-
సాధారణ స్థితికి విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/కాకినాడ/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వస్తోంది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి అవకాశంలేని చోట్ల తాత్కాలిక చర్యలతో విద్యుత్ను పునరుద్ధరించారు. దీంతో గురువారం సాయంత్రానికి రాష్ట్రమంతటా దాదాపు 98 శాతం విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. మిచాంగ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థల ప్రయత్నాలు ఫలించాయి. ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన పునరుద్ధరణ.. ఏపీఎస్పీడీసీఎల్లో 231 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 17 ఫీడర్లు ప్రభావితం కాగా, ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని ఫీడర్లు గురువారం రాత్రికి పునరుద్ధరించారు. నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్లలో దెబ్బతిన్న మూడు ఈహెచ్టీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు 269, 33 కేవీ ఫీడర్లు 145, 33 కేవీ ఫీడర్లు, 32 కేవీ స్తంభాలు 770, 11 కేవీ 2,341 స్తంభాలు, 247 డీటీఆర్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. నెల్లూరు సర్కిల్లో 33/11కేవి సబ్స్టేషన్లు 36 పూర్తిగా చెడిపోగా, పునరుద్ధరించారు. రూ.1,235.45 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో 33 కేవి సబ్స్టేషన్లు 150, 33 కేవీ ఫీడర్లు 134, 33 కేవీ పోల్స్ 16, 11కేవీ పోల్స్ 514, 173 డీటీఆర్లు దెబ్బతినగా, అన్నిటినీ సాధారణ స్థితికి తెచ్చారు. డిస్కం మొత్తం మీద రూ.545.98 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు సర్కిళ్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 204, 33కేవీ ఫీడర్లు 147, 33 కేవీ స్తంభాలు 115, 11కేవీ పోల్స్ 1,247, డీటీఆర్లు 504 పాడవ్వగా, అన్నిటినీ బాగుచేశారు. రూ.1,995.57 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. -
పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషిట్ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్ 5న చెర్ల పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్లు 2023 మార్చిలో డ్రిల్ మిషన్, మే 2023లో ఒక లేథ్ మిషన్ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది. -
చైనాకు షాక్.. భారత్ నుంచి తైవాన్కు వేలాది కార్మికులు!
చైనాకు గట్టి షాక్ ఇచ్చే పని చేస్తోంది భారత్. పక్కనే ఉన్న తైవాన్ దేశానికి వేలాది మంది కార్మికులను పంపనుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో కార్మిక ఒప్పందం జరగనుందని తెలిసింది. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్కు చెందిన వర్కర్లను నియమించుకోనుంది. ఎంప్లాయిమెంట్ మొబిలిటీ అగ్రిమెంట్పై డిసెంబర్లో భారత్, తైవాన్లు సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు. తైవాన్లో వయసు పైబడినవారి జనాభా పెరిగిపోయింది. ఫలితంగా పనిచేసే సామర్థ్యం ఉన్న యువతకు అక్కడ కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. అదే సమయంలో భారత్లో దీనికి విరుద్ధ పరిస్థితి నెలకొంది. దేశంలో యువత జనాభా పుష్కలంగా ఉంది. లేబర్ మార్కెట్లోకి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి చేరుతున్నారు. అయితే ఈ ఉపాధి ఒప్పందం చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా చైనాకు నచ్చదు. తైవాన్ స్వతంత్ర ప్రాంతంగా ఉన్నప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది. ధ్రువీకరించిన అధికారి భారత్-తైవాన్ ఉపాధి ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాకు తెలియజేశారు. అయితే తైవాన్ కార్మిక శాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తమ దేశానికి కార్మిక సహకారం అందిస్తే స్వాగతిస్తామని బ్లూమ్బర్గ్ వార్తా సంస్థకు చెప్పింది. కాగా భారత్ ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, యూకే సహా 13 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లతోనూ ఇదే విధమైన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
పరువు పోగొట్టుకున్న రామోజీ !
-
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, డి. శ్రీధర్బాబు, ఫిరోజ్ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
దిగొస్తున్న టమాటా ధర
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులుగా వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. టమాటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత జూలైలో కిలో ఏకంగా రూ.250 పలికిన టమాటా ధర ప్రస్తుతం రూ.100–120 మధ్యకు చేరుకుందని తెలిపింది. ఈ ధరలు వచ్చే సెపె్టంబర్ రెండో వారానికి సాధారణ స్థాయికి అంటే కిలో రూ.30–40కి చేరుకుంటాయని అంచనా వేసింది. మహారాష్ట్ర నాసిక్లోని పింపాల్గావ్ బస్వంత్ మార్కెట్కు వారం రోజులుగా టమాటా రాక ఆరు రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు వంటి కీలక మార్కెట్లకు కూడా ట మాటా సరఫరా పెరిగింది. ఢిల్లీలో మొన్నటివరకు కిలో రూ.220గా ఉన్న టమాటా ధర శుక్రవారం రూ.100 వరకు పలికింది. -
హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్, గంజాయి సీజ్
-
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్ హోల్సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
కాళేశ్వరానికి కరెంట్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పంప్హౌజ్ల నిర్వహణకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్కో సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే విద్యుత్ను వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖకు అనుమతిస్తోంది. సౌర విద్యుదుత్పత్తి లభ్యత ఉండే పగటి వేళల్లోనే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎల్డీసీ) స్థానిక సబ్ స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నిరంతరంగా నడపాలనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రాజెక్టు పంపులను డిజైన్ చేయగా, నిరంతర విద్యుత్ లేక తరచుగా పంపుల ను ఆపాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని చోట్లలోని పంపుల్లోని విడిభాగాలు దెబ్బతిన్నాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలియజేశారు. వాడింది 240 మెగావాట్లే! కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు నిర్వహణ అవసరాలకు మొత్తం 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ప్రాజెక్టులో భాగంగా 109 పంపులను నిర్మించారు. ప్రస్తుత వానాకాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో గత నెల తొలివారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకమ్మసాగర్లలోకి నీళ్లను ఎత్తిపోశారు. మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు నీళ్లను ఎత్తిపోసే పంప్హౌజ్లో చెరో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు ఉండగా, ఒకే పంప్ను నడిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్కి నీళ్లను ఎత్తిపోసే పంప్హౌజ్లో చెరో 134 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులుండగా, అక్కడ సైతం ఒకే పంప్ను నడిపారు. దాదాపు 10 రోజుల పాటు పగటి వేళల్లో పంపులను నడిపి 3 టీఎంసీల వరకు నీళ్లను ఎత్తిపోసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మళ్లీ వర్షాలు ప్రారంభం కాగా పంపింగ్ను నిలుపుదల చేశారు. రెండు పంపులు కలిపి మొత్తంగా 240 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, పగటి పూట మాత్రమే సరఫరా చేసేందుకు ట్రాన్స్కో అనుమతిచ్చింది. యాదాద్రి విద్యుత్ వస్తే.. తీవ్ర వర్షాభావ సమయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి గరిష్టంగా 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ మేరకు విద్యుత్ను నిరంతరంగా సరఫరా చేయడంట్రాన్స్కోకు పెను సవాలేనని భావిస్తున్నారు. నిర్మాణం చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి, 1600 మెగావాట్ల తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ కష్టాలు తప్పే అవకాశాలున్నాయి. -
Petro Prices : త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ?
మరోసారి భారత్లో పెట్రోల్, డీజిల్ ధలరకు రెక్కలు రానున్నాయా ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ....ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరుగబోతున్నాయి ? మొన్నటి వరకు భారత్కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా ? ముడిచమురు కోసం ఒకటి రెండు దేశాలపై ఆధారపడటమే భారత్కు శాపంగా మారిందా ? డిస్కౌంట్ ఫట్.. రేట్లు అప్ మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలుకు రెక్కలు రాబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒపెక్ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్ 30 డాలర్లకే భారత్కు ముడిచమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్ను డిస్కనెక్ట్ చేసింది రష్యా దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. The rest of Europe needs cheap and plentiful amount of food, to feed their welfare parasites. No Russian sanctions on their grain trade. I think Russia's goal with Ukraine has larger implications for eastern trade alliances developing in the energy markets without the petro$$$$$$ pic.twitter.com/tBTNS5McTq — Snuff Trader (@SnuffTrader) July 6, 2023 మన వాటా ఎంత? ఎంతకు కొంటున్నాం? ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా బ్యారెల్పై 4 డాలర్ల వరకు మాత్రమే పరిమితం చేసింది. అదీకాక రవాణా ఛార్జీలను కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇపుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44శాతానికి పెరిగింది. పశ్చిమ దేశాల ఆంక్షలెందుకు? 2022లో పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్పై బ్యారెల్కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇపుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనపబడుతోంది. క్రూడాయిల్ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. Ruble surrendered long before the rest of Russia, has lost 40% of its worth since the 2022 invasion. This would be difficult for any country, far more shocking for a petro-state. Russia is Venezuela w/ bigger army. pic.twitter.com/Uf7F8yumMs — steve from virginia (@econundertow) July 6, 2023 అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు రష్యా ఉక్రేయిన్ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ధర 80-100 డాలర్ల దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడిచమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గిందని కొంత మంది చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. మనకెంత ధర? రష్యాకు ఎంత ఖర్చు? ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ ముడిచమురు ధర 77 డాలర్ల దగ్గర ఉంది ఈ లెక్కన రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధర రవాణా ఛార్జీలతో కలిపితే ఇంచు మించు అంతే మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఇపుడు భారత్ మరోసారి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేశిస్తోంది. అదీకాక మరోసారి రష్యా కంపెనీలతో బేరమాడేందుకు ఇండియాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా ఐరోపాల నుంచి రష్యా చమురుకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది సో.. ఇది భారత ప్రభుత్వానికి కలిసివచ్చే అవకాశం. సామాన్యుడి పరిస్థితేంటీ? మన ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రష్యా నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. సో మనం కనుక మరోసారి రష్యాతో బేరమాడితే మనకూ తక్కువ ధరలో చమురు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఉన్న నష్టాలతో రిటైల్ మార్కెట్లో కామన్ మ్యాన్కు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదనేది నిజం. అంతర్జాతీయంగా ఎలా ముడిచమురు ధరలు ఉన్నా సామాన్యుడికి మాత్రం ప్రయోజనం శూన్యం అనేది నిపుణులు చెపుతున్నమాట. రాజ్ కుమార్, బిజినెస్ కరస్పాండెంట్ -
మంచి నీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్
-
చింతబావి బస్తీలో నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా
-
విద్యుత్ పాదుపు..ప్రగతికి మలుపు
-
అన్నదాతను అనుసంధానించాలి
ఇది సమాచార విప్లవ యుగం. సరైన సమాచారం ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ ఉంటే ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రైతన్నకు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. చాలా సందర్భాలలో ఉత్పత్తి దారులూ, వినియోగదారులూ ఒకే ప్రాంతంలో ఉన్నా ఆ విషయం వారికి తెలియక దూర ప్రాంతాల వారితో క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఉదాహరణకు నా దృష్టికి వచ్చిన ఉదంతం చెబుతాను. సత్యసాయి జిల్లా కదిరిలో పండిన వేరుశనగ వంగడాన్ని నల్లగొండ జిల్లా వాసి కొనుగోలు చేశాడు. కదిరి ప్రక్కనే ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండల వాసికి కదిరిలో ఆ వంగడం ఎవరిదగ్గర ఉందో తెలియక దళారీ ద్వారా నల్లగొండ జిల్లా వాసి నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుబాటులో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సహజంగా ఏ వస్తువైనా ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల అమ్మకపుదారు నుండి ధరలో రాయితీ లభిస్తుంద న్నది వాస్తవం. మన చుట్టు పక్కల వినియోగదారులను కలిపే ఒక అప్లికేషన్ లాంటిది ఉంటే ఒక వీధిలోనో లేదా ఊరులోనో ఉన్నవారందరూ ఉమ్మడిగా తక్కువ ధరకు కొని సరుకును పంచుకోవచ్చు. అలాగే అమ్ముకునేవారికీ ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు అమ్ముడుపోయి లాభం కలుగుతుంది. చాల సందర్భాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రత్యేకత ఉన్నా దానిని లాభదాయకంగా అమ్ము కోవడంలో రైతు విఫలమవుతున్నాడు. రైతుల ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియజేసే ఒక సమాచార వ్యవస్థ ఉంటే వారికి లాభదాయకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ప్రసిద్ధిగాంచిన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నా ఇంకొక ప్రాంతం వారికి అంతగా తెలియడం లేదు. ఉదాహరణకు రుచికరమైన కోనసీమ చక్కరకేళి అరటిపండ్లు నేపాల్ దేశానికి ఎగుమతి చేస్తారు. 2015 సంవత్సరంలో నేపాల్లో సంభవించిన భూకంపం వల్ల వాటిని ఎగుమతి చేయలేక, రోడ్ల మీద పడవేయ వలసి వచ్చింది. నిజానికి రాయలసీమ ప్రాంతంలో వాటి గురించి చాలా తక్కువగా తెలుసు. ఒక వేళ తెలిసి ఉంటే కనీస ధరకన్నా కోనసీమ రైతుల దగ్గర రాయలసీమ వినియోగదారులు కొనుక్కుని ఉండేవారు. పైన పేర్కొన్నట్లు రైతులకూ, వినియోగదారులకూ సరైన సమాచారం అందించడానికి సచివాలయ వ్యవస్థను బాగా వాడుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రైతు భరోసాకేంద్రాలను అనుసంధానించాలి. ఆయా గ్రామాల్లో పండించే పంటల వివరాలను, రైతు ఫోన్ నంబరుతో సహా సచివాలయ వెబ్సైట్లో ఉంచాలి. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలన్నింటినీ అనుసంధానించి సమాచారం అందరికీ అందుబాటులో ఉంచే సమాచార వ్యవస్థను రూపొందించగలిగితే దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఆయా సచివాలయ సిబ్బందితోగానీ లేదా రైతుతోగానీ సంప్రదించి కొనుగోలు చేసే సౌకర్యం కలుగుతుంది. ఇందులో దళారీల ప్రమేయం లేదు కాబట్టి అటు రైతుకూ, ఇటు కొనుగోలుదారునికీ కూడ ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రత్యేక అప్లికేషన్ను ఉపయోగించి ఒక్కో సచివాలయం పరిధిలోని ప్రజలను ఒక కొనుగోలు దారుల గ్రూపుగా తయారుచేయవచ్చు. ఉదాహరణకు సచివాలయ పరిధిలోని ప్రజలు కలసి టమోటా అవసరమనుకుంటే వాటిని ప్రక్క గ్రామంలో ఉన్న రైతే నేరుగా సరసమైన ధరకు అందించవచ్చు. గూగుల్ యాప్లో తమకు కావలసిన వస్తువులు దగ్గరలో ఎక్కడ దొరకుతాయో వెబ్సైట్లో వెతికి తెలుసుకునే సౌకర్యం ఉంది. అటువంటి సౌకర్యమే ఈ అప్లికేషన్లో పొందు పరచవచ్చు. కేవలం రైతు పండించే పంటలకే కాక చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల వివరాలనూ ఈ సమాచార వ్యవస్థలో భాగం చేయాలి. ఇందువల్ల రాష్ట్రంలో ఏఏ ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయో తెలియడమే గాక వాటికి ఉన్న డిమాండ్ కుడా తెలుసుకోవచ్చు. ఇలా సప్లయ్, డిమాండ్ల సమాచారం తెలియడం వల్ల వాటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా అయితే ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ మేలు చేకూరుతుంది. - డాక్టర్ జి.వి. సుధాకర్రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు -
AP: వరద బాధితులకు సాయం..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ
గోదావరి ఉగ్రరూపం కారణంగా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలకు రూ. 2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, రేషన్, పశుగ్రాసాన్ని అధికారులు అందిస్తున్నారు. ఇక, అల్లూరి సీతారామారాజు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వదర ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి.. 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 36.1 మీటర్లకు వరద నీరు చేరుకుంది. 48 గేట్ల ద్వారా దిగువకు 19.58లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తోంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏటిగట్టు ఫుట్పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. ఈ క్రమంలో ఫుట్పాత్ రెయిలింగ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, వశిష్ట గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. కానీ, ఇంకా ముంపులోనే 33 లంక గ్రామాలు ఉన్నాయి. -
YSR Jagananna Colonies: కావాల్సినంత ఇసుక
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ పక్కా ఇంటి భాగ్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఆచరణలోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా లే అవట్లను వేసింది. వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేసి స్థలాలను కేటాయించింది. విశాలమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని విరివిగా సమకూర్చుతోంది. అందులో భాగంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. దీనికోసం ప్రతి మండలంలోనూ ఒక్కొక్కటి చొప్పు న స్టాక్ పాయింట్ను జిల్లా అధికారులు ప్రారంభించారు. సమీప ఇసుక డిపోల నుంచి వాటికి ఇసుకను చేరవేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా జారీ అయిన బిల్లుల ఆధారంగా ఇప్పటివరకూ 17 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా గృహాల లబ్ధిదారులకు సమకూర్చారు. ఆ బిల్లులపై హాలోగ్రామ్ ఉండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. 77 రీచ్లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని నాలుగు డిపోల్లో మంగళవారం నాటికి 41,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడమే తరువాయి!. ఇళ్ల మంజూరు ఇలా... పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 80,547 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో చాలా ఇళ్ల నిర్మాణ పను లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 17వేల ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాల్సి ఉంది. వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతి లేఅవుట్లోనూ ఇళ్ల నిర్మాణాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేనివారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సక్రమంగా ఇసుక అందేలా... ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. గతంలో ఇసుక సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జేపీ పవర్ కన్స్ట్రక్ష న్స్కు ఇసుక సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రీచ్ల నుంచి లారీల్లో ఇసుక జిల్లాలోని నాలుగు డిపోలకు వస్తోంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు సులువుగా చేరవేసేందుకు వీలుగా మండలానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 77 ఇసుక రీచ్లు ఉన్నా యి. వీటిలో ఒక్కోచోట వెయ్యి నుంచి రెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతోంది. ఆ ఇసుకను డిపోలకు, అక్కడి నుంచి స్టాక్ పాయింట్లకు తీసుకొస్తున్నారు. అక్కడ ఇళ్ల లబ్ధిదారులకు హాలోగ్రామ్ ఉన్న బిల్లుల ఆధారంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని జేపీ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి హర్షవర్దన్ ప్రసాద్ చెప్పారు. ఇసుక పక్కదారి పట్టకుండా... గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ జనరేట్ చేసి ఇచ్చిన బిల్లును లబ్ధిదారులు స్టాక్ పాయింట్కు తీసుకెళ్లి చూపిస్తే ఇసుక ఇస్తున్నారు. చేతిరాతతో ఇస్తే కుదరదు. హలోగ్రామ్ బిల్లులతో ఇసుక పక్కదారి పట్టకుండా నిరోధించగలుగుతున్నారు. సత్వరమే బిల్లుల చెల్లింపు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ద్వారా బిల్లులను వారంలోగా జనరేట్ చేస్తున్నారు. ప్రతీ మండలం నుంచి ఆయా ఏఈలు, డీఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు వారి వ్యక్తిగత ఖాతాలకు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక, సిమెంట్ కొరత లేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. ఇనుము కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రతి లబ్ధిదారునికీ వారంలోగా బిల్లులు వారి ఖాతాల్లోకి జమవుతున్నాయి. – ఎస్వీ రమణమూర్తి, ప్రాజెక్టు డైరెక్టర్, గృహనిర్మాణ శాఖ, విజయనగరం -
చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ!
న్యూఢిల్లీ: సరఫరాల్లో సమస్యల కారణంగా కొత్త స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల తయారీ తగ్గింది. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల విచక్షణారహిత వినియోగానికి ప్రజలు వెనుకాడుతున్నారు. ఫలితంగా రీఫర్బిష్డ్ ఫోన్లకు (నవీకరించినవి) గిరాకీ ఏర్పడింది. 2019తో పోలిస్తే రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు 2020లో రెట్టింపునకు పైగా పెరిగాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. యంత్రా అన్నది మొబైల్ రిపేర్, రీఫర్బిష్డ్ సేవల్లోని కంపెనీ. ఈ సంస్థ సీఈవో జయంత్జా మాట్లాడుతూ.. రూ.4,000–6,000 ధరల శ్రేణిలోని రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ల నిల్వలు కేవలం 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్టు చెప్పారు. ల్యాప్టాప్లతో పోలిస్తే నవీకరించిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు గడిచిన ఏడాది కాలంలో అధికంగా ఉన్నాయని చెప్పారు. హ్యాండ్సెట్లపై ఆధారపడడం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. వచ్చే 12–18 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 750 పట్టణాలకు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు 450 పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. యంత్ర ప్లాట్ఫామ్ వినియోగించిన ఫోన్లను ఆన్లైన్ వేదికగా కొనుగోలు చేస్తుంటుంది. వాటిని నిపుణులతో తనిఖీ చేయించి తిరిగి మంచి స్థితిలోకి తీసుకొచ్చి (రీఫర్బిష్డ్) విక్రయిస్తుంటుంది. కొత్త ఫోన్ల మాదిరే రీఫర్బిష్డ్ ఫోన్లపైనా ఆరు నెలల వరకు వారంటీ లభిస్తుంది. కరోనా రాకతో ఆన్లైన్ వినియోగం పెరగడం తెలిసిందే. ఎన్నో సేవలను ఫోన్లలోని యాప్ల సాయంతో పొందుతున్నారు. విద్యార్థులు సైతం ఆన్లైన్ పాఠాలకు మళ్లడం చూశాం. ఈ పరిస్థితులు ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఫోన్లకు డిమాండ్ను పెంచేశాయి. 4.8 కోట్ల విక్రయాలు.. గతేడాది కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్లు ప్రకటించడం తెలిసిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో కరోనాతో చైనాలోని విమానాశ్రయలు, ఓడరేవుల్లో కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించాల్సి వచ్చింది. దీంతో చైనా నుంచి మన దేశానికి వచ్చే విడిభాగాలకు సమస్యలు ఏర్పడ్డాయి. ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో డిమాండ్ పెరగడం వంటి పరిస్థితులు పాత ఫోన్లకు డిమాండ్ను తెచ్చిపెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులు ఇప్పుడు రూ.30వేల ల్యాప్టాప్లు, రూ.10,000–15,000 ధరల శ్రేణిలోని స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపడం లేదని పరిశోధనా సంస్థ ఐడీసీ అంటోంది. 2019లో 2–3 కోట్ల రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్లు అమ్ముడుపోగా.. 2021లో 4.8 కోట్ల రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు నమోదు కావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. జగనన్న కాలనీలకు ఇసుకను నేరుగా రీచ్ల నుంచి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ-పర్మిట్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ముందుగా నిల్వలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 50 లక్షల టన్నులకుపైగా ఇసుక నిల్వ చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకి 3 లక్షల టన్నుల ఇసుక తీస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి -
‘ఏపీలోనే కాదు.. యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదు’
సాక్షి,అమరావతి: వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నా బిడ్లు దాఖలు చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో 2 వారాల గడువిస్తామని చెప్పారు. అయితే గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏపీలోనే కాదు యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని వెల్లడించారు. కాగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎంలందరికీ సీఎం జగన్ లేఖలు తెలిపారు. చదవండి: ‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు’ -
కరోనా వ్యాక్సిన్ ఆన్లైన్లో దొరకనుందా..!
దేశ ప్రజలకు కరోనా టీకాలను చేరువ చేయడంలో హెల్త్ అగ్రిగేటర్లు (ఆన్లైన్ హెల్త్కేర్/ఫార్మసీ సంస్థలు) కూడా పాలుపంచుకోనున్నారు. 1ఎంజీ, ఫార్మ్ఈజీ, మెడిబుడ్డి తదితర సంస్థలు ఇప్పటికే టీకాల తయారీ సంస్థలతో చర్చలు కూడా మొదలు పెట్టాయి. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలను ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో టీకాలను దేశంలోని నలుమూలలకూ వేగంగా సరఫరా చేయడంతోపాటు తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు హెల్త్ అగ్రిగేటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ టీకాల టెక్నాలజీ ప్లాట్ఫామ్ కోవిన్తో అనుసంధానం కావడం ద్వారా ప్రతీ టీకా నమోదు చేయడంలో భాగస్వామ్యం అవ్వాలని భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కోవిన్తో ఈ ప్లాట్ఫామ్లు అనుసంధానం కావడం వల్ల పెద్ద ఎత్తున వైద్యులు, క్లినిక్లు, ఆరోగ్య సిబ్బందితో నెట్వర్క్ భారీగా విస్తృతం అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 వేల ప్రభుత్వ, 7 వేల ప్రైవేటు కేంద్రాల్లోనే టీకాలను వేస్తుండగా.. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ టీకాలను వేగంగా ఇవ్వాలంటే ఈ నెట్వర్క్ చాలదు. హెల్త్కేర్ అగ్రిగేటర్లను కూడా ఇందులో భాగస్వాములను చేస్తే నెట్వర్క్ విస్తృతం కావడం ద్వారా మరింత మందికి టీకాలను చేరువ చేసే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలక పాత్ర..: ‘‘ప్రస్తుతం టీకాలను ఇచ్చే కార్యక్రమం పరిమితంగానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఆస్పత్రులపై ఇప్పటికే ఎంతో భారం నెలకొంది. కనుక ఈ విషయంలో మా వంటి నెట్వర్క్ ప్రొవైడర్లు పెద్ద పాత్ర పోషించవచ్చు’’ అని 1ఎంజీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ టాండన్ పేర్కొన్నారు. ప్రజలు తమ వంటి పోర్టళ్లలో పేర్లను నమోదు చేసుకుంటే.. వారికి సమీపంలో టీకాలను ఇచ్చే క్లినిక్ లేదా ల్యాబ్ విషయమై సూచనలు చేయడానికి వీలుంటుందన్నారు. 1ఎంజీ ఆన్లైన్ ఫార్మసీ, ల్యాబ్ తదితర సేవలను ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థకు 1.5 కోట్ల కస్టమర్లు ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు, పెద్ద హౌసింగ్ సొసైటీల్లో టీకాల క్యాంపులను ఏర్పాటు చేసేందుకు 1ఎంజీ ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించింది. ‘‘కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత దృష్ట్యా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడానికి సుముఖత చూపకపోవచ్చు. లేదా కొందరు బయటకు రాలేని పరిస్థితి ఉండొచ్చు. కనుక అటువంటి వారి ఇంటికే నేరుగా వెళ్లి టీకాలిచ్చేందుకు మేము ఆసక్తిగా ఉన్నాము. కాకపోతే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది’’అని ప్రశాంత్ టాండన్ వివరించారు. నేరుగా టీకాలు ఇచ్చేందుకు సుముఖం.. భారీ ఆస్పత్రుల చైన్లతోపాటు ఆరోగ్య సంరక్షణ సంస్థలు సైతం కో విన్ ప్లాట్ఫామ్ను తమ ప్లాట్ఫామ్లతో అనుసంధానం చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నట్టు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా 30 పట్టణాల పరిధిలో మాకు కోల్డ్ చైన్ నెట్వర్క్ (శీతలీకరించిన నిల్వ, సరఫరా నెట్వర్క్) ఉంది. మా సిబ్బందికి టీకాలు ఇవ్వడంపై శిక్షణ కూడా ఇచ్చాం. టీకాలను నేరుగా కొనుగోలు చేసి పెద్ద కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, నివాస సముదాయాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాము’’ అని హోమ్ హెల్త్కేర్ సేవల సంస్థ పోర్టియా మెడికల్ సీఈవో మీనా గణేష్ తెలిపారు. ఫ్లూ వ్యాక్సిన్ల దేశవ్యాప్త సరఫరా అనుభవం తమకు ఉందన్నారు. టీకాల సరఫరాదారులతో ఈ సంస్థ ఇప్పటికే చర్చలు కూడా నిర్వహిస్తోంది. -
ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లం.. ఓ వైద్యుడి భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తగా కరోనా మహమ్మారి విలయం రోజుకు రోజుకు మరింత ఉధృతమవుతోంది. దీంతో దేశంలో ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 ప్రభావిత రాష్ట్రం ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. బాధితులు ఊపిరాడక తమ కళ్లముందే విలవిల్లాడుపోతోంటే తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. ఆసుపత్రిలో దుర్భర పరిస్థితి, రోగుల ప్రాణాలను కాపాడలేని తమ నిస్సహాయతపై ఒక సీనియర్ వైద్యుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని అతిపెద్ద ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో అల్లకల్లోలమవుతున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సీరియస్గా స్పందించాయి. తక్షణమే అన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య సదుపాయాలు, రోగుల ప్రమాదకర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు శాంతి ముకాండ్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సునీల్ సాగర్ కంట తడిపెట్టారు. వైద్యులుగా రోగుల ప్రాణాలను కాపాడాల్సిన తాము, కనీసం ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న చాలామందిని డిశ్చార్జ్ చేయవలసిందిగా వైద్యులను కోరామని, చాలా క్రిటికిల్ గా ఉన్న వారికి ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. ప్రాణాలను నిలపాల్సిన తాము చివరికి ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోతే... పరిస్థితి ఏమిటి... వారు చనిపోతారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆసుపత్రిలో ఉన్న స్టాక్స్ మహా అయితే రెండు గంటలకు సరిపోతుందని డాక్టర్ సాగర్ చెప్పారు. తమ రెగ్యులర్ సరఫరాదారు ఐనాక్స్ కాల్స్కు స్పందించడం మానేసిందని ఆరోపించారు. మరోవైపు రోహిణి సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో, 51 ఏళ్ల ఆశిష్ గోయల్ వెంటిలేటర్లో ఉన్న తన తండ్రికి ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బందులనెదుర్కాను. అయితే 15 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ దగ్గర ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో చాలా భయంకరంగా ఉంది.. తమకు ఎవరూ రక్షణ లేరంటూ బావురుమన్నారు గోయల్. అటు ఘజియాబాద్లోని లక్ష్మీచంద్ర ఆసుపత్రి అంబులెన్స్లు ఇప్పుడు రోగులకు బదులుగా ఆక్సిజన్ రీఫిల్స్ సిలిండర్లను రవాణా చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని అదే జిల్లాలోని చంద్రలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ గోయల్, " మా వద్ద ఆక్సిజన్ లేదు, మందులు లేవు.. పేషంట్లను స్వీకరించలేను క్షమించండి’’ అంటూ ఏకంగా బోర్టు పెట్టేశారు. ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా యంత్రాంగానికి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాజధానిలోని ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఒక జాబితా విడుదల చేశారు. సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకుంద్ హాస్పిటల్, తీరత్ రామ్ షా హాస్పిటల్, యూకే నర్సింగ్ హోమ్, రాఠి హాస్పిటల్ , శాంటం హాస్పిటల్ ఇందులోఉన్నాయి. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) చదవండి : ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా #WATCH | Sunil Saggar, CEO, Shanti Mukand Hospital, Delhi breaks down as he speaks about Oxygen crisis at hospital. Says "...We're hardly left with any oxygen. We've requested doctors to discharge patients, whoever can be discharged...It (Oxygen) may last for 2 hrs or something." pic.twitter.com/U7IDvW4tMG — ANI (@ANI) April 22, 2021 -
కరోనా టెస్టులకు గండం.. చేతులెత్తేసిన కంపెనీ
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని కొంద రు అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కరోనా పరీక్షలు చేసే టెస్టింగ్ కిట్లకు కొరత ఏర్పడటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే అనేకచోట్ల కొద్దిమందికే పరీక్షలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లోనైతే ఈ రోజుకు ఇంతేనని చెప్పి పంపుతున్నారు. కొరత నేపథ్యంలో వైద్యాధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కిట్ల నిల్వ అయిపోయే వరకు నిద్రపోయారా అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు చేపట్టే విషయంపై సర్కారు సమాలోచనలు చేస్తోంది. అత్యవసరంగా లక్షన్నర కిట్లు రెగ్యులర్గా అవసరానికి తగినట్లుగా సరఫరా చేయాల్సిన కంపెనీ చేతులెత్తేసింది. మహారాష్ట్ర సహా దేశంలో కరోనా విజృంభణ పెరగడంతో కంపెనీ ఆయా ప్రాంతాలకు కిట్లను తరలిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఒకేసారి అధికంగా కిట్లను సరఫరా చేయలేమంది. ఢిల్లీలో లాక్డౌన్ విధించడంతో అక్కడ ఉత్పత్తి, సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో ఆ ప్రభావం రాష్ట్రంలో కిట్ల కొరతకు దారితీసిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బుధవారం వరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద కేవలం లక్షలోపు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు, లక్షన్నర లోపు ఆర్టీపీసీఆర్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గురువారం నుంచి కరోనా పరీక్షలు సజావుగా జరిగే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై లక్షన్నర కిట్లను కొనుగోలు చేశారు. ఈ కిట్లు బుధవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటాయనీ, గురువారం అన్ని పరీక్ష కేంద్రాలకు కిట్లను పంపిస్తామని అధికారులు తెలిపారు. అయితే రెండ్రోజులు ఎలాగోలా నెట్టుకొస్తారు తర్వాత ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మూడు నెలలకు సరిపోయేలా... కరోనా పరీక్షలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం నెలకొనడంతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు తక్షణం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. అలాగే మూడు నెలలకు సరిపోయేలా ఒకేసారి కిట్లను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు 90 లక్షల కిట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతి ఇచ్చింది. దీంతో నూతన టెండర్కు వెళ్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్-సీ అధికంగా ఉండే పండ్ల వినియోగానికి డిమాండ్ పెరగడంతో బత్తాయి పండ్లకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు ఇక్కడికే వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లకు బత్తాయి రాక తగ్గింది. ఒక్క కొత్తపేట పండ్ల మార్కెట్కే కనీసంగా రోజుకు 300 టన్నుల మేర బత్తాయి సరఫరా తగ్గింది. దీంతో రాష్ట్ర మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేక ధర అమాంతం పెరుగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.20 నుంచి రూ.30 పలకగా, ఇప్పుడది ఏకంగా రూ.70కి చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పొరుగు నుంచి ఎగబడ్డ వ్యాపారులు రాష్ట్రంలో రోజుకు ఐదు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా, ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాన్యులు సైతం ప్రతిరోజూ 500 మిల్లీగ్రామ్ల విటమిన్–సీ పండ్లను రోజువారీ ఆహారంగా తీసుకోవాలని, దీనిద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి వైపు సామాన్యులు ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బత్తాయికి డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు నేరుగా రైతుల పంటల వద్దకే వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులే కోతలు చేసి, ప్యాకేజింగ్, రవాణా, లోడింగ్ ఇలా అన్నీ సొంత ఖర్చులతో కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు వీరికి అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా ఢిల్లీ, హరియాణా, కోల్కతాతోపాటు రాజస్తాన్ నుంచి వ్యాపారులు టన్నుకు రూ.35 వేల నుంచి 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. బయటి రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండటంతో హైదరాబాద్ మార్కెట్కు బత్తాయి రాక తగ్గిపోయింది. ముఖ్యంగా కొత్తపేట పండ్ల మార్కెట్కు దీని సరఫరా తగ్గింది. ప్రతి ఏటా కొత్తపేట మార్కెట్కు రోజుకు 500–600 టన్నుల మేర బత్తాయి రాగా, ఈ ఏడాది కేవలం 100–125 టన్నులు మాత్రమే వస్తోంది. ఇది మార్కెట్ అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. వచ్చిన కొద్దిపాటి బత్తాయిని వ్యాపారులు హోల్సేల్లో టన్నుకు రూ.40 వేల నుంచి 50వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో రూ.40–50 వరకు ఉంది. ఇది గత ఏడాది ధరలతో పోలిస్తే రూ.20 అధికం. ఇదే బత్తాయిని బహిరంగ మార్కెట్కు వచ్చే సరికి రూ.70 వరకు కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిమ్మ, కివీ సైతం... ఇక సీ-విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయలకు చెప్పలేనంత డిమాండ్ ఉంది. గతంలో బహిరంగ మార్కెట్లలో రూ.10కి 3 నిమ్మకాయలు విక్రయించగా, ప్రస్తుతం ఒక్క నిమ్మకాయే అమ్ముతున్నారు. సీ-విటమిన్కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కివీ పండ్ల ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత ఏడాది 24 పండ్లు ఉండే ఒక్క బాక్స్ ధర రూ.వెయ్యి పలుకగా, ప్రస్తుతం రూ.3 వేలకు చేరింది. రోజుకు కొత్తపేట మార్కెట్కు వెయ్యి బాక్స్ల వరకు రాగా, ఇప్పుడది 500 నుంచి 600 బాక్స్లకు తగ్గింది. దీంతో అటు పండ్ల లభ్యత లేక.. ఇటు అధిక ధరలకు పండ్లు కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. చదవండి: కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం చదవండి: ఉత్సవంతో వచ్చిన కరోనా.. అటవీ గ్రామాల్లో కల్లోలం -
విద్యార్థులకు ఫ్లిప్కార్ట్ గుడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ పండుగ సీజన్ లో అమ్మకాలతో వినియోగదారులకు ఆకట్టుకోవడమే కాదు.. విద్యార్థులకు కూడా శుభవార్త తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల16న ప్రారంభం కానున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ తాజాగా ప్రకటించిన ‘లాంచ్ప్యాడ్’ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్మెంట్లో నైపుణ్యాన్ని పొందవచ్చు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ ఆఫర్లు) ఈ-కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ప్రాసెస్ను, క్లిష్టమైన నైపుణ్యాలను విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సంక్షోభం మధ్య కీలకంగామారిన ఇకామర్స్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి లాంచ్ప్యాడ్ రూపొందించామనీ, దీర్ఘకాలంలో మంచి అర్హత కలిగిన, బాగా శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన నిపుణులతో తమ సప్లయ్ చెయిన్ వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. (వివాదంలో ఫ్లిప్కార్ట్ : క్షమాపణలు) ఫ్లిప్కార్ట్ ఇందుకోసం 21 ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తోంది. వాటిలో తెలంగాణలోని మేడ్చల్, మహారాష్ట్రలోని భివాండి, హర్యానాలోని బినోలా, ఉలుబేరియా, డంకుని (పశ్చిమబెంగాల్), కర్నాటకలోని మలూర్ వంటి ప్రాంతాలున్నాయి. సప్లయి చెయిన్ మేనేజ్మెంట్ గురించి ఫ్లిప్కార్ట్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యా సేతు యాప్, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లాంటి సంబంధిత కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తామని విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ఫ్లిప్కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ వెల్లడించారు. ఇంటర్న్షిప్ల ద్వారా వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు యువ విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. గత ఏడాది ప్రారంభించిన ఇంటర్న్షిప్ కార్యక్రమంలో 'ది బిగ్ బిలియన్ డేస్ 2019' సందర్భంగా దేశవ్యాప్తంగా 2 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు శిక్షణ పొందారని గుర్తు చేశారు. -
‘సరిహద్దు’లో దగా..!: నిషేధిత పురుగు మందులు
సాక్షి, చిలుకూరు (కోదాడ): అమాయక రైతులను అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నిషేధిత పురుగు మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మందుల వాడకంతో స్వల్పకాలంలో ప్రయోజనాలు కనిపిస్తుండగా దీర్ఘకాలంలో వాటితో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పురుగుల మందులను గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న దళారులు రాష్ట్ర సరిహద్దు (సూర్యాపేట , నల్లగొండ జిల్లాలు) మండలాల్లోని రైతులకు తక్కువ ధరకేనంటూ విక్రయిస్తూ దగా చేస్తున్నారు. అనుమతులు లేని విషతుల్యమైన రసాయన మందుల విక్రయాలు యథేచ్ఛగా జరుగతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నీటి విడుదలతో.. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువనుంచి వరద వస్తుండడంతో ఎడమకాల్వకు సకాలంలో నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని దామరచర్ల, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్, మఠంపల్లి, చిలుకూరు, కోదాడ తదితర మండలాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. నెల రోజులు దాటిన వరిపొలాలకు ప్రస్తుతం దోమపోటు, తెగుళ్లు ఆశించాయి. అయితే ధర తక్కువగా ఉండడంతో రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు గుంటూరు జిల్లా మందుల వాడకంపై మొగ్గు చూపుతున్నారు. ధర తక్కువంటూ.. ఈ ప్రాంతంలో లభించే రసాయనిక మందులు దాదాపుగా మల్టీనేషన్ కంపెనీలకు చెంది ప్రభుత్వ ఆమోద ముద్రతో విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కూడా ఎక్కువే. ఇదే అదునుగా చేసుకున్న దళారులు ఆంధ్రా ప్రాంతంలో నిషేధించిన గుంటూరు మందులు తక్కువ ధరేనంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులు గుంటూరు జిల్లా కేంద్రం సత్తెనపల్లి రోడ్డులోని ఓ మిర్చి యార్డు దగ్గరలోని గోదాము నుంచి సరఫరా అవుతున్నాయని తెలిసింది. కాగా, ఈ మందులు ( లాకర్, బీపీహెచ్ పురుగు, దోమలకు , మూవ్ తెగుళ్లకు సంబంధించినవి) పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతుండడం, ధర తక్కువ (ఎకరానికి 100 గ్రాముల ప్యాకెట్ రూ.1000)కు లభిస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే ప్రాంతంలో లభించే మందులకు రెట్టింపు ధర ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా ఇటు రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడుతోంది. గ్రామానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లు రాష్ట్ర సరిహద్దు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇద్దరు చొప్పున ఏజెంట్లు ఆయా కంపెనీల నిర్వాహకులు నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఈ ఏజెంట్లు రైతుల వద్ద ముందస్తుగానే డబ్బులు తీసుకుని రాత్రి వేళల్లో ఆర్డర్ మీద సరఫరా చేస్తున్నారని సమాచారం. ఏజెంట్లకు కమీషన్ ఎక్కువగా వస్తుండడంతో స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నష్టాలు ఎక్కువే... గుంటూరు మందులు పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతున్నాయి. కానీ దీర్షకాలికంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిషేధిత మందులలో సైనైడ్ కలుపుతారని, వీటిని పిచికారీ చేస్తే కొద్ది రోజులకు చేలు ఎర్రబారతాయని, తదనంతరం సారవంతమైన భూములు చౌడు భూములుగా మారుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ మందులతో నీరు విషతుల్యంగా మారడంతో మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మా దృష్టికి కూడా వచ్చింది గుంటూరు జిల్లా మందుల వ్యవహారం మా దృష్టికి కూడా వచ్చింది. అ మందులు పిచికారీ చేయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొంత మంది రైతులు దళారుల ద్వారా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. ఈ మందులపై నిఘా ఏర్పాటు చేశాం. ఈ మందుల తయారీలో సైనైడ్ కలుపుతారు. ఎంతో ప్రమాదకరం. ఎవరైనా ఆ మందులు విక్రయిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. –జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయాధికారిణి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement