water disputes
-
జల వివాదాలకు తెరపడేనా?
సాక్షి, అమరావతి: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) నివేదికను ఆమోదించి జల వివాదాలకు కృష్ణా బోర్డు తెరదించుతుందా? లేక యథాప్రకారం నివేదికను అటకెక్కించి జల వివాదాలను కొనసాగనిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్ఎంసీ నివేదికపై చర్చించి, ఆమోదించడమే అజెండాగా జనవరి 6న కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక ఆర్ఎంసీ రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడంలో తెలంగాణ అధికారులు అడ్డం తిరిగిన నేపథ్యంలో.. సర్వసభ్య సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నివేదిక తయారీలోనే తీవ్ర జాప్యం ► కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు ప్రధానంగా కారణమవుతున్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్(ప్రాజెక్టుల నిర్వహణ విధి విధానాలు), మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా? వద్దా అనే అంశాలపై 2022, మే 6న సర్వ సభ్య సమావేశంలో చర్చించారు. ఈ మూడు సమస్యల పరిష్కారానికి కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీ, జెన్కోల డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని 2022, మే 10న నియమించారు. ► ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై 15 రోజుల్లోగా.. రూల్ కర్వ్స్, వరద జలాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించారు. కానీ.. గడువులోగా ఆర్ఎంసీ నివేదిక ఇవ్వలేదు. ► నివేదికను రూపకల్పనకు ఆరు సార్లు ఆర్ఎంసీ సమావేశమైంది. 3న శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగానూ, ఉత్పత్తయ్యే విద్యుత్లో చెరి సగం పంచుకునేలా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేసేలా రెండు రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం కుదిరింది. సాగర్ రూల్ కర్వ్స్పై సీడబ్ల్యూసీను సంప్రదించి ఖరారు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వరద రోజుల్లో మళ్లించే జలాలను లెక్కించినా.. వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని నిర్ణయించాయి. ఇదే అంశాలతో 3న నివేదికను రూపొందించింది. కృష్ణా బోర్డు నిర్ణయమే ఫైనల్ ఆర్ఎంసీ నివేదికపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారు. దాంతో 5న నివేదికపై సంతకాలు చేయడానికి ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, సంతకాలు చేసేదిలేదని తెలంగాణ అధికారులు సమావేశానికి డుమ్మాకొట్టారు. దీంతో నివేదికపై కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, మౌతాంగ్, ఏపీ అధికారులు సంతకాలు చేసి 8న బోర్డు చైర్మన్కు అందజేశారు. ఈ నివేదికపై జనవరి 6న కృష్ణా బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్. నివేదికను అమలు చేస్తే జల వివాదాలకు తెరపడినట్టేనంటున్నారు. -
ముగింపా? కొనసాగింపా?
సాక్షి, అమరావతి: కృష్ణా నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచుగా వివాదాలకు దారితీస్తున్న సమస్యల పరిష్కారానికి రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) వచ్చే నెల 3న నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికతోనైనా జల వివాదాలకు తెరపడుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ నియమావళి, విద్యుదుత్పత్తి, మళ్లించిన వరదజలాలను కోటాలో కలపడం ప్రధానమైన మూడు సమస్యలని మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సర్వ సభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కోల సీఈలు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. సమస్య –1: రూల్ కర్వ్పై తలో మాట బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఏ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే నియమావళి (రూల్ కర్వ్) ముసాయిదాను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది. ఈ రూల్ కర్వ్పై ఆర్ఎంసీ చర్చించింది. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్ను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 114 టీఎంసీలు (చెన్నైకి తాగునీరు, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు– నగరి) బచాత్ ట్రిబ్యునల్, విభజన చట్టం కేటాయింపులు చేశాయని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆ మేరకు నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సీడబ్ల్యూసీ కూడా ఏపీ వాదననే సమర్థిస్తోంది. సమస్య–2: విద్యుదుత్పత్తిపై తకరారు సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడు, కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్ నీటి కేటాయింపుల మేరకు 64% వాటా తమకు రావాలని ఏపీ స్పష్టం చేస్తుండగా.. తెలంగాణ మాత్రం తమకు 76% వాటా కావాలని ప్రతిపాదిస్తోంది. సమస్య–3: వరద జలాల మళ్లింపు.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉండి, దిగువకు విడుదల చేస్తున్నప్పుడు.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కడలిలో జలాలు కలుస్తున్నప్పుడు.. అంటే వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏ మేరకు జలాలు మళ్లించినా వాటిని కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం ఆది నుంచి ప్రతిపాదిస్తోంది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. -
గడువు ముగిసినా గొడవలే..!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలకు చరమగీతం పాడటానికి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల అప్పగింత, పరిధిపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నోటిఫికేషన్ అమలును కేంద్రం పొడిగించిన ఆరు నెలల గడువు కూడా జూలై 15కే పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో బోర్డులు విఫలమయ్యాయి. దీనిపై బోర్డులు, కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించడం లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సద్దుమణగడం లేదు. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కోరారు. గతేడాది శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేకున్నా, నీటి నిల్వ కనిష్ట స్థాయిలో ఉన్నా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ, బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. దీనివల్ల కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో కేంద్రంలో కదలిక వచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెల్లలో కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలో అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఏపీ భూభాగంలోని శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, తెలంగాణ సర్కారు దాని పరిధిలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అమలు గడువు జనవరి 15తో పూర్తయినా, ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. దీంతో కేంద్ర జల్శక్తి శాఖ ఈ గడువును జూలై 15 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి (పాతది), నెట్టెంపాడు (పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు దాటింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్త రామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు డీపీఆర్లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ రూపొందించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ ఇటీవల వరద తగ్గాక కూడా శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల పది రోజుల్లోనే సుమారు 32 టీఎంసీల జలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. అయినా కేంద్ర జల్శక్తి శాఖ గానీ, బోర్డులు గానీ పట్టించుకోవడంలేదు. -
‘కృష్ణా’లో మా వాటా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్కు అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 574.6 టీఎంసీలు కేటాయించాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది. ట్రిబ్యునల్కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్కు అప్పగించాలని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది. -
గెజిట్ అమలుపై గజిబిజి
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. కేంద్రం నిర్దేశించిన తుది గడువు ముగిసిపోయి మూడు నెలలు పూర్తయినా నోటిఫికేషన్ అమల్లోకి రాకపోవడం గమనార్హం. మూడు నెలల క్రితమే ఏపీ ఉత్తర్వులు.. కృష్ణా బోర్డు ఆమోదించిన తీర్మానం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ గత అక్టోబర్ 14నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు నిరాకరిస్తూ వస్తోంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే బోర్డు పరిధిని నిర్ణయించాలంటూ పాత పాట అందుకుంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుండగా.. ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు గోదావరి బోర్డుతో అవసరమేముందని, రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జల వివాదాలు సమసిపోవడం లేదు. సమీక్షలతో సరి.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఇరు బోర్డులు వేర్వేరుగా సబ్ కమిటీలను నియమించాయి. బోర్డుల సభ్య కార్యదర్శుల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలు, జెన్కో సీఈలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలు పలుదఫాలు సమావేశమై నివేదికలు ఇచ్చాయి. వీటి ఆధారంగా బోర్డు పరిధిని ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లోని 15 అవుట్ లెట్లను తొలుత పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తామని, ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రతిపాదించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించడంతో ఆ మేరకు బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. గోదావరి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును పరిధిలోకి తీసుకుని నోటిఫికేషన్ అమలు ప్రారంభిస్తామని గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రతిపాదించగా.. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తేనే దిగువ రాష్ట్రమైన ఏపీకి ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బోర్డు చైర్మన్ పలుమార్లు సమీక్షలు నిర్వహించినా ఒక తాటిపైకి తేలేకపోయారు. నోరుమెదపని జల్శక్తి శాఖ నోటిఫికేషన్ అమలుపై తొలుత కృష్ణా, గోదావరి బోర్డు అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత నెల 28న రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, గోదావరి, కృష్ణా బోర్డుల చైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. కృష్ణా బోర్డు పరిధికి ఏపీ సర్కార్ అంగీకరించగా.. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టింది. గోదావరి బోర్డు అవసరమే లేదని తెలంగాణ సర్కార్ పేర్కొనగా.. దిగువ రాష్ట్రమైన తమ హక్కుల పరిరక్షణకు బోర్డు అత్యంత ఆవశ్యకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నోటిఫికేషన్ను తప్పకుండా అమలు చేస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. -
ఏమిటీ డ్రామాలు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉండగా జరిగిన ఆలస్యానికి కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశ్నించారు. దీనిపై 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిన తర్వాతే ట్రిబ్యునల్ విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని షెకావత్ స్పష్టత ఇచ్చారు. ఈ జాప్యానికి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్ మీడియాతో మాట్లాడారు. 2 రోజులని చెప్పి 8 నెలలకు.. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత చొరవ తీసుకుని గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినట్లు షెకావత్ తెలిపారు. ఆ సందర్భంగా కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకురాగా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయడంతో 2 రోజుల్లో పిటిషన్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అయితే 7–8 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వెనక్కి తీసుకుంటామని సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిన తర్వాతే ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని తెలిపారు. చర్చించాకే బోర్డుల పరిధిపై నిర్ణయం... విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడినప్పటికీ పరిధి నోటిఫై చేయని కారణంగా ఇన్నాళ్లూ అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్ పేర్కొన్నారు. గతేడాది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు బోర్డుల పరిధి నోటిఫై ప్రక్రియ ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సుదీర్ఘ చర్చల తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించామని వివరించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే బోర్డులను నోటిఫై చేసినప్పటికీ ఇదంతా ఒక డ్రామా అని కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని చెప్పారు. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? లేక ఉన్న ట్రిబ్యునల్కే బాధ్యత అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వెల్లడించాక ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏవో కొన్ని కాగితాలు పంపుతున్నారు.. బోర్డులు సమర్థంగా పనిచేసేలా రెండు రాష్ట్రాలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని షెకావత్ కోరారు. విద్యుత్ ప్రాజెక్ట్ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్లో పూర్తి స్పష్టత ఉందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని, మూలనిధి డిపాజిట్ చేయాలని, మానవ వనరులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించారు. నోటిఫికేషన్ కటాఫ్ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే డీపీఆర్ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించి ఏవో కొన్ని కాగితాలను పంపడం సరికాదని, నిర్దిష్ట ఫార్మాట్లో ఇవ్వాలని సూచించారు. నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పుని సవరించాలంటే ప్రక్రియ పార్లమెంట్లో జరగాలని, ఇది ఇప్పటికీ అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని షెకావత్ పేర్కొన్నారు. -
Andhra Pradesh: జలదౌత్యం!
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఒడిశాతో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యల పరిష్కారంతోపాటు రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిలా నిలిచే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించేందుకు ఈనెల 9న భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఇద్దరు సీఎంలు కలసి జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను నెరపడం, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుని అందరూ అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం వైఎస్ జగన్ పలుదఫాలు వెల్లడించారు. ఈ క్రమంలో సమయం కేటాయిస్తే తానే వస్తానని ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాశారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించడంతో సీఎం జగన్ వచ్చే వారం భువనేశ్వర్ వెళ్లనున్నారు. జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్.. ► జంఝావతిలో 75 శాతం లభ్యత ఆధారంగా 8 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి ఒడిశా, ఏపీ చెరి సగం వాడుకునేలా 1978 డిసెంబర్ 25న రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ► ఈ ఒప్పందం ప్రకారం 4 టీఎంసీలను వాడుకుని విజయనగరం జిల్లాలో కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని 75 గ్రామాల్లో 24,640 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా జంఝావతి ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయ/æ్ఞంలో భాగంగా చేపట్టారు. ► 3.40 టీఎంసీల సామర్థ్యంతో విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ఒడిశాలోని 1,175 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమిని సేకరించి ఇస్తే పరిహారం చెల్లిస్తామని అప్పట్లోనే ఒడిశా సర్కార్ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ.. ఒడిశా నిరాకరించడంతో జంఝావతి ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా అందించడానికి కాంక్రీట్ డ్యామ్ స్థానంలో రబ్బర్ డ్యామ్ను నిర్మించి 2006 జనవరి 1న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జాతికి అంకితం చేశారు. అప్పట్లో తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► ముంపునకు గురయ్యే భూమిని సేకరించి ఇవ్వడానికి ఒడిశా సర్కార్ను ఒప్పించడం ద్వారా రబ్బర్ డ్యామ్ స్థానంలో శాశ్వతమైన కాంక్రీట్ డ్యామ్ను నిర్మించి విజయనగరం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. నేరడితో ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం.. ► వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2 ద్వారా 2.45 లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. నేరడి బ్యారేజీకి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయకట్టు రైతులకు ముందస్తుగా ఫలాలను అందించడానికి కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి వంశధార జలాలను మళ్లించేలా పనులు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వంశధార ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ► జల వివాదాలకు చరమగీతం పాడుతూ ఈ ఏడాది జూన్ 23న కేంద్రానికి వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక అందజేసింది. శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. నేరడి బ్యారేజీ వద్ద లభ్యమయ్యే 115 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేసింది. నేరడి బ్యారేజీతో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అందజేయాలని ఒడిశా సర్కార్ను ఆదేశించింది. నేరడి బ్యారేజీ కుడి వైపున కాలువ ద్వారా రోజూ ఎనిమిది వేల క్యూసెక్కులు వాడుకోవడానికి ఏపీ సర్కార్కు అనుమతి ఇచ్చింది. ఎడమ వైపున నీటిని వాడుకోవడానికి ఒడిశాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని ఆదేశించింది. ఈ బ్యారేజీ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఆయకట్టులో రెండు పంటలకు, ఒడిశాలో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లందించి సస్యశ్యామలం చేయవచ్చు. ► రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాను ఒప్పించే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. పోలవరంలో నీటి నిల్వే లక్ష్యంగా.. ► పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసినా ముంపు ప్రభావం తమ భూభాగంలో పడకుండా చూడాలని 2007 ఏప్రిల్ 3న అంతర్రాష్ట్ర సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ కోరాయి. ► ఆంధ్రప్రదేశ్, నాటి మధ్యప్రదేశ్, ఒడిశా మధ్య 1980 ఏప్రిల్ 2న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ముంపు ప్రభావం లేకుండా సీలేరు, శబరి నదులకు కరకట్టలు నిర్మించాలని గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ► ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఒడిశాలో సీలేరుపై 12 కి.మీ, శబరిపై 18.2 కి.మీ. వెరసి 30.2 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు తాజా ధరల ప్రకారం రూ.378.696 కోట్లు వ్యయం కానుందని అంచనా. ఇదే రీతిలో ఛత్తీస్గఢ్లో శబరిపై 25.19 కి.మీ.ల పొడవున, ఇతర వాగులపై 3.93 వెరసి 29.12 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టల నిర్మాణానికి రూ.332.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ► కరకట్టల నిర్మాణానికి పర్యావరణ అనుమతి కోసం ఒడిశాలోని మల్కనగరి, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించాలని 2005 నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు లేఖలు రాసినా ప్రయోజనం కానరాలేదు. ► పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ పనులను వేగవంతం చేశారు. గోదావరిలో వరద ప్రవాహం తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పోలవరంలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేసేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో సీఎం జగన్ చర్చించనున్నారు. -
Projects: వీడని సందిగ్ధత.. ఏవి ఎవరి పరిధిలో..?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా వెలువ రించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు గడువు దగ్గర పడుతున్నా.. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులపై మాత్రం సందిగ్ధత వీడటం లేదు. గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లోని 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి రావాల్సి ఉండగా.. ఇన్ని ప్రాజెక్టులను తీసుకోవ డంపై రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరాలు లేవ నెత్తుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు లను మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలుగు రాష్ట్రాలు కోరుతుంటే.. గోదావరిలో ఒకే ఒక్క ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలంగాణ కోరుతోంది. దీంతో కేంద్రం, బోర్డులు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కో వాదన కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ (ట్రాన్స్మిషన్ లైన్స్), ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ తదితర బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పరిధిలోని హెడ్వర్క్స్ మాత్రమే బోర్డుల పరిధిలో ఉండాలని తెలంగాణ అంటోంది. శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి పథకాలు వద్దని అంటోంది. బనకచర్ల వద్దు ఆంధ్రప్రదేశ్ మాత్రం.. సాగర్, శ్రీశైలం, పులి చింతలతో పాటు జూరాలను కృష్ణా బోర్డు పరిధిలో ఉంచాలని కోరుతోంది. అయితే బనకచర్లను మా త్రం వద్దంటోంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారానే నీళ్లు బనకచర్లను చేరతాయి. పోతిరెడ్డి పాడు ద్వారా జరిగే నీటి వినియోగానికి లెక్కలు ఉంటాయి కాబట్టి, బనకచర్లను చేర్చాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ మేరకు తన అభి ప్రాయాలను కేంద్రానికి పంపింది. దీనిపై ఇంత వరకు బోర్డు, కేంద్రం నుంచి స్పందన రాలేదు. పెద్దవాగును ఉంచితే చాలు: తెలంగాణ గెజిట్లో పేర్కొన్న మేరకు పెద్దవాగు రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీ తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర, తాడిపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు, కాటన్ బ్యారేజీ, తొర్రిగడ్డ, చింతలపూడి, చాగల నాడు, వెంకటనగరం ఎత్తిపోతలు గోదావరి బోర్డు పరిధిలో ఉండనున్నాయి. అలాగే ఎస్సారెస్పీ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం అదనపు టీఎంసీ, దేవాదుల, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్, సీతారామ ఎత్తిపోతలు, మాచ్ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లు కూడా బోర్డు అధీనంలో ఉండనున్నాయి. అయితే గోదావరిలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేని దృష్ట్యా వీటిపై బోర్డు పెత్తనం అవసరం లేదని తెలంగాణ అంటోంది. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఖమ్మం జిల్లాలో ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే ఉంచాలని కోరుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని బోర్డు, ఈ నెల 6,7 తేదీల్లో అక్కడ పర్యటించేందుకు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటోంది. -
కృష్ణా, గోదావరి బోర్డులే బాస్లు!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తెరదించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం రాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కృష్ణా బేసిన్లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్మిషన్ లైన్స్), ఆయకట్టుకు నీటి విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. ఈ మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అనుమతి తీసుకోకుండానే పూర్తి చేసినవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నోటిఫికేషన్లో పేర్కొన్నంత మాత్రాన వాటిని ఆమోదించినట్లు కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా చేపట్టిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులను ఆపివేయాలని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన రోజు నుంచి ఆర్నెల్లలోగా వాటికి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి బోర్డులు సమర్థంగా పని చేసేందుకు 60 రోజుల్లోగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్ మనీ కింద ఒకేసారి రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కృష్ణా / గోదావరి బోర్డు ఛైర్మన్ ఆమోదంతో నిర్వహణ ఖర్చుల్ని విడుదల చేయాలని కోరిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే బోర్డుల నిర్వహణలో ఎదురయ్యే పరిణామాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు ఇవీ.. విభజన చట్టం ప్రకారం.. విభజన చట్టం సెక్షన్–85(1) ప్రకారం నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా 2014 మే 28న కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బోర్డులు అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షణలో పని చేస్తాయి. కృష్ణా, గోదావరి బోర్డుల ౖచైర్మన్లుగా రెండు రాష్ట్రాలకు చెందని వారినే నియమించాలి. రెండు రాష్ట్రాలకు చెందని వారినే బోర్డు సభ్య కార్యదర్శులుగా, చీఫ్ ఇంజనీర్లుగా నియమించాలి. కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపాన్ని నిర్ణయించుకునే అధికారం ఆ బోర్డులకే ఉంటుంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన రోజు నుంచి 30 రోజుల్లోగా బోర్డులు నిర్దేశించుకున్న స్వరూపం, వాటిలో పనిచేసేందుకు ఆయా విభాగాల ఉద్యోగులను కేంద్రం నియమించాలి. బోర్డుల పరిధి ఇదీ.. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన చట్టం సెక్షన్–87(1) ప్రకారం రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని షెడ్యూల్–1, షెడ్యూల్–2, షెడ్యూల్–3లో పేర్కొన్న ప్రకారం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాలువల వ్యవస్థలో విభాగాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్మిషన్ లైన్స్) బోర్డు పరిధిలోకి వస్తాయి. ప్రాజెక్టుల పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోసహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాలి. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. ప్రాజెక్టుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. ►బోర్డులు తమ స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్–1 ప్రాజెక్టులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీం కోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్లో కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ►షెడ్యూల్–3 ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. ►ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు చేపట్టాలి. గెజిట్ ప్రకారం అనుమతి లేనివంటే...?. 1. బోర్డు అనుమతి తీసుకోనివి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదించని ప్రాజెక్టులు. 2. కేంద్ర జల్ శక్తి శాఖ, కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి ఆమోదించని సాగునీటి, బహుళార్ధసాధక, వరద నియంత్రణ ప్రాజెక్టులు. 3. బోర్డు, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి ఆమోదించిన మేరకు కాకుండా మార్పు చేసిన నిర్మించినవి, నిర్మిస్తున్న ప్రాజెక్టులు. బోర్డుల విధి విధానాలు .. ►కృష్ణా, గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం. ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అనుసరించి నీటిని పంపిణీ చేయడం. è ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను రెండు రాష్టాలకు పంపిణీ చేయడం. ►కృష్ణా, గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలికి బోర్డు పంపుతుంది. బోర్డుల పరిశీలనకు పంపని డీపీఆర్లను సీడబ్ల్యూసీ టీఏసీ పరిగణనలోకి తీసుకోదు. è ఏదైనా ఒక ప్రాజెక్టును బోర్డులకు ప్రతిపాదించినప్పుడు పరిధిపై వివాదం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. దీనిపై నిర్ణయాధికారం కేంద్రానిదే. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత.. గతేడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ క్రమంలో నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేలా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టారు. బోర్డులు ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు కేంద్రం వాటి పరిధిని ఖరారు చేయడం గమనార్హం. -
ఇద్దరి హక్కులకూ భద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే అందులో కొన్ని అంశాలపై సవరణలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్కు దక్కిన 512, తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలను పంపిణీ చేయడంపైనే కృష్ణా బోర్డు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు గోదావరి వరద జలాలను మళ్లించగా.. అక్కడ మిగిలే కృష్ణా నీటిని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించుకునే స్వేచ్ఛ కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని తెలుగుగంగ, గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీ–నీవా, తెలంగాణలోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు) కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడు వాటికి ఆర్నెళ్లలోగా మళ్లీ అనుమతి తీసుకోవాలంటూ విధించిన నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరనుంది. విభజన చట్టం ద్వారా ఆ ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత వాటి పరిధిని ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూనే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ), దిగువ ప్రధాన కాలువ (ఎల్లెల్సీ) ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి కేటాయించిన 32.5, ఎల్లెల్సీకి కేటాయించిన 29.5 టీఎంసీలను దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటికి తుంగభద్ర జలాశయంలో నీటిని విడుదల చేసినప్పుడు రాష్ట్ర సరిహద్దులోనూ టెలీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను మళ్లీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని, వాటిని పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లెక్కిస్తే చాలు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని కేటాయించిన నీటిని విడుదల చేసేటప్పుడు టెలీమీటర్ల ద్వారా లెక్కిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్, వెలిగోడు రిజర్వాయర్, తెలుగుగంగ లింక్ కెనాల్, ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు కాలువల వ్యవస్థలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని అక్కడ నీటిని లెక్కించాల్సిన అవసరం లేదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల బోర్డుకు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకే కృష్ణా బోర్డు పరిధిని పరిమితం చేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి లేదంటే ఎలా? వెంకటనగరం ఎత్తిపోతల 2006 నాటికే పూర్తయిందని, తెలుగుగంగ ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల, ఎల్లెల్సీ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 2008 నాటికే పూర్తైందని, ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం సరి కాదని కేంద్రానికి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తై ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రతిపాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో సంబంధం లేని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఎందుకు? కృష్ణా డెల్టాకు నీళ్లందించే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాకు నీళ్లందించే ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం, పోలవరం దిగువన తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకటనగరం ఎత్తిపోతల, పుష్కర, పురుషోత్తపట్నం, తాడిపూడి, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల వల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తేవడం వల్ల అదనపు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా వాటిని బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకుంటే సరి.. గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్లు ఉమ్మడి ప్రాజెక్టులు. జూరాల, పులిచింతల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రధాన ప్రాంతాలు(ఇన్టేక్లు), ఎత్తిపోతల పథకాల పంప్హౌస్లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పులిచింతలలో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల బోర్డుపై అదనపు భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. బోర్డుల పరిధి విస్తృతమైతే వాటి పరిధిలోని ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ నిర్వహణకు భారీ ఎత్తున వ్యయం అవుతుందని, దీనివల్ల రెండు రాష్ట్రాలపైనా ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా దామాషాలో పంపిణీ.. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 811 టీఎంసీలు ఉంటే 66 : 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని, ఒకవేళ వర్షాభావంతో లభ్యత తగ్గితే అదే నిష్పత్తిలో దామాషా పద్ధతిలో నీటి పంపిణీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. 2019–20, 2020–21 తరహాలోనే బేసిన్లో భారీ ఎత్తున వరద వస్తే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి వరద జలాలు సముద్రంలో కలిసే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో నీటిని మళ్లించుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకూడదని వి/æ్ఞప్తి చేయనుంది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరనుంది. -
జల వివాదం: పర్మిషన్ లేకుంటే ప్రాజెక్టుల మూత!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని బోర్డుల పరిధిపై వెలువరించిన గెజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించినంత మాత్రాన అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదించినట్టు కాదని పేర్కొంది. ఆరు నెలల్లోగా అనుమతి తీసుకోవడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి ఉంటుందని.. అవి పూర్తయినా కూడా నీటి వినియోగించుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. గెజిట్లో పేర్కొన్న మేరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులివే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఎస్ఎల్బీసీ సామర్థ్యం మరో పది టీఎంసీలు పెంపు కల్వకుర్తి ఎత్తిపోతల కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 15 టీఎంసీలు పెంపు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ డిండి ఎత్తిపోతల ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టు భక్త రామదాస ఎత్తిపోతల తుమ్మిళ్ల ఎత్తిపోతల నెట్టెంపాడు ఎత్తిపోతల నెట్టెంపాడు సామర్థ్యం అదనంగా 3.4 టీఎంసీలు పెంపు దేవాదుల లిఫ్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా బేసిన్కు మళ్లించే ప్రాజెక్టు (వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు తెలుగు గంగ వెలిగొండ హంద్రీ-నీవా గాలేరు-నగరి ముచ్చుమర్రి ఎత్తిపోతల సిద్ధాపురం ఎత్తిపోతల గురు రాఘవేంద్ర (ఇందులో మొదటి నాలుగింటిని విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు మున్నేరు పునర్ నిర్మాణం గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు కంతనపల్లి బ్యారేజీ కాళేశ్వరంలో అదనపు టీఎంసీ పనులు రామప్ప- పాకాల మళ్లింపు తుపాకులగూడెం బ్యారేజీ మోదికుంటవాగు ప్రాజెక్టు చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల కందుకుర్తి ఎత్తిపోతల బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత గూడెం ఎత్తిపోతల ముక్తేశ్వర్ ఎత్తిపోతల సీతారామ ఎత్తిపోతల (రాజీవ్ దుమ్ముగూడెం) పట్టిసీమ ఎత్తిపోతల పురుషోత్తపట్నం ఎత్తిపోతల చింతలపూడి ఎత్తిపోతల వెంకటనగరం ఎత్తిపోతల -
కీలక ప్రాజెక్టులన్నీ బోర్డుల ఆధీనంలోకి..
సాక్షి, హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించారు. రెండు రాష్ట్రాల్లో ఈ నదులు, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను మొదటి షెడ్యూల్లో ప్రస్తావించారు. మొత్తంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులను షెడ్యూల్-2లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధిం చిన ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాల్వల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ఆ ప్రాజెక్టుల్లోని రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ సహా ఉద్యోగులంతా బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. బోర్డులు ప్రాజెక్టులను తమ స్వాధీనంలోకి తీసుకున్నా.. గెజిట్ వచ్చేనాటికి ఉన్న కేసులు, అప్పటికే జరిగిన విషయాలపై భవిష్యత్లో దాఖలయ్యే కేసులకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. షెడ్యూల్ -3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాలి. కృష్ణా బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీశైలం రిజర్వాయర్, దానిపై ఆధారపడిన ప్రాజెక్టులు.. స్పిల్వే, ఎడమ, కుడిగట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్ నాగార్జున సాగర్ పరిధిలో.. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్ పాండ్. తుంగభద్ర, దాని పరిధిలోని హై లెవల్, లో లెవల్ కెనాల్లు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల ఎగువ కృష్ణాలో.. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు - పాకాల ఇన్ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంపుహౌస్, ఎస్సారెస్పీ స్టేజ్ -2లోని మైలవరం రిజర్వాయర్ వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ-ఎన్ఎస్-ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణాలింకు,కృష్ణాడెల్టా,గుంటూరు కెనాల్. గోదావరి బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు, చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ లిఫ్టు, మాచ్ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్. పెద్దవాగు రిజర్వాయర్ స్కీం, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు ప్రాజెక్టు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్ల తరలింపు. పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తమపట్నం లిఫ్టు, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్. తొర్రిగడ్డ, చింతలపూడి, చాగలనాడు, వెంకటనగరం ఎత్తిపోతలు. -
జల జగడాలతో రెండు రాష్ట్రాలకూ నష్టం
జల వివాదాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉభయ పాలకులు ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇండియా, చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహ రించినట్లుగా సాగర్, శ్రీశైలం, పులి చింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బలగాలు మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు. ఈ జగడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక కారణమైతే, రెండవది తెలంగాణ లోనున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ కేంద్రాలలో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పాదన చేయాలని నిర్ణయించడం. రెండు రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండే రాజకీయ ప్రయోజనాలు దానికి ఉండి సమస్య పరిష్కారం కాకుండా జాప్యం చేయడం వల్లనే సమస్య మరింత జటిలమౌతోంది. కృష్ణానది పుట్టిన మహారాష్ట్ర, ఆ తర్వాత పరివాహక ప్రాంతమైన కర్ణాటక, చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలకు మధ్య జలవివాదాలు రగిలాయి. ఎగువనున్న రెండు రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని విని యోగించుకుంటున్నదనే వివాదాన్ని పై రాష్ట్రాలు రెండు లేవనెత్తాయి. అది పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్ఎస్ బచావత్ కమిటీని, జలవివాదాల పరి ష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ వందేళ్ల జల పరివాహకాన్ని పరిగణనలోకి తీసు కొని మూడు రాష్ట్రాల వాటాలను తేల్చింది. బచావత్ ప్రముఖ ఇంజినీర్ కావడంతో, 75 శాతం డిపెండబిలిటీని ఆధారంగా వేసుకొని నికరజలాలను తేల్చారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో 2060 టీఎంసీలు నికరజలాలుగా నిర్ణయించారు. మహా రాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఆంధ్ర ప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయింపులు చేస్తూ 1976లో తీర్పునిచ్చారు. బచావత్ కమిటీ తీర్పు 2000 జూన్ 31 నాటికి ముగిసింది. మిగులు వరద జలాలను దిగువన ఉన్న వారు వాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చింది. 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభు త్వంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తమిళ తంబీల రుణం తీర్చుకోవడం కోసం ‘తెలుగుగంగ’ పథకాన్ని ప్రారం భించారు. దీనికోసం 15 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు చెరో ఐదు టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదు టీఎంసీలు కేటాయిస్తూ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ఆధారంగా శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్ను ప్రారంభించారు. 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలుగుగంగ హెడ్ రెగ్యు లేటర్ను వెడల్పు చేసి 11 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తరలించుకుపోయే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెగ్యులేటర్ గేట్లను పెంచి 44 వేల క్యూసెక్కులకు పైగా జలాలను తరలించే ఏర్పాటు చేశారు. బచావత్ కమిటీ ముగిసిన తర్వాత 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 65 శాతం డిపెండ బులిటీగా తీసుకొని, 2060గా ఉన్న నికర జలాలను 2,578 టీఎంసీలుగా ట్రిబ్యునల్గా గుర్తించింది. దాని ప్రకారం ఎగువన కర్ణాటకకు 700+211=911 టీఎంసీలు, మహారాష్ట్రకు 560+106=666 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 811+190=1001 టీఎంసీలు కేటా యించింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన 190 టీఎంసీల్లో సగం వాటా తెలంగాణా కావాలన్నది ప్రధానాంశంగా మారింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అంతకుముందు 811 టీఎంసీలలో 512 ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటా యించారు. కమిటీ అదనంగా కేటాయించిన నీటిలో తమకు తక్కువ ఇవ్వడం కుదరదని తెలంగాణ వాదిస్తున్నది. అంతేకాదు, మొత్తం కేటాయింపులలో చెరి సగం వాటాను పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నది. గత సంవత్సరం పోతిరెడ్డిపాడు ఎగువన సిద్ధేశ్వరం వద్ద కేంద్ర అనుమతులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిధులు కేటాయించారు. దీని ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని తెలుగుగంగ కాల్వకు లింక్ చేయడం ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని అంటే 80 వేల క్యూసెక్కుల జలాలను తోడుకుపోవచ్చు. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వరద సమయంలో రోజుకు 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలిస్తే పాలమూరు రంగారెడ్డి మొదలగు పథకాలకు నీళ్లు మిగలవని తెలంగాణ వాదన. రాయలసీమ పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ అనుమ తులు లేనందున నిలుపుదల చేయాలంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జూరాల ఎగువన ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు ఆపకపోతే తాము కూడా కృష్ణానదిపై ప్రాజెక్టులు కట్టుకొని నీటిని తీసుకుపోతామంటోంది. వాస్తవంగా కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతంకు పైగా తెలంగాణలో ఉంది. దీని ప్రకారం జలాల్లో వాటా 548 టీఎంసీలు దక్కాలని తెలం గాణ అంటున్నది. 32 శాతం మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నది. అయినా 512 టీఎంసీలు పొందుతున్నది. ఇది న్యాయమా అని ప్రశ్నిస్తు న్నది. పరివాహక ప్రాంతాన్ని అనుసరించి కేటా యింపులు జరపాలని తెలంగాణ కోరుతున్నది. అయితే, ప్రాజెక్టులు నిండకముందే, 834 అడుగులు శ్రీశైలం జలాలు చేరక ముందే తెలంగాణ అక్రమంగా విద్యుత్తును ఉత్పాదన చేసి రోజుకు 30 వేల క్యూసెక్కులు వాడు కుంటోందని ఆంధ్రప్రదేశ్ వాదన. కేంద్ర అనుమతులు లేకుండా అనేక ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టిం దని ఆరోపిస్తున్నది. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయడం వల్ల రోజుకు ఎనిమిది వేల క్యూసె క్కులకు పైగా నీరు సముద్రంలో వృథాగా పోతోందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విన్నవించుకుంది. కేంద్ర ప్రభుత్వం, జల సంఘం, కృష్ణా రివర్ బోర్డు నీటి కేటాయింపులను జరిపినప్పుడే సమస్యకు శాశ్వత పరి ష్కారం లభిస్తుంది. గత సమావేశాల్లో తెలంగాణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీనిచ్చింది. అందుకు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించు కోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం ఇచ్చిన హామీతో కేసును ఉపసంహరించుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పరిష్కారం ఉంది. జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
జల జగడం
సాక్షి నెట్వర్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద భారీగా మోహరించారు. అడ్డుకున్న తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసుల పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా డ్యామ్ వ ద్ద దాదాపు 240 మంది పోలీసులను మోహరించింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ఏపీ జలవనరులశాఖ అధికారులు బయలుదేరగా కుడి కా లువ ఎస్ఈ గంగరాజును తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. కాగా సాగర్ నూతన బ్రిడ్జి వద్ద గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ శాంతిభద్రతలను పరిశీలించారు. పులిచింతలలో వినతిపత్రం అందజేత మరోవైపు పులిచింతలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఏపీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు 300 మంది పోలీసులను ఉంచింది. పులి చింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లి వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. చెక్పోస్టులు.. ముమ్మరంగా తనిఖీలు.. కర్నూలు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. -
అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘కృష్ణానదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని మేం అంటున్నాం. కానీ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతోనే తాము ఎక్కువగా మాట్లాడడం లేదని ఏపీ సీఎం, మంత్రులు అనడం విచారకరం. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్లోగానీ, ఇతర ప్రాంతాల్లో గానీ నివసిస్తున్న సీమాంధ్రులు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా? రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇబ్బందులు పడ్డామని ఎవరైనా అన్నారా? ట్యాంక్ బండ్పై ఉన్న ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడి విగ్రహాన్ని అయినా తొలగించామా? తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను ఇక్కడివారు కలుపుకొని పోయి.. వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఏపీలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సులను అక్కడి స్టేషన్లలో ఆపనివ్వలేదు. తిరుపతిలో ఓ అధికారి మమ్మల్ని అవమాన పరిచిన ఘటన కూడా ఉంది..’’అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పాలమూరును ఎడారి చేసేలా అక్రమ ప్రాజెక్టులతో నీటిని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తోందని, పైగా తెలంగాణపై నిందలు మోపుతోందని శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం ఉండాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని.. మహారాష్ట్రకు నష్టం వాటిల్లకుండా వారిని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఏపీ కూడా అలాగే పైన ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందని భావించామన్నారు. శ్రీశైలం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అని, అలాంటిది విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. -
నీళ్లపై గరంగరం!
♦ ప్రాజెక్టుల్లో సరిపడా జలాలు లేకున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని, నీళ్లు వృథాగా పోతున్నాయని, ఆపాలని ఏపీ సర్కారు అంటోంది. తమ హక్కు మేరకే ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనిపై ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ♦ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు వైపులా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి. తెలంగాణ సర్కారు జూరాల వద్ద నిఘా పెట్టింది. ♦ ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్డీఎస్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద రెండు ప్లటూన్ల చొప్పన బలగాలను మోహరించింది. చెక్పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. నాగార్జునసాగర్/ధరూరు/అమరచింత/హుజూర్నగర్ (చింతలపాలెం)/దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి.. దానిని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ అధికారుల విజ్ఞప్తులు, ప్రయత్నాలతో పరిస్థితి వేడెక్కుతోంది. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద తమవైపు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించాయి. విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం ఆయా ప్రాజెక్టుల వద్ద తెలంగాణ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. వారిని ఇక్కడి పోలీసులు అడ్డుకుని, వెనక్కి పంపేశారు. ప్రాజెక్టుల సమీపంలో ఏపీ నుంచి వస్తున్న వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దీనితో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఏపీ కూడా తమవైపు బందోబస్తు కట్టుదిట్టం చేసింది. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 240 మందిని, పులిచింతల వద్ద 300 మందిని మోహరించింది. నాగార్జునసాగర్ వద్ద హడావుడి నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ.. గురువారం తెలంగాణ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న ఏపీ అధికారులను ఇక్కడి పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఏపీ అధికారుల నుంచి వినతిపత్రం తీసుకునేందుకు తెలంగాణ అధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇరువైపులా రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించాయి. పులిచింతల వద్ద 250 మందితో గస్తీ పులిచింతల ప్రాజెక్టులోని తెలంగాణ పవర్ హౌజ్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ప్రాజెక్ట్ ఎస్ఈ రమేశ్బాబు గురువారం టీఎస్ జెన్కో ఎస్ఈ దేశ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు డ్యాం వద్ద వారు భేటీ అయ్యారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వదిలితే.. సముద్రంలో కలవడం తప్ప ప్రయోజనం లేదని, విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు కోరారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జెన్కో ఎస్ఈ చెప్పారు. కాగా పులిచింతల డ్యామ్, పవర్హౌజ్ ప్రాంతాల్లో దాదాపు 250 మంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. సాగర్లో విద్యుత్ ఉత్పత్తితో పులిచింతలకు 36వేల క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తోంది. పులిచింతల టీఎస్ జెన్కో కేంద్రంలో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, 4 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. జూరాల దగ్గర భద్రత పెంపు కృష్ణా ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి అంశం వేడెక్కడంతో.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల వద్ద ప్రభుత్వం భద్రతను మరింతగా పెంచింది. మూడు రోజులుగా ఇక్కడ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టుపైకి వెళ్లే జీరో పాయింట్ దగ్గర, ప్రాజెక్టు కంట్రోల్ రూం సమీపంలో, జెన్కో జల విద్యుత్ కేంద్రం వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఉదయమే జూరాల ప్రాజెక్టుపై రాకపోకలను నిలిపివేశారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేట్లు మూసి, వాహనాలను నిలిపేస్తే ఎలాగని స్థానికులు, వాహనదారులు నిలదీయడంతో రాకపోకలకు అనుమతించారు. శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలను పూర్తిగా ఆపేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిఘా నీడలో శ్రీశైలం ఎడమ ప్లాంట్ తెలంగాణ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం, ఆ పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ వలయంలో ఉన్నాయి. వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గాల్లో నిఘా పెట్టారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ కేంద్రంలోకి ఇంజనీర్లు, ఉద్యోగులకు తప్ప ఇతరులెవరినీ అనుమతించడం లేదు. గురువారం అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు భూగర్భకేంద్రాన్ని సందర్శించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్దే: షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పూర్తిగా చర్చించామని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్ట్లు కట్టాలన్నా.. వాటికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్దేనని షెకావత్ స్పష్టం చేశారు. (చదవండి: ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం) ‘‘కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్లపై డీపీఆర్లను సమర్పించడానికి ఇరురాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారని’’ షెకావత్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ముందుగా డీపీఆర్లను సమర్పించిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్ల ప్రతిపాదనలు తేవాలని చర్చించామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి సంబంధించి సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగిందని, కృష్ణా రివర్ బోర్డ్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు ఇరురాష్ట్రాలు ఒప్పుకున్నాయని చెప్పారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పామని షెకావత్ తెలిపారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (రాష్ట్ర విభజన చట్టం) ప్రకారం “అపెక్స్ కౌన్సిల్” ఏర్పడిందని, నాలుగు సంవత్సరాల అనంతరం ఈ సమావేశం జరిగిందని షెకావత్ అన్నారు. 2016 లో తొలిసారి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో “అపెక్స్ కౌన్సిల్” సమావేశం జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకం, వివాదాల పరిష్కారం ఈ కౌన్సిల్ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, అన్ని సమస్యల పరుష్కర కోసం చాలా విపులంగా చర్చించామని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్య మంత్రులూ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారని షెకావత్ వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు.. ►కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ బోర్డుల పరిధి నోటిఫై చేస్తున్నాం ►కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు పంపడానికి అంగీకారం ►న్యాయ సలహా తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు పై నిర్ణయం ►సుప్రీం కోర్టు నుంచి కేసు ఉపసంహరణ చేస్తే నది జలాల పంపిణీ పై ట్రిబ్యునల్ ఏర్పాటు. కేసు ఉపసంహరణకు సీఎం కేసీఆర్ అంగీకారం ►కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయం ఆంధ్రాకు తరలింపు -
ఢిల్లీ: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
-
ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం జగన్తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం.. న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తన వాదన వినిపించినట్టు తెలిసింది. రాయలసీమ, ప్రకాశం దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం.. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను ఆయన అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. (చదవండి: బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం) ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ విమానాశ్రయానికి బయల్దేరారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరీ ఉన్నారు. -
అరవై ఏళ్లుగా గోస పడ్డాం...
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందని సీఎంకె.చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. ఆరు దశాబ్దా లుగా నీళ్లు లేక తెలంగాణ తీవ్ర అన్యాయానికి గురైందని, దీన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో సమన్యాయం జరిగేలా.. ప్రస్తుతమున్న ట్రిబ్యునల్తో నీటి కేటాయింపులు చేయించాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే సామ ర్థ్యాన్ని పెంచేలా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనులు... పునర్వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధంగా, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేలా ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు 14 పేజీల లేఖ రాశారు. రాత్రి 11 గంటలకు ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో ఇంతవరకు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగనున్న నేపథ్యంలో... సీఎం ముందుగానే లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ప్రజల మనో నివేదనం.. కృష్ణా, గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని ఎండగడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా కేసీఆర్ లేఖ రాశారు. అత్యున్నతస్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48గంటలపాటు శ్రమించి సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉత్తరాన్ని రూపొందించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, 60 ఏండ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునఃపరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిచూపుతూ కేంద్రానికి ఈ లేఖను ఎక్కుపెట్టారు. కేంద్రం తాత్సారం... అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్–3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేండ్లుగా ట్రిబ్యునల్కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్–3 క్రింద నివేదించాలని కేంద్రాన్ని కోరారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏం చేస్తున్నదని నిలదీశారు. పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని, రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్ఎంబీ నిరోధించలేకపోవడాన్ని కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. పోతిరెడ్డిపాడును ఆపండి.. వాస్తవంగా పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకే అనుమతి ఉంది. కానీ, ఏపీ కుట్రపూరితంగా దాని సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచిందని లేఖలో సీఎం కేంద్రం దృష్టికి తెచ్చారు. ఇదే అక్రమమంటే... దీన్ని 80వేల క్యూసెక్కులకు విప్తరించడం పూర్తిగా అక్రమం. శ్రీశైలం అట్టడుగు స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను మొత్తంగా రూ.24 వేల కోట్లతో చేపట్టింది. వీటిపై కేంద్రం, బోర్డుకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. పనులను నిలుపుదల చేయడంలో బోర్డు విఫలమైంది. ఈ పనులను తక్షణమే ఆపాలని సీఎం కోరారు. 2019– 20వ ఏడాదిలో 179 టీఎంసీల కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్కు తరలించారు. ఇది పూర్తిగా అక్రమమైనా బోర్డు పట్టించుకోలేదు. కావున తక్షణమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలి. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితో పాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వాటా జలాల మేరకే ప్రాజెక్టులు చేపట్టామని, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది తెలంగాణ హక్కులను హరించడమేనని, కావున ఏపీ ప్రాజెక్టులను అంగీకరించమన్నారు. ఈ విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలన్నారు. అవన్నీ పాతవే... తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని ఈ లేఖలో కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలో నుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని, ఇవేవీ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నుంచి దృష్టిని మరలించడానికి వేసిన ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించినవేనని సీఎం కేసీఆర్ ఆధారాలతో సహా వివరించారు. -
‘వన్ ట్రిబ్యునల్’ వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, అవి వెలువరించిన తీర్పులను పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం తెస్తున్న ‘వన్ నేషన్–వన్ ట్రిబ్యునల్’పై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. అంతర్రాష్ట్ర నదీజల వివాదాలను విచారించడానికి ప్రస్తుతమున్న వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి, ఒకే శాశ్వత ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఎప్పటిలోగా ఆమోదం దక్కుతుందనే సందిగ్ధత వీడటం లేదు. ప్రస్తుతం మొదలుకానున్న బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడేళ్లలో తీర్పులు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కృష్ణా, కావేరి, వంశధార, మహదాయి, రావి నదీ వివాదాలు సహా మొత్తంగా 8 ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ఏదైనా రాష్ట్రం వివాదాలపై చేసిన వినతిపై సంతృప్తి చెందినప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తూ వస్తోంది. అలాగే ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణలు పదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అయినా వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. దీన్ని దృష్ట్యా రాష్ట్రాల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనుంది. ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్పర్సన్గా ఉండనున్నారు. ఈ ట్రిబ్యునల్ రెండేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. ఈ బిల్లును 2017లోనే లోక్సభ ముందుకు తెచ్చినా, 2019 ఆగస్టులో సభ ఆమోదం పొందింది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని చూస్తున్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును తెలంగాణ గట్టిగా సమ్మతించింది. రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో వన్ ట్రిబ్యునల్ ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అని వేచి చూడాలి. ఆర్నెల్లుగా జరగని బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ.. ప్రస్తుతం కృష్ణానదీ జలాలను విచారిస్తున్న జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఆర్నెల్లుగా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే కృష్ణా వివాదాలపై పదేళ్లుగా విచారిస్తున్నా ఇంతవరకూ తుది తీర్పును ఇవ్వని ట్రిబ్యునల్.. ఆర్నెల్లుగా అయితే ఒక్క భేటీ నిర్వహించలేదు. ట్రిబ్యునల్లోని ఒక సభ్యుడు రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కేంద్రం ఇంతవరకు భర్తీ చేయకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న మళ్లీ భేటీ నిర్వహించాల్సి ఉన్నా అది జరిగేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెస్తున్న వన్ ట్రిబ్యునల్ బిల్లుతోనే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయంతో తెలంగాణ ఉంది. -
జల వివాదాలపై కదిలిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని జల వివాదాలపై కేంద్రం దృష్టి పెట్టింది. జల సమస్యలపై ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను చక్కబెట్టడం, కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించడం, వాటి పరిష్కారాలు, గ్రామీణ తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 11న హైదరాబాద్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి పర్యటనపై గురువారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. కృష్ణా, గోదావరి, కావేరి నదులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి సమావేశం జరిగింది. గతేడాది ఫిబ్రవరి 20న జరిగిన ఈ భేటీకి అప్పటి కేంద్ర జలవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగానే కృష్ణా బేసిన్లో నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోందని, భవిష్యత్తులో గోదావరి నదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరాన్ని తెలంగాణ నొక్కి చెప్పింది.గోదావరిలో నీరు ఎంత ఉందనే విషయంపై హైడ్రాలజీ సర్వే నిర్వహించాలని, తర్వాత మిగులు నీరు ఉంటేనే నదుల అనుసంధానంపై కేంద్రం ఆలోచించాలని సూచించింది. -
‘జల వివాదాల’ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు–2019 బిల్లును లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రవేశపెడుతూ, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధా నంలో మార్పు అవసరమన్నారు. ఓ కేసులో అయితే 33 ఏళ్లయినా వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని చెప్పారు. కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు నీటిని సృష్టించలేవనీ, అందరూ జల సంరక్షణపై దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని మంత్రి చెప్పారు. సభలో చర్చ సందర్భంగా కావేరీ జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సముదాయించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రాలను సంప్రదించేలా ఈ బిల్లులో నిబంధనలు లేవనీ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. బిల్లులో ఏముంది?: అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956ను సవరించేం దుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తా రు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది. -
కదిలిన కృష్ణా బోర్డు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై వాటర్ ఇయర్ దగ్గర పడుతున్నా ఇంకా కేంద్రం, బోర్డు దృష్టి సారించలేదంటూ ఈ నెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వాటా’ర్ వార్! కథనంపై కృష్ణా బోర్డు స్పందించింది. వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే సమస్యలు పరిష్కరించుకోకుంటే మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య నీటి వివాదాలు తప్పవన్న కథనం నేపథ్యంలో ఈ నెలాఖరులోగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 29 నుంచి 31 వరకు బోర్డు సమావేశాన్ని నిర్వహించే తేదీని ఖరారు చేసి తమకు తెలియజేయాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లకు లేఖలు రాశారు. మొత్తంగా 13 అంశాలను సమావేశపు ఎజెండాలో చర్చించాలని పేర్కొన్న ఆయన ఇతర అంశాలు ఏవైనా సూచిస్తే వాటిని ఈ నెల 18లోగా తమకు పంపాలని రెండు రాష్ట్రాలకు సూచించారు. వాటా.. నియంత్రణ.. టెలిమెట్రీలే కీలకం ఎజెండాలో 13 అంశాలను పేర్కొన్న బోర్డు ఇందులో ప్రధానంగా వర్కింగ్ మాన్యువల్, 2017–18 ఏడాదిలో నీటి వినియోగం, వచ్చే ఏడాది నీటి వాటాల వినియోగం, టెలిమెట్రీ అంశాలను చేర్చింది. ఇందులో వాటాల అంశం చాలా కీలకంగా ఉండనుంది. గతేడాది కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో నీటి వాటాలను ఏపీ, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో పంచుకున్నాయి. అయితే ఈ నిష్పత్తిని మార్చా లని తెలంగాణ కోరుతోంది. పట్టిసీమ, పోలవరంతో దక్కే వాటాలను దృష్టిలో పెట్టుకొని 61:39 నిష్పత్తి లో పెంచాలని కోరే అవకాశముంది. దీంతో పాటే కృష్ణాలో తమ వాటా 299 టీఎంసీలకు పట్టిసీమతో దక్కే వాటా 45 టీఎంసీలను కలపాలని ఎప్పటినుంచో పట్టుబడుతోంది. ఈ అంశమే బోర్డు సమావేశంలో అత్యంత కీలకంగా ఉండనుంది. బోర్డు వర్కింగ్ మాన్యువల్పైనా భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. ప్రాజెక్టులన్నింటినీ తామే నియంత్రిస్తామని ఇప్పటికే బోర్డు కేంద్ర జలవనరుల శాఖ ముసాయిదాను పంపింది. దీన్ని తెలంగాణ తప్పుపడుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఏపీ.. నియంత్రణ అవసరమంటూ పట్టుదలగా ఉండటంతో బోర్డు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు ఇప్పటికీ టెలీమెట్రీ మొదటి విడత ఏర్పాటుపై స్పష్టత లేదు. దీన్ని కూడా ఎజెండా అంశాల్లో బోర్డు చేర్చింది. -
ఒక దేశం.. ఒక ట్రిబ్యునల్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్రాం మేఘవాల్ ప్రకటించారు. నదీ జలాల వివాదాలన్నింటినీ ఇదే ట్రిబ్యునల్ పరిధిలోకి తెస్తామన్నారు. మార్చి–ఏప్రిల్లో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ఆమోదిస్తామని వెల్లడించారు. ‘‘ఒక్కో నది పరిధిలో ఒక్కో ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ తీర్పులు వెలువరించాక సైతం కొన్ని రాష్ట్రాలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. నదుల వారీగా ట్రిబ్యునల్స్ ఉండడం వల్ల డబ్బు, కాలం వృథా అవుతోంది. దీనికి విరుగుడుగా ఒకే ట్రిబ్యునల్ అవసరం. అన్ని నదీ వివాదాలను దీని పరిధిలోకి తెస్తాం. ఇకపై రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునళ్లు ఉండవు. ఇప్పటికే ఆయా ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్న కేసులన్నింటినీ ఒకే ట్రిబ్యునల్ కిందకు తెచ్చి సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం’’అని మేఘవాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తాజ్ వివాంటా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ నుంచి మంత్రి హరీశ్రావు, సీఎస్ ఎస్కే జోషి, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూలు హాజరు కాగా ఏపీ సహా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు గైర్హాజరయ్యారు. ఏపీ తరఫున అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సలహాదారు రామకృష్ణ, కర్ణాటక, తమిళనాడు తరఫున జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్రావు, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూ, కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందూ, సీడబ్ల్యూసీ చైర్మన్ మాజిద్ హుస్సేన్తో కలసి మేఘవాల్ మీడియాతో మాట్లాడారు. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల తొలి సమావేశం జయప్రదంగా ముగిసిందన్నారు. దీన్ని దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సమా వేశం హైదరాబాద్ డిక్లరేషన్గా పిలవవచ్చన్నారు. తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల మధ్య సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆరు వారాల్లో కావేరి మేనేజ్మెంటు బోర్డు, కావేరి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెంచుతామని, నా బార్డు వంటి సంస్థలు లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణలో మిషన్ కాకతీ య మాదిరే తమ రాష్ట్రంలోని 1,200 చిన్న, 80 పెద్ద చెరువుల పునరుద్ధరణకు కేంద్రం సహకరించాలని కోరినట్లు పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు తెలిపారు. -
మళ్లీ ట్రిబ్యునల్కే!
♦ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అఫిడవిట్ దాఖలు చేయనున్న రాష్ట్రం ♦ ఈ నెల 23 నుంచి ట్రిబ్యునల్ సమావేశాలు ♦ ఆలోగా అఫిడవిట్ వేసేందుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రిబ్యునల్నే ఆశ్రయించనుంది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యా యాన్ని వివరిస్తూనే.. వాటిని సవరించాల్సిన ఆవశ్యకతను అఫిడవిట్ రూపంలో తెలిపే అవ కాశం ఉంది. ఈనెల 23 నుంచి ట్రిబ్యునల్ సమా వేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ దాఖలు చేసే అవకాశాలు న్నట్లు నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రాన్ని 2014లోనే ఆశ్రయించినా.. నీటి కేటాయింపుల్లో తమకు జరిగిన అన్యాయా న్ని సవరించాలంటూ రాష్ట్రం 2014లో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం చేసిన అభ్యర్థనపై సెక్షన్ 3 ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా అలా చేయలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బీ)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. అయితే తెలంగాణ అవసరాలను, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచార ణ చేయాలని కేంద్రం స్పష్టంగా సూచించనం దున రాష్ట్రానికి ట్రిబ్యునల్ న్యాయం చేయలేదు. దీంతో రాష్ట్రం 2015లోనే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని అప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో కోర్టు జతపరిచింది. దీనిపై విచారణ జరుగుతుండగానే బ్రిజేశ్ ట్రిబ్యునల్.. నదీ జలాల కేటాయింపులను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ గతేడాది అక్టోబర్ 19న తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించిన తెలంగాణ ఎస్ఎల్పీ దాఖలు చేసింది. తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్ను కొట్టివేయడంతో ఇక ప్రధాన పిటిషన్ల విచారణపైనే తెలంగాణ ఆశలు పెట్టుకుంది. ఇక అఫిడవిట్ ఇవ్వాల్సిందే.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తన తీర్పు సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని తెలంగాణ, ఏపీలకు సూచించింది. అయితే సుప్రీంలో వేసిన ఎస్ఎల్పీని దృష్టిలో ఉంచుకొని అఫిడవిట్ దాఖలుకు గడువు కోరగా... అందుకు ట్రిబ్యునల్ ఇప్పటిదాకా సమ్మతిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఎస్ఎల్పీని కొట్టి వేసినందున కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జల జగడాలు ఆగుతాయా?
రాష్ట్రాల మధ్యా, ప్రాంతాలమధ్యా తరచు నిప్పును రాజేస్తున్న నీళ్ల సమస్యకు పరిష్కారం కోసం శాశ్వత ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి 1956నాటి అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టానికి అవసరమైన సవరణలు తీసుకురావాలని ఈమధ్యే మంత్రి వర్గం నిర్ణయించింది. మూడు కాలాలూ, ఆరు రుతువులూ సక్రమంగా ఉంటే... పుష్కలంగా వర్షాలు పడితే నదులన్నీ జీవ జలాలతో ఉప్పొంగుతాయి. వాపీ, కూప, తటాకాలన్నీ జలసిరితో తొణికిసలాడతాయి. తాగునీరూ, సాగునీరూ కావల సినంత లభిస్తుంది. నీరు నాదంటే నాదన్న వ్యర్థ వివాదాలుండవు. సమస్యల్లా రుతు పవనాలు ముఖం చాటేసినప్పుడే... ఆకాశం చినుకు రాల్చనప్పుడే! అప్పుడు పంట పొలాలకే కాదు, గొంతు తడుపుకోవడానికి కూడా ఇబ్బందులెదురవుతాయి. ఆ గడ్డు పరిస్థితుల్లో జల యుద్ధాలు మొదలవుతాయి. రాష్ట్రాలమధ్యే కాదు...ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాలమధ్య కూడా కొట్లాటలు ప్రబలుతాయి. మన దేశంలో రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు తక్కువేమీ కాదు. వీటి పరిష్కారం కోసం ఇప్పటి వరకూ అయిదు ట్రిబ్యునళ్లు– కృష్ణ, వంశధార, కావేరి, రావి–బియాస్, మహాదాయి వివాదాల కోసం ఏర్పాటయ్యాయి. చిత్రమేమంటే ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ఫలితంగా ఒక్కటంటే ఒక్క వివాదం కూడా సమసిపోయిన దాఖలా లేదు. అవి దశాబ్దాలుగా సెగలూ, పొగలూ కక్కుతున్నాయి. హింసనూ, విధ్వం సాన్నీ సృష్టిస్తున్నాయి. ట్రిబ్యునళ్లు సకాలంలో సక్రమంగా తీర్పులిచ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎప్పటికో తీర్పులిచ్చినా తదుపరి చర్యలు అంతకన్నా నత్తనడకన నడుస్తున్నాయి. కావేరీ ట్రిబ్యునల్ ఎడతెగని జాప్యం తర్వాత 2007లో తుది అవార్డు ప్రకటించగా దానిపై విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ కోసం కేంద్రం మరో ఆరేళ్ల సమయం తీసుకుంది. సాధారణ సంవత్సరాల్లో తమిళనాడుకు కర్ణాటక 192 టీఎంసీల నీరు విడుదల చేయాలన్నది ట్రిబ్యునల్ తీర్పు సారాంశం. ఈ తీర్పుపై కర్ణాటక సుప్రీంకోర్టుకెక్కింది. అదే వివాదంలో తమిళనాడుకు రోజుకు 1.3 టీఎంసీల చొప్పున పదిరోజులపాటు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మూడు నెలలక్రితం కర్ణాటకలో ఏ స్థాయిలో ఆగ్రహావేశాలు రగిల్చాయో అందరూ చూశారు. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న నీటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాలూ వాటా పొందాల్సి ఉంటుందంటూ ట్రిబ్యునల్ ఇటీ వల ఇచ్చిన తీర్పు సైతం ఉభయ రాష్ట్రాల్లోనూ అసంతృప్తి కలగజేసింది. చూడగానే కేంద్రం చేసిన ఆలోచన ఉత్తమమైనదని ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడున్న తాత్కాలిక ట్రిబ్యునళ్లకు బదులు ఏర్పాటయ్యేది ఏదైనా మెరుగైనదన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ సమస్య ట్రిబ్యునల్ స్వభావానికి సంబంధిం చిందా? శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటైతే జరిగేదేమిటి? వివాదంపై శరవేగంతో విచారించడానికి తాత్కాలిక ట్రిబ్యునల్కు ఉండే అడ్డంకులేమిటి... దీనికి లేకుండా పోయేవి ఏమిటి? వివాదం తలెత్తడానికీ, దానిపై తాత్కాలిక ట్రిబ్యునల్ ఏర్పా టుకూ మధ్య ఇప్పుడైతే సుదీర్ఘ సమయం తీసుకుంటున్న మాట వాస్తవం. శాశ్వత ట్రిబ్యునల్ ఉంటే ఫిర్యాదులు నేరుగా దానికే వెళ్తాయి. వివాదంపై ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలో, లేదో అది నిర్ణయిస్తుంది. చూడటానికి ఇది బాగానే ఉన్నా... ఆ ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకైనా ట్రిబ్యునల్కు వ్యవధి పట్టదా? దానికి ముందు అన్ని పక్షాల వాదనలూ వినాల్సిన అవసరం ఉండదా? పైగా అప్పుడుండేది ఏకైక ట్రిబ్యు నల్ కనుక అన్ని వివాదాల భారాన్నీ అదొక్కటే మోయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న అయిదు ట్రిబ్యునళ్ల పనే కాదు... భవిష్యత్తులో వివాదాలు తలెత్తగలవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులయ్యే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చూడాల్సివస్తుంది. బెంచ్ ఏర్పాటు అవసరమో, కాదో నిర్ణయించాలి. ఆయన ఇచ్చే తాత్కాలిక ఆదేశాలైనా, తుది తీర్పులైనా మళ్లీ సుప్రీంకోర్టు ముంగిటకు వెళ్లవన్న గ్యారెంటీ ఏం లేదు. సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాలనే ధిక్కరిస్తూ అసెంబ్లీలు తీర్మానాలు చేస్తుంటే ఈ ట్రిబ్యునల్ డిక్రీలకు ఏపాటి విలువుం టుందో చెప్పలేం. ఏ వివాదంపైన అయినా ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పు నివ్వాలని నిబంధన విధించినట్టు చెబుతున్నారు. కావేరీ వివాదంపై 1990లో ట్రిబ్యునల్ ఏర్పాటైతే అది తుది తీర్పు వెలువరించేసరికి 17 సంవత్సరాలు పట్టింది. దానిపై కేంద్రం నోటిఫికేషన్కు మరో ఆరేళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో మూడేళ్లలోనే తీర్పు వెలువరించడం సాధ్యమేనా? ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి జాప్యానికి రాష్ట్రాల్లోని పాలకులకు ఉండే రాజకీయ ప్రయోజనాలు... కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న పాలకులకు ఆయా రాష్ట్రాల్లో ఉండే స్వప్రయోజనాలు మూల కారణమని ప్రతి ఒక్కరికీ తెలుసు. తమ తమ రాష్ట్రాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి వివాదంలో తాము వీరోచితంగా పోరాడుతున్నామన్న అభిప్రాయం కలిగించడానికి పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అందుకోసం ఎంతవరకైనా వెళ్తున్నాయి. కనుక సమస్య మూలాలు వేరే చోట ఉన్నాయని ముందుగా గుర్తించాలి. అలాంటి రాజకీయ జోక్యాన్ని మొగ్గలోనే తుంచాలి. ఏ వివాదంపైన అయినా వెలువరించే తీర్పులకు నిపుణులిచ్చే సశాస్త్రీయమైన నివేదికలే గీటురాయి కావాలి. ఆ నిపుణుల తటస్థతపై, వారి సమర్ధతపై వివాదంలోని అన్ని పక్షాలకూ విశ్వాసం ఉండాలి. మూడేళ్లక్రితం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా సగటు వార్షిక నదీ ప్రవాహ పరిమాణాన్ని పరిశీలించడానికి 47 సంవత్సరాల సమాచారాన్నే తీసు కుంది. ఎగువ రాష్ట్రాల్లో అనావృష్టి ప్రాంతాలకు ఉదారంగా కేటాయింపులు చేసిన ట్రిబ్యునల్... దిగువ రాష్ట్రాలకు రిక్త హస్తం చూపింది. ఇలాంటి అశాస్త్రీయమైన, అహేతుకమైన నిర్ణయాలు దిగువ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తాయి. నీరు వంటి సహజ వనరుపై వాటాలను తేల్చడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను వివాదానికి దారితీస్తుంది. ట్రిబ్యునల్ ఎలాంటిదని కాక దాని సమర్ధత, చురుకుదనం, నిష్పాక్షికత, నైపుణ్యం ఏపాటి అన్న అంశాల ప్రాతిపదికనే దానికి విశ్వసనీయత ఏర్పడుతుందని గుర్తించాలి. -
జల జగడాలతో జాతుల వైరాలు
సమకాలీనం గాలిలాగే నీరు కూడా మానవాళి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగానే ఎక్కడి నీటిపై అక్కడి వారికి హక్కులు సంక్రమిస్తాయనే వాదనని ఇటీవల మానవహక్కుల కార్యకర్తలతోపాటు, ఆ సంస్థలు కూడా ముందుకు తెస్తున్నాయి. వారు వినియోగించుకోగా మిగిలినవి నది దిగువకు వస్తాయనేది ఆలోచన. దీంతో, నది దిగువ ప్రాంతపు హక్కులు, నికర జలాలు, మిగులు జలాలు, దామాషా వాటా... తదితర పదాలకు కాలం చెల్లిందనేది వారి వాదన. జలజగడాలు విశ్వవ్యాప్తం. అంతటా ఉన్నాయి, ఇక్కడా ఉన్నాయి. అవసరా లకన్నా జలవనరులు తక్కువున్నపుడు తగవులు తప్పవు. గోదావరి గొడవల కన్నా, కృష్ణా కిరికిరి ఎక్కువుండటానికి అదే కారణం. కృష్ణాలో డిమాండ్ ఎక్కువ, నీటి లభ్యత తక్కువ కావడం అంతర్రాష్ట్ర జలవివాదాలకు ఆజ్యం పోస్తోంది. సమస్య కన్నా పరిష్కారం సంక్లిష్టమైనపుడు పర్యవసానాలూ బాధాకరమే! కృష్ణానది నీటి పంచాయితీలు ఎడతెగని సమస్యగా పరిణమి స్తున్నాయి. ఇప్పుడు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు మింగుడు పడటంలేదు. ఎందుకంటే, తీర్పు అను కూలంగా లేదనేది ఒక బాధయితే, సదరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇంకా బాధను కలిగిస్తున్నాయి! తీర్పును అన్వయించుకుంటున్న తీరులోని స్వీయ అపరిపక్వత బాధకు మరింత కారణమౌతోంది. వెరసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీరని అసంతృప్తితో రగులుతున్నాయి. ఆపత్కా లంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే ప్రతికూ లంగా వ్యవహరించిందనే కోపం ఇద్దరికీ ఉంది. ఇక సుప్రీంకోర్టు తలుపు తట్టడమే తరుణోపాయమంటున్నాయి దాదాపు రెండు ప్రభుత్వాలు. ఇది వరకే సుప్రీం ధర్మగంటను మోగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్తి ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఫలితంగా, నీటి తాజా పంపకాలకు సంబం ధించి ట్రిబ్యునల్ ఇచ్చిన అంతిమ అవార్డు (29 నవంబర్-2013) ఇంకా ‘గజెట్’రూపం పొందలేదు. నిర్దిష్ట అభ్యంతరాలతో ఉమ్మడి ఏపీ సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ వేసింది. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అమలుకు ప్రాతి పదిక అయ్యేది ఆ తీర్పే! సదరు తీర్పుకై నిరీక్షించడమా? ఈ లోపున్నే మరో మారు కోర్టు మెట్లెక్కడమా? ఇదీ ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న ప్రశ్న. ట్రిబ్యునల్ తాజా తీర్పు ప్రతిని చూసి, నిపుణులతో లోతుగా చర్చించి వ్యూహాత్మకంగా అడుగేయాలనుకుంటున్నట్టు ప్రభుత్వాలు సంకేతాలిస్తు న్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతాలైన నాలుగు రాష్ట్రాల్నీ కలిపి పంపకాల పునరాలోచన చేయాలన్న తెలుగు రాష్ట్రాల ప్రతిపాదనను ట్రిబ్యునల్ తోసి పుచ్చి, ‘ఇది కొత్తగా ఏర్పడ్డ మీ రెండు రాష్ట్రాల వ్యవహారమే’ అని తేల్చడంతో వారికి పాలుపోవటం లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రివర్ వ్యాలీ అథా రిటీల ఏర్పాటు డిమాండ్ తెరపైకి వస్తోంది. సుస్థిరాభివృద్ధి నమూనాలో ప్రతిపాదించినట్టు ప్రకృతిగతమైన సహజ పద్ధతుల్లో ఎక్కడి నీరక్కడ నిల్వ చేయడం, ప్రత్యామ్నాయ జలవనరుల్ని మెరుగుపరచడం, సంప్రదాయ పరి జ్ఞానాన్ని వినియోగించడం అన్న పంథాలో వెళితే తప్ప పరిష్కారాలు దొరక వన్నది జల వ్యవహారాల నిపుణుల భావన. రాజకీయాంశం ప్రభావితం చేసిందా? కృష్ణా ట్రిబ్యునల్ ఇప్పుడిచ్చిన తీర్పు నిజానికి నీటి కేటాయింపులకు సంబం ధించి కాదు. తాజా వివాద పరిష్కారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతాలయిన మహారాష్ట్ర, కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాల్ని కలిపి చేయాలా? అనే అంశాన్ని తేల్చింది. మహారాష్ట్ర, కర్ణాటకకు ఇదివరకే చేసిన నీటి కేటాయింపుల్ని ముట్టు కోవద్దు, తాజా వివాదాన్ని విభజనతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయండంటూ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్కిచ్చిన (25 ఆగస్టు 2014) అఫిడవిట్టే ఈ తీర్పును ప్రభావితం చేసిందనే అభిప్రాయముంది. సదరు అఫిడవిట్ ఇప్పించడంలో ఆ రెండు రాష్ట్రాల రాజకీయ లాబీలు గట్టిగా పనిచేశాయి. మహారాష్ట్రలో అధికార పక్షంగా, కర్ణాటకలో అధికారం ఆశిస్తున్న పార్టీగా బీజేపీ నాయకత్వం అఫిడవిట్టు ఇప్పిచ్చే వ్యవహారాన్ని తనకను కూలంగా నడిపిందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వవర్గాలు భావించడం సహజం. ముఖ్యమైన నదులన్నీ పలు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తూ, తరచూ వివాదాలు రగిలే సమాఖ్య రాజ్యంలో ఇప్పటివరకు జాతీయ జలవిధానం లేకపోవడమే దారుణం. రాజకీయ అవకాశవాదమే ఇందుకు కారణమనేది మేధావివర్గం విమర్శ. నదీజలాల వినియోగం తమ చెప్పుచేతల్లో ఉండాలని, అంతర్రాష్ట్ర వివాదాలను, తద్వారా తలెత్తే ప్రజల మనోభావాలు- ఉద్విగ్న తల్ని తమ తమ రాజకీయ అవసరాలకు ఎరగా వాడుకునే ఎత్తుగడతోనే పార్టీలు ‘స్వతంత్ర నదీలోయ ప్రాధికార సంస్థ’ల ఏర్పాటుకూ మోకాలడ్డు తున్నాయనేదొక విమర్శ. సమస్య తీవ్రతను, అంటే నీటి పంపకాలతో పాటు ఏయేటి కాయేడు లభ్యత-వినియోగావకాశాల్ని ట్రిబ్యునల్ సహజ న్యాయ సూత్రాల ప్రకారం పరిశీలించడం లేదని దిగువ రాష్ట్రాలు అరోపిస్తున్నాయి. ఎగువనున్న మహారాష్ట్ర-కర్ణాటకతో కలిపి కాకుండా, కేవలం తెలంగాణ- ఏపీల మధ్యే వివాదం పరిష్కరించుకొమ్మని చెబితే తాము కొత్త వ్యూహాలు అనుసరించాల్సి వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఫలి తంగా తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త స్పర్థలకు, వివాదాలకు ఆస్కారమేర్పడు తోంది. క్యారీ ఓవర్ కింద వంద టీఎమ్సీలు, పోలవరం-పట్టిసీమ ప్రాజె క్టులు కడుతున్నందున, ఇదివరకటి ఒప్పందం ప్రకారం తమకు వాటాగా రావా ల్సిన తొంభయ్ (45+45) టీఎమ్సీలు, మొత్తం 190 టీఎమ్సీలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం, వారి ఈ యత్నాల్ని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఎత్తుగడల్లో ఉన్నాయి. అన్ని విధాలా పునరాలోచన అవసరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రస్తుత వ్యవహారం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే అనడం సబబే! అయితే, ఇక్కడ ఒక విషయాన్ని ఎగువ రాష్ట్రాలతో పాటు ట్రిబ్యునల్ కూడా పెడచెవిని పెట్టింది. నదీజలాల పంపిణి అన్నది ఫక్తు అన్నదమ్ముల ఆస్తి పంపకాల వంటిదనే వాదన తప్పు! ఎలా అంటే, ఓ కుటుంబంలోని ఉమ్మడి సంపద ఏ రూపంలో ఉన్నా, ఒకసారి పంపిణీ ద్వారా... తదనంతర కాలంలో పరస్పరం సంబంధం లేని విధంగా వేర్పరచగల ఆస్తి అది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు వాటాదారుల మధ్య కూడా పంపిణి చేయొచ్చు. ఉదాహరణకు: నలుగురు సోదరుల్లో ఇద్దరు ముందే విడిపోయినా, చివరి ఇద్దరు కొన్నేళ్లు కలిసుండి, తాజాగా వారిద్దరూ విడిపోతామంటే.... చివరి పంపిణీ వారిద్దరి మధ్యే పరిమితమౌతుంది. కానీ, నదీజలాలు అలా కాదు. వేరుపడ్డ తర్వాత కూడా సంబంధముండే వ్యవహారాలుంటాయి. తెలుగు రాష్ట్రాలు లేవనెత్తు తున్న అభ్యంతరాల్లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి: రాష్ట్ర పునర్విభజన తర్వాత కొనసాగింపు పొందిన ట్రిబ్యునల్ పరిశీలనాంశాల పరిధిలో అంతర్రాష్ట్ర వివాద పరిష్కారంతో పాటు నదిలో ‘తక్కువ నీటి ప్రవాహం ఉన్నపుడు’ నీటి నిర్వహణ నిబంధనావళి (ఆపరేషనల్ ప్రోటో కాల్)ని ఖరారు చేయడం. అందుకే ప్రాజెక్టుల వారీ కేటాయింపుల అంశం ముందుకొచ్చింది. ఎగువ రెండు రాష్ట్రాల్లో జలాల స్థూల కేటాయింపులు జరిపి, కింది రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులంటే, సమతూకం లేకుండా ఆపరేషన్ ప్రోటోకాల్ ఎలా ఆచరిస్తారు? అన్నది తెలుగు రాష్ట్రాల అభ్యంతరం. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఏపీ న్యాయవాది ఎ.కె. గంగూలీ సమర్థంగా వినిపించే యత్నం చేసినా ట్రిబ్యునల్ పట్టించుకున్నట్టు లేదు. రెండు: ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఎగువ రాష్ట్రాలు తమ రిజర్వాయర్లలో నీటిని నింపుకుంటూ వెళితే... సీజన్ ఆలస్యమైనప్పుడు, వర్షాలు తక్కువగా కురిసినప్పుడు దిగువ రాష్ట్రాల పరిస్థితేమిటి? కోటా నింపుకునే వరకు దిగువకు చుక్క నీరొదలరు. ఇందుకు ట్రిబ్యునల్ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమిటి? శూన్యం. సీజన్ల వారీగా నీటి లభ్యతను బట్టి అన్ని రాష్ట్రాల మధ్య దామషా పద్ధతినైనా పంపకాలు జరపాలి. ఇదిలేని దుస్థితి వల్లే అక్టోబర్ వరకు కిందికి నీటిని వదలటం లేదు. ఇక.. నికర జలాలనో! మిగులు జలాలనో! దిగువ రాష్ట్రాలకు ఎన్ని టీఎమ్సీలు కేటా యిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? దిగువన సాగే జరగదు కదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మారిన వాతావరణ, భౌగోళిక, నిర్వహణా పరిస్థితుల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్ని కలిపి తాజాగా ఆలోచన చేయాలన్నది ఆ విజ్ఞప్తి వెనుక భావన. ఒక నది బేసిన్ నుంచి ఇతర నదీపరీవాహక ప్రాంతా లకు కూడా ఎగువ రాష్ట్రాల్లో యథేచ్ఛగా నీటి మళ్లింపులు జరుగుతున్నందున పునరాలోచన, తాజా పరిశీలన అవసరమని దిగువ రాష్ట్రాలంటున్నాయి. ఇందుకు పూర్తి భిన్నమైన వాదన కూడా ఉంది. గాలిలాగే నీరు కూడా మాన వాళి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన సహజవనరు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగానే ఎక్కడి నీటిపై అక్కడి వారికి హక్కులు సంక్రమిస్తాయనే వాదనని ఇటీవల మానవహక్కుల కార్యకర్తలు, సంస్థలు ముందుకు తెస్తున్నాయి. వారు వినియోగించుకోగా మిగిలినవి నది దిగువకు వస్తాయనేది ఒక ఆలోచన. దీంతో, నది దిగువ ప్రాంతపు హక్కులు, నికర జలాలు, మిగులు జలాలు, దామాషా వాటాలు... తదితర పదజాలానికి కాలం చెల్లిందనేది వారి అభిప్రాయం. నది దిగువ ప్రాంతపు హక్కులనే వాదనను వరల్డ్వాటర్ ఫోరమ్ కూడా కొట్టివేసిందని వారు ఉటంకిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలే పరిష్కారం కృష్ణా తొలి ట్రిబ్యునల్ బచావత్ (‘ఏ’స్కీమ్)లోనే నదీలోయ ప్రాధికార సంస్థ (ఆర్వీయే)ల ఏర్పాటు ప్రతిపాదన ఉంది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాక ‘బి’ స్కీమ్కు వెళ్లారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఆర్వీయే బిల్లు తేవాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాటిని కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో ఉంచాలని ముసాయిదాలో ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, మళ్లీ అంతా రాజకీయమే! అలా కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా తేవాలి. అవసరాన్ని బట్టి సుప్రీంకోర్టు మాత్రమే జోక్యం చేసుకోవాలి. పాలకుల ఆలోచనల్లోనూ మార్పు రావాలి. పెద్ద పెద్ద ప్రాజె క్టులు మాత్రమే పరిష్కారంకాదు. అత్యధిక ప్రాజెక్టులున్న మహారాష్ట్రలోనే కరవులెక్కువ, రైతు ఆత్మహత్యలెక్కువ. హనుమంతరావు వంటి నిపుణులు చెబుతున్నట్టు సంప్రదాయక ప్రత్యామ్నాయాలపై శ్రద్ధ పెట్టాలి. వాన నీటిని ఎక్కడికక్కడ నిలపాలి. ఉపరితల, భూగర్భ జలమట్టాల్ని మెరుగుపరచాలి. తేమ పెంచే- పరిరక్షించే ప్రక్రియల్ని బలో పేతం చేయాలి. రెండు దశాబ్దాల కింద, 1996 మే నెల, ‘రాజ్యం-సంక్షేమం’ అంశంపై విశాఖపట్నంలో జరిగిన సెమినార్లో దివంగత మేధావి కె. బాలగోపాల్ చెప్పిన మాట మననం చేసు కోవాలి. ‘‘గాలిలాగే నీరు ప్రకృతి వనరు. అందరికీ సమానంగా అందు బాటులో ఉండాలి. ఇదొక మౌలిక ప్రజాస్వామ్య సూత్రమని నేననుకుం టాను. ఈ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నా అంచనా ఏంటంటే, అన్నిరకాల నీటివనరుల్నీ కలిపి అందరూ వాడుకునేటట్టయితే.. ప్రతి ఎక రాకూ ఒక పంటకు నీరివ్వచ్చు. ఈ మాట కొన్ని ప్రాంతాల వాళ్లకి పెద్ద విషయం అనిపించకపోవచ్చు. కానీ, అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ మాటంటే వాళ్లెంత ఆనందపడతారో! ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది. నీళ్లు అనే వనరును పంచకోవడం ఒక ప్రజాస్వామిక సూత్రంగా అన్ని ప్రాంతాల వాళ్లు- ఒక ప్రాంతానికి వ్యతిరేకం, ఇంకొక ప్రాంతానికి అను కూలం అని కాదు- ఒప్పుకోవాలి’’ దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
నీటి జగడాలకు నీళ్లొదలాలి!
సమకాలీనం తాగు-సాగునీటి వినియోగం, విద్యుదుత్పత్తి... తదితరావసరాలకిచ్చే ప్రాధాన్యతల విష యంలో రాజకీయ నిర్ణయాలు తరచూ విమర్శలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. ఇవి రాష్ట్రాల మధ్యే కాకుండా, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్యా వివాదాలకు దారి తీస్తున్నాయి. వీటన్నటి దృష్ట్యా... రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలనే సూచన వస్తోంది. కాలానుగుణంగా మారడమే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమవుతుంది. మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే భూగ్రహం మీద మూడింట రెండొం తులుగా ఉన్న నీరే కారణమవుతుందని లోగడ ఎవరో మేధావి చెప్పిన మాటలు తరచూ ప్రస్తావనకు వస్తుంటాయి. వ్యక్తుల మధ్య, జన సమూహాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య... ఇలా వివిధ స్థాయిల్లో నీటి పోరాటాలే కాకుండా ఇతరేతరంగా నీటి ఉపద్రవాలూ కారణం కావచ్చేమోనని ఇటీవలి పరిణామాల్ని బట్టి భావించాల్సి వ స్తోంది. కాలుష్యం వల్ల భూతాపోన్నతి పెరిగి ధృవాల్లో కరుగుతున్న మంచు నీరై జనావాసాల్ని ముంచేసే ప్రమా దమైనా కావచ్చు! వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో వరదలు ముంచెత్తో, కరువులు కాటేసో రాష్ట్రాలు, దేశాల ఆర్థిక-రాజకీయ అస్థిరతతో కావచ్చు! నీటి ఉపద్రవాలు, ప్రపంచ యుద్ధం సంగతలా ఉంచినా.... మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య తరచూ వివా దాలకు నదీజలాలే కారణమవుతున్నాయి. అంతర్రాష్ట్ర నదీజలాల పంపకం, వాడకం, ప్రాజెక్టుల నిర్మాణాలు, వాటిల్లో నీటిని నిలుపుకోవడం, వదలడం.... వంటివి ఎడతెగని వివాదాల్ని పుట్టిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల నడుమా ఇదొక కార్చిచ్చులా రగులుతోంది. రెండు జీవ నదుల్లో గోదావరి కన్నా కృష్ణా విషయంలో ఈ వివాదం జటిలంగా ఉంది. రెండు రాష్ట్రాల పరస్పర విరుద్ధ భావనలు-వాదనలతో ముదురుతున్న ఈ వివాదం మున్ముందు మరే విపత్తుకు దారితీస్తుందోనన్న సందేహలు కలుగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సత్వరం చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారాల్ని యోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా దీన్ని రాజ కీయాంశంగా మారనీయకుండా చూడాలి. రాజకీయ పక్షాలు, నాయకులు తమ అవసరాలకు వాడుకొని, జీవనాధారపు నీటితో ముడివడ్డ ప్రజల మనోభావాల్ని రెచ్చగొడితే, సరిదిద్ద వీలుకాని నష్టాల్ని రెండు రాష్ట్రాల ప్రజలు చవిచూడాల్సి వస్తుంది. నిన్నటికి నిన్న కావేరీ జల వివాదం వల్ల తమిళులు-కన్నడిగుల మధ్య రగిలిన ద్వేషాగ్నుల వేడి బెంగళూరు, చెన్నై నగరాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. ముఖ్యంగా బెంగళూరులో చెలరేగిన హింస నగరం బ్రాండ్ ఇమేజ్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బలంగా వేళ్లూనుకున్న ఐ.టి. పరిశ్రమ తొలసారి కంగుతిన్నది. జరిగిన ప్రాణహానితో పాటు ఆర్థిక నష్టం ఒక్క బెంగళూరులోనే పాతికవేల కోట్ల రూపాయలని ‘అసోచామ్’ పేర్కొంది. సమాఖ్య రాజ్యమైనా నిర్దిష్ట జాతీయ జలవిధానం లేకపోవడం, ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పుల్లో జాప్యాలు, వాటి అమలులో లోపాలు, పాలకపక్షాల ఓటు రాజకీయాలు.. వెరసి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. రాష్ట్రాలకు, రాజకీయాలకు, పాలకపక్షాల ఇష్టాయి ష్టాలకతీతంగా పనిచేసే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థల్ని ఏర్పాటు చేయాలన్న వాదన తెరపైకి వస్తోంది. నిన్నొకపోరు-నేడింకొకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలకోసం ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో తగాదా పడేది. నీటి కేటాయింపుల నుంచి ప్రాజెక్టుల నిర్వ హణ-నీటి విడుదల వరకు అన్నీ పంచాయితీలే! విభజన తర్వాత ఆ పంచాయితీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చైర్ పర్సన్గా ఢిల్లీలో బుధవారం జరిగిన ఉన్నత మండలి (అపెక్స్ కౌన్సిల్) సమావేశంలో ఇద్దరు సీఎంలు చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడులు తమ మంత్రులు, ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. ఇందులో అంగీకారం కుదిరినవి మూడంశాలు కాగా, ఏదీ ముడివడని వివాదాంశాలే ఎక్కువ! కేటాయించిన నికర జలాల ఆధారంగా కాకుండా మిగులు జలాల్ని ఆధారం చేసుకొని ప్రాజెక్టులు కడుతున్నారని, వాటికి అనుమతుల్లేవని, చట్ట విరు ద్ధమనే వాదనతో రెండు రాష్ట్రాలు, ప్రత్యర్థి రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అనుమతులు లేనివని ఏపీ అంటే, అలా అయితే అక్కడి గాలేరు-నగరి, హంద్రీ-నీవా, పట్టిసీమ అటువంటివే అని తెలంగాణ తిప్పికొడుతోంది. గోదావరి కన్నా కృష్ణానదితోనే ఎక్కువ సమస్య. ఎందుకంటే, ఈ నదిలో నీళ్లు, ఆధారపడదగ్గ పరిస్థితి తక్కువ, నీటి అవసరాలు ఎక్కువ! ఈ నది ఎక్కువగా మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతమే! వర్షపాతం ఎక్కువగా లేని ప్రాంతాల గుండా ఈ నది ప్రవహిస్తోంది. కానీ, గోదావరి అలా కాకుండా అడవుల గుండా, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల గుండా ప్రవహిస్తున్నది. నీటి లభ్యత కూడా అధికం. ఈ కొట్లాటలు లేకుండా ఉండాలంటే నీటి పంపకాలకు ఓ సహేతుకమైన ప్రాతిపదిక ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండే నీటిని వారు వాడుకొని, ప్రాజెక్టులు కట్టుకొని, మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం కనుక మాకు నీళ్లు ఇవ్వాల్సిందేనని ఆ తర్వాత ట్రిబ్యునల్స్ దగ్గర వాదించడమూ జరుగుతోంది. నిజానికి ప్రజల అవసరాలే ప్రాతిపదిక కావాలి. ఆయా ప్రాంతాల్లో పండే పంటలేంటి? వాటికి ఎంత నీరవసరం? దానికి తోడు... ఆ ప్రాంతాల్లో ఇతర నీటి వనరు లేంటి? భూగర్భజలాల పరిస్థితేంటి? ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటాల పంపకం చేస్తే బాగుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. తీర్పులే జాప్యమంటే, అమలు అంతంతే! అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యల్ని పరిష్కరించేందుకు ఏర్పాటవుతున్న ట్రిబ్యునల్ తీర్పుల్లో విపరీత జాప్యం జరుగుతోంది. దానికి తోడు, ఎంతో ఆలస్యంగా వెలువడిన తీర్పుల అమలు, పర్యవేక్షణ కూడా సవ్యంగా లేకపో వడం వివాదాలకు, తదనంతర సమస్యలకు కారణమవుతోంది. దాంతో ట్రిబ్యునల్స్ వల్ల ప్రభావం లేకుండా పోతోంది. ఫలితంగా మళ్లీ సుప్రీం తలుపులు తట్టాల్సి వస్తోంది. ఈ వివాదాల లోతైన పరిశీలనకు సుప్రీంకోర్టు సమయం వెచ్చించలేని కారణంగానే, ‘అంతర్రాష్ట్ర జలవివాదాల (పరిష్కార) చట్టం-1956’ ఆధారంగా ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి. కావేరి తీసు కుంటే, 1990లో ట్రిబ్యునల్ ఏర్పడగా పదిహేడేళ్లకు 2007లో తీర్పు వచ్చింది. 2013లో గజెట్ వెలువడింది. అయినా, కేటాయింపులు-వినియోగం ఓ కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. 1969లో ఏర్పడ్డ కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ 2013లో తీర్పు చెప్పింది. కర్ణాటక-గోవా మధ్య మాండవి నదీ జలాల వివాదాలకు సంబంధించి పది హేనేళ్ల సంప్రదింపులు విఫలమైన మీదట 2010లో ట్రిబ్యునల్ ఏర్పాటయినా ఇప్పటికీ నిర్ణయం వెల్లడించలేదు. తమిళనాడు-కేరళ మధ్య కూడా వివాదాలున్నాయి. కృష్ణా నీటి పంపకాలు తాజాగా నాలుగు రాష్ట్రాల మధ్య జరగా లని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద ఉంది. కేటాయించిన నీటి నిలువ-వాడకం, మిగులు జలా లపై హక్కులు, వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి, నగరీకరణలు వంటి సంక్లిష్టతల్లో తలెత్తే సరికొత్త వివాదాల్ని ఈ ట్రిబ్యునల్స్ సరిగా పరిష్కరించ లేకపోతున్నాయనేది విమర్శ. ట్రిబ్యునళ్ల ప్రస్తుత కూర్పు ప్రకారం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గాను, ఇద్దరు హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు సభ్యులుగానూ ఉంటున్నారు. సాగునీటి, పర్యావరణ నిపుణుల సహకారం తీసుకోవాల్సి రావడం వల్ల అంతిమ తీర్పులకు కనీసం 10-15 సంవత్సరాలు జాప్యమ వుతోందన్నది పరిశీలన. అలా కాకుండా ఆయా రంగ నిపుణుల్నే ట్రిబ్యునల్ సభ్యులుగా ఉంచాలనేది ఓ ప్రతిపాదన. అంశాలు, వివాదాల వారిగా ఒక్కో నదికి అని కాకుండా అంతర్రాష్ట్ర నదీవివాదాల పరిష్కారానికి ఒక శాశ్వత ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అనుసంధానంపై అనుమానాలు! దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నదుల్ని అనుసంధానపరచడం ద్వారా గరి ష్టంగా లబ్ధి పొందవచ్చన్నది ఒక ఆలోచన. ఉత్తరాదిలో బిహార్, అసోం, ఒడిశాల్లో వరదలు ముంచెత్తుతుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కరవు-కాటకాలు ప్రజల్ని పీడించడం దృష్ట్యా ఈ ఆలోచన చేశారు. బ్రహ్మపుత్ర, గంగ వంటి నదుల్ని దక్షిణాది నదులతో గ్రిడ్ ద్వారా అనుసంధానించి మధ్య, దక్షిణ భారతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఈ తలంపు. దీనిపై సమగ్ర నివేదిక (డీపీఆర్)కు గాను 2014-15 బడ్జెట్లో వందకోట్ల రూపాయలు కేటాయిం చారు. ‘జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమం’ద్వారా మొత్తం 37 నదు లకు తాజాగా 30 లింకులు ఏర్పాటు చేసి, 3వేల నీటి నిల్వ డ్యాముల నిర్మాణంతో 3.5 కోట్ల హెక్టార్లని కొత్తగా సాగులోకి తేవాలన్నది లక్ష్యం. సూచాయగా ఇందుకయ్యే వ్యయం రూ. 5.6 లక్షల కోట్లన్నది 2002 నాటి అంచనా కాగా, ఇప్పుడది పది లక్షల కోట్ల రూపాయల వరకుంటుందని భావిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రకృతి సహజ నైసర్గిక స్థితికి వ్యతిరేకమని, పర్యావరణ, జీవవైవిధ్య పరమైన ప్రతికూల పరిస్థి తులుంటాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనితో స్వచ్ఛమైన నదులూ కలుషితమయ్యే ప్రమాదమూ ఉందంటున్నారు. కృత్రిమ నీటి నిల్వ డ్యాముల వల్ల నిర్వాసితులయ్యేవారికి పునరావాస, పునఃస్థిరీకరణ వంటివి సమస్యగా పరిణమిస్తాయంటున్నారు. ఇంత కన్నా, వికేంద్రీకరణ పద్ధతుల్లోనే వాటర్షెడ్, వాననీటి సంరక్షణ, భూగర్భ జలవృద్ధి, శాస్త్రీయ-హేతుబద్ధ పంటల విధానం వంటి సంప్రదాయ పద్ధతులే అనుసరణీయం అనే వాదనా ఉంది. పెద్ద ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్న ఆలోచనాసరళి నుంచి ‘పెద్ద ప్రాజెక్టులు పెను విపత్తుల’నే దిశలో ఇప్పుడు యోచిస్తున్నారు. స్వతంత్ర సంస్థలే శరణ్యం తాగు-సాగునీటి వినియోగం, విద్యుదుత్పత్తి... తదితరావసరాలకిచ్చే ప్రాధా న్యతల విషయంలో రాజకీయ నిర్ణయాలు తరచూ విమర్శలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. ఇవి రాష్ట్రాల మధ్యే కాకుండా, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్యా వివాదాలకు దారి తీస్తున్నాయి. వీటన్నటి దృష్ట్యా... రాజ కీయాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థ (రివర్ వ్యాలీ అథారిటీ)లను ఏర్పాటు చేయాలనే సూచన వస్తోంది. 2010లో రాజకీయ కారణాల వల్ల సకాలంలో నిర్ణయం తీసుకోనందునే శ్రీశైలం ప్రాజెక్టు నిలువ నీటితో కర్నూలు, మహబూబ్నగర్ మునిగిపోయి అంతటి ఉపద్రవం ఎదుర్కోవాల్సి వచ్చిందనే వాదనుంది. నిర్ణయ జాప్యం వల్లే శ్రీశైలంలోకి వచ్చే ఇన్ఫ్లో, ప్రాజెక్టు అన్ని గేట్లు తెరిచి నీటిని వదిలినా సాధ్య మయ్యే ఔట్ఫ్లో కన్నా అధికంగా ఉండటమే సదరు ప్రమాదానికి కారణమని రుజువైంది. ఒక ప్రాధికార సంస్థ ఉండి ఉంటే, ఆ తప్పిదం జరిగి ఉండేది కాదనేది నిపుణుల అభిప్రాయం. నది పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధమైన అవసరాలుంటే పరిస్థితుల్ని బట్టి సదరు సంస్థ తగిన నిర్ణయం తీసుకోగలుగుతుందని వారంటారు. ఇక, రాష్ట్రాల్లోని రాజకీయ అవసరాలు అడ్డంకి కావు. టెన్నెసీ రివర్ వ్యాలీ అథారిటీ (యుఎస్), లింపో పో ఆర్వీఏ (దక్షిణాఫ్రికా), ముర్రే డార్లింగ్ ఆర్వీఏ (ఆస్ట్రే లియా)లు విజయవంతంగా పనిచేయడం ఈ రంగంలో ఓ గొప్ప అనుభవం. కాలానుగుణంగా మారడమే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమవుతుంది. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
ఢిల్లీలో నేడు ‘కృష్ణ’ తులాభారం
-
ఢిల్లీలో నేడు ‘కృష్ణ’ తులాభారం
⇒ హస్తినకు చేరిన నీళ్ల పంచాయితీ ⇒ పాల్గొననున్న తెలంగాణ, ఏపీ సీఎంలు, మంత్రులు, అధికారులు ⇒ అధికారులతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ సమీక్ష ⇒ పాలమూరు, డిండిలపై పాత జీవోలు సహా పలు నివేదికలతో రెడీ ⇒ పట్టిసీమ, పోలవరం కింద వాటాపై నిలదీయాలని నిర్ణయం ⇒ ఆర్డీఎస్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు సంసిద్ధం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ మధ్య రెండున్నరే ళ్లుగా నలుగుతున్న వివాదం హస్తిన చేరింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శ ర్మ, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ విజయ్ప్రకాశ్లు మంగళవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రమశక్తి భవన్లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరగనుంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి. మన వాదనలు గట్టిగా వినిపిద్దాం.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు, డిండి, టెలీమెట్రీ విధానం, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ, పోలవరం కింది వాటాలు, నీటి పంపిణీ-నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన తర్వాత.. ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలపై తెలంగాణ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, నీటి వాటాల్లో ఏపీ ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించిన అన్ని అంశాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా నివేదిక రూపంలో పొందుపరిచారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరడానికి ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను అధ్యయనం చేయడంతో పాటు వాటిలో మార్పుచేర్పులపై కీలక సూచనలు చేశారు. ఏపీ లేవనెత్తే ప్రతీ అంశాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా రాష్ట్ర వాదనలు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. కీలకంగా ఆర్డీఎస్.. ఎజెండాలో లేని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణ నిర్ణయించింది. నిజానికి ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. దీని కింద 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా 20 వేలకు మించి అందడం లేదు. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండియాయి. దీంతో ఆనకట్ట పొడవు పెంచేందుకు నిర్ణయించి, పనులు చేపట్టగా ఏపీ పదేపదే అడ్డుకుంటోంది. దీనిపై చర్చలకు ఆహ్వానించినా.. ఏపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీనికి తోడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకముందే ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ అంశాలను అపెక్స్ కమిటీ ముందుంచాలని సీఎం నిర్ణయించారు. -
ఢిల్లీకి రె‘ఢీ’!
- నీళ్ల పంచాయితీపై రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ - ఇరు రాష్ట్రాలకు నోటీస్ ఇచ్చిన కేంద్ర జల వనరుల శాఖ - నేడు ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ - మొత్తం ఐదు అంశాలతో ఎజెండా ఖరారు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల వనరుల శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి అంతా సిద్ధమైంది. సమావేశానికి సంబంధించి సోమవారం కేంద్ర జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాలకు నోటీసులు పంపింది. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారమే ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయనతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, అధికారుల బృందం వెళ్లనుంది. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఎజెండాలో చేర్చిన అంశాలపై రాష్ర్టం కసరత్తు ముగించింది. తీర్పులు, జీవోలు, ఒప్పం దాలు, నివేదికల కాపీల్ని సిద్ధం చేసింది. ఎజెండాలో చేర్చని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)ను ఆరో అంశంగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా తెలిసింది. ఇదీ ఎజెండా..: అపెక్స్ కౌన్సిల్ ఎజెం డాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్ఫ్లో, ఔట్ఫ్లో లెక్కలు పారదర్శక ంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు. వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు. పూర్తయిన కసరత్తు.. అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చినవాటితోపాటు ప్రత్యేకంగా ప్రస్తావనకు తేవాలని నిర్ణయించిన అంశాలపై తెలంగాణ కసరత్తు పూర్తి చేసింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, కల్వకుర్తి వాటాల పెంపునకు సంబంధించి ఉమ్మడి ఏపీలో చేసిన ప్రతిపాదనలు, నీటి వాటాల్లో గత రెండున్నరేళ్లుగా ఏపీ చేసిన ఉల్లంఘనలు, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనుల్లో ఏపీ సహాయ నిరాకరణకు సంబంధించి అన్ని ఆధారాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను సైతం సిద్ధం చేశారు. సీఎం సూచనల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం సాయంత్రం వరకు కసరత్తు కొనసాగించారు. దీనిపై బుధవారం ఉదయం సీఎం, మంత్రి హరీశ్రావులు మరోమారు చర్చించే అవ కాశం ఉంది. సాయంత్రం సీఎం, మంత్రి, అధికారుల బృందం ఢిల్లీకి బయలుదేరుతుందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
అన్యాయాన్ని ఎలుగెత్తుదాం
⇒ అపెక్స్ కౌన్సిల్లో మన వాణిని గట్టిగా వినిపిద్దాం: సీఎం కేసీఆర్ ⇒ కృష్ణా, గోదావరిలో 60 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని వివరిద్దాం ⇒ పాలమూరు, డిండి ముమ్మాటికీ పాతవే ⇒ కల్వకుర్తికి నీటి వాటా పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం ⇒ ఏపీ ఉల్లంఘనలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి ⇒ అన్ని వివరాలతో సిద్ధంకండి ⇒ మంత్రి హరీశ్, అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల పంపకాల్లో తెలంగాణకు 60 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ఉల్లంఘనలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని, జలాల్లో రాష్ట్ర వాటాలను మరింత పెంచాలన్న వాదనలు బలంగా వినిపించేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు రావాల్సిన 90 టీఎంసీల వాటాను గట్టిగా డిమాండ్ చేయాలని, బేసిన్ పరిధిలో వాడే ప్రతి నీటి చుక్కకు లెక్క ఉండేలా టెలీమెట్రీ విధానం అమలు చేయాలని కోరనుంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఏపీలోనే వాటిని చేపట్టిన అంశాన్ని స్పష్టంచేయనుంది. ఈ నెల 21 కేంద్ర మంత్రి ఉమా భారతి ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం తన అధికార నివాసంలో మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, ఈఎన్సీ విజయ్ ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. జలాల విషయంలో ఉమ్మడి ఏపీలో జరిగిన అన్యాయమే ప్రస్తుతం కూడా కొనసాగుతోందని, వీటిని పరిష్కరించి తగిన న్యాయం చేసేలా కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్లో చర్చకు వచ్చే ప్రతీ అంశంపై ఆధారాలు, నివేదికలతో సహా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు, ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జలవనరుల శాఖ ఎజెండా రాష్ట్రానికి అందిన తర్వాత మరోమారు సమావేశమై చర్చించనున్నారు. మన వాటా కోసం పట్టుపడదాం కృష్ణా జలాల్లో తెలంగాణకు పెంచాల్సిన వాటాపై ట్రిబ్యునల్లో జరుగుతున్న విచారణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరి నదిపై ఏదైనా ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు నీటిని తరలిస్తే.. అంతే వాటా ఎగువ రాష్ట్రాలకు వస్తుందన్నారు. ఈ లెక్కన ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో.. తెలంగాణకు 90 టీఎంసీల వాటా దక్కుతుందని సీఎం ఈ సందర్భంగా అన్నట్లు తెలిసింది. ఈ 90 టీఎంసీల వాటాను రాష్ట్రానికి ఇవ్వాలని.. ఈ లెక్కన రాష్ట్రానికికి 389 టీఎంసీల వాటా కోరాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులు పాతవే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవి కావని, వీటికి ఉమ్మడి ఏపీలోనే అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2008 నుంచి డిండి, 2013లో పాలమూరు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. కల్వకుర్తి వాటాను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచే నిర్ణయం కూడా ఉమ్మడి ఏపీలోనే జరిగిందన్నారు. గోదావరి పరిధిలో చేపట్టిన కంతనపల్లి, కాళేశ్వరం, చనాకా కొరాటా, సీతారామ ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, వాటన్నింటికి గతంలో నీటి కేటాయింపులు జరిపిన విషయాన్ని అపెక్స్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఏపీ ఉల్లంఘనలను వివరిద్దాం.. కృష్ణా జలాల్లో ఏపీ రెండున్నరేళ్లుగా పాల్పడుతున్న ఉల్లంఘనల అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. 2014-15 నుంచి కృష్ణా జలాల్లో తనకున్న వాటాకు మించి.. ఏపీ అధికంగా నీటిని తరలిస్తున్న అంశంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 90 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించినా.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించిన లెక్కల్లో చూపలేదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 4,300 క్యూసెక్కులు తోడుతున్నామని ఏపీ చెబుతున్నా.. 12 వేల క్యూసెక్కులకు పైగా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘనలను కేంద్రం ముందు పెట్టి టెలీమెట్రీ విధానం తక్షణం అమల్లోకి వచ్చేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ లెక్కలన్నీ తీయండి సీఎం కేసీఆర్తో సమావేశానికి ముందు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ సుదీర్ఘంగా చర్చించారు. అపెక్స్ భేటీలో ఏపీ ప్రస్తావనకు తెచ్చే అంశాలకు ఎలా జవాబు ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేశారు. పోతిరెడ్డిపాడు కింద 2014-15లో 33 టీఎంసీలు, 2015-16లో 13 టీఎంసీలు, 2016-17లో 33 టీఎంసీల మేరకు ఏపీ అధికంగా వాడుకుందని, ఆ లెక్కలన్నీ తీయాలని అధికారులకు సూచించారు. -
అపెక్స్ భేటీపై స్పష్టత కోసం ఢిల్లీకి జోషి
నేడు కేంద్ర జల సంఘం, జల వనరుల శాఖ అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 21న నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ భేటీపై స్పష్టత కోసం రాష్ర్ట నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల సంఘం, జల వనరుల శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశం కానున్నారు. 21నే అపెక్స్ భేటీ నిర్వహించిన పక్షంలో ఏయే అంశాలను ఎజెండాలో చేర్చాలి, వాటిపై ఎలాంటి నివేదికలు సమర్పించాలన్న అంశాలపై ఆయన కేంద్ర అధికారుల నుంచి స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్వై) పరిధిలో చేర్చిన 11 సాగునీటి పథకాలకు నిధులను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాధ్పూర్ , భీమా, వరద కాల్వ ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.7వేల కోట మేర్ల కేంద్ర సాయం అందించేందుకు ఇటీవలే నిర్ణయం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పీఎంకేఎస్వై కింద రూ.2,500 కోట్లు, నాబార్డ్ రుణం కింద రూ.4,500 కోట్లు ఇప్పించేలా ఒప్పందం జరిగింది. -
భారత్-పాక్ల మధ్య జల వివాదం
-
'తెలంగాణ ప్రభుత్వానిది మొండి వాదన'
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం మొండి వాదన చేస్తోందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. నీటి పంపిణీపై బుధవారం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల భేటీ స్పష్టత లేకుండానే ముగిసింది. సమావేశం అనంతరం దేవినేని ఉమామహేశ్వర్రావు న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నీటి పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును తాము కోరడంలేదని దేవినేని తెలిపారు. విభజన చట్టం ప్రకారమే నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు గెజిట్ చేసేంత వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు వివాదాస్పదంగా మారాయని దేవినేని అన్నారు. తమ వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. మొండి వాదనలు చేసినంత మాత్రాన చట్టాలు అనుకూలంగా మారవని తెలిపారు. చట్టాల్లో ఏముందో లాయర్లను అడిగి తెలుసుకోండంటూ సూచించారు. -
'కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో చేయాల్సింది చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దుష్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ కేసీఆర్కు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని జలవివాదాలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు సూచించారు. -
'వైఎస్ జగన్ హెచ్చరించినా పట్టించుకోలేదు'
కర్నూలు: రాష్ట్ర విభజన జరగకముందే జల వివాదాలు వస్తాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి, కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధారపడి ఉందన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు...రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఓ వైపు తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌరు సుచరిత పాల్గొన్నారు. కాగా తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16,17,18 తేదీల్లో కర్నూలు కేంద్రంగా దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. -
నీటి సమస్యలను పరిష్కరించుకోవాలి
తెలంగాణ, ఏపీ సీఎంలకు కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచన సాక్షి, హైదరాబాద్: రైతాంగం కోసం రెండు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న నీటి సమస్యలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కలసి పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. మంచి వాతావరణం కల్పించాలని.. రైతులకు మంచి చేయాలని కోరారు. భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్లో శనివారం జరిగిన ‘సృజనాత్మక వరి రైతుల సమావేశం’లో కేంద్రమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 30 మంది రైతులు కనుగొన్న పద్ధతులను ఆవిష్కరించారు. అనంతరం వారిని సత్కరించారు. తెలంగాణ, ఏపీల్లో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. కొత్త పద్ధతులతో వందల కొద్దీ వంగడాలను తయారుచేస్తున్నప్పటికీ ఖర్చు పెరుగుతుందే కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరికి గిట్టుబాటు ధర రూ. 1,200 మాత్రమే ఉందనీ... అందుకయ్యే ఖర్చు మాత్రం రూ. 1,500 వరకు అవుతోందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు మా ట్లాడుతూ సోనామసూరి, బాస్మతి వరిలో హైబ్రీడ్ తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఐఐఆర్ఆర్ డెరైక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రైతులు సబ్సిడీల కోసం ఆలోచించడం లేదని.. మంచి విత్తనం, కల్తీలేని ఎరువులు కావాలని కోరుకుంటున్నారన్నారు. -
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం!
-
తూతూమంత్రంగా ఈఎన్సీల భేటీ
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)ల మధ్య జరిగిన సమావేశం తూతూమంత్రంగా జరిగింది. కేవలం పది నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎవరి అవసరాలను వారు మరోమారు చర్చకు తేవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. సాగర్ జలాల వినియోగంపై చర్చించేందుకు సోమవారం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో ఏపీ ఈఎన్సీ తెలంగాణ ఈఎన్సీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే అధికారులంతా కార్యాలయం నుంచి వెళ్లిపోవడంతో మంగళవారం మరోసారి భేటీ కావాలని ఇద్దరు అధికారులు నిర్ణయించారు. -
జగడం జటిలం !
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతున్న జల వివాదాలు * చేతులెత్తేస్తున్న కృష్ణా, గోదావరి జలాల బోర్డులు * సాగర్ నీటి వాడకంపై ఎవరి లెక్కలు వారివే * రబీలో జలాల వినియోగంపై చర్చలకు ముందుకు రాని ఏపీ.. ఎడమ, కుడి కాల్వల కింద నీటిని వాడుకునేందుకు సిద్ధమైన తెలంగాణ * గోదావరిలో వీడని ‘సీలేరు’ ముడి * ఎగువ, దిగువ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి లెక్కలు వెల్లడించని ఆంధ్రప్రదేశ్ * విద్యుత్ వాటాలపై సీఈఏ నివేదిక ఇచ్చినా ఆమోదం తెలపని కేంద్రం.. నివేదిక అందిన తర్వాతే బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం * ఈనెల 31న గోదావరి బోర్డు చైర్మన్ పదవీ విరమణ * కృష్ణా బోర్డు చైర్మన్ కు తాత్కాలిక బాధ్యతలు? సాక్షి, హైదరాబాద్: నీళ్లు నిప్పవుతున్నాయి.. వాటాలు కొట్లాటకు దారితీస్తున్నాయి.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముదురుపాకాన పడుతున్నాయి! ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బోర్డులు చేతులెత్తేస్తున్నాయి. నీటి వినియోగం, అవసరాలపై ఇరు రాష్ట్రాలు ఎవరి లెక్కలు వారు చెపుతుంటే తాము చేసేదేమీ లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు కృష్ణా జలాల పంపిణీ సమస్యలతో బోర్డు సతమతం అవుతుంటే... మరోవైపు గోదావరిలో సీలేరు విద్యుదుత్పత్తి అంశం కేంద్ర వైఖరితో మరింత జటిలం అవుతోంది. నాగార్జునసాగర్ నీటి వినియోగం లెక్కలపై ఆంధ్రప్రదేశ్ చర్చలకు రాకపోవడం, నీటిని వాడుకునేందుకు తెలంగాణ పూనుకోవడం కృష్ణా బోర్డులో కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుండగా... సీలేరు అంశం గోదావరి బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాగర్లో తేలని లెక్క.. నాగార్జునసాగర్లో నీటిని ప్రస్తుత రబీ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదు. నీటి లెక్కలపై ఎవరికి వారే తమ వాదనలకు కట్టుబడి ఉన్నారు. నీటి లెక్కలు ఓ కొలిక్కి రాకపోవడంతో నీటి పారుదల శాఖ అధికారుల మధ్య సమావేశం జరగడం లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సమావేశం శనివారం మరోసారి వాయిదా పడింది. సాగర్ రబీ లెక్కలపై ఆంధ్రప్రదేశ్ చర్చలకు రాకపోవడంతో సాగర్ ఎడమ, కుడి కాల్వల కింద నీటిని వాడుకునేందుకు తెలంగాణ సిద్ధమైంది. రెండు కాల్వల కింద ఇప్పటికే రోజుకు వినియోగించుకుంటున్న 18,800 క్యూసెక్కుల నీటిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఖరీఫ్ అవసరాలకు 12.71 టీఎంసీలు పూర్తయ్యాక, ఎడమ కాల్వ కింద రబీ అవసరాలకు 77.90 టీఎంసీల నీటిని సాగర్ నుంచే వాడుకుంటామని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సాగర్లో నీటిమట్టం 553.8 అడుగుల మేర ఉండగా నీటి లభ్యత 218.23 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగుల వరకు లెక్కిస్తే వ్యవసాయ అవసరాలకు వాడుకోవాల్సిన నీరు కేవలం 93.791 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నీరు తెలంగాణ అవసరాలను మాత్రమే తీర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది. కుడి కాల్వ కింద నీటితో ఏపీ సైతం రబీకి నీటిని వాడుకునేందుకు ప్రయత్నిస్తే వివాదం మరీ జటిలమయ్యే ప్రమాదం ఉంది. ఎటూ తేలని ‘సీలేరు’ గోదావరి నదీ జలాల వినియోగంతో ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తి వాటాల వివాదాన్ని ఎలా పరిష్కారించాలో తెలియక గోదావరి నదీ యాజమాన్య బోర్డు సతమతమవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఉత్పత్తి చేసిన విద్యుత్ వివరాలను ఇటు ఆంధ్రప్రదేశ్ సమర్పించకపోవడం, అటు విద్యుత్ వాటాలను తేల్చేందుకు ఏర్పాటైన కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) కమిటీ తన నివేదిక సమర్పించినా దానిని కేంద్ర విద్యుత్ శాఖ ఆమోదించకపోవడం బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తంగా ఉన్న 740 మెగావాట్ల విద్యుదుత్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటిరవకు ఒక్క మెగావాట్ విద్యుత్ను కూడా తెలంగాణకు ఏపీ ఇవ్వలేదు. ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ వివరాలను షెడ్యూలింగ్ చేయకపోవడం, సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డీసీ)కి సమాచారం ఇవ్వకపోవడంతో తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదు. దీంతో మరోమారు బోర్డును సంప్రదించింది. దీంతో సీలేరు విద్యుత్ వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఎస్ఆర్ఎల్డీసీని బోర్డు కోరింది. దీనిపై కసరత్తు చేసిన నీరజా మాథుర్ కమిటీ ఈ నెల రెండో వారంలోనే నివేదికను కేంద్రానికి సమర్పించినా... దాన్ని విద్యుత్ శాఖ ఆమోదించలేదు. అక్కడ నివేదికకు ఆమోదం దక్కి, బోర్డును చేరితేనే సీలేరుపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. లేదంటే బోర్డు సమావేశం... ఈనెల 31తో పదవీ విరమణ చేయనున్న చైర్మన్ ఎంఎస్ అగర్వాల్కు వీడ్కోలు కార్యక్రమంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరురాష్ట్రాలు గోదావరి బోర్డు బాధ్యతలు, సిబ్బంది, నిధుల కేటాయింపులతో పాటు సీలేరు అంశాన్ని సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేర్చాయి. వీటితోపాటే తెలంగాణలోని బూర్గంపహాడ్ మండలాన్ని తమ రాష్ట్రంలో కలపాలన్న డిమాండ్ను ఏపీ తన ఎజెండాలో చేర్చింది. గోదావరి బోర్డు పగ్గాలు కృష్ణా బోర్డు చైర్మన్కే? ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్న గోదావరి బోర్డు చైర్మన్ స్థానంలో కొత్తగా ఎవరిని నియమిస్తారన్నది కేంద్ర జల సంఘం ఇంకా తేల్చలేదు. కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్కే తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కృష్ణా వివాదాలను తేల్చకుండా చేతులెత్తేసిన చైర్మన్... గోదావరి వివాదాలను సైతం నెత్తిన పెట్టుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న. -
జల జగడాలకు జవాబేదీ?
* ఆరు నెలలైనా పరిష్కారాల వైపు పడని అడుగులు * పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లో కేంద్రం నిర్లిప్తత * బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నోటిఫై చేయలేదు * ఇంకా ఏర్పాటు కాని పోలవరం ప్రాజెక్టు అథారిటీ * ట్రిబ్యునల్ పరిధిని నిర్ణయించడంలోనూ జాప్యం * నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ ఉన్నట్లా? లేనట్లా? సాక్షి, హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజనకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి వివాదం చివరికి ఢిల్లీకి చేరటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణం. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేయడానికే చట్టం వచ్చిన తర్వాత మూడు నెలలు పట్టింది. విభజన తర్వాత 60 రోజుల్లోగా బోర్డులు ఏర్పాటు చేయాలని చట్టంలోని సెక్షన్ 85(1) స్పష్టంగా గడువు విధించినా.. కేంద్రం పట్టించుకోని విషయం విదితమే. ఆ బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లో రెండు బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను నోటిఫై చేయాలని చట్టంలో ఉంది. అయినా.. ఆరు నెలలు దాటినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులను నోటిఫై చేయకపోవడం వల్ల.. ఉమ్మడి ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ లేదు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున నవంబర్ 2 తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసినా.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అయినా బోర్డు మౌనసాక్షిగా మిగలడం మినహా.. ఏపీ ఫిర్యాదులపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. కేంద్రం బోర్డు పరిధిని నిర్ధారిస్తూ ప్రాజెక్టులను నోటిఫై చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు అంటున్నారు. ఏర్పాటు కాని పోలవరం అథారిటీ... పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చునూ తిరిగి ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టును 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ పనులు వేగంగా జరగడంలో, పెండింగ్ అనుమతులు సంపాదించడంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అథారిటీ కీలక పాత్ర పోషించనుంది. కానీ చట్టం అమల్లోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా.. ఇంకా ఈ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడంలోనూ జాప్యం జరిగే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తున్నారు. బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ పరిధి ఏమిటి? బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్-2)ను పొడిగిస్తున్నట్లు పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 89లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడం, ప్రాజెక్టు నిర్వహణ విధివిధానాల (ప్రొటోకాల్స్)ను రూపొందించడం.. పొడిగించిన ట్రిబ్యునల్కు అప్పగించిన బాధ్యతలు. పొడిగించిన ట్రిబ్యునల్ కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితమని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల వాదన తరహాలోనే కేంద్రం కూడా రెండు రాష్ట్రాలకే పరిమితమని లేఖ రాసింది. లేఖను అంగీకరించబోమని, అఫిడవిట్ దాఖలు చేయాలని బ్రజేష్కుమార్ అడిగితే.. దాఖలు చేయడానికి మూడు నెలల సమయం కేంద్రానికి సరిపోలేదు. గురువారం జరిగిన భేటీలో.. మరో మూడు వారాల గడువు కావాలని కోరింది. కృష్ణా నది ఎగువ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి వాటాలు కేటాయించకుండా, ప్రొటోకాల్స్ లేకుండా.. దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులకే కేటాయింపులు ఎలా చేస్తారని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాల్సివస్తే.. ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు వినాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. కానీ కేంద్రం ఎటూ తేల్చకుండా అస్పష్టతను కొనసాగిస్తోంది. జలాలపై అపెక్స్ కౌన్సిల్ మాటేమిటి? ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదాలు పరిష్కారం కాని పక్షంలో.. అపెక్స్ కౌన్సిల్ పరిష్కరిస్తుందని విభజన చట్టంలోని సెక్షన్ 84 చెప్తోంది. కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన ఉండే ఈ కౌన్సిల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. విభజన రోజునే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం ఇప్పటికీ ప్రకటించలేదు. మరి.. అపెక్స్ కౌన్సిల్ ఉన్నట్లా? లేనట్లా? అనే విషయంలో స్పష్టత లేదు. -
ఏపీ-తెలంగాణ మధ్య రాజుకుంటున్న జలజగడం పై చర్చ
-
ఏపీ-తెలంగాణ మధ్య రాజుకుంటున్న జలజగడం
-
'తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్ ఎత్తును 15 సెంమీ పెంచుతుంటే వారికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని దేవినేని ఆరోపించారు. ఆర్డీఎస్ ఎత్తు పెంపు విషయంలో తెలంగాణ మంత్రి హరీష్రావు హోదాను మరచి బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచితే కడప,కర్నూలు జిల్లాల భూములు ఎడారులుగా మారుతాయని దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు 7 టీఎమ్సీల నీరు వచ్చిందని, రావాల్సిన మిగిలిన నీటి విడుదల కోసం లేఖ రాశామని దేవినేని ఉమ తెలిపారు. -
సెగ చల్లార్చేందుకు
-
సెగ చల్లార్చేందుకు
* ఏపీ, తెలంగాణ మధ్య సయోధ్యకు కేంద్రం యత్నాలు * వివాదాల పరిష్కారం దిశగా చర్యలు.. సీఈఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు * విద్యుత్ వివాదాలపై నివేదికకు ఆదేశం.. నీటి తగాదాలను తీర్చేందుకు కేంద్ర జల సంఘం కసరత్తు * 7 లేదా 8న భేటీకి రావాలని వర్తమానం.. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటే ప్రధానాంశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న విద్యుత్, నీటి వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య రేగుతున్న విద్యుత్ సెగలను చల్లార్చేందుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలకు పరిష్కారాలను చూపుతూ.. నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల విషయంలోనూ తలెత్తిన విభేదాలను తొలగించేందుకు కేంద్ర జలసంఘం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 7 లేదా 8న సమావేశమవుదామని రెండు రాష్ట్రాలకు వర్తమానం పంపింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలను తీర్చేందుకు విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద వివాదాల పరిష్కారంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించనుంది. ఇదీ నీటి తగాదా! డెల్టా తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు అవసరం లేదని తెలంగాణ సర్కారు భావిస్తుండగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ మేర నీరు కావాల్సిందేనని పట్టుపడుతోంది. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు మొదట వారం పాటు నాగార్జునసాగర్ నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల జరిగింది. ఏపీ కోరిక మేరకు మరోవారం పాటు కొనసాగించాలని తాజాగా బోర్డు ఆదేశించింది. దీనిపై టీ సర్కారు నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలతో చర్చించి వివాదాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్రం రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 7 లేదా 8న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి నీటి విడుదలకు సం బంధించి గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో బోర్డులు, వాటి కార్యాలయాల ఏర్పాటు, పరిష్కార మార్గాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. విద్యుత్పై కమిటీ ఇదే.. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) చైర్పర్సన్ నీర్జా మాథుర్ చైర్మన్గా ఏర్పాటైన ఈ కమిటీలో విద్యుత్ నిర్వహణ వ్యవస్థ(పోస్కో) సీఈవో ఎస్కే సూనీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్(పీజీసీఐఎల్) సీవోవో వైకే సెహగల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులు లేదా వారి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర విద్యుత్ శాఖ డెరైక్టర్ (ఓ అండ్ ఎం) ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. అవసరమైతే ఇరు రాష్ట్రాల ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) నుంచి కూడా ఒక ప్రతినిధిని కమిటీలోకి తీసుకోవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యుత్ వ్యవస్థ నుంచి ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ కేటాయింపులు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ లైన్ల సరఫరా చార్జీలు, నష్టాల లెక్కింపు, ఇరు రాష్ట్రాలకు ప్రత్యేకంగా విద్యుత్ నియంత్రణ మండళ్ల ఏర్పాటు, పీపీఏల రద్దుపై తలెత్తిన వివాదాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది. -
'తెలంగాణ బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్లే'
చిత్తూరు : అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్లేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆయన బుధవారం చిత్తూరు జిల్లా సోమల బహిరంగ సభలో మాట్లాడుతూ విజభన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరే గతన్నారు. మన నీటి కోసం మనమే తన్నుకోవాలా?, విభజన జరిగితే సాగుకు నీళ్లుండవని అన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రిని చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. తెలుగు రాని సోనియాగాంధీ, తెలుగు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
ముంచిన పెద్దమనిషే.. మళ్లీ పంచుతారట !
* ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నీటి పంపిణీ బాధ్యత జస్టిస్ బ్రిజేశ్కుమార్కే అప్పగింత *ఆ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగించనున్నట్టు ముసాయిదా బిల్లులో కేంద్రం వెల్లడి *దిగువ రాష్ట్రాల హక్కులు పట్టని ట్రిబ్యునల్కే ఈ బాధ్యత ఇవ్వడంపై సీవూంధ్రలో భయాందోళన సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాలతో ఉన్న నీటి తగాదాల్లో మనల్ని నిండా ముంచేసిన పెద్ద మనిషి .. ఇప్పుడు అన్నదమ్ముల (ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల)కు నీటిని పంపిణీ చేయబోతున్నారు! నదీ పరీవాహకంలోని దిగువ రాష్ట్రాల సమస్యలు, హక్కులను ఏమాత్రం పట్టించుకోకుండా కృష్ణా జలాలపై తీర్పునిచ్చిన జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013లో కేంద్రం పేర్కొంది. ఆయన ఎంపిక తెలంగాణకు దిగువ రాష్ట్రం కాబోయే సీవూంధ్రలో కొత్త ఆందోళనకు దారితీస్తోంది. ఒకవైపు వున రాష్ట్రమే ఈ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో.. తిరిగి ఆయున ద్వారా తెలంగాణ- సీవూంధ్ర నీటి పంపిణీ చేయించాలనే నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. గతంలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేని పక్షంలో 1956 అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టానికి లోబడి నీరు కేటాయించాలని, అలాగే కరువు పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిర్వహణా ప్రాధాన్యాలు (ఆపరేషనల్ ప్రొటోకాల్) స్పష్టంగా పేర్కొనాలని బ్రిజేశ్ కుమార్ను కోరనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. బోర్డులతో గందరగోళం తుంగభద్ర బోర్డు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పరిమాణాన్ని ఏనాడూ కర్ణాటక విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి జలచౌర్యం జరుగుతున్నా బోర్డు తీసుకున్న చర్యలేవీ లేవు. ఇప్పుడు కృష్ణా, గోదావరి నదుల్లోని నీటి పంపకాలు పక్కాగా అమలు చేయడానికి రెండు దశల వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో బోర్డులు తీసుకునే నిర్ణయాలు ఇరు రాష్ట్రాలు అమలు చేయడానికి అంగీకరించని పరిస్థితుల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మాత్రం కేంద్రం ఎలాంటి సమాధానాన్ని వివరించలేదు. కరువు పరిస్థితుల్లో దిగువ రాష్ట్రానికి నీరు అందకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. ఈ రెండు దశల వ్యవస్థ కూడా గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కృష్ణా-గోదావరి ఉన్నతమండలిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. సాంకేతిక అంశాలను పరిశీలించే మండళ్లపై పర్యవేక్షణ, కొత్త ప్రాజెక్టులు చేపట్టే ప్రతిపాదనలకు ఇది ఆమోదం తెలుపుతుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే.. సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భవిష్యత్తులో తలెత్తే అంశాలను ప్రస్తుత కృష్ణా నదీ వివాదాల ట్రిబ్యునల్ పరిష్కారం చూపని పక్షంలో కొత్త ట్రిబ్యునల్కు నివేదించాలి. కృష్ణా, గోదావరిల రోజువారీ వ్యవహారాల కోసం ఉన్నతాధికారుల నేతృత్వంలో యాజమాన్య మండళ్లను ఏర్పాటు చేస్తారు. కేంద్రంలో కార్యద ర్శి/అదనపు కార్యదర్శి స్థాయిలోని అధికారి ఈ బోర్డులకు అధ్యక్షత వహిస్తారు. విభజన పూర్తై 60 రోజుల్లోగా ఇవి ఏర్పాటవుతాయి. కృష్ణా యాజమాన్య మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గోదావరి యాజమాన్య మండలి తెలంగాణ రాష్ట్రం నుంచి పనిచేస్తాయి. ఈ బోర్డుల్లోకి ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్ నిపుణులను డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుంటారు. తర్వాత వారిని బోర్డు శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఒక్కో బోర్డుకు చీఫ్ ఇంజనీర్(సీడబ్ల్యుసీ) స్థాయిలో కార్యదర్శి ఉంటారు. బోర్డులు పనిచేయడానికి అదనపు సిబ్బందిని కేంద్రం మంజూరు చేస్తుంది. డ్యామ్లు, హెడ్వర్క్స్, రిజర్వాయర్ల భద్రత కోసం సీఐఎస్ఎఫ్ బలగాలను నియమిస్తారు. ఈ బోర్డు ఖర్చులను ఇరు రాష్ట్రాలు భరించాలి. యాజమాన్య మండళ్లు డ్యామ్లు, హెడ్వర్క్స్, కాలువలు, జల విద్యుత్కేంద్రాలు పరిపాలన, నియంత్రణ, అమలు, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తాయి. జలవిద్యుత్తు ప్రాజెక్టులు కూడా కొత్త బోర్డుల పరిధిలోకే వస్తాయి. తాగు, పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత.. నీటి వివాదం తలెత్తితే ముందుగా తాగునీరు, తర్వాత పారిశుధ్య అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యుత్కా.. సాగుకా? దేనికి నీటిని కేటాయించాలనే వివాదం వస్తే ముందు సాగుకు నీరివ్వాలని ముసాయిదా బిల్లు స్పష్టం పేర్కొంది. సమైక్య రాష్ట్రంలో ఈ రెండు నదుల నీటి పంపకాలు.. ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పు ప్రకారమే అమల్లో ఉంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించే పక్షంలో ఇరు రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి. ఈ యాజమాన్య మండళ్లు ఇరు రాష్ట్రాలకు ప్రకృతి విపత్తు/కరువు/వరదలపై సలహాలు ఇవ్వాలి. బోర్డు నిర్ణయాలు అమలు చేసే విషయంలో పూర్తి అధికారాలు ఉంటాయి. యాజమాన్య మండలి నిర్ణయాన్ని అమలు చేయకుంటే కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఆంక్షలు విధిస్తుంది. ట్రిబ్యునల్ కొనసాగింపు ఎలా..? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను కొనసాగిస్తామని కేంద్రం ముసాయిదా బిల్లులో పేర్కొంది. అయితే అదెలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి దీనిని నియమించారు. అందుకు ఇచ్చిన నియమ నిబంధనలు వేరని, ఇక్కడ కొత్త రాష్ట్రాల నీటి పంపిణీకి ఆ నిబంధనలకు సంబంధం లేదని, అలాంటప్పుడు ఆ ట్రిబ్యునల్ ఎలా కొనసాగుతుందని జల వనరుల నిపుణుడు ఒకరు ప్రశ్నించారు. ఆ ఆరు ప్రాజెక్టులకు నీళ్లెలా ఇస్తారో? బ్రిజేశ్కుమార్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ ఆరు ప్రాజెక్టులకు చుక్కనీటి కేటారుుంపుల్లేవు... వురిప్పుడు ఆయనే ఓ కొత్త పాత్ర పోషిస్తూ అవే ప్రాజెక్టులకు నీళ్లెలా పంచుతారు? గతంలో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే బాధ్యతను కేంద్రం బ్రిజేశ్ ట్రిబ్యునల్కు అప్పగించనున్న నేపథ్యంలో తలెత్తుతున్న సందేహమిది. ఈ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలను నికర జలాలుగా మార్చి కేటాయించిన నీటిని నాగార్జునసాగర్, జూరాల, తెలుగుగంగకు క్యారీ ఓవర్ నీటిగా తీర్పునిచ్చిన నేపథ్యంలో నెట్టెంపాడు(21.4 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), ఎఎంఆర్పీ(30 టీఎంసీలు), వెలిగొండ(43.5 టీఎంసీలు), హంద్రీనీవా సుజల స్రవంతి(40 టీఎంసీలు), గాలేరు నగరి సుజల స్రవంతి(38 టీఎంసీలు) ప్రాజెక్టులకు కావాల్సిన దాదాపు 200 టీఎంసీల నీటిని ఎక్కడ నుంచి ఇస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు మాత్రం క్యారీఓవర్గా 145 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు, జూరాల 9 టీఎంసీలు కేటాయించారని నిపుణులు చెబుతున్నారు. కానీ పైన పేర్కొన్న ఆరు ప్రాజెక్టులకు నీరు కేటాయించకపోవడం వల్ల అవి ప్రశ్నార్థకంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎత్తిపోతల ద్వారా వీటికి నీరు మళ్లించాలని చూసినా, కేంద్రం కొత్తగా ఏర్పాటు చేయనున్న కృష్ణా యాజమాన్య మండలి(మేనేజ్మెంట్ బోర్డు) అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టులకు నీటి లభ్యత అనుమానాస్పదమే. అదీకాక కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండితే తప్ప.. తెలంగాణకు అటు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీరు వచ్చే అవకాశమే లేదు. ఈ ఆరు ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలంటే.. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును మార్చాల్సిందేనని నిపుణులు వాదిస్తున్నారు. మరి అది సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
డోలాయమానంలో ప్రాజెక్టుల పరిస్ధితి
-
తుంగభద్ర జలాల చౌర్యం..
-
దోపిడీని ప్రోత్సహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం
-
తుంగలో దొంగ!
* తుంగభద్ర జలాల చౌర్యం.. బోర్డున్నా ఆగని కర్ణాటక దోపిడీ * తుంగభద్ర జలాల్లో మన న్యాయమైన కోటానూ తోడేస్తున్న వైనం.. కాల్వకు ఇరువైపులా చెరువుల తవ్వకం * 100 కిలోమీటర్ల మేర పైపులతో పీల్చేస్తున్న వాస్తవం * దోపిడీని ప్రోత్సహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం * జల దోపిడీకి విద్యుత్ లైన్లు, మోటార్లకు కనెక్షన్లు * లక్షల ఎకరాల్లో ఆయకట్టు కాని పొలాలకు జలాలు * దిగువన ఉన్న మన రాష్ట్ర రైతుల నోట్లో మట్టి * ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నపుడే తీరని అన్యాయం * రేపు రాష్ట్రం విడిపోతే కింది రాష్ట్రాలకు ఇదే దుస్థితి * నదీ జలాల పంపిణీకి బోర్డు వేస్తే సరిపోతుందంటూ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సాక్షి పరిశీలన తుంగభద్ర నుంచి బి.నారాయణరెడ్డి: రాష్ట్రాన్ని విభజిస్తే దిగువ ప్రాంతం నీరందక ఎడారిగా మారుతుందన్న తీవ్ర ఆందోళనలు.. తెలుగు వారి మధ్య నీటి కోసం నిత్యం కొట్లాటలు తలెత్తుతాయన్న ఆవేదనలు సర్వత్రా వ్యక్తమవుతోంటే.. నదీ జలాల పంపిణీకి, నిర్వహణకు బోర్డులు వేస్తే సరిపోతుందంటూ విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సభ్యుడు జైరాం రమేశ్ నివేదిక సమర్పించారు. దాన్ని జీవోఎం దాదాపుగా ఆమోదించేసింది కూడా. కానీ.. ట్రిబ్యునల్ తీర్పులున్నా.. నియంత్రణ బోర్డులున్నా.. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి నీరు రావటం గగనమేనన్నది రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్కు ఏళ్ల తరబడి ఎదురవుతున్న చేదు అనుభవం! అందుకు ప్రత్యక్ష తార్కాణం.. కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు తుంగభద్ర. ఎగువ రాష్ట్రం కర్ణాటకలో గల తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దిగువన ఆంధ్రప్రదేశ్లోని ఆయకట్టు రైతులకు కేటాయించినదానికన్నా తక్కువగానే నీరు విడుదలవుతుంది. ఆ అరకొర నీరు కూడా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించి మన రాష్ట్రంలోని ఆయకట్టుకు చేరుకునేసరికి.. అడుగూబొడుగూ కూడా మిగలటం లేదు. పొలాలకు చుక్కనీరు అందటం లేదు. విడుదల చేసిన నీరంతా మధ్యలోనే మాయమవుతోంది. ఎలా మాయమవుతోంది అంటే.. కర్ణాటక సర్కారు అండతో ఆ రాష్ట్ర రైతులు మధ్యలోనే పైపులతో పీల్చేస్తున్నారు. మన రాష్ట్ర ఆయకట్టుకు రావాల్సిన నీటిని అక్రమంగా తమ పొలాలకు తరలించుకుంటున్నారు. అందుకోసం ప్రధాన కాల్వ పక్కనే అనేక భారీ చెరువులు, కుంటలను తవ్వారు. కాలువ నుంచి ఆ చెరువులు, కుంటల్లోకి.. అక్కడి నుంచి పొలాలకు బాహాటంగా నీటిని మళ్లిస్తున్నారు. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ మోటార్లకు కనెక్షన్లను కూడా మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్వహణ, నీటి సరఫరా పర్యవేక్షణ కోసం ఏర్పడిన ప్రత్యేక బోర్డు ఏం చేస్తోంది? కర్ణాటక సర్కారు అండదండలతో రైతులు చేస్తున్న జల దోపిడీని చేష్టలుడిగి చూస్తోంది!! ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నికర జలాల్లో సగానికి మించి ఏనాడూ దిగువకు చేరుకోలేదు. ఈ జల దోపిడీ విషయంలో ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రైతుల మధ్య తరచుగా ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. తుంగభద్ర నదీ జలాల సరఫరా, దోపిడీలపై సాక్షి ప్రతినిధి ఆ ప్రాంతంలో పత్యక్షంగా పర్యటించి చేసిన పరిశీలనలో ఈ విషయాలు నిగ్గుతేలాయి. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడే.. ఎగువ రాష్ట్రం జల దోపిడీ యథేచ్ఛగా సాగిస్తోంటే.. మన రాష్ట్రం రెండుగా విడిపోతే.. పై నుంచే అరకొరగా వచ్చే నీటిని దిగువ రాష్ట్రాల మధ్య ఎలా పంచుతారు..? నదీ బోర్డుల నియంత్రణలో సరఫరా ఎలా ఉంటుంది..? అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జలాలపై ఘనమైన హక్కులు... తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం కోసం 1944లో మద్రాసు-హైదరాబాద్, మద్రాసు-మైసూరు ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు ప్రస్తుత కర్ణాటకలో ఉన్న బళ్లారి జిల్లా మల్లపురం వద్ద 1953లో ప్రాజెక్టు నిర్మించారు. సుమారు 132.471 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో పూడిక కారణంగా ప్రస్తుత సామర్థ్యం 100 టీఎంసీలకు పరిమితమైంది. మొత్తం 212 టీఎంసీల నీటి వినియోగం జరిగే ఈ ప్రాజెక్టు ద్వారా కర్ణాటకకు 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 73.01 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ప్రాజెక్టు కింద మన రాష్ట్రంలో సుమారు 6.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటక రాష్ట్రంలో మనకు రెట్టింపు ఆయకట్టు ఉంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో 1.07 ల క్షల ఎకరాలు, కడప జిల్లాలో సుమారు లక్ష ఎకరాలు, కర్నూలు జిల్లాలో 3.46 లక్షల ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లాలో 84 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా ఈ ప్రాజెక్టు నుంచి నీటిని ఉపయోగిస్తున్నారు. కుడి లో లెవెల్ కెనాల్ (ఎల్ఎల్సీ), కుడి హై లెవెల్ కెనాల్ (హెచ్ఎల్సీ) ద్వారా రెండు రాష్ట్రాలకు నీటి సరఫరా జరుగుతుంది. నది నుంచి మరి కొంత నీటిని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. ఎడమ కాల్వ మాత్రం ఒక్క కర్ణాటక రాష్ట్రానికే ఉద్దేశించినది. పూర్తి కోటా దక్కింది ఎన్నడు..? తుంగభద్ర నుంచి అధికారికంగా మనకు ఏడాదికి 73 టీఎంసీలు రావాల్సి ఉన్నా ఏనాడూ పూర్తి కోటా దక్కిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి సామర్థ్యంలో నీరున్నా మనకు మాత్రం గరిష్టంగా 42 టీఎంసీలకు మించి దక్కడంలేదు. కాల్వలు ఉమ్మడిగా ఉండడం, కాల్వలకు ఎగువన కర్ణాటక ప్రాంతం ఉండడం ఇందుకు ప్రధాన కారణం. ఇక కర్ణాటకకే పరిమితమైన ఎడమ కాల్వ కింద ఎంత నీటిని ఉపయోగిస్తున్నారనేది వివాదంగా మారింది. ఈ కాల్వ ద్వారా కర్ణాటక ప్రభుత్వం 93 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి హక్కు ఉంది. అయితే ఇంతకంటే ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో దీనిని కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని మనం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాం. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో తుంగభద్ర ప్రాజెక్టును కూడా నియంత్రణ బోర్డులోకి చేర్చుతున్నట్టు ప్రకటించింది. అది అమల్లోకి వస్తే తుంగభద్రపై కర్ణాటక ఆధిపత్యాన్ని కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంది. పైపులతో పీల్చేస్తున్నారు... కుడి లో లెవెల్ కెనాల్ పరిధిలో నీటి దోపిడీ సమస్య ఎక్కువగా ఉంది. ప్రాజెక్టు నుంచి ఈ కాల్వ ప్రారంభమైన తర్వాత మొదట కర్ణాటక పరిధి, మధ్యలో మన రాష్ట్ర సరిహద్దు, తర్వాత మళ్లీ కర్ణాటక భూములు, తర్వాత చివరన మన ఆయకట్టు ఉంది. ఈ కాల్వపై మనకు 24 టీఎంసీల నీటిని వాడుకునే హక్కున్నప్పటికీ మన వాడకం 53 శాతాన్ని మించడంలేదు. కర్ణాటక రైతులు చెరువులు, కుంటల ద్వారా అక్రమంగా ఆయకట్టు పరిధిలో లేని పొలాలకు నీటిని తరలిస్తుండడం మన రైతుల పాలిట శాపమైంది. ముఖ్యంగా 72 కిలోమీటర్ కాల్వ నుంచి 185 కిలోమీటర్ కాల్వ మధ్య భారీగా నీటి దోపిడీ జరుగుతోంది. సాధారణంగా ప్రధాన కాల్వ నుంచి నేరుగా పంట పొలాలకు నీటిని ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే కర్ణాటక పరిధిలో ఎల్ఎల్సీ నుంచి నేరుగా నీటిని తోడేస్తున్నారు. ఇందుకోసం కాల్వ పక్కనే కాల్వకంటే తక్కువ ఎత్తులో పెద్ద పెద్ద చెరువులను, కుంటలను తవ్వారు. కాల్వలో పైపులను పూర్తిగా ముంచి.. రెండోవైపు పైపులోకి గాలి చేరకుండా అడ్డుపెట్టి దానిని చెరువు లేదా కుంటలోకి లాగుతారు. తర్వాత ఆ అడ్డును తీసివేస్తే గ్రావిటీ ద్వారా కాల్వ నీరు పైపుల ద్వారా చెరువు లేదా కుంటలోకి ప్రవహిస్తోంది. ఇలా రాత్రివేళల్లో ప్రధాన కాల్వ నుంచి భారీగా నీటిని తోడేస్తున్నారు. కొందరు రైతులు పగటిపూటే నీటిని దొంగలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇలా చెరువులు, కుంటల్లోకి వచ్చిన నీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల ద్వారా పొలాలకు మళ్లిస్తున్నారు. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం కాల్వ వెంబడి అనేక ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసి మరీ ప్రత్యేక విద్యుత్ కనెక్షన్లను ఇచ్చింది. దీంతో విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని పగలు, రాత్రి అనే తేడా లేకుండా పంపింగ్ చేస్తున్నారు. ఇలా కర్ణాటకలోని ఎర్రగూడి, జాలుపాడు, బోనెహలు, బొమ్మనహళ్, చాగనూరు, మోక, సంగనకల్లు, బళ్లారి వంటి ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లోని ఆయకట్టు కాని పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు. ఈ నీరంతా కూడా మన రైతులకు న్యాయంగా కేటాయించినది కావడం గమనార్హం. ఈ అక్రమ నీటి వాడకానికి కర్ణాటక సర్కారే వత్తాసు పలుకుతోంది. పగలు వద్దు.. రాత్రి వేళల్లో చెరువులు, కుంటలు నింపుకోవాలంటూ అధికారులే రైతులకు సలహా ఇస్తున్నారు. కాల్వ నీటిని తోడటానికి అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులను గతంలో మన రైతులు అక్కడికెళ్లి తొలగించినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. దోపిడీ నియంత్రణలో బోర్డు విఫలం... ఇటు ఎల్ఎల్సీ, అటు హెచ్ఎల్సీలపై కర్ణాటక రైతులు తుంగభద్ర నీటిని అక్రమంగా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నా నియంత్రించడంలో బోర్డు పూర్తిగా విఫలమైంది. బోర్డుకు చైర్మన్గా కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఆంధ్ర, కర్ణాటకలకు చెందిన నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు ఉన్నారు. బోర్డు కార్యదర్శిగా ఎస్ఈ స్థాయి అధికారి ఉన్నారు. అలాగే ఒక్కొక్క ఈఈ, ఎస్ఈతో పాటు నలుగురు డీఈలు, 16 మంది ఏఈలు ఉన్నారు. వీరిలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఉన్నారు. అయితే కర్ణాటక పరిధిలోకి వెళ్లి అక్రమ వాడకాన్ని అడ్డుకోవడం మన రాష్ట్ర అధికారులకు ఇబ్బందిగా మారింది. ఈ విషయంపై గతంలో పలుమార్లు బోర్డుకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా కర్ణాటక నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. మన అధికారులు, రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువైనప్పుడు మాత్రం కాల్వపై ఇంజనీర్లు తిరిగి అక్రమ నీటివాడకం వద్దంటూ రైతులకు చెప్తారు. వారు పర్యటిస్తున్న సమయంలో పైపులు కనిపిస్తే వాటిని తొలగించడం మినహా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దాంతో అధికారులు వెళ్లిన తర్వాత మళ్లీ పైపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్రమ నీటి వాడకానికి పాల్పడుతున్న రైతులు ఎకరానికి కొంత చొప్పున స్థానిక సిబ్బందికి చెల్లిస్తున్నట్టు పరిశీలన లో తెలిసింది. మన ప్రతిపాదనలు పట్టించుకోరు... మన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలు ప్రత్యామ్నాయాలను కర్ణాటక దృష్టికి తీసుకువచ్చింది. ముఖ్యంగా అక్రమ నీటి వాడకాన్ని అరికట్టడం కోసం ఎల్ఎల్సీ 72 కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ వరకు ప్రత్యేక పైపు లైన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించలేదు. అలాగే మన రాష్ట్ర రైతులకు నీటి సరఫరా సరిగ్గా జరగడం కోసం మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది. ముఖ్యంగా హెచ్ఎల్సీ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 2,575 క్యూసెక్కుల నుంచి 4 వేల క్యూసెక్కులకు పెంచాలని, అందుకోసం ఈ కెనాల్ను 105 కిలోమీటర్ల మేర వెడల్పు చేయాలని, వరద నీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా వరదనీటి కాల్వను తవ్వి, దీని ద్వారా 20 నుంచి 25 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చని అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలకూ కర్ణాటక సానుకూలంగా లేదు. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య ఇటీవల జరిగిన సమావేశంలోనూ ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మన రాష్ట్రం వాదనకు ఇటు బోర్డు నుంచి కానీ, అటు కర్ణాటక నుంచి కానీ మద్దతు లభించలేదు. ఇక విడిపోతే రాష్ట్రం ఎడారే! రెండు రాష్ట్రాల మధ్య నదులు, ప్రాజెక్టులు ఉంటే.. నీటి పంపకాల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో ఇప్పటికే పలు అనుభవాలు ఉన్నాయి. కావేరి నది నీటి విషయంలో గత 30 ఏళ్లకు పైగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రెండు మూడు టీఎంసీల నీటి విడుదల కోసం స్వయంగా ప్రధానమంత్రి రంగంలోకి దిగినా ప్రయోజనం లేని పరిస్థితి ఇప్పటికే అనుభవంలోకి వ చ్చింది. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కృష్ణానది నీటిపై ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. గత పదేళ్ల నుంచి ట్రిబ్యునల్ దీనిపై కసరత్తు చేస్తున్నా ఫలితం శూన్యం. కొత్త ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే.. ఇప్పటికే తీవ్ర నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం తీవ్రంగా వ్యతిరేకించిన ఆలమట్టి, బాబ్లీ ప్రాజెక్టులను ఎగువ రాష్ట్రాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రం కూడా విడిపోతే.. నీటి పంపకాల్లో మరిన్ని సమస్యలు రానున్నాయి. ముఖ్యంగా కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులపైనా నియంత్రణ బోర్డుల పెత్తనం పెరిగిపోతుంది. దాంతో ఆయా ప్రాంతాల అవసరాలను తీర్చడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. నీటి కోసం ఒక ప్రాంతం వారు మరో ప్రాంత ప్రజలపై కక్షకట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎంఆర్పీ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. కరవు పరిస్థితుల్లో మరింత దారుణమైన దుస్థితితో రాష్ట్రం ఎడారయ్యే ప్రమాదం ఉంది. -
విభజన ఫలితం వివాదమే!
కోస్తాంధ్రలో జరిగిన నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి బ్రిటిష్ కాలం నాటిది. కానీ నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణ అలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. 1957 తరువాత మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు సాగునీటి పథకాల అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే నదీ జలాల పంపీణీలో అదనం గా ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమీ ఉండబోవని కొందరు తెలంగాణ ప్రాంత ప్రముఖులు వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు న్న సమస్యలే తప్ప అదనంగా ఎదురయ్యే సమస్యలు ఉండ వని వారి భావన. ఇది వాస్తవం కాదు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న వాదనే ఇది. ఈ వాదన ఎంత అసంబద్ధమో చర్చించాలి. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు, రాష్ట్రం లో సాగుభూమి వివరాలు ఇవి: ఆంధ్రలో 19.37 లక్షల హెక్టార్లు, రాయలసీమలో 5.31 లక్షల హెక్టార్లు, తెలం గాణలో 9.31 లక్షల హెక్టార్లు. అదే 2008 సంవత్సరం వచ్చే సరికి సాగుభూమి ఆంధ్రలో 30.68 లక్షల హెక్టార్లు, రాయలసీమలో 7.72 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 24.45 లక్షల హెక్టార్లకు పెరిగింది. అదనంగా జలాలను కేటాయించి, పథకాలను నిర్మించడంవల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తెలం గాణ ప్రాంతం విశేషంగా లాభపడిన సంగతిని ఇక్కడ గమనించవచ్చు. ఆ ప్రాంతంలో 163 శాతానికి మించి సాగుభూమి విస్తరించింది. మిగిలిన రెండు ప్రాంతాలలో సాగుభూమి విస్తరించింది తక్కువే. కాబట్టి తెలంగాణకు న్యాయం జరగలేదనడం, నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించ డం వాస్తవంకాదు. అలాగే సీమాంధ్ర ప్రజలు జల చౌర్యా నికి పాల్పడ్డారన్న ఆరోపణ కూడా పూర్తిగా సత్యదూరం. నిజానికి రాయలసీమ, కోస్తాంధ్రలో జరిగిన నీటి పారు దల సౌకర్యాల అభివృద్ధి బ్రిటిష్ కాలం నాటిది. కానీ నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణ అలాంటి అభి వృద్ధికి నోచుకోలేదు. 1957 తరువాత మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు సాగునీటి పథకాల అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతే తెలంగాణ అభి వృద్ధి చెందిందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఇప్పుడు అన్నపూర్ణ కాదు కదా ఒకప్పుడు అన్నపూర్ణ అని, ధాన్యాగారం అని కోస్తాంధ్రకు దేశంలోనే ఖ్యాతి ఉండేది. ప్రస్తుతం భారత ఆహార సంస్థ, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ చెబుతున్న వివ రాల ప్రకారం వ్యవసాయోత్పత్తులలో తెలంగాణ రాష్ట్రం లోని మిగిలిన రెండు ప్రాంతాలకూ తీసిపోదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ చర్యలవల్ల రాయలసీమ, కోస్తాంధ్రలకంటే తెలంగాణయే ఎక్కువ లబ్ధిపొందింది. రాష్ట్రంలో గోదా వరి, కృష్ణా, పెన్నా ప్రధానమైన పరీవాహక ప్రాంతాలు. పెన్నా పరీవాహక ప్రాంతం కేవలం రాయలసీమ, నెల్లూరు జిల్లాకు చెందిన పరిమిత బేసిన్. కానీ గోదావరి, కృష్ణా బేసిన్లు విస్తారమైనవి. గోదావరి బేసిన్ కోస్తాంధ్ర, తెలంగాణకు చెందినది కాగా, కృష్ణ మాత్రం మన మూడు ప్రాంతాలకు సంబంధించినది. కృష్ణా జలాలకు సంబం ధించి 1976లో బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పును ప్రక టించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క జూరాల ప్రాజె క్టుకే (17.9 టీఎంసీలు) ట్రిబ్యునల్ కేటాయింపులు చేసింది. ఆంధ్ర, రాయలసీమలోని కొత్త ప్రాజెక్టులకు ఒక్క టీఎంసీల నీరు కూటా కేటాయించలేదు. రాయలసీమ దుర్భిక్ష ప్రాంతానికి సాగునీటి అవసరం ఇతోధికంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే మూడు ప్రాంతాలలో దాదాపు పూర్తి కావస్తున్న జల పథకాల కోసం మిగులు జలాలను పంచుకునే స్వేచ్ఛ ను రాష్ట్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఇచ్చింది. సీమాంధ్రలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి అవసరాలు ఇలా ఉన్నాయి. తెలుగు గంగ 29 టీఎంసీలు, గాలేరు-నగరి 50 టీఎంసీలు, హంద్రీ-నీవా 40 టీఎంసీలు, వెలిగొండ 43.5 టీఎంసీ (162.5 టీఎంసీలు) నీరు అవసరం. తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడుకు 22 టీఎంసీలు, కల్వకుర్తికి 25 టీఎంసీలు, ఎస్ఎల్డీసీకి 30 టీఎంసీలు నీరు అవ సరం అవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ మంచి వర్షాలు పడిన కాలంలో కళకళలాడతాయి. తక్కువ వర్షపాతం నమోదైతే వెలవెలబోతాయి. కరుణించని శ్రీబాగ్ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కృష్ణా, పెన్నా బేసిన్ల నుంచి నీటిని ఉపయోగించదలిస్తే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలి. 1937లో ఈ మేరకు ఒప్పందం జరిగింది. అయితే మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ ఒప్పందాన్ని అమలు చేయలేదు. ఎలాంటి భారీ జల పథ కాలు ఆ కాలంలో చేపట్టకపోవడమే ఇందుకు కారణం. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు కూడా కృష్ణా నది మీద ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించే వరకు ఇదే కొనసాగిం ది. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత కృష్ణా, పెన్నా బేసిన్లలో కొన్ని పథకాల నిర్మాణం చేపట్టారు. కానీ రాయలసీమను పట్టించుకోలేదు. తరువాత కూడా ప్రభు త్వాలు ఈ ఒప్పందం అమలును విస్మరించడంతో రాయ లసీమకు కృష్ణా లేదా మిగిలిన వనరుల నుంచి నీళ్లు లభిం చలేదు. ఈ నిర్లక్ష్యం వల్లే రాయలసీమ నేటి వరకు కూడా తాగు, సాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు నోచుకోకుండాపోయింది. మిగిలిన ప్రాంతాలు పంటలతో కళకళలాడుతుండగా రాయలసీమ మాత్రం ఒక్క మెట్ట పంటకు కూడా నోచుకోవడం లేదు. కాబట్టి మిగిలిన ప్రాం తాలను దృష్టిలో ఉంచుకుంటే అధిక కేటాయింపులు కావా లన్న రాయలసీమ కోర్కె న్యాయ సమ్మతమైనది. మిగిలిన ప్రాంతాలలో పలు పథకాలు పూర్తయ్యాయి. వారి అవస రాలు తీరాయి. 300 టీఎంసీల గోదావరి జలాలను రాయ లసీమ అవసరాల కోసం పోలవరం, దుమ్ముగూడెం, కంతానపల్లి ప్రాజెక్టుల ద్వారా కృష్ణకు తరలించడం అనివార్యం. ఇక నియంత్రణ మండళ్ల దయ ఆంధ్రప్రదేశ్ను చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే నదీ జలా ల పంపిణీలోను, పథకాల నిర్వహణలోను అసంఖ్యా కంగా తీవ్ర సమస్యలు ఎదురవుతాయన్నది సుస్పష్టం. రాష్ట్రం విడిపోతే కృష్ణ మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వ హణ కోసం నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి. రాజోలి బండ, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచిం తల మొదలైన ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి సమస్యలు అనివార్యం. ప్రాజెక్టుల నిర్వహణ, వాటి కనిష్ట వినియో గాలకు ఈ నియంత్రణ మండళ్ల ఏర్పాటు తప్పనిసరి. ప్రయోజనాల విషయంలో వైరుధ్యాలు ఉండటంవల్ల విద్యుదుత్పాదన, వరద నివారణ చర్యలు జలాశయాల నిర్వహణ కష్టతరంగా మారుతుంది. ఆ సమస్యలను పరిష్కరించడం అంత సులభం కూడా కాదు. ఎత్తి పోతల పథకాల నిర్వహణలో కూడా ఇలాంటి సమస్యలనే ఎదు ర్కోవలసివస్తుంది. ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను అమలు చేయడానికి, నదీజలాల విడుదలకు నియంత్రణ మం డళ్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి అవుతుంది. దీనితో ట్రిబ్యునళ్లు ఇచ్చిన మేరకే నియంత్రణ మండళ్లు ఆయా ప్రాంతాలకు నీటిని కేటాయిస్తాయి. వరద మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు కూడా నీటిని సరఫరా చేయడానికి నియంత్రణ మండళ్లకు విచక్షణాధికా రాలు ఉండవు. దానితో మంచి వర్షాకాలంలో కూడా నీటిని ప్రాజెక్టులకు వదలకుండా ఉండటం వల్ల సముద్రం పాలవుతాయి. దీనితో మిగులు జలాల ఆధారంగా నిర్మిం చిన ప్రాజెక్టులు కూడా అవసరం మేరకు నీటిని పొంద లేవు. అలాగే వర్షపాతం సక్రమంగా లేని కాలంలో ఇది మరింత క్లిష్టతరం అవుతుంది. రాష్ట్రాల మధ్య జలాల పం పిణీ కోసం భారతదేశంలో నియమించిన చాలా బోర్డులు ఆయా రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడం లో, ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి విభజన తరువాత కొత్తగా ఏర్పాటు చేసే నియంత్రణ మండళ్లు ప్రస్తుతం ఉన్న నియంత్రణ మండళ్ల కంటే ప్రతిభావంతంగా పని చేయగలవని ఆశించలేము. రాజధానికి తాగునీరూ కష్టమే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి నాగార్జునసాగర్ జలా శయం నుంచి కేటాయించిన దానికి మించి సరఫరా జరు గుతోంది. (3.9 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ట్రిబ్యునల్ కేటాయించింది. సర్దుబాట్లు తరువాత ఈ కేటాయింపును 5.7 టీఎంసీలకు పెంచింది.) ప్రస్తుత వినియోగం 11 టీఎంసీలు. ముందు ముందు ఈ విని యోగం 16.5 టీఎంసీలకు పెరుగుతుంది. నియంత్రణ మండలి లేదా బోర్డు కృష్ణ నీటిని ఈ తరహాలో హైదరా బాద్కు తరలించడానికి భవిష్యత్తులో అనుమతించదు. గోదావరి విషయం కూడా ఇంతకంటే మెరుగ్గా ఉండదు. పరీవాహక ప్రాంతంలోని ఎగువ, దిగువ ప్రాజెక్టులకు సంబంధించి ఘర్షణలు తప్పవు. - ఆర్.ప్రభాకర్రెడ్డి, సీఈ (రిటైర్డ్), నీటిపారుదల శాఖ -
ఆ బీళ్లు దగాకు ఆనవాళ్లు!
1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టుల ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టింది. అయినా సీమ వాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి తీరని ద్రోహం తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నీటి సమస్యపై పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి. రాష్ర్ట, మధ్య తరహా జలవనరుల మంత్రి సుదర్శన్రెడ్డి సూచన మేరకు సాగు నిపుణులు సమావేశమై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుదర్శన్రెడ్డి సంక్లిష్టమైన నీటి సమస్య లోతు ల్లోకి వెళ్లి విశ్లేషించి, పరిష్కార మార్గాలపై మాట్లాడటానికి సాహసించలేక, తప్పుదోవ పట్టించే విధంగా సమస్యను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశారు. సాగునీటి రంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్రావు ‘సాక్షి’ దినపత్రికలో (అక్టోబర్ 3న) రాసిన వ్యాసంలో ‘దౌర్జన్యంగా ఇతర ప్రాంతాల నీటిని తరలించడం...’ అంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా రాశారు. తద్వారా కరవు కాటకాలతో జీవన్మరణ పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రాంత ప్రజలపై తీవ్రమైన నిందమోపి అవమానించారు. గత జల సేతుబంధనం రాష్ట్రంలో ఉన్న నలభై పైచిలుకు నదుల్లో గోదావరి, కృష్ణా, పెన్నా నదులు పెద్దవి. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పెన్నా నదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారం గా 98 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఒకనాడు నీటి పారుదల రంగ నిపుణులు అంచనా వేశారు. కానీ నేడు అది ఒట్టిపోయి, నీటి లభ్యత గణనీయంగా పడిపోయిం ది. కృష్ణా, పెన్నా నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అత్యంత కరవు పీడిత ప్రాంతాలున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయత ఆధారంగా 2130 (2060+70 పున రుత్పత్తి జలాలు) శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) నికర జలాలు లభిస్తాయని నిర్ధారించింది. మన రాష్ట్రానికి 811 (800+11 పునరుత్పత్తి జలాలు) టీఎంసీ కేటాయిం చింది. అందులో 33 టీఎంసీలను జల విద్యుత్తు ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు కింద చేర్చి, మిగిలిన 767 టీఎంసీలను 1960 సెప్టెంబర్ నాటికి సాగు నీటిని వినియోగించుకుంటున్న, నిర్మాణానికి అను మతులు పొందిన ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చింది. అలా వివిధ ప్రాజెక్టులు, చిన్న నీటిపారుదల పథకాలకు ట్రిబ్యునలే నిర్దిష్టమైన కేటాయింపులు చేసింది. నదీ పరీవాహక ప్రాంతాల విస్తీర్ణాన్ని బట్టి కేటాయింపులు చేయలేదు. ఆ అంశాన్ని ఇప్పుడు వివాదాస్పదం చేసి ప్రయోజనం లేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు 2000 మే 31తో ముగియడంతో కృష్ణా నదీ జలాల పంపిణీపై పునఃసమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ను నియమిం చింది. 75 శాతం విశ్వసనీయత ఆధారంగా నిర్ధారించిన 2130 టీఎంసీల నికర జలాలను ముట్టుకోకుండా, మిగు లు జలాలను పంచాలన్న కర్ణాటక, మహారాష్టల్ర డిమాం డ్కు ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం లభించే సంవత్సరా లలో దిగువ రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టు కొని, మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి కల్పించింది. అయి నా, తీర్పు అమలులో ఉన్న 1976 నుంచి 2000 సంవత్స రం వరకు అధికారాన్ని వెలగబెట్టిన ప్రభుత్వాల అలస త్వం, సాచివేత వైఖరి మూలంగా ఆ సదవకాశాన్ని చేజేతులా కోల్పోయాము. కొత్త తీర్పు శరాఘాతమే ఈ పూర్వరంగంలో మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ ముందు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలు బలంగా వాదించి, విజయం సాధించాయి. ట్రిబ్యునల్ ముసా యిదా తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శరాఘాతంలా తగి లింది. ఇక రాయలసీమ ప్రాంతంలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటి? ప్రపంచంలో ఎక్కడా పరిగణనలోకి తీసుకోని 65 శాతం విశ్వసనీయతను బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రామాణికంగా తీసు కొని 2293 టీఎంసీలు లభిస్తాయని, అందులో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2130 టీఎంసీల నికర జలాలను మినహాయించి, మిగిలిన 163 టీఎంసీలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. అందులో మన రాష్ట్రానికి 45 టీఎంసీల వాటా దక్కింది. ఆ నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా తెలుగుగంగకు 25 టీఎంసీలు, జూరాలకు 9 టీఎంసీలు, కనీస నదీ ప్రవాహం పద్దుకింద 6 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను నాగార్జునసాగర్ జలాశయంలో ‘కారీ ఓవర్’ పద్దు కింద కేటాయించిన 150 టీఎంసీలలో కలిపేయడం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంపు గొడ్డలిపెట్టు ఆల్మట్టి జలాశయం ఎత్తును 519.6 మీటర్లకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిస్తే, బ్రిజేష్ ట్రిబ్యు నల్ 524.256 మీటర్లకు పెంచుకోవడానికి ఆమోదముద్ర వేసింది. పర్యవసానంగా సాధారణ వర్షపాతం నమోదైన సంవత్సరాలలో మనకు కేటాయించిన నికర జలాలైనా లభిస్తాయో, లేదో చెప్పలేని స్థితినెలకొన్నది. ఈ నేపథ్యం లోనే సుదర్శన్ రెడ్డి, విద్యాసాగర్రావు కొత్త వివాదానికి తెర లేపుతూ రాయలసీమకు నికరజలాలలో వాటా 144.7 టీఎంసీలేనని సెలవిచ్చారు. జలవిద్యుత్తు ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు కింద బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న 33 టీఎంసీలను నిష్పక్షపాతంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ, మూడు ప్రాంతాల మధ్య సమానంగా విభజించి, 11 టీఎంసీలను రాయల సీమ పద్దుకు జమ చేశారు. మరొకవైపున 19 టీఎంసీల నికరజలాల కేటాయింపుతో, కేంద్ర జలసంఘం ఆమో దంతో నిర్మిస్తున్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్ఆర్ బీసీ)కు 11 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకోవడానికి మాత్రమే వీలుందని చెప్పకనే చెబుతూ, అలా సీమకు లభించిన నికర జలాలను 122.70+11+ 11= 144.70 టీఎంసీలుగా తేల్చేశారు. మరి మిగిలిన 8 టీఎంసీల నీరెక్కడి నుంచి ఎస్ఆర్బీసీకి సరఫరా కావాలో వారు పేర్కొనలేదు. ఇలాంటి వాదనతో గతంలో జరిగిన మరికొన్ని నీటి సర్దుబాట్లను కూడా ప్రశ్నార్థకం చేసే అవ కాశం ఉంది. నిత్య కరవులతో సతమతమవు తున్న అనం తపురం జిల్లా దాహార్తిని తీర్చడానికి తుంగభద్ర జలా శయం నుంచి కేసీ కెనాల్కు బచావత్ ట్రిబ్యునల్ కేటా యించిన 10 టీఎంసీల నికర జలాలను పెన్నా-అహో బిలం రిజర్వాయర్ (పీఏబీఆర్)కు ఇచ్చి, ఆ మేరకు శ్రీశై లం జలాశయం నుంచి కేసీ కెనాల్కు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాతే పైనీటి సర్దుబాటు చేసింది. ఈ 10 టీఎంసీల నికర జలాలు శ్రీశైలం జలాశయం నుంచి కేసీ కెనాల్కు సరఫరా కావాలి. దాన్ని అడ్డుకుంటే, తత్ఫలి తంగా తుంగభద్ర జలాశయం నుంచి పెన్నా-అహోబిలం రిజర్వాయర్కు చేసిన నీటి సర్దుబాటు రద్దవుతుంది. మొదటి నుంచీ మొండిచేయే 1937 నాటి ‘శ్రీభాగ్ ఒడంబడిక’ కాలగర్భంలో కలిసిపో యింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అందులో లిఖిత పూర్వకం గా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేం ద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టుల ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టినా సీమ వాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తా మని హామీ ఇచ్చి తీరని ద్రోహం తలపెట్టారు. తదనంతర కాలంలో ప్రజలు పోరాట ఫలితంగా దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడంతో రాయల సీమలో అంతర్భాగంగా ఉన్న బళ్లారితో పాటు తుంగభద్ర జలాశయాన్ని కోల్పోయారు. ఈ చరిత్ర తెలియని అజ్ఞా నులూ ఉన్నారు. పైగా రాయలసీమ ప్రజలను నీటి దొం గలుగా చిత్రీకరించే ఉన్మాదం ప్రకోపించింది. దాహార్తి తీరే మార్గం ఏది? గోదావరి నదీజలాలపైనే తెలుగు ప్రజల భవిష్యత్తు ఆధా ర పడి ఉంది. వెనుకబడ్డ ప్రాంతాల దప్పిక తీరి, అవి సమ గ్రాభివృద్ధి చెందాలన్నా గోదావరి నీటి తరలింపే శరణ్యం. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతోనే తెలుగు జాతి నీటి అవసరాలను తీర్చవచ్చు. ఆ నదుల అనుసంధానంతోనే మరు భూములను పంట పొలాలుగా మార్చడానికి మార్గం సుగమం అవుతుంది. తెలుగు జాతి ఐక్యంగా, శాంతియుతంగా సహజీవనం చేస్తూ, ఇచ్చి పుచ్చుకునే మనస్తత్వంతో జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. నీటి కోసం యుద్ధాలు చేసుకునే దుస్థితిని ఇప్పు డు సృష్టిస్తే చరిత్ర క్షమించదు! -
విభజనతో జలయుద్ధాలు: సీఎం కిరణ్
రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ను కలిశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ సంక్షోభంలో పడిపోతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువు అవతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ రైతు సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రైతులతో సీఎం అన్నారు. కేంద్రం ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేపడితే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని సీఎం కిరణ్ అంతకుముందు అన్నారు. రాష్ట్రం కలిసివుండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు. -
జలవివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్