Insects
-
చీనీ పంటకు ‘ఏలియన్’ పీడ
సాక్షి, అమరావతి: చీనీ (బత్తాయి) రైతులకు కొత్త తలనొప్పి మొదలైంది. ‘ఏలియన్ పెస్ట్’గా పిలిచే హైలోకోకస్ స్ట్రిటస్ (రుస్సెల్) అనే కొత్త రకం పొలుసు పురుగును దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్లో చీనీ పంటపై మన శాస్త్రవేత్తలు గుర్తించారు. చూడటానికి సూక్ష్మజీవిలా కనిపించే ఈ పురుగులు బత్తాయి మొక్కల కాండం తొలిచేయడంతోపాటు ఆకుల్లో పత్రహరితం లేకుండా తినేస్తున్నాయి. ఈ పురుగుల ఉధృతిని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన అరుదైన పురుగు ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో ఈ పురుగును తొలిసారిగా 1981లో గుర్తించారు. అక్కడ కూడా చీనీ పంటపైనే వీటిని కనుగొన్నారు. ఈ రెండు దేశాల్లో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ వీటి జాడ ఇప్పటివరకు గుర్తించలేదు. అలాంటిది తొలిసారి అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో వీటి ఉనికిని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఐదారు వేల ఎకరాల్లో ఈ పురుగు ఉధృతి ఉన్నట్టు గుర్తించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కలు, నర్సరీ మెటీరియల్స్ ద్వారా ఈ పురుగులు మన ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అంగుళంలో 8వ వంతు సైజులో ఊదా రంగులో ఉండే ఈ పొలుసు పురుగుపై ఇతర పొలుసు పురుగుల మాదిరిగా శరీరంపై వాక్సీ లేయర్ (మైనపు పొర) ఉండదు. అందువల్ల ఈ పురుగు పూర్త పారదర్శకంగా కన్పిస్తుంది. ఈ పురుగు వ్యాప్తి చెందితే దిగుబడులపై ప్రభావం చూపడం కాకుండా.. మొత్తం తోటలనే సర్వనాశనం చేస్తుంది. ఈ పురుగులు లక్షల్లో పుట్టుకొస్తాయి. సామూహికంగా వ్యాపిస్తుంటాయి. ఒకసారి సోకిన తర్వాత 30–40 శాతం పంటను తుడిచి పెట్టేస్తుంది. రైతులు ఏమరుపాటుగా ఉంటే నూరు శాతం పంట నాశనమవుతుంది. చెట్టు వయసుతో సంబంధం లేకుండా చిన్న మొక్క నుంచి ముదురు తోటల వరకు వ్యాపిస్తుంది. సమీప భవిష్యత్లో బత్తాయి నుంచి ఇతర నిమ్మ జాతి మొక్కలకు కూడా సోకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నాంఈ పొలుసు జాతి పురుగును శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులోని చీని తోటలపై తొలిసారి గుర్తించాం. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో కూడా ఈ పురుగు ఉదృతి కనిపించింది. వీటి ఉనికి, ఉధృతిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. చీనీ, నిమ్మ జాతి తోటలపై తీవ్ర ప్రభావం చూపే ఈ అరుదైన పురుగులపై పరిశోధనలు ప్రారంభించాం. ఇవి ఎంత కాలం జీవిస్తాయి. ఏయే పంటలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి, వీటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలేమిటనే అంశాలపై లోతైన పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటగిరి -
వామ్మో.. పంటంతా తినేస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాంతంలో వరి చేలను కత్తెర, కొమ్ము పురుగులు రైతుల పాలిట అశనిపాతంలా తయారయ్యాయి. నివారణ చర్యలు చేపట్టేలోగా చేలను చుట్టేసి కేవలం మూడు రోజుల్లోనే వరి కంకులను తినేస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.ఆ మూడు జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో 10లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయి. ఈ దశలో కత్తెర, కొమ్ము పురుగులు విజృంభిస్తూ పంటను తినేస్తున్నాయి. పురుగులు ఆశించిన పొలాల్లో 30నుంచి 80 శాతం పంట పూర్తిగా దెబ్బతింది. నీటిఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పురుగుల దాడి తీవ్రంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట ఈ పురుగుల ఉ«ధృతితో దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. జామి, గంట్యాడ, గరివిడి, నెల్లిమర్ల, గజపతినగరం, బొండపల్లి, పూసపాటిరేగ, చీపురుపల్లి మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పంటకు నిప్పు పెడుతున్న రైతులువిజయనగరం జిల్లా బుడతనాపల్లిలో పురుగు సోకడంతో 75 ఎకరాల్లో వరి పంట గడ్డిలా తెల్లబారిపోవడంతో కోసేందుకు పనికిరాకుండా పోయింది. దీంతో చేసేది లేక ఈ ప్రాంత రైతులు వరి పొలాలకు నిప్పు పెడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం ఎస్.నర్సాపురం పరిసర గ్రామాలతో పాటు అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కూడా కత్తెర పురుగు వ్యాపిస్తున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, స్థానిక వ్యవసాయాధికారులకు చెప్పినా తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఇలాంటి పురుగులు, తెగుళ్లు సోకినప్పుడు శాస్త్రవేత్తల బృందాలను రంగంలోకి దింపి సామూహిక నివారణ చర్యలు చేపట్టేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు.ఏడెకరాల పంటను మూడు రోజుల్లో తినేశాయి 7 ఎకరాలను కౌలుకు తీసుకుని ఎంటీయూ–1126 రకం వరి వేశాను. ఎకరాకు 40 బస్తాలకుపైగా దిగుబడి వస్తుందని ఆశించాను. పంట కోత కొచి్చన వేళ ఉన్నట్టుండి కత్తెర, కొమ్ము పురుగులు విరుచుకుపడ్డాయి. కేవలం మూడే మూడు రోజుల్లో 7 ఎకరాల పంటను పూర్తిగా తినేశాయి.. ఎకరాకు రూ.35వేల చొప్పున అప్పు చేసి పెట్టిన రూ.2.50 లక్షలు ఆవిరైపోయాయి. ఏం చేసేది లేక పంటకు నిప్పు పెట్టాను. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. – చల్లా రామునాయుడు, బుడతానాపల్లి, విజయనగరం జిల్లానష్టపరిహారం చెల్లించాలి యుద్ధప్రాతిపదికన ఆ ప్రాంతాలకు శాస్త్రవేత్తలను పంపించి వరి పంటను ఆశిస్తున్న పురుగులను పరిశీలించి డ్రోన్ల సాయంతో సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగుల ఉధృతి కారణంగా ఉత్తరాంధ్రలో కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాల్లో 30 శాతానికి పంట దెబ్బతింది. నష్టపోయిన రైతులకు ప్రకృతి విపత్తుల కింద పంట నష్టపరిహారం ఇవ్వాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం -
పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?
మీ గార్డెన్లో పేనుబంక (అఫిడ్స్)ను నియంత్రించటం ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, పేనుబంక పురుగులను అదుపు చేయటానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు అనుసరించగల కొన్ని సూచనలు:1. మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండిముడుచుకున్న ఆకులపై అంటుకునే పదార్థం లేదా స్టెమ్ లేదా ఆకులపై పేనుబంక సోకుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గమనించటం కోసం మీ మొక్కలను తరచుగా తనిఖీ చేయండి. 2. వేపనూనె వాడండి వేప నూనె అఫిడ్స్ను నియంత్రిండానికి వాడే సహజమైన పురుగుమందు. లేబుల్ సూచనల ప్రకారం వేప నూనెను నీటితో కలిపి పేనుబంక సోకిన మొక్కలపై పిచికారీ చేయండి. 3.సబ్బు నీరు స్ప్రే చేయండిపేనుబంకను నియంత్రించడానికి తేలికపాటి డిష్ సోప్ను నీటిలోకలిపి ప్రభావిత మొక్కలపై స్ప్రే చేయవచ్చు.4. గార్లిక్ స్ప్రే ఉపయోగించండివెల్లుల్లి సహజ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేనుబంకను నియంత్రించడంలో సహాయ పడుతుంది. వెల్లుల్లి రసాన్ని నీటితో కలపండి. ప్రభావిత మొక్కలపై పీచికారీ చేయండి.5. ప్రయోజనకరమైన కీటకాలులేడీబగ్స్, లేస్వింగ్, పరాన్నజీవి కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలు పేనుబంకను వేటాడతాయి. అఫిడ్స్ పురుగుల సంతతిని నియంత్రించడానికి మీ గార్డెన్ లో ఈ కీటకాలు పెరిగేలా చూసుకోండి.6. తోట పరిశుభ్రత పాటించండికలుపు మొక్కలను తొలగించండి. తెగులు సోకిన మొక్కలను తీసి దూరంగా పారవేయండి. పురుగుల ముట్టడిని నివారించడానికి ఎక్కువ ఎరువులు వేయకుండా ఉండండి.7. స్క్రీన్లు, రో కవర్లను ఉపయోగించండిఅఫిడ్స్ మీ మొక్కలను ఆశించకుండా నిరోధించడానికి ఫైన్–మెష్ స్క్రీన్లు లేదా ఫైన్–వెటెడ్ రో కవర్లను ఉపయోగించండి.8.జీవ నియంత్రణపేనుబంకను తినే పక్షులు, సాలె పురుగులు వంటి సహజ మాంసాహారులను ప్రోత్సహించటం ద్వారా జీవ నియంత్రణకు అవకాశం కల్పించండి.9. పర్యవేక్షించండి, పునరావృతం చేయండి మీ గార్డెన్లో మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. పేనుబంకను సమర్థవంతంగా అరికట్టే నియంత్రణ చర్యలను అవసరాన్ని బట్టి పునరావృతం చేయండి.– హేపీ గార్డెనర్స్ అడ్మిన్ టీం -
పరువు పోతోంది పరిష్కారమేంటి?
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనం పురుగులతో విద్యార్థులు ఏదో ఒకచోట అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. ‘ఒకరోజు ఖమ్మం జిల్లాలో, మరోరోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం పరువు పోతోంది. ఏం చేద్దాం..ఎలా పరిస్థితిని చక్కబెడదాం’అంటూ ఉన్నతాధికారులు హెచ్ఎంల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.‘నాణ్యత లేని భోజనం పెడితే కటకటాలు లెక్కబెట్టిస్తాం’అని సీఎం నవంబర్ 14న ప్రకటించారు. అయినా వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎంవో ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు హెచ్ఎంనో, డీఈవోనో సస్పెండ్ చేస్తే కొత్త సమస్యలొస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నామని సీఎం భావిస్తున్నారు. ఇవేవీ లేకుండా పురుగుల అన్నంతో పరువు పోకుండా ఏం చేయాలో నివేదిక ఇవ్వడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. సమస్య ఎక్కడ? రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యం అందజేస్తారు. మిగతా సరుకులన్నీ స్వయం సహాయ బృందాల నిర్వహణలో ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులుంటే కొంత వరకూ నిర్వహణ సాధ్యమవుతోంది. మరీ తక్కువగా విద్యార్థులుంటేనే నిర్వహణ వ్యయం ఇబ్బందే. 13,005 స్కూళ్లలో 50 లోపు విద్యార్థులే ఉన్నారు.ఈ కారణంగా వచ్చే నిధులు తక్కువ. స్వయం సహాయ బృందాలకు నెలవారీ బిల్లులు కూడా చెల్లించడం లేదు. అప్పు తెచ్చి వంట చేస్తున్నామని, వడ్డీ తామే కడుతున్నామంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఏం చేసినా నాణ్యత ఎలా పెరుగుతుందని వారు ప్రశి్నస్తున్నారు. అదీగాక సివిల్ సప్లై నుంచి వచ్చే బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, వాటిని రీ సైక్లింగ్ చేస్తే తప్ప పురుగులు అరికట్టడం సాధ్యం కాదంటున్నారు. దీనికి బడ్జెట్ ఉండదని హెచ్ఎంలు అంటున్నారు. ఇక్కడో రీతి... అక్కడో తీరు కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన మెనూ అమలు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం ఇస్తారు. గుడ్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అన్నం, వెజిటబుల్స్, రసం, కోడిగుడ్డు, ఆకుకూరపప్పు, నెయ్యి, పెరుగు ఇస్తున్నారు. కాబట్టి నిర్వహణ వ్యయం సరిపోతుందనేది హెచ్ఎంల వాదన. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం బియ్యం, కూరగాయలు, పప్పు మాత్రమే ఇస్తున్నారు. పప్పు, కోడిగుడ్డు రోజూ ఉండదు. కూరల రేట్లు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిర్వహణ సమస్యగా ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖకు తెలిపారు.విధాన పరమైన లోపాలున్నాయి మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలంటే ముందుగా విధానపరమైన మార్పులు అవసరం. సంబంధిత ఏజెన్సీలకు ముందుగా బిల్లులు చెల్లించాలి. నాణ్యత పెంచేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. నిధులు పెంచాలి. తప్పు జరిగినప్పుడు హెచ్ఎంలనే బాధ్యులను చేయడం అన్యాయం. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు టీచర్లనే ప్రశ్నించడం సరికాదు మధ్యాహ్న భోజన పథకం అమలులో హెచ్ఎంల పాత్ర నామమాత్రమని 2014లో ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. బోధన సంబంధమైన విధులే హెచ్ఎంలకు తలకు మించి ఉన్నాయి. తప్పు జరిగితే బాధ్యులను చేయాలనే విధానం మంచిది కాదు. – పింగిలి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు -
Singapore: ఈ 16 కీటకాలను లొట్టలేసుకుంటూ తినొచ్చు
వివిధ రకాల కీటకాలు, పురుగులను లొట్టలేసుకుంటూ తినే ఆహార ప్రియులకు సింగపూర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కీచురాళ్లు, గొల్లభామలు, చిమ్మట జాతులకు చెందిన కీటకాలను మనుషులు నిర్భయంగా, ఏమాత్రం సందేహం లేకుండా ఆహారంగా లాగించేయవచ్చని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.సింగపూర్ ఫుడ్ రెగ్యులేటర్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) తాజాగా 16 జాతుల కీటకాలను మనుషులు తినవచ్చని తెలిపింది. వీటిని ఆహారంలో వినియోగించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ కీటకాలు సింగపూర్, చైనా వంటకాలలో విరివిగా వినియోగిస్తుంటారు.స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక అందించిన నివేదిక ప్రకారం క్యాటరింగ్ వ్యాపార నిర్వాహకులు ఎస్ఎఫ్ఏ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరు చైనా, థాయ్లాండ్, వియత్నాంలో ఉత్పత్తి అయ్యే ఈ కీటకాలను సింగపూర్కు సరఫరా చేస్తుంటారు. వీరు ఈ కీటకాలను సింగపూర్ తీసుకురావాలంటే ఎస్ఎఫ్ఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
పురుగు.. పిట్టా.. పంట.. కనుమరుగు!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు కీటకాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాటి జనాభా తగ్గుతోంది. ముఖ్యంగా రక్షిత ప్రాంతాల్లోని కీటకాల సంతతి అత్యంత వేగంగా తగ్గిపోవడమే కాకుండా పెరుగుదల కూడా భారీగా పడిపోయిందని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జ్బర్గ్ బయో సెంటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోర్గ్ ముల్లర్ వెల్లడించారు. ఈ నెలలో విడుదలైన నేచర్ మ్యాగజైన్లో ఆయన రాసిన కథనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. 1989 నుంచి 2016 మధ్యకాలంలో జర్మనీలోని రక్షిత ప్రాంతాల్లో కీటకాల జీవం 75 శాతం కంటే ఎక్కువగా తగ్గిపోయిందని ముల్లర్ పేర్కొన్నారు. 2005లో అత్యంత వేగంగా పతనమైందని.. ఆ తర్వాత సంవత్సరాల్లో వాటి పెరుగుదల కోలుకోలేదని అధ్యయనం నిరూపించిందని స్పష్టం చేశారు. ముల్లర్ 2022లో చేసిన అధ్యయనంలో కీటకాల బయో మాస్లో కొంత పెరుగుదల కనిపించింది. అయితే, గతంలో తగ్గినంత వేగంగా ఈ పెరుగుదల లేదని ఆయన పేర్కొన్నారు. ముల్లర్ బృందం 2016, 2019, 2020, 2022లో పచ్చిక భూములు, వ్యవసాయ యోగ్యమైన పొలాలు సహా అనేక బహిరంగ ఆవాసాలలో పురుగుల బయో మాస్ పెరుగుదలపై పరిశోధనలు చేసింది. వాతావరణ మార్పులు.. ఆవాసాల నష్టం పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలకమైన కీటకాల క్షీణత మానవాళి జీవనంపైనా పెద్ద ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ ముల్లర్ పేర్కొన్నారు. వీటి జాతి తగ్గిపోవడానికి వాతావరణ మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఆవాసాల నష్టం, పట్టణీకరణ, కాలుష్యం, సింథటిక్ పురుగు మందులు, ఎరువుల వినియోగం కూడా కారణమని తేల్చారు. వీటితోపాటు జీవ సంబంధ కారకాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 1989 నుంచి 2016 మధ్య కీటకాల బయో మాస్లో 75 శాతానికి పైగా క్షీణత నమోదైనట్టు.. 2005 తర్వాత వాతావరణ ప్రభావాలు కీటకాలకు ప్రతికూలంగా మారినట్టు గుర్తించారు. ఉష్ణోగ్రతలు కీటకాల జీవన చక్రంలోని వివిధ దశల్లో వాటి జనాభాను ప్రభావితం చేస్తాయని, వీటి మనుగడ శీతాకాల పరిస్థితులు, వేసవి వంటి చివరి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ముల్లర్ తన అధ్యయనంలో పేర్కొన్నారు. శీతాకాలంలో చాలా వెచ్చగాను పొడిగాను ఉండటం, వేసవిలో చల్లగాను తడిగాను మారడంతో ఆ పరిస్థితులను తట్టుకోలేక కీటకాలు అంతరించిపోయినట్టు తేల్చారు. కీటకాల నాశనం ఆహార గొలుసును చిక్కుల్లో పడేస్తోందని.. దీనివల్ల కీటకాలను తినే పక్షులకు ఆహారం లభించక మరణిస్తున్నాయని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎకో క్లెమటాలజీ ప్రొఫెసర్ అన్నెట్ మెన్జెల్ తెలిపారు. దీనివల్ల పంటలు నాశనం అవుతున్నట్టు తేల్చారు. ముఖ్యంగా ఈ తగ్గుదల 2005 నుంచి 2019 మధ్య బాగా తగ్గినట్టు గుర్తించారు. 20 నుంచి 30% తగ్గిన పంటలు ఆహార గొలుసులో కీటకాలు తగ్గిపోవడంతో పక్షులకు ఆహారం దొరకక చనిపోతున్నాయని, వీటిలో సముద్ర పక్షులు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రభావం జర్మనీతో పాటు సమీప యూరోపియన్ దేశాల్లోనూ కనిపించినట్టు తేల్చారు. ఆహారం కొరతతో వలస పక్షులు సైతం రావడం లేదని, స్థానిక పక్షులు సైతం తగ్గిపోతున్నాయని, ఉన్నవి పంటలపై దాడులు చేస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలో 2005–2019 మధ్య పంట దిగుబడులు 30% వరకు తగ్గినట్టు అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్ని తగ్గించాలని, సమతుల వాతావరణ పరిస్థితులను కాపాడేందుకు అడవులను పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే ఆసియా, అమెరికా దేశాలకూ ఇదే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. -
రైతులకు మేలు చేసేలా..పురుగులకు కుటుంబ నియంత్రణ!
వ్యవస్థాపకుడు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పంట పొలాల్లో, పండ్ల తోటల్లో పురుగుల నియంత్రణకు పురుగుమందులు/కషాయాలు చల్లటం కన్నా.. అసలు ఆయా ప్రత్యేక జాతి పురుగుల సంతతినే పెరగకుండా అరికట్టగలిగితే రైతులకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. వివిధ శాస్త్రవిభాగాల్లో పరిశోధనలు పూర్తిచేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే వినూత్నమైన ఫెరమోన్ ఆధారిత అప్లికేషన్లు, ఆవిష్కరణలను వెలువరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పురస్కారాన్ని అందుకున్న ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఎటిజిసి బయోటెక్ అనే కంపెనీని నెలకొల్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇటీవల నిర్వహించిన ‘ఎట్హోమ్ రిసెప్షన్ ’లో ఈ సంస్థ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, హెచ్సియూ పూర్వ విద్యార్థి డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అందించిన వివరాల ప్రకారం ఈ వినూత్న సాంకేతికత వివరాలను పరిశీలిద్దాం.. పురుగుల సంతతిని అరికట్టే వ్యూహం ఆడ రెక్కల పురుగు సంతానోత్పత్తి దశలో మగ రెక్కల పురుగును ఆకర్షించడానికి ప్రత్యేకమైన వాసనతో కూడిన హార్మోన్ వంటి రసాయనాన్ని గాలిలోకి విడుదల చేస్తుంది. మగ పురుగు ఆ ఫెరమోన్ వాసనను బట్టి ఆడ పురుగు ఉన్న చోటుకు వెళ్లి కలుస్తుంది. ఈ కలయిక సజావుగా జరిగితే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. ఆ విధంగా పురుగుల సంతతి పంట పొలంలో స్వల్ప కాలంలోనే పదులు వందలుగా, వందలు వేలుగా పెరిగిపోయి పంటను ఆశించి దిగుబడిని నష్ట పరచటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఆడ–మగ రెక్కల పురుగుల కలయికే జరగకుండా చూడటం ద్వారా సంతతి పెరుగుదలను అరికట్టడం ఇక్కడ వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలుపరచడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. కృత్రిమ ఫెరమోన్తో కూడిన ప్రత్యేక పేస్ట్ను రూపొందించటం. ఈ పేస్ట్ను పంట పొలంలో మొక్కలకు అక్కడక్కడా అంటిస్తే.. ఆ వాసనకు మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు వస్తుంది. తీరా లేకపోయే సరికి తికమకకు గురవుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో నూటికి 90 సార్లు విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు సంతానోత్పత్తి ఆ మేరకు పరిమితమవుతుంది. ఈ టెక్నిక్ను ఉపయోగించి పురుగు తొలి దశలోనే పేస్ట్ను పొలంలో అక్కడక్కడా మొక్కలకు పూస్తే చాలు. పురుగుల్ని నిర్మూలించకుండానే వాటి సంఖ్యను చాలా వరకు అదుపులోకి తేవటం ద్వారా పంట దిగుబడికి పెద్దగా నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇది సరిగ్గా చేస్తే ఆ పురుగు నిర్మూలనకు రైతులు పురుగుమందు కొట్టే శ్రమ, ఖర్చు, కాలుష్యం ఉండదు. అయితే, పురుగుల తీవ్రతను తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలు చాలా కాలంగా రైతులు వాడుతున్నారు. ఫెరమోన్ ఎర వాసనతో వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడే మగ రెక్కల పురుగుల సంఖ్యను, పొలంలో అప్పుడు ఆ పురుగు తీవ్రతను గుర్తించి, పురుగు మందులు/కషాయాలు చల్లటం వంటి నియంత్రణ చర్యలను రైతులు చేపడుతున్నారు. ఈ లోగా పురుగుల సంతతి పెరిగిపోతోంది. అయితే, ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ పురుగుల సంతతి పెరగకుండా ముందు నుంచే వాటి కలయికను నివారించవచ్చు. పురుగు ఉధృతిని ఎర ఉపయోగించి గమనించవచ్చు. పత్తిలో గులాబీ పురుగుకు చెక్ గులాబీ రంగు పురుగు వలన పత్తి రైతులు సగటున ఎకరానికి 6–7 క్వింటాళ్ల పత్తిని నష్టపోతున్నారు. పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి ఫెరొమోన్ పర్యవేక్షణ మాత్రమే సరిపోదు. ఇప్పుడు పర్యవేక్షణే కాకుండా ఫెరొమోన్ ఆధారిత నియంత్రణ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎరను ఉపయోగించకుండా ఫెరొమోన్ పేస్ట్ ద్వారా పురుగులను అరికట్టే సరికొత్త పద్ధతని డాక్టర్ విజయభాస్కర్రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రస్తుతం బీటీ పత్తి పొలాల్లో విజృంభిస్తున్న గులాబీ లద్దె పురుగును అరికట్టేందుకు ప్రత్యేకమైన పేస్ట్ను తమ కంపెనీ రూపొందించిందన్నారు. పేటెంట్ కలిగిన ఈ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పత్తి పంటలో 3 సార్లు.. ఎకరం పత్తి చేనులో అన్ని మొక్కలకూ పేస్ట్ను పెట్టక్కర లేదు. 400 మొక్కల (పొలంలో 7–8% మొక్కల)కు ఈ పేస్ట్ను బఠాణీ గింజంత అంటించాలి. మొక్క పై నుంచి 10–15 సెం.మీ. కిందికి, కాండం నుంచి కొమ్మ చీలే దగ్గర పెట్టాలి. ఒక సాలులో 4 మీటర్లకు ఒక మొక్కకు పెడితే చాలు. ఒక సాలులో మొక్కలకు పెట్టి, రెండు సాళ్లు వదిలేసి మూడో సాలుకు పెడితే సరిపోతుంది. ఎకరం మొత్తానికి 125 గ్రాముల పేస్ట్ సరిపోతుందని డా. రెడ్డి వివరించారు. ఒక్కో మొక్క కాండంపై 250 నుంచి 300 మిల్లీ గ్రాముల మేరకు పెట్టాలి. పత్తి పంట కాలంలో మొత్తం 3 సార్లు పేస్ట్ పెట్టాలి. విత్తనాలు వేసిన తర్వాత (పువ్వు/ గూడ ఏర్పడటానికి ముందు) ఇంచుమించుగా 30–35 రోజులకు మొదటిసారి, విత్తిన 60–65 రోజుల తర్వాత రెండోసారి, విత్తిన 90–95 రోజుల తర్వాత మూడవ సారి పెట్టాలి. తుది పంట కోసే వరకు ప్రతి 30–35 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. ఇలా చేస్తే పంట ఖర్చు తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. ఎకరానికి పేస్ట్ ఖర్చు మూడు సార్లకు రూ. 4 వేలు అయినప్పటికీ, రైతు రూ. 30 వేల వరకు అధికాదాయం పొందగలుగుతారని ఆయన అన్నారు. మిత్రపురుగులు సురక్షితం ఈ సాంకేతికతలో పురుగుమందులు /హానికరమైన రసాయనాలు లేనందున పర్యావరణానికి హాని కలిగించదని డా. విజయభాస్కర్రెడ్డి వివరించారు. నేల, గాలి, నీరు పురుగు మందుల అవశేషాలతో కలుషితం కావు. మిత్ర పురుగులకు, పరాన్న జీవులు వంటి సహజ శత్రువులకు సురక్షితంగా ఉంటాయి. తేనెటీగలు నశించవు. సహజ పరాగ సంపర్కం బాగుంటుంది. రైతుకు, కూలీలకు సురక్షితమైనది. మొక్కకు హాని కలిగించదు. పత్తి నాణ్యత, రంగు మెరుగ్గా ఉంటుంది. మంచి ధరను పొందే అవకాశం కలుగుతుంది అన్నారాయన. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రయోగాల్లో 90% పైగా పత్తిలో గులాబీ పురుగును ఈ పేస్ట్ నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని ఆయన తెలిపారు. (ఇతర వివరాలకు.. టోల్ఫ్రీ నంబర్ 1800 121 2842) త్వరలో వంగకు కత్తెర పురుగుకు కూడా.. ప్రస్తుతానికి పత్తిలో గులాబీ పురుగును నియంత్రించేందుకు పేస్ట్ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. వంగ తోటల్లో కాయ/కాండం తొలిచే పురుగుల నియంత్రణకు ప్రత్యేక పేస్ట్ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత 2–3 నెలల్లో విడుదల చేయబోతున్నాం. ఇది అందుబాటులోకి వస్తే వంగ రైతులకు పురుగు మందుల ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక వినియోగదారులు పురుగుమందు అవశేషాలు లేని వంకాయలను తినటం సాధ్యమవుతుంది. ఇప్పటికే పండ్లు/కూరగాయ తోటల్లో నష్టం చేస్తున్న పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ల్యూర్ అందుబాటులో ఉంది. శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ దీనిపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొక్కజొన్న సహా అనేక పంటలకు నష్టం చేస్తున్న కత్తెర పురుగు నియంత్రణకు వినూత్న పద్ధతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటి తయారీలో ఎలాంటి జన్యుమార్పిడి సాంకేతికతను వాడటం లేదు. రైతులు ఈ సాంకేతిక పద్ధతిని పురుగు ఉదృతి పెరిగినాక కాకుండా ముందు జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో రైతులు కలసి వాడితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. – డా. విజయ భాస్కర్ రెడ్డి, ఎటిజిసి బయోటెక్ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్. (చదవండి: -
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువ అవుతోందని.. బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! ఖర్చుల భారం.. అందుకే.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది. కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది. (చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్) ఇలాంటి ప్రయోగాలు అవసరమా? మిడతలతో తయారు చేసిన పఫ్లు, ప్రోటీన్ పౌడర్ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు. మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం. అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది. (చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..) -
మిత్రుడికి ముప్పు!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీటకాల పాత్ర కీలకం. మానవాళి కంటే దాదాపు 17 రెట్లు అధికంగా ఉండే కీటకాల జనాభా ప్రస్తుతం ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం కీటక జాతులు తగ్గిపోతున్నాయని, మూడో వంతు అంతరించిపోతున్నట్లు బయోలాజికల్ కన్జర్వేషన్ నివేదిక వెల్లడిస్తోంది. జనావాసాల పెరుగుదల, విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువుల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా మిత్ర కీటకాలు నశిస్తున్నాయి. పర్యావరణ నిపుణులు దీన్ని ‘కీటకాల అపోకలిప్స్’గా అభివర్ణిస్తున్నారు. ఆహార చక్రంలో ఎంతో కీలకం ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్ జాతుల కీటకాలు ఉన్నట్లు అంచనా వేయగా ఇప్పటివరకు కేవలం ఒక మిలియన్ జాతులను మాత్రమే గుర్తించారు. భూమిపై జంతు జాలంలో 80 శాతం కీటకాలే ఉండటం గమనార్హం. ఆహార పంటల పరాగ సంపర్కంతో పాటు తెగుళ్ల నియంత్రణ వ్యవస్థలుగా, భూమిని రీసైక్లింగ్ చేసే డీకంపోజర్లుగా పర్యావరణాన్ని కీటకాలు కాపాడుతున్నాయి. ఫిష్ అండ్ వైల్డ్లైఫ్ సర్వీస్ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న 2.50 లక్షల రకాల పుష్పించే మొక్కలను పరాగ సంపర్కం చేయడంలో లక్ష కంటే ఎక్కువ కీటక జాతుల పాత్ర కీలకం. ఇందులో తేనెటీగలు, కందిరీగలు, సీతాకోక చిలుకలు, ఈగలు, బీటిల్స్ లాంటివి ఉన్నాయి. ఆహార చక్రంలో కీలక పాత్ర పోషించే కీటకాలు ఒక్క అమెరికాలోనే ఏటా 70 బిలియన్ డాలర్ల విలువైన సేవలను అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా 1–2 శాతం క్షీణత.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 నుంచి 2 శాతం కీటకాలు నశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 30 ఏళ్లలో కీటకాల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాల కంటే కీటకాలు అంతరించిపోయే రేటు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కీటకాల సంఖ్య క్షీణిస్తే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 శాతం ఆహార పంటలకు పరాగ సంపర్కమే ఆధారం కావడం కీటకాల మనుగడ ఆవశ్యకతను సూచిస్తోంది. ♦ మానవులు దాదాపు 2 వేల కీటకాలను ఆహారంగా భుజిస్తారు. ♦ 75 శాతం కంటే ఎక్కువ కీటకాలు పరాగ సంపర్కంతో ఆహార చక్రాన్ని పరిరక్షిస్తాయి. ♦ దీని విలువ ఏటా 577 బిలియన్ల డాలర్లు ఉంటుంది. ♦ ప్రకృతిలో దాదాపు 80 శా>తం అడవి మొక్కలు పరాగ సంపర్కం కోసం కీటకాలపై ఆధారపడతాయి. ♦ గత 150 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల నుంచి 5 లక్షల కీటక జాతులు అంతరించాయి. -
రెక్కల తేల్ల గురించి విన్నారా..!
నేల మీద పాక్కుంటూ వచ్చే తేలును చూడగానే.. గుండె ఆగినంత పనవుతుంది. కనీసం ఆ పేరు విన్నా.. ఆగకుండా ఆమడదూరం పరుగుతీస్తాం. నేల మీద పాకే తేలుకే అంత భయపడితే .. రెక్కలు కట్టుకుని ఎరిగే తేలు కనిపిస్తే? ప్రాణాలు గాల్లో కలిసిపోవూ అంటారా? అయితే ఈ చిత్రాన్ని గమనించండి. ఇది ఎగిరే తేలు. కంగారు పడకండి.. ప్రమాదకరం కాదు. చూడ్డానికి అచ్చం తేలులా ఉండే ఈ ప్రాణి పేరు స్కార్పియన్ ఫ్లై. ఇదో కీటకం. తూనీగలు, కందిరీగల జాతికి చెందినది. వీటిలో మగ స్కార్పియాన్ ఫ్లైకి పొట్ట, జననాంగం పొడవుగా సాగి తేలు కొండిలా కనిపిస్తుంది. ఈ కీటకాలు ఎగురుతుంటే అచ్చం తేళ్లలాగే కనిపిస్తాయి. ఇవి విషపూరితం కావు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఎంతయినా ప్రకృతిలోని వింతలు.. వైవిధ్యాలను చూడతరమా! -
ప్రాణం పోయినా సరే ‘తల’పెడితే.. తగ్గేదేలే!.. ఇతరులకు నో ఎంట్రీ!
చీమా.. చీమా.. ఏమిటలా కుట్టావ్ అంటే.. నా పుట్టలో వేలుపెడితే కుట్టనా? అంటుందట. కానీ ఈ చీమ కుట్టకున్నా.. తమ గూట్లో మాత్రం వేలు పెట్టనివ్వదు. తన తలను పణంగా పెట్టి మరీ గూడును కాపాడేస్తుంది. ప్రాణం పోయినా సరే.. తగ్గేదే లేదంటూ నిలబడుతుంది. ఏమిటీ.. ఓ చీమ గురించి ఇంత ఉపోద్ఘాతమేంటి అనిపిస్తోందా? దాని గురించి తెలిస్తే.. భలే ఉందిలే అనుకోకుండా ఉండలేరు. మరి ఆ చీమ ఏమిటి? దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గూటికి తగినట్టుగా తల.. సాధారణంగా ఇంటిని కాపాడటానికి గేట్లు, తలుపులు పెట్టుకుంటాం. అవసరమైతే తీసి, మళ్లీ వేసేస్తుంటాం. కానీ చెట్ల కాండంపై రంధ్రాల్లో జీవించే ‘డోర్ హెడ్’ చీమలు మాత్రం స్పెషల్. అవి తమ గూటిని కాపాడుకునేందుకు తలనే అడ్డుపెట్టి చేసే పోరు మరీ స్పెషల్.‘సెఫలోట్స్/సెరెబరా’ జాతికి చెందిన ఈ చీమల తలపై భాగం బల్లపరుపుగా, గుండ్రంగా ఉంటుంది. అంతేకాదు.. దాదాపుగా తమ గూడు రంధ్రానికి సరిపడే పరిమాణంలో ఉంటుంది. ఈ చీమలు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు.. గూటి లోపలికి వెళ్లి.. తమ తలను గూటి రంధ్రానికి అడ్డు పెట్టేస్తుంటాయి. అందుకే వీటిని ‘లివింగ్ డోర్స్’ అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా బీటిల్స్ (ఒకరకం చిన్నసైజు పురుగులు) చెట్ల కాండాలపై గుహల్లా రంధ్రాలు చేస్తుంటాయని.. వీటినే తమ గూడుగా చేసుకుని జీవిస్తుస్తున్న ఒకరకం చీమలు.. వాటిల్లోకి ప్రవేశించే రంధ్రాల వద్ద ‘డోర్హెడ్’ చీమలను కాపలాగా ఉంచుతాయని అమెరికాలోని లూయిస్విల్లే యూనివర్సిటీ పరిశోధకుడు స్టీవ్ యనోవిక్ తెలిపారు. ఈ చీమలపై ఆయన విస్తృత పరిశోధన చేశారు. ‘డోర్హెడ్’ చీమలు తమ చీమలనే లోనికి రానిస్తాయని.. చెట్లపై తిరిగే చిన్న పురుగులు, కీటకాలు వంటివి గూడులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఈ తరహా ‘డోర్ హెడ్’ చీమలు ఉన్నాయన్నారు. చెట్ల కాండాల్లో బీటిల్స్ చేసే రంధ్రాలకు సమాన సైజులో ‘డోర్ హెడ్’ చీమల తల సైజు ఉండటం విశేషమని.. లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని పేర్కొన్నారు. ప్రాణం పోయినా.. తగ్గేదే లే.. చీమల్లో చాలా రకాలు కుడతాయి. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా గొట్టంవంటి నిర్మాణం (స్టింగ్) ఉంటుంది. కానీ ‘డోర్ హెడ్’ చీమలకు స్టింగ్ ఉండదు. దాంతో కుట్టలేవు. కానీ శత్రు పురుగులు, కీటకాలు గూడులోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రాణాలనైనా పణంగా పెడతాయని.. పురుగులు ఈ చీమల తలపై గట్టిగా దాడి చేసినా, కుట్టినా వెనక్కితగ్గవని స్టీవ్ యనోవిక్ చెప్పారు. తాము పరిశీలించిన ‘డోర్ హెడ్’ చీమల్లో చాలా వాటికి తలపై గాయాల గుర్తులు ఉన్నాయని వివరించారు. చీమల గూడు నిరంతరం మూసేసి ఉండదని.. ఏదైనా ప్రమాదం వస్తున్న సంకేతాలు కనబడగానే ‘డోర్హెడ్’ చీమలు ద్వారానికి తలుపులా తమ తలను అడ్డుపెట్టేస్తాయని తెలిపారు. -
మిన్నల్లి పనిపట్టే వై.ఎన్. ద్రావణం!
మిరప, బత్తాయి తదితర పంటలను ఆశిస్తూ అనేక రాష్ట్రాల్లో రైతులను బెంబేలెత్తిస్తున్న వెస్ట్రన్ త్రిప్స్ లేదా నల్లపేను లేదా మిన్నల్లికి ఎర్రి పుచ్చకాయలు, నల్లేరు (వై. ఎన్.) ద్రావణం అద్భుతంగా పనిచేస్తున్నదని వైఎస్సార్ జిల్లా వెంపల్లె మండలం టి. వి. పల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు కె. విజయ్కుమార్ తెలిపారు. ఆరేళ్ల క్రితం ‘సాక్షి సాగుబడి’లో ప్రచురితమైనప్పటి నుంచి వై.ఎన్. ద్రావణం అన్ని రకాల పంటల్లో పురుగులు ఆశించకుండా నిలువరించటం, ఆశించిన పురుగును అరికట్టేందుకు వై. ఎన్. ద్రావణం ఉపయోగపడుతోందన్నారు. ఇప్పుడు మిరప తదితర తోటలను ఆశిస్తున్న మిన్నల్లిని అరికట్టడానికి కూడా వై.ఎన్. ద్రావణం చక్కగా పనిచేస్తున్నదని తెలిపారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదని, చాలా ఏళ్లుగా ఉన్నదేనని ఆయన అంటున్నారు. వై.ఎన్. ద్రావణం తయారీ ఇలా.. 5 కిలోల యర్రి పుచ్చకాయలు, 5 కిలోల ముదురు నల్లేరు కాడలు రెండింటిని మొత్తగా దంచాలి. వంద లీ. నీరు కలిపిన ప్లాస్టిక్ డబ్బాలో పది రోజులు నిల్వ ఉంచి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. ఏడాది పాటు నిల్వ ఉంటుంది. నీడపట్టున ఉంచి పైన గోనె సంచి కప్పాలి. ఈ పసరు శరీరంపై పడితే విపరీతమైన దురద, దద్దుర్లు వస్తాయి. ముందు జాగ్రత్తగా చేతులకు తొడుగులు, ముక్కుకు శుభ్రమైన బట్టను కట్టుకోవాలి. పొరపాటున శరీరంపై పడితే పేడ రసం, బురద రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వరుసగా మూడు పిచికారీలు వై. ఎన్ ద్రావణాన్ని గత ఎనిమిదేళ్లుగా వివిధ పంటలపై పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించారు. ఇందులో ఉండే చేదు ప్రభావం.. చర్మంపై పడగానే కలిగే దురద వల్ల పురుగులు చనిపోతాయి. గుడ్లు దశలో పిచికారీ చేస్తే పురుగు లార్వాలు మరణిస్తాయి. ఏ రకం పంటలయినా వై. ఎన్. ద్రావణాన్ని మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండు పిచికారీల మధ్య 6 రోజుల ఎడం పాటించాలి. ఎకరాకు 15 ట్యాంకుల వరకు పిచికారీ చేస్తే పైరు బాగా తడిచి ద్రావణం సమర్థవంతంగా పని చేస్తుంది. ఉ. 6–9 గంటలు, సా. 5.30–7.00 మధ్య పిచికారీ చేయాలని విజయకుమార్ సూచించారు. (చదవండి: నల్ల పేనుకు హోమియోతో చెక్!) ఆకుకూరలను ఆశించే త్లెల పేనుబంక, రంధ్రాలు చేసే మిడతలను వై. ఎన్. ద్రావణం నివారిస్తుంది. ఆకుకూరలపై మొదటిసారి ట్యాంకు (20లీ.)కు 1/2 లీ., రెండోసారి 1 లీ., మూడోసారి 1 1/2 లీ. చొప్పున ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. కాయగూరలు వేరుశనగ, పత్తి, మిరప, వరి వంటి పైర్లు, పండ్ల తోటలపై మూడు దఫాలు వరుసగా 1లీ., 11/2లీ., 2 లీ. చొప్పున పిచికారీ చేయాలి. వేరు శనగను ఆశించే పచ్చపురుగు, నామాల పురుగు, కాండం తొలిచే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. వరిలో సుడిదోమ, కాండం తొలిచే పురుగును నివారిస్తుంది. పండ్ల తోటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగించే వివిధ చీడపీడలను వై. ఎన్. ద్రావణం సమర్థవంతంగా నివారిస్తుంది. (చదవండి: వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం) మామిడిలో తేనెమంచు పురుగుపై ఇది చక్కని ఫలితాన్నిస్తుందని విజయకుమార్ తెలిపారు. చెట్లపై పూత దశకు ముందు, పిందె దశలో మాత్రమే బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పూత మీద పిచికారీ చేస్తే రాలిపోతుంది. నిమ్మ, దానిమ్మ, బొప్పాయిల్లో వచ్చే మసి తెగులు, ఆకుముడతను నివారిస్తుందని విజయకుమార్ (98496 48498) తెలిపారు. -
Cockroach beer: పేరే కాదు, ఆ టేస్టే వేరంటున్న బీర్ ప్రియులు
బీర్ను సాధారణంగా బార్లీ గింజలు, హోప్ మొక్కనుంచి వచ్చే పువ్వులు, ఒక్కోసారి గోధుమలతోను తయారు చేస్తారని మనలోచాలామందికి తెలుసు కదా. ఈ మధ్య గ్లూటెన్ ఫ్రీ అంటూ జొన్నలతో కూడా బీర్ను ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా వెరైటీ బీరు ఒకటి హల్ చల్ చేస్తోంది. అదే కాక్రోచ్ బీర్.. మీరు విన్నది నిజమే. బొద్దింకల బీర్. కానీ ఇది ఎక్కడ పడితే దొరకదు సుమా! మరి ఈ స్పెషల్ బీర్ ఎక్కడ తయారవుతుంది. దీని రేటెంత? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి. బార్లీ గంజిని పులియబెట్టి, ప్రాసెస్ చేసి బీరు తయారు చేస్తారు. ఆయా బ్రాండ్లు వీటికి కొన్ని ప్లేవర్లను యాడ్ చేస్తాయి. కానీ జపాన్లో మాత్రం బీరును ఎలా తయారు చేస్తారో తెలిస్తే..ముందు యాక్ అంటారు. కానీ టేస్ట్కు టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ జపాన్ వాసులు ఈ స్పెషల్ బీర్ కోసం ఎగబడతారట. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఈ బీర్ను ఎంజాయ్ చేస్తున్నారట అక్కడి మందుబాబులు. -
Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..!
Why is Ant’s Blood Not Red Like We Humans Have: చురుక్ మని కుట్టి పుసుక్కున జారుకునే చీమలను... ఒక్కోసారి దొరకపుచ్చుకుని కసితీర నలిపి అవతలేస్తాం కూడా!! కానీ మనుషుల రక్తం తాగే చీమల్లో కూడా రక్తం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ రంగులో ఉంటుంది? ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా? మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో.. చీమల్లో రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులోకాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుంది. దీనిని హేమోలింఫ్ అని అంటారు. మిడతలు, నత్తల వంటి వర్టిబ్రేట్స్ (వెన్నెముక ఉండే జంతువులు - సకశేరుకాలు)లో ఈ విధమైన రక్తం ఉంటుంది. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల తెల్లగా కనిపిస్తుంది. చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్స్ అధికంగా ఉండటమే అందుకు కారణమట. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! వీటి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల్లో రక్తం సిరలు, ధమనుల్లో ప్రవహిస్తుంది. ఐతే కీటకాల్లో మాత్రం ధమనులు ఉండవు కానీ శరీరమంతా స్వేచ్ఛగా ఏ దిశలోనైనా రక్తం ప్రవహిస్తుంది. అందువల్లనే చీమలు ఎటువంటి వాతావరణంలోనైనా సులభంగా జీవించగలవు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉన్నట్లే, హిమోలింఫ్ లోపల హిమోసైనిన్ ఉంటుంది. రక్తం - హిమోలింఫ్ మధ్య గుమనించదగిన ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. మనుషుల్లోనైతే రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరం అంతటా వ్యాపిస్తుంది. కీటకాల్లో ఉండే హేమోలింఫ్ ఆక్సిజన్ను శరీరం అంతటా వ్యాపింపచేయదు. వీటి శరీరాలకు స్పిరాకిల్స్ అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ రంధ్రాలు ఎర్ర రక్త కణాలతో పనిలేకుండా నేరుగా క్రిమి అవయవాలకు ఆక్సిజన్ చేరవేస్తుంటాయి. చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..! -
Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!
గత ఏడాది మేలో కరోనా ఉదృతి పెరిగినప్పుడు అమెరికాలో చాలామంది ఇళ్లకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఆ టైంలో అమెరికాకు చెందిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రోజుల్లో ఆమె కేవలం మూడే అడుగుల దూరంలో 8 వారాలపాటు శవంతో గడిపింది. ఐతే ఆమెకు ఆవిషయమే తెలియదట. అసలేంజరిగిందంటే.. అమెరికాలో లాస్ ఏంజెల్స్లోని ఓ అపార్ట్మెంట్లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ఒక రోజు హఠాత్తుగా తన అపార్ట్మెంట్లో దుర్వాసన రావడం ప్రారంభించింది. ఆ వాసనకి తలనొప్పి, రాత్రుల్లు నిద్రపట్టక ఆరోగ్యంకూడా బాగా పాడైపోయిందట. అంతేకాకుండా పురుగులు, సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోయాయట. దీంతో ఆమె అపార్ట్మెంట్ మేనేజర్కి కంప్లైంట్ చేసింది. తనకు చనిపోయిన చేప వాసన వస్తోందని, కానీ దరిదాపుల్లో ఎక్కడా చెరువు లేకపోవడంతో, పక్కింటి కుక్క చచ్చిపోయిందేమోననే అనుమానం వ్యక్తం చేసింది. ఐతే వారిని అడిగితే కంగారు పడతారేమోనని మేనేజర్ చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కొన్ని రోజుల తర్వాత ఆ దుర్వాసన భరించలేక మేనేజర్ని రప్పించి అపార్ట్మెంట్ బ్లాక్ను పరిశీలించడానికి ఒక వ్యక్తిని పురమాయించారు. ఐతే పక్క అపార్ట్మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో మెట్లు కూడా ఎక్కలేకపోయాడు సదరు వ్యక్తి. మాస్టర్ కీతో ఆ ఇంటి తలుపు తీయడంతో అస్థిపంజరంగా మారిన శవం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె రూం మరణించిన వ్యక్తి ప్లాట్కి కేవలం 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ రూంలో పడుకుంది కూడా. ఐతే ఆమెకు అసలు అక్కడ శవం ఉందనే విషయమే తెలియదట. ఆమె పక్క అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి మరణించి రెండు నెలలౌతున్నా అసలెవ్వరూ గమనించకపోవడం కొసమెరుపు. కాగా రిగాన్ బెల్లీ టిక్టాక్ ద్వారా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
చెవిలో ‘పువ్వు’!
అదో అడవి మొక్క. తెలుపు, లేత ఆకుపచ్చ రంగు పూలతో.. చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే.. అదో మాంసాహారి. ఈగల వంటి చిన్న చిన్న కీటకాలను పట్టేసుకుని ఆరగించేస్తుంది.. దానిపేరు ట్రియంతా ఆక్సిడెంటాలిస్. సాధారణంగానే కనిపిస్తూ.. ఇన్నాళ్లూ మన చెవుల్లో పూలు పెట్టిన ఈ మొక్కలు మాంసాహారులు అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. కీటకాలను ఎలా పట్టేసి, తినేస్తున్నాయో తేల్చారు. ఇవే కాదు.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 800కుపైగా మాంసాహార మొక్కలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఈ మొక్కలు ఏంటి, కీటకాలను ఎలా పట్టేసి తింటాయనే వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అమాయకంగా కనిపిస్తూ.. ఉత్తర అమెరికాలోని అలస్కా నుంచి కాలిఫోర్నియా పశ్చిమ తీరం వెంబడి అడవులు, కొండలు, గుట్టల్లో పెరిగే మొక్క ట్రియంతా ఆక్సిడెంటాలిస్. తామర పూలకు ఉన్నట్టుగా ఆ మొక్క పుష్పాలకు పొడవైన కాండం ఉంటుంది. దానిపై జిగురులాంటి పదార్థం ఉంటుంది. ఈగలు వంటి చిన్న కీటకాలు ఏవైనా దానిపై వాలితే అతుక్కుపోతాయి. అలాగే చనిపోతాయి. ఇలా మొక్కలు తమను కీటకాలు, పురుగులు, చిన్న జంతువుల నుంచి రక్షించుకునేందుకు జిగురు, ముళ్లు వంటివి పెంచుకోవడం ప్రకృతిలో సహజమే. కానీ ట్రియంతా ఆక్సిడెంటాలిస్ మొక్క విషయంలో ఏదో తేడా ఉందని శాస్త్రవేత్తలకు అనుమానం రావడంతో పరిశోధన చేపట్టారు. ఈ మొక్కల కాండానికి ఈగలు అతుక్కుపోవడం ఏదో పొరపాటున జరుగుతున్నది కాదని.. మొక్కలే వాటిని ట్రాప్ చేసి పట్టేసి ఆరగించేస్తున్నాయని గుర్తించారు. ఇలా ఉండటం చిత్రమే.. ప్రకృతిలో మాంసాహార మొక్కలు ఉండటం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని వందల రకాలను గుర్తించారు. అయితే అవన్నీ కూడా కీటకాలను పట్టుకునేందుకు ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉన్నాయి. కానీ ‘ట్రియంతా ఆక్సిడెంటాలిస్’ రహస్యంగా పని కానిచ్చేస్తుండటం విచిత్రమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపై ఇటీవల అమెరికాలో జరిగిన ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్’లో నివేదికను సమర్పించారు. ఈ వివరాలను కొలంబియా వర్సిటీ వృక్షశాస్త్ర పరిశోధకుడు సీన్ గ్రాహం వెల్లడించారు. ప్రత్యేక మూలకం ఇచ్చి.. కొన్ని ఫ్రూట్ఫ్లైస్ (ఒక రకం ఈగలు)ను తీసుకుని.. వాటికి ‘నైట్రోజన్–15 (ప్రకృతిలో సహజంగా లభించని నైట్రోజన్ ఐసోటోప్)’ ఉన్న ఆహారాన్ని తినిపించారు. తర్వాత వాటిని ట్రియంతా ఆక్సిడెంటాలిస్ మొక్కల వద్ద వదిలారు. ఆ ఈగలు మొక్క కాండానికి అతుక్కుని చనిపోయాయి. కొద్దిరోజులు దానిని పరిశీలిస్తూ.. మొక్కలోని వివిధ భాగాల నుంచి, ఈగ చనిపోయిన ప్రాంతం నుంచి శాంపిళ్లు సేకరించిన శాస్త్రవేత్తలు చిత్రమైన విషయాన్ని గుర్తించారు. ►ఈ మొక్కల కాండంపై ఉన్న సన్నని వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఈగలను పట్టేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిర్మాణాల నుంచి ‘ఫాస్పటేస్’ అనే ఎంజైమ్ను విడుదల చేసి ఈగలను కరిగించేస్తున్నాయని (జీర్ణం చేస్తున్నాయని).. ఆ ద్రవాన్ని పీల్చుకుంటున్నాయని తేల్చారు. ఈ మొక్కల ఆకులు, పూలలో రసాయనాలను పరిశీలించగా.. శాస్త్రవేత్తలు ఈగలకు తినిపించిన ‘నైట్రోజన్–15’ వాటిలో ఉన్నట్టు తేలింది. మొక్కలకు మాంసాహారం ఎందుకు? ఎడారులు, కొండ ప్రాంతాలతోపాటు కొన్ని రకాల నేలల్లో మొక్కలకు సరిపడా పోషకాలు లభించవు. ముఖ్యంగా చాలా చోట్ల నత్రజని సంబంధిత లోపం ఉంటుంది. దానితోపాటు కొన్నిరకాల మొక్కల్లో జన్యుపరమైన లోపాల కారణంగా నేల నుంచి నత్రజనిని గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీనిని అధిగమించేందుకు ఆయా మొక్కలు మాంసాహారులుగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే జంతువుల్లా మొక్కలకు దంతాలు ఉండవు. కాబట్టి అవి కీటకాలు, ఇతర చిన్నచిన్న జీవులను పట్టుకుని, ప్రత్యేక రసాయనాలతో కరిగించి.. శోషించుకుంటాయి. కేవలం కీటకాలనే కాదు.. చిన్నచిన్న జంతువులను కూడా పట్టి ఆరగించేసే మొక్కలు కూడా ఉన్నాయి. వీనస్ ఫ్లైట్రాప్ అమెరికాలో కనిపించే మరో మాంసాహారపు మొక్క వీనస్ ఫ్లైట్రాప్ (డియోనియా మస్సిపులా). తెరిచిన ఆల్చిప్పలా, అంచుల్లో పెద్ద పెద్ద ముళ్లు ఉండే ప్రత్యేక నిర్మాణం (ట్రాప్) ఈ మొక్కల్లో ఉంటుంది. దానిలోపల జిగురు లాంటి ప్రత్యేక రసాయనాలు ఉంటాయి. ఇది ఒకరకమైన వాసనలు వెదజల్లుతుంది. క్రిమికీటకాలు, కప్పలు, బల్లుల వంటి చిన్నచిన్న జీవులు దీనిపైకి వస్తే.. ఆల్చిప్పలా ఉన్న నిర్మాణం చటుక్కున మూసుకుపోతుంది. లోపల చిక్కిన జీవిని ఎంజైమ్లతో కరిగించి పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత తెరుచుకుని మరో జీవి కోసం వేచి ఉంటుంది. ఇప్పుడీ మొక్కలను ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటివాటిల్లోనూ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. పిచర్ ప్లాంట్ చిన్న చిన్న కప్పలను, ఎలుకలను కూడా పట్టేసి తినేసే మొక్క పిచర్ ప్లాంట్. దీని ఆకుల చివరన ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. అంచులు జారుడుగా ఉంటాయి. దాని నుంచి కీటకాలను ఆకర్షించే వాసనలు విడుదలవుతాయి. ఈ సంచిపైకి వాలిన కీటకాలు, జీవులు అందులో పడిపోతాయి. దానిలోని ఎంజైమ్లు ఆ జీవులను చంపేసి, కరిగించేస్తాయి. పిచర్ ప్లాంట్లలో చాలా రకాలు ఉన్నాయి. విదేశాల్లో చాలా మంది ఇళ్లలో కూడా పెంచుతారు. సండ్యూ ఈ మొక్కలు అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో కనిపిస్తాయి. చిత్తడి నేలలు, రాతి నేలలు, నాచు లాంటి వాటి ఉపరితలంపై ఇవి పెరుగుతాయి. దీని ఆకులపై టెంటకిల్స్ (వెంట్రుకల వంటి నిర్మాణాలు) ఉంటాయి. వీటి చివరన ఎర్రటి బుడిపెల్లో తేనెవంటి పదార్థం ఉంటుంది. దానికోసం వచ్చే కీటకాలను టెంటకిల్స్తో బంధించి.. ఎంజైమ్లతో ఆరగించేస్తుంది. ఈ టెంటకిల్స్లోని ఎర్రని ద్రవాన్ని గతంలో సిరాగా వినియోగించేవారని అంతర్జాతీయ మాంసాహార మొక్కల సొసైటీ పేర్కొంది. -
తేనెను జుర్రేసే ప్రత్యేక పురుగు.. దీని నాలుక ఎంత పెద్దదో తెలుసా?
తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక (గొట్టం వంటి ప్రత్యేక నిర్మాణం) చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్ మోత్ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక ఎంత పెద్దదో తెలుసా.. ఏకంగా 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్ మోత్ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు. చదవండి: మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్ చూడక ముందే ఊహించి.. జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్కు ఈ చిమ్మట పురుగుకు ప్రత్యేక సంబంధం ఉంది. మడగాస్కర్లో చెట్లు, మొక్కలను పరిశీలిస్తున్న క్రమంలో డార్విన్కు ‘అంగ్రాకమ్ సెస్కీపెడబుల్’గా పిలిచే ఒకరకం ఆర్కిడ్ పూల మొక్క కనబడింది. దాని పూల కాడలు చాలా పొడవుగా ఉండి.. కిందివైపున తేనె (నెక్టార్) ఉన్నట్టు గుర్తించారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు ఇలాంటి పూల నుంచి తేనె పీల్చే సామర్థ్యమున్న పురుగులు ఉండి ఉంటాయని, వాటి నాలుక చాలా పొడవుగా ఉంటుందని 1862వ సంవత్సరంలోనే డార్విన్ అంచనా వేశారు. కానీ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా ఎవరూ ఆ పురుగులను గుర్తించలేకపోయారు. 1903వ సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తలకు ఈ పురుగు కంటబడింది. దానిని ముందే ఊహించిన డార్విన్ పేరిటే దీనికి ‘డార్విన్స్ మోత్’ అని నామకరణం చేశారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైరల్: ఆకా లేదంటే పురుగా.. ఆశ్చర్యంగా ఉందే!
‘అరె చూడటానికి అచ్చం ఆకులా ఉందే.. నిజంగా ఆకేనా.. లేదంటే పురుగా’ అని పై ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారా. ఇలాంటి సందేహం కలగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆకృతిలో ఆకును తలపిస్తూ విచిత్రంగా కనిపిస్తున్న ఇది నిజానికి ఓ పురుగు. ఫిలియం జిగాంటియం అని పిలువబడే ఈ జీవి శరీరం అచ్చం ఆకులా కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆకు పురుగు. దీనికి ఉండే రెండు కాళ్లతో ఆకులాగే కనిపిస్తుంది. చర్మం అంచుల చుట్టూ గోధుమ రంగు మచ్చలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తాజాగా కొన్ని ఆకు పురుగులు కదులుతున్న వీడియోను సైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది. దీంతో ఈ ఆకు పురుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దీనిని చూసిన నెటిజన్లు ఇదేంటో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి చెట్టుకు ఆకులుంటాయని అందరికీ తెలుసు. కానీ, చ్చం ఆకుల్లాగానే ఉండే పురుగులు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే దీనికి మిలియన్ వ్యూస్ రాగా లక్షల్లో కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. మరి మీరూ ఈ వీడియోను చూసేయండి ఇక. చదవండి: కళ్ల ముందే కుప్పకూలుతూ.. చావు కోరల్లోకి! View this post on Instagram A post shared by Science by Guff 🧬 (@science) -
డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి
కరీంనగర్: రాత్రిపూట కీటకాలు ప్రమాదకరంగా మారాయి. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కాకతీయ కాలువ వంతెనపై ప్రమాదంగా మారింది. రోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఆ వంతెనపై వాహనదారులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఈ సమయంలో కీటకాలు వేలాదిగా వచ్చి చేరుతుంటాయి. దీంతో మూడు గంటల పాటు బీభత్సం సృష్టించాయి. రాజీవ్ రహదారిపై కీటకాలు ముసురుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీటకాలు ఏ రకం కీటకాలో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కీటకాల నమూనాలను సేకరించి అధికారులు ల్యాబ్కి పంపారు. -
పుచ్చిపోతున్నా పట్టించుకోరేం?
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్లో కేంద్రం అందించిన ‘శనగలు’ పురుగుల పాలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకంపై నిర్లక్ష్యమో లేక నిబంధన మేరకు ఉచిత పంపిణీ సాధ్యం కాకపోవడమో తెలియదు గాని ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ గోదాములు, ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో శనగల నిల్వలు మాత్రం సగానికిపైగా పురుగులు పట్టాయి. లాక్డౌన్లో ఉపాధితో పాటు తిండిగింజలు లభించక తల్లడిల్లుతున్న వలస కార్మికుల కోసం ఆహార ధాన్యాలతో పాటు సరఫరా చేసిన శనగల పంపిణీ కనీసం మూడు శాతానికి మించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చదవండి: అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ? ఇదీ పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా వలస కార్మికులకు రెండు నెలల పాటు నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు, కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు కోటా విడుదల చేసింది. సొంత ప్రాంతంలో గాని ఆయా రాష్ట్రాల్లో గాని రేషన్ కార్డ్ లేని వారిని మాత్రమే ఈ ఆహార పదార్థాలను తీసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. చదవండి: వేరుశనగ రైతులను ఆదుకోవాలి ► మే, జూన్ నెలలకు కలిపి రాష్ట్రానికి 1066 టన్నుల శనగలు కేటాయించి సరఫరా చేసింది. కానీ వలస కార్మికులు అందుబాటులో లేకపోవడంతో శనగల ఉచిత పంపిణీ మాత్రం 34 టన్నులకు మించనట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ► కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు చేరేనాటికి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉపాధి కరువై స్వస్థలాల బాట పట్టి వెళ్లిపోవడం ఉచిత శనగల పంపిణీకి సమస్యగా తయారైంది. ► ఇక వలస కార్మికులు అధికంగా ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాకు 14,791 కిలోల శనగలు కేటాయించగా కేవలం పాతబస్తీలో యాకుత్పురా సర్కిల్లోని వలస కార్మికులకు 274 కిలోలు, కార్డుదారులకు 548 కిలోల శనగలు మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. నగరం నుంచే 15 లక్షల మంది వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో కేవలం హైదరాబాద్ నుంచే సుమారు 15 లక్షల మందికిపైగా వలస కార్మికులు వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు వెళ్లిపోయారు. మొత్తం మీద ఉపాధి కోసం వలస వచ్చిన సుమారు 90 శాతానికిపైగా వలస కార్మికులు వెళ్లిపోగా కేవలం 10 శాతం మంది మాత్రం ఇక్కడే ఉండిపోయారు. వీరిని గుర్తించి ఉచిత శనగలను పంపిణీ చేయడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఉచిత శనగల పంపిణీ చేయలేకపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసి చేతులు దులుపుకొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథక గడువు పొడిగించి జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలల పాటు ఉచితంగా శనగల పంపిణీ కోసం కేటాయింపులు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శనగల స్థానంలో కంది పప్పు కేటాయించి విడుదల చేయాలని ప్రతిపాదించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారు కుటుంబాలన్నింటికీ నెలకు ఒక కేజీ వంతున ఆత్యధిక ప్రొటీన్లు అందించే శనగలు పంపిణీకే కేంద్రం మొగ్గు చూపి రాష్ట్ర ప్రతిపాదనలు పక్కకు పెట్టడంతో పాటు శనగల కోటాను విడుదలను నిలిపివేసింది. స్వస్థలాల నుంచి వలస కార్మికులు ఉపాధి కోసం తిరిగి వెనక్కి వస్తున్నా.. ఉచిత శనగల పంపిణీ మాత్రం ఊసే లేకుండాపోయింది. సంబంధిత శాఖ మంత్రి హామీ సైతం అమలుకు నోచుకోలేదు. ప్రణాళిక లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా లాక్డౌన్కష్టకాలంలో వలస కార్మికులకు ఉచిత శనగల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రణాళిక లేకుండాపోయింది. వలస కార్మికుల కచ్చితమైన వివరాలు ఇరు ప్రభుత్వాల వద్ద లేకపోవడతోనే ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ఫలాలు లబ్ధిదారులకు అందలేకపోయాయి. ఒకవైపు కేంద్రం శనగల కోటా సకాలంలో అందించలేక పోవడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంపిణీకి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా శనగలు పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు. – డేవిడ్ సుధాకర్, సామాజిక కార్యకర్త్త, హైదారాబాద్ డిస్పోజల్ ఆర్డర్ కోసం రాశాం కేంద్రం వలస కార్మికుల కోసం అందించిన శనగల కోటాను పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేక పోయాం. కేంద్రం నుంచి శనగలు వచ్చే నాటికి వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లి పోయారు. జిల్లాల వారీగా కేటాయించి సరఫరా చేసినా స్వల్పంగా మాత్రమే పంపిణీ చేయగలిగాం. ప్రస్తుతం నిల్వలున్న శనగలు పురుగులు పట్టాయని మా దృష్టికి వచ్చింది. వాటిని డిస్పోజల్ చేసేందుకు కేంద్రానికి లేఖ రాశాం. ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాం. – డీడీ, పౌరసరఫరాల శాఖ, హైదరాబాద్. -
చాక్లెట్లో పురుగులు
మంథని: ఈమధ్య పిజ్జాలు, బర్గర్లలో పురుగుల వస్తుండటం సర్వసాధారణమైపోయింది. ఇక ఐస్క్రీములో చచ్చిన ఎలుక రావడం కూడా మీకు గుర్తుంటే ఉంటుంది. తాజాగా చాక్లెట్లో పురుగుల వచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్పల్లి కిరాణం దుకాణంలో మంగళవారం ఇద్దరు చిన్నారులు చాక్లెట్ కొనుగోలు చేసి తినేందుకు ప్రయత్నించగా అందులోంచి పురుగులు బయటకు రావడంతో భయంతో కింద పడవేశారు. అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బోయిని నారాయణ కోరారు. -
పురుగుల లార్వాతో కేకులు, కుకీలు
-
తిన్నాక తెలిస్తే వాంతి చేసుకుంటారు!
బెల్జియం : అవును! బెల్జియంకు చెందిన ఘెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కేకులు, కుకీలు ఇతర ఆహారపదార్ధాలు దేంతో తయారుచేశారో తెలిస్తే మన కడుపులో తిప్పేయటం ఖాయం. ఒక వేళ అది తిన్న తర్వాత అసలు విషయం తెలిస్తే వాంతి చేసుకుంటారు. ఇంతకీ అవి దేంతో తయారు చేశారని ఆలోచిస్తున్నారా?.. బ్లాక్ సోల్జర్ అనే పురుగుల లార్వాతో. పురుగుల లార్వాతో పదార్ధాలను తయారుచేయటం డైరీ ఉత్పత్తులకంటే మేలని అంటున్నారు ఘెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. డేలాన్ జోంపా సోస అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘ పురుగుల పెంపకం పాడి పరిశ్రమ లాగా ఎక్కువ ప్లేస్ను తీసుకోదు. వాటి తిండికి కూడా ఎక్కువ ఖర్చుకాదు. నీటిని కూడా తక్కువ తీసుకుంటాయి. వీటిలో అధిక ప్రొటీన్, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. వీటి పెంపకానికి తక్కువ ఖర్చు, పర్యావరణానికి మంచిద’ని తెలిపింది. పురుగుల ద్వారా తయారైన వాటిని తిన్న వారు పురుగు పదార్ధాలకు, పాల పదార్ధాలకు మధ్య పెద్ద తేడా గుర్తించలేకపోయారు. అయితే సగం తిన్న తర్వాత ఓ రకమైన రుచిని తాము పొందామని చెప్పారు. ఏదేమైనప్పటికి పురుగులతో తయారుచేసిన పదార్ధాలను కొనబోమని తేల్చిచెప్పారు. -
చలికాలంలో ఇంటిపంటల రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. ► జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ► ఆచ్ఛాదన (మల్చింగ్): కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ► ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర ‡పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్నెట్ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్నెట్ చుట్టేస్తే సరి.? సేంద్రియ ఇంటిపంటల సాగుపై సికింద్రాబాద్ తార్నాక (రోడ్డు నంబర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర)లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో కనీసం 10 మంది కోరితే వారాంతంలో శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, విత్తనాలు, వర్మీకంపోస్టు లభిస్తాయి. వివరాలకు.. డా. గడ్డం రాజశేఖర్ – 83329 45368 ∙సిఎస్ఎ కార్యాలయంపై టెర్రస్ గార్డెన్లో డా. రాజశేఖర్ ∙ఎల్లో స్టిక్కీ ట్రాప్ -
కొబ్బరినూనె కొవ్వులతో కీటకాలు పరార్!
కొబ్బరి నూనె నుంచి తీసిన కొన్ని పదార్థాలు కీటకాలను నాశనం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయని అమెరికా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కీటకాలతో వచ్చే సమస్యలను అరికట్టేందుకు దాదాపు 60 ఏళ్లుగా డీట్ అనే కృత్రిమ రసాయనాన్ని వాడుతూండగా.. సహజసిద్ధమైన వాటి కోసం ఇటీవలే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేపట్టారు. వీటి ప్రకారం కొబ్బరి నుంచి సేకరించిన కొన్ని రకాల కొవ్వు పదార్థాలు నల్లులతోపాటు, దోమలు, ఈగల నుంచి రక్షణ కల్పించడంలో కృత్రిమ రసాయనాల కంటే మెరుగైనవని తెలిసింది. మరీ ముఖ్యంగా దోమల విషయంలో ఈ పదార్థాలు ఎక్కువ ప్రభావశీలంగా కనిపించాయని, ల్యాబొరేటరీ పరిశోధనల్లో ఈ కొవ్వులు కొన్నిరకాల కీటకాల నుంచి రెండు వారాలపాటు రక్షణ కల్పించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జున్ వీ ఝూ అంటున్నారు. కొబ్బరి నూనె నేరుగా కీటకాలను పారదోలదని స్పష్టం చేసిన జున్ వీ ఝూ ఇందులోని లారిక్, క్యాప్రిక్, క్యాప్రిలిక్ యాసిడ్లు, వీటి తాలూకు మిథైల్ ఈస్టర్లు ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ రకమైన కొవ్వుల ఆధారంగా కొత్తరకం మందులు తయారు చేయడం వల్ల జికా వంటి అనేక వ్యాధులను నియంత్రించ వచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
వర్షాకాలం ఆహార విహారాలు
‘కాదేదీ పంచభూతాలకతీతం, లేదేదీ పంచభూతాత్మకం కానిది’, ఇది చరకుడు చెప్పిన ఆయుర్వేద తాత్త్వికత. దీని సూత్ర ప్రభావాలు మనిషిపై వాతావరణం చూపించే అనుబంధానికి ఆధారభూతం. ఇందుకు అనుగుణంగా ‘ఋతుచర్య’ని వివరించింది ఆయుర్వేదం. పన్నెండు మాసాలు, ఆరు ఋతువులు అందరికీ తెలిసినవే. సుమారుగా జూలై మాసం నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ‘వర్ష ఋతువు’ ఉంటుంది. ఈ సమయమే శ్రావణ భాద్రపద మాసాలు. జలప్రళయాలకు పెట్టింది పేరు. గ్రీష్మాంతపు తొలకరి జల్లులతో ఆరంభమవుతుంది. ఈ దక్షిణాయన సమయాన్నే ‘విసర్గ’ కాలం అంటారు. అంటే సూర్యుని శక్తి సమస్త ప్రాణులకు లభించే సమయం. వర్షాకాలంలో మనం ఇంకా నీరసంగానే ఉంటాం. క్రమేపీ ‘బలం’ పుంజుకుంటాం. ఈ ఋతువులో మన జఠరాగ్ని చాలా ‘మందం’గా ఉంటుంది. త్రిదోషాలలో ఒకటైన ‘వాతం’ మనలో ప్రకోపావస్థలో ఉంటుంది. వాతావరణం పృధ్వీ తేజో భూతాల ప్రాబల్యంతో, ఆమ్ల రసాత్మకంగా ఉంటుంది. గ్రీష్మం పూర్తయి వర్షాకాలం ఆరంభమవటం ఒక ‘ఋతుసంధి’ని సూచిస్తుంది. ఇటువంటి భౌతిక రసాయనిక మార్పుల వలన వాతావరణం సూక్ష్మక్రిముల మయం అవుతుంది. అందువల్ల క్రిముల ద్వారా సంక్రమించే రోగాలకు గురవుతాం. పరిసర జల కాలుష్యాల వల్ల దోమల వంటి కీటకాలు పేట్రేగుతాయి. వీటికి తోడు ఆహారవిహారాల్లోని మనం చూపే అశ్రద్ధ కారణంగా మరి కొన్ని రోగాలు తోడవుతాయి. వీటిని ఆయుర్వేద పరిభాషలో ‘ప్రజ్ఞాపరాధం, జనపదోధ్వంశం, క్రిమి, సాంక్రామిక రోగాలు’ గా చెప్పబడ్డాయి. కనుక ఇప్పుడు సంభవించే రోగాలకు, ‘అజీర్ణం, ఆహార కాలుష్యం, వాతావరణ క్రిములు’ ప్రధాన కారణాలని గమనించాలి. ఏయే రోగాలు సంభవిస్తాయి... ప్రతిశ్యాయం (జలుబు), కాస (దగ్గు), వమన (వాంతులు), అతిసార (విరేచనాలు), అజీర్ణం, ఆధ్మానం (కడుపు ఉబ్బరం), కామలా (పచ్చ కామెర్లు), మలేరియా, డెంగూ, టైఫాయిడ్, న్యుమోనియా వంటి అనేక రకాల జ్వరాలు వస్తాయి. నివారణ చర్యలు వర్షంలో తడవకూడదు ∙శీతల వాయువులకు గురికాకూడదు కనుక మనం ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి ∙ పరిసర ప్రాంతాలు, నీరు కలుషితం కాకుండా మన వంతు బాధ్యత వహించాలిఇంట్లోను, బయట ప్రతిరోజు ‘ధూపన’ కర్మ చేయాలి ఉదా: వేపాకులు ఆవాలు కాల్చి పొగ పెట్టడం, సాంబ్రాణి ధూపం వంటివి. వీటి వల్ల దోమల నుండి, సూక్ష్మక్రిముల నుండి రక్షణ కలుగుతుందివేడినీటితో స్నానం మంచిది, అభ్యంగ స్నానం కూడా మంచిదే ∙మరిగించి చల్లార్చిన నీరు తాగాలి ∙పగటి నిద్ర, వాయామ, శృంగారాలు తగ్గించాలి. గమనిక: ∙ కేవలం ఇంట్లో తయారు చేసుకునే, తేలికగా జీర్ణమయ్యే వేడివేడి ఆహారాన్ని మితంగా తినాలి ∙ఆకుకూరలలో క్రిముల యొక్క అతి చిన్నని గుడ్లు పొంచి ఉంటాయి కనుక అతి జాగ్రత్తగా వ్యవహరించాలి ∙ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటితో చక్కగా కడిగి, ఆ తరవాత సంపూర్ణంగా ఉడికించి మాత్రమే తినాలి ∙సలాడ్సుగా పచ్చివి తినడం తగ్గించాలి లేదా పచ్చివాటిని కూడా పైన చెప్పినట్లు ప్రక్షాళనం చెయ్యాలి ∙వేపడాలు, డీప్ ఫ్రై భక్ష్యాలు (పూరి, వడ, బజ్జీ మొదలైనవి) మంచిది కాదు. ఒకవేళ నిగ్రహించుకోలేక తింటే ‘హింగ్వాష్టక చూర్ణం’ అనే ఆయుర్వేద మందును ఒక చెంచా ఉదయం, ఒక చెంచా రాత్రి మజ్జిగతో లేదా వేడినీటితో సేవించాలి. ఆహారం తినకూడనివి: ఇంటి బయట తయారుచేసిన, బజారులో తినటానికి సిద్ధం చేసి అమ్మే తినుబండారాలు, శీతల పానీయాలు, ఐస్క్రీములు, పానీపూరి, చెరకురసం మొదలైనవి. తినదగిన ఆహారం: ∙ఉడికించిన కూరలలో నిమ్మరసం కలుపుకొని తింటే మంచిది ∙ఉప్పుని అతి తక్కువగా వాడాలి ∙స్నిగ్ధ పదార్థాలు (పాయసాలు), ఆవు నెయ్యి, నువ్వుల నూనె తినటం మంచిదిపంచదారకు బదులు బెల్లం వాడుకోవటం మంచిది ∙ మాంసరసాలు కూడా మంచిదే. సూప్స్ (యూష): తృణ ధాన్యాలు, శాకములతో చేసిన వాటిలో శొంఠి, మిరియాల పొడి స్వల్పంగా కలిపి సేవించాలి ∙బియ్యం, గోధుమలు, కొర్రలు, బార్లీ మొదలైనవి బాగా పాతబడినవి మంచిది ∙తాజాఫలాలు కూడా మంచిదే ∙శుష్క ఫలాలు (డ్రైఫ్రూట్స్), ఇతర గింజలు (గుమ్మడి, సూర్యకాంతం) కూడా సేవించడం మంచిదే. వర్ష ఋతువున వలదోయి బయటి తిండి‘‘ ఇంట వండిన లఘువైన వంటకముల వేడివేడిగ తినవలె ప్రీతిమీర‘‘ త్రాగునీటిని మరిగింప ధ్యాస పెట్టు!పసుపుదాల్చీని లశునంబు పదిలరీతిఅల్లమును జేర్చి ఘన కషాయమును కాచిఆరు చెంచాలు ప్రతిరోజునారగింపదరికి రాబోవు రోగముల్ తథ్యమిదియ. ఔషధాలు అల్లం (5 గ్రా.), వెల్లుల్లి (5 రేకలు), దాల్చిన చెక్క చూర్ణం (3 గ్రా.), పసుపు (మూడు చిటికెలు), కలిపి పావు లీటరు నీళ్లు పోసి బాగా మరిగించి వడగట్టుకోవాలి. (మూడు వంతుల ద్రవ భాగం ఇగిరిపోవాలి. అంటే 60 మి.లీ. మిగలాలి) ∙ఉదయం 30 మి.లీ. (ఆరు టీ స్పూన్లు), సాయంత్రం 30 మి.లీ. తాగాలి. ఎంతమందికి ఈ కషాయం కావాలో... దానికి అనుగుణంగా ద్రవ్యాల పరిమాణం పెంచుకోవాలి. పరగడుపున కాని ఏదైనా తిన్న తరవాత కాని, ఎప్పుడు తాగినా మంచిదే. వర్షాకాలమంతా తాగితే మరీ మంచిది. కనీసం రోజుకి ఒకసారైనా తాగండి. ఇది జీర్ణకోశ సమస్యలకు, క్రిమిరోగ సమస్యలకు, జ్వరాలకు... అన్నిటికీ మంచిది. జలుబు, దగ్గులకు దివ్యౌషధం. ∙అతిసారానికి: వాము కషాయం తక్షణం పనిచేస్తుంది. ∙జలుబు, దగ్గులకు: తులసి లేదా తమలపాకు రసం + తేనె: రోజూ మూడుపూటలా తీసుకోవాలి. ∙పచ్చ కామెర్లకు: నేల ఉసిరిక (భూమ్యామలకి) రసం ఒక టీ స్పూను (5 మి.లీ.) + తేనె: రెండుపూటలా రెండు వారాలు సేవించాలి ∙గుంటకలగర (భృంగరాజ), తిప్పతీగె (గుడూచి) ఉసిరిక (ఆమలకీ) రసాలు కూడా శ్రేష్ఠమే. పునుగుల పులుసు పులుసు కోసం కావలసినవి: పెరుగు – రెండు కప్పులు (చిక్కగా గిలకొట్టాలి); సొరకాయ ముక్కలు – అర కప్పు; మునగకాడ – 1 (ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటో – 1 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా కట్ చేయాలి); ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూన్; పసుపు – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; అల్లం తురుము – ఒక టీ స్పూన్; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూన్; ధనియాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పోపు గింజలు – ఒక టీ స్పూన్; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పునుగుల కోసం కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు; అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 3; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర – కొద్దిగా పులుసు తయారీ: ∙ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙వేరే పాత్రలో పెరుగు, సెనగ పిండి, పసుపు వేసి గిలకొట్టాలి ∙ఉడుకుతున్న ముక్కలలో ఈ మిశ్రమం పోసి బాగా కలిపి ఉడికించాలి ∙మిక్సీలో అల్లం తురుము, సెనగ పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా చేసి ఉడుకుతున్న పులుసులో వేసి కలపాలి ∙కరివేపాకు, కొత్తిమీర జత చేయాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక ఆవాలు జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వేసి కలిపి దింపేయాలి. పునుగుల తయారీ: ∙పచ్చి సెనగ పప్పును సుమారు రెండు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙మిక్సీలో సెనగ పప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా చేసి, తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పునుగులుగా వేసి వేయించి తీసి, పులుసులో వేసి గంట సేపు నాననివ్వాలి ∙పునుగులు జత కలవడంతో, మారు మాట్లాడకుండా పులుసును జుర్రేస్తారు. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@ gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. Monsoon ,food ,Getaways – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
‘గులాబీ’ విలయం
సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ రంగు పురుగు ప్రళయం ముంచుకొస్తోంది’.. ఈ మాటలన్నది స్వయానా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త. గులాబీ పురుగు వల్ల పత్తి పంటకు ఈసారి భారీ నష్టం జరగనుందని ఆయన ఆవేదన. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని, వర్షాలతో మున్ముందు దాని విస్తరణ మరింత వేగం కానుందని ఆ శాస్త్రవేత్త హెచ్చరించారు. సాధారణంగా కాయ దశలో కనిపించాల్సిన ఆ పురుగు.. మొక్క దశలోనే దాడి చేయడంపై అన్నదాతల ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు పరిశోధనలు విస్తృతం చేయాలని, పురుగుపై యుద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఒకచోట గులాబీరంగు పురుగుంటే ఆ చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఆదిలాబాద్లో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు వ్యవసాయాధికారుల నుంచి వర్సిటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు సోకిందని.. ఈసారి రెండు వారాల్లోనే దాని ఉధృతి కనిపించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గుజరాత్ రైతులను అతలాకుతలం చేసిన ఆ పురుగు.. జాగ్రత్తలు తీసుకోకుంటే ఈసారి తెలంగాణ రైతులను తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఐదు లక్షల ఎకరాల్లో? రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వాటిలో అధిక భాగం పత్తి పంటదే. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 30.30 లక్షల ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం ఇంకా పెరగనుంది. ఇప్పుడు సాగైన 30 లక్షల ఎకరాల్లో దాదాపు 5 లక్షల ఎకరాల పత్తిలో గులాబీ పురుగు ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వారం రెండు వారాల్లో ఉధృతి పెరిగితే అడ్డుకోవడం కష్టమైన వ్యవహారమంటున్నారు. గులాబీ పురుగు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య పత్తి మొక్కపైకి వస్తుంది. ఆ సమయంలో చూడలేం. కాబట్టి లింగాకర్షక బుట్టలు వీలైనన్ని వేస్తే అందులో వచ్చి పడతాయి. అలా పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో 4 పురుగులు పడితే తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తారు. పురుగును గుర్తించాక క్రిమిసంహారక మందులతో అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలను ఇప్పటికే రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అందించలేదు సరికదా వాటిని తెప్పించడంలోనూ విఫలమైందని వ్యవసాయ శాస్త్రవేత్తలే విమర్శిస్తున్నారు. 10 రోజుల క్రితమే జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద నిధులు కేటాయించి బుట్టలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని,ఇంకా కొనలేదని విమర్శలున్నాయి. మరోవైపు పత్తి సరఫరా చేసే జిన్నింగ్ మిల్లుల నుంచి కూడా పంట వైపునకు పురుగు వ్యాపిస్తుందని చెబుతున్నారు. బీటీ–2 వైఫల్యమే బీటీ–2 టెక్నాలజీ వైఫల్యం వల్లే పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పీడిస్తోంది. దాన్ని నివారించేందుకు బీటీ టెక్నాలజీలో ఓ కణాన్ని జొప్పించి 2002లో బీటీ–1 పత్తి విత్తనాన్ని మోన్శాంటో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే 2006 నాటికి బీటీ–1 గులాబీ పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో రెండు కణాలు జొప్పించి బీటీ–2ను తీసుకొచ్చారు. 2012 నాటికి దీనిలోనూ గులాబీ పురుగును తట్టుకునే శక్తి నశించింది. కానీ దాన్ని రద్దు చేయకుండా 3 కణాలు జొప్పించి బీటీ–3 తీసుకొచ్చారు. దానికితోడు పత్తి కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసెట్ పురుగుమందును తీసుకొచ్చారు. దీని వల్ల జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని తెలియడంతో కేంద్రం అనుమతివ్వలేదు. అయినా రహస్యంగా రైతులకు అంటగడుతూనే ఉన్నారు. బీటీ టెక్నాలజీ విఫలమైనా గులాబీ పురుగు పీడిస్తున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలున్నాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా గులాబీ పురుగు కారణంగా గతేడాది రాష్ట్రంలో అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న వాదనలున్నాయి. మరోవైపు గులాబీ పురుగుతో పత్తి పంట పోతే రైతుకు బీమా పరిహారం రాదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతేడాది గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించింది. పత్తి విత్తన కంపెనీల నుంచీ పరిహారం ఇప్పించింది. రాష్ట్రంలో అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
తేనెటీగలను రక్షించేందుకు కీటకనాశినులపై నిషేధం!
తేనెటీగలు అంతరించిన కొన్ని రోజులకు భూమి మీద మనిషనేవాడు మిగలడని ఐన్స్టీన్ అంతటి శాస్త్రవేత్త వందేళ్ల క్రితమే హెచ్చరించాడు. అయితే క్రిమికీటకనాశినుల వాడకం పెరుగుతున్నకొద్దీ ఈ అద్భుతమైన తేనెటీగల సంతతి తక్కువైపోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోని అన్ని దేశాల్లోనూ కీటకనాశినులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నియోనికొటినాయిడ్స్ అనే రసాయనాలు తేనెటీగలు వేగంగా అంతరించిపోతున్నట్లు ఇప్పటికే గుర్తించారు. కీటకనాశినులపై నిషేధం ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి వస్తుందని అంచనా. అనాదిగా మనం తినే ఆహారంలో ఎక్కువభాగం తేనెటీగలు చేసే పని వల్ల సమకూరుతోందన్నది మనందరికీ తెలిసిందే. రెండేళ్లక్రితం అమెరికా ప్రభుత్వ సంస్థ ఒకటి తేనెటీగలను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది. కీటక నాశినులపై నిషేధం విధిస్తే పంటలు ఎలా కాపాడుకోవాలన్న అనుమానం కొందరికి రావచ్చు. కొన్ని రసాయనాల్లో నియోనికొటినాయిడ్ రసాయనం ఉన్నప్పటికీ అవి తేనెటీగలపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని తెలిసింది. ఈ రకమైన రసాయనాల వాడకం ద్వారా అటు తేనెటీగలను సంరక్షించుకుంటూనే.. ఇటు పంటలనూ కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
కొత్త రకం కీటకనాశినులు సిద్ధమవుతున్నాయి!
పంటలకు ఆశించే చీడపీడలను నాశనం చేసేందుకు వాడే కీటకనాశినులు ఒక్కప్పుడు మనిషి కడుపు నింపినప్పటికీ.. వీటితో వచ్చే కాలుష్యం ఇప్పుడు మనుషుల ప్రాణాలు హరిస్తున్నాయి. హెల్సింకీ యూనివర్శిటీ, ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తల పుణ్యమా అని సమీప భవిష్యత్తులోనే ఈ పరిస్థితి మారిపోనుంది. ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో వీరు ఆర్ఎన్ఏ ఆధారిత కీటకనాశినులు సిద్ధం చేస్తూండటం దీనికి కారణం. అచ్చం మన డీఎన్ఏ మాదిరిగా ఉండే ఆర్ఎన్ఏను నేరుగా మొక్కల ఆకులపై పిచికారీ చేయడం వల్ల అవి నేరుగా మొక్కల్లోకి చేరిపోతాయని, క్రిమికీటకాలు దాడి చేసినప్పుడు చైతన్యవంతమై వాటి జన్యువులు పనిచేయకుండా చేస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ మిన్నా పొరానెన్ తెలిపారు. ఫలితంగా కీటకాలు చనిపోతాయి.. మొక్కకు, పర్యావరణానికి ఏమాత్రం హాని జరగదన్నమాట. ఆర్ఎన్ఏ సహజసిద్ధంగా నాశనమైపోతుంది కాబట్టి కాలుష్యమనేది అస్సలు ఉండదు. మొక్కల జన్యువులను ఏమాత్రం ప్రభావితం చేయకపోవడం ఇంకో విశేషం. ప్రస్తుతానికి ఈ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ అవసరమైన ఆర్ఎన్ఏను భారీగా, చౌకగా ఉత్పత్తి చేయడం ఎలా అన్న సవాలు ఎదురవుతోందని మిన్నా చెప్పారు. బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా చౌకగా ఆర్ఎన్ఏ ఉత్పత్తికి తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే రసాయన కీటకనాశినులకు గుడ్బై చెప్పవచ్చునని అన్నారు. -
భోజనంలో పురుగులు.. ఎలుక
మునిపల్లి (అందోల్): గురుకుల పాఠశాల విద్యార్థులకు వడ్డించిన భోజనంలో పురుగులు, చనిపోయిన ఎలుక ప్రత్యక్షమయ్యాయి. ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని గురుకుల పాఠశాల హాస్టల్లో ఉదయం బగారా అన్నం పెట్టారు. ఏడో తరగతికి చెందిన అరుణ్ కొంచెం తినగానే తెల్లటి పురుగులు, మృతి చెందిన ఎలుక పిల్ల కనిపించాయి. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ విద్యార్థులకు చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. మధ్యాహ్నానికి వండుతున్న భోజనంలోనూ పురుగులు కనిపించడంతో తహసీల్దార్ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అంటూ వార్డెన్ అశోక్, సిబ్బందిపై మండిపడ్డారు. -
విష పురుగుల దాడి: 14 మందికి గాయాలు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు విష పురుగుల కాటుకు గురయ్యారు. విషపురుగులు కుట్టడం వల్ల 14 మందికి ముఖాలు ఉబ్బి(వాపు)పోయాయి. ఆశ్రమ పాఠశాల పక్కనే పొలాలు ఉన్నందున పంటపై పురుగుల మందు కొట్టడంతో ఈ విష కీటకాలు ఎగిరి రాత్రి సమయంలో ఆశ్రమ పాఠశాల వైపు వచ్చాయని బాధితులు తెలుపుతున్నారు. హాస్టల్ గదుల్లోకి పురుగులు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరందరినీ వైద్యం కోసం పీహెచ్సీకి తరలించారు. -
పత్తికి 'పురుగు' పీడ!
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో పత్తి రైతుల ఆశలను గులాబీ రంగు పురుగు తొలిచేస్తోంది.. పంటను నాశనం చేస్తూ రైతులను నిండా ముంచుతోంది. ఇటీవలి వర్షాలతో ఓ వైపు పత్తి రంగు మారుతోంటే.. మరోవైపు గులాబీరంగు పురుగు కారణంగా దిగుబడులు భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పత్తికి గులాబీ రంగు పురుగు పట్టడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వ్యవసాయశాఖ క్రాప్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 25న అన్ని రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా గులాబీ రంగు పురుగు తీవ్రతను గుర్తించడం, నష్టాన్ని అంచనా వేయడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అసలు బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి విత్తన కంపెనీలకు అనుమతి ఇచ్చిందనే విమర్శలు మిగతా వ్యక్తమవుతున్నాయి. ఇక గులాబీ రంగు పురుగు ఉధృతితో ఇంత జరుగుతున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖ కనీసం రైతులను అప్రమత్తం చేయలేకపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అనుమతిలేని బీజీ–3 విత్తనంతో జీవ వైవిధ్యానికి ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. 25వ తేదీనే బీజీ–3పై ఢిల్లీలో మరో సమావేశం జరుగనుంది. 10 లక్షల ఎకరాల్లో నష్టం? రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఈ సారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి చాలా మంది రైతులు దానివైపే మొగ్గారు. కానీ పత్తి పంట రైతులకు తీవ్ర ఆవేదన మిగుల్చుతోంది. ఇటీవలి భారీ వర్షాలకు 1.35 లక్షల ఎకరాల్లో పత్తికి నష్టం జరగగా.. ఇప్పుడు దాదాపు మరో 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టింది. దీంతో పంటంతా సర్వనాశనమవుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. విత్తనాల కోసం వేసిన పత్తి పంటకు కూడా ఈ పురుగు సోకిందని విత్తన సంస్థలు పేర్కొంటున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా దాదాపు 25 నుంచి 30 శాతం వరకు పత్తికి గులాబీ పురుగు సోకినట్లు అంచనా. బీటీ టెక్నాలజీ విఫలమైనందునే బీజీ–2 పత్తి విత్తనం గులాబీ పురుగును తట్టుకునే శక్తి కోల్పోయిందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షాలు కురిసినా తగ్గని ఉధృతి జూన్లో వేసిన పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకిందని నెల కిందటే రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ రంగు ఉధృతమైంది. సాధారణంగా విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కానీ ఇటీవల విస్తారంగా వర్షాలు పడినా.. పురుగులు నాశనం కాలేదు. మరింతగా విజృంభించి పత్తికాయలను తొలిచేస్తుండడంతో దిగుబడులు దారుణంగా పడిపోతున్నాయి. గద్వాల జిల్లాకు చెందిన రైతులు తమ విత్తన పంటకు కూడా గులాబీ పురుగు సోకిందని వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టించుకోని వ్యవసాయ శాఖ గులాబీరంగు కాయతొలుచు పురుగు రాష్ట్రంలో పత్తి పంటను నాశనం చేస్తున్నా.. వ్యవసాయ శాఖ చేపట్టిన చర్యలు తూతూమంత్రంగానే ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల కిందటే ఈ పురుగు విస్తృతిని గుర్తించినా.. రైతుల్లో అవగాహన కల్పించడంలో విఫలమైందని, ఇంత నష్టం జరుగుతున్నా పరిస్థితిని దాచిపెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏడాది క్రితం గులాబీ రంగు పురుగుతో తీవ్ర నష్టం వాటిల్లడంతో.. కర్ణాటక ప్రభుత్వం మోన్శాంటో, మహికో కంపెనీలను రూ. 2 వేల కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా సమస్య ‘‘దేశవ్యాప్తంగా పత్తిని గులాబీ రంగు కాయతొలుచు పురుగు (పింక్ బోల్వార్మ్) పట్టింది. 25 శాతం నుంచి 30 శాతం పంటకు ఈ పురుగు సోకిందని అంచనా. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. గద్వాల జిల్లాలో పత్తి విత్తన పంటకూ గులాబీ రంగు పురుగు సోకింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది..’’ – డాక్టర్ కేశవులు, రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ -
జీవరాశిని కాపాడుకోవాలి: మేనకాగాంధీ
శామీర్పేట్: కీటకాలు మొదలు పెద్ద జంతువు వరకు ఉన్న జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరముందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్పేట్లోని నల్సార్ లా యూనివర్సిటీలో శుక్రవారం జంతు సంబంధిత చట్టాల అధ్యయన కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. మేనకాగాంధీ మాట్లాడుతూ ‘జంతు సంరక్షణ అంటే వాటి పట్ల ప్రేమ చూపడమే కాదు. పర్యావరణ పరిరక్షణ కూడా’అని పేర్కొన్నారు. జంతు సంబంధమైన చట్టాలను రూపొందించాలంటే జంతువులపై ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర స్థాయిలోని పర్యావరణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పర్యావరణ చట్టాల రూపకల్పనకు సహకరిస్తున్నదని, అదేవిధంగా నల్సార్ జంతు సంబంధ చట్టాల కేంద్రం కూడా జంతు సంరక్షణ చట్టాల రూపకల్పనకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కేంద్రం జంతు సంబంధ చట్టాల్లోని సమస్యలు, జంతు సంక్షేమ చట్టాల రూపకల్పనకు సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్న లకు ఆమె ఓపిగ్గా సమాధానం చెప్పారు. అనంతరం హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్(హెచ్ఎస్ఐ) మేనేజింగ్ డైరెక్టర్ జయసింహాను ఈ కేంద్రానికి గౌరవ డైరెక్టర్గా నియమించారు. కార్యక్రమంలో నల్సార్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సూర్యుడు ఉన్నంతకాలం!
లండన్: మనుషులు, కీటకాలు, ఇతర జీవజాతుల ఆయుషు ఎంతో మనకు తెలిసిందే. అయితే సూర్యుడు ఉన్నంతకాలం జీవించే అరుదైన సూక్ష్మ జంతువు ఒకటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎనిమిది కాళ్లు ఉండే టార్డిగ్రేడ్ అనే జంతువు సూర్యుడు మరణించే వరకు జీవించి ఉండగలదని, ప్రపంచంలోనే నాశనం కాని జీవుల్లో ఇది ఒకటని పరిశోధకులు తెలిపారు. ఖగోళ విపత్తులను సైతం ఎదుర్కొని సుమారు పది బిలియన్ సంవత్సరాలు బతుకుతుందని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా 30 ఏళ్ల పాటు నీరు, ఆహారం లేకుండా, 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది జీవించగలదని, అలాగే ఇతర గ్రహాలపై కూడా జీవించే అవకాశం ఉందని తెలిపారు. నీటి ఎలుగుబంటిగా పిలిచే ఈ జంతువు పరిమాణం కేవలం 0.5 మిల్లిమీటర్ మాత్రమేనని, మైక్రోస్కోప్లో దీన్ని స్పష్టంగా చూడవచ్చని వివరించారు.అతిపెద్ద ఉల్కాపాతం, సూపర్ నోవా రూపంలో జరిగే నక్షత్రాల పేలుళ్లు, గామా కిరణాల పేలుళ్లు వంటి ఖగోళంలో జరిగే ఈ మూడు ఘటనలను పరిశోధకులు అధ్యయనం చేశారు. భూమిపై మానవుడు నిష్క్రమించిన అనంతరం కూడా అనేక జంతుజాతులు జీవిస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టరోల్ రీసెర్చ్ అసోసియేట్ రాఫెల్ ఆల్వ్ బటిస్టా వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
పాత దుపట్టాతో పండు ఈగకు చెక్!
ఇంటి పంటలను ఆశించే చీడపీడల్లో కొన్ని వాటంతటవే తగ్గుముఖం పడతాయి. మరికొన్నింటిని వేపనూనె వంటి వృక్ష సంబంధ క్రిమినాశనులను, కషాయాలను పిచికారీ చేసి అదుపులో ఉంచవచ్చు. కానీ కొన్ని మొండి జాతి పురుగుల నిర్మూలన మాత్రం ఒక పట్టాన సాధ్యం కాదు. ఇటువంటి వాటిలో ముఖ్యమైనది పండు ఈగ (ఫ్రూట్ఫ్లై) . దీనివల్ల ఇంటిపంటల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది ఆశించిన పండ్లు, కాయలు లోపలే కుళ్లి చెట్టు నుంచి రాలిపోతాయి. ఉద్యాన పంటల్లో దీన్ని నిర్మూలించేందుకు ఫిరమోన్ అనే రసాయనాన్ని వాడతారు. కానీ ఇంటిపంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల రసాయనాల పిచికారీ సాధ్యం కాదు. అయితే పాత దుపట్టా సంచితో పండు ఈగకు చెక్ చెప్పవచ్చంటున్నారు సీనియర్ ఇంటిపంటల పెంపకందారు వనమామళి నళిని (nalinivmw@gmail.com). హైదరాబాద్ మెహదీపట్నంలోని తమ మేడపై గత ఐదేళ్ల నుంచి వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలను సాగు చేస్తున్నారు. పాత దుపట్టాను కత్తిరించి కుట్టిన చిన్న సంచిలో కాయలను చేర్చి మూతి కడితే చాలు.. పండీగ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చుంటున్నారు. ఈ కవచాన్ని ఛేదించి పండు ఈగ కాయలను ఆశించలేదని నళిని చెపుతున్నారు. ఆలోచన బాగుంది.. కదా మరి ఆచరిద్దామా? దుపట్టా సంచుల తయారీ ఇలా... 1. దుపట్టా సంచిని కట్టిన పండ్లు.. 2. పాత దుపట్టాను సంచుల తయారీలో వాడాలి. 3. సంచిలో ఉంచే కాయల సంఖ్య, పరిమాణాన్ని బట్టి సరిపడా సైజులో దుపట్టాను కత్తిరించుకొని కుట్లు వేసుకోవాలి. దుపట్టాను మూడువైపులా మూసి ఒక వైపు తెరచి ఉండేలా దారంతో కుట్టుకోవాలి. 4. కాయల సంఖ్యను బట్టి అవసరమైనన్ని సంచులను తయారు చేసుకోవాలి. 5. సంచి మూతి వైపు ఒక బొందును కలిపి కుట్టాలి 6. దుపట్టా సంచులు సిద్ధం 7. కాయలు సంచిలోకి వచ్చేలా మూతిని బొందుతో బిగించి కట్టాలి. ఇంటిపంటల రక్షణలో కాంతిరేఖ లైట్ ట్రాప్ను వాడి చీడపీడల బారి నుంచి ఇంటి పంటలను కాపాడుకుంటున్నారు హైదరాబాద్లోని మెహదీపట్నంకు చెందిన వనమామళి నళిని. వినూత్న పద్ధతులను అవలంభించి ఇంటిపంటలను సాగు చేయటంలో ఆవిడది అందెవేసిన చేయి. ఇటీవలే చీడపీడలను నివారించేందుకు ఆమె రూపొందించిన లైట్ట్రాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించి మంచి ఫలితాలు రాబట్టారు. వివిధ రకాల రసం పీల్చే పురుగులను దీని ద్వారా సులభంగా అరికట్టవచ్చు. దీనికోసం ముందుగా బకెట్ లేదా వెడల్పాటి పాత్రను సబ్బునీటితో నింపుకోవాలి. మనం ఇళ్లలో వాడుకునే కరెంట్ బల్బ్ను బకెట్పైన ఏర్పాటు చే సి కనెక్షన్ ఇవ్వాలి. ఈ బకెట్ను ఇంటిపంటల్లో మొక్కల మధ్య ఉంచి పొద్దుగుంకేముందు లైట్ను ఆన్ చేయాలి. లైట్ రాత్రిమొత్తం వెలుగుతూనే ఉండాలి. ఇంటిపంటలను ఆశించిన పురుగులను ఈ వెలుతురు ఆకర్షిస్తుంది. లైట్ దగ్గరకు వచ్చిన పురుగులు బకెట్లోని సబ్బునీళ్లలో పడి చనిపోతాయి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే వీటి సంఖ్య తగ్గి ఇంటిపంటలకు ఎలాంటి హాని ఉండదని న ళిని చెపుతున్నారు. -
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో పురుగులు
-
నులి పురుగులతో పిల్లల్లో రక్తహీనత
డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు ఖమ్మం వైద్య విభాగం: కడుపులో నులి పురుగుల కారణంగా 50 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎ.కొండల్రావు చెప్పారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై ఆయన బుధవారం నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ కొండల్రావు మాట్లాడుతూ.. 1–19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తినిపించాలన్నారు. పిల్లల కడుపులో నులి పురుగులు ఉన్నట్టయితే.. వారు తీసుకున్న ఆహారంలో సగ భాగాన్ని అవే తింటాయని అన్నారు. ఫలితంగా పిల్లలకు రక్తహీనత సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఈ నెల 10న నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేయించాలని కోరారు. పిల్లలు భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ మాత్రలు ఇచ్చి, చప్పరించేలా చూడాలని చెప్పారు. ఈ మాత్రలు 1–5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో, 6–19 సంవత్సరాల లోపు వారికి పాఠశాలల్లో ఇవ్వాలని అన్నారు. పాఠశాలలకు వెళ్లని వారికి అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వనున్నట్టు చెప్పారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ ప్రచార పోస్టర్ను డిప్యూటి డీఈఓలతో కలిసి డీఎంహెచ్ఓ ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ నిర్మల్కుమార్, డిప్యూటి డీఈఓలు రాములు, బస్వారావు, డెమో బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
కిరణాలతో క్రిములు ఖతమ్!
వంటింట్లో, హాల్లో, బాత్ రూముల్లో ఎక్కడ బ్యాక్టీ రియా ఉందో ఎక్కడ క్రిములు దాక్కున్నాయో అన్న టెన్షన్... వాటి వల్ల పిల్లలను ఎలాంటి వ్యాధులు చుట్టుముడ తాయోనన్న కంగారు ఇకపై అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లోకి ‘సానిటైజింగ్ వాండ్’ వచ్చింది కాబట్టి. ఇది అల్ట్రా-వయొలెట్ కిరణాల ద్వారా క్రిములను, బ్యాక్టీరియాను క్షణాల్లో చంపేస్తుంది. అంతేకాదు, బ్యాక్టీరియాతో వచ్చే దుర్వాసనను కూడా తొలగిస్తుంది. పిల్లల మంచాలపై, వారు ఆడుకునే ఆట వస్తువులపై, పెంపుడు జంతువుల బెడ్లపై కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే కంప్యూటర్ కీబోర్డుపై, తల దిండుపై చేరే బ్యాక్టీరియాని కూడా క్షణాల్లో ఇది హరించేస్తుంది. వాడటం చాలా ఈజీ. ఈ వాండ్ను ఏదైనా వస్తువుపై పెట్టి, బటన్ను నొక్కితే చాలు... అల్ట్రా వయొలెట్ కిరణాలు బయటి వస్తాయి. రీచార్జబుల్ బ్యాటరీలతో పని చేస్తుంది కాబట్టి బ్యాటరీ డౌన్ అవ్వగానే చార్జ చేసుకుంటే చాలు! -
రాకాసి సాలీడు
తిక్క లెక్క పాడుబడ్డ ఇళ్లల్లో బూజు గూళ్లు అల్లేసే సాలీళ్లు సాధారణంగా వేలెడంత ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మాత్రం అలాంటిలాంటి సాలీడు కాదు. ఇది రాకాసి సాలీడు. ప్రపంచంలోని అన్ని రకాల సాలీడు జాతుల్లో ఇదే అతిపెద్దది. దీని రెండు పాదాల నడుమ దూరం దాదాపు ఒక అడుగు ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే పదకొండు అంగుళాలు (28 సెంటీమీటర్లు). సురినామ్, గయానా, ఫ్రెంచి గయానాలలోని తీరప్రాంతాలకు చేరువగా ఉండే అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మామూలు సాలీళ్లు ఈగల వంటి కీటకాలను తిని బతుకుతాయి. ఈ సాలీళ్లు మాత్రం ఏకంగా చిన్న చిన్న పక్షులను సైతం అవలీలగా భోంచేసేస్తాయి. -
వేపకూ తప్పని చీడపీడలు!
పంటలపై చీడపీడల నివారణకు వేప గింజల నూనె, వేపాకుల రసం వాడటం పరిపాటి. భూసారం పెంపుదలకు, మట్టి ద్వారా పంటలకు తెగుళ్లు సోకకుండా వేప పిండి ఉపకరిస్తుంది. అటువంటి జగత్ప్రసిద్ధి గాంచిన వేప చెట్టుకూ పురుగుల బెడద తప్పటం లేదు. నల్లగొండ జిల్లాలో ఇటీవల రెండు రకాల పురుగులు వేప చెట్లకు ఆకు లేకుండా తినేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇటువంటి సందర్భాలున్నాయని సమాచారం. పురుగులకు సింహస్వప్నం లాంటి వేపకు ఈ పరిస్థితి రావడం చిత్రంగా అనిపించినా.. ఇది నిజం. నల్లగొండ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఇటీవల వేప చెట్లకు ఆకుపచ్చని పురుగు(సెమీలూపర్), గొంగళి పురుగులు వందల సంఖ్యలో ఆశించి ఆకులన్నీ తినేశాయి. ఈ పురుగులు శరీరంపై పాకితే దురదతో పాటు దద్దుర్లు వస్తుండడంతో జనం బెంబేలెత్తారు. మర్రిగూడ మండలంలోనూ కొన్ని వేప చెట్లను ఈ పురుగులు మోళ్లుగా మార్చేశాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్కడక్కడ వేప చెట్ల ఆకులను పురుగులు తినేస్తున్నట్లు చెబుతున్నారు. బీటీ పత్తి సాగుతో సంబంధం ఉందా? ఈ రెండు జిల్లాల్లోనూ బీటీ పత్తి సాగు చాలా విస్తారంగా సాగవుతోంది. నిలువెల్లా విషపూరితంగా ఉండే బీటీ పత్తిని విస్తారంగా సాగు చేయడానికి, వేపపై పురుగుల దాడికి ఏమైనా సంబంధం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘బీటీ పత్తి పొలాల చుట్టూతా కొన్ని చాళ్లలో నాన్బీటీ పత్తిని ఎర పంటగా సాగు చేయాల్సి ఉంటుంది. అయితే అలా జరగడం లేదు. పత్తిని ఆశించే పురుగే ఇప్పుడు వేప చెట్లను ఆశించడం ప్రారంభించినట్లుంద’ని నారాయణపూర్ వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు పి. నాగమణి ‘సాక్షి’తో చెప్పారు. తదనంతరం ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటకశాస్త్ర విభాగాధిపతి డా. వి. శశిభూషణ్, డా. జి. అనిత, డా. ఎం. శంకర్లతో కూడిన బృందం నారాయణ పూర్ గ్రామాన్ని సందర్శించి నమూనాలను సేకరించి, అధ్యయనం చేసింది. పత్తిని ఆశించే పురుగు కాదు : డా. రాజిరెడ్డి ఈ నేపథ్యంలో.. వేప చెట్లను ఆశించిన పురుగు పత్తిని ఆశించే శనగపచ్చ పురుగు కాదని తమ పరిశీలనలో తేలిందని వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. రాజిరెడ్డి చెబుతున్నారు. ఇది వేప చెట్టును ఆశించే పురుగేనని, అయితే ఇటీవల దీని తీవ్రత బాగా ఎక్కువగా కనిపించడంతో వెలుగులోకి వచ్చిందన్నారు. 2009లో లక్నోలోని భావులా గ్రామంలోనూ, 2010లో ఉత్తర ప్రదేశ్లోనూ ఆకుపచ్చ పురుగులు వేప చెట్లను ఆశించిన దాఖలాలున్నాయని ఆయన అన్నారు. సెమీలూపర్తోపాటు, లద్దెపురుగు, పొలుసు పురుగు, శనగపచ్చ పురుగు, తేయాకు దోమ, రెక్కల పురుగు, పిండి పురుగు, ఆకుతేలు, పెంకు వంటివి కూడా వేప చెట్లను ఆశిస్తూ ఉంటాయని డా. రాజిరెడ్డి వివరించారు. అయితే, వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపాంతరం చెందిన పురుగులేవో వేప చెట్లను నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆశిస్తున్నాయని పత్తి సలహా సంఘం సభ్యుడు డా. డి. నర్సింహారెడ్డి సందేహం వెలిబుచ్చారు. శాస్త్రవేత్తలు ఉదాసీనత వదిలి దీనిపై మరింత లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. - అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: విజయ్ పొలగోని; మునుగోడు, శ్రీధర్, నారాయణపూర్ -
రాందేవ్ నూడుల్స్లో పురుగులు
హర్యానా: నూడుల్స్ వివాదం ఇప్పుడిప్పుడే తగ్గుతుండగా మరోసారి అది ముదిరే అవకాశం కనిపిస్తోంది. అందుకు తాజాగా రాందేవ్ బాబా తన ఆయుర్వేద సంస్థ పతంజలి ద్వారా విడుదల చేసిన నూడుల్స్ కారణమయ్యేలా కనిపిస్తోంది. హర్యానాలోని ఓ వినియోగ దారుడు తాను కొనుగోలు చేసిన పతంజలి నూడుల్స్లో పురుగులు ప్రత్యక్ష్యం అయ్యాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. జాతీయ ఆహార భద్రతా సంస్థ అనుమతి తీసుకోకుండానే రాందేవ్ నూడుల్స్ ఉత్పత్తిని ప్రారంభించారని ఇప్పటికే ఆయనపై ఆరోపణలు వస్తుండగా, తాజాగా ప్రారంభించిన నూడుల్స్ లో పురుగులు ఉన్నాయని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడం చూస్తుంటే ఈ నూడుల్స్ విషయంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో అని ఆలోచిస్తే ఆందోళన తప్పకపోవచ్చేమో. -
కీటక నాశని విష వలయంలో సాలీళ్ల బందీ!
పంటలపై రసాయన కీటకనాశనుల పిచికారీతో మిత్ర కీటకాలకు జరిగే హాని గురించి తరచుగా వింటున్నదే. కానీ ప్రత్యేకించి సాలీళ్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే అంశంపై ఇటీవలే ఉత్తర అమెరికాలో జరిపిన ఓ పరిశోధన పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. విస్తృతంగా కీటకనాశనుల వాడకం వల్ల సాలీళ్లపై దుష్ర్పభావం చూపుతోందని, ఇది ఇలానే కొనసాగితే వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పరిశోధనలో వెల్లడైంది.. కెనడాలోని ఎంసీగిల్ యూనివర్శిటీకి చెందిన బృందం ఈ పరిశోధన నిర్వహించింది. సాలీళ్ళ సహజ స్వభావంలో పలు మార్పులు రావటాన్ని పరిశోధకులు గుర్తించారు. పంటలకు హానిచేసే కీటకాలను వేటాడటంలో వాటి సామర్థ్యం తగ్గింది. కీటకాల పీడను తగ్గించటంలోను.. కొత్త ప్రాంతాలకు విస్తరించటంలోను సాలీళ్లు నిరాసక్తత కనబరుస్తున్నట్టు కూడా వారు కనుగొన్నారు. ముఖ్యంగా అక్కడి ఉద్యానతోటలు, పంటలపై పిచికారీ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న పాస్మేట్ అనే కీటక నాశని ప్రభావం వల్ల శత్రు కీటకాలను నిర్మూలించటంలో వాటి సామర్థ్యం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. చీడపీడలను గుర్తించి తక్షణ స్పందించలేకపోవటం, ఎరలను పసిగట్టి ఆహారాన్ని సంపాదించుకునే క్రమంలో అవి వేగంగా స్పందించలేకపోతున్నాయి. అయితే ఈ ప్రభావం ఆడ, మగ సాలీళ్లపై చూపే ప్రభావంలో వ్యత్యాసాలున్నాయి.. కీటకనాశనుల ప్రభావానికి గురైనా వాటి ఆహారాన్ని సముపార్జించే సామర్థ్యాన్ని మగ సాలీళ్లు కోల్పోనప్పటికీ బాహ్యవాతావరణానికి అనుగుణంగా అన్వేషించగలిగే లక్షణాన్ని కోల్పోయాయి. ఆడ సాలీళ్లు మాత్రం ఆహారాన్వేషణలో వాటి పూర్వ సామర్థ్యాన్ని కొనసాగించగలిగాయి. ‘పంటకాలం ప్రారంభం నుంచి శత్రుకీటకాలను తిని రైతులకు మేలు చేసే సాలీళ్లు కీటకనాశనుల పిచికారీతో కుదేలవుతున్నాయి. త్వరలోనే ఈ పరిస్థితి మారకుంటే అత్యంత విలువైన వాటిని మనం కోల్పోవచ్చు’ అని ఎంసీగిల్ యూనివర్శిటీకి చెందిన రఫెల్రాయ్ పూర్వ పీహెచ్డీ విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. -
'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులు
బులంద్షార్ (ఉత్తరప్రదేశ్): మ్యాగీ నూడుల్స్ వివాదం ముగిసిపోకముందే మరో వివాదం తలెత్తింది. తాజాగా ఎనర్జీ డ్రింక్ 'గ్లుకాన్-డీ'లో చిన్న చిన్న పురుగులు, కీటకాలు వస్తున్నాయని ఉత్తరప్రదేశ్ లోని బులందర్షార్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో 'గ్లుకాన్-డీ' ఐటమ్ ను పరిశీలనకు పంపారు. బబ్లూ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఓ జనరల్ స్టోర్ నుంచి 'గ్లుకాన్-డీ' కొన్నాడు. అది తాగిన అనంతరం వారి కుటుంబం మొత్తం వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైంది. పరీక్షల నిమిత్తం గ్లుకాన్ ప్రాడక్ట్ ను లాబోరేటరికి పంపించగా, కీటకాలున్నట్లు తేలినట్లు సమాచారం. తమకు ఫిర్యాదు అందిన తర్వాత ఆ జనరల్ స్టోర్ నుంచి నాలుగు పాకెట్లను డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్ శివదాస్ లక్నోలోని లాబ్ కు పంపి పరీక్షలు జరిపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఉత్పత్తులను అమెరికన్ ఫార్మాస్యూటికల్, హెచ్జే హీంజ్ కంపెనీ తయారుచేస్తుంది. -
హెరిటేజ్ పాలల్లో పురుగులు
హైదరాబాద్: నాణ్యతకు మారుపేరుగా సొంత డబ్బా కొట్టుకునే హెరిటేజ్ సంస్థకు చెందిన పాలల్లో పురుగులు వస్తున్నాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సలీంనగర్ డివిజన్లో రఘు అనే యువకుడు పాలప్యాకెట్లను విక్రయిస్తుంటాడు. స్థానిక తార టవర్స్లోని ఓ గృహిణి మంగళవారం ఉదయం పాల ప్యాకెట్లు కొనగా అందులో పురుగులు వచ్చాయి. దీంతో సదరు మహిళ ఈ విషయాన్ని పాల ప్యాకెట్ల డిస్ట్రిబ్యూటర్కు తెలిపింది. ఈ నేపథ్యంలో హెరిటేజ్ పాల ప్యాకెట్లను కొనాలంటేనే భయంగా ఉందని స్థానికలు వాపోయారు. -
యువతి చెవిలోనుంచి పురుగులు!
సంగెం : యువతి చెవిలో నుంచి పురుగులు వస్తున్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన సుల్తాన్ ఎల్లమ్మ, కొమురయ్య దంపతుల చిన్న కూతురు రజిత(20)కు కొంత కాలంగా ఎడమ చెవిలో నొప్పి వస్తోంది. తల్లిదండ్రులు ఆమెను గత ఏడాది డిసెంబర్ 27న సంగెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు ఆమె చెవి నుంచి పురుగులను తీశారు. అదే రోజున వరంగల్లో ఒకసారి, 30న ఇంకోసారి కూడా పురుగులను తీశారు. అయితే రెండ్రోజుల నుంచి చెవినొప్పిగా ఉందని రజిత చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 20కి పైగా పురుగులను బయటకు తీసినా అవి ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ బిడ్డను ఆదుకోవాలని కోరుతున్నారు. -
సకాలంలో గుర్తించి నివారించాలి
పాడి-పంట: పెనుగొండ (పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. అయితే ఈ పంటను తొలి దశ నుంచే పలు రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే దిగుబడులు, నాణ్యత దెబ్బతింటాయని చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ కె.వసంతభాను, డెరైక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి. ఆ వివరాలు... ఆకులు కుళ్లుతాయి కాండం తొలిచే పురుగు పసుపు రంగులో ఉంటుంది. దాని రెక్కల మధ్య నల్లని మచ్చ కన్పిస్తుంది. లద్దె పురుగు పిలక దశలో కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినేస్తుంది. దీనివల్ల మొవ్వు ఆకుకు పోషకాలు అందక ఎండి కుళ్లిపోతుంది. అందుకే దీనిని మొవ్వుకుళ్లు అంటారు. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు పురుగు ఆశిస్తే వెన్నులోని గింజలకు పోషకాలు అందక తాలుగా మారతాయి. అందుకే దీనిని తెల్లకంకి/ఊచపోటు అని కూడా అంటారు. పైరులో 5% చనిపోయిన మొవ్వులు లేదా చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు/గుడ్ల సముదాయం కన్పించిన 7-10 రోజులకు మందులు పిచికారీ చేయాలి. పైరు పిలక దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఫాస్ఫోమిడాన్/ఫిప్రోనిల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో పురుగు కన్పిస్తే ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు వేసుకోవాలి. లేకుంటే లీటరు నీటికి 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% పొడి మందు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రనిలిప్రోల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకు చివర్లు ఎండుతాయి హిస్పా పురుగులు నీలంతో కూడిన నలుపు రంగులో ఉంటాయి. వాటి శరీరంపై చిన్న చిన్న ముళ్లు ఉంటాయి. తల్లి పురుగు ఆకు చివర గుడ్లు పెడుతుంది. వీటి నుంచి 3-5 రోజుల్లో లద్దె పురుగులు బయటికి వస్తాయి. అవి ఆకు పొరల మధ్యలోకి చొచ్చుకుపోయి, పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఆకు చివర్లు తెల్లబడి ఎండిపోతాయి. దూరం నుండి చూస్తే పైరు ఎండినట్లు కన్పిస్తుంది. అందుకే దీనిని తాటాకు తెగులు అని కూడా పిలుస్తారు. పెద్ద పురుగులు ఆకుల పైపొరను గోకి తినడం వల్ల తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. తొలకరి వర్షాలు పడిన తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ఈ పురుగులు బాగా వృద్ధి చెందుతాయి. హిస్పా పురుగుల నివారణకు పొలంలోనూ, గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను తీసేయాలి. దుబ్బుకు పురుగు ఆశించిన రెండు ఆకులు కన్పిస్తే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అంకురం ఉల్లికోడులా... ఉల్లికోడు పురుగు ముదురు ఎరుపు రంగులో దోమ మాదిరిగా ఉంటుంది. దీని లద్దె పురుగు అంకురం వద్దకు చేరుకొని ‘సెసిడోజిన్’ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందదు. అది పొడవాటి గొట్టం (ఉల్లికోడు)గా మారుతుంది. పురుగు ఆశించిన పిలకలు వెన్నులు వేయవు. ఈ పురుగు పైరు పిలకలు వేసే దశలో ఆశిస్తుంది. నాట్లు ఆలస్యంగా వేసినప్పుడు, పిలక దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులను వాడినప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఉల్లికోడు నివారణకు... పిలక దశలో 5% ఉల్లి గొట్టాలు లేదా దుబ్బుకు ఒక ఉల్లికోడు ఆశించిన పిలక కన్పిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నాట్లు వేసిన 10-15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 5 కిలోల ఫోరేట్ 10జీ గుళికలు వేయాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున క్లోరిపైరిఫాస్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. మొక్కలు ఎదగవు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు వరి పైరును ఆకునల్లి ఆశిస్తుంది. సాలీడు జాతికి చెందిన చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన, ఈ నెల వెంబడి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగుకు మారతాయి. మొక్కలు ఎదగక గిడసబారతాయి. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల గంధకం (నీటిలో కరిగే) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారీ చేయాలి. గుర్తుంచుకోండి వరి పైరులో చీడపీడల నివారణ కోసం... నారుమడిలో విధిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు కొనలను తుంచి నాటాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాట తీయాలి. మొగి పురుగు ఉధృతిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు అమర్చాలి. పొలం గట్లపై కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. చేలోని మురుగు నీటిని బయటికి పంపుతూ ఉండాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. మందులు పిచికారీ చేసే ముందు చేలో నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి. పైరు బాగా తడిసేలా మందు ద్రావణాన్ని నాప్శాక్/పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. -
పాల ప్యాకెట్లలో ఈగ!
-
కళ్లు నులుముకుంటే గొంతుకు ఇన్ఫెక్షన్!
నివారణ అవును... మురికి చేత్తో కళ్లను నులుముకుంటే... క్రిములు కన్నీటి నాళాల నుంచి గొంతుకు చేరి శ్వాస సంబంధమైన అంటువ్యాధులకు కారణం అవుతాయి. కాబట్టి తరచు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అన్ని రకాలుగా ఆరోగ్యకరం. శ్వాసకోశ సంబంధమైన అనేక అంటువ్యాధులు చాలా చిన్న కారణాలతోనే వస్తుంటాయి. వాటిని నివారించాలంటే... ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్రపోవాలి. ప్రయాణాలలో తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈత కొలనులో ఈత కొట్టే ముందు ఆ నీటిని క్లోరినేట్ చేశారా, లేదా అని తెలుసుకోవాలి. క్లోరినేట్ చేసినట్లు నిర్ధారించుకున్న తర్వాతనే నీటిలోకి దిగాలి. నీటిని కానీ, ఇతర పానీయాలను కానీ మరీ చల్లగా తాగకూడదు. సమతుల ఆహారం తీసుకోవాలి. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు రెండు లీటర్ల నీటిని తాగాలి. వంట చేయడానికి, తినడానికి, మందులు వేసుకోవడానికి కూడా చేతులు శుభ్రంగా ఉండాలి. ధూమపానం చేయరాదు. ప్యాసివ్ స్మోకింగ్ (స్వయంగా పొగ తాగక పోయినా, ధూమపానం చేస్తున్న వారు విడుదల చేసే పొగను పీల్చడం) కూడా హానికారకమే. -
ఏ పేరులో ఏముందో?!
విడ్డూరం పిల్లలకు పేరు పెట్టేటప్పుడు బోలెడన్ని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఏ పేరైతే పిలవడానికి బాగుంటుంది, ఏ పేరైతే కలిసి వస్తుందంటూ వంద లెక్కలు వేస్తారు. అయితే కొన్ని దేశాల్లో మన లెక్కలు పని చేయవు. ఎందుకంటే... కొన్ని పేర్లను ఆయా ప్రభుత్వాలు నిషేధిం చాయి. మనకి ఎంత నచ్చినా కూడా ఆ లిస్టులో పేరు కనుక పెట్టామో... జైలుకు పోవాల్సిందే! మలేసియాలో పిల్లలకు జంతువులు, పురుగులు, పండ్లు, కూరగాయలు, రంగుల అర్థాలు వచ్చే పేర్లు పెట్టకూడదు. హిట్లర్, వోతీ లాంటి చాలా పేర్ల మీద అక్కడ బ్యాన్ ఉంది. ఐస్ల్యాండ్లో క్రిస్టీ/క్రిస్టా, కరొలినా లాంటి పేర్లు పెట్టకూడదు. ఎందుకంటే వాటిలో ‘సి’ అనే అక్షరం ఉంటుంది కదా! ఆ దేశ అక్షరమాలలో ‘సి’ ఉండదు. కాబట్టి ఆ అక్షరంతో వచ్చే పేర్లు పెట్టకూడదు! పేర్ల విషయంలో నార్వే దేశం చాలా కఠినంగా ఉంటుంది. కొన్ని వేల పేర్ల మీద నిషేధం ఉంది ఆ దేశంలో. వాటిలో ఏదైనా పెడితే కేసు పెడతారు. గతంలో ఓసారి... అధికారులు చెప్పినట్టుగా తన బిడ్డ పేరు మార్చనందుకు ఓ మహిళను రెండు రోజులు జైల్లో కూడా పెట్టారు! జర్మనీలో ఆండర్సన్ అన్న పేరు పెట్టకూడదు. అదే విధంగా టేలర్, టాబీ, రిలే, క్విన్ లాంటి పేర్ల మీద నిషేధం ఉంది. లింగ నిర్థారణ చేసే విధంగా పేర్లు పెట్టడానికి ఆ దేశం ఒప్పుకోదు! న్యూజిలాండ్లో ప్రిన్స, ప్రిన్సెస్, కింగ్, మేజర్, సార్జెంట్, నైట్ లాంటి పేర్లు పెట్టకూడదు. అవి స్థాయిని సూచిస్తాయి కాబట్టి కొందరి మనోభావాలు దెబ్బతింటాయంటుందా ప్రభుత్వం! పోర్చుగల్ ప్రభుత్వం నిషేధించిన పేర్ల జాబితా దాదాపు 41 పేజీలు ఉంటుంది. కారణమేంటో తెలియదు కానీ... అందులో మోనాలిసా అన్న పేరు కూడా ఉంది. అంతేకాదు... అక్కడ పిల్లలు పుట్టే సమయానికే పేరు ఆలోచించి పెట్టుకోవాలి. ఎందుకంటే బర్త సర్టిఫికెట్లో నమోదు చేసిన పేరునే జీవితాంతం ఉపయో గించాలి. ముద్దు పేరు రాస్తే కుదరదు! -
అరణ్యం: చీమ ప్రాణాలు తీయగలదా!
భూమి మీద మొత్తం పన్నెండు వేల రకాల చీమలున్నాయి! కీటకాలన్నింటిలోకీ చీమలే ఎక్కువ కాలం బతుకుతాయి. వాటి జీవిత వ్యవధి... 30 సంవత్సరాలు! చీమల్లో బానిసత్వం ఉంది. కొన్ని రకాల జాతుల చీమల వద్ద ఇతర జాతి చీమలు బానిసలుగా మెలుగుతాయి! నీటిలో పడితే చీమలు ఈదుకుంటూ వచ్చేస్తాయి చూశారా! ఇరవై నాలుగ్గంటలూ నీటిలోనే ఉన్నా, చీమలకు ఏమీ కాదు! కొన్ని రకాల చీమలకు అసలు కళ్లే ఉండవు! చీమలకు ఊపిరి తిత్తులు ఉండవు. ఒళ్లంతా ఉండే రంధ్రాల ద్వారా శ్వాసను పీల్చుకుంటాయి. అదే రంధ్రాల ద్వారా బొగ్గు పులుసు వాయువుని వదిలేస్తాయి! చీమలను చూసి కష్టపడటం నేర్చుకోవాలంటారు పెద్దలు. కానీ నిజానికి చీమలకు చాలా బద్దకం తెలుసా? ఆహారం సేకరించేటప్పుడు తప్ప... మిగతా సమయాల్లో నిద్రపోతూనే ఉంటాయవి! ఇవి తాము నివసించే ప్రదేశాన్ని విభజించుకుంటాయి. ఒక్కో చీమల దండు ఒక్కో ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ప్రతి దండులోనూ బోలెడు చీమలుంటాయి. వాటన్నిటి మీదా రాణి చీమ అజమాయిషీ చేస్తుంటుంది. మిగతావన్నీ దాని ఆజ్ఞలను పాటిస్తాయి. చీమల దండ్లు ఆహారాన్ని గోతుల్లో కానీ, చిన్ని చిన్ని తొర్రల్లో కానీ దాచుకుంటాయి. అదేం విచిత్రమో తెలీదు కానీ, ఒక్కో గొయ్యి/తొర్ర ఒక్కో రకమైన వాసన వస్తుంది. ఆ వాసనను బట్టే అవి తమ దాన్ని గుర్తిస్తాయి! చీమలు పనిని పంచుకుంటాయి. శత్రువులు దాడి చేయకుండా కొన్ని కాపలా కాస్తాయి. కొన్ని ఆహారాన్ని సేకరిస్తాయి. కొన్ని సేకరించిన ఆహారాన్ని పదిల పరుస్తుంటాయి. ఇలా వేటి పనిని అవి చక్కగా చేసుకుపోతాయి! సాధారణంగా కీటకాలన్నీ ఆకులను తింటాయి. కానీ చీమలు మాత్రం వాటిని ముట్టుకోవు! ఇవి తమ శరీర బరువుకంటే ఇరవై రెట్ల అధిక బరువును మోయగలవు! చీమల వల్ల మనకొచ్చిన నష్టమేమీ లేదు కానీ... వాటిలో అవి విపరీతంగా పోట్లాడుకుంటాయి. ప్రాణాలు తీసేసుకుంటాయి. రెండు చీమలు కొట్టుకున్నాయి అంటే వాటిలో ఒకటి చావాల్సిందే! బుష్ సామ్రాజ్యంలో ఇది సూపర్స్టార్!... పెంపుడు జంతువులను స్టేటస్ సింబల్గా భావించేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే జార్జ్ డబ్ల్యు బుష్ మాత్రం వాటిని ప్రాణంగా భావిస్తారు. ఆయన దగ్గర చాలా పెంపుడు జంతువులు ఉన్నాయి. పలు రకాల కుక్కలు, కొన్ని రకాల పక్షులు, ఒక మేక... ఇంకా చాలా ఉన్నాయి. అయితే అన్నింట్లోకీ బార్నీ అంటే చాలా ప్రేమ ఆయనకు. ఈ ఫొటోలో బుష్ చేతిలో ఉందే బుజ్జి కుక్క... అదే బార్నీ. దీన్ని ఆయన భార్య లారా ఆయనకు ప్రేమ కానుకగా ఇచ్చారు. అందుకే అది బుష్కి చాలా ప్రత్యేకం. ఎన్ని పనులున్నా దానితో ఆడుకోవడానికి కొంత సమయం కేటాయించేంత ఇష్టం అదంటే ఆయనకు. ఒక్కోసారి విదేశాలకు కూడా బార్నీని తనతో పాటు తీసుకెళ్తారు బుష్. బార్నీ మహా చురుకైనది. బుష్తో కలిసి వాలీబాల్, గోల్ఫ్ బాల్ ఆడేస్తుంది. బుష్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇది పెద్ద సెలెబ్రిటీనే. ఎప్పుడూ ఆయనతోనే ఉండేదేమో... పేపర్లలోనూ, చానెళ్లలోనూ కనిపిస్తూనే ఉండేది. చాలామంది దీన్ని ‘వైట్హౌస్ స్టార్’ అనేవారు సరదాగా!