Waka Manjula Reddy
-
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్ఘడ్లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్కుమార్ మోర్ల -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్రెడ్డి -
Chennamadhavuni Ashok raj: విశ్రాంతి ఉద్యోగానికే... జీవితానికి కాదు!
ప్రతిరోజూ మనదే. ప్రతిరోజునీ శ్వాసించాలి. ప్రతిరోజునీ ఆఘ్రాణించాలి. ప్రతిరోజునీ ఆస్వాదించాలి. ప్రతిరోజుకీ జీవం ఉండాలి. అప్పుడే... జీవితం జీవంతో ఉంటుంది. సంతోషాల సుమహారమవుతుంది. ‘బోర్ కొడుతోంది’ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి ముని పెదవుల మీద ఉంటుందీ మాట. పిల్లలను బోర్డమ్ నుంచి బయటేయడం సులువే. కానీ రిటైర్ అయిన వాళ్లను వేధించే బోర్డమ్కు పరిష్కారం ఎలా? వయసు పై బడేకొద్దీ... అలవాటు పడిన జీవితం నుంచి కొద్దిపాటి మార్పును కూడా స్వీకరించలేని మొండితనం ఆవరించేస్తుంటుంది. ఆ మొండితనం నుంచి బయటపడలేక అవస్థలు పడే వార్ధక్యానికి ఓ సమాధానం చెన్నమాధవుని అశోక్రాజు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులు ‘మేమక్కడ ఉండలేక΄ోయాం. బోర్ కొట్టి చచ్చాం. ఒక్క రోజు ఒక్క యుగంలా గడిచింది’ అనే వాళ్లకు సమాధానంగా అశోక్రాజు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కలప కరెంట్ స్తంభాలు ‘‘మేము హైదరాబాద్లోని వనస్థలిపురంలో విశ్రాంత జీవనం గడుపుతున్నాం. యూఎస్లోని రెడ్మాండ్లో మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు ఉన్నారు. గడచిన ఏడాది నేను, మా ఆవిడ వీణారాణి... పెద్దమ్మాయి దగ్గరకు వెళ్లి ఆరు నెలలు ఉండి డిసెంబర్లో ఇండియాకొచ్చాం. టూర్లో భాగంగా... యూఎస్లో టకోమా – సియాటెల్ ఎయిర్΄ోర్ట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రెడ్మాండ్కు చేరుకున్నాం. రోడ్డు వెడల్పుగా, ఇరువైపులా నిటారుగా పెరిగిన చెట్లతో పచ్చగా ఉన్నాయి పరిసరాలు. కర్రలతో నిర్మించిన ఇళ్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లతో అడవిమధ్యలో ఇల్లు కట్టినట్లు ఉంది. ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు, విద్యుత్ స్తంభాలుగా కూడా కలపనే వాడతారు. బాగా ఎత్తుగా పెరిగిన చెట్లను కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తారు. పైన్ లేక్, లేక్ వాషింగ్టన్, స్నో క్యూలమిన్ ఫాల్స్, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను చూశాం. ఓపెన్ ప్లేస్ మేరిమూర్ పార్క్లో సినిమా చూడడం మాకు విచిత్రమైన అనుభూతి. మన దగ్గర ఉన్నట్లు క్లోజ్డ్ థియేటర్ కాదది. బహిరంగ ప్రదేశంలో లాన్లో కుటుంబాలతో కూర్చుని స్నాక్స్ తింటూ, కూల్డ్రింకులు తాగుతూ సినిమా చూస్తుంటారు. పాశ్చాత్యంలో మన పతంజలి యోగ మెక్సికోలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం కంకూన్కెళ్లాం. అక్కడ క్లౌన్ ΄్యారడైజ్ క్లబ్... ఐదు వందలకు పైగా గదులున్న పెద్ద హోటల్. యూఎస్, కెనడా, బ్రెజిల్, యూకే నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మన దగ్గర ఫైవ్స్టార్ హోటళ్లలో జిమ్లుంటే... అక్కడ అతిథుల కోసం డెయిలీ రొటీన్లో యోగసాధన కూడా ఉంది. అక్కడి శిక్షకులు పతంజలి యోగ పుస్తకాన్ని ఆధారం చేసుకుని స్పానిష్ భాషలో వివరిస్తున్నారు. థియరీని మక్కీకి మక్కీ నేర్చుకుని అర్థమైనంతలో సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతున్నారని అర్థమైంది. నాకున్న ముప్పై ఏళ్ల యోగ సాధన అనుభవంతో సీనియర్ సిటిజెన్ కోసం ఆరు రోజుల కోర్సు డిజైన్ చేసి నేర్పించాను. పవన ముక్తాసనం, మకరాసనం, సర్పాసనం, వజ్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారాలతోపాటు ్రపాణాయామం, భస్త్రిక సాధనను కూడా వాళ్లు వీడియో తీసుకుని ఇకపై ఇలాగే సాధన చేస్తామని చె΄్పారు. పర్యటన కోసం అక్కడికి వెళ్లిన భారతీయులకంటే పాశ్చాత్యులు, అక్కడ స్థిరపడిన భారతీయులు యోగసాధన పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. శంకర నేత్రాలయ కోసం దాండియా యూఎస్ పర్యటనలో కొన్ని రోజులు అట్లాంటాలో గడిపాం. అట్లాంటాలో ఉన్న రోజుల్లో నేను రోజూ జేమ్స్ క్రీక్ క్లబ్లో యోగసాధన చేసేవాడిని. అక్కడి వారి కోరిక మేరకు యోగాతోపాటు విపస్సన ధ్యాన ప్రక్రియ కూడా నేర్పించాను. అక్కడ ఉద్యోగ, వ్యాపారాల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు యోగ సాధన చేయాలని ఉన్నప్పటికీ టీచర్ లేక΄ోవడంతో ్రపాక్టీస్ చేయలేక΄ోయేవారు. ‘అట్లాంటా విజిటర్స్ అసోసియేషన్’ వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ అయ్యాం. అక్కడ చాలా విశాలమైన కమ్యూనిటీ హాల్ ఉంది. అందులో సమావేశపరిచి యోగ, విపస్సన నేర్పించాను. వీటన్నింటికంటే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే... సియాటెల్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో నవరాత్రి సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ్ర΄ోగ్రామ్లో పాల్గొనడం. ఎందుకంటే అది మనదేశంలో పేదవారికి ఉచితంగా వైద్యం అందించే సేవాసంస్థ ‘శంకర్ నేత్రాలయ’ కోసం ఫండ్ రైజింగ్ ్ర΄ోగ్రామ్. పాశ్చాత్య గడ్డ మీద మన భారతీయులతో కలిసి దాండియా నాట్యం చేయడం, విదేశీయులకు నేర్పించడం, అది కూడా ఒక సామాజిక ప్రయోజనం కోసం కావడం నాకు సంతోషాన్నిచ్చింది. మనం ఎక్కడ ఉన్నా సరే... రోజును ఉపయుక్తంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని నమ్ముతాను. అదే ఆచరణలో పెడతాను. పని... చేసే వారికి ఎదురొస్తుంది! ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. పెద్దమ్మాయి అమెరికా, చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో స్థిరపడడంతో రెండేళ్లకోసారి ఒక్కో అమ్మాయి దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకున్నాం. ఎక్కడ ఉన్నా నాకు బోర్ అనే మాట నా దగ్గరకు చేరదు. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంతో మమేకమై జీవించాలనేది నా ఫిలాసఫీ. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడి వాళ్లతో కలిసి కమ్యూనిటీ ఫార్మింగ్ చేశాను. మా చిన్నల్లుడి సహకారంతో అక్కడి లైబ్రరీలో తెలుగు పుస్తకాలు పెట్టే ఏర్పాటు చేయగలిగాను. మనం ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు. అక్కడ మన అవసరం ఏమిటో, మనం మాత్రమే చేయగలిగిన పని ఏమిటో మనకు కనిపించి తీరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే పని మనకు ఎదురొస్తుంది. అలా ఒక వ్యాపకంలో నిమగ్నమైతే చాలు. మన వల్ల మరొకరికి ప్రయోజనమూ కలుగుతుంది. మనకు రోజు నిర్వీర్యంగా గడిచి΄ోకుండా ఉపయుక్తంగా గడిచిన సంతోషమూ కలుగుతుంది’’ అన్నారు చెన్నమాధవుని అశోక్రాజు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Madhavi Kattekola: జై జవాన్కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్ఆర్ఎల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్స్కిల్స్లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్స్కిల్స్లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్లైన్లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
పండించారు... వడ్డించారు!
రైతుకు కొత్త నిర్వచనం కావాలి. వ్యవసాయానికి కొత్త అర్థం చెప్పాలి. మహిళ సాగు చేస్తే నేల పులకిస్తుంది. గాజుల చేతిలో గరిటే కాదు... నాగలి కూడా గర్వంగా చాలుదీరుతుంది. అనంతపురంలో మహిళలు ‘ఆదర్శసాగు’ చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ఏం తినాలో ఎలా తినాలో నేర్పిస్తున్నారు. దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. వినడానికి బావుంటుంది. దేశానికి కంచంలో అన్నంగా మారేది గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలే... కాబట్టి గ్రామానికి, రైతుకి అంతటి గుర్తింపు వచ్చింది. మరి అదే పొలం రైతుకి సమాధి అవుతుంటే వ్యవసాయం బతికి బట్టకట్టేదెలా? నాగలి కర్రు రైతు గుండెను చీలుస్తుంటే భూమిలో బంగారం పండేదెప్పుడు? రైతు వాణిజ్య పంటల మాయలో పడి అప్పుల పాలైతే ఆ రైతుని, ఎరువులతో కలుషితమైన ఆ భూమిని కాపాడేదెవరు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే కసితో రైతు మహిళలు ఆ పనిని చేపట్టారు. భర్తను మింగేసిన పంటపొలాల్లోనే భవితను వెతుక్కుంటున్నారు. సంఘటితంగా వ్యవసాయం చేస్తూ దిగుబడితో లాభాలు కళ్ల చూస్తున్నారు. ఇది అనంతపురంలోని మహిళలు సాధించిన విజయం. వాళ్లకు దారి చూపిన భానుజ సంకల్పం. అనంతపురం జిల్లా, రూరల్ మండలం, కురుగుంట్ల గ్రామం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలను చూసిన గ్రామం. ఇప్పుడు ఆ రైతు కుటుంబాల మహిళలు నిర్వహిస్తున్న రెస్టారెంట్ను చూస్తోంది. ఆ రెస్టారెంట్లో వంటకు అవసరమైన ధాన్యాలను పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను చూస్తున్నారు. ఈ విజయాన్ని ‘చెరువు భానుజ’... సాక్షితో పంచుకున్నారు. ‘ఒంటరి’ పోరాటం! ‘‘భర్త వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో కూరుకుపోయి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే... అగమ్యగోచరంగా, అచేతనంగా మిగిలిన వాళ్లకు అండగా నిలిచాను. సింగిల్ పేరెంట్గా పిల్లల పోషణ బాధ్యతను మోస్తున్న మహిళలే వీరంతా. భర్తను కోల్పోయిన వాళ్లకు తక్షణ సహాయం చేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కోసం కార్యాలయాలకు వెళ్లి పని చేయించడం వరకు తోడుగా ఉంటున్నాను. అంతటితో ఆ కుటుంబం గట్టెక్కదు. ఉపాధి కావాలి, వాళ్లకు వచ్చిన పని వ్యవసాయమే. అయితే పొలం లేదు. దాంతో కలెక్టివ్ ఫార్మింగ్ కోసం పొలం లీజుకు తీసుకున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు ‘పుడమి తల్లి, మన భూమి’ అని పేర్లు పెట్టుకుని సేద్యం మొదలు పెట్టాం. తక్కువ ఖర్చుతో పంట చేతికి రావడానికి మిల్లెట్స్ సాగు, ఏడాది పొడవుగా రాబడి కోసం కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాం. మా ప్రయాణంలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే. పంటతో ఆపేయకుండా వంట కూడా మొదలుపెట్టాం. మార్కెట్ పుట్టింది! హరిత విప్లవంతో మనదైన సాగు కనుమరుగైంది. మిల్లెట్స్ సాగు మర్చిపోయాం, విత్తనాలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఇక ఈ వంటల గురించి ఈ తరానికి తెలియనే తెలియదు. ప్రభుత్వ సంస్థల సహకారంతో విత్తనాలు సేకరించాను. సేద్యం తెలిసిన మహిళలు కావడంతో సాగులో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ వీటిని ఎలా వండాలో నేర్పించడానికి మాస్టర్ షెఫ్లతో శిక్షణ ఇప్పించి మరీ కురుకుంట్లలో రెస్టారెంట్ పెట్టాం. రెస్టారెంట్ పెట్టడానికి ముందు ఆ ఊరిని డయాబెటిక్ ఫ్రీ విలేజ్గా మార్చాలనే సంకల్పంతో ఉచితంగా వండిపెట్టాం. డైటీషియన్లు సూచించినట్లు చిరుధాన్యాల వంటలను మూడుపూటలా తినాల్సిన మెనూను వండి వడ్డించాం. నాలుగవ వారానికి షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడాన్ని స్వయంగా తెలుసుకున్నారు పేషెంట్లు. మిల్లెట్స్ పట్ల గ్రామస్థుల్లో అవగాహన కోసం చేసిన ప్రయత్నం అది. అయితే ఆ భోజనం తిన్న వాళ్లు, తెలిసిన వాళ్లు రెస్టారెంట్ పెట్టమని సూచించారు. మా మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అలా రెండు నెలల కిందట ‘పుడమి తల్లి మిల్లెట్ హోటల్’ ప్రారంభమైంది. ‘ఆర్థిక భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత’ మా ట్యాగ్లైన్. ఊహించనంత గొప స్పందన వచ్చింది. ఆఫీసర్లు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. హోటల్ అనేక ప్రదేశాల్లో శాఖలు తెరవమని అడుగుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే హోటల్ మరో శాఖ ప్రారంభం కావాలంటే అందుకు తగిన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలి. ఇప్పుడు మేము సాగు చేస్తున్న పొలంలో సహజమైన సేంద్రియ పద్ధతుల్లో పండినవే మా రెస్టారెంట్లో వండుతున్నాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నాలుగు శాఖల్లో మొత్తం 1800 మంది రైతుమహిళలు మాతో సంఘటితమై ఉన్నారు. వారందరికీ ఉపాధిమార్గాల అన్వేషణ కోసం విస్తృతంగా పని చేయాల్సి ఉంది. వెలుగు పుట్టింది! ‘సూర్యోదయం అవుతున్నప్పుడు పుట్టింది, ఇంటికి వెలుగు తెస్తుంద’ని... మా నాన్న నాకు భానుజ అని పేరు పెట్టారు. మాది అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, బడవాండ్ల పల్లి. నాన్న చదువుకున్నది తక్కువే, కానీ కమ్యూనిస్ట్ నేపథ్యంలో చాలా నేర్చుకున్నారాయన. పాటలు రాసి పాడేవారు. చిన్నప్పుడు నాన్నతో సమావేశాలకు వెళ్లేదాన్ని. ఆ జ్ఞానమే నన్ను ఇలా తీర్చిదిద్దింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు, సందర్శనకు వచ్చన అధికారులకు మా హాస్టల్లో వసతులలేమిని చెప్పే ధైర్యం ఉండేది. టెన్త్ చదువుతూనే యంగ్ ఇండియా సంస్థలో వాలంటీర్గా పని చేశాను. అమ్మ పట్టుపట్టి ఇంటర్లో చదువాపించి మరీ పెళ్లి చేసింది. కానీ నేను గృహిణిగా ఇంటికే పరిమితం కాకుండా సామాజిక కార్యకర్తనయ్యాను. మహిళలు, పిల్లలు, దళితుల ఉన్నతి కోసం పని చేయాలనే ఉద్దేశంతో 1996లో రెడ్స్ స్థాపించాను. ట్రాఫికింగ్కి గురైన మహిళలను కాపాడడం నుంచి, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, ఉమ్మడి అటవీ సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశాను. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లు కదిరిలో నా ఇంటిని కాల్చేశారు. దాంతో నా నివాసం అనంతపూర్ పట్టణానికి మారింది’’ అని తన సమాజ సేవాయాత్రను వివరించారు భానుజ. – వాకా మంజులారెడ్డి -
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..
కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె. ‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె. నైరాశ్యం– నేను– నా బిడ్డ ‘‘మా నాన్న మెడికల్ ఆఫీసర్. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్ టీచర్లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్ క్లాస్తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్ తర్వాత విద్యుత్సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది. ఒకరికి ఒకరు తోడు మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు. సామాజిక చైతన్యం మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్తో కలిసి పని చేశాను. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్లో హాస్పిస్ సేవలే ప్రధానంగా ఉంటాయి. హోమ్ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్ స్వామి సూచనతో ముచ్చింతల్లో హోమ్ నిర్మాణం పూర్తయితే మా హోమ్ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి. సేవలోనే సాంత్వన నా సర్వీస్కి గుర్తింపుగా స్టేట్ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్ వచ్చింది. నేను హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే హోమ్లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. – నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు
విమానం నడిపిన అమ్మాయిలను చూస్తున్నాం. విమానంలో యుద్ధం చేసే అమ్మాయిలనూ చూశాం. ఇప్పుడు... విమానాలు తయారు చేస్తున్న అమ్మాయిని చూద్దాం. వల్లూరి సుధీర ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్. జర్మనీలోని లిలియుమ్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీలో మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్కి హెడ్. ఆ కంపెనీ స్థాపించిన తర్వాత ఉద్యోగంలో చేరిన వంద మంది ఇంజనీర్లలో ఒకే ఒక యువతి ఆమె. సెలవు మీద హైదరాబాద్కి వచ్చిన సుధీర ఈ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని, ఏరోస్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్ విభాగంలో తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన! ‘‘మా తాతయ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్గా పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో ఉద్యోగం చేశారు. అమ్మమ్మ అదే డిపార్ట్మెంట్లో క్లర్క్గా భువనేశ్వర్లో రిటైర్ అయ్యారు. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావడానికి డైరెక్ట్గా ప్రభావితం చేయలేదు, కానీ పరోక్షంగా వారి నేపథ్యం నాకు మంచి భరోసానిచ్చింది. నిజానికి మా అమ్మానాన్నలిద్దరి మూలాలూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులోనే ఉన్నాయి. అమ్మానాన్న హైదరాబాద్లో సెటిల్ కావడంతో నా బాల్యం భాగ్యనగరంలోనే. విద్యానగర్లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. పైలట్ల కోసం ప్రకటన అది. అయితే మగవాళ్లకు మాత్రమే. అప్పుడు ‘అమ్మాయిలెందుకు వద్దు’ అనిపించింది. అమ్మాయిలు విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదవరా అని కూడా అనుకున్నాను. నేను ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మానాన్న పెద్దరికపు సవరణలేమీ చేయకుండా నన్ను నేను కోరుకున్న కోర్సులో చేర్చారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అప్పట్లో నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి ఆర్మీలో పని చేయాలని ఉండేది. పరీక్షలు రాశాను, కానీ సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఆదిభట్లలో ఉన్న ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీ మా క్యాంపస్కి ప్లేస్మెంట్ గురించి వచ్చింది, అలా 2012లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ప్రొడక్షన్ ప్లానింగ్, కంట్రోల్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేయడంతో పని మీద మంచి పట్టు వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలని, అది కూడా మాన్యుఫాక్చరింగ్లోనే చేయాలనుకుని యూఎస్లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. కోర్స్ పూర్తయిన తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశాను. అది బిజినెస్ జెట్లు తయారు చేసే కంపెనీ. ఇప్పటి వరకు నాది చాలా మామూలు జర్నీనే. 2017లో పెళ్లి, అబ్బాయి నాకు బీటెక్ క్లాస్మేటే. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఏవియేషన్ ఆఫీసర్. పెళ్లి తర్వాత ఇండియాలో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందట నేను మాత్రమే జర్మనీలో ‘లిలియుమ్ ఎయిర్ క్రాఫ్ట్’ కంపెనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో అప్పుడు... అంటే 2018లో వందమంది ఇంజనీర్లలో అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఆ గుర్తింపు నాకు పెద్దగా సంతోషాన్నివ్వదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది జెండర్ సెపరేషన్తో కూడిన గుర్తింపు కాదు. వందమందిలో యాభై మంది అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మా కంపెనీలో ఎనిమిది వందల మంది ఇంజనీర్లున్నారు, వారిలో వందమంది వరకు అమ్మాయిలున్నారు. ఈ నాలుగేళ్లలో వచ్చిన పురోగతి. ఈ ఫీల్డ్లో అమ్మాయిలు నెగ్గుకురావడం కష్టమనేది అపోహ మాత్రమే. నేనిప్పుడు మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్కి హెడ్ని. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి సెలెక్ట్ చేసుకోగలిగాను. మా టీమ్లో పోలండ్, బ్రెజిల్, యూకే, యూరప్ దేశాల వాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసి పని చేయడం, వాళ్ల నుంచి పని తీసుకోవడంలో ఎక్కడా ఇబ్బందులేవీ రాలేదు. అయితే ఒక టాస్క్ ఇచ్చే ముందు వాళ్ల బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్ని అర్థం చేసుకోగలిగితే టీమ్తో పని చేయించుకోవడం ఏ మాత్రం కష్టంకాదనేది నా అభిప్రాయం. నేను టీమ్ లీడర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది మహిళలను చూశాను, వారితో పనిచేశాను కూడా. మిగిలిన అన్ని రంగాల్లోలాగానే ఈ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారు’’ అన్నారు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ వల్లూరి సుధీర. సబ్జెక్ట్ని నిరూపించుకోవాల్సిందే! ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ వంటి సాంకేతికత ఎక్కువగా ఉంటే రంగాల్లో టెక్నికల్ పీపుల్తో పని చేసేటప్పుడు వాళ్లు ఆడవాళ్ల మాటను పట్టించుకోరనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే... యంగ్ ఇంజనీర్కంటే సీనియర్ టెక్నీషియన్కి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త మార్పును తెచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్కి మనం విషయమంతా వివరించేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మనం ఒక అడుగు ముందున్నామనే విషయాన్ని నిరూపించుకోవాలి. ఈ నిరూపణ మగవాళ్లకైనా ఉంటుంది, ఆడవాళ్లకూ ఉంటుంది. నేను మహిళలకు చెప్పే మాట ఒక్కటే... మనల్ని మనం ‘ఇంజనీర్, సైంటిస్ట్, పైలట్’ అని ప్రొఫెషన్పరంగా మాత్రమే గుర్తించుకోవాలి, ‘ఉమన్ ఇంజనీర్, ఉమన్ పైలట్, ఉమన్ సైంటిస్ట్’ అని జెండర్పరంగా కాదు. అన్ని పరీక్షలనూ మగవాళ్లతోపాటు పూర్తి చేసి ఈ స్థాయికి వచ్చాం. రిజర్వేషన్లలో రాలేదు. ఇక ఉమన్ అని జెండర్తో ఐడింటిఫై అవడం ఎందుకు? – వల్లూరి సుధీర, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ – వాకా మంజులారెడ్డి -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్గా తెలుసుకునే విధంగా హ్యూమన్లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్లోని యూసీ డేవిస్లో పూర్తి చేసి హైదరాబాద్లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
Disha Bill: సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది. అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు. బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి. సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది. ∙∙∙ అది నేపాల్ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు. కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్ వేయగలిగారు. మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్కి వెళ్లబోతున్న టీసీఎస్ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు. ∙∙∙ ఆ బిల్లు దిశగా దర్యాప్తు గుంటూరు, దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్గా పని చేస్తున్నాం. నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ. దిశ బస్సులు పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్స్టేషన్లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు. కొన్నింటికి ఆధారాలుండవు! చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్ ఆటిట్యూడ్ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. – సుప్రజ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్చార్జ్, వెస్ట్ సబ్ డివిజన్, దిశ పోలీస్ స్టేషన్,గుంటూరు – వాకా మంజులారెడ్డి -
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
‘ఏ కలర్స్ అద్దమంటారు’ .. ఓ డిజైనర్ ప్రయాణం
‘‘మేడమ్! మీ వీడియోలు చూశాం. పోయిన వారం హైదరాబాద్కి వచ్చాం, మిమ్మల్ని చూసిపోదామని...’’ అని ఏలూరు దగ్గర వేల్పుచర్ల అనే గ్రామం నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు. ‘‘మేడమ్! మా అమ్మ ఇలా ఉంటారు’’ అని ఫోన్లో ఫొటో చూపిస్తూ ‘‘అమ్మకు ఏ కలర్ కాంబినేషన్లో చీరలు తీసుకోమంటారు’’ అని ఓ యువతి అడుగుతోంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ‘‘గాయత్రీ! వేర్హౌస్కి వెళ్తున్నాను’’ అని చెప్పి బయలుదేరారు. షోరూమ్ వెనుకగా ఉన్న ప్రింటింగ్ యూనిట్లో ఒక వ్యక్తి ఒక చీరను తెచ్చి బోర్డరు చూపిస్తూ... ‘‘ఏ కలర్స్ అద్దమంటారు’’ అని అడిగి ఆమె ‘పింక్’ అని చెప్పగానే తలూపుతూ వెళ్లిపోయాడు. ‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటాం. అలవాటైపోయింది. మీరు మా ఇంట్లో ఒకరిలా అయిపోయారు’’ అంటూ ఆ మహిళలు గాయత్రితో మాటల్లో పడిపోయారు. ‘‘మమ్మీ! వీడియో అప్ లోడ్ చేశాను. అమ్మమ్మ క్యారియర్ పంపించింది. ఆఫీస్ రూమ్లో పెట్టాను’’ అని క్లుప్తంగా చెప్పి మరో ఫ్లోర్లోకి వెళ్లి పోయాడు ఓ కుర్రాడు. ఇది... హైదరాబాద్, సైనిక్పురిలో ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో’ నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి డైలీ రొటీన్. ఇది ఆమె తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యం. 2008లో ఇంట్లో ఒక మూలగా ఒక టేబుల్తో మొదలైన తొలి అడుగు ఇప్పుడు పర్వత శిఖరానికి చేరువలో ఉంది. అన్నీ అమరిన దశ నుంచి జీవితం ఒక్కసారిగా పరీక్ష పెట్టింది. అంతా అగమ్యం. జీవితం తనను ఎటు తీసుకువెళ్తుందో తెలియని అస్పష్టమైన అయోమయమైన స్థితిలో వేసిన మొదటి అడుగు అది. గమ్యం కనిపించకపోయినా సరే... నీ ప్రయాణం ఆపవద్దు అనే ‘సంకల్పం’ మాత్రమే ఆమెకు తోడు. నేను కూడా నీకు తోడుగా వస్తానని భర్త నైతిక మద్దతునిచ్చాడు. ‘కుటుంబాన్ని నడిపించాల్సిన నేను వ్యాపారంలో నష్టపోయాను. నా బాధ్యతను నీ భుజాలకెత్తుకున్నావు. ఈ టైమ్లో నేను చేయగలిగింది ఇంతవరకే’ అని మాత్రం చెప్పాడాయన. పదమూడేళ్ల కిందట అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు వందమందికి పైగా ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి చేరింది. బంధువులను మొహమాట పెట్టి కస్టమర్లుగా మార్చుకోలేదామె. కస్టమర్లను ఆత్మీయ బంధువులుగా మార్చుకున్నారు. మధ్యవర్తులెవరూ లేరు! ‘‘నా కస్టమర్కు నేను మంచి క్వాలిటీ ఇవ్వాలి. ధర అందుబాటులో ఉండాలి. అందుకోసం చేనేతకారులున్న ప్రతి గ్రామానికీ వెళ్లాను. ఐదేళ్ల పాటు నిరంతర ప్రయత్నం తర్వాత నేను వారి విశ్వాసం చూరగొనగలిగాను. అప్పటి వరకు చేనేతకారులు వాళ్ల వాళ్ల గ్రామాల్లో షావుకారు చేతిలో ఉండేవారు. షావుకారు నూలు కొనుగోలు కోసం డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటాడు. కాబట్టి చేనేతకారులు నేసిన దుస్తులను షావుకారుకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేదనే విరచిత రాజ్యాంగం ఒకటి అమలులో ఉండేది. బయటి వాళ్లు ఎవరైనా సరే ఆ షావుకారు దగ్గర కొనాల్సిందే. ఏ వ్యాపారమైనా సరే... ఉత్పత్తిదారుడికీ– వినియోగదారుడికి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. నేను ఐదేళ్లు కష్టపడి షావుకారు అనే ఒక మధ్య వ్యక్తిని తొలగించగలిగాను. అలాగే నాకు ఏ కౌంట్ నేత కావాలో, ఏయే కాంబినేషన్లలో కావాలో చేనేతకారులకు ముందుగానే చెప్తాను. ఇంత పోటీలో కూడా నన్ను మార్కెట్లో నిలబెట్టింది. సౌకర్యం విషయంలో ఫ్యాబ్రిక్ ధరించినప్పుడు ఒంటికి హాయిగా అనిపించాలి. మన్నిక విషయంలో పెట్టిన డబ్బు వృథా కాలేదని సంతృప్తి కలగాలి. ఇవే నేను నమ్మిన సూత్రాలు. అనుసరిస్తున్న నియమాలు.’’ అని చెప్పారు గాయత్రి. పిల్లలకు కొంతే ఇవ్వాలి! ‘‘మరో రెండేళ్లకు యాభై ఏళ్లు నిండుతాయి. అప్పటికి షోరూమ్, వేర్ హౌస్, నగరంలో ఉన్న మూడు ప్రింటింగ్ యూనిట్లను ఒక చోటకు చేర్చాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని రకాల వస్త్రకారులను అనుసంధానం చేస్తూ నేను ఏర్పాటు చేసిన నెట్వర్క్ను నా ఉద్యోగులతో నడిపించాలని, ఇక నా పరుగులు ఆపేయాలనేది కోరిక. భగవంతుడి దయ వల్ల పోగొట్టుకున్న ఆస్తులకంటే ఎక్కువే సంపాదించుకున్నాం. పిల్లలను చదివించాం, జీవితాన్ని మొదలుపెట్టడానికి భరోసాగా కొన్ని ఆస్తులను మాత్రమే వాళ్లకు ఇస్తాం. వాళ్ల జీవితాన్ని వాళ్లే మొదలు పెట్టాలి. అలా చేయకపోతే డబ్బు మీద గౌరవం ఉండదు, జీవితం విలువ తెలియదు. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు కావాల్సిన సమయం వచ్చింది. అది నా ఉద్యోగులతోనే మొదలవుతుంది’’ అని చెప్పేటప్పుడు గాయత్రీరెడ్డిలో జీవితం నేర్పిన పరిణతితోపాటు స్థితప్రజ్ఞత కనిపించింది. అక్షరం నేర్పిన విలువలు ఇల్లు దిద్దుకోవడం, చక్కగా వండి పెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం... ఇదే నా లోకంగా ఉండేది. ఆర్థిక సమస్యలే రాకపోయి ఉంటే నాలో ఇంత శక్తి ఉందని నాకు కూడా ఎప్పటికీ తెలిసేది కాదేమో. అయితే కంచి పరమాచార్య చెప్పినట్లు మనం దేనిని పైకి విసురుతామో అది మనకు అంతకంటే వేగంగా వచ్చి చేరుతుందని నమ్ముతాను. మా వారు మధ్యప్రదేశ్లో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు తప్పని సరై నేర్చుకున్న హిందీ ఇప్పుడు నార్త్ ఇండియా పర్చేజ్కి, అక్కడి నుంచి వచ్చిన పనివాళ్లతో మాట్లాడడానికి పనికొస్తోంది. బెంగళూరులో ఉన్నప్పుడు రోజంతా ఏమీ తోచడం లేదని నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఈ రోజు నన్ను విజేతగా నిలబెట్టింది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. పదో తరగతి వరకే చదివిన నేను మా ఇంటి దగ్గరున్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చందమామ నుంచి ఆధ్యాత్మికం వరకు దాదాపుగా చదివేశాను. ఆ అక్షరజ్ఞానం నేర్పిన విలువలే నాకు యూనిట్ నిర్వహణలో ఉపయోగపడుతున్నాయి. – గాయత్రీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి -
‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ
ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్ ఫస్టియర్... చెల్లి టెన్త్ క్లాస్. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు. తెలతెలవారుతోంది. హైదరాబాద్ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్ వాకింగ్ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్ పేపర్ని రోల్ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది. మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది. ‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ. ‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది. న్యూస్పేపర్ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్ చౌరస్తాలోని పేపర్ పాయింట్కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఆన్లైన్ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్ క్లాస్, ప్రమీల ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది. బాయ్స్ మానేశారు ‘‘మా నాన్నకు న్యూస్ పేపర్ లైన్ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్ ఉండేవాళ్లు. మా లైన్లో మొత్తం ఏడు వందల పేపర్లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్ మానేశారు. బాయ్స్ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్ సరిపోయేది కాదు. పేపర్ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్ వేసిన తరవాత ఫిల్మ్ నగర్లో రేషన్ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల. రోజూ పేపర్ చదువుతాం నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం. మెచ్చుకుంటున్నారు! లాక్డౌన్ పోయి అన్లాక్ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు. – ప్రమీల పేపర్ల మధ్య పెరిగాం! మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్ల రూట్ నాది. పేపర్ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం – పవిత్ర – వాకా మంజులారెడ్డి -
డాక్టరవ్వాలని... ఓ కూరగాయలమ్మాయి ఎదురుచూపులు
‘ఒక పేదింటి బిడ్డ డబ్బు లేని కారణంగా చదువుకు దూరం కాకూడదు’ అనే స్ఫూర్తి ఏమైంది? ఒక విద్యా కుసుమం ఎందుకు వాడిపోవడానికి సిద్ధంగా ఉంది? ఎవరైనా వచ్చి పాదులో నీళ్లు పోస్తే సంపూర్ణంగా వికసించాలనే ఆశతో ఎదురు చూస్తోంది. డాక్టర్ అయి తీరాలనే కోరిక ఆ అమ్మాయి చేత ఓ సాహసం చేయించింది. తొలి అడుగు వేయగలిగింది. కానీ విధి పరీక్షల్లో తర్వాతి అడుగులు తడబడుతున్నాయి. ఇంత పెద్ద సమాజంలో పెద్ద మనసుతో ఎవరైనా ముందుకు రాకపోతారా అని బేలగా చూస్తోంది హైదరాబాద్, మోతీనగర్లోని అనూష. ‘‘నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవాలనే కోరిక ఉండేది. స్కూల్డేస్ నుంచి అదే కలతో చదివాను. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో 945వ ర్యాంకు వచ్చింది. ఎన్సీసీ, స్పోర్ట్స్ పాయింట్లు ఉంటే ఫ్రీ సీటు వచ్చేది. మా పేరెంట్స్ ఇద్దరూ ఏమీ చదువుకోలేదు. నాకు చిన్నప్పుడు ఇలాంటివి చెప్పేవాళ్లెవరూ లేరు. ఏ రిజర్వేషనూ లేదు. ఓపెన్లో సీట్ తీసుకుంటే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఏడాదికి ఏడు లక్షలుంది. ప్రైవేట్లో అయితే కోటిదాకా ఉంది. కిర్గిస్తాన్లో అయితే పాతిక లక్షల్లో కోర్సు పూర్తవుతుందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. మా ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఆ డబ్బు సమకూర్చుకోవడం కూడా జరిగే పని కాదు. అయితే మెరిట్ స్టూడెంట్ని కాబట్టి స్కాలర్షిప్లు వస్తాయని, మిగిలిన డబ్బు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చనుకున్నాను. స్కాలర్షిప్ కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టానో లెక్కేలేదు. ‘ఈపాస్’ లో అయితే ఇరవై సార్లు అప్లయ్ చేశాను. బ్యాంకులోన్ కూడా రాలేదు విద్యాలక్ష్మి పథకానికి అప్లయ్ చేసిన తర్వాత బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. కానీ ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదన్నారు. కూరగాయల బండిని ష్యూరిటీగా పెట్టుకోలేం. నీ సర్టిఫికేట్లన్నీ బాగున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉన్నా... ఆ ఇంటి మీద లోన్ ఇస్తామన్నారు. కానీ మాకు ఇల్లు లేదు. నాకు చదువుకోవడానికి సహాయం చేయమని ఎంతమంది కాళ్లమీదనో పడ్డాను. అందరమూ పని చేస్తున్నాం మా నాన్న వాచ్మన్, అమ్మ స్వీపర్గా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోంది. నెలకు తొమ్మిది వేలు వస్తాయి. ఆమె ఉదయం నాలుగు గంటలకు లేచి మార్కెట్కెళ్లి కూరగాయలు తెచ్చి, ఆరు గంటలకు తన డ్యూటీకి వెళ్తుంది. మధ్యాహ్నం తర్వాత కూరగాయలమ్మేది. ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముతున్నాను. తమ్ముడు డిగ్రీ చదువుతూ ఖాళీ సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. రోజంతా క్షణం తీరిక లేకుండా పని చేసి కూడబెట్టుకున్న డబ్బును అనారోగ్యం హరించి వేసింది. ఇక ఇప్పుడు మూడవ సంవత్సరం చదువుకు వెళ్లాలి. రెండవ సంవత్సరం ఫీజు, ఈ ఏడాది ఫీజు కలిపి పది లక్షలు కట్టాలి. నేను కాలేజ్లో అడుగుపెట్టగలిగేది ఆ డబ్బు చేతిలో ఉంటేనే’’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది అనూష. ఆమె మాటల్లో అన్ని దారులూ మూసుకుపోయాయనే దిగులుతోపాటు ఏదో ఒక దారి కనిపించకపోతుందా అనే చిరు ఆశ కూడా కనిపించింది. ఆమె ఆశ, ఆశయం నెరవేరుతాయని భావిద్దాం. విధి కూడా ఆడుకుంటోంది ఎలాగైనా డాక్టర్నవ్వాలనే ఆశతోనే కిర్గిస్తాన్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చేరాను. కిర్గిస్తాన్ వెళ్లడానికి చెవి కమ్మలతో సహా ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేశాం. చిట్టీల డబ్బులు... అంతా కలిపితే మూడు లక్షలు జమయ్యాయి. మొదటి ఏడాది ఫీజు ఆరులక్షల్లో సగం ఫీజు కట్టాను. రెండవ ఏడాదిలో ఉండగా మరో మూడు లక్షలు కట్టాను. రెండవ ఏడాది ఫీజు కట్టాల్సిన సమయంలో అమ్మకు యాక్సిడెంట్ అయింది. ఫీజు కోసం సమకూర్చుకున్న డబ్బు వైద్యానికి అయిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్లు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఫీజు కట్టకనే పరీక్షలు రాయగలిగాను. ఇంతలో కరోనా రూపంలో మరో ఉత్పాతం వచ్చి పడింది. కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్ అందరినీ వారి దేశాలకు పంపించి వేసింది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. నా వైద్యం కోసం మళ్లీ అప్పులు. ఐదు లక్షలు ఖర్చయ్యాయి. – వాకా మంజులారెడ్డి -
మనోజ్ఞ అద్దకం
పదేళ్ల కిందటి మాట. మచిలీపట్నం కలంకారీ పరిశ్రమ ఖాయిలా పడడానికి సిద్ధంగా ఉంది. పెడనలో ఉన్న అద్దకం బల్లలు నిరుత్సాహంగా ఊపిరి పీలుస్తున్నాయి. కుటుంబ వారసత్వంగా అంది వచ్చిన కళ అన్నం పెడుతుందనే భరోసా లేకపోవడంతో ఒక్కొక్కరు ఇతర మా ర్గాలకు మళ్లుతున్నారు. ఒక్కో అద్దకం బల్ల అటకెక్కుతోంది. అలాంటి సమయంలో కలంకారీ కళలో జీవితాన్ని వెతుక్కున్నారు మనోజ్ఞ. ఈ కళతో పరిచయం లేని కుటుంబం ఆమెది. అయినా ఈ కళ మీద ఇష్టంతో అద్దకపు ముద్రికను అందుకుంది. మగవాళ్లే ఒక్కొక్కరుగా దూరమవుతున్న ఈ రంగంలో పరిశ్రమ స్థాపించారు మనోజ్ఞ. ఆ రోజు ఆమె వేసిన తొలి అడుగు మరెంతో మందికి ఆసరా అయింది. ఒక విస్తారమైన కలంకారీ సామ్రాజ్యానికి పునాది అయింది. ఆమె జీవితాన్ని మనోజ్ఞంగా డిజైన్ చేసుకుని, చక్కగా అద్దుకుంది. పెళ్లి ఖర్చు నాలుగువేలు ‘‘మా సొంతూరు నూజివీడు. నాన్నగారి అనారోగ్యరీత్యా మా కుటుంబాన్ని మా మేనమామ మచిలీపట్నానికి తీసుకువచ్చారు. 2009 ఫిబ్రవరిలో నవీన్తో నా పెళ్లయింది. పెళ్లి ఖర్చు నాలుగు వేల రూపాయలు. నిరాడంబరత కోసం కాదు, అంతకంటే ఖర్చు చేయగలిగిన స్థితి లేకనే. మా వారు అప్పటికే ఫ్యాన్సీ షాప్ పెట్టి నష్టపోయి ఉన్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. పెడనలో ముద్రించిన కలంకారీ మెటీరియల్ 2,870 రూపాయలకు కొన్నాను. అదే నా తొలి పెట్టుబడి. ఆ కలంకారీ మెటీరియల్తో చీరకు బోర్డరు, బ్లవుజ్, పల్లుకి చిన్న పువ్వులు (ఆ పూలను చీర మీద అప్లిక్ వర్క్లాగా కుట్టించుకోవడమే) వచ్చేటట్లు కట్ చేసి అంచులు కుట్టి సెట్ తయారు చేశాను. అది బాగా క్లిక్ అయింది. పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చాయి. రా మెటీరియల్ (కలంకారీ డిజైన్ అద్దిన క్లాత్) అవసరం భారీగా పెరిగింది. మెటీరియల్ సరఫరా సక్రమంగా కొనసాగి ఉంటే నాకు అద్దకం పరిశ్రమ స్థాపించాల్సిన అవసరం ఉండేది కాదు. సహాయ నిరాకరణ! కలంకారీ పరిశ్రమ కుటీర పరిశ్రమగా విస్తరించిన పెడనలో దళారీ వ్యవస్థ పాతుకుపోయి ఉండేది. మాకు మెటీరియల్ సమయానికి అందేది కాదు. కొన్ని సందర్భాలలో నాణ్యత లేని మెటీరియల్ వచ్చేది. అలాంటి మెటీరియల్తో వ్యాపారం చేస్తే మా క్రెడిబులిటీ దెబ్బతింటుంది. అందుకోసం సొంతంగా అద్దకం పరిశ్రమ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాం. అలా 2014లో దసరా రోజున కలంకారీ ప్రింటింగ్ యూనిట్, 2015 ఫిబ్రవరిలో గార్మెంట్స్ యూనిట్ ప్రారంభించాం. పని నేర్చుకున్నాను! కలంకారీ మీద ఇష్టంతో అద్దకం కూడా నేర్చుకున్నాను. కానీ అద్దకం పనికి విశాలమైన ప్రాంగణం, పెద్ద షెడ్, టేబుళ్లు కావాలి. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్కు డబ్బు లేదు. అప్పుడు మా నవీన్ ఫ్రెండ్ కిషోర్యాదవ్ గారు అర ఎకరం స్థలాన్ని, అందులో నిర్మించిన విశాలమైన షెడ్ని వాడుకోమన్నారు. కలంకారీ కళ మరుగున పడకుండా ప్రపంచ ప్రఖ్యాతి సాధించడానికి తన వంతు సహాయంగా ఆయన ఆ షెడ్ను ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మా యూనిట్ రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకలా మారింది. మా శ్రమకు ఫలితం త్వరగానే దక్కింది. ఆరునెలల్లో బ్రేక్ ఈవెన్ వచ్చింది. మేము ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత యూనిట్ని రాయవరానికి మార్చాం. ఏడు వందల ప్యాటర్న్లా! చీరల మీద అనేక ప్రయోగాలు చేశాను. ఆర్గండి, క్రేప్, సిల్క్, నెట్... ఇలా రకరకాల క్లాత్ల మీద కలంకారీ అద్దకాలు వేశాం. ఆ ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక్క చీరల మీద అద్దకంలోనే ఏడు వందల ప్యాటర్న్లు రూపొందించాం. చుడీదార్లలో 55, బెడ్షీట్లలో 180 ప్యాటర్న్లను రూపొందించాం. అద్దకంలో ప్రతి దశనూ నోట్స్ రాసుకుంటాను. తర్వాత ఏం చేయాలో ఒక స్టిక్కర్ మీద రాసి అతికిస్తాను. ‘కరక్కాయ ప్రాసెస్ అయింది– బ్యాక్గ్రౌండ్ వేయాలి, బ్యాక్ గ్రౌండ్ అద్దకం అయింది– అవుట్లైన్ అద్దాలి, అవుట్లైన్ అయింది– ఫిల్లింగ్ అద్దాలి’ ఇలాగన్నమాట. దాంతో పనివాళ్లకు రోజూ నేను దగ్గరుండి ఏ క్లాత్ మీద ఏది అద్దాలనే ఆదేశాలు ఇవ్వాల్సిన పని ఉండదు. పేరు వెనుక... మా పరిశ్రమ పేరు మానవ్... అంటే ఏమిటని అందరూ అడుగుతుంటారు. నా పేరు మనోజ్ఞలోని మొదటి రెండు (‘ఎంఎ’) అక్షరాలు, మా వారు నవీన్ పేరులోని మొదటి మూడు (‘ఎన్ఎవి’) అక్షరాల సమాహారమే మానవ్’’ అని వివరించారు మనోజ్ఞ. నిపుణుల తయారీ! ఇరవై మంది మహిళలకు ఆరు నెలల పాటు నెలకు నాలుగు వేల రూపాయలు ఉపకార వేతనం ఇస్తూ పని నేర్పించాం. ఇప్పుడు వారిలో నెలకు తొమ్మిది–పది వేలు సంపాదించుకునే వాళ్లున్నారు. వీళ్లంతా 18 ఏళ్ల నుంచి 30–35 ఏళ్ల లోపు వారే. ఈ ప్రయత్నం ద్వారా మరో 30 సంవత్సరాల వరకు కలంకారీ కళను బతికించడానికి మా వంతు ప్రయత్నం చేశామనే సంతృప్తి కలుగుతోంది. వీరంతా ఈ వృత్తిలో సంతోషంగా ఉంటే మరో తరం కూడా తయారవుతుంది. నేను ఉపాధి పొందడంతోపాటు కొడిగడుతున్న కలంకారీ పరిశ్రమను నిలబెట్టాలనేదే నా ప్రయత్నం. కలంకారీ కాకుండా వేరే చెప్పడానికి నా జీవితంలో ఏమీ లేదు. మా ఇద్దరమ్మాయిలకు కూడా ఈ పని నేర్పిస్తాను. – తుమ్మలపల్లి లక్ష్మీ మనోజ్ఞ ‘మానవ్ కలంకారీ’ వ్యవస్థాపక నిర్వాహకురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎక్మోర్ లైఫ్
గుండె ఆగిపోయినా ఊపిరితిత్తులు పనిచేయకపోయినా ప్రాణాల్ని నిలబెట్టే మెషీన్ మోర్ లైఫ్ ఇచ్చే ట్రీట్మెంట్ ‘ఎక్మో’ గుప్పెడంత గుండె చేసే సంక్లిష్టమైన పనులను, ఊపిరితిత్తుల పనిని ఎక్మో మెషీన్ చేస్తుంది. దీని సహాయంతో దేహంలోని భాగాలన్నింటికీ ఆక్సిజెన్, రక్తం సరఫరా అవుతుండడంతో ఆయా భాగాలు వాటి పనితీరును సక్రమంగా నిర్వహించగలుగుతాయి. ఈ మెషీన్తో పేషెంటుకి బయటి నుంచి లైఫ్ సపోర్టు ఇస్తూ దేహంలో అనారోగ్యానికి గురైన అవయవానికి చికిత్స నిర్వహిస్తారు. ఈ టెక్నాలజీ గుండె కంటే శ్వాసకోశ వ్యవస్థలో లోపాలను సరి చేయడానికి బాగా ఉపకరిస్తుంది. హార్ట్ పేషెంట్లలో సక్సెస్రేట్ 40 నుంచి 50 శాతం ఉంటే, లంగ్స్ పేషెంట్లలో 60- 70 శాతం సక్సెస్ రేట్ ఉంటుంది. హార్ట్ పేషెంట్లలో గుండె సాధారణ స్థితికి రావడం కష్టమనిపించినప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ను ప్రయత్నించాల్సి ఉంటుంది. కానీ... అందులో సక్సెస్రేట్ చాలా తక్కువ. దేహం ఫారిన్ బాడీని అంత సులువుగా ఆమోదించకపోవచ్చు. అప్పుడు మళ్లీ గుండె రికవర్ అయ్యే వరకు ఎక్మో సపోర్టు తీసుకోవాల్సిందే. అయితే ఎక్మో పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పడం కష్టమే. అది పేషెంట్ వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యం, రోగనిరోధక శక్తి వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్మో ఎలా పని చేస్తుంది? పేషెంటు తొడలోని సిర (వీన్) నుంచి ట్యూబు ద్వారా రక్తాన్ని మెషీన్లోని ట్యూబుకు అనుసంధానం చేస్తారు. అది మెషీన్లోని నియమిత పైపుల ద్వారా ప్రయాణించి మెంబ్రేన్ అరలోకి చేరుతుంది. అక్కడ కార్బన్డయాక్సైడ్ వేరవుతుంది. అక్కడి నుంచి ఆక్సిజనేటర్లోకి చేరి ఆక్సిజెన్తో కలిసి రక్తం ప్యూరిఫై అవుతుంది. శుద్ధి అయిన రక్తం మరొక ట్యూబ్ ద్వారా గుండె దగ్గర ఉండే ధమని (ఆర్టరీ)కి చేరుతుంది. అక్కడి నుంచి దేహంలోని అన్ని భాగాలకూ ప్రసరిస్తుంది. దేహ భాగాల నుంచి సిరల ద్వారా చెడు రక్తాన్ని సేకరించి, దానిని మంచి రక్తంగా మార్చి ధమనుల ద్వారా దేహమంతటికీ చేరవేస్తుంది. మానిటర్ మీద పల్స్రేటు, రక్తం సరఫరా వేగం నమోదవుతుంటుంది. ఎక్మో పరికరం గుండె చేయాల్సిన పనిని, శ్వాస వ్యవస్థ పనిని కూడా చేస్తుంది. వైద్యం ద్వారా శ్వాస వ్యవస్థ, గుండె లోపాలను సరిదిద్దే వరకు ఈ పరికరం వాటికి విశ్రాంతినిస్తుంది. ఓ వారం ఆగాల్సిందే! ఎక్మో పరికరంతో సపోర్టు మొదలుపెట్టిన తర్వాత రోగి స్పందన కోసం ఐదు నుంచి ఏడు రోజులు ఆగాల్సి ఉంటుంది. వారం తర్వాత ఈ యంత్రం నుంచి అందే సపోర్టును కొద్దిగా తగ్గించి దేహంలో స్పందనలను గమనిస్తారు. పల్స్, బిపిని పరీక్షిస్తూ, ఎకో పరీక్షలు కూడా చేస్తారు. ఇది నిపుణులైన వైద్యం బృందం ఆధ్వర్యంలో జరగాలి. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడు రక్త సరఫరా, పల్స్ ఒక మోస్తరుగా పని చేస్తున్నా రోగి చక్కగా స్పందిస్తున్నట్లే చెప్పాలి. అలాంటప్పుడు క్రమంగా ఎక్మో సపోర్టు తగ్గిస్తూ గుండె, శ్వాసవ్యవస్థ పూర్తి స్థాయిలో సొంతంగా పని చేసే వరకు పర్యవేక్షిస్తారు. దీని అవసరం ఎప్పుడు? ఎక్మో ట్రీట్మెంట్ సాధారణంగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్ అయిన సందర్భాలలో నేరుగా ఉపయోగిస్తారు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే డయాలసిస్ చేయాల్సినప్పుడు దీని సహాయాన్ని పరోక్షంగా తీసుకుంటారు. కిడ్నీ ఫెయిల్యూర్లో పేషెంటు దేహం నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి సేకరించకుండా ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా చేస్తారు. కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించిన వెంటనే పేషెంటుకు సిపిఆర్ (కార్డియో పల్మనరీ రెససిటేషన్) చేస్తారు. అంటే గుండె మీద ఒత్తిడి కలిగిస్తూ గుండె తిరిగి కొట్టుకునే అవకాశం కోసం ప్రయత్నించడం. పేషెంటు ప్రాణాలను కాపాడడానికి సిపిఆర్ చేసి బ్లడ్ ప్రెషర్ మెయింటెయిన్ చేస్తూ ఎక్మో మెషీన్ను సిద్ధం చేసుకోవాలి. పేషెంటును ఎక్మో పరికరానికి అనుసంధానం చేసిన క్షణం నుంచి దేహంలో అన్ని అవయవాలూ యథాతథంగా పని చేస్తుంటాయి. అలా ఎన్ని రోజులైనా కొనసాగించవచ్చు. ఏడెనిమిది వారాలపాటు ఉంచినా పేషెంటు కోలుకునే సూచనలు లేవనిపించినప్పుడు వైద్యబృందం ఆ సంగతిని పేషెంటు బంధువులకు తెలియ చేస్తుంది. హార్ట్ పేషెంట్ల విషయంలో ఎక్మో ట్రీట్మెంట్ చివరి ప్రయత్నం అనే చెప్పాలి. ప్రయత్నించకుండా వదిలేయడం కంటే ప్రయత్నించి ఫలితాల కోసం ఎదురు చూడడాన్నే వైద్యరంగం కోరుకుంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్మో ద్వారా కోలుకున్న కేసులు తప్పని సరిగా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఒకింత తక్కువ. ముందుగా చెప్పుకున్నట్లు పేషెంటు వయసు, ఇతర అనేక అంశాలతోపాటు దేహం ట్రీట్మెంట్కి స్పందించడం వంటివన్నీ కీలకమే. ఇది ఖరీదైన వైద్యం! ఎక్మో పరికరాలు హైదరాబాద్లో ఏడెనిమిదికి మించి లేవు. ఈ ట్రీట్మెంట్లో తొలిరోజే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చవుతుంది. వయసులో ఉండి, తగినంత డబ్బు ఉన్న సందర్భాలలోనే ఇది సాధ్యమవుతుంది. ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ ప్యాకేజ్లలో ఇది చేరలేదు. ప్రభుత్వం పూనుకుంటేనే ఇది సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. వెంటిలేటర్కీ ఎక్మోకీ తేడా! వెంటిలేటర్ ద్వారా లంగ్స్లోకి నేరుగా ట్యుబ్ ద్వారా గాలిని పంపిస్తారు. ఆ గాలిని తీసుకుని మిగిలిన పని మొత్తం శ్వాసకోశ వ్యవస్థ చేసుకోవాలి. వెంటిలేటర్ నుంచి అందిన గాలిని దేహం స్వీకరించలేకపోతున్నప్పుడు ఎక్మో సేవలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. దీని ద్వారా ఊపిరితిత్తులకు కొంత విశ్రాంతినిచ్చినట్లవుతుంది. అలాగే వెంటిలేటర్ వాడినప్పుడు ట్యూబు ద్వారా లంగ్ ఇంజ్యూరీ రావచ్చు. ఎక్మోతో ఆ ఇబ్బందులు ఉండవు. ఈసిఎంఓ... ఎక్మో... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితి విషమించిన నేపథ్యంలో తరచుగా వినిపించిన మాట. ఈసిఎంఓ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్. దీనిని ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్టు అని కూడా వ్యవహరిస్తారు. ఈ టెక్నాలజీతో శ్వాసకోశ, గుండె సమస్యలు ఎదురైనప్పుడు పేషెంటుకి బయటి నుంచి మెడికల్ సపోర్టు అందిస్తారు. - వాకా మంజులారెడ్డి డాక్టర్ కిశోర్ జయంతి పీడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ అండ్ ఎక్మో స్పెషలిస్ట్, స్టార్ హాస్పిటల్ హైదరాబాద్. గుండెపోటుకూ...గ్యాస్కూ తేడా! గుండెపోటు లక్షణాలూ, గ్యాస్ పైకి ఎగజిమ్మినప్పుడు కనిపించే లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దాంతో అది గుండెపోటా లేక అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్ సమస్యా అన్నది తెలియక కొందరు అయోమయానికి గురవుతుంటారు. సాధారణంగా చాలామంది గుండెపోటు, గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని మీరు భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెనొప్పి (యాంజైనా)తో పాటు తేన్పులు వస్తుంటాయి. అందుకే దీన్ని గ్యాస్ సమస్యగా అపోహపడుతుంటారు. కొంతమంది శారీరక శ్రమ / ఉద్వేగం తర్వాత 5 - 15 నిమిషాల పాటు నొప్పి ఉంటుంది. మరికొందరిలో ఇది 20 నిమిషాలు కొనసాగుతుంది. నిమిష నిమిషానికీ చెమటలు పట్టడం పెరుగుతూ, వాంతులు, శ్వాస అందకపోవడం, చివరకు స్పృహ తప్పడం కూడా జరగవచ్చు. అప్పుడు దాన్ని గుండె సమస్యగానే పరిగణించాలి. ఉపశమన మందులు వాడినా.... నొప్పి తగ్గకపోతే సత్వరం రోగిని హాస్పిటల్కు తరలించి చికిత్స చేయాలి. పైన పేర్కొన్నట్లు నొప్పి తగ్గకుండా అదేపనిగా కొనసాగుతూనే ఉంటే పూర్తిగా గుండె సంబంధితమైన నొప్పిగా పరిగణించాలి. డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ హైదరాబాద్. -
గడుసు దెయ్యం
చేతనబడి సాధారణంగా... దెయ్యం మనిషిని పట్టుకుంటుంది. మరి, మనిషే దెయ్యాన్ని పట్టుకుంటే? అక్కడో కథ ఉంటుంది. వ్యథ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నది వేరే టాపిక్. ఈ కథలోని అమ్మాయి దెయ్యాన్ని పట్టుకుంది. పట్టుకుని ఏం చేసింది? ఏం సాధించింది? చదవండి. మాఘమాసం. ‘ఇదిగో.. వెళ్లిపోతున్నా’నన్న సంకేతాలిస్తూనే మధ్యరాత్రి రగ్గు వెతుక్కునేటట్లు చేస్తోంది చలి. పగలవగానే సూర్యుడూ బద్దకంగానే ఒళ్లు విరుచుకుంటున్నాడు. ఉండీలేనట్లున్న చలి; లేనట్లు, ఉన్నట్లున్న గోరువెచ్చని ఎండ. పెళ్లి పనులు చేసుకోవడానికి, పెళ్లికి హాజరయ్యే వారికి హాయైన వాతావరణం ఇది. ఉదయం పది గంటలు. కల్యాణిని పెళ్లి కూతురిగా అలంకరిస్తున్నారు. ఇంటి ముందు పెళ్లిపందిరి. బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు. పట్టుచీర కట్టుకున్న వధువు మండపంలోకి అడుగుపెట్టింది. కొబ్బరికాయను పూజారి చేతిలో పెట్టి పీటల మీద కూర్చుంది. పూజారి ఇచ్చిన అక్షతలను గౌరీదేవి మీద వేయకుండా పూజారి ముఖం మీదకు చల్లింది! పూజారి ఖంగుతిన్నాడు. అంతలోనే సర్దుకుని ‘గౌరీదేవికి పూజ చేయమ్మా’ అన్నాడు అనునయంగా. అమ్మాయి కళ్లెర్రబడ్డాయి. బాడీ లాంగ్వేజ్ మారింది. ‘ఎందుకు గౌరీ పూజ, ఎవరికి పెళ్లి చేస్తున్నావ్’ అంటూ పూజ సామగ్రిని చిందరవందర చేస్తోంది. వేదిక కింద కూర్చున్న వాళ్లకు పరిస్థితి అర్థంకావడం లేదు. ‘పెళ్లి కూతురికి దెయ్యం పట్టినట్లుంది’... గుసగుసలాడుతున్నారు వేదిక మీదున్న మహిళలు. ‘ఆ...’ అంటూ కంగారుపడ్డారు పెళ్లికొడుకు బంధువులు. వెంటనే వేదిక దిగి ఓ పక్కగా గుమిగూడి... ‘పెళ్లిచూపులప్పుడు బాగానే ఉందా, అప్పుడెవరెవరెళ్లారు, వాళ్లింట్లో ఇంకెవరికైనా గాలి పట్టిందా...’ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆరా తీస్తున్నారు. ఈ మాటలన్నీ పెళ్లికూతురి బంధువుల చెవిన కూడా పడుతున్నాయి. ‘లక్షణంగా చదువుకుంటున్న పిల్ల. ఎప్పుడూ ఇలాంటిది లేదు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు దెయ్యం పట్టడమేంటి?’ ఆందోళన మొదలవుతోంది వారి గుండెల్లో. అబ్బాయి వాళ్లు ఏమనుకుంటారో ఏమో... పెళ్లి ఆగకుండా మూడుముళ్లు పడితే చాలు’ ఆని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంటోంది అమ్మాయి తల్లి రాణెమ్మ. తండ్రి ‘బాణు’ ముఖం ఎర్రగా కందగడ్డలా ఉంది. అమ్మాయి మేనమామలు చొరవ తీసుకుని పెళ్లికొడుకు అన్నావదినలకు నచ్చచెబుతున్నారు. ఎలా స్పందించాలో తెలియని అయోమయం వారిది! నీ కోరికలు చెప్పమ్మా! దెయ్యం... కోరిన కోరికలు తీరిస్తే వదులుతుందని నమ్మకం. ఇద్దరు మహిళలు ధైర్యం చేసి ‘నీకేం కావాలమ్మా’ అనగానే... రకరకాలుగా నోరంతా తెరిచి విచిత్రంగా అభినయిస్తూ ‘మాంసం, చేపలు, కోళ్లు...’ జాబితా చదువుతోంది. ‘అమ్మో! ఇది రాకాసి దెయ్యమే...’ నిర్ధారణకు వచ్చేశారు పెళ్లికొడుకు బంధువులు. మంచి దెయ్యమైతే పూలు, చీరలు, ఆకు, వక్క, తాంబూలం వంటివి అడుగుతుందని, అవి పెద్దగా హానికరం కాదని, మాంసం అడిగిన దెయ్యాలు భయంకరమైనవని, అవి ప్రాణాన్ని బలి తీసుకునే వరకు వదలవని నమ్ముతారు. పెళ్లి కూతురు మాంసం అడగడంతో ... ‘అసలే పెద్ద దిక్కు లేని కుటుంబం మాది. అమ్మానాన్నలు లేని వాడిని అన్నావదినలు పట్టించుకోకుండా వదిలేశారంటారని బాధ్యతగా పెళ్లి చేస్తున్నాం. ఈ దెయ్యాన్ని ఇంటికి తీసుకెళ్తే మాలో ఎవర్ని మింగుతుందో ఏమో’ అని మనసులో ఉన్న భయాన్ని కక్కేసింది పెళ్లికొడుకు వదిన. అంతే... అబ్బాయి వాళ్లంతా ఒక్కొక్కరుగా మాయమయ్యారు. గతం మెదిలింది! ఇంతలో అమ్మాయి పీటల మీద నుంచి లేచి నిలబడింది. తండ్రిని ‘ఏరా’ అని సంబోధిస్తోంది. బాణు పరుగెత్తుకుంటూ వెళ్లి కూతురి ఎదురుగా నిలబడ్డాడు. కూతురి మాటల్ని బట్టి ఆమెను పూనింది తన తండ్రని భావించాడతడు. ‘పిల్లకు ఇష్టం లేని పెళ్లి చేస్తావురా, నేన్నీకు అట్లనే చేసిన్నా’ అంటూ రంకెలు వేస్తోంది. నిలువునా కూలబడిపోయాడతడు. బంధువులు ధైర్యం చెబుతున్నారు. ఆడవాళ్లు పెళ్లికూతురిని శాంత పరుస్తున్నారు. బంధువుల్లో ఓ పెద్దాయన చొరవగా బాణుతో ఓ మాటన్నాడు. ఆ మాటతో బాణు కళ్ల ముందు ‘నాగు’ మెదిలాడు. అతడి కొడుకులు సునంద్, ప్రమోద్లకైతే గతంలో.. కల్యాణి జోలికి రావద్దని నాగును మందలించిన సంఘటన కూడా కళ్ల ముందు మెదిలింది. సందేహంగా తండ్రి వైపు చూశారు. ‘మేము మాట్లాడతాం’ అంటూ మరికొందరు ఆత్మీయులు ముందుకొచ్చారు. నాగు కూడా ఆ పెళ్లికి వచ్చాడు! అయితే పెళ్లి ఆగిపోయింది. ఇంకా అక్కడే ఉంటే ఏం బావుంటుందని వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు నాగు, అతడి అన్నలు. ‘కల్యాణిని పెళ్లి చేసుకుంటావా’ అని నాగును అడగ్గానే... ‘నాకిస్తారా’ అంటూ బదులు ప్రశ్నించాడు నాగు. ‘మేమిప్పుడే వస్తా’మని వధువు గదిలోకి వెళ్లారు పెద్దలు. ‘నాగును పెళ్లి చేసుకోవడానికే ఇదంతా’ అనేసిందా అమ్మాయి. ఆ ఒక్క సందర్భం మినహా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ అమ్మాయికి దెయ్యం పట్టనేలేదు. పెద్దవాళ్లకు పెద్ద మనసుండాలి పెద్దవాళ్లు... పెద్దవాళ్లమనే మొండితనంతో ఇష్టంలేని పెళ్లిని పీటల వరకు తీసుకురాకపోయి ఉంటే ఆ అమ్మాయికి అసలు దెయ్యమే పట్టేది కాదు. ఒక మూర్ఖత్వం నుంచి తప్పించుకోవడానికి ఈ మూఢత్వాన్ని ఒంటబట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోవడానికి సరదాగానే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఒక అమ్మాయి పడిన ఆవేదనను వివరించడానికి మాటలు చాలవు. కల్యాణి ధైర్యం ఉన్న అమ్మాయి. దెయ్యం డ్రామాతో కథను సుఖాంతం చేసుకుంది. కానీ చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మౌనంగా రోదిస్తూ జీవిస్తుంటారు. మరికొంత మంది జీవితాన్ని అంతం చేసుకుంటారు. అందుకే... తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్లను ప్రేమించినంతగా వాళ్ల ఇష్టాల్నీ ప్రేమించగలగాలి. పిల్లల ప్రేమలో ఆకర్షణ తప్ప జీవితానికి బంధం ఏర్పడే భరోసా లేదనిపించినప్పుడు ఆ విషయాన్ని వారితోనే మాట్లాడాలి. వారిని మాట్లాడనివ్వాలి. పిల్లల్ని కన్విన్స్ చేయాలి. తల్లిదండ్రులు ఏది చెప్పినా పిల్లల పట్ల ప్రేమతోనే చెబుతారనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి. పిల్లల ఎంపిక బావుందనే భరోసా కలిగితే పెద్దలూ ఒప్పుకోవాలి. అలాగే పేరెంట్స్ చెప్పిన విషయాన్ని ఓ క్షణం పాటు వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచిద్దాం అని పిల్లలూ అనుకోవాలి. వాళ్లనుకోకపోతే తల్లిదండ్రులే ‘మా స్థానంలో నిలబడి ఆలోచించ’మని ఓ రిక్వెస్ట్ చేస్తే పోయేదేమీ ఉండదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: వ్యక్తుల పేర్లు మార్చాం. నాగు ఎవరు? అనంతపురం జిల్లా, ముదిగుబ్బ గ్రామంలో బాణు పొలాన్ని కౌలు చేసేవాళ్లు నాగు అన్నలు. ఆ కుటుంబంతోదూరపు బంధుత్వం కూడా ఉంది. ముగ్గురన్నలు కష్టపడుతూ చిన్నవాడిని చదివించారు. అనంతపురం కాలేజీలో నాగు డిగ్రీ చదివేటప్పుడు కల్యాణి ఇంటర్ చదివేది. ఒక ఊరి వాళ్లు, తెలిసిన వాళ్లు కావడంతో కలిసి ప్రయాణించేవారు. సాన్నిహిత్యం పెరుగుతుందేమోనని సందేహ పడిన కల్యాణి అన్నదమ్ములు నాగును మందలించారోసారి. అప్పటి నుంచి కల్యాణి, నాగుల సాన్నిహిత్యం పెరిగింది. ప్లాన్ లేదు కానీ... ప్రేమ ఉంది నాగుతో ‘కల్యాణికి దెయ్యం ప్లాన్ ఇచ్చింది నువ్వేనా’ అంటే ‘అదేమీ లేదబ్బా’ అన్నాడు కంగారుగా. ‘ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతుంటే బాధతో ఆ పరిసరాల్లోకి రాకుండా దూరంగా ఉంటారు ఎవరైనా. మరి నువ్వు పెళ్లి పందిట్లో ఎందుకున్నావు’ అని అడగ్గానే... నవ్వుతూ ‘పోనివ్వకూడదూ’ అని... ‘ఆ అమ్మాయి ఎప్పుడైనా ప్రేమిస్తున్నానని నాతో చెప్పిందా, లోపలే దాచుకుంది. నాకు మాత్రం చెప్పాలని ఉండేది. వాళ్ల డబ్బు చూసి భయమేసేది’ అన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఎం.ఎ, బిఈడీ చేసి, ఇప్పుడు బెంగళూరులో టీచర్లుగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నాలుగేళ్ల కొడుకుతో ఆనందంగా జీవిస్తున్నారు. - ఎస్. శంకర శివరావు, కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ -
బిడ్డ పేలిక
పురిటినొప్పుల కంటే భరించలేని నొప్పులు ఏవో చెప్పుకోండి?! గొడ్రాలి నొప్పులు! ఈ నొప్పులు కడుపులోంచి తన్నుకురావు. సమాజమే స్వయంగా వచ్చి తన్నిపోతుంది. ఎలాగైనా ఈ నొప్పుల్నుంచి బయటపడాలి. ఒక పేలిక దొరికినా పట్టుకుని ఈ గొడ్రాలి సముద్రాన్ని ఈదేయాలి. కానీ... అదే పేలిక.. ముంచింది! బిడ్డ అచ్చం వాళ్ల నాన్న పోలికే... మా తమ్ముణ్ని చూసినట్టే ఉంది... మేనల్లుడి బుగ్గలు పుణుకుతూ మురిసిపోతోంది మేనత్త. రంగు మేనమామది... అంటూ నచ్చని వాటిని అవతలి వాళ్ల మీదకు తోసేసే ప్రయత్నం చేస్తోంది నానమ్మ. వాళ్లమ్మ కళ్లలాగానే చెంపకు చారడేసి ఉన్నాయి... అంటూ మనవడి అందంలో తన కూతురి భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తోంది బిడ్డ అమ్మమ్మ. పోలికలు ఎవరివైతేనేం... ఎలా ఉంటేనేం... కన్నొంకర కాలొంకర లేకుండా సక్కంగా పుట్టాడు... బంగా...రయ్య... వీడి తాతలాగానే మంచిపేరు తెచ్చుకోవడం నా కళ్లతో చూడాలి... అంటూ బిడ్డ తాతమ్మ మంచంలో కూర్చుని బుడ్డోడి భవిష్యత్తును రీళ్లురీళ్లుగా విజువలైజ్ చేసుకుంటోంది. బిడ్డను చూడడానికి వచ్చి వెళ్లే బంధువులు, స్నేహితులతో ఇల్లు సందడిగా ఉంది. అందరిలా ఆ ఊళ్లోని ఒకామె కూడా వచ్చి బిడ్డను చూసి, తల్లిని పరామర్శించి చాలాసేపు ఉంది. ఆనక వెళ్లలేక వెళ్లలేక, తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోయింది. మరుసటి రోజు కూడా వచ్చింది. బిడ్డ మంచాన్ని వదలకుండా దగ్గరే కూర్చుంటోంది. కొంతసేపటికి అయిష్టంగా వెళ్తోంది. నాలుగైదు రోజులు గడిచాయి. హటాత్తుగా ఒకరోజు నుంచి రావడం మానేసింది. ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిడ్డ తాతమ్మ ఊరుకోలేదు. కోడలికి రహస్యంగా ఏదో చెప్పింది. ఆమె గొంతులో ఆదుర్దా, ముఖంలో ఆందోళన. చెప్పడం పూర్తి కాకనే కోడలి ముఖంలోనూ రంగులు మారాయి. ఆవేశంతో ముఖం జేపురించింది. భర్త కోసం వెతికింది. ఆ రోజు సాయంత్రానికి రచ్చబండ దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం. అందరి ముఖాలూ ఆగ్రహావేశాలకు ప్రతీకల్లా ఉన్నాయి. అందరి చూపు ఒక మహిళ మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆమె పెడరెక్కలు విరిచి, చెట్టుకి కట్టేశారు. ఆమె జుట్టు రేగి చింపిరిగా చిందరవందరగా ఉంది. దుస్తులు చిరిగి ఉన్నాయి. చెమటలు కారుతున్నాయి. ఒంటి మీద దెబ్బల వాతలు, నెత్తుటి చారికలు. ఆమె మాట్లాడే ఓపిక కూడా లేనట్లు తల వాల్చేసి నిస్సహాయంగా ఉంది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? బాణామతి... ‘నిజమే ఆమె బాణామతి చేస్తోంది’ అందరి ఆరోపణా అదే. ‘ఆమె బాణామతి చేయడం మీరు చూశారా’ అని జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరోప్రశ్న అంతే సూటిగా వచ్చింది. ‘పురిట్లో బిడ్డ పక్కకేసిన కోకను చింపుకెళ్లినామె బాణామతి చేయకపోతే ఇంకేం చేస్తుంది’ ఆగ్రహంగా ప్రశ్నించాడు బిడ్డ తాత. ఆ పక్కనే వాళ్ల బంధువులు ఆమె మీదకురకడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడడానికి నోరు పెగలని స్థితిలో తనకేమీ తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపుతోందామె. అత్త ఆరళ్లకు భయపడి... ఆ అమాయకురాలి గతంలోకి వెళ్తే... ఆమెకి పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. మన గ్రామాల్లో ఒక మహిళను రాచి రంపాన పెట్టడానికి ఈ ఒక్క కారణం చాలు. ‘నీకు పిల్లలు పుట్టేట్టు లేరు. నా కొడుక్కేం తక్కువ... మరో పెళ్లి చేస్తే ఏడాది తిరక్కుండా తండ్రవుతాడు’ అంటూ అత్త సాధింపులు. ఇంట్లో తన స్థానం పదిలంగా ఉండాలంటే ఓ బిడ్డను కనితీరాలి. బిడ్డలు పుట్టే మంత్రం ఏదైనా ఉంటే బావుణ్ను. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఇలాంటి అమాయకుల కోసమే కాచుకుని ఉండే మంత్రగాడు ఆ క్షణంలో ఆమెకు ఆపద్బాంధవుడిలా కనిపించాడు. వారం వారం అతడిని దర్శించుకుంటోంది. పండ్లు, ప్రదక్షిణలు, దక్షిణలు సమర్పించుకుంటూనే ఉంది. ఆమె కాయకష్టం చేసి దాచుకున్న పైసలు అయిపోయాయి. పుట్టింటి వాళ్లు పెట్టిన బంగారమూ అయిపోయింది. ఆమె అమాయకంగా అడిగే ప్రశ్నలతో సహజంగానే స్వామీజీ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి స్వామీజీ ఓ ప్లాన్ వేశాడు. ‘పురిట్లో బిడ్డ పక్క చించి చిన్న ముక్క తెస్తే దాంతో పూజ చేస్తాను. అప్పుడు నీకు బిడ్డలు పుడతారు’ అని నమ్మబలికాడు. ఆమె నమ్మింది. మంత్రగాడు చెప్పినప్పటి నుంచి ఊళ్లో ఎవరు బిడ్డను కంటారా అని ఎదురు చూసింది. తనకు తెలిసినావిడ నెలతప్పినప్పటి నుంచి ఆమె ప్రసవం కోసం ఎదురు చూసింది. కొన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. బాలింతను పరామర్శించి, బిడ్డను చూడాలనే వంకతో ఆ ఇంటికి తరచూ వెళ్లేది. ఓ రోజు తననెవరూ చూడట్లేదనుకుని రహస్యంగా బిడ్డ పక్కకేసిన పాత చీర నుంచి చిన్న ముక్కను చించుకుని వెళ్లిపోయింది. ఎంత జాగ్రత్తగా చేసినా, మంచంలో ఉన్న పెద్దావిడ కంట్లో పడనే పడింది. ఎందుకిలా చేసిందనే సందేహాలు కూడా తలెత్తాయి. బాణామతి చేయడానికేమోనని అనుమానించారు. తనకు బిడ్డల్లేరు. కాబట్టి బిడ్డలు పుట్టిన వాళ్లను చూసి ఓర్వలేక బాణామతి చేస్తోందేమో! అని మరో సందేహం. అది కేవలం సందేహమే, అయితే ఇదే నిజమని ఊరు ఊరంతా ఆరోపించింది. బాణామతి ఉందని కానీ లేదని కానీ వాళ్లలో ఎవరూ చెప్పలేరు. కానీ ఒక అమాయకురాలిని వధ్యశిల మీద నిలబెట్టడానికి మాత్రం ఎవరూ వెనుకాడలేదు. తల్లి కావాలనే ఆరాటంతో ఆమె మంత్రగాడిని ఆశ్రయిస్తే, ఆ మంత్రగాడి మోసం, అవకాశవాదం ఆమెను ఊరి ముందు దోషిలా నిలిపాయి. ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆమెను వదిలి పెట్టారు. ఇక్కడ మనసును కలిచి వేసే లౌక్యమూ ఉంది. నిందారోపణలతో శిక్షించడానికి వెనుకాడని జనం, పొరబడ్డామని ఒప్పుకోవడానికి ముందుకురావు. అజ్ఞానాంధకారంలో మూర్ఖంగా ప్రవర్తించాం- అని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంది. పైగా అదే అహం ముసుగులో ఊరంతా కలిసి ‘పాపం అమాయకురాలు క్షమించేద్దాం’ అని తీర్మానించేశారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నచ్చచెప్పడం చాలా కష్టం అయింది ఇది నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని శివనేనిగూడ గ్రామంలో జరిగింది. ఊళ్లో ఒకావిడను కట్టేసి కొడుతున్నారని తెలిసిన వెంటనే మా జనవిజ్ఞానవేదిక మిత్రులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ మొదలు పెట్టగానే స్థానికులు మా వాళ్ల మీద విరుచుకు పడ్డారు. కొట్టినంత పని చేశారు. మీరు నచ్చినట్లే చేద్దురు కానీ ముందు ఆమెని మాట్లాడనిద్దాం... అని వారిని సమాధాన పరిచాం. ఆమె నోరు విప్పిన తర్వాత అందరిలో సానుభూతి వ్యక్తమైంది. అయినప్పటికీ... బాణామతి అనేది మూఢనమ్మకం అని ఊరి వారిని సమాధానపరచడం మాత్రం చాలా కష్టమైంది. అదే ప్రదేశంలో సమావేశం పెట్టి మంత్రతంత్రాలు ఉండవని చెప్పాం. ఆమె భర్త, అత్తగారికి విడిగా కౌన్సెలింగ్ ఇచ్చాం. డాక్టర్కు చూపించుకుని భార్యాభర్తలిద్దరూ వైద్యం చేయించుకోవాలని సూచించాం. మా ప్రయత్నంతో ఆమె కాపురం చక్కబడింది. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
గెలుపును చూసిన కళ్లు
యుద్ధ క్షేత్రం: కెప్టెన్ బీఎల్కే రెడ్డిది వ్యవసాయ కుటుంబం. హెలికాప్టర్ను నడిపిన అనుభవం. నాటి భారత విజయంతో ఉప్పొంగిన ఉత్సాహం నేటికీ ఆ కళ్లలో... కనిపిస్తూనే ఉంది ఆయన మాటల్లో ధ్వనిస్తూనే ఉంది. ‘‘అది 1971వ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతోంది. మాకు తూర్పు పాకిస్తాన్ సరిహద్దులో డ్యూటీ వేశారు. మన సైనికులను 15 హెలికాప్టర్లలో మేఘన నది అవతలికి దాటించాలి. నా హెలికాప్టర్లో మూడు ట్రిప్పులు తరలించాను. ల్యాండింగ్ సమయంలో ప్రత్యర్థి దళాలు కాల్పులు జరిపాయి. అప్పుడు సమయం తెల్లవారు జామున నాలుగు గంటలు. టేకాఫ్ అయిన ఇరవై నిమిషాల్లో మంటలు ఇంధనం ట్యాంకుకు చేరాయి. పరిస్థితి అర్థమవుతోంది. కానీ ఎక్కడా ల్యాండ్ చేయడానికి చదునైన నేల లేదు. శీతకాలం కావడంతో పర్వతాలను మంచు కప్పేసింది. గాల్లో ఉన్నా పేలి పోక తప్పనప్పుడు నేల మీదకు దిగడానికి ఓ ప్రయత్నం చేయడమే ప్రత్యామ్నాయం. అప్పటికే కాక్పిట్ నిండా పొగ కమ్మేసింది. మాకు శిక్షణలో నేర్పించిన విన్యాసాలు చేస్తూ స్పీడ్ తగ్గించి దించేశాను. దేవుని దయ వల్ల పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది. వెంటనే నేను, కో పైలట్, ఒక గన్నర్, ఇద్దరు వైద్యసిబ్బంది దిగి, మూడు మృతదేహాలను (పాక్ భూభాగంలో ప్రాణాలు వదిలిన సైనికులవి) బయటకు తీయగానే హెలికాప్టర్ పేలి పోయింది. మా హెలికాప్టర్కు ఎదురైన ప్రమాదాన్ని గుర్తించిన బేస్స్టేషన్ మాకు సహాయంగా మరో హెలికాప్టర్ను పంపించింది. అందులో మా క్యాంపునకు చేరాం. అప్పట్లో మనదేశానికి రష్యన్లు వాడి రీ కండిషన్ చేసిచ్చిన హెలికాప్టర్లే ఆధారం. అలాంటిదే మరో సంఘటన అదే నెలలో 21వ తేదీన ఎదురైంది. అప్పటికి యుద్ధం సద్దుమణిగింది. అగర్తల నుంచి కుంభీగ్రామ్ వెళ్తుండగా హెలికాప్టర్ ఇంజన్ ఫెయిలైంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి కిందకు దిగి చూసుకుంటే హెలికాప్టర్ ప్రధాన భాగం మనదేశంలో ఉంది, తోక బంగ్లాదేశ్లో ఉంది. మొత్తానికి యుద్ధం సమయంలో సరుకులు, యుద్ధసామగ్రిని చైనా, బర్మా, నాగాలాండ్ వంటి క్లిష్టమైన ప్రదేశాల్లో చాకచక్యంగా రవాణా చేసినందుకు ‘వాయుసేన మెడల్’ అందుకున్నాను. మాది మెదక్ జిల్లా జోగిపేట దగ్గర కుస్సంగి. నా చదువు హైదరాబాద్లోనే. ఇంజనీరింగ్లో ఉండగా రక్షణరంగంలోకి వెళ్లి, 1967 డిసెంబర్లో హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఉద్యోగంలో చేరాను. పెళ్లయ్యాక నా భార్య ఉషతో అస్సాంలోని దిబ్రూఘర్లో ఏడేళ్లు ఉన్నాను. అడవుల్లో వెదురు కర్రల మీద గుడిసెలో జీవించాం. చండీగఢ్లో నాలుగువేల మంది ఉద్యోగులను పర్యవేక్షించడం, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేయడం వంటివి వృత్తిపరమైన సంతృప్తినిచ్చాయి. 1978లో ముందస్తు పదవీవిరమణ తీసుకుని ‘హాలెండ్ షెర్నర్ ఎయిర్వేస్’లో కమర్షియల్ పైలట్గా పనిచేశాను. 28 దేశాల పైలట్లను చూశాను. కానీ భారతీయ పైలట్లలో ఉండే అంకితభావం మరెవరిలోనూ చూడలేదు’’ అంటున్న బీఎల్కే రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లోని గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీగా గోల్ఫ్ను విస్తరించే పనిలో ఉన్నారు. భారతీయుడిగా... నా రక్షణ రంగ జీవితాన్ని తలుచుకున్నప్పుడల్లా గర్వంగా ఛాతీ ఉప్పొంగేది... సరెండర్ అవుతూ పాక్ సైన్యం లెటర్ రాసిన సన్నివేశమే. డిసెంబర్ 16వ తేదీ ఢాకాలో ఇండో-పాక్ సైనికాధికారులు సమావేశమయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఎ.ఎ.కె. నియాజీ సరెండర్ లెటర్ రాయడం, దాని మీద మన లెఫ్టినెంట్ జనరల్ జగత్సింగ్ అరోరా కూడా సంతకం చేయడం నా కళ్ల ముందే జరిగింది. - కెప్టెన్ బీఎల్కే రెడ్డి, వాయుసేన మెడల్ గ్రహీత - వాకా మంజులారెడ్డి -
వ్యవస్థీకృతమైన సంరక్షణ ఇది ఓ తల్లి ఆలోచన
మహిళా విజయం: రేష్మా పుట్టిల్లు బెంగళూరు... అత్తిల్లు హైదరాబాద్. యూఎస్లో ఉద్యోగం చేస్తూ ఓ పాపాయికి తల్లయ్యారు... ఇండియాకి వచ్చిన తర్వాత... రెండో బిడ్డను కన్నప్పుడు... ఆమె ముందు ఓ సవాల్ నిలిచింది. ఫలితంగా... ‘వియ్ కేర్’ ఆవిర్భవించింది. ‘‘నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. నాన్న డెంటిస్ట్, అమ్మ స్పెషల్ ఎడ్యుకేటర్(ప్రత్యేకమైన పిల్లలకు శిక్షణనిచ్చే టీచర్). నేను ‘వియ్ కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ను ప్రారంభించడానికి నా స్వీయానుభవమే కారణం. నేను పెళ్లి చేసుకుని అమెరికాలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పాప పుట్టింది. తనను డే కేర్ సెంటర్లో వదిలి ఉద్యోగం చేసుకున్నాను. బాబు పుట్టే నాటికి ఇండియాకి వచ్చేశాం. సత్యంలో సీనియర్ బిజినెస్ లీడర్గా ఉద్యోగం. మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత బాబును డే కేర్లో ఉంచడానికి అనువైన సెంటర్ కనిపించలేదు. ఆఫీసులో ఉన్నా ఇంటి గురించి, బిడ్డ గురించే ఆలోచన. బాబు కోసం ఉద్యోగంలో విరామం తీసుకోవాల్సి వచ్చింది. నాలాగ ఎందరో మహిళలు పిల్లల గురించి కెరీర్ను కోల్పోతున్నారనిపించింది. పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరినా కెరీర్ గ్రాఫ్లో పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఎదుగుదల, ప్రమోషన్ వంటి వాటికి దూరమవుతుంటారు. మహిళల్లో ఎక్కువ మంది పెద్ద స్థాయికి వెళ్లకపోవడానికి వారిలో నైపుణ్యం లేకపోవడం కాదు. పిల్లల కోసం తీసుకునే గ్యాప్ పెద్ద అగాధంగా మారుతోందనిపించింది. దాంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వియ్ కేర్’ను ప్రారంభించాను. ఐటీ ఉద్యోగాల్లో ఒత్తిడి, ఎక్కువ పని గంటలు ఉంటాయి కాబట్టి వారి మీదనే దృష్టి పెట్టాను. హైదరాబాద్లో తొలి సెంటర్ని గచ్చిబౌలిలో ఈ నెల ఆరవ తేదీన ప్రారంభించాను. - రేష్మా శ్రీనివాస్, ఎం.డి, వియ్కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్యమైన సర్వీసే నా సక్సెస్! మొదటి సెంటర్ని బెంగళూరులో 2008లో హరిణి అనే పాపాయితో ప్రారంభించాను. ఆ ఏడాదిలోనే 60 మందికి చేరింది. డే కేర్తోపాటు ప్రీస్కూల్ కూడా నిర్వహించడంతో ఎక్కువ మందికి ఉపయుక్తంగా ఉంటోంది. ప్రస్తుతం ఆరు వారాల నుంచి పన్నెండేళ్ల వయసున్న పిల్లలు దాదాపుగా వెయ్యి మందికి పైగా మా సెంటర్లలో పెరుగుతున్నారు. మూడు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఉదయం ఎనిమిది గంటలకంతా వదిలేసి వెళ్తారు. వారికి పాలు, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిండ్లు, రాత్రి భోజనం అన్నీ పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లల డాక్టర్లు సూచించిన విధంగా ఇస్తాం. స్కూలు నుంచి వచ్చిన వారికి రిఫ్రెష్మెంట్, తినిపించడం, హోమ్ వర్క్ కూడా ఇక్కడే. దాంతో పేరెంట్స్ పిల్లలతో గడిపే కొద్ది సమయం కూడా క్వాలిటీగా గడుపుతున్నారు. హైదరాబాద్లో మరికొన్ని సెంటర్లను పెట్టిన తర్వాత వియ్కేర్ సేవలను చెన్నైకి విస్తరించాలనుకుంటున్నాను. ఆరు వారాలనే నియమం... పిల్లలు పుట్టిన తర్వాత ఆరు వారాల వరకు తల్లి స్పర్శను ఆస్వాదిస్తే ఇక వారు తల్లిని మర్చిపోరని నిపుణులు నిర్ధారించారు. ఆయాలు, నర్సుల చేతిలో ఎంతకాలం పెరిగినా తల్లి స్పర్శను గుర్తించగలగడానికే ఈ నియమం. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి manjula.features@sakshi.com -
అందంగా... ఆకర్షణీయంగా... పేపర్ బ్యాగ్
మీరే పారిశ్రామికవేత్త పాత వార్తాపత్రికలను కత్తిరించి చక్కగా మడతపెట్టి జిగురుతో అతికిస్తే చక్కటి సంచి తయారవుతుంది. పాతికేళ్ల కిందట మందుల దుకాణాలతోపాటు చిన్న చిన్న కిరాణా దుకాణాలు విరివిగా ఉపయోగించిన కవర్లు ఇవే. అప్పట్లో అనేక కుటుంబాల్లో మహిళలు, పిల్లలు ఈ పని చేసుకుంటూ దుకాణాల్లో అమ్మి చేతి ఖర్చులకు డబ్బు సంపాదించుకునే వారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వచ్చిందో ఈ ఉపాధి అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అది పరిశ్రమ రూపు సంతరించుకుని మార్కెట్లో విహరిస్తోంది. ఈ పరిశ్రమ స్థాపించాలంటే... యాభై నుంచి ఎనభై లక్షల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్రారంభించవచ్చు. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ యంత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉత్పత్తికి చేత్తోనే చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఒకటి - రెండు గదులు సరిపోతాయి. లక్షా- రెండు లక్షల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు. ముడి సరుకు సర్దుకోవడానికి, తయారైన వస్తువులను పెట్టుకోవడానికి ర్యాక్లు - రెండు (ఒక్కొక్కటి 2,500), అల్మైరా - ఒకటి (ఆరేడు వేలు), ఫోల్డింగ్ మెషీన్ (చేతితో పని చేసే చిన్న మెషీన్) - పది వేల లోపు. ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - 2, కత్తెర - 1, పెద్ద స్కేలు - 1, టేపు - 1 ఐదొందల్లో వస్తాయి. ముడిసరుకు... కనీసంగా కావల్సినవి పేపర్, ఐలెట్స్, త్రెడ్, ఫెవికాల్. ఆకర్షణీయంగా తయారు చేయడానికి అలంకరణలు పెంచుకోవచ్చు. అలాగే వినియోగదారుల అవసరాన్ని, వారి బడ్జెట్కి అనుగుణంగా సంచి తయారు చేసివ్వడం కోసం రకరకాల పేపర్లు అందుబాటులో ఉంచుకోవాలి. క్రాఫ్ట్ పేపర్, ఆర్ట్బోర్డు పేపర్, ఆర్ట్ కార్డ్ పేపర్, హ్యాండ్మేడ్ పేపర్... ఇలా చాలా రకాలుంటాయి. అలాగే కాగితం మందం కూడా ముఖ్యమే. శిక్షణ గురించి... భారత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘వందేమాతరం’ పథకం ద్వారా ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తోంది. ఎలీప్ సంస్థ నిర్వహిస్తోన్న ఈ శిక్షణ కార్యక్రమాలకు కనీస విద్యార్హత ఐదవ తరగతి ఉన్న 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు హాజరుకావచ్చు. నేర్చుకున్న తర్వాత... స్వయంగా పరిశ్రమ స్థాపించవచ్చు. ఇతర పరిశ్రమల్లో ఉద్యోగం పొందవచ్చు లేదా పరిశ్రమల నిర్వాహకుల నుంచి ముడిసరుకు తెచ్చుకుని ఇంటి దగ్గరే తయారు చేసుకుని ఒక్కొక్క సంచి తయారీకి తగిన వేతనాన్ని (పీస్ లెక్కన) పొందవచ్చు. ఈ విధానంలో మార్కెట్ ఒత్తిడి ఉండదు. పరిశ్రమ స్థాపించి ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఎలీప్ సంస్థ ‘విపణి’ అనే కార్యక్రమం ద్వారా మార్కెట్ కల్పిస్తోంది. పని నేర్చుకుంటున్నాం... పని చేస్తున్నాం... మాది నల్గొండ జిల్లా హుజూర్నగర్. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేసి ఫార్మా రంగంలో ఉద్యోగం చేశాను. బాబు పుట్టిన తర్వాత ఎలీప్లో శిక్షణ తీసుకుని స్నేహితురాలితో కలిసి పరిశ్రమ ప్రారంభించాను. - వాసిరెడ్డి శిరీష, 9494428686 మార్కెట్ మీద పట్టు... మాది వరంగల్. శిరీష బాబు, మా పాప ఒకే క్లాస్ కావడంతో మాకు పరిచయమైంది. అప్పటికే శిరీష జైపూర్, మహారాష్ట్రలు తిరిగి పరిశ్రమ నిర్వహణ, ముడిసరుకు దొరికే ప్రదేశాలను తెలుసుకుంది - మడిశెట్టి అర్చన, 9642444450 శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ ఇలా... 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో ఉదయం 11 గంటల నుంచి - సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
రాజా రాణీ రాకెట్ రోవర్
గమనం నదుల స్వగత కథనం నా పేరు శరావతి. నేనొక దాన్ని ఉన్నాననే సంగతి చాలామందికి తెలియదు. నేను ప్రయాణించే దూరం తెలిస్తే శరావతి కూడా ఓ నదేనా? బహుశా ఉప నదేమో అనే సందేహం రావచ్చు కూడా. నేను ఉపనదిని కాదు, ప్రధాన నదినే. అయితే చిన్న నదిని! ఎందుకంటే స్వయంగా సముద్రంలో కలుస్తాను, నాకు ఉపనదులున్నాయి. అంతే. రెండే రెండు జిల్లాలు... షిమోగా, ఉత్తర కన్నడ... పుట్టింది ఒక జిల్లా, సాగరంలో కలిసేది మరో జిల్లాలో... ఈ మధ్యలో మరో జిల్లా కూడా లేదు. నా ప్రయాణం 128 కి.మీ.లతో ముగుస్తుంటే నా పేరు పెట్టుకున్న రైలు మాత్రం కర్ణాటకలోని మైసూరు నుంచి మహారాష్ట్రలోని దాదర్ వరకు 1212 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. శరం అంటే బాణం! నాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే... స్థానికులు ఓ చక్కని కథనాన్ని వినిపిస్తారు. రాముడు సీతతోపాటు అరణ్యవాసం చేస్తున్న సమయంలో... వనవిహారం చేస్తుండగా సీతకు దాహం వేయడంతో రాముడు వింటిని సంధించి భూమిని చీల్చాడని, బాణం వేసిన చోట నీరు పైకి ఎగచిమ్మి అది తటాకంగా మారిందంటారు. అందుకే ఆ తటాకం నుంచి మొదలైన ప్రవాహానికి శరావతి అనే పేరు వచ్చింది. శరం అంటే బాణం. అంబుతీర్థం అనే పదానికి అర్థం కూడా బాణం వేసిన ప్రదేశం అనే అర్థం. నేను పుట్టిన ప్రదేశానికి అంబుతీర్థం అనే పేరు వెనుక ఉన్న కథనం కూడా ఇదే. అలా మొదలయ్యే నా ప్రయాణంలో ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్లే సరికి అల్లంత దూరంలో సముద్రం కనిపిస్తూ ఉంటుంది. గట్టిగా లెక్కేస్తే 30 కిలోమీటర్లకు మించదు. అయినా నేను ఎనిమిది వందల అడుగులకు పైగా ఎత్తులోనే ఉంటాను. ఇక సాగరాన్ని చేరాలంటే ఎక్కడో ఓ చోట నేలను చేరాల్సిందేనని దిక్కులు చూస్తూ గెరుసొప్ప చేరేసరికి... నా కోసమే అన్నట్లు నేల మాయమై లోయ కనిపిస్తుంది. అంతే ఒక్కసారిగా లోయలోకి దూకేస్తాను. అదే కర్నాటకలోని ప్రసిద్ధ జోగ్జలపాతం. నేను అత్యంత చిన్న నదిని, అయితే ఆ జలపాతానికి అత్యంత ఎత్తై జలపాతాల్లో ఒకటిగా రికార్డు ఉంది. ఇటీవలి కాలం వరకు భారతదేశంలో ఎత్తై జలపాతంగానూ, ప్రపంచంలో రెండవ ఎత్తై జలపాతంగానూ చెప్పుకునే వారు. ఇటీవల మేఘాలయలోని నోహకాలికాయ్ ఫాల్స్ను గుర్తించారు. ఇప్పుడా కిరీటం నోహకాలికాయ్ జలపాతానికి దక్కింది. దేశంలో పొరుగు రాష్ట్రాలు జోగ్ రెండవస్థానాన్ని అంగీకరిస్తాయి. కానీ కన్నడిగులు, మరీ ముఖ్యంగా నేను పుట్టిన షిమోగా జిల్లా వాసులు మాత్రం ఒప్పుకోరు. వారి మాటనూ తీసేయడానికి లేదు. ‘కుంచికల్ జలపాతం’ సవ్వడి నా చెవులను సోకుతూనే ఉంటుంది, జోగ్కంటే ఎత్తై జలపాతం కుంచికలేనంటూ ‘విరాహి’ నది నాతో చెప్తున్నట్లు అనిపిస్తుంటుందా సవ్వడి. అలాగే సీతానది నుంచి జాలువారే ‘బర్కానా జలపాతం’ కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే వాటి సవ్వడి నాకు ఏడాది పొడవునా వినిపించదే! ఎత్తై జలపాతాల కిరీటం జోగ్ను కాదని వాటికెలా దక్కుతుంది? అందుకే జాతీయ స్థాయిలో జోగ్నే గొప్పగా చెప్పుకుంటారు. పైగా నా ప్రవాహం అలా ఇలా ఉండదు. డెబ్బై మీటర్ల వెడల్పుతో నేలకు దూకుతాను. సింహ గర్జనను తలపిస్తూ... నేను నేలకు ఉరికే తొందరలో నేల ఎత్తుపల్లాలను దాటుకుంటూ నాలుగు పాయలుగా చీలిపోతాను. రసజ్ఞుల దృష్టి నిశితంగా ఉంటుందని ఒప్పుకోవాల్సిందే. జలపాతం తీరును నాలుగు రకాలుగా చెబుతూ ‘రాజా, రాణి, రాకెట్, రోరర్ ’ అని నాలుగు పాయలకు నాలుగు పేర్లు పెట్టేశారు. రాజా పాయ చాలా హుందాగా నేలను తాకుతుంటే, రాణి పాయ జాలువారుతున్న తీరు సుతిమెత్తగా, ఒయ్యారంగా అడుగులు వేస్తున్న నాట్యకారిణిని తలపిస్తుంది. రాకెట్ పాయలో నీరు ఎక్కువ మోతాదులో భూమిని చేరుతుంది కానీ పాయ చాలా సన్నగా ఉంటుంది. ప్రవాహవేగం నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్ను గుర్తుచేస్తుంది. ఇక నాలుగో పాయ రోరర్... ఇది కూడా చిన్న పాయే... అయినా ఇది చేసే శబ్దం చిన్నది కాదు. ఈ చప్పుడు పులి గర్జనను పోలి ఉంటుందని ఈ పేరు స్థిరపడింది. నా ప్రవాహాన్ని ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ‘నందిహోలె, హరిద్రావతి, మావినహోలె, హిల్కుంజి, యెన్నెహోలె, హుర్లిహోలె, నగోదిహోలె... ఉపనదులే కారణం. మాయలా కప్పేసే మబ్బులు! నా తీరాన ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించి తీరాల్సిందే తప్ప మాటల్లో వర్ణించనలవి కాదు. పశ్చిమ కనుమల పచ్చదనం, కొండల అంచులను తాకుతూ కదిలే మేఘాల నీలవర్ణం కలగలిసి కొత్తరంగును ఆవిష్కరిస్తుంటాయి. వర్షాకాలంలో మేఘాలు సమూహంగా వచ్చి వర్షిస్తున్నాయా అనిపిస్తుంది. తెల్లని నురగలతో నీటి ప్రవాహం... ప్రవాహ వేగానికి గాల్లోకి లేచే మంచుబిందువులు ప్రదేశాన్ని పొగమంచులా కప్పేస్తాయి. ప్రబంధ కవులు ఇక్కడికి వచ్చారంటే... గంగా మాత ఆకాశం నుంచి భూమాతను పరామర్శించడానికి వచ్చే క్రమంలో ఒలికిన తుషార, తుహిన, నీహారికల సమ్మేళనం... అంటూ బరువైన పదాలతో అందమైన భావాన్ని పద్యాలల్లేస్తారు. అంతటి అందమైన ప్రదేశమే మరి. ప్రాచ్యానికీ - పశ్చిమానికీ మధ్య... నా తీరం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షి. చతుర్ముఖ బాసాడి జైన ఆలయాన్ని నిర్మించడానికి నిర్మాణ సామగ్రి చేరవేత నా మీదనే జరిగింది. పన్నెండవ శతాబ్దం నుంచి కన్నడిగ రాజ్యాన్ని పాలించిన హోయసల రాజులు హిందూత్వంతోపాటు జైనాన్ని కూడా ఆదరించారు. చతుర్ముఖ బాసాడి ఆలయంలో నలుగురు జైన తీర్థంకరుల విగ్రహాలున్నాయి. గ్రానైట్ మందిరం... ఇప్పటికీ చెక్కు చెదరలేదు కానీ మెరుపు తగ్గి రంగు వెలిసింది. పిల్లలు చూస్తే ఇదేంటి ఇలా పాతగా అంటూ ముఖం చిట్లించుకుంటారో ఏమో! ఇందులో చెన్నబైరదేవి విగ్రహం అసంపూర్తిగా ఉండిపోయింది. సాళ్వ వంశంలో గొప్ప పాలనదక్షత కలిగిన రాణి ఆమె. క్రీ.శ 1552 నుంచి 1606 వరకు పాలించిన చెన్నబైరదేవి మిరియాల రాణిగా పేరు తెచ్చుకుంది. పశ్చిమ తీరం నుంచి మేలు రకం మిరియాలను పశ్చిమదేశాలకు ఎగుమతి చేసి ఆ పేరు తెచ్చుకుంది. గెరుసొప్ప రాణిగా కూడా పిలుస్తారు. సాల్వ రాజుల రాజధాని గెరుసొప్ప. ‘నగర్ బస్తికెరి’గా పిలిపించుకున్న రోజుల్ని చూశాను. ఇది అందమైన వాణిజ్య కేంద్రం. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాల వేదిక. హోన్నావర్ పెద్ద హార్బర్. అంతర్జాతీయ వాణిజ్య రవాణా కేంద్రం. మధ్య ప్రాచ్యం, పాశ్చాత్య దేశాలకు ఓడల్లో మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు రవాణా అయ్యేవి. గతం తాలూకు వైభవాన్ని తలుచుకుంటూ వర్తమానంలో నా చెంత చేరే కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. చిన్న నదినే, అయినా చేవ ఉన్న నదిని. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పుట్టిన ప్రదేశం: కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా, తీర్థహళ్లి గ్రామానికి సమీపంలోని అంబుతీర్థం. సాగర సంగమం: కర్నాటక రాష్ట్రంలోనే... ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర్ తీరం దగ్గర అరేబియా సముద్రంలో. ప్రవాహ దూరం: 128 కి.మీ.లు -
హిమగిరి నుంచి బ్రహ్మఝరి
గమనం : నదుల స్వగత కథనం మానస సరోవరం... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనిపించే ప్రదేశం. నేను అక్కడే పుట్టి కైలాస పర్వతాన్ని చూస్తూ ప్రయాణం మొదలు పెట్టాను. హిమాలయాల్లోని చెమాయుంగ్ దుంగ్ హిమనీనదం నా పుట్టిల్లు. ప్రాచీనంలో తూర్పు దేశాలకు, పశ్చిమానికి మధ్య రవాణా నా కళ్ల ముందే జరిగేది. మానస సరోవరానికి కైలాసపర్వతానికి మధ్యనున్న ‘పర్కా’ వాణిజ్యకేంద్రం వ్యాపార లావాదేవీల స్థావరం. ‘యార్లాంగ్ గ్జాంగ్పో’ పేరుతో పుట్టిన నేను టిబెట్ పీఠభూమి నుంచి నేలను వెతుక్కుంటూ ‘నమ్చబర్వా పర్వతం’ దగ్గర మంచుకొండలను చుడుతూ వంపు తిరిగి, లోయల్లోకి జారిపోతాను. అలా జారిపోవడంలో సున్నితత్వం లోపించి కరుకుగా పర్వతాన్ని కోసేస్తుంటాను. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారత్లో అడుగుపెడతాను. అక్కడ నన్ను ‘సియాంగ్’ అని పిలుస్తారు. అక్కడి నుంచి కొద్దిగా దిశ మార్చుకుంటూ, అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తానో లేదో ‘లుయిత్’ అంటూ పలకరిస్తారు. బహుశా ఈ లుయిత్... సంస్కృతంలో లౌహిత్య పేరుతో పిలిచిన పేరుకి వ్యవహారిక నామం కాబోలు. బోడోలయితే నన్ను ‘భుల్లుంబత్తర్’ అంటారు. భుల్లుంబత్తర్ అంటే - నీటిని గొంతు దగ్గర ఆపేసి గరగర శబ్దం చేస్తుంటారు చూడండి! - అలాంటి శబ్దం అని అర్థం. గిరిపుత్రులు చెప్పిన భాష్యం నా ప్రవాహవేగాన్ని చెప్పకనే చెప్తోంది. మరి సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తు నుంచి నేలకు దిగే ప్రయాణం నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది? దిహంగ్, లుయిత్లు కలిసిన తర్వాత నన్ను ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు. మంచు కరిగే రోజుల్లో... హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ నా ప్రవాహం ఉద్ధృతమవుతుంటుంది. నా తీరంలో నేలలు ఎప్పుడూ చిత్తడిగానే ఉంటాయి. ఎటు చూసినా పచ్చటి చెట్లు, దట్టమైన అడవులు, పొదల మయం. పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లు ఉంటుంది. కళ్లు ఒక్క ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తున్నాయా, ఇతర రంగులను గుర్తించడం మానేశాయా అనే భ్రమ కలుగుతుంది కూడా. ఏడాది పొడవునా నీటి ప్రవాహంతో అలరారే నా తీరం ఇలాగే ఉంటుంది మరి. మంచు కరగడం తగ్గుముఖం పడుతుందో లేదో వర్షాలు మొదలవుతాయి. నా తీరాన ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. ఉన్న ఫళంగా కుండపోత కురుస్తుంది. చిరపుంజిలో కురిసే ప్రతి చినుకూ నన్నే చేరుతుంది. నా తీరాన నిలబడి ‘ఈ ఒడ్డు ఆ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అని పాడుకోవడం అంత సులభం కాదు. చాలా చోట్ల రెండు ఒడ్డుల మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రధాన జలరవాణా మార్గాన్ని కూడా. నా తీరాన దట్టమైన అడవులు, పచ్చటి పంట పొలాలు విస్తరించాయని సంతోషపడే లోపు వరద బీభత్సానికి తల్లడిల్లే తీర ప్రజలతోపాటు కజిరంగా నేషనల్పార్కులోని వన్యమృగాలు కళ్ల ముందు మెదులుతాయి. కజిరంగాలో... ఖడ్గమృగం భారంగా పరుగులు తీస్తుంటుంది. ఏనుగు బరువుగా అడుగులేస్తుంటుంది. చిన్న సవ్వడికే లేడి చెంగున ఎగురుతుంటే, దుప్పి అంత తొందరేముందన్నట్లు పరికించి చూస్తూ అడుగులేస్తుంటుంది. నీటి బర్రెలు... ఇంకెక్కడికెళతాం అన్నట్లు వీపులు మునిగే లోతులో విశ్రాంతిగా కాలం గడుపుతుంటాయి. రాయల్ బెంగాల్ పులులు, చిరుతలు ఎప్పుడో కానీ కనిపించవు. నీలిరంగు పాలపిట్ట, అడవి కోడి, గద్ద, తోడేళ్ల గుంపులు కనువిందు చేస్తుంటే... రామచిలుకలు ఆకుల్లో కలిసిపోయి మేమున్నామంటూ చిట్టి పలుకులతో ఆకర్షిస్తుంటాయి. ఏనుగు అంబారీ ఎక్కి వన్యమృగాలను చూడడానికి అడవిలో పర్యటించే పర్యాటకులు నా ప్రవాహ సవ్వడిని నేపథ్య సంగీతంలా ఆస్వాదిస్తుంటారు. ఇంత అందమైన ప్రదేశం కావడంతోనో ఏమో హిందువులు, జైనులు జీవితంలో ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని చూడాలని, ఆ యాత్ర బ్రహ్మపుత్ర మీదుగానే సాగాలని కోరుకుంటారు. కైలాసపర్వతాన్ని అందరూ ఎడమ నుంచి కుడివైపుగా ప్రదక్షిణ మార్గంలో చుట్టివస్తుంటే బోనులు మాత్రం కుడి నుంచి ఎడమవైపుకి అప్రదక్షిణ మార్గంలో చుట్టి వస్తుంటారు. బౌద్ధులు, జైనులు, బోనులు నన్ను నదీమతల్లిగా గౌరవిస్తారు. ప్రకృతి పరిరక్షణ నియమాలన్నీ పాటిస్తారు. నా ప్రవాహంలో ‘అమోచు, సంకోష్, దిబాంగ్, రాయ్దక్, భరేలి, మాన్స్, లుహిత్, జియా భోరేలి, కామెంగ్, తీస్తా నదులు నాకు తోడుగా వచ్చి నా శక్తిని పెంచుతుంటే అస్సాంలో నేనే ‘ఖేర్జుతియా’ పేరుతో ఒక పాయగా దూరంగా వెళ్లిపోతాను. వంద కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఖేర్జుతియా పాయ తిరిగి నాలో కలిసిపోతుంది. ఆ మధ్యలో ఉన్న భూభాగం ‘మజులి’ ద్వీపం. ఇది ప్రపంచంలో పెద్ద నదీద్వీపం. ఈ కలయికను చూస్తుంటాయి గౌహతి నగరం, ‘కామాఖ్య’ ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ‘ఇక్కడి వరకు వచ్చి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకోకపోతే బ్రహ్మపుత్రను ఏడుసార్లు దాటాల్సి వస్తుందని’ ఓ నానుడి. అంత విశాలంగా ఉండే నేను గౌహతి దాటి షిల్లాంగ్ చేరేసరికి సన్నగిల్లి ఒక్క కిలోమీటరు వెడల్పుకే పరిమితమవుతాను. ఇక్కడికి చేరగానే 17వ శతాబ్దం నాటి సరయ్ఘాట్ యుద్ధం కళ్ల ముందు మెదులుతుంది. ‘అహోం’ రాజ్యం మీద మొఘలుల ప్రతినిధి రాజా రామ్సింగ్ చేసిన దాడిని, గౌహతి వరకు విస్తరించిన పాలనను చూశాను. రాజ్యవిస్తరణలో మొఘలులు చేసిన చివరి ప్రయత్నం అదే. భూతాన్ని దాచుకున్నానని... సముద్రాన్ని తలపించే భారీ నదిని కావడంతో అలలు ఎగిసిపడుతుంటాయి. నీటి లోపల భూతం ఉండడంతోనే భారీ వరదలనీ, పడవలు బోల్తా పడతాయనీ, భూతాన్ని కడుపులో దాచుకున్న నది అని శాపనార్థాలు పెడతారు గిరిపుత్రులు. అస్సాంలోని వెనుకబాటును వెనక్కి తోసి అభివృద్ధి పథంలో నడిపించడానికి నేనూ దోహదం అవుతున్నానని సంతోషించే లోపు దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ ఫీల్డ్స్ నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీత, రవాణాలతో కలుషితమవుతున్నాను. బంగ్లాదేశ్లో అడుగు పెట్టగానే సుందర్బన్ అడవుల సాక్షిగా మరోసారి చీలిపోతాను. ఇక్కడ విచిత్రమేమిటంటే పెద్ద పాయకు నా పేరు ఉండదు, ‘జమున’ అని పిలుస్తారు. జమున కాస్తా ‘పద్మ’ (గంగను బంగ్లాదేశ్లో పద్మ అంటారు)లో మమేకమవుతుంది. బ్రహ్మపుత్రగా కొనసాగిన నేను చాంద్పూర్ దగ్గర ‘మేఘన’లో కలుస్తాను. ఇక్కడ నాకు మిగిలే సంతోషం... జమున పేరుతో వేరుపడిన నా పాయ కూడా మేఘనలోనే కలుస్తుంది. నేరుగా నాలో కలవడానికి కొద్దిగా భేషజం అడ్డొచ్చిందేమో మరి! ఇంత పెద్ద ప్రవాహాన్ని, ప్రపంచంలో పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేను... నేనుగా సముద్రంలో అడుగుపెట్టడం లేదు. అయితే ఆ ప్రదేశాన్ని గంగ- బ్రహ్మపుత్ర డెల్టా అంటూ నా పేరు వ్యవహారంలో ఉండడం నాకు సంతోషం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి manjula.features@sakshi.com -
నా తీరాన... తొలి తెలుగు రాజ్యం...
గమనం నదుల స్వగత కథనం అవి పశ్చిమ కనుమలలో మహేబలేశ్వర్ పర్వత శ్రేణులు. కనుచూపు మేరలో అరేబియా సముద్రం మంద్రమైన చిరు అలలతో పలకరిస్తోంది. ఆ వైపుగా ప్రయాణిస్తే ఒక్క ఘడియలో సాగరాన్ని చేరుతాను. కానీ, ఉరకలెత్తే నా ప్రయాణానికి... నిలువెత్తు అలలతో తీరాన్ని కల్లోలపరిచే బంగాళాఖాతమే బావుంటుందనిపించింది. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరి ఇంద్రకీలాద్రి మీదున్న కనకదుర్గమ్మను చూస్తూ హంసలదీవి దగ్గర సాగరంలో కలుస్తాను. నా లక్ష్యం, గమ్యం తూర్పుగా ఉండడంతో పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రాన్ని పలకరింపుగా ఓ చూపు చూసి ప్రయాణ దిశను మార్చుకున్నాను. నేను పుట్టిన ప్రదేశం మీద నాకున్నంత మక్కువ దేవగిరి రాజు సింఘన్కి కూడా ఉండేది. అందుకే ఇక్కడ 13వ శతాబ్దంలో నాకు ‘కృష్ణబాయి’ ఆలయాన్ని కట్టాడు. పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ప్రతాప్ఘడ్ కోటను కట్టాడు. బ్రిటిష్ పాలకులు (బాంబే ప్రావిన్స్) వేసవి రాజధానిగా చేసుకున్నారు. నాతోపాటు ‘కొయ్నా, వెన్నా (వేణి), సావిత్రి, గాయత్రి అనే మరో నాలుగు నదులకు కూడా మహాబలేశ్వర్ పర్వతాలే పుట్టిల్లు. మా అయిదుగురం కలిసే ప్రదేశాన్ని పంచగంగ అంటారు. అక్కడ నన్ను కృష్ణమాత అని కొలుస్తారు. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది.‘ఛత్రపతి శివాజీ మీద విజయం సాధించడానికి అఫ్జల్ ఖాన్ ‘వాయి’ దగ్గర వ్యూహాన్ని పన్నాడట. దాన్ని తిప్పికొట్టే శక్తినిమ్మని శివాజీ అనుచరుడు నన్ను మొక్కాడు. ఆ పోరులో శివాజీ విజయం సాధించాడు. అందుకు నా ఆశీస్సులే కారణమని నమ్ముతూ కృతజ్ఞతగా ఏటా ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఆలయంలో నా ప్రవాహానికి అనుగుణంగా ఓ తటాకాన్ని తవ్వి ఆవు ముఖాకృతిని చెక్కారు. అలా నేను గోముఖం నుంచి బయటపడతానన్నమాట. వారణ, భీమ, దిండి, ఎర్ల, పెద్దవాగు, హాయిలా, మూసీ, పాలేరు, మున్నేరు, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర నదులు నాలో కలుస్తూ నన్ను జీవనదిని చేస్తున్నాయి. సారవంతమైన నేలలున్న నా తీరంలో ఎందరు నివాసం ఏర్పరుచుకున్నారో లెక్కేలేదు. చరిత్రలో సూర్యప్రభలా వెలిగిన శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాలు నా తీరంలోనే రాజ్యాలను విస్తరించుకున్నాయి. మౌర్యుల నుంచి స్వాతంత్య్రం పొందిన శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినప్పుడు తొలి తెలుగు రాజ్యం నా తీరానే వెలిసినందుకు నేనే అందలమెక్కినంత పులకింత. నా తీరాన దినదినాభివృద్ధి సాధించిన నగరాలు మహారాష్ట్రలో సంగ్లీ, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలే. సంగ్లీ దగ్గరున్న ఇర్విన్ బ్రిడ్జి మనదేశంలో వలసపాలకులు కట్టిన పురాతన వంతెన. ఎర్ర రాతితో బ్రిటిష్ నిర్మాణాలను పోలిన ఈ బ్రిడ్జి మధ్యలో రెండు దారులున్నాయి. నా ప్రవాహాన్ని ఏదో ఒక తీరం నుంచి కాకుండా మధ్యలో చూడాలంటే ఆ దారుల నుంచి నన్ను దగ్గర నుంచి చూడవచ్చు. మరో సంగతి... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్దాదా పాటిల్ పశ్చిమ మహారాష్ట్రలో స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించాడు. ఒకసారి బ్రిటీష్ సైనికుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక్కసారిగా నా ఒడిలో దూకేశాడు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి రక్షించే ప్రయత్నంలో ఉన్న ఒక మిత్రుడిని ఆపత్కాలంలో నా కొంగు చాటున దాచేసి రక్షించానన్న తృప్తి ఇప్పటికీ ఈ వంతెన కింద నుంచి వెళ్లేటప్పుడు గుర్తొస్తుంటుంది. సంగ్లీ మీదనే ‘అంకాలి’ అని మరో వంతెన... హైదరాబాద్- సికింద్రాబాద్ నగరాలను కలిపే ట్యాంక్బండ్లాగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను కలుపుతుంది. నాపై కర్నాటకలో బసవ సాగర్, ఆలమట్టి, నారాయణపూర్ ఆనకట్టలు, రిజర్వాయర్లు కట్టారు. బీజాపూర్- భాగల్కోట్ జిల్లాల మధ్య కట్టిన ఆలమట్టి సృష్టించిన వివాదం చిన్నది కాదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసినప్పుడూ నా నీటి పంపకం ప్రధానమైన అంశంగా మారింది. అక్కడి నుంచి మహబూబ్నగర్ మీదుగా తెలంగాణలో అడుగుపెడితే అక్కడ నిజాం ప్రతిపాదించిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పలకరిస్తుంది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్లు వివాదాలను తీర్చడమే పనిగా పెట్టుకోవాల్సి వచ్చింది. నల్గొండ -గుంటూరు జిల్లాల మధ్య నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రధాని నెహ్రూ అంకితభావంతో కట్టిన దేవాలయం. నెహ్రూ పునాది వేస్తే ఇందిరా గాంధీ నీటిని విడుదల చేసిన ఈ ఆనకట్టకు అతిపెద్ద మానవ నిర్మిత రాతి ఆనకట్ట అనే బిరుదును ప్రదానం చేసి మరీ ప్రాధాన్యం కల్పించారు. హరిత విప్లవంలో నేను సైతం నా వంతు నీటిచుక్కనందించాననే సంతృప్తితో కర్నూలులో సంగమేశ్వరుడిని పలకరించి నల్లమల అడవులలో పులిని సగౌరవంగా ప్రణమిల్లి శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుని నాకు మోక్షం సిద్ధింస్తుందని సంతోషిస్తాను. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాక తుంగభద్ర, భావనాసి నదులు కర్నూలు జిల్లాలో నాకు తోడవుతున్నాయి. నాకు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు సంగమేశ్వరునికి అభిషేకం చేస్తున్నా. నా తీరాన్ని ఆసరా చేసుకుని పరిఢవిల్లిన బౌద్ధానికి ఆనవాళ్లుగా స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు వెలిశాయి. కానీ రిజర్వాయర్ ముంపులో మునిగి పోయి శిఖరం మాత్రం ఒక దీవిలా కనిపిస్తోంది. స్థానభ్రంశం చెందిన బౌద్ధ ప్రతీకలు నా మీద అలకబూనినట్లే కనిపిస్తుంటాయి. మౌనంగా అమరావతి స్తూపాన్ని చూస్తూ సాగిపోతుంటే ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. ఇక్కడే కృష్ణవేణి కొప్పున పూలు చుట్టుకుని తెలుగింటి విరిబోణిలా నాకు ప్రతీకగా నిలుచుని ఉంటుంది. కృష్ణ, వేణి నదుల కలయిక అని కృష్ణవేణి అన్నారు. ఇంతకీ ‘కృష్ణ’ అనే స్థిరపడడానికి నేను నల్లగా ఉండడమే కారణం. కృష్ణుడికీ, ద్రౌపదికీ అలాగే వచ్చింది ఆ పేరు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నా గమనంలో నాకు తోడయ్యే ఉపనదులకు, వాటి ఉప నదులకు, వాటి మీద కట్టిన ప్రాజెక్టులను లెక్కపెట్టడం, గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే మరి. వీటితోపాటుగా ఆకేరు, పాలేరు, వేదవతి, స్వర్ణముఖి, వేద, అవంతి, వరద, సిన, నిర, ముల, ముథ, చందాని, కామిని, మోషి, బోరి, మన్, భోగవతి, ఇంద్రావతి, కుండలి, కుమండల, ఘోడ్, భామా, పవ్నా వంటి చిన్న చిన్నవి నా ఉపనదుల్లో కలిసేవి, నాలో కలిసేవి కూడా ఉన్నాయి. పుట్టింది: పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ దగ్గర (మహారాష్ట్ర), జోర్ గ్రామంలో, సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో. అరేబియా సముద్రతీరానికి 64 కి.మీల దూరంలో. ప్రవాహదూరం: 1400 కి.మీ.లు సాగరసంగమం: కృష్ణాజిల్లా హంసలదీవికి సమీపంలో పాలకాయి తిప్ప దగ్గర (బంగాళాఖాతంలో) -
స్టెత్ పోయి తుపాకీ వచ్చె...
యుద్ధ క్షేత్రం డాక్టర్ కాబోయి యాక్టర్నయ్యాననే మాట చాలా సందర్భాల్లో వింటుంటాం. డాక్టర్ని కాబోయి సోల్జర్నయ్యానని చెప్పగలిగింది బహుశా ఈయనే కావొచ్చు. అలాంటి కల్నల్ పి.ప్రసాద్ అనుభవాలు ఈవారం... విజయవాడలో పుట్టాను. పదహారో ఏట జబల్పూర్ వెళ్లాను. అది నా గమ్యాన్ని మార్చేసింది. నిజానికి నేను వెళ్లింది మెడికల్ సీటు కోసం. అక్కడ మెడిసన్ సీటు సులభం అని వెళ్లిన వాణ్ణి కాస్తా అక్కడ ఆర్మీ ఉద్యోగాలను చూసి ప్రభావితుణ్ణయ్యాను. అలా 1966లో ఆర్టిలరీ విభాగంలో చేరి, 1998లో కల్నల్గా రిటైర్ అయ్యే వరకు సంతోషంగా ఉద్యోగం చేశాను. నా మొదటి పోస్టింగ్ అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని ‘సెలా టాప్’. ఆ సమయంలో ప్రభుత్వం సైనిక శిక్షణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతకు నాలుగేళ్ల ముందు భారత్- చైనా యుద్ధంలో మన వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల మన సరిహద్దు ప్రదేశాలు, ప్రత్యర్థులు దాడి చేయడానికి అవకాశం ఉన్న పాయింట్ల మీద క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. భారత్- చైనా సరిహద్దులో ఉన్న కొండలన్నీ ఎక్కించారు. ఒక్కొక్కటి పదిహేను- పదహారు వేల అడుగుల ఎత్తు! సైనికులకు ఆర్మీతో అనుబంధం పెరిగే విధంగా పాఠాలుండేవి. దేశ ప్రయోజనాలే ప్రధానంగా మాట్లాడడం, సైనిక దళాలకు ఆదేశాలిస్తూ నడిపించడం ప్రధానంగా ఉండాలి. వ్యక్తిగత సౌకర్యం, వ్యక్తిగత సమస్యల గురించి ప్రస్తావించడం మూడవ అంశంగా ఉండాలని చెప్పేవారు. ఒకసారి నా ఒన్ టన్నర్ వాహనం రెండు వేల అడుగుల లోయలో పడబోయి ఆగింది. తృటిలో ప్రమాదం తప్పింది. అప్పుడు కూడా డ్యూటీ గురించి తప్ప మా ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచనే రాలేదు. పాకిస్తాన్ 1971 తర్వాత తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండేది. అప్పుడు గుజరాత్లోని బరోడా నుంచి రాజస్థాన్లోని జైసల్మేర్ వరకు 650 కిలోమీటర్ల దూరం భారీ ప్రదర్శన చేపట్టాం. దాడిని ఎదుర్కోవడమే కాదు, దాడి చేయగల సత్తా మా దేశానికి ఉందని హెచ్చరిక జారీ చేయడమది! శ్రీనగర్లో రోడ్ ట్రాఫిక్ కంట్రోల్ నా ఆధీనంలో ఉండేది. అప్పుడు నాకు పిల్లలతో అనుబంధం ఏర్పడింది. అక్కడి సామాజిక, రాజకీయ కారణాల దృష్ట్యా రెండేళ్లుగా పరీక్షలు జరగలేదు. ఆ ఏడాది కూడా సాంకేతిక అంతరాయం వల్ల పరీక్ష హాలుకు చేరలేని పరిస్థితి. ఏడాది వృథా అవుతుందేమోనని పిల్లలు బిక్కముఖాలతో ఉన్నారు. ఆర్మీ కాన్వాయ్తో పిల్లలను బాదామి కంటోన్మెంట్ దాటించాను. అప్పట్లో సియాచిన్ గ్లేసియర్ స్టాక్స్ తరలించే బాధ్యత నాదే. ఒక్కసారిగా వరుసకు 500 వాహనాలు ప్రయాణించాలి. ఈ ప్రణాళికలో ఏ మాత్రం తేడా వచ్చినా అటు వైపు నుంచి మరో 500 వాహనాల రాకకు అంతరాయం కలుగుతుంది. ఇంత భారీగా ఎందుకంటే... ఏడాదికి సరిపడిన సరుకు (ఆహారం, నీరు, ఎనర్జీ పౌడర్, బొగ్గు, ఆయిల్, యుద్ధసామగ్రి లాంటివి) అంతటినీ మూడు నెలల కాలంలోనే తరలించాలి. మంచుతో రహదారులు మూసుకుపోయాయంటే సరుకులను హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిందే. అలా తరలిస్తే ఒక కోడి గుడ్డు రవాణాకి అరవై రూపాయలు ఖర్చవుతుంది. కార్గిల్ మీదుగా వెళ్లాల్సిన ఈ వాహనాలను అదుపు చేయగలిగితే సియాచిన్ గ్లేసియర్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం సులువవుతుందని పాక్ ఓ కన్నేసి ఉంటుంది. అన్నేళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా రవాణా నిర్వహించిన అధికారిగా ఇప్పటికీ గర్వపడతాను. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి manjula.features@sakshi.com ఫొటో: రాజేశ్ ఆ పిలుపు కోసం... దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించి పదిలక్షల మంది పిల్లలను చైతన్యవంతం చేశాను. నీటి నిర్వహణ, దేశభక్తి, సృజనాత్మకత పెంచే కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని బయటకు తీయాలని చెప్పే ‘కిడ్ ద గ్రేట్’ అనే రేడియో కార్యక్రమం చేశాను. ‘కల్నల్ అంకుల్’ అనే చిన్నారి పిలుపు కోసం మా పిల్లలు అమెరికాలో సెటిలైనప్పటికీ నేను ఇండియాలోనే ఉంటున్నాను. - కల్నల్ పి.ప్రసాద్ -
కలంకారీ... కలర్ఫుల్ ఉపాధి
‘కలంకారీ’ పదంలో ‘కలం’ అంటే పెన్ను, ‘కారీ’ అంటే రాసే వ్యక్తి. ఈ కళ అత్యంత సంప్రదాయమైనది, శ్రమతో కూడినది, కళాత్మకమైనది. దీన్ని నమ్ముకున్న వారికి కాసులు కురిపిస్తున్న ఉపాధిమార్గం కూడా! కలంకారీలో శిక్షణ పొంది ఒక యూనిట్ స్థాపించాలంటే... ఎక్విప్మెంట్కు దాదాపుగా రెండున్నర లక్షలు, రా మెటీరియల్కు యాభై వేలు కలుపుకొంటే కనీస ఖర్చు మూడు లక్షల రూపాయలవుతుంది. రెండు నెలల్లో ప్రాథమిక శిక్షణ పొందడం సాధ్యమవుతుంది. కలంతో పువ్వులు, తీగల వంటి డిజైన్ గీయాలంటే కనీసం ఆరు నెలలపాటు శిక్షణ, సాధన అవసరం. కలంకారీలో పౌరాణిక గాథల ఘట్టాలు అత్యంత ప్రసిద్ధం. వీటిని చిత్రించాలంటే రెండేళ్లు శిక్షణ తీసుకోవాల్సిందే. ఈ ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణాజిల్లా పెడనలో మాత్రమే ఈ కళాకారులున్నారు. పెడన కలంకారీ అద్దకాలకు కేంద్రస్థానమైతే, భగవంతుని బొమ్మలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధం. ఈ వస్త్రాలకు, అలంకరణ పటాలకు ఒకప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా కార్పొరేట్ రంగం ఆసక్తి చూపడంతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాళహస్తిలోనే రెండు వేల మంది మహిళలు కలంకారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు మూడు నుంచి పదివేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కలంకారీ అద్దకాన్ని ఒకప్పుడు నూలు బట్టల మీద మాత్రమే అద్దేవారు. ఇప్పుడు టస్సర్, క్రేప్, సిల్క్ వస్త్రాల మీద కూడా వేస్తున్నారు. వీటి ధర దాదాపుగా మీటరు ఆరు వందల చొప్పున ఉంటే ఒక చీర 3,600 రూపాయలవుతుంది. కలంకారీ పెయింటింగ్ చేయడానికి వెయ్యి రూపాయలు కలుపుకొంటే చీర మీద పెట్టిన పెట్టుబడి ఏడు వేలవుతుంది. మార్కెట్లో దానికి పనితనంలో నైపుణ్యాన్ని బట్టి పది నుంచి ఇరవై వేల వరకు ధర పలుకుతుంది. ఇక చందేరి, మంగళగిరి దుపట్టాలకు మార్కెట్ ధర 1,200 దాకా ఉంటోంది. కావలసిన వస్తువులు... బల్ల - 1 (ఆరడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు), ఉన్ని కంబళి - 1, మెత్తటి వస్త్రం - 1, పెయింటింగ్ కోసం వెదురు బ్రష్షులు - 14, రైటింగ్ బ్రష్షులు - ఐదారు, ప్లాస్టిక్ డ్రమ్ము - 1 (50 లీటర్లది), 20 లీటర్లు పట్టే బకెట్లు - 8; ప్లాస్టిక్ మగ్గులు - 7 లేదా 8, మరిగించే పాత్ర - 1, మిక్సీ - 1 (రంగులు కలుపుకోవడానికి), కంప్యూటర్ - 1 (డిజైన్లు రూపొందించుకోవడానికి), ఫొటోకాపీ మెషీన్ - 1 (డిజైన్లను ప్రింట్లు తీసుకోవడానికి), పెయింటింగ్ మగ్గం - 1, గది - 1 (30 బై 40 అడుగులది), సహాయకులు - ఐదుగురు వీటితోపాటు సమృద్ధిగా నీటితోపాటు నీరు ప్రవహించే సౌకర్యం ఉండాలి. దగ్గరలో ఏరు, నది వంటి జలాశయం లేకపోతే బోరు లేదా బావికి మోటారు, పెద్ద తొట్టి, వాడిన నీరు బయటకు వెళ్లే సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అద్దకం సామగ్రి... బెల్లం, తాటి బెల్లం, ఇనుపముక్కలను 15 రోజుల పాటు ఊరబెడితే రసం వస్తుంది. దానిని కసిమి అంటారు. ఆ కసిమిలో కలాన్ని ముంచి డిజైన్ రాయాలి. కంబళిని రిబ్బన్లా చించి వెదురు కర్రకు చుడతారు. అది కలం. చింత బొగ్గులు, గోరింటాకు, కూరగాయల నుంచి తయారు చేసుకున్న రంగులు ప్రధానంగా ఉండాలి (కొంతమంది ఈ డిజైన్లను కృత్రిమ రంగులతో వేసి ఇవ్వమని అడుగుతుంటారు. కూరగాయల రంగుల కంటే కృత్రిమ రంగులు కంటికి ఇంపుగా ఉంటాయి). ఇక ఒక్కో రంగుకు కొన్ని దినుసుల మిశ్రమాలను ఉపయోగించాలి. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఎలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. - ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం!
కవర్ స్టోరీ ప్రతిరోజూ మహిళలది కావాలిగానీ, ఈ ఒక్కరోజును ప్రత్యేకంగా మహిళా దినోత్సవం అనడంలో ఔచిత్యం ఏమిటి? ఎందుకంటే, జనాభాలో దాదాపు సగభాగమున్న మహిళలు, అవకాశాల్లో మాత్రం సమభాగాన్ని నేటికీ అందుకోలేకపోతున్నారు కనుక. వెనుకబడిన దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మాత్రమే కాదు, ఘనత వహించిన అగ్రరాజ్యాల్లోనూ మహిళలకు సమప్రాతినిధ్యం కరువే. అయినా ఏటా మహిళా దినోత్సవం రోజున మాత్రం మన పాలకులు మహిళల విజయగాథలను మననం చేసుకుని ఆనంద పరవశులైపోతారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను తలచుకుని ఆగ్రహం చెందుతారు. ఆ రోజు గడచిపోయాక ఇక అంతా మామూలే. కనీసమైన హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి మహిళలకు నేటికీ తప్పడం లేదు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... ఒక్క మహిళా దినోత్సవం నాడే కాదు పురుషులు పాల్గొంటే మేలు... మహిళాదినోత్సవం గత కొన్నేళ్లుగా ఎలా జరుగుతోందో మనందరికీ తెలుసు. కొన్ని ఉపన్యాసాలు, కొన్ని సన్మానాలు, ఆ ఒక్కరోజుకూ అందరు మహిళలకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు; వారి ‘దినం’ మీద కొందరు పురుషోత్తముల ఛలోక్తులు; టీవీ ఛానెళ్లలో చర్చలు; దినపత్రికల్లో పేజీల కేటాయింపులు; పార్టీ కార్యాలయాల్లో మహిళా సభ్యులకు సన్మానాలు; కొన్ని దుకాణాల్లో డిస్కవుంట్లు - చెప్పిన కథలే చెప్పుకోవడాలు; విన్న సందేశాలే వినడాలు. ఈ మాటల వల్ల, సన్మానాల వల్ల ఫలితం ఏమిటి? ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి ఏం సాధిస్తున్నాం? ఉన్నతోద్యోగాలలో మహిళల సంఖ్య పెరిగింది. సంపన్నుల జాబితాలో వాళ్లకూ చోటు దక్కుతోంది. నిజమే, కానీ మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం లేదు. మహిళలపై హింస (అత్యాచారాలు, హత్యలు, మానసిక హింసలు) ఏ మాత్రం తగ్గలేదు; బాలికల అక్షరాస్యత పెరగలేదు; స్త్రీలకు కుటుంబ భారం ఏ మాత్రం తగ్గలేదు; వరకట్న చావులు అంతరించలేదు. లైంగిక వేధింపులూ అదే స్థాయిలో ఉన్నాయి. మహిళాదినోత్సవం నాడు మళ్లీ ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఆవేశపడతాం; ఆనందపడతాం. చాలా సభల్లో మాట్లాడేవాళ్లూ, వినేవాళ్లూ ఆడవాళ్లే. రోలూ, మద్దెల మాట్లాడుకున్నట్టు. దానికంటే ఎవరిలోనైతే మార్పు రావాలో వారి చేత మాట్లాడించి, వాళ్లను శ్రోతలుగా చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. స్త్రీల పట్ల గౌరవం చూపే, స్త్రీల సమస్యలపై కృషి చేసే పురుషులను మహిళా దినోత్సవంలో పాత్రధారులను చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. టీవీలో వచ్చే ప్రభుత్వ ప్రకటనలోలా, ‘‘మగపిల్లలను ఆడపిల్లలా ఏడవొద్దని చెప్తాం. ఆడపిల్లలను ఏడిపించవద్దని ఎందుకు చెప్పం?’’ బహుశా మహిళాదినోత్సవాన్ని పురుషులు ఎక్కువగా జరిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నేననుకుంటాను. - సి.మృణాళిని, కాలమిస్ట్, రచయిత్రి ముందడుగు వేయాలనే తపన ఉండాలి! మనకు అన్ని రంగాల్లోనూ అవకాశాలుంటాయి. వాటిని ఉపయోగించుకోవడానికి చొరవ చూపాల్సింది మనమే. ఉదాహరణకు స్పోర్ట్స్ రంగంలోకి రావడానికి చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ క్రీడల వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఉన్నత చదువులు చదువుకోవడానికి స్పోర్ట్స్ కోటాలో సీటు తెచ్చుకోవచ్చు. క్రీడారంగంలోని వారికి ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. వృత్తి ప్రవృత్తి రెండింటిలోనూ రాణించవచ్చు. ముందడుగు వేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడే మహిళలు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. - నైనా జైస్వాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కొత్త స్ట్రాటజీ కావాలి విమెన్స్ మూవ్మెంట్ వల్ల మహిళలకు సంబంధించి కొత్త ఆలోచనలు, కొత్త చూపు వచ్చాయి. ఆచరణకు మాత్రం ఆమడదూరంలోనే ఉన్నాయి. నేడు విమెన్స్డేగా మనం జరుపుకుంటున్న నాటి పోరాటం వల్ల మహిళల సమస్యలను విశ్లేషించడం మొదలైంది. ఆ సమస్యలను గుర్తించడానికి మెథడాలజిస్ వచ్చాయి. బాగుంది... కానీ ఆ మూవ్మెంట్ డిఫరెంట్ లేయర్స్లోకి వెళ్లలేదు. ఇన్నేళ్లయినా మహిళలకు ఈక్వల్ రైట్స్ రాలేదు. తన జీవితానికి సంబంధించి ఆమె నిర్ణయాధికారం పొందలేదు. ఇప్పటికీ మహిళ పట్ల పరాధీన, సెక్సువల్ ఆబ్టెక్ట్ ధోరణే అమలవుతోంది. ఇది ఒక్క భారతదేశంలోనేకాదు, ఎంతో అభివృద్ధి చెందినవని చెప్పుకుంటున్న యూరోపియన్ కంట్రీస్లోనూ అంతే! స్త్రీ ఎదుర్కొంటున్న రేప్, డ్రెస్కోడ్ నిర్ణయించడం, కాప్ పంచాయితీలు వంటి బయటి హింస గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇంట్లో హింసను చెప్పుకోవడంలేదు. కాబట్టి విమెన్స్ డేను ఒక ఉత్సవంగా జరుపుకొంటూనే వివిధ వర్గాల్లోని మహిళల సమస్యలను గుర్తించి, వాటిలో కామన్గా ఉన్న సమస్యలకు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగించాలి. నిర్భయ సంఘటన జరిగినప్పుడు వచ్చిన కదలిక మిగిలిన సమస్యల మీదా రావాలి. ప్రభుత్వ పాలసీల్లో మార్పు తీసుకురాగలగాలి. దానికోసం ఓ కొత్త స్ట్రాటజీని ఏర్పాటు చేసుకోవాలి! - విమల, కవి, రచయిత ఏం దినోత్సవమో ఏమో! ఏం మహిళా దినోత్సవమో ఏమో... ఇత్తులేసే దగ్గర నుంచి మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకునేవరకూ అన్నీ నేనే చేసుకోవాలే. ఇదే మా దినం. ఇదితప్ప నాకేం తెల్వదు. బిడ్డలుంటే ఏంది? ఎవరి తిప్పలు వాళ్లకుంటయి కదా! వికారాబాద్ దగ్గర చెంచల్పేట ఊరు మాది. రెండెకరాల పొలముంది. నా భర్తకు యాక్సిడెంట్ అయింది. రెండు లక్షలదాకా ఖర్చుపెట్టి వైద్యం చేయించిన. పొలంల అన్ని రకాల ఆకుకూరలు ఏస్త. రోజు పొద్దుగాలే ఐదింటికి బస్సెక్కి వచ్చి ఈడ సిటీల అమ్ముకుని సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి మర్రుత. మహిళారైతులకు ఆ సాయం చేస్తం, ఈ సాయం చేస్తం అని సర్కారోళ్లు చెప్తరు గాని ఏం చెయ్యరు. గిదోదో మహిళా దినముంటున్నరు కదా కనీసం ఆ రోజైనా మా రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటది. - కసమమ్మ, మహిళా రైతు మనల్ని మనం విశ్లేషించుకోవచ్చు... పరిగెడుతున్న నేటి కాలంలో అందరం బిజీ అయిపోయాం. ఎందుకలా పరిగెడుతున్నామో అర్థం కాదు. ఏదో ఒక రోజు ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవడం, తెలుసుకోవడం, ఇంతవరకు జరిగిందేమిటి అని విశ్లేషించుకోవడం... ఇవన్నీ మన మంచికే! ఇలాంటి సమయంలో సమాజంలో నేటి స్త్రీ గురించి ఆలోచనాత్మకంగా మాట్లాడే నలుగురి మాటల వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. లేకపోతే జీవితం అలా గడచిపోతూనే ఉంటుంది. అలాగే ఒక వేదికమీద అన్ని వర్గాల వారు కలిసి, స్త్రీల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మనమూ ఏదైనా చేయూతనివ్వగలమా అనే దిశగా ఆలోచిస్తాం. ఆ విధంగా సమాజానికి మనమూ కొంత సేవ చేసినవారమవుతాం. సమానత్వం కోసం పోరాడే క్రమంలో ఏయే శక్తులు అవసరమో కూడా తెలుసుకొని ఉండటం మంచిదే. అందుకే మహిళా దినోత్సవం లాంటి ఒక రోజు తప్పక ఉండాలి. - అలేఖ్య పుంజల, కూచిపూడి నృత్యకారిణి ఇది శుభ పరిణామం గత కొన్ని దశాబ్దాలుగా మహిళా ఉద్యమంలో యువతులు చాలా చురుగ్గా ఉన్నారు. నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం. మహిళా ఉద్యమం జీవితంలోనే కాదు ప్రకృతిలో కూడా అంతర్భాగమనే విషయాన్ని తెలియజేస్తోందీ పరిణామం. - గీతా రామస్వామి ప్రచురణకర్త, హైదరాబాద్ బుక్ట్రస్ట్ మూడు నెలల బతుకు ఏం దినమమ్మా... మహిళా దినమా? గారోజు ఏం చేస్తరు? మాలాంటి పేద మహిళలకు ఏమన్న ఇస్తరా? మాకు మా ఊర్ల దేవుని ఉత్సవాలు తప్ప ఇంకేదెల్వదు. మాది మెదక్ జిల్లా దగ్గర కంచెర్ల ఊరు. మేం ఏడంతా ఏదురుచూసేది ఎండకాలం కోసమే. ఈ మూడునెలలే కదా కుండలు అమ్ముడువోయేది. రోజంతా ఎండల గూసోని ఈ కుండలమ్ముకుంటేగాని మాకు బతుకు ఎల్లదు. ఎండకాలమొస్తనే నాకు చేతుల నాలుగు పైసలాడుతయి. ఆటితోనే ఏడంతా గడపాలే. పూర్వం ఊళ్ల వానాకాలం, చలికాలం పనులకు పోయేటోళ్లం. ఇప్పుడు పనులకు పోనీకి పంటలేడున్నయ్. ఈ సిటీల ఏదన్న పని చేసుకుందామంటే పని తక్కువ, మందెక్కువ. మీరంటున్న దినంనాడైనా మా పేద మహిళల కష్టాలు గుర్తుచేసుకుంటే మంచిగుంటది. - గంగమ్మ, కుండల వ్యాపారి మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం! ఫలానా రంగాలకే పరిమితం అనే పరిధుల్ని చెరిపేసి మహిళలు ముందుకెళ్తున్నారు. నేను చిత్రరంగాన్ని, రాజకీయరంగాన్ని దగ్గరగా చూశాను. మగవాళ్లలో మహిళ ముందుకెళ్తుంటే చూసి భరించలేని తత్వమే ఎక్కువ! మహిళల మీద జరుగుతున్న దాడులను చూస్తుంటే మనం ఆధునిక సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. దీనంతటికీ కారణం... ఇంట్లో పిల్లలకు మంచీచెడూ చెప్పే పరిస్థితి తగ్గింది. పైగా విద్యావ్యవస్థలోనూ నైతికత గురించి పాఠాలు ఉండటం లేదు. మార్కెట్ ఆధారిత విద్యాంశాలకు పెద్ద పీట వేసే క్రమంలో మోరల్ ఎడ్యుకేషన్ పక్కకు తప్పుకొంది. దీనికి ఇళ్లల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండటమూ ఓ కారణమే. పిల్లల్లో మార్పు వచ్చిందని తల్లిదండ్రులు గమనించే లోపే జరగాల్సిన అనర్థాలెన్నో జరిగిపోతున్నాయి. చైనాలో ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంది. ఇంటర్నెట్లో అభ్యంతరకరమైన సైట్లను బ్లాక్ చేసింది. అలాంటి నిర్ణయం మన ప్రభుత్వమూ తీసుకోవాలి. ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నా మహిళ సవాళ్లను ఎదుర్కొంటూ మనోనిబ్బరంతో ముందుకు సాగుతోంది. వివక్ష రహిత సమాజ స్థాపన జరిగే వరకు ఇదే ధైర్యంతో నడుచుకోవాలి. - రోజా సెల్వమణి, నగరి ఎం.ఎల్.ఎ. (ఆంధ్రప్రదేశ్) ఈ దినం చేసే సాయం ఏమిటి? మహిళా దినోత్సవమా? మాలాంటి కూలోళ్లకు అలాంటి దినోత్సవాల గురించి ఏం తెలుస్తుంది! శ్రీకాకుళం జిల్లా నుంచి బతుకుతెరువుకి ఐదేళ్లక్రితం నగరానికొచ్చాం. మగోడి సంపాదన కడుపు నింపడానికే సరిపోవడం లేదు. పిల్లల్ని చదివించుకోవాలంటే మాలాంటి పేదోళ్లు తట్ట ఎత్తక తప్పడం లేదు. సంటిపిల్లల్ని చంకనెత్తుకుని పనులకొస్తున్నాం. లేదంటే పస్తులే. మాకుండే సమస్యలు, వచ్చే రోగాలు, పడే తిప్పలు ఇంట్లోవాళ్లతో చెప్పుకునే అవకాశం లేనప్పుడు పనిచేసే చోట మాతోటోళ్లతో చెప్పుకుంటాం. వాళ్లు చెప్పే ఓదార్పు మాటలు మాకు చానా సాయం చేస్తాయి. మగోడిలా కష్టపడుతున్న ఆడోళ్లకు ఈ దినం చేసే సాయమేందో మాబోటోళ్లకు తెలియదు. - కుమారి, భవన నిర్మాణ కార్మికురాలు గౌరవంగా చూసిన రోజే... స్త్రీల వేషధారణ మీద ఇటీవల చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక ఇంట్లో అమ్మాయి జీన్స్ వేసుకోవడం సాధారణంగా కనిపిస్తే, అదే మరో ఇంట్లో అసాధారణంగా కనిపించవచ్చు. ఇది చాలా మంది ఒప్పుకోని నిజం. స్త్రీ వ్యక్తిత్వాన్ని చులకనగా చూసే భావం మగవారిలో పోవాలి. ప్రకృతి పరంగా స్త్రీ కన్నా పురుషుడు బలవంతుడు అయ్యి ఉండవచ్చు. కానీ, మహిళకు మగవారికన్నా శక్తియుక్తులు వెయ్యి రెట్లు అధికంగా ఉన్నాయి. ప్రేమ, ఓర్పు, క్షమల్లో స్త్రీదే ప్రథమ పాత్ర. అంతటి శక్తిమంతురాలిని చిన్ననాటి నుంచి తల్లిదండ్రులే తమ పెంపకంలో తేడా చూపి వెనుకబాటుతనానికి లోను చేస్తుంటారు. వంట చేసే పని ఉంటే అమ్మాయిని చేయమంటారు. బయటకు వెళ్లే పని ఉంటే అబ్బాయిని పంపుతారు. ‘ఫలానా పని అమ్మాయిది, ఫలానా పని అబ్బాయిది’ అనే తేడాలు పోవాలి. - శిల్పారెడ్డి, మోడల్, డిజైనర్ పెళ్లయితే ఉద్యోగం మానాలా? మా దగ్గర బిటెక్, ఎంటెక్ చదివిన అమ్మాయిలు హఠాత్తుగా ఓ రోజు ‘పెళ్లి కుదిరింది, అత్తగారి తరఫు వాళ్లు ఉద్యోగం మానేయమంటున్నారు’ అంటుంటారు. పెళ్లయితే ఉద్యోగం మానేయడం ఎందుకు? స్థూల జాతీయోత్పత్తి పెరగాలని ప్రణాళికలు సిద్ధం చేసే పాలనా యంత్రాంగాలు సగం మానవ వనరులను నిరుపయోగంగా వదిలేసి అభివృద్ధి ఎలా సాధించగలమని ఆలోచించడం లేదు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా చూడండి... మహిళలు, మగవాళ్లు ఇద్దరూ పనిచేస్తారు. పని అంటే ఉద్యోగమే కాదు. చేతనైన పని ద్వారా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడం! అదే జరిగిన రోజు భర్త చనిపోతే ఇల్లు గడవక వీధిన పడే కుటుంబాలే ఉండవు. - సుచిత్ర ఎల్లా, మేనేజింగ్ డెరైక్టర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అలాగైతే రోజూ ఉత్సవమే! విష్ యు హ్యాపీ ఉమెన్స్డే. ఇది మహిళలే కాదు అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. మహిళల విజయాలు, కష్టాలు మహిళలకు మాత్రమే సంబంధించినవనుకోవడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయి. మహిళకు కష్టం వచ్చిందంటే సమాజానికి కూడా సమస్య వచ్చినట్టేనని గుర్తించాలి. స్త్రీ రక్షణ ఒక్క పోలీసులదే కాదు. మహిళలపై పెరుగుతున్న దాడుల సంఖ్య మన సమాజం పోకడని నిర్ణయిస్తుంది. మా డిపార్టుమెంట్ తరపున షీ టీమ్ చక్కగా పనిచేస్తోంది. ఇక్కడ నేను సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే... చాలామంది మగవాళ్లు ‘మేం ఏ రకంగా సహకరించగలము’ అంటూ మా షీ టీమ్ని సంప్రదిస్తున్నారు. ఇలాంటి మార్పు మహిళలకు రోజుకో మహిళాదినోత్సవాన్ని ఇస్తుంది. - స్వాతి లక్రా, అడిషనల్ సిపి, క్రైమ్ రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి, సరస్వతి రమ, నిర్మలారెడ్డి, భువనేశ్వరి -
మన మూలికలతో మెరుగ్గా జీవిద్దాం!
ప్రకృతికి దూరంగా బిజీబిజీగా పరుగులు తీస్తున్న ఆధునికత ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. అందచందాల కోసం కృత్రిమ మెరుగులతో సరిపుచ్చుకుంటూ సంతృప్తి పడుతోంది. ఈ క్రమంలో బిజీబిజీ గజిబిజి బతుకుల ఆధునిక తరానికి మన నేల సహజసిద్ధంగా ప్రసాదించిన ‘మన’మూలికలను చేరువ చేసే ప్రయత్నం పరిశ్రమగా రూపుదిద్దుకుని, పలువురికి ఉపాధినిస్తోంది. హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రదేశంలో ఉంది శ్రీనివాస ఇండస్ట్రియల్, ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పదివేల చదరపు గజాల వైశాల్యంలో యాభై లక్షల పెట్టుబడితో నిర్మించిన దీనిలో అనేక యూనిట్లు పనిచేస్తున్నాయి. వాటర్ కూలింగ్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్, డీ మినరల్ ప్లాంట్, మిక్సింగ్ ట్యాంక్, ప్లానెటరీ మిక్సర్, హోమోజినైజర్... వంటి యంత్రాలు పనిచేస్తున్నాయి. పెదవులకు రాసే లిప్బామ్ నుంచి సబ్బులు, షాంపూలు, మసాజ్ ఆయిల్, గదిని పరిమళాలతో నింపేసే క్యాండిల్ వేపరైజర్, ఎసెన్షియల్ ఆయిల్, ఫేస్ప్యాక్ల లాంటి 50, 60 రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. ‘ఏన్షియెంట్ లివింగ్’ పేరుతో పారిశ్రామికవేత్త కల్యాణి నడుపుతున్న పరిశ్రమ ఇది. జీతం అందుకోవడం నుంచి... కల్యాణి పుట్టింది హైదరాబాద్. చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చదువయ్యాక ఉద్యోగం చేశారామె. పెళ్లి తర్వాత బెంగళూరులో కాపురం. సంతృప్తిగా సాగుతున్న జీవితంలో ఏదో అసంతృప్తి. ‘నాకు ప్రకృతి సహజమైన జీవనం ఇష్టం. మన సంస్కృతి మీద గౌరవం. ప్రాచీన జీవన విధానంలో ఆరోగ్యకరమైన సౌందర్యం ఉండేది. అన్వాంటెడ్ హెయిర్ పోవడానికి కస్తూరి పసుపు, మేని లావణ్యానికి దోహదం చేసే సాధనాల వంటివెన్నో ఉన్నాయి. ఎటువంటి దుష్ర్పభావాలూ లేని మన మూలికలను, వాటిలోని ఔషధగుణాలను వదిలేసి కృత్రిమ సౌందర్య సాధనాల మాయలో పడిపోతున్నాం. ఇదే మా నాన్నతో చెప్పినప్పుడు చాలా ప్రోత్సహించారు. అలా 2011లో నాతోపాటు నలుగురు ఉద్యోగులతో మొదలైన నా పరిశ్రమలో ఇప్పుడు 30 మంది ఉద్యోగులున్నారు’ అంటారు కల్యాణి. మార్కెట్ తెలిస్తే... కృత్రిమ సౌందర్యసాధనాలు స్వైర విహారం చేస్తున్న తరుణంలో హానికారక రసాయనాలు లేని ఉత్పత్తులను తయారు చేయాలనుకోవడం సాహసమే. ‘నా ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం అంత సులభం కాదని నాకు తెలుసు. అందుకే పరిమితంగానే తయారు చేస్తున్నాను. వినియోగదారుల్లో అవగాహన కల్పించడానికి ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి వివరణాత్మకమైన కరపత్రాన్ని కూడా ముద్రించాను. అందులో భృంగరాజ్, మెంతులు, ఆమ్ల, మందార వంటి వాటిలో ఉండే సుగుణాలను వివరిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా దైనందిన జీవితంలో ఆర్గానిక్ ఉత్పత్తులను ఎందుకు వాడాలనే విషయాన్ని వివరిస్తున్నాను. కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ కోరుతూ మా ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. ఇదే నా ప్రచారాస్త్రం’ అంటారామె. ఉత్పత్తి మొదలై నాలుగేళ్లు నిండినా ప్రకటనలు కనిపించకపోవడం గురించి మాట్లాడుతూ ‘ప్రకటనల హోర్డింగులకు డబ్బు వృథా చేయను. ప్రస్తుతం ఆర్గానిక్ స్టోర్స్కు సప్లయ్ చేస్తున్నాను. ఆన్లైన్లోనూ మార్కెట్ చేస్తున్నాను. స్పాలు, విమానాశ్రయాలు మా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాయి’ అన్నారామె. వన మూలికలను సమృద్ధిగా అందించిన నేల మనది. ఆ నేలలో జీవిస్తూ ఆరోగ్యంగా బతికే అవకాశాన్ని కోల్పోవద్దు- అనేది కల్యాణి సందేశం. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: రాజేశ్ రెడ్డి ‘తైల పాక్ విధి’ ప్రక్రియతో ఆయిల్స్ చేస్తున్నాం. సల్ఫేట్స్, పారాబెన్స్, సింథటిక్ ఫ్రాగ్నన్స్ లేకుండా షాంపూలు తయారు చేస్తున్నాం. తమిళనాడు, కేరళ, రాజస్థాన్, కశ్మీర్ వంటి అనేక చోట్ల నుంచి ముడిసరుకు సేకరిస్తున్నాం. దేశం బయటి నుంచి ఒక్కటి కూడా తీసుకోలేదు. - బొప్పన కల్యాణి ,‘ఏన్షియెంట్ లివింగ్’ ఉత్పత్తుల తయారీదారు. ఫోన్: 9550753535 -
క్షణం ఆలస్యమైనా విమానం నేలకూలేది!
యుద్ధ క్షేత్రం సాధారణంగా ప్రత్యర్థి విమానాలు దాడికి దిగినప్పుడు సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేస్తారు. వెంటనే అందరూ ఇళ్ల పక్కనే ఉన్న ట్రెంచ్లోకి వెళ్లి తలదాచుకోవాలి. అలా చేస్తే బాంబుదాడిలో ఇళ్లు ధ్వంసమైనా మనుషులకు చాలా వరకు ప్రమాదం ఉండదు! 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో ఉన్నారు. అది ఆయన మొదటి పోస్టింగ్! ‘సైరన్’ మోగగానే భార్యతో సహా ట్రెంచ్లోకి వెళ్లారు. నాలుగు వందల గజాల దూరంలో పడ్డ బాంబుల తీవ్రతను ఎదుర్కొన్నారు. శత్రువుల విమానాన్ని నేలకూల్చడంలోనూ, దేశ విమానాన్ని కాపాడుకోవడంలోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అప్పటి ఆ అనుభవాలు... వైమానికదళంలో ప్రధానంగా మా సేవలు ఉత్తరభారతదేశంలోనే కేంద్రీకృతమై ఉంటాయి. గగనతలాన్ని రక్షించడం ఎయిర్ డిఫెన్స్ విభాగం బాధ్యత. శత్రువుల కదలికలను రాడార్ ద్వారా గమనిస్తూ తక్షణ చర్యలకు సంకేతాలు, ఆదేశాలు జారీ చేయడం మా విధి. ‘ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్’లో పనిచేశాను. అధునాతన రాడార్ వ్యవస్థ ద్వారా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానం ఆచూకీ కూడా తెలుసుకోవచ్చు. పాకిస్తాన్లో ఒక విమానం గాల్లోకి లేచిందంటే అది లాహోర్ నుంచా కరాచీ నుంచా అని కూడా తెలిసిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠ... ప్రత్యర్థుల దాడిని నిలువరించిన అనేక సంఘటనల్లో ప్రధానమైనది 1971లో జరిగింది. అప్పుడు కోల్కతా దగ్గర ఈస్టర్న్ సెక్టార్లో పనిచేస్తున్నాను. కలైకొండ ఎయిర్ బేస్ నుంచి మన రెండు మిగ్ విమానాలు పాకిస్తాన్కు చెందిన రెండు సేబర్ విమానాలతో తలపడ్డాయి. తూర్పు పాకిస్తాన్లోని ఢాకా (ఇప్పుడది బంగ్లాదేశ్ రాజధాని) లక్ష్యంగా సాగిందా దాడి. మన మిగ్ పాక్ సేబర్ని కొట్టేసింది. దాంతో రెండో సేబర్ వెనక్కి వెళ్లిపోయింది. మన మిగ్ విమానాలు రెండూ వెనక్కి వస్తుండగా ఊహించని పరిణామం... పాక్ మరో రెండు సేబర్లను పంపించింది. ఆ విషయం మన పైలట్లకు తెలియదు. రాడార్ ద్వారా నేను గుర్తించి, వెంటనే సమాచారాన్నందించాను. అప్పుడు మన విమానాల్లో తగినంత ఇంధనం ఉందో లేదోననే సందేహం. ఆ సమయంలో మన పైలట్లు సేబర్లతో తలపడడానికే సిద్ధమయ్యారు. ఒక సేబర్ను నేలకూల్చారు కూడా. దాంతో రెండో సేబర్ వెనక్కి వెళ్లిపోయింది (సేబర్లు జంటగా పోరాడుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఒక్క సేబర్ యుద్ధానికి దిగదు). అప్పుడు మన వాళ్లు వెనక్కి రావడానికి తగినంత ఇంధనం లేదని స్పష్టంగా తేలిపోయింది. వాటిని మానిటర్ చేస్తున్న నాలో తీవ్రమైన ఉత్కంఠ. వెంటనే ‘ఏ క్షణాన్నయినా యుద్ధ విమానాలు ల్యాండ్ కావచ్చు. రన్వేలు సిద్ధంగా ఉంచండి’ అని కోల్కతా బేస్కి సమాచారం ఇచ్చి, పైలట్తో కాంటాక్ట్లో ఉన్నాను. ఇంజన్ ఆఫ్ చేసి కొంత దూరం ప్రయాణించి, నేలకు దగ్గరగా వచ్చినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి ల్యాండ్ చేశారు పైలట్లు. అప్పటికి ఒక విమానంలో అయితే ట్యాంకు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ల్యాండ్ కావడం మరో నిమిషం ఆలస్యం అయినా ఆ మిగ్ నేలకూలేది. యుద్ధంలో ప్రత్యర్థి చేతిలో నేలకూలకుండా రక్షించుకుని ఇంధనకొరతతో విమానం నేలకూలితే అది సైనికుడికి గుండె పిండేసినంత బాధ. పైలట్కి, ఎయిర్ బేస్కి మధ్య సమన్వయం కుదర్చడంలో సెకన్లలో స్పందించి తీసుకున్న నిర్ణయమే ఆ ప్రమాదాన్ని నివారించింది. నేను పంజాబ్, హర్యానా, జోధ్పూర్, రాజస్థాన్, కశ్మీర్, మిజోరాం రాష్ట్రాల్లో పనిచేశాను. పంజాబ్, రాజస్థాన్లలో ఎయిర్ డిఫెన్స్ ఆపరేషనల్ ఎఫిషియెన్సీకి గాను నాకు మన ప్రభుత్వం 1976లో విశిష్ట సేవాపతకాన్ని ప్రదానం చేసింది. రిపోర్టింగ్: వాకా మంజులా రెడ్డి manjula.features@sakshi.com మాది వైఎస్ఆర్ జిల్లా పులివెందుల. దార్వాడ్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎ చేసి, రక్షణరంగంలోకి వెళ్లాను. రెండు దశాబ్దాల పాటు ఉద్యోగం చేసి 43 ఏళ్ల వయసులో 1985లో రిటైరయ్యాను. తర్వాత, ఈసీఐఎల్లో సీనియర్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈవెనింగ్ కాలేజ్లో ఎంబీఏ చదివాను. అందులోంచి కూడా రిటైరయ్యాక, విశ్రాంత రక్షణరంగ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్గా సైనిక్పురి, వాయుపురి, ఆ పరిసరాల్లో నివాసముంటున్న మాజీ రక్షణ రంగ ఉద్యోగుల కోసం పని చేస్తున్నాను. - మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి -
మట్టిపూల పరిశ్రమ వాడని పూలతోరణం!
మీరే పారిశ్రామికవేత్త ప్రకృతి స్ఫూర్తితో నింగికెగిరి, నీటిలో ప్రయాణించిన మనిషి, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదానినీ తాను కూడా చేసి చూసి మురిసిపోవాలనుకుంటాడు. చిత్రకళ, శిల్పకళ అలా రూపుదిద్దుకున్నవే. తాజాగా మార్కెట్ పరిభ్రమణం క్లే ఆర్టికల్స్ మీదకు మళ్లింది. క్లే ఆర్టికల్స్ తయారీ పరిశ్రమను స్థాపించాలంటే... ఈ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా కొనాల్సిన వస్తువులు పెద్దగా ఉండవు. ఇంట్లోనే ఒక గది దీని కోసం కేటాయించుకోవచ్చు. టేబుల్, కుర్చీల వంటివి ఇంట్లో ఉన్నవే వాడుకోవచ్చు. ప్రత్యేకించి పరిశ్రమ కోసం కొనాల్సినవి... ఆర్ట్ క్లే, ఫుడ్ కలర్స్, డిస్పోజబుల్ గ్లాసులు (ఫ్లవర్పాట్ తయారీకి), అప్పడాల కర్ర (ఆర్ట్ క్లేని మృదువుగా చేసుకోవడానికి), ప్లాస్టిక్ టూత్ పిక్స్ (పూలకు కాడలుగా, ఫ్రేమ్లో చక్కగా గుచ్చుకోవడానికి), పెన్, స్కెచ్ పెన్, ఐవరీ కార్డు (గ్రీటింగ్ కార్డు తయారీ కోసం), గ్లాస్ పలకలు (ఆక్రిలిక్ పలకలు కూడా వాడవచ్చు), ఫెవికాల్, అల్యూమినియం ఫాయిల్ వంటివి సరిపోతాయి. ఒక మహిళ నెల రోజుల పాటు ఇంట్లో ఈ పూలు, బొమ్మలు తయారు చేసుకోవడానికి ఇరవై కిలోల ఆర్ట్ క్లే తీసుకుంటే సరిపోతుంది. ఈ కుటీర పరిశ్రమ స్థాపించడానికి ఖర్చు పాతిక వేల రూపాయలకు మించదు. ఇంట్లో ఉత్పత్తి చేసుకుని, ఆ వస్తువులను బయట మార్కెట్ చేసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన వివరాలివి. ఒక మోస్తరు షో రూమ్ పెట్టాలంటే దానికోసం అద్దె, సహాయకుల జీతాల వంటివి అదనంగా ఉంటాయి. ఏమేం చేయవచ్చు? ఆర్ట్ క్లేతో ఇరవై రకాల పూలు చేయవచ్చు. చిట్టిపూలతో దండలు, బ్రేస్లెట్లు, తోరణాలు, పెద్ద పూలతో వాల్ హ్యాంగింగ్స్, సీనరీలు, గ్రీటింగ్ కార్డులు, ఫ్ల్లవర్ వాజులు, ఫ్లవర్ బొకేలు, పెన్స్టాండులు చేయవచ్చు. బీడ్స్ వరుసలతో ముందు గదికి, డైనింగ్ హాల్కి మధ్యలో పార్టిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. దేవుడి విగ్రహాలకు, పెద్దవాళ్ల ఫొటోలకు హారాలు చేయవచ్చు. శిల్పాలు కూడా చక్కగా రూపుదిద్దుకుంటాయి. మార్కెట్ స్థితిగతులు... పెన్ స్టాండులు, చిన్న పూల తోరణాలకు మంచి గిరాకీ ఉంటోంది. పువ్వు రెండు రూపాయల చొప్పున ఎంత పొడవు కావాలంటే అంత తోరణం కట్టించుకోవచ్చు. గ్రీటింగ్ కార్డు 50 రూపాయలకే దొరుకుతుంది. ఆర్ట్ క్లే పూలతో చేసిన చిన్న వాల్ హ్యాంగింగ్ రూ 350 నుంచి మొదలవుతుంది. పెద్దవి ఉడెన్ ఫ్రేమ్ కట్టిన వాల్ హ్యాంగింగ్ ధర ఐదువేల వరకు ఉంటుంది. శిక్షణ, రిజిస్ట్రేషన్ వివరాలకు... 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి స్వయం సమృద్ధి సాధించాలనే ఆసక్తి ఉంటే చాలు... ప్రభుత్వం... ఎం.ఎస్.ఎం.ఇ. (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్), ఎన్.ఎస్.ఐ.సి. (నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్), ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఎలీప్ వంటి సంస్థల సమన్వయంతో శిక్షణ, పరిశ్రమ స్థాపన, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. జిల్లాల్లో సదస్సులు పెట్టి శిక్షణనిస్తున్నాం. శిక్షణ పూర్తయిన బృందానికి, కొత్తగా శిక్షణ తీసుకున్న బృందానికి మధ్య సంధానకర్తగా ఉంటూ ఒకరి అనుభవాలను మరొకరు అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాం. శిక్షణలో నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగం లేదా పరిశ్రమ స్థాపన పట్ల ధైర్యం వస్తుంది. ఒకరుగా చేయలేని పరిశ్రమలైతే ఐదారు మంది బృందాలుగా ఏర్పడి (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పరిశ్రమ స్థాపించవచ్చు. కుటుంబ కారణాల వల్ల ఇవేవీ చేయడం సాధ్యం కాని మహిళలు పరిశ్రమల వారికి అవుట్ సోర్సింగ్ ద్వారా పని చేసి తగిన వేతనం (పీస్ లెక్కన) తీసుకోవచ్చు. - పంకజ్ శ్రీనివాసన్, మేనేజర్, ఎంప్లాయ్మెంట్ కో ఆర్డినేటర్ ఫోన్: 8886665904 pankaj.textmin@gmail.com -
ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది!
అది మంచయినా చెడయినా!! ఆయన మనకు నటుడిగా సుపరిచితులు. కామెర్ల వ్యాధికి మందిచ్చే వైద్యుడని కొందరికే తెలుసు. మంత్రిగా ఎందరికో తెలుసు. దేశరక్షణ, దౌత్యవ్యవహారాలను నిర్వహించిన తీరు కొందరికే తెలుసు. ఆ రెబెల్స్టార్ కృష్ణంరాజు దైనందిన ప్రణాళిక అప్పట్లో ఎలా ఉండేది? ఇప్పట్లో ఎలా ఉంటోంది? ఆయన మాటల్లోనే... అవిశ్రాంతం అరవై తర్వాత - వాకా మంజులారెడ్డి నా జీవితం ఎప్పుడూ నా చేతిలోనే ఉంది. అయితే నా ఇరవై నాలుగ్గంటల సమయానికి ప్రణాళిక వేసుకోవడం మాత్రం నా చేతిలో ఉండదు. అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటుంది. అలా మార్చుకుంటూ వచ్చాను. సినీ పరిశ్రమలో పనివేళలు ఓ రకంగా ఉంటాయి. రాజకీయరంగంలో పని వేళలు మరో రకంగా ఉంటాయి. మంత్రిగా ఉన్నప్పుడు ఐదింటికి నిద్ర లేచి ఆరు గంటలకంతా తయారయ్యే వాడిని. అప్పటి నుంచి నా కోసం వచ్చిన వారిని కలిసే వాడిని. వారడిగిన సమస్యలను పరిష్కరించడం మనచేతిలో ఉందా లేదా అని సెక్రటరీ ద్వారా సంబంధిత అధికారులను కనుక్కుంటూ వచ్చిన వారిని సమాధాన పరిచేవాడిని. అలా ఒకటిన్నర వరకు సాగేది. భోజనం తర్వాత కొంత విశ్రాంతి, మళ్లీ మధ్యాహ్నం మూడింటి నుంచి నన్ను కలవడానికి వచ్చే వారికి అందుబాటులో ఉండేవాడిని. నటుడిగా సినీరంగంలో ఇందుకు భిన్నంగా గడిపేవాడిని. ఒక సినిమాకు పనిచేస్తున్నప్పుడు షూటింగ్ మొదలు కాకముందే అందులో నా పాత్ర స్వభావాన్ని క్షుణ్ణంగా ఒంటబట్టించు కునేవాడిని. నవల ఆధారంగా తీస్తున్న సినిమా అయితే ముందు ఆ నవలను చదివేవాడిని. రాత్రంతా ‘ఎలా నటిస్తే ఆ పాత్రను పండించగలను’ అని ఆలోచిస్తూ ఉండగానే కోడి కూసేది. అప్పుడు లేచి స్నానం చేసి పడుకుని హాయిగా నిద్ర పోయేవాడిని. పాత్ర గురించి ఒక స్పష్టత వచ్చేవరకు నిద్రావస్థలో ఉండే వాడిని తప్ప అది నిద్ర కాదు. డిస్టర్బ్ కాలేదు! ఇక పాత్ర కోసం మేకప్ వేసుకున్న తర్వాత ‘నేను కృష్ణంరాజుని కాదు’ ఆ పాత్రనే. నా కళ్ల ముందు భార్య, పిల్లలు తిరుగుతున్నా కూడా నేను నా ప్రపంచంలోనే ఉంటాను. అంతటి ఏకాగ్రత ఉండడంతో నేను ఎంత మంది మధ్య ఉన్నా, నా చుట్టూ ఎంత మంది గోల చేస్తున్నా డిస్టర్బ్ అవ్వను. నా జీవితంలో ఎప్పుడూ ‘నన్ను డిస్టర్బ్ చేయకండి’ అనే మాట అనలేదు. ఇన్నేళ్లలో నేను ఎన్ని గంటలు పని చేసినా ఆయాసం, అలుపు, చేయలేనేమోననే ఆందోళన కలగలేదు. అందుకు మెడిటేషనే కారణం. ధ్యానంతో స్వీయ విశ్లేషణ! రోజూ రెండు గంటల సేపు ధ్యానం చేస్తాను. ధ్యానం వల్ల మనిషిలో స్వీయ విశ్లేషణ శక్తి వస్తుంది. దేహానికి స్వీయ స్వస్థత శక్తి కలుగుతుంది. ఎక్కడైనా గాయం అయితే, దాని మీదనే మనసు లగ్నం చేసి ధ్యానంలో మునిగిపోతే ఆ గాయం, నొప్పి మాయమవుతాయి. గ్రంథాల్లో ఉన్న ఈ విషయాన్ని నా మీద నేను ప్రయోగం చేసుకుని మరీ నిర్ధారించున్నాను. ధ్యానం వల్ల నాకు ఎప్పుడూ నెగెటివ్ థాట్స్ రావు. ఆలోచనలెప్పుడూ సానుకూలంగానే సాగుతాయి. మన ఆలోచనలు చెడుగా సాగుతుంటే అలాగే జరుగుతుంది. మంచివైపు సాగితే అదే జరుగుతుందన్నది నేను బలంగా నమ్ముతాను. రష్యన్ నటుడు కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ ‘మై లైఫ్ ఇన్ ఆర్ట్’ లో స్టానిస్లావ్స్కీ ఒక గొప్ప వాక్యం రాశారు. సక్సెస్ బాటలో మంచి ఊపులో ఉన్నప్పుడు మనిషికి ఆత్మవిశ్వాసం పెరిగి అది అహంకారానికి దారి తీస్తుంది. అప్పుడు ‘నేనేం చేసినా, ఏ పాత్రను ఎలా నటించినా ఆడుతుంది’ అనే ధోరణి తలకెక్కించుకుంటే ఘోరంగా విఫలమవుతారని రాశారాయన. అది నాపై ఎంతో ప్రభావం చూపింది. భయం అంటే ఏమిటో..? నాకు భయం అంటే ఎలా ఉంటుందో తెలియదు. భయపడడం అనే స్థితి నా జీవితంలో రాలేదు. నా మొదటి సినిమా ‘చిలకాగోరింక’లో నా నటన బాగుందనుకున్నా. చిత్రం ఆశించినట్లు ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన రెండు అవకాశాలను తిరస్కరిస్తూ ‘నేను నటన నేర్చుకున్న తర్వాత మీకు సినిమాలు చేస్తాను’ అని చెప్పాను. నిజానికి ఆ దశలో ఆ మాట అనగలగడానికి చాలా ధైర్యం ఉండాలి. భవిష్యత్తు గురించి ఏ మాత్రం భయపడినా నా నోటి నుంచి ఆ మాట వచ్చేది కాదు. పుస్తకాలను విపరీతంగా చదవడం, నేను చేయాల్సిన పని గురించి లోతుగా అధ్యయనం చేయడం వల్లనే నేను ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవడం, కష్టసాధ్యమైన పనులు చేయడం సాధ్యమైందన్నది నా నమ్మకమే కాదు, అనుభవం కూడా! ఎందుకంటే నేను విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేసినప్పుడు ఏది చేస్తే పదిమందికీ మంచి జరుగుతుందని నమ్మానో, వాటిని ధైర్యంగా, ఎటువంటి సంకోచం లేకుండా చేయగలిగాను. ఇప్పుడు పార్టీ వ్యవహారాలు చూసుకోవడం, కామెర్లకు మందివ్వడం, నటించడం... ఈ మూడింటిలో సమయం గడిచిపోతోంది. ఏ మాత్రం విరామం వచ్చినా అలా ఖాళీగా ఒక సోఫాలో కూర్చుని ఇంట్లో పిల్లలు, శ్యామల వాళ్ల పనుల్లో హడావుడిగా తిరుగుతూ ఉంటే అలా తృప్తిగా చూస్తూ ఉంటాను. అదే నాకు పెద్ద రిలాక్సేషన్. (నవ్వు) -
గీతలో అర్థం చేసుకున్నది ఆచరణలో...
శ్రీ కృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడా? లేక యుద్ధం చేయలేనని గాండీవాన్ని దించేసిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేశాడా? లేక నీ వెనుక నేనున్నాను... ధైర్యంగా యుద్ధం చేయమని ప్రోత్సహించాడా? ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రశ్నలకు అరటిపండు వలిచినంత సులువుగా సమాధానాలు చెబుతారు అరవిందరావు. ఒకప్పుడు రాష్ర్ట్రంలోని అరాచక శక్తుల ఆటకట్టించేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన ఈ విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారికి ఇప్పుడు ఇటువంటి ధర్మసూక్ష్మాలను బోధించగలగడం ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందాం... నేను అప్పుడూ ఇప్పుడూ ఎప్పడూ దేవుడిని పూజించలేదు. అయితే అప్పట్లో ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏమున్నదనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఇంటెలిజెన్స్లో పని చేస్తున్న కాలంలో కొందరిని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఒక తీవ్రవాది... ‘మాకు మీలాగ వందలాది దేవుళ్లుండరు, పిచ్చి బొమ్మలేవీ ఉండవు. ఒకే దైవం...’ అంటూ హేళనగా మాట్లాడాడు. అలాంటివే ఇంకొన్ని సంఘటనలు జరిగాక ఇంతకీ ఏ మతం ఏం చెబుతోందనే జిజ్ఞాస కొద్దీ బైబిల్, ఖురాన్, భగవద్గీత చదివాను. బైబిల్, ఖురాన్లు అర్థమైనంత సరళంగా భగవద్గీత అర్థం కాలేదు. దాంతో మహా మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడిని ఆశ్రయించి సందేహాలు తీర్చుకున్నాను. ఏతావాతా నాకు తెలిసిందేమిటంటే... గీతలో కృష్ణుడు ఉపనిషత్తులు, వేదాంతాల సారాన్ని చెప్పాడు. అవి ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేసేలా ఉంటాయే తప్ప మూఢవిశ్వాసాలవైపు మళ్లించేలా ఉండవు. అందుకే నేను భగవద్గీతను మరింత బాగా చదివి, ఆకళింపు చేసుకున్నాను. నేను తెలుసుకున్నదానిని పదిమందికీ అర్థమయేలా నా మాటల ద్వారా... రాతల ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పటి విధులకు - అనంతరం విశ్రాంత జీవనంలో ఇప్పుడు నేను నిర్వర్తిస్తున్న బాధ్యతలకు ఎక్కడా పొంతన కనిపించినట్లు అనిపించదు. కానీ భగవద్గీత సారాన్ని గ్రహించడం వల్లనే విధ్యుక్తధర్మాన్ని ఆచరించడం సులువైందని నేను నమ్ముతాను. ప్రణాళిక ఏమీ లేదు... అంతా ఆచరణలోనే! నిజానికి విశ్రాంత జీవితాన్ని ఆధ్యాత్మికపథంలో గడపాలనే ఆలోచన కానీ, అందుకు ఓ ప్రణాళిక కానీ అప్పట్లో ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎప్పుడు కలిగిన ఆలోచనలను అప్పుడు ఆచరణలో పెట్టడం వల్లనే నా ప్రయాణం ఇప్పుడిలాంటి ప్రణాళికాబద్ధమైన దారిలోకి మళ్లింది. అమెరికాలో అయోమయాన్ని చూశాక! మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. వారి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి భారతీయులలో నెలకొన్న అయోమయమే ఇలా పుస్తకాలు రాయించింది. అక్కడ స్కూళ్లలో పిల్లలకు అన్ని మతాల గురించి ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. అలా చెప్పేటప్పుడు హిందూమతం గురించి చెట్లను, పుట్టలను, విగ్రహాలను పూజిస్తారంటూ కొంత హేళనగా చెప్పడాన్ని గమనించాను. అది విన్న పిల్లలు పలు సందేహాలతో ఇంటికొచ్చి తల్లితండ్రులను అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్పలేక చాలామంది తల్లితండ్రులు నీళ్లు నములుతుంటారు. అప్పుడు హిందూమతం ఏమి చెప్తోందని విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్లు సరళంగా రాశాను. భగవద్గీతను ఎంతోమంది రాశారు. వాటిలో ఐదారు వెర్షన్లు చదివాను. పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాయాల్సిన అవసరం ఉందనిపించి నేనూ రాశాను. నలభైలలో మొదలైన జిజ్ఞాస నన్ను సంస్కృతం చదివేలా చేసింది. ఎం.ఎ, పిహెచ్డి చేశాను. రిటైరైన తర్వాత నా పిహెచ్డి గ్రంథం ‘ఉపనిషత్తుల్లోని జ్ఞానం గురించి వివేచన’ను పుస్తకరూపంలో తెచ్చాను. ఇప్పటివరకూ నేను మొత్తం ఏడు పుస్తకాలు రాస్తే, వాటిలో ఐదు విడుదలయ్యాయి. మరో రెండు ప్రచురణ దశలో ఉన్నాయి. అలాగే ఉపనిషత్తుల సారంపై నేను చెబుతున్న పాఠాలు అద్వైత అకాడమీ వెబ్సైట్లో ప్రసారమవుతున్నాయి. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మొదలయ్యే రెండవ జీవితాన్ని చాలామంది నిరర్థకంగా గడుతుపుంటారు. అయితే ఈ దశను ప్రయోజనకరంగా మార్చుకోవడానికి నలభైలలోనే నాందిపడితే మంచిది. సమాజానికి ఏం చేయగలమనే వివేచనతో ఒక ఆలోచన మొదలైతే ఉద్యోగవిరమణ తర్వాత జీవితం నిరర్థకంగా మారకుండా సార్థకమవుతుంది’’ అంటున్న ఈ అరవిందుడి సూచన రేపో మాపో రిటైరవబోయే వారే కాదు... ఇప్పుడిప్పుడే ఉద్యోగజీవనంలోకి ప్రవేశిస్తున్న వారు కూడా ఆలోచించదగ్గది... ఆచరించ వలసినదీ! ఆయన మార్గమే నన్నూ నడిపిస్తోంది ఇప్పటి పిల్లల పాఠ్యగ్రంథాల్లో నీతికథలు ఉండడం లేదు. కనీసం తల్లితండ్రులైనా పిల్లలకు ఇంట్లో సుమతీశతకం, వేమన శతకం వంటివి నేర్పించడం లేదు. ఇది సరైన ధోరణి కాదని ఆయన వాపోతుంటారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ మార్గాన్ని తీసుకోవడం వల్ల నాకు కూడా సౌకర్యంగానే ఉంది. ఉదయం వ్యాయామం నుంచి రాత్రి వరకు మా దైనందిన జీవితం ఓ క్రమపద్ధతిలో నడుస్తోంది. - రమ, అరవిందరావు సతీమణి గీతను అర్థం చేసుకుంటే పరిస్థితిని చక్కదిద్దే మెలకువ, స్వీయనియంత్రణ వస్తుంది. ఉద్యోగి, రాజకీయవేత్త, పరిపాలనాధికారి... ఎవరైనా సరే తమ రంగంలో రాణించడానికి దోహదం చేస్తుంది. భగవద్గీత చదువుతూ కాల్పులు, ఎన్కౌంటర్లు ఎలా చేస్తారని కొందరు సిద్ధాంతకర్తలు నన్ను విమర్శించారు. గీత చదవడం అంటే... ఆ వ్యక్తి అన్నీ వదులుకుని ఎవరు తమ మీద దాడి చేసినా చేయించుకోవాలని కాదు. తన కర్తవ్యాన్ని మరింత కచ్చితంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడని అర్థం. - కె. అరవిందరావు, విశ్రాంత పోలీసు డెరైక్టర్ జనరల్ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
యుద్ధం కూడా సృజనే!
యుద్ధ క్షేత్రం విధులను సృజనాత్మకతతో నిర్వర్తించాలని సైనికులకు శిక్షణలో చెబుతుంటారు. ఉద్యోగాన్ని ప్రేమించినప్పుడే సృజనాత్మక ఆలోచనలు వస్తాయంటారు కల్నల్ పి.రమేష్ కుమార్(రిటైర్డ్). మరి యుద్ధరంగంలో కొత్త ఆలోచనల అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శభాష్ అనిపించుకున్న ఈ మాజీ సైనికుడి అంతరంగం ఈవారం... మాది వరంగల్ జిల్లా. నా విద్యాభ్యాసం నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్లలో జరిగింది. ఇంజనీరింగ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశాను. మెకానికల్ ఇంజనీర్గా 1986లో రక్షణరంగంలో చేరాను. ఇరవై ఆరున్నరేళ్లు పనిచేసి 2013లో రిటైరయ్యాను. ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, జమ్మూ- కశ్మీర్తోపాటు శ్రీలంకలోనూ పనిచేశాను. బ్లాక్ క్యాట్ కమెండోస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించాను. ట్యాంకులు, వార్ ఫైటర్స్ వంటి యుద్ధసామగ్రిని మరమ్మతు చేసి కండిషన్లో ఉంచడం మా ప్రధాన విధి. అయినప్పటికీ ఆర్మీలో అందరికీ తుపాకీ పేల్చడంలో తర్ఫీదునిస్తారు. సరిహద్దులో ఉన్నప్పుడు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామస్థులతో సత్సంబంధాలు పెంచుకోవడం చాలా ముఖ్యం. అక్కడి అవసరాలను గుర్తించి మంచినీటి సౌకర్యాల వంటి మౌలిక వసతులు కల్పించడం కూడా మా బాధ్యతే. ఒక్కొక్క బెటాలియన్ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్థులతో స్నేహంగా మెలగాలి. ఉగ్రవాద దాడుల సమాచారాన్ని పసిగట్టడానికి అనేక వ్యూహాలు అవసరం. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినట్లు గానీ, కొత్త వాళ్లు ఆ గ్రామం మీదుగా ప్రయాణించినట్లు గానీ గుర్తించిన వెంటనే గ్రామస్థులు ఆ సమాచారాన్ని మాకు చేరవేసేవాళ్లు. కుక్కలు మొరగడంతో..! ఒకసారి రాత్రి పది దాటిన తర్వాత పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల కోసం మాటు వేశాం. మూడు గంటలయినా ఎటువంటి అలికిడీ లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో అనుకుంటూ ఆ రాత్రికి ప్రయత్నం విరమించుకున్నాం. గ్రామస్థులలో ఎవరైనా వారికి సమాచారం అందించారేమో అనే అనుమానం కూడా వచ్చింది. మరుసటి రోజు ఆకస్మికంగా వెళ్లి మాటు వేశాం. పైగా రెండు బృందాలుగా వెళ్లి రోడ్ క్రాసింగ్ దగ్గర రెండుగా చీలిపోయే చోటును దృష్టిలో ఉంచుకుని కాపలా కాశాం. వాళ్లు కూడా ప్రధాన దారిని వదిలి చుట్టూ తిరగాల్సిన దారినే ఎంచుకున్నారు. రెండు చోట్లా మా బృందాలు ఉండడంతో ఈ దఫా మా ప్రయత్నం ఫలించింది. కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. మరొకరు గాయపడి దొరికిపోయాడు. అతడిని విచారించినప్పుడు మాకు ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. మొదటి రోజు మేము కాపు కాసిన ప్రదేశంలో కుక్కలు మొరగడంతో ఉగ్రవాదులు ప్రమాదాన్ని పసిగట్టి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సృజనాత్మకతతో చేస్తే..! ఇంజనీర్గా నేను గర్వంగా చెప్పుకోగలిగేది జోధ్పూర్లో జరిగింది. ఫైరింగ్ మెకానిజంలో సమస్యలు వచ్చిన ట్యాంకులు ఆరేడు నెలలుగా ఓ పక్కన ఉండిపోయాయి. అవన్నీ చిన్నపాటి స్పేర్పార్ట్స్ దొరికితే పనిచేయగలిగేవే. కానీ అవి విదేశాల నుంచి రావాలి. మెటల్ టెస్టింగ్ ఆపరేషన్ ద్వారా మెటీరియల్ వివరాలు, తయారీ విధానం, క్యాడ్కామ్ వంటి టెక్నిక్స్ను అధ్యయనం చేసి తక్కువ ఖర్చుతో పది ట్యాంకులను రిపేర్ చేశాం. బ్యాటిల్ ఎక్విప్మెంట్ టెస్ట్ రన్లో అవి విజయవంతంగా నిలిచాయి. కాలువలను, చిన్న నదీపాయలను దాటాల్సినప్పుడు బ్రిడ్జి ట్యాంకర్లను వాడతారు సైనికులు. వాడగా వాడగా వాటి లోహపు వంతెన అరిగి నునుపుదేలి జారుడుగా మారుతుంది. వాటి మీద ఏ వాహనం ప్రయాణించాలన్నా ప్రమాదమే. ఇనుపరాడ్లను ముక్కలు చేసి వంతెన పై భాగాన ప్రత్యేకమైన వెల్డింగ్ రాడ్తో అతికించాం. ఆ ఫార్ములా విజయవంతం కావడంతో, ఆ తర్వాత చాలా చోట్ల నునుపుదేలిన వంతెనలను తక్షణ వినియోగంలోకి తీసుకురావడానికి అదే పద్ధతిని అనుసరించారు. ఆ ప్రయోగం చేసినందుకు ప్రశంసాపూర్వకంగా ‘కమెండేషన్ కార్డు’ కూడా అందుకున్నాను. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
మా ఇల్లొక ప్రయోగశాల!
మహిళా విజయం బాలామణి పుట్టింది, పెరిగింది హైదరాబాద్లో. ఆమెకు రంగుల అద్దకపు అందం తెలిసింది అత్తారింట్లో. చేనేత కుటుంబం కావడంతో ఇంట్లో అందరూ నిష్ణాతులే. ఆ ఇంటి మగ్గాలకు ఇరుసుగా మారిన మహిళ విజయగాథ ఇది. మా అత్తవాళ్ల కుటుంబానిది చేనేతతో విడదీయలేని బంధం. ఇకత్ నేతలో నిష్ణాతులు. గోల్కొండ నవాబులకు వస్త్రాలు నేసేవారు. అప్పట్లో వస్త్రాలకు సహజ రంగులే వాడేవారు. కృత్రిమ రంగుల ధాటికి అవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. సహజరంగుల తయారీ శ్రమతో కూడినది. కేటాయించాల్సిన సమయమూ ఎక్కువే. దాంతో తయారీ ఖర్చులు పెరుగుతాయి. సంపన్నవర్గాల దృష్టి వీటి మీద పడటంతో మళ్లీ సహజరంగులు అద్దిన బట్టల అమ్మకాలు పెరుగుతున్నాయి. నేచురల్ కలర్స్కి ముడిసరుకు బేగంబజార్లో దొరుకుతుంది. చెట్ల బెరడు, పండ్ల తొక్కలు, పూలరెక్కలు వంటివన్నీ ఎండబెట్టి అమ్ముతారు. పొడులు కూడా దొరుకుతాయి కానీ కల్తీ ఉంటుందేమోననే సందేహంతో నేను యథాతథంగా కొని మర పట్టించుకుంటాను. ఇండిగో మాత్రం చెన్నై నుంచి తెప్పిస్తాను. ఈ యూనిట్ నడపాలంటే పారే నీటి సౌకర్యం ఉండి తీరాలి. గతంలో గండిపేట, కాప్రా, దుర్గం చెరువుల్లో అద్దిన వస్త్రాలను శుభ్రం చేసేవాళ్లం. ఇప్పుడవీ కలుషితమయ్యాయి. ఇంట్లోనే సొంతబావి ఉండటంతో పెద్ద సిమెంటు తొట్టి, నీరు ప్రవహించే ఏర్పాటు చేసుకున్నాను. మా యూనిట్లో నాతోపాటు మా తోడికోడళ్లు శ్రీలత, సంగీత కూడా చురుగ్గా పాల్గొంటారు. మాది ఉమ్మడి కుటుంబం కావడమే ఈ యూనిట్ని సమర్థంగా నిర్వహించడానికి ప్రధాన కారణం. విస్తరించిన పరిశ్రమ... నా భర్త నరసింహులు, మామ నాగయ్య నాకు వస్త్రాన్ని నేయడం నేర్పించారు. పెళ్లయిన నాలుగేళ్లకు అంటే 1984లో నా చేత్తో తొలి వస్త్రం (లుంగీ) నేశాను. 2004లో నిఫ్ట్ విద్యార్థిని సౌమ్య చల్లాకు డెనిమ్ క్లాత్ మీద కలంకారీలో టాటూ డిజైన్ వేసిచ్చాను. ఆమె పేపర్ మీద తెచ్చుకున్న డిజైన్ని పెన్ కలంకారీ విధానంలో చిత్రించాను. అది పదివేల రూపాయల ప్రథమ బహుమతికి ఎంపికైంది. ఆమె ఫోన్లో థ్యాంక్స్ చెప్పినప్పుడు సంతృప్తిగా అనిపించింది. నేనూ అవార్డు అందుకోగలననే ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందా సంఘటన. రెండేళ్ల కిందట ‘ఇకత్ డబుల్ డోరియా చీర’ నేసి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి పొందాను.మా పెద్దవాళ్లు కాటన్ మీద మాత్రమే రంగులద్దేవారు. ఇప్పుడు ప్యూర్ సిల్క్, షిఫాన్, క్రేప్, జార్జెట్ల మీద కూడా అందమైన రంగులతో ప్రింట్స్ వేస్తున్నాను. ఇండియన్ ఎంపోరియమ్ వంటి ప్రఖ్యాత వస్త్రాలయాలకు రన్నింగ్ ఫ్యాబ్రిక్ సరఫరా చేస్తున్నాం. ఈ కళను ప్రదర్శించుకోవడం మాకు తెలియదు. కానీ ఈ పనిలో ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉన్నాం. నెలకు యాభై వేలకు పైగా జీతాల రూపంలో ఖర్చయినప్పటికీ... బయట పని చేస్తే వచ్చే జీతాలకంటే మెరుగైన రాబడి ఉంటోంది. హోమ్సైన్స్ విద్యార్థులు, నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు వీవింగ్, నేచురల్ ప్రింటింగ్ శిక్షణ తరగతులకు నా దగ్గరకు వస్తుంటారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మానసపుత్రిక అయిన ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రూపుదిద్దుకున్న ‘వందేమాతరం’ పథకం ద్వారా శిక్షణనిస్తున్నాను. - కందగట్ల బాలామణి, తాళ్లగడ్డ(హైదరాబాద్)లోని ‘ఇండియన్ ఇకత్స్’ చేనేత, అద్దకం పరిశ్రమ నిర్వాహకురాలు రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి , ఫొటోలు : శివ మల్లాల -
సహజంగా సంపాదన
ప్రకృతి తన బాధ్యతగా మనకు ఏడు వర్ణాలను ఇచ్చింది. ఆ పై బాధ్యతను మన సృజనాత్మకతకు వదిలేసింది. ఏ బెరడులో ఏ రంగు ఉంది? ఏ పువ్వును మరిగిస్తే ఏ వర్ణం ఆవిష్కారమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ పరిశ్రమ రూపుదిద్దుకుంది. ఎన్నో ప్రయోగాలు, మరెంతో శ్రమతో అందుబాటులోకి వచ్చిన ఈ సహజరంగుల పరిశ్రమ స్థాపించాలంటే ఏమేం కావాలో... ఆ వివరాలను చూద్దాం! ముడి సరుకు సేకరణ ఇందులో ప్రధానమైనది. పసుపురంగు కోసం: కలబంద, సన్ఫ్లవర్, బీట్రూట్, తంగేడు పువ్వు ఆరెంజ్ కలర్ కోసం: క్యారట్, జామాయిల్, ఉల్లిపాయ తొక్కలు, దానిమ్మ చెక్క, పసుపుకొమ్ములు ఆకుపచ్చ రంగు కోసం: పాలకూర ఆకులు, అరటిచెట్టు వేర్లు, చామంతి ఆకులు మొదలైనవి ఎరుపురంగు కోసం: మందారపూలు (ముదురు ఎరుపువి), తులసి, వెదురుకర్రలు, గులాబి పూలు ఒక రంగును రకరకాల దినుసులతో సృష్టించవచ్చు. మంజిష్ట, మోదుగపువ్వు, చావల్కోది వంటివి సులభంగా దొరుకుతాయి; ‘డ్రై ఫ్లవర్స్’, బెరళ్లు లాంటి వాటిని మార్కెట్లో కొనొచ్చు. వీటి పాళ్లలో కొద్దిపాటి తేడాలు పాటిస్తే కొత్త షేడ్ను తీసుకురావచ్చు. ఆ వివరాలన్నీ శిక్షణలో తెలుస్తాయి. సాధన, సృజనతో మరింత నైపుణ్యం పట్టుబడుతుంది. కావలసిన వస్తువులు: టేబుల్ - 1 (ఆరు మీటర్ల పొడవు, 50 అంగుళాల వెడల్పు ఉండాలి); తట్టు -1 (టేబుల్ మీద వేసే మెత్త వంటిది. 150 మీటర్ల వస్త్రాన్ని దాదాపు 20 పొరలుగా పేరుస్తారు) తెల్లటి వస్త్రం - పది మీటర్లు డిజైన్ అచ్చులు - పది రకాలు చెరువు, నది, వాగు వంటి జలాశయం అందుబాటులో ఉండాలి. నీటి పారుదల ఉంటే పని సులువవుతుంది. ప్రకృతి సహజమైన జలాశయం లేనప్పుడు నీటి తొట్టి, మోటారు, ట్యాంకు వంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది కొంచెం ఖర్చుతో కూడిన విషయం కాబట్టి యూనిట్ ప్రారంభ ఖర్చు లక్ష దాటుతుంది. నీటి వసతి ఏర్పాటు మినహాయిస్తే దాదాపుగా లక్షరూపాయల మూలధనంతో (రెండు నెలల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు సహా) యూనిట్ని ప్రారంభించవచ్చు. యూనిట్ని విజయవంతంగా నడిపించడానికి కొన్ని రహస్యాలుంటాయి. శ్రమ తగ్గుతుంది కదాని రెడీమేడ్ పొడులను వాడకూడదు, శ్రమ ఎక్కువైనా సరే వేర్లను, ఆకులు, పూలను స్వయంగా మర పట్టించుకుంటే అవి ఇచ్చే రంగు విషయంలో భరోసా ఉంటుంది. కొత్త షేడ్స్ రూపకల్పనలో ఆయా ఆకులు, పూల మోతాదుల విషయంలో కచ్చితమైన అంచనా సాధ్యమవుతుంది. అలాగే డిజైన్ అచ్చులను ప్రతి రెండు నెలలకోసారి మారుస్తుండాలి. వినియోగదారులు ఒకసారి వాడిన డిజైన్ను మరోసారి కొనడానికి కాదు కదా కనీసం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. శిక్షణ తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన టోల్ఫ్రీ నంబరు 1800 123 2388 ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
సెక్యులర్ స్నేహం
పిల్లలమర్రి అనూరాధ మచిలీపట్నంలో పుట్టారు.షెహనాజ్ షరీఫ్ వైజాగ్లో పుట్టారు.సబితా ఎబినెజర్ చెన్నైలో పుట్టారు.ముగ్గురు జన్మించిందీ బంగాళాఖాతం తీరాన్నే.కానీ... వీరిని కలిపిన బంధం సముద్ర తీరం కాదు.‘భారతీయత’ చుట్టూ అల్లుకున్న స్నేహబంధం. సైనిక్పురి, వాయుపురి అంటే... ఒక కశ్మీరీ కుటుంబం, ఆ పక్కనే ఓ గుజరాతీ, పంజాబీ కుటుంబాలు, వాటికెదురుగా కేరళ వాళ్లు, వారి పొరుగున ఈశాన్య రాష్ట్రాల వాళ్లూ వీరి మధ్యన అక్కడక్కడా కొన్ని తెలుగు కుటుంబాలు నివసించే ప్రదేశం. ఓ మినీ మహాభారతం. దీనిని వదిలి బయట జీవించడం తమకు తెలియదంటారు ఈ స్నేహితులు. ‘వియ్ ఆర్ ఆల్ స్వీట్ సిక్ట్సీస్’ అని సరదాగా సంతోషంగా చెప్పే వీరి స్నేహానికి దాదాపుగా ముప్ఫై ఏళ్లు. ప్రాంతం, మతం, భాష వంటి పరిధులేవీ తమ స్నేహానికి ఆటంకాలు కాదంటున్నారు. సికింద్రాబాద్లోని సైనిక్పురి, రామకృష్ణాపురం, మారేడ్పల్లిల్లో ఉండే ఈ ముగ్గురినీ కలిపిన వేదిక ఆర్మీ పబ్లిక్ స్కూల్. వీరి భర్తలు భారత వైమానిక దళంలో అధికారులు కావడంతో వీరి కెరీర్ కూడా రక్షణ రంగానికి అనుబంధంగానే అల్లుకుంది. ఉన్నత విద్యావంతులైన అనూరాధ, షెహనాజ్, సబితలు ఆర్మీ స్కూల్లో లెక్కలు, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించేవారు. సంతోషాలూ... దుఃఖాలూ... ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్డీడ్’... అన్నట్లే కనిపిస్తారు ఈ స్నేహితులు. దీపావళి పండుగకు మిగిలిన ఇద్దరూ కుటుంబాలతో సహా అనూరాధ ఇంట్లోనే పండుగ చేసుకుంటారు. ఈద్ రోజుకు అంతా షెహనాజ్ ఇంట్లోనే. క్రిస్టమస్ వేడుకకు సబిత ఇల్లే వీరి వేదిక. ‘పుట్టిన రోజులు, పెళ్లి రోజులే కాదు, సత్యనారాయణ వ్రతం కూడా అంతా కలిసి చేసుకుంటాం’ అంటున్నారు. ‘‘నేను చెన్నైలో పుట్టి పెరిగాను, పెళ్లయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఈ ప్రదేశం, పరిసరాలు అలవాటు కావడానికి షెహనాజ్, అనూరాధ ఇద్దరూ సహాయం చేశారు’’ అన్నారు సబిత. ‘‘మా వారికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉంటే షెహనాజ్, సబిత కుటుంబాలే అండగా నిలిచాయి. నేను రాత్రంతా హాస్పిటల్లో ఉండి ఉదయం నేరుగా స్కూల్కి వెళ్లేదాన్ని. అప్పటికే నా కోసం ఒకరు ఫ్లాస్కులో టీ, మరొకరు బ్రేక్ఫాస్ట్ తెచ్చేవారు. సబిత భర్త ఎబినెజర్ అయితే మా వారికి ఆహారం తీసుకెళ్లడం నుంచి దగ్గర కూర్చుని ఆయనకు ధైర్యం చెప్పేవారు. అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే... సబిత వాళ్లు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి తేదీ నిర్ణయించుకున్నారు. ఆ సమయానికి మా వారు పోయారు. నేను బాధలో ఉన్నప్పుడు నన్నలా వదిలి వెళ్లలేక వాళ్లు గృహప్రవేశం తేదీ మార్చుకున్నారు. నా సంతోషాన్నే కాదు, నా దుఃఖాన్ని కూడా పంచుకున్న స్నేహితులు వీళ్లు’’ అంటూ షెహనాజ్, సబితలను దగ్గరకు తీసుకున్నారు అనూరాధ. స్వచ్ఛంద బృందం... ‘డిఫెన్స్ వెటరన్ వాలంటీర్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్’ అనే స్వచ్ఛంద బృందంలో వీరంతా చురుగ్గా పని చేస్తుంటారు. షెహనాజ్ ఇంగ్లిష్ పరిజ్ఞానం పెద్దగా లేని జవాన్లకు ఇంగ్లిష్ పాఠాలు చెప్తారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న పరికరాలను ఉపయోగించడంలో మెళకులవను వృద్ధులకు నేర్పిస్తుంటారు. ఇక అనూరాధ... పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల కుటుంబాలను సందర్శిస్తూ వారికి అవసరమైన మందులు సమకూర్చడం, క్లినిక్కు తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించడం వంటివి చేస్తారు. అవయవదానం, ఆస్తి వీలునామా రాయడం వంటి పనులతోపాటు ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే పార్థివ దేహాన్ని వారి పిల్లలు వచ్చే వరకు భద్రపరచడం వంటి పనుల్లో సబిత పాల్గొంటారు. వీటితోపాటు ఈ బృందంలోని సభ్యులు... మరణించిన వారి ఇంటికి పది రోజుల పాటు భోజనాలు పంపిస్తారు. ఈ వివరాలు చెబుతూ ‘‘ఆనందంగా, సౌకర్యంగా, సంతోషంగా జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటుంటాం. మా చుట్టూ ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తాం. తుదిశ్వాస వరకు మా స్నేహం ఇలాగే ఉంటుంది’’ అని సబిత అంటుంటే... అనూరాధ బాధగా ఆమెను వారిస్తూ ‘‘స్నేహానికి మరణం ఉండదు’’ అన్నారు. స్నేహం అనే కొమ్మకు పూచిన పూలు అలా వికసిస్తూనే ఉంటాయి... ఎప్పటికీ... ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గట్టున ఉంటే ఈత రాదు
మహిళా విజయం రెండు తెలుగు రాష్ట్రాల్లోకి పెయింట్ తయారీ పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ కవితా రాజేశ్. ‘‘పరిశ్రమల రంగం అంటే ప్రతిరోజూ ఓ సవాలే. లాభాల కోసం చూడాల్సింది మూడేళ్లు శ్రమించిన తర్వాతనే. ఇందులో మనగలిగేది టెక్నాలజీ ఒంటబట్టించుకున్నప్పుడే. కొనసాగగలిగేది క్వాలిటీని నిలుపుకున్నప్పుడే’’ అంటున్నారామె. హైదరాబాద్లో పుట్టి పెరిగిన కవిత పూర్వీకులది మెదక్. బి.కామ్ చేశాక, న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. ఆమె చదువుకూ, ఆమె నిర్వహిస్తున్న ‘ఓం సాయి ఆంధ్రా పెయింట్స్’ పరిశ్రమకూ పొంతన కుదిరినట్లు అనిపించదు. తండ్రి స్థాపించిన పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక చెన్నైలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని ఈ రంగంలో అడుగుపెట్టిన కవిత అనుభవాలు... ‘‘మా నాన్న పరిశ్రమ నుంచి పాతయంత్రాలను కొనుగోలు చేసి 2002లో 800 చదరపు అడుగుల చిన్న షెడ్లో రంగుల తయారీ పరిశ్రమను బాలానగర్లో ప్రారంభించాను. ఏడు లక్షలకు పైగా ఖర్చయింది. బ్రేక్ ఈవెన్ రావడానికి మూడేళ్లు పట్టింది. దీనిని జస్టేషనల్ పీరియడ్ అంటారు. పారిశ్రామికవేత్తకు కుటుంబం నుంచి మద్దతు ఉండాల్సింది ఈ దశలోనే. అంత పెట్టుబడి పెట్టిన తర్వాత నెలవారీ నిర్వహణ ఖర్చులు భరిస్తూ, అమ్మకాలు ఊపందుకోక గందరగోళంగా ఉంటుంది. చాలా మంది నిరుత్సాహపడి వెనుదిరిగేదిప్పుడే. మంచి ఉద్యోగాన్ని వదులుకుని నాకు మించిన భారాన్ని తలకెత్తుకున్నానేమో అనిపించిన సందర్భాలున్నాయి. పైగా అప్పట్లో నాకు కెమికల్ రంగం గురించి తెలియదు. పరిశ్రమ పెట్టిన తర్వాత కెమికల్స్ గురించి, వాటిని కలపాల్సిన పాళ్లు, మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల గురించి తెలుసుకున్నాను. టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు నా అవగాహనను పెంచుకున్నాను. శాఖాపరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్ వంటి పనులన్నీ స్వయంగా చూసుకున్నాను. మా వారు రమేశ్ మెకానికల్ ఉత్పత్తుల మార్కెటింగ్ నిష్ణాతులు కాబట్టి ఆయన అనుభవం నాకు ఉపకరించింది. మా సేవలే మాకు ప్రచారం! డెకరేటివ్ ఎనామిల్స్తో మొదలు పెట్టిన పరిశ్రమను ఇప్పుడు వినియోగదారులు ఏ రకమైన పెయింట్ని అడిగినా సమకూర్చగలిగిన స్థితికి తీసుకొచ్చాను. పెయింట్స్ తయారీలో అగ్రగామి సంస్థలు అనేకం ఉన్నాయి. మాలాంటి చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమల దాటికి తట్టుకుని నిలబడడం పెద్ద చాలెంజ్. పైగా ప్రచారం కోసం పెద్ద సంస్థలు చేసినంత ఖర్చు మేము చేయలేం. దాంతో నేను ఓ మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాను. ఫేస్బుక్తోపాటు మా కంపెనీ వెబ్సైట్లో అన్ని వివరాలను అందుబాటులో ఉంచాను. నాణ్యమైన సర్వీస్తో ఒకరి నుంచి ఒకరికి మౌఖిక ప్రచారం లభిస్తోంది. వ్యక్తి నుంచి వ్యవస్థ దిశగా... అద్దె గదిలో పాత యంత్రాలతో మొదలు పెట్టిన పరిశ్రమను కొత్త యంత్రాలతో, సొంత స్థలంలోకి మార్చగలిగాను. ఇప్పుడు మా దగ్గర గంటకు రెండు వందల లీటర్ల రంగును తయారు చేసే అధునాతన యంత్రాలున్నాయి. నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... తయారీదారులకు, వినియోగదారులకు మధ్య డీలర్ పాత్ర కీలకమైంది. వినియోగదారు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తయారీదారులకు అందే శాతాన్ని చూసుకుంటే... తయారీ ఖర్చు, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పోను మిగిలే లాభం చాలా తక్కువ. డీలర్కి అందే కమిషనే ఎక్కువ. అందుకే నేను నేరుగా వినియోగదారులను చేరుకోగలిగాను. అలాగే సంస్థను ఒక వ్యక్తి కేంద్రంగా నడిపించే పరిస్థితి నుంచి వ్యవస్థగా మార్చగలిగాను. ఉద్యోగులందరికీ శిక్షణనిచ్చి నిపుణులుగా తయారు చేసుకున్నాను. ఒకరు లేకపోయినా ఆ పనిని మరొకరు నిర్వహించగలుగుతున్నారు.ఇలాంటి మెళకువలన్నీ దిగి ఈదినప్పుడే తెలుస్తాయి. గట్టున ఉండి ఎంతగా అధ్యయనం చేసినా పట్టుబడవు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: శివ మల్లాల -
గాజుల గలగల
మీరే పారిశ్రామికవేత్త ‘బంగారు గాజులు, బ్లాక్ మెటల్ గాజులు, రబ్బరు గాజులు, మట్టి గాజులు, లక్కగాజులు... ఎన్నో. కొంచెం కళాహృదయం ఉండాలే కానీ గాజులకే హారాలు అలంకరించవచ్చు. కళాపోషకులైన మహిళల మదిని ఇట్టే దోచేయవచ్చు. ఆ పని మాత్రం ఇంత వరకు మగవాళ్ల చేతిలోనే ఉండిపోయింది. కానీ మీరు తలుచుకుంటే మీ ఇంట్లోనే లక్క గాజుల తయారీ పరిశ్రమ పెట్టొచ్చు. ఏమేం కావాలి: సాధారణంగా పరిశ్రమల స్థాపనకు యంత్రసామగ్రి వంటి మౌలిక వసతులు అవసరం. లక్క గాజుల పరిశ్రమకు ప్లక్కర్, కట్టర్ వంటి చిన్న సాధనాలు, ఇంట్లో ఉపయోగించే పాత్రలు ఐదారు, గాజులు ఆరబెట్టడానికి స్టాండులు, నలుగురు మహిళలు కూర్చోవడానికి వీలుగా ఉండే చిన్న గది చాలు. ముడి సరుకు: అల్యూమినియం రింగులు, లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు, వెల్కమ్ పౌడర్, స్టోన్స్, కుందన్స్, చమ్కీలు, చైనులు, రంగులు అవసరం.రెండు నెలలపాటు గాజులు చేయాలంటే కనీసంగా కొంత ముడిసరుకుని సిద్ధం చేసుకోవాలి. ఎంతెంత పరిమాణంలో ఉండాలో, ఎంతెంత ధరల్లో దొరుకుతాయో చూద్దాం. వెల్కమ్ పౌడర్ - 25 కిలోలు (కిలో రూ.400) లెపాక్స్ ఆర్ - 2 కిలోలు (కిలో 350-400) లెపాక్స్ ఎక్స్ - 2 కిలోలు (కిలో 350-400) ఐదారు రంగులు (యాభై గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు) స్టోన్స్ - మూడు నాలుగు సైజులైనా తీసుకోవాలి. వాటిలో పదిరంగులుండేలా చూసుకోవాలి. ఒక్కొక్క రంగులో వంద గ్రాముల స్టోన్స్ తీసుకోవచ్చు. ధర స్టోన్ క్వాలిటీని బట్టి వందగ్రాముల ప్యాకెట్ 80 నుంచి 700 రూపాయలుంటుంది. చమ్కీలు - ఇవి కూడా పది రంగుల్లోవి తీసుకోవాలి. వంద గ్రాముల చమ్కీల ధర 50 రూపాయలుంటుంది. చైన్స్ - గోల్డ్ కలర్, సిల్వర్ కలర్తోపాటు ఇతర రంగులలో కూడా ఉంటాయి. వీటిని కిలోల చొప్పున కొనాలి. కిలో రూ. 200 ఉంటుంది. ఒక్కో రంగు చైన్ ఒక్కో కిలో చొప్పున తీసుకోవచ్చు. గాజుల తయారీలో చైన్లు తప్పనిసరి కాదు. గాజులు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసమే. అల్యూమినియం రింగులు - సైజుల వారీగా ఒక్కొక్క సెట్. ఒక సెట్కి 60- 70 రింగులుంటాయి. ఒక రింగు రెండు నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది. ఈ రింగుల సైజ్ గాజుల సైజుల్లాగే 2.4, 2.6, 2.8 అనే మూడు సైజుల్లో ఉంటాయి. ఎంత ఖర్చవుతుంది: యాభై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చుతో పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ పరిశ్రమకు కరెంటు, నిర్వహణ ఖర్చులు ఉండవు. ఈ రసాయనాలు చర్మానికిగానీ, కళ్లకుగానీ ఎలాంటి ఇబ్బందిని కలిగించవు. శిక్షణ ఎలా?: రెండు నెలల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ముడి సరుకు ఎక్కడ దొరుకుతుంది, అమ్మకం కేంద్రాలు, సెట్ తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే అంచనా వంటివన్నీ శిక్షణలో తెలుస్తాయి. శిక్షణ, రిజిస్ట్రేషన్ వివరాలకు 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. ‘ఎలీప్’ సౌజన్యంతో... తయారీ ఇలా! లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు బంకలాగ జిగురుగా ఉంటాయి. ఈ రెండింటినీ (వేటికవి విడిగా) వెల్కమ్ పౌడర్లో కలపాలి. కిలో లెపాక్స్కి నాలుగు కిలోల వెల్కమ్ పౌడర్ కావాల్సి ఉంటుంది. వీటిని చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఈ రెండు మిశ్రమాలను (వెల్కమ్ పౌడర్లో కలిపిన లెపాక్స్ ఎక్స్, లెపాక్స్ ఆర్) కలిపి అల్యూమినియం రింగుకు అతికిస్తే గాజు తయారవుతుంది. వెంటనే (లక్క ఆరి గట్టిపడే లోపు) గాజు మీద కావల్సిన డిజైన్లలో రాళ్లు, కుందన్లు, చమ్కీలు, చైన్లు అతికించుకోవాలి. ఇరవై నిమిషాలకు జిగురు కొంత వరకు ఆరిపోతుంది. ఆ తర్వాత కుందన్స్ వంటివి అతికించే ప్రయత్నం చేస్తే అతుకుతాయిగానీ గాజు ఆకారం చెడిపోతుంది. అందుకే పది, పదిహేను నిమిషాల లోపే పని పూర్తి చేయాలి. కుందన్స్ అతికించడం వంటి అలంకరణ అంతా అయిన తర్వాత గాజుల స్టాండుకు తగిలించి ఆరు గంటల సేపు ఆరనివ్వాలి. లక్క గట్టి పడి రాయిలా మారుతుంది. ఇక ఆ గాజు పగలదు, విరగదు. 2009 నుంచి యూనిట్ నిర్వహిస్తున్నాను, ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తున్నాను. - ఎస్.ఎమ్.జబీన్, నంద్యాల ఫోన్: 9492943006 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
ఉద్యోగులు కూడా మా కుటుంబసభ్యులే!
మహిళా విజయం ‘దేశంలో మొదటి స్థానానికి చేరుకుంటాం’. ఓ మహిళా పారిశ్రామికవేత్త ఆత్మవిశ్వాసంతో అన్న మాట ఇది. ఆమె విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ సరోజా వివేకానంద. సామాన్యులకు ఆమె మాజీ ఎం.పి వివేక్ సతీమణి మాత్రమే. పరిశ్రమల రంగంలో మహిళలకు మాత్రం ఆమె ఓ చుక్కాని, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ చైర్పర్సన్. ఒకప్పుడు ఆమె సంప్రదాయ కుటుంబంలో పుట్టిన సాధారణమైన అమ్మాయి. రాజకీయరంగంలో తలపండిన జి.వెంకటస్వామి ఇంటికి కోడలైన తర్వాత, పరిశ్రమను విజయవంతంగా నడిపిస్తున్న పారిశ్రామికవేత్త. ఈ పరిణామక్రమాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నాన్న అనుకున్నట్లే... ‘‘మా నాన్న వాస్తు పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం. కూతురి కోసం అల్లుడు వెతుక్కుంటూ వస్తాడని ఆయనకు నమ్మకం. అవి నేను ఇందిరాప్రియదర్శిని కాలేజ్లో డిగ్రీ చదువుతున్న రోజులు. నాన్న నమ్మకమే నిజమైంది. అదే సమయంలో వివేక్ ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసి పరిశ్రమ స్థాపించే ప్రయత్నంలో ఉన్నారు. భవనం వాస్తు నమూనా కోసం మా నాన్న దగ్గరకు పలుమార్లు రావాల్సి వచ్చింది. ఆ పరిచయంతో ఆయన ప్రపోజ్ చేశారు. 1986లో పెళ్లయ్యే నాటికి నాకు ఇరవై ఏళ్లు. మామగారి ప్రోత్సాహంతో... మా మామగారు నన్ను, మా తోడికోడల్ని ‘అమ్మాయిలు చదువుకున్నారు, ఆడవాళ్లు వ్యాపారాలు, ఉద్యోగాలు చేయకూడదని ఎవరన్నారు. పని చేసి నిరూపించుకోవాలి’ అని ప్రోత్సహించేవారు. అలా ఇరవయ్యేళ్ల కిందట విశాఖ కంపెనీకి డెరైక్టర్నయ్యాను. 1994లో చిన్నబ్బాయి పుట్టిన తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాను. చక్కటి కుటుంబం! వివేక్ రాజకీయంగా ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కుటుంబానికి ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు. కానీ తెలంగాణ మూవ్మెంట్ తీవ్రంగా ఉన్న ఐదేళ్లు మాత్రం ఫోన్కు కూడా అందని పరిస్థితుల్లో గడిచింది. ఎప్పుడైనా నేను అయోమయంలో పడితే ‘ఇంతకంటే పెద్ద ఇష్యూస్నే సమర్థంగా డీల్ చేశావు. దీనికెందుకు వర్రీ’ అంటూ భరోసా ఇస్తుంటారు. ఎప్పుడైనా నేను అయోమయంలో పడితే ‘ఇంతకంటే పెద్ద ఇష్యూస్నే సమర్థంగా డీల్ చేశావు. దీనికెందుకు వర్రీ’ అంటూ భరోసా ఇస్తుంటారు వివేక్. - సరోజా వివేకానంద, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ విశాఖ ఫ్యామిలీ! మా పరిశ్రమలలో పని చేసే వారి ఫోన్ నంబర్లన్నీ విశాఖ ఫ్యామిలీ అనే గ్రూప్లో ఉంటాయి. ప్రతి ఉద్యోగి పుట్టిన రోజుకీ నా తరఫున శుభాకాంక్షలు అందుతాయి. వాళ్ల ఇంట్లో పెళ్లి వంటి వేడుకలు జరుగుతుంటే బొకే పంపిస్తాం. నెలకోసారి మా ఉద్యోగుల్లో ఒకరి ఇంట్లో లంచ్ చేస్తాను. ఇప్పుడు మా చిన్నబ్బాయి కూడా ఇండస్ట్రీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. దాంతో నా హాబీలకు సమయం కేటాయించుకోవడానికి వెసులుబాటు దొరికింది. స్మిమ్మింగ్ క్లాసులు, సింగింగ్ క్లాసులతోపాటు గోల్ఫ్ ఆటతో గడుపుతున్నాను. హైదరాబాద్లో లేడీస్ గోల్ఫ్ బృందం ఉంది. - వాకా మంజులారెడ్డి -
ఒక అర్ధరాత్రి పిలుపు
సైనికుడికి యుద్ధ సమయం కీలకం. కానీ సైన్యంలోని వైద్యుడికి శాంతిసమయం కూడా కీలకమే. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్సైజ్ చేస్తారు. అందులో గాయపడిన వారికి వైద్యం చేయాలి, ఎప్పుడు పిలుపు వచ్చినా హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి పిలుపు ఒక పేదగ్రామీణుడి నుంచి వస్తే! దానికి స్పందించిన లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ అశోక్ అనుభవం ఈవారం... మొదట్లో నన్ను విసుక్కున్న సర్జన్ కూడా ‘ఇక నుంచి మీరిచ్చిన ధైర్యంతో సిజేరియన్ ఆపరేషన్లు కూడా చేస్తాను’ అన్నారు. మాది కృష్ణాజిల్లా రేమల్లె. నేను ఆర్మీలో చేరిన నాటికి కశ్మీర్ ప్రశాంతమైన ప్రదేశం. 1990 తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. నేను పూంచ్ సెక్టార్లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఒక ఉగ్రదాడి జరిగేది. మేమున్న ప్రదేశం జమ్మూ నగరానికి దాదాపు 250 కిలోమీటర్లుంటుంది. సెలవు రోజుల్లో జమ్మూ నగరానికి వెళ్లాలంటే సరైన రోడ్డు ఉండేది కాదు. ఘాట్రోడ్డులో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం. సైనికులకు వైద్యం చేయడం నా విధి. స్థానికులకు వైద్యం చేయడం విధి కాదుగానీ ఆసక్తి ఉంటే చేయొచ్చు. నేను వృత్తిరీత్యా ఎనెస్థిటిస్టునే అయినా ఎంతోమంది బిడ్డల్ని డెలివర్ చేశాను, ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించాను. కార్గిల్ సమయంలో... నా ఆర్మీ జీవితంలో కార్గిల్ వార్ మరిచిపోలేనిది. పాకిస్తాన్ వాళ్లు మనదేశంలో బంకర్లు కట్టేసి దాడులు చేశారు. కాల్పులు బయటి నుంచి కాదు, మన ప్రదేశం నుంచే జరుగుతున్నాయి. బంకర్లలో ఉండే శత్రుసైనికులకు ఆహారం వెళ్లే దారులన్నీ మూసేయడంతో పదిహేడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నాకు సంతోషాన్నిచ్చిన సంఘటన అక్కడి ఓ కుగ్రామంలో జరిగింది. అది 2000 డిసెంబర్. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో స్థానికులు ఒక మహిళను మంచం మీద తెచ్చారు. ఆమె ప్రసవ నొప్పులు పడుతోంది. బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. నేను తక్షణమే సర్జన్కు ఫోన్ చేశాను. ఆయన కేసు తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఆర్మీ డాక్టర్ చేతిలో ప్రాణం పోతే విచారణ జరుగుతుంది. పైగా ఆమె ముస్లిం మహిళ. ఈ ఆపరేషన్ ఫెయిలయితే తీవ్రవాదులు ఆ డాక్టర్ని టార్గెట్ చేయొచ్చు. ఆ భయంతో ‘నేను గైనకాలజిస్టును కాదు’ అని తప్పించుకోజూశారు. కళ్లల్లో కృతజ్ఞతలు ఏం చేయాలి? నాపై అధికారికి ఫోన్ చేశాను. ‘అధికారిగా ఏమీ చెప్పలేను. మీ రిస్కు మీద చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు’ అన్నారు. నేను మళ్లీ సర్జన్కు ఫోన్ చేసి ‘మీ పై అధికారిగా ఆదేశిస్తున్నాను, వెంటనే రావాలి’ అన్నాను. ‘నాకు సిజేరియన్ ప్రొసీజర్ తెలియదంటే అర్థం చేసుకోరేం’ అన్నారు. ‘ఎన్నో సిజేరియన్ కేసులు దగ్గరగా చూశాను. ప్రతి స్టెప్ నేను చెప్తాను, మీరు చేయండి’ అన్నాను. అలా ఆపరేషన్ మొదలెట్టి, బిడ్డను క్షేమంగా బయటికి తీశాం. గర్భిణి తల్లితోనే నర్సు పనులు చేయించాం. బిడ్డకు వేయడానికి వ్యాక్సిన్ కూడా లేదు. అర్ధరాత్రి కదా, ఉదయాన్నే 90 కిలోమీటర్ల దూరంనుంచి టీకా తెప్పించి వేశాం. ఆ గ్రామస్థుల్లో వ్యక్తమైన కృతజ్ఞత అంతా ఇంతా కాదు. ఆగ్రామ ముఖియా పళ్లెం నిండా ఆక్రోటులు, బాదంకాయలతో వచ్చి ‘మీ సహాయానికి కృతజ్ఞతలు. మీకెంతో ఇవ్వాలని ఉంది. కానీ మా దగ్గరున్నవి ఇవి మాత్రమే’ అన్నారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు మమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్లెవరూ భారత సైన్యాన్ని సొంతవారిగా భావించేవారు కాదు. నేను డాక్టర్గా చేసింది తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడ్డమే. కానీ ఆర్మీ వ్యక్తిగా అది దేశమాత రక్షణను పటిష్టం చేయడం! రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
రంగుల కళ
మీరే పారిశ్రామికవేత్త రైతు పండించిన పత్తి నుంచి దారం తీయడం ఓ పరిశ్రమ. ఆ దారానికి వస్త్ర రూపాన్నిచ్చేది మరో పరిశ్రమ. ఆ వస్త్రాన్ని అందమైన చీరగా, చుడీదార్ మెటీరియల్గా దిద్దేది మరో పరిశ్రమ. అందమైన డిజైన్లను అచ్చుల్లో ఇమిడ్చి అలవోకగా అద్దేదే బ్లాక్ ప్రింటింగ్ పరిశ్రమ! రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: శివమల్లాల బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ నిర్వహణలో రాణించాలంటే సృజనాత్మకతతో కొత్త డిజైన్లకు రూపకల్పన చేయగలగాలి. డిజైన్లలో ప్రయోగాలు చేస్తుండాలి. ఈ యూనిట్ పెట్టడానికి కనీసం వెయ్యి చదరపు అడుగుల స్థలం కావాలి. అందులో 500 అడుగుల గది, 500 అడుగుల ఎండ తగిలే ఖాళీ స్థలం ఉండాలి. కావల్సిన వస్తువులు: ప్రింటింగ్ టేబుల్ -1 (ఐదున్నర మీటర్ల పొడవు, 50 అంగుళాల వెడల్పు ఉండాలి); ట్రాలీలు - 2; ట్రేలు - 3; తాపీలు - 6; చింతాలు - 6; రెగ్జిన్ షీట్లు - 6 (ఒక్కొక్కటి అర మీటరు); క్లిప్పులు - 12; గుండు సూదులు. డై చేయడానికి... ఇరవై లీటర్ల నీరు పట్టే కడాయి (స్వీట్ షాపుల్లో వాడుతారు)-1; గ్యాస్ స్టవ్ - 1 (కమర్షియల్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి); తొట్టెలు - 4; చిన్న బకెట్లు - 6; మీడియం సైజు బకెట్లు -4 స్టీలు గిన్నెలు - ఐదులీటర్లవి 2, రెండు లీటర్లవి 2 ఇదంతా పరిశ్రమ ఏర్పాటు కోసం ఒకసారి పెట్టుబడి. ఇందుకు కనీస అంచనా వ్యయం డెబ్భై వేల రూపాయలు. రా మెటీరియల్ కోసం... మూడు నెలల పాటు ఉత్పత్తి కొనసాగడానికి తగినంత వస్త్రాన్ని, రంగులను కొనాల్సి ఉంటుంది. ముడి సరుకులో మనం ఎంపిక చేసుకునే క్వాలిటీని బట్టి రెండు నుంచి మూడు లక్షల రూపాయలవుతుంది. ఒక టేబుల్తో రోజుకు పది చీరలు లేదా డ్రెస్సుల అద్దకం చేయవచ్చు. ఆదివారాలు, సెలవులు పోను సరాసరిన నెలకు 25 రోజులు పనిచేస్తే 250 పీసులు (చీరలు, చుడీదార్లు కలిపి) తయారవుతాయి. ఒక చీర విత్ బ్లౌజ్కు దాదాపుగా ఆరున్నర మీటర్ల వస్త్రం కావాలి. చుడీదార్కూ దాదాపుగా అంతే. రంగులు కానీ, వస్త్రం కానీ టోకుగా తీసుకోవడమే మంచిది. ఈ ఖర్చులతోపాటు గది అద్దె, కరెంటు, ఇద్దరు సహాయకుల వేతనాలు కూడా కలుపుకోవాలి. శిక్షణ, రిజిస్ట్రేషన్ కోసం: 1800 123 2388 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించండి. ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... ‘ఆంటీ, నాకు పెళ్లి కుదిరింది’ చిన్నప్పటి నుంచి ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం. స్కూల్లో కుట్లు, అల్లికల పోటీల్లో నాకే బహుమతులు వచ్చేవి. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాను. యాభై వేల పెట్టుబడితో ఒక టేబుల్, నలుగురు వర్కర్లు, ఇద్దరు సహాయకులతో బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ పెట్టాను. ప్రస్తుతం నెలకు లక్షరూపాయలు ఖర్చవుతోంది. మొదట్లో కాటన్తో మొదలు పెట్టాను. ఇప్పుడు క్రేప్ వంటి ఇతర మెటీరియల్స్ మీద కూడా ప్రింట్స్ వేస్తున్నాను. ఒక ప్రైమ్ కలర్లో మరో పాస్టల్ కలర్ని ఎంత మోతాదులో కలిపితే ఎలాంటి షేడ్ వస్తుందనే విషయంలో ప్రయోగాలు చేస్తుంటాను. ఏ రెండు రంగుల కలయికలో చీర కానీ, చుడీదార్ కానీ ఆకర్షణీయంగా కనిపిస్తుందోనని ఎప్పటికప్పుడు కాంబినేషన్స్ మారుస్తుంటాను. నాకేమో ఇద్దరూ అబ్బాయిలే. డ్రెస్సులు డిజైన్ చేద్దామంటే అమ్మాయి లేదు. ఈ పరిశ్రమతో వేలాది మంది అమ్మాయిలకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. పెళ్లి కుదిరిన అమ్మాయిలు వచ్చి ‘ఆంటీ! మీకెలా బావుంటుందనిపిస్తే అలా డిజైన్ చేసివ్వండి’ అంటుంటారు. - పి.లక్ష్మీస్వరూప (పై ఫొటో మధ్యలో) వసుంధర బొటిక్, ఈఎస్ఐ, హైదరాబాద్ 9703444386 -
‘నేనే ప్రధాని అయితే...’
అప్పుడు సాయంత్రం ఐదుగంటలు... బీజేపీ ఆఫీసులో ఇరవై మంది వరకు అర్జీలు పట్టుకుని కిషన్రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఒకరొకరుగా సాయం కోరడం... కిషన్రెడ్డి వెంటనే పి.ఎ. ద్వారా సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించడం, వాళ్లు సంతృప్తిగా వెళ్లడం... జరిగిపోతున్నాయి. వచ్చిన వారిలో ఒకతను తన రౌడీషీట్ తీయించమంటున్నాడు. మరో వ్యక్తి ఇరవై ఏళ్ల కిందట వదిలేసిన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించమంటున్నాడు. ‘చూడన్నా... నువ్వొచ్చి నన్నడిగినంత సులభంగా నేను అధికారిని అడగకూడదు. ఇది సాధ్యమా కాదా అని వచ్చినోడికి తెల్వకపోయినా ఎమ్మెల్యేకైనా తెలియాలి కదా అనుకుంటారు. నీకు ఇంకేదన్నా కావాలంటే రా’ అని సముదాయించి పంపేశారు. ఈ అష్టావధానం రోజూ ఉంటుందా? ఇప్పుడు తక్కువ. మరో గంటకు ఆఫీసు నిండిపోతుంది. అందరినీ సమాధాన పరచాలంటే సహనం ఉండాలేమో! చాలా. ఎమ్మెల్యే చెబితే ఏ పనయినా అవుతుందనుకుంటారు. కోర్టులో కేసు రాజీ చేసుకోక ముందే రౌడీ షీట్ తొలగించమని ఎలా చెబుతాం. ఇరవై ఏళ్ల కిందట వదిలేసిన వ్యక్తిని ఆ ఉద్యోగంలో మళ్లీ చేర్చుకోమని అధికారులకు చెప్పాలంటే ముందు నా మనసుకు అది కరెక్టేననిపించాలి కదా? అంతరాత్మ సమ్మతించని పనిని చేయరన్న మాట? ఎంత వేగంగా పనులు చేస్తానో అంత కచ్చితంగానూ ఉంటాను. జరగని పనిని చేస్తానంటూ తిప్పుకోను. రాజకీయ రంగం, ఉద్యమాల గురించి తెలిసిందెప్పుడు? నేను ఆరవ తరగతికి రాకముందే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఎస్పీఎల్గా క్లాసులు బాయ్కాట్ చేయడం వంటివన్నీ జరిగిపోయాయి. పరీక్షలు లేకుండానే అందరినీ ప్రమోట్ చేసేశారు. కాలేజ్కొచ్చాక బుద్ధిమంతుడిలా చదువుకున్నారా? చదువుకున్నాను అంతే. కాలేజ్ నుంచి వచ్చి బీజేపీ ఆఫీసులో గడపడం, ఏ రాత్రికో అక్క వాళ్లింటికి వెళ్లడం! అప్పుడు పార్టీ ఆఫీసు వి.రామారావు గారింట్లో ఉండేది. దత్తాత్రేయ, రామారావు ఓ రోజు... ‘ఇక్కడికే వచ్చేయరాదా’ అన్నారు. ఇంటికి వెళ్లి పుస్తకాలు, దుస్తులు సర్దుకుని పార్టీ ఆఫీసుకొచ్చేశాను. వారలా అనకపోయి ఉంటే... బహుశా ఉద్యోగం చేసుకుంటూ ఉండే వాణ్ణేమో! రాజకీయరంగంలో ఆత్మసంతృప్తినిచ్చిన సంఘటన... తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంద కృష్ణతో కలిసి గుండె జబ్బుల పిల్లలకు వైద్యం కోసం ఉద్యమం చేశాం. గుండె ఆపరేషన్కు ఐదారు లక్షలు ఖర్చవుతుంది. ఆ ఖర్చును భరించే స్తోమత లేని వారే అందరూ. పుట్టపర్తిలో ఉచితంగా ఆపరేషన్లు చేసేవారు. కానీ ఆరేళ్ల తర్వాత కానీ ఆపరేషన్ తేదీ వచ్చేది కాదు. చాలా మంది ఈ లోపే చనిపోయేవారు. ఈ పరిస్థితుల్లో శోభన్ అనే పదేళ్ల కుర్రాడు అక్కడే మరణించాడు. ఇక ఏదయితేనేం పూర్తిగా తేల్చుకోకుండా వదలకూడదని శోభన్ పార్థివదేహంతో ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చున్నాం. ఆ ఉద్యమంతో అనుకున్నది సాధించారా? నూటికి నూరు పాళ్లు. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ‘‘మీరు కోరినట్లే గుండె జబ్బు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాను. కానీ నేనిప్పుడు ఢిల్లీలో ఉన్నాను. మెడ మీద కత్తి పెడితే ఎలా?’’ అన్నారు. ఈ ఉద్యమం కారణంగానే ఆరోగ్యశ్రీ ఆలోచన వచ్చిందని అసెంబ్లీలో చెప్పారు. మీరే కనుక ప్రధానమంత్రి అయితే చేసే మొదటి పని? పై అధికారి నుంచి కింద వరకు ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనం తక్కువ. తక్కువ అనేకంటే లేదనడమే సబబు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ వంటి ప్రజా ప్రతినిధులలోనూ ఉండడం లేదు. అయితే మేము ఐదేళ్లకోసారి ప్రజల మధ్యకు వెళ్లి వారిని సమాధాన పరిచి ఓట్లడగాలి. ఉద్యోగికి ఆ అవసరం కూడా లేదు. రాజకీయరంగంలో స్ఫూర్తి? చిన్నప్పుడు అనుకోకుండా ఆర్ఎస్ఎస్ కవాతు చూశాను. అది నా కంట పడకపోతే వేరుగా ఉండేవాడినేమో. జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవం పిలుపుతో స్ఫూర్తి పొందాను. జనతాపార్టీలో చేరి 1977లో యువజన విభాగం అధ్యక్షుడినయ్యాను. 1980లో జనతాపార్టీ నుంచి బీజేపీ ఆవిర్భవించినప్పుడు అందులోకి మారాను. హైదరాబాద్ పార్టీ ఆఫీస్ జీవితానికీ, ఢిల్లీ పార్టీ ఆఫీసు జీవితానికీ తేడా ఎలా ఉండేది? ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో 11 ఏళ్లు ఉన్నాను. గోవిందాచార్య, నరేంద్రమోదీ, నేను ముగ్గురం మూడు గదుల్లో ఉండేవాళ్లం. హైదరాబాద్ ఆఫీసులో ఉన్నప్పుడు మరీ చిన్నవాణ్ణి. కీలకమైన బాధ్యతలేవీ ఉండేవి కాదు. ఇక్కడి ఆఫీసులో దత్తాత్రేయ, నేనూ స్థిరనివాసులం. మా ఇద్దరి కోసం చిన్న మెస్ కూడా నడిచేది. దత్తాత్రేయ ఎజ్డీ మీద రాత్రి 10-11 గంటల వరకు స్నేహితులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లే వాళ్లం. మొదట్లో నేను బండి తుడిస్తే ఆయన నడిపేవారు. తర్వాత నేనే తుడిచి నేనే నడపడం మొదలైంది. అదే క్రమాన్ని పార్టీని నడపడంలోనూ పాటించినట్లున్నారు? నిజమే. ఆయన ముందు, నేను తర్వాత. స్వచ్ఛ్ భారత్ దేశానికి కొత్తగానీ మనకు గతంలో క్లీన్ అండ్ గ్రీన్ వంటి పేర్లతో పరిచయమే కదా? అది ఉద్యోగులతో చేయించిన కార్యక్రమం. ఇది ప్రజల భాగస్వామ్యంతో చేయిస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమం. మిగతా రాజకీయ నాయకులకూ మీకూ తేడా ఏదైనా ఉందా? నా దగ్గరకు గణేశ్ చందాలని, గుడి కట్టుకోవడానికి విరాళాలని ఎవరూ రారు. ‘ఆయన ఎవరి దగ్గరా ఏమీ తీసుకోడు, ఇక ఆయనేం ఇస్తాడు’ అని బాహాటంగానే అంటారు. మరి ఎన్నికలకు ఇంటి నుంచి కావ్యగారు డబ్బు సర్దాల్సిందేనా? ఎన్నికలప్పుడు విరాళాలు తీసుకుంటాను. ‘నువ్వెప్పుడూ ఏమీ అడగలేదు సార్! ఈ పదివేలు దగ్గర పెట్టుకోండి, ఈ ఐదువేలు తీసుకోండి’ అంటూ తోచినంత ఇచ్చి వెళ్తారు. మీ దినచర్య ఎలా ఉంటుంది? ఆరు గంటలకు నిద్ర లేచేటప్పటికే జనం వచ్చి ఉంటారు. వారందరితో మాట్లాడిన తర్వాత నా పనులు. పూజ చేసుకుని మరోసారి (ఈ మధ్యలో వచ్చిన వారిని) జనాన్ని కలవడం, బ్రేక్ఫాస్ట్ చేసి తొమ్మిదింటికి బయటపడడం. హైదరాబాద్లో ఉంటే ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదో ఒక చోట పర్యటిస్తాను. రాముణ్ణి మాత్రమే పూజిస్తారా? అలా అని ఏమీ లేదు. సాయిబాబా, వెంకటేశ్వరస్వామి, అయ్యప్పస్వామి అందరినీ ఇష్టపడతాను. మా ఊళ్లో (రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్) రాముడికి గుడి కట్టాను. శ్రీరామనవమికి, బ్రహ్మోత్సవాలకు తప్పకుండా ఊరికి వెళ్తాను. సినిమాలు చూస్తారా? పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు చూశాను. కమలహాసన్, శ్రీదేవి, కె.విశ్వనాథ్ సినిమాలిష్టం. ఇప్పటివాళ్ల పేర్లే గుర్తుండడం లేదు. మీతో కలసి బయటకు వెళ్లాలని ఇంట్లో వాళ్లకుంటుందిగా! బంధువుల ఫంక్షన్లకు వెళ్తాం. రెండేళ్లకోసారి టూర్లకెళ్తాం. మా ఆవిడ ఏమీ అనదు కానీ మా పాప మాత్రం ‘టూర్లో కూడా ఈ దుస్తులేంటి? మోడరన్గా వేసుకో నాన్నా’ అని కోప్పడుతుంది. మీ ఆవిడ కోప్పడే సందర్భాలు ఉండవా? నాకు వేగంగా తినడం అలవాటు. పొరమాలినప్పుడు ‘‘మెల్లగా తింటే కొంపలు మునుగుతాయా’’ అని నీళ్లందిస్తుంది. మీరు ఏమేమి ఇష్టంగా తింటారు? వైట్ రైస్, గడ్డ పెరుగు ఉంటే ఇంకేమీ చూడను. అభిమాన నాయకుడు? వాజ్పేయి. ఆయన వస్తున్నారంటే ఆ మీటింగులకు వెళ్లేవాడిని. 1980లో తొలిసారి ఆయన గురించి విన్నాను. పదహారేళ్ల వయసులో పడిన ముద్ర! అది ఎప్పటికీ చెరగదు. ఇంటర్య్వూ : వాకా మంజులారెడ్డి -
గాయం ... సైనికుడికి తీపి గుర్తు!
యుద్ధక్షేత్రం కార్గిల్ను ఆక్రమించుకుంటే భారత్ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చనేది పాకిస్తాన్ యోచన! వాస్తవాధీన రేఖకు సమీపంలో ఎత్తులో ఉంటుంది కార్గిల్. దాని మీద గనక క్యాంపు ఏర్పాటు చేసుకుంటే 180 డిగ్రీల కోణంలో భారత్లో భాగంగా ఉన్న కశ్మీర్ మీద ఎప్పుడంటే అప్పుడే దాడి చేయొచ్చు. పాకిస్తాన్ కార్గిల్ కోసం తపించేది అందుకే. అలాంటి కీలకమైన ‘కార్గిల్ ఆపరేషన్ 1971’లో పోరాడిన కెప్టెన్ లింగాల పాండు రంగారెడ్డి అనుభవాలు... మాది వరంగల్ జిల్లా జనగామ్. 1962లో సైన్యంలో చేరాను. మొదటి ఏడాది డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందాను. తర్వాత 11 గూర్ఖా రైఫిల్స్ విభాగంలో నాగాలాండ్, మిజోహిల్స్, కశ్మీర్లలో పనిచేశాను. 1965లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారత్-పాక్ యుద్ధం జరిగింది. కార్గిల్ను పాకిస్తాన్ ఆక్రమించుకోవడం, భారత్ తిరిగి విడిపించుకోవడం జరిగాయి. ఐదారేళ్లకు మళ్లీ కార్గిల్ను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మా లెఫ్టినెంట్ కల్నల్ ఆర్.బి.గురూంగ్ నుంచి మా బెటాలియన్కు ఆదేశాలు అందాయి. అప్పుడు నేను కెప్టెన్ని. ఆ ఆదేశాలతో మా బృందం యుద్ధానికి బయలుదేరింది. 60 కిలోల బరువుతో... అది 1971 డిసెంబర్ నెల. ఏడవ తేది. తెల్లవారు జామున నాలుగున్నర. కశ్మీర్ లోయలో షింగో నది దాటితే కార్గిల్! అది ఎత్తై మంచుపర్వతం. మా బృందంలోని 90 మందిమి మూడు జట్లుగా విడిపోయాం. ప్రధాన జట్టులో 60 మంది, కుడి జట్టులో 15, ఎడమ జట్టులో 15 మందిమి ఉన్నాం. ప్రత్యర్థుల దృష్టి ప్రధాన బృందం మీద నిలిచేటట్లు చేసి, పక్క జట్ల వాళ్లు క్యాంపును స్వాధీనం చేసుకోవాలనేది మా వ్యూహం. భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎయిర్ఫోర్స్ సపోర్టు కానీ, ట్యాంకర్స్ సపోర్టు కానీ లేదు. ఆపరేషన్లో పాల్గొనే సైనికుడికి డ్రైఫ్రూట్స్ ప్రధాన ఆహారం. స్టెన్గన్, తూటాలు, కక్రూ, ఇతర ఆయుధ సామగ్రి, ఆహారం అంతా కలిసి సుమారు 60 కిలోల బరువుంటుంది. లక్ష్యానికి మూడు వేల గజాల ముందు ఆహారం వంటి అదనపు బరువు వదిలించుకుని ఆయుధాలను మాత్రమే దగ్గర ఉంచుకుంటాం. మా ఆపరేషన్లో మొదటి రెండు రోజుల ప్రయాణం ఫరవాలేదు. మూడో రోజు చివరి 1500 గజాల దూరం ప్రయాణించడానికి నాలుగు గంటలు పట్టింది. మంచు పర్వతాన్ని పాక్కుంటూ ఎక్కాలి. శబ్దం రాకూడదు. దగ్గు వచ్చినా తమాయించుకోవాలి. ఆ ఆపరేషన్లో నా కాలికి అయిన గాయం ఆనవాలు అలాగే ఉండిపోయింది. సాధారణంగా దేహానికి గాయమైతే ఆ మచ్చను చూసుకున్నప్పుడు ఎవరైనా బాధ పడతారు. కానీ సైనికుడు యుద్ధంలో తగిలిన దెబ్బను తీపి గుర్తుగా భావిస్తాడు. మూడు రోజుల్లో విజయ పతాకం ప్రధాన బృందంలోని గూర్ఖాలు ప్రత్యర్థుల దాడిని ఎదుర్కొంటూ ఉంటే, పక్క బృందాల్లో ఉన్న మేము హ్యాండ్ గ్రేనేడ్లు వేస్తూ క్యాంపును స్వాధీనం చేసుకున్నాం. ఎదురొచ్చిన వారిని కక్రూ (వంపు తిరిగిన కత్తి)లతో దాడి చేస్తూ మొత్తం 45 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశాం. ఖేమ్ కరణ్ సెక్టార్ నుంచి కార్గిల్ వరకు సాగిన మా మూడు రోజుల యుద్ధ ప్రస్థానం విజయవంతంగా ముగిసింది. మన పతాకాన్ని ఎగురవేయడానికి అప్పుడు మా దగ్గర జెండా ఉండదు. తాత్కాలికంగా మా యూనిట్ జెండానే పాతాం. కార్గిల్ మిలటరీ క్యాంపు నుంచి ఆకాశంలోకి ఎరుపు, ఆకుపచ్చ రంగు బుల్లెట్లను పేల్చాం. ఆ సంకేతాన్నందుకుని మన బృందాలు వచ్చేశాయి. తెల్లవారి ఏడుగంటలకంతా వచ్చిన తొలి బృందం క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చడం వంటి పనుల్లో నిమగ్నమైంది. తొమ్మిది- పది గంటల సమయంలో మరో బృందం ఆహారంతో వచ్చింది. యుద్ధంలో ప్రాణం పోతుందేమోనన్న స్పృహ కూడా ఉండదు. అయితే తోటి సైనికుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు అతడి ఆయుధాల్ని మాత్రం తీసుకుని, దేహాన్ని అలాగే వదిలి ముందుకెళ్లాల్సి రావడం గుండెను పిండేస్తుంది. అయినా, సైనికుడిని కర్తవ్యమే లాక్కెళ్తుంది కాబట్టి ముందుకు పోగలుగుతాడు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలంటే...
మీరే పారిశ్రామికవేత్త! ‘ఇంట్లో అందరూ సంపాదన పరులే. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి’ అనుకుంటున్నారా? ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఓ నైపుణ్యం ఉంటుంది. నాలో నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి’ అనుకుంటున్నారా? ఇవేవీ కాదు, ‘డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే మార్గం కాదు. ఉద్యోగాలిచ్చే పరిశ్రమను స్థాపించడం గొప్ప ఆలోచన’ అనుకుంటున్నారా? ఇందులో మీరు ఎలా ఆలోచించినా, మీలో ఏదో చేయాలనే తపన ఉన్నట్టే! మీ ఆలోచనలకు వాస్తవ రూపమివ్వడానికే ఈ ప్రయత్నం. ఈ వారం జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ఏమేం కావాలి? ఎంత ఖర్చవుతుంది? (ధరలు రూపాయల్లో) 1 జ్యూట్ సూయింగ్ మెషీన్ - 12,000 నుంచి 20,000. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇండస్ట్రియల్ మెషీన్ తీసుకోవాలి. అది 20,000 ఉంటుంది. 1 కటింగ్ మెషీన్ - 9,000. చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో కావాలంటే మెషీన్ ఉంటే పని సులువవుతుంది. ఒక మెషీన్కు ఒక మనిషి చేత్తో కట్ చేసి అందించగలరు. 1 కటింగ్ టేబుల్ - 12,000. మీది చిన్న గది అయితే టేబుల్ వేయడం కుదరదు. నేల మీద పరచి కత్తిరించుకోవాలి. మరింత ఆకర్షణీయంగా తయారుచేయాలంటే ఎంబ్రాయిడరీ మెషీన్ కూడా తీసుకోవచ్చు. దీని ధర 28,000. 2 ర్యాకులు- ఒక్కొక్కటి 2,500 1 అల్మెరా - 6,000 నుంచి 7,000 ఇతరాలు: 1 కత్తెర - 200 1 పెద్ద స్కేలు - 20 1 టేపు - 5 10 బాబిన్లు, బాబిన్ కేస్లు - 350 మెషీన్ రిపేర్ కోసం స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ సెట్ - 100 2 ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - ఒక్కోటి వంద. (‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...) మ్యాన్పవర్: ఇద్దరు కావాలి స్థలం ఎంతుండాలి? ఒక మెషీన్తో యూనిట్ పెట్టడానికి కనీసంగా కావల్సిన స్థలం: 12 బై 12 అడుగుల గది. టేబుల్ కూడా అమర్చుకోవాలంటే మరికొంత పెద్దగా ఉండాలి. యాభై వేల రూపాయలు మీ చేతిలో ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణాల సహకారంతో పది లక్షల రూపాయల యూనిట్ పెట్టుకోవచ్చు. శిక్షణ ఎలా? భారత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ‘వందేమాతరం’ పేరుతో కేంద్ర పరిశ్రమల శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘ఎలీప్’ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా 18-45 ఏళ్ల మధ్య వయసు మహిళలు (కనీస విద్యార్హత 5వ తరగతి) శిక్షణ పొందవచ్చు. ఎలాంటివి ఉత్పత్తి చేయొచ్చు? కుషన్ కవర్లు, కర్టెన్లు, సెల్ఫోన్ కవర్లు, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, లంచ్ బాక్సుల ఆకారాలను బట్టి వాటిని ఇమిడ్చే బ్యాగులను తయారుచేయవచ్చు. సర్టిఫికెట్ల ఫోల్డర్లు, కూరగాయల సంచుల నుంచి పిక్నిక్కు పనికొచ్చే వెరైటీలు, ఇలా దైనందిన జీవనాన్ని గమనిస్తే ఎన్నో ఆలోచనలొస్తాయి. మార్కెట్ ఎలా? జిల్లా, మండల కేంద్రాలలోని డ్వాక్రా బజార్లలో స్టాల్ అద్దెకు తీసుకుని స్వయంగా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన మార్కెట్ ఏజెన్సీలతో అంగీకారం కుదుర్చుకోవచ్చు. గుళ్ల దగ్గర, కాలనీలోని దుకాణదారులకు ప్రయోగాత్మకంగా కొన్ని పీసులను ప్రదర్శించమని అడగవచ్చు. ఇంకా, ఎలీప్ ‘విపణి’ కార్యక్రమం ద్వారా అమ్మకందార్లను, కొనుగోలుదార్లను అనుసంధానిస్తోంది. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఏలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. యాభై వేల రూపాయలు చేతిలో ఉంటే పదిలక్షల యూనిట్ ప్రారంభించే అవకాశాలు నేడు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. ఎలీప్ ద్వారా శిక్షణ, పరిశ్రమ పెట్టడానికి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్నాం. ఆన్లైన్ మార్కెట్కు కూడా తెర తీశాం. జ్యూట్ (జనపనార) పర్యావరణ హితమైనది. దాని వాడకం పెరిగితే పరోక్షంగా రైతులకు ఉపాధి పెరుగుతుంది. - రమాదేవి ఎలీప్(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అధ్యక్షురాలు రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
కోరుకున్నది దేవుడిచ్చేశాడు!
అంతర్వీక్షణం: సంపూర్ణేశ్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ విలక్షణత సంపూర్ణేశ్బాబు. తెలుగు సినిమాలపై వ్యంగ్యాస్త్రంగా ఆయన సంధించిన ‘హృదయ కాలేయం’ చిత్రం ఆ మధ్య అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక్క సినిమాతో అందరికీ సుపరిచితుణ్ణి చేసింది. ఒక్క సినిమాతో వంద సినిమాల ఆదరణ చూపిన ప్రేక్షకులకు వందనమనే ‘సంపూ’తో కొన్ని ముచ్చట్లు... ఎక్కడ పుట్టారు?... మెదక్ జిల్లాలోని సిద్ధిపేట పక్కన మిట్టపల్లి అమ్మానాన్నలు?...నాన్న మహాదేవ్, అమ్మ కౌసల్య ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు? ఇలా, అలా అని లేదు. అందరినీ ఇష్టపడతాను. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది ? ఒక్కసారి చూడగానే అంచనా వేసేటంత గొప్ప వాడిని కాదు, అందరితో స్నేహంగా ఉంటాను. అందరిలో స్నేహితులనే చూస్తాను. మీలో మీకు నచ్చే లక్షణం ఏది? ఫలానా అంటూ ఏ ఒక్కటో కాదు. నాకు నేను చాలా ఇష్టం. ఆ తర్వాత ప్రపంచాన్ని ఇష్టపడతాను. ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. ఆర్టిస్టుగా విలక్షణమైన స్థానం కావాలనుకున్నాను. ప్రభావితం చేసిన వ్యక్తి ?... మోహన్బాబు. మీ తొలి సంపాదన?...‘హృదయకాలేయం’ సినిమాకి తీసుకున్న అడ్వాన్సు. అత్యంత సంతోషం కలిగిన రోజు... 2014 ఏప్రిల్ 4 - ‘హృదయకాలేయం’ విడుదలైన రోజు. ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా ? ఇంతవరకు ఎవరూ లేరు. ఇకపై తప్పు చేస్తే క్షమించమని ప్రేక్షకులనే అడుగుతాను. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి?...భయపడాల్సిన అవసరమే రాలేదింత వరకు. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?...‘నేనింత వరకు అబద్ధమే చెప్పలేదు’ అని ఎవరైనా అంటే ... ఆ మాట నిజమని నమ్మవచ్చా? చిన్నప్పుడు హోమ్వర్క్ చేయక స్కూల్లో అబద్ధం చెప్పడం వంటివి తప్ప ఘోరాలకు, నేరాలకు దారి తీసే అబద్ధాలేమీ చెప్పలేదు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?... నేను కోరుకున్నది ఇచ్చేశాడు. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంతమందిని హాయిగా ఉంచుతున్న దేవుడు నన్ను మాత్రం ఎందుకు కష్టపెడతాడు? అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు ?... మేకప్ కుదిరిందా లేదా అని చూస్తాను. ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉందా?... ప్రసారమాధ్యమాలకు, సోషల్ నెట్వర్క్ మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా నాకు చేసిన సహాయం చాలా గొప్పది. ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను తమ ఇంటి వ్యక్తిగా ఆదరించింది. అలాగే అందరు హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు. అందరికీ సదా రుణపడి ఉంటాను. మీ ప్రేమకు బానిసను. సంపూర్ణేశ్ బాబు అంటే ఏమి గుర్తు రావాలనుకుంటారు?... ‘హృదయ కాలేయం’ గుర్తు రావాలి, స్టీవెన్ శంకర్ అనే దర్శకుడు లేకపోతే సంపూర్ణేశ్ బాబు లేడు... అని కూడా. - వాకా మంజులారెడ్డి -
సాహసానికి ప్రతిరూపం
దేశం ఉత్తరాన మంచుపర్వతాన్ని తాకాడు. దక్షిణాన అరేబియా సముద్రంలో దూకాడు. ఈ మధ్యలో పుణేలో బంగీ జంప్ చేశాడు. సికింద్రాబాద్లో స్క్వాష్ ఆడి ట్రోఫీ అందుకున్నాడు. బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్లలో ప్రతిభ చూపించాడు. ఇవన్నీ చేస్తున్న అనురూప్ను అచ్చమైన ఆల్రౌండర్ అంటే తప్పులేదు. పాతికేళ్లయినా నిండని ఈ కుర్రాడి కృషి వెనుక చాలా కథే ఉంది... బి.టెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) చదివి, బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ కుర్రాడు ఓ రోజు టెలివిజన్ రియాలిటీ షోలో యాంకరింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఓ రోజు స్క్వాష్ ఆటగాడిగా చాంపియన్ షిప్ అందుకుంటూ వార్తల్లో కనిపిస్తాడు. మారథాన్ రన్ చేసి సమాజానికి సందేశంగా నిలుస్తాడు. సముద్రంలో బుడుంగున మునిగి స్కూబా డైవింగ్ చేస్తాడు. అంతెత్తు నుంచి బంగీ జంప్ చేసి చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. వీటికి తోడు ఓ సారి హఠాత్తుగా ర్యాంప్ మీద మోడలింగ్ చేస్తాడు. ఇవన్నీ తన సరదా కోసం చేస్తున్న పనులు. స్త్రీని వేధింపులకు గురిచేసే వారిని క్షమించరాదని గట్టిగా వాదిస్తాడు అనురూప్. అతడి వాదన వింటే ఏ తల్లి కన్నబిడ్డో... మహిళల మీద ఇంతటి అక్కర చూపిస్తున్నాడు అనిపించక మానదు. అనురూప్ తల్లి శోభ సంతోషంగా నవ్వుతూ... ‘‘అనురూప్ చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లాడు. స్కూల్ నుంచి కంప్లయింట్స్ వచ్చేవి. అయితే అనురూప్ అల్లరి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తపడేదానిని. ‘మన కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఎవరినీ నొప్పించకూడదు’ అని చెప్తుండేదాన్ని’’ అన్నారు. వయసు చిన్నది... విజయాలు పెద్దవి... * స్క్వాష్లో... హైదరాబాద్ సర్క్యూట్లో ప్రథమ స్థానం. 2012 నుంచి 2014 వరకు స్క్వాష్ సింగిల్స్ ఓపెన్, మెన్స్ ఓపెన్, డబుల్స్లో మొత్తం ఏడు పతకాలు. పూనా, కర్నాటక, ఎ.పి ఓపెన్ చాంపియన్షిప్లు. * బాడ్మింటన్లో... మెన్స్ ఓపెన్, మెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ . * టేబుల్ టెన్నిస్లో... 2014లో మిక్స్డ్ డబుల్స్, మెన్స్ డబుల్స్ చాంపియన్ షిప్లు. 2013లో యాన్యువల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్. * మోడలింగ్ రంగంలో... ఆర్ఎస్ఐ మే ప్రిన్స్ 2013, మిస్టర్ టాలెంటెడ్ 2014, మిస్టర్ ఆటిట్యూడ్ 2014. * టెలివిజన్లో... ఎంటీవీలో రోడీస్కి వ్యాఖ్యాత. * సాహస క్రీడల్లో... బంగీజంప్, స్కూబా డైవింగ్లో నిష్ణాతుడు. అమ్మకు బహుమతి ! నేను టోర్నమెంట్లకు వెళ్లడానికయ్యే ఖర్చులన్నీ మా నాన్న భరిస్తారు. బహుమతి కవర్ మాత్రం అమ్మకే. ఓ సారి అమ్మ కొత్త చీర కట్టుకుని ... అంచులు సర్దుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చి ఎలా ఉంది- అని అడిగింది. బావుందన్నాను. ఇది నీ పారితోషికం డబ్బుతో కొన్నాను. ఇది నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ అంటూ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది మా బ్యూటిఫుల్, లవ్లీ మామ్... - అనురూప్, సాహస క్రీడాకారుడు పన్నెండు తరగతులకు ఎనిమిది పాఠశాలలు! అనురూప్ తండ్రి బాలకృష్ణన్ ఆర్మీలో అధికారి. ఉద్యోగరీత్యా దేశమంతటా బదిలీలు ఉండేవి. దాంతో అనురూప్ పాఠశాల విద్య పూర్తయ్యేలోపు ఎనిమిది రాష్ట్రాలు మారారు. ‘‘అనురూప్ ఢిల్లీ, బికనీర్, లేహ్, కోళిక్కోద్... అనేక నగరాల్లో చదువుకుని, దాదాపుగా దేశమంతటినీ చూశాడు. వాడి ఆలోచనలు విస్తృతం కావడానికి అది చాలా దోహదం చేసింది. ఎంతటి అల్లరి వాడైనప్పటికీ తరచూ కొత్త ప్రదేశాలలో ఇమడాల్సి రావడంతో చిన్నప్పుడు కొంత బిడియం ఉండేది. స్కూల్లో బాస్కెట్బాల్ ఆడడం మొదలైనప్పటి నుంచి రెక్కలొచ్చిన సీతాకోక చిలుకలా మారిపోయాడు. ఆత్మవిశ్వాసం పాదుకొల్పడానికి తండ్రిగా నేనిచ్చిన కౌన్సెలింగ్ ఫలించింది. అనురూప్ ఏ ఆట ఆడుతానన్నా నేను అడ్డుచెప్పలేదు. స్క్వాష్ ఆటలో తనకు శిక్షణ కూడా లేదు. స్వతహాగా నేర్చుకున్నాడు. రాణిస్తున్నాడని తెలిసిన తర్వాత మెలకువల కోసం శిక్షణ ఇప్పించాను. అయితే మా అబ్బాయికి మంచి విలువలను నేర్పించింది మాత్రం వాళ్ల అమ్మే’’ అన్నారు. క్రీడాకారుడికి కుటుంబమే వెన్నెముక! క్రీడాకారులకు వెన్నెముక కుటుంబమే, తనకు అంతకంటే గొప్ప వరం అమ్మానాన్నలిద్దరూ ప్రేమను పంచడంతోపాటు సామాజికంగా చైతన్యపరచడమేనంటాడు అనురూప్. ‘‘బంగీజంప్, స్కూబా డైవింగ్ వంటి ఎంత రిస్కీ ఫీట్ చేసేటప్పుడైనా నాన్నకు చెబుతాను. అమ్మకు ఆ సాహస సన్నివేశం రికార్డును మాత్రమే చూపిస్తాను. నేల మీద ఆడే ఆటలెన్నయినా ఆడుకో, అంతే కానీ గాల్లో దూకడం, నీటిలో మునగడం వంటి నేల విడిచిన సాహసాలు వద్దంటుంది అమ్మ. 150 అడుగుల బంగీజంప్, పారాగ్లైడింగ్ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు అమ్మకు నేనే ధైర్యం చెప్పాను’’ అన్నాడు. ఇంత అల్లరిగా కనిపించే ఈ కుర్రాడు జీవితానికి చాలా లోతైన నిర్వచనం చెబుతాడు. జీవితం చాలా విలువైనది. ఆనందించడానికి ఎన్నో మార్గాలున్నాయి. పబ్లలో గడపడం, ధూమపానం, మద్యపానంతో దొరికే ఆనందం కంటే క్రీడలతో వచ్చే ఆనందం వెయ్యి రెట్లు ఎక్కువ అని ఈ ఆటల ద్వారా చెప్పదలుచుకున్నానంటాడు. స్క్వాష్ క్రీడాకారుడిగా కెరీర్ కొనసాగించడంతోపాటు హైదరాబాద్లో స్క్వాష్ అకాడమీ స్థాపించి క్రీడాకారులను తయారు చేయాలనేది అనురూప్ ఆకాంక్ష. - వాకా మంజులారెడ్డి -
కెరీర్ బయోగ్రఫీలో ఇంకా చెప్తాను!
సీనియర్ పాత్రికేయులు ఎబికె ప్రసాద్. ఒక తరం తెలుగు పత్రికలన్నింటిలోనూ ఆయన ముద్ర ఉంది. ఆయన వేసిన బీజాలతో మొలకెత్తిన మొక్కలు శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షాలయ్యాయి. విస్తృతమైన జీవితాన్ని, సమాజాన్ని చూసిన అనుభవం ఆయనది, అభ్యుదయ భావాల ఈ కలం వీరుడి అంతరంగ వీక్షణానికి ఓ ప్రయత్నం. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశాను. పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఆ ఇంటినీ అమ్మేసి ఆ డబ్బుతో నేను, నా భార్య సుధ ఇద్దరం హైదరాబాద్, కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్లో జీవిస్తున్నాం. ఎబికె ప్రసాద్ - అంతర్వీక్షణం మీరు పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? 1935వ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టాను. మీ సొంతూరు ఉయ్యూరా? అమ్మానాన్నలు... సొంతూరు కృష్ణాజిల్లా ఉప్పలూరు. మా మేనమామ చలసాని వాసుదేవరావు ఉయ్యూరు దగ్గర భట్ల పెనుమర్రులో ఉండేవారు. అమ్మ చంద్రావతమ్మ, నాన్న బుచ్చివీరయ్య. నాన్న నా ఐదవయేటనే పోయారు. నన్ను అమ్మ పెంచింది. మీరు ఏం చదివారు? ఎం.ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకలా?... నాగపూర్లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేసేవాడిని. అలా ఫైనలియర్కి వచ్చేటప్పటికి నాకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరాను. మీ తొలి ఉద్యోగం ఎక్కడ? విజయవాడలో, ‘విశాలాంధ్ర’ పత్రికలో. మీ పాత్రికేయ జీవితానికి ఎన్నేళ్లు? 1958లో విశాలాంధ్రలో సబ్ఎడిటర్గా చేరాను. అప్పటి నుంచి లెక్కిస్తే 56 ఏళ్లు. నా కలం మరో నాలుగేళ్లు పెద్దది. బి.ఎ రోజుల్నుంచి రాస్తున్నాను. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు? కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశాను. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మా మేనమామ వాసుదేవరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య లాంటి ప్రముఖుల చర్చలను ప్రత్యక్షంగా చూశాను. నన్ను వాళ్లు చాలా ప్రభావితం చేశారు. అప్పటి రాజకీయాలతో మీకు ప్రత్యక్ష సంబంధాలుండేవా? పునాదిపాడులో ఎనిమిది- తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. కొద్దికాలానికే బయటికొచ్చేశాను. ఆర్ఎస్ఎస్ నచ్చలేదా? గాంధీజీ హత్యతో ఆర్ఎస్ఎస్ పట్ల విముఖత కలిగింది. గాంధీజీ హత్య మిమ్మల్ని తీవ్రంగా గాయపరచినట్లుంది! నిజమే. ఊరు ఊరంతా అట్టుడికిపోయింది. పెద్దవాళ్లందరూ గాంధీజీ దేశం కోసం జీవితాన్ని అర్పించడాన్ని చెప్పుకోవడం విని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. సంపాదకులుగా ఎన్ని పత్రికలను నడిపించారు? ఆంధ్రపత్రిక, సాక్షిలో తప్ప తెలుగులో అన్ని పత్రికలకూ పనిచేశాను. ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కూడా. వృత్తిపరమైన ఒడుదొడుకులు...! ‘జనశక్తి’ సంపాదకుడిగా నా మీద కేసులు ఫైలయ్యాయి. జైలుకెళ్లాను కూడ. జైలు జీవితం దుర్భరంగా అనిపించిందా? పుస్తకాలు చదువుకునే వాడికి జైలు దుర్భరంగా ఉండదు. కావలసినంత సమయం దొరికినట్లవుతుంది. అక్కడ జక్కా వెంకయ్య, డాక్టర్ శేషారెడ్డి వంటి పార్టీ సీనియర్ నాయకులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చింది. వందలాది అంశాల మీద వేలాదిగా వ్యాసాలు రాసి ఉంటారు? తాజాగా ఏం రాస్తున్నారు? నా కెరీర్ బయోగ్రఫీ ఈ డిసెంబర్లో మొదలు పెడతాను. అందులో చాలా విషయాలను చెప్తాను. సంతోషం కలిగించే విషయం! అనేక పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కావడం. తరచూ పత్రికలు మారతారనే అపప్రథ కూడా ఉంది కదా! కొత్తగా పత్రిక పెట్టే వారికి నా సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత నా ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీ పడి ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. జీవితంలో రాజీ పడాల్సిన సందర్భం వచ్చిందా? రాజీ పడాల్సిన సందర్భాలు ఎవరికైనా సరే చాలానే వస్తాయి. రాజీ పడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవాడినీ కాదేమో. రాజీలేని జీవితంతో తృప్తి కలుగుతోందా? చాలా తృప్తిగా ఉన్నాను. తృప్తిని మించిన ఆస్తి లేదు. సంపాదకుడి ప్రతిభకు కొలమానం ఉంటుందా? ఉంటుంది. పత్రిక అమ్మకాలు పెరగడం, తగ్గడం- రెండూ సంపాదకుడి ప్రతిభకు గీటురాళ్లే. విమర్శలను ఎలా స్వీకరిస్తారు? కుత్సితాల లోయలోకి వెళ్లేకొద్దీ మనలోని నైపుణ్యాలు అణగారిపోతాయి. కుహనా విమర్శను అక్కడితోనే వదిలేయాలి. మనసులోంచి తుడిచేయాలి. అప్పుడే లక్ష్యాలను చేరగలం. మీరు నమ్మే సిద్ధాంతం? ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానసికంగా దెబ్బతినకూడదు. ఎంచుకున్న బాటను వదల కూడదు. పాత్రికేయులకు మీరిచ్చే సందేశం? ప్రతి వాక్యాన్నీ బాధ్యతగా రాయాలి. ఆ సంస్థను వదిలి వెళ్లేటప్పుడు రాసిన చివరి వాక్యం కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు రాసినట్లే రాయాలి. రాసిన ప్రతి వాక్యానికీ బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండాలి. - వాకా మంజులారెడ్డి -
సామాన్యునికి - పాస్పోర్టుకు పటిష్టమైన వారధి వేస్తా!
సి.బి. ముత్తమ్మ... మనదేశంలో మొదటి మహిళా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్). ఆమె 1949లో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరోసారి వచ్చింది. ఆ అవసరాన్ని కల్పించిన మహిళ అశ్విని సత్తారు. అశ్విని కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఒక తొలి రికార్డును కూడా సాధించారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్ పాస్పోర్టు ఆఫీసులో రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్. అంతేకాదు... పాస్పోర్టు ఆఫీస్ చరిత్రలో తొలి మహిళా అధికారి. సామాన్యులకు పాస్పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తన తొలి అజెండా అంటున్న అశ్విని సత్తారుతో ముఖాముఖి. మీరు మీడియాకు దూరంగా ఉంటారనుకుంటాను. అపాయింట్మెంట్ చాలా కష్టమైంది... అశ్విని: నిజమే. పెద్దగా ఇష్టపడను. ఏ బ్యాచ్లో ఐఎఫ్ఎస్లోకి వచ్చారు? అశ్విని: 2008 బ్యాచ్. నాన్న ఐపిఎస్, మీరు ఐఎఎస్కు సెలెక్ట్ అయ్యారు. కానీ ఐఎఫ్ఎస్ను ఎంచుకోవడంలో కారణం ఉందా? అశ్విని: డిప్లమాట్ అవుదామనే ఐఎఫ్ఎస్ని ఎంచుకున్నాను. ఇండియా చాలా గొప్ప దేశం. ఈ దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప అనుభూతి. మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరు? అశ్విని: ఒకరు ప్రభావితం చేయడం అనడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ పట్ల ఆసక్తి ఉండేది. నాన్నగారు ఈ రంగంలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అయ్యుండవచ్చు. కాలేజ్కొచ్చే సరికి అది ఐఎఫ్ఎస్ అని స్పష్టంగా నిర్ణయించుకున్నాను. మీ వికాసంలో అమ్మానాన్నల్లో ఎవరి పాత్ర ఎక్కువ? అశ్విని: నాకు తెలిసినంత వరకు పిల్లల వికాసంలో అమ్మపాత్ర, నాన్న పాత్ర అని విడదీసి చూడలేం. అమ్మానాన్న ఇద్దరూ ఒక టీమ్. ఆ టీమ్ పిల్లల్ని నడిపిస్తుంది, నడవనిస్తుంది. మా అమ్మానాన్నలు నన్ను, మా అన్నయ్యను ఇద్దరినీ నడవనిచ్చారు. మాకు ఇష్టమైన రంగాల్లోకి రావడానికి తగినంత ప్రోత్సాహం ఇచ్చారు. అన్నయ్య జాన్సన్ అండ్ జాన్సన్స్లో సౌత్ ఇండియా హెడ్. మీ బాల్యం ఎక్కడ గడిచింది? అశ్విని: మొత్తం హైదరాబాద్లోనే. ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయలో చదివాను. ఉస్మానియా యూనివర్శిటీలో బి.టెక్ కంప్యూటర్ సైన్స్, సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఇక్కడే. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీకి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్? అశ్విని: గ్లోబలైజేషన్ కారణంగా దేశాలన్నీ దాదాపుగా ఒకే రూపు సంతరించుకున్నాయి. రెండు - మూడ దశాబ్దాల కిందట అయితే ఎవరైనా యుఎస్ నుంచి వస్తుంటే అక్కడి విశేషాలను తెలుసుకోవడం కోసం బంధువులు, స్నేహితులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. నేను వెళ్లినప్పటికి అలా కొత్త భావన కలిగే పరిస్థితి లేదు. సివిల్స్ ప్రిపరేషన్లో జర్మన్ లాంగ్వేజ్ తీసుకున్నాను. కాబట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకపోయింది. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీలో మీ అనుభవాలు? అశ్విని: ఐఎఫ్ఎస్గా నా మొదటి పోస్టింగ్ జర్మనీలోనే. 2010వ సంవత్సరం జూలై నుంచి 2013 వరకు బెర్లిన్లోని భారత రాయభార కార్యాలయంలో పని చేశాను. మనదేశానికి- జర్మనీకి మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి. నేను అక్కడ ఉన్న సమయంలోనే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు దఫాలు జర్మనీలో పర్యటించారు. మనదేశానికి సాంకేతిక సహాయకారి జర్మనీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జర్మనీ ముద్ర మన దేశం మీద చాలా ఎక్కువ. మనం ఉపయోగించే ఎస్కలేటర్, లిఫ్ట్, కార్లు, పెద్ద మెషీన్లు... ఇలా అనేకం జర్మనీ తయారు చేసినవే. జర్మనీ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ మనదేశమే అని చెప్పాలి. జర్మనీ నుంచి మనదేశం నేర్చుకోవాల్సింది... అశ్విని: చాలా ఉంది. వారిలో జాతీయభావన మెండు. ఉద్యోగం కూడా దేశం అభ్యున్నతి కోసమే అన్నట్లు చేస్తారు. పని కచ్చితంగా చేయడం ద్వారా దేశాభివృద్ధిలో తమ పాత్రను నిర్వహిస్తున్నాం అని సంతోషిస్తారు. మేధాసంపత్తిలో భారతీయులు చాలా తెలివైన వాళ్లు. వర్క్ కల్చర్, క్రమశిక్షణ, జాతీయత భావాన్ని పెంచుకుంటే మనదేశం త్వరగా అభివృద్ధి చెందుతుందనిపించింది. పాస్పోర్టు వ్యవహారాల విషయానికి వస్తే... తొలి మహిళా అధికారిగా ఎలా ఫీలవుతున్నారు? అశ్విని: ప్రొఫెషన్కి స్త్రీ, పురుషులనే తేడాలుండవు. అయితే ఒక విషయాన్ని మహిళలు స్వీకరించే విధానం కొంత భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా పరిమితమైన సందర్భాల్లోనే. నాకు తేడా ఏమీ కనిపించలేదు. ఇంతకంటే కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఫారిన్ అఫైర్సన్ సెక్రటరీ సుజాతాసింగ్లాంటి ఎందరినో చూస్తున్నాం కదా! పాస్పోర్టు అధికారిగా ఫస్ట్ ఉమన్గా రికార్డు మీదే. మరి ఫస్ట్తోపాటు బెస్ట్ రికార్డు కూడా మీ ఖాతాలో చేరాలంటే... అశ్విని: నాకు ముందు ఈ బాధ్యత నిర్వర్తించిన శ్రీకర్ రెడ్డి గారు చాలామంచి సిస్టమ్ను రూపొందించారు. అప్పుడు నేను డిప్యూటీ పాస్పోర్టు ఆఫీసర్ని. ఇప్పుడూ ఆయన బాటలోనే పని చేస్తున్నాను. పాస్పోర్టు సేవల పట్ల ప్రజల్లో ఇంతకు ముందుకంటే ఇప్పుడు నమ్మకం పెరిగింది. అప్లయ్ చేస్తే పాస్పోర్టు వస్తుందనే భరోసా కలిగింది. మా సేవల్లో ప్రతి అంశాన్నీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. క్రమంగా అదే ‘బెస్ట్ సర్వీస్’ రికార్డును తెస్తుంది. పాస్పోర్టు ఏజెంట్ సిస్టమ్ తొలగిపోవాలంటే... అశ్విని: పాస్పోర్టు దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పుడు చాలా వరకు పారదర్శకంగా మారింది. ఎవరికి వారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం కొంతయినా ఉండాలి. నిరక్షరాస్యులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సౌకర్యం కోసం ఏజెంట్లను ఆశ్రయిస్తున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడున్న ట్రాన్స్పరెంట్ సిస్టమ్లో ఏజెంట్ అవసరమే లేకుండా పాస్పోర్టును అందుకోవచ్చు. తప్పదనుకుంటే సేవాకేంద్రాల సహాయం తీసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క పౌరునికీ తప్పని సరా? అశ్విని: పాస్పోర్టు ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు. తప్పని సరి కాదు. పాస్పోర్టు సమగ్రమైన డాక్యుమెంట్ కదా? అశ్విని: పాస్పోర్టు... ప్రభుత్వం ఇచ్చిన అనేక ధృవపత్రాల ఆధారంగా జారీ అయి ఉంటుంది. కాబట్టి ఓ భరోసా. రోజూ పాస్పోర్టు కోసం వచ్చే దరఖాస్తులు, జారీ చేస్తున్న పాస్పోర్టుల నిష్పత్తి సమంగా ఉంటోందా? అశ్విని: బేగంపేటలో రోజుకు 800 వస్తున్నాయి. రోజుకు వెయ్యి పాస్పోర్టులు జారీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఆఫీసు ఇది. అన్ని డాక్యుమెంట్లూ సరిగ్గా ఉంటే మూడు రోజుల్లో పాస్పోర్టు జారీ అవుతుంది. తత్కాల్ అయితే 48 గంటల లోపు జారీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామీణుల కోసం అవగాహన సదస్సుల వంటివి... అశ్విని: గ్రామీణులలో పాస్పోర్టు పట్ల చైతన్యం తీసుకురావడం నా ప్రధానమైన అజెండా. విలేజ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్కి శిక్షణ ఇవ్వబోతున్నాం. పాస్పోర్టు సేవలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. నకిలీ పాస్పోర్టును అడ్డుకోవడం ఎలా? అశ్విని: ఒకప్పుడు చేత్తో రాసేవారు. ఇప్పుడు అన్నీ మెషీన్ రీడ్ పాస్పోర్టులే, బయో మెట్రిక్ సిస్టమ్లో నకిలీకి ఆస్కారం ఉండదు. తప్పుడు సమాచారంతో పాస్పోర్టు కోసం వస్తే? అశ్విని: మాకు చర్య తీసుకునే అధికారం ఉండదు. మేము పాస్పోర్టు జారీ చేయడానికి అనేక డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్లో ఉన్న సమాచారం నకిలీ అని నాకు వ్యక్తిగతంగా తెలిసినా సంబంధిత అధికార విభాగం జారీ చేసిన డాక్యుమెంట్ని నేను గౌరవించాల్సిందే. సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారికి మీరు ఈ డాక్యుమెంట్ను మరోసారి సరి చేసుకోగలరు అని సూచించగలం. దేశంలోపల ఉద్యోగం, దేశం వెలుపల ఉద్యోగంలో తేడా? అశ్విని: పౌరులకు నేరుగా సేవ అందిస్తాం కాబట్టి ఇప్పుడు చేస్తున్న విభాగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. దేశం బయటకు వెళ్లినప్పుడు ‘నేను నా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా ప్రజలు ఎలా ఉంటారు, వారి సమస్యలు ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. అది ఒక బాధ్యత. జాబ్ సాటిస్ఫాక్షన్ పొందిన సందర్భం? అశ్విని: గత ఏడాది డిప్యూటీ పాస్పోర్టు ఆఫీసర్గా ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్కు చెందిన ఒక అమ్మాయి పాస్పోర్టు విషయంలో నేను గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా కష్టమైన ఉద్యోగం అనిపించిన సందర్భం ? అశ్విని: పబ్లిక్ సర్వీస్లో చాలెంజెస్ ఉంటాయి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మొదటి రోజునే అనుకున్నాను. అయితే కష్టం అనిపించిన సందర్భం ఇంత వరకూ రాలేదు. కుటుంబ వివరాలు... హాబీలు... అశ్విని: నేను సింగిల్. నా హాబీ క్రమశిక్షణతో పని చేయడమే. చివరగా పౌరులకు ఓ సూచన! అశ్విని: పాస్పోర్టు జారీ చేసే పనిని మా స్టాఫ్ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతగా చేయట్లేదు. మన పౌరులకు చేస్తున్న సేవ అనే ధోరణితో పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. దీనిని కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరికీ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తాం. - వాకా మంజులారెడ్డి సామాన్యులకు మీరిచ్చే సూచన? అశ్విని: ఏజెంట్లు ‘‘నేను చిటికెలో ఇప్పిస్తాను’’ అన్నట్లు చెబుతుంటారు. ఆ మాటలను నమ్మవద్దు. మీరే స్వయంగా పాస్పోర్టు ఆఫీసు లోపలికి రండి. ముఖ్యంగా విదేశీ విద్యావకాశాలు పెరిగిన ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదో అత్యవసరం ఏర్పడుతుంది. ఆ సమయానికి పాస్పోర్టు సిద్ధమవుతుందా లేదా అనే అయోమయంలో ఏజెంట్లను ఆశ్రయిస్తారు. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే - దయచేసి ఉదయం 9.30-11.30 మధ్య మా బ్యాక్ ఆఫీస్కి రండి. అన్ని వివరాలనూ తెలుసుకోండి. ఇప్పుడు సిస్టమ్ చాలా పారదర్శకంగా ఉంది. అవసరమైన డాక్యుమెంట్లు ఉంటే మూడు రోజుల్లో పాస్పోర్టు జారీ అవుతుంది. -
మన చరిత్రకు రాజముద్ర
ఒక సైనికుడు... ఒక చరిత్ర అధ్యయనకారుడు... పాలనా రంగ విద్యార్థులకు బోధకుడు ఈ మూడు కోణాల కలబోత... కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి. కాశ్మీర్ రక్షణ కోసం దేశ సరిహద్దులో యుద్ధం చేశారు. హైదరాబాద్ చరిత్ర ఇదీ అంటూ ఆధారాలు చూపించారు... శాతవాహనుల నాణేలు ఇలా ఉంటాయని... మధ్య యుగంలో దక్కను ప్రజల సామాజిక జీవనం ఇలా ఉండేదని కళ్లకు కట్టారు. మనకు తెలిసిన అనేక మంది ఐఏఎస్, ఐపిఎస్లకు చరిత్ర పాఠాలు చెప్పారు. ఇప్పుడు లండన్లోని రాయల్ హిస్టారికల్ సొసైటీ పురస్కారాన్ని అందుకుని తన అధ్యయనానికి రాజముద్ర వేసుకున్నారు. అది 1965వ సంవత్సరం, ఆగస్టు ఐదవ తేదీ. భారత - పాకిస్థాన్ దేశాల సరిహద్దు. పంజాబ్ రాష్ట్రంలో ఖేమ్ కరణ్ సెక్టార్. వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్)కి ఇరువైపులా సైన్యాలు మోహరించాయి. కాశ్మీర్ కోసం భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం షురూ అయింది. ఆ యుద్ధంలో మనదేశం తరఫున పాల్గొన్న ముప్ఫైవేల మందికి పైగా సైన్యాన్ని ముందుకు నడిపించిన అధికారుల్లో ఒక తెలుగు వీరుడు కూడా ఉన్నాడు. ఆయనే లింగాల పాండురంగారెడ్డి. సెకండ్ లెఫ్టినెంట్గా సైన్యాన్ని నడిపించిన ఈ కెప్టెన్ 1970లో దేశ రక్షణ బాధ్యత నుంచి విశ్రమించారు. కానీ ఆయనలో పోరాట పటిమ నేటికీ విశ్రమించలేదు. అప్పటి పోరాటం ఆయుధాలతో చేస్తే ఇప్పటి పోరాటం అక్షరాలతో చేస్తున్నారు. చారిత్రక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన స్ఫూర్తితో ఆయన చరిత్ర పాఠాలను ఆపోశన పడుతున్నారు. ఆ శ్రమను గుర్తించిన లండన్లోని రాయల్ హిస్టారికల్ సొసైటీ... ఫెలోషిప్తో గౌరవించింది. ఈ గౌరవం అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి ఆయన. ‘‘మాది వరంగల్ జిల్లా జనగాం. డిగ్రీ పూర్తయిన తర్వాత రక్షణ వ్యవస్థలో చేరాను. ఆ సమయంలోనే ఇండో-పాక్ యుద్ధం జరిగింది. నాకు స్వతహాగా పుస్తకాలు చదివే అలవాటు చాలా ఎక్కువ. రక్షణ రంగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఎం.ఎలో చేరాను. ఎం.ఎలో గోల్డ్మెడల్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఎం.ఫిల్, పిహెచ్డి చేశాను. శాతవాహనుల నాణేలు, మధ్యయుగ చరిత్ర కాలంలో దక్కను, భద్రతా సమితిలో హైదరాబాద్ వివాదం... వంటి అనేక అంశాల మీద అధ్యయనం చేశాను. వాటన్నింటిలో నేను ఉదహరించిన సహేతుకమైన ఆధారాలను నిర్ధారించుకున్న తర్వాత రాయల్ హిస్టారికల్ సొసైటీ నా పరిశోధనలను గుర్తించింది’’ అన్నారాయన. హైదరాబాద్ వ్యవహారం మీద అధ్యయనం చేయడానికి బలమైన కారణమే ఉందంటారు పాండురంగారెడ్డి. ‘‘ఒకసారి న్యూయార్క్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలిస్తుండగా భద్రతాసమితిలో వివాదం నడుస్తున్న హైదరాబాద్ అంశం నా కంట పడింది. అది ఏంటంటే... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం భారత సమాఖ్యలో దేశంలోని సంస్థానాలన్నింటినీ విలీనం చేయడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా హైదరాబాద్ రాష్ట్రం అంశం వివాదాస్పదంగా ఉండిపోయింది. చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన అంశాలెన్నో తెలిశాయి. ఆ అంశం మీద అధ్యయనం చేయాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. అయితే నేను ఆధారాలతో సహా బయటపెట్టదలుచుకున్న అనేక అంశాలను స్వీకరించడానికి స్థానిక యూనివర్శిటీలు ముందుకు వస్తాయో రావోననే సందేహంతో అన్నామలై నుంచి ఎం.ఫిల్ చేశాను. ఆ తర్వాత ఇక్కడే పిహెచ్డి చేయవచ్చని ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఆహ్వానం వచ్చింది’’. శ్రీకాకుళంతో మొదలు పెట్టి అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శాతవాహనుల గురించి, తెలుగు భాషలో విడుదల చేసిన వారి నాణేల గురించి ప్రత్యేకంగా పరిశోధన చేశారు పాండురంగారెడ్డి. మధ్యయుగం నాటి దక్కను చరిత్రనూ అనేక కోణాల్లో పరిశోధించి చరిత్రకు కొత్త అధ్యాయాలను కూర్చారు. వీటన్నింటినీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో అడుగుపెట్టాలనుకున్న విద్యార్థులకు పాఠాలుగా చెప్పి వారిని ఉత్తీర్ణులను చేశారు. ఐఎఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ, ఐపిఎస్ అధికారి అరుణా బహుగుణ వంటి చాలామంది ఆయన దగ్గర చరిత్రపాఠాలు చదువుకున్నారు. హెదరాబాద్, తెలంగాణ చరిత్రకు సంబంధించిన సాధికారిక సమాచారం కోసం రాజకీయ నేతలు ఆయనను సంప్రతిస్తున్నారంటే... చరిత్రపై పాండురంగారెడ్డి పట్టు అర్థం చేసుకోవచ్చు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక చారిత్రక సంఘటనలను గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు, డిసెంబర్ తొమ్మిదవ తేదీకి ఏదో అంతర్లీన సంబంధం ఉందని చమత్కరించారు పాండురంగారెడ్డి. ‘‘మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి నెహ్రూ రాజ్యసభలో ప్రకటించింది - 1952 డిసెంబర్ తొమ్మిదవ తేదీన! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం ప్రకటించింది - 2009 డిసెంబర్ తొమ్మిదవ తేదీన! అలా తెలుగు వారికి డిసెంబర్ తొమ్మిది చారిత్రకంగా గుర్తుండే రోజు’’ అన్నారాయన. అదే సమయంలో ‘‘రాష్ట్రం ఏదనేది ప్రధానం కాదు, ప్రజలు, వారి మధ్య సంబంధాలు ప్రధానం’’ అని విజ్ఞతను వ్యక్తం చేశారు.పాండురంగారెడ్డి మాటల్లో అక్షరం, ఆయుధం... ఈ రెండింటినీ సమర్థంగా ఉపయోగించగలిగిన నైపుణ్యం కనిపిస్తుంది. అలాగే అక్షరాన్ని ఆయుధంగా మార్చి... సమకాలీన రాజకీయాంశాల పట్ల ప్రతిస్పందిస్తూ వాటికి చారిత్రక ఆధారాలను జోడిస్తూ జాతీయ నాయకులకు ఉత్తరాలతో ఊపిరి సలపకుండా చేసిన చొరవ కూడా కనిపిస్తుంది. అలాంటి సునిశితమైన అధ్యయనాలే... ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీ పురస్కారాన్ని తెచ్చి పెట్టాయి. ఆయన చెప్పిన చరిత్రకు రాజముద్ర వంటి గౌరవాన్ని తెచ్చాయి. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అమృతాన్ని పంచే అమ్మలు!
తల్లిప్రేమకు సాటి మరేదీ రాదు. అలాగే తల్లిపాలకు కూడా. తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ పాలు అంటే అమృతమే... ఆ అమృతాన్ని పంచగలిగింది అమ్మలే!! మరి పురిటిలోనే తల్లికి దూరమైన బిడ్డకు? మరో తల్లి పెద్ద మనసుతో తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకూ పాలివ్వడం ఒక్కటే మార్గం. అందుకు ముందుకు వచ్చే వాళ్లెంతమంది? ఆ ప్రశ్నకు సమాధానంగా ‘నేనున్నాను’ అన్నారు లక్ష్మి. అలా ముందుకొచ్చే లక్ష్మిలాంటి ఎంతోమంది నుంచి పాలను సేకరించి, చంటి పాపలకు ఆ అమృతాన్ని అందించేందుకు ఇప్పుడు ఓ ‘అమ్మ పాల బ్యాంకు’ ప్రయత్నం జరుగుతోంది. లక్ష్మి తొమ్మిదవ నెల గర్భిణి. ప్రసవం అయిన తర్వాత తన బిడ్డతోపాటు మరో బిడ్డకు కూడా తన పాలనిచ్చి ఆ బిడ్డకు తల్లిపాల లోటును భర్తీ చేస్తానంటూ ‘అమ్మ పాల బ్యాంకు’కు పాలను దానమిచ్చే తొలి దాత అయ్యారు. తన సంకల్పానికి భగవంతుడు సహకరించి తగినన్ని పాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారామె. అమ్మ పాలను నిల్వ చేయడం, దానమివ్వడమనే ఆలోచన ఇప్పుడు ‘అమ్మ పాల బ్యాంకు’గా హైదరాబాద్లో ఆచరణలోకి వస్తోంది. తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి బలైపోయి చెత్తకుప్పలోకి విసిరివేతకు లోనయిన చంటిబిడ్డలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. వారిని పెంచి పెద్ద చేసి పిల్లల్లేని వారికి దత్తతనిస్తోంది కూడా. అలాంటి పిల్లలు హైదరాబాద్లోని ఒక్క శిశువిహార్లోనే వందల్లో ఉంటున్నారు. సరాసరిన రోజుకు పదహారు మంది చంటిబిడ్డలు కొత్తగా వచ్చి చేరుతూనే ఉన్నారు. కొందరిని పెంపకానికి తీసుకునే వాళ్లు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతూ ఉండగా... ఏడాదిలోపు పిల్లలు దాదాపు 80 మంది వరకు ఉంటున్నారు. వారందరినీ ప్రభుత్వం పోతపాలతో పోషిస్తోంది. వైద్యం అందిస్తోంది. తల్లిపాలు అందకపోతే అంటువ్యాధులు సులభంగా దాడిచేస్తాయి. పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒక బిడ్డ మొదటి పుట్టిన రోజును చూడకనే కన్నుమూస్తోందని, పిల్లలకు తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన భావితరం తయారవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎ.పి బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధారావు అనాథ పిల్లలకు తల్లిపాలను అందించడానికి ‘అమ్మ పాల బ్యాంకు’ను ఏర్పాటు చేశారు. పాలను దానం చేయాలనుకునే తల్లులను గుర్తించడం, పాలను సేకరించడం, నిల్వ చేయడం, ఆ పాలను అవసరమైన పిల్లలకు చేర్చడం ఈ ప్రక్రియకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్కే పరిమితమైన ఈ ప్రయత్నంలో పేరు నమోదు చేసుకున్న తల్లుల దగ్గరకు ‘అమ్మపాల బ్యాంకు’ కార్యకర్తలు రోజుకొకసారి వెళ్లి పాలను సేకరిస్తారు. తమతోపాటు సక్కర్, చల్లదనాన్ని నిలిపి ఉంచే ఫ్లాస్కు తీసుకెళ్తారు. ఆ పాలను స్థానిక లోటస్ హాస్పిటల్లోని ఫ్రీజర్లో ఉంచడానికి హాస్పిటల్ నిర్వాహకులు అంగీకరించారు. ఆ పాలను చంటిబిడ్డలకు చేర్చడం కూడా కార్యకర్తలే చేస్తారు. పాల సేకరణ పనిలో మహిళలే ఉంటారు. మరో బిడ్డకు ప్రాణదానం చేసిన సంతృప్తి! పాల దానం చేయడం ద్వారా మరో బిడ్డకు ప్రాణం పోసిన తల్లిగా సంతృప్తిని పొందవచ్చు. అయితే ‘‘నీ ఉదారత చాటుకోవడం కోసం కన్న బిడ్డను అర్ధాకలితో ఉంచుతావా’’ అని భర్త, అమ్మానాన్నలు, అత్తమామలు ప్రశ్నించడం సహజమే. సంగతిని వివరించి వాళ్లను సమాధానపరచడం చాలా ముఖ్యం. ఈ సందేహాలను నిపుణులు నివృత్తి చేస్తారు. పాలను దానం చేసే తల్లులు క్యాల్షియం లోపం రాకుండా, రక్తహీనతకు లోనుకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు... ఇద్దరు బిడ్డలకు పాలివ్వడం కష్టమేమీ కాదు. తల్లిపాలదానం అనే జ్యోతిని లక్ష్మి ఉదాత్తమైన మనసుతో అందుకున్నారు. ఆమె నుంచి ఈ జ్యోతిని అందుకుంటూ ప్రస్థానాన్ని కొనసాగించడానికి మరెందరో తల్లులు ముందుకు వస్తారు. ఇందుకు నిదర్శనం ప్రారంభోత్సవం రోజునే హైదరాబాద్లోని మదీనాగూడలోని సత్యవేణి మురుగన్ నుంచి వచ్చిన ఫోన్కాలే!. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. తల్లి మనసు... తల్లి లేని బిడ్డకు తల్లి ప్రేమను పంచడానికి ఏ మాత్రం సంశయించదు. తల్లి పాలు లేని బిడ్డను కూడా ఆదరించగలుగుతుంది. అందుకే ప్రపంచంలో అన్నింటికంటే తల్లి గొప్పది, తల్లి మనసు ఇంకా గొప్పది. అచ్చం తల్లిపాలలాగే. - వాకా మంజులారెడ్డి ఫొటో: ఠాకూర్ దేశంలో ఇదే తొలి ప్రయత్నం! దేశంలో ఈ ప్రక్రియ దాదాపు పది హాస్పిటళ్లలో ఉంది. అనారోగ్య కారణాల వల్ల తల్లి లేదా బిడ్డ ఐసియులో ఉన్నప్పుడు తల్లి నేరుగా పాలివ్వడం కుదరదు. అలాంటప్పుడు తల్లి నుంచి సేకరించిన పాలను హాస్పిటల్ వాళ్లే బిడ్డకు టైమ్ ప్రకారం పడతారు. అయితే ఈ పద్ధతిని తల్లికి దూరమైన బిడ్డలకు పట్టే ప్రయత్నం చేయడం మాత్రం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో పురిట్లో తల్లిపోయిన బిడ్డలకు మరో తల్లి విశాల దృక్పథంతో తనబిడ్డతోపాటుగా పాలిచ్చి బతికించేది. అలాంటిదే ఇది కూడా. - అనూరాధారావు, ఎ.పి బాలల హక్కుల సంఘం నిర్వాహకురాలు తల్లులకు ఏ రకంగా మేలు! సెల్ఫ్ కాంట్రాసెప్టివ్... సాధారణంగా పాలిస్తున్నంత కాలం గర్భధారణ జరగదు. బినైన్ కణుతులు... పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా వినియోగించుకోని వారిలో రొమ్ములలో బినైన్ కణుతులు ఏర్పడడాన్ని గమనిస్తుంటాం. ఇవ్వగలిగినంత కాలం బిడ్డకు పాలివ్వడం వల్ల ఈ కణుతులను నివారించవచ్చు. బిడ్డను కోల్పోయిన మహిళ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అలాంటి వారు ఈ సమయాన్ని మరో బిడ్డకు పాలివ్వడానికి కేటాయిస్తే మానసిక సాంత్వన కలుగుతుంది. ఒక బిడ్డ ప్రాణాన్ని నిలుపుతున్నాననే సంతోషం ఉంటుంది. తల్లి పాల గురించి ... - చంటిబిడ్డకు రోజుకు 150 మిల్లీలీటర్ల తల్లిపాలు కావాలి. - ఆరోగ్యవంతమైన తల్లికి రోజుకు 600- 700 మి.లీ పాలు ఉత్పత్తి అవుతాయి. - ఒక బిడ్డ గరిష్ఠంగా 300 మిల్లీలీటర్ల పాలను మాత్రమే తాగుతుంది. - తల్లి నుంచి సేకరించిన పాలను 63 డిగ్రీల ఫారన్హీట్లోపు ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే 90 రోజులు ఉంటాయి. పాశ్చరైజేషన్ చేస్తే ఆరు నెలలు పాడవవు. - ఎందరు తల్లుల పాలనైనా కలిపి ఒకే పాత్రలో నిల్వ చేయవచ్చు. - మొదటిసారి పాలను సేకరించిన తర్వాత ఆ పాలను స్క్రీనింగ్ చేస్తారు. అవకాశం ఉంటే వదులుకోవద్దు! అవసరం నుంచి వచ్చిన ఆలోచన ఇది. పాలు లేని పిల్లలు ఎదురుగా కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవడం చేతకాలేదు. నా భర్త వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత నా బిడ్డకు వచ్చిన నష్టం ఏమీ లేదని అమ్మకు, అత్తగారికి వివరించాను. నేను బాలింతలకు చెప్పేది ఒక్కటే... ‘మరో బిడ్డను కాపాడే అవకాశం ఉంటే దానిని అనవసరమైన భయాలతో వదులుకోవద్దు. ప్రాణం పోయడంలో ఉండే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి’ అని. - లక్ష్మి, అమ్మపాల దానానికి సిద్ధపడిన కాబోయే తల్లి -
మెల్లని పాపాయికి లాలనే ఆలంబన
పిల్లలు అల్లరి చేస్తుంటే... ‘ప్రాణాలు తోడేయకండ్రోయ్’ అని మొత్తుకుంటాం! పిల్లలు అసలే అల్లరి చేయకుండా ఉంటుంటే? అప్పుడూ... ప్రాణాలు తోడేసినట్లే ఉంటుంది! రెండిట్లో ఏది బెటర్? అల్లరి చేయడమే! అల్లరి అంటే చురుకుదనం, చలాకీదనం. అంతేకదా! హరివిల్లంటే రంగురంగులుగా ఉండాలి. పక్షులంటే కిలకిలలాడుతూ ఉండాలి. సెలయేరులంటే గలగలమంటూ ఉండాలి. పూలు, పూలతలు తలలూపుతూ ఉండాలి. పిల్లలంటే... ఇవన్నీ చేస్తూండాలి. కిలకిలమనాలి, కిసుక్కుమనాలి. గలగలలాడాలి, గెంతులేయాలి. కానీ కొంతమంది పిల్లలు ‘స్పెషల్’గా ఉంటారు. ఆ స్పెషాలిటీ పిల్లలది కాదనీ పుట్టుకతోవచ్చిన ఒక అసహజత్వమనీ తెలియగానే తల్లిదండ్రులు హతాశులవుతారు. అలా ఏం కానవసరం లేదని, కౌన్సెలింగ్తో వారిని తక్కిన పిల్లల్లా తీర్చిదిద్దవచ్చనీ భరోసా ఇచ్చేదే... ఈ వారం లాలిపాఠం... మూడు నెలల తన బుజ్జితండ్రికి లాలపోసి తీసుకొచ్చింది శ్రీజ. ఒళ్లు తుడిచి పౌడర్ వేస్తూ బిడ్డను చూసుకుంటూ మురిసిపోతోంది. ఎక్కువ ఏడవకుండా బుద్ధిగా ఉంటున్నాడని, రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నాడని ముచ్చటపడుతోంది. ఒకరోజు పోలియో డ్రాప్స్ వేయించడానికి, రొటీన్ చెకప్ కోసం పీడియాట్రీషియన్ దగ్గరకు తీసుకెళ్లింది. చైల్డ్ రెస్పాన్స్ నార్మల్గానే ఉంటోందా అనే సందేహంతో డాక్టర్ బిడ్డ ఎదురుగా చిటికె వేసి శబ్దం చేశారు, వెనుక వైపుగా పెద్ద శబ్దం చేశారు. బిడ్డ పెద్దగా స్పందించడం లేదని అర్థమైంది. శ్రీజను కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత డాక్టర్ తన సందేహం నిజమేనని నిర్ధారణకు వచ్చారు. ఆ మాటలను బట్టి తన బిడ్డ స్పెషల్ నీడ్స్ కిడ్ అని అర్థం కావడంతో శ్రీజకు భూమి కంపించినట్లయింది. ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఆరోగ్యంగా ఆడుతూ పాడుతూ ఉంటే తన బిడ్డకే ఇలా ఎందుకు? అని కుమిలిపోయింది. అన్నీ ప్రశ్నార్థకాలే ! శ్రీజ కౌన్సెలర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ బిడ్డను పెంచుతోంది. నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు శ్రీజలో ‘బాబుకు చదువెలా?’ అనే మరో ప్రశ్నార్థకం. ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో మెలగ గలిగేలా తీర్చిదిద్దడం ఎలా? అదసలు సాధ్యమేనా? వంటి సందేహాలతో కృశించిపోతోంది. అయితే అలా బెంగపడక్కరలేదు, మానసిక, శారీరక అవకరాలతో పుట్టిన స్పెషల్ కిడ్స్ని సాధారణమైన పిల్లల్లా తీర్చిదిద్దడం సాధ్యమేనంటారు వైద్య నిపుణులు. ఈ కింది సూచనలను పాటిస్తే ఈ పిల్లలు సాధారణ పిల్లల్లాగే సమాజంలో సులువుగా కలిసిపోగలరంటారు. ప్రత్యేకంగా పెంచాలి! ‘స్పెషల్ కిడ్స్ని మెయిన్స్ట్రీమ్లోకి తీసుకురావడం కష్టమైన పనే, కానీ అసాధ్యం మాత్రం కాద’ంటారు హైదరాబాద్లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిర్వహకురాలు శైలజారావు. తమ స్కూల్లో నత్తి, స్లో లెర్నర్, ఇతర సమస్యలతో పుట్టిన పిల్లలకు సాధారణ పిల్లలతో కలిపి పాఠాలు చెప్తున్నట్లు, అలా చదువుకున్న వారిలో నేషనల్ ఓపెన్ స్కూల్ పరీక్ష రాసి టెన్త్ క్లాస్ పాసయినట్లు చెప్పారామె. ‘బాధపడుతూ కూర్చోవడం వల్ల, సమస్య నుంచి పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని స్వీకరించాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి వీలుగా విల్పవర్ని పెంచుకోవాలి. పాఠశాలలు కూడా అన్నిరకాల పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అటెన్షన్ డిజార్టర్తో బాధపడుతున్న పిల్లలకు పాఠాలను తేలిక పదాలతో నేర్పించాలి. అలా చేయగలిగితే స్పెషల్ కిడ్స కూడా సాధారణ పిల్లల్లాగే సమాజంలో కలిసిపోతారు. స్పెషల్ చిల్డ్రన్ని సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దడం అంటే గతంలో అసలు ఊహకందని విషయం. ఇప్పుడు సమాజంలో అవగాహన పెరిగింది. పిల్లలకు, తల్లిదండ్రులకు సపోర్టు లభిస్తోంది. మా స్కూల్లో అంధ విద్యార్థులు చదువు, ఆటపాటల్లో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటే చాలు. స్పెషల్ కిడ్ నుంచి ఎక్ట్స్రార్డినరీ పెర్ఫార్మెన్స్ని ఆశించకూడదు కానీ నార్మల్ కిడ్గా మార్చడం సాధ్యమే’ అన్నారామె. గుర్తించిన వెంటనే..! స్పెషల్ కిడ్ అని గుర్తించిన తర్వాత ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించాలంటారు డాక్టర్ విష్ణుస్వరూప్రెడ్డి. ‘‘స్పెషల్ చైల్డ్ విషయంలోనూ తల్లిదండ్రులు డాక్టర్కు ప్రతి సమస్యనూ వివరించాలి. డాక్టర్ బిడ్డ పెంపకం గురించి తల్లిదండ్రులకు చెప్పిన సూత్రాలను యథాతథంగా పాటించాలి. తొలిదశలో ట్రీట్మెంట్ మొదలైతే మంచి ఫలితాలు ఉంటాయి. నత్తి విషయానికి వస్తే ఆందోళన, ఉద్వేగం ఎక్కువయ్యేకొద్దీ మాట పట్టేయడం కూడా ఎక్కువవుతుంది. ఆందోళనకరమైన పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిదానంగా మాట్లాడితే మాట పట్టేయడం తగ్గుతుంది. ఆవేశంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి, తర్వాత మెల్లగా మాట్లాడితే చెప్పదలుచుకున్న విషయాన్ని సులభంగా చెప్పవచ్చు. ఈ రకంగా తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేయిస్తూ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి’’ అంటారాయన. సహనానికి ప్రతీకలు కావాలి! స్పీచ్ సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఇంట్లో చక్కగా మాట్లాడతారు. కానీ కొత్తవారితో మాట్లాడాలంటే భయపడుతుంటారు. నలుగురిలో ఉత్సాహంగా మాట్లాడబోయి మాట రాక బిక్కముఖం పెడతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులకు ఏమీ పాలుపోక పిల్లల్ని అక్కడే దండిస్తుంటారు. స్పెషల్ కిడ్స తల్లులు పిల్లలతో చాలా సహనంతో వ్యవహరించాలి. ఇది చాలా తప్పు. పిల్లలు ధైర్యం కోల్పోతుంటే వారికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ఉండాలి. ‘ఇది చాలా చిన్న సమస్య, డాక్టర్ చెప్పినట్లు చేస్తుంటే తగ్గిపోతుంది’ అని నచ్చచెప్పాలి. డాక్టర్ కౌన్సెలింగ్ కంటే తల్లి కౌన్సెలింగ్ బాగా పనిచేస్తుంది. - వాకా మంజులారెడ్డి స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లిదండ్రుల కోసం... కుటుంబ చరిత్రలో ఎవరికైనా సరే, నత్తి, మూగ, అంధత్వం, చెవిటితనం వంటి శారీరక లోపాలు లేదా ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక, శారీరక పెరుగుదలను ప్రత్యేక శ్రద్ధతో గమనించాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉన్నట్లు గమనిస్తే, ఆ పరిస్థితిని సత్వరంగా స్వీకరించి, మానసికంగా దృఢంగా మారాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే విల్పవర్ని మనం పెంచుకుని, పిల్లల్లోనూ పెంచాలి. మనసులో ఏమాత్రం అసహనం, చిరాకు కలిగినా దానిని పిల్లల మీద ప్రదర్శించకూడదు. సంయమనం పాటిస్తూ ఇలాంటి పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పెంచితే స్పెషల్ కిడ్స్ కూడా అన్ని రంగాలలో బాగానే రాణిస్తారు. -
ఇంకా లాల పోసినట్టే! ఇంకా జోల పాడినట్టే!
తల్లిదండ్రుల ప్రేమను ఎవరూ క్వొశ్చన్ చేయలేరు. కానీ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు... ఎవరో కాదు, పిల్లలే క్వొశ్చన్ చేస్తారు! ‘ఏంటి మమ్మీ... ప్రతిదానికీ...’ అనే మాట రావచ్చు. ‘ఐ యామ్ నాట్ ఎ కిడ్ డాడ్...’ అనే విసుగు కూడా. అప్పుడు తల్లీ, తండ్రీ షాక్ అవుతారు. ఆలోచనలో పడిపోతారు. జాగ్రత్తలు చెప్పడం తప్పా? అన్నీ అమర్చిపెట్టడం తప్పా? తప్పు కాదు కానీ... ఇంకా లాల పోసినట్టే, ఇంకా జోలపాడినట్టే ప్రతిదీ వెంటబడి వెంటబడి చేస్తుంటే, చెప్తుంటే... వయసొస్తున్న పిల్లలు అమ్మ ఒడిలో ఇముడుతారా? నాన్న వేలు పట్టుకుని నడిచేందుకు ఇష్టపడతారా? ప్రేమంటే పట్టు మాత్రమే కాదు, విడుపు కూడానని బాధ్యత అంటే... బాధ్యతలను నేర్పడం కూడానని పేరెంట్స్కి చెప్పడమే... ఈవారం ‘లాలిపాఠం’. ఈ తరం కుటుంబాలో పెరిగిన జీవన ప్రమాణస్థాయులు కావచ్చు, అధునాతనమైన సౌకర్యాల వల్ల కావచ్చు... పిల్లల విషయంలో తల్లిదండ్రుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. పిల్లలను భద్రంగా చూసుకోవాలనుకోవడంతోపాటు ప్రతిదీ తామే నేర్పించాలనే తపన పెరుగుతోంది. పిల్లల బాల్యమంతా తల్లిదండ్రులే అవుతున్నారు. అన్నిపనులూ తల్లిదండ్రులే చేసిపెడుతుండడంతో పిల్లల్లో సోమరితనం పెరుగుతోంది. ఏదీసొంతంగా చేసుకోవడం చేతకాకపోవడంతో వారిలో అభద్రత భావం పెరుగుతోంది. ‘పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఎక్స్పోజర్ పెరగాలి, వాళ్లు ఏదైనా చేయాలని సరదా పడితే ఆ పని హానికరం కానంతవరకు వాళ్లను నియంత్రించాల్సిన అవసరం లేదు. నేర్చుకునే అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సహించాలి’ అంటున్నారు సైకియాట్రిస్టులు. తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టింగ్గా ఉంటే పిల్లల్లో తాము పెద్దవుతున్నామా లేదా అనే అయోమయం, నేనింత పెద్దయ్యాను కదా మరి! ఈ చిన్న పనిని కూడా సరిగా చేయలేననే సందేహమా నా మీద?... ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. ఇదే పరిస్థితి మితిమీరితే పిల్లల్లో ‘ఏమో నాకు చేతకాదేమో’ అని సర్ది చెప్పుకోవడం మొదలవుతుంది. అది ఇంకా ప్రమాదకరం. సొంతంగా తెలుసుకోనివ్వాలి! పిల్లలు ఎదిగే క్రమంలో వచ్చే మార్పులను తమకు తాముగా గుర్తించగలరు, వారికి చైల్డ్హుడ్, టీనేజ్, ఎర్లీ అడల్ట్హుడ్ దశల్ని గుర్తించే అవకాశం ఇవ్వాలి. ఆ దశలో సాధారణంగా ఉండే భావోద్రేకాల మీద అవగాహన కలిగించుకునే అవకాశం ఇవ్వాలి. దేహంలో వచ్చే మార్పులు అంటే గొంతుమారడం, మీసాలు రావడం, అమ్మాయిల్లో దేహాకృతిలో వచ్చే మార్పులను తమకు తాముగా గ్రహిస్తారు. ఇదే సమయంలో సమాజం వారిని చూసే ధోరణి కూడా మారుతుంది. దానిని పిల్లలు ఎంజాయ్ చేస్తారు కూడ. ఆ దశలో ఎలా ఉండాలో అవగాహన పెంచుకుంటారు. హితబోధ ఎక్కువైతే! తల్లిదండ్రుల్లో ఒక రకం తత్వం ఎలా ఉంటుందంటే... ప్రమాదాన్ని భయంకరంగా ఊహించుకుని ముందు జాగ్రత్తగా పిల్లలకు ‘అలా చేయాలి ఇలా చేయకూడదు’ అని పూసగుచ్చినట్లు చెబుతుంటారు. ఘోరమైన ప్రమాదం ఏదో జరుగుతుందేమోననే భయంతో పిల్లలు ఆ జాగ్రత్తలను వింటారు. కానీ అంతా సాఫీగా జరిగిన తర్వాత ‘అబ్బా! అమ్మానాన్న అంతగా చెప్పారు, ఏమీ కాలేదు కదా వాళ్లది ఒట్టి చాదస్తం’ అనుకుంటారు. ఇలాంటి హితబోధ అవసరమే, కానీ ప్రతిసారీ చేస్తోంటే పిల్లల్లో విసుగు మొదలవుతుంది. క్రమంగా తలకెక్కించుకోవడం మానేస్తారు. ఈ తేడా పెద్దవాళ్లకూ అర్థమవుతుంది. అప్పుడు మరింత ఆందోళనకు లోనవుతూ ‘పిల్లలు తమ మాటలను పెడచెవిన పెడుతున్నారనే అభిప్రాయాన్ని పెంచుకుంటారు’. నిజానికి ఇది పిల్లల్లో వయసురీత్యా వచ్చే సహజమైన మార్పే. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలా మారడానికి వారి స్నేహితులే కారణం అని నెపాన్ని మోపడానికి కూడా వెనుకాడరు. పైగా ‘ఫలానా ఫ్రెండ్ కారణంగానే వీడు ఇలా తయారవుతున్నాడు’ అనుకుంటూ ఆ ఫ్రెండ్ పేరు చెప్పకుండా ఆ లక్షణాలను, ఆ ఫ్రెండ్ ప్రవర్తనను తప్పుబడుతూ కౌన్సెలింగ్ ఇస్తారు. ఇక్కడ తల్లిదండ్రులది ఊహాజనితమైన కారణం, పిల్లలు చూసేది వాస్తవం. వాళ్లు చూసే వాస్తవాన్ని కాదని, ఊహాజనితమైన భయాలను చెప్తూ పోతే పిల్లలు సింపుల్గా ‘అమ్మానాన్నల పోరు ఎక్కువైంది’ అనేసుకుంటారు. వాళ్ల మెదడు కూడా పేరెంట్స్ చెప్పే విషయాలకు ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు అనే కండిషన్లోకి వెళ్తుంది. పియర్ ప్రెషర్... టీనేజ్ పిల్లల్లో చాలా సహజంగా కనిపించే లక్షణం పియర్ ప్రెషర్ (సాటి పిల్లలతో పోల్చుకోవడం వల్ల కలిగే ఒత్తిడి). దీని ఫలితాలు ఇలా... అని స్పష్టంగా చెప్పలేం. కొందరు బాగా చదివే క్లాస్మేట్స్తో పోల్చుకుని పోటీపడుతుంటారు. ఇక పియర్ ప్రెషర్ చూపించే ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందంటే... క్లాస్లో ఒకరు వాడుతున్న స్కూల్ బ్యాగ్ని ఫ్రెండ్స్ అంతా మెచ్చుకుంటే సహజంగానే అలాంటి ప్రశంసలు తనక్కూడా కావాలనుకుంటూ... ఇంటికి వచ్చి ‘నా స్కూల్బ్యాగ్ పాడయింది కొత్తది కావాల’ని డిమాండ్ చేస్తారు, ఫలానా మోడల్దే అయి ఉండాలని పట్టుపడతారు. అది తమ సొంతం చేసుకునేంతవరకు స్థిమితంగా ఉండలేరు. పియర్ ప్రెషర్ని సరైన క్రమంలోకి మార్చగలిగితే అది మేలు చేసే లక్షణమే. సాధారణంగా 90 శాతం పిల్లలు... తల్లిదండ్రుల మాటను కాదనరు. పిల్లలకు బోర్ కొట్టేలా చెప్పనంతవరకు అమ్మానాన్నల మాటలను పిల్లలు గౌరవిస్తూనే ఉంటారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఏం చేయకూడదు! చిన్న వయసులో జి.కె నేర్పించడం వల్ల పిల్లల మెదడు చాలా ఒత్తిడికి లోనవుతుంది. ప్రతిదీ తాము చెప్పినట్లు చేయాలని నియంత్రించడం వల్ల పిల్లలు మైనపు ముద్దల్లా, తోలుబొమ్మల్లా మారుతారు లేదా వారిలో తిరుగుబాటు ధోరణి తలెత్తుతుంది. టీవీల్లో చూసి, పేపర్లలో చదివిన ప్రమాదాలు తమ పిల్లలకే సంభవిస్తాయేమోనే ఆందోళనతో తమ కళ్లముందు నుంచి ఎటూ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తూంటారు. పైగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అనుకుంటారు. అది జాగ్రత్తగా పెంచడం కాదు. భద్రత అనే వలయాన్ని గీసి అందులో బంధించడమే అవుతుంది. ఎలా చెప్పాలో తెలియక..! ఇటీవల మా దగ్గరకు వచ్చే చాలామంది పేరెంట్స్ని గమనిస్తే... వాళ్లకు పిల్లలకు ఎలా చెప్పాలో తెలియడం లేదనిపిస్తుంది. చిన్నదానికీ, పెద్దదానికీ విపరీతమైన భద్రత కోరుకుంటారు. కుర్చీలో కూర్చున్న పిల్లవాడు కిందకు దిగాలనుకుంటాడు. వాడు కదలగానే అమ్మ లేదా నాన్న ‘బాబూ! పడిపోతావ్! దిగకు అలాగే కూర్చో’ అంటారు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రమాద హెచ్చరిక మాత్రమే చేస్తున్నారు. కానీ, అధిగమించడానికి అవసరమైన నైపుణ్యా లను నేర్పడం లేదన్నమాట. - డా॥కల్యాణ్చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఆత్మరక్షణకే అయినా...
సుమారు రెండేళ్ల క్రితం... ఆదిలాబాద్ జిల్లాలో గంగాభవాని అనే టీచర్ మీద క్లాస్రూమ్లోనే దాడి జరిగింది. ఆ దాడిలో ఆమె ప్రాణాలు పోయాయి. దాడికి పాల్పడింది ఒక ప్రేమోన్మాది. గ్రామస్థులు ఆ ఉన్మాదిని కొట్టి చంపేశారు. ఇది ధర్మాగ్రహమే అయినా వారి మీద కేసు నమోదైంది. అలాగే మహబూబ్నగర్ చిన్న చింతకుంటలో బహిర్భూమికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేశాడు సీఐ. గ్రామస్థులు ఆ సీఐని కొట్టి చంపేశారు. ఖమ్మంలో మరో మహిళ తన మీద అత్యాచారం జరగకుండా అడ్డుకోగలిగింది. ఆ తర్వాత ఊరందరి సహకారంతో ఆగంతకుడి మీద ఎదురుదాడి చేసింది. ఈ విధమైన సందర్భాలలో ఆత్మరక్షణలో భాగంగా హత్య, తిరుగుబాటులో భాగంగా హత్య, ప్రతిఘటనలో భాగంగా హతమార్చడం... ఈ మూడు కోణాల్లో కేసును పరిశీలించి తీర్పు ఇస్తుంది న్యాయస్థానం. ఇలాంటి కేసుల విషయంలో ఆ మహిళలకు న్యాయం జరిగే వరకు, కేసును పక్కదారి పట్టనివ్వకుండా సంధ్య వంటి సామాజిక ఉద్యమకారులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా మహిళల మీద లైంగికదాడులు ఆగకపోగా పెరిగిపోతున్నాయి. ఈ దాడులను అడ్డుకోవాలంటే ఆత్మరక్షణ ఒక్కటే మార్గం. అయితే మహిళ ఆత్మరక్షణలో భాగంగా చేసిన దాడిలో అత్యాచారయత్నానికి పాల్పడినవాడి ప్రాణాలు పోతే!.. ఆ మహిళ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోవలసిందేనా? ఆ మహిళకు శిక్ష తప్పదా? ఈ సందేహాలకు చాలా సందర్భాలలో అవుననే సమాధానం అంటారు న్యాయవాది నిశ్చలసిద్ధారెడ్డి. స్త్రీ తనను తాను రక్షించుకునే క్రమంలో హత్య జరిగిన సందర్భంలో... రేప్ జరిగిన తర్వాత హత్య జరిగితే ఐపిసి 376, 302 అనే రెండు సెక్షన్ల కింద బాధితురాలిపైనే కేసు నమోదవుతుంది. దీనితోపాటు కేసులో తీర్పు రావడానికి కనీసం రెండు-మూడేళ్లు పడుతుంటుంది. ఇలాంటి కేసుల్లో నిర్భయ కేసులో వచ్చినట్లు త్వరితగతిన విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పడం చాలా అవసరం. అంతకంటే ముఖ్యంగా తాను చేసిన హత్య ఆత్మరక్షణ కోసమే అని బాధితురాలు నిరూపించుకోవడం చాలా అవసరం. కోర్టులో ప్రతివాది తరఫు న్యాయవాదుల (పురుష న్యాయవాదులు) ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా, మహిళ అవమానపడే విధంగా ఉంటాయి. వీటికి భయపడి చాలామంది కేసును మధ్యలోనే ఉపసంహరించుకుంటుంటారు. ఇలాంటి కేసులను మహిళా న్యాయవాదులే విచారించాలనే చట్టం ఇంతవరకు లేదు. అలాంటి చట్టం వస్తే బావుంటుంది. అసలు అత్యాచారం, హత్యకేసును నమోదు చేయడంలోనే లోపాలు జరిగిపోతుంటాయి. కేసును నీరుకార్చే విధంగా నమోదయితే ఆ కేసులో సదరు మహిళ చేసిన హత్య ఆత్మరక్షణకోసమే అని నిరూపించడం కష్టం. హత్యకు గురైన వ్యక్తితో తనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని కూడా నిరూపించుకోవాలి. ఇలాంటి కేసు నమోదు ప్రక్రియ(ఎఫ్ఐఆర్) మహిళా పోలీసుల చేతిలో జరగాలి. పోలీసు ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసే నిష్పక్షపాతి అయి ఉండాలి. ఇక శిక్ష విషయానికి వస్తే... ఇలాంటి కేసుల్లో మహిళకు విధించే శిక్షలు మరీ అంత కఠినంగా ఉండవు. అయితే తనకు చట్టాన్ని చేతిలోకి తీసుకునే ఉద్దేశం లేదని న్యాయస్థానానికి విధేయతతో తెలియపరచడం చాలా అవసరం. ఇంకా ముఖ్యంగా తనను కాపాడుకోవడానికి చూపించిన తెగువనే చివరి వరకు కొనసాగించాలి. తీర్పు వచ్చే వరకు అదొక యజ్ఞంలా భావించి న్యాయంకోసం పోరాడాలి. - వాకా మంజులారెడ్డి