Karimnagar Crime News
-
ఈ అక్షయ పాత్రతో నీళ్లు తాగితే పాము కాటు వేసిన ఏం కాదు!
సాక్షి, జగిత్యాలక్రైం: అక్షయపాత్ర కొనుగోలు చేసి, ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారని గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. టౌన్ సీఐ జయేశ్రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్కు చెందిన కడప శ్రీనివాస్ జగిత్యాల బీట్బజార్కు చెందిన రాయిల్ల సాయికుమార్ను సంప్రదించాడు. అతను హైదరాబాద్కు చెందిన దండె కార్తీక్, బవికుమార్, మంచిర్యాలకు చెందిన బోడకుంట మురళీమనోహర్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన యాదగిరి అఖిల్కుమార్లను శ్రీనివాస్ వద్దకు తీసుకువచ్చాడు. మహిమ గల అక్షయపాత్ర తమ వద్ద ఉందని, ఇందులో నీరు పోసుకొని ప్రతిరోజూ ఉదయం కుటుంబసభ్యులందరూ తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. పాముకాటు వేసినా ఏం కాదని నమ్మించారు. పూజ గదిలో పెట్టి పూజిస్తే కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇస్తే అక్షయపాత్ర ఇస్తామన్నారు. అనుమానం వచ్చిన శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జగిత్యాల టౌన్ సీఐ జయేశ్రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ బుధవారం రావుల సాయికుమార్ ఇంటికి వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకొని, అక్షయపాత్ర స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మిగతా సభ్యులను సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. -
ప్రియుడితో కలిసి భర్తపై భార్య వేధింపులు
సాక్షి, మల్యాల(చొప్పదండి): భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక భర్త వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్యాల మండలంలోని నూకపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన అట్టపల్లి రాజు(30)కు గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో ఏడాది కిందట వివాహం జరిగింది. తర్వాత రమ్యకు తుంగూరుకు చెందిన రాజేందర్తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజుకు తెలిసింది. ఈ క్రమంలో రాజేందర్తో ఆమె చనువుగా ఉండటం చూసిన రాజు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. కొద్దిరోజుల కిందట రమ్య గర్భం దాల్చింది. తన ప్రియుడి వల్లే తాను గర్భం దాల్చానని చెప్పి, తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. ‘నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో’ అంటూ రమ్యతోపాటు రాజేందర్ ఫోన్లో తరచూ రాజును మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, నూకపల్లి శివారులోని వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వరద కాలువ వద్ద వెతకగా బైక్తోపాటు రాజు చెప్పులు కనిపించాయి. కాలువలో గాలించడంతో మృతదేహం లభ్యమైంది. తన కుమారుడి మృతికి కోడలు, ఆమె ప్రియుడే కారణమని మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గల్ఫ్ వెళ్లొచ్చినా తీరని పగ, మద్యం తాగుతుండగా..
సాక్షి, ఇబ్రహీంపట్నం(కోరుట్ల): పాతకక్షలతో వ్యక్తిని హత్య చేసిన దారుణ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో చోటుచేసుకుంది. ఎర్దండిలో బర్లపాటి రాజేశ్వర్(42) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పల్లె పోశెట్టి బుధవారం రాత్రి కత్తితో పొడిచి చంపినట్లు కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకుల వివరాల మేరకు...మృతుడు రాజేశ్వర్, పల్లె పోశెట్టిలకు 2017లో ఓ విషయంలో జరిగిన గొడవలో ఘర్షణకు పాల్పడగా రాజేశ్వర్పై కేసు నమోదైంది. అనంతరం రాజేశ్వర్ గల్ఫ్ వెళ్లి కొద్దిరోజులక్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు విషయమై పోశెట్టిని పలుసార్లు రాజీకి రావాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్షాపు వద్ద వీరిద్దరు మద్యం తాగుతుండగా మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. పోశెట్టి ఇంటికెళ్లి కత్తి వెంట తెచ్చుకొని రాజేశ్వర్ కడుపు, ముఖంపై పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సమయంలో అటుగా తండ్రికోసం వచ్చిన కూతురు దాడి దృశ్యాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు రాజేశ్వర్ను మెట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడు పల్లె పోశెట్టిపై గతంలో ఎడ్లను దొంగిలించినట్లు కేసు నమోదైందని గ్రామస్తులు తెలిపారు. కాగా పోశెట్టి భార్య పద్మ, తండ్రి నడ్పి రాజన్న, తల్లి రాజు, చెల్లెలి కొడుకు కాయిపల్లి రమేశ్ కలిసి తన భర్తను హత్యచేసినట్లు మృతుడి భార్య బర్లపాటి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గౌస్బాబా తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ధర్నా నిందితుడిని కఠినంగా శిక్షించాలని గురువారం ఎర్దండి గ్రామస్తులు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. నిందితుడు పోలీస్స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మెట్పల్లి సీఐ శ్రీనివాస్ గ్రామస్తులకు నచ్చజెప్పినా వినకపోవడంతో డీఎస్పీ గౌస్బాబా వచ్చి సముదాయించారు. మృతుడు రాజేశ్వర్ ముగ్గురు కూతుర్లు డీఎస్పీ కాళ్లపై పడి బోరున విలపించారు. తమ తండ్రిని చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. కాగా బెల్టుషాపులను మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీఎస్పీ గౌస్బాబా మాట్లాడుతూ నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని, గ్రామానికి రాకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కోరుట్ల,మెట్పల్లి సీఐలు రాజశేఖర్రాజు, శ్రీనివాస్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం ఎస్సైలు, పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
విద్యార్థినిపై లైంగిక దాడి.. ఆపై వీడియోలు తీసి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థిని(16)పై ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని భయభ్రాంతులకు గురి చేశాడు. పలుసార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడగా.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్, ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో విద్యార్థినికి దగ్గరయ్యాడు. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వీడియో, ఫొటోలు తీసి తరచూ బెదిరిస్తూ పలుసార్లు లైంగికదాడి చేశాడు. ఈ విషయమై విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ బుధవారం యువకుడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ పరిసరాల్లోని గ్రామస్తులను ఈ ఘటనపై డీఎస్పీ వివరాలు సేకరించారు. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందనే కొణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గంజాయి మత్తులో నిందితుడితో పాటు మరో ముగ్గురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. -
గోల్మాల్ గేమ్!
సాక్షి, కరీంనగర్: ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్లు ఇల్లు గుల్ల చేస్తున్నాయి. యువకులు జూదానికి ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. అప్పులు చేసి మరీ ఆడడంతో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్లైన్లో గడపడం ఈ పరిస్థితులకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచితే నష్టపోకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల్లో పొగొట్టుకున్న డబ్బులను రికవరీ చేయడానికి అవకాశముండదని పేర్కొంటున్నారు. ఆశతో అడుగు పెడుతూ.. ఆన్లైన్ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. వీరివైపు నుంచి డబ్బులు పెడుతూ ఆడుతున్నా ఇంకో వైపు ఎవరూ, ఎలా ఆడుతున్నారో కూడా తెలియకుండా గుడ్డిగా ఆడుస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో మొదలైన ఆన్లైన్ రమ్మీ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రాబట్టుకోవాలని ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది ఆన్లైన్ గేమ్స్తో అప్పుల పాలవడంతోపాటు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్లు.. ఐపీఎల్ ప్రారంభమైన రోజు నుంచి క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రమైందంటే చాలు లక్షల రూ పాయలు ఆన్లైన్లో ఖాతాలు మారుతున్నాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ బెట్టింగ్లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. యువకులు కూడా డబ్బులు బెట్టింగ్ పెట్టి నష్టపోతున్నారు. పోలీసులు బెట్టింగ్ను కట్టడి చేస్తున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్.. లాస్ కరోనాతో విధించిన లాక్డౌన్తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, అత్యవసరమయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. ఇలాంటి సమయంలో టైంపాస్ కోసం ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టడంతో తల పట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బానిస కావద్దు.. యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆన్లైన్ మోసాలు జరిగిన కేసుల్లో డబ్బులు రికవరీ చేయడం కష్టం. యువత సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలి. –వీబీ.కమలాసన్రెడ్డి, కరీంనగర్ సీపీ -
రక్తమోడిన రామోజీపేట
సాక్షి, సిరిసిల్ల: దసరా పండుగ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో రక్తం చిందింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ఊరు రణరంగమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రామోజీపేటలో ఇరువర్గాల మధ్య చాలాకాలంగా వివాదాలు ఉన్నాయి. దసరా సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒక వర్గం వారు డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తుండగా.. మరో వర్గం వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పరస్పర దాడులకు దిగారు. ఒక వర్గం వారు కర్రలతో దాడి చేసి ఏడుగురిని గాయపరిచారు. 9 ఇళ్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి దాడులు చేశారు. 11 వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రామోజీపేటకు చేరుకుని బాధితులను, సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఎస్పీ రాహుల్హెగ్డే, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ సర్వర్లు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంవారు కర్రలతో మరో సామాజిక వర్గం వారిపై దాడి చేయడం ఆందోళన కలిగించింది. -
మద్యం మత్తు గొడవ హత్యకు దారితీసింది
సాక్షి, రామగుండం(కరీనంనగర్): గోదావరిఖని గాంధీనగర్లో శుక్రవారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య మద్యంమత్తులో జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం గ్రామానికి చెందిన చెన్నూరి మధుకర్(21) మేషన్ పని చేసుకుంటూ గోదావరిఖని హనుమాన్నగర్లో నివాసం ఉంటున్నాడు. లెనిన్నగర్కు చెందిన గద్దల వంశీ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. శుక్రవారం రాత్రి గాంధీనగర్ సింగరేణి క్వార్టర్లో నివాసం ఉండే తోటి స్నేహితుడైన గడ్డం అరుణ్ అలియాస్ సోను ఇంటికి వెళ్లి మద్యం తాగారు. మద్యంమత్తులో వంశీ, మధుకర్ మధ్య మాటమాట పెరగడంతో మధుకర్పై విచక్షణారహితంగా తలపై బరువైన ఇనుప సుత్తిలాంటి వస్తువుతో గద్దల వంశీ దాడిచేసి బాదడంతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూపీ లాగుతున్నారు. సదరు సింగరేణి క్వార్టర్లో నివాసముండే అరుణ్తోపాటు, నిందితుడు గద్దల వంశీ పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి పోలీసులు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వంశీ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
ఎన్పీడీసీఎల్లో అన్న పేరుతో తమ్ముడు ఉద్యోగం
సాక్షి, రామగుండం: గోదావరిఖని చంద్రశేఖర్నగర్కు చెందిన గాదె రవీందర్ అనే వ్యక్తి తన సోదరుడు రామదాసు పేరు మీద 12 ఏళ్లుగా టీఎస్ఎన్పీడీసీఎల్లో ఉద్యోగంలో కొనసాగుతున్న విషయం విజిలెన్స్ విచారణలో తేలింది. గోదావరిఖని వన్టౌన్ సీఐ పర్శ రమేశ్ వివరాల మేరకు..గాదె రామదాసు, గాదె రవీందర్ ఇద్దరు కవలలు. పన్నెండు సంవత్సరాలక్రితం గాదె రామదాసుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ వ్యవస్థలో జూనియర్ లైన్మెన్గా ఉద్యోగంరాగా రవీందర్ ఉద్యోగంలో చేరాడు. పదోన్నతి పొందుతూ లైన్మెన్ వరకు చేరుకున్నాడు. గోదావరిఖని ఎన్పీడీసీఎల్ ఈ సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్టిఫికెట్లలో పేర్లుదిద్ది ఉద్యోగం చేస్తున్న క్రమంలో అధికారులకు అనుమానంరావడంతో ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం నిర్ధారణ కావడంతో రవీందర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. మంథని డివిజనల్ ఇంజినీర్ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ∙ -
తల్లితో గొడవపడి... మూడురోజులకు బావిలో
రామగిరి(మంథని): మూడురోజుల క్రితం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురు మృతదేహం వ్యవసాయ బావిలో తేలిన సంఘటన రామగిరి మండలం బేగంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెరుమాండ్ల రామస్వామి– దుర్గమ్మకు నలుగురు కూతుళ్లు, కొడుకు సంతానం. చిన్న కూతురు రమ్య(21) డిగ్రీ చదువుతోంది. అయితే రమ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ తగ్గపోవడంతో ఆసుపత్రికి వెళ్దామని తల్లి దుర్గమ్మ చెప్పగా, తాను రానని గత శుక్రవారం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప బంధువుల ఇళ్లలో వెతికారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన తాళ్ల రాజయ్య ఆదివారం గ్రామ శివారులోని కుమ్మరికుంట సమీపంలో గల తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా బావి నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం కనిపించింది. విషయం గ్రామంలో ప్రచారం కావడంతో రామస్వామి–దుర్గమ్మ సంఘటన స్థలానికి చేరుకుని తమ కూతురు మృతదేహామేనని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.(ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా.. ) రాయికల్లో.. రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన బోదాసు రజిత(40) ఆ దివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. వివరాలిలా ఉ న్నాయి.. రజిత చిన్నప్పటి నుంచి మూర్చవ్యాధి తో బాధపడుతోంది. వివాహమై కూతురు పుట్టగానే విడాకులయ్యాయి. ఈక్రమంలో అ నారోగ్యంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వెంకవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మలి సంధ్యలో మరణ శాసనం.. కారణాలేమిటో..?
కాయాకష్టం చేసి కుటుంబాన్ని పోషించుకున్న ఇంటి పెద్దలు.. మలి వయసులో మనుమలు, మనువరాళ్లు, కొడుకులతో సుఖసంతోషాలతో ఉండాల్సిన వారు ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబానికి శోకం మిగిల్చుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 రోజుల వ్యవధిలో దాదాపు 12 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులా.. అనారోగ్యమా.. కుటుంబ కలహాలా.. కారణమేదైనా తమకుతామే మరణ శాసనం లిఖిస్తూ ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. సాక్షి, వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో వారం వ్యవధిలో ముగ్గురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన సంగెపు మల్లారెడ్డి మే 21న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ మండలం చెక్కపల్లికి చెందిన జక్కుల దేవయ్య మే 25న నూకలమర్రి శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్లీ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లిలో అనారోగ్య కారణాలతో వృద్ధుడు మే 30న ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. అలాగే మే17న జగిత్యాల మండలం సంగంపల్లికి చెందిన దాసరి రాజమల్లు, కాల్వశ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లెకు చెందిన వృద్ధురాలు మణెమ్మ క్రిమిసంహారకమందు తాగి, మే 18న వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన లస్మవ్వ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మే 19న జమ్మికుంట రూరల్ మండలం చింతలపల్లికి చెందిన పుల్లూరి పోచమ్మ, మే 24న ఎలిగేడు మండలం దూళికట్టకు చెందిన మచ్చ రాజమల్లయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా 15రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. (రౌడీషీటర్ దారుణహత్య) కారణాలేమిటో..? వయోభారం, అనారోగ్యం, మలి వమపెలొ కుటుంబసభ్యులకు భారం కాకుండా తనువు చాలించాలనే ఆలోచనతో పలువురు వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండి నా అనే వాళ్లు లేకపోవడంతో ఇక తాము ఉండలేమనే మనోవేధన, భావనతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయా గ్రామస్తుల నోట వినిపిస్తోంది. మలి సంధ్యలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఆయా గ్రామాల్లో తోటివారిని కలిచివేస్తోంది. (పెద్ద మనసు చాటుకున్న వెటోరి ) భరోసా కల్పిస్తే.. వృద్ధాప్యంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు మేమున్నామనే భరోసా కల్పిస్తే వారిలో మనోధైర్యం కలుగుతుంది. ఆస్తితగాదాలు, మనస్పర్థలు, ప్రేమానురాగాలు లాంటి కారణాలతో వృద్ధ వయస్సులో మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు దారి తీస్తున్నాయి. – జక్కని రాజు, సైకాలజిస్టు, కరీంనగర్ ఇతరులకు భారం కావొద్దనే.. వృద్ధాప్యంలో కొంత మంది తనవల్ల ఇతరులకు ఇబ్బంది కలుగవద్దని ఆలోచిస్తు న్నారు. తను మరొకరి భారం కావద్దనే ఉద్దేశ్యంతో బలన్మరణాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న. మరొకరితో సేవలు చేయించుకోవడం ఇష్టం లేక కూడా కొంత మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నా అభిప్రాయం. – ఆనందరెడ్డి, వైద్యాధికారి, వేములవాడ -
భర్తను కాదని ప్రేమించిన వ్యక్తితో పెళ్లి.. చివరికి
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తను కాదని మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరికి వరకట్నం వేధింపులకు నిండు జీవితం బలైన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం..సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన నలువాల నర్మద (22) అనే వివాహిత యువతి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. గతంలో పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసింది. అంతలోనే భర్త, అత్త , బావలు వరకట్నం వేధింపులకు గురి చేయడంతో తల్లిగారింటికి వచ్చి ఉరి వేసుకుంది. (నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ) జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన నలువాల శ్రీనివాస్ని నర్మద ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నినెలలపాటు వీరిదాంపత్యం సాఫీగానే సాగింది. వరకట్న వేధింపులు నర్మదను కష్టాల్లోకి నెట్టాయి. భర్త శ్రీనివాస్తోపాటు, అత్త నలువాల లక్ష్మీ, బావ నలువాల అనిల్ రూ.2 లక్షలు తీసుకురావాలని వేధించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన నర్మద కుటుంబసభ్యులకు చెప్పగా పెద్దల సమక్షంలో చర్చించి కాపురం సాఫీగా సాగేలా చేశారు. అయినా వేధింపులు ఆగలేదు. మార్చిలో నాగునూర్ గ్రామంలో తల్లిగారింటికి రాగా శుక్రవారం భర్త శ్రీనివాస్ గ్రామానికి వచ్చి నర్మదను దూషించాడు. గ్రామస్తులంతా గమనిస్తుండగానే తిడుతూ ఆమెపై చేయిచేసుకున్నాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మనస్తాపానికి గురైన నర్మద ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీస్వాహనంలో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సారంగాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించారు. నర్మద భర్త శ్రీనివాస్, అత్త లక్ష్మీ, బావ అనిల్ ముగ్గురిపై మృతురాలి తల్లి అరికిల్ల శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. (‘కబీర్ సింగ్’ చూసి.. అమ్మాయిలకు ఎర! ) అదృశ్యమై...చెట్టుకు ఉరేసుకొని.. సైదాపూర్(హుస్నాబాద్): ఐదురోజులక్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఐదురోజులకు చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్లో నల్లకుంటప్రాంతంలో శుక్రవారం సంఘటన చోటు చేసుకుంది. సైదాపూర్ పోలీసులు, గ్రామస్తుల ప్రకారం..ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన చిక్కుల కొమురయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు చిక్కుల మొగిలి(35)కి పదేళ్లక్రితం హైదరాబాద్లో ఓ మహిళతో వివాహం జరిగింది. మొగిలి చిన్నప్పుడు 7వతరగతి అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఏడేళ్ల తర్వాత హైదరాబాద్లో దొరికాడు. అప్పటినుంచి హైదరాబాద్–ఎగ్లాస్పూర్ వస్తూపోతుంటాడు. (యూకేలో భారత సంతతి వైద్యుడి మృతి ) పదేళ్లక్రితం హైదరాబాద్ యువతితో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. మార్చిలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్తో ఎగ్లాస్పూర్ వచ్చారు. నెలక్రితం భార్య హైదరాబాద్ వెళ్లింది. మొగిలి మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఇంటి వద్ద గుంట స్థలం ఇటీవలే విక్రయించిన తండ్రి కొమురయ్య అప్పులు తీర్చాడు. కాగా మొగిలి మద్యానికి బానిసై ఈ నెల 25న సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి రేకొండ వైపు వెళ్లాడు. మొగిలి కనిపించడం లేదని ఈ నెల 28న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఎగ్లాస్పూర్ గ్రామ శివారులోని నల్లకుంట ప్రాంతంలో గొర్రెల కాపరులు చెట్టుకు ఉరేసుకొని మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇచ్చారు. సైదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి పిల్లలు లేరు. -
ఆత్మహత్యనా.. ఇతర కారణమా..?
కరీంనగర్క్రైం/కొత్తపల్లి(కరీంనగర్): మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గబ్బిలాలపేటలో ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి ఘటన కరీంనగర్ పట్టణంతోపాటు కొత్తపల్లి మండలం చింతకుంటలో విషాదం మిగిల్చింది. మృతికి కుటుంబ కలహాలా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి ఎలా వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? ఎవరు సహకరించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 10న కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లు ఏ కారణంతో వెళ్లారనేది మిస్టరీగా మారింది. కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న అనూష(26), సుమతి(29) మృతదేహాలు సోమవారం ఉదయం మేడ్చల్ జవహర్నగర్ పరిసరాల్లో వేలాడుతూ కనిపించగా, అనూష కూతురు ఉమామహేశ్వరి(8) బాత్రూం శుభ్రం చేసే రసాయనాలు తాగి మృతిచెంది ఉంది. ఈ నెల 10న పేదకూలీలకు కరీంనగర్ శివారు రేకుర్తిలో మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన బియ్యం పంపిణీ వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. అదే రోజు సాయంత్రం మేడ్చల్ జవహార్నగర్కు పయనమైనట్లు సమాచారం. కుటుంబ నేపథ్యం... ఖమ్మం ప్రాంతానికి చెందిన అనూషకు కరీంనగర్ కాపువాడకు చెందిన నాగరాజుతో వివాహం కాగా అదే ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం కోసం అనుమతి ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలిసింది. అనూష రెండు నెలల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది. అక్కడ పనిచేసే క్రమంలోనే జవహార్నగర్లోని గబ్బిలాలపేటలో ఒక చర్చి ఫాస్టర్ కొడుకుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే అనూష కూతురు, ఆమె స్నేహితురాలు సుమతి జవహార్నగర్కు వెళ్లడానికి కారణమైనట్లు సమాచారం. వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మోతె బానయ్య, నాగమ్మ కుటుంబం కొత్తపల్లి మండలం చింతకుంటలో నివాసం ఉంటోంది. వీరి కూతురు సుమతి డ్రైవర్ శ్యాంను ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతినగర్లో ఉండే వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి 160 కిలోమీటర్లు మేడ్చల్కు ఎలా వెళ్లారు.. ఎవరి సహకారంతో వెళ్లారు.. ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. 10న కరీంనగర్ నుంచి వెళ్లిన తర్వాత వీరి కుటుంబ సభ్యులు పోలీసులకు ఎక్కడా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. -
పథకం ప్రకారం భర్తను చంపించిన భార్య..
సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన యువకుడి దారుణ హత్య కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. పథకం ప్రకారమే మమత ఆమె ప్రియుడు సురేశ్తో తిరుపతిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో టెంట్హౌజ్ నిర్వహిస్తున్నాడు. తిరుపతి వద్ద పని చేస్తున్న సురేశ్ యజమాని భార్య మమతపై కన్నేశాడు. అప్పటి నుంచి ఇద్దరు అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ విషయం తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని మందలించడంతో అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేశ్తో కలిసి మమత పథకం రచించింది. ప్లాన్ ప్రకారం తిరుపతిని హతమార్చేందుకు సురేశ్ రూ.40 వేలకు నలుగురు వ్యక్తులతో సుపారి కుదుర్చుకున్నాడు. మమత తనకు కడుపునొప్పి వచ్చిందని భర్తను అర్ధరాత్రి బస్వాపూర్కు తీసుకెళ్లింది. అప్పటికే గ్రామశివారులో మాటువేసిన సురేశ్ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు. హ త్యను ప్రమాదంగా మార్చేందుకు మమత శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ నిజం బయటకు వచ్చింది. హత్యకేసును చేధించడంలో పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.? త్వరలో హంతకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టేనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మీకు అర్థమవుతోందా...!
సాక్షి, కోల్సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్ ప్లీజ్ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. మేం తాగాలనుకున్నది తాగేస్తామంటూ గుప్పు గుప్పుమంటూ పొగలాగేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్గా భావిస్తోంది. ప్రాణాలు తీసే పొగ... ఫ్రెండ్స్తో..కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యే సిగరేట్ తాగే అలవాటుకి బీజం పడుతోంది. ఇలా సరదాగా మొదలై..హృదయానికి “పొగ’బెడుతోంది. మొదట్లో సరదాగానే ఉన్నా తర్వాత పొగకు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కరోజు సిగరేట్ తాగకుంటే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటోందని చెబుతున్నారు. కొందరైతే రోజుకు ఒక సిగరేట్తో మొదలు పెట్టి..క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు. ప్రకటనలు ఇస్తున్నా.. అంతే ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నా..ఇదొక వినోదంలా మారిపోయింది. ధూమపానం లేని లోకాన్ని చూడగలమా..? అనే సందేహం కలుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంత నిషేధం విధించినప్పటికీ పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్ కాల్చుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ ప్రజలు పొగతాగడం ద్వారా మృత్యువాతకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏటా పది లక్షల మంది మృత్యువాత... పొగాకు మనుషులకు హాని తలపెట్టే అత్యంత ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొగ తాగడం ద్వారా ఏటా 10 లక్షల మంది బాధితులు మృత్యువాతకు గురవుతున్నారని అంచనా. పొగాకు నివారణ చర్యలు పాటించకపోతే 2030 నాటికి 10 మిలియన్ వరకు మృతుల సంఖ్య చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. బహిరంగంగానే... యువతలో సిగరేట్ ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. పాశ్చాత్య సంస్తృతికి ఆకర్షితులై “పొగ’కు బానిసవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రులు, హోటళ్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలతోపాటు బహిరంగ స్థలాల్లో పొగ తాగడం మాత్రం మానడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు ఎంతమాత్రం ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సిగరేట్లు, బీడీలు, అంబార్ తదితర పొగాకుతో కూడిన వస్తువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మైనర్లకు కూడా విక్రయించరాదని చట్టంలో ఉంది. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. క్యాన్సర్కు కారణం పొగ సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం గొంతు, ఊపిరిత్తులు, పేగు క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం తదితర జబ్బులకు గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. ధూమ ప్రియుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం సమస్యలు వస్తాయి. గుట్కాలు తీసుకోవడం ద్వారా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 20 నుంచి 60 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు ఎక్కువగా పొగాకు వాడుతున్నారని అంచనా. జరుగుతున్న మరణాల్లోనూ 90శాతం వరకు పొగాకు వాడిన వారే ఉండడం బాధాకరం. ఆరోగ్యానికి మంచిదికాదు సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటితో గొంతు, ఊపిరిత్తులు, పేగు, కడుపులో క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం, నరాల వ్యాధులు, గ్యాస్ట్రబుల్లాంటి జబ్బులకు గురవుతారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. ధూమ ప్రియుల్లో జ్ఞాపకశక్తి మందగించే సమస్యలు వస్తాయి. వీటికి దూరంగా ఉండడం మంచిది. – డాక్టర్ అహ్మద్, గయాసౌదీన్, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని చుక్కేస్తే.. చిక్కులే కరీంనగర్క్రైం : మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కితే పోలీసులు చుక్కలుచూపడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యంగా పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పోలీసుల యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఒకవైపు ట్రాఫిక్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 2018 నుంచి 2020 వరకు 19631 కేసులు నమోదు కాగా 2020 సంవత్సరం జనవరి నుంచి 2354 కేసుల నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 23 మంది లైసెన్స్లు రద్దు తరచూ మద్యం తాగి పట్టుబడిన వ్యక్తుల లైసెన్స్ల రద్దుకు రవాణాశాఖ అధికారులకు పోలీసులు ప్రతిపాదన పంపుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 23 మంది వాహనదారులకు సంబంధించిన లైసెన్స్లు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ రద్దు చేశారు. పోలీసులు అన్నివేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండడంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ విధానం అమలు కూడా ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దురుసు ప్రవర్తన, ఇతరత్రా విషయాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దోహదపడుతోంది. దడపుట్టిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మందుబాబుల్లో దడపుట్టిస్తున్నాయి. మద్యం తాగి పట్టుబడిన వారందరికీ శిక్షలు పడుతున్నాయి. ఒక రోజు నుంచి మొదలుకొని మోతాదును మించి తాగిన వాహనాలు నడిపిన వారికి మూడునెలల వరకు జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవడంతోపాటు ఎలాంటి సంబంధం లేని పాదాచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేళ్లుగా జనవరి 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో 17,277 మంది మద్యం తాగి వాహనాల తనిఖీల్లో పట్టుబడగా ఇందులో 4483 మందికి జైలుశిక్షలు, 8362 జరిమానా విధించారు. జరిమానా రూపంలో రూ.1,78,36,825లు వచ్చింది. జనవరి 2020 నుంచి మార్చి 6 వ తేదీ వరకు 2354 మంది పట్టుబడగా 464 మందికి జైలుశిక్ష, 1132 మందికి జరిమానా విధించారు. రూ.33,67,100లు జరిమానా రూపంలో వచ్చింది. అవగాహన...కౌన్సెలింగ్లు.. మద్యంతాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి పోలీసులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్లు నిర్వహిస్తూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడం లేదు. ఆన్లైన్ ద్వారా కేసు నమోదు వాహనాల తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారు గతంలో డిపార్ట్మెంట్లో తెలిసిన వారితో ఫోన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం వాహనదారులకు అలాంటి అవకాశం లేకుండా పరీక్షల్లో పట్టుబడిన వెంటనే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, బ్రీత్ అనలైజర్ చూపించిన అల్కాహల్శాతం రిపోర్టు తదితర వివరాలు ఆన్Œలైన్లో నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కన్సంట్రేషన్) ప్రమాణాల మేరకు ప్రతీ వంద మీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములకు మించి మద్యం మోతాదు దాటకూడదు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వాహనం వెంటనే స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించి, తర్వాత చార్జీషీట్ నమోదు చేసి కేసును కోర్టుకు పంపిస్తారు. కేసు తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వాహనదారుల భద్రతలో భాగంగా.. వాహనదారుల భద్రత కోసమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రమాదాలు సంభవించకముందే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా చాలామంది ప్రమాదాలబారినపడ్డారు. ట్రాఫిక్ రూల్స్ను వాహనదారులు బాధ్యతగా పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ల నిర్వహణను అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. – విబి.కమలాసన్రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష(21) మండల కేంద్రంలోని గర్ట్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఏడాది క్రితం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన ఆది మల్లేష్తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా హాస్టల్లో ఉంటూనే చదువు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అనారోగ్యంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా గదిలోనే ఉంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు అనూష రాకపోవడంతో పక్కగదిలో ఉంటున్న మరో విద్యార్థిని వెళ్లి చూడగా కనిపించలేదు. వెంటనే హాస్టల్ యజమానికి చెప్పడంతో కిటికీ పగలగొట్టి చూడగా బాత్రూంలో కాళ్లు కనిపించాయి. జారిపడి ఉంటుందని భావించారు. బాత్రూంకు గడియ పెట్టడంతో వెంటిలేటర్ నుంచి చూడగా ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రూరల్ ఏసీపీ విజయసారధి, సీఐ మహేశ్గౌడ్, ఎల్ఎండీ ఎస్హెచ్వో నీతికపంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్లో ఉన్న అనూష భర్తను కూడా రప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్తింటి వేధింపులే కారణం! అనూష మృతికి అత్తింటి వేధింపులే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఏడాది క్రితం తమ కుమార్తెకు రూ.21 లక్షల కట్నం, బంగారం ఇచ్చి సాగనంపామని, సంవత్సరం గడవకముందే ఆడపడచు, అత్త వేధింపులు మొదలయ్యాయని, మరో రూ.పది లక్షలు అదనంగా వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అనూష మరిదికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అతడికి రూ.25 నుంచి రూ.30 లక్షలు ఇస్తున్నారని, నీవు కూడా అంత కట్నం తీసుకురావాలని అనూషను ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. ఏసీపీ, సిఐ, తహసీల్దార్ మృతురాలి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి జడ మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్గౌడ్ తెలిపారు. మర్తనపేటలో విషాదం కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన జడ అనూష ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. భర్త హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం అనూష ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కరీంనగర్కు తరలివెళ్లారు. -
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం
సాక్షి, కరీంనగర్: మృగాళ్లు రెచ్చిపోయారు.. అభం శుభం తెలియని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజులు ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడడం కరీంనగర్లో కలకలం సృష్టించింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆస్పత్రికి తరలించగా.. ఈ అమానుష ఘటన గురువారం వెలుగుచూసింది. నిర్భయ, సమత కేసుల్లో నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లోని అంబేద్కర్నగర్కు చెందిన బాలిక(9) ఆదర్శనగర్లో మూడో తరగతి చదువుతోంది. తండ్రి ఆటోడ్రైవర్ కాగా.. తల్లి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. బాలికకు జ్వరం రావడంతో ఇంటి వద్ద ఉంటోంది. వీరి ఇంటికి సమీపంలో ఉండే వినోస్(20) సోమవారం బాలికను ఆడుకుందామని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం రవితేజ(18), మరో బాలుడికి చెప్పాడు. ముగ్గురూ కలిసి మంగళ, బుధవారాల్లో పైశాచికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి పోలీసులు సంబంధిత సాక్షులు, అక్కడి ప్రాంతంలో నివాసం ఉండే పలువురిని విచారించారు. మరికొందరిని పోలీసుస్టేషన్కు పిలిపించి విచారణ జరిపారు. సంబంధిత సాక్ష్యాధారాలు, ఘటన జరిగిన ప్రాంతంలో పలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పలువురు సాక్షులను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో నిందితుల అరెస్టు చూపించనున్నట్లు సమాచారం. చాలా రోజుల నుంచి కన్నేసి... భవన నిర్మాణ పనులు చేసే యువకుడు వినోస్ చాలా రోజుల నుంచే బాలికపై కన్నేసినట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో మూడు రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అభంశుభం తెలియని అభాగ్యురాలిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కరీంనగర్లో కలకలం రేపింది. పోలీసు కమిషనర్ విచారణ అంబేద్కర్నగర్లో గురువారం కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్రెడ్డి పర్యటించి విచారణ జరిపారు. అత్యాచారం జరిగిన ఇంటిని పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు, కుటుంబ సభ్యులు కమిషనర్ను కోరారు. కాగా, బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో, అత్యాచార కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ విజ్ఞాన్రావు తెలిపారు. మహిళల ఆందోళన మద్యందుకాణాల వల్లనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని నిరసిస్తూ కరీంనగర్ అబ్కారీ డీసీ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు, బీజేపీ నాయకులు, వివిధ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదర్శనగర్బోర్డు వద్ద ఉన్న మద్యం దుకాణం వద్ద మందుబాబుల ఆగడాలు మితివీురుతున్నాయని, మద్యం మత్తులోనే బాలికపై అత్యాచారం చేశారని ఆరోపించారు. అనంతరం ఆదర్శనగర్లో ఉన్న మద్యం దుకాణంపై చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తర్వాత ఆబ్కారీ టౌన్సీఐ తాతాజీకి వినతిపత్రం అందించారు. స్థానిక కార్పొరేటర్ కుర్ర తిరుపతి, కార్పొరేటర్లు జయశ్రీ, విజయ, నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అతి వేగం: ఇద్దరు యువకుల మృతి
సాక్షి, కరీంనగర్: అతి వేగం.. మద్యం మత్తు పాతికేళ్లు కూడా నిండని ఇద్దరిని బలిగొనగా.. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ శివారులో గురువారం వేకువజామున ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుకనుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్కు చెందిన వివేక్చంద్ర(20), నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్కాలనీకి చెందిన వేముల ప్రణయ్కుమార్(25), మంచిర్యాలకు చెందిన అంకరి స్వరాజ్, బియ్యాల శివకేశవ మిత్రులు. హైదరాబాద్లో ఉంటున్న మరో మిత్రుడి పుట్టిన రోజు గురువారం ఉండటంతో వేడుకలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి వీరు గౌతమినగర్లోని వివేక్చంద్ర ఇంట్లో కలుసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ బయల్దేరాలనుకున్నారు. చాలారోజుల తర్వాత కలవడంతో వివేక్చంద్ర ఇంట్లోనే అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సేవించారు. అనంతరం కారులో బయల్దేరి ఉదయం వరకు హైదరాబాద్ చేరాలనుకున్నారు. మద్యం మత్తులో ఉండటంతో స్వరాజ్ వేగంగా డ్రైవ్ చేశాడు. వివేక్చంద్ర, ప్రణయ్కుమార్, శివకేశవ నిద్రలోకి జారుకున్నారు. వేకువజామున 3:30 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. మిత్రులంతా నిద్రలోకి జారుకోవడంతో స్వరాజ్ కూడా మద్యం మత్తు కారణంగా నిద్రను ఆపుకుంటూ కారు నడిపాడు. కరీంనగర్ నుంచి 20 నిమిషాల్లో తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీకి చేరుకున్నారు. రెప్పపాటులో.. కారు రామకృష్ణకాలనీ దాటుతుండగా డ్రైవ్ చేస్తున్న స్వరాజ్కు ఒక్కసారిగా లారీ కనిపించడంతో దానిని తప్పించబోయాడు. అప్పటికే 90 కిలోమీటర్ల వేగంతో ఉన్న కారు.. రెప్పపాటులో ఎడమవైపు భాగం లారీని వేగంగా ఢీకొంటూ దూసుకెళ్లి డివైడర్ను తాకి ఆగింది. ఈ ప్రమాదంలో కారు ఎడమవైపు ముందుసీట్లో కూర్చున్న వివేక్చంద్ర, వెనుక సీట్లో కూర్చున్న ప్రయణ్కుమార్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్వరాజ్, కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. కారు అతివేగంగా లారీని ఢీకొట్టడంతో లారీ కిందభాగంలో ఉన్న స్టెప్నీ టైర్ విరిగిపోయి సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. ఇరుక్కుపోయిన మృతదేహాలు.. ప్రమాద సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ మహేశ్గౌడ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారులో ఇద్దరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఇంతలో çకరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్ రావడంతో పోలీసులు దానిని ఆపి స్థానికుల సాయంతో అతికష్టంగా క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీశారు. ఇద్దరినీ అంబులెన్స్లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు డ్రంకన్ డ్రైవ్.. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వరాజ్, శివకేశవ పరిస్థితి మెరుగ్గా ఉందని సీపీ తెలిపారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు వారికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా ఆల్కాహాల్ శాతం 87 వచ్చిందని తెలిపారు. ప్రమాదం గురించి క్షతగాత్రులను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పారని, మద్యం మత్తు, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ఎల్ఎండీ పోలీసులు పూర్తి విచారణ జరిపి నివేదిక ఇస్తారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీరని దుఖాన్ని మిగిల్చింది. సినిమాకు వెళ్లాస్తా నాన్న అని చెప్పి వెళ్లిన కొడుకు వివేక్చంద్ర మృతి చెందాడనే వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలారు. ఊరికి వెళ్తున్న అని చెప్పి వెళ్లిన భర్త ప్రణయ్కుమార్ తిరిగిరాడని తెలిసి గుండెలు అవిసేలా రోదించింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్కు చెందిన కాసారపు రమేష్రావు, అనిత దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వివేక్చంద్ర (20). హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజిలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి సినిమాకు వెళ్తున్నానని చెప్పి రాత్రి 8గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి శవవయ్యాడు. ఊరెళ్లొస్తానని చెప్పి... శ్రీరాంపూర్ కాలనీకి చెందిన వేముల సారేందర్, లక్ష్మీ దంపతుల పెద్దకుమారుడు ప్రణయ్కుమార్. తండ్రి ఎస్సార్పీ 3 గనిలో హెడ్ ఓవర్మెన్గా పనిచేసి కారుణ్య ఉద్యోగాల కింద ఆన్ఫిట్ కావడంతో ఆయన స్థానంలో ప్రణయ్కుమార్ మే, 2019లో ఉద్యోగంలో చేరాడు. జూలై 2019న పావనితో వివాహమైంది. భార్యతో కలిసి సింగరేణి క్వార్టర్స్లో నివాసముంటున్నాడు. బుధవారం రెండో షిఫ్ట్కు వెళ్లిన ప్రణయ్కుమార్ విధులు ముగిసిన అనంతరం రాత్రి 10:40లకు భార్యకు ఫోన్ చేసి తాను ఇంటికి రావడం లేదని, ఊరెళ్తున్నాని చెప్పాడు. డ్యూటీ డ్రెస్ మీదనే మంచిర్యాలకు వెళ్లి అక్కడ నుంచి స్నేహితులు వివేక్ చంద్ర, స్వరాజ్, శివకేశవ్లతో కలిసి కారులో బయలుదేరాడు. మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు బోరునవిలవిుంచారు. పరామర్శ... ప్రణణ్కుమార్ మృతిచెందిన విషయం తెలుసుకున్న గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, నాయకులు ముస్కె సమ్మయ్య, బాజీసైదా, కిషన్రావులు మృతునికి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రణయ్ స్నేహితులు భరత్రెడ్డి, అన్వేశ్రెడ్డిలు వారికుటుంబ సభ్యులను ఓదార్చారు. సినిమాకెళ్లి వస్తాడనుకున్నా నా కొడుకు ఎవరితోను పెద్దగా స్నేహం చేయడు. ఈ స్నేహితులు నాకు తెలియదు. సినిమాకు వెళ్లస్తానాని చెప్పి వెళ్లిండు. ఉదయం కరీంనగర్ నుంచి ఫోన్ అచ్చింది. రోడ్డు ప్రమాదంలో నీ కుమారుడు వివేక్చంద్ర ఉన్నాడని చెప్పడంతో నమ్మలేకపోయాను. ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు. సినిమాకు అని వెళ్లిన కొడుకు ఇలా తిరిగివస్తాడనుకోలేదని బోరున విలపించాడు. – వివేక్ చంద్ర తండ్రి రమేష్రావు, మంచిర్యాల -
తండ్రి మరణం తట్టుకోలేక..
రామగుండంక్రైం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకి గల్లంతయింది. గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఆరవెల్లి వసంతం ద్విచక్రవాహనంపై వెళ్తూ సోమవారం జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద గేదెలు అడ్డురావడంతో బైక్ పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో వసంతం మృతదేహాన్ని చెన్నూరుకు వాహనంలో తరలిస్తుండగా, కుటుంబ సభ్యులంతా కారులో ప్రయాణిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే మృతుడి కూతురు సాయిప్రియ (32) వాంతులు వస్తున్నాయని చెప్పడంతో కారుని డ్రైవర్ నిలిపివేశాడు. వెంటనే కిందకు దిగిన సాయిప్రియ కుటుంబ సభ్యులు చూస్తుండగానే హఠాత్తుగా బ్రిడ్జి పైనుంచి నదిలో దూకి గల్లంతయింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమె గల్లంతు కావడంతో వారంతా షాక్కు గురయ్యారు. రివర్ పోలీసులు గమనించి తాడు సాయంతో ప్రయత్నించినా నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో అప్పటికే ఆమె మునిగిపోయింది. రోధిస్తున్న కుటుంబసభ్యులు వసంతం మృతదేహంతో చెన్నూరు వెళ్లిపోయారు. గాలింపు చర్యలు గోదావరి నదిలోని నీటిలో దూకి గల్లంతైన సాయిప్రియ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శవంపైకి తేలితే తప్ప చేసేదేమి లేదని పేర్కొంటున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అనుకూలంగా లేదని పోలీసులు తెలిపారు. కా గా సాయిప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీగా పనిచేస్తోంది. ఘటనపై గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పరిధిలోని అల్గునూర్లో గల కాకతీయ కాలువలో జలసమాధి అయిన కుటుంబానికి సోమవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తన చెల్లెలు రాధ మృతదేహంపై పుట్టింటి పట్టుచీరను కప్పి.. తోడబుట్టిన చెల్లెను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. రాధతో పాటు సత్యనారాయణరెడ్డి మృతదేహానికి పట్టుపంచ, కోడలు వినయశ్రీ మృతదేహంపై పట్టుచీర కప్పి చివరిసారి వీడ్కోలు పలుకుతూ విషాదంలో మునిగిపోయారు. కడసారిగా కన్నీటి వీడ్కోలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో బంధం, స్నేహం ఉన్న వారందరూ అలకాపూరికాలనీలోని శాంతినిలయంలో అంత్యక్రియలు జరగడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టుకొని ఏడ్చేందుకు మృతదేహాలు కుళ్లిపోవడంతో ఆప్యాయంగా కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుదామంటే కూడా అవకాశం లేదని బంధువులు రోదించారు. అందరితో అత్మీయంగా... సత్యానారయణరెడ్డి కుటుంబం అందరితో ఆత్మీయంగా కలుపుగోలుగా ఉండేదని బ్యాంక్కాలనీలో ఆయన ఇంటి వద్ద ఉండేవారు తెలిపారు. నవ్వుతూ పలకరించేవాడని ఇరుగుపొరుగు ఉన్న వారు, వారి స్థిరాస్తి వ్యాపారం చేసే స్నేహితులు గుర్తుచేసుకొని బాధపడ్డారు. తన కొడుకు శ్రీనివాస్రెడ్డి మృతిచెందనప్పటి నుంచి మనోవేదనకు గురై రాధ పాఠశాలకు ఎక్కువగా వెళ్లడం లేదని, దాదాపుగా 80 శాతం వరకు మెడికల్ లీవ్లోనే ఉందని, ఇప్పుడు కూడా జనవరి 7 నుంచి మెడికల్ లీవ్పెట్టినట్లు మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ముగ్గురు మృతిచెందారని వార్త తెలియడంతోనే బ్యాంకుకాలనీలో మృతుల ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు తరలివచ్చారు. తాళం వేసి ఉండడంతో ఘటనస్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం జరిగే వరకూ ఉండి అలకాపూరి శ్మశానంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆత్మహత్యేనని అనుమానం..? జనవరి 25 తేదీన సుల్తానాబాద్కు చెందిన వస్త్రవ్యాపారి శ్రీనివాస్గౌడ్– స్వరూప దంపతులు ఆసుపత్రి కని వచ్చి తిరిగి సుల్తానాబాద్ వెళ్లే క్రమంలో కాకతీయ కాలువ వద్ద చేపలు కొనుగోలు చేసి తిరిగివెళ్లే క్రమంలో కాలువలో పడి మృతి చెందారు. అది జరిగినా రెండో రోజే సత్యనారాయణరెడ్డి కారు కాకతీయ కాలువలో పడటంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా సత్యనారాయణరెడ్డి బంధువులు కొందరు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు వారికి లేవని, అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదమేనని పేర్కొంటున్నారు. బ్యాంకుకాలనీలో సత్యనారాయణరెడ్డి ఇల్లు సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. జనవరి 27న మధ్యాహ్నం ఆయన దుకాణంలో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తిని పిలిపించుకొని కారులో బట్టలు, రైస్ కుక్కర్, సిలిండర్, బెడ్షీట్లతో పాటు పలు వస్తువులు పెట్టించుకున్నాడు. తర్వాత 3.15 నిమిషాలకు సత్యానారయణరెడ్డి భార్య రాధ ఫోన్లో నుంచి నర్సింగ్కు ఫోన్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని రూ.599 ప్యాకేజ్ వెయించాలని చెప్పాడు. అదే నర్సింగ్తో మాట్లాడిన చివరికాల్ కాగా, దాదాపుగా 4 నుంచి 5గంటల సమయంలో కరీంనగర్ నుంచి బయలు దేరినట్లు తెలుస్తోంది. 27 తేదీన సీసీ కెమెరాలు కరీంనగర్ నుంచి కాకతీయ కాలువ వరకు పోలీసులు పరిశీలిస్తే అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగి ఉంటుందనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. పలువురి పరామర్శ.. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంతో వారి బంధువులను పలువురు పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాడే మోశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కొట్టెపెల్లి గంగరాజు, నీర్ల శ్రీనివాస్, ఎస్టీ సంఘాల నాయకులు కుతాడి శివరాజ్, కుతాడి శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మాతంగి రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు సముద్రాల శ్రీను, దండు అంజయ్య, మధు, మాట్లా శ్యాం తదితరులు పాల్గొన్నారు. 24 గంటల్లో ఆరుగురి మరణవార్త.. 24 గంటల్లో మూడు ఘటనలకు సంబందించి మొత్తం ఆరుగురు మరణించారన్న వార్త విని కరీంనగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 16వ తేదీ ఉదయం కరీంనగర్ పట్టణం సుభాష్నగర్కు చెందిన దంపతులు శ్రీనివాస్, స్వరూప అల్గునూర్ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొట్టడంతో కారు బ్రిజ్జి కిందపడి శ్రీనివాస్ మృత్యువాతపడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనుకోకుండా జారీ పడి చనిపోయాడు. అది మరువక ముందే అదే రోజు రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తనలు కాకతీయ కాలువలో పడగా ప్రదీప్ ప్రమాదం నుంచి బయటపడగా, కీర్తన ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. వీరి ఆచూకీ కనుక్కునేందుకు కాలువ నీటి ప్రవాహం తగ్గించడంతో 17 తేదీన ఉదయం సత్యనారయాణరెడ్డి కుటుంబంతో సహా కారులోనే మృతదేహాలు కుళ్లిపోయి బయటపడటం 24 గంటల్లో ఆరుగురు చనిపోయారని వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు చర్చింకున్నారు. -
‘వినయశ్రీ లేదంటే నమ్మలేకపోతున్నాం’
సాక్షి, నిజామాబాద్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లో కారు మునిగిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వినయశ్రీ.. నిజామాబాద్లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రాక్టికల్స్ ఉన్నందున అల్వాల్ షిప్ట్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగివుండొచ్చని బంధువులు అంటున్నారు. అయితే తమ స్నేహితురాలు మరణించిందని తెలియడంతో ఆమె తోటి విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. తమతో ఎంతో స్నేహంగా ఉండే ఆప్తురాలు దూరం కావడంతో ఆవేదన చెందుతున్నారు. (రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!) చదువులో చురుగ్గా ఉండేదని, ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే వినయశ్రీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె స్నేహితులు అన్నారు. ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. ఆదివారం వినయశ్రీ పుట్టినరోజు కావడంతో మెసేజ్లు పంపించామని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి ఉంటుందని అనుకున్నామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని అన్నారు. అందరితో మంచిగానే ఉండేదని, ఆమెతో ఎటువంటి సమస్యలు ఉండేవి కాదని తెలిపారు. బర్త్డే విషెస్లకు సమాధానం ఇవ్వకపోతే తీర్థయాత్రలో బిజీగా ఉందేమో అనుకున్నాం గానీ, ఇంత బాధాకరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన చెందారు. చదువుతో పాటు అన్నిట్లోనూ ముందుండే వినయశ్రీ ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోందన్నారు. మరో 9 నెలల్లో చదువు పూర్తవుతుందనగా ఆమె ఇలా మృత్యువు బారిన పడటం నమ్మలేకపోతున్నామని వినయశ్రీ క్లాస్మేట్స్ పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాల్వలోకి దూసుకెళ్లిందా, ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. (పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) -
కారులో మూడు మృతదేహాలు..
సాక్షి, కరీంనగర్: అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లోకి కారు దూసుకుపోయి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు కెనాల్లోకి దూసుకువెళ్లిందా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కాకతీయ కెనాల్లో బయటపడింది. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. (చదవండి : పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) గత నెల 27న సాయంత్రం మూడు గంటల నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్లో ఉంది. ఆ సమయంలోనే కారు కెనాల్లో పడితే రాజీవ్ రహదారిపై వెళ్లేవారు చూసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ ప్రమాదం సాయంత్రం వరకూ జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా సత్యానారాయణ రెడ్డి ...భార్య, కుమార్తెకు తెలియకుండా ముందుగా పథకం ప్రకారమే రాత్రి సమయంలో వేగంగా కారును కెనాల్లోకి దూసుకువెళ్లేలా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనపై ట్రైనీ ఐపీఎస్ నితిక పంత్ విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోనే మూడు మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి జనవరి 27న భార్య, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి కారులో బయల్దేరారు. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దగ్గర బంధువులు. మృతురాలు రాధ ఎమ్మెల్యేకు సోదరి అవుతుంది. సత్యనారాయణ రెడ్డికి కరీంనగర్లో ఫర్టిలైజర్ షాపు ఉండగా, రాధిక స్కూల్ టీచర్. మూడేళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకును కోల్పోయినప్పటి నుంచి దంపతులు మానసికంగా కృంగిపోయారు. వైద్యం కోసం తరచూ హైదరాబాద్కి వెళ్లేవారని బంధువులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి తాళాలు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటారని భావించి విమానాశ్రయంలో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. -
భర్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబ సభ్యులు అలగనూరు వద్ద మానేరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధ మృతి చెందారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. దాదాపు 20 రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం లేదు. (దూసుకొచ్చిన మృత్యువు) బైకు కోసం నీటిని ఖాళీ చేయగా అందులో ప్రమాదానికి గురైన కారు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మూడు శవాలను బయటకు తీశారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన రాధగా గుర్తించారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి. జనవరి 27 నుంచి ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, సీపీ కమల్హాసన్రెడ్డి చేరుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని, తాజాగా కూడా అలాగే భావించామని పేర్కొన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే తమకెలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎలాంటి వివరాలు అందలేదని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
అంతు చిక్కని రాధిక హత్య కేసు
సాక్షి, కరీంనగర్ : ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో మూడు రోజుల విచారణలో ఏమీ తేలకపోవడంతో గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం కరీంనగర్ చేరుకుంది. హైదరాబాద్ సీటీ పోలీసు విభాగం నుంచి క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన బృందం కరీంనగర్ పట్టణం విద్యాగనర్లోని రాధిక ఇంటికి వెళ్లి వివిధ కీలకమైన ఆధారాలు సేకరించారు. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తర్వాత కూడా తెలుసుకునే త్రీడీ క్రైం సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫారో 3డీ స్కానర్, బాడీ ప్లూయిడ్ కిట్స్ వంటివి ఉపయోగించి పలు ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి అడిషినల్ డీసీపీ చంద్రమోహన్తోపాటు టూ టౌన్ సీఐ దేవారెడ్డిని రాధిక ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పూర్వపరాలు వివరించిన తర్వాత క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. (మిస్టరీగా మారిన రాధిక హత్య..) ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆధారాలు... హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ క్లూస్టీం బృందం రాధిక హత్య జరిగిన బెడ్రూంలో రక్తపు మరకలు పడిన చోటు, ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఆధారాలు సేకరించారు. త్రీడీ క్రైంసీన్ ఫొటోగ్రఫీ, వీడీయోగ్రఫీతో ఘటన జరిగిన ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీశారు. హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం కడిగిన స్థలం, గతంలో ఇక్కడి క్లూస్టీం సేకరించిన ఆధారాల గురించి వివరంగా తెలుసుకొనిఅవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. నూతన టెక్నాలజీతో కావాల్సిన ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. (హంతకుడు ఎవరు..?) ఆధారాలు సేకరిస్తున్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రీఫైనల్ పరీక్ష రోజే హత్య..! రాధిక హత్య జరిగిన రోజే రెండో ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు 10వ తేదీ నుంచి వారాంతం వరకు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 వరకు పరీక్ష జరిగింది. కానీ ప్రీఫైనల్ పరీక్షలకు హాజరు కాలేదు. ఒక వేళ హాజరు కావాలనుకుంటే పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలి. అంటే మధ్యాహ్నం 12 నుంచి 1గంటల మధ్య కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. రాధిక హత్య జరిగిన తీరు చూస్తే మాత్రం దాదాపుగా మధ్యాహ్నమే జరిగి ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ కళాశాలకు వెళ్లాలనుకుంటే సిద్దమమ్యేటప్పుడు హత్య గురై ఉంటుందా..? అంతకుముందే హత్యకు గురైందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు విచారణ జరిపినట్లు తెలిసింది. హంతకుడి జాడేది..? రాధిక హత్య కేసు విచారణ నాలుగవ రోజుకు చేరినప్పటికీ హంతకుడెవరో తెలియలేదు. గతంలో సేకరించిన ఆధారాలు, ఫోన్కాల్ డాటా, సీసీ పుటేజీల పరిశీలన, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడం వంటివి చేసినా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫోరెన్సిక్ నిపుణులు కేసుకు కావాల్సిన ఆధారాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. వాటి రిపోర్టుల వచ్చాక కేసు ఛేదనకు కావాల్సిన ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. హంతకుడెవరనే విషయంపై ఇటు పోలీసుల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాక ఏమైనా ముందుకు సాగుతుందో చూడాల్సిందే. చదవండి : గొంతు కోసి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య -
మిస్టరీగా మారిన రాధిక హత్య..
సాక్షి, కరీంనగర్ : ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. తెలిసిన వారే హత్య చేసి ఉంటారనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేకపోయినా... ఎవరీ దారుణానికి ఒడిగట్టారనే విషయంలో స్పష్టత రావడం లేదు. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చినా, అదెవరనే దానిపై క్లారిటీ లేదు. ఘటన జరిగి 24 గంటలు దాటినప్పటికీ, ఇంకా విచారణ పక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలువురు అనుమానితులను అదపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ చివరి వరకు వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికే చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుడెవరనే విషయం ఇంకా తెలియలేదు. ప్రేమ తిరస్కరణ నిజమేనా..? రాధిక హత్యకు ప్రేమ తిరస్కరణ కారణమనే కోణంలో పోలీసులు జరుపుతున్న విచారణలో కొత్త అంశాలేవీ వెలుగులోకి రావడం లేదని సమాచారం. అయితే అనుమానాలు మాత్రం చాలానే వ్యక్తమవుతున్నా, వాటిని నిరూపించే ఆధారాలు దొరకడం లేదని తెలిసింది. కాల్డేటా, యువతి తల్లిదంద్రులు, స్థానికులు మాటల ఆధారంగా నలుగురు అనుమానితులను అదపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. ఇందులో ఓ యువకున్ని మంగళవారం వేకువజామున 2గంటలకు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యువకుడు రాధికను ప్రేమించడం నిజమేనని ఒప్పుకొన్నప్పటికీ, హత్య చేయలేదనే చెబుతున్నట్లు సమాచారం. ఫోన్ కాల్స్లో రాధికతో ఎక్కువసార్లు మాట్లాడినది కూడా ఆ యువకుడేనని పోలీసుల విచారణలో తేలింది. రాధిక ఇంట్లో అద్దెకు ఉండి నాలుగు రోజలు క్రితం వెళ్లిపోయిన పోచమల్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిజాన్ని రాబట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇంట్లో దొంగతనంపై అనుమానాలు రాధిక హత్య కోణాన్ని విచారిస్తున్న పోలీసులకు ఆ ఇంట్లో నెలకొన్న పరిస్థితులు కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాధికను గొంతుకోసి చంపిన ఆగంతకుడు బీరువాలోని మూడు తులాల బంగారాన్ని, నగదును దొంగిలించడం ఆ తరువాత బీరువాను మూసేసి, దానికి అడ్డుగా మంచం పెట్టి వెళ్లడం ఒకెత్తయితే... రాధికను హత్య చేసిన తరువాత ఆధారాలు దొరకకుండా శుభ్రం చేయడం అనుమానాలను రేకెత్తిస్తోంది. హత్య తరువాత అంత ఓపికగా పనులు చక్కబెట్టే పరిస్థితి ఇంటి గురించి తెలిసిన వారికే తప్ప వేరేవారికి సాధ్యం కాదనే కోణంలో కూడా అనుమానిస్తున్నారు. హత్య జరిగిన వెంటనే కుటుంబసభ్యులు వ్యవహరించిన తీరుపై కూడా ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీపీ రాధికను హత్య చేసిన సంఘటన స్థలాన్ని ఇంచార్జి సీపీ సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని ఇంటి పరిసరాలు, అక్కడ ఉన్న వీధి పరిసరాలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హత్య జరిగిన విషయాన్ని అనేక కోణాల్లో ఎనిమిది బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు నలుగురు నిందితులను అదపులోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు. సమత, హాజీపూర్ ఘటనల్లో లాగే రాధిక హత్య కేసును కూడా ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దృష్టి సారించిన డీజీపీ.. రాధిక హత్య ఉదంతంపై రాష్ట్ర డీజీపీ అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఐజీతోపాటు పలువురు అధికారులు సైతం రాధిక కేసుపై దృష్టి పెట్టి పలు సూచనలు అందిస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్రెడ్డి ఎప్పటికప్పుడు కేసు విచారణ గురించి తీసుకోవాలి్సన చర్యల గురించి సూచనలు చేస్తున్నారు. తొందరగా కేసును విచారించి నిందితుడు ఎవరనే విషయాన్ని తేల్చడానికి పోలీసు యంత్రాంగం నిమగ్నమయ్యారు. సీసీ పుటేజీల పరిశీలన.. హత్య జరిగిన విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలోని రాధిక ఇంటి పరిసర ప్రాంతాలు, సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానంగా సీసీ కెమెరాల ద్వారా నిందితుడికి సంబంధించిన ఏ విషయాలూ తెలియలేదని అర్థమవుతోంది. దీంతోపాటు అక్కడి వీధుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు కాకుండా కొందరు ఇంటి యజమానులు స్వంతంగా పెట్టుకున్న సీసీ కెమెరాల డీవీఆర్లను సైతం స్వాధీన పర్చుకోవడంతోపాటు మరిన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. స్థానికులను పూర్తిస్థాయిలో విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. కాగా సీసీ కెమెరాలు చాలా వరకు పనిచేయని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గుడి వద్ద ఉన్న కెమెరా ఒక్కటే ప్రస్తుతం పోలీసులకు ఆధారంగా మారింది. లైంగిక దాడి జరగలేదు.. కాగా, రాధిక హత్యకు సంబంధించి పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో లైంగిక దాడి జరగలేదని తేలినట్లు సమాచారం. గొంతుకోయడం వల్లనే హత్య జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పూర్తయిన రాధిక అంత్యక్రియలు.. రాధిక అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం రాంనగర్ సమీపంలోని కురుమ కులస్తుల శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున బంధువులు, ప్రజలు రాధిక మృతదేహాన్ని చూడడానికి తరలివచ్చారు. వివిధ పార్టీల నాయకులు, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
తెల్లవారితే పెళ్లి చూపులు అంతలోనే..
జగిత్యాల, వెల్గటూరు/ధర్మపురి: తెల్లవారితే పెళ్లిచూపులు అంతలోనే రోడ్డు ప్రమాదంలో వచ్చిన మృత్యువు యువకుడిని కబలించిన సంఘటన విషాదం నింపింది. వెల్గటూరు మండలం కొత్తపెల్లి వద్ద స్టేట్ హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తాపడగా కారు డ్రైవరు పొడేటి భాను (32) మృతిచెందాడు. పెట్టెం సంతోశ్, చిలుక ముక్కు అశ్విన్కుమార్కు తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా ధర్మపురి ఆలయ ఉద్యోగులు. ముగ్గురు కలిసి ఆదివారం సినిమా కోసమని కరీంనగర్ వెళ్లి ధర్మపురికి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పి వాటర్ట్యాంకు వద్ద ఉన్న నీటిసంపును ఢీకొట్టి సమీపంలోని విద్యుత్స్తంభానికి బలంగా ఢీకొని బోల్తాపడింది. దీంతో కారులోని ముగ్గురు ఎగిరి బయటపడ్డారు. కారు నడుపుతున్న భాను తలకు తీవ్రంగా గాయంకావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పెట్టెం సంతోశ్ ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నాడు. మరోవ్యక్తి చిలుక ముక్కు అశ్విన్ పూజారిగా పని చేస్తున్నారు. ప్రమాదంధాటికి విద్యుత్పోల్ విరిగిపోయి లెవన్ కేవీ వైర్లు తెగిపడ్డాయి. కరెంట్నిలిచిపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్నేహితులు, బంధువులు,పూజారులు, ఆలయ ఉద్యోగులు ధర్మపురి నుంచి పెద్దసంఖ్యలో , ఘటనాస్థలానికి తరలివచ్చారు. భాను మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భాను తమ్ముడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
కుటుంబ సభ్యులకు విషం; మరో వ్యక్తితో పరారీ..
సాక్షి, గంగాధర(కరీంనగర్) : స్వీటు పదార్థంలో కుటుంబ సభ్యులకు విషం కలిపిచ్చిందో మహిళ. దాన్ని తిన్న నలుగురు స్పృహ తప్పి పడిపోగా.. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగరం ఉమ గురువారం రాత్రి సేమియా తయారుచేసింది. దాన్ని భర్త విలాసాగరం అంజయ్య, మామ రాజేశం, కొడుకు సిద్దార్థ(11), కూతురు మన్విత(4)కు వడ్డించింది. అత్త లక్ష్మికి ఇవ్వగా తినలేదు. స్వీటుతిన్న కాసేపటికే నలుగురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన ఉమ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. శుక్రవారం వేకువజామున స్పృహలోకి వచ్చిన అంజయ్య తేరుకుని విషయాన్ని అదే గ్రామంలో ఉన్న బంధువులకు చెప్పేందుకు వెళ్తుండగా.. డ్రెయినేజీలో పడి గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు నలుగురిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. మన్విత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అంజయ్య తెలిపాడు. -
తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య
సాక్షి, పెగడపల్లి(కరీంనగర్) : కుటుంబకలహాల కారణంగా అల్లారుముద్దుగా పెంచీ పెద్ద చేసిన తండ్రి.. కొడుకునే అంతమొందించిన సంఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సీఐ కిషోర్ సందర్శించారు. మృతుడి తల్లి గంగవ్వ, డీఎస్పీ వివరాల మేరకు..దోమలకుంటకి చెందిన నక్క రమేశ్–గంగవ్వ దంపతులకు కుమారుడు జలేందర్(21), కూతురు స్నేహ ఉన్నారు. ఉపాధి నిమిత్తం రమేశ్ కొన్నేళ్లపాటు దుబాయి వెళ్లి ఇటీవల తిరిగొచ్చాడు. కొద్దిరోజుల నుంచి భార్యభర్తలు రమేశ్,గంగవ్వ మధ్య డబ్బు విషయమై గొడవలు జరుగుతున్నాయి. దుబాయ్లో సంపాదించిన డబ్బు తనకు ఇవ్వకుండా తల్లిదండ్రులు, ఆడబిడ్డకు పంపించాడనే కారణంతో గొడవలు తీవ్రమయ్యాయి. కొద్దిరోజులక్రితం నుంచి రమేశ్ తన తల్లి కొమురవ్వ, తండ్రి రాయమల్లు వద్ద ఉంటున్నాడు. బుధవారం ఉదయం రమేశ్ పనులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కొడుకు జలేందర్, భార్య గంగవ్వ డబ్బు విషయమై గొడవపడ్డారు. ఈ క్రమంలో రమేశ్, తన తండ్రి రాయమల్లు సహకారంతో కత్తితో జలేందర్ను కడుపు, చాతిపై పొడిచి గొడ్డలితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడిక్కడే మృతిచెందాడు. అడ్డుగా వచ్చిన భార్య గంగవ్వ కుడివైపు పొత్తి కడుపుపై కత్తిగాటు చేయడంతో తీవ్రగాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నక్క రమేశ్ పరారీలో ఉన్నాడు. సీఐ కిషోర్ ఆధ్వర్యంలో రమేశ్, ఆయనకు సహకరించిన జలేందర్ తాత రాయమల్లుపై కేసు నమోదు చేసి అయిందని డీఎస్పీ తెలిపారు. పెగడపల్లి ఎస్సై జీవన్ వారి వెంట ఉన్నారు. కాగా మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిం దితులపై సెక్షన్ 303, 307ఆర్/విత్ 109, 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి పరిశీలించారు. హత్యకు దారి తీసిన కారణాలు పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. -
భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం
ధర్మపురి: ‘నాయకుల పలుకుబడితో నా భర్తను అణగదొక్కడానికి రౌడీషీట్ ఓపెన్ చేసిండ్రు. అవమానం భరించలేకనే శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డా’నని బాధితురాలు అనూష రోదిస్తూ తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నేరెల్ల గ్రామానికి చెందిన జాజాల అనూష(28) అదే గ్రామానికి చెందిన జాజాల రమేష్ను 2017లో ప్రేమవివాహం చేసుకుంది. వీరికి చైత్రిక(15 నెలలు) కూతురు ఉంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అనూష, ఎంపీటీసీ పదవికి రమేష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రమేష్పై 2015, 2016, 2018లో మొత్తం మూడు కేసులున్నాయని, ఏడాది క్రితం ఒకటి, ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం రెండు కేసులు కొట్టుడుపోగా మిగిలిన చిన్నపాటి కేసు కరీంనగర్లో నడుస్తోందని తెలిపింది. కొందరు నాయకులు పలుకుబడితో తన భర్తపై రౌడీషీట్ ఓపెన్ చేశారని, పలువురు పలు విధాలుగా మాట్లాడుతూ హేళన చేస్తున్నారని వివరించింది. ఈక్రమంలో మనస్తాపానికి గురై శనివారం ధర్మపురి పోలీస్స్టేషన్ ముందు క్రిమిసంహారకమందు తాగి స్టేషన్లోకి వెళ్లింది. కొంత సేపటికి కిందపడిపోగా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అవమానం భరించలేకనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. జరిగిన సంఘటనపై ఎస్సై శ్రీకాంత్ను వివరణ కోరగా అనూష భర్త రమేష్పై రౌడీషీట్ ఉందని, రైడీషీట్కు ఆత్మహత్యాయత్నానికి సంబంధం లేదని, కుటుంబకలహాలతోనే క్రిమిసంహారకమందు తాగి స్టేషన్కు రాగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పరామర్శించిన అడ్లూరి.. జగిత్యాలక్రైం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనూషను సాయంత్రం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ పరామర్శించారు. కాగా, ఆమె భర్తపై రౌడీషీట్ కేసు నమోదు చేశారని, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు బుధవారం హైదరాబాద్కు తరలివెళ్లిన డ్రైవర్ నంగునూరి బాబు గుండె ఆగింది. కరీంనగర్–2 డిపోకు చెందిన ఆయన హఠాన్మరణం కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి గ్రామంలో విషాదం మిగిల్చింది. బాబు మృతి విషయం తెలియడంతో ఆయన కుటుంబం గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. బెజ్జంకి మండలం గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన బాబు ఉద్యోగరీత్యా ఆరెపల్లిలో నివాసం ఉంటున్నాడు. కరీంనగర్–2 డిపోలో 25 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపులో భాగంగా గత 26రోజులుగా ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్లోని సరూర్నగర్లో జరిగిన సభలో పాల్గొనేందుకు తోటి కార్మికులతో కలిసి వెళ్లాడు. సభాప్రాంగణంలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. జేఏసీ నాయకులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాబుకు భార్య జయ, కుమారుడు సాయికుమార్, ఇద్దరు కూతుళ్లు దివ్య, సంధ్య ఉన్నారు. కూతురు దివ్యకు వివాహం కాగా.. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. నేడు ఉమ్మడి కరీంనగర్ బంద్ : ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ డ్రైవర్ బాబు హఠాన్మరణం చెందడంపై గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో 16 మంది కార్మికులు అమరులయ్యారని ఆర్టీసీ జేఏసీ జిల్లా నాయకులు ఎంపీ రెడ్డి, జక్కుల మల్లేశం, మనోహర్, ఎస్కె రాజు, తదితరులు విమర్శించారు. బాబు మరణం బాధాకరమని, ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. బంద్లో వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కుల సంఘాలు బంద్కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. బంద్కు పలు పార్టీల మద్దతు.. బంద్కు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, న్యూడెమోక్రసీ పార్టీలు వేర్వేరు ప్రకటనల్లో మద్దతు ప్రకటించాయి. గురువారం జరిగే బంద్లో అన్ని వర్గాల ప్రజలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పలువురి సంతాపం.. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతికి సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు శేఖర్, ఎడ్ల రమేష్, జాక్టో నేతలు, ప్రజా సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి) -
దొంగను పట్టించిన బైక్ పెనాల్టీ
మందమర్రిరూరల్(చెన్నూర్): తోటి ఉద్యోగుల కుటుంబాలతో కలివిడిగా ఉంటూ వారు లేని సమయంలో వారి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను బైక్ పెనాల్టీ పట్టించింది. పట్టుకుని ముప్పై రెండున్నర తులాల బంగారాన్ని, బైక్ను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో దేవపూర్ ఎస్సై దేవయ్య, కాసిపేట ఎస్సై భాస్కర్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మందమర్రిలోని సర్కిల్ ఇన్సపెక్టర్ కార్యాలమంలో ఏసీపీ బాలుజాదవ్ సమక్షంలో శనివారం మంచిర్యాల డీసీపీ రక్షిత కే మూర్తి వివరించారు. వివరాల ప్రకారం... తూముల శ్రీకాంత్ (29) 2013 నుంచి దేవపూర్లోని సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేసేవాడు. (ప్రస్తుతం వైజాక్లోని గాజువాకలో పని చేస్తున్నాడు). చదువుకున్న వాడు కావడంతో తోటి పనివారితో, వారి కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండేవాడు. ఈ క్రమంలో ఒక మిత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లిన సమయంలో వారి ఇంట్లోకి చొరబడి 17తులాల, మరోసారీ మరో మిత్రుడు కుటుంబ సభ్యులతో ఊరికి వెళ్లి నప్పుడు వారి ఇంట్లోని పదిహేనున్నర తులాల బంగారాన్ని దొంగిలించాడు. బాధితుల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసినా శ్రీకాంత్ మీద మాత్రం ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త బడ్డారు. ఈ విషయం ఇలా ఉంటే అదే కంపేనీలో పని చేసే మరో మిత్రుని ద్విచక్ర వాహనం కూడా దొంగిలించి కరీంనగర్ ప్రాంత వాసికి అప్పగించగా ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్వక్తి చేసిన తప్పిదం వలన రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీ ఉద్యోగి ఇంటికి (దేవాపూర్) ఫెనాల్టి రసీదు వచ్చింది. అప్పటికే వరుస దొంగతనాలు జరుగుతున్నందున్న బాధితులతో టచ్లోని ఎస్సై దేవయ్యకు బాధితుడు ఫెనాల్టీ రసీదు చూపించగా దాని లొకేషన్ వివరాలు ఆరా తీసారు. శనివారం సోమగూడం ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీకాంత్ అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దొంగతనం గురించి వివరించాడు. ఈ కేసును చేధించిన సీఐ, దేవాపూర్ ఎస్సైలను డీజీపీ అభినందించారు. -
కన్నీరుపెట్టిన వేగురుపల్లి
సాక్షి, మానకొండూర్(కరీంనగర్) : హైదరాబాద్లో ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు వెళ్లిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు విగత జీవులుగా ఇంటికి వచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. ఇంటికి చేరిన మృతదేహాలను చూసి ఊరంతా బోరున విలపించింది. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వేన్షన్లో జరుగుతున్న ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు సంతోషంగా వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడం, నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని ముగ్గురు ప్రముఖులు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో గ్రామస్తులు ఘోల్లుమన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వేన్షన్లో ఆదివారం ఓ సినిమాకు సంబంధించిన ఫ్రీ రీలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందిన మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల మల్లేశం(47), టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఆర్ఎంపీ జంగ ప్రభాకర్రెడ్డి(50), వేగురుపల్లి గ్రామపంచాయతీ ఐదో వార్డుసభ్యుడు అలుగువెల్లి జనార్ధ్దన్రెడ్డి(40), టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నిట్టురు పుల్లయ్య(40), పెరుమాల్ల గోవర్ధన్(38), కోల శంకరయ్య(55), కారు డ్రైవర్ పబ్బతి దేవేందర్రెడ్డి(35)లు ఓకే గ్రామానికి చెందినవారు. కారు కిరాయికి మాట్లాడుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం కారులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా సుమారు 12 గంటల సమయంలో ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకుంట్ల మల్లేశం, జంగ ప్రభాకర్రెడ్డి, అలుగువెల్లి జనార్ధన్రెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. గాయపడినవారిని స్థానికులు సికింద్రబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వేగురుపల్లికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులరోదనలు మిన్నంటాయి. కుటుంబానికి పెద్ద దిక్కు.. అలువెల్లి జనార్థన్రెడ్డి మృతితో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. మృతుడికి భార్య శైలజ, ఇంటర్ చదివే రుచిత, విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి.. కనుకుంట్ల మల్లేశం మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడిగా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి రాజకీయంగా ఎది గాడు. నాడు అతడి భార్య స్వరూప సర్పంచ్ ప దవి అలంకరించి అనారోగ్యంతో మృతిచెందగా నేడు కోడలు సంగీత సర్పంచ్. మృతుడికి కూతురు సౌమ్య, కుమారుడు అభిలాష్, రెండో భార్య బుజ్జమ్మ ఉన్నారు. సీనియర్ నాయకుడిగా.. మృతిచెందిన జంగ ప్రభాకర్రెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నాడు. ఇతడు మంత్రి ఈటలకు బంధువు, అత్యంత సన్నిహితుడు. మృతుడి భార్య వనజ ఉంది. ఇద్దకు కుమారులు కాగా ఒకరు వైద్య వృత్తిలో, మరొకరు సాప్ట్వేర్ ఇంజనీరుగా రాణిస్తున్నారు. ప్రభాకర్రెడ్డి ఆర్ఎంపీగా కొనసాగుతున్నారు. మంత్రుల పరామర్శ ప్రజ్ఞపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగురుపల్లికి చెందిన ముగ్గురు మృతిచెందగా, బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజందర్ మృతదేహాలకు నివాళులు అర్పించి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జెడ్పీ చైర్ పర్సన్ విజయ, స్థానిక ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు తదితరులు నివాళులర్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి దిగ్భ్రాంతి.. వేగురుపల్లి గ్రామస్తులు ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ సానుభూతి వ్యక్తం చేశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నివాళులర్పిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, తదితరులు -
అనుమానిస్తున్నాడని చంపేసింది?
సాక్షి, వేములవాడ: అనుమానం..వేధింపులు పెరిగిపోవడంతో భర్తను భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతనెల21న అగ్రహారం గుట్టల్లో వ్యక్తి శవమై కనిపించిన లక్ష్మణ్ (27)ను అతడి భార్య మౌనిక (25)నే కడతేర్చిందని ఆరోపిస్తూ గురువారం వీర్నపల్లి గ్రామస్తులు వేములవాడ పోలీస్స్టేషన్ను ముట్టడించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం... వీర్నపల్లికి చెందిన మంచాల లక్ష్మణ్ (27) ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లాడు. నాలుగేళ్లక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న క్రమంలో సెల్ఫోన్లో సంభాషణపై దృష్టి పెట్టాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని, ఎవరితో నీకు సంబంధాలు ఉన్నాయని, నీకు వ్యాధి సోకిందని నిత్యం వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. తనకు చెకప్ చేయించాలని మౌనిక భర్తను ప్రాధేయపడింది. లక్ష్మణ్కు భార్య మౌనిక ప్రవర్తనపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం గొడవలు జరగడం కొనసాగాయి. ఈ క్రమంలో గతనెల16న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనంకోసం లక్ష్మణ్, మౌనికతోపాటు కుమారుడు, కూతురు వెళ్లారు. అంజన్నను దర్శించుకుని వేములవాడకు చేరుకుని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. 17న ఉదయం ఇద్దరు పిల్లల్ని లాడ్జి వద్దనే ఉంచి భార్యభర్తలిద్దరూ అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భర్తతో చనువుగా మాట్లాడుతూ అగ్రహారం గుట్టపై ఉన్న క్వారీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మద్యంలో తాను వెంట తెచ్చిన గడ్డి ముందు కలిపి లక్ష్మణ్కు తాగించి గుట్టపైనుంచి నెట్టేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. మంచాల లక్ష్మణ్(ఫైల్): గతనెల 21న అగ్రహారం గుట్టల్లో లభ్యమైన మృతదేహం అనంతరం వీర్నపల్లికి చేరుకున్న మౌనిక తన భర్త లక్ష్మణ్ తిరిగి గల్ఫ్కు వెళ్లాడని చెప్పింది. అనుమానం వ్యక్తం చేసిన లక్ష్మణ్ కుటుంబసభ్యులు, బంధువులు మౌనికపై ఒత్తిడి పెంచారు. పలుమార్లు హెచ్చరించడంతో గతనెల 29న పోలీస్స్టేషన్లో తన భర్త లక్ష్మణ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు 30న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మౌనికను విచారణ చేపట్టగా జరిగిన విషయం పోలీసులకు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు వేములవాడలోని పలు ప్రాంతాలను గురువారం పరిశీలించినట్లు తెలిసింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వీర్నపల్లి గ్రామస్తులు ఠాణా నుంచి వెళ్లిపోయారు. కాగా హత్య ప్రమేయంలో మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎవరేది పోలీసులు విచారిస్తున్నారు. -
'ఆఫర్' అని.. అడ్డంగా ముంచారు!
సాక్షి, ధర్మపురి: ‘హలో సర్.. మేము ఫలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఈ రోజు మా లక్కీడ్రాలో విజేతగా నిలిచారు.ఆరువేల సెల్ఫోన్ మూడు వేలకే అందిస్తున్నాం’ అంటూ అవతలి నుంచి ఓ అమ్మాయి ఫోన్ చేయగానే సరే పంపించండి అంటూ సంతోషపడుతున్న అమాయకులు నిం డా మునుగుతున్నారు. చెప్పిన వస్తువులకు బదులు వేరే వస్తువులు వస్తుండడంతో లబోదిబోమంటున్నారు. వెల్గటూరు మండలం ఎండపల్లిలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బాధితులు వివరాల ప్రకారం.. వెల్గటూరు మండలం ఎండపెల్లికి చెందిన సింహరాజుల సత్యనారాయణకు నాలుగురోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ ఫోన్కాల్ వచ్చింది. ‘మీ ఫోన్ నంబరుకు జే–7ఫోన్ ఆఫర్ ఉంది. దీని విలువ రూ.6000కాగా ఆఫర్లో మీకు రూ.3150 వస్తోందని’ చెప్పారు. నమ్మిన సత్యనారాయణ పంపిచమన్నాడు. తనకు ఎలాగు సెల్ఫోన్ ఉందని తన స్నేహితుడు శివకు లేదని ఆలోచించి అతడిని ఈ ఫోన్ను తీసుకొమ్మన్నాడు. శుక్రవారం పార్సిల్ వచ్చింది. శివ రూ.3,150 చెల్లించి పార్సిల్ స్వీకరించాడు. విప్పిచూడగా ఫోన్కు బదులు వెజిటేబుల్ కట్టర్ ఉంది. దీంతో సత్యనారాయణ, శివ కంగుతిన్నారు. వెంటనే పార్సిల్పైఉన్న నంబరుకు కాల్ చేశారు. 24గంటల తరువాత ఫోన్చేస్తే.. వివరాలు తెలియజేస్తామని అవతలి వైపునుంచి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తల పట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కంపెనీకి చెందిన ఫోన్కాల్ గొడిసెలపేట గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు తంగళ్లపెల్లి చక్రపాణికి వచ్చింది. ఆయన కూడా జే–7ఆఫర్ ఫోన్బుక్ చేసుకున్నారు. ఎండపెల్లిలో మోసం జరిగిందని తెలుసుకుని పార్సిల్ను విప్పకుండానే వెనక్కి పంపించాడు. -
పెద్దబొంకూర్ వీఆర్ఏ సస్పెన్షన్
సాక్షి, పెద్దపల్లి: భూమిలేని నిరుపేదలకు పం చాల్సింది పోయి వీఆర్ఏగా పనిచేస్తున్న వ్యక్తే తన పేరిట ప్రభుత్వభూములను అక్రమ పద్ధతుల్లో పట్టా చేసుకున్న సంఘటన పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ ఎంపీటీసీ మిట్టపల్లి వసంత సమాచారహక్కు చట్టం ప్రకారం సద రు భూములకు సంబంధించిన వివరాలు కోరడంతో రెవెన్యూ అధికారులు చేసేదేమీలేక సదరు వీఆర్ఏ పేరిట ఉన్న పట్టాదారు పాసుబు క్కులను రద్దు చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దబొంకూర్ గ్రామంలోని సర్వే నంబర్ 325/16/1లో ఎకరం, సర్వేనంబర్ 485/20/1లో 20గుంటలు, 590లో 19 గుం టలు, 592లో 12గుంటలు, 620లో 16గుంట లు, 622లో 11గుంటలు, 649లో 14గుంటల భూమిని అక్రమంగా తనపేరిట రాయించుకు ని పాసుబుక్కు నంబర్ టీ20100190237 పొందినట్టు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాసుపుస్తకాలను రద్దు పర్చినట్లు ప్రకటించారు. వీఆర్ఏ రాయమల్లును సస్పెం డ్ చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ రాజనరేందర్గౌడ్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అంది స్తున్న రైతుబంధు పథకం కింద పొందిన పె ట్టుబడి సాయాన్ని కూడ రికవరీ చేసేలా సం బంధిత అధికారులకు సూచించామని పేర్కొన్నారు. కాగా పెద్దబొంకూర్లో రెవెన్యూ సం బంధమైన అవకతవకలు అనేకంగా జరిగా యని, ఈ విషయమై జిల్లాకు సంబంధంలేని అధికారులతో బహిరంగ విచారణ జరిపితే అ నేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎంపీటీసీ వసంత కోరారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ భూములను భూముల్లేని పేదలకు పంచాలని ఆమె కోరారు. సుల్తాన్పూర్ పంచాయతీ కార్యదర్శి.. పెద్దపల్లిఅర్బన్: విధులల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తు కలెక్టర్ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి డి.సంపత్ కృష్ణారెడ్డి విధులకు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం సంపత్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. -
ప్రేమపాశానికి యువకుడు బలి..!
సాక్షి, వేములవాడ: ప్రేమపాశానికి ఓ నిండు ప్రాణం బలైంది. యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు ఆ ఇంటి పరిసరాల్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన దారుణ ఘటన రుద్రంగి మండలం మానాల శివారులోని హన్మాన్తండాలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులే యువకుడిని చంపారని ఆరోపిస్తూ.. అమ్మాయి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. గ్రామస్థుల క థనం ప్రకారం.. దెగావత్తండాకు చెందిన కున్సోత్ సురేందర్(19) హన్మాన్ తండాకు చెందిన యువతి(17)ని ప్రేమిస్తున్నాడు. ఆమె ఇంటికి శనివారం రాత్రి స్నేహితుడు పవన్తో కలిసి వెళ్లాడు. అప్పటి నుంచి సురేందర్ అదృశ్యమయ్యాడు. యువకుడి కోసం తల్లి బుజ్జి, సోదరులు, తండావాసులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో సదరు యువతి కుటుంబసభ్యులపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పొలంలో మృతదేహం.. హన్మాన్ తండా శివారులోని పొలంలో సోమవారం సురేందర్ మృతదేహం లభించింది. పొలానికి అమర్చిన కరెంటు తీగ తాకి మరణించినట్లుగా ఉంది. సురేందర్ ఒంటిపై గాయాలున్నాయి. సదరు యువతి ఇంటి సమీపంలో శవం లభించడంతో యువతి కుటుంబసభ్యులే సురేందర్ను చంపారని ఆరోపిస్తూ దెగావత్ తండా వాసులు ఆందోళనకు దిగారు. సురేందర్ తండ్రి గంగాధర్ గల్ఫ్లో ఉండగా సురేందర్ అదృశ్యమై తెలిసి సోమవారం గల్ఫ్ నుంచి వచ్చాడు. ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉండగా సురేందర్ చిన్నోడు. కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ పాశానికి యువకుడు బలి కావడం గిరిజన తండాల్లో విషాదం నింపింది. అట్టుడికిన తండా.. సురేందర్ శవం లభించడంతో మానాల తండాలు అట్టుడికాయి. యువకుడి చావుకు అమ్మాయి కుటుంబసభ్యులే కారణమని వారి ఇంటిపై దాడికి యత్నించారు. వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, సీఐలు విజయ్కుమార్, శ్రీనివాస్చౌదరి, ఐదుగురు ఎస్సైలు పోలీసు బలగాలతో చేరుకొని గిరిజనులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఒక దశలో పోలీసు బలగాలను తోసుకొని వెళ్లి యువతి ఇంటిపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని «ధ్వంసం చేస్తున్న వారిని కట్టడి చేశారు. యువతి ఇంటిపై దాడి చేస్తున్న మహిళలు అనుమానాస్పద కేసు నమోదు.. సురేందర్ మృతిపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరమణ హామీ ఇచ్చారు. సురేందర్ను ఎవరైనా హత్య చేశారా..? విద్యుత్ షాక్తో మరణించాడా విచారణలో తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. యువతి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు సోమవారం రాత్రి వరకు ఆందోళన కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న గిరిజనులతో పోలీసుల సంప్రదింపులు కొనసాగుతున్నాయి. -
మందలించిన మామను హత్య చేసిన అల్లుడు
సాక్షి, మంథని: కాపురంలో కలహాలు లేకుండా కూతుర్ని బాగా చూసుకోవాలని మందలించిన మామను.. అల్లుడు హత్యచేసిన సంఘటన మంగళవారం రాత్రి మంథని మండలం బిట్టుపల్లి గ్రా మంలో జరిగింది. మంథని సీఐ మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొబ్బిల లక్ష్మయ్య(55)కు భార్య, కూతురు, ఇద్దరు కూమారులు. 2006లో కూతురు సుమలతను పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన బాసనేని శ్రీనివాస్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెండ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. ఈక్రమంలో పదినెలల క్రితం భార్యాపిల్లలతో వచ్చి అత్తగారి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివా సముంటున్నాడు. తాగుడుకు బానిసైన శ్రీనివాస్ ఈమధ్యకాలంలో సుమలతను కొట్టడంతో ఆమె తండ్రి, తల్లి, సోదరులు వెళ్లి అడిగే క్రమంలో ఇరువురి మధ్య ఘర్ణణ జరిగింది. బావమరిది మహేశ్ మూలంగా తన తలకు గాయమైందని శ్రీనివాస్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ గొడవ జరిగినప్పటి నుంచి అత్తింటివారిని చంపుతానని శ్రీనివాస్ బెదిరించేవాడు. మంగళవారం రాత్రి పనికి వెళ్లి వచ్చిన శ్రీనివాస్ అత్తింట్లో ఉన్న భార్యాపిల్లలను తను అద్దెకు ఉండే గది రావాలని కబురు పంపడంతో మామ లక్ష్మయ్య వారిని దింపి వెళ్తున్నాడు. ఈక్రమంలో పాత కక్షను మనసులో పెట్టుకున్న శ్రీనివాస్ ఒంటరిగా ఉన్న మామపై గుర్తుతెలియని ఆయుధంతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పారిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రవర్తన సరిగా లేనందుకే..
సాక్షి, రామడుగు(కరీంనగర్) : మహిళను దారుణంగా హత్యచేసిన నిందితులను చొప్పదండి సీఐ రమేశ్, రామడుగు ఎస్సై రవికుమార్ సంఘటన జరిగిన పన్నెండు గంటలలోపే అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్కు తరలించారు. రామడుగు పోలీసుస్టేషన్లో హత్య వివరాలను వెల్లడించారు. మండలంలోని వెదిర గ్రామపంచాయతీ పరిధిలో గల రాజాజినగర్లో రాగమల్ల అమల కొద్ది రోజులుగా బిర్యాని సెంటర్ను నడిపిస్తోంది. ఆదివారం రాత్రి హోటల్ మూసివేసే సమయంలో ముగ్గురు వ్యక్తులు వాహనంపై వచ్చి దారుణంగా హత్యచేసి పారిపోయారు. సంఘటనపై స్పందించిన పోలీసులు అనుమానితుల ఫోన్నంబర్లను ట్రేస్ చేసి సోమవారం ఉదయం వెలిచాల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినవారిలో మృతురాలి సోదరుడు రామంచ అనిల్తో పాటు శేఖర్, ప్రమోద్రెడ్డి ఉన్నారు. అమలకు సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన స్వామితో వివాహం జరిగింది. అమల సోదరుడు అనిల్, స్వామి సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమల ప్రవర్తన సరిగా లేదని భర్త స్వామి విడాకులు తీసుకున్నాడు. దీంతో భర్తను వదిలేసి కొద్దిరోజులు రేకుర్తిలో హోటల్ నడిపి ఇటీవలే రాజాజినగర్లో బిర్యాని సెంట ర్ను ప్రారంభించింది. అమల ప్రవర్తన సరిగా లేక పోవడంతో పాటు, తనభార్యను ఇష్టానుసారంగా తిట్టడం, ఆస్తిలో వాటా అడుగుతోందని కోపం పెంచుకున్న అనిల్ హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. రేకుర్తిలో ఒకసారి ప్రయత్నిం చగా విఫలం కావడంతో కొత్తపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. కాగా ఆదివారం రాత్రి తన స్నేహితులు శేఖర్, ప్రమోద్రెడ్డిలతో రాజాజినగర్ చేరుకున్నాడు. బిర్యాని సెంటర్ మూసివేస్తున్న తరుణంలో ముగ్గురు కత్తులతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
వీడు మామూలోడు కాదు..
సాక్షి, కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన బాలుడు(17) తన పదమూడో యేటా పనిచేస్తున్న స్థలంలో తన సెల్ఫోన్ చోరీకి గురైంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు అదే ప్రాంతంలో 30నుంచి 40 వరకు సెల్ఫోన్లు చోరీచేసి తన మకాం హైదరాబాద్కు మర్చాడు. సెల్ఫోన్లు అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశాడు. దొంగతనాన్నే వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన తన స్నేహితుడు కుందారపు సాయివర్మ(19)ను కలిశాడు. విషయం చెప్పి మకాంను హుస్నాబాద్కు మర్చాడు. సాయివర్మతో పాటు అదే ప్రాంతానికి చెందిన మురిమురి రంజిత్(38), ఎల్వకా సాయిరాం(19), బైరి రాజు(26),విలాసాగరం రజనీకాంత్(19),ఎనగందులనాగరాజు(31)తో కలిసి ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. యూట్యూబ్లో చూస్తూ.. తన చోరీలకు అధునాతన టెక్నాలజీని వాడుకోవాలనుకున్నాడు. యూట్యూబ్లో దొంగతనాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ తన ముఠా సభ్యులకు సైతం శిక్షణ ఇచ్చాడు. ఎలాంటి ఇంటి తాళమైనా రెండు నిమిషాల్లో తీసే నేర్పు సంపాదించారు. పట్టణాలే టార్గెట్.. వీరు చోరీ చేసేందుకు పట్టణాలనే ప్రధానంగా ఎంచుకుంటారు. మధ్యాహ్నం ఆ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు.తాళం వేసిఉన్న ఖరీదైన భవంతులు గుర్తిస్తారు. అదే ప్రాంతంలో సెకండ్షో సినిమాకు వెళ్తారు.తిరిగి వెళ్లేప్పుడు చోరీ చేసే ఇంటికి వెళ్లి రెండు నిమిషాల్లో తాళం తీస్తారు. అందినకాడికి దండుకుని, పోలీసులకు క్లూస్ దొరకకుండా వాళ్లు తిరిగిన ప్రాంతమంతా కారంపొడి చల్లుతారు.చోరీ చేసిన సొత్తు అమ్మగా వచ్చిన దాంతో జల్సాలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో12, సిద్దిపేట జిల్లాలో10, సిరిసిల్ల జిల్లాలో 4, వరంగల్ జిల్లాలో5 మొత్తంగా 31చోరీలు చేశారు. ఇందులో హుస్నాబాద్ ఎమ్మెల్యే అధికార కార్యాలయంలో కూడా కెమెరాలు చోరీ చేయడం కొసమెరుపు. ఇలా చిక్కారు.. కరీంనగర్ జిల్లాలో ఒకే పద్ధతిలో కారంపొడి చల్లుతూ జరిగిన దొంగతనాల విషయమై సీపీ కమలాసన్రెడ్డి దృష్టిసారించారు. సీసీఎస్ ఏసీపీ పర్యవేక్షణలో సీఐ ఎర్రల కిరణ్ ఆధ్వర్యంలో సైబర్ల్యాబ్ ఇన్చార్జి మురళిని కలుపుకుని బృందాన్ని ఏర్పాటు చేశారు. పలు సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్నారని అందిన పక్కా సమాచారంతో అల్గునూరు వద్ద పట్టుకున్నారు. తమదైన పద్ధతిలో విచారించగా నాలుగు జిల్లాల్లో 31చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారినుంచి రూ.23లక్షల విలువైన 53 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండి, ఐదుబైక్లు, ఐడుమొబైల్స్, రెండు ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నారు. రివార్డులు అందజేత.. రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగలముఠాను పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, తిమ్మాపూర్ సీఐ కరుణాకర్, ఎస్సై నరేష్రెడ్డి, సైబర్సెల్,ఐటీకోర్ టీం ఇన్చార్జి మురళి, సీసీఎస్ ఎస్సై కనకయ్య, ఏఎస్సై వీరయ్య, శ్రీనివాస్, హసన్, నరేందర్, అంజయ్య,పాల్, యాసిన్,లక్ష్మిపతి,సాగర్, షరీఫ్, సిబ్బందిని సీపీ కమలాసన్రెడ్డి అభినందించి రివార్డులు అందించారు. -
మంత్రాలు చేస్తుందని చంపేశారు
సాక్షి, వేములవాడ : మంత్రాల నెపంతో హత్యకు గురైన వృద్ధురాలు లచ్చవ్వ కేసు ఎట్టకేలకు వీడింది. మంత్రాలు చేయడం వల్లనే తమ కుటుంబం మొత్తం అనారోగ్యం బారినపడుతున్నారని, తమ తమ తల్లిదండ్రులు చనిపోయారని భావించి పండుగ లచ్చవ్వ(75)ను గత డిసెంబర్ 26న అర్ధరాత్రి గడ్డపారతో అతి కిరాతకంగా హత్య చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని సంకెపల్లి గ్రామంలో గత డిసెంబర్ 26న జరిగిన హత్య కేసు వివరాలను మంగళవారం వేములవాడ రూరల్ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ లచ్చవ్వను హత్య చేసిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు అనే సోదరులను మంగళవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. హత్యకు సహకరించిన ఎండీ షబ్బీర్, పండుగ నర్సయ్య, జింక అంజయ్య, జింక రాజు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పండుగ లచ్చవ్వ అనే వృద్ధురాలు మంత్రాలు చేయడం వల్లే కుటుంబం మొత్తం అనారోగ్యంబారిన పడుతుందని భావించిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు మరో నలుగురి సాయంతో లచ్చవ్వను హత్య చేయాలని పథకం రూపొందించారన్నారు. ఇందుకు వీరంతా కలిసి గడ్డపార, ఇసుపరాడ్డు, కత్తితో అతికిరాతకంగా లచ్చవ్వను చంపేశారని, జరిగిన హత్యపై సమాచారం అందకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారిందన్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, పరిస్థితులను బేరీజు వేసుకున్న వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, టౌన్ సీఐ ఎన్.వెంకటస్వామి బృందం టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకునేందుకు కృషి చేశారన్నారు. మొబైల్ కాల్డాటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారన్నారు. వీరిని పట్టుకు నేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని చాలాప్రాంతాలను వెతకాల్సి వచ్చిందన్నారు. హత్య కేసుతోపాటు బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు, ఎండీ షబ్బీర్పై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. హత్య కేసును ఛేదించిన టౌన్ సీఐ వెంకటస్వామి బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి రివార్డులు అందిస్తామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ రఘుచందర్, పోలీసులు పాల్గొన్నారు. ముఢనమ్మకాలను నమ్మొద్దు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినప్పటికీ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని, ఇలాంటి వాటి ఉచ్చులో పడి మోసపోవద్దని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడితే వారి జీవితాలు, కుటుంబాలు వీధిన పడతాయని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణప్రాంతాల్లో మూఢనమ్మకాలపై తమ పోలీసు బృందాలు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నాయన్నారు. విద్యావంతులు, మేధావులు, యువతరం ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. -
బాలుడ్ని తప్పించబోయారు కానీ అంతలోనే..
సాక్షి, మానకొండూర్ : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారు గుండ్లపల్లి మూలమలుపు వద్ద సైకిల్పై వెళ్తున్న ఓ బాలుడ్ని తప్పించబోయి అదుపుతప్పింది. బాలుడ్ని.. రోడ్డు పక్కనే ఉన్న ఓ రాజకీయపార్టీ జెండాగద్దెను ఢీకొట్టి సమీపంలోని కిరాణాషాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడి కాలు విరిగింది. కారులో ఏడుగురు ఉండగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు.. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదా వరిఖనికి చెందిన నర్సింగ్భూషణ్ అతడి తండ్రి వెంకటాచారి, తల్లి సరోజ, భార్య స్వరూప, కుమారుడు సంచీద్రచారీ, మామ ఉప్పుల రామబ్రహ్మం, అత్త విజయలతో హైదరాబాద్లోని ఓ శుభకార్యానికి కారులో వెళ్లారు. సోమవారం వేకువజామున తిరుగుపయనమయ్యారు. ఉదయం ఏడుగంటలకు గుండ్లపల్లికి చేరుకున్నారు. రాజీవ్ రహదారి పక్కన స్టేజీ మూలమలుపు వద్ద సైకిల్పై కారీలు విక్రయించే సుబ్ఖాన్ను తప్పించబోయి కారు అదుపుతప్పి బాలుడితో పాటు ఓ రాజకీయపార్టీ జెండా గద్దెను ఢీకొట్టింది. కారువేగంగా ఉండటంతో పక్కనే ఉన్న కిరాణషాపులోకి దూసుకెళ్లింది. బాలుడు సుబ్ఖాన్ కాలు విరిగింది. కారులోని నర్సింగ్భూషణ్తో పాటు భార్య స్వరూప, ఆత్త విజయలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు, టోల్ప్లాజా సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన కారును కిందకు దించారు. క్షత్రగాతులను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కిరాణాషాపు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో షాపు తెరవకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపు నిర్వాహకుడు పబ్బతి ఆంజనేయులు ఫిర్యాదుతో ఎస్సై వంశీకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు
సాక్షి, గోదావరిఖని : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. రామగుండం అడిషనల్ డీసీపీ అశోక్కుమార్ కమిషనరేట్లో శనివారం వివరాలు వెల్లడించారు. రామగుండం మండలం రాయదండికి చెందిన గుమ్మాల వసంతకుమార్, ఓ మైనర్, పాత రామగుండం హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన పల్లికొండ సురేష్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఏడాది క్రితం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మోటార్ల దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. మహిళను కత్తితో బెదిరించి.. అంతకు పదినెలల ముందుగానే 2017నవంబర్లో పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామశివారులో పత్తి చేనులో పత్తి తీస్తున్న విమలను బెదిరించి రూ.1.05 లక్షల విలువైన మూడు తులాల బంగారు పుస్తెలుతాడు చోరీచేశారు. అప్పటినుంచి అనుమానం రాకుండా సెంట్రింగ్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని పగటిపూట ఆటోలో తిరుగుతూ.. పంటపొలాల్లో ఒంటరిగా ఉన్నమహిళలను టార్గెట్ చేసుకొని వారిని బెదిరించి దొంగతనాలు చేశారు. ఎఫ్సీఐ టౌన్షిప్లోని ఆలయం, టెలిఫోన్ కార్యాలయాల్లో సైతం చోరీలకు పాల్పడ్డారు. దొంగతనం చేసిన సొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారు. శనివారం సీఐ బుద్దస్వామి, అంతర్గాం ఎస్సై రామకృష్ణ, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు బి–పవర్హౌస్ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు పట్టుపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు.మూడు తులాల బంగారు పుస్తెలుతాడు రికవరీ చేశారు. నిందితులపై పీడీయాక్టు.. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ వెల్లడించారు. మైనర్ను జూవైనల్ హోంకు తరలిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన సీసీఎస్ సీఐలు ఎ.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రావు, ఎస్సైలు మంగిలాల్, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు దేవేందర్, సుధాకర్, శ్రీనివాస్, అలెక్స్, రవి, రమేష్లను అడ్మిన్ డీసీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సీఐలు బుద్దె స్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రావు, ఎస్సై రామక్రిష్ణ పాల్గొన్నారు. -
ఎంత పని చేశావు దేవుడా!
సాక్షి, మెట్పల్లి : పాపం..విధి కరెంట్ షాక్ రూపంలో ఆ కుటుంబం పై కన్నెర్ర చేసింది. ఇంటికి పెద్ద దిక్కైనా తల్లిదండ్రులను కబలించి పిల్లలకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన అసరి గంగాధర్, లక్ష్మీ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మమత(22), మాధురి(20), కుమారుడు మధు(17)ఉన్నారు. పెద్ద కుమార్తె మమతకు కొంతకాలం క్రితమే వివాహం చేశారు.మాధురి ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మధు ఇంటర్ చదువుతున్నాడు. గంగాధర్ శుక్రవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చి స్నానానికి వెళ్లాడు. ఆ తర్వాత దుస్తులను ఇంటి ఆవరణలో ఉన్న తీగపై ఆరవేస్తుండగా, ఒక్కసారి కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మీ వెంటనే అక్కడకు వచ్చి గంగాధర్ను పట్టుకోగా, ఆమెకు కూడా షాక్ తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.విషయం తెలుసుకున్న కుమార్తెలు, కుమారుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. ‘ఎంత పని చేశావు దేవుడా..ఇక మాకు దిక్కెవరూ’ అంటూ మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. రెండో కుమార్తెకు వివాహం, కుమారుడి చదువు బాధ్యతలు చూడాల్సిన సమయంలో ఆ పిల్లలకు తల్లిదండ్రులు దూరమైన పరిస్థితి చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శనివారం ఉదయం గంగాధర్, లక్ష్మీ మృతదేహాలకు ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారమైన హృదయాలతో ఒకే చోట అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబాన్ని ఎంపీపీ మారు సాయిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. -
చదువుతూనే గంజాయి దందా..
సాక్షి, పెద్దపల్లి : ఓ యువకుడు డిప్లొమా ఫైనల్ ఇయర్.. మరొకరు ఇంటర్.. ఇంకొకరు ఇంటర్ పూర్తిచేసి డిగ్రీలో చేరాడు. ఈ ముగ్గురు కలిసి గంజాయి దందా చేస్తూ గురువారం పెద్దపల్లి పోలీసులకు చిక్కారు. గోదావరిఖనికి చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి చేస్తున్న దందా చూసి పోలీస్ అధికారులు నివ్వెరపోయారు. డీసీపీ సుదర్శన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోండం ప్రదీప్రెడ్డి(19), బత్తుల శివకుమార్(19), మరో మైనర్.. ముగ్గురు కలిసి కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేసి తోటి స్నేహితులకు విక్రయిస్తున్నారు. ఈ విషయం కనిపెట్టిన పెద్దపల్లి ఎస్సై ఉపేందర్రావు పెద్దకల్వల స్టేజీ వద్ద ముగ్గురు యువకులను సోదా చేయగా మూడు పాలిథిన్ కవర్లలో 750గ్రా. గంజాయి లభించింది. ముగ్గురు విద్యార్థులే కావడంతో ఎవరికీ అనుమానం కలగలేదని, కొంతకాలంగా వారు చేస్తున్న దందా పోలీసుల దృష్టికి రావడంతో నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నారు. గోదావరిఖనితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆ ముగ్గురి నుంచి గంజాయి కొనుగోళ్లు చేసినవారితో పాటు వ్యాపారానికి సంబంధాలు ఉన్నవారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ నరేందర్, ఎస్సై ఉపేందర్ పాల్గొన్నారు. పిల్లలను కాపాడుకోవాల్సింది తల్లిదండ్రులే.. కళాశాలలకు వెళ్తున్న పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం తల్లిదండ్రులు గమనించకపోతే చేజారిపోయే ప్రమాదముందని డీసీపీ సుదర్శన్గౌడ్ హెచ్చరించారు. పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారని, దీంతో వారి జీవితం పూర్తిగా దుర్భరమవుతుందన్నారు. సకాలంలో ఇంటికి వస్తున్నారా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నారు. సింగరేణి కోల్బెల్టు ప్రాంతంలో ఇలాంటి దారి తప్పిన పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆందోళన చెందారు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టైన వారికి కోర్టు 20ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. గంజాయి అమ్మకం వ్యాపారంలో పోలీసులకు చిక్కినవారిపై పిడీయాక్టు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులే పిల్లలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
ఉపాధ్యాయ వృత్తికే కళంకం
సాక్షి రామగిరి(పెద్దపల్లి) : లంచాల మకిలి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంటుకుంది. ఇప్పటివరకు రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖలకు పరిమితమైన లంచావతారులు ఇప్పుడు ఉపాధ్యాయుల రూపంలో బయటపడుతున్నారు. తల్లిదండ్రుల తరువాత గురువును దేవునితో పోల్చుతూ ఆచార్యదేవో భవా అంటారు. విద్యార్థులకు సత్యమేవ జయతే, అబద్ధాలు ఆడరాదని చెప్పే ఉపాధ్యాయులే ఇలా అక్రమ సంపాదనకు ఆశపడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా ఇదే మొదటిసారి కావచ్చు. నెలకు వేలల్లో వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందరో ఉపాధ్యాయులు నిరుపేద విద్యార్థులకు తమకు తోచినంత సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ వృత్తికి వన్నె తెస్తున్న ఈరోజుల్లో ఉపాధ్యాయులంటే అవినీతిపరులే అనే విధంగా చులకన భావం ఏర్పడే విధంగా లంచం తీసుకుంటూ పట్టుబడడం ఆ వృత్తికే మాయని మచ్చగా మారింది. ఓ ప్రధానోపాధ్యాయురాలు టీసీ కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో గురువారం జరిగింది. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దండుగుల లలిత విద్యార్థి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.బద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో సుద్దాల ఓదెలు కుమారుడు రఘు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివాడు. పరీక్షల సమయంలో రఘుకు హాల్టికెట్ ఇవ్వకుండా హెచ్ఎం లలిత ఇబ్బంది పెట్టింది. ఎందుకు హాల్టికెట్ ఇవ్వడం లేదని రఘు తల్లిదండ్రులు రమ, ఓదెలు హెచ్ఎంను కలిసి అడుగగా, రఘు హాజరు శాతం తక్కువగా ఉందని, హాల్టికెట్ ఇవ్వడం కుదరదని ఖరాకండిగా చెప్పింది. ఆందోళన చెందిన రమ, ఓదెలు ఆమెను బతిమాడారు. అయినా కనికరించలేదు. తన కొడుకు భవిష్యత్ నాశనం అవుతుందని రమ హెచ్ఎం కాళ్లు మొక్కింది. దీంతో రూ.3 వేలు ఇస్తే హాల్టికెట్ ఇస్తానని చెప్పింది. మరోమార్గం లేక కూలీ పనులు చేసుకునే రఘు తల్లిదండ్రులు కొడుకు భవిష్యత్ కోసం హెచ్ఎం లలితను ప్రాధేయపడి రూ.1,500 చెల్లించడంతో హాల్టికెట్ ఇచ్చింది. అయితే పదో తరగతి పరీక్షలు రాసిన రఘు భౌతికశాస్త్రంలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత సప్లిమెంటరీ పరీక్ష రాసి పాస్ అయ్యాడు. ఉన్నత చదువుల కోసం టీసీ కావాలని ఇటీవల హెచ్ఎంను కలిసి కోరాడు. అందుకు రూ.2 వేలు ఇవ్వాలని లలిత డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని రఘు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు విధిలేని పరిస్థితుల్లో 20 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. స్పందించిన ఏసీబీ అధికారులు ఓదెలు, రఘు చెప్పే విషయాలను నిర్ధారించుకోవడానికి గతనెల 15న బాధితులతో కలిసి మారువేశంలో పాఠశాలకు వెళ్లారు. లంచం కోసం లలిత బాధితులను వేధిస్తుందని ప్రత్యక్షంగా నిర్ధారణ చేసుకున్నారు. ఆతర్వాత హెచ్ఎం మెడికల్ లీవ్ తీసుకుంది. గురువారం తిరిగి విధుల్లో చేరింది. ఈ క్రమంలో ఓదెలు, రఘు హెచ్ఎం లలిత డిమాండ్ చేసిన రూ.2 వేలు తీసుకుని పాఠశాలకు వెళ్లారు. డబ్బులు ముట్టజెప్పి టీసీ తీసుకుని బయటకు వచ్చాక.. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు హెచ్ఎంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లలిత భర్తకు సింగరేణిలో ఉన్నతస్థాయి ఉద్యోగం. వీరు సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పదోన్నతి పొందినట్లు, గతంలో స్కూల్ గ్రాంటు, దాతలు విరాళాలు కూడా కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, మంచిర్యాలలో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు. -
హలో ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నా..
సాక్షి, పెద్దపల్లి : హలో.. సారీ నిద్రపోయారా.. 8001628694 మీకు కూడా ఇలాంటి ఫోన్ రావొ చ్చు.. రెండురోజుల క్రితం పెద్దపల్లికి చెందిన ఓ ఉద్యోగికి ఎస్బీఐ బ్రాంచి ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..మీ ఏటీఎం కార్డు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది వాటిని క్లియర్ చేస్తాం. కాస్తా మీ అకౌంట్ నంబర్ చెప్తారా..ఈ నంబర్ కరెక్టే కదా, మీ ఏటీఎం కార్డు మరోసారి చూసుకోండి ఇదే కదా అంటూ తెలుగులో మాట్లాడిన మోసకారి క్షణాల్లో రూ.70వేలు నొక్కేశాడు. ఇది ఎక్కడో ఒకసారి విన్నమాటలు కాదు.. వందసార్లకు పైగా ఇలాంటి మాటలతోనే మోసాలు చేస్తున్నవారు.. మోసపోతున్నవారు ఇంకా ఉన్నారని జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని ఓ ఉద్యోగి పట్ల రుజువైంది. పెద్దపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని మాటల్లో పెట్టి రూ.70వేలు నొక్కేసిన వైనంపై వారు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అచ్చమైన తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడిన యువకుడు నమ్మకం కలిగించేలా వ్యవహరించి మూడుసార్లు ఏటీఎం కార్డు ద్వారా రూ.10, 20, 40వేలు డ్రా చేశాడు. స్థానిక ఎస్బీఐలో ఫిర్యాదు చేయగా ఇది తమ చేతుల్లో లేదని సైబర్నేరాలు పరిశోధన చేస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. చివరగా స్థానిక పోలీసుస్టేషన్లో ఆ నంబరుపై వచ్చిన కాల్ ఆధారంగా దర్యాప్తు చేయాల్సిందిగా బాధితులు ఫిర్యాదు చేయడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినదని అయినా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పోగొట్టుకున్న డబ్బు గురించి బాధపడడం మినహాయించి బాధితులు చేయాల్సింది ఏమి లేకుండా పోయింది. -
న్యూజిలాండ్ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : న్యూజిలాండ్ పంపిస్తానని ఓ యువకుడిని మోసగించిన ఇద్దరిపై సారంగాపూర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. మండలంలోని పోచంపేట గ్రామానికి చెందిన శీలం రాజేశం కుమారుడు ప్రవీణ్కుమార్ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన అత్తినేని రాజిరెడ్డి, రాజేశంను కలిసి మీ కుమారుడిని న్యూజిలాండ్కు పంపించడానికి ఆంధ్రపదేశ్లోని గుంటూర్ జిల్లాకు చెందిన గుంటుక శ్రీకాంత్రెడ్డి ఉన్నాడని తెలిపాడు. రాజేశం, ఆయన కుమారుడు ప్రవీణ్లు రాజిరెడ్డి చెప్పిన మాటలు నమ్మారు. శ్రీకాంత్రెడ్డి, రాజిరెడ్డి ఇద్దరు కలిసి రాజేశం, ప్రవీణ్ వద్దకు వచ్చి న్యూజిలాండ్ వెళ్లడానికి రూ. 2.50 లక్షలు ఖర్చు అవుతుందని, అక్కడ మంచి కంపెనీలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నకలీ పత్రాలను వారికి చూపించారు. వీరి మాటలు నమ్మిన బాధితులు నెల క్రితం రూ.2.50 లక్షలు శ్రీకాంత్రెడ్డి చేతిలో పెట్టారు. న్యూజిలాండ్కు రేపుమాపు వెళ్లడం అంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన రాజేశం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజిరెడ్డి, శ్రీకాంత్రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, కరీంనగర్ : ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసీఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరించే సురేందర్ అనే ప్రొఫెసర్ ఆ విద్యార్థినిని వేధించడంతోపాటు వాట్సప్ చాటింగ్ చేసిన స్క్రీన్షాట్ ఫొటోలు, సదరు కీచక ప్రొఫెసర్ ఫొటోలు, వీడియోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే కళాశాల విద్యార్థిని వేధించిన ఘటన గానీ, ఆత్మహత్యాయత్నం గానీ ఇప్పట్లో కాకుండా కొద్దిరోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే సదరు హెచ్ఓడీ సురేందర్ను కళాశాల నుంచి పంపించివేసిన యాజమాన్యం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులతో చర్చించి విషయం బయటకు పొక్కకుండా చూసినట్లు సమాచారం. కాగా సంఘటనకు సంబంధించి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కడా పోలీసు కేసు నమోదు కాలేదు. సదరు విద్యార్థిని ఆచూకీ కూడా తెలియకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే... కళాశాల యాజమాన్యం, వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు..సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజాంపల్లికి చెందిన విద్యార్థిని అల్గునూరులోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేసే ప్రొఫెసర్ సురేందర్ ఆ విద్యార్థినిపై కన్నేశాడు. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ, సదరు ప్రొఫెసర్ను కాలేజీ నుంచి తొలగించారు. అయితే ఈ ప్రొఫెసర్ వేధింపులు భరించలేక కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సోమవారం సురేందర్ అనే ప్రొఫెసర్ ఆ విద్యార్థినితో జరిపిన చాటింగ్కు సంబంధించిన మొబైల్ స్క్రీన్షాట్లు, తన రూంకు రావాలని అభ్యర్థిస్తే, ఆ విద్యార్థిని నిరాకరించడం ఈ స్క్రీన్షాట్ ఫొటోల్లో కనిపిస్తోంది. దీనికి తోడు సురేందర్ వీడియోలు, ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు సమాచారం లేదు తిమ్మాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల ఉండగా, విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి సంబంధించి అక్కడ ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. విద్యార్థిని సొంత గ్రామం నిజాంపల్లి పరిధిలోని కోనరావుపేట మండలంలో గానీ, ఆ అమ్మాయి ఇప్పుడు ఉంటుందని ప్రచారం జరుగుతున్న సిరిసిల్లలో గానీ ఫిర్యాదులు లేవు. ఈ విషయంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా వాట్సప్లలో వైరల్ అయిన సమాచారం తప్ప ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, నిందితునిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా తమ కళాశాలలో అమ్మాయి ఎవరూ ఆత్మహత్యయత్నం చేయలేదని, ప్రొఫెసర్ సురేందర్ అనే వ్యక్తి ప్రవర్తన సరిగా లేనందున గతంలోనే కాలేజీ నుంచి తొలగించామని సదరు కళాశాల కరెస్పాండెంట్ ‘సాక్షి’కి వివరించారు. అడ్మిషన్ల సమయంలో ఇతర కళాశాలల యాజమాన్యాలు తమను అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు తెరతీశారని అన్నారు. అయితే ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భార్య కాటికి.. భర్త పరారీ..
సాక్షి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందినా ద్యాగం మణెవ్వ, రాజయ్యల కూతురు పద్మ(33). కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన పడకంటి నారాయణతో 15ఏళ్ల క్రితం వివాహమైంది. నారాయణ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు. పిల్లలతో పుట్టింటికి వచ్చిన పద్మ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచకు చెందిన కొమురవెళ్లి ముత్యాలును రెండో వివాహం చేసుకుంది. పిల్లలు ప్రవళిక, పవన్కుమార్తో కలిసి రామంచలో నివాసం ఉంటున్నారు. తప్పని వేధింపులు.. పేదరికం వెంటాడుతుండడంతో పద్మను రెండోభర్త ముత్యాలు అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. మనస్తాపానికి గురైన పద్మ ఈనెల 4న అత్తవారి ఊరైన రామంచలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. హైదరాబాద్లోని గాం«ధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 11న మృతి చెందింది. పద్మ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముత్యాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల భయంతో ఎక్కడికో పారిపోయాడు. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు.. తల్లి మరణం.. ముత్యాలుపై కేసు నమోదుకావడంతో పద్మ పిల్లలు మానసిక దివ్యాంగురాలైన ప్రవళిక(14), పవన్కుమార్(12) దిక్కుతోచని స్థితిలోపడ్డారు. వీరి పెద్దమ్మ చేరదీసి వృద్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంచింది. వారు బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పిల్లలను పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి పిల్లలకు డబుల్బెడ్రూం ఇల్లును మంజూరు చేసి పవన్కుమార్కు ప్రభుత్వ హస్టల్లో సీటు ఇప్పించి, మానసిక దివ్యాంగురాలైన ప్రవళికకు చేయూతను అందించాలని వృద్ధులైన మణెవ్వ, రాజయ్య కోరుతున్నారు. చిన్నారులను శనివారం ఉపసర్పంచ్ ఒగ్గు రజిత, బాల్రాజ్ పరామర్శించారు. ఎమ్యెల్యే కేటీఆర్ ద్వారా ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. -
సాయానికి వెళ్తే.. ప్రాణం పోయింది
సుల్తానాబాద్(పెద్దపల్లి): అతడో కూలీ.. రోజూవారీగా కష్టం చేస్తే.. వచ్చే ఆదాయంతో కుటుంబం గడుస్తుంది. ఆదివారం కావడంతో తోటి స్నేహితుల వ్యవసాయ పనులకు సాయంగా వెళ్లాడు.వ్యవసాయ మోటారు ఫ్యూజు తీసేప్పుడు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన కూకట్ల మల్లయ్య కొడుకు శ్రీకాంత్(21). కరీంనగర్ శనివారం మార్కెట్లో టార్స్పోర్టు హమాలీగా పనిచేస్తుంటాడు. నెలన్నర క్రితమే కేశవపట్నం మండలం గద్దపాకకు చెందిన శ్రుతితో వివాహం జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో తోటి స్నేహితులు, సమీప బంధువుల అయిన ఆసరి శ్రీనివాస్, టి.కొమురయ్య కౌలు చేస్తున్న భూమిలో వ్యవసాయపనులు చేయడానికి శ్రీకాంత్ను వెంటతీసుకెళ్లారు. వ్యవసాయ బావిలో నీరు అయిపోతుండడంతో విద్యుత్ మోటారును బంద్ చేయాలని శ్రీకాంత్కు సూచించారు. ఆయన వెళ్లి ఫ్యూజ్ తీసేక్రమంలో కరెంట్షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన భార్య, కుటుంబసభ్యులు మృతదేహం వద్ద బోరున విలపించారు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీకాంత్ తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. -
కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య
సాక్షి, వేములవాడ(కరీంనగర్) : కట్నం వేధింపులకు వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన తాడెం అంజయ్య– సత్తవ్వల కుమార్తె తాడెం సరళ ఊరాఫ్ అన్నవేని నవ్య(24)ను ఐదేళ్లక్రితం సిరిసిల్ల మండలంలోని చంద్రపేటకు చెందిన అన్నవేణి మల్లేశంకిచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలు అందించారు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. నవ్య తమ్ముడికి ఆమె అత్తవారి గ్రామం నుంచి అమ్మాయినిచ్చి ఏడాది క్రితం వివాహం జరిపించారు. ‘ మనకంటే.. మీ తమ్ముడికి ఎక్కువ కట్నం ఇచ్చారు’ అంటూ నవ్యను భర్త మల్లేశం వేధించడం ప్రారంభించాడు. వేధింపులు తాళలేక ఆర్నెల్లక్రితం కొంతడబ్బు పుట్టింటి నుంచి తీసుకొచ్చింది. అయినప్పటికీ మరింత డబ్బుకావాలని మల్లేశం వేధించడంతో నవ్య మూడ్రోజుల క్రితం పుట్టినిల్లయిన రుద్రవరంకు వచ్చింది. శనివారం మధ్యాహ్నం భర్తతో ఫోన్లో మాట్లాడిన నవ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుం ది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరా బాద్కు తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందింది. పట్టణ సీఐ వెంకటస్వామి విచారణ జరిపారు. -
అయ్యో.. హారికా..!
సుల్తానాబాద్(పెద్దపల్లి): పది రోజుల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు వెంటాడింది. పాడెపైకి చేరేలా చేసింది.. భాజాభజంత్రీతల మధ్య తల్లిదండ్రులు అత్తారింటికి సాగనంపాల్సి ఉండగా.. విధి చిన్నచూపు చూసింది.. చావుడప్పుల మధ్యల శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన సుల్తానాబాద్ మండలం సుద్దాల శివారులో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన మారేడుకొండ తిరుపతి–పద్మ దంపతులకు కొడుకు, కూతురు హారిక ఉన్నారు. ఇటీవలే హారిక వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన పెళ్లికి స్నేహితులను ఆహ్వానించేందుకు శనివారం సోదరుడు కిరణ్తో కలిసి ద్విచక్రవాహనంపై ఓదెల మండలం కొలనూర్కు వెళ్లింది. పెళ్లి కార్డు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సుద్దాల శివారుకు రాగానే చెరువు మట్టి తరలించే లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో హారిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కిరణ్ను ఆస్పత్రికి తరలించారు. పది రోజుల్లో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యపై అనుమానంతోనే హత్య
సుల్తానాబాద్(పెద్దపల్లి): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపినట్లు పోలీసుల వద్ద నిందితుడు హరీశ్ అంగీకరించినట్లు పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 24న గట్టెపల్లిలో గన్నిసంచిలో వివాహిత మృతదేహం లభ్యమైంది. కరీంనగర్లో ఫ్యాషన్ డిజైనర్గా రమ పని చేసిన సమయంలో శ్రీరాం చిట్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్న రేవెళ్లి హరీశ్తో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. కరీంనగర్లోని హజ్మత్పురాలో ఆరీఫ్ ఇంట్లో అద్దెకు జాడి రమ అలియాస్ లక్కీఅలియాస్ సిరివెన్నెలతో కలిసి ఉంటున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ రమ తరచూ ఫొన్లో మాట్లాడడాన్ని హరీష్ గమనించి తప్పుబట్టాడు. ఏప్రిల్ 7వ తేదీన తన భర్త వేధిస్తున్నాడని 100కి ఫోన్చేసి రమ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. దీన్ని మనుసులో పెట్టుకొని హత్య చేసినట్లు హరీశ్ ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి ఈనెల 21న అద్దెకుంటున్న ఇంట్లో గొంతు నులిమి హత్య చేసి తన ద్విచక్ర వాహనంపై గట్టెపల్లిలో గన్నిసంచిలో పడేసినట్లు అంగీకరించాడని వివరించారు. సోషల్ మీడియాలో, పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలు మృతురాలి కుటుంబసభ్యులు అక్క రాధా, అన్న భానేశ్, ఇంటి యజమాని ఆరీఫ్ సుల్తానాబాద్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండురోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. రమది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నార్వ స్వగ్రామం. నిందితుడు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ నివాసి అని తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ మహేందర్రెడ్డి, ఎస్సై రాజేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
ఇటుకతో కొట్టి ఇద్దరు కొడుకులను చంపిన తల్లి
కోల్సిటీ(రామగుండం): ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్తబంధం విలువ నీకుతెలియదురా... నుదుటిరాతలు రాసే ఓ బ్రహ్మదేవా.. తల్లికొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా’ అంటూ తన కొడుకు కోసం ‘తల్లి’డిల్లిన పాట ప్రతీతల్లి హృదయాన్ని కలిచి వేస్తుంది. పిల్లలు పుట్టాలని ఎందరో వ్రతాలు చేస్తున్నారు. మహాశివరాత్రికి జాగారం చేస్తున్నారు... పుట్టినబిడ్డ కాలికి రాయి తగితేనే విలవిల్లాడి పోతారు. కానీ గోదావరిఖనిలో ఓ అమ్మ... తన రెండు కనుపాపలను తనే పొడుచుకుంది. ఇటుకతో ఇద్దరు కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేసింది. తలలు పగిలి మెదడు బయటపడేలా కొట్టింది.. ‘అమ్మా.. ప్లీజ్ నొప్పిగా ఉందమ్మా... ప్లీజ్ కొట్టకమ్మా... అంటూ ప్రాధేయపడినా ఆ తల్లి మనసు కరుగలేదు. గోదావరిఖనిలో సోమవారం జరిగిన ఈ దారుణఘటన ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్–రమాదేవి దంపతులిద్దరూ ఉన్నత విద్యావం తులే. శ్రీకాంత్ ఎమ్మెస్సీ బీఈడీ చేయగా, రమాదేవి బీఎస్సీ బీఈడీ చదివింది. వీరి పెద్ద కొడుకు అజయ్కుమార్(10) 4వ తరగతి, చిన్న కొడుకు ఆర్యన్(6) ఎల్కేజీ చదువుతున్నారు. శ్రీకాంత్ స్థానిక రమేష్నగర్లోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రమాదేవి కొంత కాలం ప్రైవేట్టీచర్గా పనిచేసి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటోంది. చికిత్స పొందుతూ మృతి.. తల పగిలి అపస్మారకస్థితిలో ఉన్న అజయ్కుమార్ చికిత్స ప్రారంభించేలోగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న చిన్న కొడుకు ఆర్యన్ను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు గంటలు ప్రాణాలతో కొట్లాడి తుదిశ్వాస విడిచాడు. కన్నీరుపెట్టిన కాలనీ.. ఈ సంఘటన సప్తగిరికాలనీలో రెండు కుటుంబాలతోపాటు కాలనీ ప్రజలను కంటతడిపెట్టించింది. చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అజయ్కుమార్, ఆర్యన్ మృతదేహాలను పక్కపక్కనే పెట్టిన ఈ దృశ్యం కుటుంబ సభ్యులతోపాటు, స్థానిక ప్రజలను కన్నీరు పెట్టించింది. సాయంకాలానికి అన్నదమ్ములిద్దరికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అమ్మచేత అన్నం తినకుండానే కన్నుమూశారు సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గంగస్నానం చేసి వచ్చి సంతోషంగా అమ్మ చేత అన్నం తినాలని పిల్లలు సంతోషపడ్డారు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలని ఎదురుచూశారు. గురుకులంలో పనిచేసిన శ్రీకాంత్ ఆదివారం రాత్రి అక్కడే బస చేసి సోమవారం ఉదయం ఇంటికి పూజా సామగ్రితోపాటు పిల్లలకు అల్పాహారం, పండ్లు తీసుకువచ్చాడు. కానీ అప్పటికే ఇంట్లో జీవచ్ఛవాలుగా పడి ఉన్న కొడుకులిద్దరినీ చూసి గుండెలవిసేలా రోదించాడు. కనికరించని తల్లిమనసు.. పిల్లలిద్దరూ బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేసిన రమాదేవి కొడుకులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఇటుకతో అజయ్కుమార్, ఆర్యన్ తలలపై విచక్షణారహితంగా కొట్టింది. ప్లీజ్ మమ్మీ.. నొప్పిగా ఉంది.. కొట్టకు మ మ్మీ.. అంటూ కొడుకులిద్దరూ ప్రాధేయపడు తూ దెబ్బలకు తట్టుకోలేక విలవిల్లాడిపో యారు. అప్పటికే తలలు పగిలి రక్తం కారుతున్నా పిల్లలను చూసినా ఆ తల్లి మనసు కనికరించలేదు. తలలు పగిలి కుప్పకూలారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకులిద్దరిని తండ్రితోపాటు స్థానికులు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొడుకులను చంపిన ఆవేశం దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ తల్లిదండ్రులు, రమాదేవి తల్లిదండ్రులు కలిసి సప్తగిరికాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేసి శ్రీకాంత్–రమాదేవికి ఇచ్చారు. అయితే తండ్రితో చనువుగా ఉంటున్న ఇద్దరు కొడుకులు తనతోమాత్రం సరిగా ఉండడం లేదని పిల్లలపై రమాదేవి కోపం పెంచుకునేదని శ్రీకాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నా డు. అదే ఆవేశం కొడుకుల ప్రాణంతీసింది. అమ్మా మాకెందుకీ శిక్ష! పెద్దపల్లి: అదిగో శివ నామస్మరణం.. ఇంటింటా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు.. తమ్ముడూ ఆర్యన్ లే.. నిన్నే కాదు అమ్మ నన్ను కూడా కొట్టింది.. నా తల పగిలి రక్తం కారుతోంది.. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు ఒక శివనామస్మరణ తప్ప.. జోల పాడిన అమ్మ మనకెందుకు మరణశిక్ష విధించింది.. నవమాసాలు మోసి కన్న మమ్ముల్ని తప్పటడుగులు వేసినప్పుడు కాలు జారి కింద పడితేనే విలవిల్లాడిన అమ్మ ఇటుకరాయితో నిన్ను బాదుతుంటే అడ్డం వచ్చిన నా తలపైనా కొట్టింది. లేరా తమ్ముడు అన్నయ్య అజయ్ శివాలయానికి వెళ్దాం.. శివపూజలు చేద్దాం.. అమ్మ మనసు మార్చమని వేడుకుందాం.. ఆగండి, మా తమ్ముడిని ఎటు తీసుకెళ్తున్నారు.. ఆస్పత్రి వద్దు మాకేం కాలేదు.. గోరుముద్దలు తినిపించిన అమ్మ కొట్టిన దెబ్బలు మమ్మల్నేం చేయలేవు.. ఎన్నో రోజులు ఉపవాసం ఉండి మాకు స్వీట్లు తినిపించిన అమ్మ ఇప్పుడు మమ్ముల్ని రాయితో కొట్టి రక్తం కళ్ల చూసింది.. ఊపిరి ఆడడం లేదు.. కనుచూపు కనిపించడం లేదు.. అదిగో డాక్టర్లు వచ్చి తమ్ముడిని, నన్నూ కోసి మూటగట్టి నాన్నకు అందజేస్తున్నారు. ఏడవకండి పండగ పూట మా కన్నీళ్లు మీకు శివరాత్రి జాగరణగా మార్చాయని తెలుసు. అందరినీ విడిచి.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నాం. – అజయ్, ఆర్యన్ల ఆత్మఘోషకు అక్షరరూపం పోలీసుల అదుపులో నిందితురాలు రమాదేవిని వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పిల్లలను విచక్షణారహితంగా కొట్టిన తర్వాత, రమాదేవి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసిందని రమాదేవి తండ్రి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇద్దరి మనమళ్లను ఎందుకు కొట్టి చంపాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపాడు. సంఘటనాస్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్టౌన్ సీఐ పర్శ రమేశ్ పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు.శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆత్మరక్షణ కోసం భర్తను చంపిన భార్య
మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం కా చారంలో భూమల్ల నడ్పిమల్లయ్య(45)ను ఆయన భార్య భూమల్ల లక్ష్మి అలియాస్ మల్లవ్వ(40) గురువారం రాత్రి గొడ్డలితో నరికి చంపింది. స్థాని కులు, పోలీసుల కథనం ప్రకారం. దేశాయిపేటకు చెందిన భూమల్ల నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మి, కూతురు మౌనిక, కొడుకు ఉన్నారు. కాగా కూతురుకు ఇదే మండలంలోని మోత్కురావుపేటకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. 2016 జూలై 3న ఆషాఢ మాసం సందర్భంగా తన కూతురును అత్తవారింటి నుంచి దేశాయిపేటకు తీసుకొస్తున్నాడు. ఈక్రమంలో మార్గమధ్యలో అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన కూతురును చీరతోనే ఉరివేసి చంపాడు. ఆ సంఘటనలో నడ్పిమల్లయ్య జైలుశిక్ష అనుభవించాడు. బెయిల్పై విడుదలై ఇంటికొచ్చిన నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మితో తరచూ గొడవలు జరుగు తుండేవి. దీంతో తనను కూడా ఎక్కడ చంపుతాడోనని భయపడ్డ మల్లవ్వ తల్లిగారి ఊరైన కాచారానికి వచ్చి ఉంటోంది. కూలీ పనులు చేసుకొం టూ కొడుకుతో బతుకుతున్న మల్లవ్వ వద్దకు భర్త తరచూ వస్తూ చంపుతానని బెదిరిస్తూ ఉండేవాడ ని స్థానికుల ద్వారా తెలిసింది. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన నడ్పిమల్లయ్య తన భార్యను చంపేందుకు ప్రయత్నించగా.. రక్షించుకునే క్రమంలో మల్లవ్వ సమీపంలోనే ఉన్న గొ డ్డలితో మెడపై నరికింది. దీంతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ప్రియురాలిపై దాడి చేసిన ప్రియుడి అరెస్టు
జ్యోతినగర్(రామగుండం): ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే అనుమానంతో ప్రియురాలిని అంతం చేయాలని చూశాడు ప్రియుడు. ఇందుకు ఆమెపై కత్తితో దాడి చేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. హత్యాయత్నానికి పాల్పడిన నస్పూరి శ్రీనివాస్(30)ను ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య అరెస్ట్ చేయగా.. వివరాలను గోదావరిఖని ఏసీపీ రక్షిత కే.మూర్తి, రామగుండం సీఐ బి.స్వామి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఆటోనగర్కు చెందిన యువతి, భీమునిపట్నంకు చెందిన నస్పూరి శ్రీనివాస్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. 2013లో యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. అయినా.. శ్రీనివాస్ యువతి వెంటపడ్డాడు. ఆమె భర్త నుంచి విడాకులు ఇప్పించాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని కోరగా వాయిదా వేస్తూ వచ్చాడు. అదే సమయంలో యువతిని అనుమానిస్తూ గొడవపడేవాడు. ఈనెల 21న యువతి ఇంటికొచ్చిన శ్రీనివాస్.. మార్చి 10న వివాహం చేసుకుందామని చెప్పి.. రెస్టారెంట్కు తీసుకెళ్లాడు. మార్గంమధ్యలో కత్తితో దాడి చేశాడు. బాధితురాలు తప్పించుకుని పోలీస్స్టేషన్కు చేరింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. సోమవారం ఉదయం ఓపెన్కాస్ట్–4 ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. యువతిపై దాడి చేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
మహిళ దారుణ హత్య
కరీంనగర్ క్రైం: నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం, అపోలో ఆస్పత్రికి కూతవేటు దూరం, చొప్పదండి– కరీంనగర్ ప్రధాన రహదారిపై బానాల రమణ(25)ను సిమెంట్ ఇటుకతో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రధాన రహదారిపైనే మహిళను హత్య చేయడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. దారుణంగా హత్య.. నగరంలోని అపోలో రీచ్ ఆస్పత్రికి కూత వేటు దూరంలో కరీంనగర్–చొప్పదండి ప్రధాన రహదారి పక్కన సయ్యద్ యూసుఫ్ పండ్ల దుకాణం ఏర్పాటు చేసేందుకు మూడు రోజులుగా తడుకల షెడ్డు పనులు చేస్తున్నారు. షెడ్డులో ఓ మహిళ(25)ను దారుణంగా హత్య చేశారని ఉదయం 7.30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బ్రౌన్ కలర్ చీర ధరించి ఉన్న మహిళ ముఖాన్ని సిమెంట్ ఇటుకతో మోదడం తల పగిలింది. సంఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఎక్కడా కనింపించలేదు. ఆమెపై అత్యాచారం జరగలేదని శరీరంలో ఎక్క డా ఎలాంటి గాయాలు లేవని కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి ప్రకటించారు. క్లూస్ టీం పలు ఆ« దారాలు సేకరించారు. డాగ్స్క్వాడ్ హత్య జరిగిన సంఘటన నుంచి పక్కనే ఉన్న సరస్వతినగర్ వైపు కొంతదూరం వెళ్లి ఓ ఇంటి వద్ద నిలిచింది. కొన్ని గంటల్లోనే గుర్తింపు.. హతురాలు ఎవరనేది గుర్తించేందుకు తాడికల్ హత్య కేసును విచారించిన బృందాన్ని ప్రత్యేకంగా దీని కోసం నియమించారు. వారు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా అందులో మృతురాలు మరో వ్యక్తితో కలిసి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వాటిని కరీంనగర్ సైబర్ ల్యాబ్ సహకారంతో స్పష్టమైన చిత్రాలను తయారు చేసి మీడియా, సోషల్ మిడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో మృతురాలి, అనుమానితుడి వివరాలను పోలీసులు సేకరించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మృతురాలిని, అనుమానితుడిని గుర్తించారు. చిన్నాపైనే అనుమానం..? జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కేంద్రానికి చెందిన బానాల రమణ(25) హైదారాబాద్లోని కరకంటి చిన్న (27) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వీరిని ఓ కేసులో గుంటూరు జైలుకు పంపారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరు కూడా రెండు రోజుల క్రితం గుంటూరు జైలు నుంచి విడుదల అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం వేకువజామున ఉదయం 2 నుంచి 4 గంటల మధ్య రమణ దారుణహత్యకు గురైంది. అమె వెంట ఉన్న చిన్నానే పథకం ప్రకారం హత్య చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్కు వచ్చిన సమయంలో రమణ వద్ద ఒక సంచి, మరో ప్లాస్టిక్ కవర్ ఉంది. సంఘటన స్థలంలో కవర్ లభించింది. సంచి లభించలేదు. మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు.. హత్య సమాచారం అందుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, రూరల్ ఏసీపీ ఉషారాణి, టాస్క్ఫొర్స్ ఏసీపీ శోభన్కుమార్, రూరల్ సీఐ శశిధర్రెడ్డి, సీసీఎస్ సీఐ కిరణ్కుమార్, క్లూస్ టీం ఇన్చార్జి శ్రీధర్, సైబర్ ల్యాబ్ ఇన్చార్జి మురళి, రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి, టాస్క్ఫొర్స్ ఏసీపీ శోభన్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. -
ప్రేమ వేధింపులు భరించలేక..
కథలాపూర్(వేములవాడ): డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని ఓ యువకుడు వెంటపడి వేధింపులకు పాల్పడడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కథలాపూర్ మండలం దుంపేటలో గురువారం జరిగింది. పోలీసులు, కటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన తోట హర్షిత(22) కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతుంది. కొంత కాలంగా కథలాపూర్కు చెందిన దినేశ్ అనే యువకుడు ప్రేమ పేరిట హర్షితను వేధిస్తున్నాడు. విషయాన్ని హర్షిత కుటుంబ సభ్యులకు తెలుపడంతో సదరు యువకుడిని పద్ధతి మార్చుకోవాలని సూచిం చారు. అయినా ప్రేమించాలని హర్షితను దినేశ్ వెంబడిస్తూ వేధింపులకు పాల్పడుతుండడంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న హర్షితను కోరుట్ల ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగేశ్వర్రావు పరిశీలించారు. మృతురాలి తండ్రి నరేశ్ ఉపాధినిమిత్తం దుబాయిలో ఉంటున్నారు. మృతురాలి తల్లి తోట భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘ఖని’లో బాలిక ఆత్మహత్య
కోల్సిటీ(రామగుండం): స్కూల్కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించినందుకు గోదావరిఖనిలో పొరండ్ల వైష్ణవి(14) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ ఎస్సై ఎ.వెంకటేశ్వర్లు వివరాల మేరకు... స్థానిక ఫైవింక్లయిన్ ఏరియాకు చెందిన పొరండ్ల ఆనంద్, సరిత దంపతులకు కొడుకు రాహుల్, కూతురు వైష్ణవి ఉన్నారు. దంపతులిద్దరూ స్థానిక విఠల్నగర్ పార్క్ సమీపంలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్థానికంగానే ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి 15 రోజులుగా స్కూల్కు వెళ్లడంలేదు. ఈ విషయంపై వైష్ణవిని తల్లిదండ్రులు మందలించారు. ఆదివారం ఉదయం తల్లి, తండ్రితోపాటు సోదరుడు కూరగాయాల దుకాణంలో ఉండగా, వైష్ణవి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో మనస్తాపంకు గురై ఇంటి పైకప్పు ఇనుప ఊచకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోంచి కూరగాయల దుకాణంకు వెళ్లిన తండ్రి, గంట తర్వాత ఇంట్లో దాచిన డబ్బుల కోసం ఇంటికి వచ్చాడు. మధ్యరూంలో వైష్ణవి ఉరికి వేల్లాడుతూ కనిపించడంతో, హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆనంద్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య?
కరీంనగర్క్రైం: కరీంనగర్ శివారులోని రేకుర్తిలో ఉన్న ఓ ప్రముఖ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని గురువారం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లోని నాగార్జున కాలనీకి చెందిన డొనూరి మల్లేశం– శారద దంపతులకు కొడుకు, కూతురు రుచిత(17) ఉన్నారు. మల్లేశం సింగరేణి కార్మికుడిగా చేస్తున్నాడు. రుచిత కరీంనగర్ శివారు రేకుర్తిలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ (ఏంపీసీ) చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది. జనవరి 12న సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లింది. తన తాత చనిపోవడంతో పెద్దకర్మ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 27న తిరిగి కళాశాలకు వచ్చింది. అప్పటినుంచి అందరితో కలివిడిగా ఉంటోంది. గురువారం ఉదయం టిఫిన్ చేసి, క్లాస్కు వెళ్లింది. 11.30కి పని ఉందని హాస్టల్లోని తన గదికి వెళ్లింది. కాసేపటికే అరుపులు వినిపించాయి. సిబ్బంది వెళ్లి చూసేసరికి రుచిత బాత్రూంలో మంటల్లో కాలిపోయింది. వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రుచిత చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. కిరోసిన్ పోసుకోవడంతోనే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు పేర్కొంటున్నారు. పోలీసులు ఆస్పత్రికి, కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. అనుమానాలెన్నో... రుచిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కిరోసిన్ పోసుకుని చనిపోయిందంటున్న రుచితకు కిరోసిన్ ఎక్కడిదనే ప్రశ్న తలెత్తుతోంది. రుచిత ఉంటున్న హాస్టల్లో వంట చేయరు. క్యాటరింగ్ ద్వారానే భోజనాలు వస్తుంటాయి. కళాశాల యాజమాన్యం మాత్రం రుచిత కిరోసిన్ వెంట తెచ్చుకుందని అంటున్నారు. అయితే ఇంటినుంచి కళాశాలలోకి వస్తున్న విద్యార్థినిని మొదటగా గేటువద్ద, తరువాత వార్డెన్, సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. డబ్బాలో కిరోసిన్ తెచ్చుకుంటే యాజమాన్యం గమనించదా..? తోటి విద్యార్థులకు వాసన రాదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాలుగురోజుల క్రితం కళాశాలకు వచ్చిన రుచిత ఇన్నిరోజులు కిరోసిన్ డబ్బాను ఎక్కడ దాచి ఉంచిందన్న ప్రశ్నలు అనుమానాలకు తావిస్తోంది. అయితే రుచిత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు అంటున్నారు. ఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి, అడిషనల్ డీసీపీ సంజీవ్కుమార్, ఏసీపీ ఉషారాణి పరిశీలించారు. కేసు విచారణాధికారిగా రూరల్సీఐ శశిధర్రెడ్డిని నియమిస్తూ సీపీ కమలాసన్రెడ్డి అదేశించారు. అడగడునా సీసీ కెమోరాలు రేకుర్తిలో ఉన్న అల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో అడగడునా సీసీ కెమోరాలున్నాయి. కానీ కాలేజీలోకి కిరోసిన్ ఎలా వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వరుస ఘటనలు.. కరీంనగర్లోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల వరుస బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న పారమిత హెరిటేజ్ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి మానసిక ఒత్తిడితో ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇంత జరుగుతున్నా యాజమాన్యాలు దిద్దుబాటు చర్య తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. విద్యార్థి సంఘాల ఆగ్రహం.. పేరున్న కళాశాలలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం డబ్బులు తెచ్చేర్యాంకుల మిషన్లలా విద్యార్థులను చూస్తున్నారని ఆరోపించారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు. అసౌకర్యాల నడుమ హస్టళ్లను నిర్వహిస్తున్నారని పేర్కొంటున్నారు. ఆస్పత్రి ఎదుట ధర్నా.. విద్యార్థిని మృతి సంఘటన తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు ఆస్పత్రికి చేరుకుని అల్పోర్స్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు మధ్యాహ్నం మంచిర్యాల నుంచి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిని తల్లిదండ్రులు కూతురు మృతదేహం చూసి కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. ‘మాకు ఆరోగ్యం బాగాలేదని మాత్రమే సమాచారం ఇచ్చారు.. కాలేజీ యాజమాన్యమే మా బిడ్డను హత్య చేసింది.’ అని ఆరోపించారు. గత ఆదివారమే కాలేజీకి వచ్చిందని.. రుచిత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అమె బంధువులు తెలిపారు. -
యువతి మృతి.. ప్రేమ వ్యవహారమే కారణమా..?
చందుర్తి(వేములవాడ): దాదాపు నెలన్నర క్రితం అదృశ్యమైన యువతి చందుర్తి మండలం మల్యాల గ్రామశివారులోని వ్యవసాయబావిలో గురువారం శవమై కన్పించింది. పోలీసుల వివరాల ప్రకారం..చందుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుక ప్రియాంక(24) 2018 డిసెంబర్ 7న ఇంట్లోంచి వెళ్లిపోయింది. రెండ్రోజులైనా రాకపోవడంతో తండ్రి కృష్ణహరి డిసెంబర్ 13న పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేశారు. వేములవాడలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న రాజుపై అనుమానం ఉందనడంతో అతడ్ని ఠాణాకు పిలిపించి విచారించారు. థైరాయిడ్ పరీక్షకు ఆస్పత్రికి వచిందని, అంతకన్నా.. తమకేమి తెలియదని చెప్పడంతో వదిలిపెట్టారు. ప్రియాంక్ సెల్ఫోన్ డాటా ఆధారంగా పలువురిని ప్రశ్నించారు. వాసన వస్తోందని.. మల్యాల గ్రామానికి చెందిన పెద్దిగిరి గంగయ్యకు సమీప అటవీప్రాంతంలోని గుట్టల్లో వ్యవసాయ పొలం ఉంది. నీరందించేందుకు గురువారం బావివద్దకు వెళ్లాడు. కుళ్లిన వాసన రావడంతో అందులోకి చూడగా శవం కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి కుళ్లిన మృతదేహాన్ని బావిలోంచి వెలికితీసి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ప్రియాంక మృతదేహంగా గుర్తించారు. చందుర్తి సీఐ విజయ్కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నివేదిక ఆధారంగా వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. పెళ్లి ఇష్టంలేకనేనా..? వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్న యువకుడితో బైక్పై ప్రియాంక తిరిగేదని తండ్రి పోలీసుల ఎదుట వాపోయాడు. ప్రియాంకకు కథలాపూర్ మండలంలోని తన మేనబావతో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. డిసెంబర్ 12న పెళ్లి నిశ్చయానికి ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఇంట్లోంచి వెళ్లిపోయి శవంగా మారిందని తల్లిదండ్రులు రోదించారు. -
ప్రాణం తీసిన బావి
ధర్మపురి: పొలానికి నీరందించేందుకు వెళ్లిన దొనకంటి రాజశేఖర్(23) ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి చనిపోయాడు. ఈ ఘటన ధర్మపురి మండలం నక్కలపేటలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నక్కలపేటకు చెందిన దొన కంటి రాజశేఖర్ డిగ్రీ చదివాడు. ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. సోమవారం జరిగిన సర్పంచు ఎన్నికల్లో తొలిసారి ఓటువేశాడు. మంగళవారం ఉదయం తండ్రి లస్మయ్యతో కలిసి గ్రామ సమీపంలోని తమ పొలానికి నీరందించేందుకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి విద్యుత్సరఫరా లేకపోవడంతో తండ్రి లస్మయ్య ఇంటికి వెళ్లాడు. రాజశేఖర్ అక్కడే ఉన్నాడు. కాసేపటికి విద్యుత్ వచ్చిందో.. రాలేదో చూద్దామని వ్యవసాయమోటారు స్టార్టర్ వద్దకు వెళ్లాడు. పరిశీలిస్తుండగా కాలుజారి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. కాసేపటికి సమీప బంధువైన రాకేశ్ అక్కడికి చేరుకున్నాడు. బావిలోకి చూడగా రాజశేఖర్ చెప్పులు తేలియాడుతూ కనిపించాయి. అనుమానం వచ్చి ఇంటికి ఫోన్ చేశాడు. పొలం వద్దకు వెళ్లాడని మృతుడి తల్లిదండ్రులు చెప్పడంతో రాకేశ్ చుట్టుపక్కలా వెతికాడు. ఎక్కడా కానరాకపోవడంతో స్నేహితుల సాయంతో వ్యవసాయబావిలో వెతికారు. అప్పటికే రాజశేఖర్ నీళ్లుమింగి చనిపోయాడు. మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. రాజశేఖర్ తల్లిదండ్రులు బావివద్దకు చేరుకుని కొడుకు మృతదేహం వద్ద బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తండ్రి లస్మయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. -
స్నేహితుడినే మట్టుపెట్టిన మిత్రులు
సాక్షి, సిరిసిల్ల: స్నేహితుల మధ్య దొర్లిన మాటల తప్పిదానికి తమ మిత్రుడినే హత్యచేసిన ఐదుగురిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడకు చెందిన కవిరాజు, నాగరాజు, అజయ్, కృష్ణ, నాగేష్, సాయి స్నేహితులు. వీరిలో సాయి పది రోజుల కిందట తన మిత్రులతో సరదాగా చేసిన వ్యాఖ్యలు వారిలో ఆగ్రహాన్ని కలిగించాయి. వీరిలోని కవిరాజు తన మిత్రుడు సాయిపై పగ పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తనొక్కడే చంపడం వీలు కాదని మిగతా స్నేహితులు నాగరాజు, అజయ్, కృష్ణ అలియాస్ కిట్టు, నాగేష్లకు విషయం చెప్పాడు. వారంతా అందుకు ఒప్పుకున్నారు. అందరూ కలసి సంక్రాంతి పండగ రోజునే పూటుగా మద్యం తాగించి సాయిని మట్టుపెట్టాలని పథకం పన్నారు. ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు తమ స్నేహితుడు సాయిని పార్టీకి పిలిచి ఫుల్గా మద్యం తాగించారు. మరో ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి చింతల్ఠాణా – చీర్లవంచ గ్రామాల మధ్యలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకూ సాయిని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి కొట్టగా సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే కిట్టు తన షర్టు విప్పేసి సాయి మెడకు ఉరితాడులా బిగించి సాయి కొట్టుమిట్టాడుతుండగానే తమతో తెచ్చుకున్న బ్లేడుతో ఒకరితర్వాత ఒక్కరు గొంతు దగ్గర కిరాతకంగా కోసేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడినుంచి హైదరాబాద్కు పారిపోయారు. వెంట తీసుకెళ్లిన డబ్బులు ఖర్చు అయిపోగా వేములవాడ తిరుగుపయనంలో ఆదివారం ఉదయం టెక్స్టైల్ పార్కు వద్ద తాము పట్టుకున్నామని పోలీసులు వివరించారు. నిందితుల్లో ఒకరైన గౌరవేని నాగరాజుపై ఇప్పటికే పోక్సోతో సహా మూడు కేసులు ఉన్నాయని ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, తదితరులు ఉన్నారు. -
పండగపూట విషాదం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పండగపూట విషాదం అలుముకుంది. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం భీమారంకు చెందిన వరిగడ్డి అభిలాష్(15) కారుఢీకొని మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన అంగర్క శ్రీనివాస్(40) ట్రాక్టర్ పైనుంచిపడి దుర్మరణం చెందాడు. ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సిరవేని హరీశ్(21) బైక్ అదుపుతప్పి ప్రాణాలు విడిచాడు. ఆయా ప్రమాదాల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలంలోని భీమారంలో సంక్రాంతి పండుగ విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వరిగడ్డి అభిలాష్(15) మృతిచెందాడు. కిరణ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వరగడ్డి అశోక్, మమతకు కూతురు అర్చన, కొడుకు అభిలాష్ ఉన్నారు. పదేళ్లక్రితం అశోక్ అనారోగ్యంతో చనిపోయాడు. మమతనే తన పిల్లలను పోషిస్తోంది. అర్చన డిగ్రీ చదువుతోంది. అభిలాష్ స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం అభిలాష్ తన మిత్రుడు కిరణ్తో కలిసి ద్విచక్రవాహనంపై మేడిపెల్లి వెళ్లాడు. తిరిగివస్తుండగా నాగులపేటకు చెందిన కుమ్మనపెల్లి నవీన్ కారుతో రంగాపూర్ శివారులో బైక్ను ఢీకొట్టాడు. బైక్పై ఉన్న ఇద్దరు కిందపడ్డారు. అభిలాష్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కిరణ్ తీవ్రంగా గాయపడడంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మమత ఫిర్యాదుతో కారు డ్రైవర్ నవీన్పై కేసు నమోదు చేశారు. బుధవారం బాలుడి అంత్యక్రియలు జరిగాయి. ట్రాక్టర్ ప్రమాదంలో ఒకరు.. తలకొరివి పెట్టిన కూతురు వీణవంక(హుజూరాబాద్): ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. మూడేళ్ల క్రితం తల్లి, నేడు తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు ఆనాథలయ్యారు. మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో అంగర్క శ్రీనివాస్(40) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం... శ్రీనివాస్– కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు అమూల్య, వర్షిత ఉన్నారు. మూడేళ్ల క్రితం కవిత ఆనారోగ్యంతో చనిపోయింది. శ్రీనివాస్ అన్నీ తానై పిల్లలను పోషిస్తున్నాడు. మంగళవారం నాడు బంధువులతో కలిసి ట్రాక్టర్లో భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకొని తిరుగుతిరిగి వస్తుండగా ట్రాక్టర్ పైనుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దకూతురు చితికి నిప్పంటించింది. తల్లిదండ్రులు దూరంకావడంతో చిన్నారులు అనాథలయ్యారు. బైక్ అదుపుతప్పి యువకుడు.. ఇల్లంతకుంట(మానకొండూర్): ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఇల్లంతకుంట బిక్కవాగు కాజ్వేపై చోటు చేసుకుంది. మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సిరవేని హరీశ్(21)మండలంలోని వెల్జిపూర్కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
వేర్వేరు చోట్ల ఏడుగురు మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేర్వేరు చోట్ల ఏడుగురు చనిపోయారు. హుజూరాబాద్ పరిధిలో రెండు బైక్లు ఢీకొని నమిండ్ల సురేష్(28), గాజుల శ్రీధర్ ఊరాఫ్ నరేందర్(25) ప్రాణాలు వదిలారు.కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లెకు చెందిన కుర్రె సతీష్(21) బైక్ అదుపుతప్పి మృతిచెందాడు. రాయికల్ మండలం రాజానగర్ గ్రామశివారులో క్రేన్ కిందపడి రెండునెలల చిన్నారి రోహిత్ చనిపోయాడు. చొప్పదండి మండల కేంద్రానికి చెందిన ఎలిగేటి వెంకటేశం(52) చికిత్స పొందుతూ, తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కానిగంటి జోగవ్వ(86) బావిలోపడి, అంతర్గాం మండల పరిధిలోని పెద్దంపేట గ్రామానికి చెందిన ఎలిగేటి మల్లేశ్(30) ప్రమాదవశాత్తు మరణించారు. హుజూరాబాద్రూరల్: మండలంలోని బోర్నపల్లి గ్రామశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నమిండ్ల సురేష్(28), అదే గ్రామానికి చెందిన మొలుగూరి రాజేష్, నమిండ్ల ప్రసాద్లు కలిసి ద్విచక్రవాహనంపై హుజూరాబాద్ వైపు వస్తున్నారు. సైదాపూర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గాజుల శ్రీధర్ ఊరాఫ్ నరేందర్(25) తన స్వగ్రామానికి ద్విచక్రవాహంనపై వెళ్తున్నాడు. బోర్నపల్లి గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో నమిండ్ల సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన గాజుల శ్రీధర్ను హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మొలుగూరి రాజేష్, నమిండ్ల ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బైక్ అదుపుతప్పి ఒకరు.. కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లె గ్రామానికి చెందిన కుర్రె సతీష్(21) ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మరో ఇద్దరు ఉడుత శ్రీనివాస్, పనాస రాజ్కుమార్కు గాయాలయ్యాయి. వీరు పెద్దపల్లిలో క్రేన్ పనికోసం కూలీకి వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పింది. సతీశ్కు తల్లిదండ్రులు స్వరూప,గట్టయ్య ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలలకే నూరేళ్లు.. రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలం రాజానగర్ గ్రామశివారులో క్రేన్ కిందపడి రెండునెలల చిన్నారి రోహిత్ చనిపోయాడు. ఎస్సై కరుణాకర్ వివరాల ప్రకారం... యాదాద్రి జిల్లా కోరికర్ల గ్రామానికి చెందిన ఆనంద్ కుటుంబంతో రెండునెలల క్రితం ఉపా«ధికోసం రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి వచ్చాడు. ఆనంద్ ఆయన భార్య ఆదివారం సారంగపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన బాల మహేష్ బావి తవ్వారు. ఈ క్రమంలో తమ ఒక్కగానొక్క కొడుకు రోహిత్ను క్రేను చీరతో కట్టిన ఊయలలో పడుకోబెట్టారు. ప్రమాదవశాత్తు క్రేన్ నట్టుబోల్ట్లు ఊడిపోయాయి. రోహిత్ క్రేన్ కిందపడి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి వృద్ధురాలు... అల్గునూర్(మానకొండూర్): తిమ్మాపూర్ మండ లం గొల్లపల్లి గ్రామానికి చెందిన కానిగంటి జోగవ్వ(86) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిందని ఎల్ఎండీ ఎస్సై నరేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం ఒంటిగంట సమయంలో వ్యవసాయబావి వద్దకు నడుచుకుంటూ వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో వృద్ధురాలి కొడుకు కానిగంటి మల్లారెడ్డి బావి వద్దకు వెళ్లి చూశాడు. అందులో పడి మృతిచెంది ఉండడంతో స్థానికులసాయంతో వెలికితీశాడు. మల్లారెడ్డి ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు ఒకరు... రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని పెద్దంపేట గ్రామానికి చెందిన ఎలిగేటి మల్లేశ్(30) ప్రమాదశాత్తు చనిపోయాడు. మల్లేశ్ మరో ముగ్గురితో కలిసి వంటచెరుకుకు సమీపంలో అటవీప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వంట చెరుకు నిమిత్తం ఎండుకర్రలను మరో వ్యక్తి గొడ్డలితో నరుకుతున్న క్రమంలో గొడ్డలి కామ విరిగి మల్లేశ్కాలుకు తగడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మల్లేశ్కు భార్య, ఇద్దరు కూతుర్లున్నారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు చొప్పదండి: మండల కేంద్రానికి చెందిన ఎలిగేటి వెంకటేశం(52) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై చేరాలు కథనం ప్రకారం... ఈ నెల 11న అంబేద్కర్చౌరస్తా సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరీంనగర్ వైపు వెలుతున్న ఆటో వెనకనుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూపాలపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ మునిగాల మల్లేశంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
భూ వివాదం యువకుడు దారుణ హత్య
చందుర్తి(వేములవాడ): పాతకక్షలు యువకుడి ప్రాణం తీశాయి. పెద్దల మధ్య ఉన్న భూ వివాదంలో తలదూర్చిన పిల్లలు శత్రువులుగా మారారు. తరుచూ గొడవపడుతూ పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడ్ని తన ప్రత్యర్థి మాటువేసి వేటకొడవళ్లతో నరికి చంపాడు. ఆపై మృతదేహాన్ని అక్కడే ఉన్న వ్యవసాయబావిలో పడేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపూర్లో మంగళవారం చోటు చేసుకోగా... బుధవారం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మెరుపుల హరీశ్(25) ఇంటర్మీడియెట్ మధ్యలో మానేశాడు. తండ్రికి చేదోడు.. వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. మంగళవారం వ్యవసాయపొలం వద్దకు వెళ్లాడు. పశువులకు నీళ్లందించి బుచ్చయ్య అనే వ్యక్తితో తన స్కూటీపై తిరిగివస్తున్నాడు. గ్రామ చెరువు మత్తడి వద్ద మాటు వేసిఉన్న ఇదే గ్రామానికి చెందిన నేరెల్ల రమేశ్, నేవూరి బాబు స్కూటీకి అడ్డం తిరిగారు. తమవద్ద ఉన్న వేటకొడవళ్లతో హరీశ్ తలపై విచక్షణారహితంగా నరికారు. బుచ్చయ్య భయంతో అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన హరీశ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎవరూ గుర్తించొద్దని మృతదేహంతో పాటు స్కూటీని పక్కనే ఉన్న బావిలో పడేశారు. కొడుకు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విషయం తెలిసిన పోలీసులు, హరీశ్ తల్లిదండ్రులు బావివద్దకు చేరుకున్నారు. అప్పటికే రాత్రి అవడంలో వేకువజామున వరకు మోటార్ల సాయంతో నీటినితోడి బధవారం మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహంతో ఆందోళన.. హరీశ్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యా రు. శవాన్ని మంచంపై ఉంచి నిందితుడు నేరేళ్ల రమేశ్ ఇంటికి తీసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా... దాడిచేసేందుకు కూడా వెనకాడలేదు. పోలీసులు వెనక్కి తగ్గడంతో హరీశ్ మృతదేహాన్ని రమేశ్ ఇంట్లో ఉంచారు. అక్కడే దహనసంస్కారాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ధాన్యం, రసాయన ఎరువులు, ఇంటిని ధ్వంసం చేశారు. పరిస్థితి విషమించడంతో చందుర్తి సీఐ విజయ్కుమార్, రుద్రంగి, కోనరావుపేట , వేములవాడ రూరల్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేశ్, శివకేశువులతో పాటు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని ఇక్కడే దహనం చేస్తామని చెప్పడంతో డీఎస్పీ సముదాయించారు. నిందితులకు కఠిన శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం హరీశ్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రధాననాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకు బందోబస్తు నిర్వహించారు. భూ వివాదమే కారణమా...? హరీశ్ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. హరీశ్, రమేశ్ వ్యవసాయపొలాలు పక్కపక్కనే ఉంటాయి. హద్దుల విషయంలో ఇరువురి తండ్రులకు ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవి పిల్లల వరకువెళ్లాయి. రమేశ్, హరీశ్ తరుచూ గొడవ పడేవారు. దసరానాడు కూడా ఇద్దరూ పరస్పద దాడులకు దిగారు. ఇటీవల సైతం తలెత్తిన గ్రూపు గొడవల నేపథ్యంలో రమేశ్ హరీశ్ను మట్టుబెట్టాలని చూశాడు. అదునుచూసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని కుమ్మరికుంటకు అనుబంధ గ్రామమైన గొల్లపల్లికి చెందిన తమ్మడవేని లక్ష్మి(32) భర్త,అత్త,మామ, బావల వేధింపులతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పాలకుర్తి మండలం పూట్నురుకు చెందిన లక్ష్మికి 16ఏళ్ల క్రితం గొల్లపల్లికి చెందిన రాజుతో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కొడుకు, 11 ఏళ్ల కూతురు ఉంది. లక్ష్మి మాజీ ఉపసర్పంచ్. ఇంటిపని విషయమై లక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు తరుచూ వేధించేవారు. అనేకసార్లు గొడవలతో పంచాయితీలు జరిగాయి. ఇదే విషయమై ఈ నెల 7న లక్ష్మిని భర్త రాజు కొట్టాడు. ఇంట్లో నుంచి పోయిన లక్ష్మి ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారంఉదయం గాలించగా మృతదేహం లభ్యమైంది. భర్త రాజు, బావ కొంరయ్య, అత్త గట్టమ్మ, మామ పోచాలుల వేధింపులతోనే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మేనమామ కాల్వ మల్లయ్య చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆ సూసైడ్ నోట్ అర్థమెంటీ..?
సాక్షి, జగిత్యాల: అసలేం జరిగింది..? ఈనెల ఒకటో తేదిన జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ పదో తరగతి విద్యార్థి రుద్రారపు దినేశ్ (15) ఆత్మహత్యా చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకునేంత పెద్ద తప్పు దినేశ్ ఏం చేశాడూ..? అసలు అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి..? ఎందుకొచ్చింది..? ఇప్పుడీ చర్చ జిల్లా కేంద్రంలో హాట్టాపిక్గా మారింది. శ్రీవాల్మీకి ఆవాసంలో ఉంటూ చదువుకుంటున్న తమ బిడ్డది ముమ్మాటికీ హత్యే అని.. హత్యా కేసు నమోదు చేయాలని దినేశ్ కుటుంబ సభ్యులు చెబుతుంటే.. ఆవాసం నిర్వాహకులు మాత్రం దినేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేస్తున్నారు. ఇటు మృతదేహానికి పోస్టుమార్టం చేసిన జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు ముందు దినేశ్ది హత్యే అని చెప్పి తర్వాత ఆత్మహత్య అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో కేసును ఎలా నమోదు చేయాలో తెలియక పోలీసులు చివరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. దినేశ్ చనిపోవడానికి ఓరోజు ముందు పాఠశాలకు ఓ మహిళా వచ్చిందని, ఆమెను చూసి భయపడే మరుసటి రోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆవాసం నిర్వాహకులు చెప్పారు. పాఠశాలకు వచ్చిన ఆ మహిళా ఎవరు..? ఎందుకొచ్చింది..? దినేశ్తో ఏమైనా మాట్లాడిందా..? ఆ మాటలకు భయపడే దినేశ్ ఉరి వేసుకున్నాడా..? అసలు దినేశ్ ఉరి వేసుకునేంత పెద్ద తప్పు ఏం చేశాడనేది సదరు మహిళే సమాధానం చెప్పాల్సి ఉంది. సూసైడ్ నోట్ అర్థమెంటీ..? దినేశ్ చావడానికి ముందు సూసైడ్నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్లో ‘ఆచార్యా నేను అలా చేయలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను తప్పు చేయనిదానికి తప్పు చేసిన అంటే బాగా అనిపియలేదు. అందుకే ఇలా చేస్తున్నాను..’ అని ఉంది. ఇందులో దినేశ్తో ఆచార్య ఏ తప్పు గురించి ప్రస్తావించాడు..? దినేశ్ ఏ తప్పు చేశాడని ఆచార్య చెప్పాడు..? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అయితే.. సదరు ఆవాసం నిర్వాహకుడు (ఆచార్య) మాత్రం దినేశ్ తనతో ఏ తప్పు గురించి ప్రస్తావించలేదని చెప్పడం గమనార్హం. మరోపక్క.. తరగతి గదిలో ఉరి వేసుకున్న తీరుపైనా కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దినేశ్ చనిపోతే ఉరికి వేలాడి ఉండాలి కానీ ఉరి వేసుకున్న వైరు తెగి.. దినేశ్ కింద పడి ఉండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై జగిత్యాల పట్టణ సిఐ రత్నపురం ప్రకాశ్ వివరణ ఇస్తూ.. ‘తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని, స్కూలుకు వచ్చిన ఆ మహిళ, ఆచార్య, సహచర విద్యార్థులు, పలువురు సార్లను విచారించాలని దినేశ్ తండ్రి రుద్రారపు రాజనర్సయ్య మాకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు విచారణ చేపడుతున్నాం’ అన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
హుజూరాబాద్రూరల్: కారులో ప్రయాణిస్తున్న యువకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. గుర్తుతెలియని వాహనాన్ని తప్పించబోయిన లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరోవ్యక్తి కోమాలో ఉన్నాడు. ఈ ఘటన హుజూరాబాద్ మండలం మాందాడిపల్లి గ్రా మం వద్ద కరీంనగర్– వరంగల్ హైవేపై మంగళవారం వేకువజామున మూడుగంటలకు జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకా రం.. శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరి రవి– సరస్వతీ దంపతుల చిన్న కొడుకు కోడూరి వెంకటేష్(25) ఓ సీడ్ కంపెనీలో డ్రైవర్గా చేస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా మినిగలూరు గ్రామానికి చెందిన చెందిన కే.ఎస్ చప్రాద్రెడ్డి(31) అదే కంపెనీలో సూపర్వైజర్గా కొనసాగుతున్నాడు. లింగాపూర్కు చెందిన మరో యువకుడు సుందిళ్ల రంజిత్ కూడా అదే కంపెనీలో కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం వేకువజామున కారులో ముగ్గురూకలిసి హుజూరాబాద్ వెళ్తున్నారు. మాందాడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో వద్దకు చేరుకోగానే ఖమ్మం నుంచి కరీంనగర్ మీదుగా మహారాష్ట్ర వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి ఈ యువకులు వెళ్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి నిలిచిపోయింది. ప్రమాదంలో కారులో ఉన్న వెంకటేశ్, చప్రాల్రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. రంజిత్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడ్ని వరంగల్ ఎంజీఎంకు, మృతదేహాలను హూజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు ఆస్పత్రి ఆవరణలో రోదించిన తీరు అందరినీ కలచివేసింది. వెంకటేశ్ తండ్రి కోడూరి రవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వాసంశెట్టి మాధవి తెలిపారు. ప్రమాదాలకు నిలయం.. హుజూరాబాద్ మండలంలోని పర్కాల్ క్రాస్రోడ్డు నుంచి సింగాపూర్ గ్రామ శివారు వరకు హైవే ప్రమాదాలకు నిలయంగా మారింది. గతేడాది మార్చి 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రతికలంక గ్రామానికి చెందిన కే.ఎస్ చప్రాద్రెడ్డి(45)తుమ్మనపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మార్చి 21న సింగాపూర్ గ్రామశివారులోని వ్యవసాయ బావిలో కారు పడి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. అదేనెల 17న శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఐదుగురికి గాయాలయ్యాయి. ఆగస్టు 15న బోర్నపల్లి సబ్స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబర్ 2న సింగాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లయ్య చనిపోయాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
కేసు భయంతో ప్రాణం తీసుకుంది
సారంగాపూర్(జగిత్యాల): మండలంలోని పోతా రం గ్రామానికి చెందిన తులసి అనంతమ్మ(45) పోలీసుకేసు భయంతో ఈనెల 27న పురుగుల మందుతాగింది. చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. అనంతమ్మ మృతికి కారణమం టూ గ్రామానికి చెందిన లింగం మల్లేశం ఇంటిఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. మృతురాలి కటుంబసభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తులసి అనంతమ్మకు చెందిన కోడిని పిల్లి నోటకరుచుకుని పారిపోయింది. గమనించిన అనంతమ్మ వెంబడించింది. పక్కనే ఉన్న మేడి మల్లీశ్వరి ఇంటివైపు పిల్లి వెళ్లింది. అనంతమ్మ తన చేతిలోని కర్రను పిల్లి వైపు విసిరింది. అది మల్లీశ్వరి ఇంటిఎదుట ఉన్న మిరపచెట్లకు తాకింది. తనపై దాడి చేసేందుకే అనంతమ్మ కర్ర విసిరిందని మల్లీశ్వరి గొడవకు దిగింది. ఇద్దరిమధ్య వివాదం ముదిరింది. మల్లీశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనంతమ్మపై ఈనెల 24న 290,323 పెట్టీ కేసు నమోదు చేశారు. ఒక్కసారి స్టేషన్కు హాజరైంది. మరోసారి పోలీసులు పిలవగా వెళ్లలేదు. ఒకింత భయాందోళనకు గురై ఈనెల 27న తనఇంట్లో పురుగుల మందు, చీమలమందు కలుపుకుని తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జగిత్యాలలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతు శనివారం ఉదయం చనిపోయింది. మృతదేహంతో ఆందోళన మృతదేహాన్ని నేరుగా గ్రామానికి తీసుకొచ్చారు. తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే అనంతమ్మ ఆత్మహత్య చేసుకుందని, ఈ కేసులో ప్రమేయం ఉన్న మల్లీశ్వరి, పెద్దమనిషిగా వ్యవహరించిన లింగం మల్లేశంతో, పాటు మరోఇద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు లింగం మల్లేశం ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆం దోళన చేశారు. విషయం తెలుసుకుని ఎస్సై రాజయ్య అక్కడికి చేరుకొని, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. నలుగురిపై కేసు.. అనంతమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడి మల్లీశ్వరి, లింగం మల్లేశంతో పాటు కేసులో సాకు‡్ష్యలుగా వ్యవహరించిన గొల్లపల్లి రాయలింగు, బుర్ర పోషమల్లుపై ఐపీసీ 306 కింద కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పాతకక్షలతో నిప్పంటించి హత్యాయత్నం
జగిత్యాలక్రైం: వారిద్దరూ స్నేహితులు. నిత్యం ఒక్కచోట పనిచేస్తుంటారు. ఇద్దరిమధ్య ఏర్పడిన చిన్న గొడవతో రెండు నెలలుగా మాట్లాడుకోవడం లేదు. అదే గొడవను మనసులో పెట్టు కుని షేక్ సులేమాన్పై షేక్షరీఫ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన జగిత్యాల మండలం టీఆర్నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. టీఆర్నగర్కు చెందిన షేక్ సులేమాన్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తాడు. అతని వద్ద షేక్ షరీఫ్ లేబర్గా పనిచేస్తాడు. రెండు నెలల క్రితం షరీఫ్ చెట్లఆకులు తింటుడగా సులేమాన్ సెల్ఫోన్లో ఫొటోలు తీశాడు. దీంతో ఇద్దరి మధ్య రెండు నెలల క్రితం గొడవలు జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకున్నారు. అప్పటి నుంచి షరీఫ్ పాత పగను మనసులో పెట్టుకున్నాడు. గురువారం రాత్రి షేక్ సులేమాన్ ఇంటికి వెళ్లాడు. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు మంటలు ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. బాధితుడు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏఎస్సై రాంమూర్తి కేసు నమోదు చేశారు. సీఐ రాజేశ్ కేసు విచారణ చేస్తున్నారు. -
వృద్ధురాలి దారుణహత్య
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో బుధవారం అర్ధరాత్రి దారుణహత్య జరిగింది. గ్రామానికి చెందిన పండుగ లచ్చవ్వ(75)ను గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి చంపేశారు. పోలీసుల వివరాల ప్రకారం... పండుగ లచ్చవ్వ ముగ్గురు కొడుకులు, ఇద్ద రు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలు అ య్యాయి. పెద్దకొడుకు చంద్రయ్య వేములవాడలో, రెండో కొడుకు గోపాల్ గల్ఫ్ వెళ్లాడు. చిన్న కొడుకు లచ్చయ్య, తల్లి ఒక్కచోట ఉంటున్నారు. కాగా చిన్నకొడుకు కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. చిన్నకోడలు.. ల చ్చవ్వ పక్కపక్క ఇండ్లలో ఉంటున్నారు. బుధవారం రాత్రి లచ్చవ్వ నిద్రలోకి వెళ్లింది. అర్ధరాత్రి దాటా క గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మొదట కోడలు ఉంటున్న ఇంటికి గడియపెట్టారు. లచ్చవ్వ నిద్రిస్తున్న గదితలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. గుర్తుతెలియని ఆయుధంతో మొహంపై గట్టిగా మోదారు. కేకలు వినిపించిన లచ్చవ్వ చిన్నకోడలు చుట్టుపక్కలవారిని పిలిచిం ది. వేములవాడలో ఉంటున్న తనబావ చంద్రయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వారు వచ్చేసరికి లచ్చవ్వ చనిపోయింది. దుండగులు పారిపోయారు.పోలీసులు గురువారం ఉదయం డాగ్స్క్వాడ్తో ఇంటి పరిసరాలను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి ఎస్పీ సింధుశర్మ హత్య జరిగిన కోణాన్ని తెలుసుకున్నారు. వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, పట్టణ సీఐ వెంకటస్వామి ఉన్నారు. లచ్చవ్వ పెద్దకొడుకు చంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
పగబట్టి ప్రాణం తీశారు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మిస్టరీ వీడింది.. పాత కక్షలే ప్రాణం తీశాయని వెల్లడయింది..తండ్రి సత్తిరెడ్డి హత్యకు ప్రతీకారంగా కొడుకు మహిపాల్రెడ్డి పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామానికి చెందిన సల్లారపు సత్తిరెడ్డి, సల్లారపు రాంరెడ్డి కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో జూన్ 16న ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా..సత్తిరెడ్డిని రాంరెడ్డి కర్రతో దాడిచేసి హత్యచేశాడు. పోలీసులు నిందితుడు రాంరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపగా..బెయిల్ విడుదలయ్యాడు. ఈక్రమంలో రాంరెడ్డిని మట్టుబెట్టేందుకు సత్తిరెడ్డి కొడుకు మహిపాల్రెడ్డి, అతడి బావ ముత్తంగి తిరుపతిరెడ్డి, అల్లుడు మధుసూదన్రెడ్డితో పక్కా ప్రణాళిక రచించి రాంరెడ్డి కదలికలపై నిఘా పెట్టారు. విషయం పసిగట్టని రాంరెడ్డి ఈనెల 23న బస్వాపూర్ గ్రామంలో తన బంధువుల ఇంట్లో జరిగిన గృహప్రవేశానికి హాజరై..హరీశ్ అనే యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా..ఇదే అదునుగా భావించిన మహిపాల్రెడ్డి బస్వాపూర్, నేరెళ్ల గ్రామాల మధ్య నిర్మాణుష్య ప్రదేశంలో తన హ్యూందయ్ కారుతో రాంరెడ్డి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో రాంరెడ్డి, హరీశ్ రోడ్డు పక్కన గుంతలో పడిపోయారు. కారులోంచి దిగిన మధుసూదన్రెడ్డి కర్రతో రాంరెడ్డి తలపై కొట్టగా..మహిపాల్ గొడ్డలితో నరికాడు. దీంతో రాంరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. తనను కూడా చంపుతారేమోననే భయంతో హరీశ్ పరుగులు పెట్టి రోడ్డుపక్కన కల్వర్టులో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. రాంరెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్న నిందితులు మహిపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి హైదరాబాద్ పారిపోగా..తిరుపతిరెడ్డి వేములవాడకు వెళ్లిపోయాడు. మూడు స్పెషల్ టీమ్లుగా గాలిస్తున్న పోలీసులకు ముగ్గురు నిందితులు కారులో సిరిసిల్ల వైపు వస్తుండగా చాకచక్యంగా జిల్లెల్ల చెక్ పోస్టు వద్ద రూరల్ సీఐ అనిల్కుమార్ అరెస్టు చేశారు. పోలీసులు విచారించగా లొంగిపోయేందుకే సిరిసిల్లకు వస్తున్నట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి హ్యూందయ్ కారు, ద్విచక్రవాహనం, హత్యకు వాడిన గొడ్డలి, కర్రలు, నాలుగు సెల్ ఫోన్లు, రక్తపు మరకలు కలిగిన దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించి పూర్తి ఆధారాలతో నిందితులను అరెస్టు చేసిన సీసి అనిల్కుమార్, తంగళ్లపల్లి ఎస్సై వెంకటకృష్ణ, ముస్తాబాద్ ఎస్సై రాజశేఖర్, ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రవీణ్ను డీఎస్పీ అభినందించారు. -
స్పీడ్ కిల్స్..
అతివేగం ప్రమాదకరం.. నిదానమే ప్రధానమని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ప్రచారం చేస్తున్నా వాటిని పట్టించుకునే నాథుడే లేడు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు.. అని పలు ఆటోలు, బస్సులకు స్టిక్కర్లు అతికి ఉంచడం చూస్తాం.. కాని పాటించం.. ముఖ్యంగా బైక్పై వెళ్లేవారు ప్రమాదాలకు గురికావడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే పలు చోట్ల బైక్ ప్రమాదాలు జరిగాయి. కన్నాయిగూడెం: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారి, మరో ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన కన్నాయిగూడెం మండలం గుర్రేవుల మలుపు వద్ద శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరునాగారం మండలం రోహీర్ గ్రామానికి చెందిన ఆముదాల రమేష్ గత ఆరుమాసాల నుంచి ముప్పనపల్లి గ్రామంలో తైవాన్ పంపులు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమలో గూర్రేవుల గ్రామానికి బంధువుల ఇంటికి çపని మీద వెళ్లి బైక్పై వస్తున్నాడు. సెల్ఫోన్ మాట్లాడుతూ అతి వేగంగా బైక్పై వస్తూ ఎదురుగా వచ్చే కావిరి రవి(28) బైక్ను ఢీ కొట్టాడు. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. జనగం వెంకటయ్య, ఈశ్వరమ్మలకు స్వల్పగాయాలయ్యాయి. ఆముదాల రమేష్కు తలకు , కాలుకు తీవ్ర గాయాలు కాగ వెంటనే ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రవి బుట్టాయిగూడెంలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రవి బైక్పై వెళ్తున్న వెంకటయ్య, ఈశ్వరమ్మలు గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని సీఐ సత్యనారాయణ పరిశీలించారు. బైక్లు ఢీకొని ఇద్దరికి గాయాలు మహాముత్తారం: మండలంలోని యామన్పల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మహాముత్తారం ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం కాళేశ్వరం గ్రామానికి చెందిన కూరపాటి మహేష్ అనే వ్యక్తి మేడారం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో బోర్లగూడెం గ్రామానికి చెందిన వాసం మధు అనే వ్యక్తి కాటారం నుంచి బోర్లగూడెం వెళ్తుండగా మార్గమద్యలోని యామన్పల్లి చెరువు సమీపంలోని ప్రధాన రహదారిలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఒకదానికి ఒకటి ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో మహాముత్తారం ఎస్సై రాము సంఘటనా స్థలానికి చేరుకొని ప్రైవేట్ వాహనంలో మహాదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. బైక్ను ఢీకొట్టిన లారీ.. కురవి:బైక్ను గుర్తు తెలియని లారీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన కురవి మండలంలోని మోద్గులగూడెం–తాళ్లసంకీస గ్రామాల నడుమ ఖమ్మం ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం శివారు సాధు తండాకు చెందిన తునగర్ ఉపేందర్, తునగర్ బావ్సింగ్లు మహబూబాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై కురవి మీదుగా మన్నెగూడెం వెళ్తున్నారు. మానుకోట నుంచి వస్తున్నలారీ ముందు వెళ్తున్న బైక్ను మోద్గులగూడెం–తాళ్లసంకీస గ్రామాల నడుమ రహదారిపై ఢీకొట్టింది. ఈ ఘటనలో తునగర్ ఉపేందర్, బావ్సింగ్లకు తలలకు బలమైన గాయాలు కావడం జరిగింది. రక్తస్రావం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న జనం 108కి సమాచారం అందజేశారు. హుటాహుటిన తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైక్ను ఢీకొట్టిన లారీ వేగంగా వెళ్లిపోవడంతో లారీ దొరకలేదు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. -
అనుమానమే పెనుభూతమై..
మల్యాల(చొప్పదండి): అనుమానం పెనుభూత మై రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. అనారోగ్యానికి అనుమానం తోడవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యను గొంతు కోసి హత్య చేసిన అనంతరం భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.ఎస్సై మిథున్ కథనం ప్రకారం.. మల్యాల మండలకేంద్రానికి చెందిన కరబూజ శ్రీనివాస్(37)కు ఏడేళ్ల క్రితం సారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామానికి చెందిన ముంజాల లక్ష్మీతో వివాహమైంది. మూడేళ్ల కూతురు విషిత ఉంది. గతంలో గీత కార్మిక వృత్తి చేసిన శ్రీనివాస్ రెండేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ రెండేళ్ల అనంతరం నెల రోజుల క్రితం గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో ఇంట్లో ఉన్న పిల్లలను బయటకు పంపించి గది తలుపులు వేశాడు. దీంతో పిల్లలు లక్ష్మీ కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారమందించారు. పిల్లలు ఏడుస్తుండడంతో ఇంటి పరిసరాల్లో ఉండేవారు శ్రీనివాస్ అన్న మల్లేశంకు చెప్పారు. మల్లేశం ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, ఇద్దరు విగతజీవులై ఉన్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సీఐ నాగేందర్, ఎస్సై మిథున్ పరిశీలించారు. మృతురాలి తల్లి ముంజాల గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పాపం.. చిన్నారులు శ్రీనివాస్ మొదటి భార్య ఎనిమిదేళ్ల క్రితం నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి స్పందన, విశాంత్ సంతానం. మొదటి భార్య కుమారుడు అమ్మమ్మవాళ్లింట్లో ఉంటున్నాడు. కూతురు శ్రీనివాస్తోనే ఉంటోంది. అనంతరం లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల విషిత సంతానం. -
‘నన్ను క్షమించండి...నేను ఏ తప్పు చేయలేదు
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఎండీ. నేహ(15) అనే బాలిక ఉరివేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాలికను ఓ యువకులు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తుండడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. నిందితున్ని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వన్టౌన్ పోలీసుల వివరాల మేరకు... స్థాని అంబేద్కర్నగర్కు చెందిన ఎండీ జలేఖభేగంకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమా రుడు, కోడలు అబ్దుల్ లతీఫ్, షబానా దంపతులు ఆరేళ్ల వయసులో ఉన్న వారి కూతురు నేహాను ఇంట్లో వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో నేహకు అన్నీతానైన నాయనమ్మ జలేఖభేగం, బాబాయ్ అబ్దుల్ రజాక్ ఆలనాపాలన చూ సుకుంటున్నారు. ఉర్దూ మీడియంలో నేహా 7వ తరగతి వరకు చదువుకుంది. శనివారం జలేఖభేగం కూతురును చూసేందుకు మంచిర్యాలకు వెళ్లగా, బాబాయ్ వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నేహ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన నాయనమ్మ, బాబాయ్ ఉరికి వేళ్లాడుతున్న నేహను చూసి షాక్కు గురయ్యారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. వన్టౌన్ సీఐ ఎస్.వాసుదేవరావు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘నన్ను క్షమించం డి... నేను ఏ తప్పు చేయలేదు...’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించిందని సీఐ తెలిపారు. అలాగే ఆర్టీసీ చైర్మన్, తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, రామగుండం నగరపాలక సంస్థ మేయర్ చిట్టూరి రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రేమ పేరుతో వేధింపులు... ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ గత కొంతకాలంగా నేహను ప్రేమించాలంటూ ఫోన్లో వేధింపులకు గురి చేయడంతోపాటు వెంటపడుతున్నాడు. శనివారం నేహ బాబాయ్ రజాక్కు నిఖిల్ ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతోనే నేహ ఆత్మహత్య చేసుకుందని నాయనమ్మ, బాబాయ్లు రజాక్, సమర్తోపాటు బంధువులు ఆరోపించారు. గుండెలవిసేలా రోదించిన నాయనమ్మ... ‘‘ఎంత పనిచేసిన్ బేటా... నన్ను వదిలిపోయావా...’’ అంటూ నేహ మృతదేహం దగ్గర నాయనమ్మ జలేఖభేగం గుండెలవిసేలా రోధించింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేస్తే, అనాథ కావద్దని నేహను కన్న కూతురుగా పెంచుకుం టున్నానని... ఇలా చనిపోతుందని అనుకోలదని జలేఖభేగం రోదించింది. నిందితున్ని అరెస్ట్ చెయ్యాలని ధర్నా... నేహ మృతికి కారకుడైన నిందితున్ని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువు లు, ముస్లిం పెద్దలు, యువకులు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐ లు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని ఆందోళనకారులను శాంతిపజేశారు. నిందితునిపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఐ వాసుదేవరావు -
అత్తింటి వేధింపులు..నవవధువు ఆత్మహత్య
రాయికల్(జగిత్యాల): అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవవధువు పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కరుణాకర్ వివరాల ప్రకారం... రాయికల్ పట్టణానికి చెందిన ఊరడి మల్లయ్య, గంగరాజుల కుమార్తె లహరి ఊరాఫ్ కృష్ణవేణి(22)కి ధర్మపురికి చెందిన శనిగారపు రాకేశ్తో ఆగస్టులో వివాహం అయ్యింది. ఆ సమయంలో రూ.15 లక్షల కట్నం ఒప్పుకోగా రూ.10 లక్షలు ఇచ్చారు. రాకేశ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా చేస్తుంటాడు. ఈ క్రమంలో కృష్ణవేణిని కొంతకాలంగా అత్తింటివారు మిగితా కట్నం తేవాలని వేధించారు. దీంతో సద్దుల బతుకమ్మకు పుట్టింటికి వచ్చిన కృష్ణవేణిని తిరిగి అత్తారింటికి తీసుకెళ్లలేదు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన కృష్ణవేణి శనివారం పుట్టింట్లో ఉరివేసుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఊరడి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజేశ్ పరిశీలించారు. -
ఏసీబీ వలలో ధర్మపురి ఎస్సై
సాక్షి, ధర్మపురి: ఓ ట్రాక్టర్ కేసు విషయంలో రూ.50వేలు లంచంగా డిమాండ్ చేసి.. రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎస్సై అంజయ్య. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కిరణ్కుమార్ వెల్లడించారు. పెగడపెల్లి మండలం ఎల్లాపూర్కు చెందిన పెద్ది శ్రీరాములు కరీంనగర్లో వాహనాల కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఈయన గత మార్చి 10న అల్లంకొండ చంద్రయ్యకు చెందిన ట్రాక్టర్ను మహీంద్రా ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసి.. స్క్రాప్ కింద అమ్మేశాడు. అయితే సదరు ట్రాక్టర్పై గతంలో ఇసుక అక్రమ రవాణా చేసినట్లు ధర్మపురిఠాణాలో కేసు నమోదై ఉంది. ఆ కేసును తిరగదోడిన ఎస్సై అంజయ్య శ్రీరాములుకు గతనెల 19న ఫోన్చేశాడు. ఆయన గతనెల 21న ధర్మపురి స్టేషన్కు రాగా.. కేసులో ఉన్న ట్రాక్టర్ను ఎలా విక్రయిస్తావని దబాయించాడు. రూ.యాభై వేలు లంచం ఇస్తేనే కేసు మాఫీ చేస్తానని, లేదంటే దొంగతనం కింద కేసు నమోదు చేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. గత నెల 25న మళ్లీ ఫోన్ చేయగా.. శ్రీరాములు స్టేషన్కు వెళ్లి.. అంతమొత్తం ఇచ్చుకోలేనని వేడుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేశాడు. అనంతరం కరీంనగర్ చేరుకుని ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గత నెల 29న ఎస్సై అంజయ్య ఏఎస్సై వాహిద్ను కరీంనగర్కు పంపించి.. శ్రీరాములు నుంచి డబ్బులు తీసుకురావాలని ఆదేశించాడు. ఆయన కరీంనగర్ రాగా.. రెండురోజుల్లో వచ్చి కలుస్తానని శ్రీరాములు అతడిని పంపించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ధర్మపురి స్టేషన్కు వచ్చిన శ్రీరాములు ఎస్సై అంజయ్యను కలిసి ముందుగా రూ.పదివేలు ఇచ్చాడు. మరో రూ.ఐదువేలు డిమాండ్ చేయడంతో ఏటీఎం నుంచి తీసుకొస్తానని చెప్పి.. బయటకొచ్చి ఏసీబీ అధికారులకు చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స్టేషన్కు చేరుకుని.. ఎస్సై నుంచి రూ.పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంజయ్యపై కేసు నమోదు చేసి.. గురువారం ఏసీబీ స్పెషల్కోర్టుకు అప్పగిస్తామని డీఎస్పీ తెలిపారు. దాడిచేసిన వారిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, సంజీవ్ తదితరులున్నారు. -
గంగుల ఇలా చేస్తే ఇంటి మీదికే వెళ్తా: పొన్నం
కరీంనగర్రూరల్: టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం కరీంనగర్ మండలం చేగుర్తిలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి గ్రామంలోకి రాకుండా యత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిని నెట్టివేస్తూ ముందుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలంలోని బొమ్మకల్ రామాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల నుంచి కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అనంతరం దుర్శేడ్లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ప్రభాకర్ను కొందరు మహిళలు డబుల్బెడ్రూం ఇళ్లు, బతుకమ్మ చీరెలివ్వలేదని, ఇళ్లస్థలాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ ఎమ్మెల్యే కమలాకర్ను నిలదీయాలని ప్రభాకర్ చెప్పారు. దీంతో మహిళలు ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు దూరంగా తీసుకెళ్లారు. అనంతరం నల్లగుంటపల్లిలో ప్రచారం ముగించుకుని చేగుర్తికి చేరుకున్న ప్రభాకర్ను టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై అడ్డుగా బైఠాయించి అడ్డుకున్నారు. పొన్నం గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను తొలగించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల లోపులాట మధ్యలోనే ప్రభాకర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకోగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రూరల్ సీఐ శశిధర్రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి అడ్డుకుంటే ‘గంగుల’ ఇంటి మీదికే వెళ్తా: పొన్నం ప్రభాకర్ ‘గంగుల కమలాకర్ దోస్తు దోస్తంటే ఇట్లా చేస్తుండు.. నలుగురిని పంపించి అడ్డుకుంటున్నారు.. బిడ్డా నీ పిసరు పిసరు ఎళ్లాలి. మళ్లోసారి అడ్డుకుంటే నీ ఇంటిమీదకే వస్తా.. ఓడిపోతావని భయం పట్టుకుందా.. తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు చాలదా’.. అని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై పొన్నం మాజీ ఎమ్మెల్యే కమలాకర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తండ్రికొడుకులు పోటీచేసే అవకాశముందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను వివరించి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి.సంతోష్కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చ ల్మెడ లక్ష్మినర్సింహరావు, కార్యదర్శులు ఆమ ఆనంద్, శంకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, నగర అధ్యక్షుడు కె.ఆగయ్య, బొమ్మకల్ ఎంపీటీసీ వెంగల్దాసు శ్రీనివాస్, ఈశ్వర్, మాజీ ప్రజాప్రతి నిధులు జువ్వాడి మారుతీరావు, బేతి సుధాకర్రెడ్డి, మోహన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, పొన్నం సత్యం, టి.శ్రీనివాస్గౌడ్, దామోదర్రావు, గోపాల్, శ్రావణ్, రమేశ్ పాల్గొన్నారు. అడ్డుకున్న వారిపై కేసు నమోదు కరీంనగర్ క్రైం: కరీంనగర్ మండలం చేగుర్తిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం జెండా పండుగ నిర్వహించారు. అయితే వీరి కార్యక్రమాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన గాడ్ల లక్ష్మినారాయణ, చామనపల్లి రాజు, అవుల సంతోష్తో పాటు మరో నలుగురిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కమద్రి సంజీవ్కుమార్ కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంజీవ్కుమార్ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శశిధర్రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఏ పార్టీ అయినా మరో పార్టీ వారిని అడ్డుకోవడం, ఆటంకపర్చడం, వారి కార్యక్రమయాలు నిర్వహించుకోకుండా ఇబ్బందులు గురి చేయరాదని అలాంటి వారిపై ఎన్నికల నిబందనల ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్రెడ్డి హెచ్చరించారు. ప్రశాంత శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. -
చదువు ఇష్టంలేక ఆత్మహత్య
జగిత్యాలక్రైం: చదువుఇష్టం లేక ఓ పదో తరగతి విద్యార్థి డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఇటీవల ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోనే ఈ విద్యార్థి సైతం బలవన్మరణానికి పాల్పడడం జగిత్యాల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన దుర్గపు జగదీశ్(15) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు.అయితే కొద్దిరోజులుగా చదువు ఇష్టం లేకపోవడంతో దిగాలుగా ఉండేవాడు. గమనించిన తల్లిదండ్రులు సముదాయించి పాఠశాలకు పంపిస్తుండేవారు. ఇటీవల దసరా సెలవులు రావడం, 15రోజులు సంతోషంగా గడిపిన జగదీశ్ మళ్లీ పాఠశాలకు వెళ్లి చదువుకోవడాన్ని ఇష్టపడలేదు. దీంతో తనను ఎలాగైనా పాఠశాలకు పంపిస్తారనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో నిర్మాణుశ్య ప్రాంతంలో బుధవారం డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతనెలలో ఇదే ప్రాంతంలో పదో తరగతి విద్యార్థులు రవితేజ, మహేందర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాన్న మంచిర్యాలలో... అమ్మ కొడుకు వద్ద.. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన దుర్గపు గంగాధర్– లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. గంగాధర్ ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయన వద్దే పెద్ద కుమారుడు రంజిత్ ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమారుడు జగదీశ్ పదో తరగతి చదువుతుండడంతో తల్లి లక్ష్మి జగిత్యాలలోనే ఉంటోంది. దసరా సెలవుల నేపథ్యంలో ఇద్దరు కుమారులతో పాటు తల్లిదండ్రులు మంచిర్యాలలోనే గడిపారు. సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభం కావడంతో జగదీశ్ ఆయన సోదరుడు రంజిత్ మంగళవారం జగిత్యాలకు చేరుకున్నారు. అయితే బుధవారం ఉదయం కడుపునొస్తోందని, పాఠశాలకు వెళ్లనని చెప్పిన జగదీశ్ ఉదయం 10గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. డీజిల్ కొనుక్కుని మిషన్కాంపౌండ్ ప్రాంతంలోని నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లి డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు తట్టుకోలేక కేకలు వేశాడు. స్థానికులు వెళ్లి చూసేసరికి మృతిచెందాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వద్ద సెల్ఫోన్, పాఠశాలకు చెందిన పుస్తకాలు ఉండటంతో పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ ప్రకాశ్ తెలిపారు. -
ప్రాణం తీసిన ట్రిపుల్ రైడింగ్
సాక్షి, ధర్మపురి: ట్రిపుల్ రైడింగ్ నిండు ప్రాణాన్ని బలిగొంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో యువకుడి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బీర్పూర్ మండలం కండ్లపల్లికి చెందిన నారపాక రంజిత్(19), విష్ణువర్ధన్, పూడూరి సిద్దు ధర్మపురి మండలం గాదెపల్లికి బయలుదేరారు. గాదెపెల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కెనాల్లో నీరు ఉండడంతో తీవ్రంగా గాయపడ్డ రంజిత్ నీటిలో మునిగి మృతిచెందాడు. విష్ణువర్ధన్, సిద్దును స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బైక్ను విష్ణువర్ధన్ నడిపిస్తున్నాడని ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడి తండ్రి దుబ్బయ్య గతంలో చనిపోయాడు. చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న కొడుకు మృతిచెందడంతో తల్లి గంగవ్వ రోదనలకు అంతులేకుండా పోయింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రంజిత్ కుటుంబంలో విషాదం సారంగాపూర్(జగిత్యాల): ఆసరాగా నిలుస్తాడనుకున్న ఎదిగొచ్చిన కొడుకు అకాల మృతితో రంజిత్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఏడాదిన్నర క్రితం భర్త చనిపోగా.. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి వేదనకు అంతులేకుండా పోయింది. మండలంలోని కండ్లపల్లికి చెందిన నారపాక రంజిత్(19) సోమవారం ధర్మపురి మండలంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రంజిత్ తండ్రి దుబ్బయ్య ఏడాదిన్నర క్రితం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతిచెందాడు. తల్లి గంగమ్మ కూలి పనిచేసుకొని రంజిత్, అతని తమ్ముడు హన్సిత్ను సాదుకుంటుంది. రంజిత్ ప్రస్తుతం బీర్పూర్లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ బ్యాండ్మేళంలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. చెట్టంతా కొడుకు మరణవార్త విని తల్లి గంగమ్మ కుప్పకూలిపోయింది.