Nadu- Nedu
-
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్లు, బోధనకు ఐఎఫ్పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్కు ఠంచన్గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
Fact check: ప్రభుత్వ బడులపైనే బండలా!
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు తిని ఊరి మీద పడి తిరిగినట్టు.. ఎన్నికల ముందు ఈనాడు పత్రికాధినేత రామోజీరావు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పేదింటి పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై కత్తిగట్టారు. వాస్తవాలను వక్రీకరించి అసత్యాలతో తనకలవాటైన రీతిలో చెలరేగిపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు, పేద పిల్లల ప్రగతిపై ఏనాడూ అక్షరం ముక్క రాయని ‘ఈనాడు’ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు లేవంటూ అబద్ధాలను అచ్చేసింది. మొదటి విడత మనబడి: నాడు–నేడుతో సమూలంగా రూపురేఖలు మార్చుకున్న 15,715 ప్రభుత్వ పాఠశాలల గురించి మాటమాత్రంగా ప్రస్తావించలేదు. కానీ నాడు–నేడు రెండోవిడతలో పనులు జరుగుతున్న పాఠశాలలపై రామోజీ విషం కక్కారు. గత ప్రభుత్వంలో సర్కారు బడి భవనాలు బీటలు వారి కూలిపోతున్నా అడిగింది లేదు.. విద్యార్థులకు కనీస వసతులైన పుస్తకాలు, తాగునీరు, యూనిఫామ్ ఇవ్వకున్నా నిలదీసింది లేదు. ఇప్పుడు నాడు–నేడు రెండో దశలో బడులకు కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు సాగుతుండగా ఫొటోలు తీసి పనులు నిలిచిపోయాయంటూ రామోజీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకటీ రెండుసార్లు కాదు.. ఈ విద్యా సంవత్సరంలో 15 సార్లు ఒకే అంశంపై తప్పుడు రాతలు ప్రచురించడం ఆయన మానసిక దౌర్భల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని.. విద్యార్థులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి కొనియాడారు. వివిధ దేశాల ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ప్రశంసిస్తున్నారు. తమ దేశంలోనూ ఏపీ విధానాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కానీ రామోజీ పచ్చ కళ్లకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్ల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరంలో నాడు–నేడు మొదటి దశ కింద 15,715 పాఠశాలలను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. నూతన భవనాలతో పాటు అవసరమైన 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక 2022–23 విద్యా సంవత్సరంలో 22,344 పాఠశాలల్లో రూ.8,000 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. ఇందులో మొదటి దశలో లేని అదనపు పనులు సైతం జోడించారు. ఇప్పటికే 99.79 శాతం స్కూళ్లల్లో పనులు ప్రారంభించారు. 2,755 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తవగా, 1,331 స్కూళ్లను నూరుశాతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్లు, 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు రూ.3,361 కోట్లు చెల్లించారు. వాస్తవం ఇదయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పాఠశాలల్లో ఫొటోలు తీసి, నిర్మాణ పనులు నిలిచిపోయాయంటూ ఈనాడు పత్రిక వక్రీకరిస్తోంది. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు స్కూళ్లు, ప్రకాశంలోని కొత్తపట్నం, ఏలూరు జిల్లా ఉంగుటూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, విజయనగరం జిల్లా గుర్ల మండలాల్లోని పాఠశాలను చూపించింది. వాస్తవానికి ఆ పాఠశాలల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి గాయాలు కాకూడదని ఆరుబయట ఉంచారు. ఈ ఫొటోలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవే పాఠశాలల గోడలు బీటలు వారి, పైకప్పులు ఎప్పుడు కూలతాయోనన్న భయంతో చదువులు సాగాయి. కానీ తన శిష్యుడు చంద్రబాబు జమానా కావడంతో రామోజీకి ఒక్క ముక్క కూడా రాయాలనిపించలేదు. ఇప్పుడు అన్నీ బాగున్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అన్నీ తప్పులే ఆయనకు కనిపిస్తున్నాయి. -
అభివృద్ధి పథంలో ఏపీ విద్యావ్యవస్థ
విశాఖ (విద్య): ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని మేధావులు స్పష్టం చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నాన్–పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రగతి బాటలో ఏపీ విద్యావ్యవస్థ’ అంశంపై సోమవారం చర్చాగోష్టి నిర్వహించారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం) పూర్వ వీసీ హెచ్.లజపతిరాయ్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమండ్రి) మాజీ వీసీ ఎం.జగన్నాథరావు, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ కె.శ్రీరామమూర్తి, ఏయూ విద్యా విభాగాధిపతి టి.షారోన్రాజు, ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగం విశ్రాంత ఆచార్యులు పి.విశ్వనాథం, సీహెచ్.సూర్యనారాయణ, బీవీకే కళాశాల రిటైర్డ్ లెక్చరర్ సి.వెంకటరావు చర్చాగోష్టిలో మాట్లాడారు. నాణ్యమైన విద్యనందించే విధంగా పాఠశాల స్థాయినుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు యువతను ఉన్నత, సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్ది మెరుగైన ప్రగతిని సాధించాయని, ఇదే తరహాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఆయన ధృక్పథం, పనితీరు మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. నాలుగేళ్ల కాలంలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు 33 శాతానికి పైగా పెంచారన్నారు. రానున్న కాలంలో ఏపీ యువత ప్రపంచంలోనే నంబర్–1గా నిలుస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేస్తున్న సంస్కరణల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాల పిల్లలు పాఠశాల బాట పడుతున్నారని చెప్పారు. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు, బైజూస్ కంటెంట్తో డిజిటల్ పాఠాల బోధన ఇతర రాష్ట్రాలకు రోల్మోడల్గా నిలుస్తున్నాయన్నారు. అవాస్తవాలతో దుష్ప్రచారం ఈ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది అవాస్తవాలతో దుష్ప్రచారం చేయాలని చూడటం సరికాదని విద్యారంగ నిపుణులు హితవు పలికారు. పేద పిల్లలకు చదువుల్ని దూరం చేసేందుకు కొన్నిశక్తులు కుట్రపూరితంగా పనిచేస్తున్నాయని, దీనిని మేధావి వర్గాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, భవిష్యత్ తరాలకు జరగనున్న మేలుపై వాస్తవ గణాంకాలతో వివరించేందుకు ఏ వేదికపైన అయినా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నూతన విధానాలతో బోధన, విద్యకు నైపుణ్యం జోడిస్తూ ప్రతి విద్యార్థి మెరుగైన ఉద్యోగాలు సాధించేవిధంగా విద్యావ్యవస్థను ప్రగతివైపు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నాన్–పొలిటికల్ జేఏసీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
బోగస్ విజనరీ బాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్కు ఉన్న తేడా అదే!
కొద్ది రోజుల క్రితం యూట్యూబ్లో ఒక ఆసక్తికరమైన వీడియో చూశాను. అది ఒక ప్రొఫెసర్ చేసిన వీడియో! ఆయన ఎవరో తెలియదు. కానీ ఆయన అనుభవం వింటుంటే మాత్రం గొప్ప అనుభూతి కలుగుతుంది.ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన అద్బుతమైన మార్పులను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి స్కూళ్లలో నేర్పుతున్న విద్యను ఏపీకి ఎలా తీసుకు వస్తున్నది ఆయన చెబుతుంటే ఇది కదా అభివృద్ది అంటే అనిపిస్తుంది. ఎల్కేజీకి రెండు లక్షలు ఫ్రొఫెసర్ రమేష్ అనే ఈయన కొన్నేళ్ల క్రితం తన పిల్లలను చేర్చడం కోసం హైదరాబాద్ ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్కు వెళ్లాడట. అక్కడ ఎల్కేజీకి తీసుకునే ఫీజు సుమారు రెండు లక్షల రూపాయలని తెలుసుకున్నాడు. ఏం సదుపాయాలు ఉన్నాయో కూడా ఆయన గమనించారు. ప్రత్యేకించి స్కూల్ ఆంబియన్స్ అంటే చూడగానే పిల్లలు ఆకర్షితులయ్యే విధంగా భవనాలు, రంగులు, బొమ్మలు, క్లాస్ రూమ్స్ ,బల్లలు, డిజిటల్ బోదన ఉంటాయి. అలాగే సీబీఎస్ఈ సిలబస్ ఉంది. దానికి తోడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ఐబీ సిలబస్ కూడా మరికొన్ని చోట్ల ఉంది. వారు పిల్లలకు బస్ రవాణా సదుపాయం, ఇతర వసతులు కల్పిస్తారు. దీనికి గాను వారికి అంత మొత్తం ఫీజ్ కావచ్చు. ఆంగ్ల మాద్యమం అవసరం కానీ ఏపీలో ఇలాంటి వసతులతో కూడిన స్కూల్లో ఒక్క పైసా ఖర్చు కాకుండా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు అమోఘం అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక పిల్లలకు డ్రెస్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర అన్ని ఏర్పాట్లను జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఇది మరి గొప్ప విషయం కాదా! ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడాన్ని ఆ ఫ్రొఫెసర్ స్వాగతించడమే కాకుండా, అంతర్జాతీయంగా ఎక్కడకు వెళ్లాలన్నా ఆంగ్ల మాద్యమం అవసరం అని ఆయన అబిప్రాయపడ్డారు. దివంగత నటి సావిత్రి సాయం ఈ మద్య నేను కూడా రేపల్లె వద్ద వడ్డివారి పాలెం అని ఒక ప్రభుత్వ స్కూల్కు వెళ్లడం జరిగింది. ఆ స్కూల్ను అభివృద్ది చేయడానికి ప్రముఖ నటి, దివంగత సావిత్రి నాలుగైదు దశాబ్దాల క్రితం ఆర్దిక సాయం చేశారు. ఆ గ్రామం ఆమె అమ్మమ్మగారి గ్రామం కావడంతో ఆమె శ్రద్ద చూపించారు. అందుకు కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు స్కూల్ ఆవరణలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమె జయంతి సందర్భంగా ముఖ్య అతిధిగా వెళ్లినప్పుడు అక్కడ ఉన్న సదుపాయాలు గమనించాను. ప్రభుత్వ పాఠశాలకు బస్ సౌకర్యం స్కూల్ ఆంబియన్స్ మార్చారు. స్కూల్ లోపల కూడా రోడ్డు వేశారు. ఒకప్పుడు వంద మంది కూడా లేని స్కూల్లో ఇప్పుడు మూడు వందల మందికి పైగా ఉన్నారని గ్రామస్తులు, స్కూల్ టీచర్లు వివరించారు. వారు సొంతంగా పాఠశాల తరపున ఒక బస్ను నడిపి సమీప గ్రామాలకు పంపి పిల్లలను రప్పిస్తున్నారు. బహుశా ఒక ప్రభుత్వ పాఠశాల ఇలా బస్ నడుపుతుండడం అరుదైన విషయమే కావచ్చు. ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం స్కూల్ గోడలపై మంచి రంగు, రంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా కనిపించాయి. ఒకప్పుడు స్కూళ్లలో మంచి నీటి సదుపాయమే ఉండేది కాదు. కాని ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. టాయిలెట్లలో స్టార్ హోటళ్లలో మాదిరి పరికరాలుపెట్టారు. అయితే అక్కడ మాత్రం కాస్త నిర్వహణ లోపం కనిపించింది. నేను చూసిన మరికొన్ని స్కూళ్లలో మాత్రం టాయిలెట్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. అయినా పిల్లల కోసం అలాంటి సదుపాయం ఏర్పాటు చేయడమే ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం. డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన సదుపాయాలు ఈ మద్య తెలంగాణలో ఉన్న స్కూళ్ల పరిస్థితిని, ఏపీ స్కూళ్ల స్థితిని పోల్చుతూ కొన్ని వీడియోలు వచ్చాయి. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఒక స్కూల్కు వెళ్లినప్పుడు పిల్లలతో పాటు తాను కూడా కింద కూర్చోవలసి వచ్చింది. మరి అదే ఇప్పుడు మంచి, మంచి బల్లలు ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్లో భారీ టెలివిజన్లు ఏర్పాటై కనిపించాయి. డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన అన్ని అక్కడ ఉన్నాయి. అమ్మ ఒడి కింద పదిహేను వేలు ఒక్క బైజూస్ కంటెంట్తో కూడిన టాబ్ కావాలంటే ప్రైవేట్ స్కూళ్లలో 35 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందట. ఈ రకంగా చూస్తే ప్రవేటు స్కూళ్లలో ఎల్కేజీకే రెండున్నర లక్షల రూపాయల వ్యయం చేయవలసి వస్తుంది. కాని ఏపీలో పేద పిల్లల విద్యాబ్యాసానికి ఇంత ఖరీదైన విద్యను కాణీ ఖర్చు లేకుండా ఇస్తున్నారు. పైగా అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయలు ఇస్తున్నారు. చంద్రబాబు పిట్టలదొర కబుర్లు నమ్ముతారా? పిల్లలకు చిన్న క్లాస్ల నుంచే టోఫెల్, ఐబీ వంటివాటిలో శిక్షణ ఇవ్వాలని తలపెట్టారు. మాతృభాషకు విఘాతం కలగకుండా ఇంగ్లీష్తో పాటు, మరికొన్ని ఇతర విదేశీ భాషలు నేర్పాలన్న తలంపుతో జగన్ ప్రభుత్వం ఉంది. అలాంటి మార్పులు వస్తున్నందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతోషపడడం లేదు. పైగా పేదల చదువును అవహేళన చేసేలా మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంను అడ్డుకునే యత్నం చేశారు. బైజూస్ను జగన్ జ్యూస్ అంటూ అసభ్యంగా మాట్లాడడానికి కూడా సిగ్గు పడలేదు. పైగా ఇప్పుడు కుప్పంలో తిరుగుతూ మీ పిల్లల భవిష్యత్తుకు, మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్ కోసరం తాను పనిచేస్తానని పిట్టలదొర కబుర్లు చెబుతున్నారు. దీనిని ఎవరైనా నమ్ముతారా? 35 ఏళ్లుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సెంటర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆయన ఎందుకు బాగు చేయించలేకపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ స్కూల్ను నాడు-నేడు కింద బాగు చేయించారు. దానిని చంద్రబాబు కాదనగలరా! ఆయన ప్రభుత్వం నడిపిన రోజుల్లో ఏమనేవారో గుర్తుకు చేసుకోండి! విద్య అన్నది ప్రభుత్వ బాద్యత కాదని, ప్రైవేటు రంగం పని అని చెప్పేవారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ఏమన్నారో చూడండి. ఈనాడు నీచ రాతలు ‘మన పిల్లలకు మనం ఇచ్చే సంపద విద్యే. ప్రతి ఒక్కరిని చదివించాలి. అందుకోసం ఎంతవరకైనా వెళతాం’ అని అంటారు. బోగస్ విజనరీ చంద్రబాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్కు ఉన్న తేడా అది! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబును భుజాన ఎక్కించుకుని తిరిగే ఈనాడు మీడియా అయితే ఏకంగా పిల్లలకు టాబ్లు ఇస్తే వారు ఏవేవో చూసి పాడైపోతున్నారని నీచంగా రాసింది. దారుణమైన రీతిలో అసత్యాలు నిజానికి ఆ టాబ్ లలో విద్యకు సంబంధించిన కంటెంట్ తప్ప మరొకటి ఓపెన్ కావు. అయినా పచ్చి అబద్దాలతో, లేదా అజ్ఞానంతో ఈనాడు పేపర్ అలాంటి దిక్కుమాలిన రాతకు పాల్పడింది. అందుకే జగన్ ఒక సభలో ఈనాడు పత్రికను ప్రజలకు చూపించి ఛీ అంటూ విసిరికొట్టి బుద్ది చెప్పే యత్నం చేశారు. అయినా ఆ పత్రిక యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోగా, ఇంకా రెచ్చిపోయి దారుణమైనరీతిలో అసత్యాలు రాసి ప్రజల మీదకు వదులుతోంది. వాటిని తట్టుకుని జగన్ ముందుకు వెళుతున్నారు. విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు వాటిని అందుబాటులోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నవారు అత్యధికం బలహీనవర్గాల పిల్లలు, ఇతర వర్ణాలలోని పేదలు మాత్రమే. వారికి విద్య రావాలని తపన పడడం జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అందుకే ఇంత గొప్పగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనుకుంటే ఏపీలో విద్యారంగం వందేళ్లు వెనుకబడిపోతుందని ఫ్రొఫెసర్ రమేష్ అంటున్నారు. ఏపీ ప్రజలు విజ్ఞులే కాబట్టి తమ కోసం తపిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనబోరని సర్వేలు కూడా చెబుతున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
వైద్యం.. కొత్త ముఖచిత్రం... నాలుగేళ్లలో విప్లవాత్మక సంస్కరణలు
మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారెవరైనా మనకు తారసపడినప్పుడో లేక ఫోన్ చేసినప్పుడో వినిపించే తొలి పదం ‘బాగున్నారా..’ అని. ఆ తర్వాతే మిగతా విషయాలు. అంటే ఆరోగ్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. అప్పుడే అన్ని పనులను సవ్యంగా చేసుకోగలమని.. దేన్నయినా సాధించుకోగలమనే నమ్మకం ఉంటుంది. దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా, దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే గొప్పగా వైద్య, ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతోంది. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య.. నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఇంట్లో వారికే బాగోలేకపోతే ఎలాంటి వైద్యం కోరుకుంటామో అచ్చంగా అలాంటి వైద్యాన్నే ప్రజల ముంగిటకు తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలన్నీ శభాష్.. అనేలా విప్లవాత్మక సంస్కరణలతో ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేసింది. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరుకు చెందిన నాగమణెమ్మ ఎనిమిదేళ్ల క్రితం నరాల బలహీనత వ్యాధికి గురై మంచానికే పరిమితమైంది. భర్త గంగన్న, కొడుకు, కూతురు ఆమె బాగోగులు చూస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా ప్రస్తుతం నాగమణెమ్మ ఇంటి వద్దకు నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యుడు వస్తున్నాడు. ఆమెకు బీపీ చూసి, ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆసుపత్రికి పోవాలంటే ఆటో బాడుగకు తీసుకుని, ఇంట్లో వాళ్లు కష్టపడి తీసుకెళ్లేవాళ్లు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. గతంలో వీలును బట్టి ఏదో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లు. ఒక్కోసారి ఒక్కో వైద్యుడి వద్దకు వెళ్లడంతో ఆమె ఆరోగ్య చరిత్రపై వారికి అవగాహన లేక మందులు, వైద్యం విషయంలో కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు ఒకే వైద్యుడు క్రమం తప్పకుండా నాగమణెమ్మకు వైద్యం అందిస్తుండటంతో ఆ ఇబ్బందులేవీ లేవు. ప్రస్తుతం ఇలా ఊరూరా వైద్య సేవలందించేలా ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సాక్షి, అమరావతి : ప్రస్తుతం చిన్న చిన్న జబ్బులకు పీహెచ్సీ, సీహెచ్సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా.. గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్స్కు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు చూశాక, మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల గృహాలను సందర్శించి వారికి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఈ విధానంలో రాష్ట్రంలోని 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. ప్రతి విలేజ్ క్లినిక్లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. ఏ రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే.. ఇక్కడి నుంచే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. ఆ రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, అక్కడ అతనికి వైద్యం అందేలా చూడటం వంటి కార్యకలాపాలను సీహెచ్వో, ఏఎన్ఎం చూస్తారు. వీరు విలేజ్ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. 1.17 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ను గత ఏడాదిలో ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. 10,032 విలేజ్ క్లినిక్లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. ఈ క్రమంలో 1,17,08,895 వైద్య సేవలు అందించారు. నాడు–నేడుతో మహర్దశ ఇది 2019కు ముందు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీ. నెర్రెలు చీలిన ప్రహరీ.. పిచ్చి మొక్కలు, గడ్డితో కూడిన ఆవరణ.. అపరిశుభ్ర వాతావరణం, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి. ఇక్కడికి రావాలంటేనే రోగులు వణికిపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఆస్పత్రిలో నాడు–నేడు కింద పనులు చేపట్టింది. కుర్చీలు, ఓపీ గదులు, 10 పడకలతో ఇన్ పేషెంట్ వార్డు, కాన్పుల గది ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చూపించుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి, వాటికి శాశ్వత భవనాలు సమకూర్చే దిశగా అడుగులు వేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలు ఉన్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తుండగా 882 చోట్ల పనులు పూర్తయి అధునాతనంగా ఆస్పత్రులు తయారయ్యాయి. 121 సీహెచ్సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 443 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్క్వాష్) గుర్తింపుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గుజరాత్, కేరళ, హరియాణా, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన ప్రసూతి సేవలకు గాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. వైద్య విద్యలో నవశకం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. ఫలితంగా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు.. ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావుండదు. ప్రజలకు ఆరోగ్యశ్రీ రక్ష సీఎం జగన్.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడం ద్వారా 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 3,255కు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీని కింద 1519 రకాల ప్రొసీజర్లలో చికిత్స అనంతరం వైద్యుడు సూచించిన విశ్రాంతి సమయానికి రోజు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. ఇంకా ఎన్నెన్నో సేవలు ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ), 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను ప్రారంభంలో మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి సచివాలయాన్ని రెండు సార్లు నెలలో 104 ఎంఎంయూలు సందర్శించేలా మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ► గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ► డబ్ల్యూహెచ్వో ప్రమాణాలు కలిగిన మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్లో 105, పీహెచ్సీల్లో 172, సీహెచ్సీ ఏరియా ఆస్పత్రుల్లో 330 రకాల మందులను సమకూరుస్తున్నారు. బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రోగులకు పెట్టే ఆహారం విషయంలోను నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నారు. ► వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది. నీతి ఆయోగ్ వంటి సంస్థలు ప్రశంసించాయి. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ అని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ పేరుతో రూపొందించిన నివేదికలో నీతి ఆయోగ్ తెలిపింది. ► క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ► దేశంలో వంద శాతం పీహెచ్సీలను 24/7 నడుపుతున్న రాష్ట్రం ఏపీ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు నివేదికల్లో స్పష్టం చేసింది. ► హెపటైటిస్ నియంత్రణలో ఏపీ చర్యలు భేష్గా ఉంటున్నాయని కేంద్ర వైద్య శాఖ ప్రశంసిచింది. హైరిస్క్ వర్గాలకు ముందస్తుగా టీకా పంపిణీ చేపడుతున్న రాష్ట్రంగా కూడా రికార్డు సాధించింది. కొరతకు తావు లేకుండా.. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటికి ఏకంగా 48,639 పోస్టులు భర్తీ చేశారు. ఇక్కడితో ఆగకుండా ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది. దేశంలో స్పెషాలిటీ వైద్యులు కొరత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతం మేర ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మేర ఉంటోంది. గైనకాలజిస్టుల సంఖ్య జాతీయ స్థాయిలో కొరత 50 శాతం ఉంటే, ఏపీలో 1.4 శాతం మాత్రమే ఉంది. స్టాప్నర్స్ల కొరత 27 శాతం ఉంటే.. రాష్ట్రంలో కొరతకే ఆస్కారం లేదు. ఫలితంగా డబ్ల్యూహెచ్వో ప్రమాణాలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 4,469 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. సగటున రోజుకు 1,360 సర్జరీలు బోధనాస్పత్రుల్లో 2018–19లో సగటున రోజుకు 817 మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించే వారు. 2022–23లో రోజుకు 1360 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అప్పట్లో రోజుకు 19 వేల చొప్పున ఓపీలు, 1900 మేర ఐపీలు ఉండగా, గత ఏడాది 22 వేలకు పైగా ఓపీల చొప్పున 83.16 లక్షలు, ఐపీలు రోజుకు 2,253 చొప్పున 8.22 లక్షలు నమోదు అయ్యాయి. నాటికి, నేటికి ఎంత తేడా! కర్నూలు జీజీహెచ్లోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2019కి ముందు ఒక డాక్టర్, ఆరుగురు నర్సులు, ముగ్గురు టెక్నికల్ సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెడితే అంతే సంగతులు. సీటీ సర్జన్ ఆపరేషన్ చేసే సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కీలకమైన మిషన్ను పర్ఫ్యూజనిస్ట్లు ఆపరేట్ చేస్తుంటారు. ఇంతటి కీలకమైన పోస్టు అప్పట్లో ఖాళీగా ఉండేది. దీంతో హైదరాబాద్ నుంచి కేసుల ప్రాతిపదికన పర్ఫ్యూజనిస్ట్ను పిలిపించుకుని సర్జరీలు చేసేవారు. అత్యవసర సమయాల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోయేవారు. దీంతో 2017–18లో ఈ విభాగంలో 120 సర్జరీలు మాత్రమే చేశారు. ఓపీలు నెలకు 80లోపే చూసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విభాగంలో అదనంగా ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు రావడంతో పాటు పర్ఫ్యూజనిస్ట్ పోస్టు భర్తీ అయింది. దీంతో 2022–23లో ఏకంగా 1600 ఓపీలు నమోదు అయ్యాయి. మేజర్, మైనర్ కలిపి 566 సర్జరీలు చేశారు. మొత్తంగా 1500 పడకలున్న ఈ ఆస్పత్రిలో 2018–19లో 9.46 లక్షల ఓపీలు, 80 వేల ఐపీ, 29 వేల మైనర్, మేజర్ సర్జరీలు నమోదయ్యాయి. 2022–23లో 12 లక్షల మేర ఓపీ, లక్షకుపైగా ఐపీ సేవలు అందించడంతో పాటు, 41 వేల సర్జరీలు నిర్వహించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. అనుబంధం ఏర్పడుతుంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ చర్యలపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడం మంచి పరిణామం. గర్భిణి, బాలింత.. బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను రెండు, మూడు సార్లు చూస్తే వైద్యుడు వారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఆ వైద్యుడికి ప్రజలకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇది రోగికి మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ మానసిక బలం రోగి త్వరగా కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్ జీజీహెచ్ ప్రజారోగ్య రక్షణలో మంచి ఫలితాలు బీపీని నియంత్రణలో ఉంచుకోకపోవడంతో ప్రస్తుతం 20 శాతం పెరాలసిస్ కేసులు వస్తున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. మన దగ్గర 60 శాతం గ్రామీణ జనాభా ఉంది. గ్రామాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం 10–20 కి.మీ ప్రయాణించి చూపించుకోవడం వారికి అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైద్యుడే ఆయా గ్రామాలకు వెళ్లడం ప్రజారోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. భవిష్యత్లో గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్స్లర్, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
‘Andhra Pradesh: ఉన్నత’ వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో 48 వేలకుపైగా వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ఒక్కో ఆస్పత్రిని యూనిట్గా తీసుకుని క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో మానవ వనరులపై ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల పురోగతి, కరోనా తాజా పరిస్థితులను పరిశీలించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిబ్బందిపై ప్రతి సమీక్షలోనూ వివరాలివ్వాలి.. ప్రభుత్వాస్పత్రులను నాడు – నేడు ద్వారా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడింది. రోగుల తాకిడికి సరిపడా నియామకాలను చేపడితే సగం సమస్యలకు తెర పడుతుంది. మానవ వనరులపై ఆడిట్ నిర్వహించిన అనంతరం గుర్తించిన ఖాళీలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు మందులు సరిపడా స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి సమీక్షలోనూ నాకు వివరాలు అందచేయాలి. పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్పీసీ) అత్యంత పకడ్బందీగా అమలు కావాలి. నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) మేరకు వైద్యులు గ్రామానికి వెళ్లి సేవలు అందించాలి. జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ ఫలానా గ్రామానికి ఫలానా రోజు వస్తారనే వివరాలను ముందుగానే వెల్లడించాలి. ఆయా తేదీల్లో గ్రామానికి డాక్టర్ వస్తున్నట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలందరికీ తెలియచేయాలి. దీనివల్ల డాక్టర్ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందగలుగుతారు. ఎఫ్పీసీని మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేలా జిల్లాల్లో సమర్థులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. రక్తహీనత నివారణ.. నేత్ర పరీక్షలు గర్భిణులు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్త హీనతతో బాధపడే గర్భిణులను గుర్తించి తప్పనిసరిగా పౌష్టికాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈమేరకు కంటి డాక్టర్లకు షెడ్యూల్ రూపొందించి నెల, రెండు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయాలి. దృష్టి సంబంధిత సమస్యలున్న వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. ఎమర్జెన్సీ సీపీఆర్పై శిక్షణ విలేజ్ క్లినిక్లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (సీహెచ్వో) విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కరిక్యులమ్ను సిద్ధం చేయాలి. సీహెచ్వోలకు సరఫరా చేసే వైద్య పరికరాల వినియోగంపై బోధనాసుపత్రుల్లో శిక్షణ ఇవ్వాలి. వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో సమీక్షించాలి. దంత సంరక్షణ, ఈఎన్టీ, వృద్ధాప్య సమస్యలతోపాటు సీపీఆర్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వైద్య సేవలు అందించాలో శిక్షణ ఇప్పించాలి. వీటితోపాటు గ్రామాల్లో పాము కాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా శిక్షణ ఉండాలి. 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఏకంగా మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు. 2023–24 విద్యాసంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2024–25లో మరో 350 మెడికల్ సీట్లు అదనంగా రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 1,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 23 రోజుల్లో 20.25 లక్షల మందికి వైద్య సేవలు ఏప్రిల్ 6వతేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా గత నెల 28 నాటికి గ్రామాల్లో 20,25,903 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రక్తపోటుతో 4.86 లక్షల మంది, మధుమేహంతో 2.70 లక్షల మంది బాధ పడుతుండగా 4.43 లక్షల మంది ఈ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్యం, మందులు అందజేస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్ బాధితులు 4,649 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 1,761 మంది, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 7,042 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. పూర్తిగా అదుపులో కోవిడ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి దేశంలో 23వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 24 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లో 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు పని చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టుల్లో టెస్టులు చేస్తున్నామని, మందులు, మాస్క్లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, ఎండీ మురళీధర్రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదువుపై ఇష్టం... రామోజీకి కష్టం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కొత్త చరిత్రవైపు అడుగులేస్తోంది. ‘నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. అమ్మ ఒడి నుంచి మొదలుపెడితే జగనన్న విద్యా కానుక వరకూ అన్ని పథకాలూ చదువుపై ఇష్టం పెంచుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంటే ప్రేమగా దగ్గరకెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఇదో గొప్ప ముందడుగు. కొత్త చరిత్ర. ఫలితాలు కూడా మొదలయ్యాయి. కానీ... రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాక్షసంగా నలిపేసిన తెలుగుదేశం మాఫియాకు ఇదెంతమాత్రమూ రుచించటం లేదు. విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని విషసర్పాలుగా ఎదిగిన చంద్రబాబు నాయుడి బినామీల పని అయిపోతున్నదనే భయం ఎల్లో ముఠాను వణికిస్తోంది. ఫలితమే... కొద్దిరోజులుగా ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై వస్తున్న నెగెటివ్ కథనాలు. జూనియర్ కాలేజీలు పెట్టారు తప్ప సౌకర్యాలను పట్టించుకోలేదని ఒకనాడు... ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణతలు అంతంతమాత్రమేనని మరోనాడు... ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇంకోనాడు... ఇలా రోజుకొక విష గుళికను పాఠకుల మెదళ్లలో వేస్తున్నారు రామోజీరావు!. ఏం? రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రయివేటు మాఫియా చేతుల్లో పెట్టిందెవరు? విశాలమైన ప్రాంగణాల్లో ఉన్న జూనియర్ కాలేజీలను పరాధీనం చేసిందెవరు? కార్పొరేట్ మాఫియా చేతుల్లో విద్యార్థుల తలరాతల్ని పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? విద్యార్థులపై ఒత్తిడిని పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది అదే కార్పొరేట్ మాఫియా కాదా? వారిలో నారాయణ వంటివారు చంద్రబాబు బినామీలు కారా? అంటే ఈ ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబు కాదా? ఎందుకీ దౌర్భాగ్యపు కథనాలు? ఎందుకీ విషపు రాతలు? మీ మాఫియా మనగలిగే రోజులు పోతున్నాయనా? మీ రాతలింకా జనం నమ్ముతున్నారనే అనుకుంటున్నారా రామోజీరావు గారూ?? రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందు వరకు... అంటే 2019 వరకు 10వ తరగతి విద్యార్థుల్లో 65 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా ప్రయివేటు స్కూళ్లలో 35 శాతం వరకు ఉండేవారు. కానీ ఇంటర్మీడియెట్కు వచ్చేసరికి అది పూర్తిగా తారుమారయ్యేది. ఇంటర్ విద్యార్థుల్లో కేవలం 25 శాతం మంది ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 75 శాతం మందిది ప్రయివేటు కాలేజీల బాటే. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి మెల్లగా తన బినామీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ప్రయివేటు కాలేజీలే విద్యార్థులకు దిక్కయ్యేలా చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,600 వరకు జూనియర్ కాలేజీలుండగా అందులో 290 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మిగతావన్నీ ప్రయివేటువే. దీన్నిబట్టే చంద్రబాబు ప్రయివేటు రంగానికి ఏ స్థాయిలో మేలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు కల్పించక... అక్కడ చదివితే భవిష్యత్తు ఉండదన్న భావనను ప్రజల్లో ఏర్పడేలా చేసి వాటిని నిర్వీర్యపరిచారు. దీంతో టెన్త్ పాసైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్ కాలేజీలనే ఆశ్రయించాల్సిన దుస్థితి. అక్కడేమో లక్షల్లో ఫీజులు... అడ్డగోలు దోపిడీ!!. ఈ పరిస్థితి మారాలనుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... పునాది స్థాయి నుంచే వ్యవస్థను బలోపేతం చేసేలా ఫౌండేషన్ విద్యకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వాతావరణం ఉండేలా వాటిని వేలకోట్ల రూపాయలతో ‘నాడు–నేడు’ పేరిట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన విద్య అందేలా కరిక్యులమ్లోనూ సంస్కరణలు తెచ్చారు. ఊహించని స్థాయిలో వేలకోట్ల రూపాయలతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు. ఫలితాన్నిచ్చిన పథకాలు... ప్రభుత్వ విద్యను మెరుగు పరిచేందుకు... పాఠశాలలపై ఇష్టం పెంచేందుకు అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు పరిమితమైన ఇంగ్లీషు మీడియాన్ని ఎన్నో న్యాయపోరాటాలను కూడా తట్టుకుని అమల్లోకి తెచ్చారు. డిజిటల్ విద్యకూ శ్రీకారం చుట్టారు. వీటిల్లో కొన్ని పథకాలు విద్యా రంగ పరిస్థితులను సమూలంగా మార్చాయి. అవొక్కసారి చూస్తే... జీఈఆర్ పెంచిన అమ్మ ఒడి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో, ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 84.48. జాతీయ సగటు 99.21తో పోలిస్తే ఇది తక్కువ. పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారు జగన్. ఈ పథకం కింద ప్రతి తల్లి/సంరక్షకుడికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఇలా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి ఇస్తున్న ఈ సాయంతో... ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో జీఈఆర్ గడిచిన మూడేళ్లుగా గణనీయంగా పెరిగింది. నిపుణులు మెచ్చిన ‘విద్యా కానుక’ పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం విద్యార్థులకు కిట్ల రూపంలో బోధన–అభ్యాస సామగ్రిని అందిస్తోంది. ప్రతి విద్యార్థి కిట్లో ఒక స్కూల్ బ్యాగ్, స్టిచింగ్ ఛార్జీతో కూడిన 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగ్లీష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటోంది. గడిచిన మూడేళ్లుగా రూ.2,323.99 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి 47 లక్షల మంది చొప్పున పిల్లలకు ‘కిట్లు’ అందించింది. స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా అందరికీ పుస్తకాలు అందని గతమెక్కడ? ఆరంభమయ్యేనాటికే బుక్స్తో సహా బ్యాగులు, యూనిఫామ్, షూతో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులున్న ప్రస్తుతమెక్కడ? ఏ కొంచెమైనా పోలిక ఉందా? ఇంతటి నవశకాన్ని కనీసం ప్రశంసించని రామోజీరావును ఏమనుకోవాలి? ఇందులో కూడా రంధ్రాలు వెదికి... కొందరి బ్యాగులు పాడయ్యాయని, కొందరికి షూలు పెద్దవయ్యాయని పతాకస్థాయి కథనాలు రాసే నీచపు పాత్రికేయాన్ని ఏం చేయాలి? ఇలాంటివేవీ చేయకున్నా అధికారంలో చంద్రబాబు ఉంటే ఆహా ఓహో అనే రామోజీరావును అసలు మనిషనుకోవచ్చా? అది.. ఆడపిల్లల గౌరవం సీఎం స్వయంగా చొరవ తీసుకుని... ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ని«ధిని ఏర్పాటు చేయించారు. గడిచిన రెండేళ్లుగా రూ.874 కోట్లు ఈ నిధికి జమయ్యాయి. చదువుకునే పిల్లలు టాయిలెట్ల కోసం ఇళ్లకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని, ఆ విషయంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది సీఎం జగన్ ఉద్దేశం. అందుకే గతంలో అధ్వాన్నంగా ఉండి, శిథిలమైపోయిన టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించటం, మరమ్మతులు చేయించటంతో పాటు... వాటికి రన్నింగ్ వాటర్ ఉండేలాంటి ఏర్పాట్లూ చేశారు. వాటి నిర్వహణ కోసం 44,748 స్కూళ్లలో 47,277 మంది ఆయాలను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. దీనికోసం రూ.442 కోట్లతో స్కూల్ నిర్వహణ నిధిని (ఎస్ఎంఎఫ్) ఏర్పాటు చేశారు. ఆత్మవిశ్వాసం పెంచిన ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు విద్య అందరికీ అందాలన్నది సీఎం కల. దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా, కార్పొరేట్ మాఫియా కలిసి రకరకాలుగా చేసిన పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు జగన్. ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగా అమల్లోకి వచ్చిన ఇంగ్లీషు మీడియం విద్య... రాష్ట్రంలో ఎన్నో స్కూళ్లలో విద్యార్థుల మాట తీరునే మార్చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా తాము పోటీపడగలమన్న ఆత్మ విశ్వాసాన్ని వారిలో అణువణువునా నింపింది. అంతేకాదు! ఉన్నత ప్రమాణాలు, బోధనా పద్ధతులు ఉత్తమ మూల్యాంకన విధానానికి వీలుగా ప్రభుత్వ స్కూళ్లు దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈకి శ్రీకారం చుట్టింది కూడా. సీబీఎస్ఈ సిలబస్ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)–హైదరాబాద్, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్ (ఆర్ఎల్సీ)– అహ్మదాబాద్, సహకారంతో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. హిందూ గ్రూప్తో కలిసి టీచర్లు స్టాండర్డ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీలో (ఎస్టీఈపీ) శిక్షణ పొందారు. ఇవన్నీ కార్పొరేట్ స్కూళ్ల మనుగడనే ప్రశ్నిస్తుండటం... రామోజీ ఎదుర్కొంటున్న అసలు సమస్య. వినూత్నంగా డిజిటల్ తరగతులు... పాఠశాలలన్నిటా 6వ తరగతి నుంచి పైతరగతుల్లో ప్రతి తరగతి గదికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, అంతకన్నా కింది తరగతులకు స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటుచేయిస్తోంది. మనబడి నాడు–నేడు... తొలిదశ పూర్తయిన 15,715 స్కూళ్లలో రూ.352.32 కోట్ల అంచనాతో 10,038 స్మార్ట్ టీవీలు, 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే ఈ డిజిటల్ తరగతులతో పిల్లలకు నాణ్యమైన ఈ–కంటెంట్... దానిద్వారా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తాయి. దీనికోసం విద్యా సమీక్షా కేంద్రాన్ని (కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) కూడా ఏర్పాటుచేస్తోంది. 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ ఈ–కంటెంట్ను ఉచితంగా అందుబాటులోకి తేవటంతో... స్కూలు ముగిశాక విద్యార్థులకు వారి ఇళ్లలోనే సందేహాల నివృత్తికి ఇది ఉపయోగపడుతోంది. మారిన పాఠ్యాంశాలు... పెరిగిన ప్రమాణాలు ప్రభుత్వం 2020–21 నుండి పాఠ్యాంశాల్లో అనేక సంస్కరణలు తెచ్చింది. 1 నుంచి 7 తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఫలితాలొచ్చే పాఠ్యాంశాలపై దృష్టి సారించి మార్పులు చేయించింది. ప్రస్తుత కాలానికి అవసరమైన నైపుణ్యాలను పొందడమే లక్ష్యంగా 8, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది. సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యపుస్తకాలన్నిటినీ రెండు భాషల్లో (ఇంగ్లీషు– తెలుగు, హిందీ–తెలుగు మాదిరి) ఉండేలా అందిస్తోంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా 3 నుండి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల ద్వారా బోధనను అందిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్లలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు చెబితే పిల్లల్లో ప్రమాణాలు మెరుగువుతాయనేది ప్రభుత్వ యోచన. ఇవన్నీ ఫలితాలనిస్తుండటమే... ప్రయివేటు విద్యా రంగ మాఫియాను కొమ్ముకాస్తున్న ఎల్లో ముఠాకు నచ్చటం లేదు. మండలానికి రెండు కాలేజీలు.. అందులో ఒకటి బాలికలకే తెలుగుదేశం హయాంలో ఉన్నవి మూతపడ్డాయి తప్ప ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా రాలేదు. విశాలమైన స్థలాలతో ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పరాధీనమైపోయాయి. కార్పొరేట్ల జెండా పైపైకి ఎగిరింది. చదివించే స్థోమత లేనివారు మగపిల్లలనైతే అప్పులు చేసి కాలేజీల్లో చేర్పించటం... ఆడపిల్లలనైతే చదువు మాన్పించటం చేసేవారు. దీంతో టెన్త్ తరువాత బాలికలు డ్రాపవుటవ్వడం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో ఒకటి హైస్కూల్ను అప్గ్రేడ్ చేసి కాలేజీగా మార్చటం ద్వారా చేయాలనుకున్నారు. రెండు కాలేజీల్లో ఒకటి బాలికలకే. దీనివల్ల హైస్కూల్లో ఉత్తీర్ణులైన బాలికలందరూ తమ విద్యను కొనసాగించడానికి వీలుంటుందన్నది సీఎం జగన్ ఉద్దేశం. ఇందులో భాగంగా 292 ఉన్నత పాఠశాలల్ని బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. మొత్తం 352 కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్లస్2ను ప్రవేశపెట్టారు. 2022–23 నుండి 14 కో–ఎడ్ జూనియర్ కాలేజీలనూ బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. ఇలా మొత్తం 679 మండలాలలో రెండేసి జూనియర్ కాలేజీలుండేలా చేస్తున్నారు. విచిత్రమేంటంటే... అసలు కాలేజీలే లేనప్పుడు రామోజీరావు ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇలా కాలేజీలు ఏర్పాటు చేసినపుడు మంచి చర్యంటూ ఒక్క కథనమూ వేయలేదు. కానీ కొన్ని కాలేజీల్లో ఫలితాలు బాగా రాలేదంటూ మాత్రం ఓ కథనాన్ని అచ్చేసేశారు. అదీ.. ‘ఈనాడు’ అంటే. విద్యారంగ పథకాలకు రూ.54వేల కోట్ల ఖర్చు.. ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు రూ.54,023 కోట్లు వెచ్చించింది. చరిత్రలో ఎన్నడూ ఇంతటి భారీ మొత్తాన్ని విద్యపై ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకొని ‘నాడు నేడు’ కింద జూన్ నాటికి 24వేల అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ‘నాడు నేడు’ రెండు, మూడు దశలు కూడా పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో విద్యార్థులకు, టీచర్లకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలే... రామోజీ ముఠాకు భవిష్యత్తుపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కేజీబీవీలను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే... చంద్రబాబు హయాంలో కేజీబీవీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అనా«థ, నిరుపేద అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు విద్యనందించే ఈ సంస్థలకు కనీస నిధులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం. ఇక్కడ 6 నుంచి 10 వరకే తరగతులుండడంతో... ఆ చదువు పూర్తిచేసిన వారికి పై చదువులకు ఆస్కారం ఉండేదికాదు. డ్రాపవుట్ అయ్యేవారు. చంద్రబాబు వీటిని పట్టించుకుంటే ఒట్టు!. రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉండగా వాటిలో 84,923 మంది బాలికలు చదువుతున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దశలవారీగా మొత్తం 321 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ను అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది ఖాళీలను చంద్రబాబు అలాగే వదిలేయగా గడిచిన మూడున్నరేళ్లలో 1,377 పోస్టులను భర్తీ చేశారు. ఇంటర్మీడియెట్ను దృష్టిలో పెట్టుకొని అదనంగా గెస్టు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో అధ్యాపకులను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఈ విద్యార్థినులకు సరైన సదుపాయాలు లేవు. ఈ ప్రభుత్వం వీరికి జగనన్న విద్యాకానుక కింద అన్నీ సమకూరుస్తోంది. ఇక వీరికి హాస్టల్తో కూడిన చదువులు అందిస్తున్నా.. వీరి తల్లులకోసం అమ్మ ఒడినీ అందిస్తుండడం విశేషం. అమ్మ ఒడి ద్వారా 2020–21లో 55వేల మందికి, 2021–22లో 67వేల మందికి, 2022–23లో 84వేల మందికి రూ.15వేల చొప్పున రూ.312.80 కోట్ల లబ్ధి చేకూరింది. కాకుంటే రామోజీరావు మాత్రం ఈ వాస్తవాలేవీ చెప్పరు. విషపు రాతలే అచ్చేస్తారు. అదే పాఠకుల దౌర్భాగ్యం. పోటీపడేలా చేసిన ‘నాడు–నేడు’ ‘మన బడి నాడు– నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న 44,703 స్కూళ్లలో తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు పూర్తిచేయించారు. నాడు–నేడు 2వ దశలో రూ.4,100 కోట్లతో 17,500 స్కూళ్లలో పనులు చేయిస్తున్నారు. ఇవి రాబోయే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తాయి. మిగిలిన స్కూళ్లలో ‘నాడు–నేడు’ పనులన్నీ ఆ తరువాతి విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. కొంచెం ఖాళీ స్థలం కూడా లేకుండా ఇరుకిరుకు భవనాల్లో నడిపిస్తున్న కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా విశాలమైన ప్రాంగణాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న స్కూళ్లపై విద్యార్థులకెంత ఇష్టం పెరగిందంటే... సీట్లు లేవు అని స్కూళ్లకు బోర్డులు పెట్టేంతగా!. ఇదొక్కటి చాలు ఈ సంస్కరణల ఫలితమేంటో చెప్పడానికి. హాజరు పెంచిన ‘గోరుముద్ద’ ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై సీఎం జగన్ ఎంతశ్రద్ధ పెట్టారంటే... వారికి అందించే భోజనం మెనూను స్వయంగా తానే మార్పు చేయించారు. ఎందుకంటే... కడుపు నిండితేనే చక్కని చదువు కూడా వంటబడుతుందన్నది ఆయన మాట. స్వయంగా తానే మెనూ తయారు చేయించి... ‘జగనన్న గోరుముద్ద’ పేరిట రోజుకోరకమైన ఆహారాన్ని అందించేలా చేశారు. వారానికి ఐదు గుడ్లు, రోజూ చిక్కీలతో పాటు ఇటీవల బ్రేక్ఫాస్ట్గా రాగి జావను కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. వీటికి ప్రభుత్వం ఏటా రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. గుడ్డు నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లను అందించాలని కూడా ఆలోచిస్తోందంటేనే సర్కారు చిత్తశుద్ధి అర్థమవుతుంది. డిజిటల్ లెర్నింగ్... కొత్త చరిత్ర కోవిడ్తో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు దెబ్బతిన్నారు. అభ్యసన స్థాయిలు దిగజారాయి. అందుకే విద్యార్థులకు గూగుల్ రీడ్ ఎలాంగ్ పీఎఎల్, బైజూస్ తదితర మార్గాల్లో చదువులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 4 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు బైజూస్ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు. 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధన చేసే టీచర్లకు ప్రభుత్వం రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను అందించింది. ఈ ఏడాది కూడా 8వ తరగతిలోకి వచ్చేవారికి రూ.750 కోట్లతో ట్యాబులు అందించనుంది. ప్రతి ఏటా ఇలా 8వ తరగతిలో ఇచ్చే ట్యాబులు వారికి 10వ తరగతి వరకూ డిజిటల్ లెర్నింగ్కు పనికొస్తాయి. తరవాత ఇంటర్మీడియెట్ ఎలాగూ అందుబాటులో ఉంటుంది. అంటే... కార్పొరేట్ స్కూళ్లలో సైతం వేలకు వేలు అదనపు ఫీజులు కడితే తప్ప అందని ట్యాబులు, బైజూస్ వంటి ఎడ్యుటెక్ దిగ్గజ సంస్థ పాఠాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగానే అందుతున్నాయి. తద్వారా వారికి ఏ స్థాయిలోనైనా పోటీపడే సామర్థ్యం వస్తోంది. -
వేసవి సెలవుల్లోనూ మనబడి నాడు–నేడు
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కార్యక్రమానికి నిధుల కొరత లేదని, స్కూళ్లకు ఎండాకాలం సెలవులను సద్వినియోగం చేసుకుంటూ రెండో దశ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని, తదుపరి ఖర్చుల కోసం మరో రూ.1,400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన బడి నాడు – నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. జూన్ 12 లోగా ఐఎఫ్పీ ప్యానెళ్ల బిగింపు ఐఎఫ్పీ పానెళ్లను బిగించడం ద్వారా 15,715 స్కూళ్లలో మొదటి విడత నాడు– నేడు పనులు పూర్తైనట్లు అవుతుంది. దీంతో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి 30,230 క్లాస్రూమ్స్లో డిజిటలైజేషన్ పూర్తవుతుంది. జూన్ 12వతేదీ లోగా ఐఎఫ్పీ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి. రెండో దశలో 16,461 స్కూళ్లలో నాడు– నేడు చేపడుతున్నాం. ఫేజ్ – 3లో సుమారు మరో 13 వేల స్కూళ్లలో నాడు– నేడు ద్వారా పనులు జరుగుతాయి. వేసవి సెలవుల్లో పనులపై దృష్టి పెట్టాలి మూడు విడతల్లో దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు పనులు పూర్తవుతాయి. వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. ఈ సమయాన్ని పనుల కోసం బాగా వినియోగించుకోవాలి. కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. తొలి విడతలో ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దాలి మొదటి విడతలో నాడు– నేడు పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలి. ఎక్కడైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి. ఇంత పెద్ద సంఖ్యలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం. నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలి. పేరెంట్స్ కమిటీ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇసుక, సిమెంట్, స్టీలు లాంటివి కొరత లేకుండా పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. తద్వారా పనుల్లో ఆలస్యం జరగకుండా నివారించవచ్చు. ట్యాబ్లు బాగున్నాయా? 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5,18,740 ట్యాబ్లు ఇచ్చాం. వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనం అందేలా చూడాలి. అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి. సమస్యలుంటే ఏం చేయాలో ఎస్వోపీలు రూపొందించాం. హెడ్మాస్టర్కు గానీ స్థానిక సచివాలయాల్లో గానీ అందచేస్తే మూడు రోజుల్లోగా రిపేరు చేసి తిరిగిస్తారు. ఈ మేరకు ఎస్వోపీల అమలుపై కలెక్టర్లు పర్యవేక్షించాలి. నెలకోసారి డిజిటల్ డే గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్ డే పాటిస్తూ వారు స్కూళ్లకు వెళ్తారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై శిక్షణ ఇస్తారు. జూన్ 12న స్కూళ్లు తెరవగానే ‘విద్యాకానుక’ స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి జగనన్న విద్యాకానుక అందించాలి. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావు ఉండకూడదు. దాదాపు 43.10 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది. విద్యాకానుక పంపిణీపై ప్రోటోకాల్ను పాటించాలి. విద్యాకానుక ద్వారా అందించే వస్తువుల క్వాలిటీపై కూడా బెస్ట్ ప్రోటోకాల్ పాటించాలి. బై లింగ్యువల్ (ద్విభాషా) పాఠ్య పుస్తకాలు, మూడు జతల యూనిఫామ్, నోట్బుక్స్, బ్యాగ్, షూ, రెండు జతల సాక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బెల్టు, వర్క్బుక్స్తో కూడిన కిట్ నాణ్యతను పిల్లలకు అందించే ముందు కచ్చితంగా పరీక్షించాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను మానిటరింగ్ చేయాలి. జగనన్న విద్యాకానుకపై ఏ ఒక్క స్కూలు, ఏ విద్యార్థి నుంచి నాకు ఫిర్యాదులు రాకూడదు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలి. గతంలో పుస్తకాలు సమయానికి ఇచ్చేవారు కాదు. అక్టోబర్, నవంబర్ నెలలొచ్చినా పిల్లలకు అందేవి కావు. నా పాదయాత్ర సమయంలో ఆ ఇబ్బందులు నేను స్వయంగా చూశా. మనం వచ్చాక పాఠశాలలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం. మొత్తం వ్యవస్థలో మార్పులు తీసుకునివచ్చాం. పాఠశాలల్లో నైట్ వాచ్మెన్లను నియమించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి. ప్రతి యూనివర్సిటీ, కాలేజీల్లో ఎస్ఈబీ టోల్ఫ్రీ నంబర్ను ప్రదర్శిస్తూ పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్ను సిద్ధం చేయాలి. విద్యాసంస్థల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని నిరంతరం సమాచారం సేకరించాలి. పిల్లలు వాటి బారిన పడకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలి. మాదక ద్రవ్యాల తయారీదారులు, రవాణా, పంపిణీదారులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 15 వేల మందికిపైగా మహిళా పోలీసుల (మహిళా సంరక్షణ కార్యదర్శులు) సేవలను సమర్థంగా వినియోగించాలి. (చదవండి: పేపరు మీద లెక్కలు.. చూస్తే బోగస్ సంస్థలు!) -
‘నాడు–నేడు రెండో దశ’ జూన్ 12లోగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు రెండో దశ పనులను జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మన బడి నాడు–నేడు కింద రూ.8,000 కోట్ల అంచనా వ్యయంతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ స్కూళ్లల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం పనులు మినహా పై కప్పు, సీలింగ్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల మరమ్మతులు, నిర్మాణాలు, ఫర్నీచర్ సరఫరా–ఏర్పాటు, పెద్ద, చిన్న రిపేర్లను జూన్ 12లోగా పూర్తి చేసి స్కూళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే బాధ్యతలను సంబంధిత హెడ్మాస్టర్లకు అప్పగించాలని సూచించారు. నాడు–నేడు కోసం కొనుగోలు చేసిన మెటీరియల్ను హెడ్మాస్టర్లతో పాటు తల్లిదండ్రుల కమిటీలు తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు చేసిన మెటీరియల్ నాణ్యత లేకపోయినా, తక్కువ సరఫరా చేసినా హెడ్మాస్టర్ తిరస్కరించాలని ఆదేశించారు. స్కూళ్ల పై కప్పుల మరమ్మతుల ఫొటోలను దశల వారీగా హెడ్మాస్టర్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. తరగతి గదుల్లో మెటీరియల్ నిల్వ ఉంచినప్పుడు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. మెటీరియల్ను సురక్షితంగా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అదనపు వ్యయం అయినా హెడ్మాస్టర్లు లేదా సంబంధిత అధీకృత ప్రతినిధి జీతాల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ హెడ్మాస్టర్లకు తెలియజేసి అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేశారు. -
ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ కోసం నైట్ వాచ్మన్ల నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామకానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. వాచ్మన్లుగా నియమితులైన వారికి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని 2020–21 నుంచి మిషన్ మోడ్లో చేపట్టిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఆయా పాఠశాలల్లో రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తోంది. ఫేజ్–1 కింద 15,715 పాఠశాలల్లో ఈ పనులు పూర్తవగా ఫేజ్–2 కింద 22,228 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పాఠశాలలను ఫేజ్–3లో అభివృద్ధి చేస్తారు. ఇదేకాకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం అన్ని పాఠశాలలకు పారిశుధ్య కార్మికులుగా ఆయాలను నియమించారు. మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది. నాడు–నేడు ఫేజ్–2 కింద పాఠశాలల్లో ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ)లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేస్తున్నారు. నాడు–నేడు ఫేజ్–1 కింద పనులు పూర్తయిన స్కూళ్లలో కూడా వీటిని సమకూరుస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద కూడా అభ్యాసం చేసేందుకు వీలుగా ఐఎఫ్పీలలోని కంటెంట్తో కూడిన ట్యాబులను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. వీటికోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పరికరాలను, మౌలిక సదుపాయాల వస్తువులను రక్షించడం, భద్రంగా ఉండేలా చూడడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యంగా మారింది. వీటితోపాటు పాఠశాలల ఆవరణలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మన్లను నియమించాలని ఆదేశాలిచ్చింది. మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5,388 నాన్ రెసిడెన్షియల్ (నివాసేతర) ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క వాచ్మన్ను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధిమీనా మెమో విడుదల చేశారు. నైట్ వాచ్మన్ విధులు ► పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి. ► పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి. ► రాత్రి కాపలాదారు విధుల్లో ప్రధానమైనది పాఠశాల ఆస్తి అయిన æభవనం/ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పనిచేయాలి. ► పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి. ► ఏవైనా అసాధారణ కార్యకలాపాలు జరిగినప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పుడు, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్ మాస్టర్కు, సమీప పోలీస్ స్టేషన్కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి. ► సాయంత్రం పాఠశాల గార్డెన్కు నీరు పోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్ను శుభ్రం చేయాలి. ► పాఠశాలకు సంబంధించిన మెటీరియల్ను తీసుకురావడం, వాటిని హెచ్ఎంకు అందించడం చేయాలి. ► స్కూలుకు సంబంధించి హెచ్ఎం చెప్పే ఇతర పనులను చేయాలి. ► నైట్ వాచ్మన్ పనిని హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ► 2023 మే 1వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి. ► నైట్ వాచ్మన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్మాస్టర్ ఐఎంఎంఎస్ యాప్ ద్వారా చేపట్టాలి. ► వాచ్మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలి. మార్గదర్శకాలు.. ► పేరెంట్ కమిటీల ద్వారా పాఠశాలల్లో నైట్ వాచ్మన్ను నియమించాలి. ► ఇప్పటికే నియమితులైన ఆయా/కుక్ కమ్ హెల్పర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ► గ్రామం/వార్డులో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. ► వీరెవరూ అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తిని నియమించవచ్చు. ► నైట్ వాచ్మన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నివాసి అయి ఉండాలి. ► ఆ వార్డులో అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసిని ఎంపికచేయాలి. ► వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. ► ఇప్పుడు గుర్తించిన 5,388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించకూడదు. ► ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.6 వేల చొప్పున టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి చెల్లించాలి. -
బాబుకు స్క్రిప్టు కోసమే! మనబడి నాడు–నేడుపై ‘ఈనాడు’ కబోది కథనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు బాగు పడుతుంటే ఆనందించాల్సింది పోయి.. అదెక్కడ టీడీపీ కొంప ముంచుతుందోనని ‘ఈనాడు’ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దుతుండటం కళ్లెదుటే కనిపిస్తున్నా, లేదు లేదంటూ ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేస్తోంది. నాడు–నేడు రెండో దశ కింద ఏకంగా 22,344 స్కూళ్లలో పనులు జరుగుతుంటే.. అక్కడెక్కడో పనులు ఆగిపోయాయని యాగీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో కనీసం చాక్పీస్లకు కూడా గతిలేని వైనాన్ని మరచిపోయి.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కోడి గుడ్డుపై ఈకలు పీకుతోంది. వేల కోట్ల రూపాయలతో ఊరూరా ప్రభుత్వ స్కూళ్లలో పనులు జరుగుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా దిగజారుడు రాతలు రాస్తోంది. ప్రజలేమనుకుంటారోనన్న భయం లేకుండా తన చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలని ఉవ్విళ్లూరుతూ రోజుకో రీతిలో తప్పుడు కథనం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగం అనూహ్య రీతిలో అద్భుత ఫలితాలిస్తోందని వేనోళ్లా ప్రశంసలు వ్యక్తమవుతుండటాన్ని జీర్ణించుకోలేని రామోజీ రావు ఏదో ఒక రీతిలో ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ‘నాడు–నేడుకు నిధుల్లేవ్’ అంటూ తాజాగా తన అక్కసు వెళ్లగక్కింది. ఒక్క అధికారితో మాట్లాడకుండా, విద్యా శాఖ నుంచి వివరాలు తీసుకోకుండా తనకు తోచిన లెక్కలతో బాబుకు స్క్రిప్టు అందిస్తోంది. ఆరోపణ: నాడు–నేడుకు నిధులు లేవు వాస్తవం: ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేలా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పేదల బతుకులు మార్చే ఏకైక సాధనం విద్య మాత్రమే అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమంతో పాటు, మరెన్నో సంస్కరణలు, గొప్ప గొప్ప మార్పులు తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక ప్రభుత్వ విద్యా రంగంపై ఇంతటి వ్యయం కాని, దృష్టి కాని ఎన్నడూ.. ఎవ్వరూ పెట్టలేదు. మన బడి నాడు – నేడు మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,713 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, 2021–22లో పూర్తి చేశారు. 2021–22లో 22,344 విద్యా సంస్థల్లో రూ.8,000 కోట్లతో రెండవ దశ పనులు చేపట్టారు. విద్యా రంగం నాడు–నేడు ఇదీ పరిస్థితి ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య ఐదేళ్లపాటు పాఠశాలల్లో అభివృద్ధి కోసం రూ.1,709.64 కోట్లు మాత్రమే కేటాయించారు. అవీ పూర్తిగా ఖర్చు చేయలేదు. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2014–2019 వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఐదేళ్ల కాలంలో నాటి ప్రభుత్వం రూ.76.85 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్–1, ఫేజ్–2లో చిత్తూరు జిల్లాకు ఏకంగా రూ.1,133.09 కోట్లు కేటాయించింది. ఫేజ్ –1 కింద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ► రూ.668 కోట్లతో ట్యాబులను, రూ.778 కోట్ల విలువగల బైజూస్ కంటెంట్తో ఎనిమిదో తరగతి చదివే 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం పంపిణీ చేశారు. ► 5,800 పాఠశాలలకు 6వ తరగతిపైన ఉన్న 30,302 తరగతి గదులకు డిజిటల్ బోర్డు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్) 2023 జూన్ నాటికే అందించేలా సన్నాహాలు చేపట్టారు. దిగువ తరగతులు ఉన్న స్కూళ్లకు అంటే, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలలో 10 వేల స్మార్ట్ టీవీలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న అమ్మఒడి’ అనే వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ఈపథకం కింద అర్హులైన తల్లులు, సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తోంది. 2019–20లో 42,33,098 మంది, 2020–21లో 44,48,865, 2021–22లో 43,96,402 మంది తల్లులకు సాయం అందించారు. ► రాష్ట్రంలోని లోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను ప్రవేశ పెట్టారు. 1 నుంచి 6 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలను ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో, ద్విభాషా విధానంలో రూపొందించారు. 1 నుంచి 5 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్ లను ప్రవేశపెట్టారు. ► ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంచడం కోసం ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు చిత్రాలతో కూడిన డిక్షనరీ ఇస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నారు. విద్యార్థులకు మిర్రర్ ఇమేజ్లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు 3, 4, 5 తరగతులకు ఇంటర్మీడియట్, డీఎడ్ మాత్రమే విద్యార్హతలుగా ఉన్న ఉపాధ్యాయులు బోధించేవారు. ఇప్పుడు, ఈ తరగతులకు బీఎస్సీ, బీఈడీ అర్హతలున్న ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నారు. ప్రభుత్వం 10,114 మంది సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది. ► జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రు.2323.99 కోట్లు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి స్కూలు ప్రారంభం రోజు 3 జతల బట్టలు, షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ, టెక్స్ బుక్స్, తదితరాలను ఇస్తోంది. 2016–17లో ప్రభుత్వ బడులలో 37,57,474 విద్యార్థులు ఉండగా, ఈ కార్యక్రమాలన్నింటి వల్ల విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరోపణ: రంగులు వెలుస్తున్నాయి వాస్తవం: పనులే జరగలేదని చెబుతున్న ఈనాడు రంగులు వెలిసిపోతున్నాయని చెప్పడం విడ్డూరం. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, చిన్న, పెద్ద మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, ప్రహరీ, ఫర్నీచర్, క్యాంపస్ మొత్తానికి పెయింటింగ్, గ్రీన్ బోర్డు, ఇంగ్లిష్ ల్యాబ్ (స్మార్ట్ టీవీలు), కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు) ఇలా 12 రకాల సదుపాయాలను కల్పిస్తోంది. వేలాది స్కూళ్లలో ఇంతగా మేలు చేస్తుండటం రామోజీరావుకు కనిపించడం లేదు కాబోలు. రంగులు ఎక్కడ వెలిసిపోయాయో చెప్పకుండా, చూపకుండా ఆవు కథ రాశారు. ఆరోపణ : రూ.1,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి వాస్తవం: మన బడి నాడు – నేడు రెండవ దశ కింద రూ.8,000 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.3,750 కోట్లు విడుదల చేశారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయనే కనీస పరిజ్ఞానం లేని వారెవరూ ఉండరు. ఈనాడు చెబుతున్న రూ. వెయ్యి కోట్ల చెల్లింపులు గత నెలవి అయ్యుంటాయి. అవి ఈ నెలలోనో.. వచ్చే నెలలోనో విడుదలవుతాయి. రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నప్పుడు రూ.వెయ్యి కోట్లు పెండింగ్లో ఉంటే.. మొత్తం నాడు–నేడు కార్యక్రమమే ఆగిపోయినట్లు తప్పుడు రాతలు రాయడం చంద్రబాబు కోసమే కదా! ఆ తప్పుల తడక చిట్టా పట్టుకుని చంద్రబాబు ఊదరగొట్టాలనేగా! ఈ లెక్కన బిల్లులు రావని కాంట్రాక్టర్లలో భయం పెంచి, ఎలాగైనా సరే ఆ పనులు ఆపేయించాలన్నది రామోజీ పన్నాగం అని స్పష్టమవుతోంది. ఇది నిజం కాకపోతే రూ.3,750 కోట్లు చెల్లించారనే వాస్తవాన్ని ఎందుకు రాయలేదు రామోజీ? ఆరోపణ : విద్యార్థుల అవస్థలు వాస్తవం: పెద్ద ఎత్తున్న పనులు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న పాటి అసౌకర్యాలు సహజం. దాన్ని కూడా భూతద్దంలో చూపడం దారుణం. ఈనాడు చెబుతున్నట్లు రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలోనూ పిల్లలు ఇబ్బంది పడటం లేదు. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసినా, తూతూమంత్రంగా నిధులు విదిలించినా ఒక్క మాటా రాయని ఈనాడు నేడు వేల కోట్లతో అన్ని విద్యా సంస్థలనూ సర్వాంగ సుందరంగా మారుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. -
ఏపీలో విద్యారంగం అద్భుతం
► ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. విద్యారంగంలో నమ్మశక్యం కాని పురోగతిని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు.. ► ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. (గుంటూరులో ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ ప్రశంసల వర్షం) సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ మంత్రముగ్థులయ్యారు. ‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ ఆయన ఫిదా అయ్యారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు లక్ష్యసాధన, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముఖాముఖీగా మాట్లాడారు. ఆ తర్వాత సాయంత్రం బీఆర్ స్టేడియంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతో పాటు నగరంలోని వివిధ మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన వేలాది మంది టెన్త్ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు, చేపడుతున్న కార్యక్రమాలపై మరోమారు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో అంకితభావం ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండటం అభినందనీయమంటూ సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే, ‘నేను ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలలో పర్యటించా. కానీ ఏ దేశంలో లేని అనుభూతి, ప్రత్యేకతను నేను గుంటూరులో పొందాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచంలో ఎంతోమంది నన్ను హీరో అని పిలిచి ఉండవచ్చు.. కానీ, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇక్కడ పొందాను. వెలకట్టలేని విద్యకు, విజ్ఞానానికి అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో మంచి పాలకుడు మీకు ఉన్నారు. అంకితభావం ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. గుంటూరు ప్రాంతం విజ్ఞానం, విద్య పరంగా ఎంతో సామర్థ్యం ఉన్న ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలిశాను. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎంతో కలవబోవడం ఎంతో ప్రత్యేకానుభూతిగా ఉంది’.. అంటూ నిక్ తన అనుభూతిని పంచుకున్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. విద్యార్థిని ట్యాబ్ను పరిశీలిస్తూ.. పాఠ్యపుస్తకంలో నిక్పై పాఠం ఇది సామాన్యమైన విషయం కాదు.. ఏపీలోని ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు నేను మాట్లాడిన ఫారిన్ ఇంగ్లిష్ భాషాశైలిని అర్థంచేసుకుని, అంతేస్థాయిలో ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడిన తీరు ఎంతో అద్భుతం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత గొప్పగా ఉంటాయని నేను ఊహించలేదు. కార్పొరేట్ను తలదన్నే రీతిలో ఒక ప్రభుత్వ పాఠశాల సకల హంగులతో ఉండటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులను ఇంత గొప్ప ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడం సామాన్య విషయం కాదు. నా జీవితగాధపై పాఠ్యాంశమా!? రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 10వ తరగతి ఇంగ్లిషు టెక్ట్స్బుక్లోని మొదటి పాఠ్యాంశంగా ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్లో ‘ఆటిట్యూడ్ ఆల్టిట్యూడ్’ పేరుతో తన జీవితగాధను ముద్రించడం ఆశ్చర్యకరం. పాఠ్యాంశంగా నాకు చోటు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మీ పాఠ్య పుస్తకంలో రాసిన నా జీవితం గురించి చదివారా? (మీ గురించి చదివామని విద్యార్థులు చెప్పగా, ఆయన ఆంతులేని ఆనందానికి లోనయ్యారు.) నాడు–నేడుతో పాఠశాల రూపం మార్చేశారు.. నిక్ వుజిసిక్తో టెన్త్ విద్యార్థిని సాజిదా మాట్లాడుతూ.. ‘నేను చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన చలువతో మా పాఠశాలలో అన్ని రకాల వసతులతో చదువుకుంటున్నాం. జగనన్న విద్యాకానుక కిట్లు, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియంతో నేను ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన మీతో ఆంగ్లంలో ఇలా మాట్లాడగలుగుతున్నాను.. వైఎస్ జగన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాను’. (ఆత్మవిశ్వాసంతో సాజిదా చెప్పిన మాటలకు నిక్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.) నాడు–నేడుతో ‘కార్పొరేట్’ను తలదన్నేలా.. మరో విద్యార్థిని డి. శిరీష మాట్లాడుతూ.. ‘ఇంగ్లిష్ టెక్ట్స్బుక్లో మీ బయోగ్రఫీ చదివి స్ఫూర్తి పొందా. ప్రపంచం మెచ్చే మోటివేషనల్ స్పీకర్గా ఎదిగిన తీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాడు–నేడుకు ముందు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. సరిపడా తరగతి గదుల్లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే, జగన్ మావయ్య సీఎం అయిన తరువాత నాడు–నేడు ద్వారా కల్పించిన వసతులతో మేం కార్పొరేట్ పాఠశాలలను మించిన స్థాయిలో ఆధునిక తరగతి గదులు, నూతన ఫర్నిచర్పై కూర్చుని తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ లైట్ల మధ్య ఏకాగ్రతతో చదువుకునేందుకు అవకాశం కలిగింది. జగనన్న విద్యాకానుక కిట్తో ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పొందడంతో పాటు 8వ తరగతిలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో నాణ్యమైన బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన తీరు అద్భుతం’.. అంటూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శిరీష నిక్ దృష్టికి తెచ్చింది. దేశంలోనే బెస్ట్ సీఎం వైఎస్ జగన్ ఇక సీఎం వైఎస్ జగన్ ఎంతో విజన్ కలిగిన నాయకునిగా దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారని నిక్ వుజిసిక్ అభివర్ణించారు. ఆ తర్వాత వేణుగోపాల్నగర్లోని కోన బాల ప్రభాకరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్ పుష్ప స్వయంగా గీసిన నిక్ చిత్రాన్ని ఆయనకు బçహూకరించగా ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంసలహాదారు ఆర్. ధనుంజయరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. కాలాన్ని ఎదిరించిన కాలు! ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణుడు, ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ రాసిన వ్యాసాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగాలు లక్షల మందిలో వెలుగులు నింపి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. టెట్రా అమీలియా సిండ్రోమ్ కారణంగా నిక్ కాళ్లు, చేతులు లేకుండా జన్మించినా నిక్ నైరాశ్యం చెందలేదు. అతి స్వల్పంగా ఉన్న ఎడమ తుంటి భాగం సాయంతో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆయన మెల్బోర్న్లో పుట్టారు. 2002లో ఆస్ట్రేలియా నుంచి అమెరికా చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారాలని నిర్ణయించుకుని 2005లో లైఫ్ వితౌట్ లిమిట్స్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. 2007లో ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే మరో సంస్థను ప్రారంభించారు. కొద్దిపాటి కాలుతోనే అన్నీ.. నిక్ కష్టాల గురించి తెలుసుకోవాలంటే పొద్దున్నే లేవగానే ఒళ్లు విరుచుకునేందుకు కాళ్లు చేతులు లేకపోవడం.. కాస్తంత దురదగా అనిపించినప్పుడు, ప్రేమగా కౌగిలించుకునేందుకు చేతులు లేకపోవడం ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. 26 ఏళ్లుగా ఆయన్ను ఇవేమీ ఆపలేకపోయాయి. ఫుట్బాల్, గోల్ఫ్తోపాటు ఈత, సర్ఫింగ్ లాంటివి ఆయన వ్యాపకాలు. అవయవ శేషంగా మిగిలిన కొద్దిపాటి కాలుతోనే ఆయన టైప్ చేస్తుంటారు. పెన్నుతో రాస్తుంటారు. ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆసరాగా వినియోగిస్తుంటారు. తన కాలును ఆయన సరదాగా చికెన్ డ్రమ్స్టిక్ అని వ్యాఖ్యానిస్తుంటారు. సాధారణ బడికే.. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం నిర్వహించే స్పెషల్ స్కూళ్లకు కాకుండా సాధారణ పాఠశాలలకే పంపాలని తన తల్లిదండ్రులు తీసుకున్న కఠిన నిర్ణయం తనను రాటుదేల్చిందని నిక్ చెబుతుంటారు. నిక్ పుట్టగానే ఆస్పత్రిలో ఆయన్ను చూసిన తండ్రి షాక్ తిని వాంతి చేసుకున్నాడు. నాలుగు నెలల వయసు వచ్చేవరకు నిక్ తల్లి సైతం ఆయన్ను దరిచేర్చుకోలేకపోయారు. ► న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ ఆథర్ ► ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు ► 2005లో యంగ్ ఆస్ట్రేలియన్ అవార్డు ► ద బటర్ ఫ్లై సర్కస్ షార్ట్ ఫిల్మ్లో నటనకు 2010లో ఉత్తమ నటుడిగా ఎంపిక. ► ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా 2011లో స్విట్జర్లాండ్లో నిక్ ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ► 2012లో జీవిత భాగస్వామి కనే మియహరను కలుసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. -
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ కార్యక్రమాలు అద్భుతం
సాక్షి, అమరావతి: నాబార్డ్ సాయంతో విద్యారంగంలో చేపడుతున్న మనబడి నాడు–నేడు కార్యక్రమం, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ప్రశంసించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నాబార్డ్ చైర్మన్తో పాటు.. ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా నాబార్డ్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాబార్డ్ సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ, మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నాయని సీఎం వివరించారు. ఏపీలో 3 ఏళ్లలో మూడురెట్లు పెరిగిన వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలో మూడు రెట్లు వ్యాపారం పెరగడం నిజంగా గొప్ప విషయమన్నారు. మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమ్మేళనం(బ్యాంకర్స్ కాంక్లేవ్)కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే రూ.10 వేల కోట్ల టర్నోవర్ దాటిన తొలి బ్యాంక్గా కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్యాంక్ను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన బ్యాంకులు కూడా మారుమూల ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే రుణాల్లో కనీసం 40 శాతం సహకార బ్యాంకుల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పాడి, పశుపోషణ, మత్స్య అనుబంధ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండు గ్రామాలకొకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఎసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. నాబార్డ్ నిబంధనలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎలాంటి పెనాల్టీలు పడవని, బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా అంతరాయం ఏర్పడదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీలో సహకార బ్యాంకులు సీడీ రేషియో 140 శాతం సాధించడం పట్ల ఎంపీ బాలశౌరి బ్యాంకర్స్కు అభినందనలు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి చిరంజీవిచౌదరి, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: క్వాలిటీ వైద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. ఇందులో భాగంగానే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద ఆస్పత్రుల బలోపేతానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తద్వారా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం’ అని మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం సందర్భంగా 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలకు కార్యరూపం ఇస్తూ అడుగులు ముందుకు వేశారు. ఫలితంగా మన రాష్ట్రంలోని అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాష్) గుర్తింపు దక్కింది. ఏకంగా 443 ప్రభుత్వాస్పత్రులకు ఎన్క్వాష్ గుర్తింపుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 209 ఆస్పత్రులతో రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో కేరళ (134), నాలుగో స్థానంలో హరియాణ (121), ఐదో స్థానంలో తెలంగాణ (114) ఉన్నాయి. ఎన్క్వాష్ అంటే.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016 నుంచి అత్యున్నత ప్రమాణాలతో రోగులకు నాణ్యమైన సేవలందించే ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాష్) గుర్తింపు ఇవ్వడం ప్రారంభించింది. ఆస్పత్రిలోకి రోగి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని బయటకు వెళ్లేంత వరకు అన్ని స్థాయిల్లో సదుపాయాల కల్పనను పరిగణనలోకి తీసుకుంటారు. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రు(డీహెచ్)లకు ఎన్క్వాష్ గుర్తింపు ఇస్తారు. పీహెచ్సీల్లో 6 విభాగాల్లో 1,600 రకాల అంశాలను.. ఏరియా, సీహెచ్సీ, డీహెచ్లలో 18 విభాగాల్లో 6,625 అంశాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు రోగి సింక్ వద్దకు వెళ్లి చేతులు కడుక్కునే తీరు, ఆహారం తీసుకునే విధానం, వారికి మందులు ఇచ్చే విధానం తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తారు. ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోసిŠట్క్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 70 శాతానికి పైగా పాయింట్లు సాధించిన ఆస్పత్రులకు ఎన్క్వాష్ గుర్తింపు ఇస్తారు. అప్పట్లో 26 ఆస్పత్రులకే ఎన్క్వాష్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నామ మాత్రంగా కేవలం 26 ఆస్పత్రులకు మాత్రమే ఎన్క్వాష్ గుర్తింపు ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకాం చుట్టారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడిచిన మూడున్నరేళ్లలోనే ఏకంగా 417 ఆస్పత్రులకు ఎన్క్వాష్ గుర్తింపు లభించింది. వీటిలో 391 పీహెచ్సీలు, 25 సీహెచ్సీలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి నెలలోగా 200 వరకూ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్లకు ఎన్క్వాష్ గుర్తింపు కోసం వైద్య శాఖ దరఖాస్తు చేయనుంది. కాగా, ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్సీలను అభివృద్ధి చేయడం కోసం రూ.664.96 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు, శిథిలావస్తలో ఉన్న పీహెచ్సీ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్, ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి సైన్ బోర్డులు, రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు, మరుగుదొడ్లు, ఆస్పత్రికి వచ్చిన రోగులు కూర్చోవడానికి కుర్చీలు ఇలా అన్ని రకాల వసతులు సమకూరాయి. ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది అనేదానికి గత మూడున్నరేళ్లలో ఏకంగా 391 పీహెచ్సీలకు ఎన్క్వాష్ గుర్తింపు రావడమే నిదర్శనం అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, పలు సూపర్ స్పెషాలిటీ, గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తోంది. మానవ వనరుల కొరతకు చెక్ పెడుతూ వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీ చేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాగా పెరిగారు. ‘లక్ష్య’ గుర్తింపులో రెండో స్థానం మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ప్రసూతి సేవలకుగాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపు విభాగంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంసీహెచ్ వర్క్షాప్లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు ప్రదానం చేసింది. ఆస్పత్రుల్లో ప్రసూతి సేవల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు లక్ష్య గుర్తింపు వస్తుంది. నెలకు వంద, అంత కంటే ఎక్కువ ప్రసవాలు జరిగే ఆస్పత్రులకు ఈ గుర్తింపు పొందడానికి అర్హత ఉంటుంది. కాగా, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్లలో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు ఈ గుర్తింపు ఇస్తారు. మన రాష్ట్రంలో 40 ప్రభుత్వాస్పత్రులకు ఇప్పటి వరకు లక్ష్య గుర్తింపు లభించింది. ఎన్క్వాష్, లక్ష్య ఇతర కేంద్ర వైద్య శాఖ ఇచ్చే గుర్తింపు పొందిన ఆస్పత్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభిస్తాయి. ఆస్పత్రి వాతావరణంతో రోగి ప్రభావితం ఆస్పత్రుల్లోని వాతావరణం రోగులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ సరిగా ఉండదు. వసతుల కొరత ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు రావడానికి మొగ్గు చూపరు. ఈ క్రమంలో వాటి రూపురేఖలు మార్చడం ద్వారా సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా తయారైన ఆస్పత్రులన్నీ ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా తయారవుతున్నాయి. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తగ్గుతుంది. శుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం రోగులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. – డాక్టర్ యాదల అశోక్బాబు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రత్యేకాధికారి విలేజ్ క్లినిక్లకూ ఎన్క్వాష్ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు నాడు–నేడు కింద ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఎన్క్వాష్ గుర్తింపు కలిగిన ఆస్పత్రులు మన రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లకు కూడా ఎన్క్వాష్ గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం 10,032 విలేజ్ క్లినిక్లు నెలకొల్పింది. దశల వారీగా వీటికి ఎన్క్వాష్ కోసం దరఖాస్తు చేస్తున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఎన్క్వాష్ గుర్తింపు సంవత్సరం ఆస్పత్రులు 2017–18 4 2018–19 22 2019–20 46 2020–21 కరోనా కారణంగా సర్టిఫికేషన్ ప్రక్రియ ఆపేశారు 2021–22 306 2022–23 65 (మరో 23 ఆస్పత్రులకు అసెస్మెంట్ పూర్తి. ఫలితాలు రావాల్సి ఉంది.) ––––––––– -
ఆధునిక అంగన్వాడీలు
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఆ చిన్నారులకు తోడుగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి పట్ల సానుకూల ధృక్పథంతో పని చేయాలి. 10 – 12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నాడు–నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించి అంగన్వాడీలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేస్తూ మూడు విడతల్లో ఈ పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, ప్రతి మండలంలోనూ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంగన్వాడీల్లో టీచింగ్ క్వాలిటీపై మరింత దృష్టి సారించడంతోపాటు మాంటెస్సొరీ తరహా విద్యా విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. 63 సీడీపీవో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలని సూచించారు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగాల తరహాలో మహిళా శిశు సంక్షేమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమగ్ర పర్యవేక్షణ అంగన్వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణతో చిన్నారులకు ఆహ్లాదకరమైన మంచి వాతావరణాన్ని అందించాలి. అంగన్వాడీల ద్వారా అందించే పాలు, గుడ్లు పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎస్వోపీలు రూపొందించుకోవాలి. ఆహారం పంపిణీలో ఎక్కడైనా లోపాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సూపర్వైజర్లపై కూడా పర్యవేక్షణ ఉండాలి. ఫ్లేవర్డ్ మిల్క్ పంపిణీ అంగన్వాడీ కేంద్రాల్లో నూటికి నూరుశాతం పిల్లలకు పాల పంపిణీ జరగాలి. పిల్లలకు ఫ్లే్లవర్డ్ పాల పంపిణీని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో ఫ్లే్లవర్డ్ మిల్క్ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలి. అంగన్వాడీలలో బోధనపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహ్లాదకరంగా ఉత్తమ బోధనా విధానాలను అందుబాటులోకి తేవాలి. స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. విలేజ్, వార్డు క్లినిక్స్ సేవలు అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలి. చిన్నారులకు వైద్యపరంగా ఎలాంటి చికిత్స అవసరమైనా ఆరోగ్యశ్రీ వినియోగించుకుని మెరుగైన వైద్యం అందచేయాలి. ఎవరైనా తల్లీబిడ్డలు రక్తహీనత, పౌష్టికాహార లోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే నివారించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి. ఈ విషయంలో అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలి. రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా అదనంగా అందించి ఆరోగ్యం మెరుగుపడేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దీనిపై సమగ్ర ఎస్వోపీలు రూపొందించుకోవాలి. ఈ విధానాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పరిష్కారం చూపించాలి. తల్లులకు టేక్ హోం రేషన్ విధానాన్ని లోపాలకు తావులేకుండా అమలు చేయాలి. సమీక్షలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు.ఎ, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, మార్క్ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
నాడు-నేడుకు లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యామౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమానికి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లను విరాళంగా అందించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వార్డు (కాలిన గాయాలకు సంబంధించిన) నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. సత్యనారాయణచావా.. సీఎం జగన్తో తెలిపారు. నాడు- నేడు పథకం కింద లారస్ ల్యాబ్స్ విరాళాన్ని అందించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో సీఈఓ డా.సత్యనారాయణ చావా, కార్పొరేట్ డెవలప్మెంట్, సింథసిస్ మరియు ఇంగ్రిడియంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు చావా, సీఎస్ఆర్ హెడ్ సౌమ్య చావా ఉన్నారు. చదవండి: (సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ) -
ముమ్మరంగా నాడు – నేడు రెండోదశ పనులు
నెల్లూరు(టౌన్): ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజలకు చిన్నచూపు ఉండేది. అక్కడ సౌకర్యాలు ఉండవని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పంపేవారు. నేడు పరిస్థితి మారింది. కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో తొలివిడతలో 1,059 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.232 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడత పనులు ప్రస్తుతం శరవేగంగా నాణ్యతగా జరుగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 15 శాతం నిధులు విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేట్ లుక్లో విద్యార్థులకు స్వాగతం చెప్పనున్నాయి. ఏం చేస్తారంటే.. ఎంపికైన పాఠశాలలు, అంగన్వాడీలు, బీఈడీ, డైట్ కళాశాలల్లో మొత్తం పది రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. పెయింట్ వేయిస్తారు. లైట్లు, ఫ్యాన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం కుర్చీలు, బెంచీలు, ఇంగ్లిష్ ల్యాబ్, గ్రీన్ చాక్బోర్డు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. మేజర్, మైనర్ రిపేర్లు చేపడతారు. ఎక్కడంటే.. కొత్త నెల్లూరు జిల్లాలో రెండో విడత నాడు – నేడులో భాగంగా 1,357 పాఠశాలలు, అంగన్వాడీలు తదితరాలను ఎంపిక చేశారు. మొత్తం 531 పాఠశాలల్లో 1,841 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. రెండో విడత పనుల కోసం ప్రభుత్వం రూ.466.40 కోట్లను కేటాయించింది. దీనికి సంబంధించి తొలిదశలో రూ.79.67 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను నేరుగా ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటికే రూ.72.10 కోట్లు ఖర్చు చేసి పనులు చేశారు. మిగిలిన నిధులను దశల వారీగా ప్రభుత్వం ఆయా అకౌంట్లలో జమ చేయనుంది. పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు నాడు–నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, మండల స్థాయిలో ఎంఈఓ, ఏపీఎం, డివిజన్ స్థాయిలో డిప్యూటీ డీఈఓ, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ ఎస్ఈ, సమగ్రశిక్ష ఈఈ కమిటీల్లో ఉన్నారు. సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ రోజూ తమ బడులకు వెళ్లి పనులను ఫొటో తీసి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. త్వరగా పూర్తి చేయాలి నాడు–నేడు పనుల కోసం రూ.4 కోట్ల మేర సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ (ఫర్నీచర్, శానిటరీ, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్స్, సిరామిక్ టైల్స్ తదితరాలు) జిల్లాకు వచ్చింది. వీటితోపాటు సిమెంట్ కూడా వచ్చింది. పనులను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి. పనులు జరుగుతున్న పాఠశాలల్లో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష జూనియర్ కళాశాలల్లోనూ.. జిల్లాలోని 22 జూనియర్ కళాశాలలను నాడు–నేడుకు ఎంపిక చేశారు. వాటిల్లో పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడం, కళాశాల భవవాలకు మరమ్మతులు, పెయింట్ వేయించడం, గ్రీన్ చాక్బోర్డు, కుర్చీలు, బల్లలు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.13.44 కోట్లను మంజూరు చేశారు. తొలివిడతలో భాగంగా రూ.2.42 కోట్లను తల్లిదండ్రుల కమిటీ అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటివరకు రూ.1.62 కోట్లను ఆయా పనుల కోసం ఖర్చు చేశారు. కళాశాలల్లో నాడు–నేడు పనులను కూడా మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
అంగన్వాడీలను తీర్చిదిద్దాలి
పిల్లలు చిన్న వయసులోనే ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. అందువల్ల అంగన్వాడీల నుంచే వారికి భాషపై గట్టి పునాది అందించాలి. అంటే అభ్యాస సామర్థ్యం (లర్నింగ్ ఎబిలిటీ) పొంపొందించుకునేలా మాంటిస్సోరీ విధానంతో కూడిన కరికులమ్ (బోధనాంశం) అందుబాటులోకి తేవాలి. అప్పుడే వారి మెదడు పరిణతి చెందుతుంది. చాలా విషయాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇందుకు అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి. ఈ మార్పుల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలను అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు పనుల పురోగతి వంటి అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వీటిలో మార్పు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సిబ్బంది నియామకాలతోపాటు ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా రావాల్సి ఉందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్వైజర్స్ సక్రమంగా పనిచేస్తే అంగన్వాడీల పనితీరు మెరుగు పడటంతోపాటు నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్వైజర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సూపర్వైజర్ల పనితీరుపైనా తనిఖీలు ఉండాలని చెప్పారు. అంగన్వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం అన్నారు. సార్టెక్స్ బియ్యం సరఫరా చేయాలని, న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దని ఆదేశించారు. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు అన్నింటిలోనూ నాణ్యత పెరగాలని, ఆ ఫలితాలు కనిపించాలని చెప్పారు. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలని, ఇందు కోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖాళీలు భర్తీ చేయండి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా సీడీపీఓ నియామకాలు చేపడతామని అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏటేటా సంక్షేమ వ్యయం పెరుగుదల
సాక్షి, అమరావతి: విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక స్పష్టంచేసింది. సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. రాష్ట్రాల వారీగా సామాజిక రంగం, ఆస్తుల కల్పన వ్యయంతో పాటు రాష్ట్రాల సొంత పన్ను ఆదాయాల వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొత్త పీహెచ్సీలు, మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపడుతున్నందున ఆ రంగాల్లో వ్యయం ఎక్కువగా ఉంది. మరోపక్క.. నవరత్నాల పేరుతో అర్హులైన వారందరికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నందున సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా ఏటా పెరుగుతోందని నివేదిక వివరించింది. మరోపక్క.. ఆస్తుల కల్పన వ్యయం కూడా బాబు హయాంలో కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక స్పష్టంచేసింది. 2018–19లో ఆస్తుల కల్పన వ్యయం రూ.35 వేల కోట్లుండగా 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ.36,224 కోట్లు చేసిందని.. అదే 2021–22లో ఆస్తుల కల్పన వ్యయం రూ.47,583 కోట్లకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. కానీ, ఆర్థిక మందగమనంతో పాటు కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల రాష్ట్ర సొంత పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది. 2021–22లో మాత్రం సొంత పన్ను ఆదాయం పుంజుకుందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక 2018–19లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.58,677 కోట్లు రాగా 2019–20లో రూ.57,601 కోట్లే వచ్చింది. 2020–21లో మరింత తగ్గి రూ.57,359 కోట్లకు పరిమితమైంది. అదే 2021–22లో మాత్రం రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.85.265 కోట్లుగా ఆర్బీఐ పేర్కొంది. -
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
వైద్యరంగంలో సత్ఫలితాలిస్తున్న నాడు-నేడు పనులు
-
నాడు– నేడు’ స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’
అనంతపురం: విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి ‘నాడు–నేడు ’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కలి్పంచేందుకు ‘పీఎం శ్రీ’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 1,174 పాఠశాలలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, మండల పరిషత్, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మొత్తం 42 అంశాల్లో ఎన్ని అమలు అవుతున్నాయో వాటి వివరాలను బట్టి 1,174 పాఠశాలల నుంచి తుది జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2026–27 వరకు దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రీన్ స్కూల్స్, పాఠశాల ఆవరణంలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు, సేంద్రీయ విధానంలో తోటల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన, నీటి యాజమాన్య పద్ధతులు, వాతావరణ మార్పుల గురించి విద్యార్థులకు వివరించడం, విద్యలో గుణాత్మకమైన మార్పులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం, ప్రతి విద్యారి్థకీ మేథమేటిక్స్, సైన్స్ కిట్లు అందజేయడం చేస్తారు. అలాగే పాఠశాల వార్షిక నిధులు అందేలా చూడడం, స్మార్ట్ తరగతులు, డిజిటల్ శిక్షణ నిర్వహించడం, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీలు ఏర్పాటు చేయడం, నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం చేస్తారు. తుది జాబితా ఎంపిక చేస్తాం పీఎం శ్రీ పథకానికి సంబంధించి పాఠశాల వివరాలను పంపాలని విద్యాశాఖ కోరింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రాథమికంగా 1,174 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇందులో 42 పాయింట్లను బట్టి పాఠశాలల తుది జాబితాను ఎంపిక చేస్తాం. – కే. వెంకట కృష్ణారెడ్డి, ఇన్చార్జి డీఈఓ, అనంతపురం (చదవండి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!) -
వడివడిగా బడి దిశగా.. 1.43 లక్షల డ్రాపవుట్స్ తిరిగి బడికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరూ మంచి చదువులు చదవాలని, ప్రపంచస్థాయిలో పోటీ పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి బడుల రూపురేఖల్ని మారుస్తోంది. పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో మంచి చదువులు చదివేలా పలు సంస్కరణలు చేపట్టింది. బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడి బాట పట్టించేలా పలు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించి మరీ బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడుల్లో చేర్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనే 4 నుంచి 14 ఏళ్లలోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి, వారిలో 1,43,573 మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించింది. – సాక్షి, అమరావతి సచివాలయాలు కేంద్రంగా డ్రాపవుట్స్ను తిరిగి బడిలో చేర్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా స్కూళ్ల నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ను రూపొందించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి పాఠశాల వయస్సుగల పిల్లలందరూ స్కూళ్లలో చేరారో లేదో పరిశీలిస్తోంది. ఈ సర్వే, పాఠశాల విద్యా శాఖ అందించిన సమాచారం మేరకు బడి మానేసిన పిల్లల ఇళ్లకు సంక్షేమ, విద్యా అసిస్టెంట్, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వలంటీర్ వెళ్తున్నారు. పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. ఎక్కువ కాలం బడికి రాకపోతే అందుకు కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారా, బాల్య వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. వాటికి పరిష్కారాలను చూపి, తల్లిదండ్రులకు నచ్చ చెప్పి మరీ పిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆ వివరాలను, తల్లిదండ్రులతో సిబ్బంది మాట్లాడుతున్న ఫొటోలను ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్ రిథమ్ యాప్లో నమోదు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ పిల్లలు పాఠశాలలకు వస్తున్న తీరును సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా పిల్లలు వరుసగా మూడు రోజులు బడికి హాజరు కాకపోతే తల్లిదండ్రులకు వలంటీర్లు ఫోన్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. తిరిగి వారు బడికి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు హాజరవుతున్నారా లేదా అనే వివరాలను కూడా రిథమ్స్ యాప్లో నమోదు చేస్తున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్ వారంలో ఒక రోజు తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూలు సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. నెలలో ఒక రోజు ఏఎన్ఎం స్కూళ్లను సందర్శించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి, వ్యాక్సినేషన్ వివరాలు సేకరిస్తున్నారు. వారంలో ఒక రోజు మహిళా పోలీసు స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. వీరందరూ తమ పరిశీలనలో వెల్లడైన వివరాలను రిథమ్స్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఆ వివరాలకు అనుగుణంగా ఎక్కడైనా సమస్యలు, లోపాలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రతి గురువారం సీఎస్ సమీక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి పిల్లల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కూళ్లలో పిల్లలు హాజరు, బడి మానేసిన వారిని తిరిగి బడుల్లో చేర్పించడంపై సమీక్షిస్తున్నారు. తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిశీలన సత్ఫలితాలనిస్తోంది. పిల్లల్ని బడి బాట పట్టించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో డ్రాపవుట్స్ తగ్గి, స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరుగుతోంది. -
విద్యాశాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సెర్ప్తో షేర్
ఒంగోలు: విద్యాశాఖలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ ఎంఈఓలు నిర్వహిస్తున్న విధుల్లో కొన్నింటిని సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న ఏపీఎంలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంలు ప్రస్తుతం సెర్ప్లో స్వయం సహాయక సంఘాలు, స్త్రీ నిధి తదితర బ్యాంకు లింకేజీ స్కీములను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాశాఖకు కేటాయించిన ఏపీఎంలు నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వంటి వాటిని పర్యవేక్షిస్తారు. మండల విద్యాశాఖ అధికారికి వీటి నుంచి మినహాయింపు ఇవ్వడంతో పనిభారం తగ్గుతుంది. తద్వారా వారు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పాఠశాలల తనిఖీలు, పాఠశాలల్లో సిలబస్ నిర్ణీత సమయానికి పూర్తిచేస్తున్నారా, హాజరు ఎలా ఉంది, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. పనులు వేగవంతం అయ్యేందుకు ఉపయోగం సెర్ప్లోని అదనపు ప్రాజెక్టు మేనేజర్లను ఎంఈవో బాధ్యతల్లో కొన్నింటిని పర్యవేక్షించేందుకు ఇవ్వడం వలన పనులు వేగవంతం అవుతాయి. సాధారణంగా ఎంఈవోలకు చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నింటిని సమన్వయం చేసుకునే సమయంలో విద్యాప్రమాణాల పెంపుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీఎంలను ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యా ప్రమాణాల మెరుగుదల, మరో వైపు నాడు–నేడు వంటి పనుల పర్యవేక్షణ వేగవంతం అవుతాయి. – బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి -
నాడు- నేడు పనులు అద్వితీయం
కడప ఎడ్యుకేషన్: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు మన బడి నాడు– నేడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాడు– నేడు కింద దశల వారీగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తొలివిడతలో రూ. 270 కోట్లు వెచ్చించి 1000 పాఠశాలలను అభివృద్ధి చేశారు. అలాగే రెండవ విడత మరో అడుగు ముందుకేసి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్వాడీ, జూనియర్ కళాశాలలను కలుపుకుని మొత్తం 1008 సంస్థల్లో నాడు– నేడుతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం రూ. 301.81 కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటి వరకు పలు రకాల అభివృద్ధి పనుల కోసం రూ. 37.73 కోట్లు ఖర్చు చేశారు. నాడు– నేడు పనుల నిర్వహణలో రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. ఈ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. అంగన్వాడీ, జూనియర్ కళాశాలల్లోనూ.. మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేపట్టిన నాడు నేడు పనులను రెండవ విడతలో మరో అడుగు ముందుకేసి అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో కూడా చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీకేంద్రాలు, జూనియర్ కళాశాలలకు సంబంధింది రూ.301.81 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 87 అంగన్వాడీ కేంద్రాలలో అధనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనుల కోసం రూ. 1392 లక్షలను మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.71.78 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 635 ప్రాథమిక పాఠశాలల్లో నాడు– నేడు పనులతోపాటు 135 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.9187 లక్షలు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.1384.51 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 82 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 44 అదనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనులకు రూ.1480 లక్షలు కేటాయించగా ఇప్పటి వరకు రూ.243 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 195 హైస్కూల్స్కు 794 అదనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనులకు సంబంధించి రూ.17410 లక్షలు మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ. 2030.68 లక్షల ఖర్చుచేశారు. 9 జూనియర్ కళాశాలలకు నాడు నేడు పనులకు రూ.712.50 లక్షలు కేటాయించగా రూ.43.56 లక్షలు ఖర్చు చేశారు. 15 మందితో మానిటరింగ్ కమిటీ: ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్వాడీ, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన నాడు– నేడు రెండవ విడత అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా 15 మంది సిబ్బందితో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతోపాటు ఎక్కడైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకుంటుంది. అలా ఏవైనా సమస్యలుంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు. నాడు– నేడు పనుల్లో మన జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. పనులు పారదర్శకంగా చేపట్టాలి జిల్లా వ్యాప్తంగా రెండవ విడత ఎంపిక చేసిన పాఠశాలలతోపాటు అంగన్వాడీ, జూనియర్ కళాశాలల్లో నాడు– నేడు రెండవ విడత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులను పారదర్శకంగా చేపట్టేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలి. – అంబవరం ప్రభాకర్రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి -
AP: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి.. బడికి నిధుల వెల్లువ
టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్కారు పాఠశాలల నిర్వహణను గాలికొదిలేశారు. వాటి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టి బడుల రూపురేఖలు మార్చేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు(టౌన్): పాఠశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఖర్చు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా నిధులు విడుదల చేసేవారు. అది కూడా విద్యాసంవత్సరం ముగిసే సమయంలో వచ్చేవి. ఒక్కోసారి రెండేళ్ల నుంచి మూడేళ్లు వరకు కూడా నిధులు విడుదల చేసేవారు కాదు. దీంతో స్కూళ్ల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో నుంచి డబ్బు తీసి ఖర్చు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పరిస్థితి మారింది. సకాలంలో నిధులను కేటాయించి విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో అండగా నిలిచారు. తక్షణ గ్రాంట్ కింద.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 3,343 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.8,88,45,000 గ్రాంట్ను మంజూరు చేసింది. తక్షణం గ్రాంట్ కింద రూ.1,77,69,000ను ఇటీవల విడుదల చేసింది. కాంపోజిట్ గ్రాంట్స్ను పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. 1 నుంచి 30 మంది ఉండే స్కూల్కి రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది ఉంటే రూ.75 వేలు, 1,000 మందిపైన ఉండే బడికి రూ.లక్ష ఇస్తారు. ఈ నిధులను విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, వాటర్ బిల్లులు, మైనర్ రిపేర్స్ తదితర వాటికి ఖర్చు చేయాలి. ఎమ్మార్సీలకు ఇలా.. మండల రీసోర్స్ సెంటర్లకు నిధులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 47 మండల రీసోర్స్ సెంటర్లున్నాయి. ఒక్కో దానికి రూ.70 వేలు చొప్పున రూ.32.90 లక్షలను ఇచ్చారు. ఎమ్మార్సీల నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, టెలిఫోన్లు, కంప్యూటర్ల నిర్వహణ తదితర వాటికి నగదును ఖర్చు చేయనున్నారు. సీఆర్సీలకు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 318 స్కూల్ కాంప్లెక్స్లున్నాయి. ఒక్కో దానికి రూ.19 వేలు చొప్పున రూ.60.42 లక్షలు నిధులను విడుదల చేశారు. అదే విధంగా ఒక్కో స్కూల్ కాంప్లెక్స్కు మొబైల్ సపోర్ట్ టు సీఆర్సీ కింద రూ.1,000 రూ.3.18 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని మొత్తం 318 స్కూల్ కాంప్లెక్స్లకు రూ.63.60 లక్షల నిధులను విడుదల చేసింది. దీనిపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూసీలు అందజేయాలి పాఠశాలలకు విడుదల చేసిన కాంపోజిట్ గ్రాంట్స్ ఖర్చులపై యుటిలైజేషన్ సర్టి ఫికెట్లను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందజేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మున్సిపల్ స్కూళ్లకు కూడా కాంపోజిట్ నిధులను విడుదల చేశారు. ఇప్పటికే స్కూల్ మెయింటెనెన్స్, టాయ్లెట్ గ్రాంట్స్ను ఆయా పాఠశాలలకు అందజేశాం. స్కూల్ కాంప్లెక్స్ల అభివృద్ధికి దోహదపడాలి. – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష -
మన బడి నాడు-నేడుతో పాఠశాలల్లో ఆధునిక వసతులు
-
‘నాడు-నేడు’ను గుర్తించిన వరల్డ్ బ్యాంక్.. ఆర్థిక సాయం ప్రకటన
ఏపీ ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణల కోసం అమలు చేస్తున్న నాడు-నేడు పథకాన్ని ప్రపంచం బ్యాంకు గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన చదువులు అందించే ‘నాడు-నేడు’కు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం ప్రకటించింది. 250 మిలియన్ డాలర్లతో మరింత సమర్థవంతంగా పథకం అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 250 మిలియన్ డాలర్ల నిధులను షరతులు లేని రుణంగా మంజూరు చేసింది. రాష్ట్రంలో నాడు-నేడు పథకం క్రింద పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఇప్పటికే నిర్వహిస్తున్నారు. సాల్ట్ (SALT-Supporting AP Learning Transformation) ప్రాజెక్టు కింద కొత్తగా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ సాయంతో మొత్తం ప్రపంచ బ్యాంకు నిధులతో పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన ఇది తొలి ప్రాజెక్టుగా నిలవనుంది. గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం రూ. 53 వేల కోట్ల ఖర్చు చేసింది. ఒక్క అమ్మ ఒడి పథకానికే రూ.19,617 కోట్లు సీఎం జగన్ కేటాయించారు. వచ్చే ఇదేళ్లలో ఈ నిధులను ఉపయోగించుకుని జరిగే అభివృద్ధి ని ప్రోగ్రాం ఫర్ రిజల్ట్స్ కింద చూడనున్నట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది. చదవండి: విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు 14, 15 న దక్షిణాది రాష్ట్రాల సదస్సు పాఠశాల విద్యలో ఉత్తమ పద్ధతులు, సంస్కరణలే ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యం పెంచాలనే ఉదేశ్యంగా దక్షిణాది రాష్ట్రాల యుడిఐఎస్ఈ సదస్సును విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా సంస్కరణలను చర్చించడంతో పాటు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు పథకంపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. -
అటెండెన్స్ యాప్తో డుమ్మాలకు చెక్.. గంటలోనే సమాచారం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మనబడి నాడు–నేడుతో ఎన్నో బడుల రూపురేఖలు మారిపోయాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తెచ్చారు. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందిస్తున్నారు. విద్యాకానుక అందజేస్తున్నారు. బోధనపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు స్కూల్ అటెండెన్స్ యాప్ను తెచ్చారు. దీంతో పిల్లలు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం ఉండడంతో వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు బడికి వెళ్లకుండా క్లాసులకు డుమ్మా కొట్టేవారు. దీంతో వారు చదువులో వెనుకంజలో ఉండేవారు. ఈ విషయంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉండేది. విద్యార్థుల హాజరు పక్కాగా ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అటెండెన్స్ యాప్ను కొంతకాలం క్రితం ప్రారంభించింది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతితోపాటు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేస్తున్నారు. యాప్లో రోజూ ఉదయం 10 గంటల్లోపే వివరాలు నమోదు చేస్తున్నారు. వీరు భోజనం కూడా చేస్తారా లేదా అనే విషయాన్ని మరో విండోలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి హెచ్ఎం లాగిన్ ద్వారా ఆన్లైన్ చేయనున్నారు. ఏమి చేస్తారంటే.. రోజూ అటెండెన్స్ యాప్లో విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. విద్యార్థి గైర్హాజరైన సమాచారాన్ని హెచ్ఎం లాగిన్లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ విషయం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్కు వెళ్తుంది. అనంతరం హాజరు కాని విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులతోపాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడతారు. అలాగే విద్యార్థి వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే సంబంధిత సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్కు సమాచారం పంపుతారు. దీంతో వారు స్వయంగా విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు ఎందుకు గైర్హాజరయ్యారన్న కారణం తెలుసుకుంటారు. రోజూ బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాణించాలంటే.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించి పని ఉన్న సమయంలో తమ వెంట తీసుకెళ్తుంటారు. దీని వల్ల వాళ్లకి చాలా పాఠాలపై అవగాహన ఉండదు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని నిబంధన విధించింది. ఈ విధంగానైనా తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపిస్తారని భావించింది. కాగా విద్యార్థి బడికి వచ్చే బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేయకుండా ప్రభుత్వం అటెండెన్స్ యాప్ను తెచ్చింది. దీంతోపాటు రోజూ క్రమం తప్పకుండా స్కూల్కి వస్తేనే చదువు మెరుగుపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. వీరు ఉన్నత విద్యలో రాణించాలంటే బేసిక్ లెవల్ గట్టిగా ఉండాలని ప్రభుత్వం భావించింది. పిల్లలు సక్రమంగా బడికి వచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్) బడికి రావాలన్నదే లక్ష్యం ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా బడికి వచ్చి చదువులో రాణించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశారు. పిల్లలపై పర్యవేక్షణకు కొత్తగా అటెండెన్స్ యాప్ను అమల్లోకి తెచ్చారు. ఆయా తరగతి టీచర్ హాజరును యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు కూడా బడికి రెగ్యులర్గా వస్తారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – పి.రమేష్, నెల్లూరు డీఈఓ -
Andhra Pradesh: రోజూ ప్రత్యేక మెనూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రతి రోజు ప్రత్యేక మెనూ అమలు చేయడంతో పాటు టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లలో రెండు దశల్లో, గురుకుల పాఠశాలల్లో మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని పటిష్ట కార్యాచరణతో పూర్తి చేయాలని చెప్పారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. గురుకులాల విద్య (అకడమిక్) వ్యవహారాల పర్యవేక్షణను పాఠశాల విద్య (స్కూల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి తేవాలని చెప్పారు. మండలాల్లో అకడమిక్ వ్యవహారాలు చూస్తున్న మండల విద్యా శాఖ అధికారు(ఎంఈఓ)లకే గురుకులాల అకడమిక్ బాధ్యతలు అప్పగించాలా.. లేక మరో విధంగా చేయాలా.. అనే విషయంపై పూర్తి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ‘మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఏ విధంగా పర్యవేక్షణను పటిష్టం చేస్తున్నామో.. గురుకులాల్లో కూడా అదే తరహాలోనే పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ (ఎస్ఓపీ), ప్రత్యేక యాప్ రూపొందించాలి. గురుకుల పాఠశాలలు, వెల్ఫేర్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం ఒక్కో అధికారి ప్రత్యేక పరిధిని నిర్ణయించి సమగ్రంగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలి’ అని ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాణ్యమైన భోజనం పెట్టాలి ► రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి పెట్టే భోజనం అత్యంత నాణ్యతగా ఉండాలి. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలి. ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వండి. ► హాస్టల్ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలి. విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లలో పారిశుధ్యం, పరిశుభ్రతలపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీని లింక్ చేయడంపై కూడా శ్రద్ధ వహించాలి. హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ► వైద్యులు క్రమం తప్పకుండా హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలి. (ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు) విలేజ్ క్లినిక్స్, స్థానిక పీహెచ్సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలి. హాస్టళ్ల నిర్వహణలో సిబ్బంది ఖాళీలను గుర్తించి, భర్తీ చేయాలి. వీటన్నింటిపై తగిన కార్యాచరణ సిద్ధం చేసి నాకు నివేదించాలి. నాడు–నేడు ప్రతిపాదనలు ఇలా ► రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు–నేడు కింద టాయిలెట్లు, విద్యుదీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్ పనులు, సిబ్బందికి.. విద్యార్థులకు ఫరి్నచర్.. డెస్క్లు, బంకర్ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్ టేబుల్, గార్బేజ్ బిన్స్ తదితరాలకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. ► కిచెన్ ఆధునికీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్ మెషీన్, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్ వెసల్స్, డస్ట్ బిన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. 55 ఇంచ్ల స్మార్ట్ టీవీతో పాటు క్రీడా సామగ్రి, లైబ్రరీ బుక్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పీడిక రాజన్న దొర, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆరి్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ప్రభుత్వ హాస్టళ్లకు ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. మండలాల్లో అకడమిక్ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓకు సంబంధిత మండలంలోని గురుకుల పాఠశాలల అకడమిక్ బాధ్యతలను అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. ►మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తున్నామో ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలి. ►దీనికోసం ఎస్ఓపీలు రూపొందించాలి. ►పర్యవేక్షణకోసం ప్రత్యేక యాప్కూడా రూపొందించాలి. ►మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లపై ఈ అధికారులతో పర్యవేక్షణ చేయాలి. ►పర్యవేక్షణ వరకూ వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. ►ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించి పర్యవేక్షణ చేయించాలి. ►మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు కూడా విధివిధానాలు ఖరారుచేయాలి. ►గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు. ►టాయిలెట్లు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్ పనులు. ►సిబ్బందికి, విద్యార్థులకు ఫర్నిచర్ కల్పనలో భాగంగా డెస్క్లు, బంకర్ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్ టేబుల్, గార్బేజ్ బిన్స్. ►కిచెన్ ఆధునీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్ మెషీన్, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్ వెసల్స్, డస్ట్ బిన్స్. ► 55 ఇంచీల స్మార్ట్ టీవీతో పాటు క్రీడాసామగ్రి, మరియు లైబ్రరీ బుక్స్ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు తయారుచేశామన్న అధికారులు. ►గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు – నేడు పనులు చేయాలని సీఎం ఆదేశం. ►2 విడతలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాడు –నేడు. ►పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►డ్రైనేజీని లింక్ చేయడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►హాస్టల్ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలన్న సీఎం. ►విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలని సీఎం ఆదేశాలు. ►ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ►ఈమేరకు ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు. ►ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం అత్యంత నాణ్యతతో ఉండాలని స్పష్టంచేశారు. ►హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ►హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ►క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలి. ►ఈ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ను కూడా తయారుచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. ►విలేజ్క్లినిక్స్, స్థానిక పీహెచ్సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలి. ►హాస్టళ్ల నిర్వహణలో ఖాళీలను కూడా గుర్తించి, భర్తీచేయాలి. ►పై నిర్ణయాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధంచేసి తనకు నివేదించాలని ఆధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
నారావారి పల్లె ఎంపిపి స్కూలులో ఆధునిక సౌకర్యాలు
-
AP: వైద్య రంగానికి చికిత్స
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావివ్వకుండా గత మూడేళ్లలో చర్యలు చేపట్టాం. ఏకంగా 45 వేల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. ఇప్పటి వరకు 40,800 మందిని నియమించాం. మిగిలిన పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అక్టోబర్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించాం. వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకూడదన్న నాన్న గారి లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేశాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన వైద్య ఆరోగ్య రంగానికి విప్లవాత్మక కార్యక్రమాలు, చర్యలతో చికిత్స చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా జబ్బు బారిన పడితే పేదలు అప్పులపాలు కాకుండా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించేలా సమూల మార్పులు చేశామని చెప్పారు. శాసనసభలో మంగళవారం విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమంపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాడు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులు శిథిలావస్థకు చేరినా పట్టించుకోని దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం, సెల్ఫోన్ లైట్ వెలుతురులో ఆపరేషన్ చేయడం వంటి ఘటనలు అప్పట్లో చూశాం. అలాంటి æపరిస్థితుల్లో 2019లో అధికారంలోకి వచ్చాక మనసు పెట్టి వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మన రాష్ట్రంలో టయర్–1 సిటీలు లేవు.. ► తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు రాష్ట్రాల్లో మాదిరిగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి టయర్–1 సిటీలు మన రాష్ట్రంలో లేవు. ఈ కారణంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న పరిస్థితులు మన దగ్గర లేవు. దీంతో ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తెస్తే ప్రజలకు మంచి చేయగలుగుతాం అని ఆలోచించి.. ఆ దిశగా వేగంగా అడుగులు వేశాం. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. నిరుపేదలు పెద్ద పెద్ద జబ్బుల బారిన పడినప్పుడు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు. ► ఆ మహానేత మరణం తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టే నాటికి టీడీపీ ప్రభుత్వం రూ.680 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిపెట్టి పోయింది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు విముఖత చూపే పరిస్థితి. ► ఈ క్రమంలో డాక్టర్లా చికిత్స మొదలు పెట్టాను. టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.680 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. చెల్లింపుల్లో ఎటువంటి తారతమ్యాలకు పోలేదు. నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి ఈ రోజున బిల్లు చెల్లింపులు.. చంద్రబాబు హయాంలో కంటే చాలా వేగంగా చేస్తున్నాం. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ► వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం. అంటే నెలకు రూ.40 వేల ఆదాయం ఉండే మధ్యతరగతి కుటుంబాలకూ పథకాన్ని వర్తింపజేశాం. ఫలితంగా 95 శాతానికి పైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ► గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ అక్టోబర్ 5వ తేదీ నుంచి ఏకంగా 3,118 ప్రొసీజర్లకు పథకాన్ని వర్తింప చేయబోతున్నాం. ప్రొసీజర్ల సంఖ్య పెంచడం, మరో వైపు నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లు చెల్లింపుల ద్వారా ఈ పథకాన్ని బలోపేతం చేశాం. ► ప్రతి ప్రభుత్ర ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మారుతున్న ఆస్పత్రుల రూపురేఖలు ► రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇందుకోసం ఏకంగా రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో నాడు–నేడు కింద 11,888 పనులు చేపట్టగా 4,851 పనులు పూర్తయ్యాయి. ► వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్సీ), ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్), జిల్లా ఆస్పత్రులు (డీహెచ్), బోధనాస్పత్రుల వరకూ నాడు–నేడు కింద అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి చోటా పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నాం. ► గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలు ఈ రెండూ కూడా ప్రివెంటివ్ కేర్లో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తాయి. ఈ క్రమంలో గ్రామాల్లో రూ.1,692 కోట్ల వ్యయంతో 10,032 హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 3,673 క్లినిక్స్ నిర్మాణం పూర్తయింది. మిగిలినవి ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. విలేజ్ క్లినిక్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం ఉంటారు. ► ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు లేదా ఒక పీహెచ్సీ ఒక సీహెచ్సీ లేదా ఒక పీహెచ్సీ ఒక ఏరియా ఆస్పత్రి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటారు. తద్వారా ప్రతి మండలంలో నలుగురు వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రతి గ్రామానికి నెలలో రెండు మూడు సార్లు వైద్యుడు ► త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండు, మూడు సార్లు సందర్శిస్తాడు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. పీహెచ్సీలో ఉండే ఇద్దరు వైద్యుల్లో ఒకరు రోజు విడిచి రోజు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించి, అక్కడే వైద్య సేవలందిస్తారు. ► దీంతో మెజారిటీ జబ్బులకు గ్రామాల్లోనే వైద్యం అందుతుంది. వైద్యుడితో గ్రామస్తులకు అనుబంధం ఏర్పడుతుంది. నెలలో రెండు, మూడు సార్లు గ్రామాన్ని సందర్శించడంతో ప్రజలను వైద్యుడు పేరు పెట్టి పిలిచే పరిస్థితులు ఏర్పడతాయి. ఓ వైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీ స్థాయిలో అడుగులు వేస్తుండగా, మరో వైపు సీహెచ్సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నాం. ఈ ఆస్పత్రులు క్యురేటివ్ కేర్లో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా 17 వైద్య కళాశాలలు ► రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. వీటని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ.. కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. పాడేరు, విజయనగరం, నర్సీపట్నం, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, ఆదోని, నంద్యాల, పార్వతీపురంలలో వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. ► పాత కళాశాలల అభివృద్ధి, కొత్త కళాశాలల ఏర్పాటు కోసం రూ.12,268 కోట్లు వ్యయం చేస్తున్నాం. విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రి వరకు అన్ని స్థాయిల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులు చేపట్టాం. నాడు–నేడు ద్వారా విద్య, వైద్య ఆరోగ్య రంగంలో పూర్తి మార్పులు వచ్చే ఏడాది, రెండేళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. -
CM YS Jagan: చదువుతోనే వెలుగు
ప్రపంచం మారుతోంది. చదువులు మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా 2040 నాటికి చదువులు ఎలా ఉండాలి? వాటికి తగ్గట్టుగా పిల్లలను ఎలా తయారు చేసుకోవాలి? అనే ప్రణాళికను ప్రపంచం రచించుకుంటోంది. రాష్ట్రంలో మాత్రం 2019కి ముందు వరకూ 1950 నాటి విద్యా విధానం, దశాబ్దాలుగా పట్టించుకోని ప్రభుత్వ పాఠశాలలే కనిపించేవి. చదువుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడే పరిస్థితి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను సమూలంగా మార్చేశాం. తద్వారా ప్రభుత్వబడుల్లో (2018–19లో) ఉన్న 37,20,988 మంది పిల్లల సంఖ్య ఇప్పుడు 44,29,561కు పెరిగింది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఉన్నత ప్రమాణాలు, అత్యుత్తమ బోధనతో కూడిన మంచి చదువులను పిల్లలకు అందించడం ద్వారానే రాష్ట్రంలోని పేదల ఇళ్లలో వెలుగులు నింపగలుగుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విద్యా రంగంపై చేసే ఖర్చు మానవ వనరులపై, భవిష్యత్తుపై పెట్టుబడేనని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, వేల కోట్ల రూపాయల నిధులతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూళ్ల మేలు కోసం ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారని, చివరకు నాటి సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలోని స్కూళ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అసెంబ్లీలో మంగళవారం విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమం అమలుపై జరిగిన చర్చలో ఆయన సమాధానమిచ్చారు. ‘విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, వ్యయంపై రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా రకరకాలుగా మాట్లాడుతోంది. విద్యా రంగం, పిల్లల చదువుల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి వంటింది. రాబోయే సమాజం మీద, మంచి పౌరులను తయారు చేసేందుకు పెట్టుబడి పెడుతున్నాం’ అని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రైట్ టు ఇంగ్లిష్ మీడియం.. ► స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఆర్థిక, సామాజిక కారణాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోతున్నారు. ప్రపంచం అంతా ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేస్తుంటే.. ప్రభుత్వమే దగ్గరుండి అటు వైపు అడుగులు వేయించకుండా అడ్డుకోవడం చూశాం. ► వచ్చే తరం పిల్లలు నాణ్యమైన అభివృద్ధి వైపు అడుగులు వేయించేలా చదువుల్లో మార్పులు తీసుకువస్తేనే ప్రతి ఇంటా వెలుగులు నిండుతాయి. ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది. ఆ లక్ష్యంతోనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం. రైట్ టూ ఎడ్యుకేషన్ కేవలం ఒక నినాదంగా కాకుండా రైట్ టు ఇంగ్లిష్.. రైట్ టు హయ్యర్ ఎడ్యుకేషన్గా పేదరికంలో ఉన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి, వారందరినీ గొప్పగా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. మనబడి నాడు–నేడుతో ప్రస్ఫుటమైన మార్పు గత ప్రభుత్వ హయాంలో కునారిల్లిన్న ప్రభుత్వ విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతూ చేపట్టిన మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో ఇప్పుడు ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తోంది. నాడు–నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ బడిలో 12 రకాల మౌలిక సదుపాయాలు సమకూరాయి. ► ప్రతి పాఠశాలలో రన్నింగ్ వాటర్తో కూడిన మంచి టాయిలెట్ ► మంచి నీటి సరఫరా ► చిన్నా, పెద్ద రిపేర్లు ఏమైనా ఉంటే చేయించడం ► ప్రతి క్లాస్ రూమ్లో విద్యుదీకరణ, ట్యూబ్ లైట్, ఫ్యాన్లు అందుబాటులోకి తేవడం ► విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంచి ఫర్నీచర్ సమకూర్చడం ► ప్రతి క్లాస్ రూమ్లో గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు ► స్కూల్ బిల్డింగ్కు మంచి రంగులు వేయించడం ► ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు ► ప్రహరీ నిర్మాణం ► ప్రతి స్కూల్లో మంచి కిచెన్ షెడ్ నిర్మాణం ► అవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం ► నాడు–నేడు పూర్తయిన క్లాస్ రూమ్లను డిజిటలైజేషన్ స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్నాం.. ► రాష్ట్ర వ్యాప్తంగా 45 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు, ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్ స్కూల్స్గా మారుతున్న అంగన్వాడీలు, హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద 57 వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇందుకోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► తొలి దశలో 15,715 పాఠశాలల్లో రూ.3,700 కోట్ల నిధులతో సమూలమైన మార్పులు తెచ్చాం. ఈ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసం స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు పెడుతున్నాం. నాడు–నేడు రెండో దశ కింద 22,344 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నాం. వీటిలో రూ.8 వేల కోట్లతో సకల సదుపాయాలు కల్పించనున్నాం. ► అభివృద్ధి చేసిన ప్రతి పాఠశాలలో టాయిలెట్ల నిర్వహణ, స్కూల్ నిర్వహణ కోసం ఫండ్ను ఏర్పాటు చేశాం. ఈ తరహాలో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఇలా ఏటా రూ.448 కోట్లు టాయిలెట్ నిర్వహణ కోసం కేటాయిస్తున్నాం. టాయిలెట్లు, పాఠశాలల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 44,968 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 47 వేల మంది ఆయాలను రూ.6 వేల గౌరవ వేతనంతో నియమించి, నిర్వహణ కోసం అవసరమైన సదుపాయాలను కల్పించాం. ► స్కూళ్ల భవన నిర్వహణ కోసం ఈ ఏడాది నుంచి నిధిని ఏర్పాటు చేస్తున్నాం. చిన్న చిన్న రిపేర్లను పట్టించుకోకుంటే పాఠశాలలు అధ్వాన్నంగా మారుతాయని అమ్మ ఒడి లబ్ధిదారుల నుంచి సేకరించిన రూ.450 కోట్లు నిధికి జమ చేశాం. ఈ నిధి ద్వారా స్కూల్స్లో అప్పటికప్పుడు అవసరమైన రిపేర్లు, ఇతర పనులు చేస్తారు. ► ఉన్నత విద్యా రంగంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల వల్ల కళాశాలల్లో గరిష్ట చేరికల నిష్పత్తి (జీఈఆర్) పెరిగేలా చేస్తున్నాం. ఉన్నత విద్యలో జీఈఆర్.. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్లో 55 శాతం, రష్యాలో 86 శాతం, చైనాలో 58 శాతం ఉండగా మన దేశంలో 29 శాతంగా ఉంది. రాష్ట్రంలో దీన్ని 2030 నాటికి 70 శాతానికి తీసుకు వెళ్లాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. కృష్ణాజిల్లా కంకిపాడు మండల పరిషత్ పాఠశాల నేడు. (ఇన్సెట్లో) నాడు ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు ► ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ లేకుండా చేయడం, పాఠ్య పుస్తకాలు నెలల తరబడి అందించకపోవడం గతంలో ఉండేది. మధ్యాహ్న భోజన పథకాన్ని నీరు గార్చారు. వీటన్నిటి ద్వారా అసలు ప్రభుత్వ బడులకు పిల్లలను పంపండమే వేస్ట్.. అనే ఆలోచనను తల్లిదండ్రుల్లో తీసుకొచ్చారు. ఇలాంటి చర్యల ద్వారా తమకు కావాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు మేలు చేశారు. ► ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు లేక ఆడ పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని తెలిసినా నాడు పట్టించుకోలేదు. మంచి నీరు, కాంపౌండ్ వాల్స్, బల్లలు, చివరికి బ్లాక్ బోర్డు కూడా సరిగా లేని పరిస్థితులను తీసుకువచ్చి.. ప్రభుత్వ బడుల్లో ఏమీ ఉండదనేలా చేశారు. ► ఈ కారణాల వల్ల డ్రాపౌట్ రేటు గణనీయంగా పెరిగింది. వసతులు లేకనే డ్రాపౌట్ రేటు పెరుగుతున్నా దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోని అధ్వాన్న పాలనను అప్పట్లో చూశాం. నాడు కునారిల్లిన చదువులు ► చంద్రబాబు హయాంలో పాఠశాల విద్యలో గరిష్ట చేరికల రేషియో చాలా అధ్వాన్నంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా అట్టడుగున ఉండేది. కేంద్ర విద్యా శాఖ గణాంకాలు 2018 ప్రకారం 2015–16లో ప్రైమరీ పాఠశాలల్లో చేరే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దేశంలో 99.21 శాతంగా ఉండగా, మన రాష్ట్రంలో 84.48 శాతం ఉండింది. ► అప్పట్లో రాష్ట్రం చంఢీఘర్, డామన్డయూ, లక్ష్య ద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలతో మాత్రమే పోటీ పడేలా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలకు పూర్వ వైభవం తేవడం కోసం విప్లవాత్మకంగా అడుగులు ముందుకు వేశాం. ► దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు సాయం చేస్తున్నాం. ఇలా ఈ మూడేళ్లలో 84 లక్షల మందికి పిల్లలకు సంబంధించి 44.5 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.19,617.60 కోట్లు జమ చేశాం. గోరు ముద్ద పథకం ద్వారా రోజుకో మెనూతో మధ్యాహ్న భోజనం కింద పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇదే గోరు ముద్ద పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఏటా రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► విద్యా కానుక కింద పాఠశాలలో చేరే సమయానికి ప్రతి పిల్లవాడికి బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, కుట్టుకూలి, బెల్ట్, ఒక జత షూస్, రెండు జతల సాక్స్లు, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్, నోట్ బుక్స్, ఇంగ్లిష్ టూ తెలుగు డిక్షనరీ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 8వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు ► విద్యా కానులో భాగంగా ఈ ఏడాది 4.70 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులు, దాదాపు 50 వేల మంది ఉపాధ్యాయులకు రూ.665 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్లను నవంబర్ చివరి వారంలో పంపిణీ చేయనున్నాం. బయటి మార్కెట్లో రూ.16 వేల విలువైన ఈ ట్యాబ్లను రివర్స్ టెండర్ల ద్వారా రూ.12,840కే కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నాం. ► ఇప్పుడు 8వ తరగతి పిల్లలు 2025లో సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు వీలుగా ఈ ట్యాబ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీరికి బైజూస్ ఆన్లైన్ కంటెంట్తో పాఠాలు అందించేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు ఖర్చయ్యే బైజూస్ లెర్నింగ్ యాప్ను ట్యాబ్లలో పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతోంది. 24.74 లక్షల మందికి జగనన్న విద్యా దీవెన ► ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు తోడుగా ఉండేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా 24.74 లక్షల మంది పిల్లలకు రూ 8,365 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1,777 కోట్లు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. ► వసతి దీవెన పథకం కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.3349.57 కోట్లు అందించాం. ఈ రెండు పథకాల కోసం గత మూడేళ్లలో రూ.11,715 కోట్లు ఖర్చు చేశాం. ఆకట్టుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు–నేడు, గోరుముద్దతో సహా విద్యా రంగ కార్యక్రమాలపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘ కాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని స్కూళ్లలో, ఆయన సొంత గ్రామం నారావారిపల్లెలోని స్కూళ్లలో నాటి స్థితిగతులు, నాడు–నేడు కార్యక్రమంతో ఇపుడు సర్వాంగ సుందరంగా మారిన స్థితిని ఫొటోలతో సహా ప్రదర్శిస్తూ వివరించారు. -
బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైద్యరంగంలో నాడు-నేడుతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో వైద్యరంగంలో నాడు-నేడుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 'దివంగత నేత వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని తెచ్చారు. చంద్రబాబు హయాంలో వైద్యరంగాన్ని అసలు పట్టించుకోలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించాం. మన తన బేధం లేకుండా.. బాలకృష్ణ నడుపుతున్న బసవతారం ఆస్పత్రికి గతంలో కన్నా ఇప్పుడే టైం టు టైం ఆరోగ్యశ్రీ డబ్బుల్ని ఇస్తున్నాం. చంద్రబాబు హయాంలో కన్నా.. జగన్ హయాంలోనే బసవతారకం ఆస్పత్రికి బిల్లలు సకాలంలో వస్తున్నాయన్న మాట అక్కడ కూడా వినిపిస్తోంది. చదవండి: (దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు: సీఎం జగన్) గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం. సెల్ఫోన్ లైటింగ్లో ఆపరేషన్లు చేయడం చూశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి అనేక చర్యలు చేపట్టాం. 5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ఇప్పుడు 90శాతం మందికి పైగా ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నారు. వైద్యరంగంలో నాడు-నేడు కింద రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లీనిక్ ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను 3,118కి పెంచాం. ఫ్యామిలీ డాక్టర కాన్సెప్ట్ తీసుకువస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైద్యరంగంలో 45వేల ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజీల కోసం రూ.12,268 కోట్లు ఖర్చుపెడ్తున్నాం' అని సీఎం జగన్ తెలిపారు. -
దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యారంగంలో నాడు- నేడుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందన్నారు. గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవని, డ్రాప్ ఔట్ రేట్ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే తాము అధికారంలో వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. ‘కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదు. కుప్పంలో స్కూళ్లు దీనావస్థలో ఉండేవి. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లను గాలికొదిలేశారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాం. మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం. మొదటి దశలో 15717 స్కూళ్లలో నాడు-నేడు పూర్తయింది. రెండో దశలో భాగంగా 22వేల స్కూళ్లలో అభివృద్ధి చేస్తున్నాం. నిర్మాణంపైనే కాదు నిర్వహణపైనా దృష్టి పెట్టాం. టాయిలెట్లు, స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేశాం. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా పిల్లలకు అండగా నిలుస్తున్నాం. గతంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ అట్టడుగున ఉన్న పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులకు పునర్ వైభవం కల్పించాం. అమ్మ ఒడి పథకం ఓ విప్లవాత్మక ముందడుగు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. అమ్మ ఒడితో మూడేళ్లలో 84లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరింది. అమ్మ ఒడి పథకానికి రూ.17వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం. జగనన్న గోరుముద్ద పథకంతో పౌష్టికాహారం అందిస్తున్నాం. గోరుముద్ద పథకానికి ఏడాదికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యాకానుక కింద రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇస్తున్నాం. సరుకుల బిల్లులను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆయాల గౌరవ వేతనం వెయ్యి నుంచి 3వేలకు పెంచాం’ అని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ ట్రెండ్ సెట్టర్స్
సాక్షి, అమరావతి: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలని బాగా ఆలోచించిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. అసెంబ్లీ మూడో రోజు సోమవారం ‘విద్య, వైద్యంలో నాడు–నేడు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ మాత్రమే ట్రెండ్ సెట్టర్లని చెప్పారు. చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చినా 14 ఏళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని అన్నారు. ప్రజలు వలస వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని పిల్లలు బాగా చదువుకోవాలని సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఇదీ చదవండి: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ -
నాడు–నేడు దేశానికే ఆదర్శం
ఒంగోలు మెట్రో: ఆధునిక సౌకర్యాల నడుమ పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు–నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. మనబడి నాడు–నేడు రెండో విడతకు సంబంధించిన అవగాహన సదస్సు మంగళవారం ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధనవంతుల పిల్లలతో సమానంగా పేదల పిల్లలు కూడా ఆధునిక సౌకర్యాలు, తరగతి గదుల్లో విద్యనభ్యసించాలనే ఆశయంతో సీఎం జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. గతంలో విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే.. సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు వేచి ఉండాల్సిన దయనీయ పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. అలాంటి కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పాడిందన్నారు. ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిరావు మాట్లాడుతూ.. నిర్ణీత గడువైన ఆరు నెలల్లోగా పనులు నాణ్యంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పథకం ఆచరణ గురించి ప్రత్యేక సలహాదారు ఆకునూరి మురళి వివరించారు. సమావేశంలో కలెక్టర్ దినేష్కుమార్, సమగ్ర శిక్ష చీఫ్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, నాడు నేడు నోడల్ అధికారి సుశీల, ఇంటర్ విద్య ఆర్జేడీ సుబ్బారావు, అధికారులు ఎస్వీ సుబ్బారావు, కె.ఆంజనేయులు, సైమన్ విక్టర్, ప్రసాదరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
PM SHRI-Nadu Nedu నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు
సాక్షి, అమరావతి: విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది. నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా 14,500కు పైగా స్కూళ్లను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ప్రాతిపదికన ఐదేళ్లపాటు కొనసాగనున్నాయి. ఆహ్లాదకరంగా విద్యాభ్యాసం.. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు – నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో పూర్తి మౌలిక సదుపాయాలను సమకూర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు కొనసాగేలా చర్యలు చేపట్టారు. విద్యా ప్రమాణాలు పెరిగేలా పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేపట్టారు. జగనన్న విద్యాకానుకతోపాటు ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లిష్ ల్యాబ్లు, సీబీఎస్ఈ విధానం అమలు, డిజిటల్ తరగతులకు శ్రీకారం, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. ఇవన్నీ మంచి ఫలితాలనిస్తుండటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వ బృందాలు ఈ కార్యక్రమాలపై అధ్యయనం చేశాయి. ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో వీటి అమలుకు శ్రీకారం చుట్టాయి. సదుపాయాలతో మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కింద నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, మంచినీరు, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్తు, ఫ్యాన్లు, డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్, ల్యాబ్, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అన్ని హైస్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటవుతున్నాయి. 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి తెస్తున్నారు. 8వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ ట్యాబ్లు అందిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ బైజూస్ సహకారంతో అత్యుత్తమ పాఠ్యాంశాలతో కూడిన డిజిటల్ కంటెంట్ అందిస్తున్నారు. రూ.36,843 విలువైన ట్యాబ్, కంటెంట్ను ప్రతి విద్యార్థికి ఉచితంగా అందిస్తున్నారు. పదో తరగతి వరకు విద్యార్థులకు ఈ కంటెంట్ అందుతుంది. జగనన్న విద్యాకానుక కింద బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, వర్కు బుక్కులు, బ్యాగు, 3 జతల యూనిఫారం, షూ, సాక్సులతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను కూడా ప్రభుత్వం విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. 61,661 విద్యాసంస్థల్లో నాడు–నేడు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితితో 14,500కు పైగా పీఎం శ్రీ స్కూళ్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించగా రాష్ట్రంలో మాత్రం నాడు – నేడు ద్వారా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. నాడు–నేడు తొలిదశ కింద 15,715 స్కూళ్లలో సదుపాయాలను కల్పించగా గతేడాది ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్ వీటిని జాతికి అంకితం చేశారు. రెండో విడత నాడు – నేడు కూడా మొదలైంది. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాలల (డైట్స్)లతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో పది రకాల సదుపాయాలను సమకూరుస్తున్నారు. -
Andhra Pradesh: స్కూళ్ల భద్రతపై దృష్టి
స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే ముందు వాటి నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలి. బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్న భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి. ప్రతినెలా నాణ్యత పరీక్షలు జరగాలి. ఆహారాన్ని రుచిగా వండడంపై వంట పని వారికి (కుక్స్) తగిన తర్ఫీదు ఇవ్వాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించాలి. గుడ్లు సరఫరాలో స్టాంపింగ్ తప్పనిసరి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ పథకం కింద పలు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన స్కూళ్లలో భద్రత కోసం వాచ్మెన్లను నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు–నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనబడి నాడు–నేడు కింద నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? తదితర అంశాలపై ఆడిట్ చేయించాలన్నారు. క్రమం తప్పకుండా ఏటా నాలుగుసార్లు ఆడిట్ జరగాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే స్కూలు మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్), టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్) నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. నాడు–నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వారంటీ ఉన్నందున సమస్య రాగానే, మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వీటికోసం గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సేవలను వినియోగించుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ ► రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపైనా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. నాడు–నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ఈ పర్యవేక్షణ పక్కాగా కొనసాగాలంటే ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుంది. ► స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్ సెంటర్ను తప్పనిసరిగా నిర్వహించాలి. తద్వారా స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించొచ్చు. స్కూళ్లలో వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేసినా, అవి పని చేయడం లేదన్న మాట రాకూడదు. అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి. చిక్కీల నాణ్యతపై మూడు దశల్లో పరీక్షలు ► నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించాలి. క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ చేయాలి. దీనికోసం సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీటి పర్యవేక్షణలో హెచ్ఎం, సచివాలయ సిబ్బంది పాత్ర కీలకంగా ఉండాలి. ఆ మేరకు వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలి. ► మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీల నాణ్యతపై తయారీదారుల వద్ద, సరఫరా సమయంలో, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు.. ఇలా మూడు దశల్లో నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలి. స్టాంపింగ్ లేకుండా గుడ్లు పంపిణీ చేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమంపై కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలి. ఇందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలి. ► ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►నాడు – నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యం ►ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలి ►దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్న సీఎం. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ►నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై సమావేశంలో చర్చ ►క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలి ►దీనికోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర అన్న సీఎం ►స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరాచేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశం ►సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి ►కచ్చితంగా ప్రతినెలా ఈ నాణ్యతా పరీక్షలు జరగాలి ►ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్కు తగిన తర్ఫీదు ఇవ్వాలి ►క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలి ►చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి ►తయారీ దారుల వద్దా, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు... ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం ►అలాగే గుడ్లు పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్ చేస్తున్నామన్న అధికారులు ►స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? ►సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? ►తదితర అంశాలపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలి ►క్రమం తప్పకుండా ఇలా ఆడిట్ చేయాలి ►ప్రతి ఏటా నాలుగు సార్లు ఆడిట్ చేయాలి ►నాడు– నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రతకోసం వాచ్మెన్ నియమించాలి ►నాడు – నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వ్యారంటీ ఉన్నందున సమస్య రాగానే వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్నామన్న అధికారులు ►గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలనూ వినియోగించుకోవాలి ►అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్సెంటర్ను తప్పనిసరిగా నిర్వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి ►స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట రాకూడదు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపైనా కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ►దీనికి కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్
-
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. అదే విధంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారం.. పురోగతి పైనా ఆయన చర్చించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి ►పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్క్లినిక్స్ను అక్టోబరు నెలాఖరుకు పూర్తిచేయాలి ►3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు నాటికి పూర్తిచేయాలి ►ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలి ►ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలి ►అక్టోబరు 2నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు మరియు భూ రక్షసర్వే పూర్తికావాలి. సంబంధిత వ్యక్తుల చేతిలో జగనన్న భూ రక్ష హక్కు పత్రాలు ఇవ్వాలి ► అక్టోబరు తర్వాత ప్రతినెలలోనూ వేయి గ్రామాల్లో సర్వే పూర్తిచేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలి ►గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమంగా కచ్చితంగా జరగాలి ►ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలి ►సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాలి ►ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి ►ప్రతి గురువారం చీఫ్సెక్రటరీ జిల్లాకలెక్టర్లతో స్పందనపై సమీక్షచేయాలి. అదే సమయంలో ఎస్డీజీ లక్ష్యాలపైనా రివ్యూ చేయాలి ►గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారు ►ప్రజలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అందులో ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిపైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారు ►ఈ ప్రాధాన్యతా పనులను పూర్తిచేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించాం ►ఈ పనులు చేపట్టేలా, యద్ధ ప్రాతిపదికిన వాటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది ►వేగంగా పనులు చేపట్టడమే కాదు, వాటిని అంతే వేగంతో పూర్తిచేయాలి ►దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం ►వృద్ధిరేటులో ఏపీ టాప్గా నిలవడం సంతోషకరం ►2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరం ►దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది ►పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా ►ఆగస్టు 25న నేతన్న నేస్తం ► సెప్టెంబర్ 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: యజ్ఞంలా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ -
బడులకు మరిన్ని సొబగులు.. నిర్వహణకు ప్రత్యేక అధికారి
నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల నిర్వహణ చాలా ముఖ్యం. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాం. అన్ని వసతులు కల్పించాం. ఈ పరిస్థితిలో వాటి నిర్వహణ బాధ్యతలు ఒక ప్రత్యేక అధికారికి అప్పగించడానికి సంబంధించి.. వచ్చే సమీక్ష సమావేశం నాటికి విధి విధానాలు రూపొందించాలి. ఇందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించాలి. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేయాలి. అత్యుత్తమ బోధనకు ఇది దోహద పడుతుంది. స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోండి. వీటన్నింటిపై దృష్టి పెట్టండి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగు చేసేలా ఒక విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకు ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేయాలని, వచ్చే ఏడాది విద్యా కానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికి సిద్ధం చేయాలని చెప్పారు. శుక్రవారం ఆయన పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దశల వారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను పరిశీలించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పాఠ్యాంశాలు ► పాఠ్య పుస్తకాలకు సంబంధించిన కంటెంట్.. పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి. దీనివల్ల లిబరల్గా అందరికీ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ► వచ్చే ఏడాది విద్యా కానుకకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. ఈ కిట్లో ఇచ్చే వస్తువులన్నింటినీ ఏప్రిల్ నాటికే సిద్ధం చేసుకోవాలి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించడానికి త్వరగా టెండర్లు ఖరారు చేసి, వెంటనే ఆర్డర్ ఇవ్వాలి. ► ప్రభుత్వేతర స్కూళ్లు ఏవైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్య పుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆ మేరకు వాటిని అందించండి. ఎక్కడా పాఠ్య పుస్తకాల కొరత అనేది ఉండకూడదు. బాలికల భద్రతపై అవగాహన ► రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్ఎం తరచుగా వీరిని కలిసేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ కోసం నియమించాలి. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు (పాఠశాల విద్యా శాఖ) ఏ మురళి, మహిళా.. శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, ఎండిఎం డైరెక్టర్ దివాన్, గనుల శాఖ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హాస్టళ్లకు మహర్దశ.. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి. మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో, అలాంటి వసతులే ఉండాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలను నిశితంగా పరిశీలించి.. పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటామో అదే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకు రావాలని చెప్పారు. నాడు–నేడు పథకం కింద ఏడాదిలోగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం ఆయన గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న దానిపై తాను స్వయంగా పరిశీలన చేయించానని, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందన్నారు. దీనిపై ఒక స్పష్టమైన కార్యాచరణతో అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని చెప్పారు. ‘ఈ పనులు మావి’ అనుకుని పని చేయాలని కోరారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఇప్పటికే నాడు – నేడు కింద తొలి దశలో స్కూళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. మొదటి దశలోని స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మించే పని జరుగుతోందన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోనందున, అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలని చెప్పారు. అభివృద్ధి పనులు చేశాక, వాటి నిర్వహణ కూడా బావుండేలా దృష్టి పెట్టాలని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిపడా సిబ్బంది ఉండాలి.. ► స్కూళ్ల నిర్వహణ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల నిర్వహణ ఫండ్ను ఏర్పాటు చేయండి. ప్రతి హాస్టల్లో తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి. హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్.. ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోండి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. నెలకోసారి హాస్టల్ను సందర్శించాలి. ► విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా డైట్ చార్జీలను పెంచాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ చార్జీలను పెంచింది. అప్పటి వరకూ హాస్టల్ విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాదిలోగా హాస్టళ్లలో నాడు–నేడు పూర్తవ్వాలి ► అద్దె ప్రాతిపదికన నడుస్తున్న వసతి గృహాలపై కూడా దృష్టి సారించాలి. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించండి. అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రతి పనిలోనూ నాణ్యత చాలా ముఖ్యం. వీటికి అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలి. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించాలి. ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలి. ► ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏది నిజం?: తడబాటు కాదు... అధికారపు ఎడబాటు
ఒక వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క రోజులో సాధ్యమా? పునాదుల నుంచే చెదలు పట్టేసి... నారాయణలు, చైతన్యలు ఆక్రమించేసి... ప్రభుత్వ స్కూళ్లంటేనే భయపడుతూ... చచ్చో చెడో నిరుపేదలు సైతం ప్రయివేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తున్న వ్యవస్థ ఇది. అలాంటి వ్యవస్థను మార్చడానికి నిబద్ధతతో అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ అడుగుల్ని సైతం సరిగా పడనీయకుండా సవాలక్ష అడ్డంకులు. రాష్ట్రంలో సర్కారీ విద్యను సర్వనాశనం చేసేసిన చంద్రబాబు నాయుడు... ఆ బాబుతోనే తమ మనుగడ అని భావించే ముగ్గురు మీడియాధిపతులు!!. రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే... తామే ఏలాలనుకునే ఈ చతుష్టయం ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న మేలుకు ప్రజలంతా ఆకర్షితులవుతున్నా... వీళ్లు మాత్రం లేనిపోని రాతలతో విషం కక్కడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘తడబడిన విలీనం’ అంటూ సోమవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం ఇలాంటిదే. అసలిందులో నిజం ఏ కోశానైనా ఉందా? అంగన్వాడీల నుంచి మొదలుపెడితే చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థను చూసినంత హీనంగా ఏ వ్యవస్థనూ చూడలేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టంతా కార్పొరేట్ స్కూళ్లపైనే. ఏకంగా కార్పొరేట్ డాన్ నారాయణను తెచ్చి కేబినెట్లోనే పెట్టుకున్న చరిత్ర బాబుది. అంగన్వాడీల్లో ప్రత్యేక కిచెన్ గానీ, ప్లేగ్రౌండ్ గానీ ఉండేవి కాదు. సిబ్బందే సరిగా లేని దుస్థితి. ఇక 1 నుంచి 5 వరకు నడిచే స్కూళ్లకు ఒకరిద్దరు ఎస్జీటీలే దిక్కు. విద్యార్థులకు సదుపాయాలు దేవుడెరుగు. తరగతి గదులూ కొరతే. 18 సబ్జెక్టుల్ని ఆ ఒకరిద్దరు టీచర్లే బోధించేవారు. అప్పర్ ప్రయిమరీ స్కూళ్లు, హైస్కూళ్లదీ అదే గతి. అనేక యాజమాన్యాల పరిధిలో ఉండటంతో హై స్కూళ్ల నడుమ సంబంధాలూ ఉండేవి కాదు. ఈ చదువుల దెబ్బకు పిల్లలు తమ తరగతి పుస్తకాల సంగతి అటుంచి... కింది తరగతుల పుస్తకాలనూ చదవలేని దుస్థితికి జారిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే నేషనల్ అకడమిక్ సర్వే (న్యాస్), ప్రథమ్ సంస్థ చేసిన ‘అసర్’ సర్వే... అన్నీ తేల్చింది ఇదే. విచిత్రమేంటంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... మేకప్ వేసి, తమ కార్పొరేట్ స్కూళ్ల కడుపు నింపడానికే ప్రయత్నించారు చంద్రబాబు. కార్పొరేట్ కాలేజీల్లోకి విద్యార్దుల చేరికలను పెంచడానికి టార్గెట్లు పెట్టి... కాపీయింగ్ను ప్రోత్సహించి మరీ టెన్త్లో కృత్రిమ ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ కాలేజీల్లో చేరి... ఆ తరవాత సరైన నైపుణ్యాలు లేక... జీవితాలనే కోల్పోయిన ఎంతో మంది ... బాబు బ్రెయిన్ చైల్డ్లే!. కాకపోతే ఇంతటి ఘోరమైన పరిస్థితుల్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశ్నించలేదు. రామోజీ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇపుడు మాత్రం పునాదుల నుంచి జరుగుతున్న మార్పును తట్టుకోలేకపోతుండటమే అన్నిటికన్నా దారుణం. మొత్తం వ్యవస్థకే చికిత్స...! ఇదేదో ఒక రోడ్డో, ఒక వంతెన సమస్యో కాదు. విద్యా వ్యవస్థ. పునాదుల నుంచీ కుళ్లిపోయింది. అందుకే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కాయకల్ప చికిత్స మొదలెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చూపించనంత శ్రద్ధతో నెలకు రెండు సార్లు సమీక్షిస్తూ... ఫౌండేషన్ విద్య నుంచే శ్రీకారం చుట్టారు. దాదాపు 56వేల స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకంతో సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 15,715 స్కూళ్లను సమగ్ర మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. మిగిలిన స్కూళ్లలోనూ 2వ, 3వ విడతల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ మూడేళ్లలో 70కి పైగా సమీక్షలు విద్యారంగంపైనే నిర్వహించారంటే సీఎం చిత్తశుద్ధి చెప్పకనే తెలుస్తుంది. మంచిని ఏమాత్రం గుర్తించని చతుష్టయం... నిజానికి పాఠశాల విద్యలో కనీవినీ ఎరుగని సంస్కరణలు మొదలయ్యాయి. దీనికి పొరుగు రాష్ట్రాలే కాదు... కేంద్ర సంస్థలూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కానీ చంద్రబాబుతో కూడిన చతుష్టయం... తమ రాతల్లో ఏనాడూ ఒక్క మంచి పనిని ప్రస్తావిస్తే ఒట్టు. దేనిపైనయినా బురద చల్లటమే. నాడు–నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని జగనన్న గోరుముద్దగా అందిస్తూ... పిల్లల్ని స్కూళ్లకు పంపించే తల్లులకు బాసటగా ‘అమ్మ ఒడి’ పేరిట నగదు జమచేస్తున్న ప్రభుత్వం... జగనన్న విద్యాకానుకగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్, డిక్షనరీ తదితర వస్తువుల్ని స్కూళ్లు మొదలుకాకముందే ఉచితంగా అందిస్తోంది. గతంలో స్కూళ్లు ఆరంభమై 6 నెలలు గడిచినా పుస్తకాలే చూడని విద్యార్థులకు ఆరంభం కాకముందే అన్నీ ఉచితంగా అందించటమనేది ఈ దుష్ట చతుష్టయానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదవాలన్న ఉద్దేశంతో చివరికి కోర్టులకు కూడా వెళ్లి ఆంగ్ల విద్యను రకరకాల మార్గాల్లో వ్యతిరేకించిన తీరు వీళ్లది.. రెండు భాషల్లో ప్రచురించిన పుస్తకాలు... ఏకంగా ఎన్సీఈఆర్టీ ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇక పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లకే సాధ్యమైన ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ ఆన్లైన్ పాఠాలను రాష్ట్ర సర్కారీ స్కూళ్ల 8వ తరగతి విద్యార్థుల ట్యాబ్లెట్లలోకి తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్దే. దశల వారీగా అన్ని ప్రభుత్వ స్కూళ్లనూ సీబీఎస్ఈకి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అనుసంధానిస్తున్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో... విద్యార్థులకిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను స్వయంగా చూస్తున్నారు సీఎం. గోరుముద్దను ఆయనే రుచిచూస్తున్నారు. పిల్లల పొట్టలు నిండితేనే అక్షరాలు బుర్రకెక్కుతాయని గట్టిగా విశ్వసిస్తూ రుచికరమైన మెనూను తనే రూపొందిస్తున్నారు. ఇదిగో... వీటన్నిటి ఫలితమే... పొరుగు రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలు తగ్గి... ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి. సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిక్కూడా పచ్చ రంగు పులుముతూ... ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి కనక ప్రయివేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని వక్రభాష్యాలు చెబుతున్న చరిత్ర రామోజీరావుది. ఏం! పక్క రాష్ట్రాల్లో కరోనా రాలేదా? అక్కడ జనం ఆర్థిక పరిస్థితులు దెబ్బతినలేదా? వాళ్లెందుకు ప్రభుత్వ స్కూళ్లలోకి మారలేదు? ప్రయివేటు స్కూళ్లలో అడ్మిషన్లెందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ సర్కారీ స్కూళ్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నందుకే కదా... జనం వాటికి మారుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ..? అసలు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తేవాలన్న ఆలోచన మీకు గానీ, మీ బాబుకు గానీ ఏనాడైనా వచ్చిందా? ఇలాంటి ప్రయత్నాల్ని అభినందించటం మీకిష్టం లేకపోతే కనీసం వ్యతిరేకించకుండా అయినా ఉండాలి కదా? మీరొక పత్రికాధిపతి అని, మీ పత్రికను చదివేది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు? మీ పాఠకులను గౌరవించటం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇదీ... స్కూళ్ల మ్యాపింగ్ తీరు ► వీలున్న చోట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు అనుసంధానించి వారికి స్కూలు వాతావరణాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ► 8 ఏళ్లలోపు పిల్లల్లోనే బ్రెయిన్ అభివృద్ధి ఎక్కువ కనక... ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాల్ని అనుసంధానించి ఫౌండేషన్ స్కూళ్లుగా మారుస్తున్నారు. ► తరగతులను ఇతర స్కూళ్లకు అనుసంధానం చేసేటప్పుడు విద్యార్ధులకు ఇబ్బందిలేకుండా ఉండేలా 250 మీటర్ల నుంచి 1 కి.మీ. పరిధిలో ఉండే వాటిని మాత్రమే విలీనం చేసేలా విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. నెలల తరబడి కసరత్తు.. క్షేత్రస్థాయి పరిశీలన చేశాకే చర్యలు చేపట్టారు. – దశల వారీగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో.. 820 వరకు స్కూళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రాగా... వాటిపై జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి... వాటికి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు పట్టవు. విలీనంపై గాలి వార్తలు రాయటం ద్వారా తల్లిదండ్రుల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి... ఏదో ఒకరకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది ఆయన దింపుడుకళ్లం ఆశ. మిగిలిన స్కూళ్లు సైతం... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీహైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూళ్లు ప్లస్గా వర్గీకరించి... అన్నిటా విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అవసరమైన చోట నాడునేడు రెండో విడతలో ప్రత్యేకంగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్నీ చేపట్టారు. కాకపోతే ఈ నిర్మాణాలన్నీ ఒక్కరాత్రిలో పూర్తయ్యేవి కావు. వేల కోట్ల నిధులతో పాటు పక్కా ప్రణాళిక, పర్యవేక్షణ అవసరం. వేగంగా అడుగులేస్తూ ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళుతున్న జగన్ ప్రభుత్వానికి... అసలు ఈ దిశగా జీవితంలో ఎన్నడూ ఆలోచించని చతుష్టయం నుంచి వ్యతిరేకత రావటమే ఘోరాతిఘోరం. ► ఇక మ్యాపింగ్ పూర్తయిన స్కూళ్లలోని విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధనకు వీలుగా అదనపు స్కూల్ అసిస్టెంటు టీచర్లను విద్యాశాఖ ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకోసం 8,233 మంది ఎస్జీటీ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల పలు పోస్టులను స్కూల్ అసిస్టెంటు స్థాయికి అప్గ్రేడ్ చేపట్టింది. ఆ ఫోటోల వెనక ఎన్నో అర్థసత్యాలు... సోమవారంనాడు ప్రచురించిన ఫోటోల్లో ‘ఈనాడు’ చెప్పని నిజాలివీ... ► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీ పెద్దపేట స్కూల్కు వెళ్లాలంటే 35 ఎకరాల చెరువు దాటి వెళ్లాల్సి వస్తోందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. స్కూలు వెనుక భాగాన చెరువు ఉంది. దాన్ని దాటే పనిలేదు. ఆ స్కూలుకు రెండు వైపులా రోడ్లున్నాయి. కేవలం అరకిలోమీటర్ పరిధిలోని స్కూలులోని పిల్లలను ఈ స్కూలుకు మ్యాపింగ్ చేయడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఆహ్వానించారు. ► ఏలూరు జిల్లా ఉంగుటూరులోని మ్యాపింగ్ అయిన స్కూల్లో విద్యార్దులకు సరిపడే ఫర్నీచరు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చోబెట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నాడు– నేడు పనులు చేస్తున్న కారణంగా రెండు రోజులుగా గదులు సర్దుబాటు చేసున్నారు. తాత్కాలికంగా కూర్చోబెట్టిన ఫోటోను తీసి... శాశ్వతంగా వసతులు లేవన్నట్లు రాయటమే ‘ఈనాడు’ పైత్యానికి పరాకాష్ట. ► రాచూరు హైస్కూల్లో 3,4,5 తరగతుల విధ్యార్దులను కలిపి కూర్చొబెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా అబద్ధమే. నాడు నేడు పనులు జరుగుతున్న కారణంగా తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేశారు తప్ప గదులుపూర్తవ్వగానే ఆయా గదుల్లోకి తరగతులను మారుస్తారు. ఇక్కడ ఒక్కోగదికి 12 లక్షలు చొప్పన రెండు అదనపు గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. -
Srikakulam: రోడ్లపై టీడీపీ, జనసేన విష ప్రచారం
నాడు: టీడీపీ హయాం నుంచి అధ్వానంగా ఉన్న పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు నుంచి పలాసకు వెళ్లే రహదారి గత చిత్రమిది. వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నేడు: ఇప్పుడా రోడ్డు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.40లక్షలతో డబుల్ లైన్ సీసీ రోడ్డు వేసింది. మొగిలిపాడు నుంచి పలాస వరకు అద్భుతమైన రోడ్డు నిర్మించింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రహదారుల విషయంలో ప్రతిపక్షాలు దుష్రచారం చేస్తున్నాయి. చేసిన మంచిని వదిలేసి ఇంకా ఎక్కడో మిగిలిన రోడ్లను, అవి కూడా నిర్మాణం చేపడుతున్న దశలో ఫొటోలు తీసి అటు టీడీపీ, ఇటు జనసేన రాజకీయ పక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయి. వారికి వత్తాసు పలుకుతూ ఎల్లో మీడియా భూతద్దంలో అబద్ధాలను చూపిస్తోంది. గత ప్రభుత్వంలో నాసిరకంగా వేసిన కొన్ని రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. నాటి పాలకులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి, నాణ్యత లేని రోడ్లు వేసి వదిలేశారు. ఇప్పుడవి పాడయ్యాయి. అవి కూడా ఎల్లో మీడియాకు కనబడలేదు. వాటిని కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో వేసి పచ్చరాతలు రాస్తున్నాయి. టీడీపీ నేతలే కారణం.. అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల వరకు రోడ్ల జోలికి టీడీపీ ప్రభుత్వం పోలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా రోడ్లు మంజూరు చేసింది. అవి కూడా టీడీపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ఫ్యామిలీ, అనుచరులే దాదాపు రోడ్లు వేశారు. కాంట్రాక్ట్లు దక్కించుకుని, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి, నాసిరకం పనులు చేపట్టి కోట్లు కొల్లగొట్టారు. దీంతో వేసిన కొన్ని నెలలకే రోడ్లు పాడయ్యాయి. రోడ్లు కోసం ఖర్చు పెట్టిన నిధులన్నీ కాంట్రాక్టర్ల పరమయ్యాయి. టీడీపీ హయాంలో వేసిన ఏ రోడ్డు చూద్దామన్నా ఇదే దుస్థితి. ఇప్పుడు వాటిని పట్టుకుని అదే టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తున్నారు. ‘దారి’కి తెస్తుంటే.. టీడీపీ చేసిన తప్పులను సీఎం వైఎస్ జగన్ సరిదిద్దుతున్నారు. టీడీపీ నేతల అక్రమాలకు పాడైన రోడ్లను బాగు చేస్తున్నారు. అంతేకాకుండా దశాబ్దాలుగా పాడైన రోడ్లకు మోక్షం కలిగించారు. కరోనా తదితర విపత్కర పరిస్థితులు, మరోవైపు వర్షాలు వెంటాడుతున్నా ప్రణాళికాబద్ధంగా రోడ్లు నిర్మిస్తున్నారు. ఆర్అండ్బీ పరిధిలో రూ.121.40కోట్లతో 174 రోడ్ల పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 70 రోడ్లు పూర్తయ్యాయి. మరో 83 రోడ్లు ప్రగతిలో ఉన్నాయి. 21 రోడ్ల పనులు ప్రారంభించాల్సి ఉంది. పంచాయతీ రాజ్ పరిధిలో రూ.522.78 కోట్లతో 358 రోడ్లను వేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ. 60 కోట్లతో 150 గిరిజన ప్రాంతాలకు తారు రోడ్లు నిర్మిస్తున్నారు. వర్షాలు పడుతుండటంతో కాస్త జాప్యం జరుగుతోంది. వర్షాల నేపథ్యంలో రోడ్లు వేస్తే మళ్లీ అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంత జరుగుతుంటే... రోడ్లన్నీ ఈ మూడేళ్లలో పాడైపోయినట్టు.. గతంలో వేసిన రోడ్లు నాసిరకంగా లేనట్టు టీడీపీ, జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.. వానా కాలంలో ఓ పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం అంటూ పనిగట్టుకుని దుష్ప్రచారానికి పూనుకుంటే.. కొందరు యువకులు దాని కోసం బాగున్న రోడ్లను తవ్వేసి, రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందంటూ ఫొటోలు తీసి పెడుతున్నారు. వీరి పట్ల కూడా జనం అప్రమత్తంగా ఉండాలి. -
నాడు నేడు పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
సాక్షి, అమరావతి: మన బడి నాడు– నేడు రెండో దశ పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన మన బడి నాడు–నేడు పనుల తీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన బడి నాడు – నేడు రెండో దశ పనుల కింద 22,344 పాఠశాలలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, 20,757 స్కూళ్ల వివరాలను స్కూల్ ట్రాన్సఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం (ఎస్టీఎంఎస్) వెబ్సైట్లో ఉంచామన్నారు. పది రోజుల్లో 100 శాతం పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన అనుమతులను కలెక్టర్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. 10,891 పాఠశాలలకు రూ.554 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని, మిగిలిన వాటికీ నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతోనే పాఠశాలల విలీనంపై నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా సందేహాలు, సమస్యలు తలెత్తితే స్థానిక అధికారులు స్పందించి సత్యాసత్యాలు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్లు, ఆర్డీవోలకు చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోవద్దన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు (ఇన్చార్జి) ఎస్.సురేష్ కుమార్, పాఠశాల విద్యా సలహాదారు ఎ.మురళి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్ ప్రభాకర్
జీవితంలో నేను ఏది చేసినా తల్లిదండ్రుల తర్వాత వైఎస్సార్ స్ఫూర్తితోనే అని ఎన్ఆర్ఐ ప్రభాకర్రెడ్డి (పంచ్ ప్రభాకర్) అన్నారు. యూఎస్ఏలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రేమకు మూడు అక్షరాలు ఉన్నాయనుకుంటే అది వైఎస్సారే. ఆయన ప్రతి అడుగులో మానవత్వం, దాతృత్వం, సమానత్వం కనిపిస్తాయి. వైఎస్సార్ ఒక గొప్ప మానవతావాది. శత్రువును కూడా అక్కున చేర్చుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెడితే.. సీఎం జగన్ వాటిని కొనసాగిస్తూ, నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపు రేఖలను మారుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తి, బెండపూడి పాఠశాల ఉపాధ్యాయుడు చేసే కార్యక్రమాలు, పడుతున్న కష్టం చూసి ఆ స్కూల్ను దత్తత తీసుకోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నాతో పాటు, ఇక్కడి అనేక మంది మిత్రులు ముందుకొచ్చారు. ఇప్పటిదాకా పేద విద్యార్థులకు, రైతులకు నా వంతు మేర సహాయపడుతూ వచ్చాను. వాటన్నింటికి మహానేత వైఎస్సారే నాకు స్ఫూర్తి. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ప్రతిభ ఉండి.. పేదరికంతో ముందుకెళ్ల లేని స్థితిలో ఉంటారో వారిని ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాం. అందుకోసం మేడపాటి వెంకట్తో కలిసి కార్యాచరణను కూడా రూపొందిస్తాం. గ్రామీణ ప్రాంత యువతకు రూరల్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేసి వారి భవిష్యత్కు తోడ్పాటునందిస్తామని' పంచ్ ప్రభాకర్ తెలిపారు. చదవండి: (CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిజిటల్ లెర్నింగ్పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్ అందించడంపై సీఎం జగన్ చర్చించారు. అలాగే సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడంపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇస్తామని, ఆ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను లోడ్ చేయాలని తెలిపారు. దీనికి తగినట్టుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలన్నారు ఇవి నిర్దారించాక ట్యాబ్ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొన్నారు.. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలని తెలిపారు. అందుకే నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమని, ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. చదవండి: మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావించిన ఘనత సీఎం జగన్దే: పెద్దిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ►అలాగే తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ►దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించండి: ►విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామన్న అధికారులు. ►ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలని సీఎం ఆదేశం ►తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్, బ్లాక్ బోర్డులు.. వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలన్న సీఎం ►బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించుకున్నా.. అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలన్న సీఎం ►ఇప్పటికే డిజిటల్ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్న సీఎం ►వీటి వల్ల సైన్స్, మాథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయన్న సీఎం ►వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది ►స్క్రీన్ మీద కంటెంట్ను హైలెట్ చేసుకునేలా, ఎనలార్జ్ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. ►డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలి ►దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారుచేయాలి ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, సర్వ శిక్షా అభయాన్ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: CM YS Jagan Review: హెల్త్ నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష -
డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్కు అధికారులు వివరించారు. సమీక్ష సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ►ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి ►ఆరోగ్యశ్రీలో పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలి ►ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్చేసే విధానం బలోపేతంగా ఉండాలి ►రిఫరల్ విధానాన్ని పర్యవేక్షణ చేయండి ►విలేజ్ క్లినిక్స్లో రిఫరల్ కోసం పర్మినెంట్ ప్లేస్ను డిజైన్ చేయాలి ►విలేజ్ క్లినిక్స్ అన్నవి రిఫరల్ కేంద్రాలుగా పనిచేస్తాయి ►ఎక్కడికి రిఫరల్ చేయాలన్నదానిపై హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ పూర్తి సమాచారాన్ని ఉంచాలి ►ఆరోగ్యశ్రీ అందుకున్న తర్వాత లబ్ధిదారులకు లేఖ అందాలి ►పథకం ద్వారా తనకు అందిన లబ్ధిని అందులో పేర్కొనాలి ►ఆరోగ్యశ్రీలో ఆస్పత్రి నుంచి పేషెంట్ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై కన్ఫర్మేషన్ తీసుకోవాలి ►పేషెంట్ తిరిగి కోలుకున్నంతవరకూ అందిస్తున్న ఆరోగ్య ఆసరా విషయాలు కూడా కన్ఫర్మేషన్ పత్రంలో ఉండాలి ►ఆరోగ్య ఆసరా డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో చేస్తున్న పద్ధతిని కొనసాగించాలి ►ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలను తెరవాలి ►ఆరోగ్యశ్రీ కింద అందించే డబ్బును నేరుగా ఈ ఖాతాకు పంపాలి ►ఈ ఖాతా నుంచి ఆటోమేటిక్గా వైద్యం అందించిన ఆస్పత్రికి వెళ్లాలి ►ఈమేరకు కన్సెంట్ పత్రాన్ని పేషెంట్ నుంచి తీసుకోవాలి ►తన వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక అకౌంట్ వినియోగపడుతుంది ►ఈ విధానాల వల్ల పారదర్శకత వస్తుంది ►తనకు చేసిన వైద్యం, ప్రభుత్వం నుంచి అందిన సహాయం, అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు అంతా కూడా పారదర్శకంగా ఉంటాయి ►మరింత జవాబుదారీతనం, పారదర్శకత వస్తుంది ►రోగిపై అదనపు భారాన్ని వేయకుండా, వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలందే పరిస్థితి వస్తుంది ►ఆరోగ్య మిత్రలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి ►ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలకు ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుంది ►దీనికి అదనంగా డబ్బు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదు ►ఒకవేళ ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్న సంకేతం వెళ్లాలి ►అదనంగా తన వద్దనుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న కన్ఫర్మేషన్ పేషెంట్ నుంచి తీసుకోవాలి ►ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. ఏ నెంబరుకు కాల్ చేయాలన్న విషయం కూడా పేషెంట్కు తెలియాలి ►ఆరోగ్య మిత్రలు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలి ►పేషెంట్ అస్పత్రిలో చేరిన దగ్గరనుంచీ డిశ్చార్జి అయ్యేంత వరకూ వారికి అండగా, తోడుగా నిలవాలి ►పేషెంట్ ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యకార్యకర్త ఆ ఇంటికి వెళ్లి బాగోగులు చూడాలి ►ఆరోగ్యశ్రీ ద్వారా అందిన సేవలు, ఆరోగ్య మిత్రలనుంచి అందిన సహాయం తదితర సేవలపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి ►ఆరోగ్య శ్రీలో అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలి ►ఇప్పుడున్న 2436 చికిత్సలను ఇంకా పెంచాలి ►వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందే దిశగా అడుగులు ముందుకు వేయాలి ►108, 104, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లలో లంచాలకు ఆస్కారం ఉండకూడదు ►లంచం అడిగే పరిస్థితులు లేకుండా ఎస్ఓపీలు ఉండాలి ►లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న నంబర్లను అవే వాహనాలపై ఉంచాలి ►ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఖాళీల భర్తీ, ప్రమాణాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది నియామకంపై సీఎం సమీక్ష ►ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 40,188 పోస్టులు భర్తీచేశామన్న అధికారులు ►ఇంకా 1,132 మంది భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందన్న అధికారులు ►176 కొత్త పీహెచ్సీలకు సంబంధించి ఇంకా డాక్టర్లు అవసరమని, ఈ పీహెచ్సీల నిర్మాణం పూర్తికాగానే వారిని నియమిస్తామన్న అధికారులు ►176 పీహెచ్సీల నిర్మాణం పూర్తి కాగానే... వీటిలో 2072 పోస్టులు కూడా భర్తీ చేస్తామన్న అధికారులు. ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదు ►బోధనాసుపత్రుల్లో కూడా ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదు ►ఏ కారణం వల్ల అయినా పోస్టులు ఖాళీ అయితే వెంటనే వాటిని భర్తీచేయాలి ►వివిధ రంగాల్లో మనం సంస్కరణలతో ముందుకు సాగుతున్నాం ►మంచి ఫలితాలు రావాలంటే... సరిపడా సిబ్బందిని నియమించుకోవడం తప్పనిసరి ►పీహెచ్సీల నుంచి బోధనాసుత్రుల వరకూ ఎక్కడా కూడా డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు ►పదవీ విరమణ చేసిన వైద్యులు, ఆ రంగంలోని రిటైర్డ్ సీనియర్ల సేవలను వినియోగించుకోండి ►అవసరమైతే వారి పదవీవిరమణ వయస్సును కూడా పెంచే ఆలోచన చేయాలి ►జులై 26 నాటికల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఈ మొత్తం ప్రక్రియ ముగియాలి అని అధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజిమెంట్) ఎం రవిచంద్ర,ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్