Katamaneni Bhaskar
-
Andhra Pradesh: భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ మెడికల్ సర్వీసెస్ వీసీ–ఎండీ డి.మురళీధర్రెడ్డిలను తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను బదిలీ చేసి గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్, డైరెక్టర్గా నియమించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్కు ఆ జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్కుమార్ సింఘాల్ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్గా బి.రాజశేఖర్కు బాధ్యతలు అప్పగించారు. -
AP: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. వీటిని ఈ నెల 21న విద్యార్థులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే మెరుగైన సామర్థ్యం ఉన్న ట్యాబ్లను ఎంపిక చేసి, వాటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను చేర్చారు. గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 5,18,740 ట్యాబ్లను బైజూస్ కంటెంట్తో పంపిణీ చేసింది. ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, మార్క్ వ్యూ, లావా సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి 2.50 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్ పాయింట్కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో అందనున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ట్యాబ్ల్లో అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. వీటిని మంగళవారం ప్రాంతీయ సంయుక్త అధికారుల కార్యాలయాలకు తరలించారు. రెండు, మూడు రోజుల్లో ఇవి ఉన్నత పాఠశాలలకు చేరనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం అందిస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ)ను సైతం రెండో దశ నాడు–నేడు పనులు పూర్తయిన స్కూళ్లల్లో బిగించనున్నారు. రెండో దఫాలో 30 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు ఈ నెల 21 నాటికి స్కూళ్లకు చేరనున్నాయి. మరింత మెరుగ్గా.. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్, 64 జీబీ ఎస్డీ కార్డు గల ట్యాబ్లను అందించారు. వాటిలో అదే తరగతి పాఠ్యాంశాలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఏడాది ట్యాబ్ల సామర్థ్యం పెంచడంతోపాటు అదనపు తరగతుల డిజిటల్ పాఠాలను సైతం అప్లోడ్ చేయడం విశేషం. వచ్చే వారం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లు 8.7 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్డీ కార్డుతో ఉండనున్నాయి. వీటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల బైజూస్ ఈ–కంటెంట్ను సైతం అప్లోడ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ యాప్ ‘ఈ–ట్యూటర్’ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేసేంత స్పేస్ కూడా ఈ ట్యాబ్ల్లో ఉంది. 30 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు.. గతేడాది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేశారు. ఈ ఏడాది 30 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను ఈ నెల 21 నాటికి అందుబాటులోకి తేనున్నారు. అన్ని ట్యాబ్ల్లో ‘డ్యులింగో’ యాప్ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు, విదేశాల్లో సైతం విజయవంతమైన కెరీర్ను అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విదేశీ భాషలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులకు కూడా వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ అధికారులు హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో విదేశీ భాషలు అందించే యాప్ ‘డ్యులింగో’ను ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్ల్లో ఇన్స్టాల్ చేశారు. గత డిసెంబర్లో ఇచ్చిన 5,18,740 ట్యాబ్లతోపాటు ఈ ఏడాది ఇవ్వనున్న 4.30 లక్షల ట్యాబ్ల్లోనూ ఈ డ్యులింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునే వీలుంది. ఉన్నత తరగతులకు కూడా ఉపయోగపడేలా.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులతోపాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు కూడా వీటిని అందిస్తాం. ఇప్పటికే దాదాపు 2.50 లక్షల యూనిట్లు అందాయి. వారంలోగా మొత్తం 4.30 లక్షల ట్యాబ్లు స్కూళ్లకు చేరతాయి. ఈసారి ట్యాబ్ల సామర్థ్యం పెంచాం. అంతేకాకుండా 8, 9, 10 తరగతుల ఈ–కంటెంట్తోపాటు డౌట్ క్లియరెన్స్ యాప్ను, ఈ–డిక్షనరీని కూడా అప్లోడ్ చేశాం. కొత్త ట్యాబ్ల్లో భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేయొచ్చు. విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు పాత పాఠాలను తొలగించి కొత్త కంటెంట్ను అప్లోడ్ చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్య నాడు–నేడు మౌలిక వసతుల కల్పన -
టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: టెలీ మెడిసిన్ సేవల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలు ఏపీకి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీ మెడిసిన్ సేవలను 2019 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో 13 హబ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్రంలోని 1,145 పీహెచ్సీలతో పాటు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను అనుసంధానం చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటినుంచే టెలీ మెడిసిన్ సేవలు పొందేలా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోజువారీగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి టెలీ మెడిసిన్కు వస్తున్న కన్సల్టేషన్లలో అత్యధిక శాతం ఏపీవే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం టెలీ మెడిసిన్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. 42 శాతం ఏపీ నుంచే.. టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభమైన నాటినుంచి నేటివరకు దేశ వ్యాప్తంగా 2,43,00,635 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 42 శాతం అంటే 1,02,03,821 ఏపీ నుంచి నమోదై రికార్డు సృష్టించాయి. 37,70,241 కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం రోజుకు 75 వేల వరకూ కన్సల్టేషన్లు ఉంటున్నాయి. ఈ–సంజీవని ఓపీడీ యాప్ను రాష్ట్రంలో ఇప్పటికే 85,351 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ సంజీవని సేవలపై స్మార్ట్ ఫోన్లు వినియోగించడం తెలియని, స్మార్ట్ ఫోన్లు లేనివారిలో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది. వీటిని హబ్లకు అనుసంధానించింది. త్వరలో ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను మరింత చేరువ చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్తగా మరో 14 చోట్ల.. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 13 టెలీ మెడిసిన్ హబ్స్తో ప్రభుత్వం సేవలు అందిస్తోంది. వీటిని మరింత విస్తృతం చేయడంలో భాగంగా రూ.5 కోట్లకు పైగా నిధులతో కొత్తగా మరో 14 చోట్ల హబ్స్ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఇప్పటికే 7 హబ్స్ ప్రారంభమయ్యాయి. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్లు ఉంటారు. రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు లక్ష్యంగా.. టెలీ మెడిసిన్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి రోజుకు 2 లక్షల కన్సల్టేషన్లకు చేరుకుంటాం. ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో సగటున మూడుసార్లు టెలీ మెడిసిన్ సేవలు పొందుతారు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ -
ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:కాటమనేని భాస్కర్
-
ఏపీలో టీనేజర్లకు వ్యాక్సిన్లు
-
AP: వృద్ధులకు ప్రికాషన్ డోసు.. పిల్లలకు తొలి డోసు
సాక్షి, అమరావతి: పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కోవిడ్ టీకా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు తొలి డోసు వేయనుంది. 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి, హెల్త్కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోసు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విభాగాల్లో మొత్తంగా రాష్ట్రంలో 74,34,394 మందికి టీకాలు పంపిణీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. 15–18 ఏళ్ల పిల్లలు టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి కోవిన్ యాప్/పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టీకాకు అర్హత గల పిల్లలు 24.41 లక్షల మంది టీకా వేసుకునేందుకు అర్హులైన పిల్లలు రాష్ట్రంలో 24,41,000 మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు 29,42,020 మంది, హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు 20,51,374 మంది ఉన్నారు. పిల్లలకు కోవాగ్జిన్ టీకా మాత్రమే వేస్తారు. 60 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ప్రికాషన్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. 10 లక్షల టీకాల్ని జిల్లాలకు పంపాం టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఉన్న విధానంలోనే టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుంది. జిల్లాల్లో ఇప్పటికే 7 లక్షల టీకా డోసులు ఉన్నాయి. మరో 10 లక్షలు పంపాం. టీకా పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ -
ఒమిక్రాన్పై అప్రమత్తంగా ఉన్నాం
సాక్షి, అమరావతి: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను ముమ్మరం చేసిందని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఒమిక్రాన్పై మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 104 కాల్ సెంటర్ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఆస్పత్రులు, బెడ్లు, ఆక్సిజన్, మందులు సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయని, విదేశీ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన 30 వేలమందిని గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం నుంచి ఇంటింటి ఫీవర్సర్వే జరుగుతోందన్నారు. కరోనా లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వారికి వైద్యసేవలు అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
108 సిబ్బందికి కమిషనర్ అభినందన
సాక్షి, అమరావతి: అంబులెన్స్ (108)లో గర్భిణికి ప్రసవం చేసిన ఏఎన్ఎం, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)లను వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం రెంటికోట పీహెచ్సీ పరిధిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న సవర మహేశ్వరిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో ఏఎన్ఎం రాజేశ్వరి, ఈఎంటీ సత్యం 108లోనే కాన్పు చేశారు. కమిషనర్ మంగళవారం వీరిని అభినందించడంతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించారు. -
Andhra Pradesh: భారీ రిక్రూట్మెంట్.. కొలువుల జాతర
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామ స్థాయిలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నుంచి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా, ఏరియా, బోధనాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ రిక్రూట్మెంట్కు ఆమోదం తెలిపారు. ఒకేసారి ఏకంగా 11,775 వైద్య పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుందని, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. మరోవైపు వీటికి అదనంగా కొత్త పీహెచ్సీల నిర్మాణం కొనసాగుతున్నందున మరో 3,176 పోస్టులను కూడా తరువాత భర్తీ చేయనున్నట్లు వివరించారు. గత సర్కారు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోగా రద్దు చేసి ఔట్సోర్సింగ్కు అవకాశం కల్పించింది. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు డాక్టర్లతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏటా వేతనాలకు అదనంగా రూ.726.34 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఏటా వేతనాల రూపంలో రూ.2,753.79 కోట్లు చెల్లిస్తుండగా కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఏటా అదనంగా రూ.726.34 కోట్ల వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. వైద్య శాఖలో అతి పెద్ద భర్తీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ఇది అతి పెద్ద ప్రక్రియ కావడం విశేషం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు గతంలోనే 9,700 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు అంతకు మించి పోస్టుల భర్తీ చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున దాదాపు 15,000 మంది ఏఎన్ఎంలు, 7 వేల మందికిపైగా మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం గతంలోనే చర్యలు చేపట్టింది. గతంలో మండల స్థాయిలో పీహెచ్సీల్లో ఏఎన్ఎంలు సేవలు అందిస్తుండగా వాటిని గ్రామాలకు విస్తరించారు. సచివాలయాల వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున ఏఎన్ఎంల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్లోనూ బీఎస్సీ నర్సింగ్ అర్హతతో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను ప్రభుత్వం నియమిస్తోంది. హెల్త్ అసిస్టెంట్తో పాటు ఆశా వర్కర్లు కూడా క్లినిక్లో సేవలందిస్తారు. క్లినిక్లో నిరంతరం ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటూ 12 రకాల వైద్య సేవలు అందిస్తారు. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులను సమకూర్చడంతోపాటు 57 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్మెంట్లను అందుబాటులో ఉంచుతారు. విలేజ్ క్లినిక్స్ను పీహెచ్సీలు, ల్యాబ్స్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించడంతోపాటు టెలిమెడిసిన్ సదుపాయాలను కల్పించారు. మండలానికి రెండు పీహెచ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు చొప్పున డాక్టర్లు సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
ఆరోగ్య శాఖలో బదిలీలు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలకు గ్రీన్సిగ్నల్ లభించింది. 2019 జూలైలో 1న బదిలీలకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా 2020లో జరగలేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఆరోగ్య శాఖలోని అన్ని కేడర్ పోస్టులకూ బదిలీలు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కొంతమంది ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నారు. మరికొందరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకేచోట పనిచేస్తూ.. బదిలీ కోసం వినతులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. ముఖ్యంగా రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యతనిస్తారు. ఇటీవలే 14,391 పోస్టులను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. నియామకాలకు ముందే బదిలీలు చేపట్టి, ఖాళీ అయిన చోట కొత్త నియామకాలు చేయాలనేది ఆరోగ్య శాఖ ఆలోచన. మొదటి వారంలో నోటిఫికేషన్.. అక్టోబర్ మొదటి వారంలో బదిలీలకు నోటిఫికేషన్ ఇచ్చి.. ఆ నెలాఖరుకల్లా బదిలీల ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. ఈ లోగా కొత్త నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. పీహెచ్సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రుల్లోని, అన్ని కేటగిరీల ఉద్యోగులకు బదిలీలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. నియామకాల అనంతరం డిప్యుటేషన్లు, బదిలీల అన్న మాట ఉండకూడదని, పదే పదే సిఫార్సు లేఖలకు అవకాశం ఉండకూడదని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. దీంతో నియామకాలకు ముందే బదిలీలు చేపట్టి, మిగతా ఖాళీ పోస్టుల్లో కౌన్సెలింగ్ నిర్వహించి కొత్త వారిని నియమిస్తారు. అన్ని కేడర్లలోనూ.. వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు, పారా మెడికల్,పరిపాలనా సిబ్బంది ఇలా ప్రతి కేటగిరీలోనూ దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. కొన్ని బోధనాస్పత్రుల్లో 20 ఏళ్ల నుంచి కూడా వైద్యులు ఒకేచోట పని చేస్తున్నారు. 2019 బదిలీల మార్గదర్శకాల ప్రకారం మైదాన ప్రాంతాల్లో మూడేళ్లు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు లేదా మెడికల్ కాలేజీల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులు ఒకేచోట 7 ఏళ్లు పనిచేస్తే తనకు నచ్చిన చోటుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. మొత్తం బదిలీలు 20%కి మించకూడదు. తాజాగా బదిలీలకు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. బదిలీలు పూర్తవగానే నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో బదిలీలు చేయాలనుకున్నాం. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. సిబ్బంది బదిలీలకు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో వినతులు స్వీకరిస్తాం. ఈ వినతులను బట్టి బదిలీలు చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త నియామకాలుంటాయి. నియామకాలు పూర్తయ్యాక ఎలాంటి డిప్యుటేషన్లు, ట్రాన్స్ఫర్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
Andhra Pradesh: కోటి మందికి రెండు డోసులు
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారితో తలపడుతూ రాష్ట్రంలో టీకాల యజ్ఞం ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం 3.51 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఇప్పటివరకు కోటి మందికి పైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. గత 3 రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 28.63 లక్షల మందికిపైగా టీకాలిచ్చినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్ర జనాభా మొత్తం 5.30 కోట్ల పైచిలుకు కాగా శరవేగంగా అర్హులందరికీ టీకాల కార్యక్రమం జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఆరోగ్యశాఖ సిబ్బంది టీకాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 3.51 కోట్ల డోసులు పూర్తి ఇప్పటివరకూ రెండు డోసులూ 1,08,49,970 మందికి ఇచ్చారు. 1,34,51,311 మందికి సింగిల్ డోసు ఇచ్చారు. మొత్తం 2,43,01,281 మంది కనీసం ఒక డోసు లేదా రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇక 18 ఏళ్లు దాటిన వారికి, రెండో డోసు ఇవ్వాల్సిన వారికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు మొదటి డోసు పూర్తయింది. వ్యాక్సిన్ లభ్యతను బట్టి టీకా ప్రక్రియ రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. -
ఆరోగ్యసేవల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్యశాఖలో సమగ్ర ఆరోగ్య వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టం) రూపుదిద్దుకుంటోంది. వైద్యసేవల్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రోగికి సంబంధించిన సమాచారం పక్కాగా ఒకే చోట లభిస్తుంది. తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. తొలిదశలో ఈనెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104 సర్వీసులను అనుసంధానం చేయనున్నారు. ఈ మూడు సర్వీసుల్లో ఎక్కడకు వెళ్లినా రోగి పూర్తి సమాచారం ఉంటుంది. 104 వాహనాల్లో రక్తనమూనాలు పరిశీలించిన వివరాలు సైతం దీన్లో నమోదు చేస్తారు. ఉదాహరణకు 104 వాహనంలో సేవలు పొందాక ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి ఇచ్చిన ప్రత్యేక కోడ్ను క్లిక్ చేయగానే, నెట్వర్క్ ఆస్పత్రిలో సైతం గతంలో బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏ తేదీల్లో చూపించుకున్నారు.. ఇలా మొత్తం సమాచారం వెల్లడవుతుంది. ప్రస్తుతం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 1,149 పీహెచ్సీలు, 104 వాహనాలు 676 ప్రస్తుతం రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 104 వాహనాలు 676 సేవలందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో 800కు పైగా నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. ఈ మూడు సర్వీసులను కలిపి రోగుల డేటాను ఒకే వేదికపై ఉంచుతారు. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో గానీ, లేదా ప్రత్యేక కోడ్ నంబరు ఇవ్వడం ద్వారా గానీ సమాచారం తెలుసుకోవచ్చు. వాహనంలో చికిత్సలు పొందినా, పీహెచ్సీలో వైద్యం పొందినా.. ఈరెండూ కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లినా రోగి గతంలో తీసుకున్న చికిత్సల వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల రోగి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు తక్షణమే చికిత్స చేయడానికి వీలుంటుంది. బ్లడ్గ్రూపు వివరాలు కూడా ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ మూడు సర్వీసులను అనుసంధానించే ప్రక్రియను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని కుటుంబ సంక్షేమశాఖ భావిస్తోంది. తర్వాత మిగిలినవన్నీ.. ఈ మూడు సర్వీసులు అనుసంధానం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,051 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలను వీటికి లింక్ చేస్తారు. తరువాత ఏరియా ఆస్పత్రుల వరకు అనుసంధానం చేస్తారు. దీంతో రాష్ట్రంలో ఒక పేషెంటు ఏ ఆస్పత్రికి వెళ్లినా అతడి సమస్త సమాచారం ఒక కోడ్ నంబరు క్లిక్ చేస్తే వస్తుంది. ఇలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రోగికి తక్షణమే వైద్యం అందించడంతో పాటు సరైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సేవలు ఈనెలాఖరుకల్లా ఆరోగ్యశ్రీ, పీహెచ్సీలు, 104 సర్వీసుల అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. క్రమంగా మిగతా ఆస్పత్రులనూ ఒకే గొడుగు కిందకు తెస్తాం. దీనివల్ల రోగులకు ఉపయోగమే కాదు, వైద్యులకు కూడా చికిత్సలు సులభతరమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చికిత్స అనంతరం ఇంటివద్దకే వెళ్లి మందులు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సేవలను ఉన్నతీకరిస్తున్నాం. – కాటమనేని భాస్కర్,కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు రక్ష
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన న్యూమోనియా వ్యాధి నిరోధానికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మొదలైంది. బుధవారం సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి అన్ని జిల్లాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే ఆరోగ్య ఉపకేంద్రాలన్నిటిలోనూ ఈ వ్యాక్సిన్ లభ్యమవుతుంది. ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు న్యూమోనియా నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణనిస్తుంది. పీసీవీ (న్యూమోకాకల్ వ్యాక్సిన్) పేరుతో ఇచ్చే ఈ టీకా..నెలన్నర వయసులో మొదటి డోసు, మూడున్నర మాసాల్లో రెండో డోసు, తొమ్మిది నెలలు పూర్తయ్యే లోపు మూడో డోసు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 17 శాతం మంది శిశువులు న్యూమోనియాతోనే మృతి చెందుతున్నారు. కేంద్రం ఈ వ్యాక్సిన్ను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలకు పంపించగా.. తాజాగా మన రాష్ట్రానికి పంపిణీ చేసింది. ఇప్పటికే 11 రకాల వ్యాధి నిరోధక టీకాలు రాష్ట్రంలో వేస్తుండగా, న్యూమోనియా వ్యాక్సిన్ 12వదిగా నమోదైంది. కాగా, ఈ ఏడాది మన ఏపీలో మొదటి డోసు 5.45 లక్షల మందికి, రెండో డోసు 4.09 లక్షల మందికి, మూడో డోసు (బూస్టర్ డోసు), 68,188 మందికి వేయనున్నారని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వివరించారు. -
ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికీ టీకాలు
సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ 44 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక 18 – 44 ఏళ్ల వయసు వారికి కూడా టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. నేటి(సోమవారం) నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన సచివాలయాల ద్వారా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రతీ జిల్లాలో అయిదు సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ అందించనున్నారు. కాగా ఇప్పటివరకూ హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, గర్భిణులు, టీచర్లు, 44 ఏళ్ల వయసు దాటిన వారికి మొదటి డోసు వ్యాక్సినేషన్ 96 శాతం పూర్తయింది. చాలామందికి రెండో డోసు కొనసాగుతోంది. 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు ఇవ్వడం ద్వారా థర్డ్వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. రద్దీని నివారించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్లు ఇస్తారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు వ్యాక్సిన్ను తీసుకునేందుకు అర్హులను గుర్తించి ఆయా కేంద్రాలకు తరలిస్తారు. ఇతర కేటగిరీలకు యథాతథంగానే.. రాష్ట్రవ్యాప్తంగా 18 – 44 ఏళ్ల వయసు వారు సుమారు 1.9 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ఒకవైపు వీరికి టీకాలు ఇస్తూనే మరోవైపు ఇతర కేటగిరీలకు రెండో డోసు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో దాదాపు 2.64 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. వీరిలో అత్యధికంగా 45 – 60 ఏళ్ల వయసు వారున్నారు. రాష్ట్రంలో పురుషులకంటే ఎక్కువగా మహిళలకే టీకాలు ఇచ్చారు. లభ్యతను బట్టి రోజూ టీకాలు.. ‘రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. టీకాల లభ్యతను బట్టి ఇది ప్రతిరోజూ కొనసాగుతుంది. ఎక్కడా రద్దీ లేకుండా సాఫీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకున్నాం. వ్యాక్సిన్లు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరాయి. దీంతో పాటే ఇతరులకు రెండో డోసు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్పై సచివాలయాల వారీగా ముందే సమాచారం ఇస్తారు. దీన్ని బట్టి అర్హులంతా టీకాలు తీసుకోవాలి’ – కాటమనేని భాస్కర్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ -
న్యుమోనియా టీకా వచ్చేస్తోంది!
సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకరమైన న్యుమోనియా వ్యాధిని నియంత్రించే పీసీవీ (న్యూమో కాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్) టీకా ఇక మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఈ న్యుమోకాకల్ వ్యాక్సిన్ వేస్తునారు. తాజాగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వేయనున్నారు. 2017లోనే ఇది మన దేశంలోకి వచ్చినా.. ఖరీదైనది కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో దీనిని ఉచితంగా వేయనున్నారు. తొమ్మిది నెలల్లోగా మూడు డోసులు బిడ్డకు తొమ్మిది నెలలు వయసు వచ్చేలోగా మూడు డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. పుట్టిన ఆరు వారాల వయసులో ఒక డోసు, 14 వారాల వయసులో రెండోది వేయించుకోవాలి. చివరిగా మూడో డోసు తొమ్మిది నెలల వయసులోగా వేయించుకోవాలి. మూడు డోసులు పూర్తయితే న్యుమోనియా నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఏటా 8.90 లక్షల మంది శిశువులు పుడుతున్నట్లు అంచనా. ఇప్పుడు వీళ్లందరికీ ఈ టీకా గొప్ప ఊరటనిస్తుంది. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్ట్లకు శిక్షణ ఈనెల 20 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది. వివిధ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లుగానే న్యూమో కాకల్ వ్యాక్సిన్ను కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం వారం రోజులుగా మెడికల్ ఆఫీసర్లకు, ఏఎన్ఎంలకు, ఫార్మసిస్ట్లకు శిక్షణనిస్తున్నారు. ఈనెల 15 నాటికి శిక్షణ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత వ్యాక్సిన్ తేదీని ఖరారుచేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ వ్యాక్సిన్ వేస్తున్న కారణంగా ఇప్పటికే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లుచేశారు. ప్రతి ఐదుగురిలో ఒకరు న్యుమోనియాతో.. నిజానికి.. శిశు మరణాల్లో ప్రీమెచ్యూర్ లేదా బరువు తక్కువగా ఉన్న చిన్నారుల సంఖ్య ఎక్కువ. మొత్తం మృతుల్లో 29.8 శాతం వీళ్లే. ఆ తర్వాత రాష్ట్రంలో మృతిచెందుతున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు న్యుమోనియాతో మృత్యువాత పడుతున్నారు. వీరి శాతం 17.1. చిన్నారుల మృతికి రెండో అతిపెద్ద కారణం ఇదే.తిక డయేరియా కారణంగా 8.6 శాతం మంది మృతిచెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తుండగా, పీసీవీ వ్యాక్సిన్తో అది 12కు పెరుగుతుంది. సీఎం చేతుల మీదుగా శ్రీకారం వ్యాక్సిన్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బందికి వ్యాక్సిన్ ఎలా వేయాలో శిక్షణనిచ్చాం. త్వరలోనే సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మేరకు తేదీని ఖరారుచేసి ఆయన చేతుల మీదుగా వ్యాక్సిన్ను ప్రారంభిస్తాం. న్యుమోనియా నుంచి కాపాడే గొప్ప వ్యాధి నిరోధక టీకా ఇది. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
అడవి 'బిడ్డ'లకు ఆయుష్షు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు నవజాత శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్)లు నిర్వహణలోకి వచ్చాకే మరణాలు నియంత్రణలోకి వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలో ఆస్పత్రి ఉండటమంటేనే కష్టం. పీహెచ్సీ ఉన్నా అక్కడ చిన్న పిల్లలకు వైద్యం ఉండేది కాదు. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎస్ఎన్సీయూలు గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని నవజాత శిశువుల ప్రాణానికి రక్షణగా నిలుస్తున్నాయి. సీతంపేట, రంపచోడవరం, పాడేరు, శ్రీశైలం తదితర కొండ ప్రాంతాల్లోని చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. 24 గంటల వైద్యంతో ఇవి అండగా నిలుస్తున్నాయి. లక్ష మంది చిన్నారులకు ఔట్ పేషెంట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదేసి పడకలతో 23 ఎస్ఎన్సీయూలున్నాయి. ఇవి 2018, ఆగస్ట్లో ఏర్పాటుకాగా, బాగా నిర్వహణలోకి వచ్చింది మాత్రం 2019 జూన్ తర్వాతే. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో లక్ష మంది శిశువుల దాకా ఔట్ పేషెంట్ సేవలు పొందారు. శిక్షణ పొందిన నర్సులతో పాటు పీడియాట్రిక్ వైద్యులు, ఐసీయూ పడకలుండటంతో మెరుగైన వైద్యం లభిస్తోంది. చింతూరు ఏజెన్సీలోని కూనవరం ఎస్ఎన్సీయూలో అత్యధికంగా 10,806 మంది శిశువులకు ఔట్ పేషెంట్ సేవలందగా, మంచంగిపుట్టు ఎస్ఎన్సీయూలో 8,619 మందికి వైద్య సేవలందాయి. త్వరలోనే మరో 10 కేంద్రాలను ఒక్కొక్కటి 10 పడకలతో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ఇప్పటికే టెండర్లనూ పిలిచారు. స్పెషాలిటీ సేవలు.. ఎస్ఎన్సీయూలో అత్యాధునిక రేడియంట్ వార్మర్లుంటాయి. వీటితో పాటు ఫొటోథెరపీ యూనిట్లూ ఉంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నియంత్రణకు సీ–పాప్ యంత్రం ఉంటుంది. ఐదుగురు శిక్షణ పొందిన నర్సులు షిఫ్ట్ల వారీగా ఉంటారు. డాక్టర్లు 9 గంటల పాటు కేంద్రంలో ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడు అవసరమొచ్చినా ఫోన్ చేయగానే వచ్చేస్తారు. ఎంత ఖరీదైన మందులైనా ఎస్ఎన్సీయూల్లో శిశువులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సెంటర్లో ఐదు పడకలుంటే వాటిలో ఒకటి ప్రత్యేక సెప్సిస్ (ఇన్ఫెక్షన్లు సోకని) బెడ్ ఉంటుంది. ఈ విధమైన కార్యాచరణతో శిశు మరణాల నియంత్రణకు కుటుంబ సంక్షేమ శాఖ కృషిచేస్తోంది. శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ఎస్ఎన్సీయూల వల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కోసం ఏర్పాటు చేస్తున్న పీడియాట్రిక్ వార్డులను కూడా కోవిడ్ తగ్గాక నవజాత శిశువుల వైద్యానికి ఉపయోగిస్తాం. దీనివల్ల పుట్టిన ప్రతి శిశువునూ కాపాడుకునే అవకాశం ఉంటుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్ కుటుంబ సంక్షేమశాఖ -
సేవల్లో వేగం.. తగ్గనున్న పనిభారం
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో ఆశా వర్కర్లు అత్యంత కీలకం. పట్టణాలు, గ్రామాల్లో నిర్దిష్ట జనాభా పరిధిలో వారు సేవలు అందిస్తున్నారు. ఫీవర్ సర్వేలు, టీబీ సర్వేలు మొదలుకొని, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, ఇతర ప్రజానీకం ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం వరకు ఆశా వర్కర్లదే బాధ్యత. వీరి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వేతనాలను రూ. 3వేల నుంచి ఏకంగా రూ. 10వేలకు పెంచారు. బకాయిలు లేకుండా ప్రతి నెలా వారి ఖాతాల్లో వేతనాలు జమ అవుతున్నాయి. తాజాగా కోవిడ్ సమయంలోనూ వారు సమర్థంగా సేవలు అందించారు. ఈ నేపథ్యంలో వారి పనిని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ‘స్మార్ట్’గా ఆలోచించింది. ఇప్పటివరకు ఆశా వర్కర్లు సర్వేల సమయంలో మాన్యువల్ విధానంలో అంటే.. ప్రశ్నావళిని అడిగి పేపర్లలో రాసుకునేవారు. దీనికోసం ఒక్కో ఇంటివద్దే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేది. సేకరించిన సమాచారం కంప్యూటర్లో నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపడం మరో జాప్యం. ఇకపై ఇవన్నీ ఉండవు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40వేల మంది ఆశా వర్కర్లకు సర్కారు త్వరలోనే స్మార్ట్ ఫోన్లు ఇవ్వనుంది. దీనిద్వారా వారిని డిజిటల్ సేవలవైవు నడిపిస్తున్నారు. సేవల్లో వేగం పెరగడంతో పాటు ఆశావర్కర్లకు పనిభారమూ తగ్గనుంది. తెలుగులోనే యాప్.. ఆశా వర్కర్లకు మొబైల్ కొనుగోళ్లకు సుమారు రూ. 25 కోట్లకు పైనే వ్యయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ ఆరోగ్యమిషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే టెండరు పూర్తయి, కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చారు. జూలైలో ఇవి అందరికీ సరఫరా చేయాలన్నది లక్ష్యం. ఆశా వర్కర్లు పదవ తరగతి, అంతకంటే తక్కువ చదివిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి తెలుగులోనే యాప్ను తయారు చేశారు. అలాగే పిక్టోరియల్ (చిత్రాలతో కూడిన) యాప్ కూడా ఉంటుంది. జనం సమస్యలు తెలుసుకుని ఆశా వర్కర్లు యాప్లో నమోదు చేయగానే.. ఆ సమాచారాన్ని జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారుల వరకూ ఎవరైనా చూసుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఒక హైరిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి వివరాలు నమోదు చేసినప్పుడు సంబంధిత విభాగాధికారికి సమాచారం వేగంగా వెళ్తుంది. వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్, యాప్ల వాడకంపై శిక్షణ ఇవ్వనున్నారు. సేకరణ సులువవుతుంది ఆశాలకు ఇచ్చే స్మార్ట్ఫోన్లో తెలుగులోనే యాప్ ఉంటుంది. బొమ్మలు ఉంటాయి. దీంతో సులభంగా వివరాల నమోదుకు అవకాశం ఉంటుంది. గతంలోలాగా ఆశా వర్కర్లు ప్రశ్నావళితో కుస్తీపట్టాల్సిన అవసరం ఉండదు. జూలై నెలాఖరుకు ఫోన్లు అందజేసి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
ఆక్సిజన్ నిల్వలకు ఇబ్బంది లేదు
సాక్షి, అమరావతి: ఆక్సిజన్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని ఆస్పత్రుల్లో సరిపడా నిల్వలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొదటి వేవ్ కరోనా వచ్చినప్పుడే 26 వేలకు పైగా పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ వేశారు. 4.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండేలా రాష్ట్రంలో ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ పడకల్లోనూ పూర్తిస్థాయిలో రోగులు లేరు. ఆక్సిజన్ వినియోగం గత నాలుగు రోజులుగా పెరిగింది. ఆక్సిజన్ సరఫరా కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సరఫరాకు ఢోకా లేదు రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాకు ఢోకా లేదు. విశాఖ నుంచి మూడు కంపెనీలు సరఫరా చేస్తుండగా, చెన్నై నుంచి ఒక కంపెనీ, బళ్లారి నుంచి రెండు కంపెనీలు నిరంతరం సరఫరా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంది. రాష్ట్రంలోనే మెజారిటీ ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. దీన్ని అవసరం మేరకు, లేదా ఆస్పత్రుల ఇండెంట్ మేరకు తీసుకుంటున్నారు. 4.51 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోరేజీ సామర్థ్యం రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ కెపాసిటీ భారీగా పెంచారు. కోవిడ్ మొదటి దశలోనే ఆక్సిజన్ పడకల ఏర్పాటులో భారీ కసరత్తు చేసి మౌలిక వసతులు కల్పించారు. లిక్విడ్ ఆక్సిజన్ 4,03,989.5 క్యూబిక్ మీటర్లు, డి–టైప్ సిలిండర్లు 48,003.1 కలిపి మొత్తం 4,51,992.6 క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం ఉంది. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 380 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా.. రాష్ట్రంలో ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద 380 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. ఇవి గాకుండా 4 వేల సిలిండర్లు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో 6 వాహనాలు ఆక్సిజన్ లోడింగ్కు వెళ్లాయి. మరో 90 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్రాన్సిట్ (రవాణా)లో ఉంది. రాష్ట్రంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ఆక్సిజన్ లేకపోయినా ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు సమాచారమిస్తే.. అక్కడకు ఆక్సిజన్ సిలిండర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పైన పేర్కొన్న స్టాకు ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్నది కాకుండా త్వరలో ఆస్పత్రులకు చేరాల్సినది. నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై నిశితంగా పర్యవేక్షణ ఉంది. ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వినియోగం చూస్తున్నాం. దీన్నిబట్టి ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ కొరత సమస్యే తలెత్తలేదు మనకు వచ్చిన ఇండెంట్ను బట్టి తీసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. స్టోరేజీ కెపాసిటీ భారీగా ఉంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొరత ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పరిశీలిస్తున్నాం. రోగులకు ఆక్సిజన్ కొరత ఉండదు. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ -
వ్యాక్సిన్.. రికార్డు: అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా బుధవారం 31.39 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఏపీకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఒక్క రోజులో ఏపీలో వేసినంత వేగంగా వ్యాక్సిన్ వేయలేకపోయాయి. ఇతర ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదు. 6.40 లక్షల డోసుల్లో 4.40 లక్షల డోసులు కోవిషీల్డ్, 2 లక్షల డోసులు కోవాగ్జిన్ ఉన్నాయి. 45 ఏళ్లు దాటిన వారి నుంచి ఆపైన వయసున్న వారికి వ్యాక్సిన్ వేశారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో జరిగిన వ్యాక్సినేషన్లో ఏపీదే రికార్డు అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని బలోపేతం చేసుకోవడం వల్లే ఈ స్థాయిలో వ్యాక్సిన్ వేయడం సాధ్యమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పీహెచ్సీ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో టీకా ప్రక్రియ కొనసాగించారు. మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 255 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో వ్యాక్సిన్ వేశారు. ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన 6.40 లక్షల డోసుల వ్యాక్సిన్ను ఒకే రోజు జిల్లాలకు.. అక్కడ నుంచి పీహెచ్సీలకు, అక్కడ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీకా ప్రక్రియ కొనసాగించారు. ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, సిబ్బంది సహకారంతో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేయగలిగారు. కేంద్రం నుంచి టీకా రావాల్సి ఉంది రాష్ట్రంలో ఒక్క రోజులో 6 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉండటంతో ఏపీకి కేంద్రం నుంచి భారీగా వ్యాక్సిన్ రావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు కోటి డోసులు పంపిస్తామని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ హామీ ఇచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్ కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క డోసు కూడా నిల్వ లేకుండా పూర్తిగా వేయగలిగారు. ఏపీకి కేంద్రం నుంచి ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినా కనిష్టంగా 25 లక్షల డోసులు వస్తేనే వారం రోజులుకు సరిపడా వేయగలుగుతారు. నెలకు కోటిన్నర మందికి.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం కావడం, కింది స్థాయిలో యంత్రాంగం ఉండటం వల్ల దేశంలోనే అత్యధిక సంఖ్యలో టీకా వేసే దిశగా ఏపీ దూసుకెళ్లింది. బుధవారం ఒకేరోజు 6.40 లక్షల మందికి వేయడాన్ని పరిశీలిస్తే.. నెలలో 25 రోజుల పని దినాల్లో టీకా ప్రకియ కొనసాగినా కోటిన్నర మందికి వేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి కావాల్సిందల్లా కేంద్రం నుంచి వ్యాక్సిన్ త్వరితగతిన సరఫరా కావడమేనని చెప్పారు. 45 లక్షల మందికి టీకా పూర్తి రాష్ట్రంలో బుధవారం నాటికి 45 లక్షల మందికి టీకా వేశారు. తొలుత కాస్త నెమ్మదిగా టీకా ప్రక్రియ ప్రారంభమైనా, సచివాలయాల పరిధిలోకి వ్యాక్సిన్ ప్రక్రియను తీసుకురావడంతో వేగం పెరిగింది. వలంటీర్లు ముందు రోజే అర్హులైన వారిని గుర్తించడం, వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఇంటి దగ్గరకే రావడం వంటి కారణాల వల్ల ఏపీలో ఎక్కువ మందికి టీకా వేయడం సాధ్యమైంది. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరు బాగా ఉపకరించిందని అధికార వర్గాలు తెలిపాయి. మిగతా రాష్ట్రాల్లో ఇలా లేకపోవడంతో కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్నే సకాలంలో వేయలేకపోతున్నారు. వ్యాక్సిన్ పంపించాలని కేంద్రాన్ని కోరాం ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ను మొత్తం వేశాం. బుధవారం రికార్డు స్థాయిలో 6.40 లక్షల డోసులు వేశాం. వీలైనంత త్వరలో కేంద్రం వ్యాక్సిన్ పంపిస్తామని హామీ ఇచ్చింది. దీని కోసం వేచి చూస్తున్నాం. రాష్ట్రానికి ఎంత ఎక్కువ సంఖ్యలో టీకా డోసులు వస్తే అంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా టీకా ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. - కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
వైద్య వసతుల్లో ఆంధ్రప్రదేశ్ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్పత్రులకు స్వర్ణ యుగం వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు ప్రాథమిక ఆరోగ్యం విషయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఏపీ.. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిందంటే సామాన్య విషయం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేస్తున్న కృషే దీనికి కారణమని పలువురు కొనియాడుతున్నారు. తాజాగా ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా ఉందంటూ కేంద్రం కొనియాడటం గమనార్హం. ఇప్పటి వరకు కేరళ, తమిళనాడులోనే ప్రాథమిక ఆరోగ్య (పబ్లిక్ హెల్త్) రంగం బావుంటుందని పలువురు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి దృష్టిని ఏపీ ఆకర్షిస్తోంది. ఎన్క్వాస్తో నాణ్యతకు భరోసా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆస్పత్రులను నాణ్యత మదింపు ప్రక్రియలోకి తీసుకొచ్చింది. ఇలా చేయాలంటే ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ – జాతీయ నాణ్యత మదింపు సంస్థ) గుర్తింపు పొందాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు ఎన్క్వాస్ కిందకు తీసుకొచ్చింది. ఈ సంస్థ సంతృప్తి చెందాలంటే ఔట్ పేషెంట్ సేవలు మొదలు.. ఇన్ పేషెంట్, పారిశుధ్యం, మందులు, బెడ్లు ఇలా పలు వసతులు సంతృప్తికరంగా ఉండాలి. ఈ విషయంలో ఏపీ అద్భుతంగా నిర్వహణ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఎస్ఆర్సీ (నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసోర్స్ సెంటర్) ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెయిల్ ద్వారా లేఖ పంపించింది. పబ్లిక్ హెల్త్లో వసతులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రతిభ కనబరిచిందని కొనియాడింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గణనీయంగా వసతులు మెరుగు పడినట్టు ఈ లేఖలో పేర్కొంది. నాడు–నేడు కింద పనులు పూర్తయితే మరిన్ని వసతులు వస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఎన్క్వాస్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించాకే.. సాధారణంగా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు దశల వారీగా ఆస్పత్రులను నాణ్యతా మదింపు ప్రక్రియలోకి చేరుస్తుంటాయి. ఒక్కో దఫా 50 నుంచి 100 ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాలకు వెళతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1,135 ఆస్పత్రులను ఎన్క్వాస్ పరిధిలోకి తీసుకొచ్చింది. కొత్తగా కల్పించిన వసతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మదింపు సంస్థకు సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడమే కాకుండా, స్వయానా ఎన్క్వాస్ ప్రతినిధులు ఆస్పత్రులకు వచ్చి పర్యవేక్షించారు. 953 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 182 ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రులు.. మొత్తం 1,135 ఆస్పత్రులను పరిశీలించాకే వసతులు భేష్ అని గుర్తింపునిచ్చారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పేర్కొన్నారు. 1,400 చెక్ పాయింట్స్ ఎన్క్వాస్ నిబంధనల ప్రకారం మొత్తం 1,400 వసతులకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ఫెసిలిటీ పూర్తి చేస్తే 2 మార్కులు ఇస్తారు. చెయ్యకపోతే సున్నా. పాక్షికంగా చేస్తే ఒక మార్కు ఇస్తారు. వసతులకు సంబంధించి ముందుగా జిల్లా కమిటీ పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ చేసి.. ధ్రువీకరణ పత్రాలు కేంద్రానికి పంపిస్తుంది. అప్పుడు కేంద్ర బృందం పరిశీలన చేస్తుంది. ఇలా మన రాష్ట్రంలోని 1,135 ఆస్పత్రులకు 70 శాతానికి పైగానే మార్కులు వచ్చాయి. నాణ్యత మదింపులో గుర్తించిన అంశాలు ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ► ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి బాణపు గుర్తులతో సూచికలు ఉన్నాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సరి్టఫికెట్లు ఉన్నాయి. ► రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్లు ఉన్నాయి. ► అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వృద్ధులకు, వైకల్యంతో ఉన్న వారి కోసం అన్ని ఆస్పత్రుల్లో వీల్ చైర్లు ఉన్నాయి. ► అన్ని ఆస్పత్రుల్లోనూ ఆయా విభాగాల సిబ్బంది వృత్తి రీత్యా శిక్షణ పొందిన వారే ఉన్నారు. నాణ్యతతో కూడిన సదుపాయాల కల్పన ఒకే దఫా ఇంత పెద్ద స్థాయిలో పనులు చేపట్టడం చిన్న విషయం కాదు. 1,135 ఆస్పత్రులకు మనం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా వీటిపై ఎన్క్వాస్ సంతృప్తి చెందింది. త్వరలోనే మిగతా ఆస్పత్రుల్లోనూ నాణ్యతకు సంబంధిన పనులు చేపడతాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
రేపటి నుంచి పెద్దలకూ కోవిడ్ టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 2,222 ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. 60 ఏళ్ల వయసు దాటిన వారు, 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే ఫ్రంట్లైన్ వర్కర్లయిన ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీ తదితర విభాగాల ఉద్యోగులకు కోవిడ్ టీకాలు వేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాష్ట్ర టాస్్కఫోర్స్ కమిటీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. వ్యాక్సిన్ ప్రక్రియపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 59.96 లక్షల మందికి.. ఈ విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారు రాష్ట్రంలో 52,98,063 మంది ఉన్నట్టు తేల్చారు. వీరితోపాటు 45–59 ఏళ్ల మధ్య వయస్కులై ఉండి రకరకాల దీర్ఘకాలిక జబ్బులు అంటే క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, బీపీ వంటి సమస్యలున్న వారు 6,97,990 మందిగా (ఎన్సీడీ–సీడీ డేటా ఆధారంగా) గుర్తించారు. అంటే మొత్తం ఈ విడతలో 59,96,053 మందికి టీకాలు వేస్తారు. వీరంతా కోవిన్ సాఫ్ట్వేర్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేరు, వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళితే టీకా వేస్తారు. సోమవారం నుంచి 2 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వారానికి 6 రోజుల చొప్పున 48 రోజుల పాటు కోవిడ్ టీకా వేస్తారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకా వేస్తారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోయినా.. లబ్ధిదారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా ఆన్సైట్ సిస్టం ద్వారా కోవిడ్ టీకా వేయించుకోవచ్చు. నేరుగా కోవిడ్ టీకా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ, డ్రైవింగ్ లైసెన్సు కార్డు, దీర్ఘకాలిక జబ్బులున్నట్టు వైద్యుడి సర్టిఫికెట్, మరేదైనా అధికారిక గుర్తింపు కార్డు ఉన్నట్టు అక్కడ చూపిస్తే టీకా వేస్తారు. అయితే ఆ రోజు రద్దీని బట్టి, కోవిడ్ నిబంధనల మేరకు ఆన్సైట్ వారికి టీకా వేస్తారు. స్లాట్ బుక్ చేసుకుని వెళ్లండి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిన్ సాఫ్ట్వేర్ లేదా ఆరోగ్యసేతు యాప్ద్వారా స్లాట్ నమోదు చేసుకుని టీకాకు వెళ్లడం మంచిది. అలాంటి వారికి కచ్చితంగా అదే రోజు విధిగా టీకా వేయగలరు. అలా కాకుండా గుర్తింపు కార్డుతో వెళ్లే వారికి అదే రోజున టీకా వేసే విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ స్లాట్ బుక్ చేసుకుని తమకు నిర్ణయించిన తేదీన వెళ్లడం మంచిది. టీకాకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం జగన్
-
'న్యుమోనియాకు' చెక్
సాక్షి, అమరావతి: దేశంలో న్యుమోనియాతో జరుగుతున్న చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట పడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు సుమారు 70 వేలమంది మృతి చెందుతుండగా.. అందులో 17.1 శాతం న్యుమోనియాతోనే మరణిస్తున్నట్లు అంచనా. ఎన్నో వ్యాధులకు టీకాలు వచ్చినా దీనికి సంబంధించిన టీకా ఖరీదైనది కావడంతో వేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులనుంచి దేశం గట్టెక్కింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ న్యుమోనియా టీకాను ‘న్యుమోసిల్’ పేరుతో ప్రవేశపెట్టింది. అన్ని పరీక్షలు పూర్తయిన ఈ వ్యాక్సిన్ను వారం రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం దేశానికి పరిచయం చేసింది. దీంతో చిన్నారుల మృతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో బాధపడుతూ మృతిచెందుతున్న ఘటనలు కోకొల్లలు. టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా తక్కువ ధరకు అందుబాటులోకి తేవడంతో ఇకపై దిగువ మధ్యతరగతి వారు కూడా ఈ టీకాను తమ పిల్లలకు వేయించే అవకాశం ఉంటుంది. ఈ టీకా చిన్నారుల ప్రాణరక్షణకు అండగా ఉంటుందని భావిస్తున్నారు. న్యుమోనియాతో భారీగా నష్టం దేశంలో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 37 మంది మృతి చెందుతున్నారు. వీరిలో 17.1 శాతం మంది మరణానికి న్యుమోనియా కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35 మంది మృతిచెందుతున్నారు. వీరిలో 17 శాతం మంది న్యుమోనియా కారణంగానే చనిపోతున్నారు. వారం రోజుల కిందటే దేశానికి పరిచయమైన ఈ టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బిల్ అండ్ మిలిండా గేట్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీన్ని పీసీవీ (న్యుమోనికల్ కాంజుగేట్ వ్యాక్సిన్) అంటారు. తొలుత ఈ వ్యాక్సిన్ను న్యుమోనియా మృతులు ఎక్కువగా ఉన్న బిహార్, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (17 జిల్లాల్లో), హరియాణా రాష్ట్రాల్లో వేస్తారు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వానికి రూ.250కి, ప్రైవేటు వ్యక్తులకైతే రూ.700కు ఇస్తున్నారు. కొద్దిగా సమయం పడుతుంది కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. రెండు మూడు నెలల్లో మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. ఈ వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ వ్యాక్సిన్ డోసు ఇలా - బిడ్డ పుట్టిన 6 వారాల్లోగా తొలిడోసు. - 14 వారాల్లోగా రెండోడోసు. - 9 నెలల నుంచి 12 నెలల మధ్య వయసులో బూస్టర్ డోసు. -
పీహెచ్సీల్లో స్పెషాలిటీ వైద్యసేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య ముఖచిత్రం మారిపోనుంది. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం మరింత చేరువ కానుంది. అర్ధరాత్రో అపరాత్రో పేషెంటు వెళితే ఎవరూ అందుబాటులో లేరన్న విమర్శలకు ఇక తావుండదు. పేద రోగులకు నూతన సంవత్సర కానుకగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈనెల నుంచి 24 గంటలూ పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు జారీచేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఔట్పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే డాక్టర్కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారు. దీనికితోడు ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతి రెండువేల కుటుంబాలకు ఒక వైద్యుడు బాధ్యుడుగా ఉంటారు. కేరళ, తమిళనాడు తరహాలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసే దిశగా చర్యలు పూర్తయ్యాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు రాష్ట్రంలో ప్రస్తుతం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి పీహెచ్సీలోను ఇద్దరు వైద్యులు ఉండేలా నియామకాలు పూర్తయ్యాయి. వైద్యసేవలతో పాటు రక్తపరీక్షలు కూడా అక్కడే చేసి వైద్యం చేస్తారు. రాత్రిపూట వైద్యానికి వస్తే డాక్టర్కు ఫోన్ చేస్తే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్టెక్నీషియన్, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ప్రాథమిక వైద్యానికి సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి షుగరు, బీపీకి ఇకమీదట ఆదివారం మినహా మిగిలిన ఆరురోజులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అసాంక్రమిక వ్యాధులకు ఔట్పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వ్యాధులకు ఈ క్లినిక్లు పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి రిఫరల్ విధానం అంటే పెద్దాస్పత్రులకు పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. ఈ వ్యాధులకు మందులన్నీ రోగులకు ఉచితంగా ఇస్తారు. ఆరురోజులు స్పెషలిస్టుల సేవలు ఇప్పటివరకు పీహెచ్సీల్లో ప్రాథమిక వైద్యమే (ఎంబీబీఎస్ డాక్టరు చేసే వైద్యమే) లభించేది. ఇకమీదట ఆరురకాల స్పెషాలిటీ వైద్యసేవలు అందించనున్నారు. ఈఎన్టీ, డెంటల్, కంటిజబ్బులు, మెంటల్ హెల్త్, గేరియాట్రిక్, గైనకాలజీ సేవలు అందిస్తారు. ఒక్కో స్పెషాలిటీకి ఒక్కోరోజు చొప్పున ఆరురోజులు ఆరుగురు స్పెషాలిస్టు డాక్టర్లు ఔట్పేషెంటు సేవలు అందిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ఈ డాక్టరే పెద్దాస్పత్రికి రిఫర్ చేస్తారు. ప్రతి స్పెషలిస్టు డాక్టరు ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు పీహెచ్సీల వంతున వారంలో 12 పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించాలి. నిరంతరం అందుబాటులో ఫ్యామిలీ డాక్టరు పీహెచ్సీలో వైద్యుడికి రెండువేల కుటుంబాల ఆరోగ్య బాధ్యతలు అప్పగించారు. ఆ రెండువేల కుటుంబాలకు అతడు ఫ్యామిలీ డాక్టరుగా ఉంటారు. వారికి ఆరోగ్యపరంగా ఎప్పుడు అవసరమైనా ఆ వైద్యుడు సంబంధిత సమాచారాన్ని విశ్లేషించి తగిన చికిత్స అందిస్తారు. అవసరమైతే పెద్దాస్పత్రికి రిఫర్ చేస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం పీహెచ్సీలన్నిటినీ 24 గంటలు పనిచేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. స్పెషలిస్టు డాక్టర్లను కూడా ఏర్పాటు చేశాం. అన్ని పీహెచ్సీల్లో డబుల్ డాక్టర్ ఉంటారు. డాక్టరు లేడు, మందులు లేవు అన్న మాట వినిపించదు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
నేడు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల శనివారం కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణకు కార్యాచరణ ఏ విధంగా ఉండాలో అంచనా వేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్కు సంబంధించి రూపొందించిన వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ కోవిన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో పరిశీలించనున్నట్లు తెలిపారు. డ్రై రన్లో వెలుగుచూసే అంశాలు, ఇతర వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక రూపంలో అందజేస్తామని భాస్కర్ వివరించారు. ఈ డ్రై రన్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి, కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్కు అందజేస్తారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఈ ప్రక్రియనంతా సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్లో భాగంగా డిసెంబర్ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది ప్రోత్సాహకర ఫలితాలు ఇచ్చినట్లు భాస్కర్ తెలిపారు. వ్యాక్సిన్ రవాణా మొదలు, ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఫోన్ మెసేజ్లు పంపడం, వారు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తున్నట్టుగానే మొత్తం ప్రక్రియ (డమ్మీ ప్రక్రియ) నిర్వహిస్తారు. అనంతరం వారిని అబ్జర్వేషన్లో కూడా ఉంచుతారు. శనివారం ఒక్కో జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో, ఒక ఎంపిక చేసిన బయటి ప్రదేశంలో.. ఇలా మూడు చోట్ల డ్రైరన్ నిర్వహించనున్నారు. డ్రై రన్ నిర్వహించే ప్రదేశాలు -
కరోనా కొత్త స్ట్రెయిన్పై ఏపీ అప్రమత్తం
సాక్షి, విజయవాడ: కొత్త వైరస్ స్ట్రెయిన్పై అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ వచ్చిందని స్పష్టం చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్ వచ్చిందన్నారు. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్ చేశామని పేర్కొన్నారు. (చదవండి: భారత్లో కొత్తరకం కరోనా.. ఆరుగురికి పాజిటివ్) 1406 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యిందన్నారు. 1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్గా తేలిందన్నారు. మొత్తం 24 పాజిటివ్ కేసుల శాంపిళ్లను సీసీఎంబీకి పంపించామని తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్ వచ్చిందని నిర్ధారణ అయ్యిందని, మిగిలిన 23 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.(చదవండి: ఫ్లైట్ దిగారు.. పత్తా లేరు) -
తగ్గిన కొత్త కేసులు.. కోలుకున్న ఏలూరు
ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి ప్రతినిధి ఏలూరు: అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఒకే నమూనాను పలు ల్యాబొరేటరీల్లో పరీక్షిస్తున్నారు. ఏలూరులో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో పెస్టిసైడ్స్ (పురుగు మందులు) ఆనవాళ్లు మోతాదుకు మించి ఉన్నాయని గుర్తించినట్లు సమాచారం. దీనికి గల కారణాలపై విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. పెద్ద ఎత్తున ఆక్వా సాగు జరుగుతుండటం, ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జలాలు ఏమైనా కలుషితమయ్యాయా? అనే దిశగా అన్వేషిస్తున్నారు. మరోవైపు బాధితుల రక్తంలో నికెల్, లెడ్ లాంటివి ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గుర్తించడంతో పెస్టిసైడ్స్కు వీటితో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనే పరిశోధిస్తున్నారు. దీన్ని నిర్థారించుకునేందుకు మంగళవారం ఉదయం నమూనాలను మరోసారి ఢిల్లీ ఎయిమ్స్కు పంపగా బుధవారం ఫలితాలు వెలువడనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం, భీమవరంలో కూడా తాగునీటిని సేకరించి పరిశీలిస్తారు. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఏలూరులో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎన్ఐఎన్ బృందం.. పంపుల చెరువులో నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఆళ్ల నాని ఇ–కొలి లేదు.. తాగునీటిలో ప్రమాదకరమైన ఇ–కొలి బాక్టీరియా ఉందేమోనన్న అనుమానాలు తొలగిపోయాయి. మంగళవారం ఉదయం నివేదికల ఫలితాల్లో బాక్టీరియా లేదని స్పష్టమైంది. సెరబ్రిల్ స్పైనల్ ఫ్లూయిడ్ శాంపిల్ నమూనాలను విశ్లేషించగా అవికూడా నార్మల్గా ఉన్నట్లు తేలింది. ఇంటింటికీ తిరిగి నమూనాల సేకరణ డాక్టర్ జేజే బాబు ఆధ్వర్యంలో తొమ్మిది మంది వైద్య సిబ్బందితో కూడిన బృందం ఏలూరులో వ్యాధి ప్రారంభం అయిన దక్షిణపు వీధిలోని జేపీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితులతో మాట్లాడింది. ఆహార పదార్థాలు, నీటి నమూనాలను సేకరించింది. నాలుగో రోజు తగ్గుముఖం ఏలూరును పీడిస్తున్న అంతుచిక్కని వ్యాధి తీవ్రత నాలుగో రోజు తగ్గినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మంగళవారం రాత్రి సమయానికి 68 మంది బాధితులు చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 497 మంది డిశ్చార్జి అయినట్లు ఏలూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. బాధితుల్లో 24 మంది విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. చిన్నారులకు పాత ప్రభుత్వాస్పత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మిగిలిన వారిని కొత్త ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్కు తరలించి ప్రత్యేక చేసిన ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివశంకరరావు దగ్గరుండి వీరిని పర్యవేక్షిస్తున్నారు. ఐఐసీటీకి వివరాలు.. ఏలూరులో దుకాణదారులు విక్రయిస్తున్న పురుగు మందుల వివరాలను అధికారులు ఆరా తీశారు. నిషేధించిన మందులు ఏవైనా విక్రయిస్తున్నారా? అనే కోణంలోనూ వివరాలు సేకరించి ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)కి పంపారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం ఏలూరులో నెలకొన్న పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ ఆరా తీస్తున్నారు. సీఎంవో కార్యాలయం, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ బాధితులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష జరిపిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ మూడు రోజులుగా ఏలూరులోనే ఉంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వైద్య శిబిరాలు, కేంద్ర వైద్య బృందాలను రప్పించడం, వ్యాధి నిర్థారణ పరీక్షలు, నమూనాల సేకరణను పర్యవేక్షిస్తున్నారు. మోతాదు మించి ఉన్నాయి ‘నీటిలో పెస్టిసైడ్స్ మోతాదు ఎక్కువగా ఉంది. వీటిని ఆర్గనో క్లోరిన్స్ అంటారు. ఓపీ డీడీటీ, ఓపీ డీడీఈ లాంటి పలు రకాల నిషేధిత ఆర్గనో క్లోరిన్స్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇంత మోతాదులో ఉన్న నీటిని తాగితే నాడీ వ్యవస్థకు హాని కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవి ఎలా వచ్చాయన్న దానిపై పరిశీలన జరుగుతోంది’ –డాక్టర్ బి.చంద్రశేఖర్రెడ్డి, న్యూరో ఫిజీషియన్ -
20 శాతం మందికి వైరస్ వచ్చి పోయింది
-
20 శాతం మందికి వైరస్ వచ్చి పోయింది
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరిలో వారికి తెలియకుండానే వైరస్ వచ్చి తగ్గిపోతుంది. ఇలాంటి వారిని అంచాన వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సీరో సర్వైలెన్స్ నిర్వహించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. ముందుగా తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించారు. ఆ తర్వాత ఆగస్టు 26 నుంచి 31 వరకూ మిగిలిన 9 జిల్లాల్లో సర్వే జరిగింది. వీటి ఫలితాలను ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఈ సందర్భంగా కమ్యూనల్ డీసీజ్ ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం సీరో సర్వేలేన్స్ చేపడతారన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్. కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడానికి ఈ సీరో సర్వే చేశామన్నారు. దేశంలో తొలుత హరియాణాలో ఈ సర్వే చేయగా.. ఆ తర్వాత ఏపీలోనే చేశామని తెలిపారు. ఇందుకు గాను రెండు దశల్లో సీరో సర్వే నిర్వహించామన్నారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ఐదు వేల మంది శాంపిల్స్ టెస్ట్ చేశామన్నారు. పూర్తిగా ఏ లక్షణాలు లేని వారి మీద కూడా ఈ సర్వే చేపట్టామన్నారు. (కరోనా నియంత్రణకు నిర్దిష్ట ప్రణాళిక) కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘అనంతపురం, కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15 వరకు మొదటి దశ సర్వే లెన్స్ నిర్వహించాం. దీనిలో భాగంగా 3500 మంది శాంపిల్స్ సీరో సర్వే చేశాం. ఆ తర్వాత రెండో దశలో భాగంగా ఆగస్టు 26 నుంచి 31 వరకు మిగతా జిల్లాల్లో 5వేల మందికి చొప్పున సర్వే చేశాం. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక రౌండ్ సిరో సర్వే పూర్తయ్యింది. దీని వల్ల ఇప్పటికే 19.7శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో 18.2 శాతం.. పట్టణ ప్రాంతంలో 22.5 శాతం.. కంటైన్మెంట్ జోన్లలో 20.5 శాతం.. నాన్ కంటైన్మెంట్ జోన్లలో19.3 శాతం.. హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5 శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినట్లు తెలుస్తోంది అన్నారు. పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ కాగా.. మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. (పారదర్శకంగానే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లు) ఈ సర్వే ద్వారా త్వరలోనే కర్నూల్, విజయనగరం జిల్లాలో కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశామన్నారు భాస్కర్. అలానే రానున్న రోజుల్లో చిత్తూరు, విశాఖలో తగ్గుముఖం పట్టనుండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందని సీరో సర్వే ద్వారా అంచనా వేయడం జరిగిందన్నారు. ఇక్కడ పరీక్షలు ఎక్కువగా చేస్తాం, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
ర్యాపిడ్ టెస్ట్ కిట్లు రెండు రోజులు ఆపండి
సాక్షి, అమరావతి: ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆపాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మంగళవారం తెలిపారు. ఐసీఎంఆర్ (భారతీయ వైద్య పరిశోధన మండలి) మార్గదర్శకాల మేరకు రెండు రోజులు ఆపుతున్నామని, తిరిగి వారు విడుదల చేసే మార్గదర్శకాల మేరకు వాటిని ఉపయోగిస్తామని ఆయన వివరించారు. కాగా, ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలుకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ కిట్లను ఇంకా పరీక్షలకు ఉపయోగించ లేదు. ఇతర పద్ధతుల ద్వారానే కోవిడ్–19 పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. -
పారదర్శకంగానే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు పారదర్శకంగా జరిగిందని, ఒకవేళ ఏ రాష్ట్రానికైనా తక్కువ రేటుకు కిట్లను విక్రయిస్తే తాము కూడా అదే ధర చెల్లిస్తామని దక్షిణ కొరియాతో చేసుకున్న ఒప్పందంలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, రాష్ట్రంలో చేస్తున్న టెస్ట్లకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆయన ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామ రాజుతో కలిసి నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ► దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు చాలా పారదర్శకంగా జరిగింది. ► ఆ దేశానికి చెందిన మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ భారత్లో ఉంది. ► మనం ఆర్డర్ ఇచ్చే నాటికి దేశంలోని ఆ కంపెనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్కు అనుమతి లేదు. ► ఇటీవల ఈ కంపెనీకి భారత్లో అనుమతి రావడంతో ఆ యూనిట్ నుంచి ర్యాపిడ్ కిట్లను ఛత్తీస్గఢ్ కొనుగోలు చేసింది. ► ఒప్పందం చేసుకునే ముందే.. ఏదైనా రాష్ట్రానికి తక్కువ ధరకు కిట్లు విక్రయిస్తే తామూ అదే ధర చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ► అందుకే ఛత్తీస్గఢ్ చెల్లిస్తున్న ధరనే చెల్లిస్తున్నాం. ► ఏప్రిల్ 20 కల్లా అన్ని జిల్లాలకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను చేరవేస్తాం. ► ర్యాపిడ్ కిట్ల ద్వారా ఒకే సారి చాలామందికి స్క్రీనింగ్ చేయడానికి వీలుపడుతుంది. ► క్షేత్రస్థాయిలో మెడికల్ ఆఫీసర్లు ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహిస్తారు. ► వైరస్ సోకి తగ్గిందనే విషయం ర్యాపిడ్ టెస్ట్లో మాత్రమే తెలుస్తుంది. ► ప్రెగ్నెన్సీ టెస్ట్ మాదిరిగానే ఈ టెస్ట్ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం స్కిల్తో చేయాల్సి ఉంటుంది. ► ప్రస్తుతం టెస్ట్ల సంఖ్యను భారీగా పెంచాం. ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ► రాష్ట్రంలో 40 మందికి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా వైరస్ సోకినట్లు భావిస్తున్నాం. ఈమేరకు ఆరా తీస్తున్నాం. ► దగ్గు, జలుబు, జ్వరానికి ఎవరికైనా మందులిస్తే వారి వివరాలు చెప్పాలని మెడికల్ షాప్ కీపర్లను కోరాం. విపత్కర సమయంలో విష ప్రచారమా ? ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేయడం, దేశవ్యాప్తంగా అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ రెండో స్థానంలో ఉండటంతో జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. విపత్కర సమయంలో కీలకమైన కిట్లు రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి? ఎంత మందికి ఉపయోగపడ్డాయనే విషయాన్ని విస్మరించి విష ప్రచారానికి పాల్పడటంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీకి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఇలా దుష్ప్రచారం చేస్తుండటం పట్ల వైద్య వర్గాల్లో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ విమర్శలను వైద్య ఆరోగ్యశాఖ కూడా తీవ్రంగా ఖండించింది. దేశ అత్యున్నత పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) టెస్టులు చేసేందుకు ఓ సంస్థ నుంచి ఒక్కో కిట్ను రూ.795 చొప్పున కొనుగోలు చేయగా, ఐసీఎంఆర్ కంటే ఒక్కో కిట్ను రూ.65 తక్కువ రేటుకే ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేయడం గమనార్హం. -
కరోనా నియంత్రణకు నిర్దిష్ట ప్రణాళిక
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ బారిన పడిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలు ఉన్నాయని... ఇప్పటి వరకు రెండు దఫాలుగా సర్వే చేశామని వెల్లడించారు. 1.46 కోట్ల గృహాలను సర్వైవలెన్స్ పద్ధతిలో సర్వే చేశామని వివరించారు. ఇప్పటివరకు 1.32 కోట్ల కుటుంబాలను రెండు సార్లు సర్వే చేశామని చెప్పారు. ప్రస్తుతం మూడో దశలో సర్వే కొనసాగుతోందన్నారు. ఇప్పుడు సర్వే అంతా ఆన్లైన్లో జరుగుతుందన్నారు. కరోనా లక్షణాలు ఉంటే 14 రోజుల క్వారంటైన్కు రికమండ్ చేస్తారని.. కరోనా పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి పంపిస్తారని తెలిపారు. మూడో దశలో ఇప్పటివరకు 12,311 మంది అనుమానితులను గుర్తించి.. 1754 మందిని గృహనిర్బంధంలో ఉంచామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కాటంనేని భాస్కర్ తెలిపారు. -
‘బాబో’య్ కాటంనేని
కొత్త కలెక్టర్ పొద్దెరగడం లేదు... ఇప్పుడు కలెక్టరేట్లో ఏ సెక్షన్లో ఎవరిని కదిలించినా ఇదే మాట..ఏ సెక్షన్ అంటే ఏ ఒక్కటే కాదు.. ఎ టు జెడ్ ఎవరిని కదిపినా.. అదే భయం.ఉన్నతాధికారుల మొదలు కింది స్థాయి సిబ్బంది వరకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ దెబ్బకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడున్నర గంటల మొదలు రాత్రి ఎనిమిదిన్నర వరకు కలెక్టరేట్లోనే కాటంనేని మకాం వేసేస్తున్నారు.ఉదయం పూట కొన్ని సెక్షన్లను మాత్రమే రావాలని ఆయన నిర్దేశిస్తున్నప్పటికీ ఏకంగా కలెక్టర్ ఏడున్నరకు వచ్చి కూర్చుంటే పదిగంటలకు తాము వస్తే ఏం బాగుంటుందని మిగిలిన సెక్షన్ల అధికారులూ ఈసురోమంటూ ఏడున్నరకే వచ్చేస్తున్నారు. ఇక వెళ్లేటప్పుడూ అదే తంతు... సరే టైంది ఏముందిలే మూడు, నాలుగుగంటలు ఎక్స్ట్రా చేసేద్దామని మెంటల్గా ప్రిపేర్ అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఎలా ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడో.. ఏం యాక్షన్ తీసుకుంటాడోనని భయపడిపోతున్నారు.కాటంనేని రాక సమాచారంతోనే పశ్చిమగోదావరి ట్రాక్ రికార్డ్ చూసి భయపడిపోయిన ఉద్యోగులకు ఊహించినట్టుగానే మొదట్లోనే ఝలక్ తగిలింది.సమస్య చెప్పుకుందామని వచ్చిన ఓ మాజీ అధికారిపై పోలీస్ యాక్షన్కు దిగడం చూసి అందరూ బెంబేలెత్తిపోయారు.ఇక పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు గానూ కొత్తగా వచ్చిన తహసీల్దార్లకు శనివారం రాత్రి నరకం చూపించిన వైనంతో ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులు బాబోయ్ కాటంనేని అని వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెవెన్యూ ఉద్యోగులు ఊహించిందే జరుగుతోంది. గత నాలుగైదు నెలల నుంచి కొత్త కలెక్టర్గా కాటంనేని భాస్కర్ వస్తున్నారంటేనే కలెక్టరేట్ ఉద్యోగులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో కాటంటేని సుదీర్ఘ హయాం నాలుగున్నరేళ్ల కాలంలో ఉద్యోగులు, అధికారులు పడిన ఇబ్బందులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటేనే ఉద్యోగుల వెన్నులో వణుకు మొదలైంది. ♦ 2014 జూలై వరకు వాణిజ్య మంత్రిత్వశాఖలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన కాటంనేని భాస్కర్ తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ అయిన తొలినాళ్లలోనే చీటికీమాటికీ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారంటూ జిల్లా వ్యాప్తంగా 40మంది ఎంపీడీవోలు తిరుగుబాటు చేశారు. సామూహిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించి కాటంనేనిని జిల్లా నుంచి బదిలీ చేయాలని రోడ్డెక్కారు. అప్పటి గనులశాఖ మంత్రి పీతల సుజాత దగ్గరుండి పంచాయితీ చేసి ఇకపై అకారణంగా షోకాజ్లు జారీ చేయరని హామీనివ్వడంతో సద్దుమణిగింది. కానీ ఆ తర్వాత కూడా ఆయన తీరులో మార్పు రాకపోగా మరింతగా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారన్న పేరు తెచ్చుకున్నారు. ♦ సమయపాలన లేకుండా ఎప్పడుపడితే అప్పుడు సమీక్షా సమావేశాలకు రాలేక, నోటికొచ్చినట్టు మాట్లాడే ఆయన దూషణలు భరించలేక అప్పట్లో ఆ జిల్లా డీటీసీ సిహెచ్ శ్రీదేవి ఉద్యోగ సంఘాల నేతల వద్ద బోరున విలపించి వేరే జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు. ♦ ‘ఉపాధ్యాయులు కదిలే శవాలు’ అని ఓసారి చేసిన వ్యాఖ్యతో భగ్గుమన్న మాస్టార్లు ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. చివరకు తాను అలా అనలేదని, ఇకపై ఉపాధ్యాయులను ఆ విధంగా దూషించనని చెప్పడంతో ఎట్టకేలకు ఆందోళన ఆగింది. ♦ కాటంనేని వ్యవహారశైలిని వ్యతిరేకించిన ఉద్యోగ సంఘ నేత ఎల్.విద్యాసాగర్ను వెంటాడి.. వేధించి వ్యక్తిగత జీవితంలోని వివాదాలను రోడ్డెక్కించి.. కేసులు పెట్టి.. చివరికి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. విద్యాసాగర్ ఓ దశలో కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ♦ ఎర్రకాలువ ఆధునికీకరణ పనుల విషయంలో అర్ధరాత్రి ఆకస్మిక పరిశీలనకు తాను వస్తున్నానని చెప్పడంతో అనిల్కుమార్ అనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్ధరాత్రి సమయంలో హడావిడిగా వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇప్పటికీ ఆయన విధులకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నారు. ♦ ఇక ఇరిగేషన్ అధికారులను కుక్కల బండి ఎక్కించి, చిప్పకూడు తినిపిస్తాను అని చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇరిగేషన్ శాఖలో తీవ్ర దుమారాన్నే రేపాయి. ♦ ఓ సందర్భంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను సమావేశ మందిరంలో ఏకంగా రెండు గంటలపాటు నిల్చోబెట్టిన సందర్భమూ వివాదమైంది. ♦ ఇలా చెప్పుకుంటూపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన వచ్చే ముందే తెలుసుకున్న విశాఖ అధికారులు ఒకింత భయపడుతూనే వచ్చారు. మొదటి రోజు నుంచే ఆయన తీరు చూసి మరింత జాగ్రత్తగా ఉందాం అని మానసికంగా సిద్ధమయ్యారు. ఆయన సామాజిక వర్గ నేపథ్యం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్బాబులతో ఉన్న సాన్నిహిత్యం, పూర్తిగా గ్రామీణ నేపథ్యమున్న పశ్చిమగోదావరి జిల్లాలో పనితీరు, పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యత.. వెరసి కాటంనేని అక్కడ ఎలా ఉన్నా చెల్లుబాటైందన్న వాదనలు ఉన్నాయి. కానీ మహావిశాఖ నగరం, గ్రామీణం. మన్యం కలబోత అయిన విశాఖ వంటి వినూత్న జిల్లాలో ఆయన వర్కింగ్ స్టైల్ మారుతుందని ఆశించారు. ఇక్కడా అదే తరహా వర్కింగ్ స్టైల్ చూసి విశాఖ జిల్లా ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కలెక్టరేట్లోనే యూఎల్సీ విభాగంలో డెప్యుటీ తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయిన ఎల్.విజయ్కుమార్ ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్య చెప్పుకునేందుకు గత సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. 2013లో రిటైర్ అయిన ఈయనకు నేటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. మూడు పీఆర్సీలు అమలు కాలేదు. 13కు పైగా ఇంక్రిమెంట్లు పడలేదు. మరీ ముఖ్యంగా దాదాపు ఆరేళ్లుగా పెన్షన్ రావడం లేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోలేదంటూ ఆయన కలెక్టర్ ఎదుట ఒకింత ఆవేశపూరిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతే చిర్రెత్తుకొచ్చిన కలెక్టర్ అతను విధులకు విఘాతం కల్గించారన్న అభియోగంపై ఫిర్యాదు చేయాల్సిందిగా డీఆర్వోను ఆదేశించారు. డీఆర్వో ఆదేశాల మేరకు కలెక్టరేట్ బీట్ చూసే పోలీసు సిబ్బంది రిటైర్డ్ డీటీ విజయకుమార్ను బలవంతంగా అక్కడ నుంచి మహారాణి పేట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సెక్షన్ 186, సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు. గోడు చెప్పుకుంటే కేసులు పెడతారా? అంటూ విజయకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఉదంతంపై ‘సాక్షి’లో ప్రముఖంగా రావడంతో వెంటనే వెనక్కి తగ్గిన కలెక్టరేట్ వర్గాలు రిటైర్డ్ డీటీపై కేసుపెట్టలేదని ప్రకటించుకుని ఆయనతో చర్చలు జరిపాయి. ఇక కొత్తగా జిల్లాకు బదిలీపై వచ్చిన సుమారు 45 మంది తహసీల్దార్లకు సెలవురోజైన రెండో శనివారం ఆర్డర్లు ఇస్తామని కలెక్టరేట్కు పిలిపించారు. ఉదయం 9గంటలకే రిపోర్ట్ చేసిన వారిని రాత్రి 10 గంటల వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకునే సరికి హడావుడిగా ఆర్డర్లు ఇచ్చి పంపించారు. ఇక్కడా అదే అసహనం ఈ రెండు ఘటనలే కాదు... కలెక్టరేట్ సిబ్బంది అప్పుడే కాటంనేని తీరుపై తీవ్ర అసంతృప్తికి గురవుతూ బయటకు చెప్పలేక మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. తానొక్కడే నిజాయితీ పరుడునని భావిస్తూ.. మిగిలిన అందరినీ అనుమానిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు, తానొక్కడే పనిచేసే వాడినని.. మిగిలిన వారంతా పనితప్పించుకునే వారే అనే విధంగా ఆయన వ్యవహారశైలితో కలెక్టరేట్ వర్గాలు తీవ్ర మదనపడుతున్నాయి. అప్పటికీ కలెక్టర్ ఉదయం ఏడున్నర గంటలకే వస్తుండటంతో దాదాపు కలెక్టరేట్ ముఖ్య అధికారులంతా ముందుగానే చేరుకుంటున్నారు. వాస్తవానికి ఆయన కొన్ని సెక్షన్ల అధికారులను మాత్రమే రావాలని నిర్దేశిస్తున్నప్పటికీ ఏకంగా కలెక్టర్ ఏడున్నరకు వచ్చి కూర్చుంటే పదిగంటలకు తాము వస్తే ఏం బాగుంటుందని మిగిలిన సెక్షన్ల అధికారులూ ఈసురోమంటూ ఏడున్నరకే వచ్చేస్తున్నారు. సరే టైంది ఏముందిలే మూడు, నాలుగుగంటలు ఎక్స్ట్రా చేసేద్దామని మెంటల్గా ప్రిపేర్ అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఎలా ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడో.. ఏం యాక్షన్ తీసుకుంటాడోనని భయపడిపోతున్నారు. నిజానికి కలెక్టరేట్లోనూ అవినీతి ఆరోపణలతో పాటు పనితీరులో నిర్లిప్తత ప్రదర్శించే అధికారులూ లేకపోలేదు. కానీ అందరినీ ఒకేగాటన కట్టి చివరికి నిజాయితీగా పనిచేసే ఉన్నతాధికారులనూ పక్కనపెట్టి వన్మాన్ షో మాదిరి వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. కలెక్టర్పై ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న అసంతృప్తి నివురుగప్పినా నిప్పులా మారకముందే... ఏలూరులో మాదిరి తిరుగుబాటు దశ వరకు రాకుండానే పాలన గాడి తప్పకుండానే పరిస్థితి అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ కాటంనేనిపైనే ఉంది. ఏమంటారు సారూ.. -
సీఎం ప్రాధాన్యతలే అమలు చేస్తా..
సాక్షి, విశాఖపట్నం: నాకంటూ ప్రత్యేకంగా ప్రాధాన్యతలు ఏమీ లేవు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యతలే నా ప్రాధాన్యతలు.. ఆయన చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో అమలు చేయడమే నా పని‘ అని విశాఖ జిల్లా నూతన కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకనుగుణంగా పనిచేయడమే నా బాధ్యతన్నారు. జిల్లాలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం పరుస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో ప్రజలు సంక్షేమ ఫలాలు అందే విధంగా పాటుపడతానన్నారు. సుదీర్ఘకాలం పాటు విశాఖ కలెక్టర్గా పనిచేసి పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్కుమార్ నుంచి కలెక్టర్ చాంబర్లో సోమవారం ఉదయం 10 గంటలకు నూతన కలెక్టర్గా కాటమనేని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాధ్యమైనంత ఎక్కువ మంది అర్హులకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే తన లక్ష్యమన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై తనకు ఎలాంటి అవగాహన లేదని, పూర్తి స్థాయిలో అధ్వయనం చేయాల్సి ఉందనన్నారు. సమస్యలపై స్టడీ చేసిన తర్వాత పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఒక్క రోజులో సమస్యలన్నీ పరిష్కరించలేం.. ప్రజలు తమ సమస్యలు నేరుగా చెప్పుకునే మీ కోసం, ప్రజావాణి (గ్రీవెన్స్సెల్) కార్యక్రమాలకు తాను అధిక ప్రాధాన్యత నిస్తానని కలెక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఒక్క రోజులో సమస్యలన్నింటిని పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. ప్రతి అర్జీని నిశితంగా, క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఆర్థికంగా, ఆర్థికేతర, సామాజిక కోణాల్లో సమస్యలను విభజించి సత్వర పరిష్కారానికి నోచుకునేలా కృషి చేస్తామన్నారు. జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం కోసమేనని, ఆ దిశగా పనిచేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో అలక్ష్యం, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు. భూ వివాదాలు, వ్యక్తిగత ఫిర్యాదులు, కోర్టు వివాదాలు కలెక్టర్ వరకు ఎందుకు వస్తున్నాయనే దానిపై ఆయా శాఖాధికారులతో చర్చించి చర్యలు చేపడతామన్నారు. మండల స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారం కావాల్సిందేనన్నారు.ఈ ఆఫీసింగ్పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. సాగునీటి పథకాలపై అవగాహనలేదు జిల్లాలో సాగునీటి పథకాలపై తనకు ఎలాంటి అవగాహన లేదని, తెలియని విషయాలు తెలిసినట్టుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కలెక్టర్ భాస్కర్ అన్నారు. జిల్లాలో అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న తర్వాతే మాట్లాడతానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతో వేగంగా జరిగేలా కృషి చేశామని, అయితే ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై సంబంధిత శాఖాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో సి.చంద్రశేఖరరెడ్డి, ఆర్డీవో తేజ్భరత్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కలెక్టర్ వచ్చేశారు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కొత్త కలెక్టర్ కాటమనేని భాస్కర్ జిల్లాకు వచ్చేశారు. వచ్చిరాగానే ఒక్క క్షణం ఆలస్యంగా చేయకుండా పనిలో దిగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం సర్క్యూట్ హౌస్కు చేరుకున్న కొత్త కలెక్టర్ భాస్కర్ను పాడేరు కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి మల్లేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా గురించి వివరించారు. సోమవారం ఉదయం 10 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన జిల్లాలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్కే ప్రాధాన్యం సాక్షి, విశాఖపట్నం: గ్రీవెన్స్సెల్ ఎక్కడ నిర్వహిస్తారు? ప్రతి వారం ఎంతమంది అర్జీదారులు వస్తుంటారు? ఆ వచ్చే అర్జీలను ఏ మేరకు పరిష్కరిస్తారంటూ కలెక్టర్ భాస్కర్ ఆరా తీశారు. తనకు టాప్ ప్రయార్టీ గ్రీవెన్స్ సెల్లేనని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ పరిష్కారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. జిల్లా అధికారులందరూ(హెచ్వోడీలు) గ్రీవెన్స్కు విధిగా వస్తుంటారా? లేదా అని ఆరా తీశారు. గ్రీవెన్స్కు హెచ్వోడీలందరూ వస్తారని డీఆర్వో చంద్రశేఖరరెడ్డి చెప్పగా.. ఏ ఒక్కరు మిస్కాకుండా చూడాలని సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులోనే గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తుంటామని, వచ్చే అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. గ్రీవెన్స్ సెల్ ఎలా ఉంటుందో తాను చూస్తానని చెప్పారు. కలెక్టరేట్ సందర్శన: అనంతరం సబ్కలెక్టర్, డీఆర్వో, ఏవోలతో కలిసి కలెక్టరేట్కు చేరుకుని గ్రీవెన్స్ సెల్ నిర్వహించే మీటింగ్ హాలును పరిశీలించారు.హెచ్వోడీలు, ఇతర సిబ్బంది కూర్చునే సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. -
విశాఖకు భాస్కరుడు.. పశ్చిమకు ప్రవీణుడు
సాక్షి, విశాఖపట్నం: ‘సాక్షి’ చెప్పింది నిజమైంది. జిల్లా కొత్త కలెక్టర్గా కాటమనేని భాస్కర్ ఖరారయ్యారు. ఈ విషయాన్ని గతేడాది మార్చిలోనే సాక్షి చెప్పింది. సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా నియమించారు. అక్కడి కలెక్టర్ కాటమనేని భాస్కర్ను ఇక్కడ నియమిస్తూప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనీల్చంద్ర పునేఠా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ హోదాల్లో ఆరేళ్లు: 2006 బ్యాచ్కు చెందిన ప్రవీణ్కుమార్ 2012లో జాయింట్ కలెక్టర్గా జిల్లాలో అడుగుపెట్టారు. ఆతర్వాత జీవీఎంసీ కమిషనర్గా.. ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా.. ఒకే జిల్లాలో మూడు కీలక పదవుల్లో ఏకబికిన పనిచేసిన ఐఏఎస్ అధికారి రాష్ట్రంలో లేరనే చెప్పవచ్చు. 2014 అక్టోబర్ 12న విశాఖపై హుద్హుద్ తుఫాన్ విరుచుకుపడిన సమయంలో జేసీ ఉన్న ప్రవీణ్కుమార్ అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్తో కలిసి సహాయ, పునరావాస చర్యల్లో తనదైన ముద్ర వేశారు. బాధితులకు పరిహారం పంపిణీలో కొద్దిపాటి ఆరోపణలు వచ్చినా సహాయ చర్యల్లో సఫలమయ్యారన్న పేరుపొందారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్ హోదాలో ఏడాదిన్నర పాటు విశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్సిటీ గుర్తింపు తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో విశాఖను టాప్–3లో నిలిపారు. యువరాజ్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్గా ప్రవీణ్కుమార్కు పగ్గాలు అప్పగించింది. జేసీగా, జీవీఎంసీ కమిషనర్గా, కలెక్టర్గా ఒకేచోట పనిచేసిన ఘనత ఆయన సొంతమైంది. 2016 జూలై 25న కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్కుమార్ గత 31 నెలల్లో తీవ్ర ఒత్తిళ్ల మధ్యే విధులు నిర్వర్తించారు. రికార్డుల ట్యాంపరింగ్ను బయటపెట్టింది ప్రవీణుడే ప్రభుత్వంపై విమర్శలు వస్తాయంటే ఎవరైనా వెనుకడుగు వేస్తారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి, వారి అనుమతి లేకుండా ఆ విషయాలను బయటపెట్టరు. అలాంటిది జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరక్కుండానే ప్రవీణ్కుమార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల భాగోతాన్ని బయటపెట్టి ఒక విధంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. మధురవాడ, కొమ్మాదిల్లో అధికారుల నిర్వాకం వల్ల రూ.2,200కోట్ల కుంభకోణం జరిగిందంటూ ట్యాంపరింగ్కు గురైన రికార్డులను బయటపెట్టి సంచలనం సృష్టించారు. దాదాపు లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతైన విషయాన్ని కూడా బయటపెట్టి కలకలం సృష్టించారు. ఈ కుంభకోణం విపక్షాలకు ఆయుధం కాగా, ఆ తర్వాత వరుసగా వెలుగు చూసిన భూ కుంభకోణాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. వైఎస్సార్సీపీతో సహా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పరువును కాపాడుకునేందుకు విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై సిట్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. భూ కుంభకోణాలు వెలుగుచూసిన సమయంలోనే ప్రవీణ్కుమార్ బదిలీపై ఊహాగానాలు విన్పించాయి. కానీ వెంటనే బదిలీ చేస్తే ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావనతో అప్పట్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు: సదస్సులు, సమ్మేళనాల నిర్వహణలో ప్రవీణ్కుమార్ అరుదైన రికార్డే సృష్టించారు. అంతర్జాతీయ ప్లీట్ రివ్యూతోపాటు మూడు భాగస్వామ్య సదస్సులు, రెండు ఎడ్యుటెక్ సదస్సులు, కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సు, అగ్రిటెక్, బ్లాక్చైన్ కాన్ఫరెన్స్, పిన్టెక్, బ్రిక్స్,స్ప్రింగ్ కాన్ఫరెన్స్లతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్, వరుసగా విశాఖ ఉత్సవాలు, విండ్,బెలూన్ ఫెస్టివల్స్.. ఇలా గత ఆరేళ్లలో ఎన్నో ఈవెంట్ల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. మూడో భాగస్వామ్య సదస్సు తర్వాతే బదిలీపై ఊహాగానాలు : గతేడాది ఫిబ్రవరిలో మూడోసారి నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన తర్వాత మళ్లీ ప్రవీణ్కుమార్ బదిలీపై అధికార వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ప్రవీణ్ కుమార్కు బదిలీ తప్పదని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ కలెక్టర్గిరీపై ఆశలు పెట్టుకున్న పలువురు ఐఏఎస్లు తీవ్రంగా ప్రయత్నించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రద్యుమ్నతో సహా బాబూరావు నాయుడు, సత్యనారాయణ, కార్తికేయ మిశ్రా, పాటు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజులు కలెక్టర్గా వచ్చేందుకు పోటీపడ్డారు. కాటమనేనికే పచ్చజెండా: చాలామంది పోటీ పడినా ప్రభుత్వం మాత్రం యువ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ వైపే మొగ్గు చూపింది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా దాదాపు నాలుగున్నరేళ్లుగా భాస్కర్ సేవలందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాటమనేని భాస్కర్ను కాస్త ఆలస్యమైనా విశాఖకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో ఫిబ్రవరి వరకు ఈ ఇరువురి బదిలీలు జరకపోవచ్చునని భావించారు. కానీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే వీరిని బదిలీ చేసింది. చాలా సంతృప్తిగా ఉంది ఒకే జిల్లాలో జేసీగా, జీవీఎంసీ కమిషనర్గా, కలెక్టర్గా ఆరేళ్లపాటు మూడు కీలక పదవులను నిర్వహించగలిగే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. విశాఖవాసులు నిజంగా ఎంతో సౌమ్యులు. నేను ఎక్కడకు వెళ్లినా వీరు చూపిన ఆదరాభిమానాలు, ఇక్కడ అధికారులు అందించిన సహాయ సహకారాలు మరువలేను. ప్రభుత్వ సహకారంతో ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగాం. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించగలిగాం. జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దగలిగాం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామినయ్యే అవకాశం లభించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నా.– ప్రవీణ్కుమార్, జిల్లా కలెక్టర్ విశాఖ రావడం ఆనందంగా ఉంది రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు కలెక్టర్గా రానుండం ఆనందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పనిచేసాను. ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ఆదరాభిమానాలు మర్చిపోలేను. అమరావతి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు, ప్రాధాన్యత కలిగిన పారిశ్రామిక రాజధాని విశాఖలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా కృషి చేస్తాను.– కాటమనేని భాస్కర్, నూతన కలెక్టర్ -
మరో వివాదంలో పశ్చిమ గోదావరి కలెక్టర్
-
కొత్త కలెక్టర్గా కాటమనేని?
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘ కాలం పాటు విశాఖలోనే వివిధ హోదాల్లో పనిచేసిన కలెక్టర్ ప్రవీణ్కుమార్ త్వరలో బదిలీకానున్నారు. నెలాఖరులోగా బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పలువురు ఐఏఎస్ అధికారులు ఇక్కడికి వచ్చేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా ఐదుగురు ఐఏఎస్లు ఈ పోస్టుపై కన్నేసినప్పటికీ యువ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. జేసీగా వచ్చి.. జాయింట్ కలెక్టర్గా వివాఖ వచ్చిన ప్రవీణ్కుమార్, ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్గా, ప్రస్తుతం కలెక్టర్గా.. ఇలా ఒకే జిల్లాలో మూడు కీలక పదవుల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఐఏఎస్ అధికారి మరే జిల్లాలో లేరు. హుద్హుద్ తుఫాన్ సమయంలో జేసీగా ఉన్న ప్రవీణ్కుమార్ అప్పటి కలెక్టర్ యువరాజ్తో కలిసి సహాయ, పునరావాస చర్యల్లో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్గా ఏడాదిన్నర పాటు పనిచేసిన ఆయన స్మార్ట్ సిటీగా విశాఖకు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. 2016 జూలై 25న కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించారు. భూ కుంభకోణాన్ని బయటపెట్టి.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల భాగోతాన్ని బయటపెట్టి ఒక విధంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. కలెక్టరే స్వయంగా రూ.2,200 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పడం విపక్షాలకు ఆయుధమైంది. ఆ తర్వాత వరుసగా వెలుగు చూసిన భూ కుంభకోణాలు.. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. వరుసగా మూడుసార్లు భాగస్వామ్య సదస్సులు, అగ్రిటెక్తో పాటు ఫ్లీట్ రివ్యూ వంటి జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలు, వేడుకలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లాపై తనదైన ముద్ర వేశారు. గత ఏడాది భూ కుంభకోణాలు వెలుగు చూసిన సమయంలోనే ప్రవీణ్కుమార్ బదిలీపై ఊహాగానాలు విన్పించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడోసారి భాగస్వామ్య సదస్సు ఉన్నందున అప్పటివరకు కదపకూడదని భావించిన ప్రభుత్వం కలెక్టర్ బదిలీ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. సదస్సు ముగిసినప్పటి నుంచి మళ్లీ ప్రవీణ్ కుమార్ బదిలీపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ప్రవీణ్కుమార్కు బదిలీ తప్పదని ప్రభుత్వం సంకేతాలు కూడా ఇచ్చింది. ఎవరి ప్రయత్నాల్లో వారు నెలాఖరులోగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలుంటాయని తెలుస్తోంది. ఎప్పుడు ఈ పోస్టు ఖాళీ అవుతుందా? ఎప్పుడు వద్దామా? అని పలువురు సీనియర్లు గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తామేమీ తీసిపోమన్నట్టుగా నిన్నగాక మొన్న కలెక్టర్ పోస్టు అందుకున్న వారు సైతం ఈ జాబితాలో చేరారు. రెండేళ్లుగా ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నతో సహా పలువురు ఐఏఎస్లు ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం కడప కలెక్టర్గా ఉన్న బాబూరావునాయుడు, సత్యనారాయణ, కార్తికేయ మిశ్రాలు ఆశావహుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం యువ అధికారి కాటమనేని భాస్కర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈయన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా సుమారు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. కలెక్టర్ ప్రవీణ్తో పాటు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ కూడా బదిలీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈయన కూడా వచ్చి మూడేళ్లు కావస్తోంది. -
పౌరుషంగా పనిచేస్తే తిట్టనుగా..
ఏలూరు : జిల్లాలో ఏ అధికారిని, ఉద్యోగిని కానీ తాను ఎటువంటి మాటలు అననని, కష్టపడి పనిచేసే వారిని ఎంతో ప్రోత్సహిస్తానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కానీ కొంతమంది విధి నిర్వహణలో పనులు చేయకుండా బయట మీటింగ్లు పెట్టి కలెక్టర్ తిడుతున్నాడంటూ ఎందుకు పౌరుషం చూపిస్తున్నారని భాస్కర్ ప్రశ్నించారు. నిజంగా పౌరుషంగా పనిచేస్తే తానెందుకు తిడతానని ప్రశ్నించారు. జిల్లాలో నిర్దేశించిన పనిని నిర్ణీత కాలవ్యవధిలో పనిచేయించేందుకు తాను సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నానని, అయితే పనులు చేయకుండా నెలల తరబడి జాప్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోనని చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆదర్శ గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలు తీరుపై శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ సమీక్షించారు. ఆదర్శ గ్రామం అంటే ప్రభుత్వమే అన్నీ చేస్తుందనే ఆలోచన నుంచి ప్రజలు బయటకురావాలని, ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఎస్.షాన్మోహన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు ప్రజా సమస్యల పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్టుగా అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టించిన దేవరపల్లి ఈవోపీఆర్డీ శ్రీనివాసరావును రాతపూర్వకంగా సంజాయిషీ కోరాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ను ఆదేశించారు. మీ కోసం కార్యక్రమంలో దేవరపల్లి మండలానికి చెందిన శెట్టి కమల తమ గ్రామంలో చెరువులో లే అవుట్ చేస్తూ దారి మార్గం మూసేశారని చేసిన ఫిర్యాదుపై ఏం చేశారని కలెక్టర్ ప్రశ్నించగా సమస్య పరిష్కారమైదని ఈవోపీఆర్డీ ఇ.శ్రీనివాసరావు చెప్పడంపై కలెక్టర్ స్పందించారు. వెంటనే కమలతో ఫోన్లో మాట్లాడగా ఈ విషయంపై ఎవరూ రాలేదని సమస్య పరిష్కారం కాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చిన ఈవోపీఆర్డీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆక్రమణల్ని తొలగించండి
ఏలూరు : జిల్లాలో పంటబోదెలు, డ్రెయిన్ల ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం మీ కోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంటబోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలకు గురి అవుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పంట బోదెలను ఆక్రమించుకుని నీటిపారుదలకు ఆటంకం కలిగించడం వల్ల వచ్చే వర్షాల వల్ల పంటలు మునిగిపోయి నష్టపోయే ప్రమాదముందన్నారు. డ్రెయిన్లను ఆక్రమించుకోవడం వల్ల మురుగునీరు రోడ్లపై చేరుకుని ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందన్నారు. పంట బోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు తొల గించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన కాంకడ్రు రామకృష్ణ తమ గ్రామంలోని పొలాల నుంచి వర్షపునీరు వెళ్లే దారిని గౌరీపట్నంకు చెందిన రైతు పటార్ జబ్బర్ బాషా మూసివేయడం వల్ల పొలాలు మునిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. ఆకివీడు మండలం తరటాన గ్రామానికి చెందిన మల్లారెడ్డి వంశీ భాస్కర్, గ్రామ ప్రజలు తాగునీటి కోసం మంచినీటి చెరువుపై ఆధారపడుతున్నామని, అయితే చెరువుకు ఇరువైపులా రొయ్యల చెరువుల కారణంగా నీరు కలుషితమవుతోందని, రోగాల బారిన పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన కొల్లంశెట్టి కృష్ణ, యు.తరుణ్, కె.సూర్యకుమారి తదితరులు గ్రామంలో జనావాసాల మధ్య తోళ్ల పరిశ్రమ నిర్వహించడం వల్ల భరించరాని దుర్గంధంతో ఇబ్బందులు పడడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నామని చెప్పారు. మరికొంత మంది తమ సమస్యలను వివరించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, ట్రైనీ కలెక్టర్ ఎంఎ కిషోర్ పాల్గొన్నారు. పోస్ట్ కార్డుల ద్వారా సమాచారం పంపండి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించిన తర్వాత 15 రోజుల్లోగా పోస్టుకార్డు ద్వారా ప్రజలకు సమాచారాన్ని విధిగా అందించాలని కలెక్టర్ భాస్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడారు. లక్ష్యాన్ని సాధించకుంటే ఎలా? జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో కూలీలకు డెల్టా మండలాల్లో 2 వేల రోజుల పనిదినాలు, అప్ల్యాండ్ మండలాల్లో 5 వేల రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఎంపీడీవోలకు ఇచ్చిన లక్ష్యాన్ని సాధించకపోవడంపై కలెక్టర్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పథకాలపై ఆయన సమీక్షించారు. అంగన్వాడీ సిబ్బందికీ బయోమెట్రిక్ హాజరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలోని మహిళా శిశు,సంక్షేమశాఖ (ఐసీడీఎస్) పథకాల అమలుపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది సమీపంలోని పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి హాజరు వేయాలన్నారు. -
దేశ సరిహద్దుల్లో గెలిచా.. సొంతూరులో ఓడిపోయా
ఏలూరు : దేశ సరిహద్దుల్లో విదేశీయులపై యుద్ధం చేసి గెలిచా.. కానీ సొంతూరులో మాత్రం ఓడిపోయానంటున్నారు ఈ మాజీ సైనికుడు సత్తిబులి వెంకటరెడ్డి. సైనికుడిగా 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నానని, 40 ఏళ్ల క్రితం మిలటరీలో రిటైర్ అయిన తర్వాత తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల వద్ద ప్రభుత్వం ఇచ్చిన 4 ఎకరాలను సాగు చేసుకుంటూ అక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నానని చెప్పారు. ఇటీవల జాతీయ విద్యాసంస్థ-నిట్ కట్టడుతున్నారనే పేరుతో తనకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్ధాక్షిణ్యంగా భూమిని లాక్కుని, ఇల్లు కూల్చివేశారని, ఉండటానికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేక్కడి న్యాయమంటూ మంత్రి వద్ద, అధికారుల వద్ద మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ కలెక్టర్ భాస్కర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. -
సందేహాలెన్నో
సాక్షి, ఏలూరు : రాష్ర్ట ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం బ్యాంకర్లతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.1.50 లక్షల వరకూ పంట రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. వీటి ప్రకారం రైతు కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తామని కలెక్టర్ చెప్పారు. ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎన్నిరకాల పంట రుణాలు తీసుకున్నా, వాటన్నింటిని కలిపి రూ.1.50 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు. 2013 డిసెంబర్ 31 నాటికి రుణం తీసుకుని, 2014 మార్చి 31 నాటికి బకాయి ఉన్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందన్నారు. రైతులు, కౌలు రైతులు, రైతుమిత్ర గ్రూపు సభ్యులు రుణమాఫీ పథకానికి అర్హులన్నారు. రుణమాఫీలో రైతులకు సంబంధించి ఏమైనా అనుమానాలుంటే తహసిల్దార్ల సహకారంతో నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలు, చేపల, రొయ్యల చెరువుల సాగుదారులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు. డీసీసీబీ ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులు 2014 మార్చి 31లోగా రూ.80 కోట్లు మేర రుణాలను చెల్లించారని పేర్కొన్నారు. వీరికి రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. గతంలో భూ యజమానులు తీసుకున్న పంట రుణాలు ఇప్పటికీ బకాయి ఉండి, ప్రస్తుతం అదే భూమిపై కౌలు రైతుకు సంబంధించిన పంట రుణాలు బకాయి ఉంటే ఏ రుణాలకు మాఫీ వర్తింప చేయాలనే విషయంలో సందేహం ఉందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరతామని కలెక్టర్ చెప్పారు. రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల వివరాలను వెంటనే అందించాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. రుణ మొత్తాలు కట్టాల్సిందే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన కారణంగా అర్హత కలిగిన రైతులు తాము తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించాలన్నారు. రుణాలు చెల్లించినా వారి అర్హత మేరకు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రుణాల చెల్లింపు ఆలస్యమైతే వడ్డీ రాయితీ పోతుందని, గడువు మీరిన రుణాలపై అపరాధ వడ్డీ పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయూలపై బ్యాం కర్లు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జా రుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఆర్డీవోలు కె.ప్రభాకరరావు, శ్రీనివాసరావు, ఉదయభాస్కరరావు, గోవిందరావు, వ్యవసాయ శాఖ జేడీ ఎం.సత్యనారాయణ, డెప్యూటీ డెరైక్టర్ కృపాదాస్, తహసిల్దార్లు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
మత్స్యశాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు !
సాక్షి, ఏలూరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలిచ్చారు కలెక్టర్ కాటమనేని భాస్కర్. ఏలూరు మండలం మాదేపల్లిలో మంగళవారం నిర్వహించిన సదస్సుకు హాజరైన కలెక్టర్ అక్కడ మత్స్యశాఖ అధికారులు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉండాల్సిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ఆ శాఖ డెప్యూటీ డెరైక్టర్ వీవీ కృష్ణమూర్తిని ఆదేశించారు. దీంతో మత్స్య అభివృద్ధి అధికారి స్టీవెన్రాయ్కు షోకాజ్ నోటీసు జారీచేసినట్టు డెప్యూటీ డెరైక్టర్ కృష్ణమూర్తి మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలి పారు. తాను క్షేత్ర పరిశీలనకు వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుండటం వల్ల సమావేశానికి వెళ్లడం ఆలస్యమైందని స్టీవెన్రాయ్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఆయన క్షేత్ర పరి శీలనకు వెళ్లిన మాట వాస్తవమే అయినా సమావేశానికి అరగంట ఆలస్యంగా రావడంతో చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారని కృష్ణమూర్తి పేర్కొన్నారు. -
పర్యాటకం పదునెక్కాలి
సాక్షి, ఏలూరు : జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కలెక్టర్ కాటమనేని భాస్కర్కు ఆదేశాలిచ్చారు. విజయవాడలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల ప్రథమ సమావేశంలో ముఖ్యమంత్రితో కలెక్టర్ భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేయూలని, అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, కోళ్ల పెంపకాన్ని విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని పథకాలకు, కార్యక్రమాలకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. పతి ఇంటినుంచి ఒక మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జీపీఎస్ మ్యాపింగ్ను ఉపయోగించుకుని సర్కార్ భూములను కాపాడటంతోపాటు, కొత్త సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూములను సిద్ధం చేయూలన్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని తీసుకుని నిరుపయోగంగా ఉంచిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా అక్షరాస్యతను మెరుగుపరచాలని, గర్భిణి, శిశు మరణాలను నివారించడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. యువతలో వృత్తి నైపుణ్యత మెరుగుపరచడానికి పథకాలను రూపొందించాలని, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ముఖ్యంగా సేవల రంగాన్ని విస్తరించడానికి చర్యలు చేపట్టాలనిఆదేశించారు. అభివృద్ధిలో సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని (ఐటీ) పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. సమష్టిగా అభివృద్ధి సాధిస్తాం: కలెక్టర్ సమష్టి కృషితో జిల్లాలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పినట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఆవశ్యకత, కేంద్ర సంస్థల ఏర్పాటుకు గల అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ భూముల లభ్యత, వ్యవసాయ, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేసినట్లు కలెక్టర్ వివరించారు.