district judge
-
Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?
అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార్త ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. సోమవారం యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ ఇ.బోస్బర్గ్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ సర్కార్ పూచికపుల్లలాగా తీసిపక్కన పడేయడమే ఇందుకు ప్రధాన కారణం. వలసదారులను వెనిజులాకు చెందిన నేరాల గ్యాంగ్ సభ్యులుగా ఆరోపిస్తూ దేశ బహిష్కరణ (deportation) చేయడం సబబుకాదని జడ్జి బోస్బర్గ్ ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. ఎల్ సాల్వెడార్కు వలసదారులను విమానాల్లో తరలించడం తక్షణం ఆపేయాలని కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు. అయితే ఆ సమయానికే రెండు విమానాలు బయల్దేరాయని, గాల్లో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. అయితే విమానాలను వెంటనే వెనక్కి తిప్పాలని జడ్జి ఆదేశించారు. అయినాసరే ప్రభుత్వ న్యాయవాదులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం వెనుక ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యధోరణి దాగుందని తెలుస్తోంది. పైగా దేశ అధ్యక్షుడి నిర్ణయాన్ని కేవలం ఒక జిల్లా జడ్జి ప్రశ్నించేంత సాహసం చేస్తారా? అన్న దురహంకారం అధికారయంత్రాంగంలో ఎక్కువైందని వార్తలొచ్చాయి.తానే సర్వశక్తివంతుడినంటున్న ట్రంప్ యుద్ధకాలంలో ప్రయోగించాల్సిన కఠిన చట్టాలు, నిబంధనలను శాంతికాలంలో ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు న్యాయనిపుణులు వాదిస్తున్నారు. అక్రమ వలసదారులను తరిమేసేందుకు ఏకంగా 18వ శతాబ్దంనాటి విదేశీ శత్రుచట్టాన్ని హఠాత్తుగా అమలుచేయాల్సిన పనేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను మాత్రమే అమెరికాను కాపాడగలనన్న విశ్వాసంతో రెండో దఫా భారీ మెజారిటీతో తనను ప్రజలు గెలిపించారన్న అతివిశ్వాసం ట్రంప్లో పెరిగిందని, అందుకే సర్వశక్తివంతుడినన్న ధీమాతో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. సొంత పార్టీలో తన వ్యతిరేకవర్గాన్ని పూర్తిగా అణిచేసి, విపక్ష డెమొక్రాట్ల చేతిలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వరంగంలోని ఏ విభాగం లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇదే ధోరణి ఆయన పాలనాయంత్రాంగంలోని సీనియర్ సభ్యుల్లోనూ కనిపిస్తోంది.సోమవారం సీఎన్ఎన్ ‘కేసీ హంట్’ కార్యక్రమంలో శ్వేతసౌధం (White House) సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సైతం ట్రంప్లాగా మాట్లాడారు. ‘‘అమెరికాలోకి విదేశీయుల చొరబాట్లను అడ్డుకునే, వారిని తరిమేసే సర్వాధికారం అధ్యక్షుడికే ఉంటుంది. ఈ అంశాన్ని సమీక్షించే హక్కు కోర్టులకు లేదు. అందులోనూ ఒక జిల్లా జడ్జికి అస్సలు లేదు’’అని ఆయన అన్నారు. ట్రంప్ సైతం జడ్జి బోస్బర్గ్ను తిడుతూ ‘ట్రూత్సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఆ జడ్జిని అభిశంసించాల్సిందే. ఆయన పెద్ద సమస్యగా తయారయ్యారు. నిరసకారుడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గత ఏ డాది ఎన్నికల్లో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో పాపులర్ ఓటు సాధించి నా నాయకత్వం, నా నిర్ణయం ఎంత సరైనవో నిరూపించుకున్నా. అధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతను సమీక్షించే అధికారం జడ్జి కంటే నాకే ఉందని తాజా ఎన్నికలు నిరూపించాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జిల్లా జడ్జిని తిడుతూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ఒక పోస్ట్పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ మంగళవారం స్పందించారు. ‘‘గత రెండు శతాబ్దాల చరిత్రను గమనిస్తే కోర్టుల నిర్ణయాన్ని విబేధించేందుకు కార్యనిర్వాహణ వ్యవస్థ ‘అభిశంసన’ అనే విధానాన్ని ప్రయోగించడం ఎంతమాత్రం సబబు కాదు’’ అని వ్యాఖ్యానించారు. చదవండి: పుతిన్.. ఎవరి మాటా వినని సీతయ్య! జడ్జీలపై కన్నెర్ర పాలక రిపబ్లికన్లు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పే జడ్జీలను సాగనంపాలని చూస్తున్నారు. బూస్బర్గ్కు వ్యతిరేకంగా అభిశంసన తెస్తే బాగుంటుందని ఇప్పటికే ఇద్దరు దిగువసభ రిపబ్లికన్ సభ్యులు వ్యాఖ్యానించారు. ట్రంప్కు సంబంధించన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జీలు అమీర్ అలీ, పౌల్ ఈగల్ మేయర్లను అభిశంసించాలని దిగువసభలో గతంలో వ్యాఖ్యానించారు. 2019 జూలైలో అధ్యక్షుడిగా ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడిగా నాకేం కావాలన్నా నచ్చినట్లు చేసుకునే హక్కు రాజ్యాంగంలోని రెండో ఆర్టికల్ నాకు ప్రసాదించింది’’అని వ్యాఖ్యానించడం తెల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి
సాక్షి,న్యూఢిల్లీ:నలుగురు జిల్లా జడ్జిలకు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. శ్రీమతి రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలాదేవి, మధుసూదనరావులను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతోపాటు ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీలో జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న అవధానం హరిహరణాధ శర్మ,డాక్టర్ యడవల్లి లక్షణరావులకు ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకాలు అమలులోకి వస్తాయి. ఇదీ చదవండి: కేంద్రమంత్రికి మెటా క్షమాపణలు -
ఆమె ఒడి... అనాథల బడి
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు. ‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు! సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుకు భరోసా!ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది. – సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్ – తుమాటి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
న్యాయమూర్తినీ వదలని వేధింపులు!
జిల్లా జడ్జి తనను లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. అసలు దేశవ్యాప్తంగా మహిళలపైన నేరాలు పెరగడం చూస్తున్నాం. మహిళలపై అత్యాచారాలకు కారణం – వారి పట్ల భారత సమాజ దృక్పథమే. అయితే, ఒక మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితి వైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల పరిస్థితి ఏమిటి? విచిత్రమేమంటే, సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నాయి. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలు! ‘‘ఏ పౌరుడూ మరొక పౌరుణ్ణి కొన గలిగినంత ధనవంతుడుగా ఉండకూడదు. అలాగని ఏ పౌరుడూ తనను తాను అమ్ముకోవలసినంత పేదవాని గానూ ఉండకూడదు.’’ – రూసో మహాకవి, తాత్విక మేధావి ‘‘తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్కు లేఖ రాయడం దేశంలో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తి సీరియస్గా తీసుకొని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను విచారణకు ఆదేశించారు. ‘‘ఇక నాకు ఏమాత్రం జీవించాలని లేదు. నిర్జీవమైన ఈ శరీరాన్ని మోయడం నిష్ప్రయోజనం. నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి అనుమతించండి’’ అని మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ సుప్రీం చీఫ్ను కదిలించి వేసిన ఫలితంగా తక్షణ చర్యలకు ఆదేశించారు.’’ – 16.12.2023 నాటి పత్రికా వార్తలు ఇలాంటి ‘వేధింపుల పర్వం’ ఇంతకుముందూ జరిగిందని మరచి పోరాదు. నైతికంగా బలహీనుడైన ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలోనే పనిచేస్తున్న ఒక స్త్రీ అధికారిని రకరకాల వేధింపులకు గురిచేసి, ఆమె లొంగకపోయే సరికి, ఆమెనూ, ఆమె కుటుంబ సభ్యులనూ ఎన్ని రకాల బాధలు పెట్టిందీ లోకం మరచిపోలేదు. అలాంటి నైతిక బలహీనతలు లేనందుననే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ చంద్రచూడ్ ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తి పట్ల జరిగిన వేధింపుల కేసుపై తక్షణ విచారణకు ఆదేశించారు. గవర్నర్ల తీరు ఇదిలా ఉంచి, బీజేపీ–ఆరెస్సెస్ నాయకత్వ పాలన ఎలా ఉందో చూడండి: వారి విధానాలను అడ్డుకునే లేదా విమర్శించే రాష్ట్ర ప్రభుత్వాలను అదుపులో ఉంచగల తమ పార్టీ గవర్నర్లకు మాత్రమే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడే అధికారాలు అప్పగించారు. ఇందుకు పక్కా ఉదాహరణలు – కేరళ, తమిళనాడు గవర్నర్లు తీసు కుంటున్న నిర్ణయాలు! రాజ్యాంగంలోని 200 అధికరణకు ఇచ్చిన తొలి వివరణ ప్రకారం, శాసనసభ చర్చలో ఉన్న బిల్లులను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో శాసనసభ నిర్ణయం. అంతేగానీ ఆ హక్కు గవర్నర్కు లేదు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నర్లు తమ అసాధారణ అధికారాలు చెలాయిస్తూ శాసనసభ బిల్లులను తొక్కి పెడుతున్నారు. కానీ, బిల్లును ఆమోదించగల లేదా తిరస్కరించగల అధికారం ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు లేకుండా చేసే పెత్తనం గవర్నర్కు లేదు. ఒక వేళ ఏ కారణం చేతనైనా బిల్లును ఆమోదించ నిరాకరించే పక్షంలో ‘తిరిగి పరిశీలించండి’ అన్న విజ్ఞప్తితో శాసన సభకు నివేదించాలేగానీ, బిల్లులను తొక్కిపెట్టే అధికారం మాత్రం గవర్నర్కు లేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కరాఖండీగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ అధికారం ప్రజలు ఎన్నుకొనని గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రసిద్ధులకే ఇలా ఉంటే... అంతేగాదు, పంజాబ్ శాసనసభ కేసులో సుప్రీంకోర్టు బిల్లులను తొక్కిపెట్టి ఉంచే అధికారం గవర్నర్లకు లేదని స్పష్టం చేయడంతో రాజ్యాంగంలోని 200 అధికరణకు ఆచరణలో విలువ పెరిగింది. ఇదే సూత్రం రాష్ట్రపతికీ వర్తిస్తుంది. లోక్ సభ మాజీ ప్రధాన కార్యదర్శి పి.డి.టి. ఆచారి చెప్పినట్టు, ఒక చట్టం రాజ్యాంగబద్ధత సరైనదా, కాదా అన్నది కోర్టు నిర్ణయించాల్సిందే గానీ, ఆ విషయంపై ఇటు రాష్ట్రపతికీ, అటు గవర్నర్లకూ ఎలాంటి నిర్ణయాధికారం లేదు. అయితేనేమి, పాలకులు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నట్టు నటించ డమేగానీ దాని విలువలను ఆచరణలో పాటించడంలో నడుపుకొనేవి ‘సొంత దుకాణాలే’నని మరవరాదు. ఈ పరిస్థితులలో ఒక్క మహిళా న్యాయమూర్తులపైననే కాదు, అసలు దేశ మహిళలపైననే నేరాల సంఖ్య పెరిగిపోవడం చూస్తున్నాం. 2022వ సంవత్సరానికి నేషనల్ క్రైమ్స్ బ్యూరో ప్రకటించిన వివరాలను బట్టి మహిళలపైన ఇంతకుముందు కంటే నేరాల సంఖ్య పెరిగిపోయింది. పైగా, పెక్కు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పక్కన తమ మగ బంధువుల తోడు లేకుండా తాముగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు చేసుకోలేని స్థితి. మహిళలపై నేరాల సంఖ్య 4 శాతంపైన పెరిగిందని క్రైమ్స్ బ్యూరో నివేదిక. ఇవిగాక భర్తలు, వారి బంధువులు చేసిన నేరాల సంఖ్య 2022లో 4.45 లక్షలు. అంటే, ప్రతి గంటకూ 51 కేసులు రికార్డ య్యాయి. మరీ విచిత్రమేమంటే, ‘సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నా’యని జాతీయ మహిళా సంస్థ ‘జాగోరి’ డైరెక్టర్ జయశ్రీ వేలంకర్ వివరించారు. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలని ఆమె అన్నారు. మహిళల రక్షణకు ఉద్దేశించిన కఠిన చర్యలు కాగితం మీదనే ఉండి పోయాయిగానీ ఆచరణలో లేవనీ, దీన్ని బట్టి సంప్రదాయంగా స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతూ ఉండటానికి అసలు కారణం – స్త్రీల పట్ల భారత సమాజ దృక్పథమేననీ సుప్రీంకోర్టు ప్రసిద్ధ మహిళా న్యాయ వాది శిల్పి జైన్ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితివైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల విషయంలో గణింపు నకు రాని, వచ్చినా పట్టించుకోని సమాజ స్థితిగతుల్ని అర్థం చేసు కోగలగాలి. మాంస వ్యాపారం నా మిత్రుడు, సుప్రసిద్ధ లాయర్ హనుమారెడ్డి మతాలు – చట్టాల గురించి ముచ్చటిస్తూ మరవరాని రెండు మంచి మాటలు చెప్పాడు: ‘‘మతాలు రాజ్యమేలినప్పుడు చట్టం ఒక పద్ధతిగానూ, రాచరికం రాజ్యమేలినప్పుడు చట్టం మరొక పద్ధతిలోనూ, వ్యాపారం రాజ్యమేలినప్పుడు వేరొక పద్ధతిలోనూ ఉండి ప్రజలకు సంబంధించిన విధివిధానాలు మారుతూ వచ్చాయి. స్థూలంగా చెప్పాలంటే నేరాలు రెండు విధాలుగా ఉండాలి. ఒకటి రాజ్యాధికారం పట్ల నేరం, రెండవది ప్రజలపట్ల నేరం.’’ అలాగే, ‘ప్రేమ’ అనే పేరిట ఎంత ప్రమాదకర పరిణామాలు, విధ్వంసం జరుగుతున్నాయో మందరపు హైమవతి తన ‘నీలి గోరింట’ కవితలో ఇలా చీల్చి చెండాడవలసి వచ్చింది: ‘‘తండ్రీ, కూతురు, గురువు, శిష్యురాలు వావివరసల్లేకుండా ఆడపిల్లలే అంగడి సరుకులైనప్పుడు మానవ మాంస వ్యాపారంలో మహిళల శరీరాలే పెట్టుబడి ఐనప్పుడు రుష్యశృంగుడైనా మేనకను చూచిన విశ్వామిత్రునిలా మారిపోడా?!’’ అలా మారిపోకూడదనే ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తికి జరిగిన సంఘటన నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదేపదే చేస్తున్న విజ్ఞప్తుల పరంపర లక్ష్యం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు..సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించారు. జిల్లాలోని బారాబంకీలో నియామకం అయిన ఏడాదిన్నర నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి రెండు పేజీల లేఖలో ప్రస్తావించారు. ‘నాకు ఏమాత్రం జీవించాలని లేదు. ఏడాదిన్నర కాలంలో నన్ను జీవచ్ఛవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి’అని అందులో తెలిపారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా, బాధితురాలి లేఖపై సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు
తిరువనంతపురం: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు ఆపేశారు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టారు. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం అమెరికాలో జడ్జీగా నియమితులై తీర్పులు చెబుతోంది. ఆయనే కేరళలోని కాసరగోడ్ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్. ఇటీవలే అమెరికాలోని టెక్సాస్లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్. ‘పైచదువులు చదివించే స్తోమత నా కుటుంబానికి లేకపోవడంతో 10వ తరగతి తర్వాత చదువు మానేశాను. రోజువారీ కూలీగా ఏడాది పాటు బీడీలు చుట్టాను. అదే జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది.’అని పేర్కొన్నారు సురేంద్రన్ కే పటేల్. తన జీవితాన్ని మార్చుకునేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నాని, అందుకోసం గ్రామంలోని తన స్నేహితులను సాయం చేయాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. లా డిగ్రీ వరకు తనకు స్నేహితులు ఎంతగానో సాయపడినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లో ఓ హోటల్లో హౌస్కీపింగ్ జాబ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత చేసిన ప్రాక్టీస్ అమెరికాలో నిలదొక్కుకునేందుకు సాయపడిందన్నారు. అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్. ‘టెక్సాస్లో ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నంలో నా మాటతీరుపై కామెంట్లు చేశారు. నాకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. నేను డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీ చేసినప్పుడు నేను గెలవగలనని నా సొంత పార్టీ అనుకోలేదు. ఈ స్థాయికి వస్తానని ఎవరూ నమ్మలేదు. కానీ, నేను ఇక్కడ ఉన్నాను. అందరికి ఒకే ఒక్క సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఎవరికీ ఇవ్వకు. ఆ నిర్ణయం నీ ఒక్కడిదే. ’ అని తెలిపారు సురేంద్రన్ -
మానవత్వం చాటుకున్న జిల్లా జడ్జి..
సాక్షి, కరీంనగర్: ఆర్థిక ఇబ్బందులతో యాచకురాలిగా మారిన నిరుపేద వృద్ధురాలిపై ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.జి.ప్రియదర్శిని చొరవ చూపించి ఆసరా పింఛన్ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణం శివారు ముష్టిపల్లిలోని చేనేత కుటుంబానికి చెందిన జిందం లక్ష్మీ భర్త నర్సయ్య పింఛన్దారుడు. 2018లో భర్త చనిపోవడంతో లక్ష్మీ పింఛన్కోసం డీఆర్డీవో అధికారులకు దరఖాస్తు చేసుకుంది. నేటికి పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో యాచకురాలిగా మారింది. ఈ విషయం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని దృష్టికి రావడంతో ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల అదనపు జిల్లా జడ్జి జాన్సన్కు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. జిల్లా జడ్జి ఆదేశాలతో ఫ్రీ లీగల్ కేసు నమోదు చేసి డీఆర్డీవో అధికారులకు నోటీసులు జారీ చేసి ప్రాథమిక విచారణ జరిపారు. పెన్షన్కోసం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని తెలిపి లక్ష్మీకి సంబంధించిన పత్రాలు సేకరించినట్లు అధికారులు వివరించారు. ఈ కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు. -
పెళ్లై 8 నెలలు.. కోర్టు ఆవరణలో పోలీసు బలవన్మరణం
సాక్షి, చెన్నై: పని భారమా, కుటుంబ కష్టమా ఏమోగానీ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి గన్మన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం కృష్ణగిరి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణగిరి రైల్వే కాలనీకి చెందిన అన్బరసన్(29) సాయుధ విభాగంలో పోలీసు. కృష్ణగిరి మొదటి మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కలైమదికి గన్మన్గా పనిచేస్తున్నాడు. బుధవారం నైట్ షిఫ్ట్కు వచ్చిన అన్బరసన్ గురువారం ఉదయాన్నే న్యాయమూర్తి కలై మదితో కలిసి ఆయకోట్టై రోడ్డులోని కోర్టుకు వచ్చాడు. న్యాయమూర్తి తన గదిలోకి వెళ్లిపోవడంతో తాను అక్కడి మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి పైకి లేచిన అన్బరసన్ హఠాత్తుగా తుపాకీని నెత్తిపై పెట్టుకుని కాల్చుకున్నాడు. తుపాకీ పేలిన శబ్దంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అటు వైపు అందరూ పరుగులు తీశారు. రక్తపు మడుగులో అన్బరసన్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కృష్ణగిరి ఎస్పీ పాండి గంగాధర్, ఏడీఎస్పీ అన్బు, డీఎస్పీ శరవణన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. విచారణలో అన్బరసన్కు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. అతడి భార్య నాలుగు నెలల గర్భవతిగా తేలింది. కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే, పనిభారంతో బలన్మరణానికి పాల్పడ్డాడా లేదా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
భారత సంతతి సాధికారతకు శుభరూపం
యూఎస్లోని ఉన్నతస్థాయి బాధ్యతల్లోకి భారత సంతతి మహిళలు రావడం ఇటీవలి కాలంలో సాధారణం అయింది! స్త్రీ సాధికారతకు ఇది శుభరూప తరుణంలా కనిపిస్తోంది. తాజాగా రూప రంగ పుట్టగుంట ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయ్యారు. శుభా తటవర్తి విప్రో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పదవి చేపట్టనున్నారు. రూప రంగ పుట్టగుంట ప్రస్తుతం వాషింగ్టన్ ‘డీసీ రెంటల్ హౌసింగ్ కమిషన్’ అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆమెను వాషింగ్టన్ డీసీ జిల్లా ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె ఎంపికను సెనెట్ ఆమోదిస్తే కనుక అమెరికాలో ఫెడరల్ జడ్జి అయిన తొలి భారత సంతతి మహిళగా రూప గుర్తింపు పొందుతారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కావడానికి ముందు 2013 నుంచి 2019 వరకు ఆమె క్రిమినల్ న్యాయవాదిగా ఉన్నారు. రూపతోపాటు మరో తొమ్మిది మందిని అత్యున్నస్థాయి న్యాయ సంబంధ స్థానాలకు నామినేట్ చేసిన వైట్ హౌస్.. ‘‘ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నిష్ణాతులు అమెరికాలోని భిన్నజాతుల ప్రజలకు ప్రయోజనకరమైన సేవలను అందిస్తారని అమెరికా అధ్యక్షుడు బలంగా విశ్వసిస్తున్నారు..’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. రూపకు ఫ్యామిలీ కోర్టు న్యాయవాదిగా కూడా రెండేళ్ల పాటు అనేక కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. 2008 నుంచి 2011 వరకు ఆమె లా క్లర్క్గా పని చేశారు. 2007లో ఒహియో స్టేట్ మోర్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ‘లా’లో పట్టభద్రురాలయ్యారు. ఇక శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న సీనియర్ టెకీ శుభా తటవర్తి మంగళవారం విప్రో కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సి.టి.ఓ.) గా నియమితులయ్యారు. వాల్మార్ట్ నుంచి విప్రోకి వచ్చిన శుభ వాల్మార్ట్ కంటే ముందు పేపాల్లో పదేళ్లు సేవలు అందించారు. వాల్మార్ట్లో సీనియర్ డైరెక్టర్గా, పేపాల్లో హెడ్ ఆఫ్ ప్రాడక్ట్గా ఆమె అనుభవం విప్రో సి.టి.వో. అయేందుకు తోడ్పడింది. రూప కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. -
న్యాయమూర్తిని బలితీసుకున్న కరోనా
పాట్నా : భారత్లో కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ రాష్ర్టంలో కోవిడ్ కారణంగా మొదటిసారిగా ఓ జడ్జి కన్నుమూశారు. వివరాల ప్రకారం.. పట్నా కుటుంబ న్యాయస్థానం ప్రిన్సిపల్ జడ్జి హరిశ్చంద్ర శ్రీవాస్తవ (58) శ్వాస సంబంధిత సమస్యలతో బుధవారం ఎయిమ్స్లో చేరగా కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శ్రీవాస్తవ మృతిపట్ల బిహార్ జుడీషియల్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి అజిత్ కుమార్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్తవ మరణించడం తీరని లోటని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లా శ్రీనివాస్తవ స్వస్థలం. బిహార్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా ఎంపికైన తర్వాత 1995 డిసెంబర్ 16న న్యాయవ్యాదిగా ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2022 జూలై 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా కోవిడ్-19 బారిన పడి అకాలమరణం చెందారు. (బిహార్లో వరద బీభత్సం: 21 మంది మృతి) -
జడ్జికి కరోనా.. కోర్టు మూసివేత
భోపాల్ : మధ్యప్రదేశ్లో జిల్లా జడ్జికి కరోనా సోకడంతో కోర్టును మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే కేసులు పరిష్కరించాలని జబల్పూర్ హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. ఖండ్వా జిల్లా కోర్టు అదనపు జడ్జికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా ఆయన భార్యకు కూడా వైరస్ సోకింది. దీంతో మిగతా కుటుంబ సభ్యులు సహా న్యాయమూర్తుల కాలనీలో నివాసం ఉంటున్న 86 మంది ఇతర న్యాయమూర్తుల కుటుంబాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. (సరిహద్దు వివాదం.. కేంద్రం వర్సెస్ రాహుల్ గాంధీ ) ఖండ్వా జిల్లా ఇన్చార్జి జడ్జిగా బుర్హాన్పూర్ సెషన్స్ జడ్జిని నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వీడియో కాన్పరెన్సుల ద్వారానే కేసులను పరిష్కరించాలని పేర్కొంది. కరోనా లక్షణాలు లేవని నిర్దారణ అయిన 30 శాతం మంది సిబ్బందిని కోర్టుకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఖండ్వాలో ఇప్పటివరకు 271 మందికి కరోనా సోకగా వారిలో 17 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో సోమవారం నాటికి 9,638 కరోనా కేసులు నమోదవగా, 414 మంది చనిపోయారు. అయితే వైరస్ బారినుంచి కోలుకుంటున్న వారి శాతం క్రమంగా పెరుగుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లోనే 205 మంది కోవిడ్ బాదితులు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. (కరోనా: కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ) -
‘మెజిస్ట్రేట్లు జిల్లా జడ్జీలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారు’
న్యూఢిల్లీ: మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జీలు తదితర న్యాయ వ్యవస్థలోని దిగువ విభాగానికి చెందిన వారు జిల్లా జడ్జీల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలుగా విధుల్లో చేరిన జ్యూడీషియల్ అధికారులు.. మళ్లీ తమ పాత హోదాకు తిరిగివెళ్లాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్లు, సివిల్ న్యాయమూర్తులు మెరిట్తో, సీనియారిటీతో పదోన్నతుల ద్వారా కానీ, లిమిటెడ్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా కానీ జిల్లా జడ్జీలుగా నియామకం కావచ్చని పేర్కొంది. సాధారణంగా ఏడేళ్ల పాటు వరుసగా న్యాయవాద వృత్తిలో కొనసాగినవారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులవుతారు. జ్యూడీషియల్ అధికారులుగా విధుల్లో చేరకముందు, ఏడేళ్ల వరుస సర్వీసు ఉన్నప్పటికీ.. వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులు కాబోరని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 233కి ధర్మాసనం వివరణ ఇచ్చింది. -
పరీక్ష రాసినోళ్లందరూ ఫెయిలయ్యారు..
సాక్షి, చెన్నై: జిల్లా న్యాయమూర్తి నియామకానికి నిర్వహించిన పరీక్షలో మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జిలు, న్యాయవాదులు సహా అందరూ ఫెయిలైన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 31 జిల్లా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి గాను మద్రాసు హైకోర్టు, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా జనవరి 13న పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేశాయి. దీనికి 35 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య వయస్సున్న న్యాయవాదులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీలు), సివిల్ కోర్టుల్లో న్యాయమూర్తులుగా, మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులు కలిపి 3,562 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలుగా మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లుగా ఏప్రిల్ 7న నిర్వహించారు. పేపర్–1లో సివిల్ లా కు సంబంధించి, పేపర్–2లో క్రిమినల్ లాకు సంబంధించిన ప్రశ్నలను పొందుపరిచారు. మొత్తం 150 మార్కులకు గాను పరీక్షను నిర్వహించారు. ఇందులో రిజర్వేషన్ ప్రాతిపదికన మార్కులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 150కి గాను 45, బీసీ అభ్యర్థులకు 52.5, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 60కి కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. ప్రిలిమ్స్ పరీక్షకు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం విశేషం. దీంతో మే 25,26 తేదీల్లో జరగాల్సిన మెయిన్ పరీక్షకు ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు న్యాయవాదులు, న్యాయశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
26 ఏళ్లకే జిల్లా జడ్జిగా..
రాయచూరు రూరల్: చదువుకునే వయసులోనే ఆమె ప్రతిభకు పదునుపెట్టి జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగానికి ఎంపికైంది. విజయపుర జిల్లాకు చెందిన చైత్రా కులకర్ణి 26 ఏళ్లకే న్యాయపీఠం అధిష్టించబోతున్నారు. బాగలకోటెలోని ఎస్ఆర్ఎన్ కామర్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న వసంత కులకర్ణి కుమార్తె చైత్రా కులకర్ణి విజయపుర జిల్లా ఇండి తాలూకా నందరిగికి చెందినవారు. బాగలకోటెలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ బరగుండి వద్ద మూడేళ్ల పాటు శిక్షణ పొందారు. న్యాయ శాఖలో ఇటీవల 101 జడ్జి ఉద్యోగాల నియమకాలకు జరిగిన పరీక్షలకు 4 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 946 మంది ప్రధాన న్యాయమూర్తి పరీక్షకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలలో 86 మందికిగాను 33 మంది ఎంపిక కాగా వారిలో చైత్రా కులకర్ణి కూడా ఉండడం విశేషం. ఆమె ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మీడియంలోనే విద్యనభ్యసించడం కొసమెరుపు. హైకోర్టులో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టనున్నారు. -
జిల్లా జడ్జి చెప్పినా.. పట్టదా?
ప్రొద్దుటూరు టౌన్ : అధికార పార్టీ నాయకులు తాము అనుకున్నదే చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినా.. పట్టించుకోలేదు. పట్టణంలోని గాంధీ పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ పాలకవర్గం ఇటీవల ప్రారంభించింది. పార్కులో ట్యాంక్ నిర్మిస్తే.. ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే.. జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ దృష్టికి గురువారం తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన జడ్జి అక్కడ ట్యాంక్ నిర్మాణ పనులు ఆపాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు తెలిపారు. అలాగే అని కమిషనర్ జడ్జికి చెప్పారు. ఒక రోజు కూడా గడవక ముం దే తిరిగి పనులు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల నుంచి శని వారం తెల్లవారుజామున 5.30 వరకు అధికార పార్టీకి చెందిన రామాపురం వాసి హిటాచితో వందల ట్రాక్టర్ల మట్టిని తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం క్రీడా మైదానాలు, ఉద్యానవనాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా.. అధికార పార్టీ నేతలు తుంగలో తొక్కి పార్కులో పెద్ద గోతులు తవ్వడం పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్టర్ మట్టిని రూ.1000కి పైగా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ వంగనూరు మురళీధర్రెడ్డి అర్ధరాత్రి ఫోన్ చేసినా కమిషనర్ తీయలేదు. శనివారం ఉదయం ఆయన కమిషనర్కు తెలిపినా.. కనీసం పార్కులోకి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా పార్కులో అర్ధరాత్రి మట్టి తరలింపు చేస్తుంటే.. అధికార పార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించాయని స్పష్టమవుతోంది. అర్ధరాత్రి హిటాచిని ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుంటే.. అక్కడ పోలీసు వాహనంతోపాటు ఎస్ఐ, సిబ్బంది పహారా కాయడం కనిపించింది. -
పాఠశాలల్లో వసతులపై మే నుంచి తనిఖీలు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టేందుకు ఈ ఏడాది మే నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ చెప్పారు. బాలల హక్కులను పరిరక్షించే అంశంపై న్యాయసేవా సదన్లో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల నిర్వహణకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు, పుస్తకాల రూపంలో దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు. విద్యార్థులకు తగిన నిష్పత్తిలో మరుగుదొడ్లు, క్రీడామైదానం, రెండు అంతస్తులకు మించిన భవనాల్లో స్కూళ్లు నడపకుండా చూడటం, అన్ని అంతస్తుల్లో తాగునీటి సౌకర్యం, అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు చర్యలు తదితర ప్రభుత్వ నిబంధనలు పాటించిన స్కూళ్లకు మాత్రమే అనుమతులివ్వాలన్నారు. లేని వసతులు ఉన్నట్లు రికార్డుల్లో చూపించి, అనుమతిస్తే అందుకు అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాలపై తల్లిదండ్రులు, ఇంకెవరైనా అన్యాయం జరుగుతోందని భావిస్తే వారికి తెలిసిన న్యాయవాది లేదా జిల్లా న్యాయసేవా సంస్థ ద్వారా తమను సంప్రదించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లకుండానే హాజరైనట్లు చూపిస్తున్నారని, అటువంటి వారిపై భవిష్యత్లో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డీఆర్వో ఆర్.రాజ్కుమార్, ఏఎస్పీ ఏ.వి.రమణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ భువనగిరి కృష్ణవేణి, డీఈఓ నాగమణి, ఫ్యామిలీ కోర్టు జడ్జి భీమారావు, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారమే ధ్యేయం
► నేషనల్ లోక్ అదాలత్ ప్రారంభంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ► రాత్రి వరకు ఐదు బెంచీలతో కేసుల పరిష్కారం లీగల్ ( కడప అర్బన్ ): జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారమే ధ్యేయంగా నేషనల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకనూరు శ్రీనివాస్ అన్నారు. శనివారం నేషనల్ మెగా లోక్ అదాలత్ను జిల్లాలోని వివిధ కోర్టుల్లో ప్రారంభించారు. జిల్లా కోర్టులో నేషనల్ మెగా లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకనూరు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మెగా లోక్ అదాలత్ చైర్మన్ దీపక్ మిశ్రా ఆదేశాల మేరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ మెగా లోక్ అదాలత్లో ప్రత్యేకంగా మెజిస్ట్రేట్లతో కూడిన ఐదు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. అర్ధరాత్రి వరకు పెండింగ్ కేసులను పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులను కూడా తిరిగి పొందవచ్చన్నారు. ప్రత్యర్థి వర్గం వారితో సమన్వయంతో కేసులను పరిష్కరించుకోగలుగుతామన్నారు. ఈ అవకాశాన్ని పోలీసులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. సమావేశానంతరం లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన ఓ కేసు పత్రాన్ని సంబంధిత న్యాయవాదికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసమూర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ విష్ణు ప్రసాద్రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది గుర్రప్ప, మెజిస్ట్రేట్లు శోభారాణి, సీడబ్యూసీ చైర్మన్ శారద, భారతరత్న మహిళా మండలి వ్యవస్థాపకురాలు మూలె సరస్వతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2274 కేసుల పరిష్కారం: నేషనల్ మెగా లోక్ అదాలత్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్తోపాటు జిల్లాలోని వివిధ కోర్టులలో కూడా కేసుల పరిష్కారం జరిగింది. మొత్తం 2274 కేసులు పరిష్కారం అయ్యాయి. తద్వారా కక్షిదారులకు రూ.2,00,42,286ల నష్టపరిహారం లభించింది. కేసుల పరిష్కారానికి కృషి చేసిన మెజిస్ట్రేట్లు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు, బాధితులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. -
అవగాహనతోనే సమస్యల పరిష్కారం
► జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ రాజాం రూరల్ : అవగాహనతో వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. శనివారం స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేడు చాలా మంది అవగాహనలోపంతో ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి, వివాదాలకు వెళ్తున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో పెద్దల సమక్షంలో వీటిని పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో వర్గవిభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక ఉపాధి పని చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ఎస్పీ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో వివాదాలు లేని సమాజాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాలను నిషేధించడం,మద్యం అమ్మకాలు లేకుండా చూడ డం, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. అంతకుముందు ఈ లోక్అదాలత్లో 277 కేసులు పరిష్కారమైనట్లు సీని యర్ సివిల్ జడ్జి ఎంపీ సన్నిధిరావు తెలిపారు. క్రిమినల్ కేసులు 33, చెక్ బౌన్స్ కేసు 1, భార్యాభర్తల కేసు ఒకటి పరిష్కారమయ్యాయని వివరించారు. అలాగే మెయింటినెన్స్ కేసులు రెండు పరిష్కారం కాగా.. రూ.2.50 లక్షలు, సివిల్ కేసు ల రెండు ‡ద్వారా రూ.20వేలు, 221 పెట్టీ కేసుల నుంచి రూ.1,67,500లు వసూలు చేసినట్లు తెలి పారు. అక్రమంగా మందుగుండు కలిగిన 17 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈ అదాలత్లో ఎస్.అప్పలనాయుడు, జూనియ ర్ సివిల్ జడ్జి కృష్ణసత్యలత, బూరి దామోదరరావు, పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, రాజాం సర్కిల్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
- జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి - ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా లోక్అదాలత్ బనగానపల్లె రూరల్ : కక్షిదారులకు సత్వర న్యాయమే ధ్యేయంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ఏప్రిల్ 8వతేదీన నిర్వహించే లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని న్యాయవాదులు, పోలీసులకు సూచించారు. బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జడ్జీ లావణ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో సామరస్యంగా కక్షిదారులతో చర్చించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, చెక్బోన్స్, రెవెన్యూ, పంచాయతీ, బ్యాంకు రుణాల కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జెడ్వీ కృష్ణారెడ్డి, ఏపీపీ గోపాలకృష్ణ, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు, -
పరస్పర సహకారం అవసరం
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కర్నూలు (లీగల్): న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర సహకారంతో కక్షిదారులకు సత్వర న్యాయం అందిద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సూచించారు. ఇటీవల బదిలీపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జీగా నియమితులైన వెంకటనాగసుందర్కు బుధవారం స్థానిక న్యాయవాదుల సంఘం కార్యాలయంలో స్వాగత సభ నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ విశాఖ నుంచి కర్నూలుకు వచ్చిన న్యాయమూర్తి నాగసుందర్ అభినందిస్తూ ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులకు ఎలాంటి సహకారం అందిస్తున్నారో నూతన న్యాయమూర్తికి అందించాలని కోరారు. మొదటి అదనపు జిల్లా జడ్జీ వీవీ శేషుబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా న్యాయవాదులు కేసుల పరిష్కారానికి సహకరించారని అలాగే భవిష్యత్లో అందరికి సహకరించాలని కోరారు. నూతన న్యాయయూర్తి వెంకటనాగసుందర్ మాట్లాడుతూ కర్నూలుకు విశాఖకు అవినాభావ సంబంధం ఉందని ఇక్కడ పని చేసిన న్యాయమూర్తులు విశాఖకు, విశాఖలో పని చేసిన వారు ఇక్కడికి బదిలీ అవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి రఘురాం, సబ్ జడ్జిలు శివకుమార్, గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, గంగాభవాని, బాబు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చాంద్బాషా, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, తిరుపతయ్య, అబ్దుల్ కరీం, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
అక్షరాస్యతతోనే అభివృద్ధి
- జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు అయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. స్థానిక రవీంద్ర ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో ‘ ముగ్ధ2కే17 (ముగ్ధమనోహరం) కార్యక్రమాన్ని గత ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించారు. సాంస్కృతిక, సాహిత్య, ఆటల పోటీలు శనివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రవీంద్ర డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ మమత మాట్లాడారు. అనంతరం విద్యార్థినుల మోడలింగ్ నిర్వహించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కళాశాల వైస్ చైర్మన్ వంశీధర్, ప్రిన్సిపాల్ సతీష్బాబా, అధ్యాపక బృందం జయలక్ష్మి, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గుల పోటీల్లో జిల్లా జడ్జికి ప్రథమ స్థానం
కర్నూలు (లీగల్): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళా న్యాయవాదులకు, న్యాయమూర్తులకు న్యాయవాది సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తికి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గంగాభవానికి ప్రథమ బహుమతులు వచ్చాయి. స్థానిక జిల్లా కోర్టు ఆవరణంలో జరిగిన ఈ పోటీల్లో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండో బహుమతి న్యాయవాదులు గీతామాధురి, హిందుమతి వేసిన ముగ్గులు ఎంపికయ్యాయి. మూడో బహుమతికి పరమేశ్వరి, ప్రేమలతలు వేసిన ముగ్గులు ఎంపికయ్యాయి. న్యాయ నిర్ణేతలుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శివకుమార్, లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ వ్యవహరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు గాయత్రిదేవి, స్వప్నరాణిలతో పాటు సీనియర్ మహిళా న్యాయవాదులు సాయిలీల, నాగలక్ష్మిదేవి, యూవీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్తో జీవితాలు నాశనం
కర్నూలు సిటీ: సీనియర్, జూనియర్ విద్యార్థులు కళాశాలల్లో స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని, ర్యాగింగ్తో జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. బుధవారం నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తుంటారని.. భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉంటాయన్నారు. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. సరదాల కోసం ర్యాగింగ్కు పాల్పడితే తల్లిదండ్రుల ఆశలన్నీ వమ్ము అవుతాయన్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు అన్నదమ్ముల్లా కలిసిపోవాలన్నారు. అనంతరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్నరాణి మాట్లాడుతూ ర్యాంగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయని.. అందువల్ల విద్యార్థులు కళాశాలల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సోమశేఖర్, సీనియర్ న్యాయవాది నిర్మల, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జడ్జి సంతకం ఫోర్జరీ..
నలుగురు నిందితుల అరెస్టు డాబాగార్డెన్స్: జిల్లా జడ్జి ఫోర్జరీ సంతకం చేసిన సంఘటనలో ఓ న్యాయవాదితో పాటు ముగ్గురు కటకటాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాణిపేటకు చెందిన అక్కయ్యమ్మ, వెంకట్రావు, రేఖలకు కొంత స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. న్యాయవాది కె.శ్రీనివాస్, అక్కయ్యమ్మ, వెంకట్రావు, రేఖ జడ్జి సంతకాన్ని ఫోర్జరీ చేసి తీర్పు వారికి అనుకూలంగా వచ్చిందని రూరల్ ఎమ్మార్వో శంకరరావుకు చూపించారు. తీర్పు కాపీని ఎమ్మార్వో పరిశీలించి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఆ కాపీని పరిశీలించి జడ్జి ఫోర్జరీ సంతకాన్ని గుర్తించి ఆ నలుగుర్ని టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
బాలల హక్కులపై అవగాహన పెంచుకోవాలి
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బాలల హక్కులు, వారికున్న చట్టాలపై (జువైనల్) పోలీసులు, న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, బాలల సంరక్ష అధికారులు, జువైనల్ యూనిట్ల అధికారులకు జువైనల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు ఎంఏ సోమశేఖర్, జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ, జేసీ–2 రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న పెను మార్పులతో బాలల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి బాలలను చిన్నతనంలోనే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బాలలు తమ హక్కులను కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా జడ్జి రఘురామ్, ఆరో అదనపు జిల్లా జడ్జి వీ.శేషుబాబు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు, ప్రభుత్వ న్యాయవాదులు, జైలు అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల వద్దకే న్యాయసేవ
– జిల్లా జడ్జి హరిహరనందశర్మ హిందూపురం అర్బన్ : గడపగడపకూ న్యాయసేవలపై చైతన్యం కల్పించి వారి సమస్యలను చట్టపరంగా రాజీమార్గంలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజల వద్దకు న్యాయసేవ నినాదంతో ముందుకు పోతున్నామని జిల్లా జడ్జి హరిహరనందశర్మ అన్నారు. హిందూపురం కోర్టుకు మంగళవారం సాయంత్రం విచ్చేసిన ఆయన ఈనెల 5న హైకోర్టు జడ్జి ప్రారంభించనున్న రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొత్త భవనాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవాన్ని న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజలు కలసి çపండుగలా జరుపుకోవాలని కోరారు. అనంతరం కోర్టు ఆవరణలో పారా వలంటీర్లు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. పారామిలటరీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి కోర్టు ద్వారా న్యాయసేవలు అందే పరిస్థితి వివరించాలన్నారు. చాలామంది ప్రభుత్వ పథకాలు అందక, లైసెన్సులు, రేషన్కార్డులు తదితర సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. అలాంటి వారికి కోర్టు ద్వారా న్యాయం అందుతోందోన్న భరోసా కల్పించాలని సూచించారు. హిందూపురం అదనపు జిల్లా జడ్జి రాములు, న్యాయమూర్తులు నాగశేషయ్య, జానీబాషా, ఆనందతీర్థ, హరిప్రియ, పీపీ రాజశేఖర్, ఏజీపీ సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, సిద్ధు, శివశంకర్ పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే లోక్అదాలత్ లక్ష్యం
జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్) : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులు చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్.ప్రేమావతి, లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సి.కె.గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్స్లు ఎం.బాబు, పి.రాజు, సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు ఇన్సురెన్స్ కంపెనీల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 1,230 కేసులు పరిష్కారం... జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,230 కేసులు పరిష్కారం చేశారు. కర్నూలులో 298, నంద్యాల 196, ఆదోనిలో 85, నందికొట్కూరులో 54, ఆత్మకూరులో 217, ఎమ్మిగనూరులో 34, ఆలూరులో 35, డోన్లో 78, ఆళ్లగడ్డలో 58, పత్తికొండలో 28, కోవెలకుంట్లలో 91, బనగానపల్లెలో 56 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. -
రాజీ కేసులన్నీ పరిష్కారం
లీగల్ (కడప అర్బన్ ) : జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులలో రాజీ కాదగిన కేసులన్నింటినీ పరిష్కరించాలనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. వివిధ కోర్టుల పరిధిల్లో రాజీ కాదగిన కేసునలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 1567 కేసులకు పరిష్కారం నేషనల్ లోక్ అదాలత్ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 1747 కేసులకుగాను 1567 కేసులకు పరిష్కారం లభించింది. బాధితులకు రూ. 1,36,82,755 నష్టపరిహారంగా లభించింది. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీనివాస మూర్తి, జడ్జి అన్వర్ బాష, మెజిస్ట్రేట్ శోభారాణి, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జివి రాఘవరెడ్డి, న్యాయవాదులు, కక్షి దారులు పాల్గొన్నారు. -
రామలింగేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి
కీసర : కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి వార్లను సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి విజయేంద్ర కుటుంబసమేతంగా సందర్శించారు. ఉదయం కీసర ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు న్యాయమూర్తికి ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, వేద పండితపులు నాగేంద్రశర్మ, రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చీర్యాల లక్ష్మీనసింహస్వామి ఆలయానికి చేరుకున్న జిల్లా జడ్జికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు జడ్జి దంపతులకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్ మల్లారపులక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిలు స్వామివారి ప్రసాదంతో పాటు, చిత్రపటానికి బహూకరించారు. -
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి అనుప చక్రవర్తి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు అతిథులుగా జిల్లా జడ్జితోపాటు లోకాదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్, రిటైర్డ్ డీఎస్పీ పాపారావు పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగం హక్కులతోపాటు విధులను కూడా ప్రజలకు ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకుని మనము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతామని ఆలోచించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. తన చదువు మొత్తం ప్రభుత్వ బడులు, కళాశాలల్లోనే ముగిసిందని జడ్జి అనుపచక్రవర్తి చెప్పారు. అనంతరం విద్యార్థులకు చట్టాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీవీ రాజేశ్వరి, వైస్ప్రిన్సిపాల్ వీరాచారి, అధ్యాపకులు ఇంద్రాశాంతి, శ్రీదేవి, వసుంధరమ్మ, నజీర్ అహ్మద్, ఇమ్మానుయేల్, ఫరిదా, సమిదా, అనిత పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
లీగల్ (కడప అర్బన్) : చట్టాలపై పోలీసు అ«ధికారులతోపాటు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ఖచ్చితమైన అవగాహన ఉండాలని, మారుతున్న చట్టాలకు అనుగుణంగా తాము కూడా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణంలోని లోక్ అదాలత్ భవనంలో పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులకు, ఎన్జీఓలకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని, తద్వారా మారుతున్న చట్టాలను మరింత ప్రజల్లోకి అవగాహన కోసం తీసుకు వెళుతున్నామన్నారు. ఇందులో భాగంగానే పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓలు, స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులకు మరింత అవగాహన కల్పించే క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూయూ ప్రసాద్, జడ్జిలు అన్వర్బాష, శోభారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ రాఘవరెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కళల కాణాచి భారతదేశం
వైవీయూ : కళల కాణాచి భారతదేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ‘రంగధామ–2016’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు శారీరక ఆరోగ్యం కోసం ఆటలు ఎంతో అవసరమన్నారు. అదే విధంగా మానసిక ఆరోగ్యం, వికాసం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్నారు. భారతదేశం అనాధిగా కళలకు పెట్టింది పేరన్నారు. మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించే ఇటువంటి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కళాశాల అధినేత బైరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఏ కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో పాల్గొంటూ దానిని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రంగధామ కార్యక్రమం ఈనెల 1నుంచి 11వ తేదీ వరకు రోజుకో విభాగంలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కళాశాలలో రంగోలి పేరుతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల విభాగం కోఆర్డినేటర్ సుబ్బనరసయ్య, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల భవిష్యత్
విజయనగరం లీగల్: పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదేనని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మీనారాయణ హితవు పలికారు. స్థానిక న్యాయసేవాసదన్లో బాలల హక్కులు, బాల నేరస్తులతో పోలీసులు ప్రవర్తించాల్సిన తీరుపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. పరిసర ప్రాంతాలు, సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఈ కారణంగానే కొంతమంది బాలలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారన్నారు. వీరిపై కేసులు నమోదు అయినప్పుడు పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికారు. వారిని శిక్షించడం కన్నా వారిలో మార్పు తీసుకురావడం కోసమే కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పక్కాగా చట్టాల అమలు ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బాలల హక్కుల సంరక్షణకు చట్టాలు రూపొందించాయని, వాటిని పక్కాగా అమలు చేయడానికి జువైనల్ అధికారులు, పోలీస్ అధికారులు బాల న్యాయాధికారులు, శిశు సంరక్షణ అధికారులు కృషి చేయాలని కోరారు. సమాజంలో పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. బాల నేరస్తుల కేసులు విచారణ చేసేటప్పుడు పోలీసు అధికారులు యూనిఫాం ధరించకూడదన్నారు. బాలల విషయంలో మీడియాకు కూడా ఆంక్షలు ఉన్నాయన్నారు. వీరి ఫొటోలు, పేర్లు ప్రచురించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. దీనిపై కూడా మీడియా ప్రతినిధులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అధికారి, జువైనల్ వెల్ఫేర్ ఎం. శరత్ బాబు బాలల న్యాయ రక్షణ సంరక్షణ చట్టం, 2015 అమలు, అధికారులు నిర్వహించాల్సిన విధులు, బాల న్యాయ చట్టాల రూల్స్పై అవగాహన కల్పించారు. అలాగే పిల్లల మనస్తత్వం, కౌన్సెలింగ్పై సైకాలిజిస్ట్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, బాల నేరాలపై సెంట్రల్ క్రైం స్టేషన్ డీఎస్పీ ఎస్.చక్రవరి, బాలల న్యాయ హక్కులు జాతీయ విధానంపై లీగల్ సర్వీసెస్ మెంబర్ బి.ఎల్.నరసింగరావు, బాల నేరాల కేసులు, పరిష్కారంపై అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.ఆశారాణి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి, అదనపు జడ్జి బి.శ్రీనివాసరావు, స్పెషల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ చట్టం, అదనపు జడ్జి వి.వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.సురేష్, జిల్లాలోని 42మంది ఎస్ఐలు, చిన్న పిల్లల సంరక్షణ సంక్షేమాధికారులు, జువైనల్ అధికారులు, జిల్లా ప్రొహిబిషన్ అధికారులు, పోలీస్ అధికారులు, పిల్లల సంరక్షణ ఎన్జీవో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జేసీజే, డీజే పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జీ (జేసీజే), జిల్లా జడ్జీ (డీజే) పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకునేందుకు హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. పరీక్షల అనంతరం సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా వాటిని తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు సీల్డ్ కవర్లో భద్రపరచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గురువారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అన్ని పక్షాల తరఫు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తరువాత జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి వచ్చే నెల 12న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. అలాగే జిల్లా జడ్జీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల నిర్వహణను నిలిపేయాలంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరిగేంత వరకు పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలను గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డుకోవద్దని పిటిషనర్లకు విజ్ఞప్తి చేసింది. ‘ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే 164 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. 20 శాతం కోర్టులు న్యాయాధికారులు లేక ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దీని వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు. ప్రజలు, కక్షిదారులే. ఈ పిటిషన్లు దాఖలు చేయడాన్ని మేం తప్పుపట్టడం లేదు. ఎక్కడో ఓ చోట ప్రారంభం కావాలి కాబట్టి పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిద్దాం. ఇన్ని పోస్టులు భర్తీకి నోచుకోవడం పట్ల యువ న్యాయవాదులు సంతోషంగా ఉన్నారు. వారు సీరియస్గా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారి జీవిత కాలంలో ఒకసారి వచ్చే గొప్ప అవకాశం ఇది. ఈ పరీక్షకు తెలంగాణకు చెందిన న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి మాకు సాయం చేసే చేతులు కొన్ని కావాలి. పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థుల సహనాన్ని మేం పరీక్షించదలచుకోలేదు.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ సర్వీస్ రూల్స్ 2007ను తాము తమ రాష్ట్రానికి వర్తింప చేసుకున్నామని, విజభన తరువాత పోస్టుల భర్తీని తమ రాష్ట్ర రూల్స్ ప్రకారం చేపట్టాలని ఆయన కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, గతంలో జేసీజే పరీక్షలు జరిగినప్పుడు ఈ హైకోర్టు ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో అవే ఉత్తర్వులను ఇప్పుడు కూడా జారీ చేస్తామని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు అనుమతినిస్తూ, సమాధానపత్రాలను మాత్రం మూల్యంకనం చేయకుండా సీల్డ్ కవర్లో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
బస్సు ప్రమాదంపై విచారణ ప్రారంభం
-
బస్సు ప్రమాదంపై విచారణ ప్రారంభం
అనంతపురం: ఈనెల రెండో వారంలో పెనుకొండ వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనపై జిల్లా జడ్జి వెంకటేశ్వర రావు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ, రోడ్లు భవనాలు, రవాణా తదితర శాఖల నుంచి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరలో హైకోర్టుకు అందిస్తామని జడ్జి వెంకటేశ్వర రావు తెలిపారు. -
లోక్ అదాలత్లను వినియోగించుకోండి
నిజామాబాద్ లీగల్, న్యూస్లైన్ : లోక్ అదాలత్ల ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని జిల్లా జడ్జి, న్యాయ సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు. అలాగే సత్వరం న్యాయం పొందవచ్చన్నారు. కాబట్టి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్లను వినియోగించుకోవాలని కోరారు. న్యాయసేవా సదన్లో శనివారం మెగా లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సత్వర న్యాయం అందించే లోక్ అదాలత్లతో ఇరు పక్షాల వారు గెలుపొందుతారన్నారు. రాజీమార్గంలో కేసులను పరిష్కరిస్తామన్నారు. బ్యాంకుల ఫ్రీ లిటిగేషన్ కేసులతోపాటు వివిధ కోర్టుల్లో దాఖలు చేసిన కేసులను కూడా ఈ అదాలత్లో పరిష్కరిస్తామన్నారు. అనంతరం కేసులో అప్పటికే చెల్లించిన కోర్టు ఫీజులను వాపసు చేస్తామన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి మహ్మద్ బందె అలి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్జిలు బీఎస్. జగ్జీవన్కుమార్, కె. రవీంద్రబాబు, ఎం.రాధాకృష్ణ చౌహాన్, ఎన్ఎల్ శాస్త్రి, లోక్ అదాలత్ సభ్యులు రాజ్కుమార్ సుబేదార్, హెచ్. అంకిత, ఎం. కుసుమ కుమారి, న్యాయవాదులు పాల్గొన్నారు. అవార్డు అంద చేసిన జిల్లా జడ్జి.. మెగాలోక్ అదాలత్ ప్రారంభంలో జిల్లా జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్ బ్యాంకు కేసులను పరిష్కరించారు. మొత్తం 1,400ల బ్యాంకు కేసులను పరిష్కరించారు. పట్టు విడుపులతో రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకున్న కక్షిదారులను ఆయన అభినందించారు. -
ఖైదీలకు ఫోన్ సౌకర్యం
విశాఖ కేంద్ర కారాగారంలో జిల్లా న్యాయమూర్తి ప్రారంభం రిమాండ్ ఖైదీలకూ త్వరలో అందుబాటు విశాఖపట్నం, న్యూస్లైన్ : ఖైదీల కల నెరవేరింది. తమవారి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం కలిగింది. విశాఖ కేంద్ర కారాగారంలో వీరికి గురువారం నుంచి ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసినరెండు ల్యాండ్ ఫోన్లను జిల్లా న్యాయమూర్తి జయసూర్య ప్రారంభించారు. వెంటనే శిక్షపడిన ఖైదీతో అతని కుటుంబీకులతో మాట్లాడించారు. డీపిజా టెలికమ్యూనికేషన్స్కు ఈ ఫోన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాస్, డెప్యూటీ సూపరింటెండెంట్ సన్యాసినాయుడు, డెప్యూటీ జైలర్ శివ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఫోన్ సౌకర్యంపై జైలు సూపరింటెండెంట్ విలేకరులకు వివరించారు. వారానికి రెండు సార్లే... ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏవైనా రెండు ఫోన్ నంబర్లను ముందుగా జైలు అధికారుల రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. ఆయా నంబర్లకు మాత్రమే వారానికి రెండుసార్లు చొప్పున నెలలో ఎనిమిదిసార్లు మాట్లాడవచ్చు. ప్రతి కాల్లో అయిదు నిమిషాలు మాత్రమే ఖైదీ మాట్లాడాలి. డయిల్ చేసిన అయిదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. ప్రతి నిమిషానికి రూ.4 బిల్లు పడుతుంది. ఖైదీలకు ముందుగానే ఈ టోకెన్లను అధికారులు విక్రయిస్తారు. ఈ సౌకర్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఖైదీలు కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడుతున్నారో సిబ్బంది దగ్గరుండి పరిశీలిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజమండ్రి, చెర్లపల్లి కారాగారాల్లో ఉండగా, ఇప్పుడు విశాఖ కారాగారంలోకి అందుబాటులోకి వచ్చింది. రిమాండ్ ఖైదీలకు కూడా కొద్ది రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.