net
-
మత్స్యకారుల వలలు తగులబెట్టిన ఫారెస్ట్ అధికారులు
నాగార్జునసాగర్: అనుమతి లేకుండా కృష్ణానది తీరంలో నివాసం ఉండొద్దని అటవీశాఖ అధికారులు మత్స్యకారులను హెచ్చరించి, వారు వేసుకున్న గుడిసెలను తొలగించి వలలను తగులబెట్టారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది తీరం వెంట పుట్టీలనే గృహాలుగా మార్చుకొని గత 50 ఏళ్లుగా 2 తరాల వారు 10 వేల మత్స్యకారుల కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్నాయి. అయితే ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అటవీ అధికారులు తమ గుడిసెలు తొలగించి వలలు తగలబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సుమారుగా రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. -
నెట్ ఆగితే నష్టమే!
సాక్షి, హైదరాబాద్: నిరసనలు, ఆందోళనలు, ఎన్నికలు, మత ఘర్షణలు, చివరకు పరీక్షల సమయంలో సమాచారం, సందేశాల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రాంతాల వారీగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, సామాజిక మాధ్యమాలను స్తంభింప జేయడం ఇటీవలి కాలంలో సాధారణ విషయమై పోయింది. రాష్ట్రం, దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతోంది. 2024లో 88,788 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు, సామాజిక మాధ్యమాలు స్తంభించడంతో 60.48 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం పడినట్లు అంచనా. 28 దేశాల ఆర్థిక రంగంపై రూ.68,319 కోట్ల మేర ప్రభావం చూపించగా..మన దేశంలో రూ.279 కోట్ల మేర 6.77 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించినట్లుగా లెక్కలు వేశారు.ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉండగా పొరుగు దేశం పాకిస్తాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మయన్మార్ రెండు, బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ‘ఎక్స్’, టిక్టాక్, సిగ్నల్ అత్యధిక గంటల పాటు స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ నిలిపివేత డిజిటల్ ఎకానమీ, టూరిజం, స్టార్టప్ రంగాలపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే విద్య, టెలీమెడిసిన్తో పాటు అత్యవసర సేవలపైనా ప్రభావం చూపుతోంది.పలు సంస్థల సూచికలు పరిగణనలోకి.. ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాల ద్వారా జరిగే నష్టాన్ని ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ), యూరోస్టాట్, యూఎస్ సెన్సస్ తదితర సంస్థల సూచికలను ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం, సోషల్ మీడియా స్తంభన, ఇంటర్నెట్ స్పీడ్ను 2జీ స్థాయికి తగ్గించడం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ నిలిపివేత, సామాజిక మాధ్యమాలను స్తంభింప చేసేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలను ఒక రకంగా ఇంటర్నెట్ సెన్సార్షిప్గా భావించవచ్చు.⇒ గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ⇒ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై రైతుల దాడి నేపథ్యంలో.. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నవంబర్ 12న దుద్యాల ప్రాంతంలో కొద్ది గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.⇒ గత ఏడాది నవంబర్లో మత ఘర్షణలతో పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో, రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో ఉత్తర్ప్రదేశ్లోని సంభాల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేశారు. డిసెంబర్లో రైతుల నిరసనల నేపథ్యంలో హరియాణాలోని అంబాలాలో, జాతి ఘర్షణలు చెలరేగుతున్న మణిపూర్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.తరచూ స్తంభిస్తున్న ‘ఎక్స్’, ‘టిక్ టాక్’ ప్రాంతాల వారీగానే కాకుండా దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రత, భద్రతకు ప్రమాదం పొంచి ఉందనుకున్న ఖాతాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్లో గత ఏడాది 28 వేలకు పైగా సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయగా ఇందులో ఫేస్బుక్, ‘ఎక్స్’కు సంబంధించినవే సుమారు 10 వేల వరకు ఉన్నాయి.సామాజిక మాధ్యమ ఖాతాల తొలగింపులో.. అభ్యంతరకర సమాచారం ఉన్న యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్కు సంబంధించిన ఖాతాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. తొలగింపునకు గురైన వాటిలో ఎక్కువగా ఖలిస్తానీ అనుకూల సమాచారంతో కూడిన ఖాతాలతోపాటు విద్వేష ప్రసంగాలు, జాతీయ భద్రత, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే రీతిలో ఉన్న ఖాతాలు ఉన్నాయి. -
మెరుగైన నెట్వర్క్లో వొడాఫోన్ఐడియాకు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్ఐడియా 4జీ నెట్వర్క్ అత్యుత్తమ నెట్వర్క్గా గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ నెలలో కంపెనీ మెరుగైన నెట్వర్క్ అందించినట్లు ఓపెన్సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4జీ డౌన్లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియో ప్రసారం, 4జీ వాయిస్ వంటి సర్వీసుల్లో పటిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల బ్యాండ్విడ్త్ అప్గ్రేడ్ చేయడం, 8700 పైగా లొకేషన్లను తమ నెటవర్క్ పరిధిలోకి తీసుకురావడం వంటి తదితర అంశాలు ఇందుకు ఎంతో తోడ్పడ్డాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యుత్తమ 4జీ నెట్వర్క్ అందిస్తున్నందుకుగాను మాకు గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మా నెట్వర్క్ను మరింత పటిష్ఠ పరిచేందుకు, నిరాంటకంగా కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రతిఫలమే ఈ గుర్తింపులు. వినియోగదారులకు ఆటంకంలేని అత్యుత్తమ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆనంద్ దానీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికాలో టిక్టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఓపెన్సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ ప్రకారం..కంపెనీ వినియోగదారులు నవంబర్ నెలలో వేగవంతమైన 4జీ సేవలను ఉపయోగించుకున్నారు.యూజర్లు 17.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని, 4.7 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని అనుభవించారు.వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియోకు సంబంధించి వినియోగదారులకు మెరుగైన సర్వీసు లభించింది.యూజర్లు స్థిరంగా ఈ నాణ్యమైన సేవలను అనుభవించారు.కంపెనీ ఈ గుర్తింపు సాధించేందుకు 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను రెట్టింపు స్థాయిలో అప్గ్రేడ్ చేసింది.ఫలితంగా 5,000కు పైగా లొకేషన్లలో కంపెనీ 4జీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.2000కు పైగా పట్టణాలు, 60 జిల్లాలవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. -
ఆరేళ్లకే యూట్యూబ్ సంచలనం.. 16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద.. ప్రపంచంలోనే సంపన్నుడిగా!
ఈ రోజుల్లో మిలియనీర్ కావాలంటే మాటలు కాదు. బిజినెస్లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉన్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్టైమ్ టీవీ షోలో లీడ్ రోల్లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.అయితే యంగ్ షెల్డన్ అనే సిట్కామ్తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్కామ్లో కనిపించాడు. ఈ సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ముగిసింది.16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..యంగ్ షెల్డన్లో పాత్రకు గానూ ఇయాన్ ఒక ఎపిసోడ్కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్కామ్ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్గా ఎదిగారు. యంగ్ షెల్డన్ సిరీస్తో స్టార్డమ్ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్లో కనిపించాడు. -
నెట్టింట.. ప్రభుత్వ బడులు!
సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది. ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది. 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్నెట్, బీఎస్ఎన్ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది. -
ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా తెలుకునేందుకు ఇంటర్నెట్లో వెతుకుతుంటాం. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జపాన్కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే అధిక ట్రాఫిక్ కలిగిన ఇంటర్నెట్ను సరఫరాచేసి రికార్డు నెలకొల్పారు. ఆప్టికల్ఫైబర్ ద్వారా సెకనుకు 22.9 పెటాబిట్ల డేటాను సరఫరాచేసి రికార్డు సృష్టించారు. అక్టోబర్లో స్కాట్లాండ్లో జరిగిన యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టికల్ కమ్యూనికేషన్లో ఈ పరిశోధన నివేదికను సమర్పించారు. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) సెకనుకు 22.9 పెటాబిట్ల(1 పెటాబిట్ అంటే 10 లక్షల గిగాబిట్లకు సమానం) డేటా ట్రాన్స్మిషన్ రేటును అధిగమించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ కలిగిన డేటాను ఇంటర్నెట్ ద్వారా సరఫరా చేశారు. దీంతో ఇంటర్నెట్లోని మొత్తం ట్రాఫిక్ను సెకండ్ బై సెకండ్ 22 సార్లు ప్రసారం చేయవచ్చు. నాసా కూడా కూడా సెకనుకు 46 టెరాబిట్ల డేటాను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా దాదాపు సెకనుకు 10 గిగాబిట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ చాలావరకు సెకనుకు వందల మెగాబిట్ డేటాను మాత్రమే సరఫరా అవుతోంది. అయితే తాజాగా ఎన్ఐసీటీ సెకనుకు 22.9 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ను సాధించడానికి కొన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించింది. డేటాను ప్రసారం చేయడానికి ఒక కోర్ ఛానల్కు బదులుగా, 38 ఫైబర్కేబుళ్లను వినియోగించింది. వీటిలో ఒక్కోటి 3 మోడ్ల చొప్పున మొత్తం 114 ఛానెల్ల ద్వారా డేటాను ప్రసారం చేశారు. ప్రతి ఛానెల్లోని ప్రతి మోడ్ ద్వారా 750 వేవ్లెంత్, 18.8 టెరాహెడ్జెస్ బ్యాండ్విడ్త్తో ఈ డేటాను పంపించినట్లు తెలిసింది. అయితే కనెక్షన్లోని కొన్ని లోపాలు సవరించి ఆప్టిమైజ్ చేయడం వల్ల దాని ప్రస్తుత వేగం సెకనుకు 24.7 పెటాబిట్కు చేరుకోగలదని బృంద సభ్యులు తెలిపారు. ఇదీ చదవండి: జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ అయితే, ఇకపై మనకు కావాల్సిన ఎంత డేటా అయినా సెకనులో డౌన్లోడ్ చేసుకోవచ్చని అనుకుంటున్నారేమో. ఈ డేటాను డీకోడ్ చేయడానికి సంక్లిష్టమైన సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పింది. దీనికి ఎంఐఎంఓ రిసీవర్లు అని పిలువబడే ప్రత్యేక పరికరాలు నెట్వర్క్లో ఇన్స్టాల్ చేయాలని వివరించింది. ప్రస్తుతం 4 కోర్ వర్షన్ ద్వారా ఒక్కోమోడ్ విధానంలో సెకనుకు 1 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని తెలిపింది. -
వలలో చిక్కి.. చెట్టుకు వేలాడిన చిరుత
అడ్డతీగల: కోతుల బెడద నివారణ కోసం వరి చేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత పులి తప్పించుకుపోవడానికి చెట్టు పైకి ఎక్కి.. దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థ పడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా.. తీవ్ర గాయంతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంపచోడవరం డీఎఫ్వో జీజీ నరేంద్రన్, అడ్డతీగల సబ్ డీఎఫ్వో బి.శ్రీరామారావు, అడ్డతీగల రేంజి అధికారి షేక్ షెహన్షా, ఎస్ఐ అప్పలరాజు ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వల నడుముకు చుట్టుకుపోయి వేలాడుతున్న చిరుతను రక్షించేందుకు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు. రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి.. ట్రాక్టర్లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేదతీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్ట్మార్టం నిర్వహించి ఘటనా స్ధలంలోనే చిరుతను దహనం చేశారు. కొన్నిగంటల పాటు వల నడుం చుట్టూ చుట్టుకుపోవడంతో చిరుత పెనుగులాడటం, ఆహారం లేక నీరసించి పోవడంతో మృతి చెందిందని డీఎఫ్వో నరేంద్రన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతలు మరిన్ని ఉండవచ్చని, ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
గింజనే చూస్తే.... గింజవయిపోతావు
‘వాగురయని తెలియక మగ గణములు వచ్చి తగులురీతియున్నది..’’ వాగుర అంటే వల. వల వేసేవాడు వల ఒక్కటే వేయడు. కింద గింజలు వేసి వలేస్తాడు. ఆకలిమీద ఉన్న ప్రాణి కిందున్న గింజలనే చూస్తుంది. రివ్వున వచ్చి వలలో చిక్కుకుని తినేవాడికి అదే గింజయి పోతుంది. తన ఆహారం కోసం వెళ్ళి వేరొకడికి ఆహారమయి పోతుంది. తాను ఏది పొందడానికి వచ్చాడో అది పొందకపోగా వేరొక దానిచేత దానిని పొందబడుతున్నాడు. కారణం – మత్సరం. అప్పటికి నా అంతటి వాడు లేడు.. అని అహంకరించడం. మరొకడిని తక్కువ చేయడం, హేళనచేస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకోవడంలో ఒక చిన్న సంతోషం ఉంది. కానీ నిజానికి అది పతనం చేసే సంతోషం. మృగ గణములు వచ్చి తగులుకున్న రీతిగా నాకు హెచ్చరిక అందట్లేదు. అదే నాకు అప్పటికి సుఖకారణమనిపించి వలకు చిక్కినట్టు నన్ను కట్టిపడేస్తున్నదంటున్నాడు త్యాగయ్య. ఒకసారి పక్షులన్నీ వలలో చిక్కుకుపోయి ఉంటే... అటునుంచి ఒక రుషి వెళ్ళిపోతున్నాడు. రక్షించమని అవి వేడుకున్నాయి. విడిపిస్తాగానీ నేనొక మాట చెబుతా వింటారా...అనడిగితే సరే అన్నాయి. ‘‘గింజలు కనబడగానే వాల రాదు’’. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు మళ్లీ ఇలాటి ఆపద రాదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరో పది రోజుల తరువాత ఆయన మళ్ళీ అటుగా వస్తుంటే...మళ్ళీ అవే పక్షులు వలలో చిక్కుకుని ‘రక్షించమని వేడుకున్నాయి. నా మాట మీరెందుకు వినలేదని ఆయన అడిగాడు. వినకపోవడమేమిటి... మీరు చెప్పినట్లే కదా చేసాం... అన్నాయి...అంటూ ‘గింజలు కనబడగానే వాలరాదు’ అందుకే వెంటేనే వాలలేదు కదా... అన్నాయి... అలాగే వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నిసార్లు పాడుకున్నాం, ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం ... అని కాదు. అది అర్థం కావాలి. అర్థమయితే సుఖం. ఎంత బాగా పాడావు అన్నదానికన్నా... దానిలోని తత్త్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావన్నది కదా ముఖ్యం. తత్త్వం అర్థమయితే అరిషడ్వర్గాలు గురువుగారి అనుగ్రహం వల్ల వెంటనే పోయినట్టే కదా! అప్పుడు ఆయన సద్గురువు. అందుకే కీర్తన చివరన మదమత్సరమను తెరదీయగరాదా... అన్నాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ మదం కూడా ఉంటుంది. అది నాకు కదా దక్కాలి... అన్నప్పుడు కామం ఉంది. వాడికే ఎందుకు దక్కాలి ... అన్నప్పుడు క్రోధం ఉంది. నాకు ఉండాలన్నప్పుడు లోభం ఉంది. దీనికంతా కారణ అజ్ఞానం అన్నప్పుడు మోహం ఉంది. అరిషడ్వర్గాలు అక్కడ పుట్టాయి. అందువల్ల తెర అంత దట్టంగా ఉంది.‘నీలో మత్సరమను తెర ఉంది. అది తొలగించుకో’ అని ఆయన అనలేదు. తన మీద పెట్టుకున్నాడు. శంకరభగవత్పాదులు రాసిన శ్లోకాల్లో నాకు అంటూంటారు. అంటే ఆయనకు కాదు. ఆ శ్లోకం ఎవరు చదువుతుంటే వాళ్ళకు–అని. వాళ్ళకు దైవానుగ్రహం కలగాలి. అలాగే త్యాగరాజస్వామి తనకు అన్వయం చేసుకుని చెప్పారు. మత్సరం ... మద మత్సరం... అసూయ వినాశ హేతువు. ఆ తెర తీయమంటున్నాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం
దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు. రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్ఫోలియో స్ప్రెడ్లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్లోనే.. -
కసితో ఆడుతున్నాడు.. నెట్ను కూడా వదలడం లేదు!
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిలే లక్ష్యంగా సాగుతున్న జొకోవిచ్ వింబుల్డన్లో 14వ సారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. కాగా మ్యాచ్లో రెండో సెట్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హుర్కాజ్ సర్వీస్ చేసి డ్రాప్ షాట్ ఆడాడు. దీంతో బంతి జొకోవిచ్ నెట్ దగ్గర్లోనే పడేలా కనిపించింది. ఒక్క పాయింట్ కూడా వదలకూడదన్న ఉద్దేశంతో జొకోవిచ్ వేగంగా పరిగెత్తుకొచ్చి బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ షాట్ ఆడాడు. అయితే ఇదే సమయంలో బాడీ కంట్రోల్ కోల్పోయిన జొకోవిచ్ ఒక్కసారిగా నెట్పై పడిపోయాడు. అదృష్టవశాత్తూ జొకోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే జొకోవిచ్ చర్య తన ప్రత్యర్థి హుర్కాజ్తో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హుర్కాజ్ జొకోవిచ్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి జాగ్రత్త చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. కాగా జొకోవిచ్కు ఇది వింబుల్డన్లో వందో మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్ను సోమవారానికి వాయిదా వేశారు.సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్లో హుర్కాజ్ సర్విస్ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్లో తన సర్విస్ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్లో జొకోవిచ్ తన సర్విస్ను కాపాడుకొని సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్కిది 90వ విజయం కావడం విశేషం. Djokovic went for it 😅 #Wimbledon pic.twitter.com/q05cHyJJBt — SportsCenter (@SportsCenter) July 9, 2023 చదవండి: MS Dhoni Reaction To Fan: 'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్ #LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ -
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’
మారేడుమిల్లి: వన్యప్రాణులకోసం విద్యుత్ తీగలతో ఏర్పాటుచేసిన ఉచ్చు ఒకరిని బలిగొంది. మరొకరిని తీవ్ర గాయాల పాల్జేసింది. ఎస్ రాము, బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని చట్లవాడ పంచాయతీ పరిధిలోని బొజ్జలగండి గ్రామానికి చెందిన కొండ్ల శ్యాముల్ రెడ్డి (26), పల్లాల రమేష్ రెడ్డితో కలిసి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కర్రల నిమిత్తం శనివారం రాత్రి వెళ్లారు. వాటిని నరికి అటవీ ప్రాంతం నుంచి రహదారి వద్దకు తీసుకువస్తున్నారు. అదేమార్గంలో కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటుచేశారు. దానికి విద్యుత్ తీగలు అమర్చారు. శ్యాములరెడ్డి, సురేష్ రెడ్డి తెస్తున్న కర్రల చివర్లు విద్యుత్ తీగలకు తగలడంతో ఇరువురు షాక్కు గురయ్యారు. దీంతో శ్యాముల్రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని వెనుక వస్తున్న రమేష్ రెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమేష్రెడ్డిని అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు బోదులూరు పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీసులకు బంధువులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాము సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
జాలరి వలలో పంచలోహ మీనాక్షి అమ్మన్ విగ్రహం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తిరుచెందూరు సమీపంలో జాలరి విసిరిన వలలో మీనాక్షి అమ్మన్ విగ్రహం చిక్కింది. తిరుచెందూరు అమలినగర్ మాతా ఆలయానికి చెందిన జోషఫ్ కుమారుడు జయన్ (37). గత 15వ తేదీ రాత్రి సముద్రంలో చేపలు పడుతుండగా వలలో సుమారు అడుగు ఎత్తు కలిగిన మీనాక్షి అమ్మవారి పంచలోహ విగ్రహం చిక్కుకుంది. దీన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పగించాడు. తిరుచెందూర్ తహసీల్దార్ స్వామినాథన్, శనివారం అమలినగర్కు వెళ్లి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుకుళకుండ్రంలో ప్రసిద్ధి పొందిన వేద గిరీశ్వరర్ ఆలయంలో శనివారం ఉదయం దేవాదాయశాఖ మంత్రి బి.కె.శేఖర్బాబు తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో వేదగిరీశ్వరర్ స్వామి ఆలయానికి రోప్కార్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: (సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం) -
విషాదం: కూడు పెట్టిన వల.. కాటికి పంపింది
సాక్షి, భైంసా(నిర్మల్): గోదావరి నదిలో చేపలు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తొందూర్ నాగేశ్(45) చేపల కోసం తాను కట్టిన వలకే ప్రమాదవశాత్తు చిక్కుకొని మృతి చెందిన సంఘటన బాసరలో శనివారం జరిగింది. ఎస్సై ప్రేమ్దీప్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తొందూర్ నాగేశ్ బాసర వద్ద నదిలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నది నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. దీంతో చేపలు లభిస్తాయన్న ఆశతో శుక్రవారం నదిలో చేపల కోసం వలవేశాడు. తిరిగి శనివారం చేపల కోసం నాటుపడవపై వెళ్లి తాను వేసిన వలలోనే అనుకోకుండా చిక్కుకున్నాడు. నీటిలో మునిగిపోతున్న నాగేశ్ను ఒడ్డుపై ఉన్న తోటి జాలర్లు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వారు నాగేశ్ ఉన్న చోటికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఎందరివో ప్రాణాలు కాపాడి.. తొందూర్ నాగేశ్ బాసర వాసులకు, ఆలయ అధికారులకు, గోదావరి నది వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి సుపరిచితుడే. బాసర ఆలయానికి వచ్చి వెళ్లేవారిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునగబోయే ఎంతో మంది భక్తులను నాగేశ్ కాపాడాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని గోదావరి నదిలో దూకిన పలువురిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చాడు. అలాంటిది నాగేశ్ చివరికి తానే వేసిన చేపల వలలో చిక్కి ప్రాణాలు వదిలాడు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: దారుణం: 16రోజులు... నాలుగు హత్యలు -
‘ఇలాంటి సాహసం చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి’
అహ్మదాబాద్: గుజరాత్లో గీర్ అడవిలో వలలో చిక్కిన ఓ సింహం పిల్లను ఆటవీ సిబ్బంది రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీనియర్ ఆటవీ శాఖ అధికారి రమేష్ పాండే శుక్రవారం షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లంత సదరు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన ఈ సింహాన్ని రక్షించిన వారి ధైర్యానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో రాజూలకు చెందిన ఆటవీ సిబ్బంది, ఫీల్డ్ రిసెచ్చర్స్ వలలో ఓ సింహం పిల్ల చిక్కడం గమనించి దాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అది వలలో చిక్కుకోవడంతో అది గంభీరంగా అరవడం మొదలు పెట్టింది. అయితే ఈ పిల్ల సింహం తల్లి సంఘటన స్థలానికి సమీపంలోనే మిగతా పిల్లతో ఉండటం కూడా వారు గమనించారు. అయినప్పటికి ఈ సింహం పిల్లను రక్షించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో దాన్ని అణచి పట్టి ఆ నలుగురు సిబ్బంది కలసి సింహం పిల్లను వల నుంచి తప్పించారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. కాగా ఈ వీడియోకు ఇప్పటి వరకు 28వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ‘ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు చేయలేరు. నిజంగా వీరు రియల్ హీరోలు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Forest staffs and field researchers in Rajula, Greater Gir (Gujrat) heard a roar and found a lion cub trapped in net. Lioness with other cubs was sitting nearby. To avoid strangulation of cub they put their lives at risk and freed the cub. Salute to our green guards.@CentralIfs pic.twitter.com/sHloH9bb1J — Ramesh Pandey (@rameshpandeyifs) March 4, 2021 చదవండి: మినీ ట్యాంక్బండ్లో మొసలి సోషల్ మీడియాలో రచ్చ: సీక్రెట్గా లోగో మార్చిన అమెజాన్ -
నీట్, జేఈఈ ఏటా రెండుసార్లు
న్యూఢిల్లీ: తరచూ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్రం భారీ సంస్కరణలకు తెర లేపింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్), జేఈఈ(మెయిన్స్), జాతీయ అర్హత పరీక్ష(నెట్) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. నీట్, ఐఐటీ జేఈఈ–మెయిన్స్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. నీట్ను ఫిబ్రవరి, మే నెలల్లో, జేఈఈ–మెయిన్స్ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. విద్యార్థి ఈ పరీక్షలను రెండుసార్లు రాసినా, ఉత్తమ స్కోరునే ప్రవేశాల సమయం లో పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కసారి హాజరైనా సరిపోతుంది. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)ల నిర్వహణ బాధ్యతను కూడా ఎన్టీఏకే అప్పగించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకుని, పారదర్శకంగా, సమర్థంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పోటీ పరీక్షలు నిర్వహించేందుకే కొత్త విధానం అమల్లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా పరీక్షలకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించారు. నెట్తో ప్రారంభం.. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయాలంటే అర్హత సాధించాల్సిన నెట్ పరీక్షతో(డిసెంబర్లో) ఎన్టీఏ పని ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్ నిర్వహణను ఎన్టీఏకు అప్పగించినా, అడ్వాన్స్డ్ మాత్రం యథావిధిగా ఐఐటీల ఆధ్వర్యంలోనే జరుగుతుందని జవదేకర్ వెల్లడించారు. పైన పేర్కొన్న అన్ని పరీక్షలకు సిలబస్, ఫీజు, భాష, ప్రశ్నలు అడిగే తీరు మారవని స్పష్టం చేశారు. టైం టేబుల్ను ఎప్పటికప్పుడు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 4–5 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, పరీక్షకు ఎప్పుడు హాజరుకావాలో విద్యార్థే నిర్ణయించుకోవచ్చని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి అధునాతన ఎన్క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. ఎన్టీఏ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ఎంతో అనుకూలమని, ఆగస్టు మూడో వారం నుంచి విద్యార్థులు అధీకృత కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా సాధన చేయొచ్చని జవదేకర్ తెలిపారు. పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఉచిత సాధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఎన్టీఏ అంటే... దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏని ఏర్పాటుచేయాలని 2017–18 బడ్జెట్లో ప్రతిపాదించారు. దానికి కేంద్ర కేబినెట్ గతేడాది నవంబర్ 10న ఆమోదం తెలిపింది. ఎన్టీఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తుంది. ప్రముఖ విద్యావేత్తను ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్/సీఈఓగా మానవ వనరుల శాఖ నియమిస్తుంది. నిపుణులు, విద్యావేత్తల నేతృత్వంలోని 9 వేర్వేరు విభాగాలు సీఈఓకి సహాయకారిగా ఉంటాయి.యూజీసీ, ఎంసీఐ, ఐఐటీ సభ్యులతో పాలక మండలిని ఏర్పాటుచేస్తారు. కేంద్రం ఎన్టీఏకు తొలుత రూ.25 కోట్ల ఏకకాల గ్రాంటు కేటాయిస్తుంది. తరువాత ఆ సంస్థే సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్గా వినీత్ జోషి కొనసాగుతున్నారు. -
మత్స్యమాఫియా
అలంపూర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న తుంగభద్ర, కృష్ణానదుల్లో మత్స్యసంపదను కొల్లగొడుతున్న అలవి వలలు స్థానిక మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మత్స్యసంపదను మధ్య దళారీలు తరలించకుండా మత్స్యశాఖ, పోలీస్ యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా అలంపూర్ గొందిమల్ల, కూడవెల్లి తదితర ప్రాంతాల్లో స్థానికేతరులు ధనార్జనే ధ్యేయంగా వైజాగ్, రాజమండ్రి, తమిళనాడు, ఏపీ వంటి ప్రాంతాల నుంచి అలవి వలలతో చేపలను వేటాడే నైపుణ్యం గల వారికి రోజువారి కూలీలు ఇస్తూ ప్రభుత్వం నిషేధించిన అలవి, పట్టు, నంజు, మ్యాట్ వంటి వలలతో చేపలను వేటాడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 20 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. లైసెన్స్లు.. సొసైటీలు కులవృత్తి అయినంత మాత్రనా లేదా గంగపుత్రులు అయినంత మాత్రాన చేపలు వేటాడే అధికారం లేదు. ఇందుకోసం సంబంధిత మత్స్యశాఖ దగ్గర పేరు నమోదు చేసుకుని లైసెన్సులు పొందాలి. లేదా మత్స్యశాఖ సొసైటీలో కనీసం సభ్యుడై ఉన్నా చేపలను వేటాడవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 వేల మంది మత్స్యకారులున్నారు. రాజోళి, అలంపూర్, క్యాతూరు ఇలా మిగతా చోట సొసైటీలు కూడా ఉన్నాయి. ఒక్కో సొసైటీలో 400–600 మంది దాకా ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అయిజ నుంచి అలంపూర్ దాక 13 సొసైటీలు ఉండగా యాక్టివ్ ఉన్న సొసైటీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 25 సొసైటీల్లో 38 సంఘాలు, 3,200 మంది లైసెన్స్దారులు ఉన్నారు. ఇక వీరి ఆర్థిక పరిస్థితిలు గమనిస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. భద్రపరిచే పరికరాలేవీ..? రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ ఆర్థిక వనరులు పెంచే ప్రణాళికలో భాగంగా 2016–17 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు నాబార్డు నుంచి రాగా కేవలం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి చేపపిల్లను సరఫరా చేసింది. కానీ వీటిని భద్రపరిచేందుకు గాను టీవీఎస్ ఎక్సెల్ టాంటి మోపైడ్, బోట్లు, వల, ఐస్ బాక్స్ లాంటి పరికరాలు ఏవీ ఇవ్వలేదు. దీంతో పట్టిన చేపలను భద్రపరిచే పరిస్థితి లేకపవడంతో మత్స్యకారులు వాటిని మధ్యదళారీలకే అప్పగిస్తున్నారు. మధ్య దళారికే లాభాలు ఉదయం నుంచి సాయంత్రం దాక కష్టపడిన మత్స్యకారుడికి కడుపు నిండటం గగనంగా మారింది. రోజంతా కష్టపడితే 100 కిలోల చేపలు పడుతాయి. ఇందులో చేప బరువును బట్టి మార్కెట్లో ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్లో అమ్మకంపై మెళకువలు తెలియని అసలైన మత్స్యకార్మికుడు దళారీకి చేపలు విక్రయిస్తున్నాడు. దీంతో కష్టపడిన మత్స్యకార్మికుడుకి రోజుకు సగటున రూ.150–200 వస్తే గగనం. ఇక అదే చేపలను కొనుగోలు చేసిన మధ్య దళారీ మాత్రం వాటిని హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున లాభాలు పొందున్నాడు. లైసెన్సులు పొంది పేరు రిజిష్ట్రేషన్ చేయించుకున్న వారికి మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్పై ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వారికి అవగాహన లేకపోవడంతో మధ్య దళారీలే లాభపడుతున్నారు. త్వరలో ఐఎఫ్డీఎస్ విధానం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఎఫ్డీఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీం) సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విధానం ద్వారా మత్స్యకారులకు 75 శాతం రుణ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా రూ.310 చెల్లించిన లైసెన్స్దారులకు కావాల్సిన పరికరాలు 75 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం పంపారు. అమాయకులు బలవుతున్నారు.. అలవి వలల విషయంలో అమాయకులైన స్థానిక మత్స్యకారులే బలవుతున్నారు. వీరి వెనక ఉన్న అసలైన మాఫియా మాత్రం తప్పించుకుంటున్నారు. దీనికంతా కారణం మత్స్యకారులకు మత్స్యశాఖ తగిన రుణ సౌకర్యాలు కానీ మార్కెటింగ్ స్కిల్స్, అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించకపోవడమే. – అశోక్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ముదిరాజ్ మహాసభ కఠిన చర్యలు తప్పవు.. ప్రభుత్వం నిషేధించిన వలల ను ఉపయోగించడం కా కుండా ఎలాంటి అనుమతి, లై సెన్స్లు లేకుండా చేపలను వే టాడుతు మత్స్యసంపదను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికంగా కొందరు మా ఫియా దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. తగిన ఆధారాలతో వారిని కూడా పట్టుకుంటాం. – ప్రవీణ్కుమార్, ఎస్ఐ, అలంపూర్ -
వలేస్తే భారీ కొండచిలువ చిక్కింది!
భువనేశ్వర్: నదిలో విసిరిన వలలో చేపకు బదులుగా పాము చిక్కింది. చూడబోతే అదో పెద్ద కొండ చిలువ. 15 అడుగుల పొడవు ఉంది. పూరీ జిల్లా గోప్ సమితి నేతాపూర్ కుశభద్ర ఉపనదిలో చేపల వేట కోసం మత్స్యకారుడు బుధవారం రాత్రి వలపన్నాడు. గురువారం ఉదయం వలను లాగి చూడబోతే పెద్ద పాము చిక్కుకున్నట్లు గుర్తించి బెంబేలెత్తాడు. తోటి మత్స్యకారుల సహకారంతో సురక్షితంగా వలను ఒడ్డుకు లాగాడు. విషయాన్ని స్థానిక అటవీ విభాగం అధికారులకు తెలియజేశాడు. పామును సురక్షితంగా చేరువలో ఉన్న అడవిలోకి విడిచి పెడతామని అధికారులు తెలిపారు. -
నెట్పై క్లారిటీ ఇచ్చిన యూజీసీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నెట్) నిర్వహణపై ఉన్న అనిశ్చితి తొలిగింది. సీబీఎస్ఈనే ఈ పరీక్షను నిర్వహిస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్, నీట్ వంటి ఇతర పరీక్షల నిర్వహణ వల్ల బోర్డుపై అధిక భారం పడుతోందని, అందువల్ల నెట్ను నిర్వహించలేమని సీబీఎస్ఈ గతేడాది కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఎదుట తన అశక్తతను వ్యక్తపరిచింది. అయితే, దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మరోవైపు జూలై నిర్వహించాల్సిన నీట్కు ఏటా ఏప్రిల్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా.. సీబీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో అనిశ్చితి నెలకొన్ని విషయం తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ విద్యార్థులు యూజీసీ ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మానవవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన యూజీసీ అధికారులు సీబీఎస్ఈనే జూలైలో పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. -
పాపం పండింది
జంగారెడ్డిగూడెం : అవినీతి నిరోధక శాఖ ఉచ్చునుంచి రెండుసార్లు తప్పించుకున్న జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ డి.జయరాజు మూడోసారి పన్నిన వలలో దొరికిపోయారు. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలానికి రిజిస్ట్రేషన్ పూర్తయినా.. సంబంధిత పత్రాలు ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన బైర్రాజు ఫణీంద్రవర్మ అదే గ్రామంలో 238 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా.. సదరు స్థలాన్ని అతడి పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ జయరాజు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తానని.. లేదంటే రిజిస్ట్రేషన్ రద్దవుతుందని భయపెట్టారు. దీంతో ఫణీంద్రవర్మ ఏసీబీని ఆశ్రయించగా, డీఎస్పీ వి.గోపాలకృష్ణ, సీఐ జీజే విల్సన్ సబ్ రిజిస్ట్రార్పై వల పన్నారు. ఫణీంద్రవర్మకు రూ.15 వేలు ఇచ్చి పంపించారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వ్యవహారం సబ్ రిజిస్ట్రార్ జయరాజు మామూళ్ల వసూలు వ్యవహారమంతా రాజు అనే ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా నిర్వహిస్తున్నారని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. తాము దాడి చేసిన సమయంలో రాజు పరారయ్యాడన్నారు. అతని వద్ద రూ.లక్ష వరకు ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని, అతనిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజుకు సంబంధించి ఆస్తుల వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. రెండుసార్లు తప్పించుకున్నా.. గతంలో ఏసీబీ దాడి నుంచి సబ్ రిజిస్ట్రార్ జయరాజు రెండుసార్లు తప్పించుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఏడాది కాలంలో రెండుసార్లు తనిఖీ చేయగా.. అతని వద్ద అనధికారికంగా ఉన్న నగదు దొరికిందని తెలిపారు. దీనిపై అప్పట్లో ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. రెండుసార్లు తనిఖీలు నిర్వహించినా సబ్ రిజిస్ట్రార్ జయరాజు తీరు మార్చుకోలేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
మరోసారి చిక్కాడు
కామవరపుకోట: అవినీతి కేసు విచారణలో ఉండగానే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కామవరపుకోట సబ్ రిజి స్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు. 2013లో వట్లూరు సబ్ రిజిస్ట్రార్గా ఆయన పనిచేస్తుండగా కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు రూ.98 వేలు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరలా రెడ్ హ్యాండెడ్గా ఆయన ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి పీతల కృష్ణమూర్తి టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెంలో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్కోసం కామవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా సబ్ రిజిస్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు రూ.10 వేలు డిమాండ్ చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు సోమవారం కృష్ణమూర్తికి రసాయనా లు పూసిన ఐదు రూ.2 వేల నోట్లను ఇచ్చి సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు పంపామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కృష్ణమూర్తి నుం చి సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు రూ.10 వేలు తీసుకుంటుండగా తాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. ఫిర్యాదుదారు గతంలో ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రాగా రూ.లక్ష డిమాండ్ చేశారని, దీంతో ఫిర్యాదుదారు రిజిస్ట్రేషన్ మానేశారని చెప్పారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ 2013లో వట్లూరులో పనిచేస్తుండగా దాడులు చేశామని లెక్కల్లో చూపని రూ.98 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై విచారణ ఇంకా సాగుతోందని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఏసీబీ సీఐ విల్సన్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. కక్షిదారు రిజిస్ట్రేషన్ చేయమన్న స్థలంపై వివాదం చింతలపూడి కోర్టులో నడుస్తుండటం తో వివాదం పరిష్కారమైనట్టు లేఖ తీసుకురావాలని సూచించానని సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు చెప్పారు. అయితే సోమవారం 1బి కాగితాలు తీసుకువచ్చి చూపిస్తుండగా, ఇవి అవసరం లేదని చెబుతుండగానే కృష్ణమూర్తి కాగితం చుట్ట తన ముఖం మీదకు విసిరేశాడన్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు వచ్చారని మధుసూదనరావు అంటున్నారు. -
మోల్డ్టెక్ మరో 3 ప్లాంట్లు
• 2018లో ఉత్పత్తి కార్యకలాపాలు • రూ.54 కోట్ల దాకా పెట్టుబడి • మూడో త్రైమాసికంలో తగ్గిన నికరలాభం • కంపెనీ సీఎండీ లక్ష్మణరావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్టెక్ ప్యాకేజింగ్ మరో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఏసియన్ పెయింట్స్ కోసం మైసూరు, వైజాగ్లో ప్లాంట్లు రానున్నాయి. స్థల సేకరణ కూడా పూర్తయింది. అలాగే మరో పెయింట్ కంపెనీ కోసం దక్షిణాదిన ఒక యూనిట్ ఏర్పాటు చేయనుంది. నెల రోజుల్లోగా ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలియవచ్చింది. ప్రతిపాదిత మూడు ప్లాంట్లలో 2018 జూన్–అక్టోబర్ కాలంలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఒక్కో యూనిట్లో తొలి దశ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3,500 టన్నులుంటుంది. మూడు ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం రూ.54 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్లు మోల్డ్టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. సామర్థ్యం రెట్టింపు.. నూతన కేంద్రాల సామర్థ్యాన్ని 2021 కల్లా రెట్టింపు చేస్తామని లక్ష్మణరావు తెలిపారు. ఇందుకోసం మరో రూ.27 కోట్ల దాకా ఖర్చవుతుందన్నారు. సంస్థకు ఇప్పటికే ఏడు ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30,000 టన్నులు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,300 దాకా ఉంది. విస్తరణతో మరో 800 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. ప్యాకేజింగ్ సేవలందించేందుకు మరిన్ని ఫుడ్, ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, అవి పురోగతిలో ఉన్నాయని వివరించారు. నికర లాభం రూ.5.5 కోట్లు.. డిసెంబర్ త్రైమాసికం స్టాండెలోన్ ఫలితాల్లో మోల్డ్టెక్ ప్యాకేజింగ్ నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.6 కోట్ల నుంచి రూ.5.5 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం రూ.75.7 కోట్ల నుంచి రూ.76 కోట్లకు ఎగసింది. ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగం ప్రస్తుతం 7 శాతం సమకూరుస్తోంది. వచ్చే ఏడాది ఇది 15–20 శాతానికి చేరుతుందని కంపెనీ భావిస్తోంది. -
నేటి నుంచి ‘నెట్’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ప్రధాన అర్హతగా పరిగణనలోకి తీసుకునే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) దరఖాస్తులు ఈనెల 17 నుంచి తీసుకునేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ఫారాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వచ్చే నెల 22 నుంచి 29 వరకు సవరించుకోవచ్చని పేర్కొంది. పరీక్షను 2017 జనవరి 22న నిర్వహించనున్నట్లు వివరించింది. -
వలకు చిక్కిన వింత చేపలు
మధిర రూరల్ : మత్స్యకారుల వలలకు వింత చేపలు చిక్కాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధిర సమీపంలోని వైరా నది, రాయపట్నం, మధిర, చెరువుల సమీపంలోని కల్వర్టుల వద్ద మత్స్యకారులు, కొందరు యువకులు వలలు, గాలాలతో చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో రాయపట్నం సమీపంలోని చెరువు వద్ద యువకులు పెట్టిన వలలకు వింత చేపలు చిక్కాయి. వాటిని మధిరకు చెందిన సతీష్ గమనించి ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ చేపలు చాలా గట్టిగా.. రకరకాల చారలు కలిగి ఉన్నట్లు తెలిపాడు. వీటిని చూసేందుకు పలువురు పోటీపడ్డారు. -
వలకు చిక్కిన రాకాసి చేప
కొల్లూరు: వింతాకారంలో శరీరం, రెక్కలపై రంపాన్ని పోలిన ముళ్ళతో ఉన్న చేప కొల్లూరు పశ్చిమ బ్యాంక్ కెనాల్లో సోమవారం మత్యకారుల వలకు చిక్కింది. సాధారణ చేపలకు మాదిరిలా కాక దీని నోరు కింది భాగంలో ఉండి నోటికి ఇరువైపులా రెండు కోరలు వలే ఉండటంతో రాకాసి చేప అయ్యింటుందని మత్యకారులు భావిస్తున్నారు. దీనిని వల నుంచి తీసిన అనంతరం గంటపాటు నీటిలో కాకుండా నేలమీద ఉంచినా బతికేఉందని ఈచేపను పట్టుకున్న కట్టా శ్రీను తెలిపారు. చేపను తాకితే దానిపై రంపాలవలే ఉన్న ముళ్ళ వల్ల చేయి కోసుకుపోతుందని, తాము ఇటువంటి చేపను ఇంతవరకు చూడలేదని పేర్కొన్నాడు. అడుగు పొడవున్నా ఈ చేప ఏ జాతికి చెందినది అన్నది స్థానికుల్లో చర్చానీయాంశంగా మారింది. -
నెట్ బాండ్ బడ!
సమస్త సమస్యలకీ, సమాచారానికీ ఇప్పుడు ఇన్స్టంట్ గైడ్ - గూగుల్, వికీపీడియాలే. నెట్ ఇలా మన నట్టింటిలోకి వచ్చాక, వాట్సప్లు, ఫేస్బుక్ల లాంటి సోషల్ మీడియా కూడా పెరిగిపోయాక, నెట్లో రకరకాల వింత చర్చలు, విచిత్రమైన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ‘500 కోట్లు కాదు... వెయ్యి కోట్లిచ్చినా సరే, నేనిక బాండ్ పాత్రలు చేసేది లేదు’ అంటూ హాలీవుడ్ స్టార్, ఇటీవలి పాపులర్ సినీ జేమ్స్బాండ్ డేనియల్ క్రేగ్ తేల్చేసిన విషయం బయటకొచ్చాక నెట్ వరల్డ్లో దీనిపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. జేమ్స్బాండ్ వారసుడెవరా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వెతుకుతున్నాయి ఇంటర్నెట్ సెర్చింజన్లు. కొందైరె తే ‘జేమ్స్బాండ్ పాత్రకు అంతంత డబ్బెందుకు... బ్యాండు కాకపోతే ! అందులో సగం కాదు... పావు వంతు ఇచ్చినా అంతకన్నా మంచివాళ్లే దొరుకుతారు’ అంటున్నారు. అందుకు ఉదాహరణగా మైఖేల్ ‘ఫాస్బాండర్’ను చూపుతున్నారు. మరోపక్క, తాజాగా తీసే 25వ జేమ్స్బాండ్ చిత్రంలో బాండ్ పాత్రకు టామ్ హిడెల్స్టన్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చేశాయి. అయినా సరే, నెట్లో మాత్రం కొత్త బాండ్ పాత్ర, క్రెగ్ నిరాకరణ సహా అనేక విషయాల గురించి రకరకాల బొమ్మలు, వార్తలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఆ మాటకొస్తే జేమ్స్బాండ్ పాత్ర చేయడానికి బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్కి ఏమి తక్కువ అంటూ కొందరు బయల్దేరారు. ఏకంగా డేవిడ్ కామెరాన్ ముఖాన్ని ఫొటోషాపులో జేమ్స్బాండ్ బొమ్మకు అతికించి మరీ, బాండ్గా చిత్రీకరిస్తున్నారు ఇంకొందరు వీరాభిమానులు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ‘జేమ్స్ బాండ్ అంటే ఎప్పుడూ మగవాళ్లేనా? లేడీ బాండ్లు ఎందుకు ఉండకూడదు? వాళ్లయితే బాగా ఒళ్ళు వంచగలరు. పైగా వెరైటీగా కూడా ఉంటుంది’ అని కొందరు అంటున్నారు. అలా ఇప్పుడు కొత్త జేమ్స్బాండ్ పాత్రధారి ఎవరనే విషయంలో లింగ విచక్షణ అనే కొత్త కోణం వచ్చి చేరింది. ‘ఉబుసుపోక కబుర్లు... ఉచిత సలహాలకేం గానీ, ఎమిలీ బ్లంట్ ఐతే ఎలా ఉంటుందీ’ అని ఒకరు, ‘యాబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్’ అనే ప్రఖ్యాత టీవీ షో చేసిన ‘ప్యాట్సీ స్టోన్ అయితే అద్దిరిపోతుంది’ అని మరొకరు- ఇలా రకరకాల మాటలు, బొమ్మలు అంతర్జాలంలో ఇప్పుడు షికారు చేస్తున్నాయి. అయితే వీటన్నిటి కన్నా అధికంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న గమ్మత్తై నెట్ క్రియేషన్ ఒకటి ఉంది. అది ఏమిటంటే... నటి గిలియన్ ఆండర్సన్ను ప్రసిద్ధ జేమ్స్బాండ్ సినిమా ‘స్కైఫాల్’ పోస్టర్లో బాండ్ పాత్రలో సూపర్ ఇంపోజ్ చేస్తూ పెట్టిన ఫొటో. తమాషాగా చేసిన ఈ అభూత నెట్ కల్పన వీక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ‘అవును! ఈమె బాండ్... ‘జేన్’ బాండ్!’ అంటూ దాని కింద రాసిన ఫొటో క్యాప్షన్ అయితే మరీనూ! ‘జేన్’ అంటే ఏమిటని ఖంగారు పడకండి! పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న పెద్దోళ్ళు ‘స్త్రీ మూర్తి’ని ‘జేన్’ అంటారు లెండి! ఇక్కడ ‘జేన్’ బాండ్ అంటే... ‘లేడీ బాండ్’ అని ప్రతిపదార్థమూ, తాత్పర్యమున్నూ అని ఇంగ్లిపీసు బాగా తెలిసినవాళ్ళ ఉవాచ. ఈ భాషాతత్త్వ విచార చర్చ మాటెలా ఉన్నా, ఈ కొత్త నెట్ కల్పన, ఆ ఫొటో, క్యాప్షన్ - హంగామా అంతా సదరు గిలియాన్ ఆండర్సన్ దృష్టికి వెళ్లింది. అంతే! ‘‘లేడీ బాండ్గా నేనైతే బాగుంటానని అనడం సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ ఎవరు రూపొందించారో తెలియదు కానీ, దీని రూపకర్తలకు నా కృతజ్ఞతాభివందనాలు’’ అంటూ గిలియన్ ఆండర్సన్ సంతోషంతో ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే, ‘జీవితంలో మీ గురించి చలామణీ అయిన పుకార్లలో మిమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నది ఏమిటి?’ అని ఎవరో ఆమెను కొంటెగా క్వశ్చన్ చేశారు. ‘‘నన్ను జేమ్స్బాండ్ను చేస్తూ జరుగుతున్న ఈ ప్రచారం కన్నా సంచలనమైనది ఇంకేమైనా ఉంటుందా?’’ అంటూ అంతకన్నా కొంటెగా జవాబిచ్చారు గిలియన్. మొత్తానికి, ఈ కొత్త చర్చకు చాలా మందే మద్దతు పలికారు. గతంలో నాలుగేసి సార్లు బాండ్ పాత్ర చేసిన పియర్స్ బ్రోస్నన్, డేనియల్ క్రెగ్లు ఇద్దరూ నల్ల బాండ్ అయినా, లేడీ బాండ్ అయినా తప్పేముంది అన్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడాలి. తిమ్మిని బమ్మి... బమ్మిని తిమ్మి చేసేది ఏమైనా ఉంటే - అది నెట్టే! అదేనండీ... ఇంటర్నెట్! ‘ఎన్ని కోట్లిచ్చినా, నేను బాండ్ పాత్ర వేయను’ అని డేనియల్ క్రెగ్ అనడంతో ఇప్పుడు నెట్లో రకరకాల బాండ్లు తయారయ్యారు. దాంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్... లేడీ బాండ్! గిలియన్ ఆండర్సన్! కొత్త బాండ్ ఎవరు? త్వరలో తెరకెక్కనున్న 25వ జేమ్స్బాండ్ చిత్రానికి బాండ్ ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్బాండ్గా టామ్ హిడెల్స్టన్ చేస్తా రని ఒక వార్త. మరోపక్క బాండ్ పాత్రకోసం తొలిసారిగా ఆడవారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ‘ఎక్స్-ఫైల్స్’ ఫేమ్ గిలియన్ ఆండర్సన్ పేరు అందరి కన్నా టాప్లో నెట్లో సందడి చేస్తోంది. ‘ఘోస్ట్ బస్టర్స్’, ‘ఓషన్స్2’ లాంటి కొత్త చిత్రాల్లో ఆడవాళ్ళదే ప్రధానపాత్ర. జేమ్స్బాండ్ సిరీస్లోనూ ఈ మార్పు ఎందుకు రాకూడదన్నది కొత్త వాదన. ఇక, వర్ణ వివక్ష వ్యవహారం తెర మీదకు తెచ్చి, నల్లజాతీయుడైన 45 ఏళ్ళ ఇడ్రిస్ ఎల్బా ఎలా ఉంటారనే చర్చ వచ్చింది. ఆ మాటకొస్తే క్రెగ్ను తొలిసారిగా బాండ్ పాత్రకు తీసుకున్నప్పుడూ ఇలానే చర్చలు జరిగాయి. కొత్త బాండ్ ఎవరన్నది కొద్దిరోజుల్లో కానీ అధికారికంగా తేలదు. క్రెగ్ మాటెలా ఉన్నా, వీళ్ళకెంత పారితోషికమి స్తారో తెలీదు. అయినా, పాపులర్ బాండ్ పాత్రకు మించి పారితోషికం ఏముంటుంది! బాండ్... లేడీ బాండ్... జేమ్స్బాండ్ సినిమాలో లేడీ బాండ్నే హీరోగా పెట్టడమనేది ఇప్పుడిప్పుడే ఎంతవరకు జరుగుతుందో అనుమానమే కానీ, లేడీ బాండ్గా అందరి కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం గిలియన్ ఆండర్సన్. అమెరికన్ - బ్రిటీష్ సినీ, టీవీ, రంగస్థల నటి అయిన అమెరికన్ సైన్స్ - ఫిక్షన్ సిరీస్ ‘ఎక్స్-ఫైల్స్’లో అమెరికన్ నేర దర్యాప్తు సంస్థలో స్పెషల్ ఏజంట్ పాత్రధారిణిగా జనంలో ఫేమస్. కుటుంబాన్ని పోషించడం కోసం 22 ఏళ్ళ వయసులో హోటల్లో పనిచేస్తూ, రంగస్థలంపై నటిగా కాలుమోపారు. ఆ పైన టీవీ సిరీస్లలో నటిగా పేరు తెచ్చుకున్నారు. నవలా రచయిత్రి, ఉద్యమకారిణి అయిన ఆమె తెరపై బలమైన స్త్రీ పాత్రల్ని పోషిస్తుంటారు. పలు మహిళా సంస్థలకు, ఉద్యమాలకు మద్దతుదారైన గిలియన్ తనను తాను ‘ఫెమినిస్టు’గా అభివర్ణించుకుంటారు. ‘‘మహిళల గురించి ఎవరైనా కాస్త తేడాగా మాట్లాడినా, ప్రవర్తించినా నేను ఊరుకోలేను’’ అని బాహాటంగా అంటారు. అన్నట్లు భారతీయ సంతతి మహిళా డెరైక్టర్ గురిందర్ చద్ధా దేశ విభజన నేపథ్యంలో తీస్తున్న ‘వైస్రాయ్స్ హౌస్’లో మౌంట్బాటెన్ భార్య ఎడ్వినా మౌంట్బాటెన్గా గిలియన్ నటిస్తున్నారు. లేడీ బాండ్గా నటించినా, నటించకపోయినా - నెట్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఇంత ప్రచారం వచ్చినందుకు గిలియన్ సహజంగానే సంతోషిస్తున్నారు. కోట్లిస్తానన్నా... బాండ్ అంటే భయమెందుకు? ‘జేమ్స్బాండ్గా నటించడం కన్నా మణికట్టు కోసుకుని చావడం బెటర్’ అని హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 24 బాండ్ చిత్రాలు వస్తే, ఆ మధ్య విడుదలైన ‘స్పెక్టర్’ సహా 4 చిత్రాల్లో టైటిల్ రోల్ చేశారు క్రెగ్. ఇక బాండ్గా నటించనని ప్రకటించారు. ఎక్కువ డబ్బిస్తే క్రెగ్ నిర్ణయం మార్చుకుంటారని భావించి, దర్శక - నిర్మాతలు అనుకున్నారు. ఏకంగా 100 మిలియన్ డాలరు ్ల(రూ. 674 కోట్లపైగా) ఆఫర్ చేశారట. అంత డబ్బు అన్నా క్రెగ్ మనసు చలించలేదు. బాండ్ సినిమాల్లోని రిస్కీ యాక్షన్ సీన్స్ కారణంగా క్రెగ్కు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. పైగా, బాండ్ సినిమాల షూటింగ్ కోసం విమానం మీద నుంచి వేలాడడం, అతి వేగంగా వెళుతున్న కారులో ప్రయాణం లాంటి వాటితో ఆయనకు ఒళ్ళంతా దెబ్బలేనట! దాంతో, డబ్బు కన్నా ఆరోగ్యానికి ఓటేశారు. -
నెట్తో సొంత నిర్ణయాలు
వాషింగ్టన్: ఇంటర్నెట్ వినియోగించే పిల్లలు సమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిర్ణయాలను సొంతంగా నెట్ నుంచి క్రమంగా నేర్చుకుంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెట్ వాడకుండా నిషేధించడం కంటే వినియోగించేలా చేయడ మే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న ఉత్తమ నిర్ణయం అవుతుందని స్పష్టంచేశారు. యుక్తవయసులో ఉన్న 68 మందిపై రెండు నెలలపాటు అధ్యయనం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారంప్రపంచ వ్యాప్తంగా 92 శాతం టీన్స్ నెట్ వాడుతున్నారు. -
ప్రివెన్షన్ బెస్ట్ మెడిసిన్...
ఎగ్జామ్ టిప్స్ రోజూ 3-4 లీటర్ల వరకు నీళ్లు, పళ్లరసాలు తాగిస్తుండాలి. మధుమేహం వంటి సమస్యలున్న పిల్లలకు మాత్రం వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు పక్కన బండ్ల మీద పండ్లరసాలను, ఆహారపదార్థాలను తీసుకోనివ్వకూడదు. కలుషిత నీరు, ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ విషయంలోనూ, చేతుల శుభ్రత పాటించడంలోనూ పిల్లలకు సరైన అవగాహన తల్లిదండ్రులు, టీచర్లు కలిగించాలి. జలుబు నుంచి రిలీఫ్ కలగాలంటే బాగా మరిగించిన నీటితో ఆవిరిపట్టాలి. పరీక్షలు ఉన్నన్ని రోజులు రోజూ ఉదయం, రాత్రి పడుకునేముందు ఉప్పునీటితో నోటిని పుక్కిలించమనాలి. ఇలా గార్గిల్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలు బాధించవు. చదవాలి కదా.... అని తెల్లవార్లూ కూర్చోబెట్టకుండా పిల్లలకు తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి. పరీక్ష అయిపోయిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లదనానికి దోమలు విపరీతంగా ఇళ్లల్లోకి చేరుతుంటాయి. కిటికీలు మూయడం, దోమల మందులు, నెట్లు వాడటం చేయాలి. జ్వరంగా ఉన్నప్పుడు తడిబట్టతో ఒళ్లు తుడవడం, వైద్యుల సలహాతో మందులు వాడటం తప్పనిసరి.పరీక్షలు లేని రోజుల్లో దగ్గు, తుమ్ములు సమస్య ఉన్నప్పుడు ఒకటి రెండు రోజుల్లో పిల్లల్ని స్కూల్కి పంపించకూడదు. ఒకరికి ఈ సమస్య ఉంటే తరగతిలో మిగతా పిల్లలకూ సోకే అవకాశం ఉంటుంది. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు చేతిగుడ్డ అడ్డుగా పెట్టుకొమ్మని పిల్లలకు ముందుగానే చెప్పాలి. తాజా ఆహారపదార్థాలుగా కూరగాయలు, పండ్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉండే వాటిని ఇవ్వాలి. -
పులిగడ్డ జాలరి వలలో డేగముక్కు తాబేలు
అవనిగడ్డ: ఒడిశా, శ్రీకాకుళం తీరప్రాంతంలోని సముద్రంలో జీవించే అరుదైన డేగముక్కు తాబేలు శనివారం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో జాలరి వలలో చిక్కింది. పులిగడ్డకు చెందిన పీతా లవయ్య అక్విడెక్టు కింద వలతో చేపలు పడుతుండగా ఈ తాబేలు పడింది. వింతగా ఉండడంతో దాన్ని తీసుకొచ్చి పులిగడ్డ చేపల మార్కెట్ వద్ద ఐస్బాక్సు లో ఉంచాడు. సాధారణ తాబేలు వలె కాకుండా ముందు రెక్కలు ఉన్న దీనికి కాళ్లు, తల, రెక్కలు డిప్పలోపలికి వెళ్లకుండా బయటే ఉన్నాయి. కళ్లు పెద్దవిగా మనిషి కళ్లను పోలి ఉన్నాయి. డిప్ప గడుగడులుగా ముదురు గోధుమ రంగులో ఉంది. మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల పొడవు ఉన్న ఈ తాబేలు 18 కిలోల బరువుందని లవయ్య చెప్పారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు రేంజ్ అధికారి భవాని ఆదేశాల మేరకు సిబ్బంది శ్రీనివాసరావు ఈ తాబేలును స్వాధీనం చేసుకుని పాలకాయతిప్ప శివారు సాగరసంగమం వద్ద సముద్రంలో వదిలారు. ఒడిశా, శ్రీకాకుళం తీరప్రాంతంలోని సముద్రంలో లోతైన ప్రాం తంలో ఈ డేగముక్కు తాబేలు జీవిస్తుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి భవాని చెప్పారు. -
అవార్డులు ఇలా ఇస్తారట బాసూ!
ఇపుడు దేశంలో ఎక్కడ చూసినా సినిమా అవార్డుల సీజన్ నడుస్తోంది. ఇటీవలి సినీ అవార్డులతో ఈ ఫీవర్ మరింత హీటెక్కింది. అయితే అవార్డులను సొంతం చేసుకున్నవారు సంతోషంతో పొంగిపోవడం.. రాని వారు నిరాశతో విచారపడటం మామూలే. అలాగే ఆశపడి భంగపడిన వారు విమర్శలు గుప్పించడం తెలిసిందే. విశ్వసనీయత లోపించిందనీ, అర్హత లేని వారికి అవార్డులను కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొన్ని సంస్థలు సన్మానాలు చేస్తాం... బిరుదులు, అవార్దులు ఇస్తామంటూ వెంటపడి వేధిస్తారని అనేక కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఫీలింగ్స్ను, క్యాచ్ చేసిన కొంతమంది యువకులు ఇలాంటి కథనంతో ఉన్న ఒక వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. కొన్ని సన్మానాలు, అవార్డుల తీరు తెన్నులు, వాటి కోసం తాపత్రయపడేవాళ్ల సంఘాలు, కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలపై వ్యంగ్యంగా ఈ వీడియోను రూపొందించారు. అటు చక్కని హాస్యంతో పాటు..పదునైన మాటల మేళవించిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటీనటుల వ్యవహారాలు, గాసిప్లు, వాటిపై మీడియా ధోరణులపై సెటైరికల్గా సాగే ఈ వీడియో ఆసక్తికరంగా మారింది. నిజమైన ప్రతిభా, పాటవాలకు ఆదరణ లభించాలంటున్న ఈ వీడియో చూస్తే ఎవరైనా నవ్వి తీరాల్సిందే.. నిజం.. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి. -
మగువల షాపింగ్ ..ఓ వీడియో
న్యూఢిల్లీ: మహిళలు, వారి షాపింగ్ సందడి గురించిన కథనాలు ఇప్పటికే చాలా విన్నాం. ఆడవాళ్లు ఆ పనిలో పడితే.. ప్రపంచాన్నే మర్చిపోతారంటారు. కాలంతో పనిలేకుండా గంటల తరబడి షాపింగ్ లో మునిగిపోతారని.. అదివారికొక వ్యసనం అని కొందరు చమత్కరిస్తుంటారు కూడా. ఆడవారి షాపింగ్ శైలిపై చాలా సినిమాల్లో సెటైరికల్ స్టోరీస్ను కూడా చాలానే చూశాం. ఇపుడు ఇలాంటి నాటీ వీడియో ఒకటి అనేక లైక్లను, షేర్లను సొంతం చేసుకుంటోంది. చౌకైన, బ్రాండ్ షాపింగ్ కోసం సాధారణ మహిళ నుంచి మొదలుకొని కార్పొరేట్ మహిళ, నవవధువు సహా మార్కెట్ లో ప్రవర్తించే తీరుపై తీసిన ఈ వీడియో ఇపుడు నెట్లో నవ్వులు పూయిస్తోంది. మార్కెట్ అంతా కలియ తిరుగుతూ వారు చేసే హంగామాపై ఢిల్లీకి చెందిన లిటిల్ బ్లాక్ బుక్ సంస్థ వ్యంగ్యంగా చిత్రీకరించిన ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. -
ఎట్టకేలకు చిక్కింది..
-
ఎట్టకేలకు చిక్కింది..
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్లో మంగళవారం ఉదయం నుంచి కలకలం సృష్టించిన చిరుత ఎట్టకేలకు అటవీ సిబ్బంది వలలో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన రెండో ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తొలి ప్రయత్నంలో నాసిరకం వల విసరడంతో ఎంతో నేర్పుతో చిరుత తప్పించుకున్న విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువల నీళ్లు తాగించిన చిరుత తమ వలలో చిక్కడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలో చిరుతపులి సంచరించడంతో ఉదయం నుంచి బిక్కుబిక్కుమంటున్న చుక్కాపూర్ వాసులు.. చిరుత పట్టివేతపై హర్షం వ్యక్తం చేశారు. నేటి ఉదయం గ్రామంలో ప్రవేశించిన చిరుత ఆరుగురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. గాయాలపాలైనవారు మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స విషయం అందరికీ విదితమే. -
చీరలకు ఛీర్స్
నెట్ ఒళ్లంతా కళ్లున్న ఇంద్రుడి లాంటిది. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎంతటి సీరియస్ విషయాన్నయినా జోకుగా, ఎంతటి జోకునైనా సీరియస్గా చెప్పగలిగే కెపాసిటీ కేవలం నెట్కే ఉంది. కాస్త వైచిత్రి ఉంటే చాలు విషయం వైరల్ అయిపోతుంది. కొంచెం విషయం ఉంటే చాలు ఛాతీ విరుచుకుని షంషేర్ లా షేర్ అవుతుంది. సమాచారంలో సత్తా ఉంటే ఇక లైకులే లైకుకు. నిమిషానికి గిగా బైట్ల కొద్దీ రిలీజ్ అయ్యే ఇంటర్ నెట్ సముద్రం ఒడ్డున కాసిన్ని గులకరాళ్లు ఏరుకుందామా? ఏమో... గులకరాళ్లనుకున్నవి ముత్యాలో వజ్రాలో కూడా కావచ్చు. చెప్పలేం. చీరను ఆరు గజాల మన్మథ లేఖ అని ఉత్తినే అనలేదు. చీర లావును దాస్తుంది. సన్నగా ఉండేవారికి కాస్త పర్సనాలిటీనిస్తుంది. ఎలాంటి వారికైనా అందాన్నిస్తుంది. బ్యూటీలో చీరకు పోటీ లేదు. మిగతా డ్రెస్లన్నీ సౌకర్యాల కోసం. చీరలు మాత్రమే సౌందర్యాల కోసం. ఆధునికత హోరులో చీరను మరచిపోవద్దన్న మెసేజ్తో ఈ మధ్యే ఢిల్లీలో దేవిదితి అనే సంస్థ చీరలు కట్టుకున్న యువతులతో ఫ్లాష్ మాబ్ నిర్వహించింది. లుంగీ డాన్స్ను మించి ఆ చీర డాన్స్ అదిరింది. అది చూసిన వారికి అర్థమైంది చీరను ఎందుకు ఆరుగజాల మన్మథ లేఖ అంటారో. ఈ ఫ్లాష్ మాబ్ తరువాత ఢిల్లీ అమ్మాయిలు చీరకు ‘ఛీర్స్’ చెబుతున్నారట. బెంగుళూరులోనూ #100 Saree Pact అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మొదలైందట. ఒక్క ఏడాదిలో వంద చీరలు (కొత్తవ బాబూ కొత్తవి) వేసుకుని తీరతామని ఇద్దరు మహిళలు శపథం పట్టి మరీ ఈ హ్యాష్ ట్యాగ్ మొదలుపెట్టారు. ఇప్పుడది వైరల్ అయిపోయింది. (మగాళ్లూ .... పర్సులు జాగత్త). http://mashable.com/2015/10/30/watch-indias-first-ever-saree-flash-mob-in-delhi/# ihum9L1e6qqr క్యాజీ... ఫోర్ జీ... దేనిమీదైనా జోకు వేసుకోవడం మనోళ్లకు తెలిసినట్టు మరెవరికీ తెలియదు. అంతే కాదు... మనం దేన్నయినా జోకు చేసేయగలం. నిన్నటి దాకా ఎయిర్ టెల్ ఫోర్ జీ అమ్మాయిపై లైకుల వర్షం కురిసింది. ఇప్పుడు జోకుల కుండపోత కొనసాగుతోంది. ఆ జోకులతో సోషల్ మీడియా అంతా తడిసి ముద్దవుతోంది. మచ్చుకు కొన్ని మీ కోసం... మనమంతా దీపావళి పండగ చేసుకుంటుంటే ఎయిర్ టెల్ ఫోర్ జీ గర్ల్ అప్పుడే సంక్రాంతి సంబరాలు చేసేసుకుంటోంది. అంత ఫాస్టు మరి. ఇంకోటి - చిరుత వేగపు ఉసెయిన్ బోల్ట్ భోరుమంటున్నాడట. ఎయిర్ టెల్ ఫోర్ జీ ఫాస్టెస్ట్ అయితే మరి నేనెవరిని? అంటున్నాడట. పెద్ద మనసు తండ్రి పాత్రల అలోక్నాథ్ ఇలా అంటున్నాడట. ‘‘ఈ అమ్మాయి చాలా సంస్కారవంతురాలు. ఎందుకంటే ఫోర్ ని కూడా జీ అనిపిస్తోంది. ఇతరులను ఆయియే జీ, జాయియే జీ, బైఠియే జీ అని గౌరవంగా పిలుస్తాం. ఈ అమ్మాయి ఫోర్ ని కూడా ఫోర్ జీ అంటోంది. ఎంత మంచి పిల్ల.’’ కొందరికి ఎయిర్ టెల్ అమ్మాయి గొప్పలు నచ్చడం లేదు. వాళ్లూ జోకులేస్తున్నారు. నిజంగా ఇంత ఫాస్టయితే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ని పోస్ట్ పెయిడ్గా మార్చడానికి వారం రోజులెందుకు? అని వాళ్లడుగుతున్నారు. రావణాసురుడి తర్వాత అంత గర్వం ఉన్నదెవరికి? ఎయిర్ టెల్ ఫోర్ జీ అమ్మాయికి!! తన మొబైల్ ఫాస్ట్ అని బడాయి.... ఇది ఇంకో విమర్శక విదూషకుడి మాట!! ఎలా ఉన్నాయి ఈ కామెంట్లు? https://www.quora.com/What-are-some-famous-jokes-or-memes-on-Airtel ప్రేమలో ఫన్ను కంటిచూపుతో చంపేసేవాళ్లుండగా పంటి గిఫ్టుతో ప్రేయసి మది దోచే వాళ్లుండరా? ఉంటారు. కచ్చితంగా ఉంటారు. నమ్మకపోతే కాలిఫోర్నియాకి చెందిన లూకాస్ ఉంగర్ను కలవండి. ఉంగర్ గారు తన ప్రేయసికి తన జ్ఞానదంతం పొదిగిన ఉంగరం ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడట. దీనికి క్లారీ లిఫ్కన్ అనే అమ్మాయి పడిపోయిందట. ఇంత చక్కగా పన్ను చెల్లించుకునేవాడు ఇంకొకడు నాకు దొరుకుతాడా అని పెళ్లికి ఒప్పేసుకుందట. వజ్రాలు, రత్నాలు నార్మల్. ఏదైనా కిక్కు... కిక్కుండాలి. దంతం గిఫ్టు వెరైటీగా ఉంది అని తెగమురిసిపోతోంది. అనేక ‘దంతం’ భక్తానాం అని భక్తుడు నెలకో గిఫ్టు ఇచ్చుకుంటాడని ఆనందపడిపోతోంది. నవంబర్ 21 న ఉంగర్, క్లారీలకు పెళ్లి. ఇలాగే నెలకు మూడు ముద్దులు, ఆరు గిఫ్టులుగా కాపురం కొనసాగితే ఉంగర్ గారు ఏడాదిలో బోసినవ్వుల బాపూజీ అయిపోవడం ఖాయం. http://www.sakshi.com/news/ international/man-wins-girlfriend-s-heart-with-his-wisdom-tooth-289223? pfrom=home-top-story ఓ మై డాగ్! ఈ అయిదు నెలల కుర్రాడు ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణు మాధవ్ను మించిపోయేట్టున్నాడు. ఇంట్లో పెంపుడు కుక్క పోటీ పడి అరుస్తుంటే పోటీలో నేనూ పాల్గొంటానని ఈ పసివాడూ పరుగులు పెడుతున్నాడు. వాటితో సమ ఉజ్జీగా అరిచి చూపిస్తున్నాడు. అవి మోర చాస్తే, మన బుడతడూ మోరచాస్తున్నాడు. అయితే కుక్కలు చేయలేనిది, మనవాడు చేసేదీ ఒకటుంది. అదేమిటంటే సెల్ఫీల యుగంలో పుట్టిన మనోడు కెమెరాలకు కూడా పోజులిస్తున్నాడు. అమ్మ కడుపులోనే అభిమన్యుడు పద్మవ్యూహ రహస్యాలు తెలుసుకున్నాడంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. కానీ అయిదునెల్లకే మిమిక్రీ నేర్చుకున్న ఈ పసివాడిని చూస్తే అభిమన్యుడి కథ నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పటికైతే మనవాడు అరిస్తే అరుస్తా అంటున్నాడు. తరువాత అరిస్తే కరుస్తా... అంటాడేమో చూడాలి. ఈ వీడియోను లక్షల మంది చూస్తున్నారు. మీరూ చూడండి. http://whatstrending.com/cute/20590-baby-gets-in-howling-contest-with-dogs నీకు నేను... నాకు నువ్వు.... నలభై అయిదేళ్ల క్రితమే ప్రజలు ఆ ఊరిని వదిలేశారు. మొత్తం ఊరు ఖాళీ అయింది. స్పానిష్ అంతర్యుద్ధం ఆ ఊరిని ఖాళీ చేసేసింది. జనాభా లెక్కల వాళ్లు ఆ ఊరిని లెక్కల్లోంచి తీసేశారు కూడా. కానీ ఓ కుర్రదాని ప్రేమలో పడ్డ ఓ కుర్రాడు మాత్రం ఊరు వదల్లేదు. 79 ఏళ్ల కుర్రాడు జువాన్ మార్టిన్, 82 ఏళ్ల కుర్రది సిన్ ఫరోసా కోలోమర్ ఇప్పటికీ ‘నాకు నువ్వు... నీకు నేను... ఒకరికొకరం తోడు నీడ...’ అని డ్యూయెట్లు పాడుకుంటూ అందరూ వదిలేసిన ఊళ్లో ఆనందంగా ఉంటున్నారు. నలభై అయిదేళ్ల క్రితం ఊరంతా టౌన్కి తరలిపోతుంటే ‘టౌను పక్కకెళ్లొద్దురో... డింగరీ డాంబికాలు పోవద్దురో’ అని భార్య హెచ్చరించింది. భార్య మాట పాటించడంలో ఆనందం ఏమిటో తెలిసిన మన మార్టిన్ ఆమెతో ఉండిపోయాడు. నాలుగు కుక్కలు, మూడు పిల్లులు, డజన్ గొర్రెలు, అరడజను కోళ్లతో నాలుగున్నర దశాబ్దాలుగా హాయిగా బతికేస్తున్నారు. ఈ మధ్యే ఎవరో వస్తే ఆ ఊళ్లో ఈ జంట ఒకటి ఉందన్న సంగతి బయటపడింది. వారి కథ తెరకెక్కించడానికి ఇప్పుడు అంతా సిద్ధం. నా కాంతతో ఏకాంతం భంగం చేయకండ్రా అని మార్టిన్ మొత్తుకుంటున్నా వినడం లేదట. ఇప్పుడీ జంట కథ ఇంటర్ నెట్ ద్వారా ఇంటింటికీ చేరుకుంటోంది. పచ్చబొట్టేసిన పిల్లగాడా...!! బాహుబలి పచ్చబొట్టు పొడిస్తే పాపం గెరిల్లా యోధురాలైన అవంతికకు ఒళ్లు తెలియలేదు. ఆమె నిద్రలో ఉండగానే మన ప్రభాస్ పచ్చబొట్టేశాడు. పచ్చ బొట్టేసిన పిల్లగాడా... అని పాడుకోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. సరిగ్గా అలాంటి సమస్యే ఈ బ్రిటిష్ వ్యక్తిది. ఓ పార్టీకి వెళ్లి పూటుగా తాగేశాడు. ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. కళ్లు తెరిచేసరికి ముఖమంతా పచ్చబొట్టు పొడిచేశారు. బాహుబలి సినిమాలో అవంతికకు అందమైన టాటూలు వేశారు. కానీ మనోడికి మాత్రం రేబాన్ కళ్లద్దాలను వేసేశారు. ముందు ఏదో తుడిచేసుకుందామనుకున్నాడు. కానీ ‘పచ్చబొట్టు చెరిగిపోలే నా రాజా...’ అని త్వరలోనే తెలుసుకున్నాడు. ఆయన ఏదో కుర్రాడు కాదు. మధ్యవయస్కుడు. దాంతో ఆ టాటూను తీస్తే తప్ప రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి ఆరేడు సార్లు లేసర్, టాటూ రిమూవల్ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కళ్లద్దాల అవశేషాలు సశేషంగా ముఖం మీద కొంచెం కొంచెం ఉన్నాయి. ఆ టాటూలు వేసినోడు దొరికితేనా... అవంతికలాగా కసకసా పొడిచేస్తా అని అంటున్నాడట ఆయన. Man Wakes Up With 'Ray-Ban' Tattoo After Stag Do www.huffingtonpost.c ఇది తెలుసా.. ప్రస్తుతం ఇంటర్నెట్లో 100కోట్ల వెబ్సైట్లను యాక్సెస్ చేసుకోవచ్చట. గత రెండేళ్ల కాలంలోనే ఇంటర్నెట్ను మొబైల్ ఫోన్ల ద్వారా బ్రౌస్ చేసిన వారు దాదాపు 8.5 కోట్లమంది వరకు ఉన్నారట. 31శాతం ఇంటర్నెట్ యూజర్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోని ఫేస్బుక్ మీదే మొగ్గు చూపుతున్నారు. అత్యల్పంగా 4 శాతం మందే ట్విట్టర్ను ఉపయోగిస్తున్నారట. కేవలం ఒక నిమిషంలో 72 గంటల వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చట. ప్రస్తుతం యువత వారానికి సుమారు 35 గంటలు ఇంటర్నెట్ ముందే కూర్చుంటోందట. గంగ్నమ్ స్టైల్ యూట్యూబ్ వీడియో ఇంటర్నెట్లో ఇప్పటికి వరకు 200కోట్ల సార్లు ప్లే అయిందట. -
ఆస్పత్రి వద్దు స్వర్గమే ముద్దు
నెట్ఇంట్లో నెట్ ... నేర్పుతుంది. మార్చుతుంది. ఏమార్చుతుంది. నెట్ ... కథ చెబుతుంది... కబుర్ల మూట విప్పుతుంది. నెట్ ... విశ్వాసం పంచుతుంది. నమ్మకం పెంచుతుంది. కాస్త అజాగ్రత్తగా ఉంటే నిలువునా ముంచుతుంది. ఈ వారం కాసింత తీపి, కాసింత పులుపు, కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు కలిపి షడ్రసోపేతం మీకోసం... చూడగానే ముద్దొచ్చే ముఖం. కళ్లలో అనిర్వచనీయ అద్భుత తేజస్సు. నిండా ఐదేళ్ల ప్రాయం. అప్పుడే నిండు నూరేళ్లకు దగ్గరయింది. రోజులు లెక్కపెడుతోంది... ఈ పాప పుట్టుకతోనే చార్కాట్-మ్యారీ-టూత్ డీసీజ్ (సీఎంటీ)అనే ప్రాణాంతక నరాల జబ్బుతో బాధపడుతోంది. కృతిమ శ్వాసతో దీర్ఘశ్వాసను పీలుస్తోంది. శాశ్వతంగా ఆ శ్వాస ఎప్పుడు గాలిలో కలసిపోతోందో తెలియదు. ఆ పాప పేరు జూలియనా స్నో. ఆ పాప తన తల్లితో ‘ఇంట్లోనే ఉండి చనిపోయి స్వర్గానికి వెళ్తాను కానీ ఆస్పత్రికి వెళ్లను’ అన్న సంభాషణ ఇప్పుడు ఇంటర్ నెట్ను, వైద్య సమాజాన్ని కుదిపేస్తోంది. కారుణ్య హత్యల మద్దతుదార్లు ఈ సంభాషణను చూపించి చిన్న పిల్లలు సైతం మెర్సీ కిల్లింగ్ విషయంలో నిర్ణయం తీసుకోగలరని వాదిస్తున్నారు. వివాదానికి తెరతీసిన ఈ పాప కథనం ఇప్పుడు ఇంటర్నెట్ లో దుమారం లేపుతోంది. http://www.sakshi.com/news/international/oregon-family-lets-dying-5-year-old-daughter-decide-heaven-or-the-hospital-286945?pfrom=home-top-story తల్లి చెత్త డ్యూటీ కూతురు మంచి బ్యూటీ జిగేల్మనే అందాల రాణి మకుటం... ఒక చెత్త ఏరుకునే మనిషి పాదాలను ముద్దాడింది. ఆ బ్యూటీ క్వీన్ రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టింది. చుట్టూ చెత్త డబ్బాలున్నా, అవి కంపు కొడుతున్నా పట్టించుకోకుండా ఆ బ్యూటీ వచ్చి పాదాల మీద వాలిపోయింది. ఆ చెత్త ఏరుకునే ఆవిడ ఎవరో కాదు. ఈ బ్యూటీ క్వీన్ తల్లి. అంత పేదరికంలో ఉన్నా కూతురు కోరుకున్న పోటీకి పంపించింది ఆ తల్లి. అందుకే గెలిచిన మరుక్షణం కూతురు తల్లిపాదాల ముందు వాలింది. ఖనితా ఫాసెంగ్ అనే ఈ థాయ్లాండ్ బ్యూటీక్వీన్ అందం ఆమె వినయం వల్ల మరింత పెరిగింది. ఆమె తల్లి ఒరైత పోర్మావున్ ఇప్పటికీ చెత్త ఏరుకుంటోంది. ఖనితా కూడా తీరిక సమయాల్లో తల్లికి చెత్త సేకరించడంలో సాయం చేస్తోంది. మనసు బ్యూటీయే నిజమైన బ్యూటీ అని తల్లీకూతుళ్లిద్దరూ చెప్పక చెప్పారు. అదే మన కాస్మెటిక్ బ్యూటీలైతే చేతిలో వైన్ గ్లాస్తో నోటితో మదర్ తెరిస్సా పలుకులు పలికేవారు. సేవే లక్ష్యం అని చెబుతూనే సినిమా చాన్సుల కోసం వెంపర్లాడేవారు. ఏమంటారు? http://www.sakshi.com/news/international/garbage-collector-gets-to-keep-beauty-queen-crown-287254?pfrom=home-top-story కట్టెపుల్లలేరుకునేది ఇల్లు కట్టేందుకే కట్టప్పా.. కాసిని ఎండుపుల్లలు, కొన్ని కట్టెలు, కొయ్య దుంగలు, బోలెడంత మట్టి ... ఈ మూడు ఉంటే చాలంటున్నాడు ఈ కుర్రాడు. పెళ్లి చేసి చూపించలేనేమో కానీ కచ్చితంగా ఇల్లు కట్టి చూపిస్తానంటున్నాడు ఇతగాడు. కొయ్య దుంగలతో స్తంభాలు, మట్టి, రాళ్లతో ఇల్లు, కర్ర పుల్లలతో నిప్పు రాజేసి, దానిపై పెంకులు కాల్చి తయారు చేసి కప్పు వేసేస్తాడు. ఈ కుర్రాడు ప్రిమిటివ్ టెక్నాలజీ (ఆదిమ సాంకేతికత) అన్న యూట్యూబ్ అకౌంట్ లో మట్టి ఇల్లు కట్టి చూపించాడు. నేను ఎండు పుల్లలు ఏరుతున్నది పిచ్చిపట్టి కాదు కట్టప్పా, ఇల్లు కట్టేందుకు అంటున్నాడీ దేవసేనుడు. ఈ మట్టింటి వాడికి నెట్టింట్లో మూడున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్లున్నారు. పద్నాలుగు నిమిషాల వీడియో కచ్చితంగా కట్టిపడేస్తుంది. ఆఫ్రికా, ఏషియాల్లోనే కాదు... ఆకాశ హర్మ్యాల అమెరికాలోనూ ఈ వీడియో ఇప్పుడొక క్రేజ్.... తెగ చూసేస్తున్నారట. దీన్ని చూస్తే... ఓసోస్... ఇల్లు కట్టుకోవడం ఇంత తేలికా అనిపిస్తుంది. ప్రస్తుతానికి కాంక్రీటు కొంపలు, డ్యూప్లెక్స్ దిబ్బల్లో ఎలాగోలా నెట్టుకొచ్చేస్తాం కానీ, మూడో ప్రపంచ యుద్ధం తరువాత నీ లాంటి ఇళ్లే కట్టుకుంటాం బాసూ అని ఆ కుర్రాడికి హామీ ఇచ్చేద్దాం. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం తరువాత మనం వెళ్లేది ఖాయంగా పాతరాతి యుగంలోకే. మనకు మిగిలేది ఖచ్చితంగా మట్టి, బూడిద, ఎండుపుల్లలే! http://whatstrending.com/hoton-youtube/20589-31e-man-builds-hut-completely-out-of-raw-materia పోలీసమ్మ డాన్స్ బేబీ డాన్స్ రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటుంటే పోలీసులు ఏం చేస్తారు? ఎ) లాఠీలకు పనిచెప్తారు. బి)ఇద్దర్నీ నాలుగు పీకుతారు. సి) ఇద్దర్నీ ఠాణాకు తీసుకెళ్లి అత్తవారింటి అతిథి మర్యాదలు చేస్తారు. డి) డాన్స్ చేస్తారు. ఈ నాలుగు జవాబుల్లో ఏదో ఒకదానిపై క్లిక్ చేయమంటే నూటికి నూటొక్క మంది కచ్చితంగా క్లిక్ చేయనిది డి మాత్రమే. కానీ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ లేడీ పోలీసు ఇద్దరు అమ్మాయిలు తన్నులాడుకుంటుంటే వాళ్లను విడదీసేందుకు సరిగ్గా ఇదిగో ఈ ఆప్షన్ ‘డి’ నే ఎంచుకుంది. వాళ్లని తనతో డాన్స్ పోటీకి రమ్మని సవాలు చేసింది. మీరు గెలిస్తే కొట్టుకోండి. నేను గెలిస్తే ఇంటికి పొండి అని పందెం వేసింది. డిష్యుం డిష్యుం మని ఒకమ్మాయి డాన్స్ పోటీకి వచ్చింది. కాస్సేపు చేసిందో లేదో కానిస్టేబుల్ డాన్సు ముందు అల్లల్లాడిపోయింది. పందెం ప్రకారం కొట్లాట మాని ఇంటికి పోయింది. ఇప్పుడీ డాన్సింగ్ కాప్ వీడియోను అమెరికాలో లక్షలాది మంది చూస్తున్నారు. పోలీసమ్మ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఆఖరికి ఒబామా కూడా ఆ పోలీసును భేష్ అన్నాడు. http://wixy.com/wixy-mornings/a-cop-broke-up-a-fight-between-teens-by-starting-a-dance-off ఆ వేలును దేవుడు పట్టుకున్నాడు... పుట్టుకతో సెరిబ్రల్ పాల్సీ. నరాలపై స్వాధీనం ఉండదు. వేలు మాట వినదు. నోరు మాట చెప్పలేదు. 1960 నుంచి ఆస్పత్రే ఇల్లు. అందులోని వాళ్లే అయిన వాళ్లు. అయినా పాల్ స్మిత్ అనే ఆయన గొప్ప ఆర్టిస్టు అయ్యాడు. చేతితో కుంచె పట్టుకోలేని స్మిత్ ఆర్టిస్ట్ ఎలా అయ్యాడు? ఆయన బ్రష్... ఆయన వేలు! ఆయన కేన్వాస్ ఆయన ముందున్న పాత టైప్ రైటర్. తన జీవితంలోని సంఘటనల్నే ఆయన ఒక్క వేలు, పది టైప్ రైటర్ కీలతో చిత్రాలుగా గీస్తాడు. ఆ బొమ్మల్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నప్పటి ఇల్లు, ప్రయాణించిన పడవ, ఒబామా, ది లాస్ట్ సప్పర్ చిత్రం ఇలా చూసినవన్నీ చిత్రాలుగా అచ్చు గుద్దినట్టు దించేస్తాడు. నన్ను నడిపిస్తున్నది, బతికిస్తున్నది రెండే రెండు. ఒకటి - దేవుడు. రెండు - నా వేలు... అంటాడు. అన్నీ ఉండీ నిత్యం నిరాశలో కూరుకుపోయేవాళ్లు, ఆత్మహత్యంటే ప్రతి చిన్న సమస్యకీ అదేదో జిందా తిలిస్మాత్ అనుకునే వాళ్లు ఒక్క సారి పాల్ స్మిత్ కి సంబంధించిన ఈ నాలుగున్నర నిమిషాల వీడియోను చూసి తీరాలి. http://www.metaspoon.com/typewriter-artwork-paul-smith/?fb=719M1i1d4099tA &utm_source=719M1i1d4099tA -
షాదీ కాదు బర్బాదీ
నెట్ఇంట్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ఫేమ్... ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కనీసం పదిహేను నిమిషాల పాటు సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ వస్తుందట. సోషల్ మీడియా సామ్రాజ్యంలో తండ్రి ఒళ్లో ఒదిగి కూర్చున్న పసి కూన కూడా సెలబ్రిటీ కాగలదు. గజరాజుకి సలాం కొట్టి ప్రాణాలు కాపాడుకున్న వాడూ సెలబ్రిటీ కావచ్చు. కొందరు సెలబ్రిటీ స్ట్టేటస్ కోసం అవసరమైతే పెళ్లిని పెటాకులు చేసుకోగలరు. కొన్ని షేర్లు, కాసిన్ని లైక్లు, ఇంకొన్ని ఎమోటికాన్లు ఉంటే చాలు. సెలబ్రిటీ స్టేటస్ను శాశ్వతంగా ఉంచుకోగలరు. సలహాల నుంచి, సరదాల దాకా ఏదైనా ఈ స్టేటస్ను ఇచ్చేస్తాయి. గత వారంలో సామ్యాలకు సెలబిటీ స్టేటస్ తెచ్చిపెట్టిన కొన్ని నెట్టింటి కబుర్లూ కహానీలు మీ కోసం... పెళ్లంటే పందిళ్లు, లోగిళ్లు, వాకిళ్లు, తలంబ్రాలు, తప్పెట్లు... పరమాన్నాలు పప్పన్నాలు.... ఛ...ఛ... ఇవేం కావు. పెళ్లంటే ఏడు అడుగులు. మూడు ముళ్లు... రెండు మనసులు... ఒక్క జీవితం... ఛస్... కాదంటే కాదు... ఆస్ట్రేలియాకి చెందిన స్టిఫానీ రింగ్వెట్ అనే అమ్మాయికి, డ్రూ సిల్వర్ అనే అబ్బాయికి మాత్రం పెళ్లంటే టోర్నడోలు, తుఫాన్లు, షార్కులు, గాడ్జిల్లాలు.... ఒక్క మాటలో చెప్పాలంటే స్టిఫానీ పెళ్లి అందరికీ చావుకొచ్చిందన్న మాట. వాళ్లది ప్రళయంలో ప్రణయమో లేక వాళ్ల ప్రణయమే ప్రళయమో తెలియదు కానీ, అమ్మడికి ఇలాంటి భయంకర బ్యాక్ గ్రౌండ్లో పెళ్లి ఫోటోలు దిగాలని భలే సరదా. అందుకే షార్క్ నాడో సినిమాలో లాగా బ్యాక్ గ్రౌండ్లో రెండు టోర్నడోడు, కోరలు చాస్తున్న నాలుగు షార్కులు, విధ్వంసరచనకు వరల్డ్ రైట్స్ తీసుకున్న ఓ భయంకర గాడ్జిల్లా, నల్లని మేఘాలు, నలు దిక్కులా విలయం సీన్ని వెడ్డింగ్ ఫోటోలో డిజిటల్గా ఫిక్స్ చేశారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు, తోడు పెళ్లికొడుకు, కూతుళ్లూ ప్రాణాలరచేత పెట్టుకుని పరిగెడుతున్నట్లు ఫోటోలు తీశారు. ఇంకేముంది. వారి పెళ్లి ఓ సినిమా పోస్టర్ లా ఉంది. స్టిఫానీ రింగ్వెట్ అయితే నిజంగా జీవించేసింది. కావాలంటే ఫోటోని మీరూ చూడండి. చూస్తే ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అనుకుని షాదీ మాటే వద్దు గురూ... సోలో బతుకే సో బెటరూ అని చెప్పడం ఖాయం. http://www.dailymail.co.uk/femail/article&3283951/Newlyweds&flee&terror&Sharknado&Godzilla&invade&wedding&unique&wedding&pictures.html దణ్ణం దశగుణం భవేత్! ఎక్కడైనా ఏనుగుని ఏనుగు అనండి. కానీ అడవిలో మాత్రం గణేశ్ బాబా అనే అనాలి. ఇది అటవీ ప్రాంతపు సామెత. ఈ సామెత ఆ బైక్ రైడర్ బాగా ఒంట పట్టించుకున్నాడు కామోసు. అందుకే బతికిపోయాడు. థాయ్లాండ్లోని ఖావో యై నేషనల్ పార్క్లో బోల్డన్ని ఏనుగులు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. బైకుల హోరుతో వాటికి పిచ్చెక్కిపోతోంది. తుంటరి బైకర్లు దొరకలేదు కానీ, ఏనుగుల మందకి ఒంటరి బైకర్ ఒక దొరికారు. ఏనుగులన్నీ ఆయన మీదకి వెళ్లాయి. కోపంతో తొండం, తోక లేపి తెగ ఊపేశాయి. గుండెలు అవిసిపోయేలా ఘీంకరించాయి. లావొక్కింతయు లేని ఆ నిర్భాగ్యుడికి బహుశః గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చి ఉంటుంది. గజరాజులకు వొంగి, చేతులు జోడించి దణ్ణం పెట్టాడు. ఏనుగుల్లోని గణేశుడు మేల్కొన్నాడో ఏమో. లేక దాసుడి తప్పులు దణ్ణంతో సరి అనుకున్నాయేమో. ఏనుగులు ఒక్కసారి ఆగిపోయాయి. కాసేపు గుడ్లురిమి చూశాయి. తరువాత గునగున నడిచి వెళ్లిపోయాయి. మనోడు హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఎలిఫెంట్ గాడ్ కాదు... ఎలిఫెంటే గాడ్ అనుకున్నాడు. ఈ సంఘటన అక్టోబర్ 18న జరిగింది. ఈ మధ్య ఖావో యై నేషనల్ పార్కులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుంటే ఇది బయటపడింది. ఖావో యై నేషనల్ పార్కు వారి వెబ్సైట్ లో ఇప్పుడీ వీడియో వీర విహారం చేస్తోంది. నెట్టింట్లో ఇదొక పెద్ద సంచలనం. https://www.facebook.com/TulunaduNews/videos/833345003363381/ బతికిన కాలేజీ పరీక్షలో ఫెయిల్. ప్రేమలో ఫెయిల్. ఉద్యోగంలో ఫెయిల్, సంసారంలో ఫెయిల్... బతుకొక కొట్టివేత అయినప్పుడు, బతకడం ఒక తీసివేత అయినప్పుడు ఆత్మహత్య అందంగా కనిపిస్తుంది. ఈ కష్టాలంచి, కడగండ్ల నుంచి, ఇడుముల నుంచి, ఇక్కట్ల నుంచి ఎగిరిపోతే ఎంత బావుంటుంది అనిపిస్తుంది. ఆ క్షణంలో ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తుంది. అదిగో... సరిగ్గా అలాంటోళ్ల కోసమే ఈ స్కూలు. ఈ స్కూల్లో మీ చేత తల్లిదండ్రులకు తుది లేఖ రాయిస్తారు. కుటుంబానికి వీలునామా చేయిస్తారు. కళ్లారా మీ అంత్యకియలెలా జరుగుతాయో చూపిస్తారు. ఆ తరువాత ఓ శవపేటికలో పడుకోబెట్టి మూసేస్తారు. పది నిమిషాలు అంతా నిశ్శబ్దం... చీకటి ప్రపంచంలో పది నిమిషాలు ఉండేసరికి బతుకు విలువ తెలుస్తుంది. చావు ఎంత భయంకరమైందో అర్థం అవుతుంది. దక్షిణ కొరియాలో ఆర్థిక సమృద్ధి, హార్థిక శూన్యత పెనవేసుకుని మరీ పెరుగుతున్నాయి. రోజుకు సగటున 40 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారట. దక్షిణ కొరియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఆ ఆత్మహత్యల సంస్కృతిని చంపేసేందుకు పుట్టింది ఈ డెత్ స్కూలు. హ్యోవోన్ హీలింగ్ సెంటర్ వారు నిర్విహ స్తున్న ఈ స్కూలు మీ చావు మీరే కళ్లారా చూసేలా చేస్తుంది. పది నిమిషాల్లో ఒక్క ఉదుటున లేచి బాబోయ్... ఇక చచ్చినా చావొద్దు అనుకుంటారు. ఆ స్కూలుకి వెళ్లకపోయినా, ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఓ పది నిమిషాలు చావును అనుభవిస్తే చాలు. చచ్చినా చావరు. బతికి సాధించాలనుకుంటారు. http://www.dailymail.co.uk/news/article&3284587/Learn&dead&day&Suicidal& people&locked&coffins&bizarre&death&experience&schools&South& Korea&40& people&kill&day.html?ito=social&facebook ఈ తేనెకళ్ల పసివాడి గొంతు పిసికేయగలరా? అమాయకంగా, తేనె కళ్లతో మీ వైపు చూస్తున్న ఈ బుజ్జిగాడిని గొంతు పిసికి చంపేయమంటే మీరేం చేస్తారు? ఈ పసిప్రాణాన్ని చిదిమేయమంటే మీరేం చేస్తారు? మెడమీద తలకాయ, శరీరంలో హృదయం ఉన్న వాడెవడైనా చంపడు గాక చంపడు. అయితే మీ వైపు అమాయకంగా చూస్తున్న ఈ పసివాడే పెద్దవాడయ్యాక ప్రపంచ యుద్ధానికి కారణమై, లక్షలాది మంది ప్రాణాల హరించిన క్రూరాతిక్రూర నియంత హిట్లర్ అవుతాడని తెలిస్తే ఏం చేస్తారు? ప్రపంచంలో నరమేథం చేసి, యూదు జాతినే అంతరింపచేయడానికి ప్రయత్నించిన కిరాతకుడు ఇతనేనని తెలిస్తే ఏం చేస్తారు? న్యూయార్క్ టైమ్స్ ఇదే పశ్న వేసింది. రాబోయే రోజుల్లో కాబోయే నరరక్త పిశాచిని మీ చేతులతో చంపేస్తారా? ఈ పిల్లవాడు హిట్లర్ అవుతాడని తెలిస్తే చంపేస్తామన్న వారి సంఖ్య 42 శాతం. 30 శాతం హిట్లరేనని తెలిసినా చంపేది లేదని తెగేసి చెప్పారు. మరో 28 శాతం మాత్రం ఎటూ తేల్చలేక, ఏ జవాబూ చెప్పలేక ఉండిపోయారట. దీనిపై ధర్మసందేహాలు, ప్రశ్నోపప్రశ్నలు పుట్టుకొస్తున్నాయట. ట్విట్టర్లో దీనిపై జోకులు షేర్ అవుతున్నాయి కూడా. ఈ పశ్న, దానిపై చర్చ కూడా ఇంటర్నెట్ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. మోదీ పాట... గర్బా ఆట! ప్రధాని నరేంద్ర మోదీ మంచి కవి, రచయిత అన్న సంగతి చాలామందికి తెలియదు. ఆయన గుజరాత్లో చాలా పుస్తకాలే రాశారు. దసరా సమయంలో గుజరాతీయులందరూ ఎంతో ముచ్చటగా ఆడుకునే సామూహిక నృత్యం గర్బా. మోదీ గర్బాపై రాసిన ‘ఘూమే ఏనో గర్బా...’ అన్న పాట ఈ దసరాకి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ప్రసిద్ధ గర్బా గాయకుడు దేవాంగ్ పటేల్ ఈ గర్బా గీతాన్ని ఆలపించి, ఓ వీడియో తయారు చేశాడు. ఇప్పడు ఇంటర్నెట్లో వేలాది మంది దీన్ని లైక్ చేస్తున్నారు. అయితే మోదీ ఈ పాటను ఇప్పుడు రాయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రాశారు. కానీ ఇప్పుడు దేవాంగ్ పటేల్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. గర్బా లయబద్ధ నృత్యాధారిత సంగీతాన్ని ఆస్వాదించండి. https://www.youtube.com/watch?v=8E2VdoNTyYU అనగనగా...!! అనగనగా అంటూ నాన్న కథ చెప్పినప్పుడు మన ఊహలు రెక్కలు విప్పుకుంటాయి. మనం నాన్న ఒళ్లో కూర్చున్నా మనసు రాకుమారి, యువరాజు, రెక్కల గుర్రం, మాయలమరాఠీ, సప్తసముద్రాలకవతల చెట్టు తొర్రలో చిలుక దాకా వెళ్లిపోతుంది. గుర్రం పరిగెత్తడం నుంచి, కత్తి యుద్ధం దాకా అన్నీ మనసు తెరపై బొమ్మ కడతాయి. ఇప్పుడు పెద్దవాళ్లం అయినా మన మనసు భుజాలమీద భేతాళుడిలా చిన్ననాటి కథలు వేలాడుతూనే ఉంటాయి. కథ మన మనసుకు కళ్లు, ఊహలకు కాళ్లు ఇస్తుంది. ఇది నా కథ. మీ కథ. మనందరి కథ. బహుశః అందుకేనేమో అందరికీ ఈ వీడియో తెగ నచ్చేస్తోంది. నాన్న కథ చెబుతుంటే ఓ గడుగ్గాయి కథా ప్రపంచంలోకి వెళ్లి, అభినయించేస్తున్న వీడియో ఇది. బుల్లిపాప కథలో మమేకం అయిన తీరు తెగ ముద్దొచ్చేస్తుంది. ఊ కొడుతూ, ఉలిక్కిపడకుండా నటించడం అబ్బురపరుస్తుంది. నిజానికి గతేడాది అప్ లోడ్ అయినా ఇప్పటికీ ఇది హిట్టే. రెండు లక్షల షేర్లు, 70 వేల లైకులు, వేల సంఖ్యలో కామెంట్లతో టాప్ ఆఫ్ ది చాట్స్లోఉంది. చూడండి. మీ నాన్నో, మావయ్యో మిమ్మల్ని గుండెల మీద పడుకోబెట్టుకుని చెప్పిన కథల్లోకి మరోసారి వెళ్లిపోండి. https://www.facebook.com/TulunaduNews/videos/833345003363381/ -
తిప్పుసుల్తాన్
నెట్ఇంట్లో ఇదివరకు రెండే ఇళ్లు... ఒకటి పుట్టిల్లు. ఇంకొటి మెట్టినిల్లు... ఇప్పుడు మూడో ఇల్లు కూడా వచ్చేసింది. అదే నెట్టిల్లు...నెట్ ప్రపంచంలో నేలకు కొరత లేదు. రియల్ బూమ్ల భూదందాలుండవు. ఇక్కడంతా వర్చువల్! నెట్ ప్రపంచం దుర్యోధనుడి మయసభ లాంటిది. కాలు జారనూవచ్చు. కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతాలు చూడనూవచ్చు. మనం మంచినే తీసుకుందాం. మంచిగా పంచుకుందాం. నెట్టింట్లో మంచిని నిజం ఇంట్లోకి వైఫై సాయంతో బ్లూటూత్ బాటలోనో డేటా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఏమంటారు? ‘‘లేదా రొయ్యకు బారెడు మీసము’’ అని వెక్కిరిస్తే వెక్కిరించవచ్చు గాక...! ‘‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’’ అని వ్యంగ్యం వొలికిస్తే వొలికించవచ్చు గాక..!! ‘‘మీసాలోడురోయ్’’ అని వెటకారం పలికిస్తే పలికించవచ్చుగాక!! ‘‘నీ పోతు గడ్డం... ఛీఛీఛీ నాకడ్డం’’ అని ఆరుద్ర లాంటి వారిని భార్య విమర్శిస్తే విమర్శించవచ్చుగాక!! ఎవరెన్ని అన్నా మీసాల బినే వేరు. గడ్డాల ఘనతే వేరు! అందుకే జర్మనీలోని హోఫెనర్ బియర్డ్ క్లబ్ 1990 నుంచి ప్రపంచ గడ్డం పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3, 4న గడ్డం పోటీలు జరిగాయి. జడ్జీలు మాత్రం అందరూ ఆడవారేనట! ఇందులో మూడు కేటగిరీలు - మీసం విభాగం, సగం మీసం సగం గడ్డం విభాగం, పూర్తి గడ్డం విభాగం. ‘‘గంధం చెక్కల వీరప్పన్ చచ్చిపోయాడు కానీ... బతికుంటే ట్రోఫీ మనదే’’ అని బాధపడకండి. పెద్ద మనసు చేసుకుని దీన్లో విజేతలను ‘‘మీసాలా గోపాలా రారా’’ అంటూ వెల్కం చేయండి. మీసాలూ, గడ్డాలూ ‘తిప్పు సుల్తాన్’లకు స్వాగతం చెప్పండి.<http://www.buzzfeed.com/lauragallant/the-hairiest-event-of-2015-so-far#.fu9MMMpGOO> పెళ్లిళ్ల పేరయ్య ః ఫేస్బుక్! అమెరికాలో ఆర్కన్సాస్కు చెందిన షుల్లర్ బెన్సన్ ఆరేళ్ల క్రితం అక్టోబర్ నెలలో సెల్ఫోన్లో ఫేస్బుక్ చూద్దామని యాప్ను క్లిక్ చేశాడు. ఫేస్బుక్ ఓపెనైంది. కానీ తెరుచుకున్నది సెలెస్టీ అనే అమ్మాయి అకౌంట్. లాగౌట్ చేద్దామంటే లాగౌట్ బటన్ కనిపించలేదు. అటు 1600 కి.మీ. దూరంలోని కొలరాడోలో ఉన్న సెలెస్టీ ‘ఎవరయ్యా నువ్వు. నా అకౌంట్ని ఆపరేట్ చేస్తున్నావు’’ అని వాయించేసింది. అటూ ఇటూ కాస్త కోపం, కావలసినంత కన్ఫ్యూజన్... కొన్ని గంటల పెనుగులాట తరువాత సమస్య సాల్వ్ అయింది. సారీలు, నెవర్మైండ్లు, థాంక్యూలు, మెన్షన్ నాట్లు పూర్తయ్యాక సెలెస్టీ షుల్లర్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ‘‘అనగా అనగనగా అమ్మాయుందిరా.. అనుకోకుండా నా ఫ్రెండయ్యిందిరా’’ అని పాడుకున్నాడు షుల్లర్. ‘‘మిర్చీ మిర్చీ మిర్చీ మిర్చిలాంటి కుర్రాడే’’ అనుకుంది సెలెస్టీ. 2013లో ఇద్దరూ ఫేస్బుక్ నుంచి ఫేస్ టు ఫేస్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత ఆమె కొలరాడో నుంచి ఆర్కాన్సాస్కి వచ్చి షుల్లర్ రూమ్లోనే ఉండడం మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్ 21న షుల్లర్, సెలెస్టీలు ఒక ఇంట్లో ఉండేవాళ్ల నుంచి ఒకింటి వాళ్ల స్థాయికి ఎదిగారు. ఫేస్బుక్ పోస్టుల రూపంలో షుల్లర్ తన ప్రేమ కథను ఇమ్గుర్.కామ్లో రాశాడు. 4.70 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ఓ పెద్ద భవనం చిన్న చీకటి గదిలో మార్క్ జుకర్బర్గ్ అనే పెళ్లిళ్ల పేరయ్య తన సిస్టమ్ ఎర్రర్ ఒక పెళ్లి చేసేసిందని సంతృప్తిగా నిట్టూర్చాడు. అమెరికాలో అవుతున్న పెళ్లిళ్లలో 17 శాతం ఫేస్బుక్ వల్లే అవుతున్నాయని కథనం!! http://imgur.com/gallery/HK6Fo బుల్ డాగ్ ‘భౌభౌ’, భల్లూకం ‘బేర్ బేర్ ఓ బుల్లి బుల్ డాగ్ తన ‘భౌ భౌ’తో ఒకటి కాదు, ఏకంగా రెండు ఎలుగుబంట్లను బేర్మనిపించింది. తంతే తొమ్మిది కిలోల బరువుండదు ఆ బుల్లి కుక్క. భల్లూకం ఒక్కొక్కటి నలభై అయిదు కిలోలు. కానీ కుక్క కొంచెమైనా దాని అరుపు ఘనం. ఒక ఇంట్లోకి భల్లూకాలు చొరబడ్డాయి. ఇంట్లో వాళ్లు భయంతో పరుగులు తీశారు. కానీ బుల్డాగ్ భౌభౌమంది. ఆ అరుపులకు భల్లూకాలు బెదిరి పారిపోయాయి. విధి నిర్వహణ చేసిన తృప్తితో తోకాడించుకుంటూ బుల్డాగ్ మళ్లీ తన మూలకి చేరుకుంది. ఈ సంఘటన లాస్ ఏంజిల్స్లో జరిగింది. బుల్లికుక్క యజమాని ‘చాలా ధైర్యంగా’ తలుపులన్నీ బిగించుకుని, కిటికీ సందులోనుంచి బుల్లి కుక్క సాహసాన్ని విడియో తీసి, దాన్ని అప్లోడ్ చేశాడు. కుందేళ్లు తోడేళ్లను తరిమికొట్టిన చోట విజయనగర సామ్రాజం ఏర్పడింది. సికాకులం చిట్టడవుల్లో చిలకలు కత్తులు దులపరించిన చోట విప్లవాలు పుట్టాయట... ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అని అడవుల్లోకి పిలిచాయట. మరి ఈ బూల్డాగ్ భల్లూకాలను బేర్మనిపించిన చోట ఏమవుతుందో చూడాలి. www.sakshipost.com/index.php/ news/international/64231-tiny-bulldog- manages- to-chase-2-bears-out-of-her-garden.html ఈ మ్యూజిక్ ఏ వాయిద్యాన్నీ హింసించలేదు ఈ సినిమాలో ఏ జంతువునూ హింసించలేదు అంటూ డిస్ క్లెయిమర్లు ఇవ్వడం చూశాం. కానీ ఈ మ్యూజిక్ వీడియోలో ఏ వాయిద్యాన్నీ హింసించలేదు అన్న ప్రకటన ఎక్కడైనా చూశారా? అలాగైతే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సిందే. ప్లాస్టిక్ గ్లాసులు, గాజు గ్లాసులు, స్పైట్ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, సిల్వర్ కాగితం, ఖాళీ వాటర్ బబుల్, టేబుల్, నాలుగు కర్ర ముక్కలు, ఒక గాజు గ్లాసు నుంచి ఇంకో గాజు గ్లాసులోకి ఐసు ముక్కలు వేయడం... ఇవి చాలు ఏఆర్ రహమాన్ రోజాలో కట్టిన ‘‘పరువం వానగా...’’ పాటను మళ్లీ పుట్టించడానికి. 18 నుండి 20 ఏళ్లలోపు ఉన్న కుర్రకారు క్రియేటివిటీ ఇది అవడానికి ఓ కూల్ డ్రింక్ యాడ్ కావచ్చు. కానీ తమ కంపోజిషన్ను ఏ ఆర్ రహమాన్ అంతటి వాడికి అంకితం ఇచ్చేంత కుర్ర పొగరును తప్పనిసరిగా చూసి తీరాల్సిందే. ఇప్పటికే 10.08 లక్షల మంది చూశారు. మీరూ చూడండి. <https://www.youtube.com/watch?v=_X0IBya0SQk> ఇచ్చుటలో ఉన్న హాయి! ఓ ముసలావిడ బస్సెక్కుతుంది. ఆమె ఎక్కడ సీటడుగుతుందోనని ఓ యువతి చెవులకు ఇయర్ ఫోన్లు బిగించుకుని ఎటో చూస్తూ చేయని రిక్వెస్టుకు చెప్పని ‘నో’ని ముఖంపై ఫిక్స్ చేసుకుని కూర్చుంటుంది. ఆమె పక్కనున్న కుర్రాడు లేచి నిలబడి చిరునవ్వుతో పెద్దావిడకి సీటిస్తాడు. అప్పుడు చూస్తుంది ఆ యువతి... ఆ కుర్రాడికి ఒక కాలే ఉంటుంది. ఆ యువతి ముఖంలో పశ్చాత్తాపం మేఘంలా ముసురుకుంటుంది. ఆమె లేచి ఆ కుర్రాడికి సీటిస్తుంది. జాయ్ ఆఫ్ గివింగ్ ఉద్యమంలో భాగంగా తయారైన ఈ యాత్ ఉద్యమం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ ఫీవర్ పుట్టిస్తోంది.https://www.kulzy.com/work/92966/joy-of-giving-week/film/bus/#_=_ -
చేపల వలలో కొండచిలువ
నర్సరావుపేట (గుంటూరు) : చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కడంతో జాలరులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో శనివారం జరిగింది. చేపల వేటకు వెళ్లిన జాలర్లు విసిరిన వలలో చేపలతో పాటు కొండచిలువ ఉండటాన్ని గమనించిన జాలర్లు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. -
నెట్లో పులివెందుల విద్యార్థికి టాప్ ర్యాంక్
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొక్కు నరేష్ అనే విద్యార్థి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2015 (నెట్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మంగళవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో తెలుగు విభాగంలో 350 మార్కులకు గాను 234 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. నరేష్ ఒకటి నుంచి 10వ తరగతి వరకు నల్లపురెడ్డిపల్లిలో.. ఇంటర్, డిగ్రీ పులివెందుల బీకేఆర్ఎం కళాశాలలో చదివాడు. తిరుపతి ఓరియంటల్ పీజీ కళాశాలలో ఎంఏ తెలుగు పూర్తి చేశాడు. గ్రామీణ నేపథ్యం, తెలుగు భాష పట్ల ఉన్న అభిమానమే తనను ఈ ర్యాంకు సాధించేలా చేసిందన్న నరేష్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు రెండు సార్లు, నెట్లో ఇప్పటి వరకు నాలుగు సార్లు అర్హత సాధించడం విశేషం. తల్లిదండ్రులు కె. నరసింహులు, లక్ష్మీదేవిలు వ్యవసాయం చేసుకుంటూ నరేష్ విద్యాభ్యాసానికి సంపూర్ణ సహకారం అందించారు. -
నెట్ఇంట్లో అఁ ఆఁ..!
అ అంటే అద్భుతం, ఆ అంటే ఆశ్చర్యం. ఈవారం మన నెట్ ఇంట్లోఅన్నీ ఇలాంటి విశేషాలే. కుప్పలు కుప్పలుగా కబుర్లు, గంపలకొద్దీ గాసిప్లు, వీసెల్లెక్కన వింతలు, విడ్డూరాలు... ఇలా సెల్ఫీల నుంచి సిటిజెన్ జర్నలిజం దాకా అన్నిటికీ పుట్టిల్లు.. మన నెట్టిల్లు. కంప్యూటర్ని కలలోనైనా చూడని ఓ పూలమ్ముకునే అమ్మాయిని ఈ నెట్ ఇల్లు బ్యూటీ అట్లాస్లోకి ఎక్కించగలదు. ఉద్యోగం చేసి బోరుకొట్టిన యువకుడికి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటివ్వగలదు. ఇలా అద్భుతం, ఆశ్చర్యం, అద్వైతం,ఆలోచన, అనూహ్యం, అసాధ్యం అనిపించే గతవారపు నెట్ సంచలనాల సమాహారం... మీకోసం... ఆశ్చర్యం మన మంత్రి ఒకాయన చైనాకి వెళ్లాడట. చైనా మంత్రి ఆస్తి చూసి ఆశ్చర్యపోయాడట. ఇంత ఆస్తి ఎలా వచ్చింది అని అడిగాడట. చైనావాడు దూరంగా ఉన్న ఒక వంతెనను చూపించి ‘బ్రిడ్జి కనిపిస్తుందా?’ అని అడిగాడట. అవునన్నాడు మనవాడు. ‘‘అందులో టెన్ పర్సెంట్ నా వాటా’’ అన్నాడట చైనా మంత్రి. కొన్నాళ్లకి చైనా మంత్రి మన దేశానికి వచ్చాడట! మన మంత్రిగారి సంపద చూసి నోరు వెళ్లబెట్టాడట! ఇదెలా సాధ్యం అని అఢిగాడటు. మనవాడు ‘‘దూరంగా వంతెన కనిపిస్తోందా?’’ అని అడిగాడట! చైనా మంత్రికి ఏమీ కనిపించలేదు. ‘‘ఉహూ’’ అన్నాడు. ‘‘నా వాటా సెంట్ పర్సెంట్’’ అన్నాడట మనవాడు. ఈ వీడియో సరిగ్గా ఆ కథకి అద్దం పడుతుంది. మహారాష్ర్టలోని నాగపూర్కి, మధ్యప్రదేశ్లోని ఛింద్వారాని కలిపే హైవే నిర్మాణం ఎంత ‘పైన పటారం లోన లొటారం’గా జరిగిందో ఓ చిన్నపాటి వరద చెప్పేస్తుంది. కొద్దికొద్దిగా నీరు వచ్చి రోడ్డుపైనుంచి ప్రవహించడం, అడుగునుంచి రోడ్డును క్షణాల్లో కోసేయడం, ఆ తరువాత మొత్తంగా రోడ్డు డొల్లతనం బయటపడడం చూడొచ్చు. ఇది ఈమధ్యే జరిగిన సంఘటన. పదకొండు లక్షలమంది ఈ మూడు నిమిషాల విడియోని చూశారు. మీరూ చూడండి. మేరా భారత్ మహాన్ అనండి. https://www.facebook.com/arvind.shrivastava.773/videos/678813465553732/ ఆలోచన చైనాలో ఇటీవలే రెండో ప్రపంచయుద్ధం విజయోత్సవాలు జరిగాయి. బీజింగ్లో భారీగా సైనిక కవాతులు జరిగాయి. దీని కోసం చైనాలో కొన్ని చోట్ల వాహనాల రాకపోకల్ని నిషేధించారు. దీంతో ప్రజలకు ఆకాశం స్పష్టంగా కనిపించసాగింది. భవనాలు, వాటి డిజైన్లు, వాటికి అమర్చిన కిటికీలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. కొత్త బీజింగ్ను చూసినట్టు అనిపించింది. ప్రజలందరూ దీన్ని పడీ పడీ చూశారు. ఉత్సవాలు అయిపోయాయి. నిషేధాలు తొలగిపోయాయి. మళ్లీ కార్లు, స్కూటర్లు రోడ్లపై రయ్మన్నాయి. కొద్ది గంటల్లోనే ఆకాశం దుమ్ముతో మసకబారింది. భవనాలు అస్పష్టం అయిపోయాయి. బీజింగ్పై కాలుష్యం కంబళి కప్పుకుంది. పొల్యూషన్ బీజింగ్ను ఎలా కమ్మేసుకుంటుందో చెప్పే ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాహన కాలుష్యం బీజింగ్ను ఏం చేస్తోందో ఈ రెండు ఫొటోలు చూస్తే తెలుస్తుంది. http://en.yibada.com/articles/61158/20150907/after-brief-blue-skies-from-parade-beijings-air-pollution-is-back.htm#ixzz3l97Z0A9R అద్భుతం అనగనగా అనగనగా ఒక మునీరా. ఆమెది మధ్య ఆసియాలోని తాజికిస్తాన్. అనగనగా ఒక మిహైలా. ఆమెది యూరప్లోని రొమేనియా. మిహైలా ఒక ఫోటోగ్రాఫర్. మునీరా పూలమ్ముకునే పాప. మిహైలా ప్రపంచమంతా తిరుగుతుంది. మునీరాకి సొంత ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అట్లాస్ ఆఫ్ బ్యూటీ ప్రాజెక్టులో భాగంగా మిహైలా నొరోక్ తాజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో అతివల అందాలను క్లిక్ చేస్తూ ఉండగా, తోటలో పూలు ఏరుకుంటూ 19 ఏళ్ల మునీరా మీర్జోయేవా కనిపించింది. అంతే మిహైలా ఆమెను క్లిక్మనిపించింది. ఆ తరువాత ఏమైంది? ఆ తరువాత కథంతా సోషల్ మీడియా నడిపించింది. మునీరా ఫోటోని చూడగానే సోషల్ మీడియాకి వైరల్ ఫీవర్ వచ్చింది. వందలు వేలుగా, వేలు లక్షలుగా షేర్లు అయ్యాయి. మునీరా ఉన్నట్టుండి సెలబ్రిటీ అయింది. ఆమె గురించి చెప్పుకుని ఇప్పుడు తాజికిస్తాన్ తలకిందులైపోతోంది. కటిక పేదరికంలో మగ్గుతున్న మునీరాకోసం ఇప్పుడు తాజిక్ ఫేస్బుక్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధిని సేకరించడం మొదలైంది. సోషల్ మీడియా పవరేంటో చూపించిన సక్సెస్ స్టోరీలో తమాషాగా హీరోయిన్లే తప్ప హీరోలు లేరు. అసహ్యం మనిషి రెండు కాళ్ల పశువు. మిగతా పశువులు గడ్డం గీసుకోవు. ద్విపాద పశువు గీసుకుంటాడు. అంతే తేడా! మనిషి పశువేనన్న విషయంలో ఎవరికీ సందేహం రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పశువులాగా వ్యవహరిస్తూనే ఉంటాడు. ఓ సూపర్ మార్కెట్లో తల్లిదండ్రులు పిల్లాడిని ఆడుకొమ్మని వదిలి, సామాన్లు కొనుక్కోవడంలో మునిగిపోయారు. ఓ రెండు కాళ్ల పశువు ఇదే అదనుగా ఆ పాలుగారే పసివాడిని బలవంతంగా పెదాలపై ముద్దులు కురిపించి, తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఆకలిగొన్న తోడేళ్లు మేకపిల్లలను ఎలా వేటాడేస్తాయో చూడాలంటే అడవుల్లోకి వెళ్లక్కర్లేదని నిరూపిస్తాడు. ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎక్కడ జరిగింది. ఎవరు చేశారు అన్నది ఇక్కడ అప్రస్తుతం. బాల్యాన్ని ఎలా చిదిమేస్తున్నారన్నది తెలుసుకోవడం ముఖ్యం. పీడోఫీలియా అన్న ముద్దు పేరుతో చెలామణి అయ్యే ఈ పైశాచికాన్ని చూసైనా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నదే ఈ వీడియో సందేశం. తండ్రులూ తల్లులూ... తస్మాత్ జాగ్రత్త! http://www.indiatimes.com/videocafe/this-video-of-a-mall-toy-car-operator-forcibly-kissing-a-child-will-scare-you-even-if-you-are-not-a-parent-244963.html అద్వైతం యుద్ధం చేసేవాడెలా ఉండాలి? బుల్లెట్ల భాష మాట్లాడాలి. బాంబులతో దోస్తీ చేయాలి. బంకర్లలో నుంచి ఎప్పటికప్పుడు ఇదే ఆఖరి శ్వాస అన్నట్టు బతకాలి. తుపాకీ తోడుండాలి. కొండకోనల్లో కలాష్నికోవ్ లే దోస్తులు. గండశిలల్లో గ్రేనేడ్లే ప్రియురాళ్లు. చెట్టు చాటునో, గుట్ట మాటునో పొంచి ఉన్న చావు కోసం ప్రతి క్షణం ఇదే ఆఖరి క్షణం అన్నట్టు బతకాలి. అనునిత్యం చావుతో సహవాసం చేసే సైనికుడికి ఆకలేసినప్పుడు ఓ రెండు ఎండు రొట్టెలు, కాసింత కూర కడుపు నింపుతుంది. బండరాయే డైనింగ్ టేబుల్గా మారుతుంది. ఆ క్షణంలో భార్యా పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఓ సిక్ఖు సైనికుడు తాను తినే రొట్టె ముక్కలనే లాలనగా, ప్రేమగా ఓ ఉడుతతో పంచుకుంటున్న ఒకటిన్నర నిమిషాల వీడియో మన గుండె లోపలి పొరల్ని గీరుతుంది. తుపాను మధ్య ప్రశాంతతో ఉన్న ఆ జవాను, ఆయనతో దోస్తీ చేసిన ఉడుత ఉరుకులను చూస్తూంటే యుద్ధం అమరత్వ లబ్ధ్ది మాత్రమే కాదు అద్వైత సిద్ధినీ ఇస్తుందనిపిస్తుంది. https://www.facebook.com/PunjabSpectrumCom/videos/1038045736212019/ అనూహ్యం దుబాయి షేకులు ఏదైనా చేయగలరు. అప్పట్లో ఆకాశాన్ని ముద్దాడే వెయ్యడుగుల ఎత్తై బూర్జ్ ఖలీఫా భవనంపై టెన్నిస్ స్టేడియం కట్టారు. ఇప్పుడు తాజాగా సముద్రం లోతుల్లో టెన్నిస్ స్టేడియం కట్టబోతున్నారు. ఈ స్టేడియం పూర్తయితే నీలి రంగు నీరు, అందులో ఈదుకుంటూ పోయే చేపలు, సొర చేపలు, నలువైపులా ముసురుకుంటుంటే మధ్యలో ‘లవ్ వన్ లవ్ ఆల్’ నడుస్తూ ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు టెన్నిస్ కోర్టులు కట్టబోతున్నారు. క్రిస్తాఫ్ కొటాలా అనే పోలండ్ ఆర్కిటెక్ట్ ఈ అద్భుత అంతఃస్సాగర విశ్వామిత్ర సృష్టి చేయబోతున్నాడు. దీనికోసం పగులలేని, పగలలేని గాజు షీట్లు తయారు చేయబోతున్నారు. త్వరలో మారియా షరపోవా, రఫేల్ నాదల్, సెరీనా, మన సానియా మీర్జాలు జలక్రీడలు, టెన్నిస్ క్రీడల్ కలిసి ఆడేస్తారేమో! దీనార్లు, రియాల్స్ దండిగా ఉన్న దుబాయి బాబులు సృష్టించబోతున్న వాటర్ వరల్డ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా గుప్పుమంటోంది. http://www.pursuitist.in/an-underwater-tennis-court-in-dubai-to-host-grand-slam-tournaments/?utm _ source=taboola&utm_medium=cpc&utm_campaign=pursuitist_traffic&utm_term=greatandhra -
సీఎస్ఐఆర్ నెట్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహిస్తున్నాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. తాజాగా ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది... నెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీఎస్ఐఆర్, యూజీసీలు సంయుక్తంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పేరిట ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. పీహెచ్డీకి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సంవత్సరానికి రూ.20,000 కంటింజెన్సీ ఫండ్తోపాటు నెలకు రూ.25 వేలు జేఆర్ఎఫ్ లభిస్తుంది. అర్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులతో ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ బీఎస్-లుగేళ్లు/బీఈ/బీటెక్/బీఫార్మా/ఎంబీబీఎస్ (ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు 50 శాతం). వయసు: 2015, జూలై 1 నాటికి గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ప్రత్యేక కేటగిరీ, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. రఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ.1000, నాన్ క్రీమీలేయర్ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250. ఓబీసీ అభ్యర్థులు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తే వారిని జనరల్ అభ్యర్థులుగానే పరిగణిస్తారు. పరీక్షా విధానం: ప్రశ్నపత్రం 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం 3 విభాగాలుగా ఉంటుంది. సబ్జెక్టులు: కెమికల్ సెన్సైస్; ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషన్, ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్ పార్ట్-ఎ: ఇది అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు కామన్గా ఉంటుంది. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 30 మార్కులు ఉంటాయి . ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ ముఖ్యంగా లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిలీ, క్వాంటిటేటివ్ కంపారిజన్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. పార్ట్-బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులు. పార్ట్-సి: ఇందులో మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఏవైనా 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు. పరిశోధనాత్మక అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సైంటిఫిక్ నాలెడ్జ్తో ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తారనే కోణంలో ప్రశ్నలుంటాయి. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 25, 2015. దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ: ఆగస్టు 24, 2015. ఆన్లైన్ దరఖాస్తు హార్డ్కాపీ పోస్ట్ ద్వారా సీఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ యూనిట్కు చేరేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 3, 2015. పరీక్ష తేదీ: డిసెంబర్ 20, 2015. పరీక్షా కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్. వెబ్సైట్: www.csirhrdg.res.in -
నెట్లో త్రిష పెళ్లి ఫొటో
ట్విట్టర్ అకౌంట్స్లతో తుంటరి అభిమానులే కాదు త్రిషలాంటి నటీమణులు ప్రేక్షకులతో ఆడుకుంటుంటారు. ఈ మధ్య పెళ్లి ఫొటోను ఇంటర్నెట్లో ప్రచారం చేసిన నటి చార్మి అందరికీ షాక్ ఇచ్చారు. చివరికి ఆ ఫొటో తాను నటిస్తున్న టాలీవుడ్ చిత్రం జ్యోతిలక్ష్మి లోనిదని తెలిసింది. త్రిష కూడా అభిమాను లకు ఇటీవల షాక్ ఇచ్చారు. త్రిష ఈ మధ్యనే నిర్మాత, వ్యాపారవేత్త అరుణ్మనియన్తో ప్రేమ వివాహానికి సిద్ధం అయ్యారు. వీరి నిశ్చితార్థం కూడా నిరాడంబరంగా జరిగిపోయింది. ఇక పెళ్లి పీటలెక్కడమే తరువాయి. కాగా అదెప్పుడనే ప్రశ్న పరిశ్రమలో చర్చనీయాంశమైంది. కారణం గత మార్చి నెలలోనే త్రిష వివాహం జరుగుతుందనే ప్రచారం జరిగింది. అయితే త్రిష తాను అంగీకరించిన చిత్రాలు పూర్తి చేసే వరకు వివాహాన్ని వాయిదా వేయాలని నిర్మాతల విజ్ఞప్తి మేరకు త్రిష వివాహ తేదీని నిర్ణయించలేదని సమాచారం. నిశ్చితార్థానికి ముందు ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేస్తూనే కొత్త చిత్రాలకు వరుసగా అంగీకరిస్తుండడం చాలామందిని ఆలోచనల్లో పడేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో త్రిష పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫోటోను నెట్లో పోస్ట్ చేశారు. దీంతో త్రిష వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లి ఫోటోనే ఆమె నెట్లో పోస్ట్ చేశారు అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఆ ఫొటో త్రిష తాజా చిత్రం లోనిదన్న విషయం ఆ తరువాత తెలియవచ్చింది. అయితే ఇప్పుడా ఫొటోను నెట్లో ప్రచారం చేయడంలో త్రిష మతలబు ఏమిటబ్బా అని ఆరాలు తీసే పనిలో పడింది కోలీవుడ్. -
బహుళ ప్రయోజనాల.. నెట్
ఈసారి నెట్ నిర్వహణలో కీలకమైన మార్పు.. యూజీసీ తరపున పరీక్షను ఈసారి నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పర్య వేక్షిస్తుంది. ఇది తప్ప ఎటువంటి మార్పులు లేవు. నెట్ పరీక్షను ఈ సారి 79 ప్రధాన సబ్జెక్ట్లలో నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్గా: రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లు.. పేపర్-1, 2, 3గా ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. వివరాలు.. పేపర్ మార్కులు పశ్నలు సమయం 1 100 60 ప్రశ్నల్లో 50 సాధించాలి 75 ని. 2 100 50 ప్రశ్నలను సాధించాలి 75 ని. 3 150 75 ప్రశ్నలను సాధించాలి 150 ని. అర్హత మార్కులు: పేపర్లు, కేటగిరీల వారీగా వేర్వేరు అర్హత మార్కులను నిర్ణయించారు. ప్రతి పేపర్లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. వివరాలు.. కేటగిరీ పేపర్-1 పేపర్-2 పేపర్-3 జనరల్ 40 40 75 బీసీ 35 35 60 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ 35 35 60 ప్రయోజనాలు: నెట్లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్/ సెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్నకు ఎంపికైన అభ్యర్థులకు.. ఐదేళ్లపాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటీ/ఐఐఎస్సీ వంటి ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి.. పరిగణించే అర్హతల్లో నెట్/ జేఆర్ఎఫ్ అర్హతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. ప్రిపరేషన్ పేపర్-1: ఈ పేపర్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. దీని కోసం మెథడాలజీ, కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్ట్ పరిజ్ఞానం బాగా ఉన్న అభ్యర్థులు పేపర్-1పై దృష్టి పెట్టాలి. ఇందులోని 60 ప్రశ్నలలో 50 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. గమనించాల్సిన అంశం.. అభ్యర్థులు 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే..మొదట ప్రయత్నించిన 50 ప్రశ్నలనే మూల్యాంకన చేస్తారు. కాబట్టి సమాధానం కచ్చితంగా తెలిసిన ప్రశ్నలనే ఎంచుకోవాలి. పేపర్-2, పేపర్-3: ఇవి సబ్జెక్ట్ పేపర్లే అయినప్పటికీ ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతుంది. దీన్ని గుర్తించి తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుని ఏయే ఆధ్యాయాలకు ఎంత వెయిటేజీ ఉంటుందో గమనించి ఆ మేరకు ప్రిపరేషన్ సాగించాలి. ఒక్కొక్క అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నప్పుడే సంబంధిత అంశంపై మాక్టెస్ట్లు రాయడం ఉపయోగకరం. మాక్టెస్ట్లకు హాజరుకావడం వల్ల వేగంగా సమాధానాన్ని గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది. డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్తో: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నప్పటికీ విద్యార్థులు తమ ప్రిపరేషన్ను డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్తో సాగించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఏ ఒక్క అంశాన్నీ విస్మరించకుండా విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. అప్పుడే సబ్జెక్ట్లో ఎంత లోతైన ప్రశ్న అడిగినా సమాధానం గుర్తించడం సాధ్యం. నెట్లో కనీస అర్హత మార్కులను నిర్ణయించినప్పటికీ..60 నుంచి 70 శాతం మార్కులు పొందే దిశగా కృషి చేయాలి. సెట్-నెట్: ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) నోటిఫికేషన్ వెలువడింది. కాబట్టి సెట్ కు సమాంతరంగా నెట్ ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే నిర్వహించే సంస్థలు వేర్వేరు తప్ప మిగతా అంశాలన్నీ దాదాపు నెట్,సెట్ విషయంలో ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా నెట్ తర్వాత సెట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ప్రిపరేషన్ సెట్ కూడా ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ సమాచారం అర్హత: సంబంధిత సబ్జెక్ట్లో 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు) మాస్టర్ డిగ్రీ లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్: 28 సంవత్సరాలు (డిసెంబర్ 1, 2014 నాటికి). లెక్చరర్షిప్నకు ఎటువంటి వయోపరిమితి లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్-రూ.450, బీసీ- రూ. 225 (నాన్క్రీ మిలేయర్), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ- రూ.110. ఫీజును చలాన్ రూపంలో చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశించిన విధంగా కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలకు పంపాలి. ఆన్లైన్ దరఖాస్తు, చలాన్ తీసుకునేందుకు చివరి తేదీ: నవంబర్ 15, 2014. చలాన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 18, 2014. దరఖాస్తు, అటెండెంట్ స్లిప్, అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 19, 2014. కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలో ప్రింట్ అవుట్ దరఖాస్తు, సంబంధిత సర్టిఫికెట్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 25, 2014. పరీక్ష తేదీ: డిసెంబర్ 28, 2014. వెబ్సైట్: http://cbsenet.nic.in -
జాలర్ల వలలో రక్షస చేప
గుమ్మిడిపూండి: తమిళ జాలర్ల వలలో అరుదైన చేప పడింది. తమిళనాడులోని అలంగాకుప్పానికి చెందిన దేశాస్పన్ నేతృత్వంలోని జాలర్ల బృందం వారం రోజులుగా సముద్రంలో చేపల వేట సాగిస్తోంది. రెండు రోజుల క్రితం వారి వలలో రాక్షసజాతికి చెందిన ఓ భారీ చేప చిక్కింది. దానిని బుధవారం సముద్ర తీరానికి తీసుకొచ్చారు. అరుుతే అప్పటికే అది మృతి చెందింది. చూడటానికి చాలా విచిత్రంగా ఉన్న ఈ చేప 150 కిలోల బరువు ఉందట. ఇది ఏ జాతికి చెందినదో గుర్తించేందుకుగాను దీనిని చైన్నై మత్స్యశాఖ పరిశోధన కేంద్రానికి తరలించారు.