sandharbham
-
...అయినప్పటికీ చెరగని ముద్ర
సుమారు 28 సంవత్సరాల సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అధ్యా యానికి తెర లేచిన చీకటి రోజులు నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా జ్ఞాపకం వున్నాయి. 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు దారుణమైన ఎమర్జెన్సీ పాలన కొనసాగింది. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించిన ఆ సందర్భంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని ఇందిరా గాంధీ లోక్సభ ఎన్నిక చెల్లదనీ, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా 1975 జూన్ 12న చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్ష ణమే రాజీనామా చేయాలని ప్రతి పక్షాలు ముక్త కంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యావత్ పాలనా యంత్రాంగాన్నీ తన గుప్పిట్లో పెట్టుకునే దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బం ధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత – సమైక్య తలకు తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, 1975 జూన్ 25, అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాలరాసింది. అంత ర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాశ్ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాదిమందిని జైల్లో పెట్టించింది. ప్రజలకు అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు అంటూ... జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. ‘మీసా’ వంటి చట్టాలను కాంగ్రెస్ అధిష్ఠానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది. ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్ గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చి వేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికి వాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు సంజయ్. హఠాత్తుగా, 1977 జనవరిలో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగ తాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాశ్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’ అంటూ ఇచ్చిన పిలుపు దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకూ చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందిర అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీకి వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్లోని ‘యంగ్ టర్క్స్’ కూడా వారితో జత కట్టారు. 1977 మార్చ్ 20న జరిగిన లోక్సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజక వర్గంలోనూ, ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశం లోను దారుణంగా ఓడించారు. ప్రప్రథమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. అవిశ్వాస తీర్మానం కారణంగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ఇందిర మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని చేపట్టడం, రాజీనామా చేయడం; దరిమిలా జరిగిన ఎన్నికల్లో ఓడి పోవడం తెలిసిన విషయమే. ఆ లోక్సభ ఎన్నికలలో 529 స్థానాలకుగాను 351 స్థానాలు గెలుచుకుని తన సత్తాను నిరూపించుకున్న ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్– హర్మందిర్ సాహిబ్పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధీ హత్యకు గురై 38 సంవత్సరాలు నిండాయి. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఆమె నియంతృత్వ పోకడలను పక్కనపెడితే, అలీన ఉద్యమ నాయకురాలిగా, మహిళా ప్రధానిగా, అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న దనడంలో మాత్రం సందేహం లేదు. వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ మొబైల్: 80081 37012 (నేడు ఇందిరాగాంధీ 38వ వర్ధంతి) -
నెరవేరిన చిరకాల స్వప్నం
ఇది 21వ శతాబ్దం. ఆధునికత, సాంకేతికతల సమ్మేళనంతో వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విమాన, రైలు ప్రయాణాలు తప్పించి, రోడ్డు మీద తిరుగాడే అన్ని వాహనాలకు ఇప్పటివరకు పెట్రోలు / డీజిలు విని యోగమే అధికంగా జరుగుతున్నది. కాగా, ఇటీవలి కాలంలో ఈ పెట్రోలు / డీజిలు ధరలు గరిష్ఠంగా పెరిగి ప్రభుత్వాలకు, ప్రజలకు ఆర్థికంగా పెనుభారంగా మారాయి. వీటికి ప్రత్యామ్నాయ ఆలోచనే విద్యుత్ వాహనాలను ప్రవేశ పెట్టాలనుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీని రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలో ‘ఈవీ’ల వినియోగాన్ని ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో చేపడుతున్నది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత సమర్థంగా పని చేస్తాయి. డీజిల్, పెట్రోలు వాహనాలతో పోలిస్తే, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగి ఉంటాయి. డీజిల్ / పెట్రోలుతో పోల్చినప్పుడు విద్యుత్ ఇంధన ఆదా గణనీయంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవి, నమ్మదగినవి. ఇతర సాంకేతికతలకు సమానమైన సమయ వ్యవధిని కలిగి ఉంటాయి. వాటి నిశ్శబ్ద, మృదువైన పయనం ప్రయాణికులు విశ్రాంతి తీసు కోవడానికి అనువుగా ఉంటుంది. డీజిల్ / పెట్రోలు ఇంజిన్ లేకపోవడం వల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. డీజిల్/ పెట్రోలు వాహనాల వల్ల గాలిలోకి హానికర ఉద్గారాలు విడుదలై ప్రజలకు... ముఖ్యంగా పిల్లలకు ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తలñ త్తుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ప్రత్యర్థుల కంటే తక్కువ ఉద్గారాలు, తక్కువ గ్లోబల్ వార్మింగ్లతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ విద్యుత్ వాహనాల వినియోగంతో ప్రజా రవాణా శక్తి పెరుగుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుతాయి. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ నుండి ఒక కిలో మీటరుకు వచ్చే ఉద్గారాలు పెట్రోల్ లేదా డీజిల్ డ్రైవింగ్ వల్ల విడుదలయ్యే ఉద్గారాల కంటే చాలా తక్కువ. అలాగే, పవర్ స్టేషన్ (ఛార్జింగ్ స్టేషన్) ఉద్గారాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కూడా ఇది నిజం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చాలా ఉత్సాహ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ, అధిక కొనుగోలు ధరలు, కొత్త ఛార్జింగ్ స్టేషన్ల స్థాపన వంటి కొన్ని ఆర్థ్ధికపరమైన భారాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే, ఈ సవాళ్లు తొలిదశలోనే వుంటాయి. తదనంతరం ప్రత్యామ్నాయ మార్గాలూ వుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆశాజనకమైన భవిష్యత్తు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ప్రజలకు, ప్రయా ణికులకు తన వంతు కర్తవ్యంగా ఈ విద్యుత్ బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుడుతున్నది. ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, ప్రజా రవాణాలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో చర్యలు చేపట్టినది. సాధారణమైన ఎర్ర బస్సు స్థాయి నుంచి, క్రమేపీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ, చివరగా అత్యున్నత స్థాయి ఏసీ స్లీపర్ బస్సుల స్థాయి వరకు ఎదిగి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో కూడా వాసికెక్కి, ప్రయాణికుల మన్ననలు పొంది, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నది కూడా. ప్రస్తుతం తలపెట్టిన ఈవీల వాడకం ఈ సంస్థ కిరీటంలో మరో కలికి తురాయి కానున్నది. మొదటి దశలో 100 ఎలక్ట్రిక్ బస్సులను పవిత్ర నగరమైన తిరుపతి – తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో నడపటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ విద్యుత్ బస్సుల వల్ల ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంటే శబ్దం, కాలుష్యం లేని ప్రశాంత ప్రయాణమన్న మాట. ఈవీలకు చార్జింగ్ చేసే విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధర పెరుగుదల ఎక్కువ. ఈవీ బ్యాటరీ ధర క్రమంగా తగ్గుతూ ఉండటం గమనించవచ్చు. అలాగే కాపెక్స్ మోడల్తో పోల్చి నప్పుడు ఈవీల ఆపరేషన్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈవీలను సమకూర్చుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా యోచిస్తున్నది. పైన పేర్కొన్న విస్తృత ప్రయో జనాలు, ప్రస్తుత ప్రభుత్వ సహకారం వల్ల, ఇన్నాళ్ళకు ఈ చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ఇందువల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యే అవకాశంగా దీన్ని భావిస్తున్నది. సీహెచ్ ద్వారకా తిరుమల రావు వ్యాసకర్త ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
Yadadri Temple: గుట్ట కష్టాలకు ముగింపు ఎప్పుడు?
యాదాద్రి దేవాలయాన్ని వేలాది సంవత్సరాలు మన్నే విధంగా నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలని తేలి పోయింది. ఈదురుగాలులూ, వర్షాలకు ఆలయ సముదాయ నిర్మాణంలోని డొల్లతనం బయటపడుతోంది. గతంలో వీచిన గాలులకు ప్రధానాలయ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయింది. ఇటీవల కురి సిన వర్షాలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ దిశలో స్టోన్ ఫ్లోరింగ్ కుంగింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్కు పగుళ్లు వచ్చి కుంగింది. అష్టభుజి మండపంలో వర్షపునీరు లీకేజీతో డంగు సున్నం బయటకు వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నిర్మాణం ఎంత ‘గొప్ప’గా చేశారో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో దాదాపు 25 సార్లకు పైగా యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి, వ్యక్తి గత శ్రద్ధ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రణాళికా లోపం, నమూనాలు, డిజైన్లలో లోపాలు, అధికారుల బాధ్యతా రాహిత్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి, సమన్వయ లోపం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణా లుగా చెప్పవచ్చు. ‘అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం’ అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తరతరా లుగా వస్తున్న ‘యాదగిరిగుట్ట’ పేరును సైతం ‘యాదాద్రి’గా మార్చేసింది. గుట్ట పునర్నిర్మాణానికి ఏకంగా రూ 1,300 కోట్లు వెచ్చించింది. ఈ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఆలయ నిర్మాణంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కొండపైనా, కింద కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మా ణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వ పరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని కాంట్రాక్టు సంస్థలకు చెందిన సైట్ ఇంజనీర్లతోనే పను లన్నీ చేపట్టారు. గుట్ట చుట్టూ నిర్మాణాలు చేస్తున్న ప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారు. వర్షాలు కురిసినప్పుడు ఎటునుంచి వరద వస్తుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించకపోవడంతో రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. గత మే నెలలో కురిసిన వర్షానికి ఆలయం చిత్తడిగా మారింది. ప్రధాన ఆలయంలో పంచతల రాజగోపురం నుంచి.. ధ్వజస్తంభం వరకు వాన నీరు చేరింది. మొదటి నుంచీ ఆలయ పునర్నిర్మాణ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. శిల్పాలు చెక్కే సమ యంలో దేవాలయ స్తంభాలపై మసీదు, పీర్లు, చర్చి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, కేసీఆర్ చిత్రాలు (రిలీఫ్ ఫిగర్స్) చెక్కారు. అంతటితో ఆగలేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లోగోలను కూడా చెక్కారు. దీంతో విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ రిలీఫ్స్ను తొలగించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కాశీ అనేది పవిత్ర పుణ్యక్షేత్రం... అక్కడ రాజకీయాలు లేకుండా హిందువుల మనోభావాలు గౌరవించే స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ... నట్లు, బోల్టు లతో ఆలయం నిర్మించి తప్పు చేశారు. వర్షం పడితే ఆలయ గోపురం కూలింది, అది అరిష్టం’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరోపించారు. మరి యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఏమంటారు? నిజానికి కాశీలో నిర్మిం చిన ఆలయంలో ఎటువంటి అపశ్రుతులు దొర్ల లేదనే విషయం గమనించాలి. ఇతరులను విమర్శించే ముందు తాను చేసిన పనిని సమీక్షించుకోవాల్సిందిగా కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం. పగుడాకుల బాలస్వామి వ్యాసకర్త ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ మొబైల్: 99129 75753 -
YS Rajasekhara Reddy: దశాబ్దాల రాజకీయం... శతాబ్దాల కీర్తి
జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి! ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత! రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్. ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలు చేయడంలోనూ అధికారులకు వైఎస్ పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు వచ్చి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తమ వారికి ఇప్పించాలనీ అడిగారు. అప్పుడు వెంటనే సంబంధిత వర్సిటీ వీసీకి ఫోన్ చేసి, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి అర్హతను బట్టి పోస్టులు ఇవ్వాలనీ సూచించారు. అయితే వీసీ 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారనీ, ముందు వారికి అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనీ అన్నారు. ‘ఓకే! అలాగే కానివ్వండి. వీసీగా మీరే యూనివర్సిటీకి బాస్. మేం చెప్పిన వారికే ఇవ్వాలనేం లేదు’ అని వైఎస్ ఆయనకు స్పష్టం చేశారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే సహించేవారు కాదు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వైఎస్ఆర్ హయాంలో ఆరేళ్ళ పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. తాను ఆ పదవిలో పనిచేసిన ఆరేళ్లలో ఎన్నడూ, ఏ సందర్భంలోనూ వైఎస్సార్ ‘వీరికి ఈ ఫేవర్ చేయండి’ అని చెప్పలేదనీ, పూర్తి స్వేచ్ఛ తమకిచ్చారనీ చెప్పారు. ఇటువంటి అధికారుల సహకారంతోనే వైఎస్ పాలనలో అద్భుతాలను ఆవిష్కరించారు. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్... రైతు పక్షపాతి. ౖరైతు బాగుంటేనే దేశం బాగుంటుందనీ, లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమనీ చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘జలయజ్ఞం’ పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు ‘ఉచిత విద్యుత్’ చారిత్రక అవసరమని వైఎస్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’ అని తేల్చిచెప్పారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007లో అమెరికాలో జరిగిన ‘ప్రపంచ వ్యవసాయ వేదిక’ సమావేశంలో భారత్ ఏకైక ప్రతినిధిగా వైఎస్ పాల్గొన్నారు. అక్కడ ఓ బహుళజాతి విత్తన కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీకి చెందిన పత్తి విత్తనాల ధరపై అప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు నడుస్తోంది. వారు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరారు. అది అంతర్జాతీయ కంపెనీ అనీ, కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించమనీ ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా సూచించారు. అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అనంతర కాలంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. తద్వారా ఏటా రూ 3,000 కోట్ల చొప్పున గత 16 ఏళ్లలో రైతాంగానికి దాదాపు రూ 48,000 కోట్లు ఆదా కావటం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆనాడు ఐదు వందల గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర దాదాపు 1,600 రూపాయలు ఉంటే, అందులో దాదాపు వెయ్యి రూపాయలు రాయితీగా ఉండేది. విత్తనాల ధరను 750 రూపాయలకు తగ్గిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు రాష్ట్రాలు ఆ చట్టాన్ని అనుకరించడంతో ఆ చట్టం దేశం దృష్టిని ఆకర్షిం చింది. ఆ విషయాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వైఎస్ను ఎంతగానో ప్రశంసించింది. వైఎస్ రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ. ఐదేళ్ల వైఎస్ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1,450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెర వేర్చారు. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందిం చడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్మెంట్. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన విశిష్ట పథకం. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరి గింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మార్కెట్లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరీ ధర తగ్గేవరకూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులూ 2 రూపాయలకు కిలో బియ్యం రకాన్నే వాడారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలనీ, గుండె జబ్బులు సహా ఇతర వ్యాధులతో ఎవరూ మరణించకూడదనీ వైఎస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యులకు ఈ పథకం అపర సంజీవనిలా మారింది. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. 104 కాల్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్ హయాంలో పాడి పంటలే కాదు, ఐటీ ఎగుమతులు కూడా గణ నీయంగా వృద్ధి చెందాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన వైఎస్ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. చివరికి ప్రజల కోసం వెళుతూ, హెలికాప్టర్ ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈఓ, వైఎస్సార్కు నాటి ప్రెస్ సెక్రెటరీ -
GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి ‘జీఎస్టీ’ గురించి చర్చ జరిగింది. కానీ 2017లో మాత్రమే అది అమలులోకి రాగలిగింది. తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా, ఐదేళ్ల తర్వాత అది శక్తిమంతమైంది. వచ్చిన ఏడాదే 63.9 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇందులోకి మళ్లారు. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపయింది. కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. గతంలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. నిజంగానే జీఎస్టీ, భారతదేశాన్ని సింగిల్ మార్కెట్ను చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. భారతదేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి జూలై 1తో అయిదేళ్లు పూర్తయింది. 2003 సంవత్సరంలో పరోక్ష పన్నులపై కేల్కర్ టాస్క్ఫోర్స్ నివేదికలో జీఎస్టీ గురించి తొలిసారిగా చర్చించారు. కానీ దానికి తుదిరూపు ఇవ్వడానికి చాలా కాలం పట్టింది. ప్రవేశపెట్టింది మొదలుకొని జీఎస్టీ సహజంగానే పెను సమస్యలను ఎదుర్కొంది. అయితే కోవిడ్–19 కల్లోలాన్ని ఎదుర్కొని, దాని ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, జీఎస్టీ శక్తిమంతంగా ఆవిర్భవించింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో సరిపెట్టుకోకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ మార్గంలోకి నడిపిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకున్నా యంటే ఆ ఘనత జీఎస్టీ కౌన్సిల్కే దక్కుతుంది. ఈ రకమైన పరస్పర కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఆవిర్భవించింది. భారత్లో జీఎస్టీ 2017లో అమల్లోకి వచ్చింది కానీ, చాలా దేశాలు అంతకుముందే జీఎస్టీ విధానం వైపు మళ్లాయి. కేంద్రమూ, రాష్ట్రాలూ పన్నుల మీద స్వతంత్రతను అనుభవించిన అర్ధ–సమాఖ్య వ్యవస్థ చాలాకాలంగా ఏకీకృత పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ మండలి, భారత్కే ప్రత్యేకమైన జీఎస్టీ సొల్యూషన్ (ద్వంద్వ జీఎస్టీ) దీనికి సమాధానాలుగా నిలి చాయి. దేశంలో విభిన్న పరిమాణాలతో, విభిన్న అభివృద్ధి దశలతో కూడిన రాష్ట్రాలు, వాటి వారసత్వ పన్నుల వ్యవస్థను మిళితం చేసి జీఎస్టీ పరిధిలోకి తేవలసి వచ్చింది. కొన్ని మినహాయింపులతో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్నులను జీఎస్టీలో కలపడం జరిగింది. ఈ క్రమంలో 17 రకాల పన్ను చట్టాలను మేళవించి జీఎస్టీ ద్వారా ఏకీకృత పన్నుల వ్యవస్థను అమల్లోకి తేవడం జరిగింది. పన్ను రేట్లు, మినహాయింపులు, వాణిజ్య ప్రక్రియ, ఐటీసీ చలనం వంటి కీలక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. దేశంలోని 63.9 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు 2017 జూలైలో జీఎస్టీలోకి మళ్లారు. 2022 జూన్ నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1.38 కోట్లకు చేరుకుంది. 41.53 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు, 67 వేల మంది ట్రాన్స్ పోర్టర్లు ఈ–వే పోర్టల్లో నమోదు చేసుకున్నారు. నెలకు సగటున 7.81 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారం భమైంది మొదలు 292 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. ఇందులో 42 శాతం అంతర్రాష్ట్ర సరకుల రవాణాకు సంబంధించినవి. ఈ సంవత్సరం మే 31న ఒకేరోజు అత్యధికంగా 31,56,013 ఈ–వే బిల్స్ జనరేట్ కావడం ఒక రికార్డు. నెలవారీ సగటు వసూళ్లు కూడా 2020–21లో రూ. 1.04 లక్షల కోట్ల నుంచి, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో సగటు వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ధోరణి పెరుగుతుందని చెప్పడం హేతు పూర్వకమైన, న్యాయమైన అంచనా అవుతుంది. సీఎస్టీ, వీఎటీ వ్యవస్థలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. బోర్డర్ చెక్పోస్టులు, సరుకులు లోడ్ చేసిన ట్రక్కులను నిలబెట్టి మరీ తనిఖీ చేయడంతో కూడిన గతంలోని నియంత్రణ వ్యవస్థ కల్లోలం సృష్టించి కాలాన్నీ, ఇంధనాన్నీ వృథా చేసేది. దీంతో లాజిస్టిక్స్ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయింది. సరుకుల ధరలో 15 శాతం వరకూ దీని ఖర్చులే ఉండేవని అంచనా. జీఎస్టీకి మునుపటి వ్యవస్థలో అనేక సరుకులపై కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి రేట్లు 31 శాతం కంటే ఎక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థ కింద 400 సరకులు, 80 సేవలపై పన్నులను బాగా తగ్గించడమైనది. అత్యధికంగా 28 శాతం రేటు ఇప్పుడు విలాస వస్తువులపై మాత్రమే ఉంది. గతంలో 28 శాతం పన్ను రేటు ఉన్న 230 సరుకుల్లో సుమారు 200 సరుకులను పన్ను తక్కువగా ఉండే శ్లాబ్లకు మార్చడమైనది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ద తీసుకుంది. వీటిపై పన్ను రేట్లు బాగా కుదించింది. పైగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనం కోసం ఈ సంస్థలను సప్లయ్ చైన్స్తో అనుసంధానించడం జరిగింది. ఈ క్రమంలో రెండు కీలకమైన చర్యలను కేంద్రం తీసుకుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను మినహాయింపు 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెరిగింది. కాగా, త్రైమాసిక రిటర్న్లు, నెల వారీ చెల్లింపుల పథకం ప్రవేశపెట్టడంతో 89 శాతం పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలిగింది. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఐటీ ఆధారితంగా, పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో కొనసాగుతోంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సామర్థ్యా లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నవీకరిస్తూండటం వల్ల మొత్తం వ్యవస్థను క్రియాశీలంగా ఉంచడం సాధ్యమైంది. జీఎస్టీ వ్యవహారాలపై అనేక వ్యాజ్యాలు... సమన్లు జారీ చేయడం, వ్యక్తులను అరెస్టు చేయడం, రికవరీల కోసం ఆస్తులను జప్తు చేయడంతో సహా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వంటి అంశాల పైనే వస్తున్నాయి. మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ జీఎస్టీలోని ప్రాథమిక అంశాలను కోర్టు పక్కన పెట్టలేదని గుర్తించాలి. దాదాపు 24 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసీమ్ దాస్గుప్తా 2000 నుంచి 2011 సంవ త్సరం దాకా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరించారు. మొట్టమొదటి జీఎస్టీ చట్టాల రూపకల్పన 2009లో జరిగింది. 2017 జూలై 2న ఒక వాణిజ్య పత్రికకు అసీమ్ దాస్గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్టీలోని ముఖ్యమైన అంశాలను వక్కా ణించారు. ఆయన చెప్పిన అంశాలు ఇప్పటికీ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి: ‘సర్వీస్ టాక్స్ని విధించే అధికారం రాష్ట్రాలకు అసలు ఉండేది కాదు. అందులో కేవలం భాగం పొందడమే కాదు, పన్ను విధించే అధికారం కోసం అడుగుతూనే ఉండేవి. జీఎస్టీ దానికి అవకాశం కల్పించింది.’ ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై సాధికారిక కమిటీ దృఢమైన వైఖరి తీసుకుంది. సెంట్రల్ జీఎస్టీపై పార్లమెంట్కూ, రాష్ట్ర జీఎస్టీపై అసెంబ్లీలకూ సిఫార్సు చేసే విభాగమే జీఎస్టీ కౌన్సిల్. సాంకేతికంగా శాసనసభ దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కాబట్టి శాసనసభల అధికారాన్ని ఇది తీసేసు కోవడం లేదు.’ ఇంకా ముఖ్యంగా ఆయన ఇలా అన్నారు: ‘ఇక రేట్లకు సంబంధించి చూస్తే, రాష్ట్రాలు, కేంద్రం కలిసి రెండింటికీ ఒక రకమైన ఏక పన్నును ఆమోదించాయి. కాబట్టి సహకారాత్మక సమాఖ్య ప్రయోజనం కోసం రాష్ట్రాలు, కేంద్రం పాక్షికంగా త్యాగం చేశాయని దీనర్థం. అదే సమయంలో సర్వీస్ టాక్స్ విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ అదనపు అధికారాలను ఇచ్చింది. రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తుల్లో సగం సేవల కిందికే వస్తాయి.’ జీఎస్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగులో ఇలా రాశారు: ‘అటు వినియోగ దారు, ఇటు మదింపుదారు (అసెస్సీ) ఇద్దరికీ అనుకూలంగా జీఎస్టీ ఉంటుందని రుజువైంది. పన్ను చెల్లింపుదారులు, టెక్నాలజీని అంది పుచ్చుకున్న మదింపుదారులు ఇద్దరూ చూపించిన సానుకూలతకు ధన్య వాదాలు. నిజంగానే జీఎస్టీ, భారత్ను సింగిల్ మార్కెట్ని చేసింది.’ నిర్మలా సీతారామన్ (జూలై 1 నాటికి జీఎస్టీ వచ్చి ఐదేళ్లు) వ్యాసకర్త కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
‘రెవెన్యూ’కు 250 ఏళ్లు
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వ్యవసాయాదాయం పెంచుకునే ఇతర రంగాలను అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశ ప్రాచీన, మధ్యయుగ కాలాల్లోని రాజ్యాల ప్రధాన వనరు అయిన భూమిశిస్తును వసూలు చేసింది సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులే. అంటే దేశంలో అతి పురాతన శాఖ రెవెన్యూ శాఖే. అయితే ఆధునిక రెవెన్యూ శాఖ సృష్టి, రూపురేఖలన్నీ బ్రిటిష్ రాజ్ కాలంలోనే సంతరించుకున్నాయి. బ్రిటిష్ వలస పాలనలో స్థాపితమైన అనేక వ్యవస్థలూ, చట్టాలూ కొన్ని యథాతథం గానూ, కొన్ని మార్పు చేర్పుల తోనూ ఇప్పటికీ కొనసాగు తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఆ కాలంలో పురుడుపోసుకున్నదే. ప్లాసీ యుద్ధం (1757) భారత దేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు వీలుకల్పించింది. బక్సార్ యుద్ధం (1764) ఆంగ్లేయుల అధికారాన్ని పటిష్ఠపరచింది. ఆ యుద్ధం తరువాత జరిగిన అలహా బాద్ సంధి ద్వారా మొగల్ చక్రవర్తి షా ఆలం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాల్, బిహార్, ఒరిస్సా, సుబాలలో దివానీ (శిస్తు వసూలు చేసుకునే) అధికారం పొందారు. ఉత్తర భారతంలో 1765 నుండి 1772 వరకు, అలాగే కర్ణాటక యుద్ధాలు విజయాల తరువాత దక్షిణాదిన కూడా బ్రిటిష్వాళ్లు శిస్తు వసూలుకు వివిధ పద్ధతులను పాటించారు. బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772 మే 14న భూమిశిస్తు వసూలుకు ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ను నియమించారు. అంటే కలెక్ట్టర్ ఉద్యోగ సృష్టి జరిగి మే 14 నాటికి 250 ఏళ్ళు పూర్తవుతుందన్న మాట! బెంగాల్ మొత్తంలో శిస్తు వసూలును పర్య వేక్షించడానికి ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ గవర్నర్ ఆధ్వ ర్యంలో ఏర్పాటయింది. తరువాత కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా వచ్చిన కారన్ వాలీస్ ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ను సంస్కరించి, అన్ని బ్రిటిష్ ప్రావిన్స్ల లోనూ ఈ బోర్డులను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా మద్రాస్ ప్రావిన్స్లో ఏర్పడిన ఈ వ్యవస్థ 1977లో íసీఎల్ఆర్ శాఖ ఏర్పాటు వరకూ కొనసాగింది. ప్రస్తుతం దాని స్థానంలో సీసీఎల్ఏ 1999 నుంచి కొనసాగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో దేశంలో రెవెన్యూ సిబ్బంది నెరవేర్చిన బాధ్యతలు మరువ లేనివి. జమిందార్లకు శిస్తు వసూలు అధికారాలను రద్దు చేస్తూ, సాగుచేసే వాడికి భూమిపై హక్కులు కల్పిస్తూ చేసిన ‘ఎస్టేట్ రద్దు చట్టం–1948’ను అమలు చేయడం, ప్రతి పేదోడికి భూమిపై హక్కులను గుర్తించడానికి చేసిన ‘సర్వే అండ్ సెటిల్మెంట్’లో రెవెన్యూ శాఖవారి సేవ జీతంతో కొలవలేనిది. అలాగే ‘ల్యాండ్ సీలింగ్ యాక్ట్’ అమలు, ‘మిగులు భూమి’ని అర్హులుకు పంపిణీ చేయడం వంటివన్నీ రెవెన్యూ వారిని మరింత ప్రజల మనుషులను చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూ సంస్కరణ ఫలాలు పేదోడికి చేర్చిన ఘనత రెవెన్యూ శాఖదే! స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణా ళికలో ఎన్నో లక్ష్యాల కొరకు ఎంతో భూసేకరణ చేయవలసి వచ్చింది. రెవెన్యూశాఖే ఆ బాధ్యతను తలకెత్తుకొంది. దేశాభివృద్ధి దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు – ఇరిగేషన్, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఉన్నత విద్యా సంస్థలు, భారీ పరిశ్రమలు వంటి ఎన్నో నిర్మాణాలకు భూసేకరణ అనే మహా యజ్ఞం రెవెన్యూ శాఖతోనే జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న శాశ్వత భూ హక్కు పథకం/ రీ సర్వే’ రెవెన్యూ శాఖ ద్వారానే జరుగుతోంది. పేదలందరికీ ఇళ్ళ పథకంలో 30 లక్షల పైగా ఇంటి పట్టాల పంపిణీకి భూసేకరణ అంతా రెవెన్యూ శాఖ చేతుల మీదుగానే జరిగింది. సంక్షేమ పథకాలలో అగ్రగామి అయిన నిత్యావసర వస్తువుల పంపిణీ రెవెన్యూ శాఖ భుజస్కంధాల పైనే నేటికీ నడుస్తోంది. తుపానులు, వరదలు అగ్ని ప్రమాదాల ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు రెవెన్యూ శాఖ పాత్రే ఎంతో కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటి సామా న్యుడి జననం నుండి మరణం వరకు కావలసిన ఎన్నో ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడమే కాక సామాన్యుడి సేవలో నిరంతరం పనిచేసేది రెవెన్యూ శాఖే! కోరాడ శ్రీనివాసరావు వ్యాసకర్త తహశీల్దారు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా ‘ 94410 08574 -
ఆలస్యం... అమృతం... విషం!
గణతంత్రదినోత్సవం నాడు రాష్ట్రంలో పరిపాలన, బౌగోళిక మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం. బ్రిటిష్ వారు 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటికి జనాభా 5 రెట్లు పెరిగినా కొత్త జిల్లాలు కేవలం రెండు (విజయనగరం, ప్రకాశం) మాత్రమే ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనను కరోనా విపత్తు వల్ల నిరవధికంగా వాయిదా వేసి కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు మార్పు చేర్పులపై వున్న నిషేధాన్ని 2022 జూన్ 30 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నూతన జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరైన సమయంలో తీసుకున్న సాహసోపేత చర్య. జూన్ 30 నాటికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, రెవెన్యూ గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల్లో మార్పులు వంటివి పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిస్తే జూలై తరువాత ఎప్పుడు జనగణన జరిగినా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారమే జనగణన చేపడతారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఎంతైనా వుంది. రాష్ట్రంలో సగటు జిల్లా జన సంఖ్య 37.98 లక్షలు కాగా మొత్తం జిల్లాలు 13 మాత్రమే. నూతనంగా ఏర్పడిన తెలం గాణలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలు ఉంటే జిల్లాలు 33 ఉన్నాయి. మనకన్నా జిల్లా సగటు జనాభా (26.64 లక్షలు) తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్లో 80 జిల్లాలు ఉండటం గమ నార్హం. దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్లో (39.68 లక్షలు) మాత్రమే ఏపీలోని జిల్లా సగటు జనాభా కన్నా ఎక్కువ జన సంఖ్య ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు స్పష్ట మవుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇదీ ఒక కారణమే. దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దులే కొత్త జిల్లా సరిహద్దులకు ప్రాతిపదికగా తీసుకోవటం, అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మేలైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో 1974 జిల్లాల చట్టంలో ఉన్నవీ, 1984లో రూపొందించిన నిబంధనలనూ పరిశీలించినప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గమనించాల్సిన ముఖ్యాంశాలు– ప్రాంతం, జనాభా, ఆదాయం... కొత్త, పాత జిల్లాల్లో దాదాపు సమపాళ్లలో ఉండేటట్లు తుది ముసాయిదా నాటికి సవరిం చాలి. అలాగే చారిత్రక నేపథ్యం, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు; సాంస్కృతిక పరమైన, విద్య, మౌలిక సదుపాయాలూ; ఆర్థిక పురోభివృద్ధి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన, లేదా బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్నీ ఒకే దగ్గరకు రాకుండా చూడాలి. పార్లమెంట్ సరిహద్దు ప్రాతిపదికనే కాకుండా పరిస్థితిని బట్టి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయవలసి ఉంది. కొంతమంది 2026లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి... పార్లమెంటు సరిహద్దులు మారుతాయనీ, అందువల్ల ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సరికాదనీ అంటున్నారు. ఇది వాస్తవం కాదు. 2001లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2026 తరువాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రకారం (అంటే 2031 సెన్సెస్) డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయ డానికి 3 సంవత్సరాలు పడుతుంది. అసలు జనాభా లెక్కల తుది జాబితానే 2034లో ప్రకటిస్తారన్న సంగతి గుర్తించాలి. అంటే 2039 ఎన్నికల వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య తేలే అవకాశమే లేదన్నమాట! కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు... ప్రత్యేకించి మెడికల్ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణా భివృద్ధి, పశువైద్యశాలలు, యువజన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు జిల్లాను యూని ట్గా తీసుకొని కేటాయింపులు చేస్తుంది. నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే... కొత్త జిల్లాలకు అదనపు నిధులు, మౌలిక సదుపాయాలకు హోం, డిజాస్టర్ శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చుకునే అవకాశం వుంటుంది. ఇంత ప్రయోజన కరమైన కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత తొందరగా సాకారం అయితే అంతమంచిది. ‘ఆలస్యం అమృతం విషం!’ అందుకే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై దృష్టి సారించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు మరింత సమర్థవంతంగా, వేగంగా చేర్చడానికి వీలుండటమే కాక అభివృద్ధి ఊపందుకుంటుంది. ఇనగంటి రవికుమార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్: 94400 53047 -
ఆహారభద్రతే... ఆకలిచావులకు మందు!
కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేద రిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్ ఫామ్’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఆ సంస్థ ‘ది హంగర్ ముల్టిప్లయిస్’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాది నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమవ్వడం వంటి విషయాలు ఈ నివేదిక వెల్లడించింది.. మన దేశంలో 2021–22లో 315 మిలియన్ టన్నుల రికార్డ్ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా... 2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. కొనుగోలు సామర్థ్యం కొరవడింది. పోషకాహారం లోపం వల్ల ఆకలి చావులు పెరుగుతున్నాయి. భారత్లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకా హార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతు న్నారని అంచనాలు తెలుపుతున్నాయి. 2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశా లను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది. శ్రీలంక 65, బంగ్లాదేశ్ 76, పాకిస్తాన్ 92 స్థానాల్లో ఉండటం ఈ సందర్భంగా గమ నించాలి. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందించాలనీ, ఆకలితో ఎవ్వరూ చని పోకూడదనీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలైనా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొలుపు తాయేమో చూడాలి. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చెయ్యాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోదుమలు ఇవ్వడం కాదు. దారిద్య్రరేఖకు కింద వున్నవారికి పౌష్టికాహారం అందించడం. అప్పుడే పేద వర్గాలలో ఆహార భద్రత కలుగుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రజలు ఆరోగ్య దాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సుర క్షిత పౌష్టికాహారం ప్రజలందరికీ అందించాలి. ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలి. అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. అణగారిన వర్గాలకు, గిరిజనులకు, మురికి వాడల్లో నివసించే వారికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందజేయాలి. అప్పుడే ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరుతుంది. నేదునూరి కనకయ్య వ్యాసకర్త తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు మొబైల్: 94402 45771 -
మహిళలే నవ భారత నిర్మాతలు
ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు. గొప్ప సంప్రదాయాలు, సమున్నత విలువలతో ప్రాచీన ఘనతను కలిగి వున్న సుసంపన్న భారత దేశంలో మహిళలు ఎల్ల ప్పుడూ తమ ప్రాము ఖ్యాన్ని చాటుతూనే వచ్చారు. ఎన్ని అవ రోధాలు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. రవీంద్రనాథ్ టాగోర్ మాటల్లో చెప్పాలంటే.. ‘మనకు స్త్రీలు అగ్నిదేవతలు మాత్రమే కాదు. భారతీయాత్మ జ్వాలలు కూడా’. ధీర వనిత ఝాన్సీరాణి లక్ష్మీబాయి, భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే మొదలు... స్త్రీ విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన రమాబాయి రణడె వరకూ ఎందరో మహి ళలు సంకల్పబలానికి తిరుగులేని నిదర్శనమై నిలి చారు. సరోజినీ నాయుడు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవలి సంవత్సరాలలో సైతం ఎందరో మహిళామణులు అత్యున్నత స్థాయిలో పెద్ద పెద్ద సంస్థల నిర్వహణ చేపట్టి దేశా నికి పథనిర్దేశకులయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఓఎన్జీసీ తొలి మహిళా సీఎండీ అల్కా మిట్టల్, ‘సెయిల్’ చైర్మన్ సోమా మండల్.. ఇలా ఎంతోమంది! హరియాణా మహిళ సంతోశ్ యాదవ్ రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించి మహిళాశక్తిని శిఖరాగ్రంపై ప్రతిష్ఠిం చారు. ఇక బాక్సర్ మేరీకోమ్ పేరు తెలియని ఇల్లుందా భారత దేశంలో! మనమిప్పుడు ‘కార్యా చరణ దశాబ్దం’లోకి ప్రవేశించి ఉన్నాం. 2030 నాటికి సుస్థిరమైన అభివృద్ధిని సాధించి, ఈ భూమండలాన్ని మానవ జీవనానికి మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడం మనముందున్న లక్ష్యం. లింగ సమానత్వం; మహిళలు, బాలికల సాధికారత అనేవి కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యా లలో భాగమైనవే. అదే సమయంలో.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంక్షోభ నిర్వహణ, సామా జిక అభివృద్ధి, సమాజంలోని బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం.. వీటన్నిటితో కూడిన ‘సుస్థిర భవిష్యత్తు’ అనే లక్ష్యాన్ని మహిళల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యం చేసుకో గలమని మనం గ్రహించాలి. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. మహిళల్లోని సామర్థ్యాల గురించి ప్రఖ్యాత అమెరికన్ మత గురువు బ్రిగ్హామ్ యంగ్ సరిగ్గానే చెప్పారు. ‘‘మనం ఒక వ్యక్తిని విద్యావంతుడిని చేస్తే ఆ వ్యక్తికి మాత్రమే విద్య అందుతుంది. ఒక మహి ళకు విద్యను అందిస్తే ఒక తరం వారంతా విద్యా వంతులవుతారు’’ అంటారు బ్రిగ్హామ్. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’.. అనే ఈ ఏడాది మహిళా దినోత్సవ ప్రధానాంశం.. బ్రిగ్హామ్ మాటలకు చక్కగా సరిపోలుతుంది. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో మహిళలే కీలకమైన పాత్ర పోషించారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి, పాలనా విభాగాలలో ఉన్నత స్థానాలలో ఉన్న మహిళా అధికారుల వరకు అందరూ ఇందుకోసం విశేషకృషి సల్పారు. కోవిడ్కు స్వదేశీ ‘కోవ్యాక్సిన్’ టీకాను అభివృద్ధి చేయడంలో విశ్వస్థాయి క్రియా శీలత కనబరిచిన భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ‘పద్మభూషణ్’ అందు కున్నారు. 12–18 ఏళ్ల మధ్య వారికి ఇవ్వడం కోసం కోవిడ్ టీకాను అభివృద్ధి చేసిన బృందానికి బయో లాజికల్ ఇ కంపెనీ ఎండీ మహిమా దాట్ల నాయ కత్వం వహించి, తక్కువ సమయంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రేరణ అయ్యారు. 6వ ఆర్థిక అధ్యయనం ప్రకారం దేశంలో 80 లక్షల 5 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. స్టార్టప్లు (అంకుర సంస్థలు), ముఖ్యంగా మహిళా స్టార్టప్లు ఎందుకు మనకు ముఖ్య మైనవి? బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ విశ్లేషణల ప్రకారం 2030 నాటికి మన మహిళా వ్యాపార వేత్తలు 15 – 17 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తారని అంచనా. 2018–21లో దేశంలోని స్టార్టప్లు కల్పించిన ఉద్యోగాల సంఖ్య 5 లక్షల 90 వేలు. ఇంత ప్రాముఖ్యం ఉన్న స్టార్టప్లను గతంలో చేజార్చుకుని ఉండొచ్చు. వర్తమానంలో తప్పక చేజిక్కించుకోవాలి. రాణించాలనే పట్టుదల అమ్మాయిలలో బలంగా ఉంటోంది. ‘ఆజాదీ కా అమృత్ మహో త్సవ్’లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 6–12 తేదీల మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2,614 మంది స్వయం సహాయక బృందాల మహిళా వ్యాపారులకు కేవలం వారం వ్యవధిలోనే 8 కోట్ల 60 లక్షల రూపాయల రుణాలను ‘కమ్యూ నిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్’ లోన్ కింద అందించింది. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు తమను తాము శక్తిమంతం చేసుకోవడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకూ నిలకడైన స్థిరత్వాన్ని చేకూర్చుతున్నారు. గత 6–7 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమం విస్తృతం అయింది. నేడు దేశవ్యాప్తంగా 70 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అర్థం చేసుకో వలసినది ఏమిటంటే, స్త్రీల శక్తి సామర్థ్యాలు దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకు వెళతాయని! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా రాష్ట్ర గవర్నర్ -
పోలవరం నిర్మాణంలో వాస్తవాలేంటి?
పోలవరం ప్రాజెక్టుకు 1981 మే 21న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి. అంజయ్య శంకుస్థాపన చేసిన నాటినుండి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి పూజ చేసే వరకు పోల వరం ప్రాజెక్టును పట్టించుకున్న ప్రభు త్వమే లేదు. సుమారు పదహారున్నర సంవత్సరాల కాలం తెలుగుదేశం అప్పటికే అధికారంలో ఉంది. అయినా పోలవరం పేరెత్తిన పాపాన పోలేదు. అంతకుముందు ఈ తరహా ప్రాజెక్టుకు సర్వే చేయడానికి దశాబ్దాల కాలం పట్టేది. కానీ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను వివిధ భాగాలుగా విభజించి ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవడంతో పనులు శరవేగం అందుకున్నాయి. అయితే ఇంత భారీ ప్రాజెక్టును నిర్మించాలంటే అనేక రకాల అనుమతులు అవసరం. రాజశేఖరరెడ్డి హయాంలోనే దాదాపు అన్ని అనుమతులూ తెచ్చారు. 2005లో సైట్ క్లియరెన్సు అనుమతులను; రీలొకేషన్, రీహేబిలిటేషన్ అను మతులను 2007లో; వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఫారెస్ట్ క్లియ రెన్సులను 2008లో, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ను 2009లో రాజశేఖర రెడ్డి తేగలిగారు. కేవలం ఐదేళ్ల కాలంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణంలో సింహ భాగం పూర్తిచేయగలిగారు. అప్పట్లోనే పోలవరంను జాతీయ ప్రాజె క్టుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. అయితే వైఎస్సార్ దివంగతులు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రాజెక్టు నత్తనడక నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం అయిన చంద్రబాబు చేపట్టిన అరకొర పనులు నష్టదాయకంగా తయారయ్యాయి. చంద్రబాబు హయాంలో స్పిల్ వే నిర్మాణం పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టడంవల్ల సమస్యలు తలెత్తాయి. ఎగువ కాఫర్ డ్యామ్ నది ఎడమ వైపున మొదలుపెట్టి కుడి వైపున ఖాళీ వదిలి పెట్టడం, దిగువ కాఫర్ డ్యామ్ నది కుడివైపున మొదలుపెట్టి ఎడమవైపున ఖాళీ వదిలిపెట్టడం వల్ల నది వరద కాలంలో నీరు ‘ఎస్’(ట) ఆకారంలో ప్రవహిస్తూ వంపులు తిరుగుతూ దిగువకు వెళ్ళ వలసి రావడం వల్ల ఆ ప్రవాహంలో కాఫర్ డ్యామ్ల వెంబడి సుడులు ఏర్పడి అప్పటి వరకు పాక్షికంగా çపూర్తయిన కాఫర్ డ్యామ్లు అనేక చోట్ల దెబ్బతిన్నాయి. ప్రచార యావతో చంద్రబాబు ప్రభుత్వం ‘గిన్నిస్’ రికార్డుల కోసం నాణ్యతా ప్రమాణాలను పణంగా పెట్టి... కేవలం 24 గంటల్లో సుమారు 33 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను స్పిల్ వే ఛానల్లో కుమ్మరించింది. అయినా పని పూర్తి చేయలేక పోయింది. ఈ నేపథ్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా అధికారంలోకి వచ్చారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టును తాను త్వరితగతిన పూర్తి చేయాలనే తపనతో పోలవరం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన చంద్రబాబు హయాంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా టెండర్లు ఖరారు చేశారు. దీంతో సుమారు రూ. 800 కోట్లు పైగా నిధులు ఆదా అయ్యాయి. ఐతే దీనిపై ‘చంద్రబాబు టీమ్’ న్యాయస్థానాల్లో కేసులు వేయడంతో ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నిటినీ అధిగమిస్తూ ప్రాజెక్టును 2022 జులై కల్లా పూర్తి చేసి పొలాలకు నీరందించాలనే సంకల్పంతో జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది. ఇప్పటికే స్పిల్ వే పనులు పూర్తి చేయడం, 42 గేట్లను పూర్తిగా బిగించడం జరిగింది. మిగతా ఆరుగేట్లను కూడా ప్రస్తుతం బిగిస్తున్నారు. అప్రోచ్ పనులు, పైలెట్ ఛానల్స్ పనుల్లో సింహభాగం పూర్తి చేసి నది నీటిని స్పిల్ వే ద్వారా మళ్లించడం; ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేయడం, గ్యాప్–3 కాంక్రీట్ డ్యామ్ను పూర్తి చేయడం జరిగింది. అంతేగాక జల విద్యుత్ కేంద్రం పనులు వేగిరపరచడంతో పాటు, ఎడమ వైపున గ్యాప్–1 డ్యామ్కు అడుగున ‘సాయిల్ డెన్సిఫికేషన్ పనులు వేగంగా చేస్తున్నారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే నదీ గర్భంలో సుమారు 310 అడుగుల లోతు వరకు చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని నిపుణులు గుర్తించారు. పరిస్థితిని క్షుణ్ణంగా బేరీజు వేసి, డీడీఆర్పీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప మెయిన్ డ్యామ్ (గ్యాప్–2) నిర్మాణం మొదలుపెట్టడానికి వీలు లేదు. అందు వల్ల పోలవరం ఈ ఏడాది అంటే 2022లో పూర్తి కావడం కష్ట సాధ్యంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న ఈ జాప్యానికి పూర్తిగా చంద్రబాబే కారణమని ప్రత్యేకించి చెప్ప వలసిన పనిలేదు కదా! డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ వ్యాసకర్త జర్నలిస్ట్ ‘ మొబైల్: 98486 9337 -
ఒక సంకల్పం పుట్టిన రోజు
పధ్నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహింసా మార్గంలో పోరాడిన కేసీఆర్ను జనం అక్కున చేర్చుకుని ముఖ్యమంత్రిని చేశారు. అహరహం తెలం గాణ అభివృద్ధి కోసం ఆయన సీఎంగా శ్రమిస్తూ ఉన్నారు. జనగామ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. మనందరం కలిసి పోరాడిన ఉద్యమ గెలుపు కథలను జనం మధ్యకు వెళ్లి విప్పారబోస్తున్నారు. ఆయన ఒక్క పిలుపునిస్తే అందరి ఇళ్లపై పోరు జెండాలు ఎగిరాయి. ఆయన ఒక్క నినాదమిస్తే ఆ«ధిపత్యం వణికిపోయింది. చెప్పిన మాటమీదనే, తాను పట్టిన పంతం మీదనే చివరిదాకా నిలిచాడు. తను పోరాడుతూ లక్ష్య సాధనవెంట నడిచే లక్షలాది యోధుల్ని నడిపించుకుంటూ ప్రపంచీకరణ కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు పురుడు పోసి అస్తిత్వ ఉద్యమ పొద్దుపొడుపు అయ్యాడు కేసీఆర్. స్వరాష్ట్ర ఉద్యమాల అస్తిత్వ జెండా పట్టిన వాళ్లకు, రేపు జరుగ బోయే అస్తిత్వ సంఘర్షణల ఉద్యమాలకు మార్గ దర్శిగా నిలిచాడు. రాష్ట్రం సాధించాక తిరిగి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే పాలనా పగ్గాలు పట్టి ఈ మట్టిని ఒంటికి రాసుకుని వినమ్రంగా తెలంగాణ మళ్లకు నీళ్లు పడుతున్న రైతుకూలీ కేసీఆర్. పురుగుల మందులు తాగి పానాలు భూమితల్లి ఒడిలోనే వదులుతున్న వేలమంది పత్తిరైతుల మరణాలను చూసి దుఃఖించి, ఆ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు కాళేశ్వరం ప్రాజెక్టునే కట్టి, మహానదినే తన రెండు చేతులతో ఎత్తి పోస్తు న్నాడు. తెలంగాణ హరితవిప్లవానికి ఒక కొత్త దారి చూపిన వ్యవసాయ పంచాంగం అతడు. తెలంగాణ వచ్చాక కూడా పత్తిచేలో పచ్చ పురుగులుంటాయని ఆయనకు తెలుసు. పంటను కాపాడటానికి ఆయన పచ్చపురుగుల్ని ఏరేస్తున్నాడు. ఈనేల అభివృద్ధికి ఈ పంటల చీడలేకుండా చేయటానికి మళ్లీ పరిశోధక విద్యార్థి అయి తపిస్తున్నాడు. చదవండి: (దేశానికి నూతన దిశ కేసీఆర్) ‘పల్లెప్రగతి’తో పల్లెలు ఎంత పరిమళిస్తున్నాయో ఊరూరా తిరిగి చూస్తూ పసిపిల్లగానిలా పరవ శిస్తున్నాడు. ‘పట్టణప్రగతి’తో నగరాల ముఖ చిత్రా లను మార్చుతూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఏ ఊరు చూసినా పచ్చగా ఉండాలే, ఏ టౌన్ కెళ్లినా సోబరుగా ఉండాలే. ప్రతి ఒక్కరీ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలే. మన బడి బాగుపడాలే. బస్తీ దవాఖానాలు పేదలకు వైద్యం అందించాలే. చదువులు బాగుపడాలే. అందరి బతుకులు బాగు పడాలే... ఇదే అతడి తపన. అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు. నర్సాపూర్ అడవుల్లోకి పోయి మొక్కలు నాటి పర్యావరణానికి కాపలాదారునిగా కాపలా కాస్తున్నాడు. ఇంతగా ఈ నేల కోసం కృషి చేసిన అతడి కాలంలో ఉన్నాం. ఇపుడు తెలంగాణ 33 జిల్లాల సమాహారం. పాలన గడప గడపల దాకా పోవటానికి ఎంతో కృషిచేస్తున్నాడు. ‘పుట్టినరోజు పండుగే అందరికీ. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అని ఒక తెలుగు సినీ కవి ప్రశ్నించాడు. ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు. ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకు బాగా తెలుసు. లేకపోతే కొన్ని దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎందరో అసువులు బాసినా... ఫలితం దక్కని ఉద్యమాన్ని మళ్లీ భుజానికెత్తుకుని రాష్ట్రాన్ని సాధించేవాడా! తన కలకు మెరుగులు అద్ది ఒక మహా స్వప్నంగా మార్చి తెలంగాణ ప్రజల కళ్ళ ఎదుట ఆవిష్కరించిన ధన్యుడు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా స్వప్నం’’ ఇదే ఇదే నా జెండా, ఎజెండా... అంటూ ఒక సుదీర్ఘ ఉద్యమ యాత్ర చేశాడు కేసీఆర్. ఇందుకోసమే ఎన్నో బాధలు పడ్డాడు. కష్టాలను ఎదుర్కొన్నాడు. అధికా రాలు, పదవులు గడ్డిపోచతో సమానమని అనేకసార్లు నిరూపించాడు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మా ణంలో అలుపెరగక పోరాడుతున్నాడు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! జూలూరి గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ -
కొత్త సంవత్సరంలో... జీఎస్టీ మోత
నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మోయ లేని భారం మోపనుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు... చేనేత, జౌళి, పాదరక్షల రంగాలపై కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పన్నులు వేయలేదు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. కంచి, బెనారస్, బెంగాల్, పోచంపల్లి, గద్వాల్, నారా యణపేట, వెంకటగిరి, ధర్మవరం లాంటి పట్టు, కాటన్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇకపై ఆన్లైన్, ఈ–కామర్స్ ఫ్లాట్ఫామ్ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా; ట్రాన్స్పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే. జీఎస్టీ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... పన్నుల పెంపు, హేతుబద్ధత, వ్యత్యాసాల తొలగింపు నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకనుంచీ పన్నుల రీఫండ్ మార్పుల కోసం ఆధార్ అనుసంధానం తప్పనిసరి. వరసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే.. మూడో నెల బ్లాక్ లిస్ట్లో ఉంచుతారు. అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో జీఎస్టీ దాఖలు చేయకపోతే జనవరిలో బ్లాక్లిస్ట్లోకి వెళతారు. ఎలాంటి షోకాజ్ నోటీసు లేకుండా స్థిర, చర ఆస్తులు జప్తు చేసే అధికారం జీఎస్టీ కమిషనర్కు దఖలు పరిచారు. తనకు కావాల్సిన సమాచారం ఏ వ్యక్తి, సంస్థ నుంచైనా రాబట్టే అధికారం జీఎస్టీ కమిషనర్కు ఉంటుంది. ఈ జప్తుకు సంబంధించిన కారణాలు, పెనాల్టీలు ఏడు రోజుల్లో తెలియజేస్తారు. ఇకపై పెనాల్టీలు, ఇతర అభ్యంత రాలు కోర్టులు, ట్రిబ్యునల్లలో దావా దాఖలుకు 25 శాతం పెనాల్టీ పన్ను లేదా క్లయిం విలువను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తుది సప్లయ ర్కు జీఎస్టీ ఇన్వాయిస్ను, డెబిట్ నోటు విధిగా మొదటి సరఫరా దారు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ మార్పులతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తి, వ్యాపార సంస్థలను జీఎస్టీ 12 శాతం శ్లాబులోకి; కేంద్ర పరోక్ష పన్నుల, సుంకాల పరిధిలోకి పూర్తిగా తీసుకురావడం కేంద్ర ఉద్దేశం. పొనకా జనార్దన్రెడ్డి వ్యాసకర్త ఏపీ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి మొబైల్: 83094 09689 -
అఫ్గాన్ పరిణామాలు మళ్లీ కశ్మీర్ మెడకేనా?
భౌగోళిక స్వరూపం, భిన్న తెగల సమ్మేళనం, కిరాయి సేనలతో యుద్ధాన్ని వృత్తిగా స్వీకరించిన స్థానిక ప్రభువుల ఉనికి అఫ్గానిస్తాన్కు ప్రత్యేకం. ఇవే ఆ చిన్న దేశాన్ని ఇస్లామిక్ ఉగ్రవాద ప్రయోగశాలగా మార్చాయి. అఫ్గాన్పై నాటి సోవియెట్ రష్యా దురాక్రమణ అనేక ఉగ్రవాద సంస్థలకు బీజాలు వేసింది. అవే అమెరికా దాడి, నిష్క్రమణ కాలాలకి శాఖోపశాఖలుగా విస్తరించాయి. అఫ్గాన్ వర్తమాన సంక్షోభం వీటికి పరాకాష్ట. ఒక సమస్యగా ఇది ఆసియా స్థాయిని దాటిపోయిందని ప్రపంచ దేశాలు భయపడుతుంటే, పాకిస్తాన్ అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ఏకీకరణను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉబ్జెకిస్తాన్, ఈస్ట్రన్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ వంటి సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఈ అవాంఛనీయ ఏకీకరణతో అయినా కశ్మీర్ సాధించుకోవాలని పాక్ తలపెటిన పథకం వెల్లడైంది. తాలిబన్ ముట్టడి తరువాత ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నాయకురాలు నీలమ్ ఇర్షాద్ షేక్ ఒక టీవీ చానల్లో ‘పాకిస్తాన్ సైన్యానికీ, తాలిబన్కీ మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్ను సాధించడంలో తాలిబన్లు మాకు తోడ్పడతారు.’ అని చెప్పారు. తాలిబన్ నేత బరాదర్ కాందహార్ వచ్చిన తరువాత ఐఎస్ఐ ప్రస్తుత అధిపతి ఫైజ్ హమీద్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ రహస్యంగా వెళ్లి అతడికి అభినందనలు తెలిపి వచ్చిన సంగతి కూడా బయటపడింది. అమెరికా మీద విజయం సాధించాం కాబట్టి జిహాద్ను విస్తరించి, ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, లిబియా, మొరాకో, అల్జీరియా, మారిటానియా, ట్యునీసియా, సోమాలియా, యెమెన్ల ‘విముక్తి’కి తరువాత ప్రాధాన్యం ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన అల్కాయిదాకు, దాని అనుచర తాలిబన్కు పాకిస్తాన్ బహిరంగంగా ఇస్తున్న మద్దతు ఇది. జిహాద్తో ‘విముక్తం’ చేయవలసిన ప్రాంతాలలో కశ్మీర్ కూడా ఉంది. తాలిబన్ ఆధిపత్యంలోకి వచ్చిన అఫ్గాన్లో హక్కాని నెట్వర్క్ కమాండర్లు కీలక బాధ్యతలు చేపట్టారు. హక్కాని నాయకుడు ఖలీల్ ఉల్ రెహమాన్ హక్కాని కాబూల్ కొత్త సెక్యూరిటీ చీఫ్ అయ్యాడు. హక్కాని నెట్వర్క్ వ్యవస్థాపకుని కొడుకు జలాలుద్దీన్ హక్కానికి తాలిబన్ దళాలకు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసే బాధ్యత ఇచ్చారు. దీనితో తాను నిర్ణాయక శక్తిగా అవతరించవచ్చునని పాకిస్తాన్ నమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాంటి మాటలు చెప్పినా, అల్కాయిదా సహా, ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న ఏ ఒక్క సంస్థనీ, ప్రస్తుత పరిస్థితిలో తాలిబన్లు దూరం చేసుకునే స్థితిలో లేరు. పాక్లో తర్ఫీదు పొందిన ఉగ్రవాదులను తాలిబన్తో కలసి పనిచేయడానికి ఈ తాజా సంక్షోభంలోనూ ఐఎస్ఐ పంపించింది. అందుకే పదిరోజులలోనే 70,000 నుంచి 1,10,000కు అక్కడి ఉగ్రవాదులు పెరిగినట్టు అంచనా. హక్కాని, తాలిబన్లు 1980 నుంచి పాకిస్తాన్తో, ఐఎస్ఐతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. తాలిబన్ను అదుపులో ఉంచుకోవడానికి పాకిస్తాన్కు హక్కాని అవసరం ఉంది. పైగా ఇది భారత వ్యతిరేక సంస్థ. కొన్ని అంతర్జాతీయ నిఘా సంస్థల అంచనా ప్రకారం 1,500 నుంచి 2,000 వరకు లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులు, దాదాపు 2,500 మంది జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు తాలి బన్లతో కలసి ఇంతకాలం జిహాద్లో శ్రమించారు. నేడు వారే ఆక్రమిత కశ్మీర్లోని వాళ్ల శిక్షణ సంస్థలకి చేరుకుంటున్నారు. ఇది కశ్మీర్కు సరికొత్త బెడద. ఇప్పుడు ఐసిస్ (ఖొరాసన్) పేరు తెర మీదకు రావడం కూడా కొత్త ప్రశ్నలకు తావిచ్చేదే. దాదాపు 170 మందిని బలి తీసుకున్న కాబూల్ విమానాశ్రయం బాంబుదాడి (ఆగస్ట్ 26) వీళ్ల పనే. 2015 జనవరిలో అఫ్గాన్లో ఐఎస్ స్థాపించుకున్న అనుబంధ సంస్థ ఇస్లామిక్స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్. ఇదే ఐఎస్ఐఎస్ కె. ఇందులో ఎక్కువ మంది ఒకనాటి తెహ్రీక్ ఇ తాలిబన్ సంస్థ సభ్యులే. ఇస్లామిక్ సిద్ధాంతాల అమలు పట్ల నేతలు ఏమాత్రం మెతక వైఖరి చూపినా చాలామంది తాలిబన్ ఐసిస్కెలోకి ఫిరాయిస్తారని వినికిడి. అఫ్గాన్లో తాలిబన్ పైచేయి కావడంతోనే అసలు పని మొదలైం దని పాక్ భావిస్తున్నది. ఆ వార్త తెలియగానే ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అజహర్ అనే పాక్ ఉగ్రవాద నేత వెళ్లి తాలిబన్ ప్రముఖులు ముల్లా బరాదర్, ముల్లా యాకూబ్లను కాందహార్లో కలుసుకున్నాడు. మేం చేసిన సాయానికి మీరు కూడా ప్రత్యుపకారం చేసే సమయం వచ్చేసిందని గుర్తు చేయడానికే రవూఫ్ అజహర్ వెళ్లాడని విశ్లేషకుల అంచనా. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ ఆగస్ట్ 16న ‘మంజిల్ కి తరఫ్’ అని పోస్ట్ పెట్టాడట. దానర్థం ‘గమ్యం వైపు’. అంటే అఫ్గాన్తో వారి లక్ష్యం పూర్తి కాలేదా? మరి లక్ష్యం ఏమిటి? అల్కాయిదా జిహాద్తో విముక్తం కావలసిన దేశాల జాబితాలోనే దీనికి జవాబు ఉంది. కాబట్టి అఫ్గాన్ మతోన్మాదశక్తుల ఏకీకరణ నుంచి పాక్ కోరుకునే లబ్ధి అంతా కశ్మీర్ సాధనకేనని అనుకోవచ్చు. డాక్టర్ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ‘ మొబైల్ : 98493 25634 -
రాజకీయ క్షేత్రంలో ఒక కేసరి
ఒక నాయకుడికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉండొచ్చు. కానీ ధైర్యం అనేమాటకు సమానార్థకంగా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్ తుపాకీకి ఎదురొడ్డి, చొక్కా విప్పి ఛాతీని చూపిస్తూ, దమ్ముంటే కాల్చమని ఆయన సవాల్ విసిరిన తీరు స్వాతంత్య్ర పోరాటంలో ఒక ఉత్తేజకర ఘట్టం. ప్రజలంటే నేనే, నేనంటేనే ప్రజ అనగలిగిన అతిశయం; తన మాటనే శాసనంగా చలాయించుకోగల అధికార దర్పం ఆయనకే చెల్లాయి. ప్రజల పట్ల ఉన్న షరతులు లేని మమకారమే దానికి కారణం అయ్యుండాలి. ఆంధ్రకేసరి అనేది కేవలం బిరుదనామం కాదు. ప్రజాక్షేత్రంలో సింహంలానే బతికారు. 150వ జయంతి వేడుకల సందర్భంగా ప్రకాశం పంతులుకు భారతరత్న ప్రకటించడమే ఆయనకు ఇవ్వగలిగే సరైన నివాళి. స్వతంత్య్ర భారతావనికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ ఇది. ఈ వేడుకలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆజాదీ కా అమృత్మహోత్సవ్’ 75 వారాల పాటు జరుపు కోవాలని శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలు ముఖ్యంగా అటు పాలకులు, ఇటు పాలితులు మన గొప్ప దేశ భక్తుల జీవితాలను, వారి త్యాగాలను, ధైర్య సాహసాలను, వారి అకుంఠిత దేశభక్తిని స్మరించుకొని ఆచరణలో పెట్టడానికి, వారిలో ఉత్తేజాన్ని నింపడానికి తలపెట్టినవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ మహోత్సవ్ని స్వర్గీయ పింగళి వెంకయ్య గడప నుండి శ్రీకారం చుట్టడం హర్షణీయం. ప్రజా అంటే నేనే స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాన బ్రిటిష్సామ్రాజ్యాన్ని ధైర్య సాహసాలతో ఎదురించి గడగడలాడించిన సాహసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. అర్ధ శతాబ్దికి పైగా రాజకీయ, ప్రజా హిత జీవిత రంగంలో ఆయన ఆశాకిరణమై నిలిచారు. దక్షణాన యావత్ ప్రజానీకంతో ప్రకాశం గారికున్న చనువు, చొరవ మరి ఏ నాయకుడికీ లేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో నైనా సరే ప్రజల పక్షాన నిలిచాడు. ఆజన్మాంతం ప్రజా అంటే నేనేరా! నేనంటేనే ప్రజరా! అని నిష్కల్మషంగా అనేవారు. అనేక సందర్భాలలో అది రుజువు చేశారు కూడా. 1928లో మద్రాస్ పట్టణంలో సైమన్కు వ్యతిరేకంగా ‘సైమన్ గోబ్యాక్’ హర్తాళ్కు భయపడి అందరు అగ్ర నేతలు పట్టణం వదిలిపోయారు. ప్రకాశం ఒక్కడే స్వయంగా నిలబడి హర్తాళ్ జరిపారు. లక్షలమంది పాల్గొన్న ఆ ఉద్యమంలో బ్రిటిష్ తుపాకీకి ఒక యువకుడు బలి అయి రోడ్డు మీద పడిపోయాడు. ప్రకాశం పంతులు ఆవేశంతో ముందుకు దూకాడు. బ్రిటిష్తుపాకీకి తన గుండెను చూపించి ‘‘కాల్చుకోండిరా!’’ అని ఎదిరించిన ధీశాలి. ఆనాటి నుంచే ఆయన ఆంధ్రకేసరిగా ప్రసిద్ధులైనారు. ప్రకాశం గారు నిర్వహించిన ఆ హర్తాళ్ దేశానికే తలమానికైంది. మదరాస్ రాకుమారుడు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమమే ఊపిరిగా జీవించారు. కొన్ని సందర్భాలలో పదవులను తృణపాయంగా వదిలిపెట్టారు. లండన్లో బారిష్టర్ చదువుతున్న రోజులలో సిగార్ తాగి చిన్న ఉపన్యాస మివ్వమని చెప్తే, తల్లికిచ్చిన మాట కోసం తాను ఆ పని చేయనని నిశ్చయంగా చెప్పి కాలేజీలో చరిత్ర సృష్టించారు. రాజ మండ్రిలో, కాకినాడలో చదువుకుంటున్న రోజులలో నాటకాలు వేసేవారు. ప్రకాశం నటనా ప్రావీణ్యం చూసి ఆంగ్లబృందం ‘స్టార్ ఆఫ్ ద స్టేజ్’ బిరుదును ఇచ్చారు. వీధి తగాదాలలో పెద్ద పెద్ద రౌడీలను కూడా గడగడలాడించాడు. మద్రాసులో న్యాయవాదిగా పని చేస్తున్నప్పుడు జడ్జీలు సైతం అపసవ్యంగా, అగౌరవంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సన్మార్గంలో పెట్టేవారు. ఆ రోజులలో రోజుకి 1000 రూపాయల దాకా ఫీజు వసూలు చేసేవారు. ఆనాటికి అది చాలా పెద్ద మొత్తం. అంత ఫీజు తీసుకోవడం తెలుగు లాయర్లు ఎవ్వరు ఎరుగరు. అందుకే ఆయనను (ప్రిన్స్ ఆఫ్మద్రాస్) ‘మదరాస్ రాకుమారుడు’ అని పిలిచేవారు. బీదరికం నుంచి సంపదలోకి... కడు బీద కుటుంబంలో 1872 ఆగస్టు 23న ఒంగోలులోని మారుమూల గ్రామం వినోదరాయుడు పాలెంలో పుట్టారు ప్రకాశం. పట్టుదలతో, నిర్భీతితో, నిరంతర కృషితో బారిస్టరై లక్షలకు లక్షలు సంపాదించారు. తోటలు, భూములు, భవనాలు, ఆభరణాలు కొన్నారు. భోగభాగ్యాలను అనుభవించారు. గాంధీగారి పిలుపు మేరకు అంత సంపాదననూ వదిలి, దేశ దాస్య విమోచనకై త్రికరణ శుద్ధిగా ప్రజాసేవలో దూకిన మొట్టమొదటి తెలుగు లాయర్ఆయనే. వృత్తిని వదిలేసే ఒకరోజు ముందు తన క్లయింట్ దగ్గర తీసుకున్న ఫీజును తిరిగి ఇచ్చివేశారు. మాటే శాసనం ఉమ్మడి మద్రాసులో ప్రకాశం పంతులు మంత్రిగా ఉండగా తాను తలపెట్టిన ఒక సంక్షేమ పథకానికి ఒక అధికారి దానికి జీవో తీయాలి, సమయం సందర్భం రావాలి అని అడ్డుపడితే ‘నామాటే ఒక జీవో. తక్షణమే అమలు చేయండి రా!’ అనే ధీమా, దమ్మూ కల జననేత. తాను మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాల్సి వస్తే, కార్మికుల, ఉద్యమ కారులతో చర్చలు జరిపి ఒప్పించిన తరువాత సంతకం చేసిన మనిషాయన. సాహసమే ఊపిరి ప్రజల క్షేమం కోసం, వారి సుఖ శాంతుల కోసం పరితపించే వారు. మన రాష్ట్రాలలోనే కాక ఎక్కడ కల్లోలాలు జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. రజాకార్ల దమనకాండను సహించలేక వారిని హెచ్చరించి ప్రజలకు ధైర్యాన్ని నింపి వచ్చారు. కేరళలో మతకల్లోలాలు జరుగుతుండగా ‘కనపడితే కాల్చు’ ఆదేశాలున్నప్పటికీ అక్కడికి వెళ్లారు. అక్కడి ప్రజలు విస్తుపోయి ఒక రాత్రంతా పంతులుగారిని కాపాడి రహస్యంగా బయటకు తీసుకుని వచ్చారు. కొట్లాటలు చంపు కోడాలు ఆగిపోయినాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఒక ఏడాదిపాటు ఉన్నా దశాబ్ది కాలం పట్టే ప్రజారంజక పథకాలను అమలు చేశారు. కృష్ణా బ్యారేజ్, గుంటూరులో హైకోర్టు స్థాపన, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల దేవస్థానాభివృద్ధి, దానికి గానూ ఆర్థిక సహాయం, పన్ను ఎత్తివేత కొన్ని మచ్చుతునకలు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అమలుపర్చిన 2,000 మంది ఖైదీల విమోచన పథకం వంటిది దేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని నెహ్రూ కితాబు ఇచ్చారు. తాను మంత్రిగా ఉండగా చేనేత పరిశ్రమ అభివృద్ధి పథకంలో భాగంగా స్పిన్నింగ్స్మిల్లులను కేంద్రానికి తిప్పి పంపిన పదహారణాల గాంధేయవాధి. మహాత్ముడు ప్రవేశపెట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని కాంగ్రెస్లోని మహామహులే వ్యతిరేకిస్తే ప్రకాశం పంతులు సెంట్రల్ అసెంబ్లీకి రాజీనామా ఇచ్చి నేరుగా ఎకాఎకిగా సత్యాగ్రహ శిబిరానికి వెళ్లిన నాయకుడాయన. ఒక అధికారి బాపూజీతో, ప్రకాశం పథకాలను కేంద్రంలో నెహ్రూతో అమలు చేయించమని అడిగితే బాపూ చిరునవ్వు నవ్వి ‘‘అది కేసరులకే సాధ్యం, పండితులకు కాదు’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత సద్భావనా యాత్ర చేస్తుండగా వడదెబ్బ తగిలిన ప్రకాశం పంతులు 1957 మే 20న హైదరాబాద్లో అనంతజ్యోతిలో కలిసిపోయారు. జీవితాంతం పల్లెలు, గ్రామాలు, మారుమూల తండాలు సైతం అలుపెరుగక తిరిగిన ప్రజల మనిషి. గ్రామాల అభివృద్ధి కోసం పరితపించిన ఆంధ్రకేసరి జన్మదినాన్ని ‘‘గ్రామ స్వరాజ్య దినోత్సవం’’గా ప్రకటించి, ‘భారతరత్న’ బిరుదును ప్రదానం చేయడం దేశం వారికి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. - టంగుటూరి శ్రీరాం వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ. మొబైల్: 99514 17344 (టంగుటూరి ప్రకాశం 150వ జయంతి వేడుకల సందర్భంగా) -
సీమ నేలను కథగా చూపినవాడు
కేతు విశ్వనాథ రెడ్డికి 80 ఏళ్లు. తెలుగు కథా సాహిత్యంలో భీష్మ పితామహుడి వంటి ఆయనకు ఇప్పుడు సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం విశేషం కాదు. కాని ఆయనను సత్కరించుకోకుండా ఎవరిని సత్కరించుకోగలం? తెలుగు కథను, రాయలసీమ కథను సగర్వంగా, సమున్నతంగా గౌరవించుకోవాలని అనుకున్న ప్రతిసారీ ఆ పూలహారం వెళ్లి పడేది కేతు విశ్వనాథరెడ్డి మెడలోనే. సీమ కథకు చేవ ఆయనది. చేర్పు ఆయనది. నేల మీద గట్టిగా నిలబడి చెప్పిన సాహిత్యమంతా నిలిచింది. కేతు విశ్వనాథరెడ్డి తన చూపును నేలన గుచ్చి కథలు రాశారు. నేల మీద తిరుగాడే మట్టి పాదాలు, రైతు పాదాలు, స్త్రీల పాదాలు, తెలియకనే బానిసలుగా బతుకుతున్నవారి పాదాలు... ఇవి ఆయన కథా వస్తువులు. రాయలసీమ కథలో మధురాంతకం రాజారాం గారిది ఒక కథాధోరణి అయితే కేతు విశ్వనాథ రెడ్డిది మరో కథాధోరణి. మధురాంతకం రాజారాం పాఠకుణ్ణి ఒప్పించడం కూడా అవసరమే అనుకుంటారు. కేతు విశ్వనాథ రెడ్డి ‘నేను జీవితాన్ని చూపుతాను... చూడగలిగిన వారంతా చూడండి’ అని ములాజా లేని ధోరణి పాటించారు. కఠిన సత్యాలను, నిష్టూర సత్యాలను సీమ ప్రజల తరఫున పాఠకుల ముందు పెట్టారు. రైతుకు, నేలకు ముడి తెగితే ఆ రైతు ఎలా గాలికి కొట్టుకుపోయి పతనమవుతాడో కేతు తన ‘నమ్ముకున్న నేల’ కథలో చూపుతారు. ఆ కథ రాసే సమయానికీ ఇప్పటికీ పరిస్థితి మారి ఉండొచ్చు. కాని ఆ సమయంలో ఆ కథ మొత్తం రాయలసీమ నేల పెట్టిన వెర్రికేక. కరువు నేలలో మనిషిలో జడలు విప్పే స్వార్థం పశుస్థాయి కన్నా ఘోరమైనది అని ‘గడ్డి’ కథలో ఆయన చూపుతారు. ప్రజలకు అందాల్సిన ఫలాలు ప్రజల వరకూ చేరడం లో, ఆఖరుకు గడ్డి పంపకంలో కూడా భాగాలుంటాయని కేతు చెప్తే పాఠకునికి కడుపు తరుక్కుపోతుంది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలపై కేతు నిశితమైన వ్యాఖ్యానం వంటి కథలు రాశారు. ‘కూలిన బురుజు’ అందువల్లే గొప్ప కథగా నిలిచిపోయింది. ఆ కథలో ఒక డాక్టరు చేత ‘జబ్బు ఉంది అని కనిపెట్టడం గొప్ప కాదు. ఆ జబ్బుకు మందు కనిపెట్టడం గొప్ప’ అనిపిస్తారు. ఆ కథలో చాలా రోజుల తర్వాత తన ఊరికి వచ్చిన డాక్టరు పాత్ర ఊరిని చూసి దిగ్భ్రమ చెందుతుంది. ఊళ్లో ఎక్కడ చూడు కొట్లాటలూ కార్పణ్యాలే. తలాన్ని మార్చి చూస్తే సమస్య సరిగ్గా అర్థమవుతుంది. ఊరిలో ఉన్న వాళ్లకు తాము అలా ఎందుకున్నామో తెలియదు. ఊరు వదిలి వెళ్లిన డాక్టరుకు అర్థమవుతుంది. మగవాళ్ల పంతాలలో నలిగిపోయే స్త్రీలను ఈ కథలో కేతు గొప్పగా చూపుతారు. కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమలోని ఆత్మీయ జీవనాన్ని మతాల మధ్య ఉండే సహనపూర్వకమైన జీవనాన్ని కథల్లో చూపారు. ‘పీర్లసావిడి’, ‘అమ్మవారి నవ్వు’ ఆ విషయాన్ని నిరూపిస్తాయి. ఆయన స్త్రీవాద దష్టితో రాసిన కథలూ విలువైనవి. స్త్రీలు చదువులో, ఉపాధిలో వివక్ష అవసరంలేని, లైంగిక వేధింపులకు తావు లేని జీవనం పొందాలని బలంగా కోరుకున్నారు. ‘రెక్కలు’ కథ అందుకు ఉదాహరణ. ‘సతి’, ‘ఇచ్ఛాగ్ని’... ఆ వరుసలో ఎన్నో. రాయలసీమ వాసికి వాన ఎంత ముఖ్యమో వాన కోసం ఎన్ని అగచాట్లు పడతాడో ‘వాన కురిస్తే’ కథలో దుఃఖం కలిగేలా చెబుతాడాయన. కేతు విశ్వనాథ రెడ్డి కేవలం కథకుడు కావడం వల్ల మాత్రమే తన సాహితీ జీవనాన్ని సాఫల్యం చేసుకోలేదు. అరసంలో పని చేశారు. కొ.కు. సంపుటాలకు సంపాదకత్వం వహించారు. వత్తి రీత్యా అధ్యాపకుడైనందున కథకునిగా కూడా శిష్యులను ప్రశిష్యులను తయారు చేశారు. కేతు ప్రోత్సాహంతో కథా సాహిత్యంలో కషి చేసిన, చేస్తున్న మేలిమి కథకులు ఇవాళ ఉన్నారు. హైదరాబాద్లో సుదీర్ఘకాలం నివసించి, తన నేల– కడపలో విశ్రాంత జీవనం గడుపుతున్న కేతు విశ్వనాథ రెడ్డి కథాలోకానికి ఒక పెద్ద దిక్కు. నేడు ఆయనకు జరుగుతున్న సత్కారం తెలుగు కథకు జరుగుతున్న సత్కారం. ఆ సభకు ఆయన కథలూ బారులు తీరుతాయేమో. పాఠకులమైన మనం ఆ సమూహంలో మెడ నిక్కించకుండా ఎలా ఉండగలం? కేతుగారికి హదయపూర్వక శుభాకాంక్షలు. డాక్టర్ తుమ్మల రామకృష్ణ వ్యాసకర్త, వైస్ చాన్సలర్, కుప్పం యూనివర్సిటీ (కేతు విశ్వనాథరెడ్డికి నేడు అనంతపురంలో ‘విమల సాహిత్య జీవిత పురస్కారం’ బహూకరిస్తున్న సందర్భంగా...) -
మా బడిని... మాకిచ్చేయండి!
కరోనా వైరస్ అత్యంత దారుణంగా మానవాళిని బలిగొంటున్న దరిమిలా గత పద హారు నెలలుగా విద్యా సంస్థలన్నీ మూతబడ్డ విషయం తెలిసిందే. శాస్త్ర సాంకేతిక విప్లవం అందించిన మాధ్య మాల సహకారంతో విద్యా కార్యక్రమాలన్నీ ఆన్లైన్లోకి మారాయి. జూమ్, గూగూల్ మీట్, ఫేస్బుక్, యుడెమీ, స్కిల్ షేర్, కోర్సియా, ఎడెక్స్, ఎడ్ యాప్ వంటి వర్చువల్, డిజిటల్ ప్లాట్ఫామ్స్కు గిరాకీ పెరిగింది. కోవిడ్ నిబంధనల్ని కొంత సడలించి గత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో స్కూళ్లు, కాలేజీలు తెరచినప్పటికీ, సెకండ్ వేవ్ ఉధృతితో విద్యా సంస్థలకు మళ్లీ తాళాలు పడ్డాయి. కరోనా కారణంగా విద్యార్థుల మేధోభివృద్ధి చెప్ప లేనంతగా కుంటుబడింది. విద్యాలయంతో తమ రోజువారీ భూభౌతిక సంబంధం, ప్రాకృతిక అను భవం స్తంభించిపోవడం మూలాన ఇటు విద్యార్థు ల్లోనూ, అటు ఉపాధ్యాయుల్లోనూ నిరాశ నిస్తేజాలు అలుముకున్నాయి. ఇవాళ దేశంలోని ముప్పై మూడు కోట్లమంది విద్యార్థులు తమ చదువుల్ని తమకివ్వ మని ముక్తకంఠంతో పెద్దల సమాజానికి, ప్రభుత్వా లకు నివేదించుకుంటున్నారు. ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమై పోవటాన పిల్లల సామాజిక ఎదుగుద లకు పెను ఆటంకం ఏర్పడింది. ఈ మొత్తం ఎపి సోడ్లో ఆన్లైన్ టీచింగ్ ఉత్త బోన్సాయ్ పెంపకం అని రూఢి అయ్యింది. కరోనా కష్టకాలంలో ఆన్లైన్ తరగ తులు, ఇ–లెర్నింగ్ మేలిమి ప్రత్యామ్నాయాలుగా కని పిస్తున్నప్పటికీ, వాటి వ్యవస్థీకృత లోపాల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏ రంగం దెబ్బతిన్నా తిరిగి దానికి ఉద్దీపన ఇవ్వవచ్చు, కానీ విద్యావ్యవస్థలో అట్లా కుదరదు. ఇది కాల సంబంధి, వయో సంబంధి. బాలలు పెరుగు తున్న క్రమంలో విద్య అందకపోతే జ్ఞానశూన్యులుగా మిగిలిపోయి ‘ఖాళీ మెదళ్ల తరం’ ఏర్పడుతుంది. ఇది ఆ సమాజానికి ఎంతో నష్టదాయకం. ప్రస్తుత నయా ఉదారవాద పెట్టుబడిస్వామ్యంలో విద్య ఇంతకు ముందరికంటే ఒక అనివార్యమైన అవసరమైంది. ఇప్పటికీ మనలో కొద్దిమందికి మాత్రమే చదువులు ఉత్తమంగా అందడం, మిగతా వారికి అంతంత మాత్రంగా కూడా అందుబాటులో లేకపోవడం ఒక సాంఘిక విషాదం. ఈ విషాదాన్ని ఆన్లైన్ విద్యా కార్యక్రమం సైతం అధిగమించలేకపోగా మరింత రాజేసింది. నగరాల్లో, పట్టణాల్లోలాగా ఇంటర్నెట్ సౌకర్యం గ్రామాలకు, మారుమూల ఆవాసాలకు విస్త రించకపోవడం, తగినంత సామర్థ్యం గల స్మార్ట్ఫోన్ల కొనుగోలుశక్తి పేదలకు లేకపోవడంతో పాటు గృహ వాతావరణంలోని అనేక అస్తవ్యస్తతలు పిల్లల చదు వుల మీద ఎనలేని ప్రభావాన్ని చూపుతున్నాయి. మనది విద్యార్థి కేంద్రక విధానం అని గొప్పలు చెప్పుకుంటున్న సందర్భంలో విద్యార్థి కేంద్రక విధాన లక్ష్యాలైన నమ్రత, సుగమతలకు దరిదాపుల్లో కూడా ఆన్లైన్ టీచింగ్, లెర్నింగ్ లేకపోవడం దాని ప్రధాన లోపం. ముఖ్యంగా పాఠశాల నుండి విద్యార్థులకు అబ్బే అభివ్యక్తీరణ, నాయకత్వ సామర్థ్యం, జట్టుగా పనిచేయడం లాంటివాటిని ఆన్లైన్ తరగతులు దెబ్బ తీశాయి. సోషల్ ఇంటలిజెన్స్, ఎమోషనల్ ఇంటలి జెన్స్, ఎథికల్ ఇంటలిజెన్స్ వాళ్లకు అందకుండా పోయింది. విద్యార్థులు వాళ్లుగా రూపొందించుకునే వ్యక్తిత్వ నిర్మాణానికి క్యాంటీన్, కారిడార్, ప్లేగ్రౌండ్ జ్ఞాపకాలు ఎంతగానో దోహదం పడతాయి. వీటన్ని టినీ కోవిడ్ హరించింది. విద్యార్థికి తన అభ్యసన జీవితంలో తన సహపాఠులతో ఏర్పడే స్నేహ సంబంధం చాలా ఉదాత్తమైంది. ‘ఇతరుల నుండి ప్రత్యక్షంగా నేర్చుకునేదే విద్యార్జనలో ఎక్కువ’ అంటాడు సుప్రసిద్ధ విద్యా తత్త్వవేత్త జాన్ డ్యూయీ. ఇందుకు ఏ రకమైన టెక్నికల్ కాన్ఫరెన్సింగ్ ప్రోగ్రాం లోనూ అవకాశం ఉండదు. అందుకే కంప్యూటర్లకు, మొబైళ్లకు పిల్లలు టాటా చెప్తూ తోట లాంటి, పాట లాంటి, మంచి మాట లాంటి ‘మా బడిని మాకు ఇవ్వండి’ అని ప్రాధేయపడుతున్నారు. సమయానికి అందాల్సిన పోషకాహారం లాంటి చదువు సంధ్యలు అందినపుడే వాళ్లు ప్రపుల్లం కాగలరు. డా. బెల్లి యాదయ్య వ్యాసకర్త ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ‘ మొబైల్ : 98483 92690 -
మరొక ‘హిరోషిమా’ వద్దే వద్దు
హిరోషిమా నగరంపై అమెరికన్లు అణుబాంబు వేసిన రోజు 1945 ఆగస్టు 6. అది ప్రపంచ మానవ చరిత్రలో కారుచీకటి రోజు. ఘటన జరిగి ఆగస్టు 6వ తేదీనాటికి సరిగ్గా 76 ఏళ్లయింది. బాంబు వేసిన వెంటనే 70 వేలమంది చనిపోగా తర్వాత రోజుల్లో ధార్మికకిరణాల దుష్ప్రభావంతో 2 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. 4,400 కిలోల ఈ అణ్వస్త్రం ‘లిటిల్బోయ్’లో 64 కిలోల యురేనియం వాడారు. ఆగస్టు 9న ‘ఫ్యాట్బోయ్’ను నాగసాకిలో ప్రయోగిం చారు. అక్కడికక్కడే 80 వేల వరకు సామాన్యులు చని పోయారు. 6.2 కిలోల ఫ్లుటోనియంతో ఈ బాంబును ప్రయోగించారు. ఆగస్టు 12న జపాన్ లొంగిపోయినట్లుగా ప్రకటించింది. యుద్ధానంతరం 1945 జూలై 17న విధివిధానాలు నిర్ణయించడానికి సోవియట్ యూనియన్, అమెరికా, ఇంగ్లండ్ అధినేతలు స్టాలిన్, ట్రూమెన్, చర్చిల్లు జర్మనీ పోట్స్డామ్లో సమావేశమై ఆగస్టు 2 వరకూ చర్చలు జరిపారు. జూలై 28న ఇంగ్లండ్ ప్రధాని హోదాలో అట్లీ బాధ్యతలు తీసుకున్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే జూలై 18న రహస్యంగా అమెరికాలోని న్యూ మెక్సికోసిటీ ఎడారిలో అణుబాంబును విజయవంతంగా పరీక్షించారు. ఆ తర్వాత ట్రూమెన్ వద్దకు వచ్చిన అధికారులు ‘కవలపిల్లలు ప్రసవించటానికి ఏర్పాట్లు సిద్ధం చేశాం’ అన్నారు. ఆ కవలపిల్లలే లిటిల్బోయ్, ఫ్యాట్బోయ్లని ప్రపంచానికి తర్వాత తెలిసింది. అమెరికా న్యూక్లియర్ బలాన్ని స్టాలిన్కు ప్రదర్శించటానికి, ప్రపంచ ఆధిపత్య సాధనకోసమే ఈ అణ్వస్త్రాల ప్రయోగం జరిగింది. తదనంతరకాలంలో ప్రచ్ఛన్న యుద్ధానికి, ఆయుధపోటీకి దారితీసింది. 1962లో క్యూబన్ మిస్సైల్స్ సంక్షోభంతో అణ్వాయుధ యుద్ధానికి దరిదాపుల్లోకి ప్రవేశించింది. సోవి యట్ యూనియన్, అమెరికా, యూకేల మధ్య అణ్వాయుధ పరీక్షల సంఖ్యను తగ్గిస్తూ 1963లో కుది రిన ఎల్టీబీటీ ఒప్పందంపై 113 దేశాలు సంతకం చేశాయి. కానీ ఆ తదుపరి పదేళ్లలో అప్పటికే తయారయి వున్న క్షిపణులతో 12 వేల న్యూక్లియర్ హెడ్స్ను బిగించటం జరిగింది. జూన్ 1979లో ఆస్ట్రియా రాజ ధాని వియన్నాలో ఒప్పందం మేరకు అణ్వాయుధాల సంఖ్యను పరిమితం చేసుకోగా, 1980 అఫ్గానిస్తాన్ పరి ణామాలతో ఈ ఒప్పందం రద్దయింది. 1970వ దశకం మధ్య వరకూ అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణుల తయారీలో అమెరికాదే పైచేయిగా ఉండేది. యూరప్లో ఒక మూలనుంచి వేరొక ప్రాంతానికి ఎక్కుబెట్టగలిగే అణు క్షిపణులు వేలకువేలు వచ్చిచేరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వటంతో 1987లో రొనాల్ట్ రీగన్, గోర్బచేవ్ల మధ్య కుదిరిన ఒప్పందమే ‘ఐఎన్ఎఫ్’ (మధ్యంతర అణుక్షిపణుల శక్తుల) ఒప్పందం. దీని ప్రకారం 5,500 కి.మీ.లలోపు ప్రయాణం చేయగల అణుక్షిపణులను నిర్వీర్యం చేయాలి. అణ్వాయుధాల నిర్మూలన ప్రక్రియలో ఇది ఒక పెద్ద విజయం. ఈ ఒప్పందాన్నే ట్రంప్ రద్దుచేశాడు. నేటి ఆయుధ పోటీలో హైపర్సోనిక్ క్షిపణులతో నూతన శకం ఆరంభమైంది. ఈ నూతన అధ్యాయాన్ని ఈసారి రష్యా ప్రారంభించింది. శక్తిమంతమైన జిక్రోన్ యుద్ధ నౌక నుండి క్రితం నెలలో ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణి శబ్ధతరంగాల వేగం కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి ప్రపంచ ఆయుధ ఉత్పత్తిదారులను ఆశ్చర్యపర్చింది. ఇటీవలి కాలంలో చైనా కూడా భూగర్భ అణ్వస్త్ర గిడ్డంగులను శరవేగంగా నిర్మిస్తోంది. ప్రపంచ అగ్రదేశాలు జాతీయవాదం, స్వీయరక్షణ పేరిట కూటములుగా ఏర్పడి అడ్డూఅదుపూ లేకుండా మారణాయుధాలను తయారు చేస్తున్నాయి. జీవన ప్రమాణాల మెరుగుదల, నిరుద్యోగ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, దారిద్య్ర నిర్మూలన, మెరుగైన విద్యావైద్య సదుపాయాలు వంటి ప్రధాన సమస్యల కంటే, మానవాళిని, భూగోళాన్ని తొందరగా వినాశనం చేయాలనే దిశగానే ఆయుధపోటీకి ప్రభుత్వాలు వెళుతున్నాయి. ప్రపంచ ప్రజల శాంతి ఉద్యమమే దీనికి విరుగుడుగా ఎదగాలి. ప్రపంచంలో కొన్నిదేశాల దగ్గరే అణ్వస్త్రాలు ఉండాలనే వాదన కంటే అణ్వస్త్ర రహిత సమాజ దిశగా పయనిద్దాం. బుడ్డిగ జమిందార్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం కార్యవర్గ సభ్యులు ‘ 98494 91969 (ఆగస్టు 6 నాటికి హిరోషిమా మారణకాండ జరిగి 76 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా) -
నియామకాల్లో హిందీ ఆధిపత్యం
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీ భాషకు ఇస్తున్న వెయిటేజ్ వలన హిందీయేతర రాష్ట్రాల ఉద్యోగా ర్థులు నష్టపోతున్నారు. ఉదాహర ణకు తెలంగాణలో గల 9 నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది 220 మంది ఉండగా వారిలో సుమారు 50 (22.7%) మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. మిగిలిన వారిలో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ వారున్నా మెజారిటీ హిందీ ప్రాంతం వారే. ఏపీ నవోదయ విద్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 72 కేంద్రీయ విద్యాల యాల్లోని దాదాపు 2,500 మంది ఉపాధ్యా యుల్లో తెలుగు వారు 20 శాతమే. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపా« ద్యాయ నియామ కాల్లో 75% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్ టీచర్ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయాల్లో పరీక్ష ఉంటుంది. వీటిలో ఇంగ్లిష్, హిందీ భాషలకు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్లో ఏ ప్రాంతం వారికైనా మార్కులు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80% పైగా మార్కులు వస్తుండగా హిందీయేతరులకు అందులో సగం కూడా రావడం లేదు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో బోధనా మాధ్యమం ఇంగ్లిష్. నియామక పరీక్షలో ఇంగ్లిష్ అని వార్యం. కానీ హిందీ ఎందుకు? ఇంగ్లిష్తో పాటు మరో భాషలో పరిజ్ఞానాన్ని పరీక్షించ దలిస్తే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా రాసే అవకాశం ఇవ్వాలి. సివిల్ సర్వీసులకు కూడా ప్రాంతీయ భాషల్లో రాసే వీలుండగా కేంద్రీయ, నవోదయ ఉపాద్యాయ నియా మకాలకు లేకపోవడం అన్యాయం. నియామకాలు జోనల్ పరిధిలో కాకుండా దేశం మొత్తం ఒకే యూనిట్గా కేంద్రీకృతంగా నిర్వహించడం కూడా ఈ అస మానతకు మరో ముఖ్య కారణం. పైన ఇచ్చినవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ సంస్థ ల్లోనూ జరుగుతోంది. ఇండియన్ రైల్వేస్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ, సెంట్రల్ సెక్రటేరి యట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, డిఫెన్స్, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ యూని వర్సిటీలు, ఐఐటీలు, ఎన్ ఐటీలు... ఇలా వందలకొలదీ వున్నాయి. వాటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 40 లక్షల పోస్టులకు నియామకాలు చేస్తే అందులో సుమారు 2 లక్షలు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. అమల్లో వున్న ఎంపిక పరీక్షా విధానంలో హిందీకి గల ప్రాధాన్యత తెలుగుకు లేకపోవడం వలన అవి తెలుగు వారికి దక్కే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వ రంగంలో వున్న కొద్దిపాటి ఉద్యో గాల్లో కూడా జరుగుతున్న ప్రాంతీయ అన్యాయాన్ని ఎది రించే ఉద్యమం ఊపందుకోవాలి. నాగటి నారాయణ వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు మొబైల్: 94903 00577 -
చట్టం కంటే ప్రజాచైతన్యం ముఖ్యం
ప్రభుత్వాలు చేసే చట్టాల వల్ల తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించాలి. అప్పుడే ఆశించే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వాస్తవం ఏడు దశా బ్దాల స్వతంత్ర భారతంలో పదేపదే రుజువైనప్పటికీ, ఆయా వర్గాలను సంతృప్తి పర్చడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పలు సందర్భాలలో మొక్కుబడి చట్టాలు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల గొప్ప మేలు కలుగుతుం దని కేంద్రం పేర్కొంటున్నప్పటికీ, రైతులు సాను కూలంగా స్పందించడం లేదు. ఎన్డీఏ తెచ్చిన పలు చట్టాలపై ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘జనాభా నియంత్రణ’పై చట్టం తేవడానికి అధికార బీజేపీ అడుగులు వేయడం మరో వివాదానికి తెరలేపింది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియం త్రణ బిల్లులను తమ శాసనసభల్లో ప్రవేశపెట్టాయి. ‘ఉత్తర ప్రదేశ్ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు 2021’ ముసాయిదాను యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజానీకం ముందుంచి, వారి సలహాలు, సూచనలను ఆహ్వా నించింది. కాగా, యూపీ తరహాలోనే జనాభా నియంత్రణ బిల్లును తెచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనాభా నియంత్రణకు సంబంధించి 2020 డిసెంబర్లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాజ్యంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో చైనా తరహాలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చే ఉద్దేశమేదీ తమకు లేదనీ, వివిధ స్వచ్ఛంద విధానాల ద్వారా కుటుంబ నియంత్రణ చర్యలతోనే దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటును కనిష్టంగా 2.1 శాతం సాధించే క్రమంలో ఉన్నామనీ తెలిపింది. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానం ఇంత విస్పష్టంగా ఉన్నదని తెలిసినప్పటికీ, పార్లమెం టులో కొందరు అధికార బీజేపీ నేతలు ప్రైవేటు మెంబర్స్ బిల్ రూపంలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుబడటం వెనుక పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత భారత్ జనాభా ప్రపంచ జనాభాలో 6వ వంతు. దేశంలో ప్రతి 20 రోజులకు లక్ష చొప్పున జనాభా పెరుగుతోంది. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, 142 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న చైనాను దాటడా నికి ఎక్కువ సమయం పట్టదు. స్వాత్రంత్యం లభించిన తొలినాళ్లల్లోనే దేశంలో తీవ్ర ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అప్పుడున్న 30 కోట్ల జనాభాకు తిండిగింజలను విదేశాల నుండి దిగు మతి చేసుకొన్నది. అటువంటి నేపథ్యంలోనే, నెహ్రూ ప్రభుత్వం 1951లో కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. అయితే, దీన్ని బల వంతంగా అమలు చేయలేదు. తర్వాతి ప్రభు త్వాలు కూడా ప్రజలపై నిర్బంధంగా రుద్ద లేదు. ఒక్క ఎమర్జెన్సీ సమయంలోనే చెదురుమదురుగా బలవంతపు ఆపరేషన్లకు పాల్పడిన అమానుష సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ‘మేమిద్దరం– మాకిద్దరు’ అనే నినాదంతో సాగిన కుటుంబ నియంత్రణ కార్య క్రమాలు సత్ఫలితాలు అందించాయి. ఫలితంగానే, 1950–55 మధ్యకాలంలో సంతానోత్పత్తి వృద్ధి రేటు 5.9 శాతం ఉండగా, అది క్రమంగా 4 శాతా నికి, తదుపరి 3 శాతానికి తగ్గుతూ 2.2 శాతం వద్ద స్థిరపడింది. 2025 నాటికి 1.93 శాతంకు తగ్గిం చేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘అన్ని సమస్యలకు మూలం అధిక జనా భాయే’ అనే భావన ఒకప్పుడు ఉండేది. తర్వాత ‘అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది జనాభాయే’ అనే సిద్ధాంతం ఊపిరి పోసుకుంది. మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించు కొనే దిశగా సమర్థమైన కార్యాచరణ అమలు చేసిన తర్వాతనే చైనా ఆర్థిక వ్యవస్థ బలీయమైన శక్తిగా రూపొందింది. అంతకుముందు ‘ఒకే బిడ్డ’ విధా నాన్ని నిర్బంధంగా అమలు చేయడంతో చైనాలో యువత సంఖ్య గణనీయంగా తగ్గి, వైద్య ఆరోగ్య సౌకర్యాలు అవసరమైన వృద్ధుల సంఖ్య పెరగ డంతో తన విధానాన్ని సవరించుకొంది. ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదు పాయాల కల్పన, ప్రతి ఒక్కరికి అర్హతలను అను సరించి నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించడం, అభి వృద్ధి కార్య కలాపాలను వికేంద్రీకరించడం, తది తర చర్యలను తీసుకొన్నట్లయితే పెరుగుతున్న జనాభా విలువైన వనరుగా రూపొందుతుంది. యూపీ, అస్సాం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కుటుంబ నియంత్రణ చట్టాలు రూపొందించి, కొన్ని వర్గాల జనాభాను నియం త్రించాలనుకోవడం వెనుక రాజకీయ కోణం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల జనాభా సంఖ్యను దాటుకొని ముస్లింల జనాభా పెరిగి పోతోందని కొంతకాలంగా చాంధసవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న కారణంగానే ఆ రాష్ట్రం చట్టం ద్వారా జనాభాను నియంత్రించా లనుకొం టోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. యూపీ మోడల్ను జాతీయ స్థాయిలో అనుసరించి నట్లయితే, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఇద్దరు బిడ్డల విధానం వల్ల, ఆడపిల్లలను పిండ దశలోనే తొలగించి వేసే అవకాశం ఉంది. ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ‘జనాభా నియంత్రణ బిల్లు’పై విçస్తృతమైన చర్చ జరగాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం చేయాలి. ‘చట్టం కంటే ప్రజా చైతన్యం’ ముఖ్యం. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
వందేళ్ల ఆంధ్రుల స్వప్న సాకారం పోలవరం
ప్రపంచంలోనే గొప్పదని చెప్పుకునే చైనాలోని త్రీ గోర్జెస్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్ట్ తలదన్నబోతోంది. చైనా త్రీ గోర్జస్ ప్రాజెక్టు ప్రవాహం 41 లక్షల క్యూసెక్కులయితే మన పోలవరం ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులు. వాస్తవంగా చెప్పాలంటే ‘త్రీ గోర్జస్’ మూడు మహానదుల కలయిక... ప్రవాహంలోనూ, ఆధునిక సాంకేతికతలోనూ, ఇతర విశేషాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుతో పోలిస్తే త్రీ గోర్జస్ చిన్నబోయినట్లే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కన్న కలను ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరీ సాకారం చేయబోతున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్కు కొన్ని ప్రత్యేకతలు సంతరించుకొనున్నాయి. సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఒక సమగ్ర క్యాలెండర్ ఏర్పాటుతో ప్రణాళికాబద్ధంగా అధిక శ్రద్ధ పెట్టారు... గతంలో ప్రాజెక్ట్కు చెందిన కొన్ని విభాగాల్లో అవినీతి జరిగిందని గుర్తించి రీ టెండరింగ్ విధానం తీసుకు రావడం ద్వారా ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకట్ట వేశారు... ఆ తరువాత మాత్రమే అపార అనుభవం ఉన్న మెగా ఇంజనీరింగ్ సంస్థ టెండర్ ద్వారా ప్రాజెక్ట్ దక్కించుకుంది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరదలొచ్చినా, కరోనా విలయ తాండవం చేసినా ఒక్కరోజు కూడ పని ఆగకుండా చేయడం గొప్ప విశేషం. అలాగే ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు సైతం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. వీరంతా పోలవరం చరిత్రలో నిలిచిపోతారు. సీఎం జగన్కు ఆ నిబద్ధతే శ్రీరామరక్ష కానుంది. ఎంతగా అంటే గోదావరి నదిపైన ఒక్కొక్క గేటు 20 మీటర్ల ఎత్తు ఉండే 48 గేట్లు ఇక్కడ ప్రాజెక్టులో ఏర్పాటు చేసి నదీ గమనం మార్చి నిర్మించడం, స్పిల్ వే ద్వారా మళ్ళించిన ప్రాజెక్ట్ ప్రపంచంలో ఇదే కావడం తెలుగు వాడికి ముఖ్యంగా ఆంధ్రుడికి ఒక గర్వకారణంగా నిలిచిపోనుంది. ఇది భారతదేశానికి కూడా గర్వకారణమే కదా. పైగా సముద్రాన్ని మరపించేలా మంచినీటి మత్స్య సంపదకు ఆటంకం లేకుండా ఫిష్ ల్యాడర్ ఏర్పాటుతో మత్స్య సంపదకు ఆటంకం లేకుండా ముందుగానే పాదుకొల్పారు. ఇక పాపికొండల అందాలు మరింత ఆస్వాదించేలా ప్రత్యేకంగా నావిగేషన్ కెనాల్ ఏర్పాటు చేయడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టులో చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైనా ప్రకృతి ప్రతికూలించి వర్షాలకు ఆటంకం కలగవచ్చు. ఆ పరిస్థితే వస్తే డెల్టా సాగునీటి సరఫరాలకు ఆటంకం లేకుండా స్పిల్ లెవెల్ స్థాయిలో జలనిధి అడుగున ప్రాథమిక పునాది స్థాయినుంచి నీటి పారుదలకు ఆటంకం లేకుండా స్కవర్ స్లూయిస్లను నిర్మించారు. దార్శనికతకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం ధవళేశ్వరం వద్ద బ్యారెజ్ నిర్మించిన కాటన్ మహాశయుడు 1852లోనే గోదావరిపై రిజర్వాయర్ అవసరమని పేర్కొన్నారు... ఆనాడు ఆయన వెలిబుచ్చిన అభిప్రాయంకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలు తవ్వించిన డేరింగ్ అండ్ డేషింగ్ పొలిటికల్ హీరో దివంగత వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు జీవం పోశారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆధునిక రాజకీయ పాలనా వ్యవస్థలో మనదేశంలో ఎన్నో పథకాలకు శంకుస్థాపనలు లెక్కకు మిక్కిలిగా జరిగాయి... అంటే ఒకసారి చేసినదానికే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసిన వైనం పోలవరానికి దక్కింది... ఇలా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు ఆశించి పోలవరాన్ని కుటిల తరహాలో పావుగా ఆడుకుంటే వైఎస్సార్ మాత్రం ఆ తరహా కుటిలత్వానికి చరమగీతం పాడి రైతాం గానికి అనువుగా వాడుకున్నారు... అందుకే దాదాపు 360 కిలోమీటర్ల నిడివి కల్గిన రెండు కాల్వల పనులు చేపట్టి తొంబై ఎనిమిది శాతం పూర్తి చేశారు. సాగు, తాగు నీటి సమస్యతో పాటు పారిశ్రామిక ప్రగతికి పోలవరం ఒక్కటే పరిష్కారం చూపగలమని నమ్మారు... ఆలోచన రావడం తరువాయి ఆచరణలో పెట్టి ప్రాజెక్ట్కు ఇరువైపులా ఉభయగోదావరి జిల్లాల్లో కాల్వల నిర్మాణానికి భూసేకరణకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ. వేలకోట్లు ఖర్చయినా సరే పరవాలేదనుకుని రంగంలోకి దిగారు. ఇలా రైతులకు పరిహారాలు అందజేసి ముందుగా పనులకు శ్రీకారం చుట్టడంతో కేంద్రం దిగొచ్చింది. ఫలితంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకి నిధులు తామే ఇచ్చి పూర్తి చేస్తామని రాష్ట్ర విభజనలో భాగంగా మాట ఇచ్చింది. కానీ, బాబుని నమ్మి ఓట్లేస్తే సరికొత్త ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక తామే నిర్మిస్తామని తలదూర్చి రాజకీయం చేశారు తప్ప అయిదేళ్లయినా పునాదులు దాటకుండా నిర్వీర్యం చేశారనేది జగమెరిగిన సత్యమేగా. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ ప్యాకేజ్ స్థాయిలోనే అవినీతి అక్రమాలు జరిగిన తీరు లోకానికి తెలియ చేయడంలో జగన్ కృతకృత్యులయ్యారు. ఆ తరువాత పరిణామాలు అందరికీ తెలిసిందే. 1900 ప్రాంతం నుంచీ దాదాపు వందేళ్ళు రాజకీయం చేస్తూ పోలవరాన్ని అటకెక్కించిన తీరును తన చాణక్యంతో వైఎస్సార్ తిప్పికొట్టిన సంగతి వర్తమాన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. దివంగత వైఎస్సార్ 17,500 క్యూసెక్కుల మేరకు నీరు పారే కుడి, ఎడమల కాల్వల తవ్వకానికి ఆనాడు చేపట్టిన సాహసోపేత చర్యే ప్రస్తుతం శరవేగంగా పనులవుతున్న ‘పోలవరం’గా చరిత్రకెక్కింది... ఈ కారణంగా ఉభయ గోదావరులకే కాదు అటు ఉత్తరాంధ్ర... ఇటు సర్కార్... రాయలసీమ జిల్లాలకు కూడా సాగు, తాగు పారిశ్రామిక అవసరాలు నెరవేరతాయి కదా..! ఇప్పుడు గోదావరి జిల్లాల డెల్టా స్థిరీకరణ జరగడమే కాదు. మెట్ట ప్రాంతాలకు, ఇతర జిల్లాల నీటి సమస్యలకు చెక్ పెట్టినట్టేగా. అన్నిటికీ మించి 960 మెగావాట్ల అతి చౌకైన విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టులో కీలకమైన అంశం... ఈ ప్రాజెక్టుకోసం ఊళ్లు, ఇళ్లూ వదిలేసి నిర్వాసితులయిన ఒకో కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు పరి హారంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ ఉదారతతో తాజాగా నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. వారికి జీవించేందుకు అవసరమయ్యే ఇతర ఆర్థిక సాయం అందించడం.. జీవన భృతి ఏర్పాటు.. ఉద్యోగ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కొవ్వూరి త్రినాథరెడ్డి కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 94402 04323 -
అఫ్గానిస్తాన్ పర్యవసానాలు ఇలా...
అగ్రరాజ్య అమెరికా చరిత్రలో అతి పెద్ద యుద్ధం చేసిన సైన్యాలు అఫ్గానిస్తాన్ నుంచి మూటాముల్లె సర్దుకొని వెనుదిరిగాయి. 2011 సెప్టెంబరు 11న ట్విన్టవర్స్ కూలిన తర్వాత ‘టెర్రరిజంపై యుద్ధం’ పేరిట అఫ్గానిస్తాన్ను అమెరికా, నాటో దేశాలు కలిసి ఆక్రమించాయి. రెండు దశాబ్దాల తర్వాత ఉగ్రవాదం ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య దక్షిణాసియాల్లో పెరిగిందే తప్ప తగ్గలేదు. తాలిబాన్ల పుట్టుక సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ప్రోత్సహించిన అమెరికా అండదండలతో జరిగింది. ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పి, శిక్షణనిచ్చి కోట్ల డాలర్లు కుమ్మరించిన అమెరికా ఉత్పత్తి పుత్రుడే బిన్ లాడెన్. ఇరవై ఏళ్లపాటు అఫ్గానిస్తాన్లో అమెరికా తిష్ఠవేయడానికి కారణం, ఆ దేశ పౌరులపై ప్రేమ, జాలితో కాదు. అఫ్గానిస్తాన్ భౌగోళికంగా సెంట్రల్ దక్షిణాసియా దేశాల మధ్య మినరల్స్, ఖనిజసంపదతో నిండిన వ్యూహాత్మక దేశమవటమే. అఫ్గానిస్తాన్ ఆర్థిక, రాజకీయ పర్యవసానాలు అనాదిగా మన ఇరుదేశాల మధ్యగల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత అఫ్గాన్ ప్రభుత్వం అమెరికా కీలుబొమ్మగా పేరుగాంచి మొత్తం 43 శాతం భూభాగంతో ప్రాబల్యంలేనిదిగా ఉంది. దీనికి విరుద్ధంగా ఛాందసవాద తాలిబాన్లు మెజారిటీ ప్రావిన్సులను ఆక్రమించి, అమెరికా సేనలతో పోరాడి చివరికి దేశాన్ని వదిలిపోయేలా చేశారు. దాడులు ముమ్మరమైనప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్లో ఆశ్రయం పొందారు. ఉగ్రవాదం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా భారతదేశ కశ్మీరు వరకూ తాలిబాన్ల రూపంలో పాకింది. సుదీర్ఘయుద్ధం వల్ల అమెరికా పరువు మసకబారింది. ఆర్థికంగా, సైన్యపరంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. చివరికి 2021 సెప్టెంబరు 11 నాటికల్లా, 20 సంవత్సరాల ఆక్రమణ పూర్తి సమయానికి ఇంకా మిగిలి ఉన్న సైన్యాన్ని వెనుకకు రప్పిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్. బ్రౌన్ యూనివర్సిటీ అంచనాల ప్రకారం మొత్తం అమెరికా యుద్ధఖర్చు రెండు లక్షల, 36 వేల కోట్ల డాలర్లయింది(177 లక్షల కోట్ల రూపాయలు). యుద్ధంలో కనీసం 2,41,000 మంది ప్రత్యక్షంగా చనిపోగా, లక్షలాది మంది ఆకలితో చనిపోయారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లలో 71,344 మంది పౌరులు, అమెరికా నాటో సైన్యాలు 3,586 మంది, అఫ్గాన్ మిలిటరీ, పోలీసులు 78,314 మంది, ప్రతిపక్ష సాయుధులు 84,191 మంది చనిపోయారు. యునిసెఫ్ నివేదిక ప్రకారం కనీసం 37 లక్షల చిన్నారులు స్కూళ్లకు దూరమయ్యారు. వీరిలో 60 శాతం బాలికలే ఉన్నారు. 2007లో 33 శాతం పేదరికం 2020 నాటికి 55 శాతానికి పెరిగింది. 2002లో 74 వేల హెక్టార్లలో సాగయిన మాదక ద్రవ్య పంట ఓపియవ్ు, 2019 నాటికి 1,63,000 హెక్టార్లకు పెరిగింది. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ‘యూఎస్ మిషన్ అఫ్గాన్లో విఫలమైంది. మధ్యదక్షిణాసియాలో ప్రాంతీయ భద్రతా పరిష్కార మార్గం ఇప్పుడు చైనా, రష్యా, ఇరాన్, భారత్లపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి చరమగీతం పాడి సహకరించాలి’ అన్నారు. ఈ దిశగా చర్చలు జరపటానికి మన విదేశాంగ ప్రతినిధి వర్గమొకటి కతార్లో తాలిబాన్లను కలుసుకొందని వార్తలొచ్చాయి. రష్యా చొరవతో అస్థానాలో, మాస్కోలో అనేక పర్యాయాలు శాంతిచర్చలు జరిగాయి. భారత్–రష్యా అనేక వేదికలలో కలిసి పని చేయటానికి విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కో వెళ్లారు. తాజాగా ఉత్తర అఫ్గాన్లో తాలిబాన్ల దూకుడుతో అక్కడి ప్రజలు తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్లకు తరలిపోతుండటంతో ఆ దేశాల సుస్థిరత పట్ల రష్యా ఆందోళన చెందుతోంది. ఇది మధ్య ఆసియా దేశాలకు తక్షణ సవాలుగా ఉంది గనుక అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్లను కూడా కలుపుకొని సహకార భద్రతా కూటమిగా ఏర్పడాలని రష్యా భావిస్తోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి చైనాకు వ్యతిరేకంగా పాల్గొంటున్న భారతదేశం అదే సమయంలో పశ్చిమాన పాకిస్తాన్, తాలిబాన్లతో విరోధ బాటన పయనించటం శ్రేయస్కరం కాదనీ, కనుకనే మన విదేశాంగ విధానం ఇటీవల తన వైఖరిని మార్చి పాకిస్తాన్, తాలిబాన్లకు స్నేహహస్తం అందించిందనీ, తాలిబాన్ల ప్రభావం కశ్మీర్పై పడకుండా ఉండటానికే ఇటీవల మన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసిందనీ విశ్లేషకులు అంటున్నారు. బుడ్డిగ జమిందార్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం, కార్యవర్గ సభ్యులు; 9849491969 -
ప్రాంతీయ పార్టీలకు చెదరని ప్రజాదరణ
ఇటీవల మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐదురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలు మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడం లాంటి జిమ్మిక్కులను తిరస్కరించాయి. తమిళనాడులో స్టాలిన్ విజయం, కేరళలో విజయన్ గెలుపు, పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ గెలుపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ గెలుపు దక్షిణాదిలో బీజేపీలాంటి మతపార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ గెలవగలిగింది. ఏడు రాష్ట్రాల్లోనూ గెలుపు కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఒక్క అభివృద్ధి పథకం గురించి మాట్లాడకుండా ప్రైవేటీకరణ పేరుమీద లక్షలాది మందిని రోడ్లమీద నిలబెడుతూ ఏ ఆర్థిక పథకమూ లేకుండా దేశభక్తి, మతం ద్వేష భావాలతో గెలవాలని చూసిన బీజేపీకి ఆయా రాష్ట్రాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం అపూర్వమైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రితో పాటు మంత్రులు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యులు, రాష్ట్ర నాయకత్వమంతా బెంగాల్లో మోహరించినా బెంగాల్ టైగర్ని ఎదుర్కొని నిలువలేకపోయారు. ఇప్పటికీ కార్మికవాడలో ఉన్న తన స్వగృహంలో నివసిస్తున్న మమతా బెనర్జీ నిరాడంబరజీవి. కాళ్ళకు హవాయి చెప్పులతో, అతి మామూలు వస్త్రధారణతో ఉండే ధీరవనిత. దీదీగా బెంగాల్ ప్రజలందరి హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న వనిత. బీజేపీని మట్టికరిపించి మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేతబట్టుకుంటున్న అపర కాళికామాత. కాంగ్రెస్, సీపీఎం లాంటి జాతీయ పార్టీలను తప్ప ప్రాంతీయ పార్టీలను బీజేపీ, జయించలేదని తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపర నిరూపిస్తుంది. రాష్ట్రాన్ని ద్రావిడ శూద్ర నాయకత్వ నేపథ్యంలోంచి పాలించిన కరుణానిధి తనయుడు స్టాలిన్. తండ్రిలాగే ద్రావిడ రాజకీయాలకు నిజ మైన ప్రతినిధి. ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ బ్రాహ్మణ రాజకీయాలకు తెరలేపాలని చూస్తున్న బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకొంది. ద్రావిడ రాజకీయాలను, శూద్ర నాయకత్వాన్ని బలంగా బలీయంగా ముందుకు తీసుకెళ్తున్న స్టాలిన్ ఎత్తుగడల ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అన్నాడీఎంకే జిత్తులూ సాగలేదు. జాతీయ పార్టీలను నలభై ఏళ్లుగా రాష్ట్రంలోకి రానీయని తమిళ ప్రజలు డీఎంకేకు పట్టంగట్టి బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని నొక్కి చెప్పారు. ఇక్కడా, పాండిచ్చేరిలోనూ బీజేపీకి పరాభవమే మిగిలింది. ప్రాంతీయ పార్టీలనే విజయం వరించింది. కేరళ భారతదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం. కమ్యూనిస్టు పార్టీల పాలనను దేశంలోనే మొట్టమొదటగా ఆహ్వానించిన రాష్ట్రం. గత ఏడేళ్ళుగా పినరయి విజయన్ నాయకత్వంలో సంచలనాత్మక ప్రగతిశీల చర్యలను చేపట్టి సుపరిపాలను అందించింది. మత విశ్వాసాలు, దైవ నమ్మకాల విషయంలో సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్న రాష్ట్రం. అలాంటి కేరళలో అడుగుపెట్టాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆశాభంగమే అయింది. మత, దైవ భావనలను ఎన్నిటిని రెచ్చగొట్టినా కేరళ విద్యావిజ్ఞాన సమాజం పైన, బీజేపీ ఏమాత్రం ప్రాభవాన్ని చూపలేక పోయింది. అస్సాంలో ప్రాంతీయ పార్టీ శక్తివంతంగా లేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రియారాహిత్యం వల్ల, బంగ్లా ఆక్రమణల సమస్యలను బీజేపీ రెచ్చగొట్టి తన స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక తెలం గాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ని ఢీ కొనే శక్తి బీజేపీకి లేదని నాగార్జునసాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. అలానే వైఎస్సార్సీపీని ఢీ కొనడం బీజేపీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కాదు. టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు సాధ్యంకాదని తిరుపతి ఎన్నిక రుజువు చేసింది. గత ఏడేళ్లుగా కేసీఆర్ గత రెండేళ్లుగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజోపయోగకర పనులు, మానవీయ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్టీకి స్థానం లేదని నిరూపిస్తున్నాయి. మత తాత్వికత కాకుండా మనిషి తాత్వికతదే గెలుపన్న ఈ సందేశం భారత రాజకీయాలను మానవీయ రాజకీయాల దిక్కు మరల్చడానికి దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 91829 18567 -
దళపతి స్టాలిన్.. వేచి చూస్తున్న ముళ్ల కిరీటం
తమిళనాడులో డీఎంకేకి, దాని అధ్యక్షుడు ఎమ్కే స్టాలిన్కి మే 2వ తేదీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న రోజు కావచ్చు. దాదాపు అయిదు దశాబ్దాలపాటు తనతండ్రి, డీఎంకే పితామహుడు ఎమ్. కరుణానిధి చాటున ఎదుగుతూ.. దళపతిగా మద్దతుదార్లు, కేడర్లు అభిమానంతో పిల్చుకునే స్టాలిన్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను 160 స్థానాలు గెల్చుకున్న డీఎంకే కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుంది. మోదీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టిన స్థితిలోనూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 లోక్సభ స్థానాలకు గాను ఒక్కటి మినహా అన్నింటినీ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే గెల్చుకున్న నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. పైగా గత రెండేళ్లలో క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పులూ లేవు. కేంద్రం నుంచి బీజేపీ రిమోట్ కంట్రోల్కి అనుగుణంగా పనిచేస్తోందని అన్నాడీఎంకే ప్రభుత్వంపై ముద్రపడటంతో తమిళనాడులో అధికార మార్పిడి తప్పదని క్షేత్ర స్థాయి నివేదికలు తేటతెల్లం చేశాయి. జనంలో గూడుకట్టుకున్న ఈ అభిప్రాయాన్ని డీఎంకే మరింత శక్తివంతంగా ముందుకు తీసుకొచ్చి తమిళనాడు వ్యతిరేక విధానాలను కేంద్రం అమలు చేస్తోందని దాడి చేసింది. నీట్, రైతుల ఆందోళన, గెయిల్ హైడ్రో కార్బన్ ప్రాజెక్టు వంటి అంశాల విషయంలోనే కాకుండా జీఎస్టీ సుంకాలపై కేంద్రం వ్యవహారాన్ని కూడా డీఎంకే ఎండగట్టింది. ఈ సమస్యలన్నింటిపై స్టాలిన్ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చారు. శాంతికి కేంద్రమే అసలు విలన్ అని, రాష్ట్రంలో ఈపీఎస్ ప్రభుత్వం కేంద్రం కీలుబొమ్మలా వ్యవహరిస్తూ పాలి స్తోందనే అవగాహనను ప్రజల్లో చొప్పించడంలో స్టాలిన్ విజయవంతమయ్యారు. తమ భాష, సంస్కృతి సుసంపన్నత పట్ల గర్వపడే తమిళ ప్రజలలో ఆత్మాభిమానాన్ని స్టాలిన్ ప్రేరేపించడమే కాకుండా భాషా సమస్యపై కూడా రాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకున్నారు. అదే సమయంలో తన కూటమిలోని మిత్ర పక్షాలను తక్కువ స్థానాల్లో పోటీచేసేందుకు ఒప్పించిన స్టాలిన్ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించారు. స్టాలిన్ అభిమతాన్ని గౌరవించి 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే స్వయంగా 134 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా ప్రభుత్వ స్థాపనకు కావలసిన మ్యాజిక్ సంఖ్యను దాటివేసింది. ఇంతకు మించి సుప్రసిద్ధ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం చేసుకోవాలని స్టాలిన్ తీసుకున్న కీలక నిర్ణయం ఆయనకు ఎంతగానో సహాయపడింది. పదేళ్లుగా అధికారం చలాయించిన అన్నాడీఎంకే ప్రభుత్వం పనితీరుతో విసిగిపోయి మార్పును కోరుకుంటున్న ప్రజారాశుల వద్దకు సరికొత్త ప్రచార శైలితో వచ్చిన డీఎంకే కేడర్ ఎంతో ఉత్సాహంతో తమ అధినాయకుడి తరపున ప్రచార కార్యక్రమాన్ని శక్తివంతంగా సాగించింది. రాజకీయంగా అత్యంత చైతన్యంతో ఉండే తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, నాటి ముఖ్యమంత్రి జె జయలలిత మరణం తర్వాత ఏర్పడిన సంక్షోభ కాలం పొడవునా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించిన స్టాలిన్ ప్రతిఘటనా శక్తిని తమిళ ప్రజలు మర్చిపోలేదు. అయితే ఎన్నికల ద్వారానే అధికారాన్ని గెల్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చిన స్టాలిన్ ఆ తరుణం కోసం వేచి ఉండి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తన శైలితో అధికార పీఠం దక్కించుకున్నారు. ఇప్పుడు స్టాలిన్ కోసం సింహాసనంపై ముళ్లకిరీటం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న కోవిడ్–19 మహమ్మారిని అరికట్టడమే తన ముందున్న సవాళ్లలో ప్రధానమైనది. పదవీబాధ్యతలు స్వీకరించక ముందే రాజకీయ పరిణతిని ప్రదర్శించి పాలనలో కొత్తదనం కోరుకుంటున్న స్టాలిన్.. కొత్త ప్రభుత్వానికి తన అనుభవాన్ని పంచిపెట్టడమే కాకుండా తగిన సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అభ్యర్థించారు. పైగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజల ముంగిటకే తీసుకుపోతానని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించేశారు. అన్నాడీఎంకే ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి కోవిడ్–19ని సమర్థంగా ఎదుర్కొన్నారు. పైగా సుపరిపాలన అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు కూడా. అయితే తన ప్రభుత్వం కేంద్రలోని బీజేపీ ప్రభుత్వానికి దాసోహమైపోయిందన్న వ్యతిరేక ప్రచారం ముందు ఆయన తన ప్రాముఖ్యతను కోల్పోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో స్టాలిన్ ఎలా వ్యవహరించనున్నారు అనేది ఆయనకు విషమ పరీక్షే. కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేసిన స్టాలిన్ ఇకపై ఏం చేయబోతారని ప్రజారాశులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వంతో కార్యాచరణ సంబంధాన్ని స్టాలిన్ ఎలా నిర్మించుకుంటారో చూస్తానని అన్నాడీఎంకే ఎదురు చూస్తోంది. రాష్ట్రం ఇప్పటికీ రెండు గుర్రాల పరుగుపందేన్ని కొనసాగించనుందని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. చిరకాలంగా తిష్ట వేసి కూచున్న ద్రవిడియన్ పార్టీలకు ముగింపు పలికి కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తామంటూ పలువురు చేసిన సుదీర్ఘ ప్రసంగాలు గాల్లో కలిసిపోయాయి. సూపర్ స్టార్ కమల్ హసన్ స్థాపించిన మక్కల్ నీతి మయ్యమ్ ఊసులోకూడా లేకుండా పోయింది. మరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించినవాడై సకాలంలో ఎన్నికల రణరంగనుంచి తప్పుకున్నారు. రాజకీయరంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చిన రజనీ చివరికి అనారోగ్య కారణాలను సాకుగా చూపి రాజకీయ రంగం నుంచే తప్పుకోవడం మరీ విశేషం. లక్ష్మణ వెంకట కూచి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు -
నిండు ప్రాణాన్ని నిలువునా మింగిన అవ్యవస్థ..!!
ప్రపంచం నలుమూలల్లోని కథనాలను ప్రజలకు చేరవేసే జర్నలిస్టు.. తాను స్వయంగా ఓ కథనానికి వస్తువైతే ఎలా ఉంటుంది? పదిహేను నెలలుగా కరోనా భూతం కథలను చెబుతూ వచ్చిన నేను ఇప్పుడు ఆ భూతం బాధితురాలిగా మిగిలిపోయా. మా నాన్న ‘స్పీడీ దత్’ను కరోనా కాటేసింది. నా ప్రపంచం కుప్పకూలినంత వేదన అనుభవించా. కోపం... ఆందోళన.. ఒంటరితనం అన్నీ ఒక్కసారి నన్ను చుట్టుముట్టాయి. కరోనా కాలంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాల కథలే కదా నేను బోలెడన్ని చెప్పింది? అనిపించింది. ఎయిరిండియా మాజీ అధికారి అయిన మా నాన్న వాస్తవానికి ఓ సృజనశీలి. యంత్రాలను ముక్కలు ముక్కలు చేసి వాటిని మళ్లీ జోడించడంలో ఆనందాన్ని అనుభవించేవాడు. మిలమిల మెరిసే కళ్లు... రేపటిపట్ల నిరంతరం ఆశలు కలిగిన, శాస్త్రీయ దృక్పథం ఉన్న వ్యక్తి. మా నుంచి ఏమీ ఆశించని స్త్రీవాద తండ్రి కూడా. సోదరితోపాటు నాకూ నిర్భయంగా ఎక్కడికైనా ఎగిరిపోగల స్వేచ్ఛనిచ్చారు. మా భావోద్వేగాలను కానీ.. సమయాన్ని కానీ ఆశించకుండా.. బుల్లి విమానాలు, రైళ్లను సిద్ధం చేస్తూ గంటల సమయం గడిపేవారు. తన తరువాత ఆ బొమ్మలన్నింటినీ పిల్లల అనాధాశ్రమానికి ఇచ్చేయాలని మాట కూడా తీసుకున్నారు. కోవిడ్ లాంటి విషాదం... మన బంధుమిత్రుల ఆప్యాయతలను, కాలాన్ని మన నుంచి దూరం చేస్తుంది. మన మెదడు, గుండెల్లో వారి జ్ఞాపకాలు తొలుస్తూంటే.. తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పుల బేరీజు మనలను వెంటాడుతూనే ఉంటాయి. నాన్న చనిపోయి ఐదు రోజులవుతోంది. బుల్లి విమానాలు, రైళ్లు తయారు చేసేందుకు నాన్న సిద్ధం చేసుకున్న యూట్యూబ్ చానల్ ఓపెన్ చేస్తే చాలు... కళ్లల్లోని నీరు అప్రయత్నంగా కిందకు ఒలికిపోతున్నాయి. నాన్నకు మాటిచ్చి బతికుండగా నెరవేర్చేలేకపోయిన పనుల జ్ఞాపకాలు వెంటాడటం మొదలవుతుంది. (హిందుస్థాన్ టైమ్స్లో తాను రాసిన కథనాన్ని చూసుకోవాలన్నది వాటిల్లో ఒకటి). కోవిడ్ చుట్టుముట్టినప్పుడు చాలామంది వృద్ధుల మాదిరిగానే ఆయన కూడా ఆసుపత్రిలో చేరేందుకు అంతగా ఇష్టపడలేదు. చివరిరోజుల్లో తన వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని భయపడ్డారేమో. వ్యాధి సోకిన తొలినాళ్లలో వైద్యులు మధ్యమస్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయని, ఆక్సిజన్ మోతాదులుగా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఇంట్లోనే చికిత్స కల్పించేందుకూ అంగీకరించారు. మెదాంతా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూం డేది. కానీ.. విపత్తు అంతా అకస్మాత్తుగా ముంచుకొచ్చింది. అనూహ్యంగా జ్వరం రావడం.. ఆక్సిజన్ మోతాదులు పడిపోవడం చకచక జరిగిపోయాయి. మెదాంతా ఆసుపత్రి అంబులెన్స్ కోసం వేచి చూస్తే సమయం వృథా అవుతుందేమో అన్న అందోళనలో అప్పటికప్పుడు ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. తీరా చూస్తే అది అధ్వానస్థితిలో ఉన్న ఓ మారుతీ వ్యాన్గా తేలింది. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయని, ఆక్సిజన్ సిలిండర్ కూడా పనిచేస్తోందని నమ్మబలకడంతో నేను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నా. నాన్న అతడి సేవకుడు వెనుకన ఎక్కారు. ట్రాఫిక్ను దాటుకుని ఆసుపత్రి చేరేందుకు గంటకుపైగా సమయం పట్టింది. అంతసేపూ నాన్న అసౌకర్యంగానే వ్యాన్లోని టేబుల్పై పడుకుని ఉన్నారు. అంబులెన్స్లు సాఫీగా ప్రయాణిం చేందుకు గ్రీన్కారిడార్ ఒకటి ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులను ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా.. కర్ఫ్యూ అమలు కోసం రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యనే మా ప్రయాణం సాగింది. శ్మశానంలో గందరగోళం... నాన్నను మెదాంతా ఆసుపత్రికి చేర్చే సమయానికి ఆక్సిజన్ మోతాదులు గణనీయంగా పడిపోయాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చాలని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ ముసుగేసుకున్న ఆ డొక్కు వాహనంలోని సిలిండర్ పనిచేయలేదని, నాన్నకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మాస్కు కూడా సరైంది కాదని అర్థమైంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం తమ శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. వారికి నా కృతజ్ఞత మాటల్లో చెప్పలేను. కానీ.. నాన్న కొన్ని రోజుల కంటే ఎక్కువ సమయం బతకలేకపోయారు. రెండు రోజులపాటు వెంటిలేటర్పై గడిపి వెళ్లిపోయారు. ఆసుపత్రికి దగ్గరలోనే ఉండే శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లాం. పలుమార్లు వార్తా కథనాల్లో వివరించినట్టుగానే.. అక్కడ కాసింత స్థలం కూడా కరవై ఉంది. కనీసం మూడు కుటుంబాల వారికి ఒకే టోకెన్ నెంబర్ ఒకే సమయానికి ఇవ్వడంతో ఒకపక్క గందరగోళం నడుస్తోంది. కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలై అది కాస్తా గొడవకు దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు చెల్లి పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చింది. జర్నలిస్టుగా ఈ రకమైన సమస్యలపై.. తరచూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి ఉంటాను నేను. కానీ.. ఆ ప్రశ్నలన్నీ ఆ సమయంలో నన్నే వెంటాడాయి. ప్రభుత్వం టీకా కార్యక్రమం మరింత ముందుగా మొదలుపెట్టి ఉంటే... మా నాన్న బతికి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉండేదేమో అనిపించింది. ఇంకో రెండు వారాల్లో రెండో డోసు తీసుకోవాల్సి ఉండగా నాన్న మరణించారు. డొక్కు మారుతీవ్యాన్ కోసం కాకుండా మరికొంత సమయం వేచి ఉండి మెదాంతా అంబులెన్స్లోనే నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదా? నాన్న ఇప్పటికీ బతికి ఉండేవాడా? అయితే ఒక్క విషయం ఇంతటి కష్టంలోనూ ఒక జర్నలిస్టుగా నాకు లభించే ‘ప్రత్యేక’ సౌకర్యాల గురించి నాకు గుర్తుంది. వీట న్నింటి కారణంగా నాన్నకు కనీసం బతికేందుకు ఒక మంచి అవకాశమైనా లభించింది. ఆసుపత్రి గేట్ల వద్ద కుప్పకూలుతున్న వారు.. బెడ్లు, ఆక్సిజన్ దొరక్కుండా కన్ను మూస్తున్న వారెందరో! నాన్న మరణంతో అనాథను అయిపోయినా భారత ప్రభుత్వం కారణంగా అనాథలుగా మారిన వారికంటే నేను అదృష్టవంతురాలిననే అనుకుంటున్నా!! బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (హిందూస్థాన్ టైమ్స్ సౌజన్యంతో..) -
అభ్యర్థులు దొరకక... బరిలో నిలవలేక...
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట ములు సహజం. ప్రజల తీర్పును ఎవరైనా హుందాగా స్వీకరించా ల్సిందే. 40 యేళ్ల రాజకీయ అను భవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆ మాటను పదేపదే చెప్పుకొంటారే తప్ప, ఆ రాజకీయ పరిపక్వతను చేతల్లో చూపరు. 2014 ఎన్నికలలో కేవలం 5 లక్షల ఓట్ల వ్యత్యాసంతో విజయం చేజారినా ఆనాడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెంటనే ప్రజాతీర్పును శిరసావహిస్తామనీ, ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామనీ వినమ్రంగా తెలిపారు. కానీ చంద్రబాబు 2019 ఎన్నికలలో కేవలం 23 సీట్లకు పరిమితమైతే ‘మరీ ఇన్ని తక్కువ సీట్లా’ అంటూ ఆశ్చర్యం ప్రదర్శించారే తప్ప, ప్రజాతీర్పును గౌరవించ లేకపోయారు. ఆ ధోరణి ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపారు. పంచాయితీ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాచి పనులు చేసు కోవడానికి ఇతర రాష్ట్రాలకు పోతున్నారంటూ సామాన్య ప్రజలను చులకన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పట్ల విసుగెత్తిపోయి దూరం జరిగారని అందదరికీ అర్థం అయిందిగానీ, తనకు అర్థం కానట్లు ఆయన నటిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభించిన చారిత్రక విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉక్రోషంతో, ఉడుకుమోతుతనంతో మాట్లాడుతున్న మాటలు ఆయన అపసవ్య మానసిక స్థితికి, దెబ్బతిన్న మానసిక స్థయిర్యానికి ప్రతీక. అధికార పార్టీ చేసే ప్రతి పనిని తప్పుపట్టాలని, వాటిని భూతద్దంతో సొంత మీడియాలో చూపించి ప్రజల సానుభూతి పొందాలని భావిస్తున్నారే తప్ప వేసిన తప్పటడుగుల్ని సరిచేసుకోవాలనే ఉద్దేశం ఎక్కడా కనబడదు. చంద్రబాబు 2014–19 మధ్య అధికారంలో ఉండగా చేసిన తప్పులు సామాన్యమైనవి కావు. తెలంగాణలో అధి కారంలో ఉన్న టీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ‘ఓటుకు కోట్లు’ వంటి అనైతిక చర్యకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలన్న దుర్బుద్ధితో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఆయన పరిభాషలోనే చెప్పాలంటే సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. అంతకుముందే ప్రతిపక్షనేత జగన్పై కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయించారు. ప్రజ లందర్నీ సమానంగా చూడకుండా ఒక వర్గానికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించడానికి అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రజల్లో తన విశ్వసనీయతను తనే దెబ్బ తీసుకొన్నారు. స్థానిక సంస్థలకు 2018లోనే ఎన్నికలు జరగాలి. కానీ, ఆనాడు తన పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి ఎన్నికలను జరపలేదు. అందుకు వంతపాడి నట్లుగా బాబు సొంతమనిషి రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా మారు మాట్లాడలేదు. నిజానికి, దేశంలోని ఐదంచెల స్థానిక సంస్థలకు నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు జరిగి స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలన్న ఉద్దేశంతో 1992లో భారత పార్లమెంట్ 73, 74 రాజ్యాంగ సవరణలు తెచ్చింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏర్పా టయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1992 తర్వాత రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిర్ణీత గడువులో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం, ఏడాదిలోగా తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామకం సజావుగా సాగింది. కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేసింది. ఏడాదిన్నర తర్వాత జనవరి 30, 2016న రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవస్థ ఏర్పాటైంది. అయితే, ఎన్నికల కమిషనర్ను మాత్రం నియమించలేదు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31, 2016న పదవీ విరమణ చేశారు. 24 గంటలు తిరగకముందే ఆయన్ని చంద్రబాబు కుర్చీలో కూర్బోబెట్టారు. తన సొంత మనిషిని నియమించడం కోసమే అంతకాలం వేచి చూశారన్నది స్పష్టం. స్థానిక సంస్థలకు గడువు పూర్తయినా ఎన్నికల కమిషనర్ నోరు విప్పలేదంటే అప్పటి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసినట్లు తేటతెల్లం అవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ అధికారంలో ఉన్నంతవరకూ ఆయనను కవచంగా పెట్టుకొని చంద్ర బాబు ప్రభుత్వంపై అధర్మ యుద్ధానికి దిగిన వైనం దేశమంతా చూసింది. మార్చి 15, 2020న రాష్ట్ర ప్రభుత్వంతోగానీ, ఏ రాజకీయ పార్టీతోగానీ సంప్రదించకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు ఎన్నికల కమిషనర్. ఎంపీటీసీ స్థానాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం కావడం చంద్రబాబు సహించలేక పోయారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు నిమ్మగడ్డ ఏకగ్రీవాలు జరగడంపై అనుమానాలు ఉన్నాయంటూ, ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో రూపొందిన వాస్తవం సీఐడీ దర్యాప్తులో బయటపడింది. ఎంపీటీసీ ఏకగ్రీవాలు బల వంతంగా జరిగివుంటే నిమ్మగడ్డ వెంటనే స్పందించి ఉండే వారు. కానీ తెలుగుదేశం అధినేత ఒత్తిడిపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారని స్పష్టంగా బయటపడింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నిక లను నిర్వహించారు. మార్చి 31, 2021న పదవీ విరమణ చేసేముందు తగిన సమయం ఉన్నప్పటికీ తెలుగుదేశానికి మేలు చేయాలన్న దురుద్దేశం నిమ్మగడ్డలో స్పష్టంగా కని పించింది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పాల్గొ నకుండా వాటిని బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం చేసిన ప్రకటన ఎవర్నీ ఆశ్చర్యపర్చలేదు. కనీసం అభ్యర్థులను నిలబెట్టలేక కొత్త డ్రామాకు తెర తీసింది. నిమ్మగడ్డ కమి షనర్గా ఉండగా తీసుకున్న నిర్ణయాలను సమర్థించిన తెలుగుదేశం నూతన కమిషనర్ నిర్ణయాలను తప్పు పట్టడం ద్వంద్వ నీతి. తమ తప్పులను కప్పిపుచ్చుకొని, తమ వైఫ ల్యాలకు కారణం ప్రజలేనని నిందించిన వారు చరిత్ర హీను లుగా మిగిలిపోయారు. ఇందుకు ఏ ఒక్కరూ అతీతం కాదని ప్రతిపక్షనేత గ్రహిస్తే మంచిది. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడాలంటే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు ఏమాత్రం పెంచలేదు. పైపెచ్చు ప్రధానమంత్రి కిసాన్ యోజనకు గతంలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.65 వేల కోట్లు కేటాయించారు. రైతు వ్యవసాయ సంక్షేమంలోనూ నిధులు తగ్గించారు. అనేక పబ్లిక్ రంగ పరిశ్రమల నుండి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబ డులు పెట్టడానికి కార్పొరేట్ కంపెనీలకు, మల్టీ నేషనల్ కంపె నీలకు అవకాశం కల్పించారు. కరోనా సమయంలోనే 100 కార్పొరేట్ కంపెనీల ఆదాయం రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వాస్తవంగా మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలి? ప్రధాన సమస్యలను అసలు పట్టించుకుం టున్నారా? ఈ రోజు ఢిల్లీ లాంటి అనేక నగరాల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతున్నది. దీనివల్ల అనేక శ్వాస సంబంధమైన రోగాలు వస్తున్నాయి. వాతావరణం వేడెక్కడం వల్ల అనేక పక్షులు, జంతువులు మనలేకపోతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి పోయాయి. భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను కాపాడాలంటే మొదట చేయాల్సింది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. చట్టాలు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కానీ ప్రభు త్వాలకు చిత్తశుద్ధి లేకపోతే ఎవరూ ఏమి చేయలేరు. కాలుష్య నివారణ చట్టాలను గట్టిగా అమలు చేయడం వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఇబ్బంది కలుగుతుంది. కొంత ఆర్థికభారం వారిపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్ నుండి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి ఎక్కువశాతం ఉపయోగించాలి. కార్పొరేట్ కంపెనీల కాళ్ళకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసే ప్రభుత్వం ఉన్నప్పుడు కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు ఎవరి ప్రయోజనాల కోసం? నేడు హైబ్రిడ్ విత్తనాలు వచ్చి ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి ఆహారధాన్యాలు విషతుల్యం అవుతు న్నాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలను, కూరగాయలను, పండ్లను అందించాలంటే ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. పశువులకు అధిక పాల కొరకు ఇచ్చే ఇంజెక్షన్లను రద్దు చేయాలి. ఆహారధాన్యాలను, కూరగాయలను, పండ్లను, కొబ్బరి నీళ్లను విషతుల్యం చేసే అన్ని రకాల మందులను, ఇంజెక్షన్లను నిషే ధించాలి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పంటలను ప్రోత్స హించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తే వారు ప్రజల ఆరోగ్యం కోసం పంటలు ఉత్పత్తి చేయరు. లాభాల దిశగా వ్యవసాయ రంగాన్ని మరల్చుతారు. రైతులతో ఒప్పందాలు చేసుకొని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేస్తారు. రైతుల పంటలను కొనుగోలు చేస్తారు. కనీస మద్దతు ధర ఇస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తామని చెప్పడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కనీస మద్దతు ధర ఉండే పరిస్థితి పోతుంది. కొంతకాలానికి అధిక లాభాల కోసం ఎరువులు, విత్తనాల ధరలు పెంచి మరోవైపు పంటల ధరలను తగ్గిస్తారు. క్రమంగా రైతు అప్పుల్లో మునిగిపోతాడు. ఇప్పుడు కేంద్రం చేసిన చట్టాల ప్రకారం రైతుకు కోర్టుకు వెళ్లే అధికారం కూడా లేదు. చివరకు రైతు భూముల్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కంపెనీలు రైతుల భూముల్ని కొని పెద్దపెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా చేస్తారు. దీనివల్ల రైతులు కూలీలుగా మారుతారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారధాన్యాల గురించి గానీ, కల్తీలేని పాల గురించి గానీ ఎవరూ ఆలోచించరు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా మొదట జరిగేది కార్మికుల తొలగింపు. నిర్వహణ ఖర్చుల తగ్గింపు పేరుతో నలుగురు పనిచేస్తున్న చోట ఇద్దరితోనే సరిపోతుందనే నెపంతో అనేక మంది ఉద్యోగం కోల్పోతారు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యకు ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. నిరుద్యోగులు పెరిగితే, రైతులకు కనీస మద్దతు ధర దొరక్కపోతే ఏమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం మార్కెట్ మీద పడి రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజలు కనీస అవసరాలు తీరడానికి ఇబ్బంది పడతారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అందుకే ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు వేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆశిద్దాం. విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తీయడం వల్ల క్రమంగా మన ఆర్థిక వ్యవస్థ వారి గుప్పిట్లోకి పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ విదేశీయుల చేతిలోకి వెళ్తే వారి రాజకీయ జోక్యం పెరుగుతుంది. చివరకు మనం స్వతంత్రం కోల్పోయే ప్రమాదం కూడా రావచ్చు. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 94940 12734 -
మైనర్ బాలికలకు రక్షణనివ్వని ‘పోక్సో’
దేశంలో 18 ఏళ్ళ లోపు బాలికల సంరక్షణ కోసం 2012లో పోక్సో ప్రత్యేక చట్టం ఏర్పడింది. ఇండియన్ పీనల్ కోడ్లోని శిక్షలు సరిపోనందు వల్ల ప్రభుత్వం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫె న్సెస్ యాక్ట్ రూపొందిం చింది. కేసు తీవ్రతను బట్టి నేరస్తుడికి జీవిత ఖైదు, మరణశిక్ష కూడా విధించ వచ్చు. అయితే పోక్సో ప్రకారం శిక్ష పడ్డవారు పై కోర్టుకు వెళ్లగా వారి నేరాలను ఐపీసీ కింద జమకట్టి శిక్షలను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. జనవరిలో బొంబాయి హైకోర్టులోని నాగపూర్ బెంచి అడిషనల్ జడ్జి పుష్ప వీరేంద్ర గణేదివాలా పోక్సో చట్టం ప్రకారం శిక్షించిన కేసుల్లో సరైన ఆధారాలు లేవని, అవి ఐపీసీ కిందికి వస్తాయని శిక్షలు తగ్గిస్తూ తీర్పిచ్చారు. లోపలికి వస్తే జామపండు ఇస్తా నని పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి తీసు కెళ్ళి ఆమె ఛాతీపై నొక్కడంతో బాలిక భయపడి అరవ డంతో దొరికిపోయాడు. ఆయనకు పోక్సో చట్టంలో కనిష్టమైన 3 ఏళ్ల శిక్ష పడింది. పై కోర్టుకు అప్పీలుతో అదే కేసు జడ్జి పుష్ప ముందుకు వచ్చింది. చర్మానికి చర్మం తాకితేనే, అంటే రెండు శరీరాల పరస్పర స్పర్శ అయినట్లు రుజువైతేనే అది పోక్సో చట్టం,సెక్షన్ 7 కింద నేరమవుతుందని, అలాంటిదేదీ లేనందువల్ల ఈ నేరం ఐపీసీ సెక్షన్ 354 కిందికి వస్తుందని చెప్పి శిక్షను ఏడాదికి మార్చారు. యాభై ఏళ్ల మగమనిషి అయిదేళ్ల బాలిక చేయిని గట్టిగా అదిమి పట్టుకొని మరో చేత్తో ప్యాంట్ జిప్ తెరిచాడు. బాలిక అరవడంతో ఆమె తల్లి వచ్చి బాలి కను విడిపించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు విచారణలో అతడు మర్మాంగాన్ని బయటికి తీసింది తాను చూశానని తల్లి వివరించింది. సెషన్సు కోర్టు ఈ కేసును పోక్సో సెక్షన్ 10కి చెందిన నేరంగా స్వీకరించి ముద్దాయికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25,000 జరిమానా లేదా మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అప్పీలుపై తన దగ్గరికి వచ్చిన ఈ కేసును జడ్జి పుష్ప విచారించారు. బాలికపై లైంగిక దాడి అంటే స్త్రీ పురుషుల మర్మాంగాలు ఒకటికొకటి తాకినట్లు రుజువులుండాలని, ఈ నేరానికి పోక్సో చట్టం 8, 10, 12 సెక్షన్లు వర్తించవని శిక్షను మూడేళ్లకు పరిమితం చేశారు. అయితే జడ్జి పుష్ప తీర్పుల పట్ల ప్రజల నిరసనను పరిశీలించిన సుప్రీంకోర్టు జనవరి 27న వీటిపై స్టే ఇచ్చింది. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సైతం ఈ తీర్పులు రాబోయే కాలంలో ప్రమాదకరంగా మారు తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అడిషనల్ హోదాలో ఉన్న జడ్జి పుష్పను అదే పదవిలో శాశ్వతంగా నియమించాలని జనవరి 20న సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని 27న వాపసు తీసుకుంది. ఆమెపై ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదని, ఆమె న్యాయవాదిగా ఇలాంటి కేసులతో వ్యవహరించి ఉండకపోవచ్చునని, మరింత శిక్షణ, అవగాహన అవసరమున్నందువల్ల ఇలా చేయవలసి వచ్చిందని సుప్రీం వివరణ ఇచ్చింది. అయితే జడ్జి పుష్ప గణేదివాలా విద్యాధికురాలు. చదువులో గోల్డ్ మెడలిస్ట్. న్యాయశాస్త్ర బోధకురాలు. ప్రాక్టీసులో ఉన్నప్పుడు పలు బ్యాంకులకు ప్యానెల్ అడ్వొకేట్గా ఉన్నారు. 2007 నుండి జడ్జిగా ఉంటూ పలు కీలక తీర్పులిచ్చారు. ఖైదీలకు పెరోల్ మంజూరు వారికున్న పరిమిత హక్కు అని, అది అధికారుల నిర్ణయంపై ఆధారపడే విషయం కాదని 2019లో తీర్పి చ్చారు. కరోనా సోకిన గర్భిణిని డెలివరీకి హాస్పిటల్లో చేర్చుకోని విషయం తెలుసుకొని ఆమెకు వైద్య సదు పాయాలు అందించమని ఆదేశించారు. ముంబై ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఎన్నో పెండింగు కేసులను పరి ష్కరించారు. ఈ నేపథ్యం గల న్యాయమూర్తి ఇలాంటి తీర్పులివ్వడానికి కారణం పోక్సో చట్టంలోని లొసుగు లేననే వాదన ఒకటుంది. ఆ చట్టంలో అత్యా చారానికి శిక్ష ఉంది గానీ, ప్రయత్నానికి ఎలాంటి వివరణ లేదని అంటున్నారు. అందువల్ల వీటిని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించే అవకాశం కూడా ఉంది. పోక్సో చట్టానికి తూట్లు పొడిచే విధంగా మరిన్ని తీర్పులు రాకముందే పకడ్బందీ సవరణలు చేయాలి. బి. నర్సన్ వ్యాసకర్త కవి, రచయిత ‘ 94401 28169 -
తెలిసే వచ్చిన జలవిలయం ఇది
జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈ రోజు రేని గ్రామస్తుల భయాందోళనలు కూడా భూతా పం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వం సక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. 2019లో కోర్టుముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతి రేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. అయితే ఇప్పుడు ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలిలోని రేని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు 2019లో ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. 2005లో తమ గ్రామానికి సమీపంలో నెలకొల్పిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్ట్ నిర్వాహకులు పర్యావరణ హితం కాని పద్ధతులు పాటిస్తున్నారని, దీనివల్ల రిషి గంగానదికి, ఆ ప్రాంతంలోని జంతుజాలానికి, రేని గ్రామ వాసుల నివసించే హక్కుకు, వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. 1970లలో జరిగిన చారిత్రాత్మక చిప్కో ఉద్యమ కీలక ప్రాంతాల్లో రేని ఒకటి. ఉత్తరాఖండ్ హైకోర్టు వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేయడమే కాకుండా పిటిషన్ దాఖలైన మూడు వారాల్లోపు సమాధానం పంపాలని కోరింది. సిగరెట్ తాగడం, ఊపిరి తిత్తుల కేన్సర్ హెచ్చరిక రెండింటికీ మధ్య సాధారణ లింక్ ఏమిటనేది వాటి ప్రభావానికి గురయ్యేంతవరకు మనకు స్పష్టంగా కనిపించదు, బోధపడదు కూడా. అదేవిధంగా జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈరోజు, రేని గ్రామస్తుల భయాందోళనలు.. భూతాపం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వంసక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. ఫిబ్రవరి 7 ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అతి విధ్వంసకరమైన వరద ప్రవాహం పొంగి పొర్లింది. అతి ఇరుకుగా ఉన్న నదీ లోయల గుండా భీకరంగా తన్నుకొచ్చిన భారీ జలప్రవాహాన్ని చిత్రీకరించిన కెమెరా షాట్లు దాని విధ్వంసకర నమూనాను మిగిల్చిపోయాయి. 2013లో రుద్రప్రయాగ్ ప్రాంతంలోని కేదార్నాథ్ను చుట్టుముట్టిన మెరుపు వరదలు కలిగించిన విధ్వంసం తర్వాత తొమ్మిదేళ్లకు చమోలీలో జలవిలయం సంభవించింది. నిపుణులు, అధికారులు ఆనాటి విపత్తుకు కారణాలను కాస్త ఊహించగలిగారు. ఇప్పుడు చమోలీలో జరిగిన ఘటన కూడా కేదార్నాథ్ ఘటనకు కొనసాగింపుగానే ఉంటుందని ప్రత్యేకించి ప్రాణనష్టం, మానవుల బాధలు, నివాసాల విధ్వంసం, ఆర్థిక దుష్పరిణామాలు వంటివి ఈ రెండు ఘటనల్లో సమానంగా వర్తిస్తాయని ముందస్తు వార్తలు చెబుతున్నాయి. పశ్చిమ హిమాలయాల్లో అవక్షేపన మార్పు 2013లో వచ్చిన మెరుపు వరదలకు, రోజులపాటు కురిసిన కుండపోత వర్షం, హిమనీనదం వల్ల ఏర్పడిన డ్యామ్ తెగిపోవడమే కారణమైంది. ఆ ఉత్పాతంలో 5 వేలకు పైగా జనం కొట్టుకుపోయారు. ఈ ప్రాంతంలో ఇలాంటి విషాదాలు సంభవిస్తాయని అద్భుతమైన ప్రదర్శనలతో పరిశోధకులు ముందస్తుగానే హెచ్చ రించారు కూడా. అయితే కుంభవృష్టి కారణంగా చమోలీ ఘటన జరగనప్పటికీ అది కూడా చివరకు మెరుపు వరద కారణంగానే సంభవించింది. నందాదేవి వద్ద మంచు కొండ చరియలు జోషిమట్ వద్ద అకాలంలో విరిగిపడటంతో ఆ వరద పొంగు మొత్తంగా రిషి గంగానదిలోగి కొట్టుకొచ్చింది. దీంతో రిషి గంగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోయింది. ఈసారి చమోలీలో జరిగిన విషాదానికి రిషి గంగా నది పొడువునా నిర్మించిన వివిధ స్థాయిల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులే కారణమయ్యాయి. అలకనందా ఎగువన నిర్మించిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్టు (13.2 మెగావాట్లు) ఈ హిమపాతం తాకిడికి మొట్టమొదటగా గురయింది. వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్లాంట్కి చెందిన శిథిలాలు కిందికి వచ్చేసి ఇతర యూనిట్లను దెబ్బతీశాయి. అక్కడ పనిచేస్తున్న వారి ప్రాణాలను హరించాయి. ఇవి కాకుండా ప్రభుత్వ నిర్వహణలోని తపోవన్ (520 మెగావాట్లు), పిపాల్ కోటి (4ణ111 మెగావాట్లు) ప్రాజెక్టులు, ప్రైవేట్ సంస్థ విష్ణుప్రయాగ్ (400 మెగావాట్లు) ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉన్నాయి. 2019లో కోర్టు ముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతిరేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. తక్కువ కర్బన ఇంధనానికి వనరుగా మాత్రమే ఈ ప్రాంతాన్ని కేంద్రం పరిగణించింది. అయితే ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. చమోలీ వరద అనేది శీతాకాలం చివరలో ఆకస్మికంగా సంభవించిన హిమనీనదం విరిగి పడి కిందకు ప్రవహించిన దాని ఫలితం. చదవండి: (ఉత్తరాఖండ్లో జల విలయం) 2018లోనే బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ సంస్థ ఈ ప్రాంతం పరిస్థితిపై ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎవరూ తోసిపుచ్చలేరు. ఆ నివేదిక ప్రకారం 1991 నుంచి వాయవ్య హిమాలయాల్లోని సగటు ఉష్ణోగ్రత 0.66 సెల్సియస్ డిగ్రీలకు పెరుగుతూ వచ్చింది. ఇది అంతర్జాతీయ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. చంఢీగర్లోని స్నో అండ్ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్మెంట్కి చెందిన శాస్త్రజ్ఞులు చెప్పిన దానిప్రకారం గత 25 సంవత్సరాల్లో వాయవ్య హిమాలయాల్లో శీతకాలాలు మరింతగా వెచ్చబడుతూ వచ్చాయని తెలుస్తోంది. సహస్రాబ్దాల పాటు అతిశీతల చలికాలాలకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా దాని వ్యతి రేక దిశను ప్రదర్శించడం ప్రారంభించేసింది. విపత్తునుంచి పుట్టుకొచ్చే మరో సమస్య ఏదంటే మన మేనేజ్మెంట్ వ్యూహాలు ఎంత సమర్థంగా ఉంటాయన్నదే. 2013లో సంభవించిన కేదార్నాథ్ విపత్తు... రాడార్ ఆధారిత టెక్నాలజీలతో సహా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పర్చుకోవడానికి మేలుకొలుపు అయింది. రిషి గంగా నీటి స్థాయిలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి రాడార్ ఆధారిత పరికరాన్ని కేంద్ర జల కమిషన్ ఉపయోగించిందని, కేంద్రం కూడా సహకరించిందని తెలుస్తోంది. అయితే స్థానిక అధికారులు ఈ ఉపకరణాన్ని స్థానిక కార్యకలాపాలకు ఏమేరకు ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం కాలేదు. ఏదేమైనా మన కళ్లముందు వాస్తవ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాత కామిక్లో కొన్ని పదాలు గుర్తుకొస్తున్నాయి. మనం శత్రువును చూశాం... అదెవరో కాదు మనమే! సీపీ రాజేంద్రన్ వ్యాసకర్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ -
విశాఖ స్టీల్ప్లాంట్ను రక్షించుకుందాం
జనవరి 26న దేశరాజధానిలో జరిగిన ‘రైతు ర్యాలీ’పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుండగా కేంద్ర క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్పై పిడుగుపాటు తీర్మానాన్ని ఆమోదిం చింది. విశాఖ స్టీల్ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకం పేరుతో నూరు శాతం అమ్మకానికి పెట్టింది. దేశంలోనే అత్యంత ప్రతి ష్టాత్మకంగా పనిచేస్తున్న విశాఖ స్టీల్ను విదేశీ, స్వదేశీ ప్రైవేట్ కంపెనీలకు అమ్మ డంవల్ల భారతదేశం స్వయం సమృద్ధి ఎలా సాధిస్తుందో భారత ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీజేపీకి వుంది. కేంద్ర ప్రభుత్వ మాజీ క్యాబినెట్ మంత్రి, నేడు బీజేపీ ప్రతినిధిగా వున్న సుజనా చౌదరి విశాఖ స్టీల్ప్లాంట్ వ్యూహాత్మక అమ్మకం వల్ల యాజమాన్యం మాత్రమే మారుతుందని, సకాలంలో సిక్ కాకుండా కాపాడవచ్చని వాదిస్తున్నారు. వీరి వాదన నేతి బీరకాయలో నెయ్యి చందగా వుంది. 3 లక్షల కోట్ల విలువగల విశాఖ స్టీల్ ప్రజా సంపదను కార్పొరేట్లకు తరలించడాన్ని మసిపూసి మారేడుకాయ చేశారు. రెండు లక్షల కోట్ల విలువగల్గిన విశాఖ స్టీల్ భూములను కేవలం మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలకు తమ అనుయాయులకు కట్టబెట్టాలనే బీజేపీ కుట్రను దాస్తున్నారు. గతంలో మందుల పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐడీపీఎల్ను మూసివేసి పోటీలేకుండా చేయడంతో నేడు ప్రైవేట్ మందుల కంపెనీలు అనేక రెట్లకు మందుల ధరలు పెంచి ప్రజల మూల్గులు పీల్చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మార్కెట్లో పోటీ పడకుండా చేయడమే నేడు బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి. విశాఖ స్టీల్కు నష్టాలు వస్తున్నాయనీ, సమర్ధవంతంగా పనిచేయడం లేదనీ, అమ్మేయడానికి ఇదే మంచి సమయమని బీజేపీ నాయకులు చేసే ప్రచారం పచ్చి అబద్ధం. విశాఖ స్టీల్ప్లాంట్కు ప్రారంభంలో 1.2 మిలి యన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికిగాను రూ. 5వేల కోట్లలోపు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. కానీ దేశంలో ఇతర భిలాయ్, బొకారో లాంటి కర్మాగారాలన్నింటికీ కేంద్రం పూర్తిగా పెట్టుబడులు సమకూర్చింది. విశాఖ స్టీల్ప్లాంట్ 3.2 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తికి రూ. 12,500 కోట్ల రూపాయలు సొంత నిధులతో విస్తరణ చేసింది. దీనిలో రూ. 6 వేల కోట్లు ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేయవలసి వచ్చింది. దాని వడ్డీల భారం నేడు ఎదుర్కొంటున్నది. దీనితో పాటు 6.3 మిలియన్ టన్నులనుంచి 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం పెంచడానికి మరో రూ. 9 వేల కోట్లు అదనంగా విస్తరణ నేడు సాగుతున్నది. ఈ విస్తరణలకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2004–05 ఒక సంవత్సరంలోనే విశాఖ స్టీల్ప్లాంట్కు రూ. 2,008 కోట్లు లాభాలొచ్చాయి. 2018–19 సంవత్సరంలోనే రూ. 20,884 కోట్ల టర్నోవర్ సాధించింది. అంతర్జాతీయ ధరలనుబట్టి ఉక్కు అమ్మకాల్లో ఒడిదుడుకులుంటాయి. ఈ సంవత్సరం కరోనా కాలంలో నష్టాలు వస్తాయి కాబట్టి ప్రైవేట్ చేస్తామనడం దుర్మార్గం. మరోవైపున విశాఖ స్టీల్ పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 40 వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించింది. దీనిని సమర్ధత కాదంటారా? 2008లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభంలో అనేక భారీ స్టీల్ప్లాంట్లు మూతబడ్డాయి. ఎస్సార్ స్టీల్స్ రూ. 50 వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టి కంపెనీని మూసి వేసింది. సమర్థవంతంగా నడుస్తున్న విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేట్కు అప్పగించాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ కుట్ర చేస్తున్నది. ‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’’ నినాదంతో 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నం పోస్టాఫీసు వద్ద 9 మంది పోలీసు కాల్పుల్లో మరణించినప్పటి నుంచి అదే నెలలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. 20 వేల మంది తమ భూములిచ్చారు. మన దేశంలోని సముద్రతీర ప్రాంతంలో వున్న ఏకైక ప్లాంట్. వందలాది మంది పర్మనెంట్, కాంట్రాక్టు, ఆఫీసర్లతో సహా ప్రాణాలు త్యాగం చేసిన ఫలితమే నేటి విశాఖ స్టీల్ప్లాంట్ అభివృద్ధికి కీలకం. 1991 నుంచి కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలు అవలంబిస్తున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేట్ వారు ఎవరు తీసుకున్నా లాభాలు బాగా గడించవచ్చు. దేశీ, విదేశీ ప్రైవేట్ కంపెనీల కళ్లు ఆనాటి నుంచి విశాఖ స్టీల్ మీద పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్ను ఆర్థికంగా బలహీనపర్చాలని అనేక తప్పుడు పద్ధతులు అవలంబించింది. విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గనులు సమకూర్చడానికి గత ఆరేళ్ల కాలంలో బీజేపీ ఏ విధంగానూ సహకరించలేదు. ఒడిశా నుంచి గనుల కోసం ఓఎండీసీకి రూ. 361 కోట్లమేరకు విశాఖ స్టీల్ నిధులు ఖర్చుచేశాం. గతంలోని యాజమాన్యం మైనింగ్ చట్టాన్ని అతిక్రమించినందుకు విశాఖ స్టీల్ రూ. 400 కోట్లు జరిమానా చెల్లించింది. ఓఎండీసీని కొని 10 సంవత్సరాలైనా ఒక్క టన్ను కూడా ఇనుప ఖనిజం విశాఖ స్టీల్ప్లాంట్కు నేటికీ రాలేదు. సొంత గనులు లేనందువల్ల 2018–19 ఒక్క సంవత్సరంలోనే ఇతర స్టీల్ప్లాంట్ల కంటే రూ. 2,002 కోట్లు అదనంగా విశాఖ స్టీల్ చెల్లించింది. ఇతర స్టీల్ప్లాంట్లు తమ సొంత గనుల్లో తవ్వి తీసుకోవడానికి టన్నుకు రూ. 700 ఖర్చవుతుంది. కానీ విశాఖ స్టీల్ ముడి ఖనిజాన్ని టన్ను రూ. 7,500కు గత నెలలో చెల్లించింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని సంతృప్తిపరచడానికి యూపీలోని రాయబరేలీలో విశాఖ స్టీల్ప్లాంట్ నిధులతో రైల్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ను రూ. 1,683 కోట్లతో నిర్మించారు. కానీ నేటికీ ఎటువంటి ఉత్పత్తిలేదు. ఈ డబ్బులంతా గంగలో పోసినట్లే. గంగవరం పోర్టు విశాఖ స్టీల్ప్లాంట్ ఆధ్వర్యంలో నడిచివుంటే ప్రతి యేటా స్టీల్ప్లాంట్కు రూ. 500 కోట్లు ఆదాయం వచ్చేది. ప్రభుత్వ విధానాల వల్లనే విశాఖ స్టీల్ప్లాంట్కు రావాల్సిన వేలాది కోట్ల లాభాలు తగ్గిపోయాయి. విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించడానికి ఎన్ని తప్పుడు పద్ధతులు అవలంబించినా తట్టుకొని నేటికీ వేగంగా ముందుకు సాగుతున్నది. విశాఖ స్టీల్ప్లాంట్ను గతంలో అనేకసార్లు ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేసి ప్రభుత్వాలు భంగపడ్డాయి. అదే పరిస్థితి నేడు బీజేపీకి దాపురిస్తుంది. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి బీజేపీ చేసే ప్రయత్నాలను స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటారు. భారతీయ జనతా పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకోవాలి. పోరాడి సాధిం చుకున్న విశాఖ స్టీల్ప్లాంట్ను అవసరం అయితే మరలా ప్రాణాలు అర్పించయినా కాపాడుకోవడం నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్ను వ్యూహా త్మక అమ్మకం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకొనే వరకు పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాలి. రాష్ట్రవ్యాప్త బంద్లు, నిరసనలు, ధర్నాలు నిరంతరం సాగాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తినివ్వాలి. విశాఖ స్టీల్ కార్మికులు, ప్రజలు సమైక్య ఉద్యమాలకు సిద్ధంకావాలని కోరుతున్నాం. సీహెచ్. నరసింగరావు వ్యాసకర్త సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్ : 94900 98789 -
ప్రత్యూష కథ: ఎడారిలో వసంతం లాగా
ప్రత్యూష పెళ్లికూతురు అయింది. 28 డిసెంబర్ 2020 నాడు చరణ్ రెడ్డితో పెళ్లి కావడంతో 24 ఏళ్ళ ఆ యువతి ఓ ఇంటావిడ అయింది. ఎడారిలో వసంతంలాగా నేడు సుఖాంతమైన ప్రత్యూష జీవితం అనూహ్య మలుపులకు కేంద్ర బిందువు. 17 ఆగస్టు 2015 తెల్లవారు 6 గంటల సమయం. సమాచారం అందిన వెంటనే బాలల హక్కుల సంఘం అచ్యుతరావు ఎల్బీనగర్ స్టేషన్ లేడీ కానిస్టేబుల్ తోడుగా ఓ టీవీ చానల్ను వెంట తీసుకోని నాగోలు బండ్లగూడలోని ఆ ఇంటి తలుపు తట్టారు. ఇల్లంతా వెతుకగా గిన్నెలు తోముతూ వారికి ప్రత్యూష కనిపించింది. ఆ శరీరంలో నిలబడి నాలుగడుగులు వేసే శక్తి లేదు. ఎండిన ప్రేవులతో తడారిన గొంతుతో మాట పెగలడం లేదు. నల్లగా కమిలిపోయి పొంగిన బుగ్గ లతో ఎండు కట్టెలా నిలబడ్డ ప్రత్యూష ముఖం నిండా గాట్లు, చేతులపై వాతలు. పత్రికల్లో ఈ వార్త చదివిన వారికీ గుండెలు ద్రవించే పరిస్థితి. టీవీల్లో ప్రత్యూషని చూసినవారు చలించిపోయారు. తక్షణ వైద్య సహాయం కోసం ఆమెను దగ్గర్లోని గ్లోబల్ హాస్పిటల్లో చేర్పించారు. రెండ్రోజుల్లో కాస్త కోలుకొని, హాస్పిటల్ బెడ్ పైనుంచే టీవీ, పత్రికలవాళ్ళ ప్రశ్నలకు సమా ధానమిచ్చింది. 2015లో అచ్యుతరావు ప్రత్యూషను కాపాడినప్పటి చిత్రం ప్రత్యూష తల్లి సరళ ‘మిస్ ఆంధ్ర’ కిరీటం గెలుచు కున్న బ్యూటీషియన్. ఇంటికి దగ్గర్లో బ్యూటీ పార్లర్ నడిపేది. తండ్రి రమేశ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. 1996లో ప్రత్యూష పుట్టింది. హాయిగా సాగుతున్న సంసారంలోకి రమేశ్ సహోద్యోగి శ్యామల ప్రవేశించింది. తన బ్యూటీ పార్లర్లో వీరిరువురి శారీరక సంబంధాన్ని స్వయంగా చూసిన సరళ నిలదీయడం పర్యవసానంగా 2003లో వారి వైవాహిక బంధం తెగి పోయింది. కూతురు ప్రత్యూషతో సరళ విడిగా బతక నారంభించింది. కుటుంబ జీవితంలో వచ్చిన ఒడి దుడుకులను తట్టుకోలేక సరళ 2010 డిసెంబర్లో ఆత్మహత్య చేసుకుంది. తల్లి తోబుట్టువుల నిరాదరణ వల్ల ప్రత్యూష జీవితం అనాథాశ్రయానికి చేరింది. కొంత కాలానికి తండ్రి వచ్చి ఇంటికి తీసికెళ్ళాడు. ఒక సంవత్సరం బాగానే గడిచింది. ప్రత్యూష చదువు కొనసాగించింది. క్రమంగా సవతి తల్లి శ్యామలలో ప్రత్యూష పట్ల క్రూరత్వం మొదలైంది. చదువు మాన్పించింది. జుట్టు కత్తిరించింది. కత్తితో గాట్లు, వాతలు, ఇనుప రాడ్లతో, సుత్తితో బాదడం నిత్య కృత్యమైంది. రోజుల తరబడి ఆకలితో మాడ్చింది. తండ్రి ఆ అకృత్యాలను చూస్తూ నవ్వుతూ పేపర్ చదువుకొనేవాడు. సుమారు రెండేళ్ల పాటు ఈ దుర్భర జీవితాన్ని అనుభవించిన ప్రత్యూష బాలల హక్కుల సంఘం చొరవతో బయటపడింది. ఐదు రోజులపాటు హాస్పిటల్లో ప్రత్యూష వెంట ఉన్న అచ్యుతరావు డిశ్చార్జి అయ్యాక కూడా ఆమె బాగోగుల బాధ్యత తానే తీసుకుంటానని మీడియాతో అన్నారు. అయితే ఆయనకు ఆ అవసరం పడలేదు. ప్రత్యూష జీవన పరిస్థితి తెలుసుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వయంగా హాస్పిటల్కు వచ్చి ఆమెను పరామర్శించారు. ఆ క్షణమే తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యూష తండ్రిని, సవతి తల్లిని పోలీ సులు అరెస్టుచేసి హత్యానేరాన్ని నమోదు చేశారు. ప్రత్యూష మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్లో చేరింది. నర్సింగ్ కోర్సులో డిగ్రీ పూర్తి చేసింది. ఏడాదిగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఉద్యోగం చేస్తోంది. త్వరలో నిమ్స్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరనుంది. తన సహోద్యోగి ద్వారా పరిచయమైన కుటుంబంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగి చరణ్తో జరిగిన పెళ్లి ప్రత్యూష నిండు జీవితానికి శ్రీకారమైంది. తమ దత్త పుత్రిక పెళ్లి లాంఛనాలను కేసీఆర్ కుటుంబం నిర్వర్తించింది. తాను రక్షించిన అమ్మాయి జీవితంలో విరబూసిన ఆనందాలు చూసేందుకు, అచ్యుతరావు మన మధ్య లేరు. కరోనా బారిన పడి ఆయన 2020 జూలై 21న మరణించారు. ప్రత్యూష జీవితం బాగుపడినందుకు ఎంతో ఆనందంగా ఉందనీ, ఆ స్ఫూర్తితో బాలల సంఘం తన కార్యకలాపాలపై మరింత అంకితమవు తుందనీ అచ్యుతరావు కుటుంబం చెబుతోంది. బి. నర్సన్ వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 28169 -
అన్నదాతల ధర్మాగ్రహం
అన్నదాత సుఖీభవ అని ఒక రంటారు. రైతేరాజని మరొ కరంటారు. జై జవాన్ జై కిసాన్ అని స్వయానా మాజీ ప్రధానే అన్నారు. ఎవరేమన్నా ఈ దేశంలో ‘రైతు’ పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఇంతకీ రైతంటే ఎవరు? వందలు, వేల ఎకరాల భూము లున్నవాడు రైతెలా అవుతాడు? అయితే గీయితే భూస్వామి అవుతాడు గానీ. భూమి దున్నే వాడు రైతు. చెమట చుక్కలతో మట్టిని తడిపేవాడు రైతు. రైతు అనేది ఓ కులం గాదు. పారిశ్రామిక విప్లవం కావచ్చు, కమ్యూనిస్ట్ తిరుగుబాటు కావచ్చు, ప్రపంచీకరణ భూత కార్పొరేటీకరణ కావచ్చు... రైతుకు ఒరగబెట్టిందేమీ లేదు. భూమితో విడదీయలేని బంధమున్న రైతన్న భూమి లేనివాడుగా మారుతున్నాడు. ఇంతకీ నోట్లో నాలుక లేని అమాయకజీవి ఎందుకు ఢిల్లీ బాట పట్టాడు? ఎందుకోసం ధర్మాగ్రహంతో కళ్లెర్ర జేస్తున్నాడు? కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని, వ్యవసాయ మార్కెట్లను కూడా కార్పొరేట్లకు అప్పగించి కోట్లాదిమంది రైతుల నోళ్లలో మట్టికొడుతోంది. ఏ పారిశ్రామికవేత్తయినా వస్తువుకు తానే ధర నిర్ణయిస్తాడు. కానీ రైతు పరిస్థితి కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్నట్టుగా ఉంది. రైతు పండించిన పంటను కొనడం ప్రభుత్వాల బాధ్యత. అవసరా నికో విధిలేకో ప్రైవేట్ వ్యాపారికి అమ్మితే రైతుకు ఇప్పుడు అందుతున్న ధర కూడా లభించదు. భారతీయ రైతు నడ్డి విరిచి, ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రైతుల భూములను చేరవేయడానికే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ చట్టాల వల్ల భూమంతా కార్పొరేట్ శక్తుల అధీనంలోకి పోయి రైతులు తమ భూముల్లో తామే కూలీలు అయ్యే పరిస్థితి తలెత్తుతుంది. పైగా వినియోగదారుడు ఇప్పుడు లభిస్తున్న రేటుకంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలోని ప్రభుత్వాలంటే మునుపటి రాజులవి కావు. ప్రజలతో ఎన్నుకోబడ్డవి. ప్రజలను తన కన్నబిడ్డలుగా చూసుకోవాల్సినవి. అలాంటి ప్రభుత్వాలే అన్నదాత సంక్షేమాన్ని పట్టించుకోకపోతే కార్పొరేట్ శక్తులు ఎలా పట్టించుకుంటాయి? రైతులను ఆదుకోకుండా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడం సరైంది కాదు. డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత. మొబైల్: 91829 18567 -
మూడింటి కలయికతో మున్ముందుకు
ఏప్రిల్ 1, 2020 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోదర బ్యాంకులైన ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను కలుపుకొని భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఒక నూతన చరి త్రకు శ్రీకారం చుట్టింది. దీంతో సుమారు 12 కోట్ల మంది ఖాతాదారులు, 9,500 శాఖలు, 75 వేలకు పైగా ఉద్యోగులతో భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదవ స్థానంలో నిలిచింది.కొంతమంది నిరాశావాదులు ఈ కొత్త ఆవి ర్భావం విజయవంతం కాదని వాదించారు. కోవిడ్ కాలంలోనూ అబ్బురపరిచే విధంగా మొదటి త్రైమాసికంలోనే 333 కోట్ల రూపాయల లాభాన్ని యూనియన్ బ్యాంక్ ఆర్జించింది. వ్యాపారంలో 5 శాతం వృద్ధిని నమోదు చేసుకొని, తన వ్యాపార మొత్తాన్ని రూ.15,42,668 కోట్లకు పెంచుకొంది. మొండి బకాయిలను, నిరర్థక ఆస్తుల శాతాన్ని గణనీయంగా తగ్గించుకొంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు అత్యధిక శాఖలు ఉన్నాయి. ఈ మూడు బ్యాంకుల మేలుకలయికతో శాఖల సంఖ్యాపరంగా యూనియన్ బ్యాంక్ ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో 17 శాతం దక్కించుకుంది, తెలంగాణ రాష్ట్రంలో 14 శాతం దక్కించుకుంది. డిపాజిట్ల పరంగా ఆంధ్ర రాష్ట్రంలో 19 శాతం, తెలంగాణలో 13 శాతం దక్కించుకుని అగ్రగామి బ్యాంకుల సరసన నిలిచింది.రైతులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, ఉద్యోగులు– ఇలా సమాజంలో అనేక వర్గాలను ఆకట్టుకునే విధంగా మా పథకాలు ఉన్నాయి. వృద్ధులకు ఆసరా చెల్లింపులు చేస్తున్నాం. అన్ని సేవలు డిజిటల్ మాధ్యమాల ద్వారా అందజేయడానికి కృషి చేస్తున్నాం. కోవిడ్ వల్ల దెబ్బతిన్న జీవన వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని వారి చెల్లింపు వాయిదాలను, రేట్లను నిర్ధారించడం జరిగింది.ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులకు హైదరాబాద్, మంగళూరు నగరాలలో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. గతంలో ఈ నగరాలు ఆంధ్ర, కార్పొరేషన్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కావడంచేత వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే కొన్ని కీలకమైన కార్యాలయాలను ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ఈ చర్య నైసర్గిక, మానవ వనరుల సద్వినియోగంలో ఒక సమతుల్యతను సాధిస్తుంది. మా ఉద్యోగులు ఈ విపత్తు సమయంలోనూ తమ విధులు నిర్వర్తించి స్ఫూర్తిదాయకంగా నిలి చారు. ఈ కాలంలోనే 125 స్థానిక ప్రధాన కార్యాలయాలు, 18 ఫీల్డ్ జనరల్ మేనేజర్ స్థాయి కార్యాలయాలు ప్రారంభించగలిగాం. ముంబైలో యూని యన్ బ్యాంకు ప్రధాన కార్యాలయాల ప్రారంభోత్సవానికి గాంధీజీ విచ్చేసి తమ ఆశీస్సులు అందజేశారు. అలాగే గాంధీజీ శిష్యులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్ను, హాజీ ఖాన్ బహదూర్ అబ్దుల్లా కార్పొరేషన్ బ్యాంకును స్థాపిం చారు. ఈ మహనీయుల వారసత్వాన్ని మేము కాపాడుతాం. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులకు మా సేవల విషయంలో నమ్మకం కలిగించడం మా గురుతర బాధ్యత. ఈ మూడు బ్యాంకుల కలయిక గాంధీజీ సిద్ధాంతమైన వినియో గదారుడే దేవుడు అనేదానికి ప్రతిరూపంలా కొనసాగుతుంది. ముందు ముందు బ్యాంకింగ్ రంగంలో ఆశావహ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యతరహా, సూక్ష్మ తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న వారి రుణాలను తిరిగి బేరీజు వేసేం దుకు కూడా ఆర్బీఐ అంగీకరించింది. లాక్డౌన్తో నష్టాల్లో ఉన్న అనేక మందికి ఇది ఉపశమనం కలగజేస్తుంది. అలాగే భారత ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భరత ప్యాకేజీ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుంది. దీనివల్ల కష్టకాలంలో స్తబ్దంగా ఉన్న పరిశ్రమలు, ఇతర వర్గాలు పుంజుకుంటాయి. ఇవి దేశ సౌభాగ్యానికి దోహదం చేయగలవు. మేము ఈ మూడు బ్యాంకుల శుభ కలయికతో బ్యాంకింగ్ రంగంలో సరైన ముందడుగు వేశాం. రాజ్ కిరణ్ రాయ్ వ్యాసకర్త ఎండీ, సీఈఓ, యూనియన్ బ్యాంక్ -
సెంట్రల్ వర్సిటీల్లో ఓబీసీలకు అన్యాయం
దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారంటూ యూజీసీ ఒక ఆర్టీఐకి ఇచ్చిన సమాధానం ఓబీసీ మేధావులలో చర్చకు దారితీసింది. ఇదే పరిస్థితి అసోసియేట్ ప్రొఫెసర్స్, అసి స్టెంట్ ప్రొఫెసర్స్లో చూడవచ్చు. మండల్ కమిషన్ ప్రవేశపెట్టి 30 ఏళ్ళు అవుతున్నా ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో, ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఎంఎంలు, ఎన్ఐటీలలో తీరని అన్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. 1978 డిసెంబర్ 20న నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రెండవ జాతీయ వెనుకబడిన కమిటీని బీపీ మండల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆయన సెప్టెంబర్ 7, 1980లో భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పిం చారు. ‘సమానంగా ఉన్నవాళ్ళలో మాత్రమే సమానత్వం ఉంటుంది. అసమానతలను సమానంగా చేయాలంటే, అసమానత మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది’ అని నివేదిక తొలి పేజీలోనే రాశారు. మండల్ కమిషన్ ఆధారంగా 1993లో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసినప్పటికి అవి ఉన్నత విద్యా సంస్థలలో 2007 నుండి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్ట్యూషన్స్ 2006 చట్టం ద్వారా అమలులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుంటున్న అన్ని విద్యా సంస్థల బోధన సిబ్బంది, విద్యార్థుల అడ్మిషన్ సీట్లలో 27% రిజర్వేషన్లను అమలులోకి తెచ్చారు. దేశంలో 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 2,498 ప్రొఫెసర్లు, 5,011 అసోసియేట్ ప్రొఫెసర్లు, 10,830 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా ఓబీసీలకు 313 ప్రొఫెసర్లు, 735 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2,232 అసిస్టెంట్ ప్రొఫెసర్లను మాత్రమే కేటాయించారు. కానీ రిజర్వేషన్ కోటా కింద 674 ప్రొఫెసర్లు, 1,352 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2,924 అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఓబీసీలకు కేటాయించాలి. కేటాయించిన ఓబీసీ పోస్టులలో కేవలం 9 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 1,327 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.. అంటే 97.12% ప్రొఫెసర్లు, 94.82% అసోసియేట్ ప్రొఫెసర్లు 40.54% అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కాలేదు. ఓబీసీలకు 27% కేటాయింపులో తొలి అన్యాయం జరిగితే, కేటాయించిన పోస్టులను కూడా భర్తీ చేయకపోవడం రెండవ అన్యాయం. ఐఐటీల్లో మొత్తం 8,856 మంది బోధన సిబ్బంది ఉంటే, కేవలం 329 మంది ఓబీసీలు మాత్రమే ఉన్నారు. 18 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ల్లో 724 మంది బోధన సిబ్బంది ఉంటే, కేవలం 27మంది ఓబీసీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. కేంద్ర ఉన్నత విద్యా సంస్థలలో ఓబీసీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీటికి అనేక కారణాలు. మొదటిది విద్య కొన్ని కులాల అధీనంలోనే ఉండాలనే మనువాద ధర్మాన్ని అగ్రకులాల వారు 2020లో కూడా ఇంకా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండవ విమర్శ ఏంటంటే, ఓబీసీలకు అర్హత కండిషన్స్ లేవంటూ వారిని ఉన్నత స్థానాలకు వెళ్ళకుండా చూస్తున్నారు. కానీ జనరల్ క్యాటగిరీలో అగ్రకులాల వారికి అర్హతలు లేకపోయినా ఉద్యోగ అవకాశాలను కలుగజేస్తున్న ధోరణులను మనం చూడవచ్చు. కానీ 52% ఉన్న ఓబీసీల విషయంలో తగిన అభ్యర్థులు లేరు అని, పోస్టులను మూడు సార్లు వేసి, నాలుగవసారి జనరల్గా మార్చుతున్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చదువుకోవడానికి వస్తున్నా ఓబీసీ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలాగా సంఘటితం కాకపోవడం, కులాలవారీగా విడిపోయి వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపడంలో విఫలం అయ్యారనే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీల సమస్యలపై దృష్టి పెట్టాలి. 52% ఉన్న ఓబీసీలకు ఉన్నత విద్య సంస్థలలో తీరని అన్యాయం జరుగుతుంది. మొత్తం మంజూరయిన 27% ఓబీసీల ఉద్యోగాలను అమలు చేయాలి. సెంట్రల్ వర్సిటీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది. కానట్లయితే రాజ్యాంగాన్ని, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్ట్యూషన్ యాక్ట్ 2006ను ఉల్లంఘించినట్లే అవుతుంది. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే పద్ధతి ద్వారా అన్యాయం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ తరహా జాతీయ రిక్రూట్మెంట్ సంస్థతో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడం ద్వారా అక్రమాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జి. కిరణ్కుమార్, వ్యాసకర్త అధ్యక్షుడు, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం, పరిశోధక విద్యార్థి, రాజనీతి శాస్త్రవిభాగం, హైదరాబాద్ వర్సిటీ మొబైల్ : 80745 11654 -
భళా బహుజన స్టడీ సర్కిళ్లు
దళిత, బహుజన, గిరి జన, ఆదీవాసీ, మైనార్టీ వర్గాల్లోని యువత ఉపాధి పొందేందుకు, పోటీపరీ క్షల్లో పాల్గొనేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను రాష్ట్రప్రభుత్వమే నిర్వహిస్తోంది. వీటి ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణనిస్తారు. పేదవర్గాల యువతకు ఇవి ఎంతో సహాయం చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పోటీపరీక్షల కోసం ప్రయివేటు కోచింగ్ సెంటర్లలో చదువుకోవటం ఖరీదైన వ్యవ హారంగా మారింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన స్డడీసర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ నివ్వటమే గాకుండా, స్టడీ మెటీరియల్, భోజన వసతిని కూడా ఏర్పాటుచేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా విలేజ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ దగ్గర్నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం నిర్వ హించే అన్నిరకాల పోటీపరీక్షలకు, దేశపాలనా రంగాన్ని నిర్వహించే సివిల్స్ పరీక్షల వరకు శిక్షణ ఇస్తారు. మూడు నుంచి ఆరేడు నెలల వరకు కోచిం గ్నిచ్చి పంపేయటమే గాకుండా ఆయా వెనుకబ డిన సామాజిక వర్గాలు, అట్టడుగు బహుజన దళిత గిరి జన ఆదీవాసీ మైనార్టీవర్గాలు, పేదలకు ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు చేయాలో నన్న చింతనను కూడా ఈ స్టడీ సర్కిల్స్ నేర్పుతు న్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత వేలాదిమంది తెలంగాణ యువత ఇందులో శిక్షణ పొందారు. ఉద్యోగాలను చేజిక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు హైద రాబాద్లో తప్ప ఇతరచోట్ల స్టడీసర్కిళ్లు ఉండేవికావు. ఇపుడు ప్రతి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్టీలకు 1, ఎస్సీలకు 4, బీసీలకు 9 స్టడీ సర్కిళ్లు ఉండేవి. వీటి నిర్వహణకు 22 కోట్లు ఖర్చుచేశారు. పాతవాటితో కలుపుకొని రాష్ట్రంలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, బీసీలకు 10, మైనార్టీలకు 1 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు నాలుగేండ్లలో రూ. 253.91 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. స్టడీసర్కిల్స్ విస్తృతి ఇంకా పెరగాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలోపెట్టుకుని యువతను సన్నద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల శాఖల్లోని నియామకాలను చేపట్టినప్పటికీ ప్రైవేట్ రంగంలోనే అత్యధికంగా ఉద్యోగావకా శాలు ఉన్నాయన్నది నిజం. ప్రైవేట్రంగంలో ఉద్యో గాలు పొందటానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. హైద రాబాద్లోని అమీర్పేటలో పలు ఉద్యోగాలకు శిక్షణనిచ్చే కేంద్రాలు ప్రయివేట్ రంగంలో అనేకం వెలిశాయి. పేదరికంలో ఉన్న యువత ఇందులో శిక్షణ పొందటానికి ఆర్థిక భారం ఉంటుంది. గ్రామీణ, పట్టణాలనుంచి వచ్చే పేదయువతకు ప్రైవేట్రంగంలో ఉద్యోగాలు పొందటానికి కూడా శిక్షణనిచ్చే కేంద్రాలుగా ప్రభుత్వ స్టడీసర్కిళ్లు తయారుకావాలి. తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారింది. భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేం దుకు, ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ను తయారుచేస్తున్నారు. తెలంగా ణను సంప దపెంచే కేంద్రంగా మార్చాలన్న కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ఉత్పత్తి రంగాల వైపునకు యువసైన్యం నడిచేందుకు కావాల్సిన శిక్షణ, ఆలోచనలను పెంపొందించే దిశగా స్టడీ సర్కిళ్లు తయారుకావాలి. భవిష్యత్తులో 33 జిల్లాల్లో 33 స్టడీసర్కిళ్లను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టు కుని స్థానికంగా అందుబాటులోవున్న లెక్చరర్లు, టీచర్లు, కొత్తగా రిక్రూట్ అయిన పలుశాఖల అధికారులను ఉప యోగించుకుని స్వచ్ఛందంగా స్టడీ సర్కిల్స్ను నిర్వహించే బాధ్యతను సంబంధిత శాఖల ఉన్న తాధికారులు తమ భుజస్కందాలపై వేసుకోవలసి ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రతిజిల్లాలో శాశ్వత భవ నాలు వచ్చేంత వరకు ఖాళీగావున్న ప్రభుత్వ కార్యాలయాలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రాంతీయ విశ్వవిద్యాలయాల భవనాల్లో వారికి ఆటంకం కలు గకుండా సమయాన్ని సర్దుబాటు చేసుకుని స్టడీ సర్కిల్స్ను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టవలసి ఉంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ 100 ఎక రాల విస్తీర్ణంలో ఉంది. ఆ పచ్చటి ప్రకృతి వొడిలో యువతకు ఉద్యోగ శిక్షణనిచ్చే అతిపెద్ద కేంద్రా లను నెలకొల్పవచ్చును. కేసీఆర్ లక్ష్యమార్గంలో సాధించే ప్రతి విజయం ఈ నేలమీద 85 శాతంగా వున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆదివాసీ వర్గాలకు మేలు చేస్తుంది. ఈ యువత స్థిరంగా నిలబడ గలిగితే తెలంగాణ సమాజమే స్థిరంగా నిలబడగ లుగుతుంది. వ్యాసకర్త కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ -
సర్వతోముఖాభివృద్ధికి దివిటీ
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం, దేశ వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటూ, సామాజిక, సాంస్కృతిక అంశాల సమ్మిళి తంతో రూపొం దించిన నూతన జాతీయ విద్యా విధానం –2020, విద్యారంగంలో ఒక నవశకానికి నాందీవాచకం పలకనుంది. ప్రధాని మోదీ లక్ష్యించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాకారం చేసుకునే దిశగా, విద్యాబోధనతోపాటు సృజనాత్మకత, నైతికత, శారీరక–మానసిక స్థైర్యాన్ని పెంచుతూ.. విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడే విధంగా నూతన విద్యావిధానం ఆవిష్కృతమైంది. దేశాభివృద్ధి ప్రక్రియలో కుటుం బం, సమాజం అంశాలు కూడా కీలకమని గుర్తించి ‘వసుధైక కుటుంబం’ అన్న భారత జాతి స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పే తరాన్ని, మున్ముందు చూడబోతున్నాం. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నూతన విద్యావిధాన రూపకల్ప నకు ప్రముఖ శాస్త్రవేత్త కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు నాలుగేళ్లపాటు.. అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపింది. ఇంకా ఆన్లైన్ ద్వారా అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని భవ్యమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఇది మన దేశానికి ఓ దిక్సూచిగా ఉండబోతోంది. భారతీయ ఆత్మను ఆవిష్కరించే నూతన జాతీయ విద్యా విధానంలో భారతీయ వైవిధ్యత, భాషలు, కులాలు, మతాలు, తెగలు, వారి ఆచార సంప్రదాయాలు వీరందరూ ఉత్పత్తి చేసిన జ్ఞాన సంపద.. మన వారసత్వ సంపద.. మన పాఠశాల విద్యలో, పాఠ్యప్రణాళికలో భాగస్వామ్యం కానున్నాయి. జాతీయ నూతన విద్యా విధానం 2020.. మూడేళ్ల నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరినీ విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం విప్లవ విప్లవాత్మకమైన మార్పు. ఈ విధానం ద్వారా ముఖ్యంగా.. పాఠశాల స్థాయి, ఉన్నత విద్య, వృత్తి విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయి. వీటికి అనుబంధమైన ఉపాధ్యాయ విద్యలోనూ అవసరమైన మార్పులు వస్తాయి. విద్యార్థుల శారీరక, మానసిక, సాంఘిక, భావోద్వేగ వికాస దశలకు గుణంగా పాఠ్యప్రణాళిక, బోధనా పద్ధతి ఆధారంగా, ‘5+3+3+4’ సూత్రం ఆధారంగా.. పాఠశాల విద్య దశల విభజన జరిగింది. ప్రారంభ బాల్య సంరక్షణ్ విద్య (ఈసీసీఈ)ని మూడేళ్ల వయసులోనే చేర్చడంతో మరింత మెరుగైన అభ్యాసన, అభివృద్ధి, శ్రేయస్సుకు బాటలు పడతాయి. ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలని ఈ విద్యావిధానం ప్రతిపాదిస్తోంది. నూతన విధానంలో ఆంగ్లభాష నేర్చుకుంటూనే, మాతృభాషలో బోధన జరగడంతో విద్యార్థులు సులభంగా విషయాలను అర్థం చేసుకుంటారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వారు ఏ మాధ్యమం ఎంచుకున్నప్పటికీ.. అందులో పుస్తకాలు అందుబాటులో ఉండేట్లు జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. బట్టీ పట్టి పరీక్షలు పాసయ్యే మూస పద్ధతికి బదులు విద్యార్థి కేంద్రక విధానం రానుంది. 2040 నాటికి దేశంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ ఉండాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఇది విద్యార్థులందరికీ వారి సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా.. ట్రాన్స్జెండర్లతో సహా అందరినీ అందుబాటులో ఉండాలని సర్కారు భావిస్తోంది. దేశంలో అందరి అవసరాలకు తగ్గట్లు పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. వృత్తి విద్యను అన్ని విద్యా సంస్థలు.. అంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేస్తారు. 2025 నాటికి కనీసం 50% మంది అభ్యాసకులకు వృత్తి విద్య అందుబాటులో ఉండేట్టు చూస్తారు. భారమైన పాఠ్యప్రణాళికను తగ్గించి కీలక విషయాలను మాత్రమే చేర్చడం, పాఠ్యపుస్తకాలలో స్థానిక అంశాలకు ముఖ్యమైన స్థానం కల్పించడం, స్థానిక భాషా పుస్తకాలు రూపొందించడం, జాతీయ స్థాయి పాఠ్య పుస్తకాలు ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రించి ఉచితంగా అందించడం వంటి కార్యక్రమాలకు నూతన విద్యావిధానం వేదిక కానుంది. స్థానికంగా ఉండే వృత్తి నిపుణులు, కళాకారుల సేవలు వినియోగించుకోవడం ద్వారా శ్రమ పట్ల గౌరవాన్ని, అనుభవపూర్వక అభ్యసనాన్ని విద్యను అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకే విధమైన విద్యాప్రమాణాలు నెలకొల్పడం, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల బోర్డులకు విద్యా ప్రమాణాల నిర్ధారణకు జాతీయ సంస్థ (్కఅఖఅఓఏ) మార్గ నిర్దేశనం చేస్తుంది. పరీక్షల బోర్డులు కీలకమైన విద్యార్థుల సామర్థ్యాలను మాత్రమే పరీక్షిస్తాయి. ప్రతి రాష్ట్ర పరీక్షల బోర్డు ఇతర రాష్ట్రాలతో సమానమైన విద్యాప్రమాణాలని రూపొందించాలి. కోచింగ్ సంస్కృతికి చరమగీతం పాడడానికి, ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వివిధ రాష్ట్రాల పరీక్షల బోర్డుల సమన్వయంతో పనిచేస్తుంది. ఈ నూతన విద్యావిధానం అమలుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్న తరుణంలో.. రాష్ట్రాలు కూడా దీన్ని అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కృత్రిమ మేధ, డిజైనింగ్, సమగ్రమైన ఆరోగ్యం, సహజ జీవన విధానం, పర్యావరణ విద్య మొదలైన విషయాలను మాధ్యమిక, సెకండరీ దశలో ప్రవేశపెట్టడం. అదేవిధంగా సమస్య పరి ష్కారం, గణిత ఆలోచన నైపుణ్యాలు–కంప్యుటేషనల్ థింకింగ్ వంటి అంశాలను మాధ్యమిక దశ లోనే ప్రవేశ పెట్టడం చాలా గొప్ప నిర్ణయం. భారతీయ సాంప్రదాయ భాషలైన సంస్కృతం, ప్రాకృతం, పార్సీ వంటి అన్ని భాషలు నేర్చుకునేందుకు పాఠశాలలు అవకాశం కల్పిస్తాయి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ నూతన విద్యావిధానం భారతదేశ ఆత్మలో నిగూఢమై ఉన్న జ్ఞాన నిధిని వెలికితీసి.. విశ్వమానవాళికి మేలు చేయటంలో గొప్ప పాత్రను పోషించబోతుంది. జి. కిషన్రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com -
కరోనాపై ఇమ్యూనిటీ బూస్టర్లు పనిచేస్తాయా?
సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ఇమ్యూనిటీ బూస్టర్ల ప్రచారం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతూ వారిలో భయాందోళనలకు, పలు అపశ్రుతులకు కారణం అవుతోంది. అయినా వైరస్ దూకుడు గురించి భయపడవలసిన అవసరం లేదు. మన దేశంలో క్రమంగా పరిస్థితులు మెరుగయ్యాయి. కరోనా ప్రాణనష్ట నివారణకు చెప్పే ప్రాథమిక సూత్రాలతో పాటుగా ఇప్పుడు ప్రాణ రక్షణకు చేసే ప్రత్యామ్నాయాలపై వైద్యులు, అధికార యంత్రాం గం దృష్టి సారించారు. రోగ నిరోధక శక్తితో వైరస్ నుంచి రక్షణ పొందవచ్చా? అన్న ప్రశ్నకు జవాబుగా సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా ప్రచారమౌతున్న వ్యాపార ప్రకటనలు, ప్రజలను మరింత అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే మ్యాజిక్ మాత్ర నిజంగానే ఏదైనా ఉందా? అయితే, పోషకాహారం–రోగనిరోధక శక్తి రెండూ పరస్పరం ముడిపడి ఉన్నాయని చాలాకాలంగా మనవద్ద ప్రచారంలో ఉంది. మరిప్పుడు ఈ కోవిడ్–19 దాడి సమయంలో పోషకాహారంతో రక్షణ పొందవచ్చా? వయోవృద్ధులు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ ఇన్ఫెక్షన్ను ఎదుర్కోలేరనే అనుమానం ఉంది. ఆర్థిక స్తోమత ఉన్నవారిలో 75 శాతం మంది పెద్దలు ముందస్తు జాగ్రత్త కోసం రోజూ తీసుకునే మల్టీ విటమిన్ మాత్రలు గుండె జబ్బులు, క్యాన్సర్కి కారణమౌతూ, జ్ఞాపకశక్తిని తగ్గిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధి నివారణకు మల్టీ విటమిన్ వాడడం వలన పెద్దగా ఉపయోగం లేదు. నిజానికి సమతుల ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువు, ఉప్పు, చక్కర వాడకం తగ్గించడం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉపయోగించడం, వ్యాయామం ఇందుకు సరైన ఫార్ములా. శరీరంలోకి ప్రవేశించే ఏ క్రిమి ఐనా.. బ్యాక్టీరియా, పరాన్నజీవులే.. వీటిని ఎదుర్కొనే పోలీస్ వ్యవస్థగా తెల్లరక్త కణాల్లో ఉండే న్యూట్రోఫిల్సు, లింఫోసైట్లు పని చేస్తాయి. ప్రజలలో 70 నుంచి 90 శాతం మంది వ్యాధి బారిన పడినపుడు, హాని కలగడానికి ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో ఉండే రక్షణను ‘మంద నిరోధక శక్తి’ (హెర్డ్ ఇమ్యూనిటీ) అంటారు. ప్లీహం, ఎముక మజ్జ (బోన్ మారో) వల్ల ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ పెరుగుతుంది. శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎలా అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. తమ ఆహార ఉత్పత్తులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, అనేక కంపెనీలు వ్యాపార ప్రకటనలు ఇస్తున్నాయి. ‘న్యూట్రాస్యూటికల్’ లేదా ఆహార అనుబంధ పదార్ధాలు లేదా ‘డైటరీ సప్లిమెంట్లు’ రోగ నిరోధకశక్తిని పెంచవని, అవి అశాస్త్రీయమైనవని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇమ్యూనిటీ నిపుణులు డా. రామ్ విశ్వకర్మ అంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే అసలైన మార్గాలు– సమతుల ఆహారం, వ్యాయామం, యోగాభ్యాసం, కనీసం 7 గంటల నిద్ర, విటమిన్ సి, విటమిన్ బి 12, విటమిన్ డి, జింక్ వంటివి అవసరం. కరోనాపై వైద్యులు ఎక్కువగా దృష్టి సారించినవి– విటమిన్ డి3, విట మిన్ సి, విటమిన్ బి 12, జింక్. ‘అసలు ఇమ్యూనిటీని పెంచడం అనేది ఆహ్వానించదగినది కాదని, వైరస్ నివారణకు, ఇమ్యూనిటీ పెంచడానికి ఎటువంటి సంబంధం లేదని, ఆయుర్వేద ఔషధాలు ఇమ్యూనిటీ పెంచుతాయని చెప్పడానికి ఎటువంటి అధ్యయనాలు లేవని’ సీఎంసీ రాయవెల్లూరు ఇమ్యునాలజీ అధిపతి ప్రొఫెసర్ దేబాశిష్ దండా అంటున్నారు. నిజమే, వాటిని అల్లోపతి మందుల మాదిరి ముందుగా జంతువులలో, ఆ తరువాత మనుషులలో మూడు దశలలో ప్రయోగించి వాటి పని తీరును నిర్ధారించే అవకాశాలు లేవు. కొన్ని ఆయుర్వేద మందుల్లో లోహాలు, స్టెరాయిడ్ పెద్ద పరిమాణంలో కల్తీ చేయడం వలన మెదడు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయని నిరూపితమైంది. ఇమ్యూనిటీ బూస్టర్లు ప్రయోజనం నిజమని నమ్మిన కేసుల్లో రోగనిరోధక వ్యవస్థ విఫలమై ‘సైటోకైన్ స్టారం’తో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి ఆహార అలవాట్లలో జింక్, విటమిన్ సి లోపం అరుదైనది. కంపెనీల ప్రచారం కాకుండా నిపుణుల సూచనలు పాటిస్తే మంచిది. కరోనా కొద్ది శాతం మంది లోనే ప్రమాదకరం, 95 శాతం మందికి ఆసుపత్రుల అవసరం లేదు. మార్కెట్లో రూ. 2,000 దొరికే ‘పల్స్ ఆక్సీమీటర్’తో మనం ఇంటిలోనే వ్యాధి తీవ్రత ‘చెక్’ చేసుకోవచ్చు. ఆక్సిజన్ 93 శాతం లోపల ఉంటేనే ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం కలుగుతుంది. డా. వల్లూరి రామారావు వ్యాసకర్త చీఫ్ మెడికల్ ఆఫీసర్ (రిటైర్డ్) సెంట్రల్ హెల్త్ సర్వీస్ ‘ 94908 77471 -
కరోనా అనంతర జీవితం..!
చరిత్ర చెంపలపై కన్నీటిని మనిషే తన రెండు చేతులతో తుడిచేస్తాడు. కొన్నిరోజుల్లో మహ మ్మారికి విరుగుడు కనిపెట్టి సాగనంపుతారు. ‘మంచోని బుద్ధి మాంసం కాడ తెలుస్తుందన్నట్లుగా’ మానవ మనస్తత్వం చికెన్, మాంసం కొట్లకాడ కన్పిస్తుంది. నేనొక్కణ్ణే బతకాలనే దశకు ప్రపంచం వచ్చిందనుకుంటా! కరోనా తర్వాత మానవ మనస్తత్వం, ప్రవర్తన, జీవన విధానాలలో చెప్పుకోదగిన విధంగా మార్పులు వస్తాయని ఆశించవచ్చునా? భౌతిక దూరం పాటించకుండా రెండు నెలలకు సరిపడా గోధుమపిండి, నూనె ప్యాకెట్లు, పప్పు, ఉప్పు, బియ్యాలు తెచ్చుకుంటే సరిపోదు. క్లోరోక్విన్ మాత్రలే వేసుకుని బతుకుదామనే ప్రయత్నం తప్ప కరోనా తర్వాత మనుషులంతా మారిపోతారా? అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మా సీతారాం అన్నట్లు తడిచెత్త పొడిచెత్తలను వేరుచేయలేని మనుషులు స్వీయ నియంత్రణలను ఎంతవరకు పాటిస్తారోనన్న అనుమానాలు అట్లనే ఉన్నాయి. నిజంగా కరోనా సమయంలో మానవులు మహామానవులుగా, కరుణామయులుగా అవతరించాల్సిన సందర్భమే. ఇప్పటికైనా తనకు ఉన్నదాంట్లో వితరణ చేయవచ్చును. ఈ కష్టకాలంలో ఆర్థికంగా ఉన్నవాళ్లు పేదలైన కొన్ని కుటుంబాలనైనా ఆదుకోవచ్చు. ఎవరికోసమైతే తమ రాష్ట్రాలను, సొంతవూళ్లను వదిలిపెట్టి వలస కార్మికులు వచ్చారో వారిని తీసుకొచ్చిన నిర్మాణరంగ యజమానులు వాళ్లను చూడవలసిన కనీస బాధ్యతలేదా? కరోనా సమయంలో కూడా కొందరు కర్కశంగానే ఉన్నారనటానికి ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కరోనా కాలంలో, తదనంతరకాలంలో స్వీయ సంరక్షణతోపాటుగా ఇతరులకు తనవల్ల హాని జరుగకూడదన్న భావనలు బలంగా బలపడాలి. అది కరోనాకే కాదు సమాజంలో పేరుకుపోయిన పలు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మందు అవుతుంది. కరోనా అనంతరకాలంలో ఎట్లుం టదో? మనిషిలో ఇప్పటి వరకు గూడుకట్టుకున్న అహంకారాలు, ఆధిపత్యాలు, ఒకర్ని మరొకరు అణగదొక్కాలన్న తొక్కిసలాటలన్నీ వదిలేస్తారా? ఎక్కువ తక్కువల్లేని సమానగీతలు గీసుకుంటూ పోతారా? కరోనా అనంతరం సినిమా థియేటర్లు ఎట్ల నడుస్తయ్, బస్సులెట్లా తిరుగుతయ్, రైళ్లలో సీట్లెట్లుంటయ్, విమాన ప్రయాణాల్లో మొత్తం లగ్జరీ సీట్లే ఉంటాయా? కరోనా అనంతరం మనిషికి మనిషి ఎంతెంతదూరం? వివాహవేదికపై వధువు, వరుడూ మధ్య ఉండాల్సిన దూరం ఎంత? సామూహిక, సహపంక్తి భోజనాలు ఉంటాయా? తూఫాన్ జీపులో డైలీఫ్యాసింజర్స్ ఎంతమంది? ఆటో త్రీసీటరా! వన్ సీటరా?! తిరుపతి వెంకన్న దగ్గర భక్తుల మధ్య దూరం ఎంతెంత? బహిరంగసభలుంటాయా? సమ్మక్క సారలమ్మ మహాజాతరలో మళ్లీ జనం పోటెత్తుతారా? బావర్చీ, ప్యారడైజ్ హోటళ్ల దగ్గర బిర్యానీ క్యూలెట్లుంటాయో? కేసీఆర్ చెప్పిండు ఇక కలవారైనా పేదవాళ్లైనా ఎవరైనా గాంధీ దవాఖానకే!! కరోనా ఖతమైనా అది ప్రపంచాన్ని వెంటాడి వేటాడిన సందర్భాన్ని మనిషి మరిచిపోకూడదు. మనిషి ప్రకృతిని కాపాడుకోవాలి. స్వచ్ఛమైన గాలిని, నీటిని కాపాడుకోవాలి. లేకుంటే కొంతకాలానికి మరో కరోనా కనిపించే రూపమెత్తి ఏదీ మిగల్చకుండా మహా విధ్వంసం చేయవచ్చు. ఇది ఒకర్ని ఒకరం నిందించుకునే కాలం కాదిది. వలసకార్మికుల లెక్క దేశంలో ఎవరిదగ్గరా లేదు. దాన్నేం చేస్తాం? ఉన్నంతలో పాలనా యంత్రాంగాన్ని కదిలించి సాయం అందిస్తున్నారు. ఈ సమయంలో ప్రజల్లో అభద్రతను పెంచకూడదు. చేతనైన సహాయం చేయాలి. పేదలకు సహాయం అందేటట్లు చూడాలి. కరోనాకాలంలో కూడా అభద్రతా భావాన్ని కల్గించే ఇలాంటి మనస్తత్వాన్ని మార్చలేకపోయింది అదే పెద్ద విషాదం. ఈ తాళాలు తీశాక / పరిపూర్ణ మానవుని కోసం తలుపులు తెరవాలి / కొత్త వెలుగు కిరణాల నుంచైనా / బుద్ధులు క్రీస్తులు పుట్టకపోతారా అని చిన్న ఆశ../ దూరాలను దగ్గర చేసే సూదిమందు కావాలిపుడు / ఇప్పుడిక మనిషిని మనిషి ప్రేమించే / టీకా కనుక్కోవాలి. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
చిరస్మరణీయుడు మన సంజీవయ్య
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య (1921–1972). ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1960లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడినప్పుడు ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పదేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనుడు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లలో దాదాపు 20 ఏళ్లు వివిధ శాఖల్లోనూ ఆయన పనిచేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన డి. సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు. భూమిలేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పంపిణీ, వృద్ధాప్య పెన్షన్లు, దేశం లోనే మొదటిసారి బాలికలకు సాంకేతిక విద్య అందించే దిశగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల స్థాపన, చర్మకారుల సంక్షేమం దృష్ట్యా లిడ్క్యాప్ ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు వంటివి ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. స్పెక్యులేషన్ మూలంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు పెరగకుండా అరికట్టడానికి ప్రభుత్వపరంగా రెండువేల ఎకరాల భూమిని క్రయం చేసి, కొత్త పరిశ్ర మల ఏర్పాటుకు సుగమం చేశారు. కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఏర్పాటుతో యాజమాన్యాలు–ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా సంజీవయ్య చేసిన కృషి ఎనలేనిది. ఆ మోడల్ తర్వాతి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసే విధంగా దోహదపడటం విశేషం. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి సాంఘిక న్యాయానికి బాట వేశారు సంజీవయ్య. షెడ్యూల్డు కులాలు, జాతులు, వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు పెంచుతూ (14 నుండి 17 శాతం షెడ్యూల్డు కులాలకు; 24 నుండి 38 శాతం వెనుకబడిన తరగతులకు) తీసుకున్న నిర్ణయం ఆ రోజుల్లో సంచలనాత్మకం. ఈయనకు బోనస్ సంజీవయ్యగా గుర్తింపు ఉండేది. అంతకుమునుపు ఏమాత్రం బోనస్ పొందని 45 లక్షల మంది కార్మికులకు బోనస్ అందేలా పార్లమెంట్ ద్వారా చట్టం తెచ్చిన సంజీవయ్య కార్మికవర్గాలకు గుర్తుండిపోతారు. వీరి పదవీ కాలంలోనే కార్మిక చట్టాలను జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి వర్తింపజేశారు. దిగుమతి చేయబడే ముడి సరుకులు గానీ, యంత్రభాగాలు గానీ అంతగా అవసరం లేని 29 పరిశ్రమలను గుర్తించి, లైసెన్స్ అవసరం లేకుండా చేశారు. డీ–లైసెన్సింగ్ ఉత్తర్వులను అప్పటి పార్లమెంట్ సభ్యులైన దివాన్ చమన్లాల్, అటల్ బిహారీ వాజ్పేయి మెచ్చుకున్నారు. చిన్న పరిశ్రమల మనుగడకై సంజీవయ్య అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. రాజకీయాల్లో నెగ్గుతూ వచ్చిన సాహితీవేత్త సంజీవయ్య. పద్యాలు, గేయాలు, పాటలు, స్తుతులు, కొన్ని నాటకాలు రాసి వాటిల్లో నటించారు కూడా. అఖిల భారత తెలుగు రచయితల మహాసభల్ని 1960 మే 6న హైదరాబాద్లో నిర్వహించిన గౌరవం సంజీవయ్యకే దక్కుతుంది. ఆ సభలో ‘మానవాభ్యుదయానికి భాషే ప్రామాణికం’ అని ఉద్బోధిస్తూ, ‘జై సరస్వతి’ అని తన ప్రసంగం ముగించారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక సెంటు భూమి, సొంత కారు, బ్యాంకు బ్యాలెన్సు కూడా ఉంచుకోని నిరాడంబర జీవి ఆయన. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు బేగంపేటలోని గ్రీన్ల్యాండ్స్ అతిథి గృహమే ఆయన అధికారిక నివాసం. అక్షర జ్ఞానం లేని సాదాసీదా ప్రజానీకం తనను కలవడానికి వస్తే, తన పీఏ చేత వారి కాగితాల్ని రాయించి, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు ఎంతో సంతృప్తి కలిగించేది. 1972 మే 8న ఆకస్మికంగా ఆయన ఢిల్లీలో కన్ను మూశారు. వేద మంత్ర పఠనంతో, వైదిక పద్ధతిలో పాటిగడ్డలోని నేటి సంజీవయ్య పార్కులో జరిగిన అంత్యక్రియలతో జీవనయాత్ర చాలించిన సంజీవయ్య మనందరి స్మృతి పథంలో ఎప్పుడూ మెదులుతుంటారు. డాక్టర్ శ్రీనివాసులు దాసరి వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ -
కొత్త కరోనా లోకం
చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుందన్నప్పుడు చూశాం ప్రపంచమంతా భయం గుప్పిట్లోకెళ్ళడం. స్కైలాబ్ ఏ ప్రాంతంలో పడుతుందో తెలి యక ప్రపంచంలోని ప్రజ లంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతకడం, ఎలాగూ చనిపోక తప్పదని భావించి కొంతమంది తమ తమ తీరని కోరికలు, చివరి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఆ సందర్భంగా చాలా చోట్ల మనుషులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం లాంటి విపరీత ధోరణులు ఎన్నో గమనించాము. చివరకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి ప్రాణనష్టం జరగకుండా స్కైలాబ్ను ఎక్కడో సముద్రంలో పడేలా చేయడంతో యావత్ ప్రపంచం ఊపిరిపీల్చుకుంది. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరొక్కసారి కరోనా రూపంలో ఒక మహా భయోత్పాతం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. మొదట్లో దీనిపట్ల ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం వహించినప్పటికీ ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఈ కనిపించని కణం మనిషి కళ్లలో భయాన్ని నింపింది. అంతేకాదు ప్రస్తుతం మానవాళి జీవిత గమనాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. పొద్దున లేచినప్పటినుండి మొదలు రాత్రి పడుకునే వరకు ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏమీ చేసినా కరోనా జపం తప్ప మరొక ధ్యాస లేని మరో ప్రపంచాన్ని సృష్టించింది. కరోనా సృష్టించిన ఈ కల్లోల లోకంలో పాత్రలు,పాత్రధారులు ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు మునుపెన్నడూ కానరాని ముఖ చిత్రాలను ఆవిష్కరిస్తున్నాయి. మిత్ర దేశాల శత్రుభావం, వైరి దేశాల మధ్య మిత్రభావం మొలకెత్తుతోంది. ఆర్థిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కరోనా ఉదంతం ముగిసిన తర్వాత భవిష్యత్తు వర్ధమాన దేశాలదే అని తేలుస్తుంటే, అగ్ర దేశాల మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒకరింటికి వెళ్లలేము, మనింటికి వచ్చే వారు లేరు, పుట్టిన రోజులు లేవు, బారసాలలు లేవు, పెళ్లిళ్లు లేవు, పేరంటాలు లేవు, చస్తే వెంట వచ్చే వాళ్లు కూడా లేరు. శంకుస్థాపనలు లేవు. ప్రారంభోత్సవాలు లేవు, రాజకీయ నాయకుల వెనుక, బడా నేతల వెనుక జై కొట్టడానికి జనాలు లేరు. అభివృద్ధి ఆగిపోయి వైరస్ వృద్ధిని ఆపడమే నేడు ప్రపంచ ప్రథమ కర్తవ్యమైనది. కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇప్పటివరకు చెప్పుకున్నదంతా నాణానికి ఒకవైపు.. మరి నాణానికి ఇంకోవైపు చూస్తే.. ఈ రోజుల్లో మనిషి కోరుకున్నవి, కావాలనుకున్నవి, దక్కనివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. రోజూ కాలంతో పోటీ పడి పరుగెత్తే మనిషికి దినమంతా కుటుంబంతో కలిసి వుండే అవకాశం వచ్చింది. ప్రశాంతతకు అర్థమే మరిచిపోయిన నగరారణ్యంలో హిమాలయ పర్వతాల్లో కూడా దొరకనంత ప్రశాంతత రాజ్యమేలుతోంది. వాతావరణ కాలుష్యం తగ్గింది, శబ్ద కాలుష్యం తగ్గింది, నేరాలు తగ్గాయి. ఇన్నాళ్లూ అందరూ మర్చిపోయి అటకెక్కి కూర్చున్న తీరిక ఒక్కసారి ఒళ్లు విదుల్చుకొని గడప గడపకి తిరుగుతోంది. తన ఆవశ్యకత ఏంటో తెలియ చెప్తోంది. తను లేక, తనను దూరం చేసుకున్న మానవాళి ఏమి కోల్పోతుందో అప్పుడప్పుడు తనను ఆశ్రయిస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, జీవితం ఎంత హాయిగా ఉంటుందో అనుభవించమని చెబు తోంది. ఒకవైపు విద్యార్థులు స్కూల్కి వెళ్లకుండానే పై క్లాస్కి ప్రమోట్ అవుతుంటే, ప్రభుత్వోద్యోగులు ఇంట్లో ఉండే జీతాలు తీసుకొంటుంటే.. మరోవైపు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేసి భారం తగ్గించుకుంటుంటే.. ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఇంకా ఎంతకాలం ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలో తెలియదు, తిరిగి యథావిధిగా మానవ జీవనం మనుగడ సాగిస్తుందా లేక ఇంతకు ముందెన్నడూ లేని కొత్త జీవన విధానం ఏర్పడుతుందా. ఏది ఏమైనా కరోనా మనిషిని కలలో కూడా ఊహించని ఒక కొత్త లోకానికి తీసుకెళ్లింది. డాక్టర్ రవిశంకర్ వ్యాసకర్త, ఈఎన్టీ స్పెషలిస్టు, ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్, కోఠి, హైదరాబాద్ మొబైల్ : 94407 68894 -
ప్రజారోగ్యానికి అడుగడుగునా అడ్డంకులు
ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన 35 లక్షల మంది పడగా, సుమారు రెండున్నర లక్షల మంది చనిపోయారు. అయినా ప్రపంచ దేశాలు మౌలిక అవసరాలైన విద్య, వైద్యాన్ని పక్కకు నెట్టి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచుతున్నాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) ప్రతి ఏటా మిలిటరీ కోసం ఆయా దేశాలు వెచ్చిస్తున్న ఖర్చులను వెల్లడిస్తుంటుంది. 2019లో ప్రపంచ దేశా లన్నీ లక్షా 90 వేల కోట్ల డాలర్లు వ్యయం చేశాయని నివేదించింది. కరోనాను ఎదుర్కోవటంలో విఫల మవటానికి ప్రధాన కారణం ప్రజారోగ్య వ్యవస్థను చిన్నచూపు చూస్తూ, ఆయుధాలకు పెద్దపీట వేయడ మేనని సిప్రీ నివేదిక ద్వారా అర్థమవుతోంది. 73,200 కోట్ల డాలర్లతో ప్రపంచ మిలిటరీ ఖర్చులో అమెరికా వాటా 38 శాతం. రెండవ స్థానంలో ఉన్న చైనా (26,100 కోట్లు) కంటే రెండున్నర రెట్లు, నాలుగో స్థానంలో ఉన్న రష్యా(6,140 కోట్లు) కంటే పది రెట్ల ఖర్చుతో అమెరికా జెట్ స్పీడులో ఉంది. 2018లో ఐదవ స్థానంలో ఉన్న మన దేశం 2019 నాటికి ఆయుధ పోటీలో మూడవ స్థానానికి చేరు కుంది. ప్రతియేటా వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. దాయాది పాకిస్తాన్ 1,030 కోట్ల డాలర్లు ఖర్చు చేసి 24వ స్థానంలో ఉంది. రష్యా ఐదు నుండి నాలుగో స్థానానికి రాగా, సౌదీ అరేబియా మూడు నుండి ఐదో స్థానానికి జారుకుంది. ముడిచమురు సంక్షోభంతో సౌదీ ఖర్చు తగ్గింది. కానీ తాను చేస్తున్న మిలిటరీ వ్యయంతో యెమెన్పై యుద్ద్ధం చేస్తూ అక్కడి ఆకలి చావులకు కారణమవుతున్నది. ఫ్రాన్స్ తరువాత ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ 4,930 కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చు చేస్తూ, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, అఫ్గానిస్తాన్కు తన సేనలను పంపిస్తు న్నది. 2020 మే 9 నాటికి ఫాసిస్టు హిట్లర్ జర్మనీ ఎర్ర సేనల చేతిలో ఓడిపోయి 75 ఏళ్లు. అయినా జర్మనీ చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోలేదు. 29 దేశాల రష్యా, చైనా వ్యతిరేక నాటో కూటమి ప్రపంచ మిలిటరీలో 54.5 శాతం ఖర్చు చేస్తోంది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యు.కె. వంటివి ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమిలోనే ఎక్కువ కరోనా మరణాలుండటం పరిశీలించాల్సిన అంశం. యుద్ధాలు, అంతర్యుద్ధాలతో వెనుకబాటుతనం, ఆకలి విలయతాండవం చేస్తున్నా ఆయుధ ఖర్చులు మాత్రం ఆపకుండా పెంచుకొంటున్నాయి ఆఫ్రికా దేశాలు. అవి 4,120 కోట్ల డాలర్లు వెచ్చించాయి. ప్రపంచ మిలిటరీ ఖర్చులో 13 శాతం వెచ్చిస్తే ప్రపంచంలో అలుముకొన్న దారిద్య్రం, ఆకలి కను మరుగు అవుతాయనీ, 4 శాతం ఖర్చుతో ఆహార భద్రత, 5 శాతంతో ఆరోగ్య అవసరాలు, 12 శాతంతో అందరికీ విద్య, 3 శాతం ఖర్చుతో శుభ్ర మైన నీరు, పరిశుభ్రత సాధ్యపడతాయనీ 2018లో ‘సిప్రీ’ తెలిపింది. కరోనా ఉద్దీపన చర్యల్లో భాగంగా అమెరికా 2,20,000 కోట్ల డాలర్లు ప్రకటిం చింది. దీనిలో సింహభాగం బోయింగ్ వంటి కార్పొ రేట్ కంపెనీలకే కేటాయించారు. నిరుద్యోగ భృతికీ, వైద్య బీమాకూ జమచేసింది బహుతక్కువ. అమెరికా మిలి టరీ వ్యయాల్ని అధ్యయనం చేసిన గ్లోబల్ కేంపైన్ ఎన్జీవో ఆసక్తికర విషయాల్ని తెలిపింది. 8 కోట్ల 90 లక్షల డాలర్లు ఖరీదు చేసే ఎఫ్ 35 యుద్ధ విమా నాల్లాంటివి మూడు వేలు కొంటుంది పెంటగాన్. ఒక్క విమానపు ఖర్చుతో ఒక సంవత్సరం పాటు 3,244 ఐసీయూ బెడ్స్కు అయ్యే ఖర్చును భరించవచ్చు. అదే జెట్ యుద్ధవిమానం ఒక గంట పాటు గాల్లో ఎగిరితే 44,000 డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ ధనంతో ఏడాది పాటు ఒక స్టాప్ నర్సుకు జీతం ఇవ్వవచ్చు. ఒక ‘ట్రైడెంట్ 2’ క్షిపణి ధర 3 కోట్ల 10 లక్షల డాలర్లు. ఈ మొత్తంతో కోటీ డెబ్బై లక్షల ఎన్ 95 మాస్కులు కొనవచ్చు. అమెరికా లాగా దేశాలకు దేశాలను దురాక్రమించడం లేదా ఇరుగుపొరుగు దేశాల్లో అలజడులను సృష్టించడం ధూర్త వైఖరి. ఇలాంటి జాఢ్యాలను దేశాలు తొలగించుకుంటే ఇంత తప్ప, ఈ సైనిక వ్యయానికి అడ్డుకట్ట ఉండదు. ప్రపంచ శాంతికై ఉద్యమించి, ఈ ఖర్చులను ప్రజా రోగ్యం వైపు మళ్లిస్తే కరోనా వంటి మహమ్మారులను సులభంగా ఎదుర్కోవచ్చు. బుడ్డిగ జమీందార్ వ్యాసకర్త ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరమ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ‘ 98494 91969 -
అట్టడుగు వర్గాలు, నిరుపేదలకు కనీవినీ ఎరగని ఇక్కట్లు
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అట్టడుగు వర్గాలను, నిరుపేదలను దారుణంగా దెబ్బతీసిందనడంలో సందేహమే లేదు. సమాజం ఏమాత్రం సిద్ధం కాకముందే ముందుజాగ్రత్త చర్యగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్తంభింపచేశారు. జాతీయ విపత్తులు, ఆకస్మిక ఘటనలు ఎదురైన సమయంలో ఆర్థిక అంతరాయాలు కలిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పనిచేస్తూ వచ్చింది కానీ లాక్డౌన్ మనం కనీవినీ ఎరుగనంత స్థాయిలో వచ్చిపడింది. పెద్ద నోట్ల రద్దు సృష్టించిన ప్రకంపనల సమయంలో కానీ, జీఎస్టీ విధింపుతో వచ్చిన అంతరాయాల సమయంలో కానీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యక్తిగత గృహరుణాలు అత్యంత అధిక స్థాయికి చేరుకున్నాయి. పొదుపులు కూడా దారుణంగా పడిపోయాయి. నాలుగు కారణాల వల్ల అట్టడుగు వర్గాలు లాక్డౌన్ నేపథ్యంలో దారుణంగా దెబ్బతిన్నాయి. 1. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పేదప్రజలు తమ స్వస్థలాలకు తరలి వెళ్లలేకపోయారు. 2. అన్ని రంగాలపై ఒకే సమయంలో లాక్డౌన్ ప్రకటిం చారు. 3. సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగడంతో దిగువ తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే రుణ పరపతి మార్గాలు మూసుకుపోయాయి. 4. నిత్యావసర వస్తువులు పేదవారికి అందుబాటులో లేకుండా పోయాయి. ధరలు పెరిగి పోయాయి. దేశవ్యాప్తంగా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలపై ఒకే సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల దేశందేశమే స్తంభించిపోయింది. దీంతో పనికోసం వెతుక్కుంటూ వలసపోయే అవకాశం ప్రజలకు ఏమాత్రం లేకుండా పోయింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లాగా కాకుండా, అసంఘటిత రంగానికి సంబంధించి వాస్తవ గణాంకాలు మనకు అందుబాటులో ఉండవు. తాజా నివేదిక ప్రకారం దేశంలో హోటల్, పర్యాటక సంబంధిత రంగాల్లో ఏడు కోట్లమంది కార్మికులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారని తెలుస్తోంది. 85 శాతం కార్మికులు సంఘటిత రంగానికి వెలుపలే ఉండటంతో వీరి వేతనాలు, కూలీలు చెల్లించకుండా నిలిపివేశారు. మామూలు సందర్భాల్లో అయితే అట్టడుగువర్గాల ప్రజలు తమ పొరుగునే ఉన్న కిరాణా దుకాణాలు, ఇతర షాపుల్లో రుణం ప్రాతిపదికన లేదా నెల చివరలో చెల్లిస్తామనే ఒడంబడికతో నిత్యావసర వస్తువులు కొనుక్కునేవారు. అయితే నిత్యావసర సరుకుల రవాణా స్తంభించిపోవడంతో సరఫరాకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడినందున మొదట్లో కొద్ది రోజులు తప్ప చాలా ప్రాంతాల్లో అప్పుకు సరుకులు ఇచ్చే వెసులుబాటు లేకుండాపోయింది. ఇలా ఆదాయాలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో అట్టడుగు వర్గాల ప్రజలను లాక్డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపుగా సంఘటిత రంగంపై ఆధారపడటం, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే సామాజిక భద్రత లేకపోవడం వల్ల వీరికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ కారణం వల్లే పేద వర్గాలపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. అందుకే ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం నడిచిపోతున్న వలస కార్మికులకు సంబంధించిన దిగ్భ్రాంతి కరమైన దృశ్యాలను దేశం చూడాల్సి వస్తోంది. దేశంలోని విభిన్న వర్గాల ప్రజలపై ఈ సంక్షోభం ప్రభావం పూర్తి భిన్నంగా ఉంటోంది. రబీ పంట కోతల సమయంలో వలస కూలీలు ప్రయాణించడానికే వీలు లేకపోవడంతో గ్రామీణ వ్యవసాయ వేతనాలు పెరిగాయి. కూలీలు దొరక్కపోవడంతో లేబర్ ఖర్చు బాగా పెరిగింది. ఈ సంక్షోభంలో చిన్న స్థాయి వ్యాపారులు, అత్యవసరం కాని సేవారంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా దెబ్బతినిపోయారు. అట్టడుగువర్గాల నుంచి వచ్చిన కార్మికుల్లో ఎక్కువమంది వ్యవసాయ కూలీలుగానూ లేక వ్యవసాయేతర పరిశ్రమల్లో కార్మికులుగానూ ఉంటున్నారు. వీరిపైనే చాలా వరకు సంక్షోభ ప్రభావం కనిపిస్తుంది. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతినిపోయిన వారి సహాయార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘటిత బ్యాంకింగ్ రంగం నుంచి రుణాలను కనీసం రీ షెడ్యూల్ చేస్తే అట్టడుగు వర్గాలవారిని కాస్తయినా ఆదుకోవచ్చు. ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు ఒకేసారి రూ.10,000 మొత్తం కానీ లేక వడ్డీ లేని రుణాలు కాని ఇస్తే పేదవర్గాలు కొంతమేరకైనా కోలుకుంటాయి. అలాగే కరోనా ప్రభావం గురించిన జాగరూకతను ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంది. భౌతికదూరం, వ్యక్తిగత పారిశుధ్యం పాటించడం తప్పనిసరి. డా.ఎస్. సుధాకర్బాబు వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం హైదరాబాద్ యూనివర్సిటీ మొబైల్ : 94404 59464 -
ఇనుప గజ్జెల తల్లిని తరిమేదెలా?
ఓ మిత్రుడు ఫోన్ చేసి మరీ ఘోరంగా కరోనాలో కూడా మీరు వెనకబడిపోయారే... అని ఇగటమాడేడు. అది ఇగటమే...వెటకారం కాదు. ఆ మాటకు ముందు నవ్వొచ్చింది గానీ అది పెదవులు దాటి రాలేదు. నిజానికి ఊరందరిదీ ఒకదారి అయితే ఉత్తరాంధ్రాది వేరేదారి.. గతం నుండి వర్తమానందాకా! కానీ కరోనా పుణ్యాన విశాఖపట్నం ఊరందరి దారి పట్టింది, కరోనాని కావలించుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిపి ఉత్తరాంధ్రాగా పిలుస్తుంటారా... ఇపుడు విశాఖపట్నం మిగిలిన రెండు జిల్లాలతో జట్టు వొదిలేసింది. ఆశ్చిర్యమేటుందిరా బావూ విశాఖపట్నంల ఇపుడు ఉత్తరాంధ్రా వోళున్నారేటి? ఎప్పుడో తుంబాదుడ్డూ సర్దుకొని వలసలెళిపోనారు. అట్నించి గోదారి, కిష్ణా, నెల్లూరు గిల్లూరు నుంచి కమ్మాలు, రెడ్లు, రాజులు వొచ్చి విశాఖపట్నం నిండా చేరిపోనారు కాదేటి? ఎవుళో తప్పీతగిలీ ఉత్తరాంధ్రోళు విశాఖలో మిగిల్తే ... ఆళు మాత్రం యీళ తోటి విరోధం తెచ్చుకుంతారేటి? తెచ్చుకుంతే బతగ్గలరేటి? అక్కడ రోడ్లంట తిరగ్గలరా? అందిసేత విశాఖపట్నంల మిగిలిన్నోళు మన జట్టొదిలీసి పరాయోళ జట్టుల కలాల మరీ! కలిసినారు. అయితే మరి యీ రెండు జిల్లాల్లో జనాలు వలస పోకుండా అందరూ ఉండిపోయారా? లేదు. ఇక్కడనుంచీ ఏటా కనీసం యాభయి వేలమంది గ్రామాలనొది లేసి వలసపోతున్నారని గణాంకాలే చెప్తున్నాయి. అటు 510 కిలోమీటర్ల అటవీప్రాంతంలో సుమారు 500 రకాల ఔషధమొక్కలు, వీటికి తోడు కొండల్లో బాక్సైట్, గ్రానైట్, రంగురాళ్లు, వజ్రాలు వంటి అనేకానేక ఖనిజాలున్న ఆదివాసీ నేలనుంచి ఆరుగాలం రెక్కలు ముక్కలు చేయగలిగే కష్టజీవులు ఆదివాసీలు కూడా అడవినీ, కొండనీ వొదిలేసి విజయవాడ, హైదరాబాదు మొదలుకొని చెన్నయ్, బెంగళూర్, ఢిల్లీ, కలకత్తా ఉపాధినిచ్చే మహానగరాలెక్కడెక్కడికో వలసపోయేరు. ఇక మత్స్యకారులు కూడా సముద్రజలాల్లోనో, పరప్రాంతంలోనో చిక్కుకొనే వుంటారు. నగర జనకెరటాల హోరులో వారి ఆర్తనాదాలెవరికీ విన్పించవు! కొండలూ, అడవులూ, మారుమూల గూడేలూ, గ్రామాలున్నాయి. అక్కడకు ఏలినవారెప్పటికీ చేరలేరు గానీ యే రోగమయినా తొందరగా చేరుతుంది. ఏటా మలేరియా జ్వరాలకే రాలిపోయే అడవిబిడ్డలెందరో! విశాఖపట్నం నుండి ఇచ్చాపురం దాకా జాతీయరహదారి వెంట వీచే గాలికి రంగూ, రుచీ, వాసనా సృష్టించే కర్మాగారాలుం టాయి. అక్కడి కార్మికులుకి అంటని రోగముం డదు. తాగే నీటికోసం చెరువులూ, గెడ్డలూ ఆధారమైన పల్లెల్లో పలకరించే డయేరియా బంధువులెందరో పల్లెల్లో! కరోనా పుణ్యాన యివేవీ ఎవరికీ కన్పించటంలేదు. కరోనా ఫ్రీ జిల్లాలుగా ఈ రెండు జిల్లాలూ దేశం నోట్లో నానుతున్నాయి. రెండు జిల్లాల కలెక్టర్లనీ, రాజకీయనేతల్నీ పొగడ్తల్తో ముంచెత్తుతున్నారు. నిజమే.. యీ జిల్లాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో వీరు శ్రధ్ద చూపేరు. మాస్కుల పంపిణీ, మార్కెట్లలో క్యూలు, భౌతికదూరాన్ని పాటించడం, గ్రామవాలంటీర్లను వినియోగించడం, వైద్యసిబ్బందిని నియోగించడం వంటి అనేక చర్యలు అందరికంటే బాగా చేసివుంటారు. ఇవన్నీ యీ రెండుజిల్లాల్లో వలసబోకుండా వుంటోన్న జనాభాకు అందించిన సేవలు! కానీ వలసబోయిన వారి సంగతో..? కొంతమంది లాక్డౌన్ ప్రకటించగానే బయల్దేరి మధ్యదోవలో చిక్కుకున్నారు. వాళ్లను మధ్యలో పోలీసులు ఆపేసి... క్వారంటైన్లలో పెట్టేరు. ఎక్కడెక్కడో దోవల్లో చిక్కుకున్న యీ రెండుజిల్లాల పేద గుండెలెన్నెన్నో...! ఒకపక్క కరోనా ఫ్రీ అంటూ అధికార్లూ, ప్రసారసాధనాలూ ప్రచారం చేస్తుంటే యింకోపక్క కరోనా ఫ్రీకి కారణాలను కొన్ని యూనివర్సిటీలు పరిశోధించినాయనీ... ఈ రెండు జిల్లాలు తినే పిండొడియం, అంబలీ, గంజీ కారణాలంటూ వ్యంగ్యాస్త్రాల ప్రసారాలు! ఇక్కడ ఈ రెండుజిల్లాల్లో వున్నవారితో మాత్రమే గణించి వలసపోయిన అశేషజనాన్ని గణించకపోవడం సమంజ సంగా వుంటుందా? అపార్ట్మెంట్లూ, భవంతులూ, కోలనీలూ చప్పట్లు కొట్టేయి, దీపాలు ఆర్పేయి. కానీ అనేక గృహాల్లో కరోనా కంటే భయంకరమైన ఇనుపగజ్జెల తల్లి తిరుగాడుతోంది. ఈ తల్లిని తరి మేదెలా..? వలసపోయిన బిడ్డల్ని కాపాడేదెలా అని రెండుజిల్లాల గూళ్లల్లో గుండెలు కొట్లాడుతున్నాయి మిత్రమా! అట్టాడ అప్పల్నాయుడు వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు ‘ 94400 31961 -
గోవింద నామస్మరణే దివ్యౌషధం
కరోనా పంజాతో యావత్ ప్రపంచం విల విల్లాడుతున్న సంక్లిష్ట సమయమిది. మానవా ళికి పెనుసవాల్ విసిరిన కరోనా కరాళ నృత్యం ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఎటుచూసినా భయం ఆవరించిన వర్తమాన దృశ్యం విషాదం. మానవాళికి విపత్తులు, ప్రకృతి ప్రకోపాలు, అంటువ్యాధులు, తుపానులు, భూకంపాలు కొత్త కాదు. కానీ ప్రతి సందర్భం లోనూ ఈ ప్రకోపాలపై మనిషి విజయపతాక ఎగురవేస్తూనే ఉన్నాడు. వాస్తవానికి మనలాంటి అభివృద్ధి చెందు తున్న దేశాల్లో లాక్డౌన్ అనేది ఆర్థిక వ్యవస్థను ఎంతగా కుదేలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ విపత్తు వేళ మన ప్రజలు చూపుతున్న నిబ్బరం ప్రశంసనీయం. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంక్షోభ సమ యంలో ఎన్నో పారమార్థిక కార్యక్రమాలతోపాటు మానవసేవే మాధ వసేవ అనే సూక్తిని అక్షరాలా పాటిస్తూ సర్వేజనాసుఖినోభవంతు అనే సనాతన ధార్మిక ఆచరణను తు.చ. తప్పక పాటిస్తోంది. టీటీడీ ముందుచూపు కరోనా విపత్తును ముందుగా ఊహించి సరైన చర్యలు తీసుకోవడం లోనూ, భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడటం లోనూ టీటీడీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. మార్చి 17 నాటికే కరోనా సమస్యపై తగు చర్యలు తీసుకుంది. భక్తులు వేచి ఉండే పని లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 17 నుంచి టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లలో భక్తులు వేచి ఉండే పని లేకుండా నేరుగా అనుమతించారు. కొండపైన ప్రతి రెండు గంట లకోసారి అన్ని ప్రదేశాలను శానిటైజేషన్ చేయించింది. కరోనా నియం త్రణలో భౌతిక దూరం పాటించడం కీలకం కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంప్రదించి ఆయన సూచనల మేరకు టీటీడీ ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తు న్నట్లు మార్చి 19న టీడీడీ అధికారులు ప్రకటించారు. మార్చి 20 ఉదయం ఆర్జిత సేవా భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించి, కొండపై ఉన్న భక్తులందరికీ వీలైనంతవరకు దర్శనం కల్పించాక అందరినీ కొండనుంచి దింపివేశారు. ఆరోజు నుంచి తిరుమలేశుని సేవలన్నిం టినీ ఏకాంతంగా ఆగమోక్తంగా టీటీడీ నిర్వహిస్తోంది. అదే సంద ర్భంలో లాక్డౌన్ వేళ తిరుమలేశుని దర్శించుకోలేమనే చింత లేకుండా.. ప్రతిరోజూ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ద్వారా తిరుమలేశుని కల్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. తిరుచా నూరు అమ్మవారి కల్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు స్వామి అమ్మవార్ల దివ్యాశీస్సులు అందిస్తోంది. అలాగే లక్షలాది ప్రజలతో జరిగే ఒంటిమిట్ట శ్రీసీతారామస్వామి వారి కల్యా ణోత్సవాన్ని ఆలయప్రాంగణానికే పరిమితం చేసి, శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో భక్తజనులకు చూపగలిగాం. రోగాలను అరికట్టే యాగాలు! కరోనా విజృంభణ వేళ మానవజాతి సమస్తం ఈ గండం నుంచి గట్టెక్కాలని భావించిన టీటీడీ ఇందుకు వేదసారస్వతాన్ని అందులో పేర్కొన్న పరిష్కాకారాలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగాన్ని మూడురోజులపాటు తిరుమలలోని ధర్మ గిరి వేదవిజ్ఞాన పీఠంలో ఘనంగా నిర్వహించింది. కరోనా కట్టడికి శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జప యజ్ఞాన్ని తిరుమలలోని ఆస్థాన మండపంలో మార్చి 16 నుంచి 25వ తేదీవరకు వైభవంగా నిర్వహిం చింది. ఇందులో చతుర్వేదాలను, పంచశాఖలను, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేదపండితులు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞ మంత్రాలను పఠించారు. ఇక లోక క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించా లని భగవంతుడిని ప్రార్థిస్తూ యోగవాశిష్టం, శ్రీ ధన్వంతరి మహా మంత్ర పారాయణం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించారు. ఇందులో భక్తులు కూడా భాగస్వాములు కావడం విశేషం. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన పండి తులు చెప్పిన మంత్రాలను భక్తులు టీవీల ముందు కూర్చుని పఠి స్తున్నారు. ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రతిరోజూ ఉదయం 7 గంట లకు మొదలై 45 నిమిషాల పాటు ప్రసారమవుతోంది. మానవసేవే మాధవసేవ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తిరుపతి, పరిసర ప్రాంతాలలోని వేలాదిమంది నిరాశ్రయులకు, వలస కూలీలకు ప్రతినిత్యం 1,20,000 ఆహార పొట్లాలను అన్నప్రసాద విభాగం ద్వారా తయారుచేసి అందిస్తోంది. దీంతోపాటు గోశాలల్లో వేలాది గోవులను సంరక్షిస్తున్న టీటీడీ.. తిరుపతిలో సుమారు 500 వీధి కుక్కలకు ఆహారం సరఫరా చేస్తోంది. రోడ్లమీద తిరిగే పశువుల కోసం తిరుపతిలోని అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద తాత్కాలిక పశువులశాలను ఏర్పాటు చేసింది. రోజుకు సుమారు 3 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 300 కిలోల దాణాను టీటీడీ సరఫరా చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానములు తన ఆయుర్వేద పరిశోధన లలో భాగంగా కరోనా కట్టడికి ఐదు రకాల మందులు తయారు చేసింది. లాక్డౌన్ కారణంగా తిండిలేక అల్లాడుతున్న నిరా శ్రయుల కోసం అన్న ప్రసాదాలు తయారు చేస్తున్న టీటీడీ సిబ్బందికి ముందుగా వీటిని అందజేశారు. ఈమేరకు 200 మంది వంట సిబ్బందికి ఐదు రకాల మందుల పంపిణీ జరిగింది. వీటిలో ‘రక్షోజ్ఞ ధూపం’ (క్రిమిసంహారక ధూపం), ‘పవిత్ర’ (చేతులు శుభ్రపరచుకునే ద్రావకం), ‘గండూషకము’ (పుక్కిలించే మందు), ‘నింబనస్యము’ (ముక్కులో వేసుకునే చుక్కల మందు), ‘అమృత’ (వ్యాధి నిరోధక శక్తిని పెంచే మాత్రలు) తయారు చేసింది. కరోనాపై యుద్ధానికి 19 కోట్లు ఇక రాయలసీమలోనే పేరుగాంచిన స్పెషాల్టీ ఆసుపత్రి స్విమ్స్ను పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్పు చేసింది. స్విమ్స్ ఆవరణలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో రాష్ట్రస్థాయి కరోనా ఆసు పత్రిని ఏర్పాటు చేశారు. ఇందులో వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి కొను గోలుకు, వసతుల కల్పనకు 19 కోట్లు టీటీడీ మంజూరు చేసింది. కరోనా సహాయక చర్యల కోసం టీటీడీ ఆధ్వర్యంలోని తిరుచానూరులో గల పద్మావతి నిలయాన్ని, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీని వాసం, మాధవం విశ్రాంతి గృహాలు, రెండో సత్రం చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగానికి టీటీడీ అప్పగించింది. ఎస్వీబీసీ ద్వారా చైతన్యం తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ద్వారా శ్రీవారి కల్యాణోత్సవాన్ని, కొండపై జరుగుతున్న హోమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అలాగే కోవిడ్–19 నియంత్రణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సూచనలతో కూడిన కార్యక్రమాలను రూపొం దించి ప్రసారం చేస్తోంది. ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధించిన వేళ.. ప్రతిరోజూ తిరుమలేశుని దర్శించుకునే భాగ్యం ఈ చానల్ ద్వారా కల్పించగలుగుతున్నాము. మహమ్మారులపై మహాత్ముల పోరు! 1899 మార్చి నెలలో ప్లేగు వ్యాధితో కకావికలమైన కలకత్తా నగరంలో వివేకానందుడు యుద్ధప్రాతిపదికన ప్రజలను జాగృతం చేశారు. ప్రతి రోజూ 75 మంది మరణాలను చవిచూసిన కలకత్తా నగరం అనతి కాలంలోనే తేరుకోవడానికి ప్రధాన కారణం స్వామి వివేకానందుడు, సిస్టర్ నివేదితల ప్రణాళికాబద్ధమైన సేవే. ఇక ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిశుభ్రతకు, పెద్ద పీట వేశారు. 1927 జూలై 23న అహ్మదాబాద్ భారీవర్షాలతో తల్లడిల్లిపోయింది. దానికి తోడు ప్లేగు మహమ్మారి కూడా ప్రబలడం మొదలైంది. ఆనాడు అహ్మదాబాద్ మునిసిపాలిటీ శానిటరీ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వర్షాలు, ప్లేగు, అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పన్ను కట్టాల్సిందేనంటూ ఆంగ్లేయుల ఒత్తిడి, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పటేల్ ఎంతో నిబ్బరంగా వ్యవహరించి మారుమూల ప్రాంతాలకు సైతం వాలంటీర్ వ్యవస్థను విస్తరించి ఎవరెవరికి ఎటువంటి సాయం అవసరమో గుర్తించి వారిని సకాలంలో ఆదుకోగలిగే ప్రణాళికను పటిష్టంగా అమలు చేసి అందరనీ ఆశ్చర్య చకితులను చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సాధించిన ఈ ప్రయోజనం అప్పటి ప్రభుత్వాలను విస్మ యానికి గురిచేసింది. ఇదే సంప్రదాయాన్ని ఏపీ ప్రభుత్వం అద్భు తంగా అమలుచేస్తోంది. ఈరోజు మారుమూల పల్లెల్లో సైతం ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే వాలంటీర్ వ్యవస్థే కారణం. కోవిడ్ 19 బాధితులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలోనూ, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అందిస్తున్న సమాచారం కీలకంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దార్శనిక తకు వాలంటీర్ల వ్యవస్థ కలికితురాయి. నిత్యకల్యాణం పచ్చతోరణం నిత్యకల్యాణం పచ్చతోరణమనే నానుడికి ఏ మాత్రం భంగం కలగ కుండా తిరుమలను పచ్చతోరణంలా ఉంచటంలో టీటీడీ అమోఘ మైన కృషి చేస్తూనే ఉంది. గోవిందా అని ఎలుగెత్తి స్మరిస్తే చాలు ‘పంతమున నాతనిపై భారము వేసిన నింత ఉద్యోగములు గోవిం దుడే ఎఱగు’ అని అన్నమయ్య శ్రీవారి గుణరహస్యాన్ని వ్యక్తీకరిం చాడు. ఈ క్లిష్ట సమయంలో భక్తులు తమ మొరను స్వామి వారికి విన్న వించుకోవాలి. ఎందుకంటే ఆయన ‘చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రము. రోగాల నుంచి రక్షించే దివ్యౌషధము’. శ్రీనివాసుని వేడు కుంటూ మహర్షులు అందించిన వైదిక మార్గంలో శుచి, శుభ్రతలను పాటిస్తూ, సామాజిక దూరాన్ని ఆచరిస్తూ ‘గోవిందేతి సదా స్నానం.. గోవిందేతి సదా జపం.. సదా గోవింద కీర్తనం’గా మన జీవన సరళిని మార్చుకుంటూ భగవంతుడు ప్రసాదించిన జీవితానికి పరమార్థం తెలుసుకుని ఈ కష్టకాలంలో ఒక్కటిగా నిలుద్దాం. ఏడుకొండలవాడి దయతో కరోనాపై విజయం సాధిద్దాం. ఓం నమో వేంకటేశాయ. వై.వి. సుబ్బారెడ్డి వ్యాసకర్త అధ్యక్షులు, తిరుమల తిరుపతి దేవస్థానములు -
కరోనాపై కార్యాచరణ ఏది?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 1,32,000 దాటిపోయాయి. ఈ మహమ్మారి మీద పోరాడుతున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ పరిణామాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పెనుకుదుపులకు లోనయ్యింది. పారి శ్రామిక ఉత్పాదక, సేవా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, శ్రామిక వర్గాల ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశ ఆర్థిక వద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. పొరుగున ఉన్న చైనా, అమెరికా, ఇటలీ మొదలగు దేశాల దారుణ అనుభవాల నుంచి మన ఏలికలు ఏమి గ్రహించలేకపోయారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అమెరికాతో సహా అనేక అభివద్ధి చెందిన దేశాల్లో రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ పోతుంటే, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వంలోని వివిధ విభాగాల యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదు. మూడు వారాల లాక్డౌన్ వ్యవధిలో కూడ కరోనా వైరస్ నిర్ధారణ కిట్లు సమకూర్చుకోకపోవడం, కరోనా కట్టడిలో కీలక భాగస్వాములైన వివిధ విభాగాల ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా చికిత్సలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బంది అందరికీ సరిపడా వ్యక్తిగత రక్షణ సామాగ్రి (పీపీఈల) సమకూర్చడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నాటికి చైనా మన దేశానికి విరాళంగా ఇచ్చిన వాటితో కలిపి 2 లక్షలా 10 వేల పీపీఈ కిట్లు మాత్రమే అందుబాటులోనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి భారీ ఎత్తున పరీక్ష కిట్లు అందుబాటులో ఉంటే కానీ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఖచ్చితత్వం తేలదు. మన దేశంలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు ప్రతి 10 లక్షల మందిలో 1610 మందికి మాత్రమే. ఇంత తక్కువ సంఖ్యలో పరీక్షల ద్వారా కరోనా కేసుల వాస్తవ సంఖ్యను బేరీజు వేయడం దుర్లభం. కరోనా వైరస్ను సమర్థవంతంగా కట్టడి చేసిన చైనాలో వెయ్యి మంది జనాభాకు 1.8 వైద్యులు ఉంటే మనదేశంలో 0.62 వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇక నర్సింగ్ సిబ్బంది కొరత కూడ విపరీతంగా ఉంది. మన దేశంలోని మొత్తం జనాభాలో 40 కోట్ల మంది దాకా రోజు కూలీలు కావడం గమనార్హం. ఇళ్ళలో పని వారు, భవన నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు, ఇండ్లలో పని వారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 23 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలోని 25 వేల చిన్న, మధ్యతరహాపారిశ్రామిక యూనిట్లు లాక్డౌన్ కారణంగా మూతపడటం జరిగింది. దీనివల్ల 7.50 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్మికులు కరోనా భయంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. మన ప్రధాని మోడీ ప్రపంచ దేశాల్లో పరిణామాలని చూస్తూ కూడా కరోనా వైరస్ విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఒక ప్రణాళిక లేకుండా లాక్డౌన్ ప్రకటించారు. 130 కోట్ల జనాభాలోని 90 శాతం ప్రజల జీవనశైలి, బతుకుతెరువు చిధ్రమైంది. తాజాగా ఏప్రిల్ 20 తేది నుంచి అమలయ్యే సడలింపు వల్ల ఆర్థిక వద్ధి రేటులో అద్భుతాలు సంభవిస్తాయి అనుకోవడం భ్రమే. దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి, చెల్లాచెదురైన కార్మికులు మళ్లీ తాము పని చేసే చోట్లకు రావడానికి సమయం పడుతోంది. ఇదిలా ఉండగా కొన్ని సేవా రంగాల్లో వారికి కరోనా ‘జంకు’ అడ్డుపడుతోంది. ముఖ్యంగా ఇండ్లలో పని చేసే వాళ్ళకి ఒక పెద్ద అవరోధంగా నిలుస్తుంది. ఈ విధంగా కోట్లాదిమంది కార్మికులకు ఉపాధిపై కరోనా మహమ్మారి నీలి నీడలు వెంటాడుతాయి. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని దేశంలో 120 కోట్లకు పైగా ఉన్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకోవడానికి పకడ్బందీ ఆర్థికసహాయ ప్రణాళికను ప్రకటించాలి. భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సేవలను విస్తతం చేయాలి. ఈ సందర్భంగా రాజకీయ అభిప్రాయాలకు తావు లేకుండా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా విపత్తు మీద తక్షణం కార్యాచరణ రూపొందించాలి. జూలకంటి రంగారెడ్డి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మొబైల్ : 94900 98349 -
సమర్థ భావ ప్రసారం.. ఇప్పుడు ప్రాణావసరం!
అర్థవంతమైన కమ్యూనికేషన్ మంచి కాఫీ లాంటిది. ఎందుకంటే, ఆ తర్వాత అది నిద్రపోనివ్వదని పాశ్చాత్యుడన్నా, నిత్య సంచలనశీలికి నిద్రలో కూడా నిద్రపట్టదని మన కవులన్నా అవి ప్రజాభిప్రాయానికి మూలమైన కమ్యూనికేషన్ ప్రభావానికి దర్పణం పట్టే మాటలే. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి అభినందపూర్వకంగా కొట్టిన చప్పట్లు, సకారాత్మక భావోద్వేగాలు వెల్లివిరియడానికి వెలిగించిన దీపాలు ఒక వ్యక్తి మదిలో ఆలోచనగా అంకురించి, చిగురించి, మొగ్గతొడిగి, వికసించి అద్భుతమైన భావప్రసారం ద్వారా కోట్లమంది భారతీయులను కర్తవ్యోన్ముఖులను చేశాయి. యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్ వల్ల మానవాళి ప్రాణభయంతో బిక్కుబిక్కున బతుకుతున్న సమయాన ప్రభావశీలమైన ’కమ్యూనికేషన్’ గురించి మాట్లాడుకోవడం సముచితం. విద్యావిషయకంగా చూస్తే విస్తృతార్థంలో కమ్యూనికేషన్ నాలుగు రకాలుగా ఉంటుంది. అవి: ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ (వ్యక్తి మనసు లేదా మస్తిష్కం లోలోపల జరిగేది), ఇంటర్ పర్సనల్ (ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది), గ్రూప్ (ఒక సమూహపు సభ్యుల మధ్య), మాస్ (జనబాహుళ్యానికి ఉద్దేశించినది). కరోనా కరాళనృత్యం నేపథ్యంలో, ఈ నాలుగు రకాల కమ్యూనికేషన్ ప్రక్రియలను వినియోగించుకోవడం ద్వారా మన శారీ రక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు మన కుటుంబం, సమాజం భయాందోళనల నుంచి బైటపడి మహమ్మారిపై పోరాటంలో విజ యం సాధించడానికి ఉపకరించవచ్చు. ఈ లాక్డౌన్ తెచ్చిన ఖాళీ సమయంలో ఎప్పుడేమి ఉపద్రవం సృష్టిస్తుందో తెలియని మందులేని కరోనా, ధనిక దేశాల్లో సైతం పిట్టల్లా రాలుతున్న జనం, మనదగ్గరా పెరుగుతున్న కేసుల సంఖ్య అందరినీ లోలోపల భయంకరంగా వణికిస్తున్నాయి. అంబులెన్స్ వచ్చినట్లు, ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రికి తీసుకుపోయినట్లు, అయినవారికి దూరంగా 14 రోజులు ఆసుపత్రిలో ఉన్నట్లు, వైద్యుల ప్రయత్నాలు విఫలమయినట్లు, ఒకరిద్దరి మధ్యనే అంటరానివాడిగా అంతిమ సంస్కారం జరిగినట్లు...వివిధ భావనలు మస్తిష్కంలో రీలులా తిరగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చావు భయం అధికంగా ఉన్నవారికి కరోనా లాంటి పరిస్థితులు మరీ ప్రమాదకరంగా పరిణమించి లేనిపోని రుగ్మతలకు దారితీస్తాయి. అందుకే, ఇలాంటి సమయాల్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండకపోవడం మంచిది. పుస్తక పఠనం, సంగీతం, నాట్యం వంటి ఇష్టమొచ్చిన వ్యాపకంపై దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలి. విపరీతమైన నెగెటివ్ వార్తల ప్రభావంతో మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటే...తమ అత్యంత సన్నిహితులతో వాటిని పంచుకుని వారి నుంచి ఊరట పొందవచ్చు. ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ, శూన్యంలోకి చూస్తూ గడపడాన్ని ఈ సమయంలో తేలిగ్గా తీసుకోకూడదని నిపుణులు సూచి స్తున్నారు. ఒక వ్యక్తి దగ్గర మొదలైన సమాచారం ఒకరి నుంచి మరొకరికి, అక్కడినుంచి మరొకరికి వెళ్ళేసరికి భావ, అర్థ, తాత్పర్యాలు మార్చుకుని వేరే రూపు సంతరించుకుంటుందని కమ్యూనికేషన్ పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా, చాట్ చేసుకున్నా అప్రయత్నంగా కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వస్తున్న భయానక సమాచారంతో ఉన్న మనం అప్రయత్నంగా ఆ సమాచారం మన మిత్రుడితో, సహచరుడితో పంచుకోవాలనుకుంటాం. మనవల్ల వేరే వాడిలో నిస్పృహ పెరగకూడదన్న నియమం పెట్టుకుంటే ఏ చింతా ఉండదు. కరోనా వ్యాప్తికి ఒక మతాన్ని తప్పుపట్టడం, వదంతులు వ్యాపింపజేయడం వంటి విద్వేషకారక భావాలను టెలిఫోన్ లేదా సోషల్ మీడియా మాధ్యమంగా సంభాషణ చేసేవారు విశాల సమాజ హితం దృష్ట్యా మొగ్గలోనే తుంచివేయాలి. గ్రూప్ కమ్యూనికేషన్తోనే విప్లవాలు వచ్చాయి. సరైన సమయంలో సరైన పదాలతో మాట్లాడే శక్తిసామర్థ్యాలు ఉన్నవారు సమాజంలోని వ్యక్తులను శక్తులుగా మలిచారు, కర్తవ్యోన్ముఖులను చేశారు. ఇప్పుడు వాట్సాప్, పేస్బుక్ వంటి మాధ్యమాల వల్ల గ్రూపులు కట్టడం తేలికైపోయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, కాలేజ్మేట్స్, కొలీగ్స్తో పాటు ఒకే అభిరుచి ఉన్నవారు సైతం ఒక గ్రూపుగా ఏర్పడి నిరంతరాయంగా భావ విని మయం సాగిస్తున్నారు. గ్రూప్ మొత్తానికి ఉత్తేజపూరితమైన, ఉత్సాహకారకమైన, ఉల్లాసభరితమైన సమాచారం పంచుకోవడం అభిలషణీయం. సకారాత్మక ఒక ఆలోచన లేదా ఒక సృజనాత్మక కథనం మొత్తం గ్రూపు సభ్యుల మనసుకు ఊరట కలిగించవచ్చు. పెను విషాదాన్ని మానవాళి మౌనంగా భరిస్తున్న దుర్భర రోజులివి. ఈ కాలంలో తిమిర సమానమైన నిరాశానిస్పృహలను పారదోలి విషాదంలో మునిగి ఉన్న ప్రజలకు వెలుగు దివ్వెలు చూపాలనే సత్సంకల్పం ముఖ్యం. అందుకే తెలం గాణ ముఖ్యమంత్రి ప్రజల కోసం రచనలు చేయండని కవిలోకాన్ని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఇప్పటికే పత్రికల్లో, సోషల్ మీడియా వేదికల్లో అనేక కవితలు జనం ముంగిటికి వచ్చాయి. కళాకారులు రాగయుక్తంగా ప్రజలకు బోధలు చేస్తూ, సంఘ సేవకులను ప్రస్తుతిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈ కరోనా కాలంలో మంచి రచనలు జన బాహుళ్యానికి ఉత్సాహం, ఉత్తేజం ఇస్తాయి. ఈ వైరస్ మిగిల్చే విషాదం ఇంకా కొన్ని నెలలు ఉంటుంది. మంచి సాహిత్యం అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క మంచి మాట వెయ్యిన్నొక్క మస్తిష్కాలకు ఉత్ప్రేరకమని అంటారు. కరోనా పీడిత పలు దేశాల్లో ప్రజల మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిని, భీతావహులైన సున్నిత మనస్కులను ఆత్మహత్యలవైపు పురికొల్పుతున్నదని వస్తున్న బాధాకర వార్తల నేపథ్యంలో విద్యావంతుడైన ప్రతి వ్యక్తీ బాధ్యతతో ఈ నాలుగు రకాల భావ ప్రసరణ విధానాలను సమాజ సాంత్వన సాధనాలుగా వాడుకోవాలి. బాధ్యతాయుతమైన భావ ప్రసారం....ఇప్పుడు తక్షణావసరమే కాదు ప్రాణావసరం కూడా. డాక్టర్ ఎస్.రాము వ్యాసకర్త అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో శిక్షకుడు -
మందులు దొరక్క ఎన్ఆర్ఐల ఇక్కట్లు
అమెరికాలో ఎన్నారైలు ఎప్పుడూ ఎదురుచూడని సంక్లిష్ట స్థితిని నేడు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న ఎన్నారైలు ఎక్కువమంది 35–45 ఏళ్ల వయస్సులోని వారే. దాంతో వారు తమకు తోడుగా తల్లిదండ్రులను, అత్తమామలను అమెరికాకు పిలిపించుకోవడం మామూలే. విజిటర్స్ వీసా మీద వారు వచ్చి ఆరునెలలు తమ పిల్లలకు సహాయంగా ఉంటూ ఇండియాకు వెళుతుంటారు. తాము ఉండే కాలానికి తగ్గట్టుగా షుగర్, బీపీ, ఇతర మందులను వారు భారత్ నుంచి తమతో తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ అమెరికాను అష్టదిగ్బంధనం చేయడంతో వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. లాక్డౌన్తో వారు ఇండియాకు వెళ్ళలేని పరిస్థితి. అమెరికాలో ఉందామంటే తెచ్చుకున్న మందులు అయిపోయి మందులకోసం వారు పడుతున్న కష్టాలు చెప్పనలవి కావు. టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ తది తర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో తెలుగువాళ్ళు ఉన్నారు. తాము ఉండాల్సిన కాలానికి తెచ్చుకున్న బీపీ, షుగర్, ఇతర మందులు అయిపోవడంతో ఆ మందులకోసం వారు పడరాని కష్టాలు పడుతున్నారు. మామూలు సమయాల్లో ఇలాంటివారు ఇండియా నుంచి వచ్చేవారితో, లేదా తెలిసినవారి ద్వారా ఇండియానుంచి మందులను తెప్పించుకుంటారు. కానీ, లాక్డౌన్ వేళలో ఇండియా నుంచి మందులు వచ్చే పరిస్థితి లేదు. అమెరికాలోనే మందులు కొందామంటే తమ వల్ల కావడం లేదని పలువురు తల్లిదండ్రులు, అత్తమామలు వాపోతున్నారు. ఎందుకంటే భారతదేశంలో లాగా వీధి చివర ఉన్న మందుల షాపుకు వెళ్ళి తీసుకుని వచ్చేంత ఈజీగా అమెరికాలో కుదరదు. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. పేషెంట్కు మందులు ఇవ్వాలని డాక్టర్ ఇచ్చే ప్రిస్కిప్షన్తోపాటు, వాళ్ళు ఎంౖMð్వరీలు చేసిన తరువాతనే మందులను ఇస్తారు. ఎవరైనా ఫార్మసీ షాప్కు వెళ్ళి తమ డాక్టర్ ఇచ్చిన చీటి చూపగానే వాళ్ళు డాక్టర్ ఎవరో నిర్దారిం చుకుని ఎన్పీఐ (నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్) నెంబర్ అడుగుతారు. అలాగే డీఈఏ (డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ) నెంబర్ అడుగుతారు. ఇప్పుడు తెలుగువారికి సహాయం చేయడంకోసం ముందుకు వచ్చిన డాక్టర్లు కూడా ఒక్కో ఫార్మసిస్ట్తో మాట్లాడి, ఒక్కో కేసు విశదీకరించేందుకు సమయం చాలడం లేదు. దానికితోడు ఆ ఫార్మసిస్ట్ను ఒక్కో కేసుకు సంబంధించి కన్విన్స్ చేయడం కుదరడం లేదు. ఈ విషయంపై శాండియాగోలో వున్న హైదరాబాద్ వాస్తవ్యులు పాలకోడేటి ప్రభాకర్, ఉష దంపతులు మాట్లాడుతూ తాముతమ కుమార్తె స్వాతి దగ్గరకు వచ్చామని, తిరుగు ప్రయాణం అనుకున్నట్టుగా ఏప్రిల్ నెలలో వెళ్ళలేమని, తమ మందులు అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డల్లాస్లో తెలుగు వారికి సుపరిచితులైన డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ మాట్లాడుతూ వ్యక్తిగతంగా చాలా ఏళ్లుగా తనకు తెలిసిన తెలుగువారి తల్లిదండ్రుల మెడికల్ అవసరాలకు సహాయపడుతూ ఉంటానని, ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ సమస్య పెద్దది అయ్యిందని, ప్రతి పట్టణంలో తనలాంటి డాక్టర్లు కలిసి కొంతవరకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఫిలడెల్ఫియాలో నివసిస్తున్న నాగరాజు నలజుల మాట్లాడుతూ చాలామంది తెలుగు వారు తమ ఇంటిలో వున్న పెద్దవారి మెడికల్ అవసరాలకు సహాయం కోసం వస్తున్నారని, మా పట్టణంలోనే వున్న డాక్టర్ ప్రమీల నాయుడుగారు వారికి సలహాలు ఇస్తున్నారని, ఆవసరం అయితే పేషెంట్గా గుర్తించి వైద్య సదుపాయాలు కూడా చేస్తున్నారని తెలిపారు. బే ఏరియాలో వున్న తానా ఉపకోశాధికారి వెంకట్ కోగంటి మాట్లాడుతూ అమెరికాలో వచ్చిన విజిటర్స్ తగిన ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా మెడికల్ సౌలభ్యం పొందటం కష్టమే కాకుండా చట్టరీత్యా తప్పు కూడా కనుక తెలుగువారు ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలి అన్నారు. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ, ఒకట్రెండురోజుల్లో ఒక డాక్టర్ ప్యానెల్ ఏర్పాటు చేసి వారిని ఈ–మెయిల్ ద్వారా సంప్రదించే ఏర్పాటు చేస్తామని, అప్పుడు ఆ డాక్టర్లు కూడా వారి ఫ్రీ టైమ్లో వారికి వచ్చిన ఈ–మెయిల్ చూసి ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులను గుర్తించి వారికి ఈ– మెయిల్ ద్వారా జవాబు ఇస్తారని చెప్పారు. అప్పుడు ఎవరికి వారు తమ దగ్గరలో ఉన్న ఫార్మసిస్ట్ దగ్గరకు వెళ్లి ఆ మందులు కొనుక్కొని వారి తల్లిదండ్రులు, అత్తమామలను వీలున్నంతవరకు అటెండ్ కావచ్చని పరమేష్ భీంరెడ్డి తెలిపారు. చెన్నూరి వేంకట సుబ్బారావు వ్యాసకర్త సంపాదకులు, తెలుగుటైమ్స్ పత్రిక, అమెరికా -
గరిమెళ్ల గర్జనకు వందేళ్లు!
గాంధీ పిలుపుతో ఉధృతంగా సాగుతోన్న సహాయనిరాకరణోద్యమ సమయంలో ఉద్యమకారుల గళాలు గర్జించిన ‘మాకొద్దీ తెల్లదొరతనం...’ గీతానికి వందేళ్లు! జాతి యావత్తుకీ ఉద్యమ గీతమందించిన గరిమెళ్ల సత్యనారాయణ రాజకీయోద్యమ రచయిత! సాహిత్యాన్ని సామాజిక అభ్యున్నతికి వినియోగించాలనే లక్ష్యాన్ని కలిగిన రచయిత! స్వాతంత్య్రోద్యమ సందర్భాన రాసిన ‘స్వరాజ్యగీతాలు’ (1921), ‘హరిజన పాటలు’ (1923) వంటి గీతాలు ఉత్తేజాన్ని రగిలించాయి. దాంతో గరిమెళ్లను తెల్లదొరలు నిర్బం ధానికి గురిచేశారు. కేవలం ‘మాకొద్దీ తెల్లదొరతనం...’ గీతాలాపన కలిగించే ఉద్రేకాన్నీ, ఉత్తేజాన్నీ స్వయానా విని గ్రహించిన ఆంగ్లేయ అధికారి, తెలుగుభాష తెలియని తననే యింతటి సంచలనానికి గురిజేస్తే, భాష తెలిసిన ప్రజలనింకా సంచలనానికి గురిజేసి ఉద్యమోన్ముఖులను జేస్తుందని రాజద్రోహనేరం ఆరోపించి గరిమెళ్లను ఏడాది పాటు జైల్లోకి నెట్టారు. జైలులో వున్నపుడే గరిమెళ్ల తండ్రి, తాతయ్య, భార్య మరణించారు. జైలులోనున్న గరిమెళ్ల ఈ విషాద సందర్భంలోనయినా పెరోల్పై విడుదల కోసం, క్షమాభిక్ష కోరడం వంటి చర్యలకు దిగజారలేదు. జాతీయోద్యమం ఉధృతంగా ఉన్నపుడు ప్రజలను ఉత్తేజపరచడానికి ఉపయోగపడే పాటలను రాసిన గరిమెళ్ల ఉద్యమం నెమ్మదించినపుడూ, స్వాతంత్య్రం సిద్ధించాక ప్రజలను ఆలోచింపచేయ డానికి వ్యాసరచనలు చేశాడు. రాజకీయాలను ప్రభావితం చేసే ఆర్థిక పరిస్థితుల గురించి, జస్టిస్పార్టీ, స్వరాజ్యవాదుల గురించీ ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు గరిమెళ్ల తన భావాలను వెల్లడించారు. అభ్యుదయకర భావావేశం, రష్యా కమ్యూనిజంపట్ల అనురక్తీ వుండినా భారతదేశానుకూల కమ్యూనిజం కావాలనడం, దేశాన్ని అభివృద్ధి చేయడానికి ‘అవతారమూర్తి దిగిరావాలనడం’ వంటి భావాల పరిమితి గరిమెళ్ల వ్యాసాల్లో కన్పించినా ఆయన నిబద్ధ ప్రజా పక్షపాత రాజకీయ రచయితే! రాజకీయ సంబంధ అంశాలతో పాటు కథ, నవల, భాషా పరిణామం వంటి సాహిత్యాంశాల మీద కూడా అనేక రచనలు చేశారు. గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, ఆనందవాణి, ఢంకా, ఆంధ్రప్రభ నుంచి భారతి దాకా అనేక పత్రికల్లో గరిమెళ్ల రచనలు ప్రచురణ అయ్యాయి. తమిళంలోని ‘తిరుక్కుళ్’, ‘నందియార్’ లనూ; కన్నడలోని ‘తళ్లికోట’ రచననూ తెలుగులోకి అనువదించారు. భోగరాజు పఠాభి సీతారామయ్య గారి ‘ఎకనమిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ రచనను తెలుగులోకి అనువదించారు. తనకూ, తనతో మిగిలిన తల్లి, చెల్లెలకూ పట్టెడన్నం పెట్టలేక స్వగ్రామాన్ని వదిలి వెళ్లాల్సిన సందర్భంలో కూడా సాహిత్యం కోసం తాతలనాటి ఇంటిని అమ్మేసి ‘శారదా గ్రంథమాల’ స్థాపిం చారు. రచనారంగం, రాజకీయభావజాలం కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగం, గుమస్తా ఉద్యోగం కోల్పో యేరు. తర్వాత జీవికకోసం చిన్నచిన్న నౌకరీలు చేశారు. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిం చారు. బతుకుతెరువు కోసం చివరికి బిచ్చమెత్తు కొని జీవించారు. తన గళాన్నీ, కలాన్నీ దేశాభ్యుదయానికే వినియోగించిన ఆ మహనీయుడు 1952 డిసెంబర్ 18న మద్రాస్లో మహానగరంలో అనామకుడిగా మరణించాడు. గరిమెళ్ల జాతికి అందించిన ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ ఉద్యమగీతానికి వందేళ్లు! స్వాతంత్య్రోద్యమంలో ఏ ఆశయాలతో, ఆకాంక్షలతో గరిమెళ్ల వంటి అనేకులు త్యాగాలు చేశారో ఆ ఆశయాలు, ఆకాంక్షలేవీ నెరవేరలేదు. కుల, మత, లింగ, ప్రాంత అసమానతలతో మండుతున్న ఖండంలా ఉంది దేశం! ‘కుక్కలతో కొట్లాడీ కూడూ తింటామండీ’ అన్న గరిమెళ్ల ఆవేదన యిప్పటికీ మాసిపోలేదు. వందేళ్ల నాటి గరిమెళ్ల గర్జనను మళ్లీ అందిపుచ్చుకోవాల్సిన సందర్భంలోనే దేశమింకా వుంది. (డిసెంబర్ 22వ తేదీన శ్రీకాకుళంలో గరిమెళ్ల సంస్మరణోత్సవం) వ్యాసకర్త అధ్యక్షులు,ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అట్టాడ అప్పల్నాయుడు -
ప్రజాకోర్టులో పౌరసత్వ చట్టం
నూతన పౌరసత్వ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పౌరులు సవాలు చేస్తుండటంతో తూర్పు, ఈశాన్య భారతం తగలబడుతోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసనలు చెలరేగుతుండటంతో దేశం అట్టుడికిపోతోంది. అసోంలో ఎన్నార్సీ, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ మందిరంపై తీర్పు తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకురావడం ఏమంత ఆశ్చర్యం కలిగించదు. ఒక ప్రత్యేక మతానికి చెందిన విదేశీయులకు భారతీయ పౌరసత్వాన్ని ఈ సవరణ బిల్లు సమర్థవంతంగా నిరోధిస్తున్నందున భారత్ని హిందూ దేశంగా మల్చాలనే బీజేపీ, ఆరెస్సెస్ ఎజండాను మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుపోతున్నట్లుగానే కనిపిస్తోంది. పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చర్చ సాగుతుండగానే అసోం, ఈశాన్య భారత్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టం తమ ప్రాంత జనాభా కూర్పులో గణనీయ మార్పును తీసుకురావడమే కాక తమ సంస్కృతిపై కూడా దాడికి దిగుతుందని ప్రజలు భయాందోళనలకు గురికావడమే ఈ నిరసనలకు కారణం. పైగా ప్రజా నిరసనలు పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని అలీగర్ వంటి మరెన్నో ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా నిరసనలను పోలీసులు, భద్రతా బలగాలు తీవ్రంగా అణచివేయడంతో ప్రపంచం మెల్లమెల్లగా ఈ నిరసనలను పరిగణనలోకి తీసుకోవడం మొదలైంది. బంగ్లాదేశ్ మంత్రి భారత పర్యటన రద్దు కావడం, జపాన్ ప్రధాని గౌహతి సందర్శన వాయిదా పడటంతో భారత్కు దౌత్యపరంగా తొలి దెబ్బలు తగిలాయి. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి విభాగం యుఎన్హెచ్సిఆర్ భారత ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ చట్టం ‘ప్రాథమికంగానే వివక్షాపూరితం’గా ఉందని తన అసమ్మతిని వ్యక్తం చేయడమే కాకుండా, భారత్ కట్టుబడిన అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఐరాస విభాగం ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా పాలనాయంత్రాంగం కూడా భారత్లో పరిణామాలను నిశి తంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. ఇక దేశీయంగా చూస్తే మోదీ ప్రభుత్వ హిందుత్వ అనుకూల చర్యకు ప్రతిపక్షాలు పాలి స్తున్న కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, చత్తీస్గర్ వంటి రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని తాము అమలుపర్చబోమని ఈ రాష్ట్రాల పాలకులు స్పష్టం చేశారు. దాంతో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయనుంది. అయితే అటు బీజేపీ, ఇటు కేంద్రప్రభుత్వం ఈ వ్యవహారంలో రాష్ట్రాలకు పెద్దగా పాత్ర ఏమీలేదని, కొత్త పౌరసత్వ నిబంధనల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా పాత్ర లేదని చెబుతూ వస్తున్నాయి. పైగా పౌరసత్వ చట్టం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఏమేరకు అడ్డుకుంటాయన్నది చూడాల్సిందే మరి. రాజకీయ పరంగా చూస్తే, పౌరసత్వ చట్టం రూపంలో మతపరంగా ప్రజలను విభజించడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలను పాకిస్తాన్ అనుకూల, మైనారిటీల అనుకూల సంస్థలుగా ముద్రించడం ద్వారా బీజేపీ మరింతగా మందుగుండు దట్టించింది. కాగా, ఈ ఘర్షణలకు సంబంధించిన తొలి పరీక్ష పశ్చిమబెంగాల్లోనే జరగనుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం లోకి మరింతగా చొచ్చుకుపోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే సంవత్సరం ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పౌరసత్వ చట్టం అంశాన్ని ఇప్పటికే ప్రచారంలోకి తీసుకొచ్చేసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ చట్టంపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పథక రచన చేస్తుండగా, బీజేపీ మాత్రం ఇప్పటికే పశ్చిమబెంగాల్లో విజయోత్సవ ర్యాలీలను మొదలుపెట్టేసింది. పైగా, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి తమతో కలిసి నడవాలంటూ రాష్ట్రంలోని శరణార్థులకు పిలుపునిచ్చేసింది కూడా. కాగా, ఢిల్లీలో జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల అమానుష దాడులు దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలకు దారితీయడం గమనార్హం. లక్ష్మణ వెంకట్ కూచి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు -
ఉత్పత్తిరేటు తగ్గినా మాంద్యం లేదంటే ఎలా?
జాతీయ స్థూల ఉత్పత్తి రేటు తగ్గినప్పటికీ, భారతదేశంలో మాంద్యం లేదంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో ప్రకటించారు. మరోవైపు దేశంలో మాంద్యం కొనసాగడం వల్ల జాతీయ స్థూల ఉత్పత్తి తగ్గుతున్నదని ప్రధాని మోదీ ప్రకటించారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రధాని, ఆర్థిక మంత్రి భారత ప్రజానీకాన్నే కాక ఆర్థిక మేధావులను కూడా గందరగోళం చేస్తున్నారు. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు. 2019–20లో 2.8 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. 2025 నాటికి మరో 3.2 ట్రిలియన్ డాలర్లకు పెరగాలి. కానీ 2018–19లో 7.1 శాతంగా ఉన్న స్థూల ఉత్పత్తి రేటు ప్రస్తుతం రెండవ క్వార్టర్లో 4.5 శాతానికి తగ్గినట్లు ఆర్థిక గణాంకాలు చెపుతున్నాయి. ప్రస్తుత స్థూల ఉత్పత్తి రేటు ప్రకారం మరో 9 ఏళ్లకు అనగా 2033–34 నాటికి 5.18 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెపుతున్నారు. పై గణాంకాల్ని చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం వల్ల ఉత్పత్తి రేటు తగ్గినట్లు స్పష్టమవుతున్నది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఈ మాంద్యం ఇప్పట్లో తగ్గదని తెలుస్తుంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలోకి తెస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని ఎన్నికల హామీ సందర్భంగా ప్రకటిం చారు. కానీ వ్యవసాయరంగం స్థూల ఉత్పత్తి ప్రస్తుతం 2.1 శాతంగా ఉంది. లక్ష్యం 4 శాతం పెట్టుకున్నప్పటికీ ఏనాడూ ఆ లక్ష్యాన్ని చేరలేదు. 2001 నాటికి 58.3 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా ప్రస్తుతం 52.7 శాతంగా ఉన్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 25.7 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రధాని ప్రకటించిన పథకాలలో ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధర కల్పిం చడం, మంచి ఉపకరణాలను అందుబాటులో పెట్టడం, ఇరిగేషన్ సౌకర్యం కల్పించడం, విత్తన బదలాయింపు, తగినంత ఎరువు వాడకం, నూతన టెక్నాలజీ వినియోగం చేపట్టాలని ప్రణాళికలో చెప్పారు. మద్య దళారీలను తొలగించి ముందే నిర్ణయించిన కనీస మద్దతు ధరను మార్కెట్లో అమలు జరపడంతోపాటు, నిర్ణయించిన ధరకన్నా తక్కువ వచ్చినప్పడు ఆ లోటు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. కానీ పై అంశాలేవీ వాస్తవంలో అమలుకు నోచుకోవడం లేదు. దేశంలో 2018–19లో 43 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా 30 కోట్ల ఎకరాలలో ఆహార ధాన్యాలు (7 కోట్ల ఎకరాలలో పప్పుధాన్యాలు కలిపి), 6.5 కోట్ల ఎకరాలలో నూనెగింజలు, 1.25 కోట్ల ఎకరాలలో చెరకు, 3 కోట్ల ఎకరాలలో పత్తి తదితర పంటలు వేస్తున్నారు. పై పంటల సాగుభూమి క్రమంగా తగ్గుతున్నది. ఉత్పాదకత కూడా గత అయిదేళ్లలో పెరగలేదు. ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచడానికి అనేక పథకాలను ప్రకటిం చింది. కిసాన్ సమ్మాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 6,000ల చొప్పున దేశంలోని 14.65 కోట్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి రూ. 75,000 కోట్లు ఫసల్బీమాకు ప్రీమియం కింద రు. 14 వేల కోట్లు, వడ్డీ మాఫీకి 18 వేల కోట్లు, కృషి సించాయ్యోజనకు 3,500 కోట్లు, మార్కెట్ జోక్యం పథకం కింద 3 వేల కోట్లు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన కింద 3,500 కోట్లు, మొత్తం రూ. 1,29,585 కోట్లను 2019–20 బడ్జెట్లో కేటాయిం చారు. మొత్తం బడ్జెట్లో ఇది 4.6 శాతంగా ఉంది. కానీ కిసాన్ సమ్మాన్కి 75వేల కోట్లు మినహాయిస్తే వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు 54,585 కోట్లు మాత్రమే. అనగా మొత్తం బడ్జెట్లో 1.96 శాతం మాత్రమే కేటాయించారు. దేశీయ స్థూల ఉత్పత్తికి 15 శాతం ఆదాయాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్న వ్యవసాయ రంగానికి 1.96 శాతం బడ్జెట్ కేటాయింపుతో అభివృద్ధి జరుగుతుందా? ప్రపంచంలోని అన్ని దేశాలు తమ వ్యవసాయ రంగాలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నాయి. కానీ పత్తి ఎగుమతి రాయితీలు నిషేధించాలని 2017 జనవరి 1న భారతదేశం తరఫున ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సంతకం చేశారు. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఆహారధాన్యాల దిగుమతులపై ఆధారపడే దుస్థితికి నెట్టబడింది. 1996లో స్వయంపోషకత్వంగా ఉన్న దేశం నేడు దిగుమతులపై ఆధారపడుతున్నది. ఇంతవరకు వ్యవసాయ రంగానికి దేశీయంగా లేదా రాష్ట్రాలలో భూ వినియోగంపై ప్రణాళికలు లేవు. రైతులు తమ కోర్కెల మేరకు పంటలు వేస్తున్నారు. ప్రధానంగా ఎగుమతి ఆధారిత పంటలవైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. అనేక వైపరీత్యాలకు ఓర్చి పండించిన ఎగుమతి ఆధారిత పంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు దివాలా తీస్తున్నారు. ఇప్పటికీ 52 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. క్రమంగా వీరు వ్యవసాయ రంగాన్ని వదిలేసి ఇతర రంగాలకు తరలిపోతున్నారు. 2022 నాటికి వ్యవసాయ రంగంలో 18 అంశాలను అమలు జరపడం ద్వారా 2018 ఫిబ్రవరి 3న రైతుల ఆదాయం రేటు పెంపు చేస్తానని ప్రధాని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 6 సం‘‘లు కావస్తున్నా ప్రభుత్వం ప్రకటిం చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు జరగలేదు. చివరకు ‘రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు’ ఏర్పాటు చేసి పెద్ద కమతాలుగా మార్చి ఆ కమతాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి యాంత్రీకరణ ద్వారా అధికోత్పత్తి సాధిస్తామని ప్రణాళికలు వేస్తున్నారు. వీలైనంతవరకు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా చూడాలి. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కనీసం 8 శాతం నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగానికి రాయితీల కల్పనలో వెనుకాడరాదు. విత్తనం మొదలు మార్కెట్ వరకు గల అంశాలలో ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తిని సాధించే దిశగా ప్రణాళికల రూపకల్పన చేయాలి. భూమి సాగుతో సంబంధం ఉన్నవారందరికీ చట్టపరంగా హక్కులు కల్పించాలి. పై చర్యలు చేపట్టడం ద్వారా ప్రస్తుత మాంద్యం నుండి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బయటపడవేయాలి. అంతేకానీ ప్రపంచవ్యాపితంగా కొనసాగుతున్న మాంద్యం భారతదేశంలో లేదని ఆర్థికమంత్రి చెప్పడం వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు దూరం కావు. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు ‘ 94900 98666 -
ఆధునిక భోజరాజు మోదీ
ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సుప్రీం కోర్టులో రఫేల్ తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనపై అఫిడవిట్లో ఏమి రాయాలా అని ప్రభుత్వ న్యాయాధికారులంతా తలలు పట్టుకుని కూర్చున్నారు. కానీ ఇవేవీ పట్టనట్టు మోదీ మాత్రం ఎన్నికల ప్రచార సభలు వాయిదా వేసుకుని మరీ గంటా పది నిమిషాలపాటు అక్షయ్కుమార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే తాను రాజకీయేతర అంశాలపై చర్చ చేయటానికి సిద్ధంగా ఉన్నానని మోదీ చెప్పటం ద్వారా ఇంటర్వ్యూ పరిధి చెప్పకనే చెప్పారు. దేశంలో పేరు ప్రఖ్యాతులు గడించిన విలేకరులు మోదీ ఇంటర్వ్యూ కోసం అర్జీలు పెట్టుకుంటే సమయం లేదని దాటేసిన ప్రధాని కార్యాలయం అక్షయ్కుమార్ను వెతికి పట్టుకుని మరీ ఇంటర్వ్యూ ఇప్పించింది. మోదీ∙బ్రాండ్కు గిరాకీ పడిపోతోందని గుర్తించిన ఆయన మీడియా మేనేజ్మెంట్ టీం వ్యూహరచన పర్యవసానమే అక్షయ్కుమార్ ఇంటర్వ్యూ. అధికారంలో ఉన్న ఐదేళ్లు చాలలేదు ప్రధానికి తన గురించి తాను పరిచయం చేసుకోవటానికి. సరిగ్గా ఎన్నికల నడుమ మాత్రమే హఠాత్తుగా గుర్తొచ్చింది. తన బాల్య జ్ఞాపకాలు దేశానికి చెప్పాలనిపించింది. గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వంత బాల్యాన్ని పాఠ్యాంశంగా చేసిన మోదీ నోట ఇలాంటి మాటలు వింటుంటే ఏమనిపిస్తుందో ప్రేక్షకులే తేల్చుకోవాలి. బహుశా బతికుండగానే తన గురించి పాఠాలు రాయించుకుని భుజకీర్తులు తగిలించుకున్న ముఖ్యమంత్రి, బతి కుండగానే సినిమా తీయించుకున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోతారు. బాల్యంలో శ్రీకృష్ణుడు ఎన్ని అద్భుతాలు చేశాడో కథలుకథలుగా చిన్నప్పుడు బాలజ్యోతి, బాలమిత్ర, చందమామ కథల పుస్తకాల్లో చదువుకున్నాము. ఇదే మూసలో మోదీ బాల్యం గుజరాత్ విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. మచ్చుకు అందులో ఓ కథ. ఒక రోజు పిల్లలతో కలిసి మోదీ సబర్మతి నదీ తీరాన బంతాట ఆడుకుంటున్నారు. సహజంగానే బంతి నదిలో పడింది. అది కూడా మొసళ్లు తిరుగాడే చోటు. ఇంకేముంది పిల్లలంతా మోదీ వంక చూశారు. వాళ్ల కళ్లలో కాంతుల కొవ్వొత్తి వెలుగుతుండగా మోదీ నదిలో దూకి బంతిని, బంతితో పాటు మొసలి పిల్లను చంకనబెట్టుకుని ఒడ్డుకొచ్చారు. ఇలాంటి కథలతో తనలో ఉన్నాయనుకుంటున్న అద్వితీయ, అద్భుత శక్తులే పిల్లలకు పాఠాలు చెప్పించిన మోదీ తనకు కీర్తి, కాంక్ష లేదని చెప్పుకుంటే నమ్మాలా వద్దా అన్నది జనం తేల్చుకోవాల్సిందే. ఇంటర్వ్యూలో మోదీ ఎన్ని గంటలకు అన్నం తింటారు? ఎన్ని గంటలకు నీళ్లు తాగుతారు? ఆయన సౌందర్యం వెనక రహస్యం ఏమిటి? వంటి ప్రశ్నలన్నీ దేశం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు. ప్రధాని అవుతారని ఊహించారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ మోదీ రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే ఆయనకున్నంత కుటుంబ నేపథ్యం తనకు లేదని, అయినా నిలదొక్కుకున్నానని చెప్పు కోవటం వెనక ఉన్న భేషజం వీక్షకుల దృష్టిని దాటిపోలేదు. కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు, కీర్తి కాంక్ష లేకపోవటం తన ప్రత్యేకతగా చెప్పుకున్నారు. మరి యోగా చేస్తూ వీడియో విడుదల చేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కీర్తి కాంక్ష కాకపోతే మరేమిటి? ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అయినా తాను సాదా సీదాగా వ్యవహరిస్తున్నానని కబుర్లు చెప్పటంలో ఆంతర్యమేమిటి? బహుశా తన ఇమేజి పెంచుకోవటానికి తల్లినిసైతం సైడు పాత్రధారిగా వాడుకున్న మోదీ వ్యక్తిత్వం నుండి భావితరాలు ఏమి నేర్చుకోవాలి? ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశానన్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండానే అరవై దేశాలు చుట్టి వచ్చారు. మరి సెలవు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో? ఇక వర్క్ కల్చర్ గురించిన మోదీ సంభాషణ. 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశ విదేశాలు తిరుగుతూ దేశ ప్రతిష్టను నిలబెట్టడానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో వేరే చెప్పాలా? తన ట్విట్టర్ అక్కౌంట్లో నిమిష నిమిషానికి తాజాపర్చటం, తన గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో అలర్ట్గా ఉండటం కూడా ప్రధానికి అంతే ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. బహుశా భోజరాజు పాలనలో ధర్మ గంట పాత్ర మోదీ పాలనలో ట్విట్టర్ పోషిస్తోందేమో. అదే నిజమైతే మరి నిఘా విభాగాలు రద్దు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కలిసి వస్తుంది. ఇంటర్వ్యూ అంతా విన్న తర్వాత మామిడి పండునైనా కాకపోతిని మోదీ జిహ్వను చేరగా అని పాడుకోవాలని పిస్తోంది... హతవిధీ. కొండూరి వీరయ్య వ్యాసకర్త రాజకీయ వ్యాఖ్యాత మొబైల్ : 98717 94037 -
దళిత ప్రజల ఆత్మగౌరవ గొంతుక
సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన సామా జిక పోరాట స్వాప్నికు రాలు, తెలుగు నేలపై బలమైన తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఫైర్ బ్రాండ్ మహిళా నేత ఈశ్వరీబాయి. పాఠశాల ఉపా ధ్యాయురాలిగా, ఉద్యమ కారిణిగా, నాయకురాలిగా, స్త్రీ పక్షపాతిగా, 4 దశా బ్దాల పాటు తెలుగు సమాజంలో బహుముఖంగా పెనవేసుకుపోయిన సాహసమూర్తి ఆమె. సికింద్రాబాద్ (లష్కర్)లోని నిజాం గ్యారెం డెడ్ స్టేట్ రైల్వేలో గూడ్స్ మాస్టారుగా పనిచేసే దళిత కులానికి చెందిన బలరామస్వామి, రాములమ్మ దంపతులకు 1918 డిసెంబర్ 1న ఈశ్వరీబాయి జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అనం తరం నాటి సామాజిక పరిస్థితుల వల్ల 13వ ఏటనే పుణేకి చెందిన డా‘‘ లక్ష్మినారాయణతో వివాహం జరిగింది. ఆ దంపతుల ఏకైక సంతానం జెట్టి గీత. భర్త అకాల మరణంతో తండ్రి వద్దకు వచ్చిన ఈశ్వ రీబాయి స్వతంత్రభావాలతో మెలగడమే కాకుండా ఉపాధ్యాయురాలిగా, ఉద్యోగినిగా మహిళల స్వావ లంబన దిశగా కృషి చేశారు. అగ్రకులాలు పేద ప్రజ లపై చేసే ఆధిపత్యాన్ని, అత్యాచారాలను, దాష్టీకా లను చూసి చిన్న వయసులోనే ప్రజాజీవితంలోకి ప్రవేశించారు. 1942 జూన్లో నాగ్పూర్లో జరిగిన అఖిల భారత ఎస్సీ కులాల సభకు హైదరాబాద్ రాష్ట్ర ప్రతినిధిగా హాజరై, తొలిసారిగా అంబేడ్కర్ని కలిశారు. అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్ సంస్థను స్థాపించి క్రియాశీలకంగా పాల్గొన్నారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ అధి కారంలో భాగం కావడం ముఖ్యమని నమ్మారు. 1951లో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో చిలుకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అంబేడ్కర్ మరణానంతరం రిప బ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1968లో రాష్ట్రంలో దళిత ఉద్యమానికి భూమిక అనదగిన ‘కంచికచర్ల కోటేశు’ సజీవదహనం దురంతాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన ఈశ్వరీబాయి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసి అసెంబ్లీని స్తంభింపచేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ‘దొంగతనం చేసిన వాడిని సజీవ దహనం చేయకుండా ముద్దు పెట్టు కుంటారా’ అని జవాబిచ్చేసరికి మంత్రిపైకి ఆగ్ర హంతో చెప్పు విసిరి సమాధానం చెప్పారు. ఇది గందరగోళానికి దారి తీయడంతో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రిచేత క్షమాపణ చెప్పించి, సభను, ఈశ్వరీ బాయిని శాంతింపచేశారు. నిజామాబాద్ ప్రాంతంలో జరిగిన అన్ని సామాజిక ఉద్యమాల్లో ఆమె చెరగని ముద్రవేశారు. విశాఖ ఉక్కు కర్మాగార స్థాపన, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాయలసీమ గ్రామాల్లో వైద్యం, తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల అధ్వాన స్థితిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిల దీశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా–శిశు సంక్షేమ సంస్థ అధ్యక్షురాలిగా రాష్ట్రమంతటా పర్య టించి అనేక సంస్కరణలకు ఆద్యు లయ్యారు. 1969 ప్రత్యేక తెలం గాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఉద్య మాన్ని బతికించడంలో ముఖ్యమైన పాత్ర పోషిం చారు. జీవితం చివరి వరకు నిరాడంబరంగా గడిపిన ఈశ్వరీ బాయి 1991 ఫిబ్రవరి 24న తుది శ్వాస విడిచారు. ఆమె కుమార్తె జెట్టి గీత తన తల్లి పేరిట స్మారకట్రస్టు ఏర్పర్చి, అంబేడ్కర్ అడుగజాడల్లో పనిచేస్తున్నా వారిని గుర్తించి ప్రతి ఏటా ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును ప్రధానం చేస్తున్నారు. తెలంగాణ ఉద్య మంలో క్రియాశీల పాత్ర పోషించిన ఈశ్వరీబాయి సేవలను స్మరిస్తూ 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతి, వర్థంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వర్తిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పేరును చిరస్మరణీయంగా నిలపడమే ఆమెకు ఇచ్చే నిజమైన ఘన నివాళి. (నేడు హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న జె.ఈశ్వరీ బాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా) అంగరి ప్రదీప్ కుమార్ వ్యాసకర్త రీసెర్చ్ స్కాలర్, ‘ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్’ రాష్ట్ర అధ్యక్షుడు మొబైల్ : 95050 15502 -
నిబద్ధ జర్నలిజానికి నిరుపమాన నిదర్శనం
కులదీప్కు సంబంధించినంతవరకు అన్నిటికన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు. మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్–సెప్టెంబర్ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్ నాయకుడు మహ్మదలీ జిన్నా లాహోర్ పర్యటనకు వచ్చారు. జిన్నాతోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమానంలో లాహోర్ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలితంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండియాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనించారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని, ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపంచానికి వెల్లడించింది కులదీప్ నయ్యర్. కులదీప్ నయ్యర్ నాకంటే 20 ఏళ్లు పెద్ద. కాని, 1975 శీతాకాలంలో న్యూఢిల్లీలోని త్రివేణీ కళా సంఘంలో జరిగిన మధ్యాహ్న భోజన సమావేశంలో తొలిసారి మేం కలుసుకున్నప్పటి నుంచీ మంచి స్నేహితుల మయ్యాం. లండన్లోని ద సండే టైమ్స్లో వేసవి స్కాలర్గా పనిచేసి అప్పుడే దేశ రాజధానికి తిరిగొచ్చాను. నయ్యర్ వల్ల నేను ఎలా ఇబ్బందిపడ్డానో చెప్పడానికే అక్కడకు ఆయ నను ఆహ్వానించాను. ఓ శుక్రవారం మధ్యాహ్నం ద సండే టైమ్స్ సాహిత్య విభాగం ఎడిటర్ త్వరలో ప్రచురించే కుల దీప్ పుస్తకం పేజీల ప్రూఫుల కట్ట పట్టుకుని నా డెస్క్ దగ్గరకు వచ్చారు. ఇండియాలో ఎమర్జెన్సీ కారణంగా ఆ సమయంలోనే నయ్యర్ను అరెస్ట్ చేశారు. ఈ ఆంగ్ల వారపత్రిక ఎడిటర్గా పనిచేస్తున్న ప్రఖ్యాత జర్నలిస్ట్ హెరాల్డ్ ఈవాన్స్ కులదీప్ అరెస్టుపై వార్తా కథనం రాయాలని నన్ను కోరారు. నేను ఆ ప్రూఫులు చదివి 300 పదాల వార్త రాశాను. పొగరుబోతు ప్రధానోపాధ్యాయురాలు తన క్లాసు లోని విద్యార్థు లను ఎలా బెదరగొడతారో ఇందిరాగాంధీ కూడా కేబినెట్ సమావేశాల్లో తన మంత్రులను అలాగే చూస్తారని నయ్యర్ చెప్పిన విషయం కూడా రాశాను. ఈ వార్త ఇందిరకు నచ్చలేదు. లండన్ నుంచి ఢిల్లీలో దిగగానే ఎయిర్ పోర్ట్లో పోలీసులు మూడు గంటల పాటు నా బ్యాగులన్నీ క్షుణ్నంగా తనిఖీచేశారు. వాటిలో అభ్యంతరకరమైనదేదీ దొరకకపోవడంతో నన్ను బయటకు వెళ్లనిచ్చారు. నేను ఈ సంగతి వివ రించాక, నేనూ, కులదీప్ పగలబడి నవ్వుకున్నాం. ‘‘ఇందిరను మీరెప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా?’’ అని ఆయనను అడిగాను. ‘నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు, ఇంటర్వ్యూ ఇవ్వాలని అడగలేదు’ అని ఆయన జవాబిచ్చారు. ఎందుకని అడగలేదని ప్రశ్నిం చగా, ‘నన్ను చూడడానికి ఆమె ఎన్నటికీ అంగీకరించ రని అనుకున్నా’అని ఆయన తెలిపారు. అప్పటి నుంచీ ఆయన, నేనూ అప్పుడప్పుడూ కలుస్తుండే వాళ్లం. ఏడాది క్రితం చివరిసారిగా బంగ్లా దేశ్ హైకమిషన్లో కల్సుకున్నాం. బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలుకుతూ హైకమిషనర్ సయ్యద్ మువజ్జమ్ అలీ ఇచ్చిన విందులో ఇద్దరం పాల్గొన్నాం. అప్పుడు కులదీప్ చేతికర్రతో, ఓ మనిషి సాయంతో అక్కడికి వచ్చారు. కార్యక్రమం చివర్లో బయల్దేరే ముందు ‘‘నేను మరో పుస్తకం రాస్తు న్నాను, తెలుసా?’’ అన్నారు కులదీప్. దాదాపు 80కి పైగా పత్రికలకు వేలాది వ్యాసాలతోపాటు ఆయన 15 గ్రంథాలు రాశారు. ఈ పుస్తకాలన్నీ పాఠ కాదరణ పొందాయి. మరో ప్రసిద్ధ జర్నలిస్టు కుష్వంత్ సింగ్తో కలిసి ఓ పుస్తకం రాశారు. లాహోర్ లా కాలే జీలో కులదీప్కు కుష్వంత్ పాఠాలు చెప్పారు. 1979 డిసెంబర్లో లోక్సభ ఎన్నికల ప్రచా రంలో ఇందిరాగాంధీతోపాటు ఓ ఫోకర్ ఫ్రెండ్షిప్ విమానంలో నేను కూడా వెళ్లాను. ఆమె దేశ వ్యాప్తంగా అనేక బహిరంగ సభల్లో ప్రసంగించడం దగ్గర నుంచి గమనించాను. అప్పుడు నేను పనిచేస్తున్న ఆంగ్ల పక్ష పత్రిక ఇండియా టుడేలో మూడు పేజీల వ్యాసం రాశాను. ఇందిర ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ ప్రధాని అవుతారని ఈ వ్యాసంలో చెప్పాను. ఓ దౌత్య విందులో అదే వారం కులదీప్ను కలిశాను. తల అడ్డంగా ఊపుతూ ‘ఎంత పని చేశావు? నీకు రాజ కీయాల గురించి ఏమీ తెలియదు. నువ్వేమో ఇందిర మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పావు. ఈ విషయం ఇక మర్చిపో. అది ఎన్నటికీ జరగదు. పాత్రికేయునిగా నీ జీవితం నాశనం చేసుకున్నావు’ అని ఆయన అన్నారు. తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమిద్దరం మారిషస్ రాజధాని సెయింట్ లూయిస్ వెళ్లాం. కులదీప్ వచ్చారని తెలుసుకున్న ఆ దేశ గవ ర్నర్ జనరల్ సర్ శివసాగర్ రాంగులాం హిందూ మహాసముద్రానికి ఎదురుగా నిర్మించిన తన భారీ నివాస భవనానికి టీ పార్టీకి రావాలని మమ్మల్నిద్దరినీ ఆహ్వానించారు. అక్కడి నుంచి మేం మా హోటల్కు కాస్త ఆలస్యంగా చేరుకున్నాం. మాకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి సహాయకుడు ‘మీకు ఆడవాళ్ల తోడు కావాలా?’ అని భయం భయంగా అడిగాడు. ‘పులి తాను తినే జంతువులను తానే వేటాడి పట్టుకుంటుంది’ అని కులదీప్ చమత్కరించారు. కులదీప్ న్యాయశాస్త్రం చదివి లాయర్ కావడా నికి తగిన శిక్షణపొందారు. ఓ లాహోర్ కాలేజీలో జర్నలిజం డిప్లొమా కోర్సులో చేరారుగాని అందులో ఆయన తప్పారు. ఐఏఎస్లో చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఢిల్లీ వచ్చాక కులదీప్ మొదట చేసిన జర్నలిస్టు ఉద్యోగం అంజామ్ అనే ఓ ఉర్దూ దినపత్రికలోనే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉర్దూ దినపత్రిక విలేకరిగా ఆయన పాత్రికేయ జీవితం మొదలైంది. అయిష్టంగానే పాత్రికేయ వృత్తిలోకి కుల దీప్ ప్రవేశించారు. అయితే, చెప్పుకోదగ్గ ప్రావీ ణ్యంతో ఆయన జీవితాంతం జర్నలిస్టుగానే బతి కారు. మంచి రిపోర్టర్గా ఆయన ఎన్నో సంచలన వార్తలను మొదటిసారి రాసి దేశవ్యాప్తంగా కీర్తినార్జిం చారు. ఇక్కడ అలాంటి సంచనల వార్తల జాబితా ఇవ్వడానికి వీలులేనన్ని ఎక్కువ ఆయన రాశారు.అయితే, కులదీప్కు సంబంధించి వీటన్నిటి కన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు. మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్–సెప్టెంబర్ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్ నాయ కుడు మహ్మ దలీ జిన్నా లాహోర్ పర్యటనకు వచ్చారు. జిన్నా తోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమా నంలో లాహోర్ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలి తంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్ లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండి యాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనిం చారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపం చానికి వెల్లడించింది కులదీప్ నయ్యర్. జిన్నాతో పాటు లాహోర్ వచ్చిన పాక్ జర్న లిస్టు మరణించాక కొన్నేళ్లకు ఆయన భార్య చెప్పగా కులదీప్కు ఈ విషయం తెలిసింది. ఎస్ వెంకటనారాయణ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ప్రజాకేంద్రక రాజకీయాలకు పట్టం కడదాం..!
పోరాడే ప్రజల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ గడ్డ ఒక ధిక్కార స్వరం. పోరాటానికి అనన్యమైన త్యాగాలకు తమ అమూల్యమైన ప్రాణాలను గడ్డిపోచవలె విసిరేసిన గడ్డ మన తెలంగాణ. అందుకే మన మూలాలను పాలకులు మర్చిపోతున్న నేపథ్యంలో కోదండరాం నాయకత్వంలో ఏర్పడుతున్న తెలంగాణ జన సమితి పార్టీని ఆదరించవలసిన అవసరముంది. వ్యక్తులు, కుటుంబాలు కాకుండా ప్రజలే కేంద్రంగా రాజకీయాలను పునర్ నిర్వహించాలి. చాలా మంది తెలంగాణలో ఇన్ని పార్టీలు వుండగా మరొక రాజకీయ పార్టీ అవసరమా అని అడుగుతున్నారు. నిజానికి దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు వందల సంఖ్యలో వున్నాయి. ఇన్ని పార్టీలు ఉండగా మరొక రాజకీయ పార్టీ అవసరమా అని ప్రజలు అడుగుతున్న ప్రశ్న సహేతుకమైనదే. రాజకీయ పార్టీ పెట్టడమంటే పాన్డబ్బా పెట్టడం కాదని కేసీఆర్ వ్యంగ్యంగా అన్నట్లు నిజమే కాని, రాజకీయ పార్టీ అంటే అమ్మడం, కొనడం, దోచుకోవడం, కమీషన్లు దండుకోవడం కూడా కాదు.కాని 71 ఏళ్ళ భారత స్వాతంత్య్ర చరిత్రలో రాజకీయ పార్టీలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మాట నిజం. ప్రజాధనాన్ని దోచుకోవడమే రాజకీయాల పరమావధిగా మారిపోయింది. కార్ల్ మార్క్స్, పూలే, అంబేడ్కర్ భావించినట్లు ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామిక విలువలను, చైతన్యాన్ని ప్రజలలో పాదుకొల్పడంలో పార్లమెంటరీ రాజకీయాలు విఫలమైనాయి, ప్రజలలో అసంతృప్తి నానాటికీ పెరుగుతోంది. పార్లమెంటరీ రాజకీయ పార్టీల విధానాలు ఏ రంగంలోని ప్రజానీకాన్ని కూడా సంతృప్తి పరచకపోగా దేశం మొత్తాన్ని కార్పొరేటీకరణ వైపుగా పరుగులు తీయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై అసంతృప్తి బయట పడటానికి 20 ఏళ్ళ కాలం పట్టింది. బిజేపీపై అసంతృప్తి బయట పడటానికి పదేళ్ళ కాలం కూడా పట్టలేదు. ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ కానీ, 20 ఏండ్లు పాలించిన తెలుగుదేశం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చక పోవడంవల్లనే 1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం మళ్లీ ముందుకొచ్చింది. చివరకు 1600 మంది బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష 2014లో సాకారమైంది.అభివృద్ధి నినాదం నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామిక ఆకాంక్షల అమలు కోసం సాగిందే ప్రత్యేక తెలంగాణ పోరాటం. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన నేటి పాలకులు తెలంగాణ అస్థిత్వ కోణంలోంచి పాలనా విధానాలను రూపొందించకుండా గత పాలకుల విధ్వంసకర అభివృద్ధి నమూనానే అమలు పర్చుతున్నారు. సమస్యలపై పోరాడుతున్న అన్ని ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతూ సెక్షన్ 30, సెక్షన్ 156, సెక్షన్ 144 అమలు చేస్తూ అరెస్టులతో భయానక వాతావరణం సృష్టిస్తూన్నారు. ధర్నా చౌక్ను ఎత్తివేయడమే కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులైన ప్రొ‘‘ కోదండరాం ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అక్రమ అరెస్టు చేయడమే కాకుండా ఎన్కౌంటర్లను కొనసాగిస్తూ రాచరికపు పాలన సాగిస్తున్నారు.రాజకీయాలంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటిలో సామూహిక అభివృద్ధిని సాధించడమే తప్ప వ్యక్తుల ఎదుగుదల కాదు. తెలంగాణ సంపదను తెలం గాణ సమగ్రాభివృద్ధికి వినియోగించే ప్రణాళికలు రూపొందించకుండా ఉద్యమ ఆకాంక్షలను పక్కకు నెట్టి కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు మేలు చేసే విధానాలను రూపొందిం చారు. తెలంగాణలోని సహజ సంపద బొగ్గు, నీళ్ళు, ఇసుక ఇప్పటికీ లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం దోచి పెడుతూ కమీషన్లను దండుకొంటున్నది. ఈ నాలుగేళ్లు బడ్జెట్ రూపంలో లక్షల కోట్ల రూపాయలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) పేరుతో వెచ్చిస్తూ మౌలిక రంగాలను నిర్లక్ష్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నది. సాధించిన తెలంగాణ అడవికాచిన వెన్నెల కాకూడదంటే ప్రొ‘‘ జయశంకర్ చెప్పినట్లు తెలంగాణలో మళ్ళీ నిరంతరాయంగా భావవ్యాప్తి, ఉద్యమం, రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రజా రాజకీయాలు పటిష్టపరచాలి. ప్రజలే కేంద్రంగా రాజకీయాలను పునర్ నిర్వహిం చాలి. జవాబుదారీతనం, ప్రజల సంక్షేమం, సమష్టి వనరులు సమష్టి ప్రయోజనాలకే అన్న ఆలోచనతో కార్యాచరణ సాగాలి. వ్యక్తుల సమష్టి ప్రయోజనాలు ఆశిస్తూ మనిషి కేంద్రంగా కులాల అంతరాలను తొలగిస్తూ, అన్ని రంగాలలో వెనుకబాటుకు గురిచేసిన పాలనకు భిన్నంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పార్టీలదే. రాజకీయ పార్టీలు కుళ్ళి కంపుకొడుతూ భరింపరానివిగా తయారయ్యాయని ప్రజలు ముఖ్యంగా మేధావులు భావిస్తున్నారు. కానీ రాజకీయాలకు దూరంగా ఉండటంవల్లనే అవి మనల్ని ఈరకంగా అణగదొక్కి 70 ఏండ్లుగా శాసిస్తున్నాయి. ప్రజలు మేధావులు రాజకీయాలను పట్టించుకోకుంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న రాజకీయాలే మనల్ని చుట్టుముడతాయి. పైగా మన జీవితాలు మనకు కాకుండా విద్య, వైద్యంతోసహా అన్ని రకాల అభివృద్ధి రంగాలను మనకు ఇష్టంలేకపోయినా కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకే కోదండరాం నాయకత్వంలో ఏర్పడుతున్న తెలంగాణ జన సమితి పార్టీని ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ జన సమితి ప్రకటించుకుంటున్న లక్ష్యాలు సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణతో పాటు సమస్త సంపదలు ప్రజలందరికి చేరే విధంగా టీజేఎస్ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ముఖ్యంగా మేధావులు, విద్యార్థి యువజనులతో పాటు అన్ని ప్రజా సంఘాలపై వున్నది. ఈ బాధ్యతను గుర్తించే గత నాలుగేళ్లుగా తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి ఇతర ప్రజా సంఘాలతో కలిసి టీజేఎస్ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించింది.తెలంగాణ సమాజం సమ్మక్క, సారక్క, కొమురంభీం, రాంజీగోండు, తుర్రే బాజ్ఖాన్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మగ్దుం మోహియుద్దీన్లతో పాటు పోరాడే ప్రజల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ గడ్డ ఒక ధిక్కార స్వరం. పోరాటానికీ, త్యాగాలకూ తమ అమూల్యమైన ప్రాణాలను గడ్డిపోచవలె విసిరేసిన గడ్డ ఈ తెలంగాణ. అందుకే ఆయా సమాజాలలోని ప్రజల చైతన్యాన్ని బట్టి పాలకుల పాలన వుంటుందని రాజకీయ తత్వవేత్త బ్లంట్స్లీ చెప్పిన మాటలను ఈ తెలంగాణ గడ్డ తిరగరాస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకున్నదని రుజువు చేయాల్సిన సమయమిది. ఎంతదూరపు ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న సత్యాన్ని సమస్త ప్రజానీకం గుర్తించవలసి వుంది. అందరం కలిసి ఆశావహ దృక్పథంతో కలిసి ముందుకు సాగుతాం.(నేడు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ) గురిజాల రవీందర్ వ్యాసకర్త తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ అధ్యక్షులు మొబైల్ : 98495 88825 -
కథువా ఘటనలో రాజకీయ కోణం
దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం ఇటీవలే చూస్తున్నాం. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు జరిగేవి. కేంద్రంలో అధికారానికి వచ్చిన కొత్తలో మోదీ హరియాణాలో జరిగిన ఒక ర్యాలీలో ఆడపిల్లలను బతికించండి, చదివించండి అన్న పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే హరియాణా ఖాప్ పంచాయత్ పేరుతో మహిళలపై సాగించే అకృత్యాలకు కేంద్రంగా మారిన సమయంలో ఆడపిల్ల లను రక్షించే కార్యక్రమ ప్రారంభానికి హరి యాణాను కేంద్రంగా చేసుకోవటం ద్వారా ప్రజల దృష్టినాకర్షించింది బీజేపీ. కానీ ఈ కొత్త మురిపెం ఎంతో కాలం నిలవలేదు. రానురానూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు కనీస భద్రత కూడా కరువవుతూ వచ్చింది. కథువా బాలిక ఉదంతం ప్రాధమిక హక్కులను సైతం స్వమతం అన్యమతం అని చీల్చి అమలు జరిపేబీజేపీ పరిపాలనా తీరుకు నిదర్శనంగా నిలిచిపోతుంది. జమ్ము కశ్మీర్ నేడు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే కథువా బాలిక అత్యాచార సంఘటనకు కేంద్రమైంది. ప్రపంచ దేశాల ముందు భారతదేశం సిగ్గుతో తలొంచుకునేలా జరిగిన కథువా బాలిక బలాత్కారం, హత్య నుండి దేశం ఇంకా కోలుకోలేదు. మరింత హేయమైన చర్య ఏమిటంటే ఈ బలాత్కారానికి, హత్యకు స్థానిక దేవాలయాన్ని కేంద్రంగా చేసుకోవటం.. చివరకు ఈ హేయమైన ఘటనకు కారణమైన వారిని చట్టం శిక్షించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం గత మూడు నాలుగేళ్లల్లోనే చూస్తున్నాము. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు అడపాదడపా జరిగేవి. కానీ ఇప్పుడు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. గతంలో అటువంటి దురాగతాలకు పాల్పడిన వ్యక్తులను సమాజం చీదరించుకునేది. సాధ్యమైతే వెలివేసేది. లేదా చట్టం పరిధిలో శిక్షించేది. అటువంటి ఆగంతకులు రాజకీయ పార్టీలకు చెందిన వారైతే ప్రజల నుండి ఎక్కడ దూరమవుతామో అనే వెరపుతో బహిష్కరించేవి. కానీ ఇప్పుడు జరుగుతుంది దీనికి భిన్నం. మంత్రులు, ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు, చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదులు మొత్తంగా రేపిస్టులకు అండగా నిలుస్తున్నారు. కథువా సంఘటనలో దోషులైన వారికి అండగా నిలవటానికి ఏకంగా సంకీర్ణ ప్రభుత్వం నుండి బయటకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందువల్ల?ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆరెస్సెస్ అవగాహనలో, విస్తరణ వ్యూహంలో, ప్రజలను నిట్టనిలువునా చీల్చటంలో మహిళలపై అత్యాచారం కూడా ఒక సాధనంగా ఎలా మారిందో తెలుసుకోవాలి. కథువా సమీప గ్రామాల్లో సంచార తెగలకు చెందిన ముస్లింలు నివశిస్తున్నారు. వీరిని ఆ ప్రాంతం నుండి శాశ్వతంగా పారదోలటానికి, ఈ గ్రామాలన్నీ ఆక్రమించుకోవటానికి అభం శుభం తెలీని పాప తేలికైన లక్ష్యంగా మారిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖలేజా సినిమా కథకు కథువా ఘటన వెనకున్న లక్ష్యానికి మధ్య తేడా లేదు. ‘భారతదేశ చరిత్రలో ఆరు మహత్తర అధ్యాయాలు’ అన్న సావర్కార్ రచనను చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. ముస్లిం రాజులు ఆ రోజుల్లో హిందూ మహిళల మానప్రాణాలు తీశారు. ‘‘హిందువులు పూర్తి స్థాయి అధికారాన్ని సంపాదిస్తే ముస్లిం మహిళలకు కూడా అదే శాస్తి జరుగుతుందని వారికి అర్థం అవ్వాలి. అప్పుడు కానీ హిందు మహిళల జోలికి రాకుండా ఉండరు’’ అని అందులో ఆయన వివరిస్తారు. ఆరెస్సెస్ కార్యకర్తలు సావర్కార్ మాట జవదాటరన్న విషయం తెలిసిందే. కథువా అఘాయిత్యాన్ని ఈ కోణంలో చూస్తే తప్ప దేశంలో ముస్లింలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, చీకటి జీవితాల్లోకి నెట్టడం వంటి పరిణామాల లక్ష్యం ఏమిటో అర్థం కాదు. అంతేకాదు. హిందూ రాజులు నాటి నుంచీ ఇటువంటి వ్యూహాన్ని అనుసరించి ఉంటే ముస్లింలు హిందూ మహిళలవైపు కన్నెల్తైనా చూసేవారు కాదు అని కూడా నిర్ధారణకొచ్చాడు. ముస్లిం మహిళల పట్ల ఏ రకమైన సౌభ్రాతృత్వాన్నయినా సరే ప్రదర్శించాలని ప్రయత్నించి వారిపై అత్యాచారాలకు పాల్పడకుండా వదిలేస్తే అది ఇస్లాం మతం స్వీకరిం చినంత పాపం అని కూడా హెచ్చరిస్తాడు సావర్కార్. లవ్ జీహాద్ అసలు లక్ష్యం ఏమిటో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది. సావర్కారే ఆరాధ్యదేవుడుగా మారిన ఆరెస్సెస్ కార్యకర్తల చేతుల్లో గుజరాత్లో, ముజఫర్నగర్లో ఎంత మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోయారో తేల్చేందుకు కేంద్రం సాహసిస్తుందా? సావర్కార్ను, ఆయన ఆలోచనలను, వాటిని ఆచరించేవారిని ఈ దేశం నుండి బహిష్కరించకుండా, వారికి చట్టబద్ధత కల్పించే రాజ్యాధికారం నుండి దూరం చేయకుండా దేశంలో హిందూయేతర మహిళల మానప్రాణాల భద్రతకు హామీ ఇవ్వటం సాధ్యం కాదు. వేరుకు పుట్టిన చెదలు కొమ్మలు నరికితే పోదు. వేళ్లతో సహా చెట్టును పీకేస్తేనే పోతుంది. కొండూరి వీరయ్య వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037 -
‘కూతురుతో సెల్ఫీ’
సందర్భం ఇప్పుడున్నది ‘సెల్ఫీ’ల ప్ర పంచం. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తు లు తగ్గిపోతున్న తరుణం. తక్కువ బడ్జెట్ నుంచి ఐఫోన్ వరకు అందరి దగ్గరా ఏదో ఒక స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్లు చేతికొచ్చిన తరువాత సెల్ఫీలు ఎక్కువ కావడమే కాదు, అది వెర్రితలలు కూడా వేస్తోంది. ‘సెల్ఫీ’ కొత్తగా ఉనికిలోకి వచ్చిన పదం. ఆక్స్ఫర్డ్ డిక్ష నరీ (2013) ప్రకారం - ఒక వ్యక్తి తనకు తానుగా తీసు కున్న ఛాయాచిత్రం. స్మార్ట్ ఫోన్తో తీసుకొని సోషల్ మీడియాలో ప్రవేశపెట్టినది. తనకు తానుగా ఒక వ్యక్తి తీసుకున్న ఫొటోని సెల్ఫీ అంటున్నాం. అయితే ఆ చిత్రంలో ఆ వ్యక్తితో పాటూ ఇంకా ఎవరైనా లేదా ఏదైనా కూడా ఉండవచ్చు. కెమెరాలు మాత్రమే ఉన్న కాలంలో కూడా స్వీయ చిత్రాలను తీసుకోవడం ఉండేది. వాటిని స్వీయ చిత్రా లనేవారేగానీ, సెల్ఫీలనలేదు. అప్పుడు సోషల్ మీడి యా లేదు. అర నిమిషం వ్యవధిలో క్లిక్ అయ్యేలా కెమె రాను రెడీ చేసి, దాని ముందు నిలబడి ఫొటోలు దిగే వాళ్లు. కానీ అవి సెల్ఫీల్లా ప్రాచుర్యం పొందలేదు. అమె రికాలోని ఫిలడెల్ఫియాకి చెందిన ఓ యువ ఛాయా చిత్రకారుడు శార్నిలిన్ 1839లో మొదటిసారిగా స్వీయ చిత్రాన్ని తీసుకున్నాడని ‘పబ్లిక్ డొమెన్ రివ్యూ’ పత్రిక పేర్కొంది. అదే మొదటి సెల్ఫీ అంటున్నారు. కానీ అది కెమెరాతో, చేత్తో క్లిక్ చేయకుండానే తీసింది. కాబట్టి దాన్ని సెల్ఫీగా పరిగణించలేం. స్మార్ట్ ఫోన్లతో మన చేయి ఎంతదూరం ఉంచగలమో అంత దూరం ఉంచి స్వయం చిత్రాలను తీసుకుంటేనే ‘సెల్ఫీ’. ‘కూతుళ్లతోనే సెల్ఫీలు దిగండి!’ అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదంతో సెల్ఫీ అనే ఈ సరికొత్త పద ప్రయోగం గ్రామగ్రామానికి తెలిసిపోయింది. హర్యానా రాష్ట్రంలో మగవాళ్లకన్నా స్త్రీల సంఖ్య తక్కువ. రోజు రోజుకీ ఆ సంఖ్య తగ్గిపోతోంది. ఆ రాష్ట్రంలో ప్రతి 1,000 మంది మగవాళ్లకు 834 మంది మాత్రమే ఆడవా ళ్లున్నారు. ఇటీవలి ఓ నివేదిక ప్రకారం 2040 నాటికి 20 నుంచి 49 ఏళ్లలోపు స్త్రీలు, మగవారి కంటే 2.3 కోట్లు తక్కువగా ఉంటారని అంచనా. అప్పటి పరిస్థితి అదైతే, ఇప్పుడు రోజూ 1,300 మంది ఆడపిల్లలు మాయమైపో తున్నారు. ఇదిలాగే కొనసాగితే దేశంలో మగవాళ్ల సంఖ్య పెరిగిపోయి ఆడవాళ్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. హర్యానాలోని పరిస్థితిని గమనించి, ఆ రాష్ట్రంలోని బాజీపూర్ గ్రామ సర్పంచ్ సునీల్ గొగ్లానీ ‘కూతురుతో సెల్ఫీ’ అన్న ప్రచారాన్ని ప్రారంభించారు. దాన్నందుకుని ప్రధాని మోదీ నినాదాన్నే ఇచ్చారు. దాంతో ఆ ప్రచారం ఊపందుకుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుర్లతో ‘సెల్ఫీ’లు ట్వీట్ చేయ డం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ దగ్గర నుంచి ఫ్యాషన్ డిజైనర్ కెన్నెత్ కౌల్ దాకా కూతు ళ్ల్లతో ఫొటోలు దిగి, ట్వీట్లు చేసేశారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అంతా ఈ ప్రచారంలో పాలు పంచుకుంటున్నవారే. పైసా ఖర్చు లేకుండా రాజకీయ నాయకులు ఈ ప్రకటనతో ప్రచారం పొందుతున్నారు. ‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారం వల్ల ప్రజలకి కూతుళ్ల పట్ల కొంత అవగాహన ఏర్పడవచ్చు. కానీ ఈ ప్రచా రంతో స్త్రీల సమస్యలు ఏమైనా తగ్గుముఖం పడ తాయా? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం కష్టమే. కూతు రుతో సెల్ఫీలు సోషల్ మీడియాలో షికార్లు చేయడం వల్ల కూతుళ్లకు ఒకింత సంతోషం, గర్వం లభించవచ్చు. కానీ వారి సమస్యలకు, ముఖ్యంగా భ్రూణ హత్యలకు అది ముగింపు పలుకుతుందని అనుకోలేం. కనీసం తగ్గుముఖం పట్టిస్తుందని కూడా అనుకోలేం. మహిళా సాధికారత కొంతవరకు పరిష్కారం కావచ్చు. అందు వల్ల కనీసం భ్రూణ హత్యలు కొంత వరకు తగ్గే అవకా శమైనా ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా పని చేస్తు న్నట్టు అనిపించడం లేదు. ఏది ఏమైనా సెల్ఫీలు బాగా ప్రాచుర్యం పొందడమే కాదు, కొందరిలో ఈ పిచ్చి బాగా ముదురుతోంది. కొంత మంది కుర్రకారు చని పోయిన తమ తాతలతో, నానమ్మలతో సెల్ఫీలు దిగి వాటిని ట్వీట్ చేసే దాకా వెళ్లిపోయారు. కొన్ని దేశాల్లో ఈ సెల్ఫీలు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. భ్రూణ హత్యలను తగ్గించే లక్ష్యంతో మొదలైన ఈ ‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారానికి... ఈషాన్ జాఫ్రీ కూతు రు నిష్రీన్ జాఫ్రీ గుండె కలుక్కుమనేలాంటి బాధాకర మైన ముగింపునిచ్చింది. ఈషాన్ జాఫ్రీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరవ లోక్సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో ‘గుల్బర్గ్’ సామూహిక హత్యాకాండకు బలైపోయిన వ్యక్తి. తన ఇంట్లో ఆశ్రయం పొందిన ముస్లిం స్త్రీలను, పిల్లలను మతోన్మాద అల్లరి మూకల నుంచి కాపాడే ప్రయత్నంలో బలైపోయిన వ్యక్తి. అల్లరిమూకలకు నచ్చజెప్పి పంపడానికి వారితో మాట్లాడటం వల్లే ఆ గుంపు ఆయన్ను హత్య చేసిందని స్పెషల్ దర్యాప్తు సంస్థ తేల్చింది. మోదీ ‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారాన్ని చూసి ఇషాన్ జాఫ్రీ కూతురు నిష్రీన్ జాఫ్రీ తండ్రితో ఉన్న తన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది సెల్ఫీ అవునో కాదో తెలియదు. ఆమె దానికి ‘‘కూతురుతో సెల్ఫీ: ఇది అతన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుం ది’’ అనే వ్యాఖ్యను జోడించింది. నిష్రీన్ ఆ ‘అతను’ ఎవ రో చెప్పలేదు. కానీ అందరికీ అది అర్థమవుతూనే ఉంది. నిజానిజాలు తేటతెల్లం కాలేదు కానీ.. ‘కూతురుతో సెల్ఫీ’ సెల్ఫ్గోల్గా మారింది. హర్యానాలో మొదలైన ‘కూతురుతో సెల్ఫీ’ గుజరాత్తో ముగిసిందనుకోవచ్చు. ఆ కథ ముగిసినా ముగియకపోయినా... సెల్ఫీలు ఇప్పు డే అంతర్థానం కావు. అయినా ఫర్వాలేదు, వెర్రితలలు వేయకపోతే అదే సంతోషం. - మంగారి రాజేందర్ (వ్యాసకర్త న్యాయ నిపుణులు) 94404 83001 -
ప్రజాగ్రహానికి కారకులెవరు?
ఒక మంత్రి కోసం ముగ్గురు ప్రయాణికులను విమానం నుంచి కిందికి దింపేయటం, ఒక సీఎం కోసం అంతర్జాతీయ విమానాన్ని ఆపివుంచడం (ఆ సీఎం కార్యదర్శి తన వీసా పత్రాలను వెంట తీసుకురావడం మర్చి పోయారు), ఎంపీల జీతభత్యాల పెంపుపై పార్లమెంటరీ కమిటీ సూచన చేయడం వంటి ఘటనలు వరుసగా జరిగాయి. పై ఘటనల కొనసాగింపుగా సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అవతలి కారులో ప్రయా ణిస్తున్న కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలిక మరణిం చగా దాంట్లోని కొంతమంది గాయపడ్డారు. ఘటన జరగ్గానే హేమమాలిని షాక్కు గురయ్యారని తెలుస్తోం ది. బహుశా ఆమె దిగ్భ్రాంతి చెంది, ప్రమాదంలో గాయ పడిన వారికి సహాయం చేయాలని నిర్ణయించుకోలేక పోయి ఉండవచ్చు. బీజేపీ కార్యకర్తలు తమ విధేయత ప్రకటించుకోవడంలో భాగంగా వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఉండవచ్చు. అయితే ఈ ఘటనలో ఇతర బాధితులు తమకు తక్షణం వైద్య సౌకర్యం కల్పించేవారు కనబడక సందిగ్ధ స్థితిలో ఉండిపోయారు. ఈ పరిస్థితిలో ఒక వైపరీత్యం, అసమానత ఉన్నాయి. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారిపై సామాన్యులు ఎందుకు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారన్నే విష యాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఈ విభజనలో ‘వారు’.. ‘మనము’ అనే వ్యత్యాసం ఉంది. ఇక్కడ డబ్బు కాకుం డా ఇతర విషయాలు ప్రాధాన్యం వహిస్తుంటాయి. ఎంపీలకు మల్లే, ప్రజల ఎరుకలో హేమమాలిని కూడా ‘వారిలో’ భాగమే మరి. కార్యాలయాల్లో తాము నిర్వహించే కర్తవ్యాలను నెరవేర్చడానికి ఈ విలువైన వ్యక్తులకు ఇలాంటి సౌకర్యా లు అత్యవసరం అని మనం భావిస్తూనే, సామాన్యు లను వారిలా ఇబ్బంది పెట్టడానికి కారణాలు కూడా ఉన్నాయని గుర్తించాలి. అది వారి డాంబికం. వీరి దృష్టిలో ఇతరులు లెక్కలోకి రారు. ఇతర పౌరులు వీరి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి సంబంధించి కేవలం యాధృచ్చికమైన వ్యక్తులు మాత్రమే. ప్రభుత్వాల భారీ బడ్జెట్లతో పోలిస్తే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతరులు పొందుతున్న సౌక ర్యాలు చాలా చిన్నవి మాత్రమే. పైగా సామాన్యుడు వీరికయ్యే వ్యయం గురించి పెద్దగా బాధపడటం లేదు. కానీ వాటిని వారు తమ హక్కుగా భావిస్తుండటాన్నే వారు ఇష్టపడటం లేదు. వారి డాంబికమూ, రాజకీయా ల్లో సత్వరం ఆర్జించిన వారి వ్యక్తిగత సంపదను వారే మాత్రం ఇష్టపడటం లేదు. ప్రజాప్రతినిధులను చెడుమా ర్గాల్లో సంపాదించినవారిగా వారు అనుమానిస్తున్నారు. ఇక ఎంపీలకు వేతనాలు, భత్యాలను పెంచాలన్న సూచన కూడా ప్రముఖ వ్యక్తుల అవసరానికి సంబంధిం చినది కాదు. పార్లమెంట్ క్యాంటీన్లో వారు చెల్లించే అతి తక్కువ ధరలలోని అసంబద్ధతను ఇది పట్టి చూపు తుంది. ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులు తమ సబ్సి డీని వదులుకోవాలని ప్రభుత్వం కోరుతున్న ఘటనపై ఒక టీవీ ప్రకటన వ్యాఖ్యానిస్తూ ఇది వంట గ్యాస్ లేనివారికి లబ్ధి చేకూరుస్తుందని సూచిస్తుంటుంది. ఇది గాయంపై మరోసారి కత్తిని పెట్టి తిప్పడమే అవుతుంది. ఇది బలిసిన పిల్లులకు, బక్క పిల్లులకు మధ్య ఉన్న విభజనను సూచించే ఆర్థిక వివక్షతకు సంబంధించిన అర్థాన్ని ధ్వనిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా గృహ బడ్జెట్లను తీవ్ర ద్రవ్యోల్బణం దెబ్బతీస్తున్నప్పటికీ, మన శాసన నిర్మాత లు సరుకుల ధరలను నియంత్రించడంలో సహాయం చేయలేకపోవడాన్ని చూసినట్లయితే.. ఈ తర్కం మరిన్ని విషయాలకూ వర్తిస్తుంది. వంట గ్యాస్కు పూర్తి ధర చెల్లించగలిగిన వారు కూడా సబ్సిడీలను ఎందుకు కోరు కుంటున్నారు? దుఃఖితులకు వ్యతిరేకంగా వాదించడం దారుణం. పైగా, తమకు తాము కల్పించుకున్న ప్రయో జనాలనుంచి లబ్ధి పొందుతున్న వారు వాటిని వదులు కోలేరు. ఇది అంతమయ్యేలా కనిపించడం లేదు కూడా. అత్యధిక ప్రయోజనాల జాబితాను రూపొందించిన ఎంపీలు తమ పార్లమెంటరీ పనిని మరింత అర్థవంతం గా చేసే పనుల కు ఎందుకు మద్దతు కోరటం లేదు? వారికి ప్రస్తుతం కల్పించిన వ్యక్తిగత సహాయకులకు బదులుగా, తగిన పరిశోధక బృందం కోసం వారెందుకు అడగటంలేదు? పరిశోధక బృందం ఉంటే సమాచారాన్ని సమర్థవంతంగా అందుకున్న ఎంపీలుగా వారు చక్కటి డేటాబేస్ను కలిగి ఉంటారు. బహుశా పార్లమెంటులో ముందు బెంచీల్లో కూచున్న వారు తప్ప మిగిలిన ఎంపీ లలో చాలామంది తమ పని పార్టీ విప్లపై ఆధారపడి ఓటువేయడానికే పరిమితమని భావిస్తుండవచ్చు. స్థానిక అభివృద్ధి నిధిని ఉపయోగించుకునే హక్కు ను కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను తాము స్థానిక అంశాలకే పరిమితం చేసుకుంటున్నారు. ఒకసారి ఇలా వారి పాత్రను నిర్వచించడం, నిర్ధారించడం జరిగాక, సమాచార డేటాబేస్కు వారిని దూరం చేసి, వారి నియో జకవర్గాలకే పరిమితం చేస్తుంది. ఎంపీఎల్ఏడీ లేదా ఎంఎల్ఏఎల్ఏడీ నిధులు ఒక సందేశాన్నిస్తున్నాయి. మీ పని ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మీది నామమాత్ర మైన పాత్ర మాత్రమే. ఎంపీలు తమ పనితీరుని మెరుగుపర్చుకోవడం కోసం తగిన సహాయాన్ని కోరుకోవడం లేదన్న వాస్తవం పార్లమెంట్ లేదా రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ప్రయోజనా నికే హాని తలపెడుతోంది. పైగా తమ పాత్ర ఎంతో తక్కువ అని కూడా వారు భావిస్తున్నట్లు ఇది సూచిస్తోం ది. తమ ఆలోచనా తీరును మళ్లీ అంచనా వేసుకోవలసిన అవసరమున్న ఎంపీలతో సహా ఎవ్వరికీ ఇది మేలు చేకూర్చదు. ఎన్నికైన పదవుల్లో ఉన్న రాజకీయనేతలు తమపై వస్తున్న విమర్శను అలా సుతారంగా దులుపుకుని యథావిధిగా తమ తమ పనుల్లో మునిగిపోవడం చాలా తప్పు. (వ్యాసకర్త మహేష్ విజా పుష్కర్, సీనియర్ పాత్రికేయులు) -
‘దేశానికి’ కాలదోషం పట్టిందా?
ఒక అవినీతి కేసులో నిందితుడ్ని భగత్సింగ్లా చిత్రీకరించడం బాబు టీడీపీకే చెల్లింది. దీని ద్వారా బాబు తమ కార్యకర్తలకు, నాయకులకు పంపుతున్న సందేశం ఏమిటి? యథేచ్ఛగా అవినీతి, అక్రమాల్లో మునిగి తేలవచ్చని కాదా? ‘‘యథారాజా తథాప్రజ’’ అనే నానుడి అందరికీ సుపరిచి తమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా ధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త అవతారం చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు, గౌరవం ఏమౌతాయోనని ఆం దోళన కలుగుతోందని కొం దరు మిత్రులు ఇటీవల ప్రస్తా వించారు. ఒక అవినీతి కేసులో ప్రధాన ముద్దాయిగా పట్టుబడిన టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రాగానే... ఆ పార్టీ కార్యాలయంలోనూ, బయటా, చర్లపల్లి జైలు వద్దా ఆ పార్టీ స్పందించిన తీరు వర్ణించలేనంత ఏవగింపును, జుగుప్సను కలిగించాయని వారన్నారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్ బతికి ఉంటే ఎలా ఉండేదని? ఆ మిత్రులు అన్నారు. నాకు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం కళ్ల ముందు కదలాడింది. ‘‘ప్రజలే దేవుళ్లు, చట్టసభలే ఆధునిక దేవాలయాలు’’ అని మనసా, వాచా నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. ఆనాటి రాజకీయ పరిస్థి తుల్లో ఆయన జనాకర్షణ, బలహీనవర్గాలకు ప్రాధాన్య మిచ్చిన ఆయన సామాజిక సిద్ధాంతం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. వారిని ఆయన వెంట నడిపించాయి. ఆ కార్యకర్తలతోనే ఎన్టీఆర్ పార్టీని నడిపారు. విద్యావం తులు, న్యాయవాదులు, డాక్టర్లు, నిస్వార్థపరులు, సమా జ మార్పును కాంక్షించే ప్రగతిశీలవాదులు ఎందరో ఆయన హయాంలో చట్ట సభలకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా పనిచేసిన రామచంద్రరావు పదివేల రూపాయల అవినీతికి పాల్ప డనున్నారని తెలిసి, ఏసీబీకి పట్టించిన ఘనత ఆయనది. ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం ప్రపంచంలోనే తెలుగువారికి మంచి గుర్తింపును తెచ్చిపెడితే... చంద్ర బాబు టీడీపీ తలవంపులు తెచ్చిపెడుతోంది. ఎన్టీఆర్ అవినీతిపరుల్ని ఏసీబీకి పట్టిస్తే... చంద్రబాబు అవినీతి పరులను రక్షించుకునేందుకు బరితెగిస్తున్నాడు. ఆయన ప్రజల కోసం, పార్టీ కోసం పని చేసేవారికి ప్రాధాన్యం ఇస్తే...ఈయన డబ్బు సంచులు తెచ్చేవారికి పదవులు కట్టబెడుతున్నాడు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి అందులో పనిచేస్తున్న సీనియర్లు ఇంకా ముఖ్య స్థానాల్లో ఉన్నారు. వారు భయంతోనో, పదవీ కాంక్ష తోనో, నిర్వేదంతోనో బాబుకు వంతపాడే దుస్థితిలో ఉం డటం దురదృష్టకరం. లేకుంటే ఆ పార్టీ పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేటర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, అవినీతిపరులు, నేరచరితులతో నిండిపోయేది కాదు. నేడా పార్టీ విధాన నిర్ణేతల్లో 90 శాతం ప్రజావ్యతిరేకులు, స్వార్థపరులే. నిజానికి చంద్రబాబు ప్రజాబలంతో గెలిచిన సందర్భాలే లేవు. 1995లో బాబు ముఖ్యమంత్రి గద్దెనె క్కింది... నీతిబాహ్యంగా ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్క్వోడం ద్వారా మాత్రమే. ఆ తర్వాత1999లో, కార్గిల్ యుద్ధ భావోద్వేగ వాతావరణంలో బీజేపీ మద్ద తుతో గెలిచాడు. ఇక 2014లో మార్పును కోరుతున్న ప్రజలు, మోదీ ప్రచారం, పవన్ అభిమానుల సహాయం తో అధికారంలోకి వచ్చారు... అదీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో! ప్రజానేతకు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణ మూ చంద్రబాబుకు లేదు. ఆయనకు తెలిసింది ఒకే ఒక్క విద్య... కుతంత్రం. ‘‘ఓటుకు కోట్లు’’ అవినీతి వ్యవహారంలో రేవంత్ నేరం చేస్తూ పట్టుబడ్డాడు. ప్రజాభిప్రాయానికి భయ పడైనా అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తారనుకుంటే అది చేయలేదు. ఇంతలో చంద్రబాబు ఆడియో టేపే బయట కొచ్చింది. అప్పుడైనా ఆయన పార్టీ, ప్రభుత్వ బాధ్య తల నుంచి తప్పుకుని వేరే వారికి అప్పగిస్తాడనుకుంటే, అదీ చేయలేదు. ఒక హవాలా కేసులో తన పేరు ప్రస్తా వించి నందుకే బీజేపీ నేత అద్వానీ రాజీనామా చేశారు. ఆయనతో పోలిస్తే బాబు తీరును ఎవరైనా గర్హించక తప్పదు. పైగా ఆయన ప్రజల్ని వేరే విషయాలపై రెచ్చ గొడుతూ, తన అవినీతికి మద్దతు ఇవ్వాలని విశాల ప్రజానీకాన్ని పరోక్షంగా ఆదేశిస్తున్నాడు. ‘‘తెలంగాణ పులిబిడ్డ- నిను మరవబోదు ఈ గడ్డ’’ అంటూ రేవంత్పై పాట రాయించి మరీ బెయిల్ రాగానే వేలాది మందితో ఊరేగించాలని ఆదేశించడం ఆయనకే చెల్లింది. ఒక అవినీతి కేసులో నిందితుడ్ని భగత్సింగ్లా చిత్రీకరించడం బాబు టీడీపీకే సాధ్యం. టీడీపీ తమ కార్యకర్తలకు, నాయకులకు పంపుతున్న సందేశం ఏమిటి? ఒక నాయకుడు లేదా కార్యకర్త అవినీతి కేసులో ఇరుక్కుంటే పార్టీ అధ్యక్షుడు తమను కాపాడతాడని, తన అవినీతికి, అనైతిక చర్యలకూ వీరత్వాన్ని ఆపాదించి కీర్తి స్తాడని కాదా? యథేచ్ఛగా అవినీతి, అక్రమాల్లో మునిగి తేలవచ్చని కాదా? స్వయంగా అధినేతే అవినీతి కేసులో ఇరుక్కున్నాక ఆయన వల్లించే నీతులను ఎవరు మాత్రం ఆచరిస్తారు? సమాజం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేకుండా, ధనార్జనే ధ్యేయంగా భావించే ఫక్తు వ్యాపార వేత్తలు రాజకీయ నేతలుగా అవతారమెత్తాక... ఇక ఆ పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని ఎలా చూస్తుంది? స్వార్థపరు లతో, నేరస్తులతో నిండిన పార్టీ ప్రజలకు అవసరం లేదనే చెప్పాలి. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మహానుభావులు ఎవరైనా ఆ పార్టీలో మిగిలితే వారికి నాదో విన్నపం. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలు, బలహీనవర్గాల కోసం, కార్య కర్తల కోసం నీతి, నిజాయితీ, విలువల ప్రాతిపదికపై తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించండి. ముందే ప్రస్తావిం చినట్టు ‘యథారాజా తథాప్రజ’ అని ప్రజలంతా చంద్ర బాబును అనుసరించడం మొదలు పెడితే మన సమా జం ఎక్కడికిపోతుందో ఊహించడమే కష్టం. మీడియా సైతం రాజకీయాల నుంచి స్పష్టమైన దూరం పాటించ కపోతే ప్రజల దృష్టిలో దొంగలకూ, దొరలకూ తేడా తెలియకుండా పోయే ప్రమాదం దాపురిస్తుంది. అయితే ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న తెలుగు ప్రజలు చైతన్య వంతులు. ఈ విపరీత, వికృత ధోరణులను సహిస్తారని అనుకోవడం లేదు. (వ్యాసకర్త ఏపీ శాసన మండలి కాంగ్రెస్ పక్ష ఉపనేత) మొబైల్: 81069 15555 -
ఏడాది తెలంగాణం
( సందర్భం) తెలంగాణ ఏర్పడి ఏడాది గడచి పోయింది. ఈ ఏడాది ఎట్లా గడిచిందో, మన ప్రయాణం ఎటు సాగుతున్నదో బేరీజు వేసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చాలా ప్రయోజనాలనే తెచ్చిపెట్టింది. తెలం గాణకు మునుపెన్నడూ లేని గుర్తింపు దొరికింది. తన అస్థిత్వాన్ని కాపాడు కోవడానికి అవకాశం కలిగింది. తెలంగాణ అభివృద్ధికి కావలసినన్ని నిధులు దక్కినాయి. కృష్ణా, గోదావరి జలాలలో దాదాపు 1,000 టీఎంసీల నీళ్లు న్యాయసమ్మతంగా తెలంగా ణకు దక్కుతాయి. భారత రాజ్యాంగం నీటి పంపకాల విషయంలో రాష్ట్రాన్ని ఒక యూనిట్గా గుర్తిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, జిల్లాలకు తమ వాటాను అడిగే హక్కు లేదు. ఆ కారణం చేత గతంలో తెలంగాణకు నదీ జలాలలో వాటా దక్కలేదు. ప్రత్యేక రాష్ట్రంగా నేడు ఆ హక్కు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేకించి సరళీకరణ యుగంలో కాంట్రా క్టర్లు, కార్పొరేట్ శక్తులు, రియల్ ఎస్టేట్ డీలర్ల ప్రయోజనాలను నెరవేర్చాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వ అధికారాన్ని చలాయిం చారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆ శక్తుల ప్రత్యక్ష పెత్తనం పో యింది. ప్రజల కొరకే పనిచేయగల పాలనా వ్యవస్థ ఏర్పడింది. తెలంగాణ సమస్యలు ఎజెండా మీదికి వచ్చినాయి. వివిధ రంగాలలో స్థానిక నాయకత్వం ఎదిగే అవకాశం కలిగింది. మనకై మనం ఏర్పర్చుకున్న ప్రభుత్వ పని విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సంవత్సరం చాలదు. అందులోనూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్నది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్లో ఉన్న ఆఫీసులను రెండు ప్రభు త్వాలు పంచుకోవాలి. చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన కొద్ది రోజులకే ఎన్నికల ప్రకటన వచ్చింది. ఎన్నికైన ప్రభుత్వం రద్ద యి, గవర్నర్ పాలన వచ్చింది. ఈ పరిస్థితులలో ఏ నిర్ణయం జరగలేదు. కాబట్టి రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్ప డిన తరువాతనే విభజన ప్రక్రియ ప్రారంభమైంది. దాని వలన ప్రభుత్వం స్థిరంగా పనిచేయడానికి చాలా చాలా సమయం పట్టింది. ఇంకా విభజన ప్రక్రియ పూర్తికాలేదు. ఉద్యోగుల విభ జనలో కమలనాథన్ కమిటీ తాత్సారం చేస్తున్నది. పబ్లిక్ రంగ సంస్థల విభజన నత్తనడకన సాగుతున్నది. రెండు రాష్ట్రాలకూ విడి విడిగా హై కోర్టులు ఏర్పడవలసి ఉన్నది. ఉమ్మడి సంస్థలను అడ్డుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు తరచుగా ఇబ్బందులను సృష్టిస్తున్నది. అందువలన విభజన జరిగి సం పూర్ణ తెలంగాణ ఏర్పడకుండా ఏ ప్రభుత్వమూ సమర్థవం తంగా పనిచేయలేదు. ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది పాలనను చూడాలి. తెలంగాణ ఉద్యమ ప్రభావం విధాన రూపకల్పనపై ఉన్న ది. కార్పొరేట్ రంగానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాధాన్యత తగ్గింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వరంగ సంస్థలపై కేంద్రీకరణ పెరిగింది. ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్ట పరచ డానికి చర్యలు మొదలయ్యాయి. కేజీ నుండి పీజీ వరకూ ఉచి తంగా విద్యను అందించాలన్న ఆలోచన ఈ కోవకు చెందినదే. అదే విధంగా విద్యుత్తును ప్రైవేటు పరం చేయకుండా పబ్లిక్ రం గంలో కొనసాగించడానికి కృషి జరుగుతున్నది. సంక్షేమ రంగంలో కూడా మంచి మార్పులు వచ్చినాయి. పింఛన్లు పెరిగాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతున్నది. ఇంటింటికి నీళ్లందించాలన్న వాటర్గ్రిడ్ కార్యక్రమం కూడా ప్రజల అవసరాలను తీర్చే పథకమే. అయితే, ఈ పథకాలు సమగ్రంగా అమలులోకి రావలసి ఉన్నది. అయితే కొన్ని రంగాలలో ఇంకా కార్యాచరణ రావలసి ఉన్నది. అందులో ప్రముఖమైనవి రెండు. మొదటిది యువతకు సంబంధించిన విధానం. 18-30 ఏళ్ల వయస్కులు మన రాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం. వీరి ప్రధాన సమస్య ఉపాధి. సరళీకరణ యుగంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతి న్నాయి. పబ్లిక్ రంగ సంస్థలను మూసివేసి... ఉన్న పరిశ్రమ లలో కార్మికుల సంఖ్యను తగ్గించి గత ప్రభుత్వాలు ఉద్యోగా వకాశాలను కుదించాయి. కరెంటు కోతలతో చాలా కంపెనీలు ఖాయిలా పడ్డాయి. వ్యవసాయంలో పెట్టుబడులు లేక అభి వృద్ధి మందగించింది. ఆదుకునే నాథుడు లేక చేతి వృత్తుల నడ్డి విరిగింది. సరళీకరణ విధానాల వలన కొంతమందికి సంపద దక్కి నా, ఉపాధిలేని అభివృద్ధి కారణంగా మిగతావర్గాలు సంక్షో భంలో చిక్కుకున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లు రాలేదు... అరకొరగా వచ్చిన డీఎస్సీ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు తప్ప. ఈ పరిస్థి తుల్లో చాలీచాలని జీతాలతో ప్రైవేటు రంగంలోనో, అసంఘ టిత రంగంలోనో బతుకుదెరువు పొందినవారు కొందరు. బతకలేకపోతున్నవారు మరికొందరు. ఈ పరిస్థితిలో యువత తెలంగాణ ఉద్యమాలలో పాల్గొ న్నారు. వారందరూ బతుకుదెరువు అవకాశాలకై ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక నోటిఫికేషన్ రావలసిన అవసరం ఉన్నది. నోటిఫికేషన్ పరిధిలోకి రాని యువకులకు- పది, ఇంటర్తో చదువు ఆపినవారు, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివినవారు- ఉపాధిలో శిక్షణ ఇవ్వాలి. ఉపాధి అవకాశాలను పెంచాలి. ఈ విషయంలో ఒక విధాన ప్రకటన, కార్యాచరణ వెలువడవలసిన అవసరం ఉన్నది. ఇక వ్యవసాయం ప్రభుత్వం పట్టించుకోవలసిన రెండవ రంగం. మిగిలిన రాష్ట్రాల వలెనే తెలంగాణలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. మొత్తం జనాభాలో గ్రామాలలో జీవించేవారు దాదాపు 61 శాతం. సగటున ప్రతి రైతు కుటుంబానికి 3.51 ఎకరాలు ఉండగా, అందులో సగం సాగునీటి సౌకర్యం లేనిది. వీరందరికీ వ్యవసాయం తప్ప వేరొక ఆదాయ మార్గం లేదు. నీటి అవకాశాలు తక్కువగా ఉన్న తెలంగాణవంటి ప్రాంతాలలో హరిత విప్లవం రైతును ఆదుకోలేకపోయింది. ఈ ప్రాంతంలో చిన్న రైతులు ఎక్కువ. నీటి వసతి లేక ఖర్చుతో కూడిన హరిత విప్లవావం వల్ల అప్పులపాలయ్యారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఒక కార్యాచరణను తయారుచేయడం చాలా అవసరం. ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉన్నది. తెలంగాణ ఏర్పాటుతో ప్రజల చైతన్యం బాగా పెరిగింది. గతం లో ఆంధ్ర పాలకులు తెలంగాణను విస్మరించినందునే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారమౌతాయన్న భావనతో ప్రజలున్నారు. ప్రభుత్వంవైపు ఆశతో చూస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోకపోతే తీవ్ర మనస్థాపానికి, నిరాశకు గురవుతు న్నారు. ఆయా వర్గాలు సమస్యలను లేవనెత్తినప్పుడు వెంటనే స్పందించడం చాలా అవసరం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన లేక మంత్రులకు తెలిసిన సమస్యలపట్ల చర్యలు ఉంటున్నాయి. కానీ మొత్తంగా పాలన మరింత మెరుప డాలంటే ప్రజల నివేదనలపై స్పందించే తత్వాన్ని పాలనా యంత్రాంగం అలవర్చుకోవాలి. ఆఖరుగా ఒకమాట. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు సంఘటితంగా నిలబడి సానుకూల నిర్ణయాన్ని సాధించుకు న్నారని మరిచిపోవద్దు. ప్రజలు చైతన్యవంతులైతే పాలన కూడా బాధ్యతాయుతంగా సాగుతుంది. తెలంగాణ నిర్మాణం లో విద్యావంతులు మౌనంగా ఉండరాదు. ప్రొఫెసర్ జయ శంకర్ చెప్పినట్లు ప్రజల సమస్యలకు కారణాలు తెలుసుకొని, పరిష్కారాలను అన్వేషించి ఆ విషయాలపై ప్రజలను చైతన్య వంతులను చేయగలిగితేనే అందరికీ న్యాయం చేయగల అభి వృద్ధి సాధ్యమని గ్రహించాలి. ఆయనే చెప్పినట్టు పౌర వేదికలు తెలంగాణ నిర్మాణానికి తోడ్పడగలవు. ఈ సంవత్సర కాలంలో పౌరవేదికలు నిలదొక్కుకొని భవిష్యత్తు కార్యాచ రణను రూపొం దించుకోవడం ఒక శుభ పరిణామం. (వ్యాసకర్త: కోదండరాం, తెలంగాణ జేఏసీ చైర్మన్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు ) మొబైల్ : 9848387001 -
విలువలకు నిలువుటద్దం సీఆర్
(సందర్భం) కమ్యూనిస్టు యోధులు చం డ్ర రాజేశ్వరరావు 101వ జయంతిని జూన్ 6న దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నా రు. రాజకీయ విలువలకు నిలువుటద్దం సీఆర్. తన చివ రి ఊపిరి వరకు నిబద్ధతతో ఆదర్శప్రాయుడైన చండ్ర రా జేశ్వరరావు, పుచ్చలపల్లి సుం దరయ్య, వి. సుబ్బయ్య లాంటి వారి త్యాగాలే మన పెట్టుబడులు. రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది. పవిత్రమైన రాజకీయ వ్యవస్థను ద్రౌపది వస్త్రాపహరణం లాగా నడి వీధుల్లో ఆడుకుంటున్నారు. తాజాగా రేవంత్రెడ్డి ఓటు కొనుగోలు విషయంలో ఆధా రాలతో సహా పట్టుబడ్డాడు. ఎంతో పకడ్బందీగా ప్రభుత్వం పథకం రూపొందించ బట్టే ఆధారాలతోసహా దొరికిపోయారు. అసలు రేవంత్కు మూలం ఏంటి అనే వైపు దారితీసి చివరికి చంద్రబాబు కేరాఫ్కు పోయింది. సెల్ఫోన్ తదితర ఆధారాలతో విచారణ జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడిలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ చురుకుగా వ్యవహరిం చింది. టీడీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయించింది. టీఆర్ఎస్ నిజమైన ఓట్లతో 5వ అభ్యర్థి గెలవడం అసాధ్యం. అయినా ఐదు మందిని పోటీ పెట్టి గెలిపించుకోవాలనే వ్యూహంతోనే ముందుకు కదిలారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు టీడీపీ అభ్యర్థి గెలవకూడదనే పట్టుదల టీఆర్ఎస్ది కాగా, కాంగ్రెస్ గెలిచినా ఫర్వాలేదు టీఆర్ఎస్ గెలవకూడదని టీడీపీ పట్టుపట్టింది. టీఆర్ఎస్ పట్టుదల వల్ల కాంగ్రెస్ పార్టీ క్షేమంగా బయటపడితే, రాజకీయ అవమానాలతో టీడీపీ కుదేలయింది. రేవంత్ జైలుకు వెళ్లాల్సివచ్చింది. ప్రత్యేక తెలంగాణ నినాదంతో స్పటికంలాగా పైకి వచ్చి, ఆచరణలో కల్తీ సరు కుగా మారాల్సిన పరిస్థితి టీఆర్ఎస్కు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. సకల జనులు బరితెగించి పోరాడారు. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థాపించింది. అందరూ హర్షిం చారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంగా మాట్లాడిన పార్టీలకు చెందిన గెలిచినా, ఓడినా ప్రతినిధులతో కేబినెట్ నింపేస్తున్నారు. ఇక టీడీపీ ఆంధ్రప్రదేశ్లో సొంత మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకు న్నది. అయినా వైఎస్ఆర్ పార్టీ నుండి గెలిచిన ప్రజా ప్రతినిధులను టీడీపీ ఆకర్ష్ పథ కం అమలు చేశారు కానీ, తెలంగాణలో ఫిరాయింపులపై ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ నాయకులు. తెలుగునాట రాజకీయ రక్తి రసం డ్రైనేజిగా మారి కంపుకొడు తోంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టుల బలం కనీసం 10కి తగ్గకుండా ఉండి ఉంటే కూడా ఇంతటి అధ్వాన్నంగా సభ జరిగేది కాదు. రాజకీయ పరిణామాలు దిగజారేవి కాదు. ఈ రొంపిలో మనకెందుకని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమకున్న చెరొక ఓటు ‘తటస్థం’ అని ప్రకటించి మంచి పని చేశారు. (డాక్టర్ కె. నారాయణ కార్యదర్శి, సీసీఐ జాతీయ సమితి, 94909 52222) -
ఆకాశంలో, పోరులో సగం... అధికారంలో?!
(సందర్భం) తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో ఏడాది పాలన కూడా గడిచింది. ఏడాది దొర ల పాలన గడిచిందనటం సబ బేమో. ఎందుకంటే అరవై ఏళ్ల తెలంగాణ పోరాటం సామా జిక న్యాయం కోసం జరిగింది. 2009 నుంచి 2014 వరకు సామాజిక, ప్రజాస్వామిక నినాదాల మీద జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా మలిదశ (1996) తెలంగాణ ఉద్య మం నడిచింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజ లకు అధికారంలో వాటా కోసమనే సామాజిక న్యాయం డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉంది. అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగం కావటం వలన రాబోయే తెలంగాణలో వారి వాటా ఉండాలని భావించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాడిన శక్తులకు అన్యాయం జరిగింది.ఆ కాలంలో ఉదాసీనంగా లేదా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు, శక్తులకు అధికారం లో వాటా దక్కింది. ఉద్యమంలో విద్యార్థులు, యువత, రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఇతర వృత్తుల ప్రజలు పోరాడారు. ఇక్కడ ప్రస్తావించిన అన్ని రంగాల వారితో కలసి స్త్రీలు కూడా సగభాగమై పాల్గొన్నారు. కానీ ఈ పితృస్వామ్య సమాజంలో స్త్రీలు అన్నిటా అన్యాయానికి గురైనట్లే తెలంగాణలో కూడా గురయ్యారు. నాలుగు కోట్ల తెలంగాణ జనాభాలో రెండు కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఆకాశంలో సగంగా ఉన్న వీళ్లు పోరాటంలో కూడా సగమైనారు. తెలంగాణలో స్త్రీల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని ఎదిరించి యుద్ధం చేస్తూ అమరులైన సమ్మక్క-సారక్కల వారసత్వాన్ని వారు అందిపుచ్చుకు న్నారు. నైజాం పరిపాలనలో విసునూర్ రామచంద్రారెడ్డి గూండాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి నాళ్లలో కూడా స్త్రీలు ముందంజలో ఉన్నారు. ఆరుట్ల కమ లాదేవి మరొక అద్భుత ఉదాహరణ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటై దూసుకొచ్చిన తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. తన పాతిక సంవత్సరాల జీవితాన్ని తెలం గాణ రాష్ట్రం కోసం అర్పించింది. ఆమెతో పాటు ఎంతో మంది దళిత, బీసీ, ఆదివాసీ, స్త్రీ కళాకారులు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నిలబెట్టారు. ఆ ఉద్యమాల పునా దుల మీదనే 2001లో టీఆర్ఎస్ పుట్టింది. 2009 నుంచి 2013 వరకు జరిగిన పోరాటంలో కూడా మంజుల (వరంగల్), రాధ (కరీంనగర్), కావలి సువర్ణ (పాలమూరు), కురువ సరిత (రంగారెడ్డి), చామంతి శ్రుతి (నిజామాబాద్) వంటి ఎందరో విద్యార్థి నులు ఆత్మబలిదానంతో ఉద్యమ దీపాన్ని వెలిగించారు. ప్రత్యేక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పా టుకు కావాల్సిన మెజారిటీతో గెలిచింది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ అతడే గద్దెనెక్కి కూర్చున్నాడు. పైగా 66 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మహిళలకు మంత్రిపదవి దక్కని మంత్రివర్గం ఒక్క కేసీఆర్దే. ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా, లోక్సభ స్పీకర్గా కూడా ఇప్పుడు మహిళలు అవకాశం పొందారు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు మన దేశంలో కూడా ఎంతో కొంత మహిళలకు అధికారంలో భాగస్వామ్యం దక్కింది. కాని పోరాట చైతన్యం ఉన్న తెలంగాణలో పోరాడిన మహిళలకే అధికారంలో వాటా దక్కక పోవటం చూస్తే మగ పెత్తనం ‘దొరల’ రాజ్యం నడుస్తున్నదని అర్థమవుతుంది. టీఆర్ఎస్లో బొడిగె శోభ, కోవా లక్ష్మి, రేఖానాయక్, పద్మాదేవేందర్రెడ్డి, గొంగిడి సునీత, కొండా సురేఖ లాంటి ఆరుగురు మహి ళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్క లేదు. పైగా కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవని తుమ్మ ల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహ రిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టీడీపీ నుంచి వలస వచ్చిన శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి కట్టబె ట్టారు. మహిళలకు మంత్రి పదవి వస్తే ఈ రాష్ట్రంలో మహిళలందరి జీవితాలూ మొత్తం మారిపోతాయని కాదు కాని, ఇది తెలంగాణలోని రెండు కోట్ల మహిళల ఆత్మగౌరవం సమస్య. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబే డ్కర్ వంటి సామాజిక విప్లవకారుల స్ఫూర్తితో సమ్మక్క -సారక్క, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత పోరాట స్ఫూర్తితో మంత్రివర్గంలో చోటుతో పాటు అన్ని రంగాలలో స్త్రీలకు 50 శాతం వాటా దక్కటం కోసం పోరాటం చేయటం తప్ప మరో మార్గంలేదు. తల్లులు, అక్కలు, చెల్లెళ్లు, ప్రజాస్వామికవాదులు, మహిళా ఉద్యమ నాయకులు, విప్లవకారులు ఈ న్యాయమైన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. (నేడు హైదరాబాద్లో జరిగే మహిళా గర్జన సందర్భంగా...) (వ్యాసకర్త మందకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు) మొబైల్: 94407 23808 -
అరుణ అదృష్టవంతురాలు... కానివారో?
సందర్భం - మహేష్ విజాపుర్కార్ అరుణ శాన్బాగ్ లైంగిక దాడికి గురై, మెడకు కుక్క గొలుసు బిగుసుకుపోయి ఊపి రాడక గత నాలుగు దశాబ్దాలు గా ముంబైలోని ఒక ఆసు పత్రిలో అచేతనావస్థలో పడి ఉంది. ఆ కారణంగానే కారు ణ్య మరణం లేదా పాక్షిక కారు ణ్య మరణంపై చర్చ జరుగుతూనే ఉన్నా ఏమంత ముం దుకు సాగలేదు. నలభై ఏళ్లుగా మంచానికే అంటి పెట్టుకుని ఉన్నా అరుణ శరీరంపై ఒక్క పుండు కూడా పడకపోవడం మునిసిపల్ నిర్వహణలోని కేఈఎమ్ ఆసుపత్రికి గర్వదాయకం. అదే ఆసుపత్రిలోని బేస్మెంట్లో ఈ విషాదం జరిగేటప్పటికి ఆమె అక్కడ యువ నర్సు. ఆమెను కాపాడటం కోసం అత్యవసర చికిత్స గదిలోకి తీసుకు వచ్చేట ప్పటికి అన్ని శాఖల నిపుణులూ సహాయం అదించడం కోసం అక్కడికి చేరుకున్నారు. ఆమె పట్ల ప్రదర్శించిన శ్రద్ధ, సేవాభావం ప్రైవేటుదైనా, ప్రభుత్వం నడిపేదైనా దేశంలోని ప్రతి ఆసుపత్రికీ ప్రమాణం కావాలి. కానీ పరిస్థితి అలా ఉందా? ఉంటుందని ఆశించగలమా? నేటి ఆరవ వేతన సంఘం వేతనాలతో పోలిస్తే అప్పట్లో అరుణకు లభించినది అత్యల్పం. ఆమెగాక మరెవరైనా అత్యాచారం, గొంతు నులిమివేత బాధితు రాలై ఉంటే ఆమె ఎలా ఉండేది? అసలు ఆమెకు ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స అందించేవారేనా? అలా అచేత నావస్థలో పడి ఉండటానికైనా నోచుకునేదేనా? ఆమె తరఫున ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆమెకు తెలిసేదే కాదు. ఆమె చికిత్స వ్యయానికి ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి బికారులై ఉండేదే. తరచుగా ఖరీదైన పరీక్షలు, వైద్యపరమైన జోక్యం అవసరం లేకపోయినా ప్రైవేటు ఆసుపత్రులైతే లాభాలు పిండటానికి దొరికిన మరో పేషంటు కోసం స్థలం కేటా యించేవే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక అచేతన స్థితిలో ఉన్న రోగి పట్ల ఆసక్తి ఉండదనే చెప్పాలి. అరుణ శాన్బాగ్ మాత్రమే అందుకు మినహాయింపు, ఆమె కూడా ఆ ఆసుపత్రికే చెందిన మనిషి. కాలక్రమేణా ఆ ఆసుపత్రికి, ఆమెకూ మధ్య అనుబంధం బలపడింది. ఆమెను దీర్ఘకాలిక స్వస్థత గృహానికి తరలించేట్ట యితే ఆందోళనకు దిగుతామని ఆమె సహోద్యోగు లంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వస్థత గృహాలుగా చెప్పేవి మన వైద్య వ్యవస్థలో అల్ప ప్రాధాన్యం గలవి. మన చుట్టుపక్కల ఎక్కడా అలాంటివి కనబడవు లేదా కనిపెట్టడ మే కష్టం. గత వారం అరుణ మరణానంతరం ఆ ఆసుపత్రి డీన్, ఆమె బంధువుతో కలసి అంత్య క్రియలను నిర్వహించారు. అరుణ విషయంలో కారు ణ్య మరణాన్ని అనుమతించవచ్చంటూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోగా, ఆసుపత్రి సిబ్బంది నిరవధికంగా ఆమెకు సేవలు చేస్తామని అఫిడవిట్లు ఇచ్చారు. ఆమె అదృష్టవంతురాలు. ఒక నిస్సహాయ వ్యక్తి పట్ల అంతటి అంకితభావాన్ని చూపడం నిజంగానే హృదయాన్ని కదిల్చేది, ప్రశంసనీయమైనది. దురదృష్టవశాత్తూ, సార్వత్రికంగా అలాంటి ప్రతి దీర్ఘకాలిక రోగిని ఆసుపత్రిలో సజీవంగా ఉంచాలనడం తప్పు. ఆమెది ఒక విలక్షణమైన కేసు. కానీ ఆమెకు అందించినంత నాణ్యమైన సేవలు ప్రతి ఒక్కరికీ అందా ల్సినవి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నిటిలో అందు బాటులో ఉండాల్సినవి. కానీ అక్కడా ఇక్కడా కూడా అవి కొరవడుతున్నాయి. వివిధ కారణాల రీత్యా వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిష్పత్తి క్షీణించిపోతోం దని, ప్రైవేటు ఆసుపత్రులు పీడకలలేనని అనుభవం ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగికి మంచ మే కరువు. పడకల సామర్థ్యాన్ని మించి ఉన్న పేషంట్లం తా నేల మీద చాప పరుచుకు పడుకోవడమే రివాజు. డాక్టర్లు సహా సిబ్బంది కొరత, మందుల షెల్ఫ్లు ఖాళీగా ఉండటం, బంధువులే రోగులకు సేవలు చేయా ల్సిరావడం, మొదలైనవి ఈ వ్యవస్థ ఏర్పాట్ల గురించి బోలెడు తెలుపుతుంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖర్చులు ఊహిం పరానివి. వాటికి లాభాలు ముఖ్యం. అనవసరమైన పరీక్షలు, అధిక చార్జీలు, ప్రమాదకరంగా మందులు ఎక్కువగా రాయడమూ తప్పవు. రూ. 25,000కు దిగు మతి చేసుకునే స్టెంట్కు ఒక రోగి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశారని తెలిసింది. అయినా, ఎందువలనో దిగువ మధ్యతరగతివారు కూడా ఖరీదైనవైనా ఆ ఆసుప త్రులవేపే మొగ్గుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువగా ఉండటం ఒక్కటే అందుకు కారణం కాదు. రెండు రకాల ఆసుపత్రుల్లోనూ సంస్థాగత నైతిక విలువలు కొరవడటమే ఈ పరిస్థితులకు అసలు కార ణం. అత్యుత్తమమైన వాటితో తులతూగే వైద్య సేవలు చౌకగా లభించే అవకాశం ఉన్నా అవి విధాన కర్తలను లేదా మదుపరులను ఊరించ గలిగేవి కావు. అరుణ శాన్బాగ్ బంధువులలో పలువురు ఆమెకు దూరంగా ఉండిపోయారు. ఆమెను జీవించి ఉంచడానికి అయ్యే వ్యయాల భయమే వారిని దూరంగా తరిమింది. బాధాకరమైన 40 ఏళ్ల తర్వాత ఆమె మరణించాక వారి లో చాలా మంది వచ్చారు. ఎంతో మంది రోగగ్రస్తులు చార్జీలను సైతం భరించలేక బూటకపు వైద్యులతో సరిపె ట్టుకుంటారు. ఆదాయం, విద్య తర్వాత జీవితంలో కోరుకునే ముఖ్యాంశం మంచి ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉండటమే మహా వ్యయభరి తమైనప్పుడు అసలా జీవితం ఏం జీవితం? (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) e- mal: vapuka@gmai.com -
సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించాలి!
(సందర్భం) దేశంలోని అన్ని కాగితపు మిల్లు పరిశ్రమల్లోకెల్లా 32 రకాల నాణ్యమైన కాగితాన్ని సిర్పూర్ పేపర్ మిల్లు ఉత్పత్తి చేస్తోంది. మిల్లు మూసివేతను కేసీఆర్ ఎత్తివేయించి కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. గత నాలుగైదు దశాబ్దాలలో బ్రహ్మాండంగా నడిచినటువం టి పరిశ్రమలు మేనేజ్మెంట్ తప్పుడు విధానాలవల్ల, మూ సివేతకు గురై, కార్మికులను రోడ్డుమీద పడవేసిన కారణం కాగా కార్మిక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా యి. కాంగ్రెస్, టీడీపీ తప్పు డు విధానాలవల్ల అజాంజాహి మిల్, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, ఐడీపీఎల్, హెచ్ఎంటీ, ఆల్విన్ ఎఫ్సీఐ, ఎన్టీపీసీ, సీసీసీ (ఎస్.సి.ఎల్), రామగుండం బి పవర్ హౌజ్ తదితర ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సం స్థలు మూతపడి లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఎన్నో ఆశలతో, కోరికలతో, ఎన్నో బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో సింగరేణి ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసింది టీఆర్ఎస్ ప్రభు త్వం. సోషలిస్టు కార్మిక నాయకుడిగా సుదీర్ఘ అనుభవం కలిగిన నాయిని నర్సింహారెడ్డి దాదాపు 70 సంవత్స రాల చరిత్ర కలిగిన సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్ యూనియన్కు అధ్యక్షులుగా ఉంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారే కార్మికశాఖ, హోంశా ఖలకు మంత్రిగా ఉండటం వల్ల, మిల్లు కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉండవని, భవిష్యత్తులో జీతాలు పెరిగి తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని కార్మి కులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కార్మిక క్షేత్రంలో చాలా సంస్థలకు న్యాయం జరుగుతుంటే సిర్పూర్ మిల్లు, బిల్డ్ కార్మికులు మాత్రం రోడ్డుపైన పడ్డారు. యాజమాన్యం 27-09- 2014 నుంచి సిర్పూర్ మిల్లు షట్డౌన్ పేరుతో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా లేఆఫ్/లాకౌట్ ప్రకటించకుం డానే గత 8 నెలలుగా పరిశ్రమలు మాసివేసింది. దీంతో గత అక్టోబర్ నుంచి సుమారు 4,000 మంది కార్మికు లకు జీతాలు లేక కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డా యి. పిల్లల ఫీజులు కట్టలేక కనీసం తినడానికి సరుకులు కొనలేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, పెళ్లిళ్ల విషయం లో ఆగమవుతున్నాయి. వేలాది కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్నిరకాల ఉద్యమాలు చేసినా, గల్లీ నుండి హైదరాబాద్ వరకు అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకులు మద్దతు ప్రకటించినా, అసెంబ్లీలో సమస్య లేవనెత్తినా ఆఖరుకు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చినా మిల్లు కార్మికుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. భవిష్యత్ అంధకారంగా కనబడుతున్న పరిస్థితు ల్లో అధికారులనుంచి, యాజమాన్యం నుంచి, ప్రభు త్వంనుంచి, ఈ ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు కానీ, మిల్లు ట్రేడ్ యూనియన్ నాయకుడైన నాయిని నర్సింహారెడ్డి నుంచి కానీ, ఆఖరుకు సీఎం కేసీఆర్ నుంచి కానీ కనీస స్పందన కనిపించకపోవడం బాధాకరం. మిల్లు మూత పడి 8 నెలలు గడుస్తున్నా, ఇప్పటికి ఇద్దరు కార్మికుల ఆత్మహత్యలతో పాటు 11 మంది మరణాలు సంభవిం చినా పట్టించుకోకపోవడంతో తెలంగాణ వచ్చిన తర్వా త ఎవ్వరికీ జరగని అన్యాయం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకే జరుగుతోంది. భారతదేశంలోని అన్ని కాగితపు మిల్లు పరిశ్రమల్లో కెల్లా 32 రకాల నాణ్యమైన పేపర్ను సిర్పూర్ పేపర్ మిల్లు ఉత్పత్తి చేస్తోంది. మిల్లు యజమాని అయిన ఫోతేదార్ ధన దాహానికి అంతే లేకుండా పోయింది. అక్రమ పద్ధతుల ద్వారా బ్యాంకుల నుంచి రూ.450 కోట్లు తీసుకుని జర్మనీ నుంచి తెప్పించిన సెకండ్ హ్యాం డ్ మిషన్లను కొని అవినీతికి పాల్పడినందునే కంపెనీకి ఈ గతి పట్టింది. బిల్ట్ పరిశ్రమను తెరిపిస్తామని, అన్ని సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గతంలోనే హామీ ఇచ్చారు. ఆ హామీని ఆయన తప్పకుండా నేరవేరుస్తారని, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించడానికి శ్రద్ధ చూపుతారని కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. నిరాశతో, నిస్పృహతో వేగుతు న్న కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని అడ్డుకునే నిర్ణయం తెలంగాణ తొలి ప్రభుత్వానికే ఉం ది. వరంగల్ బిల్ట్ పరిశ్రమకు హామీ ఇచ్చిన విధంగానే మూతపడిన కాగితం మిల్లును తిరిగి నడపడానికి ప్రభు త్వం లేదా ప్రైవేట్ యాజమాన్యాలను పిలిచి రూ. 500 కోట్లు సమకూర్చితే వేలాది కార్మికుల కుటుంబాలు కళ కళలాడుతాయి. నెలకు 3 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోతున్న నాలుగు వేల కుటుంబాలను ఆదుకుని కార్మికులను ఆత్మహత్యల బారిన పడకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతున్నాము. 1938లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొత్తపేట గ్రామం లో ఈ కాగితం మిల్లును స్థాపించారు. కాగజ్ అంటే పార్శీభాషలో కాగితం అని అర్థం. 1942లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి కొత్తపేట పేరు పోయి కాగజ్ నగర్, సిర్పూర్ పేపర్మిల్ అనే పేరు స్థిరపడి పోయిం ది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలన్నింటినీ తెరిపించడంలో ఉత్సాహం చూపా లే కాని కేవలం కొత్త పరిశ్రమల ఏర్పాటుకై తాపత్రయ పడవద్దని కోరుతున్నాము. ఉద్యమ కాలంలో మూసి వేసిన అన్ని పరిశ్రమలను పునరుద్ధరించుకుందామని అప్పటి ఉద్యమ సారథులు, టీఆర్ఎస్ నాయకులు కేసీ ఆర్, జేఏసీ నాయకులు కోదండరాం హామీ ఇచ్చిన మాటల్ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నాము. మూసివే సిన సిర్పూర్ కాగితం పరిశ్రమపై ఇప్పటికైనా ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటన చేసి, మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా చూస్తారని కార్మికులు ఎదురు చూస్తు న్నారు. మిల్లు కార్మికుల పిల్లలను పాఠశాలలకు, కళా శాలలకు పంపించుకునే విధంగా మిల్లును పునరుద్ధరిం చావి, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం స్వయంగా సిర్పూర్ కాగితం మిల్లు వద్దకు వచ్చి కార్మికుల సమస్య ను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిల్లును తెలి పించాలని కార్మికులు కోరుకుంటున్నారు. (వ్యాసకర్త గురిజాల రవీందర్ రావు.. వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, మొబైల్ 9849588825) -
పెద్ద నేతల చిన్న లంచం నేరం కాదా?
(చట్టాలు ప్లస్ న్యాయశాస్త్రం ప్లస్ సాక్ష్యం కలిపి వడబోస్తే పదికోట్ల రూపాయల దాకా లంచాలు తీసుకుంటే పెద్ద నేరం కాదు అనే కొత్త సూత్రం వస్త్తుందేమో? అందరూ కలిసి లంచం విలువ పెంచడం దేశానికి మంచిది కాదు.) ‘‘న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచిం దంతా న్యాయం కాదు’’ అన్న శ్రీశ్రీ మాట అక్షరాలా న్యాయ మైన మాట. చిన్న ఉద్యోగి తీసుకున్న లంచం చాలా తక్కువని క్షమించడానికి వీల్ల్లే దనే సమన్యాయ సూత్రం... ‘ముఖ్యమంత్రి గారి అక్రమా ర్జన రెండున్నర కోట్లేనా, వదిలేయండి’ అనడం సమం జసమేనా? పెద్ద నేతలు చిన్న లంచాలు తీసుకోవచ్చనే కొత్త మినహాయింపేమైనా పుట్టుకొస్త్తున్నదా? చట్టపరమైన ఆదాయ వనరులకన్నా ఆస్త్తులెక్కు వగా ఉంటే నేరమని అవినీతి నిరోధక చట్టం చేసిన పార్లమెంటు ఎంత ఎక్కువుంటేనే నేరమో చెప్పలేదు. కొంత ఎక్కువ ఉన్నా ఫర్వాలేదనలేదు. ఏటా రూ. 12 లక్షలు సంపాదించే వ్యక్తి 12 లక్షల రూపాయల ఆస్తులు కూడబెడితే లంచాలే కారణం అనుకోవాలి. కాదని నిం దితులు రుజువు చేయలేకపోతే నేరమే. అక్రమాస్తులు 10 శాతం పైగా ఉంటేనే నేరస్త్తుడనాలని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. ఇదొక మార్గదర్శకం. శాస నం కాదు. ఏపీ ప్రభుత్వ మార్గదర్శకం ప్రకారం 20 శాతానికి మించితేనే ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ శాతాలకు చట్టపరమైన ప్రాతిపదిక ఏదీ లేదు. ఇప్ప టికీ డిఏ (ఆదాయానికి మించిన ఆస్తులు) కేసుల విష యంలో స్పష్టత లేదు. బంగారు లక్ష్మణ్ తీసుకున్న లక్ష రూపాయలూ లంచమే అంటూ ప్రాసిక్యూట్ చేశారు చనిపోయేదాకా. లక్ష అవినీతి నేరమే.. మరి రూ 2.83 కోట్ల ఆస్తులు ఎక్కువగా ఉంటే అవినీతి కాదా? ఈ ధర్మసూక్ష్మం అసమాన ప్రతిభావంతులైన న్యాయధను లకే కాదు, సామాన్యుడికీ అర్థం కాదు. జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్దో షిత్వ తీర్పులోని కూడికల తప్పు వల్లనే ఆమె నిర్దోషి అయిందని కర్ణాటక ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య ఘం టాపథంగా చెబుతున్నారు. జయ వ్యతిరేక రాజకీయ వర్గాలకు గొప్ప అవకాశం దొరికింది. చూడగానే చాలా స్పష్టమైన తప్పు బయటపడితే ఆ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాలన్నది న్యాయసూత్రం. హైకోర్టు తీర్పు ను సమీక్షించాలని హైకోర్ట్టునే కోరాలా లేక సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవాలా? అని తేల్చుకోవాలి. లెక్కలు చేయడంలో న్యాయమూర్తి సహాయకుల మీద ఆధారపడితే ఆ లెక్కను మళ్లీ పరిశీలించడం న్యాయం. ప్రాసిక్యూటర్ ఆచార్య వాదం రుజువైతే జయలలిత, మిత్రులతో సహా మళ్లీ నేరస్త్తురాలయ్యే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి) ప్రకా రం సక్రమమైన ఆదాయ వనరులేమిటి? ఉన్న ఆస్తుల విలువేమిటి? అనే లెక్క మీదనే అవినీతి నేరం రుజువు ఆధారపడి ఉంది. నెత్త్తుటి నేరాలకు సాక్ష్యాలు కావాలి, ఆ సాక్ష్యాలను సరిగ్గా అంచనా వేయడమే న్యాయ నైపు ణ్యం. కాని ఆర్థిక నేరాలకు ఆస్త్తుల విలువలను సరిగ్గా లెక్కవేయడం రావాలి. వనరులతో ఆస్తుల విలువ సరిపోయిందో లేదో చూడడం రావాలి. అక్కడా న్యాయ నైపుణ్యం అవసరం. ఏదయినా సరే నిష్పాక్షికంగా, నిర్భయంగా చెప్పగలగడమే ధర్మం. అందుకే భయపక్ష పాతాలు లేకుండా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణాలు అంటే ఇలా చేసే వాగ్దానాలని ఒక అర్థమైతే, విలువలని మరొక అర్థం. చట్టంలో నీతికి స్థానం లేదు, అవినీతి రుజువు కాదు. ఆదాయాలు ఆస్త్తుల మధ్య అప్పులు కూడా ఉం టాయి. అప్పులు లంచం కాదు. కనుక వాటిని కరా ఖండిగా లెక్కించాలి. డిఏ కేసులో జయకు, జయ కం పెనీలకు జాతీయ బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.10.67 కోట్లయితే, వాటిని రూ.24.17 కోట్లని కర్ణా టక హైకోర్టు లెక్కించడంలో తీవ్ర పొరబాటు జరి గిందా? తెలిసిన ఆదాయం రూ.5.99 కోట్లని ప్రాసి క్యూషన్ కూడా అంగీకరించింది. దానిని రూ.24.17 కోట్ల లోంచి తీసేస్తే ఆదాయం రూ.18.17 కోట్లని హైకోర్ట్టు తేల్చింది. ఆచార్య వాదన ప్రకారం తప్పు తొలగిస్తే ఆమె ఆదాయం రూ.4.68 కోట్లే. తేడా రూ.16.32గా లెక్కించవలసిన ఆస్తుల్ని రూ.2.83 కోట్లుగా లెక్కించారు. కాబట్టి హైకోర్టు లెక్క ప్రకారం ఆమె ఆస్తి 8.12 శాతం మాత్రమే ఎక్కువైంది. ఈ పొరబాటును తొలగిస్తే ఆదాయానికి మించిన ఆస్తులు 76.77 శాతం ఎక్కువ అవుతాయి. అప్పుడు జయ, ఆమె మిత్రులు నిర్దోషులనే వీలుండదు. హైకోర్టు అప్పీలులో జయ వ్యతిరేక ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా జి. భవానీ సింగ్ను నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు ఏప్రిల్ 27న తీర్పు చెప్పింది. ఆచా ర్యను కర్ణాటక ప్రాసిక్యూటర్గా నియమించింది. కాని అప్పటికే వాదాలు ముగిశాయి. కొత్త ప్రాసిక్యూటర్కు ఒక్కరోజే వాదించే అవకాశం దొరికింది. భవానీసింగ్ నియామకమే చెల్లనప్పుడు ఆయన వాదాన్ని ఎలా అనుమతిస్తారని సుప్రీం న్యాయమూర్తి ఒకరు అన్నారు. ఆచార్యకు మళ్లీ వివరంగా వాదించే అవకాశం దొరక లేదు. సుప్రీం తీర్పు ప్రకారం చెల్లని ప్రాసిక్యూటర్ వాదంపైన హైకోర్ట్టు ఆధారపడటం, సక్రమ ప్రాసిక్యూ టర్ ఆచార్య వాదాన్ని వినకపోవడం, తీవ్రమైన కూడిక పొరబాటు దొర్లడం, అందువల్ల దోషులు నిర్దోషులు కావడం సహజ న్యాయ సూత్రాలకు, సమన్యాయ శాస్త్రాలకు విరుద్ధం. చిరుద్యోగుల అవినీతికి అరదండాలు సులువుగా పడతాయి, కోటలో రాణులు, రాజులు చేసే అక్రమార్జన కోట్లు దాటినా నిర్దోషులవుతారనే విమర్శకు ఎవరు సమాధానం ఇస్తారు? చట్టాలు ప్లస్ న్యాయశాస్త్రం ప్లస్ సాక్ష్యం కలిపి వడబోస్తే పదికోట్ల రూపాయల దాకా లంచాలు తీసుకుంటే పెద్ద నేరం కాదు అనే కొత్త సూత్రం వస్త్తుందేమో? అందరూ కలిసి లంచం విలువ పెంచడం దేశానికి మంచిది కాదు. మాడభూషి శ్రీదర్ (వ్యాసకర్త మాడభూషి శ్రీదర్.. కేంద్ర సమాచార కమిషనర్)