Spiritual life
-
ఐఏఎస్ కల నుంచి సాధ్వీ గౌరీ గిరి దాకా...
ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం అది. నిక్కీ అని ముద్దుగా పిలుచుకునే చెల్లెలు ప్రాచీతో కలిసి ఆడుకోవడమంటే 13 ఏళ్ల అక్క రాఖీ సింగ్కు మహా ఇష్టం. పాఠశాలలోనూ చక్కని చదువరి. పెద్దయ్యాక ప్రజాసేవ చేయాలనేది ఆమె కల. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆమె ఆశయం. స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్కాలేజీలో 9వ తరగతి చదువుతూ స్కూళ్లో పాఠ్యాంశాలతోపాటు రామయణ, భాగవతాది ఇతిహాసాలపైనా అనర్గళంగా మాట్లాడేది. హిందూ మతంపై అచంచల విశ్వాసం ఉన్న రాఖీసింగ్ దుర్గాదేవిని బాగా పూజించేది. దేవీ శరన్నవరాత్రుల కాలంలో చెప్పుల్లేకుండానే నడిచిందని స్కూల్ యాజమాన్యంలోని అధికారి పీసీ శర్మ చెప్పారు. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలోని దౌలీ పట్టణం ఈమె స్వస్థలం. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి చూపే రాఖీ హఠాత్తుగా తాను సన్యాసినిగా మారతానని చెప్పినా తల్లిదండ్రుల్లో ఎలాంటి కలవరపాటు లేదు. ఆధ్యాత్మిక భావాలున్న తమ పెద్దకూతురు నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దీంతో జనవరి 19వ తేదీన జునా అఖాడాలో చేరి సాధ్వీగా మారేందుకు రాఖీ సిద్ధమైంది. ఆమెను పిండదాన్ క్రతువు తర్వాత గౌరీ గిరిగా పేరు మార్చి అఖాడాలో చేర్చుకుంటామని అఖాడా పెద్ద మహంత్ కౌషాల్ గిరి చెప్పారు. మలుపు తిప్పిన మహాకుంభమేళా తండ్రి సందీప్ సింగ్ ధాకరా, తల్లి రీమా సింగ్లతో కలిసి గత ఏడాది డిసెంబర్లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లింది. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రాపంచిక సుఖాలకు దూరంగా నిరాడంబరంగా గడుపుతున్న సాధువుల జీవనశైలిని చూసి ఆకర్షితురాలైంది. ఐఏఎస్ అధికారిగా ప్రజల కష్టాలను తీర్చే బదులు ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రజల మానసిక సమస్యలు తీర్చడం ముఖ్యమని భావించింది. బాహ్య ప్రపంచ కష్టాల కడలిని ఈదలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను తన ఆధ్యాత్మిక బోధనలతో సాంత్వన చేకూరుస్తానని, సాధ్విగా తన వంతు సాయం చేస్తానని రాఖీసింగ్ చెప్పింది. డిసెంబర్ 26వ తేదీన తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వాళ్లు అందుకు అంగీకరించి సెక్టార్20 ప్రాంతంలోని మహంత్ కౌషాల్ గిరి ఆశ్రమంలో చేరి్పంచారు. కన్యాదానం నుంచి సాధ్వి దాకా 13 ఏళ్ల రాఖీ నడవడికను స్వయంగా గమనించిన అఖాడా పెద్దలు ఆమెను సన్యాసినిగా స్వీకరించేందుకు అంగీకరించారు. గురుగ్రామ్ నుంచి మహంత్ రాగా ఆయన సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ జనవరి ఆరో తేదీన తల్లిదండ్రులు ఆశ్రమానికి రాఖీని కన్యాదానం చేశారు. ఆరోజున అఖాడాలు ఆమెకు గౌరి అని నామకరణం చేశారు. కూతురు సన్యాసినిగా మారుతుండటంపై తల్లి రీమా స్పందించారు. ‘‘మా కుటుంబం గత నాలుగేళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలోనే పయనిస్తోంది. మహంత్ మేముండే ప్రాంతంలో భాగవతం విశేషాలను అందరికీ విడమరిచి చెప్పేవారు. ప్రయాగ్రాజ్ వెళ్లినప్పుడు రాఖీ తన మనసులోని మాట చెప్పింది. అది ఆమె నిర్ణయం కాకపోవచ్చు. భగవత్ సంకల్పం అనుకుంటా. ఆశ్రమంలో ఎందుకు చేర్పించారని బంధువుల నుంచి ఎన్నో ప్రశ్నలు. అయినా తల్లిగా నా బిడ్డ అక్కడ ఎలా ఉండగలదు? ఏం తింటుంది? అనే భయం నాకూ ఉంది. కానీ ఆమె నిర్ణయం దైవేచ్ఛ కాబట్టి మేం కూడా అడ్డుచెప్పలేదు’’అని తల్లి రీమా అన్నారు. సుదీర్ఘంగా క్రతువు సనాతన ధర్మ ప్రకారం సాధ్విగా మారితే ఆ అమ్మాయి కేశసంరక్షణపై ధ్యాస పెట్టకూడదు. జుట్టంతా ఉండలు కట్టినా పట్టించుకోవద్దు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించాలి. సాధ్వి గా మారే రోజున ఐదుగురు సాధువులు ఇచ్చిన ఐదు పవిత్ర పత్తిదారాలను స్వీకరించాలి. సన్యాసుల అన్నపానాలు, దీక్షా నియమాలను పాటించాలి. ప్రేమ, రాగద్వేషాలు, కామామోహాలను త్యజించాలి. మహాకుంభమేళాలో నాలుగో పవిత్ర పుణ్యస్నానాల రోజున అంటే జనవరి 19వ తేదీన పిండదాన్ క్రతువులో భాగంగా గౌరీని వేదమంత్రోచ్ఛారణల మధ్య గంగానదిలో 108 సార్లు ఓం నమఃశివాయ అని చదివిస్తూ ముంచుతారు. తర్వాత గంగాదేవికి హారతి ఇచ్చాక గౌరీ గిరిగా కొత్త పేరుతో పిలుస్తారు. ఇటీవల మరికొందరూ.. ఇటీవలికాలంలో భారత్లో ఎంతోమంది సాధారణ జీవితానికి స్వస్తిపలికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించారు. ఇందులో టీనేజర్లూ ఉన్నారు. సూరత్లో వందల కోట్ల ఆస్తులున్న వజ్రాల వ్యాపారి గారాలపట్టి, 8 ఏళ్ల దేవాన్షీ సంఘ్వీ సైతం సన్యాసినిగా మారింది. జైన్ సాధ్విగా కొత్త జీవితాన్ని ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ఘటన ఇంకోటి గుజరాత్లోనే జరిగింది. హిమ్మత్నగర్లో నిర్మాణరంగంలో వ్యాపారం చేస్తూ రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టిన భవేశ్ భాయ్ భండారీ దంపతులు సన్యాసులుగా మారారు. అంతకుముందే అంటే 2022లోనే వీళ్ల టీనేజీ కుమారుడు, కుమార్తె సన్యాసులుగా మారడంతో వీళ్ల బాటలనే తల్లిదండ్రులు పయనించడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.ఎవరీ రాఖీ సింగ్ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది. ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి..
దేశంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతీఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ఒక యోగి ఆత్మకథ’ అని చెబుతుంటారు. ఈ పుస్తకం ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. పరమహంస యోగానంద తన జీవిత అనుభవాలను ‘ఒక యోగి ఆత్మకథ’ రూపంలో వెలువరించారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ పరమహంస యోగానంద మార్గదర్శిగా నిలిచారు. ఈరోజు(జనవరి 5) ఆ మహనీయుని జన్మదినం. అందుకే ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలను ఒకసారి స్మరించుకుందాం.యోగాకున్న ప్రాముఖ్యతను ప్రపంచమంతటికీ తెలియజేయడంలో పరమహంస యోగానంద(Paramahansa Yogananda) కీలక పాత్ర పోషించారు. పాశ్చాత్య దేశాల్లో ఆయనను ‘ఫాదర్ ఆఫ్ యోగా’ అని పిలుస్తారు. పరమహంస యోగానంద అందించిన ‘క్రియాయోగం’ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మిక బోధనలకు ఏకరూపత కల్పించడం, శాస్త్రీయ ధ్యాన పద్ధతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం పరమహంస యోగానంద ఎనలేని కృషి చేశారు.పరమహంస యోగానంద ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో 1893, జనవరి 5న జన్మించారు. అతని తండ్రి భగవతి చరణ్ ఘోష్ గోరఖ్పూర్ రైల్వేలో అధికారి. పరమహంస యోగానంద అసలు పేరు ముకుంద లాల్ ఘోష్. అనంతర కాలంలో పరమహంస యోగానంద అనే పేరుతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1920లో తొలిసారిగా పరమహంస యోగానంద భారత ప్రతినిధిగా బోస్టన్లో జరిగిన మతపరమైన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. అదే ఏడాది యోగానంద భారత్లో తత్వశాస్త్రం, ధ్యాన శాస్త్రంపై బోధనలను వ్యాప్తి చేయడానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్(Self-Realization Fellowship)ను స్థాపించారు. 1925లో లాస్ ఏంజిల్స్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరమహంస యోగానంద శిష్యులుగా మారారు.1917లో ఆయన ఆదర్శ జీవన్ విద్యాలయ(Adarsh Jeevan Vidyalaya)ను స్థాపించారు. ఈ పాఠశాలలో ఆధునిక విద్యా పద్ధతుల ద్వారా యోగా శిక్షణ, ఆధ్యాత్మిక ఆదర్శాలను అందించారు. పరమహంస యోగానంద ఆధ్యాత్మిక రంగంలో అందించిన సేవలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం 1977, 2017లలో రెండు తపాలా బిళ్ళలను విడుదల చేసింది. పరమహంస యోగానంద 1952 మార్చి 7న లాస్ ఏంజెల్స్లో మహాసమాధిలో ప్రవేశించారు. ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్గా ఉంటూ.. -
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
తాత్వికత: ఎంతో చిన్నది జీవితం
ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు. ‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ప్రేమించు... జీవించు...
ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది.. మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు. అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.– దాసరి దుర్గాప్రసాద్ -
ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చెప్పుకొనేదే.. నగరంలో ఉరుకులు పరుగుల జీవితం.. మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనలకు గురవుతూ.. మత్తుపానీయాలకు బానిసలు అవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే ఒత్తిడి నుంచి బయటపడేందుకు పలు కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండే రిసార్టులకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ.. నగరంలోని, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.ఎందుకిలా..? సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్టులు, సబి్మషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లతో రోజును భారంగా గడుపుతుంటారు. నెలాఖరు రాగానే లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు మరింత కామన్. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాటు చేసుకుని, అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు దిగిపోతుంటుంది. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునేంత ప్రశాంతత దొరకట్లేదని ఆధ్యాతి్మక చింతన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.చిన్న వయసులోనే..వారాంతాల్లో నగరంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ, యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరాలకు కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుని చిన్న వయసులోనే వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చుని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త ఒరవడిని చూపుకొంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయల్దేరుతున్నారు.ఆ రోజులే బాగున్నాయి.. చాలీచాలని డబ్బులతో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్లో తిరిగిన రోజులే బాగున్నాయి. అప్పుడు ఉద్యో గం వస్తే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఏదో పోగొట్టుకున్న వెలితి ఉంది. సవాలక్ష సమస్యలు చుట్టు ముడుతున్నట్లు ఉంది. ప్రశాంతత అనే మాటే కరువైంది. నెలాఖరు రాగానే లోన్లు.. ఈఎంఐల వెంట పరిగెత్తాల్సి వస్తోంది. డబ్బులు అన్నీ ఇవ్వదనే విషయం అవగతమవుతోంది. అందుకే భక్తి మార్గం ప్రశాంతతను ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి వారం ఏదైనా గుడికి వెళ్లి ఒంటరిగా కాసేపు గడుపుతాను. – నల్లం నవీన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్మనసుకు ప్రశాంతత నాకు ఆధ్యాతి్మక భావన ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు చేపట్టడం అలవాటు. పెళ్లయిన తర్వాత ఉద్యోగం, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. వారంలో శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. పిల్లలు, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్తుంటాం. తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, ఈ మధ్య స్వర్ణగిరి వెళ్లాం. – నిహారికారెడ్డి, మియాపూర్ -
ఆట కదరా శివా!
పాండిచ్చేరి పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా అరుణాచలం బస్సు ఎక్కాడు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని రాజగోపురం వద్ద నిలబడి వినాయకుణ్ణి ప్రార్థించి నడక ప్రారంభించాడు. అష్టలింగాలను చూస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని అతడి ఆలోచన.నడుస్తూ నడుస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన ఓ ఆధ్యాత్మిక వేత్త పరిచయం అయ్యాడు. ‘‘అలజడి లేని జీవితాన్ని గడ΄ాలంటే ఏమి చేయాలి?’’ అని ఆసక్తిగా ఆ ఆధ్యాత్మికవేత్తను అడిగాడు యువకుడు. ఆధ్యాత్మిక వేత్త చిరునవ్వు ముఖంతో ‘‘ఇద్దరూ ఆడగలిగి, ఇద్దరూ గెలవగలిగే ఆట ఆడాలి’’ అని బదులిచ్చాడు. అర్థం కాని ముఖం పెట్టాడు ఆ యువకుడు. ఆధ్యాత్మికవేత్త యువకుడి హావభావాలు పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ‘ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ, ఇద్దరూ ఎలా గెలుస్తారు?’ అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు. వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మిక వేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా ‘‘మీరు చెప్పింది ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆలోచించు. నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని యాభై మంది ఆడినా... అందరూ గెలుస్తారు. అంతేకాదు... అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను’’ అంటూ ఆధ్యాత్మిక వేత్త వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందూ వెనుకా చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. చేసేదేం లేక ఆధ్యాత్మికవేత్తను వెదుక్కుంటూ వెళ్ళాడు.ఎలాగైతేనేమి ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసపోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి‘‘మీరు సమాధానం చెప్పక΄ోతే నా తల బద్దలై ΄ోయేలా ఉంది’’అని దిగులుగా ముఖం పెట్టాడు. యువకుడి భుజం తడుతూ ఆ ఆధ్యాత్మికవేత్త ‘‘విచిత్రం ఏమిటంటే... వందమంది ఆ ఆట ఆడినా, వందమందీ గెలుస్తారు. అదేమిటంటే... ఎదుటివారిని ప్రేమించే ఆట. అక్కడ అందరూ విజేతలే. ఓటమి పాలయ్యేవారు ఎవ్వరూ ఉండరు’’ అని సమాధానమిచ్చి అక్కడినుంచి మెరుపు వేగంతో వెళ్ళి΄ోయాడు.‘‘నిజమే. జీవితమనేది ఒక ఆటలాంటిది. ప్రేమ విత్తనాలు వెదజల్లే ఆట ఆడటం ప్రారంభిస్తే జీవితం పూల తోట అవుతుంది. దానికి వయస్సు, భాష, లింగం, ్ర΄ాంతం, కులం, మతం అనే హద్దులు ఉండవు ’’ అనుకుంటూ ఆ యువకుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
భక్తుని వేదన..
సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
దేహం.. గాలిలో కదిలే దీపం!
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే ‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి దుఃఖం దూరమై, ముక్తి దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జనరంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆపై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు..దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సందోహము స్వప్నకాలమున దోచెడి సందడి రాజ్యభోగ సన్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీయైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయుసంచలిత దీపిక’ అనే మాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం. విన్నవెంటనే మనసుకు తోచే అర్థం. ఇక రెండవది – మానవ శరీరంలో ఊపిరి అనే వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే దీపం వంటిది ఈ దేహం. ఊపిరి ప్రసరణం ఆగిపోగానే అదీ ఆగిపోతుంది, ఆరి పోతుంది అనే విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి సొగసును కూర్చేవే!‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి అంతా కలలో జరిగేదిగానే భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజాలికుడు వెదజల్లే ధనం వంటిది సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం. – భట్టు వెంకటరావు -
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
దొంగల దోపిడి..
ఓ లక్ష్మీనృసింహ స్వామీ! నాకు చేయూతనివ్వవయ్యా! మమ దేహి కరావలంబమ్!నాకు కనిపించడం మానేసింది. అంధత్వం ఏర్పడింది. ఎదురుగా మంచీ, చెడూ కనిపిస్తుంటే కూడా ఏది ఏదో పోల్చుకోలేకుండా ఉన్నాను. ఇది పాపం, ఇది పుణ్యం అని గుర్తించలేకపోతున్నాను. ఎటు పోతున్నానో, ఎటు పోవాలో, ఏమి కాబోతున్నదో ఏమీ పాలు పోవడం లేదు. ఇది నేత్రవ్యాధి కాదు. బుద్ధి వైకల్యం. నేను వివేకాన్ని కోల్పోయాను. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు!మహాబలవంతులైన చోరులు నా మీద దాడి చేసి, అమూల్యమైన నా వివేక ధనాన్ని దొంగిలించుకెళ్లారు. ఆ దొంగలకు ‘ఇంద్రియాలు’ అని నామధేయం. నేను ఏమరుపాటుగా ఉండగా, వాళ్ళు నన్ను ఇట్టే లొంగదీసుకుని, భోగలాలసత అనే ఇనుప గొలుసులతో కట్టివేసి, నా వివేకాన్ని ఊచముట్టుగా దోచేశారు. దాంతో నేను అవివేకిగా, మూర్ఖుడిగా, పాప పుణ్యాల గ్రహింపు లేకుండా, నాకు ఏది మేలో నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను.నాకు మిగిలిందల్లా ఇంద్రియ భోగాల మీద మితిలేని, మతిలేని వ్యామోహం. ఆ మోహాంధకారం నా జీవితాన్ని చీకటి కూపం చేసేసింది. అది ఏ గోతిలోకి లాక్కెళితే అందులో పడిపోతున్నానే తప్ప, నాకు క్షేమకరమైన మార్గాన్ని స్వయంగా ఎంచుకోగల శక్తిని, దొంగలు దోచారు. నా బుద్ధి పని చేయడం మానేసింది. విచక్షణా జ్ఞాననేత్రం మూసుకుపోయింది. నాకు చేయూత ఇచ్చి, ఈ అంధకారంలో నుంచి బయటపడే మార్గం చూపు స్వామీ!"అంధస్య, మే, హృత వివేక మహా ధనస్యచోరైః మహా బలిభిః ఇంద్రియ నామధేౖయెఃమోహాంధకార కుహరే విని పాతితస్యలక్ష్మీనృసింహ, మమ దేహి కరావలంబమ్!"– ఎం. మారుతి శాస్త్రి -
భగవత్ప్రసాదం! ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’..
ఈ విశ్వంలో ఆలోచనలు, భావనలను మనిషి మాత్రమే మాటల ద్వారా తెలుపగలడు. ఏ ఇతర జీవికీ మాట్లాడే శక్తి లేదు. మాట్లాడటం అనేది భగవంతుడు మానవునికి అనుగ్రహించిన వరప్రసాదం. మానవుడు తన జీవితాన్ని సంతోషమయం లేక దుఃఖమయం కావించుకోవడం అనేది దేవుడు ఇచ్చిన వరప్రసాదాన్ని ఉపయోగించుకొనే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మాటను సరిగా, విచక్షణతో ఉపయోగించుకొన్న మానవుడు... తాను ఆనందంగా ఉండడమే కాక ఇతరులను కూడా సంతోషపరచగలడు.దీనికి భిన్నంగా విచక్షణారహితమైన, అస్తవ్యస్తమైన మాటలు మాట్లాడుట వల్ల సమస్యలు వస్తాయి. ఫలితంగా మనిషి జీవితం దుఃఖమయం అవుతుంది. ఈ కారణం వల్లనే ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’ అని పెద్దలు చెప్పారు. మనం సర్వకాల, సర్వావస్థలయందు తియ్యగా, ఇంపుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మనం మాట్లాడే పద్ధతి ఇతరులను కోపోద్రిక్తులను చేయకుండా జాగ్రత్త పడాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. నియమాలను ఉల్లంఘించకుండా ఉండడమే వినయం. ఈ పద్ధతి భగవద్గీతలో ‘వాజ్మయ తపస్సు’అని తెలుపబడినది.మనం చేయు భౌతికపరమైన పనులన్నీ ఆలోచనలపైననే ఆధారపడి ఉంటాయి. ఆలోచించడం, మంచి– చెడులను తెలుసుకొనడం బుద్ధికి సంబంధించిన పని. బుద్ధిబలాన్ని ఉపయోగించి ‘ఏది ఉచితం, ఏది ఉచితంకాదు’ అని మనం తెలుసుకో గలుగుతున్నాం. మనం చేసే పనిని బట్టి మన ఆలోచన వ్యక్తమవుతుంది.ఉదాహరణకు ఒక వక్త ముందు మైక్ ఏర్పాటు చేసినా... ఆ వక్త ఆలోచన మాటల రూపంలో బయటికి రానంత వరకూ మైక్ మనకు వినిపింపచేయలేదు. అలాగే క్రియ అనేది దానంతట అది మంచి కాదు లేక చెడు కాదు. దీని (చర్య) మంచి, చెడులు దీనికి మూలాధారమైన ఆలోచనలోనే ఉంటాయి. అందువల్లనే మనం చేసే పని మంచిగానూ, గౌరవప్రదంగానూ ఉండాలి. మంచి ఆలోచనలకే తావునిచ్చి, వాటిని వృద్ధి చేసుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఆధ్యాత్మిక శక్తితో...
ఇవ్వాళ ప్రభుత్వాలూ, సంఘసేవకులూ మహిళా సాధికారత గురించి ఎంతగానో మాట్లాడుతున్నారు. కానీ, దాదాపు 140 సంవత్సరాల క్రితమే శ్రీ రామకృష్ణ పరమహంస స్త్రీ జనోద్ధరణపై దృష్టి పెట్టారు. సాక్షాత్తూ భార్యలోనే కాళీ మాతను దర్శించగలిగిన పరమహంస స్త్రీ జనోద్ధరణకు తన శిష్యులను ప్రోత్సహించారు.ఒకరోజు గౌరీమా అనే భక్తురాలు పువ్వులు సేకరిస్తుండగా గురుదేవులు ఒక నీటికుండతో అక్కడకు వచ్చి ఒక చేత్తో చెట్టుకొమ్మను పట్టుకొని మరో చేత్తో చెట్టుకు నీరు పోస్తూ ‘గౌరీ, నేను నీరు పోస్తూ ఉంటే నువ్వు మట్టిని కలుపు’ అన్నాడు. అప్పుడామే ‘ఇక్కడ బంక మట్టి లేదు. ఎలా మట్టిని కలప గలన’ని పలికింది.ఆ మాట విని గురుదేవులు ‘నేను ఏ అర్థంలో చెప్పానూ, నువ్వు ఏ రకంగా అర్థం చేసుకొన్నావూ? ఈ దేశంలో స్త్రీల పరిస్థితి శోచనీయంగానూ, బాధాకరంగానూ ఉంది. వారికోసం నువ్వు పాటుపడాలి’ అన్నారు. అంటే... తాను దేశ స్త్రీల అభివృద్ధికి నడుం బిగించి కృషి ఆరంభిస్తే, గురుదేవులు అందుకు తగిన తోడ్పాటు అందిస్తారన్నమాట అనుకున్నారు గౌరీమా. అప్పుడామె ‘కొద్ది మంది బాలికలను నాకు ఇవ్వండి. వారిని హిమాలయాలకు తోడ్కొని వెళ్ళి వారిని సౌశీల్యవంతులుగా తీర్చి దిద్దుతాను’ అంది. గురుదేవులు తన తలను అడ్డంగా ఊపుతూ, ‘కాదు, కాదు, నువ్వు నగరంలోనే ఉంటూ పని చేయాలి. నువ్వు అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనలు చాలు. ఆధ్యాత్మిక శక్తితో నువ్వు స్త్రీలను సేవించాలి’ అన్నారు.గురుదేవుల ఆదేశాన్ని శిరసావహించిన గౌరీమా కలకత్తాలో బాలికల నిమిత్తం ఒక పాఠశాలను స్థాపించి భారతీయ స్త్రీలను విద్యావంతులను గావించడంలోనూ, తద్వారా వారిని ఉద్ధరించడంలోనూ ఎంతో కృషి చేసింది. (పుటలు 248, 249 – శ్రీ రామకృష్ణ లీలామృతం). రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు కూడా మహిళా ఉద్ధరణకు ఎంతగానో కృషి చేయడం గమనార్హం. – రాచమడుగు శ్రీనివాసులు -
ఆచరణ ముఖ్యం..!
ఒక రోజు బోధివనానికి వచ్చిన ఓ నడివయస్కుడు బోధిసత్త్వుని పాదపద్మాలను తాకి నమస్కరించాడు. చిరునవ్వుతో అతని వివరాలు అడిగాడాయన. ‘దేవా నా పేరు అభినందనుడు. నేను పేదవాడిని. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. లౌకిక పాశాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాను. మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే నాకు జ్ఞానమార్గం చూపాలి’ అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.బోధిసత్త్వుడు ‘అభినందనా, ఈ చెట్లకున్న ఆకులను చూడు. అవన్నీ ఎందుకు కదులుతున్నాయో తెలుసా... గాలి వచ్చి ఢీకొనడంతో కదులుతున్నాయి. పాశమనే గాలి వచ్చి ఢీకొన్నప్పుడల్లా మనిషి ఆకులా ఇలా ఊగుతాడు. మొదట నీ మనసులో ఉన్న లౌకిక పాశాలను తెంచుకో. అప్పుడే నీవు జ్ఞానమార్గంలో నడవగలవు. అది నీ వల్ల సాధ్యమేనా? అన్నాడు. సాధ్యమే అన్నాడు అభినందనుడు. అయితే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండన్నాడు బోధిసత్త్వుడు.అభినందనుడు అక్కడే ఉండిపోయాడు. కొద్ది రోజులు సన్యాసి జీవితం చక్కగానే గడిపాడు. క్రమంగా అతడు మళ్లీ లౌకిక బంధనాల్లోకి జారుకోవడాన్ని బోధిసత్త్వుడు గమనించాడు.ఒక రోజు అభినందనుని పిలిచి రెండు పాత్రలు తీసుకున్నాడు. ఓ పాత్రలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మరొకటి ఖాళీ పాత్ర. పదార్థాలు ఉన్న పాత్రను నీటిలో వదిలేశాడు. అది లోపలికి మునిగిపోయింది. ఖాళీ పాత్రను నీటిలో వేశాడు. అది తేలియాడుతూ కనిపించింది. ‘బరువైన పాత్ర కనిపించకుండా పోయింది. ఖాళీ పాత్ర తేలుతోంది. ఖాళీ పాత్ర ఉంది చూశావూ, అది జ్ఞానపాత్ర. బరువైన పాత్ర ఉంది చూశావూ, అది బంధనాల పాత్ర.నేను సన్యాసినవుతాననీ, జ్ఞానినవుతాననీ చెప్పడం సులభం. కానీ ఆచరణ కొచ్చేటప్పటికి అది చాలా కష్టం. అది అంత సులభమైన విషయం కాదు. ఆశనూ, లౌకిక పాశాలనూ వదులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమై ఉండాలి’ అన్నాడు బోధిసత్త్వుడు. అప్పటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు అభినందనుడు. – యామిజాల జగదీశ్ -
దైవానుభవానికి మార్గం..
దైవత్వం ఒక అనుభవం. దీనిని హృదయంలో ప్రతిబింబింప జేసుకోవాలి. అద్దం కదులుతూ ఉన్నా లేదా దానిని పొగ కప్పివేసినా లేదా వస్తువుల నుండి చాలా దూరంగా ఉన్నా... అద్దం దేనినీ సరిగా ప్రతిబింబింప చేయలేదు. మనస్సు (అద్దం) నిశ్చలంగా (కదలకుండా) ఉండడమే ఏకాగ్రత. అద్దాన్ని కప్పి ఉంచే పొగ (అహం)ను తొలగించాలి. అదే ‘దైవ సాక్షాత్కారం’.జ్ఞానానికి రెండు స్థాయులు ఉన్నాయి. ఒకటి కిందిస్థాయి, మరొకటి పైస్థాయి. ఇంద్రియాలను ఉపయోగించుకొని, హేతుబద్ధంగా విచారించి తెలుసుకొనేది కిందిస్థాయి జ్ఞానం. చాలామంది కిందిస్థాయి జ్ఞానంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. దైవానికి సంబంధించిన జ్ఞానమే పైస్థాయికి చెందింది. ఇది సాధారణమైన జ్ఞానాన్ని మించింది. అంటే సర్వోత్కృష్టమైన దన్నమాట. కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన జ్ఞానాన్ని సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారు.మానవ జన్మ ఉన్నత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందటమే. మనిషి తన జన్మకు కారణం ఏమిటో మరచిపోయి ‘కామ– కర్మ– అవిద్య’ అనే చక్రంలో చిక్కుకున్నాడు. స్వార్థబుద్ధిని పోనీయక, సొంతలాభం కోసం ఇతరులకు నష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటివారికి ఎన్నటికీ విమోచన ఉండదు. కాబట్టి ఆత్మ వివేక మార్గంలో నడచి, భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతరుల దోషాలనూ, తన చుట్టూ గల వాతావరణంలోని లోపాలను ఎంచుట మనిషికి గల సాధారణ లక్షణం. ఈ విధంగా తప్పులను ఎంచుటం వలన ఏ ప్రయోజనమూ లేదు. వాస్తవంగా ఈ లక్షణ ం మనిషి మానసిక ప్రశాంతతను భంగపరుస్తుంది. ఇందువలన సమతాస్థితిని పొందలేడు.ఆధ్యాత్మిక మార్గం అనుసరించదలచిన భక్తుడు చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది. ఇతరుల దోషాలను ఎంచటం మానివేసి, ఎవరికి వారు తమను తాము సరిచేసుకొని అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నించాలి. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్న లోకంలో తరచుగా వినబడుతూ ఉంటుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కోరకమైన సమాధానాన్ని ఇస్తుంటారు. ఈ ప్రపంచం మాయ అనుకున్న వారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతామని అంటారు. శూన్యవాదులు మనం శూన్యం (ఏమీ లేని వస్తువు) నుంచి వచ్చాము కనుక శూన్యంలోకే పోతామని అభి్రపాయపడతారు. భౌతికవాదులు మాత్రం కోరుకున్న భౌతిక పదార్థాన్ని పొందడమే లక్ష్యం అంటారు. కొందరు ఆధ్యాత్మిక వేత్తలు మనం భగవంతుని నుంచి వచ్చాము కనుక అతనిలోనే కలిసిపోతామని చెప్తుంటారు. అభ్యుదయవాదులు కొందరున్నారు. వారు ఐహిక సుఖమే పరమ లక్ష్యం అంటారు. మతవాదులున్నారు, వారు పరలోకంలో సుఖపడడమే తమ లక్ష్యం అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మానవ లక్ష్యాన్ని పేర్కొంటారు.అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. కనుక ఇతరప్రాణుల కంటే మానవుడు శ్రేష్ఠుడు. అంతేకాదు, ఇతరప్రాణులకు లేని లక్ష్యం మానవునికి ఉంది. నాల్గు పురుషార్థాలలో అర్థ కామాలను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళున్నారు. నిజానికి మానవుడు ధనాన్ని సంపాదించి, సుఖపడరాదని ఏ ధర్మ గ్రంథమూ చెప్పదు. అయితే ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, ధార్మిక ప్రవృత్తిలోనే కోరికలను తీర్చుకోవాలని, శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. అందుకే పురుషార్థాలలో మొదట ధర్మాన్నే పేర్కొన్నారు.తనకే కాక, తోటిప్రాణులకు ఏది హితకరమైందో, ఆ కర్మకే ధర్మమని పేరు. ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని స్వార్థం అంటారు. ఆచారం వ్యక్తిగతమైంది కావచ్చు కాని, ధర్మం సర్వనిష్టమైంది. అందరికీ ఆమోద యోగ్యమైంది. అందుకే పురుషార్థాలను సాధించాలనుకున్న వ్యక్తి మొదట ధర్మపరుడు కావాలి. ధర్మాన్ని దారిబత్తెంగా చేసుకుని ప్రయాణించే వారికి ధన్యప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతాయి. అంతేకాదు, ఆ రెండింటికీ మించి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. అందువల్ల మానవుని లక్ష్యం కేవలం ధనార్జనతోపాటు సుఖ్రపాప్తి మాత్రమే కాదు, మోక్షం సాధించడమే పరమ లక్ష్యమని తెలుస్తుంది.మోక్షం అంటే విడుదల. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. అదే మానవుని పరమ లక్ష్యం. బంధనాల్లో చిక్కుకోవడానికి కేవలం కర్మలు చేస్తే చాలు. కాని వాటి నుంచి బయట పడటానికి ధార్మికుడు కావాలి. ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీర తత్వంతోపాటు, ఈ శరీరంలో బంధింపబడిన తానెవరో తెలుసుకోవాలి. అంతేకాదు, మోక్ష ప్రదాతను గుర్తించాలి. శరీరం ఉంది. తాను ఉన్నాడు. శరీరం బంధనం. దాన్ని విడిచిపెడితే మోక్షం. కానీ ఎట్లా విడిచిపెట్టాలి? అందుకు చేయవలసిన పనేమిటి? తెలిస్తే గాని పరమ లక్ష్యాన్ని అందుకోలేం. – ఆచార్య మసన చెన్నప్ప -
ఇవాళ హనుమాన్ జయంతినా? హనుమాన్ విజయోత్సవమా?
హనుమాన్ జయంతి ఎప్పుడనేది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కువగా వైశాఖ మాసంలో దశమి రోజు జరుపుకుంటే, ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇంతకీ ఏది కరెక్ట్?. అదీగాక చాలామంది ఈ రోజును హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని బట్టి చూస్తే హనుమాన్ జయంతి చైత్రమాసంలోనా? వైశాఖంలోనా ? అంటే..! పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుంచి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమినే ఎందుకు.. హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్రింది శ్లోకంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. విజయోత్సవంగా చెప్పడానికి రీజన్.. చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. (చదవండి: థాయిలాండ్లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం-గుర్రాలు మాట వినవు!
ధర్మాచరణకు ప్రధానమైన ప్రతికూల పరిస్థితులు రెండు–అర్థము, కామము. ఇవి ధర్మాచరణకు నిరంతరం పరీక్ష పెడుతుంటాయి. అర్థము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, భోగ సంబంధమైన సమస్త వస్తువుల రాశిని అర్థము అనవచ్చు. తనకు సుఖాన్నిచ్చే మంచం, కుర్చీ, ప్రయాణించే వాహనం ఏదయినా కావచ్చు. కామము అంటే – కోర్కె వేరు, అవసరం వేరు. రెండింటికీ మధ్య సున్నితమైన భేదం ఉంది. అవసరం తీరకపోతే పాపం అడ్డు వస్తున్నదని గుర్తు. దానిని తీసేయగలిగిన శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. పాపం పోవడానికి యజ్ఞ యాగాదులు చేస్తారు. సంతానం కోసం అశ్వమేథం.. వంటివి. మనం ఒక కోరిక కోరుకుంటున్నాం. అది అవసరం కూడా. దానికి భగవంతుడిని ఆశ్రయించడం తప్పు కానేకాదు. భగవంతుడు ఏమంటాడంటే... నాలుగు రకాల భక్తులు నన్ను ఎప్పుడూ ఆశ్రయించి ఉంటారు. చాలా ఆర్తి కలిగినవాళ్ళు, అసలు భగవంతుడెవరని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు. మంచి పనులు చేయడానికి ధనసహాయం కోరుకుంటున్న వాళ్ళు. తత్త్వతః పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకుని స్తోత్రం చేసేవాళ్ళు. చివరి తరగతి భక్తులగురించి శంకరాచార్యులవారు ఏమంటారంటే... సముద్ర కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో తత్త్వాన్ని అవగతం చేసుకుని జ్ఞాని భగవంతుడిని స్తోత్రం చేయడం అలా ఉంటుంది–అని. ఎక్కడో కోటానుకోట్లలో ఒక్కరే కారణజన్ములుంటారు. వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వారికి అర్థకామముల మీద ఎటువంటి తపనా ఉండదు. ఒకవేళ ఏదయినా మనసులో ఏర్పడినా, ధర్మాన్ని రక్షించడానికి ఇలా చేద్దామన్న ఆలోచనే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఏకాకిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. దేనినీ కోరుకోడు. అతడు జీవన్ముక్తుడు. కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారా !!! ఉండరు. ధర్మానికి పెద్ద పరీక్ష అర్థము. ఒక కోరిక తీర్చుకోవడానికి పరుగులు తీయడం.. చివరకు తీర్చుకుంటాడు. అది తీరి΄ోయింది కనుక మళ్లీ ఆ కోరిక పుట్టదు– అని చెప్పలేం. మామిడిపండు తినాలని ఆరాటపడి, చివరకు అది దొరికి తిన్న తరువాత.. అది అక్కడితో ఆగదు. అదే పండు మళ్ళీ మళ్లీ కావాలనిపించవచ్చు, ఏ పండయినా సరే అని మళ్ళీ పరుగులు మొదలు కావచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నేతి ΄ాత్ర పట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ప్రజ్వరిల్లే అగ్ని మీద నెయ్యి చల్లితే, అది ఆరదు, మరింత విజృంభిస్తుంది. కోరికలూ అంతే. అవి ఉపశమించే అవకాశం ఉండదు. మరి అర్థకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. అవి ఉండితీరతాయి. ఎవరికయినా భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవడానికి అవసరమయిన సాధనసంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరికా ఉంటుంది. దానికి సనాతన ధర్మం ఒక చక్కటి పరిష్కారం చూపింది. అర్థకామములను ధర్మంతో ముడిపెట్టింది. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన అర్థము.. ఇవి మోక్షానికి కారణమవుతాయి తప్ప బంధాలకు, కోరికలు అపరిమితంగా ప్రజ్వరిల్లడానికి కారణం కావు. అప్పుడు మనిషి జీవితం, కుటుంబ జీవనం, సామాజిక వ్యవస్థ అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. చెలియలికట్ట దాటే సాహసం చేయవు. -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
ఆ రోజే రాఖీ పండుగ ఎందుకు? భద్రకాలం అంటే..?
ప్రతి ఏడాది రాఖీ పండుగ చక్కగా జరుపుకునేవాళ్లం. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ తలెత్తింది. అసలు ఏ రోజు ఈ పండుగ జరుపుకోవాలనేది ఒకటే గందరగోళం. కొందరూ ఆ రోజుని మరొకరు వేరొకటి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకి గందరగోళం వచ్చిందో, ఎప్పుడూ రాఖీ కట్టాలో తదితర విషయాలు చూద్దాం!. ఈ నెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా.. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.10 నిమిషాల వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి. ఇంతకీ భద్రకాలం అంటే..?? భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర(శూర్పణఖ). ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు. ఇక పోతే మనం సౌరమానం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. సూర్యోదయం మొదలైన తర్వాత ఉన్న తిథినే ప్రధానంగా తీసుకుంటాం. బుధవారం ఉదయం చతుర్ధశి తిథి ఉంది. ఉదయం 10.30 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి వస్తుంది. అందువల్ల బుధవారం చేసుకోము. గురువారం ఉదయం 9.45 నిమిషాల వరకు ఉండటంతో ఇక ఆరోజునే రాఖీపండుగ పరిగణించి జరుపుకుంటున్నాం. రక్ష కోసం కడుతున్నాం కాబట్టి అన్నా చెల్లెళ్ల ఇరువురికి మంచి జరిగేలా మంచి టైంలోనే కట్టుకుందా. మంచి సత్సంబంధాలనే కొనసాగిద్దాం. (చదవండి: రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?) -
శుభమే జరిగేట్టు శ్రద్ధ వహిద్దాం!
ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏమిటి? ఏం ఉన్నా, ఏం లేకపోయినా ఒక వ్యక్తికి ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి? ఎలాంటి వ్యక్తి ఐనా, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఐనా పొందాల్సింది ఏమిటి? ఎవరి ఆశలు వారివి. ఎవరి ఆకాంక్షలు వారివి. ఎవరి ఆశయాలు వారివి. మన అందరికీ అందాల్సిన వాటిల్లో ఏది అగ్రగణ్యమైంది? ఏది మనల్ని ఎప్పటికీ వీడిపోకుండా ఉండాలి? శుభం... శుభం... శుభం... ‘అథాతో బ్రహ్మ జిజ్ఞాస‘ అని బ్రహ్మ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం తెలియజెప్పింది. అంటే శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అని అర్థం. ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మం గురించిన జిజ్ఞాస ఎందుకు అంటే అది శుభం కాబట్టి. లౌకిక జీవనానికైనా, ఆధ్యాత్మిక జీవనానికైనా శుభమే మనిషికి లక్ష్యం; ఆ లక్ష్యానికి మనిషి లక్షణం. లక్ష్య, లక్షణ సమన్వితం జరగాలి. అంటే మనిషికి శుభం సమన్వితం అవ్వాలి. క్షేమం, మంగళం, మేలు, సౌఖ్యం ఇవి అన్నీ శుభం ఔతాయి. శుభం మనకు నిండుగా ఉండాలి. మనకు శుభం కలగడానికి, మనం శుభంతో మెలగడానికి మనకు మనమే ఆధారం. కనుక మనంత మనమై శుభం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనం శుభం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి; మన ప్రయత్నాలకు ఫలితంగా మనం శుభాన్ని పొందుతూ ఉండాలి. శుభాలు ప్రభవించాలని ఎప్పుడైనా అకాంక్షించవచ్చు; ప్రభవించిన శుభాలు విభవాన్నివ్వాలని ఎవరైనా ఆశించవచ్చు. కానీ ఇంత వరకూ ఆ పని సరిగ్గా జరగలేదు. ఎవరూ ఆ పనిని సరిగ్గా చేసేందుకు ముందుకు రాలేదు. మనం శుభం కోసం పని చెయ్యాలి. మన కోసం శుభం పంట పండాలి. ఇకపైనైనా మనం శుభం కోసం పని చేద్దాం; ఇక అంతా శుభమయం కావడానికి మనల్ని మనం సరిచేసుకుందాం. ఆశపడి, ఆకాంక్షించి, ఆశించి మనం శుభాన్ని సాధించుకుందాం. కుత్సతం, మత్సరం, దాష్టీకం, దుర్మార్గం, ద్రోహం, వైరం, అసూయ, అక్కసు, బద్ధకం, నీరసం, అభిప్రాయాలు, మనో భావాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, అపార్థాలు, అవిద్య, మూర్ఖత్వం, దుశ్చింతన, బుద్ధిమాంద్యం ఇవన్నీ శుభాన్ని మనకు లేకుండా చేశాయి. వీటిని మనం వెనువెంటనే వదిలించేసుకోవాలి. మన చెడు నడతను మనం మార్చుకోవాలి; మనం మనస్తత్త్వంలో మానవత్వాన్ని చేర్చుకోవాలి; మనం మస్తిష్కంలో మంచితనాన్ని కూర్చుకోవాలి. శుభం కోసం మనం ఇకపై సవ్యంగా ఉండాలి. మనమే కాదు, మన పెద్దలు చేసిన తప్పులూ మనకు శుభాన్ని లేకుండా చేస్తున్నాయి; అవి మన సమాజంలో అశుభాన్ని రగిలిస్తున్నాయి; ఎప్పుడో ఎవరో చేసిన కుట్రలు ఇప్పటికీ శుభాన్ని రానివ్వకుండా ఇలాతలాన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ఈ స్థితిని సరిదిద్దుకుందాం; రానున్న ఆపదల్ని తొలగించుకుందాం; శుభాన్ని ఆవాహన చేసుకుని అందుకుందాం. ‘శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు తెలియజెప్పాక ‘సుఖ విశిష్టాభిధానాదేవ చ’ అని మరో బ్రహ్మసూత్రం మనకు ఉండాల్సిన తెలివిడిని ఇస్తూ ఉంది. విశిష్టమైన సుఖం ఇస్తుందని నిశ్చయంగా చెప్పబడినందువల్లే అది బ్రహ్మం అని ఆ సూత్రానికి అర్థం. సుఖం లేదా శుభం విశిష్టమైంది అన్న సత్యాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఆ విశిష్టమైన శుభాన్ని మనం పొందుతున్నామా? ఈ ప్రశ్నను మనకు మనమే వేసుకుని సరైన జవాబుగా మనం శుభాన్ని పొందాలి; పొందుదాం. సర్వత్రా శుభం నెలకొనాలి;సర్వులకూ శుభం వెల్లివిరియాలి.శుభం భూయాత్. ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు వీటివల్ల శుభం కలుగుతుంది, జరుగుతుంది అని మనం మన మనసు, మెదడులతో తెలుసుకోవాలి. మన ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల వల్ల శుభం మాత్రమే జరిగేట్టు మనం శ్రద్ధ వహించాలి. శుభం కోసం మనం పూనుకోవాలి; శుభంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవాలి – రోచిష్మాన్ -
మలినాల నుంచి విముక్తి చెందాలి.. అప్పుడే ధర్మ సాధన
మనోశుద్ధి అంటే చిత్తశుద్ధి. చిత్తం ఈ మలినాల నుండి విముక్తి చెందడం. అలా విముక్తి చెందిన చిత్తంలో తిరిగి మరలా అమానవీయ విషయాలు మొలకెత్తవు. సమూలంగా నిర్మూలించబడతాయి. ఒకసారి బుద్ధుడు తన భిక్షువులతో కలసి ఒక విశాలమైన పొలంలోంచి నడిచిపోతున్నాడు. ఆ పొలం అంతకుముందే తగలబడి ఉంది. పంటను తీశాక రైతులు చెత్తనంతా తగలబెట్టారు. కానీ... ఆ తర్వాత వర్షం పడింది. ఆ తగలబడిన మసిలోంచి పచ్చని గడ్డి పిలకలు నవనవలాడుతూ పైకి లేస్తున్నాయి. బుద్ధుడు వాటి వంక చూస్తూ ముందుకు నడిచాడు. ఆ పొలం దాటి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. ఆ కట్ట మీద మొదలు పైకి నరికిన పెద్ద తుమ్మచెట్టు మోడు కనిపించింది. ఆ తర్వాత రకరకాల చెట్ల మోడులు కనిపించాయి. వాటి మద్య నరికేసిన తాటిచెట్లు మోడులూ కనిపించాయి. బుద్ధుడూ, భిక్షువులూ ఆ మోళ్ళను గమనిస్తూనే ముందుకు నడిచి వెళ్ళారు. వారు కొంత దూరం పోయాక నదీ తీరంలో పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అప్పటికే ఎండ ఎక్కుతూ ఉంది. కొంత సేపు సేద తీరడానికి ఆ చెట్టు కింద ఆగారు. భిక్షువులు కొన్ని సందేహాలు అడిగారు. వాటికి సమాధానమిచ్చాడు. ఆ తరువాత ఆయన ప్రబోధం ‘చిత్త మలినాలు’ మీదికి మళ్ళింది. ఆ విషయం చెప్తూ స్వచ్ఛ జలం గురించి చెప్పాడు. బుద్ధునికి నిత్య జీవితంలో తమకు అనుభవమయ్యే అంశాల్ని జోడించి, తేలికగా అర్థం అయ్యేలా చెప్పటం అలవాటు. దానితో అప్పటి వరకూ తాము నడచి వచ్చిన దారిలోని సంఘటనలు తీసుకున్నాడు. ‘‘భిక్షువులారా! చూశారుగా! మనం నడచి వచ్చిన పొలాన్ని తగులబెట్టారు. అయినా ఆ తరువాత దానిలోని గడ్డి, తుంగ పరకలూ మొలకెత్తాయి. అలాగే... గట్టు మీది ఎన్నో చెట్లు మొదలంటూ నరికినా, మరలా పిలకలు వేశాయి. చివురులు తొడిగాయి. ఐతే ఒకే ఒక జాతి వృక్షాలు మాత్రం నరికివేశాక అవి ఎలాంటి చివురులు తొడగలేవు. అవి ఏమిటో గమనించారా?’’ అని అడిగాడు. ఒక భిక్షువు వినమ్రంగా ‘భగవాన్! తాటిచెట్లు’ అన్నాడు. బుద్ధుడు చిరుమందహాసంతో –‘‘అవును భిక్షూ! నీ పరిశీలన సరైనదే! మన మనస్సులో రాగద్వేషాలూ, కోరికలూ, మోహాలు అనే అకుశలాలు అన్నీ అలాగే నరికివేయబడాలి. అవి మరలా మొలకెత్తకూడదు. చివురులు తొడక్కూడదు. తాటిచెట్టును కొట్టి వేశాక, ఎలా చివురులు వేయదో, పిలకలు తొడగదో మన మనో క్షేత్రంలో అకుశలాల్ని, కోర్కెల్ని (తృష్ణల్ని) అలాగే తొలగించుకోవాలి. మొదలంటూ నరికిన తాటిచెట్టులా తృష్ణల్ని తెగతెంచుకోవాలి. అదే తృష్ణాక్షయం. అలాంటి చిత్తమే నిర్మల చిత్తం. స్వచ్ఛమైన నీటిలాంటి చిత్తం. మన ధర్మ సాధనంతా అలాంటి నిర్మల చిత్తం కోసమే!’’ అన్నాడు. ఆ గంభీర ధర్మోపదేశం వారి హృదయాల్ని తాకింది. వారి మనో ఫలకంపై మొదలు నరికిన తాటిచెట్టు ప్రత్యక్షం అయింది. అప్రయత్నంగా అందరూ కనురెప్పలు మెల్లగా మూశారు. ఏకాగ్రతలోకి జారుకున్నారు. ధ్యాన నిమగ్నులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
హద్దులు దాటితే ప్రమాదం.. చెడ్డ ఆలోచనలు మనసులోకి రానీయకూడదు
పూర్వం కురు రాజ్యాన్ని ఇంద్రప్రస్థ నగరం రాజధానిగా ధనంజయ కౌరవ్యుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థాన పురోహితుడు, మంత్రి సుచీరతుడు అనే పండితుడు. ఒకరోజున వారిద్దరూ కూర్చొని పరిపాలన విషయాలు చర్చించుకుంటూ ఉండగా ‘ధర్మయజ్ఞం’ అనే విషయం చర్చకు వచ్చింది. ‘‘అశ్వమేధం, రాజసూయం, పుత్రకామేష్టి మొదలైన యాగాలు తెలుసు. ధర్మ యాగం ఎలా చేయాలి అచార్యా!’’ అని అడిగాడు రాజు. ‘‘మహారాజా! నాకూ పూర్తిగా తెలియదు. మన రాజ్యంలో భగీరథీ తీరంలో విదుర పండితుడు ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు. వెళ్ళి వివరంగా తెలుసుకు వస్తాను. శెలవియ్యండి’’ అని అడిగి మరునాడు బయలుదేరి వెళ్ళి విదుర పండితుణ్ణి కలుసుకున్నాడు. విదురుడు తన మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నల తర్వాత తాను వచ్చిన విషయం చెప్పాడు సుచీరతుడు.అంతలో ఎందరో శిష్యులు ఆయన సందర్శన కోసం వచ్చారు. దానితో ....‘‘మిత్రమా! నేను ఈ సమయంలో ధర్మయాగం గురించి చెప్పలేను. అదిగో.. అక్కడ అడవి సమీపంలో నా పెద్ద కుమారుడు భద్రకారుని ఆశ్రమం ఉంది. అతనూ పండితుడే. వెళ్ళి భద్రకారుణ్ణి అడుగు’’ అని చెప్పి పంపాడు సుచీరతుడు ఆయన వద్దకు వెళ్లి తాను వచ్చిన విషయాన్ని వివరించగా... ‘‘మహాశయా! మీ ప్రశ్నకు సమాధానం చెప్పే యోగ్యత నాకు లేదు. ఇంకా రెండు యోజనాల దూరం ముందుకు వెళ్ళు. అక్కడ నదీతీరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. అది నా పెద్ద తమ్ముడు సంజయునిది. అతడు ప్రాజ్ఞుడు. నీకు అతను సమాధానం చెప్తాడు’’ అని సగౌరవంగా సాగనంపాడు భద్రకారుడు. సుచీరతుడు వెళ్ళే సమయానికి సంజయుడు అక్కడ లేడు. తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. వచ్చాక, సుచీరతునికి తగు సత్కారాలు చేశాడు. ఆ విషయం తెలుసుకుని– ‘‘సుచీరతా! నేను కూడా దీనికి సమాధానం చెప్పలేను. నిజం చెప్పాలంటే అందుకు తగను. సదాచార భ్రష్టుణ్ణి. ఇందుకు తగినవాడు మా అందరికంటే చిన్నవాడు మా తమ్ముడు సంభవుడు. అతని ఆశ్రమం ఈ పక్కనే ఉంది. వెళ్ళు’’ అని మర్యాద పూర్వకంగా చెప్పాడు. సుచీరతుడు మరునాటి వేకువనే లేచి సంభవుని దగ్గరకు వెళ్ళాడు. విషయం అంతా చెప్పాడు. ఉదయం స్నానాదికాలు పూర్తయ్యాక వారిద్దరూ ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ‘‘సుచీరతా! ధర్మయాగం చేసేవారు ఐదు విషయాలు పాటించాలి. అందులో మొదటిది; ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి. తరువాత చేయవచ్చులే అని బద్ధకించకూడదు. నిర్లక్ష్యం తగదు. ఈ రెండు లక్షణాల్ని సమయపాలన అనే యజ్ఞగుండంలో కాల్చి బూడిద చెయ్యాలి. ఇక రెండోది; ఎవ్వరు ఏది చెప్పినా జాగ్రత్తగా వినాలి. విన్న ప్రతిదాన్ని ఆచరించకూడదు. బాగా ఆలోచించి సరైన వాటిని మాత్రమే ఆచరించాలి. మూడోది; ఏ విషయంలోనూ హద్దు దాటకూడదు. ప్రకృతిలో ఒక్కో శక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. సమాజంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. అర్హత ఉంటుంది. ప్రతి వారు తమ తమ హద్దులు తెలుసుకోవాలి. ఈ హద్దులు అమానవీయ, అకుశల విషయాల్లో లింగ భేదాల్లో కాదు. మన సామాజిక నైతిక నడవడికలో తండ్రికి, తల్లికి, తనయులకీ, గురువులకీ ఒక్కొక్కరికి ఒక్కో హద్దులుంటాయి. వారి వారి హద్దుల్లో వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. నైతిక హద్దులు దాటడం చాలా ప్రమాదం. అలాగే అధర్మ కార్యాలు చేయకూడదు. మనం చేసే పనులు మనకూ, పరులకూ హితాన్ని, సుఖాన్ని ఇవ్వాలి. ఇలా అందరికీ సుఖాన్నిచ్చేవే ధర్మకార్యాలు. అధర్మ కార్యాలు చేసేవారు రేవు కాని చోట నదిలో స్నానానికి దిగిన వారితో సమానం. అది వారికే ప్రమాదం. ఇక ఐదో విషయం; చెడు తలపులు మానాలి. చెడు చేష్టలే కాదు. చెడ్డ ఆలోచనల్ని మన మనసులోకే రానీయకూడదు. ఒకవేళ వచ్చినా యజ్ఞ జ్వాలలో మండించే సమిధల్లా వాటిని కాల్చి బూడిద చెయ్యాలి. సుచీరతా! ఈ ఐదూ పాటిస్తే అదే ధర్మయాగం. ఈ యాగం చేసినవారు శుక్ల పక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెంది, పున్నమి చంద్రునిలా శోభిల్లుతారు’’ అని చెప్పాడు. సుచీరతుడు ఇంద్రప్రస్థం చేరి ధనంజయు కౌరవ్యునికి ఈ విషయాలు చెప్పాడు. తన రాజ్యంలో ప్రజలందరూ– ‘ధర్మయాగం’ చేయవలసిందిగా రాజు చాటింపు వేయించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?
సత్యాన్వేషణలో రాజ్యాన్ని భార్యా బిడ్డల్నీ త్యజించిన సిద్ధార్థుడి గురించి చదువుకున్నాం. ప్రజలకోసం వేల ఎకరాల సొంత ఆస్తిని వదులుకున్న కమ్యూనిస్టు నేతల గురించి విన్నాం. ఇపుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా మారే అవకాశాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న బౌద్ధ సన్యాసి గురించి తెలుసుకుందాం. ఆయనే బుద్ధిస్ట్ మాంక్ వెన్ అజాన్ సిరిపన్యో. బిలియనీర్ ఆనంద కృష్ణన్ ఏకైక కుమారుడు. సిరిపన్యో గురించి తెలుసుకునేముందు అతని తండ్రి ఆనంద కృష్ణన్ గురించి తెలుసుకోవాలి. రూ. 40,000 కోట్ల సంపద మలేషియా-తమిళ వ్యాపారవేత్త బిజినెస్టైకూన్. తత్పరానందం ఆనంద కృష్ణన్ను ఏకే అని కూడా పిలుస్తారు. టెలికాం, మీడియా, ఉపగ్రహాల్లో వ్యాపారం, అయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్ లాంటి వాప్యారాల్లో ఆరితేరిన దిగ్గజం. దీంతోపాటు కృష్ణన్కి కలిపి కనీసం 9 కంపెనీల్లో వాటాలున్నాయి. ఈ భారీ సంపద మలేషియా టాప్ బిలియనీర్లలో మూడోవాడిగా ఆనంద్ కృష్ణన్ను నిలిపింది. అంతేకాదు ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు స్పాన్సర్ చేసిన భారతీయ ఫోన్ కంపెనీఎయిర్సెల్ యజమాని. సిరిపన్యోతోపాటు, కృష్ణన్కి ఇద్దరు కుమార్తెలున్నారు. (వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) 18 ఏళ్లకే సన్యాసం మలేషియాలో విద్య, కళలు, క్రీడలు తదితర విషయాల్లో భూరి విరాళాలిచ్చిన గొప్ప పరోపకారి. ఆనంద కృష్ణన్ కూడా బౌద్ధుడే కావడం గమనార్హం. బహుశా ఈ నేపథ్యమే ఆయన కుమారుడు సిరిపన్యో కేవలం 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసిగా మారడానికి దారి తీసి ఉంటుంది. సరదా కోసం సన్యాసం స్వీకరించిన అతను చివరికి శాశ్వత సన్యాసిగా మారిపోయినట్టు తెలుస్తోంది. అలా తండ్రినుంచి వచ్చిన కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకొని ఆధ్యాత్మిక శాంతికోసం దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవించడం ప్రముఖంగా నిలుస్తోంది. సిరిపన్యో తల్లి థాయ్ రాజ కుటుంబానికి చెందిన వారట. యూకేలో తన 2 సోదరీమణులతో పెరిగిన సిరిపన్యో ఇంగ్లీష్, తమిళం, థాయ్ పాటు దాదాపు 8 భాషలు మాట్లాడ గలడని ప్రతీతి. అతని కదలికలు, వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. కానీ ఒకసారి ఇటలీలో తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణన్ను కలవడానికి ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తుండగా గుర్తించినట్టు చెబుతారు. "నా సంపదతో నా స్వంత కొడుకును పోషించే స్తోమత కూడా లేదు" అని తన కుమారుడు సన్యాసిగా మారిపోయిన వైనాన్ని గుర్తించిన కృష్ణన్ వ్యాఖ్యానిచారట. -
పేరు మార్చేసరికి ‘కృష్ణంరాజు’కు ఏ పని చేసినా కలిసొచ్చేది కాదట..
కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). ►మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. ►దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. -
స్ఫూర్తి సుధ
ప్రాథమికం, భౌతికం – అదే, ‘ప్రస్థాన’, ఆధ్యాత్మికం! యోగాలలో మొదటిది – కర్మయోగమే, సుమా! కాదంటే మిగిలేది – కాలక్షేప, కథనాలే! భూమి వున్నది, సాగుకే – కర్మకే, జీవితం! గ్రహించి వాస్తవాన్ని – ప్రారంభించు, ప్రాథమికాన్ని! ‘‘క్రమం లేని బ్రతుకు – వక్రమార్గాన్ని వెతుకును భక్తిలేని భయం – పిరికితనాన్ని పెంచును భయం లేని భక్తి – మూర్ఖపు మొరటుతనంను ఉంచును భక్తులకే కాదు – వ్యక్తులకు కూడా కావాలి భయం, భక్తి – శిక్షణ మనస్సుతో...’’ – శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి -
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే..
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే, మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం, ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ. ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది. అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది. మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించసాగింది. అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పు సీసా మూత తీయడం జరిగింది. వెంటనే, ‘బతికేనురా జీవుడా’ అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది. కానీ, సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది. ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంటబడింది. వెంటనే ఆ చీమ ‘ఏం మిత్రమా అలా అయిపోయేవు? క్షేమమేనా?’ అని అడిగింది. ‘ఏం క్షేమం? అంతా క్షామమే’ అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది. చిత్రం. ఆ మొదటి చీమ అతి మధురమైన పంచదారనే ‘వెగటుగా ఉంది’ అంది. రెండవ చీమకు ఆశ్చర్యమేసింది. కారణం అంతు బట్టలేదు. ఎందుకైనా మంచిదని మొదటి చీమ నోరు తెరిచి అందులో ఉన్న ఉప్పు కణాలను తీసేసింది. అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు. అలాగే మనిషిలో పంచవికారాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం. – బ్రహ్మాకుమార్ రాజేష్ -
దయాగుణమే మానవత్వం
భాగవతం అష్టమ స్కంధంలో పోతన గారు ఓ మాటంటారు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటగట్టుకొని పోవం జాలిరే? భూమిపై బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!’’...ఈ భూమిని కోట్లమంది రాజులు పాలించారు, వీరిలో ఎంతమంది మనకు జ్ఞాపకం ఉన్నారు ? ఉండరు. ఎవడు సాటివారి ఆపదలను తీర్చడానికి ముందుకు వచ్చాడో, కష్టాల్లో ఉన్నవారిని గురించి ఆలోచించాడో వాడు చిరస్థాయిగా మిగిలిపోతాడు. వాడి కీర్తి మిగిలి పోతుంది. వాడు చూపిన దయ వాడికి చుట్టమై వాడిని వాడి పిల్లల్న్లి, పిల్లల పిల్లల్ని కూడా కాపాడుతూ పోతుంటుంది. రంతిదేవోఖ్యానం అని ఒక ఉపాఖ్యానం...తినడానికి ఏమీ లేక 47 రోజులు రంతిదేవుడు పస్తులున్నాడు. 48వ రోజున కాస్త అన్నం, పాయసం, నెయ్యి, కాసిని మంచినీళ్ళు దొరికాయి. వాటిని తినబోతుండగా ... డొక్కలు ఎండిపోయిన కొందరు వచ్చి చేయి చాపితే ఆహార పదార్థాలన్నీ వారికిచ్చేసాడు. నీళ్ళుతాగి ఉపశమనం పొందుదామని అనుకుంటూ నీళ్ళ చెంబెత్తుకుని తాగబోతున్న క్షణంలో... ‘కళ్ళు తిరుగుతున్నాయ్, నిలవలేక పోతున్నా, గొంతెండుకుపోతున్నది’ అన్న ఆర్తనాదం వినిపించింది. ‘నీళ్ళు కూడా తాగనివ్వరా..’’ అని ఆయన విసుక్కోలేదు. ...‘‘అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రావన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్ గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మేలున్నదె? నాకు దిక్కు పురుషోత్తము? డొక్క?డె చుమ్ము పుల్కసా!’’ అంటూ వెళ్ళి ఉన్న ఆ కొన్ని నీళ్ళు దాహార్తికిచ్చేసాడు. మనిషి హృదయం రాయిలా ఉందనుకోండి. చిక్కిన లేడిపిల్లతో పులి ఎలా చెలగాటమాడుతుందో అలా కష్టంలో ఉన్నవాళ్ళని చూసి కరగకపోగా దానికి హాస్యం ఆడడం అలవాటవుతుంది. వాడు కష్టంలో ఉన్నాడుగా.. ఎదురుతిరిగి ఏమీ అనలేడుగా... అందుకని వాళ్ళని పరిహాసాలాడడం, చిన్నబుచ్చుకునేటట్లు చేయడం... ఇది మంచి లక్షణం కాదు.. ముఖ్యంగా పిల్లలు ఇటువంటి లక్షణాలను అలవర్చుకోకూడదు. మనిషి మనిషిగా బతకడానికి మూడు విషయాలు నేర్చుకోమంటారు.. 1. ఇతరులు సంతోషపడుతుంటే చూసి మనం కూడా సంతోషించాలి.. వాడు సంతోషపడడం చూసి నువ్వు ఏడ్వడం మొదలుపెడితే... పాడయిపోయేది నువ్వే. 2. వాడు కష్టంలో ఉన్నట్లు తెలిసింది.. అది నీ కష్టమనే అనుకొని గబగబా వెళ్ళి వాడికి ఉపకారం చేయడానికి ప్రయత్నించడం నేర్చుకో. 3. నీ వల్ల మరొకరు కన్నీళ్ళు పెట్టుకునే ఘడియ నీ జీవితంలో ఎప్పుడూ రాకుండా చూడు. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకడం అంటే అది. దయాగుణం ఉంటే మనసు రాయిలా ఉండదు వెన్నలా కరుగుతుంది. అలాకాక ఉపకారం చేయాల్సిన సమయం లో అది చేయకపోగా చులకనగా చూడడం, నిందలు వేయడం అన్న ధోరణి ఉందంటే... పశువుల్లో లెక్కవేస్తారు తప్ప మనిషిగా లెక్కగట్టరు. ‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టం అవుతుందని చెప్పింది ఇందుకే. అది సర్వవేళలా నిన్ను కాపాడే చుట్టమవుతుంది. వార్తల్లో చూస్తుంటాం... ప్రమాదవశాత్తూ ఎవడో రోడ్డుమీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే... వెళ్ళి వారి ప్రాణరక్షణకు ప్రయత్నించకుండా... సెల్ఫోన్లో చిత్రిస్తున్న వారి గురించి చదువుతుంటే... అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నదని తెలుసుకుంటుంటే... బాధనిపిస్తుంది... పిల్లల్లో ఈ సంస్కారం ఉండడం సభ్యసమాజానికి మంచిది కాదు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ధర్మబద్ధమైన జీవనం
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు. ‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, అనరాని మాటలన్నాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.. ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను’ అన్నారు ప్రశాంతంగా.. ‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..? కాని ఎలా సాధ్యం? ఆ వ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు అతనే నిరాశతో.. ‘అలా అనకు.. నిరాశ తిరస్కారం (కుఫ్ర్) తో సమానం.. ఇన్షా అల్లాహ్ నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ‘నిజమే.. ఆశ లేకపోతే మనిషి బతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడంలేదు.’ ‘నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్. నీ పైకం ఇప్పించే పూచీనాది’ అన్నారు బహెలూల్ ధీమాగా.. ‘సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ‘రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆవ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు’ అన్నారు బహెలూల్. సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పోయాడు. తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, తన దగ్గర ఉన్న సంచిలో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉన్నాయని, కాస్త ఈ సంచి దగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోసపోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతని తో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞత లు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తన దారిన తను వెళ్ళిపోయారు. కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పిచూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమైన జీవనం ప్రారంభించాడు. మోసపోయినప్పుడు నిరాశ పడకూడదు. తెలిసిన వాళ్లు, తెలివైన వాళ్లను ఆశ్రయించాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అదీ మనకు దగ్గరి చుట్టమే...
‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టంబౌ... అన్నారు. దయ చుట్టమెలా అవుతుంది? మనలో దయ అనే గుణం ఉంటే... అది చుట్టంతో సమానంగా, అంతకంటే ఎక్కువగా, ఆపద్బంధువులా కాపాడుతూనే ఉంటుంది. ఒకానొకప్పుడు ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు. పొలం పక్కన పెద్ద సేద్యపు బావి ఉంది. చెరువులు, దొరువుల్లాగానే కొన్ని ప్రాంతాల్లో పెద్ద సేద్యపు బావులకింద సాగుపనులు నడుస్తుంటాయి. ఉన్నట్లుండి బావిలో దభేల్మని పెద్ద చప్పుడయింది. ఎవరో పడిపోయినట్లున్నారు... రక్షించండి, రక్షించండి.. అని అరుస్తున్నారు. చేతిలో పని వదిలేసి ఆ రైతు ఒక్క ఉదుటున వెళ్ళి చూస్తే... ఎవరో పిల్లవాడు మెల్లిమెల్లిగా నీటిలోకి మునిగిపోతున్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా నూతిలోకి దూకి ఆ పిల్లవాణ్ణి పైకి తెచ్చి, సపర్యలు చేసి లోపలికి మింగిన నీళ్ళన్నీ కక్కించాడు. కొద్దిగా తేరుకున్న తరువాత తనింటికి తీసుకెళ్ళాడు. ఆ రైతుకూ ఓ కొడుకున్నాడు. ఇంట్లో ఈ అబ్బాయిని అప్పగించి వాడు కోలుకోవడానికి ఆ రాత్రికి తనవద్దనే ఉంచుకున్నాడు. తెల్లవారింది. ఆ పిల్లవాడి వివరాలు తెలుసుకుని వాడింటికి తీసుకెళ్ళి అప్పగిద్దామని అనుకుంటుండగానే... ఇంటి ముందు పెద్ద పడవంత కారొచ్చి ఆగింది. అందులోనుంచి ఓ ధనవంతుడు ఆదుర్దాగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు.‘‘అయ్యా! మీరు కాపాడిన అబ్బాయి నా కుమారుడే. నిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆ నూతిలో పడిపోయాడట. అది తెలియక నిన్నటినుంచీ వెతికిస్తున్నా. ఇప్పుడే తెలిసింది. నూతిలో మీరు దూకి రక్షించారట కదా. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు. ఐశ్వర్యానికి కొదువలేదు. కానీ వాడికి ఏమయినా అయితే నేను తట్టుకోలేను. వాడినే కాదు, మమ్మల్ని కూడా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేం.. అయినా కృతజ్ఞత గా...’’ అంటూ డబ్బున్న ఓ ఇనప్పెట్టెను రైతు ముందుంచాడు. దానికి రైతు ‘‘ఆపదలో ఉన్న వారిని కాపాడడం, దయతో వ్యవహరించడం నా సహజ లక్షణం. నా కొడుకు ప్రమాదంలో ఉంటే కాపాడుకోనా... క్షమించండి. నా బాధ్యతకొద్దీ కాపాడినదానికి నేను డబ్బు తీసుకోను... సంతోషంగా మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి’’ అని అంటూండగానే రైతు కొడుకు లోపలినుంచి వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరని ధనవంతుడు అడిగాడు. ‘‘అయ్యా, నా కుమారుడేనండీ, కొంతవరకు చదువుకొన్నాడు.. ఇక ఆ పై చదివించే శక్తి లేక చేతికింద పెట్టుకుని పొలం పనులకు తీసుకెడుతున్నా..’’ అని పరిచయం చేసాడు. ‘‘మీరు నా కొడుకును బతికించారు. డబ్బిస్తే వద్దంటున్నారు... కానీ మీరు చేసిన సాయానికి మా తృప్తికోసం మీకు అభ్యంతరం లేకపోతే మీ వాడిని నాతోపంపండి. మా అబ్బాయిలాగే చూసుకుంటూనే చదివిస్తా. ఈ ఉపకారం చేయండి’’ అనడంతో రైతు దానికి అంగీకరించి తన కొడుకును కూడా వారి వెంట పంపాడు. ఆ ధనవంతుడి కొడుకే పెద్దయిన తరువాత బ్రిటన్ ప్రధానిగా చేసిన విన్స్టన్ చర్చిల్. ఆయనకొకసారి ప్రాణాంతక జ్వరం వచ్చింది. ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. అప్పడు ఒక్క ఇంజక్షన్ తో ఆయన కోలుకున్నాడు. ఆ ఇంజక్షన్ పెన్సిలిన్. దానిని కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరో కాదు.. ఆ రైతు కొడుకే. అదీ దయ చుట్టం కావడమంటే... -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మోహం తీరని ద్రోహం
భార్యాబిడ్డల వ్యామోహం కుటుంబ పోషణకు మాత్రమే కొనసాగాలి. పోషకుడు తామరాకుపై నీటిబిందువు వలె నిమిత్తమాత్రుడుగా మెలగాలి. నదీప్రవాహం తగ్గినప్పుడు అందులోని కట్టెలు కంపపుల్లలు ఒకచోట చేరుతాయి. ప్రవాహం ఉధృతమైన వెంటనే విడిపోయి దూరంగా పయనిస్తాయి. దానితో సమానమే సంసారంలో ఉండే సభ్యుల సమాగమం. అజ్ఞానానికి గురయినవాడు వాస్తవాన్ని తెలుసుకోలేడు. అవాస్తవాన్ని వాస్తవంగా నమ్ముకొంటాడు. తాను నమ్ముకొన్న దానిని ధర్మమార్గంగా భ్రమిస్తాడు. అందుకు నిదర్శనంగా కాంతపై కనకంపై ధనంపై పదవిపై భార్యాబిడ్డలపై అధికమైన ఆపేక్ష కలిగి వర్తిస్తాడు. దానినే మోహం లేక వ్యామోహం అంటారు. మోహం మనిషి కంటికి కనబడకుండా కష్టాలుపెట్టే ఆరుగుణాల్లో నాల్గవది గా పేర్కొనబడింది. ఉర్విలోసర్వానికి సాక్షిగా ఉంటూసర్వాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే చైతన్యస్వరూపుడు (పరమాత్ముడు) నిత్యుడు సత్యమైనవాడు అనడం వాస్తవం. పరమాత్మ కంటికి కనబడని ఆనందమయుడు అవనిలో ఆకర్షణీయమైన వస్తుజాలమంతా అవాస్తవం. క్షణభంగురం,అందుకే వ్యక్తి ఆలోచించడం మాట్లాడటం వినడం, కనడం, చేయడం అనేప్రక్రియలు వాస్తవాన్ని ప్రతిబింబింపజేసే పద్ధతిలో పయనించాలి. అవాస్తవం, అన్యాయం, అక్రమం, అధర్మం, అనే సర్పాల కోరలకు బలికాకుండా జాగ్రత్త వహించాలి. పరస్త్రీ మానధనాన్ని చెరచడం, పరధనాపహరణం రెండూ ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చే దుర్మార్గపు చర్యలైన వ్యామోహాలు. అవి భయకరమైన పరధర్మానికి ప్రతీకలు. శాస్త్రధర్మానికి విరుద్ధాలు. అధికార వ్యామోహం, భార్యాబిడ్డల భ్రాంతి శాస్త్రమర్యాదకు సంబంధమైన స్వధర్మానికి అనుగుణంగా ఆచరిస్తే వ్యక్తిసౌఖ్యానికి, సమసమాజ క్షేమానికి, ప్రపంచమంతా నిండి ఉండే పరమేశ్వరుని కరుణకు పాత్రులుగా మనవచ్చు. అధికారం జనధిక్కారం కాకుండా ఉంటూ పరిపాలన రామరాజ్యాన్ని తలపించేదిగా రాణించాలి. అప్పడది స్వధర్మాచరణకు సాక్ష్యంగా నిలుస్తుంది. భార్యాబిడ్డల వ్యామోహం కుటుంబ పోషణకు మాత్రమే కొనసాగాలి. పోషకుడు తామరాకుపై నీటిబిందువు వలె నిమిత్తమాత్రుడుగా మెలగాలి. నదీప్రవాహం తగ్గినప్పుడు అందులోని కట్టెలు కంపపుల్లలు ఒకచోట చేరుతాయి. ప్రవాహం ఉధృతమైన వెంటనే విడిపోయి దూరంగా పయనిస్తాయి. దానితో సమానమే సంసారంలో ఉండే సభ్యుల సమాగమం. పరస్త్రీ వ్యామోహంతో పాడయిపోయిన వారిలో సైంధపుడొకడు. పాండవులు తమ నివాసంలో లేనప్పుడు, ద్రౌపది ఒంటరిగా ఉండటం చూసి మానభంగం చేయదలచి రథంపై ఎక్కించుకుని తీసుకెళ్లడాన్ని తెలిసికొన్న పాండవులు వచ్చి వానికి తగిన ప్రాయశ్చిత్తం పెట్టడమేకాక తలగొరిగించి పంపారు. పరుల ఆస్తిపై వ్యామోహం కలిగిన దుర్యోధనుడు న్యాయబద్ధంగా పాండవులకు ఇవ్వవలసిన రాజ్యభాగాన్ని ఇవ్వకుండా యుద్ధం చేసి తానేగాక తన వంశనాశానికి కారణమయ్యాడు. మోహానికి వలపు అనే పదాన్ని పర్యాయపదంగా చెబుతారు. ధర్మబద్ధమైన పవిత్ర దాంపత్య బంధమైన గంగా శంతనుల వలపు తో దేవవ్రతుడు (భీష్ముడు) జన్మించాడు. అతడు మహావీరుడుగా మాట తప్పని వాడి గా మనటమే గాక విఘ్ణవును సహస్ర నామాలలø స్తుతించే జ్ఞానిగా తన గొప్పతనాన్ని చిరస్థాయిగా నిలుపుకొన్నాడు. మంచిచెడుల మధ్యలో మనిషి జీవించడం తప్పనందున పాలను మాత్రమే స్వీరించి నీటిని వదలే హంస వలె మంచిగా మనాలి. – విద్వాన్ వల్లూరు చిన్నయ్య -
మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు
"సత్యం, పవిత్రత, నిస్వార్థం-ఈ సుగుణాలున్న వాడిని అణగద్రొక్కగల సామర్ధ్యం ముల్లో కాలలో ఎవరికీ లేదు. ఇలాంటి సుగుణ సంపన్నుడు విశ్వమంతా ఏకమైనా ఒంటరిగా ఎదిరించగలుగుతాడు" అని అంటారు స్వామి వివేకానంద. సువర్ణమయం పృథివీం చిన్నంతి పురుషాస్త్రయః । శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమ్ ॥ ఈ భూతలాన్ని సువర్ణమయం చేయగలగే వారు- శూరులు, జ్ఞానులు, సేవాతత్పరులు. ఈ మూడు తరహాల వారినే 'మహాత్ములు' అంటారు. ధర్మనిరతిలో సాటిలేని రాముడు 'ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు' గా వాసి కెక్కాడు. సత్యనిష్ఠలో మేటి అయిన హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు' గా వినుతికెక్కాడు. దానగుణంలో తిరుగులేని కర్ణుడు 'దానకర్ణుడు' ఖ్యాతిగాంచాడు. ఇలా శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, కర్ణుడు తమ తమ దివ్యగుణాలతోనే అజరామరమైన కీర్తిప్రతిష్ఠలను ఆర్జించారు. అలాగే గంగాదేవి శంతన మహారాజు పుత్రుడు దేవవ్రతుడు తన భీషణ ప్రతిజ్ఞతో 'భీష్ముని' గా ప్రసిద్ధి చెందాడు రాజవంశంలో భోగమయ జీవితాన్ని అనుభవించాల్సిన భీష్ముడు అఖండ బ్రహ్మ చర్య దీక్షతో యోగమయ జీవితాన్ని గడిపి బ్రహ్మనిష్ఠుడయ్యాడు. త్యాగనిరతి, ఇంద్రియ నిగ్రహ శక్తి, ధర్మనిబద్దతల సంగమ క్షేత్రమే ఆయన పవిత్ర జీవనం. ఇలాంటి పావనమూర్తి చరించిన ఈ భారతభూమి బంగారుభూమే! మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు. శౌర్యం, సేవాతత్పరత, సత్యనిష్ఠ, పవిత్రత,ఈగుణాలు పుష్టిగావున్నాయి భీష్మునిలో. తండ్రిన సంతోషపరచడమే తనయుని ధర్మమని తలచిన దేవవ్రతుడు తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించడానికి, ఆమె తండ్రి దాశరాజును ఒప్పించడానికి వెళ్ళాడు. అప్పుడు దాశరాజు 'నా కుమార్తెకు పుట్టిన బిడ్డకే పట్టాభిషేకం చేయాలి' అని షరతు పెట్టాడు. అప్పుడు దేవవ్రతుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు."ఇక్కడ సమావేశమై ఉన్న ప్రభువు లందరూ వినండి! నేను తండ్రిగారి ప్రయోజనం కోసం స్థిరమైన ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేమంటే ఈమెకు పుట్టిన కుమారుడే రాజ్యాధిపతి అవడానికి అర్హుడు" అని పెద్దల ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. కాని దాశరాజు ఈ ప్రతిజ్ఞతో సంతోషపడలేదు. ఇలాగన్నాడు. "అది సరే!కాని నీకు పుట్టిన కుమారుడు రాజ్యాన్ని ఆశించకుండా ఉంటాడని ఏమిటి నమ్మకం?"అప్పుడు చిత్తస్తైర్యంగా బ్రహ్మచర్య వ్రతాన్ని చేబడుతున్నాను అని మరో శబధం చేసాడు శంతనుని కుమారుడు. భీష్ముడు అస్త్రశస్త్ర విద్యలో అసమాన ప్రతిభావంతుడు. తన తమ్ముల కొరకు కన్యలు తేవాలని కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్ళి అక్కడ ఎందరో రాజులను పరాజితులను చేశాడు. గురువైన పరశురాముడంతటి మహాశూరుడ్ని యుద్ధంలో ఓడించాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించాడు. భీష్మునలో రాజ్యకాంక్ష , భోగలాలస ఏమాత్రం లేదు. స్వార్థరహితుడు.కుమారుని సత్యనిష్ఠకు సంతసించి శంతనుడు కుమారునకు ఇచ్ఛామరణ వరాన్ని ప్రసాదినచాడు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాల్లో సుప్రతిష్టుడైన కురు వృద్ధుడిని శ్రీకృష్ణుడు "జన్మములిట్టివి యెందుకల్గునే" అని ప్రశంసించాడు. -గుమ్మా ప్రసాద రావు భిలాయి -
అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా?..
అంతఃపురంలో ఆడవాళ్ళే మిగిలారు. విరటుడు సైన్యంతో సుశర్మను ఎదుర్కొనాడానికి వెళ్ళాడు. మారువేషాలలో ఉన్న పాండవులు నలుగురూ వెళ్ళారు. ఇంతలో దూత వచ్చి ఉత్తరదిశను పెద్ద సైన్యం మన గోవులను మళ్లించుకు వెళ్ళిం దని ఉత్తరకుమారుడికి చెప్పాడు. నా వద్ద సారథిలేడు, ఉంటే నేను వారిని ఓడించి గోవులను తీసుకు వస్తానని ఉత్తరకుమారుడు బిరాలు పలికేడు. అప్పుడు సైరంద్రి బృహన్న లను తీసుకు వెళ్ళమంటుంది. మరో గత్యం తరం లేక ఉత్తరకుమారుడు వెళ్తాడు. అక్కడ సైన్యాన్నిచూసి భయపడి బృహన్నల వారి స్తున్నా పారిపోతాడు. బృహన్నల ఉత్తరడుని అడ్డగించి నేను అర్జునుడిని. నీవు రథం నడుపు నేను యుద్ధం చేస్తానంటాడు. ఉత్తరుడు నమ్మడు. ఆ మాటలు విన్న ఉత్తర కుమారుడు సంభ్రమాశ్చర్యాలతోసందేహంగా "బృహన్నలా! అర్జునికి పది పేర్లున్నాయి. వాటిని వివరిస్తే నేను నిన్ను నమ్ముతాను " అన్నాడు. బృహన్నల చిరు నవ్వుతో ఉత్తరుని చూసి నాకు అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహ నుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి " అన్నాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక " బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను " అన్నాడు. అర్జునుడు ఇలా అన్నాడు. "కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించితిని కనుక ధనుంజయుడ నయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడి నయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాసిస్తుంటుంది కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, బీభత్సమైన పనులు చెయ్యను కనుక బీభత్సుడి నయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తర కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వన దహనంలో అగ్ని దేవునికి సాయపడి నందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భయపడ వలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం " అన్నాడు. అర్జునుడి ఈ పది నామాలే ఉన్నాయా లేక ఇంకమైనా పేర్లు ఉన్నాయా? ఉన్పాయనే చెప్పవచ్చు. భగవద్గీతలో ఉన్న అర్జునుడి ఇతర నామాలు ఇవి. అనఘుడు, అనసూయుడు, కపిధ్వజుడు, కురుప్రవీరుడు, కురునందనుడు, కురుశ్రేష్ఠుడు కూరుసత్తముడు, కౌంతేయుడు, గుడాకేశుడు దేహభృయాం వరుడు, పరంతపుడు, పురుషవర్ధనుడు, భరతర్షభుడు , భరత శ్రేష్ఠుడు, భరతసత్తముడు, మహాబాహుడు. అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా! ఇక్కడ మరో విషయం తెలుసుకోవలసినది ఉంది. పిడుగులు పడేటప్పుడు అర్జునుని దశ నామాలను తలచుకుంటే ఆ పిడుగు మనదరిదాపుల్లో పడదు, మనకు ప్రాణభయం ఉండదంటారు పెద్దలు. -గుమ్మా నిత్యకళ్యాణమ్మ -
శశికళ ఆధ్యాత్మిక పర్యటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేసిన శశికళ ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గుచూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్యటన చేయాల్సిన ఆమె ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్ష ముగించుకుని జనవరి 27న జైలు నుంచి విడుదలైన శశికళ గతంలో నిర్ణయించుకున్న ప్రకారం క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి ఉంది. చేజారిపోయిన అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి రావడం ఆమె లక్ష్యాలుగా ఉండేవి. అయితే అన్నాడీఎంకే–బీజేపీ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో శశికళ ప్రస్తావన బెడిసికొట్టడంతో పరిస్థితి మారిపోయింది. బీజేపీలోని ఒక కీలకవ్యక్తి, కుటుంబసభ్యుని సూచనల మేరకు రాజకీయాల నుంచి ఆమె తాత్కాలికంగా వైదొలిగారు. ఈనెల 11వ తేదీ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నై టీనగర్లోని అగస్తీశ్వరాలయంలో పూజలు జరపనున్నారు. 15వ తేదీ నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు దిగుతారు. -
దేవుడే దిక్కు.. నిత్యపూజలు, ప్రార్థనలు
సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి ముందుగానే విముక్తి పొందాలని శశికళ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. ససేమిరా అని కర్ణాటక జైళ్లశాఖ చెప్పేసింది. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరిలోని శశికళ విడుదలపై ఆసక్తి నెలకొంది. జయలలిత హయాంలోనే అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆ తరువాత పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్న చందంగా సీఎం కావాల్సింది జైలుపక్షిగా మారిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అనుభవిస్తున్న నాలుగేళ్ల జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంతో పూర్తయి విడుదల కావాల్సి ఉంది. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) ముందస్తు విడుదలపై ముందుకూ, వెనక్కి... కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి నెలరోజుల జైలు జీవితానికి మూడు సెలవు రోజుల చొప్పున మొత్తం 129 రోజుల సెలవులను బేరీజు వేసుకుని నవంబరులోనే విడుదల చేయాలని శశికళ తరఫున్యాయవాది గతంలో బెంగళూరు జైలు సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించాడు. ఇక అప్పటి నుంచి శశికళ ముందుస్తు విడుదల వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు విడుదల అడ్డంకిగా ఉండిన రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించి ఆశగా ఎదురుచూడడం ప్రారంభించారు. (శశికళ ఆశలు అడియాశలు..!) నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు. అవినీతినిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయిన కొందరిని సత్ప్రవర్తన పరిధిలో చేర్చిన కర్ణాటక ప్రభుత్వం ముందుగానే విడుదల చేసిన దాఖలాలు ఉన్నందున శశికళను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లింపు, కోర్టు ఆమోదం పూర్తయినందున సత్ప్రవర్తన కింద ముందే విడుదల చేయాలని కోరుతూ జైళ్లశాఖకు ఈనెల 17న శశికళ న్యాయవాదులు మరోసారి వినతిపత్రం సమర్పించారు. శశికళ చెన్నై జైల్లో ఉన్న రోజులు, పెరోల్ రోజులు, సెలవు దినాలు పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ వినతిని జైళ్లశాఖ నిరాకరించడంతో శశికళకు మళ్లీ నిరాశే మిగిలింది. చదవండి: (పవన్ కల్యాణ్పై తమిళ మీడియా సెటైర్లు) దైవ పూజల్లో నిమగ్నం.. ముందస్తు విడుదల వ్యవహారం మూడడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనకలా మారడంతో శశికళ దైవపూజల్లో గడుపుతున్నారు. జైల్లోని తనగదిలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు పెట్టుకుని రోజుకు నాలుగు గంటలపాటు పూజలు చేస్తున్నారు. తలపెట్టిన కార్యాలు నెరవేరాలని పార్థసారథి స్వామికి పదేపదే ప్రార్థనలు చేస్తున్నారు. జయలలితలా ఆంజనేయస్వామిని సైతం ప్రత్యేకంగా ఆరాధించడం ప్రారంభించారు. మాంసాహారం మానివేసి పూర్తిగా శాఖాహారాన్ని అలవాటు చేసుకున్నారు. ఆరునెలలుగా ఎవ్వరికీ ములాఖత్ ఇవ్వలేదు. శశికళ న్యాయవాదులు బెంగళూరులోనే తిష్టవేసి ముందస్తు విడుదలపై కృషి చేస్తున్నారు. -
నేను నేనే...
ఓ సాధువు తన శిష్యుడిని పిలిచి ‘‘ఓ రోజంతా నువ్వు రాజుగారి కోటలో ఉండి పాఠం నేర్చుకురా’’ అని ఆదేశించారు.‘‘ఆశ్రమంలో నేర్చుకోని పాఠాన్ని రాజుగారి కోటలో ఏం నేర్చుకుంటాను’’ అని మనసులో అనుకున్నా గురువుగారి ఆజ్ఞగా శిష్యుడు సరేనని రాజుగారి కోటకు వెళ్ళాడు. ఆ శిష్యుడు రాజుగారి ఆస్థానానికి వెళ్ళి గురువుగారి మాట చెప్పాడు. అలాగా అని రాజుగారు ఆ యువకుడికి ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా సకల మర్యాదలతో చూసుకున్నాడు. రాజుగారి కోటలో ఎటు చూసినా ఆటాపాటలే. విలాసాలకు ఏ మాత్రం లోటు లేకుండా ఉంది. కానీ ఇవేవీ అతనికి నచ్చలేదు. ఒంటి మీద జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది అతనికి. అయినా మనసుని నియంత్రించుకుని పగలంతా కోటలో గడిపాడు. రాత్రి కాగానే నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే రాజు ఆ యువకుడిని పిలిచి దగ్గర్లోనే ఉన్న కోనేటిలో స్నానం చేసి వద్దాం అన్నాడు. యువకుడు, రాజు ఇద్దరూ వెళ్ళారు. అప్పుడు ఉన్నట్లుండి రాజుగారి కోటలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చూపించాడు రాజు. ఆ యువకుడు స్నానం మానేసి కోట వైపు వెంటనే పరుగెత్తాడు. అక్కడ ఉంచేసిన తన కౌపీనం తగలబడిపోకుండా ఉండేందుకు పరుగెత్తాడు. కౌపీనం తీసుకుని యువకుడు కోనేటి వద్దకు చేరుకున్నాడు. అప్పటికీ రాజుగారు అక్కడే నింపాదిగా స్నానం చేస్తూ కనిపించారు. కోట ఓ పక్క అగ్నిప్రమాదంలో చిక్కుకోగా ఈ రాజు ఏ మాత్రం దిగులుపడకుండా ఇలా జలకాలాడుతున్నాడేమిటి చెప్మా అనుకున్నాడు మనసులో ఆ యువకుడు. కానీ తాను మాత్రం తన కౌపీనం కోసం ఇలా పరుగులు తీసానేమిటీ అని సిగ్గుతో తలదించుకున్నాడు. రాజుగారికి నమస్కరించి ‘‘ఏ విధంగా మీరిలా నిశ్చలంగా ఉండగలిగారు’’ అని యువకుడు అడిగాడు. అప్పుడు రాజు చెప్పాడు ... ‘‘ఈ కోట నాదనే తలపు ఉండి ఉంటే నేనూ పరుగెత్తే వాడిని, అది ఒట్టి కోటే. నేను నేనే. అంతే తప్ప కోట నాదెలా అవుతుంది. నేను చనిపోయిన తర్వాత కూడా ఆ కోట అక్కడే ఉంటుంది. కౌపీనం నీదని, కోట నాదని నువ్వు అనుకున్నావు కనుకే పరుగెత్తుకుని వెళ్ళి నీ కౌపీనాన్ని మాత్రం తెచ్చుకున్నావు... కోట సంగతి వదిలేశావు. కానీ నేనలా అనుకోలేదు. కనుకే పరుగెత్తలేదు. మనిషి తన మనసు ఇష్టాయిష్టాలకు దాసోహమవుతున్నాడు. ఇష్టాయిష్టాలను వదులుకున్నవాడే ఇందులోంచి విముక్తి పొందుతాడు’’ అని రాజు చెప్పేసరికి తననెందుకు ఓ రోజు కోటలో ఉండి పాఠం నేర్చుకోమన్నాడో గ్రహించాడు ఆ యువకుడు. – యామిజాల జగదీశ్ -
ధర్మ సందేహం
నాకు రుద్ర నమకం, చమకం వంటివి రావు. రోజూ ఓ వెండి శివలింగాన్ని పూజిస్తుంటాను. అయితే రుద్రంతో తప్ప శివుని పూజించకూడదని, అసలు శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోరాదని కొందరంటున్నారు. నిజమేనా? – పిచ్చిక జ్ఞాన సుబ్రహ్మణ్యం, కాకినాడ మీరు విన్నవి సరైనవి కావు. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకుని పూజించడం ఐశ్వర్యకరం. రుద్ర నమకాదులతో అభిషేకించడం, పూజించడం మంచిది. అలాగని రుద్రనమకాదులతోనే పూజించాలన్న నిబంధన ఏమీ లేదు. శివనామాలు చెప్పుకుంటూ అభిషేకించవచ్చు. అష్టోత్తర శతనామాలతోనూ అభిషేకించవచ్చు. ఏదీ రానప్పుడు ‘శివాయ నమః అనో, నమఃశివాయ అనో పూజించడం కూడా సత్ఫలితాలనే ఇస్తుంది. బోళాశంకరుడు, భక్తవశంకరుడు, భక్త సులభుడు అయిన శివుడు అభిషేక ప్రియుడు. తన భక్తులు తనను నోరారా నమశ్శివాయ అని పూజిస్తే చాలు... ప్రసన్నుడవుతాడు. నిత్యం ఇంట్లో శివార్చన జరగడం మంచిదే. శివపూజ అందరూ చేయవచ్చు. అయితే బాణలింగం, స్ఫటికలింగం, సాలగ్రామం వంటి వాటికే ఎక్కువ నియమాలు, విధులూ ఉన్నాయి. అవి యోగ్యులైన గురువుల సాయంతోనే స్వీకరించాలి. అవి లేకున్నా వెండి లింగాన్ని అర్చించడం మంచిదే. – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ♦ప్రశ్నోత్తర భారతం.. లక్క ఇంటి కథ 1. ఎవరు యువరాజు అయ్యారు? 2. పాండవులను చూసిన దుర్యోధనుడు ఏ విధంగా ఉన్నాడు? 3. దుర్యోధనుడు ఏమని ఆలోచన చేశాడు? 4. తన దురాలోచన గురించి ఎవరెవరిని సంప్రదించాడు? 5. శకుని ముఖ్యమంత్రి ఎవరు? 6. కణికుడు ఏం చేస్తాడు? – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ జవాబులు: 1. ధర్మరాజు యువరాజు అయ్యాడు. సార్వభౌముని గౌరవం పొందాడు. పాండవులు పరాక్రమవంతులు అయ్యారు. 2. దుర్యోధనుడు సహించలేకపోయాడు. అతనిలో అశాంతి ప్రవేశించింది. నిదుర పట్టలేదు. 3. పాండవులను హతమార్చాలనుకున్నాడు. అందుకోసం పన్నాగాలను గురించి ఆలోచించాడు. 4. శకుని. కర్ణుడు మొదలైన వారిని సంప్రదించాడు. 5. కణికుడు 6. దుర్యోధనుడికి రాజకీయ ఉపాయాలను బోధిస్తాడు. ♦అమృత సూక్తులు ►కొంచెం తెలిసి ఉండి కూడా అన్నీ తెలిసినట్లు నటించడం నీచుల లక్షణం ►సంతోషం మంచి నుంచి కలుగుతుంది. చెడు నుంచి కలిగేది పైకి సంతోషంగా అనిపించినను అనంతరం అదిదుఃఖంగానే మారుతుంది. ►ప్రేమ వల్ల కోపాన్ని, మంచి వల్ల చెడును, ధర్మం చేత లోభాన్ని, విచారణ చేత మోహాన్ని, సత్యం చేత అబద్ధాన్నీ జయించాలి. ►సజ్జన సహవాసమే ఎల్లప్పుడూ చేయవలెను. ఒకవేళ సజ్జన సహవాసం లభించని యెడల ఎటువంటి సహవాసమూ చేయకుండుట మేలు. ►స్వల్పమైన ముత్యాల కోసం మనిషి ఎటువంటి కష్టానికైనా ఓర్చి ప్రాణహానికైనా తెగించి ఘోరమైన సముద్రంలో మునిగి వాటిని పొందుతాడు. కాని అనంతమైన, అనల్పమైన భగవదనుగ్రహం కోసం ఏ కష్టాలూ పడనవసరం లేదు. కేవలం భక్తిశ్రద్ధలు, సాటి మనుషుల యెడల ప్రేమ, పరోపకార గుణం కలిగి ఉంటే చాలు. -
స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం. ఆధ్యాత్మికం అంటే ? శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటే ? భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం. భగవంతుడు అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా ? పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు. భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది. పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు ఏది సత్యం ? భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రశ్న భక్తులకు మీ సందేశం ? మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’ అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
కారుణ్యం కురిసే కాలం
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక అంశాల్లో ‘హజ్జ్’ కూడా ఒకటి. వెసులుబాటున్న ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్హజ్జ్ మాసంలో నిర్వహించబడుతుంది. అందుకే ఈ మాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ మాసంలోని మొదటి పదిరోజులు చాలా ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడు రోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో రమజాన్ మాసానికి, రమజాన్లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేకత ఉందో, అదేవిధంగా జిల్హజ్జ్ మాసంలోని మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు. ఈ మొదటి దశకంలో అల్లాహ్ కారుణ్యం వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యతను కలిగి అల్లాహ్ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈదశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరమైనవికావు. అంటే, జిల్హజ్జ్ మాసం తొలి తొమ్మిది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు అల్లాహ్కు మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే అధిక ప్రీతికరం. ఈ రోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ఇందులోని ప్రతి రాత్రి ఆచరించే నఫిల్లు షబేఖద్ర్లో ఆచరించే నఫిల్లతో సమానం. నిజానికి ఇవి హజ్జ్ కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్ప అందరూ హజ్ చేయలేరు. కాని అల్లాహ్ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం పొందగలిగే అవకాశాన్ని అందరికి ప్రసాదించాడు. జిల్ హజ్జ్ మాసం ప్రారంభమవుతూనే, తమతమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళ వద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్ ఖుర్బానీలోని రహస్యం. హజ్జ్ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్ హజ్జ్ మాసం పదవతేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు. మక్కా వెళ్ళలేక పోయిన యావత్ ప్రపంచంలోని ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్’ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం చేయకూడదు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరిస్తూ వారితో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా జిల్ హజ్ మాసం మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన ఆయన కారుణ్యాన్ని పొందడానికి కృషిచేయాలి. మక్కా వెళ్ళి హజ్జ్ ఆచరించే స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్ అజ్హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే అల్లాహ్ తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. కనుక హజ్జ్ పరమార్థాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హృదయ నివేదన
దేవుడికి నివేదించడానికి భౌతికమైన మార్గాలు చాలా ఉన్నాయి. కాని ఆత్మికమైన మార్గం హృదయ సంభాషణే అంటారు శ్రీలేఖ. మన మనసుతో మౌనంగా దేవునితో చేసే ప్రతి సంభాషణ ఆయన వరకూ చేరుతుందని నమ్ముతారు ఆమె.లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం సమంగా గడపడమే తన మార్గం అంటారు శ్రీలేఖ. ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్ తప్పనిసరి అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను. అలా మా అబ్బాయి ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఫస్ట్ టైమ్ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. నేటి తెలుగు సినీపరిశ్రమలో ఒకే ఒక్క మహిళా సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ. మధురమైన∙సంగీతం, పాటలతో తెలుగువారికి ఆమె సుపరిచితురాలు అయ్యారు. పన్నెండేళ్ల వయసులోనే ‘తాజ్మహల్’ సినిమాకు సంగీత దర్శకత్వం అందించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. బాలీవుడ్లోనూ తన బాణీలతో అలరించారు. సాయంసంధ్య వేళ హైదరాబాద్ మణికొండలోని ఎమ్.ఎమ్.శ్రీలేఖ ఇంటి ముందున్నాం. లోపలి నుంచి ‘మహీం మూలాధారే కమపి మణిపూరే..’ కమ్మని స్వరంలో అమ్మవారి సౌందర్యలహరి వినిపిస్తోంది. అడుగుపెడితే హాల్లో ఏడాది వయసున్న పిల్లవాడిని ఒళ్లోకూర్చోబెట్టుకొని పాడుతున్నారు ఎమ్.ఎమ్.శ్రీలేఖ. ‘మా అబ్బాయి మహిమాన్.. ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి శ్లోకాలు పాడితే చాలు అల్లరి మానేసి కామ్గా వింటూ వుంటాడు’ అంటూ నవ్వారు. ఆ సంగీత దర్శకురాలితో భక్తి సంగీతం మీదుగా ‘నేను– నా దైవం’ ఫీచర్కు ఇంటర్వ్యూ మొదలైంది. మీకు సినిమా పాటలే అనుకున్నాం. భక్తి గీతాలు కూడా కంఠతా వచ్చన్నమాట.. అదేమిటి అలా అంటారు. సినిమా వాళ్లకు భక్తి పాటలు కూడా వస్తాయి. నేనైతే చిన్నప్పటినుంచీ వీటిని వింటూ పెరిగాను. చాలా భక్తి గీతాలు అలవోకగా వంటపట్టేశాయి. నాకు ఒకప్పటి జోలపాట ఇప్పుడు మా అబ్బాయికి లాలిపాట. మీ హాల్లో చాలా దేవతా పటాలు కనిపిస్తున్నాయి.... మా ఇంట్లో ఈ పటాలకు ఎప్పుడూ అలంకరణ ఉంటుంది. పూమాలలను చూశారుగా. మా వారు (పుట్టా వీరవరప్రసాద్) పూజలు చేస్తుంటారు. నేను ఆయనతో పాటు పాల్గొంటుంటాను. అందరి దేవుళ్లకు నేను అభిమానినే. ఎవ్వరినీ తక్కువ చేయను. కానీ, మూకాంబికా అమ్మవారిని మా ఇంట్లో అందరూ భక్తిగా కొలుస్తుంటారు. మూకాంబిక ఆలయం ఉన్నది కర్ణాటకలో.. మీరెలా ఆ అమ్మవారి భక్తులయ్యారు? నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని రాయచూర్కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో. అప్పట్లో కరెంట్, వైద్య సదుపాయం లేని ఊరు అది. మా కుటుంబం అక్కడే వ్యవసాయం చేస్తుండేది. అర్థరాత్రి నేను పుట్టిందే పూజ గదిలోనట. ఇప్పుడు ఈ హాల్కి రెండింతలు ఉంటుంది ఊళ్లో ఆ పూజగది. అంత పెద్ద పూజగదిలో మా పెదనాన్న శివశక్తిదత్త (ఎమ్.ఎమ్.కీరవాణి తండ్రి) వేసిన దేవతామూర్తుల చిత్రపటాలు ఎన్నో ఉండేవి. పుట్టాక గంటవరకు నేను ఏడ్వలేదట. పెద్దవాళ్లు భయపడి మూకాంబికా అమ్మవారికి నమస్కరించుకొని ఆమె కుంకుమ నా నుదుటన పెట్టాక నాలో కదలిక వచ్చి, ఏడ్చానట. అలా నా పుట్టుక గురించి తెలుసుకున్నప్పుడు ఒక అలౌకికమైన శక్తి ఏదో నా చుట్టూ ఉందని అర్థమైంది. అమ్మా నాన్నలకు ఒక్కత్తే కూతుర్నని మా నాన్నగారు (బోసు), అమ్మ (విజయలక్ష్మి భరణి) నన్ను భక్తికి దగ్గరగా ఉండేలా పెంచారు. మంగళ, శుక్రవారాలు మౌనవ్రతంలో ఉండేదాన్ని. పౌర్ణమి, అమావాస్యలైతే నాచేత నిష్టగా, కఠిన నియమాలు పాటింపజేసేవారు నాన్నగారు. నేను వేసుకునే డ్రెస్ కలర్ని బట్టి ఆ రోజు ఏ వారమో తెలిసిపోయేది. పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు ఉప్పుకారాలు లేకుండా తులసి ఆకులతో పెంచారంటే నమ్ముతారా! ఒక సన్యాసిని ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని. ఇంతటి కఠిన నియమాలా! .. ఉల్లంఘించాలనిపించలేదా? నాన్నగారు ఏదో కారణం లేకుండా ఇలా చేయరు అనుకునేదాన్ని. కాకపోతే లోపల ఓ సంఘర్షణ ఉండేది. ఎందుకుచేయాలి ఇవన్నీ అని. కానీ ఎప్పుడూ అడగలేదు. కీరవాణి అన్నయ్య, మా పెదనాన్న, చిన్నాన్న... మా ఇంట్లో ఆయనకు ఎవరూ ఎదురుచెప్పేవారు కాదు. ఆయన ఎంత చెబితే అంత. ఆయన ద్వారానే ధ్యానం, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ అలవడ్డాయి. స్ప్రిచ్యువల్ పవర్ గురించి కూడా ఆయన ద్వారానే నాకు తెలిసింది. పాజిటివ్గా ఉంటే అంతా మంచే వస్తుందనే నమ్మకం ఏర్పడింది. దేవుడు ఉన్నాడని మీరెలా నమ్ముతారు? దైవం మానుష రూపేణా అనేది నేను నూరు శాతం నమ్ముతాను. ఏదైనా చిన్న అవకాశం వచ్చినా అది మనిషి ద్వారానే రావాలి. మనం దారి తప్పినప్పుడు ఒక మనిషి దారి చూపిస్తాడు. దేవుడే ఆ మనిషిని పంపుతాడు. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరో అన్నం పెడతాడు. దైవమే ఆ మనిషిని ఏర్పాటు చేసి ఉంటాడు. నాకు దాసరి నారాయణరావుగారి ద్వారా మొదటి అవకాశం వచ్చింది. ఆ అవకాశమే దేవుడు. పన్నెండేళ్ల వయసులో నేనేంటి... ఆ పాటలేంటి? ఆ ప్రేమ పాటలకు బాణీలేంటి? దేవుణ్ణి మనిషిలా చూడాలి... మనిషిని దేవుడిలా చూడాలి. అప్పుడు అందరూ మనకు ఆప్తులై జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కళ కూడా దైవమే అంటారా? దేవుని ఉనికే కళ. నాకు ఆ కళ ఇచ్చి తన ఉనికిని తెలియచేశాడు దేవుడు. దాన్ని పట్టుకొని ఈ జీవితాన్ని నెగ్గుకొస్తున్నాను. ఇప్పటికీ కీ బోర్డు దగ్గర కూర్చున్నానంటే ఏదో అలౌకికమైన శక్తి నన్ను ఆవరిస్తున్నట్టుగా ఉంది. అలవోకగా బాణీలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు దైవానికి సంబంధించి ఎలాంటి నియమాల పాటిస్తున్నారు? ఏదైనా చిన్న సమస్య వచ్చినా చాలు క్షణం క్షణం సినిమాలో శ్రీదేవిలా ‘దేవుడా దేవుడా దేవుడా..’ అని మొక్కేసుకుంట. కాని ఫలానా దేవుడికే మొక్కాలి అనే నియమం కూడా లేదు. నేను జీసస్నూ నమ్ముతాను. మా నాన్నగారు 300 వరకు జీసస్ పాటలు రాశారు. కొన్నింటికి నేనూ బాణీలు కట్టాను. తిరుమలకు వెళతాను. అలాగే కడప దర్గాకు వెళతాను. దైవాన్ని నమ్మడానికి కులం, మతం తేడాలే లేవు. దైవం అనేది ఒక సుప్రీం పవర్. అన్నింటికీ అతీతమైనది. మీ నాన్నగారిలాగ మీరూ మీ అబ్బాయికి ఆధ్యాత్మికతను చేరువ చేస్తున్నారా? కొన్ని లక్షణాలు జన్మతః వచ్చేస్తుంటాయి. అందులో ఆధ్యాత్మిక శక్తి కూడా ఒకటి. మా అబ్బాయిని ‘అమ్మ ఏది’ అంటే చాలు మూకాంబికా అమ్మవారి ఫోటో చూపిస్తాడు. ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్ తప్పనిసరి అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను. అలా వాడు ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఫస్ట్ టైమ్ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. దేవుడిని ఎలా ఫీల్ అవుతుంటారు? మనం తెలిసో, తప్పకనో.. తప్పులు చేస్తూనే ఉంటాం. అది అవసరమో, అనవసరమో, అహంకారమో కూడా తెలియదు. జీవనశైలిలో ఇవన్నీ భాగమే. పడుకునే ముందు చేసే ధ్యానంలో నా వల్ల ఈ రోజు ఎవరైనా హర్ట్ అయి ఉంటే వారికి సారీ అని చెప్పుకుంటాను. టెలీపతి ద్వారా మన మనసులోని భావం వారికి చేరుతుందని నా నమ్మకం. అలాగే దేవుడికి కూడా నా మనసులోని భావం చేరుతుందని నా నమ్మకం. అందుకే చాలా విషయాలు ఆయనకు చెప్పుకుంటూ ఉంటాను. జీవితంలో అన్నీ ఉండాలి. బంధువులు, మిత్రులు, పని. అయితే, దేని కోసం దేన్నీ వదులుకోకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. వచ్చిన పని గొప్పగా చేయాలి. మంచి మంచి పాటలకు సంగీతం అందించాలి. ఇదే దైవాన్ని కోరుకునేది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఐఐటీ విద్యార్థిని అదృశ్యం
హిమాలయాలకు వెళ్తున్నట్టు ఉత్తరం చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నత ఉద్యోగాలకు బాటవేసే ఐఐటీ చదువును ఆపివేసి ఆధ్యాత్మిక జీవనం వైపు పయనమైందో విద్యార్థిని. ‘ఆధ్యాత్మిక జీవనం తన మనస్సును లాగుతోంది, హిమాలయాలకు వెళ్తున్నా’ అంటూ ఉత్తరం రాసిపెట్టి మరీ అదృశ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష (20) మద్రాసు అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్లో ఉంటోంది. ప్రత్యూష రెండ్రోజులుగా కనిపించడం లేదు. ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తనిఖీలు నిర్వహించగా తెలుగు, ఇంగ్లిషులో రాసిన ఉత్తరం దొరికింది. ‘ఆధ్యాత్మిక జీవనంపై రోజురోజుకూ నాకు ఆసక్తి పెరుగుతోంది, ఈ కారణంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అన్వేషిస్తూ హిమాలయాలకు వెళుతున్నా. నాకోసం వెతకవద్దు, తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని ఇవ్వండి’ అంటూ ఉత్తరంలో రాసింది. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రత్యూష హాస్టల్ను ఖాళీ చేసి వెళ్లిందని, అయితే ఆమె స్వస్థలానికి చేరుకోలేదని తెలియడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని మంగళవారం రాత్రి మద్రాసు ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది.