Dharavi
-
వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పండి
ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేకు ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు అజిత్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి మిలింద్ దేవ్రా వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ)కూటమిని గెలిపించాలని కోరారు. రేవంత్ బుధవారం సాయంత్రం ముంబైలో తెలుగు ప్రజలు నివసించే వర్లీ, ధారావి, సైన్ కోలివాడల్లో ఎంవీఏ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ కోడలైన వర్షా గైక్వాడ్ను ధారావి నుంచి భారీ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ ఎంవీఏ ప్రభుత్వం పరిష్కరించేలా తాను హామీగా ఉంటానని తెలిపారు. కాగా వర్లీ బీడీడీ చాల్స్లో నివసించే స్థానిక తెలంగాణ ప్రజలు రేవంత్రెడ్డి రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్రెడ్డి కూడా తాను ముంబైలో కాకుండా నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. రోడ్డు షోకు ముందు రేవంత్రెడ్డి వర్లీ బీడీడీ చాల్స్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలు సమరి్పంచారు. -
అక్కడ ఉచిత ఇళ్లు దక్కేదెవరికి? కీలక సర్వే చేపట్టనున్న అదానీ..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది. గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం. వీరే అర్హులు ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది. సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ అధిపతి ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో సర్వే పూర్తి ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
తాజ్మహల్ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ధారావి(ముంబై). దీనిని సుందరంగా మార్చే బాధ్యతను ఆదానీ గ్రూప్ తన చేతుల్లోకి తీసుకుంది. అయితే మహారాష్ట్రలోని రాజకీయ ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు నుంచి అదాని గ్రూపును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ భారీ స్లమ్ ఏరియాకు పర్యాటకులు తాకిడి మరింతగా పెరిగింది. ప్రతీయేటా వేలాదిమంది విదేశీయులు ఈ స్లమ్ ఏరియాను సందర్శించేందుకు వస్తున్నారు. ఇక్కడి పేదల దుర్భర పరిస్థితులను అసక్తిగా గమనిస్తున్నారు. దేశంలోని తాజ్మహల్ను చూసేందుకు వచ్చేవారికన్నా ఈ స్లమ్ ఏరియాకే అధికంగా పర్యాటకులు వస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 18వ శతాబ్ధంలో కొందరు మత్స్యకారులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. కూలీనాలీ చేసుకుంటూ ఇక్కడే ఉంటూ వచ్చారు. తరువాతి కాలంలో వివిధ వృత్తుల వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 20 వ శతాబ్ధం నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్కూళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసుపత్రులు.. ఇలా అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో సమకూరాయి. ప్రస్తుతం ఇది ఆసియాలో అతి పెద్ద మురికివాడగా పేరొందింది. సుమారు 550 ఎకరాల్లో విస్తరించిన ధారావి.. లెక్కకుమించిన గుడిసెలు కలిగిన బస్తీలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడి ఒక్కో గుడిసెలోనూ 10 మందికిపైగా వ్యక్తులు ఉంటున్నారు. దీనిని పరిశీలించి చూస్తే ఇక్కడి జనాభా ఎంత అధికమో తెలుస్తుంది. ధారావి మురికివాడలో 10 లక్షలకుపైగా జనాభా ఉండవచ్చని అంచనా. ఇక్కడికి వచ్చే టూరిస్టులు గంటల తరబడి ఇక్కడే ఉంటూ, ఇక్కడి పరిస్థితులను గమనిస్తుంటారు. పేదలు ఎలా జీవిస్తుంటారు? వారి దినచర్య ఎలా ఉంటుందనేది వీరు గమనిస్తారు. ఈ నేపధ్యంలో పలు అంశాలకు సంబంధిచిన వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా ఇటువంటి మురికి వాడలు మనదేశంలోనే కాకుండా ఆఫ్రికాదేశాలైన యుగాండా, కెన్యా, కేప్టౌన్లలోనూ కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్ ఫొటోతో గుట్టు రట్టు -
డీఎల్ఎఫ్కు షాక్: అదానీ చేతికి ‘ధారావి’ ప్రాజెక్టు
ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన, ముంబైలోని ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్ కాంట్రాక్టు అదానీ గ్రూప్ చేతికి వెళ్లనుంది. రూ.5,069 కోట్లను కోట్ చేసి అత్యధిక బిడ్డర్గా నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లకు కోట్ చేసింది. ఈ వివరాలను ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘259 హెక్టార్ల పరిధిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. కాంట్రాక్టు పొందిన సంస్థ ఏడేళ్లలో 6.5 లక్షల మందికి ఆవాసం సమకూర్చాల్సి ఉంటుంది. వీరంతా ఇప్పుడు ధారావిలో 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.20,000 కోట్లు. (టాటా దూకుడు: ఏవియేషన్ మార్కెట్లో సంచలనం) తొలి దశలో అదానీ గ్రూపు రూ.5,069 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించింది. దీన్ని ఏడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని శ్రీనివాస్ తెలిపారు. వివరాలను ప్రభుత్వానికి పంపిస్తున్నామని, పరిశీలన అనంతరం తుది అనుమతి ఇస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన సంస్థ 6.5 లక్షల మందికి నివాసం ఏర్పాటు చేయడంతోపాటు, మిగిలిన స్థలంలోని నివాస గృహాలను అధిక ధరలకు విక్రయించు కోవచ్చు. అలాగే, వాణిజ్య స్థలం కూడా అందుబాటులోకి వస్తుంది. (టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్పర్సన్ హఠాన్మరణం) ఇదీ చదవండి: నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్ -
వీథి నుంచి వెండి తెరకు
మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సీన్ –1 సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది. కట్ చేస్తే... సీన్ –2 కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..! ఎవరీ యువతి... ?! 2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. కుటుంబంలో ఒకరిగా.. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. ముంబయ్కి వెళ్లిన కథ చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు. శాశ్వత ఆసరా! తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ అముదకు విద్యావలంటీర్గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది. వెండి తెరపైన అముద కథ ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు. మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది. చిత్రం షూటింగ్ సన్నివేశం సంరక్షకుడు పల్లే వెంకటేశ్వర్లుతో అముద – అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ -
చిత్తు కాగితాల సుందర చిత్రం
ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ అక్కర్లేని... చిత్తుకాగితాలు స్లమ్స్. ఆ కాగితాలను అందమైన పువ్వులుగా సీతాకోకచిలుకలుగా, పిల్లల నవ్వుల్లా కొత్తగా సింగారిస్తోంది రూబుల్నాగి. కాశ్మీర్లో పుట్టిన రూబుల్ నాగి లండన్లో పెరిగింది. అక్కడే చదువుకుంది. శిల్పాలు, ఆర్ట్ ఇన్స్టాలేషన్లో ప్రత్యేకత కలిగిన ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కళతో సమాజాన్ని మార్చాలన్నది ఆమె కల. అందుకు తగినట్టుగానే రెండు దశాబ్దాలుగా పెయింటింగ్ చేస్తోంది. ఎక్కడో కాదు భారతదేశంలో చిత్తుకాగితాలుగా పరిగణించే స్లమ్స్ని ఆమె తన కాన్వాస్కు వాడుకుంది. స్లమ్స్ కలర్ఫుల్ దేశమంతా తిరిగి పిల్లల కోసం వర్క్షాప్లు నిర్వహిస్తున్న ఆమె ‘రూబుల్ నాగి’ ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. యువ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న రూబుల్ జనవరి 2018 నుంచి ‘మిసాల్ ముంబై’ పేరుతో ధారవి మురికి వాడలను పెయింటింగ్ తో అలంకరిస్తోంది. ఇప్పటివరకు 30 మురికివాడల్లోని 1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది. గోడలపై చిత్రాలను రూపొందించింది. తన పెయింటింగ్తో స్లమ్స్ రూపురేఖలను మార్చుతోంది 40 ఏళ్ల రూబుల్ నాగి. కళతో కనెక్ట్ కళకోసమే జీవితాన్ని అంకితం చేసిన రూబుల్ రెండు దశబ్దాలలో 800 శిల్పాలు, లెక్కలేనన్ని చిత్రాలను రూపొందించింది. 62 కిండర్ గార్టెన్లను కూడా నడుపుతోంది. తద్వారా పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తోంది. రూబుల్ నాగి సంస్థ దేశవ్యాప్తంగా పిల్లల కోసం ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఆమె తన కళను ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమంగా భావిస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘సామాజిక సమస్యలను లేవనెత్తడానికి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రజలకు సహాయపడే మార్గం ఇది’ అని చెప్పే రూబుల్ పెయింటింగ్స్తో సామాన్య ప్రజలూ ప్రేరణ పొందుతుంటారు. ఆమె పెయింటింగ్స్ విద్య, మహిళా సాధికారత, ఉపాధి వంటి సమస్యలను చర్చిస్తాయి. అదే సమయంలో ఆమె వర్క్షాప్లో మురికివాడల ప్రజలు పరిశుభ్రత గురించీ తెలుసుకుంటారు. కొత్త శక్తి దిశగా! రూబుల్ ఆలోచన గొప్పదనం తెలుసుకోవాలంటే ఆమెతో కాసేపు ముచ్చటించాలి. ‘ఈ ఇళ్ళపై నేను పెయింట్ చేసిన రంగులు కొన్ని ఏళ్ల తరువాత మసకబారుతాయి. కానీ ఈ రంగులు ప్రజల ఆలోచనలో సానుకూల మార్పులు వస్తాయి. అవి వారికి ఎల్లప్పుడూ కొత్త శక్తిని ఇస్తాయి’ అంటుంది అంటోంది ఈ చిత్రకారిణి. రూబుల్ ఇప్పటివరకు రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మహారాష్ట్రతో పాటు పెయింటింగ్ ద్వారా ముంబై మురికివాడలను అభివృద్ధి చేసింది. చేస్తోంది. ఆమె పెయింటింగ్స్ను కార్పోరేట్ సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, భారతప్రభుత్వం, మ్యూజియమ్లతో సహా ఎంతో మంది సేకరిస్తుంటారు. కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో మురికివాడలకు ప్రాణం పోస్తోంది రూబుల్ నాగి. మహిళలతో రూబుల్ నాగి -
కరోనాతో ఏడాది సావాసాన్ని చూస్తే...
కంటికి కనిపించని శత్రువు మనకి సవాల్ విసిరి ఏడాదైంది. కేరళలో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చి ఇవాళ్టికి సరిగ్గా ఏడాదైంది. జనాభాతో కిటకిటలాడే భారత్లో కరోనా బాంబు విధ్వంసం సృష్టిస్తుందని అందరూ అంచనా వేశారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలికేసు నమోదు కాగానే భారత్ పనైపోయిందని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అగ్రరాజ్యాలే ఇంకా కరోనా పడగ నీడలో భయం భయంగా బతుకు వెళ్లదీస్తూ ఉంటే, మనం అన్నీ తట్టుకొని ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం. కరోనా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ పాఠాలే గుణపాఠాలుగా మార్చుకొని పడిలేచిన కడలితరంగంలా పైకి లేస్తున్నాం. కరోనాతో కలిసి చేసిన ఈఏడాది ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దాం.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ఏడాదిలో మన జీవన చిత్రాన్ని మార్చేసింది. ఎంతలా అంటే కరోనాకి ముందు కరోనా తర్వాత అని నిర్వచించుకునేలా మారి పోయింది. అమెరికా, యూరప్ వంటి దేశాలు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్తో చిగురుటాకులా వణికిపోతూ ఇంకా ఇళ్లలోనే మగ్గిపోతూ ఉంటే మనం మాత్రం ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమయ్యే వ్యూహరచనలో మునిగి ఉన్నాం. కరోనాపై పోరాటం తుది దశకు వచ్చేసింది. ఏడాదిలోనే దాని కొమ్ములు విరిచేసి ప్రపంచ దేశాల్లో రొమ్ము విరుచుకొని భారత్ ఠీవిగా నిలబడింది. రోజుకి దాదాపుగా లక్ష వరకు కేసులు చూసిన భారత్లో ఇప్పుడు రోజుకి 10 నుంచి 20 వేలు వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి కేరళకి చైనాలోని వూహాన్లో 2019 డిసెంబర్ 27న తొలిసారిగా కరోనా కేసు బట్టబయలైతే ఆ తర్వాత నెల రోజులకే అంటే జనవరి 30న చైనా నుంచి భారత్కి వచ్చిన కేరళ విద్యార్థినికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఆ విద్యార్థినిని క్వారంటైన్కి తరలించడంతో భారత్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ మన ఉష్ణోగ్రతలకి వైరస్ బతకదన్న ధీమాతోనే మార్చి వరకు గడిపేశాం. అంతకంతకూ కేసులు పెరుగుతూ ఉండడంతో వైరస్ ముప్పుని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 24న హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో అందరూ మేల్కొన్నారు. మాస్క్లు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి మాటలే కొత్తగా విన్న ప్రజలకు ఈ వైరస్పై అవగాహన పెంచుకోవడానికి సమయం పట్టింది. ఆ కొద్దిపాటి సమయంలోనే కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రపంచ దేశాల పట్టికలో అమెరికా తర్వాత కోటి కేసులు దాటిన దేశంగా భారత్ నిలిచినప్పటికీ, జనసాంద్రత పరంగా చూస్తే కరోనా విసిరిన సవాళ్లను పకడ్బందీగా ఎదుర్కొన్నామనే చెప్పాలి. కరోనా విస్తరించిన తొలిరోజుల్లో ముంబై కరోనాకి రాజధానిగా మారింది. ఇప్పటికి కూడా మహారాష్ట్ర కోవిడ్–19 కేసుల్లో ముందు వరసలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర నుంచే 65శాతం నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 1.6శాతం మాత్రమే. సరైన సమయంలో లాక్డౌన్ వల్ల కోటి వరకు కేసులు, లక్ష వరకు మరణాలను నిరోధించగలిగామన్న అంచనాలున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామా..? పశ్చిమ దేశాలు కరోనా వైరస్తో ఇంకా కష్టాలు పడుతూ ఉంటే మన దేశంలో అక్టోబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. భారతీయుల్లో రోగనిరోధకత ఎక్కువగా ఉండడం, యువతరం ఎక్కువగా ఉండడం, చాలా మందిలోయాంటీ బాడీలు ఏర్పడడం వంటివి ఇందుకు కారణమని నిపుణుల అంచనా. భారత్లో ఎంత మందికి కరోనా వచ్చి తగ్గిందన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పట్టణాల్లో థైరోకేర్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 30 నుంచి 40 కోట్ల మందికి కరోనా వచ్చినట్టు తేలగా, 3నెలల క్రితం ఐసీఎంఆర్ సర్వేలో 10 కోట్ల మందికి సోకినట్టు తేలింది. దీంతో భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించి ఉంటుందని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. మరణాలు తక్కువే.! రికవరీలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. మొత్తం కేసులు కోటీ 7 లక్షలు దాటితే మృతుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. రికవరీ అంశం భారత్కు మొదట్నుంచీ అతి పెద్ద రిలీఫ్. తాజాగా జాతీయ రికవరీ రేటు 96శాతంగా ఉండడం ఒక రికార్డు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మరణాల రేటు భారత్లో చాలా తక్కువ. 12 నెలల ప్రయాణం 2020 జనవరి 18: చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకి విమానాశ్రయాల్లోనే థర్మల్ స్క్రీనింగ్ 30: కేరళలో తొలి కేసు నమోదు ఫిబ్రవరి 3,4: మరో రెండు కేసులువెల్లడి, వీరు కూడా చైనా నుంచి వచ్చిన విద్యార్థులే మార్చి 10: కరోనాతో తొలి మరణం 11: ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19న మహమ్మారిగా ప్రకటించింది. 24: భారత్లో 21 రోజుల లాక్డౌన్ విధింపు ఏప్రిల్ 14: లాక్డౌన్ మే 3వరకు పొడిగింపు మే1: మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగింపు 7: 50 వేలు దాటిన కరోనా కేసులు జూన్ 1: అన్లాక్ ప్రక్రియ ప్రారంభం 27: భారత్లో 5 లక్షలు దాటిన కేసులు జూలై 1 : అన్లాక్ 2 ప్రారంభం 17: భారత్లో 10 లక్షలు దాటిన కేసులు ఆగస్టు 3: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి 7:20 లక్షలు దాటిన కేసులు వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు సెప్టెంబర్ 5: కరోనా కేసుల్లో బ్రెజిల్ని దాటేసి రెండోస్థానంలోకి చేరుకున్న భారత్ 16 : 50 లక్షలు దాటిన కేసులు అక్టోబర్ 11: 80 లక్షలు దాటిన కేసులు నవంబర్16: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభం డిసెంబర్ 8: ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అనుమతుల్ని పరిశీలిస్తున్నట్టుగా కేంద్రం వెల్లడి డిసెంబర్ 10 : కోటి దాటిన కేసులు 2021 జనవరి 2 : భారత్లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి 16: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం. -
ధారావిలో తొలిసారిగా జీరో కేసు
ముంబై: పది లక్షల మంది జనాభా ఉండే ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ఏప్రిల్ 1న మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి అక్కడ కరోనా ప్రవేశించిందంటే దాని వ్యాప్తిని నివారించడం అసాధ్యమేనని అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. కానీ అనూహ్యంగా ముంబైలో కేసులు ఎక్కువవుతున్నా ధారావి మాత్రం కరోనాను కట్టడి చేయగలిగింది. భారత్లో కరోనా ఎంటరైన తర్వాత తొలిసారిగా ధారావిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జూలై 26న ధారావిలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ శుక్రవారం మాత్రం సింగిల్ కేసు కూడా వెలుగు చూడలేదు. ఈ మురికివాడలో ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్(4టీ) ఫార్ములాను పకడ్బందీగా అమలు చేశారు. (చదవండి: రోడ్డుపై గోనె సంచి కదిలింది.. ఏంటాని చూస్తే!..) కట్టుదిట్టుమైన ప్రణాళికతో కరోనాను కట్టడి చేశారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ గతంలో ధారావిపై ప్రశంసలు కురిపించారు. కాగా మహారాష్ట్రలో కొత్తగా 3,580 మందికి పాజిటివ్ రాగా మొత్తం కేసుల సంఖ్య 19.51 లక్షలకు చేరింది. కోవిడ్ మహమ్మారి 49 వేల మందిని పొట్టన పెట్టుకుంది. (చదవండి: ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ) -
విషాదం: లిఫ్టులో ఇరుక్కొని బాలుడు మృతి
ముంబై : ముంబైలోని ధారావిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ధారావికి చెందిన మహ్మద్ హోజైఫ్ షేక్ అనే ఐదేళ్ల బాలుడు లిఫ్టు డోరులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. షాహుర్ నగర్లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్మెంట్లో శనివారం హోజైఫ్ షేక్ తన స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్కు గ్రిల్స్తో పాటు డోర్ కూడా ఉంది. అయితే లిఫ్ట్ కింది ఫ్లోర్ రాగానే డోరు తెరుచుకోవడంతో షేక్తో మినహా మిగతా పిల్లలు బయటికి వెళ్లిపోయారు. అందరికంటే చివర వచ్చిన షేక్ బయటికి వచ్చి లిఫ్టు గ్రిల్స్ వేస్తుండగా వెనుక ఉన్న డోర్ మూసుకుపోయింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉండిపోయిన జోహైఫ్ షేక్కు బయటకు ఎలా రావాలో అర్థం కాలేదు. ఈలోగా మరొకరు లిఫ్టు బటన్ నొక్కేయడంతో కిందకు కదిలింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉన్న బాలుడు లిఫ్టు గ్రిల్స్లో నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. -
'పాపడ్'లు తిని కరోనా నుంచి కోలుకున్నారా?
సాక్షి, ఢిల్లీ : కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందన్న వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. ఒకప్పుడు రాష్ర్టంలో అత్యధిక కేసులు ప్రబలిన మురికవాడ ధారావిలో కరోనా నియంత్రణ కాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సైతం ఈ విషయంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చేసిన ప్రయత్నాలను ప్రశంసించిందన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యిందని పలువురు పార్లమెంటు సభ్యులు మహారాష్ర్ట సర్కార్పై విమర్శలు గుప్పించారు. (సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్.. చైనా మరో కుట్ర) ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ..కరోనాను అదుపు చేయకపోతే ఇంతమంది ఎలా కోలుకోగలిగారు? ఇప్పుడు కరోనాను జయించిన వాళ్లందరూ పాపడ్ తిని కరోనా నుంచి బయటపడ్డారా అంటూ వ్యంగాస్ర్తాలు సంధించారు. గతంలో పాపడ్ తింటే కరోనా పోతుందని ఉచిత సలహా ఇచ్చి విమర్శలపాలైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. తన తల్లి, సోదరుడు సైతం కోవిడ్ బారినపడ్డరని రాష్ర్టంలో రికవరీ రేటు ఎక్కువగానే ఉందని సంజయ్ రౌత్ తెలిపారు. కరోనాను రాజకీయం కోసం వాడుకోరాదంటూ పేర్కొన్నారు. ఇక దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ర్ట మొదటిస్థానంలో ఉంది. రాష్ర్టంలో కోవిడ్ తీవ్రత బుధవారం నాటికి 1.12 మిలియన్ మార్కును దాటేసింది. వీరిలో దాదాపు ఎనిమిది లక్షలమంది కరోనాను జయించారు. గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 51,18,254కు చేరుకుంది. (దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు) -
‘ఛేజ్ ది వైరస్ పాలసీ’తో కరోనా కట్టడి!
ముంబై/మనీలా: పది లక్షలకు పైగా జనాభా కలిగి, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావిలో కరోనా కట్టడి చేసిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధిక జన సాంద్రత గల ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, కరోనా మహోగ్రరూపం దాలిస్తే భారీగా ప్రాణ నష్టం చవిచూడాల్సి వస్తుందని మొదట్లో అంతా భయపడ్డారు. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మూడు నెలల్లోనే మహమ్మారి వ్యాప్తిని నియంత్రించగలిగింది. ఈ నేపథ్యంలో ధారావి మోడల్ను ప్రశంసిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలమనడానికి ధారావి అతి పెద్ద ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.(కరోనా: ధారావిపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు) ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కరోనా కట్టడికై ‘ధారావి మోడల్’ను అనుసరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి.. ‘‘ఛేజ్ ది వైరస్ పాలసీ’’ బ్లూప్రింట్ను బీఎంసీ ఫిలిప్పీన్స్తో పంచుకున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రయత్నాలకు దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాపించి తొలినాళ్లలో భారత్ ఇతర దేశాల కోవిడ్ కట్టడి మోడల్ను ఆచరిస్తే.. ఇప్పుడు విదేశాలు ధారావి మోడల్ను ఫాలోకావడం సంతోషంగా ఉందన్నారు. కాగా బీఎంసీ అధికారులు చెబుతున్న గణాంకాల ప్రకారం ధారావిలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి 0.8 శాతానికి తగ్గింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 81 శాతానికి చేరుకుంది. గతంతో పోలిస్తే కోవిడ్ మరణాల రేటులో కూడా తగ్గుదల నమోదైంది. -
ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా లో అతి పెద్ద మురికివాడ ధారావి. ఏప్రిల్ 1న అక్కడ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగానే అందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కరోనా బాం బు పేలి శవాల దిబ్బగా మారుతుందని అనుకున్నారు. కానీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేసిన కృషి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. డబ్ల్యూహెచ్ఓ ధారావిలో కరోనా కట్టడి చర్యల్ని కొనియాడింది. కోవిడ్–19ను నియంత్రించడం లో ప్రపంచ దేశాలకు ఆదర్శనీయంగా నిలిచిన ధారావి మురికివాడ మెరిసిన ముత్యం లా తళుకులీనుతోంది. ముంబైలో కేసులు విశ్వరూపం దాల్చి సినీ ప్రముఖుల్ని కూడా భయపెడుతున్న వేళ ధారావిలో కరోనా కేసులు రోజుకి రెండు లేదంటే మూడు మాత్రమే నమోదవుతున్నాయి. సామాజిక భాగస్వామ్యంతో ధారావి కరోనా చీకట్లను పారద్రోలి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. సవాళ్లు ► సుమారు 2.5 చ. కి మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో జనాభా 10 లక్షలు. ఒకే చిన్న గదిలో 8–10 మంది నివాసంతో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం ► కమ్యూనిటీ టాయిలెట్స్ మీద ఆధారపడిన 80% ప్రజలు ► ప్రతి రోజూ 450 కమ్యూనిటీ టాయిలెట్స్ వినియోగం ► స్ట్రీట్ ఫుడ్పై ఆధారపడిన అత్యధిక జనం 4 టీ ఫార్ములా ► ట్రేసింగ్ 47,500 గృహాలకు వైద్యులు స్వయంగా వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి విచారించారు. ప్రతీ ఒక్క కేసు నమోదవగానే వారితో కాంటాక్ట్ అయిన 24 మందిని గుర్తించారు. వైద్యలు ప్రతీ రోజూ వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేవారు. ఇలా 59 వేల మందిని గుర్తించారు. ► ట్రాకింగ్ 6 లక్షల మందిని స్క్రీన్ చేశారు. ప్రతీ ఒక్క పాజిటివ్ కేసుకి 5 మందిని క్వారంటైన్కి తరలించారు. ► టెస్టింగ్ 13,500 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ► ట్రీటింగ్ ధారావిలో ఉన్న వారు బయటకు అడుగు పెట్టకుండా విస్తృతంగా మౌలికసదుపాయాలు కల్పించారు.కేవలం 14 రోజుల్లో 200 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించి సీరియస్ కేసులకు చికిత్స అందించారు. స్వల్ప లక్షణాలున్నవారిని క్వారంటైన్ హోమ్స్కి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను క్వారంటైన్ హోమ్స్గా మార్చారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి అందరి కడుపు నింపారు. కమ్యూనిటీ టాయిలెట్లను రోజుకి నాలుగైదు సార్లు శానిటైజ్ చేశారు. -
కరోనా కట్టడిలో ధారావి భేష్
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి దీనికి అతి పెద్ద ఉదాహరణ అని ప్రశంసించింది. కరోనా బాంబు పేలుతుందనుకున్న ప్రాంతంలో కట్టుదిట్టమైన ప్రణాళికతో కరోనాని కట్టడి చేశారంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ధారావిలో తీసుకున్న చర్యల్ని కొనియాడారు. జన సాంద్రత అత్యధికంగా ఉన్న ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా మూడు నెలల్లోనే కరోనాని నియంత్రించింది. శుక్రవారం టెడ్రోస్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సామాజిక సహకారం, జాతీయ ఐక్యత, ప్రపంచ సంఘీభావంతో తీసుకునే చర్యల ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు. ఇటీవల చాలా దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిపోతూ ఆందోళన పెంచుతున్న సమయంలో ధారావిలో తీసుకున్న చర్యలు వైరస్ని నియంత్రించగలమన్న భరోసాని నింపుతున్నాయని ప్రశంసించారు. ‘కరోనాని మనం కట్టడి చేయగలం. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, «ముంబైలో జనసాంద్రత్య అత్యధికంగా ఉన్న ధారావి.. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి’అని టెడ్రోస్ పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం, వివిధ వర్గాల భాగస్వామ్యం, సమష్టి బాధ్యతతో వైరస్ను నియంత్రించగల మన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా కరోనా చైన్ను బద్దలు కొట్టవచ్చునని టెడ్రోస్ పేర్కొన్నారు. మరోవైపు కజకిస్తాన్లో న్యుమోనియా లక్షణాలతో వస్తున్న కేసులు కరోనా వైరస్కి చెందినవేనని డబ్ల్యూహెచ్ఓ అదికారి డాక్టర్ ర్యాన్ అనుమానం వ్యక్తం చేశారు. కజకిస్తాన్లో ఇప్పటివరకు 50 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. -
ధారావిపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు
జెనీవా: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాంతక వైరస్పై విజయం సాధించగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది. కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ, వైరస్ బారిన పడిన వారికి తక్షణ చికిత్స, ఐసోలేషన్ నిబంధనల అమలు వైరస్ గొలుసును బ్రేక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే వైరస్పై విజయం సాధించవచ్చని సూచించింది. లాక్డౌన్ నిబంధనల సడలింపుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ ఈ మేరకు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు.(గాలి ద్వారా కరోనా సాధ్యమే) జెనీవాలో నిర్వహించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా గత ఆరు వారాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే అత్యధిక జనసాంద్రత కలిగిన కొన్ని ప్రాంతాల్లో వైరస్ను కట్టడి చేసిన తీరు గమనిస్తే.. కేసులు పెరిగినా మహమ్మారిని అదుపులోకి తీసుకు రావొచ్చనే విషయం స్పష్టమైంది. ఇందుకు ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా దేశాలు సహా ముంబైలోని ధారావి వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించిన తీరే నిదర్శనం. పరీక్షలు నిర్వహణ, ట్రేసింగ్, ఐసోలేషన్, అనారోగ్యంతో ఉన్న వారికి తక్షణ చికిత్స అందించడం వంటి విధానాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాయి. మమమ్మారిని అణచివేయగలమని నిరూపించాయి’’ అని పేర్కొన్నారు. ధారావి విజయం పదిలక్షల మందికి పైగా నివసించే ధారావిలో కరోనా విజృంభించిన తొలినాళ్లలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పురపాలక సంస్థ(బీఎంసీ) సత్వర చర్యలు చేపట్టింది. కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని అక్కడికి పంపి ఈ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. ఈ క్రమంలో శుక్రవారం నాటికి ధారావిలో మొత్తంగా 2359 కేసులు వెలుగు చూడగా.. ప్రస్తుతం కేవలం అక్కడ 166 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండటం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో అత్యధికంగా 27 వేల కేసులు నమోదు కాగా.. ధారావిలో 35 మంది కరోనా బారిన పడ్డారు. -
డ్యాన్స్ వీడియో తొలగించమన్నందుకు..
ముంబై : ఒక యువకుడు చీర ధరించి డ్యాన్స్ చేస్తుండగా తనతో పాటు ఉన్న నలుగురు స్నేహితులు ఆ వ్యక్తి డ్యాన్స్ను వీడియో చిత్రీకరించారు.ఈ విషయం తెలుసుకున్నసదరు వ్యక్తి వీడియోను డిలీట్ చేయాలని అడిగినందుకు కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన ముంబైలోని ధారావి స్లమ్ ఏరియాలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కౌశిక్ సునీల్ నారాయణ్ కర్(17) అనే యువకుడు ధారవిలోని సుభాష్ నగర్లో ఉంటున్నాడు. కౌశిక్ స్నేహితులు కూడా అతను ఉంటున్న ప్రాంతంలోనే ఉంటున్నారు. (ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసు కొత్త మలుపు) సరదాగా గడుపదామని కౌశిక్ స్నేహితుల దగ్గరికి వెళ్లాడు. కాగా వారిని ఉత్సాహపరిచేందుకు కౌశిక్ చీర ధరించి డ్యాన్స్ చేశాడు. అయితే అతనికి తెలియకుండా మిగతా నలుగురు వారి ఫోన్లో వీడియోనూ చిత్రీకరించారు. ఈ వీడియోను అందరికి చూపించి కౌశిక్ను ఆటపట్టిద్దామని భావించారు. అయితే వీడియో విషయం తెలుసుకున్నకౌశిక్ తన డ్యాన్స్ వీడియో డిలీట్ చేయాలని లేకపోతే పోలీసులకు లేదా తన అంకుల్ కు చెప్తానని హెచ్చరించాడు. అయితే కౌశిక్ నిజంగానే పోలీసుల వద్దకు వెళ్తాడేమోనని అతని స్నేహితులు అనుమానించారు. దీంతో తన అంకుల్ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న కౌశిక్ను ఆపి కత్తితో పొడిచారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కౌశిక్ కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కౌశిక్ హత్యకు కారణమైన నలుగురు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ నలుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మైనర్లను డొంగ్రి రిమాండ్ హోమ్ కు తరలించారు. -
కరోనా చీకటిలో ధారవి
సాక్షి, హైదరాబాద్: ధారావి...ఆసియాలోనే అతిపెద్ద, అత్యధిక జనసమ్మర్దమున్న మురికివాడ ఇప్పుడు కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఒక మోడల్గా, ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అభివృద్ధి ర్యాంకుల్లో, ఆధునిక సాంకేతికతలో ముందున్న దేశాలు, నగరాలు కోవిడ్ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతుంటే.. 10 లక్షలకు పైగా జనాభాతో భారత్లోనే అతిపెద్ద మురికివాడగా పేరుపడిన, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి వైరస్ వ్యాప్తి కట్టడిలో వెలుగు దారి చూపుతోంది. వందరోజులకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులతో పోరాడి, ఐసోలేషన్ నుంచి విజయవంతంగా బయటికొచ్చి మళ్లీ తన కార్యకలాపాలను కొనసాగించడం మొదలెట్టింది. ఈ ప్రాంతంలోని చిన్నాచితకా ఫ్యాక్టరీలు, కుటీరపరిశ్రమలు, రకరకాల వృత్తుల్లో పనిచేసే వారు తమ రోజువారి జీవనపోరాటంలో మళ్లీ నిమగ్నమై తమ ధైర్యాన్ని, సాహసాన్ని చాటుతున్నారు. మే చివరి వరకు కరోనా హాట్స్పాట్గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కరోనా వైరస్ వ్యతిరేక పోరులో ముందంజలో నిలిచి కేంద్ర ప్రభుత్వ అభినందనలు కూడా పొందింది. భయోత్పాతం నుంచి ... కొన్ని నెలల క్రితం ధారావిలో మొదటి కోవిడ్ మరణం నమోదు కాగానే సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. మురికివాడల్లో, అందులోనూ కిక్కిరిసిన వీధులు, ఒక్కోగదిలో పదిమంది చొప్పున నివసించే చోటు కావడంతో అది శవాల దిబ్బగా మారడం ఖాయమనే భయాందోళనలు మిన్నం టాయి. ఈ పరిస్థితుల్లో కనిపించని శత్రువుతో పోరాటానికి ఇక్కడి వారు నడుం బిగించారు. వైరస్ వ్యాప్తి తీవ్రమై కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సందర్భంలో అక్కడి అధికారులు సైతం వ్యూహాన్ని మార్చారు. విపత్తు సంభవించే వరకు వేచి చూడకుండా, వైరస్ను వెన్నాడి దానిని తుదముట్టించాలనే ఆలోచనతో ముందుకు సాగారు. వీధుల్లో తిరిగి పాజిటివ్ కేసుల కోసం శోధిస్తూ వెళ్లడం కంటే ధారావిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీవర్ క్యాంప్’లు ఏర్పాటుచేసి ప్రతీరోజు వైరస్ లక్షణాల కోసం అక్కడి ప్రజలను స్క్రీనింగ్ చేయడం మొదలుపెట్టారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు ఇలా ఒకటేమిటి... అందుబాటులో ఉన్న ప్రతి భవనాన్ని క్వారంటైన్ సెంటర్లుగా మార్పుచేశారు. ఈ సెంటర్లలోని వారికి ఆహారం, అవసరమైన విటమిన్లు, యోగ, ఇతర వ్యాయామాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ వైరస్ హాట్స్పాట్లు ఉన్నాయో గుర్తించారు. ఆయా ఏరియాల్లో లాక్డౌన్ విధించడంతో పాటు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రంగంలోకి దిగి ధారావిలోని ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ఆహార ప్యాకెట్లను అందించారు. వైద్యపరికరాలు, సామాగ్రిని బాలీవుడ్ సినీతారలు, వ్యాపారవేత్తలు అందజేయగా, గృహనిర్మాణ కార్మికులు ఒక పార్కులో 200 పడకల ఆసుపత్రిని నిర్మించారు. మూడునెలల తర్వాత కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ‘జనంతో కిక్కిరిసిపోయిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ అనేది అతిపెద్ద సవాల్గా నిలిచింది. స్థానికంగా ఉన్న డాక్టర్లందరినీ విశ్వాసంలోకి తీసుకుని కరోనా లక్షణాలున్న వారందరినీ ముందుగా గుర్తించాము. ఎప్పటికప్పుడు వారిని ఐసోలేట్ చేయడం, పబ్లిక్ టాయ్లెట్లను రోజుకు లెక్కకు మించినన్నిసార్లు శుభ్రం చేయడం మంచి ఫలితాలనిచ్చింది’అని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో జూన్లో రోజుకు 16 కేసుల చొప్పున ఈ మురికివాడల్లో 489 కేసులు రికార్డయ్యాయి. మళ్లీ జీవన సమరంలోకి... వందరోజులకు పైగా అన్నిరకాల వ్యాపారాలు బందయ్యాక, వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాక ధారావి ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. అన్నిరకాల పరిశ్రమలు, వృత్తులు మళ్లీ మొదలయ్యాయి. వైరస్ భయాన్ని, దాని బారిన పడితే నూకలు చెల్లుతాయనే జీవన్మరణ సమస్యలను అధిగమించి ఇప్పుడు ధైర్యంగా ముందుకు సాగుతోంది. -
ఆరు రోజులుగా ఒక్కరు మరణించలేదు..
ముంబై: ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందంటున్నారు అధికారులు. గత ఆరు రోజులలో ఇక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) అధికారులు ఆదివారం వెల్లడించారు. మురికివాడలో ఇప్పటివరకు 71 మరణాలు నమోదయ్యాయని.. ఇక్కడ మరణాల రేటు 2.67 శాతంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ముంబైలో కరోనా మరణాల రేటు 3.27 శాతంగా ఉంది. ఇదేకాక రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందన్నారు. జూన్ 1న 34 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం కొత్త కేసుల సంఖ్య 10కి పడిపోయిందని బీఎమ్సీ జీ నార్త్ వార్డ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కిరణ్ దిఘవ్కర్ తెలిపారు. ధారావిలోని ఇరుకైన దారులు, సానిటరీ పరిస్థితులు, సామూహిక మరుగుదొడ్లు ఇతర అనేక పరిస్థితుల ఆధారంగా ఈ ప్రాంతాన్ని వర్గీకరిస్తారు. కరోనా వ్యాప్తికి ఈ ప్రాంతం ఆట స్థలంగా మారింది. ధారావిలో మొదటి కేసు ఏప్రిల్ 1న నమోదయ్యింది. మొదట్లో వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉండటంతో కేసుల సంఖ్య 100కు చేరడానికి రెండు వారాలు పట్టింది. అయితే మే 3 నాటికి ఆ సంఖ్య 500కి పెరిగింది. తరువాతి పది రోజుల్లో కేసుల సంఖ్య ఏకంగా 1,000 మార్కును దాటి మే 23 నాటికి 1,500 కు చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా అధికారులు కరోనా వ్యాప్తిపై నియంత్రణ సాధించినట్లు తెలిపారు. కరోనా కట్టడిలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. (కరోనా కట్టడిలో యూపీ భేష్.. పాక్ మీడియా) మే 28 -30 వరకు కేవలం 18 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు బీఎమ్సీ అధికారులు. జూన్ 1న కేసుల సంఖ్య రెట్టింపయినట్లు గుర్తించామన్నారు. మే మధ్యలో బీఎమ్సీ రోజుకు 50 కేసులను గుర్తించిందని.. కాని నెలాఖరు నాటికి ఆ సంఖ్య కేవలం 20కి పడిపోయిందని తెలిపారు. జూన్ 6 శనివారం నాడు కేవలం పది కొత్త కేసులు మాత్రమే వచ్చాయన్నారు. మే 31 నుంచి జూన్ 6 వరకు ఏడు రోజుల వ్యవధిలో కొత్తగా 148 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ధారావిలోని జీ నార్త్ వార్డ్లో బీఎమ్సీ 13 'హై రిస్క్' ప్రాంతాలను గుర్తించింది. ఇక్కడ నమోదవుతున్న కేసులలో మూడింట నాలుగు వంతుల మంది 21 నుంచి 60 సంవత్సరాల వయస్సులోపు వారే ఉన్నారని తెలిపింది. పె జూన్ 1నాటికి, హై రిస్క్ జోన్లలో 47,500 మందిని, విస్తృత కంటైనర్ జోన్లలో 1.25 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు బీఎమ్సీ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా రోగులను గుర్తించడానికి.. వ్యాప్తిని అరికట్టడానికి స్థానికంగా జ్వరం క్లినిక్లను ఏర్పాటు చేసినట్లు బీఎమ్సీ తెలిపింది. ద్ద సంఖ్యలో కుటుంబాలు దగ్గర దగ్గరగా ఉండటం.. దేశంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన మురికివాడ కావడంతో ధారావి భారతదేశంలో ప్రమాదకర ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.(భయపెట్టి మరీ చికిత్స; భారీ ఫైన్) -
కరోనా విజృంభణ: ఉలిక్కిపడ్డ మహారాష్ట్ర
సాక్షి, ముంబై : మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రాణాంతక వైరస్ ధాటికి దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణుకుతోంది. ముంబైవాసులను కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2940 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యియి. రాష్ట్రంలో వైరస్ బయటపడినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూడటం ఇది తొలిసారి. దీంతో మహారాష్ట్ర ఒక్కసారికి ఉలిక్కిపడింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 44,582కి చేరింది. (ఒక్కరోజే 6088 కరోనా కేసులు) ఇక ఆసియాలోనే అత్యంత మురికివాడల్లో ఒకటైన ధారావిలో కరోనా భయాందోళన సృష్టిస్తోంది. శుక్రవారం కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మురికివాడలో మొత్తం కేసుల సంఖ్య 1478కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 1460కి పెరిగింది. తాజా కేసులతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాలుగో విడత లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. (శవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదు) -
మమ్మల్ని పట్టించుకోవడం లేదు..
ముంబై: కరోనా వలస కార్మికులను ఆగం చేసింది. ఉన్న చోట తిండి లేక.. సొంత ఊరుకు వెళ్లేందుకు వీలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మీకుల కోసం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. దాంతో వేలాది మంది వలస కార్మీకులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వీరంతా కరోనా విజృంభిస్తోన్న ధారవి, కుర్లా ప్రాంతంలో నివసిస్తున్నారు. మహారాష్ట్రలో దాదాపు 5లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా నిర్మాణ రంగం, ఇటుకల తయారీ వంటి పరిశ్రమల్లో పనుల చేయడం కోసం వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంతో ప్రస్తుతం వీరు సొంత ఊళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు వలస కూలీలు మాట్లడుతూ.. ‘ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బస్సులు ఏర్పాటు చేయలేదు. శ్రామిక్ రైళ్ల కోసం ఈ నెల 5న రిజిష్టర్ చేసుకుంటే.. ఈ రోజు ప్రయాణానికి కుదిరింది. క్షేమంగా ఇంటికి చేరితే చాలు.. ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం.. మళ్లీ ముంబై రాం’ అన్నారు.(లాక్డౌన్ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు) మరి కొందరు మాత్రం ‘ముంబై నగరం మాకు ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధి కల్పించింది. పరిస్థితులు బాగాలేక ఇప్పుడు వెళ్లి పోతున్నాం. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అప్పుడు తిరిగి వస్తా’మన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. (కరోనా వైరస్: సేఫ్ జోన్లో గిరిజనం) -
ముంబై మురికివాడలో 808కి చేరిన కేసులు
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన నగరంలోని ధారవిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ధారవిలో శుక్రవారం 25 తాజా కేసులు వెలుగుచూడటంతో ఈ ప్రాంతంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 808కి ఎగబాకింది. కాగా, ముంబైలో కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర బృందం సూచించింది. ఇక ముంబై కరోనా మహమ్మారి కేంద్రంగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిపై వేటు వేసింది. ప్రవీణ్ స్ధానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఎస్ చహల్కు ప్రతిష్టాత్మక బీఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ముంబై నగరంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసులను అదుపులోకి తేవడంలో ప్రవీణ్ విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది చదవండి : స్లమ్స్లో వణుకు... ఇక్కడా ఇరుకు -
ధారావిలో ఒక్కరోజే 94 కరోనా కేసులు
సాక్షి, ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే 94 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా, ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఒక్కరోజే ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించడం వల్ల ధారావిలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 590 కి పైగా కోవిడ్-19 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 20కి పెరిగింది. (‘ధారావి’లో కరోనా విజృంభణ) ముంబై పురపాలక సంస్థ నుంచి కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ధారావిలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించారు. అయినప్పటికీ అత్యధిక జనసాంద్రత, ఇరుకు ప్రాంతం కావడంతో భౌతిక దూరం పాటించడం కష్టతరం అయ్యింది. దీంతో పరిస్థితిని అదుపు చేయడం అధికారులకుసవాల్గా మారింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా మహమ్మరి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 40 వేలకిపైగా కేసులు నమోదు కాగా, అత్యధికంగా మహారాష్ర్టలోనే వెలుగుచేస్తున్నాయి. -
కరోనా : పోలీస్ శాఖలో కలకలం
ముంబై : కరోనా వైరస్ ముంబై పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఇప్పటికే 100కి పైగా పోలీసులు ఈ వైరస్ భారిన పడ్డారు. తాజాగా వడాలా పోలీసు స్టేషన్ పరిధిలోని 9 మంది కానిస్టేబుల్స్కు కోవిడ్ సోకింది. గురువారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలడంతో ముంబైలోని గురునానక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక వీరి కుటుంసభ్యులను కూడా క్వారంటైన్లో ఉంచామని అధికారులు తెలిపారు. వడాలా పోలిస్ స్టేషన్ పరిధిలో మెత్తం 7రెడ్ జోన్లు ఉన్నాయని, వీటిలోనే 9 మంది పోలీస్ కానిస్టేబుల్స్ విధులు నిర్వహించడంతో కరోనా సోకిందని అనుమానిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ రష్మి కరాండికర్ తెలిపారు. (ముంబై పోలీసులకు అక్షయ్ విరాళం) ఇక ముంబైలోని ధారావిలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో గురువారం ఒక్కరోజే 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 369కి పెరిగింది. ఒక్క ధారావి లోనే కోవిడ్ కారణంగా ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత రెండు రోజుల్లోనే ధారావి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగురు పోలీసులకి కరోనా సోకింది. ఇప్పటివరకు నగరంలో ముగ్గురు పోలీసులు వైరస్ ధాటికి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో 55 ఏళ్లు పైబడిన పోలీసులు ఇళ్లలోనే ఉండాలని నగర పోలీసు చీఫ్ పరంబిర్ సింగ్ ఆదేశించారు. (‘ధారావి’లో కరోనా విజృంభణ) -
‘ధారావి’లో కరోనా విజృంభణ
సాక్షి, ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం తాజాగా 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 369కి పెరిగింది. ఈ ప్రాంతంలో కోవిడ్ సోకి ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ఇరుకు ప్రాంతమైన ధారావిలో కరోనాను కట్టడి చేయడం అధికారులకు సవాల్గా మారింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్డౌన్ ఉపసంహరించాక వైరస్ విజృంభణను ఏవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తుందో చూడాలి. కేంద్ర వైద్యారోగ్య తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకు 9915 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 432 మంది మరణించారు. కోవిడ్-19 బారిన పడిన వారిలో 1,593 మంది కోలుకున్నారు. ముంబై మహానగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి పెరిగింది. కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 1074 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ తరహాలో భారత్లో లాక్డౌన్! -
ధారావిని వీడని మహమ్మారి..
ముంబై : మహమ్మారి బారినపడి విలవిలలాడుతున్న ముంబై మహానగరంలో అధికారులు, వైద్య సిబ్బంది ప్రాణాంతక వైరస్ నిరోధానికి పోరాడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నగరంలోని ధారావిలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ధారావిలో బుధవారం 14 తాజా కేసులు నమోదయ్యాయని దీంతో ఆ ప్రాంతంలో పాజిటివ్ కేసుల సంఖ్య 344కు ఎగబాకిందని అధికారులు వెల్లడించారు. ధారావిలో ఈ రోజు ఎలాంటి కోవిడ్-19 మరణాలు చోటుచేసుకోలేదని చెప్పారు. మహీంలో 3 పాజిటివ్ కేసులు నమోదవగా, దాదర్లో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. చదవండి : ముంబైలో చిక్కుకున్న మత్స్యకారులు -
ధారావిలో కరోనా కేసుల తగ్గుముఖం
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో వైరస్ వ్యాప్తి కలకలం రేపింది. భౌతిక దూరం పాటించడానికి అతికష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ఇరుకైన ప్రాంతమైన ధారవిలో వ్యక్తుల కాంటాక్టుల జాడ పట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని. అయితే గురువారం నమోదైన 25 కేసులతో పోలిస్తే శుక్రవారం తక్కువగా కేవలం 5కేసులు మాత్రమే కొత్తగా నమోదయ్యాయి. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో కోవిడ్-19 రోగుల సంఖ్య 220కి చేరుకోగా, ఇప్పటి వరకు 14 మంది మృతిచెందారు. ముంబై పురపాలక సంస్థ నుంచి కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ధారావిలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించారు. శరవేగంగా భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, కొత్త ఐసోలేషన్, వైద్య మౌలిక వ్యవస్థలను సిద్ధం చేసి కరోనా కట్టడి కోసం రేయింబవళ్లు తీవ్ర కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రజలను తమ ఇళ్లలోనే ఉండేలా క్వారంటైన్ చేయడం, వారి రోజువారీ రేషన్ సరుకులను ఉచితంగా అందించడం అనేది ఏకకాలంలోనే కొనసాగిస్తున్నారు. నగరంలోని వ్యాపార వర్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాల ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తోంది. ఐసోలేట్ చేసిన అన్ని ఇళ్లకూ బియ్యం బస్తాలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పలువురు ఎన్జీవోలకు చెందిన వారు కూడా ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. 150 మంది కార్మికులతో కూడిన శానిటరీ ఇన్స్పెక్టర్లు రోజూ చెత్త ఏరివేయడం, ఇళ్లలో, రూముల్లో, భవనాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడం, మురికికాలువలను క్లీన్గా ఉంచడం వంటి విధులను నిర్వహిస్తున్నారు. తొలి కరోనా వైరస్ బాధితుడు మృతి చెందగానే మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టడంతోనే కొంత మేర సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే కరోనా కేసులు పూర్తిగా తగ్గే వరకు ధారావిలో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగించాలని లేకపోతే వైరస్ వ్యాప్తి సులువుగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
అక్కడ 200 దాటిన పాజిటివ్ కేసులు..
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో వైరస్ విజృంభణపై ఆందోళన వ్యక్తమవుతోంది. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో కోవిడ్-19 రోగుల సంఖ్య 214కు చేరకుంది. ధారావిలో గురువారం 25 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి బారినపడి ఈ ప్రాంతంలో 13 మంది మరణించారని బీఎంసీ అధికారులు తెలిపారు. ధారావిలోని కుట్టినగర్, మతుంగ లేబర్ క్యాంప్, ఆజాద్ నగర్, చమదబజార్, ముకుంద్ నగర్, కళ్యాణ్వాడి వంటి పలు ప్రాంతాల్లో తాజా కేసులు గుర్తించామని చెప్పారు. ముంబైలోనే అత్యంత ఇరుకైన ప్రాంతమైన ధారావిలో వైరస్ వ్యాప్తి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చదవండి : ముంబైలో మనోళ్లు బిక్కుబిక్కు.. -
ముంబైలో మనోళ్లు బిక్కుబిక్కు..
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో ముంబైలోని తెలుగు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముంబైలో బుధవారం నాటికి 3,683 మందికి కరోనా సోకగా, 161 మంది మరణించారు. బుధవారం ఒక్కరోజే 10 మంది కరోనాకు బలయ్యారు. ముంబైలోని హాట్స్పాట్లున్న ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇరుకు గదుల్లో ఉండలేక, బయటకు వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. తమను స్వగ్రామాలకు చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 8 మంది తెలుగువారికి కరోనా.. ముంబైలో 8 మంది తెలుగువారికి కరోనా సోకింది. కమాటిపురాలో ముగ్గురు, ధారావి ముకుంద్నగర్లో ముగ్గురు, వర్లీ బీడీడీ చాల్స్లో ఇద్దరు.. మొత్తం 8 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల్లో నివసించే స్థానిక తెలుగు ప్రజలు ‘సాక్షి’కి తెలిపారు. తెలుగువారు అత్యధికంగా ఉండే ‘జీ సౌత్’(వర్లీ, ప్రభాదేవి, లోయర్ పరేల్ తదితర పరిసరాలు) వార్డులో కరోనా బాధితుల సంఖ్య అధికంగా ఉంది. ఈ వార్డులో ఏప్రిల్ 21 వరకు 487 మందికి కరోనా సోకింది. మరోవైపు ‘ఇ’(భైకల్లా, కమాటిపురా తదితర పరిసరాలు)లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ‘జీ నార్త్’(దాదర్, మాహీం, ధారావి తదితర పరిసరాలు) వార్డులో 251 కేసులు నమోదయ్యాయి. 200లకు పైగా కరోనా బాధితులున్న 7 వార్డులున్నాయి. ఆ ఏడు వార్డుల్లో వర్లీ, కమాటిపురా, ధారావితో పాటు తెలుగు ప్రజలు నివసించే సైన్, వడాలా, అం«ధేరి తదితరాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే తెలుగు వారితో ‘సాక్షి’మాట్లాడింది. చదవండి: కరోనాను కట్టడి చేస్తాం 10 లక్షలకుపైగా... ముంబైలో సుమారు 1.2 కోట్ల జనాభా ఉండగా వీరిలో సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది తెలుగు ప్రజలున్నారు. వీరిలో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సుమారు 80 శాతంకుపైగా ఉండగా ఏపీ ప్రజలు సుమారు 20 శాతం వరకు ఉంటారు. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు చెందినవారు అధికంగా ఉన్నారు. వీరిలో సీజన్ వారీగా ముంబైకి వచ్చే వలస కూలీలు సుమారు 15 శాతం ఉండగా, 50 శాతం పైగా కూలీ పనులు చేసుకునేవారే. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సుమారు 10 నుంచి 12 శాతం ఉంటారు. రోజూ 10 వేల మందికి భోజనం: కృష్ణవేణిరెడ్డి (కార్పొరేటర్, ముంబై) మా వార్డులో రోజుకు దాదాపు 10 వేల మందికి భోజనాలు అందిస్తున్నాం. మా వార్డులో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. అవసరమున్న తెలుగు వారితో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రజలకు ఉదయం 5 వేలు, సాయంత్రం 5 వేల భోజనాల ప్యాకెట్లను పంపిణీ చేయిస్తున్నాను. ఈ నెల కష్టమే ఉంది ఇళ్లల్లో పని చేసి బతికే మాకు చాల ఇబ్బందిగా ఉంది. పోయిన నెల ఎలాగో గడిచింది. మా సేటమ్మలు ఎంతో కొంత ఇచ్చిన్రు. ఈ నెల ఎల్లుడు కష్టంగా ఉంది. నా పెద్ద కొడుకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని దమ్మన్నపేటలో అమ్మమ్మ ఇంట్లో ఉంటుండు. నేను నా భార్య, చిన్న కొడుకు ముంబైలో ఉంటున్నాం. కోడిపుంజుల రమేశ్ (మంచిర్యాల జిల్లా, వెంకట్రావ్పేట) ఎట్లన్న చేసి ఊరికి పంపండి మమ్మల్ని ఎట్టన్న చేసి మా ఊరికి చేర్చండి. ముంబై బోరివలి దౌలత్నగర్ మురికివాడలో ఉంటున్నాం. చిన్న గదిలో ఉంటూ నాకా కార్మికుడిగా పని చేస్తున్నా. ప్రస్తుతానికి పనులు లేవు. ఇక్కడ రేషన్ కార్డు కూడా లేదు. దీంతో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మంచిర్యాల జిల్లా మ్యాదరిపేటలో భార్య, ఇద్దరు పిల్లలున్నారు. – సీపతి చంద్రశేఖర్ -
స్లమ్స్లో వణుకు... ఇక్కడా ఇరుకు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహా నగరాల్లో ముంబై ప్రథమ స్థానంలో ఉంది. ఆసియాలోని అతిపెద్ద స్లమ్స్లో ఒకటైన ధారవి స్లమ్లో దాదాపు వంద పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్తో దాదాపు 10 మంది మరణించారు. ఈ నేపథ్యంలో స్లమ్ అంటేనే ప్రజల్లో వణుకు పుడుతోంది. కారణం ఇరుకు ఇళ్లు.. ఎక్కువ జనాభా.. ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. పెద్ద కాలనీల్లో కంటే స్లమ్స్లో పాజిటివ్ కేసులుంటే వ్యాపించే తీవ్రత అధికంగా ఉండడమే అందుకు కారణం. ధారవితో పోల్చగల స్లమ్ ఏదీ నగరంలో లేనప్పటికీ.. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉండటం వల్ల భయాందోళనలు నెలకొన్నాయి. (కరోనా : వారికి సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేం) ఈ కేసులే అత్యధికం.. గ్రేటర్ నగరంలో వెలుగు చూస్తున్న పాజిటివ్ కేసుల్లో మర్కజ్వే అధికం. మర్కజ్తో సంబంధాలున్న వారు వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, పాతబస్తీలో ఎక్కువగా ఉండటం తెలిసిందే. ఇప్పటికే అక్కడి పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 160కి పైగా ఉండటంతో అక్కడి స్లమ్స్లోని ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వైరస్ పొంచి ఉందోనని భీతిల్లుతున్నారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్, మలక్పేట, రాజేంద్రనగర్ సర్కిళ్లలో ఇలాంటి పరిస్థితులున్నాయి. పాతబస్తీలోని స్లమ్స్, ఇరుకు పరిస్థితులు, ఒకే ఇంట్లో అధిక జనాభా ఉండటం వంటి కారణాల వల్లే ఒకే ఇంట్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని స్లమ్స్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. లేని పక్షంలో పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్లో అధిక జనాభా కలిగిన స్లమ్స్లో హఫీజ్ బాబానగర్, వినాయక్ నగర్, ఎన్టీఆర్నగర్, అడ్డగుట్ట, సంజయ్గాంధీనగర్, ప్రేమ్నగర్, మహమూద్నగర్, ఎల్లమ్మబండ, ఎంఎస్ మక్తా, వట్టేపల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి. యూసీడీ సేవలు.. జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం స్లమ్స్లోని ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్నప్పటికీ, ప్రస్తుత కరోనా పాజిటివ్ కేసులు అన్ని ప్రాంతాల్లో ఉండటంతో అన్ని చోట్లా నివారణపై దృష్టి సారించడంతో పాటు స్లమ్స్లోని పేదలు, నిరాశ్రయులకు వసతి, ఆహారం తదితరాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (యూసీడీ) జె. శంకరయ్య తెలిపారు. ఇప్పటి వరకు నగరంలో 120 షెల్టర్లలో 4,565 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించామని, వారందరికీ రెండుపూటలా భోజనంతోపాటు శానిటైజర్లు, సబ్బులతో పాటు మాస్కులు అందజేస్తూ వైద్యపరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని ఏఎంఓహెచ్లతోపాటు బస్తీ దవాఖానాలకు చెందిన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారన్నారు. వీరిలో జ్వరాలున్నవారిని అన్ని జాగ్రత్తలతో అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. షెల్టర్లలో సామాజిక దూరం పాటించే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్లో సర్కిళ్లు : 30 వార్డుల సంఖ్య : 150 మురికి వాడలు : 1466 ఆవాసాలు : 4.21 లక్షలు నివాసితులు : 18.05 లక్షలు ఒక్కో స్లమ్లో జనాభా : 200 నుంచి 500 మరికొన్నింటిలో : 10000 నుంచి 17000 జనాభా -
ఇరుకు బతుకుల్లో ఊపిరాడేనా?
సాక్షి, ముంబై: ముంబైలోని ధారావి.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. ఈ ధారావిలో గుడిసెళ్లాంటి ఇళ్లు, దస్ బై దస్ (పది బై పది అడుగులు) కూడా లేని ఇళ్లల్లో చిన్న పిల్లలతో జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా పశువుల కొట్టం కన్నా చిన్నగా, బాత్రూం కంటే కొంత పెద్దగా ఉండే ఇళలో వలస కూలీలు పది మంది చొప్పున ఉం టారు. దీన్నిబట్టి ఇక్కడ జీవనప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ధారావిలో కరోనా ప్రవేశిస్తే అడ్డుకోవడం కష్టమని అంద రూ భయపడ్డారు. అందరూ భయపడినట్టే ధారావిలో కరోనా వైరస్ కలకలం రేకెత్తిస్తోంది. ముంబైలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధారావి మురికివాడలో ఏప్రిల్ 1న ప్రవేశించింది. అప్పటి నుంచి రోజురోజుకూ దీని ఉధృతి పెరుగుతోంది. మరణించినవారి సంఖ్య కూడా దాదాపు రెండంకెలకు చేరువలో ఉంది. దీంతో ముంబైకర్లతో పాటు అధికారులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పొంచి ఉన్న ముప్పు.. ధారావిలో కరోనా ముప్పు తీవ్రంగా ఉంది. కరోనాను అడ్డుకునేందుకు సామాజిక దూరం పాటించడంతో పాటు గుంపులుగా ఉండొద్దని, నిత్యం చేతులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ చెబుతోంది. అయితే ధారావిలో మాత్రం ఇరుకైన సందులు, చిన్న గుడిసెలు, జనసాంద్రత ఇక్కడ ఇబ్బందికరంగా మారింది. దీంతో కరోనా వైరస్ ఇక్కడ వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చేయి దాటక ముందే కరోనా కట్టడి చేయకపోతే ధారావితో పాటు ముంబైలో కరోనాతో జరిగే నష్టాన్ని ఆపడం కష్టసాధ్యం అవుతుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ముంబైలోని ధారావిపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నాయి. ధారావిలో కరోనా ఇతరులకు సోకకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు చేపట్టారు. రాబోయే రోజుల్లో ధారావిలో కరోనా విస్తరణ ఎలా ఉంటుందనేది చెప్పలేకపోతున్నారు. ముస్లింనగర్, ముకుంద్నగర్లలో అత్యధికం.. ధారావిలోని ముస్లింనగర్, ముకుంద్నగర్లలో కరోనా బాధితులు అత్యధికంగా ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో 39 మందికి కరోనా సోకింది. మరోవైపు గురువారం ఒక్కరోజే 26 మందికి కరోనా సోకగా, శుక్రవారం మరో 15 మందికి, శనివారం 16 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 117కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ 10 మంది మృతి చెందారు. ముగ్గురు తెలుగువారికి కరోనా ధారావిలోని ముకుంద్నగర్లో నివసించే ముగ్గురు తెలుగువారికి కరోనా వైరస్ సోకిందని తెలిసింది. ఈ విషయాన్ని ధారావి పునరాభివృద్ధి సమితి పదాధికారులు ధ్రువీకరించారు. వీరు అంధించిన వివరాల మేరకు సుమారు 12 లక్షల జనాభా ఉన్న ధారావిలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 25 వేలకుపైగా తెలుగు ప్రజలుంటారు. వీరిలో అనేక మంది కూలీలున్నారు. ముఖ్యంగా ధారావిలోని ముకుంద్నగర్, రాజీవ్గాంధీ నగర్, అంబేడ్కర్ శతాబ్దినగర్, ప్రధానమంత్రి గ్రాండ్ ప్రాజెక్టు కాలనీ, సక్రేశ్వర్ శివ మందిరం, లేబర్ క్యాంప్ ఆనంద్ సొసైటీ, సాయిబాబానగర్, సుభాష్నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నారాయణపేట, యాదగిరి జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే తెలుగు ప్రజలుండే ప్రాంతాల్లో అంతగా కరోనా ప్రభావం లేకపోయినా ముకుంద్నగర్లో మాత్రం పెద్ద ఎత్తున కరోనా బాధితులున్నారు. వీరిలో ముగ్గురు తెలుగువారున్నారు. జనాభా 12,00,000 ధారావి సుమారు 528 ఎకరాల్లో విస్తరించి ఉంది. పశ్చిమ రైల్వే మార్గం, సెంట్రల్ రైల్వే మార్గాల మధ్య ఈ ధారావి విస్తరించింది. ఉత్తర భారతీయులతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ధారావిలో సుమారు 10 నుంచి 12 లక్షల జనాభా ఉంది. 100 చదరపు అడుగుల్లోపు ఇళ్లు.. ధారావిలో 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు.. అంటే 100 చదరపు అడుగుల లోపు ఇళ్లే అధికంగా ఉన్నాయి. ఇలాంటి ఇళ్లలో కనీసం నలుగురి నుంచి 10 మందికిపైగా నివసిస్తున్నారు. పైగా వందలాది మంది ఒకే టాయిలెట్ వాడాల్సిన పరిస్థితి ఉంది. ధారావిలోని స్థానికులతో పాటు అధికారులను కలిసి వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రయత్నించింది. ధారావి కోసం ప్రత్యేక ప్లాన్.. ధారావిలో కరోనాను అడ్డుకునేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రత్యేక ప్లాన్ రూపొందించినట్లు బీఎంసీ జీ నార్త్ వార్డు ఆఫీసర్ కిరణ్ దిగావ్కర్ తెలిపారు. ఈ ప్లాన్ ప్రకారం డాక్టర్లు, నర్సులు, మెడికల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారితో 10 బృందాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన 24 మంది డాక్టర్లు ఉంటారు. వీరితోపాటు 35 మంది బీఎంసీ సిబ్బంది, 10 మంది పోలీసులున్నారు. వీరంతా ధారావిలో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ధారావిలో బీఎంసీ నిర్మించిన కామన్ టాయిలెట్లు అధికంగా ఉన్నాయి. వీటిని శుభ్రం చేయడానికి న్యూజిలాండ్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తున్నాం. – కిరణ్ దిగావ్కర్ (బీఎంసీ అధికారి) పైసల్లేవ్.. పని లేదు.. కరోనా కారణంగా ట్యాక్సీ సేవలు నిలిచిపోవడంతో ఇం టికే పరిమితమయ్యాం. ప్రస్తు తం పని లేదు..పైసలూ లేవు. భార్య, ఇద్దరు పిల్లలతో చిన్న ఇంట్లో రోజంతా ఉం డాలంటే తీవ్ర ఇబ్బంది అవు తోంది. – శనిగారం తిరుపతి, ట్యాక్సీ డ్రైవర్ రెండ్రోజులు చేయాలి.. కరోనా అడ్డుకునేందుకు ధారావిని దిగ్బంధం చేశారు. నిత్యావసరాల కొనుగోలు కోసం ఉదయం 7–10 వరకు సడలింపు ఇస్తు న్నారు. అయితే ఇలా కాకుండా వారానికి 2 రోజులే సడలిస్తే కరో నాను అడ్డుకోవడం సులభం అవుతుంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాం తాల్లో ఆంక్షలను కఠినం చేయాలి. – దామరగిద్ద బాలరాజ్ (సామాజిక కార్యకర్త) దిగ్బంధంలో ధారావి... కరోనా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు ధారావిని దిగ్బంధం చేశారు. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అసలే చిన్న చిన్న గదులు.. ఇరుకైన సందులు.. గాలి కూడా సరిగా ఆడని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిసరాల్లో అందరూ ఇళ్లలో ఉండడం కష్టతరం గా మారింది. ముఖ్యంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనులకు వెళ్లి రాత్రి పడుకునేందుకే గదులకు వచ్చేవారు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉం డాల్సి వస్తోంది. వీరిని ఇళ్లలో ఎలా నిర్బంధించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ధారావిలో అత్యంత జనసాంద్రత కారణంగా కరోనా చాలా వేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. -
ముంబై మురికివాడలో మహమ్మారి కలకలం..
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ధారావిలో గురువారం 26 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ ప్రాంతంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86కు పెరిగింది. కరోనా వైరస్తో బాధపడుతూ ఓ వ్యక్తి చనిపోవడంతో ధారావి మురికివాడలో మృతుల సంఖ్య 9కి చేరిందని అధికారులు వెల్లడించారు. ధారావిలోని లక్ష్మీచాల్ ప్రాంతానికి చెందిన 58 సంవత్సరాల వ్యక్తి గురువారం మరణించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో 15 లక్షల మంది నివసిస్తారు. కాగా, మహారాష్ట్రలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2919కి చేరింది. చదవండి : లాక్డౌన్: వాటినే ఎక్కువగా ఆర్డర్ చేశారు! -
అతిపెద్ద మురికివాడలో ‘కరోనా’ అలజడి
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావిలో కరోనావైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. 10 లక్షలకుపైగా ప్రజలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకగా, ఇద్దరు మరణించారని బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు.(వ్యాక్సిన్ వచ్చేవరకు ముప్పు తప్పదు) ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో అత్యంత సమీపంలో ఇళ్లు ఉండటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే దాన్ని నిరోధించడం కష్టమైన పని అని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ కొత్తగా కరోనా కేసులు నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది. (మే 3 వరకు లాక్డౌన్ : మోదీ) -
తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా
ముంబై: దేశంలోనే అత్యధిక కోవిడ్-19(కరోనా వైరస్) కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ శనివారం నాటికి 1574 మంది కరోనా బారిన పడగా 110 మంది మృతి చెందారు. అయితే ఒక్క ముంబైలోనే వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదు కావడం కలవరపరిచే అంశం. తాజాగా ప్రముఖ తాజ్ హోటల్లోని ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో శనివారం వీరిని బాంబే ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది చికిత్స అందిస్తున్నట్లు ఓ వైద్యుడు వెల్లడించారు. (ముంబై వొఖార్డ్ ఆసుపత్రి సీజ్) ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా వీరితోపాటు పనిచేసిన ఇతర ఉద్యోగులకు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కాగా తమ హోటల్స్ ప్రస్తుతం మూసివేసి ఉన్నాయని, కాకపోతే అక్కడి సామాగ్రిని చూసుకోవడానికి పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉన్నారని తాజ్ హోటల్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరు గాంచిన ధారవిలో మరో 15 కరోనా కేసులు వెలుగుచూశాయి. (పొంచివున్న పెనుముప్పు ‘ధారవి’) -
పొంచివున్న పెనుముప్పు ‘ధారవి’
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ధారవి కోవిడ్–19 విషయంలో పేలనున్న టైమ్బాంబ్లా ఉంటోంది. దేశంలోనే అత్యంత ఇరుకైన, కిక్కిరిసిన జనాభాతో కూడిన ధారవి మురికివాడలో 10 లక్షల మంది జనాభా నమ్మశక్యం కానంత ఇరుకు గుడిసెల్లో ఉండటం వల్ల ముంబై నగరంలో వైరస్ ఉత్పత్తి కేంద్రంగా ఉంటూ భయాందోళనలు కలిగిస్తోంది. ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజం ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతంలో వైరస్ నియంత్రణతో ఎలా వ్యవహరించాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంతవరకు ఇక్కడ చేసిన కృషి ఏమాత్రం సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే ధారవిని య«థాతథ స్థితికి తీసుకురావడం ప్రభుత్వ యంత్రాంగానికి, పౌర సమాజానికి అతి పెద్ద సవాలుగా మారనుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొం దిన ధారవిలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాడేందుకు అతివేగంగా మాస్ పరీక్షలు చేయడం, భారీ మౌలిక వైద్య వ్యవస్థను ఏర్పర్చడం ఇప్పుడు మహారాష్ట్ర ముందున్న అతి పెద్ద సవాలు. ముంబై పురపాలక సంస్థ నుంచి 274 మంది కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, ఆరు వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మరో 200 మంది సిబ్బంది ధారవిలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు తక్షణ సవాళ్లు ఏవంటే.. వివిధ సామాజిక బృందాలకు శరవేగంతో భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, కొత్త ఐసోలేషన్, వైద్య మౌలిక వ్యవస్థలను సిద్ధం చేసుకోవడమే. కరోనా వైరస్ రోగి మృతి చెందాక మహారాష్ట్ర ప్రభుత్వం వీటిని యుద్ధ్దప్రాతిపదికన ఏర్పర్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. మెడికల్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆమోదించిన వెంటనే ర్యాపిడ్ టెస్టింగ్ యూనిట్లను కూడా ధారవికి పంపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. 239 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు పది లక్షలమంది జనాభాకు నెలవుగా ఉన్న ధారవిని కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి హైరిస్క్ జోన్గా, ముంబై మహానగరానికే సాంక్రమిక వ్యాధికి చెందిన ఎపిసెంటర్గా ముంబై పురపాలక సంస్థ గుర్తించింది. ముంబై మహారాష్ట్ర రాజధాని. భారత్లోనే అత్యధిక సంఖ్యలో కోవిడ్–19 రోగులు నమోదైన రాష్ట్రమిది. వారం రోజుల క్రితమే అంటే ఏప్రిల్ 1న ధారవిలో తొలి కోవిడ్–19 మరణం నమోదైంది. మార్చి 23న జ్వరం రావడంతో రోగి సమీపంలోని సియోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అప్పటినుంచి ధారవిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 8 నాటికి, ధారవిలో 9 కరోనా కేసులను నిర్ధారించారు. వీరిని ఈ ప్రాంతంలోనే ఉన్న రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రూపొందించిన ఐసోలేషన్ వార్డులకు తరలించారు. స్థానికుల వినోదానికి రూపొందించిన ఈ కాంప్లెక్స్ను రాత్రికి రాత్రే 300 పడకలతోకూడిన ఐసోలేషన్ కేంద్రంగా మార్చేశారు. ఇరుగుపొరుగున ఉన్న డాక్టర్ బలిగానగర్, వైభవ్ అపార్ట్మెంట్, ముకుంద్ నగర్, మదీనా నగర్, ధన్వాడ చావల్ ప్రాంతాల్లో ఇప్పటికే 5 వేలమందిని క్వారంటైన్ చేశారు. ధారవిలో 150 చదరపుటడుగుల నివాస ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు సాగించే 85 క్లస్టర్లున్నాయి. ఈ ఇళ్లలో సగటున ఆరుమంది నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో 25 శాతం మేరకు పక్కా నిర్మాణాలు ఉండి ఇక్కడ 20 వేల చిన్నతరహా వర్క్ యూనిట్లు పనిచేస్తున్నాయి. తోలు ఉత్పత్తుల ఎగుమతులు, జౌళి, జరీ పని, గ్లాస్ పని, కుండల తయారీ, రీసైకిలింగ్ వంటి వృత్తులు ధారవిలో వంద కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. ఇక్కడి నివాస ప్రాంతాల్లో కమ్యూనిటీ టాయ్లెట్లు ఉన్నాయి. ఒక్కో టాయ్లెట్ని దాదాపు 1400 మంది ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కరోనా రోగి 400 చదరపుటడుగుల విస్తీర్ణం గల ఇంటిలో 8 మంది కుటుంబ సభ్యులతో నివసించేవాడు. ఇటీవలే ఇక్కడ మసీదుని సందర్శించి పలువురు వ్యక్తులను కలిసి ప్రార్థనలు చేసిన 10 మంది తబ్లిగీ జమాత్ సభ్యులకు అతడు ఆశ్రయమిచ్చాడు. ఆ తర్వాతే అతడికి కరోనా సోకింది. దాంతో అతడు సంబంధం పెట్టుకున్న 74 మందిని క్వారంటైన్ చేశారు. భౌతిక దూరం పాటించడానికి అతికష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ఇరుకైన ప్రాంతమైన ధారవిలో వ్యక్తుల కాంటాక్టుల జాడ పట్టుకోవడం చాలా కష్టమైన పని. అందుకే పురపాలక సంస్థ వార్డు ఆఫీసర్ కిరణ్ దివాకర్ నేతృత్వంలోని టీమ్ కరోనా రోగివల్ల ప్రమాదంలో పడిన బాధితుల జాడ పట్టడానికి సులువైన వర్క్ నమూనాను రూపొందించుకుంది. ప్రాంతాలను ఐసోలేట్ చేయడం, వారికి అవసరమైన నిత్యావసర సరుకులను వారి ఇళ్లవద్దకే తెచ్చివ్వడం సాగించారు. అయితే భవనాల్లో నివసిస్తున్న వారికి ఈ మోడల్ కాస్త విభిన్నంగా ఉంటుంది. భవనాల్లో ఉంటున్నవారు ఒక మోస్తరు వ్యాధి లక్షణాలను కలి గివుంటే అలాంటివారిని తమ ఇళ్లలోనే ఉంచేస్తున్నారు. అయితే మొత్తం భవనాలను మాత్రం సీల్ చేస్తున్నారు. ఇక మురికివాడలో గుడిసెల్లో ఉంటున్నవారిని ఐసోలేట్ చేయడం అసంభవం. ఎందుకంటే ఇరుకైన ప్రాంతంలో ఇక్కడ జనాభా కిక్కిరిసిపోయి ఉంటుంది. పైగా అనేకమంది ప్రజలు తమ ఇళ్ల బయట నిద్రపోతుంటారు. పైగా ఉమ్మడిగా పారిశుద్ధ్య వసతులను ఉపయోగించుకోవడం అనేది వైరస్ వ్యాప్తికి అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. ఇక్కడ వ్యాధి సోకినవారిని వెంటనే ఐసోలేషన్కు పంపించాల్సి ఉంది. అందుకే ధారవిలోని అయిదు ఐసోలేటెడ్ ఏరియాల్లో ఫీవర్ క్లినిక్లను లేదా హెల్త్ క్యాంపులను నగరపాలక సంస్థ ఏర్పర్చింది. అనుమానిత కేసులన్నింటినీ ఇక్కడికే తీసుకువస్తున్నారు. కోవిడ్–19 కేసుల్లో పాజిటివ్గా తేలినవారితో సంబంధంలోకి వచ్చిన వారిని కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఈ క్యాంపులకు రోజుకు సగటున 50 మంది అనుమానితులను తీసుకొస్తున్నారు. ప్రతి అనుమానిత రోగిని డాక్టరు, పురపాలక అధికారి ఇంటర్వూ్య చేస్తారు. డాక్టరేమో పరీక్షలతో వైద్య ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇక పురపాలక అధికారి ఆ రోగితో సంబంధం ఉన్న వారి జాడను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్య కార్యకర్తలను స్థానిక ఎన్జీవోలు ఆ రోగితో కాంటాక్టులోకి వచ్చిన వారికోసం ఇల్లిల్లూ తిరిగి సమాచారం సేకరిస్తారు. వీళ్లందరికీ పరీక్షలు జరిపాక వారిలోని వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి వారిని ఇళ్లలోనే ఉండమని చెబుతారు. ఒక మోస్తరు లక్షణాలున్నవారిని రాజీవ్ గాంధీ కాంప్లెక్స్కు పంపుతారు. లేదా కొత్తగా నిర్మించిన సాయి హాస్పిటల్కు తీవ్రస్థాయిలో ఉన్న కేసులను పంపుతున్నారు. దాదాపు 51 పడకలు ఉన్న ఈ ప్రైవేట్ హాస్పిటల్లో 8 ఐసీయూ బెడ్లు, డాక్టర్లతో కూడి ఉంది. దీన్ని నెలకు 30 లక్షల రూపాయలకు ముంబై పురపాలక సంస్థ లీజుకు తీసుకుంది. సీరియస్ కేసులను ఇక్కడికే పంపుతున్నారు. ప్రజలను తమ ఇళ్లలోనే ఉండేలా క్వారంటైన్ చేయడం, వారి రోజువారీ రేషన్ సరుకులను ఉచితంగా అందించడం అనేది ఏకకాలంలోనే కొనసాగిస్తున్నారు. నగరంలోని వ్యాపార వర్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాల ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తోంది. ఐసోలేట్ చేసిన అన్ని ఇళ్లకూ బియ్యం బస్తాలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పలువురు ఎన్జీవోలకు చెందిన వారు కూడా ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. 150 మంది కార్మికులతో కూడిన శానిటరీ ఇన్స్పెక్టర్లు రోజూ చెత్త ఏరివేయడం, ఇళ్లలో, రూముల్లో, భవనాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడం, మురికికాలువలను క్లీన్గా ఉంచడం వంటి విధులను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు సంబంధించిన అన్ని ప్రొటోకాల్స్ని అమలు చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ క్లినిక్కులలో పనిచేస్తున్న వారు తమ ఆందోళనలను వ్యక్తపరుస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులను భారీ స్థాయిలో చేయడం అనేదే ఇప్పుడు ఏకైక కార్యక్రమంగా ఉంటున్నప్పటికీ గుడిసెల్లో ఉంటున్న వారు కరోనా వైరస్కు కేంద్రాలుగా ఉంటున్నందున ధారవి వంటి మురికివాడల్లో ప్రత్యేకించి మాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ఏర్పర్చాల్సిన అవసరం ఉందని వీరు చెబుతున్నారు. పోలీసు బలగాలు కూడా భారీ స్థాయిలో ధారవిలో మోహరించారు కానీ చిన్న చిన్నగదుల్లో నివసిస్తున్న ప్రజలను నిర్బంధంలో ఉంచటం చాలా కష్టంగా ఉంటోంది. ప్రత్యేకించి టాయ్లెట్స్ ఉమ్మడిగా ఉపయోగించుకోవడం, ఇళ్లకు బయట ఉంటున్నందున ఇక్కడి ప్రజలను అటూ ఇటూ తిరగకుండా నియంత్రించడం చాలా కష్టమైన పని అని పోలీసు అధికారులు చెబుతున్నారు. అందుకే ధారవి మురికివాడ కోవిడ్–19 విసురుతున్న పెను సవాలుకు సంబంధించి టైమ్ బాంబులాగా ఉంటోందని వర్ణిస్తే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంతవరకు ఇక్కడ చేసిన కృషి ఏమాత్రం సరిపోదు. ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజం ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతంలో వైరస్ నియంత్రణతో ఎలా వ్యవహరించాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధారవిని యథాతథ స్థితికి తీసుకురావడం ప్రభుత్వ యంత్రాంగానికి, పౌర సమాజానికి అతి పెద్ద సవాలుగా మారనుంది. సాయ్లి ఉదాస్ మన్కికర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ధారావిలో తొలి మరణం.. అధికారులు అలర్ట్
సాక్షి, ముంబై : కరోనా వైరస్ ధాటికి మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. కరోనా ప్రభావం ఈ రాష్ట్రంపై ఎక్కువగా చూపుతోంది. గురువారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా 1950కిపైగా కరోనా కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే 340 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో ఒకటిగా గుర్తింపు పొందిన మహారాష్ట్రలోని ధారావిలో గురువారం తొలి కరోనా మరణం నమోదైంది. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ముందస్తు జాగ్రత్తగా బాధితుడు నివశిస్తున్న భవంలోని అందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (కరోనా: ఆరు వారాల శిశువు మృతి) మరోవైపు గడిచిన 24 గంటల్లోనే 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో పాటు ఆరుగురు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా దేశంలోనే అతిపెద్ద మురికివాడైన ధారావిలో వ్యాధి విస్తరిస్తే అదుపుచేయడం కష్టతరమైన వైద్యులు భావిస్తున్నారు. ముంబయి మహానగరం నడిబొడ్డున ఉంది ఈ ధారావి మురికివాడ. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్ షాపులు, మురికి కాలువలతో నిండి ఉంటుంది. దాదాపు 16 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. చాలామంది ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఎగుమతికి అనువైన- నాణ్యమైన తోలు ఉత్పత్తులు, కుండలు, ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తుంటారు. ఇక్కడ జరిగే వ్యాపారం వార్షిక టర్నోవర్ రూ.4,800 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. (కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి) ధారావిలో చెత్త ఏరుకునేవారు ఎక్కువగా నివశిస్తుంటారు. పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు ఉన్నాయి. కానీ, పరిశుభ్రత మాత్రం సరిగా ఉండదు. మురికి నీరంతా వీధుల్లో పారుతూ ఉంటుంది. దీంతో వైరస్ ఈ మురికివాడకు చేరకుండా ముంబై మున్సిపల్ అధికారులు తొలినుంచీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం తొలి మరణం నమోదు కావడం అధికారులకు ముచ్చమటలు పడుతున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా ధాటికి 16 మంది మృతిచెందారు. -
ధారవిలో సినిమా కలలు
ముంబైలో పెద్ద పెద్ద యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి. చాలా మంది డబ్బున్న పిల్లలు అక్కడకు వెళ్లి యాక్టింగ్ నేర్చుకుంటారు. కాని ఆసియాలోనే అతి పెద్ద మురికివాడైన ధారవిలో కూడా ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది. ముప్పై ఏళ్లుగా అక్కడ ఒక వ్యక్తి యాక్టింగ్ గురువుగా పరిశ్రమిస్తున్నాడు. విద్యార్థులను తయారు చేస్తున్నాడు. కలలు ఎవరైనా కనవచ్చు. దాని కోసం ప్రయత్నించనూ వచ్చు అనడానికి ఇదో గొప్ప ఉదాహరణ. ధారవిలో బాగా లోపలిగా ఉండే శాస్త్రి నగర్లో బాబూరావు లాడ్సాహెబ్ అంటే తెలియని ఞవారు ఉండరు. అతని యాక్టింగ్ స్కూల్ ఇంటర్నెట్ పుణ్యమా అని దేశంలోనే చాలామందికి తెలుసు. 30 అడుగుల కిటికీ లేని గదిలో నడిచే ఆ యాక్టింగ్ స్కూల్ పేరు ‘ఫైవ్ స్టార్ యాక్టింగ్ డాన్సింగ్ స్కూల్’. దాని బయట ‘నటన, డాన్స్, గుర్రపుస్వారీ, కత్తి యుద్ధం, హైజంప్, షార్ట్ జంపింగ్, ఫైట్ చేస్తూ డైలాగ్ చెప్పడం ఎలా నేర్పబడును’ అని ఉంటుంది. లోపల ప్రవేశిస్తే చెమటలు కక్కుతూ యాభై ఏళ్ల లాడ్సాహెబ్ తన విద్యార్థులకు ఆడియో సెట్లో వినిపించే తాజా బాలీవుడ్ పాటకు డాన్స్ నేర్పుతూ కనపడతాడు. ‘ఊ.. ఎగరండి.. బాగా ఎగరండి’ అని అరుస్తూ ఉంటాడు. ‘నేను మరాఠి, భోజ్పురి సినిమాలలో గ్రూప్ డాన్సర్గా పని చేశాను. కాని నాకు బాలీవుడ్లోకి ఎలా ప్రవేశించాలో తెలియలేదు. నాకే కాదు నాలాంటి వాళ్లందరికీ ఒక గురువు కావాలి. అది నేనే అయ్యాను’ అంటాడతడు. ధారవిలో సినిమా కలలు కనే అమ్మాయిలు, అబ్బాయిలు చాలామందే ఉన్నారు. కాని వారంతా నిరుపేదల కిందే చెప్పాలి. అలాంటి వారి పాలిట లాడ్సాహెబ్ పెద్ద మార్గదర్శి కిందే లెక్క. ప్రతి ఆదివారం రెండు గంటల లెక్కన నాలుగు వారాలకు కలిపి అంటే నెలకు 500 రూపాయలు లాడ్సాహెబ్ తన ఫీజుగా తీసుకుంటాడు. ‘ఒక హీరో తయారు కావాలంటే కనీసం ఐదేళ్లు శిక్షణ తీసుకోవాలి. కాని ఇవాళ చాలామంది దగ్గర టైమ్ లేదు. అందుకే మూడు నెలలు, ఆరు నెలల కోర్సులు ఎక్కువగా ఇస్తుంటాను’ అంటాడు లాడ్సాహెబ్. పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాల కాస్టింగ్ డైరెక్టర్లు జూనియర్స్ కోసం తరచూ లాడ్సాహెబ్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఆస్పత్రిలో రోగులు, రైలు ప్రమాదంలో క్షతగాత్రులు తదితర పాత్రలకు ఇక్కడి నుంచే మనుషులను సరఫరా చేస్తుంటాడు లాడ్సాహెబ్. అతని యాక్టింగ్ స్కూల్కు ఆ ప్రాంతంలో ఆదరణ ఉంది. సినిమా రంగంలో వెలగాలని వచ్చి కార్పెంటర్లుగా, కూలీలుగా పని చేస్తున్న ధారవి వాసులు కొందరు తమ పిల్లల ద్వారా అయినా తమ కలలు నెరవేర్చుకోవాలని వాళ్లను పట్టుకొచ్చి లాడ్సాహెబ్కు అప్పజెబుతుంటారు. ‘క్లాసికల్ డాన్సులు నేర్పించొద్దు. అంతా మాస్ మసాలా డాన్స్ నేర్పించండి’ అని ఒక తండ్రి తన కుమారుడి విషయంలో దగ్గరుండి మరీ తాకీదు ఇవ్వడం అక్కడ చూడొచ్చు. దారుణమైన జీవన పరిస్థితుల్లో ఉండి కూడా, బతకడానికి ఎంతో శ్రమ చేయాల్సినా కూడా మనుషులు చిన్న చిన్న కలలు కనవచ్చని, పెద్ద పెద్ద లక్ష్యాలను చేరవచ్చని ఇలాంటి ప్రయత్నాలు చెబుతూ ఉంటాయి. వెతికితే ప్రతి శిష్యుడకీ ఒక గురువు దొరుకుతాడని లాడ్ సాహెబ్ లాంటి వాళ్లు తార్కాణంగా నిలుస్తూ ఉంటారు. ఇలాంటి పని ఎక్కడ జరుగుతున్నా మనం చెప్పట్లు కొట్టాల్సిందే. అన్నట్టు ప్రఖ్యాత కమెడియన్ జానీలివర్ ధారవిలోని కింగ్ సర్కిల్ నుంచే సినిమా స్టార్గా ఎదిగాడు. సూపర్స్టార్ కమెడియన్ అయ్యాడు. అలాంటి సక్సెస్ ప్రతిభ ఉన్న ప్రతి ధారవి స్టార్కూ దక్కాలని కోరుకుందాం. -
ఎస్బీఐ క్యాష్ వ్యాన్ను కొల్లగొట్టారు
ముంబై: ఏటీఎంలలో నగదు లేక సామాన్యులు కరెన్సీ కష్టాలు పడుతుండగా.. కొన్నిచోట్ల సిబ్బందే ఏటీఎంల నుంచి డబ్బు కాజేయడం, దొంగలు ఏటీఎంలను లూటీ చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గుర్తు తెలియని దుండగులు ఎస్బీఐ క్యాష్ వ్యాన్ నుంచి దాదాపు కోటి 50 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ ఏరియా, ముంబైలోని ధారవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎస్బీఐకు చెందిన నగదును వ్యాన్లో తీసుకెళ్తుండగా, నలుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
15 నిమిషాల్లో జీఎస్టీ..
షరతులు వర్తిస్తాయ్: రాహుల్ ముంబై: కేంద్రం తెస్తున్న వస్తు,సేవల పన్ను (జీఎస్టీ)కు మద్దతిచ్చి 15 నిమిషాల్లోనే ఆమోదం పొందేలా చేయగలమని.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే అందుకోసం తమ షరతులకు ఎన్డీఏ సర్కారు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఒకసారి సర్కారు సరేనంటే.. బిల్లు గట్టెక్కినట్లేనన్నారు. ముంబైలో మేనేజ్మెంట్ విద్యార్థులతో మాట్లాడుతూ.. జీఎస్టీని కాంగ్రెస్ తీసుకువస్తే.. ఏడేళ్లపాటు బీజేపీ దీన్ని అడ్డుకుందన్నారు. పన్నులపై పరిమితుల్లేని జీఎస్టీని ఒప్పుకోబోమన్నారు. కార్యకర్తల భేటీలో మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేశారు. మోదీ సర్కారు చాలా వేగంగా ప్రజాదరణ కోల్పోతుందన్నారు. వ్యవసాయ, ఆర్థిక, ప్రభుత్వ నిర్వహణలో ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అంటే పార్లమెంటులో 40 సీట్లు కాదని.. దేశంలో 20 శాతం ఓటు బ్యాంకు తమకుందన్నారు. -
‘ధారావి’కి మహర్దశ
సాక్షి, ముంబై: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరు గాంచిన ‘ధారావి’ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఐదు సెక్టార్లు ఉన్నాయి. నాలుగు సెక్టార్లను ప్రైవేటు బిల్డర్లు అభివృద్ధి చేయగా మిగతా ఒక సెక్టార్ పనులు స్వయంగా మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) చేపట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ధారావి ప్రాంతాన్ని అత్యధిక శాతం ప్రైవేటు బిల్డర్లు చేపట్టనుండడంతో దీని లబ్ధి ఇక్కడి నివాసులకు లభించనుంది. ఈ ప్రాంతంలో ఉన్న చిన్న, పెద్ద గుడిసె వాసులందరికి కూడా ఒకేరకంగా, ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లు లభిస్తాయి. అదే విధంగా దీని లబ్ధి వీరితోసహా బిల్డర్లు, స్థల యజమానులు, ప్రభుత్వం కూడా పొందనున్నాయి. బిల్డర్ల ద్వారా వసూలయ్యే ప్రీమియం డబ్బులు ప్రభుత్వ ఖజానాలోకి చేరనున్నాయి. ఇలా దాదాపు రూ.10 వేల కోట్లు ప్రభుత్వ తిజోరిలో జమ కానున్నాయని అంచనవేశారు. ముంబై నగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని ధారావి ప్రాంతం అభివృద్ధితోనే ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకు 2004-05లోనే ప్రభుత్వం ధారావి పునరాభివృద్థి ప్రాజెక్టు ప్రకటించింది. కాని దీనిపై అనేక వివాదాలు, రాజకీయాలు మొదలయ్యాయి. అనేక పర్యాయాలు అధ్యయనం జరిగింది. ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అనేకసార్లు టెండర్లను ఆహ్వానించి రద్దు కూడా చేశారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుతం ధారావి ప్రాంతం మొత్తం 240 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ వెలసిన 65-70 వేల గుడిసెల స్థానంలో సరాసరి 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిస్తారు. ఇళ్లతోపాటు ఇక్కడ చిన్నచిన్న పరిశ్రమలు, గార్మెంట్, వస్త్ర, జరి, నగల తయారీ తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికి సరాసరి 225 చదరపు అడుగుల గాలాలు దొరుకుతాయి. గోదాములున్నవారికి నియమ, నిబంధనల ప్రకారం నిర్మించి అందజేస్తారు. ఐదో సెక్టార్లో మాడా చేపట్టే అభివృద్ధి పనులను మార్గదర్శకంగా తీసుకుని మిగతా నాలుగు సెక్టార్ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. దీనికి ప్రజల నుంచి మాకు సమ్మతమేనని హామీ తీసుకున్నారు. ఈ సెక్టార్ పనులు పూర్తికాగానే ఒకటి నుంచి నాలుగో సెక్టార్ వరకు ప్రైవేటు బిల్డర్ల ద్వారా జరగనున్నాయి. ఇక్కడ అత్యధిక స్థలం ప్రైవేటు యజమానులదే . ఈ ప్రాజెక్టులో స్థల యజమానులకు కూడా అత్యధికంగా లాభం పొందనున్నారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్కు ఈ ప్రాజెక్టు అనుకుని ఉంది. దీంతో పనులు పూర్తయితే ఇక్కడి ఇళ్లకు బంగారం కంటే ఎక్కువ ధర పలకనుంది. ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి ముంబై: వివిధ కారణాల వల్ల అనేక ప్రాజెక్టులు ఆలస్యం అవుతుండటంపై ఆందోళన చెందుతున్న రాష్ట్ర సర్కార్ అవి కాలానుగుణంగా పూర్తయ్యేలా వివాదాల పరిష్కార విభాగాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ప్రారంభ దశలోనే కొన్ని ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నుంచి సమస్యలు రావడంతో మళ్లీ మొదటి నుంచి టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోంది. దీంతో ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమవుతున్నాయని నగరంలో సోమవారం జరిగిన మహా ఇన్ఫ్రా సమ్మిట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వివిధ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్డు అభివృద్ధి సంస్థ తొలిసారిగా బిడ్ నిర్వహించిన 2004 నుంచి 22 కిలోమీటర్ల రూ.9,630 కోట్ల ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ (ఎంటీహెచ్ఎల్) ప్రాజెక్ట్కు ఐదుసార్లు టెండర్లు నిర్వహించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా రవాణా, విద్యుత్ రంగాల్లోనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని సీఎం అన్నారు. కాగా, కార్పొరేషన్ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఎంటీహెచ్ఎల్ ప్రాజెక్ట్ అమలును ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కి కట్టబెట్టారు. అయితే ఆగస్టు ఐదున నిర్వహించిన ఈ ప్రాజెక్ట్కు ఇప్పటివరకు ఏ ఒక్కరూ బిడ్ దాఖలు చేయలేదు. దీనికితోడు వివిధ సమస్యల వల్ల వర్లి-హజీ అలీ సిలింక్, మెట్రో లైన్ టూ, త్రీ, నవీముంబై ఎయిర్పోర్టు పనులు కూడా ముందుకు కదలడం లేదు. రూ.5,100 కోట్ల వ్యయమయ్యే వర్లి, హజీ సీలింక్ ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్న ఎంఎస్ఆర్డీసీ ప్రస్తుతమున్న బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిని ఎత్తేయనుంది. సొంతంగానే ‘సీ లింక్’ ప్రాజెక్టు! సాక్షి, ముంబై: ప్రతిపాదిత ‘శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు’కు ఇటీవల చేపట్టిన టెండర్ల ప్రక్రియకు వివిధ కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రత్యామ్నాయ వేటలో పడింది. అందుకు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినివల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) ద్వారా నిధులు సేకరించి, మిగిలిన నిధులను తానే సమకూర్చుకుని ప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు సాగాలంటే జేఎన్ఎన్యూఆర్ఎం ను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ మిషన్ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల నిధులు లభించనున్నాయి. మిగతా రూ.ఐదు వేల కోట్లు ఎమ్మెమ్మార్డీయే స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సీ లింకు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలపై టోల్ భారం కొంత మేర తగ్గనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఆహ్వనించిన టెండర్ల ప్రక్రియకు గడువు ఈ నెల ఐదో తేదీన ముగిసింది. అయితే గతంలో ఆసక్తి కనబర్చిన బడా కంపెనీల్లో ఒక్క సంస్థ కూడా ఇప్పుడు టెండరు వేయలేదనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూ.పి.ఎస్.మదన్ స్పష్టం చేశారు. దాదాపు రూ.9,630 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం 22 కి.మీ. పొడవు ఉంటుంది. ఇందులో 16.5 కి.మీ. మార్గం సముద్రంపై ఉండగా మిగతాది చిర్లే ప్రాంతం వరకు నేలపై ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఐఆర్బీ ఇన్ఫ్రా, హూండాయ్, సింట్రా-సోమా, గెమన్ ఇన్ఫ్రా- ఓహెచ్ఎల్, జీఎంఆర్-ఎల్ అండ్ టీ-స్యామ్సన్, ది టాటా రియాల్టీ-ఆటో స్ట్రెడ్ ఇండియన్ ఇన్ఫ్రా-విన్సి ఇలా ఆరు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. కాని ఇందులో ఏ ఒక్క కంపెనీ కూడా టెండరు వేయలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ఈ కంపెనీలు టెండర్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఫలితం లభించలేదు. తాజాగా గత సోమవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నిధులు రాబట్టుకోవాలని ఎమ్మెమ్మార్టీయే యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.9,630 కోట్ల నిధుల్లో 50 శాతం జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా లభిస్తే మిగత నిధులు ఎమ్మెమ్మార్డీయే సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదు. నగర రహదారులపై విపరీతంగా పడుతున్న వాహనాల భారాన్ని తగ్గించేందుకు శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు తెరమీదకు వచ్చింది. అంతేకాక భవిష్యత్తులో నవీముంబైలో చేపట్టనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఎంతో దోహదపడనుంది. అయితే విమానాశ్రయ నిర్మాణం కార్యరూపం దాల్చకపోతే ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య తగ్గిపోయి టోల్ డబ్బులు రావనే ఉద్దేశంతోనే వివిధ సంస్థలు టెండర్లకు దూరంగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో జేఎన్ఎన్యూఆర్ఎం సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనే సంకల్పంతో ఎమ్మెమ్మార్డీయే ముందడుగు వేస్తోంది.