online services
-
అమ్మకాల్లో ఆన్లైన్దే హవా..
కోల్కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది. ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్లైన్ స్టోర్లకంటే ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్లైన్ అమ్మకాలు ఆఫ్లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్ఐక్యూ, జీఎఫ్కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం.. డోర్ డెలివరీ ఎఫెక్ట్ కరోనా తదుపరి లాక్డౌన్లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్లైన్కే ఓటు వేస్తున్నారు. భారీ వృద్ధి బాటలో లాక్డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది. ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్ఫ్రీ ఫ్రిజ్లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి. -
ఏదైనా సాయంత్రం 5 తర్వాతే..
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) చందాదారులకు లెక్కలు దాచి చుక్కలు చూపిస్తోంది. చందాదారుల ఖాతావివరాలను తెలుసుకునేందుకు ఉన్న ఈ–పాస్బుక్ ఆప్షన్ సేవలను ఈపీఎఫ్వో నిలిపివేసింది. ఈ–పాస్బుక్ సర్వీసు కోసం లాగిన్ అయ్యేందుకు వెబ్సైట్లో పేజీని తెరవగానే ‘ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పాస్బుక్ సర్వీసులు పునరుద్ధరిస్తాం’అని ప్రత్యక్షమవుతోంది. కొన్నిరోజులుగా ఇదే సూచన ప్రత్యక్షమవుతోందని ఖాతా దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి భవిష్యనిధి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ నెలవారీ చందా జమచేస్తున్న వివరాలు మొదలు భవిష్యనిధిలో ఉన్న మొత్తం, ఈ నిధిపై వస్తున్న వడ్డీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం హక్కుగా భావిస్తారు. నగదు నిల్వలు, వడ్డీ డబ్బులతో భవిష్యత్ కార్యకలాపాలకు సైతం ప్రణాళిక రచించుకుంటారు. రెండేళ్లుగా వడ్డీ ఏమైంది? వడ్డీ జమ అయ్యిందా?.. అనేది అత్యధిక ఈపీఎఫ్ చందాదారుల్లో తలెత్తుతున్న ప్రశ్న. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల, రెండు నెలల్లో ఈపీఎఫ్వో చందాదారుల ఖాతాలో వడ్డీ నిధిని జమ చేస్తుంది. ఈ మేరకు ఖాతా రికార్డుల్లో లెక్కలు పేర్కొంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఈపీఎఫ్వో ద్వారా వస్తుండటంతో చందాదారులు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవడానికి ఇష్టపడరు. ఇంతటి కీలకమైన ఈపీఎఫ్ ఖాతాలోని వడ్డీ డబ్బులకు సంబంధించిన సమాచారంగత రెండేళ్లుగా అందుబాటులో లేదంటూ చందాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ నిధిపై స్పష్టత లేదని చందాదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2022–23 సంవత్సరంలో వడ్డీ శాతంపైనా ఈపీఎఫ్వో నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. -
‘స్మార్ట్’ తెలంగాణ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి వ్యవసాయంలో ఆధునికత పెరిగిపోయింది. సంప్రదాయ పద్ధతుల్లో సాగు దాదాపుగా కనుమరుగైపోతోంది. విత్తనాలు నాటాలన్నా యంత్రాలే..కోత కోయాలన్నా యంత్రాలే. ఇక మధ్యలో పంటలను ఆశించే తెగుళ్లను నిర్మూలించేందుకూ ఆధునిక స్ప్రే పరికరాలు వచ్చేశాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి..కానీ ఏ పనికి ఏ పరికరం వాడాలి?, ఏ తెగులు సోకితే ఏ మందు వాడాలి?, పంటల ఎదుగుదల సరిగ్గా లేకుంటే ఏం చేయాలి?..ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, పరిష్కారం దొరికినట్టేనని అంటున్నాడు కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం రామానుజరెడ్డి. తనకున్న యాభై ఎకరాల్లో వరి, పత్తి పంటలను సాగు చేస్తూ చీడపీడలకు ‘స్మార్ట్ ఫోన్ వైద్యం’చేస్తున్నాడు. తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ప్లాంటిక్స్, అగ్రిసెంటర్, కిసాన్ తదితర యాప్ల సహాయంతో మొక్కలు ఎదగకపోయినా లేదా తెగులు కనిపించినా ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తే గంటల వ్యవధిలోనే తగు సలహాలు వచ్చేస్తున్నాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్లో శోధించడం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ–పేమెంట్లు కూడా పెరిగిపోవడం స్మార్ట్ ఫోన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తున్నాయో స్పష్టం చేస్తోంది. జోరుగా ఆన్లైన్ సర్వీసులు 2022లో తెలంగాణలో టెలిడెన్సిటీతో పాటు డిజిటల్ లైఫ్ గణనీయంగా పెరిగిపోయింది. దేశ సగటుకు మించిన స్మార్ట్ సిటిజెన్ (స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు), డేటా వినియోగంతో పాటు ఆన్లైన్ సర్వీసులు, పేమెంట్లు జోరుగా సాగుతున్నాయి. టెలిడెన్సిటీ (ఎంత మందికి ఎన్ని సిమ్లు)ని తీసుకుంటే 2022 ట్రాయ్ తాజా నివేదిక మేరకు తెలంగాణలో 100 మంది 110 సెల్ఫోన్ సిమ్కార్డులున్నాయి. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో 4.22 కోట్ల సిమ్ కార్డులుండగా వీటిలో 1.80 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కేరళ 100 మందికి 123 సిమ్లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ సెకండ్ ప్లేస్కు చేరింది. రాష్ట్రాల వారీగా ప్రతి 100 మందికి వాడుతున్న సిమ్ల వివరాలు ఈ పేమెంట్లలో టాప్ ఫైవ్లో హైదరాబాద్ కోవిడ్తో వేగం పుంజుకున్న ఈ పేమెంట్ల జోరు 2022లో కూడా కొనసాగింది. ఒకరి నుండి ఒకరికి, సంస్థల నుండి బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ మినహాయిస్తే.. వ్యక్తిగత లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ – 2022) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఈ కామర్స్ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ, ముంబై అనంతరం హైదరాబాద్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో ఉండగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు వరసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లావాదేవీల కోసం అత్యధికంగా ఫోన్పే (47.8%), గూగుల్పే (33.6%), పేటీఎం (13.2%) లను ప్రజలు వినియోగిస్తున్నారు. నగదు వాడేదే లేదు..! ప్రపంచంలో 63 దేశాలు చుట్టివచ్చా. ఇండియాలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లా. విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి కరెన్సీ తీసుకుంటా. ఇండియాలో మాత్రం నగదు రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు. ఇక హైదరాబాద్లో అయితే అన్నీ ఆన్లైన్లోనే. – నీలిమారెడ్డి, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ సిటిజెన్ సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వ, ప్రైవేటు సేవలు చాలావరకు ఆన్లైన్లోకి రావటం వల్లే టెలిడెన్సిటీ పెరిగింది. దీంతో పాటు ఆన్లైన్ లావాదేవీలు పెరిగి తెలంగాణలో స్మార్ట్ సిటిజెన్ సంఖ్య దేశ సగటు కంటే పెరుగుతూ వస్తోంది. అలాగే దేశంలో అత్యధిక డేటా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. దీని ఫలితాలు అన్ని రంగాల్లోనూ రావటం మొదలయ్యాయి. – జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ -
పెద్ద ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
సాక్షి, అమరావతి: రూ.25 లక్షలకు పైబడి వార్షికాదాయం కలిగిన 175 పెద్ద ఆలయాల్లో జనవరి నెలాఖరుకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 16 ప్రధాన ఆలయాల్లో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క నిమిషమే కదా అనుకుంటే..? ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సాక్షి సెంట్రల్ డెస్క్: ఒక్క నిమిషం.. ఇందులో ఏముంది. సింపుల్గా గడిచిపోతుంది. ఒక పాట వినాలన్నా, చూడాలన్నా నాలుగైదు నిమిషాలు పడుతుంది అంటారా? కానీ ఒక్క నిమిషంలో డిజిటల్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా.. ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఆన్లైన్ సేవల సంస్థ డొమో దీనిపై పరిశీలన జరిపి నివేదిక రూపొందించింది. మరి ఒక్క నిమిషంలో ఏమేం జరుగుతోందో చూద్దామా.. డేటా లెక్క.. నోరు తిరగనంత! ♦స్టాటిస్టా సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న జనాభా సంఖ్య 500 కోట్లు దాటింది. ♦మొత్తం భూమ్మీద ఉన్న జనాభాలో ఇది 62 శాతం ♦ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారిలో ఏకంగా 93 శాతం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ♦2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా సృష్టించిన, కాపీ చేసిన, వినియోగించిన డేటా లెక్కఎంతో తెలుసా.. ♦97 జెట్టాబైట్లు.. అంటే లక్ష కోట్ల జీబీ (గిగాబైట్లు) డేటా అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 10,00,00,00, 00,000 జీబీలు. -
ఏపీఐఐసీ ఆన్లైన్ సేవలకు ఆదరణ
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే ఒక్క క్లిక్తో ఆన్లైన్ ద్వారానే అన్ని సేవలు అందించేలా ఏపీఐఐసీ వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 14 సేవలను అందిస్తుండగా.. త్వరలోనే అన్ని సేవలను అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం ‘సాక్షి’తో చెప్పారు. ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు అనుమతుల కోసం 389 దరఖాస్తులు రాగా, నిర్ణీత గడువులోగా 144 అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. కొన్ని అనుమతులకు మరింత సమాచారం అవసరం కావడంతో తిరిగి పంపగా, మిగిలిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్టు చెప్పారు. సేవల విస్తరణ ప్రస్తుతం వెబ్ ద్వారా సేవలను అందిస్తున్నామని, ఏపీఐఐసీ సేవల కోసం ఒక మొబైల్ యాప్ను రూపొందిస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ ఆన్లైన్ ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా సేవలను విస్తరిస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమ పేర్లు మార్చుకోవడం, కేటాయింపుల్లో మార్పు, కేటాయింపుల బదిలీ, పునఃకేటాయింపులు, కేటాయింపులను వెనక్కి తీసుకోవడం, లైన్ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, ఐదెకరాల్లోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, ఐదెకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాట్కు సంబంధించిన ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు.. తదితర సేవలను ఆన్లైన్లో అందిస్తున్నామని, త్వరలోనే మిగిలిన సేవలనూ ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఏపీఐఐసీ ఎండీ వివరించారు. -
ఒక క్లిక్తో ఏపీఐఐసీ సేవలు..14 సేవలు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 14 సేవలకూ ఒకటే అప్లికేషన్ సింగిల్ విండో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుందన్నారు. పరిశ్రమ పేరు మార్చుకోవడం, కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు, ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం) -
మరో 180 ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
పెనుగంచిప్రోలు: ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సేవలు, పూజలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ పి.వాణీమోహన్ పేర్కొన్నారు. శనివారం ఆమె కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా ప్రముఖ ఆలయాలన్నింటిలో ఆన్లైన్ సేవలు కొనసాగుతున్నాయని, మరో 180 దేవాలయాల్లో కొత్తగా ఆన్లైన్ సేవలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు రిజిస్టర్లు, బంగారం, వెండి నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించటంపై దృష్టి పెడుతున్నామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆలయ ఈవో మూర్తి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలతో ప్రిన్సిపల్ సెక్రటరీని సత్కరించారు. -
ఆన్లైన్ పూజలు.. ఇంటికే ప్రసాదం
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకుని దేవాదాయ, తపాలాశాఖలు సంయుక్తంగా ఆన్లైన్ సేవలు, స్పీడ్పోస్టు ద్వారా ఇంటికే ప్రసాద పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. ప్రయోగాత్మకంగా మొదట సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్తో దీన్ని ప్రారంభిస్తున్నారు. కోవిడ్ ఆందోళన నేపథ్యంలో కొందరు భక్తులు దేవాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ, ఏటా వినాయక ఉత్సవాల వేళ ఆలయంలో పూజలు చేయించుకునే సంప్రదాయాన్ని ఆచరించలేకపోతు న్నామన్న భావన వారిలో ఉంది. ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తపాలాశాఖ ఈ–షాప్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే నవరాత్రి ప్రత్యేక పూజాదికాలను నిర్ధారిత రోజుల్లో వారి పేరుతో నిర్వహి స్తారు. కుంకుమ, అక్షింతలు, పొడి ప్రసాదాలను స్పీడ్ పోస్టు ద్వారా భక్తుల ఇళ్లకు పంపుతారు. సెప్టెంబరు 12న లక్ష భిల్వార్చన (రుసుము రూ.320), 14న సత్య గణపతి వ్రతాలు (రూ.620), 17న సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం (620), 10 నుంచి 19 వరకు సహస్ర మోదక గణపతి హోమాలు (620), 10 నుంచి 20 వరకు సర్పదోష నివారణ అభిషేకాలు (రూ.400) ఉంటాయని, ఆయా సేవలకు కనీసం రెండు రోజుల ముందు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. -
కారు రుణం మరింత సులువు
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ వేదికను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫాం ద్వారా దరఖాస్తు చేసుకుని వినియోగదార్లు సులభంగా కారు రుణం పొందవచ్చు. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ సేవలను 2020 డిసెంబరులో కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టింది. ఇప్పుడీ వేదికను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించేందుకు కంపెనీ 14 బ్యాంకులతో చేతులు కలిపింది. వీటిలో నచ్చిన బ్యాంకును కస్టమర్లు ఎంచుకోవచ్చు. ‘షోరూంలకు వచ్చే ముందే కార్లు, ఫైనాన్స్ వివరాల కోసం వినియోగదార్లు ఆన్లైన్లో వెతుకుతున్నారు. మారుతున్న కస్టమర్ల తీరును దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్ఫాంను తీసుకొచ్చింది. ఈ సేవలు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల పైచిలుకు విజిటర్లు నమోదయ్యారు’ అని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
ఇష్టదైవానికి ఆన్లైన్లోనే పూజలు
సాక్షి, అమరావతి: కోవిడ్ వేళ గుడి వరకు వెళ్లకుండానే తమ ఇష్ట దైవాల పూజల్లో ఆన్లైన్ ద్వారా హాజరవుతున్నారు భక్తులు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్లో పూజాదికాలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన శుక్రవారం రోజున రాష్ట్రంలోని 23 ఆలయాల్లో 512 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు దేవదాయ శాఖ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ క్షేత్రమైన మావుళ్లమ్మ ఆలయంలో శుక్రవారం అత్యధికంగా 159 మంది భక్తులు ఆన్లైన్ పూజల్లో పాల్గొనగా.. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయంలో ఒక్కరోజే 145 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా పూజలు నిర్వహించారు. ఈ నెల 8–11 తేదీల మధ్య 14 ఆలయాల్లో 624 మంది ఆన్లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం 23 క్షేత్రాల్లో.. రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన శ్రీశైలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, కాణిపాకం, మావుళ్లమ్మ మొదలగు 23 ఆలయాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహించుకునేలా ఈ–పూజలను దేవదాయ శాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉండే 6 (ఏ) కేటగిరీలో ఉండే 175 ఆలయాల్లోనూ ఈ నెలాఖరు నాటికి ఆన్లైన్ పూజలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది. మరో 1,300 పైగా 6 (బీ) కేటగిరీ ఆలయాల్లోనూ జూలై చివరి నాటికి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. భక్తులు వీక్షించేలా ప్రత్యేక లింకు వివిధ ఆలయాల్లో ఈ–పూజలను బుక్ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో కోరుకున్న పూజను ఆలయంలో నిర్వహించేలా దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుడు పూజను బుక్ చేసుకున్న వెంటనే అతడి మొబైల్ నంబర్కు ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ లింకును ఆలయ అధికారులు పంపుతారు. నిర్దేశిత సమయంలో అధికారులిచ్చిన కోడ్తో భక్తుడు ఆన్లైన్లో లింకు ఓపెన్ చేయగానే.. సంబంధిత భక్తుల పూజను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. పూజల తరువాత ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు. రాష్ట్రంలోని 170 ప్రముఖ ఆలయాల్లో ఈ–హుండీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 207 రకాల పూజలు వివిధ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలను మాత్రమే దేవదాయ శాఖ ఆన్లైన్లో పరిధిలోకి తెచ్చింది. త్వరలో 207 రకాల పూజలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ► శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో అభిషేకం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చంఢీ హోమం, నిత్య కల్యాణ పూజలను పరోక్ష సేవల కేటగిరిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఆన్లైన్ రూ.1,116 చెల్లించి ఏ పూజానైనా తమ గోత్రనామాలతో జరిపించుకోవచ్చు. ► అన్నవరం ఆలయంలో మఖ నక్షత్రం రోజున అభిõÙకంతోపాటు అన్ని రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆన్లైన్ ద్వారా జరిపించుకోవచ్చు. ► ద్వారకా తిరుమలలో శ్రీవారి నిత్య కల్యాణం (టికెట్ ధర రూ.1,600), బెజవాడ కనకదుర్గ ఆలయంలో చండీహోమం, ఖడ్గమాలార్చన, శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలను ఆన్లైన్ విధానంలో నిర్వహించుకోవచ్చు. -
ఈఎస్ఐ సేవలు @ ఆన్లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో భారీ సంస్కరణల దిశగా ముందుకు వెళుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్మీకులకు వైద్యం కాదు కదా.. వచి్చన నిధులన్నీ కాంట్రాక్టర్లు, మంత్రులు, నేతల చేతుల్లోకి వెళ్లి, కార్మీకరాజ్య బీమా ఆస్పత్రులు నిర్వీర్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ కార్మికులకు ఆన్లైన్లో డాక్టరు అపాయింట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. జబ్బు చేస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీకి వెళ్లినా డాక్టరు లేకపోవడం వంటి కారణాలతో వెనక్కు రావాల్సి వచ్చేది. దీంతో కార్మీకులకు వైద్యం సరిగా అందేది కాదు. ఇకపై అలాకాకుండా జబ్బు చేసిన రోజు వైద్యానికి వెళ్లగానే చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 13 లక్షల మందికిపైగా కార్మీకులున్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 40 లక్షల మందిపైనే ఉన్నారు. వీళ్లకోసం కార్మీక రాజ్యబీమా సంస్థ ‘ఏఏఏప్లస్’ అనే యాప్ను రూపొందించింది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏ డిస్పెన్సరీకి వెళ్లాలో దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టరు దగ్గరకు వెళ్లే గంట ముందు యాప్లో వివరాలు పంపిస్తే చాలు.. పేషెంటు వెళ్లేసరికి విధిగా అక్కడ వైద్యులు ఉంటారు. పేషెంటు వేచి ఉండకుండా వెంటనే పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. ఇప్పటికే గుణదలలోని ఆస్పత్రిని మోడల్ డిస్పెన్సరీగా తీర్చిదిద్దారు. మొత్తం 78 డిస్పెన్సరీలకు ఆన్లైన్ సేవలు విస్తరిస్తున్నారు. దీనివల్ల డాక్టర్లు గైర్హాజరవడానికి వీలుండదు. ఏరోజుకారోజు ఆన్లైన్ వివరాలుఅందుతాయి. 13 ఏళ్ల తర్వాత నర్సుల నియామకాలు గడిచిన 13 ఏళ్లుగా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఒక్క నియామకమూ జరగలేదు. 13 ఏళ్ల తర్వాత ఒకేసారి 101 మంది నర్సుల నియామకం జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించి పరిశీలించారు. కొద్ది రోజుల్లో నర్సులు విధుల్లో చేరనున్నారు. దీనివల్ల నర్సింగ్ కేర్ సేవలు మెరుగు పడనున్నాయి. ఇకపై అన్నీ ఆన్లైన్ సేవలే తాజాగా కార్మికులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. మందుల కొనుగోళ్లు, ఇన్వెంట్రీ, ఇండెంట్ అన్నీ ఆన్లైన్ పరిధిలోకి తీసుకురాబోతున్నాం. గతంలో పెండింగ్లో ఉన్న పేషెంట్ల బిల్లులన్నీ ఆన్లైన్ చేశాం. ప్రైవేటు ఆస్పత్రుల వివరాలను కూడా ఆన్లైన్ చేయబోతున్నాం. దీనివల్ల పారదర్శకంగా పనులు జరుగుతాయి. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకుండా సేవలు అందేలా చేస్తున్నాం. రెండు నెలల్లో అన్ని ఆస్పత్రులను ఆన్లైన్ అపాయింట్మెంట్ పరిధిలోకి తెస్తాం. – డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్,కార్మీకరాజ్య బీమా సంస్థ -
కార్మికులకు మెరుగైన వైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ ఎల్ఎస్బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు. -
ఆలయ వ్యవస్థ ఇక స్వచ్ఛం, పారదర్శకం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాల మేనేజ్మెంట్ వ్యవస్థ ఇకపై అత్యంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ నూతన మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రారంభించారు. ఇందులో దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్ బోర్డు, సిబ్బంది వివరాలు ఉంటాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగ పడుతుందన్నారు. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. ► కొత్త విధానం వల్ల భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించవచ్చు. క్యూ ఆర్ కోడ్ ద్వారా కూడా ఇ– హుండీకి కానుకలు సమర్పించే అవకాశం ఉంటుంది. ► ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తొలిసారిగా అన్నవరం దేవాలయంలో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అన్నవరం టెంపుల్కు రూ.10,116 ఇ–హుండీ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించింది. ► ఈ నెలాఖరుకు మరో 10 ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్ కమిషనర్ అర్జున రావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ జి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ ఏజీఎం అండ్ కోఆర్డినేటర్ ఇ.రాజుబాబు, రీజనల్ హెడ్ వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లోనే ఆర్టీఓ సేవలు
సాక్షి, నిజామాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలన్నా.. లెర్నింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే కొత్తది తీసుకోవాలన్నా.. డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్లో మార్పులు, చేర్పులు చేయాలన్నా.. ఇప్పటి వరకు తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి కొన్ని రకాల సేవలన్నీ ఇకపై ఆన్లైన్లోనే అందించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ సేవల కోసం కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే రవాణాశాఖ వెబ్సైట్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా జారీ చేసే అన్ని సేవలను ఆన్లైన్లో అందించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ ఆన్లైన్ సేవలు వెంటనే ప్రారంభించాలని ఆ శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్టీఓ సేవలను మరింత సరళతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ సేవలు పొందేవారికి ఊరట లభించింది. రోజుకు సుమారు 500 మందికి.. జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి. ఇలాంటి సేవల కోసం ఆయా కార్యాలయాలకు రోజుకు సుమారు 400 నుంచి 500 మంది వస్తుంటారు. దీంతో ఆర్టీఓ కార్యాలయాలు కిక్కిరిపోతుంటాయి. కొందరు నేరుగా కాకుండా, ఏజెంట్ల ద్వారా పనులు చేయించుకుంటారు. ఇకపై వీరంతా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆన్లైన్లోనే దరఖాస్తులు.. పౌరులు ఆయా సేవల కోసం ఇంటి వద్ద నుంచే పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు నిర్ణీత స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. సంబంధిత డాక్యుమెంట్లను రవాణాశాఖ వెబ్సైట్లో (www.transport.telangana.gov.in) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తులు నేరుగా ఆశాఖ రాష్ట్ర కార్యాలయంలోని సర్వర్కు అనుసంధానం అవుతుంది. ఆయా సేవల కోసం ఆన్లైన్లోనే ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే నిర్ణీత రోజుల్లో ఈ సేవలు అందుతాయి. ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోండి రవాణాశాఖకు సంబంధించి కొన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సేవలను వినియోగించుకోవాలి. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా పొందే సేవలను పౌరులు ఇంటి నుంచే పొందవచ్చు. కార్యాలయాలనికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో పొందవచ్చు. – డా.కె.వెంకటరమణ, ట్రాన్స్పొర్టు డిప్యుటీ కమిషనర్. -
ఆర్టీఏ: ఆన్లైన్లో మరో ఆరు సేవలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్లైన్తో అనుసంధానించారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, లైసెన్స్లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్ (హజార్డస్ లైసెన్స్) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్ లైసెన్స్ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్ లైసెన్స్ పొందటం, డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్ లైసెన్స్ జారీ తదితర ఆరు సేవలను ఆన్లైన్తో అనుసంధానించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. (కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి) జూన్ 24న, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, పాత లైసెన్స్ కార్డు స్థానంలో స్మార్ట్కార్డు పొందటం, లైసెన్స్ హిస్టరీ షీట్ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి మంచి స్పందన వస్తోందని, సేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణా శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో ఐదు సేవలు ఆన్లైన్ ద్వారా అందు బాటులో ఉండేవని, ఇప్పుడు వాటికి అదనంగా మరో ఆరు సేవలను చేర్చామని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వాహనదారులు జాప్యం లేకుండా సేవలు పొందే వీలు కలుగుతుందని తెలిపారు. (ప్రత్యేక రైళ్లకు అన్లాక్) -
ఆర్టీసీ.. ఆన్లైన్ దూకుడు
సాక్షి, కర్నూలు: ఆర్టీసీ (రోడ్డు రవాణా సంస్థ) ఆన్లైన్ సేవలతో ప్రయాణికులకు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే బస్సు సీట్ల రిజర్వేషన్లు అధిక శాతం ఆన్లైన్ చేయగా.. తాజాగా మరో అడుగు ముందుకు వేస్తోంది. నగదు, కాగిత రహిత టికెట్ల జారీకి కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందలేని ప్రయాణికులకు ఇక డబ్బు తీసుకోకుండా, టికెట్లు ఇవ్వకుండా మెసేజ్ ద్వారా ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది. వెళ్లాల్సిన ప్రాంతానికి చెల్లించాల్సిన డబ్బును యాప్స్ ద్వారా ఆర్టీసీ ఖాతాలోకి బదిలీ చేసిన వెంటనే ప్రయాణికుడి సెల్కు మెసేజ్ రావడం.. ఆ తర్వాత ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీని కోసం ప్రత్యేక ఖాతాలను తెరిచి ప్రయాణికులకు నూతన సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు మరో రెండు మూడు రోజుల్లో దీనిని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నో కరెన్సీ.. నో పేపర్ టికెట్... అటు ప్రయాణికులు, ఇటు కండక్టర్లు సౌలభ్యంగా ఉండేలా ఆర్టీసీ నో కరెన్సీ, నో పేపర్ టికెట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ంది. ప్రయాణికుడి చేతిలో సెల్ ఉండి.. అందులో బ్యాంకింగ్ సేవల యాప్స్ ఉండి.. అందులో డబ్బు ఉంటే చాలు ఈ టికెట్ పొందవచ్చు. ఏర్పాట్లు ఇలా... మొబైల్ మెసేజ్ టికెట్ల జారీ కోసం అర్టీసీ అధికారులతో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా డిపో మేనేజర్లు పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచారు. 12 డిపో మేనేజర్లకు వారి సౌలభ్యం కోసం ఖాతాలు తెరిచారు. ఈ ఖాతా నంబర్లకు పేటీఎం యాప్ సహకారంతో ప్రత్యేకంగా బార్కోడ్ ఏర్పాటు చేసి అనుసంధానం చేశారు. బార్ కోడ్ను కండక్టర్ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. వాటి ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. మొబైల్ టికెట్ జారీలో సమస్య తెలుసుకుంటున్న ఆర్ఎం చిల్లర సమస్యకు చెక్.. బస్సు టికెట్ల జారీ సమయంలో చిల్లర సమస్యను ఆర్టీసీ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ప్రయాణికులు, కండక్టర్లు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుంటోంది. ఈ – టికెట్ విధానం దూర ప్రాంత సర్వీసులతోపాటు గ్రామీణ ప్రాంత రూట్లలోనూ అమల్లోకి వస్తే చిల్లర సమస్య పరిష్కారమైనట్లే. మొబైల్ యాప్ ద్వారా టికెట్ చార్జీలు వసూలు మనం వెళ్లే ప్రాంతం బస్సులు నిలిచే ప్లాంట్ ఫాం వద్దకు చేరుకొని అక్కడే ఉన్న కండక్టర్కు ఫలానా ఊరికి టికెట్ ఇవ్వమని చెబితే ప్రయాణికుడి సెల్ ఫోన్లోని మొబైల్ యాప్స్ ద్వారా కండర్టర్ సెల్లో ఉన్న బార్ కోడ్పై స్కాన్ చేస్తారు. అక్కడ ప్రయాణికుడు వెళ్లాల్సిన ఊరిపేరు ఎంటర్ చేయగానే ప్రయాణికుడి బ్యాంకింగ్ యాప్లో ఉన్న నగదు కట్ అవడం, ప్రయాణికుడి సెల్కు మెసేజ్ వెళ్లడం వెంటనే జరిగిపోతాయి. ఎక్కాల్సిన బస్సు డ్రైవర్కు మొసేజ్ చూపిస్తే చాలు.. సీటులో కూర్చొని ప్రయాణించే వీలు కల్పించారు. చదవండి: తిరుపతికి మరో మణిహారం త్వరలో ఈ టికెటింగ్ విధానం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెసేజ్ టికెటింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 12 డిపో మేనేజర్ల పేరున ప్రత్యేక ఖాతాలు తెరిచాం. పేటీఎం సహకారంతో బార్ కోడ్లు క్రియేట్ చేయించి వాటిని కండక్టర్ సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయించాం. దీని ద్వారా ప్రయాణికులు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యూపీఐ వంటి బ్యాకింగ్ యాప్స్తో చార్జీ సొమ్ము బదిలీ చేసి ఈ టికెట్ పొంది, వాటి ఆధారంగా ప్రయాణం చేయవచ్చు. – టి. వెంకటరామం, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, కర్నూలు -
నోలైన్.. అన్నీ ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. వాహన వినియోగదారులు ఆర్టీఏ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందొచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వాహనదారులు తమకు కావాల్సిన పౌరసేవల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్కు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. వినియోగదారుల దరఖాస్తులను, డాక్యుమెంట్లను పరిశీలించిన వారం రోజుల వ్యవధిలో స్మార్ట్ కార్డులను స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు పంపిస్తారు. దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఫీజులు కూడా ఆన్లైన్లో చెల్లించాలి. లెర్నింగ్ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల క్రయ విక్రయాలు వంటి వినియోగదారులు స్వయంగా రావాల్సిన పౌరసేవలు మినహాయించి సుమారు 17 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ట్రయల్స్ సైతం పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ధ్రువీకరణ కోసమే సెల్ఫీ.. సాధారణంగా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవల కోసం వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో, ఈ–సేవా కేంద్రాల ద్వారా నెట్బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించాలి. స్లాట్లో నమోదైన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏకు వెళ్లి పత్రాలను అధికారులకు అందజేయాలి. అక్కడే ఫొటో దిగి, డిజిటల్ సంతకం చేయాలి. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వారం, 10 రోజులకు వినియోగదారుల ఇళ్లకే స్పీడ్ పోస్టు ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తారు. వినియోగదారుల నిర్ధారణ కోసం ఫొటోలు, డిజిటల్ సంతకాలే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ సేవల్లో వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నియంత్రించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. మరోవైపు నకిలీ డాక్యుమెంట్లను అరికట్టేందుకు కూడా కీలకం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్ ద్వారా అందజేసే సమాచారంలో వినియోగదారులు కోరుకున్న సేవలను ధ్రువీకరిస్తూ ఒక నంబర్ కేటాయిస్తారు. ఒకవేళ ఆర్టీఏ ఆన్లైన్ సేవల్లో జాప్యం చోటు చేసుకున్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఈ నంబర్ ఆధారంగా వివరాలు పొందొచ్చు. ఏయే సేవలకు ఆన్లైన్.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, 6 నెలల గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి పొడిగింపు, లెర్నింగ్ లైసెన్స్లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వాహన రిజిస్ట్రేషన్ డూప్లికేట్ పత్రాలు, గడువు ముగిసిన వాటి రెన్యువల్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, అంతర్రాష్ట్ర సేవలపైన తీసుకోవాల్సిసిన నిరభ్యంతర పత్రాలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), రవాణా వాహనాల పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు వంటి 17 రకాల సేవలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నారు. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు వంటి వాటికి మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. -
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ అర్చన
సాక్షి, హైదరాబాద్: దైవికమైన శుభసందర్భాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు.. ఇలాంటి సందర్భాల్లో దేవాలయాలకు వెళ్లాలని భక్తులు భావిస్తారు. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఇది కుదరటం లేదు. దీంతో చాలామంది మానసిక ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని గుర్తించిన దేవాదాయశాఖ.. భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నా, వారిపేరుతో పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే, నిర్ధారిత జాబితాలోని కోరుకున్న దేవాలయంలో పూజలు నిర్వహించే ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన యాప్ ద్వారా ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లేస్టోర్లో యాప్ను రూపొందించింది. తొలుత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్ఘాట్లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో బుధవారం నుంచీ ప్రారంభిస్తున్నారు. ఆపై రాష్ట్రంలోని ఇతర ముఖ్య ఆలయాల్లో ప్రారంభిస్తారు. ప్లేస్టోర్ ద్వారా ఈ వెసులుబాటు కల్పించేందుకు గూగుల్ మంగళవారం సమ్మతి తెలిపింది. భద్రాద్రి రామయ్య తలంబ్రాలు సిద్ధం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని భక్తకోటి నేరుగా తిలకించలేకపోయింది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి ఆనందపడింది. కానీ స్వామి తలంబ్రాల అక్షింతల కోసం వారు తపన పడుతున్నారు. ఇప్పుడు టీఎస్ యాప్ ఫోలియో ద్వారా కోరుకున్న వారికి వాటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐదు వేల తలంబ్రాల పొట్లాలను దేవాదాయశాఖ సిద్ధం చేసింది. యాప్ ద్వారా బుక్ చేసుకున్నవారికి తపాలా ద్వారా ఇంటికి అందిస్తారు. ఇందుకోసం తపాలాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో భద్రాచలం దేవాలయం తలంబ్రాల వివరాలు ఉన్న విండో ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా బుక్ చేసుకోవచ్చు. తలంబ్రాలకు గాను రూ.20, పోస్టల్ చార్జీ రూ.30, ఐటీ సర్వీస్ చార్జీ చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేందుకు తపాలాశాఖ సిబ్బంది, వాహనాలను సిద్ధం చేసింది. ఎలా బుక్ చేసుకోవాలి? గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీఎస్ యాప్ ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో దేవాలయాల వివరాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సిన ఆలయంలో ఆర్జిత సేవను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. దాని ఆధారంగా ఆయా దేవాలయాల్లో భక్తుల పేర్లతో, వారు కోరుకున్న రోజున ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఆ వివరాలను తిరిగి వారి మొబైల్ ఫోన్కు సమాచారం రూపంలో అందిస్తారు. కుదిరితే పూజ అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్, మిశ్రీతో కూడిన ప్రసాదాన్ని కూడా అందించాలని తొలుత భావించారు. కానీ ప్రస్తుతం తపాలా, కొరియర్ సేవలు పరిమితంగానే ఉన్నందున ఇది సాధ్యం కాదని అనుకుంటున్నారు. -
‘ఉపకారా’నికి టీ–వ్యాలెట్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన పథకానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అనే నిబంధనకు కాస్త బ్రేక్ పడింది. బ్యాంకు ఖాతా తెరవడం, దాని నిర్వహణ తదితర అంశాలు విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయనే ఆందోళన ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ–వ్యాలెట్ యాప్/ఆన్లైన్ సర్వీసు ద్వారా ఉపకారవేతనాలు పంపిణీ చేసేలా నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గతేడాది అందుబాటులోకి తెచ్చింది. ఈ జిల్లాలోని విద్యార్థులు ఉపకారవేతనం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకు ఖాతా నంబర్ బదులుగా టీ–వ్యాలెట్ బటన్ ను ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తుదారు ఎంట్రీ చేసిన ఫోన్ నంబర్, విద్యార్థి పేరు ఆధారంగా టీ–వ్యాలెట్ రిజి స్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఉపకారవేతనం విడుదలైన వెంటనే విద్యార్థి టీ–వ్యాలెట్ ఖాతాకు నిధులు జమవుతాయి. వీటిని సమీప మీ సేవా కేంద్రంలో విత్డ్రా చేసుకునే వీలుంటుంది. గతేడాది నిజామాబాద్ జిల్లాలో 32 వేల మంది విద్యార్థులు టీ–వ్యాలెట్ ఎంపిక చేసుకున్నారు. మరో నాలుగు జిల్లాల్లో.. నిజామాబాద్ జిల్లాలో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడంతో మరో నాలుగు జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉపకారవేతనాలు ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాలెట్ ఆప్షన్ ఇస్తే మేలు.. ప్రస్తుతం ఉపకారవేతన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు. నిర్దేశించిన 4 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో టీ–వ్యాలెట్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే విద్యార్థులంతా బ్యాంకు ఖాతాకు బదులుగా టీ–వ్యాలెట్ వివరాలు సమర్పించవచ్చు. కొత్తగా నాలుగు జిల్లాల్లో టీ–వ్యాలెట్ అమలుపై అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘క్యాష్లెస్’ సేవలు
సాక్షి, సిటీబ్యూరో: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంస్కరణల్లో భాగంగా అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పూర్తి స్థాయి నగదు రహిత లావాదేవీ చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో పాటు భూములకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (సీసీ)ల జారీకి సైతం నగదు రహిత లావాదేవీలను ప్రారంభించిన రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా రూ.1000 లోపు విలువైన సేవలు సైతం నగదు రహితంగా జరిపేందుకునిర్ణయం తీసుకుంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలో నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక టీ యాప్ను రూపొందించి అనుసంధానం చేశారు. మొబైల్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా రూ.2 వేల వరకు విలువైన లావాదేవీలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీంతో ఇప్పటివరకు చిన్నపాటి లావాదేవీలను నగదు తీసుకుని పూర్తి చేసే విధానానికి కూడా బ్రేక్ పడనుంది. ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఏ పని అయినా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్లోని చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా నగదు రహిత సేవలు అందిస్తున్నారు. 25 నుంచి పూర్తి స్థాయి అమలు రాష్ట్ర వ్యాప్తంగా గల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ నెల 25 నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారం భం కానుంది. హిందు మ్యారేజ్, సొసైటీ రిజిస్ట్రేషన్, అప్డేట్, ఈసీ, సీసీ తదితర చిన్నచిన్న సేవలు సైతం నగదు రహిత విధానంలో అందనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన టీయాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు చెల్లింపులు జరుపవచ్చు. మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపిన నగదు రహిత సంబంధించిన సేవలను 30 రోజుల లోపు వినియోగించుకోవచ్చు. గడువు దాటితే నగదు రహిత చెల్లింపులు మురిగిపోయినట్లేని సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఆన్లైన్.. ఆగమాగం
సాక్షి, చొప్పదండి : మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటికీ అప్గ్రేడ్ అయిన చొప్పదండిలో నూతన గృహ నిర్మాణదారులకు చిక్కులు తప్పడం లేదు. పురపాలన ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటికీ ఒక్క నూతన నిర్మాణానికి కూడా అనుమతి రాకపోవడం పురపాలనలో నూతన గృహ నిర్మాణదారులకు తెచ్చిన కష్టాలను తెలియజేస్తోంది. ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం పురపాలనలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన చొప్పదండిలోనూ దీన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో నూతన గృహ నిర్మాణ ఆశావహులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తులు గతంలో నూతన గృహ నిర్మాణదారులు పంచాయతీ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకొనేవారు. భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణం ప్రారంభించాక కూడా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో 2016 నుంచి ఆన్లైన్ ద్వారా నిర్మాణ అనుమతుల మంజూరు విధానం ప్రవేశపెట్టారు. నూతన నిర్మాణాలను చేపట్టేవారు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాకే నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్మాణాలను రూపొందించాలంటే ఇండ్లు కట్టడం పలువురికి గగనంగా మారింది. ఇబ్బందిగా నిబంధనలు మున్సిపల్ నూతన చట్టంలోని నిబంధనలు చిన్న స్థలాలు కలిగిన గృహ నిర్మాణదారులకు ఇబ్బందిగా పరిణమించాయి. జీవో 168 ప్రకారం మున్సిపాలిటీల్లో ఇండ్లు నిర్మాణం చేసే వారికి పలు నిబంధనలు రూపొందించారు. దీంతో గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తు చేసేందుకే రూ. పదివేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అనుమతి వచ్చేందుకు ఫీజులు ఏ మేరకు బాదుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు నిర్ధేశించిన ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణదారులకు వచ్చిన మొదటి ఇబ్బంది రోడ్ల వెడల్పుతోనే. గతంలో తొమ్మిది ఫీట్ల నుంచి మొదలుకొని పన్నెండు ఫీట్ల రోడ్లనే ఎక్కువగా గ్రామస్తులు ఉపయోగించేవారు. నిర్మాణ అనుమతుల సమయంలో రోడ్లు ముప్పై అడుగులు ఉంటేనే అనుమతి ఇస్తారు. పైగా మూడు అడుగులు సెట్ బ్యాక్ కోసం కూడా వదులాల్సి ఉంటుంది. దీంతో ఉన్న స్థలమంతా రోడ్లకే పోతే తాము ఎక్కడ నిర్మాణాలు చేయాలని చిన్న చిన్న ప్లాట్లు గల యజమానులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ నుంచి ఒక్క అనుమతి కూడా ఇవ్వకపోగా, దరఖాస్తులు మాత్రం అయిదు వరకు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ఏర్పడిన ఆరునెలల్లో ఒక్క అనుమతి కూడా బయటకు వెళ్లక పోవడంతో ఇండ్ల నిర్మాణాలు చేసేదెట్లా అంటూ నిర్మాణ ఆ శావహకులు లబోదిబో మంటున్నారు. రెండేళ్లుగా కొనసాగుతోంది రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. తమకు డిజిటల్ కీ రావడానికి ఆలస్యమైంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండటం వల్ల నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు దోహదపడుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం మేము వ్యవహరిస్తాం. – రాజేందర్ కుమార్, కమిషనర్ -
వడ్డీ తక్కువ.. మోసాలెక్కువ..!
సాక్షి,సిటీబ్యూరో: ’హయత్నగర్లో నివాసం ఉంటున్న సురేష్ రూ.10 లక్షల రుణం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఓ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ యవతి అతడికి ఫోన్చేసింది. రుణం మంజూరుకు ఆస్తి తనఖా పత్రాలతోపాటు రూ.50 వేలు నగదు చెల్లించాలని కోరింది. ఆ తరవాత ఆదాయ పన్ను పేరుతో మరో రూ.70 వేలు చెల్లించాలని కోరడంతో ఆమొత్తాన్ని చెల్లించారు. ఇలా పక్షం రోజుల్లో రూ.1.20 లక్షలు చెల్లించిన సురేష్కు అనుమానం వచ్చింది. రుణం ఎప్పడు మంజూరు చేస్తారని గట్టిగా నిలదీయడంతో చెక్కులు త్వరలో పంపుతామని చెప్పింది. ఆ తర్వాత రెండురోజులకు ఫోన్చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన సురేష్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు’. ఇది సురేష్ ఒక్కరి సమస్యే అని భావిస్తే పొరపాటే..ఇటీవలి కాలంలో గ్రేటర్ నగరంలో ఐటీ, బీపీఓ, కెపిఓ, ఫార్మా, బల్క్డ్రగ్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్నెంబర్లను ఆయా సంస్థల వెబ్సైట్ల నుంచి సేకరిస్తున్న సైబర్నేరగాళ్లు తక్కువ వడ్డీలకు రుణాల పేరుతో సిటీజన్లకు ఎరవేస్తున్నారు. గత ఆరునెలలుగా సుమారు 25 మంది వరకు బాధితులు రూ. కోటికి పైగా మోసపోయినట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ వడ్డీ ..మోసాలు ఇలా.. ♦ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్న సిటీజన్లకు సైబర్ నేరగాళ్లు.. రూ.100కు పావలావడ్డీ మాత్రమేనని, రుణ వాయిదాలు కూడా అధికమే నంటూ ఆన్లైన్లో అప్పుల వల విసురుతున్నారు. ♦ నెట్వర్క్ సైట్లు, ఛారిటీ ట్రస్టులు, బ్యాంకిం గేతర ఆర్థిక సంస్థల పేరు చెప్పి ఆకర్షణీయమైన రుణ జారీ విధానాలను తెలియజేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ♦ నగరంలోని ఐటీ, బీపీఓ, కెపిఓ, బల్క్డ్రగ్, ఫార్మా కంపెనీల ఉద్యోగుల వివరాలు, ఫోన్నెంబర్లు సేకరించి వారికి టోకరా వేస్తున్నారు. ♦ గత ఆరునెలలుగా సుమారు రూ.కోటికి పైగా ఇలాంటి సంస్థలు స్వాహా చేసినట్లు తేలింది. ♦ ఈ ముఠాలు ఢిల్లీ, నోయిడా, చెన్నై, బెంగ ళూరు తదితర నగరాలే కేంద్రంగా ఇలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. అప్రమత్తతే కీలకం.. ఏదేని రుణజారీ సంస్థ ముందుగా సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను మాత్రమే అడుగుతుందని..ప్రాసెసింగ్ ఫీజులు సైతం నామమాత్రంగానే ఉంటాయని బ్యాంకింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా సెక్యూరిటీ డిపాజిట్లు, ఇన్కంట్యాక్స్ ఇలా రకరకాల పేర్లతో డిపాజిట్లు సేకరించబోవని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్చేసి రుణం ఎరవేస్తే మీ పూర్తి వివరాలను, అవసరాలు తెలపరాదని..బ్యాంకు ఖాతాల నెంబర్లను షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. రుణం జారీకి సంబంధించి సంబంధిత బ్రాంచీల్లో నేరుగా మేనేజర్ లేదా ఇతర ఉన్నతాధికారులను సంప్రదించి స్పష్టత తీసుకోవాలని సూచిస్తున్నారు. రుణం తీసుకోబోయే ముందు రుణజారీ పత్రాలపై గుడ్డిగా సంతకాలు చేయకుండా సంబంధిత విధివిధానాలను, షరతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరవాతే రుణాలు పొందాలని సూచిస్తున్నారు. రుణం జారీ చేసేకంటే ముందుగా వేలాదిరూపాయల నగదు చెల్లించాలని కోరితే వెంటనే అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేస్తున్నారు. -
‘డిగ్రీ’ కాలేజీ మార్పునకు మరో చాన్స్!
సాక్షి, హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాలేజీల్లో చేరిన, మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు మరోసారి ఆప్షన్లకు అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన 74 హెల్ప్లైన్ కేంద్రాల్లో విజ్ఞాపనలు స్వీకరించనున్నట్లు సమాచారం. కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తమ తల్లిదండ్రుల నుంచి వన్టైమ్ పాస్వర్డ్ తీసుకొని తమ కాలేజీల్లో సీట్లు వచ్చేలా ఆప్షన్లు ఇచ్చారని, ఫలితంగా ఇష్టం లేని కాలేజీల్లో సీట్లొచ్చాయని దాదా పు 2 వేల మంది విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ లోని దోస్త్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో వారికి రెండో దశలో ఆప్షన్లకు అవకాశమిచ్చిన దోస్త్.. వారితోపాటు అన్ని జిల్లాల విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని జిల్లాల్లో హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. హెల్ప్లైన్ కేంద్రాల్లో సమస్య పరిష్కారం కాకపోతే హెల్ప్లైన్ కోఆర్డినేటర్ సహకారంతో విజ్ఞప్తుల కాపీని స్కాన్ చేయించి హైదరాబాద్ కళాశాల విద్యా కమిషనర్ కార్యాలయంలోని సూపర్ హెల్ప్లైన్ కేంద్రానికి పంపితే సమస్య పరిష్కరించి మూడో దశలో ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టనున్నారు. 84 వేల మందికీ అవకాశం మొదటి దశ ప్రవేశాలల్లో సీట్లు పొందిన 84 వేల మంది విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించాలని దోస్త్ నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థులు ఇచ్చిన మొదటి ఆప్షన్ ప్రకారమే వారికి సీట్లు లభించినందున రెండో దశ కౌన్సెలింగ్లో వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొదటి దశలో సీట్లు వచ్చిన వారు కూడా కాలేజీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు దోస్త్ వెబ్సైట్లో పేర్కొన్న హెల్ప్లైన్ కేంద్రాల్లో విజ్ఞప్తి చేసేలా చర్యలు చేపట్టింది. -
‘ఈ’–జిల్లా!
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లాను ‘ఈ–జిల్లా’గా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కాగిత రహిత, జాప్యంలేని సేవలు అందించడం ద్వారా ప్రజల మెప్పు పొందాలని భావిస్తోంది. ఇప్పటికే కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్, ఆన్లైన్ పద్ధతుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలను కూడా పూర్తిస్థాయి ఈ–ఆఫీసులుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ మేరకు ప్రతి ఆఫీసు నుంచి ఈ–ఆఫీస్కు అవసరమైన ప్రతిపాదనలు కోరుతూ వర్తమానం పంపించారు. ఆఫీసుకు మంజూరైన పోస్టులు, పోస్టుల వారీగా ఎన్ని కంప్యూటర్లు అవసరం, ఎన్ని ఫైళ్లు స్కాన్ చేయాలి తదితర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత హెచ్ఓడీలకు పంపాల్సిందిగా సూచించారు. మొదట ఆయా విభాగాల్లోని ఫైళ్లను పూర్తిగా స్కాన్ చేసి..ఆన్లైన్లోకి అప్లోడ్ చేస్తారు. తద్వారా అన్ని కార్యకలాపాలు ఆన్లైన్లో నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు రెవెన్యూ విభాగంలో ఇప్పటికే ఉత్తర ప్రత్యుత్తరాలు, సేవలు ఎలక్ట్రానిక్ మెథడ్లోనే జరుగుతున్నాయి. కలెక్టరేట్లో పూర్తిస్థాయిలో... జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్ పద్ధతిలోనే నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. జూన్ ఒకటి నుంచి ఈ–ఆఫీస్ను అమలు పర్చనున్నట్లు ఇటీవల కలెక్టర్ యోగితా రాణా వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటికే కొన్ని పరిపాలన పరమైన అంశాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఆన్లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. కాగా, కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు ఈ–ఆఫీస్ నిర్వహణను పూర్తి స్థాయిలో ఆచరించాల్సిందేని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని మానిటరింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీవత్స కోటకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఫైళ్లన్నీ చకచకా స్కానింగ్ చేస్తున్నారు. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పెండింగ్కు చెక్ పాలన పరమైన వ్యవహారాల్లో ఈ–ఆఫీస్ అమలుతో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లకు మోక్షం లభించే అవకాశాలుంటాయని అధికారయంత్రాంగం భావిస్తోంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చని యోచిస్తోంది. ముఖ్యంగా పారదర్శకతతో సమస్యల పరిష్కారంలో వేగం కూడా పెరుగుతుందని భావిస్తోంది. దీంతో ముందుగా కలెక్టరేట్లో పూర్తి స్థాయి అమలు శ్రీకారం చుడుతోంది. అ తర్వాత రెవెన్యూ యంత్రాంగంలో క్షేత్ర స్థాయి నుంచి ఈ– ఆఫీస్ అమలుకు ప్రయత్నం ప్రారంభిస్తారు. -
ఐఆర్సీటీసీ వెబ్సైట్, ఇతర రైల్వే సర్వీసులు క్లోజ్
రైల్వే ప్రయాణికులకు ఒక గమనిక. దేశీయ రైల్వే టిక్కెటింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ, ఇతర ఆన్లైన్ సర్వీసులు కొన్ని గంటల పాటు మూతపడబోతున్నాయి. గురువారం రాత్రి 10.45 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని రైల్వే పేర్కొంది. రైల్వేకు సంబంధించిన అన్ని వెబ్సైట్లు, యాప్స్ను అప్గ్రేడ్ చేయడం కోసం ఆరు గంటల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనిలో ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఆన్లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ను మరింత స్నేహపూరితంగా చేయడం కోసం రైల్వే కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. దీనికోసంవెబ్సైట్లను, యాప్స్ను దేశీయ రైల్వే అప్గ్రేడ్ చేస్తోంది. సిస్టమ్లను అప్గ్రేడ్ చేసే సమయంలో ప్రయాణికులకు ఐవీఆర్ఎస్ టచ్ స్క్రీన్, కాల్ సెంటర్, 139 ఎంక్వైరీ సిస్టమ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవు. -
అన్నీ ఆన్లైన్లోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల్లో విద్యార్థులకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాసి, కౌన్సెలింగ్ ద్వారా సీట్లు లభించిన విద్యార్థులు ఇకపై ఫీజులను చలానా రూపంలో బ్యాంకుల చుట్టూ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపడుతోంది. చలానా విధానాన్ని ఈ సారి పూర్తిగా తొలగించి రిజిస్ట్రేషన్ నుంచి మొ దలుకొని ట్యూషన్ ఫీజు వరకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాం కింగ్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇబ్బందులకు చెల్లు చీటీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ప్రవేశ పరీక్షల ద్వారా సీట్లు పొందే దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. సీట్లు కేటాయించే సమయంలో కనీస ఫీజున్న కాలేజీల్లో మినహా మిగతా కాలేజీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులు అదనపు ఫీజులను చలానా జనరేట్ చేసుకొని బ్యాంకులకు వెళ్లి చెల్లించాల్సి వచ్చేది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ రాని ఓసీ విద్యార్థులైతే మొత్తం ఫీజులను ఇలాగే చెల్లించేవారు. అలా మొదటి విడతలో సీటు వచ్చి ఫీజు చెల్లించిన విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్లో ఎక్కువ ఫీజు ఉన్న మరో కాలేజీలో సీటు వస్తే అదనపు ఫీజును మళ్లీ బ్యాం కులకు వెళ్లి చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు రెండో విడతలో తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో సీటు వస్తే.. ముందుగా చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అన్ని కౌన్సెలింగ్లు, ప్రవేశాలు పూర్తయ్యే వరకు ఆగాల్సి వస్తోంది. అంతేకాదు ఆ మిగతా మొత్తాన్ని తీసుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లోని ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు ఫీజుల చెల్లింపులో ఇబ్బందులను తొలగించడంతోపాటు అదనపు మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు విద్యార్థులు ఎవరూ హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. ప్రవేశాల కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఆన్లైన్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు రెండో విడత, మూడో విడత కౌన్సెలింగ్లలో ఎక్కువ ఫీజున్న కాలేజీల్లో సీట్లు వస్తే అదనపు ఫీజును ఆన్లైన్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెండు, మూడు విడతల్లో తక్కువ ఫీజు ఉన్న కాలేజీల్లో సీటు వస్తే మొదటి విడతలో చెల్లించిన ఫీజులో రెండు, మూడు విడతల్లో సీటు వచ్చిన కాలేజీ ఫీజు పోగా మిగతా మొత్తాన్ని ఆ విద్యార్థి ఆన్లైన్లో చెల్లించిన అకౌంట్కే తిరిగి వెనక్కి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా విద్యార్థులు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. -
పోలీస్ నెట్వర్క్ షట్డౌన్
ఏలూరు అర్బన్: హ్యాకింగ్ అనే పదం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల పోలీసు నెట్వర్క్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీస్స్టేషన్లు, కార్యాలయాల్లో కంప్యూటర్లు రాన్సమ్వేర్ వైరస్ బారిన పడి మూగబోయాయి. పోలీసు ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించడం తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లను తక్షణం షట్డౌన్ చేయాలని రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు అందేంతవరకూ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని ఆర్డర్ వేశారు. దీంతో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లను ఆపరేటర్లు షట్డౌన్ చేశారు. ఏలూరు సీఐ ఉడతా బంగార్రాజు మాట్లాడుతూ హ్యాకర్స్ దాడికి పాల్పడటంతో రాష్ట్రంలో దాదాపు సగం పోలీస్స్టేషన్లలో నెట్వర్క్ సేవలు నిలిచిపోయాయని చెప్పారు. విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో నెట్వర్క్లు పూర్తిగా స్తంభించాయన్నారు. కంప్యూటర్ రంగ నిపుణులు మాత్రం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లు మాత్రమే హ్యాక్ అయ్యాయని, ఆండ్రాయిడ్ వెర్షన్ వాడుతున్న కంప్యూటర్లకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారన్నారు. ఈ సమస్య కేవలం రాష్ట్రానికే పరిమితం కాదని ప్రపంచంలోని పలు దేశాల్లో పోలీస్ నెట్వర్క్లు సైబర్ దాడుల బారిన పడ్డాయని చెప్పారు. -
మొబైల్ ఫోన్ నుంచే టీటీడీ సదుపాయాలు
తిరుమల: మొబైల్ ఫోన్ నుంచే తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు, గదుల బుకింగ్, ఈ-హుండీ, ఈ-డొనేషన్ సౌకర్యాలు పొందేలా టీటీడీ మొబైల్ యాప్ రూపొందించింది. ఉగాది సందర్భంగా తిరుమల ఆలయం వద్ద బుధవారం ‘గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్’ పేరుతో కొత్త యాప్ను టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్తో ఇప్పటివరకు 1.30 కోట్ల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు వివరించారు. ఐటీ సంస్థ టీసీఎస్ సహకారంతో మొబైల్ యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. దీంతో ఇకపై భక్తులు శరవేగంగా, సులభంగా ఎక్కడి నుంచైనా యాప్ సేవలు పొందవచ్చన్నారు. ప్రస్తుతానికి ఈ-హుండీ, ఈ-డొనేషన్, రూ.300 దర్శన టికెట్ల బుకింగ్, గదుల బుకింగ్ సదుపాయాలు ఉన్నాయని, మలిదశలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గూగుల్ స్టోర్, టీటీడీ వెబ్సైట్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. టీటీడీ వెబ్సైట్కున్న 33 లక్షల మంది యూజర్లు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. టీటీడీ ఆన్లైన్ సేవలు భేష్: సుధా నారాయణమూర్తి టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుధా నారాయణమూర్తి టీటీడీ ఐటీ సేవల్ని అభినందించారు. ఈ యాప్ ద్వారా టీటీడీ శ్రీవారి భక్తులకు మరింత చేరువైందన్నారు. భక్తులు కూడా సులభతరంగా శ్రీవారి సేవలు పొందవచ్చన్నారు. టీటీడీ యాప్ను ‘https://play.google.com/store/apps/details?id=com.ttdapp’ ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
మళ్లీ బ్రేక్!
► ఖజానాలో కదలని బిల్లులు ► స్తంభించిన ఆన్లైన్ సేవలు ► పది రోజులుగా కొనసాగుతున్న ఆంక్షలు ► బిల్లులు డ్రా చేసుకోవాలనుకునే వారికి నిరాశే ► ఉద్యోగుల జీతాలకూ లభించని అనుమతి ► ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు జిల్లా ఖజానాశాఖలో మళ్లీ బిల్లులకు బ్రేక్ పడింది. ఆన్లైన్ సేవలు సైతం స్తంభించడంతో గత పది రోజులుగా బిల్లులకు మోక్షం లభించడం లేదు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చే సమయంలో ఖజానాపై ఆంక్షలు విధించడం బిల్లులు పెట్టుకున్న వారిలో ఆందోళనకు కారణమవుతోంది. ఒంగోలు టూటౌన్ : జిల్లా సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలోనే వందల సంఖ్యలో బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. చివరి త్రైమాసికం బడ్జెట్ నుంచి బిల్లులు డ్రా చేసుకోవాలని హడావుడి పడే వారికి నిరాశే మిగిలింది. గత ఏడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి ఖజానాపై రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు గా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. దీంతో అన్ని రకాల బిల్లులు నిలిచిపోతున్నాయి. దాదాపు నాలుగో త్రైమాసికంలో సుమారుగా రూ.500 కోట్ల వరకు అయ్యే బిల్లులు ఆగిపోయి ఉంటాయని అంచనా.ఇటీవల జిల్లాకు వచ్చిన ట్రెజరీ శాఖ స్టేట్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బి.ఎల్.హనుమంతరావు ట్రెజరీ ఆంక్షలు ప్రభుత్వం ఎత్తివేసినట్లు విలేకర్ల సమావేశంలో తెలిపారు. దాంతో దాదాపు 482 బిల్లులకు ఒక్క సారిగా మోక్షం లభించింది. వీటిలో అన్ని ప్రభుత్వం కార్యాలయాల కంటిన్జెంట్ బిల్లులు ఉన్నాయి. ముఖ్యంగా కళాశాలలో చదువుతున్న విద్యార్థుల (పెండింగ్ బకాయిలు) ఉపకార వేతనాలను పూర్తిగా క్లియర్ చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్ల బకాయిలను విడుదల చేసింది. వీటిలో ప్రకాశం జిల్లావే రూ.55 కోట్లు ఉన్నాయి. ఈనెల 13 నుంచి కదలని బిల్లులు.: ప్రభుత్వం ఉన్న ఆర్థిక వనరులను మలచుకొని పెండింగ్ బకాయిలను విడుదల చేసినట్లు ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఖజానాశాఖలో బిల్లులు నిలిచిపోయినట్లు వివరించారు. పాన్ నంబర్ లేని పలు పార్టీలు, సంస్థలు ఇతర బిల్లులను ఆదాయపన్ను శాఖ తీవ్రంగా చూడటం వలన చెల్లింపుల్లో కొంత ఆలస్యమయినట్లు తెలిపారు. మళ్లీ ఈ నెల 13వ తేదీ నుంచి ఖజానా బిల్లులు నిలిచిపోయాయి. దాదాపు 10 రోజులుగా నాలుగో త్రైమాసికం బిల్లులు నిలిచిపోవడంతో సంబంధిత వర్గాలు చెందుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి పోతున్నా.. ఇంతవరకు ఖజానా ఆంక్షలు తొలగలేదని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. నిధులుండీ నిష్ప్రయోజనం..: జిల్లాలో ఒంగోలు, అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, మార్టూరు, పొదిలి, యర్రగొండపాలెంలలో ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 12 ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 37,647 మంది ఉద్యోగులు, 22,250 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరందరు ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెల పొందుతుంటారు. ఇవి గాక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఆర్అండ్బి, దాదాపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఎదురు చూస్తున్నాయి. దీనికి తోడు ఈ నెలాఖరుకు ఖర్చు పెట్టాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి. అందుబాటులో ఉన్న నిధుల్లో 75 శాతం మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన నిధులు వేరే ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పంచాయతీల్లో ఉన్న నిధులు ఖర్చు చేయడానికి లేకుండా పోయింది. ఆర్థిక లోటును అంచనా వేసుకొని, వనరుల లభ్యతను బట్టి ప్రభుత్వం బిల్లులకు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలకు అనుమతి లేని పరిస్థితి నెలకొంది. సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ వలన అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. -
ఆర్టీఏలో ఆన్లైన్
– చిల్లరనోట్లు ఉన్నా ఇబ్బందిపడ్డ వాహనదారులు – అధికారుల హడావుడి నిర్ణయాలే కారణమంటూ ఆవేదన అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణాశాఖ అధికారులు తీసుకున్న హడావుడి నిర్ణయాల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శుక్రవారం నుంచి నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని ఉన్నఫలంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వాహనదారులకు కాదు కదా.. అశాఖలో పనిచేసే చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా తెలియక పోవడం గమనార్హం. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వాహన రిజిస్ర్టేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర సమస్యలపై వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిల్లర నోట్లు తెచ్చుకున్నా అధికారులు తీసుకోకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు.. రోడ్డు రవాణాశాఖలో(ఆర్టీఏ) డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్, అపరాధ రుసుం చెల్లించేందుకు రోజూ వందల మంది వస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన తర్వాత చిల్లర సమస్య తీవ్రంగా ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం విజయవాడ నుంచి రవాణశాఖ అధికారులు స్వైప్ మిషన్ తెప్పించారు. గురువారం వరకూ అకౌంట్లలో డబ్బు ఉన్న వాహనదారులు స్వైప్ మిషన్ ద్వారా, చిల్లర నోట్లు ఉన్న వాహనదారులు చలానా కోసం నేరుగా డబ్బు చెల్లించేవారు. దీంతో రవాణాశాఖలో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. శుక్రవారం మాత్రం అన్ని లావాదేవీలు నగదు రహితంగా స్వైప్ మిషన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. రవాణాశాఖలో నేరుగా డబ్బులు తీసుకోరనే అంశం ప్రజలకు తెలియపర్చలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఉన్నట్లుండి శుక్రవారం ఉదయం డబ్బులు తీసుకోం.. అని చెప్పేసరికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొంతమంది నిరాశతో వెనుతిరగగా.. మరికొందరు దగ్గర్లో తెలిసిన వ్యక్తులు ఉంటే వారి ఖాతాల నుంచి చాలానాలు చెల్లించారు. ఇక్కడకు వచ్చాక చెప్పారు బొలెరో వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేషన్ కోసం కార్యాలయంకు వచ్చా. ఇక్కడికొచ్చాక డబ్బులు తీసుకోమని చెబుతున్నారు. దీంతో దగ్గర్లో తనకు తెలిసిన వారు ఉంటే వారి అకౌంట్ నుంచి నగదు చెల్లించాను. ముందస్తుగా తెలియజేయకుండా నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది వెనక్కుపోయారు. - : అయూబ్ఖాన్, పేరూరు, రామగిరి మండలం ముందుగా చెప్పలేదు ఆటోకు జరిమానా వేశారు. డబ్బులు చెల్లించి ఆటోను విడిపించుకుందామని వస్తే డబ్బులు తీసుకోలేదు. దీంతో గుత్తి నుంచి నా అల్లుడుని రమ్మని చెప్పా. అధికారులు ముందుగా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం వలన ఒక పనికి రెండు పనులు అయ్యాయి. - మహ్మద్వలి, ఆటోడ్రైవర్, గుత్తి ప్రభుత్వ ఆదేశాల మేరకే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం, కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ ఆదేశాల అనుసరించి శుక్రవారం నుంచి నగదు రహిత లావాదేవీలు చేపట్టాం. తాత్కాలికంగా ఇబ్బంది పడ్డా .. భవిష్యత్లో చిల్లర నోట్ల సమస్య పరిష్కారం అవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించాం.- : శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం -
ఆన్లైన్ సేవలను విస్తృతం చేస్తాం
విజయవాడ: రాష్ట్రంలో ఆన్లైన్ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఉపాధి కల్పించేందుకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేస్తామని, మొబైల్ కరెన్సీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 'మొబైల్ కరెన్సీకి 13 వ్యాలెట్ కంపెనీలు ముందుకొచ్చాయి. పర్స్ వ్యాలెట్ ద్వారా నగదు రహిత చెల్లింపులకు కార్యాచరణ చేపట్టాం. నగదు రహిత లావాదేవీలపై వివిధ సర్వీసు ప్రొవైడర్స్తో చర్చించాం. సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా ఏపీ పర్స్ వ్యాలెట్ పరిధిలోకి రావాలి. నగదు రహిత చెల్లింపులపై అవగాహనకు ఓ కమిటీ వేశాం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. -
రవాణా శాఖలో నేటి నుంచి ఆన్లైన్ సేవలు
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణా శాఖలో శనివారం నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్వద్ది తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు గుత్తిరోడ్డులోని దుర్గా ఆటోమోటివ్స్ నుంచి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు వివరించారు. నూతనంగా వాహనం కొనుగోలు చేసే వ్యక్తులు రిజిస్ట్రేషన్ మొత్తం డీలర్ నుంచి కానీ, నేరుగా ఆన్లైన్లో కానీ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. -
పంచాయతీల్లో ఈ-సేవలు
సంగారెడ్డి రూరల్: మండల పరిధిలోని అన్ని గ్రామాలను ఈ పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీఓ సంధ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎర్ధనూర్, చిద్రుప్ప, తాళ్ళపల్లి, జుల్కల్ పంచాయతీలకు నాలుగు కంప్యూటర్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 27కు గాను ఇప్పటి వరకు 18 పంచాయతీలకు కంప్యూటర్లను అందజేశామన్నారు. ఆయా గ్రమాలను ఈ పంచాయతీలుగా మార్చినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన ట్యాక్స్ల చెల్లింపులు, నిధుల వివరాలు, ఇళ్ల నిర్మాణల అనుమతులు, వివిధ రకాల ధ్రువీకరణపత్రాలను ప్రభుత్వ పథకాలకోసం వచ్చే దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ గోపాల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిల్వేరి ప్రభాకర్, నాయకులు అశోక్, రమేష్, ఎర్దనూర్, బ్యాతోల్ సర్పంచులు అనంతయ్య, శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శులు శారద, శ్రీకాంత్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
అద్దెకు తోడి పెళ్లికూతుళ్లు
ఏ దేశమైనా, ఎక్కడైనా యువతీ యువకులకు పెళ్లనేది జీవితాంతం గుర్తుండి పోవాల్సిన ఓ మధురజ్ఞాపకం. వాటిని చక్కగా జరిపించేందుకు ఎన్నో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. యువతీ యువకులకు పెళ్లి కుదర్చడం దగ్గరి నుంచి ఆహ్వాన పత్రికలు అందంగా ముద్రించడం, వాటిని బంధుమిత్రులకు పంపిణీ చేయడం, మ్యారేజ్ హాళ్లను బుక్ చేయడం, పెళ్లి పందిళ్లను అలంకరించడం, పెళ్లికి నగలు తయారు చేయించడం, దుస్తులు కుట్టించడం, పెళ్లి తంతును ఘనంగా నిర్వహించడం, విందు భోజనాలు, ఫొటో సెషన్లు నిర్వహించడం వరకు అన్ని వ్యవహారాలు చూసేందుకు నేడు ఆన్లైన్ సర్వీసులెన్నో అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవలోనే ఇప్పుడు తోడి పెళ్లికూతురు (బ్రైడ్స్ మెయిడ్) సర్వీసుకు కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. సహజంగా పెళ్లికూతురు వెంట స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులు ఉంటారు. వారే పెళ్లి కూతురుకు సంబంధించిన సమస్త వ్యవహారాలు చూసుకుంటారు. పెళ్లి కూతురులా ఎలా ముస్తాబు కావాలి? ఎలాంటి దుస్తులు ధరిస్తే నప్పుతుంది? ఎలాంటి నగలు వేసుకోవాలన్న సంశయం చాలామంది పెళ్లి కూతుళ్లకు కలగడం సహజం. బంధుమిత్రులను అడగాలంటే మొహమాటం అడ్డు రావచ్చు. ఒకవేళ అడిగినా, వాళ్లు ప్రొఫెషనల్స్ కాకపోవడంతో ఆ సలహాలు, సూచనలు నప్పకపోవచ్చు. సరిగ్గా అలాంటి సందర్భాల్లోనే తోడి పెళ్లికూతురు సర్వీసు ఎంతో సహకరిస్తుంది. పెళ్లీడుకు వచ్చిన యువతులే ఎక్కువగా బ్రైడ్స్మెయిడ్ను ప్రొఫెషనల్ వృత్తిగా స్వీకరిస్తున్నారు. అందచందాలతో పాటు కలుపుగోలుతనం, చలాకీతనం, అప్పటికప్పుడు కమ్మని కథలల్లే నేర్పు, ఓర్పు ఉన్నవాళ్లే ఈ వృత్తిలో రాణిస్తున్నారు. వారిలో న్యూయార్క్కు చెందిన జెన్ గ్లాంట్జ్ అనే 28 ఏళ్ల యువతికి ఇప్పుడు యమ గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తోడి పెళ్లికూతురుగా ఆమె సర్వీసు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు వస్తున్నాయి. రెండేళ్లుగా ఈ వృత్తిని చేస్తున్న ఆమెకు ఇప్పుడు చేతుల్లో పదివేల దరఖాస్తులు ఉన్నాయి. పెళ్లికూతురును అందంగా అలంకరించడం నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు అన్నీ తానై పెళ్లి కూతురును అంటుకు తిరగాలి. పెళ్లికూతురు అభిరుచులుకు తగ్గట్టుగా కట్టు, బొట్టు దగ్గరి నుంచి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. బిడియపడే పెళ్లికూతుళ్లకు కబుర్లు చెబుతూ ఉల్లాసపర్చాలి. బంధుమిత్రుల్లో ఇట్టే కలసిపోవాలి. అద్దెకు వచ్చిన తోడి పెళ్లి కూతురనే విషయం బయటకు తెలియకుండా నడుచుకోవాలి. పెళ్లి కూతురుకు చాలా సన్నిహిత మిత్రురాలనో, దూరపు బంధువనో, చిన్నప్పటి స్నేహితురాలనో అందరినీ నమ్మించాలి. అవసరమైతే పెళ్లి కొడుకును కూడా నమ్మించాలి. అందుకోసం అప్పటికప్పుడు కథలు కూడా అల్లాల్సి వస్తుంది. ఒకేరోజు రెండు, మూడు పెళ్లిళ్లు బుక్కవడం వల్ల ఇబ్బందులు పడ్డ రోజులు లేకపోలేదని జెన్ చెప్పారు. ఒక్కో పెళ్లిలో ఒక్కో కథ చెప్పినప్పుడు, ఏ పెళ్లిలో ఏ కథ చెప్పానో, పెళ్లి కూతురుకు ఏ వరుసయ్యానో మరచిపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు జెన్ దగ్గర అనేకమంది తోడి పెళ్లికూతుళ్లు పనిచేస్తున్నారు. ఒకే రోజు ఎక్కువ మంది అవసరం అవుతోందని, కొందరు ఒక్క పెళ్లికే ఐదారు బ్రైడ్స్మెయిడ్ను అడుగుతున్నారని, మూడు రోజుల నుంచి పది రోజుల వరకు తోడి పెళ్లి కూతుళ్లు అడుగుతున్న వాళ్లు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. ప్యాకేజీలను బట్టి ఒక్కో బ్రైట్స్మెయిడ్కు 300 డాలర్ల నుంచి రెండువేల డాలర్ల వరకు చార్జి చేస్తామని 'బ్రైడ్స్మెయిడ్ ఆన్ హైర్' అనే వెబ్సైట్ నిర్వహిస్తున్న జెన్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ బిజినెస్ బాగానే ఉందిగానీ పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్లను వదిలేసి తోడి పెళ్లికూతుళ్లపై మనసు పారేసుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో! -
రవాణాశాఖలో ఆన్లైన్ సేవలకి అవాంతరాలు
సాక్షి, సిటీబ్యూరో: రవాణా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ ఆన్లైన్ పౌరసదుపాయాలు తొలిరోజే వాహన దారులకు చుక్కలు చూపించాయి. మంగళవారం స్లాట్ నమోదు చేసుకొన్న వారంతా ఫీజు చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంపై అవగాహన లేక చాలామంది నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో అన్ని రకాల రవాణా కార్యకలాపాలకు (ట్రాన్సాక్షన్స్) కలిపి ప్రతి రోజు సుమారు 10 వేల దరఖాస్తులు వస్తుంటాయి. కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ పద్ధతి వల్ల కేవలం 4 వేల దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ ద్వారా అందాయి. చాలామంది ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి వెనుదిరిగారు. ప్రతి రోజు 150 కొత్త వాహనాలు నమోదయ్యే ఖైరతాబాద్ సెంట్రల్ కార్యాలయంలో కేవలం 20 వాహనాలే నమోదయ్యాయి. ఒక్క లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు (ఈ రెండింటికి చాలా కాలంగా స్లాట్ బుకింగ్ ఉంది.) మినహా మిగతా 56 రకాల పౌరసదుపాయాలపై ఆన్లైన్ దరఖాస్తులు సగానికి పైగా పడిపోయాయి. నగరంలోని సికింద్రాబాద్, ఉప్పల్, మెహదీపట్నం, మలక్పేట్, అత్తాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, కొండాపూర్ తదితర అన్నిచోట్ల వాహన వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సేవా కేంద్రాల్లో ఇక్కట్లు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1400 ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ సేవల కోసం స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు సదుపాయం ఉన్నట్లు రవాణా అధికారులు స్పష్టం చేశారు. కానీ చాలా చోట్ల స్లాట్ బుకింగ్కు మాత్రమే అవకాశం లభించింది. ఫీజు చెల్లింపునకు ఆప్షన్ లేకపోవడంతో స్లాట్ న మోదు చేసుకున్నప్పటికీ ఫీజు చెల్లించలేక ఆర్టీఏ సేవలను పొందలేకపోయారు. దీంతో ఒకటికి రెండు సార్లు ఇటు ఈ సేవా కేంద్రాలకు, అటు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వచ్చింది. ఈ సేవ కేంద్రాలకు ఆర్టీఏకు మధ్య సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లింకు ఏర్పాటు కాకపోవడం వల్లనే ఫీజు చెల్లింపునకు ఆప్షన్ లేకుండా పోయిందని ఈ సేవా నిర్వాహకులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని కేవలం 50 ఈ సేవా కేంద్రాల్లో మాత్రమే ఫీజు చెల్లింపునకు అవకాశం లభించింది. ఇప్పటి వరకు కేవలం లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులకు మాత్రం స్లాట్లు నమోదయ్యే ఈ సేవా కేంద్రాల్లో ఒక్కసారిగా 58 రకాల సేవలకు సంబంధించి స్లాట్లు నమోదు చేయవలసి రావడంతో పనిభారం పెరిగి గందరగోళం నెలకొంది. నిబంధనల ప్రకారం స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి వచ్చిన వాళ్లలో కొందరు ఆలస్యంగా వచ్చినట్లు భావించిన అధికారులు పలు చోట్ల రూ.25 చొప్పున ఆలస్యపు రుసుము వసూలు చేసినట్లు వినియోగదారులు విస్మయం వ్యక్తం చేశారు. గందరగోళం... మరోవైపు ఆన్లైన్ సేవల అమలులో కొన్ని చోట్ల ఆర్టీఏ ఉద్యోగులకు సైతం సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా చోట్ల ఆర్టీఏ కౌంటర్లు ఖాళీగా కనిపించాయి. ఒకవైపు వినియోగదారులు లేకపోవడం వల్ల మరోవైపు సిబ్బంది గందరగోళం వల్ల కొంతసేపు స్తబ్ధత కనిపించింది. నగరంలోని ప్రధాన కార్యాలయాల్లో సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసినప్పటికీ సమస్యలు తొలగిపోలేదు. దీంతో ప్రాంతీయ రవాణా అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తొలిరోజు తలెత్తిన సాంకేతికపరమైన ఆటంకాల వల్ల వాహనాల యాజమాన్య బదిలీలు, డూప్లికేట్ ఆర్సీ, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల రెన్యూవల్స్ వంటివన్నీ నిలిచిపోయాయి. -
బ్యాంకర్లు ముందుకు వస్తే ఆన్లైన్ సేవలు
టీటీడీ బోర్డు సభ్యుడు రమణ కొడంగల్ : బ్యాంకర్లు సహకరిస్తే టీటీడీ కల్యాణమంటపాల్లో ఆన్లైన్ సేవలు అందించడానికి టీటీడీ అనుమతి ఇస్తుందని పాలకవర్గం సభ్యుడు ఏవీ రమణ అన్నారు. ఆదివారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీలో సిబ్బంది కొరత ఉన్నందున తాము ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. కొడంగల్ ఆలయానికి వైభవోత్సవ మంటపాన్ని మంజూరు చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తలకు సూచించారు. భక్తుల కోరిక మేరకు కొడంగల్ ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు తిరుపతి రెడ్డి, నందారం ప్రశాంత్, అనురాధ ఉన్నారు. -
ఎంజీఎంలో త్వరలో ఆన్లైన్ సేవలు
ఆదర్శంగా జిల్లాలోని రెండు సీహెచ్సీ, ఐదు పీహెచ్సీలు మంత్రి లక్ష్మారెడ్డికి వివరించిన కలెక్టర్ ఎంజీఎం : నాలుగు జిల్లాలకు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎంకు వచ్చే రోగుల వివరాలను నమోదు చేయడంతో పాటు ప్రతీ రికార్డు అందుబాటులో ఉండేలా వైద్యసేవలను కంప్యూటరీకరించేందుకు త్వరలో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామ ని కలెక్టర్ వాకాటి కరుణ మంత్రి లక్ష్మారెడ్డికి వి వరించారు. ఎంజీఎంతో పాటు సీకేఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆమె బుధవారం మంత్రి దృష్టికి తెచ్చారు. ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్(ఎన్బీఏహెచ్) ర్యాంకు సాధించేలా సేవలు మెరుగుపర్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. 1200 పడకల ఆస్పత్రిలో మెకానిజం లాండ్రీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎంజీఎంకు వచ్చే రోగుల సంఖ్య ను తగ్గించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రిలయన్స్ పౌండేషన్ ప్రతినిధుల సహాయం తో జిల్లాలో రెండు సీహెచ్సీలు, ఐదు పీహెచ్సీలను మోడల్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దేలా ప్ర ణాళిక సిద్ధం చేశామని వివరించారు. అక్కడి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. 104లో జీపీఆర్ఎస్ సిస్టమ్.. జిల్లాలో 104 వాహనాల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఈ వాహనాలను సక్రమంగా విని యోగించుకుంటే గ్రామాల్లో పేదలకు మెరుగైన సేవలందించవచ్చని కలెక్టర్ మంత్రికి వివరించారు. 104ల్లో జీపీఆర్ఎస్ సిస్టమ్ను అందుబాటులో తెస్తే.. అవి రోజూ ఏయే గ్రా మాల్లో సేవలందిస్తున్నాయో తెలుసుకోవచ్చ న్నారు. సీకేఎం ఆస్పత్రిలో అదనపు భవన ని ర్మాణం అవసరమని, అక్కడ సిబ్బంది పోస్టు లు భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎంజీఎం, సీకేఎంల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంజీఎం పిడియాట్రిక్ విభాగంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న మాతశిశు కేంద్ర భవనాన్ని మంత్రి పరి శీలించారు. పలువురు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి చికిత్స ఎలా అందుతుందో ఆరా తీశారు. కార్యక్రమంలో వీసీ కరుణాకర్రెడ్డి, సీకేఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు -
ట్రెజరీలో ఇక ఈ-పాలన
అన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను ఆన్లైన్లోనే ట్రెజరీకి సమర్పించాలి ఏప్రిల్ నుంచి పేపర్లెస్ వర్క్ ఉద్యోగులకు అందనున్న పారదర్శక సేవలు ఒంగోలు టూటౌన్: ట్రెజరీలో ఇక పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. పేపరు కట్టలు (ఉద్యోగుల జీత భత్యాల బిల్లులు) కనపడని పరిస్థితి రాబోతోంది. కాగిత రహిత పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే బిల్లులతో పాటు ఇతరత్రా బిల్లులన్నీ ఆన్లైన్ ద్వారానే ట్రెజరీకి వచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. నూతన ఆన్లైన్ వ్యవస్థ వలన జీపీఎఫ్ అమలులో పొరపాట్లకు తావులేకుండా ఉంటుందని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి పేపరు కట్టలు (బిల్లులు) లేకుండా ఈ కొత్త విధానం అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ట్రెజరీకి పేపరు బిల్లులు, ఆన్లైన్ సేవలు రెండూ అందిస్తూ వస్తున్నారు. ఈ రెండింటిలో పేపరు పనికి స్వస్తి చెప్పి.. ఏప్రిల్ నుంచి ఆన్లైన్ సేవలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే గత నెల 25న కృష్ణా జిల్లా నూజివీడులో రాష్ట్రంలోని అన్ని ట్రెజరీ అధికారులకు, ఉద్యోగులకు ఆన్లైన్ సేవలపై ఒక రోజు వర్క్షాపు నిర్వహించారు. ఈ వర్క్షాపులో ట్రెజరీశాఖ స్టేట్ డెరైక్టర్ కనకవల్లి, అడిషనల్ డెరైక్టర్ హనుమంతరావు, జాయింట్ డెరైక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. పే-రోల్ ప్యాకేజి, పెన్షన్స్ అకౌంట్స్, ఆన్లైన్ సేవలపై సమీక్షించినట్లు వర్క్ షాపునకు వెళ్లిన ట్రెజరీ ఉద్యోగులు తెలిపారు. మన జిల్లా నుంచి డిప్యూటీ డెరైక్టర్ ఎ.లక్ష్మికుమారి, 10 మంది సబ్ ట్రెజరీ ఉద్యోగులు వర్క్ షాపునకు వెళ్లారు. జిల్లాలో మొత్తం 12 ఉపఖజానా కార్యాలయాలున్నాయి. మొత్తం 24 వేల మందికిపైగా ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరందరూ ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు సమర్ధవంతంగా పొరపాట్లు లేని సేవలను ట్రెజరీ శాఖ ద్వారా అందిస్తామని ట్రెజరీ ఉద్యోగులు చెబుతున్నారు. -
సంతకం సమర్పయామీ!
సంగారెడ్డి క్రైం: దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా మారింది ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి. జిల్లాలోని ఆయా శాఖల్లో డిజిటల్ కీ వ్యవహారమంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండాలి. కానీ ఆ వ్యవహారమంతా ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ శాఖల్లో సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరించి ఆన్లైన్ సేవలు అందిస్తోంది. అలాగే ఉన్నతాధికారులకు సంబంధించిన సిగ్నేచర్ను డిజిటలైజేషన్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ఆర్జీదారుల సర్టిఫికెట్ల కోసం సంతకాలు చేయాలంటే జాప్యమవుతోంది.జాప్యాన్ని నివారించేందుకు డిజిటల్ సిగ్నేచర్ పరికరం డిజిటల్ కీని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే, కార్మిక శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీసు తదితర శాఖల్లో ఈ డిజిటల్ కీ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఆయా శాఖల ఉన్నతాధికారుల చేతుల్లో వుండాల్సిన డిజిటల్ కీ సిగ్నేచర్ వారికి తెలియకుండానే అనధికారికంగా దుర్వినియోగమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో డిజిటల్ కీ సిగ్నేచర్ను వాడుకొని ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ రూ. 3 కోట్లకు పైగా నిధులను ఆన్లైన్ ద్వారా దారి మళ్లించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ జరుపుతోంది. దీనితోపాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ నేతృత్వంలో జెడ్పీ సీఈఓ వర్షిణి, జిల్లా ఎస్పీ సుమతి నేతృత్వంలో సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్నలు వేర్వేరుగా దర్యాప్తులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా వ్యవసాయ శాఖలో భారీగా నిధులు ఆన్లైన్ ద్వారా దారి మళ్లిన తర్వాత తీరిగ్గా అధికారులు తేరుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజు సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్లు, మండలాల ప్రత్యేకాధికారుల నియామకం కారణంగా గ్రామాలను సందర్శించడం ఇలా ఆయా శాఖల అధికారులకు తీరక లేకుండాపోయింది. అంతేగాక డిజిటల్ కీని తమ వద్దే వుంచుకోవాలన్న విషయం తెలిసి కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ కీని కార్యాలయాల సిబ్బందికి, కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లోని కంప్యూటర్ ఆపరేటర్లే నియంతలుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారు. మీ సేవా, ఇతర ఆన్లైన్ సేవల ద్వారా ఇస్తున్న సర్టిఫికెట్లు చాలా వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు సంబంధం లేకుండానే జారీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రధాన శాఖల్లో డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా అడ్డుకట్ట వేయడానికి అవకాశం వుంటుంది. డిజిటల్ సిగ్నేచర్ ఎందుకు వాడారు? ఏ ఏ సర్టిఫికెట్లకు వాడారో? పేర్కొంటూ రికార్డులు నమోదు చేస్తూ, వాటిని ప్రతి వారం జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది. -
అన్లైన్లో ల్యాబ్ టెస్ట్ సర్వీసులు
-
24గంటలూ టీటీడీ ఆన్లైన్ టిక్కెట్లు
తిరుపతి అర్బన్: శ్రీవారి దర్శనార్థం టీటీడీ ఆన్లైన్ టికెట్ల బుకింగ్ను మంగళవారం నుంచి 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఆన్లైన్ సేవలు-మరింత పారదర్శకతకు చర్యలు’ అనే అంశంపై సోమవారం ఆయన సీనియర్ విభాగాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు మరింత పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. అందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి తేవాలని ఆదేశించారు. ఆన్లైన్లో టికెట్లు మంజూరుకాని భక్తులకు నగదును మూడురోజుల్లో వాపసు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24 గంటలూ పొందేందుకు ఒక కుటుంబానికి 6 టికెట్లు మాత్రమే కేటాయించ నున్నట్లు తెలిపారు. గతంలో ఈ విధానం ద్వారా టికెట్లు పొందాలంటే కుటుంబంలోని అందరి ఫొటో, ఐడీ ప్రూఫ్లను అప్లోడ్ చేయాల్సి వచ్చేదన్నారు. ఇకపై గ్రూపులోని ముఖ్యవ్యక్తి మాత్రమే ఫొటో, ఐడీ ప్రూఫ్లను అప్లోడ్ చేసి, మిగిలిన వారివి ఐడీ ప్రూఫ్లు మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుందని చెప్పారు. రోజూ అడ్వాన్స్ దర్శన టికెట్లు పొందిన భక్తుల పేర్లు, వివరాలను జూన్ ఒకటి నుంచి టీటీడీ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించారు. -
హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు
ఖమ్మం జెడ్పీసెంటర్:జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు వేగంగా ఆన్లైన్ సేవలందించేందుకు ఆప్టికల్ ఫైబర్ఆధారిత హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించనున్నట్లు కలెక్టర్ ఇలంబరితి పేర్కోన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తనచాంబర్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనుల ప్రగతిపై అటవీశాఖ,పవర్గ్రిడ్,బిఎస్ఎన్ల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్కు ద్వారా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1800 కిలో మీటర్ల మేర ఆప్టికల్ కేబుల్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వరకు 500 కిలో మీటర్ల భూగర్భం గుండా వేసినట్లు తెలిపారు. అటవీమార్గం ద్వారా కేబుల్ వేసే సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతోమాట్లాడి పరిష్కరించాలన్నారు. రాత పూర్వకంగా ఆమోదం పొందాలన్నారు. జిల్లాలో ఖమ్మం అర్బన్, జూలూరుపాడు,గార్ల, సింగరేణి మండలాల్లో కేబుల్ వేసే పనులు పూర్తయినట్లు తెలిపారు. ఆర్అండ్బీ,పీఆర్,అటవీశాఖలకు సంబంధించి రోడ్డు క్రాసింగ్ ఉన్నట్లయితే ముందుగా ఆయా శాఖల అధికారులకులిఖిత పూర్వకంగా తెలపాలన్నారు. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు సహకరించాలన్నారు. మండల స్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక మండల పరిషత్ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. మళ్లీ 15 రోజుల్లో సమావేశం ఉంటుందని, అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ సతీష్,పవర్గ్రిడ్ డీజీఎం వీఆర్రావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
సంతలో ఆన్లైన్ వసతులు
కృష్ణరాజపురం: రైతులు ఎంతో కష్టపడి పండించిన కూరగాయలు దళారుల చేతుల్లో పెట్టి మోసపోకుండా ఉండేందుకు కేఆర్పురం మార్కెట్లో సరికొత్త విధానం అమల్లోకి రానుంది. మార్కెట్లో కూరగాయలు ఎంత ధర ఉందో తెలుసుకోవడం కోసం ఆన్లైన్ వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనిని ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాదు. రైతులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమిది. దేశంలో మొదటి సారిగా కూరగాయల మార్కెట్లో ఆన్లైన్ వ్యవస్థను కృష్ణరాజపురంలో ఏర్పాటు చేయనున్నారు. కృష్ణరాజపురం మార్కెట్కు ప్రతి రోజూ వేలాది మంది రైతులు తాము పం డించిన కూరగాయలను తీసుకవచ్చి అమ్ముతుంటారు. అఖిల కర్ణాటక రైతు, వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఈ మార్కెట్లో ఆన్లైన్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. కూరగాయలను మార్కెట్కు తీసుకురావడానికి ముందే ఎంత ధర పలుకుతుందో తెలుసుకోవచ్చు. అప్పుడు రై తులు ఆ రోజు కోత పెట్టుకోవచ్చా వద్దా, మార్కెట్కు తీ సుకువెళ్లాలా వద్దా అన్న నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అంతా పూర్తి చేసి అందుబాటులోకి వస్తే మాత్రం రైతు లు దళారీల చేతుల్లో మోసపోయే అవకాశం ఉండదు. మరో రెండు నెలల్లో ఈ ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ వెబ్సైట్కు సంబంధించిన ఆప్ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు గ్రామీణ ప్రాంతం, కోలారు, చిక్కబళ్లాపురం, రామనగర, హాసన, మైసూరు, తుమకూరు, నెళమంగళతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు కూడా ఈ ఆప్ ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంతకు ప్రతి రోజు కనీసం 2 వేల మంది రైతులు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతి రోజు 10 వేల మంది కోనుగోలుదారులు వస్తున్నారు. సుమారు రూ.2 కోట్ల వ్యాపారం ఇక్కడ మార్కెట్లో జరుగుతుందని రైతులు అంటున్నారు. ఆన్లైన్ వ్యవస్థను ఎర్పాటు చేస్తున్నందున మరింత ఎక్కువ మంది రైతులు ఇక్కడకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడికి వచ్చి రైతులు, కొనుగోలుదారుల భద్రతను దృష్టి లో పెట్టుకొని వ్యాపారులు, రైతులు కలిసి సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్లోని రోడ్లను సైతం బాగు చేస్తున్నారు. వర్షం పడితే చిత్తడిగా మారే మార్కెట్ దారులను సిమెంటు రోడ్లుగా మార్చి అభివృద్ధి చేస్తున్నారు. -
ఆన్లైన్ అవస్థలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:రెవెన్యూ శాఖకు సంబంధించి ఆన్లైన్ సేవలు అస్తవ్యస్తంగా ఉంటూ ప్రజలను అవస్థల పాల్జేస్తున్నాయి. ప్రజలతో నిత్య సంబంధాలు ఉండే ఈ శాఖ ద్వారా కుల, ఆదాయ, జనన, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు రైతులకు సంబంధించిన అడంగళ్లు, భూముల మార్పులు చేర్పులు, రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు.. వంటి కీలక సేవలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ సేవలు పొందాలంటే ముందుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తుదారులకు ధ్రువపత్రాల జారీకి సంబంధిత తహశీల్దార్ కార్యాలయం ఆన్లైన్లోనే క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడం వల్ల దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సులు, చిరునామాల మార్పు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారి కార్డులతోపాటు కీ రిజిస్టర్లో ఆ మేరకు మార్పులు చేసేందుకు సంబంధిత తహశీల్దార్ తరఫున ఆ కార్యాలయంలోని డేటా ఎంట్రీ అపరేటర్ అనుమతి ఇవ్వాలి. ఈ విధానం అమలు కావడం లేదు. కాగా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ చాలామందికి వర్తించలేదు. అటువంటి వారందరూ మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అడంగల్, ఇతర ఆధారాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి వెళితే సిబ్బంది లేరని, వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని, సర్వర్ స్లోగా ఉందని రకరకాల కారణాలతో రోజుల తరబడి తిప్పుతున్నారు. ఫలితంగా వందలాది దరఖాస్తులు కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. ఈ పరిస్థితికి తహశీల్దార్లు, ఆ పని చూసే డేటా ఎంట్రీ అపరేటర్ల నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ, ఇటీవల భారీగా జరిగిన బదిలీలను కారణంగా చూపుతూ తప్పించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లా రెవెన్యూ శాఖలో విఆర్వో నుంచి తహశీల్దారు వరకు సుమారు 360 మందిని బదిలీ చేశారు. ప్రతి తహశీల్దార్ కార్యాలయంలోనూ సగటున పది మంది వరకు బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో కొత్తగా వచ్చిన సిబ్బంది ఈ పనుల పై ఇంకా దృష్టి సారించడం లేదు, దీనికి తోడు అవుట్ సోరింగ్ పద్ధతిలో జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న 53 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా బదిలీ చేశారు. వారు కొత్త స్థానాల్లో చేరినా ఇంకా విధులపై దృష్టి సారించడం లేదు, మార్పులు చేర్పుటు జరుగుతాయన్న ఆశతో నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించాయి. -
ఎయిమ్స్లో ఆన్లైన్ సేవలకు కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వాసుపత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) పడకల స్థాయిని విస్తరించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ ఆపరేషన్ల కోసం రోగులు దీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తోంది. పడకల సంఖ్య తక్కువగా ఉం డడంతో నెలలు, సంవత్సరాలపాటు వివిధ ఆపరేషన్ల కోసం రోజులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ నిరీక్షణ కాలం వ్యాధి తీవ్రతను బట్టి, నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అడ్మిషన్ ప్రక్రియ సరళీకరణ: ఇందులో భాగంగా రోగుల అడ్మిషన్ ప్రక్రియను సరళీకరించి సౌకర్యవంతంగా, పారదర్శకంగా అడ్మిషన్ ప్రక్రియను తీర్చిదిద్దడం కోసం ఆన్లైన్ ద్వారా పడకలను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. రోగులు ఇంటి వద్ద నుంచే అసుపత్రిలో ఆన్లైన్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసుపత్రిలో పడక లభ్యత గురించిన సమాచారాన్ని ఎయిమ్స్ ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తుంది. దాని వల్ల రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ తిర గాల్సిన పనిలేదు. ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలనేది రోగులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతోంది. కేటాయించిన రోజు రోగులను ఆసుపత్రికి తీసుకొని రావచ్చని ఎయిమ్స్ సీనియర్ అధికారి పేర్కొన్నారు. రోజూ 10 వేల మంది రోగుల రాక: ఎయిమ్స్ ఓపీడీ విభాగాన్ని రోజుకు పదివేల మంది సందర్శిస్తారు. న్యూరాలజీ, కార్డియాలజీ, కేన్సర్, పిడియాట్రిక్ ,ఈఎన్టీ విభాగాలలో రోగుల సంఖ్యఎక్కువగా ఉంటుంది. 2,400 పడకలు కల ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఆపరేషన్ల కోసం నిరీక్షాంచాల్సి వస్తోంది. ఒక్కోసారి ఆపరేషన్ తేదీ ముందుగానే లభించిన ప్పటికీ పడకలు ఖాళీగా లేకపోవడం జాప్యం జరుగుతోంది. పడక ఎప్పుడు దొరుకుతుందో తెలుసుకోవడం కోసం రోగులు, వారి బంధువులు ఆసుపత్రి చుట్టూ ఏళ్లతరబడి తిరుగాల్సి వచ్చేంది. డబ్బులు తీసుకుని ఆసుపత్రి సిబ్బంది పడక కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఈ సమస్యలను నివారించడం కోసం పడకల కేటాయింపు సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అందించాలని ఎయిమ్స్ యోచిస్తోందని అధికారులు పేర్కొన్నారు. -
డీడీఏ వెబ్సైట్కు విశేష స్పందన
న్యూఢిల్లీ: హౌసింగ్ స్కీమ్-2014 కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్రారంభించిన వెబ్సైట్కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 48 గంటల్లో 18.25 లక్షల మంది ఈ హౌసింగ్ స్కీమ్ వివరాల కోసం డీడీఏ వెబ్సైట్ను సందర్శించారు. పేరుతో ప్రారంభించిన వెబ్సైట్ సోమవారం క్రాష్ కావడంతో దానిని మళ్లీ పునరుద్ధరించామని, వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అన్ని ఆన్లైన్ సేవలు ఇకపై కూడా అందుతాయని డీడీఏ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ప్రారంభించిన రోజే 11 లక్షల మంది వెబ్సైట్ను సందర్శించగా రెండో రోజు పునరుద్ధరించిన తర్వాత 7.25 లక్షల మంది వెబ్సైట్ను సందర్శించారని డీడీఏ సిస్టమ్స్ డెరైక్టర్ వి.ఎస్. తోమర్ తెలిపారు. వెబ్సైట్ క్రాష్ అయిన తర్వాత తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శ్రమించి మరింత మెరుగ్గా వెబ్సైట్ను తీర్చిదిద్దారని, దీంతో ఆన్లైన్ సేవలు అందించడం ఇకపై మరింత సులువుతుందని తోమర్ అభిప్రాయపడ్డారు. -
బ్రోకర్ దందాకు చెక్
సింగరేణిలో ఆన్లైన్ సేవలు ప్రారంభం కార్మికుల సంక్షేమానికి వెబ్సైట్ ఏర్పాటు ఫలిస్తున్న డెరైక్టర్ ‘పా’ వ్యూహం కొత్తగూడెం (ఖమ్మం) : నిరక్షరాస్యులు అధికంగా ఉండే సంస్థగా ముద్రపడిన సింగరేణిలో గతంలో దళారీల పైరవీలపైనే కార్మికులు ఎక్కువగా ఆధారపడేవారు. ఆ వ్యవస్థను రూపుమాపేందుకు సింగరేణి పర్సనల్ విభాగం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ కార్మికులు.. అధికారులకు మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచింది. ఇప్పటి వరకు జోరుగా సాగిన పైరవీలు ఇకపై జరగవు. ఎక్కువగా అభియోగాలు ఉన్న విభాగాలను ఆన్లైన్కు అనుసంధానం చేస్తూ కార్మికులకు త్వరితగతిన పనులు జరిగేలా చర్యలు తీసుకుంది. సెంటర్ ఫర్ గుడ్గవర్నెన్స్ విధానాన్ని అన్ని విభాగాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు ప్రధానంగా బదిలీలు, మెడికల్ అన్ఫిట్ విషయాల్లో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉండేది. మెడికల్ అన్ఫిట్ కోసం ఒక్కో కార్మికుడు లక్ష రూపాయల దాకా బ్రోకర్లకు ముట్టజెప్పేవారు. బదిలీల కోసం కూడా పైరవీకారులకు పైకం చెల్లించుకునేవారు. దళారీ వ్యవస్థపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతోపాటు కార్మిక సంఘాలు ఆందోళనలు చేయడంతో విజిలెన్స్ విభాగం బ్రోకర్ దందాకు చెక్పెట్టేందుకు నడుం బిగించింది. విజిలెన్స్ విభాగం అధిపతి డెరైక్టర్ (పా) టి.విజయ్కుమార్ దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రణాళికలు రూపొం దించారు. ఆన్లైన్లో మెడికల్ అన్ఫిట్ మెడికల్ అన్ఫిట్కు హాజరయ్యే కార్మికుల వివరాలను ఆన్లైన్లోనే పొందుపరచనున్నారు. ఏయే రుగ్మతల కింద మెడికల్ అన్ఫిట్ పొందవచ్చో.. వాటిని కూడా ఆన్లైన్లో సూచించారు. దీంతో అక్రమంగా మెడికల్ అన్ఫిట్ తీసుకునే వారికి చెక్పెట్టినట్లే కాకుండా.. దళారీలకు చోటులేకుండా పోయినట్లవుతోంది. అయితే, ఈ విధానం మరో నెల రోజుల్లో అమలులోకి రానుంది. బదిలీలకు ప్రత్యేక వెబ్సైట్ గతంలో ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు కార్మికులు బదిలీ కోరుకుంటే దానికి సంబంధించిన సమాచారం అందేది కాదు. దీంతో నిరక్ష్యరాస్యులైన కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరగలేక పైరవీకారులను ఆశ్రయించేవారు. దీనిని అధిగమించేందుకు బదిలీల ప్రక్రియను ఇప్పుడు వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నారు. తాము పనిచేస్తున్న గనుల వద్దనే కార్మికులు బదిలీ కోసం నమోదు చేయించుకుంటే చాలు ఆ ప్రక్రియ మొదలవుతుంది. దానికి సంబంధించిన వివరాలు, ఫైల్ ఎక్కడ ఉందో.. దాని వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో కార్మికులు చూసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ విభాగంలో సైతం పైరవీలకు చెక్ పెట్టినట్లే. ఈ రెండు అంశాలకే ప్రాధాన్యం కల్పించకుండా సింగరేణి అభివృద్ధిలో కార్మికులను భాగస్వాములు చేసేందుకు వారి విలువైన సలహాలను తీసుకునేందుకు ‘సింగరేణి ఐడియా’ అనే వెబ్సైట్ను రూపొందించారు. విలువైన సలహాలు అందించిన వారికి బహుమతులు కూడా అందించనుంది. పనిప్రదేశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన సలహాలను అందించేందుకు సెఫ్టీ సజెక్షన్స్ పేరుతో ఆన్లైన్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఆర్టీఏ ఆఫీస్కు ఆన్లైన్, కరెంటు కష్టాలు
నిలుస్తున్న సేవలు తిమ్మాపూర్ : నిర్ధిష్ట కాల పరిమితి ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయంలో దరఖాస్తు దారులకు, ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. కార్యాలయంలో దరఖాస్తులు అందించేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 2 గంటల వరకు సమయం కాగా అర్జీదారుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అందరూ ఆ సమయంలోనే పని పూర్తి చేసుకునేందుకు వస్తుంటారు. ఇందు కోసం అర్జీదారులు బారులు తీరాల్సి వస్తోంది. ఈ కార్యాలయంలో పలు పనులు బ్యాంకు డీడీలతో ముడిపడి ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ లైన్ కారణంగా ఆర్టీఏ కార్యాలయంలో నిత్యం ఆన్లైన్ సేవలు తరచూ నిలిచిపోతున్నాయని ఉద్యోగులు, దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ఒక్కోసారి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ సమస్య కారణంగా పని చేసే సమయంలో ఒత్తిడి తీవ్రతమవుతోందని, విద్యుత్ కోతలతో సమస్య మరింత జఠిలవుతోందని ఉద్యోగులు అంటున్నారు. కరెంట్ పోయినపుడు, వచ్చినపుడు జనరేటర్ ఆన్, ఆఫ్ చేసినపుడు ఏసీ, డీసీని మార్చాల్సిన చేంజోవర్ పాడైపోయిందని, దీనిని మరమ్మతు చేయించాల్సిన కార్యాలయ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ సేవలు నిలిచిపోతున్నా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఆన్లైన్ సేవల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందని పలువురు పేర్కొంటున్నారు. శనివారం బ్యాంకు సేవలు మధ్యాహ్నం వరకే అందుతుండడంతో దరఖాస్తుదారులు ఆర్టీఏ కార్యాలయ ఉద్యోగులపై మరీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిత్యం ప్రజలతో సంబంధాలుండే ప్రభుత్వ కార్యాలయాలకు ఆన్లైన్ సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు స్పందించాలని ఉద్యోగులు, దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్, విద్యుత్ సమస్యలు ఇలా ఉంటే...కార్యాలయంలో కౌంటర్లు పని చేసే నిర్ణీత సమయంలోనే అవగాహన కార్యక్రమాల పేర ప్రైవేటు కార్యక్రమాలను ఆఫీసులోనే ఏర్పాటు చేయడం..అందులో అధికారులు, ఏవోలు పాల్గొనడంతో సేవలు అందించడంలో మరింత ఆలస్యమవుతుందని అర్జీదారులు పేర్కొంటున్నారు. -
మళ్లీ ఇ-సువిధ..!
* కొత్త పేరుతో ముందుకు.. * అన్ని పురపాలికల కంప్యూటరీకరణ * ఆన్లైన్ ద్వారా అందుబాటులో సేవలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కంప్యూటరీకరించేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ యోచిస్తోంది. దీనికోసం మళ్లీ ‘ఇ-సువిధ’ ప్రాజెక్టుకు దుమ్ము దులుపుతోంది. పురపాలికల కంప్యూటరీకరణ కోసం గతంలో అమలు చేసిన ఈ-సువిధనే మళ్లీ పునరుద్ధరించాలా? లేక కొన్ని మార్పులతో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలా? అన్న అంశంపై ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో 2004లో సువిధ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజలనుంచి అంతగా స్పందన రాకపోవడంతో పూర్తిగా అమలు కాకముందే మరుగున పడిపోయింది. మళ్లీ ఈ ప్రాజెక్టుకు జవసత్వాలు నింపాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు కొత్త పేరు పెట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 69 పురపాలికల్లో అమలుచేయడానికి రూ. 30.99 కోట్లు ఖర్చవుతుందని కన్సల్టెన్సీ నివేదించింది. దీంతో అమలుకు అనుమతులు జారీ చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాద నలు వెళ్లాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, శాఖ కమిషనర్, డెరైక్టర్ జనార్దన్రెడ్డి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ అనితా రామచంద్రన్, ఏపీఎండీపీ ప్రాజెక్టు డెరైక్టర్ కె. నిర్మల శనివారం సమావేశమై ఈ ప్రాజెక్టు విధివిధానాల ఖరారుపై చర్చించారు. -
‘మీ సేవ’లకు విభజన బ్రేక్
నల్లజర్ల రూరల్, న్యూస్లైన్ : ‘మీ సేవ’లకు విభజన బ్రేక్ పడనుంది. మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్లైన్ సేవలు, ప్రజా సంబంధ కార్యకలాపాలకు శుక్రవారం సాయంత్రం నుంచి విఘాతం కలిగింది. ప్రవేశ పరీక్షలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యే సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులు పూర్తిగా మీ సేవలు నిలిచిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాన సర్వర్లో మార్పులు చేయనున్నారు. దీని కారణంగా మే 30, 31 జూన్ 1 తేదీల్లో సేవలు స్తంభించనున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి మీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని నల్లజర్లలోని కేంద్రం నిర్వాహకుడు కారుమంచి రమేష్ తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆన్లైన్ ఓపీడీ సేవలు
న్యూఢిల్లీ: ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయటి రోగుల విభాగం(ఓపీడీ)లో రోగులు వేచి చూడాల్సిన పనిలేదు. వీరి వెతలను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీవాస్తవ మంగళవారం ప్రారంభించారు. ఈ సేవలు 24 ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఒక్కోరోజు ఈ ఆస్పత్రుల్లో ఓపీడీ విభాగాలకు నాలుగువేలకు పైగా రోగులు వస్తున్నారు. వీరి రద్దీని తట్టుకొని సేవలందించడం వైద్యులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇటు వైద్యులు, అటు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందు కోసమే ఆన్లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీవాస్తవ తెలిపారు. ఇంట్లోనే కూర్చుండి రైలు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే మాదిరిగానే 15 రోజులు ముందుగానే రోగులు ఏ వైద్యుడిని సంప్రదించాలనుకుంటున్నారో తదితర వివరాలతో అపాయిట్మెంట్ తీసుకోవాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆస్పత్రి, వైద్యం కోసం ఏ డిపార్ట్మెంట్ను సంప్రదించాలనుకునే వివరాలు, తేదీ, అపాయిట్మెంట సమయాన్ని నమోదు చేయాలన్నారు. ఇదిలావుండగా ఇదే లింక్ మీద ఆస్పత్రి వైద్య సేవలపై సమస్యలు ఏమైనా ఉంటే ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రతిసారి ఆస్పత్రిని సందర్శించే రోగి మొదటిసారి క్రియేట్ చేసిన యూజర్ ఐడీని నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆరోగ్య విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని వివరించారు. ప్రజా ఆరోగ్య సంస్థల్లో పాటించాల్సిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. -
ఇక ఏపీ 03
మీరు కొత్త వాహనం కొంటున్నారా.. డ్రైవింగ్ లెసైన్స్, వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా.. అయితే ఈ నెల 30లోపు పూర్తి చేసుకోండి.. ఈ నెల 31, జూన్ ఒకటో తేదీల్లో రవాణశాఖ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేయనున్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఇప్పుడున్న సర్వర్ను నిలిపేసి, రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా రెండు సర్వర్లను ఏర్పాటు చేయనున్నారు. మళ్లీ జూన్ 2వ తేదీ నుంచి సేవలను ప్రారంభించనున్నారు. సాక్షి, కడప: రాష్ట్రవిభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలో రెండు రోజులపాటు రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో త్రీటైర్ ఆర్కిటెక్చర్ సాప్ట్వేర్ విధానం ద్వారా రవాణశాఖ ఆన్లైన్ సేవలు అందిస్తోంది. దీని ప్రధాన సర్వర్ హైదరాబాద్ కేంద్రంగా ఉంది. జూన్2వ తేదీ తెలంగాణ అపాయింటెడ్ డే. ఆ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా సర్వర్లు ఏర్పాటు చేయాలి. వేర్వేరుగా సేవలు అందించాలి. దీంతో రవాణశాఖ అధికారులు ఆదిశగా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల31తో పాటు జూన్ ఒకటో తేదీన ప్రధాన సర్వర్ను పూర్తిగా ఆపేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించాలన్నా, డ్రైవింగ్ లెసైన్స్ పొందాలన్నా మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరగాలి. హైదరాబాద్లోని ప్రధాన సర్వర్కు అనుసంధానమైతేనే వాటికి సంబంధించిన నెంబర్లు, అనుమతులు కన్పిస్తాయి. తద్వారా రిజిస్ట్రేషన్, లెసైన్స్ల జారీ సాధ్యమవుతంది. సర్వర్ నిలిపేయడం వల్ల వీటిని కేటాయించేందుకు ఆరెండు రోజులు వీలుండదు. ముందు రెండురోజులు అదనపు సమయం: మే 31, జూన్ ఒకటో తేదీల్లో సేవలకు పూర్తిస్థాయిలో ఆటంకం కలగనున్న నేపథ్యంలో మే 29, 30 తేదీల్లో అదనపు వేళల్లో పనిచేసేందుకు రవాణశాఖ అధికారులు నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ కౌంటర్లో సేవలు అందిస్తారు. మే 29, 30 తేదీల్లో మాత్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ సిబ్బంది కౌంటర్లలో అందుబాటులో ఉంటారు. ఆ రెండురోజులు సేవలు బంద్: కృష్ణవేణి, డీటీసీ. రవాణశాఖ. మే 31,జూన్ ఒకటో తేదీన రవాణశాఖలో అన్ని రకాల సేవలు నిలిపేస్తున్నాం. సర్వర్ నిలిచిపోనుండటంతో రవాణశాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరెండురోజులు సేవలు అందుబాటులో ఉండవని వినియోగదారులు గమనించాలి.సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. కొత్త వాహనాల క్రయవిక్రయాలకు బ్రేక్ రెండురోజుల పాటు కొత్తవాహనాల క్రయవిక్రయాలు ఆగిపోనున్నాయి. వాహనాల విక్రయదారులు వాహనాలను విక్రయించేటప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సంఖ్య(టీఆర్ నెంబర్)ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ జరగాలంటే రవాణశాఖ ప్రధాన సర్వర్తో అనుసంధానమవ్వాలి. టీఆర్ నెంబరు లేకుండా వాహనాలు షోరూం నుంచి రోడ్డెక్కే అవకాశం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండురోజుల పాటు షోరూముల్లో వాహనాల విక్రయాలు కూడా నిలిచిపోనున్నాయి. వాహనాలకు సంబంధించిన పలురకాల పన్నులు, లెర్నింగ్ లెసైన్స్లు, డ్రైవింగ్ లెసైన్స్ల రూసుముల వంటివి ఈ సేవ, మీసేవ కేంద్రాల ద్వారా రోజువారీ చెల్లింపులు జరుగుతుంటాయి. ఆ రెండు రోజుల్లో రవాణశాఖకు సంబంధించి ఎలాంటి రుసుములు, చలానాలు కట్టంచుకోరు. అన్ని రకాల లావాదేవీలు ఆగిపోనున్నాయి. -
ఇకపై ఈ-పంచాయతీలు
మంచిర్యాల రూరల్, న్యూస్లైన్ : ప్రజలకు పారదర్శక, వేగవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీలను ‘ఈ-పంచాయతీలు’గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో గ్రామపంచాయతీల ద్వారా అందే అన్ని సేవలు ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే అందనున్నాయి. అలాగే పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం మొదటి విడతగా జిల్లాలోని 141 గ్రామపంచాయతీలకు కంప్యూటర్లను మంజూరు చేశారు. పారదర్శక పాలన కోసం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా పాలనలో సంస్కరణలు అవసరమవుతున్నాయి. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంత ప్రజలకు పారదర్శక పాలనను అందించేందుకు పంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 866 గ్రామపంచాయతీలు ఉండగా, మొదటి విడతగా 141 కార్యాలయాలకు కంప్యూటర్లను మంజూరు చేశారు. మండల పరిషత్ కార్యాలయాలకు సైతం ఒక్కో కంప్యూటర్ను అందించారు. కంప్యూటర్తో పాటు ప్రింటర్ను కూడా అందించారు. మంజూరు చేసిన కంప్యూటర్లను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అమర్చి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించారు. కంప్యూటర్ ఆపరేటర్ను సైతం ప్రైవేటు సంస్థనే ఏర్పాటు చేయనుంది. రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక ఆపరేటర్ను ఎంపిక చేయనున్నారు. వారంలో మూడు రోజులు ఒక గ్రామంలో, మరో మూడు రోజులు మరో గ్రామంలో ఆపరేటర్ అందుబాటులో ఉండి విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల విధులు, కోడ్ అమల్లో ఉన్నందున వచ్చే నెలలో అధికారికంగా పంచాయతీల్లో కంప్యూటర్లను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పోటెత్తారు...
ఆదివారం ఒక్కరోజు జిల్లాలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు 43,738 మంది. మహబూబాబాద్, పాలకుర్తి నియోజకవర్గాలు మినహా మిగతా పది సెగ్మెంట్లలో నమోదైన సంఖ్య ఇది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 16,032 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జనం ఉత్సాహం చూపారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 2,990 పోలింగ్ బూత్ల పరిధిలో చేపట్టిన ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపెయిన్కు విశేష స్పందన లభించింది . అయితే ఇదివరకు ఉన్న పేర్లు గల్లంతు కావడం... తప్పులుండడం... ఇంట్లో ఒకరి పేరు ఉండి మరొకరిది లేకపోవడం వంటి తప్పిదాలు షరామామూలుగా ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం ఉన్న పేరును సమాచారం లేకుండా తొలగించడమేంటని బీఎల్ఓలు, వీఆర్ఓలతో పలువురు వాగ్వాదానికి దిగారు. ఆరు నెలల క్రితం ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా... జాబితాలో పేరెందుకు లేదంటూ అధికారులను తప్పుబట్టారు. ఓటరు నమోదు కేంద్రాల వద్ద జీరాక్స్ కేంద్రాలు లేకపోవడంతో దరఖాస్తుదారులు నానాఅవస్తలు ఎదుర్కొన్నారు. సమయానికి రాని బీఎల్ఓలు బూత్ స్థాయి అధికారులు ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంటారని కలెక్టర్ ప్రకటించడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓటరు నమోదు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కుమార్పల్లిలోని తోటబడి, మార్కెట్ స్కూల్, సుబేదారిలోని రెడ్క్రాస్, ఆర్ట్స్ కాలేజీ, జూలైవాడతోపాటు పలు ప్రాంతాల్లో 11 గంటల వరకు బీఎల్ఓలు రాకపోవడంతో దరఖాస్తుదారులు పడిగాపులు కాయూల్సి వచ్చింది. విసిగిన ప్రజలు ఒక్కొక్కరుగా హన్మకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ రద్దీ ఎక్కువైంది. సిబ్బంది తక్కువగా ఉండడంతో వచ్చినవారికి సమాధానం చెప్పేవారే కరువయ్యూరు. పనిచేయని ఆన్లైన్ సేవలు నేరుగా కాకుండా ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికీ ఇబ్బందులు తప్పలేదు. ఉదయంన ుంచి వెబ్సైట్ సేవలు అందలేదు. దీంతో అందరూ బూత్లకే వచ్చారు. ఇంటర్నెట్లో గతంలో దరఖాస్తు చేసిన వారిలో చాలా మంది పేర్లు జాబితాలో లేవు. దీంతో వారు గతంలో తీసుకున్న ప్రింట్తో వచ్చి అధికారులను నిలదీశారు. కాగా, ఇంకా... సమాచారం అందలేదు ల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదుకు సంబంధించి రాత్రి 10.30 గంటల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందలేదని ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ విశ్వనారాయణ తెలిపారు. వివరాలు సోమవారం వెల్లడిస్తామన్నారు. -
ఆధార్ లేకున్నా ఉపకార వేతనాల ఆన్లైన్
=కలెక్టర్ నివేదికతో ప్రభుత్వం అనుమతి =రెండు రోజుల్లో అందుబాటులోకి ఆన్లైన్ సేవలు పాడేరు, న్యూస్లైన్ : ఆధార్ కార్డులు లేకపోవడంతో ఉన్నత విద్యలో ఉపకార వేతనాల ఆన్లైన్ సౌకర్యానికి జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు కలెక్టర్ మేలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల సౌకర్యం పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కళాశాలల వారీగా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వేలాది మంది విద్యార్థులకు ఆధార్కార్డులు లేకపోవడంతో ఆన్లైన్లో వివరాలు పొందుపర్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రియాంబర్స్మెంట్ కోసం ఆన్లైన్లో వివరాలు పొందుపర్చలేక తమకు న్యాయం చేయాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలోనే సుమారు 3 వేల మంది గిరిజన విద్యార్థులు ఉపకార వేతనాల ఆన్లైన్కు దూరంగా ఉన్నారు. మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆధార్ కార్డుల సమస్యతోనే ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళనకు స్పందించిన కలెక్టర్ ఆరోఖ్యరాజ్ గత నెలలో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆధార్కార్డులు లేకపోయినా ఆన్లైన్ సౌకర్యం కల్పించి ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్మెంట్ సౌకర్యం వర్తింప చేయాలని కలెక్టర్ ఇచ్చిన నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆధార్ కార్డులతో సంబంధం లేకుండా ఉపకార వేతనాల ఆన్లైన్కు సమ్మతించింది. రేషన్కార్డులు, బ్యాంకు ఖాతాలు, కుల, ఆదాయ దృవీకరణ పత్రాలతో ఆన్లైన్ సౌకర్యం వర్తింప చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసే తాజా ఉత్వర్వులు సోమవారం నాటికి వస్తాయని, తద్వారా ఆధార్కార్డులు లేకపోయిన విద్యార్థులకు ఉపకార వేతనాల ఆన్లైన్ సౌకర్యాన్ని వేగవంతం చేస్తామని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరక్టర్ బి.మల్లికార్జునరెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. -
ఆన్లైన్.. స్లోడౌన్
పంచాయతీ సిబ్బంది అవగాహన లోపం.. అలసత్వం.. గ్రామాల అభివృద్ధికి శాపంగా మారింది. పంచాయతీల పరిధిలో అన్ని విభాగాలకు చెందిన వివరాలను ఆన్లైన్ చేయకుండా వీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. ప్రగతి పనుల్లో పారదర్శకత లోపించే అవకాశం ఏర్పడింది. పాలమూరు, న్యూస్లైన్: గ్రామ పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. అయితే జిల్లాలో ఇవి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం వివరాలు ప్రతీ ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా అన్నింటినీ కంప్యూటరీకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యోచన. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసినా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఈ విధానంపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. జిల్లాలో 1279 మైనర్, 48 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య వివరాలను 2013 మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఉంచితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమాచారాన్ని పొందుపర్చడంలో సంబంధిత విభాగాలు వెనుకబడి పోయాయి. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి కోట్లాది రూపాయాల నిధులు కుమ్మరిస్తున్నా ఆశించిన ప్రగతి కానరావడం లేదు. నిధులు పక్కదారి పడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధిదీపాలు, తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. పాలకవర్గం పదవీ కాలం 2011 అగస్టులో ముగియడంతో 13వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. గత నెలలో 2011-12కు సంబంధించిన 13వ ఆర్థిక సంఘం (టీఎఫ్సీ) నిధులు ఈ మధ్యే విడుదలయ్యాయి. ఇక నుంచి నిధులు విడుదల కావాలంటే పంచాయతీ పద్దుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వివరాలు ఆన్లైన్లో ఉంచాలి. అయతే పంచాయతీల్లో కంప్యూటర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వివరాలు నమోదు చేయని పంచాయతీలకు నిధులు నిలిచిపోయి అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే ఆ శాఖ అధికారులు కనెక్షన్లు తొలగిస్తే పంచాయతీ గ్రామాల్లో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కారణాలెన్నో..? జిల్లాలో1327 పంచాయతీలుండగా దాదాపు 169 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీలున్నాయి. ఒక్కో కార్యదర్శికి నాలుగు నుంచి ఐదారు పంచాయతీల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నిధులు విడుదల వినియోగం తదితర వాటిని ఆన్లైన్ల్లో ఉంచేందుకు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. దీంతో వారికి సరైన అవగాహన లేక వివరాల నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల్లో కంప్యూటర్లు లేకపోవడంతో వివరాలు నమోదు చేసేందుకు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ స్నేహితుల దగ్గర, సమీప బంధువుల ఇళ్లకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. అవగాహనా రాహిత్యంతో పలువురు కార్యదర్శులు ఓపెనింగ్ బ్యాలెన్స్లను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో పొందుపరచకుండానే అయిందనిపిస్తున్నారు. గడువు ముగిసి ఆరునెలలు గడుస్తున్నా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీల వివరాలు ఆన్లైన్ చేయని వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాాశం లేదు. అదే జరిగితే పంచాయతీల అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. కాగా దీనిపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ఎన్ఆర్ఐలకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ సేవలు
ఎన్ఆర్ఐలకు ఆన్లైన్ ద్వారా సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు, పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం www.apnri.ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు. ఈ సదుపాయం వల్ల సచివాలయంలో ఎన్ఆర్ఐ శాఖలో గంటల కొద్దీ వేచిఉండే పని ఉండదు. మంత్రి శ్రీధర్బాబు వివరాల్ని వెల్లడించారు. ఆదిలాబాద్, కడప, కరీంనగర్, నిజమాబాద్, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాలకు ఈ ప్రాజెక్ట్ వర్తిస్తుంది. దరఖాస్తు అందిన 30 రోజుల తర్వాత ప్రభుత్వం సర్టిఫికెట్ను జారీ చేస్తుంది. -
ఇదే‘మీ సేవ ’?
= నిర్వహణ పట్టని కాంట్రాక్టర్లు = స్కానర్లు లేక ఆగిన ఆన్లైన్ సేవలు = వేతనాలందక సిబ్బందికి అగచాట్లు = వినియోగదార్లకు తప్పని తిప్పలు సాక్షి, సిటీబ్యూరో : పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా తయారైంది నగరంలోని ‘మీ సేవ’ కేంద్రాల పరిస్థితి. ‘సులభంగా.. వేగంగా..’ నినాదంతో ఆన్లైన్ ద్వారా ప్రజలకు సత్వర సేవలందిస్తామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘మీసేవ’లు రానురాను నగరంలో మృగ్యమౌవుతున్నాయి. సిబ్బంది లేమి.. పనిచేయని స్కానర్లు.. కారణాలేవైతేనేం ప్రభుత్వం ప్రకటించిన సేవలన్నీ అందించడం సాధ్యం కాదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 177 రకాల సేవలను ప్రజలకు అందుబాట్లోకి తెచ్చామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తుండగా... వాస్తవానికి వీటిలో సగానికి పైగా సేవలు ప్రజలకు అందడం లేదు. అవగాహన లోపమేనా? ‘మీసేవ’ కేంద్రాలను ప్రస్తుతం నిర్వహిస్తోన్న కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతోనే సేవలను అందించలేకపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పనిచేసిన శాంకో సంస్థ నుంచి మీసేవల కాంట్రాక్టును ఈ ఏడాది మార్చి 19 నుంచి ‘ఉపాధి, రామ్ ఇన్ఫర్మాటిక్స్, ఐటీగ్లోబల్’ సంస్థలు సంయుక్తంగా పొందాయి. వీరు నిర్వహణ బాధ్యతలు చేపట్టేనాటికి 160 సేవలు ఉండగా, తాజాగా అవి 177కి చేరాయి. అయితే పెరిగిన సేవలకు అనుగుణంగా టెక్నాలజీని గాని, సిబ్బందిని గాని సమకూర్చుకోకపోవడంతో ప్రజలకు సేవలందించడం దుర్భరంగా మారింది. కనీసం ఆయా కేంద్రాల వద్ద సరైన సెక్యూరిటీ ప్రమాణాలు కూడా పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బందికి రెండు నెలల పాటు జీతాలివ్వకపోవడంతో వారు మానేస్తున్నారు. పలు కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు (తాగునీరు, మరుగుదొడ్లు..తదితరమైనవి) లేక ప్రజలు కూడా నానా అవస్థలు పడుతున్నారు. పెండింగ్లో దరఖాస్తులు మీసేవలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.79 ల క్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వివిధ శాఖలకు పంపిన దరఖాస్తులు (ఇంకా సమాచారం రానివి) 8.02 లక్ష లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఓవైపు సర్వర్తో సమస్యలు ఉండగా.. మరోవైపు స్కానర్లు లేకపోవడంతో ఆన్లైన్ వ్యవస్థ పనిచేయడం లేదు. పలు కేంద్రాలకు మాన్యువల్(కొరియర్) వ్యవస్థ ద్వారానే దరఖాస్తులు పంపుతున్నట్లు సమాచారం. మీ సేవాకేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్లకు సంఖ్య కనీసం 25 శాతం పెంచాల్సి ఉండగా.. యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నెలనెలా వేతనాలు ఇవ్వక ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలోనే కొంతమంది ఇతర ఉద్యోగాలు చూసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆపరేటర్లకు, మేనేజర్లకు వేతనాలు పెంచకపోగా పని గంటలు పెంచేసరికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. మెహిదీపట్నం(పీఅండ్ కాలనీ)కి చెందిన ఓ వ్యక్తి నివాస ధ్రువీకరణపత్రం కావాలని దరఖాస్తు సమర్పించేందుకు సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లారు. అయితే.. ఆ దరఖాస్తు ఆసిఫ్నగర్ మండలానికి సంబంధించినదని, తాము గోల్కొండ మండల వాసులకు మాత్రమే సేవలందిస్తామని అక్కడి సిబ్బంది చెప్పారు. వాస్తవానికి మీసేవాకేంద్రం ఉన్న ప్రాంతం ఆసిఫ్నగర్ మండలంలోనే ఉండడం గమనార్హం. ఆరా తీస్తే.. సదరు మీసేవాకేంద్రంలో స్కానర్లు లేనందున దరఖాస్తును స్కాన్ చేసి ఆసిఫ్నగర్ తహశీల్దారు కార్యాలయానికి పంపడం సాధ్యం కాదని సిబ్బంది అలా చెప్పినట్లు తెలిసింది. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగర్ కాలనీ మీసేవాకేంద్రానికి వెళ్లమని సిబ్బంది ఉచిత సలహా ఇవ్వడం విశేషం. అంతేకాదు.. ఇక్కడి కేంద్రంలో కరెంట్ పోతే కంప్యూటర్లు ఆగిపోయి కస్టమర్లకు తిప్పలు తప్పడం లేదు. గతంలో ఇక్కడ 16మంది ఆపరేటర్లు పనిచేయగా ప్రస్తుతం కేవలం 8మంది మాత్రమే పనిచేస్తున్నారంటే.. మీసేవా కేంద్రాల నిర్వహణ ఎలా ఉందో ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదేమో. -
నేటి నుంచి ఈపీఎఫ్వో ఆన్లైన్ సేవలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) తమ చందాదారుల సౌకర్యార్థం శుక్రవారం నుంచి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా చందాదారులు ఇకపై తమ ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకొనేందుకు వీలవుతుంది. ‘ఇప్పటివరకు వారి ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే సవరించేవాళ్లం. ఇకపై ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని ఈపీఎఫ్వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జలాన్ తెలిపారు.