Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cyclone Remal slams into Bangladesh coast
తీరం దాటిన రెమాల్‌.. ఇక భగభగలే!

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపానుగా బల­పడిన రెమాల్‌ ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటింది. అంతకుముందు తీవ్ర తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్‌డీ­ఆర్‌­ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. తుపాన్‌ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోయినా.. దీని కారణంగా రాష్ట్రంలో తేమ మొత్తం పోయింది. పొడి వాతావరణం ఏర్పడింది.దీనికితోడు ఏపీ, యానాంలో పశ్చిమదిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మరింత ఎక్కువ కానుంది. రాబోయే రెండురోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడు­తుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవు­తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.రెండురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కని­పిస్తు­న్నాయని వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశా­న్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఈ నెల 31 నాటికి కేరళలోకి ప్రవేశించేందుకు అవకా­శాలు కనిపిస్తు­న్నా­­యని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు రెమాల్‌ తుపాను ముప్పు తప్పినప్పటికీ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు(జూన్‌ 3దాకా) ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

IPL 2024 Final KKR VS SRH: Mitchell Starc Becomes The First Player To Win More Than 1 POTM Award In Knock Outs In Single Season
IPL 2024 Final: సన్‌రైజర్స్‌కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్‌

చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్‌కేకేఆర్‌ పేసర్‌, ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం​ చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి సన్‌రైజర్స్‌కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్‌ చరిత్రలో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్‌ చరిత్ర సృష్టించాడు. స్టార్క్‌ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్‌లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు. సీజన్‌ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్‌ అత్యంత కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్‌లో స్టార్క్‌ సన్‌రైజర్స్‌ పాలిట విలన్‌లా దాపురించాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (2), ట్రివిస్‌ హెడ్‌ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్‌ కాకుండా మార్క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13), క్లాసెన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్‌ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్‌ (2.3-0-19-3), హర్షిత్‌ రాణా (4-1-24-2), సునీల్‌ నరైన్‌ (4-0-16-1), వరుణ్‌ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్‌ అరోరా ఓ వికెట్‌ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్‌ నరైన్‌ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది. గత సీజన్‌లో టేబుల్‌ చివర్లో ఉండిన సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్‌ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్‌ నరైన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది.

TDP Leaders Fires on against farmers in Mangalagiri
ఓటు తెచ్చిన చేటు..

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : పేద రైతులకు ముఖ్యంగా కౌలుదారులకు మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు ఎక్కడాలేని కష్టం తెచ్చిపెట్టాయి. తమ యజమానులు చెప్పిన వారికి ఓటు వేయకపోవడం.. తమ మనస్సాక్షి ప్రకారం వారు నడుచుకోవడమే వారు చేసిన నేరం. తమ మాటకు విలువ ఇవ్వలేదని, తాము చెప్పినట్లు ఓట్లు వేయలేదన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు బరితెగించి ఇక నుంచి మా భూముల్లోకి అడుగుపెట్టొద్దని చెప్పేస్తున్నారు.మీకు మా భూములను కౌలుకు ఇవ్వడంలేదని తేల్చిచెప్పేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతులు వ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. తాత, తండ్రుల నుంచి ఇప్పటివరకు ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ క్రమం తప్పక కౌలు చెల్లిస్తున్న తమను రావద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదనకు లోనవుతున్నారు. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోతున్నారు.భూమి వారిదైనప్పుడు మా ఓటు మాది కాదా అని యువ కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా మాలాంటి పేదలపై పెత్తందారుల దాష్టీకాలు ఇంకెంత కాలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణాలు మంగళగిరి నియోజకవర్గంలోనే చోటుచేసుకుంటున్నాయా? లేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందా అని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కౌలురైతులు ‘సాక్షి’ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.కౌలురైతు: బుల్లా శ్రీనివాసరావు సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి- రెండెకరాలుఎప్పటి నుంచి - 15 ఏళ్లుగాకౌలు మొత్తం (ఎకరానికి) - రూ.35 వేలుకౌలురైతు: గొడవర్తి ప్రతాప్‌సింగ్‌సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - వాసిరెడ్డి వాసుగ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - ఏళ్లుగా చేస్తున్నారుకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్‌ సద్దాం హుస్సేన్‌ సామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - గద్దె శ్రీనివాసరావుగ్రామం - చిలువూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - ఐదేళ్లుగా..కౌలు మొత్తం - 16 బస్తాలుకౌలురైతు: షేక్‌ ఖాదర్‌ భాషాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - యడ్ల హర్షవర్థన్‌రావుగ్రామం - తుమ్మపూడిసాగుచేస్తున్న భూమి - 10 ఎకరాలు ఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 70 వేలు (నిమ్మతోట)కౌలురైతు: చిలకా తిమోతిసామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - పాటిబండ్ల హరిప్రసాద్‌ గ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - ఒకటిన్నర ఎకరంఎప్పటి నుంచి - 30 ఏళ్లుగాకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్‌ ఖాంసాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - లంక గోపాలరావుగ్రామం - కంఠంరాజు కొండూరుసాగుచేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 14 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుకౌలురైతు: గంపల శ్రీనివాసరావుసామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - పుతుంబాక సాయికృష్ణగ్రామం - పేరకలపూడి సాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 22 ఏళ్లుగాకౌలు మొత్తం - 35,000కౌలురైతు: యలమాటి ప్రసాద్‌కుమార్‌సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగా (తండ్రి నుంచి)కౌలు మొత్తం - 5 బస్తాలు మొదలు 23 బస్తాల వరకు / 30 వేలుకౌలురైతు: దేశబోయిన బాబుయాదవ్‌సామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - గుండిమెడ బసవయ్యగ్రామం - కంఠంరాజు కొండూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుమంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీతో..టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలై, మూడు శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి అదే స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన మురుగుడు లావణ్యతో ఈసారి పోటీపడ్డారు. చాలాకాలంగా మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని తన సామాజికవర్గంపై ఆయన ప్రధానంగా దృష్టిసారించారు.ఈ నేపథ్యంలో.. పెదపాలెంకు చెందిన పాటిబండ్ల కృష్ణప్రసాద్‌ (కేపీ) వైఎస్సార్‌సీపీ నాయకుడిగా కొనసాగుతూ కొద్దినెలల కిందట లోకేశ్‌ పక్షాన చేరారు. అలాగే, దుగ్గిరాల మండలవాసి, మాజీ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేష్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య రంగ సంస్థల ముఖ్యులు, వ్యాపారస్తులు, ఎన్‌ఆర్‌ఐల సహకారం కూడా లోకేశ్‌కు తోడైంది. తమ వాడైన లోకేశ్‌కు మద్దతిస్తే ఇవ్వండి, లేదంటే మా సంస్థల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసుకోండని స్పష్టంగా చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.. ఇళ్లలోని పెద్దలకు, మహిళలకు కూడా ఫోన్లుచేసి ఇదే విషయమై బెదిరించారని చెప్పారు.వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నామని..దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాల్లో పెత్తందారులుగా చలామణి అవుతున్న పలువురు టీడీపీ నాయ­కులు, మద్దతుదారులు తమను అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు వాపోయారు. మండలంలోని పెదపాలెం, తుమ్మపూడి, చిలువూరు, కంఠంరాజు కొండూరు, పేరకలపూడి, శృంగారపురం, పెనుమోలి, మోరంపూడి, చిన్నపాలెం తదితర 12 పల్లెల్లోని పేద రైతులకు ఈ ఏడాది నుంచి కౌలుకు భూమి ఇవ్వడంలేదని వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు టీడీపీ సామాజికవర్గానికి రైతులు చెప్పడం పరిశీలనాంశం. ‘ఎన్నికలు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎవరికిష్టమైన పార్టీకు వారు ఓట్లు వేసుకుంటున్నారు. ఆ తరువాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈసారే కులాలు, మతాలు అంటూ దారుణంగా పరిస్థితులు మారాయి’.. అని వైఎస్సార్‌సీపీ నాయకుడు వీరయ్య వ్యాఖ్యానించారు.నియోజకవర్గ ఓటర్లకు డబ్బులు..ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వాటితో పాటు విజయవాడ, గుంటూరు, ఇతర ముఖ్య నగరాల్లోని కార్పొరేట్‌ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో పనిచేసే నియోజకవర్గ ఓటర్లకు ఎన్నికల బోనస్‌ అందింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఆయా ఉద్యోగి స్థాయిని బట్టి 2,500 నుంచి 5,000 వరకు డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. చేతికి కూడా ఇచ్చారు. అడక్కపోయినా తమకు ఎన్నికల బోనస్‌ అందిందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. పదవులు వచ్చాయని పగబట్టారు..మండలంలోని ఓ ప్రధాన సామాజికవర్గం వారు దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్‌ (పసుపు) యార్డు చైర్మన్‌ పదవిని దశాబ్దాలుగా అనుభవించారు. ఆ పదవిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికిచ్చారు. అప్పటి నుంచే ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. నియోజకవర్గంలోని ఇతర పదవుల విషయంలోనూ వారిది అదే తీరు.ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు దారులకు మండలంలో సుమారు 200 ఎకరాల వరకు కౌలుకు ఇవ్వడంలేదనేది మా అంచనా. గత ఎన్నికల్లో నారా లోకేశ్‌ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గీయురాలిపై పోటీచేశారు. ఫలితం తేలాల్సి ఉంది. ఆయన సామాజికవర్గీయులకు చెందిన భూములు కౌలుకు ఇవ్వడంలేదంటే వారి ఆలోచనా తీరును అర్థంచేసుకోవాలి. ఆయన మంగళగిరి నియోజకవర్గ నాయకుడా? లేక రాష్ట్రస్థాయి లీడరా? అనేది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం. – దుగ్గిరాల వీరయ్య, వైఎస్సార్‌సీపీ, దుగ్గిరాలరెడ్‌బుక్‌లో పేరు ఎక్కిందంటూ బెదిరింపులు..35 ఏళ్లుగా మా తాత తండ్రుల కాలం నుంచి మూడెకరాలను కౌలుకు చేస్తున్నాం. వాళ్ల ఇళ్లలో అన్నిరకాల పనులూ చేశాం. వైఎస్సార్‌సీపీ వైపు నిలిచినందుకు మాకు భూమి కౌలుకు ఇచ్చేది లేదంటున్నారు. అమరావతి భూముల అంశంలో మాట్లాడినందుకు.. ‘నీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లో ఎక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక నీ సంగతి తేలుస్తా’..మని బెదిరిస్తున్నారు. ఏం జరుగుతుందో, ఏమో! – యలమాటి ప్రసాద్‌కుమార్, పెదపాలెంఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకున్నారు..మేం ఇల్లు కట్టుకుంటున్నాం. నిర్మాణ సమయంలో పొరుగు ఇంటిపై కాస్త నీళ్లు పడినా, దుమ్ము రేగినా తట్టుకోలేక­పోతున్నారు. పనిచేసే భవన కార్మికులను, పనివాళ్లను తిడుతున్నారు. కారణం మేం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచామని. – షేక్‌ బాజీ, చిలువూరుమీరు పార్టీ మారారని మేమూ మారాలా?‘మీరు ఎందుకు జగన్‌కు మద్దతుగా ఉంటున్నారు? ఆ పార్టీని వదిలేసి లోకేశ్‌కు ఓట్లు వేయండి’.. అని మా గ్రామ పెత్తందారు హుకుం జారీచేశారు. మేం జగన్‌ను వదిలే ప్రసక్తిలేదని నాతో పాటు మా బంధువర్గానికి చెందిన వారందరం స్పష్టంగా చెప్పాం. మీరు పార్టీ మారారని, మమ్మల్ని కూడా మారాలని ఆదేశిస్తే అంగీకరించేదిలేదన్నాం. దీంతో పదిహేనేళ్లుగా కౌలుచేస్తున్న రెండెకరాలను ఇచ్చేదిలేదన్నారు. కౌలు డబ్బులు సీజన్‌కు ముందే చెల్లిస్తాం. ఓట్లు వేయనందుకు పొలం ఇవ్వడంలేదనడం వ్యవసాయ సీజన్‌ మొదలయ్యే ముందు చెప్పడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించుకోవాలి. – బుల్లా శ్రీనివాసరావు, పెదపాలెండబ్బులు వెనక్కు ఇచ్చేశారు..భూమి సత్తువ కోసం జొన్న మొదుళ్లను కట్టర్‌తో పనిచేయించాం. రూ.5వేలు ఖర్చ­య్యింది. ఆ మొత్తాన్ని మా భూ యజమాని తిరిగి ఇచ్చేశారు. మూడెకరాలను ఈ ఏడాది కౌలుకు ఇచ్చేది లేనిదీ ఇరవై రోజులు తరువాత చెప్తామన్నారు. ఇక వారు చెప్పేదేంటో అర్థమైపోయింది. – గొడవర్తి ప్రతాప్‌సింగ్, పెదపాలెంమేమే సాగు చేసుకుంటామంటున్నారు..పద్నాలుగేళ్లుగా సాగుచేసుకుంటున్న నాలుగెకరాల పొలాన్ని ఈ దఫా కౌలుకు ఇచ్చేలా లేరు. మేమే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో మేం ఫ్యాన్‌కు ఓట్లేశామని వారికి మాపై కోపం.– షేక్‌ ఖాంసా, కంఠంరాజుకొండూరుమా నాన్నకు వీడియోలు చూపించి బెదిరించారు..మీ అబ్బాయి వైఎస్సార్‌సీపీలో తిరుగుతున్నాడు. పోలింగ్‌ కేంద్రంలో ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాడు. ఇవిగో వీడియోలు చూడండని ఇంటికెళ్లి మా నాన్న ఇస్మాయిల్‌కు వాటిని చూపించారు. దీంతో.. ఐదేళ్లుగా చేస్తున్న నాలుగెకరాలను ఇక నుంచి కౌలుకు ఇచ్చేదిలేదని చెప్పారు. – షేక్‌ సద్దాం హుస్సేన్, చిలువూరుసర్పంచ్‌గా గెలిచానని..మాది తుమ్మ­పూడి. మా అన్న షేక్‌ ఖాదర్‌ బాషా. ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.70 వేలు చొప్పున నిమ్మతోటకు కౌలు చెల్లిస్తూ వచ్చాం. పదెకరాలకు 35 ఏళ్ల పాటు ఎప్పటి కౌలు అప్పుడు ఇచ్చేవాళ్లం. నేను సర్పంచ్‌గా పోటీచేసి గెలిచినందుకు మూడేళ్ల నుంచి నిమ్మతోటను మా అన్నకు ఇవ్వలేదు. – జానీ బాషా, తుమ్మపూడి సర్పంచ్‌మీవి భూములైనప్పుడు మావి ఓట్లు కావా?మా బాబాయి గంపల శ్రీనివాసరావు 22 ఏళ్లుగా రెండెకరాలు కౌలుకు చేసేవారు. ఎకరానికి రూ.35 వేలు చొప్పున ముందస్తు కౌలు క్రమం తప్పక చెల్లించేవారు. ఎంబీఏ చేసిన నేను బీసీ వర్గం నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందాను. అంతమాత్రాన కౌలుకు భూమి ఇచ్చేదిలేదంటే ఎలా? భూములు వారివి అయినప్పుడు ఓట్లు మావి కావా? వారికి మాత్రమే పార్టీ.. మాకు పార్టీ అంటే ఇష్టం ఉండదా? ఇదెక్కడి న్యాయమో అర్థంకావడంలేదు. – గంపల గంగాధరరావు, పేరుకలపూడి, సర్పంచ్‌

Warangal and Khammam and Nalgonda Graduate MLC bypoll Updates In Telugu
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం

Updatesకాసేపట్లోప్రారంభం కానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌నేడు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు

పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ గూండాలు చేసిన  విధ్వంసాన్ని చూపిస్తున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని
పిన్నెల్లి హత్యకు పథకం: పేర్ని నాని ఆందోళన

సాక్షి, అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటాడి హత్య చేసేందుకు పోలీసుల ద్వారా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా సీఐ నారాయణస్వామి, గుంటూరు రేంజ్‌ ఐజీ, డీజీపీదే బాధ్యతని స్పష్టం చేశారు. సీఐ నారాయణస్వామిని అడ్డు పెట్టుకుని తనను అంతమొందించేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నట్లు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాలను ఈనెల 14న ఎందుకు వెనక్కి రప్పించారని నిలదీశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ఈ కుట్రలపై గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానికి మొర పెట్టుకుంటేగానీ పారా మిలిటరీ బలగాలను పంపలేదన్నారు. పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా తయారై సంఘ విద్రోహక శక్తుల్లా వ్యవహరిస్తున్న అధికారులకు ముందుంది ముసళ్ల పండుగని హెచ్చరించారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో టీడీపీ గూండాలకు వత్తాసు పలుకుతున్న వారు జూన్‌ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. పేర్ని నాని ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ మూకల విధ్వంసకాండను రుజువు చేసే పలు వీడియోలను ప్రదర్శించారు.పిన్నెల్లి 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాచర్లలో వైఎస్సార్‌సీపీకి బలమైన పునాది వేశారు. మాచర్లలో టీడీపీ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, గట్టి భద్రత కల్పించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని కోరుతూ ఈనెల 11న ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందచేశారు.⇒ మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకూ అల్లర్లు జరగని ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను నియమించిన అధికారులు ఘర్షణలు చోటుచేసుకునే చోట్ల మాత్రం హోంగార్డులతో సరిపుచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై టీడీపీ మూకలు దాడి చేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించడం ద్వారా పోలింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర చేశారు. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేసి టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి.⇒ ఈనెల 13న పోలింగ్‌ రోజు పాల్వాయి గేట్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్‌ బుక్‌లో ఎందుకు నమోదు చేయలేదు? అర క్షణమైనా పోలింగ్‌కు విఘాతం కలిగిందా? ఈనెల 17న విచారణకు వెళ్లిన సిట్‌ బృందానికైనా ఈవీఎం ధ్వంసం గురించి చెప్పారా? ఈనెల 18న డీజీపీకి సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనూ ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు లేదు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినట్లు ఆ నివేదికలో ఎక్కడా లేదు. మీడియాకు సిట్‌ విడుదల చేసిన నివేదికే అందుకు తార్కాణం.⇒ ఈనెల 20న లోకేష్‌ ట్వీట్‌ ఆధారంగా పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్‌ మర్నాడు ఆదేశించింది. లోకేష్‌కు ఆ వీడియో ఎలా వచ్చిందని మీడియా ప్రశ్నిస్తే తన కార్యాలయం నుంచి లీక్‌ కాలేదని, ఎలా వచ్చిందో విచారణలో తేలుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొనడం హాస్యాస్పదం.⇒ ఈసీ ఉత్తర్వులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ఈనెల 22న బెయిల్‌ తెచ్చుకుంటే అదే రోజు ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈనెల 14న కారంపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెదరగొట్టేటప్పుడు తనకు గాయమైందని, తనపై దాడి చేసిన వారిలో పిన్నెల్లి ఉన్నారని ఈనెల 22న సీఐ నారాయణస్వామి తాపీగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పిన్నెల్లి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి తప్పుడు కేసు బనాయించారు. సీఐకి 14న గాయమైతే 22 వరకూ స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండా ఏం చేశారు?⇒ పోలింగ్‌ మర్నాడు పారా మిలటరీ బలగాలు మాచర్లలో ఉన్నా పక్కనే ఉన్న కారంపూడిలో సీఐ నారాయణస్వామి, ఎస్సై రామాంజనేయులు అండతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి తెగబడ్డాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేసినా పోలీసులు పట్టించుకోలేదు.⇒ టీడీపీకి లొంగిపోయిన ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి. మాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. ⇒ పోలింగ్‌ రోజు టీడీపీ కార్యకర్తను హత్య చేసేందుకు పురిగొల్పారని, మహిళలను చంపుతానని బెదిరించారని పిన్నెల్లిపై ఈనెల 23న మరో రెండు కేసులు నమోదు చేశారు. ఇలా ఇంకెన్ని తప్పుడు కేసులు బనాయిస్తారో డీజీపీ వెల్లడించాలి. పిన్నెల్లిని కౌంటింగ్‌కు రానివ్వకుండా చేసి దౌర్జన్యాలకు తెగబడాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు వంత పాడటం దారుణం.

AP Elections 2024: May 27th Political Updates In Telugu
May 27th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates..7:00 AM, May 27th, 2024ఓటు తెచ్చిన చేటు..కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గంసాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటందశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపువ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులునారా లోకేశ్‌కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరంఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవంనీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లోకి ఎక్కిందంటూ బెదిరింపులు‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులుఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదనఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు 6:50 AM, May 27th, 2024సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దుడిక్లరేషన్‌పై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి అనుమానం వస్తే పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని కౌంటర్‌ ఫాయిల్‌తో సరిచూడండిడిక్లరేషన్‌పై ఓటరు, అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి డిక్లరేషన్‌ ఫారం విడిగా కవర్‌–బీలో లేకపోతే ఓపెన్‌ చేయకుండానే తిరస్కరించొచ్చు బ్యాలెట్‌ పేపర్‌ నెంబరు డిక్లరేషన్‌పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. బ్యాలెట్‌ పేపర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు 6:40 AM, May 27th, 2024‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండిఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్‌పై హత్యాయత్నం కేసున్నా బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు 6:30 AM, May 27th, 2024తాపీగా తప్పుడు కేసులుపిన్నెల్లికి బెయిల్‌ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు? నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?

Health Insurance Premiums Increase Every Year explanation story
ప్రీమియం భారమైతే.. పరిష్కారం?

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు మరోసారి ప్రీమియం బాదుడు షురూ చేశాయి. ‘కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు’.. బీమా సంస్థలు కూడా ప్రీమియం పెంచడానికి ఎన్నో కారణాలు చూపిస్తుంటాయి. లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో.. గడిచిన ఏడాది కాలంలో తమ వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియం 25 శాతం పెరిగినట్టు 52 శాతం మంది చెప్పారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నూతన పాలసీల ప్రీమియం సైతం ఈ ఏడాది మొదటి మూడు నెలలల్లోనే 5.54 శాతం మేర పెరిగినట్టు బీమా పంపిణీ ప్లాట్‌ఫామ్‌ ‘పాలసీఎక్స్‌’ చెబుతోంది. రెక్కలు తొడిగిన పక్షి మాదిరిగా ఇలా ప్రీమియం గణనీయంగా పెరుగుతూ పోతుంటే కొత్తగా పాలసీ తీసుకునే వారికే కాదు, అప్పటికే పాలసీ తీసుకున్న వారిపైనా అదనపు భారం పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రీమియం భారం కొంత తగ్గించుకునే మార్గాలేంటన్నది చూద్దాం. ప్రీమియం ఎందుకు పెరుగుతోంది..హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియం గణనీయంగా పెరిగిపోవడానికి వైద్య ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణం నిత్యావసరాలకు (వినియోగ ధరల, టోకు ధరల ఆధారిత) సంబంధించినది. ఇది 5–6 శాతం మధ్య ఉంటోంది. కానీ, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఇంతకు రెట్టింపు 14–15 శాతంగా ఉంటోంది. చికిత్సల వ్యయాలు ఈ స్థాయిలో ఏటా పెరిగిపోతుండడంతో, బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లు వస్తున్నాయి. దీంతో వాటిపై చెల్లింపుల భారం పడుతోంది. ‘‘వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వసతులు మెరుగుపడడం, ప్రాణాలను కాపాడే అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడం.. ఇవన్నీ వ్యయాలు పెరగడానికి దారితీస్తున్నాయి’’ అని రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో రాకేశ్‌ జైన్‌ తెలిపారు. ఔషధాలు, ఇంప్లాంట్లు, ఇతరత్రా వ్యయాలు పెరగడం వల్లే ఆస్పత్రుల చికిత్సల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్టు కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటింగ్, క్లెయిమ్స్‌ హెడ్‌ మనీష్‌ దొదేజా సైతం పేర్కొన్నారు. జీవనశైలి, ఇతర వ్యాధుల రిస్క్‌ పెరగడం కూడా అధిక క్లెయిమ్‌లకు దారితీస్తున్నట్టు చెప్పారు. ‘‘మనదేశం ప్రపంచ మధుమేహం రాజధానిగా మారుతోంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కేన్సర్‌ రిస్క్‌ సైతం పెరుగుతోంది’’అని ఇన్సూరెన్స్‌ సమాధాన్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు శిల్పా అరోరా తెలిపారు. కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. దీంతో బీమా సంస్థలకు పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ భారాన్ని దింపుకునేందుకు బీమా సంస్థలు విడతలవారీగా పాలసీదారులకు ప్రీమియం వాత పెడుతున్నట్టు విశ్లేషకులు చెబతున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం సవరణ ఇప్పడే మొదటిసారి కాదు. లోగడ ఒకటి రెండు సార్లు కూడా అవి సవరించాయి.అందరికీ కవరేజ్‌ లేకపోవడమూ కారణమే...ఇక మనదేశంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ అందరికీ లేకపోవడం కూడా ప్రీమియం అధికంగా ఉండడానికి మరొక కారణమంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే బీమా సంస్థలు వ్యయాలను మరింత మంది పాలసీదారులతో పంచుకోవడానికి వీలు ఏర్పడుతుంది. దీంతో విడిగా ఒక్కొక్కరిపై పడే ప్రీమియం భారం తగ్గుతుంది. ప్రీమియంపై 18 శాతం జీఎస్‌టీ సైతం మరో పిడుగులాంటిదే. ఉదాహరణకు రూ.10వేల వార్షిక ప్రీమియంపై రూ.1,800 జీఎస్‌టీని కేంద్రం వసూలు చేస్తోంది. బీమా సంస్థలు వయసుల వారీగా ప్రీమియం పెంచుతుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 35 ఏళ్లు నిండి 36వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు ప్రీమియం పెరిగిపోతుంది. అలాగే 45 ఏళ్లు నిండి 46లోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రీమియం టారిఫ్‌లను బీమా సంస్థలు సవరిస్తుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికమవుతుంటాయి. దీంతో చికిత్సల క్లెయిమ్‌ల రిస్క్‌ పెరిగిపోతుంటుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బీమా సంస్థల ముందున్న ఏకైక పరిష్కారం ప్రీమియం బాదుడే. ఇక బీమా పాలసీ తీసుకున్న వారు కూడా పెద్ద పట్టణాల్లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో చికిత్సలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరొందిన కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సాధారణంగానే వైద్య చికిత్సల చార్జీలు ఎక్కుగా ఉంటాయి. దీంతో బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్‌ బిల్లులు వస్తున్నాయి. ఇది కూడా ప్రీమియం పెరిగేందుకు కారణమవుతోంది. ఇటీవలే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐర్‌డీఏఐ) ముందస్తు వ్యాధులకు వెయిటింగ్‌ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. మారటోరియం పీరియడ్‌ను ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. దీనివల్ల కూడా క్లెయిమ్‌లు పెరుగుతాయన్న అంచనాతో బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తున్నాయి. వచ్చే 12 నెలల కాలంలోనూ ప్రీమియంలు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు హెల్త్‌ ప్లాన్‌ అవసరమా?హెల్త్‌ ప్లాన్‌ లేకపోతే ఆర్థికంగా కుటుంబం గుల్ల కాక తప్పదు. ప్రీమియం భారంగా మారిందని హెల్త్‌ ప్లాన్‌ ప్రీమియం కట్టడం మానేయవద్దు. ఎందుకంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. అదే సమయంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో వ్యయాలు కూడా పెరిగాయి. హెల్త్‌ ప్లాన్‌ తీసుకోకపోతే.. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, రుణాలతో గట్టెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకని ఆరోగ్య బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.– లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వివరాలివి...→ 21 % మంది గడిచిన ఏడాదిలో తమ పాలసీ ప్రీమియం 50 శాతం కంటే ఎక్కువే పెరిగినట్టు చెప్పారు. 31 % మంది 25–50 % మధ్య ప్రీమియం గతేడాదితో పోలిస్తే పెరిగినట్టు తెలిపారు. → 15 శాతం మంది తమ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌లో ఉన్నవారే.→ మొత్తం 11,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. భారం ఎలా తగ్గించుకోవాలి? పోరి్టంగ్‌: ఆరోగ్య బీమా ఒకసారి కొనుగోలు చేసి మర్చిపోయే వస్తువు కాదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ పాలసీలోని సదుపాయాలు ఉన్నాయా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సహేతుక ప్రీమియంపై మరింత మెరుగైన ఫీచర్లను వేరొక బీమా సంస్థ ఆఫర్‌ చేస్తుంటే, అందులోకి మారిపోవడం మంచి నిర్ణయమే అవుతుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్‌ పెట్టుకోవచ్చు. కేవలం ప్రీమియం కొంత తక్కువగా ఉందని చెప్పి పోరి్టంగ్‌ ఆప్షన్‌ను పరిశీలించడం సరైనది కాదు. ప్రీమియంలో చెప్పుకోతగ్గ వ్యత్యాసానికి తోడు, కొత్త సంస్థ ప్లాన్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పుడే పోరి్టంగ్‌ను పరిశీలించొచ్చు. పోరి్టంగ్‌తో వేరొక బీమా సంస్థకు మారిపోయిన తర్వాత.. అక్కడ కూడా పాలసీ రెన్యువల్‌ (పునరుద్ధరణ) సమయంలో ప్రీమియం పెంచరని చెప్పలేం. అన్ని బీమా సంస్థలూ తమ క్లెయిమ్, ప్రీమియం నిష్పత్తి ఆధారంగానే ప్రీమియం పెంపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కనుక ప్రీమియం పెంచినప్పుడల్లా దాన్ని తగ్గించుకునేందుకు కంపెనీని మారడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఒకేసారి మూడేళ్లు: ప్రీమియంను ఒకేసారి మూడేళ్లకు చెల్లించే ఆప్షన్‌ కూడా ఉంది. ఇలా ఒకేసారి మూడేళ్లకు ప్రీమియం చెల్లిస్తే 10–15 శాతం ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల మూడేళ్ల పాటు ప్రీమియం పెంపు భారాన్ని తప్పించుకోవచ్చు. వయసువారీ శ్లాబు మారే ముందు మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లించడం వల్ల.. అక్కడి నుంచి మూడేళ్ల పాటు పెంపు లేకుండా చూసుకోవచ్చు. సూపర్‌టాపప్‌: ప్రస్తుత పాలసీలో ఎంత కవరేజీ ఉందన్నది ఒక్కసారి గమనించండి. ఒకవేళ రూ.10 లక్షల కవరేజీ ఉంటే, దాన్ని రూ.5 లక్షలకు తగ్గించుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవడం మరో మార్గం. దీనివల్ల బేస్‌ ప్లాన్‌ ప్రీమియం తగ్గుతుంది. సూపర్‌ టాపప్‌ చౌకగా వస్తుంది. దీనివల్ల మొత్తం మీద ప్రీమియంలో 10–15 శాతం తగ్గుతుంది. ఫ్లోటర్‌ ప్లాన్‌: అవివాహితులు ఇండివిడ్యువల్‌ ప్లాన్‌ తీసుకుని ఉంటే.. వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కలసి కొత్త ప్లాన్‌కు వెళ్లొద్దు. అప్పటికే ఉన్న ప్లాన్‌ను ఫ్లోటర్‌గా మార్చుకుని, జీవిత భాగస్వామిని చేర్చుకోవాలి. దీనివల్ల జీవిత భాగస్వామి ఒక్కరికే వెయిటింగ్‌ పీరియడ్‌ తదితర నిబంధనలు వర్తిస్తాయి. కొంత ప్రీమియం కూడా తగ్గుతుంది. గ్రూప్‌ ప్లాన్‌: ప్రీమియం భారంగా పరిణమిస్తే.. అప్పుడు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్‌ ప్లాన్‌ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. లేదంటే దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు గ్రూప్‌ హెల్త్‌ప్లాన్లను తమ కస్టమర్లకు తక్కువ ప్రీమియానికే ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. యాక్టివ్‌ హెల్త్‌ ప్లాన్‌: కొన్ని బీమా సంస్థలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే వారికి ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. రోజువారీ వ్యాయామం, నడక తదితర సాధనాలు చేయడం వల్ల అనారోగ్యం రిస్క్‌ తగ్గుతుందని తెలుసు. దీనివల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌ల రిస్క్‌ తగ్గుతుంది. పాలసీదారులను ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రోత్సహించి, తమ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు బీమా సంస్థలు ఇలాంటి ప్లాన్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిల్లో 50 శాతం వరకు ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. కోపే: బీమా ప్రీమియం కట్టలేనంత భారంగా మారిపోతే.. అప్పుడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ రద్దు కావడం కంటే.. కో పే ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఉదాహరణకు 20 % కో పే ఎంపిక చేసుకుంటే.. ప్రీమియంలోనూ అంతే మేర డిస్కౌంట్‌ వస్తుంది. హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నప్పుడు వచ్చే బిల్లులో 80 శాతాన్నే బీమా సంస్థ చెల్లిస్తుంది. 20 శాతాన్ని పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. నో క్లెయిమ్‌ బోనస్‌: దాదాపు అన్ని బీమా సంస్థలు నో క్లెయిమ్‌ బోనస్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌ లేకపోతే, మరుసటి సంవత్సరం రెన్యువల్‌ అనంతరం 10–100 శాతం వరకు ఏటా కవరేజీని పెంచుతుంటాయి. ఇలా గరిష్టంగా 100–200 శాతం వరకు కవరేజీ పెరుగుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల హెల్త్‌ ప్లాన్‌పై 50 శాతం నో క్లెయిమ్‌ బోనస్‌ ఆఫర్‌ ఉందనుకుంటే.. ఒక ఏడాదిలో క్లెయిమ్‌ లేకపోతే మరుసటి సంవత్సరం కవరేజీ రూ.15 లక్షలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్‌ లేకపోతే రూ.20 లక్షలకు పెరుగుతుంది. మూడో ఏడాది క్లెయిమ్‌ వస్తే, అప్పుడు పెరిగిన రూ.10 లక్షల నుంచి 50 శాతం అంటే రూ.5 లక్షలను తగ్గిస్తాయి. కానీ కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అయితే సుప్రీమ్‌ ప్లాన్‌లో సమకూరిన నో క్లెయిమ్‌ బోనస్‌ను క్లెయిమ్‌ చేసుకున్నా డిడక్షన్‌ అమలు చేయడం లేదు. అంటే నో క్లెయిమ్‌ బోనస్‌ కూడా కవరేజీగానే మిగిలిపోతుంది. కనుక బేస్‌ కవర్‌ రూ.5 లక్షలు తీసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌లో మెరుగైన కవరేజీని పొందొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. పెద్దలు ఉంటే వారిని ప్రత్యేక ప్లాన్‌ కింద వేరు చేయాలి.

Rasi Phalalu 27-05-2024 Telugu
ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.చవితి సా.4.44 వరకు, తదుపరి పంచమి నక్షత్రం: పుర్వాషాఢ ఉ.10.25 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.6.11 నుండి 7.44 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.15 వరకు తదుపరి ప.2.58 నుండి 3.50 వరకు, అమృతఘడియలు: ఉ.5.41 నుండి 7.15 వరకు, తదుపరి రా.3.31 నుండి 5.05 వరకు. మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.వృషభం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.కర్కాటకం: పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ప్రోత్సాహం. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది.సింహం: సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం. కన్య: రుణభారం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.తుల: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో అనుకూలత.వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.ధనుస్సు: పనులు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వాహనయోగం.మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.కుంభం: నూతన మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.మీనం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. సమస్యలు తీరతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

Lok Sabha Election 2024: Voting to be held on 13 seats of UP on June 1 in 7th phase of elections
Lok Sabha Election 2024: యూపీలో ఆఖరి పోరాటం!

ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్‌ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్‌ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్‌పూర్‌ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్‌... గోరఖ్‌పూర్‌... భోజ్‌పురీ వార్‌ సుప్రసిద్ధ గోరఖ్‌నాథ్‌ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోట. ఆయన గురువు మహంత్‌ అవైద్యనాథ్‌ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్‌ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్‌ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.గాజీపూర్‌.. త్రిముఖ పోరు ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్‌ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్‌ సింగ్, బీజేపీ నుంచి పరాస్‌ నాథ్‌ రాయ్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్‌ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!వారణాసి... మోదీ హ్యాట్రిక్‌ గురికాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్‌సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్‌ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్‌ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్‌ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున పీసీసీ చీఫ్‌ అజయ్‌ రాయ్, బీఎస్పీ నుంచి అథర్‌ జమాల్‌ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.చందౌలీ... టఫ్‌ ఫైట్‌ దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్‌లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్‌ ఎంపీ మహేంద్రనాథ్‌ పాండే ఈసారి హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్‌ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మీర్జాపూర్‌... ప్రాంతీయ పారీ్టల హవాఒకప్పుడు బందిపోటు రాణి పూలన్‌ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్‌ నుంచి అనుప్రియా పటేల్‌ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్‌(ఎస్‌) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్‌ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్‌ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్‌లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.కుషీనగర్‌... హోరాహోరీగౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్‌ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్‌ ఎంపీ విజయ్‌ కుమర్‌ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్‌ నారాయణ్‌ చౌహాన్‌ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.పోలింగ్‌ జరిగే మొత్తం స్థానాలు...మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్‌గావ్‌ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్‌ (ఎస్సీ)– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

UN migration agency estimates over 670 dead in Papua New Guinea landslide
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..

మెల్‌బోర్న్‌: పసిఫిక్‌ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ మైగ్రేషన్‌(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్‌ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement