Engineering education
-
‘ప్రమోట్’కు ఒకటే ప్రమాణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకే తరహా ప్రమోషన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం సాంకేతిక విద్య విభాగానికి సూచించింది. ఇంజనీరింగ్లో కనీసం 20 క్రెడిట్స్ ఉంటేనే తర్వాతి ఏడాదికి ప్రమోట్ చేసే విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలో అన్ని వర్సిటీల వీసీలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్రెడిట్ పాయింట్లను బట్టి మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ విధానం ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉంది. దీంతో కొన్ని వర్సిటీల విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, మహాత్మాగాంధీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కో విధానం వర్సిటీల్లో ఒక్కో సెమిస్టర్కు 20 చొప్పున, ఏడాదికి 40 క్రెడిట్స్ ఉంటాయి. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి మొదటి సంవత్సరంలో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. మిగతా సంవత్సరాల విషయంలోనూ ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. నాలుగేళ్లకు కలిపి మొత్తం 160 క్రెడిట్ పాయింట్లు ఉంటాయి. 4వ సంవత్సరంలో 160 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అయితే యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్లో ఐదు థియరీ సబ్జెక్టులు, మూడు ల్యాబ్లు ఉంటాయి. విద్యార్థి పాసయ్యే ఒక్కో సబ్జెక్టుకు దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్లు అతని ఖాతాలో పడతాయి. విద్యార్థులు ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో చూసుకుని ఆ వర్సిటీని ఎంచుకుంటున్నారు. -
ఆ స్కిల్స్ ఏవీ?
సాక్షి, హైదరాబాద్ : భారత్లో ఇంజనీరింగ్ విద్యను లైట్గా తీసుకున్న విద్యార్థులు..ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటెక్లో ముఖ్యమైన నైపుణ్య మెళకువలపై దృష్టి పెట్టకపోవడం అక్కడ చాలామంది స్కిల్ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ప్రాజెక్టులు, ఇంటర్న్ íÙప్లు ఇండియాలో సరిగ్గా పూర్తి చేయకపోవడంతో విదేశీ ఉద్యోగాలు చేజిక్కడం లేదు. ఇంజనీరింగ్లో సెమినార్ను లైట్గా తీసుకోవడం వల్ల విదేశాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రదర్శించలేక పోతున్నారు. ఎంఎస్ కోసం ఏటా 7.50 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. వీరిలో 1.90 లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్లేవారే. ఇందులోనూ అత్యధికంగా అమెరికాకు 90 వేలకుపైగా వెళుతున్నారు. లీప్ స్కాలర్స్ అధ్యయనం ప్రకారం అమెరికాలో వివిధ దేశాలకు చెందిన 2.25 లక్షల మంది ఏటా స్కిల్ ఉద్యోగాలు పొందుతుంటే, తెలంగాణ విద్యార్థుల వాటా 8 వేలకు మించడం లేదు. మిగతా వారంతా అన్స్కిల్డ్, పార్ట్టైం ఉద్యోగాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యాలపై దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. కలివిడితనమే కీలకంఎంఎస్ తర్వాత విదేశాల్లో ఉద్యోగం పొందాలంటే కలివిడిగా దూసుకెళ్లడం కీలకం. ఇంటర్వ్యూలు, సెమినార్లు, గ్రూప్ డిస్కషన్స్కు విదేశీ సంస్థలు ప్రాధాన్యమిస్తాయి. నాయకత్వ లక్షణం ఉంటేనే ప్రాజెక్టు ముందుకెళుతుందనే భావనతో ఉంటాయి. చాలామందిలో ఈ లోపం కనిపిస్తోందని యూఎస్లో లీడింగ్ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడు నీరజ్ పంకజ్ తెలిపారు. అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులకు స్థానిక వసతి, రవాణా, మార్కెట్లు, కరెన్సీ వంటి అంశాలపై కూడా ఆరునెలల వరకూ అవగాహన ఉండటం లేదని తెలిపారు. కేవలం కన్సల్టెన్సీలనే నమ్ముకుంటున్నారని, ఇతరులతో పరిచయాలు పెంచుకునే నైజం ఉండటం లేదన్నారు. ఇంజనీరింగ్లో ఇంటర్న్ షిప్లు, గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొంటే, సెమినార్లు తరచు చేస్తూ ఉంటే ఈ సమస్య ఉండదన్నారు. ఏకాగ్రతను దెబ్బతీసే అలవాటు మనకు, ఇతర దేశాలకు వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలుంటాయి. సంస్కృతి, భాష వంటకాల్లో కూడా అంతే. ఈ అసౌకర్యంతో చాలామంది విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తింటోంది. హోమ్సిక్ బారిన పడుతున్నారు. మనవారు సాధారణంగా టూరిస్ట్ గైడ్, టీచింగ్ అసిస్టెంట్, లైబ్రరీ మానిటర్, గిగ్ మార్కెట్లో పనిచేస్తుంటారు. ఇవన్నీ పార్ట్టైం ఉద్యోగాలే. వాస్తవానికి ఇండియాలో ఉన్నప్పుడు అసలీ రంగాలపైనే వారికి అవగాహన ఉండటం లేదని, ఇతర దేశాలకు వెళ్లి నేర్చుకోవడం కష్టంగా ఉంటోందని ఆ్రస్టేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు ఆదిత్య తెలిపారు. ఈ అసౌకర్యం వల్ల ప్రధానమైన స్కిల్ ఉద్యోగాలపై ఏకాగ్రత తగ్గుతోందన్నారు. వీసా గడువు పూర్తయ్యే నాటికి కూడా మంచి ఉద్యోగం పొందే స్కిల్ ఉండటం లేదని చెప్పారు. ఆ నిర్లక్ష్యంతోనే ఒత్తిడి ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థి ఏకకాలంలో ఎన్నో పనులు చేయాలి. క్లాసులకు హాజరవ్వాలి. అసైన్మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. ఇంకోవైపు పార్ట్టైం ఉద్యోగమూ చేయాలి. వాస్తవానికి ఇవన్నీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇంజనీరింగ్ చేసేప్పుడూ ఇవన్నీ ఉంటాయి. కానీ మనవారు పట్టించుకోవడం లేదని కెనడాలో ఉంటున్న హైదరాబాద్వాసి సాయిచరణ్ తెలిపారు. విదేశాల్లో ఇవన్నీ ఏకకాలంలో చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రణాళికాబద్ధమైన జీవన విధానం దెబ్బతింటోందన్నారు. సామాజిక అవగాహనతో ఇంజనీరింగ్ విద్య చేసేవారు ఈ ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఆవిష్కరణలు, వాటిపై జరిగే సెమినార్లలో పాల్గొంటే ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం నాణ్యమైన విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విద్యార్థులకే విదేశీ ఉద్యోగాలు తేలికగా లభిస్తున్నాయి. అక్కడే వివిధ అంశాల బోధనకు అవసరమైన వాతావరణం ఉంటుంది. ఇందులోనే పరిశోధన ఉంటుందని నమ్ముతున్నాయి. జ్ఞానాన్నీ, తార్కిక ఆలోచనా నైపుణ్యాన్నీ పెంచుకునే అవకాశాలు విద్యార్థులకు విస్తృతంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో రాణించే మెళకువలు ఇంజనీరింగ్ నుంచే అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. తరగతిగదిలో లెక్చరర్లు బోధించే సమయం, వారానికి కొన్ని గంటలపాటు పరిమితంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత నేర్చుకోవడం, అవసరమైన సమాచారాన్ని సేకరించగలగడమే విదేశీ విద్య తర్వాత రాణించడానికి మార్గం సుగమం చేస్తుంది. -
చదువు పూర్తయిందా.. ఉద్యోగం కావాలా..? ఇదే బెస్ట్ ఛాయిస్..
ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. కానీ ఎంచుకున్న రంగంలో ఏ విభాగంలో డిమాండ్ ఉందో తెలుసుకోలేక నష్టపోతుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విభాగంలో ఎక్కువ కొలువులు రానున్నాయో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. చదువు అయిపోయాక ఉపాధి అవకాశాలు లభించాలంటే విద్యను అభ్యసిస్తున్నపుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటుండగా... ఇందులో చాలా శాతం మంది ఉద్యోగాలు సాధించడం లేదు. సొంతంగా అంకుర సంస్థలను స్థాపించేందుకు కొద్దిమందే ముందుకొస్తున్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్లో పరిశోధనలు.. విదేశాల్లో కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఆటోమేషన్ అంశాలపై అధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో విభిన్నమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఓ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ కొద్ది నెలల కిందట కృత్రిమ మేధతో అనుసంధానమైన స్మార్ట్ఫ్రిజ్ను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా దేశాల్లో ఆవిష్కరించింది. ఇదీ చదవండి: 4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే.. ఒక సాంకేతిక పరికరాన్ని ఫ్రిజ్లో అమర్చితే చాలు అందులోని కూరగాయలు ఏ రోజు వండుకోవాలో చెబుతుంది. పండ్లు, ఇతర సామగ్రి ఖాళీ అవుతున్నప్పుడు దానంటదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు, సాఫ్ట్వేర్లు ఇతర రంగాలకూ అవసరం. వీటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా చాలా మార్పులు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అంశాలను విద్యను అభ్యసిస్తున్నపుడే నేర్చుకుంటే చదువు అయిపోయాక వెంటనే కొలువు దొరికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
యువ ఇంజనీర్లకు 'ఉపాధి ఎక్కడ'?
► నిజామాబాద్కు చెందిన సూర్యకిరణ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశాడు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్సే అతని ప్రధాన సబ్జెక్టు. ఇతను ఓ ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మైక్రో లెవల్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఇంత సూక్ష్మ స్థాయి టెక్నాలజీ గురించి అతను పుస్తకాల్లో చదవలేదు. ప్రాజెక్టు సమయంలోనూ దీని జోలికెళ్ళలేదు. దీంతో నైపుణ్యం లేదని కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆకర్షణీయమైన వేతనంతో ఏ బహుళజాతి కంపెనీలోనో తక్షణ ఉద్యోగం లేదా డిగ్రీ పూర్తి కాగానే ఎమ్మెస్ కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్లి పోవచ్చు. డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రధానంగా ఇలాంటి కారణాలతోనే ఇంజనీరింగ్పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా కంప్యూటర్ సంబంధిత కోర్సులపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు. కానీ ఏటా సగటున కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభిస్తుండటం గమనార్హం. ఇందులోనూ కేవలం 8 శాతం మందికి మాత్రమే వారు చదివిన విద్యకు తగిన ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వారంతా ఏదో ఒక ఉద్యోగంతో సరిపుచ్చుకుంటున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలు స్పష్టం చేస్తుండటం శోచనీయం. మన రాష్ట్రంలో 2021–22లో 87 వేల మంది ఇంజనీరింగ్లో చేరారు. వీరిలో 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లో చేరారు. కానీ ఈ ఏడాదిలో కేవలం 39 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు పొందారు. వీటిల్లో ఎక్కువగా నాన్–స్కిల్డ్ ఉద్యోగాలే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంకేతికతకు సరిపడ నైపుణ్యాలు కొరవడటం, సంబంధిత సబ్జెక్టుపై తగిన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏళ్ల నాటి టెక్నాలజీయే ఇప్పుడూ..! ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతికతను అన్ని రంగాలూ అందిపుచ్చుకుంటున్నాయి. మానవ వనరులతో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి టెక్నాలజీ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తోంది. అయితే వీటి నిర్వహణకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ల అవసరం ఉంది. కానీ బోధనలో ఎప్పటికప్పుడు మార్పు చెందే టెక్నాలజీని చేర్చడం లేదని, ఏళ్ళ నాటి టెక్నాలజీతోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. గత కొన్నేళ్ళుగా కంప్యూటర్ సైన్స్లో అనేక కొత్త కోర్సులు వస్తున్నాయి. ఇవన్నీ మూడేళ్ళ క్రితమే డిజైన్ చేసినవి. కోవిడ్ తర్వాత అన్ని రంగాలు తక్కువ మానవ వనరులతో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను అభివృద్ధి చేశాయి. ఇంటినుంచే బ్యాంకు లావాదేవీలు, ఢిల్లీలో ఉండి ఎక్కడో మారుమూల ఉన్న సోలార్ సిస్టమ్ను పరిశీలించే విధానాలు వచ్చాయి. కానీ ఈ టెక్నాలజీ విద్యార్థుల వరకూ వెళ్ళడం లేదు. ఇలాంటి పరిస్థితులే యువ ఇంజనీర్ల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు. తూతూ మంత్రం ప్రాజెక్టులు ఇంజనీరింగ్ విద్యలో ప్రాజెక్టులు కీలకం. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసేవారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే టెక్నాలజీపై ప్రాజెక్టులు చేయాలి. కానీ ఏదో ఒక ప్రాజెక్టును ఎవరితోనో చేయించుకుని వస్తున్నారని, విధిలేని పరిస్థితుల్లో వాటిని అనుమతించాల్సి వస్తోందని ఒక యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఇక ప్రైవేటు కాలేజీలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. చాలా కాలేజీలకు నాణ్యమైన పరిశ్రమలతో ఎలాంటి సంబంధాలూ లేవు. దీంతో విద్యార్థులకు మంచి ప్రాజెక్టులను సూచించలేకపోతున్నారు. విద్యార్థులు కూడా ఏదో ఒక ప్రాజెక్టు చేశామనిపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త విషయాలపై దృష్టి పెట్టాలనే ఆలోచనను విద్యార్థి దశలోనే విస్మరిస్తే, కంపెనీలు కోరుకునే కొత్త టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యకే కాదు..ఉన్నత విద్య మొత్తానికీ ఇదే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిలో, విద్యా విధానంలో మార్పు రావాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అంటున్నారు. సాంకేతికతలో మార్పులు అందిపుచ్చుకోవడం లేదు ఉన్నత విద్యకు వచ్చిన విద్యార్థి తరగతి గదిలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే కొత్త విషయాలను రాబట్టే విధానం అభివృద్ధి చెందుతుంది. మెజారిటీ విద్యార్థుల్లో ఇది కన్పించడం లేదు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఇదే ఉపాధికి ప్రధాన అడ్డంకిగా మారింది. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్టీయూహెచ్) ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి 75 ఏళ్ళు గడిచినా భారత విద్యా విధానంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. అనేక కమిషన్లు వేసినా ఈ దిశగా ముందడుగు వేయలేదు. ఈ కారణంగానే మన అవసరాలకు కావాల్సిన విద్యా విధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాం. పరిశోధనాత్మక విద్యకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. థియరీ విద్యతో పాటు ప్రధానంగా ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి. – ప్రొఫెసర్ తాటికొండ రమేష్ (వీసీ, కాకతీయ వర్సిటీ) నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ పెంచాలి సాంకేతిక విద్యే కాదు.. ఉన్నత విద్యలోనూ థియరీలోనే ముందుకెళ్తున్నాం. కానీ పుస్తకాల్లో ఉన్నదానికి నిజ జీవితంలోని అనుభవాలు జోడించడం లేదు. థియరీతో పాటు నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే పెంచాలి. ఈ దిశగా ఏఐసీటీఈ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. ఏదో ఒక ఉపాధి అనుకోవడం కాదు.. ఉన్నత విద్య తర్వాత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం) విద్యార్థి దశలోనే సంస్థలతో భాగస్వామ్యం ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా అన్ని సంస్థలు యాంత్రిక విధానాలను అనుసరిస్తున్నాయి. వీటి నిర్వహణ నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లకే ఉపాధి అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఆసుపత్రులు ఏఐ ద్వారా ముందుకెళ్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలియాలంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఆ విద్యార్థికి సంస్థలు, కంపెనీలతో భాగస్వామ్యం అవసరం. అప్పుడే భవిష్యత్ అవసరాలకు ఇంజనీరింగ్ విద్యను ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది. ఈ దిశగా ఉన్నత విద్యలో మార్పులు అవసరం. – ఎస్.నీలిమ (సీఈవో, అనురాగ్ యూనివర్సిటీ) నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే విధానం ఉండాలి విద్యార్థికి మార్కులు కొలమానంగా ఉండే విద్యా విధానం మారాలి. అందుకే దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని ఓ సంస్థను కోరాం. విద్యార్థిలో ఉండే నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే పరీక్షా విధానం భావి ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి) -
రెండో ఏడాది నుంచే ఫీల్డ్ స్టడీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య ఈ ఏడాది నుంచి సరికొత్తగా ఉండబోతోంది. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అన్ని కాలేజీలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. విశ్వవిద్యాలయాలు సైతం ఇప్పటికే బోధన ప్రణాళిక తీరు తెన్నులను కాలేజీలకు పంపాయి. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా స్వీయ అనుభవంతో బోధన ఉండబోతోందని యూనివర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విజ్ఞానం అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలని అంటున్నాయి. ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు నాలుగో సంవత్సరంలో కాకుండా ముందు నుంచే విద్యార్థులపై దృష్టి పెట్టబోతున్నాయి. వారిలో నైపుణ్యానికి పదును పెట్టే రీతిలో ప్రాజెక్టు వర్క్స్ను ఎంపిక చేసినట్టు కొన్ని కాలేజీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు తెలిపాయి. రెండో ఏడాది నుంచే... అన్ని బ్రాంచీల విద్యార్థులకు మొదటి సంవత్సరం పుస్తక విషయ పరిజ్ఞానం ఆధారంగానే కొనసాగుతుంది. రెండో ఏడాది నుంచి ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నాల్గవ సంవత్సరంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉండేది. అదికూడా విద్యార్థులు ఇష్టానుసారం ఏదో ఒక ప్రాజెక్టు సమర్పించేవాళ్లు. ఈ క్రమంలో విద్యార్థులు ఎవరో తయారు చేసిన ప్రాజెక్టులను కొని తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. దీనివల్ల విద్యార్థికి డిగ్రీ చేతికొచ్చినా విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండేది కాదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు రిపోర్టులను పక్కాగా తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన ప్రముఖ కంపెనీలకు సెకండియర్ విద్యార్థి వెళ్లాలి. అక్కడి నిపుణులతో మమేకమై సరికొత్త టెక్నాలజీపై ఆలోచన చేయాలి. విద్యార్థిలో విషయ పరిజ్ఞానం ఉందని, ప్రాజెక్టు రిపోర్టు సరికొత్తదేనని సంబంధిత సంస్థలు ధ్రువీకరించాలి. అప్పుడే ప్రాజెక్టు రిపోర్టును విశ్వవిద్యాలయాలు ఆమోదిస్తాయి. ఇదేవిధంగా నాల్గో సంవత్సరంలోనూ మరింత లోతైన అవగాహనతో ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి సంపూర్ణమైన స్వీయ పరిజ్ఞానం పొందుతాడని విశ్వవిద్యాలయాలు భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులపై దృష్టి రాష్ట్రంలో 90 వేల మంది ఇంజనీరింగ్లో చేరగా, ఇందులో 64 శాతం కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీలకు చెందిన వారున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇంజనీరింగ్ విద్యలో కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకోవడం ఇప్పటివరకూ జరిగింది. ఇక నుంచి తొలి ఏడాదిలోనే అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న కోడింగ్ విధానంపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల అనుసంధానంతో కంప్యూటర్ కోర్సుల్లో లోతైన ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుపరిచే దిశగా ఈ ఏడాది నుంచి బోధన ప్రణాళిక ఉండబోతోందని వర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. కోడింగ్పై సరైన అవగాహన ఉందనేది ప్రాజెక్టు రిపోర్టుల ద్వారా విద్యార్థి నిరూపించుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులే కీలకం ఈ ఏడాది నుంచి సెకండియర్లో ప్రాజెక్టు నివేదికలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనివల్ల విద్యార్థి నాణ్యమైన ఇంజనీర్గా బయటకొచ్చే వీలుంది. ఎంతోమంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నా, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఆ దిశగానే సరికొత్త బోధన ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూ వీసీ -
ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తేవాలనుకుంటున్న ఈ బోధనా విధానం ప్రకారం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోనే ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే మార్కులు ఇస్తారు. అలాగే ఆఖరి సంవత్సరంలో మరో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాలనే షరతు పెట్టనున్నారు. ఎందుకీ మార్పు...? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో 12 శాతం మంది మాత్రమే స్కిల్డ్ జాబ్స్ పొందుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సర్వేలో ఇది స్పష్టమైంది. కంప్యూటర్ సైన్స్లో కనీసం కోడింగ్ కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో వెల్లడైంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళిక లేదని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల కోసం స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బోధన స్థాయిలోనూ పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని ఏఐసీటీఈ సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొంతకాలంగా సరికొత్త బోధన ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడది ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. నాణ్యమైన విద్య, తక్షణ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్నత విద్యలో మార్పులతోపాటు ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంజనీరింగ్ విద్యలో ఫీల్డ్ అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే దీని భాగస్వామ్యాన్ని పెంచనున్నాం. నవీన దృక్పథంతో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే ఇంటర్నల్ మార్కులను 20 నుంచి 40కి పెంచాం. ఎక్స్టర్నల్స్ 60 మార్కులకు ఉండేలా మార్పులు చేశాం. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్ చేయడం, సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ తీసుకురావడాన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఇవన్నీ ఇంజనీరింగ్ విద్య నాణ్యతను పెంచుతాయని, మార్కెట్లో మంచి నిపుణులుగా విద్యార్థులను నిలబెడతాయని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ -
ఇంజనీరింగ్ విద్య పల్లెకు దూరం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చేయాలంటే ఇక రాజధానికే చేరాలా? సొంతూళ్లలో ఉండి చదువుకోవడం సాధ్యం కాదా? సాంకేతిక విద్యారంగ నిపుణులు లేవనెత్తే సందేహాలివి. నిజమే! ఇంజనీరింగ్ కాలేజీలు శరవేగంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు మాత్రమే పోటీ ప్రపంచంలో పడుతూ లేస్తూ నిలబడుతున్నాయి. రాష్ట్రంలో 2014లో 249 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ఇప్పుడు వీటి సంఖ్య 175కు తగ్గింది. అంటే 2014 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లలో 74 కాలేజీలు మూతపడ్డాయి. ఇందులో 54 కళాశాలలు గ్రామీణ ప్రాంతాలకు చేరువలో జిల్లా కేంద్రంలో ఉండేవే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కాలేజీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కాలేజీల మనుగడే కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన బ్రాంచీల్లోనే పూర్తిగా సీట్లు నిండని కళాశాలలు 15 వరకూ జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. హైదరాబాద్ బాట పట్టడం వల్లేనా?: టెన్త్ వరకూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నా... తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండి ఇంటర్ చదివేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్ సహా పలు పోటీ పరీక్షలకు రాజధానిలో కోచింగ్ తీసుకోవడం తేలికని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఉపాధే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీంతో అవసరమైన అనుబంధ కోర్సులు చేసేందుకు హైదరాబాద్లోనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పలు కంపెనీలు క్యాంపస్ నియామకాలను హైదరాబాద్ పరిసర కాలేజీల్లోనే నిర్వహిస్తున్నాయనే ప్రచారం ఉంది. కంప్యూటర్ కోర్సులూ కారణమే.. గత ఐదేళ్లుగా సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల కన్నా, కంప్యూటర్ సైన్స్, కొత్తగా వచ్చిన దాని అనుబంధ కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. గత ఏడాది సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో 38,796 సీట్లు ఉంటే, 37,073 సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 13,935 సీట్లకు 12,308 సీట్లు, సివిల్లో 6 వేల సీట్లకు 3 వేలే భర్తీ అయ్యాయి. ఈఈఈలో ఉన్న 7 వేల సీట్లల్లో 4 వేలు, మెకానికల్లో 5,800 సీట్లుంటే 2,550 మాత్రమే భర్తీ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే.. సివిల్, మెకానికల్లో చేరే వారి సంఖ్య తగ్గింది. మారిన ట్రెండ్కు అనుగుణంగా కొత్త కోర్సులను నిర్వహించడం గ్రామీణ కాలేజీలకు సాధ్యం కావడం లేదు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 48 కాలేజీలుంటే, ఇప్పుడు 11కు పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మి గిలాయి. మహబూబ్నగర్ జిల్లాలో 11లో రెండు మాత్రమే ఉన్నాయి. ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. నిర్వహణ కష్టం.. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు నిర్వహణ కష్టంగానే ఉంది. మంచి ఫ్యాకల్టీ హైదరాబాద్ విడిచి వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో భవిష్యత్ ప్రయోజనాల కోసం విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. ఇది గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలకు గడ్డు పరిస్థితి తెస్తోంది. –ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, వీసీ, జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయిలో మార్పులు అవసరం గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచాలి. సంప్రదాయ సివిల్, మెకానికల్ కోర్సులకు ఆధునిక సాంకేతికత జోడించి కొత్తదనం వచ్చేలా చూడాలి. వీటితో ఉపాధి ఉంటుందనే నమ్మకం కలిగించాలి. లేకపోతే ఇంజనీరింగ్ విద్య మరింత భారమయ్యే అవకాశం ఉంది. –అయినేని సంతోష్కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యను ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. పాఠ్యపుస్తకాల ముద్రణను వేగవంతం చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మొదటి సంవత్సరం పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో రూపొందించే పనిలో నిమగ్నమైంది. వీటితో పాటు డిప్లొమా పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదింపజేస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతీయ భాషలకు చెందిన 226 మంది రచయితలతో 218 పాఠ్యపుస్తకాలను తర్జుమా చేయించి సిద్ధం చేసింది. ఇకపై ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వారికి భాష అడ్డంకిగా ఉండదని ఏఐసీటీఈ ట్విట్టర్లో పేర్కొంది. నూతన విద్యావిధానంలో భాగంగా దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంజనీరింగ్ విద్యను అందించేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. హిందీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు నిర్ణయించింది. అయితే, ఇంజనీరింగ్ సిలబస్కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేకపోవడం, వాటిని బోధించే సిబ్బంది కూడా లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లోని కాలేజీలు ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యకు సుముఖత చూపడం లేదు. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 5 ప్రాంతీయ భాషల్లో 14 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్లోని కొన్ని కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను తమిళ భాషలో అందించేందుకు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుంటూరు జిల్లాలోని ఒక కాలేజీ తెలుగు మాధ్యమంలో కొన్ని కోర్సులను అందించేందుకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకుంది. ఈ ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్ధులు ఆ భాషలో కానీ, ఆంగ్లంలో కానీ పరీక్షలు రాసేందుకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది. -
ప్రాంతీయ భాషల్లో బీటెక్ సాధ్యమేనా?
సాక్షి, అమరావతి: నూతన విద్యావిధానంలో పేర్కొన్న మేరకు ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీటెక్ వంటి సాంకేతిక కోర్సులను స్థానిక భాషల్లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్నది చర్చ సాగుతోంది. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల అమలు కష్టమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక భాషల్లో సాంకేతిక పదజాలం ఏది? స్థానిక భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలంటే ముఖ్యంగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన సాంకేతిక పదజాలం ప్రాంతీయ భాషల్లో లేదు. వాటిని ఏదోలా తర్జుమా చేసినా విద్యార్థులకు పదాలు అర్థమవడం కష్టమే. ప్రస్తుతం ఇంజనీరింగ్ సహా అనేక అంశాల పరిజ్ఞానం ఆంగ్లంలోనే లభ్యమవుతోంది. ఆ భాషలో నైపుణ్యమున్న వారికే ఆ పరిజ్ఙానం ఎక్కువగా పొందగలుగుతున్నారు.ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులను నిర్వహించడం, అభ్యసించడం కష్టమే కాకుండా అలా చదువులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు దక్కవు ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లిషు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికే ప్రాధాన్యం దక్కుతోంది. తెలుగు వంటి స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించడం చాలా కష్టం. అందరూ ఎల్కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమానికి మొగ్గుచూపుతున్న తరుణంలో తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రారు. తెలుగులో ఇంజనీరింగ్ చేసేవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకురావు. – చొప్పా గంగిరెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఆప్షన్ మాత్రమే ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలన్నది జాతీయ నూతన విద్యావిధానంలో పాలసీగా పెట్టినా అది ఆప్షన్ మాత్రమే. దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కొన్ని ఎంపికచేసిన ఇంజినీరింగ్ ప్రోగ్రామ్లకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా తర్జుమా చేయించారు. కాలేజీలు తమకు నచ్చితే అమలు చేయవచ్చు. వద్దనుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమంలోనే బీటెక్ కోర్సులను కొనసాగించవచ్చు. అది వారిష్టం. – సతీష్చంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ -
మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ ప్రవేశాలకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి.. 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్ (రివైజ్డ్) 2020–21లో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్/బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియట్లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్ప్రెన్యూర్షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మన దగ్గర ఎంపీసీ విద్యార్థులే ఇంజనీరింగ్లో చేరుతారు. ఏఐసీటీఈ పేర్కొన్న పలు కాంబినేషన్ల సబ్జెక్టులు మన దగ్గర ఇంటర్మీడియట్లో లేవు. పైగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - పాపిరెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి అన్ని కోణాల్లో పరిశీలిస్తాం నిర్దేశిత సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే చాలని పేర్కొన్న ఏఐసీటీఈ నిబంధనను పరిశీలిస్తాం. ఈసారి సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై సబ్జెక్టు నిపుణులతో, యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విభాగం నిపుణులతో చర్చిస్తాం. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అయితే అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు/ సంబంధిత బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పినందున ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చిస్తాం. మండలి సూచనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - ప్రొఫెసర్ గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్ -
త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్య త్వరలో ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులకు అందుబాటులోకి రాబోతోంది. గిరిజనులు కూడా తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే 105.32 ఎకరాల భూమిని, రూ.153 కోట్లను కేటాయించారు. వీలైనంత వేగంగా పనులు జరిగేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గిరిజన కాలేజీని జేఎన్టీయూ కాకినాడకు అనుబంధం చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ నెలలోనే మంత్రుల చేతుల మీదుగా ఈ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు ఇప్పటికే ప్లానింగ్ పూర్తి చేశామని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్లలో తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నాలుగేళ్ల డిగ్రీ హానర్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యకు దీటుగా సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఉన్నత విద్యా మండలి డిగ్రీలో బీఎస్సీ డాటా సైన్స్, బీకాం అనలిటిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉద్యోగ, ఉపాధికి వెళ్లేవారికోసం, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం బీటెక్ తరహాలోనే నాలుగేళ్ల డిగ్రీ హానర్స్ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. బీఎస్సీ డాటా సైన్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు), బీకాం అనలిటిక్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు) డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు బీటెక్ తరహాలో నాలుగేళ్ల డిగ్రీ చదివి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఈ కోర్సులు అనుమతి పొందిలేవు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులకు సిలబస్ను రూపొందించి, యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఆమోదం తీసుకుని ప్రవేశ పెట్టేలా కసరత్తు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ఆర్.రామచంద్రం నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈనెల 14వ తేదీన కమిటీ సమావేశం జరగనుందని, అందులో సిలబస్, ఇతరత్రా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సిలబస్కు సంబంధించి, డిగ్రీ కాలేజీల్లో ఈ సిలబస్ను బోధించే అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన టీసీఎస్తో తాము ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు. ఈ కోర్సులను రాష్ట్రంలోని 50 వరకున్న అటానమస్ కాలేజీలతోపాటు, పలు ప్రభుత్వ కాలేజీలు, నాణ్యత ప్రమాణాలు పాటించే ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో తాము కోరుకున్న కోర్సును చదువుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఇంజనీరింగ్పై నో ఇంట్రస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. పలు కోర్సులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరడానికి నిరాసక్తత చూపుతున్నారు. ఇక ఇటు యాజమాన్యాలే కాలేజీల మూసివేత, కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకుంటుండగా, మరోవైపు తగిన వసతులు, ఫ్యాకల్టీ లేక అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు వివిధ కోర్సుల్లో సీట్లకు కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా 4 వేల నుంచి 7 వేల వరకు క్రమంగా సీట్లకు కోత పడుతోంది. దీంతో అనుబంధ గుర్తింపు లభిస్తున్న సీట్ల సంఖ్య తగ్గుతోంది. అనుమతించినా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో దాదాపు 11 వేల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఉన్నత విద్యా మండలి తేల్చిన తాజా పూర్తి స్థాయి లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్లలో 33 కాలేజీలు మూత.. ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మేనేజ్మెంట్ కోటాలో 2016 నుంచి 2018 వరకు ప్రవేశాల్లో పెద్దగా తగ్గుదల లేనప్పటికీ 2018 నుంచి 2019కి వచ్చేసరికి మాత్రం భారీగానే ప్రవేశాలు తగ్గిపోయాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కలుపుకొని 2016 సంవత్సరంలో రాష్ట్రంలోని 220 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,758 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అదే 2019 సంవత్సరం వచ్చేసరికి 187 కాలేజీల్లోని 93,790 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. అంటే నాలుగేళ్లలో 33 కాలేజీలు మూతపడగా, 10,968 సీట్లు రద్దయ్యాయి. మరోవైపు విద్యార్థులు చేరకపోవడంతో ప్రవేశాలు తగ్గిపోయాయి. 2016లో 73,686 మంది విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరగా, 2019లో 62,744 మంది మాత్రమే ఇంజనీరింగ్లో చేరారు. ఇందులో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా తగ్గింది. 2016లో 54,064 నుంచి 46,134కు పడిపోయింది. గడిచిన రెండేళ్ల ప్రవేశాలను పరిశీలిస్తే మాత్రం మేనేజ్మెంట్ కోటాలోనూ చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. డిమాండ్ లేని కోర్సులకు దూరం.. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే చేర్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రమాణాలు పాటించని కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. విద్యార్థులు కూడా తమ ఆలోచనను మార్చుకొని టైంపాస్ కోసం ఏదో ఓ కోర్సులో చేరాలనుకోవడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు లేకపోతే వాటిల్లో చేరేందుకే అస్సలు ఇష్టపడటం లేదని వారంటున్నారు. ఇలాంటి కారణాలతోనే ఏటా 8 నుంచి 15 వరకు కాలేజీలు మూత పడుతూనే ఉన్నాయి. ఈసారి కూడా 10 కాలేజీలు మూసివేత కోసం జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈసారి మరో 7 వేల వరకు సీట్లు తగ్గిపోవచ్చు. అయితే మార్కెట్లో డిమాండున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అవి ఇప్పటివరకు అన్ని కాలేజీల్లో లేవు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి మాత్రం జేఎన్టీయూలోని అన్ని కాలేజీల్లో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో 3 వేల వరకు సీట్లలో ఆయా కోర్సులకు అనుమతి ఇచ్చే అవకాశముంది. అయినా 2020 ప్రవేశాల్లో 4 వేల వరకు సీట్లు తగ్గే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రవేశాల్లో తగ్గుదలే తప్ప పెరుగుదల కనిపించడం లేదు. ఇంజనీరింగ్కు కెమిస్ట్రీ తప్పనిసరి కాదు ఇంజనీరింగ్ చదివేందుకు కెమిస్ట్రీని తప్పనిసరి సబ్జెక్టుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్లో 2021–22 విద్యా ఏడాది నుంచి అమల్లోకి తేనుంది. 2020–21 విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం ఇప్పటికే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష గత జనవరిలో జరిగినందున వచ్చే ఏప్రిల్లో రెండో విడత జేఈఈ మెయిన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా ఏడాదిలో ఇది అమలు చేసే అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము 2020–21 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని ఏఐసీటీఈని కోరాయి. దీంతో ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన 2020–21 అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్లోనూ మార్పులు చేసింది. దీంతో మనరాష్ట్రంలో వేలమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తప్పిన తప్పనిసరి కెమిస్ట్రీ.. ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. వాటినే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు మెటీరియల్స్ కాంపొజిషన్లో మాత్రమే కెమిస్ట్రీ అవసరం అవుతుందని, అదీ ప్రాథమిక అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బీఈ/బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకునే వారికి కెమిస్ట్రీ అవసరం లేదని పేర్కొంటున్నారు. అందుకనుగుణంగానే బీఈ/ బీటెక్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివుండాలని, వాటితో పాటు కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టు/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ను మూడవ సబ్జెక్టుగా చదివిన వారు కూడా అర్హులేనని అప్రూవల్ ప్రొసెస్ హ్యాండ్బుక్లో మార్పులు చేసింది. దీంతో ఇంటర్లో ఎంపీసీ చదివినవారే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు పైన పేర్కొన్న సబ్జెక్టులు చదివిన వారు కూడా బీటెక్ చేసేందుకు అర్హులే. కాగా, శనివారం జరగనున్న ఎంసెట్ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నేడు ఎంసెట్ కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కమిటీ సమావేశం ఈ నెల 15న నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం ఈ సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష ఫీజు, అర్హతలకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామన్నారు. ఈనెల 19న ఎంసెట్ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకు ఫీజు రాయితీ ఇచ్చే అంశాన్ని ఖరారు చేయనున్నారు. -
24న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ను ఈనెల 24న విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి, ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 9న విడుదల చేసింది. ఎంసెట్కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,42,210 మంది దరఖాస్తు చేసుకోగా, 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ రాసేందుకు 74,989 మంది దరఖాస్తు చేసుకోగా, 68,550 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. ప్రస్తుతం వాటిల్లో అర్హత సాధించిన విద్యార్థులంతా ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాయి. ఈ సారి 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం ఇంకా తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టులో కేసు వేయడంతో ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలు విషయంలో ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంకా ఆలస్యం అయితే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈనెల 24న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, కౌన్సెలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత వారం రోజుల సమయంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించి, సీట్లు కేటాయింపు చేపట్టాలని ఆలోచిస్తోంది. మరోవైపు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ ప్రవేశాలకు కూడా ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఈనెల 20న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఆ రెండింటి ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూలు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. -
ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ఏఐ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ప్రత్యేక బ్రాంచ్గా బీటెక్ ప్రోగ్రామ్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీహెచ్) ప్రారంభించింది. దేశంలో కృత్రిమ మేధస్సును బ్రాంచ్గా నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్ను అందించనున్న తొలి ఇన్స్టిట్యూట్ గా ఘనతకెక్కింది. అంతర్జాతీయంగా మూడో ఇన్స్టిట్యూట్గా నిలిచింది. ప్రస్తుతం బీటెక్ (ఏఐ) కోర్సును ఎంఐటీ (యూఎస్), కార్నెగీ మిలన్ వర్సిటీ(యూఎస్)లే అందిస్తున్నాయి. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హెచ్లో ఏఐ అందుబాటులోకి రానుంది. తొలి బ్యాచ్లో జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు ఆధా రంగా 20 మందితో దీన్ని ప్రారంభించనున్నట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ తెలిపారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను అందించేలా ఏఐ బ్రాంచ్ కరిక్యులమ్ ను రూపొందించినట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పరిష్కారాలు ప్రస్తుతం మన దేశంలో హెల్త్కేర్, పంటలు, నేల నిర్వహణ, వాతావరణ అంచనాలు, భద్రత, రక్షణ వంటి విభాగాల్లో ఉపయోగపడుతున్నాయని ఐఐటీ హెచ్ఆర్ అండ్ డీ డీన్, ప్రొఫెసర్ ఎస్.చన్నప్పయ్య తెలిపారు. ఇతర బ్రాంచ్ల్లో బీటెక్ చేరిన అభ్యర్థులు ఏఐను మైనర్ కోర్సుగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ విభాగం లో మానవ వనరుల డిమాండ్–సప్లయ్ వ్యత్యా సం తగ్గించేలా అడుగులు వేస్తామన్నారు. -
రోజుకు 2 సెషన్లలో ‘గేట్’
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పూర్తిస్థాయి షెడ్యూలు జారీ అయింది. దేశంలోని ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో 2019–20 విద్యా సంవత్సరంలో ఎంటెక్లో ప్రవేశాలకు గత ఆగస్టులోనే నోటిఫికేషన్ జారీ చేసిన ఐఐటీ మద్రాసు పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూలును బుధవారం జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఐఐఎస్సీ బెంగళూరు, ఏడు ఐఐటీల నేతృత్వంలో నిర్వహించే బాధ్యతను ఐఐటీ మద్రాస్కు అప్పగించాయి. గత సెప్టెంబర్లోనే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఐఐటీ మద్రాస్ స్వీకరించారు. 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో గేట్ను నిర్వహిస్తామని వెల్లడించింది. రోజూ 2 సెషన్లుగా 4 రోజుల పాటు 24 సబ్జెక్టుల్లో గేట్ నిర్వహించనుంది. 2019లో స్టాటిస్టిక్స్ సబ్జెక్టులోనూ ప్రవేశాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షల కోసం తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్ పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులను పరీక్ష హాల్లోకి 40 నిమిషాల ముందునుంచే అనుమతిస్తారు. ఉదయం సెషన్లో 10 గంటల తర్వాత, మధ్యాహ్నం సెషన్ వారిని 3 గంటల తర్వాత అనుమతించరు. నెగటివ్ మార్కుల విధానం ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. పరీక్ష ఫలితాలు 2019 మార్చి 16న విడుదల అవుతాయి. పెరిగిన ప్రాధాన్యం.. ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తాము చేపట్టే నియామకాల్లో గేట్ స్కోర్కు ప్రాధాన్యం ఇస్తుండటంతో తెలంగాణ నుంచి గేట్కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బీహెచ్ఈఎల్, గెయిల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఐవోసీఎల్, ఎన్టీపీసీ, ఎన్పీసీఐఎల్, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ వంటి సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. అలాగే కేంద్రం గ్రూప్–ఏ కేటగిరీలోని సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్; సీనియర్ రీసెర్చ్ ఆఫీ సర్ వంటి పోస్టులను కూడా గేట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తోంది. అయితే గేట్ నిర్వహణ సంస్థకు, ఉద్యోగ నియామకాలకు సంబంధం లేదని, అది అభ్యర్థులే చూసుకోవాలని ఐఐటీ మద్రాసు స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ కోర్సు ల్లో పరిశోధన విద్యార్థులు ఆర్థి«క సాయం పొందేందుకు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి ఇచ్చే స్కాలర్షిప్లు పొందేందుకు గేట్లో అర్హత సాధించాలి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. గేట్ స్కోర్ను ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి మూడేళ్ల పాటు పరిగణనలోకి తీసుకుంటారు. -
సివిల్ ఇంజనీర్లకు డిమాండు తక్కువే
దేశంలో సివిల్ ఇంజనీర్ కోర్సుకు అనుకున్నంతగా డిమాండు లేదని ప్రాంగణ నియామకాల తీరు వెల్లడిస్తోంది.2012–13 నుంచి2015–16 మధ్య కాలంలో సివిల్ ఇంజనీరింగ్ పాసయిన వారిలో కేవలం 38 శాతం మందికే ఉద్యోగాలు లభించాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)గణాంకాలను బట్టి తెలుస్తోంది.దేశంలో నిర్మాణ రంగం శరవేగంతో పురోగమిస్తున్న ఈ తరుణంలో ఆ రంగానికి కీలకమైన సివిల్ ఇంజనీర్లకు డిమాండు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏఐసీటీఈ ఆమోదించిన ఆరు ఇంజనీరింగ్ కోర్సుల్లో మూడు కోర్సులకు –కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్–మాత్రమే డిమాండు ఉంది. ఆ కోర్సుల్లో ప్రాంగణ నియామకాలు 50 శాతానికి మించి ఉన్నాయి.అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్తో పోలిస్తే కెమికల్ ఇంజనీరింగ్వంటి కోర్సుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ఏఐసీటీఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2012–13 సంవత్సరంలో సివిల్ ఇంజనీరింగ్లో 11.98 లక్షల మంది చేరగా, వారిలో 4.64 లక్షల మంది(39శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1.74 లక్షల మంది(38శాతం)కే ఉద్యోగాలు లభించాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 86 వేల మంది చేరితే,45 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో25వేల మందికి(55%) ఉద్యోగాలు వచ్చాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 20 లక్షల మందికిపైగా చేరారు. వీరిలో 9.40 లక్షల మంది పాసయ్యారు.4.74 లక్షల(50శాతం) మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం మీద కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్లలోనే 50శాతానికిపైగా ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ సీట్లు తామరతంపరగా పెరిగిపోవడంతో కోర్సు పూర్తి చేసి బయటకొస్తున్న వారి సంఖ్య కూడ పెరుగుతోందని, అయితే, వారిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడటంతో ఉద్యోగాలు లభించడం లేదని నిపుణులు చెబుతున్నారు. -
నేనో నిరుద్యోగి.. చదివింది ఇంజనీరింగ్
► ఉద్యోగం ఇవ్వని ఇంజనీరింగ్ విద్య.. నైపుణ్యాల కొరతే ప్రధాన సమస్య ► అడ్డగోలుగా కాలేజీలు.. ప్రమాణాలు మాత్రం శూన్యం.. దేశవ్యాప్తంగా 32.88% మందికే ఉద్యోగాలు ► ఏటా ఇంజనీరింగ్ చదువుతున్న వారు 15 లక్షల పైనే.. ఉద్యోగాలు లభిస్తున్నది 4.95 లక్షల మందికే ► తెలంగాణలో 28.3% శాతం మందికే ఉద్యోగాలు.. రెండేళ్లుగా మెరుగుపడుతున్న పరిస్థితి.. అరవింద్.. వయసు 26 ఏళ్లు.. ఊరు నల్లగొండ జిల్లా తేరట్పల్లి. ఇంజనీర్ కావాలన్నది అతడి చిన్నప్పటి ఆశయం.. దానికి తగ్గట్టే బీటెక్ చదివాడు. 2012లో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.. బీటెక్ పూర్తిచేశాడు గానీ ఇంజనీర్ కావాలన్న అతడి ఆశయం మాత్రం అలాగే ఉండిపోయింది. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఓరల్లో అంతా ఇంగ్లిష్లోనే సమాధానమివ్వాలి.. అరవింద్ అక్కడ తడబడ్డాడు.. నేటికీ నిరుద్యోగిగానే మిగిలిపోయాడు. సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతోంది. కొరవడిన నాణ్యతా ప్రమాణాలు, సబ్జెక్టుపై పట్టులేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం వంటి కారణాలతో దాదాపు 67% మందికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు గానే మిగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 15 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ విద్య పూర్తిచేసుకుంటున్నా.. వారిలో 32.88% మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇవీ కూడా కాలేజీల యాజమాన్యాలు చెప్పిన లెక్కలే. వాస్తవంగా ఈ శాతం మరింత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తెలంగాణలో కేవలం 28.31 శాతం మందికి, ఏపీలో 27.92% మందికే ఉద్యోగావకాశాలు లభిస్తుండడం గమనార్హం. ఏఐసీటీఈ సర్వేలోనే.. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 2016–17 విద్యా సంవత్సరంలో 1,18,419 మంది ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసుకున్నారు. ఇందులో 33,529 మందికి (28.31%) మాత్రమే ఉద్యోగావకాశాలు లభించాయి. ఏపీలో గతేడాది 1,47,699 మంది ఇంజనీరింగ్ పూర్తి చేయగా.. 41,312 మందికే (27.97%) ఉద్యోగాలు వచ్చాయి. ఇవి లెక్కలు కూడా సాక్షాత్తు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్వయంగా తేల్చినవి కావడం గమనార్హం. ఎన్నో కారణాలతో.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లభించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో నైపుణ్యాల కొరత, మార్కెట్ అవసరాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇంగ్లిషు భాషా సమస్య వంటివి ప్రధానమైనవి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ఇంజ నీరింగ్ కాలేజీలు, వాటిల్లో ప్రమాణాల లేమి, మౌలిక సౌకర్యాల కొరత, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బోధన జరపకపోవడం వంటి వాటి కారణంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాల లేమి కనిపిస్తోంది. పీపుల్ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, లింక్డ్ఇన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోనే ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీబాక్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్టు (వెస్ట్) పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 5.2 లక్షల మంది అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించారు. ఇక అస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలోనూ ఇవే అంశాలు వెల్లడయ్యాయి. వీటితోపాటు పారిశ్రామిక రంగంలో, మార్కెట్లో అవసరాల కంటే ఏటా రెట్టింపు సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు రావడమూ కారణమని తేలింది. మరోవైపు మంచి నైపుణ్యం ఉన్న అభ్యర్థుల కోసం డిమాండ్ కూడా పెరుగుతుండడం గమనార్హం. మెరుగవుతున్న పరిస్థితి గత ఒకటీ రెండేళ్లుగా ఉద్యోగాలు పొందుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల శాతం స్వల్పంగా పెరిగింది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా గతేడాది ఉద్యోగాలు పొందిన వారి శాతం పెరిగింది. తెలంగాణలో 2015–16లో 26.79% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించగా... 2016– 17లో 28.31% మందికి ఉద్యోగాలు వచ్చాయి. పొరుగు రాష్ట్రం ఏపీలో 2015–16లో 25.30% మందికి ఉద్యోగాలురాగా.. 2016–17లో 27.97% మందికి లభించాయి. -
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి
-
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి
కొన్ని కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి - ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి - జేఎన్టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాల లపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే ఆశిస్తుందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. కొన్ని యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని, ఇలాంటి కళాశాలల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వసతులు, నిపు ణులు లేకపోయినా అడ్మిషన్లు తీసుకుంటున్నా యని, ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తు న్నారని అధికారులను ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. పరిశోధనా పత్రాలు సమర్పించిన వారికి పీహెచ్డీ అవా ర్డులతో పాటు ఇంజనీరింగ్లో అత్యుత్తుమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. గవర్నర్ మాట్లా డుతూ... ఉన్నత విద్య ఆశయాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాలేజీలను మూసివే యించడమే ఉత్తమమన్నారు. ‘ఓ సామాన్యు డిలా అడుగుతున్నా..’ అంటూ అధ్యాపకులు, విద్యార్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఖర్చులు తగ్గించే దిశగా సాగాలి... ఒక అధ్యాపకుడు వంద మందికి గైడ్గా ఎలా వ్యవహరిస్తారని నరసింహన్ ప్రశ్నించారు. పీహెచ్డీ పట్టాలు ఉద్యోగుల పదోన్నతులకు పనికివస్తున్నాయేమో కానీ.. సమాజానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదన్నారు. పరి శోధనలు సమాజానికి ఉపయోగపడినప్పుడే వాటికి విలువ ఉంటుందన్నారు. దేశ జనాభా రోజురోజుకూ పెరుగుతోందని, వారి అవసరా లకు అనుగుణంగా ఆహార పంటలు పండటం లేదని, చాలా మంది తిండి లేక, తాగేందుకు నీరు లేక పస్తులుండాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య భద్రత లేదన్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే.. అక్కిడి వైద్య ఖర్చులు భరించలేని స్థాయిలో ఉన్నాయని, వైద్య ఖర్చులు తగ్గించే దిశగా తమ పరిశోధనలు చేపట్టాలని విద్యార్థు లకు సూచించారు. సోలార్ పలకలు మన దగ్గర లేకపోవడంతో వాటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, సామా న్యులకు ఈ ధరలు భారంగా మారుతున్నాయ ని, వీటి ధరలు తగ్గించే దిశగా పరిశోధనలు చేయాలన్నారు. ఐ ప్యాడ్లతో మెదడుకు ముప్పు... సాంకేతిక పరిజ్ఞానం పేరుతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రాథమిక దశలోనే ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు చేతికిస్తున్నారని, ఇది పిల్లల ఆలోచనా పరిజ్ఞానాన్ని దెబ్బతీయడమే కాకుం డా వారి మెదడు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని నరసింహన్ హెచ్చరించా రు. నీటిపారుదల ప్రాజెక్టులపై పరిశోధనలు చేయడం ద్వారా వాటి ఫలాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సాంకేతిక విద్యకు మంచి భవిష్యత్తు విద్య విద్యార్థులకు ఓ ఆయుధం. చదువు, పరిశోధనలే విద్యార్థులను ఉన్న తులుగా తీర్చిదిద్దుతాయి. సాంకేతిక విద్య కు మంచి భవిష్యత్తు ఉంది. దేశంలో 300 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతు న్నారు. 833మిలియన్ల మంది మారు మూల గ్రామాల్లోనే జీవిస్తున్నారు. 260 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి జరుగు తుంది. అయినా 42 శాతం మంది పిల్లలు పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ప్రతి వెయ్యికి 44మంది పిల్లలు చనిపోతు న్నారు. 2050 నాటికి సగం జనాభా నగరీ కరణ చెందుతుంది.వీరి అవసరాలు తీర్చా లంటే మరిన్ని పరిశోధనలు అవసరం. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- రేపే జేఈఈ మెయిన్ పరీక్ష - 8, 9 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 69,467 మంది, ఏపీ నుంచి 80 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీఈ/బీటెక్లో ప్రవేశాల కు నిర్వహించే పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. 9.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బీఆర్క్, బీ ప్లానింగ్లో ప్రవేశాల కోసం పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. హైదరాబాద్, ఖమ్మం,వరంగల్లలో కేంద్రాలు..: జేఈఈ పరీక్షలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్లో, ఏపీలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆఫ్లైన్ పరీక్షకు నిర్ణయించిన సమయాల్లోనే ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలకు మరో 25 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. పరీక్షలో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానినికి 4 మార్కుల చొప్పున 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో తప్పు సమాధానానికి ఒక్క మార్కు తగ్గుతుంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ ప్రధాన నిబంధనలు.. ► పేపర్–1 పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ► ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థుల తనిఖీ ఉంటుంది. ► పరీక్ష హాలులోకి మాత్రం ఉదయం 9 గంటలకు అనుమతిస్తారు. ► 9.20 గంటలకు ప్రశ్నపత్రం ఓఎంఆర్ బుక్లెట్ను ఇస్తారు. దాన్ని 9.25 గంటలకు తెరవాలి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ► 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ► హాల్టికెట్, గుర్తింపుకార్డు తప్ప మరేవీ అనుమతించరు. ► కాలిక్యులేటర్లు, అవి ఉండే గడియారాలు, సెల్ఫోన్లను అనుమతించరు. ► పరీక్ష బ్లూ/బ్లాక్ పెన్తోనే రాయాలి. పెన్సిల్ను అనుమతించరు. -
దేశమంతా ఒకటే ఎంట్రన్స్
ఇంజనీరింగ్ ప్రవేశాలపై ఏఐసీటీఈ చైర్మన్ సహస్రబుద్ధే ⇒ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం ⇒ ఒక్కో విద్యార్థి పది ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయాల్సిన పనిలేదు ⇒ ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘ఏకీకృత ఫీజు’ సాధ్యం కాదు ⇒ విద్యార్థులకు ‘స్వయం’ ఉపయోగపడుతుంది ⇒ ‘సాక్షి’తో సహస్రబుద్ధే ప్రత్యేక ఇంటర్వూ్య సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశానికి దేశమంతా వచ్చే ఏడాది నుంచి ఒకే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నా మని, రెండు మూడు విడతల్లో ఆ పరీక్ష నిర్వహిస్తామని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యు కేషన్(ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ దత్తాత్రేయ సహస్రబుద్ధే చెప్పారు. దేశమంతా ఒకేరకమైన ఫీజు విధానం సాధ్యం కాదన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కాలేజీలకు అనుమతి ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరి స్తున్నామని తెలిపారు. అధ్యాపకులకు శిక్షణ ఇస్తామని, శిక్షణ పూర్తిచేసిన వారే కాలేజీల్లో టీచింగ్ చేయాలనే నిబంధన తెస్తామని వెల్లడిం చారు. కాగా, దాదాపు 3 దశాబ్దాల పాటు ఐఐటీ లో బోధించిన అనుభవం సహస్రబుద్ధే సొంతం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్వహించిన ‘సృజన’ కార్యక్రమంలో పాల్గొన డానికి శుక్రవారం విజయవాడ వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వూ్య ఇచ్చారు. ప్రశ్న: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ పరీక్ష ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఒకే ఎంట్రన్స్ వల్ల ప్రయోజనం ఏమిటి? సమాధానం: వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నాం. ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశానికి చాలా పరీక్షలు నిర్వహిస్తు న్నారు. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం పొందడానికి ఒక్కో విద్యార్థి 5 పరీక్షలు రాయా ల్సి ఉంటుంది. అన్ని పరీక్షలకు ఫీజులు చెల్లిం చాలి. ఇకపై ఒకే పరీక్ష నిర్వహిస్తాం. రెండు మూడు విడతల్లో ఈ పరీక్ష నిర్వహిస్తాం. ఏ విడతలోనైనా విద్యార్థి పరీక్ష రాయవచ్చు. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికీ ఈ పరీక్షే ఉంటుందా? స: తొలి దశ పరీక్షగా ఇదే ఉంటుంది. కావాలనుకుంటే.. ఐఐటీ, ఎన్ఐటీలు అడ్వాన్స్ పరీక్ష నిర్వహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ (+2) సిలబస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. మరి ఉమ్మడి పరీక్ష వల్ల ఇబ్బందులు ఉండవా? స: కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించాలి. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఇప్పటికే ఉమ్మడి పరీక్ష ఉంది. ప్రతిపాదిత ఉమ్మడి ప్రవేశ పరీక్షతో కొత్తగా ఇబ్బందేమీ ఉండదు. రాష్ట్రాలకు సంబంధించినంత వరకు.. పరీక్ష ఉమ్మడి ఉన్నా, పోటీ మాత్రం ఆ రాష్ట్ర విద్యా ర్థుల మధ్యే ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు కనీస స్థాయిలోనే ఉంటాయి. సీబీఎస్సీ సిలబస్కు అనుగుణంగా రాష్ట్రాలు కూడా తమ సిలబస్ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారుగా! ఫీజులూ ఒకేలా ఉంటాయా? ఏకీకృత ఫీజు విధానం సాధ్యమవుతుందా? స: ఒకే రకమైన ఫీజు విధానం సాధ్యం కాదు. కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఫీజు ఉండాలి. ఉన్నత ప్రమాణాలు ఉన్న కాలేజీల్లో ఫీజు కాస్త ఎక్కువ ఉంటుంది. మిగతా కాలేజీల్లో తక్కువ ఉంటుంది. ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమా ణాలు లేవు. పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసే నైపుణ్యం లేకపోవడమే ప్రధాన సమస్యని పరిశ్రమల వర్గాలు అంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏఐసీటీఈ ఏమైనా చేస్తుందా? సమాధానం: దురదృష్టవశాత్తూ.. డిమాండ్ కంటే ఎక్కువ సంఖ్యలో కాలేజీలు ఏర్పాటయ్యాయి. కాలేజీలకు అనుమతి ఇచ్చే విషయంలో ఏఐసీటీఈ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రమాణాలు పాటించలేని, అడ్మిషన్లు తక్కువగా ఉన్న కాలేజీలను మూసేయమని మేం సూచిస్తున్నాం. నాణ్యమైన బోధనా సిబ్బంది లేకపోవడం అసలు సమస్యకు కారణం. దీన్ని అధిగమించేందుకు ఏఐసీటీఈ చేపడుతున్న చర్యలేమిటి? స: రెండు చర్యలు చేపడుతున్నాం. 1. ఎంటెక్ పూర్తి చేసి, టీచింగ్ రంగంలోకి రావాలనుకునేవారికి 2–3 నెలల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఈ శిక్షణకు హాజరై, పరీక్ష ఉత్తీర్ణులైతేనే టీచింగ్లోకి వెళ్లాలని నిబంధన తీసుకురానున్నాం. 2. ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ శిక్షణ పూర్తి చేయకుంటే టీచింగ్ రంగంలో కొనసాగడానికి వీలు కాని విధంగా నిబంధనలు రూపొందిం చనున్నాం. వారం క్రితం సమావేశంలో ఈ సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నాం. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుబాటులోకి తీసుకురావచ్చు కదా? స: ‘స్వయం’ అలాంటిదే. ప్రముఖ ప్రొఫెసర్లు, ఆయా రంగాల్లో నిపుణుల పాఠాలను ‘స్వయం’ ద్వారా విద్యార్థులు నేరుగా వినవచ్చు. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. గ్రామీణ విద్యార్థులకు ‘స్వయం’ ఎంతో ఉపయోపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలు ‘స్వయం’ ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ‘ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం’(సీబీసీఎస్) కేవలం కాగితాలకే పరిమితం. పూర్తిస్థాయిలో అమలుకు ఏం చేయాలి? స: ఐఐటీల్లో అనుసరిస్తున్న సీబీసీఎస్ విధానం సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అమలు చేయడం కష్టమే. కొత్త విధానానికి అలవాటుపడటానికి టైం పడుతుంది. నాణ్యత ప్రమాణాలు పెరిగితే ‘సీబీసీఎస్’ స్ఫూర్తి అమలు సాధ్యమవుతుంది. అందుకు తగిన శిక్షణ అధ్యాపకులకు ఇవ్వాలి. -
కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థల మూత
► 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం ►శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాలని ►యాజమాన్యం హుకుం ఎన్ఓసీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ► విద్యార్థుల డిమాండ్ కల్లూరు: ఇంజనీరింగ్ విద్య విభాగంలో ఒక వెలుగు వెలిగిన కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ విద్యా సంస్థలో సీఎస్ఈ, ఈసీఈ, ఈసీ, సీఎస్ఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సులు చదువుతున్న 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కొట్టం కరుణాకరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లు చిన్నటేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ కాలేజ్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కళాశాలలోని ల్యాబ్పరికరాలను యాజమాన్యం అమ్ముకుని ల్యాబ్ పరీక్షలు, ప్రయోగాలపై వారికి శిక్షణ ఇవ్వలేదు. బస్సు సౌకర్యాలను రద్దు చేయడంతో సొంత వాహనాలు,ఆర్టీసీ బస్సులద్వారా కొందరు విద్యార్థులు కాలేజ్కు వస్తుండగా మరికొందరు సమీప గ్రామాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అడ్మిషన్ పొందుతున్న సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తామని యాజమాన్యం చెప్పి మోసం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థలను మూసివేస్తున్న సమాచారం తమకు ఇవ్వలేదని, కేవలం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాలని యాజమాన్యం హుకుం జారీచేసిందని ఈసీఈ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాధవరెడ్డి, శశిధర్, బి.రాజశేఖర్, బి.ఈరన్న తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు గురువారం వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు ఎన్ఓసీ ధ్రువీకరణ పత్రాలు అందేలా చూడాలని కోరుతున్నారు. -
ఐఐటీలకు దీటైనవెన్నో..
గెస్ట్ కాలమ్ జేఈఈ మెయిన్ ఫలితాలు, ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో... ఐఐటీలు, అప్టిట్యూట్ టెస్ట్, ఇంజనీరింగ్ విద్య తదితర అంశాలపై ప్రొఫెసర్ సరిత్ కుమార్తో గెస్ట్కాలం.. * ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించి తాజాగా ప్రతిపాదించిన స్టాండర్డయిజ్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్య పట్ల ఉన్న వాస్తవ అభిరుచి, ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన సహజ నైపుణ్యాలను గుర్తించడం. దాంతోపాటు కోచింగ్ సంస్కృతికి స్వస్తి పలకడం. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల విద్యార్థులు కోచింగ్ ద్వారా పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఐఐటీల్లో అడుగు పెడుతున్నారు. ఐఐటీల్లో చేరాక అక్కడి వాతావరణంలో ఇమడలేక ఒత్తిడికి గురవుతున్నారు. * ఆప్టిట్యూడ్ టెస్ట్లో విజయం సాధించిన విద్యార్థులకు.. ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన బేసిక్స్ను పరీక్షించేందుకు సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్లో విజయం సాధించిన విద్యార్థులు... కోచింగ్తో సంబంధం లేకుండా సింగిల్ ఎంట్రన్స్లో రాణించగలరని ఐఐటీ నిపుణుల కమిటీ గట్టిగా నమ్ముతోంది. * విద్యార్థుల్లో అధిక శాతం మంది గమ్యం ఐఐటీలే!కానీ ఐఐటీల్లో సీట్ల సంఖ్య పరిమితం.. పోటీ మాత్రం అపరిమితం. కాబట్టి విద్యార్థులు ముందు నుంచే ఐఐటీలకు ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిపెట్టాలి. ఐఐటీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించే ఇన్స్టిట్యూట్స్ ఎన్నో దేశంలో ఉన్నాయి. అంతేకానీ ఐఐటీలో సీటు రాలేదని కుంగిపోకూడదు. * ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులు క్యాంపస్లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే లక్ష్యం దిశగా కృషి చేయాలి. ఇంజనీరింగ్లో చేరడమే విజయం కాదని.. తమ లక్ష్యం పూర్తి స్థాయిలో సాధించాలంటే నాలుగేళ్ల కోర్సులో రోజూ రాణించడం ముఖ్యమని గుర్తించాలి. ప్రాక్టికాలిటీతో పర్ఫెక్షన్ ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులు ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. బోర్డ్ సిలబస్ తరహాలో క్లాస్ రూం లెర్నింగ్కు, లెక్చరర్స్పై ఆధారపడటం అనే ఆలోచనకు స్వస్తి పలకాలి. ప్రాక్టికల్ అప్రోచ్ను పెంపొందించుకోవాలి. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక కాన్సెప్ట్ చెబితే దానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి. - ప్రొఫెసర్ సరిత్ కుమార్ దాస్ డైరెక్టర్, ఐఐటీ - రోపార్ -
ఇంజనీరింగ్పై ఆసక్తి లేదు!
రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై తగ్గుతున్న ఆదరణ ♦ ఆరేళ్లుగా కన్వీనర్ కోటాలో తగ్గుతున్న ప్రవేశాలు ♦ 2010లో 69 వేలకుపైగా భర్తీ.. ఈసారి 56 వేలకే పరిమితం ♦ వచ్చే విద్యా సంవత్సరంలోనూ భారీగా తగ్గనున్న ప్రవేశాలు ♦ సీట్లను తగ్గించేందుకు ఏఐసీటీఈ చర్యలు ♦ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్.. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజీ కోర్సు. ఏ తల్లిదండ్రులను అడిగినా తమ పిల్లాడిని ఇంజనీరింగ్ చదివిస్తామని.. ఏ విద్యార్థిని అడిగినా వారి టార్గెట్ ఒక్కటే ఇంజనీర్ అవుతామని చెప్పేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ అంతకంతకూ తగ్గిపోతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతోంది. గడిచిన ఐదేళ్లలో ఇంజ నీరింగ్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమం గా తగ్గుతూ వస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలు.. అధ్యాపకులు లేకపోయినా కాలేజీలను కొనసాగిస్తున ్న యాజమాన్యాల వైఖరితో ఇంజనీరింగ్ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందన్న నిరాసక్తత తల్లిదండ్రుల్లోనూ.. విద్యార్థుల్లోనూ పెరుగుతోంది. నాణ్యతా ప్రమాణాలపై దృష్టి రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్రం కూడా ఇంజనీరింగ్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తోంది. ఏటా 40 శాతం మేర ఖాళీగా ఉంటోన్న ఇంజనీరింగ్ సీట్లను తగ్గించే దిశగా కసరత్తు చేస్తోంది. దీంతోపాటు ఇష్టారాజ్యంగా అనుమతులివ్వొద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ సహస్రబుద్దే ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ముగిసిన తర్వాత(గత డిసెంబర్ నాటికి) సీట్లు మిగిలిపోయిన 556 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు 1,422 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు నాణ్యతా ప్రమాణాలపై గతంలో చూసీచూడనట్లు వ్యవహరించిన రాష్ట్ర అధికారులు ఈ విద్యా సంవత్సరం నుంచి పక్కా చర్యలపై దృష్టిసారించారు. మొత్తంగా అటు దేశవ్యాప్తంగా.. ఇటు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కుదింపుపై ప్రభుత్వాలు పక్కా చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కాలేజీల అనుమతుల ప్రక్రియను పక్కాగా చేపట్టాలని నిర్ణయించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో(2016-17) కాలేజీల రద్దు, కోర్సుల రద్దు, సీట్ల తగ్గింపు ప్రక్రియపై జేఎన్టీయూ ఈసారి ముందుగానే చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా కాలేజీల రద్దు, కోర్సుల రద్దు, సీట్ల తగ్గింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఏఐసీటీఈ అనుమతుల తర్వాత జేఎన్టీయూ చేపట్టాల్సిన అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం ముందుగానే అఫిలియేషన్ ప్రొసీజర్ అండ్ రెగ్యులేషన్స్-2016ను సిద్ధం చేసింది. కాలేజీల తీరే కారణం.. ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకుని విద్యను గాలికొదిలేసిన యాజమాన్యాల వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీలు విద్యా బోధనపై దృష్టి పెట్టలేదు. ఫీజుల కోసమే కాలేజీలను నడుపుతూ ఇంజనీరింగ్ విద్యను వ్యాపారంగా మార్చుకున్నాయి. అధ్యాపకులను నియమించకుండా, బీటెక్ వారితోనే మమా అనిపించేస్తూ ఇంజనీరింగ్ విద్యను భ్రష్టు పట్టించాయి. దీంతో అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ పడిపోయాయి. పేరున్న కాలేజీల్లో తప్ప మిగతా కాలేజీల్లో రిక్రూట్మెంట్ జరగడంలేదు. దీంతో ఇంజనీరింగ్ చేసినా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. మార్కెటింగ్రంగంలో నెలకు రూ.5 వేలు, రూ.10 వేలకు పనిచేయాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ఏటా 90 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా 15 వేల మందికి కూడా తగిన ఉద్యోగం లభించడం లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల వల్ల విద్యార్థులకు సబ్జెక్టుతోపాటు భాషా నైపుణ్యాలు లేకపోవడమే దీనికి కారణం. యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్, చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో వెనుకబడి ఉన్నట్లు స్పష్టమైంది. తగ్గిపోతున్న సీట్లు... ఆరేళ్ల కిందట(2010-11) కన్వీనర్ కోటాలో 69,690 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరితే.. గత ఏడాది (2014-15) కన్వీనర్ కోటాలో 57,925 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఇక 2015-16లో అయితే 56,017 మంది విద్యార్థులే కాలేజీల్లో చేశారు. విచిత్రం ఏంటంటే ఆరేళ్ల కిందట కన్వీనర్ కోటాలో తక్కువ సీట్లు ఉన్నా ఎక్కువ మంది విద్యార్థులు చేశారు. (87,793 సీట్లలో 69,690 మంది చేరారు) ఆ తర్వాత నుంచి సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నా.. కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఇంజనీరింగ్లో నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించిన కారణంగా కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా సీట్లు రద్దు చేసుకోగా, మరికొన్నింటిలో నాణ్యతా ప్రమాణాల మేరకు జేఎన్టీయూహెచ్ సీట్లకు అనుమతిచ్చింది. దీంతో 2015-16లో సీట్ల సంఖ్య తగ్గింది. అయినా వాటిల్లో చేరే వారు లేకుండా పోయారు. కన్వీనర్ కోటాలో 86,313 సీట్లకు అనుమతి ఇచ్చినా 56,017 మంది మాత్రమే చేరారు. 30 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. -
‘టాప్’ లేచిపోతోంది
గందరగోళంగా ఇంజనీరింగ్ విద్య ఇతర రాష్ట్రాల బాట పడుతున్న టాపర్స్ ఇప్పటికే రెండుసార్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా ఎప్పుడు చేపడతారో స్పష్టత కరువు తప్పెవరిదైనా బలవుతున్నది విద్యార్థులే వేలాదిగా మైగ్రేషన్ సర్టిఫికెట్లు తీసుకున్న వైనం ఈసారీ ఆగస్టులో తరగతుల ప్రారంభం అనుమానమే సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య గందరగోళంగా మారింది. దీంతో విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు. కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం కారణంగా ఎంసెట్లో టాపర్లు జేఈఈ ర్యాంక్ ఆధారంగా దూరప్రాంతమైనా సరే ఎన్ఐటీల్లో చేరిపోతున్నారు. ఎంసెట్లో 2,000 లోపు ర్యాంక్ సాధించి జేఈఈలో 5 వేల లోపు ర్యాంక్ సాధించిన విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో ఎన్ఐటీలు, జేఈఈ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహించే ఇతర రాష్ట్రాల కాలేజీల్లో చేరిపోతున్నారు. ఇక్కడ కౌన్సెలింగ్లో జాప్యం కారణంగానే దాదాపు 5 వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టారు. మరో 5 వేల మంది దాకా డీమ్డ్ యూనివర్సిటీల్లో చేరిపోయారు. చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన 62 వేల మందిలో 50 వేల మంది ఇక్కడ చేరడం గగనమే. ఏటా ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. కాలేజీ యాజమాన్యాల ఇష్టారాజ్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇంజనీరింగ్ ప్రవేశాల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విద్యా మండలి గొడవల కారణంగా గతేడాది ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు విద్యార్థులకు రెండో దశ కౌన్సెలింగ్ లేకుండా పోయింది. ఫలితంగా ఇష్టంలేని బ్రాంచీల్లో విద్యార్థులు చేరాల్సి వచ్చింది. కాలేజీ, కోర్సును మార్చుకునే అవకాశం విద్యార్థులకు లేకుండా పోయింది. ఇక ఈసారి కాలేజీల అఫిలియేషన్ల గొడవతో గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతోంది?: ఈసారి ఎంసెట్లో ఇంజనీరింగ్కు 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా 1,28,162 మంది పరీక్ష రాశారు. అందులో 90,556 మంది విద్యార్థులే(70.65 శాతం) అర్హత సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు 62,777 మంది హాజరయ్యారు. మరోవైపు ఎంసెట్లో అర్హత సాధించినా 12 వేల మంది ఇంటర్లో ఉత్తీర్ణులు కాలేదు. అందులో కనీసంగా ఆరేడు వేల మంది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. వారికి ఇంతవరకు ర్యాంకులు ఇవ్వలేదు. ఈలోగా జేఎన్టీయూహెచ్ పరిధిలో కాలేజీల అఫిలియేషన్ల గందరగోళం మొదలైంది. 220 కాలేజీల్లో మొదట 76 వేల సీట్లకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇచ్చింది. చాలా కాలేజీల్లో పలు కోర్సులకు కోత పెట్టింది. ఆ తరువాత కాలేజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని వివిధ కాలే జీల్లో కోర్సులకు అనుమతించడంవల్ల మరో 18 వేల వరకు సీట్లు వచ్చాయి. మొత్తానికి సీట్ల సంఖ్య 90 వేలు దాటింది. కానీ కోర్సులకు కోతపడిన కాలేజీలు, అనుబంధ గుర్తింపును నిరాకరించిన 25 కాలేజీలు, అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని మరో 45 కాలేజీలు, తమ కాలేజీల్లో అన్ని వసతులు ఉన్నా కోర్సులకు కోత పెట్టారని 50 కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. గురువారమే విచారణను కోరలేదెందుకు? గతనెల 28వ తేదీన జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను, సీట్ల వివరాలను ప్రకటించింది. దీంతో వెంటనే ఉన్నత విద్యామండలి ఈ నెల 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. కాని కాలేజీలు కోర్టును ఆశ్రయించడంతో దానిని 8వ తేదీకి వాయిదా వేసింది. చివరకు అదీ వాయిదా పడింది. మరోవైపు జేఎన్టీయూహెచ్కు కోర్సులను రద్దు చేసే అధికారమే లేదని, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలు, సీట్లను కౌన్సెలింగ్లో పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని అమలు చేస్తే మరో 50 వేల సీట్లు వచ్చేవి. సకాలంలో ప్రవేశాలు పూర్తయ్యేవి. కాని ప్రభుత్వ ఆదేశాలతో జేఎన్టీయూహెచ్ డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్లింది. మొదట లంచ్ మోషన్కు వెళ్లింది. అడ్మిట్ కాలేదు. దీంతో సాధారణంగానే బుధవారం అప్పీల్ పిటిషన్ వేసింది. గురువారం లిస్ట్లో ఉంది. కాని ప్రభుత్వం అర్జెన్సీ ఉందని, విచారించాలని గురువారం కోర్టును కోరలేదు. ముందుగా లంచ్ మోషన్కు వెళ్లిన జేఎన్టీయూహెచ్ గురువారంనాడు ఎందుకు త్వరగా విచారించాలని కోరలేదన్న ప్రశ్నపై సమాధానం లేకుండా పోయింది. విద్యార్థుల ప్రయోజనాలు చూడాలి ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాల కోసమే పనిచేయాలి. యాజమాన్యాల కోసం కాదు. సకాలంలో ప్రవేశాలు చేపట్టాలి. కోర్టు తీర్పు ఇచ్చాక కాలేజీల నాణ్యతపై మళ్లీ అప్పీల్కు వెళ్లడం సరికాదు. పారదర్శకత లేకుండా, గోప్యత ప్రదర్శిస్తే గందరగోళం తప్పదు. - మధుసూదన్రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ కన్వీనర్ -
ఇంజనీరింగ్ విద్యకు తెలంగాణ సర్కార్ మెరుగులు
-
‘విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి’
మండి(హిమాచల్ప్రదేశ్): దేశంలో ఇంజనీరింగ్ విద్యాసంస్థలు లెక్కకుమించి పుట్టుకురావడంతో సాంకేతిక విద్యలో నాణ్యత, ప్రమాణాలు దెబ్బతింటున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆయా సంస్థల్లో సరైన మౌలిక సదుపాయాలూ ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం మండిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) స్నాతకోత్సవంలో పాల్గొనాల్సిన ఆయన హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవడంతో వెళ్లలేకపోయారు. దీంతో సందేశాన్ని పంపారు. ఇటీవలి ఓ సర్వేలో ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితాలో భారత్లోని ఒక్క విద్యాసంస్థకూ ఉత్తమ ర్యాంకు లభించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోదగ్గ ఉన్నతవిద్యా సంస్థలు దేశంలో కొన్నే ఉన్నాయని పేర్కొన్నారు. -
ఇంజనీరింగ్ విద్య.. ‘మిథ్యే’
రంగారెడ్డి జిల్లాలో 92 కళాశాలల్లో ప్రవేశాలు కరువు మిగతావాటిల్లోనూ పూర్తిస్థాయిలో భర్తీకాని సీట్లు నిర్వహణ భారంతో సతమతమవుతున్న యాజమాన్యాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంజనీరింగ్ విద్య సంకటంలో పడింది. రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ కళాశాలల్లో మెదటి సంవత్సరం విద్యార్థులు చేరలేదు. ఒకవైపు కళాశాలల్లో మౌలిక వసతులు, బోధన తీరుపై జేఎన్టీయూ నిర్వహించిన తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు, మరోవైపు నిబంధనలపై సర్కారు సైతం కఠినంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే జిల్లాలో 20వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. కొత్త విద్యార్థులు లేకపోవడంతో సీనియర్ల బోధన సిబ్బంది, కాలేజీ నిర్వహణ అంశాలు యాజమాన్యాలకు మరింత భారంగా మారాయి. జిల్లాలో 172 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీలు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు జిల్లాలోని కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ కాలేజీలన్నీ నగర శివారు మండలాల్లో ఉండడంతో ఎక్కువశాతం జిల్లా కాలేజీలవైపే మొగ్గు చూపారు. దీంతో ఇక్కడి కాలేజీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఈ పరిస్థితి తలక్రిందులైంది. విద్యాప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యంపై దృష్టి సారించిన జేఎన్టీయూ.. పలు కాలేజీల అనుమతిని రద్దు చేసింది. మరోవైపు కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం వసుతులు లేని కాలేజీలపై కఠినంగా వ్యవహరించడంతో 2014-15 విద్యాసంవతర్సంలో జరిగిన తొలివిడత కౌన్సెలింగ్కు పలు కాలేజీలు దూరమయ్యాయి. 92 కాలేజీల్లో ఫ్రెషర్స్ నిల్ ఇంజనీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్కు జిల్లానుంచి కేవలం 75 కాలేజీలు మాత్రమే అర్హత సాధించాయి. దీంతో ఆ కాలేజీలు మాత్రమే వెబ్ కౌన్సెలింగ్లో కనిపించడడంతో.. విద్యార్థులు సైతం వాటినే ఎంచుకున్నారు. అయినప్పటికీ ఆయా కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్టు భర్తీ కాలేదు. ఇదిలా ఉండగా తొలివిడత కౌన్సెలింగ్లో అనర్హత వేటు పడిన 97 కాలేజీలకు రెండోవిడత కౌన్సెలింగ్లో అర్హత సాధించినప్పటికీ.. విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. రెండోవిడతలో 97 కాలేజీలకు గాను కేవలం 5 కాలేజీల్లో మాత్రమే సింగిల్ డిజిట్లో విద్యార్థులు చేరారు. మిగతా 92 కాలేజీల్లో కొత్త విద్యార్థులు చేరకపోవడంతో.. ఆ ప్రభావం.. ఆయా కాలేజీల భవిష్యత్పై పడింది. తగ్గిన 20 వేల మంది విద్యార్థులు 2014-15 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలో దాదాపు 1.5లక్షల మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నారు. కానీ ఈ ఏడాది నెలకొన్న పరిస్థితులతో కొత్తగా ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏటా కొత్త విద్యార్థులు 43వేల మంది ప్రవేశాలు పొందుతుండగా.. ఈఏడాది ప్రవేశాల సంఖ్య 50శాతానికి పడిపోయింది. కేవలం 20 వేల మంది మాత్రమే ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందినట్లు అధికారుల గణాంకాలు చెబుతుండడం గమనార్హం. విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడంతో కాలేజీల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో కళాశాల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడనుంది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో కాలేజీల మూసుకోవాల్సిందేనని ఓ కళాశాల ప్రిన్సిపల్ ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
ఇంజనీరింగ్ విద్యకు వివిధ మార్గాలు..
ఏటా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు.. వివిధ రకాల ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దోహదం చేస్తున్న ఎంట్రెన్స్ టెస్టులు, వాటి వివరాలు... మన ఇంటర్మీడియెట్ సిలబస్ అన్ని జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సరిపోతుంది. ప్రశ్నించే విధానం, ప్రశ్నల క్లిష్టత, మార్కులు వంటి అంశాల్లో మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ పరంగా కొంత సమన్వయం చేసుకోగలిగితే అన్ని ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ఇంటర్తో సమాంతరంగా సిద్ధం కావచ్చు. అంతేకాకుండా ఒక పరీక్షకు మరొ పరీక్షకు మధ్య కొంత వ్యవధి ఉంటుంది. ఈ సమయం కూడా సంబంధిత పరీక్షకు చక్కగా సన్నద్ధమవ్వడానికి దోహద పడుతుంది. ఇంటర్మీడియెట్ తర్వాత: ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత తక్కువ వ్యవధిలోనే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలుంటాయి కాబట్టి మొత్తం సిలబస్ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్ ప్రిపరేషన్తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలాచేస్తే ఇంటర్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది. భిన్నంగా: కొన్ని ఇన్స్టిట్యూట్లు ప్రవేశపరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోపాటు ఇంగ్లిష్, ఇతర విభాగాల్లో కూడా ప్రశ్నలు ఇస్తున్నాయి. బిట్శాట్లో లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీపై ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ కోసం బొమ్మల చిత్రీకరణ, అనాలజీ, లాజికల్ డిడక్షన్, నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్లపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ కోసం సినానిమ్స్, యాంటానిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్/ఫార్మేషన్, టెన్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, జంబుల్డ్ వర్డ్స్పై దృష్టిసారించాలి. గ్రామర్లోని ప్రాథమిక అంశాలన్నింటిపైనా పట్టు సాధించాలి. ఎంసెట్ ఇతర ఎంట్రెన్స్లతో పోలిస్తే ఎంసెట్కు సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు వేగం కూడా ముఖ్యం. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్లతో పోలిస్తే ఎంసెట్లో దాదాపు రెట్టింపు ప్రశ్నలుంటాయి. అందువల్ల వీలైనన్ని ఎక్కువ వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్లు రాయాలి. కాలేజీ మెటీరియల్తో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలను బాగా చదివితే 160 మార్కులకుగాను 110మార్కులకు పైగా సాధించవచ్చు. ఎంసెట్ 160 ప్రశ్నల్లో 70శాతం ప్రశ్నలు సులభంగా లేదా మధ్యస్థంగా ఉంటాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్కు సమ ప్రాధాన్యం లభిస్తుంది పరీక్ష ప్రశ్నించే విభాగాలు, ప్రశ్నలు రాత పరీక్ష తేదీ ఎంసెట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (80 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు) మే లో బిట్శాట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (45 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ (10 ప్రశ్నలు), ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ(15 ప్రశ్నలు) మే 3-4వ వారం, 2015 ఎస్ఆర్ఎం ఫిజిక్స్ (35 ప్రశ్నలు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు), కెమిస్ట్రీ (35 ప్రశ్నలు) ఆఫ్లైన్ ఏప్రిల్ 26, ఆన్లైన్ ఏప్రిల్ 19-22, 2015 విట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (40 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు) ఏప్రిల్ 8-19, 2015 జేఈఈ మెయిన్ బీఈ/బీటెక్ కోర్సు కోసం పేపర్ -1కు హాజరు కావాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల సంఖ్య ప్రతి ఏడాది మారుతూంటుంది.గత పరీక్షలో ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సులో చేరాలనుకునే వారు పేపర్-2 రాయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 18, 2014. పరీక్ష తేదీ (ఆఫ్లైన్): ఏప్రిల్ 4, 2015. (ఆన్లైన్): 2015, ఏప్రిల్ 10, 11. జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2015. ముగింపు: మే 7, 2015. పరీక్ష తేదీ: మే 24, 2015. కేఎల్యూ, గీతం, విజ్ఞాన్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నాయి. సబ్జెక్ట్ల వారీగా.. మ్యాథమెటిక్స్ బిట్శాట్లో కాలిక్యులస్, ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హయ్యర్ ఆర్డర్, నంబర్ సిస్టమ్ వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలి. మిగతా పరీక్షలకు సంబంధించి సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి. -ఎం.ఎన్.రావు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఫిజిక్స్ భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాలను కాన్సెప్ట్ల వారీగా ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. {పతి చాప్టర్ వెనుక ఇచ్చే అదనపు ప్రశ్నలతోసహా ప్రిపేరవ్వడం లాభిస్తుంది. ఈ సబ్జెక్ట్లో 60 శాతం మార్కులు స్కోర్ చేస్తే మెరుగైన ర్యాంక్ను సాధించవచ్చు. {పథమ సంవత్సరం సిలబస్ను మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి.. 1) గతిశాస్త్రం, 2) ద్రవ్య ధర్మాలు, 3) ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రం. {దవ్య ధర్మాలు, ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రాల్లో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించటం చాలా ప్రధానం. ఉష్ణగతికశాస్త్రంలో గ్రాఫ్లకు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయాలి. ద్వితీయ సంవత్సరంలో కాంతి, విద్యుదయస్కాంతత్వం, కేంద్రక, పరమాణు భౌతిక శాస్త్రాలను క్షుణ్నంగా చదవాలి. {పతి పాఠ్యాంశంలోని సిద్ధాంతపరమైన ప్రశ్నలతోపాటు ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రశ్నలను తప్పకుండా సాధన చేయాలి. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలు, ఫార్ములాలతో కూడిన నోట్స్ను రూపొందించుకోవాలి. దీనివల్ల పునశ్చరణ తేలికవుతుంది. {పతి చాప్టర్లో గ్రాఫ్లకు సంబంధించిన ప్రశ్నలను ఒక చోట చేర్చి చదివితే వాటి మధ్య పోలికలు తేలికగా తెలుస్తాయి. ప్రిపరేషన్ ప్రయోజనకరంగా సాగుతుంది. -పి.కె.సుందర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ. కెమిస్ట్రీ కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు జ్ఞాపక శక్తి ఆధారంగా ఉంటున్నాయి. కాబట్టి పీరియూడిక్ టేబుల్, ఎస్-బ్లాక్, పి-బ్లాక్ వంటి సులువైన అంశాలను నిర్లక్ష్యం చేయొద్దు. కెమికల్ ఈక్విలిబ్రియుంలో రిలేషన్షిప్స్ను బాగా నేర్చుకోవాలి. అయానిక్ ఈక్విలిబ్రియుంలో ప్రాబ్లమ్స్, బఫర్ సొల్యూషన్స్, సాల్ట్ హైడ్రాలిసిస్, సొల్యుబిలిటీ ప్రొడక్ట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఎలక్ట్రోలైటిక్ కండెక్టెన్స్, ఎలక్ట్రాలిసిస్ వంటి అంశా లపై దృష్టి సారించాలి. థర్మోడైనమిక్స్లో ఫస్ట్ లా అప్లికేషన్స్, స్పాంటెనిటీకి సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. అకాడమీ పుస్తకంలోని రీజెంట్స్ను తప్పకుండా చదవాలి. కైనటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ కైనటిక్స్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్, బాండింగ్స్, ఆక్సియాసిడ్స్, ఆక్సైడ్ తదితరాలను విధిగా నేర్చుకోవాలి. కాంప్లెక్స్ కంపౌండ్స్లో ఐసోమార్సిజం, బాండింగ్పై దృష్టి సారించాలి. ఎంసెట్తో పోల్చితే బిట్శాట్లో ప్రశ్నల క్లిష్టత కొంచెం ఎక్కువ. మెటలర్జీ, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, బయోమాలిక్యుల్స్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. విట్ పరీక్ష కోసం కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్, లిపిడ్స్ వంటి అంశాలలోని వర్గీకరణలు, ఉదాహరణలను బాగా నేర్చుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సీనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పి-బ్లాక్ ఎలిమెంట్స్కు సంబంధించి అకాడమీ పుస్తకాల్లోని అంశాలను బాగా చదవాలి. -టి. కృష్ణ, డాక్టర్ ఆర్కే క్లాసెస్, హైదరాబాద్. -
వినియోగంలోకి తెస్తే ప్రతిష్టాత్మకమే..
కాగజ్నగర్ రూరల్ : కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామ సమీపంలో 21వ శతాబ్ది గురులకు విద్యాలయం కోసం నిర్మించిన అధునాతన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 12 కోట్లతో నిర్మించిన అధునాన భవనాలు నాలుగేళ్లుగా నిరూపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్తోపాటూ ఇతర సాంకేతిక విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 21వ శతాబ్ధి గురుకులాలను మంజూరు చేసింది. ఎంసెట్లో సీటు రాని విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఇంజనీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైస్ రాజశేఖర్రెడ్డి 21వ శతాబ్ధి గురుకులాలకు రూపకల్పన చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలికి అప్పగించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కాాగజ్నగర్ మండలం గన్నారంలో గురుకుల భవనాలు నిర్మించారు. గ్రామ సమీపంలోని 50 ఎకరాల భూమి కేటాయించి రూ. 12 కోట్లు విడుదల చేశారు. 12 కోట్లతో భనవ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎనిమిది బ్లాకులు, 384 గదులతో అధునాతన సౌకర్యాలతో భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాక్కు మూడు అంతస్తులు, ప్రతీ అంతస్తుకు 16 చొప్పున మొత్తం 384 గదులను నిర్మించారు. 2010 సంవత్సరం నాటికే ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు వసతీసౌకర్యం కల్పించేలా అధునాతన ఏర్పాట్లు చేపట్టారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి మృతి చెందడంతో అనంతర కాలంలో ఈ గురుకులాల గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ భవనాలు నిరూపయోగంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వమైనా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ భవనాలను పట్టించుకుని వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 50 ఎకరాల విశాల స్థలంలో అధునాతన భవనాలు నిర్మించి ఉండడంతో ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తేనే భవనాలు వినియోగంలోకి రావడమే కాకుండా ఈ ప్రాంతంకూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు ఈ భవనాలను వినియోగంలోకి తెచ్చే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. ఈ భవనాలను గిరిజన యూనివర్శిటీకి కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రశేఖర్రావుకు వివరించడం జరిగిందని, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విద్యార్థులకు ఈ భవనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ భవనాలను వినియోగంలోకి తీసుకువస్తే జిల్లాకే తలమానికం కానున్నాయి. -
ఇంజనీరింగ్ చివరి ఏడాది అప్రెంటిస్షిప్!
ఆలోచనలు సాగిస్తున్న ప్రభుత్వం విశాఖలో జరిగే విద్యాసదస్సులో దీనిపై చర్చ హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో సంస్కరణల దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, పరిశ్రమలకు అవసరమైన రీతిలో నిపుణులను తయారుచేయడం లక్ష్యంగా సంస్కరణలపై కసరత్తు సాగిస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు చేయడానికి అధికారులు కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాలేజీల నుంచి బయటకు వచ్చే ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణత ఉండేలా తీర్చిదిద్దాలన్నది దీని సారాంశం. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో సబ్జెక్టులపై అవగాహన కలిగించేలా కాలేజీల్లో బోధనాభ్యసనాన్ని మొదటి మూడేళ్లకు కుదించనున్నారు. నాలుగో ఏడాది పూర్తిగా అప్రెంటిస్షిప్ను అమలుచేయనున్నారు. ఇందుకోసం కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానిస్తారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసి బయటకు వచ్చే విద్యార్థి తరువాత అప్రెంటిస్షిప్ కోసం ఆయా పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నారు. అవకాశం లేని వారు అదీ చేయడం లేదు. దీన్ని నివారించేందుకు విద్యార్థులు కాలేజీల్లో ఉండగానే అప్రెంటిస్షిప్ను పూర్తిచేయించాలన్నది ఉద్దేశం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వీరిని తయారుచేస్తే కోర్సు పూర్తయ్యేనాటికి ఆయా పరిశ్రమల్లోనే వారికి ఉద్యోగాలు దొరకడమో, లేకుంటే ఆ అనుభవంతో వేరే చోట్ల అవకాశాలు దక్కించుకోగలుగుతారని భావిస్తున్నారు. విశాఖపట్నంలో యూనివర్సిటీల ఉపకులపతులు, విద్యారంగ నిపుణులు, ఇతర ప్రముఖులతో త్వరలో నిర్వహించబోయే సదస్సు ఎజెండాలో దీన్ని ముఖ్యాంశంగా చేరుస్తున్నారు. దీనిపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని విద్యాశాఖవర్గాలు వివరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా ఏటా లక్షకు పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యకు క్రేజ్
ఎచ్చెర్ల:ఇంజినీరింగ్ విద్యపై జిల్లా విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. అదే స్థాయిలో కళాశాలలు కూడా పెరగడం కూడా విద్యార్థులకు కలిసొచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తూ ఆయూ రంగాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. 3,024 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. దీంతో పాటు ప్రభుత్వ రంగంలో ఐదు, ప్రైవేటు రంగంలో ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది రెండు పాలిటెక్నిక్ కళాశాలలు టెక్కలి, సీతంపేటల్లో ప్రారంభించటంలో ఇంజినీరింగ్ విద్య ప్రభుత్వ రంగంలో విస్తరించింది. ప్రస్తుతం 3,070 సీట్లు పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. నేడు ఇంజినీరింగ్ డే కార్యక్రమాలు శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల కళాశాలలో సోమవారం ఇంజినీరింగ్ డే నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. కార్యక్రమానికి బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ఎస్ఈ రమణ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీపీ రామకృష్ణ తది తరులు హాజరుకానున్నారు. శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్లోఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రిన్సిపాల్ వీఎస్ దత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లోను మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నిర్వహనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌరవప్రదమైన వృత్తి ఇంజినీరింగ్ వృత్తి గౌరవప్రదమైనది. సమాజంలో ఎంతో గుర్తింపునిస్తుంది. గృహ నిర్మాణశాఖలో వివిధ హోదాల్లో పని చేసినప్పుడు ప్రజలకు చేసిన సేవ లు, వారి ప్రశంసలు ఎంతో సంతృప్తినిచ్చాయి. కుటుంబపరంగా కూడా గౌరవాన్ని పెంచుతోంది. - పొన్నాడ కూర్మినాయుడు, కార్యనిర్వాహక ఇంజినీర్, గృహ నిర్మాణశాఖ డివిజన్ నేటి తరాలకు ఆదర్శం... ఏ రంగంలో ఇంజినీర్లకైనా సీఆర్ఎం పట్నాయక్ ఆదర్శమే. విధుల్లో ఆయన పాటించిన విలువలు, చూపిన చిత్తశుద్ధి నేటి మా లాంటి తరాలకు ఎంతో అవసరం. ఆదర్శం. ఇప్పటికీ వంశధార నిర్మాణంలో ఆయన పాత్రే కీలకం. కోర్టు పెండింగ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలి... క్షేత్రస్థాయిలో నివేదికలంతా ఆయన సలహాలతోనే నడుస్తున్నాయి. - పి.సుగుణాకరరావు, ఈఈ (ఆర్విఎం), శ్రీకాకుళం అందుబాటులో ఇంజినీరింగ్ విద్య ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఉపాధి అవకాశాలు సైతం మెరుగు పడ్డాయి. ఇంజినీరింగ్లో శ్రమించి చదివితే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఇంజినీరింగ్ విభాగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ ఆర్థర్ కాటన్ వంటి వారి సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోలేదు. -పి.హేమశ్రీ, మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని ఉత్తమ ఇంజినీర్ కావడమే లక్ష్యం ఉత్తమ ఇంజినీరు కావడమే నా లక్ష్యం. దీనికోసం ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా చదువుతున్నాను. ఇంజినీరై సమాజానికి నా వంతు సేవ చేస్తాను. దేశంలో ఇంకా నైపుణ్యంగల ఇంజినీర్లు కొరత ఉంది. ఇంజినీర్లు వల్లే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. సమాజానికి మేలు జరగుతుంది. - ఎస్.గాయత్రి, మహిళా పాలిటెక్నిక్ విద్యార్థిని ఇంజినీర్లతోనే సమాజ ప్రగతి ప్రస్తుతం ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంజినీరింగ్ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఐటీ, ఆటోమొబైల్స్, సెల్ నెట్ వర్క్, ఇంటర్నెట్ తదితర అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. సాంకేతిక ప్రగతి నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యతోనే సాధ్యం. చదువును పూర్తిచేసి మంచి ఇంజినీరుగా స్థిరపడతాను. దేశానికి సేవ చేస్తాను. -ఇ.రేవతి, మహిళా పాలిటెక్నిక్ విద్యార్థిని -
ప్రత్యేకం.. ప్రాక్టీస్ స్కూల్స్
ప్రైవేటు రంగంలో ఇంజనీరింగ్ విద్య అంటే ఠక్కున గుర్తొచ్చేది.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - పిలానీ. హైదరాబాద్, గోవా, పిలానీ (రాజస్థాన్), దుబాయ్ల్లో క్యాంపస్లు కలిగిన బిట్స్.. ఇంజనీరింగ్లో అత్యుత్తమ విద్యకు, పరిశోధనలకు పెట్టింది పేరు. బిట్స్ పిలానీ - గోవా క్యాంపస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీఈ (ఆనర్స్) నాలుగో ఏడాది చదువుతున్నారు హైదరాబాద్కు చెందిన దీపక్. తన క్యాంపస్ విశేషాలను మనతో పంచుకుంటున్నారిలా.. యాంటీ ర్యాగింగ్ అఫిడివిట్ ఇవ్వాలి మాది హైదరాబాద్. అమ్మా, నాన్న ఇద్దరూ ఉద్యోగులే. అన్నయ్య ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. చెల్లెలు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదువుతోంది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 92 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్లో 94 శాతం మార్కులు వచ్చాయి. బిట్శాట్లో ర్యాంకు సాధించి బిట్స్ పిలానీ - గోవా క్యాంపస్లో చేరాను.క్యాంపస్లో ర్యాగింగ్ లేదు. విద్యార్థులంతా ఇన్స్టిట్యూట్లో చేరేటప్పుడే యాంటీ ర్యాగింగ్ అఫిడివిట్ ఇవ్వాలి. విద్యార్థులందరూ చాలా స్నేహంగా ఉంటారు. క్యాంపస్ సదుపాయాలెన్నో 180 ఎకరాల్లో విస్తరించిన క్యాంపస్లో ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ కేటాయిస్తారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. కామన్ రూమ్లో భాగంగా టీవీ, పత్రికలు, మ్యాగజైన్లు ఉంటాయి. వార్డెన్గా ఒక ప్రొఫెసర్ను నియమిస్తారు. స్టడీస్ పరంగా ఎదురయ్యే సందేహాలను వీరిని అడగొచ్చు. తరగతి గదులు, లైబ్రరీ, లేబొరేటరీలు, షాపింగ్ కాంప్లెక్స్ అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయి. క్యాంటీన్లో అన్ని రకాల టిఫిన్స్ లభిస్తాయి. భోజనం రుచికరంగా ఉంటుంది. అన్ని ఫీజులు కలుపుకుని సెమిస్టర్కు రూ.80,000 వరకు ఖర్చు అవుతుంది. సెమిస్టర్ పరీక్షల్లో 9.0 సీజీపీఏ సాధించినవారికి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందిస్తారు. ఇవేకాకుండా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. వినూత్న బోధన ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉన్న సమయంలో విద్యార్థులు ఎంచుకున్న ఎలెక్టివ్స్/స్పెషలైజేషన్ను బట్టి క్లాసులుంటాయి. ఒక్కో పీరియడ్ 50 నిమిషాలు ఉంటుంది. ఒక రోజు పీరియడ్లో సంబంధిత అంశంపై లెక్చర్ ఉంటే.. మరుసటి రోజు ట్యుటోరియల్.. ఆ తర్వాత రోజు ప్రాక్టికల్స్ ఉంటాయి. లెక్చర్లో భాగంగా పవర్పాయింట్ ప్రజెంటేషన్తో కూడిన బోధన ఉంటుంది. ట్యుటోరియల్లో ముందు రోజు చెప్పిన పాఠాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రాక్టికల్స్లో భాగంగా లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో టెస్ట్-1, టెస్ట్-2, కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ను నిర్వహిస్తారు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (సీజీపీఏ) విధానంలో మార్కులు కేటాయిస్తారు. నేను ఇప్పటివరకు 10 పాయింట్లకు 7.5 సీజీపీఏ సాధించాను. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎడెక్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులను కూడా పూర్తి చేశాను. నైపుణ్యాలు పెంచే ప్రాక్టీస్ స్కూల్స్ సెకండియర్ వేసవి సెలవుల్లో ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామింగ్-1 (వ్యవధి రెండు నెలలు), నాలుగో ఏడాదిలో ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామింగ్-2 (వ్యవధి ఆరు నెలలు) చేయాలి. ప్రాక్టీస్ స్కూల్స్లో భాగంగా క్విజ్, డిబేట్, గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వంటివి ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరిన తర్వాత ఎదురయ్యే వివిధ అంశాలపై వీటిల్లో శిక్షణనిస్తారు. వీటి ద్వారా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పెరుగుతుంది. నేను ప్రస్తుతం ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ పొంది ఇండస్ట్రీ ఆర్క్ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇంజనీరింగ్తోపాటు హ్యుమానిటీస్ కూడా ఇంజనీరింగ్ మొదటి ఏడాది అందరికీ కామన్గా ఉంటుంది. రెండో ఏడాది నుంచి ఎన్నో ఎలక్టివ్స అందుబాటులో ఉంటాయి. నాలుగేళ్ల ఇంజనీరింగ్లో భాగంగా మూడు హ్యుమానిటీస్ సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. మ్యూజిక్, పబ్లిక్ స్పీకింగ్, భగవద్గీత, సైకాలజీ, మోరల్ పొలిటికల్ కాన్సెప్ట్స్ వంటి ఎన్నో ఎలక్టివ్స్ ఉంటాయి. నేను ఫిలాసఫీ, కాంటెంపరరీ ఇండియా, మోరల్ పొలిటికల్ కాన్సెప్ట్స్, ఎసెర్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఎంచుకున్నాను. వీటివల్ల నాలో బ్రాడ్ థింకింగ్ పెరిగింది. పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకున్నాను. తెలుగు సమితిని ఏర్పాటు చేశాం క్యాంపస్లో వ ందకుపైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. అందరం కలిసి తెలుగు సమితిని ఏర్పాటు చేసుకున్నాం. క్యాంపస్లో ఉగాది, విజయదశమి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, దీపావళి వంటి పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. క్యాంపస్లో తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మేము బాగా చేసే పండుగ.. ఉగాది. ఆ రోజు ఉగాది పచ్చడి తయారుచేసి అందరికీ పంచుతాం. వంటవాళ్లను రప్పించి, ఆంధ్రా స్పెషల్ వంటకాలను వండించి విందు చేసుకుంటాం. అకడమిక్తోపాటు మరెన్నో క్యాంపస్లో అకడమిక్తోపాటు కల్చరల్ యాక్టివిటీస్కు పెద్దపీట వేస్తారు. డ్రామా క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫొటోగ్రఫీ క్లబ్, ఆస్ట్రానమీ క్లబ్ ఉన్నాయి. ప్రతిఏటా కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్లను కూడా నిర్వహిస్తారు. వీటిని విద్యార్థులే ఆర్గనైజ్ చేస్తారు. నేను ఒక క్లబ్లో సభ్యుడిగా ఉన్నాను. దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకున్నాను. స్టార్టప్స్కు ప్రోత్సాహం క్యాంపస్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్, సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూరియల్ లీడర్షిప్ ఉన్నాయి. కొత్తగా స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఇక్కడ గెడైన్స్, సూచనలు, సలహాలు అందిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కోసం కంపెనీలు, పరిశ్రమలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ కోసం స్థలం కేటాయిస్తారు. ఫ్యాక్స్, ఫోన్, ప్రింటర్, లైబ్రరీ, ఇంటర్నెట్, స్కానర్, టెలికాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పిస్తారు. గేట్కు దరఖాస్తు చేశా వీలు దొరికినప్పుడల్లా గోవా బీచ్ల్లో విహరిస్తుంటాం. ఇక్కడ ఎన్నో చూడచక్కని బీచ్లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం గేట్కు దరఖాస్తు చేశాను. మంచి ర్యాంకు సాధించి ఏదో ఒక ఐఐటీలో ఎంటెక్ చేస్తాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఆఫర్ వస్తే ఉద్యోగం చేయడానికి సిద్ధమే. -
అను‘మతి’ లేని ప్రచారం
నిజామాబాద్ అర్బన్ : ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాల కోసం జిల్లా వి ద్యార్థులకు చిక్కులు వచ్చి పడ్డాయి. జిల్లాలో ఉన్న మొ త్తం పది ఇంజినీరింగ్ కళాశాలలకుగాను, జేఎన్టీయూ కేవలం మూడు కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా ఏడింటిని పక్కన పెట్టింది. అయినా, ఆ ఏడు కళాశాలలు విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రచారాలు చేస్తున్నాయి. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా విద్యార్థులను అసత్య ప్రచారాలతో మోసం చేస్తున్నాయి. ప్రవేశాల వేళ ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుండడంతో ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసంవిద్యార్థులు ఆరాట పడుతున్నారు. కళాశాల ఎంపికలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తల మునకలయ్యారు. బంగారు భవిష్యత్తు కోసం మంచి కళాశాల, దగ్గరి ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి సరైన విధి విధానాలు తెలియక అవస్థలు పడుతున్నారు. కళాశాలకు అఫిలియేషన్ రద్దయినా, కౌన్సెలింగ్ జాబితాలో కళాశాలల పేరు లేకున్నా, కొన్ని కళాశాలలు కౌన్సెలింగ్ సెం టర్ల వద్ద జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో పది ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం మూడు కళాశాలలకు మాత్రమే జేఎన్టీయూ ఈ ఏడాది కౌన్సెలింగ్లో సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చిం ది. మిగతా ఏడు కళాశాలలకు అనుమతి ఇవ్వలేదు. జిల్లాలో అనుమతి పొందిన మూడు కళాశాలలలో మహిళా కళాశాల విభాగంలో కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల (కిట్స్) మాత్రమే ఉంది.జిల్లాలో మొత్తం 3,060 సీట్లకుగాను ఏడు కళాశాలలకు అనుమతి లేకపోవడంతో 1,060 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్థా నికంగా చదివే విద్యార్థులు కళాశాలలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరగా చేసుకుని, అనుమతి లేకున్నా కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద సందడి ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ప్రైవేట్ కళాశాలల ప్రచార సందడి నెలకొంది. జిల్లా కేం ద్రంలోని గిరిరాజ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. పాలి టెక్నిక్ కళాశాల వద్ద సీట్ల భర్తీకి అనుమతి లేని మూడు కళాశాలల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ కళాశాలలో గల బ్రాంచ్లు, కళాశాలల కోడ్లతో సహా జోరుగా ప్రచారం చేపడుతున్నాయి. దీంతో విద్యార్థులు కళాశాల ఎంపికలో అయోమయానికి లోనవుతున్నారు. -
ఇంజనీరింగ్ విద్యకు..ఉత్తమ స్వదేశీ గమ్యాలు
దేశంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్లు.. వాటికి నెలవైన మరెన్నో నగరాలు ఉన్నాయి. కానీ ఔత్సాహిక విద్యార్థుల్లో అత్యధిక శాతం మందికి గమ్యస్థానాలుగా నిలుస్తున్న నగరాలు మాత్రం కొన్నే. ఆయా నగరాల్లో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలు బోధనపరంగా పాటిస్తున్న ప్రమాణాలు..ఆర్ అండ్ డీ అవకాశాలు.. పరిశ్రమలతో అనుసంధానం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వంటి కారణాలతో విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. అంతేకాకుండా రవాణా, నివాస సదుపాయాలు లభించడంతోపాటు జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం వల్ల ఆయా నగరాలపై విద్యార్థులు మక్కువ చూపుతున్నారు.దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. బీటెక్ ఔత్సాహిక విద్యార్థులకు ఫేవరెట్లుగా నిలుస్తున్న సిటీలపై విశ్లేషణ.. ముంబైకే మొదటి ప్రాధాన్యం దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఔత్సాహికుల హాట్ ఫేవరెట్ నగరం ముంబై. ఇక్కడ ప్రతిష్టాత్మక ఐఐటీ ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. ఐఐటీ-ముంబై జాతీయ సంస్థలతోనే కాకుండా అంతర్జాతీయ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటోంది. స్పాన్సర్డ్ రీసెర్చ్, కన్సల్టెన్సీ రీసెర్చ్ ప్రోగ్రామ్లు కూడా నిర్వహిస్తోంది. ఫలితంగా ఐఐటీ ఔత్సాహిక విద్యార్థుల్లో మొదటి ప్రాధాన్యంగా దీన్నే ఎంచుకుంటున్నారు. గత మూడేళ్లుగా జేఈఈ అడ్వాన్సడ్ టాప్-100 ర్యాంకర్లలో మెజారిటీ విద్యార్థులు ముంబైను ఎంపిక చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడంతోపాటు అనేక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా ఇక్కడి ఇన్స్టిట్యూట్లు స్థానిక పరిశ్రమలు /కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అపార అవకాశాలు దక్కుతున్నాయి. అటు పరిశ్రమ వర్గాల్లోనూ ముంబై కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులంటే ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా 90 నుంచి 95 శాతం మధ్యలో సుస్థిరంగా ఉంటున్నాయి. వీటితోపాటు అన్ని ప్రాంతాలకు చక్కటి రవాణా సదుపాయాలు, నెలకు రూ.15 వేలకు మించని నివాస ఖర్చులు కూడా విద్యార్థులను ముంబైని ఎంచుకునేలా చేస్తున్నాయి. దేశానికే తలమానికం.. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని (నేషనల్ క్యాపిటల్ రీజియన్ - ఎన్సీఆర్).. ఇంజనీరింగ్ కళాశాలలు.. ఎవర్గ్రీన్గా పేరొందుతున్నాయి. ఐఐటీ-ఢిల్లీతోపాటు.. ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ (జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ), ఐటీఎం యూనివర్సిటీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఇక్కడ నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణం. అన్నిటికంటే ముఖ్యంగా ఐఐటీ-ఢిల్లీలోని రీసెర్చ్ కార్యకలాపాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలతో కలిసి చేపడుతున్న జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వంటివి విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తు ప్లేస్మెంట్స్కు బలమైన పునాది వేస్తున్నాయి. దక్షిణాన.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు దక్షిణ భారతదేశంలోని (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ).. పలు ప్రముఖ నగరాలు ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులకు చక్కటి గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో.. చెన్నైలోని ఐఐటీ-మద్రాస్ ముందంజలో ఉంది. దీంతోపాటు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు, సైబరాబాద్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన హైదరాబాద్.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ల్లో వివిధ జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దే క్రమంలో పలు కళాశాలలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులకు ఉద్యోగ భరోసా లభిస్తోంది. తెలంగాణలో ఐఐటీ, ఐఐఐటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - హైదరాబాద్, నిట్ - వరంగల్; ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీయూ-కాకినాడ, అనంతపురం క్యాంపస్ కళాశాలలు, ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటివి విద్యార్థులకు ముఖ్య గమ్యాలుగా నిలుస్తున్నాయి. తమిళనాడులో అన్నా యూనివర్సిటీ - చెన్నై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం కూడా ముఖ్యమైనవే. వెలుగులీనుతున్నవి ఇవే దశాబ్దాల చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూట్లు ఉన్న నగరాలతోపాటు ఇటీవల కాలంలో దేశంలో టైర్-2, టైర్-3 పట్టణాలు కూడా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో నాగ్పూర్, అహ్మదాబాద్, చండీగఢ్, నోయిడా, గుర్గావ్, పుణె వంటివి ముందంజలో నిలుస్తున్నాయి. ప్రతి పది కళాశాలల్లో 2.25 శాతం కళాశాలలు టైర్ - 2 నగరాల్లో ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆర్ అండ్ డీ ఓరియెంటెడ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్తోపాటు ఐటీ, ఐటీఈఎస్/ బీపీఓ సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ సంస్థలు తమ సమీప ప్రాంతాల్లోని కళాశాలలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్నాయి. సంస్థల కోణంలో ఇలా సంస్థలు కూడా తమ అవసరాలను తీర్చే మానవ వనరులు లభించే విషయంలో కొన్ని నగరాలను ప్రధాన కేంద్రాలుగా గుర్తించాయి. ఈ క్రమంలో బెంగళూరు, పుణె, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, త్రివేండ్రంలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా తాజా ప్రతిభావంతుల విషయంలో ఈ నగరాల్లోని విద్యార్థులు బాగా రాణిస్తున్నారనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ, ఐటీఈఎస్ సంస్థల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది. తూర్పులో ప్రముఖ విద్యా సంస్థలు ఇవే తూర్పు భారత్లో.. ఐఐటీ-ఖరగ్పూర్, జాదవ్పూర్ యూనివర్సిటీ, ఎన్ఐటీ-రూర్కెలా, ఐఎస్ఎం-ధన్బాద్, ఎన్ఐటీ - దుర్గాపూర్.. ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన గమ్యాలుగా నిలుస్తున్నాయి. ఇందుకు కారణం.. పరిశోధనలు, ప్లేస్మెంట్స్, మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా సౌకర్యాలే. ఈ సిటీల్లో జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం విద్యార్థులకు కలిసొచ్చే అంశం. ఎన్ఐటీల్లోనూ.. కొన్నిటికే ప్రాధాన్యం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల విషయంలోనూ విద్యార్థులు కొన్ని ఎన్ఐటీలపైనే అధిక ఆసక్తి చూపుతున్నారు. మొత్తం 30 ఎన్ఐటీల్లో సూరత్కల్, తిరుచిరాపల్లి, కాలికట్, సూరత్, రాయ్పూర్, భోపాల్, అగర్తలా, అలహాబాద్, జైపూర్, కురుక్షేత్ర, నాగ్పూర్లు ముందంజలో నిలుస్తున్నాయి. ప్రాధాన్యతలు మారుతున్నాయి నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. తమ నివాస ప్రాంతాలకు సమీపంలోని కళాశాలల్లోనే చేరాలనే ఆలోచన నుంచి బయటికొస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలపై దృష్టి సారించి వాటిలో నాణ్యమైన కళాశాలల్లో ప్రవేశించడానికే మొగ్గు చూపుతున్నారు. ఒక విధంగా ఈ దృక్పథం ఆహ్వానించదగినదే. ఇన్స్టిట్యూట్ల కోణంలోనూ పోటీతత్వం పెంపొంది.. అవి.. నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెడతాయి. ఫలితంగా విద్యార్థులకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. - బి. చెన్నకేశవరావు ప్రిన్సిపాల్, సీబీఐటీ, హైదరాబాద్ అన్నింటిలో కొన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రతిఏటా కొత్తగా వందల సంఖ్యలో మరిన్ని కళాశాలలు వస్తున్నాయి. అందుకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ‘బెస్ట్ ఫ్రం మోస్ట్’ను కనుగొనాలి. అవి కొంత దూరమైనా చేరేందుకు వెనుకంజ వేయకూడదు. సొంత ఊరు కాకపోతే దేశంలో ఏ ప్రాంతమైనా ఒకటే అని గుర్తించాలి. ప్రభుత్వ రంగంలోని ఐఐటీలు, ఎన్ఐటీలతోపాటు.. ప్రైవేటు రంగంలోనూ దశాబ్దాల చరిత్ర కలిగి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆదరణ పొందుతున్న ఇన్స్టిట్యూట్లు ఎన్నో ఉన్నాయి. వీటిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స కూడా ఒకటి. అయితే విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోని కళాశాలల్లో ప్రవేశించేటప్పుడు.. అక్కడి మౌలిక సదుపాయాలు, సంస్కృతి-సంప్రదాయాలపై అవగాహన పొందాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాణించగలరు. - ప్రొఫెసర్ వి.ఎస్.రావు డెరైక్టర్, బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్ పరిజ్ఞానానికి ప్రాధాన్యం విద్యార్థుల ముందు ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫ్యాకల్టీ, ఆర్ అండ్ డీ ఒప్పందాలు, ప్లేస్మెంట్స్ చరిత్ర కలిగిన ఎన్నో ఇన్స్టిట్యూట్లు బీటెక్ కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థులు ఎక్కడ చేరినా.. పరిజ్ఞానం సొంతం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తాము చేరిన కళాశాలలోని సదుపాయాలన్నింటినీ సమర్థంగా సద్వినియోగం చేసుకుంటేనే సరైన నైపుణ్యాలు లభిస్తాయి. - ప్రొఫెసర్॥వి.ఎస్.ఎస్. కుమార్ ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రైవేటు కళాశాలల్లో ప్రముఖమైనవి బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ఇన్స్టిట్యూట్ల ఎంపికలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పేరొందిన ప్రైవేటు విద్యా సంస్థలపైనా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆదరణ పొందుతున్న ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స మూడు క్యాంపస్లు (పిలానీ, గోవా, హైదరాబాద్) ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్ అమిటీ యూనివర్సిటీ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మెస్రా ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బెంగళూరు ఐఐటీల్లోనూ గతంలో ఐఐటీల్లో ప్రవేశం అంటే.. ‘క్యాంపస్ ఏది’ అనే ప్రస్తావన పెద్దగా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఐఐటీ క్యాంపస్ల విషయంలో విద్యార్థులు ప్రాధాన్య జాబితా రూపొందించుకుంటున్నారు. ఆయా ఐఐటీల్లో చేపడుతున్న ఆర్ అండ్ డీ కార్యకలాపాలు, పీహెచ్డీ ఫ్యాకల్టీ సంఖ్య, ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ పరంగానూ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నారు. ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ గ్యారంటీ. కానీ ఎలాంటి కంపెనీలు ప్లేస్మెంట్స్లో పాల్గొంటున్నాయి అనే అంశం కూడా ప్రముఖంగా నిలుస్తోంది. ఐఐటీ- ముంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, గువహటి, రూర్కీలు ఎక్కువమంది విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. ఇవే కాకుండా 2008 నుంచి కొత్తగా ఏర్పాటైన ఐఐటీ క్యాంపస్లలో హైదరాబాద్, భువనేశ్వర్, గాంధీనగర్ క్యాంపస్ల పట్ల విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్యాంపస్లలో సగటున 95 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ రికార్డ్ నమోదు కాగా.. ఆర్ అండ్ డీ విషయంలోనూ ప్రతి ఏటా సగటున 13 నుంచి 17 మధ్యలో వృద్ధి నమోదు అవుతోంది. ఫలితంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే క్షేత్ర నైపుణ్యాలు లభించడంతోపాటు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్కు అత్యధిక ఆస్కారం లభిస్తోంది. -
విద్యార్థి.. ఇన్నోవేటివ్గా తీర్చిదిద్దుకోవాలి!!
గెస్ట్ కాలమ్ ‘ఇంజనీరింగ్ విద్యలో పరిశోధనలకు, ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్కు ప్రాధాన్యమివ్వాలి.ఇది బ్యాచిలర్స డిగ్రీ స్థాయి నుంచే మొదలు కావాలి. అప్పుడే విద్యార్థులు కోర్సు పూర్తయ్యేనాటికి పరిపూర్ణత సాధించగలరు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుచుకోగలరు. నేటి పోటీ ప్రపంచంలో ఈ రెండూ అత్యంత కీలక అంశాలు’.. అంటున్నారు టెక్ మహీంద్రా యంగ్ సీఈఓ.. రాహుల్ భూమన్. మహీంద్రా గ్రూప్లోని మొత్తం 18 కంపెనీల్లో భవిష్యత్తు సీఈఓలను ఎంపిక చేసే క్రమంలో నిర్వహించిన పోటీలో.. ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఐడియాతో 28 ఏళ్ల వయసులోనే యంగ్ సీఈఓగా ఆయన ఎంపికయ్యారు. టెక్ మహీంద్రా సంస్థ.. ఫ్రాన్స్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎకోల్ సెంట్రల్ ప్యారిస్ ఇన్స్టిట్యూట్తో కలిసి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్న ‘మహీంద్రా ఎకోల్ సెంట్రల్’ నిర్వహణ బాధ్యతలను రాహుల్ చేపడుతున్నారు. ఈ సందర్భంగా రాహుల్ భూమన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఇంజనీరింగ్.. ఎవర్గ్రీన్ కోర్సుగా విద్యార్థుల ఆదరణ పొందుతోంది. అయితే, నాణ్యత పెంచేందుకు మన ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు తేవాలనే నిపుణుల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీ పరిస్థితులు, మన దేశ అవసరాలను గమనిస్తే.. ఇంజనీరింగ్ విద్యలో గణనీయ మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. కరిక్యులంలో మార్పులతో దీనికి శ్రీకారం చుట్టాలి. స్ట్రక్చరల్ విధానం స్థానంలో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ కాన్సెప్ట్ను ఆవిష్కరించాలి. అప్పుడే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థికి తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. లెర్నింగ్ పరంగానూ నిరంతరం కొత్త అంశాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు కూడా పరీక్షలు-ఉత్తీర్ణత అనే ధోరణికే పరిమితం కాకుండా.. ఆలోచనలను విస్తృతం చేసుకోవాలి. స్వయంగా కొత్త అంశాలు నేర్చుకోవడంలో ఉత్సుకత చూపాలి. ఆర్ అండ్ డీ, ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ విషయంలో చాలా ఇన్స్టిట్యూట్లు వెనుకంజలో ఉన్నాయి. ఈ పరిస్థితికి పరిష్కారం? ఇటీవల కాలంలో ఆర్ అండ్ డీ, ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ ప్రాధాన్యం పొందడం ఆహ్వానించదగిన పరిణామం. ఇన్స్టిట్యూట్లు ఆర్ అండ్ డీ, ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ బోధనలో ముందుండాలంటే.. ఆర్థిక వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు స్పాన్సర్డ్ రీసెర్చ్ యాక్టివిటీస్వైపు దృష్టి సారించాలి. పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా నిధుల సమస్యను అధిగమించాలి. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ను అందించొచ్చు. ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ కోణంలో ఒక ఇన్స్టిట్యూట్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలు? ఐడియేషన్ టు ఇంక్యుబేషన్.. ఒక ఇన్స్టిట్యూట్ ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ కోణంలో అనుసరించాల్సిన తొలి విధానం. విద్యార్థుల నుంచి ఐడియాలు స్వీకరించాలి. ఆచరణ సాధ్యమైన వాటికి కార్యరూపం ఇచ్చేలా ఇంక్యుబేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి. ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటులో సంస్థల సహకారం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఇన్స్టిట్యూట్స్తో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. స్టార్ట్-అప్స్ విషయంలో ఔత్సాహికులు అనుసరించాల్సిన వ్యూహాలు? ముందుగా తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని.. అందులో మార్కెట్ పొటెన్షియల్ను గుర్తించాలి. దానికి అనుగుణంగా తమ ఐడియాలు రూపొందించుకోవాలి. ప్రస్తుతం అనేకమంది ఔత్సాహికులు స్టార్ట్-అప్స్ దిశగా ఆలోచిస్తున్నప్పటికీ.. ఫండ్ మొబిలైజేషన్, మార్కెటింగ్ విధానాలపై సరైన అవగాహన లేక ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎన్నో సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు, ఐఐటీ, ఐఎస్బీ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్-అప్స్ను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఎంటర్ప్రెన్యూర్స్ను, ఇన్వెస్టర్స్ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ముఖాముఖి చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ఇంటరాక్షన్స్ నిర్వహిస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలి. చక్కటి ఐడియా, మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్తో ముందుకువస్తే.. ఫండ్ మొబిలైజేషన్ కష్టం కాదు. అంతేకాకుండా సీడ్ ఫండింగ్ కల్పించిన సంస్థలే సదరు స్టార్ట్-అప్ భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై నిరంతర సలహాలు అందిస్తున్నాయి. నేటి అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో తీసుకురావాల్సిన మార్పులు? కేవలం కోర్ సబ్జెక్ట్స్కే పరిమితం కాకుండా.. ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజంలోని అన్ని రంగాలపై అవగాహన ఉండటం తప్పనిసరి. సొంతంగా సంస్థలు స్థాపించినా.. ఉద్యోగంలో ప్రవేశించినా.. పరిశోధనల్లో పాల్పంచుకున్నా.. అవన్నీ పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో సామాజిక అవసరాలు తీర్చేందుకే. వీటిపై అవగాహన లేకుంటే పై మూడు అంశాలకు సంబంధించి సరైన మార్గంలో వెళ్లే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్మెంట్ డిగ్రీ అవసరమా.. ఈ రెండు అర్హతలున్న ప్రొఫెషనల్గా మీ అభిప్రాయం? ఉద్యోగం.. ఉపాధి.. రెండు కోణాల్లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్మెంట్ డిగ్రీ అదనపు అవకాశాలు కల్పిస్తుంది. ఉదాహరణకు.. ఉద్యోగ కోణంలో విశ్లేషిస్తే.. ఇప్పుడు ఐటీ, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లోని సంస్థలకు అన్ని రంగాల నుంచి క్లయింట్స్ ఉంటున్నారు. ఆయా క్లయింట్స్ వాస్తవ వ్యాపార కార్యకలాపాలపై అవగాహన ఉంటే.. సంస్థ తరఫున ఉద్యోగిగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుంది. అదేవిధంగా ఉపాధి కోణంలో చూస్తే.. సొంత కంపెనీల సమర్థ నిర్వహణకు మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఎంతో దోహదం చేస్తాయి. టెక్ మహీంద్రా సంస్థ ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజ్ మహీంద్రా ఎకోల్ సెంట్రల్.. ఇంజనీరింగ్ విద్యలో అందించనున్న వినూత్న విధానాలు? ఇంజనీరింగ్ విద్యలో మరింత నాణ్యమైన విద్యను అందించాలి. ప్రతి ఒక్క విద్యార్థిని లీడర్, ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్గా తీర్చిదిద్దాలి. ఈ ఉద్దేశాలతోనే ఫ్రాన్స్కు చెందిన ఎకోల్ సెంట్రల్ ప్యారిస్, జేఎన్టీయూ-హైదరాబాద్లతో అకడెమిక్ భాగస్వామ్యంతో కళాశాలను ఏర్పాటు చేశాం. ఈ కళాశాల అందించే ఐదేళ్ల బీటెక్ - ఎంటెక్ (డ్యూయల్ డిగ్రీ) కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు మహీంద్రా గ్రూప్లోని 18 కంపెనీల్లో ఏదో ఒక కంపెనీలో జాబ్ గ్యారెంటీ. బోధన పరంగా తీసుకోనున్న చర్యలు? ప్రస్తుతం మన ఇంజనీరింగ్ విద్యా విధానానికి భిన్నంగా వినూత్న తరహాలో బోధనను అందించనున్నాం. నాలుగేళ్ల కోర్సులో ఇండస్ట్రీ-అకడెమిక్ విధానంలో కరిక్యులంలో ఎప్పటికప్పుడు మార్పు లు చేసి విద్యార్థులకు వాస్తవ అవసరాలపై అవగాహన కల్పించనున్నాం. ప్రతి సమ్మర్లో ఒక ఇంటర్న్షిప్, మినీ ప్రాజెక్ట్ తప్పనిసరి. నాలుగేళ్లు పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్టీయూ నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది. అంతేకాకుండా డ్యూయల్ డిగ్రీ విధానంలో ఎంటెక్ సర్టిఫికెట్ను పొందే అవకాశం కల్పిస్తున్నాం. నాలుగేళ్ల తర్వాత ఆసక్తి గల విద్యార్థులు ఈ ఆప్షన్ను ఎంచుకుంటే.. ఫ్రాన్స్ ఉన్నత విద్యా శాఖ గుర్తింపు ఉన్న ఎంటెక్ సర్టిఫికెట్ లభిస్తుంది. అంతేకాకుండా.. ఆర్ అండ్ డీకి పెద్దపీట వేసేలా ఇండస్ట్రీ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నాం. ఇప్పటికే ఫార్చూన్-500 సంస్థల జాబితాలో ఉన్న సెఫ్రాన్, ఎయిర్ లిక్విడ్ తదితర సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. మరోవైపు ఫ్యాకల్టీ విషయంలోనూ ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తిని 1:10గా నిర్దేశించాం. అంతేకాకుండా ఫ్యాకల్టీలుగా పీహెచ్డీలు చేసి ఆయా రంగాల్లో అనుభవం గడించిన వారినే నియమించాం. ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులకు మీ సలహా? ప్రతి విద్యార్థి తనను తాను ఇన్నోవేటివ్గా తీర్చిదిద్దుకోవాలి. తులనాత్మక, విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలి. చదివే ప్రతి అంశాన్ని ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించుకుంటూ, వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే నిజమైన ఇంజనీరింగ్ లక్షణాలు లభిస్తాయి. కోర్సు పూర్తయ్యేనాటికి ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యా లనూ ఒంటబట్టించుకోవచ్చు. మహీంద్రా ఎకోల్ సెంట్రల్ (కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్) ప్రత్యేకత భవిష్యత్తులో ప్రపంచశ్రేణి ఇంజనీరింగ్ పట్టభద్రులను అందించాలనే ఉద్దేశంతో మహీంద్రా గ్రూప్ సంస్థ ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజ్.. మహీంద్రా ఎకోల్ సెంట్రల్. అకడెమిక్ సిలబస్, కరిక్యులం రూపకల్పన, బోధన, ఇతర శిక్షణ అంశాలకు సంబంధించి.. ఫ్రాన్స్కు చెందిన 185 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఎకోల్ సెంట్రల్-ప్యారిస్, మన రాష్ట్రంలోని జేఎన్టీయూ(హైదరాబాద్)లతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్లో ఈ కాలేజ్ను ఏర్పాటు చేశారు. టెక్ మహీంద్రా సంస్థ ప్రాంగణంలోనే 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజ్కు మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికోసం సంస్థ ప్రారంభంలో రూ.300 కోట్లు కేటాయించింది. ప్రధాన ఉద్దేశమిదే భవిష్యత్తు అవసరాలకు సరితూగే విధంగా ప్రతి విద్యార్థికి రీసెర్చ్ ఓరియెంటెడ్ స్కిల్స్, ప్రాక్టికల్ అప్రోచ్ మెళకువలను అందిస్తారు. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి మంచి నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతారు. ప్రతి విద్యార్థి కోర్సు సమయంలో ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా ఎకోల్ సెంట్రల్ ప్యారిస్కు వెళ్లే అవకాశం లభిస్తుంది. కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం అవుతున్న మహీంద్రా ఎకోల్ సెంట్రల్లో ఐదేళ్ల బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సును అందిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లలో ఒక్కో బ్రాంచ్లో 60 సీట్లు చొప్పున భర్తీ చేస్తారు. జేఈఈ-మెయిన్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల కోర్సు తర్వాత మరో ఏడాది అదనంగా చదవాలనుకునే ఔత్సాహికులకు బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ అందుతుంది. కోర్సు స్వరూపం విభిన్నం మహీంద్రా ఎకోల్ సెంట్రల్ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సు స్వరూపం కూడా భిన్నంగా ఉంటుంది. మొదటి రెండేళ్లు అన్ని బ్రాంచ్లకు ఉమ్మడిగా సిలబస్ ఉంటుంది. తర్వాత ఏడాదిన్నర విద్యార్థులు తాము ఎంచుకున్న బ్రాంచ్కు సంబంధించిన అంశాలపై బోధన ఉంటుంది. తర్వాత మరో ఏడాదిన్నర ఇండస్ట్రీపరమైన అంశాలలో బోధన ఉంటుంది. ఈ క్రమంలోనే.. విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, ఇంటర్-డిసిప్లినరీ అప్రోచ్ లభించేలా సంగీతం నుంచి సోషల్ సెన్సైస్ వరకు పలు అంశాలను మైనర్స్గా నిర్దేశించారు. ఆధునిక సదుపాయాలు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ లభించేలా ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో డిజిటల్ లైబ్రరీ, వీడియో కాన్ఫరెన్స్ రూమ్స్, ఆన్లైన్ లెక్చర్స్, ఆడియో-విజువల్ నెట్వర్క్ సదుపాయాలు లభిస్తాయి. అంతేకాకుండా లైబ్రరీ సదుపాయం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫీజులు.. ఆర్థిక ప్రోత్సాహకాలు: ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి ఏడాదికి రూ. నాలుగు లక్షల ఫీజు నిర్దేశించారు. ప్రతి ఒక్క విద్యార్థి హాస్టల్లో ఉండటం తప్పనిసరి. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ ఫీజు నుంచి ఉపశమనం లభించేలా నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. మొత్తం విద్యార్థుల్లో 30 శాతం మందికి ఈ స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇందుకోసం అర్హులైన విద్యార్థుల ఎంపిక విషయంలోనూ వినూత్నంగా వ్యవహరిస్తోంది. ముందుగా.. స్కాలర్షిప్స్ అవసరమైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. తర్వాత సంస్థ అధికారులు స్వయంగా ఆయా విద్యార్థుల కుటుంబ పరిస్థితులను ప్రత్యక్ష పరిశీలనల ద్వారా తెలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతులను తెలుసుకు న్న తర్వాత మాత్రమే స్కాలర్షిప్స్ కేటాయిస్తారు. స్కాలర్షిప్స్తోపాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం లభించేలా ఆంధ్రాబ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. -
ఇంజనీరింగ్లో నాణ్యత సున్నా
గత ఏడాది మిగిలిపోయిన 2 లక్షల సీట్లు విభజనతో ఇంకా ఎక్కువే మిగులుతాయంటున్న నిఫుణులు స్పష్టం చేస్తున్న ఆస్పరింగ్ మైండ్స్ నివేదిక హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతాప్రమాణాలు పడిపోయి, గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ విద్యపై అనాసక్తి పెరిగిపోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాలుగేళ్ల కిందట ఇంజనీరింగ్లో 1,94,203 సీట్లు భర్తీకాగా.. మూడేళ్ల కిందట 1,84,080 సీట్లు భర్తీ అయ్యాయి. రెండేళ్ల కిందట 1,58,700, సీట్లు మాత్రమే భర్తీ కాగా, గత ఏడాది 1,28,950 సీట్లే నిండాయి. గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈసారి కూడా 3.20 లక్షల సీట్లు అందుబాటులో ఉంటే అర్హత సాధించిన వారు 1.81 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో యాజమాన్యం పరిధిలోనే ఐదారు కాలేజీలు ఉండడం.. కాలేజీల మధ్య అనారోగ్యకర పోటీ... సీట్లు నింపుకునేందుకే తాపత్రయం.. వెరసి ఇంజనీరింగ్లో నాణ్యత కరువైంది. నిర్వహణకే తంటాలు పడుతున్న కాలేజీలు నాణ్యతపై దృష్టిపెట్టడం లేదు. 25వ స్థానానికి పడిపోరుున రాష్ట్రం... ఐటీలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ (ఇపుడు రెండు రాష్ట్రాలు) ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రస్తుతం దేశంలోనే 25వ స్థానానికి పడిపోయింది. ఒకప్పుడు అగ్రదేశాల్లో ఒక వెలుగువెలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇపుడు కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు సామర్థ్యాలు లేక వెనుకబడిపోయారు. ఆరు మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ చివరి నుంచి రెండో స్థానానికి దిగజారింది. కాగా, వుహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఉద్యోగ అవకాశాల కల్పనలో పురోగతి సాధించారుు. 2011లో చేసిన సర్వేతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ 2011లో కిందినుంచి 25 పర్సంటైల్లోనే ఉండగా, ఇపుడు అదే పర్సంటైల్లోనే ఉంది. కర్ణాటక వూత్రం 50-25 స్థానంలోకి వెళ్లింది. ఇక వుహారాష్ట్ర అవకాశాలు పెంచుకొని 75-50 పర్పంటైల్లోకి వెళ్లింది. ఆందోళన కలిగించే ఇలాంటి నిజాలెన్నింటినో ‘ఆస్పరింగ్మైండ్స్’ అనే సంస్థ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు, పరిస్థితులపై రూపొందించిన నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్-2014లో వివరించింది. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 2,500కు పైగా కాలేజీల కు చెందిన 10 ల క్షల వుంది విద్యార్థులపై ఈ సర్వే చేసినట్టు వెల్లడించింది. నాణ్యత పట్టని యాజమాన్యాలు.. కొద్దిగా పేరున్న కాలేజీలు ఏటికేడు సీట్లు పెంచుకుంటున్నాయి. కామన్ ఫీజున్నప్పటికీ యాజమాన్య కోటాలో భారీగా వసూలు చేస్తున్నాయి. 15 శాతం ఎన్ఆర్ఐ కోటానే కాకుండా, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. సాధారణ కాలేజీల్లో ప్రవేశాలు లేక మూసివేత దిశగా నడుస్తున్నాయి. వసతుల్లేని కాలేజీలు, అర్హత లేని అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. అధిక మొత్తం ఫీజులున్న కాలేజీల్లో కూడా ప్రమాణాలు లేవు.దీంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు కొరవడి, ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నారు. 32 కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు.. గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఒకటి నుంచి 5 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 14 ఉండగా, 6 నుంచి 10 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 14 ఉన్నాయి. 11 నుంచి 15 మందిలోపు విద్యార్థులు చేరినవి మరో 14 కాలేజీలు ఉండగా, 16 నుంచి 20 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 19 ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 400కు పైగా సీట్లు ఉంటే 100 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 250 ఉండడం గమనార్హం. 2013లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పనలో రాష్ట్రాల పరిస్థితి.. టాప్ 25 పర్సంటైల్లో - బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్ 75 - 50 పర్సంటైల్లో - గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ 50-25 పర్సంటైల్లో - హర్యానా, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్ కింది నుంచి 25 పర్సంటైల్లో - ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఆస్పరింగ్మైండ్స్ నివేదికలోని ముఖ్యాంశాలు... దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయూరుు. ఇంజనీరింగ్ విద్యలో సావుర్థ్యాల పెంపునకు దేశంలో 3 వేల కాలేజీలే దీర్ఘకాలిక ప్రణాళికను కలిగి ఉన్నాయి. పట్టణాల్లోని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగిష్ భాషానైపుణ్యం ఉండడం లేదు. అనాలిసిస్లో విద్యార్థులు పూర్తిగా వెనుకబడి పోతున్నారు. -
గీతం విద్యార్థులకు టీసీఎస్ అవార్డులు
సాగర్నగర్, న్యూస్లైన్ : ఇంజినీరింగ్ విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గీతం విద్యార్థులకు టాటా కన్సల్టెన్స్ సర్వీసెస్(టీసీఎస్) అవార్డులను ప్రకటించింది. అవార్డుల్లో భాగంగా ఒక్కొక్కరికి రూ.10 వేలు నగదుతోపాటు ప్రశంసా పత్రాన్ని సోమవారం టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న విద్యార్థులకు అంద జేశారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి కె.దివ్యతేజస్వికి(ఉత్తమ విద్యార్థి) టీసీఎస్ బంగారు పతకంతో పాటు రూ.10 వేలు నగదు అందజేశారు. బెస్ట్ స్టూడెంట్ ప్రొజెక్టు అవార్డును కౌసల్ కుమార్కు అందజేశారు. అవార్డులు పొందిన విద్యార్థులను గీతం అధ్యాపకులు, టీసీఎస్ ప్రతినిధులు అభినందించారు. ఇన్ఫోటెక్ పోటీల విజేత అవినాష్ గుప్తా హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఇండియన్ ఏవియేషన్-2014 ఉత్సవాల్లో ఇన్ఫోటెక్ సంస్థ నిర్వహించిన ఇన్ఫోటెక్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ పోటీల్లో గీతం ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థి అవినాష్ గుప్తా విజేతగా నిలిచాడు. గీతం విద్యార్థికి ఐఎన్ఓఐ గోల్డ్ మెడల్ గీతం వర్సిటీ ఇనుస్ట్రుమెంటేషన్ ఇం జినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థి జి.మణికంఠ అరవింద్కు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనుస్ట్రుమెంటేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా వార్షిక అవార్డు లభించింది. బీటెక్లో అన్ని సబ్జెక్టుల లోనూ ఒకే ప్రయత్రంలో ఉత్తీర్ణులై రా ష్ట్రంలో అధిక మార్కులు సాధించిన వి ద్యార్థులకు ఏటా ఈ అవార్డులు అందజేస్తారు. ఈ అవార్డులను డి.వి.ఎస్ రాజు ఎండోమెంట్ మెడల్, సి.సీతారాజు ఎండోమెంట్ అవార్డు పేరిట ఈ సొసైటీ అవార్డులు అందజేస్తుందని గీతం అధ్యాపకులు తెలిపారు. -
కాసుల కక్కుర్తిలో నాణ్యతకు పాతర
* ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇష్టారాజ్య విధానాలు * మొన్న ఎన్ఆర్ ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పెంపు * ఇపుడు ఎంసెట్ లేకుండానే యాజమాన్య కోటాలో ప్రవేశాలు * ఎంసెట్నే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం * యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు సాక్షి, హైదరాబాద్: యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఎంసెట్ మనుగడనే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సిఫారసు చేసిన అధికారులు.. తాజాగా మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగానే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు అనుకున్నదే తడవుగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం వెనుక భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు.. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత లేకుండాపోయింది. టాప్ కాలేజీల్లోనే ఫలితాలు 50 శాతం నుంచి 80 శాతానికి మించడం లేదు. అయినా కొన్ని ప్రముఖ కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గిన అధికారులు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను మరింత పాతాళానికి తొక్కుతున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఇపుడు మేనేజ్మెంట్ కోటా సీట్లను పూర్తిగా ఇంటర్మీడియెట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తే నాణ్యత మరింత దెబ్బతింటుందని, ఎంసెట్కు ప్రాధాన్యమే ఉండదన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం అనేక నిబంధనలు ఉన్నప్పుడే మేనేజ్మెంట్ కోటా సీట్లను బేరం పెడుతున్న ప్రముఖ కాలేజీలకు ఇక ఇంటర్మీడియెట్ మెరిట్తోనే యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అవకాశం ఇస్తే.. సీట్లను మరింత అడ్డగోలుగా అమ్ముకుంటారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆలోచనలతోనే ముందుకొచ్చిన కొన్ని ప్రముఖ కాలేజీల యాజమాన్యాల ముడుపుల బాగోతం, ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పక్కా విధానం అనుసరించాలన్న కోర్టు ఆదేశాల పేరుతో యాజమాన్య అనుకూల విధానాలు తీసుకువస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పెంపులో మరో కుట్ర ప్రస్తుతం ఐదు శాతం ఉన్న ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచడం ద్వారా సీట్లు అమ్ముకునేందుకు యాజమాన్యాలకు మరింత అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 705 ఇంజనీరింగ్ కాలేజీల్లోనే 3,06,925 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తోంది. మరో ఐదు శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీకి, 25 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసేలా గతేడాది చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి. దీంతో యాజమాన్యాలతో సమావేశమైన ఉన్నత విద్యామండలి యాజమాన్యాల డిమాండ్కు అనుగుణంగా ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయించి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జూన్ 9న ఎంసెట్ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రాతపరీక్ష ఫలితాలు జూన్ 9న ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో మే 17న నిర్వహించాల్సిన ఎంసెట్ రాతపరీక్షను అదే నెల 22వ తేదీకి వాయిదా వేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎంసెట్ కమిటీ ప్రిలిమినరీ కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ఫలితాల వెల్లడి తేదీలనూ మార్పు చేసిందని ఎంసెట్-2014 కన్వీనర్ రమణారావు శుక్రవారం వెల్లడించారు. తొలుత మే 19న ప్రాథమిక కీ విడుదల చేసి, 26వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని, జూన్ 2న ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించారు. అయితే పరీక్ష తేదీ మారడంతో మే 24న ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను మే 31 వరకు స్వీకరిస్తారు. జూన్ 9నఎంసెట్ ఫలితాలు, ర్యాంకులను వెల్లడిస్తారు. -
విద్యాబోధనపై యూజీసీ సంతృప్తి
నూజివీడు, న్యూస్లైన్ : ట్రిపుల్ఐటీలో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి బోధనాపద్ధతులపై యూజీసీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందం చైర్మన్, పంజాబ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అరుణ్కుమార్ గ్రోవర్ నేతృత్వంలో బృందం సభ్యులు ఆదివారం స్థానిక ట్రిపుల్ఐటీని సందర్శించారు. తొలుత ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డెరైక్టర్ ఇబ్రహీంఖాన్, ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ వి.రాజకుమార్లతో బృందం సమావేశమైంది. వీసీ రాజకుమార్ ట్రిపుల్ ఐటీ లక్ష్యం, ప్రగతి, విద్యార్థులకు బోధిస్తున్న విద్యావిధానం, సదుపాయాలు, విద్యార్థుల నాసా పర్యటన, ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికలు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 80 శాతం పైన ప్రతిభ కలిగిన విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో ఇంజినీరింగు విద్యను అందజేస్తున్నామన్నారు. విద్యాబోధన, వసతులపై ఆరా... బృంద సభ్యులు ప్రాంగణంలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించారు. తరగతి గదులు, హాస్టల్లో వసతి ఏర్పాట్లు, ఒక్కొక్క గదికి ఉంటున్న విద్యార్థులు ఎంతమంది తదితర అంశాలను డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఆస్పత్రి, అందులో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మెస్ను సందర్శించి పిల్లలకు నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని పరిశీలించారు. చివరగా ఇంజినీరింగు విద్యకు సంబంధించి ప్రయోగశాలలు, వాటిలోని పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, మెంటార్లతో సమావేశమై విద్యావిధానంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ విభాగం ఏర్పాటు చేయండి... ఏడువేల మంది విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో చదువుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్లేస్మెంట్ సెల్ల తరహాలో విద్యార్థుల ప్రయోజనార్థం కోచింగ్ సెల్ (శిక్షణ విభాగం)ను కూడా ఏర్పాటుచేసి అన్ని రకాల ప్రవేశపరీక్షలకు శిక్షణ కూడా ఆయా ప్రాంగణాల్లోనే నిర్వహించాలని అరుణ్కుమార్ గ్రోవర్ సూచించారు. దీనివల్ల వారి సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం ఆర్జీయూకేటీ అధికారులు యూజీసీ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ మేరకు ట్రిపుల్ ఐటీని సందర్శించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సోమయ్య, సీనియర్ ప్రొఫెసర్లు ఆచార్య రామనర్శింహం, డాక్టర్ రామ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వెల్లడించిన మెంటార్లు... ట్రిపుల్ ఐటీ మెంటార్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యూజీసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఆరేళ్లుగా తాము ఒకే జీతంతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు తమకు అనుకూలంగా స్పందించారని, ట్రిపుల్ఐటీ విద్యకు పునాది వేసేది మెంటార్లే కాబట్టి మీ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారని మెంటార్లు వివరించారు. -
8% వృద్ధే లక్ష్యం: రాష్ట్రపతి ప్రణబ్
చెన్నై, సాక్షి ప్రతినిధి : దేశంలో కొనసాగుతున్న ఆర్థిక పతనానికి అడ్డుకట్ట వేసేలా ఇంజనీరింగ్ విద్యాబోధన సాగాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్బోధించా రు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఇంజనీరింగ్ కళాశాలల సమా ఖ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, రెండేళ్లలో దేశ ఆర్థికాభివృద్ధి క్షీణించిందని తెలిపారు. 2012-13లో వృద్ధి రేటు 5 శాతవునీ, గత పదేళ్లలో ఇదే కనిష్ట వృద్ధి రేటనీ చెప్పారు. దీన్ని 8 శాతానికి మించిన స్థారుుకి పెంచడమే వున వుుందున్న తక్షణ సవాలని అన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా దేశం ఆర్థిక పరిపుష్టి పొందుతుందని, దీనిని సాధించాలంటే మెరుగైన ఇంజనీరింగ్ విద్య అవసరమని పేర్కొన్నారు. మానవ అవసరాలకు, దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను మెరుగుపర్చుకోవాలని సూచించారు. జపాన్, సింగపూర్లు ఆధునిక టెక్నాలజీ సాయుంతోనే అభివృద్ధి సాధించాయుని గుర్తుచేశారు. మెరుగైన విధానంతో నాణ్యమైన బోధనతో చురుకైన ఇంజనీర్లను దేశానికి అందించాల్సిన బాధ్యతను యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు గుర్తెరగాలని పేర్కొన్నారు. దేశం గత 20 ఏళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని, భవిష్యత్తులో ఎదురయ్యే మరెన్నో సవాళ్లను అధిగమించేలా విద్యావంతులను తీర్చిదిద్దాలని చెప్పారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రి జీకే వాసన్ పాల్గొన్నారు. -
ఎంజీయూలోనూ.. ఇంజినీరింగ్ విద్య
సాక్షి, నల్లగొండ: విద్యార్థులకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ చదువుల వనంగా మారనుంది. మరిన్ని ఉన్నత చదువులకు కేరాఫ్గా నిలువనుంది. ఇప్పటికే మూడు విభాగాల్లో అందిస్తున్న పలు కోర్సులకు తోడు తాజాగా ఇంజినీరింగ్ చేరింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వస్తుంది. మూడు బ్రాంచ్లల్లో సీట్లు కేటాయిస్తూ ఉన్నత విద్యాశాఖ నుంచి మంగళవారం క్లియరెన్స్ వచ్చింది. మూడు బ్రాంచ్లతో ప్రారంభం.. 2013-14 విద్యా సంవత్సరంలో మూడు బ్రాంచ్లతో ఇంజినీరింగ్ విద్యను ప్రారంభిస్తారు. ప్రస్తుత పరిస్థితులో విద్యార్థులు ఆసక్తి కనబర్చుతున్న సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్), ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్), ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) బ్రాంచ్లు పరిచయం చేస్తున్నారు. ఒక్కో బ్రాంచ్లో 60 సీట్లు కేటాయించారు. ఇప్పటికే ఎంసెట్ -2013 అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీ లన పూర్తయింది. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియా మొదలైంది. వర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో ఇంజినీరింగ్ కళాశాల, ఎంజీయూను ఎంపిక చేసుకోవచ్చు. ఈ మేరకు నూతన కళాశాల కోడ్ను కౌన్సెలింగ్ వెబ్సైట్లో చేర్చారు. ఇంజినీరింగ్ కోర్సును పానగల్ క్యాంపస్లో నడిపిస్తారు. గొప్ప పురోగతి... రాష్ట్రంలో 38 యూనివర్సిటీలున్నాయి. ఉస్మానియా, కాకతీయ, యోగి వేమన యూనివర్సిటీల్లో మాత్రమే ఇంజినీరింగ్ విద్యను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని వర్సిటీలకు 50, 60 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఆయా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ విద్య అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఎంజీయూ ఏర్పాటైన ఐదేళ్ల కాలంలోనే ఇంజినీరింగ్ విద్య అందించే అవకాశం దక్కడం శుభ పరిణామం. ఎంజీయూతోపాటే తెలంగాణ, పాలమూరు, శాతవాహన వర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇంజినీరింగ్ కోర్సు ఆఫర్ చేయాలన్న డిమాండ్ ఆ వర్సిటీల నుంచి వచ్చింది. ఈ విషయాన్ని ఎంజీయూ వైస్చాన్సలర్ కట్టా నర్సిం హారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంజీయూలో ఇప్పటికే భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు విద్యార్థులకు సరిపడా భవనం ఉంది. ఈ సబ్జెక్టులు బోధించే ప్రొఫెసర్లకు కొరత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టడం పెద్ద కష్టం కాదని సర్కారు భావించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్య అందించడానికి సుముఖత తెలిపింది. ఎంజీయూకు ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణకు అనుమతి రావడం పట్ల నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.