Constitutional amendment
-
జమిలి ఎన్నికల బిల్లు... రేపే లోక్సభ ముందుకు
న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సభ ముందు ఉంచనున్నారు. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. -
రాజ్యాంగ పీఠికనూ పార్లమెంట్ సవరించొచ్చు
న్యూఢిల్లీ: 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత (సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ) అనే పదాలను చేర్చుతూ చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ మేరకు వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు ముగించి, సోమవారం తీర్పు వెలువరించింది. ‘రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ, తీర్పు కానీ అవసరం లేదు. రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కుంది. సవరణకు ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు’అని తీర్పులో పేర్కొంది.‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. పైపెచ్చు ఆ అధికారాలను సవాల్ చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్కు ఉంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయని గుర్తు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేమని కూడా పేర్కొంది. ఎన్నో ఏళ్లు గడిచాక పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?అంటూ ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.పిటిషనర్ల అభ్యంతరం ఏమంటే..సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై చేరిక తనకూ సమ్మతమేనని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనల సందర్భంగా తెలిపారు. అయితే, ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడంపైనే తనకు అభ్యంతరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాల చేరికను ఇందిరాగాంధీ అనంతరం ఎన్నికైన జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్థించిందని ఇదే అంశంపై వేరుగా పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అయితే, 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ, 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో..ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాటిని చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ కేసులో మొట్ట మొదటిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థమే వస్తుందని వివరించింది. -
భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామ్యవాద, లౌకిక( సోషలిస్ట్, సెక్యులర్) పదాలను తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం సుప్రీంకోర్టు విచారించి పిటిషన్లపై పలు ప్రశ్నలు సంధించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, లాయర్ విష్ణు శంకర్ జైన్, బలరామ్ సింగ్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తదితరులు దాఖలుచేసిన ఈ పిల్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. ‘‘సామ్యవాదం అనే పదానికి అర్ధాలను ప్రాశ్చాత్య దేశాల కోణంలో చూడొద్దు. సోషలిజం పదానికి అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అనే దృక్కోణంలోనే చూడాలి. సెక్యులరిజం అనే పదం భారత రాజ్యాంగంలో భాగమని గతంలో ఎన్నో తీర్పుల్లో న్యాయస్థానాలు తేలి్చచెప్పాయి. సెక్యులర్ పదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఫ్రెంచ్ వారి సెక్యులరిజంకు బదులు ఆధునిక భావజాల సెక్యులరిజాన్ని భారత్ సంగ్రహించింది. మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవాట్లేరా?’’అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి లాయర్ విష్ణుశంకర్ జైన్ బదులిచ్చారు. ‘‘మేం లౌకిక అనే పదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పదాన్ని పీఠికలో చేర్చిన విధానాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నాం. తప్పుడు మార్గంలో సోషలిజం పదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడుతుందని బీఆర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. 1949 నవంబర్ 26నాటి రాజ్యాంగ పీఠికనే కొనసాగిద్దాం. సవరణల ద్వారా పీఠికలో సవరణ చేయకూడదు. అదనపు పదాలను చేర్చడంలో హేతుబద్ధత లోపించింది’అని లాయర్ వాదించారు. ‘‘కొత్తగా చేరిన పదాలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాకున్నా ఒక గందరగోళానికి తెరలేపాయి. దీంతో పీఠికలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చన్న భావన తదుపరి ప్రభుత్వాల్లో నెలకొంది’’అని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదించారు. వాదోపవాదనల తర్వాత కేసు విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదాపడింది. -
India vs Bharat : ఒకే దేశం, ఒకే పేరు ?
ఇండియా పేరు శాశ్వతంగా భారత్గా మార్చనున్నారా ? నిజానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇప్పటికే ఇండియా దటీజ్ భారత్ అని రాసి ఉంది. ఇండియా అంటే భారత్ అని అర్థం. ఇండియా, భారత్ రెండు పేర్ల బదులుగా ఒకే పేరు తీసుకువచ్చే ఆలోచనలో మోదీ ప్రభుత్వం కనిపిస్తోంది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ వస్తున్నారు. మరుగున పడిఉన్న దేశ సంస్కృతిని మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెపుతున్నారు. అదే క్రమంలో 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. జి–20 సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరాల పేర్లనుంచి ...దేశం పేరు మార్పు వరకు నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక నగరాల పేర్లను మార్చారు. అలహాబాద్ను ప్రయాగ్రాజ్ గా, గుర్గావ్ను గురుగ్రామ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఈ నగరాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుండగానే, దేశం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు చరమగీతం పాడాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి బిజెపి, సంఘ్ పరివార్నుంచి వస్తోంది. వేద కాలం నుంచే ఈ ప్రాంతానికి భారత్ పేరు.. భారత్పేరు రుగ్వేద కాలం నుంచి వస్తోంది. వేద తెగ భరతుల పేరు నుంచి భారత్ అనే పేరు ఉద్భవించిందని చెపుతుంటారు. రుగ్వేదంలోని ఆర్యవర్తన తెగలవారని కూడా చరిత్ర చెపుతోంది. మహాభారత కాలంలోని శకుంతల–దుష్యంతుడు కుమారుడి పేరు కూడా భరతుడే. అలాగే భరతుడు పాలించిన ప్రాంతాన్ని భరత దేశంగా పిలుస్తుండేవారు. ఇలా ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతానికి భారత్ అనే పేరు కొనసాగుతూ వస్తోంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలోని హతిగుంఫా శాసనంలో కూడా భారత్ ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అయితే గంగా, మగద కు పశ్చిమాన ఉన్నభాగాన్నే భారత్ గా శాసనాలో ఉంది. దక్షిణభారతం, దక్కన్ పీఠభూమి దీని నుంచి మినహాయించారు. గ్రీకుల కాలంలో ఇండియా పేరు ఇక ఇండియా పేరు గ్రీకుల కాలం నుంచి కొనసాగింది. సింధు నదిని ఇంగ్లీష్లో ఇండస్ రివర్గా పిలుస్తుంటారు. ఇండస్ రివర్కు అవతల ఉండేవారిని ఇండియా అని, ఇండియాన్స్ అనే పిలవడం మొదలుపెట్టారు. 17వ శతాబ్దంలోకి ఇది బాగా వాడుకలోకి వచ్చింది. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనా ప్రభావంతో ఇండియా అనే పేరు స్థిరపడింది. ఇండియా పేరు ఎలా మారుస్తారంటే? రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఉపయోగించి ఏవైనా సవరణలు చేయడానికి పూర్తి వెసులుబాటు ఉంది. స్వయంగా రాజ్యాంగ సభ ఈ అవకాశం కల్పించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం ఉంది. అయితే రాజ్యాంగంలో చేసే మార్పులకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1కి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, తీర్మానం గానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్ 1 ప్రకారం ఈ ప్రాంతాన్ని ఇండియా, భారత్గా పిలుచుకునే అధికారం ఉంది. ఇండియా పేరును పూర్తిగా తొలగించి కేవలం భారత్ ఉండేలా బిల్లు పెట్టే అవకాశముంది. నాగిళ్ల వెంకటేష్, సాక్షిటీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్కు పేచీ అల్లా ఉక్రెయిన్తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 కోటా కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దతపై దాఖలైన దాదాపు 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 50 శాతం జనరల్ కోటాలో ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సీనియర్ లాయర్లు రవి వర్మ కుమార్, పి. విల్సన్ సహా పలువురు లాయర్లు కోర్టులో వాదించారు. ఈడబ్ల్యూఎస్కు ఆర్థికపరిస్థితినే గీటురాయిగా తీసుకోకూడదని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ లాయర్ శేఖర్ నఫరే వాదించారు. వీటిని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. -
లంకలో నిరసనలకు తెర
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది. -
Sakshi Cartoon: శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత
శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత -
బీసీల ప్రాతినిధ్యానికి రాజ్యాంగ సవరణ చేయాలి
హస్తినాపురం: చట్ట సభల్లో వెనుకబడిన తరగతులకు 52 శాతం ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆలోచన దినోత్సవం సందర్భంగా బీసీ కులాల వారీగా చట్ట సభలలో ప్రాతినిథ్యం కోసం మంగళవారం హస్తినాపురం చౌరస్తానిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం అమలు కావాలంటే శ్రమజీవులు పాలకులు కావాల్సిన అవసరం ఉందని, ఢిల్లీ, తమిళనాడు తరహా ప్రత్యామ్నాయం చూపే నాయకత్వం అవసరం అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వేల్పూరి కామేశ్వరరావు మాట్లాడుతూ.. 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన అగ్రవర్ణాలు బీసీలకు ఏమాత్రం ప్రాతినిథ్యం కలి్పంచలేదన్నారు. ఈ కార్యక్రమంలో రుక్మోద్దీన్, చెన్నోజు శ్రీనివాసులు, బర్మాల సత్యనారాయణ, పాండురంగం, జి.రాజు, వలిజాల యాదయ్య పాల్గొన్నారు. -
నిర్దిష్ట చర్చ లేకుండా చట్టాలా!?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను రూపొందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పన ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. పార్లమెంట్లో నిర్దిష్ట చర్చ జరగకుండానే చట్టాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వాటిలో స్పష్టత లేకుండా పోతోందని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై, అవి ప్రజలపై చూపించే ప్రభావంపై గతంలో పార్లమెంట్లో ఎన్నో చర్చలు, సంవాదాలు జరిగేవని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ పరిజ్ఞానం కలిగిన వారు చట్టసభలో లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పార్లమెంట్లో చట్టాలను రూపొందించే సమయంలో విస్తృతమైన చర్చ జరిగితే కోర్టులు వాటి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాయని, తద్వారా న్యాయ వివాదాలు తగ్గుతాయని సూచించారు. తొలి పార్లమెంట్లో చాలామంది న్యాయవాదులు ఉన్నారు. మహత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితర నేతలు న్యాయవాదులే. న్యాయవాదులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని దేశానికి అందించాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా చర్చ లేకుండానే కీలకమైన బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రాష్ట్రాలకు ‘ఓబీసీ జాబితా’ అధికారాలు
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) జాబితాలో మార్పులు/చేర్పులకు సంబంధించిన హక్కులను మళ్లీ రాష్ట్రాలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. అందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. త్వరలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)లను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కులు ప్రస్తుతం రాష్ట్రాలకు లేవని గతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. అంతకుపూర్వం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండేవి. అయితే, 102వ రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాలకు ఈ హక్కులు లేవని కోర్టు తేల్చింది. జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను ఖరారుచేస్తూ 2018నాటి రాజ్యాంగ సవరణ చట్టంలో 338బీ ఆర్టికల్ను చేర్చారు. ఇదే చట్టంలోని ఆర్టికల్ 342ఏ ప్రకారం ఎస్ఈబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఎస్ఈబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉందంటూ మే ఐదున సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్తగా మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ, 1992నాటి ‘మండల్’ తీర్పును విస్తృత ధర్మాసనానికి సమీక్షకోసం పంపలేమంటూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం మే ఐదున సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ తీర్పు తర్వాత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ తమ నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుందని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అందుకే మళ్లీ రాష్ట్రాలకు ఓబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారాలు అప్పజెప్పే బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పిందని సమాచారం. మరో ఐదేళ్లు సమగ్ర శిక్షా పథకం పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అంగన్వాడీలకు శిక్షిణనిచ్చే మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణనివ్వడం, విద్యార్థినుల హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్ మెషీన్ల ఏర్పాటు, సీనియర్ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులను నేర్పించడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకూ విద్యాబోధన, తదితరాలను సమగ్ర శిక్షా పథకంలో భాగంగా అమలుచేయనున్నారు. మరో రెండేళ్లు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు 389 పోక్సో కోర్టులుసహా దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కోర్టుల నిర్వహణకు కేంద్రం తన వాటాగా రూ.971.70 కోట్లు ఖర్చుచేయనుంది. ‘నిర్భయ’ నిధి నుంచి కేంద్రం తన వాటా నిధులను అందజేయనుంది. -
‘రిజర్వేషన్’ తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు(ఎస్ఈబీసీ) రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ వేసింది. 102వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే రాష్ట్రాల హక్కుకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఆ సవరణ ద్వారా పొందుపర్చిన రెండు నిబంధనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదని కేంద్రం ఆ పిటిషన్లో పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని మే 5న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అలాగే, రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మండల్’తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రివ్యూ పిటిషన్పై బహిరంగ కోర్టులోనే విచారణ జరగాలని, దీనిపై తీర్పు వెలువడే వరకు గత తీర్పులోని పలు అంశాలపై స్టే విధించాలని కేంద్రం కోరింది. గత తీర్పులో ఆర్టికల్ 342ఏను ధర్మాసనం సమర్ధిస్తూనే.. ఎస్ఈబీసీలను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు ఉన్న హక్కును తప్పుగా అర్థం చేసుకుందని రివ్యూ పిటిషన్లో కేంద్రం పేర్కొంది. 342ఏతో పాటు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన ఇతర నిబంధనలపై తీర్పు వెలిబుచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కేంద్రం తన రివ్యూ పిటిషన్లో కోరింది. -
102వ సవరణ రాష్ట్రాలకు ఆటంకం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన కులాల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) అధికారాల్లో స్పష్టత, ఎస్ఈబీసీ జాబితా మార్చే అధికారం పార్లమెంట్కు దఖలు పడిందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఎన్ఈబీసీ విషయంలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు అలాగే ఉన్నాయని, ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏను ఏ మాత్రం మార్చలేదన్నది తన అభిప్రాయమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నివేదించారు. ‘102వ సవరణ ఫలితంగా రాష్ట్రాలకున్న అధికారాలను లాగేసుకునే ప్రయత్నం జరిగిందన్న వాదన సరికాదు. ఆర్టికల్స్ 15(4), 16(4) ప్రకారం వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉన్నాయి’అని చెప్పారు. ‘ప్రస్తుత విషయానికొస్తే, మరాఠాకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎన్సీబీసీ వ్యతిరేకించింది. మరాఠాలు వెనుకబడిన తరగతికి చెందిన వారు కాదనేది కేంద్రం అభిప్రాయం. కానీ, రాష్ట్రం తన సొంత వైఖరి ఆవలంబించవచ్చు’అని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లున్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ 1992 నాటి ఇందిరా సాహ్ని కేసు తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసే విషయాన్ని పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కేంద్ర రిజర్వేషన్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారే తప్ప, రాష్ట్ర జాబితా కాదని తెలిపారు. తదుపరి వాదనలు సోమవారం వింటామని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. -
తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి
న్యూఢిల్లీ: శ్రీలంకలో మైనార్టీ వర్గమైన తమిళ ప్రజలకు మరిన్ని పాలనాధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సకు భారత ప్రధాని మోదీ సూచించారు. తమిళులు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని మోదీ చెప్పారు. మోదీ, రాజపక్స శనివారం వర్చువల్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. తమిళులకు అధికారాలను బదిలీ చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. లంకలో శాంతి, తమిళ వర్గంతో సయోధ్య కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మోదీ పేర్కొన్నారు. 1987లో ఇండో–శ్రీలంక ఒప్పందం తర్వాత 13వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే, ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ద్వైపాక్షిక సదస్సులో మోదీ, రాజపక్స పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లంకతో బౌద్ధపరమైన సంబంధాలను ప్రోత్సహించడానికి 15 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహీందా రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ అన్నారు. -
‘ఇండియా’ కాదు.. భారత్!
న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా అన్న పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అన్న పదం వాడేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన విచారించనుంది. ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పేరు మార్పునకు సంబంధించి కేంద్రం రాజ్యాంగంలోని ఒకటో ఆర్టికల్లో మార్పులు చేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే అందుబాటులో లేకపోవడంతో విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా పడింది. -
2024 తర్వాతా పుతినే అధ్యక్షుడు
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు వ్లాదిమిర్ పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. దిగువ సభ ‘ద స్టేట్ డ్యూమా’ రాజ్యాంగంలో చేసిన పలు సవరణలకు ఓకే చెప్పింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు లభించగా ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు వ్యతిరేకించకపోవడం గమనార్హం. కాకపోతే 43 మంది సభకు దూరంగా ఉన్నారు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సవరణలు అన్నింటికీ ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందు రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను సమీక్షించనుంది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెల్సిందే. -
ఆర్టికల్ 370 రద్దుపై విస్తృత ధర్మాసనానికి నో
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి రాజ్యాంగబద్ధతపై విచారించేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం కావాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విస్తృత ధర్మాసనానికి ఇవ్వాల్సిన కారణమేమీ కనబడటం లేదని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ను పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, జమ్మూ కశ్మీర్ హైకోర్ట్ బార్ అసోసియేషన్లు కలసి దాఖలుచేశాయి. -
తమిళుల సమస్యలను పరిష్కరించండి
న్యూఢిల్లీ: శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సను ప్రధాని మోదీ కోరారు. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, తమిళుల సయోధ్య ప్రక్రియను అమలు చేయాలని కోరారు. ఇందుకోసం శ్రీలంక రాజ్యాంగంలోని 13వ సవరణను అమలుచేయాలని తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్న రాజపక్స శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. శ్రీలంకలో తమిళుల జీవన ప్రమాణాల పెంపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విస్తృ్తత స్థాయి చర్చలు జరిపారు. శ్రీలంకలో తమిళుల సమస్యల పరిష్కారానికి కొలంబో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై మానవతా కోణంలో స్పందించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని వెల్లడించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. -
పుతిన్.. ఎన్నటికీ రష్యాధిపతే!
మాస్కో: రష్యాలో రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతున్న తన అధికారాన్ని ఇకపైనా నిరాటంకంగా కొనసాగించే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా పలు రాజ్యాంగ సంస్కరణలను ఆయన ప్రతిపాదించారు. పార్లమెంటు, కేబినెట్ అధికారాలను విస్తృతపరచాల్సి ఉందని బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ఈ మేరకు సవరించాల్సి ఉందన్నారు. 2024తో దేశాధ్యక్షుడిగా పుతిన్ పదవీకాలం ముగియనుండటంతో... ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటు పాత్ర పెరగాలి: ప్రధానమంత్రిని, కేబినెట్ను ఎంపిక చేసే అధికారాన్ని పార్లమెంట్కు ఇవ్వాలని పుతిన్ తాజాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ అధికారం అధ్యక్షుడి చేతిలో ఉంది. ‘ఆ అధికారాలను ఇవ్వడం ద్వారా పార్లమెంటరీ పార్టీలు, పార్లమెంట్ పాత్ర మరింత పెరుగుతుంది. ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల అధికారం, స్వతంత్రత కూడా పెరుగుతాయి’ అని ఆ ప్రసంగంలో పుతిన్ స్పష్టంచేశారు. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక పెట్టారాయన. ‘‘అలాగని పార్లమెంటరీ పాలన విధానం గొప్పదని చెప్పలేం. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్తే దేశ సుస్థిరతకు ప్రమాదం కలిగే అవకాశముంది. ‘ప్రధానిని, కేబినెట్ను రద్దు చేసే అధికారం అధ్యక్షుడికే ఉండాలి. రక్షణ రంగంలోని అత్యున్నత అధికారులను నియమించే అధికారం సైతం దేశ అధ్యక్షుడికే ఉండాలి. రష్యా మిలటరీ, ఇతర దర్యాప్తు సంస్థల ఇన్చార్జిగా కూడా అధ్యక్షుడే ఉండాలి’ అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ గవర్నర్లు సభ్యులుగా ఉన్న స్టేట్ కౌన్సిల్ అధికారాలను కూడా రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొనాలని సూచించారాయన. ‘ఎక్కువమంది పిల్లలున్న వారికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచాలి. తక్కువ ఆదాయం వల్లే జనం ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి ఆదాయాన్ని పెంచేలా పరిశ్రమలు తేవాలి’ అని చెప్పారాయన. రష్యా ప్రస్తుత జనాభా 14.7 కోట్లు. ప్రతిపాదిత సంస్కరణలను దేశవ్యాప్త ఓటింగ్కు పెట్టాలని పుతిన్ కోరారు. మెద్వదేవ్ రాజీనామా పుతిన్ ప్రసంగం అనంతరం, దేశ ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో పుతిన్ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మెద్వదేవ్ రాజీనామాను పుతిన్ ఆమోదించారు. ఆయన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉప దళపతిగా మెద్వదేవ్ను, తదుపరి ప్రధానిగా మైఖేల్ మిషుస్తిన్ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్ ఆమోదించింది. కాగా, మెద్వదేవ్ పనితీరుపై గతంలో పుతిన్ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్ ఆలోచన ఇదే!! రష్యా రాజ్యాంగం వరసగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండటానికి అవకాశం కల్పిస్తోంది. 2000వ సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పుతిన్... నిబంధనల ప్రకారం నాలుగేళ్లు చొప్పున 2008 వరకూ రెండుసార్లు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరవాత ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఉన్న తన అనుచరుడు మెద్వదేవ్ను అధ్యక్షుడిని చేశారు. తన పదవీకాలంలో మెద్వదేవ్... అధ్యక్ష పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచేశారు. అంతేకాకుండా 2012లో పుతిన్ కోసం మెద్వదేవ్ తన పదవి నుంచి దిగిపోయారు. అప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్ 2018లో మొదటి విడతను పూర్తి చేసుకుని, రెండోవిడత కూడా కొనసాగుతున్నారు. 2024 వరకూ పదవీ కాలం ఉంది. గ్యాప్ కోసం 2024లో మళ్లీ దిగి... ప్రధానిగా బాధ్యతలు చేపడతారని, అప్పుడు కూడా తన చేతిలో అధికారమంతా ఉండేందుకే పుతిన్ ఈ ప్రతిపాదన చేశారని విశ్లేషకుల మాట. తన స్థానంలో అధ్యక్షుడిగా వచ్చే వ్యక్తి .. మళ్లీ తనకే పగ్గాలు అప్పగించేలా చేయడమే పుతిన్ వ్యూహమని చెబుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తరువాత అత్యధిక కాలం దేశ కీలక పదవిలో కొనసాగిన ఘనత పుతిన్దే కావడం విశేషం. రష్యా కొత్త ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ -
జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రైతు ప్రయోజనాల పరిరక్షణ, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుకు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే ఈ కమిషన్ రైతాంగ సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కమిషన్కు ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడం, న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వొకేట్స్ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహిళల నుంచి గొలుసులు, ఆభరణాలు, పర్సులు ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను భారతీయ శిక్షా స్మృతిలో విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ ఈ నేరానికి పాల్పడిన వారికి 5 నుంచి 10 ఏళ్లపాటు కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షా స్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. -
వచ్చే 3నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ..
శ్రీనగర్/న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో జమ్మూకశ్మీర్లో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు, జననష్టం నివారణకే నిషేధాజ్ఞలు విధించి, కొనసాగిస్తున్నామన్నారు. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం జరిగిన మొదటి మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ‘వచ్చే 3నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. రాష్ట్ర చరిత్రలో∙ఇది అతిపెద్ద రిక్రూట్మెంట్. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యువతను కోరుతున్నా. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం త్వరలోనే భారీ ప్రకటన చేసే వీలుంది’ అని చెప్పారు. ‘జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను చాలా తేలిగ్గా స్వార్థానికి ఉపయోగించుకుంటాయి అందుకే సేవలను పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ తదితర రాజకీయ పార్టీల నేతల నిర్బంధంపై అడిగిన ప్రశ్నకు ఆయన.. ‘వాళ్లు పెద్ద నేతలవ్వాలని మీరు కోరుకోవడం లేదా? ఇప్పటి వరకు నేను 30 పర్యాయాలు జైలు కెళ్లా. ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలు జైలు జీవితం గడిపా. వాళ్లను అక్కడే ఉండనివ్వండి. ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంటే ఎన్నికలప్పుడు అంతపెద్ద నాయకులవుతారు’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ప్రజలపై బయటి నుంచి ఎటువంటి ఒత్తిడులు ఉండబోవని హామీ ఇస్తున్నా. వారి గుర్తింపు, మతం, సంస్కృతులను పరిరక్షిస్తాం’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రాణనష్టం నివారించేందుకు ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో నిషేధాజ్ఞలు విధించామని, ఫలితంగా భద్రతా బలగాల చర్యల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు. ఇంటర్నెట్ చాలా ప్రమాదకరం ‘ఇంటర్నెట్ చాలా ప్రమాదకరమైంది. మనకు చాలా తక్కువగా ఇది ఉపయోగపడుతోంది. కానీ, భారత్ వ్యతిరేక విషప్రచారానికి, కశ్మీర్పై పుకార్ల వ్యాప్తికి ఉగ్రవాదులకు, పాక్కు ఇది సులువైన అస్త్రంగా మారింది. ఇంటర్నెట్ సేవలను క్రమేణా పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. రాహుల్ రాజకీయ బాలుడు కశ్మీర్లో హింస కొనసాగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై గవర్నర్ మాలిక్ ఎద్దేవా చేశారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ తీరు రాజకీయాల్లో బాలుడి మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. గత వారం రాహుల్ చేసిన ప్రకటనను వాడుకుని పాక్ ఐరాసలో భారత్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిందన్నారు. ముందుగా కశ్మీర్పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెల్లడించాలి.ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370ను సమర్థించే కాంగ్రెస్ నేతలను ప్రజలే చెప్పులతో కొడతారు’ అని పేర్కొన్నారు. ‘రాహులే నాయకుడైతే పార్లమెంట్లో కాంగ్రెస్ నేత(ఆధిర్ రంజన్ చౌధురి) కశ్మీర్పై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినప్పుడే ఆపి తగిన బుద్ధి చెప్పి ఉండేవాడు’ అని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను బుధవారం చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపింది. ఈ పిటిషన్ల విచారణకు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ వెల్లడించింది. అక్టోబర్ మొదటి వారంలో రాజ్యాంగధర్మాసనం పిటిషన్లను విచారిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ను ఎలా రద్దు చేస్తారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కేంద్రానికి, జమ్ము కశ్మీర్ పాలనా యంత్రాంగానికి నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్పై జీవోఎం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేంద్రం కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్– 370 రద్దుతోపాటు రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ, కశ్మీర్, లదాఖ్గా విభజించడం తెల్సిందే. ఈ ప్రాంతాల అభివృద్ధితోపాటు, సామాజిక, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి పని ప్రారంభించే ఈ కమిటీలో న్యాయ, సామాజిక న్యాయం, సాధికారిత, వ్యవసాయ, పెట్రోలియం శాఖల మంత్రులు రవిశంకర్, గహ్లోత్, నరేంద్ర తోమర్, ప్రధాన్తోపాటు ప్రధాని కార్యాలయంలో మంత్రి జితేంద్ర సభ్యులు. ఈ బృందం ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి వాటిపై అధ్యయనం చేయనుంది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, సామాజిక పరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ బృందం తొలి సమావేశం సెప్టెంబర్లో ఉంటుంది. ‘కశ్మీర్’ అంతర్గత అంశమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కశ్మీర్లో హింసను పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కశ్మీర్ ఉగ్రవాదుల దుశ్చర్యల వెనుక పాక్ హస్తం ఉందన్నారు. కశ్మీర్ అంశం ముమ్మాటికీ భారతదేశ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్ బుధవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలతో తాను విభేదించినప్పటికీ కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారం అనడంలో తాను స్పష్టతతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్కు, ఇతర దేశాలకు ఎలాంటి హక్కు లేదన్నారు. అయితే, కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రవేశపెట్టిన పిటిషన్లో రాహుల్ పేరును అనవసరంగా లాగారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. పాక్ తన అసత్య ప్రచారానికి అండగా రాహుల్ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాలి: జవదేకర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్లో హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేవిగా, ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్కు మద్దతునిచ్చేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జవదేకర్ బుధవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో హింస కొనసాగుతోందని, ఎంతోమంది మరణిస్తున్నారని, అత్యంత బాధ్యతారహిత రాజకీయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై జవదేకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ వాదనకు ఊతమిచ్చేలా మాట్లాడడం ఏమిటని రాహల్ను ప్రశ్నించారు. కశ్మీర్ వ్యవహారం భారతదేశ అంతర్గత వ్యవహారమని రాహుల్ బుధవారం ట్వీట్ చేయడంపై జవదేకర్ స్పందించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కశ్మీర్ అంశంపై రాహుల్ యూ–టర్న్ తీసుకున్నారని చెప్పారు. అంతేగానీ స్వయంగా ఆయనలో అలాంటి అభిప్రాయమేలేదన్నారు. రాహుల్కు ముద్దు వయనాడ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. ఒక చోట జనం గుమిగూడి ఉండగా.. కారులో వెళ్తున్న రాహుల్ అక్కడ ఆగాడు. అంతలోనే డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉన్న రాహుల్ బుగ్గపై బయటి నుంచి నీలిరంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని కొందరు వెనక్కి లాగేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
జడ్జీలను పెంచండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు అన్నిహైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై గొగోయ్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి మూడు లేఖలు రాశారు. ఈ సందర్భంగా హైకోర్టుల్లో జడ్జీల పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు పదవీవిరమణ చేసిన జడ్జీలను నిర్ణీతకాలానికి మళ్లీ విధుల్లో తీసుకోవాలని సూచించారు.‘సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ కేసులను విచారించలేకపోతున్నాం. మీకు(మోదీకి) గుర్తుందనుకుంటా. 1988లో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 18 నుంచి 26కు చేరుకుంది. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత అంటే 2009లో సీజేఐతో కలిపి జడ్జీల సంఖ్య 31కి చేరుకుంది. సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల కోర్టు మెట్లు ఎక్కే ప్రజలకు నిర్ణీత సమయంలోగా న్యాయం దొరుకుతుంది’ అని లేఖలో గొగోయ్ తెలిపారు. సుప్రీం, హైకోర్టుల్లో జడ్జీల పోస్టులకు అర్హులైనవారి సంఖ్య పెరిగినప్పటికీ, అదే స్థాయిలో న్యాయమూర్తుల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు. హైకోర్టుల్లో తీవ్రమైన కొరత.. హైకోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తోందని జస్టిస్ గొగోయ్ ప్రధాని మోదీకి రాసిన తన రెండో లేఖలో తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలోని అన్నిహైకోర్టుల్లో కలిపి 39 శాతం అంటే 399 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. శక్తివంచనలేకుండా కృషి చేస్తే తప్పించి ఈ ఖాళీలను భర్తీచేయడం సాధ్యం కాదు. అలాగే హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మిమ్మల్ని(ప్రధాని) కోరుతున్నా. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టండి. గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘాలు కూడా దీన్ని సూచించాయి’ అని జస్టిస్ గొగోయ్ వెల్లడించారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన మరో లేఖలో కోరారు. నిర్ణీత కాలానికి వీరిని న్యాయమూర్తులుగా నియమించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణలకు సవరణ చేయాలని సూచించారు. దీనివల్ల అపార అనుభవం ఉన్న జడ్జీలు మరింత ఎక్కువకాలం సేవలు అందించడం వీలవుతుందని పేర్కొన్నారు. -
3 భాగాలుగా ఓబీసీ కోటా?
దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్ వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతోందన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ ఉమ్మడిగా 27శాతం రిజర్వేషను అమలవుతోంది. వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి ప్రయోజనం కలగడం లేదని కమిషన్ అభిప్రాయ పడినట్టు తెలిసింది. తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, లబ్ధి స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. 27శాతంలో రిజర్వేషన్ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్ రోహిణి తెలిపారు. పది కులాలకే ఎక్కువ లబ్ధి ఓబీసీ జాబితాలో ఉన్న వేల కులాల్లో కేవలం 10 ఉప కులాల వారే 25 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్నారని, 983 ఉప కులాల వారికి ఒక్క శాతం లబ్ధి కూడా చేకూరడం లేదని కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1931 చేపట్టిన జనాభా లెక్కల్లో ఓబీసీల గణన జరిగింది. ఆ తర్వాత ఇంత వరకు ఓబీసీల గణన జరగలేదు. ఓబీసీ జనాభాపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేనందున రోహిణి 1931నాటి ఓబీసీ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంప్రదాయకంగా రాళ్లను పాలిష్ చేసే కలైగర్లు, కత్తులు సానపట్టే సిక్లిగర్లు,సరనియాలు వంటి వృత్తిపరమైన కులాలలో పాటు అనేక వెనకబడిన కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు ఎంత మాత్రం అందడం లేదని కమిషన్ పేర్కొంది. ‘ఈ కులాల జనాభా తక్కువేం కాదు. అయినా వారికి ఓబీసీ ప్రయోజనాలు అందడం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు’అని కమిషన్ సభ్యుడు డా.జేకే బజాజ్ అన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్లో భిక్షాటన చేసే బుద్బుదీలు, గోసాయన కులాల వారు కూడా ఓబీసీ వల్ల లాభం పొందలేకపోతున్నారని, అయితే ఈ కులాలకు చెందిన ఒకరిద్దరు ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులుగా కనిపిస్తున్నారని ఆయన వివరించారు. ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి, ఏవి పొందలేదు అన్నది నిర్థారించడం కోసం కమిషన్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ సహా దేశంలోని విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత మూడేళ్లుగా ఈ కోటా కింద పొందిన లక్ష అడ్మిషన్లను, ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఈ కోటా కింద పొందిన 1,30,000 ఉద్యోగాలను పరిశీలించింది. కమిషన్ ప్రతిపాదనలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ స్పందిస్తూ ‘ముందు కమిషన్ నివేదిక రానివ్వండి. దాన్ని అధ్యయనం చేసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం’ అన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్వాదీ పార్టీ, దక్షిణాన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఓబీసీల ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి. -
ఆ ‘సవరణ’ బిల్లు ఎవరి లబ్ధికోసం?
ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి పరాభవం కలిగిన నేపథ్యంలో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై కలిగిన కలవరం ఫలి తంగానే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈబీసీలకు రిజర్వేషన్ రేపటి ఎన్నికలాట కోసం విప్పిన వరాలమూటే తప్ప మరేం కాదు. అడుగంటిపోయిన ఉపాధి, ఉద్యోగ అవకాశాల మధ్య అగ్రకులాలకు రిజర్వేషన్ ఎవరికీ మేలుకలిగించేది కాదు. జనాభా ప్రాతిపదికన 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అన్ని వర్గాల, కులాలకు మేలు జరుగవచ్చు. రాజకీయ ప్రయోజనాలకై తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ ఎవరికీ లబ్ధి కలిగించదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది ఎంపీలు తప్ప మిగిలిన అందరు సభ్యుల మద్దతుతో, దాదాపు ఏకగ్రీవమైన ఆమోదంతో, మన రాజ్యాంగానికి 124వ సవరణ ద్వారా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ దాదాపు 50 శాతంగా ఉండగా, ఈ కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన (ఈబీఎస్) వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైన వాటిలో మరో 10 శాతం మందికి రిజర్వేషన్ లభిస్తుంది. అంతేకాదు, వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారందరికీ ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వలన ఈ కులప్రాతిపదిక రిజర్వేషన్ల వల్ల తమకు అవకాశాలులేకుండా పోతున్నాయని అగ్రవర్ణాలు బలంగా విశ్వసిస్తున్నారు. మేధాసంపత్తి కాకుండా, కులం ఆధారంగా రిజర్వేషన్ల వలన దేశ ప్రగతి కుంటుపడుతున్నదనీ తమలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల, తాము నష్టపోతున్నామన్న భావన అగ్రవర్ణాల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వలన తమకూ విద్య, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వీరున్నారు. ఈ భావన, ఆశ ప్రభావమెంతో ముందు పరిశీలిద్దాం. ఈ రిజర్వేషన్ ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు వర్తించదు. అసలు వాస్తవమేమిటంటే, మొత్తం ఉద్యోగ మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగాల వాటా 3.5 శాతం మాత్రమే. ఇందులో 10 శాతం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే 0.35 శాతం మాత్రమే మేలు జరగవచ్చేమో! అయితే మోదీ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగ కల్పన దిగజారుతున్నది. నిజానికి మూడు నెలల క్రితమే విడుదల చేయవలసిన దేశ నిరుద్యోగ పరిస్థితిని మోదీ ప్రభుత్వం వెల్లడించడానికే భయపడుతోందనిపిస్తోంది. కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోగా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానం వలన దేశవ్యాప్తంగా ఉద్యోగులు చిరుద్యోగులవుతున్నారు. చిరుద్యోగులు నిరుద్యోగులయ్యారు. వీరి సంఖ్య లక్షల్లో ఉంటోంది. మన చంద్రబాబు విషయానికివస్తే బాబు వస్తే జాబు వస్తుందని చేసిన ఊకదంపుడు ప్రచారం ఆచరణలో ఉన్న జాబులు ఊడిపోవడంగా ప్రతిఫలిం చింది. కనుక రిజర్వేషన్ వల్లనే తమ నిరుద్యోగ సమస్య తీరుతుందనుకోవడం భ్రమ. ప్రధానంగా కావలసింది కోట్లలో ఉద్యోగ కల్పన. ఇది చాతగాని ప్రభుత్వాలు ఏదో గోసాయి చిట్కాల వంటి సవరణ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టి ప్రయోజనం లేదు. అగ్రవర్ణ విద్యావంతులు సైతం ఆలోచించవలసిన విషయం మరొకటి. కేవలం తమ కులం ఆధారంగానే, తగిన విద్య మేధాసంపత్తి లేకపోయినా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు ప్రతిభ లేకపోయినా నెగ్గుకొస్తున్నారన్న అభిప్రాయం వీరిలో ఉంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఒక లెక్కప్రకారం ఏటా 4,50,000 మంది ప్రయత్నిస్తుంటారు. కానీ వారిలో అంతి మంగా 1100 మంది అర్హత సాధిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, ఏదో పరీక్ష రాస్తే చాలు, రిజర్వేషన్ వర్తించే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని భావింపగలమా? అంతే కాదు. ప్రతిభ, మేధోసంపత్తులకు ఈరోజుల్లో పరీక్షలో వారు సాధించిన మార్కులే కొలబద్ద! అసలీ మార్కుల కొలబద్దే వాస్తవానికి ప్రశ్నార్థకం కూడా. ఈ మార్కుల విషయం ఆలోచిస్తే, ప్రస్తుత పరిస్థితిలో ఈ మార్కుల సాధన, ఆ విద్యార్థి కుటుంబ పరిస్థితి, చదువుకునే వెసులుబాటు, వాతావరణం, తగిన ప్రోత్సాహం, దానితో పాటు వ్యక్తిగత మేధోసంపత్తి వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్ణవ్యవస్థ దుర్మార్గం కారణంగా అంబేడ్కర్, ఎన్నో కష్టాలు, అవమానాలు స్వయంగా అనుభవించవలసి వచ్చింది. తన గురువు గారి ప్రోత్సాహం, ఆయన సమకూర్చిన సాయం, తన వ్యక్తిగత ప్రతిభ వలన ఆయన ఇంగ్లండ్, అమెరికా, దేశాలకు విద్యార్జన కోసం వెళ్లి రెండు డాక్టరేట్ డిగ్రీలు తీసుకుని భారతదేశం తిరిగొచ్చారు. కానీ మనదేశం తిరిగి వచ్చిన తర్వాత మామూలు కిరాయిబండి తోలుకునే వ్యక్తి కూడా, అంబేడ్కర్ని తన బండి ఎక్కించుకోలేదు. కారణం దళితుడి నీడ సైతం అంటరానిదే అనే తరతరాల భావదాస్యంలో ఉన్నవాడే ఆ వ్యక్తి కూడా. అంబేడ్కర్కు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు ఇచ్చేందుకు సైతం మిగిలిన కులాలవారెవరూ సిద్ధపడలేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ మతస్థులు కూడా ఎవరూ అంబేడ్కర్కు ఒక గది ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు తన ఆఫీసులో తన కింద పనిచేసే ఫ్యూన్ ఆఫీసు ఫైల్ సైతం అంబేడ్కర్ చేతికి అందించేవాడు కాడట. మైలపడిపోతామన్న మూఢవిశ్వాసమే కారణం. అందుకే అంబేడ్కర్ ఈ వర్ణ వ్యవస్థ అంతమయితే గానీ మన దేశానికి విముక్తి ఉండదని ‘కులనిర్మూలన’ అనే గొప్ప గ్రంథం రచించారు. కానీ మన సామాజిక జీవనంలో నేటికీ ఈ కులోన్మాద వికృత రూపం కనబడుతున్నది. భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించినా, నేటికీ సామాజిక జీవనంలో, ఈ కులవ్యవస్థ అలాగే ఉంది. అందుకే సామాజిక న్యాయ సాధన అవసరం నేటికీ ఉంది. నిజానికి దళితుల ఆర్థికపరిస్థితి చెప్పనక్కరలేదు. నేడు విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో ఈ మేరకైనా దళితుల అభివృద్ధి సాధ్యమైందంటే అందుకు రిజర్వేషన్లే ప్రధాన కారణం. గతంతో పోలిస్తే చాలామంది దళితులు మధ్యతరగతి స్థాయికి వచ్చారు. కానీ ఇంకా ఎంతటి వ్యత్యాసం ఉందంటే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన దళిత, గిరిజనులు 0.4 శాతం కూడా లేరు. కనుక ఆర్థిక సమానత్వం పేరుతో, సామాజిక అన్యాయాన్ని తోసిరాజనడం సబబు కాదు. ఈ స్థితిలో కొత్తగా వచ్చిన ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కూడా స్థూలంగా పరిశీలిద్దాం. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, వైశ్య, క్షత్రియ ఇత్యాది అగ్రకులాలు జనాభాలో 23 శాతం మించి ఉండరు. మామూలుగా ఈ చట్టం చేయబోయేముందే అలాంటి కులాల గణాంకాలు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు అన్నింటినీ సాధికారంగా ప్రభుత్వాలు ఇచ్చి ఉండాల్సింది. నిరుద్యోగ పరిస్థితిపై అంచనాను కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఉన్న బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచింది. కొత్తగా దళితులపై మైనారిటీలపై గోరక్షణ పేరుతోనో, మరో వంకతోనో బీజేపీ, వీహెచ్పీ వంటి మతతత్వ సంస్థల మూకదాడులు పెరిగిపోయాయి. దానికితోడు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు తరి గిపోతున్నాయి. మోదీ డబ్బా వాయించుకున్న అవినీతి, అధికార కేంద్రీకరణ మరింతగా పెరిగిపోతోంది. మన రాజ్యాంగ వ్యవస్థలు చివరకు సర్వోన్నత న్యాయవ్యవస్థ సైతం ఈ విలువలు దిగజారుతున్న ఆరోపణలకు గురవుతున్నాయి. అన్నిటికీ మించి ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల్లో, కేంద్రంలో ఒకే పార్టీ పాలన వంటి ప్రచారంతో ప్రజల్లో మోదీ ప్రతిష్ట మసకబారుతోంది. అందుకు ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దీనిపై తమ విజయంపై ఆందోళన చెందుతున్న బీజేపీ నేతలు, అగ్రవర్ణాల ఓటర్లను మరింతగా ఆకర్షించడమే మార్గం అని తన విశ్వసనీయమైన సర్వేల ద్వారా నిజనిర్ధారణకు వచ్చిందట! ఆ ఎన్నికలాటలో, వరాల మూటలో రూపొందినదే ఆర్థికంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్ పేరుతో వచ్చిన చట్టం. పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ రిజర్వేషన్ వల్ల 8 లక్షల వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణాల వారందరికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు లభించినట్లే. ఆమేరకు రిజర్వేషన్ అనుభవిస్తున్న దళిత, ఆదివాసీ, బీసీలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆర్థిక సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెబుతూనే ఇంకా ఆ స్థాయికి మన దేశం చేరుకోలేదు కాబట్టి అది సాధించాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో దాన్ని చేర్చారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల సామాజిక న్యాయం మరింత దిగజారే అవకాశం ఉంది కనుక, విరుగుడుగా మరో 25 శాతం రిజర్వేషన్లను పెంచితే ఇప్పుడు కొత్తగా చేరినవారితో కలిపి దేశంలో 85 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. నిజానికి వివిధ వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే అణగారిన వర్గాలకే కాదు.. జనాభా మొత్తానికి సామాజిక న్యాయం తగురీతిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు 69 రిజర్వేషన్లను కల్పిం చాయి కాబట్టి 85 శాతం రిజర్వేషన్ అసాధ్యం అని కొట్టిపారవేయాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రతి వ్యక్తికీ పని కల్పించి, కనీన అవసరాలు తీర్చే తరహా సామాజిక వ్యవస్థను నెలకొల్పడం ఈ ప్రభుత్వాలకు అసాధ్యం కాబట్టే దేశంలో నిరుద్యోగుల సంఖ్య హనుమంతుని తోకలాగా పెరిగిపోతోంది. ఈ స్థితిలో దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన కులాలకు కనీసం ఇప్పుడున్న రిజర్వేషన్కి ఏదో మేర నష్టం కలుగకుండా నిలబెట్టుకోవాలి. కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం రిజర్వేషన్ చట్టానికి సవరణలు కావాలని కోరుతూ పార్లమెంటులో ఓటింగులో పాల్గొనకుండా ఉండాల్సింది. కానీ దాదాపుగా అన్నిపార్టీలూ ఈ 124వ రాజ్యాంగ సవరణకు మద్దతు ఇచ్చాయి. సామాజిక న్యాయ అంశాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో చూడటం సరికాదు. ఓట్లాటలో మధ్యతరగతి ముఖ్యం కనుక వారి ఓట్లకోసమే అన్ని పార్టీలు రాజ్యాంగ సవరణను ఏకగ్రీవంగా అంగీకరించాయని అనుకోవాలి. ఈరోజు ప్రగతిశీల శక్తులు ఎన్నికల విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. సామాజిక న్యాయసాధన అవసరమైన అన్ని వర్గాల, అస్తిత్వ పోరాట శక్తుల ఐక్యత పునాదిగా సమరశీల ప్రజా ఉద్యమమే సామాజిక న్యాయ సాధనకు పరిష్కారం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
పేదల కోటాపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఇటీవల కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ కోటాకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్ట చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించింది. 10 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ బెంచ్ శుక్రవారం నోటీసులు జారీచేసింది. జనహిత అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ పిటిషన్లను వేశాయి. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ..ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు ఆర్థిక స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావొద్దని యూత్ ఫర్ ఈక్వాలిటీ తన పిటిషన్లో పేర్కొంది. 50 శాతమే ఉండాలన్న రిజర్వేషన్ల పరిమితిని తాజా చట్టం ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది. ‘ఎస్సీ/ఎస్టీ చట్ట సవరణ’పై యోచన ఎస్సీ, ఎస్టీ(సవరణ) వేధింపుల నిరోధక చట్టం–2018పై కేంద్ర ప్రభుత్వ సమీక్షతోపాటు, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందనీ, ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై తక్షణం ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇతరులను కానీ అరెస్టు చేయరాదంటూ గత ఏడాది కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించినప్పు డు జరిగే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్లలో డబ్బు వెంటనే వాపసు అయ్యేలా చూడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, పిటిషనర్ ముందుగా ఈ సమస్యను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. -
పేదల కోటాకు రాజముద్ర
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగ(103వ సవరణ) చట్టం పేరిట తెచ్చిన ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. ప్రభుత్వం త్వరలో ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన ప్రజల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేరుస్తూ రాజ్యాంగంలోని 15వ, 16వ నిబంధనల్ని సవరించి ఈ చట్టం రూపొందించారు. మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక పరిమితుల ఆధారంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ప్రభుత్వం కాలానుగుణంగా గుర్తిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీచేసింది. ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరంటే.. ► వృత్తిగత, వ్యవసాయిక వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ► 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు ► నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 100 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు ► నాన్ నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు -
కోటా బిల్లులో ఏముంది?
న్యూఢిల్లీ: ఈ 10 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే 124వ రాజ్యాంగ సవరణ చట్టంగా పేర్కొంటారు. అధికరణ–15లోని నిబంధన(5) తరువాత నిబంధన (6)ను చేర్చుతారు. నిబంధన (6) ప్రకారం ఈ అధికరణలోని ఏ నిబంధన గానీ, అధికరణ–19లోని నిబంధన (1)లోని ఉప నిబంధన(జి) గానీ, అధికరణ–29లోని నిబంధన(2) గానీ రాజ్యం(ప్రభుత్వం) ఎ)ఆర్థికంగా వెనకబడిన వర్గాల(నిబంధన–4, నిబంధన–5లో ప్రస్తావించినవి కాకుండా) పురోగతికి ఏదైనా ప్రత్యేక నిబంధన రూపొందించడంలో గానీ ; బి) ఏదైనా ఆర్థిక వెనకబాటు వర్గాల(నిబంధన–4, నిబంధన–5లో ప్రస్తావించినవి కాకుండా) పురోగతికి వీలుగా ప్రయివేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ సహా విద్యా సంస్థల్లో.. ప్రస్తుత రిజర్వేషన్లకు అదనంగా గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఏదేనీ ప్రత్యేక నిబంధన రూపొందించడంలో గానీ నిరోధించజాలదు. అధికరణ–16లోని నిబంధన (5) తరువాత నిబంధన (6) చేర్చుతారు. నిబంధన (6) ఇలా ‘ప్రస్తుతం ఉనికిలో ఉన్న రిజర్వేషన్లకు అదనంగా.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో గరిష్టంగా పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా రాజ్యం(ప్రభుత్వం) ఏదైనా ప్రత్యేక నిబంధన రూపొందించడాన్ని ఈ అధికరణలోని ఏ భాగమూ నిరోధించజాలదు..’ బిల్లు ఉద్దేశాలు; కారణాలు ప్రస్తుతం ఆర్థికంగా వెనకబడిన వర్గాల పౌరుల్లో అధిక భాగం ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు దూరంగా మిగిలిపోయారు. ఆర్థిక వెనకబాటుతనం కారణంగా ఆర్థికంగా పుష్టి కలిగిన వారితో పోటీపడలేకపోతుం డటమే ఇందుకు కారణం. భారత రాజ్యాంగ అధికరణ 15లోని నిబంధన (4), నిబంధన (5), అధికరణ 16లోని నిబంధన (4) ద్వారా ప్రస్తుతం ఉనికిలో ఉన్న రిజర్వేషన్ ప్రయోజనాలు.. సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు తదితర నిర్ధిష్ట ప్రాతిపదిక గల వారికి తప్పితే ఈ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అందుబాటులో లేవు. బలహీన వర్గాలు, నిర్ధిష్టంగా చెప్పాలంటే.. ఎస్సీ, ఎస్టీ ప్రజల విద్యా, ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు, సామాజికంగా అన్యాయానికి, ఏరకమైన దోపిడీకి వీరు గురికాకుండా రక్షించేందుకు వీలుగా ప్రత్యేక శ్రద్ధ చూపేందుకుగాను ప్రభుత్వానికి రాజ్యాంగంలోని 46వ అధికరణలోని ఆదేశిక సూత్రాలు అధికారాన్ని కల్పించాయి. అధికరణ –15లో 93వ రాజ్యాంగ సవరణ చట్టం–2005 ద్వారా నిబంధన (5)ను చేర్చారు. దీని ద్వారా సంక్రమించిన అధికారంతో ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల పౌరులకు, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు, ఉన్నత విద్యలో ప్రవేశాలకు సంబంధించి వారికి చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక నిబంధన రూపొందించేందుకు వీలు కలిగింది. అదే తీరుగా అధికరణ–16లో నిబంధన (4)ను చేర్చింది. దీని ద్వారా సంక్రమించించిన అధికారంతో ప్రభుత్వం ఏదేని వెనకబడిన తరగతులకు ఉద్యోగ రంగంలో తగిన ప్రాతినిథ్యం లేదని ప్రభుత్వం అభిప్రాయపడినప్పుడు, వారికి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక నిబంధన ఏర్పాటు చేయవచ్చు. అయినా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందుకునేందుకు అర్హత లేదు. 46వ అధికరణలోని ఆదేశాలను పూర్తి చేయడానికి, ఆర్థికంగా వెనకబాటుకు గురైన వర్గాలకు ఉన్నత విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయమైన వాటా పొందేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించడమైంది. ఆర్థికంగా వెనకబాటుకు గురైన వర్గాలకు ఉన్నత విద్యాసంస్థల (ప్రైవేటు విద్యా సంస్థలు, ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ సహా, అధికరణ–30లో ప్రస్తావించినట్టుగా మైనారిటీ విద్యా సంస్థలు మినహాయించి)లో కోటా కల్పించేందుకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు–2019 ఉపయోపడుతుంది. ఈ ప్రయోజనాలన్నీ సాధించేందుకే ఈ బిల్లు. -
న్యాయ సమీక్షకు నిలుస్తుందా?
అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10% రిజర్వేషన్ ప్రక్రియకు చట్టపరమైన అడ్డంకులు తప్పవని పలువురు ప్రముఖ న్యాయవాదులు భావిస్తున్నారు. ‘ప్రభుత్వం ఏ వర్గం ప్రజలకైనా రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. అయితే దీని వల్ల లబ్ధి పొందే వర్గం ప్రజలకు ప్రస్తుతం ఉద్యోగాలు, విద్యలో తగినంత ప్రాతినిధ్యం లేదనే విషయాన్ని సంఖ్యా వివరాలతో సహా రుజువు చేయాల్సి ఉంటుంది. ఏ వర్గానికి కోటా ఇవ్వదలిచినా జనాభాలో, ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ఆ వర్గం వాటా ఎంత ఉందనే పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 1991 నాటి ఇందిరా సహానీ కేసు నుంచి అనేక కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వడం సబబేనని చెప్పడానికి నరేంద్రమోదీ సర్కారు ఎలాంటి అధ్యయనమూ చేసినట్టు కనిపించడం లేదు’ అని మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ కేవీ విశ్వనాథన్ వివరించారు. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడినవర్గాల ప్రాతినిధ్యం సరిగా లేదని నిర్ధారించేందుకు ఓ కమిటీ వేస్తే బావుంటుందని సూచించారు. హడావుడి నిర్ణయం తగదు: వికాస్ ‘కొత్త కోటా కోసం రాజ్యాంగ సవరణను ఇంత హడావుడిగా చేయడం సరికాదు. ముందు విస్తృత సంప్రదింపులు, అధ్యయనం జరగాలి’ అని మరో మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ వికాస్సింగ్ అభిప్రాయపడ్డారు. జాట్ వర్గీయులను ఓబీసీల్లో చేర్చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, ఇది కాలం చెల్లిన వివరాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ‘14, 15 అధికరణల కింద వివక్ష లేని సమానత్వ సూత్రాల కింద లభించే హక్కులను ప్రభావితం చేసే ఇలాంటి కీలక, సున్నితమైన నిర్ణయాన్ని పాత వివరాల ఆధారంగా తీసుకోకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని 16(4) అధికరణలో ప్రస్తావించిన వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం కిందకు వస్తుంది. అయితే విద్యాపరమైన, ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనానికి దారితీయొచ్చు. కానీ, సామాజిక వెనుకబాటుతనానికి ప్రత్యేక లక్షణాలు, కారణాలుంటాయని జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్తో కూడిన ధర్మాసనం అప్పట్లో తేల్చిచెప్పింది’ అని వికాస్ సింగ్ చెప్పారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా కల్పించాలన్న అప్పటి సర్కారు నిర్ణయాన్ని(1991 సెప్టెంబర్ 25) ఇందిరా సహానీ(మండల్ కేసు)కేసులో 9 మంది జడ్జీల సుప్రీంకోర్టు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇది 16వ అధికరణ ప్రకారం రాజ్యాంగబద్ధం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఓపెన్ కేటగిరీలోని పది శాతం ఖాళీలను ఆర్థిక ప్రాతిపదికపై పేదలకు కేటాయించడం అంటే ఆపైన ఉన్నవారికి పదిశాతం సీట్లు దక్కకుండా చేయడమే అవుతుంది. ఇలాంటి చర్య ఏదైనా 16వ అధికరణలో సమానావకాశాలు ఇవ్వాలనే ఒకటో నిబంధనకు విరుద్ధమని ఆ బెంచ్ ప్రకటించింది. -
ఐర్లాండ్లో అబార్షన్ చట్టబద్ధం
లండన్: ఈ నిర్ణయం కోసం ఐర్లాండ్ మహిళలు 35 ఏళ్లు పోరాటం సాగించారు. కేవలం అబార్షన్ కోసం బలవంతంగా, ఒంటరిగా బ్రిటన్కు వెళ్లేందుకు కష్టాలు పడ్డారు. అబార్షన్ను చట్టబద్ధం చేస్తూ శుక్రవారం ఐర్లాండ్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. గత కొంతకాలంగా చర్చికి వెళ్లేవారి సంఖ్య క్షీణించడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన రిఫరెండంలో 66 శాతం ప్రజలు అబార్షన్కు తమ సమ్మతి తెలిపారు. దీంతో అబార్షన్ను చట్టబద్ధం చేయడానికి దారులు సుగమం అయ్యాయి. ఈ బిల్లును అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది. ‘ఇది ఐరిష్ మహిళలు చరిత్రలో మరిచిపోలేని క్షణం. దీనికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని ఐర్లాండ్ ప్రధాని లియో వారద్కర్‡ ట్వీట్ చేశారు. 1980 నుంచి ఇప్పటివరకు 7.77 లక్షల మంది ఐర్లాండ్ మహిళలు అబార్షన్ కోసం బలవంతంగా బ్రిటన్కు వెళ్లి వచ్చారు. ‘ఇకపై ఐర్లాండ్ మహిళల ఒంటరి ప్రయణాలుండవు’అని ఐర్లాండ్ ఆరోగ్యమంత్రి సైమన్ హారిస్ ట్వీట్ చేశారు. నిర్ణయం వెనుక భారతీయురాలు.. అబార్షన్కు అనుమతులు లేక సమయానికి అబార్షన్ జరగక ప్రాణాలు విడిచిన వారి విషాద కథనాలు ఎన్నో ఐర్లాండ్లో ఉన్నాయి. రక్తం విషతుల్యం అయిన కారణంగా భారత్కు చెందిన డెంటిస్ట్, సవిత హలప్పన్వర్ 2012లో స్థానిక గాల్వే ఆస్పత్రిలో చేరారు. ఆమె అప్పటికే గర్భవతి. ఆ సమయంలో ఆమె కడుపులో నొప్పిగా ఉందని, తనకు అబార్షన్ చేయమని చాలాసార్లు వేడుకున్నారు. చలించని వైద్యులు నిబంధనల్ని సాకుగా చూపి అబార్షన్కు నిరాకరించారు. దీంతో ఆమె 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచారు. ఆమె మృతి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఐర్లాండ్ మహిళలు ఉద్యమించారు. దాని ఫలితమే నేటి చరిత్రాత్మక నిర్ణయానికి నాంది. 2019 జనవరిలో ఈ చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం..గర్భం దాల్చిన 12 వారాల వరకు ఎప్పుడైనా అబార్షన్ చేయించుకోవచ్చు. 12 వారాల అనంతరం అబార్షన్ చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం. అయితే, ఇది అనారోగ్య సమస్యలు తలెత్తిన వారికి మాత్రమే వర్తిస్తుంది. వారికి అబార్షన్ చేయాలా? వద్దా అని ఇద్దరు వైద్యులు పరిశీలించి నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం వెనుక భారత మూలాలున్న వైద్యుడు, ప్రధాని వారద్కర్(39) చొరవ అభినందించదగినది. దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరికీ అవకాశం కల్పిస్తానని లియో ఎన్నిక తర్వాత ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పుట్టుకతో పౌరసత్వం ప్రశ్నార్థకం!
పై చదువుల కోసమో, బతుకుదెరువు కోసమో, లేదా జీవన ప్రమాణాల్లో మెరుగుకోరుకునో.. పలు వీసాల ద్వారా ప్రతియేటా ఆశల రెక్కలు తొడుక్కొని అమెరికాలో అడుగుపెడుతోన్న వేలాది మంది భారతీయుల కడుపున బిడ్డలుపుడితే.. ఆ బిడ్డల పౌరసత్వ హక్కుకు విఘాతం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన ప్రతిబిడ్డకీ వర్తించే పౌరసత్వ హక్కు రాజ్యాంగబద్దమైనది కాదనీ, పుట్టుకద్వారా సంక్రమించే హక్కుని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తేలేదని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ఇప్పుడు భారతీయుల్లో ఆందోళన నెలకొంది. అమెరికా సహా కెనడా, మెక్సికోలాంటి మొత్తం 35 దేశాల్లో అమలులో ఉన్న పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కుని రద్దు చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు భారతీయులంతా అమెరికా రాజ్యాంగంలోని 14 సవరణపై దృష్టిసారించారు. 14వ సవరణ ఏం చెబుతోంది? 1968లో అమెరికా రాజ్యాంగానికి 14వ సవరణ చేపట్టారు. ఇతర దేశాల దౌత్యాధికారులు మినహా మిగతా వారికి అమెరికా గడ్డపై పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుందని 14వ సవరణ చెబుతోంది. తల్లిదండ్రుల పౌరసత్వ స్థితి, జాతీయతతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకీ (తల్లిదండ్రులు దౌత్యాధికారులు కానంతవరకు) ఇది వర్తిస్తుంది. ఈ వెసులుబాటు వల్లనే భారతీయ సంతతికి చెందిన వేలాది మంది గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా అమెరికా పౌరసత్వాన్ని హక్కుగా పొందగలిగారు. అమెరికాలో పుట్టిన వాళ్ళంతా అమెరికన్లే. ‘‘ఇండియన్ అమెరికన్’’లో ‘‘ఇండియన్’’ అనేది కేవలం గుర్తింపుకోసమే వాడుతున్నారు. వృత్తిరీత్యా అమెరికాకి వెళ్ళిన భారతీయులు, తదనంతర కాలంలో అమెరికా గర్వించదగ్గ వ్యక్తులుగా గౌరవాన్ని అందుకున్నారు. వారి సేవలకిప్పుడు గుర్తింపేలేదా? అన్న ప్రశ్న భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరులను తొలచేస్తోంది. ట్రంప్ అనుమానిస్తున్నట్టుగా ఏ ఒక్కరూ కూడా కేవలం అమెరికా పౌరసత్వం కోసం అమెరికాలో బిడ్డని కనరనీ, ప్రకృతి సహజసిద్ధమైన చర్యకు అమెరికా రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుని ఇకపై లేకుండా చేయడం అమానవీయమనీ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోకి పెరిగిపోతోన్న వలసలను అరికట్టే ఉద్దేశ్యంతోనే పుట్టుకద్వారా సంక్రమించే పౌరసత్వ హక్కుని ట్రంప్ ఆక్షేపిస్తున్నట్టు ఆయన విధానాలను సమర్థిస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు. అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వలసవచ్చిన వారి పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వహక్కును మాత్రమే ఇది తిరస్కరిస్తుందన్న వాదనకూడా ఉంది. అయితే అమెరికాలో పుట్టిన వాళ్ళందరికీ వర్తించే ఈ హక్కుని పూర్తిగా తొలగించాలన్న భావం చాలా మందిలో ఉండడం గమనార్హం. ఏ దేశాల్లో ఎలా ఉంది బిడ్డ ఏ దేశంలో పుడితే ఆ దేశ పౌరుడిగా గుర్తించే సంప్రదాయం అమెరికా, కెనడా సహా మొత్తం 35 దేశాల్లో అమలులో వుంది. దీనినే జస్ సోలీ అని పిలుస్తారు. ఇక మిగిలిన దేశాల్లో పిల్లలు పుట్టిన దేశం ఆధారంగా కాకుండా వారి తల్లిదండ్రుల పౌరసత్వం ఆధారంగా పిల్లలు ఏ దేశ పౌరులో నిర్ణయిస్తారు. దీనిని జస్ సాంగ్వినీస్ అని పిలుస్తారు. భారత్, పాకిస్తాన్తోపాటు ఆస్ట్రేలియా, పోలాండ్లు సహా అత్యధిక దేశాల్లో జస్ సాంగ్వినీస్ విధానాన్నే అవలంబిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు చాలు వాషింగ్టన్: కీలక మధ్యంతర ఎన్నిక ల వేళ వలస విధానంపై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. దేశంలో అమెరికాయేతర దంపతులకు పుట్టే బిడ్డలకు ఆటోమేటిక్గా పౌరసత్వాన్నిచ్చే హక్కును రద్దుచేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తాజాగా చెప్పారు. రద్దుకు రాజ్యాంగ సవరణ అక్కర్లేదని, ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు సరిపోతుందన్నారు. ‘జన్మతః పౌరసత్వ హక్కు రద్దుకు సుదీర్ఘ ప్రక్రియ అనవసరం. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్లమెంట్లో సాధారణ ఓటింగ్ సరిపోతుంది. అయితే ఈ వ్యవహారాన్ని అంతిమంగా సుప్రీంకోర్టు తేల్చుతుంది’ అని ట్రంప్ అన్నారు. -
మరో మూడేళ్లు అబేనే
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడిగా మరో మూడేళ్ల కాలానికి ఎన్నికయ్యారు. దీంతో 2021, ఆగస్టు వరకూ ఆయన జపాన్ ప్రధానిగా కొనసాగనున్నారు. గురువారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 807 ఓట్లకుగానూ అబే 553 ఓట్లను దక్కించుకోగా, ఆయన ప్రత్యర్థి, మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబాకు 254 ఓట్లు లభించాయి. విజయం అనంతరం అబే మాట్లాడుతూ..‘పోరాటం ముగిసింది. ఇక రాజ్యాంగ సవరణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. పదండి.. సరికొత్త జపాన్ కోసం మనమందరం కలసికట్టుగా కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. తాజా విజయంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒత్తిడితో 1947లో రూపొందించిన రాజ్యాంగాన్ని సవరించేందుకు అబేకు మార్గం సుగమమైంది. ఉభయసభల్లో అబే నేతృత్వంలోని ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. జపాన్కు యుద్ధం చేసేందుకు సైన్యం లేకుండా, అంతర్జాతీయంగా తలెత్తే ఘర్షణల్లో పాల్గొనకుండా నిషేధిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 9కు సవరణలు చేయాలని అబే పట్టుదలతో ఉన్నారు. జపాన్కు ప్రస్తుతం ఆత్మరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎస్డీఎఫ్) అనే పరిమిత సైన్యం మాత్రమే ఉంది. -
లోక్సభతోపాటు 11 రాష్ట్రాలకూ ఎన్నికలు!
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటే 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పును అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. జమిలీ ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ న్యాయ కమిషన్కు పార్టీ చీఫ్ అమిత్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరిగే (మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్) రాష్ట్రాలకు కూడా 2019లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చూస్తోంది. బిహార్ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ బీజేపీ ఆలోచనకు మద్దతు తెలుపుతుండటంతో.. బిహార్ను ఈ జాబితాలో కలుపుతారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మిజోరంలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అధిష్టానంతోపాటు పార్టీలోనూ ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా మోదీ హవా.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిబింబిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి. ఏకకాల ఎన్నికలకు బీజేపీ మద్దతు దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అధికార బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని, దేశమంతా ఏడాది పొడవునా ఎన్నికల వాతావరణం ఉండకుండా చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్కు లేఖ రాశారు. ఈ లేఖను సోమవారం పార్టీ నేతలు లా కమిషన్కు అందజేశారు. ఏకకాలంలో ఎన్నికలు ఆలోచన మాత్రమే కాదు. ఆచరించదగింది కూడా అని పేర్కొన్నారు. రెండు దఫాలుగా ఎన్నికలు జరపడం వల్ల దేశ సమాఖ్య విధానం మరింత బలోపేతం అవుతుందని లేఖలో షా తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమే లేదన్నారు. తరచూ ఎన్నికలు పెడితే ఎన్నికల నియమావళి అమలవుతుందని, ఆ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు, విధాన నిర్ణయాలకు అవరోధం కలుగుతుందని తెలిపారు. ఏకకాల ఎన్నికలపై ప్రతిపక్షాల వ్యతిరేకత రాజకీయపరమైనదిగా కనిపిస్తోందన్నారు. అధికార ఎన్డీఏ పక్షంతోపాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్వాదీ పార్టీ, టీఆర్ఎస్ ఏకకాల ఎన్నికలను సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. -
అబార్షన్ చట్టాల రద్దుకే ఐర్లాండ్ ఓటు!
లండన్: ఆరేళ్ల క్రితం భారత సంతతి వివాహిత సవితా హాలప్పనవర్(31) మృతితో ఐర్లాండ్లో అబార్షన్ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని మొదలైన ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన రిఫరెండంలో ఆ కఠిన చట్టాల్ని రద్దు చేయాలని సుమారు 66.4 శాతం మంది ఓటేసినట్లు మీడియా తెలిపింది. 33.6 శాతం మంది వ్యతిరేకించారు. గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం సేకరించారు. ప్రజా తీర్పును ప్రధాని వారద్కర్ స్వాగతించారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న నిశ్శబ్ద విప్లవం ముగింపు దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ఆయన మొదటి నుంచి అబార్షన్ వ్యతిరేక చట్టాల రద్దుకు మద్దతు పలుకుతున్నారు. -
చైనా సర్వోన్నత నేత జిన్పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆదివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, కావాలంటే చనిపోయేంత వరకు కూడా అధ్యక్షుడిగా ఉండొచ్చు. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్పింగ్ రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరూ రెండు కన్నా ఎక్కువసార్లు చేపట్టకూడదంటూ ఉన్న నిబంధనను రద్దు చేయాలని ఇటీవల జరిగిన సీపీసీ మహాసభల్లో తీర్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలన్న సీపీసీ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పొరుగుదేశాలకు ఆందోళనకరం.. జిన్పింగ్కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కల్పించడం భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఆందోళన కలిగించే అంశం. 2013లో జిన్పింగ్ అధ్యక్షుడయ్యాక ఆయా దేశాలతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భారత్తో డోక్లాం వివాదం తెలిసిందే. భారత్కు శత్రుదేశమైన పాకిస్తాన్కు చైనా బాగా దగ్గరవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా–పాక్ ఆర్థిక కారిడార్ను కూడా నిర్మిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లోనూ తన ప్రాబల్యాన్ని బాగా పెంచుకుంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో నేపాల్తో కూడా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతోనూ విభేదాలను చైనా పెంచుకుంది. ఇవన్నీ జిన్పింగ్ అధ్యక్షుడయ్యాక జరిగినవే. ఈ నేపథ్యంలో జీవితకాలం పదవిలో కొనసాగే అవకాశాన్ని ఆయనకు కల్పించడం పొరుగుదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రాధాన్యం... చైనాను ఆర్థికంగా, సైనికపరంగా ‘సూపర్పవర్’గా మార్చాలనేదే జిన్పింగ్ లక్ష్యం. మరో 30 ఏళ్లలో చైనాను ›ప్రపంచ ఆర్థికశక్తిగా, ప్రపంచస్థాయి మిలటరీ శక్తిగా రూపుదిద్దే తన జీవితకాల లక్ష్యాన్ని సాధించేందుకు జిన్పింగ్కు తాజా నిర్ణయం దోహదపడతుందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలను చేపట్టడంతో పాటు పార్టీ కఠినమైన క్రమశిక్షణ పాటించేలా చేయడం, వివిధస్థాయిల్లో అవినీతిని అంతమొందించేందుకు తీసుకున్న ధృడచిత్త వైఖరి ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఈ విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారిని కూడా ఉపేక్షించలేదనే పేరు గడించారు. ఇప్పటికే ఆయన చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శిగా, చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్గా దేశంలోని అన్ని వ్యవస్థలపై కీలకబాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేపథ్యమిదీ... విప్లవోద్యమ కాలంలో నిర్వహించిన పాత్రతో జిన్పింగ్ తండ్రి పార్టీలో కీలకబాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను తప్పించడంతో షీ కుటుంబం కష్టాలు ఎదుర్కొంది. పార్టీలో జిన్పింగ్ నిబద్ధతతో, అత్యంత క్రమశిక్షణతో పనిచేశారు. 1971లోనే కమ్యూనిస్ట్ యూత్లీగ్లో చేరారు. పార్టీలో చేరేందుకు పదిసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమై 1974లో దానిని సాధించగలిగారు. 1999లో ఫుజియన్ ప్రావిన్స్ గవర్నర్ పదవిని చేపట్టారు. 2002లో ఝేజియాంగ్ ప్రావిన్స్, 2007లో షాంఘై పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2007లోనే పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీలో, సెంట్రల్ సెక్రటేరియట్లో చేరారు. హుజింటావో అధ్యక్షుడిగా ఉన్నపుడు 2008–13 మధ్యలో ఉపాధ్యక్షుడిగా, 2010–12 మధ్యకాలంలో సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్చైర్మన్గా ఉన్నారు. 2012లో తొలిసారిగా ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టిన ఆయన 2017లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు. -
ఇది సాధికారత శోధన
మధ్యభారతంలో ఓ కుగ్రామం పర్మినో. తరతరాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా అక్కడంతా మగవాళ్ల పెత్తనమే. ఆడవాళ్లు తల బయట పెట్టాలంటే తల మీద గూంఘట్ను సవరించుకోవాలి. వాకిలి బయట తలపెట్టి తమను ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత కానీ అడుగు గడపదాటదు. అలాంటి కుగ్రామంలో ఊరి పెత్తందారు రతన్సింగ్. అతడి మాటకు తిరుగులేకుండా సాగిపోతోంది. అప్పుడు వచ్చిందో చట్టం. అది 73, 74 రాజ్యాంగ సవరణ. ఆ సవరణ ప్రకారం స్థానిక పరిపాలనలో మూడవ వంతు మహిళలు ఉండాలి. పదిమంది వార్డు సభ్యులు ఉండే పంచాయితీలో కనీసం ముగ్గురైనా మహిళలు ఉండాలి. అది చట్టం రూపం సంతరించుకుంది కాబట్టి గ్రామ పరిపాలనలో మూడవ వంతు మహిళలు ఉండి తీరాలి. చట్టాన్ని ఉల్లంఘించకూడదు. అలాగని ఊరి పెత్తనం తన చేతి నుంచి జారిపోవడానికి వీల్లేదు. పెత్తనం చేయి దాటుతుందనే ఆలోచననే భరించలేని స్థితిలో ఉంటాడు రతన్ సింగ్. ‘కర్ర విరగకూడదు, పాము చావాలి’ ఎలా... మన ఇంటి మహిళ అయితే! ఆ మూడవ వంతు మహిళలు తమవాళ్లే అయితే? గొప్ప ఆలోచన. తన తెలివి తానే మురిసిపోతూ మీసం మెలేసుకుంటాడు రతన్సింగ్. కొడుకు ఇందర్కు చెప్తాడు ఈ సారి పంచాయితీ ఎన్నికలలో కోడలు మంజు పోటీ చేయాలని. అది ఇంటి పెద్ద తీర్మానం. ఊరిపెత్తనం ఇల్లు దాటి పోకుండా ఉండడానికి చేసిన తీర్మానం. ‘మంజు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది’ నిర్ణయం జరిగిపోయింది. నామినేషన్ పేపర్లు ఇంటికే వచ్చేశాయి. మగవాళ్లు చూపించి చోట సంతకం పెట్టడమే మంజు చేయాల్సింది. మామగారు, భర్త చెప్పినట్లు సంతకం చేసింది మంజు. ఇక మిగిలిన ఇద్దరు మహిళలు? పైగా ఈ ముగ్గురిలో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కూడా కవర్ అవ్వాలి. రతన్ సింగ్ మాటకు ఎదురు చెప్పని అనుచరులు గుర్తొచ్చారు. వారికి భార్యలున్నారు చాలు. పంచాయితీ ఎన్నికలు జరిగాయి. మగవారి నిర్ణయాలు అమలులోకి వచ్చేశాయి, వారు సూచించిన మహిళలే పంచాయితీ సభ్యులయ్యారు. పంచాయితీ సమావేశాల సమయంలో ఈ ముగ్గురు మహిళలూ గూంఘట్లు మరింత కిందకు లాక్కుంటూ భర్తల వెంట పంచాయితీ కార్యాలయాలకు వెళ్తుంటారు. మగవాళ్లంతా ఒక గదిలో కూర్చుని గ్రామ వ్యవహారాల మీద చర్చిస్తుంటారు. ఆడవాళ్లు మాత్రం మగవాళ్ల కంట పడకుండా మరొక గదిలో కూర్చుంటారు. పంచాయితీ గుమాస్తా రికార్డు బుక్ తీసుకుని ఆడవాళ్లున్న గదిలోకి వినయంగా వచ్చి సంతకాలు తీసుకుని వెళ్లిపోతుంటాడు. అది కూడా పంచాయితీ పెద్ద చెప్పినప్పుడు. ఆ క్లర్కు రికార్డు బుక్ తెచ్చినప్పుడు సంతకాలు పెట్టడానికా తాము సభ్యులైంది? మహిళా సభ్యులలో ఆలోచన రేకెత్తింది. వారిలో విద్య ఒక్కటే చదువుకున్న అమ్మాయి. ఎన్నికలకు కొద్ది ముందుగా పెళ్లయి ఆ ఊరికి వచ్చిన కొత్త కోడలు. ఆమె ఊరి పెద్ద పెత్తందారీ తనానికి తలొగ్గదామె. పంచాయితీకి విడుదలైన నిధులు ఏమవుతున్నాయి? బడి నిర్మాణం అసంపూర్తిగా ఎందుకు ఉంది? వంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఆమెను నియంత్రించడానికి ఆమె భర్త మీద ఒత్తిడి తెస్తుంటాడు రతన్సింగ్. దాంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. ఒత్తిడులకు భయపడి వెనుకడుగు వేయకుండా ముందడుగు వేయడానికి విద్య పోరాడుతుంది. మహిళలు సంఘటితమయ్యారు. తమకూ మెదడు ఉందని, దానికి ఆలోచనలు ఉన్నాయని, ఇంటిని దిద్దడమే కాదు ఊరిని బాగు చేయడం కూడా తమకు చేతనవుతుందని నిరూపిస్తారు గ్రామంలోని మహిళలు. ఎంపవర్మెంట్ ఒకరు ఇస్తే వచ్చేది కాదు, సాధికారత సాధించుకోవాలనే తపన మహిళలో ఉండాలి. ఒకసారి ఆ బీజం పడితే అది మొలకెత్తక మానదు, మహావృక్షంగా మారకా మానదు. – వాకా మంజులారెడ్డి ∙నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, యునిసెఫ్లు సంయుక్తంగా 1996లో నిర్మించిన సంశోధన్ సినిమాకు గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించారు. ∙73,74 రాజ్యాంగ సవరణ బిల్లును 1992లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా, అది 1993 ఏప్రిల్లో అమలులోకి వచ్చింది. ఈ సవరణల ఆధారంగా రూపొందిన చట్టం... స్థానిక పరిపాలనలో మూడవ వంతు మహిళల భాగస్వామ్యం ఉండాలని చెప్తోంది. -
జిన్పింగ్ కోసం రాజ్యాంగ సవరణకు సిద్ధం
బీజింగ్: కమ్యూనిస్ట్ చైనాలో వార్షిక పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను నిరవధికంగా అదే పదవిలో కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశముంది. చైనా పార్లమెంటు అయిన జాతీయ ప్రజా కాంగ్రెస్తో పాటు చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్సభ్యులైన దాదాపు 5,000 మంది ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఎన్పీసీలో 269 మిలటరి ప్రతినిధులు సహా 2,980 మంది సభ్యులున్నారు. చైనాలో అన్ని రంగాల ప్రముఖులతో ఏర్పాటుచేసిన సీపీపీసీసీలో యాక్షన్ నటుడు జాకీచాన్ కూడా సభ్యుడిగా ఉండటం విశేషం. -
జిన్పింగ్ కోసం రాజ్యాంగ సవరణ
బీజింగ్: చైనాలో శక్తిమంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని ఏ వ్యక్తులైనా రెండుసార్లకు మించి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధనను తొలగించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) సిద్ధమైంది. సీపీసీకి చెందిన సెంట్రల్ కమిటీ ఈ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్పింగ్ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. గతేడాది జరిగిన సీపీసీ కాంగ్రెస్ సమావేశాల్లో జిన్పింగ్ సిద్ధాంతాల్ని, ఆలోచనా విధానాన్ని రాజ్యాంగంలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. -
అసెంబ్లీ సమావేశాలకు ‘పంచాయతీ’ పీటముడి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు పంచాయతీరాజ్ చట్టంతో పీటముడి పడింది. ఈ నెల మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్ గత నెల 17న అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇప్పటికీ పంచాయతీరాజ్ ముసాయిదా బిల్లు సిద్ధం కాలేదు. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి కొత్తగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2017 అమల్లోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ముసాయిదా బిల్లు తయారీకి ప్రభుత్వం ఇటీవల కమిటీని నియమించింది. పంచాయతీరాజ్ చట్టం 73, 74వ రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్నది కావటంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముందస్తుగా కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని న్యాయ శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు 250 పేజీల ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే 130 పేజీల వరకు కసరత్తు పూర్తయింది. వేగంగా కసరత్తు చేసినా మరో పది రోజులు పడుతుందని చెబుతున్నారు. ఇక కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు రూపొందించుకునే ఏ చట్టానికైనా రాష్టపతి అనుమతి తప్పనిసరి. బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు కేంద్రం అనుమతి కావాలి. ఇప్పటికిప్పుడు అనుమతి కోరినా.. కేంద్రం అంగీకరించేందుకు 15 రోజుల సమయం పడుతుందని సమాచారం. దీంతో ఈ నెలాఖరులోగా పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాల్లేవని తెలుస్తోంది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాక రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర చట్టానికి లోబడి రాష్ట్ర బిల్లు లేకుంటే కేంద్రం తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశాలుంటాయి. -
రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలె అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న అగ్రవర్ణాల్లోని పేదలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు ఎం.వి.రెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ఈ రిజర్వేషన్లు సరిపోవని అన్నారు. దేశంలో 77 శాతం జనాభా ఉన్న వర్గాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం లెక్కన 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని మంత్రి అన్నారు. మరాఠా, పటేల్, జాట్, రాజ్పుత్ తదితర వర్గాలకు ప్రత్యేక కేటగిరీలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఓబీసీల్లో కలపాలనే డిమాండ్తో కాకుండా ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణ పేదలు పోరాడాలని సూచించారు. మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్కు ఆర్పీఐ, బీజేపీ మద్దతిచ్చాయని, కేసీఆర్ మద్దతు కోరుతున్నామని అథవాలె చెప్పారు. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, కల్యాణలక్ష్మి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ముదావహమని అన్నా రు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా పెద్దగా 350 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ముంబైలో ఏర్పాటు చేయనున్నట్లు అథవాలె చెప్పారు. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. -
రెండు నెలల్లో అమలు చేయండి
బీసీసీఐకి లోధా ప్యానెల్ సూచన న్యూఢిల్లీ: తమ రాజ్యాంగ సవరణలకు సంబంధించి 15 సంస్కరణలను అక్టోబర్ 15లోపు అమలు చేయాల్సిందిగా బీసీసీఐకి జస్టిస్ లోధా ప్యానెల్ సూచించింది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సంస్కరణల అమలుపై మంగళవారం బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే.. ప్యానెల్తో సమావేశమయ్యారు. దీంట్లో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పాల్గొనాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు. ఈనెల 25లోగా తాము అమలు చేసే సంస్కరణలపై నివేదిక ఇస్తామని షిర్కే వారికి తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే ఓటు, గరిష్ట వయస్సు ప్రతిపాదన వంటి ప్రతిపాదనలను అమలు చేయడం వల్ల వచ్చే సమస్యలపై ప్యానెల్తో షిర్కే చర్చించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పుడేమీ చేయలేమని లోధా కమిటీ తేల్చి చెప్పినట్టు సమాచారం. అమెరికాలో విండీస్తో జరిగే రెండు టి20ల హక్కులను సోమవారం స్టార్ ఇండియాకు రూ.34.2 కోట్లకు బీసీసీఐ అప్పగించింది. అయితే మ్యాచ్ల ప్రసార హక్కుల విషయంలో మరింత పారదర్శకత పాటించాలని ప్యానెల్ సూచించింది. -
జీఎస్టీకి అన్ని రాష్ట్రాల మద్దతు
తమిళనాడు అభ్యంతరాలను పరిశీలిస్తాం: జైట్లీ వెల్లడి - కోల్కతాలో జీఎస్టీపై ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ భేటీ - పన్ను రేటు మార్పుపై పరిమితులుండవు కోల్కతా: జీఎస్టీ( వస్తు, సేవల పన్ను) అమలుకు తమిళనాడు తప్ప అన్ని రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పరోక్ష పన్నుల సంస్కరణల్లో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న జీఎస్టీపై కోల్కతాలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారక కమిటీ మంగళవారం భేటీ అయింది. అనంతరం జైట్లీ వివరాలు వెల్లడిస్తూ... జీఎస్టీ బిల్లు అమలుకు ఎలాంటి గడువు లేదని, తమిళనాడు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, ఆ రాష్ట్ర సూచనల్ని కమిటీ పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. రెండు రోజులు జరిగే ఈ భేటీలో మొదటిరోజు 22 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అరుణాచల్, మేఘాలయ సీఎంలు, ఢిల్లీ డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఎక్కువ మంది ఆర్థిక మంత్రుల హాజరుతో సమావేశం రికార్డు సృష్టించిందని, జీఎస్టీపై రాష్ట్రాలు తమ విస్తృత అభిప్రాయాల్ని తెలిపాయని జైట్లీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే జీఎస్టీ ముఖ్యోద్దేశం. బిల్లును ఏప్రిల్ 1, 2016 నుంచే అమల్లోకి తేవాలని కేంద్రం భావించినా.. బిల్లులో రాజ్యాంగ సవరణను రాజ్యసభ ఆమోదించ లేదు. జీఎస్టీ పన్ను రేటుపై భవిష్యత్తులో రాజ్యాంగ సవరణ చేయాలా? అన్న అంశంపై ఏకాభిప్రాయం వచ్చిందని, భవిష్యత్తు అవసరాల కోసం పన్ను రేటుపై పరిమితులు ఉండబోవని, దానిని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనకు ప్రతిపాదించామని జైట్లీ చెప్పారు. తయారీ రాష్ట్రాలు ఒక శాతం అదనంగా పన్ను వసూలుకు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ.. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. జీఎస్టీ వినియోగ ఆధారిత పన్ను కావడంతో తయారీ రాష్ట్రాలు అదనపు పన్నును కోరుతున్నాయన్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు రాజ్యాంగ సవరణకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తామని, అనంతరం సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ బిల్లుల ఆమోదం కోసం ఆయా సభల్లో ప్రవేశపెడతామన్నారు. రెవెన్యూ న్యూట్రల్ రేట్పై మాట్లాడుతూ.. జూలైలో మరోసారి సాధికారిక కమిటీ భేటీ నిర్వహిస్తామన్నారు. పన్ను రేట్ల ద్వంద్వ నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉందని సాధికారక కమిటీ చైర్మన్ మిత్రా తెలిపారు. మోడల్ జీఎస్టీ చట్టానికి అంగీకారం: మోడ ల్ జీఎస్టీ చట్టం ప్రకారం వస్తువులు, సేవల అమ్మకాలతో పాటు అన్ని ఆన్లైన్ కొనుగోళ్లకు లావాదేవీల మొదటి దశలోనే జీఎస్టీ వర్తించనుంది. ఏప్రిల్, 2017 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయించిన ఈ మోడల్ జీఎస్టీ చట్టానికి ఆర్థిక మంత్రుల భేటీలో ఆమోదం తెలిపారు. వార్షిక టర్నోవర్ రూ. 10 లక్షలుంటే జీఎస్టీ వర్తిస్తుంది. ఆన్లైన్ కొనుగోళ్లకు కూడా ఒకే విధమైన జీఎస్టీ పన్నును విధించాలన్న ప్రతిపాదనకు కూడా అంగీకరించారు. దీనిపై అభిప్రాయాలు, సూచనలు తెలుపాలంటూ ఆర్థిక మంత్రుల్ని కోరారు. ఈ మోడల్ జీఎస్టీ బిల్లులో 162 క్లాజులు, 4 షెడ్యూల్స్ ఉండగా...ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల జైలు విధింవచ్చని సూచించారు. రాష్ట్రాల నష్టాల్ని భర్తీ చేస్తాం లోక్సభ జీఎస్టీ బిల్లును ఆమోదించినా, రాజ్యసభలో ఇంకా పెండింగ్లోనే ఉందని, మొదటిగా పార్లమెంట్లో జీఎస్టీపై రాజ్యాంగ సవరణ చేయాలని, తర్వాత రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. అనంతరం సెంట్రల్ జీఎస్టీ బిల్లును పార్లమెంట్, స్టేట్ జీఎస్టీ బిల్లును రాష్ట్రాలు ఆమోదించాలన్నారు. తొలి ఐదేళ్లు ఆదాయం కోల్పోతామనే రాష్ట్రాల భయంపై చర్చించామని, నష్టాన్ని కేంద్రం భర్తీ చేస్తుందని అన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయండి
- ప్రధానికి కేసీఆర్, కడియం వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని, దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సమస్య ఉంటే ప్రస్తుతం తెలంగాణ వరకు వర్తించేలా సవరణ చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వినతిపత్రం సమర్పించారు. ఈ వివరాలను కడియం మంగళవారమిక్కడ ఏపీభవన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘‘ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీల మద్దతు ఉంది. రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధానిని కోరాం. ఎస్సీ, ఎస్టీల్లో అందరికీ రిజర్వేషన్లు అందడం లేదని, అనేక రాష్ట్రాల్లో సమస్య ఉందని, అందరికీ రిజర్వేషన్లు చెందాల్సి ఉందని ప్రధాని మాతో అన్నారు. తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు’’ అని ఆయన పేర్కొన్నారు. అఖిలపక్షంతో రావాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘‘అఖిలపక్షంతో వస్తామని, అపాయింట్మెంట్ కావాలని ప్రధాని కార్యాలయాన్ని కోరాం. కానీ వారు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చింది ప్రభుత్వం తరఫునే. ఇదివరకు కూడా ఒక లేఖ ఇచ్చాం. వర్గీకరణపై మా చిత్తశుద్ధిని శంకించవద్దు. ఉద్యమం చేసే వారికి మా విజ్ఞప్తి ఏంటంటే వర్గీకరణ లక్ష్యానికి సహకరించే మాతో కలిసి రావాలి తప్ప వర్గాలు వద్దు. ఉద్యమం చేసే వారంతా కలిసికట్టుగా ఉండాలి..’’ అని కడియం అన్నారు. -
ఓసీల సమస్యలపై జాతీయ ఉద్యమం
- ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి మదనపల్లె(చిత్తూరు) ఓసీల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాల నిర్లక్ష్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ఉద్యమాలు ఉధృతమవుతున్నాయన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అంటూ రాజకీయ నాయకులు అగ్రవర్ణాల ద్వితీయ శ్రేణి పౌరులుగా పరగణించడం వల్ల ఓసీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్చేశారు. ఓసీల అభివృద్ధికి జాతీయస్థాయిలో లక్ష కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటుచేస్తే ఆర్థిక అసమానతలు అంతరించి రిజర్వేషన్లు, ఉద్యమాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని కరుణాకర్రెడ్డి సూచించారు. రాజ్యాంగపరంగా విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లు యాభైశాతం అమలుకాగా, జనరల్ కేటగిరీలో కూడా ఇతర వర్గాలవారు ఎంపిక అవుతున్నందున ఓసీలుగా పిలువబడే అగ్రవర్ణాలకు 10 శాతం విద్య, వైద్య ఉద్యోగ అవకాశాలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలను విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఓంప్రకాష్, రెడ్డిజన సంక్షేమ సంఘం సమన్వయకర్త రామ్మోహన్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వేమనారాయణ రెడ్డి, అవుల సిద్దారెడ్డి, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి
ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం సత్వరమే రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఫరీదాబాద్లో ‘ఆలిండియా యాంటీ రిజర్వేషన్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక వివక్షత అంతరించి అర్థిక వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రి మండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ?
రాజ్యాంగం సర్వోన్నతమైంది. ప్రజాస్వామిక దేశాల్లో పరిపాలనకు పునాది ఇదే. ఏ దేశ రాజ్యాంగాన్నయినా దాని రచనా కాలంలో నెలకొని ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకనుగుణంగా రూపొందిస్తారు. అయితే ఎప్పటికప్పుడు వస్తున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణ విధానాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఈ సవరణ పద్ధతిని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు. రాజ్యాంగాలను సాధారణ లేదా ప్రత్యేక మెజార్టీతో సవరిస్తారు. దీనికి చాలా సరళమైన పద్ధతి ఉన్నప్పుడు రాజ్యాంగ స్థిరత్వం, నిరంతరతకు విఘాతం కలుగుతుంది. అలాగని కఠినమైన పద్ధతిని ఎంచుకుంటే అవసరమైన మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండు పద్ధతుల్లోని సమన్వయాన్ని ఎంపిక చేసుకుంటారు. రాజ్యాంగ సవరణ పద్ధతి సవరణ (Amendment) అంటే కొత్త ప్రకరణలు చేర్చడం, ఉన్న ప్రకరణలను తొలగించడం. ప్రస్తుతం ఉన్న అంశాలను మార్పులు చేయడం వేరు, సవరణ (Amend) వేరు. అదేవిధంగా ’Emend’ అంటే దోషాలను (Errors) తొలగించడం. సవరణ పద్ధతులు - రాజ్యాంగ స్థానం రాజ్యాంగంలోని 20వ భాగంలో ప్రకరణ 368లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపర్చారు. రాజ్యాంగ ప్రకరణలను మూడు భాగాలుగా వర్గీకరించి, మూడు ప్రత్యేక పద్ధతులను నిర్దేశించారు. అవి: 1. పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా జరిగే సవరణ పద్ధతి (Simple Majority) 2. పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా జరిగే సవరణ పద్ధతి (Special Majority) 3. పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ, సగాని కంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభల ఆమోదం (States Satisfaction) ద్వారా జరిగే సవరణ పద్ధతి మౌలిక రాజ్యాంగంలో ప్రకరణ 368లో రాజ్యాంగాన్ని ‘సవరించే ప్రక్రియ’ (Procedure for Ammendment of Constitution) అని పేర్కొన్నారు. కానీ 1971 లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదబంధానికి బదులుగా ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారం, ప్రక్రియ’గా (Power to amend and procedure thereof) మార్పు చేశారు. ప్రకరణ 368లోని అంశాలను రెండు పర్యాయాలు సవరించారు. 24వ రాజ్యాంగ సవరణ (1971), 42వ రాజ్యాంగ సవరణ (1976). ప్రకరణ 368లో ఐదు సబ్ క్లాజులు ఉన్నాయి. అవి: 1. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం, ప్రక్రియ ఉంటుంది. 2. ప్రత్యేక మెజార్టీతో సవరించే అంశాల గురించి పేర్కొన్నారు. 3. ప్రకరణ 13లో పేర్కొన్న చట్ట నిర్వచనంలోని అంశాలు రాజ్యాంగ సవరణ నిర్వచనంలోకి రావు. 4. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను (ప్రాథమిక హక్కులు సహా) రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు. 5. సవరణ అధికారాల్లో మార్పులు, చేర్పులు, రద్దు చేసే అంశంలో పార్లమెంటుపై ఏవిధమైన ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. క్లాజు 4, 5లోని అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఈ క్లాజులు చెల్లవని, రాజ్యాంగ విరుద్ధమని, మౌలిక నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయని 1980లో మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సాధారణ మెజార్టీ పద్ధతి ఈ పద్ధతి ప్రకారం పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా కొన్ని ప్రకరణలను సవరిస్తుంది. సాధారణ చట్టాన్ని పార్లమెంటు ఏ విధంగా సవరిస్తుందో అదే పద్ధతిలో రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలను సవరిస్తారు. సాధారణ మెజార్టీ అంటే హాజరై ఓటువేసిన వారిలో సగాని కంటే ఎక్కువ ఉండాలి. సాధారణ మెజార్టీ పద్ధతి గురించి ప్రకరణ 368లో ప్రస్తావించలేదు. అందువల్ల సాధారణ మెజార్టీ ద్వారా జరిగే సవరణలను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. కింద పేర్కొన్న అంశాలు ప్రకరణ 368లో తెలిపిన రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావు. ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు.. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్ర సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్లు మార్పు (ప్రకరణలు 1-4) రాష్ట్ర ఎగువసభ విధాన పరిషత్ ఏర్పాటు, రద్దు (ప్రకరణ 169) భారత పౌరసత్వంలో మార్పులు (ప్రకరణ 5 -11) రెండో షెడ్యూల్లో పేర్కొన్న రాజ్యాంగ పదవుల జీతభత్యాలు (ప్రకరణలు 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186, 221) పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియలు, శాసన సభ్యుల సాధికారాలు (ప్రకరణ 105, 194) సుప్రీంకోర్టు పరిధికి సంబంధించిన అంశాలు (ప్రకరణ 139) కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనమండలి, శాసనసభ ఏర్పాటు (ప్రకరణ 239) నియోజకవర్గాల పునర్విభజన (ప్రకరణ 82) పార్లమెంటులో ఉపయోగించే భాష (ప్రకరణ 120) ఐదు, ఆరో షెడ్యూల్లలో పేర్కొన్న అంశాలు సుప్రీంకోర్టు, న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం (ప్రకరణ 124) పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించే అంశాలు ప్రకరణ 368 ఈ పద్ధతి గురించి వివరిస్తుంది. రాజ్యాంగంలోని అత్యధిక భాగాలను ప్రత్యే మెజార్టీ ద్వారానే సవరిస్తారు. పార్లమెంట్ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు మెజార్టీని సాధించాలి. ఈ పద్ధతి ద్వారా కింది అంశాలను సవరిస్తారు. ఎ) భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు (ప్రకరణ 12-35) బి) భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో పేర్కొన్న నిర్దేశిక నియమాలు (ప్రకరణ 36-51) సి) మొదటి పద్ధతిలో, మూడో పద్ధతిలో పేర్కొనని ఇతర అన్ని అంశాలు ప్రత్యేక మెజార్టీ, రాష్ట్ర శాసనసభల ఆమోదం ఈ పద్ధతిలో పేర్కొన్న అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించిన తర్వాత సగానికి తగ్గకుండా రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ సవరణ బిల్లు ను సాధారణ మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్రాల ఆమోదానికి నిర్ణీత సమయమంటూ ఉండదు. రాష్ట్రపతి నిర్ణయించిన గడువులోపల రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు: ఎ) రాష్ట్రపతి ఎన్నిక విధానం (ప్రకరణ 54, 55) బి) కేంద్ర కార్య నిర్వాహక పరిధిని విస్తృతం చేయడం (ప్రకరణ 73) సి) రాష్ట్ర కార్య నిర్వాహక పరిధిని విస్తృతం చేయడం (ప్రకరణ 162) డి) కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనపరమైన అధికారాల విభజన (ప్రకరణ 246) ఇ) రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం (ప్రకరణ 80, 81) ఎఫ్) రాజ్యాంగ సవరణ పద్ధతి (ప్రకరణ 368) రాజ్యాంగ సవరణ పద్ధతి - నియమ నిబంధనలు ప్రకరణ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో కింది నియమాలను పాటించాలి. - రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. రాష్ట్ర శాసనసభలకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించే అధికారం లేదు. - రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రిగానీ, సాధారణ సభ్యుడుగానీ ప్రతిపాదించవచ్చు (ప్రభుత్వ బిల్లు లేదా ప్రైవేట్ మెంబర్ బిల్లు). - రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. - రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభలు నిర్ణీత మెజార్టీ ప్రకారం వేర్వేరుగా ఆమోదించాలి. ఒక సభ ఆమోదించి, మరో సభ తిరస్కరిస్తే, ప్రతిష్టంభన తొలగించడానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. కాబట్టి బిల్లు వీగిపోతుంది. - సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలను సవరించడానికి సగానికి పైగా తగ్గకుండా రాష్ట్ర శాసనసభలు కూడా తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. - పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపిస్తారు. రాష్ట్రపతి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలపాలి. తిరస్కరణకు లేదా పునఃపరిశీలనకు అవకాశం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలనే నియమాన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. - రాష్ర్టపతి ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి రాజ్యాంగాన్ని సవరించినట్లుగా పరిగణిస్తారు. - రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు గురవుతుంది. మాదిరి ప్రశ్నలు 1. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన భాషలు? 1) కొంకణి, సింధి 2) మణిపురి, సింధి 3) నేపాలి, కొంకణి 4) సింధి, నేపాలి 2. సంస్థానాధీశుల బిరుదులు, ప్రత్యేక హక్కుల రద్దుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? 1) 24వ సవరణ 2) 26వ సవరణ 3) 42వ సవరణ 4) ఏదీకాదు 3. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు? 1) 85 2) 83 3) 92 4) 78 4. పదో ఆర్థిక సంఘం సూచనలు అమలుపరుస్తున్న రాజ్యాంగ సవరణ? 1) 80 2) 81 3) 84 4) 94 5. 1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 1) పార్టీ ఫిరాయింపుల నిరోధం 2) పంచాయతీరాజ్ సంస్థలు 3) కొత్త రాష్ట్రాల ఏర్పాటు 4) ఏదీకాదు 6. కేంద్ర మంత్రి మండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ? 1) 90 2) 91 3) 92 4) 93 7. భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం? 1) మిజోరాం 2) గోవా 3) లక్షద్వీప్ 4) పాండిచ్చేరి 8. కిందివాటిలో భిన్నమైంది ఏది? 1) 8వ రాజ్యాంగ సవరణ, 1959 2) 23వ రాజ్యాంగ సవరణ, 1970 3) 45వ రాజ్యాంగ సవరణ, 1980 4) 61వ రాజ్యాంగ సవరణ, 1989 సమాధానాలు 1) 3; 2) 2; 3) 1; 4) 1; 5) 1; 6) 2; 7) 1; 8) 4; బి. కృష్ణారెడ్డి- డైరెక్టర్ క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్. -
రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమా?
రాష్ట్రాల ఏర్పాటు-సరిహద్దుల మార్పు, పునర్వ్యవస్థీకరణ భారత్లో సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగంలో పేర్కొన్న అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది? రాష్ట్రాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ మొదలైన అంశాలను ఒకటో భాగంలో ప్రకరణ 1 నుంచి 4 వరకు ప్రస్తావించారు. భారత భూభాగం: ప్రకరణ ఒకటి ప్రకారం భారత భూభాగం అంటే రాష్ట్రాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం సముపార్జ్జించుకున్న ఇతర భూభాగాలు కూడా ఉంటాయి. భారత యూనియన్: ఇందులో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. సమాఖ్యలో అంతర్భాగంగా ఉండే రాష్ట్రాలకు నిర్ణీత అధికారాలు ఉన్నాయి.భారత భూభాగం అనే భావన విస్తృతమైంది. అది భారత సార్వభౌమాధికారం ఏవిధంగా విస్తరించి ఉంటుందో తెలియజేస్తుంది. ఇది భౌగోళిక ప్రాంతాలకే పరిమితం కాదు. భారత సముద్ర జలాలు (Territorial Waters, 12 నాటికల్ మైళ్ల వరకు), విశిష్ట ఆర్థిక మండళ్లు (Exclusive Economic Zones, 200 నాటికల్ మైళ్ల వరకు), భారత అంతరిక్ష సరిహద్దుకు కూడా సార్వభౌమాధికారం వర్తిస్తుంది. రాష్ట్రాల సమ్మేళనం: భారత రాజ్యాంగంలో ఒకటో ప్రకరణలో భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్’(యూనియన్ ఆఫ్ స్టేట్స్) గా పేర్కొన్నారు. సమాఖ్య (ఫెడరేషన్) గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కెనడా సమాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని ‘యూనియన్’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. భారత సమాఖ్య అమెరికాలా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అదేవిధంగా కెనడాలా ఏకకేంద్ర రాజ్యాన్ని సమాఖ్యగా విడగొట్టలేదు. ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదు కాబట్టి రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేదు. అమెరికా సమాఖ్యలో ప్రారంభంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి విడిపోయే హక్కు ఉండేది. ఈ హక్కును ఆ తర్వాత రద్దు చేశారు. అందువల్ల భారత సమాఖ్యను విచ్ఛిన్నం అయ్యే రాష్ట్రాలు, అవిచ్ఛిన్న యూనియన్గా పేర్కొంటారు (Indestructible Union of Destructible States) ప్రకరణ 2 దీని ప్రకారం పార్లమెంట్ ఒక చట్టంద్వారా కొత్త ప్రాంతాలను చేర్చుకోవచ్చు. ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. ఈ అధికారం భారత భూభాగంలో లేని అంశాలకు వర్తిస్తుంది. ఇది పార్లమెంటుకు సంబంధించిందే అయినా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుంది. విదేశీ భూభాగాలను భారతదేశంలో చేర్చుకున్నప్పుడు పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో రాజ్యాం గ సవరణ చేయాల్సి ఉంటుంది. ఉదా: 1961లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాను, 1962 లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని భారత్లో కలిపారు. అదేవిధంగా 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత రాష్ర్టంగా చేర్చుకున్నారు. ప్రకరణ 3 దీనిలో కింది అంశాలు ఉన్నాయి. ఎ) కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ర్టంగా ఏర్పాటు చేయవచ్చు. ఉదా: 1956లో ఆంధ్రరాష్ర్టం, హైదరాబాద్లను కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ర్టంలోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త రాష్ర్టంగా ఏర్పాటు చేయవచ్చు. బి) రాష్ర్ట విస్తీర్ణాన్ని పెంచవచ్చు సి) రాష్ర్ట విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు డి) రాష్ర్ట సరిహద్దులను సవరించవచ్చు ఇ) రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రకరణ 3లో పేర్కొన్న అన్ని అంశాలకు ఒకే ప్రక్రియ ఉంటుంది. పై అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఉంటే అది స్పెషల్ కేటగిరి బిల్లు అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిల్లును లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు విషయంలో ఈ విధానాన్ని అనుసరించారు. బిల్లులను రాష్ర్టపతి అనుమతితోనే ప్రవేశపెట్టాలి. ఈ నిబంధనను 1955లో ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ముందే రాష్ర్టపతి సంబంధిత రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాన్ని కోరుతారు. శాసన సభలు నిర్ణీత సమయంలోగా అభిప్రాయాన్ని తెలపాలి. ఈ అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. పార్లమెంటు ఉభయసభలు బిల్లును సాధారణ మెజారిటీతో విడివిడిగా ఆమోదించాలి. ఉభయసభల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి ఆస్కారం ఉండదు. బిల్లు వీగిపోతుంది. పార్లమెంటు అంగీకారం పొందిన బిల్లును రాష్ర్టపతి తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ర్టపతి ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది. దాంతో ప్రక్రియ పూర్తవుతుంది. కొత్త రాష్ర్టం అమల్లోకి వచ్చే తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్నే ‘అపాయింటెడ్ డేట్’ అంటారు. ప్రకరణ 4 ఈ ప్రకరణ తర్వాత పరిణామాల గురించి వివరిస్తుంది. ప్రకరణ 2, 3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు 1, 4 షెడ్యూళ్లలో పేర్కొన్న అంశాలను కూడా మార్చాలి. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా ఆటోమేటిక్గా 1, 4 షెడ్యూళ్లలోని అంశాలు కూడా మార్పునకు గురవుతాయి. ప్రకరణ 2, 3 ప్రకారం ఎలాంటి మార్పు చేసినా దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఈ అంశాన్ని ప్రకరణ 4(2)లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రాష్ట్రాల ఏర్పాటుకు, పునర్వ్యవస్థీకరణకు, ఇతర అంశాలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వివాదాలు-సుప్రీంకోర్టు తీర్పులు బెరుబారి యూనియన్ వివాదం (1960): బెరుబారి అనేది పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని ఒక ప్రాంతం. దీని విస్తీర్ణం 9 చదరపు మైళ్లు. ప్రకరణ 3 ప్రకారం పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దును కుదించే అధికారం ఉంది. అయితే, ‘ఒక రాష్ర్ట వివాదాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం ఉందా?’అనే సంశయం తలెత్తిన సందర్భంగా రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహా కోరారు. సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాష్ర్ట భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలంటే పార్లమెంటు ప్రకరణ 368 ప్రకారం ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్గతంగా బదిలీ చేసేందుకు సాధారణ మెజార్టీ సరిపోతుంది. బాబూలాల్ మారండి వర్సెస్ బాంబే స్టేట్ (1960): రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఒక్కసారి మాత్రమే సంబంధిత రాష్ర్ట శాసనసభల అభిప్రాయానికి నివేదిస్తారు. ఒకవేళ ఆ బిల్లులో తర్వాత ఏవైనా మార్పులు చేస్తే, దాన్ని మరోసారి రాష్ర్ట పరిశీలనకు పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.దీనికి తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ర్టంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయించడం. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ యూనియన్(1982): భారత రాజ్యాంగం నిర్ణీతమైన సమాఖ్య వ్యవస్థను ఏర్పర్చలేదు. నిర్మాణపరంగా సమాఖ్య అయినప్పటికీ, ఇది సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాల మిశ్రమంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ముల్లా పెరియార్ పర్యావరణ వివాదం (2006): నదీ జలాల పంపిణీపై చట్టాలు చేసే అధికారం రాష్ర్ట శాసనసభకు లేదని, ఇది పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మాదిరి ప్రశ్నలు 1. గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమి స్తుంది. ఈ విధానాన్ని ఏమంటారు? 1) నిఖరమైన సమాఖ్య 2) పరిపూర్ణ ప్రజాస్వామ్యం 3) రిపబ్లికనిజం 4) విశిష్ట సమాఖ్య విధానం 2. కొత్త రాష్ట్రాల ఏర్పాటును తెలిపే రాజ్యాంగ అధికరణ? 1) 2 2) 3 3) 1 4) 4 3. భారత ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను దేని ద్వారా ఏర్పాటు చేయవచ్చు? 1) భారత రాష్ర్టపతి 2) పార్లమెంటు శాసనం 3) రాజ్యాంగ సవరణ ద్వారా 4) అంతర్రాష్ర్ట మండలి 4. కింది రాష్ట్రాలు ఏర్పడిన వరుస క్రమాన్ని గుర్తించండి. ఎ. ఆంధ్రప్రదేశ్ బి. నాగాలాండ్ సి. మహారాష్ర్ట డి. హర్యానా 1) ఎ, సి, బి, డి 2) ఎ, సి, డి, బి 3) సి, ఎ, బి, డి 4) సి, ఎ, డి, బి 5. రాష్ట్రాల ఏర్పాటులో ప్రాతిపదిక కానిది? 1) భాష 2) భౌగోళిక అంశాలు 3) ప్రాంతీయ అసమానతలు 4) పైవేవీ కావు 6. రాష్ట్రంగా మారిన కేంద్రపాలిత ప్రాంతం? 1) అరుణాచల్ప్రదేశ్ 2) గోవా 3) హిమాచల్ ప్రదేశ్ 4) పైవన్నీ 7. నవంబరు 1న అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే రాష్ర్టం? 1) కర్ణాటక 2) కేరళ 3) ఛత్తీస్గఢ్ 4) పైవన్నీ 8. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. 1) తెలంగాణ మొదటి ఉప ముఖ్యమంత్రులు - మహ్మద్ అలీ, డాక్టర్ టి. రాజయ్య 2) నూతన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రులు - కె. క్రిష్ణమూర్తి, ఎన్. చినరాజప్ప 3) తెలంగాణ రాష్ర్ట విధానసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి 4) పైవన్నీ 9. కిందివాటిలో తెలంగాణాకు సంబంధించి సరైన అంశం ఏది? 1) జనాభాలో 12వ స్థానం 2) విస్తీర్ణంలో 12వ స్థానం 3) లోక్సభ స్థానాల్లో 13వ స్థానం 4) పైవన్నీ 10. నూతన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. 1) జనాభాలో 10వ స్థానం 2) విస్తీర్ణంలో 8వ స్థానం 3) లోక్సభ స్థానాల్లో 9వ స్థానం 4) పైవన్నీ సమాధానాలు 1) 4; 2) 2; 3) 2; 4) 1; 5) 4; 6) 4; 7) 4; 8) 4; 9) 4; 10) 4. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీపరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగంలో ‘శక్తి వనరులు’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఈ టాపిక్ ప్రిపరేషన్కు సంబంధించి కొన్ని సూచనలివ్వండి. - ఆర్.అనురాధ, ఏఎస్రావు నగర్. దేశాభివృద్ధికి ‘శక్తి’ వెన్నెముక లాంటిది. శక్తి వనరులు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి వర్గీకరణ లాంటి అంశాలను అధ్యయనం చేయడం అన్ని పోటీ పరీక్షలకు అవసరమే. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో దేశంలో శక్తి వనరుల లభ్యత, స్థూల, స్థాపిత సామర్థ్యం విలువలు, శక్తి మంత్రిత్వశాఖ, దాని పరిధిలోని సంస్థలు/కేంద్రాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. శక్తి వనరులు రెండు రకాలు. అవి: సంప్రదాయ, సంప్రదాయేతరమైనవి. బొగ్గు, సహజవాయువు, చమురు, జల విద్యుత్, అణువిద్యుత్ సంప్రదాయ శక్తి వనరులు. దేశంలో వీటి లభ్యత, ఉత్పాదన గురించి తెలుసుకోవాలి. అదనంగా కోల్ బెడ్, మీథేన్, షెల్ గ్యాస్ల గురించి చదవాలి. సంప్రదాయేతర శక్తి వనరులు పునర్వినియోగ, నవీన వనరులు అని రెండు రకాలుగా ఉంటాయి. జీవశక్తి, సౌరశక్తి, పవన శక్తి, చిన్న తరహా జలవిద్యుత్ లాంటివి పునర్వినియోగ శక్తి వనరులు. హైడ్రోజన్ శక్తి, జియోథర్మల్, సముద్ర తరంగ శక్తి, బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు లాంటివి నవీన శక్తి వనరులు. ఏ శక్తి వనరుల లభ్యత ఏవిధంగా ఉంది? ప్రస్తుతం వాటి ఉత్పాదన, ఏ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏయే రకాల శక్తి వనరుల నిర్వహణ ఉంది? లాంటి అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి. శక్తి రంగంలో పరిశోధన కేంద్రాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇండియా ఇయర్ బుక్, ఎకనామిక్ సర్వే లాంటి పుస్తకాల్లో వీటికి సంబంధించిన వర్తమాన అంశాలు, సమగ్ర సమాచారం లభిస్తుంది. - సి. హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ. -
విభజన కోసం రాజ్యాంగ సవరణ: డిఎస్
హైదరాబాద్: విభజన సాఫీగా సాగేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తారని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర విభజనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి అడ్డురాదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విభజనతో సీమాంధ్రలో వచ్చే నష్టాలపై చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలోనూ ప్రయోజనాలు అనేకం ఉన్నాయని తెలిపారు. సీమాంధ్రకు మంచి ప్యాకేజీ లభిస్తుంది, అన్యాయం జరగదని చెప్పారు. బిల్లు ఆమోదంపొందాక సీమాంధ్ర ప్యాకేజీని ప్రకటించవచ్చునన్నారు. అప్పుడు సీమాంధ్రలోనూ కాంగ్రెస్ బలపడుతుందని చెప్పారు. టిఆర్ఎస్ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, అధిష్టానం పెద్దలు మాట్లాడుకుంటారన్నారు. కెసిఆర్తో విభేదాలు ఏమీలేవని, ఆయన తమకు మంచి స్నేహితుడని చెప్పారు. -
రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ సూచించిన హొం శాఖ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు కేంద్ర హొం మంత్రిత్వ శాఖ రాజ్యాంగ సవరణను సూచించింది. విభజనకు సంబంధించి నియమించిన మంత్రుల బృందం(జీఓఎం)కు హొం మంత్రిత్వ శాఖ ఒక నివేదిక సమర్పించింది. 85 పేజీల ఈ నివేదికలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించింది. హైదరాబాద్, వనరుల పంపిణీ, సాగు నీరు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలను ముఖ్యమైన అంశాలుగా హొం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవసరమైతే ఆర్టికల్ 371డిని సవరించాలని సూచన చేసింది. ఈ నాలుగు అంశాల విషయంలో స్పష్టత వస్తే విభజన సాధ్యమేనని ఆ శాఖ తెలిపింది. ఇంకా ఈ నివేదికలో శాసన, పాలన, న్యాయపరమైన అంశాలను ప్రస్తావించింది. -
రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ సూచించిన హొం శాఖ
-
సర్పంచ్లంటే చులకనా?!
సంపాదకీయం: అధికారం నిలుపుకోవడానికి అనుక్షణమూ అర్రులుచాచే పాలకులు ఆ అధికారాలను కింది స్థాయిలో వికేంద్రీకరించాల్సి వచ్చేసరికి విలవిల్లాడిపోతున్నారు. మిన్ను విరిగి మీదపడుతుందేమోనన్నట్టు భయపడుతున్నారు. తాము ఏదో కోల్పోతున్నామన్న బాధతో కుంగిపోతున్నారు. గ్రామ పంచాయతీల సర్పంచ్లకు ఉండే చెక్ పవర్ను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నంబర్ 385 ఈ కోవలోకే వస్తుంది. అసలు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు జరపడానికే ప్రభుత్వానికి కాలూ చెయ్యీ ఆడలేదు. ఏదో సాకుతో, ఇంకేదో కారణంతో వాటిని వాయిదా వేయడానికే ప్రయత్నించింది. మీనమేషాలు లెక్కిస్తూ రెండేళ్లు కాలక్షేపం చేసింది. గ్రామ స్వరాజ్యం పటిష్టంగా ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న మహాత్ముడి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించకుండా పంచాయతీలను అనుమాన దృక్కులతో చూడటానికే నిర్ణయించుకుంది. పునాది స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలని, పరిపాలనలో స్థానిక ప్రజానీకానికి చోటిచ్చి, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని ఎందరెందరో కోరుతూనే ఉన్నారు. ఆ దిశగా రెండు దశాబ్దాల క్రితం కొంత ప్రయత్నమూ జరిగింది. 29 అంశాల్లో పంచాయతీలే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి... విధులు, నిధుల వ్యవహారాన్ని అవే పర్యవేక్షించుకోవడానికి వీలుకల్పిస్తూ అప్పుడు 73వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. కానీ, ఈ ఇరవైయ్యేళ్లలోనూ ఏ రాష్ట్రప్రభుత్వమూ రాజ్యాంగం సూచించిన అధికారాలను వాటికి అప్పగించడానికి సిద్ధపడలేదు. పర్యవసానంగా వీధి దీపాలు వెలిగించుకోవాలన్నా, ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించడానికి ప్రయత్నించాలన్నా, ఆఖరికి పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలన్నా పంచాయతీ రాజ్ సంస్థలు ప్రభుత్వంవైపు చూడవలసివస్తున్నది. అధికారాలను బదలాయించడా నికి ససేమిరా అంగీకరించని పాలకులుంటారన్న భావనతోనే రాజ్యాంగ అధికరణంలో కట్టుదిట్టమైన నిబంధనలుంచారు. ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యే ప్రభుత్వాలకు నిధులు కోతపెట్టాలని నిర్దేశించారు. ఆ నిబంధనల పర్యవసానంగా మనకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి కూడా. తప్పనిసరై ఎన్నికలు నిర్వహించాక కూడా అధికారాల బదలాయింపులో రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించదల్చుకోలేదని జీవో నంబర్ 385 చూస్తే అర్థమవుతోంది. పారదర్శకతనూ, జవాబుదారీతనాన్ని నెలకొల్పడానికే ఈ చర్య తీసుకుంటున్నట్టు జీవోలో చెప్పడం పంచాయతీరాజ్ సంస్థలను, సర్పంచ్లను దారుణంగా అవమానించడమే. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు ఎంతో అవసరమైన పారిశుద్ధ్యమైనా, వ్యవసాయ సంబంధమైన పథకాలైనా, పశు సంరక్షణకు సంబంధించిన అంశాలైనా పంచాయతీల పరిధిలో పెట్టినట్టే పెట్టి ఆచరణలో మాత్రం మొండిచేయి చూపారు. కార్యక్రమాలను అమలుచేసే అధికారం పంచాయతీలకిచ్చారు తప్ప వాటికి అవసరమైన నిధులను మాత్రం తమ గుప్పెట్లోనే ఉంచుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, గ్రామీణ నీటి సరఫరా, వయోజన విద్య, ఖాదీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, గ్రామీణ విద్యుదీకరణ, రోడ్లు వంటివెన్నో పంచాయతీలకు అప్పజెప్పి... వాటిని విస్తరించడానికైనా, నిర్వహించడానికైనా నిధులను బదిలీచేయాల్సి ఉండగా ఏ ఒక్కటీ అమలుకావడం లేదు. ఒకపక్క తాము అమలుచేస్తున్న పథకాల్లో అవినీతిని అరికట్టలేకపోతున్న ప్రభుత్వాలు పంచాయతీలకు డబ్బులిస్తే దుర్వినియోగమవుతాయని చెప్పడానికి సాహసిస్తున్నాయి. పంచాయతీల ద్వారా అభివృద్ధి పనులను కొనసాగిస్తే స్థానికంగా ఉన్న తమ పార్టీకో, తమ ఎమ్మెల్యేకో పలుకుబడి, పరపతి ఉండదన్న భయంతో వణుకుతున్నాయి. ఆ మనస్తత్వమే ఇలాంటి జీవోలను పుట్టిస్తోంది. నిజానికి పంచాయతీల్లో పారదర్శకత, జవాబుదారీతనం దండిగా ఉన్నాయి. ఏడాదికి నాలుగుసార్లు జరిగే గ్రామసభల్లో చర్చించి, నిర్ణయించిన అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే పంచాయతీలు చేపడతాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల జమాఖర్చుల్ని కూడా గ్రామసభలు పరిశీలిస్తాయి. పంచాయతీల సర్వసభ్య సమావేశాలు గరిష్టంగా 90 రోజులలోపు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. అది జరగకపోతే ఆ పంచాయతీలు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీటికితోడు పంచాయతీ సర్పంచ్ అయినా, వార్డు సభ్యుడైనా నిత్యం జనం మధ్యే తిరగవలసి ఉంటుంది. లోటుపాట్లుంటే వారిని నిలదీసేవారు ఎక్కువుంటారు. సారాంశంలో ఒక ఎమ్మెల్యేతో పోల్చినా, ఎంపీతోపోల్చినా పంచాయతీ వార్డు సభ్యుడికుండే జవాబు దారీతనం ఎక్కువ. వాస్తవం ఇదికాగా, నిధుల వినియోగాన్ని సర్పంచ్లకు విడిచి పెడితే ఏదో అయిపోతుందని చెప్పడం అన్యాయం. ఇంత పెద్ద వ్యవస్థలో లోటు పాట్లుండవనీ, అవినీతికి తావేలేదని ఎవరూ అనరు. అవసరమనుకుంటే వాటిపై ఇప్పటికే ఉన్న నిఘా, పర్యవేక్షణ మరింత విస్తృతం చేయవచ్చు. గ్రామసభలు సక్రమంగా జరగకపోయినా, పంచాయతీ సర్వసభ్య సమావేశం నిబంధనల ప్రకారం నిర్వహించకపోయినా వాటిపై చర్యలు తీసుకోవచ్చు. అంతేతప్ప, సర్పంచ్లను అవమానపరిచేలా వారిని దోషులుగా చూడాల్సిన అవసరం లేదు. 1995 వరకూ ఉన్న జాయింట్ చెక్ పవర్ విధానం రద్దుకు అప్పట్లో సర్పంచ్లు సమష్టిగా పోరాడారు. ప్రభుత్వం మెడలువంచి తమ డిమాండును సాధించుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరుపెట్టింది. నిజానికి ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగితే అది చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా, అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకునేలా అక్కడి ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వొచ్చు. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను వాటికి దఖలుపరిచి, అవి జవజీవాలతో కళకళలాడేలా చేయవచ్చు. మహాత్ముడు చెప్పినట్టు గ్రామస్వరాజ్య స్థాపనకు పాటుపడవచ్చు. ఇవేమీ చేయకుండా పంచాయతీలపై అత్తగారి పెత్తనాన్ని చెలాయిద్దామని చూస్తే సర్పంచ్లు సహించరు.