Water resources
-
జాగ్రత్తలు తీసుకోకుంటే తాగునీటి ఎద్దడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు ముదరక ముందే పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొన్ని రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు మార్చి, ఏప్రిల్ చివరి వరకే తాగునీటికి సరిపోతాయని పేర్కొన్నాయి. ప్రధానంగా గోదావరి బేసిన్ కింద ఉన్న మంచినీటిని సరఫరా చేయడానికి ఉన్న నీటివనరుల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని రిజర్వాయర్లలో కనీస నీటిమట్టం నుంచి తాగునీరు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా బేసిన్ నుంచి 23.44 టీఎంసీలు, గోదావరి బేసిన్ కింద 35.28 టీఎంసీలను కలిపి మొత్తంగా 58.72 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు మిషన్ భగిరథ పథకం కింద ఈ నీటి కేటాయింపులు చేసింది. తాగునీటి అవసరాలపై అధికారుల లెక్కలు ఇలా.. » ప్రస్తుతం జూరాలకు ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో సమంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి చివరి నాటికి ఇన్ఫ్లోలు ఆగిపోతాయని, ప్రస్తుతం ఉన్న అవుట్ఫ్లో కొనసాగినా ఏప్రిల్ వరకే నీరు అందించడానికి వీలవుతుందని... అప్పుడు సంగంబండ నుంచి నీటి సరఫరా చేస్తే తప్ప తాగునీరు సరఫరా చేయని పరిస్థితులు తలెత్తుతాయని స్పష్టం చేశారు. » ఎల్లంపల్లిలో రోజుకు 0.20 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. అలా చేస్తే మార్చి నెలాఖరు వరకే నీరు సరిపోతుంది. అందుకని ఇతర అవసరాలకు ఎల్లంపల్లి నీటి వినియోగాన్ని ఆపేయాలి. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్ వరకు 7 టీఎంసీల నీరు నిల్వలు ఉండేలా చూడాలి. » మిడ్మానేరు నుంచి రోజుకు 0.20 టీఎంసీల నీరు వినియోగిస్తున్నారు. ఇలా కొనసాగిస్తే ఏప్రిల్ వరకు మాత్రమే నీరు రిజర్వాయర్లో ఉంటాయి. ఆ తరువాత ఇక్కట్లు తలెత్తుతాయి. మిడ్మానేరు నీరు కలుíÙతం కాకుండా ఉండాలంటే కనీసం ఆరు టీఎంసీల నిల్వ ఉంచాలి. ఇతర అవసరాలకు వినియోగాన్ని తగ్గించాలి. » లోయర్ మానేరు నుంచి రోజుకు 0.13 టీఎంసీలు నీరు వాడుతున్నారు. అలా వాడితే ఏప్రిల్ వరకే నీరు అందుబాటులో ఉంటుంది. అందుకని ఇతర వినియోగాన్ని తగ్గించాలి. » రామన్పాడు, వనపర్తి నుంచి 46 హ్యాబిటేషన్లు, రెండు మునిసిపాలిటీలకు ఏప్రిల్ చివరి వరకు నీటి సరఫరా చేయాలంటే 0.20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి. » పాలేరు–ఖమ్మం రిజర్వాయర్లోకి ఏప్రిల్ నెలాఖరు వరకు 1.90 టీఎంసీ నీటి నిల్వ ఇన్ఫ్లో కొనసాగించి అవుట్ఫ్లో నిలిపివేయాలి. » నల్లగొండ జిల్లాలోని ఏకేబీఆర్ రిజర్వాయర్ నుంచి 999 ఆవాసాలు, 5 మునిసిలిటీలకు తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీరు కేవలం 22 రోజులకు మాత్రమే సరిపోతుంది. దీనికి ఎన్ఎస్పీ నుంచి నీటి సరఫరా చేయాలి. అలాగే పెండ్లిపాకల నుంచి 67 హ్యాబిటేషన్లకు నీటి సరఫరా 38 రోజులకు సరిపడా మాత్రమే ఉంది. దీనికి కూడా ఎన్ఎస్పీ నుంచి నీటి సరఫరా చేయాలి. » ఎస్ఆర్ఎస్పీ నిజామాబాద్ నుంచి రోజుకు 0.46 టీఎంసీల నీరు అన్ని అవసరాలకు వాడుతున్నారు. మిగిలిన అవసరాలకు నీటిని తగ్గించాలి. ఏప్రిల్ చివరి నాటికి 6 టీఎంసీలు నిల్వ ఉండేలా చూడాలి. -
అంబేడ్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు. అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. -
నీటి వనరుల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు?
సాక్షి, హైదరాబాద్: నీటి వనరుల పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలు, వాటి పరిరక్షణకు ఏం చేస్తున్నారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం సుమోటో పిల్గా విచారణ చేపట్టేందుకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
అంతరించిపోయే దశలో నీటి వనరులు
సాక్షి, హైదరాబాద్: మహా నగరం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం నీటివనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని అందులో వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం.. సుమోటో పిల్గా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు ‘అక్రమంగా నాలాలను ఆక్రమించి విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. చెరువులు, కుంటలు సహా నీటివనరుల ఆక్రమణను ఇలానే వదిలేస్తే భవిష్యత్లో తాగునీటికీ కటకట ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చెరువులు, కుంటలనూ వదలని అక్రమార్కులు వాటిలోకి నీరు చేరకుండా పరీవాహక ప్రాంతాలనూ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలాప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. సంప్రదాయ నీటివనరుల ఆక్రమణను ఇలా వదిలేస్తూ పోతే చెరువులు, నీటివనరులు, నాలాలు లేని నగరంగా హైదరాబాద్ త్వరలోనే మారుతుంది. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఆక్రమణలు, భారీ విల్లాల నిర్మాణాల కారణంగా హైదరాబాద్లోని నీటివనరులు అంతరించిపోయే పరిస్థితి. ఇది పర్యావరణంలో తీవ్ర అసమతుల్యతకు దారితీస్తోంది. భారీ వర్షాలు వస్తే నీరు సాఫీగా పోయే మార్గాలు లేక ఒత్తిడి పెరిగి వరదలు జనావాసాలను ముంచెత్తుతాయి. ఆస్తులకే కాకుండా ప్రజల జీవితాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం లేకపోలేదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ప్రజా జీవనం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జనాభా నిష్పత్తికి తగ్గట్టు చెట్లు కూడా లేక స్వచ్ఛమైన గాలి అందడం లేదు. పర్యావరణం దెబ్బతిని ఎల్నినో, లానినో లాంటివి సంభవిస్తున్నాయి. చెరువులు, నీటివనరులు, నాలాల పరిస్థితిపై రెడ్ అలర్ట్ ప్రకటించాలి. వాటిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలి. పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన పలు శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలి’అని జస్టిస్ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్తోపాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, జిన్నారం, పటాన్చెరు, ఆర్సీ పురం, కంది, సంగారెడ్డి, హత్పూర మండలాల్లో 90కి పైగా చెరువుల ఆక్రమణను ఆయన సీజే దృష్టికి తెచ్చారు. ఈ పిల్పై నేడు (గురువారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
నాలుగు జాతీయ జల అవార్డులను ఒడిసిపట్టిన ఆంధ్రప్రదేశ్...ఇంకా ఇతర అప్డేట్స్
నాలుగు జాతీయ జల అవార్డులను ఒడిసిపట్టిన ఆంధ్రప్రదేశ్...ఇంకా ఇతర అప్డేట్స్
-
జలవనరుల నిర్వహణలో ఉత్తమ మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
-
‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!
జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. ► యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది. ► యురేనస్పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్ స్పేస్క్రాఫ్ట్లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్ మోడల్ను ఉపయోగించారు. ► యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. ► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. ► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. ► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది. ► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. ► యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు. ► యురేనస్ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో యురేనస్ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జలపథంలో... తొలి పదం
దేశచరిత్రలోనే ఇది తొట్టతొలి ప్రయత్నం. మనిషికి ప్రాణావసరమైన జల వనరులు ఎక్కడెక్కడ, ఎంతెంత, ఎలా ఉన్నాయని లెక్కలు తేల్చిన ఘట్టం. మానవ తప్పిదాల వల్ల క్షీణిస్తున్న నీటి వసతులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మరోసారి గుర్తు చేసిన జలగణన యజ్ఞం. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన భారత జలవనరుల తొలి గణన అనేక విధాల కీలకమైనది అందుకే. దేశంలో అటు ప్రకృతి సహజమైన, ఇటు మానవ కల్పితమైన చెరువులు, సరస్సులు, నీటి కుంటల సమగ్ర సమాచారాన్ని ఈ లెక్కలు తొలిసారిగా ముందుకు తెచ్చాయి. దేశంలో ఈ జల వనరులు ఏ మేరకు ఆక్రమణకు గురైనదీ తేల్చాయి. సమస్త జీవరాశి మనుగడ కొనసాగాలంటే... ప్రతి నీటి చుక్కా కీలక సమకాలీన సందర్భంలో కేంద్రశాఖ నిర్వహించిన ఈ జలవనరుల గణన ఆహ్వానించదగ్గ యత్నం. ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీటిని అందిస్తామని పాలకులు పదే పదే సంకల్పం చెప్పుకుంటున్న వేళ ఈ నీటి వసతుల సమగ్ర సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులు, రిజర్వా యర్లు, సరస్సులు – ఇలా జలవనరులు వివిధ రకాలు. కాగా, వాగులు, నీటి చెలమలు, గృహ సము దాయాలు – ఇతర ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీళ్ళు, ఏదైనా నది – వాగుల నుంచి దారి మళ్ళించడం ద్వారా నిల్వచేసిన నీళ్ళు, మంచు కరగడంతో ఏర్పడ్డ నీటి వసతి... ఇలాంటివన్నీ కూడా నీటి వనరులేనని ఈ తొలి జలగణన నివేదిక నిర్వచించింది. వ్యవసాయం, చేపల పెంపకం, ఆధ్యాత్మికత – ఇలా రకరకాల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ చేసినవాటిని జాబితాకు ఎక్కించింది. 2018– 19లో చేసిన ఈ గణన దేశం మొత్తం మీద 24 లక్షలకు పైగా జలవనరులు ఉన్నాయని తేల్చింది. వీటిలో 97.1 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 2.9 శాతమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. నీటి వస తుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న భారీ అంతరాలను ఈ జల నివేదిక ఎత్తిచూపింది. ఈ లెక్కల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 7.47 లక్షల జలవనరులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానం దక్కించుకోగా, దేశంలోనే అత్యధిక జనాభాకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ కేవలం 2.5 లక్షల నీటివనరులతో రెండో స్థానంలో నిలిచింది. బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఏకంగా 3.55 లక్షల నీటి వనరులతో దేశంలోనే ముందుంది. అలాగే, దేశంలోని నీటి వనరుల్లో దాదాపు 63 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నెలకొన్నాయి. బెంగాల్లో నీటి మడుగులు, రిజర్వాయర్లు, ఆంధ్రప్రదేశ్లో చెరువులు, తమిళనాట సరస్సులు ఎక్కువని ఈ నివేదిక తేల్చింది. అదే సమయంలో దాదాపు 1.6 శాతం మేర, అంటే 38 వేలకు పైగా వనరులు కబ్జాకు గురయ్యాయట. ఈ కబ్దాలో 40 శాతం వాటా యూపీదే అన్నది నివేదిక సారాంశం. నిజానికి, 1986 నుంచి అయిదేళ్ళకోసారి కేవలం చిన్న నీటిపారుదల వసతుల లెక్కలను కేంద్రం చేపడుతూ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ సంస్థల జనాభా లెక్కల నుంచి సేకరించిన డేటాను సంకలనం చేస్తూ వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఒకప్పుడు నీటి వసతులను కేవలం వ్యవసాయ, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే చూస్తూ వచ్చాయి. ఆ దృక్కోణం గత రెండు దశాబ్దాల్లో మారింది. మానవ, పర్యావరణ సంక్షేమానికి జలవనరుల ప్రాధాన్యాన్ని గ్రహించి, పాత తప్పును సరిదిద్దుకొనే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. 2005లోనే కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జలవనరుల మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ పథకం’ చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల లాంటి సాంప్రదాయిక నీటివసతులకు మళ్ళీ ఊపిరిపోసే పని చేపట్టింది. అయితే, సమగ్ర సమాచార లేమి వల్ల ఈ పథకాల లక్ష్యాలు ఏ మేరకు సిద్ధించాయో చెప్పలేని పరిస్థితి. తాజా జలగణన ముఖ్యత్వం సంపాదించుకున్నది అక్కడే. ఆఖరుసారి 2013–14లో చేసిన చిన్న నీటిపారుదల వసతుల సర్వేతో పోలిస్తే, తాజా గణనలో నీటి వసతుల సంఖ్య 5 రెట్లు పెరగడం విశేషం. పట్టణప్రాంత చెరువులు, కుంటల వివరాలపై పౌరసంస్థలు, విద్యాకేంద్రాలే గళమెత్తేవి. వాటి క్రియాశీలత వల్లే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో చెరువులు కనుమరుగవుతున్న తీరు కొంతైనా జనం దృష్టికి వచ్చింది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే జలగణనతో రంగంలోకి వచ్చింది గనక పరిస్థితులు మరింత మెరుగవుతాయని చిన్న ఆశ. గమనిస్తే, ఒకప్పుడు పుష్కలంగా నీళ్ళున్న భారతావని ఇవాళ అధిక జనాభా, పట్టణీకరణతో నీటి కొరత దిశగా జారిపోతోంది. దీనికి తక్షణం పగ్గం వేయాలి. ప్రపంచంలో 18 శాతం జనాభాకు నెలవైన మన దేశంలో ఉన్న నీటి వనరులు 4 శాతమే. అవసరాలు ఎక్కువ, అందుబాటులో ఉన్న నీరు తక్కువ గనక నీటి కోసం ఒత్తిడీ అధికమే. దానికి తోడు పర్యావరణ మార్పుల ప్రభావం నీటి వసతులు, వాటి నాణ్యత, నిర్వహణ పైన గణనీయంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో జనగణన లాగానే క్రమం తప్పకుండా జల వనరుల గణన చేయడం అవసరం. పదేళ్ళకోసారి చేసే జనాభా లెక్కల లాగా కాక, వీలైనంత తరచుగా ఈ నీటి లెక్కలు తీయాలి. ప్రతి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికీ, నీటికీ లంకె ఉంది గనక దీంతో నీటి నిర్వహణను మెరుగుపరుచుకొనే వీలు చిక్కుతుంది. అలాగే పట్టణ నిర్మాణం, విస్తరణల్లో పాలకులు సరైన నిర్ణయాలు చేయడానికీ నీటి వసతుల వివరాలు దోహదపడతాయి. స్థానిక సంస్థలను, పౌరసమాజ బృందాలను కూడా ఈ జలగణనలో భాగస్థుల్ని చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి. ఆ దిశగా ఈ నివేదిక తొలి అడుగు. మేలైన ముందడుగు. -
చెరువుల్లో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1,13,425 చెరువులుంటే.. అందులో 1,03,952 చెరువులు వినియోగంలో ఉన్నాయి. అత్యధిక కుంటలు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ్ బెంగాల్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఊటకుంటలు, చెక్డ్యామ్లు వంటి జలసంరక్షణ నిర్మాణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే, అత్యధిక రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. అత్యధిక జలసంరక్షణ నిర్మాణాలున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. చిన్న నీటివనరుల కింద దేశంలో 14,75,29,626.21 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇందులో అత్యధిక ఆయకట్టు ఉన్న రాష్ట్రాల్లో 1,19,95,473 హెక్టార్ల ఆయకట్టుతో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో రాజస్థాన్(54,28,765.19 హెక్టార్లు), మూడో స్థానంలో తెలంగాణ (49,71,121.4 హెక్టార్లు) నిలవగా.. 13,37,841 హెక్టార్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలో జలవనరుల మొదటి గణన, చిన్న నీటివనరుల ఆరో గణనను కలిపి జలవనరుల గణన పేరుతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహించింది. వాటి ఫలితాలను కేంద్ర జల్శక్తి శాఖ ఇటీవల విడుదల చేసింది. అందులోని ప్రధానాంశాలివీ.. రాష్ట్రంలో 1,90,777 జలవనరులు.. ► దేశంలో 24,24,540 జలవనరులు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 23,55,055 (97.1 శాతం) ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 69,485 (2.9 శాతం) ఉన్నాయి. ఇందులో 14,42,993 (59.5 శాతం) కుంటలు, 3,81,805 చెరువులు (15.7 శాతం), రిజర్వాయర్లు 2,92,280 (12.1 శాతం), ఊటకుంటలు, చెక్ డ్యామ్లు 2,26,217 (9.3 శాతం), సరస్సులు 22,361 (0.9 శాతం), 58,885 ఇతరాలు (2.5 శాతం) ఉన్నాయి. ► ఈ జలవనరులలో మానవ నిర్మితమైనవి 18,90,463 (78 శాతం). సహజసిద్ధంగా ఏర్పడినవి 5,34,077 (22 శాతం). ► 20,30,400 జలవనరులు (83.7 శాతం) వినియోగంలో ఉండగా.. 3,94,500 జలవనరులు (16.3 శాతం) ఎండిపోయాయి. ► 7,47,480 (30.8 శాతం) జలవనరులతో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో నిలిచింది. 2,45,087 (10.1 శాతం) జలవనరులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 1,90,777 (7.9 శాతం) జలవనరులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. 1,81,837 (7.5 శాతం) జలవనరులతో నాలుగో స్థానంలో ఒడిశా, 1,72,492 (7.1 శాతం) జలవనరులతో ఐదో స్థానంలో అస్సోం నిలిచాయి. ► జలవనరులను అత్యధికంగా చేపల పెంపకం, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఉపయోగంలో 1,49,279 జలవనరులు.. ► ఆంధ్రప్రదేశ్లో 14,132 కుంటలు.. 1,13,425 చెరువులు, 62 సరస్సులు, 703 రిజర్వాయర్లు, 57,492 ఊటకుంటలు, చెక్ డ్యామ్లు, 4,963 ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో కుంటలు 8,475, చెరువులు 1,03,952, సరస్సులు 60, రిజర్వాయర్లు 667, ఊటకుంటలు, చెక్డ్యామ్లు 32,011, ఇతరాలు 4,114 వెరసి మొత్తం 1,49,279 ఉపయోగంలో ఉన్నాయి. ►రాష్ట్రంలో 37,257 జలవనరులను సాగునీటి కోసం ఉపయోగించుకుంటుండగా.. 680 వనరులు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగమవుతున్నాయి. చేపల పెంపకం కోసం అత్యధికంగా 69,510 జలవనరులను వినియోగించుకుంటుండగా. తాగునీరు, గృహావసరాల కోసం 1,945 వనరులను వాడుకుంటున్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు 38,460 వనరులు దోహదపడుతున్నాయి. -
తెలంగాణలో 64,056 జల వనరులు
తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. 17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు. – సాక్షి, న్యూఢిల్లీ నిండిన స్థితిలో 43,695 జల వనరులు రాష్ట్రంలో 10,170 సహజసిద్ధమైన, 53,886 మానవ నిర్మిత జల వనరులు ఉన్నాయి. సహజ జల వనరుల్లో 96.2% (9,781) గ్రామీణ ప్రాంతాల్లో, 3.8% (389) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ నిర్మిత జల వనరుల్లో 98.9% (53,283) పల్లెల్లో, 1.1% (603) పట్టణాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 64,056 జల వనరుల్లో 43,695 వనరులు ‘నిండిన నిల్వ సామర్థ్యం’/ ’నిండిన స్థితి’కలిగి ఉన్నాయి. గత ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రమాణాల ఆధారంగా ఈ 43,695 వనరుల్లో 20.3% (8,862) ప్రతి ఏటా నిండుతున్నట్లు గుర్తించారు. 41.9% (18,301) సాధారణంగా నిండుతుండగా, 29.8% (13,033) చాలా అరుదుగా నిండుతున్నాయని, 8.0% (3,499) ఎప్పుడూ నిండట్లేదని నివేదికలో వెల్లడించారు. మొత్తమ్మీద 38,540 వనరులు జిల్లా నీటిపారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికలో ఉన్నాయి. వీటిలో 45.9% (17,681) చెరువులు కాగా, 54.1% (20,859) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, నీటి సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్లు మొదలైనవి ఉన్నాయి. 1,540 చెరువులు, 1,492 ట్యాంకులు, సరస్సుల్లో ఆక్రమణలు రాష్ట్రంలోని 3,032 జల వనరుల్లో ఆక్రమణలను గుర్తించారు. వాటిలో 50.8% (1,540) చెరువులు, 49.2% (1,492) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, జల సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో 3,032 ఆక్రమణకు గురైన జల వనరులు, 2,028 జల వనరుల్లో ఆక్రమణ ప్రాంతాన్ని అంచనా వేశారు. ఈ 2,028 వనరులకుగాను 1,415 జల వనరుల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో ఆక్రమణలకు గురవుతున్నాయని, 402 జలవనరులు 25%–75% మధ్య ఆక్రమణ కలిగి ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన 211 జల వనరులు 75% కంటే ఎక్కువ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 64,056 జల వనరుల్లో 63,769 వనరుల్లో ‘జల వ్యాప్తి ప్రాంతం’నివేదించారు. వీటిలో 51.6% (32,914) జల వనరులు 0.5 హెక్టార్ల కంటే తక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నాయి. అయితే 1.8% (1,166) జల వనరులు 50 హెక్టార్ల కంటే ఎక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. -
Ap Budget: నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల కేటాయింపులు
సాక్షి, అమరావతి: సంక్షేమమే తమ ధ్యేయమంటూ జన రంజక బడ్జెట్ ప్రవేశపెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నీటి వనరుల అభివృద్ధికీ ప్రాధాన్యమిచ్చింది. ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు శ్రేయస్సు దిశగా చేస్తున్న కృషిని వెల్లడించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి సీఎం జగన్ పెన్నా నదిపై పనులను సెప్టెంబర్ 6, 2022 న ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతంలో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి రానుండటంతో ప్రజల చిర కాలస్వప్నం నెరవేరనున్నది. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్ట, కాలువ పనులు 79.07 శాతం పూర్తయ్యాయి. పునర్నిర్మాణ, పునరావాస పనులు ఏక కాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాలలో జలయజ్ఞం కింద సత్వర సాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా, నాగావళి మరియు వంశధార నదుల అను సంధానాన్ని, 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశలోని స్టేజ్-2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లమల సాగర్ నీరందించేందుకుగాను పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశ, రెండవ దశలను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాంమని, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశను మార్చి 2025 నాటికి, రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన తెలిపారు. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022న కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022న నీటిని విడుదల చేశాం. జూలై 31, 2022న నాగార్జున సాగర్ ప్రాజక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని మంత్రి అన్నారు. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. -
గ్రామాల్లో తాగునీటి వనరులకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని సంప్రదాయ తాగునీటి వనరుల పునరుజ్జీవానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీసత్యసాయి, అన్నమ య్య, చిత్తూరు, పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు వీలైనంత ఎక్కువ నిల్వ చేసేలా.. నీటి కొలనులు, మంచినీటి చెరువుల వంటి సంప్రదాయ తాగునీటి వనరుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టబోతోంది. ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం 8 రకాల పనులు చేపట్టను న్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల భాగస్వామ్యంతో ఆ ప్రాంతాల్లో భూమిలోని తేమ శాతం పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రూ.240 కోట్లతో ఆయా ప్రాంతాల్లోని ప్రభు త్వ భవనాల వద్ద రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం తదితరాలు చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చి 4 నుంచి దేశవ్యాప్తంగా.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల తరహాలోనే దేశవ్యాప్తంగా మార్చి 4 నుంచి నవంబర్ 30 వరకు ‘జలశక్తి అభియాన్–క్యాచ్ ద రెయిన్ 2023’ పేరుతో కేంద్ర జలశక్తి శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దేశం మొత్తం మీద నీటి ఇబ్బందులుండే జిల్లాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మార్చి 4న దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇప్పటికే లేఖలు రాశారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమ లక్ష్యాలు, ప్రాధాన్యతల గురించి అన్ని రాష్ట్రాల అధికారులకు వివరించారు. కాగా, పట్టణ ప్రాంతాలో సైతం నీటి ఎద్ద డికి అవకాశమున్న ప్రాంతాల్లో.. వార్డు స్థాయిలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. -
అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ– జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ–నీటివనరుల సంస్థ(ఏఎస్సీఈ– ఈడబ్ల్యూఆర్ఐ) ఆహ్వా,నించింది. అమెరికా హెండర్సన్లో మే నెల 21 –25 తేదీల మధ్య ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఏఎస్సీఈ– ఈడబ్ల్యూఆర్ఐ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్తోపాటు సంస్థ అధ్యక్షుడు షిర్లీ క్లార్క్ నాయకత్వంలోని ఓ ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు పరిధి– సామర్థ్యంతోపాటు నిర్మాణంలో చూపించిన వేగంపట్ల ఆ ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పలు నీటిపారుదల ప్రాజెక్టులతో తెలంగాణలో చోటుచేసుకున్న సామాజిక, ఆర్థిక ప్రగతిని ప్రశంసించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ను కలిసిన ఆ ప్రతినిధి బృందం అతితక్కువ సమయంలోనే నీటివనరుల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించిన తీరుపట్ల అభినందనలు తెలిపింది. మెగా ప్రాజెక్టుల గురించి వివరించండి... కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడానికి రాష్ట్రప్రభుత్వం అవలంబించిన విధానాలతోపాటు తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా మారిన క్రమాన్ని సమావేశాల్లో వివరించాలని కేటీఆర్కు పంపిన ఆహ్వానలేఖలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ–నీటి వనరుల సంస్థ కోరింది. కాగా, 177 దేశాలకు చెందిన 1,50,000 కంటే ఎక్కువమంది సివిల్ ఇంజనీర్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్లో సభ్యులుగా ఉన్నారు. 1852లో స్థాపించబడిన ఈ సంస్థ అమెరికాలోనే పురాతన ఇంజనీరింగ్ సొసైటీ. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సమస్యల పరిష్కారంతోపాటు నీటివనరుల సంరక్షణపై ఈ సొసైటీ పనిచేస్తోంది. కాగా, ఆరేళ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, నీటిసంరక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. -
రింగ్కు అటూ ఇటూ హైదరాబాద్ సిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్మించనున్న రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ ప్రకారం కొన్ని పట్టణాలు రింగురోడ్డు లోపల, మరికొన్ని పట్టణాలు దాని వెలుపల ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న జలవనరులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, ఇతర నీటి కాలువల ఆధారంగా ఈ అలైన్మెంట్ను ఖరారు చేశారు. యాదాద్రిని దాటిద్దామనుకున్నా.. యాదగిరిగుట్ట దేవాలయం ఈ రీజినల్ రింగు రోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్మెంట్ను ఖరారు చేయాలని ప్రభుత్వం భావించినా ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో దానికి నీటిని అందించే కాళేశ్వరం నీటి కాలువకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. తాజా అలైన్మెంట్ ప్రకారం యాదాద్రికి దాదాపు 4 కి.మీ. దూరం నుంచే రోడ్డు నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి నుంచి యాదాద్రికి వెళ్లే రాయగిరి రోడ్డు మొదలయ్యే చోట, భువనగిరి పట్టణం బైపాస్ రోడ్డు ముగిసే ప్రాంతానికి చేరువగా ఆర్ఆర్ఆర్ క్రాస్ కానుంది. ఇది భువనగిరి పట్టణానికి చేరువగా ఉండనుంది. అంటే భువనగిరి పట్టణం రీజనల్ రింగురోడ్డు లోపలివైపు ఉండనుండగా యాదాద్రి టెంపుల్ టౌన్ మాత్రం దీనికి ఆవల ఉండనుంది. బస్వాపూర్ రిజర్వాయర్కు సమీపంలోని తుర్కపల్లి పట్టణం మాత్రం రింగురోడ్డు లోపలివైపే ఉండనుంది. తుర్కపల్లి నుంచి యాదాద్రికి నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు మధ్య భాగం నుంచి ఈ రోడ్డు క్రాస్ కానుంది. దీనికి ఇటు తుర్కపల్లి, అటు యాదాద్రి సమ దూరంలో ఉండనుంది. ఇక తుర్కపల్లికి సమీపంలోని జగదేవ్పూర్ పట్టణం రీజినల్ రింగురోడ్డుకు వెలుపలే ఉండనుంది. మరోవైపు గజ్వేల్ పట్టణం సైతం రింగురోడ్డు పరిధిలోకి రావడంలేదు. ఆ పట్టణానికి నిర్మిస్తున్న ప్రత్యేక రింగురోడ్డుకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్ఆర్ఆర్ మార్గాన్ని కాస్త దూరంగానే నిర్మించనున్నారు. అలాగే తూప్రాన్ పట్టణం రింగురోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్మెంట్ రూపొందించారు. తర్వాత నర్సాపూర్, సంగారెడ్డి పట్టణాలు కూడా రింగురోడ్డు లోపలికే ఉండబోతున్నాయి. ఈ పట్టణాలు దాటాక ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందన్నమాట. ఇటు భువనగిరి దాటిన తర్వాత వచ్చే వలిగొండ ఆర్ఆర్ఆర్ వెలుపలికి పరిమితం కానుండగా చౌటుప్పల్ మాత్రం రింగురోడ్డు లోపలివైపు ఉండనుంది. 130 గ్రామాల వరకు గుర్తింపు? రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించి 85 గ్రామాల్లో భూసమీకరణ జరగనుంది. వాటిని గుర్తిస్తూ గెజిట్ విడుదల కానుంది. అయితే ఈ గెజిట్లో మరో 45 గ్రామాలను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. నేరుగా ప్రభావితం అయ్యే గ్రామాలకు అతిచేరువగా ఉండి కనీసం ఎకరం స్థలం అయినా కోల్పోయే గ్రామాన్ని కూడా గెజిట్లో చేర్చాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భూసమీకరణ సమయంలో గ్రామ పంచాయతీల మధ్య తేడా వస్తే ప్రత్యేకంగా అప్పటికప్పుడు మరో గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది. దీన్ని నివారించేందుకు ముందుగానే ఆయా గ్రామాలకు అతిచేరువలో ఉన్న వాటిని కూడా గుర్తించనున్నారు. -
కేసీఆర్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలో ఉండే జలవనరుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఎందుకో అర్థం కావడం లేదని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నంతో పాటు అలాంటి అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పేనని అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శి కైలాశ్కుమార్, ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్లతో కలిసి మాట్లాడుతూ, తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులను ప్రారంభించామని గుర్తుచేసిన పొన్నాల, గత ఏడేళ్లలో సాగునీటి విషయంలో కేసీఆర్ వెలగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంతో తెలంగాణకు ఏం లాభం జరుగుతుందో కేసీఆర్ చెప్పగలరా అని అన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని, కృష్ణా బోర్డు పాపం కేసీఆర్కు ఊరికేపోదని అన్నారు. దేశంలో బొగ్గు లేక అనేక విద్యుదుత్పాదన ప్రాజెక్టులు మూతపడ్డాయని, బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తోందని అన్నారు. కేంద్రం దగ్గర ప్రణాళిక లేని కారణంగానే బొగ్గు కొరత, కరెంటు కోతలు వచ్చాయని, పాలనను పక్కనపెట్టిన బీజేపీ రాజకీయాలపై దృష్టి పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినన తర్వాత ఒక్క మెగావాట్ కూడా కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయారని పొన్నాల ఎద్దేవా చేశారు. -
శ్రీసిటీకి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు సీఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆగస్టు 28న సీఐఐ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ యాజమాన్యం అందుకోనుంది. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్గా నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి శ్రీసిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అవార్డులు తమ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తాయన్నారు. -
ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నాం: మంత్రి అనిల్
సాక్షి, కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నామని జల వనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందో అదే తాము ఉపయోగించుకుంటున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల నీటిమట్టం రాక ముందే తెలంగాణ రాష్ట్ర అక్రమ కట్టడాల ద్వారా నీటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఏపిలోని అన్ని ప్రాంతాలకు నీరు చేరాలంటే తాము కూడా ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు సామార్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. ‘చంద్రబాబు మతిభ్రమించినట్లే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలకు మతి భ్రమించి ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాస్తున్నారు. నీటి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పడం లేదు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుపై తెలుగుదేశం నాయకులు మద్దతివ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. జూమ్ మీటింగ్లకు పరిమితమైన తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాయలసీమ వివక్షకులు టిడిపి నేతలే’ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
నిలకడగా ఉన్న నీటితోనూ విద్యుత్తు!
గువాహటి: ఇళ్లల్లో, వీధుల్లో, పల్లెల్లో, పట్టణాల్లోనూ కనిపించే అతి సాధారణ దృశ్యమేది? జల వనరులు! కుండల్లో, కుంటల్లో, చెరువుల్లో ఇలా అన్నిచోట్ల నిలకడగా ఉండే నీరు కనిపిస్తూనే ఉంటుంది. ప్రవహించే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు ఉండగా.. నిలకడగా ఉన్న నీటితోనూ కరెంటు పుట్టించే అవకాశమేర్పడింది. ఇందుకు అవసరమైన వినూత్నమైన పదార్థాలను ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేయడం దీనికి కారణం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పదార్థాలను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలగడం. ఏసీఎస్ అప్లైడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. పదార్థాల ధర్మాలు స్థూల ప్రపంచంలో ఒకలా.. సూక్ష్మ ప్రపంచంలో మరోలా ఉంటాయని నానో టెక్నాలజీ గతంలో తేల్చింది. నానోస్థాయిలో వ్యక్తమయ్యే ఇలాంటి ధర్మమే ‘ఎలక్ట్రో కైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్’. ఈ ధర్మాన్ని వాడి ఇంటి నల్లాల్లో ప్రవహిస్తున్న నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. ‘కాంట్రాస్టింగ్ ఇంటర్ఫేషియల్ ఆక్టివిటీస్’అనే మరో నానోస్థాయి ధర్మం ఆధారంగా సిలికాన్ వంటి అర్ధవాహకాలను ఉపయోగించుకుని నిలకడగా ఉన్న నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు. ముప్పు ముంచుకొస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభిృవృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతి వినూత్నమైనదీ.. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించనిది. ‘విద్యుత్తు చార్జ్ ఉన్న సూక్ష్మస్థాయి కాలువల్లాంటి నిర్మాణాల ద్వారా ద్రవాలు ప్రవహిస్తున్నప్పుడు వోల్టేజీ ఉత్పత్తి అవుతుంది. అతిసూక్ష్మమైన జనరేటర్లను తయారుచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కళ్యాణ్ రైడోంగియా తెలిపారు. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చాలా తక్కువ కావడంతో ఎవరూ ప్రయత్నించలేదని చెప్పారు. నానోస్థాయిలో పరిశోధనలు చేయడం ద్వారా తాము మునుపటి సమస్యలను అధిగమించగలిగామని, విద్యుదుత్పత్తిని వేలరెట్లు ఎక్కువ చేయవచ్చునని తాము గుర్తించామని కళ్యాణ్ వివరించారు. నిలకడగా ఉన్న నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు తాము గ్రాఫీన్ పెచ్చులతో పరికరాలను తయారు చేశామని, దీన్ని నీటిలో ముంచడం ఆలస్యం... విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గ్రాఫీన్లో మార్పులు చేసి తాము ఫిల్టర్ పేపర్లపై ఏర్పాటు చేశామని, వీటికి నీరు తాకినప్పుడు సుమారు 570 మిల్లీ వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి అయిందని వివరించారు. -
ఢిల్లీలో జలజీవన్ మిషన్ కార్యక్రమం
-
నీటి వనరులపై సర్వే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జల వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్న తరహా సాగునీటి వనరుల సర్వే చేపట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది. బోర్లు, బావులు, ఉపరితల నీటి నిల్వలకు ఆధారమైన కొలనులు, కుంటలు, చెరువులు, చెక్డ్యాంలు, రిజర్వాయర్లు, ఊట కుంటల సంఖ్యను లెక్కిస్తారు. రెండు వేల హెక్టార్లలోపు భూములకు సాగు నీరందించే వనరుల సమగ్ర సమచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరిస్తారు. సదరు నీటి వనరు ఎప్పుడు ఏర్పాటైంది.. ఆ కాలంలో చేసిన ఖర్చు, నీటి సామర్థ్యం, దాని కింద ఖరీఫ్, రబీ సీజన్లలో సాగవుతున్న భూ విస్తీర్ణం, పండుతున్న పంటలు, ప్రస్తుత నీటి నిల్వలు, వినియోగంలో లేకుంటే అందుకు గల కారణాలు.. ఇలా సంపూర్ణ వివరాలు రాబడుతారు. ఈ సర్వే వారం రోజుల్లో మొదలు కానుంది. ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. సర్వే ఉద్దేశం ఇదీ.. ప్రతి ఐదేళ్లకోసారి చిన్నతరహా సాగునీటి వనరుల సర్వేను కేంద్ర జల వనరుల శాఖ చేపడుతోంది. 1986–87లో తొలిసారి శ్రీకారం చుట్టగా.. ప్రస్తుతం జరిగేది ఆరో సర్వే. 2017–18 సంవత్సరానికి సంబంధించిన ఈ సర్వే నిర్వహణకు ఆదేశాలు జారీకావడంతో దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ప్రతి ఐదేళ్ల వ్యవధిలో నీటి వనరుల పరిస్థితి ఎలా ఉంది? నీటి వినియోగం తగ్గిందా.. పెరిగిందా? పంటల సాగు విస్తీర్ణం ఎలా ఉంది? ఆయా పంటలకు వినియోగమవుతున్న నీటి పరిమాణం, గతానికి..ప్రస్తుతానికి నీటి నిల్వలు పెరిగాయా..తగ్గాయా? తదితర వివరాలను విశ్లేషిస్తారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరగడం లేదు. ఒక్కోసారి విస్తృతంగా వర్షాలు కురిసినా ఆశించిన స్థాయిలో నీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. మరోపక్క భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నీటి వనరుల గణన ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉంటే అందుకు గల కారణాలను కూలంకషంగా విశ్లేషించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారు. అంతేగాక భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక పథకాలను రూపొందించే అవకాశమూ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సర్వేలో గుర్తించిన ప్రతి నీటి వనరుని జియోట్యాగ్ చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసంతోపాటు సర్వేలో పాదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు. 18లోపు అధికారులకు శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రతి నీటి వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం ఉద్యోగులను రంగంలోకి దించుతోంది. పల్లెల్లో వీఆర్ఓలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్ ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. ఇక మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు లేదా వర్క్ ఇన్స్పెక్టర్లు సర్వేలో పాల్గొంటారు. ఈ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు వీరిని సమన్వయం చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ చైర్మన్గా వ్యవహరిస్తారు. సర్వే ఎలా చేయాలన్న అంశంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. సర్వేపై అవగాహన కల్పించారు. ఈనెల 18లోపు మండల, మున్సిపాలిటీల్లో కిందిస్థాయి ఉద్యోగులకు సర్వే నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి గణన చేపడతారు. ఈనెల 30వ లోపు సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. -
కృష్ణమ్మ రాకతో జలసిరి
సాక్షి, కోడేరు: వరుస కరువుతో కుదేలైన అన్నదాతల ఆశలు కృష్ణమ్మ పరవళ్లతో రెక్కలు విప్పుకున్నట్లయ్యింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబొగుడ రెండో లిప్టు నుంచి నీరురావడంతో కోడేరు మండలంలోని గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో మండలంలోని అన్నదాతలు పంటలను పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా వరిసాగు మండలంలోని కోడేరు, పస్పుల, రాజాపూర్, ముత్తిరెడ్డిపల్లి, ఎత్తం, నాగులపల్లి, కొండ్రావుపల్లి, నర్సాయిపల్లి తదితర గ్రామాలకు కేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు రావడంతో ఆరుతడి పంటలు, వరిపంటలను సాగు చేసుకున్నారు. కొన్నేళ్లుగా కరువు కాటకాలతో అల్లాడిన రైతులకు జొన్నలబొగుడ ద్వారా సాగునీరు వచ్చి చెరువులు, కుంటలు నిండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల్లో నీటిమట్టం పెరిగిందన్నారు. రబీలో వేసిన పంటల ద్వారా తమ అప్పులను తీర్చుకున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బోరుబావులు లేని రైతులు చెరువులు, కుంటల వద్ద మోటార్ల ద్వారా తమ పొలాలకు సాగునీరు అందించుకొని అధిక దిగుబడులు పొందుతున్నామని పేర్కొంటున్నారు. మత్స్యకారులు సైతం చేపలను పెంచుతూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పుంజుకోని వరి నాట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి సాగు నిరాశాజనకంగా మారింది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, చెరువులు, బావులు, బోర్లలో నీటివనరులు అడుగంటడంతో నాట్లు పుంజుకోవడంలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 37,500 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గతేడాది రబీలో వరి సాగు గణనీయంగా జరిగినా, ఈసారి పరిస్థితి దారుణంగా ఉందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రబీ పంటల సాగుపై వ్యవసాయశాఖ బుధవారం ఒక నివేదికను సర్కారుకు పంపించింది. ఆ నివేదిక ప్రకారం రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 8.20 లక్షల (25%) ఎకరాల్లోనే సాగయ్యాయి. అందులో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.80 లక్షల (44%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.70 లక్షల (87%) ఎకరాల్లో వేశారు. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.22 లక్షల (63%) ఎకరాల్లో సాగైంది. 18 జిల్లాల్లో వర్షాభావం... రాష్ట్రంలో రబీ సీజన్ మొదలైన అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కరువు ఛాయలు నెలకొన్నాయని వ్యవసాయశాఖ తెలిపింది. అక్టోబర్లో 83 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, నవంబర్లో ఏకంగా 95 శాతం లోటు రికార్డు అయింది. ఇక డిసెంబర్లో ఇప్పటివరకు 81 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 13 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ దాడి అధికంగా ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇక ఖరీఫ్లో వరి కోతలు కొనసాగుతున్నాయి. కంది ఇప్పుడే కోత దశకు చేరింది. జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్లన్నీ చేతికొచ్చాయి. ఇక పత్తి తీత చివరి దశకు చేరుకుంది. మిరప రెండో తీత దశలో ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. -
సృజనాత్మకతతో అభివృద్ధి జరగాలి
న్యూఢిల్లీ: అభివృద్ధి పరంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు సృజనాత్మక మార్గాలతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 నాటికి స్పష్టమైన పురోగతి కనిపించేలా పనిచేయాలని 115 వెనుకబడిన జిల్లాల కలెక్టర్లు, ఇన్చార్జి అధికారులకు సూచించారు. శుక్రవారం ‘ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్’ అనే కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడారు. అభివృద్ధి లక్ష్యాలు సాధించి శాశ్వత సంతృప్తి పొందే అవకాశం 115 జిల్లాల అధికారులకు ఉందని అన్నారు. ఆశించిన ఫలితాలు రావాలంటే సంబం ధిత అధికారులు సులువైన లక్ష్యాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలని, ప్రజల్లో ఆశావహ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ‘ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి జరుపుకుంటున్నాం. వెనకబడిన జిల్లాల్లో సృజనాత్మక మార్గాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి ఈ మూడు నెలలు కష్టపడదాం. నవ భారత నిర్మాణానికి ఈ 115 జిల్లాలే నాంది పలకాలి. ప్రజలు వెనకబడి ఉన్నారంటే వారికి అన్యాయం జరిగినట్లే అవుతుంది’ అని అన్నారు. కార్యక్రమంలో కొందరు అధికారులు పోషణ, విద్య, మౌలిక వసతులు, వ్యవసాయం, జల వనరులు, మావోయిస్టుల సమస్య, నైపుణ్యాభివృద్ధి తదితరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. -
కాస్త తగ్గినా.. రబీ ఆశలు సజీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న నీటి వనరులుగా ఉన్న చెరువుల కింద సాగు విస్తీర్ణం గత ఏడాది రబీతో పోలిస్తే కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రబీలో గత ఏడాది చెరువుల కింద సాగు 7.25 లక్షల ఎకరాలు దాటగా, ఈ ఏడాది 5.16 లక్షల ఎకరాల వరకు ఉండనుంది. మిషన్ కాకతీయ కింద మూడు విడతల్లో 22,895 చెరువులను పునరుద్ధరించినా, లోటు వర్షపాతం కారణంగా చెరువుల్లో నీరు చేరకపోవడం ఆయకట్టును ప్రభావితం చేయనుంది. పదేళ్లతో పోలిస్తే.. ఆశాజనకమే.. రాష్ట్రంలో మొత్తంగా 46,531 చెరువులు ఉండగా, వాటి కింద 24,39,515 ఎకరాల మేర సాగు విస్తీర్ణం ఉంది. కృష్ణా, గోదావరిలో కలిపి 255 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరగకపోవడంతో గరిష్టంగా 10 లక్షలకు మించి ఆయకట్టుకు నీరందించిన సందర్భాలు లేవు. 2008–09 ఏడాది నుంచి ప్రస్తుతం వరకు ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా చూస్తే గరిష్టంగా 2013–14 ఖరీఫ్లో 9,04,752 ఎకరాల్లో సాగు జరిగింది. గత సంవత్సరం కంటే ముందు 2008–09లో గరిష్టంగా 2.38 లక్షల ఎకరాల్గో రబీ సాగు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది 2016–17లో విస్తారంగా వర్షాలు కురవడం, చెరువుల పునరుద్ధరణ రబీ సాగుకు ఊపిరి పోసింది. దీంతో గత ఏడాది రబీలో గరిష్టంగా 7.25 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈ ఏడాది మొత్తం చెరువుల్లో 14,418 చెరువుల్లో 25శాతం కన్నా తక్కువగా నిండగా, మరో 9,289 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు మాత్రమే నిండాయి. రంగారెడ్డి జిల్లాలో 2,019 చెరువులు ఉండగా ఏకంగా 1,635 చెరువులు నీటి కరువు ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలోనూ 1,185 చెరువులకు గానూ 1,070 చెరువుల్లో నీరు చేరలేదు. కృష్ణా బేసిన్లోని మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి పెద్దగా నీరు చేరని కారణంగా కూడా చెరువులను నింపడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ మూడు విడతల్లో పునరుద్ధరించాలని తలపెట్టిన 22,895 చెరువుల్లో ప్రస్తుతం వరకు 15,649 చెరువుల పనులు పూర్తి కావడంతో వర్షాలు మెరుగ్గా ఉన్న చోట్ల నీటి లభ్యత కొంత పెరిగింది. దీంతో ఈ ఏడాది 5,16,097 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఆయకట్టు తగ్గినా.. పదేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ప్రస్తుతం చెరువుల ద్వారా సాగయ్యే ఆయకట్టు గణనీయంగా ఉండటం ఆయకట్టు ఆశలను సజీవం చేస్తోంది. -
ఈ నెల గడిచేనా..?
► కోరుట్లకు మంచినీటి గండం ► నిండని పాలమాకుల చెరువు ► ఖాళీ అవుతున్న తాళ్ల చెరువు.. ► భూగర్భజలాలకూ దెబ్బ కోరుట్ల: వర్షాలు జాడలేవు.. అరకొరగా వచ్చిన ఎస్సారెస్పీ నీరు..నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోరుట్లకు మంచినీటి ముప్పు పొంచి ఉంది. వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే.. ఈ నెలాఖరులో నీటి గండం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. పెరిగిన అవసరాలు... ఈ మధ్యకాలంలో కోరుట్ల జనాభా సుమారు లక్షకు మించిపోయింది. పట్టణంలోని 31వ వార్డుల్లో కలిపి మొత్తం 22 వేల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 13 వేలకుపైగా ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో మంచినీటి పైప్లైన్లు లేని ఏరియాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రతీరోజు పట్టణ జనాభా అవసరాలకు నల్లా కనెక్షన్ల ద్వారా సరాఫరా చేయడానికి సుమారు 4.2 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పట్టణ శివారులోని తాళ్ల చెరువు నుంచి నీటిని వాగులో ఉన్న బావుల్లో నింపి వాటర్ ట్యాంకుల ద్వారా పట్టణానికి సరాఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నల్లాల నుంచి నీటిని సరాఫరా చేస్తున్నారు. ఇదంతా మంచినీటి పైప్లైన్ ఉన్న చోట మాత్రమే జరుగుతోంది. మంచినీటి పైప్లైన్లు పూర్తిస్థాయిలో లేని భీమునిదుబ్బ, రథాల పంపు, హాజీపురా, ఆనంద్నగర్, ఆల్లమయ్యగుట్ట ఏరియాల్లో మంచినీటికి తిప్పలు తప్పడం లేదు. భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడంతో నల్లానీటిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నీటి అవసరాలు మరింత పెరిగాయి. అవసరాలు పెరిగినా నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారడంతో పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నెల గడిచేనా..? పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం వాడుతున్న తాళ్ల చెరువులో నీటి మట్టం దాదాపుగా డెడ్స్టోరేజీకి చేరింది. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ముందుచూపుతో ఎస్సారెస్పీ నీటిని వదిలిన సమయంలో మరో నీటి వనరుగా ఉన్న పాలమాకుల చెరువును నింపే ప్రయత్నం చేశారు. ఎస్సారెస్పీ నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఫలితంగా తాళ్ల చెరువు, పాలమాకుల చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి వనరులు మరో 20–25 రోజులకు మించి సరిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు లేని క్రమంలో భూగర్భ జలమట్టం సుమారు 900 ఫీట్లుకు పడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇటు మున్సిపల్ నల్లా నీరు లేక..అటు బోర్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఏడాది క్రితంలా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయాల్సిన దుస్థితి మళ్లీ వస్తుందా..? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. -
జలవనరులపై సర్వే చేయండి
♦ ఆయకట్టు, శిఖం వివరాలు సేకరించాలి ♦ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ♦ వీఆర్వో, తహసీల్దార్, ఎంఏవోలకు ఆదేశాలు ♦ కలెక్టరేట్లో మండల అధికారుల సమావేశం ఆదిలాబాద్అర్బన్: జిల్లాలోని జలవనరులు, వాటి ఆయకట్టు సామర్థ్యం తదితర వివరాలను సర్వే ద్వారా గుర్తిం చాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి మండల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, వీఆర్వోలు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు ఉన్నాయని, ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ జలవనరులు ఉన్నాయో వీఆర్వోలు, తహసీల్దార్లు గుర్తించాలని సూచించారు. ఆయా ట్యాంకులకు ఎంత నీటి సామర్థ్యం ఉంది, దాని చుట్టూ ఎంత ఆయకట్టు ఉందో వివరాలు సర్వే చేసి తీసుకోవాలని పేర్కొన్నారు. చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు, వాగుల పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, అలాంటి వాటిపై దృష్టి సారించి సమగ్ర వివరాలు తెలపాలని వివరించారు. ఒక్కో చోట ఎన్ని నీళ్లున్నాయి.. చుట్టూ ఎన్ని మీటర్ల దూరంలో బోరు వేస్తే నీళ్లు పడతాయి. . ఆయకట్టు ఎప్పుడు, ఎంత నీటిని విడుదల చేయాలనే అంశాలు ఉండాలని అన్నారు. ఆ వివరాలన్ని ఉంటేనే జిల్లాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఆక్రమణల వల్ల వాగులు, కుంటలు, చెరువులు చెడిపోతున్నాయని, శిఖం భూములు లేకుండా పోతున్నాయని, ప్రభుత్వ భూములపై దృష్టి సారించి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాష్ ఈ సమావేశానికి హాజరుకాగా, ఇరిగేషన్పై వివిధ అంశాల్లో మండల అధికారులతో చర్చించామని తెలిపారు. త్వరగా సర్వే చేసి వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో బానోత్ శంకర్, తహసీల్దార్లు అతికొద్దీన్, రాంరెడ్డి, ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
గొంతు తడవని గిరి‘జనం’
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల గోస - ఎండిన బావులు, బోర్లు, పనిచేయని ట్యాంకులు - 2008లో ప్రారంభమై మూలకు పడ్డ నీటిశుద్ధి కేంద్రాలు - మోక్షం కలగని రివర్స్ ఆస్మాసిస్ పథకం - కుమ్రం భీం ప్రాజెక్టును పూర్తి చేయని పాలకులు సాక్షి, మంచిర్యాల ► ఉట్నూరు మండలంలోని చాందూరి పంచాయతీ పరిధిలో గల కెస్లాగూడ జనాభా 50. తాగునీటి బావిలో నీరు అడుగంటడంతో తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ► చింతలమానెపల్లి మండంలోని డబ్బా గ్రామపంచాయతీలో వెనుకబడిన గ్రామం ధరంపల్లిలో నివసిస్తున్న రెండు వేల జనాభాకు ఏడు చేతిపంపులు, నాలుగు బావులు ఉన్నా నీరు లేదు. కిలోమీటరు దూరంలోని వాగులోని చెలిమెలే దిక్కయ్యాయి. ► తిర్యాణి మండలంలోని గడలపల్లిలో 70 కుటుంబాలకు రెండు చేతి పంపులే దిక్కు. రోజంతా పది బిందెల నీరు కూడా రావడం లేదు. అదీ మురికినీరు. ► ఇంద్రవెల్లి మండలంలోని గట్టెపల్లి, సాలెగూడ, కెరమెరిలోని కొప్పగూడ, ఉట్నూరులోని లెండిగూడ, తానూరు మండలంలోని హిప్పెల్లిగూడ, నర్సాపూర్(జె), చెన్నూరు మండలంలోని సుందరసాల, భీమిని మండలంలోని మామిడిగూడ, నర్సాపూర్(జి) మండలంలోని కుస్లి, జన్నారం మండలంలోని కొలాంగూడ గ్రామాల్లో తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. ► ఆదిలాబాద్ మండలం ఖండాల పంచా యతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కోసం గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు. వట్టిపోయిన గట్టి పథకాలు 2008 సంవత్సరంలో ఐటీడీఏ, వాటర్ హెల్త్ ఇండియా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు కోటి వ్యయంతో ఏజెన్సీలోని సమస్యాత్మక మండలాలైన నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ఏర్పాటైన నీటిశుద్ధి కేంద్రాలు మూలకు పడ్డాయి. ఇక 2010–11లో రివర్ అస్మాసిస్ పేరుతో ఏజెన్సీలో దాదాపు 18 ప్రాంతాల్లో సురక్షిత నీటి కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోలేదు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏజెన్సీ మండలాలకు కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.72 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. విద్యుత్ కోతతో అవస్థలు... మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న నిర్మల్ జిల్లాలోని కుభీర్, తానూర్ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితుల్లో నీళ్లు లేక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి పైప్లైన్ ద్వారా నీళ్లు పొందుతున్నారు. అయితే త్రీఫేజ్ కరెంట్ సమస్య కారణంగా అర్ధరాత్రి తాగునీరు పట్టుకునేందుకు గ్రామాల్లో బారులు తీరుతున్నారు. కుభీర్ మండలంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. జాడలేని మిషన్ భగీరథ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని ఇంటింటికి తాగునీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ పథకం ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో ఇంకా ఇంటెక్ వెల్ల నిర్మాణం వరకు కూడా రాలేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆఫీసుల్లో కూర్చొని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, ప్రత్యామ్నాయ నీటివనరుల వృద్ధిపై శ్రద్ధ చూపడంలేదు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అడుగంటిన నీటి వనరులు గిరిజనులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాలు, గ్రామాల్లో తాగునీటి వనరులు అడుగంటాయి. నీటి అవసరాలను తీర్చే వాగులు, వంకలు, వ్యవసాయ బావులు కూడా ఎండిపోతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు సతమతమవుతున్నారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల దూరం నుంచి మహిళలు బిందెలు మోస్తూ వస్తున్న దృశ్యాలే. రక్షిత మంచినీటి సరఫరా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాల కాలంగా చేస్తున్న ‘భగీరథ’ప్రయత్నాలేవీ సాకారం కాకపోవడమే ఈ దుస్థితికి కారణం. -
భూగర్భ జలవనరుల సర్వేను పూర్తి చేయాలి
డ్వామా పీడీ హరిత నెల్లూరు(అర్బన్): ఎన్టీఆర్ జలసిరి పథకం కింద బోర్ల మంజూరుకు భూగర్భ జలవనరుల సర్వేను వెంటనే పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత జియాలజిస్టులకు సూచించారు. శనివారం ఆమె దర్గామిట్టలోని తన చాంబర్లో జియాలజిస్టులు, కార్యాలయ సిబ్బందితో ఎన్టీర్ జలసరి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ జలసిరి కింద జిల్లాకు 15,249 బోర్లు మంజూరయ్యాయని తెలిపారు. 2016లో 5వేల బోర్లను వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎంపీడీఓ, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయంతో చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కోరారు. భూగర్భ జల వనరుల శాఖ ఉపసంచాలకులు రమేష్ మాట్లాడుతూ భూగర్భజల వనరుల సర్వే నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇదిగో.. ఎడారి ఓడిపోతుంది!
రాజస్థాన్లో మహోద్యమంగా జలయజ్ఞం ఇసుక నేలల్లో పరుచుకుంటున్న పచ్చదనం - కరువును జయించేందుకు కదిలిన జనం - వంద కోట్ల విరాళంతో ముందుకు వచ్చిన దాతలు - ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ అభియాన్ చేపట్టిన రాష్ట్ర సర్కారు - జల వనరులకు పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యం - ఏడు నెలల్లో 500 చెరువులు, కుంటల నిర్మాణం - నాలుగేళ్లలో 22 వేల గ్రామాలకు జలకళ దిశగా అడుగులు - భగీరథ యజ్ఞంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ బిడ్డ శ్రీరాం వెదిరె రాజస్థాన్.. పర్యాటక రంగానికి పర్యాయపదం. కోటలు.. మహల్లు.. చరిత్రకు అద్దం పట్టే కట్టడాలు.. ప్రతీదీ ప్రత్యేకమే. దేశ భౌగోళిక విస్తీర్ణంలో, జనాభాపరంగా అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. పశు పోషణలో దేశానికే ఆదర్శం! కానీ.. జల వనరుల్లేక అల్లాడుతోంది. రాష్ట్ర విస్తీర్ణంలో మూడింట రెండొంతుల భూభాగం ఎడారే. ఒకవైపు వరుస కరువు.. మరోవైపు జల సంరక్షణలో అలసత్వం! వెరసి రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు పెను సంక్షోభమే!! కానీ రాబోయే ఆ ఉపద్రవాన్ని ముందే పసిగట్టిన రాజస్థాన్ దిద్దుబాటు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణను ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తోంది. ఈ యజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ‘మినీచిరపుంజి’గా పేరొందిన ఝాలావర్ జిల్లాలో ఏడు నెలల వ్యవధిలో జల సంరక్షణ కార్యక్రమం ఉద్యమంలా సాగిన తీరును ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఇదే ఈ వారం ఫోకస్.. - ఝాలావాడ్ నుంచి కల్వల మల్లికార్జున్రెడ్డి, సాక్షి ప్రతినిధి ఇదీ రాజస్థాన్.. దక్షిణ, పడమటి ప్రాంతాల నుంచి ఉత్తర, తూర్పు ప్రాంతం వరకు విస్తరించి ఉన్న రాజస్థాన్ను ఆరావళి పర్వత శ్రేణి రెండుగా విభజిస్తోంది. దేశంలో భౌగోళికంగా రాజస్థాన్ 10.4 శాతాన్ని ఆక్రమించగా.. దేశ జనాభాలో 5.5 శాతం, పశు సంపదలో 18.70 శాతంగా ఉంది. అయితే దేశంలో లభ్యమవుతున్న భూ ఉపరితల జలంలో కేవలం 1.16 శాతం, భూగర్భ జలంలో 1.70 శాతం మాత్రమే రాష్ట్రంలో లభ్యమవుతోంది. సగటు వార్షిక వర్షపాతం150 మి.మీ. నుంచి 900 మి.మీ. మధ్య ఉంటోంది. 33 జిల్లాల్లోని 295 బ్లాక్లలో.. 95శాతం బ్లాక్లు డార్క్ ఏరియాలోనే ఉన్నాయి. చంబల్తో పాటు మాహి, కాళిసింధ్, బనాస్, సబర్మతి తదితర నదులున్నా.. ఉపరితల జలం కొరత పీడిస్తోంది. 90 శాతం తాగునీరు, 60 శాతం సాగునీటిని భూగర్భం నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రతీ మూడేళ్లకోమారు కరువు.. ఐదేళ్లకోమారు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు తర చూ తలెత్తుతుండటంతో.. భూగర్భ జలంపై ఒత్తిడి పెరుగుతోంది. జలసిరుల దిశగా.. వర్షపాతం, పారే నీరు, భూగర్భ జలం, మట్టిలో తేమ పెంచడం లక్ష్యంగా చేపట్టిన ‘ఫోర్ వాటర్ కాన్సెప్ట్’ కార్యక్రమం పరిధిని విస్తరించి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే జల స్వావలంబన్ అభియాన్ (ఎంజేఎస్ఏ)కు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశనం చేసి, అమలు చేసే బాధ్యతను ‘రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ’కి అప్పగించారు. గ్రామాలు జల స్వయం స్వావలంబన సాధించేందుకు.. నాలుగేళ్లలో రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 22,500 గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతీ దశలో ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. 33 జిల్లాల పరిధిలోని 295 పంచాయతీ బ్లాకుల్లో.. ప్రతీ దశలోనూ.. ఒక్కో బ్లాక్లో 12 గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. భూగర్భ జల మట్టం, తాగునీరు, నీటిపారుదల, సాగుకు యోగ్యమైన విస్తీర్ణం, పంటల ఉత్పత్తి పెంచడాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావ ప్రాంతంలో కనీసం 40 శాతాన్ని సాగులోకి తేవడంతో పాటు పంటల రకాల్లోనూ మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కరువు నేర్పిన పాఠం.. రాష్ట్ర విస్తీర్ణంలో 61 శాతాన్ని థార్ ఎడారి ఆక్రమించగా.. దీని మీదుగా వీచే గాలితో భూక్షయం జరుగుతోంది. ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలమైనా.. నీరు లేదు. రాష్ట్రంలోని భూముల్లో 30 శాతం మేర కొండలు, గుట్టలతో పాటు.. సాగునీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తూ.. ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలుస్తోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27 శాతం వ్యవసాయ రంగానిదే! 90 శాతం సాగు విస్తీర్ణం వర్షపాతంపైనే ఆధారపడి ఉంది. సగటు వర్షపాతం నమోదైనా వర్షపు నీటిని నిల్వ చేసే అవకాశం లేక.. జల వనరులు అడుగంటుతున్నాయి. దీంతో వ్యవసాయ రం గం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ నీటి వనరులకు సవా లు విసురుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 19 జిల్లాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. 44,672 గ్రామాలకుగాను సుమారు 17 వేలకు పైగా గ్రామాలు తీవ్ర తాగునీటి సమస్యతో సతమతమయ్యాయి. రైళ్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. ఆహార భద్రత, పశువుల మనుగడ సవాలుగా మారింది. దీంతో జల సంరక్షణ ఆవశ్యకత, సహజ వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి రాజస్థాన్లో తలెత్తింది. తొలి ఫలితం.. ఆశాజనకం! ఈ ఏడాది జనవరి 27న ఎంజేఎస్ఏను ప్రారంభించిన సీఎం.. మొదటి దశ పనులు పూర్తి చేసేందుకు ఐదు నెలల వ్యవధి ఇచ్చారు. మొద టి దశలో 3,529 గ్రామాల్లో రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఇందులో ఉపాధి హామీ పథకం కింద రూ.400 కోట్లు, ఐడబ్ల్యూఎంపీ కింద రూ.200 కోట్లు కేంద్రం నుంచి రాగా.. మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. తొలి విడతలో 16.5 లక్షల ఎకరాల పరీవాహక ప్రాంతంలో జల సంరక్షణ పనులు చేపట్టి సుమారు 500కు పైగా చెరువులు, కుంటలు నిర్మించారు. జీఐఎస్, జియో ట్యాగింగ్ సాంకేతికత వినియోగించడంతో పాటు తక్కువ ఖర్చుతో జల సంరక్షణ నిర్మాణాలు చేపట్టారు. డబ్బులు ఆదా చేయడంతో పాటు కాంట్రాక్టర్లకు టర్న్ కీ పద్ధతిలో పనులు అప్పగించారు. తొలి దశ పనులు పూర్తి కావడంతో రెండో దశ పనులను రూ.2,500 కోట్లతో ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రారంభించాలని నిర్ణయించారు. రెండో దశలో 4,200 గ్రామాల ఎంపిక పూర్తి కాగా.. ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో మరో వేయి గ్రామాలను అదనంగా చేర్చబోతున్నారు. సర్వే పూర్తి చేసేందుకు ‘వే పాయింట్ మొబైల్ యాప్’తో పాటు డ్రోన్లను వినియోగిస్తున్నారు. రెండో పంటకు అవకాశం ఏర్పడింది ఇక్కడ సగటున 1,300 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉన్నా.. కొండ ప్రాంతం కావడంతో వర్షపు నీరు వేగంగా కిందకు పోతోంది. నల్ల రేగడి భూములున్నా పంటలు పండే అవకాశం లేకపోయింది. మొదటి దశలో నా నియోజకవర్గం పరిధిలో 40 వ్యవసాయ కుంటలు నిర్మించారు. వీటి కింద సుమారు 4 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. రెండో విడతలో 98 కుంటల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గతంలో ఒకే పంట వచ్చేది. ఇప్పుడు రెండో పంటకు అవకాశం ఏర్పడింది. కూరగాయలు, ఉద్యాన పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. - కన్వర్ లాల్ జీ మీనా, ఎమ్మెల్యే, మనోహర్థానా ఎటు చూసినా పచ్చదనమే గతంలో ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది. వర్షం కురిసినా.. క్షణాల్లో దిగువకు వెళ్లి నదిలో కలిసేది. ఇప్పుడు ఎటు చూసినా నీళ్ల కుంటలు.. పచ్చదనమే! తాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బంది లేదు. మేకలు, పశువులకు గడ్డి, నీళ్లకు కరువు లేదు. మాకు ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటుంది. - రతన్లాల్, రైతు, హర్నవాడ యజ్ఞంలా చేస్తున్నాం దేశంలోనే అత్యంత దుర్భిక్ష పరిస్థితులు ఉన్న రాజస్థాన్లో.. జల స్వయం స్వావలంబన ద్వారా గ్రామీణుల జీవన స్థితిగతులు మార్చేందుకు ఎంజేఎస్ఏ చేపట్టాం. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేలా ఈ పథకాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నాం. ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు.. జల సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చాం. ఉపరితల జల సంరక్షణ, భూ సంరక్షణ, భూగర్భ జల సామర్థ్యం పెంపు, కాలుష్య నివారణ. నీటి లభ్యత పెంచడం, వర్షపు నీరు ప్రవహించే మార్గంలో సూక్ష్మ వ్యవసాయ నీటి నిలువ ట్యాంకుల (ఎంఐటీలు) నిర్మాణం. ఉపరితల జల ప్రవాహాన్ని నిరోధించి.. నీరు ఇంకేలా చేయడం.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఎంఐటీ దిగువ ప్రాంతాల్లో చెక్డ్యాంల నిర్మాణం, నదులపై చెక్డ్యాంలు, బ్యారేజీల నిర్మాణం చేపట్టాం. వ్యవసాయ అవసరాలతో పాటు మిగులు నీటిని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం తదితరాలను మలి దశలో చేపట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం చంబల్, మాహి నదుల పరిధిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత లూని, వెస్ట్బనాస్, సుక్లి, ఈస్ట్ బనాస్, సబర్మతి, పర్బి పరీవాహక ప్రాంతాల్లో పనులు ముమ్మరం చేస్తాం. ప్రభుత్వ విభాగాలు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు, మతపరమైన ట్రస్టులు, నాన్ రెసిడెంట్ విలేజర్లు, సోషల్ గ్రూపుల నుంచి నిధుల సేకరించాలని నిర్ణయించాం. తొలి విడతలో సుమారు రూ.100 కోట్లు సేకరించాం. కాంటూరు గుంతలు, ఇంకుడు కుంటలు, వ్యవసాయ కుంటలు నిర్మించి ఝాలావర్ జిల్లాలో క్యాస్రీ నదికి మళ్లీ ప్రాణం పోయడం మా ప్రాథమిక విజయంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో నదుల అనుసంధానంపైనా కసరత్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఎంజేఎస్ఏ పురోగతి, ఫలితాలపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తాం. - శ్రీరాం వెదిరె, ఛైర్ పర్సన్, రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ భూగర్భ జలాలు పెరిగాయి గతంలో కొండలు, గుట్టలతో ఈ ప్రాంతం దు మ్మూ, ధూళితో ఉండేది. ప్రభుత్వ చొరవతో కుంటల నిండా నీరు కనిపిస్తోంది. కాంటూరు తవ్వకాలు, కుంటల నిర్మాణంతో మాకు ఉపాధి దక్కింది. నీటినిల్వతో భూ గర్భ జలాలు కూడా మెరుగయ్యాయి. వ్యవసాయ పనులు పెరిగి ఈ సారి కూలీ పనులు కూడా దొరికాయి. - నాథూరాం, రైతు కూలీ, రూప్పురా బల్దియా ఎంజేఎస్ఏ వెనుక తెలంగాణ వ్యక్తి ఈ జలయజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కీలక పాత్ర పోషిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఈయన.. రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ చైర్మన్ హోదాలో ఎంజేఎస్ఏ అమల్లో కీలక బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ జల వనరుల విభాగం కన్వీనర్గా ఉన్న శ్రీరాం.. ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తెహ్రీ జలాశయం వద్ద గంగా నది ప్రవాహానికి సంబంధించిన అరైవల్ ప్రాజెక్టులోనూ కీలకంగా పనిచేశారు. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాలపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణకు చెందిన జల సంరక్షణ నిపుణులు రాకేశ్రెడ్డి, జంగారెడ్డి, అఫ్సర్ కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. సజీవ సాక్ష్యం సరోద్ ఝాల్రాపాటన్ పంచాయతీ బ్లాక్ పరిధిలోని సరోద్ గ్రామం ఎంజేఎస్ఏ స్ఫూర్తికి అద్దం పడుతోంది. 2,224 హెక్టార్లలో విస్తరించి ఉన్న సరోద్లో 435 కుటుంబాలు ఉండగా.. గతంలో కేవలం 193 హెక్టార్లు మాత్రమే సాగయ్యేది. ఎంజేఎస్ఏలో భాగంగా ఇక్కడ 12 ఇంకుడు కుంటలు, 19 వ్యవసాయ కుంటలు నిర్మించడంతో సాగు స్వరూపమే మారిపోయింది. నీటి లభ్యత పెరగడంతో ఈ ఏడాది 328.99 హెక్టార్లలో పంటలు వేశారు. గతంలో నువ్వులు, జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి పంటల సాగుకు పరిమితం కాగా.. ప్రస్తుతం కొత్తిమీర, గోధుమ, పప్పుధాన్యాలు, కూరగాయలు, సోయా పంటల వైపు మొగ్గు చూపారు. బావులు, బోరు బావుల్లో పుష్కలంగా నీరు లభిస్తోంది. సరోద్తోపాటు ఝాలావాడ్ జిల్లాలోని రోజా, ఖేడ్లా, హర్నవాడ తదితర గ్రామాల్లోనూ జలకళ ఉట్టిపడుతోంది. ‘మొక్క’వోని దీక్షతో అంతా ఏకమై.. ఎంజేఎస్ఏ తొలి విడతలో 26 లక్షల మొక్కలు నాటారు. కాంటూరు గుంతలు, చెరువులు, కుంటల గట్లపై జట్రోపా (బయో ఫ్యూయల్), కలబంద, కానుగతోపాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటారు. ప్రతీ 150 నుంచి 200 మొక్కలకు ఒక సంరక్షకుడిని నియమించి.. ప్రతీ నెలా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వేతనం అందిస్తున్నారు. రెండో దశలో 70 వేల నుంచి కోటి మొక్కలు నాటి.. ఐదేళ్ల పాటు సంరక్షించేందుకు నిధులు కేటాయించారు. మరోవైపు సీఎం వసుంధర తన అరు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించగా.. విరాళాలు, శ్రమదానం రూపంలో ప్రజలు కూడా ఎంజేఎస్ఏలో భాగస్వాములయ్యారు. ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు రూ.55 కోట్లు, వివిధ వర్గాలు రూ.37 కోట్లు నిధులు సమకూర్చాయి. ఆర్మీ, పోలీసు, మీడియా సంస్థలు, మత సంస్థలు శ్రమదానంలో పాల్గొనడంతో పాటు.. లేబర్, జేసీబీ మెషీన్లు, డీజిల్, సిమెంట్, కాంక్రీట్ తదితరాల రూపంలో విరాళం ఇచ్చారు. భూమి ధరకు నాలుగింతల పరిహారం జల వనరుల అభివృద్ధి కోసం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములను సేకరిస్తున్నారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిహారాన్ని నిర్ణయిస్తుంది. భూమి ధరకు అదనంగా 3.5 నుంచి 4 రెట్లు పరిహారం ఇస్తుండగా.. ఇందులో 75 శాతాన్ని ముందే చెల్లిస్తున్నారు. భూమి స్వాధీనం చేసుకున్న తర్వాత చెల్లింపులకు 12 శాతం వడ్డీ ఇస్తున్నారు. పరిహారం తీసుకోని రైతులకు.. జల వనరుల్లో నీరు లేని సమయంలో సాగు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఒక్కో ఎకరాకు సగటున సుమారు రూ.8.05 లక్షల పరిహారం లభిస్తోంది. భూ సేకరణలో కోర్టు కేసులు, అభ్యంతరాలు రాలేదని అధికారులు చెప్పడం విశేషం. -
ఆకుపచ్చని సేద్య సౌధం!
నీటి వనరులు బాగా తక్కువగా ఉన్న చోట అందుకు తగిన చిరుధాన్య పంటలు పండించడం.. రసాయనిక సేద్యానికి బదులు ప్రకృతి వ్యవసాయం చేయడం.. పండించిన చిరుధాన్యాలను అలాగే అమ్మేకంటే అటుకులు చేయించి అమ్మడం.. ఇవన్నీ ఆరుగాలం చెమటను చిందించే రైతన్నకున్న విజ్ఞతకు నిదర్శనాలు. అటువంటి విజ్ఞత కలిగిన రైతు దంపతులు తలమంచి నరసారెడ్డి, శారద. పంట పొలంతో పశువులకు అనుసంధానం చేయడం ద్వారా తమ వ్యవసాయ క్షేత్రాన్ని కరువు కాలాల్లోనూ సస్యశ్యామలంగా మార్చుకున్న మార్గదర్శకులు ఈ ఆదర్శ రైతు దంపతులు.. ♦ మామిడి తోటలో చిరుధాన్యాల సాగు.. ♦ చిరుధాన్యాల కన్నా అటుకులు తినడం సులభం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో తలమంచి నరసారెడ్డి, శారద దంపతులు 21 ఎకరాల్లో ఆకుపచ్చని ఆశాసౌధాన్ని నిర్మించుకున్నారు. కాంట్రాక్టులు, వివిధ వ్యాపారాల్లో ఆటుపోట్లను చవిచూసిన నరసారెడ్డి పదిహేనేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లోనే నాలుగు ఆవులు, దూడలను తెచ్చి పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు వాటి సంఖ్య ఏభైకి చేరింది. ఆరు ఎద్దులు ఉన్నాయి. సొంత అరకలతోనే దుక్కి పనులు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న దగ్గరి నుంచి వీరి క్షేత్రం పచ్చగా మారిపోయింది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న నరసారెడ్డి, శారద మక్కువతో ప్రకృతి సేద్య జీవనం సాగిస్తున్నారు. 12 ఎకరాల్లో 18 ఏళ్ల నాటి సుమారు 500 మామిడి చెట్లున్నాయి. వాటి మధ్య చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల మిశ్రమ సేద్యం చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదన ద్వారా భూమిని సారవంతం చేస్తున్నారు. కొర్రలు, ఆరికలు, ఒరగలు, వివిధ రకాల జొన్నలు, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని అందిస్తున్నారు. సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని జీవామృతం తయారు చేసి.. మినీ ట్రాక్టర్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరంలో ఆర్ఎన్ఆర్15048, మరో ఎకరంలో సోనా మసూరితోపాటు ఇంకో అరెకరంలో నవర రకం సంప్రదాయ వరి వంగడాన్ని సాగు చేస్తున్నారు. సోనామసూరి నాట్లు వేశారు. మిగతా రెండు వరి వంగడాలను వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఏ యే పంటల పెరుగుదల తీరు, దిగుబడి తీరుతెన్నులను నిశితంగా పరిశీలించే నరసారెడ్డి ప్రయోగశీలి. రాగులు ఒక మడిలో ఏక పంటగా సాగు చేస్తూనే, మరో మడిలో నాట్లు వేసే పద్ధతిలో వేశారు. చిరుధాన్య పంటల సాగులో రాలిన విత్తనాలు మొలకెత్తుతుండటంతో వరుసగా 2-3 పంటలు తీస్తున్నారు. ఉదాహరణకు.. 2015 ఖరీఫ్లో 2 కిలోల కొర్రలు చల్లారు. అక్టోబర్లో పంట నూర్చారు. అదే పొలంలో విత్తనాలు చల్లకుండానే రాలిన కొర్రలే మళ్లీ మొలిచాయి. 2016 జనవరిలో కొర్ర పంట కోశారు. అదే భూమిలో ఏప్రిల్లో మళ్లీ కొర్ర పంటను కోశారు. బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేశారు. రోజుకు 40 కిలోల పేడ నీటిని పోస్తూ ఉంటారు. గ్యాస్ను వంటకు వాడుకోవడంతోపాటు 25 హెచ్పి డీజిల్ ఇంజిన్ను పాక్షికంగా గోబర్ గ్యాస్తో నడుపుతున్నారు. భూగర్భ జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతం అది. వర్షాలు కూడా తక్కువే. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం జియాలజిస్టును తీసుకొచ్చి బోర్లు ఎక్కడ వేయాలో చెప్పమన్నారు. ఆయన పొలమంతా కలియదిరిగి ఇక్కడ బోరు వేసినా నీటి చుక్క పడదు. సాగు మానెయ్యడం మేలని చెప్పి వచ్చిన దారినే వెళ్లిపోయాడు. అయితే, నరసారెడ్డి పొలం మధ్యలో నుంచి వెళ్తున్న చిన్న వాగుపై చెక్ డ్యాం నిర్మించి.. వాననీటిని ఒడిసిపడుతున్నారు. చెక్డ్యాం వద్దే బోరు వేశారు. ఒక బోరు రెండించుల నీరు పోస్తోంది. మరోచోట కూడా బోరు వేస్తే కొద్దిగా నీరు వస్తోంది. పరిమిత నీటి వనరులతోనే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. అనేక అవరోధాలను అధిగమించి సాగు చేసే చిరుధాన్యాలను హైదరాబాద్లో మిల్లుకు తీసుకెళ్లి అటుకులు పట్టించి, ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నారు. చిరుధాన్యాలు తినడం అలవాటు లేని వారు సైతం ఈ అటుకులను సులభంగా తినగలుగుతున్నారని, తమకు మంచి ఆదాయంతో పాటు చిరుధాన్యాల వాడకాన్ని పెంచుతున్నందుకు ఆనందంగా ఉందని నరసారెడ్డి, శారద తెలిపారు. తాము కూడా చిరుధాన్యాల అటుకులు, రాగి ముద్ద తింటున్నామన్నారు. ధాన్యాన్ని ముడిబియ్యం పట్టించి అమ్ముతున్నారు. తద్వారా రెట్టింపు ఆదాయం పొందుతున్నామని తెలిపారు. ఆవులతోపాటు కొన్ని గొర్రెలు, మేకలు, కోళ్లను సైతం పెంచుతున్నారు. పశువుల పేడ, మూత్రాన్ని వ్యవసాయానికి వాడుకుంటూనే అధికాదాయం పొందుతున్నారు. అన్నిటికన్నా మిన్నగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకుని తింటూ.. నలుగురికీ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తున్న నరసారెడ్డి, శారద (98480 25089) దంపతుల కృషి ప్రశంసనీయం. - సాగుబడి డెస్క్ -
‘హద్దు’లపై నిద్దరేల!
♦ చెరువుల సర్వే జాప్యంపై ఇంజినీర్లకు కలెక్టర్ అక్షింతలు ♦ సర్వేలో సహకరించడంలేదని తహసీల్దార్ల ఫిర్యాదు ♦ వారానికి 5-7 చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారించాలని ఆదేశం ♦ ఈ ఏడాది చివరినాటికి సర్వే పూర్తి చేయాల్సిందే ♦ ఈ వ్యవహారంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు ♦ హెచ్ఎండీఏ పరిధిలో సర్వే చేయాల్సినవి 385 ♦ ఇప్పటివరకు 38 చెరువులకు మాత్రమే మోక్షం నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంపై జిల్లా యంత్రాంగం కన్నెర్రజేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల సర్వే ప్రక్రియ నత్తనడకన సాగడంపై ఆగ్రహించింది. చెరువుల ఎఫ్టీఎల్ (హద్దు) నిర్ధారణకు సంబంధించిన సర్వే నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు సంస్థ సహా ఇంజినీరింగ్ అధికారులకు అక్షింతలు వేసింది. వర్షాకాలం వచ్చినా సర్వే పనులు పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రఘునందన్రావు.. ప్రతివారం 5-7 చెరువులను సర్వే చేసి ఎఫ్టీఎల్ను గుర్తించాలని నిర్దేశించారు. ఈ మేరకు 12 మంది నీటిపారుదల /హెచ్ఎండీఏ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. వీరిలో డిప్యూటీ ఈఈ మొదలు ఎస్ఈ వరకు ఉన్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని జలవనరులను పరిరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కబ్జాకోరల్లో చిక్కుకున్న ఈ చెరువులకు ఎఫ్టీఎల్ బోర్డులను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు ఇరిగేషన్, ప్రైవేటు కన్సల్టెన్సీకి సర్వే పనులు అప్పగించింది. స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. సర్వేకు నోచుకున్నవి కొన్నే.. హెచ్ఎండీఏ పరిధిలో 385 చెరువులను సర్వే చేయాలని ప్రణాళిక తయారు చేసింది. వీటిలో ఇప్పటివరకు 38 చెరువులకు మాత్రమే మోక్షం కలిగింది. వీటి సర్వే ప్రక్రియ పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు హద్దురాళ్లను ప్రకటించారు. మిగతావాటిలో కేవలం 55 చెరువులకు సంబంధించిన సమాచారం స్థానిక తహసీల్దార్లకు పంపారు. ఈ నేపథ్యంలో చెరువుల ఎఫ్టీఎల్ గుర్తింపుపై జరిగిన సమావేశంలో నీటిపారుదలశాఖ అధికారుల వ్యవహారశైలిపై తహసీల్దార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చెరువుల సర్వేపై ఇరిగేషన్ ఇంజినీర్లు, ఆర్వీ అసోసియేట్స్ ప్రతినిధులు సహకరించడంలేదని మొర పెట్టుకున్నారు. ఈ పరిణామంతో అవాక్కయిన కలెక్టర్ రఘునందన్రావు చెరువుల సర్వేపై డెడ్లైన్ విధించారు. ఈ ఏడాది చివరికల్లా సర్వే ప్రక్రియ పూర్తి చేసి హద్దులను ప్రకటించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా సర్కారీ శిఖం భూములను కూడా గుర్తించాలని నిర్దేశించారు. ప్రతివారం ఐదు నుంచి ఏడు చెరువులను సర్వే చేయాలని, శేరిలింగంపల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏదైనా మండలంలో 50-100 చెరువులుంటే అదనంగా ఏఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చెరువుల సంరక్షణకు ఉద్దేశించిన ఈ సర్వేను ఆషామాషీగా తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని, నిర్దేశించిన పరిమితి మేరకు ప్రతివారం తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. -
బెంగళూరు డెడ్ సిటీ!
♦ ఐదేళ్లలో కాంక్రీటు అరణ్యంగా మారనున్న ఉద్యాన నగరి ♦ పెరుగుతున్న భవనాలు, తరుగుతున్న నీటివనరులు బెంగళూరు: పచ్చని చెట్లు, కనువిందైన పార్కులు, చెరువులతో కళకళలాడే ఉద్యాననగరి, సిలికాన్ సిటీ బెంగళూరు వచ్చే ఐదేళ్లలో మొత్తం కాంక్రీటు కీకారణ్యంగా మారి, మృతనగరమైపోనుందా? నగరంలోని చెట్టూచేమా, ప్రాణాధారమైన నీటివనరులు మాయమైపోయి నివాసానికి ఏమాత్రం పనికిరాకుండా పోనుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అవుననే అంటున్నారు! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్సీ) అధ్యయంలో ఇలాంటి మరెన్నో చేదు నిజాలు వెలుగు చూశాయి. మతిలేని అభివృద్ధి..: ఐఐఎస్సీ అధ్యయనం ప్రకారం.. నగరంలో భవనాలతో కూడిన ప్రాంతం గత 40 ఏళ్లలో 525 శాతం పెరిగింది. చెట్టుచేమల ప్రాంతం 78 శాతం తగ్గిపోయింది. జలవనరులు 79 శాతం తగ్గాయి. ‘ఇదంతా మతిలేని, ముందుచూపులేని అభివృద్ధి. ప్రణాళికలేని పట్టణీకరణ వల్ల బెంగళూరు వచ్చే ఐదేళ్లలో నివాసయోగ్యం కాకపోవడంతోపాటు మృతనగరం(డెడ్ సిటీ)గా మారనుంది. ప్రైవేటు డెవలపర్లు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. నగరంలో 15 నుంచి 20 శాతం ఖాళీస్థలం ఉండాలన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారు’ అని ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ ఎకలాజికల్ సెన్సైస్కు చెందిన ప్రొఫెసర్ రామచంద్ర తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలని, భవన నిర్మాణాలను తగ్గించేందుకు.. కొత్త పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదని సూచించారు. రాజకీయ నాయకులకు బీడీఏ వత్తాసు బెంగళూరు అభివృద్ధి సంస్థ(బీడీఏ) రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం భూములను పందేరం చేస్తోందని, దీంతో భవన నిర్మాణాలు విపరీతంగా పెరిగి, పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ‘ప్రస్తుత అభివృద్ధి పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూమి, నీటిపై సరైన విధానం లేదు. భూమిని రాజకీయనేతలు వాళ్ల ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని పర్యావరణవేత్త ఎల్లప్పరెడ్డి చెప్పారు. 40 వేల ఎకరాల ఖాళీ స్థలంలో పార్కులు,నీటి వనరులను ఏర్పాటు చేయాలన్నారు. -
ఎవరితోనూ లడాయి వద్దు
ఇరుగుపొరుగుతో కూర్చొని మాట్లాడుకొని ముందుకెళదాం గొడవలతో ఒరిగేది ఏమీ ఉండదు నదీజలాలపై నేనే చొరవ తీసుకుంటా: కేసీఆర్ బాబుతో మాట్లాడతా.. మహారాష్ట్రతో మాదిరిగానే ఏపీతో వ్యవహరిస్తాం పోలవరం మీద పట్టింపు అవసరం లేదు గోదావరిలో పుష్కలంగా జలాలు భద్రాచలం దిగువన నీటిని వారే వాడుకోవచ్చు ఏ రాష్ట్రమైనా రైతులు బాగుపడాలని వ్యాఖ్య ప్రజెంటేషన్ను బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ 2 గంటల 50 నిమిషాల పాటు ప్రసంగం సాక్షి, హైదరాబాద్: జలాల విషయంలో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రతో వ్యవహరించిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్తోనూ వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తానే చొరవ తీసుకొని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును కలుస్తానని.. ఏ రాష్ట్రమైనా రైతులు బాగుపడాలని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో తన ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘చండీయాగం చేసిన సమయంలో అమరావతికి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుని కలిశా. ఆయన నాకు మిత్రుడే. అక్కడున్న వారు తెలుగు ప్రజలే. ఒకరి నోరుకొట్టి బ్రతికే స్వభావం మాది కాదు. బతుకు, బతికించు అనే నైజం తెలంగాణ ప్రజలది. నైసర్గికంగా కలిసుండేవాళ్లం. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అప్పుడే ఆయనతో మాట్లాడిన. పోలవరం మీద ఎలాంటి పట్టింపుల్లేవు. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల సరాసరి లభ్యత ఉంటే... పోలవరం వద్ద 2,631.1 టీఎంసీల లభ్యత ఉంది. కాళేశ్వరం వద్ద రోజుకు 3 టీఎంసీల చొప్పున 5 నెలల పాటు అంటే 150 రోజులు నీటిని తెలంగాణ తీసుకున్నా 450 టీఎంసీలకు మించదు. ఒకవేళ వెయ్యి టీఎంసీలు తీసుకున్నా ఇంకా 1,600 టీఎంసీలు ఏపీ వినియోగించుకోవచ్చు. తెలంగాణలో భద్రాచలం దాటితే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేదు కాబట్టి ఏపీనే వాడుకోవాలి. ఆ నీటిని తీసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. ఆ నీటిని కుడివైపు నాయుడుపేట, శ్రీకాళహస్తి వరకు ఎడ మ వైపు వైజాగ్ వరకు, అదేరీతిన రాయలసీమకు నీళ్లు ఇవ్వవచ్చని చంద్రబాబుకు చెప్పిన. దానిపై వెంటనే స్పందించి వ్యాప్కోస్కు సర్వే బాధ్యతలు ఇచ్చారని తెలిసింది. పొరుగు రాష్ట్రాలతో కలహించుకోవడం కాకుండా కలసి సాగుతాం. చిల్లరమల్లర గొడవలొద్దు. అసెంబ్లీ తర్వాత నేనే చొరవ తీసుకుని చంద్రబాబును కలుస్తా. ప్రజెంటేషన్ పెన్డ్రైవ్ను కూడా సభ ముగిశాక పంపిస్తా..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నేనేసినన్ని నాణాలు ఎవరేయలే.. తెలంగాణ పంటలను తడపాలని ఉద్యమ సమయం నుంచే కృష్ణా, గోదావరి తల్లులను మొక్కుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా తన కారు డ్రైవర్ బాలయ్య, నాణాల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నాకు సిద్దిపేటకు చెందిన బాలయ్య డ్రైవర్గా ఉండేవాడు. ఇరైవె ఏళ్ల నుంచే ఆయన నాకు డ్రైవర్. ఎప్పుడు పర్యటించినా బాలయ్య తన దగ్గర రూపాయి నాణాలు పెట్టుకునేవాడు. కృష్ణా, గోదావరి నదులను ఎప్పుడు దాటినా నాణాలను నదిలో వేసేవాళ్లం. అలా రాష్ట్రంలో నేనేసినన్ని నాణాలు ఎవరూ వేసి ఉండరు. నదుల్లో నాణాలు వేయడం తెలంగాణలో గొప్ప సంస్కారం. నాణాలు వేసిన ప్రతిసారీ తల్లి గోదావరీ, తల్లి కృష్ణమ్మా మా బీళ్లకు ఎప్పుడు వస్తావమ్మా అనే దండం పెట్టేవాడిని..’’ అని చెప్పారు. బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ సీఎం ప్రజెంటేషన్ను కాంగ్రెస్, టీడీపీలు బహిష్కరించాయి. ప్రజెంటేషన్ను బహిష్కరిస్తామని కాంగ్రెస్ బుధవారం రాత్రే వెల్లడించగా... హాజరుకారాదని టీడీపీ గురువారం ఉదయం నిర్ణయించుకుంది. ప్రజెంటేషన్కు ముందు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ సభ్యులు సభలోనే ఉన్నప్పటికీ తర్వాత వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్, టీడీపీల వైఖరిపై సీఎం కేసీఆర్ తన ప్రజెంటేషన్ చివరలో మండిపడ్డారు. ఏ భేషజాలకు పోయి, ఎవరి క్షేమం ఆశించి సభకు దూరంగా ఉన్నారో కాంగ్రెస్, టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తానెవరినీ నిందించలేదని, ఎవరినీ తప్పుపట్టలేదని స్పష్టం చేశారు. జరిగిన తప్పిదాలు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుతున్నామో చెప్పామని... అది వినకుండా అసెంబ్లీ నుంచి పారిపోయారని విమర్శించారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు, కోర్టుల్లో పిల్ వేస్తున్నారు. ప్రాణహితపై సైతం పిల్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుహనా మేధావులను తయారు చేసి ప్రజలను అయోమయం చేయవద్దు..’’ అని మండిపడ్డారు. తమకు ఎవరితోనూ పంచాయతీ వద్దని, పొలాలకు నీళ్లు పారితే చాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించి కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. 2 గంటల యాభై నిమిషాల ప్రసంగం నీటి పారుదల రంగంపై సీఎం కేసీఆర్ శాసనసభలో రెండు గంటల యాభై నిమిషాల పాటు ప్రసంగించారు. 1956 నుంచి సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో వినియోగం, ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యాలపై తొలి 45 నిమిషాల పాటు తన స్థానంలో నిలబడి మాట్లాడారు. 12.20 గంటల సమయంలో స్క్రీన్ల ద్వారా తన ప్రజెంటేషన్ను సీఎం ప్రారంభించారు. మధ్యలో కొన్ని అంశాలను వివరించాల్సి వచ్చినప్పుడు ఒకట్రెండు నిమిషాలు లేచి నిల్చుని మాట్లాడారు. మిగతా సమయమంతా కూర్చుని తన ముందున్న కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తూ వివరణ ఇచ్చారు. 2.35 గంటలకు ప్రజెంటేషన్ను ముగించారు. ఎమ్మెల్సీలకు సీఎం క్షమాపణ సీఎం ప్రజెంటేషన్ సందర్భంగా మండలి సభ్యులు శాసనసభ గ్యాలరీలో కూర్చుని వీక్షించారు. ప్రజెంటేషన్ పూర్తయ్యాక సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పారు. ఎమ్మెల్సీలు శాసనసభలో కూర్చోవడం రాజ్యాంగ నియమాల ప్రకారం చెల్లదని.. అందువల్ల గ్యాలరీలో కూర్చోబెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు లోక్సభ సభ్యుడిగా తాను సైతం ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీక్షించానని గుర్తుచేశారు. పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. -
దేశంలో 7.6 కోట్ల మందికి క‘న్నీరు’!
సురక్షిత నీరందని వారు భారత్లోనే అధికం కొచ్చి/న్యూఢిల్లీ: ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేక అత్యధిక మంది ఇబ్బందులు పడుతున్నది భారత్లోనే అన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్లో 7.6 కోట్ల మంది ప్రజలకు మంచినీరు అందుబాటులో లేదు. టాప్ 10 జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత చైనా, నైజీరియా ఉన్నాయని వాటర్ఎయిడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. పాక్ పదో స్థానంలో నిలిచింది. మంచి నీటి కోసం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొందని, నీటి వనరుల అస్తవ్యస్త నిర్వహణే దీనికి ప్రాథమిక కారణమని తేల్చింది. ప్రాజెక్టుల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడమో లేదా పైపులైన్లు లేకపోవడం వల్లనో ప్రజలకు నీరు అందడం లేదని పేర్కొంది. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. భారత్లో సురక్షిత నీరు లేక బాధపడుతున్న వారిలో అత్యధిక మంది రోజువేతనం రూ.300 కన్నా తక్కువగా ఉందని, వారు ట్యాంకర్ నుంచి నీటిని కొనాలంటే లీటర్కు ఒక రూపాయిపైనే వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తోందని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కనీస వేతనం పొందుతున్న వారికి నీటి వ్యయం లీటర్కు 0.1 శాతం ఉండగా, అది భారత్ లాంటి దేశాల్లో 17 శాతం వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 85 శాతం మందికి జలాశయాలు తాగునీటిని అందిస్తున్నా, 56 శాతం మందికి మాత్రమే అందుతోందని పేర్కొంది. -
తేలనున్న ‘కృష్ణా’ లెక్క!
♦ నీటి వినియోగ వివరాలు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను కోరిన బోర్డు ♦ బేసిన్ నుంచి చిన్ననీటి వనరులకు మళ్లించిన జలాలపైనా దృష్టి ♦ నాగార్జునసాగర్ ఆర్నెల్ల లెక్కలను సమర్పించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాల నీటి వినియోగ లెక్కలు తేల్చేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు సిద్ధమైంది. వర్షాకాలం దాదాపుగా ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు బేసిన్లోకి వచ్చిన నీరు, ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలపై అంచనాకు రావాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు కాలువల ద్వారా తరలించిన నీటి వివరాలను ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశిం చింది. ఇక కృష్ణా పరీవాహకంలోనే ఉత్పత్తయి, చిన్న నీటి వనరులకు మళ్లించిన జలాల డేటాను కూడా అందజేయాలని కోరింది. వివాదాలు రావొద్దనే.. కృష్ణా నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలున్న విషయం తెలిసిందే. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఉన్నాయి. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. బచావత్ అవార్డులోని క్లాజ్-15 మేరకు గుండుగుత్తగా జరిపిన కేటాయింపులను (ఎన్బ్లాక్ కేటాయింపులు) రాష్ట్ర సరిహద్దుల లోపల ఎక్కడైనా వాడుకోవచ్చని తెలంగాణ చెబుతోంది, ఆ మేరకే నీటిని వాడుకుంటోంది. అసలు కోయల్సాగర్ (3.90 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), జూరాల (17.84 టీఎంసీలు), చిన్న నీటి వనరులు (26.79 టీఎంసీలు), తాగునీటి అవసరాలు (2.40 టీఎంసీలు)సహా మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు కలిపి 78 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ప్రాజెక్టులు పూర్తికాని కారణంగా ఇందులో కేవలం 10 నుంచి 20 టీఎంసీలనే తెలంగాణ వినియోగించుకుంటోంది. మిగతా వాటా నీటిని రాష్ట్ర పరిధిలోని నాగార్జునసాగర్ నుంచి వినియోగించుకునే హక్కు తమకు ఉందని పేర్కొంటోంది. దీనిని తొలుత ఏపీ తీవ్రంగా వ్యతిరేకించినా... జూలైలో జరిగిన ఒప్పందం మేరకు గుండగుత్తగా ఎక్కడైనా వాడుకునేందుకు అంగీకరించింది. అయితే ఈ విధానం కేవలం ఆ ఒక్క వాటర్ ఇయర్ (అక్టోబర్ వరకు) ముగిసేదాకానే పరిమితమని... తదుపరి దీనిపై చర్చిద్దామని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సాగర్లో నీటి వినియోగ వివరాలు, గత రెండేళ్లలో చిన్న నీటి వనరుల కింద జలాల వినియోగ వివరాలను కోరింది. ముందు ముందు ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదనే ఈ డేటాను కోరినట్లు తెలియజేసింది. ఈ ఏడాది తక్కువే.. కృష్ణా బేసిన్లోని కే7, కే10, కే11, కే12 సబ్ బేసిన్ల పరిధిలో ఉన్న చిన్న నీటి వనరుల కింద రాష్ట్రానికి సుమారు 97 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఇవన్నీ పరీవాహకంలో కురిసే వర్షాలతో ఏర్పడే ప్రవాహాలే. గతేడాది చిన్ననీటి వనరులకు సుమారు 60 టీఎంసీల మేర ప్రవాహాలు వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇవే బేసిన్లలో ఏపీలో మరో 8 టీఎంసీల వరకు నీరు చేరింది. అయితే ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చిన్న నీటి వనరుల కింద వచ్చిన నీరు 15 నుంచి 20 టీఎంసీలను మించదని అధికారులు చెబుతున్నారు. ఇక నాగార్జునసాగర్లోకి ఈ సీజన్లో వచ్చిన మొత్తం జలాలు 10 టీఎంసీలను మించలేదు. ఈ నీరంతా తాగు అవసరాలకే సరిపోగా.. సాగుకు నీరు అన్న మాటే లేదు. కేవలం శ్రీశైలానికి మాత్రమే 60 టీఎంసీల నీరు వచ్చింది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు కోరినప్పుడల్లా అవసరాన్ని బట్టి విడుదలకు అనుమతిస్తోంది. ఇటీవలే 7 టీఎంసీలు ఏపీకి, 2 టీఎంసీలు నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు కేటాయించింది. -
బృందా‘వనాలు’..!
- మొక్కలు నాటేందుకు 25 చెరువుల ఎంపిక - పచ్చదనంపై హెచ్ఎండీఏ దృష్టి - ‘ఔటర్’లో పూర్తయిన ‘హరిత హారం’ సాక్షి, సిటీబ్యూరో: జల వనరుల వద్ద పచ్చదనం పెంపునకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. తొలిదశలో 25 చెరువుల వద్ద మొక్కలు నాటి ‘వనదుర్గాన్ని’ ఆవిష్కరించేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం సిద్ధమవుతోంది. గత నెల వరకు వర్షాలు లేని కారణంగా ఆగిపోయిన ‘హరిత హారం’ మళ్లీ ఊపందుకొంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హరితహారాన్ని పూర్తి చేసిన అధికారులు ఇప్పడు చెరువుల వద్ద పచ్చదనాన్ని పెంచడంపై దృష్టి పెట్టారు. ‘త్రి సూత్రం’తో... చెరువుల ఆక్రమణల నిరోధం, బండ్స్ సుందరీకరణ, బఫర్ జోన్లో చె ట్ల అభివృద్ధి అనే‘త్రి సూత్ర’ విధానంతో అధికారులు ముందుకెళుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం ప్రారంభించి... అక్టోబరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. టార్గెట్ 40 లక్షలు ‘తెలంగాణ కు హరిత హారం’ పథకంలో ఈ ఏడాది 395 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 40 లక్షల మొక్కలు నాటాలనేది హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం లక్ష్యం. ఇందులో భాగంగా రూ.1.5 కోట్లతో నర్సరీలు ఏర్పాటు చేసి... ఇటీవల ఔటర్ చుట్టూ, 19 జంక్షన్లు, 3 రేడియల్ రోడ్లు, ఖాళీ స్థలాలు, గ్రామాలు, స్కూళ్లు, ఆస్పత్రుల వద్ద సుమారు 9 లక్షల మొక్కలు మొక్కలు నాటారు. మరో 5-6 లక్షల మొక్కలను వివిధ ప్రభుత్వ శాఖలకు ఉచితంగా అందించారు. తాజాగా ఎంపిక చేసిన 25 జలాశయాల వద్ద 10-15లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ‘పచ్చ’లహారం ఔటర్ చుట్టూ గ్రీనరీని అభివృద్ధి చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. ఆ మేరకు ఔటర్ మెయిన్ క్యారేజిలోని రోడ్ మీడియన్, రైల్వే కారిడార్, సర్వీసు రోడ్లు, ఇంటర్ ఛేంజెస్లో పూల మొక్కలు, ఫలసాయాన్నిచ్చే వృక్ష జాతులు నాటినట్టు అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్ స్వర్గం శ్రీనివాస్ తెలిపారు. ‘హరితహారం’ కింద హెచ్ఎండీఏకు ఈ ఏడాది రూ.50 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని... వాటిలో రూ.25 -30 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆయన ‘సాక్షి’కి వివచించారు. మిగిలిన నిధులతో వచ్చే ఏడాది పెద్ద మొత్తంలో మొక్కలను నాటి నగరాన్ని వనదుర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. -
ఇదేం తీరు(వా)
- అన్నదాతపై నీటితీరువా పిడుగు - అమాంతం రెట్టింపయిన పన్ను - అధికారుల వద్ద గత లెక్కలు లేని వైనం - పక్కదారి పడుతున్న వసూలు - లెక్కాజమా లేని తీరు సాక్షి, విశాఖపట్నం: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. పుట్టెడుకష్టాల్లో ఉన్న వీరిపై నీటితీరువా పెంచుతూ ఇటీవల సర్కార్ తీసుకున్న నిర్ణయం గుది బండగా మారుతోంది. జిల్లాలో 6,98,702 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ భూమిలో సాగునీటి వనరులు కింద 2,83,412 ఎకరాల భూమి సాగవుతుంటే, మరో 4,36,132 ఎకరాల భూమి పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగవుతుంది. జిల్లాలో మేజర్ అండ్ మీడి యం ఇరిగేషన్ ప్రాజెక్టులైన తాండవ కింద 51,465, రైవాడకింద15,344, కోనాం కింద 12,628, పెద్దేరు జలాశయం కింద 19,969 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే వంద ఎకరాలకు పైబడిన ఆయకట్టు ఉన్న 236 మీడియం ఇరిగేషన్ టాంక్స్ (చెరు వులు) కింద మరో 59వేలఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నీటితో పంటలు పండించు కున్న రైతులు ప్రభుత్వానికి నీటితీరువా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద ప్రాజెక్టుల కింద పంటలు పండించుకునే రైతులు వరికైతే ఎకరాకు ఏడాదికి ఒక పంటకు రూ.200,చెరువుల కింద రూ.100 చొప్పున, అదే చెరకుకైతే ఎకరాకు రూ.350 చొప్పున వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో చెరువులు, చిన్న, మధ్యతరహా నీటి వనరుల కింద సాగయ్యే లక్షా 80వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీటి తీరువా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.2.25కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఏటా కోటి మాత్రమే వసూలవుతుందని అధికారులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో రావాల్సిన నీటి తీరువా ఏకంగా రూ.21కోట్లకు పైగా పేరుకుపోయిందని అధికారిక అంచనా. వాస్తవంగా క్షేత్ర స్థాయి సిబ్బంది మాత్రం నీటి తీరువాను వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఉజ్జాయింపుగా చెప్పడమే తప్ప ఏ మండల పరిధిలో డిమాండ్ ఎంత? ఎంత వసూలైంది.? ఎంత బకాయి ఉందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ప్రభుత్వం నీటి తీరువా రెట్టింపు చేసింది. ప్రస్తుత డిమాండ్ రూ.2.25 కోట్లు నాలుగున్నర కోట్లకు చేరుకోనుంది.పెట్టుబడి వ్యయంతో భారం గా మారినసాగు చేయలేక తల్లడిల్లుతున్న రైతులపై నీటితీరువా భారం కానుంది. ఖరీఫ్ సీజన్ నుంచే నీటితీరువా పెంపు అమలులోకి రానుం డడంతో పెరగనున్న భారంతో పాటు పాత బకాయిలను కూడా సీజన్ పూర్తయ్యేలోగా వసూలు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా నీటితీరువా బకాయిల జాబితాలను సిద్దం చేయాలని తహశీల్దార్లను జేసీ ఆదేశించారు. నీటితీరువా పెంచడం సరికాదు తిమ్మరాజుపేటలో నాకు ఎకరంన్నర వరి ఉంది. ఏటా నీటితీరువా ఎకరాకు రూ.300 చెల్లిస్తున్నాను. గత ఆరేళ్లుగా అధికారులు నీటితీ రువా సక్రమంగా వసూలు చేయ డం లేదు. ప్రభుత్వం సాగునీటి సమస్యలు పట్టించుకోకుండా నీటితీరు వా పెంచడం సరికాదు. రైతులు మరింత ఇబ్బంది పడ తారు. -భీమరశెట్టి గణేష్నాయుడు, వ్యవసాయరైతు, తిమ్మరాజుపేట కాలువలు బాగు చేయకుండా పెంపా సాగునీటి ఇబ్బందులను పట్టించుకోని ప్రభుత్వం నీటి తీరువాను పెంచడం సరికాదు. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనిలో వరి, చెరకు పంటలు పండిస్తున్నాను. వరికి ఎకరానికి రూ.100, చెరకుకు రూ.350 చెల్లిస్తున్నా. కాల్వలు పూడికతో ఉండటం వల్ల సక్రమంగా నీరు అందకపోయినా ప్రతీఏటా నీటితీరువా చెల్లిస్తున్నా. -వెలగా రమణ, రైతు, జి.కోడూరు, మాకవరపాలెం మండలం -
‘నీరు-చెట్టు’ను ఉద్యమంలా చేపట్టండి
చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జెడ్పీ చైర్పర్సన్ ఎస్.గీర్వాణి కోరారు. ఆమె శనివారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులను అభివృద్ధి చేసుకోవాలని రైతులను కోరారు. ఆదిశగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు క్షేత్రస్థాయిలో శ్రద్ధ వహించి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకుని పొ లాలకు లింక్రోడ్లు నిర్మించుకోవాలని ఆమె తెలిపారు. ప్రతి జాబ్కార్డుదారుని కి కచ్చితంగా 100 రోజులు పని కల్పిం చేలా డ్వామా అధికారులు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మామిడి పంట ఎగుమతులకు అనుకూలంగా ఉందని, తద్వారా రైతు లు ఆర్థికంగా పరిపుష్టిని పొందాలని కోరారు. సాగునీటి వనరులు పుష్కలం గా లేని మెట్టభూముల్లో ఉపాధి పథకం ద్వారా మామిడి మొక్కలు నాటుకుంటే ప్రభుత్వం ఎకరాకు రూ. 1.35లక్షలు చొప్పున మూడెకరాలకు గరిష్టంగా రూ.4.05లక్షలు చెల్లిస్తుందన్నారు. దేశీ య మార్కెట్లో గిరాకీ ఉన్న జామ మొక్కల పెంపకంపై సన్నకారు రైతులు మక్కువ చూపాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు సత్వరమే చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరుగుదొడ్ల నిర్మాణాలు ముందుకు సాగవని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు అవరమైన ప్రతిచోట నిధులు విరివిగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా జీపీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. -
‘నీటి’ ప్రత్యామ్నాయాలపై సమీక్ష
- ఏర్పాటు చేయనున్న సీఎం ఫడ్నవీస్ - నీటి ఎద్దడిపై చర్చించాలని నిర్ణయం ముంబై: రాష్ట్రంలో కరవు పరిస్థితిని తట్టుకునేందుకు నీటి వనరుల ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తారస్థాయికి చేరడంతో నీటి వనరులు, రెవెన్యూ, ఫైనాన్స్ శాఖల అధికారులలో సీఎం సమావేశం ఏర్పాటు చేసి నీటి ఎద్దడి తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరవు పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కేంద్రం చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియ దీర్ఘకాలిక ప్రాజెక్టు అని, ప్రభుత్వం సత్వర ప్రత్యామ్నాయాల కోసం ఆలోచిస్తోందని ఆయన అన్నారు. ఇందుకోసం కొంకణ్ తీరం నుంచి నీటిని రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నామన్నారు. విద్యాపథకాల అమలుపై ప్రభుత్వ దృష్టి కేంద్రం ప్రవేశ పెట్టిన విద్యా పథకాలను జిల్లాల్లోని పాఠశాలల్లో అమలుచేసి విద్యార్థుల పని తీరును పరీక్షించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కమిటీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లా పరిషత్, ప్రైమరీ, సెకండరీ విద్యాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విద్యా కమిటీ అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని ఆయన అన్నారు. సీనియర్ లోక్సభ సభ్యుడు ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారన్నారు. విద్యార్థుల ప్రతిభ, పనితీరు, వివిధ విద్యాపథకాల అమలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. -
నదుల అనుసంధానం... ఆచరణ సాధ్యమేనా?
జలం లేనిదే జనం లేరన్నది జగమెరిగిన సత్యం. భూగ్రహంపై మానవాళి మనుగడకు మూలాధారం నీరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ నీటిలో మనకు ఉపయోగపడేది కేవలం ఒక శాతం మాత్రమే. అది కూడా అందరికీ అందుబాటులో లేదు. ఇక మన దేశం విషయానికి వస్తే... నదీమతల్లులకు నెలవైనా ఆ నీటి గలగలలను ఒడిసిపట్టడంలో విజయం సాధించలేక పోతున్నాం. అయితే అతివృష్టి... లేదంటే అనావృష్టి.. ఇదీ మన దురవస్థ. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే నదుల అనుసంధానమే సరైన పరిష్కార మార్గమంటూ గత కొన్నేళ్ల నుంచి పాలక పెద్దల నోట వినిపిస్తున్నా ఇప్పటికీ కార్యాచరణ దిశగా అడుగు పడలేదు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మరోమారు నదుల అనుసంధాన రాగం ఆలపించడంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. గాలి తర్వాత.. అత్యంత ముఖ్యమైన సహజ వనరు నీరు. ఇది ప్రాణికోటికి ఆధారం. ప్రపంచ జనాభాలో రెండో పెద్ద దేశమైన భారత్లో నీటి వనరుల ప్రాధాన్యాన్ని ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం నూతన జాతీయ జల విధానం రూపొందించింది. అందులో భాగంగా భారత జాతీయ జలాభివృద్ధి వ్యవస్థ (ఇండియాస్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) నదుల అనుసంధానాన్ని సిఫారసు చేసింది. ఇది బృహత్తర ప్రణాళిక. ఆర్థిక, ఆర్థికేతర వనరుల వినియోగంతో పాటు సాంకేతిక, నిర్వహణ కార్యకలాపాలకు ఇదొక పెద్ద సవాలు. దక్షిణాదిన, పశ్చిమాన నిరంతరం సంభవించే నీటి ఎద్దడిని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి ఉద్దేశించిన యజ్ఞమే నదుల అనుసంధానం. ఈ ప్రక్రియలో 30 పెద్ద నదుల అనుసంధానం జరుగుతుంది. అతిపెద్ద జలాభివృద్ధి పథకం భారతదేశంలో రెండు పెద్ద నదులైన గంగా, బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహాన్ని అనుసంధానం ద్వారా మళ్లించడం జరుగుతుంది. ఇది పూర్తి రూపం దాల్చితే ప్రపంచంలోనే అతి పెద్ద జలాభివృద్ధి పథకం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. దీనికి 2002 సంవత్సర ధరల సూచీ ప్రకారం 123 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ బృహత్తర ప్రణాళిక విజయవంతంగా అమలైతే...దారిద్య్ర నిర్మూలన, జీవన ప్రమాణాల పెరుగుదల, ప్రాంతీయ అసమానతలు తగ్గడం, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతలు మెరుగుపడడం లాంటి శుభ పరిణామాలు సాకారమవుతాయి. రెండో శతాబ్దంలోనే... నదుల అనుసంధాన ప్రక్రియ ఈనాటిదేమీ కాదు. వ్యవ సాయమే ప్రధాన వృత్తిగా ప్రారంభమైన నాటి నుంచి స్థానిక అవసరాలకు అనుగుణంగా కాలువల మీద ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసి ఎద్దడి సమయాల్లో వినియోగించుకునేవారు. మన దేశంలో రెండో శతాబ్దంలో కావేరి నదిపై కట్టిన పెద్ద ఆనకట్ట 19వ శతాబ్దం మధ్య వరకు 25 వేల హెక్టార్ల సాగుకు నీటిని అందించింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, కాకతీయులు.. కావేరి, తుంగభద్ర, వైగాయ్ నదీ జలాలను మళ్లించి వ్యవసాయానికి నీటి సరఫరా చేశారు. మొఘల్ సామ్రాజ్య కాలంలో పశ్చిమ యమున, ఆగ్రా కాలువలు తవ్వించారు. బ్రిటీషువారి హయాంలో ఆధునిక నీటి పారుదల పితామహుడైన సర్ ఆర్థర్ కాటన్.. కృష్ణ, గోదావరి నదులపై ఆనకట్టలు కట్టించారు. ప్రస్తుతం తెలుగుగంగ ప్రాజెక్టు కృష్ణా నదీ జలాలను చెన్నై పట్టణానికి అందిస్తుంది. ఆలోచనకు ఆద్యుడు... కె.ఎల్.రావు సుప్రసిద్ధ ఇంజనీర్, ఇందిరా గాంధీ కేబినెట్ మంత్రి డా.కె. ఎల్.రావు 1972లో నదుల అనుసంధాన ఆవశ్యకతను ప్ర స్తావించారు. కాలువల హారాన్ని (గార్లాండ్ కెనాల్స్) రెండు ప్రాంతాల్లో నిర్మించాలని (ఒకటి.. హిమాలయ పరీవాహక ప్రాంతానికి, రెండోది పశ్చిమ కనుమల ప్రాంతానికి) కెప్టెన్ దిన్షా దస్తూర్ సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా నదీజలాల అనుసంధానాన్ని సమర్థించారు. పాశ్చాత్య దేశాల్లోనూ ఐరోపా, ఉత్తర అమెరికాలో నదుల అనుసంధాన ప్రక్రియ లు జరిగాయి. యూరప్ కాలువ(రైన్-డాన్యూబ్ కాలువ).. 1992లో పూర్తయింది. ఇది ఉత్తర సముద్రాన్ని అట్లాంటిక్ మహా సముద్రంతో కలుపుతుంది. ఈ కాలువ ద్వారా నౌకాయానం కూడా జరుగుతుంది. వ్యవసాయానికి, పారిశ్రామిక అవసరాలకు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఈ కాలువ ఉపయోగ పడుతుంది. అమెరికాలో ఇల్లినాయ్ నదీ మార్గం, టెన్నిసి-టామ్ బిగ్ బి నదీ మార్గం, గల్ఫ్ తీర ప్రాంత నదీ మార్గాలూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఫ్రాన్స్లోని మార్ని-రైన్ కాలువ నదీ అనుసంధానాలకి ఉదాహరణ. నదుల అనుసంధానం - ప్రయోజనాలు 1. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయోత్పత్తి 100 శాతం పెరుగుతుంది. దుర్భిక్షం తలెత్తకుండా అడ్డుకట్ట వేయవచ్చు. 2. ఆయిల్ దిగుమతిని తగ్గించుకోవచ్చు. దీని ద్వారా విలువైన విదేశ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. 3. ఆహార స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా దేశ భద్రతను పటిష్ట పరచవచ్చు. 4. రాబోయే పదేళ్లలో 10 లక్షల మందికి జీవనోపాధి కల్పించవచ్చు. 5. ఉత్తరాదిన, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలలో తరచుగా సంభవించే వరదల్ని నియంత్రించవచ్చు. 6. నీటి కొరత నివారణకు మార్గం సుగమమవుతుంది. 7. నౌకాయానం ద్వారా రవాణా సౌకర్యాల వృద్ధి 8. రైతుల సగటు వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 2500 (ఒక ఎకరానికి) నుంచి రూ. 30,000 వరకు పెంచవచ్చు. అనుసంధానం - పరిమితులు 1. అటవీ నిర్మూలన, నేలకోతతో పర్యావరణ పరంగా భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుంది. 2. ఈ ప్రాజెక్టు వలన నష్టపోయిన వారికి పునరావాసం కల్పించడం కష్టం. సామాజిక, మానసిక అలజడులను అదుపు చేయడం సులభమైన పని కాదు. 3. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో సంబంధా లు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. వ్యతిరేక వాదనలు ఉత్తరాదితో పాటు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లో మిగులు జలాలున్నాయన్నది భ్రమే అవుతుంది. దాదాపు అన్ని నదీ పరీవాహకాలు (రివర్ బేసిన్లు) ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంత రైతులకు, పట్టణ ప్రాంత పారిశ్రామిక వినియోగదారులకు మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయంటే అవసరానికి సరిపడా నీరు లభ్యం కావడం లేదని అర్థం. ఇటీవల జరిపిన పరిశోధనలో మహానది పరీవాహకంలో మిగులు జలాలు లేవని తేలింది. అలాంటప్పుడు దాన్ని గోదావరి నదితో అనుసంధానం చేయడంలో అర్థం లేదు. వరద నీటిని పొరుగు నదులకు తరలించడం అనేది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే పొరుగు నదిలో వరద నీటి ఉద్ధృతి ఉంటుంది. ఒకవేళ తరలించినప్పటికీ ఆ నీటిని జలాశయాలలో నిల్వ ఉంచడానికి విస్తృత సదుపాయాలు కల్పించాలి. భారీ ఎత్తున జలాశయాల నిర్మా ణం పర్యావరణానికి హాని కలిగిస్తాయి. పైగా ముంపున కు గురయ్యే ప్రాంతాలలో నివసించే వారికి పునరావాసం కల్పించడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం మీద ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం వల్ల పలు ప్రయోజనాలుంటాయన్నది నిజమే. అయితే, వాటిని సకాలంలో నిర్మించి ఎంత మేర సమర్థంగా నిర్వహిస్తారనేది పెద్ద ప్రశ్న. అనుసంధానానికి ప్రత్యామ్నాయం పరిశుభ్ర జలాలు అందరికి అందుబాటులో ఉంచడం, నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ముఖ్యమే. అయితే నదుల అనుసంధానానికి ప్రత్యామ్నాయమేదైనా ఉందా? అంటే ఉందనే వాదిస్తారు. 1. నీటి కొరతకు ప్రధాన కారణం వినియోగం పెరగడం అనే వాదనతో పూర్తిగా ఏకీభవించలేం. నీటి సరఫరాలో అవకతవకలు, వృథా, దుబారా(ప్రోఫ్లిగేషన్) మొదలైనవి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. వీటిని అరికట్టగలిగితే చాలా వరకు కొరత నివారించవచ్చు. 2. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఇంకుడు గుంటల ద్వారా ఒడిసిపట్టవచ్చు. వర్షం పడేటప్పుడు ఇంటి కప్పులపై నుంచి కిందికి జారిన నీటిని భద్ర పరచడం ద్వారా స్థానిక అవసరాల్ని తీర్చుకోవచ్చు. నీటి సేకరణ, పరిరక్షణ ప్రక్రియను వికేంద్రీకరించడం, లోతట్టు ప్రాంతాల్లో చెక్ డ్యామ్లు నిర్మించడం ద్వారా స్థానిక నీటి వినియోగంలో స్వయం సమృద్ధి సాధించవచ్చు. దీంతో భారీ ఎత్తున ఆనకట్టల నిర్మాణం, కాలువలు తవ్వించడం లాంటి అవసరం ఉండదు. 3. వరద నీటిని కొరత ఉన్న ప్రాంతానికి తరలించడమే నదుల అనుసంధాన ముఖ్య ఉద్దేశం. కానీ, గంగ- బ్రహ్మపుత్ర నదీ పరీవాహకాలకు జులై నుంచి అక్టోబరు మధ్య కాలంలో అదనపు నీరు చేరుతుంది. నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో (దక్షిణాది ప్రాంతం) జనవరి నుంచి మే మధ్య కాలంలో నీరు అవసరం. ఈ పరిస్థితుల్లో అదనంగా లభ్యమైన నీటిని భారీ ఎత్తున జలాశయాలు నిర్మించి నిల్వ ఉంచాలి. వాటికయ్యే ఖర్చు, సామాజిక సమస్యలు, పర్యావరణ ముప్పు ఆమోదయోగ్యమేనా? 4. వరదలు కొంత నష్టాన్ని కలిగించినా, ఒండ్రు మట్టిని తేవడం ద్వారా భూసారాన్ని పెంచుతాయి. సహజ సిద్ధమైన వరదలను కృత్రిమంగా నిరోధించే ఏ పద్ధతి అయినా చౌడు భూములుగా మారే ప్రమాదముంది. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గవచ్చు. 5. ఏటా సంభవించే వరదల వల్ల గంగా నదిలో చేరే కాలుష్యాలన్నీ సముద్రంలోనే కొట్టుకుపోతాయి. నదు ల అనుసంధానం వల్ల గంగా నది నీటి ఉరవడి తగ్గి వ్యర్థ పదార్థాలతో నీరు మరింత కలుషితమవుతుంది. యుమునా నది నుంచి హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు నీటిని ఉపయోగించుకుంటున్నాయి. ఢిల్లీలో సరఫరా అయ్యే తాగునీటిలో నాణ్యత లోపించడానికి ఇదే కార ణం. దీనివల్లే ఎంతో ఖర్చు పెట్టి వార్షిక ప్రాతిపదికన అమలు చేస్తున్నా గంగా నదీ ప్రక్షాళన విఫలమైంది. 6. ఈ ప్రణాళిక అమలుకు 8 వేల చదరపు కిలోమీటర్ల భూమి అవసరం. అంత భారీ ఎత్తున భూసేకరణ సాధ్యమేనా? ఒకవైపు రైతులు, మరోవైపు పర్యావరణ మద్ధతుదారులు న్యాయస్థానాలలో కేసులు వేసి సమస్యలను మరింత జటిలం చేస్తారు. దానికి తోడు భూమిని కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయం చూపించడం కష్టతరమవుతుంది. వాస్తవానికి అంత అదనపు భూమి లేదు. సమస్యలనేకం అనుసంధాన ప్రక్రియను ప్రారంభించినప్పటికీ దాని విజయం అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ప్రధానంగా మిగులు జలాలు కలిగిన రాష్ట్రాలు వాటిని తరలించడానికి ఒప్పుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలు నిరాకరించవచ్చు. దానికి తోడు రాజకీయాలు కూడా ఈ బదిలీ ప్రక్రియను మరింత జటిలం చేస్తాయి. జల సంబంధ, భౌగోళిక, నైసర్గిక, ప్రాంతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ యజ్ఞం విజయవంతమవుతుంది. పర్యావరణ రక్షణ కవచాలను సక్రమంగా అమలు చేయాలి. వివిధ వ్యవస్థల మధ్య తగిన సమన్వయం ఏర్పడాలి. ఏదేమైనా... అనుసంధాన భావన ఆకర్షణీయంగా కనిపించనప్పటికీ.. ఆచరణలో పలు సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. ఉత్తరాదిలో నదుల అనుసంధాన ప్రతిపాదనలు మానస్-సంకోష్-తీస్తా-గంగ కోసి, ఘాగ్ర గండక్ - గంగ ఘాగ్ర-యమున శారద-యమున యమున-రాజస్థాన్ రాజస్థాన్-సబర్మతి చునార్-సోని జరాజ్ సోని ఆనకట్ట- దక్షిణగంగ ఉపనదులు గంగ-దామోదర్-సువర్ణరేఖ సువర్ణరేఖ- మహానది కోసి-మేచి ఫరఖ్ఖా-సుందర్బన్లు జోగిఘోఫా-తీస్తా-ఫరఖ్ఖా (మొదటి దానికి ప్రత్యామ్నాయం) దక్షిణాదిలో అనుసంధానానికి ప్రతిపాదించిన నదులు.. మహానది-గోదావరి(ధవళేశ్వరం) గోదావరి-కృష్ణా(పులిచింతల) గోదావరి-కృష్ణా(విజయవాడ) కృష్ణా (ఆల్మట్టి)-పెన్నార్ గోదావరి-కృష్ణా(నాగార్జున సాగర్) కృష్ణా(శ్రీశైలం)-పెన్నార్ కృష్ణా- పెన్నార్(సోమశిల) పెన్నార్-కావేరి కావేరి-వైగాయ్-గుండార్ కెన్-బెట్వా పర్బతి-కల్సింద్-చంబల్ పర్-తపి-నర్మద దామన్గంగ-పింజల్ బెడ్తి(గంగవల్లి)-వర్ద నేత్రావతి-హేమావతి పంబ-అచంకోవిల్-వైప్పార్ - డా॥బి.జె.బి. కృపాదానం సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ -
జల గండం
వేసవికి ముందే జిల్లావాసులకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. తీవ్ర వర్షాభావంతో భూగర్భజలమట్టాలు పాతాళానికి పడిపోవడం...ప్రధాన జలాశయాల్లోనూ నీటినిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండడం.. జలగండానికి సంకేతంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని నారాయణఖేడ్తోపాటు గిరిజన తండాలు, మారుమూల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. వేసవి నాటికి ఇది తీవ్రరూపం దాల్చి జిల్లాలోని 1099 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనవచ్చని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాక్షి, సంగారెడ్డి: ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 50 శాతం మేర వర్షపాతంలోటు ఉంది. వర్షాభావం కారణంగా జిల్లాలో ఎక్కడా చెరువులు, బావులు ఇతర నీటి వనరులు నిండలేదు.మంజీరా ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో సింగూరు, మంజీరా జలాశయాల్లో తగినంత నీరు వచ్చి చేరలేదు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచే జిల్లా ప్రజలకు, హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చటం జరుగుతోంది. అయితే ప్రస్తుతం సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. జంటనగరాలతోపాటు జిల్లాలోని పలు రక్షిత మంచినీటి పథకాలకు తాగునీరు అందించే సింగూరు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీ జలాలు మాత్రమే ఉన్నాయి. రాబోయే రోజుల్లో సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో సింగూరు ద్వారా తాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో నీటి ఇబ్బంది తప్పకవపోచ్చు. సంగారెడ్డి సమీపంలోని మంజీరా రిజర్వాయర్లో 1.56 టీఎంసీల జలాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 0.36 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మంజీరా రిజర్వాయర్లో జలమట్టాలు క్రమంగా పడిపోతున్నాయి. ఇదే పరిస్థితి మరో పదిరోజులపాటు కొనసాగితే సంగారెడ్డి మున్సిపాలిటీ, ఇతర రక్షిత మంచినీటి పథకాలు, జంటనగరాలకు తాగునీటి సరఫరాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చని అధికారులు చెబుతున్నారు. పాతాళంలోకి గంగ.... తాగునీటి కోసం అత్యధిక శాతం ప్రజలు జిల్లాలో ప్రధానంగా బోర్లు, బావులుపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవటంతో భూగర్భ జలమట్టాలు పెరగలేదు. దీంతో బోరుబావులు, బావుల్లోకి ఆశించిన స్థాయిలో నీళ్లు రాలేదు. వర్షాభావానికి తోడు అవసరానికి మించి నీళ్లు తోడుతుండటంతో బోరుబావుల్లో జలమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాభావం కారణంగా బావుల్లో సైతం క్రమంగా నీళ్లు అడుగంటుతున్నాయి. వేసవి నాటికి చాలా ప్రాంతాల్లో బోర్లు, బావులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అధికారుల తెలిపిన వివరాల మేరకు జిల్లాలో ప్రస్తుతం భూగ ర్భ జలాలు 15.57 మీటర్ల లోతులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు 5.26 మీటర్ల మేర తగ్గిపోయాయి. ములుగులో భూగర్భ జలమట్టాలు అత్యధికంగా 33.65 మీటర్లకు పడిపోయాయి. తూప్రాన్, కొల్చారం, టేక్మాల్, చిన్నశంకరంపేట, రామచంద్రాపురం, నారాయణఖేడ్ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. 1,099 ఆవాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి రానున్న వేసవి దృష్ట్యా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగు నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ముందస్తుగానే సన్నద్ధమవుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని అంచనా వేయటంతోపాటు సమస్య పరిష్కారం కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రాథమిక ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికను అనుసరించి వేసవిలో 44 మండలాల్లోని 1,099 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు. మెదక్ డివిజన్లో 540, సిద్దిపేట డివిజన్లో 444, సంగారెడ్డి డివిజన్లో 115 గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 624 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 354 గ్రామాలకు తాగునీటిని రవాణా చేయక తప్పదని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రూ.41 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించారు. నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటంతోపాటు బోరుబావులు మరమ్మతులు, వ్యవసాయబోర్లు అద్దెకు తీసుకోవటం, రక్షితనీటి పథకాల మరమ్మతులు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికలో ప్రతిపాదించారు. వేసవినాటికి తాగునీటి సమస్య నెలకొనే గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ ప్రణాళిక వ్యయం పెరిగే అవకాశం ఉంది. -
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు
వాటర్గ్రిడ్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయమైన అవగాహన, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాటర్గ్రిడ్ పనులను చేపట్టాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజె క్టు పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. వాటర్గ్రిడ్ పనులపై బుధవారం సచివాలయంలో మంత్రి కె.తారకరామారావు, ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రామకృష్ణారావు తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా మ్యాప్లు తెప్పించుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, గుట్ట లు, ఎత్తై ప్రదేశాలను పరిశీలించాలన్నారు. కృష్ణా, గోదావరి, ఇతర నదుల నీటిని గ్రామాలకు తరలించేందుకు లిఫ్ట్ కమ్ గ్రావిటీ మేరకు వాటర్గ్రిడ్ పైపులైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున, మండలాల వారీగా కాంటూర్లను గుర్తించే ప్రక్రియపై దృష్టి సారించాలని అన్నారు. కాంటూర్ల వివరాలను తెలుపుతూ ఒక పుస్తకాన్ని ముద్రించాలని, ఈ పుస్తకం ఆర్డబ్ల్యూఎస్లో పనిచేస్తున్న అధికారులందరికీ అం దుబాటులో ఉంచాలని కేసీఆర్ సూచించారు. ఇంటెక్ వెల్స్కు వెంటనే ప్రతిపాదనలు.. వాటర్గ్రిడ్లో భాగమైన ఇంటెక్ వెల్స్ నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైన ఇంటెక్ వెల్స్, మోటార్లు.. తదితర అంశాలపై అంచనాలు రూపొందించాలని చెప్పారు. అవాంతరాలు ఎదురైనా నీటిని తోడేందుకు ఇబ్బంది రాకుండా అదనపు మోటార్లను ఇంటెక్ వెల్స్ వద్ద సిద్ధంగా ఉంచాలని సూచించారు. ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పెద్దసంఖ్యలో ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్లాంట్లు, వాటి నిర్మాణానికి పట్టే సమయం.. తదితర అంశాలను అధ్యయనం చేసి ముందుకు సాగాలన్నారు. ఓవర్హెడ్ ట్యాంకులు, ట్రంక్, డిస్ట్రి బ్యూటరీ పైపులైన్లు కూడా నిర్మించాల్సి ఉన్నందున అధికారులు వేగంగా స్పందించాలని కోరారు. ఎంత సమయంలో వాటిని నిర్మించగలరో ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వాటర్గ్రిడ్లో 709 తాత్కాలిక ఉద్యోగాలకు అనుమతి వాటర్గ్రిడ్ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇం దులో భాగంగానే 709 తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనల మేరకు ఉద్యోగుల నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ను ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం మంజూరు చేసిన 709 పోస్టుల్లో 47 సీనియర్ అసిస్టెంట్లు కాగా, 662 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. అలాగే వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ నిమిత్తం ఇంజనీరింగ్ అధికారుల(ఎస్ఈ)కు 26 ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేసేం దుకు ప్రభుత్వం అనుమతించింది. -
గ్రామాల్లో విద్యుత్ వివాదం
తాగునీటి వనరులు, వీధి దీపాలకు కట్ బకాయిలు చెల్లిస్తేనే పునరుద్ధరిస్తామంటున్న కరెంట్ అధికారులు నిస్సహాయ స్థితిలో సర్పంచ్లు...ఉన్నతాధికారులపై ఆగ్రహం గీసుకొండ : గ్రామపంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిల చెల్లింపులో వివాదం నెలకొంది. తాము పదవిలోకి వచ్చి ఏడాది అవుతోంది... రూ.లక్షల్లో బిల్లులు ఎట్లా చెల్లించాలి... గతంలో పనిచేసిన సర్పంచ్ల వద్ద ఎందుకు బిల్లులు వసూలు చేయలేదు... తమనే ఎందుకు అడుగుతున్నారని ఆయూ గ్రామాల సర్పంచ్లు ఓ వైపు ప్రశ్నిస్తున్నారు. బిల్లు బకాయిలను చెల్లించే వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు మరోవైపు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు... గ్రామపంచాయతీ ల ద్వారా ప్రజలకు తాగునీరందించే పబ్లిక్ వాటర్ స్కీం కిం ద ఓపెన్వెల్, బోరు బావులతోపాటు వీధి దీపాలకు విద్యుత్ కనెకసన్లను కట్ చేశారు. ఇప్పటికే గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హ వేలి, సింగ్యాతండా, అనంతారం గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిపివేయగా... శుక్రవారం గీసుకొండ, గంగదేవిపల్లి, ఎలుకుర్తిహవేలితోపాటు పలు గ్రా మాలకు విద్యుత్ సరఫరా బంద్ చేశారు. సంగెం మండలంలోనూ చాలా గ్రామపంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా ఆయూ గ్రామాల ప్రజలకు తాగునీటి ఇక్కట్లు మొదలయ్యూరుు. రాత్రివేళల్లో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం సంగెం మండల సర్వసభ్య సమావేశంలో ఇదే విషయమై చర్చ జరిగింది. బిల్లులను గతం నుంచి ప్రభుత్వమే చెల్లిస్తోందని, తమను చెల్లించమంటే ఎక్కడి నుంచి తేవాలని పలు గ్రామాల సర్పంచ్లు వాపోయారు. అంతా అయోమయం... విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలో అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచ్లు అయోమయానికి గురవుతున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని, ఇప్పుడు కొత్తగా కట్టాలని అడిగితే ఎక్కడి నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలకు మంజూరయ్యే టీఎఫ్సీ నిధులను తాగునీటి కోసం ఖర్చు చేయాలని.. నిధులు మిగిలితే పారిశుద్ధ్య పనులకు ఖర్చు చేయాలనే నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేతప్ప కరెంటు బిల్లులకు చెల్లించాలని ఎక్కడా లేదని అంటున్నారు. తమ గ్రామానికి ఐదేళ్లపాటు మంజూరైన టీఎఫ్సీ నిధులను మొత్తం కేటాయించినా... విద్యుత్ బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు... తాగునీటి బావులు, బోర్లు, వీధి దీపాలకు మీటర్లను ఏర్పాటు చేయలేదని, ఇష్టారాజ్యంగా కరెంటు బిల్లుల భారం మోపారని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. తమ గ్రామాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్ప్ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి పంచాయతీలకు ఏమి ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తేల్చాల్సింది ఉన్నతాధికారులే... తాగు నీటి వనరులకు కరెంట్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో మచ్చాపూర్ ఇన్చార్జ్ ఏఈని ‘సాక్షి’ సంప్రదించింది. ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించగా... కరెంటు బిల్లులకు సంబంధించిన నిధులను పంచాయతీలకు విడుదల చేశామని డీపీఓ తమకు చెప్పారని పేర్కొన్నారు. సర్పంచ్లు చెల్లించకపోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. అసలు ఈ నిధులు విడుదల కాలేదని సర్పంచ్లు చెబుతుండడం విశేషం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు ఎట్ల కడతారో..! అనంతారంలో పంచాయతీ రూ. 4,11,445 విద్యుత్ బిల్లుల బకాయిలు చె ల్లించాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ గ్రామ పంచాయ తీ ఏడాది ఆదాయం రూ. 42 వేలే. బీఆర్జీఎఫ్ నిధులు రూ. 30 వేలు, ఎస్ఎఫ్సీ నిధులు 7 వేలు, టీఎఫ్సీ నిధులు 18 వేలు. ఈ లెక్కన ఐదేళ్లపాటు ఇంటిపన్నులు, ఇతర అభివృద్ధి నిధులను విద్యుత్ బిల్లుకు చెల్లించినా సరిపోవు. గంగదేవిపల్లి పంచాయతీ చెల్లించాల్సిన విద్యుత్ బిల్లు బకాయిలు రూ. 6 లక్షలు. ఈ పంంచాయతీకి ఏడాదికి ఇంటిపన్నుల రూపంలో రూ. 1.56 లక్షలు, కొత్తగా ఇళ్ల నిర్మాణాల అనుమతులకు రూ. 20 వేలు, రహదారి పన్ను కింద రూ. 4 వేల ఆదాయం సమకూరుతోంది. పంచాయతీ ఆదాయం నుంచి 30 శాతం వేతనాలు, 16 శాతం వీధిలై ట్ల నిర్వహణ, 20 శాతం తాగునీటి కోసం, మరో 20 శాతం రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆదాయం మొత్తం ఈ ఖర్చులకే పోతే రూ. 6 లక్షల విద్యుత్ బిల్లు బకాయిలు ఎలా చెల్లించాలని సర్పంచ్లు ప్రశ్నిస్తున్నారు. గీసుకొండ గ్రామంలో రూ. 16 లక్షల బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఇంటిపన్నులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఇతర ఆదయాలు మొత్తం కలిపినా బిల్లుకు సరిపోని పరిస్థితి. కరెంట్ కట్ చేయొద్దని ఆదేశించా - కలెక్టర్ కిషన్ గ్రామాల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు పేరుతో పంచాయతీలకు సంబంధించి తాగునీటి బావులు, బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయొద్దని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)కి చెప్పానని కలెక్టర్ కిషన్ తెలిపారు. శనివారం గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగాగంగదేవిపల్లి, ఎలుకుర్తిహవేలి, శాయంపేట, అనంతారం గ్రామ సర్పంచ్లు ఇట్ల శాంతి, భీమగాని సౌజన్య, కొంగర చంద్రమౌళి, దనేకుల వెంకటేశ్వర్లు విద్యుత్ బిల్లు బకాయిల సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సర్పంచ్లు తాము పదవి చేపట్టిన కాలం నుంచైనా కరెంటు బిల్లులను చెల్లించాలని, నల్లా కనెక్షన్లు తీసుకున్న వారి నుంచి తప్పనిసరిగా పన్ను వసూలు చేసి... కరెంటు బిల్లులు చెల్లించాలన్నారు. మీటర్లు ఉన్న వాటికే బిల్లులు చెల్లించాలని, లేనివాటికి చెల్లించొద్దని స్పష్టం చేశారు. -
లాభాల బిందువు
నేరుగా మొక్క వేరుకు నీరు డ్రిప్పు పరికరాలను అమర్చి బిందు సేద్యం చేయడం ద్వారా నీటి వనరులు ఆదా అవుతాయి. కాల్వల ద్వారా నీరు వృథాగా పోయే అవకాశం లేదు. అంతేకాకుండా మొక్క వేరు భాగానికి నేరుగా నీరు అందుతుంది. దీనివల్ల పంట భూముల్లో కలుపు మొక్కలు పెరిగే అవకాశం లేకుండాపోతుంది. మొక్కలకు సమృద్ధిగా నీరందుతుంది. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. పంటలకు ఎరువులను డ్రిప్పు పైపుల ద్వారా సరఫరా చే సే అవకాశం ఉంది. డ్రిప్పు పైపులతో పాటు ట్యాంకును కూ డా సరఫరా చేస్తున్నారు. ట్యాంకులో యూరి యా వేస్తే చాలు పంట అంతటికీ అందుతుంది. సబ్సిడీపై పరికరాలు డ్రిప్పు పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై, పెద్ద రైతులకు 65శాతం సబ్సిడీపై డ్రిప్పు పరికరాలను అందిస్తున్నారు. రైతు పాస్బుక్లో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 1.50 ఎకరాలను ఒక యూనిట్ మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 1.5 ఎకరాల కోసం ఇచ్చే యూనిట్ పరికరాలు కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతున్నాయని రైతులు అంటున్నారు. కావాల్సినన్ని పరికరాలను సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు. డ్రిప్పు ద్వారా పసుపు, సోయా, మొక్కజొన్న, బెండ, వంగ, టామాట, పంటలను సాగు చేస్తున్నారు. -
డ్రమ్సీడర్తో సాగు సులభం
షాబాద్ : రోజు రోజుకూ తగ్గుతున్న నీటి వనరులు కూలీల కొరత, పెరుగుతున్న సాగు వ్యయం, సకాలంలో కురవని వర్షాలు, కరెంటు కోతలు వంటి సమస్యలతో వరి సాగు చేయాలంటేనే రైతులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి. వీటిన్నింటికీ కొత్త యంత్రం డ్రమ్సీడర్ పరిష్కారం చూపిస్తుందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు. వరి పంట అధికంగా పండించే నియోజకవర్గంలో సమయనికి నార్లు పోసుకోలేక నాట్లు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులు డ్రమ్ సీడర్ వాడుకొని సాగును సులభం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రత్యేకతలు కూలీల అవసరం ఎక్కువగా లేకుండా వరి విత్తనాలు విత్తుకునేందుకు డ్రమ్ సీడర్ యంత్రాన్ని రూపొందించారు. దీన్ని ప్లాస్టిక్తో తయారు చేయడంతో దీని బరువు కేవలం ఎనిమిది కిలోలు మాత్రమే. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ యంత్రానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెం.మీ. దూరంలో రెండు రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ముల్లో వరి గింజలు రాలడానికి వీలుగా మూడో వంతు మాత్రమే నింపాలి. ఇద్దరు చెరో వైపున పట్టుకుని లాగితే ఒకేసారి ఎనిమిది వరుసల్లో విత్తనాలు పడతాయి. వరుసలో కుదురుకు కుదురుకు మధ్యన 5 నుంచి 8 సెం.మీ. వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో కుదురులో ఐదు నుంచి ఎనిమిది విత్తనాలు రాలుతాయి. సాగు పద్ధతి సాధారణ సాగు మాదిరిగానే పొలాన్ని దున్నుకోవాలి. పొలమంతా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. విత్తన రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలను తీసుకోని నానబెట్టుకోవాలి. మొలకలు పెద్దగా వస్తే డ్రమ్ సీడర్ నుంచి రాలవు. కాబట్టి తగు మోతాదు నీళ్లలో చిన్న మొలకలు వచ్చే లా మాత్రమే విత్తనాలు నానబెట్టాలి. వీటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి గ్రాము కార్బండిజం పొడిని నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టుకోవాలి. విత్తే సమయంలో పొలంలో నీరు లేకుండా బురదగా ఉండేట్లు చూసుకోవాలి. 50 శాతం రాయితీపై లభ్యం మిగతా వ్యవసాయ యంత్రం పరికరాల్లాగే డ్రమ్ సీడర్లను కూడా వ్యవసాయశాఖ అధికారులు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఒక డ్రమ్ సీడర్ విలువ రూ.4వేలు ఉండగా.. రాయితీపై రూ.2వేలకు అందజేస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాబాద్ ఏఈఓ కుమార్ సూచిస్తున్నారు. -
వరిలో ప్రత్యామ్నాయమే మేలు
ఖమ్మం వ్యవసాయం/వైరా : ప్రస్తుత తరుణంలో వరిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేసి నీటి వనరుల కోసం ఎదురు చూడడం కంటే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సాగు చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. ఈ పద్ధతుల్లో నీటిని ఆదా చేయడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంది. వరి సాగులో రెండు రకాల ప్రత్యామ్నాయ పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. దమ్ములో విత్తనాలు వెదజల్లడం, డ్రమ్ సీడర్ ద్వారా సాగు చేయడం. దమ్ములో వెదజల్లే పద్ధతి ఈ పద్ధతిలో వరి సాగు చేసేందుకు విత్తన రకాన్ని బట్టి ఎకరాకు 12 నుంచి 16 కిలోల విత్తనాలు సరిపోతాయి. అలాగే పలు ప్రాంతాల్లోని రైతులు సన్న రకాలను కేవలం ఎకరానికి 7 నుంచి 8 కేజీల విత్తనాలను మాత్రమే వినియోగిస్తున్నారు. విత్తన శుద్ధి లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టిన తర్వాత 24 నుంచి 36 గంటల పాటు మండె కట్టి పొలంలో వెదజల్లాలి. పొలం తయారీ విధానం సాధారణ పద్ధతిలాగానే దమ్ము చేసి వీలైనంత భాగా పొలాన్ని చదును చేసుకోవాలి. విత్తనాలు విత్తే సమయంలో నీరు లేకుండా బురదగా ఉండేలా చూసుకోవాలి. ఇసుక శాతం అధికంగా ఉన్న నేలల్లో విత్తనాలు చల్లాలనుకున్న రోజు ఆఖరు దమ్ము చేసి చదును చేయాలి. దానిలో పలుచని నీటి పొర ఉండేలా చూసుకోవాలి. మట్టి పేరుకున్న తర్వాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలువలు చేసి, ఎక్కువగా ఉన్న నీరు, మురుగునీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి. సాధారణంగా వరి సాగు చేసే అన్ని నేలలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. డ్రమ్ సీడర్తో వరిసాగు డ్రమ్ సీడర్తో వరి విత్తడానికి ఎకరాకు 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. పొలం తయారీ వెదజల్లే పద్ధతి మాదిరిగానే చేసుకోవాలి. మండె కట్టిన విత్తనాలను కేవలం ముక్కు పగిలి తెల్లపూత వచ్చిన తర్వాత డ్రమ్ సీడర్లో పోసి విత్తుకోవాలి. డ్రమ్ సీడర్కు 4 ప్లాస్టిక్ డ్రమ్లు ఉంటాయి. ప్రతి డ్రమ్కు 20 సెం.మీ దూరంలో రెండు చివర్ల రంద్రాలు ఉంటాయి. ఈ డ్రమ్లో విత్తనాలను 3/4 వంతు నింపి డ్రమ్ సీడర్ లాగుతే 8 వరుసల్లో వరుసకు, వరుసకు మధ్య 20 సెం.మీ, కుదురుకు కుదురుకు మధ్య 5-8 సెం.మీ దూరంలో గింజలు పడుతాయి. ఈ పద్ధతిలో ఎకరం విత్తటానికి కేవలం ఇద్దరు సరిపోతారు. ఒక ఎకరం విత్తటానికి 2-3 గంటల సమయం సరిపోతుంది. రెండు పద్ధతుల్లోనూ యాజమాన్యం ఇలా కలుపు నివారణ...: నేరుగా గింజలను విత్తడం వల్ల కలుపు మొక్కులు కూడా వరి గింజలతో పాటు పెరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కలుపు నివారణ మందును ఖచ్చితంగా వాడాలి. డ్రమ్ సీడర్ లాగినా, దమ్ములో విత్తనాలను వెదజల్లినా మూడు లేదా నాలుగో రోజు 80 గ్రాముల ఫైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ కలుపు మందును ఒక ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. విత్తనాలను వేసిన 20 - 25 రోజులకు ఏ కారణం చేతనైనా వెడల్పాటి ఆకులు, సన్న ఆకు కలుపు ఉంటే ఎకరానికి 100 మి.లీ బిస్పైరీ బాక్ సోడియం పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం సాధారణ పద్ధతిలో వరిసాగుకు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు సరిపోతుంది. దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా భాస్వరం ఎరువు మొత్తం, సగం పొటాష్ ఎరువులను వేయాలి. దమ్ములోకాని, విత్తేటప్పుడు కాని నత్రజని ఎరువులను వేస్తే కలుపు విపరీతంగా వస్తుంది. కనుక నత్రజని ఎరువులను మూడు సమభాగాలుగా చేసి విత్తిన 20, 40, 60 రోజుల్లో వేయాలి. మూడవ దఫాగా వేసే నత్రజని ఎరువుతో పాటు మిగిలిన సగభాగం పొటాష్ ఎరువును కూడా వేయాలి. నీటి యాజమాన్యం పొలంలో విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వరకు పొలం తడిగా ఉండాలి. నీరు ఎక్కువయితే బయటకు పోవడానికి కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువ పిలకలు పెడతాయి. పైరు పొట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు పొలంలో 5 సెం.మీ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కోతకు 10 రోజుల ముందు నుంచి నెమ్మదిగా తగ్గించాలి. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం సాధారణ పద్ధతిలో మాదిరిగానే చేపడితే సరిపోతుంది. సాధారణం కంటే పంట 7-10 రోజులు ముందుగా కోతకు వస్తుంది. ఖర్చు తగ్గుతుంది వరి సాగులో ఈ పద్ధతులు అనుసరించడం వల్ల ఖర్చు తగ్గుతుంది. వరి నాటు మొదలుకుని కోత వరకు ఎకరానికి రూ. 2500 నుంచి రూ. 3000 వరకు ఖర్చు తగ్గుతుంది. జిల్లాలో గత ఏడాది ఈ విధానాలను దాదాపు 40 వేల ఎకరాల్లో అనుసరించి మంచి దిగుబడులు సాధించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఈ విధానాలను అనుసరించ వచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచనలు చేస్తున్నారు. -
భూగర్భాన్వేషకుడు.. జియాలజిస్ట్
అప్కమింగ్ కెరీర్: భూగర్భం... అపారమైన ఖనిజ సంపద, ముడి చమురు, సహజ వాయువు, జల వనరులకు నిలయం. భూగర్భ సంపద మెండుగా ఉన్న దేశాలు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. అనతికాలంలోనే సంపన్న దేశాలుగా అవతరించాయి. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఊహించనంతగా పెరిగాయి. దేశ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి భూగర్భ సంపదకు ఉంది. అలాంటి సంపదను అన్వేషించి, వెలికితీసేవారే జియాలజిస్ట్లు. ఎదుగుదలకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్న కెరీర్.. జియాలజిస్ట్. భూగర్భాన్వేషణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. దీంతో జియాలజిస్ట్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ రంగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో జియాలజీ కోర్సులను అభ్యసించిన నిపుణుల కొరత కంపెనీలను వేధిస్తోంది. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చమురు, గ్యాస్ వెలికితీత ఊపందుకుంటోంది. మైనింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. జియాలజిస్ట్లకు అధిక వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్లకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. జియాలజీలో ఎంఎస్సీ పూర్తిచేయగానే ఉద్యోగం సిద్ధంగా ఉంటోంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో, మైనింగ్ శాఖల్లో అవకాశాలు సులువుగా దక్కుతున్నాయి. రిలయన్స్, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. కాలేజీలు/యూనివర్సిటీల్లోనూ ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ సేవలందించొచ్చు. అర్హతలు మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరొచ్చు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ కూడా చేస్తే ఉద్యోగావకాశాలు సులభంగా పొందొచ్చు. వేతనాలు ఎంఎస్సీ డిగ్రీ ఉన్న జియాలజిస్ట్కు రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. పరిజ్ఞానం, పనితీరును బట్టి జీతభత్యాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు సగటున రూ.25 వేల దాకా వేతనం అందుకోవచ్చు. అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలో చేరితే నెలకు రూ.లక్షన్నర దాకా పొందొచ్చు. జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు - ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ - ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ - నాగార్జునా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.nagarjunauniversity.ac.in/ - ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్బాద్ వెబ్సైట్: http://www.ismdhanbad.ac.in/ - సెంటర్ ఫర్ ఎర్త్ సెన్సైస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు వెబ్సైట్: http://www.ceas.iisc.ernet.in/ అన్వేషణతో అద్భుత ఫలం ‘‘భూ అంతరాల్లో దాగిన ఖనిజాల అన్వేషణలో జియాలజిస్టుల భాగస్వామ్యం తప్పనిసరి. ఇటీవలి కాలంలో జియాలజీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. జియాలజిస్ట్లకు అవకాశాలు పెరగడమే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేట్ మైనింగ్ సంస్థలు గనుల తవ్వకాలకు, ఖనిజాల వెలికితీతకు నిపుణులను నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్లకు మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. శ్రమించగల తత్వం, ఓర్పు ఉన్న వారికి ఇది బెస్ట్ కెరీర్’’ - డాక్టర్ ఎం.మురళీధర్, జియాలజీ విభాగ అధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం -
జుట్టు కేంద్రం చేతికివ్వొద్దు: దేవినేని
హైదరాబాద్ : రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వనరుల సమస్యలను రాష్ట్రాస్థాయిలో పరిష్కరించుకుంటేనే మంచిదని, అలాగాక జటిలం చేసుకుని మన హక్కులను కేంద్రం చేతికిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా బేసిన్లో 10 లక్షల ఎకరాలకు పైబడి వరి చేయాల్సి ఉండగా, కేవలం 150 హెకార్టలోనే నారుమళ్లు పడ్డాయంటే... అదికూడా బోర్ల కింద పడటాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. తాగునీటికి సైతం గడ్డుకాలం దాపురించిందని మంత్రి అన్నారు. వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయం ఏంటనే పరిస్థితి భయపెడుతోందన్నారు. -
మెట్టలో కరువు
మెట్ట ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తోంది. జలవనరులు పూర్తిగా నిండుకున్నాయి. జనంతో పాటు పశువులు కూడా గుక్కెడు నీటికి అల్లాడుతున్నాయి. వరి పంట నిలువునా ఎండిపోయింది. బత్తాయి, నిమ్మ తోటలు కూడా ఎండడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. ఇప్పటికే పలువురు బతుకుదెరువు కోసం వలసబాట పట్టారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవవని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత దయనీయంగా మారేలా కనిపిస్తున్నాయి. ఉదయగిరి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దుర్భిక్షం నెలకొంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు. ఈ ఏడాది కరువు నేపథ్యంలో మూడు లక్షల ఎకరాల్లో కూడా పంటల సాగు చేపట్టలేదు. సోమశిల పరిధిలోని కాలువ కింద రబీలో సాగుచేసిన సుమారు 70 వేల ఎకరాల వరి పూర్తిగా ఎండిపోవడంతో రూ.100 కోట్లకు పైగా రైతులు నష్టపోయారు. మూడేళ్ల నుంచి మినుము సాగులో లాభాలు లేకపోవడంతో ఆ భూముల్లో జామాయిల్ సాగు చేశారు. ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లోని 25 వేల హెక్టార్లలో నిమ్మ, 8 వేల హెక్టార్లలో బత్తాయి, మరో 35 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులోఉన్నాయి. వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు,వింజమూరు, ఉదయగిరి మండలాల్లో ఐదు వేల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి వర్షాభావంతో భూగర్బజలాలు పూర్తిగా అడుగంటాయి. బోర్లలో నీరు అగిపోవడంతో పంటలను రక్షించుకునేందుకు లక్షలు ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా చెట్లను బతికించుకునే ప్రయత్నం చేశారు. అయినా చాలా తోటలు నిలువునా ఎండిపోయాయి. జూన్ మొదటి వారంలోనైనా వర్షాలు పడకపోతాయని ఆశించిన ఉద్యాన పంటల రైతులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది రాష్ట్రంలోనే మిగతా జిల్లాలకు భిన్నంగా ఉదయగిరి,ఆత్మకూరు నియోజకవర్గాలలో వర్షం పడలేదు. రెండ్రోజుల నుంచి వాతావరణం చల్లబడివున్నా మేఘాలు కనిపిస్తున్నాయే తప్ప నీటి బొట్టు నేలను తాకలేదు. ఎండిన జలాశయాలు, చెరువులు: గత ఏడాది జిల్లాలో వర్షాలు సరిగా కురవకపోవడంతో స్థానిక జలాశయాలకు నీరు చేరుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 1,716 చెరువులుండగా 70 శాతం చెరువుల్లో నీరు చేరలేదు. మెట్ట ప్రాంత చెరువులు నీరు లేక వెలవెలబోయాయి. ఉదయగిరి ప్రాంతంలోని నక్కలగండి, గండిపాళెం, రాళ్లపాడు, మోపాడు జలాశయాలకు చుక్క నీరు రాకపోవడంతో వీటి పరిధిలోని ఆయకట్టు బీడుబారింది. జలదంకి, వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల పరిధిలో బోర్లు, వాగుల కింద సాగుచేసిన వరి పైరును చిరుపొట్టదశలో నీరు లేక కోసి పశువులకు మేతగా వేశారు. పదేళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి మెట్టప్రాంతంలో కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గండిపాలెం ఆయకట్టు పరిధిలో 16 వేల ఎకరాలు, నక్కలగండి పరిధిలో ఐదు వేల ఎకరాలు, మోపాడు పరిధిలో పది వేల ఎకరాలుండగా కనీసం 50ఎకరాల్లో కూడా పంట పండకపోవడం కరువు తీవ్రతకు నిదర్శనం. మరోవైపు అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఒట్టిబోయిన పాడి: వర్షాకాలంలోనే సక్రమంగా వర్షాలు పడక పశుగ్రాసం కొరత ఏర్పడింది. జనవరి, ఫిబ్రవరి నుంచి ఈ పరిస్థితి మరింత విషమించింది. పచ్చిక బయళ్లుపూర్తిగా ఎండిపోవడం, పంటలు పండక గడ్డి దొరక్కపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. మేత దొరక్క పశువులను తక్కువ ధరకు కబేళాలకు తరలించారు. ఇక మేకలు, గొర్రెల యజమానుల బాధలు వర్ణణాతీతం. వలస బాట: ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారు మొదటి నుంచి పనులు దొరక్క ఉపాధి కోసం వలస వెళ్లేవారు. సోమశిల జలాశయం నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో కొంత వలసలు తగ్గాయి. ఉదయగిరి ప్రాంతంలో కూడానాలుగైదేళ్ల నుంచి ఈ పరిస్థితి తగ్గుముఖం పట్టింది.అయితే మూడేళ్ల నుంచి వర్షాలు పడక పంటలు లేక పరిస్థితి మరింత విషమించడంతో పొట్ట కూటి కోసం ఈ ఏడాది మళ్లీ అనేక కుటుంబాలు వలసబాట పట్టాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు వలస వెళుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు లేకపోతే పల్లె బతుకులు మరింత చితికిపోయే ప్రమాదం పొంచివుంది. -
వర్ష హర్షం
మేలుచేసిన అకాల వర్షాలు అకాల వానలతో జలాశయాల్లో పెరిగిన నీటిమట్టాలు ఖరీఫ్పై రైతుల్లో ఆశలు చోడవరం, న్యూస్లైన్: ఖరీఫ్పై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అనుకోకుండా కురిసిన వర్షాలు పంటల సన్నద్ధతకు అన్నదాతలను ఉపకరించాయి. తొలకరి వర్షాలు ముందే కురవడంతో భూమి తడిబారింది. జలాశయాల్లో కూడా నీరు భారీగా వచ్చి చేరడంతో రైతులు కొంత ఊరట చెందారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోవడంతో జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గాయి. సాగునీటి చెరువు ఎండిపోయాయి. గతేడాది అతివృష్టి కారణంగా సాగునీటి వనరులు కళకళలాడాయి. ఖరీఫ్కు ఇబ్బంది లేకుండా పోయింది. ఈ ఏడాది తొలకరి జల్లులుపైనే ఖరీఫ్ సాగుకు రైతులు ఆశలు పెట్టుకున్నారు. వారం రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే మెట్ట ప్రాంతాల్లో వేరుశనగ,ఇతర పంటలకు ఏరువాక జోరుగా సాగుతోంది. వరి నారుపోతలకు దుక్కులు చేపడుతున్నారు. పల్లపు ప్రాంతాలు, జలాశయ ఆయకట్టు రైతులు కూడా మరో వారంలో నారుపోతలకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలోని పెద్దేరు, కోనాం, రైవాడ, తాండవ, కల్యాణపులోవ జలాశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా వరి,చెరకు సాగుచేసే చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో పెద్దేరు, కోనాం, రైవాడ, కల్యాణపులోవ వంటి పెద్ద రిజర్వాయర్లు, గొర్రిగెడ్డ, పాలగెడ్డ, ఉరక గెడ్డ వంటి మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇవన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. గత నెలలో ఎండల తీవ్రతకు ట్యాంక్ బండ్లలో నీటి మట్టాలు తగ్గాయి. ప్రస్తుతం జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాతోపాటు ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. రైవాడ రిజర్వాయరు రబీ పంటకు కూడా 150క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయగా ఖరీప్కు కూడా నిండుకుండలా ఉంది. రైవాడ క్యాచ్మెంట్లో తాజాగా 110 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. కోనాంలో 78మిల్లీమీటర్లు, పెద్దేరులో 40 మిల్లీమీటర్లు, కల్యాణపులోవలో 27 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. క్యాచ్మెంట్లో కురిసిన వర్షానికి తోడు ఎగువ కొండల్లో కుసిరిన భారీ వర్షాలు కారణంగా అన్ని రిజర్వాయర్లలోనూ ఇన్ప్లో బాగా పెరిగి నీటి మట్టాలు పైకి వచ్చాయి. నిండుకుండల్లా జలాశయాలు ఉండటంతో ఖరీప్ పంటకు నీటి కొరత ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నీటి వనరులు తగ్గడం పెను ప్రమాదం
చెరువులు, కుంటలను రక్షించుకోవాలి.. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం పిలుపు అమీర్పేట,న్యూస్లైన్: ప్రకృతి ప్రసాదమైన నీటివనరులు తగ్గిపోవడం మానవ మనుగడకు పెనుప్రమాదమని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాక్టివేటెడ్ స్లడ్జ్ప్రాసెస్ వందేళ్ల వేడుకలు, జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ లిమిటెడ్ (జేఈటీఎల్) సిల్వర్జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం అమీర్పేట మ్యారీగోల్డ్ హోట ల్లో ఒకే వేదికపై జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అబ్దుల్కలాం హాజరై..పారిశ్రామికవ్యర్థ జలాలను శుద్ధి చేసి మొక్కలకు అందిస్తూ పచ్చదనాన్ని పెంపొందించడంలో జేఈటీఎల్ కృషిని కొనియాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నగరంలోనూ చెరువులు, కుంటలు, సరస్సులు ఉండేవని, కానీ చాలావరకు వాటి ఉనికి కోల్పోయాయన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో 100 ఏళ్లనాటి చెరువులను, కుంటలను పరిరక్షించే కార్యక్రమం చేపట్టారని, ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. అందరిలోనూ పర్యావరణ సృ్పహ పెరగాలని, భావితరాలకు కాలుష్యంలేని సమాజాన్ని అందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుగా నిలుస్తున్న యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్, జేఈటీఎల్లు మున్ముందు ఆదర్శవంతమైన కార్యక్రమాలు రూపకల్పన చేయాలని సూచించారు. కాగా ఎనిర్వాన్మెంట్ ఇంజనీర్స్ పితామహుడు ప్రొ.ఆర్సీ వాలా అబ్దుల్కలాంకు ‘టెర్రారియం’ బహుకరించారు. కార్యక్రమంలో జీఈటీఎల్ చైర్మన్ జీవీకే చౌదరి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు జీఎస్ మర్దా, నీరా డెరైక్టర్ డాక్టర్ వాటే, ఇండియన్ ఎన్విరాన్మెంటల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఫరేఖ్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవడం బాధ్యతగా గుర్తించాలని, అయితే అభ్యర్థుల గుణగణాలను బట్టి ఓటెరికి వేయాలో మీరే ఎంచుకోవాలని అబ్దుల్కలాం సూచించారు. అమీర్పేట సెస్ ఆడిటోరియంలో యునిసెఫ్ ఆధ్వర్యంలో ‘చైల్డ్ అండ్ సోషల్స్టడీస్’పై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరగాలన్నారు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటినే విజయానికి సోపానాలుగా మలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ చైర్మన్ ప్రొ.రాధాకృష్ణ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.హనుమంతరావు, యునిసెఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల చీఫ్ రూత్లక్స్కేనా రియానో, డెరైక్టర్ గాలబ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.