mining mafia
-
‘మైనింగ్’ అనుమతులు రద్దు చేయండి
బల్మూర్/వెల్దండ: మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని మైలారం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కారు. వివరాల్లోకి వెళితే.. మైలారం గుట్టపై సర్వే నంబర్ 121లోని 35 ఎకరాల్లో మైనింగ్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి గ్రామంలో రిలే దీక్షలు చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు కొందరిని ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు గ్రామస్తుల ఆందో ళనకు మద్దతు ప్రకటించేందుకు, మైలారం గుట్టను పరిశీలించడానికి ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వస్తుండగా.. వెల్దండలో పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు.దాదాపు గంటసేపు వారిని స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన గ్రామస్తులు ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడుదల చేయడంతోపాటు గ్రామానికి ఎమ్మెల్యే వచ్చి..మైనింగ్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గుట్టపై ప్రజాభిప్రాయం లేకుండానే మైనింగ్ తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారు. ఆరు గంటలపాటు ఉద్రిక్తత ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఐ రవీందర్, ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో లింగాల, ఉప్పునుంతల, అమ్రాబాద్, అచ్చంపేట, సిద్దాపూర్ పోలీసులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మైలారం గ్రామం మీదుగా అప్పాయిపల్లి, అంబగిరి, చెన్నంపల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత గ్రామానికి చెందిన మైలారం గుట్ట పోరాట సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, లింగయ్యగౌడ్, లక్ష్మయ్య, సుమిత్ర తదితరులను పోలీసులు విడుదల చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.ఖనిజ లవణాలపై గద్దల్లా వాలుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్దేశవ్యాప్తంగా ఖనిజ, లవణాలను తవ్వేందుకు గద్దల్లా వాలిపోతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రకృతిని నాశనం చేసే మైనింగ్ తవ్వకాలను ప్రభుత్వాలు నిలిపివేయకుండా వ్యాపారులకు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి మైలారంలో మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం తగదని చెప్పారు. -
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత
-
క్వార్డ్జ్ గనుల్లో.. ఘనుల లూటీ!
సాక్షి టాస్క్ఫోర్స్: కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా ‘ముఖ్య’ నేత పర్యవేక్షణలో జరుగుతున్న ‘తెల్ల’బోయే లూటీ కథ ఇదీ! పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ప్రకృతి సంపదను పిండి చేసే ఘనాపాటీల వ్యూహం దీని వెనుక దాగి ఉంది. ‘ముఖ్య’నేత ఆదేశాలతో స్వయంగా ఆయన కార్యాలయమే రంగంలోకి దిగి ఈ వ్యవహారాలను చక్కబెడుతోంది. ఇక ఈ మైనింగ్ దోపిడీలో అధికారికం.. అనధికారికం అనే తేడాలే లేవు. అనుమతుల పట్టింపే లేదు. గనులు ఎవరివైనా సరే.. ఖనిజాన్ని మాత్రం వారు చెప్పిన ధరకు అప్పగించాల్సిందే. ఇస్తావా..? లేదంటే చస్తావా?.. అంతే!! ఐదేళ్లలో రూ.వేల కోట్లను ఆర్జించే ఎత్తుగడ ఇదీ. రాష్ట్రంలోని క్వార్ట్జ్ (తెల్లరాయి) గనుల్లో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపద దోపిడీ కుట్రలు టీడీపీ పెద్దల కనుసన్నల్లో సాగుతుండగా.. నెల్లూరుకు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధిని ముందుపెట్టి ‘ముఖ్య’నేత కార్యాలయం అనునిత్యం దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ఈ దందాకు తెర తీశారు. ఇందుకు సీనియర్ ప్రజాప్రతినిధి 50 శాతం పెట్టుబడి పెడితే ఆయనకు వాటాలు దక్కేలా డీల్ కుదిరినట్లు సమాచారం. దీంతో సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి నిత్యం రాత్రి పూట వందల లారీల్లో ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తమకు ముడిసరుకు మొత్తం అప్పగించకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని బెదిరించినట్లు అన్ని అనుమతులున్న గనుల యజమానులు వాపోతున్నారు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని, గత ఆర్నెళ్లుగా మైనింగ్ను అడ్డుకుని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొంటున్నారు.వేస్ట్ మెటల్తో కోట్లు..స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి కీలక అనుచరుడి చేతిలో నాలుగు మైన్లు ఉన్నాయి. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఈ గనుల్లో గతంలో ఎందుకు పనికి రాదని గుట్టలు గుట్టలుగా వదిలేసిన వేస్ట్ ఖనిజమే మైకా క్వార్డ్జ్. ఈ ఖనిజానికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ వేస్ట్ మెటల్తోనే కోట్లు ఆర్జించే దందాలో భాగస్వాములయ్యారు.తాజాగా మరో 4 గనులకు..! స్థానిక ప్రజాప్రతినిధి బంధువులు, అనుచరులకు రెండు రోజుల క్రితం మరో నాలుగు గనులకు అనుమతి ఇచ్చారు. ఆయన బంధువుకు రెండు, జోగుపల్లికి చెందిన దళారీకి పొక్కందల సమీపంలో ఒక గని, చాకలికొండ వద్ద ఉన్న మరో గనికి అనుమతి ఇచ్చారు. సైదాపురం మండలంలోని రామసాగరం, చిల్లకూరు మండలంలోని రెట్టపల్లిలో ఉన్న గనికి కూడా అనుమతులు మంజూరు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు పావులు కదపడంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు.క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ పేరుతో..సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తెచ్చి మొత్తం మైనింగ్పై పెత్తనాన్ని ప్రభుత్వ పెద్దలు స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధికి అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సైదాపురం వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు వెళ్లిన ఆయన... ప్రస్తుతం చైనాలో ఉన్న క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా 50 శాతం పెట్టుబడి పెడితే వాటాలు ఇచ్చే ఒప్పందంతో సైదాపురం గనులను ఆయనకు అప్పగించారనే ప్రచారం సాగుతోంది. దీంతో క్వార్ట్జ్ మెటల్ను వ్యాపారులు ఇకపై ఆయన అనుచరులు నిర్ణయించిన ధరకే ఇచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. ‘ముఖ్య’నేత కార్యాలయం నుంచి అధికారులకు ఈమేరకు ఆదేశాలు రావడంతో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలకనేత దీనిపై మైనింగ్ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతా ‘ముఖ్య’నేత కార్యాలయం పర్యవేక్షిస్తోందని, ఇకపై ఎవరూ కూడా ఈ దందా విషయంలో కలగజేసుకోవద్దని మంత్రి కార్యాలయం చేతులెత్తేసినట్లు సమాచారం.మైకా క్వార్ట్జ్ ఖనిజం టన్ను రూ.2 లక్షలు!సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజం టన్ను రూ.20 వేల నుంచి మొదలై రూ.2 లక్షల వరకు పలుకుతోంది. దీంతో కాలం చెల్లిన గనుల్లో ఉన్న ఈ ఖనిజాన్ని దోచుకునేందుకు, మిగిలిన గనులను సొంతం చేసుకునేందుకు కూటమి నేతలు రాజకీయ పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా మైనింగ్ చేస్తున్న కూటమి నేతలు చీకటి పడితే చాలు దండులా వాహనాలతో తెల్లరాయి అక్రమ రవాణా సాగిస్తున్నారు. టన్నుల లెక్కన అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు అధికారుల పాత్ర కూడా ఉండడంతో అక్రమ రవాణాకు ఎక్కడా అడ్డు చెప్పడం లేదని తెలుస్తోంది. దీనిపై ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలక నేత రగిలిపోతున్నారు. తమ జేబులోకి వచ్చి పడే సొమ్మును లాక్కెళ్లిపోతున్నారని గుర్రుమంటున్నారు.80 గనులు ఓపెన్?– ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు..గత ఆర్నెళ్లుగా నిలిచిపోయిన 80 గనులకు రాష్ట్ర గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల గనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్ర అధికారులకు నివేదిక పంపారు. అన్ని గనుల్లో ఉన్న ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలకు రహస్య నివేదిక ఇవ్వడంతో కప్పం వసూలుకు సిద్ధమయ్యారు. లీగల్ మైన్లు తాము నిర్దేశించిన వారి చేతికి అప్పగిస్తేనే వాటికి పర్మిషన్లు ఇస్తామంటున్నారు. దీంతో గత 40 – 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ కడుతున్న గనుల యజమానులు లబోదిబో అంటున్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని వాపోతున్నారు.నెలకు 30 – 50 వేల టన్నులు..ఈ ప్రాంతంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజాన్ని ప్రతి నెలా 30 వేల నుంచి 50 వేల టన్నులను తవ్వి ఎగుమతులు చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి టన్నుకు కేవలం రూ.230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంది. నిత్యం సైదాపురం మండలంలో 1,000 టన్నులు, ఇతర ప్రాంతాల్లో మరో 500 టన్నులు దొరికే అవకాశం ఉంది.అధికారిక మైనింగ్దారులకు బెదిరింపులుజిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి అనుచరులు అధికారికంగా అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు దిగుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని నెల్లూరులో ఓ చోటా నేత బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉన్న కార్యాలయానికి గనుల యజమానులను పిలిపించుకుని తీవ్ర స్థాయిలో హెచ్చరికలకు దిగినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు.రాత్రి వేళ అక్రమ రవాణా..స్థానిక ప్రజాప్రతినిధి అనుచర వర్గం గత రెండు నెలలుగా రాత్రి వేళల్లో సైదాపురం నుంచి అనుమతులు లేకుండా తెల్ల క్వార్ట్జ్ను నిత్యం భారీ స్థాయిలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. మండలంలో 40 గనుల్లో నిల్వలున్న క్వార్ట్జ్ను స్థానిక వ్యాపారులతో మాట్లాడుకుని అక్రమ రవాణా చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మైన్ల పర్మిట్లతో సైదాపురం క్వార్ట్జ్ను చెన్నైకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి టన్ను రూ.2 వేల నుంచి రూ.5 వేలు వంతున కొనుగోలు చేసి చెన్నై మార్కెట్లో రూ.50 వేలు వంతున విక్రయిస్తున్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తుండడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించడం లేదు. నెలవారీ మామూళ్లతో కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.విస్తార గనులు.. అపార సంపద సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరితోపాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే మైకా, మైకా క్వార్ట్జ్, క్వార్ట్జ్, పల్స్పర్, వర్ముఖ్లైట్ ఖనిజాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ ఏడు భూగర్భ గనులు, 130 ఓపెన్ మైనింగ్ క్వారీలు, 26 కాలం చెల్లిన గనులున్నాయి. ఒక్క సైదాపురంలోనే 70 ఓపెన్ క్వారీలు ఉండగా మిగతావి ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో మరో వందేళ్ల పాటు మైనింగ్ చేసినా తరగని అపార మైకా క్వార్ట్జ్ నిల్వలు ఉన్నాయి. ప్రధానంగా సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ గనులపై కన్నేసింది. ఆర్నెళ్లుగా అన్ని రకాల మైనింగ్ అనుమతులను నిలిపివేసింది. -
టీడీపీ మైనింగ్ మాఫియా అరాచకం.. క్వారీలో దారుణ హత్య
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో పలమనేరులో అనధికారికంగా క్వారీల నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని టీడీపీ నేత ఆక్రమించుకున్నారు. ఇక, అక్కడ క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు సదరు టీడీప నేత. అంతేకాకుండా క్వారీలో పనిచేస్తున్న చిన్నస్వామి అనే యువకుడిని క్వారీలో చంపిపడేయటం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఈ హత్య విషయం పలమనేరు పోలీసు స్టేషన్కు చేరింది. పోలీసు స్టేషన్లో టీడీపీ నేతలు పంచాయతీ పెట్టారు. ఇక, మృతుడు చిన్న స్వామి డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
టీడీపీలో టికెట్ల బేరం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. అధికార పార్టీ దూకుడు మీద ఉండగా.. టీడీపీ అసలు అభ్యర్థులనే ప్రకటించకుండా జాప్యం చేస్తుండడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఒకవైపు పొత్తులు, మరోవైపు కమిటీల పేరుతో ఎంతో కాలంగా పనిచేసిన లీడర్లను కూడా హీనంగా చూస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారంటూ ఎక్కువ డబ్బు డిమాండు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మమ్మల్ని నిర్ణయించేది జోనల్ కమిటీనా? తెలుగుదేశం పార్టీలో ఇటీవలే జోనల్ కమిటీని వేశారు. రాయలసీమకు సంబంధించిన ఈ జోనల్ కమిటీలో బీద రవిచంద్రయాదవ్, కిలారి రాజేష్ ఉన్నారు. వీళ్లిద్దరి పెత్తనం ఎక్కువైందనేది ఇక్కడి నేతల ఆవేదన. చీటికి మాటికి హైదరాబాద్ పిలుస్తున్నారని, అక్కడికి వెళితే ‘మీ నియోజకవర్గంలో పోటీ ఎక్కువగా ఉంది. మీరు చెబుతున్న డబ్బుకైతే మీకు టికెట్ ఇవ్వడం కష్టం’ అని చెబుతున్నారని అంటున్నారు. ఇద్దరు అభ్యర్థులను ఒక్కొక్కరి చొప్పున (వన్ టూ వన్) పిలిచి డబ్బులు అడుగుతున్నారని, టికెట్ కోసం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఇవ్వడానికి ఇన్నేళ్లు జెండా మోయడం దేనికని మండి పడుతున్నారు. రాబిన్ శర్మ రిపోర్టులంటూ.. ప్రస్తుతం టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్శర్మ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి, మీకు రిపోర్టులు నెగిటివ్గా ఉన్నాయని చెబుతున్నారని, ఈ రిపోర్టులను ఆధారం చేసుకుని జోనల్ కమిటీ మెంబర్లు డబ్బులు అడుగుతున్నట్టు నేతలు వాపోతున్నారు. ఎవరికైతే టికెట్ ఇవ్వకూడదనే ఆలోచన ఉందో వారికి సంబంధించి రాబిన్ శర్మ రిపోర్టు నెగిటివ్గా ఉందని చెబుతున్నారని, డబ్బులిచ్చిన వారికి రిపోర్టు బాగుందని అంటున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టూమెన్ కమిటీ ఇంకెన్నాళ్లు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల, మడకశిర రెండూ రిజర్వుడు నియోజకవర్గాలు. శింగనమలలో ఇద్దరు ఓసీ నేతలతో టూమెన్ కమిటీ వేశారు. ఇక్కడ ఈ ఇద్దరిదే పెత్తనం. మడకశిరలోనూ అంతే. మైనింగ్ మాఫియాగా ఉన్న గుండుమల తిప్పేస్వామి అక్కడ ఇన్చార్జ్గా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమని, ఎస్సీలను డమ్మీ చేశారని టీడీపీ ఎస్సీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలపరిమితి లేని కమిటీగా వ్యవహరిస్తున్నారని, తమను వీరినుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. -
క్రిమినల్ కోసం వెళ్లిన పోలీసులపై మర్డర్ కేసు!
దెహ్రాదూన్: నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. అయితే, నేరస్థులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే మర్డర్ కేసు నమోదైన అరుదైన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. వారిపై హత్య కేసు సైతం నమోదు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఉత్తర్ప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన ఐదుగురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్లోని జాస్పూర్కు వెళ్లారు. రూ.50,000 రివార్డ్ ఉన్న వాంటెడ్ క్రిమినల్ జాఫర్.. జాస్పూర్లోని భుల్లార్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్నట్లు తెలిసి.. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, మైనింగ్ ముఠా మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఎదురుకాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్ప్రీత్ కౌర్ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పోలీసులకు సైతం తూటాలు తగిలాయి. బీజేపీ నేత భార్య మృతితో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ వెళ్లిన ఐదుగురు ఉత్తర్ప్రదేశ్ పోలీసులపై హత్య కేసు సైతం నమోదైంది. ‘రూ.50వేల రివార్డ్ ప్రకటించిన వాంటెడ్ క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. భరత్పుర్ గ్రామం నుంచి తప్పించుకుని పోయాడు. మా పోలీసు బృందం అక్కడికి వెళ్లిన క్రమంలో వారిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. ప్రస్తుతం ఐదుగురు పోలీసులు చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతుంది.’ అని మొరదాబాద్ సీనియ్ పోలీసు అధికారి షలాబ్ మథూర్ తెలిపారు. ఇదీ చదవండి: హిజాబ్ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం -
డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్!
చండీగఢ్: హర్యానా డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ను పోలీసులు గంటల్లోనే పట్టుక్నునారు. నూహ్లో అతడ్ని గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితుడి మోకాలిలోకి బుల్లెట్ దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడి పేరు ఇక్కార్ అని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని చికిత్స కోసం నల్హార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నూహ్లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించేందుకు మంగళవారం మధ్యాహ్నం తన టీమ్తో వెళ్లారు తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. అక్కడ మైనింగ్ చేస్తున్న డంపింగ్ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ట్రక్కు డ్రైవర్ మాత్రం డీఎస్పీ ఆపుతున్నా లెక్కచేయకుండా వాహనాన్ని ఆయనపై నుంచే పోనిచ్చాడు. అనంతరం సురేంద్రసింగ్ను ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలై ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ట్రక్కును ఆపే సమయంలో డీఎస్పీతో పాటు గన్మెన్, డ్రైవర్ ఉన్నారు. కానీ వారు ప్రాణభయంతో ట్రక్కు దగ్గరకురాగానే పక్కకు దూకారు. డీఎస్పీ మాత్రం అలాగే ఉండిపోవడం వల్ల ట్రక్కు ఆయనపై నుంచి వెళ్లి చనిపోయాడు. ఈ ట్రక్కును డ్రైవ్ చేసింది నిందితుడు ఇక్కారే అని పోలీసులు తెలిపారు. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. రైడింగ్కు వెళ్లిన డీఎస్పీ దారుణ హత్య
చండీగఢ్: హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్ను దుండగులు దారుణంగా హతమార్చారు. నూహ్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడింగ్కు వెళ్లిన ఆయనను.. మాఫియా గ్యాంగ్ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపింది. పంచగావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ డంపర్ డ్రైవర్ డీఎస్పీపై నుంచి ట్రక్కును పోనిచ్చినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకే డీఎస్పీ వెళ్లారని, తన వెంట బలగాలను తీసుకువెళ్లే సమయం లేదని పేర్కొన్నారు. నిందితులు హత్యకు ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. Haryana | Tawadu (Mewat) DSP Surendra Singh Bishnoi, who had gone to investigate an instance of illegal mining in Nuh, died after being run over by a dumper driver. Search operation is underway to apprehend the accused. Details awaited: Nuh Police pic.twitter.com/Q1xjdUPWE2 — ANI (@ANI) July 19, 2022 వదిలిపెట్టేది లేదు.. డీఎస్పీ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా మైనింగ్ మినిస్టర్ మూల్ చంద్ శర్మ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్షాతో కూడా చర్చించినట్లు చెప్పారు. హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ కూడా నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సురేంద్ర సింగ్ కుటుంబానికి రూ.50లక్షలు బ్యాంకు ద్వారా , మరో రూ.50లక్షలు ప్రభుత్వం తరఫున పరిహారంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పోలీసు శాఖ మొత్తం డీఎస్పీ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చదవండి: వాట్సాప్ స్టేటస్గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
కంత్రీ కాంతారావు
తెలుగుదేశం పార్టీ నాయకుల మైనింగ్ దందాకు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు అడ్డాగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ టీవీఎస్ కాంతారావు. అనుమతులు పొందింది గోరంత.. తవ్వి బొక్కసం చేసింది కొండంత. 2014–19 మధ్య కాలంలో టీవీఎస్ కాంతారావు చేసిన దందా అంతా ఇంతాకాదు. కోట్లాది రూపాయల ఖనిజం కొల్లగొట్టాడు. అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న అతనికి ఇటు రాజకీయంగానూ, అటు అధికారుల పరంగానూ ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. దీంతో కోట్లాది రూపాయల ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ము చేసుకున్నాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంతారావు మైనింగ్ దందాతో చెలరేగిపోయాడు. అనుమతులు తీసుకోవడం ఒక సర్వే నంబర్లో.. తవ్వింది మరో సర్వే నంబర్లో. ఇవన్నీ ఎవరో చెప్పినవి కావు.. స్వయానా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో బయటపడ్డాయి. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు తవ్వారో అధికారులకే అంతుచిక్కలేదు. దీంతో భారీగా పెనాల్టీలు విధించారు. నేమకల్లులో సర్వే నంబర్ 253లో అధికారికంగా అతనికిచ్చింది ఎకరా విస్తీర్ణంలో తవ్వుకోవాలని మాత్రమే. కానీ విచ్చలవిడిగా తవ్వడంతో అధికారులు రూ.కోట్లల్లో పెనాల్టీ విధించారు. అంతేకాదు అత్యంత కఠినమైన ఆర్ఆర్ (రెవెన్యూ రికవరీ) యాక్ట్ ద్వారా ఆస్తులు రికవరీ చేసుకోవాలని కూడా నోటీసులు ఇచ్చారు. కానీ తెలుగుదేశం హయాంలో ఏ అధికారీ అతని క్రషర్ల వైపు వెళ్లలేకపోయారు. కూతురు, అల్లుడు, తమ్ముడు, తమ్ముడి కొడుకు ఇలా అందరి పేరుమీదా కాంతారావు మైనింగ్ చేసి రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తీరు మైనింగ్ అధికారులనే నివ్వెరపోయేలా చేసింది. అనుమతులు లేకుండా తవ్వారు అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ మెటల్ను తవ్వి తరలించారు. అంతేకాకుండా పరిమితికి మించి ఎక్కువ భూమిలో తవ్వారు. దీంతో ఎక్కువ పెనాల్టీలు వేశాం. తహసీల్దార్లకు కూడా దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చాం. దీనిపై సదరు వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. దీనికి మేము రివిజన్ పిటిషన్లు కూడా వేశాం. –బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్, గనులశాఖ కఠిన చర్యలు తీసుకుంటాం మైనింగ్ శాఖ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి నోటీసులు వచ్చాయి. ఈ మేరకు ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి ఆస్తులను గుర్తించి ఆర్ఆర్ యాక్ట్కింద వసూలు చేస్తాం. జరిమానాలు కట్టించి తీరతాం. –ఎ.నిశాంత్రెడ్డి, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
ఉల్లం‘ఘనులకు’ ఇంటి దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: గనులను కొల్లగొట్టిన అక్రమార్కులకు మైనింగ్ శాఖలోని కొందరు అధికారులే అండగా నిలవడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలోని మెటల్ క్వారీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం 10 రోజులుగా చేస్తున్న తనిఖీలకు అక్కడి మైనింగ్ అధికారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నట్టు తేలింది. తనిఖీలకు నేతృత్వం వహిస్తున్న విజిలెన్స్ ఏడీ ప్రతాప్రెడ్డి పట్ల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించగా.. జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు ఏకంగా దాడికి యత్నించటం కలకలం రేపింది. ఫైళ్లు ఇవ్వకుండా.. మాఫియాకు పాదాక్రాంతం అనకాపల్లి మండలంలోని 30 క్వారీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు రాష్ట్రంలోనే బడా కంపెనీలకు చెందిన క్వారీల్లో తనిఖీలు చేసి ఉల్లంఘనల్ని బయటపెడుతుండడంతో మైనింగ్ మాఫియా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయినా విజిలెన్స్ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో అనకాపల్లి ఏడీ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, ఇతర ప్రాంతాల్లోని పలువురు మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు అడ్డంకులు కల్పించారు. తనిఖీలు చేస్తున్న క్వారీలకు సంబంధించిన ఫైళ్లు, అనుమతులు, ఇతర వివరాలు ఇవ్వకుండా అక్కడి అధికారులు రోజుల తరబడి తప్పుకుని తిరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు విజిలెన్స్ అధికారుల తనిఖీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మైనింగ్ మాఫియాకు చేరవేస్తూ అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్రెడ్డి ఇటీవల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయానికి వెళ్లి ఫైళ్లు ఇవ్వాలని కోరారు. విజిలెన్స్ బృందం మూడు గంటలకు పైగా ఆ కార్యాలయంలో వేచి ఉన్నప్పటికీ.. ఫైళ్లు ఇవ్వకుండా తనిఖీలను తప్పుపట్టేలా మాట్లాడుతూ అక్కడి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు విజిలెన్స్ ఏడీ ప్రతాప్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఏడీ మొహంపై తాను తాగుతున్న టీని విసిరారు. ఆ తర్వాత దాడికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ప్రతాప్రెడ్డి విజయవాడలోని మైనింగ్ శాఖ సంచాలకులు వెంకటరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు. అనకాపల్లి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడుదే తప్పని నిర్థారించి వెంటనే ఆయనను సస్పెండ్ చేసి పని చేస్తున్న ప్రాంతం నుంచి అనుమతి లేకుండా వెళ్లకూడదని ఆదేశించారు. విజిలెన్స్ ఏడీ లక్ష్యంగా మాఫియా స్కెచ్ ఉత్తరాంధ్ర మైనింగ్ మాఫియాకు చెందిన శ్రీనివాస చౌదరి, ఎంఎస్ రెడ్డి, వాణీ చౌదరికి చెందిన కంపెనీలతోపాటు ఇతర కంపెనీలతోనూ అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు లాలూచీపడినట్టు స్పష్టమైంది. వారి మద్దతుతోనే విజిలెన్స్ ఏడీపై జియాలజిస్ట్ దాడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బహిర్గతమవడంతో ఇప్పుడు నేరుగా మాఫియాలోని వ్యక్తులే విజిలెన్స్ ఏడీ ప్రతాప్రెడ్డిని అడ్డుకునేందుకు స్కెచ్ వేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆయన్ను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తనిఖీలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రతాప్రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. విజిలెన్స్ బృందాలకు సైతం భద్రత పెంచి తనిఖీల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అనకాపల్లి మైనింగ్ వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్టు సమాచారం. -
విశాఖలో మైనింగ్ మాఫియా అక్రమాలు..
సాక్షి, విశాఖపట్నం: మైనింగ్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్ వేశారు. మొత్తం 9 క్వారీ లీజుల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వీవీఆర్ గ్రూప్లో దాడులు చేశారు. ఈ దాడులలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు 8 క్వారీలకు రూ.114 కోట్లు ఫైన్తో పాటు నాలుగు క్వారీలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే వీవీఆర్ గ్రూప్కు నోటీసులు జారీ చేశారు. కాగా 5 క్వారీల్లో తవ్వని వాటికి కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు నిర్ధారణయింది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. -
2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు!
సాక్షి, ఒంగోలు: గ్రానైట్ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్ సీఎం కూడా ఉన్నాడు. కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్లైన్ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి.పి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్ మాఫియా డొంకను కదిలించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. -
'ఏ ఒక్కరినీ వదలకండని సీఎం జగన్ ఆదేశించారు'
సాక్షి, ఒంగోలు: గుట్టుచప్పుడు కాకుండా అధికారులను మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలు గడించిన మైనింగ్ మాఫియాకు సంబంధించి కీలకంగా వ్యవహంచిన 16 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 16 మంది నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశారో వివరించారు. ముంబై మాఫియాను తలపించే రీతిలో చేసిన వీరి మోసంపై సీబీఐ విచారణ అక్కర్లేదని, తామే మొత్తం నిందితులు గుట్టు రట్టు చేస్తామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ధీమా వ్యక్తం చేశారు. నేరం వెలుగు చూసింది ఇలా.. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృత నేరంగా మారిన కేసు.. అద్దంకి స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వీపీ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టకుండా నకిలీ ఫరంలతో 290 కోట్ల 49 లక్షల 75 వేల 81 రూపాయల వ్యాపారం చేసి 52 కోట్ల 20 లక్షల 19 వేల 33 రూపాయల పన్ను ఎగ్గొట్టారని, తాము విచారించగా ఫరంలన్నీ తప్పుడు చిరునామాలతో ఆన్లైన్లో సృష్టించినట్లుగా శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్టూరు పరిసర ప్రాంతాల్లో ఒన్మ్యాన్ ఫ్రీ బిజినెస్ పాలసీ కింద 2018 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 2919 సెపె్టంబర్ 28వ తేదీ వరకు ఒన్మ్యాన్ ఫ్రీ బిజినెస్ పాలసీ కింద ప్రభుత్వం కలి్పంచిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడినట్లు శ్రీనివాస్ తేల్చడంతో నిందితుల నేరం వెలుగులోకి వచ్చింది. దీనిపై మార్టూరు ఎస్ఐ మల్లికార్జున్ తొలుత సాంకేతిక పరిజ్ఞానం, స్థానికుల ద్వారా సమాచారం సేకరించి నిందితులు గుట్టు వెలికితీయడంతో ఇదో పెద్ద మాఫియా అన్న వ్యవహారం స్పష్టమైంది. ఈ కేసును చేధించడం ఒక్క ఎస్ఐతో సాధ్యం కాదని భావించిన ఎస్పీ..ఏకంగా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, అద్దంకి సీఐ టి.అశోక్వర్థన్, ఇంకొల్లు సీఐ రాంబాబు, మార్టూరు ఎస్ఐ మల్లికార్జున, మేదరమెట్ల ఎస్ఐ బాలకృష్ణతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేశారు. చిన కోటయ్యకు లోడుకు రూ.6 వేలు ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దులు దాటించగలిగారు కానీ దాచేపల్లి వద్ద వీరి వ్యవహారానికి గండిపడింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో యరపతినేని అనుచరునిగా పేరుండి సీబీఐ కేసులో నిందితుడైన చినకోటయ్య రాజకీయ నాయకులు, అధికారులను మేనేజ్ చేసేందుకు లోడుకు రూ.6 వేలు చొప్పున అందించేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన్నూ విచారించేందుకు పోలీసులు దృష్టి సారించారు. తొలుత నలుగురు.. నేడు 16 మంది ఈ కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం తాము నలుగురిని అరెస్టు చేశామని, ప్రస్తుతం 16 మందిని అరెస్టు చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టకుండా జీఎస్టీ, మైనింగ్ బిల్లులకు సంబంధించి రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని, బిల్లులు లేకుండా తరలి వెళ్లిన సరుకు విలువ రూ.900 కోట్లకుపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా 123 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అంతే కాకుండా అక్రమ వ్యాపార లావాదేవీలు నిర్వహించిన మార్కర్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. నేరంలో పాత్ర ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సార్లు తమను ఆదేశించారని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో విశేషంగా కృషి చేస్తున్నారంటూ సిట్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అరెస్టయిన నిందితులు వీరే.. పఠాన్ అరీఫుల్లా, షేక్ షబ్బీర్, షీక్ రహీం (మార్టూరు గొట్టిపాటి హనుమంతురావు కాలనీ), కోనేరు సతీష్ (మార్టూరు మద్ది సత్యనారాయణ కాలనీ), గడ్డం హేమంత్ (మార్టూరు ఎంఎల్ఏ క్వార్టర్స్), ఆలకుంట రవికుమార్ (బల్లికురవ మండలం వైదన), వేముల జెల్లయ్య (బళ్లారి సమీపంలోని టోర్నగల్ గ్రామం), పఠాన్ జానీబాషా (మార్టూరులోని గన్నవరం రోడ్డు), కల్లేపల్లి శివప్రసాద్ వర్మ (మార్టూరు మండలం రాజుగారిపాలెం), గుర్రంకొండ భార్గవ్ (మార్టూరు విద్యానగర్), చల్లగొండ కార్తీక్ చౌదరి (మార్టూరు తూర్పు బజారు), ఏలికా రవి (గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నవరం), పెద్దిశెట్టి రవికుమార్ (మార్టూరు విద్యానగర్ మొదటి లైను), బిళ్లా చినబాబు (మార్టూరు మండలం నాగరాజుపల్లి), కోటగిరి శ్రీనివాసరావు (మార్టూరు), కాకుమాను చంద్రమోహన్ అలియాస్ చంద్రమౌళి (గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం చించాలిడొంక). దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అక్రమాలు సిట్ దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత యర్రపోగు మహేంద్ర, అమర్నేని వెంకటేశ్వర్లు మార్టూరు పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి అవసరమైన రుణాలు ఇప్పిస్తామంటూ వారికి సంబంధించిన ధ్రువపత్రాలు సేకరించారు. వాటిని వారు జంపని వెంకట సుబ్బారావు, చేబ్రోలు రమే‹Ù, ఆడిటర్ చేబ్రోలు రమేష్నాయుడులకు ఇచ్చారు. వారు వాటి సాయంతో 26 ఫోన్ నంబర్లు, 17 ఈ మెయిల్స్ సాయంతో 278 నకిలీ ఫరంలు సృష్టించారు. ఒక్కో ఫరాన్ని వారు రూ.35 వేలు చొప్పున విక్రయించేవారు. ఇలా మొత్తం 19 గ్రూపులకు విక్రయించారు. ఒక్కో గ్రూపులో 6 నుంచి 10 మంది ఉంటారు.ఈ మొత్తం గ్రూపుల్లో మార్టూరు పరిసర ప్రాంతాల్లోని వారు 70 మంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ 19 గ్రూపుల్లోని వారు తాము కొనుగోలు చేసిన ఫరంల ద్వారా నకిలీ వేబిల్లులు సృష్టించేవారు. ఇలా నకిలీ ఫరంలను పఠాన్ ఆరీఫుల్లా, దరియావలి, షబ్బీర్, జాని, కాలేషా, శివవర్మ, కార్తీక్, షరీఫ్, భార్గవ్, శివ, జైపాల్రెడ్డి, కాళి, రహీం, ఎల్లయ్య, హేమంత్, ఖలీల్, రవి, సందీప్, నాగరాజు అనే వారు కొనుగోలు చేశారు. వీరంతా సంబంధిత గ్రూపుల లీడర్లు. ఇలా తాము కొన్న నకిలీ ఫరం ద్వారా 33 మంది మార్కర్లతో వీరు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్కో లారీ గ్రానైట్ లోడుకు ప్రభుత్వానికి రూ.75 వేలు నుంచి లక్ష రూపాయల వరకు మార్కర్ చెల్లించాల్సి ఉంటుంది. నకిలీ ఫరాలు కొనుగోలు చేసిన వారు అందుకు భిన్నంగా మార్కర్ల వద్ద రూ.30 వేలు తీసుకునేవారు. అందులో తాము రూ.20 వేలు ఉంచుకుని మిగిలిన రూ.10 వేలు చంద్రమౌళి, కామేశ్వరరావు అలియాస్ కాముడు, సుదీర్, నన్నేషు, జానీ, కరీం, చినబాబు, సుదర్శన్, మల్లికార్జున, అంజయ్య, నాగయ్య, శేషు అనే వారికి ఇచ్చి లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యతను అప్పగించేవారు. ఇందుకుగాను ప్రతి గ్రూపులో ఉన్న సభ్యుల్లో ఏడుగురు అక్రమ గ్రానైట్ తరలుతున్న లారీలకు ముందు పైలెట్లుగా వ్యవహరించేవారు. ఎక్కడైనా అధికారులు ఉన్నా సమాచారం అందిస్తూ వాహనాలను దారి మళ్లించడం వీరి పని. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్లే లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యత శేషు అనే వ్యక్తి తీసుకునేవాడు. మిగిలిన వారు మాచర్ల, దాచేపల్లి, చెన్నై, బెంగళూరు వైపు ఎటువంటి తనిఖీలు జరగకుండా, వాహనాలు సీజ్ కాకుండా జాగ్రత్త పడేవారు. -
రూ.8 కోట్ల విలువైన ఖనిజం అక్రమరవాణా
పచ్చని చెట్లపై పక్షుల కిలకిల రావాలు.. పొదల మాటున జీవనం సాగించే వన్యప్రాణులు. విలువైన వృక్ష సంపద. అద్భుతమైన జీవ వైవిధ్యం.. అటవీ ప్రాంతం సొంతం. గత టీడీపీ హయాంలో నేతలు అడవినీ వదిలి పెట్టలేదు. అడవిలో విధ్వంసం సృష్టించి సహజ వనరులను కొల్లగొట్టారు. కొందరు అక్రమార్కులు తమ స్వార్థం కోసం అటవీ ప్రాంతంలో జెలిటిన్స్టిక్స్తో పేల్చుతూ వృక్ష, పక్షి జాతులతో పాటు వన్యప్రాణులను విలవిలల్లాడేలా చేశారు. ఇదంతా రిజర్వు ఫారెస్ట్లోనే విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టడానికే అని విజిలెన్స్ విచారణలో నిగ్గు తేలింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అక్రమార్కులు రూ.8 కోట్ల విలువైన సంపదను యథేచ్ఛగా అక్రమ రవాణా సాగించినా, అధికారులు నిలువరించలేకపోయారు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అధికారులు అండగా నిలిచారని సమాచారం సాక్షి, నెల్లూరు: అధికారం మాటున అప్పటి మంత్రి అండదండలతో అక్రమార్కులు అడవిని ధ్వంసం చేశారు. రక్షకులమంటూ.. అడవిని భక్షించారు. నీతికి, నిజాయతీకి తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ నిత్యం నీతులు వల్లించే ఆ పార్టీ నేతలు మైనింగ్ నిర్వాహకులతో కలిసి అటవీ సహజ వనరులను దోచేశారు. పొదలకూరు మండలం నందివాయ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28లో 36.58 ఎకరాల భూమిని 1990లో ఉమామహేశ్వరీ మైన్ నిర్వాహకులకు మైనింగ్ అనుమతి ఇచ్చారు. ఆ సర్వే నంబరులో దాదాపు 214 ఎకరాల భూమి ఉంది. అందులో 70 ఎకరాల భూమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ భూములను మైనింగ్కు అనుమతులు తీసుకున్న నిర్వాహకులు మాత్రం రెవెన్యూ భూముల పరిధి దాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి చొరబడ్డారు. కొండలు, గుంటల భూములను ఇష్టానుసారంగా తవ్వేసి తెల్లరాయి, గ్రావెల్, మెటల్ను అక్రమంగా రవాణా చేశారు. 19 ఏళ్ల పాటు మైనింగ్ అనుమతులు పొందిన లీజుదారులు ఆయా భూములను పీల్చి పిప్పి చేసి కోట్లాది రూపాయల విలువైన సంపదను దోచేశారు. 2009 నాటికి మైనింగ్ అనుమతులు ముగిసినా కూడా నిర్వాహకులు రెన్యువల్ చేయించుకోలేదు. అయినా యథేచ్ఛగా మైనింగ్ను కొనసాగించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి అధికార పార్టీ నేత, మాజీమంత్రి అండతో దోపిడీని కొనసాగించారు. టీడీపీ హయాంలో.. టీడీపీ హయాంలో మైనింగ్ నిర్వాహకుడు జిల్లా మంత్రితో లోపాయి కారి ఒప్పందం చేసుకుని అనుమతులు లేకుండానే రెవెన్యూ భూములే కాకుండా నందివాయ రిజర్వ్ ఫారెస్ట్ను ఆక్రమించారు. ఫారెస్ట్ పరిధిలో ఉండే కొండలను జిలెటిన్స్టిక్ వంటి పేలుడు పదార్థాలతో పేల్చి తెల్లరాయి నుంచి గ్రావెల్, మెటల్ను అక్రమ రవాణా సాగించారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఫారెస్ట్ పరిధిలో సుమారు 20 ఎకరాల్లోకి చొచ్చుకుపోయి సహజ వనరులను కొల్లగొట్టుతున్నా అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో చర్యలు తీసుకొనేందుకు వెనకాడిన అధికారులు మైనింగ్ నిర్వాహకుడితో లాలూచీ పడి అక్రమ రవాణాకు సహకరించారు. అప్పట్లో అక్రమ మైనింగ్పై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2017లో అటవీశాఖ, రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించి ఫారెస్ట్ భూముల్లో మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో మైనింగ్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కానీ అప్పటి అధికార పార్టీ మంత్రి అండదండలు ఉండడంతో సర్వే నివేదికను తొక్కి పెట్టారు. దీంతో మైనింగ్ నిర్వాహకుడు మాత్రం అక్రమ రవాణా దందా కొనసాగించాడు. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లినా.. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ వ్యవహారం విషయం జిల్లా స్థాయిలో అధికారులందరికీ తెలిందే. ఈ వ్యవహారంపై గత జిల్లా ఉన్నతాధికారి దృష్టికి అటవీశాఖ అధికారులు తీసుకెళ్లినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కనీసం స్పందించలేదని తెలిసింది. జిల్లా అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి ఈ అక్రమ మైనింగ్కు అండగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు కూడా వారికి సహకరించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇటు రెవెన్యూ, అటు మైనింగ్ అధికారులు కూడా అక్రమ మైనింగ్కు పూర్తి స్థాయిలో అండదండలు అందించారు. వన్యప్రాణులు విలవిల మైనింగ్ నిర్వాహకులు తమ స్వార్థం కోసం అడవినే ఆక్రమించి సంపదను కొల్లగొట్టే క్రమంలో విధ్వంసం సృష్టించి వన్యప్రాణులను, పక్షి జాతులను విలవిలాలాడేలా చేశారు. నందివాయ రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపు 40 రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు ఉన్నాయి. పచ్చని అడవిలో ప్రశాంతంగా ఉండే పక్షులు, వన్యప్రాణులకు పేలుళ్లతో నిద్ర లేకుండా చేశారు. కొండను తొలిచేందుకు నేపథ్యంలో జెలిటిన్స్టిక్, అమ్మెనియా వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించి రాత్రి వేళల్లో పేల్చేవారు. ఆ ప్రభావంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలలాడాయి. ఆ పేలుళ్ల ప్రభావం వల్ల నందివాయ గ్రామ పరిధిలో పంటలపై పడేది. పచ్చని పంటలపై దుమ్ము, ధూళి కణాలు పడి ఎదుగుదల లోపించేదని స్థానికులు ఆరోపించారు. విచారణలో నిగ్గుతేలిన వాస్తవాలు నందివాయ రిజర్వు ఫారెస్ట్లో కొండలను తొలిచి ఏళ్ల కాలంగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వైనంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమ మైనింగ్ వ్యవహారంపై కదలిక వచ్చింది. అధికారులు విచారణలో దాదాపు అడవిని కొల్లగొట్టి రూ.8 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా రవాణా సాగించినట్లు నిగ్గు తేలింది. 2010 నుంచి మైనింగ్కు అనుమతి లేకుండా నిర్వాహకులు మాత్రం మైకా, తెల్ల రాయిలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించి అటవీశాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఇంత భారీగా అక్రమ మైనింగ్ జరిగినా అధికారులు స్పందించలేదని తేలడంతో అందుకు బాధ్యులైన ఇద్దరు బీట్ అధికారులపై వేటు వేశారు. ఇంకా ఈ అక్రమ మైనింగ్కు సహకరించిన అధికారులపై కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఒక్కరూ సహకరించలేదు నేను రాపూరు రేంజర్గా జాయిన్ అయినప్పటి నుంచి అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు పోరాటం చేస్తున్నా. ఏ ఒక్క అధికారి కూడా నాకు సపోర్ట్ చేయలేదు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు అయితే అసలు చెవికెక్కించుకోలేదు. గతంలో అక్రమ మైనింగ్పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మైనింగ్ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశాను. కానీ ఎవరూ సహకరించకపోవడంతో ఏమి చేయలేకపోయాం. నిర్వాహకుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. జాయింట్ సర్వే చేయమని కోర్టు ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోలేదు. – శ్రీదేవి, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి జాయింట్ సర్వే నిర్వహిస్తాం రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులందరిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయి. త్వరలోనే మైనింగ్పై జాయింట్ సర్వే నిర్వహిస్తాం. పూర్తి స్థాయి విచారణ కూడా జరుపుతాం. అక్రమ మైనింగ్కు సహకరించిన ఎవరిని వదలం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులపై తాత్కాలిక చర్యలు చేపట్టాం. పూర్తిస్థాయి విచారణలో తప్పు చేశారని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. – శ్రీనివాసులు రెడ్డి, డీఎఫ్ఓ , నెల్లూరు -
గుండుమల దందా!
మడకశిర నియోజకవర్గం జిల్లా సరిహద్దులో కర్ణాటకకు సమీపంలో ఉంది. అక్షరాస్యత శాతం చాలా తక్కువ. ప్రశ్నించే తత్వం కూడా లేని ప్రాంతం. దీన్ని ఆసరా చేసుకున్న ఎమ్మెల్సీ గుండుమల కుటుంబం టీడీపీ హయాంలో క్వారీల బిజినెస్ ప్రారంభించింది. కొండ కనబడితే పిండేస్తూ రూ.కోట్లు సంపాదించింది. తమ్ముళ్లందరినీ క్వారీ బిజినెస్లో దింపిన గుండుమల నిబంధనలకు విరుద్ధంగా సహజవనరులన్నీ దోచేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలిస్తూ విలువైన గ్రానైట్ను అడ్డగోలుగా సరిహద్దు దాటించేస్తున్నారు. తమ పరిధిలో ఎవరైనా పొరపాటున క్వారీ బిజినెస్ చేయాలన్నా కప్పం కట్టాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ భారీగా వసూళ్లు చేస్తున్నారు. సాక్షి, మడకశిర: టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హవా నడిపించారు. పచ్చ చొక్కా మాటున ఫ్యామిలీ బిజినెస్ చేశారు. సొంత తమ్ముళ్లందరినీ క్వారీల బిజినెస్లోకి దింపి నిబంధనలకు విరుద్ధంగా సహజవనరులన్నీ సరిహద్దు దాటించేశారు. ఎమ్మెల్సీ కుటుంబమంతా క్వారీలపైనే ఆధారపడి బతుకుతుండగా.. అధికారులు ఆ క్వారీలవైపు కన్నెత్తి చూసేందుకు జంకుతున్నారు. అడపాదడపా దాడులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మడకశిర మండలంలోని జాడ్రహళ్లి కలర్ గ్రానైట్ క్వారీ చాలా విలువైనది. ఈ క్వారీలో ఎమ్మెల్సీ సోదరులు రాధాకృష్ణ, శివానందప్ప, చంద్రప్పలు పాగా వేశారు. మూడు హెక్టార్ల విస్తీర్ణంలోని ఈ క్వారీ నుంచి విలువైన గ్రానైట్ను తవ్వుకుని కర్ణాటకకు తరలిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడంతో పాటు రాయల్టీ కూడా చెల్లించకుండానే గ్రానైట్ తరలిస్తున్నారు. పలుసార్లు గనులశాఖ అధికారులు గ్రానైట్ లారీలను సీజ్ చేసినా ఎమ్మెల్సీ అండతో మళ్లీ అదే దందా నడిపిస్తున్నారు. రాత్రివేళల్లో గ్రానైట్ను సరిహద్దు దాటించేస్తున్నారు. ఇక అగళి మండలంలోని హెచ్డీ హళ్లి క్వారీలో విలువైన గ్రానైట్ లభ్యమవుతుండగా.. ఈ క్వారీపై కూడా ఎమ్మెల్సీ కుటుంబ సభ్యుల కన్నుపడింది. ఎమ్మెల్సీ సోదరుడు చంద్రప్ప రెండు హెక్టార్లలో గ్రానైట్ క్వారీని లీజుకు తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉండగా..రాత్రికి రాత్రి గ్రానైట్ను సరిహద్దు దాటించేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొండ కనబడితే చాలు ఎన్ఓసీ గుండుమల కుటుంబీకులు రూ.కోట్లు కుమ్మరించే గ్రానైట్, మెటల్ క్వారీ బిజినెస్పైనే దృష్టి సారించారు. టీడీపీ హయాంలో అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగించారు. కొండలు కనబడితే చాలు వెంటనే క్వారీల నిర్వహణకు అనుమతి తీసుకుంటారు. వీరికి మైనింగ్, గనులు, రెవెన్యూ శాఖాధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఇతరులెవరైనా ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకుంటే గుండుమలకు ముందుగానే సమాచారం ఇచ్చి స్వామిభక్తి చాటుకుంటున్నారు. అందువల్లే నియోజకవర్గంలో క్వారీల నిర్వహణకు పలువురు టీడీపీ నాయకులు దరఖాస్తు చేసుకున్నా వారికి దక్కని పరిస్థితి. పొరపాటున ఎవరైనా క్వారీలకు అనుమతులు తెచ్చుకున్నా గుండుమల కుటుంబీకులు వారిని భయాందోళనకు గురిచేస్తున్నారనే చర్చ ఉంది. తమదారికి వచ్చాక మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు గుండుమల అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది మడకశిర మండలం మెళవాయి సమీపంలోని రోడ్డు మెటల్ క్వారీ. దీన్ని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్లు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారన్న ఫిర్యాదుల మేరకు ఇటీవల కర్నూలు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. హద్దులు దాటి తవ్వకాలు చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. అయినా ఎమ్మెల్సీ కుటుంబీకులు క్వారీల్లో పనులు కొనసాగిస్తున్నారు. -
పరిటాల మైనింగ్ మాఫియాపై సీఎంకు ఫిర్యాదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ నిర్వాహకులు ‘వడ్డెర్ల బండ’ ద్వారా రూ.250 కోట్లు దోపిడీ చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి, అక్రమంగా కంకర తరలించి సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు. ఆత్మకూరు మండలం కుర్లపల్లి సమీపంలోని కంకర క్రషర్ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ బండపై ఆధారపడి 200 వడ్డెర కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అయితే పరిటాల సునీత బంధువులు, ఎస్ఆర్సీ సంస్థ వారు క్రషర్ పేరిట లీజుకు తీసుకుని, అక్రమంగా మరికొంత బండను ఆక్రమించుకున్నారని విమర్శించారు. మూడో ప్యాకేజీ కింద హంద్రీ–నీవా కాలువ నిర్మాణం కోసం 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయికి బిల్లు తీసుకున్నారన్నారు. వాస్తవానికి కాలువపై ఆ మేరకు రాయి కనిపించడం లేదన్నారు. మరో 30 లక్షల టన్నుల రాయిని కంకరగా మార్చి అక్రమ మార్గంలో అమ్మేసుకున్నారన్నారు. వడ్డెర్ల బండకు సంబంధించి 24 ఎకరాలకు గాను 18 ఎకరాల్లో 35 లక్షల టన్నుల బండను క్రషింగ్ చేశారన్నారు. అంతేకాకుండా బండపైన, కాలువకు పైన ఉన్న రాయిలో దాదాపు 50 లక్షల టన్నుల రాయిని అమ్ముకున్నారన్నారు. మూడు ఎకరాలు బండ లీజు తీసుకుని, అంతకు మించి ఆక్రమించి బండ కొడుతున్నారని తెలిపారు. యరపతినేని మైనింగ్ మాఫియా తరహాలోనే ఇక్కడ కూడా మాఫియా చెలరేగిపోయిందన్నారు. క్రషర్ నిర్వాహకులు ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొమ్ము చేసుకుంటున్నా మైనింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆత్మకూరు పంచాయతీ రూ.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు కంకర మిషన్ ద్వారా వెలువడే దుమ్ము సమీప పొలాలను కప్పేస్తుండటంతో పంటలు పండటం లేదని, స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్టు వ్యవహరించారని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఫిర్యాదు చేసిన రైతులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని హితవు పలికారు. ఇదివరకే మైనింగ్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే ఈ మైనింగ్ మాఫియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆత్మకూరు, కృష్ణమరెడ్డిపల్లి, నసనకోట, సుబ్బరాయునిపల్లి వద్ద మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అవినీతి అక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆత్మకూరు వడ్డెర్లకు జీవనోపాధిగా ఉన్న బండను తిరిగి అప్పగించాలని ఆయన సూచించారు. -
టీడీపీ నేతల గ్రానైట్ దందా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. మైనింగ్ మాఫియాకు సహకరించి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.వందల కోట్ల రాయల్టీని ఎగ్గొట్టి, జేబులు నింపుకున్నారు. డొల్ల కంపెనీలు, దొంగ వే బిల్లులు సృష్టించి ప్రకాశం జిల్లా నుంచి విలువైన గ్రానైట్ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. గ్రానైట్ దోపిడీ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం బయటపడింది. రవాణా శాఖ, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఒక్కో లారీకి రూ.17 వేలు వసూలు ప్రకాశం జిల్లాలో దాదాపు 2,500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క మార్టూరు ప్రాంతంలోనే 700 వరకు పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే మూడు సర్టిఫికెట్లు అవసరం. గ్రానైట్ కంపెనీకి చెందిన ఇన్వాయిస్, మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లు ఉండాలి. చెక్పోస్టుల్లో గానీ, తనిఖీ అధికారులు ఆపినప్పుడు గానీ ఇవి చూపించాల్సి ఉంటుంది. గ్రానైట్ను క్యూబిక్ మీటర్లలో సైజుల వారీగా తరలిస్తారు. సైజులను బట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రతి రూ.లక్ష లావాదేవీకి 18 శాతం జీఎస్టీ (రూ.18,000) చెల్లించాలి. రిజిస్టర్ అయిన కంపెనీ పేరిట ఉన్న మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లుల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మైనింగ్ మాఫియా సభ్యులు డొల్ల కంపెనీల పేరిట సృష్టించిన దొంగ ఈ–వే బిల్లులతో గ్రానైట్ లారీలను తరలించారు. దొంగ ఈ–వే బిల్లుల ముద్రణ, నకిలీ మైనింగ్ పర్మిట్ల వ్యవహారం మొత్తం బల్లికురవ కేంద్రంగా సాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అద్దంకి, మార్టూరు నుంచి గ్రానైట్ను సరిహద్దులు దాటించేందుకు ఒక్కో లారీ నుంచి రూ.17 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రభుత్వ అధికారులకు, మిగిలిన రూ.12 వేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చేవారు. అద్దంకి, మార్టూరు నుంచి వినుకొండ, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా పిడుగురాళ్ల, దాచేపల్లి, అక్కడినుంచి తెలంగాణకు గ్రానైట్ను అక్రమంగా తరలించేవారు. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు ఆపితే వినుకొండకు చెందిన మైనింగ్ మాఫియా రంగప్రవేశం చేసి, వ్యవహారాన్ని చక్కబెట్టేది. ఈ అక్రమ రవాణాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. గ్రానైట్ దోపిడీ వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. 270 డొల్ల కంపెనీలు, 16వేల దొంగ వే బిల్లులు ప్రకాశం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను ఇటీవల పోలీసులు, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైనింగ్ మాఫియాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో అక్రమాల గుట్టు బయటపడింది. 270 డొల్ల కంపెనీలను సృష్టించి, 16,000 దొంగ వే బిల్లులతో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే మొత్తం రూ.300 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. -
టీడీపీ మహిళా నేత దందా
సాక్షి, పెనుకొండ: టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్ఆర్ఆర్ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. క్వారీలోని కంకరను బయటకు తరలించకుండా ఆదేశాలు జారీ చేశారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి క్వారీ నిర్వాహకులు గత రెండు రోజులుగా 6 ఎంఎం కంకరను టిప్పర్లో బయటకు తరలిస్తున్నారు. నిఘా ఉంచిన కియా పోలీసులు టిప్పర్లో అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టిప్పర్ సహా డ్రైవర్ను స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ తెలిపారు. ఇదిలా ఉంటే టిప్పర్పై దేవా వెంకటకొండయ్య పేరు ఉంది. ఇతను సవితమ్మ భర్త వెంకటేశ్వరరావుకు స్వయానా తమ్ముడు. ఇతను చనిపోయాడు. కంకరను సవితమ్మే అక్రమంగా తరలిస్తుందనేందుకు ఇదే నిదర్శనంగా పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
యరపతినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
మైనింగ్ మాఫియా ఒంట్లో వణుకు మొదలైంది. అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరులను కొల్లగొట్టిన ఘనుల బండారం బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకపర్వానికి తెర తీసిన అక్రమార్కులకు కళ్లెం పడబోతోంది. చట్టాలను తుంగలో తొక్కి పచ్చ చొక్కాలకు సలాం కొడుతూ గులాంగిరి చేసిన అధికారులను నడిరోడ్డుపై నిలబెట్టనుంది. పల్నాడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన మైనింగ్ దందా గుట్టురట్టవుతోంది. యరపతినేనితో సహా ఆయనకు సహకరించిన పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికార యంత్రాంగానికి ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు పిడుగురాళ్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, గుంటూరు: మైనింగ్ మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. అక్రమ మైనింగ్కు పాల్పడి ప్రకృతి సంపదను దోచుకున్న వాళ్లపై కేసుల రూపంలో ఉచ్చు బిగుస్తోంది. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, మైనింగ్ ఏడీలు తనను వేధింపులకు గురిచేసి, చంపాలని చూశారని వైఎస్సార్ సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు యరపతినేని సహా 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో సంచలనంగా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగింది. రూ.వేల కోట్ల విలువ చేసే లైమ్ స్టోన్ (సున్నం రాయి) నిక్షేపాలు అప్పటి ఎమ్మెల్యే యరపతినేని అండదండలతో మైనింగ్ మాఫియా కొల్లగొట్టిందన్న ఆరోపణలున్నాయి. దర్యాప్తు ప్రారంభం.. యరపతినేని, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు వ్యతిరేకంగా అక్రమ మైనింగ్పై హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం) వేసిన కోపంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, రౌడీలు, సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లతో మానసికంగా, శారీరకంగా వేధించి చంపేందుకు యత్నించారని గురువాచారి ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో యరపతినేని సహా 12మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. 2016లో గురువాచారిని వేధింపులకు గురిచేసిన ఘటనపై ఇటీవల కేసు నమోదు కావడంతో మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరెస్టుల భయం.. పల్నాడు ప్రాంతంలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ మైనింగ్కు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి అరెస్ట్ భయం పట్టుకుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీసీఐడీ అధికారులు తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే యరపతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై మరో కేసు నమోదవడంపై యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన చెందుతున్నారని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. -
టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: టీడీపీ నేతల మైనిగ్ మాఫియా అక్రమాలు బయటపడుతున్నాయి. కోర్టు ఆదేశాలతో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా యరపతినేనితో పాటు,ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు మైనింగ్ ఏడీ జగన్నాధరావు, ఆర్డీవో మురళీ, సీఐ హనుమంతావులపై కూడా కేసు నమోదు చేశారు. గతంలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై గురవాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో తనపై వ్యతిరేకంగా కేసు పెట్టాడనే కోపంతో యరపతినేని.. గురవాచారిని కాళ్లు, చేతులు విరిగేలా కొట్టించాడు. తనపై జరిగిన దాడి గురించి గురవాచారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టినా వారు పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమీ లేక గురవాచారి హైకోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో యరపతినేనితో సహా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులపై కేసుల నమోదయ్యాయి. -
హద్దులు దాటి.. అక్రమ తవ్వకాలు!
సాక్షి, అమరావతి : ఇన్నాళ్లూ అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలు సాగించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దందా కొనసాగిస్తున్నారు. అనుమతి లేని చోట కొండలను అక్రమంగా తవ్వేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నంబర్ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్లలోపు మాత్రమే క్వారీయింగ్కు అనుమతులు లభించాయి. క్వారీయింగ్కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల కిందటే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత టీడీపీ నేతల కన్ను అక్కడికి సమీపంలోనే ఉన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్పై పడింది. క్వారీయింగ్ పూర్తి చేసిన ప్రాంతానికి చెందిన అనుమతులనే చూపిస్తూ రిజర్వ్ ఫారెస్ట్లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం బ్లాస్టింగ్లతో పిండి చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమీప బంధువులే ఇక్కడ అక్రమ క్వారీలు నిర్వహిస్తుండడం గమనార్హం. అక్రమ మైనింగ్కు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి కొందరు వ్యక్తులు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. అంతరించిపోతున్న వన్యప్రాణులు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు జీవిస్తున్నాయి. 32 రకాల జంతువులున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్ మాఫియా తవ్వేసింది. ఈ క్రమంలో అరుదైన వృక్ష జాతులు నాశనమయ్యాయి. జిలెటిన్ స్టిక్స్తో బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వన్యప్రాణులు కన్ను మూస్తున్నాయి. హద్దులను చెరిపి క్వారీయింగ్కు మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలి. అయితే, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో ఎవరికి తెలియవు. హద్దులు చెరిపేసి... సరిహద్దులు దాటి రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోకి మైనింగ్ మాఫియా చొచ్చుకుపోయింది. నెల రోజులపాటు విరామం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో తమ అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడకుండా నిర్వాహకులు నెల రోజుల పాటు తవ్వకాలు నిలిపేశారు. అయితే, తాజాగా మళ్లీ బ్లాస్టింగ్లు ప్రారంభించారు. ఇక్కడి నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల తమ పంటలకు నష్టం వాటిల్లుతోందని సమీప ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నా మైనింగ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హద్దులు నిర్ధారించి, అక్రమ మైనింగ్ను అరికట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం రిగ్ బ్లాస్టింగ్ల వల్ల వచ్చే భారీ శబ్దాలను భరించలేక వణ్యప్రాణులు ఈ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి. పర్యావరణం పరంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అక్రమంగా అటవీ భూముల్లో మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం – బూరుగు లెనిన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కంచికచర్ల -
అడ్డదారుల్లో.. అడ్డగోలుగా
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : డివిజన్ కేంద్రమైన టెక్కలిలో మైన్స్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి అధికారులు సంవత్సరాలు తరబడి సిట్టింగ్ వేయడంతో అటు గ్రానైట్ క్వారీల్లో... ఇటు ఇప్పుడిప్పుడే చాప కింద నీరులా సాగుతున్న క్రషర్ చిప్స్ అనుమతుల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అండతో మైనింగ్ అధికారులు చేసిన అడ్డగోలు వ్యవహారాలు తారాస్థాయిలో ఉన్నప్పటికీ అవేమీ బయట పడకుండా సదరు నేతకు, చోటా నాయకులకు గుట్టు చప్పుడు కాకుండా ముడుపులు చెల్లించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఐదేళ్లలో క్వారీ బ్లాకుల తరలింపు విషయంలో అక్రమాలు ఉన్నప్పటికీ ఎక్కడా బయట పడకుండా అధికారులు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించినట్లు సమాచారం. ఇప్పుడు క్వారీల్లో నిల్వగా ఉన్న మెటిరీయల్తో తయారయ్యే చిప్స్ విషయంలో మళ్లీ అధికారుల చేతివాటం తారాస్థాయికి చేరుకుంది. క్వారీలకు అనుకుని సమీప దూరంలో ఉన్న కొన్ని క్రషర్ యూనిట్లకు అడ్డగోలు ‘టీపీ’ (తాత్కాలిక అనుమతులు) ఇచ్చి, ఇష్టారాజ్యంగా రవాణాకు ప్రోత్సహిస్తున్నారు. వాస్తవానికి ప్రతి డంపర్కు లోడ్ చేసే విషయంలో ఎప్పటికప్పుడు బిల్లులు పక్కాగా ఉండాలి. అయితే ఇక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. నామమాత్రంగా అనుమతులు ఇస్తూ లెక్కలేని విధంగా యూనిట్లను లోడ్ చేసుకుంటున్నారు. టెక్కలి సమీపంలో కొన్ని క్వారీల నుంచి రోజూ టెక్కలి మీదుగా లెక్కకు మించిన చిప్స్ లోడ్లు రవాణా జరుగుతున్నాయి. ఏ రోజూ వాటిపై మైన్స్ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో అడ్డగోలు ‘టీపీ’ల వ్యవహారం బయట పడడం లేదు. వాస్తవానికి టెక్కలి మైన్స్ కార్యాలయంలో కొంతమంది అధికారులు, దిగువ స్థాయి సిబ్బంది సంవత్సరాలు తరబడి ఇక్కడే తిష్ట వేయడం వల్ల కొన్ని రకాల వ్యవహారాలు అలవాటుగా మారిపోయాయి. దీంతో అక్రమాలు చోటు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో చేరాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తే, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దెందులూరులో చింతమనేని అధ్వర్యంలో మైనింగ్ మాఫియా
-
ఏపీలో మరో కుట్ర బట్టబయలు
సాక్షి, గుంటూరు: ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అనుచరుల మధ్య వివాదాన్ని.. వైఎస్సార్సీపీ మెడకు చుట్టాలనుకున్నారు. తన హత్యకు కుట్ర పన్నారంటూ వైఎస్సార్సీపీ మీద బురద జల్లుతూ ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. అయితే జిల్లా రూరల్ ఎస్పీ ఇది యరపతినేని అనుచరుల మధ్య ఆధిపత్య పోరు మాత్రమే అని పక్కాగా తేల్చడంతో.. ఇప్పుడు ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వివరాలు.. పల్నాడు ప్రాంతంలో తుపాకులు పట్టుకుని తిరుగుతున్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులైన నల్లబోతు శ్రీనివాసచౌదరి, వడ్లమూడి శివరామకృష్ణ చౌదరి, పూర్ణచంద్రరావును ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. తమ అనుచరులు తుపాకులతో పట్టుబడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది తనకు మరింత చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని భావించారు. తనకు రాజకీయ సమాధి తప్పదనుకున్న ఆయన వెంటనే.. తన హత్యకు వైఎస్సార్సీపీ కుట్ర పన్నిందంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే యరపతినేని ప్రధాన అనుచరుడు, మైనింగ్ మాఫియాలో కీలక సూత్రధారి అయిన ముప్పన వెంకటేశ్వర్లును మట్టుబెట్టేందుకు.. మిగతా అనుచరులంతా ఏకమై తుపాకులు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. యరపతినేని నామినేషన్ కార్యక్రమంలోనే వెంకటేశ్వర్లును కాల్చి చంపాలనుకున్నట్లు వెల్లడైంది. ఇదంతా యరపతినేని అనుచరుల ఆధిపత్య పోరులో భాగమేనని గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్బాబు స్పష్టం చేశారు. అయినా కూడా ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. ఎల్లో మీడియా ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు యరపతినేని అనుచరులు అనుకున్నది పక్కాగా జరిగితే.. ఆ నేరాన్ని వైఎస్సార్సీపీ నేతలపైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారేమోననే అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, తుపాకులతో పట్టుబడ్డ నలబోతు శ్రీనివాసరావు చౌదరితో పాటు ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచురుడు ముప్పన వెంకటేశ్వర్లు.. గతంలో జరిగిన కాంగ్రెస్ నేత ఉన్నం నరేంద్ర హత్య కేసులో నిందితులు. అయినా కూడా దొంగే దొంగా అని అరిచినట్లుగా ఉంది ఆయన తీరు అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి కుట్రలు పన్నుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పల్నాడులో యథేచ్ఛగా అక్రమ క్వారీయింగ్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు భారీగా మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. పిడుగురాళ్ళ, దాచేపల్లి, కేశానుపల్లి, తంగెడ తదితర ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది. భారీ ఎత్తున బ్లాస్టింగ్లకు పాల్పడుతూ అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుతోంది. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే.. ఘోర సంఘటనలు జరిగే ప్రమాదముంది. పోలీస్స్టేషన్లకు కూతవేటు దూరంలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
మాఫియా గుండెల్లో మందుపాతర ముగ్ధ సిన్హా
‘వెల్డన్.. డన్ ఎ గ్రేడ్ జాబ్’ అనేవారు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసేవారు. ప్రతిసారీ అంతే. ప్రతిచోటా అంతే. ముగ్ధ బెదర్లేదు. బ్యాక్ స్టెప్ వెయ్యలేదు.ఎందుకోసమైతే ఆమె ఐఏఎస్ అయ్యారో అందుకోసమే పనిచేస్తున్నారు.ఆమె సామాన్యుల పక్షం. వాళ్ల కోసం ఎంతటివాళ్లతోనైనా పోరాడేందుకు సిద్ధం అయ్యే.. ఏరోజుకారోజు ఆమె డ్యూటీకి బయల్దేరుతుంటారు. రాజస్థాన్ కేడర్కు చెందిన ముగ్ధ ప్రస్తుతం రాజస్థాన్–ఢిల్లీమధ్య పాలనా వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లా. 2010. ఆ జిల్లాలోని పల్లెల్లో.. చట్టబద్ధమైన ఎలాంటి అనుమతి, అంగీకారం లేకుండా యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది. అగ్రకులాల వాళ్లు ఏది చెబితే అదే చట్టం. ఏం చేస్తే అదే న్యాయం. మైనింగ్ మాఫియా, బోర్వెల్స్, గ్యాస్ సిలెండర్స్, బ్లాక్ మార్కెటింగ్.. ఒకటేమిటి అన్నీ! అలా ఒకసారి.. ఓ గ్రామంలో మైనింగ్ కోసం పేలుడు పదార్థాలు పెట్టారు. ధనార్జనే ధ్యేయం కాబట్టి పనిచేస్తున్న కూలీల, చుట్టుపక్కల ప్రజల భద్రతను గాలికొదిలేశారు. దాంతో ఆ పేలుడికి కొంతమంది ఎగిరిపడ్డారు. ప్రాణాలు గాల్లో కలిశాయి. తర్వాత చూస్తే దగ్గర్లో ఉన్న పొదల్లో తెగిపడ్డ తలలు కనిపించాయి. ఊరంతా వణికిపోయింది. దానికి బాధ్యులమంటూ స్థానిక మైనింగ్ కంపెనీలేవీ ముందుకు రాలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్నిచ్చే బాధ్యతా తీసుకోలేదు. చివరకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. ఆ మైనింగ్ వ్యవస్థా మూతపడింది. ఇదంతా ఇక్కడ రాసినంత తేలిగ్గా, అలవోకగా జరగలేదు. కొన్ని నెలల పోరాటం, బెదిరింపులు, బదిలీలు.. అన్నీ జరిగాకే న్యాయం గెలిచింది. అది ఓ వ్యక్తి సాధించిన విజయం. ఆమె ఆ జిల్లా కలెక్టర్. పేరు ముగ్ధా సిన్హా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ జిల్లాకు కలెక్టర్గిరీ చేయడానికి పురుష ఐఏఎస్ అధికారులే భయపడ్తుంటే మహిళా ఐఏఎస్లు చార్జ్ తీసుకోవడం ఊహించలేని విషయం. కాని ఆ సవాల్ను స్వీకరించారు ముగ్ధా సిన్హా. ఝున్ఝునుకు వచ్చిన మొదటి మహిళా కలెక్టర్గానే కాదు.. ఆ జిల్లాను ఓ దారిలో పెట్టిన ఐఏఎస్గానూ చరిత్రలో నిలిచారు. నిజానికి నలభై లక్షల జనాభా ఉన్న పెద్ద జిల్లాలకు కలెక్టర్గా పనిచేసిన ముగ్ధా.. ఝున్ఝునుకు ట్రాన్స్ఫర్ అవగానే.. చిన్న జిల్లా, హాయిగా పనిచేసుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నారట. తీరా వచ్చాక తెలిసింది.. పరిమాణంలో చిన్నదే అయినా ఎదుర్కోవాల్సిన చాలెంజెస్ పెద్దవని. భయపడలేదు ఆమె. ‘‘బ్యూరోక్రాట్స్లో నాలుగు రకాలుంటారు. ఒకటి.. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసేవారు. రెండు.. నిజాయితీగా ఉన్నా సామర్థ్యంలేని వాళ్లు. మూడు.. సామర్థ్యం ఉన్నా నిజాయితీలేని వాళ్లు. నాలుగు.. అవినీతి, అసమర్థులైన ఆఫీసర్లు. నాకు తెలిసింది.. నేను ప్రయత్నించేది.. ఒక్కటే.. నిజాయితీగా ఉండాలి.. సమర్థవంతంగా పనిచేయాలి. ఆ సూత్రాన్ని నమ్మాను కాబట్టే ఝన్ఝునులో పరిస్థితులకు వెరవలేదు’’ అంటున్నారు ముగ్ధ. మాఫియా నుంచి ఫోన్ కాల్స్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాక ముగ్ధాకు చాలా ఫోన్కాల్స్ వచ్చాయి.. ‘‘మళ్లీ మా మైన్స్ ఎప్పుడు తెరుస్తున్నారు’’ అంటూ! అలా ఫోన్ చేసిన వాళ్లెవరూ నిజమైన యజమానులు కారు. యజమానులు ఫోన్ చేయించిన మధ్యవర్తులు. అలాంటి ఏ ఒత్తిళ్లకూ తలొగ్గలేదు ముగ్ధ. అదొక్కటే కాదు.. ఝున్ఝునులో జరుగుతున్న ఇతర అరాచకాలకూ ఆమె అడ్డుకట్ట వేశారు. మైనింగ్ తర్వాత ఆ రేంజ్లోనే ఉన్న వంట గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెటింగ్నూ బ్లాక్ చేసేశారు. అలాగే పర్మిషన్ లేకుండా వేస్తున్న బోర్వెల్స్నూ పూడ్చేయించారు. హర్యానా నుంచి బోర్వెల్ మెషీన్స్ వచ్చేవి. వాటన్నిటినీ సీజ్ చేయించారు. ఝున్ఝునూను పట్టి పీడిస్తున్న ఇంకో పెద్ద రుగ్మత.. అగ్రకుల అహంకారం. సామాన్యులు తమ గోడు వెళ్లబుచ్చుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు వరుస కడితే.. వాళ్ల ముందు అగ్ర కులస్థుల సమూహం ఉండేది. అగ్రకులస్థులు కలెక్టర్ను కలిసి మాట్లాడాకే నిమ్న కులస్థులు కలవాలి. ఇది అక్కడి ఆనవాయితీ. ఆ ‘సంప్రదాయాన్ని’ తుంగలో తొక్కారు ముగ్ధ. అసలు ఎవరూ తన ఆఫీస్ ముందు క్యూ కట్టకముందే గ్రామాల్లోకి వెళ్లిపోయి ప్రత్యక్షంగా సామాన్య ప్రజలను ఆమె కలిసేవారు. వాళ్ల అర్జీలు, దరఖాస్తులు తీసుకునేవారు. సత్వర పరిష్కారం కోసమూ అంతే శ్రమించేవారు. ఆఫీస్ పనివేళలు అయిపోయి, పని మిగిలిపోతే ఆ ఫైల్స్ పట్టుకుని ఇంటికి వెళ్లేవారు. రాత్రంతా కూర్చొని ఫైల్స్ చెక్ చేసేవారు. ఆమె నిజాయితీ, సామాన్యులకు అండగా ఉన్న తీరు, మైనింగ్ మాఫియా, బ్లాక్ మార్కెటింగ్పై ఆమె ఉక్కుపాదం మోపడం.. ఇవన్నీ గిట్టని పెద్దలు ఆర్నెల్లలో ముగ్ధకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించారు. ఆ ఆర్డర్ తీసుకునే ముందు.. ఆరావళి పర్వత సాణువుల్లోని మైన్స్లో ఇల్లీగల్ మైనింగ్ కోసం పేలుడు పదార్థాల లోడ్తో వెళ్తున్న ట్రక్కులన్నిటినీ ముగ్ధ సీజ్ చేయించారు. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆ మైన్స్ తెరుచుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరూ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్లో ముగ్ధ వేసిన ముద్ర అది! అమ్మ కోరికపై ఐఎఎస్ ముగ్ధా తండ్రి గురు స్వరూప్ సిన్హా. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలట్గా పనిచేసేవారు. చైనాతో, ఆ తర్వాత 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1978లో విమాన ప్రమాదంలో మరణించారు.. విధి నిర్వహణలోనే. అప్పటికి ముగ్ధ వయసు నాలుగేళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. తల్లి కమలా సిన్హా పిల్లల్ని పెంచి పెద్దచేసింది. సమాజాన్ని సంస్కరించడం కోసం ముగ్ధాకు ఐఏఎస్ లక్ష్యాన్ని నిర్దేశించిందీ ఆమెనే. భర్త చనిపోయాక పిల్లలను తీసుకుని ఆగ్రా వెళ్లిపోయారు కమల. పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేశారు ముగ్ధ. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్లో హిస్టరీ హానర్స్ చదివారు. కాలేజ్ ఫస్ట్. యూనివర్సిటీలో థర్డ్ ర్యాంకర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎమ్మే చేశారు. సెకండ్ అటెంప్ట్లో ఐఏఎస్ సాధించారు. సివిల్స్లో ఆమెది ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్. జైపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ముగ్ధానే. రెండేళ్లు సీఎమ్ (రాజస్థాన్) ఆఫీస్లోనూ పని చేశారు. జిల్లా కలెక్టర్గా 2005లో మొదటి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ‘‘సివిల్ సర్వీస్.. జాబ్ కాదు. నిజంగా సర్వీసే. సామాన్యుల సంక్షేమం కోసం చేసే సేవ. మనం చేసిన పనే తర్వాతి తరాల వాళ్లకు అందే వారసత్వం. మన పనే ప్రజల హృదయాల్లో మనకు సుస్థిరస్థానం కల్పిస్తుంది’’ అని అంటారు ముగ్ధా సిన్హా. పదేళ్లలో పదమూడు బదిలీలు! ఆర్నెల్లలోనే అరవై ఏళ్ల పాలనా సంస్కరణలు తెచ్చారు ముగ్ధ. అందుకే ఆమె ట్రాన్స్ఫరై పోతుంటే ఆ జిల్లాలోని ప్రజలు సరే.. లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు అందరూ ముగ్ధా బదిలీని ఆపమంటూ ధర్నా నిర్వహించారు. బంద్కు పిలుపిచ్చారు. ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత తన పదిహేనేళ్ల సర్వీస్లో పదమూడు ట్రాన్స్ఫర్స్లను గిఫ్ట్గా ఇచ్చింది. అయినా అలుపెరగక ప్రయాణిస్తూనే ఉన్నారామె తను నమ్మిన దారిలో. -
పల్నాడులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
-
ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ
సాక్షి, గుంటూరు: తన ఆకలి తీర్చుకోవడానికి పాము తన పిల్లల్ని తానే తింటుందని చెబుతుంటారు. అదే తీరున గుంటూరు జిల్లా గురజాల అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధనదాహానికి సొంత పార్టీ నేతల్నే బలి తీసుకుంటున్నారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి అక్రమ తవ్వకాలకు తెగబడుతోంది. ఇప్పుడు వీరి కన్ను సొంత పార్టీ నేతల క్వారీలపై పడింది. వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ అలియాస్ బుజ్జి.. యరపతినేని బెదిరింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడికి చేరుకున్న మైనింగ్ మాఫియా యరపతినేని పేరు బయట పెట్టవద్దంటూ ఆదినారాయణ సోదరులు, బంధువులతో బేరసారాలకు దిగారు. వాటికి లొంగకపోవడంతో దౌర్జన్యానికి దిగారు. మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ నెట్టివేశారు. తమ కుటుంబానికి ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉందని, తమకేం జరిగినా ఆయనదే బాధ్యతని కుటుంబసభుల్య మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల క్వారీల దురాక్రమణ దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ, ఆయన బావమర్ది బెల్లంకొండ పూర్ణచంద్రరావులకు సర్వే నెంబర్ 325లో 2. 10 ఎకరాల భూమి ఉంది. అందులో తెల్లరాయి నిక్షేపాలు ఉండటంతో క్వారీ లీజు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. దీంతో 2018 జూలై 10వ తేదీన పూర్ణచంద్రరావు పేరుతో మైనింగ్ అధికారులు అనుమతులిచ్చారు. ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, సీబీసీఐడీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మైనింగ్ మాఫియా వ్యూహాన్ని మార్చేసింది. గతంలో మూతబడ్డ క్వారీలు, వీరు బెదిరించి నిలుపుదల చేసిన క్వారీలను దౌర్జన్యంగా లాక్కుని వాటికి తిరిగి అనుమతులు తెప్పించుకుని తెల్లరాయిని అక్రమంగా దోచేసే కుట్రకు తెరతీశారు. ఇందులో భాగంగా కేసానుపల్లిలో ఆదినారాయణకు చెందిన క్వారీని కూడా లాగేసుకుని తవ్వకాలు మొదలు పెట్టారు. తమ క్వారీని అప్పగించాలంటూ ఆదినారాయణ గత పదిరోజులుగా యరపతినేని అనుచరుడు, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నెల్లూరి శ్రీనివాసరావును కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే తమకు అప్పగించారని, ఆయనతో మాట్లాడుకుని తేల్చుకోవాలంటూ శ్రీనివాసరావు చెప్పాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు తన క్వారీని లాక్కుని అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న నెల్లూరి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదినారాయణ శనివారం దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో శనివారం రాత్రి ఆదినారాయణ సోదరుడు కోటేశ్వరరావు ఎమ్మెల్యే యరపతినేని వద్దకు వెళ్లి తమ క్వారీ అప్పగించాలంటూ వేడుకున్నారు. ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోవాలంటూ చెప్పడంతో చేసేదేమీ లేక వెనక్కు వచ్చేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆదినారాయణ ఇంటికి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న ఆదినారాయణను పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి మా తండ్రి, మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లిఖార్జునరావు పార్టీకి అండగా ఉన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం మేం ఎంతో కష్టపడ్డాం. అలాంటి మాపై యరపతినేని వ్యవహరించిన తీరు బాధాకరం. మా సోదరుని క్వారీని ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించారని ఆయన వద్దకు వెళ్లి చెబితే ఎంతోకొంత డబ్బులు తీసుకోమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కొడుకులమైన మాకే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అలాగే మా బావమరిదిని కూడా బెదిరించి క్వారీని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడిన తరువాతే మా తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది. మాకు ఏం జరిగినా ఆయనదే బాధ్యత. – గడిపూడి కోటేశ్వరరావు, లక్ష్మయ్య(ఆదినారాయణ సోదరులు) -
అక్రమ మైనింగ్కు అడ్డాగా కొత్తగూడెం జిల్లా
-
పల్నాడు గనుల్లో బ్లాస్టింగ్ మోత
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల అక్రమ మైనింగ్కు అడ్డే లేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను బ్లాస్టింగ్కు వినియోగిస్తూనే ఉన్నారు. అనుభవం లేని కార్మికులతో బ్లాస్టింగ్ చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మైనింగ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో డిటోనేటర్లు పేలి క్వారీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చావుబతుకుల మధ్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది కప్పిపుచ్చుకోడానికి రకరకాల కథలు అల్లుతున్నారు. చేపల వేటకు వచ్చి డిటోనేటర్లు పేల్చారంటూ టీడీపీ నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండగా, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు మాత్రం దీపావళి మందులు పేలాయంటున్నారు. మొక్కుబడిగా సీబీసీఐడీ విచారణ పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా భారీ ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగించడమే కాకుండా, విచ్చలవిడిగా నిల్వలు ఉంచుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల సీబీసీఐడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కానీ, వీరు రెండు రోజులకోసారి పిడుగురాళ్ల వచ్చి మిల్లర్లు, లారీ యజమానులు, డ్రైవర్లు, కూలీలను విచారిస్తున్నారే తప్ప మైనింగ్ మాఫియా సభ్యుల జోలికి మాత్రం వెళ్లడంలేదు. దీంతో క్వారీల్లో మళ్లీ బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారు. సీఐడీ అధికారులుగానీ, స్థానిక పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులెవరూ అక్రమ బ్లాస్టింగ్లపైగానీ, పేలుడు పదార్థాల నిల్వలపైగానీ చర్యలు తీసుకోవడంలేదు. గత రెండు నెలలుగా పల్నాడు ప్రాంతంలో పేలుడు పదార్థాల నిల్వలు, అక్రమ బ్లాస్టింగ్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేష్రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు సీబీసీఐడీ ఏడీజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీబీఐ అధికారులకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఇంత చేస్తున్నా మైనింగ్ మాఫియాకు అడ్డుకట్టపడటం లేదు. జిల్లాలో 25 మందికి పైగా మృతి మైనింగ్ బ్లాస్టింగ్ ప్రమాదాల్లో గడిచిన కొన్నేళ్లలో 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2010లో అక్రమ మైనింగ్ కోసం నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్ దాచేపల్లిలో పేలి వ్యాపారి కుటుంబంతో పాటు, చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే 16 మంది మృత్యువాత పడ్డ ఘటన ఇప్పటికీ మరువలేని విషాదం. ఏడాది క్రితం ఫిరంగిపురం క్వారీలో బ్లాస్టింగ్కు యత్నిస్తుండగా రాళ్లు కూలి ఐదుగురు కూలీలు సజీవ సమాధి అయిన ఘటన సంచలనం కలిగించింది. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో మాత్రం కనువిప్పు కలగలేదు. మరోవైపు.. అక్రమ క్వారీయింగ్పై రెండు నెలలుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు పేలుడు పదార్థాలు అక్రమంగా తయారుచేస్తున్న వారు ఎవరు.. సరఫరా చేస్తున్న వ్యక్తులు ఎవరనే విషయంపై ఆరా తీయడంగానీ, చర్యలు తీసుకోవడంగానీ చేయకపోవడం గమనార్హం. -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. మీడియాపైనా చిందులు!
సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. తాను నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు పెదవేగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింతమనేని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమను భయభ్రాంతులకు గురిచేశారని వెజిలెన్స్ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం కొప్పాక వద్ద సాగుతున్న అక్రమ మైనింగ్పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి.. నాలుగు టిప్పర్లు, ప్రొక్లైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం ఈ మేరకు దాడులు చేసింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న చింతమనేని విజిలెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా టిప్పర్లనే సీజ్ చేస్తారా? మా వాళ్లపైనే కేసులా?’ అంటూ ఆయన దౌర్జన్యానికి దిగారు. సీజ్ చేసిన వాహనాలు వదలాలంటూ అధికారులను బెదిరించారు. అయినా వాహనాలను వదలకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని వెనుదిరగగా.. ఆయన ప్రోద్బలంతో కొద్దిసేపటికి చింతమనేని సోదరుడు, దుగ్గిరాల మాజీ సర్పంచ్ చింతమనేని సతీష్ ఆధ్వర్యంలో వందమంది టీడీపీ కార్యకర్తలు విజిలెన్స్ అధికారులను చుట్టుముట్టారు. విజిలెన్స్ బృందాన్ని భయభ్రాంతులకు గురిచేసి.. సీజ్ చేసిన నాలుగు వాహనాలను తీసుకెళ్లిపోయారు. జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు విజిలెన్స్ డీజీ దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు. మీడియాపైనా రౌడీయిజం! ఈ ఘటన నేపథ్యంలో విజిలెన్స్ కార్యాలయంలో ఎస్పీ అచ్యుతరావుని కలిసిన చింతమనేని ప్రభాకర్ .. అనంతరం మీడియాతోను దురుసుగా ప్రవర్తించారు. వివరణ కోరేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపైకి దూసుకెళుతూ.. చింతమనేని బూతుపురాణం విపారు. ‘మీ అంతు తేలుస్తా.. తొక్కిపెట్టి నారతీస్తా నా కోడక్కల్లారా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కెమారామెన్లు, మీడియా ప్రతినిధులు బిత్తరపోయారు. కాగా, అక్రమ మైనింగ్ చేస్తున్న నాలుగు టిప్పర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. వాటిని ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని, ఈ ఘటనపై పెదవేగి పోలీసులకి ఫిర్యాదు చేశామని విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు మీడియాతో తెలిపారు. -
25 వేలమంది ఉపాధికి గండి!
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెల్ల సున్నపురాయి అక్రమ తవ్వకాల దందాతో వేల కోట్లు దండుకున్న మైనింగ్ మాఫియాను రక్షించేందుకు ప్రభుత్వం రకరకాల ఎత్తులు వేస్తోంది. అక్రమార్కులను వదిలేసి అన్ని పల్వరైజింగ్ మిల్లులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఖనిజ రవాణా పర్మిట్లు ఆపేసింది. ఈ మేరకు వివరాలను కోర్టుకు సమర్పించనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ చర్యతో సుమారు 25 వేలమంది కార్మికుల ఉపాధికి గండిపడింది. అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గత తొమ్మిదేళ్లుగా మరీ ముఖ్యంగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగిస్తున్న మైనింగ్ మాఫియా గురించి మైనింగ్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులందరికీ తెలుసు. ముఖ్యమంత్రితో సహా అందరికీ తెలిసి సాగుతున్న వ్యవహారమే కావడంతో అధికారులు అడ్డుకునే సాహసం చేయలేదు. అటవీ భూములు, రెవెన్యూ భూముల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో లోకాయుక్త నియమించిన అధికారి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పల్నాడు ప్రాంతంలో యరపతినేని సాగిస్తున్న మైనింగ్ మాఫియావల్ల రాయల్టీ రూపంలో సర్కారుకు వేల కోట్ల నష్టం వాటిల్లిందంటూ హైకోర్టులో పిల్ దాఖలవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. మొత్తం వ్యవహారంపై నిగ్గుతేల్చి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తే సర్కారు బండారం బట్టబయలవుతుందనే ఉద్దేశంతో సర్కారు సీబీసీఐడీకి అప్పగించి నీరుగార్చే కుట్రపన్నింది. అక్రమార్కులను వదిలి... తాజాగా అక్రమ మైనింగ్ కొనసాగించిన వారిని వదిలేసి మొత్తం పల్నాడు ప్రాంతంలో ఖనిజ ట్రాన్సిట్ పాసులను ఆపేసింది. దీంతో తెల్ల సున్నపురాయి ఖనిజ సరఫరా నిలిచిపోయి గుంటూరు జిల్లాలోని 200 పైగా సున్నపుబట్టీలు మూతపడ్డాయి. బట్టీల్లో కాల్చిన సున్నపురాళ్లను పొడిచేసే వందపైగా పల్వరైజింగ్ మిల్లులు మూతపడ్డాయి. దీంతో 22 నుంచి 25 వేలమంది కార్మికుల ఉపాధికి గండిపడింది. సక్రమంగా నడుస్తున్న మిల్లులకు ఖనిజ సరఫరాను ఆపేయడంవల్ల సున్నపుపొడి ఉత్పత్తి ఆగిపోయింది. దోషులను వదిలేసి తమ మిల్లులు మూతపడేలా చేశారంటూ పల్వరైజింగ్ మిల్లుల యజమానులు, సున్నపు బట్టీల వారు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ఉపాధి కోల్పోయిన కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్రమ మైనింగ్నిరోధించామని చెప్పడానికే.. మొత్తం అక్రమ మైనింగ్ను నిరోధించామని చెప్పడానికి, మైనింగ్ దందా సాగించిన అధికార పార్టీ ఎమ్మెల్యేను కాపాడేందుకే పల్వరైజింగ్ మిల్లులకు నోటీసులు జారీ చేసి, ఖనిజ రవాణా పర్మిట్లు ఆపేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగురాళ్లకు చెందిన పల్వరైజింగ్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులు గనుల శాఖ సంచాలకులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. దోషులను రక్షించడమే లక్ష్యం యరపతినేని శ్రీనివాసరావు అక్రమ తవ్వకాలు సాగించారని లోకాయుక్త ప్రతినిధి నిగ్గుతేల్చారు. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, ఎమ్మెల్యేకు భయపడటం వల్లే అధికార యంత్రాంగం కట్టడిచేయలేకపోయినట్టుగా తమ విచారణలో తేలిందని నివేదికలో పేర్కొన్నారు. ఇది జరిగి రెండేళ్లయినా స్పందించని సర్కారు ఇప్పుడు హైకోర్టు అక్షింతలు వేసినా దోషులను రక్షించి అమాయకులను శిక్షించే పనిలో పడింది. మైనింగ్ ఏడీ, డీడీలను సస్పెండ్ చేయడం ఇందుకు నిదర్శనం. మరోవైపు కోర్టుకు చర్యలు తీసుకున్నట్లుగా చెప్పి, మసిపూసి మారేడుకాయ చేసి ఎమ్మెల్యేని కాపాడేందుకే గత దశాబ్దకాలంలో ఎంత ఖనిజాన్ని పొడిచేశారో లెక్కలు చెప్పాలంటూ పల్వరైజింగ్ మిల్లులకు నోటీసులు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
త్వరలోనే మైనింగ్ ప్రాంతాల్లో పర్యటిస్తాం
-
తప్పు మీద తప్పు..!
సాక్షి, గుంటూరు: చీకట్లో నల్లపిల్లిని వెతుకుతున్నారన్న హైకోర్టు వ్యాఖ్యలను మైనింగ్ అధికారులు నిజం చేస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి నోటీసులు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిన అక్రమ మైనింగ్పై రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలతో చేయిస్తున్న విచారణ తీరే ఇందుకు నిదర్శనం. హైకోర్టు మొట్టికాయలు మొట్టడంతో తామేదో పొడిచేస్తాం.. అక్రమాలను నిగ్గుతేలుస్తాం అన్నట్టుగా ఫోజు పెట్టి విచారణ మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తీరు హాస్యాస్పదంగా మారింది. ఉండటానికి సరైన నివాసం కూడా లేని వాళ్లు వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించి రూ.కోట్లు సంపాదించారని, అలాగే 1998లో మరణించిన వ్యక్తి 2013లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డాడంటూ నోటీసులిచ్చి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విచారణ పేరుతో మైనింగ్ అధికారులు ఇంకో అడుగు ముందుకేసి స్వామిభక్తి చాటుకోవడంలో భాగంగా పత్తి, బియ్యం, మైదాపిండి మిల్లుల వారికి కూడా తెల్లరాయి అక్రమ తవ్వకాలతో సంబంధం ఉందని నోటీసులిచ్చి, మిల్లులను మూతవేయించారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టుకు ఈ జాబితాను కూడా నివేదించడం గమనార్హం. తమ ఎమ్మెల్యేను కాపాడేందుకే... గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, ఇతర అధికార పార్టీ పెద్దలను తప్పించే యత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణను సీబీసీఐడీకి అప్పగించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చేస్తున్న విచారణ తీరు ఈ ఆరోపణలను బలపరుస్తోంది. అక్రమ మైనింగ్లో కీలక పాత్ర పోషించిన వారిని వదిలేసి సంబంధంలేని ముగ్గురాయి మిల్లుల యజమానులను, అమాయక కూలీలు, టిప్పర్, ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లకు సైతం నోటీసులు జారీచేస్తున్నారు. పైగా వారిని పోలీసు స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారు. రైస్మిల్లులు, కాటన్ మిల్లులకు అక్రమ మైనింగ్కు సంబంధం ఏంటనేది మైనింగ్ అధికారులు, సీబీసీఐడీ అధికారులకే తెలియాలి. మైనింగ్ మాఫియా నుంచి తెల్లరాయి కొనుగోలు చేసి ముగ్గు, చిప్స్ తయారు చేసే మిల్లులకు నోటీసులు ఇస్తే పర్వాలేదు. నిజంగా ముగ్గు, పల్వరైజింగ్ మిల్లులు నడుస్తున్నప్పటికీ ఆ పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆ బిల్డింగ్లో రైస్ మిల్లు, కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, ఇతర పరిశ్రమలు నడిచాయనే అవగాహన కూడా లేకుండా ఆ పేర్లతో నోటీసులు జారీ చేశారు. తాము తప్పించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేత ఏస్థాయిలో తన పరపతిని ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు. నోటీసులు ఇచ్చాం విద్యుత్ శాఖ అధికారుల నుంచి సేకరించిన మీటర్ల ఆధారంగా మిల్లులకు నోటీసులిచ్చాం. గతంలో కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, రైస్మిల్లులు ఇలా ఏ పరిశ్రమ పేరుతో అయితే కరెంటు మీటరు తీసుకున్నారో ఆ పేరుతో నోటీసులిచ్చాం. ఆపేరుతో అక్కడ పరిశ్రమ నడవకపోతే యజమానులు మాకు తెలియజేయాలి. వెంటనే మా అధికారులను పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత వారు చెప్పినట్లు మైనింగ్కు సంబంధం లేని పరిశ్రమ అయితే నోటీసులు వెనక్కు తీసుకుంటాం. – విష్ణువర్ధన్, మైనింగ్ ఏజీ -
మైనింగ్ మాఫియా గుండెల్లో పేలుడు!
సాక్షి, గుంటూరు : పల్నాడు అక్రమ మైనింగ్ కేసులో అమాయకులను ఇరికించి అసలు సూత్రధారులు తప్పించుకున్నారంటూ నలుగురు నిందితులు తాజాగా హైకోర్టును ఆశ్రయించడంతో మైనింగ్ మాఫియాలో కలవరం మొదలైంది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో నిర్వహించే ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధమేనని న్యాయస్థానానికి నివేదించడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండదండలతో అక్రమ క్వారీయింగ్ సాగిస్తున్న మైనింగ్ మాఫియా బెంబేలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేదర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణకు ఆదేశించాలని కేసులో నిందితుడిగా ఉన్న ఓర్సు ప్రకాష్ కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. తప్పు చేయకుంటే భయమెందుకు? గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గంలో అక్రమ మైనింగ్కు సంబంధించి సర్వే పేరుతో అధికారులు అసలు దొంగలను వదిలేసి కూలీలు, అమాయకులపై కేసులు నమోదు చేశారు. అయితే వీరంతా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించడంతో అక్రమ మైనింగ్పై పోరాడిన వారిని కేసుల్లో ఇరికించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధికి గొంతులో వెలక్కాయ పడినట్లైంది. చివరకు ఈ వ్యవహారం ఎటువైపు మళ్లుతుందోననే ఆందోళనలో మైనింగ్ మాఫియా ఉన్నట్లు సమాచారం. ఏ తప్పూ చేయకుంటే సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే యరపతినేని ఎందుకు జంకుతున్నారంటూ ప్రజలు నిలదీస్తున్నారు. శాటిలైట్ సర్వే కూడా చేయలేదు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్తో తెల్లరాయిని దోచేసిన ఘనులను గుర్తించేందుకు హైకోర్టు ఆదేశాలతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది! సుమారు కోటి టన్నుల వరకు దోపిడీ జరిగినట్లు అంచనాలు ఉన్నప్పటికీ శాటిలైట్ సర్వే కూడా చేయకుండా 31.53 లక్షల టన్నుల తెల్లరాయిని మాత్రమే తరలించారంటూ నివేదిక ఇచ్చారు. కేసులో నిందితులుగా ఉన్న ఓర్సు ప్రకాష్, తిప్పవజ్జుల నారాయణశర్మ, తిప్పవజ్జుల సీతారామాంజనేయులు, రాజేటి జాకబ్ తమను ఇందులో అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టుకు నివేదించడం కలకలం రేపింది. ఎమ్మెల్యే అనుచరుల పట్ల ఉదాశీన వైఖరి అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలంటూ వైఎస్సార్ సీపీతోపాటు పలువురు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంగానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుగానీ ముందుకు రాలేదు. ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ నిర్వహించే అధికార పార్టీ నేతలు ఘట్టమనేని నాగేశ్వరరావు, బుల్లబ్బాయి, ముప్పన వెంకటేశ్వర్లుకు అధికారులు నోటీసులు ఇవ్వకుండా, విచారించకుండా ఉదాశీనంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పల్నాడు గనుల దోపిడీపై.. సీబీఐ విచారణకు సిద్ధమా?
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడమంటే వాస్తవాలను కప్పి పుచ్చడమే. అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలోని దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించి పెద్ద తప్పును చిన్న తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేశారని తేలుతోంది. ప్రతి రోజూ కొన్ని వేల లారీలతో ఖనిజాన్ని తరలించారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవరికీ తెలియదని అనుకోవాలా? ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీలో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా? రాష్ట్రంలో జరుగుతున్న అనేక దోపిడీల్లో ఇదొక దోపిడీ మాత్రమే. ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఏ సహజ వనరులనూ మిగల్చలేదు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తరువాత చంద్రబాబు గారు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ‘మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది. మాకూ సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించలేదా? సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అలాంటి వ్యక్తి పల్నాడు గనుల దోపిడీపై సీఐడీ చేత దర్యాప్తు చేయించడం అపహాస్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతోనే గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయి’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పల్నాడు గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు చంద్రబాబుగారు సిద్ధమా? pic.twitter.com/vsNveKwePX — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 August 2018 -
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్పై విచారణ
సాక్షి, గుంటూరు:టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీసీఐడీ విచారణ ప్రారంభించింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న ఈ దందాపై ఎట్టకేలకు విచారణను ప్రారంభించారు. దీనిలో భాగంగా సీబీఐ, మైనింగ్ అధికారులు పిడుగురాళ్ల పీఎస్కు చేరుకున్నారు.18 ఏళ్ల మైనింగ్ లావాదేవీలపై సీబీఐ విచారణ జరుపుతోంది. సున్నం తయారీ మిల్లర్లతోనూ సమావేశం ఏర్పాటుచేశారు. అంతకుముందు అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వటానికే... గురజాల అక్రమ మైనింగ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస రావుకు క్లీనచీట్ ఇవ్వటానికే సీఐడీ విచారణను జరుపుతున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. సీబిఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరిపించాల్సిన అవసరమేంటని నిలదీశారు. టీడీపీకి సీఐడీ తోక సంస్థ అని, ఏ ఎమ్మెల్యే నైనా విచారించిన ఘనత సీఐడికి ఉందా అని ప్రశ్నించారు. ఐదు వందల కోట్లు దోచిన స్కాంను సీబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డెబ్బై వేలు విలువ చేసే భూములను అప్పట్లోనే రెండు మూడు లక్షల చొప్పున కొన్నారని, ఈ భూములపై యరపతినేని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..? -
మైనింగ్ మాఫియా సరికొత్త డ్రామా!
సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్కు పాల్పడి తాము తవ్విన తెల్లరాయిని మాత్రమే మిల్లుల్లో దించుకోవాలని గత నాలుగేళ్లుగా భయపెట్టి దౌర్జన్యంగా కోటి టన్నులకు పైగా కొల్లగొట్టిన పల్నాడులోని మైనింగ్ మాఫియా కేసు నుండి బయటపడేందుకు ఇప్పుడు కొత్త అంకానికి తెరతీసింది. హైకోర్టు కన్నెర్ర చేయడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటివరకూ మిల్లర్లకు నోటీసులు ఇప్పించి వారిని భయాందోళనకు గురిచేసింది. కానీ, కేసు తీవ్రతతో ఇంకా మథనపడుతున్న మాఫియా సూత్రధారులు ఇప్పుడు తాజాగా తాము చెప్పినట్లు చేస్తే మీకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం.. ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ మాఫియా సూత్రధారులు వడ్డవల్లి బుల్లబ్బాయి, ముప్పన వెంకటేశ్వర్లులు పిడుగురాళ్ళ, నడికుడి ప్రాంతాల్లోని మిల్లర్ల యజమానులను దగ్గరుండి కలెక్టరేట్కు తీసుకొచ్చి వారిని కలెక్టర్ వద్దకు పంపారు. వీరు మాత్రం బయటే ఉండిపోయి కొత్త కథను నడిపించారు. ఇందులో భాగంగా ముందుగా.. మైనింగ్ను నిలిపివేయడంవల్ల కూలీలు ఉపాధి కోల్పోతున్నారని వారితో కలెక్టర్కు వినతిపత్రం ఇప్పించారు. పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వల్లే తాము, కూలీలు ఇబ్బందులు పడుతున్నామని వారి నోటితో చెప్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం వారిని గుంటూరు నగరంలోని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి తాము అండగా ఉంటామంటూ మిల్లర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. దీంతో.. ఇప్పటికే తమకు మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారని, మిగతా శాఖలకు చెందిన అధికారులు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, అవైనా తమకు రాకుండా చూడాలంటూ ఎమ్మెల్యేను మిల్లర్లు వేడుకున్నట్లు సమాచారం. అయితే, గతంలో మైనింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలిసినప్పటికీ ఎదురు తిరిగితే కేసుల్లో ఇరికిస్తారనే భయంతో ఇష్టంలేకపోయినా మైనింగ్ మాఫియా ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి మిల్లర్లకు ఏర్పడింది. ఇదిలా ఉంటే.. నిజంగా ఎమ్మెల్యేకు, మైనింగ్ మాఫియాకు తమపై ప్రేమ ఉంటే.. అక్రమ మైనింగ్ జరుగుతున్న మూడు క్వారీలను మాత్రమే నిలిపివేయమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే, మిగతా క్వారీలను సైతం ఎందుకు మూయించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కొందరు మిల్లర్లు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం. -
కొల్లగొట్టింది కోటి టన్నులు!
సాక్షి, గుంటూరు: సున్నపురాళ్లలో కొల్లగొట్టింది కొండంత.. లెక్కల్లో చూపించేది మాత్రం గోరంత! పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో సాగుతున్న మైనింగ్ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అక్రమాలపై సర్వే చేసిన అధికారులపైనే చర్యలు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున సాగిన అక్రమ మైనింగ్ 31 లక్షల టన్నులు మాత్రమేనంటూ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంపై అనుమానాలు ముసురు కుంటున్నాయి. ఈ నివేదిక ఆధారంగా మైనింగ్ డీడీ, ఏడీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవంగా అక్కడ దోచేసిన సున్నపురాయి కోటి టన్నులకు పైగానే ఉంటుందని శాటిలైట్ సర్వేల ఆధారంగా అంచనా వేస్తున్నారు. దీన్ని దాచిపెట్టి కూలీలు, కార్మికులపై కేసులు బనాయించి అధికార పార్టీ ప్రజాప్రతినిధిని తప్పించే యత్నాలు సాగుతున్నాయి. మైనింగ్ వ్యవహారంలో బాధ్యులుగా చేస్తూ మంగళవారం రాత్రి సస్పెన్షన్ వేటు వేసిన మైనింగ్ డీడీ, ఏడీల నేతృత్వంలోనే అక్రమ క్వారీయింగ్పై సర్వే జరిగిన విషయం తెలిసిందే. మైనింగ్ ఏడీ జగన్నాధరావు ఫిర్యాదు ఆధారంగా 17 మందిపై కేసులు సైతం నమోదయ్యాయి. మైనింగ్ డీడీ, ఏడీలు నిజంగానే తప్పు చేసి ఉంటే వారి నేతృత్వంలో జరిగిన సర్వే కూడా తప్పేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులను కూడా పునఃపరిశీలించి మైనింగ్ మాఫియాలో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాటిలైట్ సర్వే ప్రకారమే 68.53 లక్షల టన్నులు.. మైనింగ్ అధికారుల నివేదికను బట్టి చూస్తే పిడుగురాళ్ల మండలం సీతారాంపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికూడి ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా కేవలం 31 లక్షల టన్నుల సున్నపురాయిని మాత్రమే తవ్వినట్లుగా చూపారు. అయితే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాటిలైట్ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2017 జనవరి నాటికే 68.53 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేసినట్లు మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి చెబుతున్నారు. ఈమేరకు సాక్ష్యాలను సైతం ఆయన హైకోర్టుకు అందించారు. 2017 జనవరి నుంచి 2018 జూలై 25వతేదీ వరకు అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. శాటిలైట్ సర్వే జరిగిన తరువాత 19 నెలల్లో సుమారుగా మరో 30 లక్షల టన్నుల సున్నపురాయిని దోచేసినట్లు అంచనా వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం మూడు క్వారీల్లో కలిపి ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ఇలా ఏకంగా కోటి టన్నుల తెల్లరాయిని కొల్లగొట్టిందని అంచనా వేస్తున్నారు. దీని విలువ సుమారుగా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మైనింగ్ లెక్కల ప్రకారం అక్రమంగా ఆర్జించిన సొమ్ముపై పది రెట్లు వరకు పెనాల్టీ విధించే అధికారం ఉంటుంది. మైనింగ్ మాఫియా దోచేసిన దాంట్లో నాలుగో వంతు కూడా మైనింగ్ అధికారులు లెక్కల్లో చూపకపోవడాన్ని బట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు, బాధ్యులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రక్షించేందుకే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఆదేశించినా పక్కదారి పట్టించే యత్నాలు మైనింగ్ మాఫియాలో అధికార పార్టీ ఎమ్మెల్యే పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన జోలికి వెళ్లకుండా ప్రభుత్వ పెద్దలు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. శాటిలైట్ సర్వే నిర్వహించకుండా తూతూమంత్రంగా లెక్కలు చెబుతున్నారు. ఎమ్మెల్యే పేరు బయటకు రాకుండా అమాయకులకు నోటీసులు జారీ చేస్తూ విద్యుత్ మీటర్ రికార్డులు, 18 ఏళ్ల రికార్డులు చూపాలంటూ మిల్లర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మైనింగ్ మాఫియాలో సూత్రధారుల పేర్లు లేకుండా వారి వద్ద పనిచేసే కూలీలను, కార్మికులను కేసుల్లో ఇరికించి చేతులు దులుపుకొనే ప్రయత్నం జరుగుతోంది. కొందరు అధికారులను ఈ వ్యవహారంలో బలిపశువులుగా మార్చి వారిపై చర్యలు తీసుకున్నట్లుగా హైకోర్టుకు నివేదించేందుకు సర్కారు సిద్ధమైంది. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సీఐడీకి విచారణ బాధ్యతలు అప్పగించి కేసును తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
సాక్షి, గుంటూరు: పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మైనింగ్ డీడీ పాపారావు, దాచేపల్లి మైనింగ్ ఏడీ జగన్నాధరావులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో కొనసాగుతున్న వారిని సీబీసీఐడీ విచారిస్తుందా? గురజాల నియోజకవర్గంలో అక్రమ క్వారీయింగ్ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా తెలిసినా ఈ వ్యవహారంలో ఉద్యోగులను బలి పశువులుగా మార్చే కుట్ర జరుగుతోంది. సీబీఐ విచారణకు సర్కారు జంకుతోంది. మైనింగ్ మాఫియాపై హైకోర్టు కన్నెర్ర చేయడం, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆందోళనలు నిర్వహించడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, మిల్లర్లకు నోటీసులు జారీ చేస్తోంది. మైనింగ్ ద్వారా కోట్లు గడించిన వారిని వదిలేసి వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తోంది. గతంలో పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేసి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని గమనిస్తే పెద్దల పాత్ర బయటకు రాకుండా కాపాడే యత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో కొనసాగుతున్నవారిని సీబీసీఐడీ విచారించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కలు దాచిపెట్టి కార్మికులపై చర్యలు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తం చేయడంతోపాటు సీబీఐ, కాగ్, కేంద్ర గనుల శాఖను ప్రతివాదులుగా చేర్చడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం బలి పశువుల కోసం రంగంలోకి దిగింది. మైనింగ్ మాఫియా అక్రమంగా దోచుకున్న వేల కోట్ల విలువ చేసే సున్నపురాయి లెక్కలను దాచిపెట్టి కార్మికులపై చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులపై వేటు వేయడం ద్వారా అక్రమ మైనింగ్ వ్యవహారంలో తాము అన్ని చర్యలు చేపట్టామని న్యాయస్థానానికి నివేదించేందుకే కంటి తుడుపు చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో నడిచే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి సరికొత్త డ్రామా మొదలు పెట్టింది. అక్రమ మైనింగ్లో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు జంకుతోంది? ఉన్నతాధికారులకు మా పార్టీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు మైనింగ్ ఉద్యోగులపై చర్యలకు దిగటాన్ని బట్టి కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చర్యలు చేపట్టకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటి? మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. – కాసు మహేష్రెడ్డి (వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త) -
'నిజాలు బయటకొస్తాయని టీడీపీకి భయం'
-
కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : నరసరావుపేటలోని గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తవాతావరణం నెలకొంది. అక్రమ గునుల పరిశీలనకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు. యరపతినేని కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని, అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తుంటే వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకొస్తాయని యరపతినేనికి భయం పట్టుకుందన్నారు. కూలీలు, డ్రైవర్లపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారన్నారు. ఇల్లు, పొలం కూడా లేని వ్యక్తి రూ.80 కోట్ల స్కాం చేస్తాడా అని ధ్వజమెత్తారు. అమాయకులపై కేసులు పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని హైకోర్టు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అమాయకులపై కేసులు పెట్టి యరపతినేని ఈ కేసులనుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్ క్వారీలను తాము పరిశీలిస్తే నిజాలు బయటకోస్తాయని టీడీపీకి భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ఖచ్చితంగా అక్రమమైనింగ్ క్వారీలను పరిశీలిస్తామని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసును తప్పుదారిపట్టించాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అక్రమ మైనింగ్ పాల్పడ్డవారు ఎవరైనా శిక్షపడాల్సిందేనన్నారు. నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడం సరికాదన్నారు. -
‘ఘనుడు’ సేఫ్ బడుగులే బలి
సాక్షి, టాస్క్ఫోర్స్: అక్రమంగా దోచేసిన సొమ్ముతో ఇతరుల పేరిట ఇళ్లు, పొలాలు, ఇంటి స్థలాలు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసి, అసలు దోషులు తప్పించుకోవడం చూస్తుంటాం. అయితే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరింత బరితెగించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు రాకుండా అమాయకులను బలి చేస్తున్నారు. వారిపైనే కేసులు నమోదు చేయించారు. తనకు బదులుగా కేసులు మీద వేసుకుంటే ప్రభుత్వానికి కట్టాల్సిన జరిమానాలు తానే చెల్లిస్తానని, కేసుల నుంచి బయటపడేందుకు సహకరిస్తానని యరపతినేని ముందుగానే బేరం మాట్లాడుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచన మేరకు అనామకుల నుంచి ముందుగానే ఆధార్ కార్డులు సేకరించిన మైనింగ్ అధికారులు పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసులకు మొత్తం 17 మందిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే డైరెక్షన్లో కేసులు నమోదు చేసిన పోలీసులు సదరు ‘నిందితులను’ అరెస్టు చేయకుండా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. ఈ కేసుల్లో బలిపశువులుగా మారిన వారంతా చిన్నాచితక కూలీలు, పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. కేసులు నమోదైన 17 మందిలో 13 మంది ఎమ్మెల్యే బినామీలు కాగా, మిగిలిన నలుగురు ఎమ్మెల్యే యరపతినేని అవినీతి అక్రమాలపై పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు. న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టే యత్నం మైనింగ్ మాఫియా ఆగడాలపై ఇటీవల సాక్షాత్తూ హైకోర్టులు, లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేసానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలోని క్వారీల్లో 28 లక్షల టన్నుల మొజాయిక్ చిప్స్ను(తెల్లరాయి) అక్రమంగా దోచుకున్నట్లు నిర్ధారించారు. మైనింగ్ ఏడీ జగన్నాథరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మైనింగ్ మాఫియా సూత్రధారి, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరు, ఈ మాఫియాలో ముఖ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు పేర్లు లేవు. అక్రమ మైనింగ్పై ఈ నెల 21న హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో గనులను దోచుకున్నవారిపై చర్యలు తీసుకున్నామంటూ కోర్టుకు నివేదించి, న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టేందుకు అమాయక కూలీలపై కేసులు పెట్టి, అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేసులు నమోదైన వ్యక్తుల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ కుట్ర ఎంత పకడ్బందీగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ మైనింగ్ కేసులు నమోదైన అనామక కూలీలు, సామాన్యులు 1.క్వారీల కాపలాదారుడిపై కేసు పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు అనే టీడీపీ కార్యకర్త 9.83 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమంగా క్వారీయింగ్ చేసి దోచేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దోచేసిన తెల్లరాయి విలువ రూ.80 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత విలువైన తెల్లరాయిని తవ్వి సొమ్ము చేసుకున్న అంజిబాబు కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే.. ఎకరం పొలం కూడా లేని అంజిబాబు 2014లో టీడీపీ అధికారంలోకి రాకముందు వరకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ముఠాలో ఇతడు ఒక సభ్యుడు మాత్రమే. క్వారీల వద్ద కాపలాగా ఉండేవాడు. అలాంటి అంజిబాబు 9.83 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేయడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. 2.మందుగుండు సరఫరా చేసే వ్యక్తిపై కేసు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గుదె వెంకటశివకోటేశ్వరరావు అలియాస్ కోటి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడు సీతారాంపురం క్వారీల నుంచి 2.64 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమంగా తరలించినట్లు మైనింగ్ అధికారులు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశాడు. పిడుగురాళ్ల పట్టణంలో సాధారణ ఇంట్లో నివాసం ఉండే శివకోటేశ్వరరావు ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ క్వారీల్లో పేలుళ్లకు మందుగుండు సామగ్రి సరఫరా చేస్తుంటాడు. ఇతడు నేరుగా తెల్లరాయిని తవ్వి, తరలించిన దాఖలాలు లేవు. 3.మధ్యతరగతి వ్యక్తి రూ.45 కోట్లు దోచేశాడా? కేసానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు గతంలో ఓ పెట్రోల్ బంకులో సూపర్వైజర్గా పనిచేస్తూ యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యరపతినేని కేసానుపల్లిలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలను నెల్లూరి శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా తెల్లరాయిని తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూస్తుంటాడు. ఆర్థిక లావాదేవీలన్నీ యరపతినేనికి కుడిభుజంగా ఉండే ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తుంటారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుడి భుజాలుగా ఉన్న ఇద్దరిని వదిలేసి బినామీగా ఉన్న నెల్లూరి శ్రీనివాసరావుపైనే కేసు నమోదు చేశారు. ఇతడికి ఎకరం పొలం, చిన్న ఇల్లు మాత్రమే ఉంది. మధ్యతరగతి కుటుంబం. మైనింగ్ అధికారులు తేల్చిన లెక్క ప్రకారం నెల్లూరి శ్రీనివాసరావు రూ.45 కోట్ల విలువైన తెల్లరాయిని దోచేశాడట! 4.ఎమ్మెల్యే అనుచరుడి బినామీ అవతారం దాచేపల్లి పట్టణానికి చెందిన బత్తుల నరసింహారావు క్వారీలో కూలీ పనులు చేసుకుంటూ టీడీపీ కార్యకర్తగా, యరపతినేని అనుచరుడిగా కొనసాగేవాడు. ఇతడికి సెంటు భూమి కూడా లేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటివరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటివ్ సొసైటీని రద్దు చేశారు. ఎమ్మెల్యే అండతో కొత్త సొసైటీని ఏర్పాటు చేశారు. దానికి బత్తుల నరసింహారావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బత్తుల నరసింహారావు 4.25 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిపై కేసు నమోదైంది. ఈయన దోచేసిన తెల్లరాయి విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 5.టీడీపీ కార్యకర్తపై కేసు నమోదు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ కార్యకర్త. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామీల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్ ద్వారా దోచేశాడని మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతడికి చిన్న ఇల్లు తప్ప ఒక్క సెంటు భూమి కూడా లేదు. అయితే, మైనింగ్ మాఫియా ఇచ్చిన సొమ్ముతో ఇటీవల కొండమూడు ప్రాంతంలో రెండెకరాల పొలం కొన్నట్లు సమాచారం. అధికారుల లెక్కల ప్రకారం నీరుమళ్ల శ్రీనివాసరావు దోచేసిన తెల్లరాయి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 6.చిన్న స్థాయి కూలీ మరో బినామీ పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వర్ల రత్నం 11,356 టన్నుల తెల్లరాయిని అక్రమ క్వారీయింగ్ చేసి దోచేసినట్టు అధికారులు నిర్ధారించారు. వాస్తవానికి ఇతడికి ఎకరం పొలం కూడా లేదు. పేద కుటుంబానికి చెందినవాడు. ఒక ట్రాక్టర్ ఉంది. దాన్ని సీతారాంపురం క్వారీల్లో లీజుకు పెట్టి అక్కడే కూలీగా పనిచేస్తుంటాడు. ఇతడికి అధికారులు మైనింగ్ దోపిడీదారుగా చిత్రీకరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం వర్ల రత్నం దోచేసిన తెల్లరాయి విలువ రూ.కోటి వరకు ఉంటుంది. అయితే, ఆయన ఇప్పటికీ ఆ క్వారీలో కూలీగానే పనిచేస్తున్నాడు. తమ వద్ద కూలీగా పనిచేస్తూ ట్రాక్టర్ నడుపుకునే సామాన్యుడిని మభ్యపెట్టి కేసులో ఇరికించినట్లు స్పష్టమవుతోంది. 7.నెలవారీ జీతగాడు గనులు దోచేశాడట! గ్రంథి అజయ్కుమార్.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త, యరపతినేని అనుచరుడు. మైనింగ్ క్వారీల నిర్వాహకుడు అంజిబాబు వద్ద రూ.10 వేల నెలవారీ జీతానికి పని చేస్తుంటాడు. గుమాస్తాగా పని చేసే ఇతడిని అధికారులు మైనింగ్ దోపిడీదారుగా సృష్టిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ఇతను 67,039 టన్నుల తెల్లరాయిని దోచుకున్నాడు. దీని విలువ రూ.8 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వాస్తవానికి ఇతను అంజిబాబు కింద పనిచేసే గుమాస్తా మాత్రమే. తన బినామీ వద్ద పనిచేసే నెలవారీ జీతగాడిని కేసులో ఇరికించి, తాను తప్పించుకోడానికి ఎమ్మెల్యే కుట్ర పన్నారు. 8.ట్రాక్టర్ డ్రైవర్పై అక్రమ మైనింగ్ కేసు రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన ఓర్సు ప్రకాశ్ సీతారాంపురం తెల్లరాయి గనుల్లో ట్రాక్టర్లు బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రకాశ్ 6,643 టన్నుల తెల్లరాయిని అక్రమంగా దోచేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 9.అప్పులున్న వ్యక్తి అక్రమంగా దోచేశాడా? రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన నంద్యాల నాగరాజు క్వారీల్లో ట్రాక్టర్లు బాడుగకు పెట్టి జీవనం సాగిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం వరకూ దినసరి కూలీగా ఉండే నాగరాజు ఒకానొక సందర్భంలో కుటుంబ అవసరాల కోసం ఇతరుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును సైతం చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. కానీ, అధికారుల దృష్టిలో మాత్రం ఇతడు మైనింగ్ మాఫియా సభ్యుడు. నాగరాజు 4,508 టన్నుల తెల్లరాయిని మింగేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. 10.నిరుపేద.. 51 వేల టన్నుల రాయిని మింగేశాడంటున్నారు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓర్సు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. గతంలో క్వారీలో కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. ఇతడు చిన్న ఇల్లు తప్ప సెంటు పొలం కూడా లేని పేద కుటుంబానికి చెందినవాడు. ఓర్సు వెంకటేశ్వర్లు రూ.6 కోట్ల విలువైన 51,000 టన్నుల తెల్లరాయిని దోచేశాడంటూ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. 11.సాధారణ కూలీపై కేసు నమోదు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఇతడికి చిన్న ఇల్లు తప్ప సెంటు భూమి కూడా లేదు. క్వారీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఇతడు రూ.5 కోట్ల విలువైన 40,000 టన్నుల సున్నపు రాయిని దోచేశాడని నిర్ధారించిన మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 12.కమిటీ సభ్యుడు కావడంతో కేసు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల ఏడుకొండలు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతడికి చిన్న ఇల్లు మినహా సెంటు సొంత భూమి కూడా లేదు. గతంలో క్వారీల్లో కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేత బత్తుల నరసింహారావు అధ్యక్షుడిగా ఏర్పడిన వడ్డెర సొసైటీలో సభ్యుడిగా చేరాడు. ఇతడు 2,400 టన్నుల సున్నపురాయిని దోచుకున్నాడంటూ కేసు పెట్టారు. కేవలం వడ్డెర సొసైటీలో కమిటీ సభ్యుడిగా ఉన్నందుకు ఒత్తిడి చేసి అక్రమ మైనింగ్ కేసులో ఇరికించినట్లు తెలుస్తోంది. 13.ట్రాక్టర్ నడుపుకునే వ్యక్తిపై కేసు దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఈర్ల వెంకట్రావు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఉండడానికి చిన్న ఇల్లు తప్ప వ్యవసాయ భూమి కానీ, సెంటు స్థలం కానీ లేవు. బ్యాంకు రుణంతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి, క్వారీల్లో బాడుగకు పెట్టి నడిపిస్తున్నాడు. ఇతడు 9,600 టన్నుల సున్నపురాయిని దోచేశాడని నిర్ధారించిన మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
గుండెల్లో పేలుళ్లు
సాక్షి టాస్క్ఫోర్స్: భారీ పేలుళ్లు.. అడ్డగోలుగా యంత్రాలతో తవ్వకాలు.. రేయింబవళ్లు దూసుకెళుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లతో క్వారీల ప్రాంతాల్లో ప్రజల గుండెలు అదురుతున్నాయి. అనుమతి నుంచి బ్లాస్టింగ్ చేసే వరకు క్వారీల నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. కూలీల రక్షణను గాలికి వదిలేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతల అండదండలతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా అక్రమ మైనింగ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు రాలేదు. అక్రమ మైనింగ్కు పాల్పడిన భారీ యంత్రాలను సీజ్ చేయడంగానీ, మందు గుండు సామగ్రి సరఫరాపై చర్యలుగానీ తీసుకోలేదు. వణుకు పుట్టిస్తున్న బ్లాస్టింగ్స్ పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల్లో పేలుడు పదార్థాలతో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయి. మైనింగ్ లీజు ఉన్న కొంత మందిని అడ్డు పెట్టుకుని.. పేలుడు పదార్థాలను వారి పేరు మీద తీసుకుంటున్నారు. శిక్షణలేని కార్మికులతో 20 అడుగుల లోతులో బ్లాస్టింగ్ చేయిస్తున్నారు. నాలుగేళ్లలో సుమారుగా లక్ష మెట్రిక్ టన్నుల తెల్లరాయి తవ్వేశారు. దీనికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాల్లో 295 క్వారీలు, 60 గ్రానైట్, 7 మోజాక్, 17 గ్రావెల్, 102 స్టోన్క్రషర్స్ ఉన్నాయి. జిల్లా మొత్తంలో ఆరుగురికి మాత్రమే బ్లాస్టింగ్ అనుమతి లైసెన్సులు ఉన్నట్టు సమాచారం. అడ్డదారుల్లో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్లను తీసుకొచ్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఇన్సూరెన్స్ ఊసే లేదు కార్మికులకు మైన్స్ సేఫ్టీ నిబంధనల ప్రకారం గ్రూపు ఇన్సూరెన్స్ తప్పనిసరి. అది ఎక్కడా అమలు కావడం లేదు. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుంది. ప్రీమియం ఎక్కువగా ఉందని చాలామంది కార్మికులకు లీజుదారులు బీమా చేయడం లేదు. అమ్మోనియా వాడకానికి ప్రాధాన్యం డిటోనేటర్లో లెడ్ ఆక్సైడ్ అనే పేలుడు పదార్థం ఉంటుంది. దాన్ని కేవలం చేతితో రాపిడి చేస్తే పేలుతుంది. జిలెటిన్ స్టిక్స్ వైర్లు కలిపి పేల్చాలి. ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యంతోపాటు శ్రమతో కూడు కున్నది. ఈ నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ పొడిని రంధ్రాల్లో కూర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ మంది క్వారీ యజమానులు ఈ పద్ధతికి అలవాటు పడా ్డరు. పిడుగురాళ్లకు చెందిన ఇసాక్ అనే వ్యా పారి తెలంగాణాలోని నల్లగొండ వైపుగా అ డ్డదారుల్లో అమ్మోనియాను జిల్లాకు తరలిం చి వ్యానులో యథేచ్ఛగా విక్రయిస్తున్నాడు. ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా ? ఫిరంగిపురం మండలం గొల్లపాలెం క్వారీలో గత ఏడాది మే 27న బ్లాస్టింగ్ కోసం ప్రయత్నిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ సమయంలో ఉపయోగించిన పేలుడు పదార్థాలకు అనుమతులు లేవు. అప్పటి నుంచి మందు గుండు సామగ్రి రవాణా, నిల్వలపై ఆరా తీసిన వారు లేరు. -
పంట కాలువనూ పీల్చేశారు!
రెండువేల ఎకరాలకు నీరందించే పంట కాలువ అది. రైతుల లోగిళ్లలో ధాన్యరాశులు కురిపించే వరదాయని అది. కానీ అదిప్పుడు మాయమైపోయింది. మైనింగ్ మాఫియా బారిన పడి రూపు కోల్పోయింది. క్వారీలను కొల్లగొట్టడంతోపాటు పంటలకు సాగు నీరందించే సాగర్ కాలువను సైతం మైనింగ్ మాఫియా మాయం చేసింది. తమ వాహనాలు తిరగడానికి వీలుగా కాలువను ఆక్రమించేయడమేగాక అడ్డంగా రహదారిని నిర్మించింది. అంతేకాదు కాలువ గట్టు మట్టిని సైతం కొల్లగొట్టి అమ్మేసుకుని సొమ్ము చేసుకుంది. దీంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు పంట కాలువ కనిపించకుండా మాయమైంది. సందట్లో సడేమియా అన్నట్టుగా కాలువ మరమ్మతు పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ ఎటువంటి మరమ్మతులు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి రూ.కోట్లు దండుకున్నారు. ఫలితంగా కాలువ పూడుకుపోయి నీరు దిగువకు రాని దుస్థితి నెలకొంది. దీంతో రెండువేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారి రైతులు తల్లడిల్లిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎక్కడో కాదు.. సాక్షాత్తూ సాగునీటి శాఖ మంత్రి ఇలాకాలోనే చోటు చేసుకుంది. అధికారపార్టీ అండతో చెలరేగుతున్న మైనింగ్ మాఫియా ఆగడాలకు ఇది మరో నిదర్శనం. సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో నాగార్జునసాగర్ నుంచి సాగునీటిని తీసుకొచ్చే ఇబ్రహీంపట్నం మేజర్ కెనాల్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గ్రామ శివారు సర్వే నంబర్ 801లో ఉన్న 1,204 ఎకరాల కొండపోరంబోకులోని దొనబండ క్వారీల పక్కనుంచి ఈ కాలువ ప్రవహిస్తుంది. గొట్టిముక్కల అబ్బరాజు చెరువు, పరిటాల చెరువుకు ఈ కాలువ ద్వారా నీరందుతుంది. గొట్టిముక్కల అబ్బరాజు చెరువు వరకు కాలువ బాగానే ఉంది. నాగార్జునసాగర్ నుంచి నీళ్లు విడుదల చేస్తే చెరువుకు నీరు చేరుతుంది. ఆ తర్వాత.. మైనింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి ఈ కాలువ సాగుతుంది. అయితే ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న మాఫియా.. అధికార పార్టీ అండతో చెలరేగిపోతోంది. క్వారీలను కొల్లగొట్టే క్రమంలో అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కంచికచర్ల మండలం పరిటాల దొనబండ క్వారీలు ఉన్న ప్రదేశంలో ఐదు కిలోమీటర్ల మేరకు ఉన్న పంట కాలువను క్వారీల నిర్వాహకులు తమ సొంత అవసరాలకోసం ఆక్రమించారు. క్వారీల ప్రాంతంలోకి తమ వాహనాలు వెళ్లాల్సి ఉండడంతో కెనాల్పైనే రహదారులు నిర్మించారు. కార్మికులకు నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ పంట కాల్వ ద్వారా పరిటాల చెరువు కింద రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. మైనింగ్ మాఫియా కాలువను ఆక్రమించడమేగాక కాలువకు అడ్డంగా రోడ్లను సైతం నిర్మించడంతో సాగర్ నీరు వదిలినా ఈ కాలువలో నీళ్లు రావడానికి అవకాశం లేకుండా పోయింది. మరమ్మతుల పేరుతో నిధులు స్వాహా.. గత వేసవిలో దుగ్గిరాలపాడు నుంచి దొనబండ వరకు ఉన్న సాగర్ కెనాల్ ఎర్త్ వర్క్కోసం నిధులు మంజారయ్యాయి. దాదాపు 24 కిలోమీటర్ల వరకు ఉన్న కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.9.35 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్కు అప్పగించారు. అయితే సదరు కాంట్రాక్టర్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న ఐదు కిలోమీటర్ల మేరకు కాలువ మరమ్మతులు చేపట్టకపోగా పనులు చేసినట్టుగా చూపించి బిల్లు తీసుకున్నారు. ఆ మేరకు రూ.2 కోట్ల నిధులు స్వాహా చేసినట్టు సమాచారం. 5 వేల ట్రాక్టర్ల మట్టి విక్రయం... ఒకవైపు కాలువను ఆక్రమించి రోడ్లు వేసిన మైనింగ్ మాఫియా కాలువ గట్టుమీద ఉన్న మట్టిని కూడా వదల్లేదు. కాలువ గట్టుపై ఉన్న మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంది. దాదాపు ఐదువేల ట్రాక్టర్ల మట్టిని తవ్వేసి విక్రయించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలువ మరింత కుంచించుకుపోయి ఆనవాళ్లను కోల్పోయింది. బిల్లులు తీసుకున్నారు గతంలో కెనాల్ రిపేర్ల పనులు జరిగినట్టు రికార్డుల్లో ఉంది. ఆ టైంలో నేను లేను. కానీ ఆ రికార్డులు మాత్రం బదిలీపై వెళ్లిన ఏఈ ఇవ్వలేదు. పనులు మాత్రం పూర్తిచేసి బిల్లులు తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది. – రమేష్బాబు, ఇరిగేషన్ ఏఈ కంచికచర్ల కాలువ లేకుండా చేశారు గతంలో క్వారీలున్న ప్రాంతంలో ఉన్న సాగునీటి కాలువను ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. కొందరు క్వారీ యజమానులు వారి లారీలు పోయేందుకు కాలువను పూడ్చి రోడ్డు నిర్మించుకున్నారు. కాలువపైనే రహదారులు ఏర్పాటు చేసుకోవడంతో పూర్తిగా పూడిపోయింది. దీంతో సాగునీటి పారుదల ఆగిపోయింది. క్వారీల సమీపంలోనే నాకు 8 ఎకరాల భూమి ఉంది. నీరు రాక ప్రస్తుతం వర్షంపైనే ఆధారపడి పంటలు పండించుకుంటున్నాం. – మాగంటి ప్రసాద్ రైతు, పరిటాల గట్టు కూడా కన్పించడం లేదు సాగర్ కెనాల్లో గతంలో సాగునీరు పుష్కలంగా ఉండేది. కొందరు క్వారీ యజమానులు వారి అవసరాలకోసం కాలువనే పూర్తిగా మాయం చేశారు. రైతుల అవసరాలకంటే వారి వ్యాపార ఆదాయంకోసం వాడుకోవటం బాధగా ఉంది. వారికి రాజకీయంగా పలుకుబడి ఉండడంతో అ«ధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కాలువ గట్టు మట్టిని కూడా వదలిపెట్టకుండా అమ్మేసుకున్నారు. దీంతో గట్టు కూడా కన్పించడం లేదు. – పురమా సత్యనారాయణ రైతు, పరిటాల -
అధికారుల అండతోనే విశాఖలో మైనింగ్ మాఫియా
-
మంత్రి ఇలాకాలో మైనింగ్ మాఫియా
-
మైనింగ్ మాఫియా దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు
-
ఎమ్మెల్యేపై మైనింగ్ మాఫియా దాడి
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ మాఫియా దాడిలో ఆప్ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. పంజాబ్లోని బైహరా గ్రామంలో ఇల్లీగల్ మైనింగ్ వ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రోపార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే అమర్జీత్ సింగ్ సందోవా తన అనుచరులతో గురువారం మధ్యాహ్నాం అక్కడికి వెళ్లారు. మీడియాతోపాటు ఆయన్ని గమనించిన ముఠా సభ్యులు ముందుగా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది నిలువరించే యత్నం చేసినప్పటికీ మైనింగ్ మాఫియా ముఠా అస్సలు వెనక్కి తగ్గలేదు. కాసేపటికే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కర్రలు, ఇనుపరాడ్లతో ఎమ్మెల్యే బృందంపై ముఠా సభ్యులు విరుచుకుపడ్డారు. రాళ్లు విసిరి చెదరగొట్టే యత్నం చేశారు. ఈ క్రమంలో రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గాయపడ్డారు. ఛాతీకి బలమైన గాయం కావటంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటనపై ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. పంజాబ్లో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరీందర్ సింగ్ ప్రభుత్వం కళ్లు తెరవాలని.. మాఫియా ఆగడాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నామన్న సిసోడియా తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
బుల్లెట్ ఓర్ తవ్వకాల వెనుక ఓ మహిళ
విజయనగరంలో ఓ అధునాతన భవనం... అందులో ఓ యువతి... ఆమెకు రక్షణగా ఇద్దరు బాడీగార్డులు... ఇంట్లో పనికోసం నియమించుకున్న కొందరు పరివారం. ఆమె సాధారణ యువతి అనుకునేరు. ఏడాదిగా రూ. కోట్లలో లావాదేవీలు సాగించేస్తున్న ఓ ముఠా నాయకురాలు. ఆమెను సామాన్యులు కలవడం అంత సులభం కాదు. వ్యాపార లావాదేవీలకోసం వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించి... వారివద్ద నున్న మొబైళ్లతో సహా... ఉన్న వస్తువులు తీసుకుని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఇదంతా విలువైన ఖనిజాన్ని గుర్తించి దానిని తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక యంత్రాంగం. విజయనగరం కేంద్రంగా రెండు మూడు జిల్లాల్లో సాగిస్తున్న కార్యకలాపాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. మరో నమ్మశక్యం కాని విషయమేంటంటే... ఆ ముఠా నాయకురాలి నివాసం ఎస్పీ బంగ్లాకు కూతవేటు దూరంలోనే ఉండటం. సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్ఫోర్స్: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజక వర్గం గరివిడి మండలం శేరిపేటలో అక్రమ మైనింగ్ వెనుక చాలా పెద్ద వ్యవస్థే ఉంది. బుల్లెట్ ఓర్ కోసం బెంగళూరు కంపెనీ పేరుతో ఇక్కడి రైతులను మభ్యపెట్టి తవ్వకాలు జరిపిస్తున్న ముఠాకు ఓ మహిళ నేతృత్వం వహిస్తోంది. విజయనగరం పట్టణంలో మకాం వేసి చుట్టు పక్కల జిల్లాల్లో బుల్లెట్ ఓర్ కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటికే ఏడు మైనింగ్ ప్రాంతాలను గుర్తించగా వాటిలో మూడు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. విశాఖపట్నంలోని పెందుర్తి – సబ్బవరం జాతీయ రహదారికి సమీపంలో ఒక మైనింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మిగతావి కూడా పూర్తి చేయడానికి ఉన్నతస్థాయిలో లాబీయింగ్ నడుపుతున్నారు. ‘సాక్షి’ టాస్క్ఫోర్స్ పరిశోధనలో ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఎస్పీ బంగ్లాకు కూతవేటు దూరంలోనే నివాసం విజయనగరం పట్టణంలోని తోటపాలెం ప్రాంతంలో జిల్లా ఎస్పీ బంగ్లాకు కూత వేటు దూరంలో శ్రీనివాస కాలేజ్ వెనుక ఓ భవంతి ఉంది. పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకున్న ఓ మహిళ అందులో ఒంటరిగా నివసిస్తోంది. కొందరు బాడీగార్డ్స్ ఇద్దరు పనిమనుషులు ఆమె పరివారం. ఎవరైనా ఆమెను కలవాలని వస్తే గేటు వద్దనే బాడీగార్డ్స్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మొబైల్స్తో పాటు అన్ని పరికరాలు లాక్కొని లోనికి పంపిస్తారు. అది కూడా తెలిసిన వాళ్లకైతేనే ప్రవేశం. కొత్తవారెవరికీ లోనికి ప్రవేశం లేదు. ఇక బుల్లెట్ ఓర్ తవ్వకాల గురించి మాట్లాడేందుకు వచ్చే వారికి తన డాబు, దర్పం ప్రదర్శిస్తుంది. తనకు కర్ణాటక రాష్ట్ర మంత్రులతో పరిచయాలున్నట్లు, కొందరు పెద్దలు, ఉన్నతాధికారులతో సంబంధాలున్నట్లు మాట్లాడుతారు. అవన్నీ విని ఆమెకు చాలా పెద్ద నెట్వర్క్ ఉందని అక్కడివారు భావిస్తుంటారు. ఆమె చెప్పినట్లు వింటే డబ్బులు బాగా సంపాదించవచ్చని నమ్ముతుంటారు. రెండు జిల్లాల్లో ఏడు మైనింగ్ ప్రాంతాలు బుల్లెట్ ఓర్ గురించి ఏ మాత్రం బయటకు పొక్కనివ్వకుండా తెర వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది క్రితం విజయనగరంలో దిగిన బెంగళూరు మహిళ విజయనగరం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ తవ్వకాలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విశాఖలో పెందుర్తి, సబ్బవరం జాతీయ రహదారికి వంద అడుగుల దూరంలోనే ఒక మైనింగ్లో తవ్వకాలు జరిపి ఓర్ను తరలించారు. మరో మూడు ప్రాంతాలను గుర్తించారు. జిల్లాలోనూ మూడు ప్రాంతాల్లో మైనింగ్ జరపాలనుకున్నారు. గరివిడి మండలం శేరిపేట, గుర్ల మండలం గుజ్జింగివలస, గంట్యాడ మండలం లకిడాం ప్రాంతాల్లో గనులు గుర్తించారు. పలాయనం చిత్తగించిన పరివారం శేరీపేటలో తవ్వకాలు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ‘సాక్షి’ వారి ప్రయత్నాన్ని బట్టబయలు చేసింది. దీంతో బుల్లెట్ రాణి పలాయనం చిత్తగించింది. తన బాడీగార్డులతో పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇంటిలో లకిడాం ప్రాంతానికి చెందిన ఒక మహిళ, ఒక యువతి ఉన్నారు. ‘సాక్షి’ టాస్క్ఫోర్స్ బృందం వారిని కలిసి ఆరాతీయగా... తమకేమీ తెలియదని, ఒక మేడమ్ తమను ఇంటి పనులకు నెల రోజుల క్రితం నియమించుకుని రూ. 3వేల జీతం ఇస్తామన్నారని వివరించారు. ప్రస్తుతం తమ మేడమ్ క్యాంపునకు వెళ్లారని వెల్లడించారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు వంద మంది రైతులు, అనుచరులతో సంప్రదింపులు జరిపిన బుల్లెట్ రాణి స్థానికుల సాయంతోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు. -
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
పిడుగురాళ్లటౌన్: అధికారమే ఆయుధంగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. పల్నాడులోని సీనియర్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండలంలోని కోనంకి గ్రామ పరిధిలో ఉన్న సీతారాంపురం మైన్స్ ముగ్గురాయిని అక్రమంగా తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అడ్డగోలుగా భారీ పేలుళ్లు జరుపుతూ, భూగర్బాన్ని చీలుస్తూ ముగ్గురాయిని బహిరంగంగా తరలిస్తున్నా మైనింగ్శాఖా పట్టించుకోవడంలేదు. పేలుళ్ల ధాటికి సమీపంలోని పులిచింతల పునరావాస కేంద్రం వణికిపోతుంది. పక్కనే ఉన్న రైల్వేట్రాక్కు కూడా ప్రమాదం పొంచివుంది. పులిచింతల కాలనీలో, కొండమోడు గ్రామంలో ఉండలేమంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. అనుమతి లేకున్నా విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి ఏటా ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.15కోట్లు గండికొడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిడుగురాళ్ల శివారు కొండమోడు గ్రామ సమీపంలో ఉన్న సుమారు 630 ఎకరాల భూములను గతంలో ఏసీసీ లీజుకు తీసుకుంది. గడువు పూర్తి కావడంతో 30 ఏళ్ల కిత్రం ఆ భూములను రెవెన్యూ శాఖకు అప్పగించి వెళ్లింది. ఆ రోజు నుంచి అక్రమార్కుల కన్ను ఆ క్వారీ భూములపై పడింది. ఆ భూముల్లో విలువైన ముగ్గురాయి నిక్షేపాలు ఉన్నాయని గ్రహించి కొద్ది కొద్దిగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. అయితే అధికారం మారటంతో ముగ్గురాయి క్వారీలపై ఓ ప్రజాప్రతినిధి చూపుపడింది. వెంటనే తెలుగు తమ్ముళ్లకు ముగ్గురాయి క్వారీని సొంతం చేసుకోమని ఆదేశించారు. అప్పటికే సీతారాంపురం మైన్స్లో లీజు పొందిన వారిని బెదిరించి క్వారీ గుంతలలోకి రాకుండా చేశారు. ప్రభుత్వం తమదంటూ, ప్రభుత్వ భూములు తమకే చెందుతాయంటూ క్వారీ భూముల్లో తవ్వకాలు ప్రారంభించారు. ఒక్కొక్క ట్రాక్టర్కు రూ.1000 వసూలు చేస్తూ ప్రతిరోజు వందల ట్రాక్టర్ల ద్వారా ముగ్గురాయిని తరలిస్తున్నారు. నిత్యం ట్రాక్టర్కు 4 టన్నుల చొప్పున 60 ట్రాక్టర్ల ద్వారా రోజుకు 300 ట్రిప్పులు ముగ్గురాయిని తరలిస్తూ రోజుకు రూ.3లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నారు. ఈ లెక్క చొప్పున నెలకు రూ.3కోట్లు, ఏడాది రూ.15కోట్లకుపైగా అక్రమంగా ఆర్జిస్తున్నారు. రూ. 10వేల జీతం ఇస్తూ 20 మంది యువకులను మీడియా, ప్రతిపక్ష నాయకులు రాకుండా క్వారీ ప్రాంతంలో కాపలాగా పెట్టడం విశేషం. అనుమతులు లేకుండా భారీ పేలుళ్లు జరుపుతున్నా పట్టించుకునే నాథుడేలేడు. పేలుళ్ల ధాటికి సమీపంలో ఉన్న పులిచింతల పునరావాసకేంద్రంలోని గృహాలు దెబ్బతింటున్నాయి. వందల ట్రాక్టర్లు నిత్యం పునరావాస కేంద్రం గుండా తిరుగుతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నా ప్రశ్నించే అధికారే కరువయ్యారు. ఈ విషయమై నిర్వాసితులు మైనింగ్శాఖకు, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులకు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులకు ఫిర్యాదు చేసినా కన్నెత్తి చూడటంలేదు. ఎటువంటి అనుమతులు లేకుండా ముగ్గురాయిని తరలిస్తున్నా మొన్నటి వరకు పట్టించుకున్న అన్నిశాఖలు ఇప్పుడు మొద్దునిద్ర నటిస్తున్నాయి. -
మైనింగ్ గద్దలు
-
'ఎమ్మెల్యే అండతోనే మైనింగ్ మాఫియా'
కృష్ణాజిల్లా : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అండతోనే టీడీపీ నాయకులు మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ధనాన్ని అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నా రెవెన్యూ యంత్రాంగం కళ్లు కనిపించటం లేదా ? అని ప్రశ్నించారు. చిక్కవరం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో తొలగించిన విగ్రహాలను తిరిగి నెలకొల్పే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అండదండలతోనే టీడీపీ నేతలు విగ్రహాలను తొలగించారన్నారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. గత రెండురోజుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని విజయవాడ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేస్తానని పద్మశ్రీ చెప్పారు. -
మైనింగ్కు అడ్డాగా మారిన చిత్తూరు జిల్లా
-
గుట్టపై మైనింగ్ మాఫియా కుట్ర
-
మైనింగ్ కోసమే మట్టుబెట్టారా?
- ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన మైనింగ్ మాఫియా - దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఎన్కౌంటర్ సాక్షి, హైదరాబాద్: ఏఓబీలో మావోయిస్టులను మట్టుబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం దీర్ఘ కాలిక ప్రణాళిక రచించిందా? బాక్సైట్ మైనింగ్కు అడ్డుగా నిలుస్తున్నందునే అడ్డు తొలగించుకునే వ్యూహాన్ని అమలు చేసిందా? ఏఓబీపై పూర్తి స్థాయి పట్టు సాధించిన మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ని రెండేళ్లుగా వెంటాడుతోందా? ఏఓబీ ఎన్కౌంటర్ను విశ్లేషిస్తున్న వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మరణించినవారిలో ఏఓబీ నేత, భూపాల్పల్లి జిల్లా (పాత వరంగల్) టేకుమట్ల మండలం (పాత చిట్యాల) వెలిశాలకు చెందిన గాజర్ల రవి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ముఖ్య నాయకులు కోసం పోలీసు బలగాలు రెండేళ్లుగా వేట మొదలు పెట్టాయని తెలుస్తోంది. మైనింగ్ మాఫియా ఒత్తిడి? ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2000లోనే దుబాయ్కి చెందిన ఒక మైనింగ్ కంపెనీకి 2 వేల ఎకరాలను ధారాద త్తం చేసేందుకు ప్రయత్నించారు. అయితే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామ సభ అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపట్టే వీల్లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా (సమతా వర్సెస్ ఏపీ స్టేట్) స్పష్టంగా చెప్పింది. దీంతో నాటి సీఎంగా చంద్రబాబు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలతో మాట్లాడి.. గ్రామసభ అనుమతి అక్కర్లేదన్న రాజ్యాంగ సవరణ తీసుకువచ్చే యత్నం చేశారని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, కోస్టల్ కారిడార్, కొవ్వాడ వజ్రాల గనులు, బాక్సైట్ గనులు, శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన 8 పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలంటే ఏఓబీలో అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను మట్టుబెట్టాలన్న వ్యూహాన్ని రచించినట్లు చెబుతున్నారు. మైనింగ్ మాఫియా కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? ఏఓబీ ఎన్కౌంటర్కు ‘ఫుడ్ పాయిజనింగ్’ కూడా కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మిన వారే ఆహారంలో విషం పెట్టడం ద్వారా గతంలో మానాల, రాచకొండ, పామేడు, పూపర్తి, అందుగుల మేధి సంఘటనలు జరిగాయని చెబుతున్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా మైనింగ్ మాఫియా, అక్రమార్కుల ఆగడాలను నిరోధిస్తామని పరిశ్రమలు, మైనింగ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇసుక రీచ్ల నుంచి ఇసుకను కేటాయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు సౌకర్యం ఉండేలా.. సామాన్యుడి సొంత ఇంటి కలకు సహకారం అందించేలా.. రాష్ట్ర నూతన మైనింగ్ పాలసీ ఉంటుందన్నారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు సంబంధించిన అంశాలపై శుక్రవారం మంత్రి కేటీఆర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా రవాణా చేసే లారీలను సీజ్ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి.. ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా జిల్లాల్లోని ఇంజనీరింగ్ విభాగం సిబ్బందితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ సెల్: ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు మొబైల్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ బృందాలన్నింటినీ పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ‘ఎన్ఫోర్స్మెంట్ సెల్’ ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్ లోడింగ్ సమస్యను అరికట్టేందుకు వేబ్రిడ్జిల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మైనింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, టీఎస్ఎండీసీ ఎండీ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో ఇసుక దందా, భూకబ్జాలు సిఫార్సులతో టెండర్లు దక్కించుకుంటున్న అక్రమార్కులు నిలువరించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు, యంత్రాంగం టీడీపీ నేతల దురాగతాలను నిలువరించలేని దుస్థితిలో అధికార యంత్రాంగం కూరుకుపోతోంది.. పెచ్చరిల్లుతున్నభూ దందాలు, సివిల్ సెటిల్మెంట్లు, ఇసుక రీచ్ అక్రమాలతో అధికారుల తలలు బొప్పికడుతున్నాయి..ప్రభుత్వ శాఖలు నిర్వహించే టెండర్లలోనూ తెలుగు తమ్ముళ్లు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎవరికీ చెప్పుకోలేక.. బయటపెట్టలేక మల్లాగుల్లాలు పడుతున్నారు. కొంతమంది ఇక్కడి నుంచి బదిలీ చేయించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అన్యాయానికి, దోపిడీకి గురైన బాధితులు టీడీపీ నేతల అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, వారికి సహకారం అందించిన అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లే శిరోభారంగా ఉంటే.. మరోవైపు కోర్టుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని అధికారులు వాపోతున్నారు. గుంటూరు/ విజయవాడ: జిల్లాలోని తెనాలి, పొన్నూరు, సత్తెనపల్లి, గురజాల, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు భూ దందాలు, సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. రాత్రికి రాత్రి పంట పొలాలు, స్థలాలు కబ్జా చేయడం, అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం వంటి సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన బాధితులు తమకు జరిగిన నష్టాన్ని జిల్లా యంత్రాంగానికి వివరించినా, ఫలితం ఉండటం లేదు. వెంటనే విచారణ జరిపిస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రంచూపడం లేదు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయడం కంటే న్యాయస్థానాలను ఆశ్రయించడమే మేలనే అభిప్రాయానికి బాధితులు వస్తున్నారు. ఆగడాలు.. అరాచకాలివీ.. ముసునురు మండలంలో తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తరలించడానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో ప్రయాత్నించగా స్థానిక తహశీల్దార్ వనజాక్షి సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే, అతని అనుచరులు తహశీల్దార్పై దాడిచేశారు. ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరిపై కూడా దాడి జరిగింది. కైకలూరు అటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమ గోదావరి కోమటిలంక వరకు ఉన్న కోల్లేరు చెరువు గట్టుపై చింతమనేని రబ్బిస్తో చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీ శాఖాధికారులపై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. వార్తను కవర్ చేయడానికి వెళ్లిన విలేకరులను బెదిరించారు. పొన్నూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని కొన్ని గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించలేదు. సత్తెనపల్లి నియోజకవర్గం దూళిపాళ్లలోని 17 ఎకరాల వ్యవసాయ భూమి దురాక్రమణలో టీడీపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు బాహాటంగా వినపడటమే కాకుండా కోళ్ల ఫారాలను కూల్చివేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించినా, పోలీస్ యంత్రాంగం ప్రేక్షకపాత్రే వహించింది.. ఈ ఘటనకు ఐదారు గంటల ముందు వైఎస్సార్కాంగ్రెస్ నేతలు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్ అక్కడి పరిస్థితులను వివరించి, శాంతి భద్రతలు కాపాడాలని రూరల్ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే కోళ్ల ఫారాల కూల్చివేతను నిలువరించే అవకాశం ఉండేది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ నేతలు నియమించిన ప్రైవేటు సైన్యం ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు సృష్టించారు. ఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా నిందితులను ఇంత వరకు గుర్తించలేకపోయింది. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించినా అక్రమ మైనింగ్ కొనసాగుతూనే ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోవడంతో కొందరు వ్యాపారులు అక్కడి క్వారీలను వదిలేసి ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. ‘కలం’పైనా దాడి.. చిలకలూరిపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను పత్రికాముఖంగా బయటపెడుతున్నాడనే అక్కసుతో అక్కడి ‘సాక్షి’ విలేకరి మానుకొండ సురేంద్రపై వారం రోజుల క్రితం కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. దాడి వెనుక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి తేనే వెంకాయమ్మ ఉన్నారని సదరు విలేకరి యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి, ఆయన సతీమణి పేర్లను తీసివేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ అక్కడి పోలీసులు మంత్రికి మద్దతు పలకడం కొసమెరుపు. జర్నలిస్టు సంఘాలు విలేకరికి మద్దతుగా నిలవడంతో ఎఫ్ఐఆర్లో వారి పేర్లను నమోదు చేశారు. రాజధాని నేపథ్యంలో గుంటూరు రూరల్ పరిధిలోని నివేశన స్థలాలకు డిమాండ్ ఏర్పడటంతో పలువురు టీడీపీ నేతలు స్థలాల అక్రమణలు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం పరిపాటిగా మారింది. బాధితులు వీరిపై ఫిర్యాదు చేసినా, సివిల్ కేసుల విషయంలో మా జోక్యం ఉండదని, న్యాయస్ధానాన్ని ఆశ్రయించాలనే చిన్నపాటి సలహా ఇచ్చి అక్రమణదారులకు మద్దతుగా నిలుస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల టెండర్లనూ టీడీపీ నేతలే దక్కించుకుంటున్నారు. రూ.10 లక్షల విలువ చేసే పనులను నామినేషన్పై ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో వాటిని సిఫారసులతో కార్యకర్తలు దక్కించుకుంటున్నారు. దీనితో కంట్రాక్టర్లకు పనులు లభించక ఇబ్బందులు పడుతున్నారు. -
ఎత్తులు.. చిత్తులు
సాక్షి, హన్మకొండ : మల్లంపల్లి మైనింగ్ మాఫియా సంచనాలకు కేంద్రంగా మారుతోంది. హింసాత్మక సంఘటలు, అవినితీ వ్యవహరాలతో ఇటీవల మల్లంపల్లి చర్చనీయాంశంగా మారింది. మైనింగ్ కంపెనీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు చిలికిచిలికి గాలివానగా మారింది. సహాజవనరులను ఇష్టారీతిగా కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు చూసీ చూడనట్లుగా వ్యవహారిస్తున్నాయి. మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ భవనాలకు వెనకవైపు ఎస్సారెస్పీ కాలువ సమీపంలో 15 కంపెనీలు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మైనింగ్లో తవ్విన ఎర్రమట్టిని తరలించడనికి సరైన రోడ్డు మార్గం లేదు. ఎర్రమట్టిని తరలించేందుకు అటవీశాఖ భూముల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో అటవీశాఖ అధికారుల చేతులు తడిపి ఫారెస్టు భూముల నుంచి లారీలను నడిపించారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ ఓ ఫారెస్టు రేంజి అధికారి ఎర్రమట్టి రవాణాకు దారి అనుమతి లేదంటూ కొన్నాళ్ల పాటు లారీలను అడ్డుకున్నాడు. ఇక్కడి మైనింగ్ కంపెనీల మధ్య వ్యాపార సంబంధమైన పోటీని ఆసరగా చేసుకుని ఎక్కువ ముట్టచెప్పిన వారికే అనుమతి ఇస్తానంటూ బేరం పెట్టాడు. చివరికి కొందరు మైనింగ్ వ్యాపారులు బృందంగా ఏర్పడి సుమారు రూ.12 లక్షలు సదరు అధికారికి సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కరికే అనుమతి సిన్సియర్ అధికారిగా కలరింగ్ ఇచ్చి మైనింగ్ మాఫియాలో ఒక వర్గాన్ని తన దారిలోకి తెచ్చుకుని బహుమతి అందుకున్న అధికారి తీరులో మార్పు వచ్చింది. తనకు నజరాన ముట్టచెప్పిన కంపెనీల వ్యాపారం చక్కగా సాగేందుకు అటవీ భూమికి పక్కన ఉన్న రైతుల నుంచి స్థలాలను కొన్నట్లుగా సుమారు 15 ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలను అవినీతి ఫారెస్టు అధికారి సృష్టించినట్లుగా తెలుస్తోంది. నెలవారీగా రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు ముడుపులు అందుతుండటంతో ఈ విషయం బయటకు రావడంలేదు. కొందరు వ్యాపారుల లారీలకు అనుమతి ఇచ్చి.. మిగిలిన మైనింగ్ కంపెనీల రవాణాను అడ్డుకోవడంతో ఇక్కడ మైనింగ్ వ్యాపారుల మధ్య పోరు మొదలైంది. ఫారెస్టు అధికారి అండతో తమ వ్యాపారాలను అడ్డుకుంటున్న ఎదుటి వర్గం ఆట కట్టించేందుకు వీరు గట్టిగానే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కోవలోనే ఇటీవల జిల్లాలో సంచనాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదేతీరు జాతీయ రహదారి(163) నుంచి మల్లంపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో నుంచి మైనింగ్ కార్యకలాపాలకు అటవీశాఖ అడ్డదారి చూపింది. అటవీభూమి కంపార్ట్మెంట్ నెంబర్ 599, 600ల నుంచి క్వారీలకు వందలాదిగా లారీలు వచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇదేమంటే సదరు భూ భాగాన్ని సోషల్ ఫారెస్ట్కు లీజుకు ఇచ్చారని.. దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్లదేనంటూ అటవీశాఖ సెలవిస్తోంది. ఎర్రమట్టి లోడుతో వెళ్తున్న భారీ వాహనాలు ఎస్సారెస్పీ కాలువ మీదుగా వెళ్తున్నాయి. దీంతో కాలువ కుంగి పోతోందని రైతులు పేర్కొంటున్నారు. ఓవర్లోడ్లతో లారీలు వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఓవర్లోడు వాహనాల వల్ల మల్లంపల్లి నుంచి రాంచంద్రాపురం వరకు రోడ్డు అడుగుకో గుంత అన్న పరిస్థితి ఉంది. నిత్యం లారీల రద్దీతో పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి, మిరప తోటలపై ఎర్రని దుబ్బ అలముకుని మొక్కలు చనిపోతున్నాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక ప్రతీ ఏటా ఇబ్బందులు పడుతున్నా... ఎవరూ పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఈ విషయంలో పలుసార్లు అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. పచ్చని చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ చేయాల్సిన సోషల్ ఫారెస్ట్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మైనింగ్ను అరికట్టాల్సిన అవసరముంది. -
నీకింత... నాకింత...నిబంధనలు మనకెంత?
గుంటూరు జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే బంధువుల గ్రావెల్ దందా సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో మైనింగ్ మాఫియా విజృంభిస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేల అండదండలతో సున్నపురాయి మొదలు ఇసుక, మట్టి(గ్రావెల్).. ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు. ఇందుకు నిబంధనలను తోసిరాజని అధికారులు కూడా సహకరిస్తున్నారు. అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. గుంటూరు డీపీఓ నుంచి ఉత్తర్వులు.. మంగళగిరి సమీపంలో కాజ, గుంటూరును ఆనుకుని ఉండే సుద్దపల్లి, శేకూరు గ్రామాల్లోని 142.73 ఎకరాల ప్రభుత్వ భూముల్లో మట్టి(గ్రావెల్)ని తవ్వుకునేందుకు ఏకంగా గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) అనుమతులిచ్చేశారు. కలెక్టర్ ఉత్తర్వులననుసరించి ఈ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు డీపీఓ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. గుంటూరు జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే బంధువులు ఈ అనుమతులు పొందడం గమనించాల్సిన అంశం. డీపీఓ ఇచ్చిన అనుమతి పత్రాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు తమ్ముళ్లు భారీఎత్తున గ్రావెల్ తవ్వి దోపిడీకి తెరతీశారు. క్యూబిక్ మీటర్ గ్రావెల్కు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.330 ధర ఉంది. ట్రాక్టరుకు(మూడు క్యూబిక్ మీటర్లు) రూ.వెయ్యి, లారీకి(ఆరు క్యూబిక్ మీటర్లు) రూ.2 వేల వరకు వసూలు చేస్తూ కోట్లల్లో జేబులు నింపుకుంటున్నారు. క్వారీ లీజులకు నిబంధనలివీ... సాధారణంగా మైనింగ్, క్వారీ లీజులు పొందేందుకు సంబంధించిన నిర్దిష్ట విధివిధానాలపై ప్రభుత్వం 2013లో జీవో నంబరు 2 జారీచేసింది. దీనిప్రకారం జిల్లా స్థాయి కమిటీ సమావేశమై అనుమతులకు సంబంధించి మైనింగ్ డెరైక్టర్కు సిఫారసు చేయాలి. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, మైనింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్గా, జాయింట్ కలెక్టర్, సంబంధిత ఆర్డీవో, కాలుష్య నియంత్రణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా ఫారెస్ట్ అధికారి, సంబంధిత తహశీల్దారులు సభ్యులుగా ఉండే ఈ స్క్రూటినీ కమిటీకి క్వారీ తవ్వకాలకు సంబంధించి సిఫారసు మాత్రమే చేసే అధికారముంది. క్వారీ అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారికి నిరభ్యంతర పత్రమిచ్చేందుకు దానికి ఎలాంటి అధికారం లేదు. దరఖాస్తు చేసుకున్న భూముల్ని కమిటీ పరిశీలించి నివేదికను మాత్రమే మైనింగ్ డెరైక్టర్కు పంపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడేం చేశారంటే.. కాజ, సుద్దపల్లి, శేకూరు గ్రామాల్లో మొత్తం 142.73 ఎకరాల్లో గ్రావెల్ను వెలికితీసేందుకు అధికారపార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే బంధువులు దరఖాస్తు చేసుకున్నారు. కాజలో 95.27 ఎకరాల్లో, శేకూరులో 7.30 ఎకరాల్లో, సుద్దపల్లిలో 40.16 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులు కోరారు. అయితే కమిటీ పరిశీలనలో లేకుండానే కలెక్టర్ నోటు ఉత్తర్వుల ప్రకారం వీరికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు డీపీఓ జూన్ 23న ఉత్తర్వులివ్వడం గమనార్హం. సర్వే నంబర్లుసహా ఏ గ్రామాల్లో తవ్వకాలకు అనుమతి ఇస్తున్నారో కూడా స్పష్టం చేయలేదు. ఒకవైపు సదరు మూడు గ్రామపంచాయతీలు తమ గ్రామాల్లో గ్రావెల్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏకంగా తీర్మానాలు చేసినా పట్టించుకోలేదు. కాగా దరఖాస్తుదారులు దరఖాస్తు నంబరును పొందుపరచకపోగా.. దాన్ని ‘నిల్’ అని పేర్కొన్నారంటే అడ్డగోలు అనుమతుల మంజూరు ఏవిధంగా ఉందో విదితమవుతోంది. కమిటీలో పంచాయతీల తరఫున నివేదిక ఇవ్వాల్సిన డీపీఓనే ఏకంగా అనుమతి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఉన్నతాధికారులు సైతం తప్పుపడుతున్నారు. అనుమతులిచ్చిన భూముల్లో ఎంతమేరకు గ్రావెల్ ఉందో.. మైనింగ్ ఏడీ నివేదికివ్వాలి. భూములకు సంబంధించిన సమాచారాన్ని తహశీల్దారు కలెక్టర్కు నివేదించాలి. ఇవేవీ లేకుండానే డీపీఓ అనుమతులివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ సదరు డీపీఓపై ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ను తప్పుదోవ పట్టిస్తూ అనుమతులిచ్చారనే ఆరోపణలున్నాయి. -
బతుకులు బుగ్గి
♦ ‘క్వారీ కోరల్లో పచ్చని పొలాలు ♦ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు ♦ పేలుళ్లకు బీటలువారుతున్న ఇళ్లు ♦ అనారోగ్యాల పాలవుతున్న జనం ఒకప్పుడు పచ్చని పొలాలు...చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గ్రామాలు ఉండేవి. ఊట, కొండగెడ్డల నీటితో పంటలతో కళకళలాడే ఆ గ్రామాల్లో కొంతకాలంగా అలజడి మొదలైంది. క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు ఏ రాయి నెత్తిన పడుతుందోనన్న భయం...ఊటనీరురాక ఏటా ఎండిపోతున్న పొలాలు...చివరికి గ్రామాలనే ఖాళీచేసి వెళ్లిపోదామనే దుస్థితి. చోడవరం : వ్యవసాయమే ఆధారంగా ఉండే గ్రామాల్లో ఇప్పుడు మైనింగ్ మాఫియా కోరలు చాస్తోంది. కొండలు, గుట్టలు పేల్చి సొమ్ముచేసుకుంటున్న కొందరు పచ్చని పొలాలను బుగ్గిపాలు చేస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నాయకుల అండదండలతో కొండలను ఆక్రమిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి,చెరకు, అపరాలు పండించే మాడుగుల, చోడవరం, అనకాపల్లి, రావికమతం, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, నర్సీపట్నం, మాకవరంపాలెం ప్రాంతాలు ఇప్పుడు క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. మాడుగుల మండలం ఎం.కృష్ణాపురం,ఎరుకువాడ, చింతలూరు, విజెపురం, కె.కోటపాడు మండలం దాలివలస, పిండ్రంగి, రావికమతం మండలంలో మరుపాక, కొట్నాబిల్లి, అనకాపల్లి మండలంలో మార్టూరు, బవులవాడ, దర్జీనగర్, శంకరం, మామిడిపాలెం గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. క్వారీల వల్ల గ్రామాల్లో ప్రజలు వ్యవసాయం కోల్పోయి, ఊరులోకి ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని బండరాళ్ల మధ్య, దుమ్ముదూళి మింగేస్తూ అనుక్షణం ఆందోళనతో జీవిస్తున్నారు. ఒకప్పుడు ఈ గ్రామాలు నిత్యం పంటలతో కళకళలాడుతూ ఉండేవి. క్వారీలు పెరిగిపోవడంతో కొండ ఊటగెడ్డలన్నీ మూసుకుపోయాయి. ఇలా నీటి సౌకర్యం లేక ఈ ప్రాంతాల్లో 20శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మాడుగుల మండలం కృష్ణాపురం కొండ నుంచి ఊటగెడ్డల్లో నిత్యం నీరు పారేది. పంటలు బాగా పండేవి. అటువంటి ఈ గ్రామం ఇప్పుడు పంటలు నాశనమై, క్షణక్షణం భయం గుప్పెట్లో బతకాల్సిన దుస్థితి. ఈ గ్రామం సమీప కొండలో నల్లరాయి ఉండటంతో ఒకే అనుమతితో ఇక్కడ పదుల సంఖ్యలో క్వారీలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో రాజులకాలం నుంచి ఉన్న తాగునీటి కోనేరును సైతం క్వారీ యజమానులు కప్పేశారు. కొండ నుంచి పంట కాలువలకు వచ్చే నాలుగు ఊటగెడ్డలనూ కప్పేయడంతో సుమారు 200ఎకరాలకు సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. వీరవిల్లి అగ్రహారం శివారు ఎరుకువాడపై గ్రానైట్ క్వారీ ఉంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేస్తున్నారు. ఆ సమయంలో పెద్దపెద్ద రాళ్లు పచ్చని పొలాల్లోకి పడి పంటలు నాశమైపోతున్నాయి. కె.కోటపాడులో క్వార్జ్ రాయి క్వారీలు, మరుపాక, కొట్నాబిల్లి గ్రామాల్లో నల్లరాయి మెటర్ క్వారీల్లో అక్రమ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి. గంధవరం సమీపంలో కొండపై అక్రమ బ్లాస్టింగ్లు చేస్తున్నారు. ఇక చోడవరం-అనకాపల్లి రోడ్డులో అయితే చెప్పనక్కరలేదు. ఈ రోడ్డులో గంథవరం నుంచి తుమ్మపాల వెళ్లేవరకు దారిపొడవునా ధన్..ధన్ అంటూ కొండలు నిత్యం పేలుతూనే ఉంటాయి. నిత్యం రాయి క్రషింగ్తో బుగ్గి ఆయా గ్రామాలను, పంటలను ఆవరిస్తోంది. వాతావరణం పూర్తిగా కలుషితమై పంటలు నాశనమవుతున్నాయి. వరి,చెరకు, కంది, ఆపరాల పంటలతోపాటు మామిడి, జీడి తోటలు ఈ బూడిదపడి ఎర్రగా మారిపోయి దిగుబడి తగ్గిపోతోంది. క్రషర్బుగ్గితో చిన్నారులు, వృద్ధులు తరుచూ ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా కిడ్నీల వ్యాధులకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ఐదేళ్లలో సుమారు 100 మంది వరకు కిడ్నీల వ్యాధికి గురయ్యారంటే కమ్ముకున్న ఈ కాలుష్యం ప్రజాఆరోగ్యాన్ని ఎలా క బళిస్తోందో అర్ధమవుతుంది. పేలుళ్ల శబ్ధాలకు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. ఎం. కృష్ణాపురం, మార్టూరు, బవులవాడ గ్రామ ప్రజలైతే ఒక దశలో గ్రామాలనే వదిలిపోవాలా... అంటూ ఆందోళనలు సైతం చేపట్టిన సంఘటనలు ఉన్నాయి.అక్రమ బ్లాస్టింగ్లకు ఐదేళ్లల్లో 18మంది వరకు మృతిచెందారు. అనేక మంది శరీర అవయవాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ బ్లాస్టిం గ్లు నిరువరించడంతోపాటు క్రషర్ల నుంచి దు మ్ము బయటికి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఉన్న క్వారీల లీజను రద్దుచేయడంతోపాటు కొత్తక్వారీలకు అనుమతి ఇవ్వకుండా చూడాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
చెరువుకు ముప్పు తప్పదా?
ఇబ్రహీంపట్నం: మండలంలో 1000 ఎకరాలకు పైబడి భూములకు సాగునీరందించే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఉనికికి ముప్పు పొంచి ఉంది. దురాక్రమణలు, రియల్ మాఫియా, మైనింగ్ మాఫియా, అధికారయంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటం ఇబ్రహీంపట్నం చెరువు ఉనికికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. వర్షాలు లేకపోవడం వల్లనే చెరువు నిండటంలేదని అనుకుంటున్నా వర్షాలు కురిసినా చెరువులోని నీరురావడం అంత సులువుకాదన్నది నిజం. రైతులకు నాటి భరోసా ఏదీ? ఇబ్రహీంపట్నం చెరువు పూర్తిస్థాయిలో నిండితే కొన్ని సవంత్సరాలు కరువుఛాయలు దరిచేరవని రైతాంగంలో భరోసా ఉండేది. చెరువులోని నీరు సం వృద్ధిగా చేరితే సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు, ప్రజల్లో గతంలో నమ్మకం ఉండేది. ఆ భరోసా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి లేదు. కబ్జాకోరల్లో చెరువు రియల్టర్లు, మైనింగ్ మాఫియా ఇష్టానుసారం రెచ్చిపోవడంతో ఇబ్రహీంపట్నం చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. 800 ఎకరాల్లో ఉన్న చెరువు ప్రధాన నాలాలు, వాగులు పరాధీనం అవుతున్నాయి. దీంతో 47 గొలుసు చెరువులకు ప్రాణాధారమైన వనరులన్నీ హరించుకుపోతున్నాయి. ప్రధానంగా 85 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఫిరంగి నాలా అన్యాక్రాంతం అరుుంది. షాబాద్ మండలం చందన్వెల్లి మీదుగా ప్రారంభం అయ్యే ఈ నాల చేవెళ్ల, సరూర్నగర్, శంషాబాద్ మండలాల మీదుగా ఆదిబట్లద్వారా ఇబ్రహీంపట్నం చెరువులోకి వచ్చిచేరుతుంది. ఈ నాలాను ప్రస్తుతం ఆక్రమించడం, పూడిపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. తాజాగా చెరువులో సైతం అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. చెరువు నిండితే పండగే: పోచారం వాగులో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు, ఫిరంగి నాలా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపితే ఇక్కడి రైతాంగం కళ్లలో ఆనందంచూడొచ్చు. ఇబ్రహీంపట్నం తూర్పుభాగంతోపాటు మంచాల, హయత్నగర్, సంస్థాన్ నారాయణ్పూర్, చౌటుప్పల్ మండలాల్లోని వందగ్రామాల రైతాంగం, ప్రజలకు సాగు, తాగునీరు కు ఈచెరువు ఆధారం. వర్షాభావ పిరిస్థితులు, చెరువు నుంచి నీటి విడుదల అయ్యేమార్గం లేకపోవడంతో ఆయకట్టు భూముల్లో కంపచెట్లు మొలకెత్తున్నాయి. -
బళ్లారి గనుల కార్మికులను ఆదుకోండి
మైనింగ్ కార్యకలాపాలు జాతీయ చేయాలని డిమాండ్ గనుల కార్మికుల నిరాహార దీక్షలు బళ్లారి టౌన్ : బళ్లారి జిల్లాలో మైనింగ్ నిషేధం అనంతరం వీధిన పడిన 25 వేల మంది కార్మికులను ఆదుకోవాలని జిల్లా గని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీహెచ్.పూజార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సతీష్, జిల్లాధ్యక్షుడు ఆర్.మానసయ్య తదితరులు మాట్లాడుతూ జిల్లాలో మైనింగ్ కార్మికులు వీధిన పడిన విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ఇంత వరకూ స్థానిక జిల్లా ఇన్చార్జ్ మంత్రి గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించలేదన్నారు. మైనింగ్ కార్యకలాపాల నిషేధం అనంతరం సుప్రీంకోర్టు సీఈసీ సిఫార్సుల అమలు కోసం నియమించిన మానిటరింగ్ కమిటీ ఫునర్నిర్మాణం, ఫునర్వసతి పథకం అమలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గనుల మాఫియా ఆక్రమణలు, గనుల సంగ్రహణ వంటి భారీ మొత్తం వసూళ్లు కనీసం ప్రగతి సాధించలేదన్నారు. అంతేగాక అక్రమ మైనింగ్కు పాల్పడిన వీఎస్.లాడ్ సన్స్ కంపెనీ, అనిల్ లాడ్, ఆయన భార్య ఆర్తి గౌతం ఆరాని, బీఎంఎం దినేశ్సింగ్, ఎంఎస్పీఎల్ రావు బల్డోటా, టీఎంసిడబ్ల్యూ వినోద్ గోయల్తో పాటు 50 మందిపై సీబీఈ 22 కేసులు నమోదు చేసిందని, వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు. కార్మిక శాఖ చట్టాలను ఉల్లంఘించి పలు మైనింగ్ కంపెనీలు కార్మికుల వేతనాలు, భవిష్యనిధి, సెటిల్మెంట్ చేయలేక ఐదువేల కుటుంబాల కడుపులు కొట్టారని విమర్శించారు. వీటన్నింటి విషయంలో కార్మికులకు న్యాయం చేకూరేదాకా పోరాటాలు మానేది లేదన్నారు. ప్రస్తుతం జరగనున్న విధానసభ సమావేశంలో వీటన్నిటిపై చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. అనంతరం ‘గనుల మైనింగ్ను జాతీయం చేయాలి. మైనింగ్ కాలాపాలలో పాల్గొన్న కార్మికులను పర్మినెంట్ చేయాలి. కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి. బేలికేరి మైనింగ్ విషయంలో 52 మంది మైనింగ్ మాఫియాలను అరెస్ట్ చేయాలన్న’ ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించారు. కార్యక్రమంలో కేఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, స్థానిక కార్మిక సంఘాల నేతలు వై.గోపి, ఏ.ఎర్రిస్వామి, కాడప్ప తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ మాఫియా ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖనిజం.. మైనింగ్ మాఫియాకు సిరులు కురిపిస్తోంది.. అధికారుల కళ్లుగప్పి మాంగనీస్ వ్యాపారులు సరిహద్దులు దాటిస్తున్నారు.. అనుమతి లేనిచోట తవ్వకాలు జరుపుతూ రూ.కోట్లు గడిస్తున్నారు.. గనులు, రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని దందా కొనసాగిస్తున్నారు.. ప్రభుత్వానికి గండి కొడుతున్నారు.. జిల్లాలో ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీస్(ఐరన్ ఓర్) లభిస్తుంది. సీజన్లవారీగా కంపెనీలు తవ్వకాల అనుమతి, లెసైన్స్, పర్యావరణ అనుమతి పొంది గనుల శాఖ సూచించే కొన్ని షరతులకు లోబడి తవ్వకాలు జరపాలి. లేకుంటే ఆ కంపెనీలకు మాంగనీసు తరలించేందుకు అనుమతిని మైనింగ్ అధికారులు ఇవ్వరాదు. నిబంధనలు తుంగలో తొక్కి కొన్ని కంపెనీలు రూ.కోట్ల విలువ చేసే మాంగనీసును మూడో కంటికి తెలియకుండా రాత్రిపూట సరిహద్దులు దాటిస్తున్నాయి. ఇంకా మైనింగ్ శాఖ పర్యావరణ అనుమతి లేని కంపెనీలకు పర్మిట్లు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది క్రితం ఆదిలాబాద్ నుంచి ఆదిత్య మినరల్స్ పర్మిట్పై రాయల్టీ ఎగవేసి అక్రమంగా రాజస్థాన్కు తరలుతున్న లారీని ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కొంత మంది ప్రాస్పెక్టీవ్ లెసైన్స్(పీఎస్) అనుమతి తీసుకుని 200 టన్నుల మాంగనీసును తవ్వాల్సి ఉండగా వేలాది టన్నులు తవ్వుతూ ఏటా రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకునే భూగర్భగనుల శాఖ అధికారులు అక్రమంగా మైనింగ్ జరుపుతున్న ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్థలున్నాయి. ‘మామూలు’గా తీసుకుంటున్న మైనింగ్ శాఖ ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీసు తవ్వకాల కోసం 16 కంపెనీలకు 12,200 ఎకరాల్లో అనుమతి ఉంది. అయితే చాలామంది వ్యాపారులు పర్యావరణ అనుమతి తీసుకోకుండానే మాంగనీసు తవ్వి తరలిస్తున్నారు. తమకు లీజు ఇచ్చిన స్థలంతోపాటు ప్రభుత్వ, రెవెన్యూ, ఫారెస్టు భూముల నుంచి కూడా అక్రమంగా మాంగనీసు తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయమై పలువురు లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుపై జరిపిన విచారణలో తేలినా ఇప్పటివరకు అక్రమ మైనింగ్కు కళ్లెం పడలేదు. అయితే ఇప్పుడు తవ్వకాలు జరపడం లేదని అధికారులను బుకాయిస్తున్నా, గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యాపారులు 20 రోజులుగా ఆదిలాబాద్ నుంచి తరలిస్తుండంపై పోలీసు, రెవెన్యూశాఖల అధికారులకు ఇటీవలే ఫిర్యాదులు అందాయి. ఇదిలా వుంటే అక్రమ మైనింగ్కు తోడు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బోర్వెల్ మిషన్లతో డ్రిల్చేసి పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తూ మాంగనీసు తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులు, ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తుండటంపై చర్చ జరగుతోంది. అంతేగాకుండా మాంగనీసు తవ్వకాల్లో కొందరు ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదులుతూ ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారు.