maha kutami
-
మాటల కూటమి.. పోటీ సెపరేట్
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి.. ఉపఎన్నిక దెబ్బకు విచ్ఛిన్నమైంది. కాంగ్రెస్ పెద్దన్న పాత్రలో సీపీఐ, టీజేఎస్, టీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీల కలయికగా పురుడు పోసుకుని ఏడాది గడవకముందే బతికి బట్టకట్టలేకపోయింది. ఈ నెల 21న జరగనున్న హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ‘ఎవరికివారే యమునా తీరే’అనే రీతిలో వ్యవహరించబోతున్నాయి. అధికార టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాజకీయ శక్తులను ఏకం చేయాలనే ఎజెండాతో రూపొందించిన ఈ కూటమి ప్రస్థానం హుజూర్నగర్ ఉప ఎన్నికల వేళ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తలోదారిన.. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సహకరించుకున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఇంటి పార్టీలు తలోదారి పట్టాయి. కాంగ్రెస్, టీడీపీలు తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. తెలంగాణ ఇంటి పార్టీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. సీపీఐ కూడా కూటమి నుంచి జారుకునే ప్రయత్నాల్లో ఉంది. మొన్నటివరకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్న సీపీఐ నేతల స్వరంలో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. తమకు మద్దతివ్వాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు సీపీఐ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపే వరకు సీన్ వెళ్లింది. అప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సీపీఐ కార్యాలయానికి వెళ్లి మద్దతు అభ్యర్థించారు కూడా. కానీ, సీపీఐ మాత్రం టీఆర్ఎస్ నేతలకు కూడా చర్చలకు అవకాశమివ్వడం, మరోసారి కాంగ్రెస్ నేతలు కలిసినా ఖచ్చితమైన నిర్ణయం చెప్పకపోవడం బట్టి చూస్తే ఆ పార్టీ కాంగ్రెస్కు మద్దతిచ్చే యోచనలో లేదని అర్థమవుతోంది. తాము పోటీ చేయకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్న ఆ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు అధికార పక్షాన్ని అక్కున చేర్చుకుంటుందని తెలుస్తోంది. కూటమిలో మరో భాగస్వామ్యపక్షమైన టీజేఎస్ కూడా కాంగ్రెస్పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించలేకపోతోంది. టీజేఎస్ నేతలు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెబుతూనే ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేస్తామంటున్నారు. కాంగ్రెస్కు మద్దతిస్తారా అంటే పార్టీలో చర్చించాల్సి ఉందని అంటున్నారు. ఏతావాతా మహాకూటమిలో టీజేఎస్ మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణాలేంటి? ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయంతో అప్పుడే కూటమి కుదేలయిపోయింది. తాము ఆశించిన దానికి పూర్తి భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఆ పరాజయం నుంచి కోలుకునేందుకే కూటమి నేతలకు చాలా కాలం పట్టింది. కోలుకున్న తర్వాత కూడా అడపాదడపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో వేదికలు పంచుకోవడం తప్ప ఆ పార్టీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. కనీసం ఎన్నికల్లో పరాజయాన్ని కూటమిగా సమీక్షించుకున్న దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కూటమికి సిద్ధాంతమేమీ లేదని, కేవలం టీఆర్ఎస్ను ఓడించి గద్దెనెక్కాలనే ఆలోచనతోనే జట్టు కట్టారనే విమర్శలు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ కూడా ఆ తర్వాత ఇతర పక్షాలను పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల భాగస్వామ్యపక్షాలు గుర్రుగానే ఉండేవి. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలు మొక్కుబడిగా మద్దతు ఇచ్చి పుచ్చుకున్నాయి. దీంతో ఇప్పటివరకు పేరుకు మాత్రమే కూటమిగా ఉన్న ఆ పార్టీల అనైక్యత హుజూర్నగర్ ఉప ఎన్నికలతో తేటతెల్లమైంది. 4 పార్టీలు నాలుగు దారులు వెతుక్కుని తలో గూటికి చేరుకోవడం గమనార్హం. కాంగ్రెస్కు నష్టం జరుగుతుందా? కూటమిలో చీలిక హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అన్ని పార్టీల సహకారంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి 7,500 పైచిలుకు మెజార్టీతో గట్టెక్కారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన నేపథ్యంలో దాని ప్రభావం ఎలా ఉంటుందనేది హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం, సీపీఐల ఓటు బ్యాంకు పకడ్బందీగా ఉందా? ఉంటే ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపేది? ఒకవేళ ఈ పార్టీలు కలిసి ఉన్నా ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థికి పడేవా? నియోజకవర్గంలో పరిస్థితి ఏంటన్న దానిపై రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఓ అంచనాకు రావడం అప్పుడే సాధ్యం కాకపోయినా టీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ మద్దతుతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినా అవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే కనుక కాంగ్రెస్కు ఆ మేరకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పార్టీలు కలిసి ఉన్న కారణంగా గత ఎన్నికల్లో ఉత్తమ్కు పడాల్సిన ఓట్లు కూడా పడలేదని, ముఖ్యంగా టీడీపీ కలయికతో తెలంగాణవాదులు దూరమయ్యారని, ఇప్పుడు ఆ ఓట్లు కొంత కలిసివస్తాయని కూడా అంటున్నారు. మొత్తం మీద కూటమి చీలిక కాంగ్రెస్ను కష్టాలపాలు చేస్తుందా..? మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్కు ఏమైనా నష్టం చేస్తుందా అన్నది డిసెంబర్ 24న వెలువడే ఫలితం తేల్చనుంది. -
కలలు సాకారం చేస్తాం
సాక్షి, చెన్నై: బలమైన భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని, మరో అవకాశం ఇస్తే కలలు సాకారం చేస్తానని తమిళ ఓటర్లను ప్రధాని మోదీ బుధవారం కోరారు. చెన్నై శివారు కిలాంబాక్కం వేదికగా అన్నాడీఎంకే మెగా కూటమి నేతృత్వంలో ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా దాడులు, ప్రతిదాడులు, వింగ్ కమాండర్ అభినందన్ మళ్లీ భారత్కు రావడాన్ని గుర్తు చేస్తూ, తీవ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. తమిళనాట అన్నాడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని మెగా కూటమి ఖరారు అయింది. పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీకి–5, పీఎంకేకు–7, పుదియ తమిళగం–1, పుదియ నిధి కట్చి –1, ఎన్ఆర్ కాంగ్రెస్కు పుదుచ్చేరిలోని దక్కాయి. మరికొన్ని చిన్న పార్టీలు కూటమిలో ఉన్న సీట్ల కేటాయింపులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. మిగిలిన సీట్లలో అన్నా డీఎంకే పోటీ చేయనుంది. ఈ బహిరంగ సభతో పాటు అధికారిక వేడుక నిమిత్తం బుధవారం మోదీ చెన్నైకు వచ్చారు. ముందుగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారతరత్న ఎంజీఆర్ పేరును చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్కు పెడుతున్నట్లు మోదీ ప్రకటించారు. కర్ణాటకలో రిమోట్ కంట్రోల్ సీఎం సాక్షి, బెంగళూరు: కర్ణాటక కలబురిగిలో బీజేపీ ఎన్నికల సభలోనూ మోదీ పాల్గొన్నారు. ‘ రాష్ట్ర సీఎం కుమారస్వామి ఒక రిమోట్ కంట్రోల్ సీఎం. రాష్ట్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం పాలన సాగిస్తోంది’ అని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు, అవినీతిపరుల దుకాణం బంద్ చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకటని ఆరోపించారు. ఎలాంటి అవినీతికీ తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తుండడంతో కమీషన్లకు అలవాటు పడిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. మోదీ విరాళం 21 లక్షలు ప్రధాని మోదీ తన దాతృత్వాన్ని మరోసారి చాటారు. కుంభమేళాలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తన సంపాదన నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. -
యూపీఏ కాదు.. పీపీఏ!
న్యూఢిల్లీ: విపక్ష మహా కూటమి పేరును యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)నుంచి ‘ప్రోగ్రెసివ్ పీపుల్స్ అలయన్స్(పీపీఏ)గా మార్చాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. యూపీఏ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడింది కాబట్టి అదే పేరును కొనసాగిస్తే ఇప్పుడు కూడా కూటమిపై కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించినట్లు అవుతుందని, అందువల్ల పేరు మార్చాలని బీజేపీపై పోరు కోసం ఒక్కటైన విపక్ష పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయని సమాచారం. అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఉందన్న అభిప్రాయం కలిగేలా ‘పీపీఏ’ను తెరపైకి తేవాలని కొందరు ప్రతిపాదించారని, ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన విపక్ష పార్టీల నేతల సమావేశంలో ఆ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలిసింది. -
కూటమి ఓటమి పాపం బాబుదే
ఎదురవుతున్న వ్యతిరేక పరిస్థితిని కూడా సానుకూలంగా మల్చుకోవాలని తరచుగా చెప్పే చంద్రబాబు తెలంగాణలో ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్ని నిండా ముంచేశారు. కేవలం 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా ప్రజాకూటమికి తానే నాయకుడు, సర్వం అయినట్లు వ్యవహరించారు. తన వ్యవహార శైలితో ఎన్నికల వాతావరణాన్ని కూటమికి వ్యతిరేకంగా, తెరాసకు అనుకూలంగా మల్చి ప్రజల భావోద్వేగాలను మళ్లీ తీవ్రస్థాయిలో పెరిగేలా చేయడంలో విజయం సాధించారు. మొత్తంమీద బాబు స్పాన్సర్ చేసిన ప్రజాకూటమి కుట్రకూటమిగా ప్రజలముందు నిలబడగా, కేసీఆర్ వాస్తవికత ప్రాతిపదికన ప్రజలముందుకు వెళ్లి ఘనవిజయం అందుకున్నారు. ఇటీవల మన చంద్రబాబు గారు నార్సిజం అనే వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. ఆ వ్యాధి ఉన్నవారు తనకు తానే సాటి అని తమంతవారు తామేనని నిజంగానే భావిస్తారట! ఆ వ్యాధి ముదిరితే తన నీడ సైతం చాలా గొప్పదని దానికి కూడా సాటి లేదని అనుకుంటారట! అందుకే తన పార్టీ నిజంగానే జాతీయ పార్టీ అయిందని, తన పొరుగు రాష్ట్రంలో సైతం ప్రజానీకం ఇంకా తనను ఆరాధిస్తున్నారని, కనుక తెలంగాణ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీవారితో కలిసి కూటమి కట్టారు. మొత్తం 119 స్థానాల్లో తన పార్టీ కేవలం 13 స్థానాల్లోనే పోటీలో ఉన్నా తానే దానికి నాయకుడు, సర్వస్వం అయినట్లు అక్కడ బాబుగారు వ్యవహరించారు. అయినా కాస్త లోకజ్ఞానం ఉన్నవారికెవరికైనా చంద్రబాబు రంగప్రవేశం చేయడంతో మొత్తం వాతావరణం కూటమికి వ్యతిరేకంగా, తెరాసకు అనుకూలంగా ప్రజల భావోద్వేగాలు తిరిగి తీవ్రస్థాయిలో పెరిగాయని గ్రహించడంలో గొప్ప ఏమీలేదు. కేసీఆర్ చెబుతున్నట్లు తెరాస 100 స్థానాలు సాధించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు ఎందుకింతగా అక్కడ తీవ్ర పోటీ కూటమికి, తెరాసకి మధ్య ఉంటుందని చెబుతూ వచ్చాయో నాకు అర్థం కాలేదు. అయితే లగడపాటి సర్వే... అదీ నిబంధనలకు, సాంప్రదాయానికి విరుద్ధంగా ఎన్నికలకు రెండు రోజుల ముందే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మరీ, తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి గెలవబోతోందని స్వయంగా తానే చెప్పడం చూసి ఆశ్చర్యపోయాను. లగడపాటి సర్వే కొంత వాస్తవికంగా ఉంటుందని నాకూ కొంత విశ్వాసం ఉండేది. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబు నిలువునా ముంచడమే కాకుండా, చివరకు లగడపాటి వంటి తన మిత్రుడి ప్రతిష్టను కూడా గంగలో కలిపారని భావించాను. అదేమాట ఒక మిత్రుడితో అన్నాను. ఆయన నన్నొక అమాయకుడిని చూసినట్లు చూసి, లగడపాటి ఎవరు, ఆయన ఏపార్టీలో ఉన్నా, లేకున్నా చంద్రబాబు గారి అంతేవాసే కదా! ఆయన కూడా చంద్రబాబు గారి కూట మిలో అంతర్భాగమే! అన్నారు. అయినా ఇంత... అని ఏదో అనబోతోంటే, నా మిత్రుడు, ఆ సర్వే ఏదో కూటమికి చివరి క్షణాల్లో అయినా కాస్త నైతిక సత్తా కోసమే కాదండీ, అందువల్ల ఆయనకు, చంద్రబాబుకి కూడా కొంత ఐహిక లాభం కూడా ఉన్నది. లగడపాటి సర్వేపై కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 1500 కోట్ల రూపాయల పందెం జరిగిందట. పత్రికల్లో చూడలేదా, అన్నాడు. లగడపాటి సర్వే అనేది బయటకు రాకపోతే బెట్టింగ్ ఎక్కడ ఉండేది? అలా బెట్టింగ్ జరగాలని కూడా లగడపాటి గారి ఉద్దేశం! బెట్టింగ్ కట్టిన వారిలో, బెట్టింగ్ జరగాలని కోరుకుంటున్న వారిలో బడా నేతలు ఉన్నారు. అయితే టీడీపీ నేతలు బెట్టింగ్ కాసింది మాత్రం టీఆర్ఎస్ గెలవబోతున్నదనే. అదే సమయంలో ఆ పార్టీలో పిన్నలూ, సాధారణ పందెం రాయుళ్లూ, మామూలు జనం లగడపాటి సర్వే నిజమవుతుం దని పందెం కట్టి సర్వం పోగొట్టుకున్నారట! అన్నాడు. ‘అంటే’ అని అడిగాను. ‘అరటిపండు వలిచినట్లు చెప్పిన తర్వాత కూడా గ్రహించకపోతే ఎలా, బెట్టింగ్ బిజినెస్కు తెరలేపి, తద్వారా కూడా లాభపడాలన్న తపనతో కావాలని బయటపెట్టిన సర్వే అది. అయినా ఈ బెట్టింగ్ నిర్వాహకులెవ్వరు? వీరు బెట్టింగ్ వ్యసనపరులా? లేదా ముంచేందుకు రంగంలోకి వచ్చిన రాజకీయవాదులా అని తేలిస్తే–ఈ గుట్టు రట్టవుతుంది!’ అన్నాడా మిత్రుడు. ఇక ఆపై ఆలోచించసాగాను. తాడితన్నేవాడి తల తన్నేవాడొకడైతే వాటి తల తన్నేవాడుంటారు అంటారు. అలాగే చంద్రబాబు గారి కౌటిల్యం గ్రహించిన కేసీఆర్, చంద్రబాబు గారి మోదీ వ్యతిరేక ఫ్రంట్ అనే రాజకీయ కూటమికి పోటీగా తాను అటు మోదీ ముక్త, ఇటు కాంగ్రెస్ ముక్త ఫెడరల్ ప్రంట్ నినాదం అందుకున్నారు. ఇక ఎన్నికలు ముగి సిందే తడవుగా, తాను ఫెడరల్ ఫ్రంట్ దిశగా దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని తదనుగుణంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. పార్టీ దైనందిన వ్యవహారాలు చూసేందుకు వీలుగా కేటీఆర్ను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించేశారు. తనది కుటుంబ పాలన అని తనను విమర్శిస్తున్నవారు మళ్లీ అదే గోల చేస్తారని ఆయనకు తెలుసు. తన కుమారుడు కేటీఆర్ అయినా, మేనల్లుడు హరీష్ రావు అయినా, తన కుమార్తె కవిత అయినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తమవంతు పాత్ర నిర్వహించిన పార్టీ కార్యకర్తలు అన్న విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు! వీరిని కేసీఆర్ కుటుంబ సభ్యులనే కాకుండా, తమంత తాముగా పరిణతి చెందిన రాజకీయనేతలుగా కూడా గౌరవిస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కేసీఆర్ది కుటుంబ పాలన అని విమర్శించే ఆస్కారం తనకు లేదని బాబుకు తెలుసు. ఆ సందర్భంగా తమ చినబాబు ప్రస్తావన వస్తే మొదటికే మోసం వస్తుందని కూడా తెలుసు. చినబాబు పార్టీకి గుదిబండగా మారారని తెలిసినా ఏం మాట్లాడలేని పరిస్థితి. నిజానికి చిరంజీవి లోకేశ్ను చంద్రబాబే ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టారు. అవతల ప్రత్యర్థి జగన్. ఆయన తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి పట్ల ప్రజల్లో ఈరోజుకీ ఆరాధనా భావం, కృతజ్ఞతా భావన అలాగే ఉంది. కాదనలేం కానీ అదే సమయంలో వైఎస్ జగన్ తన సామర్థ్యం, కృషి, పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానాన్నే ధిక్కరించి, పార్టీ స్థాపించి, చాలా కష్ట సమయంలో కూడా చంద్రబాబు టీడీపీని రానున్న ఎన్నికల్లో ఓడించగల పార్టీగా తీర్చిది ద్దారు. గత ఏడాదిగా ఆయన సాగిస్తున్న ప్రజాసంకల్పం యాత్రంలో తాను చూపిస్తున్న నిబద్ధత, ప్రజల పట్ల అభిమానం అన్ని వర్గాల ప్రజల హృదయాలను చూరగొన్నది. కనుక ‘‘ఆరంభింపరు నీచమానవులు’’ అంటూ శాసనసభలోనే వివరించిన తన తండ్రి వైఎస్సార్ స్ఫూర్తితో జగన్ ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో చినబాబును ఎంతగా పెద్ద రాజకీయ వేత్తగా ప్రచారం చేయదలిస్తే అంత నష్టం అని తెలుగుదేశం నేతలకూ తెలుసు. కానీ పిల్లిమెడలో గంటకట్టేదెవరు? చంద్రబాబు సత్యం పలుకరు, సరికదా సత్యం వినరు. అందుకే ఆ నేతలు నోరు మెదపడం లేదు. ఈ స్థితిలో దేశరాజకీయాలలో ఏదో ఆ పార్టీ, ఈ పార్టీ, వారివారి సంఖ్యాబలాలు, కూడివేతలు, తీసివేతలతో కూటమి కట్టాలనుకుని, అలా చక్రం తిప్పుతున్నట్లు నటించుదామనుకున్నారు బాబు. కానీ పూర్తి సానుకూల ఎజెండాతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. కేంద్రప్రభుత్వ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా, వివిధ రాష్ట్రాల సహజ హక్కులను నిలబెట్టేందుకు నిజమైన సమాఖ్య వ్యవస్థ రూపంలో దేశపాలన ఉండాలన్నదే కేసీఆర్ ’’సమాఖ్య సంఘటన’’ లక్ష్యం. అలా రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఆ దిశగా పయనిద్దామన్నది కేసీఆర్ తపన. కేంద్రప్రభుత్వం పేరిట వివిధ జాతుల ప్రత్యేకతలు, నాగరికత, సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేయడం కూడదని, ఒక జాతి (భాషా ప్రయుక్త రాష్ట్రాలు, అందులో ఉపజాతులు) ప్రత్యేకత, ఆ జాతివనరులు, అభివృద్ధి, ప్రణాళికలు ఆ ప్రజానీకమే నిర్ణయించుకోవాలన్న చాలా సహజమైన, సత్యమైన సద్భావనే కేసీఆర్ సమాఖ్య సంఘటనలో కనిపిస్తున్నది. ఈ భావనతోనే ఆనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటూ నాటి కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయాన్ని పుచ్చలపల్లి సుందరయ్య నినదించారు. ఆ ప్రజారాజ్యం విశాలాంధ్రలో లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాకపోతే తెలంగాణ ప్రజానీకం తమకు ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని, తామనుకున్న రీతిలో తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకోవడం సహజం. అలా తెలంగాణ ఏర్పడటంలో టీఆర్ఎస్ పాత్ర అభినందనీయం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజానీకం, అలాగే వివిధ రాష్ట్రాలు తమకు అనుకూలమేన్న రీతిలో పురోగమించేందుకు ఒక మంచి మార్గాన్ని తెరాస నేత ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో ముందుకు తెస్తున్నారు. మన చంద్రబాబు ఒక నిర్దిష్ట ఆశయం, రాజకీయ విలువలు లేకుండా నిన్నటివరకు మోదీ చంకనెక్కి, అక్కడ గిట్టుబాటు కాలేదని తాజాగా కాంగ్రెస్ చంకనెక్కడం ద్వారా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మంటగలిపారు. దీనికి భిన్నంగా తెలుగు జాతితో సహా, వివిధ జాతుల ఆత్మగౌరవాన్ని ఫెడరల్ ఫ్రంట్ ద్వారా నిలపాలని తలచినవాడు కేసీఆర్. ఆనాడు ఎన్టీఆర్ కేంద్రం పెత్తనం ఏమిటి అని ప్రశ్నించగా ఇప్పుడు కేసీఆర్ సమాఖ్య సంఘటన పేరుతో మన దేశానికి, మన దేశంలోని వివిధ జాతులకు అనువైన ప్రయోజనకరమైన స్ఫూర్తిని రగిలించారు. ఆ స్ఫూర్తికి అనువైన మార్గంలో తగు మార్పులు చేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆ మార్గాన్ని అనుసరిస్తున్న తెరాస మార్గదర్శకమే! తన కాళ్ల కింద భూమి, దాంతో పాటు తన పదవీసింహాసనం కదిలిపోనున్న తరుణంలో ఆ వాస్తవికత నుండి ఏపీ ప్రజల దృష్టి మరల్చేందుకు తానే దార్శనికుడు అన్న రీతిలో కూటములు కట్టడం, వివిధ పార్టీనేతలతో చర్చలతో తలమునకలైనట్లు ప్రచారం చేసుకుంటూ బాబు చక్రం తిప్పుతున్న ప్రజాకూటమి.. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి పేరుతో కేసీఆర్ ముందుకు తెచ్చిన సమాఖ్య సంఘటనకు సాటిరాదు. మరోవైపున ఏ కూటమిని బలపర్చకుండా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అవసరమైన అంశానికి మద్దతునిచ్చేవారినే కేంద్రంలో బలపరుస్తామని మొదటినుంచి తేల్చిచెబుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్పై ఆడిపోసుకోవడం బాబుకు రివాజుగా మారింది. తెలం గాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కేసీఆర్కు మర్యాద పూర్వకంగా అభినందనలు తెలిపిన వైఎస్ జగన్ని పండుగ చేసుకుంటున్నాడంటూ హేళన చేసే స్థాయికి చంద్రబాబు, టీడీపీ దిగజారిపోవాలా? డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు, మొబైల్ : 98480 69720 -
విలువల్లేని రాజకీయాలను విశ్వసించని జనం
సాక్షిప్రతినిధి, విజయనగరం: అంచనాలను మించిన తీర్పుతో.. విశ్లేషణలకు అందని ఫలితాలతో.. తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఓటర్లు అఖండ విజయాన్ని అందించారు. తెలం గాణలో మహా కూటమిని నడిపించిన తెలుగుదేశం పార్టీపై తెలుగు ప్రజలు పెం చుకున్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శనమని ప్రతిపక్షాలు అంటుంటే, అనవసరంగా టీడీపీతో పొత్తుపెట్టుకుని అభాసుపాలయ్యామని కాంగ్రెస్ పార్టీ నేతలు మదనపడుతున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఇంటగెలవలేకపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు రచ్చ గెలిచేసి, జాతీయ రాజకీయాలను శాసించేద్దామని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీతో అనైతిక పొత్తు పెట్టుకుని, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి, తెలంగాణలో ఎన్నికల ప్రచా రాన్ని కూడా చంద్రబాబు చేశారు. అయితే, వచ్చే ఆకొద్దిపాటి ఓట్టు కూడా ఈ పొత్తుల వల్ల కొట్టుకుపోయాయి. ఆ ప్రభావం జిల్లా రాజకీయాలపైనా పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంట గెలవలేక.. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ప్రత్యేకహోదాను అస్త్రంగా వాడి, కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించి గెలుపు సాధించింది. ప్రత్యేక హోదా హామీని అస్త్రంగా వాడిన చంద్రబాబు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రత్యేక రైల్వే జోన్ తీసుకువస్తామని నమ్మించారు. ఉపాధిలేక, వ్యవసాయం గిట్టుబాటు కాక, ఉద్యోగాలు దొరక్క ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసపోతుంటారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇక్కడి ప్రజలు ఆశపడి చంద్రబాబును నమ్మి ఓట్లేశారు. కానీ అవేవీ నెరవేరలేదు. నాలుగున్నరేళ్లు కేంద్రంలో బీజేపీతో కలిసి ఉండి కూడా ఏమీ సాధించుకోలేకపోయారు. చివరికి తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసం తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి మహా కూటమిని తయా రు చేశారు. ఇవన్నీ గమనిస్తున్న జిల్లా టీడీపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కూటమి విజయంపైనే తమ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ముందే నిర్ణయించుకున్నారు. రేపటి పరిస్థితేంటి.. చంద్రబాబు మాటలతో పాటు, లగడపాటి సర్వే కూడా కూటమికి అనుకూలంగా ఉండటంతో కొంత ధీమాగానే ఉన్నారు. అయితే, టీడీపీ కుట్ర లను పటాపంచలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. దీంతో జిల్లా టీడీపీలో ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే ముఖ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోగా, మిగిలిన ఆ కొద్దిపాటి నాయకుల్లో తాజా ఫలితాలతో అంతర్మథనం మొదలైంది. జిల్లాలో ఉన్న టీడీపీ సీనియర్ నేతలకు మహానటుడు, మాజీ సీఎం, దివంగత ఎన్టీ రామారావుతోనూ, ఆయన కుటుంబంతోనూ ప్రత్యక్ష సత్సంబంధాలున్నాయి. చంద్రబాబు పంచన ఉన్నప్పటికీ ఎన్టీఆర్పై వారికి అభిమానం అలాగే ఉంది. పదవి కోసం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఆయన మనుమరాలు, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని బలిపశువుని చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రేపటి నుంచి ప్రతి పక్షం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలెలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. ఇక్కడా అదే పరాభవం.. ఇక టీడీపీ–కాంగ్రెస్ల అనైతిక పొత్తు వల్లనే వచ్చే ఆ కొద్దిపాటి ఓట్లు కూడా పడలేదని ప్రతిపక్షం విశ్లేషిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్ని కల్లోనూ తెలంగాణలో మాదిరిగా> కాంగ్రెస్–టీడీపీలు తుడిసిపెట్టుకుపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. హైదరాబాద్లో ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే వలసలు వెళ్లి బతుకుతున్నారు. కూటమి ఓటమికి వారు కూడా ఓ కారణమని, తమ ప్రాంతానికి టీడీపీ చేస్తున్న అన్యాయానికి వారు ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యిందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. దమ్ముంటే తెలంగాణలో కాదు ఇక్కడ కూడా కాంగ్రెస్తో కలిసి టీడీపీ పోటీచేయాలని సవాలు విసురుతున్నారు. -
చంద్రబాబూ.. ప్యాకప్!
సాక్షి వెబ్, హైదరాబాద్ : మహాకూటమి పేరిట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి... జాతీయ రాజకీయాల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల కూటమిలో కీలక పాత్ర పోషించాలని తహతహలాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కూటమి పేరిట, పొత్తుల పేరిట చంద్రబాబు తెలంగాణలో ప్రదర్శించిన కుటిల రాజకీయ నీతిని ప్రజలు గట్టిగా తిప్పికొట్టారు. ఏ ఎండకా గొడుగు పట్టడంలో, అవకాశవాద రాజకీయాలను ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు తన వ్యూహం బెడిసికొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. బీజేపీ, పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకొని గత ఎన్నికల్లో ఏపీలో విజయం సాధించిన చంద్రబాబు.. నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీ సర్కారులో కొనసాగిన విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించిన తర్వాత రాజకీయంగా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ మూల సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ తో జత కట్టడమే కాకుండా తద్వారా జాతీయస్థాయిలో చక్రం తిప్పొచ్చని భావించారు. అందులో భాగంగా చేసిన తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రజలిచ్చిన షాక్తో చంద్రబాబు ఎటూ పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఏర్పడుతుందని చంద్రబాబు భావించారు. పనిలోపనిగా కాంగ్రెస్ను అడ్డంపెట్టుకొని జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలని భావించారు. ఇప్పటికే ఉన్న యూపీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీల నేతలతో సమావేశమవుతూ ఏదో ఒక హడావిడి సృష్టించాలని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి దగ్గర కావడం ద్వారా ఇటు తెలంగాణ, అటు ఏపీలో తన పెత్తనం కొనసాగించవచ్చన్న ఆలోచనతో ముందుకెళ్లారు. అలాగే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూపీఏ పక్షంలోని పార్టీల నేతలతో సమావేశమై వారికి దగ్గర కావాలని ప్రయత్నించారు. అలా చేయడంలో తానే ముందుండి అన్నీ నడిపిస్తున్నట్టుగా ప్రచారం పొందడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో చంద్రబాబు సమన్వయ పాత్ర పోషిస్తున్నారని పచ్చ మీడియా కూడా హడావిడి చేసింది. అయితే, సోమవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి ఉత్తరప్రదేశ్లో కీలకమైన ఎస్పీ, బీఎస్పీ నేతలు హాజరు కాకుండా గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతలోనే తెలంగాణ ఫలితాలు కూడా చంద్రబాబు పొలిటికల్ గేమ్కు గట్టి బ్రేకులు వేశాయి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు అనేక ఎత్తులు వేశారు. మహాకూటమి ఏర్పాటులో, సీట్ల పంపకాల్లో, ప్రచారంలో చంద్రబాబే కీలకంగా వ్యవహరించినట్టు ఆయన అనుకూల మీడియా కలరింగ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం ఆ పార్టీ అధిష్టాన దూతలు అమరావతి వెళ్లి చంద్రబాబును కలువడం ప్రతికూల ప్రభావం చూపింది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక అవసరాలను సమకూర్చుతూ తద్వారా తన పెత్తనం చెలాయించాలని వ్యూహరచన చేశారు. తెలంగాణలో తన పట్టు నిరూపించుకోవడానికి చంద్రబాబు ఏకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా కూకట్పల్లిలో దివంగత నేత, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూతురు సుహాసినికి టికెట్ ఇచ్చి.. ప్రచారం పేరిట హడావిడి చేశారు. సుహాసినికి టికెట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ కుటుంబం తనకు అనుకూలంగా కలిసి వస్తుందని, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం వంటి నందమూరి హీరోలను ప్రచారానికి వాడుకోవచ్చునని తలపోశారు. ఇది ఏపీ ఎన్నికలకూ ఉపకరిస్తుందని ముందస్తు వ్యూహాలు రచించారు. చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ, ఏపీ మంత్రులు కూకట్పల్లిలో ప్రచారం చేశారు. సెటిలర్ ఓట్లు తమకు కలిసివస్తాయని భావించారు. కానీ, ప్రజలు చంద్రబాబుకు గట్టి షాకిచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో వేదిక పంచుకొని చంద్రబాబు ప్రచారం చేయడం తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. కూటమి ఏర్పాటు ద్వారా టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కోవచ్చని చంద్రబాబు చెప్పిన వ్యూహం బెడిసికొట్టడమే కాకుండా ఏకంగా కాంగ్రెస్ కోలుకోలేని దారుణ పరిస్థితుల్లోకి పడిపోయింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, విశ్వసనీయత లేని కారణంగా చంద్రబాబు నాయుడు అతిపెద్ద ప్రతికూల అంశంగా మారడంతో కాంగ్రెస్ నేతలే కాకుండా ఇప్పుడు ఏపీలోని టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి కూడా చక్రం తిప్పుబోతున్నామని చంద్రబాబు నాయుడు తరఫున ఆ పార్టీ నాయకులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. కానీ, ఆయన అనుకున్నది ఒక్కటైతే.. తెలంగాణ ప్రజలు మాత్రం రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. చంద్రబాబు కుటిల రాజకీయనీతిని తిప్పికొట్టారు. మొత్తంమీద తాజా ఫలితాలు చంద్రబాబు ఎత్తుగడను ప్రజలు తిప్పికొట్టినట్టు స్పష్టం కాగా, చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. -
బుల్లెట్లు దించినవాడి కడుపులో తలపెడతావా?
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు విప్లవ రాజకీయాలతో మమేకమై.. తన ఆటాపాటతో చైతన్యం తీసుకొచ్చి.. ప్రజాయుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. ఇటీవల పంథా మార్చుకున్నారు. ఒకప్పుడు విప్లవబాట శరణ్యమని.. తన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన ఆయన ఇప్పుడు ప్రజాస్వామిక రాజకీయాలే మార్గమంటున్నారు. నాడు నక్సలిజానికి ఆకర్షితులై అడవిబాట పట్టిన ఆయన.. నేడు రాజకీయ పార్టీలతో కలిసి బహిరంగ వేదికలు పంచుకుంటున్నారు. మారిన కాలమాన పరిస్థితుల్లో రాజకీయాల్లో గద్దర్ తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు తన కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబునాయుడు కడుపులోనే గద్దర్ తాజాగా తలపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఖమ్మం జిల్లాలో బుధవారం ప్రజాకూటమి బహిరంగ సభ సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో కలిసి గద్దర్తోపాటు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు వేదిక పంచుకున్నారు. వేదికపై చంద్రబాబును పలుకరించిన గద్దర్.. ఆయన కడుపులో తలపెట్టినట్టు ఆలింగనం చేసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు-గద్దర్ ఆలింగనం చేసుకున్న ఫొటోను, వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు.. ఒకప్పుడు బుల్లెట్లు దించిన చంద్రబాబునే ఇప్పుడు గద్దర్ ఆలింగనం చేసుకోవడం.. చంద్రబాబు సమక్షంలో గద్దర్ తెలంగాణమా అని గొంతెత్తి పాట పాడటంపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మారిన గద్దర్ ధోరణి..! ఇటీవలికాలంలో గద్దర్ ధోరణిలో మార్పు కనిపించింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేసిన ఆయన.. ఆకస్మికంగా ఆధ్యాత్మిక బాట పట్టి.. గుళ్లు, గోపురాలు తిరిగారు. వ్యక్తిగత పరిధిలో గద్దర్ ఆధ్యాత్మిక బాట పట్టడంలో తప్పేమీ లేదు కానీ.. ఆయన ప్రచారం చేసిన కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మి ఎంతోమంది యువత అడవిబాట పట్టి ప్రాణాలు కోల్పోయారు. అమరుల కుటుంబాలకు గద్దర్ సమాధానం చెప్తారా అని నెటిజన్లు, ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామిక రాజకీయాలపై విశ్వాసం ప్రకటిస్తున్న గద్దర్.. ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీని కలిసిన విషయం తెలిసిందే. తన కొడుకుకు టికెట్ ఇప్పించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారని వినిపించింది. ఆయన కొడుకుకు టికెట్టయితే రాలేదు కానీ.. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చేరువగా వచ్చిన గద్దర్.. కేసీఆర్ను గద్దె దించేందుకు ఏర్పాటైన ప్రజాకూటమికి మద్దతుగా ప్రకటించారు. మహాకూటమి తరఫున గద్దర్ ప్రచారమూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం బహిరంగ సభలో చంద్రబాబు-గద్దర్ ఆలింగనం చేసుకోవడం.. సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. గద్దర్ ఈ స్థాయికి దిగజారుతాడని అనుకోలేదని, తెలంగాణను అన్నివిధాల వంచించిన చంద్రబాబు కడుపులో గద్దర్ తలపెట్టడం.. మారిన రాజకీయ పరిస్థితులను చాటుతోందని, ఏది ఏమైనా గద్దర్ తీరు తమను బాధించిందని తెలంగాణ ఉద్యమకారులు, నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో గద్దర్కు అనుకూలంగా కూడా సోషల్ మీడియాలో పోస్టులు వెలువడుతున్నాయ్.. -
పొత్తు కలిసివచ్చేనా
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): మహాకూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి నియోజకవర్గంలోని తొమ్మిది నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలవగా వీరికి టీడీపీతో పొత్తు కలిసి వచ్చేనా అనే సందేహం వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ భారీగా పడిపోవడాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి టీడీపీతో పొత్తు ఎంత మేరకు ప్రయోజనం కలిగిస్తుందో వెల్లడికావడం లేదని రాజకీయ పరిశీలకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడం, అప్పట్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడంతో టీడీపీ బలహీనపడిందనే వాదన వినిపిస్తుంది. అంతేకాక గడిచిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలవడంతో ఆ పార్టీ గ్రాఫ్ దిగజారిపోయిందని స్పష్టమవుతోంది. టీడీపీ గ్రాఫ్ దిగజారి పోవడంతో ఆ పార్టీతో కాంగ్రెస్కు కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీకి ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఎంతో బాగుండగా 2009 తరువాత మాత్రం ఎదురుగాలి వీయడంతో పార్టీ పతనం ఆరంభమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, జుక్కల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలను టీడీపీకి కేటాయించారు. మిగిలిన నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తులను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట కొంత మెరుగైన ఓటింగ్ లభించగా, టీడీపీ పోటీ చేసిన చోట తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం చూపింది. దీంతో టీడీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం పడిపోయింది. టీడీపీ పోటీ చేసిన చోట ఫలితాలు ఇలా.. టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో మూడో స్థానంకే పార్టీ పరిమితమైంది. బాల్కొండలో టీడీపీకి 17.69 శాతం ఓట్లు లభించాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఆర్మూర్ నియోజకవర్గంలో ఉండగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజారాం యాదవ్కు 5.06 శాతం ఓట్లు లభించడం గమనార్హం. బోధన్లో 17.05 శాతం, బాన్సువాడలో 14.35 శాతం, జుక్కల్లో 5.29 శాతం ఓట్లు లభించాయి. ఈ నియోజకవర్గాలలో బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చింది. అయితే టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని తెలంగాణ వాదులు ప్రచారం చేయడంతో టీడీపీకి ఎంతో పట్టు ఈ నియోజకవర్గాల్లో పెద్దదెబ్బ తగిలింది. 2009లో టీడీపీకి మెరుగైన ఫలితాలు 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఫలితాలను పరిశీలిస్తే తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డి, బాల్కొండలో పీఆర్పీ అభ్యర్థి ఈరవత్రి అనిల్, ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిలు గెలుపొందారు. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, ఆర్మూర్, బాన్సువాడ, జుక్కల్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అన్నపూర్ణమ్మ, పోచారం శ్రీనివాస్రెడ్డి, హన్మంతత్ సింధే, మండవ వెంకటేశ్వర్రావు, గంప గోవర్ధన్లు గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీకి మెరుగైన ఫలితాలు రావడం గమనార్హం. 2004లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ 2004 సాధారణ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు వల్ల టీడీపీ అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారు. తొమ్మిది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఓట్ల గ్రాఫ్ ఈ ఎన్నికల్లో భారీగా పతనమైంది. కాంగ్రెస్కు టీడీపీ పొత్తు లాభించడంపై సందేహాలు గతంలోని ఫలితాలను పరిశీలిస్తే పడిపోయిన టీడీపీ ఓట్ల గ్రాఫ్ను విశ్లేసిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ పొత్తు లాభించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి మరో పార్టీ పొత్తువల్ల ప్రయోజనం కలిగింది తప్ప మరో పార్టీకి టీడీపీ పొత్తు మాత్రం అనుకూలించలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్కు టీడీపీతో పొత్తు కలిసి వస్తుందని అనేక సందేహాలు వ్యక్తమవుతుండగా పోలింగ్లో కాంగ్రెస్కు టీడీపీ సహకారం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. బీజేపీకి అనుకూలించని టీడీపీ పొత్తు టీడీపీ, బీజేపీల పొత్తులో భాగంగా నాలుగు నియోజకవర్గాలలో పోటీకి బీజేపీకి అవకాశం లభించింది. అయితే టీడీపీ క్యాడర్ బీజేపీకి సపోర్టు చేయకపోవడంతో తమ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అప్పట్లో బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం తమ కార్యకర్తల కృషి వల్లనే అని కూడా నాయకులు వివరించారు. బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో పోటీ చేయగా ఈ నియోజకవర్గంలో 8.82 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజామాబాద్ అర్బన్లో 20.91 శాతం, రూరల్ నియోజకవర్గంలో 25.23 శాతం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 21.11 శాతం ఓట్లు బీజేపీకి లభించాయి. టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలను, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలను పరిశీలిస్తే బీజేపీ పోటీ చేసిన చోటనే ఓట్ల శాతం పెరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో ఫలితాలను విశ్లేసిస్తే టీడీపీతో పొత్తు బీజేపీకి లాభించలేదని వెల్లడైతుంది. -
సీట్లు తక్కువగా వచ్చినందుకు బాధగా ఉంది : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంక్షేమం, సమస్యల పరిష్కారం, ఉద్యమ ఆకాంక్షల సాధనే ప్రజాకూటమిలోని పార్టీల లక్ష్యమని ప్రజాకూటమి కన్వీనర్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఉద్యమ ఆకాంక్షల సాధనకు ప్రత్యేక ఉమ్మడి ఎజెండాను సిద్ధం చేసి దాని అమలుకు ముందుకొచ్చిన పక్షాలతోనే ప్రజాకూటమి ఏర్పడిందన్నారు. పార్టీల సొంత విధానాలకు, ప్రజాకూటమి ఎజెండాకు సంబంధం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు అంశం టీడీపీ వ్యవహారమన్నారు. ఉద్యమ ఆకాంక్షల అమలు ఎజెండాకు టీటీడీపీ నేతలు అంగీకరించారని, అందుకే వారితో పొత్తు పెట్టుకున్నట్లు కోదండరాం చెప్పారు. అయినా తాము చంద్రబాబుతో మాట్లాడటం లేదని, టీటీడీపీ నేతలతోనే మాట్లాడుతున్నామన్నారు. పొత్తుల్లో భాగంగా తాము నష్టపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పొత్తుకు అంగీకరించామన్నారు. సీట్లు తక్కువగా వచ్చినందుకు బాధ ఉండటం సహజమని, సీట్లు రాని వారికి అసంతృప్తి ఉంటుందన్నారు. అయితే సీట్లు లభించిన అభ్యర్థులే అసంతృప్తులను సమన్వయం చేసుకోవాలన్నారు. అదే ప్రధానమని, అప్పుడే క్షేత్రస్థాయిలో ఓట్లు రాబట్టుకోగలుగుతామని, ఆ దిశగా అభ్యర్థులు, జిల్లా స్థాయి నేతలు కృషి చేయాలన్నారు. తద్వారా కూటమిని అధికారంలోకి తెస్తామని, ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తామని కోదండరాం స్పష్టం చేశారు. ప్రజాకూటమి కన్వీనర్గా ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోదండరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. సాక్షి: 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారుగా.. కోదండరాం: అవును నిజమే. 12 స్థానాల్లో పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించాం. వాస్తవానికి రకరకాల సమయాల్లో ఏదో ఒక మేరకు వారు అంగీకరించిన స్థానాలనే మేం ప్రకటించాం. వాటిల్లో కొన్ని పోటీ చేయవచ్చు. కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటున్నారు. ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనేది నష్టం చేస్తుంది. వీలైనంత వరకు అది లేకుండా చూడాలన్నదే తాపత్రయం. ఒకట్రెండు చోట్ల మాకు బాగా పని చేసినవారు ఉన్నారు. వారి పాత్ర వల్ల లేదా వారి సామాజిక నేపథ్యం రీత్యా కొందరికి ఒకట్రెండు చోట్ల సీట్లు ఇవ్వాల్సి రావచ్చు. అది ఎలా పరిష్కరించుకుంటామన్నది విత్డ్రా సమయంలో చూస్తం. పొత్తుల విషయంలో మీకు రాజీ తప్పడంలేదా? చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నాం. రాజకీయాల్లో ఒక అవకాశం కోసం గత ఆరు నెలలుగా మా కార్యకర్తలు చేసిన పని గొప్పది. కానీ వారందరికీ భాగస్వామ్యం కల్పించలేకపోతున్నాం. కొందరైతే మనకు రానప్పుడు పోటీ ఎందుకు అని దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సర్ది చెబుతున్నాం. అయితే ఆయా నియోజకవర్గాల్లో మిత్రపక్షం నుంచి సీట్లు లభించిన అభ్యర్థులు చాలా చోట్ల సీట్లు రాని వారిని కలుపుకొని పోవడానికి సిద్ధంగా లేరు. అది చాలా సమస్యగా ఉంది. మీ పార్టీలో టికెట్లు ఆశించిన వారిని ఎలా సంతృప్తి పరుస్తారు? పరిస్థితి అంతా చూస్తున్నారు. కాబట్టి ఎవరూ తొందరపడట్లేదు. అయితే ఫ్రంట్ తరఫున సీట్లు లభించిన అభ్యర్థులు ఇతర ఆశావహులను తొందరగా కలుపుకొని వెళ్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఆ బాధ్యత వారిపై ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాం. ఎజెండాలో ఉన్న ప్రధాన అంశాలేంటి? కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించడం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమనే ప్రధానాంశాలు ఎజెండాలో ఉన్నాయి. వాటిని సాధించడం మరో లక్ష్యం. ప్రజాస్వామిక అభివృద్ధిని తెలంగాణలో సాధించుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం చేశాం. దానికి ప్రత్యేక తెలంగాణ అవసరమని తెలంగాణ సమాజం అంతా అనుకుంది. అందుకే తెలంగాణ సాధించుకున్నాం. కానీ అది ఇప్పుడు లేదు. అందుకే వాటి సాధనకు కృషి చేస్తున్నాం. వృత్తుల పరిరక్షణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, అన్ని వర్గాల భాగస్వామ్యం పెంచడం వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఉద్యమ ఆకాంక్షల గురించి ప్రజలకు ఏం చెబుతారు? ఈ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, తాగు, సాగునీరు లేకుండా పోయింది. అలాంటి వాటినే మేం చేస్తామని చెబుతాం. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందా? అవును.. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల విషయంలో సంపూర్ణంగా విఫలమైంది. ప్రభుత్వం లక్ష ఉద్యోగాలకు అనుమతిచ్చామని చెప్పి న్యాయ వివాదాలతో నిలిచిపోయాయని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ రద్దు ఆగిందని చెప్పడం కరెక్టు కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని రిక్రూట్మెంట్స్ చూపించాలి. వారే చెప్పారు కదా లక్ష ఖాళీలున్నాయని. జిల్లాలు, శాఖలు, విభాగాలు ఎక్కువయ్యాయి. ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంది. అయినా భర్తీ చేయట్లేదు మళ్లీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నడపాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే వారు చెప్పిన దానికి విలువలేదు. టీఆర్ఎస్ను గద్దె దించే లక్ష్యంతోనే మీరు పొత్తు పెట్టుకున్నారా? ఏ పొత్తు అయినా ఏదో ఒక దాన్ని వ్యతిరేకించే ఆలోచనతో పుడితే నిలబడదు. అది చేయదలచుకున్న కార్యాచరణే ప్రధానం. ఆ కార్యాచరణ అమలు లక్ష్యంగా ముందుకు సాగితేనే పొత్తు నిలుస్తుంది. మేము చేస్తున్నదీ అదే. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు కాంగ్రెస్కు పడతాయనుకుంటున్నారా? అందుకోసమే రాష్ట్ర స్థాయిలో నేతలంతా పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు, పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగాలి. పొత్తు ధర్మం ప్రకారం వారంతా పని చేయాలి. అదే చాలా ముఖ్యం. మేము అదే చెబుతున్నాం. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. ఇంత తక్కువ సమయంలో అన్ని పక్షాలను కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు అన్ని స్థానాల్లో ప్రచారం చేయలేం. మాకు ఎక్కడ వెసులుబాటు ఉంటుందో ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. ఇంకా సమయం ఉంటే మిగతా స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తాం. గట్టిగా తిరిగితే మళ్లించగలిగే ఓట్లను సాధించవచ్చు. కొన్ని చోట్ల అది సులభమవుతుంది. మరికొన్ని చోట్ల కష్టం అవుతుంది. అయినా సమన్వయంతో సాధిస్తాం. కూటమిని అధికారంలోకి తెస్తాం. కూటమి సీట్ల విషయంలో మీకు అవమానం జరిగిందా? సీట్ల పంపిణీ విషయంలో కొంత బాధ కలుగుతోంది. ఉద్యమ శక్తులను కలుపుకోవాల్సిన సమయంలో వారికి ప్రాతినిధ్యం లభించనప్పుడు సహజంగానే బాధ కలుగుతది. మాకు గుర్తింపు ఇవ్వలేదని టీజేఎస్ కార్యకర్తలు, నాయకులు బాధ పడుతున్నారు. అయితే మేము దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు కొంత నష్టం జరిగినా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తును గట్టిగా నిలబెట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబుతో మీరు పొత్తు పెట్టుకోవడం ఎందుకు? పొత్తు అనేది చంద్రబాబు పార్టీ విధానాలతో కాదు. కేవలం ఎజెండా ప్రాతిపదికనే. వారు ఆ ఎజెండాను అంగీకరిస్తున్నారు కాబట్టే కలసి పనిచేస్తున్నాం. అయినా మేము చంద్రబాబుతో మాట్లాడటం లేదు. ఎజెండాను అంగీకరించిన టీటీడీపీ నేతలతోనే మాట్లాడుతున్నాం. చంద్రబాబు అంశం వారి పార్టీ వ్యవహారం. కూటమికి ఉద్యమ ఆకాంక్షల అమలే ప్రధానం. -
బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్!
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మరోసారి తన తెలుగు ప్రావీణ్యంతో వార్తల్లో నిలిచారు. ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ బాలయ్య మాత్రం అన్న మరణంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడట.. ఇది ఆయన నోట నుంచి వచ్చిన మాటే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్ను తెరపైకి తీసుకొచ్చిన టీడీపీ బాస్ చంద్రబాబు.. కూకట్పల్లి స్థానాన్ని దివంగత నేత హరికృష్ణ కూతురు సహాసినికి కేటాయించారు. ఇంకేముంది బావ చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన బాలయ్య.. తన అన్న కూతురు గెలుపునకు నడుం బిగించారు. ఇందులో భాగంగా శనివారం ఆమె నామినేషన్ వేసేముందు తాత, తండ్రి సమాధుల వద్ద నివాళులర్పించి అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య నోట జాలువారిన మాట.. ‘ఆయన(హరికృష్ణ) అకాల మరణం అందరిని కూడా సంబర ఆశ్చర్యాల్లో ముంచెత్తింది’. ఇంకేముంది ఈ మాటలతో బాలయ్య అడ్డంగా బుక్కయ్యారు. నెటిజన్లు సెటైర్లతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘ఎయ్ మళ్లి ఏసేశాడు.. మరణిస్తే సంభ్రమాశ్చర్యం ఏంటి నాయనా’ అని ఒకరు.. కనీసం ఆ పదం కూడా సరిగ్గా పలకకుండా సంబర ఆశ్చర్యం అని పలకడం ఏంటని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. తెలుగు భాషను ఖూనీ చేయడంతో అల్లుడు లోకేశ్ను మించిపోయిండుపో అని ఇంకొకరు సెటైర్ వేస్తున్నారు. ఇక ఈ సందర్భంగానే మహాకూటమి తరపున బరిలోకి దిగుతున్న సుహాసినికి మీడియా ముందే కూటమి గురించి అడిగితే ఇలా చెప్పాలని సూచించడంపై కూడా జోకులు పేలుతున్నాయి. గతంలో కూడా బాలకృష్ణ ఇదే తరహాలో మాట్లాడి విమర్శలపాలైన విషయం తెలిసిందే. Jai Balayya 😂 😂 pic.twitter.com/bXDwWFN348 — #Advaitam (@advaitology) November 18, 2018 Telugu lo champestadu balayya ante edo anukuna.. Marii ee range lo anukola — 🌠 (@Suresh_ntr1) November 18, 2018 -
కోదండరాంకు లైన్క్లియర్!
సాక్షి, జనగామ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న జనగామ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ టీజేఎస్కు కేటాయించే అవకాశాలు ఖాయమైనట్లుగా తెలుస్తున్నాయి. సిద్ధమైన ప్రచార రథాలు కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసినా జనగామ నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జనగామతోపాటు 11 స్థానాల్లో పోటీ చేస్తా మని టీజేఎస్ ప్రకటించింది. టీజేఎస్ వ్యవహార తీరుపై పొన్నాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రెండు పార్టీల్లోనూ జనగామ సీటు పీటముడి వీడటం లేదు. దాదాపుగా జనగామ టీజేఎస్కే కేటాయించే అవకాశం ఉండటంతో ప్రచారానికి ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఎనిమిది ప్రచార రథాలను సిద్ధం చేశారు. శుక్రవారం నియోజకవర్గంలో తిప్పడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రచార రథాలపై జనగామ అభ్యర్థి కోదండరాం అని రాయడం గమనార్హం. జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం ఇక్కడే నివా సం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు బలమైన నేతలు కోదండరాం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న కోదండరాం నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ముం దుగా 17న కోదండరాం తరుపున పార్టీ నేతలు మొదటి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో ఆ పార్టీ కార్యకర్తలు, పొన్నాల అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 13 మంది కౌన్సిలర్లతోపాటు 28, 500 మంది క్రియాశీలక కార్యకర్తలు మూకు మ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కు లేఖ రాశారు. కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. -
12 స్థానాల్లో పోటీ
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ జన సమితి ప్రకటించింది. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పి.ఎల్ విశ్వేశ్వరరావు టీజేఎస్ పోటీ చేసే స్థానాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్గిరి, అంబర్పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, జనగాం, మహబూబ్నగర్, మిర్యాలగూడ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు ఇంకా సాగుతున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ ప్రకటించిన అన్ని స్థానాల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెబుతూనే ఒకటి రెండు సీట్లు అటూఇటుగా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి తెరలేపింది. మిత్రపక్షాల స్థానాల్లోనూ పోటీ టీజేఎస్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన స్థానా ల్లో మహాకూటమి పక్షాలు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు కూడా ఉన్నాయి. స్టేషన్ఘన్పూర్, ఆసిఫాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్నగర్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్న జనగాం స్థానం నుంచి తామే పోటీలో ఉంటామని టీజేఎస్ ప్రకటించింది. -
అగ్గి రాజుకుంటున్నా అలసత్వం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పార్టీని నమ్ముకుంటే తీవ్ర అన్యాయం చేసిందని ఆశావహులు సెగలు కక్కుతున్నా వాటిని చల్లార్చే ప్రయత్నాలే కరువయ్యాయి. టికెట్ల ప్రకటనకు ముందు తూతూమంత్రంగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన స్క్రీనింగ్ కమిటీ, ప్రకటన తర్వాత మాత్రం ఎవరి దారిన వారిని వదిలేశాయి. దీంతో ఆశావహులంతా కొందరు ఇండిపెండెంట్లుగా, కొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించే స్థానాలపై ఒకింత స్పష్టత వచ్చినప్పటి నుంచే పార్టీలో అసంతృప్తి రాజుకుంది. ముఖ్యంగా వరంగల్ వెస్ట్ టీడీపీకి కేటాయించనున్నారన్న సమాచారంతో టికెట్ల ప్రకటనకు మూడు రోజుల ముందునుంచీ అక్కడ టికెట్ ఆశిస్తున్న నాయిని రాజేందర్రెడ్డి వర్గీయులు డీసీసీ కార్యాలయంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. వారిని ఏ ఒక్క నేత సముదాయించే ప్రయత్నం చేయలేదు. దీంతో మరింత ఆగ్రహావేశాలకు లోనయిన రాజేందర్రెడ్డి వర్గీయులు జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఎంపీ వి.హనుమంతరావుపై తిరగబడ్డారు. సీనియర్ నేతను అవమానపరిచారని, కనీసం ఆందోళనలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు స్పందించకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఖానాపూర్ టికెట్ హరినాయక్కే కేటాయించాలని ఆ పార్టీ నేతలు మూడు రోజులు గాంధీభవన్లో నిరాహార దీక్షలకు దిగినా ఏ ఒక్క నేత కూడా వారి దీక్షలను ఉపసంహరించే ప్రయత్నం చేయకపోవడంపై వారంతా గుర్రుగా ఉన్నారు. ఇక మల్కాజ్గిరికి చెందిన నందికంటి శ్రీధర్ వర్గం ఆందోళనలతో హోరెత్తించినా వారిని పట్టించుకున్న నాథులే లేరు. శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్, స్టేషన్ ఘన్పూర్లో విజయరామారావు, జూకల్లో అరుణతార, కంటోన్మెంట్లో క్రిశాంక్, బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి, చొప్పదండిలో గజ్జెలకాంతం వంటి నేతల పరిస్థితి ఇలాగే ఉంది. వీరిని అటు పార్టీ అధిష్టానంకానీ, రాష్ట్ర పెద్దలుకానీ కనీసం పిలిచి మాట్లాడటంగానీ, బుజ్జగించే ప్రయత్నాలుగానీ చేయడం లేదు. జిల్లా నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఇండిపెండెంట్లుగా, రెబెల్స్గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం ప్రకటించిన స్థానాల్లో ఎల్లారెడ్డి టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్రెడ్డి, ధర్మపురిలో కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు తమ భవిష్య త్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను తీవ్రంగా నష్టపరిచేవేనని స్పష్టంగా తెలుస్తున్నా పార్టీ పెద్దలు మాత్రం పట్టనట్లే వ్యవహరించడం కేడర్ను అయోమయానికి గురి చేస్తోంది. పార్టీ కోసం శ్రమించిన నేతలతో వెళ్లాలా? లేక పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకోవాలా? అన్న అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు పార్టీ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తిగా మారింది. -
75 నుంచి 80 సీట్లు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 75 నుంచి 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కూటమిగా అవగాహనతో పోటీచేస్తామని, కలిసి పనిచేసి ఆ నలుగురి నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని చెప్పారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజాకూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. ప్రజాకూటమి దెబ్బకు కేటీఆర్ మైండ్ బ్లాక్ అయిందని వ్యాఖ్యానించారు. అధికారం, సంపద, వనరులను నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పంచడమే కూటమి ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను ఆ నలుగురి నుంచి విముక్తి చేయడం, సంపద పంచడం ఖాయమన్నారు. నాలుగు గోడల మధ్య ఫాంహౌస్లో కూర్చుని వ్యవహారాలు నడిపే వాళ్లం కాదన్నారు. భవిష్యత్లో న్యాయం.. కూటమి ఏర్పాటు ద్వారా పోటీ చేసే అవకాశం రాని నేతలు నిరాశపడవద్దని, వారి త్యాగాలను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని భట్టి అన్నారు. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతోనే పార్టీ హైకమాండ్ ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాకూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేస్తామని భట్టి చెప్పారు. మొత్తం 10 సభలు ఉంటాయని, అందులో ఒక సభకు సోనియా, మిగిలిన వాటికి రాహుల్ హాజరవుతారని తెలిపారు. -
టీడీపీ కనుసన్నల్లో అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. బుధవారం నాంపల్లిలోని గన్పార్కు వద్ద కాంగ్రెస్ వైఖరి పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కనుసన్నల్లోనే మహా కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి కూటమి రాజకీయాలు నడిపిస్తే ఉద్యమకారుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నిం చారు. బీసీలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి, పొన్నాల వంటి నాయకులకు సీట్లు నిరాకరించారని, విద్యార్థి నాయకులను సైతం పిలవలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ నుంచి 30 స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ నుంచి తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ.. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్న ప్రొఫెసర్ కోదండరాం ఇది నీకు భావ్యమా అని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. బీసీలు ఢిల్లీ గల్లీ ల్లో టికెట్ల కోసం బిచ్చగాళ్లుగా తిరుగుతున్నారన్నా రు. మంద కృష్ణమాదిగ, గద్దర్, ఆర్.కృష్ణయ్య వంటి నాయకులు ఎక్కడున్నారని నిలదీశారు. మనందరం కలిసి ఎందుకు ప్రత్యామ్నాయం కాకూడదని ప్రశ్నిం చారు. త్వరలోనే అందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించింది. ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్గుప్తాలు టీడీపీ తరఫున పోటీచేస్తారని బుధవారం ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో టీడీపీ పోటీ చేయాలనుకుంటున్న 14 స్థానా ల్లో 11 చోట్ల అభ్యర్థులను ప్రకటించినట్టయింది. సామ ఎల్బీనగర్ స్థానాన్ని ఆశించగా, ఆయన్ను ఇబ్ర హీంపట్నం అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. ఇదేందబ్బా? ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ స్థానాలను అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించడంపై ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నా రు. ఇబ్రహీంపట్నం స్థానా న్ని ఆశించిన రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ బుధవారం మధ్యాహ్నమే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నేడో, రేపో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అదే స్థానాన్ని ఆశించిన మరో నేత మల్రెడ్డి రంగారెడ్డి బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్రనగర్ స్థానాన్ని సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్రెడ్డి ఆశించారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ సైతం ఆ స్థానంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సీటును అనూహ్యంగా టీడీపీకి కేటాయించడంతో వారిద్దరూ ఆందోళన చెందుతున్నారు. -
టెన్షన్.. టెన్షన్
ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి స్థానాలకు తేల్చలేదు. మహా కూటమి పొత్తులో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి టీడీపీకి కేటాయించే అవకాశాలు ఉండటంతో ఆ స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. రూరల్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి చెందిన మల్లికార్జున్రెడ్డి ఢిల్లీకి వెళ్లి బాల్కొండ స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. సాక్షి ,నిజామాబాద్: మహాకూటమిలో టిక్కెట్ల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి టీడీపీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తుండటం తో ఆ స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహు ల్లో టెన్షన్ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి ప్రకటించిన జాబితాలో బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, జుక్కల్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి స్థానాలకు అభ్యర్థులెవరో తేల్చలేదు. అయితే నిజామాబాద్ రూరల్తో పాటు, బాల్కొండ స్థానాలపై టీడీపీ కన్నేసిన విషయం విదితమే. రూరల్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ టికెట్ను ఆశిస్తున్న డాక్టర్ భూపతిరెడ్డి, అర్కల నర్సారెడ్డిల్లో టెన్షన్ నెలకొంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డితో భూపతిరెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా, రేవంత్రెడ్డి ద్వారా అర్కల టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్రూరల్ స్థానం టీడీపీకి కేటాయిస్తారనే అంశం తెరపైకి రావడంతో ఇటు ఆ పార్టీ వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. జిల్లాలో బాల్కొండ స్థానానికి కూడా అధిష్టానం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అనీల్ టికెట్ రేసులో ఉండగా, టీడీపీ కోటాలో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసేందుకు ఏలేటి మల్లికార్జున్రెడ్డి ఆశిస్తున్నారు. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తే ఓట్లు బదిలీ కావడం అసాధ్యమని భావిస్తున్న మల్లికార్జున్రెడ్డి కాంగ్రెస్ గుర్తుపై బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. టీడీపీకి చెందిన మల్లికార్జున్రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ రూరల్, బాల్కొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరంగా అర్బన్ రాజకీయాలు.. నిజామాబాద్ అర్బన్లోనూ కాంగ్రెస్ టికెట్ల గోల ఆ పార్టీ వర్గాలను గందరగోళానికి గురి చేస్తోంది. అర్బన్ స్థానాన్ని కూటమిలో భాగస్వామ్య పార్టీలు కోరడం లేదు. కానీ అధిష్టానం మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. బొమ్మా మహేష్కుమార్గౌడ్, డీసీసీ అధ్యక్షులు తాహెర్బిన్ హందాన్, రత్నాకర్ పేర్లు ప్రారంభంలో వినిపించినప్పటికీ.. ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎల్లారెడ్డిపై రేవంత్వర్గం పట్టు.. ఎల్లారెడ్డి స్థానానికి నల్లమడుగు సురేందర్, సుభాష్రెడ్డి ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తన వర్గీయుడైన సుభాష్రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈస్థానంతోపాటు మిగతా మూడు స్థానాలను ఎవరికి కేటాయిస్తారనేది బుధవారం తేలనుంది. -
ఎంపీ టికెట్ వద్దు.. ఎమ్మెల్యేనే కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరిన ఆయన అక్కడ సాక్షితో మాట్లాడారు. తన సర్వే రిపోర్ట్ బాగా లేదంటున్నవారు 65 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్ను బయట పెట్టాలన్నారు. ఒకే పార్టీ ఒకే నియోజకవర్గంలో ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్నాని తెలిపారు. జనగామ టికెట్ను ఎన్నికల కమిటీ తనకు ప్రతిపాదించిందని, అయినా తన పేరు జాబితాలో ఎందుకు రాలేదో తెలియదన్నారు. టీఆర్ఎస్లో చేరుతానని కొందరు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేశారని, ఏడాదికి పైగా తనకు టికెట్ రాకుండా కుట్ర జరుగుతోందని తెలిపారు. భువనగిరి ఎంపీ టికెట్ తనకొద్దని, మాజీమంత్రులు అందరినీ లోక్సభకు పంపుతున్నారా? అని ప్రశ్నించారు. మహాకూటమి ఒప్పందంలో భాగంగా టీజేఎస్ అధినేత కోదండ రాం జనగామ టికెట్ను ఆశిస్తున్నారు. దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పెండింగ్లో పెట్టింది. పొన్నాల లక్ష్మయ్య ఇతర స్థానాలు నుంచి పోటీచేసేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. పొన్నాల మాత్రం తనకు జనగాం తప్పా.. ఏ స్థానం వద్దని పట్టుబడుతున్నారు. -
అయ్యా.. ఎన్నికలు 2024లో కాదు!
సాక్షి, హైదరాబాద్ : ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న మహాకూటమి ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం ఇటు రాజకీయ పరిశీలకులనే కాదు.. అటు నెటిజన్లను సైతం విస్మయపరుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహంలో భాగంగా.. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలకు సిద్ధపడటం.. ప్రతిపక్ష పార్టీలకు ఒక రకంగా షాక్ ఇచ్చింది. ఈ షాక్లో నుంచి తేరుకొని.. టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి మహాకూటమిగా జతకట్టింది. తన మౌలిక విలువలను సైతం పక్కనబెట్టి.. టీడీపీతో అంటకాగేందుకు సిద్ధపడింది. ఇంతవరకు బాగానే ఉంది. కూటమిగా జతకట్టి కూడా చాలారోజులు అవుతోంది. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. సోమవారం నోటిఫికేషన్ కూడా వెలువడింది. నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతూ.. పార్టీ అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేసి.. ఏకంగా నామినేషన్లు కూడా వేసేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థుల ఖరారు విషయంలో మీనమేషాలు లెక్కబెడుతోంది. ఇప్పటికీ టికెట్ల సర్దుబాటు వ్యవహారాన్ని తేల్చకుండా.. ఇదిగో.. అదిగో ముహూర్తం అంటూ ఊరిస్తోంది. ఓవైపు ఆశావహులు టికెట్ కోసం చేస్తున్న ఆందోళనలతో గాంధీభవన్ అట్టుడికిపోతుండగా.. మరోవైపు టికెట్ కోసం కొందరు నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో భారీగా ఆశావహులు ఉండటం.. మహాకూటమిలో భాగంగా కొన్ని సీట్లు మిత్రపక్షాలకు వదులుకోవాల్సి రావడంతో ఆ పార్టీ ఒక పట్టాన అభ్యర్థుల ఖరారు అంశాన్ని తేల్చలేకపోతోంది. మరోవైపు భాగస్వామ్య పార్టీలకు ఇచ్చే సీట్లపైన క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఇన్నాళ్లు కూటమిలో తీసుకుంటామంటూ సీపీఐని ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడా పార్టీకి మూడు స్థానాలు మాత్రమే ఇస్తామని, ఇష్టమైతే ఉండొచ్చు లేకపోతే కామ్రేడ్లు తెగదెంపులు చేసుకోవచ్చునని తెగేసి చెప్తోంది. ఇలా ఇటు అభ్యర్థుల జాబితా ప్రకటన విషయంలో.. అటు భాగస్వామ్య పక్షాలకు సీట్ల పంపిణీ విషయంలో ఎటూ తేల్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిపై సోషల్ మీడియాలో సైటెర్లు బాగానే పేలుతున్నాయి. కాంగ్రెస్ తీరుపై నెటిజన్లే కాదు.. కూటమి పెద్ద మనిషి కోదండరామ్ కూడా గుస్సా అయ్యారు. ‘మనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయయ్యా? తొందరగా ఆ సీట్ల పంపకం ఏదో తేల్చండి’ అంటూ మీడియా వేదికగానే ఆయన ఘాటుగా కాంగ్రెస్ను ఉద్దేశించి పేర్కొన్నారు. కూటమి సమన్వయకర్తగా ఉన్న కోదండరామే అలా మాట్లాడితే.. నెటిజన్లు ఊరుకుంటారా? ఇదే పాయింట్ పట్టుకొని కూటమిపై పంచ్లు విసురుతున్నాయి. ‘ఒక్కతాన కూర్చుని సీట్లు పంచుకోనోళ్లు.. రేపు ఒక్కటిగా రాష్ట్రాన్ని ఏం పాలన చేస్తారయ్యా? ’ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేయగా.. ‘అయ్యా కాంగ్రెస్, మహాకూటమి పెద్దమనుషులు.. ఎన్నికల ఫలితాల తర్వాత జాబితా ప్రకటిస్తారా ఏంటి?.. 2024లో ఎన్నికలనుకుంటున్నారా? ’ అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ఇట్ల చేస్తే మేం ఓటెయ్యంపో’ అని చురకలు అంటిస్తున్నారు. Requesting @INCIndia and @INCTelangana leaders and #Mahakutami leaders to complete the seat adjustments before election results and to mind elections are not in 2024 ...!!@naralokesh @JanaSenaParty @BJP4India @ncbn @KTRTRS #TelanganaElections2018 @TOIIndiaNews @PawanKalyan — 🤫 POLI’TRICKS’ 🙈🙉🙊 (@politricks_new) November 11, 2018 #Telangana election notification will be released tomorrow and nominations will follow, but #MahaKutami yet to finalise seat sharing. Alliance partners couldn't arrive at a consensus in two long months, can they provide a stable government, if elected?#TelanganaElections2018 — Mythreya (@mythreyaa) November 11, 2018 I'm definitely not going to vote to this #Mahakutami Less than one month, they don't even finalize the candidates for elections. For every decision they are going to Delhi. Very Unstable minds. Telangana state will be in danger if they come into power #TelanganElections — Nunna Hareesh kumar (@hareeshjgd) November 8, 2018 -
కృషి అంతా నాదే:బాబు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు తానొక్కడినే కృషి చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు శుక్రవారం రాత్రి చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ను కలిసి చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో పడిందన్నారు. దేశంలో వ్యవస్థలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యంతో ఆర్బీఐ గవర్నర్ కూడా వైదొలగాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వ్యవస్థలను సైతం ప్రతిపక్షాలను బెదిరించేందుకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఆఖరికి గవర్నర్ను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహాకూటమిలో కొన్ని పార్టీల మధ్య అభిప్రాయ భేదాలున్నా దేశ ప్రయోజనాల దృష్ట్యా కలసి నడుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ మహాకూటమిని నడిపించేందుకు ఎందరో సమర్థవంతమైన నాయకులున్నారు. నరేంద్ర మోదీ కంటే స్టాలిన్ ఎంతో సమర్థుడు’ అని అన్నారు. -
ఆ సీట్లు ఇస్తేనే కూటమి గురించి ఆలోచిస్తాం : చాడ
-
ఆ సీట్లు ఇస్తేనే కూటమి గురించి ఆలోచిస్తాం : చాడ
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న మహాకూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని మహాకూటమిని తామే ప్రతిపాదించామని, కానీ కూటమిలో అది జరగట్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కూటమి బలోపేతంకు చాలా ఆలస్యం అయిందన్నారు. తొమ్మిది నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, దేవరకొండ, పినపాక నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయనుందని చాడ తెలిపారు. ఏది ఏమైనా ఈ సీట్లలో సీపీఐ పోటీ చేస్తుందని చాడ స్పష్టం చేశారు. ఈ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ముందు జాబితా పెట్టామన్నారు. ఈ తొమ్మిది స్థానాలు గౌరవ ప్రదంగా సీపీఐకి కేటాయిస్తే కూటమి గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. -
వారితో సంక్షోభం... మాతో సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: కూటమికి ఓటేస్తే రాష్ట్రంలో సంక్షోభం వస్తుందని... టీఆర్ఎస్కు ఓటేస్తే సంక్షేమం జరుగుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. కూటమిలోని పార్టీలకు రాద్ధాంతాలు తప్ప సిద్ధాం తాలు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు శుక్రవారం తెలంగాణ భవన్లో హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి హరీశ్ మాట్లాడారు. ‘తెలంగాణలో బీజేపీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. అని ఆ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా, పరిపూర్ణానంద మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బీజేపీ వచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఎందుకు ఖాళీ అవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ ఖాళీ అవుతోంది.. ఇది టీఆర్ఎస్ అభ్యర్థుల మెజారిటీని మరింత పెంచుతుంది. టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలను బాగా చూసుకుంటాం. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తాం. కూటమి పేరుతో అవకాశవాద రాజకీయాలు మహాకూటమి పేరుతో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీ పెత్తనం తెలంగాణలో చెల్లదు. చంద్రబాబు ఢిల్లీలో రాహుల్ వద్ద మోకరిల్లారు. కూటమికి ఓటేస్తే రాష్ట్రంలో సంక్షోభం వస్తుంది. టీఆర్ఎస్కు ఓటేస్తే సంక్షేమం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తామని ఆ పార్టీ నేత అంజన్కుమార్ యాదవ్ అంటున్నారు. దామచర్ల విద్యుత్ ప్లాంట్ను నిలిపివేస్తామని మరో నేత అంటున్నారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను విస్మరించింది. ఇప్పుడేం చెప్పినా ఆ పార్టీని ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ కార్యకర్తల భార్యలు కూడా టీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని చెబుతున్నారు. కోదండరాంను కాంగ్రెస్ చీకొడుతున్నా మూడునాలుగు సీట్ల కోసం గాంధీభవన్ మెట్ల మీద కూర్చుంటున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెడితే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కోదండరాం మంటగలిపారు. రాహుల్ వద్ద మోకరిల్లారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుతో కోదండరాం అంటకాగడం సిగ్గుచేటు. తెలంగాణలో జోక్యం చేసుకోనని చంద్రబాబు చెప్పిన మాటల్లో నిజంలేదు. అసెంబ్లీ భవనాలను ఖాళీగానైనా ఉంచుతున్నారేగానీ తెలంగాణ ఇబ్బంది పడుతున్నా ఇవ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన అసెంబ్లీ భవనాలను ఇవ్వకుండా తాళాలు వేసి పెట్టుకున్నారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు... తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసే చంద్రబాబును ఇక్కడి ప్రజలు నమ్ముతారా? తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది తమ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమని లేఖలు రాసి చనిపోయారు. అలాంటి బాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ అమరుల ఆత్మను కూడా క్షోభ పెట్టింది. సిద్ధాంతాలు సరిగా ఉంటే మహాకూటమి పొత్తులు ఎపుడో తేలేవి. టిక్కెట్లపుడే ఇన్ని సిగపట్లు పడుతున్న వారు రేపు పొరపాటున అధికారంలోకొస్తే ఇంకెంత గందరగోళం అవుతుందో. కూటమి గెలిస్తే రాష్ట్రంలో కొత్తగా సమస్యలు వస్తాయేగానీ పథకాలు రావు. సీట్ల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న పార్టీలు తెలంగాణను ఏం ఉద్ధరిస్తాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లది అవకాశవాద కూటమి. పదవులపై యావ తప్ప వారికి ఇంకేమీ లేవు. టీఆర్ఎస్ చెప్పిందీ, చెప్పనిదీ.. చేసింది. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతోంది. ప్రజలు టీఆర్ఎస్నే నమ్ముతున్నారు. ఉమ్మడి మెదక్లో మొత్తం పది సీట్లను టీఆర్ఎస్ గెలుస్తుంది. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది’అని అన్నారు. ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గడీల పాలన గద్దె దించే లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాల కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో ఉంచాల్సిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గడీల పాలనను గద్దె దించడమే లక్ష్యంగా అమరవీరుల ఆకాంక్షల ఎజెండా పేరుతో సీఎంపీ తయారు చేసేందుకు కూటమిలోని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందించగా వాటన్నింటినీ క్రోడీకరించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలో కసరత్తు పూర్తవుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కూటమిపక్షాన కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ని విడుదల చేస్తామని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో పరిగణనలోకి తీసుకోనున్న ముఖ్య ప్రతిపాదనలివే... ► అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ► రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ ► జిల్లాలు, జోనల్ వ్యవస్థలపై సమీక్ష ► 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ► గునీటి కాంట్రాక్టుల్లో ఈపీఎస్ వ్యవస్థ రద్దు, స్థానిక కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ► తొలి, మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం, పింఛన్ సౌకర్యం∙ ధర్నా చౌక్ పునరుద్ధరణ ► నిరుద్యోగులకు నెలసరి భృతి (రూ. 3 వేలు)కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం ► రూ. 10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ► రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి ► ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపు ► పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ► ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం ► పెండింగ్లో ఉన్న మండల, డివిజన్ డిమాండ్ల పరిష్కారం ► అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత ► సంవత్సరంలోగా అమరవీరులకు స్మృతి వనం ► భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి, అర్హులందరికీ ఇచ్చేంత వరకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం ► బీసీ సబ్ప్లాన్ ► మైనార్టీల సంక్షేమం కోసం సచార్, సుధీర్ కమిటీల నివేదికల అమలు ► సింగరేణి, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఆసరా పింఛన్లు ► వ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ► ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ► అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్, వైద్య సౌకర్యం, గృహ వసతి, సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ► 5 సంవత్సరాలలోపు ప్రాక్టీస్ ఉన్న లాయర్లకు సైపెండ్ ► ఏటా ఉద్యోగ కేలండర్ ► అన్ని జిల్లా కేంద్రాల్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు ► విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ఎన్నారై శాఖ ► విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర ప్రకటన ► ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్ ఏర్పాటు ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం... అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం ► మండల కేంద్రాల్లో ఐటీఐ/జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్/డిగ్రీ కళాశాల, జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీ, పీజీ సెంటర్ ఏర్పాటు ► మహిళ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు ► పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్ల ఏర్పాటు ► 104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు ► ఇంటి పన్ను హేతుబద్ధీకరణ ► తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, తగిన వేతనం ► తెలంగాణ సినీ రంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ ► ఖాయిలా పడిన పరిశ్రమల పరిరక్షణకు విధానం ► నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్లు, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ. -
‘తెలంగాణ అంటే బాబుకెందుకు ప్రేమ ఉంటది’
సాక్షి, సిద్ధిపేట : టీఆర్ఎస్ అంటే సంక్షేమం.. మహా కూటమి అంటే సంక్షోభం అంటూ టీఆర్ఎస్ ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గురువారమిక్కడ గజ్వెల్లో ఏర్పాటు చేసిన కుర్మ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వెల్ నియోజకవర్గంలో అభివృద్ధికి.. అవకాశవాదులకు మధ్య పోటీ జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీలేని రుణాలిచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రేమ ఉంటది కానీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎందుకు ప్రేమ ఉంటదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుర్మలకు గుంటడు జాగ కూడా ఇవ్వలేదు.. కానీ కేసీఆర్ మాత్రం కుర్మలకు హైదరాబాద్లో ఐదెకరాల భూమితో పాటు 5 కోట్ల రూపాయలిచ్చారని తెలిపారు. గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి దొంగ చాటుగా రాత్రి పూట ప్రచారం చేస్తున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. -
ఎన్నికల బరి నుంచి ఎల్.రమణ ఔట్ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరి నుంచి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తప్పుకున్నా రు. కరీంనగర్ జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున టి.జీవన్రెడ్డి పోటీ చేయనుండటంతో ఆయన్ను కోరుట్ల నుంచి పోటీ చేయాలని మహాకూటమి ముఖ్య నేతలు కోరారు. కోరుట్ల నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో ఏపీ ప్రజల ప్రాబల్యమున్న చోట్లలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి దూరంగా ఉండాల్సి వస్తుందనే ఆయన విరమించుకున్నట్లు తెలిసింది. కోరుట్ల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని రమణ కోరినట్లు సమాచారం. -
‘కూటమి’ తేలాకే మనం
సాక్షి, హైదరాబాద్: మరో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఈ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలుండగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. మరో పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పెండింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. వరంగల్ తూర్పు, ఖైరతాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, అంబర్పేట, చొప్పదండి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తులు పోటీగా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో సామాజిక లెక్కల పరంగానూ మహాకూటమి కంటే మెరుగ్గా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అందుకే కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో మహాకూటమి బాగా జాప్యం చేస్తే అప్పుడు మరో వ్యూహం అమలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వరంగల్ తూర్పు, చొప్పదండి, మల్కాజ్గిరి, వికారాబాద్, మేడ్చల్, అంబర్పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, హుజూర్నగర్, కోదాడ, చార్మినార్ అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ► ఖెరతాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్రెడ్డి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి టికెట్పై ధీమాతో ఉన్నారు. ► గోషామహల్ టికెట్ను ప్రేంసింగ్ రాథోడ్కు ఇవ్వాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నందకిశోర్ బిలాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ► ముషీరాబాద్ అభ్యర్థిగా ముఠా గోపాల్కు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే తనకుగానీ, తన అల్లుడు శ్రీనివాస్రెడ్డికిగానీ ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఇవ్వాలని టికెట్ ఇవ్వాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కోరుతున్నారు. ► అంబర్పేట అభ్యర్థిగా కాలేరు వెంకటేశ్ పేరును ఖరారు చేసింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చా ర్జి ఎడ్ల సుధాకర్రెడ్డి, కృష్ణయాదవ్, గడ్డం సాయికిరణ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ► మేడ్చల్ స్థానాన్ని మల్కాజ్గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డికి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్రెడ్డి మరోసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ► మల్కాజ్గిరి అభ్యర్థిత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు ఇవ్వాలని నిర్ణయించింది. ► చొప్పదండిలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ను అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. ప్రచారం చేసుకోవాలని ఆదేశించింది. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సైతం ప్రచారం చేస్తున్నారు. ► వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ పేరును ఖరారు చేసింది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ► హుజూర్నగర్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి పోటీగా శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలపాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ► కోదాడలో వేనేపల్లి చందర్రావుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్రెడ్డి టికెట్పై ఆశతో ఉన్నారు. ► వికారాబాద్ టికెట్ టి.విజయ్కుమార్కు దాదాపుగా ఖరారైంది. మరో నేత ఎస్.ఆనంద్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఆ పార్టీ నేతలు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. వీరిలో అవకాశం దక్కని నేతను టీఆర్ఎస్ తరుఫున బరిలో దింపాలని కూడా టీఆర్ఎస్ భావిస్తోంది. ► చార్మినార్లో దీపాంకర్పాల్కు టికెట్ దాదాపుగా ఖరారు చేసింది. ఇలియాస్ ఖురేషీ పేరును పరిశీలిస్తోంది. ఎంఐఎం కంచుకోట అయిన ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ నామమాత్రంగానే ఉండనుంది. -
‘పొత్తుకు స్పష్టత రావాలనే సమావేశం అయ్యాం’
హైదరాబాద్: ఒక వైపు టీఆర్ఎస్,అభ్యర్థులను ముందే ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతూ ఉంటే..మరో వైపు మహా కూటమిలో సీట్ల వ్యవహారం తేలక అభ్యర్థులు ప్రచారంలో వెనకబడిపోతున్నారు. నిజానికి మహా కూటమిలో కాంగ్రెస్దే పెద్దన్న పాత్ర. తెలంగాణ జన సమితి(టీజేఎస్), సీపీఐ, టీడీపీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతల వెంట పడుతూ సీట్ల వ్యవహారం తొందరగా తేల్చాలని వేడుకుంటున్నారు. ఎన్ని సీట్లు తమకు కేటాయిస్తారో, తమకు బలంగా ఉన్న నియోజకవర్గాలను కేటాయిస్తారో లేదో అన్న అనుమానం భాగస్వామ్య పక్షాల నేతల్లో తలెత్తుతోంది. దీనిపై తాజాగా మహాకూటమిలోని టీజేఎస్, సీపీఐ, టీడీపీ పార్టీలు బుధవారం సమావేశమయ్యాయి. సమావేశం ముగిసిన తర్వాత కూటమి నాయకులు విలేకరులతో మాట్లాడారు. టీజేఎస్ అధినేత కోదండ రాం విలేకరులతో మాట్లాడుతూ..పొత్తులకు సంబంధించి ఒక స్పష్టతకు రావాలనే సమావేశం అయ్యామని తెలిపారు. నిరంకుశ పాలన అంతం చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని వివరించారు. కూటమి నిర్మాణంలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పార్టీదేనని అభిప్రాయపడ్డారు. తాము కూడా విడిగా ప్రచారం చేయలేక కూటమిగా ప్రచారం చేయాలనుకున్నామని తెలిపారు. కూటమి ఏర్పాటు కృషి బాధ్యత కాంగ్రెస్పై ఉందని, దాని మీద త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి మరింత బలోపేతం చేయాలని గుర్తించామని, ఆ బాధ్యత మాపై ఉందని వ్యాక్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచ్చలవిడిగా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. మా కూటమి ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తుందని చెప్పారు. మేనిఫెస్టోను ప్రజా మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్కు అధికారం ఇస్తే రాజకీయ గుత్తాధిపత్యంతో పాలించిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రూ.వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. నేరేళ్ల బాధితులతో కేటీఆర్ ప్రమేయం లేదని బలవంతంగా చెప్పించారని అన్నారు. మహా కూటమి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని, ఇది దేశం మొత్తం ఏర్పడబోతోందని వెల్లడించారు. -
అది ఆత్మహత్యా సదృశమే!
సాక్షి, హైదరాబాద్: ‘మహా కూటమిలో చేరతామన్నందుకు.. సీపీఐకి రెండు, మూడు సీట్లా? అక్కర్లేదు. వారి ప్రతిపాదనకు ఒప్పుకుంటే.. అది పార్టీకి ఆత్మహత్యా సదృశమే. అవసరమనుకుంటే సొంతంగానే పోటీ చేద్దాం’ అని సీపీఐ తెలంగాణ నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం మగ్దూం భవన్లో అత్యవసరంగా భేటీ అయింది. ఈ సందర్భంగా మహాకూటమిలో.. సీపీఐకి 2–3 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సీట్లు ఆఫర్ చేస్తే తిరస్కరించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అవసరమైతే ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారు. దీంతో ముఖ్యనేతలకు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి ఎదురైంది. కూనంనేని సాంబశిరావు అయితే సమావేశం మధ్యలోనుంచే అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా, కార్యవర్గంలోని సభ్యుల డిమాండ్తో సీపీఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, చాడ వెంకటరెడ్డి కూడా ఏకీభవించారు. కాగా, తానేమీ అలిగి వెళ్లిపోలేదని సాంబశివరావు స్పష్టం చేశారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. సీట్ల కేటాయింపు విషయంలో అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోమన్నారు. కాంగ్రెస్ ఇస్తానంటున్న రెండు, మూడు సీట్లకు అంగీకరిస్తే.. అది పార్టీకి ఆత్మహత్య లాంటిదేనన్నారు. అంతటి దారుణమైన స్థితిని పార్టీకి కల్పించబోమన్నారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేం దుకూ వెనుకాడబోమన్నారు. రాఫెల్ వివాదంపై జాతీయ వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఈనెల 24న ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సురవరం వెల్లడించారు. సైకిల్ కూడా తయారు చేయలేని అనిల్ అంబానీకి యుద్ధ విమానాల తయారీని ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొత్తులపై ఇప్పటివరకు ఏ పార్టీతోనూ అవగాహన కుదరలేదన్నారు. సీట్ల సర్దుబాటు విషయా న్ని కాంగ్రెస్ పార్టీ తొందరగా తేల్చాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ‘మాకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్కు తెలిపాం. మహా కూటమితోనే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి.. అందులో ఒకటో, రెండో సీట్లు తగ్గిస్తే పర్వాలేదు. కానీ అంతకన్నా ఎక్కువగా తగ్గిస్తామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. దీనిపై మరోసారి కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తాం’ అని ఆయన వెల్లడించారు. -
మెదక్ పరిధిలో కూటమికి సీట్లు కేటాయించొద్దు
సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమిలోని పార్టీలకు ఒక్క సీటు కేటాయించొద్దని కాంగ్రెస్ స్టార్ క్యాం పెయినర్ విజయశాంతి సూచించారు. ఒక వేళ కూటమి తరఫున అభ్యర్థులను నిలిపితే మాత్రం మెదక్ పార్లమెంట్ స్థానంపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు తప్ప కూటమి అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదని తెలిపారు. అం తేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి సైతం లేదని శుక్రవారం పేర్కొన్నారు. -
ఆ ముగ్గురికి సీట్లెక్కడ?
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన మహాకూటమికి సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. దాదాపు అన్ని స్థానాల్లో మహాకూటమి తరఫున బరిలో దిగేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ.. ఎవరికి సీట్లు దక్కుతాయో? ఎవరికి దక్కవోనన్న మీమాంస కనబడుతోంది. అభ్యర్థులకే కాదు.. కూటమిలోని పార్టీల అధినేతలకూ దీనిపై స్పష్టత రాక జుట్టుపీక్కుంటున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి భాగస్వామ్య పక్షాలయిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంలకు.. ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి? అనుకున్న చోట సీటు వస్తుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. వీరు స్థానాలు ఆశించిన చోట ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో.. అసలు వీరు పోటీలో ఉన్నారా.. లేదా.. అన్న సందిగ్ధత నెలకొంది. అయితే.. జగిత్యాల, లేదంటే! టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల. 2009లో ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో సాధారణంగా సిట్టింగ్కే అవకాశాలు ఎక్కువ. దీనికితోడు జగిత్యాలలో కూటమి తరఫున జీవన్రెడ్డే సరైన అభ్యర్థి. దీంతో ఈ సీటును కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే అవకాశం లేదు. అటు రమణ కూడా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని అడగడం పొత్తు ధర్మం కాదనే ఆలోచనలో ఉన్నారు. కోరుట్లలో పోటీకి అవకాశం ఇచ్చినా వెళ్లబోనని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే జగిత్యాల లేదంటే పోటీకి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఆయన హైదరాబాద్లో టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఒకచోటినుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రమణను బరిలో దించాలని.. ఇందుకు హైదరాబాద్ సరన వేదికని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే.. దీనికి ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమణ అసెంబ్లీ బరిలో నిలుస్తారా? లేక ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా వెళ్తారా అన్నది చర్చనీయాంశమైంది. హుస్నాబాద్లో చాడకు సెగ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 2004లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇక్కడినుంచి కాంగ్రెస్ తరపున అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇస్కో సంస్థకు డైరెక్టర్ కూడా అయిన ప్రవీణ్ రెడ్డి.. తనే హుస్నాబాద్ అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై చాడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తు కుదిరిన తర్వాత కూటమి సీట్లపై ఇంకా స్పష్టత రాకముందే.. కాంగ్రెస్ అభ్యర్థి ఎలా ప్రచారం చేసుకుంటారని మండిపడుతున్నారు. చాడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దగా స్పందించలేదు. అటు, ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వదులుకోవద్దని.. ప్రవీణ్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని స్థానిక నాయకత్వం నుంచి టీపీసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హుస్నాబాద్ బరిలో ఎవరుంటారనేది అర్థం కావడం లేదు. కాంగ్రెస్కే టికెట్ ఇస్తే.. చాడ పరిస్థితేంటనే దానిపైనా అయోమయం నెలకొంది. ప్రొఫెసర్ ఎక్కడినుంచి? టీజేఎస్ చీఫ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేననే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడినుంచి పోటీచేయాలనే అంశంపై మాత్రం కూటమిలో గానీ, టీజేఎస్లో కానీ స్పష్టత రాలేదు. మొదట ఆయన జనగామ బరిలో ఉంటారని.. ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులే సీట్లు ఆశిస్తున్నారు. జనగామ నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉండగా.. వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోదండరాం భావించినప్పటికీ.. అక్కడినుంచి మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రేం సాగర్ రావు సీటు ఆశిస్తున్నారు. దీంతో అసలు కోదండరాం బరిలో ఉంటారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ముఖ్యనేతలకూ పరేషాన్.. ఈ 3 పార్టీల అధ్యక్షులతో పాటు కీలకనేతల విషయంలోనూ సీట్ల కేటాయింపు పెద్ద సమస్యగానే మారింది. టీజేఎస్లో ముఖ్యనేత కపిలవాయి దిలీప్కుమార్ మల్కాజ్గిరి స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే.. అక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, గతంలో పోటీచేసిన నందికంటి శ్రీధర్, దిలీప్ సామాజిక వర్గానికే చెందిన బిల్డర్ల సంఘం నాయకుడు శ్రీరంగం సత్యం టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుకు వారివారి స్థానాల్లో కాంగ్రెస్ నుంచే తీవ్రపోటీ ఎదురవుతోంది. దీంతో కూటమి సీట్ల సర్దుబాటుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
కూటమికి భయపడటం లేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మహా కూటమికి తాము భయపడటం లేదని, రాజకీయ పార్టీల మధ్య పొత్తులకు ప్రాతిపదిక ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఆ పార్టీ వారే భయపడరని, తామెలా భయపడతామని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల తర్వాత దొంగ కూటమి కళ్లు బైర్లు కమ్మాయి. మహా కూటమిలో పొత్తు, సీట్లు ఖరారయ్యాక అసలు మజా ఉంటుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి కేసీఆర్ దీక్షపై భట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలే. కేసీఆర్ ఆరోగ్యంపై ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే చిదంబరం ప్రకటన చేశారు. సైన్యంలో ఉత్తమ్ ఉద్యోగిలా పనిచేసి ఆ తర్వాత పైరవీలతో కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర లేదని దొంగ మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏం జరగలేదంటున్న కాంగ్రెస్ నేతలు.. మీ ఇళ్లల్లో 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ నీళ్లు, రైతుబంధు చెక్కులు రావడం లేదా..? నా వెంట వస్తే అభివృద్ధి పనులు చూపిస్తా. గొర్లు, బర్లు ఇస్తారా అంటూ బలహీన వర్గాలను అవమానిస్తున్నారు. బీజేపీకి ఇప్పుడున్న 5 అసెంబ్లీ సీట్లు కూడా రావు. రాష్ట్రంలో సెటిలర్లు అంటూ ఎవరూ లేరు. ఆ పదాన్ని నిషేధించాం. ఓట్ల కోసం మహాకూటమి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతోంది. మాకు ఎవరితో రహస్య ఒప్పందాలు లేవు. ఎంఐఎం మా మిత్రపక్షం. 10 సీట్ల కోసం టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పక్క రాష్ట్రంతో గెలుక్కుంటోంది’అని అన్నారు. -
మోసం చేసేందుకే కూటమి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: పరస్పర విరుద్ధమైన సిద్ధాం తాలు కలిగిన పార్టీలు ప్రజలను మోసం చేసేం దుకు మహా కూటమి పేరుతో జట్టు కట్టాయని సాగునీటి శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అసలు ఆ కూటమికి ఓట్లు అడిగే హక్కు లేదని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ సొంత పార్టీ అయిన టీఆర్ఎస్ను మరోసారి దీవించాలని కోరారు. శనివారం అంథోల్కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జోగినాథ్, జిల్లా కార్యదర్శి విజయ్లతోపాటు పలువురు నేతలు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అందరూ కలసికట్టుగా పనిచేసి అంథోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని హరీశ్రావు సూచించారు. -
తెలంగాణలో టీఆర్ఎస్కు ఆధిక్యం
తెలంగాణలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని సీ–ఓటర్ సర్వే చెబుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కు 6, బీజేపీ, ఎంఐఎంలకు చెరో సీటు దక్కుతాయని సర్వే తేల్చింది. 2014లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు ఆ పార్టీకి దాదాపు 35 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయని సర్వే అంటోంది. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ, ఇతర పార్టీలు కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని ఇప్పటికే నిర్ణయించడం తెలిసిందే. 2014లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయగా ఇరు పార్టీలూ చెరో సీటును గెలిచాయి. ఇటీవలే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పుడు బీజేపీ తన ఒక్క సీటును నిలుపుకోనుండగా టీడీపీ మాత్రం ఆ సీటును కూడా కోల్పోనుందని తేలింది. మరోవైపు కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచినప్పటికీ టీడీపీ, ఇతర పార్టీల కూటమితో లాభపడి ఈసారి ఆరు సీట్లు గెలవనుందని సర్వే పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 2014లో వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు 22 శాతం ఓట్లు అధికంగా వస్తాయనీ, అయితే ఆ పార్టీ ఒక్క సీటుకే పరిమితమవుతుందంది. -
ఆ దాడులతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధ లేదు
-
వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే : ఎంపీ
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్లో కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో వార్ వన్సైడే అని నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్లు సిద్ధాంతాలు పక్కన పెట్టేశాయని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా, అలాంటిది ఆ రెండు పార్టీలు జతకట్టడం అనైతికమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల అపవిత్ర పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. ఆ దాడులతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధ లేదు రేవంత్రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని కవిత అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కొడంగల్, హైదరాబాద్లోని రేవంత్ నివాసాలు, వ్యాపార కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. -
ఒక్క ఓటుతో కూటమి తాట తీయండి: హరీష్రావు
సాక్షి, సిద్దిపేట : టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఒక్క ఓటుతో బుద్ధి చెప్పాలని ఆపద్ధర్మ మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. జిల్లాలోని ములుగు, మార్కుక్ మండలంలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, దేవేందర్రెడ్డి, భూమిరెడ్డి ఎలక్షన్రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో హరీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డిలకు కుర్చీల కోసం కొట్లాట తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. తెలంగాణలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసి చూపిందని వెల్లడించారు. గతంలో మంత్రులు, అధికారులు గ్రామాల్లోకి వస్తే.. నీటికి కటకట ఉందని ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపేవారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని గుంటిపల్లె ప్రజలంతా తీర్మానం చేశారనీ.. అదే స్ఫూర్తితో యావత్ తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. కోదండరామ్ పార్టీ గురించి మాట్లాడడమంటే సమయం వృధా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. కొండపోచమ్మ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోదండరామ్ తీవ్రంగా యత్నించాడని ఆరోపించారు. ప్రభుత్వ కృతనిశ్చయంతో నేడు కొండపోచమ్మ ప్రాజెక్టు పనులు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా సాగుతున్నాయని తెలిపారు. -
ప్రత్యర్థుల వ్యూహం ప్రకారం టీఆర్ఎస్ అడుగులు
-
‘కూటమి’ తర్వాతే తుది జాబితా
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర సమితి... పెండింగ్లో ఉన్న 14 స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్తో ఏర్పడే మహా కూటమిపై స్పష్టత వచ్చాకే ఈ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించని స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నాయి. మిగిలిన జనరల్ స్థానాలను మహాకూటమి ఏ వర్గాలకు కేటాయిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తారనే లెక్కలపై స్పష్టత వచ్చాకే... టీఆర్ఎస్ తుది జాబితాను వెల్లడించనుందని తెలిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీఆర్ఎస్ ఈసారి ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు ఈ స్థానాలన్నింటిలోనూ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు. మిగిలిన స్థానాలకు సైతం వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. మహాకూటమి జాబితా కోసమే వేచి చూస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా టీఆర్ఎస్ తుది జాబితా వెలువడనుంది. వరంగల్ తూర్పు, చొప్పదండి, మల్కాజ్గిరి, వికారాబాద్, మేడ్చల్, అంబర్పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, హుజూర్నగర్, కోదాడ, జహీరాబాద్, చార్మినార్, మలక్పేట అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ♦ మాజీ మంత్రి దానం నాగేందర్కు టీఆర్ఎస్ అధిష్టానం గోషామహల్ టికెట్ను ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక్కడి నుంచి మహాకూటమి తరుఫున మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ బరిలో దిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ టికెట్ కావాలని దానం కోరుతున్నారు. దీనిపై దాదాపు రోజూ కేటీఆర్ను కలుస్తున్నారు. ఖైరతాబాద్కు దానం ఖరారైతే, గోషామహల్ స్థానాన్ని నందకిశోర్ బిలాల్, ప్రేం సింగ్ రాథోడ్లలో ఒకరికిచ్చే అవకాశం ఉంది. ♦ ఖైరతాబాద్ టికెట్ పీజేఆర్ కూతురు విజయారెడ్డికి దాదాపుగా ఖరారైంది. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కూతురు విజయలక్ష్మీ, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. విజయలక్ష్మీ, విజయారెడ్డి కార్పొరేటర్లుగా ఉన్నారు. ♦ ముషీరాబాద్ అభ్యర్థిగా ముఠా గోపాల్ పేరు దాదాపుగా ఖరారైంది. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి ఇక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ♦ అంబర్పేట స్థానానికి పోటీ ఎక్కువగానే ఉంది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్రెడ్డి, గడ్డం సాయికిరణ్, కాలేరు వెంకటేశ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సామాజిక సమీకరణ లెక్కల ఆధారంగా ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనుంది. ♦మేడ్చల్ అసెంబ్లీ టికెట్ విషయంలోనూ పోటీ నెలకొంది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్రెడ్డి, మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి, నక్కా ప్రభాకర్గౌడ్, సాదా నర్సింహారెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.› ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ♦మల్కాజ్గిరి విషయంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి పేరును ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ఈ సీటు ఆశిస్తున్నారు. కనకారెడ్డి మాత్రం తన కోడలు విజయశాంతికి ఇవ్వాలని కోరుతున్నారు. ♦వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇంకా ఖరారు కాలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు పేరును అధిష్టానం పెండింగ్లో పెట్టింది. సంజీవరావు మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. టి.విజయ్కుమార్, ఎస్.ఆనంద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.›ప్రతిపక్షపార్టీకి చెందిన ఓ నేత పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ అవకాశమిస్తారని ప్రచారం జరుగుతోంది. ♦టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తాజాగా ప్రాతినిధ్యం వహించిన హుజూర్నగర్లో టీఆర్ఎస్ సరైన అభ్యర్థి కోసం ప్రయత్నిస్తోంది. నల్లగొండ లోక్సభ సభ్యుడు సుఖేందర్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ, శానంపూడి సైదిరెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ♦కోదాడలోనూ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్రెడ్డితోపాటు వేనేపల్లి చందర్రావు, ఆయన కూతురు ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం లోక్సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఇక్కడి నుంచి బరిలో దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ♦చొప్పదండి అభ్యర్థిత్వాన్ని మళ్లీ తనకే ఇవ్వాలని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కోరుతున్నారు. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ పేరును టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. మాజీ మంత్రి జి.వినోద్ ఇక్కడ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ♦జహీరాబాద్లో అభ్యర్థి కోసం టీఆర్ఎస్ వెతుకుతోంది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మానిక్రావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తోంది. మాజీ మంత్రి జి.వినోద్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని, టీడీపీకి చెందిన జిల్లా నేతను టీఆర్ఎస్లోకి తీసుకువచ్చి టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ♦ మజ్లిస్ పార్టీ కంచుకోటలైన చార్మినార్, మలక్పేటలో నియోజకవర్గాలకు ముఖీద్ చందా, చవ్వా సతీశ్ పేర్లు ఖరారైనట్లు తెలిసింది. వరంగల్ తూర్పు బీసీలకు.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్ను వీడడం ఖరారైంది. ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో కొండా సురేఖ కుటుంబం ప్రైవేట్ పర్యటనలో ఉంటారు. సెప్టెంబర్ 23న ఈ పర్యటన నుంచి రాగానే రాజకీయ భవిష్యత్తుపై వీరు నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థిత్వాల ప్రకటన విషయంలో టీఆర్ఎస్ అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ కొండా సురేఖ చేసిన విమర్శల నేపథ్యంలో వరంగల్ తూర్పు స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించింది. ‘మహా కూటమి’కొలిక్కి వస్తున్న నేపథ్యంలో వరంగల్ తూర్పు టీడీపీకి కేటాయించే పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ నుంచి రేవూరి ప్రకాశ్రెడ్డి బరిలో ఉంటే అభ్యర్థి విషయంలో పునరాలోచించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, టీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకుడు గుడిమల్ల రవికుమార్ వరంగల్ తూర్పు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరం!
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో అధికారికంగా చేరేందుకు ససేమిరా అంటున్న సీపీఎం అంశాల వారీ మద్దతుతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న కూటమిలో తాము చేరే ప్రసక్తే లేదని, ఆ పార్టీతో ప్రత్యక్షంగా జట్టుకట్టే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. సీపీఐ లాంటి వామపక్ష పార్టీలు, టీజేఎస్ లాంటి భావసారూప్య పార్టీలతోపాటు జనసేన, టీడీపీలతో కలసి పనిచేసే అవకాశాలున్నాయని వారం టున్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన కామ్రేడ్లు నేటితో ముగియనున్న రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. పరస్పర సహకారం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలోకి రావాల ని సీపీఎంను అన్ని పార్టీలు కోరుతున్నాయి. అయితే, తాము జాతీయ స్థాయిలో తీసుకున్న రాజకీయ తీర్మానాన్ని ఉల్లంఘించలేమని, సామాజిక కోణంలో ‘లాల్– నీల్’ ఎజెండాతోనే ఎన్నికలను ఎదుర్కొం టామని ఆ పార్టీ అంటోంది. అందులో భాగంగానే సీపీఎంతో పాటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పక్షాన అభ్యర్థులను నిలబెట్టాలని, జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలని తొలుత ఆ పార్టీ నేతలు భావించారు. సీపీఐ లాంటి వామపక్ష పార్టీల అభ్యర్థులున్నచోట్ల వారికి మద్దతివ్వాలని, టీజేఎస్తో కూడా కలసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. టీడీపీతో కూడా తమకు పెద్దగా అభ్యంతరం ఉండదని వారు చెపుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు పోటీ చేసే స్థానాల్లో సీపీఎం పక్షాన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మొత్తం మీద సీపీఎం, బీఎల్ఎఫ్, జనసేన పార్టీలతో కలసి కూటమిగా ముందుకెళ్లాలని, సీపీఐ, టీజేఎస్, టీడీపీ అభ్యర్థులున్న చోట్ల (కాంగ్రెస్ కూటమి అయినప్పటికీ) వారికి మద్దతివ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, కాంగ్రెస్ కూటమి పక్షాన ఒకే అభ్యర్థి ఉండి, సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులు లేని చోట్ల కూడా పరిస్థితులను బట్టి ఆలోచించాలని, మహాకూటమి అభ్యర్థిని బట్టి అవసరమైతే పరోక్షంగా మద్దతివ్వాలనే చర్చ కూడా పార్టీలో జరిగిందని సమాచారం. ఆది, సోమవారాల్లో జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో వచ్చే అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. సీపీఎం పోటీచేసే స్థానాల్లో కూడా మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చించాలనే దానిపై కూడా ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. రానున్న ఎన్నికలలో సీపీఎం పరంగా ఎంచుకునే విధానాన్ని ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
మహాకూటమికి కామన్ మినిమం ప్రోగ్రాం
సాక్షి, హైదరాబాద్: మహా కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసేందుకు కామన్ మినిమం ప్రోగ్రాం(సీఎంపీ)ని రూపొందించుకోవాలని, దీనికి మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ అంగీకరించాలని టీజేఎస్ షరతు విధించింది. మహాకూటమి ప్రభుత్వం ఏర్పడితే సీఎంపీని అసెంబ్లీలో ప్రత్యేక కౌన్సిల్గా మార్చి చట్టబద్ధత కల్పించి దానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను చైర్మన్గా చేయా లని టీజేఎస్ కోరింది. మహాకూటమిలో చేరితే అమలుచేయాల్సిన అంశాలపై కోదండరాం అధ్యక్షతన సమావేశమై నిర్ణయించిన షరతులను శుక్రవారం ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వ పాలన తెలంగాణ అవసరాల కోసమే సాగాలని, ఉద్యమ ఆకాంక్షలకు పెద్దపీట వేయాలని కోరారు. ఆంధ్రా పెట్టుబడిదారులకు తెలంగాణలో మళ్లీ స్థానం కల్పించొద్దని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కంటే ఉద్యమ ఆకాంక్షల సాధనే టీజేఎస్కు ముఖ్యమ న్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలకుడు కేసీఆర్ను గద్దెదించడానికి అంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. సీఎంపీ కోసం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు సిద్ధమన్నారు. -
కాంగ్రెస్తో టీడీపీ పొత్తు
-
బద్ధవిరోధితో చేతులు కలిపిన టీడీపీ!
సాక్షి, హైదరాబాద్ : అవకాశవాద పొత్తులకు టీడీపీ మళ్లీ తెరలేపింది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యమని చెబుతూ తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు బద్ధవిరోధి కాంగ్రెస్తో పొత్తుకూ బరితెగించింది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపామని విపక్షాలు ప్రకటించాయి. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ముందుకెళతామని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ స్పష్టం చేశాయి. మంగళవారం పార్క్హయత్ హోటల్లో జరిగిన సమావేశంలో పొత్తులపై ప్రాథమిక చర్చలే జరిగాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మహాకూటమిలో ప్రజా సంఘాలనూ, విద్యార్థి సంఘాలను కలుపుకుని వెళతామన్నారు. మేనిఫెస్టోను ఉమ్మడిగా ప్రజల ముందుంచుతామన్నారు. కేసీఆర్లో నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. విపక్షాల పొత్తుతో కేసీఆర్కు చెక్ పెడతామని టీటీడీపీ నేత ఎల్ రమణ అన్నారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవ్వరితో చర్చలు జరపకుండా అసెంబ్లీని ఆదరాబాదరాగా రద్దు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కుతోందన్నారు. కాగామహాకూటమి నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నేతలు పేర్కొన్నారు. -
మహాకూటమి..!
సాక్షి, హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఢీకొట్టేందుకు ఇతర విపక్షాలతో కలసి ‘మహాకూటమి’ ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితులతో కలసి ఎన్నికల బరిలోకి దూకేందుకు వ్యూహరచన చేస్తోంది. పార్టీపరంగా తమకు కొన్ని సీట్లు తగ్గినా బలమైన పార్టీని గద్దె దింపాలంటే ఇతర పక్షాలతో సర్దుబాటు చేసుకోకతప్పదనే నిర్ణయానికి వచ్చింది. మొత్తం మీద తమతోపాటు ఆ నాలుగు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో కేవలం త్రిముఖ పోటీకి పరిమితం కావాలని, తద్వారా ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటామనే భావన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆ రెండు పార్టీలు ఓకే... రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో బీజేపీ మినహా అన్ని పార్టీలతో కలసి పనిచేసే అవకాశముందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందులో భాగంగానే టీడీపీ, సీపీఐ, సీపీఎం, జన సమితులను కలుపుకొని పోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే టీడీపీ, సీపీఐలతో చర్చలను దాదాపు ముగించారు. తెలుగుదేశం పార్టీకి 15 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం, సీపీఐకి 4 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగానే ఉన్నారు. టీడీపీ, సీపీఐలు కూడా కాంగ్రెస్తో జత కట్టేందుకు సిద్ధంకావడంతో ఆ రెండు పార్టీలతో కలిసే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నా సీపీఎంను కూడా కలుపుకొనిపోవాలన్నది వారి ఎజెండాగా ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో తాము కలసి పోటీ చేయబోమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించగా ఆ పార్టీలోని కిందిస్థాయి కేడర్ మాత్రం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉంది. అయినా ఈ అంశాన్ని నాయకత్వం పట్టించుకోవడం లేదు. ఢిల్లీ స్థాయిలో చర్చలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీలతో పొత్తులుం డవని చెబుతున్న సీపీఎంను దారిలోకి తెచ్చుకు నేందుకు కాంగ్రెస్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి ఒకరు ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రాథమిక చర్చల్లో వీరభద్రం తన వాదనకే కట్టుబడ్డారని, తాము స్వతంత్రంగానే ఉంటామని ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలోని సీపీఎం నాయకత్వంతో కలసి దీన్ని పరిష్కరించుకోవాలనే అభిప్రాయంతో ఉంది. తెలంగాణలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు సీపీఎం జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పక్షాన ఇప్పటికే ప్రకటించినట్టుగా బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదనను తెరపైకి తేవాలని, ఇందుకు అంగీకరిస్తే తమకేమీ అభ్యంతరం లేదని కొందరు సీపీఎం నేతలంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులను ప్రకటించే పరిస్థితి తమ పార్టీలో ఉండదని, ఎన్నికల తర్వాత ఆ ప్రతిపాదన చూద్దామని కాంగ్రెస్ నేతలు అంటున్నట్టు తెలిసింది. మొత్తంమీద సీపీఎం కూడా పొత్తుకు సై అంటే ఆ పార్టీకి నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు సీపీఎం ఒకవేళ అంగీకరించకుంటే ఆ పార్టీ కోరిన కొన్ని స్థానాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు చెబుతున్నారు. కోదండరాంతో కాంగ్రెస్ ముఖ్య నేత భేటీ... ఎన్నికల్లో కలసి పోటీ చేయడంపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాంతో కూడా కాంగ్రెస్కు చెందిన ఓ ముఖ్య నాయకుడు రెండు నెలల క్రితమే భేటీ అయినట్టు తెలుస్తోంది. విడివిడిగా పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఇరుపక్షాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఇరు పార్టీల ప్రాథమిక రాజకీయ లక్ష్యం నెరవేరాలంటే పొత్తు అనివార్యమనే చర్చ ఈ భేటీలో జరిగినట్టు సమాచారం. అయితే కోదండరాం కూడా పొత్తుకు సానుకూలత వ్యక్తం చేయకపోయినా నిరాకరించలేదని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో ఈ చర్చలను ముమ్మరం చేస్తామని మాజీ మంత్రి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కాగా, టీజేఎస్, సీపీఐల మధ్య గతంలో జరిగిన పొత్తు చర్చల్లోనూ కాంగ్రెస్తో జతకట్టే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. టీజేఎస్ పొత్తుకు అంగీకరిస్తే 6 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చల అనంతరం ఎన్ని స్థానాలివ్వాలో తేలుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీపీఎం, టీజేఎస్తో చర్చలు కూడా ఈ నెలలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తుండటం గమనార్హం. జనసేనతో సీపీఎం పొత్తు యోచన... సీపీఎంను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ మాత్రం సినీనటుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధి బృందంతో వీరభద్రం చర్చలు కూడా జరిపారు. అయితే రాష్ట్రంలో ఉనికిలోలేని జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల సీపీఎం తుడిచిపెట్టుకుపోతుందని, రాష్ట్ర నాయకత్వం వైఖరిలో మార్పు లేకుంటే తిరుగుబాటు చేయాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఒకరు హెచ్చరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ కూటమితో జట్టు కడితే రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చన్న యోచనలో సీపీఎం కేడర్ ఉంది. -
ఎన్నికల తరువాతే మహాకూటమి?
కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కిందటి నెల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మహాగఠబంధన్ (మహాకూటమి) వచ్చే లోక్సభ ఎన్నికల ముందు సాధ్యమయ్యేది కాదని స్పష్టమౌతోంది. ఇటీవల ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీయేతర రాజకీయపార్టీల మధ్య పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిలో సీట్ల సర్దుబాటు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలపాలన్న ప్రతిపాదన మొదట పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ చేయగా, బెంగళూరులో హెచ్డీ కుమారస్వామి ప్రమాణానికి హాజరైన ప్రతిపక్షాల నేతలు దీనికి మద్దతు పలికారు. అయితే, బీజేపీయేతర పార్టీల మహాకూటమి సాధారణ ఎన్నికల తర్వాత మాత్రమే ఏర్పడుతుందని ఈ పార్టీల నేతల తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి. యూపీ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమి ళనాడు, కర్ణాటక, ఒడిశా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని బడా ప్రాంతీయ పార్టీలే మిగిలిన బీజేపీయేతర పార్టీలకు కొద్దోగొప్పో లోక్సభ సీట్లు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ బలానికి అనుగుణంగా తగినన్ని సీట్లు ఇవ్వకపోతే మిగిలిన పక్షాలు ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుకు అంగీకరించవు. అలాగే, గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెసే పెద్ద పార్టీ కావడంతో ఇతర ప్రతిపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అవకాశం లేదు. కేరళలోని రెండు ప్రధాన కూటము(ఎల్డీఎఫ్, యూడీఎఫ్)ల మధ్య పోరు తప్పదు. బీజేపీ ఈ రాష్ట్రంలో మూడో పక్షంగా మిగిలిపోయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఎన్నికల ఫలితాలు వచ్చాకే చేతులు కలుపుతాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు రాష్ట్రాలవారీగా మాత్రమే బీజేపీయేతర పార్టీల మధ్య ఓ మోస్తరు సీట్ల సర్దుబాటుకు అవకాశముంటుంది. ఇదే విషయం పవార్, సూర్జేవాలా చెప్పారు. మహాకూటమి సాధ్యం కాదన్న పవార్! వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య జాతీయస్థాయిలో పొత్తు ఉండదని, మహాకూటమి ఎన్నికలకు ముందు ఆచరణసాధ్యం కాదని శరద్పవార్ ఇటీవల తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాల్లోనూ నంబర్వన్ ప్రతిపక్ష పార్టీయే సీట్లు కేటాయిస్తుందని ఆయన అన్నారు. పొత్తులు రాష్ట్రాలవారీగా పార్టీల మధ్య కుదురుతాయనీ, అన్ని రాష్ట్రాల్లో అనుసరించడానికి వీలైన ఒకే తరహా పొత్తుల నమూనా ఏదీ ఉండదని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అభిప్రాయపడ్డారు. బిహార్లో ప్రతిపక్షాల మధ్య కుదిరే పొత్తు యూపీలో పనిచేయదని ఆయన అన్నారు. మమతా బెనర్జీ సహా అనేక మంది ప్రాంతీయపక్షాల నేతలు మహాకూటమికి నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న కారణంగా కాంగ్రెస్ వైఖరి మారిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి మమత, మాయావతి, అఖిలేశ్ వంటి నేతలు సిద్ధంగా లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తు కాంగ్రెస్కు సాధ్యం కాదనీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఈ జాతీయపార్టీ అభిప్రాయపడుతోంది. కుమారస్వామి ప్రమాణానికి బెంగళూరు వచ్చిన పార్టీల నేతలందరూ ఎన్నికల్లో కలిసి పోటీచేయాల్సిన అవసరం లేదని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ చెప్పారు. ఈ పార్టీలన్నీ అన్ని రాష్ట్రాల్లో చేతులు కలుపుతాయని ఆశించవద్దని ఆయన అన్నారు. ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుపై కీచులాడుకోకుండా ఫలితాలు వెలవడ్డాకే ఎన్డీఏ మెజారిటీ కోల్పోయేపక్షంలో ప్రతిపక్షాలు చేతులు కలపడం మేలనే అభిప్రాయం అనేక మంది ప్రతిపక్షనేతల్లో బలపడుతోంది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ మధ్యే పొత్తు? ఉత్తర్ప్రదేశ్లో ప్రధాన ప్రాంతీయపార్టీలైన ఎస్పీ, బీఎస్పీ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చాయని తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకుగాను బీఎస్పీ ఎక్కువ సీట్లకు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అత్యధిక స్థానాలకు పోటీచేసేలా రెండు పార్టీల నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో పెద్దగా బలంలేని, తన ఓట్లు మిత్రపక్షాలకు బదిలీ చేయలేని కాంగ్రెస్కు రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని అఖిలేశ్ అన్నారని కూడా వార్తలొచ్చాయి. నెహ్రూ–గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రంగా చెప్పే యూపీలో కనీసం 20 సీట్లకైనా పోటీచేయకపోతే పరువు పోతుందనే భావన కాంగ్రెస్లో ఉంది. ఈ లెక్కన ఎస్పీ, బీఎస్పీ మధ్య మాత్రమే సీట్ల సర్దుబాటు కుదురుతుంది. బిహార్లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీయే కాంగ్రెస్ వంటి చిన్న పార్టీలకు సీట్లు ఇచ్చే స్థితిలో ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అవకాశమున్న మరో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ దాదాపు సమాన బలం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూడా కలిసి పోటీచేసే అవకాశాలున్నాయి. కర్ణాటకలో కూడా సంకీర్ణ భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ 28 లోక్సభ సీట్లను పంచుకుంటాయనడంలో సందేహం లేదు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులో పాలక ప్రాంతీయపక్షాలైన తృణమూల్, బీజేడీ, ఏఐఏడీఎంకే మిగిలిన మిత్రపక్షాలకు ఎవరికి ఎన్ని సీట్లో నిర్ణయిస్తాయి. తమిళనాట ప్రధానప్రతిపక్షమైన డీఎంకే నాయకత్వాన కాంగ్రెస్ వంటి పార్టీలు కలిసి పోటీచేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని పాలక ప్రాంతీయపక్షాలు బీజేపీకి వ్యతిరేకమని ప్రకటించినా లోక్సభ సీట్లు ఇతర చిన్న పార్టీలకు ఎంత వరకు కేటాయిస్తాయో అప్పుడే చెప్పడం కష్టం. -
పేరులోనే ఉన్నది పెన్నిధి
విశ్లేషణ: ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును ప్రేరేపిస్తున్నదో గమనించండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమింపజేయటం ప్రారంభమైంది. ఇది సహజంగానే కొందరిలో ఆగ్రహావేశాలను రగిల్చింది. వాటిని చల్లార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇది మాసికే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది ఓటరుకు అందించలేదు. పేరు అనేది ఉందే అది మహా జిత్తులమారిది. మీరు మీ పేరుకు తగ్గట్టుగా నడుచుకోక తప్పని పరిస్థితిని ఎప్పుడు కల్పిస్తుందో తెలియనే తెలీదు. అందుకే రాజకీయ పార్టీలు తెలివిగా... తర్వాత చింతించడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటాన్ని కోరుకుంటాయి. భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లేదా సమాజ్వాదీ పార్టీ వంటి పేర్లు పెద్ద పెద్ద లక్ష్యాలను అతి సామాన్యంగా నిర్వచించే బాపతు పేర్లు. ఇక సీపీఐ(ఎమ్) లోని మార్క్సిస్టు అనే భాగం కచ్చితంగా చెప్పేది ఏమిటా అని ఆశ్యర్యం కలుగుతుంటుంది. అయితే అది ఈ చర్చను పెడదోవ పట్టించే అనవసర మైన ఆ సంగతిని అలా ఉంచితే... కూటములు అని పిలిచే చలనశీల మైన వాస్తవాలకు సామాన్యంగా సూటిగా లక్ష్యాన్ని తెలిపే పొట్టి పేరు ఉండటం అవసరం. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, యూపీఏలు రెండూ వాటి ఉద్దేశాలను సమంజసమైన రీతిలో వివరించేవే. బిహార్లో ఇటీవల నితీష్కు మార్, లాలూప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, శరద్ పవార్, సోనియా గాంధీలు 'మహా కూటమి' ని నిర్మించారు. అతుకుల బొంతలా ఏర్పాటు చేసిన ఆ కూటమి పగులు బారి ఉండటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆ కూటమి తనకే కీడు చేసేటంతటి అతి బృహత్తరమైనది మరి. జ్ఞాపకం స్వల్పకాలిక మే, కానీ మరీ అంత స్వల్పకాలికమైనదేమీ కాదు. ఆ కూటమి ప్రారంభ స్థానం 'మహా విలీనం' ములాయం మూలపురుషునిగా ఏర్పడ్డ ఆ కూటమికి... గతం జ్ఞాపకం మీది మక్కువతో 'జనతా పరివార్' అని నామకరణం చేశారు. జయజయ ధ్వానాల హోరు మధ్య ఆ విషయాన్ని ప్రకటించారు. అది సద్దుమణగక ముందే ఆ కూటమి కాస్తా కుప్ప కూలింది. విలీనానికి బదులుగా బిహార్ ఎన్నికల్లో అంతా కలసి పోటీ చేస్తామంటూ.. వారు అంతటి ఘనమైననదేమీ కాని ప్రత్యామ్నాయాన్ని చూ పారు. అంతా ప్రశాంతంగా ఉన్న ఓ రోజున నితీష్, లాలూప్రసాద్లు శాసన సభ ఎన్నికలకు సీట్ల కేటాయింపును ప్రకటించారు. ఇద్దరు బడా నేతలకు చెరి 100, దీన మౌన ముద్రలో ఉన్న కాంగ్రెస్కు 40, ఏ భాగస్వామైనా ఏరుకోవ చ్చని ఓ మూడు సీట్లను వదిలారు. పవార్ లేదా ములాయం సంప్రదించవ లసిన నేతలని ఎవరూ ఆలోచించలేదు. ఇది సహజంగానే కొందరికి ఆగ్రహావే శాలను కలిగించింది. ఇది రాస్తున్నప్పటికి ఆగ్రహావేశాలను చల్లార్చే ప్రయ త్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ జాబితా నుంచి 10 సీట్లు తమకు ఇవ్వాలని ములాయం కోరుతున్నారు. ఇది అత్యంత అమోఘమైన ఎత్తుగడ. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అయితే ఓటరుకు సంబంధించినంత వరకు ఇది మాసిక వేయడమే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది అందించలేదు. ఎన్నికల సరళి ఏ దిశను చూపిస్తున్నదో తెలుసుకోవాలనుకునే వారి కోసం అందుకు సంబంధించిన కొన్ని సూచికలను ఇస్తున్నాం. 1. వలసను గమనించండి. ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును పేరేపిస్తున్నదో గమనిం చండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమిం పజేయటం ప్రారంభమైంది. 2. ప్రజాభిప్రాయ సేకరణలను గమనించండి. కానీ అవి తమకు తాముగా చేసుకునే ప్రచారాన్ని బట్టి మాత్రం చూడకండి. అవి సీట్ల అంచనాలను ప్రకటించేటప్పుడు మీలో కొంత సంశయవాదానికి తావు ఉండనివ్వండి. బ్రిటన్ ఎన్నికల అంచనాల పండితులు ప్రపంచంలోనే అత్యంత నిపుణులు. అయినా ఈ వేసవి సార్వత్రిక ఎన్నికల్లో వారి అంచనాలు ఎంతగా తప్పాయంటే...వారింకా టీవీ స్టూడియోల్లో ముక్కలు చెక్కలై పడివున్న తమ అహం శకలాలను ఏరుకుంటూనే ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలు ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబించడానికి ఉద్దేశించినవి. కానీ చాలా తరచుగా అవి విశ్లేషకులకున్న పక్షపాత వైఖరినే సూచిస్తుంటాయి. ఏది ఏమైనా. మీరు శ్రద్ధగా గమనించాల్సింది మాత్రం ఒక ఎన్నికల సీజనులో జరి పిన పలు అభిప్రాయ సేకరణల్లో ఒక్కో పార్టీకి లభించిన మద్దతు గ్రాఫ్ను. కాలానుగ తంగా వచ్చే హెచ్చుతగ్గులు స్వల్పంగానే ఉండొచ్చు, కానీ అవి ఆ గ్రాఫ్లో నమోదు అవుతాయి. ఒక పక్షాన ఆ గ్రాఫ్ పైకి ఎదుగుతుంటే, మరో పక్షాన దిగువకు దిగజారుతుంటుంది. ఒక్కొక్క అంగుళమే పైకి ఎగబాకే పార్టీని వెన్నంటే విజయాన్ని సాధించిపెట్టే 'గాలి' వీస్తుంటుంది. 3. మాటల్ని జాగ్రత్తగా గమనించండి. మీ స్వంత మాటల్ని కాదు...అవి ఎప్పుడూ ప్రశాతంగా, స్థిరంగా ఉంటాయనే అంతా భావిస్తారు. శ్రద్ధగా గమ నించాల్సింది రాజకీయ నాయకుల మాటలను. స్థిమితత్వాన్ని కోల్పోవడం మొదలుపెట్టిన నాయకులు క్షేత్రస్థాయిలోని ప్రతికూల పరిస్థితుల వేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్నవారై ఉంటారు. ఒక బహిరంగ సభలో నితీష్ కుమార్ చిరచిరలాడి, ఆగ్రహంతో జగడానికి దిగారు. మొబైల్ కెమెరా అనే ప్రమాదక రమైన ఆవిష్కరణ దాన్ని ఖండించే ఆవకాశం ఆయనకు లేకుండా చేసేసింది. ఆ వీడియో క్లిప్పు వైరస్లా సోషల్ మీడియాలో వ్యాపించిపోయింది. 4. కళ్లను గమనించండి. సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య లెక్కలోకి వచ్చేదే. అయితే ఓటర్లు ప్రత్యర్థిని గేలి చేయడం కోసం గాక, తమ పక్షానికి హర్షధ్వా నాలు పలకడానికి వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలకు హాజరైన వారిలో ఎక్కువ మంది యువతే. అయితే అది కథలో ఓ భాగం మాత్ర మే. అసలు కథ వారి కళ్లల్లో ఉంది. అవి విశ్వాసంతో నిండిన సజీవమైన వెలుగును నింపుకుని ఉన్నాయి. ఆ వెలుగు రవ్వ ఇతరులకు సైతం సోకేది. 5. గెలుపు, ఓటముల మధ్య స్వల్ప తేడాలను, ఆధిక్యతలను గమనించండి. మీరు అలాంటి వివరాల్లోకి వెళ్లే బాపతు రాజకీయ వ్యసనపరులు కాక పోవచ్చు. కానీ నిజం వెల్లడయ్యేది అక్కడే. గత ఎన్నికల్లో గెలుపు, ఓటము లకు మధ్య తేడా 5,000 ఓట్లు ఎక్కువ లేదా తక్కువ ఉన్న నియోజక వర్గాల్లో ఏం జరుగుతోందో పరిశీలించండి. ఫలితాన్ని తారుమారు చేయ డానికి 1 శాతం మొగ్గు సరిపోతుంది. ఆ మాత్రం బలం మీ పక్షానికి చేరితే 5,000 ఓట్ల తేడాతో కోల్పోయిన సీటును 3,000 ఓట్ల తేడాతో గెలుచుకుంటారు. వీటికి నేను ఆరో విషయాన్ని కూడా చేర్చగలను. కానీ అది పూర్తిగా అభ్యర్థులను ఉద్దేశించినది: మీరు మీ జేబుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎన్నికల పోరాటానికి డబ్బు అవసరమే. కానీ డబ్బు ఎన్నికల్లో గెలుపును సంపాదించిపెట్టలేదు. ఒత్తిడికి గురైన అభ్యర్థులు ఊహల భూతాలను మనీ పర్సులతో తరిమికొట్టాలని చూస్తుంటారు. కానీ డబ్బు ఎప్పుడూ మీ వెంట తిరిగే వారిని సంపాదించిపెట్టగలదే తప్ప, క్షేత్ర స్థాయి వాస్తవికతపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపజాలదు. ప్రజలు ఒకరోజు సంబరం కోసం గాక, మెరుగైన జీవితం కోసం ఓటు వేస్తారు. మీరు సరళమైన పేరున్న కూటమికి ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్త వహించండి. (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)