Startup Diary
-
ప్రాక్టీస్ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్! ఇదో నానుడే కాదు. వ్యాపార సూత్రం కూడా. ఇంటర్వ్యూబడ్డీ చేసేదిదే!!. దేశ, విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల వైస్ ప్రెసిడెంట్స్, హెచ్ఆర్ ప్రతినిధులతో పాటూ రిటైర్డ్ ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకుంది. మన దేశంతో పాటూ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో మాక్ ఇంటర్వ్యూ సేవలందిస్తున్న ఇంటర్వ్యూ బడ్డీ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ ఉజ్వల్ సూరంపల్లి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది విశాఖపట్నం. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తయ్యాక.. జర్మనీలో మాస్టర్స్ కోసం వెళ్లా. చదువుకుంటూ జాబ్స్ కోసం ప్రయత్నించా. ప్రాక్టీస్ లేకపోవటంతో ఒకటిరెండు ఇంటర్వ్యూల్లో ఫెయిలయ్యా. అప్పుడే అనిపించింది. క్రీడలకు ఉన్నట్టే ఇంటర్వ్యూలకూ ప్రత్యక్షంగా ప్రాక్టీస్ ఉంటే బాగుండునని. అంతే! చదువును మధ్యలోనే ఆపేసి.. విశాఖపట్నం కేంద్రంగా జూలై 2017లో ఇంటర్వ్యూబడ్డీ.ఇన్ను ప్రారంభించాం. విద్యార్థులు, కంపెనీలకూ ఇంటర్వ్యూలు.. విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికలతో అకౌంట్ను నమోదు చేసుకున్నాక.. హెచ్ఆర్, టెక్నికల్, స్పెషలైజేషన్ విభాగాల్లో కావాల్సిన ఆప్షన్ను ఎంచుకుంటే చాలు ఇంటర్వ్యూ మొదలువుతుంది. ఇంటర్వ్యూబడ్డీతో ప్రెషర్స్కు ఇంటర్వ్యూలంటే ఉండే తొందరపాటు, ఒత్తిడి తగ్గుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రొఫైల్ ప్రిపరేషన్, వెబ్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూ వీడియోలతో పాటూ నైపుణ్య ప్రదర్శన, బలహీనతలతో కూడిన సమగ్ర నివేదికను అందిస్తాం. ఒక్క సెషన్ ప్రారంభ ధర రూ.1,099. ఇటీవలే కంపెనీల కోసం ప్రత్యేకంగా ‘ఇంటర్వ్యూ బడ్డీ వైట్ లేబుల్’ అనే వేదికను ప్రారంభించాం. ఇది.. కంపెనీలకు ఇంటర్వ్యూలను, అభ్యర్థుల జాబితా సేవలను అందిస్తుంది. ప్రస్తుతం అప్రాటిక్స్ వంటి మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే మరో 5 కంపెనీలను జోడించనున్నాం. అమెరికా, బ్రెజిల్లోనూ యూజర్లు.. 15 వేల మంది రిజిస్టర్ యూజర్లున్నారు. మన దేశంతో పాటూ అమెరికా, మెక్సికో, అర్జెంటీనా నుంచి కూడా యూజర్లున్నారు. ఇప్పటివరకు 5 వేల ఇంటర్వ్యూలను నిర్వహించాం. ప్రస్తుతం నెలకు 200 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఐటీ, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి అన్ని రంగాల్లో మాక్ ఇంటర్వ్యూలుంటాయి. ఆయా రంగాల్లో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న ఇండియా, అమెరికాలకు చెందిన 220 మంది ఇంటర్వ్యూ ప్యానెలిస్ట్లతో ఒప్పందం చేసుకున్నాం. వీరికి ప్రతి ఇంటర్వ్యూ మీద 25–75 శాతం వరకు కమీషన్ ఉంటుంది. వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం గతేడాది రూ.30 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఐదేళ్లలో 20 కోట్ల ఆదాయాన్ని, 15 లక్షల ఇంటర్వ్యూలను లకి‡్ష్యంచాం. జనవరి నుంచి ఉత్తర అమెరికాలో సేవలను ప్రారంభిస్తాం. స్థానికంగా ఉన్న పలు వర్సిటీల్లోని విద్యార్థులకు ప్రాక్టీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. మన దేశంలోని ఐఐటీ–రూర్కీ, ఎఫ్ఎంఎస్–ఢిల్లీ, ఐఐఎం–రూటక్, ఢిల్లీ–అంబేడ్కర్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రూ.15 కోట్ల నిధుల సమీకరణ ప్రస్తుతం 9 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే వైజాగ్కు చెందిన ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఆల్కోవ్ పార్టనర్స్ రూ.75 లక్షల పెట్టుబడి పెట్టింది. జనవరిలో సీడ్ ఫండింగ్లో భాగంగా యూపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఫిన్ల్యాండ్కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని ఉజ్వల్ వివరించారు. -
కోలం, పొన్ను, చిట్టి ముత్యాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిరాణా సరుకులను కూడా ఆన్లైన్లో కొనే రోజులివి. కానీ ఏ గ్రాసరీ స్టార్టప్స్లోనైనా ఉప్పులు, పప్పుల వంటి వాటిల్లో లభ్యమయ్యేన్ని బ్రాండ్లు బియ్యంలో దొరకవు! ఇది చూశాక హైదరాబాద్కు చెందిన విక్రమ్ చక్రవర్తి... బియ్యాన్ని మాత్రమే విక్రయించే ‘ఓన్లీ రైస్.కామ్’ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ప్రస్తుతం మేం కోలం, పొన్ను, జై శ్రీరామ్, చిట్టి ముత్యాలు, సోనా మసూరీ, సాంబ మసూరీ, ఇడ్లీ రైస్, దోశ రైస్, బాస్మతీ, హెచ్ఎంటీ వంటి 18 రకాల బియ్యం బ్రాండ్లు విక్రయిసు ్తన్నాం. ఇవి మిర్యాలగూడ, కర్నూల్, కర్ణాటక నుంచి దిగుమతవుతాయి. ఆర్గానిక్ డయాబెటిక్ పేటెంట్ రైస్తో ప్రత్యేక ఒప్పందం ఉంది. వీటిని మైసూర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రసుతం నెలకు 1,200–1,500 బస్తాలు విక్రయిస్తున్నాం. వీటి విలువ రూ.15 లక్షల వరకూ ఉంటుంది. కిలో బియ్యం ధర రూ.32 నుంచి రూ.120 వరకూ ఉంది. కిలో బియ్యం కూడా డెలివరీ చేస్తాం. రూ.500 కంటే ఎక్కువ ఆర్డరైతే డెలివరీ ఉచితం. అంతకంటే తక్కువైతే రూ.45 డెలివరీ చార్జీ ఉంటుంది. హోటల్స్కు రూ.లక్ష వరకు రుణం... రిటైల్, హోల్సేల్ వంటి బీ2బీ వర్తకులకు, గృహ కస్టమర్లకు (బీ2సీ) రుణాలందించేందుకు ఒక ఎన్బీఎఫ్సీతో ఒప్పందం చేసుకున్నాం. దీనిప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లకు 30 రోజుల కాల పరిమితితో రూ.లక్ష వరకు రుణమిస్తాం. ఇక, బీ2సీలకు 14 రోజుల పాటు రూ.10 వేల క్రెడిట్ ఉం టుంది. ఆధార్, పాన్, ఈ–మెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలు సమర్పిస్తే చాలు నిమిషం వ్యవధిలోపే రుణం జమ అవుతుంది. ప్రస్తుతం బీ2బీలో 40, బీ2సీ 4 వేల మంది కస్టమర్లున్నారు. ఉచితంగా ఓన్లీ రైస్ ఫ్రాంచైజీ కూడా.. ఓన్లీ రైస్కు హైదరాబాద్లో నాలుగు సొంత ఔట్లెట్లున్నాయి. ఏడాదిలో 500కి చేర్చాలన్నది లక్ష్యం. అందుకే ఫ్రాంచైజీ ఇస్తున్నాం. రైస్ మర్చంట్స్కు, ఇతర దుకాణాదారులకు ఉచితంగా ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ప్రతి బస్తా అమ్మకంపై 5 శాతం కమీషన్ తీసుకుంటాం. ప్రతి నెలా 50 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి రూ.50 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ఫిబ్రవరికి బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలను విస్తరిస్తాం. ఇటీవలే హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ రూ.7 కోట్ల పెట్టుబడి పెట్టింది. త్వరలో రూ.25 కోట్లు సమీకరిస్తాం’’ అని చక్రవర్తి వివరించారు. -
ప్రకటనలు.. ప్రచారం ఒక్క చోటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ ఉత్పత్తయినా లకి‡్ష్యంచిన కొనుగోలుదారులకు చేరాలంటే నాణ్యతతో పాటూ బ్రాండ్ ఇమేజ్ తప్పనిసరి! దీనికోసం సెలబ్రిటీల ఎంపిక, ప్రకటనలు, ప్రచారం... ఇవన్నీ పెద్ద టాస్కే. కానీ, విజయవాడకు చెందిన రీసెర్చ్ మీడియా గ్రూప్ దీన్ని సులభతరం చేసింది. సెలబ్రిటీల ఎంపిక కోసం సెలబ్రిటీ హబ్, ప్రకటనల కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ల నిర్వహణ కోసం మ్యాజిక్ మంత్ర... ఇలా అన్ని సేవలనూ అందిస్తున్న రీసెర్చ్ మీడియా గ్రూప్. మరిన్ని వివరాలు సంస్థ చైర్మన్ జే చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. చిన్న ప్రకటనల సంస్థగా మా ప్రస్థానం మొదలైంది. ఇపుడు కార్పొరేట్ ఈవెంట్స్, సెలబ్రిటీ మేనేజ్మెంట్ స్థాయికి చేరాం. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్లో సెలబ్రిటీ హబ్, మేజిక్ మంత్ర, న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, రీసెర్చ్ మీడియా గ్రూప్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ పీఆర్ లైన్స్, కీ హైట్స్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఇప్పటివరకు రీసెర్చ్ మీడియా గ్రూప్కు 18 వేల మంది కార్పొరేట్స్ క్లయింట్లున్నారు. వీటిలో రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు, ఉత్పత్తుల తయారీ కంపెనీల వరకూ అన్నీ ఉన్నాయి. త్వరలోనే కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), కామినేని, కేర్ ఆసుపత్రులు, ప్రక్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా క్లయింట్ల జాబితాలో చేరనున్నాయి. ఇదీ... మా కంపెనీల తీరు సెలబ్రిటీ హబ్: 2014లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. దీనికి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, ముంబైలో బ్రాంచీలున్నాయి. సెలబ్రిటీల ఎంపిక కోసం ముంబైకి చెందిన సిమ్కామ్ మోడల్, చిరాక్ మేనేజ్మెంట్స్, జాకీ ఫెర్నాండెస్, పినాకిల్ రూడ్జ్, ది క్వీన్స్, ఎవాన్ ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం సెలబ్రిటీ హబ్లో 40 వేల మంది సినీ ప్రముఖులున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక వంటి దేశాల్లోని కార్యక్రమాలకూ తారలను అందించాం. మ్యాజిక్ మంత్ర: 2012లో ప్రారంభమైన ఈ సంస్థ కార్పొరేట్, వ్యక్తిగత ఈవెంట్లను నిర్వహిస్తుంది. గతేడాది రూ.40 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. న్యూవేవ్: విజువల్ యాడ్స్ రూపకల్పన కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్ పనిచేస్తుంది. టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణ కోసం అవసరమైన ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 టీవీ సీరియల్స్కు సేవలందించాం. రూ.100 కోట్లు లక్ష్యం.. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్లో 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.60 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.100 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే సొంత బ్యానర్పై తెలుగు, హిందీ చిత్రాల నిర్మాణంతో పాటూ జాతీయ స్థాయిలో మిస్ ఇండియా పోటీలను నిర్వహించనున్నాం’’ అని చైతన్య వివరించారు. -
2 గంటల్లో ముంగిట్లోకి ‘ఖట్టా మీఠా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నచ్చిన స్వీట్స్ కోసం కొన్ని షాపులకే వెళతాం. అక్కడికెళ్లే అవకాశం లేకపోతే ఫుడ్ అగ్రిగేటర్ల ద్వారా ఆన్లైన్లో ఆర్డరివ్వొచ్చు. కానీ అవి నిర్దేశిత పరిధి వరకే డెలివరీ చేస్తాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘ఖట్టా మీఠా’ ఒక అడుగు ముందుకేసింది. వినియోగదారులు సిటీలో ఏ మూలనున్నా టాప్ దుకాణాల నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది. స్వీట్స్, నమ్కీన్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు ఆర్డర్లు తీసుకుంటోంది. హైదరాబాద్కే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా 10–15 శాతం తక్కువ ధరకే సరఫరా చేస్తామంటున్నారు ‘ఖట్టా మీఠా’ను ప్రమోట్ చేస్తున్న ఫ్రెస్కో సర్వీసెస్ సీఈవో సందీప్ మారెళ్ల, సీవోవో శ్రీధర్ మహంకాళి. దీని గురించి స్టార్టప్ డైరీకి వారు చెప్పిన వివరాలివీ.. టాప్ స్వీట్ షాప్స్ నుంచే.. హైదరాబాద్లో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని స్వీట్స్, నమ్కీన్స్ మాత్రమే డెలివరీ చేసే కంపె నీ మాదే. దాదూస్, ఆల్మండ్ హౌస్, మిఠాయివాలా, ఆలివ్, ఆగ్రా స్వీట్స్ బంజారా, కేసరియాస్, ఆగ్రావాలా, గంగారామ్స్ వంటి 40 ప్రముఖ బ్రాండ్ల స్వీట్లు, నమ్కీన్స్, పచ్చళ్లు, టీ పొడులు మా పోర్టల్లో ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా మాదిరి ముంబై, బెంగాల్, అగ్రా, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పేరున్న దుకాణాల్లో లభించే పాపులర్ వెరైటీలను త్వరలో ప్రవేశపెడతాం. సంక్రాంతి నుంచి హోమ్ మేడ్ స్వీట్స్ సరఫరా చేస్తాం. విదేశాలకు అయిదు రోజుల్లో.. ప్రస్తుతం ఖట్టామీఠా.ఇన్ పోర్టల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. దీపావళికల్లా యాప్ సిద్ధమవుతుంది. 10–15 శాతం తక్కువ ధరకే ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నాం. ఇక భాగ్యనగరిలో రెండు గంటల్లో డెలివరీ ఇస్తాం. డెలివరీకి రూ.40 చార్జీ తీసుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 48 గంటల్లో కస్టమర్కు చేరతాయి. విదేశాలకు 5–7 రోజుల సమయం పడుతుంది. ఇతర సంస్థలతో పోలిస్తే విదేశాలకు సరఫరాకు డెలివరీ చార్జీలు 50 శాతం కంటే తక్కువే వసూలు చేస్తున్నాం. స్వీట్ కంపెనీలు మాకిచ్చే డిస్కౌంట్ ప్రయోజనాలను కస్టమర్లకే అందజేస్తున్నాం. స్నేహితులు రవీందర్ పల్లెర్ల, నరేశ్ కుమార్ బుద్ధాతో కలిసి ఈ ఏడాది మొదట్లో దీన్ని ఆరంభించాం. 10 మంది మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు. డెలివరీకి క్వికర్ సేవల్ని వినియోగించుకుంటున్నాం. కార్పొరేట్ ఆర్డర్లూ స్వీకరిస్తున్నాం. యూఏఈ, మలేషియా, సింగపూర్, యూఎస్ నుంచి ఇప్పటికే ఎంక్వైరీలు వస్తున్నాయి. -
డిజిటల్ మార్కెటింగ్ అడ్డా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం విద్య, వైద్యం, వినోదం ఏ రంగంలోనైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ప్రధానంగా మారింది. కంపెనీ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారంలో ఇతర మాధ్యమాల మార్కెటింగ్ కంటే డిజిటల్ మార్కెటింగ్ ముందున్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే దీన్ని వ్యాపార వేదికగా ఎంచుకుంది ‘డిజిటల్ అకాడమీ 360’. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ యోగేష్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. బెంగళూరులో మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తయ్యాక.. జిఫ్పీ ఎస్ఎంఎస్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేరా. మూడేళ్లు పనిచేశాక.. సొంతంగా బల్క్ ఎస్ఎంఎస్ కంపెనీ పెట్టా. ఆ తర్వాత అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కూడా! ఐదేళ్ల తర్వాత మార్కెటింగ్ రంగంలోని మార్పులు గమనించి.. దీన్నే వ్యాపార వేదికగా మార్చుకోవాలని నిర్ణయించుకొని నవంబర్ 2015లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా డిజిటల్ అకాడమీ 360ని ప్రారంభించా. త్వరలోనే 10 రకాల కోర్సులు.. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ రెండు రకాల కోర్సులున్నాయి. వీటిల్లో 30కి పైగా సబ్జెక్స్ ఉంటాయి. ధర ఒక్క కోర్సుకు రూ.41 వేలు. ఇప్పటివరకు 20 వేలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. వచ్చే ఏడాది కాలంలో 60 వేల మందికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది ముగిసే నాటికి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, యూఐయూఎక్స్, మొబైల్ డెవలప్మెంట్ వంటి 10 రకాల కోర్సులను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం ఆయా సబ్జెక్ట్స్లో మెటీరియల్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం అమెజాన్, పేటీఎం, యాహూ, కేపీఎంజీ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. 6 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోకి.. ప్రస్తుతం బెంగళూరు, పుణే, మైసూర్, ఢిల్లీ, నోయిడా, చెన్నై నగరాల్లో 21 శిక్షణ కేంద్రాలున్నాయి. 6 నెలల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లను ప్రారంభించనున్నాం. ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లోనూ డిజిటల్ అకాడమీ 360 సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. ఆయా దేశాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. స్థానికంగా ఒకటిరెండు ఫ్రాంచైజీ శిక్షణ సంస్థలతో కలిసి సెంటర్లను ప్రారంభించనున్నాం. మొత్తంగా ఏడాదిన్నరలో 50 సెంటర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఫ్రాంచైజీ రూ.25 లక్షలు.. స్టడీ మెటీరియల్స్, పరీక్ష పత్రాల తయారీ, శిక్షణ కోసం 60 మంది ట్రైనర్లున్నారు. ఏడాదిలో 200 మందికి చేరుకుంటాం. ప్రతి నగరంలో ఒక్క సెంటర్ మాత్రమే డిజిటల్ అకాడమీ 360ది ఉంటుంది. మిగిలినవి ఫ్రాంచైజీ రూపంలో ఉంటాయి. ఒక్క సెంటర్ ఫ్రాంచైజీ వ్యయం రూ.25 లక్షలు. ఇందులో శిక్షకుల సరఫరా, మార్కెటింగ్, మెటీరియల్ సప్లయి వంటివన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఫ్రాంచైజర్ స్థానికంగా ఉంటూ అకాడమీని నడిపిస్తే చాలు. మొదటి 3 నెలల పాటు రాయల్టీ ఉండదు. ఆ తర్వాత 12 నెలల వరకు నెలకు రూ.50 వేలు ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఆదాయంలో 12–25 శాతం వరకు వాటా ఉంటుంది. రూ.40 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.9 కోట్లు లక్షి్యంచాం. డిజిటల్ అకాడమీ 360 కేంద్ర ప్రభుత్వం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ), గూగుల్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ప్రస్తుతం మా కంపెనీలో 80 మంది ఉద్యోగులున్నారు. ఈ డిసెంబర్ ముగింపు నాటికి రూ.40 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి’’ అని యోగేష్ తెలిపారు. -
రుణం ఇవ్వొచ్చు.. తీసుకోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: ‘‘శ్రీనివాస్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. నెలాఖర్లో వాళ్ల అమ్మాయి మొదటి పుట్టిన రోజొచ్చింది. పార్టీ ఏర్పాట్లకు చేతిలో డబ్బు లేదు. తెలిసిన వాళ్లని అప్పు అడగటానికి మనసొప్పలేదు. పోనీ, బ్యాంక్ లోన్ కోసం వెళదామా అంటే... అదో పెద్ద ప్రక్రియ. సిబిల్ స్కోరు... వగైరాలు చూసి మంజూరు చేయటానికి బోలెడంత సమయం పట్టేస్తుంది. మరేం చేయాలి?’’ ‘‘వెంకటేశ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం నుంచి పొదుపు చేసిన సొమ్ము రూ.3 లక్షల వరకు చేతిలో ఉంది. బ్యాంక్లో వేద్దామంటే వడ్డీ రేటు తక్కువ. పోనీ, తెలిసిన వాళ్లకెవరికైనా అప్పుగా ఇద్దామంటే తిరిగి వసూలు చేయడం కొంత రిస్కే’’.. పై రెండు సందర్భాలు వేర్వేరు. ఒకరికేమో డబ్బు అవసరం, మరొకరికేమో అదే డబ్బుపై రాబడి కావాలి. వీళ్లద్దరి అవసరాలను ఒకే వేదికగా తీరుస్తోంది లెన్డెన్క్లబ్! సింపుల్గా చెప్పాలంటే? రుణదాతలు, గ్రహీతలను కలిపే ‘పీర్ టు పీర్’ లెండింగ్ వేదికన్న మాట. ఇన్నాళ్లూ ఉద్యోగులకే రుణాలిచ్చిన లెన్డెన్క్లబ్.. త్వరలో దుకాణదారులకూ రుణాలిచ్చేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్, సీఈఓ భవీన్ పాటిల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘2015లో రూ.80 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా లెన్డెన్క్లబ్ను ప్రారంభించాం. ప్రస్తుతం లెన్డెన్క్లబ్లో 40,880 మంది రుణ గ్రహీతలు, 9,982 మంది రుణదాతలు నమోదయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే రుణాలిస్తున్నాం. కేవైసీ పూర్తి చేసిన 3 గంటల్లో రుణాన్నిస్తాం. రూ.40 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. వార్షిక వడ్డీ రేటు 12.5 నుంచి 35 శాతం వరకుంటుంది. రుణ వాయిదాలను 18–36 నెలల్లో తిరిగి చెల్లించేయాలి. రూ.5 లక్షల కేటగిరీలో 5 శాతం కస్టమర్లుంటారు. తెలంగాణలో నెలకు 150 మందికి.. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 60 వేల మందికి రూ.40 కోట్ల రుణాలిచ్చాం. ప్రస్తుతం నెలకు వెయ్యి మందికి రూ.4 కోట్ల వరకు రుణాలందిస్తున్నాం. తెలంగాణ నుంచి నెలకు 150 రుణ గ్రహీతలకు రూ.70 లక్షల వరకు రుణాలిస్తున్నాం. డిసెంబర్ నాటికి నెలకు వెయ్యి మందికి రుణాలను అందించాలనేది లక్ష్యం. 6 నెలల్లో మరో 3 నగరాలకు విస్తరించనున్నాం. త్వరలో ఏపీలో సేవలను ప్రారంభిస్తాం. రూ.2.5 కోట్ల ఆదాయం లక్ష్యం.. రుణ గ్రహీతలు చెల్లించే నెలసరి వాయిదా నేరుగా రుణదాతల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. లెన్డెన్క్లబ్ రుణదాత నుంచి 1.5%, రుణగ్రహీత నుంచి 4% నిర్వహణ రుసుము కింద వసూలు చేస్తుంది. గతేడాది రూ.55 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2.5 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం ఎన్పీఏ 3.92 శాతంగా ఉంది. త్వరలోనే దుకాణదారులకు అర్హతలను బట్టి రూ.20 వేల నుంచి లక్ష రూపా యల వరకు రుణాలను అందించనున్నాం. కాల వ్యవధి 6 నెలలు. వార్షిక వడ్డీ 15 నుంచి 22% ఉంటుంది. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం కంపెనీలో 45 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే హోమ్ రెనోవేషన్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటి వాటికి రుణాలిచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నాం. ఇటీవలే వెంచర్ క్యాటలిస్ట్, అనిరుధ్ దమానీ, ఇండియన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించాం. వచ్చే 3 నెలల్లో రూ.10 కోట్ల వరకు నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ ఒకటిరెండు వీసీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం’’ అని భవీన్ వివరించారు. -
వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘నిరంతర విద్యార్థి’.. ఇది వైద్యులకు పక్కాగా వర్తిస్తుంది. ఎందుకంటే? వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన శస్త్ర చికిత్స విధానాలు, మెడికల్ టెక్నాలజీ, వ్యాధులు, చికిత్స మార్గాలు వంటివి నేర్చుకుంటూ ఉండాలి. మరి డాక్టర్లు వృత్తిని వదిలి.. పుస్తకాలు పట్టుకొని రోజూ శిక్షణ తరగతులకు వెళ్లాలా? అవసరమే లేదంటోంది బెంగళూరుకు చెందిన మెడినిట్. జస్ట్! వైద్యులు మెడినిట్లో నమోదైతే చాలు.. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, వైద్య వర్సిటీలు, మెడికల్ అసోసియేషన్స్ ప్రచురించే జర్నల్స్, వైద్య కోర్సుల కంటెంట్, ఆడియో, వీడియో వంటివన్నీ పొందొచ్చు. డాక్టర్లకే శిక్షణ ఇస్తున్న మెడినిట్ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ డాక్టర్ భాస్కర్ రాజ్ కుమార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. 2010లో రష్యాలో రేడియాలజీలో ఎండీ పూర్తయ్యాక.. బెంగళూరులోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరా. ఆ తర్వాత ఓ ప్రముఖ హెల్త్కేర్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశా. మెడికల్ టెక్నాలజీ మీద శిక్షణ నిమిత్తం వందలాది డాక్టర్లను కలిసేవాణ్ణి. అప్పుడు తెలిసిందేంటంటే.. నేర్చుకునే సమయం, సరైన వేదిక రెండూ లేకపోవటంతో చాలా మంది డాక్టర్లు సంపాదనకే వృత్తిని అంకితం చేస్తున్నారని!. ఇదే మెడినిట్కు బీజం వేసింది. స్నేహితుడు సురేందర్ పరుసురామన్తో కలిసి 2016లో రూ.45 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మెడినిట్ను ప్రారంభించాం. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, సంఘాలు, వర్సిటీలు రూపొందించే వైద్య కోర్సులు, వెలువరించే జర్నల్స్, కంటెంట్, రకారకాల వ్యాధులు, చికిత్స మార్గాలకు సంబంధించిన వీడియోలు వంటివి మెడినిట్లో పొందే వీలుండటమే మా ప్రత్యేకత. ప్రస్తుతం 28; ఏడాదిలో 65 కోర్సులు.. ప్రస్తుతం మెడినిట్లో 28 రకాల వైద్య కోర్సులున్నాయి. డిప్లొమా ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ, ఫెలోషిప్ ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ, ఏఏఎస్ స్కిల్ కోర్స్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్థోస్కోపిక్ సర్జరీ: నీ అండ్ షోల్డర్, ఫెలోషిప్ ఇన్ డయాబెటిక్ ఫుట్ మేనేజ్మెంట్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ డిమోన్టియా వంటివి వీటిల్లో కొన్ని. రిజిస్టర్ చేసుకున్న డాక్టర్స్ అభ్యర్థులు ఆయా కోర్సుల ఆడియో, వీడియో కంటెంట్తో పాటూ వైద్య సంఘాల లెక్చర్స్, సెమినార్స్ పొందవచ్చు. కోర్సుల కాల పరిమితి 3 వారాల నుంచి ఏడాది వరకుంటుంది. కోర్సు, కాలపరిమితిని బట్టి ధరలు రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల వరకుంటాయి. వచ్చే ఏడాది 65 కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతో పాటూ అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ ఆధారిత కంటెంట్నూ అందుబాటులోకి తీసుకురానున్నాం. వర్సిటీలు, సంఘాలు, ఆసుపత్రులతో జట్టు కోర్సుల రూపకల్పన, వ్యాధుల రకాలు, నివారణ, టెక్నాలజీ వంటి వాటిపై శిక్షణ కోసం మన దేశంతో పాటూ సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలు, వైద్య సంఘాలతో ఒప్పందం చేసుకున్నాం. మన దేశంలో జీఈఎం టెలివర్సీటీ, కాలేజ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, డిమెన్షియా అకాడమీ, ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ లివర్ (ఐఎన్ఏఎస్ఎల్), ఇంటర్నేషనల్ హిపాటో పాన్క్రీటో బిలియరీ అసోసియేషన్ (ఐహెచ్పీబీఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్, వెనిరోలాజిస్ట్ అండ్ లెప్రోలాజిస్ట్, ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్ఐఏ), అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిలోఫేసియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఓఎంఎస్ఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వంటి సంఘాలున్నాయి. రూ.20 కోట్ల ఆదాయం.. ప్రస్తుతం మెడినిట్లో 65 వేల మంది వైద్యులు నమోదయ్యారు. వీరిలో 2,500 మంది వార్షిక సబ్స్క్రిప్షన్ డాక్టర్స్. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది వైద్యులుంటారు. గ్లోబల్, కేర్, కిమ్స్, ఏసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వంటి ఆసుపత్రులతో పాటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రోటెస్టినల్ ఎండ్రో సర్జన్స్ (ఐఏజీఈఎస్), సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అసోసియేషన్ వంటి సంఘాలతో ఒప్పందాలున్నాయి. ఏడాది కాలంలో 2 లక్షల మంది వైద్యుల నమోదు, మరో 30 సంఘాలను జత చేయాలన్నది టార్గెట్. 2 నెలల్లో రూ.72 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.20 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే మధ్య ప్రాచ్యం, దుబాయ్, అబుదాబి దేశాల్లో సేవలందించనున్నాం. ఆ తర్వాత అమెరికా, యూకేలకు విస్తరిస్తాం. ‘‘ప్రస్తుతం కంపెనీలో 41 మంది ఉద్యోగులున్నారు. జూన్కి మరో 100 మందిని నియమించుకోనున్నాం. ఇప్పటివరకు ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.3 కోట్లను సమీకరించాం. 2 నెలల్లో రూ.72 కోట్లను సమీకరించనున్నాం. మన దేశంతో పాటూ విదేశాల్లోని వీసీ ఇన్వెస్టర్లతో చర్చ లు జరుగుతున్నాయని’’ భాస్కర్ వివరించారు. వైజాగ్లో శిక్షణ కేంద్రం.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీలో స్థానిక వైద్య సంఘాలతో కలిసి ఆఫ్లైన్లో శిక్షణ కేంద్రాలున్నాయి. తొలిసారిగా సొంతంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇటీవలే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చిం చాం. ఏపీ ప్రభుత్వంతో కలిసి విశాఖపట్నం లోని మెడ్టెక్ జోన్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో సిమ్యులేషన్ జోన్ను ఏర్పాటు చేయనున్నాం. జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మౌలిక వసతులు, రాయితీలు కల్పిస్తే తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తాం. -
టెక్నాలజీని అద్దెకిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు, కార్ల లాగే టెక్నాలజీనీ అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ఆన్గో ఫ్రేమ్ వర్క్లో! మన దేశంతో పాటూ దుబాయ్, మధ్య ప్రాచ్య వంటి దేశాల్లోని కంపెనీలూ కస్టమర్లుగా ఉన్నాయి. జస్ట్, 30 నిమిషాల్లోనే డిజిటల్ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే వీలుండటమే ఆన్గో ఫ్రేమ్ వర్క్ ప్రత్యేకత! అందుబాటు ధరల్లో ఎంటర్ప్రైజ్లకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) కంపెనీలకు టెక్నాలజీలను అద్దెకిస్తున్న ఆన్గో ఫ్రేమ్ వర్క్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ రామకృష్ణ కుప్పా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది హైదరాబాద్. ఆచార్య నాగార్జున వర్సిటీలో ఎంఎస్ పూర్తయ్యాక.. బెంగళూరులో ఒకట్రెండు స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తర్వాత అక్కడి నుంచి మైండ్ట్రీ టెక్నాలజీ డెవలప్మెంట్ బృందంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరా. తర్వాత మోటరోలాలో సీనియర్ ఇంజనీర్గా చేరా. 2009లో ఎస్ఎంఈలకు మొబిలిటీ సొల్యూషన్స్ అందించే క్రియేటివ్ ఎక్స్పర్ట్స్ కన్సల్టింగ్ అనే ఐటీ కంపెనీని ప్రారంభించాం. ఈ సమయంలో తెలిసిన విషయమేంటంటే.. టెక్నాలజీ అభివృద్ధి కోసం అయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నందువల్లే పె ద్ద కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లటం లేదని! అభివృద్ధి వ్యయాన్ని తగ్గించాలంటే ముందుగా సమయాన్ని, నిర్వహణ ఖర్చును తగ్గిస్తే సరిపోతుందని తెలిసి.. రకరకాల టెక్నాలజీలను అద్దెకు ఇస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాం. అలా 2015లో నా భార్య అను అఖిలతో కలిసి రూ.1.2 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ కేంద్రంగా ఆన్గో ఫ్రేమ్ వర్క్ కంపెనీని ప్రారంభించాం. ఏపీ, తెలంగాణ నుంచి 400 కంపెనీలు.. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, కాగ్నెటివ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఈఆర్పీ, వాలెట్ ప్రోగ్రామింగ్ వంటి అన్ని రకాల టెక్నాలజీలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్ధిక, వ్యవసాయ, రియల్ ఎస్టేట్, బీమా, వైద్యం, ఫుడ్ టెక్ రంగాల్లో ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఈ రెండు విభాగాల్లో కలిపి 900 కంపెనీలు మా టెక్నాలజీని అద్దెకు తీసుకున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 400 కంపెనీలుంటాయి. దుబాయ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సుమారు 20 కంపెనీలు కూడా ఉన్నాయి. దుబాయ్కు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ, నిర్మాణ కంపెనీలు వీటిల్లో కొన్ని. ఇక, లోకల్ కంపెనీల్లో ఈ–సహాయ్, పేవైస్, లోహిత, బెల్ రైస్ వంటివి ఉన్నాయి. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్.. ప్రస్తుతం నెలకు 10 ఎంటర్ప్రైజ్లకు, 300 ఎస్ఎంఈలకు ఫ్రేమ్ వర్క్ ఫీచర్స్, ప్రొడక్ట్ ఫీచర్స్, మొబైల్ యాప్, వెబ్ యాప్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్సాఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ సేవలందిస్తున్నాం. టెక్నాలజీని బట్టి నెల అద్దె రూ.2 వేల నుంచి రూ.7 లక్షల వరకున్నాయి. గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్ను సాధించాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి మరో రూ.7 కోట్లకు చేరుకుంటాం. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 10 వేల ఎస్ఎంఈ కస్టమర్లను చేరుకోవాలన్నది టార్గెట్. త్వరలోనే అమెరికాలోని పలు టెలికం కంపెనీలతో టెక్నాలజీ సేవల ఒప్పందం చేసుకోనున్నాం. త్వరలోనే రూ.35 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 94 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 160కి చేర్చనున్నాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.10 కోట్ల నిధులను సమీకరించాం. స్విట్జర్లాండ్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూస్ డైరెక్టర్ పారస్ పరేఖ్, విర్టుసా ఐటీ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిషీ చౌహాన్ వంటి ఐదారుగురు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరో రూ.35 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ముంబైకి చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో చ ర్చలు జరుగుతున్నాయి. ‘‘ మా టెక్నాలజీ మీద శిక్షణ, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాలపై అ వగాహన కల్పించడం కోసం హైదరాబాద్కు చెం దిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ హాకీస్టిక్ మీడి యా అనే స్టార్టప్ను కొనుగోలు చేశాం. ఎస్ఎంఈ కంపెనీలతో పనిచేసే మరో స్టార్టప్ను కొనుగోలు కు ఆసక్తిగా ఉన్నామని’’ రామకృష్ణ వివరించారు. -
హోల్సేల్ బట్టల దుకాణం ‘టెక్స్ఫై’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్కు వరంగల్లో ఒక బట్టల దుకాణం ఉంది. చీరలు, డ్రెస్ల కోసం సూరత్, అహ్మదాబాద్, కోల్కతా వంటి ప్రాంతాలకు వెళ్లి హోల్సేల్గా కొంటుంటాడు. వెళ్లడం నుంచి ఉత్పత్తుల ఎంపిక, లాజిస్టిక్, లావాదేవీలు.. ప్రతిదీ ఇబ్బందే! కానీ, ఇప్పుడు శ్రీనివాస్.. జస్ట్ తన షాపులో కూర్చొని వేరే రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొంటున్నాడు. అదే... టెక్స్ఫై.కామ్ ప్రత్యేకత. టెక్స్ఫైలో వివిధ రాష్ట్రాలకు చెందిన 300కు పైగా గార్మెంట్స్ తయారీ సంస్థలు.. 15 వేలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న టెక్స్ఫై గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ రఘునాథ్ పెనుమూర్తి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం. డిగ్రీ పూర్తయ్యాక.. హైదరాబాద్లో ఓ స్టార్టప్ కంపెనీలో చేరా. నా రూమ్మేట్కు భీమవరంలో ఓ బట్టల షాపుంది. వాళ్ల నాన్న నెలకోసారి హైదరాబాద్కు వచ్చి హోల్సేల్గా చీరలు, పిల్లల బట్టలు వంటివి కొనుక్కెళ్లేవాడు. ప్రతిసారి లాజిస్టిక్ ఇబ్బందిగా ఉండేది. ఇదే విషయాన్ని ఓరోజు నాతో చర్చించాడు. అప్పుడే అనిపించింది గార్మెంట్స్ తయారీ సంస్థలను, రిటైలర్లను కలిపే కంపెనీ పెడితే బాగుంటుందని!! అదే టెక్స్ఫై.కామ్కు పునాది. రూ.30 లక్షల పెట్టుబడితో గతేడాది ఆగస్టులో విశాఖపట్నంలో దీన్ని ఆరంభించాం. 400 తయారీ సంస్థలు, 3 వేల రిటైలర్లు.. ప్రస్తుతం టెక్స్ఫైలో 300 తయారీ సంస్థలు నమోదయ్యాయి. సూరత్, అహ్మదాబాద్, జైపూర్, లుథియానా, ముంబై, తిర్పూర్, కోల్కతా, చెన్నై వంటి ప్రాంతాల నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి ఉప్పాడ, పోచంపల్లి, కలంకారి వంటి చేనేత వస్త్ర తయారీ సంస్థలున్నాయి. ప్రతి నెలా కొత్తగా 40 సంస్థలు రిజిస్టరవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 3 వేల మంది రిటైలర్లు నమోదయ్యారు. ప్రస్తుతం టెక్స్ఫైలో 15 వేల పైగా ఉత్పత్తులు లిస్టయ్యాయి. నెలకు రూ.10 లక్షల ఆర్డర్లు.. టెక్స్ఫై యాప్, వెబ్సైట్... ఎక్కడి నుంచైనా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.10 లక్షల విలువ చేసే 130 ఆర్డర్లు వస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,600. ఉత్పత్తుల డెలివరీ కోసం డెలివర్హీ, ఫెడెక్స్, అరామెక్స్, బ్లూడార్ట్ వంటి ఆరు కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డర్ వచ్చిన వారం రోజుల్లోగా డెలివరీ పూర్తవుతుంది. గత నెలలో టెక్స్ఫై ఈ–డిస్ట్రిబ్యూషన్ను ప్రారంభించాం. గోడౌన్, లాజిస్టిక్, ఉత్పత్తుల నిర్వహణ అన్నీ కంపెనీయే చూసుకుంటుంది. జస్ట్.. స్థానికంగా ఉన్న రిటైలర్ల నుంచి ఆర్డర్లు తీసుకొస్తే చాలు.. టర్నోవర్లో 3 శాతం కమీషన్ ఉంటుంది. ఇప్పటివరకు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కర్నాటకలో 6 ఈ–డిస్ట్రిబ్యూషన్లు ఇచ్చాం. ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 300 మందికి ఈ–డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలన్నది లక్ష్యం. త్వరలోనే బజాజ్ ఫైనాన్స్ వంటి పలు ఎన్బీఎఫ్సీ సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నాం. దీంతో రిటైలర్లకు 45 రోజుల క్రెడిట్ మీద ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది. 2 నెలల్లో రూ.50 లక్షల సమీకరణ.. ఏడాది కాలంలో అన్ని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరణతో పాటూ రూ.25 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి టెక్స్ఫైలో రిటైలర్ల సంఖ్యను 10 వేలకు, తయారీ సంస్థలను వెయ్యికి చేర్చాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో 16 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల్లో రూ.50 లక్షల నిధులను సమీకరించనున్నాం. త్వరలోనే డీల్ను క్లోజ్ చేస్తాం’’ అని రఘునాథ్ వివరించారు. -
కోళ్ల పరిశ్రమకు డిజిటల్ టచ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్ల పరిశ్రమ అనగానే సీజనల్ బిజినెస్ అంటారు. గుడ్ల నుంచి మొదలుపెడితే కోడి పిల్లల పెంపకం, ఫీడింగ్, కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా ప్రతి దశలోనూ ఉష్ణోగ్రత, స్థానిక వాతావరణ ప్రభావితం చేస్తుంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టాలే. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ కోళ్ల పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎందుకా అనిపించింది హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్–అర్చన దంపతులకు. అప్పటికే చేస్తున్న ఐటీ ఉద్యోగాలకు గుడ్బై కొట్టేసి ఎంఎల్ఐటీని ప్రారంభించారు. ఇదేంటంటే.. పొదుగు, కోడి పిల్లల ఉత్పత్తి, ఆహారం, శీతలీకరణ కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా కోళ్ల పరిశ్రమలో ప్రతి దశలోనూ టెక్నాలజీ అందిస్తుంది. మరిన్ని వివరాలు ఎంఎల్ఐటీ కో–ఫౌండర్ అర్చన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. కస్తూర్బాలో ఎంఎస్సీ పూర్తయింది. పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాం. ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి కుటుంబ వ్యాపారమైన ఇండస్ట్రియల్ పరికరాల తయారీలో భాగస్వామినయ్యా. నట్లు, బోల్ట్ల వంటి ప్రతి ఉత్పత్తి తయారీని ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా ఉత్పత్తుల తయారీ, నియంత్రణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఐఓటీ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశా. ఈ ఐవోటీ పరికరం... ఉత్పత్తుల తయారీ సమయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి, వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే.. క్వాలిటీ మేనేజర్ పనంతా ఈ ఐఓటీ పరికరమే చేసేస్తుందన్నమాట! ఓ రోజు మా కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు సంబంధించిన ఓ హేచరీస్ ఇంక్యుబేటర్లో ఉష్ణోగ్రత పెరిగి గుడ్లు పాడైపోయాయని ఫోన్ వచ్చింది. దీన్ని మాతో చెబుతు నట్లు, బోట్ల తయారీలో ఉష్ణోగ్రతలను నియంత్రించినట్లే పౌల్ట్రీ పరిశ్రమలోనూ ఉంటే బాగుండనని అన్నారాయన. అలా ఎంఎల్ఐటీ కంపెనీకి పునాది పడింది. 2016లో రూ.60 లక్షల పెట్టుబడితో టీ–హబ్ కేంద్రంగా ప్రారంభించాం. కన్సైట్, పౌల్ట్రీమాన్ రెండు పరికరాలు.. ప్రస్తుతం ఎంఎల్ఐటీ నుంచి రెండు ఉత్పత్తులున్నాయి. మొదటిది కన్సైట్. దీన్ని బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాం. కోళ్ల పరిశ్రమలో ఉష్ణోగ్రతల నియంత్రణతో పాటు ఫామ్ నిర్వహణ, విశ్లేషణ సేవలందించడం దీని ప్రత్యేకత. ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఫామ్లను రియల్ టైమ్లో నిర్వహించుకునే వీలుంటుంది. ధర రూ.60 వేలు. రెండోది పౌల్ట్రీమాన్. సెన్సార్లు, క్లౌడ్ టెక్నాలజీ అనుసంధానిత పరికరమిది. దీన్ని హేచరీలో అనుసంధానం చేస్తాం. మొబైల్ అప్లికేషన్స్తో ఎప్పటికప్పుడు ఇంక్యుబేటర్లోని ఉష్ణోగ్రత నివేదికలను చూడొచ్చు. ఏమాత్రం తేడా వచ్చిన అలెర్ట్ చేస్తుంది. ఏ దశలో సమస్య ఉందో కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. దీంతో నేరుగా సమస్యను పరిష్కరించవచ్చు. ధర రూ.15 వేలు. వార్షిక నిర్వహణ రుసుము 12 శాతం. పౌల్ట్రీమాన్కు పేటెంట్ ఉంది. సెప్టెంబర్ నుంచి సుగుణలో సేవలు.. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సేవలందిస్తున్నాం. దాదాపు 10 సంస్థలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. వీటిల్లో వంద వరకు ఇంక్యుబేషన్స్ ఉంటాయి. పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాం. సుగుణ కంపెనీలో అన్ని విభాగాల్లోనూ పౌల్ట్రీమాన్, కన్సైట్ నిర్వహణ సేవలు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరు, కోయంబత్తూరు, కోల్కతాలకు విస్తరించనున్నాం. గతేడాది రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని, పౌల్ట్రీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటాను లకి‡్ష్యంచాం. మా సంస్థలో ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. టెక్నాలజీ, సేల్స్ విభాగంలో మరో నలుగురిని తీసుకుంటున్నాం. దేశంలోని ప్రముఖ అగ్రిటెక్ వెంచర్ క్యాప్టలిస్ట్ నుంచి రూ.7 కోట్ల నిధులను సమీకరించనున్నాం. డీల్ 2 నెలల్లో పూర్తవుతుంది’’ అని అర్చన వివరించారు. -
అద్దెకు పురుషుల ‘ఫ్యాషన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బట్టలు కొనాలంటే మనం ఏం చేస్తాం. షోరూమ్కు వెళ్లి నచ్చిన బట్టలను ఎంచుకొని.. సరిపోతాయో లేదోనని ట్రయల్ వేసుకొని కొంటాం! సేమ్.. క్యాండిడ్ నాట్స్లోనూ అంతే. కాకపోతే ఇక్కడ కొనాల్సిన పనిలేదు. అద్దెకు తీసుకుంటే చాలు! అంతేకాదు దుస్తులే కాదు టైలు, బెల్టులు, కళ్లద్దాలు, పర్సులు పురుషులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాషన్ ఉత్పత్తులనూ అద్దెకివ్వటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు క్యాండిడ్నాట్స్.కామ్ ఫౌండర్ శ్వేత పొద్దార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది తమిళనాడు. వీఐటీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అకామాయ్ టెక్నాలజీస్, హెచ్ఎస్బీసీ వంటి కంపెనీల్లో పనిచేశా. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుండటంతో మీటింగ్ లేక పార్టీ ఇతరత్రా ప్రత్యేక సందర్భాలు కామన్గా జరుగుతుండేవి. ప్రతిసారీ ఖరీదైన బట్టలు కొనాలంటే ఇబ్బంది. దీంతో స్థానికంగా అద్దెకు తీసుకునేదాన్ని. ఇదే పరిస్థితి నా తోటి సహోద్యోగులదీనూ. కాకపోతే పురుషుల ఫ్యాషన్స్ అద్దెకు దొరకటం చాలా తక్కువ. ఇదే క్యాండిడ్నాట్స్ స్టార్టప్కు బీజం వేసింది. 2016 ఆగస్టులో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యాండిడ్నాట్స్ను ప్రారంభించా. 8 కేటగిరీలు; వెయ్యి ఉత్పత్తులు.. జోధ్పురీ సూట్స్, బ్లేజర్స్, జాకెట్స్, కుర్తా అండ్ పైజామా, శేర్వాణీ, వెస్ట్రన్, డిజైనర్ అండ్ ఎత్నిక్ వేర్ దుస్తులుంటాయి. వీటితో పాటు టై, బెల్ట్లు, పాదరక్షలు, కళ్లద్దాలు, గడియారాలు, పర్సులు వంటి పురుషుల ఫ్యాషన్కు సంబంధించిన అన్ని రకాల యాక్ససరీలుంటాయి. సంజయ్ షానీ, సోలా ఫ్యాషన్స్, మాక్రో ఇటలీ వంటి 6 డిజైనర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా డిజైనర్ దుస్తులను అద్దెకిస్తాం. మొత్తంగా 8 కేటగిరీల్లో 1,000 రకాల ఉత్పత్తులుంటాయి. ఏడాది కాలంలో 2 వేల ఉత్పత్తులకు చేర్చాలన్నది లక్ష్యం. 2 నెలల్లో హైదరాబాద్లో.. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 12 వేల మంది కస్టమర్లు మా యాక్ససరీలను అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం నెలకు 800 ఆర్డర్లు వస్తున్నాయి. సూట్లు ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారు. ఉత్పత్తుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)లో 10–15% అద్దె ఉంటుంది. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. ఏటా రూ.80 లక్షల ఆదాయం వస్తుంది. 2 నెలల్లో హైదరాబాద్లో సేవలను ప్రారంభించనున్నాం. ఏడాదిలో ఆఫ్లైన్ స్టోర్ను ఏర్పాటు చేస్తాం. 2020 నాటికి ఢిల్లీ, ముంబై, పుణే నగరాలకు విస్తరించాలన్నది లక్ష్యం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. పెళ్లి ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలు, మీటింగ్స్, సమావేశాలు, ఇంటర్వ్యూలు, కార్పొరేట్ ఈవెంట్లకు, కాలేజ్ ఫేర్వెల్, కాన్వొకేషన్స్, వార్షికోత్సవాలకు అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. 4 నెలల్లో రెట్టింపు ఉద్యోగులను తీసుకుంటాం. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం లక్ష్యం. క్యాండిడ్ నాట్స్కు సొంత డెలివరీ, లాజిస్టిక్ వ్యవస్థ ఉంది. త్వరలోనే రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వీటితో మహిళలు, పిల్లల దుస్తులు, యాక్ససరీల అద్దె విభాగంలోకి విస్తరిస్తామని శ్వేత వివరించారు. -
గ్రామాల్లో ‘నయాగాడీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి కుర్రాడు బాలాజీ చూపించిన పరిష్కారమే... ‘నయాగాడీ’! కైశెట్టి బాలాజీది రైతు కుటుంబం. వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొందామనుకున్నాడు. అడ్వాన్సు పట్టుకుని బయలుదేరాడు. అప్పుడు తెలిసింది.. వాళ్ల ఊళ్లో ట్రాక్టర్ షోరూమ్ లేదని! చిత్తూరుకు వెళ్లి కొనాలి. కంపెనీ రేటొకటైతే స్థానిక డీలర్ చెప్పేది మరొకటి!!. అవసరం మనది కనక చేసేదేమీ ఉండదు. డీలర్లే కాదు! వాహన రుణాలిచ్చే బ్యాంక్లు, బీమా కంపెనీలు, నిర్వహణ కేంద్రాలు అన్నింటికీ సమస్యే. దీనికి టెక్నాలజీతో బాలాజీ చెప్పిన సమాధానమే ‘‘నయాగాడీ’’ ఆవిష్కరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. చిత్తూరులో డిప్లొమా పూర్తయ్యాక.. బెంగళూరులోని ఆటోమొబైల్ డిజైన్, సప్లయి కంపెనీ ఆస్పెక్ట్లో చేరా. అక్కడి నుంచి విప్రో, హెచ్పీ, ఐబీఎం వంటి కంపెనీల్లోనూ పనిచేశా. బహుళ జాతి ఆటో మొబైల్ కంపెనీల్లో 10 ఏళ్ల అనుభవం ఉంది. దీంతో 2015 సెప్టెంబర్లో రూ.25 లక్షల పెట్టుబడితో బెంగళూర్లో ‘నయాగాడీ.కామ్’ను ప్రారంభించా. స్థానికంగా ఉండే అన్ని రకాల వాహన డీలర్లతో ఒప్పందం చేసుకొని గ్రామాల్లో నయాగాడీ ఎక్స్పీరియన్స్ కేంద్రాలు, ఏజెంట్లను ఏర్పాటు చేసి వాహనాలను విక్రయించడమే మా ప్రత్యేకత. రూ.4 కోట్లు; 80 వాహనాలు.. నయాగాడీలో బైక్లు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్ల వంటి అన్ని రకాల వాహనాలతో పాటూ ఎలక్ట్రిక్ వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ఒడిశా నగరాల్లో సేవలందిస్తున్నాం. 120 మంది వాహన డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. రుణాల కోసం క్యాపిటల్ ఫస్ట్, కొటక్, బీమా కోసం పాలసీబజార్, రెన్యూ, గోడిజిట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. నయాగాడీ మల్టీ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన బ్రోచర్లు, ఫొటోలు, ధరలు, రుణం, బీమా వంటి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు నయాగాడీ వేదికగా రూ.4 కోట్ల విలువ చేసే 80 వాహనాలను విక్రయించాం. డీలర్ ధర కంటే నయాగాడీలో రూ.1,000–10,000 వరకు ధర తక్కువే ఉంటుంది. పైగా విడిభాగాలు, ఇతరత్రా ఉపకరణాలపై 20% కమీషన్ కూడా ఉంటుంది. నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి... నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరుల్లో నయాగాడీ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఆయా ప్రాంతాల్లో 100 మంది డీలర్లతో డీల్ చేసుకున్నాం. ఏడాదిలో చెన్నై, కోచి, భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో నయాగాడీ సెంటర్లను ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో దేశంలోని 30 ప్రాంతాలకు విస్తరించాలన్నది మా లక్ష్యం. రూ. 3 కోట్ల ఆర్డర్ బుక్.. ప్రతి వాహనం విక్రయంపై డీలర్ నుంచి 1 శాతం, బ్యాంక్ రుణం పొందితే బ్యాంక్ నుంచి 1–1.50 శాతం, బీమా కంపెనీ నుంచి 10–20 శాతం వరకు కమీషన్ వస్తుంది. ప్రస్తుతం రూ.3 కోట్ల ఆర్డర్ బుక్ చేతిలో ఉంది. 3 నెలల్లో టీవీఎస్, నిస్సాన్, రెనాల్ట్, మహీంద్రా వాహన సంస్థలతో ఒప్పందాలు పూర్తవుతాయి. దీంతో డీలర్లతో పాటూ నేరుగా నయాగాడీలోనూ విక్రయాలుంటాయి. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది కర్నాటక ప్రభుత్వ ఎలైట్ 100 పోటీలో విజేతగా నిలిచాం. దీంతో రూ.10 లక్షలు గ్రాంట్గా లభించింది. ప్రస్తుతం మా కంపెనీలో 11 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 25కి చేర్చనున్నాం. గతేడాది రూ.2.5 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల టర్నోవర్ను చేరుకోవాలి లకి‡్ష్యంచాం. పలువురు హెచ్ఎన్ఐలు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. -
రీల్స్ ఆన్ వీల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిండి.. బట్ట.. ఇల్లు. ఈ మూడింటి తర్వాత మనిషికి కావాల్సింది వినోదమే!!. అందులో ముందుండేది సినిమానే!. కాకపోతే ఈ రంగంలో పెద్ద కంపెనీలదే హవా. ఇక్కడ చిన్న కంపెనీలు రాణించాలంటే వినూత్న ఆలోచన కావాలి.పిక్చర్ టైమ్ చేసిందిదే!!. గ్రామీణ ప్రాంతాల వారికి మల్టీప్లెక్స్ సినిమా అనుభూతిని కల్పించాలనుకుంది. దీనికోసం ప్రత్యేకంగా వాహనాలకు అభివృద్ధి చేసి సినిమాలను ప్రదర్శిస్తోంది. గోవా కేంద్రంగా 2015 అక్టోబర్లో ప్రారంభమైన ‘పిక్చర్ టైమ్’ సేవల గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ సుశీల్ చౌధురి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం.. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తున్నాం. కొత్త సినిమాల రిలీజ్ కోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్లతో పాటు శోభు యార్లగడ్డ, శీతల్ భాటియా వంటి నిర్మాతలు, యశ్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్), రెడ్ చిల్లీస్ వంటి నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో ఫాక్స్ స్టార్, డిస్నీ, సోనీ పిక్చర్స్ వంటి సంస్థలతోనూ ఒప్పందం చేసుకోనున్నాం. కార్పొరేట్ ప్రకటనలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ ప్రదర్శనలు, బ్రాండింగ్, సినిమా టికెట్ల అమ్మకం వంటి మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. గత సంవత్సరం రూ.8 లక్షల టర్నోవర్ను నమోదు చేశాం. ప్రకటనల ధరలు డీఏవీపీ నిర్దేశించినట్లే ఉంటాయి. వచ్చే నెలాఖరుకు తెలుగు రాష్ట్రాల్లోకి... ప్రస్తుతం ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తోంది. ఆ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50కి పైగా సినిమాలను ప్రదర్శించాం. రేస్–3, సంజు, బాహుబలి–2 సినిమాలు నేరుగా పిక్చర్ టైమ్లో రిలీజయ్యాయి. వచ్చే నెలాఖరుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇస్తాం. స్థానికంగా ఒకరిద్దరితో జట్టుకట్టాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతో పాటూ హిందీ సినిమాలనూ ప్రదర్శిస్తాం. 10 మొబైల్ సినిమా ట్రక్స్.. సినిమాలను ప్రదర్శించేందుకు, ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా ట్రక్లను ఆధునీకరిస్తాం. ఏసీ, హెచ్డీ స్క్రీన్, 5.1 డోల్బీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. థియేటర్లో 120–150 సీట్లుంటాయి. ప్రస్తుతం పిక్చర్ టైమ్లో 10 మొబైల్ సినిమా ట్రక్లున్నాయి. ట్రక్ వెలుపలి భాగంలో ఫుడ్ కోర్ట్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ జోన్లు, వై–ఫై హాట్స్పాట్స్, మైక్రో ఏటీఎం వంటి ఏర్పాట్లుంటాయి. టికెట్ ధరలు రూ.30–50. ఆక్యుపెన్సీ 60% ఉంటుంది. 6 నెలల్లో రూ.100 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం 60 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరికి 3 వేల పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్లను ఏర్పాటు చేస్తాం. ఇటీవలే ప్రీ–సిరీస్ రౌండ్లో భాగంగా రూ.25 కోట్ల నిధులు సమీకరించాం. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీఎక్స్ పార్టనర్స్ కో–ఫౌండర్ అజయ్ రిలాన్ ఈ పెట్టుబడి పెట్టారు. వచ్చే 6 నెలల్లో మరో రౌండ్లో రూ.100 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తాం. 2021 నాటికి ఎస్ఎంఈ వేదికగా ఐపీవోకి వెళ్లాలని లకి‡్ష్యంచాం. -
ఇడ్లీ దోశ వడ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్స్కు నిధులను సమీకరించడం పెద్ద సవాలే. వినూత్న ఆలోచన, భవిష్యత్తు మార్కెట్ అవకాశాలుంటే తప్ప అంత త్వరగా పెట్టుబడులు రావు. అలాంటిది ఇడ్లీ, దోశ, వడ పిండిలను విక్రయించే సంస్థలో దిగ్గజ పారిశ్రామికవేత్త, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ పెట్టుబడి పెట్టడమంటే మామూలు మాట కాదు. రెడీ టు కుక్ రంగంలో తనదైన ముద్రవేసిన బెంగళూరు కంపెనీ ‘ఐడీ ఫ్రెష్ ఫుడ్స్’ మన దేశంలోనే కాదు! విదేశాల్లోనూ ఇడ్లీ, దోశ ఉత్పత్తులను విక్రయిస్తోంది. రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ వ్యవస్థాపక సీఈఓ పీసీ ముస్తఫా ఓ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ‘స్టార్టప్ డైరీ’తో మాట్లాడారు. ఆయనేమంటారంటే.. ‘‘మాది కేరళలోని చెన్నాలోడె అనే మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబం కావటంతో మూడు పూట్లా తిండే కష్టం. ఇక పొద్దున్నే టిఫిన్స్ అంటే లగ్జరీనే. చదువే దారి చూపిస్తుందని కష్టపడి కోల్కతాలోని ఆర్ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆ తర్వాత మోటరోలా, సిటీ బ్యాంక్, ఇంటెల్ సంస్థల్లో ఇండియాతో పాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేశా. తర్వాత ఐఐఎం బెంగళూర్లో ఎంబీఏ కూడా పూర్తి చేశా. ఓసారి బెంగళూరులోని మా కజిన్ వాళ్లింటికి వెళ్లా. వాళ్లకు ఇంద్రానగర్లో ఓ చిన్న కిరాణా షాపుంది. రోజూ అక్కడ లోకల్ బ్రాండ్ ఇడ్లీ, దోశ ప్యాకెట్స్ బోలెడన్ని అమ్మకాలుండేవి. ఓసారి షాపులో కూర్చున్న నాకు.. ఇది ఆశ్యర్యం కలిగించింది. నాణ్యత, దినుసుల ఎంపిక వంటివేవీ పట్టించుకోకుండా ప్యాకేజ్డ్ ఫుడ్కు ఇంత మార్కెట్ ఉందా అని! దీన్నే తాజాగా, అందుబాటు ధరల్లో అందిస్తే ఎలా ఉంటుందనుకున్నా!! మా కజిన్తో కలిసి రూ.50 వేల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్ ఫుడ్ను ప్రారంభించాం. వండుకునేందుకు సిద్ధమైన రెడీ టు కుక్ ప్యాకెట్స్.. అది కూడా ప్రతి రోజూ తాజా ఉత్పత్తులు, వినూత్న ప్యాకేజింగ్, అందుబాటు ధర ఇదీ ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ ప్రత్యేకత. 8 ఉత్పత్తులు.. ప్రస్తుతం ఐడీ ఫ్రెష్ నుంచి ఇడ్లీ, దోశ, వడ, రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, మలబార్ పరాఠా, గోధుమ పరాఠా, పన్నీర్ పిండి 8 రకాల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే ఫిల్టర్ కాఫీ డికాక్షన్, టమాట, కొబ్బరి చట్నీలను తెస్తున్నాం. వచ్చే రెండేళ్లలో 15 ఉత్పత్తులను విపణిలోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, దుబాయ్లో 6 తయారీ కేంద్రాలున్నాయి. ఆయా ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15 లక్షల ఇడ్లీలు. త్వరలోనే బెంగళూరులో మరో భారీ ప్లాంట్ను నిర్మించనున్నాం. దీంతో సామర్థ్యం రోజుకు కోటి ఇడ్లీలకు చేరుతుంది. పిండి రుబ్బడానికి అమెరికా సంస్థతో కలిసి సొంతంగా మిషన్లను అభివృద్ధి చేశాం. ఈ మిషన్ గంటకు 1,500 కిలోల పిండి రుబ్బుతుంది. 20 వేల స్టోర్లు; రోజుకు 20 కోట్ల వ్యాపారం.. మన దేశంతో పాటు దుబాయ్లోనూ ఐడీ ఫ్రెష్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. మొత్తం 20 వేల స్టోర్లున్నాయి. హైదరాబాద్లో 2,200, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో 1,200 స్టోర్లున్నాయి. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్లో 3 వేల స్టోర్లతో పాటు వరంగల్, కర్నూల్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని లకి‡్ష్యం చాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. హైదరాబాద్లో రోజు కు రూ.2 కోట్లు, ఏపీలో రూ.80 లక్షల వ్యాపారం ఉంది. మొత్తం ఆదాయంలో బెంగళూరు నుంచి 40%, హైదరాబాద్ నుంచి 16% వాటా వస్తోంది. ఐదేళ్లలో వెయ్యి కోట్లు లక్ష్యం.. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.275 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అంతక్రితం ఏడాది ఇది రూ.182 కోట్లు. వచ్చే ఐదేళ్లలో వెయ్యి కోట్ల టర్నోవర్ను లకి‡్ష్యంచాం. త్వరలోనే ఒమన్, సౌదీ దేశాలకు ఆ తర్వాత సింగపూర్, శ్రీలంక, అమెరికా వంటి దేశాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం కంపెనీలో 1,600 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో రూ.185 కోట్ల నిధులను సమీకరించాం. హీలియన్ వెంచర్ పార్టనర్స్ రూ.35 కోట్లు, అజీజ్ ప్రేమ్జీ రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టారు... అని ముస్తఫా వివరించారు. -
స్పెషల్ కిడ్స్కు ‘పినాకిల్ బ్లూమ్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలే... స్పెషల్ కిడ్స్. దేశంలో ఇలాంటివారి సంఖ్య 5 లక్షలకుపైనే. సరిపల్లి కోటిరెడ్డి కుమారుడికీ ఇలాంటి సమస్యే వచ్చింది. వైద్యుల దగ్గరికి తీసుకెళితే ఆటిజం (బుద్ధి మాంద్యం) అని చెప్పారు. అయితే కోటిరెడ్డి దానిపై పూర్తిస్థాయిలో శోధించారు. రుగ్మతేంటో తెలుసుకున్నారు. చికిత్సతో కొంతవరకూ నయం చేయగలిగారు. అలాగని అక్కడితో ఆగిపోలేదు!! అలాంటి పిల్లలకు తగిన విద్య, ఇతర సేవలు అందించడానికి ‘పినాకిల్ బ్లూమ్స్’ను ఏర్పాటు చేశారు. ఇపుడు దాన్ని విస్తరించే పనిలో పడ్డారు. కంపెనీ గురించి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే... ‘‘మా బాబుకి 20 నెలలున్నప్పుడు ఆటిజం అని డాక్టర్ చెప్పారు. ఆ బాధ నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకుని నిజంగా ఆటిజం ఉందా అని అధ్యయనం చేశాను. చివరకది సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (వినికిడి సమస్య) అని తేలింది. పిల్లాడికి కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించాం. ఇప్పటికీ బాబుకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అయితే ఆటిజం, డాల్ ఫేస్, మానసిక రుగ్మత, ప్రవర్తన సమస్యలతో దేశంలో 5 లక్షల పైచిలుకు మంది పిల్లలు బాధపడుతున్నారు. పిల్లలు పెరిగేంత వరకు సమస్య బయటపడదు. వీరికోసం ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. పరిశోధన ఆధారంగా.. స్పెషల్ కిడ్స్కు ఎటువంటి థెరపీ ఇవ్వాలో లోతైన అధ్యయనం చేశాం. ఇందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చయింది. సెంటర్ల ఏర్పాటు, కంపెనీ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు వెచ్చించాం. మా సెంటర్ల ద్వారా స్పెషల్ కిడ్స్కు స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఆడియాలజీ సేవలు అందిస్తున్నాం. ఇందుకు తొలిసారిగా మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా టెక్నాలజీని ఆసరాగా చేసుకున్నాం. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, లాంగ్వేజ్ పాత్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్టులతో కూడిన 40 మంది నిపు ణులు ప్రస్తుతం పూర్తిస్థాయి సేవలందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్తో కలిసి సైకాలజీలో పరిశోధన చేస్తున్నాం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా.. పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బందిపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది. బాబు, పాప తల్లిదండ్రులకు ప్రతిరోజు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ ఉంటుంది. ప్రతి సెషన్లో పిల్లలకు అందిన సేవలపై తల్లిదండ్రులు పినాకిల్ కనెక్ట్ యాప్లో రేటింగ్ ద్వారా తమ స్పందనను తెలియజేయాలి. ఇంట్లో పిల్లల ప్రవర్తన సమాచారాన్ని పొందుపరచాలి. ఈ అంశాల ఆధారంగా థెరపీలో మార్పు ఉంటుంది. అలాగే బాబు, పాప గురించి, వారితో ఎలా మెలగాలో నిపుణులు యాప్ ద్వారా చెప్తారు. సమస్య స్థాయినిబట్టి 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు థెరపీ అవసరం. విదేశాల్లోనూ అడుగుపెడతాం.. హైదరాబాద్లో కూకట్పల్లి, మాదాపూర్, సుచిత్ర, వెస్ట్ మారేడ్పల్లిలో పినాకిల్ బ్లూమ్స్ కేంద్రాలున్నాయి. రెండు నెలల్లో హైదరాబాద్లోనే మరో 7 కేంద్రాలు వస్తున్నాయి. విస్తరణకు రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో ఫ్రాంచైజీ విధానంలో 30 సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. భారత్లో అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ విస్తరిస్తాం. ఫ్రాంచైజీకి ప్లే స్కూళ్లు, చిల్డ్రన్ హాస్పిటల్స్, న్యూరాలజిస్టులకు ప్రాధాన్యమిస్తాం. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం, రూ.2–3 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో ఏదైనా గవర్నమెంటు స్కూల్లో పినాకిల్ బ్లూమ్స్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సిద్ధం. ఈ సెంటర్లలో ఉచితంగా సేవలు అందిస్తాం, -
బార్కోడ్లో రెజ్యూమ్! వీడియోలో ఇంటర్వ్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా, ఉబర్ వంటి రెంటల్ కార్ల బుకింగ్ ఎలా చేయాలో మనకందరికీ తెలిసిందే! అచ్చం అలాగే కంపెనీల ఉద్యోగ నియామకాలూ ఉంటే! ఖాళీగా ఉన్న జాబ్స్ వివరాలు అభ్యర్థులకు.. అలాగే విద్యార్హతలతో కూడిన అభ్యర్థుల వివరాలు కంపెనీలకూ గూగుల్ మ్యాప్స్లో దర్శనమిస్తుంటే? ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. బెంగళూరుకు చెందిన హలోజాబ్స్ అనే స్టార్టప్ ఈ నియామక టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం టెస్టింగ్లో ఉందని, ఏడాదిలో విపణిలోకి విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు హలోజాబ్స్ ఫౌండర్ శ్రీనివాస్ వరాహగిరి. మరిన్ని వివరాలను ఆయన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా చింతలపల్లి గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తయ్యాక... పలు ప్రైవేట్ కంపెనీల్లో హెచ్ఆర్, ఫైనాన్స్ విభాగంలో కీలక స్థాయిల్లో పనిచేశా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడిని కూడా. హెచ్ఆర్లో పని చేయటం వల్లే కావొచ్చు... ఉద్యోగ నియామక ప్రక్రియలోని సమస్యలను క్షుణ్నంగా తెలుసుకునే వీలు కలిగింది. టెక్నాలజీతో మానవ వనరుల విభాగం అవసరాలను సులభతరం చేయాలని నిర్ణయించుకొని.. రూ.25 లక్షల పెట్టుబడితో 2016 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా హలోజాబ్స్ను ప్రారంభించా. బార్కోడ్లో రెజ్యూమ్.. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. పేజీలకు పేజీలు రెజ్యూమ్లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా హలోజాబ్స్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఏటీఎం కార్డు తరహాలో ఉచితంగా క్యూఆర్ కోడ్తో విజువల్ రెజ్యూమ్ (వీఆర్) గుర్తింపు కార్డును అందిస్తాం. ఇందులో అభ్యర్థి విద్యా సంబంధమైన వివరాలతో పాటు, నైపుణ్యం, అనుభవం వంటి కీలక సమాచారాన్ని సులువుగా గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. పైగా అభ్యర్థుల సర్టిఫికెట్స్, వ్యక్తిగత వివరాలు ధ్రువీకరణ ప్రక్రియ అంతా హలోజాబ్స్ చేసి బార్కోడ్లో నిక్షిప్తం చేస్తాం. కంపెనీలు తమ మొబైల్ ఫోన్తో ఈ బార్కోడ్ను స్కాన్ చేసినా లేదా ఫొటో తీసినా సరే వెంటనే అభ్యర్థి రెజ్యూమ్ ఫోన్ లేదా డెస్క్టాప్లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురించి మళ్లీ కంపెనీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముండదు. వీడియోలోనే ఇంటర్వ్యూలు.. విజువల్ రెజ్యూమ్తో పాటూ వీడియో ఇంటర్వ్యూ సిస్టమ్ను కూడా అభివృద్ధి చేశాం. త్వరలోనే విపణిలోకి విడుదల చేయనున్నాం. ఇదేంటంటే... అభ్యర్థులు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా నేరుగా ఇంటర్వ్యూ కు హాజరయ్యే అవకాశముంటుంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నైల్లో సేవలందిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, పుణె, అహ్మదాబాద్ నగరాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం హలోజాబ్స్లో 3 లక్షల మంది అభ్యర్థులు, 140 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో ప్రణవ హెల్త్కేర్, కాన్కార్డ్ ఆటోమేషన్, డిజిటల్ అకాడమీ వంటివి కొన్ని. ఏపీ, తెలంగాణ నుంచి 40 వేల అభ్యర్థులుంటారు. ఇప్పటివరకు హలోజాబ్స్ వేదికగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయి. రూ.5 కోట్ల ఆదాయం లక్ష్యం.. మా ఆదాయ మార్గం రెండు విధాలుగా ఉంటుంది. ఒక ఉద్యోగ నియామక ప్రకటనకు రూ.250 ఉంటుంది. అలా కాకుండా నమోదైన అభ్యర్థుల డేటాబేస్ పొందాలంటే లక్ష రూపాయల వరకు ఉంటుంది. డేటాబేస్తో కంపెనీలు వాళ్లకు కావాల్సిన అభ్యర్థిని ఎంచుకునే వీలుంటుంది. కంపెనీల తరఫున ఇంటర్వ్యూ హలోజాబ్స్ చేసి పెడుతుంది. ఎంపికైన అభ్యర్థికిచ్చే ప్యాకేజ్లో 5–8.3 శాతం కంపెనీ నుంచి కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 5 వేల మంది అభ్యర్థులు నమోదవుతున్నారు. 2,500 జాబ్ పోస్టింగ్స్ అవుతున్నాయి. సుమారు 100 ఇంటర్వ్యూలు చేస్తున్నాం. రూ.25 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం నెలకు రూ.15 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. 15% వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.5 కోట్ల టర్నోవర్, 2020 నాటికి రూ.20 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 25 లక్షల మంది అభ్యర్థులకు, సింగపూర్, మలేషియా దేశాలకు విస్తరించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం మా కంపెనీలో 36 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.25 కోట్ల నిధులను సమీకరిస్తామని’’ శ్రీనివాస్ వివరించారు. -
పార్టీ మీది.. ఏర్పాట్లు మావి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలు కావచ్చు... హాలిడే ట్రిప్స్, బ్యాచ్లర్, వీకెండ్ పార్టీలు కావచ్చు.. ఈవెంట్ ఏదైనా సరే అరేంజ్మెంట్స్ చేయడం పెద్ద పని. పోనీ, ఏ హోటల్లోనో కానిచ్చేద్దామంటే బడ్జెట్ భారమవుతుంది. పార్టీకయ్యే ఖర్చుకంటే ఏర్పాట్ల ఖర్చే తడిసిమోపెడవుతుంది. అలాకాకుండా కారు అద్దెకు తీసుకున్నట్టు పార్టీకి అవసరమైన ఉత్పత్తులనూ అద్దెకు తీసుకుంటే? ఇదే వ్యాపార సూత్రంగా మలచుకుంది బెంగళూరుకు చెందిన రెంట్షేర్. మన దేశంతో పాటూ దుబాయ్, షార్జా, అబుదాబిల్లోనూ తక్కువ ఖర్చుతో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలు రెంట్షేర్ ఫౌండర్ అండ్ సీఈఓ హార్ష్ దండ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఐఐటీ ఢిల్లీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశాక.. ఐబీఎం రీసెర్చ్లో ఉద్యోగంలో చేరా. కొత్త కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనతో 2008లో ఆక్స్వర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశా. అక్కడ చూసిన రెంటింగ్ ట్రెండ్ మన దేశంలోనూ ప్రారంభించాలని నిర్ణయించుకొని 2015 అక్టోబర్లో బెంగళూరు కేంద్రంగా రెంట్షేర్ స్టార్టప్ను ప్రారంభించా. ఆఫ్లైన్లో దొరికే ప్రతి వస్తువూ ఆన్లైన్లో అద్దెకివ్వాలన్నదే రెంట్షేర్ లక్ష్యం. 40 కేటగిరీలు.. 12 వేల ఉత్పత్తులు.. ప్రొజెక్టర్స్, ఎల్ఈడీ స్క్రీన్స్, స్పీకర్స్, బార్బిక్యూ గ్రిల్స్, హుక్కా సెట్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఉత్పత్తులు ఇలా 40 కేటగిరీల్లో సుమారు 12 వేల ఉత్పత్తులున్నాయి. వీటిని గంటలు, రోజులు, వారం లెక్కన అద్దెకు తీసుకోవచ్చు. కనీస ఆర్డర్ విలువ రూ.వెయ్యి. ఉత్పత్తుల డెలివరీ, పికప్ బాధ్యత వెండర్దే. ఉత్పత్తుల అద్దె కోసం స్థానికంగా ఉండే వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 600 మంది వెండర్లున్నారు. హైదరాబాద్ నుంచి 55 మంది ఉన్నారు. ఐపీఎల్, ఫీఫా వరల్డ్ కప్ సమయంలో ఎల్ఈడీ వాల్స్కు, స్పీకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కర్ణాటక ఎలక్షన్ సమయంలో ఎల్ఈడీ వాల్స్ అద్దెకు తీసుకున్నారు. దీని ధర రోజుకు రూ.11 వేలు. హాబీస్, ట్రావెల్స్లోకి విస్తరణ.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటూ దుబాయ్, అబుదాబి, షార్జాలల్లో సేవలందిస్తున్నాం. వీకెండ్స్, సమ్మర్ పార్టీలు, పెళ్లి, బర్త్డే పార్టీలు దుబాయ్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే విదేశాల్లో మొదటగా దుబాయ్లో ప్రారంభించాం. వచ్చే నెలాఖరు నాటికి పుణే, కోచి, చండీగఢ్ నగరాలకు విస్తరించనున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వంద మంది వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. రెండు వారాల్లో హాబీస్, ట్రావెల్ విభాగంలోకి విస్తరించనున్నాం. అంటే డ్రోన్ కెమెరాలు, ఐస్ బాక్స్లు, డిస్కో లైట్లు, స్నో మిషన్స్, బీన్ బ్యాగ్స్ వంటి ఉత్పత్తులను అద్దెకిస్తాం. హైదరాబాద్ వాటా 20 శాతం... ప్రస్తుతం నెలకు 10 వేల ఉత్పత్తుల అద్దె ఆర్డర్లు వస్తున్నాయి. ఇందులో ఈవెంట్స్, పార్టీ ఉత్పత్తుల అద్దెలే 40% వరకుంటాయి. హైదరాబాద్ నుంచి నెలకు 1,200 ఉత్పత్తులు అద్దెకు తీసుకుంటున్నారు. గత రెండేళ్లలో 60 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. సుమారు 10 లక్షల ఉత్పత్తులను అద్దెకు అందించాం. మెడికల్ కేటగిరీలో వీల్ చెయిర్స్, ఆక్సిజన్ కిట్స్ వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా రూ. 20 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో హైదరాబాద్ వాటా 20% వరకూ ఉంది. రూ.30 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం కంపెనీలో 20 మంది ఉద్యోగులున్నారు. నెలాఖరు నాటికి టెక్నికల్ టీమ్లో మరో ఐదుగురిని తీసుకోనున్నాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి 2 వేల మంది వెండర్లకు, రూ.60 కోట్ల ఆదాయానికి చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు రూ.10 కోట్లు సమీకరించాం. ఐఐటీ–ఢిల్లీ, ఆక్స్వర్డ్ స్నేహితులతో పాటు దుబాయ్కు చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ముగింపులోగా మరో రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నాం. సౌదీకి చెందిన పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. -
చిట్టీలుంటే.. రుణాలిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యక్తిగత అవసరం కావొచ్చు.. సంస్థ కోసం కావచ్చు.. ప్రతి నెలా చిట్టీలు వేయటం మనకు తెలిసిందే. అవసరానికి డబ్బులొస్తాయనో లేక పొదుపు చేస్తే వడ్డీ కలిసొస్తుందనో చిట్ఫండ్లలో సభ్యులుగా చేరతాం. మరి, నెలనెలా మీరు వేసే చిట్టీలే మీకు రుణాన్నిస్తే? చిట్టీ కాలం ముగిసే లోపు నెల వాయిదాతో పాటూ అసలూ తీరిపోతే? ఇదే వ్యాపారసూత్రంగా ఎంచుకుంది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ క్రెడ్రైట్. దేశంలోని చిట్ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సభ్యులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.35 లక్షల వరకూ రుణాన్నిస్తోంది. మరిన్ని వివరాలను క్రెడ్రైట్ కో–ఫౌండర్ నీరజ్ భన్సాల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్ఫండ్స్ జనరల్ సెక్రటరీ టీఎస్ శివరామకృష్ణన్తో కలిసి 2014లో రూ.1.5 కోట్ల పెట్టుబడితో క్రెడ్రైట్ను ప్రారంభించాం. అమెరికాలోని రొటేటింగ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ అసోసియేషన్ (రోస్కా) తరహాలోనే చిట్ఫండ్స్తో ఒప్పందం చేసుకున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), కిరాణా షాపులు, ఇతరత్రా వ్యాపారస్తులకు డేటా ఆధారిత రుణాన్నివ్వటమే మా ప్రత్యేకత. చిట్ విలువలో 80% రుణం.. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన బలుస్సెరీ, చెన్నైకి చెందిన మాయావరం, బెంగళూరుకు చెందిన ఇందిరానగర్, హైదరాబాద్కు చెందిన సప్తవందన చిట్ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. వీటికి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోల్లో వందల బ్రాంచీలున్నాయి. లక్ష నుంచి రూ.35 లక్షల వరకు రుణాలిస్తాం. చిట్ విలువలో 80 శాతం వరకూ రుణం వస్తుంది. ప్రతి నెలా కేవలం వడ్డీ మాత్రమే ఉంటుంది. చిట్ పాడుకున్నపుడు అసలును కట్టాల్సి ఉంటుంది. ఏడాదికి 18% వడ్డీ ఉంటుంది. రూ.10 కోట్ల రుణాల మంజూరు.. పేరు, చిరునామా, చిట్ఫండ్ వివరాలు, ఇతరత్రా డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయ్యాక.. 24 గంటల్లో రుణం మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 150 మంది చిట్ఫండ్ దారులకు రూ.10 కోట్ల రుణా లిచ్చాం. రూ.10 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నవాళ్లు 35% ఉంటారు. ఈ ఏడాది ముగిసేలోగా రూ.100 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యించాం. రుణగ్రహీత నుంచి రుణంలో 1–2% ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 2 నెలల్లో కేరళ, ఏపీలకు విస్తరణ.. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. మా మొత్తం ఆదాయంలో తెలంగాణ వాటా 15 శాతం. కర్ణాటక, మహారాష్ట్రల వాటా 35 శాతం. రెండు నెలల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవలను ప్రారంభిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో 5 చిట్ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నాం. మార్గదర్శి, కపిల్ చిట్ఫండ్లతో చర్చిస్తున్నాం. ఈ ఏడాది ముగింపులోగా ఒప్పందం పూర్తవుతుంది. రూ.9 కోట్ల నిధుల సమీకరణ..: 2017–18లో రూ. కోటి ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.10 కోట్లకు చేరాన్నది లక్ష్యం. ‘‘ప్రస్తుతం కంపెనీలో ఏడుగురు ఉద్యోగులున్నారు. త్వరలోనే దీన్ని 30కి చేర్చనున్నాం. ఇటీవలే యువర్నెస్ట్, ఆసియాన్ వెంచర్ల్యాబ్స్ ద్వారా రూ.9 కోట్లు సమీకరించాం’’ అని నీరజ్ వివరించారు. -
సౌర విద్యుత్ను విస్తరిద్దాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్.. పేరు వినడానికి సింపుల్గానే అనిపిస్తుంది. ప్రాక్టికల్గానే కాసింత కష్టం. కారణం.. ఇన్స్టలేషన్, నిర్వహణ, పనిచేసే విధానం అంత సులువుగా అర్థం కావు! ఈ రంగంలోని బడా కంపెనీలేమో మెట్రోలకే పరిమితమయ్యాయి. గ్రామీణ, ఎంఎస్ఎంఈలకు సౌర వెలుగులు అందటంలేదు. దీనికి పరిష్కారం కనుగొంది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ఫ్రెయర్ ఎనర్జీ. ‘సన్ ప్రో’ యాప్ ఆధారంగా కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా సౌర ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కంపెనీలకు ఎలాంటి పెట్టుబడి లేకుండానే గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించినట్టవుతుంది. పైగా బ్యాంక్లతో ఒప్పందం చేసుకొని కస్టమర్లకు రుణాలనూ అందిస్తుంది. మరిన్ని వివరాలను ‘ఫ్రెయర్’ కో–ఫౌండర్ రాధిక చౌదరి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. ఉస్మానియాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అమెరికాలో న్యూక్లియర్ ఎనర్జీలో మాస్టర్స్ చేశా. తర్వాత జీఈ కంపెనీలో పవన విద్యుత్ విభాగంలో చేరా. అక్కడి నుంచి ఎస్కేఎఫ్ బేరింగ్స్లో చేరా. పెళ్లయి, పిల్లలు పుట్టడంతో 2008లో ఇండియాకు తిరిగి వచ్చేశా. హైదరాబాద్లో ల్యాంకో ఇన్ఫ్రాలో సోలార్ విభాగ డీజీఎంగా చేరా. ఆర్థిక సంక్షోభంతో కంపెనీ ఢిల్లీకి మారింది. ఢిల్లీకి వెళ్లటం ఇష్టం లేక నేను హైదరాబాద్లోనే ఉన్నా. అప్పుడే మరో మిత్రుడు సౌరభ్ మర్ధాతో కలిసి రూ.కోటి పెట్టుబడితో 2014లో ఫ్రెయర్ ఎనర్జీని ఆరంభించాం. నెలకు రూ.5 కోట్ల ఆర్డర్లు.. రూఫ్ టాప్స్, బోర్వెల్స్, పెంట్రోల్ బంక్లు, మైక్రో గ్రిడ్ నాలుగు విభాగాల్లో సౌర విద్యుత్ను అందిస్తున్నాం. రూ.5 కోట్ల విలువైన ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్పై మాకు 10 శాతం లాభం ఉంటుంది. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ వంటి విద్యుత్ విభాగాలతో పాటు యాక్సిస్ బ్యాంక్ వంటి పలు కమర్షియల్ ప్రాజెక్ట్లనూ నిర్వహిస్తున్నాం. త్వరలోనే తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సౌర విద్యుత్ ఏర్పాట్లకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. మా మొత్తం సౌర విద్యుత్ నిర్వహణలో ఎంఎస్ఎంఈ 40 శాతం, రూఫ్ టాప్ 20 శాతం వరకూ ఉంది. 14 రాష్ట్రాలు, విదేశాల్లోనూ సేవలు.. ప్రస్తుతం ఫ్రెయర్ ఎనర్జీతో 10 వేల మంది చానల్ పార్టనర్స్ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 500 మంది యాక్టివ్గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చంఢీగఢ్, ఢిల్లీ వంటి 14 రాష్ట్రాల్లో 900 పైగా సోలార్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 6 మెగావాట్ల సౌర విద్యుత్ను నిర్వహిస్తున్నాం. మన దేశంతో పాటూ ఆఫ్రికా దేశాల్లోనూ చానల్ పార్టనర్స్ ఉన్నారు. వచ్చే రెండేళ్లలో 15 దేశాలకు విస్తరణ, 8 మెగావాట్ల సోలార్ విద్యుత్ నిర్వహణకు చేరాలని లకి‡్ష్యంచాం. 2 నెలల్లో రూ.20 కోట్ల సమీకరణ.. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.12 కోట్లు ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.80 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే టెక్నాలజీ విభాగంలో మరో 15 మందిని తీసుకోనున్నాం. గత 18 నెలల్లో పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు మా సంస్థలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. రాబోయే 2 నెలల్లో 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనున్నాం. యూరప్, సింగపూర్లకు చెందిన ఇన్వెస్టర్లతో చర్చలు ముగిశాయి’’ అని రాధిక వివరించారు. -
రూ.66కే ఆన్లైన్ దుకాణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రాత్రికి రాత్రే మీ ఆఫ్లైన్ దుకాణం ఆన్లైన్లోకి మారిపోవాలంటే? వెబ్సైట్ అభివృద్ధి, నిర్వహణ కోసం టెక్నాలజీ సంస్థలతో.. ఉత్పత్తుల సరఫరా కోసం లాజిస్టిక్స్తో.. నగదు లావాదేవీల కోసం పేమెంట్ గేట్వేలతో ఒప్పందం చేసుకోవాలి. నిజానికిది రాత్రికి రాత్రే జరిగే పనేం కాదు. కానీ షాప్మాటిక్తో ఒప్పందం చేసుకుంటే చాలు!! జస్ట్.. 15 నిమిషాల్లో మీ ఆఫ్లైన్ స్టోర్ కాస్త ఈ–కామర్స్ స్టోర్గా మారిపోతుంది. అంతే! వెబ్సైట్ అభివృద్ధి నుంచి మొదలుపెడితే నిర్వహణ, ప్యాకింగ్, లాజిస్టిక్, పేమెంట్ గేట్వే అన్ని రకాల సేవలూ ఒకే వేదికగా అందించడమే దీని ప్రత్యేకత. దీనికయ్యే ఖర్చు 3 నెలలకు రూ.66. ఇదే షాప్మాటిక్ సక్సెస్ మంత్రమంటున్నారు హైదరాబాద్కు చెందిన అనురాగ్ ఆవుల. మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారాయన. ‘‘మాది కూకట్పల్లి. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తయ్యాక.. మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, ఎన్సీఆర్ కార్పొరేషన్లో కొన్నాళ్లు పనిచేశా. అక్కడి నుంచి ఫిన్టెక్ కంపెనీ పేపాల్లో సింగపూర్లో చేరా. వృత్తిరీత్యా ఈ–కామర్స్ కంపెనీలతో పనిచేయాల్సి ఉండటంతో మన దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్ఎంఈ), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ–కామర్స్ వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత వ్యయ ప్రయాసలు పడుతున్నారో తెలిసింది. సులువుగా, అందుబాటు ధరలో దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని పేపాల్లోని మరో ఇద్దరు సహోద్యోగులు క్రిస్ చెన్, యెన్లీతో కలిసి రూ.2 కోట్ల పెట్టుబడితో 2015 అక్టోబర్లో బెంగళూరు కేంద్రంగా షాప్మాటిక్.కామ్ను ప్రారంభించాం. 15 నిమిషాల్లో ఈ–కామర్స్ స్టోర్.. ప్రస్తుతం 60కి పైగా ఉచిత స్టోర్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. షాప్మాటిక్తో ఒప్పందమైన 15 నిమిషాల్లో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ–కామర్స్ నిర్వహణ సేవలతో పాటూ ప్రమోషన్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఉత్పత్తుల రికమండేషన్స్ అన్ని ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం షాప్మాటిక్కు 1.5 లక్షల మంది కస్టమర్లున్నారు. వీరిలో 45 శాతం కస్టమర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారే. అత్యధిక కస్టమర్లు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ వాటా 13 శాతం వరకూ ఉంటుంది. 3, 6, 12 నెలల వారీగా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. 3 నెలలకు రూ.66. నెల రోజుల్లో యూఈఏకి విస్తరణ.. ప్రస్తుతం మన దేశంతో పాటూ సింగపూర్, తైవాన్, హాంకాంగ్ దేశాల్లో సేవలందిస్తున్నాం. నెల రోజుల్లో యూఏఈకి విస్తరించనున్నాం. ఈ ఏడాది ముగిసేలోగా ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ దేశాలకు విస్తరించాలని, వచ్చే ఏడాది కాలంలో కస్టమర్ల సంఖ్యను 3 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఉత్పత్తుల డెలివరీ కోసం డెల్హివరీ, ఫెడెక్స్, డీహెచ్ఎల్ వంటి అన్ని కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రూ.70 కోట్ల నిధుల సమీకరణ.. ఏటా 310 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 25 మందిని నియమించుకోనున్నాం. గతేడాది ఏసీపీ వెంచర్స్, స్ప్రింగ్స్ సీడ్ క్యాపిటల్ సంస్థలు రూ.25 కోట్ల పెట్టుబడి పెట్టాయి. మరో 2 నెలల్లో రూ.70 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఈ రౌండ్లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ ఉంటారు’’ అని అనురాగ్ వివరించారు. -
కాజా.. పేట.. పల్లీపట్టీ.. రసగుల్లా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, ఆగ్రా పేట, నాగ్పూర్ రసగుల్లా, లూనావాలా పల్లీపట్టీ... ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఫేమస్ స్వీట్స్! నిజం చెప్పాలంటే వీటివల్లే ఆయా ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది కూడా. వీటిని టేస్ట్ చేయాలంటే? ఐతే ఆయా ప్రాంతాల్లో తెలిసిన వాళ్లెవరైనా ఉంటే పంపించమని చెప్పాలి లేకపోతే మనమో అటువైపు వెళ్లినప్పుడు కొనుక్కోవాలి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ అంత ఖర్మెందుకనుకున్నాడు అహ్మదాబాద్ కుర్రాడు విశ్వ విజయ్ సింగ్. అంతే!! చేస్తున్న ఉద్యోగానికీ గుడ్ బై చెప్పేసి.. సేల్భాయ్ని ప్రారంభించేశాడు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ విక్రయాలతో జోరు మీదున్న సేల్భాయ్ విశేషాలను ‘స్టార్టప్ డైరీ’కి వివరించారాయన. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక.. ఎయిర్టెల్, నెరోల్యాక్, ఐసీఐసీఐ వంటి సంస్థల్లో 15 ఏళ్ల పాటు పనిచేశా. 2012–13లో ఇంటర్నెట్ బూమ్తో ఈ–కామర్స్ హవా మొదలైంది. అప్పటివరకు మొబైల్స్, అపెరల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులనే ఆన్లైన్లో అమ్మారు. మనకంటూ ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో పేరొందిన ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించాలనుకుని ఇద్దరు స్నేహితులు పూర్భ, ప్రమోద్లతో కలిసి అహ్మదాబాద్ కేంద్రంగా 2015 సెప్టెంబర్లో కోటి రూపాయల పెట్టుబడితో సేల్భాయ్.కామ్ను ప్రారంభించాం. 400 మంది వర్తకులు; 8 వేల ఉత్పత్తులు.. ప్రస్తుతం 400 మంది వర్తకులతో ఒప్పందం చేసుకున్నాం. స్నాక్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్తో పాటూ హస్త కళలు, పూజా సామగ్రి, డెకరేటివ్, హెర్బల్ కేటగిరీలో సుమారు 10 వేల రకాల ఉత్పత్తులుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 20 మంది వర్తకులుంటారు. చార్మినార్ గాజులు, కొండపల్లి బొమ్మలు, గద్వాల్ చీరలు వంటివి వీటిల్లో కొన్ని. ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా.. వర్తకులు ఎవరు? ఉత్పత్తి ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఎందుకింత ప్రత్యేకత వంటి వివరాలను ఫొటోగ్రాఫులతో పాటూ పొందుపరుస్తాం. దీంతో కస్టమర్ కొనుగోలు చేయకముందే ఉత్పత్తి విశేషాలను తెలుసుకునే వీలుంటుంది. హైదరాబాద్, రాయలసీమ కీలకం.. కస్టమర్ ఆర్డర్ బుక్ చేయగానే సంబంధిత వర్తకుడికి మెసేజ్, ఈ–మెయిల్ రూపంలో సందేశం వెళుతుంది. దీన్ని ఓకే చేయగానే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. వెంటనే ఆ సమాచారం దగ్గర్లోని లాజిస్టిక్ కేంద్రానికి వెళుతుంది. కొరియర్ బాయ్ వర్తకుడి షాపుకెళ్లేలోపు వర్తకుడు ఆయా ఉత్పత్తిని సేల్భాయ్ ప్యాకేజింగ్లో ప్యాక్ చేసి పెడతాడంతే! ఫెడెక్స్, బ్లూడార్ట్, డెలివర్హీ వంటి అన్ని కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 1.6 లక్షల మంది కస్టమర్లు నమోదయ్యారు. నెలకు 15 వేల ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ప్రతి ఉత్పత్తిపై వర్తకుని దగ్గర్నుంచి 22–45 శాతం వరకు కమీషన్ తీసుకుంటాం. మా వ్యాపారంలో రాయలసీమ, హైదరాబాద్ కీలకం. ఆర్డర్లు, వర్తకుల వారీగా ఇక్కడి నుంచే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఇతర ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడాదిలో కనీసం 50 మంది వర్తకులతో ఒప్పందం చేసుకుంటాం. వచ్చే ఏడాది కాలంలో నెలకు 50 వేల ఆర్డర్లకు చేర్చాలని లక్ష్యించాం. 3 నెలల్లో రూ.25 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది మా ఒప్పందం వర్తకులకు రూ.5 కోట్ల గ్రాస్ మర్తండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) వ్యాపారం చేసిచ్చాం. ఇందులో రూ.1.7 కోట్లు లాభం వచ్చింది. ఈ ఏడాది రూ.10 కోట్లు జీఎంవీ, రూ.4 కోట్ల లాభం లక్ష్యించాం. మా లాభంలో 10 శాతం హైదరాబాద్ నుంచి ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీలో 38 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటి వరకు రూ.13 కోట్ల నిధులను సమీకరించాం. టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్రాండ్ క్యాపిటల్, పలువురు హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లున్నారు. త్వరలోనే రూ.25 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ వీసీ ఫండ్లతో చర్చిస్తున్నాం. 3 నెలల్లో డీల్ను క్లోజ్ చేస్తాం... అని సింగ్ వివరించారు. -
ఆన్లైన్లో ‘అమ్మ మాట’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కూతురు, భార్య, తల్లి.. దశలను బట్టి మహిళ పోషించే పాత్రలివి. ఒక్కో దశలో ఒక్కో రకమైన అనుభవాలు! మరి, వీటిని మరో పది మందితో పంచుకుంటే!!? ఒకరి అనుభవాలే మరొకరికి పాఠాలుగా మారతాయి. ఇదే ఉద్దేశంతో దీనికి ఆన్లైన్ వేదికను అభివృద్ధి చేసింది ‘మామ్స్ప్రెస్సో’. గర్భం నుంచి మొదలుపెడితే సంతాన సంరక్షణ, బేబీ కేర్, టీనేజ్, బ్యూటీ, ఫ్యాషన్, హెల్త్కేర్ దాకా మహిళల అనుభవాలు, వీడియోలూ ఉంటాయిందులో! తెలుగుతో పాటూ ఇంగ్లిష్, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం భాషల్లో కంటెంట్ రాయొచ్చు. చదవొచ్చు కూడా. మరిన్ని వివరాలు మామ్స్ప్రెస్సో.కామ్ కో–ఫౌండర్ విశాల్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఐఐఎం బెంగుళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఏషియన్ పెయింట్స్లో రెండున్నరేళ్లు, హెచ్యూఎల్లో ఆరేళ్లు.. ఆ తర్వాత ఆవివా లైఫ్ ఇన్సూరెన్స్లో ఆరున్నరేళ్లు పనిచేశా. సహోద్యోగులైన ప్రశాంత్ సిన్హా, ఆసిఫ్ మహ్మద్తో కలిసి 2010లో రూ.45 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా మామ్స్ప్రెసో.కామ్ను ప్రారంభించాం. 6 వేల మంది తల్లులు, 50 వేల బ్లాగ్స్.. ప్రస్తుతం మామ్స్ప్రెస్సోలో 6 వేల మంది తల్లులు, 7 ప్రాంతీయ భాషల్లో 50 వేల బ్లాగ్స్ నిర్వహిస్తున్నారు. రోజుకు 150 మంది బ్లాగర్ల ఆర్టికల్స్ యాడ్ అవుతున్నాయి. బ్లాగ్స్ నిర్వహణలో సెలబ్రిటీలూ ఉన్నారు. ప్రస్తుతం నెలకు లక్ష మంది మామ్స్ప్రెస్సో కంటెంట్ను చదువుతున్నారు. 400 మంది బ్లాగర్స్... మాతో ఒప్పందం ఉన్న బ్రాండ్లకు కంటెంట్, వీడియోలను అందిస్తున్నారు. దీంతో ఒక్కో బ్లాగర్స్ నెలకు రూ.20–40 వేల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం 6 వేల బ్లాగర్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 720 మంది ఉన్నారు. వీరిలో 15 శాతం వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారే. ఎక్కు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది మాత్రం ఉత్తరాది వారే. మూడేళ్లలో రూ.150 కోట్ల ఆదాయం.. మామ్స్ప్రెస్సోలోని బ్లాగర్లకు గైనకాలజిస్ట్, పిడీయాట్రిషియన్, కౌన్సిలర్, ఎడ్యుకేటర్, న్యూట్రీషన్ విభాగాల్లో సలహాలిచ్చేందుకు ఆ రంగాల్లోని 400 మంది నిపుణులతో ఒప్పందం చేసుకున్నాం. వారి కంటెంట్, వీడియోలు అందుబాటులో ఉంటాయి. మామ్స్ప్రెస్సోకు రెండు రకాల ఆదాయ మార్గాలున్నాయి. 1. స్త్రీలు, పిల్లలకు సంబంధించిన కంపెనీల ప్రకటనల ద్వారా. 2. ఆయా బ్రాండ్లకు వీడియో ఆధారిత ప్రకటనలు చేయడం ద్వారా. ప్రస్తుతం జాన్సన్ అండ్ జాన్సన్, నెస్లే, హార్లిక్స్, డవ్, డెటాల్ వంటి 75కి పైగా బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. గతేడాది రూ.15 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే మూడేళ్లలో 200 బ్రాండ్లతో ఒప్పందం.. రూ.150 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. నెల రోజుల్లో మామ్స్ప్రెస్సో రేడియో.. ఇటీవలే ప్రత్యేకంగా మహిళల కోసం మామ్స్ప్రెసో ఆన్లైన్ టీవీ చానల్ను ప్రారంభించాం. ప్రస్తుతం 500లకుపైగా వీడియోలున్నాయి. మరో నెల రోజుల్లో ఆన్లైన్ రేడియో చానల్ను ప్రారంభిస్తాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళలను చేరుకునేందుకు వీలుగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ వాయిస్ ఆధారిత కంటెంట్ను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటివరకు యువర్ నెస్ట్, సిడ్బీ వెంచర్ క్యాపిటల్ నుంచి రూ.20 కోట్ల నిధులను సమీకరించాం. ప్రస్తుతం మా సంస్థలో 56 మంది ఉద్యోగులున్నారు. మరో 15 మందిని నియమించుకోనున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి కన్నడ, మలయాళం, గుజరాతీ, ఉర్దూ భాషల్లోనూ కంటెంట్ను తీసుకురానున్నాం. వచ్చే ఏడాది ఇదే విభాగంలోని ఓ కంపెనీని కొనుగోలు చేస్తాం’’ అని విశాల్ తెలిపారు. -
ఇన్వాయిస్లపై రుణాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘నిధులు’. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఎస్ఎంఈలకు అందించే ఇన్వాయిస్ బిల్లులు సమయానికి క్లియర్ కాక మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒక్క ఇన్వాయిస్ క్లియర్ కావాలంటే కనీసం 60–90 రోజుల సమయం పడుతుంది. ఎస్ఎంఈల ఇన్వాయిస్ సమస్యలకూ చెక్ చెప్పేస్తోంది ఇన్డిఫై టెక్నాలజీస్. ఇన్వాయిస్లను తనఖాగా పెట్టుకొని రూ.15–50 లక్షల వరకూ రుణాలివ్వటమే దీని ప్రత్యేకత. బిల్ క్లియర్ కాగానే వెంటనే రుణం తీర్చేయాలి సుమీ! ఇందుకు నెలకు 1.5 శాతం వడ్డీ. ఇప్పటివరకు ఇన్వాయిస్ల మీద 100 మందికి రూ.20 కోట్ల రుణాలందించామని ఇన్డిఫై కో–ఫౌండర్ సిద్ధార్థ్ మహనోత్ ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఐఐటీ ఘజియాబాద్ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక.. ఐసీఐసీఐ, సిటీ, ఇండియాబుల్స్, ఎడిల్వైజ్ వంటి సంస్థల్లో పనిచేశా. రెండు దశాబ్ధాల బ్యాంకింగ్ రంగ అనుభవంలో ఎంతో మంది కస్టమర్లు లోన్ కోసం రావటం ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లడం గమనించాం. వీరందరి సమస్యకు పరిష్కారం చూపించాలని నిర్ణయించుకొని.. ఇంటర్నేషనల్ వీసీ ఫండ్స్ నుంచి రూ.32 కోట్ల నిధుల సమీకరణతో 2015 మేలో ఇన్డిఫై టెక్నాలజీస్ను ప్రారంభించాం. కిరాణా స్టోర్లు, చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లకు రుణాలు అందటం చాలా కష్టం. తనఖా పెట్టందే బ్యాంకులు రుణాలివ్వవు. ప్రైవేట్ రుణాలు తీసుకుందామంటే వడ్డీ వాయింపు. నిజం చెప్పాలంటే కార్పొరేట్లకు రుణాలిచ్చి చేతులు కాల్చుకునే బదులు తిరిగి చెల్లించే సామర్థ్యం, వ్యాపార విధానం బాగుండే ఇలాంటి చిన్న వ్యాపారస్తులకు ఇవ్వటమే బెటర్. 10కిపైగా బ్యాంకులతో ఒప్పందం.. మేక్మై ట్రిప్, ఫుడ్పాండా, స్విగ్గీ, పేటీఎం, ట్రావెల్ బొటిక్యూ, ఓలా క్యాబ్స్, షాప్క్లూజ్, టీబో గ్రూప్, గోఐబిబో, రియా, యాత్రా, పిన్ల్యాబ్స్, ఆఫ్బిజినెస్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా సంస్థలతో వ్యాపారం నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు, రిటైల్, ఈ–కామర్స్ సంస్థలకు, వ్యక్తిగత వ్యాపారస్తులకూ ఇన్డిఫై రుణాలందిస్తుంది. లోన్ల కోసం యెస్ బ్యాంక్, ఆర్బీఎల్, ఐడీఎఫ్సీ బ్యాంక్లతో, ఎడిల్వైజ్, ఇండియాఇన్ఫోలైన్, క్యాపిటల్ ఫస్ట్, ఆదిత్య బిర్లా, ఇన్క్రెడ్, లెండింగ్కార్ట్ వంటి 10కి పైగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రూ.50 లక్షల వరకూ రుణం.. సిబిల్ స్కోర్, బ్యాంక్ స్టేట్మెంట్స్, బిజినెస్ డాటా, సోషల్ మీడియా యాక్టివిటీ వంటి మాధ్యమాల ద్వారా రుణ గ్రహీత డేటాను సేకరించి.. మా వ్యక్తిగత బృందం స్వయంగా తనిఖీ చేసిన తర్వాత రుణాన్ని మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 5 వేల మంది రుణ గ్రహీతలకు సుమారు రూ.300 కోట్ల రుణాలను అందించాం. హైదరాబాద్ నుంచి 5 శాతం రుణ గ్రహీతలుంటారు. వడ్డీ నెలకు 1.5 నుంచి 2 శాతంగా ఉంటుంది. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలందిస్తాం. ప్రతినెలా 100 శాతం వృద్ధిని నమోదు చేశాం. రూ.300 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం 300 పట్టణాల్లో సేవలందిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో 500 పట్టణాలకు, రుణగ్రహీతల సంఖ్యను 8 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 130 మంది ఉద్యోగులున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా నెలకు నలుగురిని కొత్తవాళ్లను తీసుకుంటున్నాం. ఇప్పటివరకు రూ.100 కోట్ల నిధులను సమీకరించాం. యాక్సెల్ పార్టనర్స్, ఎలివార్ ఈక్విటీ, ఒమిడ్యార్ నెట్వర్క్లతో పాటూ ఒకరిద్దరు వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ఇదే రంగంలో వినూత్న వ్యాపార విధానమున్న స్టార్టప్స్ ముందుకొస్తే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిద్ధార్థ్ తెలిపారు. -
ఆన్లైన్... జస్ట్ 5 నిమిషాల్లో!!
వెబ్సైట్, యాప్ అభివృద్ధి సేవలందిస్తున్న నౌఫ్లోట్స్ ► 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈ కస్టమర్లు ► ఇప్పటివరకు రూ.76 కోట్ల సమీకరణ ► ‘స్టార్టప్ డైరీ’తో నౌఫ్లోట్స్ కో–ఫౌండర్ జస్మిందర్ సింగ్ గులాటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫ్లైన్ సంస్థలు ఆన్లైన్ వ్యాపారంలోకి రావాలంటే వెబ్సైటో లేక యాపో కావాలి. అలాగని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్ఎంఈలు) వెబ్సైట్ను అభివృద్ధి చేయటం, నిర్వహించటం కష్టం. మరెలా? దీనికి పరిష్కారం చూపిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నౌఫ్లోట్స్.కామ్. మన దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈల వెబ్సైట్లను నిర్వహిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ జస్మిందర్ సింగ్ గులాటీ మాటల్లోనే.. స్నేహితులు రోనక్ కుమార్ సమంత్రాయ్, నీరజ్ సబర్వాల్, నితిన్ జైన్తో కలిసి 2012లో రూ.80 లక్షల పెట్టుబడితో ‘నౌఫ్లోట్స్’ను ప్రారంభించాం. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ చాలెంజ్ అవార్డు గ్రాంట్ను రూ.15 లక్షలు గెలుచుకున్నాం. ఇదే నౌఫ్లోట్స్కు ప్రారంభ పెట్టుబడి. 11 పేటెంట్ల కోసం దరఖాస్తు.. చిన్న, మధ్యతరహా సంస్థలు, కూరగాయల షాపు, కిరాణా, మందుల దుకాణాలు వంటి చిన్న చిన్న షాపులు కూడా వారి వ్యాపారాన్ని ఆన్లైన్లో నిర్వహించుకునేందుకు వీలుగా వెబ్సైట్, యాప్లను అభివృద్ధి చేసి నిర్వహిస్తాం. వీటితో పాటు మార్కెటింగ్, పేమెంట్ గేట్వే కూడా అందిస్తాం. అంటే ఎస్ఎంఈల తరుఫున ఆన్లైన్ వ్యాపారాన్ని నౌఫ్లోట్సే చేస్తుందన్న మాట. అంతేకాక కస్టమర్లు ఆన్లైన్లో షాపింగ్ కోసం వెతికినప్పుడు వారి తాలుకు సర్వే వివరాలను, సామాజిక మాధ్యమాల రిపోర్ట్లను కూడా ఎస్ఎంఈలకు అందిస్తాం. బిగ్ డేటా ఆల్గోరిథం, ప్రాంప్టింగ్ వంటి 11 టెక్నాలజీల్లో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. 50 దేశాలు.. 2.5 లక్షల ఎస్ఎంఈలు.. వెబ్సైట్, యాప్ అభివృద్ధికి 5 నిమిషాల సమయం పడుతుంది. ఏడాదికి వార్షిక ఫీజు రూ.25 వేలు. మన దేశంతో పాటూ ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, ఫిలిప్పీన్స్, టర్కీ వంటి 50 దేశాల్లో 2.5 లక్షల ఎస్ఎంఈల వెబ్సైట్లను నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 7 లక్షల ఎస్ఎంఈ వెబ్సైట్లుండగా.. వీటిలో 1.4 లక్షల వెబ్సైట్లను మేమే నిర్వహిస్తున్నాం. తయారీ, రిటైల్, వైద్య రంగంలో ఎక్కువ కస్టమర్లున్నారు. మరో నెల రోజుల్లో సిమ్లా, పుదుచ్చేరి, విశాఖపట్నం, హంపి వంటి టూరిస్ట్ హబ్స్లో నౌఫ్లోట్స్ సేవలను విస్తరిస్తున్నాం. 6 నెలల్లో రూ.5 కోట్ల సమీకరణ.. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.20 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. ఈ ఏడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మాకు దేశంలో 65 కార్యాలయాలు, 900 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు ఐరన్ పిల్లర్ అండ్ ఐఐఎఫ్ఎల్, ఓమిడయ్యర్, బ్లూమీ వెంచర్స్, హైదరాబాద్, ముంబై ఏంజిల్స్ నుంచి రూ.76 కోట్ల నిధులను సమీకరించాం. మరో 6 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. -
సినిమా చూశాకే టికెట్ కొనండి!
► పీవీఆర్తో ఒప్పందం చేసుకున్న ఈపే లేటర్ ► క్రెడిట్పై రైలు టికెట్ల బుకింగ్ కోసం ఆర్సీటీసీతో కూడా ► నగదు చెల్లింపులకు 14 రోజుల గడువు; డీఫాల్టయితే నెలకు 3% పెనాల్టీ ► ఏడాదిలో బస్సు, విమాన టికెట్లు కొనుగోలు సౌకర్యం కూడా.. ► ఇప్పటివరకు రూ.13 కోట్ల నిధుల సమీకరణ ► ‘స్టార్టప్ డైరీ’తో ఈపే లేటర్ కో–ఫౌండర్ భట్టాచార్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనకు తెలిసిందల్లా సినిమాకెళ్లాలంటే ఆన్లైన్లోనో లేక థియేటర్ కౌంటర్లోనో టికెట్ కొని వెళ్లడం. కానీ, ఇపుడు మరో కొత్త సౌకర్యమూ అందుబాటులోకి వచ్చిందండోయ్!! టికెట్ అవసరం లేకుండా ముందైతే సినిమా చూసేయండి.. ఆ తర్వాతే టికెట్ ధర చెల్లించమంటోంది ‘ఈపే లేటర్’ సంస్థ. ఒక్క సినిమానే కాదు... రైలు ప్రయాణం, గ్రాసరీ, షాపింగ్, టూరిజం ట్రావెల్ ఇలా అన్ని రకాల సేవలకూ ఇదే మంత్రమంటోంది. దీనికోసం ఐఆర్సీటీసీ, పీవీఆర్, ఇండియామార్ట్, జాప్నౌ, గుడ్బాక్స్, ఈట్రావెల్ స్మార్ట్, ఆక్సిజన్, పేవరల్డ్ వంటి 5 వేల ఆన్లైన్, ఆఫ్లైన్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది కూడా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ ఆర్కో భట్టాచార్య మాటల్లోనే... ఈపే లేటర్ గురించి చెప్పే ముందు అసలు మన దేశంలో ఈ–కామర్స్ సంస్థల క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విభాగం గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈపే లేటర్ ఆరంభమైంది గనక. దేశీ ఈ– కామర్స్ సంస్థల లావాదేవీల్లో 67% వాటా సీఓడీదే.కారణం మనం కొనే వస్తువుల్ని ప్రత్యక్షంగా చూస్తే తప్ప చెల్లింపులు చేయం. అలా అని ఆర్డరిచ్చిన ఉత్పత్తులు డెలివరీ కాగానే క్యాష్ ఇస్తే సరిపోదు. ఇక్కడ కూడా చెల్లింపుల ను కూడా మరింత సులువుగా, సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంతోనే 2015 డిసెంబర్లో ముంబై కేంద్రం గా.. స్నేహితులు అక్షయ్ సక్సే నా, ఉదయ్ సోమయాజులుతో కలిసి ఈపే లేటర్ను ప్రారం భించాం. ‘‘ముందైతే సేవలందుకోండి. తర్వాతే నగదును చెల్లించండి’’ ఇదే మా వ్యాపార సూత్రం. డేటా సైన్స్, అనలిటిక్స్తో కస్టమర్ల ఎంపిక.. ఈపే లేటర్ సేవలను వినియోగించుకోవాలంటే ముందు ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్, పాన్ కార్డు వివరాలు వెల్లడించాలి. అలా ఇచ్చిన కస్టమర్ల పాత లావాదేవీల చరిత్ర, సామాజిక మాధ్యమాల్లో ప్రవర్తించే తీరు, ఇతరత్రా మార్గాల ద్వారా తనిఖీ చేస్తాం. డేటా సైన్స్, అనలిటిక్స్ ద్వారా వారి చరిత్రను విశ్లేషిస్తాం. ఎంపికైన కస్టమర్ల మొబైల్కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. తర్వాతి నుంచి ఈపే లేటర్తో ఒప్పందం చేసుకున్న ఆన్లైన్, ఆఫ్లైన్ సంస్థల సేవలను క్రెడిట్ రూపంలో వినియోగించుకునే వీలుంటుంది. త్వరలో బస్సు, విమాన టికెట్లు కూడా.. ప్రస్తుతం 5 వేల ఆన్లైన్, ఆఫ్లైన్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఏడాదిలో 1.50 లక్షల సంస్థలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆయా సంస్థల సేవలను వినియోగించుకున్నాక 14 రోజులలోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే నెలకు 3 శాతం పెనాల్టీ ఉంటుంది. బీ2బీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.25 వేలు, బీ2సీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.2,500. క్రెడిట్పై గ్రాసరీ, షాపింగ్ వంటి సంస్థల సేవలే కాదు. రైల్వే టికెట్లనూ కొనొచ్చు. ఇందుకోసం ఐఆర్సీటీసీతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో బస్సు, విమాన టికెట్లనూ అందుబాటులోకి తెస్తాం. ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం.. ప్రస్తుతం 30 మంది ఉద్యోగులు, 50 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజుకు 2,500–3,000 లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 45%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 15%. ఈపే లేటర్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ మీద మా ఒప్పంద సంస్థ నుంచి 2–2.5 శాతం వరకు కమీషన్ తీసుకుంటాం. ప్రతి నెలా 30 శాతం వ్యాపార వృద్ధిని సాధిస్తున్నాం. గతంలో సీడ్ రౌండ్లో భాగంగా దేశీయంగా ముగ్గురు ఇన్వెస్టర్ల నుంచి రూ.13.3 కోట్లు సమీకరించాం. ఏడాదిలో మరో విడత నిధులను సమీకరిస్తాం. -
అర్ధరాత్రి... హలో పిల్లల డాక్టర్!!
► ఆన్లైన్ కన్సల్టేషన్ సేవలందిస్తున్న డాక్స్ యాప్ ► 40% కన్సల్టేషన్స్ తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ► 15 విభాగాల్లో.. 1,500 మంది వైద్యుల నమోదు ► నెలకు 50 వేల కన్సల్టేషన్స్; 22–25% ఆదాయ వృద్ధి ► ‘స్టార్టప్ డైరీ’తో సీఈఓ అండ్ కో–ఫౌండర్ సతీశ్ కన్నన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న పిల్లలు అర్ధరాత్రి ఏడిస్తే...? ఎందుకు ఏడుస్తున్నారన్నది తల్లిదండ్రులకు అర్థంకాదు! ఓదార్చడానికి ప్రయత్నించినా విఫలమవుతుంటారు. పోనీ, పిల్లల డాక్టర్ను సంప్రదిద్దామంటే అర్ధరాత్రి డాక్టర్లెవరూ అందుబాటులో ఉండరు. దీనికి పరిష్కారం చూపిస్తోంది డాక్స్యాప్. దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట పీడియాట్రిషన్ సేవలందిస్తోంది. 10 నిమిషాల్లోపే వైద్యులతో మాట్లాడే వీలు కల్పిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలు డాక్స్యాప్ కో–ఫౌండర్ అండ్ సీఈఓ సతీశ్ కన్నన్ మాటల్లోనే... ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఫిలిప్స్ హెల్త్కేర్ విభాగంలో, స్నేహితుడు ఎన్బశేఖర్ దీనదయాళ్ మరో హెల్త్కేర్లో జాబ్స్లో చేరాం. ఆ సమయంలో మేం గమనించిందేంటంటే.. స్పెషలిస్ట్ వైద్యులు మెట్రో నగరాలకే పరిమితమవుతున్నారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని పేషెంట్లకు మెరుగైన చికిత్స అందట్లేదని! వీరు కూడా స్పెషలిస్ట్ వైద్యుల చికిత్సను పొందాలంటే ఇంటర్నెట్ను వేదికగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. 2015లో డాక్స్యాప్కు శ్రీకారం చుట్టాం. డాక్స్యాప్ అనేది చాట్ లేదా కాల్ ఆధారిత ఆరోగ్య వేదిక. ఎవరైనా సరే దేశంలోని ఏ డాక్టర్నైనా 30 నిమిషాల్లోపే సంప్రదించవచ్చు. మాకొస్తున్న కాల్స్లో 35–40% కాల్స్ పిల్లల గురించే ఉంటున్నాయి. అవీ రాత్రి 10–12 మధ్యే ఎక్కువ. అందుకే ఇటీవలే రాత్రి సమయాల్లో పీడియాట్రిషన్ సేవలు మొదలుపెట్టాం. 15 విభాగాల్లో.. 1,500 మంది వైద్యులు..: గైనకాలజీ, సైకియాట్రిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రిషన్, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ వంటి 15 విభాగాల్లో 1,500 మంది వైద్యులున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 150 మంది డాక్టర్లు నమోదయ్యారు. ప్రస్తుతం 10 లక్షల మంది యూజర్లున్నారు. డాక్టర్ కన్సల్టేషన్ నుంచి మందుల డెలివరీ వరకూ.. డాక్స్యాప్ ప్రధానంగా 3 రకాల సేవలందిస్తుంది. కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటి వద్దనే ల్యాబ్ టెస్ట్లు. సేవలను బట్టి 20–30% వరకు కమీషన్ తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 50 వేల మంది పేషెంట్లు డాక్టర్ కన్సల్టేషన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా 10%. మెడిసిన్ డెలివరీ, ల్యాబ్ టెస్ట్ సేవలను నెలకు 10 వేల వరకు వినియోగించుకుంటున్నారు. ఇందులో 15% వాటా తెలుగు రాష్ట్రాలదే. కాకినాడ, భువనగిరి, బాన్స్వాడ వంటి పట్టణాల నుంచి పేషెంట్లు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని వైద్యులతో మాట్లాడుతున్నారు. రూ.14 కోట్ల నిధుల సమీకరణ.. ఇప్పటివరకు రూ.14 కోట్ల నిధులను సమీకరించాం. మరో 7 నెలల్లో మరో రౌండ్ నిధులను సమీకరిస్తాం. ఫేస్బుక్లో ఏంజిల్ ఇన్వెస్టరైన ఆనంద్ రాజమన్, వెంకీ హరినారాయణన్, జపాన్కు చెందిన రీబ్రైట్ పార్టనర్స్, పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, షాదీ.కామ్ సీఈఓ అనుపమ్ మిట్టల్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ‘మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. 6 నెలల్లో రెట్టింపు చేస్తాం. నెలకు 3 లక్షల కన్సల్టేషన్లను అందించాలని లకి‡్ష్యంచాం. ప్రతి నెలా 22–25% ఆదాయ వృద్ధి ఉంది. గైనకాలజీ వంటి స్త్రీ ఆరోగ్య సేవలనూ అర్ధరాత్రి సమయాల్లో అందిస్తాం’ అని సతీష్ తెలిపారు. -
హైదరాబాద్లో డబ్బావాలా!
♦ స్కూళ్లు, ఆఫీసులకు లంచ్ బాక్స్ డెలివరీ చేస్తున్న బెంటోవాగన్ ♦ ‘స్టార్టప్ డైరీ’తో బెంటోవాగన్ కోఫౌండర్ ఎస్ విజయలక్ష్మి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై డబ్బావాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిదే కాన్సెప్ట్తో హైదరాబాద్లోనూ డబ్బావాలా సేవలు ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థ బెంటోవాగన్... కార్యాలయాలు, పాఠశాలలకు టిఫిన్ బాక్స్లను డెలివరీ చేస్తోంది. మరిన్ని వివరాలు సంస్థ కోఫౌండర్ సుంకు విజయలక్ష్మి మాటల్లోనే.. గృహిణిగా, ఉద్యోగినిగా మహిళల ప్రధాన సవాల్ వంట గదిలోనే. ఉదయాన్నే పిల్లలకు బాక్స్ను రెడీ చేయటమంటే మామూలు విషయం కాదు. ఆపైన ఆఫీసుకెళ్లటం. తిరిగి ఇంటికొచ్చే వరకూ పిల్లలేం తిన్నారోననే టెన్షన్. కాగ్నిజెంట్లో ఉద్యోగిగా ఉన్న నాకూ ఇదంతా అనుభవమే. అయితే నాలా మరే మహిళకూ హడావుడిగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా. ఇదే నిర్ణయాన్ని మా ఆయన సునీల్ కుమార్తో చర్చించా. మీరు నమ్మరూ!! అప్పటిదాకా విప్రో వంటి ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఆయన.. నా నిర్ణయాన్ని గౌరవించి ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసేసి సహాయపడ్డారు. సర్వేతో మొదలు.. కంపెనీ ప్రారంభానికి ముందు మార్కెట్లో ఎలా ఉంటుందని కొన్ని స్కూళ్లకు, ఆఫీసులకెళ్లి ఐడియాను షేర్ చేసుకున్నాం. వాళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్నిసార్లు ఉదయం బాక్స్లో తెచ్చుకున్న కూరలు మధ్యాహ్నం అయ్యే సరి కి పాడైపోయేవని చెప్పుకొచ్చేవాళ్లు. వాళ్ల సూచనలు, సలహాలను తీసుకొని ఈ ఏడాది మార్చిలో బెంటోవాగన్ పేరిట స్టార్టప్ను ప్రారంభించాం. వెబ్సైట్ అభివృద్ధి, మార్కెటింగ్, కాల్ సెంటర్ కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాం. బెంటోవాగన్ అంటే..: బెంటోవాగన్ అనేది జపనీస్ పదం. ఇందులో బెంటో అంటే అందంగా డెకరేట్ చేసిన టిఫిన్ బ్యాక్స్ అని, వాగన్ అంటే వాహనం అని అర్థం. అందుకే రెండూ కలిపి బెంటోవాగన్.కామ్ అని పేరు పెట్టాం. ప్రస్తుతం కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్సిటీ, మణికొండ, బొల్లారం, నిజాంపేట, బీహెచ్ఈఎల్, మూసాపేట్, చందానగర్, కేపీహెచ్బీ, మదీనాగూడ, హఫీజ్పేట, బాచుపల్లి ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. స్కూళ్లు, ఆఫీసులకు లంచ్ బాక్స్లను మాత్రమే డెలివరీ చేస్తున్నాం. త్వరలోనే డిన్నర్ బాక్స్లనూ డెలివరీ చేస్తాం. ఈ ఏడాదిలోపు హైదరాబాద్ అంతా విస్తరించాలనేది లక్ష్యం. ఒక్క బాక్స్కు నెలకు రూ.500.. ప్రస్తుతానికి వెబ్సైట్, కాల్ సెంటర్ (96404 00079) ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తున్నాం. సబ్స్క్రైబర్లకు బెంటోవాగన్ బ్యాగ్ ఇస్తాం. ఇందులో టిఫిన్ బాక్స్ను పెట్టి ఇవ్వాలి. మొదటి వారం మాత్రం ఉచితంగా డెలివరీ చేస్తాం. సేవలు నచ్చితే... 5 కి.మీ. పరిధిలో ఒక్క బాక్స్కు నెలకు రూ.500 చార్జీ ఉంటుంది. కి.మీ. పెరిగితే ధర కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 5 వేల వెబ్సైట్ యూజర్లున్నారు. రోజుకు 80 నుంచి 100 ఆర్డర్లొస్తున్నాయి. ఇందులో 70% స్కూళ్లు, మిగిలినవి ఆఫీసులవి. బాక్స్ల డెలివరీ కోసం 10 మంది ఉద్యోగులున్నారు. వీరికి మూడున్నర గంటలకు రూ.7,500–9,500 మధ్య వేతనాలను చెల్లిస్తున్నాం. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. ప్రతి నెలా వ్యాపారం పెరుగుతోంది. త్వరలోనే యాప్ను విడుదల చేస్తాం. కస్టమర్ యాప్ కంటే డెలివరీ యాప్ విడుదల చేయాలని నిర్ణయించాం. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో విస్తరించాక.. రూ.10 కోట్ల నిధులు సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
అట్టపెట్టెలో ప్రీ స్కూల్ చదువు
♦ ఫ్లింటూ బాక్స్లో 2–12 ఏళ్ల పిల్లల విద్యా కార్యకలాపాలు ♦ నెలకు 30 వేల బాక్స్ల డెలివరీ; రూ.13 కోట్ల ఆదాయం ♦ ఈ ఏడాదిలో రూ.30 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ♦ ‘స్టార్టప్ డైరీ’తో ఫ్లింటూ బాక్స్ ఫౌండర్ అరుణ్ప్రసాద్ దురైరాజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కూళ్లు మొదలయ్యాయి. పిల్లలు, తల్లిదండ్రులూ ఎవరికి వారు బిజీ. బుడిబుడి అడుగులతో తొలిసారిగా ప్లే స్కూల్లోకి అడుగుపెట్టే చిన్నారులతో సందడే సందడి. మరి, ఆ చదువులు, ఆటలూ అట్టపెట్టెలో లభ్యమైపోతే? స్కూల్లోనే కాదు కావాలంటే ఇంటి దగ్గరే నేర్చేసుకునే వీలుంటే? అర్థం కాలేదు కదూ!! ఏం లేదండీ.. ఫ్లింటూ బాక్స్ స్టార్టప్ చెన్నై కేంద్రంగా ఫ్లింటూ బాక్స్, ఫ్లింటూ స్కూల్ పేరిట ప్లే స్కూల్ సేవలందిస్తోంది. 2–12 ఏళ్ల వయసు పిల్లల మానసిక, మేధో అభివృద్ధి విద్యా కార్యకలాపాలను అట్టపెట్టెల్లో అందించడం దీని ప్రత్యేకత. దీనికి సంబంధించిన వివరాల్ని సంస్థ ఫౌండర్ అరుణ్ప్రసాద్ దురైరాజ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి... పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన ప్లే స్కూల్స్ కాసింత వెనకబడే ఉంటాయి. కారణం సరైన విద్యా ప్రణాళికలు లేకపోవటం. ప్లే స్కూల్ అనగానే 4–5 గంటల తతంగం అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, నిజానికి 6–7 ఏళ్లలోపు పిల్లల్లో మానసిక అభివృద్ధి వేగంగా ఉంటుంది. ఈ వయసు పిల్లల్లో విషయ సంగ్రహణ కాసింత ఎక్కువే. కానీ ప్లే స్కూల్ విద్య అందుకు తగ్గట్టుగా ఉండటంలేదు. దీనికి పరిష్కారమే మా ఫ్లింటూ బాక్స్. నేను, విజయ్బాబు గాంధీ, శ్రీనిధి సింగారం ముగ్గురు కలిసి రూ.10 లక్షల పెట్టుబడితో 2013 సెప్టెంబర్లో చెన్నై కేంద్రంగా దీన్ని ప్రారంభించాం. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో ఒప్పందం.. ఫ్లింటూ బాక్స్లో పిల్లల్లో మానసిక అభివృద్ధిని పెంపొందించేలా బొమ్మల రూపంలో విద్యా కార్యకలాపాలుంటాయి. వీటిని పిల్లలు గుర్తిస్తూ చదవటం, రాయటం, అన్వేషించడం చేస్తారు. దీనివల్ల మానసిక వృద్ధితో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత బయటపడతాయి. ఫ్లింటూ విద్యా కార్యకలాపాల డిజైన్, పరిశోధన మరియు అభివృద్ధి కోసం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో ఒప్పందం చేసుకున్నాం. నమూనాల రూపకల్పన, తయారీ, ప్యాకింగ్, డెలివరీ కోసం చెన్నైలో సొంత అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టాం. 300 మంది విక్రయదారులతోనూ ఒప్పందాలు చేసుకున్నాం. 2 రకాల వ్యాపార విభాగాలు.. ప్రస్తుతం ఫ్లింటూ బాక్స్, ఫ్లింటూ క్లాస్ రెండు రకాల వ్యాపార విభాగాలున్నాయి. ఫ్లింటూ బాక్స్ హోమ్ టీచింగ్, ఫ్లింటూ క్లాస్ ప్రీ స్కూల్స్ కోసం. ఫ్లింటూ క్లాస్ సేవలు: ఫ్లింటూ క్లాస్ 2 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించిన సమగ్ర విద్యా కార్యకలాపాల వేదిక. ఫ్లింటూ క్లాస్ బాక్స్లో పరిశోధన ఆధారిత పూర్వ అభ్యాస పాఠ్య ప్రణాళికలు, రోజు వారీ పాఠ్య ప్రణాళికలు, ఆన్లైన్ ఉపాధ్యాయ శిక్షణ, తల్లిదండ్రుల కమ్యూనికేషన్ వంటివి ఉంటాయి. ఒక్కో బాక్స్లో 20 రోజుల విద్యా కార్యకలాపాలుంటాయి. నెలకు ఒక్కో విద్యార్థికి రూ.500 చార్జీ. ప్రస్తుతం 150 ప్రీ స్కూల్స్ మా ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. ఇందులో 60 శాతం ప్రీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైనవే. తమిళనాడు, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఎక్కువ ప్రీ స్కూల్స్ ఉన్నాయిందులో. ఫ్లింటూ బాక్స్ సేవలు: ఇందులో 12 ఏళ్ల లోపు వయసు వాళ్లు ఇంటి దగ్గరే నేర్చుకునేలా వ్యక్తిగత శిక్షణ ఉత్పత్తులుంటాయి. ప్రతి బాక్స్లో 4–5 ప్లే ఆధారిత కార్యకలాపాలు. అవి కూడా పిల్లల సృజనాత్మకతను వెలికితీసేలా ఉంటాయి. ఒక్కో నెలా ఒక్కో థీమ్తో రూపొందిస్తాం. ప్రతి బాక్స్లో 15 రోజుల కార్యకలాపాలుంటాయి. నెలకు ఒక్కో విద్యార్థికి రూ.650 చార్జీ. ప్రస్తుతం ఫ్లింటూ బాక్స్కు 500 నగరాల్లో 3 లక్షల మంది విద్యార్థులు కస్టమర్లుగా ఉన్నారు. ప్రస్తుతం నెలకు 30 వేల బాక్స్ల ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. సింగపూర్, దుబాయ్లకు విస్తరణ.. ఇప్పటివరకు ఫ్లింటూ సేవలన్నీ కూడా వెబ్సైట్, యాప్ ద్వారానే అందుతున్నాయి. త్వరలోనే ఆఫ్లైన్లో ఓ స్టోర్ను తెరవనున్నాం. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ.13 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. 2017–18లో రూ.40 కోట్ల ఆదాయం లకి‡్ష్యంచాం. మా ఆదాయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 10 శాతం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దుబాయ్, సింగపూర్ దేశాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం ఆయా దేశాల్లో డిస్ట్రిబ్యూటర్తో ఒప్పందం చేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 150 మంది ఉద్యోగులున్నారు. త్వరలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తాం. మరికొంత మంది ఉద్యోగులను తీసుకుంటాం. ఇప్పటివరకు రూ.10 కోట్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది చివరిలోగా మరో రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
పోటీ పరీక్షలకు... ఆలివ్బోర్డ్!
► 30 రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్స్ ► సిలబస్లతో పాటూ వీడియో పాఠాలు, బృంద చర్చలు ►2 నెలల్లో ఐటీ కోర్సుల సిలబస్ అందుబాటులోకి ►10 లక్షల మంది యూజర్లు; 70 శాతం టౌన్లలోనే ►‘స్టార్టప్ డైరీ’తో ఆలివ్బోర్డ్ సీఈఓ అభిషేక్ పాటిల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చిలో పరీక్షలవగానే... అంతా కుస్తీలు పట్టేది ప్రవేశ, పోటీ పరీక్షలతోనే. కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్ చుట్టూ తిరుగుతుంటారు కూడా. కాకపోతే టెక్నాలజీ చేతికొచ్చాక ఇదంతా అవసరం లేదంటోంది ఆలివ్బోర్డ్. ఏకంగా 30 రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్తో పాటు... ఆన్లైన్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్స్... వంటివన్నీ అందజేస్తోందీ సంస్థ. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉపయోగించుకుంటున్న ఆలివ్బోర్డ్ సేవల గురించి ఆలివ్బోర్డ్.కామ్ సీఈఓ అభిషేక్ పాటిల్ ఏమంటారంటే... నాలుగు గోడల మధ్య కూర్చొని చదివే రోజులు పోయాయి. పైగా కోచింగ్ సెంటర్లకు వెళ్లడం అన్ని వర్గాలకూ కుదరదు.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ఉద్యోగార్థులకైతే మరీనూ. ఇదే ఆలివ్బోర్డ్ ప్రారంభానికి కారణమైంది. అందుబాటు ధరల్లో, నాణ్యమైన స్టడీ మెటీరియ ల్స్ అందించడమే లక్ష్యంగా మరో స్నేహితుడు సతీష్ కుమార్తో కలిసి 2012 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా ఆలివ్బోర్డ్ను ప్రారంభించాం. 10 లక్షల మంది యూజర్లు..: ప్రస్తుతం ఆలివ్బోర్డ్లో 10 లక్షల మంది యూజర్లున్నారు. వీరిలో 2 లక్షల మంది యాక్టివ్. 70 శాతం మంది విద్యార్థులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారే. ఏడాదిలో ఈ సంఖ్యను కోటికి చేర్చాలని లకి‡్ష్యంచాం. ఆలివ్బోర్డ్ సేవలను డెస్క్టాప్, ల్యాప్ట్యాప్స్లతో పాటూ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్లలోనూ వినియోగించొచ్చు. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా తరగతులకు హాజరుకావచ్చు. ప్రిపేరయ్యే వీలూ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లతో ఒకే సమయంలో దేశవ్యాప్తంగా ఇతర విద్యార్థులతో పోటీపడొచ్చు. వీడియో పాఠాలు కూడా.. ఎంబీఏ, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్లు, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. ఐబీపీఎస్, ఐపీపీబీ ఆఫీసర్స్, క్యాట్, సీమ్యాట్, స్నాప్, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ వంటి 30కి పైగా పోటీ పరీక్షల సిలబస్లున్నాయి. అన్నీ సిలబస్లలో కలిపి సుమారు 10 కోట్లకు పైగా ప్రశ్నలున్నాయి. కోర్సులు, మెటీరియల్స్ ఎంపికను బట్టి ధరలు రూ.349–3,999 వరకూ ఉంటాయి. స్టడీ మెటీరియల్స్ మాత్రమే కాదు వీడియో పాఠాలు, ప్రత్యక్ష బృంద చర్చలు, కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్స్, ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్, విశ్లేషణలు వంటి సేవలన్నీ ఉంటాయి. 6 నెలల్లో నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 28 మంది ఉద్యోగులున్నారు. త్వరలో మరో 60 మందిని నియమిస్తాం. ఏటా రెట్టింపు ఆదాయాన్ని నమోదు చేస్తున్నాం. గతేడాది ఏప్రిల్లో ఇండియా ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫం డ్ (ఐఈఐఎఫ్) నుంచి నిధులు సమీకరించాం. 6 నెల ల్లో మరికొంత ఫండింగ్ చేస్తాం. వీటితో ఐటీ కంపెనీ ల ప్రాంగణ నియామకాల కోసం పలు ఐటీ కోర్సుల శిక్షణ మెటీరియల్స్నూ అందుబాటులోకి తెస్తాం. -
మీకిష్టమైన ఉద్యోగం చేస్తారా?
♦ విద్యార్థి దశలోనే కెరీర్ ఎంచుకోవచ్చు ♦ కోర్సులు, భవిష్యత్తు ఉద్యోగాలేంటో చెబుతాం ♦ ‘లోడ్స్టార్’ నుంచి కెరీర్ గైడెన్స్ సేవలు ♦ 100 మంది గైడెన్స్ నిపుణులతో ఒప్పందం ♦ బెంగళూరు, హైదరాబాద్, మైసూర్లలో సేవలు ♦‘స్టార్టప్ డైరీ’తో లోడ్స్టార్ ఫౌండర్ మురళీధర్ ఎస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : యూఎక్స్ డిజైనర్, యాచురీ, క్యూరేటర్, జెనిటీసిస్ట్, టాక్సికాలజిస్ట్, సోషల్ మీడియా అడ్వైజర్.. ఇవేవో కొత్త టెక్నాలజీ కోర్సులనుకునేరూ! కొత్త ఉద్యోగాలండి బాబూ!!ఇలా ఒకటా రెండా.. 260కి పైగా కొత్త ఉద్యోగాల జాబితాను సిద్ధం చేసింది లోడ్స్టార్. మరి ఆ ఉద్యోగాల్లో చేరాలంటే ఎలా? ఏం చదవాలి? వీటికి సమాధానమే లోడ్స్టార్ కెరీర్ గైడెన్స్ స్టార్టప్. విద్యార్థి దశలోనే కెరీర్ గైడెన్స్ అందిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలను లోడ్స్టార్ ఫౌండర్ సీఈఓ మురళీధర్.ఎస్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... లోడ్స్టార్ గురించి చెప్పాలంటే ముందుగా తొలి స్టార్టప్ మెరిట్ట్రాక్ గురించి చెప్పాలి. కంపెనీలకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందించే సంస్థ. తర్వాత దీన్ని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కొనుగోలు చేసింది. ఓ సారి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికైన ఉద్యోగులు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవటానికి ఓ సర్వే చేశాం. దాన్లో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికైన ఉద్యోగులు కొందరు.. ఆ తర్వాత అసలీ ఉద్యోగం తమకు కరెక్ట్ కాదని, కెరీర్ను తప్పుగా ఎంచుకున్నామని భావిస్తున్నారు. దీనిక్కారణం విద్యార్థి దశలోనే కెరీర్ ఎంపిక, చేయబోయే వృత్తిపై అవగాహన లేకపోవటమేనని తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాం.. క్యాంపస్ ప్లేస్మెంట్ బదులు కెరీర్ గైడెన్స్ ఇస్తే సక్సెస్ అవుతామని! అలా 2015లో లోడ్స్టార్ స్టార్టప్ ప్రారంభమైంది. లోడ్స్టార్ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే 10వ తరగతి పూర్తయ్యే విద్యార్థులను ఎంపిక చేసి వారి ఆసక్తిని గుర్తించి.. సరైన కెరీర్ను ఎంపిక చేయటమే. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ సేవలు.. లోడ్స్టార్ అసెస్మెంట్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధాలుగా ఉంటుంది. అంటే ముందుగా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థి ఆసక్తులు, కెరీర్ అవగాహన వంటి వాటిపై ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తాం. ఫలితాలు, విద్యార్థి ఆసక్తిని బట్టి కెరీర్ ఆప్షన్లను వివరిస్తాం. ఆపై ఆఫ్లైన్లో నేరుగా నిపుణులు వద్దకు వెళ్లి ప్రవేశ పరీక్షలు, కళాశాల ఎంపిక, విద్యా విధానం, ట్యుటోరియల్ క్లాసుల వంటివి నిర్వహిస్తారు. ఇందుకోసం 100 మంది కెరీర్ గైడెన్స్ నిపుణులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. హైదరాబాద్ నుంచి 15 మంది ఉన్నారు. త్వరలో మరో 50 మందిని నియమించుకుంటాం. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాజీ సీఈఓ అండ్ ఎండీ ఆనంద్ సుదర్శన్, స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్ (ఇండియా) మాజీ ఎండీ సుబోధ్ జిందాల్, మెక్ఫీ మాజీ సీనియర్ డైరెక్టర్ తరుణ్ కృష్ణమూర్తి వంటి వారు లోడ్స్టార్లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. 260కి పైగా కెరీర్ ఆప్షన్స్.. ఫీజు రూ.4 వేలు ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ నగరాల్లో సేవలందిస్తున్నాం. విద్యార్థులకు 260కి పైగా కెరీర్ ఆప్షన్స్ను అందిస్తాం. ఒక్కో దాంట్లో 70కి పైగా పారామీటర్స్ ఉంటాయి. కెరీర్ అసెస్మెంట్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.4 వేలు చార్జీ ఉంటుంది. కెరీర్ అసెస్మెంట్తో పాటూ 20 పేజీల సమగ్ర నివేదికనిస్తాం. దీంతో తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఏ కోర్సును ఎంచుకుంటే ఏ కెరీర్లో స్థిరపడతాడో అవగాహన వస్తుంది. 2 వేల మంది విద్యార్థులు ఇప్పటివరకూ మా సేవలను వినియోగించుకున్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి 8 వేల మంది విద్యార్థులకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.26–30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి ప్రస్తుతానికి మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.6 కోట్ల నిధులను సమీకరించాం. జైకెన్ ఫండ్, మణిపాల్ గ్రూప్కు చెందిన ఆనంద్ సుదర్శన్, పలువురు హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు నాటికి చెన్నై, కోయంబత్తూరులకు విస్తరించటంతో పాటు రూ.3 కోట్ల ఆదాయా న్ని లకి‡్ష్యంచాం. విస్తరణకు రూ.26–30 కోట్ల నిధుల సమీకరణ చేస్తున్నాం. వీసీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ముగింపులోగా డీల్ను క్లోజ్ చేస్తాం. -
ఫీల్డ్ ఉద్యోగులపై నిఘా!
► క్లౌడ్ ఆధారంగా ఉద్యోగులను ట్రాక్ చేస్తున్న స్పూర్ ► డేటాతో పాటు రిపోర్ట్లు, ఆడియో, వీడియోలూ పంపొచ్చు ► 6 దేశాల్లో 150 కంపెనీల్లో 30 వేల మందికి సేవలు ► గతేడాది రూ.4 కోట్ల టర్నోవర్; ఈ ఏడాది7 కోట్ల లక్ష్యం ► రెండేళ్లలో అమెరికా, ఆఫ్రికా, యూరప్లకు విస్తరణ ► ‘స్టార్టప్ డైరీ’తో స్పూర్ ఫౌండర్, సీఈఓ సీ రామకృష్ణా రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెటింగ్, కలెక్షన్, ఏజెంట్ వంటి ఫీల్డ్ ఉద్యోగాలు టార్గెట్ను చేరుకుంటే చాలు... ఎంచక్కా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటారు. ఎందుకంటే పై అధికారులకు ఫీల్డ్ ఉద్యోగులు ఎక్కడున్నారో తెలిసే అవకాశముండదు కాబట్టి!!. అంటే ట్రాకింగ్ చేసే వీలుండదని దానర్థం. కానీ, స్పూర్తో ట్రాకింగ్ మాత్రమే కాదు ఎప్పటికప్పుడు ఉద్యోగి పనితీరు రిపోర్ట్లూ వస్తాయి. డేటా విశ్లేషణతో పాటూ ఆడియో, వీడియోలు కూడా అందుతాయి. అది కూడా ఇంటర్నెట్ అక్కర్లేకుండానే!. ఆ విశేషాలేంటో స్పూర్.ఇన్ ఫౌండర్ అండ్ సీఈఓ సీ రామకృష్ణా రెడ్డి మాటల్లోనే.. మాది అనంతపురం జిల్లా. కర్ణాటకలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరా. తర్వాత సొనాటా బెంగళూరులో.. తరవాత అమెరికాలో ఇంటెల్ చిప్ కంపెనీలో చేశా. 2002 వరకు అక్కడే పనిచేసి.. హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్కి తిరిగొచ్చా. ఆ సమయంలో మొబైల్ వాల్యూ యాడ్ సర్వీసెస్ కంపెనీ అయన్సిస్ను ప్రారంభించా. కానీ మొబైల్ ప్రాజెక్ట్లు నెల రెండు నెలల కంటే ఎక్కువ కాలం ఉండేవి కావు. ఇది కరెక్ట్ కాదని కంపెనీలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్త టెక్నాలజీ స్టార్టప్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. అలా 2013 ఏప్రిల్లో స్పూర్.ఇన్ను బీజం పడింది. రూ.కోటి పెట్టుబడితో ఎఫర్ట్ అనే టెక్నాలజీ ప్రొడక్ట్ను రూపొందించాం. స్పూర్ అంటే.. స్పూర్ అంటే జంతువును గానీ మనిషిని గానీ ట్రాక్ చేయడం అని అర్థం. మా సేవలు కూడా ఉద్యోగుల పనితీరును ట్రాక్ చేయడమే కనుక ఈ పేరు పెట్టాం. ఎఫర్ట్ (ఈఎఫ్ఎఫ్ఓఆర్టీ) అంటే.. ఎఫర్ట్లెస్ ఫీల్డ్ ఫోర్స్ ఆప్టిమైజేషన్ అండ్ రిపోర్టింగ్ టూల్కిట్ అని. దీంతో ఫీల్డ్ ఉద్యోగుల్లో పారదర్శకత, సమర్ధత, జవాబుదారీతనం పెరుగుతుంది. కంపెనీలకు ఉత్పాదక పెరుగుతుంది. ఏ రంగంలోని ఫీల్డ్ ఉద్యోగులైనా సరే పై అధికారులకు మూడింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 1. ఎక్కడున్నారు? 2. ఈరోజు ఏం చేస్తారు? 3. చివరికి సాధించిందేంటి? వీటిల్లో ఫీల్డ్ ఉద్యోగులు ఏం చెబితే అదే ఫైనల్. అంటే అధికారులకు ప్రతి ఉద్యోగినీ స్వయంగా తనిఖీ చేయడం కుదరదు. స్పూర్తో అది కుదరదు. ఎందుకంటే స్పూర్ ‘ఎఫోర్ట్’ ఫీల్డ్ ఆఫీసర్లను ట్రాక్ చేస్తుంటుంది? ఎప్పటికప్పుడు వాటి వివరాలను అధికారికి చేరవేస్తుంది. డేటానే కాదు పిక్చర్స్, వీడియో, ఆడియోలను కూడా పంపించుకోవచ్చు. అది కూడా ఇంటర్నెట్ అవసరం లేకుండానే. ఒక్కో లాగిన్కు రూ.300 చార్జీ.. ఆటోమెటిక్ ఫీల్డ్ ఆపరేషన్, షెడ్యూలింగ్ అండ్ డిస్ప్యాచ్, జీయో ట్యాగింగ్, నోటిఫికేషన్స్ మరియు అలెర్ట్స్, మొబైల్ పేమెంట్స్, డిజిటల్ డేటా కోడింగ్, అడ్వాన్స్ రిపోర్ట్ వంటివి స్పూర్ ఫీచర్లలో కొన్ని. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ అవసరం లేకుండానే నిర్వహించుకోవచ్చు. అది కూడా ఏ మొబైల్లోనైనా, ఏ భాషలోనైనా పనిచేయడం ఎఫోర్ట్ సాప్ట్వేర్ ప్రత్యేకత. ఒక్కో లాగిన్కు రూ.300–800 చార్జీ ఉంటుంది. ఫీచర్లను బట్టి ధరలు మారుతాయి. గతేడాది రూ.4 కోట్ల టర్నోవర్కు చేరుకున్నాం. ఈ ఏడాది రూ.7 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.20 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 50 మంది ఉద్యోగులున్నారు. వచ్చే రెండేళ్లలో క్లయింట్ల సంఖ్యను 300కు, టర్నోవర్ను రూ.100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే సేవలను అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు విస్తరించాలని నిర్ణయించాం. 2014లో బంధువులు, తెలిసిన వాళ్ల నుంచి రూ.2 కోట్ల నిధులను సమీకరించాం. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాం. 6 దేశాల్లో 150 కంపెనీలు.. స్పూర్ టెక్నాలజీని సేల్స్, సర్వీసెస్, కలెక్షన్స్, ఆడిట్స్, మార్కెటింగ్, రియల్టీ, బీమా, బ్యాంకింగ్ వంటి రంగాల్లోనూ విని యోగించవచ్చు. ప్రస్తుతం 150 కంపెనీలు 30 వేల మం ది ఫీల్డ్ ఉద్యోగులు దీన్ని వినియోగిస్తున్నారు. మన దేశంతో పాటూ నేపాల్, దుబాయ్, దక్షిణాఫ్రికా, వియత్నాం, మయన్మార్ దేశాల నుంచి క్లయింట్లున్నారు. గోఐబిబో, జేకే సీడ్స్, మహీంద్రా ఫైనాన్స్, ఎల్అండ్టీ ఫైనాన్షియల్, రెడ్బస్, రిలయన్స్, ఎయిర్టెల్ వంటి కస్టమర్లున్నారు. హైదరాబాద్ నుంచి మెడ్ప్లస్, మైక్లాస్ బోర్డ్ వంటి 30కి పైగా కంపెనీలున్నాయి. -
రూ.300కే.. యాప్తో వ్యాపారం!
► ఆఫ్లైన్ సంస్థలు, ఆన్లైన్ కస్టమర్లను కలిపే వేదిక గుడ్బాక్స్ ► గుడ్బాక్స్ యాప్లో వందలాది మినీ యాప్స్ ► చాట్ చేస్తూ ఉత్పత్తుల కొనుగోలు, లావాదేవీలూ జరిపే అవకాశం ► ప్రస్తుతం 14 వేల వర్తకులు; 2 లక్షల యాప్స్ డౌన్లోడ్ ► రూ.19 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ► ‘స్టార్టప్ డైరీ’తో గుడ్బాక్స్ ఫౌండర్ అబే జకారియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక్క యాప్తో ఒకే ప్రయోజనం. మరి, బోలెడు ప్రయోజనాలు కావాలంటే బోలెడు యాప్స్ కావాలి!! అన్ని యాప్స్ను ఒక్క స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే మెమొరీ కూడా సరిపోదేమో? మరెలా?! ఒకే ఒక్క యాప్లో స్థానిక వర్తకులందరి మినీ యాప్స్ ప్రత్యక్షమైతే? ఎంచక్కా మనకేది కావాలంటే ఆ యాప్ను ఓపెన్ చేసి వినియోగించుకోవచ్చు కదూ!! ఇంతకీ ఆ మెగా యాప్ ఏంటంటారా? అదే.. ‘గుడ్బాక్స్’! ఇంతకీ మరి మినీ యాప్ను డెవలప్ చేయాలంటే అయ్యే ఖర్చెంతో తెలుసా.. నెలకు రూ.300! ఆశ్చర్యంగా ఉంది కదూ!! ఇంకెందుకు ఆలస్యం గుడ్బాక్స్ కథేంటో దాని వ్యవస్థాపకుడు అబే జకారియా మాటల్లోనే తెలుసుకుందాం!! ఈ రోజుల్లో యాప్ అభివృద్ధి, టెస్టింగ్ కోసం ఎక్కడికెళ్లినా ఎంతలేదన్నా రూ.3 లక్షలపైనే చార్జీ చేస్తున్నారు. దీంతో చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఆన్లైన్ వ్యాపారానికి దూరంగా ఉంటున్నారు. దీనికి పరిష్కారం చూపించటం కోసమే రెడ్బస్లో టాప్ లెవల్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి సొంతంగా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకున్నా. అయితే ఆ ఆలోచన కేవలం తక్కువ ధరకు యాప్ను అభివృద్ధి చేయడంతోనే సరిపోదు. ఒకే యాప్లో స్థానిక వర్తకులందరి మినీ యాప్స్ కూడా ఉంటే అటు కస్టమర్లకూ వినియోగంగా ఉంటుందని నిర్ణయించుకున్నా. స్నేహితులు మయాంక్, మహేశ్, ఆనంద్, నితిన్ చంద్ర, మోహిత్ మహేశ్వరీ, చరణ్ శెట్టిలతో కలిసి 2015 జూన్లో బెంగళూరు కేంద్రంగా గుడ్బాక్స్.ఇన్ను ప్రారంభించాం. చాట్ చేస్తూ ఆర్డర్.. గుడ్బాక్స్ మెగా యాప్లో వందలాది మినీ యాప్స్ నిక్షిప్తమై ఉంటాయి. ఇందులో 2 రకాల యాప్స్ ఉంటాయి. 1. పార్టనర్ యాప్, 2. కన్సూమర్ యాప్. పార్టనర్ యాప్లో వర్తకులు వారి ఉత్పత్తులను డిస్ప్లే చేసుకోవచ్చు. ఆర్డర్లను తీసుకోవచ్చు. కన్జ్యూమర్ యాప్లో.. కస్టమర్లు యాప్ను ఓపెన్ చేయగానే స్థానికంగా ఉండే అన్ని రకాల వర్తకుల యాప్స్ కనిపిస్తుంటాయి. అందులో కావాల్సిన యాప్ను ఎంచుకొని నేరుగా వర్తకులతో చాట్ చేస్తూ ఆర్డర్లు ఇవ్వొచ్చు. రాయితీలూ పొందొచ్చు. కావాలంటే నేరుగా అక్కడి నుంచే ఆన్లైన్ లావాదేవీలూ జరపొచ్చు కూడా. ప్రస్తుతం 2 లక్షల మంది కస్టమర్లు గుడ్బాక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. 3 రకాల సబ్స్క్రిప్షన్స్.. గుడ్బాక్స్ యాప్ అభివృద్ధికి నెలకు రూ.300, రూ.600, రూ.1,200లు 3 రకాల సబ్స్క్రిప్షన్ మోడల్స్ ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ను బట్టి యాప్ ఫీచర్లలో తేడాలుంటాయి. ఉదాహరణకు బేసిక్ సబ్స్క్రిప్షన్లో వర్తకులు ఉత్పత్తుల డిస్కౌంట్స్, రివార్డు పాయింట్ల వంటివి ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 వేల మంది ఎస్ఎంఈలు నమోదయ్యారు. ఇందులో కిరాణా, గ్రాసరీ, లాండ్రీ, రెస్టారెంట్, ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఎన్జీవోలు, సెలూన్లు వంటివెన్నో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 1,000 లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో 40 శాతం పేమెంట్ గేట్వే లావాదేవీలే. ప్రతి లావాదేవీ మీద 1.99 శాతం కమీషన్గా తీసుకుంటాం. ప్రతి నెలా 30 శాతం వ్యాపారం వృద్ధి చెందుతుంది. రూ.19 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 75 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.19 కోట్ల నిధులను సమీకరించాం. మణిపాల్ గ్రూప్, నెక్సెస్ వెంచర్ పార్టనర్స్, ట్యాక్సీ4ష్యూర్ కో–ఫౌండర్ అప్రమేయ రాధా కృష్ణన్, రెడ్బస్ కో–ఫౌండర్ చరణ్ పద్మరాజులు ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రూ.10 కోట్లుగా ఉన్న గ్రాస్ మర్చండేజ్ వ్యాల్యూ (జీఎంవీ).. ఈ ఏడాది ముగింపులోగా రెండింతలకు, 25 వేల మంది వ్యాపారుల నమోదు లక్ష్ష్యించాం. -
పాలు, పేపర్ బిల్లుకూ క్లిక్కే!
⇒ పీఓఎస్ మిషన్ అవసరం లేదంటున్న ఎఫ్టీక్యాష్ ⇒ స్మార్ట్ఫోన్, బ్యాంకు ఖాతా ఉంటే చాలు ⇒ రోజుకు రూ.కోటి లావాదేవీలు పూర్తి ⇒ 3 నెలల్లో రూ.50 కోట్ల నిధుల సమీకరణ ⇒ ‘స్టార్టప్ డైరీ’తో ఎఫ్టీ క్యాష్ కో–ఫౌండర్ వైభవ్ లోధా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్లు రద్దుచేశాక దేశంలో అంతా నగదును ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకూ ఇంటర్నెట్ బ్యాంకింగో లేదా పీఓఎస్ మిషన్లలోనో క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారానే చెల్లిస్తున్నారు. మరి, చిన్న చిన్న అవసరాల పరిస్థితేంటి? కూరగాయలు, పాలు, పేపర్ బిల్లు, మందుల దుకాణంలో చెల్లింపులెలా? ఆయా వర్తకుల వద్ద కార్డు స్వైపింగ్ మిషన్లుంటే ఓకే? లేకపోతే? ఇదిగో ఇప్పుడా చిక్కులేవీ అక్కర్లేదంటోంది ఎఫ్టీ క్యాష్! పీఓఎస్ మిషన్ అవసరం లేకుండా స్మార్ట్ఫోన్, బ్యాంకు ఖాతా ఉంటే చాలు నగదు లావాదేవీలను పూర్తి చేసేస్తోంది. రోజుకు రూ.కోటి లావాదేవీల్ని పూర్తి చేస్తున్న ‘ఎఫ్టీ క్యాష్.కామ్’కు సంబంధించిన వివరాలు కో–ఫౌండర్ వైభవ్ లోధా ‘సాక్షి’తో పంచుకున్నారు. చిన్న చిన్న వర్తకులు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లను నిర్వహించలేరు. వారి కోసం స్మార్ట్ఫోన్తో నగదు లావాదేవీలను జరపాలనే లక్ష్యంతో 2015 జూన్లో ముంబై కేంద్రంగా ఎఫ్టీక్యాష్.కామ్ను ప్రారంభించాం. మిత్రులు సంజీవ్ చందక్, దీపక్ కొఠారీతో కలిసి రూ.40 లక్షల పెట్టుబడితో దీన్ని ఆరంభించాం. ప్రస్తుతం హైదరాబాద్, పుణె, ముంబై, జైపూర్, సూరత్ నగరాల్లో సేవలందిస్తున్నాం. 20 వేల వర్తకులు నమోదయ్యారు. ఇందులో వెయ్యి మంది హైదరాబాద్ నుంచి ఉంటారు. ఇందులో కూరగాయలమ్మే వాళ్లు, పేపర్ బాయ్స్, పాలు వేసేవాళ్లు, కిరాణా , మెడికల్ షాపుల వంటి చిన్న చిన్న వర్తకులున్నారు. ప్రతి రోజు 2 వేల లావాదేవీలు, రూ.కోటి వ్యాపారం జరుగుతోంది. ప్రతి లావాదేవీపై వర్తకుడి నుంచి 1–1.8% రుసుము తీసుకుంటాం. ఎస్ఎంఎస్ చాలు.. ప్రతి వర్తకుడికీ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ లింక్ ఉంటుంది. దీన్ని వర్తకులు తమ కస్టమర్లకు మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా పంపించాలి. దీనికి వర్తకుడి దగ్గర ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కస్టమర్లకొచ్చిన మెసేజ్ను క్లిక్ చేసి పేరు, చెల్లించాల్సిన నగదు నమోదు చేసి ఎంటర్ చేస్తే చాలు. లావాదేవీ పూర్తయినట్టే. క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్ దేనినైనా వినియోగించుకోవచ్చు. సంబంధిత సొమ్ము నేరుగా వర్తకుడి బ్యాంకు ఖాతాలో జమవుతుంది అంతే! రూ.2 కోట్ల రుణాల మంజూరు.. పేమెంట్ సేవలతో పాటు... బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని వర్తకులకు రుణాలను మంజూరు చేస్తున్నాం. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ వంటి 15 బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాం. రూ.50 లక్షల నుంచి రూ.5 లక్షల లోన్ ఇస్తాం. రుణ మొత్తాన్ని 3 నెలల నుంచి 2 ఏళ్ల లోపు చెల్లించాలి. వడ్డీ, అసలు సులభ వాయిదాల్లో నేరుగా వర్తకుని బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుంటుంది. ఇప్పటివరకు 150 మంది వర్తకులకు రూ.2 కోట్ల లోన్స్ అందించాం. వచ్చే రెండేళ్లలో 10 లక్షల వర్తకుల్ని సభ్యులుగా చేర్చుకోవటంతో పాటు లక్ష మందికి రుణాలివ్వాలనేది లక్ష్యం. 3 నెలల్లో రూ.50 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. గత ఏడాది కాలంలో వ్యాపారం 65 రెట్లు వృద్ధి చెందింది. ఇప్పటివరకు రూ.7 కోట్ల నిధులను సమీకరించాం. గతంలో సీడ్ రౌండ్లో మహారాష్ట్రకు చెందిన ఐవీ క్యాప్ వెంచర్స్ రూ.కోటి, సింగపూర్ ఏంజిల్స్, బెంగళూరుకు చెందిన ట్రాక్సన్ ల్యాబ్స్ రూ.6 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. తాజాగా సిరీస్–బీ రౌండ్లో భాగంగా రూ.50 కోట్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. వచ్చే 3 నెలల్లో డీల్ను క్లోజ్ చేస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటేstartups@sakshi.comకు మెయిల్ చేయండి... -
లోడెంతైనా ఒకవైపే చార్జీ..!
⇔ లాజిస్టిక్స్ రంగానికి టెక్నాలజీని జోడించిన తులిప్ ⇔ బీ2బీ మార్కెట్లో కస్టమర్లుగా 80కి పైగా కంపెనీలు ⇔ 4 లక్షల వాహనాలు నమోదు; నెలకు రూ.2 కోట్ల వ్యాపారం ⇔ 2 నెలల్లో రూ.150 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ⇔ సాక్షి ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ నివాస్. కె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో దేశంలోని లాజిస్టిక్స్ రంగంలో ప్రధాన సమస్యేంటో తెలుసా? రెండు వైపులా చార్జీని కస్టమరే భరించడం! అలా కాకుండా ఒక వైపు చార్జీలే చెల్లించే విధానముంటే బావుంటుంది కదూ!!. అదనపు ట్రిప్పులతో ట్రక్ డ్రైవర్కు, ఒకవైపు చార్జీతో లోడ్ ఓనర్కూ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. ఇదిగో ఇలాంటి వ్యాపార విధానంతోనే పనిచేస్తోంది హైదరాబాద్కు చెందిన తులిప్ లాజిస్టిక్స్.కామ్. ఓలా, ఉబర్లు కారు డ్రైవర్ను, కస్టమర్ను ఎలాగైతే కలుపుతాయో.. తులిప్ కూడా అదే రీతిలో ట్రక్కుల్ని, కస్టమర్లను కలుపుతుంది. తులిప్ సేవలు, విస్తరణ ప్రణాళికల వివరాలను సంస్థ వ్యవస్థాపక సీఈఓ నివాస్ కె ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆయనేమన్నారంటే... మాకు యూఎస్ఎం గ్రూప్ కింద మైనింగ్, సాఫ్ట్వేర్, ఇన్ఫ్రా కంపెనీలున్నాయి. మైనింగ్ విభాగంలో ట్రాన్స్పోర్ట్ ఎప్పుడూ ఇబ్బందే. వాహనం ఎప్పుడొస్తుందో తెలియదు. అసలెక్కడుందో తెలియదు. ఏజెంట్లు, బ్రోకర్లపై ఆధారపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే అనిపించింది..!! టెక్నాలజీలోనూ సేవలందిస్తున్న మనమే ఎందుకూ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని జోడించకూడదు అని? రూ.20 లక్షల పెట్టుబడితో 2014లో హైదరాబాద్ కేంద్రంగా తులిప్ లాజిస్టిక్స్ ప్రారంభించటానికి ఆ ఆలోచనే కారణం. బీ2సీ నుంచి బీ2బీ మార్కెట్లోకి.. మొదట్లో బీ2సీ మార్కెట్లో పిపీప్ లాజిస్టిక్స్ను ప్రారంభించాం. ఇది అగ్రిగేట్ మోడల్. వాహన డ్రైవర్లు తమ వాహనాలను పిపీప్లో నమోదు చేసుకోవాలి. కావాల్సిన కస్టమర్లతో వారిని పిపీప్ కలుపుతుంది. 800 కి.మీ. వరకు రూ.400, 1,200 కి.మీ వరకైతే రూ.800, ఆపైన ఎన్ని కి.మీ. అయినా రూ.1,000 చార్జీ వసూలు చేస్తాం. కానీ ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాహనంలోని సరుకుకు బాధ్యత ఎవరిదని చాలా మంది కస్టమర్లు అడిగారు. దీంతో టెక్నాలజీని అభివృద్ధి చేసి తులిప్ లాజిస్టిక్స్ పేరిట బీ2బీ మార్కెట్లోకి వచ్చాం. సాంకేతికత, వేగం, కచ్చితత్వం.. ఈ మూడే తులిప్ స్పెషాలిటీ. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో కంపెనీలతో భాగస్వామ్యమవుతాం. ట్రక్ డ్రైవర్కు చార్జీ తులిపే చెల్లిస్తుంది. ఆ తర్వాత కస్టమర్ నుంచి తులిప్ వసూలు చేసుకుంటుంది. ఈ విధానంలో సరుకు బాధ్యత తులిప్దే. 2 టన్నుల నుంచి మొదలు... తులిప్ లాజిస్టిక్స్.కామ్లో ట్రక్ల సామర్థ్యం 2 టన్నుల నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం తులిప్లో 50 వేల మంది ఏజెంట్లు, వాహన ఓనర్లు రిజిస్టరయ్యారు. 4 లక్షలకు పైగా వాహనాలు నమోదై ఉన్నాయి. ఇందులో టాటా ఏస్ నుంచి 20 చక్రాల భారీ వాహనాల వరకూ ఉన్నాయి. మాంసాహార ఉత్పత్తులు, పాలు, పండ్ల వంటి ఉత్పత్తుల సరఫరా కోసం ప్రత్యేకంగా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే వాహనాలూ ఉన్నాయి. జీపీఎస్ సాంకేతిక విధానంతో ట్రక్ ఎక్కడుంది? ఎంత సమయంలో చేరుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు లోడ్, ట్రక్ ఓనర్లకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తుంటాం కూడా. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లోడ్తో వచ్చే వాహనాల తనీఖీ సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి వాహనానికి తులిప్ లాజిస్టిక్స్.కామ్ సర్టిఫికెట్ను ఇస్తాం. ఇందులో వాహనానం, లోడ్కు సంబంధించిన పూర్తి వివరాలుంటాయి. దీంతో తనిఖీ అధికారుల పని సులువవ్వటమే కాకుండా ట్రక్ కూడా త్వరగా గమ్యాన్ని చేరుకుంటుంది. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్.. కోకకోలా, జేకే సీడ్స్, భారతి సిమెంట్స్, భవ్య సిమెంట్స్, హల్దీరామ్స్, ఇమామి, కేఎల్ఆర్, పార్లే బిస్కెట్స్, బేక్మేట్ వంటి ప్రముఖ కంపెనీలు మా సేవలను వినియోగించుకున్నాయి. ట్రక్కును బట్టి చార్జీ ఉంటుంది. ప్రారంభ ధర రూ.10–20 వేల మధ్య ఉంటుంది. ఆర్డర్ బుకింగ్ అయినప్పుటి నుంచి సరుకు గమ్య స్థానాన్ని చేరే వరకూ బాధ్యత తులిప్దే. ప్రస్తుతం రోజుకు 30 ట్రక్కులు బుక్ అవుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్–బెంగళూరు, విశాఖపట్నం పోర్ట్–బెంగళూరు, ఆంధ్రప్రదేశ్–లక్నో, పాట్నా మార్గాలుంటున్నాయి. నెలకు రూ.1.5–2 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాం. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని చేరాం. రూ.150 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. విస్తరణ కోసం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.150–200 కోట్ల వీసీ ఫండ్ కోసం చూస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరుకు చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో ప్రాథమిక చర్చలు నడుస్తున్నాయి. మరో 2 నెలల్లో డీల్ను క్లోజ్ చేస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఆన్లైన్లో బొమ్మల కొలువు!
లెగో సెట్స్ను అద్దెకిస్తున్న ఫన్ స్టేషన్ • ప్రస్తుతం 200 సెట్స్ అందుబాటు • గతేడాది 400 లెగో సెట్స్ అద్దెకు; రూ.10 లక్షల టర్నోవర్ • మార్చి నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సేవల విస్తరణ • రూ.4–5 కోట్ల సమీకరణపై దృష్టి • ‘స్టార్టప్ డైరీ’తో ఫన్స్టేషన్ ఫౌండర్ కశ్యప్ షా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లెగో సెట్స్ (బిల్డింగ్ బ్లాక్స్).. గురించి పిల్లలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. వీటితో భవనాలు, కార్లు, బొమ్మలు వంటి రకరకాల రూపాలు తయారు చేస్తుంటారు. అందుకే లెగో సెట్స్తో పిల్లలు ఆడుకోవటం కాదు.. నేర్చుకుంటారు అనంటారు. ఇంకా చెప్పాలంటే లెగో సెట్స్ గేమ్... మెదడుకు మేతలాంటిది. అయితే ఈ సెట్స్ను అందరూ కొనలేరు. ఎందుకంటే వీటి ప్రారంభ ధరే రూ.13 వేల నుంచి ఉంటుంది. మరి, అంత డబ్బు పెట్టి పిల్లలకు లెగో సెట్స్ను కొనివ్వటం అందరి తల్లిదండ్రులతో అయ్యేపనేనా? ఇదిగో దీనికి పరిష్కారం చూపిస్తోంది ఫన్స్టేషన్! కేవలం లెగో సెట్స్ను మాత్రమే అద్దెకివ్వటం దీని ప్రత్యేకత. రూ.10 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా 2015 మార్చిలో ప్రారంభమైంది ఫన్స్టేషన్.ఇన్. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ కశ్యప్ షా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అందుబాటులో 200 లెగో సెట్స్.. ప్రస్తుతం ఫన్స్టేషన్లో 200 లెగో సెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫన్ ప్లాన్, ఫన్ స్క్వేర్ ప్లాన్, ఫన్ క్యూబ్ ప్లాన్ అని 3 రకాలుగా లెగో సెట్స్ను అద్దెకిస్తాం. వీటి అద్దె ధరలు 28 రోజులకు రూ.400 నుంచి రూ.4,500 వరకుంటాయి. డిపాజిట్స్గా రూ.1,500–3,500 ఉంటుంది. ఇది రిఫండబుల్. మొత్తం 500 మంది రిజిస్టర్ కస్టమర్లున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి 150 మంది యూజర్లుంటారు. నెలకు 50–80 సెట్స్ అద్దెకు తీసుకుంటున్నారు. ఫన్స్టేషన్కే అద్దెకివ్వొచ్చు.. ప్రస్తుతమున్న లెగో సెట్స్లో 90 శాతం మా సొంతం. మిగిలినవి కస్టమర్ల నుంచి సమీకరించినవి. అంటే ఫన్ కిడ్స్ప్రెన్యూర్ వేదికగా పిల్లలు తమ వద్ద ఉన్న లెగో సెట్స్ను ఫన్స్టేషన్కు అద్దెకివ్వొచ్చు. అయితే ఒక్కసారి రిజిస్టరయ్యాక 10 సార్లు అద్దెకిచ్చే వరకూ రిటర్న్ తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత కావాలంటే తీసుకోవచ్చు. ఫన్స్టేషన్కు అద్దె ద్వారా వచ్చే సొమ్ములో 15 శాతం నేరుగా కస్టమర్ ఖాతాలో జమ అవుతుంది. రూ.40 లక్షల ఆదాయం లక్ష్యం.. గతేడాది 400 లెగో సెట్స్ అద్దెకిచ్చాం. రూ.10 లక్షల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.1,500 లెగో సెట్స్ అద్దె టార్గెట్గా పెట్టుకున్నాం. సుమారు రూ.40 లక్షల టర్నోవర్ లక్ష్యించాం. లెగో సెట్స్ పికప్, డ్రాప్ కోసం ఫెడెక్స్ కొరియర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. 5 పీసెస్ లెగో సెట్స్ పోగొట్టినా ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఆపైన పోగొడితే మాత్రం ప్రతి ఒక్క పీస్కు రూ.40 చార్జీ పెనాల్టీ ఉంటుంది. నిధుల సమీకరణపై దృష్టి.. ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాల్లో మాత్రమే అద్దె సేవలందిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని లక్ష్యించాం. తొలి దశలో వచ్చే నెలలో కోయంబత్తూర్, లూధియానా, నాగ్పూర్ పట్టణాల్లో సేవలను ప్రారంభించనున్నాం. విస్తరణ నిమిత్తం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.4–5 కోట్ల పెట్టుబడుల కోసం ఒకరిద్దరు ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
బైక్స్ గ్యారేజీ.. ‘గాడీ 360’!
ఇంటి దగ్గరికే బండి సర్వీసింగ్ సేవలు • ఎక్కడైనా బైక్ ఆగితే 2 లీటర్ల పెట్రోల్ డెలివరీ • నెల రోజుల్లో చెన్నైకిæ; 3 నెలల్లో బీమా సేవల్లోకి విస్తరణ • రూ.5–6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి • ‘స్టార్టప్ డైరీ’తో గాడీ 360 ఫౌండర్ అండ్ సీఈఓ సంగన్ పాటిల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఆఫీసుకెళ్లేటప్పుడో.. అర్జెంటుగా బయటికెళ్తుంటేనో మార్గ మధ్యంలో పెట్రోల్ అయిపోతే? సడన్గా బండి ట్రబుల్ ఇస్తే? .. ఏమవుతుంది? ముందు మైండ్ బ్లాంక్ అవుతుంది! ఆ తర్వాత చేసేదేంలేక.. ఆగిన బండిని తోసుకుంటూ మెకానిక్ షాపుకి తీసుకెళ్లటమో లేదా బండిని అక్కడే పెట్టేసి మెకానిక్ను తీసుకొచ్చి రిపేర్ చేయించుకోవటమో చేస్తాం! ఇలాంటి కష్టాలేవీ లేకుండా జస్ట్ ఒక్క క్లిక్ చేస్తే చాలు ఆగిన బండి దగ్గరికే మెకానిక్ వచ్చి.. రిపేర్ చేసి అవసరమైతే పెట్రోల్ కూడా పోసి బండి తాళాలు చేతిలో పెట్టేస్తాడు. అదే ‘గాడీ 360.కామ్’ ప్రత్యేకత కూడా. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకుడు సంగన్ పాటిల్ మాటల్లోనే... సమస్యల నుంచే సంస్థ ప్రారంభమవుతుందనడానికి ‘గాడీ 360’ ప్రత్యక్ష ఉదాహరణ. ఓ రోజు పని మీద వెళుతున్నప్పుడు రోడ్డు మధ్యలో బండి మొరాయించింది. అక్కడే వదిలేసి వెళ్దామంటే తిరిగొచ్చేసరికి బండి ఉంటుందో లేదోనని అనుమానం. రిపేర్ చేయించుకుందామంటే దగ్గర్లో రిపేరింగ్ షాపు లేదు. అప్పుడే అనిపించింది దేశంలోని బైక్ సర్వీసింగ్ స్టేషన్లంటినీ ఒకే వేదిక మీదికి తీసుకొస్తే.. స్టేషన్లకు లాభంతో పాటూ కస్టమర్కూ ఎంతో ఉపశమనంగా ఉంటుందని! మరో మిత్రుడు సతీష్ ఆష్కితో కలిసి రూ.5 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా 2015 ఫిబ్రవరిలో సంస్థను ప్రారంభించాం. సర్వీసింగ్ స్టేషన్లతో ఒప్పందం.. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే సేవలందిస్తున్నాం. స్థానికంగా బెంగళూరులో 100, హైదరాబాద్లో 60 సర్వీసింగ్ స్టేషన్లతో ఒప్పందం చేసుకున్నాం. వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సేవలందిస్తున్నాం. మీ దగ్గర్లోని సర్వీసింగ్ సెంటర్ను ఎంచుకున్నాక.. బైక్ పికప్ తేదీ, సమయం, వాహన సమస్య, చిరునామా అందిస్తే చాలు.. సర్వీస్ స్టేషన్ ఎగ్జిక్యూటివ్ మీ ఇంటికొచ్చి బైక్ కండీషన్ను చూసి సర్వీసింగ్కు ఎంతవుతుందో అంచనాగా చెబుతాడు. ఏవైనా పార్ట్స్ మార్చాల్సి వస్తే కొత్తవి వేసి.. పాత పార్ట్స్ను తిరిగి కస్టమర్కే ఇచ్చేస్తారు. ఇలా బైక్ పికప్ నుంచి డ్రాపింగ్ వరకూ ప్రతిదీ పక్కాగా, నమ్మకంతో సాగుతుంది. పెట్రోల్ డెలివరీ కూడా.. బైక్ పికప్, డ్రాప్ ఉచితంగా అందించడంతో పాటూ 30 రోజుల వారంటీ ఇస్తున్నాం. బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ సేవల్ని దేశవ్యాప్తంగా అందిస్తున్నాం. ఇందులో బైక్ పంక్చర్, రిపేర్ సేవలతో పాటూ ఆర్డర్ ఇస్తే 2 లీటర్ల పెట్రోల్నూ సరఫరా చేస్తాం. అది కూడా 7 ఏళ్ల లోపున్న వాహనానికే. అయితే బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ సేవలను పొందటానికి ప్రతి బైక్కు ఏడాదికి రూ.600 రిజిస్ట్రేషన్ చార్జీ కింద చెల్లించాలి. ప్రస్తుతం నెలకు 600–800 బైక్స్ సర్వీసింగ్ ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి సర్వీసింగ్ మీద కొంత మొత్తాన్ని కమీషన్ రూపంలో తీసుకుంటాం. గత నెల్లో రూ.12 లక్షల వ్యాపారం చేశాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి రూ.1.8 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నాం. నిధుల సమీకరణపై దృష్టి... ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైలో గాడీ 360 సేవలను ప్రారంభిస్తాం. 3 నెలల్లో వాహన బీమా, ప్రీమియం కవరేజీ సేవల్లోకి ప్రవేశిస్తున్నాం. విస్తరణ అవసరాల కోసం రూ.5–6 కోట్ల పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. త్వరలో డీల్ను క్లోజ్ చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఆ తర్వాత కార్ల సర్వీసింగ్ విభాగంలోకి విస్తరిస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
కంపెనీ మీది.. నిపుణులు మా వాళ్లు!
• డెవలపర్లను అద్దెకిస్తున్న డెవలపర్-ఆన్-రెంట్ • అన్ని రంగాలు, అన్ని టెక్నాలజీల్లోనూ సేవలందించడమే ప్రత్యేకత • మన దేశంతో పాటూ కెనడా, యూఎస్, యూకెల్లోనూ సేవలు • 2 నెలల్లో 4-6 కోట్ల నిధుల సమీకరణ పూర్తి • ‘స్టార్టప్ డైరీ’తో డెవలపర్-ఆన్-రెంట్ ఫౌండర్ క పిల్ మెహతా హెదరాబాద్, బిజినెస్ బ్యూరో : ముంబైకి చెందిన పేమెంట్ గేట్వే కంపెనీ ఆటమ్ టెక్నాలజీస్కు ఓ రోజు వెబ్, మొబిలిటీ సొల్యూషన్స్లో ఇబ్బంది ఎదురైంది. వెంటనే క్లిక్ చేసి నిపుణున్ని అద్దెకు తీసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన స్లాటర్ కన్సల్టింగ్కు యాంగ్లర్ జేఎస్, మాజెంటో టెక్నాలజీలో సమస్య. సొల్యూషన్ కోసం చూస్తుంటే.. డెవలపర్ రెంట్కొచ్చేశాడు. కెనడాకు చెందిన సెంతిక్... సీఎంఎస్, క్రోన్ వర్షన్లో ఇబ్బంది మొదలైంది. అది కూడా నిపుణున్ని అద్దెకు తీసుకోవటంతో పరిష్కారం కనుగొంది. ...ఇలా మన దేశంలోనే కాదు అమెరికా, కెనడా, యూకే, గల్ఫ్ వంటి 7 దేశాల్లోని కంపెనీలకు బెంగళూరు కేంద్రంగా పరిష్కారం చూపిస్తోంది ‘డెవలపర్-ఆన్-రెంట్’!! సొంతంగా డెవలపర్లను నియమించుకొని కంపెనీలకు టెక్నాలజీలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే ఈ సంస్థ పని. రూ.10 లక్షల పెట్టుబడితో 2014 జనవరిలో ప్రారంభమైన డెవలపర్-ఆన్-రెంట్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ కపిల్ మెహతా మాటల్లోనే.. ‘‘ఈ-కామర్స్ కంపెనీ ప్రారంభించాలంటే ముందుగా వెబ్సైట్ డిజైన్, టెక్నాలజీ డెవలప్మెంట్ కావాలి. వీటి కోసం డెవలపర్ వద్దకెళితే ఎవరి ధర వారిదే. కొందరేమో కొటేషన్ ఇచ్చి వెళ్లండి తయారు చేసి పంపిస్తామంటారు. ఇంకొందరేమో కస్టమర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరు. ఇలా ఒక్కో డెవలపర్ది ఒక్కో ధోరణి. అలాకాకుండా కంపెనీతో పాటే డెవలపర్నూ అద్దెకు తీసుకుంటే!! కంపెనీకి అవసరమైనట్లుగా దగ్గరుండి చేయించుకొని ఆ తర్వాత డెవలపర్కు అద్దె ఇస్తే పోలే... అనిపించింది. దీంతో డెవలపర్కూ డబ్బులొస్తాయి. కస్టమర్ తనకేం కావాలో అదే దగ్గరుండి అందుబాటు ధరల్లో చేయించుకుంటాడు. అలా అనుభవం నుంచి పుట్టిందే డెవలపర్-ఆన్-రెంట్’’ అని సంస్థ ప్రారంభం గురించి వివరించారు కపిల్. డెవలపర్, కస్టమర్ ఇద్దరికీ లాభమే.. డెవలపర్ను అద్దెకు తీసుకోవటం వల్ల డెవలపర్కు, కస్టమర్కు ఇద్దరికీ లాభం ఉంటుంది. అదెలాగంటే.. ఒక్కో డెవలపర్ ఏడాదిలో 6-8 మంది కస్టమర్లతో పనిచేస్తాడు. వివిధ టెక్నాలజీ, బిజినెస్ మాడ్యూల్స్ మీద పనిచేయాల్సి ఉంటుంది. దీంతో డెవలపర్కు అన్ని రకాల టెక్నాలజీ, వ్యాపార విధానాల మీద పూర్తి స్థాయి పట్టు వస్తుంది. కస్టమర్ లాభం విషయానికొస్తే.. ఆయా కంపెనీలకు అప్లికేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం పూర్తి స్థాయి డెవలపర్ను నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. కారు, బైకు అద్దెకు తీసుకున్నట్టే పనికి తగ్గ డెవలపర్ను అద్దెకు తీసుకుంటే సరిపోతుంది. దీంతో పని లేని సమయంలోనూ డెవలపర్కు వేతనం ఇవ్వాల్సిన భారం తప్పుతుంది. అన్ని టెక్నాలజీల్లోనూ సేవలు.. పీహెచ్పీ, పైథాన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, యాంగ్లర్ జేఎస్, మీన్ స్టాక్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, హెచ్టీఎంఎల్5, ఐఓటీ, మాజెంటో, వర్డ్ ప్రాసెసర్ వంటి అన్ని రకాల టెక్నాలజీల్లోనూ సేవలందిస్తున్నాం. రిటైల్, ఈ-కామర్స్, హెల్త్కేర్, టెలికం, రియల్టీ, ట్రావెల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో సేవలందించేందుకు 100 మంది నిపుణుల్ని నియమిం చుకున్నాం. అందరూ ఆయా టెక్నాలజీల్లో మూడేళ్ల అనుభవం ఉన్నవారే కావటం మా ప్రత్యేకత. ఒక్కో డెవలపర్కు రూ.40 వేల కనీస వేతనం ఇస్తున్నాం. 2 నెలల్లో 4-6 కోట్ల నిధులు.. ప్రస్తుతం నెలకు 3-5 కంపెనీల వరకు నిపుణులను అద్దెకిస్తున్నాం. నెలకు రూ.30 లక్షల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. ఇప్పటివరకు సంస్థలో వ్యక్తిగత, కుటుంబ పెట్టుబడులే ఉన్నాయి. తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. మరో 2 నెలల్లో రూ.4-6 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. త్వరలోనే డీల్ను క్లోజ్ చేసి.. పూర్తి వివరాలు వెల్లడిస్తాం. వైజాగ్, హైదరాబాద్లో నియామకాలు.. ఇప్పటివరకు జస్ట్ డయల్, శుభ్కార్ట్, ఆటోమొబీ, స్కిల్ స్పీడ్, పిట్టిగ్రూప్, స్లాటర్ కన్సల్టింగ్, సెంతిక్ వంటి 50కి పైగా కంపెనీలు మా నిపుణుల్ని అద్దెకు తీసుకున్నాయి. ప్రస్తుతం 35 కంపెనీల్లో మా నిపుణులు అద్దెకు పనిచేస్తున్నారు. రోజులు, కంపెనీ అవసరాలు, పని, టెక్నాలజీ, డెవలపర్ అనుభవాన్ని బట్టి చార్జీ ఉంటుంది. తొలిసారిగా హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డెవలపర్లను నియమించుకోనున్నాం. మరో రెండు నెలల్లో 15-20 మంది డెవలపర్లను ఉద్యోగులుగా తీసుకుంటాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
వైద్య నిపుణులూ ఇంటికొస్తారు
• విజయవాడ కేంద్రంగా ఫ్రిస్కా హోమ్హెల్త్కేర్ సేవలు • మూడు నెలల్లో వైజాగ్, కాకినాడ, ఏలూరు, తిరుపతికి • ఏడాదిన్నరలో తెలంగాణ వ్యాప్తంగా సేవలందిస్తాం • ‘స్టార్టప్ డైరీ’తో ఫ్రిస్కా వ్యవస్థాపకుడు ఆసిఫ్ మొహమ్మద్ హైదరాబాద్, బిజినెస్బ్యూరో : హోమ్ హెల్త్కేర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. వైద్య పరీక్షల కోసం ఫోన్ చేస్తే ఇంటికొచ్చి శాంపిల్స్ తీసుకుంటున్నారు. నర్సులు, ఫిజీషియన్లు ఇంటికొస్తున్నారు. అయితే విజయవాడ కేంద్రంగా సేవలు ప్రారంభించిన ఫ్రిస్కా కేర్... మరో అడుగు ముందుకేసింది. ఫోన్ చేస్తే వైద్య నిపుణులనూ ఇంటికి పంపిస్తోంది. వైద్య పరీక్షల శాంపిల్స్, నర్సింగ్, ఫిజీషియన్ సేవలతో పాటు కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, డయాబెటిక్ స్పెషలిస్ట్... ఇలా వైద్య నిపుణుల సేవల్ని సైతం పేషెంట్ల ఇంటివద్దే అందించటం తమ ప్రత్యేకత అని ఫ్రిస్కా వ్యవస్థాపకుడు, ఎన్నారై ఆసిఫ్ మొహమ్మద్ తెలియజేశారు. సంస్థ గురించిన వివరాలు ఆయన మాటల్లోనే... పదిహేనేళ్లుగా అమెరికా, కెనడాల్లో ఉంటూ క్లౌడ్ కంప్యూ టింగ్ కంపెనీ ‘న్యూవోల్ టెక్ సొల్యూషన్స్’ను నడిపిస్తున్నా. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం వైద్య నిపుణుల్ని సంప్రతించటం, వైద్యం సరిగా ఆందుతోందో లేదో చూసుకోవటం సమస్యగా ఉండేది. ఇదంతా చూశాక... నా లాంటి ఎన్నారైల కోసం ఇండో-అమెరికన్ వైద్యులతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమరావతిలో ఫ్రిస్కాను ఆరంభించాం. స్థానికుల నుంచి అనూహ్యమైన స్పందన రావటంతో రెండు నెలల్లోనే సిబ్బందిని మూడు రెట్లు పెంచి... గుంటూరు, విజయవాడల్లో అందరికీ పూర్తిస్థాయి సేవలు ఆరంభించాం. 3 నెలల్లో విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, ఏలూరుల్లో సేవలు విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఏడాదిన్నరలో యావత్తు తెలంగాణ వ్యాప్తంగా, మూడేళ్లలో దేశంలోని పలు నగరాల్లో సేవలు అందిస్తాం. నిపుణులైన వైద్యులే మా ప్రత్యేకత హోమ్ హెల్త్కేర్లోకి చాలా కంపెనీలొస్తున్నాయి. కానీ కొందరు ఫిజియోథెరఫీపైనే దష్టి పెడుతుండగా... కొందరు నర్సింగ్ సేవలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఫ్యామిలీకి ఒక సొంత డాక్టర్ను అందించటమనేది మా ప్రత్యేకత. అంటే భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలున్న కుటుంబం ఏడాదికి కొంత ఫీజు చెల్లిస్తే చాలు. ఏడాదిలో నాలుగు సార్లు వారి అవసరం మేరకు డాక్టరే వాళ్లింటికి వెళతారు. నెలకోసారి నర్సింగ్ మేనేజరూ విజిట్ చేస్తారు. ల్యాబ్ పరీక్షల కోసం ఇంటికొచ్చి శాంపిల్స్ తీసుకోవటం, మందులు డెలివరీ చేయటం... ఇవన్నీ ఈ ప్యాకేజీలో భాగంగా ఉచితంగానే చేస్తాం. ఇంకో ప్రత్యేకతేంటంటే... మా సభ్యులు కాల్ చేసినపుడు వారి అవసరాన్ని బట్టి డయాబెటిక్ నిపుణులు, కార్డియాలజిస్టు, నెఫ్రాలజిస్టు వంటి స్పెషలిస్టులు కూడా వాళ్లింటికి వెళతారు. ఇప్పటిదాకా దేశంలో ఏ హోమ్ హెల్త్కేర్ సంస్థా దీన్ని ఆఫర్ చేయటం లేదు. పెపైచ్చు ఉన్న హోమ్ హెల్త్కేర్ సంస్థలన్నీ మెట్రోలు, పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకూ ఈ సేవలు అందాలన్నది మా ఉద్దేశం. యాప్లోనే అన్ని సేవలూ... వెబ్సైట్తో పాటు ఫ్రిస్కా ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకుని అన్నిసేవలూ పొందొచ్చు. పేషెంట్లయినా, వారి బంధువులైనా ఎక్కడి నుంచైనా వారి మెడికల్ రిపోర్టులను మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదు!! ఆ రిపోర్టులు చూసి వారే నేరుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడొచ్చు. త్వరలో ఐఓఎస్ యాప్ను కూడా తీసుకొస్తున్నాం. మా సేవలతో ఖర్చు తగ్గుతుంది. సమయం కలిసొస్తుంది. నర్సుల్ని కూడా పోలీసు వెరిఫికేషన్ వంటివన్నీ చేశాకే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవరింటికైనా వారిని పంపితే తరవాత ఇబ్బందులు రాకుండా ఉండాలని. అనుభవం ఉన్న వైద్యులు.. ప్యాకేజీలు ఫ్రిస్కాలో ఇండో అమెరికన్ వైద్యులు డాక్టర్ సురేంద్ర ప్రసాద్ (డయాబెటిక్ కేర్), అమెరికన్ వైద్యుడు రత్నకాంత్ సిద్ధాబత్తుల, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ భార్గవ్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ మురళీకృష్ణ, మార్కెటింగ్ నిపుణుడు ఎం.ఆర్.రెహమాన్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రత్యేకంగా మహిళా వైద్యులూ ఉన్నారు. నిమ్స్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎంఎస్ఎన్ పవన్ మాకు మెడికల్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారు. ప్యాకేజీల విషయానికొస్తే వృద్ధుల సంరక్షణ పేరిట ఎన్నారై పేరెంట్లకు, ఇతరులకు వయసుకు తగ్గ ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నాం. ప్రత్యేక ల్యాబ్ టెస్టులు, నర్స్ల సాయం, ఆసుపత్రికి రెగ్యులర్గా తీసుకెళ్లటం దీన్లో భాగంగా ఉంటాయి. దీర్ఘకాలం, స్వల్పకాలం ప్రాతిపదికన నర్సింగ్ సేవలూ ఆఫర్ చేస్తున్నాం. సభ్యులకు రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
దంతం.. వీరి వ్యాపార మంత్రం!!
చేతి గ్లౌజ్ నుంచి డెంటిస్ట్ చెయిర్ వరకూ.. * దంత వైద్య పరికరాలను విక్రయిస్తున్న మై డెంటిస్ట్ చాయిస్ * 80 రకాల బ్రాండ్లు.. 6 వేలకు పైగా ఉత్పత్తుల లభ్యం * వచ్చే ఏడాది మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలకూ విస్తరణ * రూ.20 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దంత పరిశ్రమలోని ప్రధాన సమస్య ఏంటో తెలుసా.. దంత పరికరాలు, ఉత్పత్తుల కొనుగోళ్లే! ఎందుకంటే ఆయా ఉత్పత్తుల్లో 80% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఉన్న కొద్దిపాటి విక్రయ కేంద్రాలైనా మెట్రో నగరాలకే పరిమితం. మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని దంత వైద్యుల పరిస్థితేంటి? ..ఇదిగో సరిగ్గా ఇలాంటి అనుభవం స్థానిక దంత వైద్యుడు అల్లాడి చంద్రశేఖర్కూ ఎదురైంది. దాన్నే వ్యాపార అవకాశంగా భావించాడు. టెక్నాలజీ నిపుణులైన సునీల్ మేడ, శివప్రసాద్ పిన్నపురాల ఇద్దరితో కలిసి ఈ-కామర్స్ సంస్థను ఆరంభించాడు. నిజానికి సీబీఐటీలో ఇంజినీరింగ్ చేసేటప్పటి నుంచీ శివ ప్రసాద్, సునీల్ స్నేహితులు. అమెరికాలో 15 ఏళ్ల పాటు వివిధ ఐటీ కంపెనీల్లో సహోద్యోగులగా పనిచేశారు. ఓ రోజు డాక్టర్ చంద్రశేఖర్ అల్లాడి.. తన మిత్రుడైన శివ ప్రసాద్తో దంత పరిశ్రమలోని సమస్యను, వ్యాపార అవకాశాలను చర్చించాడు. అదే అవకాశంగా భావించి సునీల్తో కలసి వారిద్దరూ రూ.60 లక్షల పెట్టుబడితో మై డెంటిస్ట్ చాయిస్.కామ్ను ప్రారంభించారు. 2014 జూలైలో ఆరంభమైన ఈ సంస్థ... చేతి గ్లౌజ్ల నుంచి మొదలుపెడితే డెంటిస్ట్ చెయిర్ వరకూ వైద్యుడికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తుల్నీ అందిస్తుంది. దీనికి సంబంధించి సునీల్ మేడా చెప్పింది ఆయన మాటల్లోనే... 80 బ్రాండ్లు.. 6 వేల ఉత్పత్తులు.. ‘‘ప్రస్తుతం మా వద్ద జీసీ ఇండియా, జీడీసీ, ఐవోక్లార్, డెన్స్ప్లే, ప్రైమ్ డెంటల్, మనీ, ఎస్డీఐ, పీవో వంటి 80 రకాల బ్రాండ్లు, సుమారు 6 వేలకు పైగా ఉత్పత్తులున్నాయి. అమెరికాకు చెందిన వాక్యూక్లియర్ సంస్థతో ఎక్స్క్లూజివ్ ఒప్పందం చేసుకున్నాం. దీంతో విదేశీ మార్కెట్లో విడుదలయ్యే ఉత్పత్తులను మన దేశీయ విపణిలోనూ విక్రయించే వీలుంటుంది. ఈ ఏడాది ముగిసేనాటికి మరో రెండు కంపెనీల తోనూ ఎక్స్క్లూజివ్ ఒప్పందాలు చేసుకుంటాం. నేరుగా దంత వైద్య పరికరాలు, ఉత్పత్తుల తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకోవటం వల్ల ఇతరులతో పోలిస్తే 10 శాతం తక్కువ ధరకే మేం విక్రయిస్తాం. ఉత్పత్తుల డెలివరీ కోసం ఫెడెక్స్, డీటీడీసీ, డెల్హివరీ సంస్థలతో, 100 కిలోలు మించిన సరుకుల డెలివరీ కోసం ఈకార్గో, వీఆర్ఎల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రూ.20 కోట్ల నిధుల సమీకరణ... ఈ ఏడాది మార్చిలో అమెరికాకు చెందిన ఇద్దరు ఏంజిల్ ఇన్వెస్టర్లు మా సంస్థలో కోటి రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ముగిసే నాటికి సిరీస్-ఏలో భాగంగా రూ.20-30 కోట్ల నిధులు సమీకరించాలని నిర్ణయించాం. నెక్సస్ వెంచర్ వంటి ఒకటి రెండు వీసీ సంస్థలతో చర్చిస్తున్నాం. త్వరలో రోజువారీ ఆర్డర్ల విలువను లక్షకు, ఉత్పత్తుల సంఖ్యను 20 వేలకు చేర్చాలని లక్ష్యించాం. ప్రస్తుతం మా సంస్థలో 16 మంది ఉద్యోగులున్నారు. మరో వారం రోజుల్లో ఐఓఎస్ వర్షన్ యాప్నూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. వచ్చే ఏడాది మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకూ విస్తరించనున్నాం. ఆ తర్వాత ఆర్థోపెడిక్, నర్సింగ్ విభాగాల్లోకి కూడా వస్తాం.’’ రూ.4-5 కోట్ల వ్యాపార లక్ష్యం... ప్రస్తుతం 1,000-1,200 మంది డెంటిస్ట్లు కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 60 శాతం మంది రిపీటెడ్ కస్టమర్లే. రోజుకు రూ.40-50 వేల విలువైన ఆర్డర్లొస్తున్నాయి. నెలకు రూ.15-20 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఇందులో ఖర్చులన్నీ పోగా 6-7 శాతం లాభాలుంటాయి. ఈ ఏడాది ముగిసేనాటికి రూ.4-5 కోట్ల వ్యాపారాన్ని చేరుకోవాలని లక్ష్యించాం. ఎక్కువ ఆర్డర్లు ముంబై నుంచి వస్తున్నాయి. హైదరాబాద్ వాటా 10-15 శాతం ఉంటుంది. హైదరాబాద్లో పార్థా డెంటల్, డెంటిస్ట్, అపోలో వంటి వాటికి దంత వైద్య పరికరాలు, ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. మా సంస్థకు రిటర్న్లు 2-3% మధ్య ఉంటాయి. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఇంటి రిపేర్లకూ ఆన్లైనే!
• ప్లంబింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనర్ వరకూ.. • 2 నెలల్లో బెంగళూరు, చెన్నైలకు విస్తరణ • ఈ ఏడాది ముగింపులోగా రూ.5 కోట్ల నిధుల సమీకరణ • ‘స్టార్టప్ డైరీ’తో వే2 నిర్మాణ్ ఫౌండర్ సీతారామరాజు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంట్లోని నల్లా రిపేరుకొస్తుంది.. ప్లంబర్ ఎక్కడుంటాడో తెలియదు! పండగొస్తుంది.. ఇంటికి పెయింటింగ్ వేయించాలి.. కానీ, పెయింటర్ను ఎలా సంప్రతించాలో అర్థం కాదు!! ⇒ ఇవే కాదు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్.. ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి పనికీ ఎక్కడికెళ్లాలో అర్థం కాదు. మార్కెట్లోకెళితే.. మనకవసరమైన పనులు కాబట్టి.. వారు ఎంత చెబితే అంతే ఇవ్వాలి. లేకపోతే రారు.. చేయరు!! ⇒ ఇదిగో సరిగ్గా ఇలాంటి అనుభవమే సివిల్ ఇంజనీరు సీతారామరాజుకూ ఎదురైంది. చిన్న పనికి జేబులోని రూ.500 వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న రిపేర్లకూ జేబుగుల్ల చేసుకునే బదులు ఈ రంగానికి టెక్నాలజీని జోడించి.. వ్యవస్థీకృతం చేస్తే ఎలా ఉంటుందని!! ఇంకేముంది గతేడాది మేలో హైదరాబాద్ కేంద్రంగా వే2నిర్మాణ్.కామ్ ప్రారంభమైంది. ⇒ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటర్, మేస్త్రీ, పెయింటర్, ఇంటీరియర్ డిజైన్, ఎలివేషన్స్, ప్లాన్స్ వంటి ఇంటికి సంబంధించిన 10 రకాల సేవలందిస్తున్నాం. ఇందులో ఇంటీరియర్, ప్లాన్స్ సేవలు దేశవ్యాప్తంగా అందిస్తుంటే.. మిగతావి హైదరాబాద్కే పరిమితమయ్యాం. 2 నెలల్లో బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలు ఆరంభమవుతున్నాయి. ⇒ సాఫ్ట్వేర్ అభివృద్ధి, మార్కెటింగ్, ఉద్యోగుల నియామకం కోసం రూ.40 లక్షల వరకు ఖర్చయింది. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులు, ఐదుగురు ఐటీ నిపుణులున్నారు. వృత్తి నిపుణుల వివరాలను పూర్తిగా వెరిఫై చేశాకే నియమించుకుంటాం. వారితో అగ్రిమెంటు చేసుకుంటాం కాబట్టి సెక్యూరిటీ, నమ్మకమైన సర్వీసు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ⇒ సర్వీసు విషయంలో సామాన్య, ఎగువ తరగతులనే తేడా లేదు. ఎవరికైనా ఒకటే ధర. చేసిన పనికి మాత్రమే చార్జీ. కనిష్ట ధర రూ.100. ప్రస్తుతం రోజుకు 60-80 కాల్స్ వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మేస్త్రీ, ప్లంబింగ్, పెయింటింగ్ ఆర్డర్స్ ఉంటున్నాయి. ⇒ నెలకు రూ.10 లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పోగా.. రూ.2 లక్షల వరకు ఆదాయంగా మిగులుతోంది. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. ఈ ఏడాది రూ.5 కోట్ల నిధుల సమీకరిస్తాం. వారంరోజుల్లో ఆండ్రాయిడ్ యాప్ను తెస్తున్నాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
డెలివరీ స్పెషల్... ‘జిప్.ఇన్’
♦ అదేరోజు డెలివరీకి సొంత లాజిస్టిక్స్ ♦ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖల్లో సేవలు ♦ 6 నెలలకో మెట్రోకు విస్తరణ.. బెంగళూరుతో షురూ ♦ 5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో జిప్.ఇన్ ఫౌండర్ కిశోర్ గంజి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరంభించి నిండా ఏడాదిన్నర కూడా కాలేదు. కానీ 30 వేల మంది కస్టమర్లకు చేరువయిందీ అన్లైన్ కంపెనీ. అంతేకాదు! నెలకు రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేసే స్థాయికి చేరింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సేవలందిస్తున్న ఈ కంపెనీ... త్వరలో బెంగళూరుకు... అక్కడి నుంచి ప్రతి ఆరునెలలకు మరో మెట్రో నగరానికి విస్తరించాలని లక్షిస్తోంది. ఈ స్థాయికి చేరుకున్న జిప్.ఇన్ ప్రస్థానం... ఈ వారం ‘స్టార్టప్ డైరీ’లో... హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న జిప్.ఇన్ ప్రత్యేకత ఏంటంటే... ఆర్డర్ చేసిన రోజే సరుకులు డెలివరీ చేస్తుంది. ఉదయం ఆర్డర్ చేసినవారికి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా సరువులు వచ్చి వాలిపోతాయి. ఇందుకోసం సంస్థ ప్రత్యేక లాజిస్టిక్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అమెరికాలో ‘ఆస్టిర్’ పేరిట ఐటీ కంపెనీని ఏర్పాటు చేసిన కిశోర్ గంజి... 2014 డిసెంబర్లో ‘జిప్.ఇన్’ను ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా పనిచేస్తున్న ఆస్టిర్... ప్రస్తుతం 40 మిలియన్ డాలర్ల టర్నోవర్కు చేరుకుంది. హైదరాబాద్ ఏంజిల్స్ బోర్డ్ మెంబర్లలో కూడా కిశోర్ ఒకరు. ఇప్పటివరకు సుమారు 30 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ‘జిప్.ఇన్’ ప్రారంభం, విస్తరణ ప్రణాళిక గురించి మరిన్ని వివరాలు కిశోర్ మాటల్లోనే... ఈ రోజుల్లో ఆన్లైన్లో వ్యాపారానికి కస్టమర్లను ఆకర్షించడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ లాజిస్టిక్సే ప్రధాన సమస్య. ఎందుకంటే ఇచ్చిన ఆర్డర్ను సమయానికి డెలివరీ చేయాలి. అలా చేయకుంటే ఎంత మంచి కస్టమరైనా మరోసారి రాడు. అదే గడువులోగా డెలివరీ చేస్తే... కస్టమర్తో పాటు బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే... ఎక్కడైతే సమస్యలుంటాయో అక్కడే వ్యాపార అవకా శాలూ పుష్కలంగా ఉంటాయని! ఇదే జస్ట్.ఇన్ ప్రారంభానికి కారణమైంది. దేశంలో గ్రాసరీ విభాగంలో ఉన్న లాజిస్టిక్ సమస్యలను క్షుణ్నంగా తెలుసుకున్నాం. అందుకే ముందుగా వ్యవస్థీకృతమైన లాజిస్టిక్ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మరో కో-ఫౌండర్ వెంకట్తో కలిసి కోటి రూపాయల పెట్టుబడులతో 14 నాలుగు చక్రాల వాహనాలను లీజుకు తీసుకొని జిప్.ఇన్ను ప్రారంభించాం. నెలకు మిలియన్ డాలర్లు..: ప్రస్తుతం మాకు 30 వేల మంది కస్టమర్లున్నారు. ఇందులో 60-70% మంది రిపీటెడ్ కస్టమర్లే. నెలకు 5-6 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకుంటున్నారు. నెలకు మిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. డెలివరీకి కనీస ఆర్డర్ విలువ హైదరాబాద్లో అయితే రూ.500, విశాఖలో అయితే రూ.249గా నిర్ణయించాం. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆరు నెలలకో మెట్రోకు.. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలో సేవలందిస్తున్నాం. త్వరలోనే బెంగళూరుకు విస్తరిస్తాం. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఓ మెట్రో నగరంలో విస్తరించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం 5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. 8,500 ఉత్పత్తులు.. ప్రస్తుతం జిప్.ఇన్లో పండ్లు, కూరగాయలు, వంట సామగ్రి, కాస్మొటిక్స్, పూజా సామగ్రి, పెట్ కేర్, మాంసం... ఇలా సుమారు 15 విభాగాల్లో 8,500 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.5 నుంచి రూ.5వేల వరకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తుల సంఖ్యను 12 వేలకు పెంచుతాం. ఇందుకోసం రిటైలర్లు, హోల్సేలర్స్, రైతులు.. ఇలా పలువురితో ఒప్పందాలు చేసుకున్నాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
క్లాస్ బయటా... టీచర్తో టచ్లో!
♦ లెర్నింగ్ సొల్యూషన్ను అందిస్తున్న బ్లైండర్ ♦ యాప్తో విద్యార్థులు, టీచర్లకు డిజిటల్ సేవలు త్వరలో రూ.1.65 కోట్ల సమీకరణ ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో బ్లైండర్ కో-ఫౌండర్ సతీష్ నాంపల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లైండర్...! ఈ పేరు వింటే అంధుల కోసమో... మరొకటో అనిపిస్తుంది. కానీ నిజానికిది టీచర్లకు, విద్యార్థులకు వెలుగు దారి చూపిస్తుంది. అదెలాగంటే... ‘‘తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం పూర్తవగానే వెళ్లిపోతాడు. తర్వాత ఆ పాఠాన్ని విద్యార్థి రివిజన్ చేస్తున్నప్పుడు ఏదైనా సందేహం తలెత్తితే పరిస్థితేంటి? తెల్లారి మళ్లీ క్లాస్ రూమ్కు వస్తే గానీ టీచర్ను అడిగే అవకాశం ఉండదు. అదే సందేహం వచ్చిన వెంటనే సెల్ఫోన్లో పోస్ట్ చేస్తే! వెంటనే అటు నుంచి టీచర్ స్పందించి జవాబిస్తే!!. అంతేకాదు..! క్లాస్రూంలో రేపు ఏ అంశం మీద పాఠం ఉంటుందో ఉపాధ్యాయుడు ముందే బ్లైండర్లో పోస్ట్ చేయొచ్చు. అటు టీచర్, ఇటు స్టూడెంట్స్ ఇద్దరూ బాగా ప్రిపేరయి సదరు పాఠంపై లోతైన విశ్లేషణ సాగించొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఇవే బ్లైండర్ ప్రత్యేకతలు. సంస్థ ప్రత్యేకతల్ని, విస్తరణ ప్రణాళికల్ని బ్లైండర్ సహ వ్యవస్థాపకుడు సతీష్ నాంపల్లి ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... బ్లైండర్ ప్రారంభం గురించి చెప్పాలంటే ముందు మా గురించి కొంత చెప్పాలి. కాగ్నిజెంట్ ఐటీ కంపెనీకి అమెరికా, ఇండియాలో సీనియర్ డెలివరీ మేనేజర్గా 15 ఏళ్లు పనిచేశా. ప్రవీణ్, జోసెఫ్ ఫ్రీడ్, మార్క్ గార్బేడియన్ ముగ్గురూ నా సహోద్యోగులు. ప్రవీణ్ సోదరి ప్రశాంతి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఓ రోజు తన సోదరి నుంచి ఫోన్ వచ్చింది. క్లాస్ రూం బయటకు రాగానే విద్యార్థులకు, టీచర్లకు మధ్య ఏర్పడుతున్న దూరం, అవాంతరాలు చాలా ప్రమాదకరమని... ఇప్పటివరకు దేశంలో విద్యార్థులు, టీచర్లు, విద్యా సంస్థల్ని ఒకే ప్లాట్ఫామ్ మీదికి ఎవ్వరూ తీసుకురాలేదని, టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపించాలనేది ఆ ఫోన్ సారాంశం. అప్పటికే టెక్నాలజీ విభాగంలో మాకు పట్టుండటంతో క్లౌడ్ ఆధారిత సొల్యూషన్ను రూపొందించాం. ఇండియాలో ప్రారంభించే ముం దు దాన్ని అమెరికాలో పరీక్షించాలనుకున్నాం. అదే సమయంలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో స్టార్టప్ పోటీలు జరుగుతుండటంతో పాల్గొన్నాం. అందులో బ్లైండర్కు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ దక్కింది. 20 వేల డాలర్ల నగదు బహుమతిగా అందుకున్నాం. మరో రూ.70 లక్షల పెట్టుబడి తో బ్లైండర్ను ప్రారంభించాం. గతేడాది మార్చిలో అమెరికా, హైదరాబాద్లో బ్లైండర్ సేవలు ప్రారంభమయ్యాయి. టీచర్లు, విద్యార్థులు ఒకే వేదికపై.. దేశంలో విద్యా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్, అకడమిక్ అనే రెండు విభాగాలుగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ఫీజులు, అటెండెన్స్, హెచ్ఆర్ వంటి విభాగాలుంటే.. అకడమిక్లో పేపర్లు, పరీక్షలు, ఫలితాలు, గ్రేడ్ల వంటివి ఉంటాయి. అయితే అడ్మినిస్ట్రేషన్ పనిని సులువుగా చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ, అకడమిక్ విభాగంలో అంతగా లేవు. ఉన్న కొద్ది కంపెనీలు కూడా పాఠ్యాంశాలన్నిటినీ డిజిటైజ్ చేయటం, టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు క్లాస్ రూం అవసరం లేకుండా చూడటమో చేస్తున్నాయి. నిజానికి విద్యార్థుల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దేది నాలుగు గోడల మధ్య సాగే తరగతి గదే. ఓవైపు క్లాస్ రూంలో పాఠాలు సాగుతూనే.. సమయం పూర్తయ్యాక కూడా టెక్నాలజీ ఆధారంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని టెక్నాలజీతోనే అనుసంధానం చేయాలి. ఇదే బ్లైండర్ పని. అంటే క్లౌడ్ ఆధారంగా పనిచేసే లెర్నింగ్ మేనేజ్మెంట్ సొల్యూషన్. దీన్ని ఇంటర్నెట్ సాయంతో కంప్యూటర్, మొబైల్, ల్యాప్టాప్ ఇలా ఏ డివైజ్లోనైనా వినియోగించుకోవచ్చు. రూ.1.65 కోట్ల నిధులు... ఈ ఏడాది ముగిసే నాటికి కనీసం మూడు నాలుగు నగరాలకు విస్తరిస్తాం. బెంగళూరు, పుణె నగరాల్లోని పలు కళాశాలతో చర్చిస్తున్నాం. విస్తరణ నిమిత్తం తొలిసారిగా నిధులు సమీకరిస్తున్నాం. అమెరికాలోని పలువురు ప్రైవేట్ పెట్టుబడిదారులతో చర్చలు చివరి దశలో ఉన్నాయి. లీగల్ పేపర్ వర్క్ నడుస్తోంది. సుమారుగా రూ.1.65 కోట్ల (2.50 లక్షల డాలర్లు) నిధులను సమీకరించనున్నాం. మొదటి 6 నెలలు ఉచితం... ప్రస్తుతం మా సేవలను గుంటూరులోని వీవీఐటీ, జనగాంలోని సీజేఐటీఎస్లతో పాటుగా హైదరాబాద్లోని శ్రీనిధి, వర్ధమాన్, మల్లారెడ్డి గ్రూప్, వీబీఐటీ, సీవీఎస్ఆర్ వంటి సుమారు 33 కళాశాలలు వినియోగించుకుంటున్నాయి. చార్జీల విషయానికొస్తే.. మొదటి ఆరు నెలలు ఉచితంగా అందిస్తున్నాం. ఆ తర్వాత ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.500 ఫీజు తీసుకుంటాం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి బ్లైండర్ ఆండ్రాయిడ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ప్రచారంతో ప్రోత్సాహం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏదైనా సంస్థ నిలబడాలంటే.. ఓ మంచి ఆలోచన, ప్రజలకు ఉపయోగపడే సేవలు, దాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఉంటే చాలదు. వాటికి ప్రచారం కూడా అవసరమే మరి. అందుకే ఇలాంటి స్టార్టప్స్ సంస్థలను ప్రోత్సహించేందుకు ‘స్టార్టప్ డైరీ’ పేరుతో ప్రతి శనివారం ‘సాక్షి’ ఓ ప్రత్యేక కథనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. విద్య, వైద్యం, ఆరోగ్యం, షాపింగ్, మొబైల్స్.. ఇలా ప్రతి విభాగానికి సంబంధించిన ఓ కొత్త స్టార్టప్ను ఎంపిక చేసి.. ఆ సంస్థ ఆవిర్భావం నుంచి మొదలుపెడితే అందిస్తున్న సేవలు.. నిధుల సమీకరణ.. భవిష్యత్తు ప్రణాళిక.. వంటి సమస్త సమాచారాన్ని పాఠకులకు సవివరంగా సాక్షి సవివరంగా అందిస్తోంది. ప్రతి కంపెనీ సేవలు వేటికదే ప్రత్యేకం. సరికొత్త ఆలోచనలతో.. ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తోన్న కంపెనీల వివరాలు చూసిన పాఠకులు స్పందిస్తూ ఆయా స్టోరీలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. తమకు పాఠకులు మెయిళ్లు, ఫోన్లు చేసి అభినందించడంతో పాటు తమ స్టార్టప్స్ను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయా కంపెనీల యజమానులు ‘సాక్షి’కి చెపుతున్నారు. ఆ వివరాలు... విదేశీ కస్టమర్లు పెరిగారు.. ఇప్పటివరకు ఈకిన్కేర్.కామ్లో చాలా వరకు కస్టమర్లు స్థానికులు. కానీ, సాక్షి స్టార్టప్ డైరీలో మా సంస్థ అందిస్తున్న సేవలను ప్రచురించాక.. విదేశీ కస్టమర్ల సంఖ్య చాలా వరకు పెరిగిందని ఈకిన్కేర్.కామ్ సీఈఓ కిరణ్ కే కలకుంట్ల చెప్పారు. దాదాపు 350-400 మంది ఎన్నారైలు ఈకిన్కేర్. కామ్లో రిజిస్టర్ అయ్యారు. ఎన్నారైలు ఇక్కడున్న వారి తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆరోగ్య సంరక్షణ కోసం వారి మెడికల్ రికార్డ్లను ఈకిన్కేర్.కామ్లో రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో వారికొచ్చిన వ్యాధేంటి.. అది ఏ స్థాయిలో ఉంది? వాటి తాలుకు వివరాలను గ్రాఫులు, రంగుల రూపంలో తెలుసుకోవచ్చు. దీంతో వ్యాధి తీవ్రం కాకముందే నివారణ చర్యలు తీసుకోవచ్చు. పాఠశాలలు కదిలొచ్చాయ్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులంటే ఎందకో చిన్న చూపు. కారణం.. టీచర్లు, వసతులు సరిగా ఉండవని. అయితే సాక్షి స్టార్టప్ డైరీలో smartur3d.com గురించి వార్తా కథనం ప్రచురితమయ్యాక.. చాలా మందిలో అప్పటివరకున్న అభిప్రాయం తప్పనిపించిందంటున్నాడు సంస్థ సీఈఓ నీరజ్ జువెల్కర్. ‘‘మా పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా టఝ్చట్టఠట3ఛీ.ఛిౌఝ ద్వారా విద్యా బోధన చేస్తాం.. మీ సాఫ్ట్వేర్ను మాకు అందించండని’’ పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ మా కంపెనీకి మెయిల్స్, ఫోన్లు చేశారు. నావరకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సాఫ్ట్వేర్ను రూపొందించడం వెనక కారణం కూడా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉపయోగపడితే చాలని. రూ.10-12 లక్షల వ్యాపారం జరిగింది.. ఈ-కామర్స్ వ్యాపారాన్ని ఎం-కామర్స్ ఎలా అధిగమించనుంది.. భవిష్యత్తులో ఎం-కామర్స్ సైట్లకు డిమాండ్ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని సాక్షి స్టార్టప్ డైరీ చాలా విపులంగా వివరించింది. దీంతో చాలా మంది వ్యాపారులు ఎం-కామర్స్ సైట్ను డిజైన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపించారంటున్నారు మార్ట్మోబీ.కామ్ సీఈఓ సత్యక్రిష్ణ గన్ని. రూ.3 వేల ఖర్చుతో ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్ను రూపొందిస్తున్న మార్ట్మోబీ సేవలను చూసిన సుమారు 30-40 కంపెనీలు ఎం-కామర్స్ సైట్ను రూపొందించుకునేందుకు సంప్రదించాయి. వీటి ద్వారా మా సంస్థకు సుమారు రూ.10-12 లక్షల వ్యాపారం జరిగింది. -
చూస్తూ... చదువుకోవచ్చు
⇒ స్మార్టర్ త్రీడీతో అందుబాటులోకి ⇒ హైదరాబాద్లో 25 స్కూళ్లలో బోధన ⇒ యూఎస్, యూకే సహా విదేశాల్లోనూ ⇒ సర్కారీ స్కూళ్లకు ఉచితంగానే ఇస్తామంటున్న హైదరాబాద్ స్టార్టప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్బోర్డ్-చాక్పీస్కు అలవాటు పడ్డ క్లాస్ రూమ్... కొన్నాళ్ల కిందటే ఎల్సీడీ స్క్రీన్కు మళ్లింది. అయితే కంప్యూటర్ సాయంతో విద్యా బోధన చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లు భారీ ఫీజుల్ని వసూలు చేస్తుండటంతో దాన్ని చౌకగా మొబైల్కు మళ్లించాడు నీరజ్ జువెల్కర్. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్న ఈ హైదరాబాదీ... ఇందుకోసమే SMARTUR3D.COM ను ఆరంభించాడు. ప్రయోగాత్మకంగా చెబితేనే పాఠాలు అర్థమవుతాయనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఏవియేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో శిక్షణకు వినియోగిస్తున్న అగ్మెంటెడ్ రియాలిటీని తన సాఫ్ట్వేర్ ద్వారా క్లాస్రూమ్కూ తీసుకొచ్చాడు. ఆ వివరాలు ఈ వారం ‘స్టార్టప్ డైరీ’లో... ఆయన మాటల్లోనే... ప్రాక్టికల్గా చెబితేనే.. ‘‘ఏదైనా ప్రాక్టికల్గా ఒక్కసారి చూపిస్తే ఆ దృశ్యం మదిలో నిక్షిప్తమైపోతుంది. అందుకే అగ్మెంటెడ్ రియాలిటీతో smartur3d.com ను రూపొందించాం. దీంతో ప్రతి అంశాన్నీ ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. శరీరంలోని ప్రతి భాగాన్ని చూస్తూ, తాకుతూ.. క్షుణ్ణంగా అధ్యయనం చేయొచ్చు. ప్రస్తుతం 3 నుంచి 10వ తరగతి వరకు బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్లో, ఆ తర్వాత జాగ్రఫీతో పాటు అన్ని సబ్జెక్టుల్లోనూ రూపొందిస్తాం. ఈ సాఫ్ట్వేర్లో ప్రధానంగా ఇంటరాక్టివ్ త్రీడీ, అగ్మెంటెడ్ రియాలిటీ, స్టీరియో స్కోపిక్ త్రీడీ అనే మూడు విభాగాలుంటాయి. ఏక కణ జీవి అమీబా నుంచి సూక్ష్మ జీవులు, క్రిమికీటకాలు, చెట్లు, జంతువులు, మనుషులు... ఇలా అన్ని జీవుల శరీరాల్లోని బాహ్య, అంతర్భాగాలు ఇంటరాక్టివ్ 3డీ రూపంలో ఉంటాయి. అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా అయితే టెక్నాలజీ సహాయంతో నేరుగా చేతుల్లోకి తీసుకొని చదువుకోవచ్చు. స్టీరియో స్కోపిక్ త్రీడీ ద్వారా అయితే గూగుల్ కళ్లద్దాలను పెట్టుకొని మన కళ్ల ముందు కదలాడుతున్నట్లు చూస్తూ, శరీర భాగాల లోపలికి వెళ్లి అధ్యయనం చేయొచ్చు. ఆడియో సైతం మనకు కావాల్సిన అంశాన్ని కావాల్సిన భాషలో రికార్డు చేసుకుంటే... అదే భాషలో వినొచ్చు. విద్యార్థుల పరిజ్ఞాన స్థాయి, తరగతులను బట్టి శరీర భాగాల్లోని కొన్ని పార్ట్లను తొలగిస్తూ కూడా బోధించవచ్చు. హైదరాబాద్లో 25 పాఠశాలల్లో... ప్రస్తుతం హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్, హెచ్పీఎస్, స్టాన్లీ వంటి 25 పాఠశాలల్లోనూ... ముంబై, బెంగళూరు, పుణేల్లోని 150 పాఠశాలల్లోను; యూకే, కెనడా, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లోని 600 పాఠశాలల్లోను ఈ సాఫ్ట్వేర్ ద్వారా బోధిస్తున్నారు. దీని కోసం నెలకు రూ.2,500 చెల్లిస్తే చాలు. కంప్యూటర్లో, ఆండ్రాయిడ్ మొైబె ల్స్లో ఎందులోనైనా వేసి... దాన్ని కావాల్సిన స్క్రీన్కు కనెక్ట్ చేసి సులభంగా విద్యార్థులకు బోధించవచ్చు. తయారీకి మూడేళ్లు.. ఈ సాఫ్ట్వేర్ రూపొందించడానికి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర స్థాయి విద్యా బోర్డులతో పాటు అన్ని దేశాల్లోని విద్యా వ్యవస్థలను అధ్యయనం చేశా. అన్ని సిలబస్లలో కామన్గా ఉన్న పాఠ్యాంశాలను తీసుకొని దీన్ని రూపొందించా. అందుకే దీని తయారీకి మూడేళ్లు పట్టింది. రూ.3 కోట్లు ఖర్చయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా.. తెలంగాణలో 44 వేల పాఠశాలలున్నాయి. వీటిలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలు. మిగతావన్నీ ప్రయివేటువే. ప్రయివేటు స్కూళ్లకి కంప్యూటర్ల ద్వారా చదువులు చెప్పటం పెద్ద సమస్యేమీ కాదు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం ప్రోత్సహిస్తే రాష్ట్రంలోని సర్కారీ స్కూళ్లన్నిటికీ ఈ సాఫ్ట్వేర్ను ఉచితంగా అందిస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
మీ ‘కేర్’ మీ చేతుల్లోనే...
అద్భుతాలు చేయడానికి బడా బడా కంపెనీలే అక్కర్లేదు. మల్టీ మిలియన్ డాలర్ల పెట్టుబడీ అవసరం లేదు. ఓ మంచి ఐడియా... దాన్ని నెరవేర్చుకోవాలన్న సంకల్పం... నెరవేర్చుకునే నైపుణ్యం... ఈ మూడూ ఉంటే చాలు. నిజమే! ఈ మూడు లక్షణాలతో మొదలైన స్టార్టప్లు అద్భుతాలు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి స్టార్టప్ కంపెనీలను వెదికి... వాటి వివరాలను పాఠకులకు అందించటాకే ‘సాక్షి’ ఈ ‘స్టార్టప్ డైరీ’ని ఆరంభిస్తోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నుంచి నివేదికలన్నీ ఆన్లైన్లోనే ⇒ అదికూడా... అర్థమయ్యే భాషలో సరళీకరణ ⇒ హైదరాబాదీ స్టార్టప్ ‘ఈ కిన్కేర్’ ఉచిత సేవలు ⇒ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టిన విదేశీ సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హలో... అమ్మా ఒంట్లో ఎలా ఉంది? టైంకి మందులేసుకుంటున్నారా? మళ్లీ చెకప్కు డాక్టర్ ఎప్పుడు రమ్మన్నాడు? ఎవరైనా ఎన్నారై తన ఇంటికి ఫోన్ చేస్తే చాలు... ఈ మాటలు ఉండాల్సిందే. తరవాత తల్లిదండ్రులు చెప్పిన వివరాలు విని ఆదుర్దా పడటం... వీలైతే తనకు తెలిసిన ఓ డాక్టర్నో, ఆసుపత్రినో సూచించటం. ఇప్పటిదాకా అంతే!! అయితే ఇలాంటి చెకప్లకు చెక్ పెడుతోంది ekincare.com.ఫోన్లో మాట్లాడటంతోనే వదిలిపెట్టకుండా ఆ ఫోన్లోనే మనవాళ్ల ఆరోగ్య వివరాలూ తెలుసుకునేందుకు వీలుగా ఈ స్టార్టప్ను ఏర్పాటు చేశారు హైదరాబాద్కు చెందిన కిరణ్ కే. కలకుంట్ల. కంపెనీకి సంబంధించి ‘సాక్షి’తో ఆయన ఏం చెప్పారంటే... అమెరికా ఉద్యోగం వదిలిపెట్టి... హైదరాబాద్లోని గోకరాజు రంగరాజు కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2004లో ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్లా. నాకైతే చిన్నప్పటి నుంచీ సొంత కంపెనీ పెట్టాలని ఉండేది. యూఎస్లో టెలికం సేవల కంపెనీ ఐటీఅండ్టీలో నార్త్ అమెరికా మేనేజర్గా పనిచేశా. 2013లో ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చా. జనానికి, సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఓ కొత్త కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా. మొదట్లో ఎవరూ నా నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. బంగారంలాంటి ఉద్యోగం వదిలేసి ఎదుకొచ్చావన్నారు. అయినా బాధపడలేదు. నాకైతే నమ్మకం ఉంది. సొంత కంపెనీ పెట్టి ఎదుగుతానని. ఆ పేరెందుకంటే... e ఎలక్ట్రానిక్స్... kin కుటుంబీకులు/బంధువులు/శ్రేయోభిలాషులు... care శ్రద్ధ అని అర్థం. అంటే మొత్తంగా చూస్తే.. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ద్వారా మన వాళ్ల ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ వహించడమన్నమాట. మా సేవలు కావాలంటే... ekincare సేవలు వినియోగించుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ekincare యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్లో భద్రపరచాలనుకుంటున్న మెడికల్ రికార్డులను, రిపోర్టులను, ప్రిస్కిప్షన్స్ను, డాక్టర్ సమ్మరీలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా ఫొటో తీసి యాప్లోకి అప్లోడ్ చేయాలి. సులువుగా అర్థమయ్యేలా... డాక్టర్ ప్రిస్క్రిప్షన్గానీ, ల్యాబ్ రిపోర్టులు గానీ ఇవేవీ మనకు సులువుగా అర్థమయ్యేవి కావు. డాక్టర్ చెప్పింది నమ్మడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. కానీ, ekincareలో మాత్రం వచ్చిన వ్యాధేంటి? అది ఏ స్థాయిలో ఉంది? వంటి విభిన్న కోణాల్లో విశ్లేషిస్తూ.. క్లయింట్లకు అర్థమయ్యే భాషలో వాటిని సరళంగా చెబుతాం. వాటి వివరాలను గ్రాఫులు, రంగుల రూపంలో తెలియజేస్తాం. (ఎరుపు రంగుంటే ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు.. పసుపు రంగుంటే జాగ్రత్తలు తీసుకుంటే మేలని గుర్తుగా..) సంబంధిత వ్యాధి తాలూకు చరిత్ర, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తాం. తలనొప్పి నుంచి మొదలుపెడితే గుండె పోటు వరకు సుమారు 150కి పైగా వ్యాధులకు సంబంధించిన రికార్డులను ఆన్లైన్లో భద్రపరచుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,500కి పైగా ఆసుపత్రుల్లో... దేశవ్యాప్తంగా 1,500కు పైగా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు మా సంస్థతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో డాక్టర్ అపాయింట్మెంట్లను కూడా మా యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారి రిపోర్ట్లు పరీక్షల తరవాత నేరుగా మేమే తీసుకుంటాం. వాటిని సరళీకరించి యాప్లో అప్లోడ్ చేస్తాం. క్లయింట్ నేరుగా తన మొబైల్లోనే వీటిని చూసుకోవచ్చు. తర్వాతి చెకప్ మళ్లీ ఎప్పుడుం టుందో ముందుగానే చెబుతాం కూడా. ప్రస్తుతం అపోలో డెంటల్, మాక్సి విజ న్, పార్థ డెంటల్, వాసన్ ఐ కేర్, విజయ డయాగ్నస్టిక్స్, తపాడియా, థైరో కేర్, డాక్టర్ లాల్ ఆసుపత్రులతో కంపెనీ అనుసంధానమై ఉంది. త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ఆసుపత్రుల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. త్వరలో హోమ్ హెల్త్కేర్లోకి... ఇప్పటివరకు క్లయింట్స్ నివేదికలను ఆన్లైన్లో భద్రపరచడమే చేస్తున్నాం. ఈ నెలాఖరుకల్లా డయాబెటిస్, అధిక రక్తపోటు, కార్డియో వాస్క్యులర్ (గుండె- రక్తనాళాలకు సంబంధించి) వ్యాధులకు చికిత్సలు కూడా చేస్తాం. అది కూడా నేరుగా ఇంటికి వెళ్లి. దీనికోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్లను నియమించాం. ఆ రోగుల నివేదికలను కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తాం. రూ.2 వేలకు కుటుంబంలోని ఇద్దరికి మొత్తం బాడీ చెకప్ చేస్తాం. ఇందులో సుమారుగా 70 రకాల చెకప్లుంటాయి. రూ.2 కోట్ల పెట్టుబడులు..: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి కంపెనీని ప్రారంభించా. గతేడాది నవంబర్లో మార్కెట్లోకి వచ్చాం. ప్రస్తుతానికి కంపెనీలో 1,000 మంది క్లయింట్లు రిజిస్టరై ఉన్నారు. ఇటీ వలే బిట్చెమీ వెంచర్ క్యాపిటల్, యూఎస్ కంపెనీ అయిన అడ్రాయిటెంట్ కంపెనీలు రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిని పూర్తిగా కంపెనీ విస్తరణ, మార్కెటింగ్ కోసం వినియోగిస్తున్నాం. అద్భుతమైన స్టార్టప్ ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే bussiness@sakshi.com కు మెయిల్ చేయండి....