Listing
-
ఈ వారం 2 ఐపీవోలు.. 10 లిస్టింగ్లు
ఈ వారం రెండు కొత్త ఐపీవోలు ప్రారంభం కానుండగా, మెయిన్బోర్డ్, ఎస్ఎంఈ విభాగంలో కలిపి 10 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ కానున్నాయి. మెయిన్ బోర్డ్లో 17న అజాక్స్ ఇంజనీరింగ్, 19న హెక్సావేర్ టెక్నాలజీస్, 21న క్వాలిటీ పవర్ లిస్ట్ కానున్నాయి. ఎస్ఎంఈ కంపెనీ హెచ్పీ టెలికామ్ ఐపీవో 20న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ.108. ప్రమోటర్లే 34.28 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో యాపిల్ ఉత్పత్తులను ఈ సంస్థ పంపిణీ చేస్తుంటుంది. సివిల్ కన్స్ట్రక్షన్ కార్యకలాపాల్లోని బీజాసాన్ ఎక్స్ప్లోటెక్ అనే మరో ఎస్ఎంఈ ఐపీవో 21న మొదలు కానుంది. 34.24 లక్షల తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో కంపెనీ రూ.60 కోట్లు సమీకరించాలనుకుంటోంది. -
ట్రిపుల్ ధమాకా!
గతవారం పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ కంపెనీల షేర్లు బుధవారం స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. ఈ మూడు కంపెనీల షేర్లు భారీ ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతున్నా.., వీటికి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో తొలిరోజే మొబిక్విక్ షేరు అత్యధికంగా 90%, విశాల్ మెగామార్ట్ 44%, సాయి లైఫ్ సైన్సెస్ 42 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి. విశాల్ మెగామార్ట్ దేశవ్యాప్తంగా సూపర్మార్ట్లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.78)తో పోలిస్తే 33% ప్రీమియంతో రూ.104 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 46% ఎగసి రూ.114 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 44% లాభంతో రూ.112 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,444 కోట్లుగా నమోదైంది.మొబిక్విక్ సిస్టమ్స్మొబిక్విక్ పేరుతో ఫిన్టెక్ సేవలు అందించే వన్ మొబిక్విక్ సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.279)తో పోలిస్తే 59% ప్రీమియంతో రూ.442 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 90.21% ఎగసి రూ.531 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి అదే స్థాయి (రూ.530) వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,120 కోట్లుగా నమోదైంది. సాయి లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.549)తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 42% ఎగసి రూ.780 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 40% లాభంతో రూ.768 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,974 కోట్లుగా నమోదైంది. -
క్విక్ కామర్స్లోకి మరిన్ని బ్రాండ్లు
న్యూఢిల్లీ: క్విక్కామర్స్కు పట్టణ వాసుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో.. ప్రముఖ బ్రాండ్లు అమ్మకాలు పెంచుకునేందుకు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్యాబ్ ఇండియా, డెకథ్లాన్, అడిడాస్, యూఎస్ పోలో, బోట్ తదితర ప్రముఖ బ్రాండ్లు బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో ప్లాట్ఫామ్లపై తమ ఉత్పత్తులను ఇటీవలి కాలంలో లిస్ట్ చేశాయి. పుమా, స్కెచర్స్ సైతం క్విక్కామర్స్ ప్లాట్ఫామ్లపై లిస్టింగ్కు ఉత్సాహం చూపిస్తున్నాయి. ‘‘ఇది కేవలం ఆరంభమే. వేగం, సౌకర్యం దేశంలో ప్రజల షాపింగ్ తీరును మార్చివేయనున్నాయి’’అని జెప్టో అప్పారెల్ లైఫ్స్టయిల్ హెడ్ ఆస్థా గుప్తా తెలిపారు. క్విక్ కామర్స్ సంస్థలు ఇంతకాలం మెట్రోలకే పరిమితం కాగా, టైర్–2, 3 పట్టణాల్లోకి విస్తరిస్తున్నాయి. కనుక ఈ విభాగాన్ని ప్రముఖ బ్రాండ్లు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్కు చెందిన ‘తస్వ’ మెన్స్వేర్ బ్రాండ్, డిజైనర్ తరుణ్ తహిల్యాని క్విక్కామర్స్ ప్లాట్ఫామ్లపై తమ ఉత్పత్తులను లిస్టింగ్ చేసే ప్రణాళికతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ బ్రాండ్లు తమ స్టోర్ల కోసం సరైన లొకేషన్ను గుర్తించడం, అమ్మకాల పరంగా విజయం సాధించడం క్లిష్టమైన టాస్క్ అనడంలో సందేహం లేదు. అదే క్విక్ కామర్స్ అయితే మరింత మంది వినియోగదారులకు వేగంగా, సులభంగా చేరుకోగలగడం వాటిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో నాసిక్, వారణాసి, ఉదయ్పూర్, హరిద్వార్, బటిండ తదితర చిన్న పట్టణాలకూ క్విక్కామర్స్ సేవలు విస్తరించడం గమనార్హం. స్పందన చూద్దాం.. క్విక్కామర్స్ ప్లాట్ఫామ్లతో దీర్ఘకాల ఒప్పందాలకంటే, ముందు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రముఖ బ్రాండ్లు ఆసక్తి చూపుతున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రస్తుతం బ్రాండ్లకు ఇది ప్రయోగాత్మక దశ. ఆడిదాస్, ఫ్యాబ్ ఇండియా తదితర బ్రాండ్లకు భారీ అమ్మకాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి కేవలం అప్పారెల్ కంపెనీలు. ఈ ఉత్పత్తుల్లో వెనక్కి తిరిగి పంపడం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ కొనుగోళ్లలో 25–30 శాతం వెనక్కి వస్తుంటాయి. కనుక వీటి విషయంలో విజయం ఎంతన్నది వేచి చూస్తే కానీ తెలియదు. అదే గ్రోసరీ, స్టాపుల్స్, సౌందర్య ఉత్పత్తులు, బహుమతులు, మొబైల్ ఉత్పత్తులు క్విక్ కామర్స్పై ఎక్కువ డిమాండ్ ఉన్న విభాగాలు’’అని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తురాణి వివరించారు.సంప్రదాయ స్టోర్లపై ప్రభావం..క్విక్కామర్స్ శరవేగంగా విస్తరిస్తుండడం సంఘటిత స్టోర్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికం డీమార్ట్ ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫలితాల తర్వాత స్టాక్ కూడా భారీగా పడిపోవడం గమనార్హం. పెద్ద మెట్రోల్లో క్విక్ కామర్స్ సంస్థల రూపంలో డీమార్ట్ వంటి స్టోర్లకు పోటీ తీవ్రంగా ఉన్నట్టు బ్రోకరేజీ సంస్థలు తమ విశ్లేషణలో పేర్కొన్నాయి. క్విక్ కామర్స్ కంపెనీలు తొలుత తక్షణ గ్రోసరీ డెలివరీ సేవలతో వ్యాపారం మొదలు పెట్టగా, కస్టమర్ల స్పందన ఆధారంగా తర్వాతి కాలంలో మరిన్ని విభాగాల్లోకి సేవలను విస్తరించాయి. గృహోపకరణాలు, చార్జింగ్ కేబుళ్లు, ఎయిర్కూలర్లు, ఐఫోన్లు, ఆట»ొమ్మలు ఇలా ఎన్నో ఉత్పత్తులను జోడించుకుంటూ వెళుతున్నాయి. ఇది సంప్రదాయ రిటైల్ పరిశ్రమను దెబ్బతీస్తుందని, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు వర్తకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
ఈ వారం 2 లిస్టింగ్లు, 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో 4 ఐపీవోలు హడావిడి చేయనున్నాయి. గత వారమే ఇష్యూలు పూర్తి చేసుకున్న అలైడ్ బ్లెండర్స్ 2న, వ్రజ్ ఐరన్ 3న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నాయి. ఇక మరోపక్క ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బన్సల్ వైరింగ్ పబ్లిక్ ఇష్యూలు 3నే ప్రారంభంకానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ బ్రాండ్ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ రూ. 281 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 1,500 కోట్లు అందుకుంది. స్పాంజ్ ఐరన్, టీఎంటీ బార్ల తయారీ కంపెనీ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ షేరుకి రూ. 207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 171 కోట్లు అందుకుంది. జూలై 5న ముగియనున్న స్టీల్ వైర్ల తయారీ కంపెనీ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 243–256 ధరల శ్రేణిని ప్రకటించింది. మొత్తం రూ. 745 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయడం ద్వారా రూ. 745 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైలర్లు కనీసం 58 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. హెల్త్కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి రూ. 960–1008 ధరల శ్రేణిని ప్రకటించింది. 5న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్ల(రూ. 1,152 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,952 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 14 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. -
బీమా రంగంలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు
న్యూఢిల్లీ: బీమా రంగం నుంచి రానున్న కాలంలో మరికొన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ కావొచ్చని, విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు చోటు చేసుకుంటాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ అంచనా వేసింది. 2022–23లో బీమా రంగంలో రూ.1,930 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ మెరుగైన వృద్ధి అవకాశాలు బీమా కంపెనీల నిధుల సమీకరణకు మద్దతునిస్తోందని, దీంతో బలహీన అండర్ రైటింగ్ లాభదాయకతను అవి అధిగమించగలుగుతున్నాయని తెలిపింది. 2022–23లో బీమా రంగం చెల్లించిన మూలధనం రూ.75,300 కోట్లకు పెరిగిందని, 2021–22 నాటికి ఇది రూ.73,400 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2.6 శాతం వృద్ధి చెందింది. ఇదే తరహాలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు, ఐపీవోలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు, దీంతో భారత బీమా రంగం క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యత మెరుగుపడుతుందని తెలిపింది. విదేశీ బీమా సంస్థలు భారత బీమా మార్కెట్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తాయని, ఇప్పటికే భారత కంపెనీలతో ఉన్న జాయింట్ వెంచర్లలో వాటా పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తాయని అంచనా వేసింది. విదేశీ బీమా సంస్థల భాగస్వామ్యంతో క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యం, పరిపాలనా ప్రమాణాల పరంగా ప్రయోజనాలు లభిస్తాయని వివరించింది. భారత బీమా సంస్థల్లో విదేశీ బీమా కంపెనీలు వాటాలు పెంచుకోవడం మార్కెట్కు క్రెడిట్ పాజిటివ్గా పేర్కొంది. మొత్తం మీద 2022–23లో బీమా రంగం లాభదాయకత సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్లు పెరిగిపోతుండడంతో సాధారణ బీమా రంగం ఫలితాలు ప్రతికూలంగానే ఉన్నట్టు తెలిపింది. స్థిరమైన ధరల పెరుగుదలతో ఈ రంగం అండర్రైటింగ్ పనితీరు, లాభదాయకత గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేసింది. -
ఎయిర్పోర్ట్ల విభాగాన్ని లిస్టింగ్ చేస్తాం - వీపీ జీత్ అదానీ
హైదరాబాద్: నిర్దిష్ట మైలురాళ్లను సాధించిన తర్వాత సమీప భవిష్యత్తులో ఎయిర్పోర్ట్స్ విభాగాన్ని లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అదానీ ఎంటర్ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ జీత్ అదానీ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో ఉన్న విమానాశ్రయాలను విస్తరిస్తున్నామని, గతేడాది అన్ని ఎయిర్పోర్ట్ల నుంచి 8 కోట్ల మంది ప్యాసింజర్లు ప్రయాణించినట్లు ఆయన చెప్పారు. లక్నో, గువాహటి ఎయిర్పోర్ట్లలో కొత్త టెర్మినల్స్ను ప్రారంభించనున్నామని, నవీ ముంబై విమానాశ్రయం ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని చెప్పారు. అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు ఎయిర్పోర్ట్ల విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. భారత నేవీ కోసం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తయారు చేసిన దృష్టి 10 స్టార్లైనర్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమంలో జీత్ పాల్గొన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్ఎల్) మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, తిరువనంతపురం, ముంబై తదితర విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో (ఎంఐఏఎల్) 73% వాటా ఉంది. ఎంఐఏఎల్కు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 74% వాటాలు ఉన్నాయి. ప్రయాణికుల పరంగా 25% వాటా, ఎయిర్ కార్గో ట్రాఫిక్లో 33% వాటాతో ఏహెచ్ఎల్ దేశీయంగా అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా సంస్థగా ఉంది. -
ఐపీవో రష్.. లాభాల జాతర
గత క్యాలండర్ ఏడాది(2023)లో పబ్లిక్ ఇష్యూల హవా నడిచింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు కొత్త కంపెనీల లిస్టింగ్స్తో కళకళలాడాయి. వీటిలో అత్యధిక శాతం ఇష్యూలు ఇన్వెస్టర్లను మెప్పించడం విశేషం! ముంబై: స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్సులలో సెన్సెక్స్(బీఎస్ఈ) 72,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నూతన చరిత్రకు తెరతీసింది. ఈ బాటలో నిఫ్టీ(ఎన్ఎస్ఈ) సైతం తొలిసారి 22,000 పాయింట్ల మార్క్కు చేరువైంది. ఈ ప్రభావంతో 2023లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు తెరతీశాయి. ఇందుకు అనుగుణంగా కొద్ది నెలలనుంచి పెట్టుబడుల దూకుడు చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేయడంలో క్యూ కట్టారు. వెరసి 2023లో మార్కెట్లను తాకిన 59 ఐపీవోలలో ఏకంగా 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ద్వారా రికార్డు నెలకొల్పాయి. 4 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూ ధరలకంటే దిగువన కదులుతున్నాయి. రూ. 82 లక్షల కోట్లు గతేడాది(జనవరి–డిసెంబర్) దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు 20 శాతం ర్యాలీ చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 82 లక్షల కోట్లమేర(ఒక ట్రిలియన్ డాలర్లు) బలపడింది. ఫలితంగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 370 లక్షల కోట్లకు(4.3 ట్రిలియన్ డాలర్లు) చేరింది. 2022తో పోలిస్తే 30 శాతం వృద్ధి! తద్వారా గ్లోబల్ టాప్–5 విలువైన మార్కెట్ల జాబితాలో భారత్ చోటు సాధించింది. సగటున 45 శాతం ప్లస్ గతేడాది స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన 59 కంపెనీలు ఉమ్మడిగా రూ. 54,000 కోట్లు సమీకరించాయి. వీటిలో 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. ఇవి సగటున 45 శాతం బలపడ్డాయి. అయితే 4 కంపెనీలు ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి. 59 ఇష్యూలలో లిస్టింగ్ రోజు లాభాలు సగటున 26 శాతంకాగా.. డిసెంబర్ 29కల్లా సగటున 45 శాతం పురోగమించాయి. 4 ఇష్యూలు మాత్రమే బలహీనంగా ట్రేడవుతున్నాయి. లిస్టింగ్ నుంచి 23 కంపెనీలు 50 శాతానికిపైగా రిటర్నులు అందించాయి! 9 ఇష్యూలు రెట్టింపునకుపైగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) నుంచి 182 ఐపీవోలు నమోదయ్యాయి. ఇది 56 శాతం వృద్ధికాగా.. ప్రపంచంలోనే అత్యధికం!! టాప్లో పీఎస్యూ ఐపీవోలలో ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఇరెడా) అత్యధికంగా 205 శాతం దూసుకెళ్లి రిటర్నుల జాబితాలో టాప్ ర్యాంకును అందుకుంది. ఈ బాటలో సైయెంట్ డీఎల్ఎమ్ 155 శాతం, నెట్వెబ్ టెక్నాలజీస్ 141 శాతం చొప్పున జంప్చేసి తదుపరి స్థానాల్లో నిలిచాయి. టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిస్టింగ్లో మూడు రెట్లు ఎగసి ప్రస్తుతం 136 శాతం లాభంతో కదులుతోంది. ఇక రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ 128 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో 240 ఇష్యూల ద్వారా 60 బిలియన్ డాలర్లు సమీకరించిన చైనా తదుపరి భారత్ అత్యధిక ఐపీవోల మార్కెట్గా నిలిచింది. కారణాలున్నాయ్ బలమైన స్థూల ఆర్థిక మూలాలు, రాజకీయ నిలకడ, ఆశావహ కార్పొరేట్ ఫలితాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు నిలుపుదల తదితర అంశాలు స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణమైనట్లు పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి రూ. 1.7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు దేశీ మార్కెట్లలోకి ప్రవహించాయి. మరోపక్క గతేడాది సుమారు 2.7 కోట్లమంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించడం గమనార్హం! మధ్య, చిన్నతరహా కంపెనీలు దూకుడు చూపడంతో ఐపీవో ఇండెక్స్ 41 శాతం జంప్చేసింది. గతేడాది మార్చిలో నమోదైన కనిష్టం 57,085 పాయింట్ల నుంచి సెన్సెక్స్ డిసెంబర్ 28కల్లా 72,484 పాయింట్లకు పురోగమించింది! -
ఎస్ఎంఈ ఐపీవోల దూకుడు
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్ల ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజాగా ఇటు సెన్సెక్స్ 72,000 పాయింట్ల మైలురాయిని చేరగా.. పోటీగా అటు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్క్వైపు కదులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుండటంతో ప్రధాన ప్రైమరీ మార్కెట్ పలు ఐపీవోలతో కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్ఎంఈ) సైతం లిస్టింగ్కు క్యూ కడుతున్నాయి. వెరసి ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో 2023లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూల విభాగం దూకుడు చూపుతోంది. ఇప్పటివరకూ 166 కంపెనీలు ఐపీవోలను పూర్తి చేసుకున్నాయి. బ్రోకింగ్ సంస్థ ఫైయర్స్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం రూ. 4,472 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఇంతక్రితం 2022లో 109 ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 1,980 కోట్లు సమకూర్చుకున్నాయి. కాగా.. ఈ ఏడాది ఐపీవోకి వచ్చిన 166 సంస్థలలో 136 లాభాలతో లిస్టయ్యాయి. వీటిలో 24 ఎస్ఎంఈలు లిస్టింగ్ రోజున ఏకంగా 100 శాతం లాభాలను సాధించాయి. జాబితాలో గోయల్ సాల్ట్ 258 శాతం దూసుకెళ్లి టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో సన్గార్నర్ ఎనర్జీస్ 216 శాతం, బేసిలిక్ ఫ్లై 193 శాతం జంప్చేసి తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. ఇన్వెస్టర్ల క్యూ ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది లిస్టయిన సంస్థలలో 51 ఇష్యూలు 100 రెట్లుపైగా సబ్ర్స్కిప్షన్ను సాధించాయి. మరో 12 ఐపీవోలు ఏకంగా 300 రెట్లు అధికంగా డిమాండును అందుకున్నాయి. ఫైయర్స్ వివరాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు చరిత్రాత్మక స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. అంతగా ప్రసిద్ధంకాని చాలా కంపెనీల ఇష్యూలలో సైతం రిటైలర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వెరసి స్పందనలో గత రికార్డులను తుడిచిపెడుతున్నారు. అయితే ఇకపై రానున్న ఐపీవోల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు ఫైయర్స్ పేర్కొంది. మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తోంది. ఈ స్పీడ్ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడింది. కొన్ని కంపెనీల షేర్లు దూకుడు చూపుతున్నప్పటికీ ఆర్థిక పనితీరు ఆ స్థాయిలో ఉండటంలేదని ప్రస్తావిస్తోంది. వెరసి చిన్న ఇన్వెస్టర్లకు బహుపరాక్ చెబుతోంది! జోరు తీరిదీ.. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్టయిన సంస్థలలో గోయల్ సాల్ట్ ముందునిలవగా.. లిస్టింగ్ రోజు భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోల జాబితాలో పలు సంస్థలు చోటు సాధించాయి. వీటిలో సన్గార్నర్ ఎనర్జీస్(216 శాతం), బేసిలిక్ ఫ్లై స్టుడియో(193 శాతం), స్(216 శాతం), ఓరియానా పవర్(169 శాతం), ఏనియన్ టెక్ సొల్యూషన్స్(164 శాతం), సీపీఎస్ షేపర్స్(155 శాతం), శ్రీవారి స్పైసెస్(154 శాతం), ఇన్ఫోలియన్ రీసెర్చ్(142 శాతం), రాకింగ్డీల్స్ సర్క్యులర్(125 శాతం), నెట్ ఎవెన్యూ టెక్(122 శాతం), పారగాన్ ఫైన్ ఎస్(114 శాతం), విన్యాస్ ఇన్నొవేటివ్ టెక్(110 శాతం), కృష్ణా స్ట్రాపింగ్(109 శాతం), సార్ టెలివెంచర్(101 శాతం), ఇన్నోకయిజ్ ఇండియా(100 శాతం) తదితరాలున్నాయి. -
ఎస్ఎస్ఈలో తొలి లిస్టింగ్
ముంబై: నైపుణ్యాన్ని పెంపొందించే నాన్ప్రాఫిట్ కంపెనీ.. ఎస్జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్ సోషల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎస్ఎస్ఈ)లో లిస్టయ్యింది. తద్వారా ఎస్ఎస్ఈలో లిస్టయిన తొలి సంస్థగా నిలిచింది. పారదర్శక, విశ్వాసపాత్ర మెకనిజం ద్వారా ఈ ప్లాట్ఫామ్ ఇన్వెస్టర్లు సామాజిక సేవా కంపెనీలను గుర్తించేందుకు వీలు కల్పిస్తుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్టైమ్ సభ్యురాలు అశ్వనీ భాటియా పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీల గుర్తింపు, విలువ మదింపునకు వీలుంటుందని తెలియజేశారు. వీటికి మద్దతివ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా ఎస్ఎస్ఈ ఆలోచన విజయవంతంకాకపోవడం గమనార్హం! 2019లోనే 2019 ఆర్థిక బడ్జెట్లో ప్రభుత్వం ఎస్ఎస్ఈ ఏర్పాటుకు ప్రతిపాదించింది. సెబీ ఇటీవల నిబంధనలను రూపొందించింది. వెరసి తొలి ఎన్పీవో ఉన్నతి రూ. 2 కోట్ల సమీకరణకు తెరతీయగా.. 90 శాతం సబ్స్క్రిప్షన్ లభించింది. నిధుల్లో రూ. 1.8 కోట్లను గ్రాడ్యుయేషన్ చివరి ఏడాదిలో ఉన్న 10,000 మంది కాలేజీ విద్యార్ధులపై వెచి్చంచనున్నట్లు ఉన్నతి తెలియజేసింది. తద్వారా నైపుణ్య పెంపుతో పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్ధులను సిద్ధం చేయనుంది. సామాజిక సంస్థలకు ఎస్ఎస్ఈ కొత్త అవకాశాలను కలి్పంచనున్నట్లు ఈ సందర్భంగా భాటియా పేర్కొన్నారు. తమ వర్క్, కార్యకలాపాల విస్తరణ, జవాబుదారీతనం, సుపరిపాలనను పెంపొందించుకునేందుకు వీలు కల్పిస్తుందని తెలియజేశారు. తొలి కంపెనీ లిస్ట్కావడం ద్వారా సోషల్ ఫైనాన్స్ శకం ప్రారంభంకానున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్ఎస్ఈపై త్వరలోనే సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఇష్యూ కనీస పరిమాణాన్ని రూ. 50 లక్షలకు, దరఖాస్తు మొత్తాన్ని రూ. 10,000కు కుదించనుంది. 39 కంపెనీలు ఇప్పటికే రిజిస్టరైన 39 ఎన్పీవోలతో ఎస్ఎస్ఈ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తున్నట్లు దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వీటిలో చాలావరకూ నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశారు. ఎన్జీవోలకు ఎస్ఎస్ఈ గుర్తింపునిస్తుందని ఉన్నతి వ్యవస్థాపక డైరెక్టర్ రమేష్ స్వామి పేర్కొన్నారు. దీంతో సంస్థ విశ్వసనీయత, డాక్యుమెంటేషన్, ప్రభావాలను ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించరని వ్యాఖ్యానించారు. దేశంలో సొమ్ము అనేది సమస్యకాదంటూ మందిరాలు, మసీదులు, చర్చిలలోనే రూ. 80,000 కోట్ల సంపద ఉన్నట్లు ప్రస్తావించారు. -
టాటా టెక్ సూపర్ హిట్.. గాంధార్ ఆయిల్ ఘనం
న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 140% ప్రీమియంతో రూ.1,200 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 180% ఎగసి రూ.1,400 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 163% లాభపడి రూ.1,314 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2023) లిస్టింగ్ రోజు అత్యధిక లాభాలు పంచిన షేరుగా రికార్డు సృష్టించింది. కంపెనీ విలువ రూ.52,940 కోట్లుగా నమోదైంది. గాంధార్ సెంచరీ... గాంధార్ ఆయిల్ రిఫైనరీ షేరు ఘనంగా లిస్టయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.169)తో పోలిస్తే 75% ప్రీమియంతో రూ.295 వద్ద లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్లో మరింత దూసుకెళ్లింది. ఒక దశలో 104% ర్యాలీ చేసి రూ.345 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరికి 78% లాభంతో రూ.301.50 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మొత్తం 29.06 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,951 కోట్లుగా నమోదైంది. ఫెడ్ ఫినా.. ప్చ్! ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ. 140)తో పోలిస్తే 1.50% డిస్కౌంట్తో రూ.138 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లిస్టింగ్ నష్టాలు భర్తీ చేసుకొంది. ఒక దశలో 6% ర్యాలీ చేసి రూ.148 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరికి ఇష్యూ ధర రూ.140 వద్దే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.5,378 కోట్లుగా నమోదైంది. -
విదేశాల్లో డైరెక్ట్ లిస్టింగ్కు గ్రీన్ సిగ్నల్..
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు విదేశీ ఎక్స్చెంజీలలో నేరుగా లిస్టయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కంపెనీల చట్టంలో సంబంధిత సెక్షన్ 5ని నోటిఫై చేసింది. దీని ప్రకారం నిర్దిష్ట తరగతులకు చెందిన పబ్లిక్ కంపెనీలు .. ఆమోదయోగ్యమైన కొన్ని విదేశీ స్టాక్ ఎక్స్చెంజీలలో తమ షేర్లను లిస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈ సెక్షన్కు సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై చేయాల్సి ఉంది. విదేశాల్లో లిస్టింగ్ కోసం విదేశీ మారక నిర్వహణ చట్టం మొదలైన వాటిని కూడా సవరించాల్సి ఉంటుందని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ పార్ట్నర్ యష్ అషర్ తెలిపారు. తాజా పరిణామంతో పెట్టుబడుల సమీకరణకు దేశీ కంపెనీలకు మరో మాధ్యమం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. అయితే, వ్యాల్యుయేషన్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు లెక్కగట్టే విధానం, విదేశాల్లో లిస్టింగ్ వల్ల వాణిజ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలు మొదలైన వాటన్నింటినీ కంపెనీలు మదింపు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశీ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్టవుతున్నాయి. 2020 మే నెలలో కోవిడ్ ఉపశమన ప్యాకేజీలో భాగంగా భారతీయ సంస్థలు విదేశాల్లో నేరుగా లిస్టయ్యేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. సదరు సంస్థలు ప్రపంచ మార్కెట్ల నుంచి పెట్టుబడులను సమీకరించుకునేందుకు తోడ్పా టు అందించేలా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జూలై 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. పటిష్టమైన మనీలాండరింగ్ నిబంధనలు అమలయ్యే ఎన్వైఎస్ఈ, నాస్డాక్, ఎల్ఎస్ఈ మొదలైన పది ఎక్సే్చంజీలను పరిశీలించవచ్చని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. -
ఆరు కంపెనీలుగా వేదాంతా
బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్.. వేదాంతా రిసోర్సెస్.. సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది. వీటి ప్రకారం డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఇక మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ విభిన్న విభాగాల కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. తద్వారా ఓవైపు రుణ భారాన్ని తగ్గించుకోవడం, మరోపక్క వాటాదారులకు అధిక విలువను రాబట్టడం లక్ష్యాలుగా పెట్టుకుంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ కీలక బిజినెస్లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనుంది. అల్యూమినియం, ఆయిల్– గ్యాస్, స్టీల్, ఫెర్రస్ మెటల్స్, బేస్ మెటల్స్ పేరుతో ఐదు విభాగాలను విడదీసేందుకు ప్రణాళికలు వేసింది. వీటిని విడిగా లిస్ట్ చేయడం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చనున్నట్లు వేదాంతా తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా సరళతర విభజనకు తెరతీయనుంది. వెరసి వేదాంతా వాటాదారులకు తమవద్దగల ప్రతీ 1 షేరుకీ విడదీయనున్న 5 కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నారు. ఆపై వీటిని స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్ట్ చేయనున్నట్లు వేదాంతా తెలియజేసింది. వెరసి వేదాంతాసహా.. ఆరు లిస్టెడ్ కంపెనీలకు తెరలేవనుంది. ఇక మరోవైపు హిందుస్తాన్ జింక్సహా.. కొత్తగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్, సెమీకండక్టర్ డిస్ప్లే బిజినెస్లలో 65 శాతం చొప్పున వాటాను కలిగి ఉండనుంది. ఈ మొత్తం ప్రణాళికల అమలును 12–15 నెలలలోగా పూర్తిచేయాలని వేదాంతా భావిస్తోంది. గ్రూప్నకు మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్.. హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. హింద్ జింక్ కార్పొరేట్ సమీక్ష వేదాంతా గ్రూప్ కంపెనీ హిందుస్తాన్ జింక్ పూర్తిస్థాయిలో కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించనుంది. కంపెనీ విలువలో మరింత వృద్ధికి వీలుండటంతో కార్పొరేట్ నిర్మాణ సమీక్షకు బోర్డు నిర్ణయించినట్లు మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్లను ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల భిన్న విభాగాల పరిమాణం, కార్యకలాపాలు, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనలకు తెరతీసినట్లు వివరించింది. వీటిలో బిజినెస్ అవసరాలరీత్యా మూలధన నిర్మాణం, పెట్టుబడి కేటాయింపుల విధానాలు, కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర అంశాలున్నట్లు తెలియజేసింది. తద్వారా విభిన్న బిజినెస్లు తమ మార్కెట్ పొజిషన్ను వినియోగించుకుని దీర్ఘకాలిక వృద్ధి సాధించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేసింది. వెరసి అన్ని రకాల వాటాదారులకు విలువ చేకూర్చే వ్యూహంతో ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్ల విడదీత వార్తలతో ఎన్ఎస్ఈలో వేదాంతా షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద నిలవగా.. హిందుస్తాన్ జింక్ 3.5 శాతం జంప్చేసి రూ. 308 వద్ద ముగిసింది. నిధుల సమీకరణ.. ప్రతీ ప్రత్యేక విభాగాన్నీ ఒక్కొక్క కంపెనీగా విడదీయడం ద్వారా వేదాంతా గ్రూప్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరంగా మార్చివేయనుంది. ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే బాటలో స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. దీంతో సావరిన్ వెల్త్ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లతోపాటు.. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను కలి్పంచే యోచనలో ఉంది. వెరసి దేశ ఆర్థిక వృద్ధిని అవకాశాలుగా మలచుకునే ప్యూర్ప్లే కంపెనీలలో పెట్టుబడులకు వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న భారత్లో కమోడిటీలకు భారీ డిమాండ్ కనిపించనున్నట్లు వేదాంతా భావిస్తోంది. ఇటీవలే సెమీకండక్టర్లు, డిస్ప్లే తయారీలోకి సైతం ప్రవేశించింది. -
కొత్త రికార్డ్! ఐపీవో ముగిసిన రెండు రోజుల్లోనే లిస్టింగ్..
న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ కొత్త రికార్డుకు తెరతీస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 20) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతోంది. వెరసి పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ అయిన తొలి కంపెనీగా నిలుస్తోంది. ఇక టీ+3 విధానంలో లిస్టయిన తొలి కంపెనీ రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్కాగా.. రెండో రోజు నుంచి టీ+2లో ఆర్ఆర్ కేబుల్లో ట్రేడింగ్ ప్రారంభంకానుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆగస్ట్లో ఐపీవో తదుపరి లిస్టింగ్ కాలాన్ని సగానికి కుదించింది. దీంతో టీ+6 నుంచి టీ+3కి లిస్టింగ్ కాలావధి తగ్గింది. ఆర్ఆర్ కేబుల్ ఇష్యూ సెప్టెంబర్ 13న మొదలై 15న ముగిసింది. సెప్టెంబర్ 1 నుంచి లిస్టింగ్ తాజా మార్గదర్శకాలు స్వచ్చంద ప్రాతిపదికన అమలులోకి వచ్చాయి. అయితే 2023 డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఆర్ఆర్ కేబుల్ ఈక్విటీ షేర్లు బీ గ్రూప్లో లిస్ట్కానున్నట్లు బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. -
గిఫ్ట్ సిటీ, ఎల్ఎస్ఈలలో లిస్టింగ్
న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్ఎస్ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్ఎస్ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
విడిగా వివిధ బిజినెస్ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్లోని బిజినెస్లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్లో అగర్వాల్ బిజినెస్ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్లు.. రిలయన్స్కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్లు), విదేశాల్లో లిస్టింగ్పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. -
అంబానీ మరో సంచలన నిర్ణయం: జూలై 20 ముహూర్తం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక అడుగు వేయబోతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ంగ్కు సిద్దమవుతున్నారు. మాతృ సంస్థ రిలయన్స్ గ్రూపు నుంచి విడిపోయేందుకు ఇప్పటికేఎన్సీఎల్టీ ఆమోదం పొందింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్) కొత్త ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో పొందేందుకు అర్హులైన కంపెనీ ఈక్విటీ వాటాదారులను నిర్ణయించే ఉద్దేశ్యంతో జూలై 20ని రికార్డ్ డేట్గా (షేర్స్ ఎలాట్మెంట్) నిర్ణయించినట్లు శనివారం తెలిపింది. ఈ స్కీం ఎఫెక్ట్ తేదీ జూలై 1, 2023 అని రెగ్యులేటర్ ఫైలింగ్లో రిలయన్స్ పేర్కొంది. స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్ఎస్ఐఎల్ ఈక్విటీ షేరును రూ. 10 ముఖ విలువతో జారీ చేస్తుంది. (HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్!) ఈ మార్చిలో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్)లుగా విడదీసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్)గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అలాగే హితేష్ కుమార్ సేథీ కొత్త సంస్థకు సీఎండీగా ఉంటారని కూడా ఆర్ఎస్ఐఎల్ ప్రకటించింది. (డైనమిక్ లేడీ నదియా: కిల్లర్ మూవ్తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు) జియో ఫైనాన్షియల్ నికర విలువ రూ. 1,50,000 కోట్లు. ఈ లిస్టింగ్ ద్వారా కంపెనీకి చెందిన 36 లక్షల మంది వాటాదారులకు లాభాల పంట పడనుంది. మరోవైపు గ్లోబల్ బ్రోకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్ ధర రూ. 189 ఉంటుందని అంచనా. ఈ డీమెర్జర్, లిస్టంగ్ తరువాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో ఐదో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు పేటీఎం, బజాజ్ ఫైనాన్స్తో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. -
ఎస్సీఐఎల్ఏఎల్ లిస్టింగ్ ఈ నెలలోనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్సీఐ నుంచి విడదీసిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ (ఎస్సీఐఎల్ఏఎల్) సంస్థ ఈ నెలలో స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్ట్ కానుంది. విభజన ప్రక్రియ కింద ఎస్సీఐ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) షేర్హోల్డర్లకు ఎస్సీఐఎల్ఏఎల్ షేర్లు లభించనున్నాయి. సంస్థ లిస్టింగ్ తర్వాత ఎస్సీఐ ప్రైవేటీకరణపై స్పష్టత వస్తుందని, అటుపైన ఫైనాన్షియల్ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2020 నవంబర్లో షిప్పింగ్ కార్పొరేషన్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రధాన వ్యాపారయేతర అసెట్స్ను ఎస్సీఐఎల్ఏఎల్ కింద విడగొట్టారు. గతేడాది మార్చి 31 నాటికి దీని విలువ రూ. 2,392 కోట్లు. ప్రస్తుతం ఎస్సీఐలో కేంద్రానికి 63.75 శాతం వాటాలు ఉన్నాయి. -
LIC: ఏడాదిలో రూ. 1.93 లక్షల కోట్లు ఆవిరి!
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్లు లిస్టయిన ఏడాది వ్యవధిలో 40 శాతం క్షీణించాయి. దీంతో రూ. 1.93 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఎల్ఐసీ గతేడాది ఐపీవో ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించి, రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో టాప్ 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. షేర్లు మే 17న ఇష్యూ రేటుతో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంటుకు బీఎస్ఈలో రూ. 872 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 867 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ప్రస్తుతం షేరు ఎన్ఎస్ఈలో 39.93 శాతం క్షీణించింది. బుధవారం రూ. 570 వద్ద ముగిసింది. తొలి ఏడాది ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 920ని, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 530.20ని తాకాయి. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) గురువారం కూడా షేరు ధర మరో 3 శాతం నష్టాలతో ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఇష్యూ ధరను మాత్రం దాటలేకపోయాయి. ఇదే వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 13.33 శాతం, నిఫ్టీ 11.82 శాతం పెరిగాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) -
ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తమ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఇందుకు వాటాదారులు, రుణదాతలు తాజాగా ఆమోదముద్ర వేశారు. తొలుత రిలయన్స్ స్ట్రాటజిక్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్) పేరుతో విడదీయనున్న కంపెనీని తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసులుగా మార్పు చేయనున్నారు. వాటాదారుల సమావేశంలో ఈ ప్రతిపాదనకు 99.99 శాతం ఓట్లు లభించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. కాగా.. ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ రూ. 10 ముఖ విలువగల ఆర్ఎస్ఐఎల్ షేరును జారీ చేయనున్నారు. తదుపరి ఆర్ఎస్ఐఎల్.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్)గా ఆవిర్భవించనుంది. సెప్టెంబర్కల్లా లిస్టింగ్ జెఫరీస్ రీసెర్చ్ వివరాల ప్రకారం జేఎఫ్ఎస్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో సెప్టెంబర్కల్లా లిస్ట్కానుంది. ఇందుకు అప్పటికల్లా అన్ని అనుమతులూ లభించగలవని అభిప్రాయపడింది. కంపెనీ వెనువెంటనే రుణ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. అసెట్ మేనేజ్మెంట్, జీవిత, సాధారణ బీమా విభాగాలకు నియంత్రణ సంస్థల అనుమతులను కోరనుంది. వీటిని 12–18 నెలల్లోగా పొందే వీలున్నట్లు జెఫరీస్ పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసేందుకు గతేడాది అక్టోబర్లో ఆర్ఐఎల్ గ్రూప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఐఎల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఆర్ఎస్ఐఎల్ వ్యవహరిస్తోంది. ఆర్బీఐ వద్ద రిజిస్టరై డిపాజిట్లు సమీకరించని ప్రధాన ఎన్బీఎఫ్సీగా కొనసాగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.2 శాతం బలపడి రూ. 2,448 వద్ద ముగిసింది. కామత్కు బాధ్యతలు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కేవీ కామత్ను జేఎఫ్ఎస్ఎల్కు నాన్ఎగ్జిక్యూటివ్గా చైర్మన్గా ఆర్ఐఎల్ ఎంపిక చేసింది. 2021–22లో ఈ విభాగం రూ. 1,536 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 27,964 కోట్ల సంయుక్త ఆస్తులను కలిగి ఉంది. బ్రోకింగ్ సంస్థ మెక్వారీ వివరాల ప్రకారం జియో ఫైనాన్షియల్ విలువ రూ. 1.52 లక్షల కోట్లకుపైనే. దేశీయంగా ఐదో అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థగా నిలవనుంది. -
ఎన్ఎస్ఈలో విరించి లిస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విరించి లిమిటెడ్ తాజాగా తమ షేర్లను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎక్సే్చంజీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు మాధవీ లత కొంపెల్ల, లోపాముద్ర కొంపెల్ల, ఈడీ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంటను మోగించడం ద్వారా షేర్ల లిస్టింగ్ను ప్రకటించారు. మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువయ్యేందుకు ఎన్ఎస్ఈలో లిస్టింగ్ దోహదపడగలదని వారు పేర్కొన్నారు. ఐటీ, హెల్త్ కేర్, పేమెంట్ తదితర సర్వీసులు అందించే విరించి షేర్లు ఇప్పటికే బీఎస్ఈలో ట్రేడవుతున్నాయి. సంస్థ షేరు బుధవారం ఎన్ఎస్ఈలో రూ. 35.70 వద్ద క్లోజయ్యింది. -
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చేస్తోంది: ఇక వాటికి పెట్టుబడుల వెల్లువ!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎస్ఎస్ఈ)ని ఏర్పాటు చేయడానికి సెబీ ఆమెదించిందని తెలిపింది. దీని ప్రకారం మార్చినుంచి ఎస్ఎస్ఈ మొదలు కానుందని చెప్పింది. దీని ప్రకారం ఏదైనా సామాజిక సంస్థ, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓపి) లేదా ఫర్-ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్పిఇలు), సామాజిక ఉద్దేశం ప్రాధాన్యాన్ని స్థాపించే సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజ్ విభాగంలో రిజిస్టర్ చేసుకోవచ్చు, లిస్టింగ్ కావచ్చు అని ఎన్ఎస్ఈ వెల్లడించింది. అంటే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుదారులుఈ సంస్థల షేర్లను కొనుగోలు చేయవచ్చు. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం, వాటికి దృశ్యమానతను అందించడానికి, సామాజిక సంస్థల ద్వారా నిధుల సమీకరణకు ఇది ఉపయోపడనుంది. అలాగే వినియోగంలో పారదర్శకతను పెంచడానికి సామాజిక సంస్థలకు కొత్త మార్గాన్ని అందించాలనేది కూడా తమ లక్ష్యమని ఎస్ఎస్ఈ పేర్కొంది ఈ సెగ్మెంట్లో అర్హత కలిగిన ఎన్ఓపీ నమోదు చేసుకోవచ్చు. తద్వారా వీటిని పెట్టుడుల సమీకరణకు ఆస్కారం లభిస్తుంది. ఆన్బోర్డింగ్ అర్హత కలిగిన ఎన్జీవో పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ (ZCZP) వంటి సాధనాలను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. నిబంధనల ప్రకారం ఇష్యూ పరిమాణం కోటి రూపాయలు, సబ్స్క్రిప్షన్ కనీస అప్లికేషన్ సైజును రూ. 2 లక్షలుగాను సెబీ నిర్దేశించింది. -
ఎన్ఎస్ఈలో జిమ్ ల్యాబ్ లిస్టింగ్
న్యూఢిల్లీ: జనరిక్ ప్రొడక్టుల హెల్త్కేర్ కంపెనీ జిమ్ ల్యాబొరేటరీస్ తాజాగా ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. శుక్రవారం రూ. 336 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 340 వద్ద గరిష్టం, రూ. 330 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 3 శాతం లాభంతో రూ. 332 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2018 జూన్లోనే లిస్టయిన స్మాల్ క్యాప్ కంపెనీ వారాంతాన ఎన్ఎస్ఈలోనూ లిస్టింగ్ను సాధించింది. విభిన్న, నూతన తరహా జనరిక్ ప్రొడక్టుల పోర్ట్ఫోలియోను అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, ఎండీ అన్వర్ డి. పేర్కొన్నారు. వీటిని ఈయూ మార్కెట్లలో ఫైలింగ్ చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రధానంగా నూతనతరహా డ్రగ్ డెలివరీ సొల్యూషన్స్ అందిస్తోంది. -
ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్ఐసీకి కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన దగ్గర్నుంచి ఇష్యూ ధర కన్నా దిగువనే ట్రేడ్ అవుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పనితీరును మార్చడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసి అధిక లాభాలు ఆర్జించడంపైనా, ఇన్వెస్టర్లకు మరింత రాబడులు అందించడంపైనా దృష్టి సారించాలని ఒత్తిడి పెంచుతోంది. (Jay Y Lee శాంసంగ్కు కొత్త వారసుడు, కొత్త సవాళ్లు) ఇందులో భాగంగా కొత్త తరాన్ని కూడా ఆకర్షించేలా పథకాల వ్యూహాలను మార్చుకోవాలని, లాభ దాయకతను పెంచేలా మరిన్ని టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టడాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ సమీక్షలో సూచించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయడం ద్వారా 65 ఏళ్ల సంస్థను ఆధునీకరించే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) అలాగే పథకాలను కూడా ఆధునీకరించేలా మేనేజ్మెంట్తో కలిసి పని చేస్తు న్నట్లు అధికారి వివరించారు. రూ. 902-949 ధర శ్రేణితో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. దీని ద్వా రా ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్లు వచ్చాయి. (Hero MotoCorp ఫిలిప్పైన్స్లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్ ) అయితే, మే 17న లిస్టింగ్ తొలి రోజే ఇష్యూ ధర కన్నా తక్కువగా రూ. 872 వద్ద లిస్టయిన ఎల్ ఐసీ షేరు అప్పటి నుంచి కోలుకోలేదు. ప్రస్తు తం రూ. 595 దగ్గర ట్రేడవుతోంది. కానీ వచ్చే ఏడా ది వ్యవధిలో ఎల్ఐసీ షేరు బాగా రాణిస్తుందని కొన్ని బ్రోకరేజీలు బులిష్గా ఉన్నాయి. రేటు రూ. 1,000 స్థాయికి చేరవచ్చని సిటీ అంచనా వేసింది. -
నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్’ మార్గం
ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ఎస్ఎంఈ ప్లాట్ఫామ్తోపాటు గాంధీనగర్ గిఫ్ట్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో లిస్ట్ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై 400 కంపెనీల లిస్టింగ్ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్ సిటీ ప్లాట్ఫామ్ లేదా ముంబై బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లేదా రెండింటిలో ద్వంద్వ లిస్టింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ఉంటుందన్నది పరిశీలించాలి. ► ద్వంద్వ లిస్టింగ్ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం. ► అంతర్జాతీయ ఫండ్లు కూడా ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్ వెల్త్ ఫండ్లు ఈ ఎక్సే్ఛంజ్ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్ఈ ప్రయత్నాలు జరపాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్ఫామ్లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి. ► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్జీసీ, టీఆర్ఈడీఎస్సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది. ► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు. ► స్టార్టప్ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్ 100 కంటే ఎక్కువ యునికార్న్లకు (బిలియన్ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు), 70–80 ‘సూనికార్న్లకు‘ (యూనికార్న్లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్తో అనుసంధానానికి బీఎస్ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ప్లాట్పామ్పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్లో బుల్ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కార్యక్రమంలో బీఎస్ఈ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఈ ఎంఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 60,000 కోట్లు దాటింది. -
స్టాక్ మార్కెట్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నమోదు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లను లిస్టింగ్కు అనుమతించడం ద్వారా పెట్టుబడుల సమీకరణ మార్గాలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశలో ఆర్ఆర్బీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు వీలుగా ఆర్థిక శాఖ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక మూలాలు తదితర అంశాలను రూపొందించింది. వీటి ప్రకారం గత మూడేళ్లలో కనీసం రూ. 300 కోట్ల నెట్వర్త్ను కలిగి ఉండాలి. అంతేకాకుండా నిబంధనలు డిమాండ్ చేస్తున్న 9 శాతం లేదా అంతకుమించిన కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్)ని గత మూడేళ్లలో నిలుపుకుని ఉండాలి. ఈ బాటలో మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తుండటంతోపాటు.. గత ఐదేళ్లలో మూడేళ్లు కనీసం రూ. 15 కోట్లు నిర్వహణ లాభం సాధించిన సంస్థనే లిస్టింగ్కు అనుమతిస్తారు. సంస్థ నష్టాలు నమోదు చేసి ఉండకూడదు. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు ఈక్విటీపై కనీసం 10 శాతం రిటర్నులు అందించిన సంస్థకు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో ఆర్ఆర్బీలు వ్యవసాయ రంగానికి రుణాలందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రస్తుతం ఆర్ఆర్బీలలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటాను కలిగి ఉంటోంది. మరో 35 శాతం సంబంధిత పీఎస్యూ బ్యాంకుల వద్ద, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. -
ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
లిస్టింగ్లోనే 100 శాతం లాభం. మరొకటి లిస్టింగ్ రోజే 150 శాతం లాభం ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) గురించి ఈ తరహా వార్తలు వింటుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఐపీవోలో షేర్లు అలాట్ అయితే లాభాల పంట పండినట్టే! అన్న వేలంవెర్రి కొన్ని సందర్భాల్లో మార్కెట్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇది అన్ని వేళలా ఉండే ధోరణి కాదు. బుల్ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటే అంచనాలు తప్పుతాయి. నష్టాలు పలకరిస్తాయి. గతేడాది మార్కెట్ల ర్యాలీ సమయంలో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లలో విపరీతమైన యూఫోరియా నెలకొంది. 2022 వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. స్టాక్స్ భారీ పతనంతో ఆ యూఫోరియా ఆవిరైపోయింది. మార్కెట్లో ఈ రకమైన అస్థిరతలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మార్కెట్లో నిలిచి గెలవాలంటే, పెట్టుబడులన్నవి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలనేది నిపుణుల మాట. ఐపీవోల్లో పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేసే కథనమిది... జొమాటో షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.76. లిస్టింగ్ ధర రూ.115. అక్కడి నుంచి రూ.169 వరకు వెళ్లింది. రూ.140 ధరలో ఉన్నప్పుడు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ రూ.175 వరకు పెరుగుతుందని లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ, ఒక జొమాటో షేరుకు రూ.41 మించి పెట్టడం దండగని వ్యాల్యూషన్ గురువుగా ప్రసిద్ధి చెందిన అశ్వత్ దామోదరన్ ఐపీవో సమయంలోనే సూచించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టు జొమాటో ఇటీవలే రూ.40.55కు పడిపోయి అక్కడి నుంచి కోలుకుంది. ఆ సందర్భంలో జొమాటో సహేతుక విలువ రూ.35 అంటూ దామోదరన్ సవరించారనుకోండి. ఒక్క జొమాటోనే అని కాదు. న్యూఏజ్ వ్యాపారాల్లో ఉన్న అన్ని ఐపీవోలు లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చినవే. అందుకే లాభాల వెర్రితనం కాకుండా.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఇన్వెస్ట్ చేయడం ద్వారానే విలువైన క్యాపిటల్ను కాపాడుకోవచ్చని మార్కెట్ పండితుల సూచన. 2021 జూలైలో జొమాటో ఐపీవోకు వచ్చింది. బ్లాక్బస్టర్గా 38 రెట్లు అధిక స్పందన అందుకుంది. రూ.9,000 కోట్ల ఐపీవోకు ఈ స్థాయి స్పందన అంటే చిన్నదేమీ కాదు. లిస్టింగ్లోనే 64 శాతం లాభాన్ని పంచింది. నైకా అయితే లిస్టింగ్ రోజే 96 శాతం లాభాలను ఇచ్చింది. ‘‘ఐపీవోలో ఒక కంపెనీ జారీ చేసే షేరు ధరను నిర్ణయించే విధానం ఈ ఏడాది మార్చి 31వరకు వేరుగా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సైతం నిధుల లభ్యత దండిగా ఉంది. దీంతో వారు రుణం తీసుకుని మరీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో రెట్ల అధిక స్పందనతో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగి ఆయా షేర్ల ధరల వృద్ధికి దారితీసింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐపీవో నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన ఐపీవోల్లో కేవలం ఒక్క ఇష్యూలోనే అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల కోటా (హెచ్ఎన్ఐలు) డబుల్ డిజిట్లో సబ్స్క్రయిబ్ కావడం గమనించాలి’’అని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ ‘క్రిస్’ డైరెక్టర్ అర్జున్ కేజ్రీవాల్ తెలిపారు. గతేడాది ఐపీవోకు వచ్చిన, కొత్తగా లిస్ట్ అయిన వాటిల్లో అధిక శాతం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోవడాన్ని గమనించొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో ఇవి ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఎన్నో ఉదాహరణలు... ప్రస్తుతం జొమాటో ధర (రూ.60)ను చూస్తే గరిష్ట స్థాయి (రూ.169) నుంచి 60 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. పాలసీబజార్ (పీబీ ఫిన్టెక్) గరిష్ట ధర (రూ.1,470) నుంచి చూస్తే 65 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. నైకా (ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) గరిష్ట ధర రూ.2,574 కాగా, 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఇక పేటీఎం అయితే ఇష్యూ ధర రూ.2,150 కాగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,961 మాత్రమే. ఈ ధర నుంచి చూస్తే 60 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాల్లో ఉన్న న్యూఏజ్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఐపీవోలకు వచ్చి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడాన్ని చూశాం. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ఈజీని ప్రమోట్ చేస్తున్న ఏపీఐ హోల్డింగ్స్ కూడా నష్టాల్లో నడుస్తున్నదే. ఈ సంస్థ కూడా ఐపీవోకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ, న్యూఏజ్ వ్యాపార కంపెనీల షేర్లు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోకు రావడం తగదని భావించి ఇటీవలే తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ తరహా షేర్ల వ్యాల్యూషన్ నిర్ణయ విధానం సంప్రదాయానికి భిన్నమైనది. వ్యాపారంలో భారీ వృద్ధి, భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాల ఆధారంగా వీటి షేర్ల ధర నిర్ణయమవుతుంటుంది. సుదీర్ఘకాలం పాటు (5–10–15–20 ఏళ్లు) వేచి చూస్తేనే.. ఇవి నిలిచి గెలుస్తాయా? లాభాలు కురిపిస్తాయా? అన్నది తేలుతుంది. కానీ, వీటిపై పెద్దగా అవగాహన లేని, ప్రణాళిక లేని ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కోసం, స్వల్పకాల లాభాల కోసం వీటికి దరఖాస్తు చేసుకుని నష్టపోయారు. అంతెందుకు ఎల్ఐసీ ఐపీవోనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా అధిక శాతం ఇన్వెస్టర్లలో మంచి అంచనాలే ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు, పాలసీదారులకు ఇష్యూ ధరలో డిస్కౌంట్ కూడా లభించింది. కానీ, లిస్టింగ్లో నిరాశపరించింది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి అది నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఒక్కో షేరు జారీ ధర రూ.949 కాగా, బీఎస్ఈలో నమోదైన గరిష్ట ధర రూ.920. అక్కడి నుంచి 30 శాతం నష్టపోయి రూ.700కు దిగువన ట్రేడ్ అవుతోంది. ఎల్ఐసీ బీమా రంగంలో గొప్ప కంపెనీ. భారీ లాభాల్లో ఉన్న బ్లూచిప్ సంస్థ. ఆ రంగంలో లీడర్. అయినా కానీ లిస్టింగ్లో లాభాలు పంచలేకపోయింది. దీనికి కారణం ప్రతికూల మార్కెట్ పరిస్థితులకుతోడు, ఎల్ఐసీ అధిక వ్యాల్యూషన్పై ఐపీవో రావడాన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం కోసం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ నష్టాల బెడద ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బీమా వ్యాప్తి 5 శాతం మించలేదు. కనుక భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకావాలు దండిగా ఉన్నాయి. అయినా కానీ, స్వల్పకాలంలో లాభాలకు ఇక్కడ హామీ ఉండదు. ఎందుకంటే..? ఇటీవలి ఐపీవోల్లో ఇన్వెస్టర్ల చేతులు కాలడం వెనుక నిపుణులు ప్రధానంగా.. ఆయా కంపెనీల ఫండమెంటల్స్కు తోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘గతేడాది వ్యవస్థలో నగదు లభ్యత పుష్కలంగా ఉంది. దీంతో కొత్త టెక్నాలజీ కంపెనీల ధరలను పరుగుపెట్టించింది. ఇప్పుడు నగదు లభ్యత కఠినతరంగా మారింది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ షేర్లపై ప్రభావం పడింది’’అని హేమ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆస్తాజైన్ పేర్కొన్నారు. వీటి వైపు చూడొచ్చా..? కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు రక్షణాత్మకం అని భావించొచ్చు. ‘‘జొమాటో షేరును గతేడాది ఇష్టపడని వారు లేరు. కానీ, ఇప్పుడు దీనికి అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నికరంగా నష్టాలనే ఇచ్చింది. బ్లింకిట్ కొనుగోలుతో లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. యాజమాన్యం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో బ్రేక్ ఈవెన్కు సంబంధించి అంచనాలను ప్రకటించింది. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు కూడా సందేహం లేదు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఇదొక మంచి ఉదాహరణ అవుతుంది’’అని జెఫరీస్ తన నివేదికలో ప్రస్తావించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ గత నెలలో నైకా షేరుకు బై రేటింగ్ ఇచ్చింది. మార్కెటింగ్పై అధిక వ్యయాలతో మార్జిన్లు తగ్గుతున్నందున ఇదే నైకా స్టాక్కు రెడ్యూస్ (తగ్గించుకోవడం) రేటింగ్ను ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రకటించింది. పేటీఎం, ఎల్ఐసీకి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. పాలజీబజార్కు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బై రేటింగ్ ఇచ్చింది. తిరిగి ఈ కంపెనీలు పూర్వపు ఆదరణ సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ఈ కంపెనీల మూలాలు మెరుగుపడాల్సి ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం కూడా అనుకూలించాలి’’అని ఆస్తాజైన్ పేర్కొన్నారు. మిస్ అయిపోతామన్న భయం వద్దు ఒక స్టాక్ను మిస్ అయిపోతామన్న ధోరణి (ఫోమో)కి దూరంగా ఉండాలన్నది స్టాక్ మార్కెట్ల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘టీబీఎంజీ క్యాపిటల్’ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ తెలిపారు. ఈ విధమైన ధోరణిని అనుసరించకుండా, ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లకు స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి, కావాల్సిన క్యాపిటల్ ఉంటే లాభాలను ఇవ్వదు. లక్ష్యాలు, కాల వ్యవధి పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడు తమ కాలవ్యవధి, రాబడుల అంచనాలకు అనుకూలమైన స్టాక్స్లో పెట్టుబడి చేసుకోవచ్చు. ఐదేళ్లు లేదా పదేళ్ల కోసం, భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాలతో ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తే, లిస్టింగ్ తర్వాత నష్టాల్లోకి వెళ్లిందని విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు లాభాల్లోకి వస్తామన్నది తమకు తెలియదని జొమాటో ఫౌండర్ గోయల్ ఐపీవో ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దీర్ఘకాలం కోసమే తాము వ్యాపారాన్ని నిర్మిస్తున్నామనే అంటున్నారు. కనుక దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ∙ కొందరు లిస్టింగ్ రోజు లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న ఒకే ఆలోచనతో డిమాండ్ ఉన్న ఐపీవోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వారు లిస్టింగ్ రోజు లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే విక్రయించుకోవాల్సిందే. జొమాటో ఐదేళ్లలో లాభాల్లోకి వస్తుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పటి వరకు వేచి చూసి, కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు ఆధారంగా నిర్ణయానికి రావాలి. స్టాక్స్ ఎప్పుడూ పడి లేచే కెరటాలే. కాకపోతే మంచి యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్న కంపెనీలకే ఇది అమలవుతుంది. ఇక అసలు నష్టాల్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లకపోవడం రిస్క్ వద్దనుకునే వారికి మెరుగైన మార్గం. వివిధ రంగాల్లో లీడర్లుగా ఉన్న బ్లూచిప్ కంపెనీల్లో రిస్క్ దాదాపుగా ఉండదు. రాబడులు మోస్తరుగా ఉంటాయి. అధిక రాబడి ఆశించే వారు, అధిక రిస్క్ తీసుకుంటున్నట్టే. అది కూడా తగినంత అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా కాలిక్యులేటెడ్ రిస్క్కే పరిమితం కావాలి. -
బీమా కంపెనీలు లిస్టింగ్కు వెళ్లాలి!
ముంబై: పెట్టుబడులను సులభంగా సమీకరించేందుకు వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ను పరిశీలించవచ్చని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా బీమా కంపెనీలు లిస్టింగును సాధించవచ్చని తెలియజేశారు. దీంతో బిజినెస్లో వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. అంతేకాకుండా దేశీయంగా బీమా విస్తృతికి సైతం లిస్టింగ్స్ దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బీమా రంగ కంపెనీలను ఐపీవోలకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే మార్కెట్లో 60 శాతం లిస్టయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది అత్యధిక పారదర్శకత, సమాచార వెల్లడికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కంపెనీలు మరింత పురోగమించడానికి లిస్టింగ్ దోహదపడుతుందని, అంతిమంగా ఇది బీమా రంగ వ్యాప్తికి కారణమవుతుందని వివరించారు. ఐఆర్డీఏ చైర్మన్గా పాండా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బీమా రంగ సంస్థలతో రెండు రోజులుగా ఇక్కడ పాండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రూ.100 కోట్ల ప్రవేశ నిబంధన ఎత్తివేయాలి బీమా వ్యాపారం ప్రారంభించేందుకు కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పరిమితిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. ప్రస్తుత నిబంధన సదుపాయ కల్పన కంటే అడ్డంకిగా ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు ప్రవేశానికి వీలుగా పరిమితిని ఎత్తివేయడం లేదా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించండి ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు ఐఆర్డీఏ ఆదేశం సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించాలంటూ మూడు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ను ఐఆర్డీఏ ఆదేశించింది. ఈ మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు సంబంధించి కొంత సమాచారాన్ని ప్రభుత్వం కోరిందని, దాన్ని అందించినట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ పాండా తెలిపారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిధులను అందించే అవకాశం ఉందన్నారు. ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా, ఇతర సీనియర్ అధికారులు, సభ్యులు, బీమా సంస్థల ఉన్నతాధికారుల సమావేశం గురువారం ముంబైలో జరిగింది. -
ఎల్ఐసీ ఐపీవోపై యుద్ధం ఎఫెక్ట్
న్యూఢిల్లీ: వారం రోజులుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ముడిచమురు, బంగారం ధరలకు రెక్కలురాగా.. డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల బాటలో దేశీయంగానూ ఇండెక్సులు భారీ ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్ను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి గరిష్ట విలువ లభించేందుకు అనువైన పరిస్థితులున్నప్పుడు మాత్రమే ఐపీవోకు వెళ్లడం ఉచితమని భావిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. -
మార్చిలో లిస్టింగ్కు సన్నాహాలు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మార్చిలో లిస్టింగ్ చేసేందుకు సన్నద్ధమై ఉన్నట్లు కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ తాజాగా పేర్కొన్నారు. అయితే ఇటీవల రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆరి్థక సంవత్సరం(2021–22) ముగిసేలోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా దాడిచేయనున్న అంచనాలతో అమెరికా అప్రమత్తమైన నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశి్చత పరిస్థితులు తలెత్తడంతో స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. మరోపక్క యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపులో సాగనున్న సంకేతాలు ఇస్తోంది. దీంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–18 మధ్య నికరంగా రూ. 18,856 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి వరుసగా ఐదో నెలలోనూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్న ట్లు కుమార్ తాజాగా పేర్కొన్నారు. కాగా.. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 63,000 కోట్ల సమీకరణతో సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. వీళ్లకూ డిస్కౌంట్..: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన(పీఎంజేజేబీవై) సబ్్రస్కయిబర్లకు సైతం ఎల్ఐసీ ఐపీవో ధరలో డిస్కౌంటును అందించనున్నట్లు కుమార్ వెల్లడించారు. పాలసీదారులకు ఇస్తున్నట్లే వీరికీ తగ్గింపును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన పీఎంజేజేబీవై పొదుపు ఖాతా కలిగిన 18–50 ఏళ్ల వయసులోపు వారికి రూ. 330 వార్షిక ప్రీమి యంతో రూ. 2 లక్షల బీమా కవరేజీ అందిస్తోంది. ఎల్ఐసీ.. ద లీడర్ బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ ప్రభుత్వ రుణ సాధనాలలో అత్యధిక స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా నిలుస్తున్నట్లు స్వీస్ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ తాజాగా పేర్కొంది. మొత్తం జీసెక్యూరిటీస్లో 19 శాతాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈక్విటీలలోనూ అతిపెద్ద వాటాదారు, ఫండ్ మేనేజర్గానూ నిలుస్తున్నట్లు తెలియజేసింది. 520 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదికలో యూబీఎస్ పేర్కొంది. మొత్తం ఈక్విటీలలో 4 శాతం వాటాతో ప్రభుత్వం(ప్రమోటర్) తదుపరి ఒకేఒక అతిపెద్ద వాటాదారుగా రికార్డును నెలకొలి్పనట్లు వివరించింది. 2021 డిసెంబర్కల్లా బ్లూచిప్ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్లో 10 శాతం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీలలో 5 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంది. వీటితోపాటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎస్బీఐలో 4 శాతం వాటా ఉంది. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీలోనూ 4 శాతం వాటాను పొందింది. ప్రతిఏటా కుటుంబ పొదుపు రూ. 100లో రూ. 10 వరకూ ఎల్ఐసీకి చేరుతున్నట్లు తెలియజేసింది. -
నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్
ముంబై: సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ–కామర్స్ వేదిక ‘నైకా’ లిస్టింగ్లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.., ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్ను ముగిచింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3.43 కోట్ల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. తద్వారా దేశీయ ఎక్సే్చంజీల్లోని లిస్టెడ్ కంపెనీల్లో 55వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ–కామర్స్ విభాగంలో ఈ స్థాయి లాభాలతో ఎక్సే్చంజీల్లో లిస్టయిన తొలి కంపెనీ ఇది. నైకా బంపర్ లిస్టింగ్ ఊతంతో కంపెనీ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ కుటుంబ సంపద ఏకంగా 7.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. కంపెనీలో ప్రమోటర్ కుటుంబానికి 54.22% వాటాలు ఉన్నాయి. క్లోజింగ్ ధర ప్రకారం వీటి విలువ సుమారు 55,900 కోట్లు (7.5 బిలియన్ డాలర్లు). చదవండి: వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ - మంత్రి కేటీఆర్ -
ఈ వారం ఐపీవోల టార్గెట్ రూ.21,000 కోట్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ మూడు ఐపీఓలతో పాటు రెండు లిస్టింగ్లు ఈ వారం సందడి చేయనున్నాయి. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ సేవలందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్తో పాటు.. కేఎఫ్సీ, పిజ్జా హట్ ఔట్లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్, ఐటీ సర్వీసుల సంస్థ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.21,000 కోట్లను సమీకరించనున్నాయి. ఈ వారంలో రెండు లిస్టింగ్లు... గత వారంలో ఐపీఓను పూర్తి చేసుకున్న ఒమ్ని చానెల్ బ్యూటీ ప్రొడక్ట్ రిటైలర్ నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ షేర్లు గురు, శుక్రవారాల్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. నైకా ఒక్కో షేరుకు రూ.1,085–రూ.1,125 మధ్య ధర శ్రేణిని నిర్ణయించి రూ.5,352 కోట్లను సమీకరించింది. ఇష్యూ 81.78 రెట్ల సబ్స్క్రిబ్షన్ను సాధించింది. గ్రే మార్కెట్లో ఇష్యూ గరిష్ట ధర(రూ.1,125)తో పోలిస్తే రూ.650 అధికంగా ట్రేడ్ అవుతున్నందుగా ప్రీమియం ధరతో లిస్ట్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఫినో పేమెంట్స్ ఒక్కో షేరును రూ.560 – రూ.577 ప్రైస్బ్యాండ్తో జారీ చేసి రూ. 1,200 కోట్లను సమీకరించింది. ఈ పబ్లిక్ ఇష్యూ 2.03 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఈవారం మార్కెట్లో ఐపీవోల వివరాలు ఇష్యూ పేరు ప్రారంభం ముగింపు ఇష్యూ సైజు పేటీఎమ్ సోమవారం బుధవారం రూ.18,300 కోట్లు సఫైర్ ఫుడ్స్ మంగళవారం గురువారం రూ. 2,073 కోట్లు లేటెంట్ వ్యూ బుధవారం శుక్రవారం రూ. 600 కోట్లు చదవండి: 4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్: సైబర్ఎక్స్9 -
మానిటైజేషన్కు ఎన్టీపీసీ రెడీ
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ తాజాగా డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ఆవిష్కరించింది. మూడు అనుబంధ సంస్థలను లిస్టింగ్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వీలున్నట్లు తెలియజేసింది. జాబితాలో ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్(ఎన్వీవీఎన్), నార్త్ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(నీప్కో)తోపాటు.. ఏడాది కాలమే ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ(ఎన్ఆర్ఈఎల్) ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా స్టీల్ పీఎస్యూ సెయిల్తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ నుంచి సైతం వైదొలగనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఎన్ఆర్ఎల్ను వచ్చే ఏడాది అక్టోబర్కంటే ముందుగానే లిస్టింగ్ చేయనున్నట్లు ఎన్టీపీసీ చైర్మన్, ఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన విభాగంలో 2020 అక్టోబర్లో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి 7–8 గిగావాట్ల సామర్థ్యాన్ని జత కలుపుకుంటున్నట్లు గురుదీప్ తెలియజేశారు. పవర్ ట్రేడింగ్కు ఏర్పాటు చేసిన కంపెనీ ఎన్వీవీఎన్ తదుపరి ఫ్లై యాష్ ట్రేడింగ్, వినియోగం, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ మొబిలిటీ, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టింది. గతేడాది మార్చిలో నీప్కోలో ఎన్టీపీసీ 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. కంపెనీ 7 హైడ్రో, 3 థర్మల్, 1 సోలార్ పవర్ స్టేషన్లను నిర్వహిస్తోంది. 2,057 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 50:50 శాతం వాటాతో ఏర్పాటైన ఎన్టీపీసీ– సెయిల్ జేవీ దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్లలో సెయిల్ సొంత అవసరాలకు వీలుగా 814 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లను నెలకొలి్పంది. -
ఎగుమతులకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ లిస్టింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఐదేళ్లలో (2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–2026 ఆర్థిక సంవత్సరం వరకూ)మూలధనంగా కంపెనీకి రూ.4,400 కోట్లు సమకూర్చడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థ మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేయగలుగుతుందని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. ఎగుమతుల రంగం పురోగతికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుందని, ఇందులో సెప్టెంబర్ ముగింపునకు 190 బిలియన్ డాలర్లకు చేరువవుతున్నామని తెలిపారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎగుమతుల పురోగతికి ఈసీజీసీ తమ సామర్థ్యాన్ని మరింత పటిష్ట చేసుకోడానికి దోహదపడుతుందని వివరించారు. తక్షణం ఈసీజీసీకి రూ.500 కోట్లు మూలధనంగా సమకూర్చుతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.500 కోట్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈసీజీసీ లిస్టింగ్ ప్రక్రియను కేంద్రం త్వరలో ప్రారంభిస్తుందని, వచ్చే ఏడాది ఆఫర్ మార్కెట్లోకి వస్తుందని వెల్లడించారు. ఎన్ఈఐఏ స్కీమ్ కొనసాగింపు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్ఈఐఏ) స్కీమ్ కొనసాగింపునకు, అలాగే వచ్చే ఐదేళ్లలో రూ.1,650 కోట్ల మేర గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించడానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.ఈ చర్య ద్వారా సంఘటిత రంగంలో దాదాపు 12,000సహా మొత్తం 2.6 లక్షల నూతన ఉద్యోగ కల్పన జరుగుతుందని మంత్రి వివరించారు. 2022 మార్చి వరకు ఈసీఎల్జీఎస్ స్కీమ్ చిన్న సంస్థలకు మరింత చేయూత కోసమే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయంచింది. 2020లో తీసుకొచి్చన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెపె్టంబర్ 30తో ముగిసిపోవాలి. కానీ, 2020 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల మండళ్లు, ఇతర భాగస్వాముల నుంచి డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ‘‘కరోనా రెండో విడత వల్ల ప్రభావితమైన పలు వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు 2020 మార్చి 31 వరకు ఈసీఎల్జీఎస్ పథకం గడువును పొడిగించాలని నిర్ణయించడమైనది. లేదా రూ.4.5 లక్షల కోట్ల రుణాల మంజూరు లక్ష్యం పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. ఈ పథకం కింద రుణాల విడుదలకు చివరి తేదీగా 2020 జూన్ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు.. అదనంగా మరో 10% (మిగిలిన రుణంలో) లభిస్తుందని పేర్కొంది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటి వరకు సాయం పొందని సంస్థలు.. 30 శాతాన్ని (తమ రుణ బకాయిల మొత్తంలో) తాజా రుణం కింద తీసుకోవచ్చని సూచించింది. ఈసీఎల్జీఎస్ 3.0 కింద ప్రకటించిన రంగా ల్లోని కంపెనీలకు ఇది 40%గా అమలు కానుంది. -
2 నెలల్లో 30 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న ప్రైమరీ మార్కెట్ మరోసారి కళకళలాడనుంది. రానున్న రెండు నెలల్లో కనీసం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా రూ. 45,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశమున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే పైచేయిగా నిలవనున్నట్లు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో చేపట్టిన ఐపీవో విజయవంతంకావడంతో పలు టెక్నాలజీ సంబంధ కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. తొలుత పీఈ ఫండ్స్ జొమాటో తదితర ఆధునికతరం కంపెనీలు తొలుత ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల సెకండరీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. దీంతో టెక్ ఆధారిత నవతరం కంపెనీలకు ఐపీవోలు మరో మార్గాన్ని చూపుతున్నాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు క్యూ కడుతున్నట్లు ఏంజెల్ వన్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. కారణాలివీ. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోనుందన్న అంచనాలకుతోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్లకు జోష్నిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డ్ స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటం దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సెకండరీ మార్కెట్ బాటలో ప్రైమరీ మార్కెట్ సైతం సందడి చేస్తున్నట్లు వివరించారు. ఇకపైన ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదిపాటు మార్కెట్లు బుల్ జోరులో కదిలే వీలున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌశలేంద్ర జెరోధా, ట్రూ బీకన్ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం ఇందుకు దోహదం చేయనున్నట్లు అంచనా వేశారు. 40 కంపెనీలు ఈ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 64,217 కోట్లు సమీకరించాయి. బుధవారం నుంచీ ప్రారంభకానున్న ఐపీవో ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ. 2,778 కోట్లు సమకూర్చుకోనుంది. మరోవైపు వాటాల విక్రయం ద్వారా పవర్గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున నిధులను సమీకరించాయి. కాగా.. 2020లో 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు మాత్రమే సమకూర్చుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2017లో మాత్రమే 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను ఐపీవోల ద్వారా అందుకున్నాయి. జాబితా ఇలా.. అక్టోబర్–నవంబర్లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో పాలసీ బజార్ రూ. 6,017 కోట్లు, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 1,900 కోట్లు తదితరాలున్నాయి. జాబితాలో ఇంకా నార్థర్న్ ఆర్క్ క్యాపిటల్ రూ. 1,800 కోట్లు, శాఫైర్ ఫుడ్స్ రూ. 1,500 కోట్లు, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,330 కోట్లు, స్టెరిటైల్ పవర్ రూ. 1,250 కోట్లు, రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్సైన్స్ రూ. 1,200 కోట్లు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
డీలిస్టింగ్పై సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: లిస్టెడ్ అనుబంధ సంస్థల డీలిస్టింగ్ విషయంలో హోల్డింగ్ కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రామాణిక నిర్వహణ విధానాలను ప్రకటించింది. సర్దుబాటు పథకంలో భాగంగా లిస్టెడ్ అనుబంధ సంస్థను లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ స్టాక్ ఎక్సే్ంజీల నుంచి డీలిస్ట్ చేయదలచినప్పుడు రివర్స్ బుక్ బిల్డింగ్ పద్ధతి నుంచి మినహాయింపునకు సెబీ ఇటీవల అనుమతించింది. ఇందుకు వీలుగా పూర్తిస్థాయి నిబంధనలను తాజాగా విడుదల చేసింది. లిస్టయిన అనుబంధ సంస్థలు, హోల్డింగ్ కంపెనీలు ఒకే విధమైన బిజినెస్లు నిర్వహిస్తున్నప్పుడు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. వీటి ప్రకారం రెండు కంపెనీలు కలసిపోవడం ద్వారా భారీ ప్రయోజనాలకు అవకాశముండాలి. రెండు కంపెనీల ఆదాయంలో కనీసం 50 శాతం ఒకే బిజినెస్ నుంచి నమోదవుతూ ఉండాలి. అంతేకాకుండా రెండు సంస్థలూ ఒకే గ్రూప్నకు చెంది ఉండాలి. రెండు సంస్థలూ కనీసం మూడేళ్లుగా స్టాక్ ఎక్సే్ంజీలలో లిస్టయి ఉండాలి. వెరసి జూన్లో నోటిఫై చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సెబీ తాజాగా పలు నిబంధనలను విడుదల చేసింది. -
ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. వీటిపై కన్నేయండి
మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా..? 2020లో 15 ప్రధాన ఐపీవోలకు గాను 14 కంపెనీల స్టాక్స్ ఇప్పుడు వాటి ఇష్యూ ధరకు పైనే ట్రేడవుతున్నాయి. వీటిల్లో చాలా కంపెనీల రాబడులు 200 శాతానికంటే ఎక్కువే ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పటికే 400 శాతం రాబడులను కూడా ఇచ్చాయి. 11 స్టాక్స్ లిస్టింగ్ రోజు నుంచే లాభాలతో మొదలు పెట్టగా.. 6 స్టాక్స్ లిస్టింగ్ రోజే 70 శాతానికి పైగా లాభాన్నిచ్చాయి. ఈ గణాంకాలను చూసి ప్రతీ ఐపీవోను ఆకర్షణీయమైనదిగా భావించడానికి లేదు. ఐపీవోల్లో మీరు చేసే పెట్టుబడులు లాభాలు పంచి పెట్టాలంటే.. ఇన్వెస్టర్గా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో మొదటిసారి లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పించేదే ఐపీవో. మార్కెట్లలో లిస్ట్ అయిన తర్వాత ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక గణాంకాలను వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, అదే కంపెనీకి సంబంధించిన సమాచారం లిస్టింగ్కు ముందు సాధారణంగా బయటకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఐపీవోలకు వచ్చే కంపెనీలు ఆర్థిక గణాంకాలను డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో (డీహెచ్ఆర్పీ)లో ఇవ్వడం తప్పనిసరి. కానీ, వీటిని గుడ్డిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే కంపెనీలు మార్కెట్ల నుంచి అనుకున్న విధంగా నిధులు సమీకరించేందుకు అనుకూలమైన నివేదికలను రూపొందించే అవకాశం లేకపోలేదు. నిష్పాక్షికంగా వీటిని రూపొందించారని భావించలేము. కనుక ఐపీవోకు దరఖాస్తు చేసుకునే ముందు కంపెనీకి సంబంధించి విస్తృతమైన పరిశోధన చేసి, వీలైనంత సమాచారాన్ని రాబట్టుకోవాలి. ప్రమోటర్ల చరిత్ర, వారిపై ఏవైనా నేరపూరిత అభియోగాలు/ఆరోపణలు ఉన్నాయా?, ఆర్థిక పరిస్థితులు, కంపెనీకి పోటీదారులు, మీడియాలో వాటికి వచ్చిన కవరేజీ, కంపెనీ పనిచేస్తున్న రంగం విస్తరించడానికి అవకాశం ఉందా తదితర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఐపీవోలో మంచి రాబడులను సంపాదించుకోవాలని భావిస్తే ఆయా కంపెనీకి సంబంధించి వీలైనంత సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. కంపెనీ వ్యాల్యూయేషన్స్.. ఐపీవోలో తమకు సెక్యూరిటీల కేటాయింపులపైనే ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. కానీ, చాలా మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు, ఐపీవోలో స్టాక్స్ వ్యాల్యూయేషన్ల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించారు. అయితే, ఐపీవోకు వచ్చే కంపెనీ మూలాలపై లోతైన పరిశోధనకు.. డీఆర్హెచ్పీలో ఇచ్చిన వివరాలు మినహా అదనపు వివరాలు లభించడం కష్టమైన పనే. సాధారణంగా ఐపీవోకు వచ్చే కంపెనీలు అధిక ధరలకు స్టాక్స్ను ఆఫర్ చేస్తుంటాయి. కనుక ఆయా కంపెనీ పనిచేస్తున్న రంగంలోని పోటీ కంపెనీల వ్యాల్యూయేషన్ల్లతో పోల్చి చూడొచ్చు. పోటీ సంస్థల వ్యాల్యూయేషన్లు లేదా ఆయా రంగాల్లోని కంపెనీల వ్యాల్యూయేషన్ల ఆధారంగా నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ల భాగస్వామ్యం.. ఐపీవోల్లో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (క్యూఐబీ/అర్హత కలిగిన సంస్థాగత మదుపుదారులు) కూడా పాలుపంచుకుంటుంటారు. సెబీ వద్ద నమోదైన ఫైనాన్షియల్ ఇన్నిస్టిట్యూషన్స్, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) క్యూఐబీ విభాగం కిందకు వస్తాయి. ఇవి సాధారణంగా ఇతర ఇన్వెస్టర్ల తరఫున ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక ఇన్వెస్ట్ చేసే ముందు తగినంత పరిశోధన, అధ్యయనం తప్పక చేస్తాయి. క్యూఐబీలు ఆసక్తిగా ఒక ఐపీవోలో పాల్గొంటున్నారంటే.. ఆ కంపెనీ భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందని ఎక్కువ మంది బెంచ్మార్క్గా పరిగణిస్తుంటారు. అయితే, నేటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లోనూ క్యూఐబీల భాగస్వామ్యాన్నే ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఒక్కోసారి క్యూఐబీలు సైతం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. డీఆర్హెచ్పీ చదవాలి ఐపీవోకు వచ్చే ప్రతీ కంపెనీ కూడా తమ వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు, ఆస్తులు, అప్పులు, మార్కెట్ అవకాశాలపై సమగ్రమైన వివరాలను డీఆర్హెచ్పీలో అందుబాటులో ఉంచడం తప్పనిసరి. అంతేకాదు, ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ఎందుకు వినియోగించేదీ తెలియజేయాలి. అందుకే ఇన్వెస్టర్లు తాము ఆసక్తిగా ఉన్న ఐపీవోలకు సంబంధించి డీఆర్హెచ్పీని సమగ్రంగా చదవాలి. కొన్ని కంపెనీలు డీఆర్హెచ్పీని తమకు అనుకూలంగా రూపొందించే అవకాశాల్లేకపోలేదు. కానీ, వివరాలను విశ్లేషణా దృష్టితో చూస్తే తప్పక ఒక అవగాహనకు రావచ్చు. అప్పటి వరకు కంపెనీ పనితీరు ఎలా ఉన్నదీ చూడాలి. అలాగే, ఐపీవో రూపంలో సమీకరించే నిధులను ఎందుకు వినియోగిస్తుందన్నది గమనించాలి. కంపెనీ వ్యాపార విస్తరణ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించేట్టు అయితే భవిష్యత్తులో ఆ కంపెనీ మరింతగా వృద్ధి సాధిస్తుందన్న దానికి సంకేతాలుగా చూడొ చ్చు. ఒకవేళ ఐపీవో నిధులతో రుణబారం తీర్చుకోవాలని భావిస్తే.. నిజానికి ఆ కంపెనీకి ఉన్న లయబులిటీస్ (అప్పులు) ఏ మేరకు అన్నది చూడాల్సి ఉంటుంది. టెక్నాలజీ వినియోగం ఒక ఐపీవోపై నిర్ణయం తీసుకోవాలంటే చూడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ఈ పని చేయాలి. నేడు పెట్టుబడుల సిఫారసులు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అవి ఒక బిలియన్ కంటే ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించి ఐపీవోపై సలహా సేవలు అందిస్తున్నాయి. కావాలంటే వాటి సాయాన్ని తీసుకోవచ్చు. జ్యోతిరాయ్, డీవీపీ–ఈక్విటీ స్ట్రాటజిస్ట్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ -
గ్లాండ్ ఫార్మా ఐపీవో సోమవారమే
ముంబై: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన హెల్త్ కేర్ కంపెనీ గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సోమవారం(9న) ప్రారంభంకానుంది. షేరుకి రూ. 1,490-1,500 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. బుధవారం(11) ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 3.5 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూకి 13 షేర్లు ఒక లాట్ కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వారాంతాన షేరుకి రూ. 1,500 ధరలో యాంకర్ సంస్థలకు 1.29 కోట్లకుపైగా షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,944 కోట్లు సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ కంపెనీల జాబితాలో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, గోల్డ్ మన్ శాక్స్, సింగపూర్ ప్రభుత్వ సంస్థతోపాటు.. 18 దేశీ మ్యూచువల్ ఫండ్స్ చేరాయి. చైనీస్ పేరెంట్.. ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. అతిపెద్ద ఇష్యూ దేశీయంగా గ్లాండ్ ఫార్మా అతిపెద్ద ఫార్మా ఐపీవోగా ఆవిర్భవించనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఎరిస్ లైఫ్ సైన్సెస్(2017) రూ. 1,741 కోట్లను సమీకరించింది. 2015లో ఐపీవోకు వచ్చిన ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ రూ. 1,350 కోట్లు, 2016లో లిస్టయిన లారస్ ల్యాబ్స్ రూ. 1,350 కోట్లను సమకూర్చుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది. -
విదేశాలలో రిలయన్స్ జియో లిస్టింగ్!
అనుబంధ డిజిటల్, మొబైల్ విభాగం రిలయన్స్ జియోను విదేశాలలో లిస్ట్ చేసే యోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి విదేశాలలో రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వెళ్లే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా రియలన్స్ జియో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలలో 5 డీల్స్ కుదుర్చుకోవడం ద్వారా 10.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 77250 కోట్లు)ను సమకూర్చుకుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 5.7 బిలియన్ డాలర్లను వెచ్చించడం ద్వారా రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటాను సొంతం చేసుకోగా.. పలు పీఈ సంస్థలు సైతం స్వల్ప స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. ఫలితంగా జియో ప్లాట్ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.15 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దీంతో అల్ఫాబెట్, టెన్సెంట్, అలీబాబా వంటి దిగ్గజాలతో పోల్చవచ్చని పేర్కొంటున్నారు. రిటైల్ సైతం ఐదేళ్లలోగా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బిజినెస్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గతేడాది ఆగస్ట్లో పేర్కొన్నారు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా పలు విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకోనున్నట్లు తెలియజేశారు. కాగా.. దేశీ కంపెనీలు డైరెక్ట్గా విదేశాలలో లిస్టయ్యేందుకు వీలుగా అవసరమైన నిబంధనలను సవరించనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. తద్వారా దేశీ కంపెనీలకు విదేశీ నిధుల లభ్యతను పెంచేందుకు వీలు కలుగుతుందని వివరించింది. అయితే పన్ను సంబంధిత, విదేశీ మారక నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ భారం తగ్గింపు ఓవైపు రిలయన్స్ జియోలో వాటాల విక్రయం ద్వారా 10.3 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోవైపు రైట్స్ ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 53,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. నిధులలో అధిక శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2021 మార్చికల్లా రుణ రహిత కంపెనీగా నిలవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
సీఎస్బీ బ్యాంక్ లిస్టింగ్.. భేష్
న్యూఢిల్లీ: సీఎస్బీ బ్యాంక్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్లోనూ, ముగింపులోనూ మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర రూ.195తో పోల్చితే లిస్టింగ్లో 41 శాతం లాభాన్ని, ముగింపులో 54 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. రూ.193–195 ప్రైస్బ్యాండ్తో వచ్చిన ఈ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 87 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. బుధవారం సీఎస్బీ బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో ఇష్యూ ధర, రూ.195తో పోల్చితే 41 శాతం లాభంతో రూ. 275 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 57 శాతం లాభంతో రూ. 307 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 40.2 లక్షలు, ఎన్ఎస్ఈలో 3.7 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్రూ.5,205 కోట్లకు చేరింది. ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్ రూ.410 కోట్లు సమీకరించింది. -
మార్కెట్లోకి ‘బిగ్బాస్’?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేసే రోజు భవిష్యత్తులో చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణ/వాటాల అమ్మకాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు ప్రాధా న్యం ఇస్తుండడంతో, ఎల్ఐసీ లిస్టింగ్ కూడా ప్రభుత్వ అజెండాలో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఐపీవో ద్వారా స్వల్ప మొత్తంలో వాటాలను ప్రభుత్వం విక్రయించే చాన్స్ ఉందని సమాచారం. ఎల్ఐసీ తొలిదశ ఐపీవోకు అధిక ప్రీమి యం ఉంటుందని అంచనా. ఈక్విటీ చిన్నది కావడమే దీనికి కారణం. ఎల్ఐసీలో వాటాల అమ్మకం ఆరంభ దశలో ఉందని, ఈ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సంబంధిత వర్గాల సమాచారం. విలువ అధికం... ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. స్టాక్ ఎక్సే్ఛంజ్లో ఎల్ఐసీ గనుక లిస్ట్ అయితే మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ను దాటిపోతుందని అంచనా. రూ.5 కోట్ల ఈక్విటీ ఆధారంగా వేసిన అంచనా ఇది. లిస్ట్ చేయడం వల్ల ఖాతాలు మరింత పారదర్శకంగా నిర్వహించడంతోపాటు, పెట్టుబడులు, రుణాల పోర్ట్ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి వస్తుంది. ఇది మరింత మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్కు దారితీస్తుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర సర్కారు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలను లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఐసీలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే అందుకు ఎల్ఐసీ చట్టం 1956లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం... ఎల్ఐసీ పాలసీలు అన్నింటికీ వాటి సమ్ అష్యూర్డ్, బోనస్లు చెల్లించే విషయంలో ప్రభుత్వం హామీదారుగా ఉంటోంది. పెట్టుబడుల కొండ ఎల్ఐసీ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం చూస్తే... డిబెంచర్లు, బాండ్లలో రూ.4,34,959 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, ఎన్నో మౌలిక రంగ ప్రాజెక్టులకు రూ.3,76,097 కోట్లను రుణాలుగా సమకూర్చింది. అదే ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడులపై రూ.23,621 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఈక్విటీలలో ఆ ఏడాది రూ.68,621 కోట్లు పెట్టుబడులు పెట్టింది. రూ.5 కోట్ల మూలధనంతో ఎల్ఐసీ సంస్థ ఏర్పాటు కాగా, ఐఆర్డీఏఐ నిబంధనల మేరకు బీమా సంస్థల కనీస ఈక్విటీ రూ.100 కోట్లుగా ఉండాలి. ఈక్విటీ చిన్నదే అయినప్పటికీ, ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీ నిర్వహణలో భారీ ఆస్తులు ఉన్నాయి. 2018–19లో ఎల్ఐసీ పెట్టుబడుల మార్కెట్ విలువ వార్షికంగా 8.61 శాతం పెరిగి రూ.28.74 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.26.46 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేషన్ మొత్తం ఆస్తులు రూ.31.11 లక్షల కోట్లకు చేరాయన్నది అంచనా. ‘‘అధికారికంగా ప్రకటించినా, ప్రకటించకపోయినా కానీ ఎల్ఐసీ వ్యవస్థాపరంగా చాలా ముఖ్యమైన బీమా సంస్థ. ఐఎల్అండ్ఎఫ్ఎస్ తదితర వెంచర్ల బెయిలవుట్ విషయంలో ఎల్ఐసీ పెట్టుబడులు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. మిలియన్ల పాలసీదారుల సొమ్ములు ఇవి. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి ముందు ఎల్ఐసీ చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుంది’’అని ఐఆర్డీఏఐ సభ్యుడు కేకే శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఎల్ఐసీని తన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఓ సాధనంగా వాడుకుంటున్న పరిస్థితి ఇన్వెస్టర్లకు అవగతమే. ఓఎన్జీసీ తదితర ఎఫ్పీవోలకు, ఐడీబీఐ బెయిలవుట్కు ప్రభుత్వ ఆదేశాలతో ఎల్ఐసీయే భారీగా నిధులు సమకూర్చింది. ఏటా ప్రభుత్వ సెక్యూరిటీల్లో అతిపెద్ద పెట్టుబడిదారు కూడా ఎల్ఐసీయే. ఏటా రూ.55,000–65,000 కోట్ల మేర స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. 2018–19లో ఎల్ఐసీ నూతన పాలసీలు, రెన్యువల్ పాలసీల ప్రీమియం రూపంలో రూ.3,37,185 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. పాలసీదారులకు చెల్లించిన మొత్తం ప్రయోజనం రూ.2,50,936 కోట్లు కావడం గమనార్హం. -
అమరావతి బాండ్ల లిస్టింగ్
సాక్షి,ముంబై: ఆంధప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న నిధుల కోసం అమరావతి బాండ్ల నమోదును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో నమోదు చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏపీసీఎం 9.15 గంటలకు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశీష్కుమార్తో కలిసి చంద్రబాబు బాండ్ల లిస్టింగ్ను ప్రారంభించారు. బీఎస్ఈలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలోమంత్రులు యనమల, నారాయణతోపాటు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఇంకా ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్పై బాండ్లను జారీ చేయగా , మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ బంపర్ లిస్టింగ్...
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎమ్సీ) సోమవారం లిస్టింగ్లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర, రూ.1,100తో పోల్చితే 58 శాతం లాభంతో బీఎస్ఈలో రూ.1,739 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 68 శాతం లాభంతో రూ.1,843 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 65 శాతం లాభంతో రూ.1,815 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 30.77 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 1.93 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. బీఎస్ఈ టాప్100లో స్థానం... హెచ్డీఎఫ్సీ గ్రూప్నకు చెందిన హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ కంపెనీ మార్కెట్ క్యాప్ సోమవారం ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.38,479 కోట్లుగా ఉంది. షేర్ ధర జోరుగా పెరగడంతో బీఎస్ఈ టాప్ 100 మార్కెట్ క్యాప్ కంపెనీల జాబితాలో చేరింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, డీఎల్ఎఫ్, సెయిల్, యూపీఎల్, ఎమ్ఆర్ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్, బయోకాన్. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటి కంపెనీల కంటే అధిక మార్కెట్ క్యాప్ను ఈ కంపెనీ సాధించింది. ఐపీఓకు అనూహ్య స్పందన గత నెల 25–27 మధ్య వచ్చిన ఈ ఐపీఓ 83 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ), స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ జాయింట్ వెంచర్గా హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో నిర్వహణ ఆస్తుల పరంగా ఈ కంపెనీ రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.3 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. మొదటి స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఇక స్టాక్ మార్కెట్లో లిస్టైన రెండో మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ అవతరించింది. గత ఏడాది రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఏఎమ్సీ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఈ ఏడాది అత్యధిక లాభంతో లిస్టైన రెండో ఐపీఓగా హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ నిలిచింది. అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ ఏడాది జనవరి 22న 74 శాతం లాభంతో స్టాక్ మార్కెట్లో లిస్టయింది. కాగా 2011 తర్వాత అత్యధిక లిస్టింగ్ లాభాలు సాధించిన ఆరో కంపెనీ ఇది. లాభాలు స్వీకరించాలా ? లిస్టింగ్లో భారీ లాభాలనిచ్చినందున స్వల్పకాల ఇన్వెస్టర్లు ఈ షేర్లను ప్రస్తుత ధరలో విక్రయించి లాభాలు స్వీకరించవచ్చని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ ఎమ్డీ జి. చొక్కలింగమ్ సూచించారు. అయితే 2–3 ఏళ్ల పాటు వేచి చూడగల వాళ్లు ఈ షేర్ను హోల్డ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఐపీఓలో షేర్లు అలాట్ అయిన వాళ్లు సగం షేర్లు అమ్మేసి లాభాలు స్వీకరించాలని, మరో సగం షేర్లను దీర్ఘకాలానికి అట్టేపెట్టుకోవాలని హెమ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ ఆస్థా జైన్ సూచించారు. దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు... కొన్ని రోజులు వేచి చూడాలని, 10–20 శాతం ధర తగ్గిన తర్వాత కొనుగోలు చేయవచ్చని మరికొంత మంది నిపుణులంటున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల పెంపు వివిధ కాల వ్యవధులపై 0.60శాతం వరకు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. రిజర్వ్ బ్యాంకు ఎంపీసీ ఇటీవలే పావు శాతం మేర కీలక రేట్లను పెంచడంతో, హెచ్డీఎఫ్సీ సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 6 నెలల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు, పలు కాల వ్యవధుల డిపాజిట్లపై 0.6 శాతం వరకు పెంచింది. ఈ పెంచిన రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు, మరోవైపు రుణాలపై వడ్డీ రేట్ల పెంపునకూ దారితీయనుంది. 6–9 నెలలకు 0.40% పెంచి 6.75% చేసింది. 9 నెలల 3 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 0.60% పెంచింది. ఏడాది కాల డిపాజిట్పై 0.40 శాతం పెరిగి 7.25%కి చేరుకుంది. 2 ఏళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు డిపాజిట్లపై కేవలం 0.10 శాతమే పెంపుదల ఉంది. -
5శాతం ప్రీమియం : ఇండోస్టార్ డెబ్యూ లిస్టింగ్
సాక్షి,ముంబై: ఐపీవోలో అదరగొట్టిన ఎన్బీఎఫ్సీ సంస్థ ఇండోస్టార్ కేపిటల్ ఫైనాన్స్ లిస్టింగ్లో ప్రీమియంతో డెబ్యూలో శుభారంభాన్నిచ్చింది. సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో దాదాపు 5 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 572 కాగా.. బీఎస్ఈలో రూ. 28 లాభంతో రూ. 600 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. . ప్రస్తుతం 3.7 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 606 వద్ద గరిష్టాని నమోదు చేసింది. ఇటీవల ఐపీవోకు దాదాపు 7 రెట్లు ఆదరణతో రూ. 1844 కోట్లను సమీకరించింది. ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఐపీవోకు భారీ స్పందన లభించింది. మొత్తం రూ.1844 కోట్లు విలువ చేసే ఐపీవో ఏడురెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఇష్యూకి ముందురోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. 24 యాంకర్ సంస్థలకు 96.7 లక్షల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 572 ధరలో వాటాను కేటాయించడం ద్వారా రూ. 553 కోట్లను సమకూర్చుకుంది. ఆఫర్లో భాగంగా రూ.700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను సైతం విక్రయానికి ఉంచింది. కాగా.. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఎంఎఫ్, ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తదితరాలున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ రుణాలు, వాహన రుణాల వ్యాపారంలో ఉన్నఇండోస్టార్ క్యాపిటల్ మొత్తం విలువ రూ.5,200 కోట్లుగా అంచనా. ఈ ఐపీవోకు మోతీలాల్ ఓస్వాల్, మోర్గాన్ స్టాన్లీ, నొమోరాలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 15శాతం నష్టం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిస్టింగ్లో నష్టాలను మూటగట్టుకుంది. బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఇది 17 శాతం(రూ. 89) నష్టపోయి రూ. 431వద్ద ప్రారంభమైంది. చివరికి 15 శాతం నష్టంతో ముగిసింది. అయితే దీని ఈక్వీటీ షేరు ఇష్యూ ధర రూ. 520. కాగా ఇష్యూకి 78 శాతమే సబ్స్క్రిప్షన్ లభించింది. యాంకర్ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ పోర్షన్తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిమాణాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్ దాఖలుకాగా.. సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించింది. -
ఆకట్టుకోని హెచ్ఏఎల్ లిస్టింగ్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం, రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) నిరాశాకరమైన లిస్టింగ్ను నమోదు చేసింది. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ అండతో ఇటీవలే పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న హెచ్ఏఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో పేలవమైన ప్రదర్శన కనబర్చింది. ఇష్యూ ధర రూ. 1240 కాగా.. బీఎస్ఈలో రూ. 1169 వద్ద లిస్టయ్యింది. ఇది దాదాపు 5 శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఒకదశలో1150 స్థాయికి పడిపోయింది.డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీలో దేశంలోనే అతిపెద్ద సంస్థ హెచ్ఏఎల్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూకి 98 శాతం స్పందన లభించగా.. ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 4229 కోట్లను సమీకరించాలని భావించగా.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) వేసిన బిడ్ విలువే రూ. 3000 కోట్లు. ప్రభుత్వం 10 శాతం వాటాను విక్రయించేందుకు వీలుగా హెచ్ఏఎల్ ఐపీవోను చేపట్టింది. రూ. 1215-1240 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 4000 కోట్లు సమీకరించాలని భావించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం(క్విబ్) 1.73 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్కాగా.. దీనిలో ఎల్ఐసీకాకుండా మ్యూచువల్ ఫండ్స్ రూ. 130 కోట్ల విలువైన బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది. సంపన్న వర్గాల(హెచ్ఎన్ఐ) విభాగంలో 3.5 శాతం స్పందన మాత్రమే లభించింది. ఇక రిటైల్ విభాగం సైతం 36 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైలర్లకు ప్రభుత్వం షేరుకి రూ. 25 డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. -
4శాతం డిస్కౌంట్తో ఖాదిమ్ లిస్టింగ్
సాక్షి,ముంబై: పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) లో ఒకే అనిపించుకున్న దేశీయ ఫుట్వేర్ సంస్థ ఖాదిమ్ ఇండియా లిస్టింగ్లో నిరుత్సాహపర్చింది. ఈ నెల తొలి వారంలో పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న ఖాదిమ్ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 750కాగా.. ఎన్ఎస్ఈలో 3.6 శాతం నష్టంతో రూ. 723వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 543 కోట్లను సమీకరించింది.ఇష్యూలో భాగంగా ఖాదిమ్ ఇండియా ప్రమోటర్ సిద్దార్థ రాయ్ బర్మన్ 7.22 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించగా.. ఫెయిర్విండ్స్ ట్రస్టీస్ 58.52 లక్షలకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచింది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 157.5 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 750 ధరలో 13 యాంకర్ సంస్థలకు షేర్లను కేటాయించింది. కాగా దక్షిణ భారతదేశంలో మూడవ అతిపెద్ద ఫుట్ వేర్ సంస్థగా ఉన్న ఖాదిమ్ ఇప్పుడు పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ఖాదిమ్ ఇండియా ప్రాస్పెక్టస్లో పేర్కొంది. 1981లో ఏర్పాటైన కంపెనీ ఖాదిమ్ బ్రాండ్తో ప్రధానంగా ఫుట్వేర్ తయారీ, విక్రయాలను నిర్వహిస్తోంది. -
మాస్ ఫైనాన్షియల్ బ్లాక్ బస్టర్ లిస్టింగ్
సాక్షి, ముంబై: గత వారం పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న ఎంఏఎస్ ఫైనాన్షియల్ లిస్టింగ్లో కూడా అదరగొట్టింది. మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఎంఏఎస్ భారీ ప్రీమియంతో లాభాలను సాధిస్తోంది. ఇష్యూ ధర రూ. 459కాగా.. బీఎస్ఈలో రూ. 660 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకదశలో ఇంట్రాడేలో రూ. 668 వరకూ ఎగసింది. ప్రస్తుతం 48 శాతం వృద్ధితో ట్రేడవుతోంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 460 కోట్లను సమకూర్చుకుంది. అక్టోబర్ 6-10 నుంచి కంపెనీకి చెందిన 460 కోట్ల ఆరంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) 128 రెట్లు అధిగమించింది. సంస్థాగత భాగంలో 148 సార్లు , అధిక నికర-విలువ కలిగిన సంస్థాగత వర్గీకరణ వర్గం ద్వారా 378 సార్లు, రిటైల్ పెట్టుబడిదారుల విభాగంలో 16రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్ ఇన్వస్టర్ల నుంచి సైతం రూ. 136 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా మాస్ ఫైనాన్షియల్ గుజరాత్లో గత రెండు దశాబ్దాలకు పైగా వ్యాపార కార్యకలాపాలలను నిర్వహిస్తోంది. ప్రధానంగా సూక్ష్మ, మధ్యతరహా సంస్థలతోపాటు మధ్య, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించింది. టూ వీలర్ లోన్స్ రుణాలు, వాణిజ్య వాహన రుణాలు , గృహ రుణాలతో కూడిన ఐదు కేటగిరీల్లో వీటిని అందించనుంది. తాజా ఇష్యూ ద్వారా సాధించిన నికర ఆదాయాన్ని భవిష్యత్ అవసరాలకు, మూలధన వృద్ధికి ఉపయోగించనుంది. -
లిస్టింగ్ అదరగొట్టిన శంకర బిల్డింగ్
ముంబై: బెంగళూరుకు చెందిన హోమ్ ఇంప్రూవ్మెంట్, బిల్డింగ్ ప్రొడక్టుల సంస్థ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ బధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో అట్టహాసంగా లిస్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ తో పోలిస్తే భారీ ప్రీమియంతో రూ.555 వద్ద డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అంచనాలకు తగ్గట్టుకుగానే 25 శాతం పైగా ప్రీమియంతో దూసుకుపోతోంది. రూ.ప్రస్తుతం 571 వద్ద పాజిటివ్గా ఉంది. కంపెనీ ఎండీ శ్రీ సుకుమార్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెలలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈ ఐపీవో 41 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 440-460గా నిర్ణయించింది. ఈఐపివో ద్వారా కంపెనీ రూ. 350 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 53 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. మొత్తం 22 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ కోటా దాదాపు 52 రెట్లు, హెచ్ఎన్ఐల విభాగం నుంచి 91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలుకాగా... రిటైల్ విభాగం నుంచి ఏకంగా 15 రెట్లకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్మార్ట్స్(డీమార్ట్) ఐపీవో ధరతో పోలిస్తే 110 శాతంపైగా లాభాలను పంచడంతో శంకర బిల్డింగ్ ఇష్యూకి రిటైలర్లు క్యూకట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా 103 రిటైల్ స్టోర్లను శంకర రీటైల్ కంపెనీ నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలలో మొత్తం 11 ప్రాసెసింగ్ కేంద్రాలున్నాయి. -
జీఎంఆర్ ఎయిర్పోర్టులు ఇక ప్రత్యేక కంపెనీ!
లిస్టింగ్ కోసం సన్నాహాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల వ్యాపారాన్ని విడదీయడంతోపాటు వేరుగా లిస్టింగ్ చేసే పనిలో జీఎంఆర్ ఇన్ఫ్రా నిమగ్నమైనట్టు సమాచారం. ఈ మేరకు రుణదాతల నుంచి అనుమతి కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జీఎంఆర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిలిప్పైన్స్లోని మక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం సంస్థ ఖాతాలోనే ఉంది. ఉత్తర గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టును చేజిక్కించుకుంది కూడా. అయితే జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ను రూ.20,000 కోట్లుగా విలువ కట్టాలని జీఎంఆర్ ఇన్ఫ్రా భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీకి విలువ చేకూర్చడంతోపాటు రుణ భారం తగ్గించుకోవాలన్నది సంస్థ ఆలోచన. ఎయిర్పోర్ట్స్ విభాగాన్ని విడదీయడం, లిస్టింగ్ వార్తలను సంస్థ ఖండించింది. అయితే జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిస్టింగ్ చేయనున్నట్టు గతంలోనే కంపెనీ తెలిపింది. జీఎంఆర్ ఇన్ఫ్రా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.9,271 కోట్లుగా ఉంది. ఎయిర్పోర్ట్స్ విభాగంలో జీఎంఆర్ ఇన్ఫ్రాకు 97 శాతం వాటా ఉంది. బీఎస్ఈలో జీఎంఆర్ షేరు శుక్రవారం ముగింపు ధర రూ.14.39. సోమవారం రూ.14.50 దగ్గర ప్రారంభమై తాజా వార్తల నేపథ్యంలో రూ.15.82 దాకా వెళ్లిన షేరు, చివరకు రూ.15.36 దగ్గర స్థిరపడింది. -
పేలవంగా ప్రుడెన్షియల్ లిస్టింగ్
ఇష్యూ ధర కంటే 11% నష్టంతో ముగింపు న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లిస్టింగ్ పేలవంగా జరిగింది. ఇష్యూ ధర(రూ.334) కంటే 1 శాతం తక్కువగా రూ.329 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. చివరకు 11 శాతం క్షీణతతో రూ.298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం క్షీణతతో రూ.295ను తాకింది. బీఎస్ఈలో 1.2 కోట్లు, ఎన్ఎస్ఈలో 8 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,722 కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలి బీమా కంపెనీ ఇదే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్ నిస్తేజంగా ఉండటంతో ఆ ప్రభావం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్పై కూడా పడింది. బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 4% క్షీణించి రూ.251 వద్ద ముగిసింది. రూ.300-334 ధరల శ్రేణితో వచ్చిన రూ.6,057 కోట్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 10 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయ్యింది. కోల్ ఇండియా(రూ.15,000 కోట్లు) తర్వాత వచ్చిన అతి పెద్ద ఐపీఓ ఇదే. పుష్కలంగా నిధులు: చందా కొచర్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్ను మించిన వృద్ధిని సాధిస్తుందని కంపెనీ చైర్పర్సన్ చందా కొచర్ ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమ కంటే వేగంగా వృద్ధి చెందే సంప్రదాయం తమ కంపెనీదని, ఇదే జోరును కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయిన కొన్ని నిమిషాలకే ఆమె మాట్లాడారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ గత 4-5 ఏళ్లలో ఏడాదికి 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని వివరించారు. ప్రస్తుతానికి తమ వద్ద పుష్కలంగా నిధులున్నాయని, మరో కొన్నేళ్లదాకా పెట్టుబడులు అవసరం లేదని పేర్కొన్నారు. ఐఆర్డీఏఐ నిర్దేశించిన సాల్వెన్సీ రేషియో 150 శాతమని, కానీ తమ కంపెనీ సాల్వెన్సీ రేషియో 320 శాతమని వివరించారు. -
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ స్టాక్మార్కెట్ ఎంట్రీ
ముంబై: రికార్డుస్థాయిలో సబ్స్క్రైబ్ అయిన లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ నేటి (జూలై 21 గురువారం) నుంచి స్టాక్ మార్కెట్ లో తెరంగేట్రం చేయనుంది. ఈ కంపెనీ షేర్లు ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ ఎన్ఎస్ఇ , బిఎస్ఇ లో లిస్ట్ కానుంది. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఛైర్మన్ ఎఎం నాయక్ , ఇతర ఉన్నతాధికారులతోపాటు మర్చంట్ బ్యాంకర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 887 మిలియన్ డాలర్ల ఆదాయంతో 20 వేల మంది ఉద్యోగులతో ఐటీ సేవల్లో ఆరవ అతి పెద్ద సంస్థగా ఉంది ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ . తాజా ఐపీవో లో భారీ స్థాయిలో మిలియన్ అప్లికేషన్లు సాధించిందనీ, 2011 నుండి ఇప్పటివరకు ఒక షేర్ ఇంత పెద్ద మొత్తంలో అప్లికేషన్లు ఆకర్షించడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత బుధవారంతో ముగిసిన ఐపీఓ లో 12 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేరు ధరను రూ.705-710గా కంపెనీ నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్ను కంపెనీ ఆఫర్ చేసింది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఐటీ అనుబంధ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎనర్జీ పరిశ్రమలకు ఐటీ సొల్యూషన్లనందిస్తున్నది. కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, అబర్న్... యాంకర్ ఇన్వెస్టర్లలో కొన్ని సంస్థలు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.