Cultural Activities
-
గుంటూరులో అంగరంగ వైభవంగా నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు
'భాషే రమ్యం.. సేవే గమ్యం' అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరు నగరంలో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాల్లో వందల మంది జానపద కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నగరంలో జానపద కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారుల నృత్యం, ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు, మహిళల కోలాటం కోలాహలం మధ్య పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ సాగింది. ఆ తర్వాత విజ్ఞాన మందిరంలో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా జరిగాయి. గాయకుల పాటలు, డప్పు కళకారుల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు సాగాయి. తెలంగాణ ప్రజా గాయకుడు చింతల యాదగిరి పాడిన పాట ఈ చిట్టి చేతులు పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణాజిల్లాల నుండి జానపద, గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కళారూపాలు బుర్రకథలు, ఆహుతులను మైమరిపించాయి. కిక్కిరిసిన జనసందోహంతో విజ్ఞాన మందిరం నిండిపోయింది. కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో విజ్ఞాన మందిరం మారుమ్రోగింది. షేక్ బాబుజి, ప్రజా నాట్యమండలి పీవీ రమణ, రంగం రాజేష్ లు తమ బృందంతో ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు అలరించాయి.తెలుగు భాష పరిరక్షణ కోసమే మా కృషి: నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి మేం అమెరికాలో ఉంటున్నా మా మనస్సంతా ఇక్కడ ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. మన తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు కళలను, కవులను ప్రోత్సాహించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అమెరికాలో నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ కవులు, కళకారులను అక్కడ తెలుగువారికి కూడా పరిచయం చేస్తున్నామని.. వారి గొప్పదనాన్ని వివరిస్తున్నామని బాపు నూతి తెలిపారు. తెలుగు భాష తరతరాలకు తరగని వెలుగులా ఉండాలనేదే తమ ఆశయమని తెలిపారు. తెలుగు కళాకారులు మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని బాపు అన్నారు. కళకారులు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ జానపద సంబరాల నిర్వహణలో శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారని తెలిపారు. గురువుకు గౌరవం దక్కిన సమాజం ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందని.. అందుకే ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సంబరాల్లో గౌరవిస్తూ వారికి పురస్కారాలు అందించామని బాపు నూతి అన్నారు. నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిందని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయడం.... మహిళా సాధికారత కోసం ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడం.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసిందని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలు స్వశక్తితో నిలబడేలా వారికి కావాల్సిన చేయూత నాట్స్ అందించిందన్నారు. నాట్స్ అంటే సేవ.. సేవ అంటే నాట్స్ అనే రీతిలో తమ కార్యక్రమాలు ఉంటాయని బాపు నూతి అన్నారు. అమెరికాలో తెలుగువారికి అండ నాట్స్: సత్య శ్రీరామినేనితెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలుస్తుందని డల్లాస్ నాట్స్ నాయకుడు సత్య శ్రీరామినేని అన్నారు. విద్యార్ధులు అమెరికాకు వచ్చేటప్పుడు యూనివర్సీటీల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే రావాలన్నారు. అమెరికాలో బోగస్ యూనివర్సీటీల వల్ల నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు తాము అండగా నిలిచిన విషయాన్ని శ్రీరామినేని గుర్తు చేశారు. అందుకే నాట్స్ విద్యార్ధులకు అమెరికాలో చదువుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘం: ఎమ్మెల్సీ లక్ష్మణరావునాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న పేదలకు ఏ సాయం చేయాలన్నా నాట్స్ ముందుంటుందనే విషయం నాట్స్ సేవా కార్యక్రమాలనే నిరూపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి సేవా కార్యక్రమాల్లో చూపిస్తున్న చొరవ మాలాంటి వారికి కూడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో నిలబడేలా వారికి ఆర్థిక సహకారం, నల్లమల అడవుల్లో గిరిజన మహిళల సాధికారత కోసం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహించేలా పురస్కారాలు అందిస్తున్న నాట్స్ కు లక్ష్మణరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులకు, కళకారులకు సన్మానంజానపద, సాంస్కృతిక సంబరాల్లో భాగంగా కవులకు, కళకారులకు నాట్స్ పురస్కారాలు అందించింది. వారిని సన్మానించింది. అలాగే పలు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరున్న వారిని ఆహ్వానించి వారిని సంబరాల వేదికపై సత్కరించింది. ఇంకా ఈ సంబరాల్లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, కన్నా మాస్టారు, పాటిబండ్ల విష్ణు, కృష్ట్నేశ్వరరావు, కార్యక్రమం సమన్వయ కర్త కాకుమాను నాగేశ్వరరావు, సుబ్బారాయుడు, దాసరి రమేష్, దాసరి సుబ్బారావు, సరిమల్ల చౌదరి, షేక్ బాషా, భగవాన్ దాస్, లక్ష్మణరావు, కిరణ్, గుర్రం వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ) -
ఉత్సాహ తరంగం.. రాక్ అండ్ రోల్ అంటూ చిందేస్తూ (ఫొటోలు)
-
‘ఆద్యకళ’కు ఆయువునివ్వండి
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్ల నాటి సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించిన పరిశోధన..ఆదివాసీ, గిరిజన కళాత్మకతకు సమున్నతమైన ఆవిష్కరణ..ఇటీవల హైదరాబాద్లో జరిగిన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్యకళాకృతుల ప్రదర్శన. ఆదికాలం కళారూపాలను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు, ఆద్యకళను కాపాడేందుకు నాలుగున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. సుమారు 2,000 ఆద్యకళాకృతులతో జూలై నుంచి ఆగస్టు చివరి వరకు జరిగిన ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. ఈ ప్రదర్శన తెలంగాణ సృజనాత్మకతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటింది. అయితే ఈ కళాసంపద ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానిని కాపాడి జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం, సమాజం ముందుకు రావాలని ఆద్యకళకు ఆయువునివ్వాలని కోరుతున్నారు జయధీర్ తిరుమలరావు. ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అవి సామూహిక వ్యక్తీకరణలు ప్రకృతిలోని వివిధ రకాల వస్తువుల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దాన్ని ఒడిసిపట్టుకొని సంగీత పరికరాలను సృష్టించారు. మృత జంతువుల చర్మాలతో ఆదివాసీలు రూపొందించిన వాయిద్య పరికరాలు గొప్ప సంగీతాన్ని సృష్టించాయి. కోయ గిరిజనులు వేసే ‘పగిడె’పటాలు ఆది మానవుడి కాలం నాటి గుహచిత్రాలను తలపిస్తాయి. మట్టి ఫలకాలు, కుండలు, కర్రలపై చెక్కుకున్న అక్షరాలు తర్వాతర్వాత అనేక రకాలుగా పరిణామం చెందాయి. ఓజోలు అనే గిరిజన సమూహం తయారు చేసిన డోక్రా హస్త కళావస్తువులు గొప్ప ప్రతిభకు తార్కాణం. పొనికి చెట్టు కలప నుంచి అద్భుతమైన బొమ్మలు తయారు చేశారు. ఇవన్నీ సామూహిక వ్యక్తీకరణలు. ఆద్యకళకు ప్రతిరూపాలు. 1974లో ఎం.ఎ. పూర్తైన తొలిరోజుల్లో పరిశోధన ప్రారంభించాను. క్షేత్రస్థాయిలో పర్యటించాను. ప్రజలు రూపొందించుకున్న కళల చారిత్రక, సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నించాను. రెండువేల ఆద్యకళారూపాల సేకరణ ఆదివాసీ, గిరిజన కళల్లో గొప్ప ప్రతిభ ఉంది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా అన్ని వర్గాల జీవన సమూహాలతో కలసి పనిచేశాను. వారి కళలను, కళా నైపుణ్యాలను, కళా పరికరాలను తయారు చేసే విధానాన్ని దగ్గర నుంచి చూశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 2,000 కళాకృతులకు, కళాఖండాలను సేకరించాను. వాటన్నింటిని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంత్రులు, ప్రముఖులు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆ సాంస్కృతిక, కళా వారసత్వ సంపదను కాపాడుకుంటూ వచ్చాను. ఈ కళాసంపదను భవిష్యత్తరాలకు అందజేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజమే చొరవ చూపాలి. మ్యూజియం ఏర్పాటు చేయాలి ఆద్యకళను కాపాడేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకోసం ఒకభవనాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. తద్వారా తెలంగాణ ప్రజల సాంస్కృతిక, వైవిధ్యభరితమైన కళాత్మక జీవితాన్ని జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. అంతరించిపోతున్న ఆద్యకళలను కాపాడుకోలేకపోతే చారిత్రక తప్పిదమవుతుంది. -
ఆషాఢ ఎడబాటు వెనుక.. ఆచారం.. ఆంతర్యం ఇవే..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభకార్యాలు చేయకూడదని పెద్దలు విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. కొత్త దంపతులకు ఆషాఢం విరహ మాసం. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన తరుణం. చూసుకోవడానికి కూడా వీల్లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. మారిపోయిన ప్రస్తుత కాలంలో నెల రోజుల ఎడబాటు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త దంపతుల ఎడబాటు అనివార్యం అనే సంప్రదాయం సడలింపు దిశగా సాగిపోతోంది. ఫార్మాలిటీ కోసం ఓ 5 రోజులపాటు పుట్టింటికి వెళ్లి వస్తే చాలు అనే భావన కొందరు వెలిబుచ్చుతున్నారు. పెద్దల నియమం కూడా మంచికే అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే ఎడబాటు కూడా మంచికే అన్నది పెద్దల నిశ్చితాభిప్రాయం. ఆచారం.. ఆంతర్యం ఇవే.. ఆషాఢ మాసం నవ దంపతులను దూరంగా ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త కోడలు అత్తగారి ముఖం చూడకూడదు. అలాగే కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదు అనే ఆచారం తరతరాలుగా వస్తోంది. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవు. మృగశిర నుంచి మొదలయ్యే చినుకుల ఆగమనం.. క్రమంగా ఆషాఢ మాసం ప్రవేశించే సరికి సమృద్ధిగా వర్షాకాలం అవుతుంది. సాగు ప్రధాన వృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాది అదే పనుల్లో తలమునకలవుతారు. దీంతో కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. పని ఆధారిత ప్రాంతాల్లో చేసే వృత్తిని కాదని మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం విధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరిస్తున్నారు. సంప్రదాయం వెనక శాస్త్రీయత నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండటం అంత మంచిది కాదంటారు. ఈ సమయంలో గర్భధారణ జరగడం తల్లీబిడ్డలకు అంత క్షేమం కాదు. ఆషా«ఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా జలాశయాలు, పరిసరాల్లోని నీళ్లు కలుషితం అవుతాయి. ఈ నీటి వినియోగం అనారోగ్యాలకు కారణమవుతుంది. చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చీడపీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్ర వచనం. ప్రత్యామ్నాయాలు బోలెడు ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఆ భావనను దూరం చేస్తున్నాయి. సెల్ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాల ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. దూరంగా ఉండటమే శ్రేయస్కరం ఆషాఢ మాసంలో విడిగా ఉండటం శ్రేయస్కరమే. ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో అవుతుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శిశువు జన్మిస్తే బాహ్య పరిసరాలను భరించడం కష్టమవుతుంది. ఆషాఢ మాసంతోపాటు పూజలు, నోముల పేరుతో శ్రావణంలో ఎడబాటు కొనసాగిస్తే సంతానోత్పత్తి› సమయాన్ని జూలై, ఆగస్టు వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సుఖ ప్రసవానికి అనువుగా ఉంటుంది. – డాక్టర్ గీతావాణి, గైనకాలజిస్టు వివాహ బంధం బలోపేతం ఆషాఢ మాసం కొత్త దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో ఈ నియమం చాలా బాగా పని చేస్తుంది. ఆషాఢ మాసంతో పరస్పర అభిప్రాయాలను పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా వివాహ బంధం బలోపేతం అవుతుంది. – బోయిని గౌతమ్, హారిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం పెద్దవాళ్లు ఏ నియమం పెట్టినా అది పిల్లల మంచి కోసమే. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం వల్ల సమస్యేమీ లేదు. పైగా ఇప్పుడు సెల్ఫోన్ లాంటి సాంకేతిక పరికరాలు మనుషులను కలిపే ఉంచుతున్నాయి. పెద్దవాళ్లు వి«ధించిన నియమ నిబంధనలు శాస్త్రీయ కోణంలోనే చూడకుండా, ఆరోగ్యం దృష్ట్యా పాటిస్తే మేలు కలుగుతుంది. అందుకే మేము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. – గూడెల్లి సురేశ్, వాసవి, సాఫ్ట్వేర్ దంపతులు 5 రోజులు తీసుకెళ్లారు పిల్లలు బాగుండాలనే పెద్దలు అనేక నియమాలను వి«ధించారు. టైమ్తో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకునే కాలంలో ఇలాంటి ఇవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి సంప్రదాయం కోసం ఐదు రోజులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఎడబాటుతో అన్యోన్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆషాఢ నియమం మంచిదే. – గోవిందు భరత్కుమార్ (ప్రైవేట్ ఉద్యోగి), పద్మజ -
కళాపిపాసి..విభిన్న రంగాల్లో రాణిస్తున్న వెంకటేష్
సాక్షి, కొల్లాపూర్: రంగస్థల నటనలో అభినయం, పాటలు పాడటంలో ప్రతిభ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కొల్లాపూర్కు చెందిన వెంకటేష్. వృత్తిరీత్యా స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఫార్మాసిస్టుగా పనిచేస్తూనే కళలపై తనకున్న మక్కువను ప్రదర్శిస్తున్నాడు. ఆయన ప్రతిభకు పలు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. కొల్లాపూర్లో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణలో తప్పనిసరిగా వెంకటేష్ పాత్ర ఉంటుంది. 20 ఏళ్లుగా కళాకారుడిగా.. నటన పట్ల తనకున్న మక్కువతో వెంకటేష్ రంగస్థల నాటకాలు వేయడంలో శిక్షణ పొందాడు. వెంకటేష్ నాటకరంగంలోకి ప్రవేశించాక తన సహచరులతో కలిసి శృతిలయ కల్చరల్ అకాడమీని స్థాపించారు. అకాడమీ ద్వారా ఎంతోమందికి నాటకాలపై శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు కూచిపూడి, భరతనాట్యం నేర్పించారు. పాటలు పాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గంలో చాలామంది నాటకరంగ కళాకారులు శృతిలయ అకాడమీ ద్వారానే సమాజానికి పరిచయమయ్యారు. అకాడమీ ఏర్పాటు చేసి, నాటకరంగ శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు శృతిలయ అకాడమీనే శ్రీకారం చుట్టింది. శృతిలయ కల్చరల్ అకాడమీ పేరుతో వందలాది నాటక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు శృతిలయ అకాడమీ ద్వారా 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్లో నిర్వహించే సంబరాలు, కృష్ణానది పుష్కరాలు, పర్వదినాలు, జాతరల్లో నాటకాలు ప్రదర్శించారు. వెంకటేష్ ప్రతిభను గుర్తించి మహారాష్ట్రలోని కొల్హాపూర్ నాటకరంగం, వారణాసి, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నాటకరంగం వారు ఏకపాత్రాభినయ ప్రదర్శనలకు ఆహా్వనించారు. వీటితోపాటు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, సుందరయ్య విజ్ఞానకేంద్రం, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇచ్చారు. బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర, విప్రనారాయణ, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త చింతామణి, వేంకటేశ్వర మహాత్యం, మహాభారత సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల నాటకాలను వెంకటేష్ నేతృత్వంలోని బృందం ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. నాటకం వేసే సమయంలో ఆయన హావాభావాలు, పద్యవచనాలు ఆహుతులను ఆకట్టుకుంటాయి. సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వందసార్లు, భక్త చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాత్రను 60 సార్లు, శ్రీకృష్ణ రాయభారం నాటకంలో శ్రీకృష్ణుని పాత్రను 35 సార్లకుపైగా పోషించాడు. అవార్డులు.. ప్రశంసలు కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను అక్టోబర్లో వెంకటేష్ చెన్నైలోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నవంబర్లో అదే యూనివర్సిటీ నుంచి భారత కళారత్న అవార్డు వరించింది. వీటితోపాటు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలచే అవార్డులు స్వీకరించారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్చే రాష్ట్రస్థాయి అవార్డు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ వంటి వారితోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులచే అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. ముందు తరాలకు అందిస్తా.. ప్రస్తుత సమాజంలో సంప్రదాయ కళలకు సరైన ప్రాధాన్యం లేదు. పాశ్చాత్య పోకడల వైపు యువత వెళ్తున్నారు. సంప్రదాయ కళలైన శాస్త్రీయ సంగీతం, లలిత కళలు, నాటకరంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ముందు తరాలకు అందించాలనే సంకల్పంతోనే శృతిలయ కల్చరల్ అకాడమీ స్థాపించి శిక్షణ ఇస్తున్నా. సంప్రదాయ కళాకారులకు ప్రభుత్వంతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ తగిన సహకారం ఇవ్వాలి. – వెంకటేష్, కళాకారుడు -
సదర్ కింగ్..సర్తాజ్
మహానగరానికే ప్రత్యేకమైన సదర్ ఉత్సవానికి రంగం సిద్ధమైంది. దీపావళి అనంతరం యాదవుల సాంస్కృతిక వేడుకగా పేరొందిన సదర్ను నగరంలోని పలుచోట్ల నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో దున్నల ప్రదర్శన హైలెట్. ఇందుకోసం ప్రత్యేక దున్నలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. ఈ నెల 29న జరగనున్న సదర్లో ‘సర్తాజ్’అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హరియాణాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్రసింగ్కు చెందిన ‘సర్తాజ్’ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. రూ.27 కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల సందర్భంగా ప్రదర్శించేందుకు అఖిలభారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
రాష్ట్రాన్ని కళలకు కేంద్రంగా మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నమ్మకంతో తనకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బి.శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలోని కళాభవన్లో భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం పైఅంతస్తులో ఏర్పాటుచేసిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయాన్ని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ నాటక, సంగీత కళలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తానని తెలిపారు. గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారని.. వారికి రవీంద్రభారతి లాంటి వేదికపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణను కళలకు కేంద్రంగా మారుస్తామని హామీఇచ్చారు. జీవితాంతం కళలకు సేవ చేస్తానని.. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి పేరు తెస్తానని తెలిపారు. పేద కళాకారులకు నాటక అభినయం ఉన్నవారికి చేయూత ఇస్తామని చెప్పారు. కళాకారులకు ఆర్థిక సాయం, పల్లె కళాకారులకు రవీంద్రభారతిలో ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. -
స్వేచ్ఛా భారత్ దిశగా కదలండి
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారత్ దిశగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు ముందడుగు వేయాలని ప్రముఖ కన్నడ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు ప్రతిభానందకుమార్ పిలుపునిచ్చారు. భిన్న ఆలోచనలను, విభిన్న సాహిత్యాలను సమాజం ప్రతిబింబించాలని, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భావప్రకటనా స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె సూచించారు. శుక్రవారం బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘కన్నడ సాహిత్యం అప్పుడు–ఇప్పుడు’అనే అంశంపై ప్రతిభా నందకుమార్ కీలక ఉపన్యాసం చేశారు. సామాజిక పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కన్నడ సాహిత్యం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడంలో కన్నడ సాహితీవేత్తలు మొదటి నుంచి ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు సమాజాన్ని ప్రతిబింబిస్తోన్న సోషల్ మీడియా కంటే బలమైన సాహిత్యాన్ని తాము దశాబ్దాల క్రితమే రాసినట్లు పేర్కొన్నారు. కుచించుకుపోతున్న ప్రజాస్వామిక వాతావరణం పద్మావత్ వంటి సినిమాను వ్యతిరేకించడం, అందులోని కథాంశాన్ని జీర్ణించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి అసహనం తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణం రోజురోజుకూ కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, వివక్ష కొనసాగుతున్న రోజుల్లోనే తాము స్వేచ్ఛగా సాహితీ సృజన చేశామని, 35 ఏళ్ల క్రితమే తాను ఎరోటిక్ పొయెట్రీ రాసినట్లు ఆమె గుర్తుచేశారు. కొంతమంది జ్యోతిష్య పండితులు మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని, ఫలానా రాశి మహిళలు అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉందంటూ చేస్తోన్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తాను ‘ఆగ్రహం’అనే కవిత రాసినట్లు గుర్తు చేశారు. సృజనాత్మక రచనలకు సోషల్మీడియా సరికొత్త వేదికగా మారుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం, వివక్ష, పురుషాధిపత్యం లేని సమాజం కోసం నేటితరం రచయితలు కృషి చేయాలని కోరారు. భిన్న సంస్కృతులకు నిలయం.. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులకు, కళలకు హైదరాబాద్ నిలయమని అన్నారు. మగ్ధూం మొహియుద్దీన్, సరోజినీనాయుడు, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావులు హైదరాబాద్ నుంచి తమ కలాన్ని, గళాన్ని ప్రపంచానికి వినిపించారని చెప్పారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ సాహిత్యంతో పాటు, తెలంగాణ సాహిత్య సంస్కృతులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్తతరం రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. స్పెయిన్ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఎడ్యురో సాంచెజ్ మొరాకో మాట్లాడుతూ.. స్పానిష్ భాషకు తెలుగు భాషకు పోలికలున్నాయని, తెలుగులో ఉన్నట్లుగానే స్పానిష్లోనూ మాండలికాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఒక చక్కటి సాంస్కృతిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ప్రఖ్యాత నర్తకి సోనాల్మాన్సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేని వైవిధ్యభరిత సంస్కృతి, అత్యున్నత సంప్రదాయాలు, విలువలు ఒక్క భారత్లోనే ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పదనమని చెప్పారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభోత్సవ సభలో కన్నడంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. చర్చాగోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం స్పెయిన్ మహిళా రచయిత్రుల సాహిత్యంపైనా, పలువురు రచయితలు రాసిన పుస్తకాలపైనా చర్చాగోష్టులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన దళిత సామాజిక కార్యకర్త సరస్వతి వంట చేస్తూ చెప్పిన రామాయణం, దక్కనీ ఉర్దూలో సాగిన మిజాహియా ముషాయిరా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 మంది కళాకారులు నిర్వహించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్కుమార్, సినీ దర్శకుడు డాక్టర్ కిన్నెరమూర్తి తదితరులు పాల్గొన్నారు. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ సింగ్. చిత్రంలో బుర్రా వెంకటేశం -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మార్కాపురం:డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాల స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం రాత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ప్రముఖ గాయకులు సమీరా భరద్వాజ్, సత్యాయామిని, మనీషా, దినకర్ బృందం పాడిన పాటలు అలరించాయి. జబర్దస్త్ టీమ్లో రాకెట్ రాఘవ బృందం చేసిన హాస్య సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు ఐఆర్ఎస్ అధికారి కిశోర్బాబు, కళాశాల సాంకేతిక సలహాదారులు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే సురేష్, కళాశాల కార్యదర్శి డాక్టర్ సతీష్, డైరెక్టర్ విశాల్లు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఇన్కమ్టాక్స్ కమిషనర్ విజయలక్ష్మి సురేష్, వీహెచ్ఆర్ విద్యా సంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డి, ఏ–వన్ గ్లోబల్ కళాశాల చైర్మన్ షంషీర్ అలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటపాటలతో అలరించిన విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లి రోడ్డు స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో భాగంగా శనివారం రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేశారు. ఆర్డీవో జె.రవీందర్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహ పరిచారు. స్టేడియం కన్వీనర్ మందాడి రవి, ఆకుల సత్యనారాయణ, డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కళాకారులకు పుట్టినిల్లు సింహపురి
నెల్లూరు(బారకాసు): కళాకారులకు పుట్టినిల్లు సింహపురి అని 25 కళాసంఘాల గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యాక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి నగరంలోని ఇందిరాభవన్లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ జానపద నృత్య కళాకారుడు, డాన్స్ మాస్టర్ నారాయణమూర్తిని ఈ సందర్భంగా సత్కరించారు. అలాగే 8 మంది పేద వృద్ధ కళాకారులకు నగదు పురస్కారం అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన డాన్స్ ఇనిస్టిట్యూట్లకు సంబంధించిన నృత్య కళాకారులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ, వెస్ట్రన్, సినీ నృత్యాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బట్టేపాటి నరేంద్రరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈదూరు భాస్కరయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త పెళ్లకూరు నందకిషోర్రెడ్డి, రోటరీ క్లబ్ కొణిదల మునిగిరీష్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సూరిశెట్టి నరేంద్ర, శ్రీధర్రెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, డాన్స్మాస్టర్ చిట్టిబాబు, బాబు, పలువురు డ్యాన్స్ మాస్టర్లు నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు. -
శోభాయాత్రలో సాంస్కృతిక వైభవం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో గురువారం నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పుళ్లు, గజ్జెల చిందులతో జానపద కళాకారులు గణేషుని శోభాయాత్రలో హోరెత్తించారు. టపాసులు కాలుస్తూ యువకులు సందడి చేశారు. ఆటపాటలతో చిన్నారులు ఆకట్టుకొన్నారు. మహిళలు, పెద్దలు కాషాయ రంగు జెండాలు పట్టుకొని రహదారుల వెంట నడుస్తూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాంస్కృతిక కళాకారులతో కలిసి హోరెత్తించారు. తొమ్మిదిరోజుల పాటు వినాయకుడికి వైభవోపేతంగా పూజలు చేసి గంగమ్మ చెంతకు సాగనంపారు. శాలిబండ, సరూర్నగర్, సఫిల్గూడ, ఉప్పల్, అంబర్పేట్, సికింద్రాబాద్, సైదాబాద్, పురానాపూల్, బషీర్బాగ్, మాల్కాజ్గిరి సర్కిళ్లలో భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాకారుల బృందాలవారు విగ్రహాల వెంట నడిచారు. చార్మినార్ ప్రాంతంలో కళాకారులు సంప్రదాయ దుస్తులు ధరించి మహాద్భుతంగా వినాయక విగ్రహాల ముందు నృత్యాలు చేస్తూ జోరు వానలో సైతం సందడి చేశారు. సినిమాల్లోని గణేషుడి గీతాలను మార్మోగించారు. కళా రూపాల ప్రదర్శనలను సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పర్యవేక్షించారు. -
టంగుటూరి ప్రకాశం.. ఆదర్శం
కర్నూలు(అగ్రికల్చర్): టంగూటూరి ప్రకాశం పంతులు నిస్వార్థ జీవితాన్ని, ఆయన పట్టుదల, అకుంటిత దీక్షను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడు పేర్కొన్నారు. మంగళవారం టంగుటూరి 145వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరుపున కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టుంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో అనంతరం కర్నూలు బాలభవన్, నంద్యాల గురురాజ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ సందర్బంగా డీఆర్ఓ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఒంగోలు జిల్లాకు చెందిన వారయిన వెనుకబడిన కర్నూలును ఆంధ్రరాష్ట్రానికి రాజధానిని చేయడంలో ఆయన పాత్ర కీలకమైందన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కర్నూలు అభివద్ధికి పునాది వేశారన్నారు. జమిందారి వ్యవస్థను రద్దు చేసి పలు శాశ్వత పనులు చేసిన ఘనత ఆయనదేనన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడిన మహామనిషిగా కొనియాడారు. ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం పంతులు జీవితం విద్యార్థులకు విజ్ఞానాన్ని ఇస్తుందన్నారు. కర్నూలులో టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహాన్ని నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఏఓ తహేరా సుల్తానా, తెలుగు బాష వికాశ ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంటు డాక్టర్ వీరస్వామి, ప్రముఖ రచయిత ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, కళాకారుడు ఇనయతుల్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
నేత్రపర్వంగా కూచిపూడి నృత్యాలు
విజయవాడ కల్చరల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. కార్యక్రమ ప్రారంభంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు అన్నవరపు రామస్వామి వయోలిన్ కచేరీ నిర్వహించారు. గురువందనంతో ప్రారంభించి వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. మరో సంగీత విద్వాంసురాలు విశాఖకు చెందిన మండా సుధారాణి నిర్వహిచిన గాత్ర సంగీత సభ ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా కె.వీ.సత్యనారాయణ బృందం, టి.శ్రావణి, శివసుధీర్కుమార్(భక్తిరంజని) న్యూఢిల్లీకి చెందిన సంగీతశర్మ ప్యూజన్ డాన్స్తో అలరించారు. మహాబృందనాట్య వేదిక మార్పు ప్రభుత్వం మహా బృంద నాట్యం వేదిక ఇందిరాగాంధీ స్టేడియంగా ప్రకటించింది. కళాకారులకు అలానే సమాచారం అందించారు. ప్రేక్షకుల సంఖ్య పలుచగా ఉండడంతో దానిని సంగమ ప్రాంతానికి మార్చారు. సమాచారం లేక కళాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే కళాకారులు పుష్కర కృష్ణ గీతానికి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చని రెండురోజుల కిందట ప్రకటించారు. చివరి నిమిషంలో స్టేడియంలో ప్రభుత్వం మరో కార్యక్రమం నిర్వహించటంతో వేదికను మరోచోటుకు మార్చారు. కళాకారులు వ్యయప్రయాసల కోర్చి సంగమం ప్రాంతానికి చేరుకోవాల్సి వచ్చింది. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
హన్మకొండ అర్బన్ : హన్మకొండ పోలీస్ పరేడ్గ్రౌండ్లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై కస్తూర్బా విద్యార్థులు చేసిన ‘లేవండోయ్... రారండోయ్... ఊరూవాడ కదలండి’ అంటూ చేసిన బృంద నృత్యం ఆకట్టుకుంది. మల్లికాంబ మనోవికాస కేంద్రం విద్యార్థుల సుజలాం... సుఫలాం నృత్యం, భీమారం ఎస్ఆర్హెచ్ విద్యార్థుల ప్రదర్శన, కాజీపేట ఫాతిమా స్కూల్ విద్యార్థుల లండన్దేఖో.. ప్రదర్శన దేశభక్తిని ప్రేరేపించేలా ఉన్నాయి. ఛాయా చిత్రం.. ప్రగతికి ప్రతిరూపం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శన వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిభింబించాయి. జిల్లాలో వివిధ సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ మధుసుదనాచారి, కలెక్టర్ వాకాటి కరుణ పాల్గొన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల చాయా చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీపీఆర్వో శ్రీనివాస్, ప్రచార సహాయకులు విధుమౌళి పాల్గొన్నారు. శకటాలు అదుర్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా పరేడ్గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకాటాల ప్రదర్శనను ఆహుతులు ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయ, పర్యాటక, గృహనిర్మాణం, డీఆర్డీఏ, వైద్యారోగ్యశాఖ, డ్వామా, ఐటీడీఏ, సర్వశిక్షాభియాన్, ఐసీడీఎస్, అటవీ, పశుసంవర్థక శాఖ, మిషన్ భగీరథ శకటాలు ప్రదర్శించారు. వీటిలో గుప్పెడు బియ్యం, గుడుంబా నిర్మూలనపై ఏర్పాటు చేసిన డీఆర్డీఏ శకటానికి ప్రథమ బహుమతి, ఆర్డబ్ల్యూస్ శకటానికి ద్వితీయ బహుమతి, వైద్యారోగ్య శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి. తొలిసారి స్టాల్స్ ఏర్పాటు పరేడ్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ను తొలిసారి ఏర్పాటుచేశారు. ఇందులో వివిధ శాఖల ద్వారా ప్రదర్శించిన సైకిళ్లు, ఇతర పరికరాలను కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లబ్ధిదారులకు అందజేశారు. -
లైంగిక దాడులు ఎదుర్కొవడంపై అవగాహన
చేవెళ్ల : మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక దాడులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై శుక్రవారం కళాజాత బృందంచే పోలీసులు చేవెళ్ల బస్స్టేషన్లో ఆట, పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శృతకీర్తి మాట్లాడుతూ.. మహిళలపై, విద్యార్థినులపై పోకిరీల వేధింపులు, దాడులను పసిగట్టడానికి, అరికట్టడానికి ఏర్పాటు చేసిన షీటీంలను వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా వేధించినా, ఈవ్టీజింగ్కు పాల్పడినా షీటీంకుగాని, నేరుగా పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. బస్స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో షీటీంలు అనునిత్యం గమనిస్తుంటాయని తెలిపారు. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళలకు సూచించారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎస్ఐలు భీంకుమార్, విజయభాస్కర్, వరప్రసాద్లు పాల్గొన్నారు. -
సంస్కతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట
ఖానాపూర్ : అనాదిగా వస్తున్న సంస ్కతీ సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి ఒక్కరూ వారి వారి సంస్కతిని ఆచరించాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. మండలంలోని బంజారా గిరిజన తండాల్లో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా జరుపుతున్నారు. బంజార సంస్కతీ సంప్రదాయాల్లో భాగంగా ప్రతీ ఏటా ఖరీఫ్లో ఆయా గ్రామాల బంజారాలు సీతళాయాడి పూజలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. ప్రజలు, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గ్రామశివారులోని వేపచెట్టు క్రింద పంట దాన్యాలు, నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తారు. ఏడు దేవుళ్లను అక్కడ ఏర్పరచి ఈ పూజలు చేశారు. పూజ నిర్వహించిన ప్రాంతం నుంచి గొడ్డు, గొద, పశుసంపదను తీసుకెళ్లడంతో పాటు రోజంతా మహిళల పాటల మధ్య వేడుకలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పెంబితాండ, ఇటిక్యాల తండా, లోతొర్యెతండా, తాటిగూడ తదితర చోట్ల జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సంప్రదాయ నత్యం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వి.లలిత, విక్రమ్నాయక్, చంద్రబాను, విలాస్, పరుశురాం, అంకం రాజేందర్, పాకల రాంచందర్, రాజగంగన్న, అష్వక్, ఆరె. రాజేందర్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, అబినయ్, షకిల్, స్వామి, కిషన్, ఎంఈవో గుగ్లావత్ రాంచందర్ పాల్గొన్నారు. -
దురాచారాల నివారణకు కళాజాత ప్రదర్శనలు
♦ బెల్టుషాపులపై కొరడా ♦ నిర్వాహకులకు రూ.50 వేల జరిమానా ♦ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేసులు ♦ నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటుకు మున్సిపాలిటీకి లేఖ ♦ బహిరంగ ధూమపానం చేస్తే కఠినచర్యలు ♦ తాండూరు ఏఎస్పీ చందనదీప్తి గ్రామాల్లో సాంఘిక దురాచారాల నివారణకు ప్రజలను చైతన్యం చేసేందుకు కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తాం. బెల్టుషాపులపై కొరడా ఝుళిపిస్తాం. అక్రమంగా కల్లు దుకాణాలు నిర్వహిస్తే సంబంధిత ఎస్ఐలపై చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు. బహిరంగంగా ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తాం. - చందనదీప్తి, తాండూరు ఏఎస్పీ తాండూరు: బాల్య వివాహాలు, రెండు గ్లాసుల పద్ధతి, మూఢనమ్మకాలు తదితర దురాచారాలపై నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏఎస్పీ చందనదీప్తి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ఆరంభిస్తామన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో అక్రమ కల్లు దుకాణాలతోపాటు బెల్టుషాపులపై కొరడా ఝళిపించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. సంబంధిత ఎస్ఐలు అక్రమ కల్లు దుకాణాలు, బెల్టుషాపులను అరికట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ విషయంలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో బెల్లుషాపులు, అక్రమ కల్లు దుకాణాలు ఉన్నట్టు తేలితే సదరు ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని చందనదీప్తి స్పష్టం చేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే బైండోవర్ చేస్తామని, రెండోసారి అయితే రూ.50 వేల జరిమానా విధించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల వద్ద ద్విచక్రవాహనాలు, ఇతర భారీ వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య వస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆయా సంస్థల నిర్వాహకులకు, ట్రాన్స్పోర్టు సంస్థలకు నోటీసులు జారీ చేయాలని అర్బన్ సీఐ, ఎస్ఐలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నో పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాయనున్నట్టు చెప్పారు. బహిరంగంగా ధూమపానం చేసినా, ప్రజలకు అసౌకర్యంగా వ్యవహారించినా ఐపీసీ 290 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని, పునరావృతమైతే కేసులు పెడతామని స్పష్టం చేశారు. పోలీసుశాఖ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఏఎస్పీ చందనదీప్తి కోరారు. -
కీర్తి పతాక...సంబురం
జనసాగరం.. కన్నుల పండువగా తెలంగాణ ఆవిర్భావోత్సవం నగరం నలుదిశలా మువ్వన్నెల రెపరెపలు హోరెత్తిన తెలంగాణ నినాదాలు ఆట, పాటలు..సాంస్కృతిక కార్యక్రమాలు నోరూరించిన తెలంగాణ రుచులు సిటీబ్యూరో: తెలంగాణ ఆవిర్భావ ఉత్సవం అంబరాన్నంటింది. మువ్వన్నెల జెండా ఎగిసింది. మహానగరం మురిసింది. జై తెలంగాణ నినాదం హోరెత్తింది. మదినిండా అమరుల జ్ఞాపకాలను నింపుకొని, సాధించుకొన్న కలల తెలంగాణను స్మరించుకొని జనం ఘనంగా వేడుకలు చేసుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అవతరణ ద్వితీయ వేడుకలు గురువారం కన్నుల పండువగా జరిగాయి. వందలాదిగా తరలి వచ్చిన తెలంగాణ జానపద, గిరిజన కళాకారులు, వివిధ రకాల కళాప్రదర్శనలు బతుకమ్మలతో సాగిన భారీ ఊరేగింపుతో ట్యాంక్బండ్ తెలంగాణ కల్చరల్ కార్నివాల్కు వేదికైంది. ఒకవైపు అద్భుతంగా సాగిన కళా,సాంస్కృతిక ప్రదర్శనలు, మరోవైపు ఆకాశంలో హరివిల్లులను ఆవిష్కరిస్తూ వెలుగులు విరజిమ్మిన తారాజువ్వలు, తరలి వచ్చిన అతిరథమహారధులు, నింగినంటిన ఆనందోత్సాహాలతో హుస్సేన్సాగర్ పోటెత్తింది. రంగురంగుల విద్యుద్దీపాలతో మహానగరం సరికొత్త అందాలను సంతరించుకొంది. నెక్లెస్రోడ్డు, ట్యాంక్బండ్, రవీంద్రభారతి, హరిహరకళాభవన్, సచివాలయం,అసెంబ్లీభవనం, నింగినంటే జాతీయ జెండాకు వేదికైన సంజీవయ్యపార్కు, ఎన్టీఆర్, లుంబినీ, ఇందిరాపార్కు, శిల్పారామం తదితర ఉద్యానవ నాలు, కళల లోగిళ్లు, సాంస్కృతిక కేంద్రాలలో సంబురాలు అంబరాన్నంటాయి. గన్పార్కు వద్ద, సికింద్రాబాద్ క్లాక్టవర్ వద్ద అమరుల స్థూపాలకు నివాళులర్పించారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పీపుల్స్ప్లాజా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నోరూరించే వివిధ రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ రాష్ర్ట అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీలో జరిగిన వేడుకల్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సంయుక్త రవాణా కమిషనర్లు వెంకటేశ్వర్లు, రఘునాథ్, ఆర్టీఓ జీపీఎన్ ప్రసాద్, సామ్యూల్పాల్ తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి వాహనదారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచారు. 100 మందికి పైగా అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎండీ దానకిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఘనంగా అవతరణ వేడుకలు జరిగాయి.హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో ఎండీ ఎన్వీఎస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లోనూ, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్స్టేషన్లలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి. ఆర్టీసీ జేఎండీ రమణ రావు, ఈడీలు పురుషోత్తమ్, నాగరాజు, అధికారులు, సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్, హెచ్ఎండీఏ, విద్యుత్తు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, నగరంలోని ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు చేసుకున్నారు. సాంస్కృతికోత్సాహం.... తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్గార్డెన్స్ లలితకళాతోరణంలో ఏర్పాటు చేసిన డప్పు, డోళ్ల దరువు ప్రదర్శన, 200 మందికి పైగా కళాకారులతో సాగిన పేరిణి నృత్య మహా ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించాయి. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన తెలంగాణ గీత రచయితల ప్రత్యేక సంగీత విభావరి, అర్ధనారీశ్వరం నృత్య ప్రదర్శన, ‘నా తెలంగాణ -కోటి రతనాల వీణ’ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో ఇందిరాపరాశరం బృందం తమ కళా నైపుణ్యాన్ని ఎంతో అద్భుతంగా చాటారు. అలాగే ఎస్.శరత్ బృందం ప్రదర్శించిన ‘అమరవీరులకు జై బోలో’ ప్రదర్శన సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పబ్లిక్గార్డెన్, తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో 45 మంది కవులు తమ కవితా గానం చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కవులు తమ కవిత్వాన్ని వినిపించారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో సిక్కు సోదరుల కళా ప్రదర్శనలు, క్రైస్తవ సోదరుల సాంస్కృతిక కార్యక్రమాలు, బషీర్బాగ్ ఎల్బీస్టేడియంలో ప్రముఖ గజల్ గాయకుడు తలత్ అజీజ్ గానం చేసిన ‘షామ్-ఎ.గజల్’ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉర్దూ, మోతీగల్లీ ఖిల్వత్లో గుల్బర్గా బృందం ఖవ్వాలీ ప్రదర్శన విశే షంగా ఆకట్టుకుంది. కులీఖుతుబ్షా స్టేడియంలో నిర్వహించిన ఆల్ ఇండియా ముషాయిరాలో (ఉర్దూ కవి సమ్మేళనంలో) వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొన్నారు. సిండికేట్ బ్యాంకు కార్యాలయంలో... మాసబ్ట్యాంక్ : నగరంలోని సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సిండికేట్ బ్యాంక్ అన్ని శాఖల్లో ఉద్యోగులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిండికేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎప్పీ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ది వైపు పరుగులు తీస్తుందన్నారు. అన్ని రకాల వనరులు, సౌకర్యాలు ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ రీజనల్ ఆఫీస్ (రూరల్) రీజనల్ మేనేజర్ శీలం గిరితో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అవతరణ సంబురం
► రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ► నేడు పల్లె పల్లెన ‘ప్రత్యేక’ సంబరాల నిర్వహణ ► ప్రారంభించనున్న మంత్రి ఈటల తెలంగాణ అవతరణ వేడుకలకు జిల్లా ముస్తాబైంది. రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేం దుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్థూపా లను విద్యుద్దీపాలతో అలంకరిం చారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనం తరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. - కరీంనగర్ కల్చరల్ ముకరంపుర: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రెండేళ్లు పూర్తయ్యాయి. అధికారిక ప్రకటన వెలువడిన ఉద్విగ్న క్షణాలు.. హర్షాతిరేకాలు.. రెండేళ్ల పాలన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అట్టహాసంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉత్సవాలు మరింత హోరెత్తించనున్నాయి. అందుకు పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. కలెక్టర్, ఎస్పీ ఆహ్వానితులుగా వ్యవహరించనుండగా.. వేడుకలను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. జిల్లాలో ఎటు చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మహిళా సంఘాలతో అమరవీరుల సంస్మరణార్థం బుధవారం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన కూడళ్లను దీపాలంకరణ, స్వాగత తోరణాలతో మిరుమిట్లుగొలిపేలా తీర్చిదిద్దారు. అమరవీరుల స్థూపాలన్నింటికీ మరమ్మతుతో ముస్తాబు చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్గ్రౌండ్లో మంత్రి ఈటల రాజేందర్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. పోలీసుల వందనస్వీకారం అనంతరం మంత్రి సందేశమిస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులు, కవులు, రచయితలు, అధికారులు, జర్నలిస్టులతో పాటు అన్ని రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న వారిని జిల్లా స్థాయిలో 25 మందిని సత్కరించనున్నారు. వీరికి రూ. 51 వేల నగదుతో పాటు శాలువాతో మంత్రి ఈటల రాజేందర్ సన్మానించనున్నారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్తుల పంపిణీ కార్యక్రమాలుంటాయి. రక్తదానాలు, అనాథలు, వృద్ధులకు బట్టలు, పండ్ల పంపిణీ, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు, వృద్ధాశ్రమాల్లో మాంసాహార భోజనం, సాయంత్రం కవి సమ్మేళనం, ముషాయిరా, సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. -
చెవిరెడ్డి మునిరెడ్డి ఆదర్శప్రాయులు
తుమ్మలగుంట(తిరుపతి రూరల్): చెవిరెడ్డి మునిరెడ్డి ఆదర్శప్రాయుడని ప్రముఖులు కొనియాడారు. వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తాత మునిరెడ్డి కర్మక్రియలు బుధవారం తుమ్మలగుంటలో నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు మునిరెడ్డికి నివాళులర్పించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడంలో మునిరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నివాళులర్పించిన ప్రముఖులు.. చెవిరెడ్డి మునిరెడ్డికి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు నారాయణస్వామి (జీడీ నెల్లూరు), దేశాయ్ తిప్పారెడ్డి(మదనపల్లి), రామిరెడ్డి ప్రతాప్రెడ్డి(కావలి), సుగుణమ్మ(తిరుపతి), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఐజయ్య(నందికొట్కూరు), ఎమ్మెల్సీ నరేష్కుమార్, నాయకులు కశంకర్రెడ్డి, భానుప్రకాష్రెడ్డి, కోలా ఆనంద్, మిద్దెల హరి, డాక్టర్ సుధారాణి, నవీన్కుమార్రెడ్డి, దామినేటి కేశవులు, పార్టీ రాష్ట్ర నాయకులు మునీశ్వర్రెడ్డి, విక్రంరెడ్డి, లోకనాథరెడ్డి, బాబురెడ్డి పాల్గొన్నారు. -
మళ్లీ..చిందులు!
► పాట కచ్చేరీల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు ► యువతుల బతుకులను చిదిమేస్తున్న ‘మహిళ ’ ► పాత రోజులను జ్ఞప్తికి తెస్తున్న చిలకలూరిపేట చిలకలూరిపేట టౌన్: సమసి పోయిందనుకున్న దురాచారం అధికారదర్పంతో బుసలు కొడుతోంది. నైతికత కలిగిన నాయకులు, నిబద్ధత కలిగిన కొందరు పోలీసు అధికారులు ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా సీసాలో బందీ అయిన వ్యభిచార భూతం ఇప్పుడు బంధనాలు తెంచుకుంటోంది. పాటకచ్చేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో యువతుల జీవితాలను విటుల పాదాల కింద నలిపేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఓ మహిళ కేంద్రబిందువుగా మారడం బాధాకరం. చీకటి దందా... ఒకప్పుడు చిలకలూరిపేట పట్టణంలోని రెండు వీధుల్లో వ్యభిచారం కొనసాగేదన్నది బహిరంగ రహస్యం. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇక్కడి వారు తమ ఊరు పేరు చెప్పుకొనేందుకు కొంత సంకోచించేవారు. ఈ సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు ఎందరో చేసిన కృషి ఫలితంగా క్రమంగా అనాచారం అంతరించి పోయింది. ఇటీవల కాలంలో పట్టణంలోని వడ్డెర పాలెం ప్రాంతంలో ఓ మహిళ తిరునాళ్ల వంటి వేడుకలకు పాటకచ్చేరీలు, సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో డాన్సర్లను ఇక్కడ నుంచి పంపే వ్యాపారానికి తెరతీసింది. పనిలో పనిగా ఖాళీగా ఉన్న సమయాలలో వాళ్లతో వ్యభిచారం చేయిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతోంది. ఈ వ్యభిచార కూపంలో మగ్గేది మొత్తం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన యువతులు కావటం విశేషం. గుట్టుచప్పుడు కాకుండా... అనైతికంగా సాగే ఈ చీకటి వ్యాపారం రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంటుంది. నృత్యాలకు వెళ్లే యువతులను వడ్డెరపాలెం ప్రారంభం నుంచి ఓగేరు వాగు వడ్డువరకు ఉన్న తమ వారికి చెందిన గృహాలలో అక్కడక్కడ ఇద్దరి నుంచి నలుగురు చొప్పున ఉంచుతారు. రాత్రి వే ళల్లో సంబంధిత ప్రదేశాలలో వీధి దీపాలు వెలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే సమయాలలో కొంతమంది వ్యక్తులు పోలీసు దాడులు జరగకుండా వీధి ఆరంభంలోనే కాపలా ఉంటారు. అటుగా పోలీసు వాహనాలు వస్తే వెంటనే సెల్ ఫోన్లద్వారా సమాచారం చేరిపోతుంది. రాత్రివేళ తమ ఇళ్ల ముందు ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల వాహనాలు, కార్లు వచ్చి ఆగటం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిపై మూకుమ్మడిగా గొడవకు దిగుతారు. అంగబలం, అర్ధబలం ఉన్న వీరిని ఎదిరించేందుకు ధైర్యం లేక, గొడవలు పడలేక చీకటి కార్యకలాపాలకు మూగసాక్షులుగా మిగలడం స్థానికుల వంతైంది. అంతరించి పోయిందనుకున్న విష సంస్కృతి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కొత్త రూపు దాల్చటం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీస్ అధికారులు ఈ మొత్తం వ్యవహారంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం.. పట్టణంలో చీకటి దందా గురించి అర్బన్ సీఐ బి. సురేష్బాబును వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. వ్యభిచారం జరుగుతున్నట్లు ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యపై దృష్టి సారిస్తామన్నారు. -
ఘనంగా ఉగాది వేడుకలు
► ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు ► హాజరైన తీన్మార్ సత్తి, ప్రముఖ జానపద గాయకులు ► అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది పచ్చడి పంపిణీ నిర్మల్ టౌన్ : తీన్మార్ సత్తి పంచ్లు... చిన్నారుల సాం స్కృతిక కార్యక్రమాలతో ఉగాది ఉత్సవ స మితి ఆధ్వర్యంలో దుర్ముఖినామ సంవత్సరానికి ఆ హ్వానం పలికారు. పట్టణంలో ఉగాది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. స్థాని క పాత బస్టాండ్ వద్ద వేదిక ఏర్పాటు చేసి ప్ర త్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమా న్ని తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉగాది పచ్చడిని చింతకుంట వాడ నుం చి ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. తీన్మార్ ఫేం సత్తి ప్రేక్షకులను అలరించారు. తన మాటలతో చేష్టలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. సత్తి చేష్టలను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆస్వాదిం చారు. అనంతరం ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ చేశారు. ప్రముఖ జానపద కళాకారులు ఆలపించిన గేయాలు అలరించాయి. గోండ్ల సంప్రదాయ నృత్యాన్ని కళాకారులు చేసిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచిం ది. ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది పండుగను ప్రతి ఏటా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తారు. వేడుకలకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతుండడంతో ఉత్సవసమితి ఆధ్వర్యంలో ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ పా ఠశాలల విద్యార్థులే కాక, ఇతర ప్రాంతాల నుం చి కూడా విద్యార్థులు వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్సవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన పలువురికి అవార్డులను అం దజేశారు. అనంతరం యోగానంద సరస్వతీ స్వామి ప్రవచనాలు, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీధర్రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, ఉ గాది ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్, ఉత్సవసమితి అధ్యక్షుడు కొరిపెల్లి దేవేంధర్రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, నాయకులు రామకృష్ణగౌడ్, గురుదీప్సింగ్ భాటియా, నవయుగమూర్తి, అన్నపూర్ణ, వేణుగోపాలకృష్ణ, పొడెల్లి చిన్నయ్య, గందె సుదీర్, రాంరమేశ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గండిరామన్న సాయిబాబా ఆలయంలో సాయి దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో డీఎస్పీ మనోహర్రెడ్డి పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం ఆచార్య కళ్యాణ్ పంచాంగ శ్రవణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో బీజేపీ స్వచ్ఛ భారత్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్, సబ్ రిజిస్ట్రార్ జ్యోతి, సాయి దీక్షా సేవా సమితి సభ్యులు దేవిదాస్, శ్రీయ, గోవర్ధన్, పడిగెల లింగయ్య, దేవన్న, రేణుకాదాస్, హరీష్, శివ తదితరులు పాల్గొన్నారు. -
మహా జన సంరంభం
ప్రవహించినంతమేరా పచ్చటి ప్రకృతిని మాత్రమే కాదు... జనపదాలనూ, సంస్కృతీ సంప్రదాయాలనూ పెంపొందింపజేసే నదులకు మనిషి జీవితంలో విశిష్ట స్థానం ఉంది. అవి మనిషి దాహార్తినీ, క్షుదార్తినీ తీర్చడంతోనే ఆగిపోలేదు. సంస్కారాన్నిచ్చాయి. సహజీవనాన్ని నేర్పాయి. విజ్ఞానతృష్ణను రగిల్చి ఉన్నత స్థానానికి చేర్చాయి. నదులను అమ్మలా సంభావించుకుని ప్రణమిల్లడం, పూజాదికాల్లో నదులరీత్యా ఉనికిని చెప్పుకోవడం అందుకే. ప్రాణికోటి మనుగడకు ఆధారమైన పంచభూతాల్లో నీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః/ పరోపకారాయ వహంతి నద్యాః’ అనే సూక్తి నదులకుండే ప్రవాహ గుణంలోని పరోపకారత ను పట్టిచూపుతుంది. మనిషికీ, నదీమతల్లికీ గల అనుబంధాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక సందర్భమయ్యే గోదావరి పుష్కరాలు మంగళవారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మొదలవుతున్నాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే క్షణాలను గణనలోకి తీసుకుని తెలంగాణలో ఉదయం 6.21 గంటలకూ...ఆంధ్రప్రదేశ్లో ఉదయం 6.26కూ ఈ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. పన్నెండేళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాలు జన, జల రాశుల మహా సంగమం. మహా సంరంభం. ఈసారి ఆంధ్రప్రదేశ్లో 5 కోట్లమంది, తెలంగాణలో 3 కోట్లమంది పుష్కరాల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి జరిగేవి 144 ఏళ్లకొకసారి వచ్చే మహా పుష్కరాలని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకే వీటి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ పుష్కర సమయంలో గోదావరీ తీరాన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్త రుషులూ, పితృ దేవతలూ నడయాడతారని ప్రతీతి. అందుకే ఈ పన్నెండు రోజులూ గోదావరి నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. పితృకర్మలు సాగుతాయి. దక్షిణాన అతి పెద్ద నదిగా...దేశంలో గంగానది తర్వాత రెండో పెద్ద నదిగా ప్రఖ్యాతి చెందిన గోదావరి... మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన సహ్యాద్రి కొండల్లో పుట్టి మొత్తంగా 1,465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 927 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఒకచోట పర్వత శిఖరాలనుంచి దుమికినా, మరోచోట కొండల్ని ఒరుసుకుంటూ, సుడులు తిరుగుతూ అన్నిటినీ చుట్టబెడుతూ, మహావృక్షాలను సైతం కూకటివేళ్లతో పెకిలిస్తూ ప్రళయ భీకర రూపం చూపినా...వేరొకచోట ప్రశాంత గంభీర వదనంతో ప్రవహించినా, చివరిగా సముద్రంలో సంగమించేందుకు ఉత్తుంగ తరంగాలతో ఉరకలెత్తుతూ వెళ్లినా గోదావరి తీరే వేరు. అది మానవ జీవితంలోని సకల పార్శ్వాలనూ గుర్తుకు తెస్తుంది. ఈ పుష్కరాల పనుల కోసం రెండు రాష్ట్రాలూ భారీగానే ఖర్చు చేశాయి. పుష్కరాలకొచ్చే భక్తులకు స్నాన ఘట్టాలు మొదలుకొని వసతి సౌకర్యాలవరకూ వివిధ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోజుకు దాదాపు 25 లక్షలమంది పుష్కర స్నానం చేస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 264 స్నానఘట్టాలను ఏర్పాటుచేశారు. ఇంత భారీయెత్తున ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయలు వ్యయం చేసిన రెండు ప్రభుత్వాలూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికొచ్చేసరికి ముఖం చాటేశాయి. మరికొన్ని గంటల్లో పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా పట్టనట్టు కూర్చున్నాయి. ఫలితంగా పారిశుద్ధ్యం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అన్నిచోట్లా చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రైనేజిలన్నీ పొంగిపొర్లి దుర్గంధం నిండింది. చినుకు పడిందే తడవుగా భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలే స్థితి నెలకొంది. తెలంగాణలో సమ్మె మొదలై 8 రోజులు గడుస్తుంటే...ఏపీలో మూడు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. చాలీచాలని వేతనాలను సరిదిద్దాలంటున్నారు. తమ బతుకుల్ని కాస్తయినా బాగుచేయమంటున్నారు. మిగిలినవారంతా సమీపానికి రావడానికి కూడా హడలెత్తే చెత్తలో నిత్యం మునిగితేలుతూ వీధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికులు చేస్తున్న కృషి నిజానికి వెలకట్టలేనిది. అలాంటివారి జీవితాలను కాంట్రాక్టు ఉద్యోగాల్లో పాతేసి, అభద్రతలోకి నెట్టడం అన్యాయమని, అమానుషమని పాలకులు ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యం కలుగుతుంది. ఈఎస్ఐ సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారుల పాలై వైద్య సేవలు లభించని స్థితి ఏర్పడినా కార్మికుల గోడు పట్టించుకునే నాథుడు లేడు. చట్టసభలకు ఒకసారి ఎన్నికైతేనే పెన్షన్తోసహా అనేక సౌకర్యాలు పొందేవారు... పౌరులందరికీ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంలో రాత్రింబగళ్లు శ్రమించేవారిని చిన్నచూపు చూడటం వింతగొలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే పొరుగునున్న తమిళనాడునుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించింది. తెలంగాణ సర్కారు సైతం ఆ తోవనే పోదల్చుకున్నట్టు కనబడుతోంది. అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి వారికి చేతినిండా పని కల్పించవచ్చు గనుక... కోట్లాది రూపాయలు వెనకేసుకోవచ్చు గనుక పుష్కర పనులంటూ హడావుడి చేస్తారు. వాస్తవానికి స్నాన ఘట్టాలవంటివి శాశ్వత ప్రాతిపదికన ఉండాల్సినవి. అందుకోసం పటిష్టంగా నిర్మాణం చేయాల్సినవి. కానీ పనులు నాసిరకంగా ఉండటంవల్ల వచ్చే పుష్కరాల వరకూ ఉండటం మాట అటుంచి కొన్ని నెలలకే నామరూపాల్లేకుండా పోతున్నాయి. కనుకనే ప్రతిసారీ వాటి కోసం కోట్లు ఖర్చుచేయాల్సివస్తున్నది. రోడ్ల సంగతి చెప్పనవసరమే లేదు. ఖర్చుచేశామన్న సొమ్ముతో పోల్చిచూస్తే జరిగిన పనులు సరిగా లేవన్నది అర్థమవుతుంది. భక్తినీ, చిత్తశుద్ధినీ, సత్సంకల్పాన్నీ పెంపొందింపజేసే ఈ పుష్కరాలు పాలకులకు సద్బుద్ధిని కలిగిస్తే మున్సిపల్ కార్మికులకూ, పౌరులకూ మేలు కలుగుతుంది. -
అంబరాన్నంటిన సంబరాలు
వైజాగ్ ఫెస్ట్కు అపూర్వ ఆదరణ.. వారాంతం కావడంతో శనివారం స్టాళ్లన్నీ కిటకిటలాడాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జనం పోటెత్తారు. పిల్లలు, పెద్దలు, యువత, వృద్ధులు అన్న తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫెస్ట్ ఆవరణంలో అడుగు పెట్టగానే అన్ని హంగులు, కావాల్సిన కార్యక్రమాలు, ఆహ్లాదపరిచే సాహితీ వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞానాన్ని పెంచే విషయాలు అందరినీ అలరిస్తున్నాయి. ఫెస్ట్ ముగింపుకు రావడంతో రద్దీ మరింత పెరిగింది. విశాఖ-కల్చరల్ : ఆలోచింపజేసే గీతాలు... హృదయాలను హత్తుకునే నృత్యాలు... జనాన్ని కదిలించే జనపదాలు అలరించాయి. గోరటి వెంకన్న గొంతెత్తి పాట పాడితే ప్రేక్షక లోకం ఒక్కసారిగా స్తంభించింది. కళాభిమానులు చెవులు రిక్కించి ఆయన పాటలను ఆలకించారు. వైజాగ్ ఫెస్ట్-సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఘంటసాల కళావేదిక శనివారం రాత్రి ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు అందించింది. జానపదం నుంచి కొత్తరూపం దాల్చిన ‘జనం కోసం రూపకం’ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఖమ్మం జిల్లా కూనవరం రాజయ్య బృందం ప్రదర్శించిన డోలుకొయ్యలు అలరించాయి. ‘గల్లీ చిన్నది.. గరీబోడికన్నా పెద్దదీ..’ అంటూ గోరటి వెంకన్న పాడిన పాట కదిలించింది. ఉత్తరాంధ్రపై ‘నాగవళీ, వంశధార, శారదా, తాండవ నదులు పొంగేటి గంగాయమ్మ తల్లీ...’ అంటూ సాగిన గీతం హర్షధ్వానాలు అందుకుంది. ఘంటశాల స్పోర్ట్సు అండ్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి చెన్నా తిరుమలరావు బృందం, అరుణోదయ, సుస్వరమాధురి, ప్రియరాగ వంటి ఆర్కెస్ట్రాలు ఆలపించిన సుమధుర సంగీత విభావరి సంగీత ప్రియులను మరోలోకంలో విహరింపచేసింది. అరుణోదయ నిర్మల్ బృందం ఆలపించిన జానపద గీతాలు ఉర్రూతలూగించాయి. పౌరాణిక కళాకారుడికి ఘన సత్కారం ప్రముఖ పౌరాణిక కళాకారుడు, నంది అవార్డు గ్రహీత డి.అచ్చియ్యనాయుడును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేంద్రకమిటీ సభ్యురాలు ఎస్.పుణ్యవతి, దడాల సుబ్బారావు, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మ మాట్లాడుతూ సాహిత్య, సంగీత, కళారంగానికి ఉత్తరాంధ్ర పుట్టినిల్లని కొనియాడారు. తాను గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం తొలి ప్రదర్శనలో పాల్గొన్నట్టు చెప్పారు. తొలుత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
ఉప్పొంగె... ఉత్సాహం
కాస్తంత ప్రోత్సాహం ఉంటే చాలు... ఎంతలా చెలరేగుతారో చూపించారు పేద విద్యార్థులు. ప్రతిభకు కొదవ లేదని... ఎవరికీ తీసిపోమనీ చేతల్లో చెప్పారు. దేశభక్తి గీతాలు, విచిత్ర వేషధారణలు, పల్లె సోయగాలు, జానపదాలు... ఒకటేమిటి... అన్నింటా అదరగొట్టి అబ్బురపరిచారు. యూత్ ఫర్ సేవ సంస్థ దర్గాలోని నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్లో ఆదివారం నిర్వహించిన ‘చిగురు’ వేడుకగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి, ఆదాపై విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు అద్భుతంగా ఉన్నాయి. నగరంలోని 150కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ ఆశ్రమాలకు చెందిన దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు ఈ వేడుకలో ఉత్సాహంతో ఊగిపోయారు. పేద విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని యూత్ ఫర్ సేవ వ్యవస్థాపకుడు శోభిత్ చెప్పారు. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు రక్తదానం చేశారు. -
హరహర మహాదేవ
హొసూరు/కెలమంగలం/క్రిష్ణగిరి : మహాశివరాత్రి సందర్భంగా క్రిష్ణగిరి జిల్లాలోని ఈశ్వరాలయాలకు మంగళవారం వేకువ జాము నుంచి భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకొన్నారు. క్రిష్ణగిరి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో విశేషపూజలు, రథోత్సవాలు, హోమాలు, తీర్థప్రసాద వినియోగాలతో పాటు అన్నదానం, వివిద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హొసూరు తాలూకా ఎస్.ముదుగానపల్లిలో ప్రసిద్ద శ్రీ ప్రసన్నపార్వతీసమేత అమృత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి 9 గంటలకు ఊంజల సేవతో కార్యక్రమం ప్రారంభమైయ్యింది. మంగళవారం ఉదయం 6 గంటలకు గణపతి ప్రార్థన, కలశారాధన, నవగ్రహ, గణపతి హోమం, రథసంప్రోక్షణం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉత్సవ మూర్తులను రథంలో ఉంచి రథోత్సవాన్ని జరిపారు. సాయంత్రం 6 గంటలకు అభిషేకం, రుద్రపారాయణం జరిగింది. మధ్యాహ్నం మహామంగళారతి, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటలకు తిరుమలతిరుపతి దేవస్థానం కళాకారిణి విజయకుమారి భాగవతారణిచే హరికథా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్. ముదుగానపల్లి చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త వి. గోవిందరెడ్డి నేతృత్వంలో గ్రామస్థులు ఏర్పాటు చేశారు. పంచాయతీ అధ్యక్షులు పద్మావతి, మాజీ అధ్యక్షులు లోకేశ్రెడ్డి, శాంతమ్మ, నివృత ఉప విద్యాశాఖాధికారి మునిరెడ్డి, గ్రామపెద్దలు రమేశ్రెడ్డి, రవి టీచర్, వి.లోకేష్రెడ్డి, ఎం.బాబురెడ్డి, లోకేష్, కౌన్సిలర్ రమేష్, సహకార బ్యాంక్ అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి, జిల్లా కౌన్సిలర్ శేఖర్, అప్పోజిరెడ్డి, హొసూరు యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేశ్ తదితరులు పాల్గొన్నారు. హొసూరులో చారిత్రక ప్రసిద్ది పొందిన శ్రీ మరకత సమేత చంద్రచూడేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. మంగళవారం వేకువ జామునుండే స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని చంద్రచూడేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్పించుకొన్నారు. ప్రత్యేక అలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. తీర్థప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హొసూరు నంజుండేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. విశేష పూజలు, భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. కాళేశ్వరంలో కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. బాగలూరులో ఈశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కెలమంగలం బేవనత్తం వద్ద గల శివానంజుండేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు మంగళవారం ఆలయం వద్దకు చేరుకొని కొండపై కొలువైన కైలాసనాథున్ని దర్శించుకొన్నారు. కెలమంగలం నుండి, డెంకణీకోట నుండి బేవనత్తంకు ప్రత్యేక ఆర్టీసి బస్సులు నడిచాయి. ప్రైవేట్ వాహనాలు, టెంపోలలో భక్తలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివెళ్లారు. సోమవారం రాత్రి సాసువుల చిన్నమ్మ తెలుగు సామాజిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 50 గ్రామాలకు చెందిన ప్రజలు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. వీరికి అన్నదానం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి కురుక్షేత్రం పౌరాణిక నాటక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శివనపల్లి చెన్నవీరభద్రస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుందుకోట సమీపంలోని మల్లిఖార్జునదుర్గంపై నెలగొన్న మల్లిఖార్జునస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగింది. తళి, గుమ్మళాపురం, గ్రామాల్లో, అగ్గొండపల్లిలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. సూళగిరిలో సూళగిరిలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పేరండపల్లి సమీపంలోని శివశక్తి నగర్లో అర్థనారే శ్వరమ్మస్వయంబు దేవాలయంలో శివరాత్రి పండుగ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోరుద్రాభిషేకం, కళశస్థాపన, ప్రాకారోత్సవం, అనంతరం రథోత్సవం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
7న ‘అంతరం’ నృత్యరూపకం
తమిళసినిమా: తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రాచుర్యం పొందిన భరతనాట్యం, కూచిపూడి, మోహినీ ఆట్టం, తమిళనాట బహుళ ప్రాచుర్యం పొందిన కన్నగి ఇతివృత్తాలతో అంతరం పేరుతో బ్రహ్మాండమైన నృత్యరూపక కార్యక్రమం జరగనుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రిన్స్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఈ నెల 7న స్థానిక రాయపేటలో గల మ్యూజిక్ అకాడమీలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి సుహాసిని, నృత్య కళాకారిణులు గోపిక వర్మ, యామినిరెడ్డి, కృతిక సుబ్రమణియన్ నర్తించనున్నారు. నాలుగు భాషల్లో నిర్వహించనున్న ఈ నృత్య రూపకానికి నటి సుహాసిని నేపథ్య సంభాషణలను ఆయా భాషలతోపాటు ఆంగ్లాన్ని కలిసి అందించనున్నట్లు ఆమె మంగళవారం సాయంత్రం స్థానిక రాయపేటలోని ప్రిన్స్ జ్యువెలరీ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు. ఆమె మాట్లాడుతూ ఒకసారి ప్రముఖ నృత్య కళాకారిణి గోపికా వర్మ కలిసినప్పుడు నాట్య కళారంగం మరుగున పడిపోతోందని, దాన్ని బతికించుకోవడానికి కృషి చేయాలన్న ఆలోచనకు రూపకల్పన ఈ అంతరం నృత్యరూపకమే అని పేర్కొన్నారు. మొత్తం 1.45 గంటల పాటు సాగే ఈ నృత్య రూపకంతో యామిని రెడ్డి, కృతిక సుబ్రమణియన్, గోపిక వర్మ నృత్యం 20 నిమిషాలు తాను నటించి నర్తించే ఓ కన్నగి ఇతివృత్తం సాగుతుందని తెలిపారు. తన నృత్యానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషంగా పేర్కొన్నారు. ఇంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన ప్రిన్స్ జ్యువెలరీ సంస్థ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తోందని సుహాసిని చెప్పారు. ఈ సమావేశంలో యామినిరెడ్డి, కృతిక సుబ్రమణియన్, గోపిక వర్మ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన సంబరాలు
జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా మొదలయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే పీలా గోవింద ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సంబరాల సెట్టింగ్, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, వివిధ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సంప్రదాయక దుస్తుల పోటీలు అలరించాయి. అనకాపల్లి: జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సంబరాల సెట్టింగ్, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, వివిధ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి ముగ్గుల పోటీలను, పిల్లల గాలిపటాల పోటీలను, మహిళల వంటల పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన సంప్రదాయక దుస్తుల పోటీలను పలువురు ఆసక్తిగా తిలకించారు. హరిదాసులు, గంగిరెద్దులు, ఎడ్లబండ్ల అలంకారాలు, సంక్రాంతి కుటీరాలు, కోలాటాలు, బొమ్మలకొలువులు, తప్పెటగుళ్లు, చిడత భజన వంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతిని చాటిచెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల ఉత్పత్తులు, పాడి పశువులతో పాటు ఎస్వీడీఎస్ స్టాళ్లు, ఐసీడీఎస్ స్టాళ్లు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన లక్కీడిప్ బహుమతులు, పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్రోత్సాహక బహుమతులతో అందరిలో ఉత్సాహం కనిపించింది. ఆర్డీవో పద్మావతి, జీవీఎంసీ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ, మండల పరషత్ సిబ్బంది, పశుసంవర్థక శాఖ, వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బంది, వెలుగు సిబ్బందితో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గంటా ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. -
హంపి ఉత్సవాల్లో నేటి కార్యక్రమాలు
హొస్పేట : హంపి ఉత్సవంలో భాగంగా మూడో రోజు ఆదివారం వివిధ వేదికలపై జరుగనున్న సంగీత, సాంస్కృతిక, నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. శ్రీకృష్ణదే వరాయ వేదికపై... ఆదివారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు సిరుగుప్ప చిదానంద రారావి ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 5.30 నుంచి 6 గంటల వరకు సండూరు ఉమేష్కే ఆధ్వర్యంలో తబల జుగల్బందీ, 6 నుంచి 7 గంటల వరకు హొస్పేట శరణ బసవ ఒకార బృందం ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం, నాడగీత రైతు గీతాలు, 7నుంచి 8.30 గంటల వరకు ముంబయి రిచాశర్మ ఆధ్వర్యంలో గీత గాయన, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు తంజావూరు దక్షిణజోన్ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో జానపద నృత్యం, రాత్రి 9.30 ముంబయి వికాస్సింగ్ ఆధ్వర్యం రసమంజరి జరగనుంది. ఎంపీ ప్రకాష్ వేదికపై... సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు కోలారు పిచ్చళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జానపద గీతాలు, 6 నుంచి 6.45 గంటల వరకు బెంగళూరు రాధికా నందకుమార్ బృందం ఆధ్వర్యంలో నృత్య రూపకం, 6.45 నుంచి 7.40 గంటల వరకు ధార్వాడ కైవల్యకుమార్ ఆధ్వర్యంలో హిందుస్థానీ సంగీతం, 7.30 నుంచి 8 గంటల వరకు బెంగళూరు విద్వాన్ టీఎస్ మణి బృందం ఆధ్వర్యంలో తాళ వాయిద్య ఫ్యూజియన్, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు నాగపూర్ దక్షిణ కేంద్రం విభాగం సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో జానపద నృత్యం, 9 నుంచి 10 గంటల వరకు బెంగళూరు పింక్ ఫ్లవర్స్ ఆధ్వర్యంలో సాంప్రదాయ అన్వేషణ ప్రదర్శన, 10 నుంచి 10.30 గంటల వరకు మంగళూరు హెజ్జనాథ ఆధ్వర్యంలో దుర్గాశక్తి నృత్య రూపకం, 10.30 నుంచి 11.15 బెంగళూరు బాబు పద్మనాభ ఆధ్వర్యంలో వేణు వాదన, 11.15 నుంచి 11.40 గంటల వరకు బెంగళూరు డాక్టర్ సువర్ణ రవిశంకర్ ఆధ్వర్యంలో వీణా వాదన, 11.40 నుంచి 12 గంటల వరకు సండూరు సహన ఆధ్వర్యంలో సుగమ సంగీతం ఉంటుంది. విద్యారణ్య వేదికపై... సాయంత్రం 5.30 నుంచి 5.50 గంటల వరకు హావేరి బసవరాజ తిరుకప్ప భజంత్రీ ఆధ్వర్యంలో షహనాయి వాదన, 5.50 నుంచి 6.20 గంటల వరకు రాయచూరు అంబయ్యనులి ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 6.20 నుంచి 6.45 గంటల వరకు బేళూరు శివణ్ణ బృందం ఆధ్వర్యంలో జానపద గీతాలు, 6.45 నుంచి 7.15 గంటల వరకు బెంగళూరు జయశ్రీ రవి బృందం ఆధ్వర్యంలో నృత్య రూపకం, 7.15 నుంచి 7.35 గంటల వరకు కూడ్లిగి అనురాధ ఆధ్వర్యంలో దాసర పదాలు, 7.35 నుంచి 8 గంటల వరకు బళ్లారి దొడ్డయ్య వి.కల్లూరు ఆధ్వర్యంలో వచన సంగీతం, రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు గంగావతి రాఘవేంద్ర హెచ్ఏ ఆధ్వర్యంలో సామూహిక నృత్యం, 6.30 నుంచి 8.50 గంటల వరకు ధార్వాడ శివకుమార్ పాటిల్ ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 8.50 నుంచి 9.15 గంటల వరకు రాణి బెన్నూరు కేసీ నాగ రజిని బృందం ఆధ్వర్యంలో జానపద గీతాలు, 9.15 నుంచి 10 గంటల వరకు బళ్లారి శివశంకర నాయుడు ఆధ్వర్యంలో హాస్య నాటకం, 10 నుంచి 10.20 గంటల వరకు హగరిబొమ్మనహళ్లి కె.శారద ఆధ్వర్యంలో వచన గాయన, 10.20 నుంచి 10.45 గంటల వరకు బళ్లారి ఎం.నాగభూషణ బాపురే ఆధ్వర్యంలో హిందుస్థానీ సంగీతం, 10.45 నుంచి 11.15 గంటల వరకు బెంగళూరు హెచ్.ఫల్గుణ ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 11.15 నుంచి 11.30 గంటల వరకు కొప్పళ హనుమంత నరేగల్ ఆధ్వర్యంలో భావగీతాలు, 11.30 నుంచి 12.30 గంటల వరకు మరియమ్మనహళ్లి లలిత కళాబళగ బృందం ఆధ్వర్యంలో చారిత్రక నాటక ప్రదర్శన ఉంటుంది. బుర్రకథ దరోజీ ఈరమ్మ వేదికపై... సాయంత్రం 5.30 నుంచి 5.50 గంటల వరకు హడగలి హుగ్గి రుద్రమ్మ ఆధ్వర్యంలో సాంప్రదాయ పాటలు, 5.50 నుంచి 6.10 గంటల వరకు హొస్పేట బి.మారెప్ప ఆధ్వర్యంలో బుర్రకథ, 6.10 నుంచి 6.20 గంటల వరకు కంప్లి రాహుల్ నాగప్ప బృందం ఆధ్వర్యంలో రాజన కుణిత, 6.20 నుంచి 6.40 గంటల వరకు మడికేరి ఏవీ షడాక్షరి బృందం ఆధ్వర్యంలో జానపద గీతాలు, 6.40 నుంచి 7.30 గంటల వరకు బళ్లారి రామాంజినేయ తోలుబొమ్మలాట మేళ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట, 7.30 నుంచి 7.50 గంటల వరకు కొప్పళ గుండూరు ఉసేన్సాబ్ ఆధ్వర్యంలో రంగగీతాలు, 7.50 నుంచి 8.15 గంటల వరకు బాగలకోట విఠల్ బలవంతరావు పుత్తూర సింధె ఆధ్వర్యంలో రివాయత్ పాటలు, రాత్రి 8.15 నుంచి 8.30 గంటల వరకు టీబీడ్యాం కన్నడ కళా సంఘం ఆధ్వర్యంలో హాస్య నాటకం ఆహా..నన్న మదువె అంతే, 9.30 నుంచి 10.30 గంటల వరకు బళ్లారి అభినవ కేంద్రం ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన, 10.30 నుంచి 12 గంటల వరకు మల్పనగుడి మల్లికార్జున నాట్య కళా సంఘం ఆధ్వర్యంలో పౌరాణిక నాటక రక్తనాటకం ఉంటుంది. హక్కబుక్క వేదికపై... సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు హొస్పేట కృష్ణప్ప ఎం.జోగి ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 6.30 నుంచి 7 గంటల వరకు బళ్లారి నవజీవన వికలాంగుల పాఠశాల ఆధ్వర్యంలో సమూహ నృత్యం, 7 నుంచి 7.45 గంటల వరకు బళ్లారి బీఎం వీరభద్రయ్య ఆధ్వర్యంలో హిందుస్థానీ సంగీతం, 7.45 నుంచి 8.15 గంటల వరకు బళ్లారి ప్రభుత్వ చెవిటి విద్యార్థుల ఆధ్వర్యంలో సామూహిక నృత్యాలు, రాత్రి 8.15 నుంచి 9 గంటల వరకు తిమ్మలాపురం హనుమయ్య ఆధ్వర్యంలో జానపద గీతాలు, 9 నుంచి 10 గంటల వరకు హగరి బొమ్మనహళ్లి కుబేంద్రశాస్త్రీ ఆధ్వర్యంలో కథకేతన ఉంటుంది. -
సంక్రాంతి సంబరాలు అదిరిపోవాలి
కలెక్టర్ యువరాజ్ విశాఖపట్నం: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 13న అధికారికంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల ద్వారా అన్ని మండలాలు, పట్టణాల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని కలెక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు.సంబరాల్లో భాగంగా ప్రతీ గ్రామం నుంచి ముగ్గురు ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి మండలస్థాయిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలు అందజేయాలన్నారు. ఒక్కో మండలానికి రూ.1.50లక్షలు సంబరాల నిర్వహణకు తక్షణం విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. మండల కేంద్రాల్లో నిర్వహించే సంబరాల్లో యువతకు కబడ్డీ పోటీలు, మహిళలకు ముగ్గులు, పిండివంటలు, రైతులకు పశువులు, పం టల ప్రదర్శన పోటీలు నిర్వహించాలన్నారు. విశాఖ నగరాన్ని సంక్రాంతి కళ ఉట్టిపడేలా గొబ్బమ్మలు, రంగవల్లులతో అలంకరించాలని సూచించారు. నగరంలో ఒక్కో జోన్లో రెండు చోట్ల ఈ సంబరాలు నిర్వహించాలన్నారు. సంక్రాంతి సంబరాల నిర్వహణపై కలెక్టర్ తన ఛాంబర్లో శనివారం జిల్లా అధికారులతో సమీక్షించారు. కైలాసగిరిపై గాలిపటాల ఉత్సవం, గంగిరెద్దులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. విశాఖ నగరంలో పలుచోట్ల సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మహా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నూతనోత్సాహం
ఘనంగా నూతన సంవత్సరాది వేడుకలు విందు వినోదాల్లో యువత కేరింత జన సందోహంతో హోటళ్లు కిటకిట తిరుపతి కల్చరల్: నూతన సంవత్సర వేడుకలు జిల్లాలో హోరెత్తాయి. ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటారుు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే యువత కేక్లు కట్ చేసి కేరింతలు కొట్టింది. బాణసంచా పేల్చి రంగులు చల్లుకుంటూ ఆనంద హేలలో మునిగి తేలారు. బంధు మిత్రులకు నూతన శుభాకాంక్షలు చెప్పారు. ఉదయం నుంచే నగరంలో సందడి కనిపించింది. బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్ఛాలు, కేక్లు, స్వీట్లు కొనుగోళ్లతో నగరంలో సందడి నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లవర్ బాస్కెట్స్, బేకరీ షాపులు కిటకిటలాడాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహల మధ్య నూతన సంవత్సర సంబరాలు చేసుకున్నారు. నగరంలోని స్టార్ హోటళ్లలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టీవీ యాంకర్, జబర్దస్త్ టీమ్తో కార్యక్రమాలు సాగారుు. సంగీత విభావరి, హాస్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రత్యేక ఆఫర్లతో ఆహార పదార్థాలు అందించడంతో స్టార్ హోటళ్లు కిటకిటలాడారుు. బాణసంచా వేడుకలు, డప్పు వాయిద్యాలు మార్మోగాయి. చిన్నాపెద్దా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. -
విద్యను నిర్లక్ష్యం చేయొద్దు
శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, ప్రముఖ నటుడు మోహన్బాబు ఘట్కేసర్: విద్యకు అంత్యంత ప్రాధాన్యం ఇస్తానని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, ప్రముఖ నటుడు మోహన్బాబు పేర్కొన్నారు. పోచారం పంచాయతీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో ఉన్న శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో శనివారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధికి విద్య ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విద్యను నిర్లక్ష్యం చేయరాదన్నారు. తన విద్యా సంస్థల్లో కులమతాలకు అతీతంగా 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలను మో సం చేసే రాజకీయనాయకులు, విద్యార్థులను మోసం చేసే ఉపాధ్యాయులు మనుగడ సాధించలేరన్నారు. తన అసలు పేరు భక్తవత్సలం అని, దానిని తన గురువు దాసరి నారాయణరావు మోహన్బాబుగా మార్చారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువులు, తల్లిదండ్రుల పాత్ర చాల కీలకమైందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి రాంరెడ్డి, టౌన్షిప్ అధ్యక్షుడు హరిప్రసాద్ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. -
బాల దిగ్గజాలు
పట్టుమని పదేళ్లు కూడా నిండని పిల్లలు.. రంగస్థలంపై రసరమ్యంగా నటించారు. ఏదో చిన్నాచితకా వేశాలు కాదండోయ్.. ఏకంగా రాయల వైభవాన్ని కళ్లకు కట్టారు. ప్రబంధకాలం నాటి అష్టదిగ్గజాలుగా ఒదిగిపోయిన బాల దిగ్గజాలు తమ నటనతో ఔరా! అనిపించుకున్నారు. కృష్ణరాయల కీర్తి, మహామంత్రి తిమ్మరుసు ధీయుక్తిని.. వికటకవి తెనాలి రామలింగడి చాతుర్యాన్ని ప్రదర్శించి నటనలో తమకు తామే సాటని నిరూపించుకున్నారు ఆ బాలలు. ముద్దు ముద్దు మాటలు.. అనుకరణ తొంగిచూడని అభినయం.. ఈ చిన్నారుల సొంతం. అందుకే మహామహులకైనా తికమకపెట్టే పాత్రలు ఈ బుడతల దగ్గరకు వచ్చేసరికి నవరసాల్లో నాట్యమాడాయి. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య భువనవిజయాన్ని మరోసారి చూసి తరించాయి. ‘గ్లోబల్ ఎడ్జ్ స్కూల్’ కలైడోస్కోప్ 2014-15 వార్షిక ఉత్సవాలను ‘ఎక్స్ప్రెషన్స్’ పేరుతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించింది. శ్రీకృష్ణదేవరాయలు పాలనలోని కొన్ని ఘట్టాల ఆధారంగా చిన్నారులు ప్రదర్శించిన నాటకం అందరి మన్ననలు అందుకుంది. భువన విజయం.. అష్ట దిగ్గజాలు కొలువుదీరిన రాయల ఆస్థానం భువనవిజయంగా చారిత్రక ప్రశక్తి పొందింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భువనవిజయం కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. తెలుగు, సంస్కృత భాషా పండితులు అష్టదిగ్గజాల పాత్రల్లో అలరిస్తారు. అలాంటి ఇతివృత్తాన్ని ఎంచుకున్న ఒకటో తరగతి విద్యార్థులు చారిత్రక పాత్రల్లో జీవించారు. రాయలుగా కార్తీక్, తిమ్మరుసుగా సాయిధ్రువ్, తెనాలి రామకృష్ణుడుగా గీతేష్రెడ్డి, మిగిలిన కవులుగా మౌర్య, వరుణ్తేజ, సూర్యతేజ, సాయి శ్రీహిత్, వీణహంసిని, జయదేవ్లు, ఇతర పాత్రల్లో అల్లా రన్వీ శ్రీ, శశాంక్ నటించారు. రాయలు, రామకృష్ణ కవి మధ్య జరిగిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అవకాశం ఇస్తే మహా నటులకు తామేం తీసిపోమని నిరూపించారు. తెర వెనుక.. ఒకప్పుడు స్కూల్స్లో కల్చరల్ ఈవెంట్స్ అంటే.. ఒకట్రెండు రోజులు ప్రాక్టీస్ చేసి తమ ప్రతిభను ప్రదర్శించేవారు. అయితే పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సరికొత్త ఈవెంట్లు డిజైన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. పౌరాణిక, చారిత్రక నాటకాలను వారితో వేయించి.. చరిత్ర మూలాలను పిల్లలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ‘పౌరాణిక, చారిత్రక నాటకాలు కనుమరుగవుతున్నాయి. చరిత్ర, సాహిత్యం పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే ఈ నాటకం పిల్లలతో వేయించాను. నెల రోజులు ప్రాక్టీస్ చేయించాను. ఈ పిల్లలు ఇంత అద్భుతంగా నటిస్తారని అనుకోలేదు’ అని పిల్లలతో దగ్గరుండి నాటకం వేయించిన తెలుగు ఉపాధ్యాయురాలు గాయత్రీ శ్రీరామ్ తెలిపారు. పసి మనసుల్లో.. తమ అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చిన్నారులు.. పెద్దలు చూపిన దారిలో ముందుకెళ్తామని చెబుతున్నారు. పాలనతో మేధావులకు పెద్ద పీఠ వేస్తానని రాయల పాత్ర పోషించిన కార్తీక్ చెబుతున్నాడు. తెనాలి రామకృష్ణుడిలా తానూ జీనియస్ అని నిరూపించుకుంటానని తెలిపాడు గీతేష్ రెడ్డి. అంతే కాదు మరిన్ని పౌరాణిక నాటకాలు వేస్తామని చెబుతున్న చిన్నారులకు జేజేలు చెబుదాం. ..:: కోన సుధాకర్రెడ్డి -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ప్రశాంతినిలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. సాయంత్రం విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీలో భాగంగా సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు. సత్యసాయి చిత్రపటాన్ని జోలలో ఉంచి ఊపుతూ భక్తి గీతాలాపన చేశారు. కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బృందం సంగీత కచేరీ నిర్వహించింది. మధుర స్వరాలొలికిస్తూ భక్తులను అలరించింది. మంగళహారతితో జయంతి వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో ‘నారాయణ సేవ’ నిర్వహించారు. వేలాది మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఓంశాంతి సంస్థ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో ప్రపంచ శాంతి సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను స్థానిక శివాలయం వద్ద రాష్ట్ర ఉపముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు. 108 శివలింగాకృతులను పుట్టపర్తిలో ఊరేగించారు. నవధాన్య, నవరత్న నిర్మిత శివలింగాలను సైతం ఊరేగించారు. -
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
రేపే మహాయాత్ర
గ్రేటర్ నగరం ఆధ్యాత్మిక సాగరమైంది. వీధివీధినా విభిన్న రూపాల్లో వినాయకుడిని కొలువుదీర్చిన జనం తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పూజలు... భజనలు... సాంస్కృతిక కార్యక్రమాలతో గణేశుని మండపాల పరిసరాల్లో సందడి నెలకొంది. శనివారం నాటికి తొమ్మిది రోజులు పూర్తి కావడంతో భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనం చేశారు. మేళతాళాలు.. డప్పుల దరువులు.. విచిత్ర వేషధారణలతో ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు, దుర్గం చెరువుల్లో గణేశ నిమజ్జనం పూర్తి చేశారు. మరోవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాగణపతి కొలువైన ఖైరతాబాద్ పుణ్యక్షేత్రాలను తలపించింది. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది విశ్వరూప మహాగణపతిని దర్శించుకున్నారు. ఒక్క శనివారమే 2 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అంచనా. నిమజ్జనానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఆదివారం సుమారు 3-4 లక్షల మంది ఖైరతాబాద్కు తరలి రానున్నారని అంచనా. మరోవైపు సోమవారం మహా గణపతితో పాటు సామూహిక నిమజ్జనానికి విగ్రహాలను తరలించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల ఉత్సవ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఇలా.. 30 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 800 సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. 605 సమస్యాత్మక ప్రాంతాలుగా, 310 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 410 మొబైల్ పార్టీలు ముందుజాగ్రత్త చర్యగా 30 బాంబ్ డిస్పోజబుల్ బృందాలను ఏర్పాటు చేశారు. మండపాల నుంచి విగ్రహాలను లారీల్లోకి ఎక్కించేందుకు 71 మొబైల్ క్రేన్లను వినియోగిస్తున్నారు. రద్దీ ప్రాంతాలైన రైల్వే, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు, షాపింగ్మాల్స్తోపాటు వాహనాల తనిఖీలను నిమజ్జనం పూర్తయ్యే వరకు చేపడతారు. నగరానికి చేరుకున్న విశాఖపట్నం నేవీకి చెందిన గజ ఈతగాళ్లు అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిపి గత నెల 28 నుంచి చార్మినార్ వద్ద గల సర్దార్మహల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కొనసాగిస్తున్నారు. బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్తోపాటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్పై ఉన్న గాంధీనగర్ ఔట్పోస్టు వద్ద పోలీసు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కూడా జనం వచ్చే అవకాశం. నగరంలో మొత్తం 23 వేల గణేశ్ విగ్రహాలను నెలకోల్పారు. మూడు, ఐదు, ఏడో రోజుల్లో పలు విగ్రహాలను నిమజ్జనం చేయగా సామూహిక నిమజ్జనానికి మరో ఏడు వేల వరకు మిగిలి ఉన్నాయి. సైబరాబాద్లో.. 9,400 మందితో బందోబస్తు ఇందులో ఏడుగురు డీసీపీలు, 25 మంది ఏసీపీలు, 90 మంది సీఐలు, 490 మంది ఎస్ఐలు ఉన్నారు. బాంబ్ స్వ్కాడ్స్ 109 చోట్ల వాహనాల తనిఖీలు 312 చోట్ల పికెట్స్, 112 మొబైల్ పార్టీలు 57 పిక్ యాక్షన్ టీమ్లు 51 క్రైమ్ కంట్రోల్ టీమ్లు 30 ప్లటూన్ల స్పెషల్ పోలీస్ -
గ్రామస్థాయి నుంచి సంబరాలు
సప్తగిరికాలనీ, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించేం దుకు అధికార యంత్రాం గం సమాయత్తమవుతోం ది. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో జూన్ 1, 2 తేదీల్లో సంబరాలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య బుధవారం జిల్లా అధికారులు, టీఎన్జీవోస్, ఉపాధ్యాయ సంఘాలు, సాహితీ సంస్థల నాయకులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. 60 ఏళ్ల ప్రజల పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న జరిగే వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. సంబ రాల్లో ఉద్యోగుల జేఏసీ ముఖ్య పాత్ర పోషించాలని, ప్రజాప్రతినిధులు, నాయకులకు భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లా కేంద్రం లో రెండు రోజులు వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. జూన్ 1న కలెక్టరేట్ నుంచి కళాకారులు బతుకమ్మలతో సర్కస్ గ్రౌండ్ వరకు ర్యాలీ ఉంటుందని, రాత్రి సర్కస్గ్రౌండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులు, బోనాలు, బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. సర్కస్గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమాలు ఉంటాయన్నారు. జూన్ 2న ఉదయం కలెక్టరేట్లో జాతీయపతాక ఆవిష్కరణ, జాతీయ, తెలంగాణ గీతాలాపన, ప్రతిజ్ఞ, కలెక్టర్ సందేశం ఉంటాయని తెలిపారు. అనంతరం ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అమరవీరుల కుటుంబాలకు సన్మానం, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. తెలంగాణ సంబరాల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జేసీ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి లింగయ్య, డీపీఆర్వో ప్రసాద్, హౌసింగ్ సీడీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
అవతరణ దినోత్సవాలకు అంతా సిద్ధం..!
సాక్షి, ముంబై: సంయుక్త మహారాష్ట్ర అవతరించి నేటితో 54 సంవత్సరాలు పూర్తయ్యాయి. 55వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అవతరణ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ముంబై నగరంలోని శివాజీ పార్క్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భద్రతా దళాల కవాతు ప్రదర్శనతోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను అలరించనున్నాయి. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు అవతరణ వేడుకల కోసం అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశాయి. ప్రభుత్వంతోపాటు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పేదల కోసం ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతోపాటు పలు సేవాకార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అవతరణ దినోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం పలు ఆంక్షలు విధించింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా దాదర్లోని శివాజీపార్క్లో భారీ ఎత్తున మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల సందర్భంగా లాంగ్మార్చ్(పరేడ్) తీయనున్నారు. దీంతో ఈ పరేడ్ కోసం గురువారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ను దారిమళ్లించనున్నారు. శివాజీపార్క్ మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ పరేడ్ గేట్ నంబర్ 4 నుంచి బయటకు రానుంది. అనంతరం అక్కడి నుంచి కెలూస్కర్ మార్గ్, గడ్కరీ చౌక్, ఎన్.సి. కేల్కర్ మార్గ్, కొత్వాల్ గార్డెన్, తిలక్ బ్రిడ్జీ, దాదర్ టీటీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డు, డాక్టర్ అశోక్ తుల్పులే చౌక్, లేడీ జహంగీర్ మార్గ్ల మీదుగా సాగుతూ ఫైవ్ గార్డెన్ మాటుంగాలో ముగియనుంది. దీంతో ఎన్.సి. కేల్కర్ మార్గ్, ఎల్.జె. రోడ్డు జంక్షన్ నుంచి కేలూస్కర్ మార్గ్, దక్షిణ, ఉత్తర జంక్షన్ల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేదించారు. కేలుస్కర్ మార్గ్ దక్షిణం నుంచి తూర్పు వైపు వెళ్లే మార్గాన్ని వన్వేగా మార్చనునున్నారు. ఇలా పరేడ్ వెళే ్లమార్గాల్లో పలు మార్పులు చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ముక్కలు ముక్కలుగా ఉన్న ప్రాంతాలన్నింటిని సంయుక్త మహారాష్ట్రగా చేసేందుకు అనేకమంది ప్రాణాలర్పించారు. 1938 నుంచి ప్రారంభమైన ఈ పోరాటం సుదీర్ఘ కాలంపాటు కొనసాగింది. ఫలితంగా 1960, మే 1న సంయుక్త మహారాష్ట్ర అవతరించింది. గడచిన 54 సంవత్సరాల్లో రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం మరింత తీవ్రమైంది. ముంబై రాష్ట్రంతోపాటు వర్హాడ్, నాగపూర్ తదితర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలన్నింటిని ఒక్కటి చే సి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ పోరాటంలో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగువారు కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ 105 మంది అమరవీరుల స్మృతి చిహ్నంగా ఫోర్ట్ ప్రాంతంలో హుతాత్మ(అమరవీరుల) చౌక్ను నిర్మించారు. మన రాష్ట్రం గురించి... రాష్ట్ర విస్తీర్ణం 3,07,670 చదరపు కిలోమీటర్లు. రాజధాని ముంబై జిల్లాలు 35 పట్టణాలు 378 గ్రామాలు 43,723 {పముఖ నగరాలు: ముంబై, నాగపూర్, పుణే, ఔరంగాబాద్, ఠాణే, కొల్హాపూర్, షోలాపూర్, నాసిక్ {పముఖ విమానాశ్రయాలు: ముంబై, నాగపూర్, పుణే, ఔరంగాబాద్ 2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 11.23 కోట్లు. దేశంలోనే అత్యధిక జనాభా(1,10,54,131) కలిగిన జిల్లా ఠాణే. -
శ్రీగిరి.. జన ఝరి
శ్రీశైలం, న్యూస్లైన్: ఓం నమః శివాయ నామస్మరణతో శ్రీగిరి మారుమ్రోగింది. శ్రీశైలాలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. గువారం రాత్రి శ్రీభ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణోత్సవం తిలకించిన భక్తులు.. శుక్రవారం స్వామి, అమ్మవార్ల రథోత్సవంలో పాల్గొని తన్మయత్వం చెందారు. మండల దీక్ష స్వీకరించిన శివస్వాములు దేవదేవుని దర్శనంతో పులకించిపోయారు. సాయంత్రం 5 గంటలకు వేద మంత్రోచ్ఛారణ.. మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణం నుంచి పల్లకీలో ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథంపై కల్యాణోత్సవ మూర్తులను అధిష్టింపజేయగా.. అశేష భక్తజనం జయజయధ్వానాల నడుమ రథోత్సవం కనులపండువగా ముందుకు సాగింది. అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా భక్తులు అరటి పండ్లను రథంపైకి విసిరి కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. ఇసుకేస్తే రాలనంత జనం మధ్య సాగిన రథోత్సవంలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గొరవయ్యల నృత్యం.. ఢమరుక నాదాలు.. బుట్టబొమ్మలు.. నందికోలు.. బంజారాల నృత్యం ప్రత్యేకత ఆకర్షణగా నిలిచాయి. రథశాల నుంచి మొదలైన రథోత్సవం అంకాలమ్మగుడి, నంది మండపం మీదుగా తిరిగి యథాస్థానానికి చేరుకుంది. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయ ప్రాంగణం చేర్చారు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ఆజాద్, ట్రస్ట్బోర్డు సభ్యులు పత్తి వెంగన్న, చుండు ప్రశాంత్, దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ, ఈఈ రమేష్, ఆలయ ఏఈఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిట్లో వసంతోత్సవ కళ
రేపటి నుంచి స్ప్రింగ్ స్ప్రీ నేడు లాంఛనంగా ప్రారంభం ముమ్మరంగా ఏర్పాట్లు హాజరు కానున్న ప్రముఖులు నిట్ క్యాంపస్, న్యూస్లైన్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం నుంచి స్ప్రింగ్ స్ప్రీ(వసంతోత్సవం) నిర్వహించనున్నారు. నిట్ వరంగల్ ఆధ్వర్యంలో ఏటా కల్చరల్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో గాయనీ, గాయకుల ఆట, పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆన్లైన్ షోలు, నృత్యాలు, ప్రముఖ గాయనీగాయకుల పాటలు, పాశ్చాత్య సంగీత ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఈ మేరకు నిట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈవెంట్లు ఇవే.. స్ప్రింగ్స్ప్రీలో భాగంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 40కి పైగా ఈవెంట్లు ప్రదర్శించనున్నారు. అల్లూరే, వార్ ఆఫ్ డీజే, ఐఆర్ఏ, టియర్ హిటప్, ఐడోల్, గేమ్ డోమ్, ఫుష్టల్, స్ట్రీట్ బాల్, గల్లీ క్రికెట్, ఫుడ్ ఫెస్టివల్, సోలో డ్యాన్స్, పెయిర్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, క్లాసికల్, వెస్ట్రన్ ఇన్స్ట్రిమెంట్ ప్రోగ్రామ్స్, నెహలే దే పెహలా.. యాహో జబర్దస్త్, రంగోలీ, పెయింటింగ్ కాంపిటీషన్, ఫొటో మెకానిజం, టీషర్ట్ డిజైనింగ్, ఆన్లైన్ ఈవెంట్స్, మిస్టర్ అండ్ మిస్ స్ప్రీ ఆన్లైన్ షోలు, షార్ట్ ఫిల్మ్ మేకింగ్స్ తదితర ఈవెంట్లు జరగనున్నాయి. ప్రముఖుల సంగీత కార్యక్రమాలు నిట్ ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు సన్బార్న్ ఆధ్వర్యంలో డీజే షో నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు టాలీవుడ్ గాయకురాలు సుచిత్ర పాటల కచేరీ, రాత్రి 9 నుంచి 10.30 వ రకు బాలివుడ్ ప్లేబ్యాక్ సింగర్ సూరజ్ జగన్ ఆధ్వర్యంలో హిందీ పాటల కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 23న రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు ప్రముఖ గిటారిస్ట్ బైజు ధర్మరాజన్ ఆధ్వర్యంలో రాక్బ్యాండ్ కార్యక్రమం, రాత్రి 8.30 నుంచి 9.15 గంటల వరకు ప్రముఖ డ్రమ్మర్ గినోబ్యాంగ్స్, గిటారిస్టు బైజు ధర్మరాజన్ ఆధ్వర్యంలో ఫ్యూషన్ బ్యాండ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అనూప్ రూబెన్స్, మిస్ ఇండియా శోభిత రాక స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమానికి మిస్ ఇండియా శోభిత దూళిపాళ, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరుకానున్నారు. మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న శోభిత దూళిపాళ తెనాలికి చెందినవారు. గత ఏడాది జరిగిన అందాల పోటీల్లో ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. కార్యక్రమానికి ఆమె గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఇరవైకి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనూప్ రూబెన్స్ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. బుడ్డా హోగా తేరా బాప్ హిందీ సినిమాతోపాటు ఇష్క్, హార్ట్ఎటాక్, ప్రేమకావాలి, అడ్డా, గుండె జారి గల్లంతయిందే సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. -
ఓయూలో ‘సంస్కృతి-2014’
-
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
ఏలూరు, న్యూస్లైన్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ సమైక్యతను చాటాయి. పరేడ్ గ్రౌండ్ వేలాదిమంది విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. ఏలూరు శ్రీశ్రీ విద్యాసంస్థ విద్యార్థులు జాతీయ జెండా ఔన్నత్యాన్ని చాటుతూ నిర్వహించిన రిబ్బన్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలి చింది. భీమవరం కాకతీయ ఇంగ్లిష్ మీడియం పాఠశాల వి ద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఏలూరు సెయింట్ థెరి స్సా బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల నృత్యాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. కోటరామచంద్రపురం కామయ్యకుంట గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థుల రేలారేరేలారే.. అంటూ గిరిజన సంప్రదాయాన్ని ప్రదర్శించారు. ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల తీరుతెన్నులను వివరిస్తూ ప్రభుత్వ శకటాల ప్రదర్శన కూడా సభికులను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది అగ్నిమాపక శాఖ, ఎన్నికల సంఘం కార్యక్రమాలను వివరిస్తూ శకటం, జిల్లా నీటి యజమాని సంస్థ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నీరు, పారిశుద్ధ్యమిషన్, హౌసింగ్, 108, 104, ఎయిడ్స్ కంట్రోల్ సంస్థల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. హౌసింగ్ శకటానికి ప్రథమస్థానం లభించింది. రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ పి.మరియన్రాజు ఆధ్వర్యంలో పోలీస్పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్లో ఆర్ఎస్ఐ బి.శ్రీనివాసరావు, కేఆర్ఎస్ఐ కె.చల్లన్నదొర ఆధ్వర్యంలో పాల్గొన్న సెకండ్ ప్లాటూన్కు ఉత్తమ కంటింజెంట్ అవార్డు లభించింది. ఉపకరణాల పంపిణీ వివిధ సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, ఇతర అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ ద్వారా స్వయం సహాయ సంఘాలకు రూ.64 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.32 కోట్లు మహిళా సంఘాలకు రుణాలుగా అందించామని కలెక్టర్ చెప్పారు. ఇటీవల ఉత్తారాఖండ్ వరదల్లో మృతి చెందిన జంగారెడ్డిగూడెం బాధితులకు రూ.10 లక్షల చెక్ను కలెక్టర్ అందజేశారు. గల్ఫ్లో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4,40,820, ప్రమాదవశాత్తూ మరణించిన17 మంది కల్లుగీత కార్మికులకు ఎక్స్గ్రేషియాను కలెక్టర్ అందజేశారు.జేసీ టి.బాబూరావునాయుడు, ఎక్సైజ్ శాఖ డీసీ చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
యువతపైనే దేశ భవిష్యత్
=ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు దోహదం =హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కేయూ క్యాంపస్, న్యూస్లైన్ : దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. 29వ అంతర్ యూనివర్సిటీ సెంట్రల్ జోన్ యువజనోత్సవాలను సోమవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని నూతన ఆడిటోరియంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువశక్తి ఎంతో గొప్పదని, వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలోని పలువురు శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ వారు కొనుగొన్న సిద్ధాంతాలను విద్యార్థులకు వివరించారు. అలాగే వందేమాతరం గొప్పదనం గురించి తెలిపారు. కాకతీయుల సంస్కృతీసంప్రదాయాలతోపాటు వారి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతోగొప్పదని కొనియాడారు. శతాబ్దాల క్రితం నిర్మించిన కట్టడాలు, దేవాలయాలు, నీటిపారుదల వ్యవస్థ వారి దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు దోహదం చేస్తాయని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఆడిటోరియం మరెక్కడా లేదు సభకు అధ్యక్షత వహించిన కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం మాట్లాడుతూ సెంట్రల్జోన్ యూత్ ఫెస్టివల్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కొన్ని రోజులుగా కృషి జరుగుతోందన్నారు. కేయూలో నూతంగా నిర్మించిన ఆడిటోరియం లాంటిది ఈ రీజియన్లో మరొకటి లేదన్నారు. యువజనోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి సహాకారంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ నూతన ఆడిటోరియంలో రాబోయే నంది అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఐదు రోజులపాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మహిళల భద్రతకు పోలీసుల సహాకారం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో యువత ఎక్కువగాఉందన్నారు. యువజనోత్సవాల కల్చర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.దామోదర్ మాట్లాడుతూ కేయూలో సెంట్రల్జోన్ యూత్ ఫెస్టివల్కు మొదటిరోజు 19 యూనివర్సిటీల నుంచి 800మందికిపైగా విద్యార్థులు వచ్చారని తెలిపారు. 25 ఈవెంట్లలో ఉత్సవాలు జరుగుతాయని, దీనికోసం నాలుగు వేదికలను సిద్ధం చేశామన్నారు.షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి పోటీలు కొనసాగుతాయన్నారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ డాక్టర్ నేరళ్ల వేణుమాధవ్ మాట్లాడుతూ మిమ్రిక్రీ ప్రాముఖ్యతను వివరిస్తూనే మిమిక్రీ చేసి అకట్టుకున్నారు. సభలో క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్ కె.దామోదర్రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధికారాణి మాట్లాడారు. కాగా హైకోర్టు జడ్జి నర్సింహారెడ్డిని ఇతర అతిథులను కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం, రిజిస్ట్రార్ సాయిలు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఉత్సాహంగా యువజనోత్సవాలు కాకతీయ యూనివర్సిటీలో యువకళారత్నం-2013 సెంట్రల్జోన్ యూనివర్సిటీల యువజనోత్సవాలు సోమవారం రాత్రి ఆడిటోరియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 22వరకు జరిగే ఈ ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల నుంచి తొలిరోజు 19 యూనివర్సిటీల విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం విద్యార్థులందరూ తమ సంస్కృతిసంప్రదాయలను ప్రతిబింబించే వేషధారణలతో పబ్లిక్ గార్డెన్కు చేరుకుని నృత్యాలతో అలరించారు. పబ్లిక్ గార్డెన్ నుంచి సాయంత్రం శోభయాత్రను కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్హెడ్ కార్వర్టర్స్, న యీననగర్ మీదుగా దూరవిద్యాకేంద్రం క్రాస్ రోడ్డు నుంచి క్యాంపస్లోని నూతన ఆడిటోరియం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఈవెంట్లు ఇవే.. క్లాసికల్ ఓకల్( హిందుస్తానీ, కర్ణాటక ), క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ సోలో, క్విజ్, ఫోక్, ఆర్కెస్ట్రా, మిమిక్రీ, స్కిట్, స్పాట్ పెయింటింగ్, స్పాట్ ఫోటోగ్రఫీ, కాలేజ్ ఇన్స్టాలేషన్, పోస్టర్ మేకింగ్, క్లే మోడలింగ్, కార్టూనింగ్, రంగోళి, గ్రూప్డ్యాన్స్లు, ఫోక్, ట్రైబల్ డ్యాన్స్, వెస్టర్న్ వోకల్, ఎలక్యూషన్,లైట్ ఓకల్ సోలో, ఫోక్ ఆర్కెస్ట్రా, మైమ్, వన్యాక్ట్ప్లే తదితర అంశాల్లో పోటీలు జరగనున్నాయి. కిక్కిరిసిన ఆడిటోరియం కేయూలో సెంట్రల్జోన్ యూనివర్సిటీ యువజనోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నూతన ఆడిటోరియంను ఆగమేఘాల మీద హైదరాబాద్లోనే మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభింపజేసి సోమవారం రాత్రి ప్రధాన వేదిక గా ఆడిటోరియంలో ఉత్సవాలను ప్రారంభించారు. వివిధ ఈవెంట్లలో భాగస్వాములయ్యే విద్యార్థులను తొలుత లోనికి అనుమతించారు. దీంతోపాస్లు లేని విద్యార్థులు కూడా ఆడిటోరియంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు పాత్రికేయలను కూడా అనుమతించకపోవడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తర్వాత అనుమతించారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన వందలాదిమంది విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. చివరకు చేసేది లేక లోపలికి అనుమతించిన సీట్లు నిండిపోవడంతో నిలబడే ఉపన్యాసాలు విన్నారు. ఇంకొందరు బయట ఏర్పాటు చేసిన స్క్రీన్లోనే కార్యక్రమాన్ని వీక్షించారు. యువజనోత్సవాలను నిర్వహించేందుకు 18 కమిటీలను ఏర్పాటుచేశారు. ఉత్సవాలకు సంబంధించిన ఇన్విటేషన్ తమకు అందలేదని కొందరు కేయూ ఉద్యోగులు కార్యక్రమానికి హాజరుకాలేదు. -
రారండోయ్...
కొత్తగూడెం అర్బన్, న్యూస్లైన్: బాలల కళల సౌధం బాలోత్సవ్-2013కు కొత్తగూడెం క్లబ్ ముస్తాబైంది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు జరుగనున్న 22వ రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 22 అంశాలను 39 విభాగాలుగా చేసి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 15 వేల ఎంట్రీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలోత్సవ్ కోసం కొత్తగూడెం క్లబ్లో నాలుగు వేదికలను ఏర్పాటు చేశారు. రామాయణ ఘట్టాలు, మూఢనమ్మకాల పట్ల చైతన్యం కలిగించడం, పల్లె వాతావరణం, పండుగల ప్రాముఖ్యతను తెలిపే బొమ్మలు, కార్టూన్ చానళ్లలో వచ్చే చోటాభీమ్ వంటి బొమ్మలను ఆవరణలో ఏర్పాటు చేశారు. పలు రంగులతో క్లబ్ను తీర్చిదిద్దారు. 20 అడుగుల మిక్కీమౌస్ బొమ్మతో స్వాగత ద్వారాన్ని రూపొందించారు. ప్రతిరోజు పలు అంశాలు.. శుక్రవారం ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు కొన్ని అంశాల చొప్పున మూడు రోజులపాటు పోటీలు కొనసాగుతాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంట్రీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది సుమారు 12 వేల మంది పోటీలకు హాజరయ్యారని, ఈ ఏడాది 15 వేలకు పైగా బాలబాలికలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎంట్రీల కౌంటర్, భోజనం టోకెన్ల కౌంటర్, ఫలితాల కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. కొత్తగూడెం క్లబ్తోపాటు కేసీఓఏ క్లబ్లో సైతం పలు అంశాలపై పోటీలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతోపాటు వారివెంట వచ్చే సంరక్షకులకు సైతం ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. బాలోత్సవ్లో స్వచ్ఛందంగా సేవలందించేందుకు స్థానిక శ్రీరామచంద్ర కళాశాలకు చెందిన ఎన్సీసీ కేడెట్లు 40 మంది, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, ధన్వంతరి కళాశాల నుంచి 80 మంది వలంటీర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. పిల్లలకు ఆహ్లాదం కలిగించేందుకే: వాసిరెడ్డి రమేష్బాబు, బాలోత్సవ్ కన్వీనర్ పిల్లల మనసు నిష్కల్మషంగా ఉంటుంది. తరతమ భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకుని మిత్రులుగా మారుతుంటారు. ఎప్పుడూ చదువుల చుట్టూ తిరిగే వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలనే ఉద్దేశంతోనే బాలోత్సవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. గత 22 ఏళ్లుగా ఈ వేడుకలను కొనసాగిస్తున్నాము. దీనికి అందరి సహకారం లభిస్తోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది స్పందన ఎక్కువగా వచ్చింది. అయితే ఎక్కువగా నాటకాలకు సంబంధించిన ఎంట్రీలు రావడం, అవి ప్రదర్శించే సమయం సరిపడక కొన్నింటిని తిరస్కరించాం. బాలోత్సవ్తో రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో కొత్తగూడెం పేరు మార్మోగుతోంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించడంలో అందరి సహకారం ఉంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు స్వచ్ఛందంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని స్థానికులు కొందరు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. -
ముగిసిన డీపీఎస్ క్రీడా సంబరం
రాయదుర్గం, న్యూస్లైన్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఖాజాగూడలోని డీపీఎస్ స్కూల్లో రెండు రోజులుగా ‘యుఫోరియా’ పేరిట వార్షిక అంతర్ పాఠశాలల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని 25 పాఠశాలలకు చెందిన 171 మంది విద్యార్థులు క్రికెట్, అథ్లెటిక్స్ పోటీలతోపాటు సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, ప్రిన్సిపల్ రేఖా అగర్వాల్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రమ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సమర ఢంకా
సమైక్య సమరం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతోంది. సకల జనులు ఉద్యమబాటలో పయనిస్తున్నారు. ఆదివారం కడపలో సహకార సంఘాల ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పూరించారు. పల్లెల నుంచి వెల్లువలా తరలివచ్చిన అన్నదాతలు, చేనేతలు, మహిళలు జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సమైక్య పోరులో తుది వరకూ అలుపెరుగని పోరాటం చేస్తామని ప్రతిన బూనారు. రెండు నెలలు దాటినా సడలని సంకల్పంతో సమైక్యవాదులు ఉద్యమానికి కొత్త రూపు, ఊపు తెస్తున్నారు. సాక్షి, కడప/అగ్రికల్చర్: పల్లెలన్నీ స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమంలోకి తరలి వస్తున్నాయి. సమైక్య గర్జన చేస్తున్నాయి. ఆదివారం కడపలోని కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎదుట జిల్లా నలుమూలల నుంచి అన్నదాతలు, మహిళలు, నేతన్నలు, కుల సంఘాలు, గృహ నిర్మాణ సంఘాల వారు స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి సమైక్య శంఖారావం పూరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక దీక్షలు చేపట్టి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. సమైక్య నినాదాల సెగ ఢిల్లీకి తాకేలా సింహాలై గర్జించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జోష్ నింపడంతోపాటు విభజన వల్ల కలిగే కష్టనష్టాలను కళ్లకు కట్టేలా కళాకారులు వివరించారు. సభనుద్దేశించి నేతలు చేసిన ప్రసంగాలు దీక్షాపరులు శ్రద్ధగా ఆలకించారు. సభలో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహానికి తొలుత పూలమాలలు వేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి డీసీసీబీ అధ్యక్షుడు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహకార సమరాన్ని వీరు ఢంకా మోగించి ప్రారంభించారు. ఢంకా మోగిస్తున్నప్పుడు దీక్షా ప్రాంగణం జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. సహకార, డీసీసీబీ అధికారులు, జేఏసీ నేతలు వేదికపై చేతులు పట్టుకుని సమైక్యానికి సంఘీభావం తెలిపారు. సహకార స్ఫూర్తి రగిలించే ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు. తొలుత డీసీసీబీ అధ్యక్షుడు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. డీసీసీబీ జీఎం సహదేవరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం సాగింది. అనుసంధాన కర్తగా సహకార కళాశాల ప్రిన్సిపాల్ గుర్రప్ప, నాన్ పొలిటికల్ జేఏసీ కో కన్వీనర్, డీఆర్వో ఈశ్వరయ్యలు వ్యవహరించారు. మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డి సామూహిక దీక్షా శిబిరానుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను స్తంభింపజేసినప్పుడే ఉద్యమ సెగ ఢిల్లీకి తాకుతుందని అన్నప్పుడు అందుకు తామంతా సహకరిస్తామని సభికులు నినాదాలు చేశారు. ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది గ్రామీణ ప్రాంత ప్రజలేనని, జల వివాదాలు, నీటి కష్టాలను వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగం దీక్షా పరులను చైతన్య పరిచింది. దీక్షకు తరలివచ్చిన సహకార సంఘాల అధ్యక్షులు, రైతులు, నేతన్నలు, మహిళలు, కుల సంఘాల వారు మొక్కవోని దీక్షతో శిబిరంలో ప్రసంగాలు వింటూ, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ కదలకుండా ఉండిపోయారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సహకార సమరం దీక్షా శిబిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాకారులు, చిన్నారుల నృత్యాలకు చప్పట్లతో అనూహ్య స్పందన లభించింది. ‘ఓ సోనియా ఓట్లు కావాలా, సీట్లు కావాలా?’ అని ఓ మహిళ ఆలపించిన జానపద గేయం సమైక్యవాదుల్లో ఊపు తెచ్చింది. తెలుగుజాతి మనది...నిండుగ వెలుగు జాతి మనది...అన్న గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ముగ్దుల్ని చేశాయి. అంధ విద్యార్థి ఆలపించిన గీతం ఆకట్టుకుంది. దీంతోపాటు సమైక్యానికి దండు పెట్టు....సోనియాకు పిండం పెట్టు అన్నప్పుడు కచ్చితంగా పిండం పెడతామంటూ సభికులు నినదించారు. నేతల ప్రసంగాలు ఆకట్టుకోగా, దుర్యోధనుడి పాత్రలో మాచిరాజు వెంకటరమణ, జానపద కళాకారుడు గురవారెడ్డి ఆలపించిన సమైక్య గేయాలు సభికులను ఊర్రూతలూగించాయి. సత్యహర్చిశ్చంద్ర నాటకంతోపాటు సాస్కృతిక కార్యక్రమాలు జోష్ను నింపాయి. గ్రామీణ ప్రాంతాల్లోకి... ఉద్యమ స్వరూపం మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల చేతుల్లోకి వెళుతోంది. జిల్లా వ్యాప్తంగా గత శుక్రవారం సర్పంచులు, వార్డు మెంబర్లతో జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఒకే వేదికపై సామూహిక దీక్షలు చేసి తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపారు. ఆ సమైక్య సెగలు రగులుతున్నాయి. ఇదే స్ఫూర్తిగా సహకార సంఘాలు, డీసీసీబీ, సహకారశాఖ, మహిళా సంఘాలు, గృహ నిర్మాణ సంఘం, కుల సంఘాలు ఇలా అన్ని ఒకే వేదికపై సామూహిక దీక్షలు చేపట్టేందుకు ఊతమిచ్చాయి. అన్నదాతలు, నేతన్నలు, మహిళలు ఉద్యమంలో భాగస్వాములై కదం తొక్కుతున్నారు. ఇందులో భాగంగానే డీసీసీబీ ఎదుట సామూహిక దీక్షల ద్వారా బలమైన సమైక్య ఆకాంక్షను వెలిబుచ్చారు. తరలి వచ్చిన నేతలు సమైక్య సమరం సభకు జిల్లా వ్యాప్తంగా నేతలు, అధికారులు తరలి వచ్చారు. మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డి, కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్బాష, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ డెరైక్టర్లు, సొసైటీల అధ్యక్షులు, మహిళా, కుల, చేనేత సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ఈశ్వరయ్య, చేనేత జౌళిశాఖ ఏడీ సత్యనారాయణరావు, సహకార అధికారి గుర్రప్ప, డీసీఓ చంద్రశేఖర్, ఎన్జీఓ సంఘం కన్వీనర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు జమాల్రెడ్డి, ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు, సహకార రిజిస్ట్రార్ సుభాషిణి, కార్పొరేషన్ ఈడీ ప్రతిభాభారతితోపాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డీసీసీబీ చైర్మన్ తిరుపాల్రెడ్డి, జీఎం సహదేవరెడ్దితోపాటు సహకార సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. -
నేడు ‘సేవ్ ఏపీ’ సభ
సాక్షి, విజయవాడ : ‘ప్రతి గడపకు ఒక్కరు’ అనే నినాదంతో విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ద్వారా ఎన్జీవోలు సమైక్య సమరశంఖం పూరించనున్నారు. హైదరాబాద్లో ఈ నెల ఏడో తేదీన జరిగిన సభను తలదన్నేలా దీన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీమాంధ్ర నడిబొడ్డున జరుగుతున్న సభ కావడంతో దీని ప్రకంపనలు ఢిల్లీ పీఠానికి వినిపించేలా సమైక్యవాదులు కదలివస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్జీవోల సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విజయవాడలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరిగే సమయానికే చర్చలకు రావాలని ఎన్జీవో అసోసియేషన్కు ప్రభుత్వం నుంచి పిలుపువచ్చింది. అయితే విజయవాడ, విశాఖపట్నాల్లో జరిగే సభల తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని ఎన్జీవో నాయకులు భావిస్తున్నారు. హైదరాబాద్ సభకు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. ఈ సభకు ఉద్యోగులతోపాటు కార్మికులు, విద్యార్థులు, వివిధ జేఏసీలు, రైతులు, కూలీలు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల సిబ్బంది, సాధారణ ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ సభ ప్రధాన లక్ష్యం రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడమేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు రక్షించుకోవాలి, విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలు, నష్టాల గురించి వక్తలు సవివరంగా ప్రసంగిస్తారు. ఈ సభకు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్బాబు, మేధావుల ఫోరం నుంచి చలసాని శ్రీనివాస్, నల్లమోతు చక్రవర్తి తదితరులు మాట్లాడతారు. ఈ సభకు రాజకీయ నాయకులకు ఆహ్వానం పంపలేదు. ఒకవేళ వారు హాజరైతే సముచిత స్థానం కల్పించాలని ఎన్జీవో నేతలు భావిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు హాజరైతే సభకు వచ్చిన వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీ లగడపాటి ఢిల్లీలో మకాం వేసి ఉండగా, జిల్లామంత్రి పార్థసారథి తనకు సేవ్ ఆంధ్రప్రదేశ్ సమావేశం కన్నా కేబినేట్ భేటీ ముఖ్యమని ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ స్వరాజ్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సేవ్ఆంధ్రప్రదేశ్ సభ ప్రారంభమవుతుంది. దీని కోసం ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఉదయానికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. వర్షం పడకపోతే లక్షమందికి తగ్గకుండా ఈ సభకు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే సభ నిర్వాహణకు 10 కమిటీలను ఏర్పాటు చేసి పనులు చురుగ్గా చేస్తున్నారు. విశాలమైన వేదికతో పాటు, బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక వద్ద బాంబుస్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది. సభ వేదిక కు కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరు, సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టారు. 35 వేల మంది వరకూ కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరైన వారికి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు నాలుగు లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ కూడా సమ్మెలోఉన్న నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి సభకు జనాన్ని తీసుకువచ్చేందుకు సుమారు 600 బస్సులు పెడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు... సభకు ముందు సమైక్యాంధ్ర ఉద్దేశాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వంగపండు బృందంతో ప్రత్యేక కార్యక్రమం, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, ఉంగుటూరు వారి డప్పువాయిద్యాలు ఏర్పాటు చేశారు. బందరు రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు విజయవాడ సిటీ : ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ దృష్ట్యా బందరు రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణకు పలు చర్యలు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. సభకు వచ్చేవారి వాహనాల పార్కింగ్కు కొన్ని ప్రదేశాలు కేటాయించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. బంద రు రోడ్డులో ఆర్టీసీ డిపో సెంటర్, ఆర్.జి.స్ట్రీట్, రాఘవయ్య పార్కు, ఆర్టీఏ కూడలి, వెటర్నరీ ఆస్పత్రి కూడలి వద్ద ట్రాఫిక్ను మళ్లిస్తారు. వాహనాల పార్కింగ్.. గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, ఉయ్యూరు వైపు నుంచి వచ్చే బస్సులు, నాలుగు చక్రాల మోటారు వాహనాలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిలుపుకోవాలి. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి మీదుగా వచ్చే, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో నిలపాలి. ఏలూరు, గన్నవరం, రామవరప్పాడు మీదుగా వచ్చే వాహనాలు బిషప్ అజరయ్య స్కూల్ ఆవరణలో నిలపాలి. సభకు హాజరయ్యేవారు తమ ద్విచక్ర వాహనాలను ఆర్టీఏ కార్యాలయం ఎదుటనున్న ఖాళీ స్థలంలో, సీఎస్ఐ చర్చి ఆవరణలో, ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో పార్క్ చేసుకోవాలి.