sarvajana hospital
-
పెద్దాసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)లో రోగులకు ఆక్సిజన్ కొరత లేదని, కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. 11.5 కేఎల్డీ కెపాసిటీతో పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి.. పైపు ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దీంతో పాటు అదనంగా 10 కేఎల్డీ కెపాసిటీతో కొత్త ఆక్సిజన్ ట్యాంక్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. నాగపూర్లో ఉన్న డైరెక్టర్ జనరల్ (హై ఎక్స్ప్లోజివ్స్) నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీన్ని ఉపయోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం 450 పడకలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా ఉందని, అదనంగా 1,131 పడకలకు సరఫరా కోసం చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కరోనా బాధితుల్లో రోజూ 120 మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతోందన్నారు. ఈ విషయమై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ కథనాలను ప్రజలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఆందోళన కలిగిస్తున్న మరణాలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది. ఇక్కడ కేవలం కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని, వైద్యపరికరాలను, సౌకర్యాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గత మార్చి 28 నుంచి ఇప్పటి వరకు 2,600లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 85 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను బట్టి చూస్తే రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి, విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఏర్పాటు చేసినా.. మరణాలన్నీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే నమోదయ్యాయి. ♦ గత నెల 26న సికింద్రాబాద్కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి మధ్యాహ్నం 2.07 గంటలకు కరోనా లక్షణాలతో కర్నూలు పెద్దాస్పత్రికి వచ్చాడు. 2.25కే మృతి చెందాడు. ♦ అదే నెల 28న గద్వాలకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు చికిత్స నిమిత్తం ఉదయం 11.39 గంటలకు ఆసుపత్రికి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకే మరణించింది. ♦ మరుసటి రోజు నందికొట్కూరుకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో వచ్చాడు. కొద్దిసేపటికే కన్నుమూశాడు. అదేరోజు ఆదోని ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల యువతి సైతం కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. రెండురోజుల తర్వాత మృతిచెందింది. ♦ ఆ మరుసటి రోజు మంత్రాలయం మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఉదయం 9.56 గంటలకు కరోనా లక్షణాలతో వచ్చింది. ఆమె సైతం కొద్దిసేపటికే కన్నుమూసింది. ఈ మరణాలన్నీ కర్నూలు పెద్దాస్పత్రిలోనే.. అందులోనూ చికిత్స కోసం వచ్చిన కొద్దిసేపటికే సంభవించినవి. అధిక శాతం ఛాతిలో నొప్పి, ఆయాసం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో వచ్చారు. వీరి లక్షణాలను బట్టి వైద్యం చేయడానికి ముందుగా వైద్యులు జంకుతున్న పరిస్థితి. క్యాజువాలిటీలో కోవిడ్ పరీక్షలు చేసిన తర్వాత, ఆ ఫలితం వచ్చేంత వరకు ఇలాంటి వారికి చికిత్స చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీనికితోడు అధిక శాతం వైరస్ వచ్చిన విషయం తెలిసి కొందరు, తెలియక కొందరు నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వల్ల వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారన్న చర్చ కూడా ఉంది. వైద్యుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం ఆస్పత్రిలో రోజూ 4 నుంచి 6 దాకా కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తుండటం, రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులతో చర్చించింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి అధికారులు, వైద్యులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సమావేశమయ్యారు. కరోనా రోగుల వద్దకు వైద్యులు వెళ్లడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులోనే మరణాలు ఎందుకు అధికమవుతున్నాయని ప్రశ్నించారు. కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాలని, తగిన రక్షణ కిట్లతో వెళ్లి వారికి వైద్యం చేయాలని సూచించారు. ఇకపై తాను నేరుగా కరోనా రోగులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడతానని, వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకుంటానని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. చివరి క్షణంలో చికిత్సకొస్తున్నారు కరోనాతో మరణించిన వారిలో అధిక శాతం చివరి స్టేజీలో వస్తున్న వారే ఉన్నారు. కరోనా లక్షణాలు కనిపించినా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో బాహాటంగా బయట తిరుగుతున్నారు. దీంతో వారి ద్వారా మరికొందరికి వైరస్ సంక్రమించడమే గాక వారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికమై శ్వాస తీసుకోలేని పరిస్థితికి వస్తున్నారు. ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న స్థితిలో చికిత్స కోసం వస్తే కోలుకోవడం కష్టమవుతుంది. ప్రతి ఒక్కరూ కరోనాను నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.– డాక్టర్ జి.నరేంద్రనాథ్రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
కరోనాకు ఎదురొడ్డి ప్రసవాలు..
అసలే కరోనా కాలం. ఎదుటి వారితో మాట్లాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.ఇలాంటి సమయంలోనూ కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు ప్రత్యేకతనుచాటుకుంటున్నారు. ‘పెద్ద’ మనసుతో వైద్యసేవలు కొనసాగిస్తూప్రజల మన్ననలు చూరగొంటున్నారు.ముఖ్యంగా ప్రసూతి విభాగంఅందిస్తున్న సేవలుకష్టకాలంలో గర్భిణులకువరంగా మారాయి. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను స్టేట్ కోవిడ్ సెంటర్గా మార్చారు. ఇక్కడ అందే సాధారణ వైద్యసేవలను ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నగరంలో 12కు పైగా ‘డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ నెట్వర్క్ ఆసుపత్రులను ఎంపిక చేశారు. అయితే.. పెద్దాసుపత్రిలో మాతా శిశువులకు ఉన్న వసతులు, వైద్యులు, సిబ్బంది సేవలు బయట అందించలేరన్న ఉద్దేశంతో చిన్నపిల్లల విభాగం, ప్రసూతి విభాగాలను ప్రైవేటుకు ఇవ్వకుండా ఇక్కడే ఉంచారు. ఈ విభాగాలకు కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులు, వారికి చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి నెలా 800కు పైగా ప్రసవాలు జిల్లాలో లాక్డౌన్ కారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ప్రజారవాణా ఆగిపోయింది. ఆ సమయంలోనూ జిల్లానలుమూలల నుంచి గర్భిణులను సొంత ఏర్పాట్లతో పెద్దాసుపత్రి ప్రసూతి విభాగానికి తీసుకొచ్చి.. ప్రసవం చేయించారు. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉంటాయని, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉంటారని, ప్రసవానికి వెళితే ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న ఉద్దేశంతో దూరాభారమైనా గర్భిణులను ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ విభాగంలో సాధారణ రోజుల్లో ప్రతి నెలా 900 నుంచి 1,000 దాకా ప్రసవాలు జరిగేవి. అలాగే లాక్డౌన్ సమయంలోనూ 800లకు పైగా జరగడం విశేషం. జిల్లా మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్యలో దాదాపు సగం పెద్దాసుపత్రిలోనే చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ధైర్యంగా వైద్యసేవలు కరోనా కాలంలోనూ వైద్యులు ఏమాత్రమూ జంకకుండా సేవలు కొనసాగిస్తున్నారు. ప్రసూతి విభాగంలో ఏడు యూనిట్లు ఉన్నాయి. నలుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 13 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 18 మంది పీజీలు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరే కాకుండా లాక్డౌన్ సమయంలో అదనంగా నలుగురు ఓబీజీ స్పెషలిస్టులు (ప్రసూతి–గైనకాలజిస్టులు), నలుగురు ఎంబీబీఎస్ వైద్యులను నియమించారు. ఇక్కడ చేరిన నలుగురు గర్భిణులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా వైద్యులు, సిబ్బంది భయపడకుండా వైద్యసేవలు అందించారు. ముగ్గురికి సాధారణ ప్రసవం, ఒకరికి సిజేరియన్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినా వెరవలేదు. ప్రస్తుతం వారంతా కోలుకుని తిరిగి విధుల్లో చేరడం గుండె నిబ్బరానికి నిదర్శనం. కోవిడ్, నాన్ కోవిడ్లుగా విభజించి... గర్భిణులను ప్రసవ తేదీ దగ్గరగా ఉంటేనే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. వారికి ముందుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. కరోనా ఉంటే కోవిడ్ డివిజన్లో చేర్చుతున్నారు. వైరస్ లేని వారిని నాన్ కోవిడ్ డివిజన్లో అడ్మిట్ చేస్తున్నారు. వైద్యులను సైతం ఇందుకు ప్రత్యేకంగా నియమించి సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. వైద్యులు, సిబ్బంది స్వీయరక్షణలో భాగంగా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడుతూ సేవలందిస్తున్నారు. కరోనా వచ్చినా భయపడలేదు కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మేము ఏ మాత్రమూ భయపడలేదు. స్వీయరక్షణ చర్యలు తీసుకుని గర్భిణులకు వైద్యసేవలు అందిస్తామని చెప్పాం. ఈ మేరకు ఎప్పటిలాగే సేవలు కొనసాగిస్తున్నాం. కొందరికి కరోనా సోకినా కొద్దిరోజుల్లోనే రికవరీ అయ్యి.. మళ్లీ విధుల్లో చేరారు. వారి ధైర్యానికి సెల్యూట్. –డాక్టర్ బి.ఇందిర, గైనకాలజీ హెచ్వోడీ, పెద్దాసుపత్రి -
పాజిటివ్ వచ్చినా ఆరుబయట విహారం
అనంతపురం హాస్పిటల్: సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో ఉన్న కోవిడ్ అనుమానితుల్లో కొందరు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా.. వార్డుల నుంచి బయటకు వచ్చి విహరిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని స్టాఫ్నర్సులు, కింది స్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. హిందూపురం ప్రాంతానికి చెందిన కరోనా పాజిటివ్ కేసుల్లోని వారే ఆస్పత్రిలో అలజడి సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ గదుల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. -
మగ బిడ్డకి రూ.1,200.. ఆడబిడ్డకి వెయ్యి
ఈ చిత్రంలోని బాలింత పేరు దిల్షాద్. ధర్మవరానికి చెందిన ఈమె రెండో కాన్పు కోసం సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శిశువును ఎస్ఎన్సీయూలో ఉంచారు. దిల్షాద్ను పోస్టునేటల్కు మార్చాల్సి ఉండగా.. ఆ సమయంలో విధుల్లో ఉన్న క్లాస్–4 సిబ్బంది దిల్షాద్ భర్త మున్వర్ను రూ.1,200 డిమాండ్ చేశారు. ముందు వార్డుకు మార్చండి.. ఉదయం డబ్బులిస్తానని చెప్పినా వినకపోవడం వివాదానికి కారణమైంది. కరువు జిల్లా అనంతలో కాసులకు నిత్యం కటకటే. అందుకే నిరుపేదలంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రికి పరుగున వస్తారు. ఇక ప్రసవాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆస్పత్రిలో తిష్టవేసిన ధన పిశాచులు.. డబ్బుకోసం నిరుపేదల రక్తం పీలుస్తున్నారు. ఆడపిల్లకు ఓ రేటు.. మగపిల్లాడైతే మరో రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. వారడిగినంత డబ్బులివ్వకపోతే బాలింతలకు నరకం చూపుతున్నారు. అనంతపురం హాస్పిటల్: మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో అపురూప ఘట్టం. అందుకే తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసిన గర్భిణి.. ప్రసవం అయ్యాక బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోతుంది. తన ప్రతిరూపాన్ని చూసే క్షణాలకోసం ఎన్ని ఇబ్బందులైనా భరిస్తుంది. అలాంటి అపురూప క్షణాలను కూడా సర్వజనాస్పత్రిలోని సిబ్బంది మహిళలకు దూరం చేస్తున్నారు. మానవత్వం మరచి.. మనీ కోసం కక్కుర్తి పడుతున్నారు. అడిగినంత డబ్బులివ్వకపోతే బిడ్డను కూడా చూపని పరిస్థితి. దీంతో కాన్పులకోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో వచ్చే నొప్పులకంటే డబ్బుల కోసం ఆస్పత్రిలోని సిబ్బంది పెట్టే హింసతో కన్నీరుమున్నీరవుతున్నారు. రేట్లు ఫిక్స్ చేశారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారే సర్వజనాస్పత్రికి వస్తారు. కాన్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికే వస్తారు. రోగులు ఆస్పత్రుల్లో ఉంటుండగా.. వారి బంధువులు, వెంట వచ్చిన వారు లాడ్జిల్లో బసచేసే ఆర్థిక స్థోమత లేక ఆస్పత్రి ఆవరణలోనే దోమలతో సహవాసం చేస్తుంటారు. అలాంటి వారినీ ఇక్కడి సిబ్బంది పీక్కుతింటున్నారు. ముఖ్యంగా గ్రూప్–4 సిబ్బంది ప్రసవాలకు రేట్ ఫిక్స్ చేశారు. మగ బిడ్డ పుడితే రూ.1,200, ఆడబిడ్డ పుడితే రూ.1,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బిడ్డను ఇవ్వరు. అదీ కాకపోతే లేబర్ వార్డు నుంచి పోస్టునేటల్ వార్డుకు తీసుకెళ్లేది లేదని మొండికేస్తుండటం పరిపాటిగా మారింది. రోజూ 25 ప్రసవాలు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ సరాసరి 25 ప్రసవాలు జరుగుతుంటాయి. అధిక శాతం బాలింతల నుంచి లేబర్ వార్డు క్లాస్–4 సిబ్బంది రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రూపులుగా ఏర్పడి బాలింతల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చుకోలేని వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. గట్టిగాఅడిగితే తాము కూడా ప్రసవానికి ఇంత అని అధికారులకు ఇవ్వాలంటున్నారు. ఏ అధికారికి అని అడిగితే మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. ఈ చిత్రంలోని బాలింతల పేర్లు వరలక్ష్మి(రాణినగర్, అనంతపురం), భాగ్యమ్మ(కొడవాండ్లపల్లి). రెండ్రోజుల క్రితం ఇరువురూ ప్రసవించారు. రూ.700 ఇచ్చే వరకు బిడ్డనిచ్చేది లేదని వరలక్ష్మితో సిబ్బంది పేచీ పెట్టుకున్నారు. ఇక భాగ్యమ్మతోనూ రూ.1000లు ముక్కుపిండి వసూలు చేశారు. కూలీ పనులకెళ్లే తమలాంటోళ్లతో రూ.వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రసవమైతే చాలు.. ప్రతి ఒక్కరూ క్లాస్–4 సిబ్బందికిలంచాలు సమర్పించుకోవాల్సి వస్తుండటం గమనార్హం. పట్టించుకోని ఆర్ఎంఓలు సర్వజనాస్పత్రిలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ల(ఆర్ఎంఓ) రోగులకందే సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఆర్ఎంఓలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడికొస్తున్న నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు హడావుడి చేయడం తప్ప.. సిబ్బందిని సరైన మార్గంలో నడపలేకపోతున్నారు. చంద్రుని చూపునకు నోచుకోక... కలెక్టర్ గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు దాటి పోయింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా ఉన్న ఆయన ఇంతవరకు కనీసం ఆస్పత్రివైపు కన్నెత్తి చూడని పరిస్థితి. నిత్యం ఏదో ఒక పనిమీద ఆస్పత్రి ఎదుటే వెళ్తున్నా.. ఆస్పత్రిలోకి మాత్రం రాకపోవడం గమనార్హం. దీంతో పర్యవేక్షణ కొరవడటం.. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో రోగులకు సరైన వైద్య సేవలందడం లేదు. గతంలో ట్రెయినీ కలెక్టర్గా వచ్చిన వినోద్ అర్థరాత్రి వేళల్లో ఆస్పత్రిని తనిఖీ చేసే వారని, ఫలితంగా వైద్యులు, సిబ్బంది అలర్ట్గా ఉంటూ సేవలందించేవారని రోగులు గుర్తు చేసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటున్నాం ఎఫ్ఎన్ఓ, స్వీపర్లు బాలింతల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా ఇద్దరిని వేరే వార్డుకు మార్చాం. ఆస్పత్రిలో సేవలకు ఎవరూ డబ్బులివ్వాల్సిన పనిలేదు. సర్వజనాస్పత్రిలో అన్ని సేవలు ఉచితమే. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే నాకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
రామా.. కనవేమిరా!
కుర్చీలకే పరిమితమైన వారు.. కాలు భూమిపై మోపలేని వారు.. మనిషి సాయంలేనిదే నడవలేనివారు.. వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, వృద్ధులు.. వీరిని చూస్తే ఎవరికైనా అయ్యోపాపం అనిపిస్తుంది. కానీ సర్వజనాస్పత్రి నిర్వాహకులు మాత్రం కనీస మానవత్వం చూపలేకపోయారు. బుధవారం ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో సదరం శిబిరం ఏర్పాటు చేసి దివ్యాంగులకు నరకం చూపించారు. ఒక్కోమెట్టు ఎక్కేందుకు ఒక్కొక్కరు పడిన కష్టం చూసి అక్కడున్న వారే అయ్యో అంటూ తల్లడిల్లిపోయారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు మాత్రం ప్రశ్నించిన వారితో వితండవాదం చేయడం గమనార్హం. అనంతపురం న్యూసిటీ: తొమ్మిది రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి సామాజిక పింఛన్లు మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వెల్లడించింది. దీంతో తలసీమియా, హీమోఫీలియా, సికెల్సెల్ అనీమియా, ఎలిఫాంటియాసిస్(బోదకాలు), మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, కండరాల బలహీనత, యాక్సిడెంట్కు గురై(చక్రాల కుర్చీ/మంచానికి పరిమితమైన వారు), కుష్టు రోగులు(బహుళ వైకల్యం), కిడ్నీ, కాలేయం, గుండె మార్పి జరిగిన వారికి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ మంజూరు కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, చిన్నపిల్లల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మల్లీశ్వరి, తదితరులు దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు, పాతరిపోర్టులను పరిశీలించారు. శిబిరానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా రోగులు తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారింది. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్ ముందున్న మొదటిఫ్లోర్ వికలాంగులతో కిక్కిరిసిపోయింది. ఎఫ్ఎం, ఎంఎం, ఐసీసీయూ, చిన్నపిల్లల వార్డు, సర్జికల్ వార్డులకు వెళ్లేందుకు వీల్లేకుండా వికలాంగులు బారులు తీరారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. శిబిరాన్ని మొదటి అంతస్తులో నిర్వహించగా.. దివ్యాంగులు ఫస్ట్ప్లోర్ చేరుకోవడానికి నరకం చూశారు. నడిచేందుకు కూడా వీలులేని స్థితిలో ఉన్నవారు మోకాళ్లతో దోక్కుంటూ మెట్లు ఎక్కడానికి అల్లాడిపోయారు. తీరా సర్టిఫికెట్ల మంజూరు గదికి వచ్చే సరికి వందల సంఖ్యలో దివ్యాంగులు బారులు తీరారు. పసిపిల్లల గావుకేకలు వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సదరం సర్టిఫికెట్ తీసుకోవడం.. ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లను ధ్రువీకరించుకునేందుకు చాలా మంది చంటిబిడ్డలతో వచ్చారు. ఒళ్లో చంటిబిడ్డ.. మరో చేతిలో అనారోగ్యంతో ఉన్న పిల్లలతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం కిటకిటలాడగా గాలిసైతం వీయక పసిపిల్లల ఏడ్పులతో ఆస్పత్రి మార్మోగింది. చిన్నారుల ఇబ్బందులు చూసి తట్టుకోలేని చాలా మంది వెనక్కివెళ్లిపోయారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలోనే కూర్చుండిపోయారు. అంతలా కష్టపడినా సదరం శిబిరంలో వివరాలు నమోదు చేయించలేకపోయారు. అడుగడుగునా నిర్లక్ష్యం దివ్యాంగులు, వివిధ రోగాలతో బాధపడుతున్న వారు సదరం శిబిరానికి వేలాదిగా తరలివస్తారని తెలిసినా...ఆస్పతి యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. సెక్యూరిటీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో కంట్రోల్ చేయడానికి వీలుకాలేదు. సర్టిఫికెట్ల కోసం రోగులు తోపులాడుకునే పరిస్థితి ఎదురైంది. తమనంటే తమను ముందు పరీక్షించాలంటూ శిబిరానికి వచ్చిన వారు ఎగబాకారు. ఈ పరిస్థితుల్లో ఔట్పోస్టు ఏఎస్ఐ త్రిలోక్ టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా, వారు స్పెషల్పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. వారొచ్చిన గంటన్నరకు సమస్య సద్దుమణిగింది. క్షేత్రస్థాయిలో విఫలం దివ్యాంగులను ఆస్పత్రికి పంపే విషయంలో క్షేత్రస్థాయిలో పీహెచ్సీ వైద్యులు, తదితర సిబ్బంది విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రతి బుధవారం సర్టిఫికెట్ల మంజూరు చేస్తారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఆస్పత్రి యాజమాన్యం, ఆరోగ్యశాఖ, సచివాలయ ఉద్యోగులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ. 9 రకాల సమస్యలతో బాధపడేవారితో పాటు సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే వారు ఆస్పత్రికి రావడం పెద్ద సమస్యగా మారింది. -
రక్త పరీక్ష..శిక్ష
ఎవరైనా అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేసి.. ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు.. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి. రోజూ 2 వేల ఓపీ ఉండే అనంతపురం సర్వజనాస్పత్రిలో రక్త పరీక్షలు సకాలంలో చేయడం లేదు. రక్త పరీక్ష నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్లు తెచ్చినా వాటినిి వాడే కెమికల్స్ లేకపోవడంతో సిబ్బంది మాన్యువల్గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్షల ఫలితం ఆలస్యమవుతుండగా.. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఈ చిత్రంలోని బాలిక పుట్టపర్తి మండలం నిడిమామిడికి చెందిన సాహితి. నవంబర్ నెలలో డెంగీతో సర్వజనాస్పత్రిలో చేరింది. వెంటనే రక్త పరీక్ష చేయాల్సి ఉన్నా.. సెల్కౌంటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది వైద్య పరీక్షలు వాయిదా వేశారు. చివరకు చిన్నారి ప్లేట్లెట్ కౌంట్ 30వేలకు తగ్గిపోవడంతో టెక్నీషియన్లు స్పందించి పరీక్షలు చేశారు. చిన్నవార్డులోనే రోజూ 200 మందికిపైగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర సమయంలో కీలకం కానున్న రక్త పరీక్షల నివేదికలు అందక వైద్యులు కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లా వాసులందరికీ పెద్ద దిక్కు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. అందుకే ఇక్కడ రోజూ 2 వేల మంది ఔట్పేషంట్లు, 1,300 మంది ఇన్పేషంట్లు ఉంటున్నారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దాదాపుగా వెయ్యి మందికి వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసమే పెథాలజీ విభాగంలో రక్తపరీక్షల కోసం రూ.20 లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్ మిషన్లు(హెమటాలజీ అనలైజర్) తెప్పించారు. కానీ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. కెమికల్స్ లేవన్న కారణంతో ఐదు నెలలుగా వాటిని మూలకుపెట్టారు. దీంతో వివిధ వార్డుల్లో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. సెల్కౌంటర్ సేవలు ఇలా... సెల్కౌంటర్ మిషన్ ద్వారా ప్లేట్లెట్స్, టీసీ, డీసీ, సీబీపీ, హెచ్బీ తదితర పరీక్షలు నిమిషాల్లో చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా చేసే పరీక్షలు దాదాపుగా 500 వరకు ఉంటాయి. ఫలితం కూడా వేగవంతంగా అందుతుంది. దాన్నిబట్టి పరిస్థితి విషమించిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపడమో, లేదా మెరుగైన వైద్యం అందించడమో చేయవచ్చు. కానీ సెల్కౌంట్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డు, ఎఫ్ఎం, ఎంఎం, చెస్ట్, ఆర్థో, గైనిక్ తదితర వార్డుల్లో టెక్నీషియన్లు మాన్యువల్గా పరీక్షలు చేస్తున్నారు. వివిధ వార్డుల్లో రక్తపూతలు తీయడానికే గంటల సమయం వ్యవధి పడుతోంది. రక్తపూతలు తీసిన వెంటనే వారే మాన్యువల్గా పరీక్షలు చేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది. దీంతో ఫలితం ఆలస్యమవుతుండగా.. వైద్య సేవల్లోనూ జాప్యం జరుగుతోంది. పోని ప్రైవేట్గా రక్త పరీక్షలు చేయించాలంటే రూ.300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. సర్వజనాస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఇది మరింత భారంగా మారింది. పనిభారంతో పరీక్షలు వాయిదా.. సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. సెల్కౌంట్ మిషన్లు అందుబాటులో లేక ఒక్కోరోజు ఒక్కో యూనిట్ చొప్పున టెక్నీషియన్లు మాన్యువల్గా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఇక శనివారం, ఆదివారం వస్తే రక్త పరీక్షలకు మూడ్రోజుల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్ష ఫలితం వచ్చే వరకూ వైద్యులూ సరైన చికిత్స అందించలేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిన్నపిల్లల వార్డులోనే కాదు.. ఆస్పత్రిలోని ఎంఎం, ఎఫ్ఎం, ఆర్థో, చెస్ట్, ఓపీ, గైనిక్ తదితర విభాగాల్లో రక్త పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనిభారంతో టెక్నీషియన్లు రక్తపరీక్షలు వాయిదా వేస్తుండటంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది. అందుబాటులోకి రావాలంటే.. సెల్కౌంటర్ మిషన్లు అందుబాటులోకి రావాలంటే కెమికల్స్ కావాల్సి ఉంది. సెల్కౌంటర్ మిషన్లో 8 రకాల కెమికల్స్ను వినియోగిస్తారు. వాటికోసం ప్రతి నెలా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది రెండు మినీ సెల్కౌంటర్ మిషన్లను సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు ల్యాబ్లలో ఎలక్ట్రికల్, ఏసీ తదితర పనుల్లో జాప్యం చేశారు. దీంతో వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం మేలుకుని రూ.లక్షలు విలువ చేసే సెల్కౌంటర్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమికల్స్కు ఆర్డరిచ్చాం కెమికల్స్ లేకపోవడంతో సెల్కౌంటర్ మిషన్లను ఉపయోగించడం లేదు. కెమికల్స్కు ఆర్డర్ ఇచ్చాం. త్వరలోనే కెమికల్స్ వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో రెండు మినీ సెల్కౌంటర్ మిషన్లున్నాయి. వాటి ద్వారా రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రామస్వామి నాయక్,ఆస్పత్రి సూపరింటెండెంట్ రక్తనమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్ -
ఆరోగ్య వివరాలు తారుమారు
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో ఆరోగ్య వివరాలు తారుమారవుతున్నాయి. ఆస్పత్రిలో ఇటీవల ఓ బాలింతకు రక్తమార్పిడి జరిగి ప్రాణం కోల్పోయిన విషయం విదితమే. దీని ద్వారా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్నర్సులు, టెక్నీషియన్లను సస్పెండ్ చేసినా ఇంకా చాలామంది వైద్యుల్లో మార్పు రావడం లేదు. చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవాక్కు... చిన్న పిల్లల వార్డులో ధర్మవరానికి చెందిన మూడేళ్ల పాప మనస్వి డెంగీ అనుమానిత కేసుగా ఈ నెల 9న అడ్మిట్ అయ్యింది. ఆస్పత్రిలో వైద్యులు ఈ నెల 11న చిన్నారికి ప్లేట్లెట్స్తో పాటు డెంగీ పరీక్షకు రెఫర్ చేశారు. కానీ హౌస్సర్జన్లు మౌనిక అనే పేషెంట్ ఆరోగ్య నివేదికను ఏకంగా మనస్వి కేస్ షీట్లో నమోదు చేశారు. కేస్ షీట్లో మనస్వికి సీఆర్పీ పాజిటివ్ అని నమోదు చేశారు. దీనిపై పాప తండ్రి రాము కేస్ షీటును నిశితంగా పరిశీలించారు. పాప డెంగీ సమస్యతో బాధపడుతుంటే సీఆర్పీ ఎందుకు వస్తుందని ఆరా తీశాడు. దిద్దుబాటు చర్యలు వాస్తవంగా ఇదే వార్డులో ఉన్న మౌనిక అనే చిన్నారికి చెందిన సీఆర్పీ రిపోర్టును మనస్వి కేస్ షీట్లో రాశారు. అప్పటికప్పుడు తేరుకున్న వైద్యులు మనస్వి కేస్ షీట్లోని రిపోర్టును కొట్టేశారు. పాప తల్లిదండ్రులు ఆరా తీయకపోతే సీఆర్పీ కిందే మందులిచ్చే పరిస్థితి ఉండేది. ఆస్పత్రిలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సర్వజనాస్పత్రిలో పసికందుల మృతి
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో ఆదివారం ఇద్దరు పసికందుల మృతి తీవ్ర వివాదానికి దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధిత కుటుంబీకులు ఎస్ఎన్సీయూ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బుక్కరాయసముద్రం మండలం వడియంపేటకి చెందిన లక్ష్మిదేవి, ఎర్రిస్వామిల పాప(1.3 కేజీలు), కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ, గంగయ్య పాప(2కేజీలు) ప్రీమెచ్యుర్డ్ బేబీలు. వీరిని ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో ఔట్బార్న్ యూనిట్లో చేర్పించారు. వీరు సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికున్న పిల్లలను ఇస్తే, వారి ప్రాణం లేకుండా ఇచ్చారని కన్నీరుపెట్టారు. యూనిట్లో ఏసీలు పనిచేయడం లేదని, ఉదయం నుంచి ఐదు మంది చనిపోయారంటూ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఔట్పోస్టు ఏఎస్ఐ రాము తదితరులు బాధిత కుటుంబీకులను నచ్చజెప్పడంతో సమస్య సద్దుముణిగింది. వద్దు బాబోయ్ ఎస్ఎన్సీయూలో ఇద్దరు చిన్నారులతో మృతి కలకలం రేగడంతో అక్కడే ఉన్న రెండు కుటుంబాలు తమ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు చెబుతున్నా..హైయ్యర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తామంటూ వెళ్లిపోయారు. చివరకు వైద్యులు వారితో సంతకాలు చేయించుకుని డిశ్చార్జ్ చేశారు. మెరుగైన సేవలందించాం ఇద్దరు పసికందుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. రెండు ప్రీమెచ్యూర్డ్ బేబీలు. పుట్టగానే ఏడవలేదు. దీంతో వారు కోలుకోవడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ రౌండ్ ద క్లాక్ మెరుగైన సేవలందించాం. అమాయక ప్రజలకు తెలియక మాపై ఆరోపణలు చేస్తున్నారు. – డాక్టర్ శ్రీధర్ -
పెద్దాసుపత్రిని నిమ్స్లా తీర్చిదిద్దుతాం
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను హైదరాబాద్లోని నిమ్స్లా తీర్చిదిద్దుతామని కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవకుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్, డాక్టర్ సుధాకర్ అన్నారు. ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగంలో రూ.35 లక్షలు, న్యూరోసర్జరీ విభాగంలో రూ.50 లక్షలు, యురాలజీ విభాగంలో రూ.35 లక్షలతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లుగా ఆధునికీకరించారు. వీటిని మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ సంజీవకుమార్ మాట్లాడుతూ సర్జన్లకు ఆపరేషన్ థియేటర్ పూజగది లాంటిదన్నారు. మాడ్యులర్ ఓటీగా మార్చడం వల్ల ఇంకా ఉత్సాహంగా పని చేస్తారన్నారు. తనకు ఓనమాలు నేర్పిన కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం కళాశాలలో సెంట్రల్ లైబ్రరీ, క్లినికల్ లెక్చరర్ గ్యాలరీ, స్టాఫ్ క్వార్టర్స్ కావాల్సి ఉందని, వీటిని తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. క్యాజువాలిటీ, ట్రామాకేర్లలో సౌకర్యాలు పెరగాల్సి ఉందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు సైతం బలోపేతం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చామన్నారు. ఈ ఆసుపత్రికి అధిక శాతం పేదలు వస్తారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని తరచూ ధర్నాలు చేస్తున్నారని, ఇలాంటి ఏజెన్సీలపై చర్యలు తీసుకునేలా నివేదికలు సిద్ధం చేసిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పకుండా ఉండాలన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య,ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ శాఖను ఆయనే పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104లకు పూర్వవైభవం తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. అవినీతి రహిత పాలన దిశగా సీఎం కృషి చేస్తున్నారని, ఇందుకు అధికారులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. పెద్దాసుపత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్ మాట్లాడుతూ తనలాంటి సామాన్యునికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారన్నారు. ఆయన ఆశయం మేరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తానన్నారు. ఏఎంసీలో ఐసీయూ మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ అవసరమైన వైద్యపరికరాలు, వసతులుంటే ఇలాంటి ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని, ఈ మేరకు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం 300లకు పైగా గుండెశస్త్రచికిత్సలు నిర్వహించిన సీటీ సర్జన్ డాక్టర్ ప్రభాకర్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డీఎంహెచ్వో డాక్టర్ జేవీవీఆర్కె ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్, అనెస్తీషియా హెచ్వోడీ డాక్టర్ కైలాష్నాథ్రెడ్డి, న్యూరోసర్జరీ హెచ్వోడీ డాక్టర్ రామాంజులు, ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో కోల్డ్వార్ !
అనంతపురం న్యూసిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యుల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఈ ప్రభావం రోగులపై పడుతోంది. ఇందుకు నిదర్శనం ఆస్పత్రిలోని పల్మనరీ విభాగమే. ఈ విభాగంలో ఓ ప్రొఫెసర్, కిందిస్థాయి వైద్యుల మధ్య సమన్వయలోపంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి దిగజారారు. దీంతో పాటు నర్సుల డ్యూటీల కేటాయింపులపై నర్సింగ్ సూపరింటెండెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో స్టాఫ్నర్సులు తలలుపట్టుకుంటున్నారు. ఇలా ఆస్పత్రిలో ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యం పల్మనరీ విభాగంలో ఓ ప్రొఫెసర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలవు కోసం లిఖితపూర్వకంగా అడిగేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే మరో వైద్యురాలు సెలవు కోసం ప్రొఫెసర్ను కోరారు. వైద్యురాలి సమక్షంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ను హేళనగా మాట్లాడారు. ఇదే విషయమై సదరు వైద్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్పై ఆర్ఎంఓకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ ఐదు రోజుల క్రితం విధుల్లో ఉన్న స్టాఫ్నర్సుపై నోరుపారేసుకున్నారని తెల్సింది. రోగికి ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా అని స్టాఫ్నర్సును నిలదీశారు. అందుకు స్టాఫ్నర్సు ‘సార్..తాను సెలవులో ఉన్నానని, నైట్ డ్యూటీ స్టాఫ్నర్సుతో మాట్లాడి విషయాన్ని చెబుతాన’ని సమాధానమిచ్చింది. దీనికి ప్రొఫెసర్ ‘బాగా స్టైల్గా, అతి తెలివితో సమాధానమిస్తావే’ అని స్టాఫ్నర్సును వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రొఫెసర్ స్టాఫ్నర్సులు, హెడ్నర్సులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, ఇదిలాగే కొనసాగితే తాము ధర్నా చేస్తామని నర్సింగ్ అసోసియేషన్ నాయకురాళ్లు ఆర్ఎంఓకు ఫిర్యాదు చేశారు. గ్రూపు రాజకీయాలు నర్సింగ్ రోస్టర్ విషయంలో ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారికి ఇష్టమొచ్చినట్లు సెలవులు, విధులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రోస్టర్ ప్రకారమైనా విధులు కేటాయిస్తారంటే అదీ లేదని స్టాఫ్నర్సులు వాపోతున్నారు. వంద మంది రోగులకు ఒక్కరు విధులు నిర్వర్తిస్తున్నా.. సెలవు కోసం వెళితే కనీస గౌరవం లేకుండా నర్సింగ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారని స్టాఫ్నర్సులు చెబుతున్నారు. గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి స్టాఫ్నర్సులకు కేటాయిస్తున్న విధుల్లో పారదర్శకత లోపించిందని వాపోతున్నారు.ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
స్వీపర్లే.. స్టాఫ్నర్సులు
కోవెలకుంట్ల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న స్వీపర్లు స్టాఫ్నర్సుల అవతారమెత్తారు. క్షతగాత్రులు, వివిధ సంఘటనల్లో గాయపడిన వ్యక్తుల చేయి కూడా ఇక్కడ పనిచేస్తున్న కొందరు స్టాఫ్ నర్సులు పట్టుకోకపోవడంతో అత్యవసర సేవలకు స్వీపర్లే దిక్కయ్యారు. కోవెలకుంట్ల సీహెచ్సీ ద్వారా మండలంతోపాటు సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు చెందిన రోగులకు ఓపీ, అత్యవసర వైద్య సేవలందాల్సి ఉంది. కోవెలకుంట్ల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, కర్నూలు, అవుకు, తదితర ప్రధాన రహదారులు ఉండటంతో ఈ మార్గాల్లో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్సీకి తరలిస్తుంటారు. విలువైన ప్రాణాలతో చెలగాటం: రెండు రోజుల క్రితం సంజామలకు చెందిన ఓ వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సీహెచ్సీలో అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. ఇక్కడ పని చేస్తున్న నిర్మల జ్యోతి అనే స్టాఫ్నర్స్ నైట్ డ్యూటీ నిర్వహిస్తోంది. తలకు గాయమైన వ్యక్తికి స్టాఫ్నర్స్ వైద్య సేవలు అందించాల్సి ఉండగా గాయాన్ని పరిశీలించడంతోపాటు కట్టుకట్టే వరకు వైద్య చికిత్సలన్నీ అక్కడే ఉన్న స్వీపర్తో చేయించింది. గదిలో కూర్చున్న స్టాఫ్ నర్స్ చివరకు వచ్చి రెండు ఇంజక్షన్లు వేసి వెళ్లిపోయింది. అత్యవసర వైద్య చికిత్స విభాగం డాక్టర్తోపాటు స్టాఫ్నర్స్ వైద్యసేవలందించాల్సి ఉంది. కాని డాక్టర్ అందుబాటులో లేకపోగా ఉన్న స్టాఫ్నర్సు వైద్యసేవలందించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ ఒక్క బాధితుడికే కాదు ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే బాధితులకు ఇలాగే జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. శరీర అవయవాలకు గాయాలై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు సకాలంలో వైద్య సేవలందించి ప్రాణభిక్ష పెట్టాల్సిన వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తుండటంతో వచ్చిరాని వైద్యంతో స్వీపర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై సీహెచ్సీ ఇన్చార్జ్ డాక్టర్ జఫురుల్లాను వివరణ కోరగా స్వీపర్లు వైద్య సేవలందిస్తున్న సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ప్రత్యక్ష నరకం!
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో గురువారం రోగులు ప్రత్యక్ష నరకం అనుభవించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పురి టిశాలలో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివాన బీభత్సంతో వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో జరగలేదు. అత్యవసర ఆపరేషన్లు మినహా అన్ని ఆపరేషన్లను వైద్యులు వాయిదా వేశారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం ప్రేక్షకపాత్ర వహించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న జనరేటర్లతో కొన్ని వార్డులకు కొంతసేపు.. మరికొన్ని వార్డులకు కాసేపు కరెంటు సరఫరా చేశారు. గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ), పురిటిశాల (లేబర్వార్డు)లో రోగులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పురిటిశాలలోని టేబుల్స్పై గర్భిణులు ప్రసవం పొందే సమయంలో ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో డ్యూటీ వైద్యులు, హౌస్ సర్జన్లు సెల్ టార్చ్ వేసి ప్రసవాలు చేశారు. ఇక సిజేరియన్ల పరిస్థితి దేవునికెరుక. ఎప్పుడెప్పుడు కరెంటు వస్తుందా అంటూ వేచి ఉండాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ల కోసం వైద్యులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ లలితకి చాలాసార్లు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చివరకు జనరేటర్ సహాయంతో కరెంటు సరఫరా అందించడంతో గైనిక్ వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఏఎంసీలో వెంటిలేటర్పై రెండు కేసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. బ్యాటరీ బ్యాక్అప్ ఉండడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఏఎంసీ వైద్యులు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందారు. జనరేటర్తో సేవలు ఆస్పత్రిలో వేకువజాము నుంచి విద్యుత్ లేదు. జనరేటర్ల సహాయంతో వార్డులకు కొంత కొంత సేపు సేవలందించాం. అత్యవసరం మినహా మిగతా ఆపరేషన్లు వాయిదా పడ్డాయి.– డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
సర్వజన ఆస్పత్రిలో బాలింత మృత్యువాత
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఎంసీహెచ్ బ్లాక్లో మంగళవారం బాలింత మృతిచెందింది. మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, వైద్యులు హై బీపీ కారణంగానే బాలింత చనిపోయిందని చెబుతున్నారు. కాగా మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. కోవూరు మండలంలోని వేగూరు పంచాయితీలో ఉన్న సీతారామపురం గ్రామానికి చెందిన గుంటి రాజమ్మ (19)కు నెల్లూరుకు చెందిన బాలరాజుతో వివాహమైంది. అతను కొయ్య పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజమ్మ గర్భం దాల్చడంతో రెండునెలలపాటు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు. తర్వాత నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఎంసీహెచ్లో చూపిస్తున్నారు. ఆమెకు ఏడో నెల వచ్చే సరికి బీపీ అధికంగా ఉందని ఆస్పత్రిలో చేర్చాలని వైద్యులు సూచించారు. దీంతో 9 రోజుల క్రితం రాజమ్మను ఆస్పత్రిలో చేర్పించారు. కాన్పు చేయగా.. బీపీ నియంత్రణలో లేకపోవడంతో వెంటనే ఆపరేషన్ చేసి కాన్పు చేయకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమని, మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికైనా తీసుకెళ్లాలని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు తాము తిరుపతికి వెళ్లలేమని ఇక్కడే వైద్యం చేయండని చెప్పడంతో డాక్టర్లు రాజమ్మకు సోమవారం ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. పుట్టిన ఆడశిశువు నెలలు, బరువు తక్కువ కారణంగా ప్రత్యేక వార్డులోని బాక్సులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే మంగళవారం రాజమ్మకు బీపీ మరింత అధికమై మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రాజమ్మ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. దర్గామిట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. కారణం చెప్పాలంటూ.. రాజమ్మ మృతికి కారణాలు చెప్పాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దీనిపై దర్యాప్తు చేస్తామని వారికి చెప్పారు. మృతికి గల కారణం చెబితేనే ఇక్కడి నుంచి వెళతామని రాజమ్మ కుటుంబసభ్యులు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా రాజమ్మకు హై బీపీ ఉందన్నారు. అందుకు అవసరమైన వైద్యం అందించినట్లు చెప్పారు. అయినా బీపీ కంట్రోల్ కాకపోవడంతో ఆమె మృతిచెందినట్లు తెలియజేశారు. పూర్తిస్థాయిలో నివేదికను తయారుచేసి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
పెద్ద దిక్కు.. మూడేళ్ల చిక్కు!
ప్రాణమ్మీదికి వచ్చి పరుగుపరుగున సర్వజనాస్పత్రికి వెళ్తే.. వైద్యులు చూసేలోపే ప్రాణం పోయేలా ఉంది. వైద్యం సంగతి దేవునికెరుక.. కనీసం తాగేందుకు నీళ్లు కూడా కరువే. మండు వేసవిలోనూ విద్యుత్ సమస్యలతో రోగులు ఉక్కపోతతో నరకం చూస్తున్నారు. పర్యవేక్షణ లేక.. పట్టించుకోవాల్సిన అధికారి స్వార్థం చూసుకోగా.. కొందరు వైద్యులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అంతిమంగా రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. గతంలో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తితేనే ధర్నాలు చేసే ప్రజాప్రతినిధులు కానీ.. జిల్లా పాలనా వ్యవహారాలు చూడాల్సిన కలెక్టర్ కానీ ఇటువైపు కన్నెత్తిచూడకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లాకే పెద్దదిక్కు. అందుకే పేదోళ్లకు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. కానీ ఇక్కడి ఉన్నతాధికారి నిర్లక్ష్యం.. రోగుల ప్రాణాలమీదకు తెస్తోంది. టీడీపీ నేతల సిఫారసుతో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రిలోని కీలకమైన సూపరింటెండెంట్ సీట్లో కూర్చున్న డాక్టర్ జగన్నాథ్.. తన స్వార్థంమాత్రమే చూసుకుంటున్నారు. ఫలితంగా పాలన గాడి తప్పింది. ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోగా.. రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇదే అదనుగా కొందరు వైద్యులు అండిదే ఆట, పాడిందే పాటగా వ్యవహారం సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ జగన్నాథ్కు సూపరింటెండెంట్గా కీలక బాధ్యతలు అప్పగించడంతోనే తాజా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. బోధనాస్పత్రిలో ప్రొఫెసర్గా పనిచేయడంతో పాటు 5 ఏళ్ల పాటు టీచింగ్ అనుభవం ఉన్న వారు మాత్రమే సూపరింటెండెంట్ పోస్టుకి అర్హులు. కానీ జగన్నాథ్ విషయంలో ఇవేమీ పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత సిఫారసుతో ఆయనన్ను సూపరింటెండెంట్గా నియమించినట్లు సమాచారం. స్తంభించిన పాలన ఆస్పత్రి సూపరింటెండెంట్(ఎఫ్ఏసీ)గా డాక్టర్ జగన్నాథ్ 2017 మే 2న బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లుగా ఆయన కీలక పోస్టులో కొనసాగుతున్నారు. కానీ ఆస్పత్రి వ్యవహారాలు మాత్రం గాలికి వదిలేశారు. ఛాంబర్ దాటి బయటకు రాకపోవడంతో వార్డుల్లో వైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. ఇక ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు సరేసరి. తాగునీరు లేక రోగులు నిత్యం నరకం చూస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంలు సరిగా లేని పరిస్థితి. ఇక రేడియాలజీ, కంటి విభాగంలో విద్యార్థులు రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఈసీజీ, ఎక్స్రే, మందులిచ్చే ప్రాంతాల్లో అనర్హులతో పనులు చేయిస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు ఈసీజీ, ఎక్స్రే టెక్నీషియన్లుగా, అటెండర్లు మందులిచ్చే దారుణమైన పరిస్థితి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వీరందరికీ పోస్టులు పురమాయించిన ఘనత కూడా డాక్టర్ జగన్నాథ్కే దక్కింది. అక్రమాలకు నిలయం సర్వజనాస్పత్రి అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. అడిగేవారు లేరన్న ధీమాతో ఇక్కడ కొందరు ఉన్నతాధికారులు, వైద్యులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకున్నా... ఆస్పత్రిలోని ప్రిజన్స్ వార్డులో ఓ ఖైదీని ఏకంగా రెండు నెలల పాటు అడ్మిషన్లో ఉంచారు. ఇందుకుగానూ సదరు ఖైదీ నుంచి రూ.లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై ఏప్రిల్ 18న ‘సాక్షి’లో నిబంధనలకు ‘ఖైదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పత్రిలో ఓపీ, ఐపీ నిర్వహణ బాధ్యతను ఓ కీలక అధికారి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. దీనిపై ఏప్రిల్ 24న ‘కాంట్రాక్ట్ జగన్నాథునికెరుక’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. దీనిపైనా యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఆఫీసు కార్యాలయంలో పైసలివ్వందే ఫైలు కదలని పరిస్థితి. కొందరు ఎంఎన్ఓల పదోన్నతుల విషయంలో రూ.లక్షలు మారాయన్న ఆరోపణలున్నాయి. ఇక సిటీ స్కాన్ నిర్వాహకులు ప్రత్యేక మీటర్ వేసుకోకుండా ఆస్పత్రి కరెంటునే వాడుకుంటున్నారు. వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ. కోట్లతో నిర్మించిన ఎస్ఆర్ క్వార్టర్స్లో ప్రైవేట్ వ్యక్తులు తిష్టవేసినా..ఇంత వరకు ఖాళీ చేయించలేదు. రోగులకు ప్రత్యక్ష నరకం పట్టించుకునే వారులేక.. కనీస సౌకర్యాలు లేక.. సకాలంలో వైద్యసేవలందక సర్వజనాస్పత్రిలో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. రేడియాలజీ, కంటి తదితర విభాగాల్లోని వైద్యులు రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. రేడియాలజీ విభాగంలో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 24న ‘రేడియాలేజీ’ అన్న శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఇదే నెలలో కంటి విభాగంలో ఓ విద్యార్థితో సిరంజ్ పనులు చేయిస్తున్నారు. ఇక వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వాడుకునేందుకు నీళ్లు లేక.. మరుగుదొడ్లకు తాళం వేయడంతో వారి బాధలు వర్ణించడానికి వీలు కాని విధంగా ఉన్నాయి. సర్వజనాస్పత్రిలో నెలకొన్న ఈ దుస్థితిపై ఈ నెల 10న ‘జగన్నాథ..మేలుకో’ అన్న శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. మహిళలే యూరినల్స్ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న వైనాన్ని ఎండగట్టింది. ఇక వార్డుల్లో నీళ్లు సరఫరా కాక మరుగుదొడ్లకు తాళం వేయగా.. కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం మహిళలు ఇతర వార్డులకు పరుగులు తీస్తున్నారు. ఇలా రోజూ ఓ సమస్యతో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నా.. పట్టించుకోవాల్సిన సూపరింటెండెంట్ చోద్యం చూస్తూ గడిపేస్తుండటం గమనార్హం. వీళ్లనెందుకు పరిగనలోకి తీసుకోరూ.. బోధనాస్పత్రిలో జగన్నాథ్ కంటే సీనియర్లు 8 నుంచి 10 మంది ఉన్నారు. గతంలో సూపరింటెండెంట్గా పనిచేసిన వెంకటేశ్వరరావుతో పాటు, నవీన్కుమార్, మైరెడ్డి నీరజ, రామస్వామినాయక్తో పాటు మరికొందరున్నప్పటికీ సూపరింటెండెంట్గా వీరిని పరిగన లోకి తీసుకోవడం లేదు. సూపరింటెండెంట్గా దర్జా వెలగబెట్టే జగన్నాథ్..మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పర్యటనకు రాగానే జారుకుంటారు. ఆయన స్థానంలో ఇన్చార్జి హోదాలో నవీన్కుమారే బృందం సభ్యుల వెంట ఉంటూ ఆస్పత్రి సేవల గురించి వివరిస్తారు. 22వైద్య కళాశాల,బోధనాస్పత్రి విభాగాలు 19ప్రొఫెసర్లు 10ఐదేళ్ల అనుభవంకలిగిన ప్రొఫెసర్లు 3నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ జగన్నాథ్ సూపరింటెండెంట్ సీటులో కొనసాగుతున్న సంవత్సరాలు -
యూరిన్ పరీక్షలు సొంతంగా చేసుకోవాల్సిందే..
ఈ ఫొటోను చూడండి. గైనిక్ ఓపీ లేబొరేటరీ ఎదుట ఈ మహిళ ప్రెగ్నెన్సీ స్ట్రిప్తో సొంతంగా పరీక్ష చేసుకుంటోంది. వాస్తవంగా గర్భం దాల్చారా? లేదా? అనే విషయమై గైనిక్ వైద్యులు యూరిన్ పరీక్షకు రెఫర్ చేస్తారు. ల్యాబ్ సిబ్బంది యూరిన్ సేకరించి పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవలకు అద్దం పడుతోంది. అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. ప్రధానంగా గైనిక్ ఓపీ, పోస్టునేటల్ వార్డులో గర్భిణిలు, బాలింతలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఎంతలా అంటే.. యూరిన్ పరీక్షలు కూడా సొంతంగా చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక బాలింతల బాత్రూంలు శుభ్రపరిచే ఓపిక లేక ఏకంగా తాళాలు వేయడం గమనార్హం. ఈ కారణంగా అత్యవసర సమయంలో బాలింతలు ఇతర వార్డులకు పరుగు తీయాల్సి వస్తోంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గైనిక్ సేవలు ఈ స్థాయికిదిగజారినట్లు తెలుస్తోంది. మహిళా రోగులకు సర్వజనాస్పత్రిలో అందుతున్న సేవలను పరిశీలిస్తే ఈ సమాజం ఎటువైపు పయనిస్తోందనే అనుమానం కలుగక మానదు. మహిళ గర్భం దాల్చిందా? లేదా? అనేందుకు నిర్వహించే పరీక్షలను చూస్తే ప్రభుత్వాసుపత్రుల పరువు నానాటికీ ఎందుకు దిగజారుతుందో అర్థమవుతుంది. సిబ్బంది చేయాల్సిన పరీక్షలను, ఆసుపత్రికి వచ్చే మహిళల చేతనే చేయిస్తున్నారు. ఎదురు సమాధానం చెప్పలేక.. మహిళలు, గర్భిణిలు ఓపీ ముందే యూరిన్ పరీక్షలు సొంతంగా చేసుకుంటున్న దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం. ఇదేమిటని ఎవరైనా ల్యాబ్ సిబ్బందిని ప్రశ్నిస్తే చీవాట్లు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకొని తిరిగి వైద్యులను కలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్కు చీమ కుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. బాత్రూంలకు తాళాలు బాత్రూం కష్టాలతో బాలింతలు చుక్కలు చూడాల్సి వస్తోంది. పోస్టునేటల్ వార్డుకి చెందిన మరుగుదొడ్డికి తాళం వేయడంతో కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. అసలే మంచానికి ఇద్దరు, ముగ్గురు ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాత్రూంకు తాళం వేయడంతో యాంటీనేటల్ వార్డుకు పరుగు తీస్తున్నారు. ఇటీవల ఓ బాలింత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. స్టాఫ్ నర్సులు గమనించి సెక్యూరిటీ సాయంతో వార్డుకు తరలించారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? అనే చర్చ ఆసుపత్రిలో జరుగుతోంది. కలెక్టర్ గారూ.. చూస్తున్నారా! నిరుపేద కుటుంబం నుంచి కలెక్టర్గా ఎన్నికైన వీరపాండియన్ కూడా ఆసుపత్రిలోని వైద్య సేవల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవల విషయమై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఇంత జరుగుతున్నా సూపరింటెండెంట్కు వత్తాసు పలుకుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కనీసం ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం చూస్తే నిరుపేదలకు అందుతున్న వైద్యంపై కలెక్టర్కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. చీదరించుకుంటున్నారు యూరిన్ పరీక్ష కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తీరా మా కోడలు నర్మదాకి కంటైనర్, స్ట్రిప్ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే మీరే యూరిన్ పట్టుకుని, స్ట్రిప్ అందులో అద్ది తీసుకురమ్మన్నారు. మీరు పరీక్ష చేయరా? అని అడిగితే చీదిరించుకున్నారు. గర్భిణీలన్న దయ కూడా లేదు. ప్రభుత్వాసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా?– లక్ష్మిదేవి, నాల్గవ రోడ్డు, అనంతపురం -
ఏదైనా వారం తర్వాతే..
అనంతపురం న్యూసిటీ: వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ ప్రాణం పోయాల్సిన వైద్యులే...రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సర్వజనాస్పత్రికొచ్చే వారికి బతికుండగానే నరకం చూపుతున్నారు. పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారులు ఛాంబర్లతో పరిమితం కాగా..నిరుపేద రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రేడియాలజీ విభాగంలోని వైద్యుల నిర్లక్ష్యం..రోగుల ప్రాణం మీదకు తెస్తోంది. ఎమర్జెన్సీ కేసులకు కూడా వాయిదా వేస్తుండటంతో... సదరు రోగిని పరీక్షించిన వైద్యులే కలుగజేసుకుని స్కాన్ చేసి పంపాలని బతిమాడాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ‘‘ఇవాల్టికి ఇంతే.. మీరు పది రోజుల తర్వాత రండి’’ అంటూ రేడియాలజీ విభాగంలోని వైద్యులు తెగేసి చెబుతున్నారు. దీంతో అమాయక రోగులు తమ బాధను ఎవరికి చెప్పుకోలేక దేవుడా ఇదేం ఖర్మయ్యా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎవరు చెప్పినా పట్టించుకోరు ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలోని వైద్యులకు రోగుల ప్రాణాలంతే లెక్కేలేకుండా పోయింది. వారికి ఓపిక ఉంటేనే ఇక్కడ సేవలందుతాయి. మెడిసిన్, సర్జరీ, ఆర్థో, గైనిక్ తదితర వైద్యులు ప్రిస్కిప్షన్పై స్కాన్ చేయాలని రాసినా... వారు పట్టించుకోరు. అడ్మిషన్లో ఉన్న కేసులను వెనక్కి పంపుతున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేటు బాట పట్టి జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. ఎఫ్ఎస్ 4లో అడ్మిషన్లో ఉన్న 10 ఏళ్ల వసంతలక్ష్మికి వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ రెఫర్ చేశారు. కానీ రేడియాలజిస్టు ఈ నెల 24వ తేదీ రావాలని చెప్పారు. దీంతో ఆ పాప అవ్వ ‘‘అయ్యా మీకు పుణ్యముంటుంది. ఆ పరీక్ష చేస్తే ఆపరేషన్ చేస్తారని డాక్టరమ్మ చెప్పింది..కొంచెం త్వరగా చూడయ్యా’’ అని సిబ్బందిని వేడుకోగా..9వ తేదీ రావాలని చెప్పారు. 10 నిమిషాల్లో చేసే పనికి కూడా 10 రోజుల తర్వాత రావాలని చెబుతుండటంతో ఆస్పత్రిలో ఉండలేక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ స్ట్రెచర్పై పడుకున్న వ్యక్తి పేరు గోపాల్. సీకేపల్లి మండలం ముష్టికోవెల. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలోని ఎంఎం వార్డులో చేరారు. గోపాల్ను పరీక్షించిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్ త్వరగా అల్ట్రాస్కౌండ్ స్కాన్ చేయించాలని.....కేస్ షీట్పై ఎమర్జెన్సీ అని రాసి పంపారు. దీంతో గోపాల్ కుమారులు అతన్ని అల్ట్రాసౌండ్ స్కాన్కి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఈ రోజు కాదని చెప్పారు. దీంతో వారు తండ్రిని తీసుకుని వార్డుకు వెళ్లగా.. అక్కడి వైద్యుడు ‘ఇది అర్జెంటయ్యా తొందరగా స్కానింగ్ చేయించండి’’ అని చెప్పారు. మరోసారి గోపాల్ను తీసుకుని వెళ్లినా.. పరిస్థితి వివరించినా రేడియాలజీ వైద్యులు పట్టించుకోలేదు. దీంతో వారు ఆర్ఎంఓ డాక్టర్ జమాల్బాషాకి ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వీరభద్రయ్య సైతం గోపాల్ పేగుకి రంధ్రం పడిందని, త్వరగా స్కాన్ చేయించాలని ఆర్ఎంఓకి చెప్పారు. చివరకు ఆర్ఎంఓ రేడియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రాజేంద్రనాయుడికి ఫోన్ చేసి సమస్యను వివరించగా..ఆయన అప్పుడు కరుణించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. సర్వజనాస్పత్రిలోని రేడియాలజీలో అందుతున్న సేవలకు ఇదో ఉదాహరణ మాత్రమే. -
ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలు
ఈ చిత్రంలో అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ)లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ఈసీజీ తీస్తున్న వ్యక్తి పేరు సుధాకర్. ఈయన వాస్తవానికి ఎలక్ట్రీషియన్ ఈసీజీ తీసేందుకు ఎలాంటి అర్హత లేకయినా ఆస్పత్రి యాజమాన్యం ఆయనకే బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. ఈ చిత్రాన్ని చూడండి.ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలోని డార్క్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ వ్యక్తి పేరు సురేష్. ఈయన కూడా ఎలక్ట్రీషియనే. కానీ కొన్ని నెలల క్రితం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈయన విధులను మార్చారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలక పోస్టులో ఉన్న ఆయన కొందరి సిబ్బంది విధులు మార్చడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలందించే పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రీషియన్లు పూర్తీ స్థాయి పని చేయకపోవడంతో రోగులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. ఆస్పత్రిలో కరెంటు కష్టాలు.. సర్వజనాస్పత్రిలో ఔట్సోర్సింగ్ కింద ఇద్దరు ఎలక్ట్రీషియన్లు 19 ఏళ్లుగా పని చేసేవారు. వీరిద్దరినీ ఆ విధుల నుంచి తప్పించి ఇతర బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు దిన కూలీలుగా పని చేస్తున్నారు. అయితే వారు రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండటం లేదు. అందులోనూ ఆస్పత్రిపై పూర్తీ స్థాయిలో అవగాహన లేదు. చెడిపోయిన ఫ్యాన్లు, లైట్లను ఎప్పటికప్పుడు రిపేరీ చేయాల్సిన ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో గైనిక్, లేబర్, పోస్టునేటర్, సర్జరీ, మేల్, ఫీమేల్ హౌస్సర్జన్ హాస్టళ్లలో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారం రోజుల క్రితం కరెంటు పోతే సకాలంలో స్పందించి జనరేటర్ కూడా వేయలేని స్థితిలో ఎలక్ట్రీషియన్లున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిద్రమత్తులో జిల్లా అధికార యంత్రాంగం ఆస్పత్రిలో రోజుకో అడ్డగోలు బాగోతం బయటపడుతున్నా జిల్లా అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన స్తంభించి తాము ప్రత్యక్ష నరకం చూస్తున్నా పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమస్యగా ఉంటే మార్చా సుధాకర్కు ఎలక్ట్రీషియన్ పని చేతకాదు. ఉద్యోగంలో చేరే సమయంలో ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపర్చాడో అర్థం కావడం లేదు. ఈసీజీ ట్రైనింగ్ ఇచ్చి పని చేయిస్తున్నా. ఇక సురేష్ ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో మానవతా దృక్పథంతో మార్చా. అందుబాటులో ఉన్న వారితో పని చేయిస్తున్నాం.– డాక్టర్ జగన్నాథ్(ఆస్పత్రి సూపరింటెండెంట్) -
సర్వ'జల' ఘోష
ఎండలు మండిపోతున్నాయి...అరగంటకోసారి నీరు తాగినా దాహం తీరడం లేదు. కానీ జిల్లాకే పెద్దదిక్కయిన సర్వజనాస్పత్రిలో తాగేందుకు నీళ్లు దొరకడం లేదు. దీంతో దాదాపు 2,500 మంది రోగులు...వారికి సేవలందిస్తున్న 500 మంది సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు ఇళ్లనుంచే బాటిళ్లలో నీరు తెచ్చుకుని 8 గంటల పాటు వాటినే పొదుపుగా వాడుకుంటుండగా...రోగులు, వారి బంధువులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇది సర్జికల్ వార్డులోని దృశ్యం...ఇక్కడ తాగునీటి సౌకర్యం లేక వార్డులో విధులు నిర్వర్తిస్తున్న హౌస్సర్జన్, స్టాఫ్నర్సులు ఇంటి వద్ద నుంచే వాటర్ బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. ఆ నీరు అయిపోతే ఇక డ్యూటీ అయ్యే వరకు వేచి ఉండాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రంలోని వృద్ధురాలి పేరు లక్ష్మక్క. కూడేరు మండలం కరుట్లపల్లి. ఎఫ్ఎం వార్డులో అడ్మిషన్లో ఉంది. అక్కడ వాటర్ ప్లాంట్ పని చేయకపోవడంతో తాగునీటి కోసం ఎంఎం వార్డు వద్దకు వచ్చింది అక్కడా లేవు. దీంతో చిన్నపిల్లల వార్డు, ఆర్థో వార్డు..ఇలా వార్డులన్నీ తిరిగి చివరకు సూపరింటెండెంట్ కార్యాలయం పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చింది. అక్కడా నీళ్లు రాకపోవడంతో...ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత పెద్ద ఆస్పత్రిలో తాగేందుకు నీళ్లు కూడా లేవయ్యా అంటూ నిట్టూర్చింది. ఈ కష్టం లక్ష్మక్కది మాత్రమే కాదు...ఆస్పత్రిలో వస్తున్న వారిదీ..ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరిదీ. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, రోగులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. వైద్యం మాట దేవుడెరుగు..కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులపాటు రోజూ 3 వేల మంది సేవలందించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్నర్సులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి పేరుతో రూ. కోట్లు ఖర్చు చేస్తున్న ఉన్నతాధికారులు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటర్ ప్లాంట్లు రిపేరీ ఆస్పత్రిలో మొత్తం 10 వాటర్ ప్లాంట్లున్నాయి. అందులో రెండు మినహా మిగితావి పని చేయడం లేదు. దీంతో రోగులు ఆస్పత్రి ఆవరణలో ఉండే వాటర్ ప్లాంట్ వద్దకు వస్తున్నారు. ఆ వాటర్ ప్లాంట్లు కూడా సమయపాలనతో నడుపుతున్నారు. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కదలలేని వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. సిబ్బందికీ ఇబ్బందే అక్యూట్ మెడికల్ కేర్లో నిరంతరం వైద్యులు, స్టాఫ్నర్సులు అందుబాటులో ఉండాలి. అటువంటి ఈ యూనిట్లో ఒక్క వాటర్ ప్లాంట్ లేదు. సిబ్బంది ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే తాగాల్సి వస్తోంది. ఒక వేళ నీటి కోసం బయటకు వెళ్తే....అదే సమయంలో రోగికి ఏమైనా అయితే అందరూ మళ్లీ తమనే నిందిస్తారని అందుకే ఇంటినుంచి తెచ్చుకున్న నీటిని పొదుపుగా వాడుకుంటున్నామని ఓ సీనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పరిస్థితి ఇంతలా ఉన్నా ఉన్నతాధికారి మాత్రం పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎన్ఏబీహెచ్ సర్టిఫికెట్ అంటూ నరకం చూపిస్తున్నారని ఉద్యోగులు బహిరంగంగా వాపోతున్నారు. -
‘సర్వ’జన కష్టాలు
అనంతపురం న్యూసిటీ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రిలోని పలు వార్డుల్లో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. స్కాన్, ఎక్స్రేలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలకు వెళ్లాలన్నా స్ట్రెచర్ ఉండదు. ఒక వేళ స్ట్రెచర్ ఉంటే రోగి సహాయకులు ఉండరు. దీంతో రోగుల బంధువులే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలుగా మారాల్సి వస్తోంది. హిందూపురం ఆరుమాకులపల్లికి చెందిన నారమ్మ అనే వృద్ధురాలును ఎఫ్ఎం వార్డులో అడ్మిషన్ చేయాల్సి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలికి వైద్యులు స్కాన్కు రెఫర్ చేశారు. కొడుకు గోవిందు, అల్లుడు నరసింహ, ఇతర కుటుంబీకులు ఉదయం 9.45 నుంచి వార్డులో స్ట్రెచర్, వీల్ చైర్ కోసం ఎదురుచూశారు. రోగి సహాయకులు లేకపోవడంతో చివరకు ఈ ముగ్గురే వృద్ధురాలిని వార్డు నుంచి స్ట్రెచర్పై స్కాన్ సెంటర్కు తీసుకెళ్లారు. ఉదయం 11.25 గంటలకు స్కాన్ పూర్తయ్యింది. తిరిగి ఆ వృద్ధురాలిని వార్డుకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో ఏ వార్డు ఎటువైపు ఉందో తెలియని పరిస్థితి. ఎఫ్ఎం వార్డులో తీసుకెళ్లేది పోయి ఓపీ నంబర్ 3కి తీసుకెళ్లారు. వార్డు ఎక్కడుందని అందరినీ బతిమాలుకోవాల్సిన పరిస్థితి. చివరకు 12 గంటల సమయంలో అక్కడే ఉన్న రోగులు సమాచారం ఇవ్వడంతో వారు అతికష్టం మీద వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో నిత్యం ఇలాంటి దయనీయమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నా..యాజమాన్యం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా మేలుకొని వార్డుల్లో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలను అందుబాటులో ఉంచి సేవలందించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. -
గాలి తగలదు.. ఊపిరాడదు!
తాగేందుకు నీళ్లుండవు... ఉక్కపోతలోనూ ఫ్యాన్ తిరగదు. ఆక్సిజన్ మాస్క్ మూతికి కట్టుకున్నా... గాలి ఆడదు. మంచాలు... స్ట్రెచర్ల సంగతి సరేసరి. ఆఖరుకు రాత్రివేళల్లో కరెంటు పోతే టార్చిలైట్లే గతి. కానీ ఇదే జిల్లాకంతటికీ పే...ద్ద ఆస్పత్రి. పాలకులు శ్రద్ధ చూపరు. ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోదు. అందుకే ఇక్కడికొచ్చే వారు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కనీస కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆస్పత్రి ఉన్నతాధికారి తన గది దాటి బయటకు రాకపోవడంతో రోగుల హాహాకారాలేవీ ఆయనకు వినపడటం లేదు. ఏపీ చాంబర్లో సంతకాలు చేస్తూ అంతా బాగుందంటూ ఆయన గొప్పలు చెబుతుండగా...వార్డుల్లోని రోగులు మాత్రం సౌకర్యాల లేమితో అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచే ఫ్యాన్లు ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఆస్పత్రిలో పేరుకు ఫ్యాన్లు ఉన్నా...అవి తిరగవు. ఎమర్జెన్సీ వార్డుల్లోని ఏసీలు పనిచేయడం లేదు. అందుకే రోగులు ఇళ్లనుంచే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) యూనిట్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో రోగులు ఉక్కపోతతో ప్రత్యక్షనరకం చూస్తున్నారు. వాస్తవానికి ఏఎంసీలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కేసులుంటాయి. ఈ యూనిట్కు 24 గంటలూ నిరంతరాయంగా కరెంటు సరఫరా ఉండడంతో పాటు వెంటిలేటర్, ఏసీ, ఇతరత్రా మౌలిక సదుపాయాలుండాలి. కానీ సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి లేదు. వారం రోజులుగా కరెంటు సమస్య వెంటాడుతోంది. లోడింగ్ సరిగా రాకపోవడంతో యూనిట్లో ఉండే రెండు, మూడు ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. దీంతో రోగుల సహాయకులు విసనకర్రతో ఊపుతూ ఉపశమనం కలిగిస్తున్నారు. మరికొందరు ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా...రోగుల ప్రాణాలే పోయేలా ఉన్నా అటు ఆస్పత్రి యాజమాన్యం గానీ, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు గాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అయినా ఓ సారి యూనిట్ను పరిశీలించి మెరుగైన వసతలు కల్పించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
ప్రేమకథ విషాదాంతం
ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... ఏడాది కాలంగా ప్రేమించు కుంటున్నారు. ఈ సమాజంలో కులం అనే అడ్డుగోడలు తమ ప్రేమను ఆమోదించవని భయపడ్డారు. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏ అనర్థం జరుగుతుందోనన్న ఆందోళనఆ ప్రేమికులకు వెంటాడింది. తమ వెంట తెచ్చుకున్న విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే మృత్యువు సమీపించడంతో వారిలో బతకాలనే ఆశ కలిగింది. తాము ఎందుకు మరణించాలి? తాము బతికి తమ ప్రేమను బతికించుకోవాలని నిర్ణయించుకుని స్వయంగా ఆస్పత్రికి వెళ్లి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ ప్రేమికులు మృత్యువాతపడ్డారు. అనంతపురం, పుట్లూరు: పుట్లూరు మండలం బాలాపురం ఎస్సీ కాలనీకి చెందిన మల్లికార్జున (20) తాడిపత్రిలో ఐటీఐ పూర్తి చేశాడు. విడపనకల్లు మండలం కొట్టాలపల్లికి చెందిన సి.మాధవి(19) తన తల్లి స్వస్థలం పుట్లూరు మండలం కోమటికుంట్లలో తాత రాముడు ఇంటి వద్ద ఉంటూ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంభ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డిగ్రీ పూర్తీ చేసిన మాధవి తన స్వగ్రామానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్న సమయంలో ప్రేమికులిద్దరూ ముందస్తు ప్రణాళిక ప్రకారం తాడిపత్రికి చేరుకున్నారు. కులాలు వేరు అయినందున తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని చర్చించుకున్నారు. కలిసి జీవించే పరిస్థితి లేనపుడు కలిసి చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. వెంట తెచ్చుకున్న విషపుగుళికలు ఇద్దరూ మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. మనసు మార్చుకుని.. బతకాలని..! ఆత్మహత్యాయత్నం చేసిన ఈ ప్రేమికులు తాము బతికి ప్రేమనూ బతికించుకోవాలని మనసు మార్చుకున్నారు. స్వయంగా తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరి తాము ఆత్మహత్యాయత్నం చేశామని, తమను బతికించాలని అక్కడి వైద్య సిబ్బందిని వేడుకున్నారు. వారిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో సైతం మల్లికార్జున తాను ఉన్న బెడ్ నుంచి లేచి మాధవి ఎలా ఉంది.. అని ఆమె వద్దకు వెళ్లడానికి ప్రయత్నించాడు. చికిత్స పొంతుతూ మల్లికార్జున, మాధవిలు శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాత్రికి రాత్రి సర్వజనాస్పత్రి నుంచి ఖైదీ డిశ్చార్జ్
అనంతపురం న్యూసిటీ: ఓ ఖైదీని కొన్ని నెలలుగా ఆస్పత్రిలో ఆశ్రయం కల్పించిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి రోగాలు, జబ్బులూ లేకున్నా.. ఓ రోగిగా రికార్డులు సృష్టించి ప్రిజనర్స్ వార్డులో రాజభోగాలు కల్పించిన వైనంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ను ఈ నెల 17న సాయంత్రం 5.20 గంటలకు ‘సాక్షి’ వివరణ కోరింది. ఈ విషయంపై ఆరా తీసిన ఆయన అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు. అదే హడావుడితో గుట్టుచప్పుడు కాకుండా బుధవారం రాత్రికి రాత్రే ఏడు గంటలకు ఖైదీని డిశ్చార్జ్ చేసేశారు. సీసీ ఫుటేజీల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆస్పత్రి రికార్డులో మాత్రం అదే రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు డిశ్చార్జ్ చేసినట్లు రాసేశారు. ఇదంతా చూస్తుంటే అంతా పథకం ప్రకారమే ఖైదీని ఆస్పత్రిలో ఉంచినట్లు తెలుస్తోంది. నిజంగా ఖైదీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఆ సమయంలో ఎందుకు పంపాల్సి వచ్చిందంటూ ఆస్పత్రి వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. నిర్లక్ష్యం నీడలో జిల్లా యంత్రాంగం ‘ఆస్పత్రిపై ఆరోపణలు వస్తున్నా సీరియస్గా తీసుకోవడం లేదు. పేదలకు మెరుగైన సేవలందిస్తున్నారనే ఒకేఒక్క కారణంతో చిన్న వాటిని పట్టించుకోవడం లేదు’ అంటూ ఈ ఏడాది వైద్య కళాశాలలో జరిగిన హెచ్డీఎస్ సమావేశంలో వైద్యాధికారులను సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తుంటే.. సర్వజనాస్పత్రిలో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమేనన్నది స్పష్టమవుతోంది. కేవలం హెచ్చరికలు తప్ప ఆచరణలో ఆ స్థాయి తీవ్రత కనిపించకపోవడంతో సర్వజనాస్పత్రిలో అక్రమార్కులకు మరింత ఊతమిచ్చినట్లైంది. దీంతో సర్వజనాస్పత్రిలో కీలక అధికారి ఆడింది ఆటగా సాగుతోంది. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే అతని అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆస్పత్రి వర్గాలే అంటున్నాయి. ఆ ముగ్గురే కీలకం కొన్ని నె లల పాటు ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డు లో ఖైదీని ఉంచడం వెనుక అ నంతపురం రెండో పట్టణ పోలీసు స్టే షన్లో విధులు నిర్వర్తించే ఓ హోంగార్డు, సర్వజనాస్పత్రిలోని ఆర్థో విభాగంలోని ఓ వైద్యుడితో పాటు మ రో కీలక అధికారి ప్ర మేయం ఉన్నట్లు వి శ్వసనీయ సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా వీరు ముగ్గురు కలిసి ఖైదీకి సర్వజనాస్పత్రిలో ఆశ్రయం కల్పించా రు. వివిధ కారణాలు చూపుతూ రోజుల తరబడి ఖైదీ వార్డులో ఉండేలా సహకరిస్తూ వచ్చారు. ఇందుకు గాను వారికి రూ. లక్షల్లో నజరానాను ఆ ఖైదీ సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. -
ఖైదీ దర్జా.. ఆస్పత్రే అడ్డా
ఆయన చేయి తడిపితే చాలు...ఆస్పత్రిలో ఎవరైనా సరే సలాం చేస్తారు. కంటిమీద కునుకు లేకుండా సేవ చేస్తారు. రిపోర్టులు కూడా ఎలా కావాలంటే అలా రాసిస్తారు..ఈ విషయం తెలుసుకున్న ఓ ఖైదీ మూడు నెలలుగా ఇక్కడ తిష్ట వేశాడు. సదరు ఆస్పత్రి కీలక అధికారికి రూ.లక్షలు ముట్టజెప్పాడు. అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తూ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరిలో అనారోగ్య సమస్య ఉందంటూ రెడ్డిపల్లి జైలు నుంచి వచ్చిన ఖైదీ ఇక్కడే ఉండిపోయాడు. రిపోర్టులన్నీ నార్మల్గానే ఉన్నా... రోజుకో సమస్య చెబుతూ సపర్యలు చేయించుకుంటున్నాడని ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో నిబంధనలు బంధీలుగా మారాయి. చేయి తడిపితే చాలు ఏ పనైనా సులువుగా చేయించుకోవచ్చనే చందంగా తయారైంది ఇక్కడి పరిస్థితి. ఆస్పత్రిలోనే ప్రిజన్ వార్డులో తాజాగా వెలుగుచూసిన ఓ బాగోతం ఈ మాటలకు అద్దం పడుతోంది. ఆ వివరాలిలా ఉన్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు పెద్దాసుపత్రిలో ప్రిజన్ వార్డు ఉంది. రక్త విరేచనాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి 3 నెలల క్రితం ఈ వార్డులో చేరాడు. ఆస్పత్రి సిబ్బంది సర్జరీ కింద ఆయనకు అడ్మిషన్ ఇచ్చారు. మెడిసిన్ సమస్య ఉందని మరో నెల పొడిగించారు. ప్రస్తుతం ఆర్థో సమస్య ఉందని ఆ వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారు. రిపోర్టుల్లో కండీషన్ నార్మల్.. ఇదిలా ఉంటే, సదరు వ్యక్తికి సంబంధించిన మెడికల్ రిపోర్టుల్లో మాత్రం ఆయన కండీషన్ నార్మల్గా ఉన్నట్లు నిర్ధారణ అవడం చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నా ఎందుకు అతడిని ఇంకా వార్డులో కొనసాగిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సదరు ఖైదీ మామూలు స్థితిలో ఉన్నా వార్డులో ఉంచి సపర్యలు చేయడం వెనుక ఆంతర్యమేమిటో ఆయనకు వైద్య సేవలు అందింస్తున్న వారికే తెలియాలి. రూ.లక్షల్లో బేరం! ఈ విషయంపై పరిశీలన జరిపితే ఆసత్పికి సంబంధించిన ఓ కీలకాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ప్రిజన్ వార్డులో రోగిని అడ్మిషన్లో ఉంచడానికి సదరు అధికారికి, ఖైదీకి రూ. లక్షల్లో బేరం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ అధికారి వచ్చినప్పటి నుంచే ఇలాంటి అక్రమాలు మొదలయ్యాయని పలువురు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన చేయి తడిపితే ఏ పనైనా సరే ఇట్టే అయిపోతుందని అక్కడి కొందరు సిబ్బందినడిగితే తెలిసింది. ఏమైనా అంటే నిబంధనల గురించి మాట్లాడే ఆయనే.. అవేవీ తనకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ అయినా స్పందించి, మరిన్ని అక్రమాలకు తావివ్వకుండా సదరు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విచారించిచర్యలు తీసుకుంటా ప్రిజన్ వార్డులో మూడు నెలలుగా ఓ ఖైదీ ఉన్న విషయం తెలియదు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తా. అక్రమం జరిగిందని తెలిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటా. – డాక్టర్ జగన్నాథ్,ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కర్నూలు పెద్దాసుపత్రికి వెళ్తున్నారా..?
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మృత్యుఘోష విన్పిస్తోంది. రోజూ సగటున ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికొస్తే చివరకు మృతదేహాలను తీసుకెళ్లాల్సి వస్తోందని మృతుల బంధువులు వాపోతున్నారు. ముఖ్యంగా అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) విభాగంలో గత ఏడాది చేరిన 3,746 మందిలో ఏకంగా 2,498 మంది చికిత్స పొందుతూ మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైద్యుల కొరత, ఉన్న వారిలోనూ నిర్లక్ష్యం, మందులు, పడకల కొరత తదితర కారణాలతో రోగులకు నూకలుచెల్లిపోతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): సర్వజన వైద్యశాలలోని జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్టీతో పాటు న్యూరాలజీ, నెఫ్రాలజీ, యురాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సైతం ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూలు) లేవు. రోగులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే చికిత్స అందించేందుకు గాను ఆసుపత్రి అధికారులే 20 ఏళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సాయిప్రసాద్ సహకారంతో 20 పడకలతో అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్, జనరల్సర్జరీ, అనెస్తీషియా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీలు, హౌస్సర్జన్లు ఇక్కడ వంతుల వారీగా డ్యూటీలు వేసుకునివిధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగానీ ప్రత్యేకంగా ఈ విభాగానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. దీంతో వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులను మంజూరు చేయలేదు. వైద్యులు, నర్సులను ఆసుపత్రిలో రెగ్యులర్గా పనిచేస్తున్న వారినే వంతుల వారీగా, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించి ఇక్కడ వైద్యసేవలు అందిస్తున్నారు. రోగుల రద్దీ దృష్ట్యా నాలుగేళ్ల క్రితం ఈ విభాగంలో పడకల సంఖ్యను 32కు పెంచారు. అయినప్పటికీ చాలడం లేదు. క్యాజువాలిటీలో అత్యవసర చికిత్సకు వచ్చే వారిని ఏఎంసీకి మార్చాలంటే పడకలు లభించడం లేదు. ఏఎంసీలో ఎవరికైనా ఆరోగ్యం కాస్త కుదుటపడితే గానీ అక్కడికి పంపలేని పరిస్థితి. లేదా ఎవరైనా మరణిస్తే గానీ పడకలు ఖాళీ కావడం లేదు. అప్పటి వరకు వార్డుల్లోనో, క్యాజువాలిటీలోనో రోగులు చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. ఏడాదిలో 2,498 మరణాలు ఏఎంసీ విభాగంలో ఇటీవల మరణాల శాతం బాగా పెరిగింది. గత ఏడాది(2018) 3,746 మంది చేరగా.. అందులో 2,498 మంది మరణించారు. నెలకు సగటున 200 మంది, రోజుకు ఏడుగురు చనిపోతున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అత్యవసర చికిత్స కోసం అత్యధిక శాతం మంది ఇక్కడికే రావడం, చివరిక్షణాల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు తమ వల్ల కాదని చేతులెత్తేసి పెద్దాసుపత్రికి పంపించడం, ఏఎంసీలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో పాటు మందులు, పడకల కొరత వల్ల రోగులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు. ఈ కారణంగానే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మధ్యాహ్నం దాటితే అరణ్యరోదనే ఏఎంసీ విభాగంలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా విభాగాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చి ఒకసారి రోగులను చూసి జూనియర్ డాక్టర్లకు దిశా నిర్దేశం చేస్తుంటారు. మధ్యాహ్నం నుంచి జూనియర్ వైద్యులే ఇక్కడ దిక్కు. మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు పెద్ద డాక్టర్లు ఇటువైపు రావడం లేదు. ఫలితంగా సకాలంలో సరైన వైద్యం అందక ఎందరో తనువు చాలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిలో కూడా కొందరు రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోగులకు క్యాథ్ ఊడిపోయినా, ఫ్లూయిడ్ అయిపోయినా తిరిగి పెట్టేందుకు త్వరగా రావడం లేదన్న విమర్శలున్నాయి. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నాం రోగుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఏఎంసీ సరిపోవడం లేదు. ఈ కారణంగా పాత గైనిక్ భవనంలో ప్రత్యేకంగా 100 పడకలతో ఏఎంసీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విభాగం ఏర్పాటు తర్వాత అవసరమైన వైద్యులు, సిబ్బంది కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. దీనికితోడు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి, జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి సీరియస్గా ఉన్న రోగులను ఇక్కడికి పంపుతున్నారు. ఈ కారణంగానే మరణాల శాతం పెరుగుతోంది. కొత్త విభాగం వస్తే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. –డాక్టర్ పి. చంద్రశేఖర్,ఆసుపత్రి సూపరింటెండెంట్ -
మందుల్లేవ్..మాస్కుల్లేవ్ !
పేరుకు జిల్లాకే పెద్దఆస్పత్రి.. సేవల్లో మాత్రం చిన్నాస్పత్రి.. జిల్లాలో స్వైన్ఫ్లూ విజృంభిస్తున్నా కనీసం మాస్క్లు.. మందులు కూడా లేని ధర్మాస్పత్రి. అందుకే వైద్యులు కూడా కేసులన్నీ రెఫర్ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. వైద్యఆరోగ్య శాఖ చోద్యం చూస్తుండగా.. కలెక్టర్ సారూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. నిరుపేదలు ప్రాణాలు నిలుపుకునేందుకు దొరికిన చోట్ల అప్పులు చేస్తూ ఇతర జిల్లాలకు పరుగు తీస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: జిల్లాలో స్వైన్ఫ్లూ పంజా విసురుతోంది. గడిచిన రెండు నెలల్లో 13 కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వైన్ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. బాధితుల్లో చిన్నారులే అధికంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది. మరోవైపు స్వైన్ఫ్లూ బాధితుల ప్రాణాలతో వైద్యఆరోగ్యశాఖ, సర్వజనాస్పత్రి యాజమాన్యం ఆటలాడుతోంది. మందులు.. కనీసం మాస్క్లు కూడా అందుబాటులో ఉంచకుండా చోద్యం చూస్తోంది. ఇదే సాకుగా వైద్యులు కేసులన్నీ కర్నూలుకు రెఫర్ చేస్తున్నారు. దీంతో నిరుపేదలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసులన్నీ కర్నూలుకే.. సర్వజనాస్పత్రి వైద్యులు మౌలిక సదుపాయాల లేమిని సాకుగా చూపి ఇప్పటి వరకు 9 కేసులను కర్నూలుకు రెఫర్ చేశారు. దీంతోనిరుపేదలంతా ఆర్థికంగా చితికిపోతున్నారు. వాస్తవంగా స్వైన్ఫ్లూ రోగులను ఐదు రోజుల పాటు ఐసొలేషన్ వార్డులో ఉంచి, మందులు అందించాలి. అవసరాల మేరకు ఫ్లూవాక్ వ్యాక్సిన్, వెంటిలేటర్, వైరల్కిట్, ఎన్95 మాస్క్లు అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం వ్యాక్సిన్, ఎన్95 మాస్క్లు పూర్తిస్థాయిలో లేవు. స్వైన్ప్లూ వార్డులో పీడియాట్రిక్ వెంటిలేటర్ సదుపాయం లేదు. ఇవి ఏర్పాటు చేస్తే రోగులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందించే వెసులుబాటుంది. ఏఎంసీ, క్యాజువాలిటీ తదితర విభాగాల వైద్యులు, స్టాఫ్నర్సులు, సిబ్బందికి ఫ్లూవాక్ వ్యాక్సిన్ వేయలేదు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే రోగులకు మరింత సేవలందించే అవకాశం ఉంటుంది. వైద్యుల మధ్య కోల్డ్వార్ సర్వజనాస్పత్రిలో వైద్యుల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. స్వైన్ఫ్లూ కేసులను చెస్ట్వార్డ్లో ఉంచుతారు. రోగులకు వైద్యం అందించే బాధ్యత సంబంధిత పల్మనాలజీ విభాగం వైద్యులదే. కానీ పల్మనాలజీ విభాగం వైద్యులు మాత్రం ఏ వార్డు నుంచి కేసు వస్తే వారే రెఫర్ చేయాలని చెబుతున్నారు. దీన్ని మిగితా విభాగాల వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ఎక్కడి నుంచైనా స్వైన్ఫ్లూ కేసు వస్తే సర్వజనాస్పత్రిలోనే అడ్మిట్ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 24న ఓ స్వైన్ఫ్లూ బాధితునికి వైద్యం అందిచే బాధ్యత మీదంటే.. మీదంటూ ఆర్ఎంఓ సమక్షంలోనే పల్మనాలజీ, పీడియాట్రిక్, మెడిసిన్, మైక్రోబయాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ విభాగం వైద్యులు ఘర్షణ పడ్డారు. ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడని కలెక్టర్ జిల్లాలో స్వైన్ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగి సర్వజనాస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడిపోతున్నా జిల్లా కలెక్టర్ ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం స్వైన్ఫ్లూ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై అధికారులతో సమీక్ష కూడా చేయలేదు. ఇప్పటికైనా కలెక్టర్ వీరపాండియన్ స్పందించకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులే చెబుతున్నారు. జిల్లాలో ప్రభావిత ప్రాంతాలు జిల్లాలోని నార్పల, ఓడీసీ, శింగనమల, గుంతకల్లు, అనంతపురం రూరల్, అర్బన్, గార్లదిన్నె, కంబదూరు మండలాల్లోని గ్రామాల్లో స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఆరోగ్యశాఖాధికారులు, ముందస్తు చర్యలు తీసుకోలేదు. తూతూమంత్రంగా కరపత్రాలు పంచి పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్య లోపం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. -
పెద్ద దిక్కు.. తీరని మొక్కు!
అనంతపురం మెడికల్ కళాశాల 18 ఏళ్ల క్రితం ఏర్పడగా.. దానికి అనుబంధంగా సర్వజనాస్పత్రి కూడా రూపుదిద్దుకుంది. కానీ అప్పట్లో ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. సిబ్బంది, వైద్యులు, మౌలిక సౌకర్యాలు మాత్రం ఆ మేరకు పెరగని పరిస్థితి. దీంతో సకాలంలో వైద్యం అందక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎంసీహెచ్(మెటర్నటీ చైల్డ్ హెల్త్ బ్లాక్) ఏర్పాటు కాక ఆస్పత్రి పురిటినొప్పులు పడుతోంది. అడ్మిషన్లో ఉంటున్న గర్భిణులు, బాలింతలకు.. ఆస్పత్రిలోని పడకలు.. సిబ్బందికి పొంతన లేకుండా పోయింది. ఫలితంగా సర్వజనాస్పత్రికి వస్తున్న వారు నరకం చూస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఏర్పాటైన సర్వజనాస్పత్రే జిల్లాకు పెద్దదిక్కు. పేదోడికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే పరిగెత్తుకు వస్తాడు. ఇక ప్రసవాల సంగతి సరేసరి. అందుకే ఓపీ రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఇక్కడ మౌలిక వసతులు లేక సరిపడా సిబ్బంది లేక జనం నరకం చూస్తున్నారు. ఇక పీజీ సీట్ల అనుమతులు, జీఓ 124 అమలు, ఎంసీహెచ్ బ్లాక్ కలగా మారడందో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నత్తనడకన సూపర్ స్పెషాలిటీ పనులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నత్తనడకనసాగుతున్నాయి. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైనా...టీడీపీ నేతలు మాత్రం తామే మంజూరు చేయించామని గొప్పలు చెబుతున్నారు. అయినా కూడా పనులపై దృష్టి సారించడం లేదు. అందువల్లే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఆగుతూ...సాగుతున్నాయి. 2014–15లో రూ.150 కోట్లతో ఆస్పత్రి ఏర్పాటుకు బీజం ఏర్పడింది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు భాగస్వామ్యంతో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015–16లో పనులు ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్కంతా పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంత వరకు పనులు పూర్తి కాలేదు. ఆస్పత్రి ఏర్పాటైతే కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, రేడియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ తదితర సేవలతో పాటు 200 నుంచి 300 మందికి ఉపాధి దొరుకుంది. అంతటి ప్రాధాన్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరో ఐదారు నెలల్లో టీడీపీ సర్కార్ గడువు ముగియనుంది. మళ్లీ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం దృష్టి సారిస్తే సరి..లేదంటే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. కనీసం టీడీపీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి.. దాదాపు 80 శాతం నిర్మాణపనులు పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తమ హయాంలోనే పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చూపితే జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది..చరిత్రలో వారి పేరూ మిగులుతుంది. లేకపోతే ఎప్పటిలాగే జనం ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకూ కర్నూలు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు పరుగులు తీయాల్సి వస్తుంది. బాలింతలకు తప్పని నరకం సర్వజనాస్పత్రిలో అవుతున్న ప్రసవాలకు, పడకలకు పొంతన కుదరడం లేదు. అయినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని నిరుపేదలంతా సర్వజనాస్పత్రిలోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఇలా సిజేరియన్ చేయించుకుంటున్న వారిని కనీసం వారం రోజుల పాటు గైనిక్ వార్డులో ఉంచుతారు. అయితే పడకలు తక్కువగా ఉండడంతో ఒకే మంచంపై ముగ్గురు పడుకోవాల్సి వస్తోంది. దీంతో బాలింతలు కదలకుండా పడుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు తమ చిన్నారులు ఎక్కడ పడిపోతారో..? కుట్లు ఎక్కడ ఊడిపోతాయోమోనని భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారు నరకం చూస్తున్నారు. ఆస్పత్రికి ఎంసీహెచ్ బ్లాక్ మంజూరైనా అది హిందూపురం జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రి యాజమాన్యం కలెక్టర్ ద్వారా రూ.55 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. కానీ ఇంతవరకూ అతీగతీ లేదు. ప్రస్తుతం గైనిక్ విభాగంలో 60 పడకలు మాత్రమే మంజూరైనా... 250 మంది అడ్మిషన్లో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పీజీ సీట్లు లేక ఇబ్బందులు బోధనాస్పత్రి ఏర్పడి 18 ఏళ్లు గడుస్తున్నా.. పీజీ సీట్లు లేకపోవడంతో వైద్యులపై అదనపు భారం పడుతోంది. పొరుగున ఉన్న కర్నూలు జిల్లాలోని ఏ ప్రైవేటు మెడికల్ కళాశాల ఏర్పడి ఎనిమిదేళ్లు కాకముందే పీజీ సీట్లు సంపాదించుకోగలిగింది. కారణం ఆ యాజమాన్యం పీజీ సీట్లకోసం పట్టుబట్టి సాధించుకుంది. మన జిల్లా నుంచి ఎన్నికైన వారిలో ఎక్కువ మంది టీడీపీ వారే అయినా... ఎప్పుడు ఇద్దరు కేబినెట్లో ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పీజీ సీట్లు సాధించడంలో వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఎప్పుడో ఒకసారి ఆస్పత్రికి వచ్చి తనిఖీల పేరుతో హడావిడి చేయడం తప్ప నిజంగా చిత్తశుద్ధితో వారు ప్రయత్నించింది శూన్యమనే చెప్పాలి. ఇప్పటికైనా వారు కళ్లు తెరిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పీజీ సీట్లు మంజూరు చేయించడంతో పాటు ఎంసీహెచ్ బ్లాక్, జీఓ 124 అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అదే జరిగితే జీఓ 124 ద్వారా 649 పోస్టులు మంజూరవుతాయి. దీని ద్వారా రోగులకు మరింత మెరుగ్గా సేవలదించేందుకు వీలుగా ఉంటుంది. నరకం చూశా మూడ్రోజులుగా గైనిక్ వార్డులో ఉంటున్నాం. మంచాలు చాలడం లేదు. ఒకే మంచంపై ముగ్గురు పడుకుంటున్నాం. రాత్రి వేళల్లో కదిలేందుకు వీలుండదు. ఎక్కడ పడిపోతామోనన్న భయం. కుట్లు ఊడి మరింత ఇబ్బంది అవుతుందని కదలకుండా ఉంటూ నరకం చూశాం. – అరుణ, ఆనందరావు పేట, శింగనమల -
బండితోస్తేనే వైద్యం
నగరంలోని నాల్గో రోడ్డుకు చెందిన నాగలక్ష్మి అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఎఫ్ఎం వార్డులో చేరింది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్కు రెఫర్ చేశారు. 11 గంటల సమయంలో నాగలక్ష్మిని స్కానింగ్ రూంకు తీసుకెళ్లేందుకు వచ్చిన ఎంఎన్ఓ ఆరోగ్య శ్రీ కార్యాలయం ముందు వరకూ తీసుకువెళ్లి..పని ఉందంటూ వెళ్లిపోయాడు. గంటన్నర గడిచినా ఎవరూ రాకపోవడంతో కుటుంబీకులు వార్డుకెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు వారే స్ట్రెచర్ తోసుకుంటూ స్కానింగ్ రూంకు తీసుకువెళ్లారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో ఎంఎన్ఓ, ఎఫ్ఎంఓలది ఆడింది ఆట..పాడింది పాటగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారం విధులు నిర్వర్తిస్తున్నారు. రోగులను వార్డుల్లోనుంచి రక్త పరీక్షలు, స్కానింగ్కు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిదే అయినప్పటికీ పట్టించుకోవడం లేదు. పైగా నడవలేని స్థితిలో ఉన్న వారిని హీనంగా చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులను తరలించాల్సి వచ్చినా...స్ట్రెచర్పై ఉన్న రోగులను ఎక్కడపడితే అక్కడే వదిలేసి వెళ్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక రోగులు నకరం చూస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడే కరువవుతున్నారు. పత్తాలేని సిబ్బంది ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 30 మంది ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు రెగ్యులర్ ఎంఎన్ఎఓ, ఎఫ్ఎన్ఓలు 29 మంది వరకు ఉన్నారు. వీరు రౌండ్ ద క్లాక్ రోగులకు సేవలందించాల్సి ఉంది. కానీ వార్డుల్లో పూర్తి స్థాయిలో ఉండడం లేదు. ఆస్పత్రిలో అడ్మిషన్లో ఉన్న వారిని వైద్య పరీక్షల(ఎక్స్రే, సిటీ స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎంఆర్ఐ)తదితర సేవలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొన్ని వార్డుల్లో ఉదయం వైద్యులు రెఫర్ చేస్తే మధ్యాహ్నం వరకైనా సిబ్బంది తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు కుటుంబీకులే వైద్య పరీక్షలకు అతి కష్టం మీద తీసుకెళ్తున్నారు. నిద్రమత్తులో ఉన్నతాధికారులు ఆస్పత్రిలో అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంఓ) ఆవైపుగా దృష్టి సారించడం లేదు. వాస్తవంగా ఆర్ఎంఓ, డిప్యూటీ ఆర్ఎంఓ, అసిస్టెంట్ ఆర్ఎంఓలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు వార్డులను పర్యవేక్షించి, అక్కడ రోగులేమైనా ఇబ్బందులు పడుతుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఆర్ఎంఓ కార్యాలయానికే పరిమితం కాగా... ఇదే అదునుగా సిబ్బంది పత్తా లేకుండా పోతున్నారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలు..రోగుల ఇబ్బందులపై కలెక్టర్ వీరపాండియన్ చొరవ చూపితే బాగుంటుందని రోగులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం రోగులను వైద్య పరీక్షల కోసం ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలే తీసుకెళ్లాలి. అలా చేయకుండా మధ్యలోనే వదిలేయడం సరికాదు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
ముగ్గురు పసికందులు మృతి
హిందూపురం అర్బన్: హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ముగ్గురు పసికందులు మృతి చెందటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 18న మడకశిర మండల పాపసానిపల్లికి చెందిన కవిత తన నాలుగు నెలల ఆడ శిశువుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యసేవలు పొందుతున్న పసిబిడ్డ బుధవారం ఉదయం చనిపోయింది. ప్రాణం పోస్తారని బిడ్డను తీసుకువస్తే బిడ్డ శవాన్ని చేతికిచ్చారని కవిత కన్నీరుమున్నీరైంది. ♦ ఇలా ఉండగానే గంట తర్వాత చౌళూరు గ్రామానికి చెందిన సుకన్య మూడునెలల ఆడశిశువుకు దగ్గు ఉందని, సరిగా పాలు తాగలేకపోతోందని ఆస్పత్రిలో చేర్చింది. చికిత్స పొందుతూ పాప 10 గంటల సమయంలో మృతి చెందింది. అక్కడి సిబ్బంది విషయం తెలిస్తే రచ్చ అవుతుందని భావించి పాప బతకదని ముందే చెప్పామని చెప్పి బాధితులను ఆటో ఎక్కించి పంపించేశారు. ♦ మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిసలమానేపల్లికి చెందిన శ్రావణి రెండు నెలల మగశిశువు ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యుల సూచన మేరకురక్త పరీక్షలు చేయించి తీసుకొచ్చిన కొద్దిసేపటికే బిడ్డ శీరీరం చల్లబడిపోయింది. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో తల్లి శ్రావణి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో లేపాక్షి పీహెచ్సీ ఆస్పత్రిలో చేర్పించారు. పేరుకే జిల్లా ప్రభుత్వాస్పత్రి హిందూపురంలో రూ.23 కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి ఏ మాత్రం తీసిపోని రీతిలో హంగు అర్భాటంతో ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, సదుపాయాలు కల్పించారు. అయితే ఇక్కడ వైద్యం అందించడానికి వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. పేరుకే జిల్లా ఆస్పత్రి. సేవల్లో పీహెచ్సీ కన్నా అధ్వానంగా మారిందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైద్యసేవలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెబితే ‘ఇక్కడ పదిమంది లేరు.. వచ్చి చూస్తారు.. కాస్త ఓపిక ఉండాలి’ అంటూ చీదరించుకుంటున్నారని తెలిపారు. వైద్యులు వచ్చి చూసేసరికి ఉన్న ప్రాణం పోయే పరిస్థితి నెలకొంటోందన్నారు. విచారణకు కలెక్టర్ ఆదేశం అనంతపురం న్యూసిటీ: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న పసికందుల మరణాలపై కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. జేసీ–2 సుబ్బరాజు, డీఎంఅండ్హెచ్ఓ అనీల్కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్తో కమిటీగా వేశారు. కమిటీ రెండు రోజుల్లోపు లోతుగా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని సూచించారు. చిన్నారుల మృతి పట్ల కల్టెకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నీ సహజ మరణాలే ఒకేరోజు ముగ్గురు పసికందులు చనిపోయారు. అన్నీ సహజ మరణాలే. పాపసానిపల్లి కవితకు మేనమామతో పెళ్లయ్యింది. మేనరికం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయింది. చౌళూరు సుకన్య బిడ్డ కుపోషణకు గురై చనిపోయింది. బిసలమానేపల్లి శ్రావణి బిడ్డకు రక్తం తక్కువగా ఉండటంతో మృతి చెందింది.– డాక్టర్ కేశవులు, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యసేవల్లో నిర్లక్ష్యం లేదు హిందూపురం ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న మరణాలపై వైద్యశాఖ నిర్లక్ష్యం లేదు. కేసులన్నీ చివరిలో ఆస్పత్రికి వచ్చాయి. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యమే అందించారు. –రమేశ్నాథ్, డీసీహెచ్ఎస్ -
నిమోనియా.. ప్రాణాలు తీసేనయా!
ఈ ఫొటోలో చిన్నారితో కలిసి ఉన్న ఈమె పేరు లక్ష్మి. రూరల్ పరిధిలోని వికలాంగుల కొట్టాల్లో నివాసముంటోంది. చిన్నారికి కొన్ని రోజులుగా దగ్గు, జలుబు, జ్వరం వస్తుండడంతో సర్వజనాస్పత్రిలో చేర్పించింది. అలాగే మరో చిన్నారి పేరు అర్బన(5 నెలలు) శెట్టూరు మండలం బలపంపల్లి గ్రామం. నాలుగు రోజుల నుంచి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఆస్పత్రిలో నిమోనియాతో బాధపడుతూ ఎంతో మంది చేరుతున్నారు. అనంతపురం న్యూసిటీ: నిమోనియా వ్యాధి చిన్నారులను ప్రాణాలను కబలిస్తోంది. సీజినల్ వ్యాధుల్లో జ్వరపీడితులకు దీటుగా నిమోనియా బాధితులు పెరిగిపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా చిన్నారులు దీని బారిపడి మృత్యువాత పడుతున్నారు. అప్రమత్తతే శరణ్యమని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటుని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు అనుభవజ్ఞులైన చిన్నపిల్లల వైద్యులతోనే వైద్యం ఇప్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దగ్గు, జలుబు వస్తే చిన్నపాటి సూది మందు వేసుకుని పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. పెరుగుతున్న మరణాలు చిన్నారులు నిమోనియాతో బాధపడుతూ మృత్యువాతపడుతున్నారు. ఈ నెల 12న కళ్యాణదుర్గానికి చెందిన లక్ష్మి(2) నిమోనియాతో బాధపడుతూ సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో మృతి చెందింది. ఈ నెల 13న కుందుర్పికు చెందిన బేబీ ఆఫ్ బొమ్మక్క(2 నెలలు) సివియర్ నిమోనియాతో మృతి చెందింది. అలాగే ఈ నెల 14న ఉరవకొండ చిన్నకౌకుంట్లకు మధు(3నెలలు) నిమోనియాతో మృతి చెందాడు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. కిక్కిరిస్తున్న సర్వజనాస్పత్రి సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లలో వార్డులో గత మూడు నెలల్లో 50కిపైగా నిమోనియా కేసులు నమోదయ్యాయంటే వ్యాధి తీవ్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల వార్డులో 60 పడకల సామర్థ్యం ఉంటే అందులో వందకుపైగా కేసులున్నాయి. దీంతో వార్డు కిక్కిరిసిపోతోంది. వ్యాధి లక్షణాలు నిమోనియా అనేది బ్యాక్టీరియల్ వైరస్. పెద్దల్లో దగ్గు, జలుబు ఉంటే పిల్లలకు త్వరగా అంటుకుంటుంది. చిన్నారుల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి త్వరితగతిన దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం, పిల్లికూతలు, కడుపు ఎగిరేస్తూ ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. టీకాలు సరిగా వేయించని, బరువు తక్కువ పిల్లలకు, నెలలు నిండని పిల్లలకు నిమోనియా వచ్చే అవకాశాలున్నాయి. ఏం చేయాలి? ⇔ ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తే తక్షణం వైద్యున్ని సంప్రదించాలి. ⇔ ఇంట్లో ఎవరికైనా పెద్దలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే వారి వద్దకు పిల్లలను పంపరాదు. వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ⇔ పసివయసులో తల్లిపాలతో పాటు టీకాలు తప్పక వేయించాలి. ప్రైవేట్గా నిమోకోకల్ వ్యాక్సిన్ లభిస్తుంది. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను ఇంత వరకు ఆస్పత్రుల్లో ప్రవేశపెట్టడం లేదు. అర్చన(బలపంపల్లి, శెట్టూరు) -
సర్వశిక్షాస్పత్రి
సర్వజనాస్పత్రికి వెళ్లే వారంతా సర్వశిక్షలూ అనుభవించాల్సిందే. ఇక్కడి వైద్యులకు.. సిబ్బందికి జాలి, దయ, మానవత్వం ఏమీ ఉండవనే సంగతి మరోసారి రుజువైంది. కళ్లముందే బాలింతలు నరకం చూసున్నా.. ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఏ మాత్రం పట్టించుకోకుండా మరింత ఇబ్బంది పెట్టాడు. ఇక నొప్పితో విలవిల్లాడుతున్న మరో బాలింతకు స్టాఫ్నర్సు కనీసం సూది వేసేందుకు కూడా ముందుకు రాకపోగా ఇంజెక్షన్ వేయాలని సూచించిన వైద్యురాలితో తగదా పెట్టుకుంది. ఏ ఆస్పత్రిలోనైనా ఒకే రోజు ఐదుగురు శిశువులు మృత్యువాత పడితే.. మరుసటి రోజు కలెక్టర్ స్థాయిలో తనిఖీలు.. వైద్యులపై చర్యలుంటాయి. కానీ ఇక్కడ కనీసం విచారణ కూడా లేదు. అందుకే వైద్యులు.. సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రినే నమ్ముకుని ఇక్కడికొచ్చే వారికి చావును ప్రసాదిస్తున్నారు. ఆస్పత్రి సేవలకు నిదర్శన చిత్రమిది. తుగ్గలి మండలం దిగువచింతలకొండకు చెందిన బాలింత జ్యోతి హెచ్బీ పరీక్ష చేయించుకునేందుకు క్యూలో నిలబడలేక పడిపోయింది. తోటివారు సహకరించడంతో.. ఓ వైపు రక్తస్రావం అవుతున్నా క్యూలో నిల్చుంది. ఎక్కడైనా టెక్నీషియన్ ప్రతి మంచం వద్దకు వెళ్లి పరీక్ష చేస్తాడు. ఇక్కడేమో బాలింతలే ఆయన వద్దకు వెళ్లాలి. ఇది సర్వజనాస్పత్రి మరి. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి వైద్యులు, సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఒకేరోజు ఐదుగురు శిశువులు మృత్యువాత పడినా...వారికి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు. ఎప్పటిలాగే బుధవారమూ నిర్లక్ష్య వైద్యమే చేశారు. మంగళవారం నాటి ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా..సూపరింటెండెంట్ జగన్నాథ్ ముగ్గురు వైద్యులతో కమిటీ వేశారు. అనంతరం ఆయన కూడా పలువార్డులకువెళ్లి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా సిబ్బంది సమస్యలే ఏకరువుపెట్టారు. బాలింతల అవస్థలెన్నో... గైనిక్ విభాగంలోని పోస్టునేటల్ వార్డులో బాలింతలు ప్రత్యక్షనరకం చూస్తున్నారు. ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉంటున్నారు. పోస్టునేటల్ వార్డులో ఫ్యాన్లు తిరగక ఏళ్లు గడుస్తోంది. దీంతో బాలింతులు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. కడుపుకోత మిగిల్చారు ప్రైవేట్గా చికిత్స చేయించుకోవాలంటే రూ.వేలు ఖర్చు అవుతుంది. ఆస్పత్రిలో బాగా చూస్తారనే ఆశతోనే నా భార్యను తీసుకువచ్చా. ఇక్కడేమో వైద్యులు, సిబ్బంది సరిగా పట్టించుకోలేదు. గత నెల 28న కడుపులో బిడ్డ బాగా ఉందని చెప్పారు. నిన్న(ఈ నెల 2న) ఉదయం 6 గంటలకు వచ్చాం. కాసేపటికల్లా బిడ్డ ఇస్తారని ఎంతో సంతోషించా. బిడ్డ చనిపోయిందని చెప్పారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడుంటుందయ్యా(ఏడ్చుకుంటూ). – వీరనారాయణచారి, ప్రమీల భర్త, మేడిమాకులపల్లి, పెదవడుగూరు ఇంత నిర్లక్ష్యమా? మేము పేదోళ్లమయ్యా... అందుకే ప్రైవేటు ఆస్పత్రులకు పోలేక ఇక్కడ ప్రసవం చేయించేందుకు తీసుకువచ్చాం. ప్రాణం లేని బిడ్డను అట్టపెట్టెలో ఉంచి ఇచ్చారే. ఇంతకన్నా నిర్లక్ష్యమెక్కడుంటుంది. వైద్యులపై నమ్మకం లేకుండా పోతోంది. – నిర్మల, ప్రమీల వదిన -
కాళ్లు మొక్కినా.. వైద్యమందక
నిరుపేదలకు ప్రాణం మీదకు వస్తే వెంటనే గుర్తొచ్చేది ప్రభుత్వ ఆస్పత్రి. అందుకే ఇక్కడి వైద్యులను దైవంతో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం మంVýæళవారం నుంచి సమ్మెబాట పట్టారు. అత్యవసర సేవలు మినహా చేయిపట్టేది లేదని తేల్చిచెప్పారు. దీంతో నిత్యం వేలాది మంది వచ్చే సర్వజనాస్పత్రిలో రోగులు నరకం చూశారు. సకాలంలో వైద్యం అందక ఏడుపులు..పెడబొబ్బలు పెట్టారు. కాస్త దయచూపండంటూ కనిపించిన వారందరినీ వేడుకున్నారు. ఈ క్రమంలోనే హౌస్ సర్జన్లకు సూచనలిచ్చేందుకు ఓ వైద్యురాలు రాగా.. నీకాళ్లు మొక్కుతా తల్లీ నాకు వైద్యం చేయమని ఓ వృద్ధురాలు ప్రాధేయపడిన తీరు రోగుల దీన స్థితికి అద్దం పట్టింది. ఈ వృద్ధురాలి పేరు ఈరమ్మ. మడకశిర మండలం హనుంతరాయపల్లి గ్రామం. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. రెండ్రోజులుగా ఆయాసంతో బాధపడుతూ మడకశిర ఆస్పత్రిలో చూపించుకుంది. ఎటువంటి ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చింది. ఓపీ నంబర్ 15కు ఎంతసేపటికీ వైద్యులు రాలేదు. ఇదేమిటని ఆరా తీస్తే వైద్యుల సమ్మె అని తెలిసింది. దీంతో ఆ వృద్ధురాలి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. రూ 250 ఖర్చు పెట్టుకుని ఇక్కడకు వస్తే వైద్యులు లేకపోతే ఎలాగని కన్నీటి పర్యంతమైంది. ఆయాసం వస్తోందయ్యా ఏంటి నా పరిస్థితితని బోరున విలపించింది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యుల సమ్మెతో రోగులు ప్రత్యక్ష నరకం చూశారు. మంగళవారం సమ్మెలో భాగంగా ఆస్పత్రిలోని ఓపీ గదులను వైద్యులు మూసేసి ధర్నాలో పాల్గొన్నారు. వైద్యులు ఓపీ బ్లాక్ ముందే సేవలు లేవని రోగులకు తెగేసి చెప్పారు. నిత్యం కిటకిటలాడే ఓపీ విభాగాలు బోసిపోయాయి. అత్యవసరం మినహా మిగతా ఆపరేషన్లను వాయిదా వేశారు. విద్యార్థులకూ బోధన తరగతులు తీసుకోలేదు. ఇంకా సమ్మె మూడ్రోజుల పాటు ఉండడంతో రోగులు మరింత ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ వైద్యులపై చిత్తశుద్ధేదీ? ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఓపీ బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ వీరభద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల పట్ల సర్కార్ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతుంటే రిమ్స్ వైద్యులను ప్రభుత్వ వైద్యులుగా గుర్తించడమేంటని నిలదీశారు. దీని ద్వారా సీనియర్ వైద్యులు నష్టపోవడమే కాక, ఒకే కేడర్లో ఉద్యోగ విరమణపొందుతారన్నారు. పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారమయ్యే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. 27న మహాధర్నా ఆస్పత్రిలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్తో వైద్యుల సంఘం నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ డీఎంఈ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ప్రభుత్వ వైద్యుల సంఘం స్పందిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వాలని డీఎంఈ ఇస్తే కుదరదన్నారు. ఈ నెల 26న విధులను బహిష్కరిస్తామని, 27న జూనియర్ డాక్టర్లు, స్టాఫ్నర్సులు, పారామెడికల్ సిబ్బందిని కలుపుకుని మహాధర్నా చేపడుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ భానుమూర్తి, వైద్యులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ షంఫాద్బేగం, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ సుల్తానా, డాక్టర్ హేమలత, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్ పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రికి పురిటినొప్పులు!
వెనుకబడిన జిల్లా ఆఖరుకు ఆరోగ్య సౌకర్యాల్లోనూ వివక్షకు గురవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మెల్యేల్లో దాదాపు 12 మంది టీడీపీ వారే అయినా.. అందులో ఇద్దరు మంత్రులుగా రాష్ట్రానికే సేవలందిస్తున్నా.. వీరిలో ఓ మహిళా మంత్రి ఉన్నా.. అనంతలోని అమ్మల ఆక్రందన చెవికెక్కని పరిస్థితి. కనీస ఆరోగ్య సౌకర్యాలు లేక మాతృమరణాలు పెరుగుతున్నా.. వారికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రసవ వేదనతో ఎందరో తల్లులు మృత్యువాత పడుతుండగా.. కళ్లు తెరవని పసికందులు తల్లి ప్రేమకు దూరమై మౌనంగా రోదిస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గించడంలో భాగంగా ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) రాష్ట్ర వ్యాప్తంగా 19 గైనిక్ యూనిట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ ‘అనంత’ ఆస్పత్రికి ఒక్క యూనిట్ కూడా కేటాయించలేదు. దీని ప్రభావం గర్భిణులు, బాలింతలపై పడుతుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు సర్వజనాస్పత్రిని తనిఖీ చేసిన ప్రతిసారీ మెరుగైన వైద్యం అందించాలని చెబుతున్నారే కానీ.. వైద్యుల సంఖ్య, మౌలిక సదుపాయాల కల్పనపై నోరుమెదపడం లేదు. ఫలితంగా రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. మరోవైపు వైద్యులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రెండు యూనిట్లతోనే ఏళ్లుగా సర్దుబాటు సర్వజనాస్పత్రిలో గర్భిణులు, బాలింతల పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవంగా గైనిక్ వార్డులో రెండు యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్కు 30 పడకలుంటాయి. కానీ ఆస్పత్రిలో 250 మంది గర్భిణులు, బాలింతలుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులపై పని ఒత్తిడి ఆస్పత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య రోజు రోజుకూపెరుగుతోంది. ఐపీతో పాటు ఓపీ మొత్తం కలుపుకుని 450 నుంచి 500 మంది వరకు వస్తుంటారు. బోధనాస్పత్రిలో యూనిట్కు ప్రొఫెసర్తో పాటు ఇద్దరు అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్లు, సీనియర్ రెసిడెంట్లు,ఇద్దరు జూనియర్ రెసిడెంట్లు ఉండాలి. సర్వజనాస్పత్రిలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న గర్భిణులు, బాలింతల సంఖ్య దృష్ట్యా 8 యూనిట్లు ఉండాలి. కానీ ఇక్కడ రెండు యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. రోజూ 30 ప్రసవాలు జరిగితే అందులో 10 సిజేరియన్లు ఉంటున్నాయి. ఇలా ప్రతి నెలా 900 మందికి ప్రసవాలు జరుగుతున్నాయి. యూనిట్లు పెరిగితే ప్రొఫెసర్లతో పాటు అసోసియేట్, అసిస్టెంట్లు వస్తారు. మెరుగైన వైద్య సేవలూ అందే అవకాశం ఉంది. అనంతలోనే ‘హైరిస్క్’ దేశ వ్యాప్తంగా లక్ష కేసుల్లో 130 మాతృమరణాలు సంభవిస్తున్నాయి. అదే ఏపీలో లక్ష మందికి 74 మంది, ‘అనంత’లో అయితే లక్షకు 40 మాతృ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మృతులంతా హైరిస్క్ గర్భిణీలే. రక్తహీనత, హైపర్టెన్షన్తో పాటు వివిధ రకాల సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. మాతృ మరణాలు తగ్గించాలని చెబుతున్న ప్రభుత్వం...ఆ స్థాయిలో వైద్యులను నియమించడం లేదు. ఒక వైద్యురాలు రోజూ దాదాపు 40 నుంచి 45 మంది గర్భిణులను చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం ఏవిధంగా సాధ్యపడుతుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. మాతృ మరణాల తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా..మౌలిక సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమవుతోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కలెక్టర్ మాట బేఖాతర్ ఇటీవల జరిగిన హెచ్డీఎస్ సమావేశంలో కలెక్టర్ వీరపాండియన్ గైనిక్ వార్డుకు అదనంగా ఏఎన్ఎంలను నియమించాలని డీఎంహెచ్ఓ కేవీఎన్ఎస్ అనిల్కుమార్, సూపరింటెండెంట్ జగన్నాథ్కు సూచించారు. కానీ వారిద్దరూ కలెక్టర్ మాటలను చెడచెవినపెట్టారు. సర్వజనాస్పత్రిలో 12 మంది మెటర్నిటీ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా.. ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో మెటర్నిటీ అసిస్టెంట్ల పని కూడా వైద్యులే చేయాల్సి వస్తోంది. సర్దుకుంటేనే సేవలు ఈ చిత్రం చూడండి... రెండు మంచాలపై ముగ్గురు బాలింతలు ఎలా సర్దుకునే ఉన్నారో... ఒకరు విశ్రాంతి తీసుకోవాలంటే మరొకరు కూర్చోవాల్సిందే. చిన్నారులను పక్కన పెట్టుకుని ఎక్కడ కాళ్లు తగులుతాయోనన్న భయంతో బాలింతలు అల్లాడిపోతున్నారు. మరోవైపు చాలా సేపు కూర్చుండిపోవడం వల్ల సీజేరియన్ చేసి కుట్లు వేసిన చోట నొప్పిగా ఉందంటూ బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక యూనిట్ అంటే 30 పడకలను ఒక యూనిట్గా తీసుకుంటారు. ఈ యూనిట్కు ఒక ప్రొఫెసర్.. ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ఇద్దరు జూనియర్ రెసిడెంట్లు అందుబాటులో ఉంటారు. యూనిట్లు పెరగాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనిట్లు తప్పక పెరగాలి. రోజూ వందల మంది గర్భిణులకు సేవలందిస్తున్నాం. ఒక్క వైద్యురాలే అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మెటర్నిటీ సేవలు సైతం వైద్యులు చేస్తున్నారు. దీంతో పాటుగా విద్యార్థులకు నాలుగు పిరియడ్లు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో హైరిస్క్ కేసులు ఎలా చూడగలం.– డాక్టర్ షంషాద్బేగం, గైనిక్ హెచ్ఓడీ -
ఖర్మాస్పత్రులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మీదేవి. తలుపుల మండలంలోని భూపతివారిపల్లి స్వగ్రామం. జ్వరంతో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం 11 గంటలకు తలుపులలోని పీహెచ్సీకి రాగా.. పరీక్షించిన వైద్యుడు సెలైన్ ఎక్కించాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో మంచాలు లేకపోవడంతో ఇదిగో ఇలా వరండాలోని అరుగుపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కించారు. ఇలాంటి దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణమని సిబ్బందే చెబుతున్నారు. 24 గంటలు పనిచేసే ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్యురాలు మెటర్నిటీ లీవ్లో వెళ్లిపోగా.. మరో పీహెచ్సీలో పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీరాంను ఇక్కడ నియమించారు. ఆయన వారం రెండురోజులు మాత్రమే సేవలందిస్తున్నారు. ఏదైనా అత్యవసరమైతే 24 కి.మీ., దూరంలోని కదిరికి పరుగులు తీయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. – తలుపుల అనంతపురం న్యూసిటీ: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆస్పత్రులు మాత్రం ఆ మేరకు సేవలందించలేకపోతున్నాయి. మందులు లేక..ఉన్నా వాటిని ఇచ్చే వారు లేక..మౌలిక సదుపాయాల కొరతతో రోగులకు నరకం చూపుతున్నాయి. సిరంజీలు మొదలుకుని కుక్కకాటు వ్యాధులకు కూడా మందుల లేకపోవడంతో రోగులు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. బయోమెట్రిక్ అమలులో ఉన్నా... కొన్ని పీహెచ్సీల్లో(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలందడం లేదు. ఇక జిల్లాలోని స్టేట్ కేడర్లలో 281 పోస్టులు మంజూరైతే అం దులో 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక జోనల్ కేడర్కు సంబంధించి 825 పోస్టులకు గానూ 139 ఖాళీలున్నాయి. జిల్లా కేడర్కు సంబంధించి 2105 పోస్టులకుగానూ 682 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే వైద్యం దైవాదీనంగా మారింది. మందుల్లేవ్ అసలే సీజనల్ వ్యాధుల కాలం. డెంగీ, మలేరియా కేసులు అధిమకమయ్యాయి. జిల్లాలోని వివిధ పీహెచ్సీల్లో 164 మలేరియా, 66 డెంగీ కేసులునమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా.. పీహెచ్సీలే పెద్ద దిక్కు. అక్కడి వైద్యులిచ్చే నాలుగు గుళికలే ప్రాణం పోకుండా చూస్తాయి. అటువంటిది ఆ మాత్రలు కూడా పీహెచ్సీల్లో అందుబాటులో లేని దుస్థితి. జ్వరానికిచ్చే పారాసీటమాల్ మాత్రలు కూడా చాలా ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. వృద్ధులు, మహిళలు, గాయాలపాలైన వారికి ఇచ్చే డైక్లోఫినాక్ మాత్రలు కూడా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. యాంటిబయాటిక్స్ మందులైన అమాక్సలిన్, అమాక్సిలిన్ క్వావినేట్ 625 ఎంజీ, సిఫ్రోప్లాక్సిన్ల గురించి చెప్పుకోకపోతేనే మేలు. పెంటా సోడియం, జెంటామైసిన్, బీ 12 ఇంజెక్షన్లు సరఫరా ఆగిపోయినా అడిగే వారు లేరు. ఇక కుక్కకరిస్తే వేయాల్సిన ఇమినోగ్లోబిలిన్ మందు చాలా పీహెచ్సీల్లో అందుబాటులో లేదు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలోని 87 పీహెచ్సీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా పీహెచ్సీ వైద్యులు పూర్తిస్థాయిలో లేరు. 173 మెడికల్ ఆఫీసర్లలో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని కొట్టాలపల్లి, ముద్దినాయినపల్లి, విడపనకల్లు, బి.కౌకుంట్ల, ఎన్ఎస్ గేట్, కుందుర్పి, కృష్ణాపురంలో పీహెచ్సీల్లో వైద్యులు లేరు. దీంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇతర పీహెచ్సీల్లోని వైద్యులను సర్దుబాటు చేస్తున్నారు. 13 మంది సీనియర్ వైద్యులు పీజీ సీట్లు రావడంతో వెళ్లిపోయారు. ఇక 219 స్టాఫ్నర్సు పోస్టులకుగానూ 185 మంది మాత్రమే ఉన్నారు. స్టాఫ్నర్సుల అవస్థలు మెడికల్ ఆఫీసర్ తర్వాత పీహెచ్సీలకు స్టాఫ్నర్సే పెద్దదిక్కు. అంతటి కీలకమైన స్టాఫ్ నర్సు పోస్టులు జిల్లాలోని 34 ఖాళీ ఉన్నాయి. 24 గంటలు పనిచేసే ఆస్పత్రులకు ముగ్గురు స్టాఫ్నర్సులుంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసే పీహెచ్సీల్లో ఒక స్టాఫ్నర్సు మాత్రమే ఉంటారు. దీంతో వీరికి సెలవు పెద్ద సమస్యగా మారింది. కార్మిక చట్టం ప్రకారం 40 గంటలు పని చేసి తర్వాత కచ్చితంగా సెలవు ఇవ్వాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. అందుకే హెల్త్ అసిస్టెంట్లను బతిమాలుకుని సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మెరుగైన సేవలందిస్తాం రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందిస్తాం. పీహెచ్సీల్లో వైద్యుల సమస్య లేకుండా సర్దుబాటు చేశాం. త్వరలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు ఉన్నతాధికారుల అనుమతితో భర్తీ చేస్తాం. కొందరు పీజీ చదివేందుకు వెళ్లారు. జిల్లాలో ఎక్కడా మందుల కొరత రానివ్వకుండా చర్యలు తీసుకుంటా. వైద్యులు సమయపాలన పాటించాల్సిందే. సిబ్బంది కొరత సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. – కేవీఎన్ఎస్ అనిల్కుమార్,జిల్లా వైద్యాధికారి -
ఎక్స్రే.. తీయరే!
కర్నూలు పెద్దాసుపత్రిలో ఎక్స్రే మిషన్లను ‘నిర్లక్ష్యపు రోగం’ పట్టిపీడిస్తోంది. మిషన్లు చెడిపోయి..రోగుల అవస్థలకు కారణమవుతున్నాయి. వీటి మరమ్మతుల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఆసుపత్రిలో వైద్యపరికరాల మరమ్మతుల పేరిట ప్రతినెలా లక్షలాది రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడ ఏ పరికరమూ సక్రమంగా పనిచేయడం లేదు. ఉన్న ఒకట్రెండు పరికరాల వద్ద రోగులు పడిగాపులు కాస్తున్నారు. ఎక్స్రే మిషన్లు రెండు నెలలుగా పనిచేయకపోయినా.. వాటిని మరమ్మతు చేయాల్సిన టీబీఎస్ సంస్థ ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతిరోజూ 2,500 నుంచి మూడు వేల మంది రోగులు ఓపీ చికిత్సకు వస్తున్నారు. అలాగే నిత్యం 1,500 మందికి పైగా ఇన్పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. వీరిలో ప్రతిరోజూ 300 మందికి పైగా రోగులకు ఎక్స్రే పరీక్షలు అవసరం అవుతుంటాయి. ఆసుపత్రిలోని 500 ఎంఏ ఎక్స్రే మిషన్లు 7, మొబైల్ ఎక్స్రే మిషన్లు 10 ద్వారా ఈ సేవలు అందించాల్సి ఉంది. కానీ కొంత కాలంగా 500 ఎంఏ ఎక్స్రే మిషన్లు నాలుగు, మొబైల్ ఎక్స్రే మిషన్లు ఐదు పనిచేయడం లేదు. ఇక 1000 ఎంఏ, 800 ఎంఏ ఎక్స్రే మిషన్లు కొన్నేళ్లుగా మూలనపడ్డాయి. వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లతో డీఆర్ సిస్టమ్ అనే ఎక్స్రే మిషన్ పంపించింది. అయితే.. సదరు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు పూర్తిగా చెల్లించకపోవడంతో దాన్ని బిగించలేదు. నాలుగు నెలలుగా ఆసుపత్రిలో ఓ మూల చెక్కపెట్టెలో పడి ఉంది. ఈ యంత్రం ద్వారాఎక్స్రే ఫిల్మ్ లేకుండానే కంప్యూటర్లో పరీక్షా ఫలితాన్ని చూసే అవకాశముంది. ఈ మేరకు ప్రతి విభాగంలోనూ కంప్యూటర్లు ఏర్పాటు చేయాలి. కానీ ఇందుకు అవసరమైన కంప్యూటర్లు మాత్రం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. ఇటీవలే సదరు సంస్థ ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చి..మిషన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. అయితే.. కంప్యూటర్లు ఎప్పటికి సమకూరుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రోగుల అవస్థలు ఎక్స్రే మిషన్లు చాలావరకు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర అవస్థ పడుతున్నారు. రోజూ 300 మందికి పైగా ఎక్స్రేకు వస్తున్నారు. గురువారం రేడియాలజీ విభాగం వద్ద ఓపీతో పాటు ఐపీ రోగులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పనిచేయని ఎక్స్రే మిషన్లను మరమ్మతు చేయాలని టీబీఎస్ సంస్థకు ఆసుపత్రి అధికారులు పలుమార్లు చెప్పినా.. ఇదిగో అదిగో అంటూ నెలలు గడిపేస్తున్నారు. దీనికితోడు ఎక్స్రే ఫిల్మ్లు ప్రింట్ తీసే యంత్రం కూడా నాలుగు రోజుల నుంచి మొరాయిస్తోంది. ప్రస్తుతం ఒకే యంత్రంతోనే ఫిల్మ్లు తీస్తుండటంతో నివేదికలు ఇచ్చేందుకు ఆలస్యమవుతోంది. -
మరో బాలిక ప్రసవం.. ఆస్పత్రి ఆవరణలో పసికందు
అనంతపురం సెంట్రల్: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రసవించిన ఘటనను మరువకముందే అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. తాడిపత్రి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం రాత్రి అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపాన గల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. శనివారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పసికందును ఆస్పత్రి ఆవరణలోనే వదిలిపెట్టి బాలికను తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మయాదేవికి సమాచారం అందించారు. పీడీ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు సదరు పసికందును స్వాధీనం చేసుకున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో పాపకు చికిత్స అందిస్తున్నారు. బాలికకు వివాహమైందా.. అత్యాచారానికి గురై పసికందును ప్రసవించి వదిలేసి వెళ్లారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
కథలు చెప్పకండి
అనంతపురం న్యూసిటీ: ప్రసవానంతరం బాలింతను, చంటిబిడ్డను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు ఆస్పత్రి ఆవరణలోనే అధిక సంఖ్యలో ఉండటంపై వైద్య ఆరోగ్యశాఖ ఉమెన్, చైల్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వాణిశ్రీ ‘జీవీకే గ్రూపు’ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె అనంతపురం సర్వజనాస్పత్రిని పరిశీలించారు. ప్రసవాల నివేదికను పరిశీలించి తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలపై ఆరా తీశారు. అసలు చాలా వాహనాలను వాడటమే లేదని తెలిసింది. అక్కడి నుంచి సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్వద్దకు వెళ్లిన ఆమెకు ఆరుబయట ఆరువాహనాలు కనిపించాయి. డ్రైవర్ల లైసెన్స్, బ్యాడ్జీలను పరిశీలించారు. డ్రెస్కోడ్ లేకపోవడంపై మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా వాహనాలన్నీ ఇక్కడే ఉంటే ఎలా అంటూ ప్రశ్నించడంతో.. ‘బాలింతలు వాహనాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు’ అని వాహనాల నిర్వాహకుడు సమాధానమిచ్చారు. పేదలు డబ్బు ఖర్చు చేసుకోవాలని అనుకోరు.. కథలు చెప్పకండి అంటూ జాయింట్ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందేనంటూ ఆదేశించారు. నిర్వహణ సరిగా లేనందున మూడు ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను రద్దు చేశామని తెలిపారు. అంతకు ముందు జాయింట్ డైరెక్టర్ ఆస్పత్రిలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఆర్ఎంఓతో సమావేశమయ్యారు. ప్రసవాలు బాగానే చేస్తున్నారని, డిశ్చార్జ్ అయ్యాక తల్లీబిడ్డలను గమ్యస్థానాలకు చేర్చకపోతే మిగతా ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే కాకుండా ఏ సమస్య వచ్చినా ప్రజలు 108కు ఫోన్ చేసి, సేవలు వినియోగించుకోవాలన్నారు. బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదు బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్కు జాయింట్ డైరెక్టర్ సూచించారు. డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఆమె సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తక్కువ బరువు కారణంగానే శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వీటిని అధిగమించాలంటే గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ జ్యోత్స్న, విశ్రాంత డీఐఓ డాక్టర్ పురుషోత్తం, పీఓడీటీటీ డాక్టర్ సుజాత, ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, మేనేజర్ శ్వేత, గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ కెజియాపాల్ ఉన్నారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం
అనంతపురం న్యూసిటీ: వైద్య సేవల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై డీఎంఈ కార్యాలయం డైరెక్టర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ డాక్టర్ సుబ్బారావు మండిపడ్డారు. మంగళవారం ఆయన ఎంసీహెచ్ బ్లాక్, కేన్సర్ ఆస్పత్రి, ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటును పరిశీలించేందుకు అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా సర్వజనాస్పత్రిలోని పోస్టునేటల్ వార్డులో ఇద్దరు బాలింతల పిల్లలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐ) ట్యాగ్ పసికందులకు వేయకపోవడాన్ని గుర్తించారు. పొరపాటున పిల్లలు మారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ స్టాఫ్నర్సులు, కంపెనీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీకిచ్చే డబ్బుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. ఇక నుంచైనా జాగ్రత్తగా ట్యాగ్లు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఏకరువు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ చాంబర్లో జరిగిన సమావేశంలో హెచ్ఓడీలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. సర్జరీ హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామినాయక్ మాట్లాడుతూ మెయిన్ ఆపరేషన్ థియేటర్లో టేబుళ్లు తక్కువగా ఉన్నాయన్నారు. ఆస్పత్రి యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తూ...తమకు ఆపరేషన్లు చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీలు తక్కువైతే పీజీలు రావన్నారు. ఓటీలో ఏసీలు పని చేయడం లేదని, లీకేజీలున్నాయని పేర్కొన్నారు. ♦ గైనిక్ వార్డులో మంచాల కొరత అధికంగా ఉందని హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం తెలిపారు. మెటర్నిటీ అసిస్టెంట్లు కూడా తగినంత మంది లేరన్నారు. ఎంసీహెచ్ బ్లాక్ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ రేడియాలజీ విభాగంలో ఒక్క రేడియాజిస్టు మాత్రమే ఉన్నారన్నారు. ప్రైవేట్గా ప్రతి నెలా రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు వెచ్చిస్తున్నారన్నారు. ఇద్దరు రేడియాలజిస్టులను ఏర్పాటు చేస్తే ఆ మొత్తం చెల్లించే పరిస్థితి ఉండదని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ♦ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, నిర్వహణ కోసం రూ.కోట్లు ఖర్చు అవుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. ప్రస్తుతం కోటి రూపాయలు మాత్రమే నిధులున్నాయన్నారు. ప్రత్యేక బడ్జెట్ను విడుదల చేయాలని డైరెక్టర్కు విన్నవించారు. సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం ప్రొఫెసర్లు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ మైరెడ్డి నీరజ, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ జేసీ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు ఉదయం డైరెక్టర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్తో కలసి పాతూరు సీడీ ఆస్పత్రి, కేన్సర్ యూనిట్, బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. సీడీ ఆస్పత్రి ఆవరణలో రూ.55 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటుకు అనువైన స్థలమన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ కింద కేన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. అపరిశుభ్రతపై ఆగ్రహం సర్జికల్ విభాగాలను పరిశీలించిన డాక్టర్ సుబ్బారావు శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డుల్లో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను వేయడాన్ని తప్పుబట్టారు. వార్డులు పరిశుభ్రంగా ఉంటేనే రోగులు త్వరగా కోలుకునేందుకు వీలుంటుందన్నారు. ఆర్ఎంఓ, మేనేజర్, వైద్యులు ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహణ చూసుకోవాలన్నారు. ఎంఆర్ఐ యూనిట్ను త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రమోదిన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులకు సూచించారు. -
పెద్ద ప్రాణం నిలిపారు
అనంతపురం న్యూసిటీ : అనంతపురం సర్వజనాస్పత్రిలో గైనిక్ వైద్యులు కాన్పు కష్టంగా ఉన్న ఓ గర్భిణికి శస్త్ర చికిత్స చేసి, ఆమె ప్రాణాన్ని కాపాడారు. తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఛాలెంజింగ్గా తీసుకొని మూడున్నర గంటల పాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కానీ బిడ్డ ప్రాణం దక్కలేదు. అతికష్టంమీద ప్రాణాలు కాపాడిన గైనిక్ వైద్యులకు బాలింత, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో సర్జరీ విషయాలను గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం తెలియజేశారు. గుంతకల్లుకు చెందిన ఇర్షాద్, యాస్మిన్ దంపతులకు ఇద్దరు సంతానం. ఇప్పటికే రెండు అబార్షన్లు అయ్యాయి. గర్భిణి అయిన యాస్మిన్ గత నెల 23న సర్వజనాస్పత్రిలో చేరింది. హెచ్బీ పరీక్షించగా 4 గ్రాములు మాత్రమే ఉండడంతో హైపర్ టెన్షన్తో బాధపడుతోంది. అదేరోజు రాత్రి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రేణుక, అనస్తీషియా వైద్యులు డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ హరికృష్ణ బృందం సర్జరీ చేశారు. సర్జరీ సమయంలో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. బాలింతకు మాయ ఊడి పడడంతోపాటు మరో భాగంలో అతుక్కుపోయింది. ఆసమయంలో మాయను తొలగించలేని పరిస్థితి. పరిస్థితి మరింత విషమించింది. చివరకు గర్భసంచి తొలగించారు. కాసేటిపకి పుట్టిన ఆడశిశువు మృతి చెందింది. యాస్మిన్కు బీపీ 90కి పడిపోవడంతో పాటు కోమాలోకి వెళ్లింది. వైద్యులు వెంటనే అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీ)లోకి మార్చి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. అదే రోజు రాత్రి మరో 4 యూనిట్ల రక్తం ఎక్కించారు. ఉదయం 4.30 గంటల సమయంలో బాలింత కోలుకుంది. వైద్యులు 24 గంటల పాటు హైలీ యాంటీబయోటిక్స్ అందించారు. ఈ నెల 25న ఆమె పూర్తిగా కోలుకోగా పోస్టునేటల్ వార్డుకు మార్చారు. బాలింతలో దాదాపుగా 3.5 లీటర్ల రక్తం పోయింది. సకాలంలో ఆస్పత్రిలోని రక్తనిధి నుంచి 10 యూనిట్ల రక్తాన్ని అందించారు. అందరి సహకారంతో ఆపరేషన్ను విజయవంతం చేశారు. యాస్మిన్, ఇర్షాద్ దంపతులు మాట్లాడుతూ ‘సార్.. ప్రాణాలు దక్కుతాయోలేదో తెలియని పరిస్థితి.. పొరపాటున ఏమైనా జరిగింటే మా ఇద్దరు బిడ్డలు తల్లిని కోల్పోయేవారు.. దేవుళ్లలా ప్రాణం పోశారు..మీకు రుణపడి ఉంటామని తెలిపారు. గైనిక్ వైద్యుల సాహసమే ఇలాంటి కేసులు చాలా అరుదు. గైనిక్ వైద్యులు సాహసంతో బాలింతకు ప్రాణం పోశారు. నిజంగా చెప్పాలంటే మిరాకిల్. గైనిక్, అనస్తీషియా, రక్తనిధి కేంద్రాన్ని అభినందిస్తున్నా. మున్ముందు మరిన్ని సర్జరీలు చేసి ఆస్పత్రికి పేరు తేవాలి. – డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నడవలేక నడిచాడు.. ప్రాణాలు విడిచాడు..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): అసలే కాలేయ వ్యాధి.. అడుగు తీసి వేయడానికి నరకయాతన పడుతున్నాడు.. ఆస్పత్రి ఓపీ వద్దకు వెళ్లాలంటే.. చాలా దూరం. తన భర్త అంతదూరం నడవలేడని భావించిన ఆ ఇల్లాలు స్ట్రెచర్/వీల్చైర్ను ఇవ్వాల్సిందిగా ఆస్పత్రి సిబ్బందిని వేడుకుంది. వారు కనికరించకపోవడంతో చేసేదేంలేక అతికష్టం మీద భర్తను నడిపించుకుంటూ తీసుకెళుతుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై ఓపీ వద్ద మెట్లెక్కుతూ ప్రాణాలొదిలాడు. ఈ ఘటన గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. బెలుం గ్రామానికి చెందిన ఐజన్న కొద్దికాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం భార్య శిరోమణి ఓ వాహనంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చింది. ముందుగా సర్జికల్ ఓపీకి వెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి జీర్ణకోశ వ్యాధుల విభాగం ఓపీ (ఓపీ నెం.26)కి వెళ్లాలని సూచించారు. అసలే నడవలేని మనిషి.. ఆ ఓపీ విభాగం ఎక్కడుందో చూసొస్తే బాగుంటుందని భర్తను అక్కడే ఉంచి ఓపీ వద్దకెళ్లింది. తన భర్త ఇంత దూరం నడవలేడని భావించి.. క్యాజువాలిటీకి వెళ్లి అతని పరిస్థితిని వివరించిం స్ట్రెచర్/వీల్చైర్ ఇవ్వాలని బతిమాలింది. ఇక్కడి రోగులకే స్ట్రెచర్ ఇస్తామని, బయటి వారికి ఇచ్చేదిలేదని సిబ్బంది చెప్పడంతో చేసేదేంలేక భర్తను మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళుతుండగా అలసిపోయి పడిపోయాడు. సపర్యలు చేశాక మొదటి అంతస్తులో ఉండే ఓపీ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఐదు మెట్లు ఎక్కగానే ఐజన్న తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. -
‘గుండె’ చేజారుతోంది
నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. కళ్లముందే చెట్టంత కొడుకు మృత్యువుకు చేరువవుతూ ఉంటే.. చూస్తూ మౌనంగా రోదిస్తోంది. ఆర్థిక సమస్యల భారంతో తామేమీ చేయలేని అసహా స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, పామిడి :గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పట్టణం నెహ్రూనగర్కు చెందిన సి.పోతన్న, సి.నాగరతమ్మ దంపతులకు శివభారత్ (ప్రస్తుతం అతని వయసు 18 సంవత్సరాలు) ఒక్కగానొక్క కుమారుడు. సీఎస్ఐ చర్చివీధిలో ఓ గుడిసెలో నివసిస్తున్న పోతన్న ఎద్దుల బండిలో సరుకులు తరలిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదాయం అంతంగా మాత్రంగానే ఉండడంతో భార్య కూలీ పనులతో సంసారాన్ని నెట్టుకొస్తోంది. మూడేళ్ల క్రితం పోతన్న అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స కోసం అప్పటి వరకూ కూడబెట్టిన సొమ్ముకు తోడు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. లక్ష వరకు అప్పు చేయాల్సి వచ్చింది. ఐటీఐ మానేసి.. కూలీగా మారి తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ పోషణ భారాన్ని తల్లితో పాటు శివభారత్ పంచుకున్నాడు. ఐటీఐలో సాంకేతిక విద్యనభ్యసిస్తున్న అతను మధ్యలోనే చదువులకు స్వస్తి పలకాల్సి వచ్చింది. గార్లదిన్నె మండలం కల్లూరులోని భాస్కరరెడ్డి ఐరన్ మార్ట్లో నెలకు రూ. 6వేలు వేతనంతో కూలీగా చేరాడు. వెంటాడుతున్న మృత్యువు రెండు నెలల క్రితం శివభారత్ తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి తీసుకోవడం భారంగా మారింది. పామిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం శివభారత్ గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్సతోనే అతని జబ్బు నయమవుతుందని తేల్చి చెప్పారు. అంతేకాక ఎన్టీఆర్ వైద్య సేవ కింద విజయవాడలోని ఉషా కార్డియాక్ సెంటర్కు సిఫారసు చేశారు. పది రోజులు విజయవాడలో చికిత్స చేయించుకున్నాడు. అయినా నయం కాలేదు. వైద్య పరీక్షల అనంతరం శివభారత్కు గుండె మార్పిడి అవసరమని వైద్య నిపుణుడు డాక్టర్ వై.వి.రావు గుర్తించారు. ఇదే విషయాన్ని బాధితుడి తల్లిదండ్రులకు ఆయన వివరించి, అరుదైన ఈ చికిత్స గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో చేస్తారంటూ అక్కడకు సిఫారసు చేశారు. గండం గట్టెక్కానా? అనారోగ్యంతో బాధపడుతున్న పోతన్న కొన్ని నెలలుగా బండి తోలడం మానేశాడు. దీంతో అతని రోజు వారి సంపాదన రూ. 200 కొండెక్కింది. కుటుంబ పోషణ కోసం కూలీ పనుల ద్వారా రోజుకు రూ. 100 సంపాదించుకుని వస్తున్న నాగరత్నమ్మ కూడా ఇటీవల కొన్ని రోజులుగా కుమారుడి బాగోగులు చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్న ఇలాంటి తరుణంలో కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు రూ. 30 లక్షలు సమకూర్చుకోవడంలో వారికి తలకు మించిన భారంగా మారింది. కళ్ల ముందే మృత్యువుకు చేరవవుతున్న కుమారుడిని చూస్తూ రోదించని రోజంటూ లేదు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం నిరుపేద కుటుంబం ఎదురు చూస్తోంది. గుండె మార్పిడి తప్పనిసరి తమ కుమారుడికి గుండె మార్పిడి అత్యవసరమన్న విషయం తెలుసుకోగానే నిరుపేద తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలైపోయారు. అయినా ఎక్కడో ఒక ఆశ. ప్రభుత్వాస్పత్రి కాబట్టి ఉచితంగా చేస్తారన్న కొండంత ఆశ. పైగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఎలాగూ ఉంది అనే ధైర్యంతో ఈ నెల 19న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి కుమారుడిని పిలుచుకెళ్లారు. గతంలో శివభారత్కి అందించిన వైద్య సేవలకు సంబంధించిన రిపోర్టులు, విజయవాడలోని వైద్యులు అందజేసిన నివేదికను పరిశీలించిన అనంతరం గుండె మార్పిడి అత్యవసరమని గుర్తించారు. అయితే అంతకు ముందు గుండెకు సంబంధించిన సమగ్ర పరీక్షల కోసం రూ. లక్ష వరకు, అనంతరం గుండె మార్పికి రూ. 30 లక్షల వరకు ఖర్చు వస్తుందని తేల్చి చెప్పారు. విషయం విన్న నిరుపేద తల్లిదండ్రులకు దిక్కు తోచలేదు. పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ప్రాణాపాయం నుంచి కుమారుడిని ఎలా గట్టెక్కించాలో అర్థం కాక బరువెక్కిన హృదయాలతో బస్కు ఎక్కి శనివారం పామిడికి చేరుకున్నారు. సాయం చేయదలిస్తే.. పేరు : సి.నాగరత్నమ్మ బ్యాంక్ ఖాతా : 0422 1010 015 3521 ఐఎఫ్ఎస్ కోడ్ : ఏఎన్డీబీ0000422 బ్యాంక్ పేరు : ఆంధ్రాబ్యాంకు, పామిడి శాఖ అదనపు సమాచారానికి సంప్రదించండి : 73864 79722 -
పేదాస్పత్రి
సర్వజనాస్పత్రి...జిల్లాకే పెద్దదిక్కు. ఏ చిన్న జబ్బుచేసినా నిరుపేదలంతా పరుగున వచ్చేది ఇక్కడికే. అందుకే రోజూ ఓపీ 2,000 దాకా ఉంటుంది. అడ్మిషన్లో 1,300 మంది దాకా ఉంటారు. కానీ ఇది పేదాస్పత్రిగా మారిపోయింది. కనీసం మందులు అందజేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికొచ్చిన వారిని ప్రైవేటు ఫార్మసీల మెట్లెక్కిస్తోంది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారి తనకేం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.. ప్రశ్నిస్తే..మందులు పుష్కలంగా ఉన్నాయంటూ బుకాయిస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. మూడు నెలలుగా మందులు పూర్తి స్థాయిలో లేవు. దీంతో ఫార్మసీ సిబ్బంది రోగులకు అరకొరగా పంపిణీ చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... స్టాక్ లేదని సమాధానం చెబుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం స్టాక్ పుష్కలంగా ఉందని సమాధానమిస్తోంది. రోగులు మాత్రం ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యే పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం జిల్లా కలెక్టర్ అయినా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సాధారణ మాత్రలకే గతిలేదు ఆస్పత్రిలో సాధారణ మాత్రలు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. రాన్టాక్, పాన్టాప్, బీ కాంప్లెక్స్, విటమిన్ సీ,డీ 2 సీసీ సిరంజీలు, గ్లౌవ్స్ కూడా లేవు. వీటి ధర చాలా తక్కువ. ఇలాంటి వాటిని సరఫరా చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం విఫలమవుతోంది. ఇకఖరీదైన మందుల కథ దేవునికెరుకనే చెప్పాలి. వీటితో పాటు 70 రకాల యాంటీబయాటిక్స్ మందులు పూర్తి స్థాయిలో లేవని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీపీని అదుపులో ఉంచే ఆమ్మోడిపిన్తో పాటు ట్రెమడాల్, డైజోఫామ్ ఇంజెక్షన్, తదితర మందులు సరఫరా ఆగిపోయింది. ఆర్ఎల్ ఐవీ ప్లూయిడ్ లేదు. ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సిందే సర్వజనాస్పత్రికి వచ్చే రోగుల్లో 90 శాతం నిరుపేదలే. ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా రూ.వందలు వెచ్చించి ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ‘‘అత్యవసర కొనుగోలు’’ కింద డబ్బులు వెచ్చించి రోగులకు సరఫరా చేయవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇక.. ఎన్టీఆర్ వైద్యసేవ కేసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద సర్జరీ చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆస్పత్రిలో అలాంటి పరిస్థితే లేదు. వారుసైతం ప్రైవేట్గా కొనుగోలు చేస్తున్నారు. మందులు సమృద్ధిగా ఉన్నాయే... ఆస్పత్రిలో మందుల కొరతా..? అలాంటి పరిస్థితే లేదే.. మందులు సమృద్ధిగానే ఉన్నాయి.. మందులు లేకపోతే ఎమర్జెన్సీ పర్జేసింగ్ కింద అందజేస్తున్నాం.–డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రిసూపరింటెండెంట్ -
కక్కుర్తి వైద్యం
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలోని కొందరు వైద్యులు కమిషన్ కోసం కక్కుర్తి పడుతున్నారు. రోగిని ఒక చోట అడ్మిషన్ చేసి మరో వార్డులో సేవలందిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద వేలాది రూపాయలు డ్రా చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..నగరంలోని అరవిందనగర్కు చెందిన ఆలంవలి, షరీఫ దంపతులు తమ కుమారుడు గఫూర్కు (16 నెలలు) తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో జూన్ 26న ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి బరువు తక్కువగా ఉండడంతో ఆస్పత్రిలోని న్యూట్రిషియన్ రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేయగా... సివియర్ బ్రాంక్డ్ నిమోనియాగా తేలింది. అయితే ఓ అసోసియేట్ ప్రొఫెసర్ కమిషన్ కోసం కేసును ఎన్టీఆర్ వైద్య సేవ కింద నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఈ నెల 4న ఎన్ఆర్సీ యూనిట్ సిబ్బంది గఫూర్ కేసు వివరాలను ఎన్టీఆర్ వైద్య సేవ డాటా ఎంట్రీ ఆపరేటర్కు అందజేశారు. సర్జరీ మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ సివియర్ బ్రాంక్డ్ నిమోనియాగా ప్రీఆథరైజేషన్ కోసం పంపారు. అవాక్కైన కుటుంబీకులు అయితే ఎన్టీఆర్ వైద్యసేవ నుంచి ఈ నెల 7న గఫూర్ తల్లిదండ్రులకు ఓ మెసేజ్ వచ్చింది. గఫూర్కు మూడ్రోజుల పాటు చేసిన ట్రీట్మెంట్కు రూ 15,000 మంజూరు చేసినట్లు మెసేజ్ ఉంది. హెచ్ఓడీ నిలదీత ఈ విషయంపై గఫూర్ తల్లిదండ్రులు హెచ్ఓడీ డాక్టర్ మల్లీశ్వరితో పాటు ఎన్ఆర్సీ సిబ్బందిని నిలదీశారు. వైద్యం చేయకుండానే డబ్బు ఎలా డ్రా చేశారని ప్రశ్నించారు. అయితే ఈ విషయం తనకు తెలియదని హెచ్ఓడీ జారుకున్నారు. ఇదీ అసలు కథ వాస్తవంగా ఎన్ఆర్సీలో అడ్మిట్ అయిన వారు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్మెంట్ ఇచ్చినట్లు నమోదు చేస్తే.. సంబంధిత వైద్యురాలికి కమిషన్ వస్తుంది. అందుకే ఈ బాగోతానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఆదేశాలు రాలేదు ఎన్ఆర్సీ రోగులు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రారు. నిమోనియా ఎన్టీఆర్ వైద్య సేవ కింద వస్తుంది. కేసు వివరాలు అప్లోడ్ చేశాం. ఇంకా కన్ఫాం కాలేదు. ఇదే విషయమై సంబంధిత అసోసియేట్ ప్రొఫెసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు నాకు తెలియదు.– డాక్టర్ మల్లీశ్వరి, హెచ్ఓడీ, చిన్నపిల్లల విభాగం -
సర్వజనాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ రోగికి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సూపరిటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఈఎన్టీ, అనస్తీషియా హెచ్ఓడీలు డాక్టర్ నవీద్, డాక్టర్ నవీన్, అంకాలజిస్టు డాక్టర్ సత్యనారాయణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తాడిపత్రి వెంకటాంపల్లికి చెందిన చిన్నకేశన్న కేన్సర్తో బాధపడేవాడు. కర్నూలులో కీమో థెరపీ చేయించినా ఆయాసం, దగ్గు తరచూ వస్తుండేది. దీంతో కుటుంబ సభ్యులు మే 23న అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఈఎన్టీ వైద్యులు పరీక్షించి స్వరపేటికకు కేన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో సర్జికల్ ఆంకాలజిస్టు, అనస్తీషియా, ఈఎన్టీ వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. వైద్య పరీక్షలు చేయగా టీబీ (క్షయ) బయటపడింది. మరో పది రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి వైద్యం అందించారు. తిరిగి సర్జరీ చేసేందుకు సిద్ధమవగా ఈసారి ఊపిరితిత్తులు, గుండె సమస్యను గుర్తించారు. అనస్తీషియా, ఈఎన్టీ, సర్జికల్ ఆంకాలజిస్టు మరోసారి సమావేశమై, స్వరపేటికను తొలగించాలని నిర్ణయించారు. మత్తుమందు శరీరం మొత్తం ఇస్తే చనిపోయే ప్రమాదం ఉందని, గొంతు భాగంలో మాత్రమే మత్తు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 26న చిన్నకేశన్నకు ఆంకాలజిస్టు డాక్టర్ సత్యనారాయణ, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సుధీర్, అనస్తీషియా వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ సుబ్రమణ్యం, తదితరులు రోగి స్పృహలో ఉండగానే గొంతుకు మత్తుమందు అందించి స్వరపేటిక తొలగించారు. మూడున్నర గంటపాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా చేశారు. తన తండ్రికి ఊపిరి పోసిన వైద్యులకు రుణపడి ఉంటానని చిన్నకేశవన్న కుమారుడు రవికుమార్ తెలిపాడు. విలేకరుల సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ జమాల్బాషా, అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, మేనేజర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రిలో కీచకపర్వం
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులు, వారి సహాయకుల రక్షణ కోసం నియమించిన సెక్యూరిటీ గార్డులే వారి పాలిట భక్షక భటులయ్యారు. ఒంటరిగా కనిపించిన మహిళలను చెరబడుతున్నారు. మహిళల ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి బుధవారం వెలుగులోకి రావడంతో ఆ సెక్యూరిటీ గార్డుపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఫొటోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేసి.. ఆసుపత్రిలోని ఫిమేల్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళకు సహాయకురాలిగా ఉన్న మహిళ గత సోమవారం రాత్రి ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డు లక్ష్మీకాంత్ గమనించి ఫొటోలు తీశాడు. అనంతరం ఆ మహిళతో పాటు ఆమెతో ఉన్న వ్యక్తినీ బ్లాక్ మెయిల్ చేశాడు. విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరించాడు. దీంతో ఆమెతో ఉన్న వ్యక్తి రూ.2 వేలు సమర్పించుకుని అక్కడ నుంచి బయటపడ్డాడు. అయితే మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సదరు సెక్యూరిటీ గార్డు మద్యం సేవించి వచ్చి ఆ మహిళను వార్డులో నుంచి బయటకు పిలిచి మళ్లీ బ్లాక్మెయిల్ చేశాడు. గదిలోకి రాకపోతే ఫొటోలు బయటకు పంపిస్తానని బెదిరించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చేయిపట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి సెక్యూరిటీ గార్డు ఉడాయించాడు. విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరకు పోలీస్స్టేషన్కు చేరింది. మూడో పట్టణ పోలీసులు సదరు మహిళ, సెక్యూరిటీ గార్డును పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. అయితే విషయం బయటపడితే తన సంసారం నాశనం అవుతుందని ఆమె వేడుకోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు సమాచారం. కాగా ఈ విషయమై సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేస్తూ బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ఇన్చార్జ్ సీఎస్ఆర్ఎంవోను విచారణకు ఆదేశించారు. రాత్రిపూట విధులంటేనేవారికి మక్కువ... ఆసుపత్రిలో జై బాలాజీ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే నలుగురైదుగురు సెక్యూరిటీ గార్డులకు రాత్రి పూట విధులంటేనే ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. వారికి పగటిపూట విధులు వేసినా రాత్రి పూట మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో ఆసుపత్రిలో గస్తీ తిరగడం, ఒంటరి మహిళలు కనిపిస్తే వారిని బ్లాక్మెయిల్ చేయడం వారికి పరిపాటిగా మారిందని ఆసుపత్రి వర్గాల ప్రాథమిక విచారణలో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. గతంలోనూ భూత్బంగ్లా, మానసిక రోగుల వార్డు, అంటువ్యాధుల విభాగం, మార్చురీ వద్ద మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు రక్షణంగా ఉండాల్సిన వారే భక్షించేందుకు సిద్ధమవడం రోగులను ఆందోళనకు గురిచేస్తోంది. -
సర్వం.. సమస్యల మయం
అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో మౌలిక సదుపాయా లు కొరవడ్డాయి. రోజూ మూడు వేలమంది దాకా రోగులు వైద్యం కోసం వస్తున్నారు. సౌకర్యాలు కల్పించడంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం రోగులకు శాపంగా మారుతోంది. ఆస్పత్రిలో ఏ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని, రోగులకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయో పరిశీలించేందుకు ఈ నెల 31న నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) బృందం వస్తోంది. వైద్య సేవల తీరును పరిశీలించి ర్యాంకు ఇస్తారు. దీని ద్వారా ఆస్పత్రి స్థాయి ఏపీ చిత్రపటంలో ఓ మార్క్ వేసుకోనుంది. ♦ జీఓ 124 ప్రకారం సర్వజనాస్పత్రిలో 649 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రోగులను తీసుకెళ్లే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు లేకపోవడంతో శానిటేషన్ సిబ్బంది, రోగి బంధువులే ఆ పని చేయాల్సి వస్తోంది. ♦ ఆస్పత్రిలో కొందరు సిబ్బంది నాణ్యతా ప్రమాణాలకు మంగళం పాడుతున్నారు. పనిభారం కారణంగా ముందస్తుగానే సిరంజిలు లోడ్ చేసి ఉంచడంతో పాటు వాడిన బ్లడ్ బ్యాగులు, సిరంజిలను ఎక్కడపడితే అక్కడ వదిలేస్తున్నారు. ♦ ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా పారిశుద్ధ్యం మెరుగుపడలేదు. ♦ ఇక్కడ రోగిని ఎంఎం వార్డుకి తీసుకెళ్తున్నది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. వాస్తవంగా రోగులను తీసుకెళ్లేందుకు ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు ఉండాలి. అయితే 30 ఏళ్లుగా ఇక్కడ ఈ పోస్టులు భర్తీ చేయలేదు. చివరకు పారిశుద్ధ్య కార్మికులే దిక్కవుతున్నారు. సర్వజనాస్పత్రిలోని ఓ వార్డులో సిరంజిల్లో ముందస్తుగా మందులోడ్ చేసి ఉంచారు. ఇలా చేయడం ద్వారా రోగులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం లేకపోలేదు. రోగికి వాడిన సిరంజిలనూ పక్కనే ఉంచారు. ప్రాణాంతక జబ్బులతో బాధపడే వారి ఇన్ఫెక్షన్స్ సోకితే అంతే సంగతులు. గతేడాది ఎన్ఏబీహెచ్ బృందం ఈ అంశాన్ని ప్రధానంగా రిమార్క్స్లో పొందుపర్చింది. 1947 కాలం పద్ధతులు అనుసరిస్తున్నారని ఓ స్టాఫ్నర్సుకు చివాట్లు పెట్టింది. అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. ♦ రోగులను రెండు, మూడో అంతస్తులోని వార్డులకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి యాజమాన్యం ఈ ఏడాది రూ. 6 లక్షలు వెచ్చించి లిఫ్ట్ ఏర్పాటు చేసింది. కానీ తరచూ లిఫ్ట్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. -
ఉరుకులు..పరుగులు
అనంతపురం న్యూసిటీ: ప్రీ పీజీ సీట్ల మంజూరులో భాగంగా భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం మంగళవారం అనంతపురం సర్వజనాస్పత్రి – వైద్య కళాశాలతోపాటు బుక్కరాయసముద్రం, ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. లోపాలు బయటపడకుండా చూసుకునేందుకు వైద్యులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎంసీఐ బృందంలో అనాటమీ ప్రొఫెసర్ (గౌహతి), ఫోరెన్సిక్ ప్రొఫెసర్ (సూరత్), సర్జరీ ప్రొఫెసర్ (బెంగళూరు) ఉన్నారు. సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఉండగానే ఆయన సీటులో అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్ కుమార్ కూర్చుని ఉండటంతో వైద్యులు కంగుతిన్నారు. అనంతరం ఎంసీఐ బృందం ఆస్పత్రిలోని మెడిసిన్, చిన్నపిల్లలు, గైనిక్, సైకియాట్రీ తదితర ఓపీలను పరిశీలించారు. ఓపీ, ఐపీ పేషెంట్లు, డిజిటల్ రికార్డుల గురించి ప్రశ్నించారు. ఓపీ 1800 నుంచి 2000 మంది, ఐపీ వెయ్యి మంది ఉన్నారని అధికారులు సమాధానమిచ్చారు. గైనిక్ విభాగంలో గర్భిణులకు అందుతున్న సేవల గురించి ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్ నాగరాజు ఆరా తీశారు. రోజూ 25 నుంచి 30 దాకా ప్రసవాలు జరుగుతున్నాయని హెచ్ఓడీ డాక్టర్ శంషాద్బేగం వివరించారు. మెయిన్ ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి పరికరాలు, సిబ్బంది కొరతకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని బృందం సభ్యులు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, అకడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేసీ రెడ్డి, సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామి నాయక్ను కోరారు. 43 రోజులుగా ఒక్క స్కాన్ చేయలేదా? సర్వజనాస్పత్రి రేడియాలజీ విభాగంలోని ఆల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్లోకి వెళ్లిన బృందం సభ్యులకు అక్కడ వైద్యులు కన్పించలేదు. రికార్డులను పరిశీలించగా గత నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్కానింగ్ కూడా తీసినట్టు నమోదు కాలేదు. 43 రోజులుగా ఒక్కసానింగ్ కూడా చేయలేదా అని ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్న ఒక్క వైద్యురాలు కంపల్సరీ సెలవులో వెళ్లిందని డాక్టర్ జేసీ రెడ్డి తెలియజేశారు. స్కాన్లు ఏవిధంగా చేస్తున్నారని డాక్టర్ నాగరాజ్ ఆరా తీస్తే అన్నీ ప్రైవేట్గా చేయిస్తున్నామని సమాధానం ఇచ్చారు. రేడియాలజీ బోర్డులో 15 మంది వైద్యులుండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆయన నోట్ చేసుకున్నారు. సీటీ స్కాన్ సెంటర్లో ఎన్ని స్కాన్లు చేశారని ఆరా తీశారు. అందుకు అక్కడి సిబ్బంది 37 చేశామని చెప్పగా, రికార్డులో 20 మాత్రమే నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంతరం వైద్య కళాశాలలోని వివిధ విభాగాలతో పాటు, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫార్మకాలజీ ల్యాచ్లు, ఈ సెంటర్, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. వైద్య కళాశాలలో హెడ్కౌంట్ వైద్య కళాశాలలో మెడిసిన్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, సర్జరీ, గైనిక్, ఫోరెన్సిక్, ఆప్తమాలజీ, డర్మటాలజీ, అనస్తీషియా, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఈఎన్టీ, రేడియాలజీ, పెథాలజీ, ఎస్పీఎం, తదితర విభాగాలలో ఎంసీఐ బృందం హెడ్ కౌంట్ చేసింది. వైద్యుల ఆధార్తో పాటు వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించారు. ఎంసీఐ బృందం వెంట వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ పల్లా శ్రీనివాసులు, డాక్టర్ శంషాద్బేగం తదితరులు ఉన్నారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం
అనంతపురం న్యూసిటీ : అనంతపురం సర్వజనాస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒకరి విధులు మరొకరు నిర్వర్తిస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది కూడా రోగుల సహాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హీనంగా మాట్లాడుతూ గొడవలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పోకముందే అధికారులు మేల్కోవాలి. పాలనను గాడిలో పెట్టి.. వైద్యసేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం ప్రశ్నార్థకం ♦ రెండ్రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి ఎమర్జెన్సీ వార్డుకొచ్చిన రోగికి ఎంఎన్ఓ (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ) కుట్లు వేస్తున్నాడు. సాధారణంగా కుట్లు మెడికల్ ఆఫీసర్/హౌస్సర్జన్ వేయాలి. కానీ ఎంఎన్ఓ కుట్లు వేసే సమయంలో ఎటువంటి సూది వాడుతున్నారో తెలియని పరిస్థితి. ఒకరికి వాడిన సూది మరొకరికి వాడితే ఆ రోగి ఆరోగ్యం ప్రశ్నార్థకమే. ఎంతసేపు వేచి ఉండాలో.. ♦ ఇక్కడ కనిపిస్తున్నది సర్వజనాస్పత్రిలోని జనన, మరణ రిజిస్ట్రేషన్ గది. బుధవారం ఉదయం 12 గంటలకే రిజిస్ట్రేషన్ గదితోపాటు రికార్డు రూంకు తాళాలు వేశారు. దీంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఎవరిది వారే తెచ్చుకోవాలి ♦ ఆస్పత్రిలో అడ్మిషన్లో ఉన్న మహిళలే మంచాలపై వేసుకోవడానికి బెడ్షీట్లు తెచ్చుకోవాలి. వాస్తవంగా ఆస్పత్రి సిబ్బందే పాత బెడ్సీట్లను తీసి కొత్త వాటిని రోజూ మార్చాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు. రిపోర్టు కచ్చితమేనా..? ♦ రోగికి ఈసీజీ తీస్తున్న వ్యక్తి పేరు సుధాకర్. ఈయన ఎల క్ట్రీషియన్. రెండు నెలలుగా ఆస్పత్రి యాజమాన్యం ఈసీజీ టెక్నీషియన్ బాధ్యతలను ఈయనకు అప్పగించింది. గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి కచ్చితమైన రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. అర్హతలేని వ్యక్తులకు ఇటువంటి బాధ్యత అప్పగించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. మందులు తారుమారైతే.. ♦ ఆస్పత్రిలో మందులిస్తున్న వ్యక్తి ఫార్మసిస్టు అనుకుంటే పొరపాటే. ఇతను గతంలో అడ్మిషన్ కౌంటర్లో విధులు నిర్వర్తించే వారు. ఇటువంటి వ్యక్తిని తీసుకువచ్చి కీలకమైన మందులిచ్చే ప్రాంతంలో పని చేయిస్తున్నారు. రోగులకు ఒక మందుపోయి మరొకటి ఇస్తే ఏంటి సంగతని ఆస్పత్రి సిబ్బందే చర్చించుకుంటున్నారు. నోటి దురుసు ♦ సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న వ్యక్తి నార్పలకు చెందిన నారాయణ, వారి బంధువులు. బుధవారం లేబర్వార్డులో తమ బంధువులను చూసేందుకు వెళ్లగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు. ‘గొర్రెల మంద’లా వెళ్తారనడంతో నారాయణ కుటుంబీకులు సెక్యూరిటీపై తిరగబడ్డారు. సెక్యూరిటీల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. -
జగన్నాథా..ఇదేమి పాలన!
అనంతపురం న్యూసిటీ:అనంత సర్వజనాస్పత్రిలో పాలన అస్తవ్యస్తంగా మారింది. బోధనాస్పత్రిలోని 17 మంది ప్రొఫెసర్లను పక్కనపెట్టి గతేడాది మే 2న సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా ఉన్న డాక్టర్ జగన్నాథ్కు సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్(ఎఫ్ఏసీ)గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ నియామకం ద్వారా ఆస్పత్రిలో పాలన వ్యవహారాలు గాడితప్పాయి. కలెక్టర్ అనుమతి లేకుండానే ఆస్పత్రిలోని పలు విభాగాల్లో నియామకాలను పూర్తి చేయడమే కాదు.. ఓపీ, ఐపీ బ్లాక్ను రిజిస్ట్రేషన్ను ప్రైవేట్కు అప్పజెప్పడం పలు విమర్శలకు దారితీస్తోంది. వైద్యుల పోస్టు భర్తీ చేసే ముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా.. తుంగలో తొక్కి తమకు అనుకూలంగా ఉన్నవారిని విధుల్లోకి తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమర్జెన్సీ(క్యాజువాలిటీ)లో నెల రోజులుగా మందులు లేవు. రోజూ 2వేల మంది ఔట్, 1,300 మంది ఇన్పేషెంట్లు ఉన్న సర్వజనాస్పత్రిలో రోగులకే కాదు నర్సింగ్ విద్యార్థుల మానప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. చికిత్స కోసం వస్తేనరకయాతనే ఆస్పత్రికి రోజూ ఐదు నుంచి పది పాయిజన్ కేసులు వస్తుంటాయి. ఈ కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు రైల్స్ ట్యూబ్ అవపసరం చాలా ఉంటుంది. రూ. 120 విలువ చేసే ఈ ట్యూబ్లను అందుబాటులో ఉంచడంలో యాజమాన్యం విఫలం చెందింది. పాయిజన్ కేసుల్లో రోగుల కుటుంబసభ్యుల చేతనే బయట నుంచే వాటిని కొనుగోలు చేయిస్తున్నారు. కేవలం రైల్స్ ట్యూబ్లే కాదు. లాసిక్స్, కుట్లు వేసే పరికరాలు, సర్జికల్ గ్లౌస్, అస్తాలిన్ ద్రావణం, కాటన్, తదితర పది రకాల వస్తువులను కూడా రోగులే తమ వెంట తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. శానిటేషన్కి దాసోహం ఆస్పత్రిలో శానిటేషన్ నిర్వాహకులకు యాజమాన్యం దాసోహమంటోంది. ప్రతి నెలా శానిటేషన్కి రూ 20 లక్షలు చెల్లిస్తున్నారు. ఇందుకు గాను ఆస్పత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణపై పర్సెంటేజీలో వేసి ఆ మేరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. దీనిపై అప్పటి కలెక్టర్ కోన శశిధర్ 90 శాతం కంటే ఎక్కువ పర్సెంటేజీ ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం 92 నుంచి 96, 97 శాతం పర్సెంటేజీ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో వివిధ విభాగాల ప్రొఫెసర్లు, నర్సింగ్ స్టాఫ్ ఇచ్చే మార్కుల ఆధారంగా పర్సెంటేజీ వేసేవారు. ఇప్పుడు కేవలం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, మేనేజర్ మాత్రమే పర్సేంటేజీ మార్కులు వేస్తున్నారు. అమ్మాయిలే టార్గెట్ కొందరు సెక్యూరిటీగార్డులు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చే నర్సింగ్ విద్యార్థినిలు, రోగులను టార్గెట్ చేస్తున్నారు. వారికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. సెక్యూరిటీ గార్డుల అసభ్య ప్రవర్తనతో పలువురు రోగులు, వైద్య సిబ్బంది విసుగెత్తి పోయారు. లంచమిస్తే చికిత్స సర్వజనాస్పత్రిలో వైద్య చికిత్సలన్నీ ఉచితమే. అయితే ఇక్కడ మాత్రం లంచం అందనిదే చికిత్సలు అందడం లేదు. గత నెల 28న గైనిక్ వార్డులో తన బిడ్డ వందన ప్రసవానికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మశ్రీ రూ.వెయ్యి తీసుకున్నారని నార్పలకు చెందిన రవికుమార్ ఏకంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మగబిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడ బిడ్డ పుడితే రూ.500 బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుమతితోనే.. చిన్న పిల్లల వార్డును మూడో అంతస్తులో ఏర్పాటు చేయడంతో 18 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం ఏర్పడింది. వీరందరినీ స్థానిక ఎమ్మెల్యే అనుమతితోనే తీసుకున్నాం. ఇక నెఫ్రాలజిస్టులు దొరికేది చాలా కష్టం. ‘అనంత’లోనే ఓ వైద్యుడు అందుబాటులో ఉంటే ఆయన్ను డైరెక్ట్గా అపాయింట్ చేసుకున్నాం. ఆర్ఎంఓ వేరే జిల్లాకి వెళ్లాలని ట్రై చేస్తున్నారు. అందుకే సెలవులో వెళ్తున్నారు. – డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్, -
ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని నిర్వాకం..
బుక్కరాయసముద్రం: ప్రసవించిన గంటల వ్యవధిలోనే శిశువును మరొకరికి అప్పగించి వెళ్లిపోయిన తల్లి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లికి చెందిన ప్రతాప్, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం రాజేశ్వరి గర్భిణి. రోడ్డుప్రమాదంలో చెయ్యి విరగడంతో ప్రతాప్ అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజులపాటు చికిత్స చేయించుకున్నాడు. మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇదే ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డను ప్రసవించిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రతాప్ చేతిలో పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రతాప్ ఆ శిశువును ఇంటికి తెచ్చుకున్నాడు. గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త గోవిందమ్మ విషయం తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సీడీపీఓ వనజా అక్కమ్మ, సూపర్ వైజర్ వాణిశ్రీ, చైల్డ్లైన్ ప్రతినిధులు సురేష్, ఆదినారాయణలు గురువారం పి.కొత్తపల్లికి చేరుకుని ప్రతాప్, రాజేశ్వరి దంపతుల వద్ద ఉన్న శిశువును స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం శిశువును వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. -
వృద్ధుడికి ఆర్థో విభాగంలో మెరుగైన చికిత్స
నెల్లూరు(బారకాసు): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా రోగులకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. 90 ఏళ్ల వృద్ధుడు ప్రమాదవశాత్తూ పడిపోయి కాళు, చేయి విరిగితే అతనికి 45 రోజుల పాటు జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది శ్రమించి మెరుగైన వైద్యసేవలందించి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు మస్తాన్బాషాను మంగళవారం జీజీహెచ్లో రోగి కుటుంబసభ్యులు, వైద్యాధికారులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలిచ్చి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ చాట్ల నరసింహరావు మాట్లాడారు. బాలాజీనగర్కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు శేషయ్య ప్రమాదవశాత్తూ పడిపోయి కాళు, చేయి విరిగిపోయి చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేరారన్నారు. ఆర్థోపెడిక్ వైద్యుడు మస్తాన్బాషా పరీక్షించి రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులు ఉన్నాయని గుర్తించారని, విరిగిన కాలు, చేయికి అవసరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి నయం చేశారని తెలిపారు. ఏసీఎస్సార్ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజు, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కళారాణి, ఆర్థో విభాగ హెడ్ డాక్టర్ హరిబాబు, అనస్థీషియా హెడ్ డాక్టర్ నిర్మలాదేవి, కమిటీ సభ్యురాలు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు
అనంతపురం న్యూసిటీ:నగరంలోని సర్వజనాస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. కొందరు పురుష సిబ్బంది మహిళా రోగులు, సిబ్బందిపై కన్నేస్తున్నారు. మాయమాటలతో లోబర్చుకుని ఆస్పత్రి ప్రాంగణంలోనే చనువుగా మెలుగుతున్నారు. ఓపీ, మందులిచ్చే ప్రాంతంలోనూ క్యూలో నిల్చున్న మహిళను అదేపనిగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో సదరు పురుష సిబ్బంది మరింతగా రెచ్చిపోతున్నారు. తామేమి చేసినా ఎవ్వరూ ఏమీ చేయరనే ధీమాతో బరితెగిస్తున్నారు. రోగుల తాకిడి సర్వజనాస్పత్రిలో ఆరు నెలలుగా రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. అనారోగ్యాలు, ప్రమాదాలు, వివిధ సమస్యలతో ఇక్కడ చేరుతున్న వారితో 24 గంటలూ కిటకిటలాడుతోంది. మహిళా సిబ్బంది కూడా షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రోగులకైనా, మహిళా సిబ్బందికైనా సహాయం చేసే పేరుతో కొందరు పురుష సిబ్బంది చనువు పెంచుకుంటున్నారు. అపవిత్రమవుతున్న వైద్యాలయం ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున 3.29 గంటల సమయంలో ఓ పురుష సిబ్బంది మార్చురీ పక్కన ఉన్న షెడ్డులోకి వెళ్లాడు. 3.30 గంటలకు ఓ మహిళా సిబ్బంది అదే షెడ్డులోకి వెళ్లింది. దాదాపు గంటన్నర సమయం అందులోనే గడపడం దుమారం రేపుతోంది. వీరిని కొందరు సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా ఎటువంటి చర్యలూ లేవు. ఆస్పత్రి యాజమాన్యం బాధ్యులను పిలిపించి హెచ్చరికలు చేసి.. పనితీరు మార్చుకునే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విచారణకు ఆదేశించారు సెక్యూరిటీగార్డుపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఆర్ఎంఓ డాక్టర్ లలితను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టి నివేదికను సూపరింటెండెంట్కు అందజేశారు. అయినా సెక్యూరిటీ గార్డును తీసేశామని సెక్యూరిటీ నిర్వాహకులు చెప్పారు. తీసేశారో లేదో తెలియదు. – డాక్టర్ విజయమ్మ,ఇన్చార్జ్ ఆర్ఎంఓ -
జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యుడి వీరంగం
నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్పై అభివృద్ధి కమిటీ సభ్యుడు బుధవారం వీరంగం సృష్టించాడు. క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు నిరసనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి చైర్మన్, పోలీసులు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పించడంతో వివాదం సమసింది. వివరాలు...జీజీహెచ్లో బుధవారం జరిగిన సెమినార్ హాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు మొగరాల సురేష్ మాట్లాడుతూ ఆస్పత్రిలో శానిటేషన్ బాగాలేదని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, తనకు తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతున్నాయని సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజుపై విరుచుకుపడ్డారు. తాను ఏమి చెప్పినా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. తాను ఆస్పత్రికి వచ్చినప్పుడు కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా లేదని, చెట్లు, మెట్ల వద్ద ఉండాలా అని మండిపడ్డారు. కమిటీ సభ్యుడిగా కాకపోయినా కనీసం జాతీయ పార్టీ జిల్లా నాయకుడిగా కూడా గౌరవించరా అంటూ ప్రశ్నించారు. అందుకు సూపరింటెండెంట్ పార్టీ పరంగా ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన మొగరాల తమ పార్టీనే విమర్శిస్తావాని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇరువురి నడుమ మాటమాట పెరిగిపోతుండగా వైద్యాధికారులు, ఆస్పత్రి చైర్మన్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఉద్యోగులు, వైద్యులు సెమినార్ హాల్ ప్రారంభోత్సవం అనంతరం మూకుమ్మడిగా ఆస్పత్రి చైర్మన్ ఛాంబర్కు చేరుకున్నారు. ఆస్పత్రి చైర్మన్ ఛాంబర్లో ఉన్న మొగరాలపై ధ్వజమెత్తారు. సూపరింటెండెంట్ను పళ్లు రాలగొడతావా, వెంటనే క్షమాపణ చెప్పి కమిటీ సభ్యుడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆస్పత్రి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు స్పందిస్తూ కమిటీ చైర్మన్గా తాను సూపరింటెండెంట్కు క్షమాపణ చెబుతున్నానన్నా ఉద్యోగులు ఒప్పుకోలేదు. అనుచితంగా మాట్లాడిన వారే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. సూపరింటెండెంట్ తనకు జరిగిన అవమానాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని, వారే చర్యలు తీసుకుంటారని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వివాదం ఆపకపోతే చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఆస్పత్రి చైర్మన్, పోలీసులు చర్చలు జరిపి మొగరాలతో క్షమాపణ చెప్పించారు. సూపరింటెండెంట్ చేతులతోనే ఫిర్యాదుని చించివేయించారు. దీంతో మూడు గంటల పాటు నెలకొన్న గందరగోళానికి తెరపడింది. -
చీటర్ పట్టివేత
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సదరం సర్టి ఫికెట్ ఇప్పిస్తానంటూ ఓ వికలాంగురాలి నుంచి డబ్బు వసూలు చేసి, ముఖం చాటేసిన చీటర్ను సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 8న ధర్మవరం తారకరామాపురానికి చెందిన రామలక్ష్మి సదరం సర్టిఫికెట్ కోసం ఓపీ నంబర్ 9కి వెళ్లింది. ఓపీ వద్ద ఓ వ్యక్తి వైకల్యం సర్టిఫికెట్ ఇప్పిస్తానని, అందుకు రూ.వెయ్యి ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో రామలక్ష్మి తన వద్ద అంత లేదని రూ.600 మాత్రమే ఉందని చెప్పింది. ఉన్న డబ్బులు ఇవ్వాలని, సర్టిఫికెట్ ఇచ్చే ముందు మిగతా రూ.400 ఇవ్వాలని చెప్పాడు. సర్టిఫికెట్ వస్తుందన్న ఆశతో ఆమె రూ.600 సమర్పించుకుంది. మొదట ఆధార్కార్డు జిరాక్స్ చేసుకుని రావాలని, తాను ఇక్కడే ఉంటానని తెలిపాడు. జిరాక్స్ చేయించుకుని ఓపీ వద్దకు వస్తే ఆ వ్యక్తి కనిపించకపోవడంతో తాను మోసపోయానని రామలక్ష్మి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ దృష్టికి తీసుకెళ్లింది. చాకచక్యంగా.. ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో నమోదైన ఫొటోను సెల్లో తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఓపీ నంబర్ 9 వద్ద మరోసారి సదరు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. సెక్యూరిటీ సూపర్వైజర్లు ఇర్ఫాన్, నరేష్ గట్టిగా నిలదీయడంతో రామలక్ష్మి నుంచి సర్టిఫికెట్ కోసం డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. తన పేరు రెడ్డప్పరెడ్డి అని, ఊరు నల్లమాడ మండలం అయ్యన్నగారిపల్లి అని తెలిపాడు. అనంతరం అతడిని సెక్యూరిటీ సిబ్బంది టూటౌన్ పోలీసులకు అప్పగించారు. -
రేడియా'లేజీ '
అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రేడియాలజిస్టు, సిబ్బంది లేకపోవడంతో రేడియాలజీ సేవలను ఎంబీబీఎస్ వైద్యునితో అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేడియాలజీ విభాగంలో రోజురోజుకూ సేవలు మృగ్యంగా మారుతున్నా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) శ్రద్ధ చూపడం లేదు. నాలుగేళ్లుగా ఒకరికే బాధ్యతలు.. సర్వజనాస్పత్రిలో నాలుగేళ్లుగా ఎంబీబీఎస్ అర్హత కల్గిన డాక్టర్ నాగరాజు రేడియాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో షిఫ్ట్ల ప్రకారం వైద్యులు నివేదికలను సిద్ధం చేసి కోర్టుకెళ్లేవారు. ఆస్పత్రి యాజమాన్యం సిబ్బంది కొరతను చూపుతూ ఈ బాధ్యతను ఎంబీబీఎస్ వైద్యులైన నాగరాజుకు అప్పగించేసింది. ఇటీవల కాలంలో పలు కేసుల్లో ఎక్స్రేలు తీసే విషయంలో సిబ్బందికి, వైద్యుని మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఒక కేసుకు అధిక సంఖ్యలో ఎక్స్రేలు తీయాలని చెబుతున్నారని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఎంఎల్సీ రిపోర్టుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం ఓ వైద్యునికే బాధ్యతలు ఇప్పించి చోద్యం చూస్తోందని మండిపడుతున్నారు. ఒకే ఒక్కరు.. రేడియాలజీ విభాగంలో ఒకే ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉన్నారు. వాస్తవంగా రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్, నలుగురు ట్యూటర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ట్యూటర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్న వైద్యుల్లో డాక్టర్ పద్మ (ట్యూటర్), డాక్టర్ వసుంధర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఇద్దరు లాంగ్వీల్లో ఉన్నారు. అందుబాటులో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అనారోగ్యం కారణంతో విధులకు రావడం లేదు. రేడియాలజిస్టులకొరతతోనే రేడియాలజిస్టుల కొరతతోనే ఎంబీబీఎస్ వైద్యులైన డాక్టర్ నాగరాజుకు బాధ్యతలు అప్పగించాం. అయినా అందుబాటులో ఉన్న రేడియాలజిస్టు సలహాతోనే డాక్టర్ నాగరాజు రిపోర్టులు రాస్తారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత తెల్సిందేకదా? కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులే కోర్టుకెళ్లి వివరణ ఇస్తుంటారు. – డాక్టర్ జగన్నాథ్,సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
భార్య, ప్రియుడిపై కత్తితో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పొదలకూరు: భార్య, ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడిపై ఓ వ్యక్తి శనివారం రాత్రి కత్తితో దాడిచేశాడు. బాధితులు నెల్లూరులోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరడంతో పొదలకూరు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. ఎస్సై అల్లూరు జగత్సింగ్ కథనం మేరకు వివరాలు.. మండలంలోని మర్రిపల్లిలో జి.కృష్ణవేణి నాలుగు నెలలుగా భర్త రమేష్ నుంచి వేరుపడి పైడినాయుడు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. రమేష్ మండలంలోని మొగళ్లూరు నిమ్మతోటలో కాపలాదారుడిగా ఉంటున్నాడు. కృష్ణవేణి మరొకరితో సహజీవనం సాగించడాన్ని జీర్ణించుకోలేకపోయిన రమేష్ శనివారం రాత్రి సమయంలో కత్తి తీసుకుని వెళ్లి భార్య, ఆమె ప్రియుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో పైడినాయుడు మెడపై, కృష్ణవేణి చేతిపై తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దాస్పత్రి అభివృద్ధికి సుస్తీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న వరాలు అమలుకు నోచుకోవడం లేదు. నిధులు మంజూరు చేస్తున్నట్లు కాగితాలపై ప్రకటిస్తున్నారే గానీ పనులు మాత్రం మొదలుకావడం లేదు. ఇందుకు పలు రకాల కొర్రీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. నిధుల కొరత కారణంగానే రాష్ట్ర ఉన్నతాధికారులు పనులను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రికి కర్నూలుతో పాటు ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, మహబూబ్నగర్, రాయచూరు, బళ్లారి జిల్లాల నుంచి వందలాది మంది రోగులు వస్తున్నారు. ప్రతిరోజూ ఓపీ 3 వేలు, ఐపీ 1300 నుంచి 1500 దాకా ఉంటోంది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు. కానీ అభివృద్ధి పనులు మాత్రం 30 ఏళ్ల క్రితం నాటివి ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రగల్భాలు పలికే పాలకులు పనులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం లేదు. అందరూ ఆశపడేటట్లు పనులు ప్రకటించడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించడం షరా మామూలుగానే అయ్యింది. ఇప్పటికే కోట్లాది రూపాయల పనులు మొదలుకాకుండా ఆగిపోతున్నాయి. 2015లో మంజూరైనా ఇప్పటికీ ప్రారంభం కాలేదు ఆసుపత్రిలో రూ.15కోట్లతో రేడియోడయాగ్నోస్టిక్ బ్లాక్ నిర్మించనున్నట్లు 2015లో ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండేళ్ల పాటు దాని ఊసు ఎత్తలేదు. ఏడాది క్రితం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటిదాకా పిలువ లేదు. అలాగే రూ.1.35కోట్లతో గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగానికి ఐసీయూ బ్లాక్ నిర్మాణానికి 2016లో ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క ఇటుక ముక్క కూడా పేర్చలేదు. ఇందుకు సంబంధించి టెండర్ను ప్రతిసారీ వాయిదా వేస్తూ వెళ్తున్నారు. 2016లోనే రూ.2కోట్లతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి టెండర్ పిలుస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటి వరకు పిలవలేదు. మూడేళ్ల క్రితం నిర్మించతలపెట్టిన డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ చైల్డ్ సెంటర్ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకే.. జిల్లా ప్రజలకు ఏదో చేస్తోందని భ్రమింపజేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు ప్రకటిస్తోంది. ఆ తర్వాత నిధుల కొరత పేరు చెప్పి టెండర్ వేయకుండా అడ్డుపడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోట్ల రూపాయలతో చేపట్టే పనులను రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్అండ్బి, ఏపీఎంఎస్ఐడిసి సీఈలతో కూడిన టెండర్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ కమిటీ సభ్యులు సమయాభావం పేరు చెప్పి పనుల ఆమోదానికి సమావేశం ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల వారం రోజుల క్రితం ఈ కమిటీ కూర్చున్నా పనుల అంచనా విలువ వ్యాట్తో వేశారని, దానిని మార్చి జీఎస్టితో వేసుకురావాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇలా ప్రతిసారీ ఏదో ఒక వంక పెట్టి పనులను ప్రారంభించకుండా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఖాతాలో రూ.10కోట్ల దాకా ఎన్టీఆర్ వైద్యసేవ నిధులు ఉన్నా వాటిని ఉపయోగించలేని పరిస్థితి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రివాల్వింగ్ ఫండ్ కింద మినహాయించుకుని విడుదల చేస్తుంది. కనీసం ఆ నిధులతోనైనా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని వైద్యులు కోరుతున్నారు. -
ప్రాణం పోశారు
అనంతపురం న్యూసిటీ: జిల్లా సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ రోగికి ప్రాణం పోశారు. 72 సంవత్సరాల వృద్ధుడికి మూడు గంటల పాటు శ్రమించి క్యాన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించారు. వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, సర్జరీ అనస్తీషియా విభాగం హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ నవీన్, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కె.ఎల్.సుబ్రహ్మణ్యం సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన పి.బాలాజీ అనే వృద్ధుడికి దవడ కింది భాగంలో క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ 30న అతన్ని కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో దవడ నుంచి కొంత భాగాన్ని తీసి బయాస్సీకి పంపారు. పరీక్షల అనంతరం అది కార్సినోమా (క్యాన్సర్) గడ్డగా తేలింది. అదే సమయంలో రోగి గుండె సంబంధిత వ్యాధి, ఆస్తమా, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆరేళ్ల క్రితం చేసిన బైపాస్ సర్జరీ ఫెయిల్యూర్ దశకు చేరడంతో గుండె 28 శాతం మాత్రమే పనిచేస్తోందని తెలుసుకున్నారు. జనరల్ అనస్తీషియా ఇస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో బాలాజీ కుమారులు రమేష్, గిరిప్రసాద్తో వైద్యులు సంప్రదించారు. వారి అనుమతితో ఈ నెల 24న సర్వజనాస్పత్రిలోనే రోగి ఎడమ కన్ను కింది భాగం నుంచి ఛాతీ వరకు అనస్తీషియా ఇచ్చి మూడు గంటల్లోనే సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఇది చాలా అరుదైన శస్త్రచికిత్సగా ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. దీనిని ఒక సవాల్గా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఎస్ఐసీయూలో ఉంచిన రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో వారం అడ్మిషన్లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
బాలుడి గొంతులో ఎముక తొలగింపు
అనంతపురం న్యూసిటీ: బాలుడి గొంతులు ఇరుక్కున్న చికెన్ ముక్క (ఎముక)ను సర్వజనాస్పత్రి ఈఎన్టీ వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. నల్లమడ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్కుమార్, సంధ్య దంపతుల కుమారుడు ఐదేళ్ల వినయ్కుమార్ ఈ నెల 25వ తేదీన భోజనం చేసే సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. నరకయాతన పడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన కదిరి ఆస్పత్రి, అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆపరేషన్ విజయవంతం : సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో స్పందించారు. గురువారం రాత్రంతా వారి పర్యవేక్షణలోనే ఉంచారు. శుక్రవారం ఉదయం ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ నవీద్అహ్మద్ నేతృత్వంలో వైద్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ అనూష, అనస్తీషియా వైద్యులు డాక్టర్ శ్రీహరిల బృందం అరగంట పాటు శ్రమించి ఈసోఫాగోస్కోపీ ద్వారా బాలుడి గొంతులో ఇరుక్కున్న ఎముకను తొలగించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, లేకపోతే ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారేదని హెచ్ఓడీ డాక్టర్ నవీద్ అహ్మద్ పేర్కొన్నారు. ఎముకను తొలగించడంతో బాబు కుటుంబీకులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈఎన్టీ వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అభినందించారు. -
గోల్మాల్..!
సర్వజనాస్పత్రి కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్ స్టాఫ్నర్సును బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాఫ్నర్సుకు చెందిన రూ. 50 వేల చలానా కట్టినట్లు ఫోర్జరీ చేశాడు. ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా సదరు సీనియర్ అసిస్టెంట్పై విచారణకు ఆదేశించి ఆర్డీకు సరెండర్ చేసింది. అనంతపురం న్యూసిటీ:అనంతపురం సర్వజనాస్పత్రిలోని సునీత అనే స్టాఫ్నర్సు గతేడాది నవంబర్లో ఎమ్మెస్సీ పరీక్షల కోసం సెలవు పెట్టారు. ఆ నెల జీతం డిసెంబర్లో స్టాఫ్నర్సు ఖాతాలో జమ అయ్యింది. ఈమె సెలవులో వెళ్లిన విషయాన్ని ఆలస్యంగా కార్యాలయం సిబ్బందికి తెలియజేశారు. గత నెల జీతం అకౌంట్లో పడిందని తెలియజేశారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ అల్తాఫ్ ఆ మొత్తాన్ని తనకిస్తే చలానా రూపంలో ట్రెజరీకి చెల్లిస్తామన్నారు. స్టాఫ్నర్సు సునీత రూ.55 వేల నగదును సీనియర్ అసిస్టెంట్కు అందజేశారు. సీనియర్ అసిస్టెంట్ రూ. 5వేలు మాత్రమే చెల్లించి, రూ.50 వేలు తీసుకున్నాడు. ట్రెజరీకు చెల్లించిన స్లిప్ను స్టాఫ్నర్సుకు అందజేశాడు. ఆ స్లిప్లో అంకెలను దిద్దిన విషయాన్ని పసిగట్టిన స్టాఫ్నర్సు వెంటనే ఏఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సూపరింటెండెంట్ దృష్టికి వెళ్లగా.. ఆయన విచారణకు ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్ తప్పిదం చేసినట్లు విచారణలో తేలడంతో ఆయన్ను కడపలోని ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేశారు. పైసలిస్తేనే పనులు! : సర్వజనాస్పత్రిలోని ఆఫీస్ కార్యాలయంలో పైసలివ్వందే పనులు జరగడం లేదు. పది మంది స్టాఫ్నర్సుల ఇంక్రిమెంట్ల ఫైల్ ఆర్డీ కార్యాలయానికి పంపడంలోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఒక్కో స్టాఫ్నర్సుతో రూ.3 వేలు లంచం తీసుకున్నట్లు తెల్సింది. ఆస్పత్రి కార్యాలయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారిపోయాయి. పర్యవేక్షించాల్సిన యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని చర్చించుకుంటున్నారు. వాస్తవమే సీనియర్ అసిస్టెంట్ అల్తాఫ్ హుస్సేన్ స్టాఫ్నర్సు సునీత వేతనాన్ని తీసుకున్న మాట వాస్తవమే. ట్రెజరీకి రూ.5వేలు మాత్రమే చెల్లించాడు. దీనిపై విచారణకు ఆదేశించి సదరు ఉద్యోగిని ఆర్డీకి సరెండర్ చేశాం. – డా.జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
సిబ్బంది కొరతా..? మీ మంత్రులనడగండి
అనంతపురం న్యూసిటీ: ‘సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత ఉంటే..మీ మంత్రులు, చీఫ్ విప్లనే అడగండి. మీ జిల్లాకు పదవులు ఎక్కువగా వచ్చాయ్. వారినడిగితే బాగుంటుంది’ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం సర్వజనాస్పత్రిలోని రోగులకందుతున్న సేవలపై విలేకరులడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. సర్వజనాస్పత్రిలోని సమస్యలను తనవంతుగా సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కరువు జిల్లా ‘అనంత’లో మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయని, అందుకు సర్వజనాస్పత్రిలో జరిగే ప్రసవాలే ఉదాహరణ అన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం కల్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తల్లీబిడ్డకు మెరుగైన వైద్యం అందించేందుకు పీజీ చేసిన గైనిక్, చిన్నపిల్లల, మెడిసిన్ వైద్యులు రెండేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం కేటాయించిన పడకలు చాలడం లేదని, నూతన భవనాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు ఆమె ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్, ఎస్ఎన్సీయూలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గైనిక్ వార్డులో ఓ మహిళ అప్పుడే పుట్టిన పాపను తీసుకురాగా... ఆ పాపను చేతుల్లోకి తీసుకున్న నన్నపనేని ‘అమరావతి’ అని నామకరణం చేశారు. చైర్పర్సన్ వెంట మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్భాను, సర్వజనాస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, తదితరులున్నారు. -
డాక్టర్లకు మినిస్టర్ వార్నింగ్
మీ అందరి చిట్టా మావద్దుంది నర్సింగ్ హోంలే కావాలనుకుంటే వెళ్లిపోండి సర్వజనాస్పత్రి వైద్యులను హెచ్చరించిన మంత్రి కామినేని అనంతపురం మెడికల్ : ‘సర్వజనాస్పత్రికి ఏ డాక్టర్ ఎప్పుడొస్తున్నారు.. ఎవరు బయట ప్రైవేట్ నర్సింగ్ హోం లకే పరిమితమవుతున్నారనేది అంతా తెలుసు.. మీ అందరి చిట్టా మా వద్ద ఉంది.. నర్సింగ్ హోంలే కావాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్యులను హెచ్చరించారు. సోమవారం రాత్రి అనంతపురం జిల్లాలోని సర్వజనాస్పత్రిలో ‘ఆస్పత్రి నిద్ర’ చేసిన ఆయన మంగళవారం ఉదయం అన్ని విభాగాల హెచ్ఓడీలతో సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమయ్యారు. నిరుపేదలే ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు.. వ్యాపార దృక్పథం మానుకొని సేవలందించాలని సూచించారు. విధుల పట్ల అంకితభావం ఉన్న వాళ్లకు పట్టం కడతామని అన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో మార్పుల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అందరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వైద్యుడిపై సస్పెన్షన్కు ఆదేశం : కదిరి ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ త్రిలోక్నాథ్పై సస్పెన్షన్కు మంత్రి ఆదేశించారు. ఆయన ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తూ ప్రైవేట్ నర్సింగ్ హోంలో కూడా సర్జరీలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఇటీవల ఒకరు మృతి చెందినట్లు స్థానిక ఎమ్మెల్యేతో పాటు కొందరు నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సస్పెన్షన్కు ఆదేశించారు. జూన్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన అనంతపురంలో రూ.150 కోట్లతో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రికి జూన్లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల అందిస్తుందన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, మెడాల్, పిరమిల్ సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు అందిస్తామన్నారు. ఆస్పత్రికి వచ్చిన కేసును మరో ఆస్పత్రికి రెఫర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యులు కష్టపడి పని చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. -
ఈ ఆస్పత్రిలో స్వీపరే డాక్టర్!
- సర్వజనాస్పత్రిలో వైద్య సేవల తీరిది అనంతపురం: ఈ నెల 27వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం నార్పలలో జరిగిన ఘర్షణలో ఈరమ్మ (50) తలకు తీవ్రగాయమైంది. దీంతో అదే రోజు కుటుంబీకులు ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఎంఎస్-2 వార్డులో అడ్మిట్ చేశారు. అడ్మిషన్లో ఉన్నప్పటి నుంచి ఆమెకు వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఈరమ్మ తలకు కట్టు కట్టాల్సి ఉంది. అయితే డ్యూటీ డాక్టర్ మనోహర్ ఆపరేషన్ థియేటర్కు వెళ్లగా, హౌస్సర్జన్ శ్వేత ఇతర రోగులకు వైద్య పరీక్షలు నిర్విహించే పనిలో నిమగ్నమయ్యూరు. నర్సింగ్ విద్యార్థినులు ఉన్నా, తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. చివరకు పారిశుద్ధ్య పనులు చేయాల్సిన స్వీపర్ తన పని వదిలేసి ఇదిగో ఇలా కట్టుకట్టేసింది. చాలా వార్డుల్లో స్వీపర్లు పరిశుభ్రతను గాలికొదిలేసి రోగులకు వైద్యం చేసేస్తున్నారు. ఇలా చేసినందుకు రోగుల నుంచి ఎంతో కొంత మొత్తం తీసుకుంటున్నారు. - అనంతపురం మెడికల్