standing committee
-
GHMC: బరిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన అధికార మార్పిడితో జీహెచ్ఎంసీ పాలక మండలిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్–ఎంఐఎం పార్టీలు స్టాండింగ్ కమిటీకి పరస్పర అవగాహనతో పోటీ చేయడంతో ఎన్నిక జరగకుండానే కమిటీ ఏకగ్రీవమవుతూ వచ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సఖ్యతగా ఉండే ఎంఐఎం..తన స్టాండ్ కనుగుణంగా ప్రస్తుతం కాంగ్రెస్తో జత కట్టింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం తమ కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం బరిలో దింపాయి. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి సైతం ఇద్దరు స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు వేయడంతో ఉపసంహరణ గడువు దాకా కొంత డ్రామా జరిగే అవకాశం ఉంది. స్టాండింగ్ కమిటీలో 15 స్థానాలున్నాయి. కార్పొరేటర్లు 15 మందిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం..ఇద్దరి మృతితో నాలుగు స్థానాలు ఖాళీ కాగా 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరే స్టాండింగ్ కమిటీని ఎన్నుకునేందుకు ఓటర్లు. ఎక్కువ ఓట్లు పొందిన వారు స్టాండింగ్ కమిటీ సభ్యులయ్యే అవకాశం ఉంది. పొత్తు లేకుండా పారీ్టలు వేటికవి విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది. ఎక్కువ మంది కార్పొరేటర్లున్న బీఆర్ఎస్ గెలిచేది. కానీ ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తుతో ఆ రెండు పార్టీల వారే ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేటర్ల బలానికనుగుణంగా స్టాండింగ్ కమిటీకి పార్టీలు సభ్యులను నిలబెడుతున్నాయి. బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తు ఉన్నప్పుడు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆపార్టీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నిలబడి, గెలిచేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ కంటే ఎంఐఎం బలం ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం ఎనిమిదిమందిని బరిలో దింపింది.కాంగ్రెస్ నుంచి ఏడుగురు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ కార్పొరేటర్లను పోటీకి దింపాలో, వద్దో నిర్ణయించకముందే ఆ పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేశారు. పారీ్టల బలాల దృష్ట్యా, అధిష్ఠానం ఆదేశిస్తే వారిద్దరూ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. లేని పక్షంలో క్రాస్ ఓటింగ్పై ఆశతో బరిలో ఉండవచ్చు. అదే జరిగితే ఉత్కంఠ భరితమైన పోలింగ్ జరగనుంది. బీజేపీ సైతం స్టాండింగ్ కమిటీకి పోటీ చేయాలని భావించినప్పటికీ, పార్టీ పెద్దల సూచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఒకవేళ పోలింగ్ జరిగితే, పోటీలో లేని బీజేపీ సభ్యుల ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.నేడు నామినేషన్ల పరిశీలన నామినేషన్ పత్రాలను కమిషనర్ కార్యాలయంలో మంగళవారం స్క్రూటినీ చేస్తారు. పోటీకి అర్హులుగా నిలిచేవారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుంది. అన్ని నామినేషన్లు అర్హత పొంది, ఎవరూ ఉపసంహరించుకోని పక్షంలో 25వ తేదీన పోలింగ్జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీలో స్థానం ఉన్న కాంగ్రెస్ పారీ్ట..బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీలో స్థానం లేకుండానే ఉంది. తిరిగి స్టాండింగ్ కమిటీలోకి వచ్చే అవకాశం ఏర్పడినట్లు పరిశీలకులు చెబుతున్నారు.నామినేషన్లు వేసింది వీరే.. గడువు ముగిసేలోగా నామినేషన్లు వేసిన వారిలో ఎంఐఎం నుంచి బాతా జబీన్, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహబ్, మహ్మద్ సలీమ్, పరీ్వన్ సుల్తానా, సమీనాబేగం, డా. అయేషాహుమేరా, గౌసుద్దీన్ మహ్మద్లున్నారు. కాంగ్రెస్ నుంచి మహాలక్ష్మి రామన్ గౌడ్, బూరుగడ్డ పుష్ప, సీఎన్ రెడ్డి, వి.జగదీశ్వర్గౌడ్, బానోతు సుజాత, బొంతు శ్రీదేవి, ఎండీ బాబా ఫసియుద్దీన్లున్నారు. బీఆర్ఎస్కు చెందిన జూపల్లి సత్యనారాయణరావు, ప్రసన్నలక్ష్మి కూడా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు పార్టీల గుర్తింపు అంటూ లేదు. -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్ఝున్వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
Hyderabad: మిత్రులెవరో.. ప్రత్యర్థులెవరో?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఏ పార్టీ ఎవరికి మద్దతివ్వనుంది? ఏ పార్టీ ఎవరితో విభేదించనుంది? వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం ఇటీవలి కాలంలో రాజకీయ పారీ్టల్లో చేటుచేసుకున్న పరిణామాలు. ప్రస్తుత పాలకమండలి ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర అవగాహనతో కలిసి పోటీ చేయడంతో ఎన్నికలు పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవంగానే ముగిశాయి. రెండు పార్టీలకు పాలకమండలిలో ఉన్న కార్పొరేటర్ల సీట్లను పరిగణనలోకి తీసుకొని స్టాండింగ్ కమిటీలోని మొత్తం 15 స్థానాలకుగాను బీఆర్ఎస్ 8, ఎంఐఎం 7 స్థానాలకు పోటీ చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్– ఎంఐఎం పరస్పర సహకారంతో పని చేసినందున ఆ రెండు పార్టీల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతూ వచ్చారు. ఈ నెల 25న జరగాల్సిన స్టాండింగ్ కమిటీకి సైతం ఏ రెండు పార్టీలైతే పరస్పర అవగాహనతో పని చేస్తాయో ఆ పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఎంఐఎం మద్దతు ఎవరికి? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతిస్తూ వస్తున్న ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్తో జత కట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎంఐఎం–కాంగ్రెస్ల మధ్య నెలకొన్న అనుబంధం తెలిసిందే. ఆ రెండు పారీ్టలే పరస్పర సహకారంతో పోటీ చేస్తాయనే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లోనూ ఉన్నాయి. అదే జరిగితే గతంలో బీఆర్ఎస్ పొందిన స్టాండింగ్ కమిటీ స్థానాలు ఈసారి కాంగ్రెస్కు దక్కుతాయి. లేదా బలాల దృష్ట్యా కాంగ్రెస్ కంటే ఎంఐఎంకు ఎక్కువ మంది సభ్యులున్నందున బలాల దామాషాకు అనుగుణంగా రెండు పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పొత్తు లేకుండా పోటీ జరిగితే? అలా కాకుండా పొత్తు లేకుండా వేటికవే విడివిడిగా పోటీచేస్తే ఎక్కువ సభ్యులున్న పారీ్టకి ఎక్కువ సీట్లొచ్చే అవకాశం ఉన్నా, సీక్రెట్ బ్యాలెట్ కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో ఏ పారీ్టకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పే పరిస్థితి లేదు. పార్టీలతో పాటు, పార్టీల కతీతంగా కార్పొరేటర్ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు, మద్దతు తదితరమైనవి ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. బల్దియాలో ఇప్పటి వరకు ఎంఐఎం లేకుండా.. ఏ రెండు పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్న చరిత్ర లేదు. ఎంఐఎంయేతర పారీ్టల మధ్య పొత్తు ఉండదనే అభిప్రాయాలే ఉన్నా, రాజకీయ అవసరాల దృష్ట్యా ఏ పార్టీ దేనితోనైనా లోపాయికారీ మద్దతు పొందవచ్చనే అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన జనరల్బాడీ సమావేశం ఇందుకు ఉదాహరణ. సభ జరగడానికి కొన్ని రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్.. ‘మా పార్టీ బలమే ఎక్కువ. మా వాళ్లకు మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా సభ జరపగలరా’ అన్నారు. కానీ.. కారణమేదైనా సభలో బీఆర్ఎస్ మాత్రమే లేకుండా బడ్జెట్, సాధారణ సమావేశాలు జరగడం తెలిసిందే. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లున్నా.. బీఆర్ఎస్కు అందరి కంటే ఎక్కువ సీట్లున్నా పారీ్టల మధ్య పరస్పర సహకారం లేకుంటేనే దానికి ఉపకరిస్తుంది. లేని పక్షంలో ఏ రెండు పారీ్టలైతే జత కడతాయో ఆ రెండు పారీ్టల సభ్యులే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఏం జరగనుందన్నది నామినేషన్లు ముగిసే లోగా స్పష్టత రానుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. పోటీ జరుగుతుందా, ఏకగ్రీవమవుతుందా? అన్నది ఉపసంహరణలు ముగిసే 21వ తేదీన వెల్లడి కానుంది. బీజేపీ కార్పొరేటర్లతో నేడు కిషన్ రెడ్డి భేటీ జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీ విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొంటారు.అవే కీలకం మొత్తం 150 మంది కార్పొరేటర్లకుగాను ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరి మరణంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్నారు. వీరే స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికి పోటీ చేసేందుకు, ఓట్లు వేసేందుకూ అర్హులు. ఈ బలం దృష్ట్యా బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలెక్కువ. తర్వాత ఎంఐఎంకు అయినప్పటికీ.. అంతర్గతంగానైనా, బహిరంగంగానైనా ఎత్తులు, పొత్తులు, జిత్తులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. -
ఈ విజయం టీడీపీకి చెంపదెబ్బ.. కర్నూల్ లో YSRCP క్లీన్ స్వీప్..
-
చరిత్రకెక్కిన జిన్పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా..
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (69) చరిత్ర సృష్టించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు ఆయనే! బీజింగ్లోని ఆర్నేట్ గ్రేట్ హాల్లో ఆదివారం సీపీసీ 20వ సెంట్రల్ కమిటీ ప్లీనరీ జిన్పింగ్ అధ్యక్షతన జరిగింది. 203 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 168 మంది ప్రత్యామ్నాయ సభ్యులు పాల్గొన్నారు. జిన్పింగ్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 24 మందితో సీపీసీ పొలిట్బ్యూరోకూ సెంట్రల్ కమిటీ ఆమోదముద్ర వేసింది. జిన్పింగ్ సహా ఏడుగురు సభ్యులతో అత్యంత శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జిన్పింగ్ మద్దతుదారులకే స్థానం దక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికయ్యాయని జిన్పింగ్ స్వయంగా ప్రకటించారు. సీపీసీ షాంఘై అధ్యక్షుడు లీ ఖియాంగ్.. జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. చైనా ప్రీమియర్ (ప్రధానమంతి) లీ కెఖియాంగ్ వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రీమియర్గా లీ ఖియాంగ్ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ.. చైనా ప్రజలకు వెన్నెముక ప్రపంచానికి చైనా అవసరం, చైనాకు ప్రపంచం అవసరం ఉందని షీ జిన్పింగ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటూ చైనా అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రపంచానికి చైనా కావాలని చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థ నమ్మదగినది, స్వేచ్ఛాయుతమైనది అని పేర్కొన్నారు. పునాది బలంగా ఉందని వివరించారు. దేశ విదేశీ పెట్టుబడుల కోసం తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. సంస్కరణల విషయంలో స్థిరంగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. సౌభాగ్యవంతమైన చైనా బాహ్య ప్రపంచం కోసం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. మార్క్సిజం వైపు మొగ్గు చూపుతుండడంతోపాటు చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జిన్పింగ్ ఇప్పటికే ప్రకటించారు. నూతన శకంలో సోషలిజం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర ఉన్న.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మన పార్టీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నుముకగా మారాలన్నారు. ఘన కీర్తి కలిగిన చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోందని జిన్పింగ్ వివరించారు. మార్గసూచి(రోడ్మ్యాప్) తయారు చేసుకున్నామని, శంఖం పూరించామని చెప్పారు. మన దేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీకి పక్షపాతానికి తావులేని వాస్తవికమైన ప్రచారం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మూడు అత్యున్నత పదవులు అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్గా జిన్పింగ్ను కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూర్ మరోసారి నియమించింది. ఆయనకు మూడు అత్యున్నత పదవులు దక్కాయి. దేశాధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా, సీఎంసీ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) జనరల్స్ ఝాంగ్ యుషియా, హీ వీడాంగ్ను సీఎంసీ వైస్ చైర్మన్లుగా నియమించారు. పలువురు సైనిక ఉన్నతాధికారులకు సెంట్రల్ మిలటరీ కమిషన్లో సభ్యులుగా అవకాశం లభించింది. ఆదివారం సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ (సీసీడీఐ) స్టాండింగ్ కమిటీ కార్యదర్శి, ఉప కార్యదర్శులు, సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 24 మందితో కూడిన సీపీసీ పొలిట్బ్యూరోలో మహిళలకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత! -
మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత!
బీజింగ్: చైనాలో కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో (79)ను మీడియా సాక్షిగా హాల్ నుంచి గెంటేశారు. జిన్పింగ్ పక్కన ఇతర అత్యున్నత స్థాయి నేతలతో పాటు ముందు వరుసలో కూర్చుని ఉన్న ఆయనతో ఇద్దరు వచ్చి కాసేపు మాట్లాడారు. చివరికి జింటావో అయిష్టంగానే వారితో పాటు వెళ్లిపోయారు. దాంతో పార్టీ నాయకులంతా బిత్తరపోయారు. మీడియాను హాలోలోకి అనుమతించాక అందరి ముందే ఇదంతా జరగడం యాదృచ్ఛికం కాదని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. 2012లో జింటావో నుంచే జిన్పింగ్ చైనా అధ్యక్ష పగ్గాలు స్వీకరించడం గమనార్హం! Another clip of the moments leading up to the original Hu videohttps://t.co/CkoALIH52A — Danson Cheong (@dansoncj) October 22, 2022 ఇక్కడ చదవండి: జిన్పింగ్ మూడోస్సారి! -
జిన్పింగ్ మూడోస్సారి!
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (69) రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు నేడు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. ఐదేళ్లకోసారి జరిగే వారం రోజుల కమ్యూనిస్టు పార్టీ సదస్సు శనివారం 205 మంది సెంట్రల్ కమిటీ సభ్యుల ఎన్నికతో ముగిసింది. ఆదివారం వీరంతా కలిసి 25 మంది పొలిటికల్ బ్యూరో సభ్యులను ఎన్నుకుంటారు. తర్వాత వారు దేశ పాలనా వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు ఏడుగురు, లేదా అంతకంటే ఎక్కువ మందితో కీలకమైన స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటారు. వారిలోంచి ఒకరు ప్రధాన కార్యదర్శి పార్టీనీ, అధ్యక్ష హోదాలో దేశాన్నీ నడిపిస్తారు. జిన్పింగ్తో పాటు ఆయన మద్దతుదారులు చాలామంది సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జిన్పింగ్ వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై అధ్యక్షునిగా కొనసాగడం లాంఛనమేనని పరిశీలకులు భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్అనంతరం పదేళ్లకు పైగా అధ్యక్ష పడవిలో కొనసాగనున్న తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక మావో మాదిరిగానే జీవితకాలం పదవిలో కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. మావో అనంతరం చైనా అధ్యక్షులైన వారంతా పార్టీ నియమావళి ప్రకారం రెండుసార్లు పదవీకాలం పూర్తయ్యాక తప్పుకుంటూ వచ్చారు. కమిటీలో కుదుపులు పలువురు ప్రముఖులను ఇంటిదారి పట్టిస్తూ సెంట్రల్ కమిటీని భారీగా ప్రక్షాళించారు. జిన్పింగ్ తర్వాత నంబర్ టూగా కొనసాగుతున్న ప్రధాని లీ కీ కియాంగ్ (67), ఉప ప్రధాని హన్ జెంగ్ (68), నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ లీ జాన్షు (72), చైనీస్ పీపుల్స్ పొలికిటల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్ యాంగ్ (67) సహా పలువురు ప్రముఖులకు కమిటీలో చోటు దక్కకపోవడం విశేషం! పైగా వీరంతా పదవీకాలం ముగుస్తున్న జిన్పింగ్ సారథ్యంలోని ప్రస్తుత స్టాండింగ్ కమిటీలో సభ్యులు కూడా!! జిన్పింగ్కు మరిన్ని విశేషాధికారాలు కట్టబెడుతూ శనివారం సదస్సు తీర్మానాలను ఆమోదించింది. అనంతరం జిన్పింగ్ ప్రసంగించారు. ‘‘కష్టించేందుకు, గెలిచేందుకు భయపడొద్దు. చిత్తశుద్ధితో ముందుకు సాగాలి’’ అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం
న్యూఢిల్లీ: దేశ సమాఖ్య విధానంలో సహకార స్పూర్తిని పెంచేందుకు కృషి చేసే అంతర్రాష్ట్ర మండలిని కేంద్రం పునర్నిర్మించింది. ఈ మండలి అధ్యక్షుడు ప్రధాని మోదీ కాగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. దీంతోపాటు, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించింది. కేంద్రం–రాష్ట్రాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివిధ అంశాలను అంతర్రాష్ట్ర, జోనల్ మండలులు పరిశీలించి, పరిష్కారాలు వెతుకుతాయి. ఇవి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు చేస్తుంటాయి. హోం మంత్రి అధ్యక్షుడిగా ఏర్పాటైన మండలి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్రసింగ్ షెకావత్తోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. -
స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించండి
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. 31 మంది సభ్యులున్న ఈ స్థాయీ సంఘంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ (టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్) ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు సంబంధించిన కీలక బిల్లును పరిశీలించడానికి సగం కంటే ఎక్కువమంది మహిళలను స్టాండింగ్ కమిటీలో నియమించాలని కోరారు. అలాగే ఈ కమిటీ మహిళా ఎంపీనే చైర్మన్గా నియమించాలని స్వాతి డిమాండ్ చేశారు. చదవండి: వాళ్లు అగాథం పెంచితే.. మేం అభివృద్ధి చేశాం -
ఆమె ఒక్కరే!
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం)లో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులో వచ్చింది. విప్లవాత్మకమైన, మహిళల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకాంశంపై చర్చ జరిగే సమయంలో అతివలకు ఇంత తక్కువ భాగస్వామ్య ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై... ఉన్న శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (రాజ్యసభ) సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు (వైఎస్సార్సీసీ) ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది. అమ్మాయిల కనీసం వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు మార్పులు తలపెట్టింది. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్ల పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ (సవరణ) చట్టం–2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 21న లోక్సభలో ప్రవేశపెట్టింది. హడావుడిగా బిల్లు తెచ్చారని, లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్ కమిటీకి పంపింది. కమిటీలోని 31 సభ్యుల్లో మీరొక్కరే మహిళ అనే విషయాన్ని సుస్మితా దేవ్ దృష్టికి తీసుకెళ్లగా ‘ఈ బిల్లును పరిశీలించేటపుడు మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేది. అయితే ఇదివరకే చెప్పినట్లు భాగస్వామ్యపక్షాల అందరి వాదనలూ వింటాం’ అని ఆమె ఆదివారం స్పందించారు. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే... అమ్మాయి కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్ లా’ కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తుంది. ఏకరూపత వస్తుంది. మతపరమైన ‘పర్సనల్ లా’ల్లో ఏం నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద ఫారిన్ మ్యారేజ్ యాక్ట్లకు... బాల్య వివాహ నిషేధ (సవరణ)–2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసును 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది. స్టాండింగ్ కమిటీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగా నియమించలేదు నిజానికి ఈ స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించేందుకు ప్రత్యేకంగా నియమించిన కమిటీ కాదు. పార్లమెంటులో మొత్తం 24 శాఖాపరమైన కమిటీలు ఉన్నాయి. ఇవి శాశ్వత కమిటీలు. వీటిల్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలిద్దరూ సభ్యులుగా ఉంటారు. ఆయా పార్టీలు తమకు పార్లమెంటులో ఉన్న బలానికి అనుగుణంగా స్టాండింగ్ కమిటీలకు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తాయి. కొన్నింటిని లోక్సభ, మరికొన్నింటిని రాజ్యసభ పర్యవేక్షిస్తుంది. సెలక్ట్ కమిటీ, జాయింట్ (సంయుక్త) కమిటీలను ఏదైనా అంశంపై చర్చించాల్సిన వచ్చినపుడు ప్రత్యేకంగా దాని కోసమే ఏర్పాటు చేస్తారు. మహిళల వివాహ వయసును పెంచే బిల్లును పరిశీలించనున్న కమిటీలో 2021 సెప్టెంబరులో రెండు విడతలుగా సభ్యులను నియమించారు. 10 లోక్సభ ఎంపీలు, 21 మంది రాజ్యసభ ఎంపీలు దీనిలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో నియామకాలు జరిగిన తర్వాత మహిళలకు సంబంధించిన ఈ కీలక బిల్లును డిసెంబరు 21 లోక్సభ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయడం గమనార్హం. సమంజసం కాదు ప్రతిపాదిత బిల్లును పరిశీలించే స్టాండింగ్ కమిటీలో 50 శాతం మంది మహిళలు లేకపోతే అది సమంజసం అనిపించుకోదు. నిబంధనలు అనుమతిస్తే.. ఈ ప్యానెల్లోని తమ పురుష ఎంపీలను మార్చి వారి స్థానంలో మహిళా ఎంపీలను నామినేట్ చేయాలని నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలా కుదరని పక్షంలో ఈ కీలకమైన బిల్లుపై చర్చించేటపుడు తమ పార్టీలోని మహిళా ఎంపీలను సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. – జయా జైట్లీ మరింత మంది ఉండాలి నారీమణులకు సంబంధించిన అంశాలపై చర్చించే ఈ స్టాండింగ్ కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలకు ప్రాతినిధ్యం ఉండాలి. సభ్యులు కాని వారినీ చర్చకు పిలిచే అధికారం కమిటీ ఛైర్మన్కు ఉంటుంది. భాగస్వామ్యపక్షాలందరినీ కలుపుకొని పోతూ, విస్తృత చర్చ జరగాలంటే ఛైర్మన్ మహిళా ఎంపీలను ఆహ్వానించవచ్చు. ఈ కీలక చర్చలో మహిళా ఎంపీల భాగస్వామ్యం మరింత ఉండాలని కోరుకుంటున్నాను. – సుప్రియా సూలే, లోక్సభ ఎంపీ -
ఆధార్– ఓటర్ ఐడీ అనుసంధానానికి లోక్సభ ఓకే
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ నెంబర్తో అనుసంధానించడం సహా పలు ఎన్నికల సంస్కరణలు పొందుపరిచిన బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లును హడావుడిగా తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు, దీన్ని స్టాండింగ్ కమిటీ (లా అండ్ జస్టిస్) పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఎన్నికల చట్ట సవరణ బిల్లు –2021ను సోమవారం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడీ– ఆధార్ను లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలుగుతుందని, దేశ పౌరులు కాని వారు కూడా ఓటేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆధార్ లింకింగ్తో పాటు కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కటాఫ్ డేట్లను (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నిర్ణయించడం, సర్వీసు ఓటర్ నిబంధనలో మార్పును బిల్లులో పొందుపరిచారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో రూ. 3.73 లక్షల కోట్లను వ్యయం చేసుకునేందుకు వీలుకల్పించే సప్లిమెంటరీ గ్రాంట్స్కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.62 వేల కోట్లను ఎయిర్ఇండియాకున్న పాత అప్పులు, ఇతరత్రా బకాయిలను చెల్లించడానికి, రూ. 58 వేల కోట్లను ఎరువుల సబ్సిడీకి, రూ. 53 వేల కోట్లను ఎగుమతుల ప్రోత్సాహక బకాయిలను చెల్లించడానికి, రూ. 22 వేల కోట్లను గ్రామీణాభివృద్ధికి వెచ్చిస్తారు. ఒమిక్రాన్పై పోరుకు సిద్ధం కరోనా కొత్త వేరియంట్పై పోరుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో చెప్పారు. రాబోయే రెండు నెలల్లో దేశ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 45 కోట్ల డోసులకు పెంచుతామని తెలిపారు. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ను సిద్ధంగా ఉంచామన్నారు. దేశంలో ఇంతవరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్నారు. మరోవైపు మీడియేషన్ (మధ్యవర్తిత్వ) బిల్లును స్టాండింగ్ కమిటీకి, బయోడైవర్సిటీ బిల్లును జాయింట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం రాజ్యసభ ఎన్డీపీఎస్ చట్టానికి ఆమోదం తెలిపింది. సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ఎందుకింత హడావుడి? ఎన్నికల చట్ట సవరణల బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని విపక్షాలు దుయ్యబట్టాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2.45గంటలకు లోక్సభ మళ్లీ సమావేశమైంది. బిల్లును తీసుకురావడంలో ప్రభుత్వం తొందరపాటు చూపిందని, తగిన నిబంధనలు పాటించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరాయి. అయితే పుట్టుస్వామి కేసులో వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే ఈ బిల్లును తెచ్చామని, దీనివల్ల ఎవరైనా ఒక్కచోట మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోగలరని, ఒక్కరే వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉంటే... అలాంటివి గుర్తించి ఏరివేయవచ్చని మంత్రి రిజిజు వివరణ ఇచ్చారు. తద్వారా పారదర్శక ఎన్నికలు జరపవచ్చని అన్నారు. సుప్రీం జడ్జిమెంట్లో పేర్కొన్న అన్ని అంశాలకు అనుగుణంగానే బిల్లు రూపొందిందన్నారు. అలాగే ఆధార్తో అనుసంధానం స్వచ్ఛందమని స్పష్టం చేశారు. ఆధార్తో లింక్ చేయలేదని ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం జరగదన్నారు. లా అండ్ పర్సనల్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఇప్పటికే బిల్లులో చేర్చినందున మరలా దీన్ని స్టాడింగ్ కమిటీకి పంపాల్సిన పనిలేదన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే మూజువాణి ఓటుతో బిల్లును లోక్సభ ఆమోదించింది. అయితే బిల్లులో ‘‘ఆధార్ నెంబరు ఇవ్వలేకపోతున్నందువల్ల (నిర్దేశించే సముచిత కారణాన్ని చూపితే)... కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చే ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించ కూడదు, ఓటరు జాబితాలోని ఏ ఒక్క పేరునూ తొలగించడానికీ వీల్లేదు’’ అని మెలిక ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. -
మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం
బీజింగ్: భారత్తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం మరో కొత్త డ్రామాకి తెరతీసింది. సరిహద్దు ప్రాంతాల్ని మరింతగా ఆక్రమించుకోవడానికి వీలుగా సరిహద్దు భూ చట్టానికి ఆమోదముద్ర వేసింది. చైనా ప్రజల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవని, ఎవరూ దానిని ఉల్లంఘించడానికి వీల్లేదని ఆ చట్టంలో పేర్కొంది. జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్కి చెందిన స్టాండింగ్ కమిటీ శనివారం ఆమోదించినట్టుగా జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే చైనా ఎంతటి చర్యలకైనా దిగుతుందని చట్టంలో ఉంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సరిహద్దు ప్రాంతాల రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. మొత్తం 14 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటున్న చైనాకి ప్రస్తుతం భారత్, భూటాన్ లతోనే సమస్యలున్నాయి. మిగిలిన 12 దేశాలతో సరిహద్దు సమస్యల్ని ఆ దేశం పరిష్కరించుకుంది. (చదవండి: చైనాపై భారత్ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..) -
పోలీసులపై ఫిర్యాదుల విచారణకు స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీల అండ చూసుకొని బ్యూరోక్రాట్లు ,ముఖ్యంగా పోలీసు అధికారులు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసునన్నారు. పోలీసుల అకృత్యాలపై అందిన ఫిర్యాదులను విచారించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఛత్తీస్గఢ్కు చెందిన సస్పెండైన పోలీసు అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ తనపై దేశద్రోహం, అవినీతి, బలవంతపు వసూళ్లకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారించింది. నేతల అండతో చెలరేగే పోలీసు అధికారుల్ని న్యాయవ్యవస్థ కాపాడలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. -
జీహెచ్ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయాలపై వివాదం నెలకొంది. ఐ ఫోన్లు కావాలంటూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల పట్టు బట్టినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేసేందుకు స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా సమాచారం. స్టాండింగ్ కమిటీలోని 17 మంది సభ్యులకు తలా ఒక ఐఫోన్ను ‘బహుమతి’గా ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఒక్కో మొబైల్ విలువ 1.6 లక్షలు. ఈ మొత్తం వ్యవహారానికి 27 లక్షల రూపాయలకు పైగా వ్యయం కానుంది. అయితే, మార్కెట్లో ఐఫోన్-12 మ్యాక్స్ ప్రో (ఇంటర్నల్ మెమొరీ 512 జీబీ) మొబైల్స్ స్టాక్ లేకపోవడంతో కొనుగోలును జీహెచ్ఎంసీ వాయిదా వేసిందట. దాంతో తమకు మొబైల్స్ అందవేమోనని స్టాండింగ్ కమిటీ సభ్యులు కలవరపడుతున్నారట. మరో 45 రోజుల్లో ప్రస్తుత గ్రేటర్ పాలకమండలి గడువు ముగియనుండటమే ఈ కలవరపాటుకు కారణం! (చదవండి: ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు..) తీవ్ర విమర్శలు స్టాండింగ్ కమిటిలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మరో 15 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు సభ్యులు. జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. ఇక ఈ బహుమతుల కార్యక్రమంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కారు పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందనడానికి తాజా బాగోతమే ఉదాహరణ అని బీజేపీ హైదరాబాద్ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న నగరపాలక సంస్థ ఇంత ఖర్చు చేసి ఐఫోన్లు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని నీళ్లలాగా ఖర్చు చేస్తున్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులు సిగ్గుపడాలని చురకలు వేశారు. ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని మీడియాతో శుక్రవారం పేర్కొన్నారు. కాగా, గ్రేటర్ నూతన పాలక మండలి ఫిబ్రవరిలో కొలువుతీరనుంది. (చదవండి: ఇక హైదరాబాద్లో ఫ్రీ వాటర్.. అయితే..) -
స్టాండింగ్ కమిటీలో సమప్రాతినిధ్యం
సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక్కో జెడ్పీటీసీని ఒక్కో స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం)లో సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ అర్బన్ మినహాయిస్తే మిగిలిన ఐదు నియోజకవర్గాల నుంచి అన్ని కమిటీల్లో ప్రాతినిధ్యం ఉండేలా కూర్పు జరిగింది. పక్షం రోజుల క్రితం నుంచే ఈ కమిటీలపై కసరత్తు కొనసాగుతోంది. జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అధ్యక్షతన గురువారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో కమిటీలను ప్రకటించారు. సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ డి రాజేశ్వర్రావు హాజరు కాగా, ఎమ్మెల్యేలంతా గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు చైర్మన్ చాంబర్లో జెడ్పీటీసీలందరూ కమిటీలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం జెడ్పీ సమావేశం ప్రారంభమైంది. సీఈఓ ఐ గోవింద్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. కమిటీలు ఇలా... ⇒ ఫైనాన్స్, ప్లానింగ్ కమిటీ చైర్మన్గా జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, సభ్యులుగా సీహెచ్.రవి (భీంగల్ జెడ్పీటీసీ), విజయభాస్కర్రెడ్డి (మోస్రా), బాజిరెడ్డి జగన్మోహన్ (ధర్పల్లి), పి.లక్ష్మిబాయి (బోధన్), వేముల ప్రశాంత్రెడ్డి ( ఆర్అండ్బీ శాఖ మంత్రి), ఆశన్నగారి జీవన్రెడ్డి (ఆర్మూర్ ఎమ్మెల్యే) ⇒ గ్రామీణాభివృద్ధి కమిటీ చైర్మన్గా జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, సభ్యులుగా బి హరిదాస్(వర్ని జెడ్పీటీసీ), బి సుమలత (నిజామాబాద్రూరల్), ఎంఎ మోయిజ్(కోఆప్షన్ సభ్యులు), ఎండీ సిరాజ్(కోఆప్షన్ సభ్యులు), బీబీ పాటిల్(జహీరాబాద్ ఎంపీ). ⇒ వ్యవసాయ కమిటీ చైర్మన్గా జెడ్పీ వైస్చైర్పర్సన్ మానకాల రజిత , సభ్యులుగా దాదన్నగారి విఠల్రావు, బి.రవి (మోర్తాడ్ జెడ్పీటీసీ), ఎన్ గంగారాం (రుద్రూరు జెడ్పీటీసీ), ఎం మాన్సింగ్ (సిరికొండ జెడ్పీటీసీ), డి శ్రీనివాస్(రాజ్యసభ సభ్యులు), బాజిరెడ్డి గోవర్ధన్(రూరల్ ఎమ్మెల్యే). ⇒ విద్య, వైద్యం కమిటీ చైర్మన్గా దాదన్నగారి విఠల్రావు, సభ్యులుగా ఎ భారతి(వేల్పూరు), గడ్డం సుమన రవిరెడ్డి (ఇందల్వాయి జెడ్పీటీసీ), ఎస్ శంకర్ (కోటగిరి), టి గంగాధర్ (మెండోర), వీజీ గౌడ్(ఎమ్మెల్సీ). ⇒ స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్మన్గా దాసరి లావణ్య, సభ్యులుగా దాదన్నగారి విఠల్రావు, వై యమున (నందిపేట జెడ్పీటీసీ), కమల బా నోత్ (మోపాల్), జి రాజేశ్వర్ (ఏర్గట్ల), ఆకుల లలిత (ఎమ్మెల్సీ), టి జీవన్రెడ్డి(ఎమ్మెల్సీ). ⇒ సోషల్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా దాసరి ఇందిర (డిచ్పల్లి జెడ్పీటీసీ), సభ్యులుగా దాదన్నగారి విఠల్రావు, బి నర్సవ్వ(ముప్కాల్), ఆర్ అంబర్సింగ్(చందూరు), ఎం విజయ(రెంజల్), ధర్మపురి అరవింద్(ఎంపీ). ⇒ పనులు కమిటీ చైర్మన్గా దాదన్నగారి విఠల్రావు, సభ్యులుగా పి రాధ(కమ్మర్పల్లి), పి తనూజ (జక్రాన్పల్లి), ఎన్ సవిత(నవీపేట), ఎం సంతోష్(ఆర్మూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి( స్పీకర్), ఎండీ షకీల్ అమీర్(బోధన్ ఎమ్మెల్యే), డి.రాజేశ్వర్(ఎమ్మెల్సీ) కమిటీలో ఉన్నారు. -
విదేశాల్లో 34 లక్షల కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: భారతీయులు తమ నల్లధనాన్ని భారీ మొత్తంలో విదేశాల్లో దాచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని స్పష్టమైంది. ఇదంతా కేవలం 1980–2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్ఎమ్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్ఐపీఎఫ్పీ) సంస్థలు వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించాయి. వీటన్నింటినీ కలిపి ‘దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు’పేరిట నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను సోమవారం లోక్సభ ముందుంచాయి. దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని పేర్కొన్నాయి. భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి. 1980–2010 సంవత్సరాల మధ్య విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం రూ.26.6 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఎన్సీఏఈఆర్ తన అధ్యయనంలో వెల్లడించింది. 1990–2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారని ఎన్ఐఎఫ్ఎమ్ తెలిపింది. కాగా, దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరింది. అయితే నల్లధనానికి సంబంధించి ఈ మూడు సంస్థల నివేదికలు ఒకేలా ఉంటాయని భావించలేమని ముఖ్య ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారని పార్లమెంటరీ ప్యానల్ తన నివేదికలో వెల్లడించింది. దీనిని ప్రాథమిక నివేదికగానే భావించాల్సి ఉందని.. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. -
స్టాండింగ్ కమిటీకి మెడికల్ బిల్లు
న్యూఢిల్లీ: దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్సభ కోరింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగడంతో పాటు, మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై లోక్సభలో మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ ప్రకటన చేస్తూ.. ప్రతిపక్షంతో పాటు అధికార ఎన్డీఏ కూడా బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరిందని అందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ముందే నివేదికను సమర్పించాలని కమిటీని కోరాలని స్పీకర్ మహాజన్ను మంత్రి కోరారు. తర్వాత స్పీకర్ లోక్సభలో ప్రకటన చేస్తూ.. బడ్జెట్ సమావేశాలకు ముందు లోక్సభకు నివేదిక సమర్పించాలని స్టాండింగ్ కమిటీని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐఎంఏ ఈ బిల్లును ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారులకు, వైద్య విద్యతో సంబంధంలేని యంత్రాంగానికి తమను జవాబుదారీగా ఉంచడమంటే వైద్య వృత్తిని నిర్వీర్యం చేయడమేనని వారు ఆరోపిస్తున్నారు. మంగళవారాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. అయితే లోక్సభలో బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపడంతో ఐఎంఏ సమ్మెను విరమించుకుంది. రాజ్యసభ ‘ప్రశ్నల’ రికార్డు ప్రశ్నోత్తరాల సమయంలో జాబితాలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా రాజ్యసభ మంగళవారం రికార్డు సృష్టించింది. ప్రశ్నలడిగిన 20 మంది సభ్యుల్లో మంగళవారం 10 మంది గైర్హాజరు కావడంతో ఇది సాధ్యమైంది. ఆ తర్వాత మిగతా సభ్యులు అప్పటికప్పుడు ప్రశ్నలడిగేందుకు సభాధ్యక్షుడు వెంకయ్య అనుమతించారు. జీరో అవర్లో గరిష్టంగా18 మంది పలు ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశాలపై మాట్లాడారు. ‘దివాలా’ బిల్లుకు ఓకే దివాలా చట్టం సవరణ బిల్లుపార్లమెంట్లో ఆమోదం పొందింది. ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(సవరణ) ఆర్డినెన్స్ పేరిట తెచ్చిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో గట్టెక్కింది.అవసరాలకు తగినట్లు బిల్లులో మార్పులు చేస్తామని జైట్లీ సభకు హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచి రాజకీయాలకు అతీతంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి రుణాలనూ రద్దుచేయలేదన్నారు. అన్ని వస్తువులకు ఒకే జీఎస్టీ రేటు వర్తింపజేయడం సాధ్యం కాదన్నారు. మొత్తం జనాభా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న దేశాల్లోనే ఏకరేటు పన్ను విధానం అమల్లో ఉందని, భారత్లో అది సాధ్యం కాదనిచెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించడానికి ఒక సంచి పరిమాణాన్ని 45 కిలోలకు తగ్గించినట్లు ఎరువుల శాఖ సహాయ మంత్రి లోక్సభలో చెప్పారు. -
అంతా మొక్కుబడి తంతు
♦ స్టాండింగ్ కమిటీ సమావేశాల తీరిది ♦ హాజరుకాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు కొరిటెపాడు(గుంటూరు) : జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు గురువారం మొక్కుబడి తంతుగా మారాయి. ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఓ ఎమ్మెల్యే మినహా మిగిలిన వారెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో కోరం కోసం పాట్లు పడ్డారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన గురువారం జరిగింది. జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు అధ్యక్షతన మూడో స్థాయి సంఘ సమావేశానికి చివరి నిమిషంలో రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. తెనాలి జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మీ మాట్లాడుతూ అమృత హస్తం అభాసుపాలవుతోందన్నారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య మాట్లాడుతూ మంగళగిరి ప్రాంత గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని, అంగన్వాడీ సెంటర్లలో ఐదారు మందికి మించి పిల్లలు లేరని చెప్పారు. పంటలకు నీళ్లివ్వరా ? దాచేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఎం.ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ కెనాల్స్ ఆధునికీకరణ పనులు సరిగా లేవని, నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరొస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పొలాలకు నీరిచ్చే పరిస్థితి లేకపోవటం బాధాకరమన్నారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లలో సమన్వయ లోపం ఉందని తెలిపారు. 2016–17 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యంలో 30 శాతం కూడా గృహ నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి పంచాయతీ భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. పల్నాడు ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతోపాటు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు రాయితీ రుణాలు ముందుకు కదలడం లేదన్నారు. సాగు, తాగునీరు, వైరల్ ఫీవర్లు, విద్యాశాఖలో నెలకొన్న నిర్లిప్తత, పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తూతూ మంత్రంగా చర్చ జరిగింది. ఒక వైపు జ్వరాలు... మరోవైపు నీటి ఎద్దడి... ప్రస్తుతం వైరల్ ఫీవర్లు జిల్లాను వణికించేస్తున్నాయి. సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయి అధికారులు మాత్రమే రావడం గమనార్హం. సమావేశంలో జెడ్పీ సీఈవో బి.నాగార్జునసాగర్, వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
‘స్టాండింగ్’ లేని సమావేశం
– హాజరు కాని జెడ్పీటీసీలు – కోరం లేక ప్రధాన శాఖల చర్చలు వాయిదా అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం దిశానిర్దేశం లేకుండా గురువారం ముగిసింది. సగానికి పైగా సభ్యులు హాజరు కాక పోవడంతో కోరం లేక రెండు ప్రధాన శాఖలకు సంబంధించిన చర్చను వాయిదా వేశారు. జెడ్పీ చైర్మన్ చమన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు అంశాలతో కూడిన అజెండాను సభ్యులకు సీఈఓ సూర్యనారాయణ అందజేశారు. తాగునీటి సమస్యనే ప్రధానంగా పలువురు సభ్యులు చర్చించారు. రూ. కోట్లు కుమ్మరిస్తున్నా.. ప్రజలకు అవసరమైన మేరకు తాగునీరు అందించలేకపోతున్నట్లు విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్య నానాటికీ జఠిలమవుతోందని మండిపడ్డారు. డ్వామా పీడీ నాగభూషణం మాట్లాడుతూ...జిల్లాను ఉపాధి హామీ పనులు కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
ఆస్థాయిలో జరగలేదు
► మొక్కుబడిగా స్టాండింగ్ కమిటీ సమావేశాలు ► కోరం లేకపోయినా కొనసాగింపు ► ముందుగా నివేదిక ఇవ్వని వైద్య,ఆరోగ్య శాఖ జిల్లా సమస్యల పరిష్కారానికి నిర్వహించే స్థాయీ సంఘాలను వివిధశాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. చిన్నచూపు చూస్తున్నారు. చట్టప్రకారం రెండు నెలలకోసారి జరిగే వీటిని నామమాత్రంగానే చేపడుతున్నారు. కొందరు సభ్యులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోతున్నారే కానీ.. సమస్యలు లేవనెత్తే పరిస్థితి కానరావడంలేదు. దీంతో.. ఆయా శాఖలు కూడా ఈ సమావేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి నివేదికలు సైతం పంపించడంలేదు. విశాఖసిటీః జెడ్పీ కార్యాలయంలో గురువారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశాలు సాదాసీదాగా సాగాయి. సమస్యలు ప్రస్తావించే కోరం సభ్యులు లేకపోయినా.. సమావేశాలు జరగడం గమనార్హం. 1,2,4,7 సంఘాల సమావేశాలు జడ్పీ ఛైర్పర్సన్ లాలం భవాని అధ్యక్షతన జరగ్గా.. 4,5, స్థాయీ సంఘాల సమావేశాలకు ఒక్కొక్కరే సభ్యులు హాజరయ్యారు. ఆయా ప్రభుత్వాధికారులు తమ శాఖల్లో పనితీరును వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ లాలంభవాని మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసి.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచెయ్యాలన్నారు. మాతాశిశు మరణాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యురాలు గాలి వరలక్ష్మి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ ‘అంగన్వాడీ పిలుస్తోంది’ కార్యక్రమంతో పాటు కేంద్రాల్లోని ఐదేళ్ల బాలలకు పూర్వ ప్రాథమిక విద్య అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైతే.. అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం వస్తుందన్నారు. ఈ సమావేశాల్లో జడ్పీ సీఈవో జయప్రకాశ్ నారాయణ్, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, జడ్పీ వైస్ ఛైర్మన్ కె.అప్పారావుతో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు, వివి«ధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నివేదికలివ్వని ముఖ్యశాఖలు.. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు పది రోజులు ముందుగానే జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తాము చేపట్టిన కార్యక్రమాలు సమగ్ర నివేదిక విధిగా అందించాలి. కానీ.. స్థాయీ సంఘాల సమావేశాలు జరుగుతున్న తీరుతో.. కొన్ని శాఖల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖతోపాటు 108 సర్వీసుల విభాగం, ఆరోగ్యశ్రీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులతో పాటు పలువురు నివేదికలు అందించలేదు. ఏ కారణంతో వీరు నివేదికలందించలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ్ ఆదేశించారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే.. శాఖాపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపిస్తామన్నారు. -
లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యపడుతుందా? ఈ అంశంపై దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఇలా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయాన్నిన్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం పరిశీలించిందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక జవాబిస్తూ ఈ విషయంలో పార్లమెంటరీ స్ధాయీ సంఘం తమ 79 నివేదికలో కొన్ని సిఫార్సులు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. నివేదికను సమర్పించే ముందు కేంద్ర ఎన్నికల సంఘంను పార్లమెంటరీ స్ధాయీ సంఘం సంప్రదించిందని, లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనకు కొన్ని సలహాలు, అభిప్రాయాలతో పార్లమెంటరీ స్ధాయీ సంఘం మద్దతు పలికిందని కేంద్ర మంత్రి పిపి చౌదరి తెలిపారు. దేశంలో లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రపతి అనుమతి ఇచ్చిన విషయం వాస్తవమేనా అన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు.. లేదని కేంద్ర మంత్రి జవాబిచ్చారు. పార్లమెంటరీ స్ధాయీ సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా దేశంలో జాతీయ, ప్రాదేశిక శాసనసభల ఎన్నికలు 5 ఏళ్ల కొకసారి ఏకకాలంలోజరుగుతాయని, అదేవిధంగా అ తర్వాత రెండేళ్లకు మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. స్విడన్లో జాతీయ, ప్రాదేశిక శాసనసభలు, స్ధానిక ఎన్నికలు ఎన్నికలు కూడా ఒక నిర్ణీత తేదీన జరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. మిగిలిన దేశాలలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అనుభవాల గురించి సమాచారం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. -
అనుమతిలేని ఫ్లెక్సీలపై గరం..గరం..
► బాధ్యులపై చర్య తీసుకోవాలని సభ్యుల డిమాండ్ ► ఆక్రమణలను ప్రోత్సహించవద్దని ఆదేశం ► స్టాండింగ్ కమిటీ ► సమావేశంలో నిర్ణయం కరీంనగర్ కార్పొరేషన్ : ఫ్లెక్సీలను నిషేధించి మూడు నెలలు గడుస్తున్నా నగరంలో విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయని, అధికారులు ఏం చేస్తున్నారని స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు నిలదీశారు. అధికారుల అలసత్వంపై మండిపడ్డారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రవీందర్సింగ్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించారు. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయొద్దని నిర్ణరుుంచామని, అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో మళ్లీ కనిపిస్తున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా ఎవరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తొలగించాలని సూచించారు. 57 అంశాల ఎజెండాలో 53 అంశాలకు ఆమోదం తెలిపారు. అంకెలు తప్పులుగా ముద్రించిన 4 అంశాలను పక్కనబెట్టారు. అదే విధంగా రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వెంటనే గుడారాలు తొలగించాలన్నారు. సభ్యులు ఏవీ రమణ, లంక రవీందర్, ఎడ్ల సరిత, కట్ల విద్య, కమిషనర్ ఎం.వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు. నాణ్యతలేని లైట్లు బిగించవద్దు : మేయర్ నాణ్యతలేని లైట్లు సరఫరా అవుతున్నాయని, థర్డ్పార్టీ క్వాలిటీ చేరుుంచాలని నగర మేయర్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో గురువారం తనిఖీలు చేపట్టారు. నాణ్యతలేని లైట్లు వారంలోపే పాడవుతున్నాయని కార్పొరేటర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఈ సమస్య తిరిగి ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నకిలీ మెటీరియల్ పంపించే ఏజెన్సీలను బ్లాక్లిస్టులో పెట్టాలని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని స్తంభాలకు లెడ్ బల్బులు బిగించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సెలబ్రిటీలు ప్రకటనల్లో తప్పుదోవ పట్టిస్తే జైలే
న్యూఢిల్లీ: సెలబ్రిటీలు నటించే వాణిజ్య ప్రకటనలకు సంబంధించి వారిని బాధ్యులను చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ఈ ప్రకటనల ద్వారా తప్పుదోవ పట్టించే సెలబ్రిటీలకు ఇకపై అవసరమైతే ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించాలని నివేదికలో పేర్కొంది. ఈ మేరకు వినియోగదారుల భద్రతా బిల్లు-2015పై ఏర్పడిన ఎంపీ జేసీ దివాకర్రెడ్డి నేతత్వంలోని పార్లమెంటరీ కమిటీ మంగళవారం పార్లమెంట్కు తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కళ్లెం వేయాలని అలాంటి కంపెనీలకు, అందులో నటించే సెలబ్రిటిలకు తీవ్రమైన జరిమానా, శిక్షలు, అవసరమైతే లెసైన్సులను సైతం రద్దు చేయాలని సూచించింది. -
జన్మభూమి కమిటీల పెత్తనమేంటి?
► చిన్నచూపు చూస్తున్న అధికారులు ► స్టాండింగ్ కమిటీ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుల ధ్వజం నెల్లూరు(అర్బన్) : చిన్న, చిన్న సమస్యల పరిష్కారానికి కూడా అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారు. పింఛన్ పొందాలన్న జన్మభూమి కమిటీల ఆమోదం తెలపాలి. కమిటీల పెత్తనం ఏంటంటూ అధికార పక్షాని చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక దర్గామిట్టలోని జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి మాట్లాడుతూ అజెండా ప్రకారం గృహనిర్మాణం, విద్య, వైద్యం, స్త్రీశిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం తదితర అంశాలపై చ ర్చించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. గృహనిర్మాణ శాఖ పీడీ రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ హౌసింగ్, అందరికీ ఇళ్లు పథకాలకు వచ్చిన అర్జీలు, తదితర అంశాలను వివరిస్తుండగా దుత్తలూరు జెడ్పీటీసీ చీదెళ్ల మల్లికార్జున అడ్డుకున్నారు. ఇళ్ల మంజూరుపై జెడ్పీటీసీ సభ్యులతో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. గతంలో నిర్మించిన ఇళ్లకు నేటికీ బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించారు. ఈఈల అవినీతి వల్లనే బిల్లులు అందడం లేదని, కొత్తగా మంజూరయ్యే వాటికైనా బిల్లులు వస్తాయా..రావా చెప్పాలని డిమాండ్ చేశారు. పీడీ మాట్లాడుతూ లోపాలపై సమీక్షించి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఐ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల సమాచారాన్ని జెడ్పీటీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాఠశాలల్లో స్వీపర్ల భర్తీ, మరుగుదొడ్ల నిర్మాణం తదితర విషయాలను జెడ్పీటీసీలకు చెప్పకపోవడానికి గల కారణాలను వెల్లడించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను డిమాండ్ చేశారు. తమకు తెలియకుండా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈయనకు మద్దతుగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడారు. ఈ దశలో చైర్మన్ బొమ్మిరెడ్డి కలుగజేసుకుని ఇక మీదట ఏ పనులు జరిగినా జెడ్పీటీసీల ఆధ్వర్యంలో జరిగేలా తీర్మానం చేయించారు. డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి మాట్లాడుతూ పింఛన్ల కోసం కొత్తగా 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. దీంతో పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికే పింఛన్ అందుతుందని విమర్శించారు. ప్రజాప్రతినిధులను కాదని అర్హతలేని జన్మభూమి కమిటీల సభ్యులకు పెత్తనం ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలతో అర్హత ఉన్న పలువురికి పింఛన్ అందడం లేదని ధ్వజమెత్తారు. వైద్యశాలల్లో తగిన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లు, వ్యవసాయం, సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువులు , సంక్షేమం, తదితర అంశాలను చర్చించారు. జెడ్పీ వైస్చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష, డ్వామా పీడీ హరిత, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఎంహెచ్ఓవరసుందరం, సర్వశిక్ష అభియాన్ పీఓ కనకనర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మేయరా.. మోనార్కా!?
మేయర్ తీరుపై కార్పొరేటర్ల గుర్రు సమోసాలు తినేందుకేనా స్టాండింగ్ కమిటీ చిన్నబుచ్చడమేనా ‘పెద్దరికం’ విజయవాడ : ఏమ్మా.. స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దు. సమోసాలు తిని వెళ్లేందుకే ఈ మీటింగ్.. చాయ్ తాగి, సమోసాలు తినేందుకే అయితే స్టాండింగ్ కమిటీ సమావేశాలెందుకు అన్నది స్టాండింగ్ కమిటీ సభ్యుల ప్రశ్న. జీతాలు చాలకపోతే వెళ్లిపోండి. రెండేవేలకు పని చేసేందుకు ఏఎన్ఎంలు వస్తారని అన్నా. అంటే మీరు పేపరోళ్లకు చెబుతారా. ఆందోళన చేస్తే జీతాలు రావు. అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందిపై కస్సుబుస్సు.. మాట్లాడింది చాల్లే అమ్మా.. కూర్చో, కూర్చుంటారా సభ నుంచి బయటకు పంపేయమంటారా? కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చే వార్నింగ్. ఏం కమిషనర్ మాటే వింటారా? నా దగ్గరకు వచ్చే పన్లేందా. మీరు సమావేశంలో ఉండొచ్చు. ఇంకెక్కడైనా ఉండొచ్చు. పిలిస్తే రావాలికదా. ఓ ముఖ్య అధికారిపై కన్నెర్ర వివిధ సందర్భాల్లో మేయర్ వ్యవహారశైలి ఇది... నగరపాలక సంస్థలో మేయర్ కోనేరు శ్రీధర్ ఏకపాత్రాభినయంపై నిరసన వెల్లువెత్తుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన తమను డమ్మీల్ని చేస్తూ అంతా నా ఇష్టం అన్న చందంగా మేయర్ వ్యవహారశైలి మారిందని టీడీపీ కార్పొరేటర్లే ధ్వజమెత్తుతున్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరుపై సభ్యులు గుర్రుగా ఉన్నారు. సమావేశానికి ముందు ఓ సభ్యురాలు చాంబర్కు వెళ్లగా స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దని, సమోసాలు తిని వెళ్లేం దుకు తప్ప ఎందుకు ఉపయోగం ఉండదని మేయర్ అనడంపై ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని తోటి సభ్యులకు చెప్పి వాపోయారు. నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్ను కోడ్ట్రీ టెక్నాలజీస్కు రూ.27.36 లక్షలు కట్టబెట్టే విషయంలో చర్చకు సభ్యులు పట్టుబట్టగా మేయర్ ఏకపక్షంగా టెండర్ను ఆమోదిస్తూ తీర్మానం చేయడంలో ఆంతర్యమేమిటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కోటరీకే ప్రాధాన్యం మేయర్ కీలక నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో కోటరీకే ప్రాధాన్యత ఇస్తూ తమను పక్కకు నెట్టేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. మూడు నెలలకు ఒకసారి జరిగే కౌన్సిల్ సమావేశాల్లో సైతం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే ఆవేదనను జూనియర్ కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ‘లబ్ధి’ చేకూర్చేలా మేయర్ నిర్ణయాలు ఉంటున్నాయన్నది టీడీపీ కార్పొరేటర్ల వాదన. చిన్నబుచ్చుతున్నారు కౌన్సిల్ సమావేశాల అజెండాలో ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్క రోజులో అయిపోవాలనే విధంగా మేయర్ తీరు ఉంటుందని, దీనివల్ల ప్రధాన అంశాలపై సమగ్ర చర్చ జరగడం లేదన్నది పలువురి సభ్యుల అభిప్రాయం. తమ ప్రశ్నలకు అధికారులతో సమాధానం చెప్పించాల్సి ఉండగా మేయరే జోక్యం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉందని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ప్రశ్నోత్తరాల నుంచి తీర్మానాల వరకు అంతా గందరగోళంగా సాగుతోందన్నది సభ్యుల ఆరోపణ. అజెండా లో చేర్చాల్సిన ప్రతిపాదనల్లోనూ కోతలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. నగరపాలక సంస్థకు ‘పెద్ద’లా వ్యవహరించాల్సిన మేయర్ తమను ‘చిన్న’బుచ్చడంపై అధికారపార్టీ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు. హైకమాండ్కు ఫిర్యాదు చేస్తాం - స్టాండింగ్ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహారశైలిపై హైకమాండ్కు ఫిర్యాదు చేయనున్నట్లు స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ, నాగోతు నాగమణి స్పష్టం చేశారు. ప్రజాఫిర్యాదుల కమిటీ హాల్లో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో తమను ఉత్సవ విగ్రహాలను చేస్తున్నారన్నారు. అధికారులను తాము ప్రశ్నిస్తే మేయర్ ఎందుకు సమాధానమిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్పై సమగ్ర చర్చ జరగాల్సి ఉండగా ఆమోదించాననే ఒక్క మాటతో మేయర్ తేల్చేశారన్నారు. గంటలో సమావేశం పూర్తి చేయాలనే హైరానా తప్ప స్టాండింగ్ కమిటీలో సమగ్ర చర్చ జరగడం లేదని తెలిపారు. కబేళాలో కోటి రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన మిషన్ను వాడకుండా పక్కన పడేశారని కాకు పేర్కొన్నారు. ఆప్స్ కాంట్రాక్ట్ను ఐదుగురు సభ్యులు ఆమోదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మేయర్పై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని, కార్పొరేటర్లకు కనీస గౌరవం ఇవ్వాలన్నదే తమ వాదన అన్నారు. మేయర్ నియంతలా వ్యవహరిస్తున్నారు -వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ పుణ్యశీల విజయవాడ సెంట్రల్ : మేయర్ కోనేరు శ్రీధర్ నియంతలా వ్యవహరిస్తున్నారని నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల దుయ్యబట్టారు. శుక్రవారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. కౌన్సిల్లో ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న మేయర్ స్టాండింగ్ కమిటీలో సొంతపార్టీ వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. గుట్టుగా పాలన సాగిద్దామనుకుంటే కుదరదని, ప్రతి సభ్యుడికి స్వతంత్రంగా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం ఉందన్న విషయాన్ని మేయర్ గుర్తిస్తే మంచిదని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగం దేశానికి బైలా లాంటిదంటూ ప్రసంగం చేసిన మేయర్ ప్రజాప్రతినిధులకు మాట్లాడే స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా యాప్స్ కాంట్రాక్ట్ను ఎం దుకు ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీని, కౌన్సిల్ను అడ్డుపెట్టుకొని మేయర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. కనకదుర్గ సొసైటీ లే అవుట్ అప్రూల్ విషయంలో మేయర్ తొందరపాటు నిర్ణయం వెనుక కాసుల కక్కూర్తి ఉందన్నారు. సొంతపార్టీ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న శ్రీధర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ దాసరి మల్లీశ్వరి పాల్గొన్నారు. -
ప్రతిపాదనలకే అభివృద్ధి పరిమితం
నెల్లూరు, సిటీ : టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి ఏ విధమైన చేయూతనివ్వలేదనే విమర్శలొస్తున్నాయి. అభివృద్ధి కేవలం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయనే ఆరోపణలొస్తున్నాయి. హడ్కో నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు దాని ఊసే లేకుండాపోయింది. కౌన్సిల్ ఏర్పడిన ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సమావేశాలు నిర్వహించారు. అందులో ఒకటి బడ్జెట్ సమావేశం. స్టాండింగ్ కమిటీ ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సమావేశం నిర్వహించి సరిపెట్టుకున్నారు. ఈ విషయాన్ని గమనిస్తే చాలు కార్పొరేషన్లో అభివృద్ధి ఏమాత్రం ఉందనేది తెలుస్తుంది. నేటికి కౌన్సిల్ సమావేశం నిర్వహించి 181 రోజులు.. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలు తీసుకోవాలటే కౌన్సిల్లో చర్చించాలి. అటువంటిది ఏమీ లేకుండా మేయర్, అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. నగరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ విషయాన్ని కౌన్సిల్లో చర్చించకుండానే జరిగిపోయింది. మంత్రి నారాయణ ఆదేశాలతో మేయర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మూడు నెలలకు ఒక సారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నాయకులు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కోరినా ఫలితం లేదు. స్టాండింగ్ కమిటీ ఉన్నట్లేనా..? ఐదుగురు సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఉంటుంది. కార్పొరేటర్లతో వారానికి ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్టాండింగ్ కమిటీలో చర్చించిన తర్వాతే అమలు చేయాలి. అదేమీ లేకుండా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎవరికి వారుగా ఉన్నారు. ఐదు నెలల కాలంలో ఒక్క సమావేశం మాత్రమే నిర్వహించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఉన్నా లేనట్టేనని కార్పొరేషన్లో చర్చించుకుంటున్నారు. -
కార్మికులు ఔట్..!
సాగనంపేందుకు కుట్ర కౌన్సిల్కు సిద్ధమైన టెండర్ ప్రతిపాదనలు మూడువేల మంది భవిష్యత్ ప్రశ్నార్థకం కార్పొరేషన్ పాలకుల అనాలోచిత నిర్ణయం విజయవాడ సెంట్రల్ : కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా మారాయి నగరపాలక సంస్థ పాలకుల నిర్ణయాలు. ఓవైపు పొదుపు మంత్రం జపిస్తూనే, మరోవైపు దుబారాకు తెగబడుతున్నారు. ఏళ్ల తరబడి అరకొర జీతాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను సాగనంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు టెండర్లు అనే పాచిక విసురుతున్నారు. ఇందులో భాగంగానే గూర్ఖాలు, పార్కు కార్మికులకు సంబంధించి టెండర్లు పిలవాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. తాజాగా డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం పారిశుధ్య విభాగంలో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికులకు రూ.8,300 చెల్లించాలి. కనీసం పదిశాతం లాభానికి టెండర్ దాఖలు చేస్తే ఆ పదిశాతం కార్పొరేషన్కు అదనపు భారంగా పరిణమిస్తుంది. నిత్యం కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడే పాలకులు ఎవరి ప్రయోజనం కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కార్మికుల్లో ఆందోళన నగరపాలక సంస్థలో 2004 నుంచి డ్వాక్వా, సీఎంఈవై గ్రూపుల కార్మికులు పారిశుధ్య విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 443 గ్రూపుల నుంచి 3,274 మంది విధుల్లో చేరారు. ప్రస్తుతం 2,984 మంది 59 డివిజన్లలో పనిచేస్తున్నారు. రూ.1,600తో ప్రారంభమైన వీరి జీతం ప్రస్తుతం రూ.8,300కు చేరింది. గడిచిన పదకొండేళ్లుగా ఏటా వీరి కాంట్రాక్ట్ను కొనసాగిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా టెండర్లు పిలవాలని పాలకులు, అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేస్తున్నారు. టెండర్ల విధానం అమలైతే భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదనలు సిద్ధం ప్రజారోగ్య విభాగంలో ఔట్సోర్సింగ్ కార్మికుల నియామకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సిందిగా 2011 జూలైలో కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ప్రేమ్చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాటి కమిషనర్ రవిబాబు టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. దీంతో కార్మికులు ఆందోళనబాట పట్టారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు కార్మికులకు అన్యాయం జరుగుతోందంటూ లోకాయుక్తలో కేసు ఫైల్ చేశారు. దీంతో వివాదం ముదిరింది. అనూహ్య పరిణామంతో కంగుతిన్న అధికారులు తూచ్.. అన్నారు. టెండర్లు పిలవడం లేదంటూ లోకాయుక్తకు సమాచారం ఇచ్చారు. మూడున్నరేళ్ల స్పెషల్ అధికారుల పాలనలో కాంట్రాక్ట్ కాలపరిమితి పెంచుతూ వస్తున్నారు. కార్మికులకు ఏడాదికి సుమారు రూ.29 కోట్లు జీతాలుగా చెల్లించాలి. దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసు కెళ్లారు. 2016 మార్చి వరకు కార్మికుల కొనసాగింపు సాధ్యం కాదని, టెండర్లు పిలవాల్సిందిగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యశాఖాధికారులు ఈనెల ఏడో తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కౌన్సిల్పైనే ఆధారం కౌన్సిల్ తీసుకునే నిర్ణయంపైనే కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గూర్ఖాలు, పార్కు వర్కర్లకు సంబంధించి టెండర్లవైపు మొగ్గుచూపిన టీడీపీ పాలకులు ప్రజారోగ్య విభాగంలోనూ ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్లో 38 మంది సభ్యులతో పూర్తి మెజారిటీ ఉన్న టీడీపీ గడిచిన మూడు సమావేశాల్లో పలు అంశాలపై ఏకపక్ష ధోరణిలోనే నిర్ణయాలు తీసుకుంది. -
టీడీపీలో అంతర్గత పోరు
నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్ళ మధ్య అంతర్గత పోరుకు తెరలేపుతోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలం 31 ఉండగా, వైఎస్సార్సీపీ బలం 19 ఉంది. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ తరఫున 17 మంది ఎన్నిక కాగా, ఒక ఇండిపెండెంట్తో కలిపి 18 స్థానాలు ఉన్నాయి వైఎస్సార్సీపీ నుంచి 32 మంది ఎన్నికయ్యారు. అయితే మేయర్తో సహా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ వెంట వెళ్లిన సభ్యులకు ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపించడం లేదు. టీడీపీ తరఫున ఎన్నికయిన సీనియర్లకు స్టాండింగ్ కమిటీల్లో చాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మేయర్ వెంట వెళ్లిన 10 మంది మహిళల్లో ఒక్కరికి కూడా స్టాండింగ్ కమిటీలో ఎంపికయ్యే అవకాశాలు లేవు. ఇది మహిళా సభ్యుల్లో అసంతృప్తికి దారితీస్తుంది. దీని ఫలితం ఎన్నిక రోజున (9వ తేదీన) బహిర్గతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ సీనియర్ కార్పొరేటర్లలో నలుగురికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. వారిలో జెడ్ శివప్రసాద్, నూనె మల్లికార్జున్యాదవ్, కిన్నెర ప్రసాద్, దాసరి రాజేష్కు దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో అంచూరి జానకి, కొత్తూరు శైలజ, బొల్లినేని శ్రీవిద్యలో ఒక్కరికి స్థానం దక్కనున్నట్లు సమాచారం. మేయర్ వర్గం నుంచి బాలకోటేశ్వరరావుకు మాత్రమే స్థానం దక్కనున్నట్లు సమాచారం. రహస్య ఓటింగ్ కావడంతో బలాబలాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. మేయర్ వర్గమైన మహిళా ఓట్లు చీలినట్లయితే వైస్సార్సీపీకి బలం చేకూరుతుంది. రెండు పార్టీల నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిలబడే సభ్యుల పేర్లను నేడు ఖరారు చేయనున్నారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. -
పింఛన్లలో కోతపై జెడ్పీటీసీల ఆగ్రహం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ సూచన వాడీవేడీగా స్టాండింగ్ కమిటీల సమావేశాలు హన్మకొండ : ఆసరా పింఛన్ల నుంచి ఇంటి పన్నుల వసూలు చేయడంపై ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంటే వచ్చిన దానిలో నుంచి పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు పేరిట కత్తిరించడం ఎంత వరకు సమంజసమని డీపీఓను నిలదీశారు. దీంతో సంబంధిత అధికారి మాట్లాడుతూ ఆసరా పింఛన్ల నుంచి ఇంటి పన్నులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన 1, 2,4, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. 3వ స్థాయి సంఘం సమావేశం ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, 5వ స్థాయి సంఘం సమావేశం వీరమ్మ, 6వ స్థాయి సంఘం సమావేశం మాదాసు శైలజ అధ్యక్షతన జరిగాయి. క్వారీ నిర్వాహకులు భారీ ఎత్తున గ్రానైట్ రాళ్లు తరలిస్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయని జెడ్పీటీసీ సభ్యులు వాపోయూరు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ తాను నెల్లికుదురు మండలం చిన్ననాగారం శివారు తండాను సందర్శించినపుడు గ్రానైట్ క్వారీతో ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశానన్నారు. క్వారీ యజమానిని పిలిచి తన వంతుగా భారీ వాహనాల రాకపోకలకు అనుగుణంగా రోడ్డు నిర్మించాలని సూచించానన్నారు. మైనింగ్ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, క్వారీలున్న గ్రామాలను మైనింగ్ చేస్తున్న ఏజెన్సీలు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఉపప్రణాళిక నిధుల నుంచి ఎస్సీ, ఎస్టీల బిల్లులు చెల్లించాల్సిన నిధులను ఇతర పనులకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తరలించాయని. దీంతో బకాయిలు పేరుకుపోయాయన్నారు. తాగునీటికి ఇబ్బం ది ఎదురుకాకుండా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు సోలార్ మోటార్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు భరిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ లోక్సభ నియోజవ ర్గానికి 179 సోలార్ పంప్సెట్లు మంజూరైనట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రా లు మంజూరైన చోట భవనాలు నిర్మించడం లేదని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పంచాయతీ అధికారులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కేటాయించిన రూ.4.50 లక్షల నిధులతో భవనాలు పూర్తి కావన్నారు. ఏటూరునాగారం డిగ్రీ కాలేజీలోని విద్యార్థులకు మూడేళ్లుగా స్కాలర్షిప్లు రాకుండా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పీటీసీ సభ్యు లు అధికారులను నిలదీశారు. స్కాలర్షిప్లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులకు లెస్కు టెండర్ వేయడం ద్వారా పనుల నాణ్యతపై సందేహాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. పనుల వివరాలు తమకు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నిం చారు. నివేదికలు జెడ్పీటీసీ సభ్యులకు అందించాలని సూచిం చారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్కుమార్రెడ్డి, జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, టీడీపీ ఫ్లోర్లీడర్ శివశంకర్, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
రైతులతో ఎంపీల ముఖాముఖి
దేవరకొండ : రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ బుధవారం సాయంత్రం డిండికి వచ్చింది. రైతులతో ముఖాముఖి మాట్లాడింది. పలువురు రైతులు చెప్పిన విషయాలను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా విన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామని వారికి హామీ ఇచ్చారు. డిండి ఎత్తిపోతల చేపడితేనే ఈ ప్రాంతానికి మేలు : రాఘవాచారి ఈ ప్రాంతంలో కరువు పోవాలంటే కేవలం డిండి ఎత్తిపోతలను చేపట్టాల్సిందే. డిండి ఎత్తిపోతల చేపడితే జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించాలి. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది : లక్పతి ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య బాగా ఉండటం వల్ల రాత్రి వేళల్లో కూడా కరెంటు కోసం తాపత్రయ పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ వేల మంది రైతులు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటనలున్నాయి. విద్యుత్ సమస్యను తీర్చడానికి ఎన్ఆర్ఈజీఎస్ను అనుసంధానం చేయాలి. గిట్టుబాటు ధర లేదు : గుర్రం రాములు బజారులో ఏ వస్తువు కొన్నా ప్రస్తుతం ఒక నిర్ణీత ధర ఉంది. కానీ శ్రమించి పంట పండించిన రైతు పంటకు మాత్రం కనీస ధర లేదు. ఈ ధర లేకపోవడం వల్లే రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. పార్లమెంటులో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలి : రాఘవేందర్రావు పండించిన పంటకు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్తో వేల మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి కేవలం ప్రత్యామ్నాయం నక్కలగండి ఎత్తిపోతల మా త్రమే. రైతులు పండిం చిన పంటను అమ్ముకోవడానికి దళారుల బెడద లేకుండా గిట్టుబాటు ధర కల్పిం చాలి. అనువాదంతో ఆకట్టుకున్న ఆర్డీఓ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం డిండి మండలంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో ఉన్న 15 మంది ఎంపీలలో బీహార్, అస్సాం, తమిళనాడు, ఛత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలున్నారు. కేవలం తెలుగు భాష తెలిసిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డే కావడంతో రైతులు తమ సమస్యను తెలుగులో చెప్పుకోవడంతో ఎంపీలకు వారి బాష అర్థం కాలేదు. దీంతో దేవరకొండ ఆర్డీఓ రవినాయక్ రైతుల సమస్యలను ఇంగ్లీష్లోకి అనువదించి ఒక్కొక్కరి సమస్యను క్లుప్తంగా వివరించి అక్కడి వారిని మెప్పించారు. -
యాజమాన్యాలు చట్టాల్ని ఉల్లంఘిస్తే చర్యలేవి?
లోక్సభలో కార్మిక చట్టం సవరణ బిల్లుపై ఎంపీ వరప్రసాద్రావు ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: కార్మిక చట్టంలో సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న సవరణల్లో ఉల్లంఘనలకు తగిన చర్యలేవీ లేవని వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్రావు పేర్కొన్నారు. శుక్రవారం లోక్సభలో కార్మిక చట్టం(రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘‘ఈ బిల్లుపై రాజకీయ కోణంలో మాట్లాడదలుచుకోలేదు. నేను గతంలో తమిళనాడు రాష్ట్రంలో లేబర్ కమిషనర్గా పనిచేశాను. అందువల్ల కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నా. నేను ఈ బిల్లుకు వ్యతిరేకంగానూ లేను. మద్దతుగానూ లేను. కార్మిక చ ట్టాలకు సంబంధించి శాసన ప్రక్రియను సరీళకరించడానికి ప్రోత్సాహాన్నిచ్చే రీతిలో ఇది కనిపిస్తోంది. కానీ మీరు లోతుగా చూస్తే సంక్లిష్టత కనిపిస్తుంది. రిజిస్టర్లు, రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో పంపించవచ్చన్న ప్రక్రియ ఒక్కటే సరళతరంగా కనిపిస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘2005లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు స్టాండింగ్ కమిటీ దాదాపు 10 సార్లు సమావేశమైంది. తిరిగి 2011లో వచ్చినప్పుడు.. కొన్ని సవరణ ప్రతిపాదనలను తొలగించాలని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కానీ ఈ బిల్లులో ఒక్క లైను కూడా మారలేదు. సంస్థలు రిటర్నులు, రిజిస్టర్లను నిర్వహిస్తే తప్ప కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, వంటి కార్మిక సంక్షేమ చర్యలు అమలు కావు.. అందువల్ల సంఖ్య విషయంలో, జరిమానాల విషయంలో మార్పులు చేయాలి..’ అని వరప్రసాద్ డిమాండ్ చేశారు. తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు? -
గ్రేటర్ వార్
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, కమిషనర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గురువారం సాయంత్రం మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎల్ఈడీల ఏర్పాటుపై కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్లో ఉంచింది. కమిటీ అనుమతివ్వకపోయినా డిసెంబర్ 4వ తేదీ నుంచి అమలులోకి తెస్తామని కమిషనర్ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది. మేయర్ మహ్మద్ మాజిద్హుస్సేన్, కమిషనర్ సోమేశ్కుమార్ల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొంది. ఒకటీ అరా సందర్భాల్లో వీరి మధ్య విభేదాలు బట్టబయలైనప్పటికీ, అంతలోనే సర్దుబాటయ్యాయి. రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధిస్తామనే ప్రకటనతో తమకు సంబంధం లేదని మేయర్ చెప్పడంతో పాటు మరికొన్ని అంశాల్లోనూ అభిప్రాయ భేదాలు బయట పడ్డాయి. తాజాగా.. రూ. 4వేల లోపు నివాస గృహాలకు ఆస్తిపన్ను రద్దుకు మేయర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం సమావేశమైన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. మరోవైపు నగరమంతా ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పా టుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్లో ఉంచడంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు బయటపడ్డాయి. నగరాన్ని వరల్డ్క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంతో పాటు విద్యుత్ పొదుపునకు ఉపకరిస్తుందనే భావనతో ఎల్ఈడీల ఏర్పాటుకు కమిషనర్ సిద్ధమయ్యారు. ఈ కాంట్రాక్టున ఈఈఎస్ఎల్కు అప్పగించేందుకు స్టాండింగ్ కమిటీ ముందుంచారు. దీనికి కమిటీ అంగీకరించలేదు. దీని ద్వారా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే తలంపుతో కొందరు ముఖ్యనేతలు మేయర్ ద్వారా ఆటంకాలు సృష్టించినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీలో చర్చ సందర్భంగా కమిషనర్ ఈ అంశంపై గట్టిగా పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘మీరు ఇప్పుడు అంగీకరించకపోయినా.. డిసెంబర్4 తర్వాత అమల్లోకి తెస్తా’మని కమిషనర్ అన్నట్లు సమాచారం. డిసెంబర్ 3తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిపోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లు పెంచేందుకు కమిషనర్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో.. మేయర్ రూ. 4వేల లోపు ఆస్తిపన్ను రద్దు చేస్తూ ప్రకటన చేయడం విభేదాలపై ప్రచారాలకు ఊతమిస్తోంది. -
రెండేళ్ల లీజు కట్టాల్సిందే
వీబీఎం కళాశాలకు షాక్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ తీర్మానం విజయవాడ సెంట్రల్ : వీబీఎం కళాశాల రెండేళ్ల లీజు కట్టాల్సిందేనని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం కమిటీ సమావేశమైంది. గత సమావేశంలో వాయిదాపడ్డ వీబీఎం కళాశాల లీజు వ్యవహారంపై వాడీవేడిగా చర్చ సాగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్లోని 20,148 చ.అ స్థలాన్ని కళాశాల నిర్వహణ కోసం 2009 జూలై 1న కార్పొరేషన్ నుంచి కళాశాల యాజమాన్యం లీజుకు తీసుకుంది. నెలకు రూ.1,30,280 అద్దె ఇచ్చే ఒప్పందంపై లీజు ఖరారైంది. కళాశాల నిర్వహణకు అనువైన వసతులు లేవని పలుమార్లు లేఖలు రాసినప్పటికీ అధికారులు స్పందించలేదన్నది కళాశాల యాజమాన్యం వాదన. ఈ క్రమంలో నవంబర్ 2011 వరకు కళాశాలను నిర్వహించలేదని, రూ.18 లక్షల సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించుకున్నామన్నారు. 2011 తర్వాత వినియోగంలోకి వచ్చింది కాబట్టి అప్పటినుంచే లీజు మొదలైనట్లు పరిగణించాల్సిందిగా యాజమాన్యం కోరింది. స్టాండింగ్ కమిటీ నో చెప్పింది. రెండేళ్ల అద్దె కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. 2014 నుంచి 2017 వరకు ప్రస్తుత అద్దెపై ముప్పై మూడున్నర శాతం పెంచుతూ తీర్మానం చేసింది. మరిన్ని తీర్మానాలు రాజగోపాలాచారి మర్కెట్లో ఐదో నెంబర్ షాపు లీజు వ్యవహారంపై ఇంజినీర్ల బృందం పరిశీలించిన తర్వాత నిర్ణయం వెల్లడించాలని మేయర్ పేర్కొన్నారు. హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) కార్యాలయం ఏర్పాటుకు బందరు రోడ్డులో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల స్థలాన్ని అడ్వాన్స్ లేకుండా లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో పెరిగిన అద్దెల దృష్ట్యా అడుగుకు రూ.35 అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు. సీవీఆర్ కాంప్లెక్స్ సమీపంలోని డ్వాక్వా షాపు లీజును ఖరారు చేశారు. షాపు ముందు ఏర్పాటు చేసిన బడ్డీకొట్టు నుంచి అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల మెడికల్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించిన అంశాలకు ఆమోదముద్ర వేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు జి.కనకదుర్గ, ఎస్.సరిత, ఎన్.బాలస్వామి, జి.నరసింహారావు, ఎ.రవికుమార్, అదనపు కమిషనర్ ఆర్.ఎం.జె.నాయక్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపీనాయక్, ఎస్ఈ టి.మోజెస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. లీజులో అవకతవకలు జరిగాయి : పుణ్యశీల వీబీఎం కళాశాల లీజు వ్యవహారంలో స్టాండింగ్ కమిటీ అవకతవకలకు పాల్పడిందని వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ప్రతిపక్ష నేత బండి నాగేంద్ర పుణ్యశీల ఆరోపించారు. కళాశాల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే రెండేళ్లపాటు అద్దె కట్టలేదన్నారు. మరమ్మతుల పేరుతో అడ్డగోలుగా ఖర్చు చేశారన్నారు. రూ.18 లక్షల ఖర్చులో సుమారు రూ.15 లక్షలకు కళాశాలకు మినహాయింపు ఇవ్వడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. -
నిఘా నేత్రం
నగరంలో 50 వేల సీసీ కెమెరాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నేరాలు నిరోధించే దిశగా జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేస్తోంది. గ్రేటర్లోని వివిధ మార్గాల్లో రాబోయే వంద రోజుల్లో 50 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ను జీహెచ్సీ స్టాండింగ్ కమిటీ ఆమోదానికి పంపించనున్నారు. అనంతరం రెండు వారాల్లోగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనికి సుమారు రూ.400- 450 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. తొలిదశలో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రధాన రహదారులు, మెట్రో రైలు మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్కుమార్, కమిషనర్ సోమేశ్కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డిలు గురువారం సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ మొత్తం వంద రోజుల్లో పూర్తి కాగలదని చెప్పారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో తొలుత వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులకు సూచించారు. తద్వారా నేరాలు తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రజాభద్రత బాధ్యత మొత్తం పోలీసులదే కాదని, అన్ని విభాగాల సహాయ సహకారాలు అవసరమని గుర్తు చేశారు. ప్రజాభద్రత చట్టం వల్ల నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అందుకు కార్పొరేటర్ల పూర్తి సహకారం ఉంటుందని అధికారులకు చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్సిటీగా మారే తరుణంలో ప్రజలకు భద్రత కల్పించడం అత్యావశ్యకమన్నారు. సీసీకెమెరాల ప్రాజెక్టుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ మాజిద్హుస్సేన్ ప్రకటించారు. భారీ స్థాయిలో వీటిని ఏర్పాటు చేయనుండటం దేశంలో ప్రప్రథమమన్నారు. తొలుత వంద పోలీస్ స్టేషన్ల పరిధిలో, అనంతరం జోన్ల వారీగా వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ షాపులు, దుకాణదారులు తమ సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రజాభద్రత చట్టంలో పొందుపరిచేం దుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే భవనాలు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా గట్టిగా చెబుతున్నామన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి మాట్లాడుతూ, సీసీ కెమెరాలతో తమకు భద్రత ఉందని ఓ వైపు ప్రజలకు విశ్వాసం కల్పించడంతో పాటు మరోవైపు నేరాల తీరును తెలుసుకునేందుకు, నిరోధించేం దుకు పోలీసులకు అవకాశం ఉంటుందన్నారు. కెమెరాల ఆధారంగా త్వరితంగా విచారణ జరిపేందుకు వీలవుతుంద ని చెప్పారు. ఇవి మూడో నేత్రాల్లాంటివని, తద్వారా సంఘ విద్రోహులు, దొంగలు నేరాలు చేసేందుకు భయపడతారన్నారు. సీసీ కెమెరాలను జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్కో, జెన్కోలతోనూ అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. -
24న స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నిక
సత్యనారాయణ మృతితో ఏర్పడిన ఖాళీ షెడ్యూల్ విడుదల చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ 15వరకు నామినేషన్ల స్వీకరణ 20న ఉపసంహరణ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జె.సత్యనారాయణ (రాజేంద్రనగర్ కార్పొరేటర్) ఆకస్మిక మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక షెడ్యూల్ జారీ అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 24న ఎన్నిక నిర్వహిస్తారు. శనివారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 15వరకు (పనిదినాల్లో) నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసినవారి జాబితాను 16న వెలువరిస్తారు. 17న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఆ తరువాత పోటీకి అర్హులైన వారి పేర్లను వెలువరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆసక్తికరం కానున్న ఎన్నిక.. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉండగా, పదిమంది కార్పొరేటర్లకు ఓ సభ్యుడి వంతున మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్-ఎంఐఎం పరస్పర పొత్తుతో గత జూన్లో జరిగిన ఎన్నికల్లో నెగ్గిన వారిలో ఒకరైన రాజేంద్రనగర్ కార్పొరేటర్ సత్యనారాయణ(కాంగ్రెస్) ఇటీవల మరణించారు. ఖాళీ ఏర్పడిన ఈ స్థానానికి తాజాగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాల ఖాళీతో 147 మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అర్హులవుతారు. కాగా, ఇటీవలి కాలంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మరోవైపు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఖాళీ అయిన స్థానం కాంగ్రెస్ కోటాలోది. టీడీపీ-బీజేపీ పొత్తు.. టీడీపీ నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ దిడ్డిరాంబాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కంటే బీజేపీ కార్పొరేటర్ల బలం పెరగడం.. కాంగ్రెస్ నుంచి కొందరు ఇతర పార్టీలకు వెళ్లగా మరికొందరు కాంగ్రెస్లో చేరారు. ఇటీవలి కాలంలో ఎంఐఎం టీఆర్ఎస్తో దోస్తీ కట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నిక సైతం ఆసక్తికరంగా మారింది. -
స్టాండింగ్ కమిటీలు ఇవే..
మచిలీపట్నం : జిల్లా పరిషత్లో ఏడు స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నియమించినట్లు జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ ప్రకటించారు. ఆయా స్టాండింగ్ కమిటీల చైర్మన్లు, సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రణాళిక, ఆర్థిక సంఘం : గద్దె అనూరాధ చైర్పర్సన్ కాగా, మంత్రి కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు నున్నా రామాదేవి(కలిదిండి), కిలారు విజయబిందు(తిరువూరు), మట్టా ధనలక్ష్మి(విస్సన్నపేట), మెడబలిమి మల్లికార్జునరావు(మోపిదేవి), మోటూరు వెంకట సుబ్బయ్య(పమిడిముక్కల), తాతినేని పద్మావతి(తోట్లవల్లూరు), డి.వెంకట కృష్ణారావు(గంపలగూడెం) సభ్యులుగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం : గద్దె అనూరాధ(చైర్పర్సన్) కాగా ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు(పెడన), బోడే ప్రసాద్(పెనమలూరు), ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యులు గింజుపల్లి శ్రీదేవి(పెనుగంచిప్రోలు), బొగ్గవరపు శ్రీనివాసరావు(పెనమలూరు), కోవెలమూడి ప్రమీల(నందిగామ), పాలెం ఆంజనేయులు(ఎ.కొండూరు), కాజా రాంబాబు(ఆగిరిపల్లి), పైడిపాముల కృష్ణకుమారి(చల్లపల్లి), బడుగు తులసీరావు(కృత్తివెన్ను) సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయ స్థాయీ సంఘం : శాయన పుష్పావతి చైర్ పర్సన్ కాగా, ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు భూపతి నాగకళ్యాణి(ముదినేపల్లి), షేక్ మహ్మద్ షహనాజ్బేగం(వీరులపాడు), మరీదు లక్ష్మీదుర్గ(గన్నవరం), మీగడ ప్రేమ్కుమార్(నందివాడ), కన్నా నాగరాజు(నాగయలంక), బాణావతు రాజు(నూజివీడు) సభ్యులుగా ఉన్నారు. విద్య, వైద్యసేవల స్థాయీ సంఘం : గద్దె అనూరాధ చైర్పర్సన్ కాగా, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల వరలక్ష్మి(ఘంటసాల), దొండపాటి రాము(మైలవరం), అమ్మనబోయిన రాణి(జగ్గయ్యపేట), ఎల్.కమల(వత్సవాయి), బి.నాగవెంకట శ్రీనుబాబు(పెడన), శాయన పుష్పావతి(గుడ్లవల్లేరు), మూల్పూరి హరీష(పెదపారుపూడి) సభ్యులుగా ఉన్నారు. మహిళా సంక్షేమ స్థాయీ సంఘం : పొట్లూరి శశి చైర్పర్సన్ కాగా, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మంత్రి కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), జెడ్పీటీసీ సభ్యులు కాటూరి మోహనరాజు(ఉయ్యూరు), చెన్నుబోయిన రాధ(ఇబ్రహీంపట్నం), పాలంకి విజయలక్ష్మి(రెడ్డిగూడెం), కైలా జ్ఞానమణి(బాపులపాడు), డి.రాఘవరెడ్డి(చాట్రాయి), కంచికచర్ల కో-ఆప్షన్ సభ్యుడు అన్వర్ సభ్యులుగా ఉన్నారు. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం : దాసరి కరుణజ్యోతి చైర్పర్సన్ కాగా, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, తిరువూరు కో-ఆప్షన్ సభ్యుడు టి.పుష్పరాజు, జెడ్పీటీసీ సభ్యులు జి.శివరామకృష్ణప్రసాద్(కంకిపాడు), కాజ బ్రహ్మయ్య(జి.కొండూరు), చిన్ని శ్రీనివాసకుమారి(గుడివాడ), ముత్యాల నాగ నాంచారమ్మ(మండవల్లి), చిమటా విజయశాంతి(మొవ్వ), కొల్లూరి వెంకటేశ్వరరావు(అవనిగడ్డ) సభ్యులుగా ఉన్నారు. పనుల స్థాయీ సంఘం : గద్దె అనూరాధ చైర్ పర్సన్ కాగా, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీటీసీ భ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మి(కైకలూరు), వాసిరెడ్డి కృష్ణప్రసాద్(చందర్లపాడు), బి.శ్రీనివాసరావు(కోడూరు), కోగంటి వెంకట సత్యనారాయణ(కంచికచర్ల), కందిమళ్ల అంజనీకుమారి(విజయవాడ రూరల్), చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే(గూడూరు), లంకే నారాయణప్రసాద్(మచిలీపట్నం), చిలుకూరి వెంకటేశ్వరరావు(ముసునూరు) సభ్యులుగా ఉన్నారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు
జెడ్పీ సమావేశ తీరుపై వైఎస్సార్ సీపీ నాయకుల ఆగ్రహం 15 మంది సభ్యులు ఉన్నా ప్రాధాన్యత లేని కమిటీల్లో నియామకంపై అభ్యంతరం మచిలీపట్నం : జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల నియామకంలో అధికారపక్షం తన చిత్తానుసారం వ్యవహరించిందని వైఎస్సార్ సీపీ నాయకుడు సామినేని ఉదయభాను, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్అప్పారావు తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్ వద్దకు వచ్చిన వారు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ఫ్లోర్లీడర్ తాతినేని పద్మావతి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉదయభాను మాట్లాడుతూ జిల్లా పరిషత్లో పనుల స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్ సీపీకి చెందిన ఒక్కరికే సభ్యులుగా అవకాశం ఇవ్వడం అన్యాయమన్నారు. తమ పార్టీ నుంచి ఇద్దరు ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలు ఉన్నా వారికి సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించకపోవడం అధికార పార్టీ దురుద్దేశాన్ని చాటిచెబుతోందన్నారు. వైఎస్సార్ సీపీకి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం రెండు స్టాండింగ్ కమిటీల్లోనే స్థానం కల్పించారని, ప్రాధాన్యత ఉన్న ఆర్థిక, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం కమిటీల్లో స్థానం కల్పించకపోవటం దారుణమన్నారు. స్టాండింగ్ కమిటీల నియామకంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకుండా అధికార పక్షం కుట్ర చేస్తోందని, అదే ఆనవాయితీని జిల్లా పరిషత్ సమావేశంలోనూ, స్టాండింగ్ కమిటీల నియామకంలోనూ పాటిస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తాతినేని పద్మావతి మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, అధికార పక్షం అవకతవకలకు పాల్పడితే కచ్చితంగా నిలదీస్తామన్నారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన జిల్లా పరిషత్ సమావేశాన్ని ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏర్పాటు చేసి మాట్లాడకుండా చేశారని అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేద్దాం
వాడీవేడిగా జెడ్పీ తొలి సమావేశం జిల్లా అభివృద్ధికి కలిసి ముందుకు సాగుదాం ప్రజాప్రతినిధుల పిలుపు స్టాండింగ్ కమిటీల ఏర్పాటుపై దుమారం పిన్నమనేని, కేఎన్నార్, తంగిరాలలకు నివాళి మచిలీపట్నం : రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని, నూతన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కీలకంగా మారనుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య ఆదివారం జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగింది. జెడ్పీ హాలులో జరిగిన ఈ సమావేశం సాదాసీదాగానే ప్రారంభమైనప్పటికీ స్టాండింగ్ కమిటీల ప్రకటన అనంతరం వేడెక్కింది. నందిగామ ఉప ఎన్నిక కారణంగా కోడ్ అమల్లో ఉండటంతో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, అధికారుల పరిచయ కార్యక్రమం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటుతోనే ఈ సమావేశం ముగిసింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని రాష్ట్ర విభజన అనంతరం జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ ఏడు స్టాండింగ్ కమిటీల జాబితాలను ప్రకటించారు. స్టాండింగ్ కమిటీల ఎంపిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, పార్టీ పరంగా ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. స్టాండింగ్ కమిటీల నియామకాన్ని పునఃసమీక్షించాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కోరడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్య స్టాండింగ్ కమిటీల నియామకంపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగింది రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు తదితర పథకాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అక్టోబరు రెండో తేదీ నుంచి నిరంతరాయంగా గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. పులిచింతల, పోలవరం పూర్తి చేస్తామని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ప్రకటించారు. బందరు పోర్టు అభివృద్ధితోపాటు జిల్లాలో జరిగే పారిశ్రామిక అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించి తమకు నివేదిక అందజేస్తే ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) హామీ ఇచ్చారు. జెడ్పీ ఆదాయం వృద్ధికి కృషి : అనూరాధ జిల్లా పరిషత్ ఆదాయాన్ని పెంచి, ఆస్తులను పరిరక్షించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడదామని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా సమావేశంలో ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించలేకపోతున్నామని, మరో నెల రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీకి ఆస్తులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులపై ఉందన్నారు. జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని తెలిపారు. ఇసుక సీనరేజ్, జెడ్పీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్కు చెందిన దుకాణ సముదాయాల అద్దెలు పెంచి పది సంవత్సరాలు గడిచిందని, వీటి పెంపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలనలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో నైట్వాచ్మెన్ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే పనులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పెడన, నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, మేకా ప్రతాప్ అప్పారావు, కె.రక్షణనిధి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కంచి రామారావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. మంత్రులు ఉమ, కామినేని గైర్హాజరు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కరే హాజరయ్యారు. తొలుత ఇటీవల మరణించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు పిన్నమనేని కోటేశ్వరరావు, కుక్కల నాగేశ్వరరావుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు విడతలుగా మౌనం పాటించారు. -
అక్కడ...ఇక్కడ
నగరంతో పాటు స్వగ్రామాల్లోనూ వివరాల నమోదు జీహెచ్ఎంసీకి స్వయంగా వెళ్తున్న జనం సర్వేలో గందరగోళం సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజే (19వ తేదీన) జరుగుతుందని తెలిపిన అధికారులు దాన్ని ఇంకా కొనసాగిస్తుండటంతో జిల్లాల్లో పేర్లు నమోదు చేయించుకునేందుకు వెళ్లినవారు.. ఇక్కడ కూడా తిరిగి నమోదు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఒక్కరోజు మాత్రమే సర్వే జరుగుతుందని ప్రకటించినప్పటికీ.. ప్రజల ఫిర్యాదుల మేరకు వారందరి వివరాలు నమోదు చేస్తామన్న యంత్రాంగం గురువారం వరకూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. కొన్ని సర్కిళ్లలోని జీహెచ్ఎంసీ కార్యాలయాలకు ప్రజలే ఫారాలను స్వయంగా ఇచ్చారు. ఈలోగా జిల్లాల్లో తమ పేర్లు నమోదు చేయించి వచ్చిన వారు తిరిగి ఇక్కడ కూడా నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజా సమాచారం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు 20,57,121 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. ఇంకా 71,083 కుటుంబా లు ఉన్నట్లుగా అంచనా. వీటితో పాటు ఇంకా తమ దృష్టికి రాకుండా మిగిలిపోయిన వారి వివరాలు కోసం మరో రోజు సర్వే జరపాలనేది అధికారుల యోచన. గందరగోళంగా టెండర్లు సమగ్ర సర్వే వివరాల కంప్యూటరీకరణకు జీహెచ్ఎంసీ పిలిచిన టెండర్ల ప్రీ బిడ్ సమావేశం సందర్భంగా శుక్రవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. బిడ్స్ స్వీకరణ సమయానికి సంబంధించి పత్రికల్లో ప్రకటనకు, జీహెచ్ఎంసీ వెబ్సైట్లోని ప్రకటనకు తేడా ఉండటంతో తాము దాఖలు చేయలేకపోయామని పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళన సాగుతుండగానే సాంకేతిక బిడ్ల కార్యక్రమాన్ని అధికారులు పూర్తిచేశారు. ఆర్థిక బిడ్ల ఆమోదం అనంతరం సంబంధిత సంస్థకు పనులు అప్పగించనున్నారు. మొత్తం ఆరు టెండర్లు రాగా, అందులో మూడు ఒకే సంస్థవి ఉన్నాయి. వీటిలో ఐదు సాంకేతిక అర్హత పొందాయి. శనివారం ఆర్థిక బిడ్లు ఆమోదం పొందితే.. సోమవారం నుంచి ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు పనుల ప్రాధాన్యం దృష్ట్యా స్టాండింగ్ కమిటీ ఆమోదానికి వేచి చూడకుండా ఉండేందుకు పనులను విభజించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్టిఫికె ట్లు ఇవ్వాలి: విద్యార్థుల డిమాండ్ సమగ్ర కుటుంబ సర్వేలో సహాయ ఎన్యూమరేటర్లుగా పని చేసిన కొన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు తమకు జీహెచ్ఎంసీ నుంచి ధ్రువపత్రాలు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. సమగ్ర సర్వేలో పాల్గొన్న వారికి జీహెచ్ఎంసీ నుంచి ప్రశంసా పత్రాలు అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. పారితోషికం కంటే వీటి వల్ల తగిన గుర్తింపు లభిస్తుందనే తాము విధులు నిర్వహించామని వారు చెబుతున్నారు. హామీ మేరకు తమకు సర్టిఫికెట్లు అందజేయాల్సిందిగా పలువురు విద్యార్థులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పొరపాట్లు సవరించాలి సమగ్ర సర్వేలో భాగంగా సేకరించిన వివరాలు సరైనవేనంటూ ఎన్యూమరేటర్లు సంతకాలు చేయాల్సి ఉంది. సహాయ ఎన్యూమరేటర్లుగా వివిధ కళాశాలల విద్యార్థులు, ఇతరత్రా విభాగాల వారు సర్వే ఫారాలను పూరించారు. అలాంటి వాటిలో పూర్తి వివరాలు నమోదు కాలేదని.. కొన్నింట్లో పొరపాట్లు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము పూర్తి చేయని వాటికి బాధ్యులుగా సంతకాలు చేయలేమని కొందరు ఎన్యూమరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు విభాగం నుంచి ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహించిన వారి నుంచి ఈ అభ్యంతరాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు నింపడంలో పొరపాట్లు దొర్లితే తగిన ధ్రువీకరణలు చూపిన వారి వివరాలు సవరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
కూల్చివేతలు ఆపండి
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచన సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్ఎంసీ కొనసాగిస్తోంది. తాజాగా గురువారం నగరంలోని వివిధ సర్కిళ్ల పరిధిలోని 19 భవనాలను టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. గడచిన మూడు రోజుల్లో మొత్తం 44 భవనాలను కూల్చివేశారు. అధికారుల ఈ చర్యలపై ప్రజల నుంచి పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోకుండా.. ఏళ్ల తర్వాత కూల్చివేతలకు దిగడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజల నుంచి కార్పొరేటర్లపై ఒత్తిళ్లు పెరగడంతో పలువురు కార్పొరేటర్లు దీనిపై తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నంమేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు కూల్చివేతలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను వెంటనే నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కూల్చివేతకు ముందు.. అక్రమ నిర్మాణాలు ఆదిలోనే అడ్డుకోకుండా ప్రోత్సహించిన సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ల (ఏసీపీలు)పై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా కమిషనర్కు సూచించారు. సమావేశంలో స్పెషల్ కమిషనర్లు ఎ.బాబు, పీఎస్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్పొరేటర్ల ధర్నా కూల్చివేతలను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ అంతకుముందు టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కూల్చివేతలకన్నా ముందు అక్రమ భవనాలు రావడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఫ్లోర్లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేయర్కు వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రికి రాసిన మరో లేఖలో టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పక్షపాతంతో కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లో జరగుతున్న కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలన్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎక్కడెక్కడ.. అధికారులు గురువారం చర్లపల్లి, సరూర్నగర్, ఎల్బీనగర్, ఆజంపురా, బడాబజార్, జాస్మిన్నగర్, రాంనగర్, మధురానగర్, బంజారాహిల్స్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, గాజులరామారం, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని భవనాలను నేలమట్టం చేశారు. కూల్చివేతలు యధాతథం: కమిషనర్ ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలు యధాతథంగా కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ స్పష్టం చేశారు. కూల్చివేతలను నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల మేరకు అక్రమ భవనాలన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్రమబద్ధీకరణను కోరుతూ కార్పొరేటర్ల విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదించేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. పాత పద్ధతిలోనే ట్రేడ్లెసైన్స్ ఫీజు గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లోని దుకాణాలకు ఒకేలా ట్రేడ్లెసైన్సు ఫీజు విధించడాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ వ్యతిరేకించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా చేపట్టిన ఈ విధానాన్ని నిలుపు చేస్తూ పాత పద్ధతినే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. వీటికి ఆమోదం.. కార్పొరేటర్లకు యాపిల్ ఐపాడ్లు, మీడియా ప్రతినిధులకు టాబ్లెట్లు ఇచ్చేందుకు గతంలో ఆమోదించిన తీర్మానం ఉపసంహరణ ప్రభుత్వోద్యోగుల తరహాలో 2014 జనవరి నుంచి జీహెచ్ఎంసీ ఉద్యోగులకు డీఏ పెంపు రూ. 74 లక్షలతో సైనిక్పురి షాపింగ్కాంప్లెక్స్ రెండో అంతస్తు నిర్మాణం జోహ్రాబీ దర్గా నుంచి డీఆర్డీఎల్ వరకు రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి పరిహారం. తిరస్కరించినవి.. మోహన్నగర్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు సీసీరోడ్డు పనులు. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ప్రహరీగోడ, అంతర్గత రహదారి నిర్మాణపనులు. హైదర్గూడ రింగ్రోడ్డు వద్ద సర్దార్ వల్లభాయిపటేల్ విగ్రహం ఏర్పాటు. దాన్ని తెలంగాణ అమరవీరుల ప్రదేశంగా గుర్తించాలని ప్రతిపాదన. పెండింగ్.. బల్దియా పెట్రోల్ సప్లయ్ కంపెనీకి స్థలం లీజు పొడిగింపు అంశం. 2013- 14 బడ్జెట్ రీ అప్రాప్రియేషన్ చేయాలనే అంశాన్ని వాయిదా వేశారు. 60 వేలపై అయోమయం: నగరంలో 60 వేల అక్రమ నిర్మాణాలున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అన్ని నిర్మాణాలెక్కడ ఉన్నాయో తెలియక జీహెచ్ఎంసీ అధికారులు అమోమయానికి గురవుతున్నారు. బీపీఎస్ పథకం అమల్లో ఉన్నప్పుడు అందిన 2.05 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 60 వేల దరఖాస్తుల్ని తిరస్కరించారు. వాటినే సీఎం అక్రమ నిర్మాణాలుగా చెబుతున్నారా అనేది అంతుబట్టక జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి అక్రమ నిర్మాణాల లెక్కల్లో పడ్డారు. -
కూల్చివేతలపై గ్రేటర్ స్టాండింగ్ కమిటీ వ్యతిరేకత
-
ఇక..స్టాండింగ్ కమిటీల వంతు!
నల్లగొండ :జిల్లాపరిషత్ పాలకవర్గం కొలువుదీరడంతో ఇప్పుడు అందరి దృష్టి స్టాండింగ్ కమిటీలపై పడింది. జెడ్పీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన 60 రోజుల్లోగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో ముందుగా స్టాండింగ్ కమిటీలకు ఎన్నిక ఉంటుంది. సభ్యుల మధ్య పోటీ ఏర్పడితే రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. లేనిపక్షంలో ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారు. జిల్లాపరిషత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ స్టాండింగ్ కమిటీలకు ఎన్నిక జరగలేదు. సభ్యులందరినీ ఏకగ్రీవంగానే కమిటీల్లో నియమించారు. ఏడు కమిటీలు జిల్లా పరిషత్లో మొత్తంగా ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్ నాలుగు కమిటీలకు, వైస్చైర్మన్ ఒక కమిటీకి చైర్మన్గా ఉంటారు. మహిళా సంక్షేమ స్థాయి కమిటీలో కేవలం సభ్యులు ఉంటారు. అయితే ఈ కమిటీలో సగం మంది మహిళలు తప్పనిసరిగా ఉండాలి. సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ లోనూ సభ్యులే ఉంటారు. ఇక్కడా సగం మంది మహిళలకు అవకాశం కల్పించాలి. ఈ సగం మందిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సభ్యులకు అవకాశం ఇవ్వాలి. ప్రణాళిక-ఆర్థిక స్థాయి, పనుల స్థాయి కమిటీల్లో సభ్యులుగా ఉండేందుకు జెడ్పీటీసీల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 11మంది సభ్యులు ఉండగా, జెడ్పీ పరిధిలో మొత్తంగా 79 సభ్యులు (జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు) ఉంటారు. కమిటీల ఎన్నిక ఇలా... ఇప్పటిదాకా స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవంగానే కమిటీలకు సభ్యులను ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్మన్ ఇచ్చిన జాబితా ప్రకారం సర్వసభ్య సమావేశం రోజున ఏ కమిటీల్లో ఎవరిని నియమించారనే విషయాన్ని ప్రకటిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సూచనల మేరకే జెడ్పీటీసీ సభ్యులను కమిటీల్లో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా వచ్చిన ప్రతిపాదనలనే జెడ్పీ చైర్మన్ ఆమోదిస్తూ వచ్చారు. ఏదేని విపత్కర పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించాల్సి వస్తే మాత్రం రహస్య ఓటింగ్ ద్వారానే కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఉదాహరణకు ఓ కమిటీకి 15 పోటీ పడుతుంటే, 11 మందిని మాత్రమే ఎన్నుకునేందుకు రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. మిగిలిన జెడ్పీటీసీ సభ్యులందరు కూడా ఈ ఓటింగ్లో పాల్గొంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రం ఓటు హక్కు ఉండదు. జెడ్పీ చైర్మన్, వైస్చైర్మన్ పదవులకు చివరి వరకూ పోటీలో ఉన్న నేతలు ముఖ్యమైన కమిటీల్లో చోటు దక్కించుకునేందుకు అప్పుడే తమ గాడ్ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
టీడీపీ ఎత్తుగడ ఫ్లాప్
జీహెచ్ఎంసీ ‘స్టాండింగ్’ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్-ఎంఐఎం కూటమి అన్ని పార్టీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ ఈ పాలకమండలి ఉండేది డిసెంబరు 3 వరకే సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రభావం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించింది. ఆ ఎన్నికల మాదిరే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అదే తరహాలో పలు ప్రలోభాలు.. ముడుపుల పంపిణీ జరిగినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. క్రాస్ ఓటింగ్పై భారీ నమ్మకంతో ఈసారి ఎలాగైనా స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్, ఎంఐఎం కూటమికి పడి టీడీపీకి నిరాశ మిగిలింది. గెలిచిన వారిలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి కంటే టీడీపీకి రెండు ఓట్లు తక్కువగా వచ్చాయి. మొత్తానికి కాంగ్రెస్- ఎంఐఎం కూటమి ఎప్పటిలాగే విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎనిమిదిమంది, ఎంఐఎం నుంచి పోటీలో నిలిచిన ఏడుగురు గెలిచారు. టీడీపీ, బీజేపీల నుంచి చెరొకరు పోటీ చేయగా ఇద్దరూ ఓటమి పాలయ్యారు. భారీగా క్రాస్ ఓటింగ్ ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఊహించినట్లుగానే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అన్ని పార్టీల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆయా పార్టీలకు దక్కిన ఓట్లను బట్టి తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు.. తర్వాత పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు.. కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అనంతరం వారు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారినప్పటికీ రికార్డుల్లో అది నమోదు కావడం లేదు. ఆయా పార్టీలు.. నేతలు.. కార్పొరేటర్ల మధ్య అవగాహనతో మాత్రమే పార్టీ మారిన వారిని కొత్తపార్టీ సభ్యులుగా పరిగణిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, తదితర సమయాల్లోనూ ఇదే అమలవుతోంది. పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి.. అనంతరం ఆయా పార్టీల్లోకి మారిన వారిని సదరు పార్టీ సభ్యులుగానే పరిగణిస్తున్నారు. ఇటీవల పలు పార్టీల నుంచి పలువురు ఇతర పార్టీల్లో చేరారు. అలా టీడీపీ నుంచి ఏడుగురు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇతర పార్టీల్లోనూ ఈ ఫిరాయింపులున్నాయి. రావాల్సిన ఓట్ల కన్నా ఎక్కువగానే.. ఆయా పార్టీల్లోని కార్పొరేటర్ల తాజా గణాంకాల మేరకు కాంగ్రెస్- ఎంఐఎంల కార్పొరేటర్లు తమ కూటమి అభ్యర్థులకు ఓటేసినట్లయితే ఒక్కో అభ్యర్థికి 90 ఓట్లు రావాల్సి ఉంది. కానీ.. ఇతర పార్టీల నుంచి సైతం భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు 103 ఓట్ల నుంచి 123 ఓట్ల వరకు లభించాయి. కూటమిలోని మరో అభ్యర్థికి కేవలం 75 ఓట్లు మాత్రమే లభించాయి. అలాగే టీడీపీ- బీజేపీ పొత్తును పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ అభ్యర్థికి 47 ఓట్లు మాత్రమే లభించాలి. కానీ, 73 ఓట్లు వచ్చాయి. అన్ని పార్టీల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ, జీహెచ్ఎంసీలోని ఒప్పందం మేరకు కూటమిలోని కాంగ్రెస్- ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే గెలవడం విశేషం. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 వరకే ఉంది. ఈ పాలకమండలిలో ఇదే చివరి స్టాండింగ్ కమిటీ కావడం.. స్టాండింగ్ కమిటీకి 50 లక్షల రూపాయల మేర పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండటంతో ఎలాగైనా స్థానం పొందాలనుకున్న టీడీపీ ఆశ అడియాసే అయింది. ఓటు వేయని మాజీ మేయర్ జీహెచ్ఎంసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 150 మంది కార్పొరేటర్ల నుంచే 15మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై కార్పొరేటర్లుగా రాజీనామా చేశారు. మిగిలిన 148 మంది కార్పొరేటర్లకుగాను 140 మంది శుక్రవారం పోలింగ్లో పాల్గొన్నారు. ఓటు వేయని వారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి (కాంగ్రెస్)తో సహా ఎనిమిదిమంది కార్పొరేటర్లున్నారు. ఓటు వేయని మిగతా వారిలో నిర్మలా పురుషోత్తంరెడ్డి (కాంగ్రెస్), సీహెచ్ శ్రీనివాస్ (టీడీపీ), అమ్జదుల్లాఖాన్(ఎంబీటీ), ఎంఐఎంకు చెందిన మెరాజ్ అహ్మద్, అరుణలు ఉన్నారు. వీరితోపాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన మురళిగౌడ్, ముఠాపద్మలు కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. -
ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీ రద్దు
ఈ నెల 31లోగా చెల్లిస్తే వర్తింపు 21 వరకు వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీలు(వడ్డీలు) రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఈ నెల 31 లోగా ఆస్తిపన్ను చెల్లించేవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రతియేటా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నప్పటికీ.. మార్చి నెలాఖరులో దీనికి సంబంధించిన జీవోను జారీ చేసేది. దాని బదులు త్వరితంగా జీవో జారీ చేస్తే వసూళ్లలో గణనీయ ప్రగతి ఉంటుందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ అంశంపై చొరవ తీసుకోవాల్సిందిగా కమిషనర్ను కోరింది. త్వరలోనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత జీవోను త్వరితంగా జారీ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజా జీవో జారీ అయింది. దీని ప్రకారం.. పాత బకాయిల్ని.. ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏక మొత్తంలో కానీ.. వాయిదాల్లో కానీ మార్చి 31 లోగా చెల్లిస్తే వడ్డీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక వసూళ్లపై దృష్టి.. పెనాల్టీలను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ఇక ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. మార్చి 21 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకనుగుణంగా తగిన నియమ నిబంధనలు పొందుపర్చారు. వసూళ్ల కోసం సర్కిల్స్థాయిల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. బృందాలకు అవసరమైన వాహనాలు సమకూరుస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ వాహనాలతోపాటు జీహెచ్ఎంసీ టిప్పర్లను వినియోగించుకోవచ్చునన్నారు. సర్కిల్ స్థాయిలో టాప్ 200 బకాయిలున్న వారిపై ప్రత్యేక శ్రద్ధతో వసూళ్లు చేపడతారు. వారిలో రోజుకు పదిమంది నుంచి ఆస్తిపన్ను వసూళ్లు చేయాలి. ఎవరి వద్ద నుంచైనా ఆస్తిపన్ను వసూలు చేయని పక్షంలో ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాలి. వివరణ సంతృప్తికరంగా లేనట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఆస్తిపన్ను వసూళ్ల పర్యవేక్షణ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ స్థాయిల్లో సీనియర్ అధికారులను నియమించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 1250 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 605 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. నెలరోజులే గడువున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మేయర్ పదవి బీసీకిస్తూ ప్రభుత్వం జీవో తేవడాన్ని ప్రస్తావించారు. -
గ్రేటర్ కేటా‘యింపు’
రూ. 3936 కోట్లు! =ఇది వచ్చే ఏడాదికి జీహెచ్ఎంసీ బడ్జెట్ =ముసాయిదా కసరత్తు షురూ =ఏటా కేటాయింపులే ఘనం.. అమలు అంతంతే సాక్షి, సిటీబ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15) బడ్జెట్పై జీహెచ్ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. షెడ్యూలు మేరకు ఈనెల 10లోగా ముసాయిదా బడ్జెట్ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందజేయాలి. దీంతో తుదిరూపునిచ్చేందుకు శ్రమిస్తున్నారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి (2013-14) రూ.3800 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. ఏటా కేటాయింపులు భారీగా ఉంటున్నా.. అందులో దాదాపు సగం నిధులే ఖర్చు చేయగలుగుతున్నారు. మిగతావి అంకెల్లో తప్ప వినియోగంలోకి రావట్లేదు. ప్రస్తుత బడ్జెట్ రూ. 3800 కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీనిని రూ. 4000 కోట్లకు పెంచే అవకాశాలున్నాయి. తాజా వివరాల ప్రకారం.. రూ. 3936 కోట్లతో కొత్త బడ్జెట్ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రాథమిక కసరత్తే అయినందున.. స్టాండింగ్ కమిటీ నుంచి జనరల్బాడీ సమావేశానికి వెళ్లి అక్కడ ఆమోదం పొందేలోగా మార్పులకు అవకాశాలు మెండు. ఏటా జరుగుతున్న తంతే ఇది. ప్రస్తుత సంవత్సరం కంటే బడ్జెట్ను తగ్గించడం బాగుండదనే తలంపుతోనే ఏటా మొత్తం పెంచేస్తున్నారు. ఈసారీ అదే పునరావృతమైతే ఆమోదం పొందే సమయానికి బడ్జెట్ రూ. 3900- 4000 కోట్ల మధ్య ఉంటుందనేది అంచనా. కేటాయింపులు భారీగా ఉన్నా.. ఏ ఒక్క ఏడాదీ దాదాపు రూ.2200 కోట్లకు మించి ఖర్చుచేయలేదు. తీరు మారేనా? ఇటీవలే కొత్త కమిషనర్ రావడంతో పాటు త్వరలోనే మేయర్ మార్పు కూడా జరగనున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ తీరుతెన్నులెలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు జనవరిలో కాంగ్రెస్ వారు మేయర్ కావాల్సి ఉంది. కొత్త మేయరే బడ్జెట్ను జనరల్బాడీ సమావేశంలో చర్చకు ఉంచి.. ఆమోదం పొందాల్సి ఉన్నందున ఆయన ఆలోచనలకనుగుణంగానే బడ్జెట్ తుదిరూపు దిద్దుకోనుంది.