ponnam prabakar
-
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది పక్కా..
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు వాస్తవాలు మాట్లాడుతుంటే.. అవి జీర్ణించుకోలేని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన కేసీఆర్ మండిపడ్డారు.‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించ దగ్గ విషయం’ అని సీరియస్ టోన్తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు.కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘కేసీఆర్కు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో రెండు హామీలను అమలు చేసాం. పంట బోనస్ , రైతు భరోసా పెంపు , 55 వేల ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టింగులు ఇలా చెప్పుకుంటే పోతే అనేకం చేశాం. ఇంకా చేస్తాం. కేసీఆర్ వ్యాఖ్యల్లో అసహనం తప్ప మరొకటి కనబడటం లేదు. అధికారం దరిదాపుల్లో కనబడక పోవడంతోనే కేసీఆర్లో అసహనం ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తారు... ఇది పక్కా. ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా పాత పథకాలను ఒక్కటి కూడా రద్దు చేయకుండా ,మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కేంద్రం ఇంకా సహకరిస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కలసి రావాల్సిందేనని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు.. ఏం చేయాలో తెలియక
కౌడిపల్లి(నర్సాపూర్): కూలి పనులు చేస్తేనే కూడు దొరకని కుటుంబం.. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అయితేనేం ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు చదువులో మేటిగా ఉన్నారు. ఇప్పుడా దంపతుల రెండో కుమార్తెకు ఎంబీబీఎస్ సీటొచ్చినా.. డబ్బుల్లేక కూలి పనులకు వెళ్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.పెద్ద కొడుకు విజయ్కుమార్ కాకినాడలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం.. పెద్దకూతురు అనిత సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు రాహుల్ ఖమ్మం ఎస్టీ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కూతురు కాట్రోత్ సుమలత సిద్దిపేటలోని సురభి ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. కానీ ప్రైవేట్ కళాశాల కావడంతో ఏటా సుమారు రూ 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న పొలం తాకట్టుపెట్టి రూ.లక్షన్నర చెల్లించింది. ఇంకా హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు రూ.లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక సుమలత ఆవేదన చెందుతోంది. పెద్ద మనుసున్న దాతలు 77801 06423 ఫోన్ నంబర్కు తోచిన సాయం చేయాలని కోరుతోంది.మెడికల్ సీటు సాధించిన పేద విద్యార్థినికి పొన్నం భరోసా హుస్నాబాద్ రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన పేద విద్యార్థిని లావుడ్య దేవి ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తోంది. దీనిపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘డాక్టర్ చదువుకు డబ్బుల్లేక కూలి పనులకు..’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన విద్యార్థి కుటుంబం గురించి స్థానిక నాయకులతో అరా తీశారు. మంగళవారం హుస్నాబాద్కు వచ్చిన మంత్రి.. గిరిజన విద్యార్థిని అభినందించారు. ఆమె కాలేజీ ఫీజుకు ఆర్థిక సాయంతో చేయడంతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాదికి కూడా కాలేజీ ఫీజుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. జెన్కో ఇంజనీర్లకు పోస్టింగ్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో భారీ సంఖ్యలో ఈ నెల 9న అడ్హాక్ (తాత్కాలిక) పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు ఎట్టకేలకు కొత్త పోస్టింగ్స్ కేటాయిస్తూ సోమవారం సంస్థ సీఎండీ సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లోని 203 మంది ఏడీఈలు, ఎలక్ట్రికల్ విభాగంలో 34 మంది డీఈలు, ఏడుగురు ఎస్ఈలు, ఇద్దరు సీఈలతో పాటు మెకానికల్ విభాగంలో 12 మంది డీఈలు, ఎస్ఈలు.. సివిల్ విభాగంలో ఐదుగురు ఏఈఈలుగా, ఇద్దరు ఈఈలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు. చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త -
15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం
vehicle scrapping policy 2024: పదిహేను ఏళ్లు దాటిన వాహనాల విషయంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ రవాణాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 15 ఏళ్లు గడువు తీరిన వాహనాలు దాదాపు 21 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. స్క్రాపింగ్ తప్పనిసరి కాదనడంతో కొందరు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆరీ్వఎస్ఎఫ్) పేరిట స్క్రాపింగ్కు రాష్ట్రవ్యాప్తంగా సదుపాయాలు కల్పించనున్నారు. ద్విచక్రవాహనాలే అధికం మొత్తంగా 21.27 లక్షల వాహనాల కాలం తీరిపోయింది. అయితే వీటిని ఇప్పటికిప్పుడు స్క్రాప్నకు పంపాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వీటిలో ఫిట్నెస్ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు రూ.5 వేలు చెల్లించి ఐదేళ్లు, ఆ తర్వాత కూడా ఫిట్గా ఉంటే.. రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 21,27,912 వాహనాలు 15 ఏళ్లు వయసు పైబడ్డాయి. ఇందులో 9 లక్షల వాహనాలు హైదరాబాద్లో ఉండగా.. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో అధికశాతం ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం.మళ్లీ అందులోనూ 1.3 లక్షల బైకులు హైదరాబాద్కు చెందినవి కాగా, 1.8 లక్షల ద్విచక్రవాహనాలు రంగారెడ్డిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల తర్వాత 15 ఏళ్లు పైబడిన వాహనాలు వరుసగా మేడ్చల్ (1.5 లక్షలు), కరీంనగర్ (1.5 లక్షలు) నిజామాబాద్ (1.2 లక్షలు) జిల్లాల్లో ఉన్నాయి. ఈ లెక్కన గ్రీన్ ట్యాక్స్ అత్యధికంగా గ్రేటర్ పరిధిలోనే వసూలు కానుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. -
సీఎం రేవంత్ అమెరికా పర్యటన వ్యక్తిగతం కాదు: మంత్రి పొన్నం
సాక్షి, హన్మకొండ: తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా బీఆర్ఎస్ నేతలకు కళ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. అన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండలోని భీమదేవరపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వ్యక్తిగతం కాదు. అది ప్రభుత్వ అధికారిక పర్యటన మాత్రమే. బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ బాగుపడుతుందోనని అసూయతో ఆరోపణలు చేస్తున్నారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారు. సుంకేసుల నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయి. ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశిస్తున్నాం. మీరు విచారణకు సిద్ధమా?. మసి పూసి బట్టకాల్చి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సుంకేసుల ఘటనపై సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తాం. ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం.పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత వారి అసహనానికి హద్దు లేకుండా పోయింది. ప్రజా సమస్యలపై మాట్లాడాలని జ్ఞానం లేకుండా ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దోషులను కచ్చితంగా శిక్షిస్తాం. బరాబర్ జవాడు చెబుతాం. బీఆర్ఎస్, బీజేపీ వేరువేరు కాదు. ప్రజలు మిమ్మల్ని వేరువేరుగా చూడటం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అందుకే: మంత్రి పొన్నం
సాక్షి,కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ సుస్థిరత కోసమే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం(జులై 15) కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవంలో మొక్కలు పొన్నం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చింది..? బండి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు..? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. చూస్తూ ఊరుకోవాలా..? మేం ధర్మం తప్పలేదు. కులగణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. తర్వాత పరిస్థితుల్లోనే చేర్చుకుంటున్నాం’అని పొన్నం తెలిపారు. -
హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?: మంత్రి పొన్నం ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చాడు? అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అసమర్థుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి పొన్నం తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్కు కౌంటరిచ్చారు. మంత్రొ పొన్నం ప్రభాకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా కిషన్రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశాయి.తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాగానే హైదరాబాద్ ఇంచార్జీ మంత్రిగా కలిశాను. కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాడు. కేటీఆర్ పెద్ద అసమర్థుడు. హైదరాబాద్ అస్తవ్యస్తం కావడానికి కారణం కేటీఆరే. ఉద్యోగ క్యాలెండర్ తప్పకుండా ఇస్తాం. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటి వరకు ప్రశ్నించి, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయండి అంటున్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకండి. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
అలిగిన మంత్రి పొన్నం.. బల్కంపేట గుడిలో ప్రోటోకాల్ రగడ
సాక్షి,హైదరాబాద్: ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా బల్కంపేట గుడిలో మంగళవారం(జులై 9) ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు గుడికి వచ్చారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. ఈ సందర్భంగా గుడిలో తోపులాట జరిగింది. తోపులాటలో మేయర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని అయిన తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని పొన్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్పై పొన్నం సీరియస్ అయ్యారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా మంత్రి పొన్నం అలక వీడలేదు. -
TGSRTC: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో, దీనికి సంబంధించిన విధివిధానాలను ఆర్టీసీ అధికారులు రూపొందించనున్నారు. మరోవైపు.. ఆర్టీసీ ఖాళీల భర్తీపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా..‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని రూట్స్లో బస్సులు సరిగా లేకపోవడంతో ప్రజలు బస్సులు నడపాలని కోరారు. దీంతో, ప్రభుత్వం ఆర్టీసీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. -
‘బ్లాక్ బుక్’లో మంత్రి పొన్నం పేరు: పాడి కౌశిక్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఫిలింనగర్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బుధవారం(జూన్ 26) ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి తనతో పాటు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్ను ఫిలింనగర్లోని వేంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశా. ఫ్లైయాష్ స్కామ్ చేయలేదని ప్రమాణం చేయాలని కోరాను. నువ్వు నీతి మంతుడివి అయితే ఎందుకు రాలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు పొన్నం. తడి బట్టలతో హుజురాబాద్లో హనుమాన్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశాను.నీ నిజాయితీ ఎందుకు నిరూపించుకోవడం లేదు పొన్నం ప్రభాకర్. వే బ్రిడ్జిలో కొలతలు తక్కువ వచ్చాయి. దీనికి ప్రూఫ్ ఉంది. వే బిల్ సరిగా లేదు. రవాణా శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా? రోడ్లు నాశనం చేస్తున్నారు. ఫ్లైయాష్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్నాడు’అని కౌశిక్రెడ్డి మండిపడ్డారు. ప్రమాణం సందర్భంగా బ్లాక్ బుక్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్రెడ్డి రాశారు. తాము అధికారంలోకి వచ్చాక పొన్నంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రమాణం చేసేందుకుగాను బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్న కౌశిక్రెడ్డి అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి గుడికి బయలుదేరారు. -
ప్రణవ్ సవాల్ నేపథ్యంలో.. చెల్పూర్లో టెన్షన్.. టెన్షన్!
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ, అందులో నిజం ఉంటే హుజూరాబాద్ మండలం చెల్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ విసిరిన సవాల్ మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.ప్రణవ్, పాడి కౌశిక్రెడ్డి అక్కడికి చేరుకుంటే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ రోజంతా నెలకొంది. ప్రణవ్ పిలుపుమేరకు మంగళవారం ఉదయమే చెల్పూర్కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మోసం చేశారంటూ ఫ్లెక్సీ ఏర్పా టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరు కుని నిరసనకు దిగారు. ఆలయం వద్ద బీఆర్ఎస్– కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్జి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఇరువర్గాలతో మాట్లాడగా.. శాంతించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బుర్రకుమార్ గౌడ్కు గాయాలయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు జమ్మికుంట, సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా.. వొడితల ప్రణవ్బాబును సింగాపూర్లో, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని వీణవంకలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.చెల్పూర్ లో ఏసీపీ శ్రీనివాస్ జితో వాగ్వాదానికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులుతడి బట్టలతో ఎమ్మెల్యే ప్రమాణంవొడితెల ప్రణవ్ చేసిన సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కరీంనగర్ సీపీకి ఫోన్చేసి, తనకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా నిరాకరించారు. ఎమ్మెల్యే ఇంటివద్ద జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, సీఐ సృజన్రెడ్డి సిబ్బందితో మోహరించారు. పోలీసుల అనుమతి రాకపోవడంతో ఎమ్మెల్యే తడి బట్టలతో దేవుడి మీద ప్రమాణం చేసి తను మంత్రిపై చేసిన ఆరోపణలు నిజమంటూ పేర్కొన్నారు. ప్రణవ్బాబు చిన్న పిల్లాడని పేర్కొన్నారు. పోలీసులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కలుస్తానని పేర్కొన్నారు.రాజకీయ ఉనికి కోసమే..రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారని వొడితెల ప్రణవ్బాబు అన్నారు. ఎన్నికల సమయంలో కుటుంబా న్ని అడ్డుపెట్టుకొని గెలిచిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్పై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి కౌశిక్రెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు.ఉద్యోగాల పేరిట కౌశిక్రెడ్డి మోసం చేశారుకోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అంటూ చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్గౌడ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన కౌశిక్రెడ్డి ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం ఉనికి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. -
పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అతిపెద్ద స్కాం చేశాడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అండగదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీలో నుంచి వస్తున్న యాష్ను లోడ్ రికార్డు లేకుండానే బయటకు పంపిస్తున్నారని అన్నారు. అయితే లారీ లోడు ఖాళీగా చూపిస్తూ వే బ్రిడ్జి ఇస్తున్నారని విమర్శించారు. .కలెక్షన్ బాయ్గా పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ఈ వ్యవహారాలు చూస్తున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. స్థానికంగా దీనిపై వార్తలు రాస్తున్న రిపోర్టర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రెండు లారీలను సీజ్ చేసి, మిగితా 13 లారీలను వదిలిపెట్టారని తెలిపారు.ఇంత పెద్ద స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ పొన్నం ప్రభాకర్ను ప్రశ్నించారు. తమ ఆరోపణలపై దమ్ముంటే మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. `నా దిష్టి బొమ్మ తగలబెట్టడం కాదు. ఈ స్కాం పై మీరు మాట్లాడాలి. ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మేము బాధ్యులం కాదు. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.` అంటూ మండిపడ్డారు.కాగా రెండు రోజుల క్రితం ఓవర్ లోడ్తో రామగుండం నుంచి ఖమ్మం వెళ్తున్న బూడిద లారీలను హుజురాబాద్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లు లేకుండా ప్లై యాష్ బూడిద తరలించడాన్ని గుర్తించి సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆందోళనకు దిగి అధికారుల తీరు, మంత్రి పొన్నం వైఖరిపై మండిపడ్డారు.రవాణా శాఖ మంత్రి అండదండలతోనే అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. అధికారులకు పిర్యాదు చేసిన మంత్రి ప్రోద్బలంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ దందాకు చేస్తున్న మంత్రి పొన్నం ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
వీఐపీల డ్రైవర్స్కు ఫిట్నెస్ టెస్ట్ చేస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్కు ఫిట్నెస్ టెస్ట్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మంత్రి పొన్నం మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. ‘మహాలక్ష్మి కింద కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొడితే.. పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. గతంలో రెగ్యులర్గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే.. ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉంది. ఆటోవాళ్లకు రూ. 12 వేల హామీ ఇచ్చాం.. నెరవేరుస్తాం. ఆటోలు కొనుగోలు పెరిగింది, ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారు?. ... కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తాం. బిహార్లో 2.5 లక్షల మంది అధికారులను కేటాయించి ఒకొక్కరికి 150 ఇల్లు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి.. అధికారులను నియమిస్తాం. నోడల్ ఆఫీసర్గా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఉంటుంది. కవితకు సీబీఐ నోటీసులు వాయిదాల పద్ధతిలో వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, అందుకే మళ్లీ కొత్త డ్రామా’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
మంత్రి పొన్నం ప్రకటనతో పరేషాన్..!
కరీంనగర్: ఇప్పటికే భూ ఆక్రమణల విచారణతో అతలాకుతమవుతున్న నగరపాలకసంస్థకు పులిమీద పుట్రలా స్మార్ట్సిటీ విచారణ వచ్చి పడనుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్మార్ట్సిటీ నిధులతో నగర రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరగడం తెలిసిందే. ఈ పనుల్లో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారంటూ గతంలోనే అనేక ఫిర్యాదులు వెల్లువెతాయి. తాజాగా స్మార్ట్సిటీ పనుల్లో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో అధికారుల్లో గుబులు మొదలైంది. నగరపాలక అధికారుల్లో గుబులు.. స్మార్ట్సిటీ పనులపై విచారణ అంటేనే అధికారుల్లో వణుకుపుడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మార్ట్సిటీ పనుల్లో అక్రమాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తొలుత హౌసింగ్బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినప్పటికీ, పూర్తిస్థాయిలో మాత్రం దృష్టి పెట్ట లేదు. కేవలం వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగానే విచారణ సాగినట్లు సమాచారం. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్సిటీ అక్రమాలపై విచారణ జరిపిస్తామని మరోసారి వెల్లడించడం హాట్టాపిక్గా మారింది. మొత్తం పనులపై విచారణ జరిపితే, చాలా విషయాలు బయటకు రానున్నాయి. దీంతో సాంకేతికంగా బాధ్యులుగా తేలే చాన్స్ నగరపాలకసంస్థ అధికారులకే ఉండడంతో, ఈ విచారణ వారి మెడకు చుట్టుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే భూ ఆక్రమణలకు సంబంధించి నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగం అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తుండగా, మరో వైపు స్మార్ట్సిటీ పనులపైనా విచారణ జరిగితే కొంతమంది ఇంజినీరింగ్ అధికారుల అక్రమాల బాగోతం బయటపడనుంది. మరికొద్ది రోజుల్లో విచారణపై స్పష్టత రానుంది. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి స్మార్ట్సిటీ జాబితాలో చోటులభించడంతో కరీంనగర్ నగరపాలకసంస్థకు నిధుల వరద వచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో రూ.వెయ్యి కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.740 కోట్లు విడుదల కాగా, ఇందులో రూ.539 కోట్లు చెల్లించారు. మరో రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. స్మార్ట్సిటీ కింద చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు, స్మార్ట్ వీధిదీపాలు, నిర్మాణం దాదాపు పూర్తయింది. కొన్ని కూడళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఇక కమాండ్ కంట్రోల్, లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలు, పార్క్లు తదితర అభివృద్ధి పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇష్టారీతిన అంచనాలు.. రూ.వందలకోట్లతో చేపట్టిన స్మార్ట్సిటీ పనుల్లో కొంతమంది నగరపాలకసంస్థ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా గతంలో బల్దియాలో అంతా తానై వ్యవహరించిన ఓ ఇంజినీరింగ్ అధికారి కనుసన్నల్లో చేసిన అంచనాలే తప్పినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను ఇష్టారీతిన పెంచి, స్మార్ట్సిటీ నిధులను కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించినట్లు అభియోగాలున్నాయి. రూ.50 లక్షలతో పూర్తయే జంక్షన్ పనికి, రూ.కోటికి పైగా బిల్లు చేసిన వైనం నగరపాలకసంస్థ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణంలోనూ అంచనాలు, బిల్లులపై అనేక ఆరోపణలు వచ్చాయి. లెస్ క్వాలిటీ.. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్సిటీ పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తమ లాభాల కోసం అంచనాలు భారీగా పెంచినప్పటికీ, చేసిన పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో వాటి మనుగడ కష్టంగా మారింది. కలెక్టరేట్ రోడ్డు, హౌసింగ్బోర్డు కాలనీ, అంబేడ్కర్ స్టేడియం, టవర్సర్కిల్ తదితర ప్రాంతాల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. సీసీరోడ్డు కుంగిపోగా, డ్రైనేజీలు నిర్మాణంలోనే కూలిపోయాయి. ఫుట్పాత్లైతే చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో ఫుట్పాత్లపై వేసిన టైల్స్ 90 శాతం సక్రమంగా లేవు. టవర్సర్కిల్ వద్ద డ్రైనేజీల నుంచి ఫుట్పాత్ల మీదుగా వచ్చే వరదనీళ్లు ఫౌంటేన్ల మాదిరిగా మారాయి. కూడళ్లకు వినియోగించిన మెటీరియల్ కూడా నాసిరకం వాడారనే ఆరోపణలున్నాయి. ఎక్కడో ఒకటి అరా తప్ప దాదాపు అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే ఫిర్యాదులున్నాయి. ఇవి చదవండి: మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి -
కాంగ్రెస్ బలోపేతానికి పాత మిత్రులు కలిసిరావాలి..
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాత మిత్రులు కలిసి రావాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీచేయని పాత కాంగ్రెస్ నాయకులు తిరిగి పార్టీలోకి రావాలన్నారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడుతుంటే, కొంతమంది మతం పేరిట, దేవుళ్ల ఫొటోలతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. సీనియర్ నాయకుడైన భాస్కర్రెడ్డి, తిరిగి పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. సొంత గూటికి ఆకారపు భాస్కర్రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఆయన, కొన్ని సంవత్సరాల క్రితం బీఆర్ఎస్లో చేరారు. బుధవారం బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జీ రోహిత్ చౌదరి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్లో సీనియర్ నాయకులకు గుర్తింపు లేదని ఆకారపు భాస్కర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు, మూల వెంకట రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
‘నామినేటెడ్’ ఎవరికో?
కరీంనగర్: పదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదివరకు ప్రతిపక్ష నాయకులుగా ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రధాన నాయకులు, ముఖ్య కార్యకర్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. తాము కోరుకున్న కమిటీలో స్థానం కల్పించాలని కోరుతూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హు జూరాబాద్ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులతో పాటు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్(సుడా), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులకు పోటీ పడుతున్నారు. కరీంనగర్, హుజూరా బాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. గ్రంథాలయ సంస్థకు తీవ్ర పోటీ.. జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో ఎలాంటి రాజ కీయ ఒత్తిళ్లు లేకుండా గౌరవప్రదమైన హోదా కలి గిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు తమ మనసులో మాట చెప్పినట్లు సమాచారం. చైర్మన్ పదవితోపాటు డైరెక్టర్ల నియామకం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రైతుబంధు సమితులు కొనసాగేనా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా, మండల స్థాయిలో రైతుబంధు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వీటిని కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా.. కొనసాగిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవులను తమకు ఇవ్వాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 7 మార్కెట్లు, 3 ఉప మార్కెట్లు జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్లు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, మానకొండూర్, గోపాల్రావుపేటలతోపాటు 3 ఉప మార్కెట్లు కమలాపూర్, కేశవపట్నం, ఎల్కతుర్తి ఉన్నాయి. గత ప్రభుత్వం చైర్మన్ పదవులను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం అదే పద్ధతిని పాటిస్తుందా లేదా పాత పద్ధతిలో కమిటీలను నియమిస్తుందో వేచిచూడాలి. దేవస్థాన కమిటీలు.. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఇల్లందకుంట సీతారామాలయం, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్రోడ్లో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలకు రూ.25 లక్షల పైబడి ఆదాయం వస్తుంది. వీటికి దేవాదాయ పాలక కమిటీలు నియమించి, ఉత్సవాలను నిర్వహించే ఆనవాయితీ ఉంది. జిల్లాలో కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి, జిల్లా కేంద్రంలోని విజయగణపతి సాయిబాబా, గౌరీశంకర, భక్తాంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి(మంకమ్మతోట), పొద్దుటూరి వారి ధర్మసంస్థ, హరిహర, గిద్దెపెరుమాండ్ల స్వామి, వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, కోతిరాంపూర్ పోచమ్మ, కట్టరాంపూర్ అభయాంజనేయ, గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ, హనుమాన్(హుజూరాబాద్), సీతా రామస్వామి (నల్గొండ, తిమ్మాపూర్), వెంకటేశ్వర స్వామి(జమ్మికుంట) ఆలయాలకు దేవస్థాన కమిటీల చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా అధికార పార్టీకి చెందిన మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి ఉన్నారు. కరీంనగర్, హుజూరాబాద్లలో కాంగ్రెస్ ఇన్చార్జీలుగా పురమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్ వ్యవహరిస్తున్నారు. ఓటమి చెందినప్పటికీ ఆ నియోజకవర్గాలకు వీరినే ఇన్చార్జీలుగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారి కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి చదవండి: సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి! -
మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఎమ్మెల్సీ కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్పై మండిపడ్డారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని నిలదీశారామె. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని కవిత తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో, ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నామన్నారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంత్రి గారూ! అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ? భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?? అసెంబ్లీలో… https://t.co/Eb6nPs2YN0 — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 22, 2024 చదవండి: ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం -
కార్యదర్శిపై మంత్రి పొన్నం ఆగ్రహం! ఎంపీడీవోకు ఆదేశాలు
కరీంనగర్: ప్రజాపాలన దరఖాస్తును చించేసిన పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిగురుమామిడికి చేరుకున్న మంత్రి సర్దార్సర్వాయిపాపన్న, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. మండలంలోని 17 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. బొమ్మనపల్లి గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అల్లెపు కనకయ్య తన ఆవేదనను మంత్రికి చెప్పుకున్నాడు. ప్రజాపాలనలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా జీపీ కార్యదర్శి రమణారెడ్డి దరఖాస్తు చించేశాడని, బొమ్మనపల్లి గ్రామం కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడని చెప్పాడు. మంత్రి వెంటనే జీపీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. దరఖాస్తును ఎందుకు చించావని, ప్రజలకు సేవచేయాల్సిందిపోయి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సస్పెండ్ చేస్తామని, కనకయ్య ఇంటికెళ్లి దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఎం. నర్సయ్యకు ఫోన్ చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేమే సేవకులమైనప్పుడు, ఉద్యోగులు కూడా సేవకులే అని అన్నారు. గ్రామాల్లో తప్పనిసరి పర్యటిస్తానని, అత్యవసరాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జెడ్పీఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్కుమార్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరయ్యారు. ఇవి చదవండి: గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు -
అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: రాష్ట్రం ప్రస్తుతం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పులను సాకుగా చూపి హామీలను విస్మరించమని, ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దిగువ మానేరు జలా శయం నుంచి ఆయకట్టుకు ఆదివారం సాయంత్రం కాకతీయకాలువ ద్వారా నీటిని కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. యాసంగి పంటలకు ఎల్ఎండీ నుంచి సూర్యాపేట వరకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఎల్ఎండీ, మిడ్ మానేరులో తాగునీటి కోసం 15టీఎంసీలు నిల్వ చేసి మిగతా 29 టీఎంసీలు ఆయకట్టుకు విడుదల చేస్తామని వెల్లడించారు. రైతులు నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సారెస్పీ గెస్ట్హౌస్లో అభయహస్తం దరఖాస్తులపై సమీక్ష చేశారు. అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తామన్నారు. ప్రజలు గత నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని మార్చి తాము చెబితే వినాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని మంత్రి అన్నారు. తప్పకుండా ప్రజల సూచనలు, సలహాలు, ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు ఆరుకోట్ల ఉచిత బస్సు టిక్కెట్లు మహిళలు వినియోగించుకున్నారని తెలిపా రు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతామని తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, తహసీల్దార్ కనుకయ్య, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, ఎస్ఎల్గౌడ్, శ్రీగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చిగురుమామిడిలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్కుమార్ కూతురు సిరివైష్ణవ్య చేత కేక్కట్ చేయించారు. బొకేలు వద్దు.. నోట్బుక్స్తో రండి! నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు తనవద్దకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలతో కాకుండా నోట్బుక్స్, పుస్తకాలు తీసుకురావాలని సూచించారు. అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని, వాటిని విద్యార్థులకు, చిన్నారులకు చేరవేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్భవన్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్కు ఆత్మీయ సత్కారం చేశారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ఇళ్లపట్టాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అ ప్రక్రియ రద్దు చేశామని తెలిపారు. అర్హుల జాబితాను పారదర్శకంగా తయారు చేసి ఇస్తే, వారికి ఇళ్లస్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బాధ్యతతో 2024కు స్వాగతం.. కాంగ్రెస్ పార్టీకి 2023 శుభ సంవత్సరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పును, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీసిన వైనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు కోరుకొన్న ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారన్నారు. స్వేచ్చగా జీవించే విధంగా, తమ సమస్యలు చెప్పుకొనే విధంగా, తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఆ దిశగా ప్రజలు రాష్ట్రంలో మార్పు తీసుకువచ్చారని అన్నారు. 2024 సంవత్సరం తమకు బాధ్యతతో కూడిన సంవత్సరమని, ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే సంవత్సరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు వైద్యుల అంజన్కుమార్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పార్లమెంట్లో భద్రతను ప్రశ్నిస్తే ఎంపీలకు సస్పెండ్ చేస్తారా?’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాసులు వచ్చాయని, వారిని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నం ఆరోపించారు. పార్లమెంట్.. రాజ్యాంగాన్ని అమలుచేసే వేదిక అని, అక్కడ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు అంటూ బీజేపీ సర్కార్పై ధ్వజమెత్తారు. పార్లమెంట్ భద్రతపై విచారణ జరపాలని, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పొన్నం డిమాండ్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ నేతలకు పొన్నం కౌంటరిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలి. గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కచ్చితంగా నెరవేస్తుంది. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు అని కామెంట్స్ చేశారు. -
'ఎస్ఆర్ఆర్ నుంచే నా రాజకీయ జీవితం' : పొన్నం ప్రభాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అని, రాజకీయ ఉద్ధండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, జువ్వాడి చొక్కారావు, ఎమ్మెస్సార్, జి.వెంకటస్వామి, జైపాల్రెడ్డి నుంచి అక్షరాలు నేర్చుకున్నానని చెప్పా రు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వచ్చారు. నగరంలోని ఇందిరాచౌక్లో ఏర్పాటు చేసిన వి జయభేరి సభలో ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ మంత్రి టి.జీ వన్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతామన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తమది చేతల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం మారిందని, అధికారులు కూడా వ్యవస్థను మార్చుకోవాలని సూచించారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను కరీంనగర్ బిడ్డనన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, ఎన్ఎస్యూఐ జిల్లా, రాష్ట్ర అ ధ్యక్షుడిగా, మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశానన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ అయ్యానన్నారు. తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు 1973లో రవాణా శా ఖ మంత్రి అయితే, చొక్కారావు శిష్యుడినైన తాను 2023లో రవాణాశాఖ మంత్రి అయ్యానన్నారు. తా ను 1987లో రాజకీయ జీవితం ప్రారంభించానని, ఈ 36 ఏళ్లలో ఎక్కడా అవినీతికి తావులేదని, ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కొంతమంది చేతగాక పార్టీలు మారినోళ్లు తనను విమర్శిస్తే, భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడని చెప్పానంటూ గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారలేదని కాంగ్రెస్ అంటే పొన్నం, పొన్నం అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదమే టానిక్ అ ని, కేసీఆర్ వాడే టానిక్ కాదంటూ చమత్కరించా రు. ఎంపీగా తాను పార్లమెంట్లో తెలంగాణ కో సం కొట్లాడి, మా ఎంపీ పొన్నం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేశానన్నారు. మానకొండూరు ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రజల ఆశలు నెరవేర్చిన నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాలు గెలిపించుకున్నానని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం మాట్లాడుతూ నియంతృత్వ ప్రభుత్వం కూలి పోయి, ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్, హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్, నాయకులు వైద్యుల అంజన్కుమార్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మెనేని రోహిత్రావు, మంజులారెడ్డి, కటకం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. దారిపొడవునా నీరాజనం! మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, పొన్నం అభిమానులు, కుల, బీసీ సంఘాలు ఘనస్వాగతం పలికా యి. ఎమ్మెల్యేలు క వ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఓపెన్టాప్ వాహనంలో నగరానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద పూలవర్షంతో నీరాజనం పట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోతిరాంపూర్, కమాన్చౌరస్తా, సిక్వాడీ, శ్రీపాదచౌక్ మీదుగా ఇందిరాచౌక్ వరకు అడుగడుగునా స్వాగతం పలికారు. కోలాటాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మ హిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గొల్లకురుమలు గొంగడితో సత్కరించారు. సిక్లు కరవాలం బహుకరించారు. ఆర్టీసీ కార్మికులు గజ మాలతో సన్మానించారు. ఇందిరాచౌక్ వద్ద విజయభేరి సభ ముగిసిన తరువాత పొన్నం ప్రభాకర్ ర్యాలీగా డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. నాయకులు కట్ల సతీశ్, కొడూరి రవీందర్గౌడ్, మునిగంటి అనిల్, దన్ను సింగ్, ఖమర్, సిరాజొద్దిన్, మొహమ్మద్ అమీర్, బోనాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవి చదవండి: రెగ్యులర్ కమిటీ లేనట్టేనా? ఇంతకీ చైర్మన్ ఎవరు? -
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పొన్నం
-
ఆస్పత్రిలో కేసీఆర్.. యశోదకు పొన్నం
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చనట్లు తెలిపారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పొన్నం చెప్పారు. కేటీఆర్, హరీష్ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిడి తెలుకున్నానని తెలిపారు. ఇక మధ్యాహ్నం 12.30 తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యశోదా ఆస్పత్రికి రాననున్నట్లు అయన వెల్లడించారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
పొన్నం వర్సెస్ అల్గిరెడ్డి.. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా?
సాక్షి, మెదక్: కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల కేటాయింపులో మొదటి లిస్ట్లో హుస్నాబాద్కు చోటు ఇవ్వలేదు. రేపో మాపో రెండో లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ ఖరారు కాకముందే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. టికెట్ నాకే అంటే నాకే అని ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. – హుస్నాబాద్ హైదరాబాద్లోని తక్కుగూడలో జరిగిన రాహుల్ గాంధీ, సోనియాగాంధీ విజయభేరికి ఎవరికి వారే వాహనాల్లో కార్యకర్తలను తరలించారు. పార్టీ కార్యాలయాలను సైతం ప్రారంభించారు. ‘తిరగబడుదాం..తరిమికొడదాం’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి. హన్మంతరావు పాల్గొనగా, పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఇద్దరూ పాల్గొన్నారు. దీని తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదుకు నిర్వహించి సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు మోహన్ ప్రకాశ్ రాగా, రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా ఏర్పడడం కార్యకర్తల్లో అయోమయానికి గురి చేసింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా హుస్నాబాద్ టికెట్ తమకే కేటాయించాలని సీపీఐ పార్టీ ఒత్తిడి తెస్తోంది. ఈ రెండు మూడు రోజుల నుంచి సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో, హుస్నాబాద్ సీటు కాంగ్రెస్కే కేటాయిస్తారనే భావనతో టికెట్ కోసం పొన్నం ప్రభాకర్, ప్రవీణ్రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చలో కాళేశ్వరం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని, ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు చూపేందుకు పొన్నం ప్రభాకర్ చలో కాళేశ్వరం పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలానికి ఒక బస్సు చొప్పున రైతులు, కాంగ్రెస్ నాయకులతో కాశేశ్వరానికి తరలివెళ్లారు. అలాగే మార్నింగ్ వాక్ పేరిట ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇటీవలె కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రచార రథాలకు పూజలు చేయించి ప్రతి రోజూ ప్రచారం చేయిస్తున్నారు. చాపకింది నీరులా ప్రచారం.. మరో వైపు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి చాపకింద నీరులా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు 90 గ్రామాలను చుట్టిముట్టి కాంగ్రెస్ ఆరు గ్యా రెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఊరు ఊరునా పరామర్శల పేరిట ఇంటింటికీ వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. టికె ట్ తనకే వస్తుందనే ధీమాతో కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో బుధవారం ప్రచ ార రథాలకు పూజలు నిర్వహించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా? కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరి మద్దతు ఉంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు నేతలు ఎందులోనూ తగ్గకుండా సీరియస్గా ఎవరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఇద్దరు చేతులు కలుపుతారా లేదా చేయి ఇస్తారా అనేది అంతుపట్టని పరిస్థితి నెలకొంది. -
‘రాజన్నకే శఠగోపం పెట్టిన సీఎం కేసీఆర్’
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆరేళ్లక్రితం వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ గుడిమెట్ల సాక్షిగా యేటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పటికీ నెరవేర్చలేదని, రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. రాజన్న ఆలయ అభివృద్ధికి నిధుల కొరతతో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే 15నెలలుగా పత్తాలేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, నాయకులు సాగారం వెంకటస్వామి, సగ్గు పద్మ, ముడిగె చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు. చదవండి: Etela Rajender: కేసీఆర్ పతనం కావడానికి హుజూరాబాద్ వేదిక కావాలి -
‘బరితెగించి ఇంకా అప్పులు చేస్తానంటున్నాడు’
సాక్షి, పెద్దపల్లి : ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి విమర్శించారు. ఎలిగేడు మండలం శివపల్లిలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టబోయే బిడ్డపై లక్ష రూపాయల భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని, ప్రభుత్వ దుబారా వ్యయాన్నికాగ్ నివేదిక తప్పుబట్టిందని తెలిపారు. కేసీఆర్ ఇంకా బరితెగించి అప్పులు చేస్తానంటునాడని మండిపడ్డారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్గా స్వీకరించాలన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని పిలుపునిచ్చారు. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి క్షేత్రస్థాయి నాయకులకు గౌరవం లేకుండా చేసిన టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా స్థానిక సంస్థల బలోపేతానికి సహకరించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారంజరగనున్న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 10 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన, అంబేడ్కర్ జయంతి నాడే ఆయన విగ్రహాన్ని ముక్కలు చేసిన, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన, కేబినెట్లో స్థానం ఇవ్వకుండా తెలంగాణ మహిళలను అవమానపరచిన టీఆర్ఎస్ పార్టీకి ఓటేయవద్దని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని, టీఆర్ఎస్, బీజేపీలు తొడుదొంగల్లా పనిచేస్తున్నాయని ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలు అమలు కాకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ గతంలో పాల్పడిన అవినీతి పనులతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని పొన్నం ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకుంటున్నా, వాస్తవంగా రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. ప్రధాని మోదీ అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధిని కోల్పోయారని చెప్పారు. -
విభజన హామీల అమలులో విఫలం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం ఎంపీలతో సమావేశం పెట్టి ప్రాధాన్యత గలిగిన అంశాలపై మాట్లాడకపోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వస్తే ఆయన కారు దిగగానే టీఆర్ఎస్ ఎంపీలు గజగజ భయపడే పరిస్థితి. ఏ ఎంపీ రాష్ట్ర ప్రయోజనాలపై విజ్ఞప్తి చేసే పరిస్థితి లేదు. మొత్తంగా అందరూ వ్యాపారస్తులై ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు’ అని వ్యాఖ్యానించారు. ఎయిమ్స్కు నిధులు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని పేర్కొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని అడిగితే టీఆర్ఎస్ ఎంపీలు తలదించుకునే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనలోగానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలోగానీ పురోగతి లేదని విమర్శించారు. -
బీసీ స్టడీసర్కిల్కు మోక్షమెప్పుడో..?
భవన నిర్మాణానికిరాని మంజూరు నాలుగు జిల్లాల్లో గ్రీన్సిగ్నల్ కరీంనగర్కు దక్కని చోటు నిధులుండీ నిర్మాణం చేపట్టని సర్కారు కరీంనగర్ సిటీ : బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి ఇప్పట్లో మోక్షం కలిగేలా పరిస్థితులు కల్పించడంలేదు. నిధులు విడుదలై శంకుస్థాపన చేసుకున్నా పనులు, మంజూరుకు మాత్రం నోచుకోవడంలేదు. తాజాగా నాలుగు జిల్లాల్లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. అందులో కరీంనగర్ను విస్మరించడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం రాజకీయ కోణంలోనే కరీంనగర్కు చోటు లభించలేదనే విమర్శలొస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే అందులో కరీంనగర్ గురించి ప్రస్తావన లేకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.3.65 కోట్లతో నిజామాబాద్లో, రూ.8.70 కోట్లతో హైదరాబాద్, రూ.3.75 కోట్లతో ఆదిలాబాద్, రూ.3.70 కోట్లతో సంగారెడ్డి (మెదక్)లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణాలకు మెమో నెం.టీ4/24/2017–17, తేదీ 11.08.2016 ద్వారా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 2013లో శంకుస్థాపన చేసుకుని మంజూరుకు ఎదురుచూస్తున్న కరీంనగర్ బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. మూడేళ్లయినా కలగని మోక్షం.. 2009 ఆగస్టు 3న జిల్లా కేంద్రంలో ఎస్సారార్ కళాశాల ఎదురుగా ఆర్అండ్బీ క్వార్టర్స్ సముదాయంలో బీసీ స్టడీసర్కిల్ను ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో స్టడీసర్కిల్ నిర్వహిస్తుండడంపై విమర్శలొచ్చాయి. స్టడీసర్కిల్కు సొంత భవనం నిర్మించాలంటూ అభ్యర్థులు, వివిధ సంఘాల బాధ్యులు కోరుతూ వచ్చారు. చివరకు 2013లో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ చొరవతో భవన నిర్మాణానికి బీజం పడింది. ఇందుకోసం నగరంలోని సప్తగిరికాలనీ ఆబాదికుంట శిఖంలో వేయిచదరగపు గజాల స్థలాన్ని కేటాయించారు. రూ.2 కోట్ల 40 లక్షల వ్యయంతో నాలుగు అంతస్తులతో భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తన వాటాగా పొన్నం ప్రభాకర్ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయించారు. మరో రూ.50 లక్షలు రాజ్యసభ సభ్యుడు దేవేందర్గౌడ్తో మంజూరు చేయించారు. మిగిలిన రూ.కోటి 40 లక్షలు బీసీ శాఖ భరించడానికి ఒప్పందం కుదిరింది. భవన నిర్మాణానికి 2013 నవంబర్ 28న అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం భవన నిర్మాణానికి మంజూరు ఇవ్వడంలో ఆసక్తి చూపకపోవడానికి రాజకీయపరమైన కారణాలంటూ ప్రతిపక్షాలు పలుమార్లు ఆరోపించాయి. ప్రస్తుత ప్రభుత్వం రూ.3కోట్ల అంచనాతో భవన నిర్మాణానికి కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఎంపీ హోదాలో పొన్నం ప్రభాకర్ కేటాయించిన రూ.50 లక్షలు విడుదల అయినా ప్రభుత్వం మంజూరు ఇవ్వకపోవడంతో అలానే ఉండిపోయాయి. అద్దె భవనంలో కొనసాగింపు ప్రస్తుతం పోటీపరీక్షల సీజన్ కావడంతో బీసీ స్టడీసర్కిల్కు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం మంకమ్మతోటలో అద్దె భవనంలో స్టడీసర్కిల్ను ఇబ్బందుల మధ్య నిర్వహిస్తున్నారు. ఒకటో అంతస్తులో కార్యాలయం, రెండోఅంతస్తులో డైనింగ్, మూడు, నాలుగు అంతస్తుల్లో బాలికల, బాలుర హాస్టళ్లను నిర్వహించడానికి వీలుగా నిర్మించనున్న భవనం పూర్తయితే అభ్యర్థులకు ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి త్వరగా స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
ఒక్క హామీ నెరవేర్చని సీఎం
ఎల్లంపల్లి నీళ్లు జిల్లా ప్రజలకు ఇచ్చిన తర్వాతనే గజ్వేల్కు తరలించాలి ధర్నాలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ : సీఎం హోదాలో కేసీఆర్ 2014 ఆగస్టు 5న తొలిసారిగా పర్యటించిన సందర్భంగా నాలుగు గంటల్లో నలభై హామీలిచ్చారని, రెండేళ్లు గడుస్తున్నా వాటిని నెరవేర్చలేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎల్లంపల్లి నీటిని హైదరాబాద్, మెదక్ జిల్లాలకు తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా ప్రజల నీటి అవసరాలు తీర్చిన తర్వాతనే ఎల్లంపల్లి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎల్లంపల్లి నీటిలో జిల్లా వాటాను సాధించేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనన్నారు. సీఎం కేసీఆర్ తొలిసారి కరీంనగర్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. హామీలు నేరవేర్చని సీఎంపై క్రిమినల్ కే సు నమోదు చేయాలని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాట తప్పడం కేసీఆర్ నైజం కాదని ఎంపీ వినోద్కుమార్ పత్రికల ద్వారా ప్రచారం చేసుకోవడం తగదన్నారు. జిల్లా పర్యటనలో కేసీఆర్ ఇచ్చిన నలభై హామీల్లో ఎన్ని నెరవేర్చాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఎనభై వేల పవర్లూమ్స్ ఉన్న సిరిసిల్లను కాదని వరంగల్కు టైక్స్టైల్స్ జోన్ను తీసుకెళ్లడం శోచనీయమన్నారు. కరీంనగర్ను ఊహించని విధంగా లండన్, న్యూయార్క్ మాదిరిగా అభివృద్ధి చేస్తానని, ఎల్ఎండీలో మైసూర్లోని బందావన్ గార్డెన్ను తలపించేలా మూడు వందల ఎకరాల్లో ఉద్యానవనంగా తీర్చిదిద్దుతానని, నేదునూర్ గ్యాస్ ఇవ్వకుంటే జెన్కో ద్వారా థర్మల్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జిల్లా ఆస్పత్రిని నిమ్స్ స్థాయిలో అబివద్ధి చేసి దానికి అనుబంధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. టీఆర్ఎస్ నాయకులకు చాతనైతే జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై కేసీఆర్తో చెప్పించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్, హుజూరాబాద్ ఆర్టీఓ కార్యాలయాలపై దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తుందే తప్ప నిర్మాణాత్మకమైన పనులు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రం విడిపోయాకా రూ.60వేల కోట్ల అప్పులు ఉంటే ప్రస్తుతం రూ.లక్షా 60వేల కోట్ల అప్పులయ్యాయని అన్నారు. -
రామోజీ ఫిలింసిటీని దున్నటం ఏమైంది?
సీఎం కేసీఆర్కు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్న కరీంనగర్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలింసిటీని వెయ్యి నాగళ్లు కట్టి దున్నిస్తామన్న కేసీఆర్ హెచ్చరికలు ఏమయ్యాయని కరీంనగర్, నిజామాబాద్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్లో వారు విలేకరులతో మాట్లాడారు. పోలవరం విషయంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న కేసీఆర్ మాటమార్చడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయంలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తే లాఠీచార్జి చేయించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. చిల్లర పార్టీలంటూ ఎదురుదాడికి దిగడం, తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వంటి చర్యలు కేసీఆర్ అహం కార ధోరణికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ నేతలతో నీతులు చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని, హద్దుమీరి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
తెలంగాణతో పవన్కేం సంబంధం?
కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం వీణవంక జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు తెలంగాణతో ఏం సంబంృం ఉందని కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు ఇక్కడ పర్యటించడం బీజేపీ దౌర్భాగ్యమని పేర్కొన్నారుృ రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాల్లో నటించే వ్యక్తి.. అదే రెమ్యూనరేషన్ ఇచ్చి భార్యలకు విడాకులు ఇస్తున్నాడని, అటువంటి వ్యక్తిని బీజేపీ చేరదీసి తమ పార్టీ తరపున ప్రచారం చేయించడం సిగ్గుచేటన్నారు. పవన్ కేవలం డ్రామాలకే పనికి వస్తాడని విమర్శించారు. తెలంగాణ ద్రోహులను ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. -
వారంతా ఆడ,మగ కాని వారే..!
టీడీపీలో చేరికలపై పొన్నం వ్యాఖ్య కథలాపూర్, : రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయిందని, ఆడ, మగ కాకుండా ఉన్నవారే ఆ పార్టీలో చేరుతున్నారని కరీంగనర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కథలాపూర్లో మంగళవారం ఆయన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీతో బీజేపీ దోస్తీ కట్టడం దారుణమన్నారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ లోక్సభలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాటంతో ఆ పార్టీ ద్వందవైఖరి బహిర్గతమైందని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్పార్టీకే దక్కుతుందన్నారు. రెండు కళ్ల సిద్ధాంతాలతో ఉన్న టీడీపీ, ద్వంద విధానం అవలంబించిన బీజేపీతో జత కట్టడం ప్రజలను మోసం చేయడానికేనని మండిపడ్డారు. -
ఆత్మబలిదానాలకు చంద్రబాబే కారణం
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఆత్మబలిదానాలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరే కారణమని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మబలిదానాలకు సోనియా కారణమన్న టీటీడీపీ ఫోరం ఆరోపణలను ఖండించారు. బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఇచ్చినప్పుడు తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారని, అద్వానీ ఈ విషయం చెప్పారని గుర్తుచేశారు. అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే వేలాది మంది ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఇప్పుడు సైతం తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతున్న చంద్రబాబును నిలువరించకపోతే టీడీపీ నాయకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర విభజన జరుగుతున్నా ఇంకా ఆగుతుందనడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. టీడీపీ ప్లీనరీలో కనీసం అమరులకు సంతాపం ప్రకటించలేదని, ఏనాడూ అమరుల కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. 18 వేల మెయిల్స్ను పరిశీలించి జీవోఎం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం హర్షణీయమని, యావత్ జిల్లా ప్రజానీకం తరఫున సోనియా, మన్మోహన్, రాహుల్, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపవని తెలిపారు. వెంకయ్యనాయుడు కుట్రలు చేస్తున్నా సుష్మాస్వరాజ్ తెలంగాణ బిల్లుకు మద్దతు పలుకుతారనే విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. సీఎం అయ్యేందుకు మంత్రి శ్రీధర్బాబు అర్హుడేనని, ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. ఎన్నికల వేళ డీసీసీ అధ్యక్షుడిని మారుస్తారని తాననుకోవడం లేదన్నారు. ఓట్లు తొలగించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయరాదని సూచించారు. అర్హుల ఓట్లు తొలగిస్తే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. చేర్పులు, తొలగింపులపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యవే క్షించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, నగర అధ్యక్షుడు కన్న కృష్ణ, డి.శంకర్, వై.సునీల్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు ఉన్నారు.