Mid Manair Dam
-
3 ప్రాజెక్టులను ఆదుకున్న ‘ఎల్లంపల్లి’
బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా నీరు లేక వెలవెలబోయిన మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వస్తుండడంతో మూడు ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పెరిగాయి. బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీరాజరాజేశ్వర(మిడ్మానేరు) ప్రాజెక్టులోకి శ్రీపాద ఎల్లంపల్లి జలాలు గాయత్రీ పంప్హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా చేరుతున్నాయి. మిడ్మానేరులో 17 టీఎంసీల మేర నీరు చేరిన తర్వాత ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టు ప్యాకేజీ–10లోకి.. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్రాజెక్టు–11లోకి నీరు విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతలతో ఎల్లంపల్లి జలాలు నంది పంప్హౌస్ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్హౌస్కు చేరుకుంటున్నాయి.అక్కడి నుంచి వరదకాల్వ మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్మానేరుకు, అక్కడి నుంచి అన్నపూర్ణతోపాటు సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్కు తరలుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో గత జూలై 27వ తేదీ నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్మానేరుకు నీటి విడుదల కొనసాగుతోంది.మిడ్మానేరు టు అన్నపూర్ణ.. రంగనాయకసాగర్మిడ్మానేరు నుంచి ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ పూర్తి నీటిమట్టం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్మానేరు అప్రోచ్ కెనాల్ నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఈనెల 5వ తేదీ నుంచి రోజుకు 6,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్యాకేజీ–11లోకి రోజుకు 3,300 క్యూసెక్కుల నీరు ఔట్ఫ్లోగా వెళుతోంది. ఇప్పటికే రెండు రెండు టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రస్తుతం రంగానాయకసాగర్ లో 2.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్కు రోజుకు 3, 900 క్యూసెక్కుల నీరు మల్లన్నసాగర్ నుంచి కొండ పోచమ్మసాగర్లోకి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదుకున్న ఎల్లంపల్లి జలాలుమిడ్మానేరులో గత జూలై 27వ తేదీకి ముందు 5.90 టీఎంసీల మేర నీటి నిల్వలు మాత్రమే ఉండేవి. ఈక్రమంలో మిడ్మానేరుకు ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వదలడంతో 20 రోజులుగా వచ్చిన నీటితో ప్రస్తుతం 15.91 టీఎంసీలకు నీటినిల్వ చేరింది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం నిత్యం 3,150 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీరు చేరింది. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల పరి«దిలో విస్తరించి ఉన్న వరదకాల్వలో నీరు నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా పరిధిలోని రైతులు 2వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. -
జ్ఞాపకాల్లో మునిగి తేలారు!
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు. మునిగితేలిన ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి పాతూరు చూసేందుకు వచ్చిన.. పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక 60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం సాక్షి, నాగర్కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం. కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు. -
విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్మానేర్లో దూకిన తల్లి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసకుంది. బోయినపల్లి మండలం శభాష్పల్లి వంతెన వద్ద పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలతో కలిసి బుధవారం మిడ్ మానేరు రిజర్వాయర్లోకి దూకి ప్రాణాలు విడిచింది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. చనిపోయిన వారిని తల్లి రజిత, అయాన్(7), అశ్రజాబిన్(5), ఉస్మాన్ అహ్మద్(14నెలలు)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా వేములవాడ అర్భన్ మండలానికి చెందిన రజిత, కరీంనగర్లోని సుభాష్ నగర్కు చెందిన మహ్మద్ అలీది ప్రేమ వివాహం. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలు కలిసి బయల్దేరింది. అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మిడ్ మానేరులో నాలుగురిని విగత జీవులుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం -
గత జ్ఞాపకాలతో బరువెక్కుతున్న గుండెలు
బోయినపల్లి (చొప్పదండి): కూలిన గోడలు.. శిథిల రోడ్లు.. మోడువారిన చెట్లు.. పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరువెక్కుతున్నాయి. తాము పుట్టి, పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగలడాన్ని చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్యమానేరులో ముంపునకు గురైన గ్రామాలు ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వాసితులు ఉద్వేగానికి గురవుతున్నారు. ‘ఇది మా ఇల్లు.. ఇది మా బడి.. అరే అదిగదిగో అంజన్న గుడి’అంటూ పాత జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. మొండి గోడలు, మోడువారిన చెట్లను చూసి చలించిపోతున్నారు. ఈ దృశ్యాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపు నకు గురైన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిడ్మానేరులో నీటిమట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తేలాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు నిత్యం వెళ్లి వస్తున్నారు. రోజంతా అక్కడే గడిపి బరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు. 2019లో మునిగిన గ్రామాలు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టుతో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులో 2018 నుంచి నీరు చేరడంతో ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు తరలిపోయారు. 2019లో 25 టీఎంసీల నీరు చేరడంతో బ్యాక్వాటర్లో ముంపు గ్రామాలు మొత్తం మునిగిపోయాయి. రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండటంతో ఆ గ్రామాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. నెల రోజులుగా 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పది కి.మీ. తగ్గిన బ్యాక్వాటర్ మిడ్మానేరు ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు చేరితే తంగళ్లపల్లి బ్రిడ్జి, సిరిసిల్ల బతుకమ్మ ఘాట్, సాయినగర్ వరకు 18 కి.మీ. మేర బ్యాక్వాటర్ చేరుతుంది. ఇటీవల ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్, ఎల్ఎండీలకు నీరు విడుదల చేయడంతో ఇప్పుడు 8.33 టీఎంసీల జలాలున్నాయి. దీంతో బ్యాక్వాటర్ పది కిలోమీటర్లలోపే ఉంది. మిడ్మానేరు ప్రాజెక్టు స్వరూపం నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు ప్రస్తుత నిల్వ 8.33 టీఎంసీలు బ్యాక్ వాటర్ 18 కి.మీ. ప్రస్తుత బ్యాక్వాటర్ 10 కి.మీ. ముంపు గ్రామాలు 11 ప్రాజెక్టులో సేకరించిన భూమి 20వేల ఎకరాలు ముంపునకు గురైన ఇళ్లు సుమారు 8,500 నిర్వాసిత కుటుంబాలు 11,731 గుండెలు బరువెక్కుతున్నాయి ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గ డంతో నీలోజిపల్లి పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూసేందుకు వెళ్తే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కూలిన గోడలు.. దర్వాజలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – సింగిరెడ్డి బాలమల్లు, నీలోజిపల్లి, బోయినపల్లి తెలియని అనుభూతి ముంపులో మునిగిన ఊరు మళ్లీ కనిపిస్తుందంటే చూసేందుకు వెళ్తున్నారు. మళ్లీ ఆ ఆనవాళ్లు కనిపిస్తాయో.. లేదోనని చాలామంది పాత ఊళ్లు చూసేందుకు వెళ్తున్నారు. పాత గ్రామాలను చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అదోరకమైన సంతోషం.. బాధ రెండూ కలుగుతున్నాయి. – ఆడెపు రాజు, వరదవెల్లి, బోయినపల్లి తేలిన గ్రామాలివీ వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభాష్పల్లి, రుద్రవరం, బోయినపల్లి మండలం, కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి -
మిడ్మానేరులో ఇద్దరు గల్లంతు.. ఆచూకీ లేదు
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక ఫోర్లేన్ వంతెనపై నుంచి మిడ్మానేరులో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ వ్యక్తి దూకగా.. సంఘటన స్థలంలో జనం గుమిగూడడంతో పరిశీలిస్తూ వంతెన దాటే ప్రయత్నంలో మరోవ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడిపోయాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన సాయికృష్ణ(26)కు జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన యువతితో ఆర్నెల్ల క్రితం వివాహం జరిగింది. వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాయికృష్ణ మిడ్మానేరు వంతెన వద్ద బైక్ నిలిపి తన సోదరుడికి ఫోన్ చేశాడు. వంతెన వద్ద ఉన్న ‘ఐ మిస్యూ అన్న’ అంటూ చెప్పి మిడ్మానేరులో దూకాడు. అతడి సోదరుడు, సంబంధీకులు వచ్చి మిడ్మానేరు వద్ద చూడగా మోటారు సైకిల్ కనిపించింది. కానీ సాయికృష్ణ కనిపించలేదు. ప్రమాదవశాత్తు పడిపోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కరీంనగర్ పట్టణానికి చెందిన గడ్డం రాజశేఖర్రెడ్డి(30) సాఫ్ట్వేర్ ఇంజినీర్. లాక్డౌన్తో ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నాడు. అతడి మిత్రుడు అజిజ్ కొరియర్లో పనిచేస్తాడు. అజిజ్తో కలిసి కొరియర్ డబ్బు ఇవ్వడానికి సిరిసిల్లకు వెళ్లి సోమవారం రాత్రి వంతెన పరిసరాల్లో నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జి వద్ద సాయికృష్ణ దూకడంతో అక్కడ జనం గుమిగూడి ఉండడం చూసి ఆగారు. ఇంకోవైపు బ్రిడ్జి వద్ద ఉన్న జనం వద్దకు వెళ్లేందుకు రెండు వంతెనల మధ్యలో నుంచి దారి ఉందనికుని దాటే ప్రయత్నం చేశాడు. దీంతో రెండు బ్రిడ్జిల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం మానేరు నీటిలో రాజశేఖర్రెడ్డి పడ్డాడు. కాగా, ఒకరి ప్రమాదం చూసేందుకు వస్తూ.. కళ్లముందే మరొకరు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా రాత్రి 11 గంటల వరకు ఇద్దరి ఆచూకీ లభించలేదు. -
తెలంగాణ: వేసవిలోనూ చెరువులకు జలకళ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఆరంభమైన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టు పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చెరువులు, చెక్డ్యామ్ల్లో నీటి నిల్వలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి దిగువ నుంచి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులను వంద శాతం నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మొదలవగా, మొత్తంగా 2,074 చెరువులకు నింపేలా ప్రణాళిక రచించింది. ఈ చెరువుల ద్వారా 1.20 లక్షల ఎకరాల మేర నీరందించనుంది. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఎస్సారెస్పీ కింద చెరువులకు జలకళ... ముఖ్యంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ పుష్కలంగా ఉండటంతో ఆ నీటి ద్వారా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకు కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉంచడం మేలనే ఉద్దేశంతో ఎల్ఎండీ దిగువన కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని వాడుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద సుమారు మరో 3.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ఇప్పటికే కాల్వల ద్వారా నీటి విడుదల జరగ్గా, దీని కింద 942 చెరువులున్నాయి. ఈ చెరువులకు నీటిని అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చెరువులకు నీరందించేలా తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, వాటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ చెరువులను నింపడం ద్వారా వాటికింద ఉన్న సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, 10 టీఎంసీల మేర నిల్వలు సాధ్యపడనున్నాయి. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తంగా 3.52 లక్షల ఎకరాలకు నీరందించనుండగా, 866 చెరువుల పరిధిలో కనీసంగా 30 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ చెరువులన్నింటినీ ముందుగా నింపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. చదవండి: (ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్) మిడ్మానేరు దిగువన... ఇక మిడ్మానేరు దిగువన అనంతగిరి రిజర్వాయర్ మొదలు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్కు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. ఈ నీటితో మొత్తంగా 266 చెక్డ్యామ్లు, చెరువుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ మొత్తం చెరువులు, చెక్డ్యామ్ల కింద 18 వేలకు పైగా ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, 8.60 టీఎంసీల మేర నీటి నిల్వలకు అవకాశం ఉంది. ఇందులో అనంతగిరి కింద బెజ్జంకి మండల పరిధిలో 16, ఇల్లంతకుంటలో 9, రంగనాయక్సాగర్ కింద చిన్నకోడూరు మండలంలో 23, నంగనూర్–49, నారాయణ్పేట–22, సిద్దిపేట–4, ఇల్లంతకుంట–3, తంగనపల్లి–10, ముస్తాబాద్–5 చెరువులు, వీటితో పాటు మరో 35 చెక్డ్యామ్లు ఉన్నాయి. మల్లన్నసాగర్లో తవ్విన ఫీడర్ చానల్ ద్వారా తొగుట–6, దుబ్బాక–సిద్దిపేట–25, ముస్తాబాద్–6, కొండపోచమ్మసాగర్ పరిధిలో జగదేవ్పూర్ కెనాల్ ద్వారా మర్కూక్–23, జగదేవ్పూర్–5, తుర్కపల్లి కెనాల్ ద్వారా మర్కూక్–5, ఎం.తుర్కపల్లి–9, బొమ్మలరామారం–5. గజ్వేల్ కెనాల్ ద్వారా మర్కూక్–3, గజ్వేల్–1 చెరువులను నింపుతున్నారు. -
మిడ్మానేరు వద్ద మంచు లక్ష్మి షూటింగ్
సాక్షి, కరీంనగర్: శ్రీరాజరాజేశ్వర(మిడ్మానేరు) ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్ స్పాట్గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరు ప్రాజెక్టు వెబ్ సిరీస్ పాటల చిత్రీకరణకు వేదికగా మారుతోంది. ప్రాజెక్టు డౌన్ స్ట్రీమ్, వరదకాలువ పరిసరాలతోపాటు, ప్రాజెక్టు బ్యాక్వాట ర్ ఏరియాలో ప్రముఖ టీవీ ఛానళ్లు సీరియల్స్ షూటింగ్ నిర్వహించడం విశేషం. పలువురు లోకల్ టాలెంట్ కళాకారులు, యూ ట్యూబ్ ఛానల్స్ వారు పలు జానద గేయాలు చిత్రీకరిస్తున్నారు. వరదకాలువ వద్ద మంచు లక్ష్మి షూటింగ్ గత జనవరి మొదటి వారంలో వెబ్ సిరీస్ ఆన్లైన్ షూటింగ్ నిమిత్తం ప్రముఖ నటుడు మోహన్బాబు కూతురు మంచు లక్ష్మితో దేశాయిపల్లి వరదకాలువ వద్ద షూటింగ్ నిర్వహించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ వరదకాలువపై నుంచి ఓ అమ్మాయి నీటిలో దూకే సీన్ చిత్రీకరించారు. ఇందులో మంచు లక్ష్మి గ్రామ పెద్ద పాత్ర పోషించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో టీవీ సీరియళ్ల చిత్రీకరణ సందడి వారంక్రితం మిడ్మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామం వరదవెల్లి బ్యాక్ వాటర్ పరిసరాల్లో మా టీవీ నిర్మిస్తున్న కస్తూరి సీరియల్ షూటింగ్ సందడి చేసింది. అగ్నిసాక్షి సీరియల్ ఫేం హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతంరాజు నటించారు. వైద్యశిబిరం జరిగే సన్నివేశం చిత్రీకరించారు. మూడురోజులపాటు షూటింగ్ చేశారు. వారంక్రితం జరిగిన సీరియల్ షూటింగ్ దృశ్యం జానపద గీతాలు.. మిడ్మానేరు ప్రాజెక్టు పరిసరాల్లో లోకల్ టాలెంటెడ్ కళాకారులు పలు జానపద గీతాలు చిత్రీకరించారు. కరీంనగర్, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ టాలెంట్తో నిర్వహించే గీతాలు చిత్రీకరిస్తున్నారు. మండలంలోని కొదురుపాకకు చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ పలు ప్రేమ గీతాలతోపాటు, జానపద గీతాలు చిత్రీకరించారు. ప్రాజెక్టు అందాలు అద్భుతం మెరుగు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మించిన సరియా.. సరియా.. అనే గీతంలో నటించా. ప్రాజెక్టు గేట్ల పరిసరాల్లో పాట చిత్రీకరించారు. గేట్ల మీదుగా నీరు వెళ్తుండగా సాంగ్లో నటించడం ఎంతో మధురానుభూతిని అందించింది. – అశ్రుత, నటి, హైదరాబాద్ ప్రాజెక్టు వద్ద సందడి మాన్వాడ వద్ద గల మిడ్మానేరు ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్కు వేదికయ్యాయి. ప్రాజెక్టు గేట్లు, బ్యాక్ వాటర్ పరిసరాల్లో వివిధ యూట్యూబ్ ఛానల్స్ వారు పలు జానపద గీతాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొంది. దీంతో గ్రామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. – రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ -
మిడ్మానేరుకు స్కానింగ్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది ఎడతెరిపిలేని వానలు.. పోటెత్తుతున్న వాగులు, వంకలు.. పరవళ్లుతొక్కే వరద ప్రవాహాలు.. వెరసి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడ్మానేరు రిజర్వాయర్ పరిధిలో వరద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్మానేరు గుండె కాయలాంటిది. కీలకమైన ఈ రిజర్వాయర్ పరిధిలో గతంలో రెండుసార్లు కట్ట తెగిన దృష్ట్యా వరదను ఎదుర్కొనే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నిర్ణయించింది. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్లో భాగంగా ఉండే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ నిమిత్తం పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే నీళ్లు ఎల్లంపల్లిని దాటి మిడ్మానేరుకు చేరుకుంటాయి. మిడ్మానేరు నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవం వైపు, దిగువ లోయర్ మానేరు, అనంతగిరి, రంగనాయక్సాగర్ మీదుగా కొండపోచమ్మ వైపు నీళ్లు సరఫరా అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని భాగాలకు ఇక్కడి నుంచే నీటి సరఫరా ఉండటంతో రిజర్వాయర్ పటిష్టత కీలకం. 5 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చినా తట్టుకునేలా ఈ రిజర్వాయర్ను నిర్మించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే...: ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే ఎగువ నుంచి వరదను అంచనా వేయడంతో పాటు ఏ స్థాయి లో వరద వస్తే రిజర్వాయర్లో ఎంతమేర నీటిని నిల్వ చేయాలి, ఎంతమేర దిగువకు వదలాలి? అన్న అంచనాకు రావచ్చు. ఈ వరద అంచనాలకు అనుగుణంగా దిగువ రిజర్వాయర్కు నీటి విడుదల చేయడం, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం వంటివి ముందస్తుగానే సిద్ధం చేసుకోవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టులో ఏమైందంటే... గతేడాది సైతం ఆగస్టులో మిడ్మానేరులో 15 టీఎంసీల మేర నీటిని నింపిన అనంతరం రిజర్వాయర్ పరిధిలో కొన్ని సీపేజీలు ఏర్పడ్డాయి. కట్టకు దిగువన ఏర్పడ్డ ఒర్రెలతోనూ సమస్యలు వచ్చాయి. దీంతో 10 కిలోమీటర్ల పొడవైన కట్టను పూర్తి స్థాయిలో పరీక్షించి, రాక్టో నిర్మాణాలను పరిశీలించి, కట్ట 2.450 కిలోమీటర్ నుంచి 2.700 కిలోమీటర్లు మేర పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు రూ.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ లీకేజీల మరమ్మతుల కోసం హడావుడిగా రిజర్వాయర్ను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ సంఘనటకు ముందు 2016లో రిజర్వాయర్ నిర్మాణం పూర్తికాక ముందే ఎగువన ఉన్న కూడవెళ్లి వాగు, మానేరు వాగుల నుంచి ఒక్కసారిగా 2.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తడంతో రిజర్వాయ ర్కు ఎడమవైపు 130 మీటర్ల మేర కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న 12 వేల మంది ప్రజలను çసురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈ నేపథ్యం లో వరదను ఎదుర్కొనేలా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సర్కారు నిర్ణయించింది. -
దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి: పొన్నం
సాక్షి, రాజన్న సిరిసిల్లా: మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎలా తరిలిస్తున్నారని మంత్రి కేటీఆర్ను టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరు ప్రాజెక్టుకు ఎందుకు నీటిన తరలించడం లేదన్నారు. ఇది మీ అసమర్థతనా లేక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారా అని మండిపడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (నిర్మల.. యాక్సిడెంటల్ మినిస్టర్!) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని చెప్పే మీరు, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 6 ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోతే ఎవరిది బాధ్యత అని ధ్వజమెత్తారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి కాకుండా, అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పక్షాన కార్యాచరణ రూపొందిస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పుర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. -
‘అనంతగిరి’కి గోదారమ్మ
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ఎత్తిపోతల ద్వారా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి మిడ్మానేరు (రాజరాజేశ్వరి) రిజర్వాయర్కు చేరుకున్న గోదావరి జలాల ప్రయాణం కొండలు, కోనలు, వాగులు, వంకలు, కాల్వలు, సొరంగ మార్గాలు దాటుకుంటూ కాళేశ్వర గంగమ్మ (గోదావరి), అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ చేరింది. బుధవారం మిడ్మానేరు దిగువన పంప్హౌస్లోని ఒక మోటార్ ద్వారా నీటిని అనంతగిరి తరలించే ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతమైంది. 164.15 కి.మీ. ఎగువకు గోదావరి నీళ్లు ప్రయాణించాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీ పూర్తయినట్లయ్యింది. ఈఎన్సీ హరిరామ్, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ ఆనంద్ పర్యవేక్షణలో 106 మెగావాట్ల (1.40 లక్షల హెచ్పీ) సామర్థ్యంగల మోటారు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మధ్యాహ్నం 1.30 గంటలకు ఎత్తిపోసింది. ఇక్కడ నుంచి నీటిని రంగనాయక్సాగర్ మీదుగా ఈ నెల 25 నాటికి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్కు చేరనున్నాయి. 90 మీటర్లు ఎగిసిపడిన జలాలు.. మధ్యమానేరు జలాశయం నుంచి 3.50 కి.మీ. కాలువ ద్వారా నీరు ఒబులాపూర్ చేరింది. అక్కడి నుంచి 7.65 మీటర్ల సొరంగ మార్గం ద్వారా తిప్పాపూర్ సర్జిపూల్ (మహాబావి)లోకి చేరాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్ ద్వారా 90 మీటర్ల ఎత్తునకు నీటిని ఎత్తిపోశారు. దీంతో అనంతగిరికి నీరు చేరింది. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్హౌస్ల నుంచి నీరు ఇప్పటికే ఎల్లంపల్లి చేరగా రెండో దశలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు తరలించారు. గతేడాది నవంబర్ నుంచి మిడ్మానేరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ నాలుగో దశ ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మిడ్మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్కు తరలించాలంటే అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా అక్కడ కోర్టు కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఇటీవల నిర్వాసితుల తరలింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆగమేఘాలపై ఎస్సీ కాలనీని ఖాళీ చేయించారు. అయినప్పటికీ మరో పదిగృహాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గృహాలకు ఇబ్బంది లేకుండా 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల అనంతగిరిలోకి ప్యాకేజీ–10లోని 4 మోటార్ల ద్వారా 0.8 టీఎంసీల నీటిని తరలించాలని ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ను ఆదేశించారు. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం 106 మెగావాట్ల సామర్థ్యంగల ఒక మోటార్ ద్వారా తొలి ఎత్తిపోతలు చేశారు. ఇది విజయవంతం కావడంతో ఆ మోటార్ను 10 గంటలపాటు నిరంతరాయంగా నడిపించి రాత్రికి రెండో మోటార్ ఆన్ చేశారు. గురు, శుక్రవారాల్లో మరో రెండు మోటార్లను సైతం నడిపించి మొత్తంగా 0.8 టీఎంసీ నీటిని అనంతగిరికి తరలిస్తారు. అనంతరం అనంతగిరి నుంచి ప్యాకేజీ–11లోని 134.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్ల ద్వారా నీటిని రంగనాయక్ సాగర్కు తరలిస్తారు. ఈ పంపులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. రంగనాయక్ సాగర్కు ఈ వారంలోనే నీటిని తరలించే ప్రక్రియ మొదలవుతుందని, మరో నాలుగైదు రోజుల్లో 3 టీఎంసీల ఈ రిజర్వాయర్ను నింపుతామని ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. 25 నాటికి కొండపోచమ్మకు.. రంగనాయక్ సాగర్ నుంచి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలించేలా ప్యాకేజీ–12లో 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపుల్లో అన్నీ సిద్ధమయ్యాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్నసాగర్ పనులు మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్కు నీటిని తరలించేలా ప్యాకేజీ–13 పనులు పూర్తవ్వగా, ప్యాకేజీ–14లో రెండు పంప్హౌస్ల్లోని ఆరేసి మోటార్లను సిద్ధం చేశారు. అయితే వాటికి విద్యుత్ కనెక్షన్ పనులు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి 15 టీఎంసీల సామర్థ్యంగల కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరతాయని, కనీసంగా 240 కిలోమీటర్ల గోదావరి తరలి రానుందని ఈఎన్సీ హరిరామ్ వెల్లడించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. గోదావరి జలాలు అనంతగిరికి చేర్చే ప్రక్రియ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనంతగిరి నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించారు. నీరు రావడంతో మిగతా వాళ్లు ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోపాలకృష్ణ, డీఈఈ దేవేందర్, తహసీల్దార్లు రాజిరెడ్డి, ప్రసాద్, ప్రాజెక్టు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే పనుల పూర్తి ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే నాలుగో దశ పూర్తయింది. ఆసియాలోనే అతిపెద్దదైన 92 మీటర్ల లోతైన సర్జ్పూల్ నుంచి నీటిని 101.20 మీటర్లు ఎత్తి అనంతగిరికి తరలించే ట్రయల్ రన్ బుధవారం పూర్తయింది. సీఎం సూచనల మేరకు ఈ నెలాఖరుకు కొండపోచమ్మ సాగర్కు కాళేశ్వరం జలాలు చేరతాయి. – హరిరామ్, ఈఎన్సీ -
ఇప్పుడంతా మారిపాయె..
కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలతో నిండిన మిడ్మానేరు (శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్)కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు డిసెంబర్ 30న కుటుంబ సమేతంగా జలహారతి పట్టారు. అవిభాజ్య కరీంనగర్ కరువు పీడకు శాశ్వత పరిష్కారం చూపే మిడ్మానేరు జలాలను చూస్తే కలలుకన్న తెలంగాణ కళ్ల ముందే ఆవిష్కృతం అయిందని పేర్కొన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో ఈ ప్రాంతమంతా ఎడారిని తలపించేదని, ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మూలవాగుకు పైన నిమ్మపల్లి ప్రాజెక్టును సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగా ఆపారని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని తన పర్యటన సందర్భంగా గుర్తుచేశారు. ‘ముల్కి పాయె... మూట పాయె... మూలవాగు నీళ్లుపాయె’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకున్న సందర్భాల అనుభవాలను పంచుకున్నారు. కరువులతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలసలు పోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే అవి పరిష్కారం కావని గతంలో గోడలపై జిల్లా కలెక్టర్ రాయించాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతలతో పరిస్థితి పూర్తిగా మారిందని, మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 140 కిలోమీటర్ల మేర గోదావరి సజీవ జీవధారగా మారిందంటూ హర్షం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు కలిపి మొత్తంగా 100 టీఎంసీల మేర గోదావరి జలాలు నిల్వ ఉండటం, దీంతో భూగర్భ మట్టాలు గణనీయంగా పెరగడంతో ఆయకట్టు రైతుల్లో నెలకొన్న సంతోషాలను జిల్లా మంత్రి కేటీఆర్, కమలాకర్, ఈటల రాజేందర్ తదితరులతో కలసి పంచుకొని మురిసి పోయారు. ఈ సందర్భంగా మూలవాగు, మిడ్ మానేరు నీళ్లు కలిసే చోట బ్రిడ్జిపై కాసేపు గడిపిన ముఖ్యమంత్రి... పుష్కలమైన నీళ్లను చూసి తన్మయత్వం చెందారు. మిడ్ మానేరు ప్రధాన డ్యామ్ గేట్ల వద్ద గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు... జలహారతి ఇచ్చారు. తన అలవాటు ప్రకారం నీళ్లలో నాణేలు వేసి నమస్కరించారు. మిడ్ మానేరు రిజర్వాయర్కు పూజలు చేసే ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించిన ముఖ్య మంత్రి... దేవాలయంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేవాలయమంతా కలియతిరిగి సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించారు. రాజన్నకు రెండు కోడెలు సమర్పించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మట్లాడిన ముఖ్యమంత్రి, మిడ్మానేరు సజీవంగా ఉంటుందని చెబితే... కొందరు సన్నాసులు వెకిలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై తమ పార్టీకున్నంత కమిట్మెంట్ ఏ పార్టీకి ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే జిల్లావ్యాప్తంగా మానేరు నదిపై 29 చెక్డ్యాంలు, మూలవాగుపై 10 చెక్డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు జనవరి 3న ముఖ్యమంత్రి ప్రగతిభవన్లో కరీంనగర్కు చెందిన మంత్రి గంగుల కమలాకర్తో కలిపి జిల్లా చెక్డ్యామ్లపై సమీక్షించారు. జిల్లాలో 41 చెక్డ్యామ్ల ఆమోదానికి రూ.580కోట్లతో పనులు చేపట్టేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ప్రతి ఏటా చెక్డ్యామ్ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు సైతం కేటాయిస్తామని ప్రకటించారు. -
రాష్ట్ర ప్రగతి అంటే అప్పు చేయడమా: జీవన్ రెడ్డి
సాక్షి, కరీంనగర్ : అధికార పార్టీ ప్రచార ఆర్భాటాలకు పరిమితం అవడంతో మిడ్ మానేరు ప్రాజెక్టు మూడేళ్ళు ఆలస్యంగా నిర్మాణం జరిగిందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. సాంకేతిక పరిజ్ఞానం లోపంతోనే కట్ట తెగిందని ఆయన విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిడ్ మానేరు ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టని, దీనిపై భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు. వరద కాలువ ద్వారా ఎల్ఎమ్డీని నేరుగా నింపుకునే అవకాశం ఉండేదని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 70 -80 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అంత సాగవలంటే వాటి కోసం 800 టీఎంసీలు కావాలని తెలిపారు. ప్రస్తుత నీటితో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చని అన్నారు. ఒక్క అదనపు ఎకరం ఆయకట్టు వినియోగంలోకి రాలేదని దుయ్యబట్టారు. ఎస్సీర్ఎస్పీ వరద నీటితో మిడ్ మానేరు నింపే అవకామున్న ఆ పని చేయలేదని విమర్శించారు. ఎఎస్సార్ఎస్పీ నుంచి ఎల్ఎండీ నేరుగా నింపడానికి రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మానేరు, మూల వాగుల మీద చెక్ డ్యామ్ల నిర్మాణాన్ని ఎవరు వద్దనడం లేదని, ఇప్పటి వరకు అప్పర్ మానేరు ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ఎగువన ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది గర్భంలో బ్యారేజీలు నిర్మిస్తే 50 నుంచి 100 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి అంటే రూ. 2 లక్షల 40 కోట్ల అప్పు చేయడమా అని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు ప్రతి ఏటా ఓవర్ ఫ్లో అవుతుందని, ఎల్లంపల్లి ఎగువన 5 నుంచి 6 బ్యారేజీలు నిర్మించవచ్చని తెలిపారు. విషయ పరిజ్ఞానం లేదని సీఎం విమర్శించడం సరి కాదని, ఎవరికీ విషయ పరిజ్ఞానం లేదో సీఎం అర్థం చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు ఆనాడు గోదావరి నదిపై బ్యారేజీలు నిర్మించడానికి రిటైర్ చీఫ్ ఇంజినీర్ హనుమంతరావుతో చర్చించారని గుర్తు చేశారు. -
400 చెరువుల్లో... గోదావరి గలగలలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపిన ప్రభుత్వం చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యామ్ కింద చెరువులను నింపించిన ప్రభుత్వం..వందకు వంద శాతం చెరువులను నింపే పనిలో పడింది. వీటితో పాటే మిడ్మానేరు పరిధిలోని చెరువులతో పాటే, మిడ్మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులకు నీళ్లందించి, వాటి కింది ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఎస్సారెస్పీ స్టేజ్–2 చెరువులకు జలకళ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్మానేరు వరకు ఎత్తిపోసిన విషయం తెలిసిందే. దీంతో మేడిగడ్డ మొదలు మిడ్మానేరు వరకు గోదావరి అంతా జలకళను సంతరించుకుంది. మిడ్మానేరులోకి ఈ సీజన్లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యామ్కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న చెరువులను నింపే ప్రక్రియ గడిచిన రెండు నెలలుగా సాగుతోంది. స్టేజ్–2లో మొత్తంగా 681 చెరువులు నింపాల్సి ఉండగా, ఇప్పటికే 586 పూర్తయ్యాయి. మరో 78 చెరువులను ప్రస్తుతం నింపే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 17 నింపాల్సి ఉంది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలుగా కాగా, ఇప్పటికే నిండిన చెరువులతో వాటి నిల్వ 8.10 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత యాసంగిలో స్టేజ్–2 కింద ఉన్న 3.97 లక్షల ఎకరాల్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మిడ్మానేరు, లోయర్ మానేరులు నిండుగా ఉండటంతో నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. ఇక మిడ్మానేరు సైతం పూర్తి సామర్థ్యంతో నిండి ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్దేశించిన 80 వేల ఎకరాల ఆయకట్టులో 25 వేల ఎకరాలకు ఈ సీజన్లో నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు నీరిస్తూనే మరో 50 చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని సీఎం కేసీఆర్ సోమవారం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతగిరి ఖాళీ అయితే... ఇక దీంతో పాటే మిడ్మానేరు కింద ఉన్న అనంతగిరి గ్రామాన్ని త్వరగా ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ గ్రామం ఖాళీ అయితే అనంతగిరి, రంగనాయక్సాగర్ రిజర్వాయర్లను నింపడంతో పాటు కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించవచ్చు. ఇలా నీటిని తరలించే క్రమంలో రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటికే నింపిన చెరువులు, కొత్తగా నింపేవి కలిపి మొత్తం వెయ్యికి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపే కసరత్తు వేగంగా జరుగుతోంది. -
కాళేశ్వర గంగకు సీఎం జలహారతి
సిరిసిల్ల/మేడ్చల్రూరల్/బోయినపల్లి(చొప్పదండి)/వేములవాడ: కాళేశ్వర గంగమ్మను చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పులకించిపోయారు. సోమవారం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు వంతెన వరకు చేరిన గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. సిరిసిల్లను తాకిన జలాలను చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం మానువాడ వద్ద రూ.690.18 కోట్లతో నిర్మించిన మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించారు. 25.873 టీఎంసీల నీటి నిల్వతో నిండుకుండలా ఉన్న జలాశయం వద్ద జలహారతి పట్టారు. మిడ్ మానేరు జలాశయం 2006లో ప్రారంభం కాగా, పలు కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. అయితే 2016 తర్వాత సీఎం ప్రత్యేక చొరవతో మిడ్ మానేరు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి నీటిని మిడ్ మానేరులో నింపేందుకు చర్యలు తీసుకున్నారు. నవంబర్ 8 నుంచి ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోయడంతో మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండింది. జలకళతో ఉట్టిపడుతున్న జలాశయానికి సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం జలాలు చేరడంతో సీఎం కేసీఆర్ పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, జెడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, కనుమల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్గే తదితరులు పాల్గొన్నారు. సోమవారం సిరిసిల్ల వంతెనపై గోదావరి జలాలకు పూజలు చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో సీఎం కేసీఆర్ దంపతులు, వినోద్కుమార్ సీఎం వెంట ఈటల కుటుంబీకులు సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబీకులను వెంట తీసుకుని వెళ్లారు. తన పర్యటన సందర్భంగా కుటుంబంతో సహా రావాలని కేసీఆర్ కోరారు. దీంతో మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో ఉండే మంత్రి ఈటల రాజేందర్.. శామీర్పేటలో ఈటల భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్తో కలసి కేసీఆర్ బస్సు ఎక్కారు. సరిగ్గా పదేళ్లలో.. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ 2009 నవంబర్ 8న సిరిసిల్ల మానేరు వంతెనపై బట్టలు మార్చుకుంటూ.. పని ఒత్తిడితో కనిపించారు. మళ్లీ అదే వంతెనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు.. అధికారులతో మిడ్ మానేరు బ్యాక్ వాటర్కు పూజలు చేశారు. పదేళ్ల కిందట రాష్ట్ర సాధన ఉద్యమంలో బిజీగా ఉన్న సమయంలో కేసీఆర్ సిరిసిల్లలో బస చేసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళ్తూ.. ఢిల్లీకి విమానంలో వెళ్లే హడావుడిలో మానేరు వంతెనపై బట్టలు మార్చుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను సిరిసిల్ల ప్రజలు సోమవారం గుర్తు చేసుకున్నారు. సీఎంకు నిరసన సెగ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నీలోజిపల్లి గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి రోడ్డుపైకి ఊరేగింపుగా వస్తున్న మహిళలను, యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసన కారులకు తోపులాట జరిగింది. మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మాణ గ్రామమైన మాన్వాడ వాసులు సీఎం పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురికి ప్యాకేజీ డబ్బులు అందాల్సి ఉన్న నేపథ్యంలో తమ సమస్యలు సీఎంకు విన్నవించుకుందామని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రాజన్నను దర్శించుకునేందుకు వేములవాడకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ను ఏబీవీపీ నేతలు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అడ్డుకునేందుకు యత్నించారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలకు గాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ దర్శనానికి సీఎం బస్సులో వెళ్తుండగా, ఆయనను చూసేందుకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ చోట పేర్చిన విద్యుత్ స్తంభాలపై 20 మంది మహిళలు కూర్చున్నారు. సీఎం బస్సు రావడంతో ఒక్కసారిగా అందరూ లేచి నిల్చోవడంతో స్తంభాలు అదుపుతప్పి పక్కకు కూలాయి. దీంతో నక్షత్ర(19), వెంకాయమ్మ(35)లకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలసి సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్, వీటీడీఏ వైస్చైర్మన్ పురుషోత్తంరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రాజన్నగుడి చెరువులో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వీటీడీఏ అధికారులకు పలు సూచనలు చేశారు. -
కలగన్న తెలంగాణ కన్పిస్తోంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డెల్టా కన్నా అద్భుతంగా ఉంటుందని 2001 ఏప్రిల్లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో తొలి సింహగర్జన సభలో నేను చెప్పిన. కచ్చితంగా నిజాయితీ ఉన్న పోరాటం విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఈరోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మిడ్మానేరు ప్రాజెక్టు మీద నిల్చొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. జీవితంలో గొప్ప సఫలత్వం సాధించినట్లు అనుభూతి కలిగింది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. సోమవారం మిడ్మానేరును సందర్శించిన అనంతరం కరీంనగర్లోని ఉత్తర తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కలగన్న తెలంగాణ ఇప్పుడు కనిపిస్తోందని భావోద్వేగంతో చెప్పారు. సమావేశంలో కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఎంత ఆపినా ఆగలేదు.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేందుకు వందల కేసులు వేసిన్రు. మిడ్మానేరుపైనా వేస్తున్నరు. చిల్లర రాజకీయ ఆటంకాలు ఉన్నా మా ప్రయత్నాలు ఆగలేదు. ఎవరూ ఏ ఆటంకం తలపెట్టినా మేం పురోగమిస్తూనే ఉంటం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు పంటలు కలిపి 75 నుంచి 80 లక్షల ఎకరాల పంట పండుతుంది. కాళేశ్వరం పరిధిలో ఇప్పుడు కళకళలాడుతున్న రాజరాజేశ్వర స్వామి జలాశయం, లోయర్ మానేరు జలాశయం ఎప్పుడూ నిండుకుండలా ఉంటయి. ఎల్లంపల్లి, మిడ్మానేరు, మల్లన్న సాగర్ నీటి ఖజానాలుగా ఉంటయి. ఎక్కడ నీరు తగ్గినా మిడ్మానేరు ఆదుకుంటది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకే గాక, హైదరాబాద్కు, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ, మిషన్ భగీరథకు నీరు వెళ్తుంది. కరువు కాటకాలకు మారుపేరుగా ఉన్న కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వ, వరద కాల్వ, మానేరు, కాళేశ్వరం డ్యాంల నీటితో పాలుగారే జిల్లాగా జూన్ తర్వాత మనం చూడబోతున్నాం. రాష్ట్రంలో అధికారికంగా 24 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. అనధికారికంగా మరో మూడు లక్షల పంపు సెట్లు ఉంటాయి. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లకు ఉపయోగకరంగా ఉంటుంది’. కమిట్మెంట్ మాకే ఉంది.. రాష్ట్రం మీద కమిట్మెంట్ మాకే ఉంది. ఉద్యమకారులం, రాష్ట్రాన్ని సాధించినం. రాష్ట్రాన్ని ఎక్స్రే కళ్లతో చూసినం. రాష్ట్రం మీద టీఆర్ఎస్కు ఉన్న బాధ్యత ఇతర ఏ పార్టీలకు ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా 1,230 చెక్డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. రూ.1,232 కోట్లతో కరీంనగర్ జిల్లాలో చెక్డ్యాంలు రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించాం. మానేరు నది మీద 29 చెక్డ్యాంలు, మూలవాగుపై 10 చెక్డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశాం. సోమవారం కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ మొగులుకు మొఖం చూడొద్దు తెలంగాణ రాకముందు గోదావరి ఒరుసుకుని పారిన వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయి. ఈ జిల్లాల్లో కరువు ఉండకూడదు. కానీ తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో తల్లడిల్లాయి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అప్టూ మిడ్మానేరు లింక్ విజయవంతంగా పూర్తయింది. సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవడం జరిగింది. దీంతో మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలు నిండుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీలు, బ్యారేజీల్లో 60 టీఎంసీల వరకు మొత్తం 110 టీఎంసీల నిల్వ ఉంది. 20 టీఎంసీలు పోయినా నికరంగా 90 టీఎం సీలు ఉంటుంది. రైతులు మొగులుకు మొఖం చూడకుండా నిశ్చింతగా రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది. కరీంనగర్ నుంచి సూర్యాపేట జిల్లాకు నీళ్లు పోతున్నాయి. మహబూబాబాద్, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేట టేలెండ్ ప్రాంతాలకు నీళ్లు పోతున్నాయి. చావులు వద్దని రాసెటోళ్లు.. కరీంనగర్ జిల్లాలో 46 వాగులు ఉన్నాయి. ఇన్ని వాగులు ఉండి కూడా ఈ జిల్లా కరువు పాలైంది. ఇదే జిల్లా నుంచి దుబాయ్, గల్ఫ్, బొంబాయిలకు జనం వలసలు పోయిన్రు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా కరువు బారినపడ్డాయి. 700 నుంచి 900 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడలే. కరెంటు బాధలు తాళలేక జమ్మికుంటలో భిక్షపతి అనే యువకుడు చచ్చిపోయిండు . సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా రు. ‘చావులు పరి ష్కారం కాదు.. చావకండి’అని అప్పటి కలెక్టర్ గోడల మీద నినాదాలు రాయించిండు. 60 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఈ నినాదాలా మనం చూసేదని కళ్లకు నీళ్లు వచ్చినై. కరీంనగర్కు జీవధార.. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో లక్ష్మి, సరస్వతి, పార్వతీ బ్యారేజీలు కలిపి 145 కిలోమీటర్ల మేర గోదావరి 365 రోజులు సజీవంగా ఉంటుంది. ఇది కరీంనగర్ జిల్లాకు జీవధార. బోర్లు రీచార్జి అయినయి. అద్భుతంగా బోర్లు నిండాయని సిరిసిల్ల దగ్గర జిల్లెల్ల, నేరేళ్ల రైతులు చెప్పారు. మిడ్ మానేరు పుణ్యమా అని భూగర్భ జలాలు పైకి ఎగసిపడుతున్నాయి. కాకతీయ కాల్వ పాత కరీంనగర్ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది. మెట్పల్లి దమ్మన్నపేట నుంచి హసన్పర్తి దాక 200 కి.మీ కాకతీయ కాల్వ రెండు పంటలకు నీళ్లిస్తుంది. ఎస్సారెస్పీ వరద కాల్వ కూడా 160 కిలోమీటర్లు జిల్లాలో ఉంది. ఈ కాల్వ మొత్తం 365 రోజులు నిండే ఉంటుంది. జిల్లాలో అన్నింటికన్న పొడవైన నది మానేరు. అప్పర్, మిడ్, లోయర్ మానేరు కలిపి 181 కిలోమీటర్ల మానేరు నది సజీవంగా ఉంటుంది. కరీంనగర్లో రూ. 530 కోట్లతో చెక్డ్యాంలు ‘రూ.490 కోట్లతో మానేరు మీద 210 చెక్ డ్యాంలు, రూ.40 కోట్లతో మూలవాగు మీద 10 చెక్డ్యాంలు కట్టుకోవాలి. జూన్లోగా ఇవి పూర్తి చేసి నీటితో నింపుకునేలా సిద్ధంగా ఉండాలి. లండన్ థేమ్స్ నది సజీవంగా ఉన్నట్లు మానేరు నది కూడా ఉంటుందని నేనంటే కొందరు సన్నాసులు వక్రీకరించిన్రు. కొన్ని వెకిలి పార్టీలు హేళన చేíసినయి. జూన్ తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు కూడా మనం చేసిన పని కనబడుతది. కరీంనగర్ మానేరు, మిడ్మానేరు, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేస్తాం. పాపికొండల నడుమ గోదావరి కనిపించినట్లే వేములవాడ పుణ్యక్షేత్రం, మిడ్మానేరు కలిపి సిరిసిల్లలో కనబడుతుంది. ఏ తెలంగాణ కలగన్ననో ఆ తెలంగాణ కనబడుతంది. 46 నదులు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. పిచ్చికూతలు కూసేవాళ్లకు ఇన్ని వాగులు ఉన్నట్లు కూడా తెల్వదు. ఈడ ప్రాజెక్టులు కట్టాలని మాకు ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు. ఎవరూ పైరవీలు చేయలేదు. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి చేసినం. రాజకీయ వివక్ష లేకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పూర్తి చేసినం. ఈ చెక్డ్యాంలను కూడా అలాగే నిర్మిస్తం’అని సీఎం కేసీఆర్ వివరించారు. -
నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది: సీఎం కేసీఆర్
-
‘కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు’
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ భౌగోళిక, సాంకేతిక అంశాలపై కనీస పరిజ్ఞానం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని కేసులు పెట్టిన పట్టించుకోకుండా పనిచేశామని, దాని ఫలితం అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టులు, డ్యాంలను చూస్తుంటే తాను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం కరీంగనర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సీఎం కేసీఆర్ తొలుత మిడ్ మానేర్ను సందర్శించాక కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్తర తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్స్రేతో చూస్తోందన్నారు. ఉద్యమంలో అండగా ఉన్న కరీంనగర్ జిల్లా అభివృద్ది సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. సిరిసిల్లలో ఆకలి చావులు ఉండేవి.. ‘కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ తో సంబంధం లేకుండా 50 టీఎంసీలు లోయర్, మిడ్ మానేరులో నింపుకున్నాం. మరో 60 టీఎంసీలు బ్యారేజీల్లో నింపే అవకాశం ఉంది. ఇకపై వర్షాల కోసం రైతు మొగులు వైపు చూడనవసరం లేదు. 2001లోనే గోదావరి తీర తెలంగాణలో కరవు ఉండకూడదని ఆకాంక్షించాం. ఆ కల కాళేశ్వరంతో నెరవేరింది. మిడ్ మానేరు చూస్తే చాలా ఆనందం వేసింది. గోదావరి నదితో పాటు అనేక వాగులున్న కరీంనగర్ జిల్లా ఇంతకాలం కరువుతో అల్లాడింది. అనేక మంది ఈ జిల్లాల నుంచి వలసలు పోయారు. సిరిసిల్లలో ఆకలి చావులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జిల్లా ఎలా మారిందో చూస్తున్నారు. జిల్లాలో 140 కి.మీ గోదావరి 365 రోజులు ఇకపై సజీవంగా ఉంటుంది. భూగర్భ జలాలు పెరిగి బోర్లు బయటకు పోస్తున్నాయి. రాష్ట్రాన్ని ఎక్స్రేతో టీఆర్ఎస్ చూస్తుంది కాకతీయ కెనాల్ 200 కి.మీ పారుతుంది. మెట్పల్లి దమ్మన్నపేట నుంచి హసన్ పర్తి 200 కిలోమీటర్ల మేర రెండు పంటలు పండిస్తున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద ఎస్సారెస్పీ ఎల్లప్పుడు నిండుగా ఉంటుంది. మానేరు నది జిల్లాకు మరో వరం. ఇది 181 కి.మీ. మేర పారుతుంది. ఈ నదిని గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి పై ఏ పార్టీకి లేనంత కమిట్ మెంట్ ఉంది. రాష్ట్రాన్ని ఎక్స్రే తో టీఆర్ఎస్ చూస్తుంది. 1230 చెక్ డ్యాంలు రాష్ట్రంలో నిర్మించ బోతున్నాం. వీటిలో సింహ భాగం రూ. 1250 కోట్లతో పాత కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంలు నిర్మించబోతున్నాం. మానేరుపై 29, మూలవాగుపై 10 చెక్ డ్యాంలకు వెంటనే టెండర్లు పిలుస్తాం. పాలుగారే జిల్లాగా కరీంనగర్ మారబోతోంది. మిడ్ మానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా గొప్ప పాత్ర పోషించబోతోంది. నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది ఎల్లంపల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్ కీలక ప్రాజెక్టులుగా ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 75-80 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతాయి. 40 వేల కోట్లతో రైతులు బోర్లు మోటార్లు పెట్టుకున్నారు. 26, 27 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. జూన్ లోగా జిల్లాలోని చెక్ డ్యాంలు పూర్తి చేస్తాం. లండన్లోని థేమ్స్ నదిలాగా మానేరు సజీవంగా ఉంటుందని నేను గతంలో చెబితే కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు. వచ్చే జూన్ నాటికి ఈ ప్రాంతం ఎలా మారుతుందోమారుతుంది చూపిస్తాం. నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది. 46 వాగులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. కొంతమందికి ఇన్ని వాగులున్నాటని కూడా తెలియదు. ఈ పర్యటన నాకెంతో సంతోషం కలిగించింది మాకు ఎవరూ దరఖాస్తు చేయకున్నా రాష్ట్రం మొత్తం బాగుపడాలన్న లక్ష్యంతో స్కీంలు తెచ్చాం. కాంగ్రెస్, బీజేపీలకు భౌగోళిక, సాంకేతిక, విషయ పరిజ్ఞానం లేదు. మిడ్ మానేరు ను నింపే క్రమంలో కూడా కొందరు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. మిడ్ మానేరులో సీపేజీల గురించి అవగాహన లేకుండా మాట్లాడారు. 15 టీఎంసీలు నింపినప్పుడు కొంచెం ఎక్కువ సీపేజీ వస్తే టెస్టులు చేయించాం. ఆ సీపేజీ వచ్చిన ప్రాంతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రాక్టు పనులు గతంలో చేసాడు. కాళేశ్వరంపై ఎన్ని కేసులు వేసినా పట్టించుకోకుండా పనిచేశాం. 46 వాగులపై 210 చెక్ డ్యాంలు కడతాం. అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఈ పనులు చేపట్టేలా చూడాలి. ఉద్యమంలో అండగా ఉన్న కరీంనగర్ జిల్లా అభివృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. పెద్దపల్లి, రామగుండం టేలెండ్ ప్రాంతాలకు కూడా నీరందుతోంది. కరీంనగర్ నుంచి సూర్యాపేట జిల్లా వరకు నీరు చేరుతోంది. త్వరలోనే ఎమ్మెల్యేలతో చెక్ డ్యాంల పై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. నేటి పర్యటన నాకెంతో సంతోషం కలిగించింది.’అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
-
నేడు సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమ వారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిడ్ మానేరు డ్యామ్ పరిశీలన కోసం బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిడ్ మానేరు నుంచి బయలుదేరి ఒంటి గంటకు కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. -
ఆహా.. మిడ్ మా‘నీరు’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటి తరలింపుతో శ్రీ రాజ రాజేశ్వర రిజర్వాయర్ (మిడ్మానేరు) నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 25.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.11 టీఎంసీల మేర నిల్వ ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిజర్వాయర్లోకి 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీటి పరిమాణమే 46.46 టీఎంసీలుగా ఉంది. మరో 3.07 టీఎంసీ వరద నీరు కాగా, 2.45 టీఎంసీల నీరు ఎస్సారెస్పీ ద్వారా వచ్చింది. ఇప్పటికే మిడ్మానేరు ద్వారా లోయర్ మానేరు డ్యామ్కు 29.14 టీఎంసీల మేర నీటిని తరలించారు. ఎల్ఎండీ నుంచి ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీటిని తరలించి చెరువులు నింపారు. అయితే కాళేశ్వరంలో భాగంగా మిడ్మానేరు నుంచి నీటిని ప్యాకేజీ–10, 11, 12ల ద్వారా దిగువ అనంతగిరి, రంగనాయక్సాగర్ ద్వారా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉంది. అయితే అనంతగిరి గ్రామం ఖాళీ చేయకపోవడంతో నీటి పంపింగ్ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో మిడ్మానేరు కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రిజర్వాయర్ పరిధిలో చేసే పర్యటన సందర్భంగా కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిడ్మానేరు కుడి, ఎడమ కాల్వల కింద 75 కిలోమీటర్ల కాల్వల తవ్వకం చేయాల్సి ఉండగా, 60కిలోమీటర్లు పూర్తయింది. దీనికింద 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ యాసంగిలో 25వేల నుంచి 30వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి. -
రేపు కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(సోమవారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ప్రగతి భవన్ నుంచి బయలుదేరి నేరుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంటారు. అక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఉత్తర తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
ఒక రిజర్వాయర్..రెండు లిఫ్టులు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీ నీటిని ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు ఎత్తిపోసే ప్రణాళిక కొలిక్కి వచ్చింది. టన్నెల్ వ్యవస్థ ద్వారా నిర్మాణ ఖర్చు, గడువు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి దిగువన రెండు లిఫ్టులు, ఒక రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పైప్లైన్ల నుంచే నీటిని ఎత్తిపోసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి మొత్తంగా రూ. 12,700 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదలశాఖ అంచనా వేసింది. మూడో టీఎంసీ ద్వారా హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం చేపట్టే కేశవాపూర్ రిజర్వాయర్కు నీటిని అందించడంతోపాటు సింగూరు, నిజాంసాగర్, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. నీటి లభ్యత కరువైన సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని నిర్ణయించిన ప్రభుత్వం... బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీటిని తరలించే ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా అంచనా వ్యయం రూ. 12,700 కోట్లకు చేరనుందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. -
కందికట్కూర్కు ‘లీకేజీ’ భయం
ఇల్లంతకుంట (మానకొండూర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామం వద్ద నిర్మించిన మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నుంచి రెండు రోజులుగా నాలుగైదు చోట్ల నీటి ఊటలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనకట్ట నుంచి నీరు లీకవడంతో తమకు ముప్పేమైనా ఉంటుందా? అని గ్రామస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద బోగం ఒర్రె ప్రాం తంలో బుంగపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడి మాదిరిగానే ఇక్కడ బుంగ పడుతుందని భయపడుతున్నారు. కాగా, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ సమీపంలో మధ్యమానేరు ఆనకట్ట నుంచి శనివారం మూడు చోట్ల ఊట లొచ్చాయి. దీంతో అధికారులు రాళ్లు, మట్టితో ఆ ప్రాంతాన్ని పూడ్చివేయించారు. ఆదివారం మళ్లీ రెండుచోట్ల ఊటలు రావడం ప్రారంభమైంది. ఇది చూసి గ్రామస్తులు ఆనకట్ట నుంచి వస్తున్న లీకేజీ ఊట ఎక్కడ ఉప్పెనగా మారుతుందోనని ఆందో ళన చెందుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆనకట్ట వెంట నిర్మించిన కాల్వలో సీపేజీ నీళ్లు పారుతున్నాయి. నాలుగైదు చోట్ల కట్ట నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి. భయం అవసరం లేదు: శ్రీకాంత్రావు, ఎస్ఈ మధ్యమానేరు ఆనకట్ట నుంచి వస్తుంది సీపేజీ వాటర్ మాత్రమే. ఆనకట్టకు ప్రమాదం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకున్న స్థాయిలో కూడా రావడం లేదు. కట్ట లీకేజీపై సీఎం పేషీ ఆరా మధ్యమానేరు ఆనకట్ట లీకేజీపై సీఎం పేషీ అధికారులు ఆదివారం ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
వీడిన కట్ట లోగుట్టు
సాక్షి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మిడ్మానేరు రిజర్వాయర్ కట్ట భద్రతపై నెలకొన్న సందేహాలకు పుల్స్టాప్పడనుంది. నిండుకుండలా ఉండాల్సిన మిడ్మానేరు 2 టీఎంసీల నీటి నిలువలకు పడిపోవడం వెనుక రిజర్వాయర్ కట్ట పటిష్టంగా లేకపోవడమే కారణమని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ప్రతినిధి బృందం పలుమార్లు కట్టను సందర్శించి, రిజర్వాయర్ నుంచి లీకవుతున్న నీరుకు అడ్డుకట్ట వేయాలంటే ఆ ప్రాంతంలో కట్ట అడుగుభాగాన్ని పునర్నిర్మించడం ఒక్కటే మార్గమని తేల్చారు. ఈ మేరకు బోగంఒర్రె ప్రాంతంలో 200 మీటర్ల పొడవున కట్ట అడుగుభాగంలో పునాదిగా వేసిన రాతి కట్టడాల(రాక్టో నిర్మాణాలు)ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు శనివారం కూడా కొనసాగించారు. కట్ట అడుగు భాగంలో పదిమీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పులో తవ్వకాలు జరిపి, తిరిగి పటిష్టవంతంగా మట్టితో నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్చనీయాంశంగా రాక్టో తొలగింపు మిడ్మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై గత ఆగస్టు నెలలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరగడంతో నీటిని దిగువన ఉన్న మిడ్మానేరుకు వదిలిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సహకారంతో 25 గేట్లు ఎత్తి నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేశారు. అంత అర్జెంట్గా నీటిని ఎందుకు విడుదల చేశారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమైనా.. ఎల్లంపల్లి నుంచి మళ్లీ నీటిని నింపేందుకే అనుకున్నారు. 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలిన అధికారులు మళ్లీ మిడ్మానేరు నింపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ బృందం స్పందించారు. ‘మిడ్మానేరుకు ఏమైంది?’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టు భద్రతపై పడింది. ఈ నేపథ్యంలో లీకేజీ కాదు సీపేజీ అంటూ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్రెడ్డి స్పందించారు. ‘సాక్షి’ దినపత్రికలో మిడ్మానేరు ప్రాజెక్టు భద్రత, రిజర్వాయర్ నీటిని పూర్తిగా దిగువకు వదలడం అంశాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టుపై పడింది. ఆసక్తి రేపిన కట్ట నాణ్యత పరీక్షలు మిడ్మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికారులు ప్రాజెక్టుకు పలు పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో కట్టపైన ఫిజోమీటర్లను ఏర్పాటు చేశారు. బోగెంఒర్రె పరిసరాల్లో కట్ట నాణ్యత, భద్రత అంశాలు పరిశీలించడానికి ఢిల్లీకి చెందిన పర్సాన్ అనే సంస్థతో నీటిపారుదల శాఖ అధికారులు పలు రకాల జియో ఫిజికల్ టెస్టులు(పరీక్షలు) చేయించారు. ఇందులో భాగంగా కట్ట కింద 25 మీటర్ల లోతులో పలు చోట్ల ఎలక్ట్రికల్ సర్వే చేశారు. ఎలక్ట్రికల్ సర్వేలో భూమి అడుగు భాగానా.. తవ్వే అవసరం లేకుండా భూమి కింద 25 మీటర్ల లోపల కట్ట పరిస్థితి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. దీనికోసం అధికారులు కట్ట కింద ఎలక్ట్రికల్ సర్వేలు, సెప్మో రిట్రాక్టివ్(కట్ట స్కానింగ్) టెస్టులు చేశారు. దీంతో లోపల కట్ట బలంగా ఉందా..? రాక్ ఉన్నదా.. మట్టి బలంగా ఉందా.. లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఈ టెస్టులన్నీ ఇటీవల పూర్తి చేశారు. టెస్టులపై ఢిల్లీ సంస్థ ఇచ్చిన నివేదిక అనంతరం డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును సందర్శిస్తారని అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు. 200 మీటర్లు వెడల్పు... 10 మీటర్ల లోతు ప్రాజెక్టు కట్ట నుంచి సీపేజీ జరుగుతున్న బోగం ఒర్రె ప్రాంతంలో 2475 నెంబర్ నుంచి 2675 నెంబర్ వరకు 200 మీటర్ల పొడవున కట్ట కింద సుమారు రాతి కట్టడాల(రాక్టో)ను తొలగిస్తున్నారు. 10 మీటర్ల లోతు, వెడల్పులో రాతి నిర్మాణాలను తొలగించి తిరిగి పనులు చేస్తున్నారు. కట్టకింద భాగంలో తొలగించడం వల్ల కట్ట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున 200 మీటర్ల మేర పూర్తిగా కొత్త నిర్మాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాక్టో తొలగింపునకు పెద్ద మొత్తంలో జేసీబీలు, టిప్పర్లు వాడుతుతున్నారు. 200 మీటర్ల మేర కట్ట కిందనే తొలగిస్తారా? లేదా మొత్తం తొలగిస్తారా..? రాక్టో తొలగింపుల అనంతరం డ్యాం సేఫ్టీ, సెంట్రల్ డిజైనింగ్ అధికారులు ఏమంటారు..? తదితర సందేహాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కాగా శనివారం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, మిడ్మానేరు ఎస్ఈ శ్రీకాంత్రావు, ఈఈ అశోక్కుమార్ కట్టను సందర్శించారు. కట్టకు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా రిటైర్డ్ ఇంజినీర్ల బృందం కూడా శనివారం మరోసారి మానేరు కట్టను సందర్శించింది. 200 నుంచి 300 మీటర్ల పొడవున కట్టను పునర్నిర్మించాలని అధికారులు సూచించారు. గతంలో ఓసారి తెగిన కట్ట మిడ్మానేరు రిజర్వాయర్ నిర్మాణం సమయంలోనే ఓసారి గండిపడింది. 2016, సెప్టెంబర్ 24న మిడ్మానేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎడమవైపు కట్ట తెగింది. కట్ట తెగిన తరువాత మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉండగా, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు జరగలేదని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. గతంలో తెగిన ఎడమవైపే బోగం ఒర్రె ప్రాంతంలో కట్ట సీపేజీ రావడం, దానిని పునర్నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించడం గమనించాల్సిన విషయం. కాగా, ఇంత జరుగుతున్నా... రిజర్వాయర్ కట్ట విషయంలో అధికారులు వాస్తవాలు తెలియజేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని విషయం. -
మిడ్మానేరుకు ఏమైంది..?
సాక్షి, కరీంనగర్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మిడ్మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు భద్రత చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులోకి నీటిని నింపడం, అక్కడి నుంచి దిగువకు వదలడం వంటి అంశాల్లో పారదర్శకంగా ఉండాల్సిన అధి కార యంత్రాంగం గుంభనంగా వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. 25.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్మానేరులోకి 2017 నుంచి నీటిని నింపుతున్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట తొలిసారిగా 14 టీఎంసీల నీటిని నింపారు. కానీ నింపిన నీటిని దిగువకు వదిలి 25 రోజులు కావస్తున్నా, ఇప్పటి వరకు మళ్లీ మిడ్మానేరులోకి గోదావరి నీటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోగా, మిడ్మానేరులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ, దిగువన గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మిడ్మానేరు కట్ట సురక్షితం కాదనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం మిడ్మానేరు కట్టపైకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో చర్చించారు. మిడ్మానేరు కట్టపైన, కట్ట దిగువన బోరు మిషన్లతో డ్రిల్లింగ్ చేస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. మిడ్మానేరును ఎందుకు నింపడం లేదనే ఆయన ప్రశ్నకు అధికార యంత్రాంగం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడం గమనార్హం. మాన్వాడ, మల్లాపూర్, కొత్తపేట, బావుపేట ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరానికి గుండెకాయ మిడ్మానేరు కాళేశ్వరం ప్రాజక్టుకు గుండెకాయ వంటి మిడ్మానేరు నిండితేనే అక్కడి నుంచి ఒకవైపు లోయర్ మానేరుడ్యాం ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు, మరోవైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా మెదక్, నల్గొండ, హైదరాబాద్ వరకు కాళేశ్వరం జలాలు తరలివెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలో గత నెలలో ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని నందిమేడారం రిజర్వాయర్ ద్వారా లక్ష్మీపూర్ పంప్హౌజ్ నుంచి మిడ్మానేరుకు వదిలారు. 25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్మానేరులో తొలిసారిగా 14 టీఎంసీల వరకు నీటిని నింపిన అధికారులు ఆగస్టు 30న సాయంత్రం 5 గంటలకు రిజర్వాయర్ నీటిని 10వేల క్యూసెక్కుల వరకు ఎల్ఎండీకి వదలాలని నిర్ణయించారు. అప్పటికే పొద్దుపోవడంతో హుటాహుటిన రెవెన్యూ అధికారులతో చర్చించి, పోలీసుల కాపలా మధ్య రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సిరిసిల్ల ఎస్పీతో కలిసి కరీంనగర్ ఈఎన్సీ అనిల్కుమార్ నీటిని విడుదల చేశారు. 5 నుంచి 10 గేట్లు ఎత్తి మిడ్మానేరుకు నీటిని విడుదల చేస్తారని భావించగా, తెల్లవారే సరికి ఏకంగా 25 గేట్లు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఈ క్రమంలో దిగువన ఉన్న గ్రామాల్లోని గొర్రెలు, మేకలు, కరెంటు మోటార్లు కొట్టుకుపోయాయి. రెండు మూడు రోజుల్లో ఏకంగా 10 టీఎంసీల నీటిని మిడ్మానేరుకు వదిలేసి గేట్లు మూసివేశారు. ప్రస్తుతం మిడ్మానేరు ప్రాజెక్టులో కాళేశ్వరం నీరు నింపక ముందున్న 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వగా ఉంది. కాగా వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న 3,500 క్యూసెక్కుల నీటిని కూడా యధాతథంగా కిందికి వదులుతున్నారే తప్ప నిలిపే ప్రయత్నం చేయడం లేదు. మిడ్మానేరు కట్టకు లీకేజా... సీపేజా..? ‘కొత్త కుండ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నిండుగా నీళ్లు నింపి ఎక్కువ సేపు ఉంచరు. కుండ గట్టిపడేదాకా నీటిని నింపి వదిలేస్తుంటారు. అలాగే మిడ్మానేరు విషయంలో జరిగింది’ అని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్రెడ్డి గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఐఎస్ కోడ్ ప్రకారం రిజర్వాయర్ను రెండింట మూడొంతుల వరకు నీటితో నింపి ఆపేయాలని, ఏడాదికి కొంత చొప్పున నీటిని నింపాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే 2017లో ఈ ప్రాజెక్టులోకి 5.29 టీఎంసీ నీటిని నింపిన అధికారులు 2018లో 9 టీఎంసీలకు నింపారు. ఈ రెండు పర్యాయాలు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఈసారి 15 టీఎంసీల వరకు నింపినట్లు చెప్పారు. అయితే అంత మొత్తం నీటిని రాత్రికి రాత్రే వదిలేయాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. మాన్వాడ పరిధిలోని బోగంఒర్రె పూడ్చివేసి కట్ట కట్టిన ప్రాంతంలో భారీగా నీరు పైకి లేస్తుందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నీటి సాంధ్రత, గ్రావిటీని లెక్క కట్టేందుకు పీజో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏ సమస్య లేకపోతే పీజో మీటర్లను భారీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిడ్మానేరుకు లీకేజీ లేదని చెబుతున్న అధికారులు కేవలం సీపేజీ మాత్రమేనని దాటవేస్తున్నారు. సీపేజీ అనే సాంకేతిక పదానికి అర్థం... ఏదైనాæ ద్రవం గానీ, గ్యాస్ గానీ చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటకు వెళ్లడమే. ‘నేషనల్ రివర్స్ అథారిటీ’ ఈ సీపేజీ అనే పదాన్ని ‘ప్రమాదం నుంచి నివారించేందుకు గల అవకాశం’గా పేర్కొంది. పీజో మీటర్ ద్వారా పీడన పరీక్షలు ఏదైనా ద్రవం గ్రావిటీ కన్నా ఎత్తులో పీడనం చెందితే ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు పీజో మీటర్ను వినియోగిస్తారు. సివిల్ ఇంజనీరింగ్లో ఈ ప్రక్రియ సహజమే అయినప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణంలో గతంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలాలు లేవు. అయితే మిడ్మానేరు నీటిని ఎల్ఎండీకి వదిలిన తరువాత ఇరిగేషన్ అధికారులు మిడ్మానేరు కట్ట నాణ్యత పరీక్షల్లోనే మునిగిపోయారు. సీపేజీ జరుగుతుందని నిర్ధారణకు వచ్చిన అధికారులు కట్ట పైనుంచి 30 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి, పీవీసీ పైపుల గుండా పీజో మీటర్లను ఏర్పాటు చేసి కట్ట అడుగున నీటి సాంధ్రత, పీడనాన్ని అంచనా వేసే పనిలో మునిగిపోయారు. ఇప్పటికి కట్టకు ఇరువైపులా 8 పీజో మీటర్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కట్టకు దిగువన కూడా పీజో మీటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు జరుపుతున్నారు. కట్ట నుంచి 2.5 కిలోమీటర్ల నుంచి 2.7 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో భూ ఉపరితలం నుంచి ‘సీపేజీలు’ జరుగుతున్నాయని గుర్తించి డ్యాం సేఫ్టీ టీం పనులు చేస్తుందని ఈద శంకర్రెడ్డి చెప్పారు. భూ ఉపరితలం నుంచి మట్టితో కట్ట నిర్మించిందే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని, నాణ్యత లేని పనులు చేశారని కూడా ఆయన విమర్శించారు. చెరువు కట్ట నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఐడీసీ చైర్మన్ ఒప్పుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మిడ్మానేరు కట్ట ఎంత మేరకు సురక్షితమనే ఆందోళన దిగువనున్న గ్రామాల్లో మొదలైంది. దీనిపై అధికారులు గానీ ప్రభుత్వం గానీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
‘మిడ్ మానేరు’ ఎందుకు నింపడం లేదు'
సాక్షి, చొప్పదండి : మిడ్మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు కాగా కేవలం 15 టీఎంసీల నీరు చేరడంతోనే అర్ధరాత్రి 25 గేట్లు తెరిచి ఆదరాబాదరగా ఎల్ఎండీకి నీరు ఎందుకు విడుదల చేశారో జవాబు చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి మండలంలోని మాన్వాడ వద్ద మిడ్మానేరు ప్రాజెక్టు కుడివైపు కట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నిండి నీరు ఓవర్ ఫ్లో అయి వృథాగా పోతున్న సందర్భంలో అట్టి నీటిని మిడ్మానేరు ప్రాజెక్టులోకి ఎందుకు వదలడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు గల కారణాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ ప్రతినిధి బృందం కట్ట భద్రతపై ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్లు తెలిపారు. కాగా కట్ట మీద వాస్తవ పరిస్థితి చూస్తే బోర్లు వేసి టెస్ట్లు చేస్తున్నారు. మొత్తం బురద వస్తుంది. కట్టపైన బోగం ఒర్రె పరిసరాల్లో కిలోమీటర్ మేర కట్ట పునర్మించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్లు మాట్లాడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 30 నిర్వాసితుల మహాసభ చేపట్టిన రోజు కట్ట తెగుతుందనే భయంతో ఆదరాబాదరగా గేట్లు ఎత్తారన్నారు. బోగం ఒర్రె పరిసరాల్లో కట్ట మరమ్మతులు చేసిన క్రమంలో రాత్రికి రాత్రి మూడు మీటర్ల మేర కట్ట నిర్మించే పనులు చేపట్టి పాడుపడ్డ మట్టి, పెద్ద పెద్ద మొద్దులు వేసి నాసిరకంగా నిర్మించారని దాంతో లీకేజీ వస్తుందన్నారు. మిడ్మానేరు కట్ట నాణ్యతపై రాష్ట్రస్థాయి ఇంజినీర్లతో విచారణ చేయించాలని కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కట్ట నాణ్యంగా ఉంటే వెంటనే 25 టీఎంసీల నీరు మిడ్మానేరు ప్రాజెక్టులో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు సంగీతం శ్రీనివాస్, కూస రవీందర్, బండి శ్రీనివాస్, పిల్లి కనుకయ్య, వేసిరెడ్డి దుర్గారెడ్డి, వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్వర్రెడ్డి, మొగులోజి శ్రీకాంత్, ఎండీ.బాబు, నాగుల వంశీ పాల్గొన్నారు. చిన్న సీఫేజ్ అబ్జర్వ్ చేశాం వీటిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జేఈతో మాట్లాడారు. దానికి జేఈ వేణుగోపాల్ జవాబిస్తూ ప్రాజెక్టులో టూ థర్డ్ వాటర్ ఫిల్లింగ్ అయ్యాక టెక్నికల్ వాక్త్రూలో సీఫేజ్ అబ్జర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. అది లిమిట్లో ఉందని తెలిపారు. సీఫేజీలు ఉండడం సాధారణమన్నారు. డ్యాం పటిష్టతపై మంచిగా ఉండాలని ఈఆర్టీ, ఎస్ఆర్టీ టెస్ట్ చేయించామన్నారు. డౌన్ స్ట్రీమ్లో 20, 30 మీటర్ల తర్వాత సీఫేజీ గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని ఢిల్లీ పర్సా టెక్నాలజీ వారు చూశారు. వారు ఈఆర్టీ, ఎస్ఆర్టీ టెస్టులు చేశారని తెలిపారు. దీంతో బండ్ ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉందో తెలుస్తుందన్నారు. 300 మీటర్ల మేర సీఫేజ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకోసం 9 ఫీజో మీటర్లు ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఒక వారంలో ఫీజో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
మానేరు.. జనహోరు
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం వద్ద జనజాతర సాగింది. జలాశయం 23 గేట్లు ఎత్తి నీటిని ఎల్ఎండీకి వదలడంతో ఆ దృశ్యాన్ని తిలకించేందుకు జనం బారులు తీరారు. మధ్యమానేరు నిండా నీటితో కనువిందు చేస్తుండగా.. గేట్ల నుంచి నీళ్లు దిగువకు దూకుతున్న మనోహరమైన దృశ్యాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో సందర్శకులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. జలాశయం నీరు మానేరులోకి ప్రవహిస్తుంటే.. జనం ఆనందంగా తిలకించారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనజాతర సాగుతూనే ఉంది. ఎవరికీ పట్టని వాహనదారుల గోడు.. కొదురుపాక నుంచి ప్రాజెక్టు కట్టపైకి దారి మూసి వేశారు. వెంకట్రావుపల్లె, మాన్వాడ నుంచి వెళ్లే రోడ్డు ఒక్కటే ఉండడంతో వాహనాల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు దిగువ(కట్టకింద) ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు రోడ్డు దిగితే.. మట్టిలో కూరుకుపోయాయి. రద్దీని నియంత్రించే ఏర్పాట్లు చేయకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. వర్షాలకు మట్టి బాగా తడిసి ఉండడంతో జనం జారిపడ్డారు. అటు నీటిపారుదలశాఖ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎవరూ ట్రాఫిక్ ఇబ్బందులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే వారు ఇబ్బందులు పడుతుంటే.. కనీస ఏర్పాట్లు చేయడంతో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. బోయినిపల్లి పోలీసులు జలాశయం వద్దకు వచ్చినా.. ట్రాఫిక్ నియంత్రణలో ఇబ్బందులను అధిగమించలేకపోయారు. సందర్శకులకు పార్కింగ్ సదుపాయంతో పాటు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. నీటి అలలపై ఫొటోషాట్ సెల్ఫీ తీసుకుంటున్న యువతి -
‘టీఆర్ఎస్లో ఓనర్ల చిచ్చు మొదలైంది’
సాక్షి, రాజన్న సిరిసిల్ల : సీఎం కేసీఆర్కు చింతమడకపై ఉన్న ప్రేమ ముంపు గ్రామాలపై ఎందుకు లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మిడ్మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడతూ.. మిడ్మానేరు నిర్వాసితులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. పరిహారం వచ్చే వరకు జెండాలు పక్కకు పెట్టి పోరాటం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ తన సొంత గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఇస్తామని చెబుతున్నారు కానీ ముంపుకు గురైన కుటుంబాలకు మాత్రం నయా పైసా ఇవ్వడం లేదని విమర్శించారు. చావుకైనా తెగబడి మరోసారి మలిదశ ఉద్యమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్నాలతో కాకుండా ప్రగతి భవన్ను ముట్టడించి కేసీఆర్ సంగతేంటో చూద్దామన్నారు. సీఎం కేసీఆర్ మిడ్మానేరు ప్రాంతానికి వస్తే ప్యాకేజీతోనే రావాలని లేదంటే తమ తడాఖా ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్లో ఓనర్ల చిచ్చు మొదలైందని, దీనికి మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మంత్రి ఈటలకు దమ్ముంటే రాజీనామా చేసి బయటకు రావాలని సవాల్ చేశారు. రెండు పడకల ఇళ్లకోసం ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్రం నుంచి మంజూరు చేయించి తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ సంజయ్ హామీ ఇచ్చారు. -
లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు?
సాక్షి, రాజన్న సిరిసిల్ల : పరీహారం అందక మిడ్మానేరు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అండగా నిలిచిన ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మిడ్మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని భావించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఊర్లను మానేర్లో ముంచి కేసీఆర్ మూటలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహి అంటున్నారని మండిపడ్డారు. ‘మిడ్మానేరు నిర్వాసితులు ఇల్లు కట్టుకునేందుకు రూ. ఐదు లక్షల నాలుగు వేలు, 18 ఏళ్లు నిండిన వారికి రూ.2లక్షలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ నెరవేర్చలేదు కానీ కానీ ఆయన సొంత గ్రామం చింతమడకకు మాత్రం ప్రతి ఇంటికి రూ.10 లక్షలు ఇస్తానంటున్నారు. చింతమడకకు ఏమైందని లక్షలకు లక్షలు ఇస్తున్నారు? నష్ట పరిహారం చెల్లించేందుకు నీ బంధువలు తప్ప ముంపు గ్రామాల ప్రజలు కనిపించాడంలేదా? టీఆర్ఎస్ పార్టీ దొంగల బండిగా మారింది. చివరికి చెప్పులు కూడా విడిచిపెట్టడం లేదు’ అని రేవంత్రెడ్డి ఆరోపించారు. 13గ్రామాల ప్రజలు మౌనంగా ఉంటే హక్కులు తీరవన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశ సమయంలో హైదరాబాద్లో 48 గంటల దీక్ష చెపట్టమని నిర్వాసితులకు సూచించారు. దీక్షలో తాను కూడా పాల్గొంటానని, అప్పుడు ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామని రేవంత్ వ్యాఖ్యానించారు. మంచిగా నష్ట పరిహారం చెల్లిస్తే సరి లేదంటే దంచి తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి : పొన్నం మిడ్మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్, ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల 4వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని లేనట్లయితే కేసీఆర్ వస్తున్న రోజు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామన్నారు. ఎంపీ సంతోష్కు పుట్టిన గడ్డపై మమకారం ఉంటే మిడ్మానేరు ముంపుకు గురైన 13 గ్రామాలను దత్తత తీసుకోవాలని సవాల్ విసిరారు. -
ఆపరేషన్ అనంతగిరి..!
సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–10లో భాగంగా రూ.2700 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు నుంచి మరో దశకు నీటి మళ్లింపునకు రంగం సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టులోకి మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గోదావరి జలాలు లక్ష్మీపూర్ పంపుహౌస్ ద్వారా సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి 12 రోజులుగా చేరుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. అనంతగిరి జలాశయానికి గోదావరి జలాలను తరలించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం అనంతగిరి ఊరును ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్జిపూల్ సిద్ధం మధ్యమానేరు బ్యాక్ వాటర్ను గ్రావిటీ ద్వారా ఒబులాపూర్ నుంచి తిప్పాపూర్ మహాబావి (సర్జిపూల్)కి మళ్లించే పనులు సాగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద బావిని సిద్ధం చేశారు. 92 మీటర్లు లోతు, 56 మీటర్ల వెడల్పుతో సర్జిపూల్ను నిర్మించారు. మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు 3.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వచ్చి ఒబులాపూర్ సొరంగం ద్వారా తిప్పాపూర్లోని మహాబావికి చేరుతాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల నాలుగు మోటార్లతో నీటిని అనంతగిరి రిజర్వాయర్కు ఎత్తిపోస్తారు. ఇందు కోసం తిప్పాపూర్లో 440 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అనంతగిరి రిజర్వాయర్లో 3.5 టీఎంసీ నీటిని నిల్వ చేస్తారు. ఇప్పటికే నీటిపారుదలశాఖ అధికారులు తిప్పాపూర్లోని మోటార్లను వెట్రన్కు సిద్ధం చేశారు. అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఇల్లంతకుంట మండలంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. పునరావాస ప్యాకేజీ సిద్ధం ఇల్లంతకుంట మండలం అనంతగిరి నిర్వాసితుల కోసం పునరావాస ప్యాకేజీని సిద్ధం చేశారు. ఆ ఊరిలో 837 కుటుంబాలు ఉండగా.. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను కుటుంబా లుగా గుర్తించడంతో నిర్వాసితుల జాబితా 1,135 చేరింది. తంగళ్లపల్లి మండల కేంద్రం శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో మరో 70 ఎకరాలను పునరావాసం కోసం ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీని చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ప్లాట్లను ఇచ్చేందుకు లే అవుట్తో కూడిన పునరావాసం సిద్ధమైంది. 922 పట్టాలను పంపిణీకి సిద్ధం చేశారు. మరో 213 కుటుంబాలతో రెవెన్యూ అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు. అనంతగిరి ఊరును ఖాళీ చేయిస్తేనే.. మధ్యమానేరు నీరు అన్నపూర్ణ ప్రాజెక్టులోకి మళ్లించే అవకాశం ఉంది. ఇందు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్బాషా, డీఆర్వో ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాస్రావులు తొలి ప్రాధాన్యతగా అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో నిమగ్నమయ్యారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్కు.. అనంతగిరిలో నిల్వ చేసిన నీటిని సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్కు ఎత్తిపోస్తారు. ఇప్పటికే ఎత్తిపోతలకు సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. రంగనాయకసాగర్ నుంచి కొండ పోచమ్మ, అక్కడి నుంచి మల్లన్నసాగర్కు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ముందుగా కరీంనగర్ వద్ద ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)కి నీటిని విడుదల చేశారు. కానీ అనంతగిరి ప్రాజెక్టును ముందుగా నీటితో నింపాలనే లక్ష్యంతో ఎల్ఎండీకి నీటి విడుదలను నిలిపి వేశారు. సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలను ముందుగా తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. నీటి విడుదలకు సీఎం కేసీఆర్ మధ్యమానేరు నీటిని అనంతగిరి రిజర్వాయర్కు విడుదల చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మధ్యమానేరు వద్ద హెలీప్యాడ్ సిద్ధం చేశారు. అనంతగిరి నిర్వాసితుల పునరావాసం పూర్తి అయితే.. మధ్యమానేరులోకి 16 టీఎంసీల నీరు చేరగానే అనంతగిరికి నీటి విడుదల ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కరణకు సిద్ధమైంది. పునరావాసానికి ఏర్పాట్లు అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశాం. నిర్వాసితుల అభీష్టం మేరకు ప్లాట్లు కేటాయిస్తాం. ముందుగా అనంతగిరి వాసులు ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. పునరావాస ప్యాకేజీకి మెజార్టీ నిర్వాసితులు అంగీకరించారు. సంతకాలు చేయని వారి విషయంలో చట్టం ప్రకారం ముందుకు వెళ్తాం. టి.శ్రీనివాస్రావు, ఆర్డీవో, సిరిసిల్ల -
ఎన్నేళ్లకు జలకళ
సాక్షి, గంగాధర(కరీంనగర్) : కొన్నేళ్లుగా నీరు లేని చెరువు కాలం కరుణించకున్నా జలకళ సంతరించుకుంటుంది. సాగునీరు కరువై బీడు వారిన వ్యవసాయభూములు సాగుకు నోచుకోనున్నాయి. దీంతో సాగునీటి సమస్యతో సతమతమైన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గట్టుభూత్కూర్ ఊర చెరువులోకి కాలం కరుణించక చాలా సంత్సరాల దాకా నీరు రాలేదు. చెరువుకింది వ్యవసాయ భూములు సాగుకు నోచుకోలేదు. భూగర్భ జలాలు అడుగంటి పోయి వ్యవసాయ బావుల కింద సైతం నామమాత్రంగా పంటలు సాగయ్యేవి. కాళేశ్వరం నీరు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో సైతం కాలం కరుణించక పోయినప్పటికీ ఊరచెరువుకు కాళేశ్వరం ప్రాజక్టు నీరు చేరుతుండటంతో చెరువు నిండుకుండలా మారనుంది. మండలంలోని తాడిజర్రి గ్రామ శివారు నుంచి వెళ్తున్న వరదకాలువ ద్వారా గట్టుభూత్కూర్ ఊరచెరువుకు నీరు తరలించడానికి దాదాపు రూ.30 లక్షల రూపాయల వ్యయంతో తూం ఏర్పాటు చేశారు. గత పది రోజుల నుంచి రామడుగు మండలంలోని లక్ష్మిపూర్లోని గాయత్రి పంప్హౌజ్ నుంచి మూడు బాహుబలి మోటర్ల ద్వార వరదకాలువ నుంచి రాజరాజేశ్వర ప్రాజెక్టుకు (మిడ్మానేర్) నీరు సరఫరా చేస్తున్నారు. వరదకాలువ నిండుగా నీరు వెలుతుండటంతో తూం నుంచి చెరువుకు నీరు చేరుతుంది. చెరువు నిండితే మత్తడి ద్వారా దిగువలోని వెలిచాల చెరువుకు సైతం నీరు చేరే అవకాశం ఉంది. మిషన్కాకతీయలో చెరువుకు మరమ్మతు 107 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరచెరువును మిషన్కాకతీయ పథకంలో మొదటి విడతలోనే 2014–15 ఆర్థిక సంవత్సరంలో మరమ్మత్తులు చేశారు. దాదాపు కోటి రూపాయల వ్యయంతో చెరువులో పూడికతీత పనులు, కట్ట, మత్తడి, తూం మరమ్మత్తు చేశారు. వరదకాలువ నుండి వస్తున్న నీటితో ఇప్పటి వరకు దాదాపు 70 శాతం చెరువులోకి నీరు చేరింది. మరో నాలుగైదు రోజులు చెరువులోకి నీరువస్తే మత్తడి దూకి వెలిచాల చెరువులోకి నీళ్లు వెళ్తాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పంటలసాగు ఊరచెరువులోకి వరదకాలువ నుండి నీరు సరఫరా చేస్తుండటంతో దిగువ ప్రాంత రైతులతో పాటు, తూంల మీద ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. చెరువు నిండితే తూం ద్వారా దా దాపు ఐదు వందల ఎకరాల్లో పంటలు సా గయ్యే అవకాశాలున్నాయి. అలాగే భూగర్భ జలాలు పెరిగి మరోవేయి ఎకరాలకు సాగునీ రందుతుందని రైతులు పేర్కొంటున్నారు. చె రువు నిండితే సాగునీటితో పాటు, భూగర్భ జ లాలు పెరిగి తాగునీటి సమస్య సైతం పరి ష్కారం అవుతుందని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు. -
ఎమ్మెల్యేను అడ్డుకున్న మిడ్మానేరు నిర్వాసితులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు మిడ్మానేరు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతే ముందుకు కదలాలంటూ కొదురుపాక, నీలోజిపల్లి నిర్వాసితులు సోమవారం ఆయన్ను అడ్డుకున్నారు. ఇళ్లకు రూ.5,40,000 అందించడంతోపాటు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు కటాఫ్ డేట్ లేకుండా కుటుంబ పరిహారం ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రవిశంకర్ హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30న కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపడతామని నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
తెరపైకి ముంపు గ్రామాల ఉద్యమం
సాక్షి, బోయినపల్లి: శ్రీరాజరాజేశ్వర(మిడ్మానేరు) ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టారు. ఇదే సమయంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశాలతో ముంపు గ్రామాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందనివారి నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 2006లో రాజరాజేశ్వర(మిడ్మానేరు)రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. పదేళ్ల అనంతరం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు నిర్మాణంలో బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, రుద్రవరం, సంకెపెల్లి, ఆరెపెల్లి కొడుముంజ, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా, ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు ఆయా గ్రామాల్లో సర్వేచేసి 11,731 కుటుంబాలు ముంపునకు గురవుతున్నట్లు 2008–09లో గెజిట్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక మెజార్టీ నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీలు అందాయని అధికారులు అంటుంటే.. చాలా మంది పరిహారం అందాల్సినవారున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. స్థానిక నేతలకు సీఎం కేసీఆర్ ఫోన్ ప్రాజెక్టుకు వస్తున్న నీటి ప్రవాహం గురించి సీఎం కేసీఆర్ ఈ నెల 16న స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడారు.వారు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాని వారి సమస్యలపై సీఎంకు వివరించారు. సీఎం జిల్లా కలెక్టర్ను కలవాలని ఆదేశించారు.ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ తదితరులు జిల్లా కలెక్టర్ను కలిశారు. సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ప్యాకేజీలు రాని నిర్వాసితుల నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు ఆర్అండ్ఆర్ కాలనీలకు తరలిన నిర్వాసితులకు ప్రభుత్వం 242చదరపు గజాల ఇంటి స్థలం మంజూరుచేసింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ వేములవాడలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఐక్యవేదిక,అఖిలపక్షం నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన సందర్భంలో ఇళ్ల నిర్మాణాలకు రూ. 5.04 లక్షలు ఇవ్వాలనే విషయం దృష్టికి తీసుకువెళ్లినట్లు స్థానిక నేతలు తెలిపారు.ఆడిట్ ప్రాబ్లం అవుతుందని, మిగతా ప్రాజెక్టులకు ఇవ్వాల్సివస్తుందని సీఎం చెప్పారని అంటున్నారు.ఐక్యవేదిక నేతలు ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04లక్షలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఉద్యమానికి ఊపిర్లూదుతున్నారు. 30 భారీ బహిరంగసభ ముంపు గ్రామాల ఐక్యవేదిక,అఖిలపక్షం ఆధ్వర్యంలో గతనెల 31న చలో కలెక్టరేట్ పేరిట మహాపాదయాత్ర నిర్వాహించారు. అదే ఊపుతో రాష్ట్రస్థాయిలో వివిధ పార్టీల ముఖ్య నేతలతో కలిసి ఈ నెల 30న భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభ ద్వారా ఇండ్ల నిర్మాణానికి రూ.5.04లక్షల సీఎం కేసీఆర్ హామీ,18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు రూ. 2 లక్షల ప్యాకేజీ, పట్టా, ఇల్లు ఉండి గ్రామంలో లేరనే నెపంతో గెజిట్ జాబితా నుంచి తొలగించిన వారి పేర్లు మళ్లీ గెజిట్ జాబితాలో చేర్చి పరిహారం, అధికారులు ఎస్టిమేట్ చేసిన పరిహారం రాని ఇళ్లకు పరిహారం ఇవ్వాలని, కాలనీల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని సన్నాహాలు చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిర్వాసితులు పోరుబాట పడుతుంటే ముంపు గ్రామాల్లో ఇప్పటికీ పరిహారం రానివారి నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు రెండు రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఈ నెల 24వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంటున్నారు. -
అద్వితీయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని ఎత్తిపోసి మొదటి దశను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ ఎత్తిపోతలకు సిద్ధమైంది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించేలా పనులన్నీ పూర్తి చేసింది. నందిమేడారం, రామడుగు పంప్హౌస్లలో ఏడు మోటార్లకుగాను 5 మోటార్లను సిద్ధం చేయడంతోపాటు అత్యంత కీలకమైన ప్యాకేజీ–7 టన్నెల్ పనులను పూర్తి చేసింది. ప్యాకేజీ–8లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రామడుగు పంప్హౌస్లో ఏర్పాటు చేసిన ఆసియాలోకెల్లా పెద్దవైన బాహుబలి మోటార్లకు ఆదివారం లేదా సోమవారం నుంచి ట్రయల్ రన్ జరగనుంది. ఒకట్రెండు రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి ఆ వెంటనే 3–4 రోజుల్లో పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హాజరై మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆవిష్కృతం కానున్న అద్భుతం...: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి బ్యారేజీకి నీటి ఎత్తిపోతల ప్రక్రియ విజయవంతమైంది. ప్రస్తుతం పరీవాహకం నుంచి వస్తున్న ప్రవాహాలతో ఎల్లంపల్లి నుంచి నీరు దిగువకు వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేరుకు తరలించే పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్తో నడిచే 7 మోటార్లలో ఐదింటికి ఇప్పటికే వెట్ రన్ నిర్వహించారు. రెండ్రోజుల కిందట ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనులు పూర్తి చేసి పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ సఫలం కావడంతో ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లను పరిశీలించేలా ఫోర్ బేకి నీటిని వదిలారు. ప్యాకేజీ–8లోని సర్జ్పూల్ని శనివారం 227 మీటర్లకుగాను 214 మీటర్ల లెవల్ వరకు నింపారు. దశలవారీగా సర్జ్పూల్ను నింపుతూ లీకేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయితే పూర్తిస్థాయిలో సర్జ్పూల్ను నింపి ఒకటి లేదా రెండు మోటార్లకు వెట్ రన్ నిర్వహిస్తారు. 115 మీటర్ల లోతు నుంచి నీటి ఎత్తిపోత... ప్యాకేజీ–8లోని ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ స్టేషన్ను భూగర్భానికి 330 మీటర్ల దిగువన మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటీ 139 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని సిద్ధం చేశారు. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు, వ్యాసం 22 మీటర్లు, బరువు 2,376 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ట్రాన్స్ఫార్మర్ బేలు, కంట్రోల్ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్ రూమ్ ఒక్కొక్కటి నిర్మించగా, ఎల్టీ ప్యానెల్స్, పంప్ ఫ్లోర్, కంప్రెషర్లు కలిపి మొత్తం 4 అంతస్తులతో నిర్మించారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాల రూపంలో బీహెచ్ఈఎల్ సరఫరా చేయగా వాటిని ప్యాకేజీ–8 వద్దకు తీసుకొచ్చాక బిగించే 60 శాతం పనిని మేఘా సంస్థ పూర్తి చేసింది. ఈ మోటార్లకు కరెంట్ సరఫరా చేసేందుకు 400 కేవీ విద్యుత్ సబ్ స్టేసన్ ఇప్పటికే సిద్ధమైంది. మోటార్ల వెట్ రన్ పూర్తయ్యాక వచ్చే వారం నుంచే పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టనున్నారు. మోటార్ల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్మానేరుకు ఎత్తపోసే రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేయనున్నారు. -
కాళేశ్వరం నీరు.. మరో వారం ఆగాల్సిందే!
‘ఎల్లంపల్లి పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ఇక్కడి నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపు పూర్తయితే ప్రాజెక్టు లక్ష్యం 65 శాతం సాఫల్యమైనట్టే. వారం రోజుల్లో మిడ్మానేరుకు నీరు విడుదల కావాలని అధికారులను ఆదేశిస్తున్నా...’ – ధర్మపురిలో మంగళవారం మీడియాతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సాక్షి , కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 25వేల నుంచి 40వేల క్యూసెక్కుల వరద నిరాటంకంగా వచ్చి చేరుతోంది. 20.175 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో 19.50 టీఎంసీల నీటి నిల్వ తరువాత 10 గేట్ల ద్వారా మిగతా నీటిని వదులుతున్నారు. దిగువకు వదిలిన నీరు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గుండా మేడిగడ్డకు చేరి అక్కడి నుంచి గోదావరి నదిలో కలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందించే ప్రక్రియలో ప్రధాన జలాశయమైన మిడ్మానేరుకు నీటిని ఎత్తిపోయడంలో జరిగిన ఆలస్యం కారణంగానే ఎల్లంపల్లికి వస్తున్న వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాటి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో... వారంలోగా మిడ్మానేరుకు నీరు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు మిడ్మానేరుకు నీరు తరలించే విషయంలో అడ్డంకిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. నందిమేడారం నుంచి సర్జిపూల్కు గోదావరి నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారానికి గోదావరి నీటిని ఇప్పటికే వదిలారు. నందిమేడారం నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్లోని పంప్హౌస్ మధ్య 15.11 కిలోమీటర్ల పొడవునా టన్నెల్స్ ఉన్నాయి. 6వ ప్యాకేజీలో ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా సుమారు కిలోమీటరు పారి అక్కడి నుంచి టన్నెళ్ల ద్వారా 9.5 కిలోమీటర్లు ప్రయాణించి నందిమేడారం పంప్హౌస్కు చేరుకుంటున్నాయి. పంప్హౌస్ నుంచి మేడారం చెరువులోకి అవసరం మేరకు నీటిని ఎత్తిపోశారు. నంది మేడారం చెరువు మత్తడి 233 మీటర్ల ఎత్తులో ఉండగా, 230.55 మీటర్ల నీటిమట్టం ఉంటే లక్ష్మీపూర్లోని ఏడు పంపులకు నీటిని తరలించవచ్చు. ఈ నేపథ్యంలో నందిమేడారం చెరువు నుంచి 7వ ప్యాకేజీలో మల్లాపూర్ సొరంగం ద్వారా 11.24 కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీపూర్ సర్జిపూల్ పంప్హౌజ్కు నీటిని విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు మేడారంలో నాలుగు గేట్లు ఎత్తి గత సోమవారం ఉదయం నీటిని వదలగా, ఆ రోజు రాత్రి వరకు లక్ష్మీపూర్ సర్జిపూల్కు చేరుకున్నాయి. మంగళవారం నీటిని తరలించే పనిని ఆపేశారు. మొదట సర్జ్పూల్ నుంచి పంపుల్లోకి నీటిని తరలించే డ్రాఫ్ట్ట్యూబులకు అడ్డంగా ఉన్న గేట్లు మునిగేలా 193.5 మీటర్ల మేర నీటిని నింపారు. గేట్ల నుంచి లీకేజీలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మిగతా సర్జ్పూల్లను క్రమక్రమంగా పూర్తిస్థాయిలో నింపాలని నిర్ణయించి ఆ మేరకు బుధవారం పనులు చేపట్టారు. అన్ని పరీక్షలు పూర్తయితే వెట్ రన్ జరపాలని భావిస్తున్నారు. ఇప్పటికే 5పంపుల డ్రైరన్ నిర్వహించిన నేపథ్యంలో వెట్రన్కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సర్జ్పూల్లో నీటిని 226 మీటర్ల వరకు నింపితే ఏడు పంపులు నడిపించేందుకు వీలవుతుంది. అయితే వెట్రన్ జరిపిన వెంటనే నీటిని మిడ్మానేరుకు తరలించే పరిస్థితి లేదని సమాచారం. సర్జిపూల్లో పంపుల పనితీరును పరీక్షించిన తరువాత, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చే వారం మిడ్మానేరుకు నీరు తరలిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. 7వ ప్యాకేజీతోనే ఆలస్యం కాళేశ్వరం ప్రాజెక్టు ఏడో ప్యాకేజీలో నందిమేడారం రిజర్వాయరు, 11.24 కిలోమీటర్ల టన్నెళ్లు(సొరంగాలు) మాత్రమే ఉన్నాయి. 6, 8 ప్యాకేజీల్లో రెండు చోట్ల భారీ పంప్హౌస్లు తవ్వాల్సి ఉంది. అయితే 6, 8 ప్యాకేజీ పనులు అనుకున్న సమయంలో పూర్తి కాగా, ఏడో ప్యాకేజీలోని 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం ప్రధాన సమస్యగా మారినట్లు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత టన్నెల్ పైనుంచి ఎస్సారెస్పీ వరదనీటి కాలువ, కాకతీయ కాలువ పారుతున్నాయి. భూగర్భం నుంచి తవ్వే టన్నెళ్లకు నీటి ఊట ఎక్కువగా రావడంతో అధికార యంత్రాంగం, కాంట్రాక్టు సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ మార్గంలో నిర్మాణం జరుగుతున్నప్పుడు నాలుగు చోట్ల టన్నెల్ల పైభాగం కూలాయి. ఈ నేపథ్యంలో పైభాగం కూలకుండా ఇనుప కడ్డీలు వేస్తూ పైభాగంలో సిమెంటు కాంక్రీటు నింపుతూ ఎట్టకేలకు పనులు పూర్తి చేసినప్పటికీ, టన్నెల్లోపల లైనింగ్ పనులు పూర్తి కాక కూడా కొద్దిరోజులు ఆలస్యం అయింది. ఇప్పుడు టన్నెళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, బాహుబలి వంటి ప్రధానమైన లక్ష్మీపూర్ సర్జిపూల్లో నీటిని నింపి పంపుల ద్వారా బయటకు పంపే ప్రక్రియను ఆచితూచి నిర్వహిస్తున్నారు. సీఎం ఆదేశాలతో పనులు వేగం ప్రస్తుతం లక్ష్మీపూర్ సర్జిపూల్కు వచ్చే నీటిని వీలైనంత వేగంగా మిడ్మానేరుకు తరలించేందుకు ఇంజినీరింగ్ విభాగంతోపాటు పనుల కాంట్రాక్టులు చూస్తున్న కంపెనీల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో లక్ష్మీపూల్లోని సర్జ్పూల్లోని ఏడు పంప్లను నడిపించడం ప్రయాసతో కూడుకున్నదిగా ఇంజినీర్లు చెబుతున్నారు. ఏ చిన్న సాంకేతిక లోపం ఎదురైనా, లీకేజీలు జరిగినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్నందున సర్జ్పూల్లో, అండర్గ్రౌండ్ టన్నెళ్లలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని తేలిన తరువాతే లక్ష్మీపూర్ నుంచి నీటిని విడుదల చేస్తామని చెబుతున్నారు. సర్జ్పూల్ మోటార్లు పనిచేస్తే గ్రావిటీ కాలువ ద్వారా 5.770 కిలోమీటర్లు పారి వరద నీటి కాలువ ద్వారా నేరుగా మిడ్మానేరుకు గోదావరి జలాలు చేరుతాయి. ఈ ప్రక్రియ మొత్తానికి లక్ష్మీపూర్ పంప్హౌస్ను పూర్తిస్థాయిలో పనిచేయించడమే ప్రధానం కానుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారంలోగా నీటిని మిడ్మానేరుకు గోదావరి నీటిని తరలించేందుకు కృషి చేస్తున్నారు. -
ఇక మిడ్మానేరుకు ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 2 నెలలు ఆలస్యంగా అయినా కరువుతీరా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా గోదావరిలోనూ ప్రవాహాలు పెరుగుతుండటంతో అవన్నీ నిండుకుండలుగా మారుతున్నాయి. కడెం, దాని పరీవాహకంలో కురిసిన వర్షాలతో గోదావరి బేసిన్ లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.18 టీఎంసీలుకాగా 19.14 టీఎంసీల మేర నిల్వలు చేరుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ప్రవాహా లు తగ్గాయి. గేట్లు ఎత్తడంపై అధికారులు సోమ వారం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేరు ప్రాజె క్టుకు ఎత్తిపోసే పనులకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరంలో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 నందిమేడారం పంప్హౌస్లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న నీటితో ఏప్రిల్లోనే 5 మోటార్లకు 0.25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యా సంతో ఉన్న జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6 లోని సర్జ్పూల్ను నింపి లీకేజీలను పరిశీలించారు. ఎత్తిపోతలకు ప్యాకేజీ–6 సిద్ధంగా ఉం డగా ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం రెండ్రోజుల కిందటే పూర్తయింది. ఈ టన్నెల్లోకి నీటిని వదిలి లీకేజీలు, ఇతరత్రా పరీక్షలను సోమవారం నుంచి మొదలు పెట్టనున్నారు. సోమవారం సాయం త్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మం డలం మేడారం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా టన్నెల్లోకి నీటిని తరలించే షట్టర్ల వద్ద ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి షట్టర్లను ఎత్తనున్నారు. మరోవైపు పరీక్షలు చేస్తూనే ప్యాకేజీ–8లోని రామడుగు పంప్హౌస్కు నీటిని పంపనున్నారు. ‘బాహుబలులు’ సిద్ధం.. ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లకు మంగళవారం నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ఈ పంప్హౌస్లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉం డగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. ఈ నెల 9 లేదా 10న ఎల్లంపల్లి నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతలు చేపట్టి ప్యాకేజీ–6, 7, 8ల ద్వారా నీటిని మిడ్మానేరుకు తరలించనున్నారు. కృష్ణా ఉగ్ర తాండవం... పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం చూపిస్తోంది. వాగులు, వం కలు నిండిపోవడం, వచ్చిన వరద వచ్చినట్లుగా ఆల్మట్టి, నారాయణపూర్లోకి చేరుతుండటంతో ఉధృతి పెరుగుతూనే ఉంది. ఆల్మట్టిలోకి 2.45 లక్షల క్యూసెక్కులు (22 టీఎంసీలు) వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 2.85 లక్షల క్యూసెక్కుల (25.90 టీఎంసీలు) నీటిని దిగవ నారాయణపూర్కు వదులుతున్నారు. నారాయణపూర్కు వచ్చిన నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలకు 2.33 లక్షల క్యూసెక్కులు (21 టీఎంసీలు) వస్తుండగా అంతే మొత్తంలో శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 2.20 లక్షల క్యూసెక్కుల (20 టీఎంసీలు) మేర నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 100 టీఎంసీలకు చేరింది. ఈ నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టులోకి 66 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. రోజుకు 20 టీఎంసీలకు తగ్గకుండా వరద కొనసాగుతుండటంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 854 అడుగులను దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సైతం తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభు త్వం శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కుల మేర నీటిని వినియోగిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో దిగువ నాగార్జున సాగర్కు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో 3 రోజులు వర్షాలు రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు వంపు తిరిగి ఉందని సీనియర్ అధికారి రాజా రావు తెలిపారు. దీంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, చికున్గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. -
‘కిషన్ది ప్రభుత్వ హత్యే’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు నిర్వాసితుల పాదయాత్రలో పాల్గొని గుండె పోటుతో మృతి చెందిన ఆరెపల్లి గ్రామానికి చెందిన కిషన్ కుటుంబ సభ్యులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ తదితరులు గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. మృతి చెందిన కిషన్కు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే.. కేసీఆర్కు పాలాభిషేకం చేస్తామన్నారు. ముంపు గ్రామంలో సీనియర్ అధికారిని నియమించి సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు పొన్నం. -
ఉప్పొంగులే గోదావరి
వందల కిలోమీటర్ల పొడవైన సొరంగాలు.. నూటా నలభై టీఎంసీల సామర్థ్యంగల బ్యారేజీ, రిజర్వాయర్లు.. వేల కిలోమీటర్ల కాల్వలు.. ప్రపంచంలోనే ఇంతకుముందెన్నడూ వాడని భారీ మోటార్లు.. కనీవినీ ఎరుగని రీతిలో మూడేళ్లలోనే నిర్మాణం.. 40 లక్షల ఎకరాలకు ఆయకట్టు.. కలగలిపి బృహత్తర ప్రణాళికతో ప్రపంచమే అబ్బురపడేలా నిర్మించిన మానవ అద్భుతం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నేడు అంకురార్పణకు సిద్ధమైంది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కల సాకారం చేయడంలో కీలక ముందడుగు వేయనుంది. నీళ్లు, నిధులు, నియామ కాలు లక్ష్యంగా తెచ్చుకున్న రాష్ట్రాన్ని హరితవనం చేస్తానన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కలలకు ప్రాణంపోస్తూ మహాయజ్ఞంలా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోనుంది. అనేక అవాంతరాలు, అడ్డంకులు దాటుకొని వచ్చే నెల నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించేందుకు సిద్ధమైంది. జూలై చివరికల్లా ఎస్సారెస్పీకి జలాలు.. గోదావరిలో వరద ఉధృతం అయ్యే నాటికి నీటిని ఆయకట్టుకు పారించేలా పనులన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ పంప్హౌస్లో 11 మోటార్లకుగాను ఇప్పటివరకు 10 మోటార్లు అమర్చారు. అన్నారం పంప్హౌస్లో 8 మోటార్లకుగాను 6, సుందిళ్లలో 9కిగాను 7 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెల రెండో వారానికి మిగతా మోటార్లు సిద్ధం చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టారు. పంప్హౌస్ పనులు పూర్తయితే గోదావరి నీళ్లు ఎల్లంపల్లికి చేరుతాయి. ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే ఐదు సిద్ధమయ్యాయి. ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. ఇక ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యంగల బాహుబలి మోటార్ పంపులు 6 సిద్ధమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి, అటు నుంచి మిడ్మానేరుకు తరలించే నీటిని వరద కాల్వపై నిర్మిస్తున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని లిఫ్టుల ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 9.68 లక్షలు, స్టేజ్–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను దాటుకొని నీరు ఎల్లంపల్లి మీదుగా వరద కాల్వ ద్వారా మిడ్మానేరుకు చేరుతుంది. అయితే మిడ్మానేరుకు చేరక ముందే వరద కాల్వ మీద మూడు పంప్హౌస్లను నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద ఉండే 60 నుంచి 120 రోజులపాటు ఎస్సారెస్పీకి తరలించి ఆయకట్టుకు నీరివ్వనున్నారు. మిడ్మానేరు దిగువనా అంతా సిద్ధం... ఇక మిడ్మానేరు కింద కొండపోచమ్మ సాగర్ వరకు ప్యాకేజీ–10, 11, 12, 13, 14 ఉండగా అవన్నీ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ–10లో అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్ ఇతర నిర్మాణాలతోపాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయి. కేవలం 800 మీటర్ల టన్నెల్ లైనింగ్ మిగిలి ఉంది. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉండగా అన్నీ పూర్తయ్యాయి. 3.5 టీఎంసీల సామర్థ్యంగల అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–11లో అన్ని పనులూ పూర్తవగా 8.41 కిలోమీటర్ల టన్నెల్ పనులు, లైనింగ్ పనులను పూర్తి చేశారు. ఇక్కడ నాలుగు మోటార్లకుగాను నాలుగూ సిద్ధమవగా 3 టీఎంసీల సామర్థ్యంగల రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం సైతం పూర్తయింది. ప్యాకేజీ–12లో 16.18 కిలోమీటర్ల టన్నెల్ పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయి. ఇక్కడ ఎనిమిది పంపుల్లో నాలుగు సిద్ధమవగా నాలుగు శ్లాబ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే నెల పూర్తవుతాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రూ. 80 వేల కోట్ల వ్యయంలో రూ. 50 వేల కోట్ల మేర పనులు ఇప్పటికే పూర్తవగా ఇందులో రూ. 30 కోట్ల మేర బ్యాంకు రుణాల ద్వారానే సేకరించారు. వైఎస్ హయాంలో మొగ్గ తొడిగి.. రీ డిజైన్తో కొత్త అడుగు.. ఎగువ రాష్ట్రాల జల దోపిడీతో కృష్ణా జలాలు దిగువకు రావడమే కరువైన పరిస్థితుల్లో పుష్కలంగా లభ్యత ఉన్న గోదావరి జలాలే తెలంగాణకు శరణ్యమని అంచనా వేసిన తొలి వ్యక్తి దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి. సముద్రం పాలవుతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి ఉపనదులైన వార్దా, పెన్గంగ, ఇంద్రావతి, ప్రాణహిత నీటిని ఎక్కడికక్కడ వినియోగంలోకి తెచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పంట పొలాలకు ఊపిరిలూదేందుకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఏకంగా 160 టీఎంసీల నీటిని మళ్లించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీలు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ ప్రాంత తాగునీటికి 10 టీఎంసీలు వినియోగించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 డిసెంబర్ 16న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వైఎస్... ఆ మర్నాడే రూ. 35,200 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో విడుదల చేశారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి సైతం తెచ్చారు. అయితే ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ 16 లక్షలకు అదనంగా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18.87 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగా నీటి లభ్యత అధికంగా ఉన్న మేడిగడ్డకు మార్చి దానికి కాళేశ్వరమని పేరు పెట్టారు. అప్పటి వైఎస్ ఆలోచనలే నేడు కాళేశ్వరం ప్రాజెక్టుగా పురుడు పోసుకుంటోంది. పాత డిజైన్కు అంగీకరించని మహారాష్ట్ర.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేయాలని సంకల్పించింది. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించేలా అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు 2014 జూలైలో ముంబై వెళ్లి మహారాష్ట్ర జలవనరులశాఖ మంత్రితో సమావేశమయ్యారు. కానీ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు çఅంగీకరించలేదు. అనంతరం సీఎం కేసీఆర్ స్వయంగా 2015 ఫిబ్రవరి 15న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్తో సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తామే దీన్ని వ్యతిరేకించి ఇప్పుడెలా అంగీకరిస్తామంటూ ఆయన కూడా ఆసక్తి చూపలేదు. ఈ సమయంలోనే కేంద్ర జలసంఘం నుంచి 2015 మార్చి 4న ప్రాణహిత–చేవెళ్ల డిజైన్లోని తప్పిదాలను ప్రశ్నించడం మొదలు పెట్టింది. ప్రాణహిత–చేవెళ్లలో భాగంగా తమ్మిడిహెట్టి వద్ద 273 టీఎంసీల నీటి లభ్యత ఉందని ప్రభుత్వం మొదటగా డీపీఆర్ సమర్పిస్తే... కేంద్ర జలసంఘం దాన్ని పరిశీలించి 165 టీఎంసీలేనని తెలిపింది. ఇందులోనూ ఎగువ రాష్ట్రాలు వాడుకోవాల్సిన 63 టీఎంసీలు కలిసి ఉన్నాయని చెప్పింది. 75 శాతం డిపెండబులిటీ లెక్కన ఇక్కడ వినియోగించుకునే నీళ్లు కేవలం 80 టీఎంసీలకు మించదని, ఈ నీటితో 16.40 లక్షల ఎకరాలకు నీరివ్వలేరని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రీ డిజైనింగ్ తెరపైకి వచ్చింది. ప్రత్యామ్నాయాలపై అహోరాత్రులు శ్రమించి మేడిగడ్డ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల లభ్యత ఉందని తేల్చి అక్కడి నుంచే గోదావరి ఎత్తిపోతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్మాణానికి మహారాష్ట్ర అనుమతి అవసరం కావడంతో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకునేందుకు 2016 మార్చి 8న తెలంగాణ–మహారాష్ట్ర అంతర్రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేశారు. సాంకేతిక అంశాలపై బోర్డులో సానుకూలత రావడంతో 2016 ఆగస్టు 23న తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, ఫడ్నవిస్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య చరిత్రాత్మక అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరింది. పరుగులు పెట్టించిన హరీశ్ కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెట్టించి దాన్ని పూర్తి చేయడంలో మాజీ మంత్రి టి.హరీశ్రావు పాత్ర మరువలేనిది. ప్రతి 15 రోజుల్లో మూడు రోజులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండి పనులు చేయించారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఏమాత్రం కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టేనని కేంద్రాన్ని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారు. పాత ప్రాజెక్టుగా గుర్తించిన అనంతరమే కీలకమైన 9 కేంద్ర అనుమతులు మంజూరయ్యాయి. ఇక ప్రాజెక్టుల భూసేకరణ అంశంలో రెవెన్యూ, అటవీ, మైనింగ్, పోలీసు, ఇరిగేషన్ శాఖలను సమన్వపరచడం, వాటిపై ఏకధాటిగా 12 గంటలపాటు సమీక్షలు చేసి వాటి సేకరణ పూర్తి చేయించడం ఆయనకే చెల్లింది. సవాళ్లకు ఎదురేగి... కాలంతో పరుగులు పెడుతూ రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే స్థాయిలో అవాంతరాలు ఎదురయ్యాయి. ఓవైపు వర్షాలు, వరదలు, కొన్ని సార్లు తీవ్రమైన ఎండలు, మరోవైపు కూలిన సొరంగాలు, కార్మికుల కొరత ప్రాజెక్టు నిర్మాణ పనులకు సవాళ్లు విసిరాయి. మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో మూడు లక్షల క్యూసెక్కులకుపైగా వస్తున్న ప్రాణహిత వరద, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించే టన్నెళ్లు కూలుతుండటం, మేడిగడ్డకు అవసరమైన కంకరను 150 కి.మీ. దూరం నుంచి సరఫరా చేయాల్సి రావడం, లారీల సమ్మె నేపథ్యంలో సిమెంట్ లారీలను పోలీసుల రక్షణ మధ్య తరలించాల్సి రావడం ప్రాజెక్టుకు కఠిన పరీక్షలు పెట్టాయి. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–7లోని సొరంగ పనులకు అనేక అవాంతరాలు ఎదురవగా.. విక్రంసింగ్ చౌహాన్ అనే నిపుణుడి సాయంతో పరిష్కరించారు. భూసేకరణ విషయంలో ఎదురైన అవాంతరాలను ఎదుర్కొని ప్రాజెక్టును పూర్తి చేశారు. వచ్చే ఏడాదికే ‘మూడో’ టీఎంసీ.. కాళేశ్వరంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం... కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునే ప్రణాళికకు ప్రాణం పోసింది. ఇందులో భాగంగా మేడిగడ్డ పంప్హౌస్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పుడు అదనంగా మూడు పంప్హౌస్లలో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ. 7,998 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ప్రస్తుతం అది రూ. 12,392 కోట్లకు చేరుతోంది. ఇక మిడ్మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు పైప్లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు మూడు స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ. 4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్లైన్ నిర్మాణానికి రూ. 10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ. 14,362 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని నిర్ణయించింది. మున్ముందు దక్షిణ తెలంగాణకు... ఉత్తర తెలంగాణకే పరిమితమైన ఈ ప్రాజెక్టును.. మున్ముందు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులతోనూ అనుసంధానించనున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపుతూనే పూర్వ మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో కాళేశ్వరాన్ని అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ వద్ద స్లూయిస్ నిర్మాణం చేసి అటు నుంచి ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థ ద్వారా 50 కిలోమీటర్ల దూరాన ఉండే ఉస్మాన్సాగర్కు నీటిని తరలించేలా చూడాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ. 300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇదే సమయంలో గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం... మరో కొత్త ప్రతిపాదనకు నాంది పలికింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యమున్న బస్వాపూర్ రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడికి చేరే నీటిని పాలమూరులో భాగంగా జడ్చర్ల వద్ద నిర్మిస్తున్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కు తరలించాలన్నది ప్రణాళిక. దీంతోపాటే కొత్తగా కాళేశ్వరం నీటిని పాలమూరు–రంగారెడ్డిలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి, డిండి ప్రాజెక్టులోని శివన్నగూడెం రిజర్వాయర్కు తరలించే ప్రతిపాదనలను రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వం ముందుంచారు. నెరవేరని జాతీయ హోదా యత్నాలు... కాళేశ్వరం ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు దక్కినా.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసినా ఒక్క అంశంలో మాత్రం లోటు కనిపించింది. అదే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలో ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించిన దృష్ట్యా కాళేశ్వరానికి హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచీ పట్టుబట్టింది. దీనిపై అనేకసార్లు పార్లమెంటులో, ప్రధాని వద్ద ప్రస్తావించింది. నీతి ఆయోగ్ భేటీల్లో, కేంద్ర జలవనరులశాఖ సమావేశాల్లో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయినా కేంద్రం కనికరించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తే.. రూ. 80 వేల కోట్ల వ్యయంలో 90 శాతం నిధులు కేంద్రమే సమకూర్చేది. మహాయజ్ఞంలో ‘త్రిమూర్తులు’.. తీవ్ర కరువు ప్రాంతాలు, బీళ్లు బారిన భూములకు గోదావరి నీటిని తరలించాలని సంకల్పించి ఆ దిశగా ఆలోచించిన తొలి ఇంజనీర్గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చరిత్రకెక్కారు. దివంగత ఇంజనీర్ ఆర్.విద్యాసాగర్రావుతో కలసి ప్రాజెక్టుకు పురుడు పోసింది మొదలు అన్నీ తానే వ్యవహరించారు. అహోరాత్రులు ఈ మహాయజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలి, ఎలాంటి ప్రణాళిక ఉండాలి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై కర్త, కర్మ, క్రియ అన్నీ తానై సీఎం కేసీఆర్ ముందుండి నడిపించారు. ఇక రెండో వ్యక్తి ఈఎన్సీ హరిరామ్. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్కు ముందు నుంచీ ఆయన చీఫ్ ఇంజనీర్ స్థాయిలో మహారాష్ట్రతో చర్చలు, ప్రాజెక్టు అనుమతుల విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఈఎన్సీగా ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చాక కేంద్ర అనుమతులన్నీ తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిది. దీనికితోడు మిడ్మానేరు దిగువన మేడారం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను పూర్తి చేయడం, మల్లన్న సాగర్ భూసేకరణ పూర్తిలో ఆయన పాత్రే కీలకం. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా బ్యాంకు రుణాల విషయంలో చురుకైన పాత్ర పోషించారు. కోర్టులు, ఎన్జీటీ కేసులన్నీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక మూడో వ్యక్తి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు. అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌస్లను కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం వెనుక ఆయన శ్రమ చాలా ఉంది. పనుల పూర్తికి నిరంతరం శ్రమించారు. మహారాష్ట్ర ప్రాంతంలో నిర్మాణాల పూర్తికి సమన్వయంతో వ్యవహరించి పూర్తి చేశారు. ఎల్లంపల్లి దిగువన అత్యంత క్లిష్టమైన ప్యాకేజీ–7 టన్నెల్ పనులను పూర్తి చేయడం, ప్యాకేజీ–6, ప్యాకేజీ–8లో మోటార్ల బిగింపులో ఎక్కడా లేని వేగం చూపడం ఆయనకే చెల్లింది. -
‘మిడ్మానేరు’కు కొత్త చిక్కు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి గుండెకాయలాంటి మిడ్మానేరు రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపేందుకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంకా మిడ్మానేరు రిజర్వాయర్ పరిధిలో పూర్తికాని భూసేకరణ, నిర్వాసితులకు అందని పునరావాసం కారణంగా పూర్తిస్థాయి నిల్వలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరో రూ.104 కోట్లు చెల్లిస్తే కానీ సహాయ పునరావాసం, ఇతర పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లోనే 150 టీఎంసీల మేర గోదావరి జలాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోజుకు 2 టీఎంసీల మేర నీటిని తరలించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లిల అనంతరం నీరు మిడ్మానేరుకు చేరాలి. మిడ్మానేరుకు కొద్దిముందు నుంచి వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీరు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి, మిడ్మానేరు నుంచి మరో టీఎంసీ కొండపోచమ్మసాగర్ దిగువకు చేరాలి. ఈ మొత్తం ప్రక్రియలో మిడ్మానేరు చాలా కీలకం. 25.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టును గత ఏడాదే 5 టీఎంసీల మేర నింపారు. వాస్తవానికి 10 టీఎంసీల వరకు నింపుదామని భావించినప్పటికీ ప్రాజెక్టు కింది ముంపు గ్రామాల్లో సహాయ పునరావాసం పూర్తికాని కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో నింపేలా పనులన్నీ పూర్త య్యాయి. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఈ కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు. తర్వాత ఈ ఏడాది 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,800 గృహాలకు రూ.250 కోట్ల మేర సైతం చెల్లింపులు జరిగినా.. ఇంకా ఆరేపల్లి, సంకేపల్లి గ్రామాల్లో 170 ఎకరాల మేర భూసేకరణ జరగాలి. దీంతో పాటే చీర్లవంచ గ్రామంలో ముంపునకు గురయ్యే సుమారు 200 ఇళ్లతో పాటే, మరిన్ని గ్రామాల్లో సహాయ పునరావాస ప్యాకేజీ కింద చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆర్అండ్ఆర్ కిందే ఇంకా రూ.40 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. -
సోలార్ ప్లాంట్లు ఇవి నీటిపై తేలుతాయి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్ముందు భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుదుత్పత్తిని మరింత మెరుగుపరచుకునే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పాదకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో నీటితో ఉండే రిజర్వాయర్ల పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవకాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. నీటిపై తేలియాడే సోలార్ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే దేశంలో పేరొందిన పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కాళేశ్వరం పరిధిలోని ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్మానేరు, అనంతగిరి, రంగనాయక్సాగర్, కొండపోచమ్మ సాగర్ల పరిధిలో వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28, 29న ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్మానేరులలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. కాళేశ్వరం బ్యారేజీలు, రిజర్వాయర్లే టార్గెట్.. రాష్ట్రంలో సోలార్ విద్యుదుత్పత్తి ప్రస్తుతం 3,700 మెగావాట్లకు చేరుకోగా, 2022 నాటికి 5వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. మరో అడుగు ముందుకేసి రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 141 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మల్లన్నసాగర్ వంటి 50 టీఎంసీల రిజర్వాయర్తో పాటు 20 టీఎంసీల ఎల్లంపల్లి, 25 టీఎంసీల మిడ్మానేరు, 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. గంధమల 9, బస్వాపూర్ 11 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల్లో వాటర్ స్ప్రెడ్ ఏరియా చాలా ఉంటోంది. ఈ ఏరియాను వినియోగించుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రిజర్వాయర్లపై తేలియాడే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి ఉంటుందని, ఇదే సమయంలో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలను నివారించవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. నీటిపై తేలియాడే సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తయ్యే విద్యుత్, నాణ్యతతో పాటు పలు అంశాల్లో లాభదాయకంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భూమిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ఖాళీ స్థలాలు అవసరమని, భారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఖాళీ స్థలాల లభ్యత ఆషామాషీ వ్యవహారం కానందున, రిజర్వాయర్ల పరిధిలో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ఆమోదయోగ్యమని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లుగా తెలిసింది. అయితే కాళేశ్వరం పరిధిలో నది పరీవాహకంపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో ప్యానెళ్ల నిర్మాణం కష్టసాధ్యమని, ఇక్కడ భారీ వరదలు వచ్చినప్పుడు సోలార్ ప్యానెళ్లు కొట్టుకొనిపోయే ప్రమాదం ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు పరిధిలోనూ ఇదే సమస్య ఉంటుందన్నారు. అయితే అనంతగిరి, రంగనాయక్సాగర్, బస్వాపూర్, గంధమల, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో మాత్రం వీటిని ఏర్పాటుచేసే వీలుంటుందని చెబుతున్నారు. అయితే వీటి నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలన్న దానిపై పూర్తి స్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. కాగా రిజర్వాయర్ల పరిధిలో సోలార్ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్కు సంబంధించిన ఉన్నతాధికారులు మిడ్మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లిలో పర్యటించి నీటిపై తేలియాడే విద్యుత్ ప్లాంట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. -
‘కాళేశ్వరం’లో పైప్లైన్కు రూ. 14,430 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటిని తరలించే వ్యవస్థకు తోడు అదనంగా మూడో టీఎంసీ నీటి తరలింపునకు అయ్యే అంచనా వ్యయాలను నీటిపారుదలశాఖ సిద్ధం చేసింది. గతంలో సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించేలా సిద్ధం చేసిన ప్రతిపాదనలను పక్కనపెట్టి సీఎం సూచన మేరకు పైప్లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించింది. అదనపు టీఎంసీ నీటి తరలింపునకు మిడ్మానేరు మొదలు మల్లన్నసాగర్ వరకు రూ. 14,430 కోట్ల మేర ఖర్చవుతుందన్న అంచనాతో సీఎంకు నివేదిక సమర్పించింది. వచ్చే ఏడాదికే అదనపు టీఎంసీ... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రెండు టీఎంసీలను తరలించేలా కసరత్తు జరుగుతున్న సమయంలోనే మరో టీఎంసీ నీటిని తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే ఆదేశించారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు పనులకు సంబంధించిన అంచనా వ్యయాలు సమర్పించగా వాటికి పరిపాలనా అనుమతులు వచ్చాయి. మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు ఒక టీఎంసీ నీటిని గ్రావిటీ కాల్వలు, సొరంగాల ద్వారా తరలించాలని నిర్ణయించారు. ఈ నీటి తరలింపునకు 35.55 కి.మీల సొరంగాలు తవ్వాల్సి వస్తోంది. రెండు అండర్గ్రౌండ్ పంప్హౌస్లు నిర్మాంచాలని ప్రతిపాదించారు. దీనికి రూ. 12,594 కోట్లు అంచనా వేసి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అయితే సొరంగాల నిర్మాణానికి భారీగా భూసేకరణ అవసరం ఉండటంతోపాటు సొరంగాల తవ్వకానికి రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి పైప్లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించేలా అధ్యయనం చేయాలని సూచించారు. పైప్లైన్ ద్వారా అయితే భూసేకరణ అవసరాలు తగ్గుతాయని, నిర్మాణాన్ని సైతం వచ్చే ఏడాదికి పూర్తి చేసి నీటిని తరలించవచ్చని సీఎం సూచించారు. దీనికి తగ్గట్లుగా ప్రస్తుతం ఇంజనీర్లు నివేదిక రూపొందించి శుక్రవారం ప్రగతి భవన్లో నీటిపారుదలశాఖ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి అందజేశారు. పైప్లైన్ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా గ్రావిటీ కెనాల్, మూడు ఓపెన్ పంప్హౌస్లు, 16.35 కి.మీల ప్రెషర్ మెయిన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి మిడ్మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు రూ. 4,147 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ. 10,283 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. గతంలో సొరంగ వ్యవస్థల నిర్మాణంతో పోలిస్తే అదనంగా రూ.1,836 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపినట్లుగా తెలిసింది. దీంతో త్వరలోనే పరిపాలనా అనుమతులు రానున్నాయి. -
ఇప్పుడంతా ‘పరీక్షా’ కాలం!
సాక్షి, హైదరాబాద్: ఇది ‘పరీక్ష’ల సీజన్. నీటిపారుదల శాఖకు టెస్టింగ్ పీరియడ్. పంప్హౌస్లలో డ్రై, వెట్రన్ నిర్వహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్ సీజన్లో కనిష్టంగా నూటా ఇరవై టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని నీటి పారుదల శాఖ దృడ సంకల్పంతో ఉంది. ఇప్పటికే ఎల్లంపల్లిలో లభ్యత ఉన్న జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–6 పరిధిలో పంపులు, మోటార్లకు వెట్రన్ నిర్వహించిన ఇంజనీర్లు మిగతా ప్యాకేజీల్లోని మోటార్లను సైతం డ్రై, వెట్రన్ నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 8వ తేదీన గానీ, 9వ తేదీన గానీ మేడిగడ్డ పంప్హౌస్ల పరిధిలో, 15వ తేదీలోపే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో, నెలాఖరుకు మిడ్మానేరు దిగువన ఉన్న నాలుగు ప్యాకేజీల పరిధిలోని పంప్హౌస్ల్లో డ్రై, వెట్రన్ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ నుంచే ఎత్తిపోతలు గోదావరిలో జూన్ తొలివారం నుంచే నీటి ప్రవాహాలు మొదలవుతాయి. ప్రాణహిత నుంచి గోదావరికి ఉధృత ప్రవాహాలుంటాయి. ఈ ప్రవాహాలు పుంజు కునే నాటికి పంపులు, మోటార్లు అంతా సిద్ధం చేసి వరద కొనసాగే రోజుల్లో కనిష్టంగా రోజకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పె ట్టుకున్న విషయం తెలిసింది. అందుకు తగ్గట్లే బ్యారేజీలు, పంప్హౌస్లు, రిజర్వాయర్లు, కాల్వల పనులను చేస్తోంది. అత్యంత ముఖ్యమైన మోటార్ల ఏర్పాటును వేగిరం చేసింది. అత్యంత ప్రాధాన్యం గల తొలి పంప్హౌస్ అయిన మేడిగడ్డలో 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇందులో 7 ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో రెండు మోటార్లు ఏర్పాటు దశలో ఉన్నాయి. సిద్ధంగా ఉన్న మోటార్లకు ఈ నెల 8నగానీ, 9న గానీ వెట్రన్ నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయిం చారు. ఇటీవల పంప్హౌస్ పరిధిలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ సైతం గోదావరిలో లభ్యతగా ఉండే నీటితో ఈ నెల 8న వెట్రన్కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాలు కురిసి నీటి లభ్యత ఏర్పడిన అనంతరం అన్నారంలోని 9 మోటార్లు, సుందిళ్లలోని మోటార్లకు వెట్రన్ చేయనున్నారు. కాళేశ్వరానికి అనుసంధానంగా ఉన్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్హౌస్లకుగానూ రెండింటిని సిద్ధం చేసిన 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగేసి చొప్పున పంపులకు డ్రైరన్ నిర్వహించనున్నారు. ఈ పంప్హౌస్ల ద్వారా ఈ ఖరీఫ్లో కనిష్టంగా 45 నుంచి 60 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం విధించారు. మిడ్మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ–10లో 106 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 4 పంపులకు ఈ నెలాఖరున డ్రైరన్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్యాకేజీ–11లోని 135 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 మోటార్లు, ప్యాకేజీ–12లో 43 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 8 మోటార్లకు జూన్లో వెట్రన్ చేసే అవకాశం ఉంది. ఇక ప్యాకేజీ–16లోని రెండు పంప్హౌస్ల్లో జూలైలో వెట్రన్ జరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
మిడ్మానేరు ఎగువన 3.. దిగువన 2 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నుంచి మూడో టీఎంసీ నీటిని తీసుకునేలా ఇప్పటికే బృహత్ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, నీటిని తరలించే వ్యవస్థలకు సమగ్ర ప్రణాళికల తయారీలో పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేలా సివిల్ పనులు జరుగుతుండగా, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మీదుగా దిగువ మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించే ప్రణాళికలకు పదును పెడతోంది. ప్రాజెక్టు ద్వారా గరిష్ట నీటి వినియోగం, వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా అధ్యయనం చేసి పనులకు శ్రీకారం చుట్టాలని శనివారం నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎలాంటి నిర్మాణాలు అవసరమవుతాయా? ఎక్కడెక్కడ లిఫ్టులు, టన్నెళ్లు, పైప్లైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, వ్యయ అంచనాలపై అధ్యయనం ఆరంభించింది. పత్తిపాక ఉంచాలా?.. వద్దా?.. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటిని తరలించేలా ఇప్పటికే పనుల కొనసాగుతున్నాయి. అం దుకు తగ్గట్లే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. ఎల్లంపల్లి దిగువన మిడ్మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. మిడ్ మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టడంతో, మిడ్మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ మొదలుకుని గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు ఒక టీఎంసీ నీరు మాత్ర మే లభ్యతగా ఉంటుంది. ఈ నీటితో ఆయకట్టు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. దీన్ని దృ ష్టిలో పెట్టుకొని మిడ్మానేరు వరకు 3 టీఎంసీలు, ఆ దిగువన 2 టీఎంసీల నీటిని తరలించాలన్నది సీఎం యోచన. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలో సుమారు 10 టీఎంసీలతో పత్తిపాక రిజర్వా యర్ను సైతం ప్రతిపాదించారు. దీని నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఉంచా లా? వద్దా? అన్న దానిపై అధ్యయనం చేయా లని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. దీన్ని కొనసాగించితే ప్రాజెక్టుకు రూ.13 వేల నుంచి రూ.14 వేల కోట్ల వ్యయం కానుంది. పత్తిపాక లేని పక్షంలో రూ.11 వేల కోట్లు కానుంది. ఇక మిడ్మానేరు దిగువన ప్రస్తుతం 12 వేల క్యూసెక్కులు (ఒక టీఎంసీ) మేర నీటిని తరలించేలా కాల్వలు, టన్నెళ్ల నిర్మాణాలు జరుగు తున్నాయి. ప్రస్తుతం 24వేల క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటిని తరలించాలంటే మళ్లీ కొత్తగా లిఫ్టులు, పంప్హౌజ్లు, గ్రావిటీ కాల్వలు, టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. టన్నెళ్ల నిర్మాణం చేస్తే సమయం ఎక్కువగా పట్టే నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థ వైపు సీఎం మొగ్గు చూపుతున్నారు. పైప్లైన్ వ్యవస్థ అయితే రూ.11 వేల కోట్లు, టన్నెల్ అయితే రూ.8 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఏ వ్యవస్థ సరైనదో నిర్ణయించి వారంలో నివేదించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వ్యవస్థలకు అవసరమయ్యే సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తూనే, ప్రస్తుతం జరుగుతున్న పనుల ద్వారా కనిష్టంగా 3 వేల చెరువులను నింపాలని కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట్ల తూముల నిర్మాణం వేగిరం చేయాలని సూచించారు. -
భారమంతా 'భూమి మీదే'..
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో రైతుల ఆశలన్నీ కాళేశ్వరం ద్వారా మళ్లించే గోదావరి జలాలపైనే ఉన్నాయి. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న ప్రాజెక్టు పనులన్నీ పూర్తయి ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ఎంతమేర గోదావరి నీటిని తమ ఆయకట్టుకు మళ్లిస్తారోనని రైతులు కోటికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే.. బీడువారిన భూముల్లో సిరులు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో 50% పూర్తి కాగా, మరో 50% పనులు మిగిలున్నాయి. మిగతా పనుల పూర్తికి భూసేకరణ అడ్డంకిగా మారుతోంది. ప్రాజెక్టు పరిధిలో ఇంకా 27వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. దీనికి నిధుల కొరతతోపాటు.. కోర్టు కేసులను దాటడం అత్యవసరంగా మారింది. జూన్ నాటికి ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంప్హౌస్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో ఇప్పుడిప్పుడే పనులు వేగవంతమయ్యాయి. ఇక్కడ ఇంకా 4.87లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేయడం పెద్ద సవాల్. అయితే మొత్తం పని పూర్తవకపోయినా.. గోదావరి నుంచి కనిష్టంగా 100 టీఎంసీల మేర నీటిని తీసుకునే ఆస్కారం ఉంది. ఈ పనులను మరింత వేగవంతం చేసేందుకు.. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మేడిగడ్డ పంప్హౌస్లో 11 మోటార్లకు ఇప్పటివరకు 4 మోటార్లు అమర్చారు. మిగతావాటిని అమర్చే ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంది. అన్నారం బ్యారేజీలో 66 గేట్లు, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. పంప్హౌస్ల పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నారం పంప్హౌస్లో 8 మోటార్లకు గానూ 2, సుందిళ్లలో 2 మోటార్లు సిద్ధం చేయగా, మే నాటికి మిగతా మోటార్లు సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. ఈ పంప్హౌస్ పనులు పూర్తయితే గోదావరి నీళ్లు ఎల్లంపల్లికి చేరతాయి. ఎల్లంపల్లి దిగువన 6,7,8 ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్కు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే మూడు సిద్ధమయ్యాయి. మరో మోటార్ రెడీ అవుతోంది. ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎడమ వైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటినైనా మళ్లించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 4 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్ను మరో 15–20 రోజుల్లో సిద్ధం చేయనున్నారు. మార్చి లేక ఏప్రిల్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు ప్యాకేజీలు పూర్తి చేసి జూన్ నాటికి మిడ్మానేరుకు కనిష్టంగా 90–100 టీఎంసీల నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. మిడ్మానేరు కింద అంతా సిద్ధం ఇక మిడ్మానేరు కింద కొండపోచమ్మ సాగర్ వరకు 10,11, 12, 13, 14 ప్యాకేజీలు ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ–10లో అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్ ఇతర నిర్మాణాలతో పాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయి. కేవలం 800 మీటర్ల టన్నెల్ లైనింగ్ మిగిలి ఉంది. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉంది. ఇందులో 2 పూర్తవగా.. మరో రెండింటిని ఏప్రిల్లో పూర్తి చేయనున్నారు. 3.5 టీఎంసీల అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. వీటిని జూన్ నాటికి పూర్తి చేస్తారు. ప్యాకేజీ–11లో అన్ని పనులు పూర్తవగా, 8.41 కిలోమీటర్ల టన్నెల్ పనులు, లైనింగ్ పనులు రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇక్కడ 4 మోటార్లలో 3 పూర్తవగా, ఒకటి మార్చి నాటికి సిద్ధం కానుంది. ఇక్కడ 3 టీఎంసీల రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ పని పూర్తయింది. ప్యాకేజీ–12లో 16.18 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవగా 800 మీటర్ల లైనింగ్ మిగిలుంది. ఈ పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయి. ఇక్కడ 8 పంపుల్లో 2 సిద్ధమవగా, 4 స్లాబ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ జూన్ నాటికి పూర్తవుతాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సబ్స్టేషన్లు 'సిద్ధం'.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్లకు అవసరమైన విద్యుత్కోసం గోలివాడ గ్రామ శివారులో ట్రాన్స్మిషన్ (సబ్స్టేషన్) వ్యవస్థ సిద్ధమైంది. నిర్దేశిత గడువుకు ముందే ఈ వ్యవస్థను పూర్తిచేశారు. గోలివాడ గ్రామ శివారులో 400/220/11 కేవీ సామర్థ్యంతో దీన్ని రెడీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్టీపీపీ) నుంచి గోలివాడ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రాజెక్టులో భాగంగా 19 సబ్స్టేషన్లు నిర్మిస్తుండగా గోలివాడ సబ్స్టేషన్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి మూడు పంప్హౌజ్ల పరిధిలో ఏర్పాటు చేసిన 28 మోటార్లకు 40 మెగావాట్ల చొప్పున 1,120 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయనున్నారు. ఈ ఖరీఫ్లోనే 89 లక్షల ఎకరాలకు.. మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడం ద్వారా 8–9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఏర్పడుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఊపిరిలూదేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని కాళేశ్వరంతో పాటే ఈ జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్ నుంచే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు జరుగుతున్న నేపథ్యంలో అదే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పూర్తి చేసి కనిష్టంగా మేడిగడ్డ నుంచి తరలించే గోదావరి నీటిలో 60 టీఎంసీల నీటినైనా ఎస్సారెస్పీకి ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మే నాటికి 2 పంప్హౌస్లలో పూర్తిగా ఎనిమిదేసి మోటార్లను అమర్చి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ నీటితో 6 లక్షల ఎకరాల మేర స్థిరీకరణ జరగనుండగా, మిడ్మానేరు దిగువన కొండపోచమ్మ సాగర్ వరకు 400 చెరువులు నింపడం, అదనంగా కాల్వల ద్వారా కలిపి మొత్తంగా మరో 2–3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. భూసేకరణే 'కీలకం'.. ఈ ప్రాజెక్టు పరిధిలో అత్యంత కీలకమైన సమస్య భూసేకరణే. ప్రాజెక్టుకు కేంద్రం అన్ని రకాల అనుమతులు ఇచ్చినా.. వివిధ కోర్టుల్లో కేసుల కారణంగా భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 63,159.22 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా.. 35,643.37 ఎకరాల మేర సేకరణ మాత్రమే పూర్తయింది. మరో 27,516.13 ఎకరాల సేకరణ మిగిలి ఉంది. ఇందులో అత్యంత ముఖ్యంగా మల్లన్నసాగర్ పరిధిలోనే 900 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఈ సేకరణకు కోర్టుల్లో ఉన్న 190కి పైగా కేసులు అడ్డుగా మారాయి. వీటి పరిష్కారం దిశగా తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఇటీవలి సమీక్షల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక కొండపోచమ్మ సాగర్కింది కాల్వలు, పిల్ల కాల్వలు, పూర్వ నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ల కింద 13వేల ఎకరాల సేకరణ ఇబ్బందికరంగా ఉంది. ఈ రిజర్వాయర్ల పరిధిలో ఎకరాకి రూ.30 లక్షల – 50 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, చదువుకున్న వ్యక్తులు ఉంటే ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం కల్పించాలని, చదువుకోని వారికి ఉపాధి హామీ అవకాశం, ముంపునకు గురవుతున్న రైతులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని నిర్వాసితుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ల పరిష్కారం ఎంతవరకు అన్నది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఈ నిర్ణయాలకు అనుగుణంగానే భూసేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుత అంచనాల మేరకు భూసేకరణకు రూ.2,696.13 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఇందులో రూ.856కోట్లు తక్షణావసరం ఉందని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదించారు. సమస్యల పరిష్కారంతో పాటు, నిధులు సమీకరించి ఇస్తేనే ప్రాజెక్టు పనులు మరింత వేగిరం కానున్నాయి. -
కొత్తకుంటకు జలకళ
గన్నేరువరం : మిడ్ మానేరు నీటితో మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది. మండలంలోని మాధాపూర్ గ్రామం కొత్తకుంటకు మిడ్ మానేరు నీటిని డిస్ట్రిబ్యూటర్ 9 ఉపకాల్వ ద్వారా విడుదల చేశారు. ఆ నీటితో కుంట నిండుకోవడంతో జలకళ వచ్చింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో నిర్మించిన మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం వరకు గతంలో 34 కిలోమీటర్ల వరదకాల్వను పూర్తి చేశారు. మండలంలోని చీమలకుంటపల్లె, గునుకుల కొండాపూర్, పీచుపల్లి గ్రామాల మీదుగా మిడ్ మానేరు కుడికాల్వ నిర్మాణం ఉంది. అలాగే ఈ ఏడాది తోటపల్లి గ్రామంలో తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి గత నెల 11వ తేదీన దీనిలోకి మిడ్మానేరు కుడికాల్వ ద్వారా నీటి పారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నిండుకుని కుడికాల్వలో బ్యాక్వాటర్ పెరిగింది. ఈ క్రమంలో ఈ నీటిని అక్టోబర్లో డిస్ట్రిబ్యూటర్ 4 ఉపకాల్వ ద్వారా గన్నరువరం గ్రామ చెరువుకు, పారువెల్ల గ్రామ పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బుధవారం ఖాసీంపేట గ్రామంలోని డిస్ట్రిబ్యూటర్ 8 ఉప కాల్వకు విడుదల చేశారు. తాజాగా మాధాపూర్ గ్రామానికి నీటిని విడుదల చేసి కొత్తకుంటను నింపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో భూగర్భజలాలు పెరగడానికి దోహదపడుతుందని అంటున్నారు. కుడికాల్వలో నీటినిల్వతో దాని సమీపంలోని బావుల్లో, బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగినట్లు చీమలకుంటపల్లెకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. రబీలో వరిసాగు చేయడానికి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. -
మధ్యమానేరుకు జలసిరి
బోయినపల్లి/సిరిసిల్ల: భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. దిగువకు వెళ్తున్న ఈ నీటిని వివిధ ప్రాజెక్టుల్లోకి మళ్లించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మధ్యమానేరు జలాశయాన్ని గోదావరి నీటితో నింపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు జలాశయానికి శ్రీరాంసాగర్ నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిరుడు 5 టీఎంసీల నీటిని మళ్లించిన అధికారులు.. ఈ ఏడాది 24 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి: మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల ధాటికి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది నిండుగా పారుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 90 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుంచి వచ్చే వరదతో రోజుకు 5–8 టీఎంసీల నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. శనివారం నాటికి 30–35 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిండితే వరద కాల్వ ద్వారా మధ్యమానేరు జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి నీరు చేరేందుకు 48 గంటల సమయం పడుతుందని లెక్కకట్టారు. అంటే.. 3 రోజుల్లో మధ్యమానేరులోకి గోదావరి జలాలు వచ్చి చేరనున్నాయి. దాదాపు 21 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. మధ్యమానేరు పూర్తిగా నిండుతుంది. ఈ ప్రాజెక్టు నిండితే.. అక్కడ నుంచి దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లోకి నీటిని వదిలిపెడతారు. మరోవైపు.. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్, ఎగువ మానేరుకు నీరు అందించే వీలు కలుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జలాశయాలకు మధ్యమానేరు గుండెకాయలా మారుతుంది. ముంపు గ్రామాలు ఖాళీ చేయాలి మధ్యమానేరులో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులు వెంటనే ఊర్లు ఖాళీ చేసి.. పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్ఠాణా, బోయినపల్లి మండలం కొదురుపాక, వర్దవెల్లి, నీలోజిపల్లి గ్రామస్తులు కొందరు ఊర్లు ఖాళీ చేసి పునరావాస కాలనీకు చేరారు. ఇంకా కొన్ని గ్రామాల ప్రజలు ముంపు గ్రామాల్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వారంతా పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. మూడు రోజుల్లో మధ్యమానేరు జలాశయానికి జలకళ రాబోతుంది. ప్రాజెక్టు నిండితే.. సిరిసిల్ల ప్రాంతంలో కొంత మేరకు భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. మిడ్మానేరుకు వరద నీరు మహారాష్ట్రలోని నాందేడ్ ఎస్సీవీపీ, ఆందూర, బాలేగావ్, బాబ్జీ బ్యారేజీల నుంచి రోజూ 9 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 23 టీఎంసీల నీరు నిల్వఉంది. వరుసగా మూడురోజులపాటు నీరు ఇలానే వస్తే ఎస్సారెస్పీలో 30 టీఎంసీలకు పైగా చేరుతుంది. ఆ ప్రాజెక్టులో ఈ మేరకు నీరు చేరితే మధ్యమానేరులోకి వరద కాలువ ద్వారా నీరు వదిలే అవకాశం ఉంది. –శ్రీకాంత్రావు, ఎస్ఈ, మిడ్మానేరు ఎస్సారెస్పీకి భారీగా వరద ఇన్ఫ్లో 62,520 క్యూసెక్కులు జగిత్యాల అగ్రికల్చర్: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు వస్తోంది. ప్రాజెక్టులో 1067.4 అడుగుల(24.277 టీఎంసీల) నీటి నిల్వ ఉంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో 42,385 క్యూసెక్కుల వరదనీరు రాగా.. ఏడు గంటలకు 46,940 క్యూసెక్కులకు, 10 గంటలకు 49,240, 11 గంటలకు 58,330, 12 గంటలకు 68,650, మధ్యాహ్నం ఒంటిగంటకు 76,540, సాయంత్రం 4 గంటల వరకు 82,650 క్యూసెక్కు లకు చేరింది. తిరిగి సాయంత్రం ఆరు గంటల వరకు 62,520 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1054.90 (9.214 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
మానేరు.. కనరు.. వినరు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నా మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల వెతలు తీరడం లేదు. ఓవైపు ఈ ప్రాజెక్టును ఆరంభించేందుకు కసరత్తు జరుగుతున్నా.. మరోవైపు దశాబ్దానికి పైగా పరిహారం అందక నిర్వాసితులు గుండెలు బాదుకుంటున్నారు. పదేళ్ల కిందట మొదలుపెట్టిన సహాయ, పునరావాస ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. పునరావాస కాలనీల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. పట్టాల పంపిణీ మొదలు గృహ వసతి కల్పన వరకు స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం నిర్వాసితుల పాలిట శాపంగా మారింది. పూర్తికాని ఇళ్లు, రోడ్లు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25.87 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టును 2006 అక్టోబర్లో చేపట్టారు. 2009 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని సంకల్పించినా 12 ఏళ్ల అనంతరం పనులు ప్రస్తుతం చివరి దశకు చేరాయి. ప్రాజెక్టు 25 గేట్లు బిగింపు ప్రక్రియ పూర్తయి, నీటి నిల్వకు సిద్ధమైంది. అయితే పన్నెండేళ్ల కింద మొదలైన పునరావాస ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు కింద బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతల్ఠానా, వేములవాడ రూరల్ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నట్లు 2008లో గెజిట్ జాబితా ప్రచురించారు. ఇప్పటికీ పలు ముంపు గ్రామాల్లో పూర్తిగా పరిహారం అందలేదు. గెజిట్ పబ్లికేషన్ సమయంలో తప్పిపోయిన వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి ఇంకా చెప్పులరిగేలా తిరుగుతున్నారు. గెజిట్లో దొర్లిన తప్పులు సవరించుకోవడానికి కూడా నానా తిప్పలు పడుతున్నారు. మొత్తం 13 పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి 4,500 ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా.. వెయ్యి మాత్రమే పూర్తి చేశారు. పునరావాస కాలనీల్లో రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి కనీస వసతులు కల్పించాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం అధికారులను ఆదేశించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. కాలనీల్లో వసతులేవి? నిర్వాసితులు రాక ముందే పలు పునరావాస కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. ఇళ్ల నిర్మాణ సమయంలోనే చాలాచోట్ల మురుగు కాల్వలు మట్టి, ఇసుక, ఇటుక తదితరాలతో పూడుకుపోయాయి. దీంతో కాలనీల్లో పారిశుధ్యం లోపించి దోమల బెడద తీవ్రంగా ఉందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలనీల్లో శ్మశాన వాటికలు లేకపోవడంతో అంత్యక్రియలకు ఇబ్బంది ఎదురవుతోంది. కొదురుపాక, నీలోజిపల్లి కాలనీల్లో ఎవరైనా చనిపోతే మిడ్మానేరు కట్ట కింద అంత్యక్రియలు చేస్తున్నారు. కాలనీల పరిసరాల్లో బస్సులు నిలపడం లేదు. బస్షెల్టర్ల జాడే లేదు. ముంపు గ్రామాల్లో చెరువులు, కుంటల్లో రజకులు బట్టలు ఉతికి పొట్టబోసుకునేవారు. కొత్త కాలనీల్లో చెరువులు, కుంటలు లేకపోవడంతో వారి ఉపాధికి గండి పడింది. కాలనీలో దోబీఘాట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాలనీల్లో నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కోట్లు ఖర్చు చేసి రక్షిత మంచినీటి పథకాలు నిర్మించినా.. అధికారుల సమన్వయ లోపంతో ప్రజలకు నీటి వసతి అందడం లేదు. కొదురుపాక, నీలోజిపల్లి కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించి, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినా నీటి సరఫరా జరగడం లేదు. గెజిట్లో పేరు లేదని పరిహారం ఇవ్వలేదు నేను కుట్టు మిషన్ ద్వారా జీవనోపాధి పొందుతా. నాపేరు గెజిట్లో లేకపోవడంతో ఇప్పటి వరకు పైసా పరిహారం ఇవ్వలేదు. నాకు నలుగురు కుమారులు. ఇందులో ముగ్గురు పరిహారానికి అర్హులు. ఎవ్వరికి పరిహారం, పట్టా, ప్యాకేజీ రాలేదు. ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదు. – దోమకొండ రాజవీరు, కొదురుపాక ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి ఆర్అండ్ఆర్ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు అప్పులు తెచ్చి రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఆరు నెలల క్రితం పీఎంఈవై పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.1.20 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇవ్వడం లేదు. ఇళ్లు పూర్తి చేసిన వారికి వెంటనే బిల్లులు విడుదల చేయాలి. – కూస రవీందర్, నీలోజిపల్లి యువతకు పరిహారం..పరిహాసం మిడ్మానేరు ముంపునకు గురైన గ్రామాల్లోని యువతకు రూ.2 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం 2015 మార్చిలో జీవో జారీ చేసింది. 2015 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండినవారిని పరిహారానికి అర్హులుగా నిర్ణయించింది. ఈ మేరకు 4,231 మంది యువతను పరిహారానికి అర్హులుగా గుర్తించారు. అయితే వారిలో ఇప్పటికి సగం మందికి మాత్రమే పరిహారం అందించారు. యువకులకు పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం యువతుల విషయంలో స్పష్టత ఇవ్వలేదని నిర్వాసిత మహిళలు అంటున్నారు. కొందరు నిర్వాసితుల కుటుంబాల్లో ఇద్దరు కుమారులకు పరిహారం అందింది. మరికొందరి ఇళ్లల్లో ఇద్దరు కుమార్తెలు ఉన్నా పరిహారం అందకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. తాగడానికి నీళ్లు లేవు కాలనీలో నీటి వసతి లేక అరిగోస పడుతున్నాం. బోరు బావుల నుంచి నీరు చిన్న దారలా పోస్తుంది. పది నిమిషాలుంటే ఒక్క బిందె నిండుతుంది. ఎండాకాలం ఏ పనికి పోకుండా కేవలం నీరు తెచ్చుకోవడానికే సరిపోతుంది. – దూలపల్లి పోశవ్వ, కొదురుపాక -
వీడని పీటముడి
బోయినపల్లి (చొప్పదండి) : ‘మిడ్మానేరు’ ని ర్వాసితులు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపు విషయంలో పీటముడి వీడడంలేదు. పెరిగిన ధరల ప్రకా రం ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు చెల్లించాల ని నిర్వాసితులు కోరుతున్నారు. గతంలో ఐఏవై కింద ఇల్లు ఉండేదని, దానికి రూ.70 వేలు వర్తించేవని, ఇప్పుడు పీఎంఏవై కిందకు రావడంతో రూ.1.20 లక్షలకు మించి చెల్లించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మధ్య మానేరులో 5 టీఎంసీలు.. ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా మిడ్మానేరు ప్రాజెక్టులోకి మూడు నెలల క్రితం నీటిని విడుదల చేశారు. మిషన్ భగీరథ కోసం 5 టీఎంసీలను ఆ రిజర్వాయర్లో నిల్వ చేశారు. ప్రాజెక్టు బ్యాక్వాటర్తో పలు ముంపు గ్రామాల్లోకి నీరు వచ్చిచేరింది. నిర్వాసితుల ఇళ్లు నీట మునిగాయి. దీంతో వారు ఆర్అండ్ఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, శాభాష్పల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్ఠాణా, వేములవాడ రూరల్ మండలం రుద్రవరం, అనుపురం, కొడుముంజ, సంకెపల్లి గ్రామాలు మధ్యమానేరులో ముంపునకు గురువుతున్నాయి. ఈ గ్రామాల్లో 11,731 కుటుంబాలు సర్వం కోల్పోతున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరికి పునరావాసం కల్పించేందుకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లోకి నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాసకాలనీల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కొదురుపాక, నీలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఏళ్లుగా ఉంటున్నారు. నిర్వాసితులకు ఐఏవై (ఇందిరా ఆవాస్ యోజన– గతంలో ఉన్న ఐఏవైని ఇపుడు పీఎంఏవైగా మార్చారు) కింద నిధులు మంజూరు చేయాలని గతనెల 6న హైదరాబాద్లో నిర్వహించిన ప్రాజెక్టుల సమీక్షలో హౌసింగ్ ఎండీ చిత్రారామచంద్రన్ను నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంత్రి ప్రకటనతో కొత్తగా ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే నిర్వాసితులకు ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు మంజూరవుతాయి. అయితే, తాము అప్పుసప్పు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, సర్కారు ఇచ్చే సొమ్ము సరిపోవడంలేదని నిర్వాసితులు ఆవేదన చెందారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని విన్నవించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. అంతకుముందున్న ఐఏవై పథకం కింది ఇంటి నిర్మాణాన్ని పీఎంఏవై కిందకు తీసుకొచ్చింది. ఒక్కో ఇంటిపై రూ.50 వేలు పెంచి ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం ఈసొమ్ము సరిపోదని, మార్కెట్లో ధరలను పోల్చుకుని ఒక్కో ఇంటికి కనీసం రూ.2.50 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఈపంచాయితీ ఎటూ తేలడంలేదు. బిల్లుల కోసం ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి.. ఆర్అండ్ఆర్ కాలనీల్లో నిర్వాసితులు నిర్మించుకుంటున్న ఇళ్ల జాబితా రూపొందించేందుకు తహసీల్దార్, పంచాయితీరాజ్ ఏఈతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచన మేరకు బిల్లులు మంజూరవుతాయి. ఇందుకోసం ఈక్రింది ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇంటి యజమాని ఆధార్ నంబరు నిర్వాసితుడి బ్యాంకు పాస్బుక్ ఇంటి ఎదుట నిర్వాసితుడు దిగిన ఫొటో వీటిని తహసీల్దార్, పీఆర్ ఏఈ కమిటీకి అందజేయాలి ఇలా అందిన దరఖాస్తులను కమిటీ ఉన్నతాధికారులకు నివేదిస్తుంది పరిశీలన పూర్తయ్యాక ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు విడుదలవుతాయి. నిర్వాసితులు సహరిస్తే చెల్లింపులు నిర్వాసితులు నిర్మించుకునే ఇళ్లకు మొదట ఐఏవై కింద రూ.70 వేలు వర్తించేవి. ఆ నిధులు సరిపోవడం లేదనే నిర్వాసితుల కోరిక మేరకు ఇళ్ల నిర్మాణాలను పీఎంఏవైగా మార్చాం. దీంతో ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిర్వాసితులు సహకరిస్తే తక్షణమే బిల్లులు చెల్లిస్తాం. – జీవీ శ్యాంప్రసాద్లాల్, డీఆర్వో -
ఓరుగల్లుకు నిరంతర సాగునీరు
హసన్పర్తి: రానున్న ఆరునెలల్లో ఓరుగల్లుకు నిరంతరం సాగునీరు, తాగునీరు అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 191–234 కిలోమీటర్ల వరకు సుమారు రూ.122.9 కోట్లతో చేపట్టనున్న శ్రీరాంసాగర్ మరమ్మతు పనులను శనివారం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును మానేరుకు అనుసంధానం చేసి కాకతీయ కాల్వలకు నీరు విడుదల చేస్తామన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద మొదటి విడత రూ.60 కోట్లతో పనులు పూర్తి చేశామని, రెండో విడతలో మరో రూ.270 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కడియం వెల్లడించారు. డీబీఎం కాల్వల ఆధునీకరణ ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలతో పాటు డీబీఎం, మైనర్ కాల్వలను కూడా ఆధునీకరించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారతో పాటు పూడికతీత పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే పలివేల్పుల గ్రామం గుండా ఎస్సారెస్పీ కాల్వపై వంతెన మంజూరు చేశామని, దాని నిర్మాణం కోసం రూ. 1.54 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు నీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఈఈ పోచయ్య, డీఈ బాలకృష్ణ, ఏఈ మాధవరావు, కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, నాగమళ్ల ఝాన్సీ, సర్వోత్తంరెడ్డి, సిరంగి సునీల్కుమార్, బానోతు కల్పన, వీర భీక్షపతి, ఎంపీపీ కొండపాక సుకన్య,రఘు, జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్, బిల్లా ఉదయ్కుమార్రెడ్డి, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, మేర్గు రాజేష్, వల్లాల యాదగిరి, రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్, నాయకపు శ్రీనివాస్, గడ్డం శివరాంప్రసాద్, చకిలం చంద్రశేఖర్, దేవరకొండ అనిల్, రజనీకుమార్, రమేష్, సర్పంచ్ రత్నాకర్రెడ్డి పాల్గొన్నారు. -
మిడ్ మానేరులో ఇసుక మాఫియా
-
‘మిడ్మానేరు’ అక్రమార్కులపై కేసులు
సాక్షి, హైదరాబాద్: మిడ్మానేరు భూ నిర్వాసితుల నష్టపరిహారం కోసం తప్పుడు అఫిడవిట్లు సమ ర్పించిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నీటిపారుదల మంత్రి టి.హరీశ్రావు ఆదేశించారు. నిర్వాసితుల నష్ట పరిహారం చెల్లింపుల్లో అవకతవ కలు జరగకుండా చూడాలని, ముంపునకు గుర య్యే నిర్మాణాల అంచనాలు రూపొందించడంలో అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం హైదరాబాద్లోని జలసౌధలో మిడ్మానేరు పనుల పురోగతి, భూ నిర్వాసితుల నష్టపరిహారం, పునరావాస కార్యక్రమాలపై హరీశ్ సమీక్షించారు. పరిహారాల్లో అవకతవకలు, రికార్డుల తారుమారు, వాటి నిర్వహణ వంటి అంశాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ను అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నటరాజ్ అనే అధికారి నిర్వాకం వల్ల పరిహార చెల్లింపులు ఆలస్యమయ్యాయని, రికార్డుల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ పేర్కొనడంతో ఆ అధికారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హరీశ్ ఆదేశించారు. మిడ్మానేరు కింద ముంపునకు గురవుతున్న 7,419 ఇళ్లలో ఇప్పటికే 3 వేలకుపైగా ఇళ్లు నిర్మించామని, మరో 1,500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. మిగతా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్ ఆదేశించారు. ఇప్పటికే 7,159 ఇళ్లకు పరిహారం పూర్తయిందని, మిగతా ఇళ్ల పరిహారాన్ని వారంలో చెల్లించాలని కలెక్టర్కు సూచించారు. ఆర్ అండ్ ఆర్ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ముంపు గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రజలు ఇంకా ఇళ్లు ఖాళీ చేయలేదని అధికారులు వివరించగా పెండింగ్లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేయాలని హౌసింగ్ ఎండీ చిత్రా రామచంద్రన్ను మంత్రి ఆదేశించారు. నిర్వాసితుల గృహ నిర్మాణాలకు నష్టపరిహారం కింద రూ. 40 కోట్లు, ఆర్ అండ్ ఆర్ కోసం మరో రూ. 25 కోట్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ కింద 1,200 కోట్లు చెల్లించామన్నారు. వచ్చే నెల 15లోగా ప్రాజెక్టు పనులు పూర్తి... మిడ్మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా సివిల్, మెకానికల్, సాంకేతిక పనులన్నీ ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నందున మిడ్మానేరు పూర్తి కావడం కీలక మన్నారు. మొత్తం 25 గేట్ల ఫ్యాబ్రికేషన్, బిగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు పరిధిలోని ఆర్ అండ్ ఆర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. -
అబ్బే.. అలాంటిదేం లేదు!
సాక్షి, హైదరాబాద్: మిడ్మానేరు ప్రాజెక్టు పరిహార మదింపు, గృహ పరిహార మదింపులో ఎలాంటి అక్రమాలూ జరగలేదని అటవీ, ఆర్అండ్బీ శాఖల సంయుక్త అధికారుల బృందం తేల్చిచెప్పింది. చట్టాలకు అనుగుణంగానే పరిహార మదింపు చేశామని, ఎక్కడా అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో చెల్లించిన పరిహారం, పరిహార చెల్లింపు ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని వడ్డీతో సహా చెల్లించడంతో వ్యయం పెరిగిందని నివేదిక ఇచ్చింది. ఇదే రీతిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సైతం నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అక్రమాలేవీ జరగలేదు.. మిడ్మానేరు ప్రాజెక్టుతో అనాపురం, సంకెపల్లి, చింతలతానా, చీర్లవంచ, కుదురుపాక, నీలోజిపల్లి, వర్దవెల్లి, శాభాజ్పల్లి, రుద్రారం, కోడిముంజ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లో ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, రెండు దఫాలుగా 4,864 గృహాలకు రూ.536 కోట్లు చెల్లింపులు చేశారు. అయితే గృహ నిర్మాణ పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకు సంబంధించి 2009లోనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో శాభాజ్పల్లి కూడా ఉండటంతో గతంలోనే విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకున్నారు. అనంతరం ఇదే గ్రామంలోని గృహాల పరిహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ గ్రామంలో 7 గృహాల పరిహారాన్ని పరిశీలిస్తే.. 2008లో గృహాల పరిహారాన్ని రూ.35.10 లక్షలుగా నిర్ణయించగా, తాజాగా దానిని రూ.4.85 కోట్లుగా నిర్ధారించినట్లు బయట పడింది. గృహ నిర్మాణ వయసు నిర్ధారించడం, కలప వినియోగాన్ని లెక్కించడం, భూమి విలువను లెక్కించడంలో ఆర్అండ్బీ, రెవెన్యూ, అటవీ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో పాటు అటవీ, ఆర్అండ్బీ అధికారుల సంయుక్త సాంకేతిక అధికారుల బృందంచే విచారణ జరిపించింది. ఈ అధికారుల బృందం ఇటీవల నీటి పారుదల శాఖకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. ‘శాభాజ్పల్లిలో గృహాల పరిహారాన్ని వాస్తవానికి 2009లో విలువ కట్టారు. అయితే 2017లో తిరిగి గృహాల పరిహార మదింపు చేశారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి గృహానికి 100 శాతం పరిహారం చెల్లించడంతో పాటు ఆగస్టు 2009 నుంచి ఆగస్టు 2010 వరకు 9 శాతం వడ్డీ, 2010 నుంచి 2017 జూలై వరకు 15 శాతం వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయం జరిగింది. దీనికి తగ్గట్టుగా గృహాల పరిహారాన్ని సవరించి ధరలు నిర్ణయం చేశారు. ఈ కారణంగానే పరిహార వ్యయం పెరిగింది’అని నివేదికలో పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సైతం ఇదే మాదిరిగా నివేదిక ఇచ్చారని అందులో తెలిపారు. అయితే ఈ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణకు నీటి పారుదల శాఖ ఈ కేసును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు సిఫార్సు చేయడం గమనార్హం. -
‘మిడ్మానేరు’ గుండెకాయలాంటింది
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మిడ్మానేరు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామన్నారు. రూ.461 కోట్ల పనులతో 10 టీఎంసీల నీటినిల్వ కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఐదున్నర టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉందన్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో 18 మండలాలకు మిడ్మానేరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరు అందుతుందని తెలిపారు. -
'మిడ్ మానేరు' పనుల్లో అపశ్రుతి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు ప్రాజెక్ట్ స్పిల్ వే నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్పిల్వే పై పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు పై నుంచి జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బోయినిపల్లి మండలం మానువాడ దగ్గర నిర్మిస్తున్న మిడ్ మానేరు ప్రాజెక్టు స్పిల్వే పై పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. -
‘మిడ్మానేరు’ పరిహారంలో మళ్లీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: మిడ్మానేరు ప్రాజెక్టుకింద నిర్వాసితులకు పరిహార మదింపులో మళ్లీ అక్రమాల పర్వం మొదలైంది. అడ్డగోలు అంచనాలతో ముంపు గృహాలకు ఇష్టారీతిన పరిహారం లెక్కగట్టి కోట్ల రూపాయలు దండుకునేందుకు అక్రమార్కులు తెరతీశారు. వీరికి అధికారుల నుంచి సహకారం అందుతుండటంతో కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో ఇదే ప్రాజెక్టు కింద పరిహారంలో భారీ అక్రమాలు జరగడంతో 24 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. గతం మాదిరే అక్రమాలు.. పూర్వ కరీంనగర్ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో 2006లో మిడ్మానేరు ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు. తర్వాత ఈ ఏడాది 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,965 గృహాలకు రూ.250 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకు సంబం ధించి 2009 చివర్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి. అనంతరం కొత్త రాష్ట్రంలో ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరపగా, అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఇందులో కొడిముంజ గ్రామంలో గృహాలకు పరిహారాన్ని మొదట రూ.6.10 కోట్లతో అంచనా వేయగా, తర్వాత దాన్ని రూ.18.58 కోట్లకు పెంచినట్లు గుర్తించారు. శాభాష్పల్లిలో రూ.5.32 కోట్ల మేర పరిహారాన్ని లెక్కిస్తే దాన్ని రూ.20.49 కోట్లకు పెంచారు. ఈ రెండు గ్రామాల్లోనే మొత్తంగా 27.65 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ అవకతవకల్లో మొత్తంగా 24 మంది అధికారుల పాత్రను విజిలెన్స్ విభాగం గుర్తించింది. అదే గ్రామంలో మరోసారి.. కాగా తాజాగా శాభాష్పల్లిలో మరోసారి అక్రమాలు వెలుగుచూశాయి. ఈ గ్రామంలో 7 గృహాల పరిహారాన్ని పరిశీలిస్తే, 2008లో వాటికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.35.10 లక్షలుగా నిర్ణయించగా, తాజాగా రూ.4.85 కోట్లకు పెంచారు. 1–26 ఇంటినంబర్ ఉన్న గృహానికి 2008లో రూ.60వేల పరిహారాన్ని ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని రూ.65 లక్షలకు పెంచారు. 1–17 ఇంటినంబర్ ఉన్న మరో గృహానికి గత అంచనా రూ.7.36 లక్షలుగా ఉండగా, దాన్ని ఏకంగా రూ.1.20 కోట్లకు పెంచారు. అలాగే 1–29 నంబర్తో ఉన్న మరో గృహ పరిహారాన్ని రూ.1.74 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచేశారు. ఇలా చాలా గృహాలకు సంబంధించి అడ్డగోలుగా పరిహార మొత్తాలను పెంచినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. లెక్కల్లో మాయ.. గృహ నిర్మాణ కాలాన్ని నిర్ధారిం చడం, గృహాల్లో వాడిన కలప విలువ, భూమి విలువలను లెక్కించడంలో ఆర్ అండ్బీ, రెవెన్యూ, అటవీ అధికారులు అక్ర మాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపి స్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఇక నీటి పారుదల శాఖ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్ నుంచి సంబంధిత అధికారులు ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం. -
పరిహారం ఇచ్చాకే ఖాళీ చేయిస్తాం
‘మిడ్మానేరు’ బాధితుల పరిహారంపై హైకోర్టుకు ప్రభుత్వం హామీ సాక్షి, హైదరాబాద్: మిడ్మానేరు ఇళ్ల ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు హామీనిచ్చింది. జూలై నెలాఖరులోగా ఇళ్లను ఖాళీ చేయాలని వేములవాడ తహసీల్దార్ ఇచ్చిన నోటీసును నీలోజిపల్లి, కొండుముంజు గ్రామాలకు చెందిన వి.మల్లేశంతో పాటు మరో 40 మందికిపైగా రెండు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. వీటిని జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. రైతులకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఇళ్ల ముంపు బాధితులకు ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదించారు. ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తగ్గించడం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ సిఫార్సులకు వ్యతిరేకమన్నారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పరిహారం కోసం ఇళ్ల నిర్మాణాల వ్యయాన్ని పెంచేసి చెబుతున్నారని, ఈమేరకు నిఘా నివేదికలు కూడా వచ్చాయన్నారు. అయినా తగిన పరిహారం ఇచ్చిన తర్వాతే వారిని ఖాళీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 9న భూసేకరణ అధికారి నిర్వహించే విచారణ సమయంలో ముంపు బాధితుల çసమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11 కి వాయిదా వేసింది. -
మిడ్మానేరు పరిహారానికి రూ.45 కోట్లు
♦ యుద్ధ ప్రాతిపదికన పరిహార పంపిణీ ♦ పునరావాసానికి చర్యలు చేపట్టండి ♦ అధికారులకు హరీశ్రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు పరిధిలో ముంపు బాధితుల పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసం ప్రభుత్వం శుక్రవారం రూ.45 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టులో త్వరలోనే 10 టీఎంసీల నీటి నిల్వ చేయనున్న నేపథ్యంలో ఈ నిధులను విడుదల చేశారు. ఈ పరిహార చెల్లింపులను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలని ఈ మేరకు సంబంధిత ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్లో మిడ్మానేరు నుంచి 80 వేల ఎకరాలు సాగులోనికి తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కాల్వలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిడ్మానేరు ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్య మివ్వాలని, భూనిర్వాసితుల పరిహారం, పునరావాస చర్యలకు గాను నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లే వారికి రూ.2 లక్షల పరిహారం వెంటనే అందజేయాలని కోరారు. ఏ క్షణమైనా ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు చేరనున్నందున ముంపు గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
► పదేళ్ల తర్వాత సిద్ధమైన మిడ్ మానేరు ► నెలాఖరుకల్లా 10 టీఎంసీల నీటి నిల్వ ► మిగతా పనులు డిసెంబర్ నాటికి పూర్తి ► తొలి విడతలో 70 వేల ఆయకట్టుకు నీరు సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: పదేళ్ల కల సాకారం కాబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతలకు, ఇందిరమ్మ వరద కాల్వకు ఆయువు పట్టులాంటి మిడ్ మానే రు డ్యామ్ త్వరలో జలకళ సంతరించు కోనుంది. 2006లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరదకాల్వ ఆధారంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ నెలాఖరుకల్లా 10 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే అవకాశం లభించనుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి 25 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2006లో కరీంనగర్ జిల్లా మాన్వాడ (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆయన మరణాంతరం నిలిచిపోయాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. పదేళ్లలో యాభై శాతం పనులు జరగ్గా.. మిగిలిన పనులు కేవలం ఏడాదిలో పూర్తి కాబోతున్నాయి. మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎట్టకేలకు ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఐదుమార్లు చేతులు మారాక.. మిడ్మానేరు ప్రాజెక్టులో భాగంగా ఎడమ వైపు 5.2 కి.మీ, కుడివైపు 4.4 కి.మీ. దూరం మట్టికట్ట నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ కట్టకు రెండువైపులా 80 మీటర్ల చొప్పున నాన్ ఓవర్ ఫ్లో డ్యాం, మధ్యలో 388 మీటర్ల స్పిల్వే పనులు పూర్తికాగా.. 25 రేడియల్ గేట్లు అమర్చాల్సి ఉంది. కుడి కాల్వ కింద 1,89,000, ఎడమ కాల్వ కింద 10,500 ఎకరాల ఆయకట్టు నిర్దేశించారు. రూ.339 కోట్లతో కాంట్రాక్టు ఏజెన్సీలతో తొలి ఒప్పందం జరగ్గా.. 2010 వరకు 23 శాతం పనులే జరిగాయి. దీంతో అప్పటి ప్రభుత్వం కొత్తగా రూ.454 కోట్ల అంతర్గత అంచనాతో మళ్లీ టెండర్ పిలిచింది. ఈ పనులను 20.5 శాతం తక్కువతో రూ.360.90 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ సక్రమంగా పని చేయకపోవడంతో రూ.117 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ నుంచి తొలగించారు. 2015లో మరో సంస్థకు కట్టబెట్టారు. అందులోనూ రూ.101.88 కోట్ల విలువైన పనులను తొలగించి మరో సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. ఇలా ఐదుమార్లు పనులు చేతులు మారాయి. గతేడాది జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లలో 303 మీటర్ల వరకు నిర్మించి 3.3 టీఎంసీలు నిల్వ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అంచనాకు అందని వరద రావడంతో మట్టికట్ట 40 మీటర్ల మేర (150– 190 మీటర్ల మధ్య) కోతకు గురైంది. కాంక్రీటు డ్యాం కంటే మట్టికట్టను మరింత ఎత్తు నిర్మించి ఉంటే కాంక్రీటు డ్యాం నుంచి నీరు వెళ్లిపోయేది. కానీ ఇవి రెండూ ఒకే ఎత్తులో ఉండడంతో మట్టికట్ట నుంచి నీరు వెళ్లి కోతకు గురైంది. దీంతో గత ఏడాది నీటి నిల్వ సాధ్యపడక ఆయకట్టుకు నీరందలేదు. 13 నెలల్లో 61 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని ప్రాజెక్టులో మొత్తంగా 1.28 కోట్ల మట్టిపని, 4.80 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా.. అందులో 1.23 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 4.30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తయింది. గత 13 నెలల కాలంలోనే 61 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1.45 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తయింది. మొత్తంగా రూ.279 కోట్ల మేర నిధులు వెచ్చించారు. క్రస్ట్ గేట్ల వరకు పనులు పూర్తయ్యాయి. దీంతో నీళ్లొస్తే 10 టీఎంసీల నిల్వ సాధ్యం కానుంది. కుడి కాల్వ కింద 70 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లభిస్తుంది. కుడి కాల్వ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి కాకున్నా దిగువ ఎల్ఎండీ కింది ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూసే అవకాశం ఉంటుంది. దీనికితోడు ఈ ఏడాది డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం రెండు పంపులు నడిపించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 45 టీఎంసీల నీరొచ్చినా, మిడ్మానేరు పనులు పూర్తయితే గరిష్ట ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం లభిస్తుంది. మిడ్మానేరు ప్రాజెక్టు స్వరూపం నీటి నిల్వ సామర్థ్యం - 25.873 టీఎంసీలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. కోట్లలో - 639 నిర్మాణానికి శ్రీకారం - 2006 ఫిబ్రవరి ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు - 107 ముంపు గ్రామాలు - 12 రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు - 358 కోట్లు నిర్దేశిత ఆయకట్టు - 2,00000 ఎకరాలు -
రికార్డు సమయంలో ‘మిడ్ మానేరు’
ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులకు హరీశ్ కితాబు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినప్పటి నుంచి పెండింగ్లో ఉన్న మిడ్మానేరు ప్రాజెక్టు పనులను అధికారులు కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. ప్రాజెక్టు పూర్తికి ఇంజనీర్లు చేసిన కృషిని అభినందించారు. శుక్రవారం మిడ్మానేరు ప్రాజెక్టు పురోగతిపై మంత్రి సమీక్షించారు. ‘‘2006లో ప్రారంభమైన మిడ్మానేరు పనులు పదేళ్లలో కేవలం 50 శాతమే జరగ్గా మిగతా 50శాతం 12 నెలల రికార్డు సమయంలో పూర్తిచేశారు. ప్రాజెక్టులో మొత్తం కాంక్రీటు పనులు 4.8 లక్షల క్యూబిక్ మీటర్లుకాగా పదేళ్లలో 65 వేల 200క్యూబిక్ మీటర్లు పని చేశారు. తెలంగాణ వచ్చాక 3.49లక్షల క్యూబిక్మీటర్ల పనులు జరిగాయి. పన్నెండు నెలల్లో 1.3లక్షల క్యూబిక్మీటర్ల పనులు జరిగాయి. రూ.639 కోట్ల ప్రాజెక్టు అం చనా వ్యయంలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు దాదాపు 11 ఏళ్లలో రూ.107కోట్ల ఖర్చు జరగ్గా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.358 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో రూ. 251 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే 1.28 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు జరగాల్సి ఉండగా మూడేళ్లలో 80లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. గత 12 నెలల్లో 59 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేపట్టారు. అంతకుముందు పదేళ్లలో జరిగింది 41 లక్షల క్యూబిక్ మీటర్ల పనులే’’ అని హరీశ్ వివరించారు. ఆర్అండ్ఆర్కు ప్రాధాన్యమివ్వండి మిడ్ మానేరు ప్రాజెక్టును రికార్డు వ్యవధిలో పూర్తిచేసినా ఆర్ అండ్ ఆర్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దగ్గర భూ నిర్వాసితుల పరిహారం, పునరావాస చర్యల కోసం రూ. 30 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ఆర్ అండ్ ఆర్ పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన నిర్వాసితుల పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ముంపునకు గురయ్యే చింతల్ ఠాణా, కోదురుపాక, శాబా సుపల్లి, కొడిముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి గ్రామాల నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాస్రాజ్, రాజన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఓఎస్డీ దేశ్పాండే పాల్గొన్నారు. కాగా, ఈ వానాకాలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలను సాగులోకి తేవాలని హరీశ్రావు ఆదేశించారు. పంప్హౌస్లు, రిజర్వాయర్ల పనులను వేగవంతం చేయాలని ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలో సూచించారు. -
‘మిడ్మానేర్’ నిర్వాసితులకు ప్యాకేజీ!
- కుటుంబానికి రూ. 8 లక్షల పరిహారం! - పదేళ్ల పోరాటానికి తెరదించిన మంత్రి హరీశ్రావు - గ్రామం యథాతథం.. ప్యాకేజీ అదనం - మాన్వాడ గ్రామస్తుల్లో ఆనందం బోయినపల్లి (వేములవాడ): మధ్యమానేర్ ప్రాజెక్టు నిర్వాసిత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామస్తులకు మంచిరోజులు వస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వచ్చేనెలలో ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు నిల్వ చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేసిన సర్కారు.. అదే స్థాయిలో నిర్వాసితులకు పరిహారం అందించడంపై దృష్టి సారించింది. మాన్వాడ గ్రామాన్ని యథాతథంగా ఉంచుతూనే కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి సిద్ధమవుతోంది. 2006లో మిడ్మానేర్కు శ్రీకారం.. 2006లో మాన్వాడలో 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి మాన్వాడవాసులకు ఎలాంటి పరిహారం అందలేదు. గతేడాది సెప్టెంబర్ 25న ప్రాజెక్టు కట్ట తెగినపుడు మంత్రి హరీశ్రావు సందర్శించారు. పరిహారం అందించకుండానే గ్రామం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై గ్రామస్తులతోపాటు, ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రనిరసన వ్యక్తం చేశాయి. ముంపుగ్రామంగా ప్రకటించి తక్షణపరిహారం అందించాలని మహిళలు ధర్నా చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మంత్రి హరీశ్రావు మాన్వాడను సందర్శించి ఆందోళనకారులను సముదాయించారు. ‘నన్ను నమ్మండి.. నేను మీకు న్యాయం చేస్తా’అని మాట ఇచ్చారు. అటు ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా, ఇటు గ్రామాన్ని ఖాళీ చేయించకుండా.. పరిహారం ఎలా ఇవ్వాలనే విషయంలో తర్జనభర్జన పడ్డారు. చివరకు సీఎం కేసీఆర్ను ఒప్పించి మాన్వాడ వాసులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పదేళ్ల పోరాటానికి తెరదించిన హరీశ్ మాన్వాడ గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి హరీశ్ హామీ ఇవ్వడంతో తరచూ ఆయనను కలుస్తూ తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఇదే క్రమంలో స్పష్టమైన హామీ రావడం లేదని ప్రాజెక్టు పనులు అడ్డుకున్నారు. ఒక్క రోజు పనులు అడ్డుకుంటేనే రూ. లక్షల నష్టం వాటిల్లింది. పనుల వేగం తగ్గి కాంట్రాక్టర్కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. దీంతో మంత్రి హరీశ్రావు గ్రామస్తులను పిలిపించుకుని పనులు అడ్డుకోవద్దని, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం సర్పంచ్ శ్రీనివాస్తోనూ మంత్రి మాట్లాడారు. కుటుంబానికి రూ.8 లక్షల ప్యాకేజీ.. 2014లో చేసిన గెజిట్ ప్రకారం గ్రామంలోని 610 కుటుంబాలకు రూ.50 కోట్లకు పైగా ప్రత్యేక ప్యాకేజీ అందించేందుకు మార్గం సుగమమైంది. మొట్ట మొదటిసారి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఈనెల 17న నిర్వహించిన ఆర్ అండ్ ఆర్ సమావేశంలో సర్పంచ్ను ఆహ్వానించారు. ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న విషయం తెలిపారు. ఆనందంలో గ్రామస్తులు.. పదేళ్ల పోరాటానికి తెరదించుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ గ్రామస్తులకు ఇవ్వాలనే నిర్ణయానికి రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల పోరాటం ఫలించబోతోందని సంతోష పడుతున్నారు. కట్ట తెగడంతో మాన్వాడపై దృష్టి.. గతేడాది ఖరీఫ్లో ప్రాజెక్టులో 4 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ప్రాజెక్టు కట్ట నాణ్యత లోపంతో తెగింది. ఇది ఒక రకంగా మాన్వాడవాసులకు కలిసొచ్చినట్లయ్యింది. కేవలం భూములు ముంపునకు గురై, ఇళ్లకు ముప్పులేదని అధికారులు మాన్వాడ గ్రామస్తులకు పరిహారం అందించే విషయంలో తాత్సారం చేశారు. కట్ట తెగడంతో రాష్ట్రం దృష్టి మాన్వాడపై పడింది. కట్ట తెగిన ప్రాంతంలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, వైఎస్సార్ సీపీ తదితర పార్టీలు మిడ్మానేర్ బాటపట్టాయి. మాన్వాడవాసులకు పరిహారం అందించాలని పట్టుబట్టాయి. దీంతో పరిహారంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. మంత్రి హరీశ్ కృషితోనే ప్యాకేజీ మాన్వాడకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పదేళ్లనుంచి పోరాటం చేస్తున్నం. కట్ట తెగినపుడు మంత్రి హరీశ్ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కృషితో ఈ రోజు మాన్వాడ ప్రజల పోరాటం ఫలించింది. –రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ ప్రత్యేక ప్యాకేజీకి సుముఖం మాన్వాడ ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ అందించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్యాకేజీ అందించే విషయంలో ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నిర్వాసితులకు ప్యాకేజీ వర్తింజేస్తాం. – ఎన్.పాండురంగ, సిరిసిల్ల ఆర్డీవో -
డ్యామ్ల పటిష్టతపై దృష్టి పెట్టండి
అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు ► డ్యామ్ల పనితీరుపై నిరంతరం సమీక్షించాలి ► భద్రతకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలి ► అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల డ్యామ్ల పటిష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికా రులను ఆదేశించారు. డ్యామ్ గేట్లు, వాటి పని తీరు, ఇతర అంశాలపై నిరంతరం తనిఖీ చేస్తూ, సమీక్షించాలని సూచించారు. మంగళవారం ’వాలంతరి’ సంస్థలో జరిగిన డ్యామ్ సేఫ్టీ సదస్సులో మంత్రి హరీశ్ ప్రసంగించారు. డ్యాముల ఆపరేషన్ వ్యవహారాల్లో తగు పరి జ్ఞానం అవసరమని, ప్రతి డ్యామ్ దగ్గర లైన్ డయాగ్రం ఉండాలని ఇంజనీర్లకు సూచిం చారు. 2009 వరదలప్పుడు ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రతిభ చూపి డ్యాములను రక్షించారని, అలాంటి అనుభవాలను ఆచరించాలన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాల వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల డ్యామ్ భద్రతా వ్యవహారాల బాధ్యతలను ఎస్ఈలు మీడియం, మైనర్ ప్రాజెక్టు వ్యవహారాలను ఈఈలు చూడాలని ఆదేశించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి: వర్షాకాలానికి ముందు, వర్షాకాలం అనంతరం చేపట్టవలసిన చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని అమలు చేయాలని హరీశ్ సూచించారు. ప్లాన్ అమలుకు నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం 10 మేజర్, 39 మీడియం, 132 మైనర్ డ్యామ్లు రాష్ట్రంలో ఉన్నాయని, డ్యామ్ల అభివృద్ధి కోసం కేంద్రం డీఆర్ఐపీని ప్రకటించిందని వెల్లడించారు. డ్యాముల పటిష్టతకు చర్యలు చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేసి పంపాలని రాష్ట్రాలను కేంద్రం కోరిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇందుకుగానూ ఈఎన్సీ, ’కాడా’ కమిషనర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ, ఇరిగేషన్ ప్రాజెక్టుల సీఈలు సమన్వయంతో అంచనాలు తయారు చేయాలని చెప్పారు. డ్యామ్ల రక్షణ కోసం అంతర్జాతీయ అనుభవాలు అనుసరించాలని, గేట్లు, గ్రీసింగ్ పనులను, మరమ్మతులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ప్రమాదాలు రాకముందే వాటిని నిరోధించడానికి చర్యలవసరమని, ఇందుకు రిటైర్డు అధికారుల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. 39 ప్రాజెక్టులకు ‘క్యాడ్వాం’ నిధులు రాష్ట్రంలోని 39 సాగునీటి ప్రాజెక్టు లకు క్యాడ్వాం కింద కేంద్రం నిధులు ఇవ్వ నుంది. ఏఐ బీపీ పరిధిలోని 11 ఆన్ గోయింగ్ ప్రాజె క్టులకు క్యాడ్వాం కింద రూ.1,928 కోట్లు మంజూరయ్యాయని, అందులో నిబంధ నల ప్రకారం వివిధ కాంపోనెంట్ల కింద కేంద్రం 50% భరించనుందని, ఆ నిధుల మొదటి ఇన్స్టాల్మెంట్ కోసం ప్రతిపాద నలు తయారు చేసి పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఇక ఇదివరకే పూర్తయిన ప్రాజెక్టుల్లో 28 ప్రాజెక్టులు క్వాడ్వాం నిధులు విడుదలయ్యే జాబితా లోకి చేరాయని, ఈ జాబితాలో ఉన్న ప్రాజెక్టుల్లో చేపట్టనున్న పనులకు సంబంధించిన డీపీఆర్లను వెంటనే కేంద్రానికి పంపించాలని సూచించారు. మిడ్మానేరు పనులు వేగిరం చేయండి ► అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల రాజన్న జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం మిడ్మానేరు తదితర ప్రాజెక్టుల పురోగతిని ’వాలంతరి’లో సమీ క్షించారు. మిడ్మానేరుకు చెందిన ఆర్ అండ్ ఆర్ సమస్యలని వెంటనే పరిష్కరిం చాలని సమావేశంలో పాల్గొన్న జిల్లా కలె క్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారు లను ఆదేశించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఇతర అంశాలను గ్రామాల వారీ గా మంత్రి సమీక్షించారు. అలాగే ఆర్ అండ్ ఆర్ కాలనీలలో మౌలిక సదుపాయా ల కల్పనకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు పనులను సత్వరం చేయాలన్నారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పాలెం వాగు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. -
మంత్రిగారూ నాకు ఆత్మహత్యే దిక్కు..
ఈటల కాన్వాయ్ వెళ్తుండగా రైతు ఆత్మహత్యాయత్నం ఇల్లంతకుంట (మానకొండూర్): ‘ఆనకాలంల రెండు లక్షలు వెట్టి రెండు బోర్లు ఏయించిన.. భారీ వానకు మధ్యమానేరు ప్రాజెక్టు కట్ట తెగి బోర్లు నీళ్లల్లో కొట్టుకుపోయి నయ్.. తెల్సినోళ్ల కాడ ఇంకో రెండు లక్షలు అప్పు దెచ్చి నాకున్న ఆరెకరాల్లో వరి ఏసిన.. మరో రెండు లక్షల రూపాయలు బెట్టి మళ్లీ రెండు బోర్లు ఏసిన.. మొన్నటి దాకా నీళ్లు బాగానే అచ్చినయ్.. కొద్దిరోజులైతే వరి చేతికచ్చేది.. గానీ, మానేటిల నీళ్లులేవు. బోర్లు వట్టిపోయినయ్.. ఆరెకరాల్లోని వరి పంటంతా ఎండిపోయింది.. దిగుబడిపై ఆశలు పోయినయ్.. తెచ్చిన అప్పులే మిగిలినయ్.. ఇక నాకు చావు తప్ప మరో గత్యంతరం లేదు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన రైతు పొలె కొమురయ్య... ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పర్యటనలో పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం సృష్టించింది. కొమురయ్య పురుగు మందు తాగేందు కు యత్నిస్తుండగానే గమనించిన పోలీసులు.. అతని నుంచి డబ్బా లాక్కున్నా రు. రైతును మంత్రి ఈటల వద్దకు తీసుకెళ్లగా.. ఎండిన పంటలను సర్వే చేయించి తగిన పరిహారం మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతు శాంతించాడు. -
‘మిడ్మానేర్’ నిర్వాసితులకు పరిహారం
18 ఏళ్లు నిండితే రూ.2లక్షల చొప్పున పరిహారం ► 4,720 మంది యువతకు లబ్ధి ► వెల్లడించిన టెస్కాబ్ చైర్మన్ కొండూరి ముస్తాబాద్ (సిరిసిల్ల) : మిడ్మానేర్ నిర్వాసితులకు కుటుంబ ప్రయోజన పరిహారం మంజూరైనట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు వెల్లడించారు. మండలకేంద్రంలో గురువారం విలేకరులతోమాట్లాడారు. నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్.. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. 2006 నుంచి 2015 వరకుæ 18 ఏళ్లు నిండినవారికి రూ.2లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, ఈ నిర్ణయంతో 4,720 మందికి పరిహారం అందుతుందని చెప్పారు. ఇళ్లకు పరిహారం తీసుకోని 197 మందికి వడ్డీ చెల్లించేందుకూ సీఎం అంగీకరించి జీవో 66 విడుదల చేశారని వివరించారు. 2013లో కొందరు నిర్వాసితులు ఇళ్ల పరిహారం తీసుకోలేదని, ఆ మొత్తాన్ని అధికారులు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని, పరిహారానికి నిర్వాసితులు పదిశాతం వడ్డీ కోరితే.. సీఎం 15శాతం చెల్లించేలా జీవో తెచ్చారని వెల్లడించారు. మధ్యమానేరులో జూలై నాటికి ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశముందన్నారు. నిర్వాసితు లు వారికి కేటాయించిన పునరావాస కాలనీలకు వెళ్లాలని కోరారు. సర్పంచ్ నల్ల నర్సయ్య, సహాకార సంఘాల చైర్మన్లు చక్రాధర్రెడ్డి, తన్నీరు బాపురావు, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, మాజీ ఎంపీపీ గోపాల్రావు, శ్రీనివాస్రెడ్డి, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు. దిగువ భూములకు ఎగువమానీరు ఎగువ మానేర్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందిస్తామని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. ఎగువ మానేరు ఆయకట్టుకు నీరు అందడం లేదని స్థానికులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. రవీందర్రావు గురువారం కాలువలు, పంట పొలాలను పరిశీలించారు. ఎగువన ఉన్న రైతులు కాలువలకు గండ్లు కొట్టి దిగువ రైతులకు నష్టం చేయవద్దన్నారు. జెడ్పీకో–ఆప్షన్ సభ్యుడు సర్వర్, రైతులు గండ్లను పూడ్చివేసి రైతులందరికి నీటి సరఫరా చేయడం అభినందనీయమన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 17 మంది గ్యాంగ్మన్లను నియమిస్తున్నారన్నారు. ముస్తాబాద్లో సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణకు రూ.12 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో విస్తరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ శరత్రావు, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీకోఆప్న్ సభ్యడు సర్వర్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, విండో చైర్మన్లు చక్రాధర్రెడ్డి, తన్నీరు బాపురావు, సర్పంచ్ నల్ల నర్సయ్య, గోపాల్రావు, శ్రీనివాస్రెడ్డి, కొమ్ము బాలయ్య, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు. -
భూ నిర్వాసితులకు నజరానా
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితు లైన యువతకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ల పరిధిలో ఆర్అండ్ఆర్ నోటిఫి కేషన్ ఇచ్చిన 2010 ఆగస్టు నాటికి మైనర్లుగా ఉండి 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఏకమొత్తంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రెండు ప్రాజెక్టుల పరిధి లోని 9,484 మంది నిర్వాసిత యువతకు రూ. 189.68 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ప్రత్యేక సాయం పొందే వారిలో కరీంనగర్ పరిధిలోని 3,127 మందికి రూ. 62.54 కోట్లు, ఆదిలాబాద్ పరిధిలోని 1,974 మందికి రూ. 39.48 కోట్లు కలిపి మొత్తంగా రూ. 102.02 కోట్ల ఆర్థిక సాయం పొందను న్నారు. అలాగే మిడ్మానేరు పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ పరిధిలో 152 మందికి రూ. 3.04 కోట్లు, ఇదే ప్రాజెక్టు పరిధిలోని ఇందిరమ్మ వరద కాల్వ కింద ఉన్న 4,231 మందికి రూ. 84.62 కోట్లు కలిపి రూ. 87.66 కోట్ల ఆర్థిక సాయం అందుకోనున్నారు. గతేడాది నిర్ణయం..ప్రస్తుతం అమలు..: మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో సామాజిక ఆర్ధిక సర్వే (ఎస్ఈఎస్) ఆధారంగా గుర్తించిన యువతకు మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందిం చాలని గతేడాది జనవరిలోనే నిర్ణయం జరిగింది. 2010 ఆగస్టు 26 నాటికి సామాజిక ఆర్థిక సర్వే సమయానికి మైనర్లుగా ఉండి 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఓసీ, బీసీలకు రూ. 2 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.30 లక్షలు చెల్లిస్తే సబబుగా ఉంటుందని సర్కారు భావించింది. అయితే ఈ విధానం ద్వారా చెల్లింపులకు మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు పోలేదు. అనంతరం తిరిగి కొత్తగా మార్గదర్శకాలు రూపొందించి నిర్ణీత గడువులో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి జాబితా సిద్ధమైంది. అయితే ఇతర ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రత్యేక ఆర్థిక సాయం డిమాండ్లు వచ్చే అవకాశాలున్న దృష్ట్యా ఈ ప్రతిపాదనను జూన్లో జరిగిన కేబినెట్ సమావేశంలో తిరస్కరించారు. కానీ గతేడాది సెప్టెంబర్లో కురిసన భారీ వర్షాల వల్ల మిడ్ మానేరు కట్టలు తెగిపోయిన సందర్భంగా కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్ స్థానిక ప్రజాప్రతినిధుల వినతులను దృష్టిలో పెట్టుకొని నిర్వాసిత యువతకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. -
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా..?
సాక్షి, సిరిసిల్ల : పరిహారంపై బెంగతో ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో నిర్వాసితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో గత మూడు నెలల్లో చిలుక సత్తయ్య, అవదూత్త ప్రకాశ్, ఎడవల్లి నర్సయ్య, మొగులోజు బాలయ్య, వడ్ల బాలయ్య, జోగు దుర్గయ్య మరణించారు. వీరంతా కూడా తక్కువ పరిహారం, పరిహారం చేతికందకపోవడంతో బెంగపడి ప్రాణాలు వదిలినవాళ్లే. పరిహారంలో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. చీర్లవంచకు చెందిన చిలుక సత్తయ్య ఇంటిని మొదటిసారి సర్వే చేసి రూ.3 లక్షల 62 వేలుగా నిర్ణయించి, రెండో సర్వేలో రూ.లక్షా 30 వేలకు కుదించారు. తనకు పరిహారం తక్కువగా వస్తుందనే బెంగతో సత్తయ్య గత నెల రోజుల క్రితం గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. పదేళ్లయినా అందని పరిహారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడలో నిర్మిస్తున్న మిడ్మానేరు ప్రాజెక్ట్ కింద 12 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, శాభాష్పల్లి, వరదవెల్లి, మాన్వాడ, వేములవాడ మండలం సంకెపల్లి, ఆరెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడిముంజ, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్ఠాణా, ఇల్లంతకుంట మం డలం గుర్రంవానిపల్లి గ్రామాలను ముంపు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. 11,590 కుటుంబాలు ని ర్వాసితులుగా మారుతున్నట్లు అధికారులు నిర్ధారించా రు. పరిహారం అంచనా వేసేందుకు 2006–07లో అధికారులు ఈ గ్రామాల్లో సర్వే చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క గుర్రంవానిపల్లిలో 210 కుటుంబాలకు మాత్రమే పూర్తిగా రూ.2.39 కోట్లు పరిహారం చెల్లించారు. చాలా గ్రామాల్లో పాక్షికంగా ఇచ్చారు. దాదాపు 6,292 కుటుంబాలకు పరిహారం ఇప్పటికీ అందాల్సి ఉంది. ఇక పరిహారం అంచనాలోనూ లోపాలున్నట్లు నిర్వాసితులు పేర్కొంటున్నారు. కేటగిరీల వారీగా విద్యార్థికి రూ.53 వేలు, ఇతరులకు రూ.58 వేలు, కూలీకి రూ.2 లక్షల 9 వేలు, వ్యవసాయదారునికి రూ.2 లక్షల 30 వేలుగా నిర్ధారించారు. సర్వే సంవత్సరాలుగా సాగుతుండడంతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పది సంవత్సరాల క్రితం విద్యార్థి, ఇప్పుడు వ్యవసాయదారుడిగా మారినా రూ.53 వేలుగానే నిర్ణయిస్తున్నారు. తాజాగా సమగ్రంగా సర్వే చేసి పరిహారాన్ని నిర్ధారించాలని, త్వరగా చెల్లించి మరో ప్రాణం పోకుండా కాపాడాలని నిర్వాసితులు వేడుకొంటున్నారు. -
అఖిల పక్షాన్ని కలుస్తాం
భూ సేకరణ, ప్రైవేటు వర్సిటీ బిల్లుపై ప్రొఫెసర్ కోదండరాం కరీంనగర్: రైతుల నుంచి భూసేకరణ, పునరావాస ప్యాకే జీ విషయంతోపాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో అఖిలపక్ష పార్టీల నాయకులను కలుస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. భూసేకరణలో రైతులకు అన్యాయం చేయొద్దని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తూ నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యామేలుతున్నాయని, ప్రైవేటీకరణ వల్ల విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. ఇసుక, గ్రానైట్ వ్యాపారాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సామా న్యుడికి ఒక ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితుల్లో టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతోందని చెప్పారు. గత ప్రభుత్వాలకు.. ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమీ లేకపోవడం విచారక రమన్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు గండిప డేందుకు కారణమైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీన మేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమి టని, పాత కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాం ట్రాక్టర్కు టెండర్ల ద్వారా మిడ్మానేరు ప్రాజెక్టును రెండింతలు అంచనాలు పెంచి ఇవ్వడం ప్రజాధనం దుర్వినియోగం చేయ డం కాదా? అని ప్రశ్నించారు. జేఏసీ, టీవీవీ ప్రజలపక్షాన నిలుస్తుందని, జేఏసీ ఎవరికి తొత్తుగా ఉండబోదని స్పష్టం చేశారు. -
2.12 శాతం లెస్తో మిడ్మానేరు టెండర్లు
రూ.323 కోట్లకు దక్కించుకున్న రాజరాజేశ్వరి-బెకామ్-ఎస్ఎమ్మెస్ సాక్షి, హైదరాబాద్: మిడ్మానేరు రిజర్వాయర్ టెండర్ ప్రైస్బిడ్ గురువారం తెరుచుకుంది. రూ.323.45 కోట్ల పనులను రాజరాజేశ్వరి-బెకామ్-ఎస్ఎమ్మెస్ సంస్థ (జారుుంట్ వెంచర్) దక్కించుకుంది. 2.12 శాతం లెస్తో టెండర్ దాఖలు చేసి ఈ పనులను రాజరాజేశ్వరి సంస్థ దక్కించుకుంది. శ్రీరాంసాగర్ వరదకాల్వ కింద కరీంనగర్ జిల్లాలో 25.873 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన మిడ్మానేరు రిజర్వాయర్కు ఈ ఏడాది సెప్టెంబర్ 25న భారీ వర్షాలతో గండి పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై కొత్తగా టెండర్లు పిలవాలన్న సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు అక్టోబర్ 26న రూ.323.45 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించింది. ఈ పనుల కోసం రాజరాజేశ్వరి, మెగా సంస్థలు మాత్రమే పోటీలో నిలవగా, మెగా సంస్థ సాంకేతికంగా అర్హత సాధించకపోవడంతో మిగిలిన రాజరాజేశ్వరి సంస్థకు టెండర్ ఖరారైంది. ఈ టెండర్కు సంబంధించిన డాక్యుమెంట్లను శుక్రవారం కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) పరిశీలనకు పంపుతున్నారు. వారంలో అగ్రిమెంట్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ఆరంభించనున్నారు. 12 నెలల్లో పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెరుచుకున్న ‘పాలమూరు’నెట్వర్క్ సర్వే టెండర్లు.. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ (పిల్లకాల్వల వ్యవస్థ)సర్వేకు సంబంధించి సాంకేతిక టెండర్లు గురువారం తెరుచుకున్నారుు. పిల్ల కాలువల సర్వేకు సంబంధించిన రూ.92 కోట్లు విలువ చేసే పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా దీనికి పలు ప్రముఖ సంస్థలు పోటీపడ్డట్లుగా తెలిసింది. శుక్రవారానికి ఏయే ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయన్న అంశంపై స్పష్టత వస్తుందని, వారంలో ప్రైస్బిడ్లో తెరుస్తామని నీటి పారుదల వర్గాలు తెలిపారుు. -
నేడు మిడ్మానేరు టెండర్ ఫైనల్..!
► టెండర్లు దాఖలు చేసిన రెండు వెంచర్లు ► పదేళ్ల ప్రాజెక్టు పనుల పోరాటానికి తెరపడేనా? బోరుునపల్లి : మిడ్మానేరుకు పడ్డ గండి పూడ్చడంతో పాటు బ్యాలెన్స పనుల నిర్వహణకు ఈ నెల17న ఫైనల్ టెం డర్ ప్రైస్ బిడ్ను అధికారులు ప్రకటించనున్నారు. గత సెప్టెంబర్ 25న మిడ్మానేరుకు గండి పడడంతో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసి అప్పటి వరకు ఎడమ వైపు పనులు నిర్వహిస్తున్న సంస్థల కాంట్రాక్టు రద్దు చేశారు. కొత్తగా రూ.323.45 కోట్ల అంచనాలతో మిడ్మానేరు ఇంజినీరింగ్ అధికారులు గత నెల 26న టెండర్లు పిలి చారు. నూతనంగా చేపట్టనున్న ప్రాజెక్టు పనులకు ఎస్ఆర్ఆర్సీ, ఎస్ఎంఎస్, బీఈకేఈఎం అనే ఉమ్మడి సంస్థ లు, ఎంఈఐఎల్, హెచ్ఈఎస్ అనే జారుుంట్ వెంచర్లు టెండర్లు దాఖలు చేశారుు. టెండర్ప్రైస్ బిడ్లో భాగం గా ఈనెల 16,17న టెండర్లు దాఖలు చేసిన జారుుంట్వెంచర్లకు సంబంధించిన సాంకేతిక అంశాలు ఇంజినీరింగ్ అధికారులు పరిశీలన చేస్తారు. సాంకేతిక పరంగా అర్హులైన సంస్థలను గుర్తించి ఈనెల 17న ఫైనల్ ప్రైస్ టెండర్ బిడ్ ప్రకటిస్తారు. కొత్త ఎస్సెస్సార్ రేట్లతో పెరిగిన అంచనాలు గండి పడిన నేపథ్యంలో మిగిలిన పనులకు సంబంధిచి కొత్త అంచనాలను నెల క్రితం నీటి పారుదల శాఖకు మి డ్మానేరు ప్రాజెక్టు అధికారులు సమర్పించారు. ప్రస్తుత పనులకు సుమారు రూ.134 కోట్లు ఖర్చు చేయాల్సి ఉం ది. అరుుతే కొత్త ఎస్సెస్సార్ (స్టాం డర్డ్ షెడ్యూల్ రేట్లు) రేట్లతో రూ. 134 కోట్ల పనులకు అదనంగా స గానికంటే ఎక్కువగా అంచనాలు పెరిగా రుు. దీంతో మొత్తం పనుల నిర్వహణకు రూ. 323.45 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. కొత్త ఎస్సెస్సార్ రేట్లతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భారం పడనుంది. ఇదే క్రమం లో కొత్త కాం ట్రాక్టర్కు పెరిగిన రేట్లు లాభం చేకుర్చనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో కాంట్రాక్టు ప నులు పొందిన సంస్థలు లెస్కు టెం డర్లు పొందారుు. ఈసారి సంస్థలు ప్రభుత్వ అంచనాలకంటే లెస్కు చేస్తా యా.. ఎక్సెస్ రేట్లు కావాలంటాయా గురువారం తెలనుంది. కాగా ప్రాజెక్టు బ్యాలెన్స పనుల అంచనాలు పో ను, మిడ్మానేరుకు గండి పడడంతో , సుమారు రూ. 27కోట్లు అదనంగా అంచనాలు పెరిగా రుు. పదేళ్ల ప్రా జెక్టు పనుల పోరాటంలో ముచ్చటగా మూడోసారి ప్రకటించే టెండర్ పొందే సంస్థలు పూర్తి పనులు చేస్తాయో వేచి చూడాలి. -
కాంగ్రెస్ నేతలకు ఆ అర్హత లేదు: హరీశ్
కరీంనగర్ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు...కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్టులపై మాట్లాడే హక్కులేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.700 కోట్లు పంపిణీ చేస్తే...రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ రూ.400 కోట్లు పంపిణీ చేసిందని అన్నారు. ఇక మిడ్ మానేరు నిర్వాసితులకు కుటుంబ పరిహారం కింద రూ.2 లక్షల చొప్పున త్వరలోనే అందచేస్తామన్నారు. ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇస్తే 123 జీవో ప్రకారం 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని హరీశ్ తెలిపారు. 2018వరకు ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. -
మిడ్మానేరు కొత్త అంచనా 380 కోట్లు
గత అంచనాతో పోలిస్తే రూ.216 కోట్ల మేర పెరుగుదల - ఒప్పందంలోని క్లాజ్-61 ప్రకారం ప్రస్తుత కాంట్రాక్టు రద్దు - నీటి పారుదల శాఖ నివేదిక సిద్ధం.. రెండు నెలల్లో కొత్త టెండర్లు సాక్షి, హైదరాబాద్: మిడ్మానేరు రిజర్వాయర్ నిర్మాణానికి కొత్త అంచనాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత లెక్కల మేరకు మొత్తంగా రూ.380 కోట్లు అవసరమని నీటి పారుదల శాఖ తేల్చింది. గత అంచనాతో చూస్తే దాదాపు రూ.216 కోట్ల వ్యయం అదనంగా పెరుగుతుందని లెక్కించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ, హైపవర్ కమిటీలలో చర్చించి.. కొత్తగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, టెండర్లు పిలుస్తారు. శ్రీరాంసాగర్ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 2006లో కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిపై 25.873 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీని ద్వారా 2.2 లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో రూ.406.48 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. తొలుత రూ.339.99 కోట్లకు మూడు సంస్థలు సంయుక్తంగా దీని పనులు దక్కించుకున్నాయి. 2009 నాటికి పూర్తి చేసేలా ఒప్పందాలు జరిగాయి. అనుకున్న మేర పనులు చేయకపోవడంతో 2015 వరకు నాలుగు కాంట్రాక్టు సంస్థలకు పనుల మార్పిడి జరిగింది. 2015 వరకు కేవలం రూ.127 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత పనులు కొంత పుంజుకున్నాయి. జలాశయం పూర్తి నీటిమట్టం 318 మీటర్లు కాగా.. ఈ ఏడాది 303 మీటర్ల వరకు పూర్తి చేసి 3.3 టీఎంసీలు నిల్వ చేయాలని నీటి పారుదల శాఖ తలపెట్టింది. అయితే అంచనాలకు మించి వరద రావడంతో ఎడమవైపు మట్టికట్ట 40 మీటర్ల మేర (150- 190 మీటర్ల మధ్య) కోతకు గురైంది. పనిలో జాప్యం, రిజర్వాయర్కు గండి పడిన నేపథ్యంలో పాత కాంట్రాక్టర్ను తొలగించి మళ్లీ టెండర్ పిలవాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కొత్త అంచనాలు తయారు చేశారు. రూ.216 కోట్ల భారం.. ప్రాజెక్టు తొలి అంచనా వ్యయం రూ.339.99 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.176 కోట్ల విలువైన పని పూర్తయింది. అంటే మిగతా పని విలువ రూ.164 కోట్లు. తొలుత పనులు దక్కించుకున్న సంస్థ 20 శాతం లెస్కు టెండర్ వేసిన లెక్కన.. ప్రస్తుతం మిగిలిన పనుల విలువ రూ.198 కోట్లు. కానీ ఇంకా పెండింగ్లో ఉన్న ఈ పనులకు ప్రస్తుత స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల(ఎస్ఎస్ఆర్)ను వర్తింపజేస్తుండడంతో వ్యయం రూ.380 కోట్లకు పెరుగుతోంది. అంటే గత పనుల విలువతో పోలిస్తే ఏకంగా రూ.216 కోట్ల మేర పెరుగుతోంది. ఈ రూ.380 కోట్లలో పనుల విలువ రూ.320 కోట్ల వరకు ఉండగా.. పన్నులు, ఇతరత్రా వ్యయాలకు రూ.60 కోట్లు ఖర్చవుతాయని లెక్కించారు. పెరిగిన అంచనాలకు నీటి పారుదల శాఖలోని వివిధ కమిటీల ఆమోదం అనంతరం కొత్తగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తారు. అనంతరం టెండర్లు పిలుస్తారు. దీనికి సుమారు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఒప్పందం ప్రకారం పనిచేయని ప్రస్తుత కాంట్రాక్టర్ను ఒప్పందంలోని సెక్షన్-61 కింద తొలగించాలని నిర్ణయించారు. ఈ సెక్షన్ కింద కాంట్రాక్టర్ బ్యాంకు గ్యారంటీ కింద ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేయనుండగా.. పనులు చేయని వాటి కి చెల్లింపులు నిలిపేస్తారు. -
'ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేర్కు గండి'
కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేర్కు గండి పడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. పార్టీకి చెందిన కొందరు నేతలతో కలిసి మిడ్ మానేరును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మానేరుకు గండి పడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కనపిస్తోంది, కానీ ప్రకృతి వైపరిత్యం ఏమాత్రం కాదన్నారు. మిడ్ మానేర్ డ్యాంను సందర్శించిన ఆయన అనంతరం ముంపు గ్రామమైన మన్వాడలో పర్యటించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్మానేరుకు గండి
నిర్వాసితులపై సమస్యలపై ఆందోళన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి బోయినపల్లి : ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్మానేరు రిజర్వాయర్ కట్టకు గండి పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం మిడ్మానేరు రిజర్వాయర్ గండిని పరిశీలించారు. బోయినపల్లి మండలం మాన్వాడ, సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామాల్లోని ముంపు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేసినా కమీషన్ల కక్కుర్తితో పాలకులు పట్టించుకోలేదన్నారు. దీంతో కట్ట నిర్మాణంలో నాణ్యత లోపించి గండి పడిందన్నారు. నాలుగు టీఎంసీల నీరు వథాగా పోయిందని, వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో ముంపు గ్రామాల్లోకి నీళ్లు వచ్చాన్నారు. ఒక్కో కుటుంబం రూ.10వేలు ఖర్చు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయన్నారు. ప్రభుత్వం వెంటనే మిడ్మానేరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంతోపాటు వరద బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పదిరోజుల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో కలక్టరేట్ను ముట్టడిస్తామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్రెడ్డి, గుండా మల్లేశ్ తదితరులున్నారు. -
తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు
జగిత్యాల రూరల్ : తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలతో ఎదురుదాడి చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేయడంతోనే మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్పీ కాకతీయ కాల్వకు గండిపడిందన్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లనే ఎగువమానేరు రిజర్వాయర్ కట్టకు గండి పడ్డదన్నారు. ఈ రెండు సంఘటనలపై విచారణ నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే స్పందించని ప్రభుత్వం.. ఎదురుదాడికి దిగడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి విచారణ లేకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే అన్నారు. మిడ్మానేరు భూనిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నా సీఎం హామీని నెరవేర్చాలన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజోద్దీన్ మన్సూర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలుగూరి దామోదర్రావు పాల్గొన్నారు. -
మిడ్మానేరుకు గండిపై దర్యాప్తు జరపాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మంకమ్మతోట/బోయినపల్లి: కరీంనగర్లోని మిడ్మానేర్కు గండిపడి.. వరద ప్రవాహం తో ఇసుక మేటలు పడిన పంట భూములకు ఎకరానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మిడ్మానేర్ ప్రాజెక్టును సంద ర్శించి పంటలు కోల్పోయిన బాధితులను పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. అలాగే, బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గండిపడ్డ మిడ్మానేరు రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. మాన్వాడ వద్ద పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. నష్టపరిహారం అందేవరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిడ్మానేర్ ప్రాజెక్టు ముంపుకు గురై పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే 12 ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కట్ట తెగడం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం కనబడుతున్నా యన్నారు. స్పిల్వే కన్నా ఎత్తులో మట్టి కట్ట నిర్మించాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మిం చడం తోనే నీటి ఉధృతికి కట్ట తెగిందన్నారు. మిడ్మానేర్ను సందర్శించిన వారిలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మతీన్ ముజారుద్దీన్, బోయినపల్లి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు అక్కెనపెల్లి కుమార్, బమ్మిడి శ్రీనివాసరెడ్డి, బొడ్డు సాయినాథ్రెడ్డి, నాడెం శాంతకుమార్, అమృతసాగర్, వెల్లాల రామ్మోహన్ తదితరులు ఉన్నారు. -
‘వైఎస్ఆర్ వల్లే ప్రాజెక్టులకు జలకళ’
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లి మిడ్ మానేరు గండిని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మిడ్ మానేరు గండికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరినట్లు పరిహారం చెల్లించకుంటే మిడ్ మానేరు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి, 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే..
మిడ్మానేరు ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. మిడ్మానేరుకు పడిన గండిని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిడ్మానేరు ప్రాజెక్టుకు పడిన గండికి టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి.. నిర్వాసితులు కోరినట్టు పరిహారం చెల్లించాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన మిడ్మానేరు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతాం హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, బోయినిపల్లి శ్రీనివాసరావు, మహేందర్రెడ్డి, మతిన్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. -
మిడ్మానేరుపై అసెంబ్లీలో నిలదీస్తాం: కె.లక్ష్మణ్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే అసెంబ్లీ సమావేశంలో మిడ్మానేరు అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మిడ్మానేరు ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకు వచ్చిన లక్ష్మణ్ జిల్లా పార్టీ నేతలతో కలిసి మిడ్మానేరు ముంపు ప్రాంతాలైన మాన్వాడ, కట్కూర్, కొదురుపాక, రుద్రవరం గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులతో సమావేశమై వారి గోడును విన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు గుజ్జల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్రావు, వసంత, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 25 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మిడ్మానేరు కట్ట మూడు టీఎంసీలకే గండిపడటం శోచనీయమన్నారు. -
ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్మానేరుకు గండి
• హరీశ్రావు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి • వైఎస్సార్ హయాంలోనే ఎల్లంపల్లి 80శాతం పూర్తి: ఉత్తమ్ కరీంనగర్/గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేరు రిజర్వాయర్కు గండి పడిందని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. మిడ్మానేరు రిజర్వాయర్ గండి పడటానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని, మంత్రి హరీశ్రావు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది, ఇందులో టీఆర్ఎస్ సర్కారు పాత్ర ఏమీలేదన్నారు. బుధవారం ఆయన శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్అలీ, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి. సంతోష్కుమార్, డీసీసీ చైర్మన్ కటుకం మృత్యుంజయంలతో కలిసి ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులను సందర్శించారు. ముందుగా ఎల్లంపల్లిని సందర్శించి.. గోదావరి మాతకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపకర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటాలకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించి 2014 మే నాటికి 86 శాతం పూర్తి చేశామన్నారు. ఎల్లంపల్లితోపాటు తెలంగాణలో ఉన్న మిగతా ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పాలనలోనే పురుడుపోసుకున్నాయన్నారు. టి.జీవన్రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వల్లే మిడ్ మానేరు ప్రాజెక్టుకు గండి పడిందని ఆరోపించారు. -
క్షమాపణతో కష్టాలు తీరవు
సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి భూనిర్వాసితులకు డబుల్బెడ్రూం ఇవ్వాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మిడ్మానేరు గండి పరిశీలన.. ముంపు బాధితులకు పరామర్శ బోయినపల్లి/వేములవాడరూరల్ : మధ్యమానేరు నిర్మాణంతో నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, వారి కన్నీళ్లను ఒక్క క్షమాపణ చెప్పి తీర్చలేరని, డబుల్ బెడ్రూమ్ విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మధ్యమానేరు గండిని పరిశీలించారు. మండలంలోని కొదురుపాక ఎస్సీ కాలనీలో వరద ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శించారు. వేములవాడ మండలం రుద్రవరంలో మానేరు ముంపు బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వీరు కూడా ముంపు గ్రామాలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. 2008లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని, 2016 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పరిహారంతోపాటు ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. డబుల్బెడ్రూమ్ హామీపై నాడు అవగాహన లేక మాట్లాడానని, క్షమించాలని సీఎం కోరడం సిగ్గుచేటన్నారు. మిడ్మానేరు వరదతో పంటలు దెబ్బతిన్న భూములను సేకరించి ఎకరానికి రూ.20లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, వర్షాలకు ధ్వంసమైన పంటలకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. వర్షాలతో పంటలు నష్టపోయి, మానేరు నీటితో రుద్రవరం గ్రామంలో బాధితులు ఆవేదన చెందుతుంటే ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు గ్రామంవైపు కన్నెత్తి చూడకపోవడం ప్రజలపై ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతోందని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతీ నాయకుడు ఆపదలో ఉన్న ముంపు గ్రామాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పాలని సూచించారు. రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక గ్రామంలోని సమస్యలతోపాటు ముంపు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ లక్ష్మణ్కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆది శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్రెడ్డి, నాయకులు మీస అర్జున్రావు, లింగంపల్లి శంకర్, శ్రీధర్, ఆకుల విజయ్, మేకల ప్రభాకర్యాదవ్, గుడి రవీందర్రెడ్డి, కన్నం అంజయ్య, గంటల రమణారెడ్డి, మహిళామోర్చ జిల్లా అధ్యక్షురాలు గాజుల స్వప్న, సుజాతారెడ్డి తదితరులున్నారు. -
శాశ్వత పరిష్కారం చూపాలి