psychologist
-
బాధ్యతల్లో బ్యాలెన్స్ లేకుంటే కాపురం కష్టమే!
రేఖది పల్లెటూరి నేపథ్యం. తండ్రిది వ్యవసాయం. తల్లి గృహిణి. పిల్లల పెంపకం బాధ్యత కూడా ఆమె మీదనే ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన రేఖకు భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తయ్యాక ఆమెకు ఆనంద్తో పెళ్లయింది. ఆనంద్ ప్రభుత్వోద్యోగి. గృహిణిగా రేఖ సంతోషంగా బాధ్యతలను స్వీకరించింది. ఒక బిడ్డ పుట్టాక కూడా రేఖ తన పనులను హ్యాపీగా మేనేజ్ చేసుకునేది. రెండో బిడ్డ పుట్టాక కష్టమైంది. ఉదయాన్నే లేచి ఆనంద్కు బ్రేక్ఫస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల పనులు చూసుకోవడంతో చాలా అలసిపోయేది. ఆనంద్ తన పని ఒత్తిడిలో ఉండి ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేసేవాడు కాదు. కనిపించని దూరం..భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ సమకూర్చే క్రమంలో రేఖ తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. ఎప్పుడైనా తన అవసరాల గురించి ఆమె మాట్లాడగానే ఆనంద్ వాటిని పట్టించుకునేవాడు కాదు. లేదంటే తన ఆఫీసు ఒత్తిడి గురించి చెప్పుకునేవాడు. దీంతో తన కష్టాన్ని ఆనంద్ గుర్తించడం లేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించసాగింది. క్రమేపీ వారిద్దరి మధ్య మానసికంగా దూరం పెరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపుల్స్..కుటుంబ జీవితం అనేది ఆటోమేటిక్గా సాఫీగా సాగిపోయే విషయం కాదు. క్రమం తప్పకుండా పరస్పర సహకారం, ఓపిక, కమ్యూనికేషన్ అవసరం. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బలమైన బంధాన్ని కాపాడు కోవడం కోసం పాటించాల్సిన సూత్రాలివే. 1. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం⇒ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా, భావాలను వ్యక్తపరచడంలో ఓపెన్గా ఉండాలి⇒ ఐ–సెంటెన్సెస్ వాడకం అంటే ‘నాకు ఇలా అనిపిస్తోంది’, ‘నేను ఇలా ఫీలవుతున్నాను’ అని చెబుతూ, దూషణలకు లేదా నిందలకు తావు లేకుండా కమ్యూనికేషన్ చేయండి. మీ ఆలోచనలను ఈ విధంగా పంచుకోవడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.2.బాధ్యతలను పంచుకోండి⇒ గృహభారాలు ఒక్కరిపై మాత్రమే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఏమి చేయాలో కూర్చుని మాట్లాడి నిర్ణయించు కోవాలి. చిన్న విషయాల్లో కూడా భాగస్వామ్యం ఉంటే, ఎదుటి వాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది⇒ వారానికి ఒకసారి ఆ వారం ఎవరేం పనులు చేయాలనేది చర్చించుకోవడం ద్వారా బ్యాలెన్స్ను సాధించవచ్చు.3.తమ శ్రమను గుర్తించండి⇒ కుటుంబంలో ఎవరి శ్రమకైనా విలువ ఇవ్వడం అవసరం ⇒ భర్త తన పని ఒత్తిడిని, భార్య తన ఇంటి పనుల కష్టాన్ని పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది.⇒ వారానికి ఒకసారి ఓపెన్గా అభినందనలు లేదా కృతజ్ఞత వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది.4. ప్రత్యేక సమయాన్ని కేటాయించండి⇒ పనుల మధ్య ఎప్పుడు తనతో మాట్లాడతాడో అన్న నిరీక్షణ భార్య/భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది · వారానికి ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఒకరి కష్టాన్ని మరొకరు వినండి · మనసు పంచుకునే ఈ చర్చలు బంధం బలపడటానికి దోహదపడతాయి. 5. ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేయడం నేర్చుకోండి⇒ గృహిణిగా స్త్రీ, పనిలో పురుషుడు ఇద్దరూ ఒత్తిడితో ఉంటారు ⇒ దీర్ఘ శ్వాస, ధ్యానం, మైండ్ఫుల్నెస్ వంటి పద్ధతులు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి ⇒ అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.6. సామాజిక ప్రమాణాలను పునఃపరిశీలించండి⇒ భార్యాభర్తలు తప్పనిసరిగా వారి వారి పాత్రల్లోనే ఉండాలి అనే ఆలోచనను మార్చుకోండి ⇒ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ విషయంలో భర్త సహాయాన్ని సగర్వంగా కోరండి ⇒ గృహిణి కష్టం కూడా సమాన గౌరవానికి అర్హమైనది.7. సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి⇒ ఇతరులను తప్పు పట్టడం కంటే, కలిసి పనిచేయడం ద్వారా సమస్యలపై దృష్టి పెట్టండి⇒ ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసలు అందించుకోవడమనేది ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. 8. స్వీయపరామర్శ⇒ తన బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నానని భావించడంలో తప్పు లేదు. కానీ ఆలోచనను సానుకూలంగా మలచుకోవాలి ⇒ ‘నేను కుటుంబం కోసం ఇలా చేయగలిగాను’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి⇒ అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. దానివల్ల మానసిక శక్తి పెరుగుతుంది. -
బౌండరీ దాటితే ఔటే!
కవిత, కుమార్లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్కు వెళ్లింది. కాలంతో పాటు మారని మనుషులు..మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది. సరిహద్దులు అవసరం..భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. ⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. ⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. ⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. ⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. ⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి. వీటిని కవిత, కుమార్లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజ్లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు. రకరకాల హద్దులు..శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి. మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం. భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి. మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే! -
‘మైండ్ స్పోర్ట్స్’: మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
‘ఆలోచనల గురించి పెద్దగా ఆలోచించవద్దు’ అనుకునేవాళ్లకు ముగ్ధ బవరే చెప్పే మాట...‘మన ఆలోచనలే మన పనితీరును ప్రభావితం చేస్తాయి’ ముగ్ధ ఒకప్పుడు ప్రతిభావంతురాలైన స్విమ్మర్. స్పోర్ట్స్ సైకాలజీపై పెద్దగాఅవగాహన లేని కాలంలో ఎంతోమంది అథ్లెట్ల మనసును అధ్యయనం చేసింది. క్రికెట్ టీమ్ నుంచి మొదలు ఒలింపిక్, పారాలింపిక్ అథ్లెట్ల వరకు ఎంతోమంది అథ్లెట్లతో కలిసి పనిచేసింది.మానసిక సమస్యలు, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలతో ΄ పోరాడడానికి వారికి మార్గం చూపిన ముగ్ధ ప్రస్తుతం ‘మైండ్ స్పోర్ట్స్’ పేరుతో సొంతంగా ప్రాక్టీస్ నిర్వహిస్తోంది. ఎంతోమంది అథ్లెట్లకు దిశానిర్దేశం చేస్తోంది.‘మైండ్ స్పోర్ట్స్’పై పుస్తకం కూడా రాసింది. ఒక అథ్లెట్ మనసు మార్చడానికి ఏ అంశాలు ఉపయోగపడతాయో ఈ పుస్తకంలో వివరించింది.‘ఒక అథ్లెట్ మనసు ఇతర ప్రొఫెషనల్స్ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ముగ్ధ బవరే చెప్పే జవాబు...‘పూర్తిగా భిన్నం కాదు. మనం ఆలోచించే విధానం స్పోర్ట్స్ అయినా కార్పొరేట్ అయినా తేడా తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే ఏ రంగంలోనైనా మానసిక శిక్షణ(మెంటల్ ట్రైనింగ్) చాలా కీలకం. మనం ఆలోచించే విధానమే మన పనితీరును ప్రభావితం చేస్తుంది. సక్సెస్ మాత్రమే సర్వస్వం అనుకునేచోట వైఫల్యం బాధ పెడుతుంది. చాలామందిని కోలుకోకుండా చేస్తుంది. అయితే గెలుపు, ఓటములు ప్రతిభకు, ప్రతిభ లేక పోవవడానికి నిర్వచనం కాదనే అవగాహన ప్రస్తుత కాలంలో పెరిగింది -
ప్రాణాలు తీసే అభిమానం సరికాదు!
పుష్ప-2 సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలచివేస్తోంది.అసలెందుకిలా జరుగుతోంది? సినిమాల పట్ల ఇంత వేలంవెర్రి ఎందుకు? టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉండటమేంటి? అందుకు ప్రభుత్వాలు అనుమతించడమేంటి? వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడమే కాకుండా, ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలనే ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతోంది? దీన్ని ఎలా నివారించాలి? అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.మనదేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది. సినిమా హీరోలను దేవుళ్లుగా భావించడం, వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్ గా మారిపోయింది.ఫ్యాన్స్ మానసిక స్థితిఅభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటారు. వారితో మమేకమవుతారు. వారిలో తమను చూసుకుంటారు. అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిస్తుంది. అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు. ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు. ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ తనను తాను పుష్పలా భావించుకునేవాడని, అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి.మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్, ఎక్సయిట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది. దాంతో ఆ అనుభవం ఎక్సయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ప్రతీ మూవీ మొదటిరోజు చూసేందుకు, అందుకోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు ఉర్రూతలూగుతుంటారు.మొదటిరోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా, ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు. అలా తమ గ్రూప్ లో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది. అంతేకాదు, ఫ్యాన్స్ గ్రూప్ లో ఉన్నవారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది. మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీలవుతుంటారు. ఇది గుంపు ప్రవర్తన (Herd Behaviour)తో ముడిపడి ఉంటుంది.గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు. అభిమానుల ఆసక్తి, ఉత్తేజం వేగంగా పాకిపోతుంది, చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారతాయి. తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంద. సంధ్య ధియేటర్ వద్ద జరిగింది ఇదే.నిర్మాతల వ్యాపారాత్మక ధోరణి... బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప-2తో ఒక మేనియాగా మారింది. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం.వ్యాపారాత్మక ధోరణి తప్ప, అభిమానుల బలహీనతలను సొమ్మి చేసుకోవడం నిర్మాతల నైతికలోపంగా భావించవచ్చు. కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?మరోవైపు, భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు. ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని, తొక్కిసలాట జరగవచ్చని గుర్తించి ఉండాల్సింది. ఆయనా పని చేయలేదు. సరే ఆయన వచ్చారు. ధియేటర్ యాజమాన్యం, పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా ఒక నిండుప్రాణం బలయ్యింది. అందరూ బాధ్యత తీసుకోవాలి.. • ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాధాన్యతలను పునరాలోచించుకోవాలి. ప్రాణాలకంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసలు కోవాల్సిన అవసరం ఉంది. • పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి. వాళ్ళ అభిమానులు జవాబుదారీతనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు చేయాలి.• నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి, మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి. • మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్వర్డ్స్ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్తో ఓపెన్గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
నేటి బాలలే రేపటి మేధావులు!
నేటి బాలలే రేపటి పౌరులంటే అందరూ ఒప్పుకుంటారు. కానీ, నేటి బాలలే రేపటి మేధావులంటే అనుమానంగా చూస్తారు. పిల్లలందరూ జీనియస్లు ఎలా కాగలరు? అని ప్రశ్నిస్తారు. నాకో పదిమంది పిల్లలను ఇవ్వండి. వారు పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటే అదయ్యేలా పెంచగలనని అప్పుడెప్పుడో చెప్పాడు ప్రముఖ బిహేవియరల్ సైకాలజిస్ట్ జేబీ వాట్సన్.ఇదిగో వీరికి సాధ్యమైంది.. తల్లిదండ్రులు తలచుకుంటే, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే ప్రతి బిడ్డా తానెంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరతాడనడానికి అనేక ఉదాహరణలున్నాయి. 1898లో పుట్టిన విలియమ్ జేమ్స్ సిడిస్ అనే బాలుణ్ని బాలమేధావిగా మార్చారు. రిచర్డ్స్ విలియమ్స్ అనే తండ్రి తన బిడ్డలిద్దరినీ ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణులు విలియమ్స్ సిస్టర్స్గా తీర్చిదిద్దాడు. లాజ్లో పోల్గార్ అనే టీచర్ తన ముగ్గురు బిడ్డలనూ చెస్ గ్రాండ్ మాస్టర్స్ పోల్గార్ సిస్టర్స్గా తీర్చిదిద్దాడు. పట్నాకు చెందిన నారాయణ్ తులసి అనే ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడు తథాగత్ అవతార్ తులసిని బాల మేధావిగా తీర్చిదిద్దాడు. తాజాగా కేరళకు చెందిన ఆవిర్భావ్ అనే ఏడేళ్ల బాలుడు సూపర్ స్టార్ సింగర్–3 విజేతగా నిలిచాడు. రెండేళ్ల వయసు నుంచే అతని చుట్టూ సంగీత ప్రపంచాన్ని సృష్టి్టంచడంతో అది సాధ్యమైంది. గట్టిగా అనుకుంటే అవుతుంది..మీరు తలచుకుంటే మీ బిడ్డనూ మేధావిగా పెంచవచ్చు. అందుకు చేయాల్సిందల్లా వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను బలోపేతం చేయడమే. కాగ్నిటివ్ మ్యాట్రిక్స్: పిల్లల మేధో వికాసానికి పునాది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, ప్రతికూలతలను అధిగమించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఎందుకు’, ‘ఎలా’ వంటి ప్రశ్నలతో సంభాషణలను ప్రోత్సహించడం ద్వారా ఇన్వెంటివ్ మైండ్సెట్ని ప్రోత్సహించాలి.ఎమోషనల్ మ్యాట్రిక్స్: పిల్లలకు తెలివితేటలు ఎంత ముఖ్యమో భావోద్వేగాలు కూడా అంతే ముఖ్యం. భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇది వారిలో ధైర్యాన్ని, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.హెరిడిటరీ మ్యాట్రిక్స్: కుటుంబ వాతావరణం, సామాజిక పరిస్థితులు జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేయగలవని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెబుతున్నాయి. ఇంట్లో సానుకూల, ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జీన్స్ మ్యాట్రిక్స్ను అభివృద్ధి చేయవచ్చు. లాంగ్వేజ్ మ్యాట్రిక్స్: పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనసులోని భావాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి భాష అవసరం. పిల్లలతో కలిసి కథలు చదవడం, చెప్పడం, చర్చించడం ద్వారా దీన్ని సుసంపన్నం చేయవచ్చు. బిహేవియర్ మ్యాట్రిక్స్: పిల్లల దీర్ఘకాల విజయంలో అలవాట్లు, సంకల్పం ప్రధానపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన రొటీన్లను సృష్టించడానికి పిల్లలకు సహాయం చేయడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. సోషల్ మ్యాట్రిక్స్: మనిషి సంఘజీవి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో కుటుంబం, స్నేహితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. గౌరవం, దయ, సానుభూతి వంటి లక్షణాలను పిల్లలకు నేర్పడంలో ఆదర్శంగా ఉండాలి. మోరల్ మ్యాట్రిక్స్: పిల్లలు ఎదుగుతున్న కొద్దీ నైతిక భావనలు అభివృద్ధి చెందుతాయి. ఇవి వారి ప్రవర్తనను, నిజాయితీని, జీవితం పట్ల వారి ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తాయి. న్యాయం, దయ, బాధ్యత గురించి పిల్లలతో చర్చించడం ద్వారా వారిలో బలమైన నైతిక చైతన్యాన్ని పెంపొందించవచ్చు.స్కూల్లో చేర్పించడంతో తల్లిదండ్రుల పాత్ర పూర్తికాదని గుర్తించాలి. వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను అభివృద్ధి చేయడం బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డ సంపూర్ణ సామర్థ్యంతో ఎదుగుతాడు. అతనిలోని జీనియస్ మ్యాట్రిక్స్ ఆవిష్కృతమవుతుంది. ఆ దిశగా ఈరోజే అడుగులు వేయండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి బిడ్డా మేధావే..పుట్టిన ప్రతి బిడ్డా జీనియస్ కాగలిగిన సామర్థ్యంతోనే పుడుతుంది. కానీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాలు, పాఠశాల, ఉపాధ్యాయులు, సమాజం ఆ బిడ్డ చుట్టూ కనిపించని పరిమితులను ఏర్పరుస్తారు. కనిపించని ఆ వలలో చిక్కుకున్నవారు అదే నిజమని నమ్మి, ఆ పరిమితుల్లోనే పనిచేసి, పరిమితమైన విజయాలతో సంతృప్తి చెందుతుంటారు. కొద్దిమంది మాత్రమే తమ చుట్టూ ఉన్న పరిమితులను అధిగమించి, తమలోని ప్రతిభను పూర్తిగా చాటడం ద్వారా జీవితాల్లో, సమాజంలో శాశ్వతమైన మార్పు తీసుకువస్తారు. అలాంటి వ్యక్తులనే జీనియస్ అంటారు. -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
ప్రేమాకర్షణలు సహజం.. శాశ్వతం కావు
ఇంట్లో టీనేజర్స్ ఉన్నారంటే తల్లిదండ్రులకు గుండెల్లో గుబులే. ఎప్పుడేం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఏ గొడవ తీసుకొస్తారో అని! అన్నింటికంటే భయపెట్టే అంశం.. ప్రేమ వ్యవహారాలు. పెళ్లికి ముందు శృంగారం కూడా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశం. కానీ కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి. ఈ కాలం పిల్లలకు రిలేషన్స్, బ్రేకప్స్ సర్వసాధారణమయ్యాయి. కొందరు ఈ రిలేషన్స్లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు బ్రేకప్ వల్ల అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అందుకే పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కొందరైతే తిడతారు, కొడతారు, కంట్రోల్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల టీనేజర్లలో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెరగడం తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. దీనికన్నా టీనేజర్లతో ఓపెన్గా మాట్లాడటం, సరైన గైడెన్స్ను అందించడమే మంచిదని గుర్తించాలి. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. సెక్సువల్ డెవలప్మెంట్..సెక్సువల్ డెవలప్మెంట్ అనేది సహజమైన పరిణామం. పీరియడ్స్, వెట్ డ్రీమ్స్ లాంటి శారీరక మార్పులు, అపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి లాంటి భావోద్వేగ మార్పులు మొదలవుతాయి. ఇదంతా వారికి కొత్తగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్తో చర్చిస్తారు. లేదా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అందులో తప్పుడు సమాచారం అందే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశాలపై తల్లిదండ్రులే చర్చించాలి. అలా చర్చించడంలో ఎలాంటి తప్పూ లేదని గుర్తించాలి. ప్రేమ, ఆకర్షణ..టీనేజ్లో ప్రేమ, ఆకర్షణ సహజమైన భావోద్వేగాలు. నచ్చిన వ్యక్తి పట్ల బలమైన ఆకర్షణను కలిగి ఉంటారు. అదే ప్రేమ అని భ్రమపడుతుంటారు. ఇది చూసి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఆకర్షణ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొందరిలో ఎక్కువకాలం కొనసాగవచ్చు. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పిల్లలను జడ్జ్ చేయకుండా, వారి క్రష్, లవ్ గురించి ఓపెన్గా మాట్లాడండి, తప్పొప్పులు, పర్యవసానాల గురించి చర్చించండి. అప్పుడే వాళ్లు తమ భావోద్వేగాలను సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.టీనేజ్ సెక్స్..యవ్వనంలో సెక్స్ అనే అంశం చాలా సున్నితమైనది. యవ్వనంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల లేదా సోషల్ మీడియా లేదా ఫ్రెండ్స్ ప్రభావం వల్ల టీనేజ్ సెక్స్ పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ దశలో టీనేజర్లకు సరైన గైడెన్స్ అవసరం. అది ఫ్రెండ్స్ ద్వారానో, పోర్న్ ద్వారానో వచ్చేకంటే, పేరెంట్స్ ద్వారా అందడం అవసరం. భయపెట్టడం, నియంత్రించడం కంటే గైడెన్స్ ద్వారానే పిల్లలను సరైన దారిలో నడపగలమని గుర్తించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు ఎలాంటి సందేహాలనైనా అడగడానికి, వారి భావాలు పంచుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి ∙సెక్సువల్ డెవలప్మెంట్, రిలేషన్స్ గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి ∙ తాత్కాలిక ఆకర్షణలు, టీనేజ్ లవ్, సంపూర్ణ ప్రేమ మధ్య తేడాలు అర్థం చేసుకునేందుకు సహాయపడాలి ∙సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడాలి ∙టీనేజర్ల ఫ్రీడమ్, తల్లిదండ్రుల గైడె¯న్స్ మధ్య బ్యాలె¯న్స్ సాధించాలి ∙పేరెంట్స్ చర్చించలేని అంశాల గురించి చెప్పేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.టీనేజర్లు చేయాల్సింది..టీనేజ్లో జరిగే మార్పుల గురించి చదవాలి, అవగాహన పెంచుకోవాలి. పేరెంట్స్తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి టీనేజ్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ సహజమైన విషయాలని, శాశ్వతం కావని గుర్తించాలి తొందరపాటు చర్యల వల్ల వచ్చే ఎమోషనల్ పెయిన్ గురించి అవగాహన పెంచుకోవాలి ఈ వయసులో ప్రేమ వ్యవహారాల కంటే అకడమిక్ సక్సెస్ ముఖ్యమని అర్థం చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి కొత్త ఆసక్తులు, హాబీలను కనుగొనేందుకు సమయం కేటాయించాలి మైండ్ఫుల్నెస్, జర్నలింగ్, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం వంటి పనుల ద్వారా ఎమోష¯న్స్ను నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేయాలి సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. నిజమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశగా అనిపిస్తే సైకాలజిస్ట్తో మాట్లాడి సహాయం తీసుకోవాలి. -
సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు
ఆత్మహత్య లేదా బలవన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8,00,000 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ నేర పరిశోధన బ్యూరో (NCRB) ప్రకారం, 2021లో మన దేశంలో 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే, రోజుకు 450 బలవన్మరణాలు. ప్రతి నాలుగు నిమిషాలకో జీవితం కోల్పోవడం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. వ్యక్తుల నిశ్శబ్ద బాధను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆత్మహత్యకు, 20 కి పైగా ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘ఆత్మహత్య నివారణ దినోత్సవం’ జరుపుకుంటాం. అవగాహన లోపమే ప్రధాన సమస్య.. భారతదేశంలో ఆత్మహత్యలను నివారించడంలో ప్రధాన అడ్డంకి, మానసిక ఆరోగ్యం చుట్టూ ఉండే అపహాస్యం. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది సహాయం కోసం బయటకు రావడానికి సిగ్గుపడుతున్నారు. ఈ మౌనం ప్రమాదకరం, ఇది ప్రజలను ఒంటరితనం, నిరాశలోకి నెట్టేస్తుంది. ఇవన్నీ కలిసి బలవన్మరణం వైపు నెట్టేస్తాయి. కొన్ని ముఖ్యమైన గణాంకాలు... దేశంలో మొత్తం బలవన్మరణాల్లో 34.5 శాతం 18-30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే.బలవన్మరణాల్లో 71 శాతం పురుషులే. మహిళల్లో 15-39 ఏళ్ల మధ్యవారే ఎక్కువ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.సామాజిక, ఆర్థిక సమస్యలు వల్ల 10,881 మంది రైతులు 2021లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.కొన్ని ప్రధాన కారణాలు... పరీక్షల ఒత్తిడి, పోటీ, భవిష్యత్తు పట్ల భయంతో 2021లో 13,089 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.ఉద్యోగాలు కోల్పోవడం, అప్పులు, పేదరికం ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.కుటుంబ విభేదాలు, వివాహ పరమైన సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు చికిత్స లేకపోతే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు ఆత్మహత్య నివారణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అందుకోసం ముందుగా ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. అవి... నేను చనిపోవాలని అనుకుంటున్నాను" లేదా "నేను పుట్టకపోయినా బాగుండేది" అంటూ ఆత్మహత్య గురించి మాట్లాడటం.కత్తి, తాడు, నిద్రమాత్రలు లాంటి వాటిని సమకూర్చుకోవడం. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం. ఒక రోజు అత్యంత సంతోషంగా, మరుసటి రోజు తీవ్ర నిరుత్సాహంగా ఉండటం వంటి మూడ్ స్వింగ్ కలిగి ఉండటం. సమస్యలో చిక్కుకున్నట్లు, బయటపడే మార్గం లేనట్లు, నిస్సహాయంగా ఉన్నట్లు మాట్లాడటం. మద్యం లేదా మాదకద్రవ్యాల వాడకం పెరగడం. తిండి, నిద్రలాంటి సాధారణ దినచర్యలలో మార్పు. డ్రగ్స్ వాడటం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర లేదా స్వీయ-విధ్వంసక పనులు చేయడం తన వస్తువులను, వ్యవహారాలను ఇతరులకు అప్పజెప్పడం. మళ్లీ కనిపించనట్లుగా వీడ్కోలు చెప్పడం. వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఆత్రుత లేదా ఆందోళన చెందడం. మీరేం చేయవచ్చు... మీ సన్నిహితుల్లో ఎవరిలోనైనా ఎవరికైనా ఆత్మహత్య యత్నం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మాట్లాడండి. మీ మద్దతును, సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీకు సాధ్యం కాదనుకున్నప్పుడు సైకాలజిస్ట్ ను సంప్రదించండి. ఆత్మహత్య గురించి అడగడాన్ని భయపడవద్దు. ఇది వాళ్లకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. జడ్జ్మెంట్ లేకుండా, ప్రేమగా వారు చెప్పేది వినండి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్ట్ చేయండి. ఒంటరిగా వదిలిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. వారి దగ్గర ఉన్న కత్తులు, తాళ్లు, మాత్రల్లాంటి ప్రమాదకరమైన వస్తువులు తీసివేయండి. మీరు లేదా మీకు తెలిసినవారు ఆత్మహత్య ఆలోచనలకు గురవుతున్నట్లయితే, వెంటనే హైదరాబాద్ లో ఉన్న రోష్ణి ఆత్మహత్యల నివారణ సంస్థకు (081420 20033 ⋅ 081420 20044) ఫోన్ చేసి సహాయం పొందండి. అప్పటికీ మీకు ఉపశమనం కలగకపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.comగమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Bigg Boss 8: చూసేదంతా నిజంకాదు.... అది మీ పర్సెప్షన్ మాత్రమే!
బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో అయినా, నిజ జీవితంలో అయినా మీరు చూసేదంతా నిజంకాదు. అది మీ పర్సెప్షన్ మాత్రమే. అదెలాగంటారా? బిగ్ బాస్ లో24 గంటల సంఘటనలను ఎడిట్ చేసి ఒక గంటలో చూపిస్తారు. మనం చూసినదాన్ని బట్టి అందులోని కంటెస్టెంట్లపై మనకు ఒక అభిప్రాయం, అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన ఆధారంగానే ఇష్టపడటం, వ్యతిరేకించడం, ఓట్లు వేయడం జరుగుతుంది. జీవితంలోనైనా అంతే.ఏ వ్యక్తీ మరో వ్యక్తి జీవితాన్ని 24/7 చూడలేడు. అతనితో పాటు జీవించే కుటుంబ సభ్యులైనా సరే అతని మనసులోని మధనాన్ని అర్థం చేసుకోలేడు. మనకు కనిపించిన ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి గురించి ఒక అంచనాకు వస్తాం. అలా అంచనాకు రావడానికి మన అనుభవాలు, నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు అన్నీ బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తాయి. అలా మన పంచేద్రియాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మన అనుభవాలు, నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు ఆధారంగా మనం ఎలా అర్థం చేసుకుంటామనేదే పర్సెప్షన్. మనకు అర్థమైనదే నిజం కాదు, అది ఒక పర్సెప్షన్ మాత్రమే, ఎవరి పర్సెప్షన్ వారికి ఉంటుందనే సూత్రాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే విభేదాలే ఉండవు.ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. కంటెస్టంట్లు తాము ఉన్నది ఉన్నట్లు కాక, తామెలా కనిపించాలనుకుంటున్నారో అలాగే ప్రవర్తిస్తారు. దాని ఆధారంగానే మనం ఒక అవగాహనకు వస్తాం. ఉదాహరణకు అభయ్ నవీన్ తన తండ్రి మరణం, నటన, దర్శకత్వం అవకాశం గురించి మాట్లాడాడు. తాను దర్శకుడు అవ్వడం వల్ల నటించననే అపోహతో అవకాశాలు తగ్గాయని చెప్పాడు. తనను తాను ఎక్స్ ప్లోర్ చేసుకోవడం కోసం హౌస్ లోకి వెళ్తున్నానన్నాడు. అయితే ఈ మాటలన్నీ అతను తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోవాలనుకుంటున్నాడో అందులో భాగమే తప్ప, అతని పూర్తి పర్సనాలిటీ కాదు.ప్రతీ మనిషిలోనూ నాలుగు రకాల సెల్ప్ లు ఉంటాయి. రియల్ సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్, పబ్లిక్ సెల్ఫ్, బిహేవియరల్ సెల్ఫ్. మనకు కనిపించేది బిహేవియరల్ సెల్ఫ్ మాత్రమే. రియల్ సెల్ఫ్ అంటే మన నిజస్వరూపం, ఇతరులకు తెలియనిది, చూపించనిది. ఐడియల్ సెల్ఫ్ అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అది. పబ్లిక్ సెల్ఫ్ అంటే మనం పబ్లిక్ లో ఎలా కనిపించాలనుకుంటున్నామో, కనిపిస్తామో అది. బిహేవియల్ సెల్ఫ్ అంటే మనం ఎలా ప్రవర్తిస్తామో అది. ఉదాహరణకు ఆదిత్య ఓం తాను డిప్రెషన్ని అధిగమించి "పునర్జన్మ" కోసం బిగ్ బాస్ లోకి ప్రవేశించానని చెప్పాడు. ఇది అతని పబ్లిక్ సెల్ఫ్ ను సూచిస్తుంది.విష్ణుప్రియ తన IQ తక్కువని, ఎంటర్టయిన్మెంట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పింది. తాను సరదాగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నా ఆమె రియల్ సెల్ప్ లోతులు ఎవ్వరికీ తెలీదు.యష్మి తన బ్రేకప్ గురించి, మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుతూ తనను తాను బలమైన వ్యక్తిగా చెప్పుకుంది. అది ఆమె ప్రొజెక్టెడ్ లేదా పబ్లిక్ సెల్ఫ్ మాత్రమే. ఆమె రియల్ సెల్ప్ ఏమిటో ఎవరికీ తెలియదు.నిఖిల్ శాంతిని కోరుకుంటున్నానంటూ నిత్యం గొడవలుండే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. దాన్ని బట్టి అది అతని రియల్ సెల్ఫా లేక ఆటకోసం ప్రదర్శించిన ప్రొజెక్టెడ్ సెల్ఫా అని ప్రశ్నించవచ్చు.మన సోషల్ సెల్ఫ్ చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతుంది. ఉదాహరణకు మణికంఠ ప్రాంక్ ఎలిమినేషన్ సమయంలో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి తన సున్నితత్వాన్ని చూపించాడు. అలాగే తాను ఒత్తిడి, రిజెక్షన్ తో బాధపడుతున్నట్లు చెప్పాడు. అలాగే ఒకానొక సందర్భంలో ఇకపై నటించలేనంటూ విగ్ తీసేశాడు. అంటే పబ్లిక్ సెల్ఫ్ ను పక్కనపెట్టేశాడు.మనం మన నమ్మకాలను ధృవీకరించే విషయాలను మాత్రమే గమనిస్తాం, మన నమ్మకాలకు విరుద్ధంగా ఉన్న సమాచారాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దీన్నే పర్సెప్షన్ బయాస్ అంటారు. ఉదాహరణకు, బేబక్క వంటలో నిర్లక్ష్యం చేస్తోందని సోనియా ఆరోపించింది. కానీ అది ఆమె పర్సెప్షన్ బయాస్ కావచ్చు. కానీ బిగ్ బాస్ టీమ్ దాన్ని ఎడిట్ చేసి చూపించిన దాన్ని బట్టి ప్రేక్షకులు ఎవరో ఒకరివైపు నిలబడతారు. నిజజీవితంలోనూ ఇలాగే జరుగుతుంది. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఒకవైపు నిలబడతాం.బిగ్ బాస్ కు నిజజీవితానికి లింక్ ఏంటంటే... మనం మనకు చూపించే, కనిపించే దాన్ని బట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఎలా అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటామో, తీర్పులిస్తామో నిజజీవితంలోనూ అదే చేస్తాం. సోషల్ మీడియా కూడా అంతే.జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను సోషల్ మీడియాలో చూపుతాం. దాన్ని బట్టి ఆనందంగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ నిజానికి చాలా కష్టాల్లో, బాధల్లో ఉండవచ్చు. కానీ మనం మనకు కనిపించిన దాన్ని బట్టే అవగాహనకు వస్తాం. మనం చూసేది, చూపించేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అందుకే కనిపించేదంతా నిజంకాదు, అదొక పర్సెప్షన్ మాత్రమే.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
ప్రముఖ సైకాలజిస్ట్ డేనియల్ కానమన్ కన్నుమూత
న్యూజెర్సీ: ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కానమన్ (90) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రకటించింది. 1993వ సంవత్సరం నుంచి కానమన్ అక్కడే పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థికశాస్త్రానికి ఆయన పర్యాయపదంగా మారారు. ఆయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో’ ఎంతో ప్రజాదరణ పొందింది. డేనియల్ కానమన్ సిద్ధాంతాలు సామాజికశాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్డార్ షాఫిర్ పేర్కొన్నారు. 1934లో ఇజ్రాయెల్లోని టెల్అవీవ్లో కానమన్ జన్మించారు. -
మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా?
మన మెదడులో ఎంత శాతం మనం ఉపయోగించుకుంటున్నాం? అంటే మీ సమాధానమేంటి? ఐదు లేదా పది శాతం అనేగా! ఇదే ప్రశ్నను మీ మిత్రులను అడిగి చూడండి. ‘ఐదు లేదా పది శాతం, కచ్చితంగా పదిశాతంకన్నా తక్కువే..’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మీరే కాదు, కొందరు సైకాలజీ విద్యార్థులు, న్యూరోసైంటిస్టులు కూడా ఒక సర్వేలో అదే సమాధానం చెప్పారు. కొందరు అంతర్జాతీయస్థాయిలో పేరున్న ప్రముఖులు కూడా తమ పుస్తకాల్లో కూడా పది శాతమనే రాశారు. కానీ అది అవాస్తవం, అపోహ మాత్రమే. అపోహ ఎలా మొదలైంది? 1890వ దశకంలో హార్వర్డ్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్, బోరిస్ సిడిస్ ఇద్దరూ కలసి పిల్లల పెంపకంపై ప్రయోగాలు చేశారు. విలియం సిడిస్ అనే బాల మేధావిని తయారుచేశారు. ఆ సందర్భంగా విలియం జేమ్స్ మాట్లాడుతూ ‘మనిషి తన మేధాసామర్థ్యం (mind potentiality)లో కొద్ది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు’ అని చెప్పారు. ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు డేల్ కార్నీ 1936లో రాసిన "How to win friends, influence people"కు అమెరికన్ రచయిత Lowell Thomas ముందుమాట రాశాడు. అందులో ‘మనిషి తన మేధాశక్తి (mind power)లో 10శాతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోగలడు’ అని చెప్పాడు. అంటే సామర్థ్యం కాస్తా శక్తిగా మారింది. ఆ తర్వాత 1970లో సైకాలజిస్ట్, విద్యావేత్త Georgi Lozanov తన suggestopedia ని ప్రతిపాదిస్తూ ‘మనం మన మేధాశక్తిలో ఐదు నుంచి పది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత అనేకమంది తమ పుస్తకాల్లో ఉపన్యాసాల్లో ‘మెదడులో పదిశాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని రాశారు, చెప్పారు. తేడా గమనించండి.. మేధాసామర్థ్యంలో పదిశాతం ఉపయోగించుకోవడానికి, మెదడులో పదిశాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనడానికి.. చాలా తేడా ఉంది. మేధో సామర్థ్యంలో పదిశాతాన్ని ఉపయోగించుకుంటున్నారంటే.. మనిషి తన మేధస్సుతో తాను సాధించగలిగిన దానిలో పదిశాతాన్ని మాత్రమే సాధించగలుగుతున్నాడని అర్థం. అంటే తన మేధస్సును మరింతగా ఉపయోగించుకుంటే మరింత ప్రగతిని సాధించగలడనే కదా. మన మెదడు అన్ని సందర్భాల్లోనూ నూటికి నూరుశాతం పనిచేస్తుంది. ఏ భాగమైనా పనిచేయకపోతే, దానికి సంబంధించిన శరీరభాగం చచ్చుబడి పోతుంది. దాన్నే పక్షవాతం అంటారు. అపోహల నుంచి బయటపడండి.. మీరు చదివింది లేదా మీకు తెలిసింది మాత్రమే నిజమనే నమ్మకం నుంచి బయటపడాలి. గొప్పవారు చెప్పారు కాబట్టి నమ్మాలి, దాన్ని ప్రశ్నించకూడదనే వైఖరి నుంచి బయటకు రావాలి. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా అంగీకరించవద్దు, అనుసరించవద్దు. ఇలాంటి భ్రమలు, అపోహలు, అసత్యాలు మన చుట్టూ చాలా.. చాలా.. ఉన్నాయి. అవే అపర సత్యాలుగా చలామణీ అవుతున్నాయి. చలామణీ చేస్తున్నారు. అధిక సంఖ్యాకులు అంగీకరించినంత మాత్రాన, అనుసరించినంత మాత్రాన అసత్యం సత్యం కాబోదు. ఎవరో చెప్పారనో, ఎక్కడో రాశారనో దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు. కాస్త సమయం వెచ్చించి పరిశీలించాలి, పరీక్షించాలి, ప్రశ్నించాలి. నిజానిజాలేమిటో తెలుసుకోవాలి. మీ మేధా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. తప్పు అభిప్రాయానికి ఎందుకొస్తారు? తాము చదివిన పుస్తకాల్లో అలా రాసి ఉండి ఉంటుంది.. ప్రఖ్యాత వ్యక్తులు తమ ఉపన్యాసాల్లో అలా చెప్పి ఉంటారు.. ప్రశ్నలకు సులువుగా సమాధానాలు తెలుసుకోవాలనే కోరిక.. తమకు నచ్చిన సమాధానాలనే ఎంచుకోవడం, గుర్తుంచుకోవడం.. తప్పు సమాచారం మాత్రమే అందుబాటులో ఉండటం.. మీడియా, సినిమాల ద్వారా అందిన సమాచారం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా అందిన సమాచారాన్ని, వివిధ కారణాలతో ఏ మాత్రం ప్రశ్నించకుండా, పరీక్షించకుండా అంగీకరించడంతో వివిధ అంశాలపై అపోహలు, తప్పు అభిప్రాయాలు ఏర్పడతాయి. జ్ఞానమెలా వస్తుందంటే.. మనమందరం మనకు అందుబాటులో ఉన్న, లేదా మనం చదివిన పుస్తకాల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఒకసారి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాక దాన్ని ఏ మాత్రం పరీక్షించం, అదే సత్యమని విశ్వసిస్తాం. ఆ తర్వాత మనం ఎవరితో మాట్లాడినా అదే విషయాన్ని చెప్తాం. మన విలువలు, విశ్వాసాలు, వైఖరులు, ప్రవర్తనలన్నీ ఇలా ఏర్పడినవే. మన జ్ఞానమంతా ఇలా వచ్చిందే. మనం జ్ఞానం అనుకుంటున్న జ్ఞానం మనకు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించే శాస్త్రాన్నే Epistemology (జ్ఞానమీమాంస) అంటారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు
ఐన్ స్టీన్.. ఈ పేరు వినగానే చింపిరి జుత్తుతో కనిపించే ఓ పెద్దాయన గుర్తొస్తాడు కదా. కాస్తంత చదువుకొని ఉంటే శక్తి నిత్యత్వ సూత్రం E = mc² గుర్తొస్తుంది. ఇంకా.. సాధారణ సాపేక్షత సిద్ధాంతం గుర్తొస్తుంది. 20వ శతాబ్దపు మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఐన్ స్టీన్ కేవలం భౌతికశాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన శాంతికాముకుడు, రాజకీయ కార్యకర్త, చురుకైన జాత్యహంకార వ్యతిరేకి, నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన జీవితం నుంచి, మిత్రులకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి ఆయన చెప్పిన జీవన సూత్రాలను ఈరోజు తెలుసుకుందాం. మీ సమయాన్ని, కృషిని ముఖ్యమైన విషయాలపై వెచ్చించండి మనం ఏదైనా పని చేయాలంటే శక్తిని వెచ్చించాలి. అలాగే రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి మానసిక శక్తిని వెచ్చించాలి. ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తినాలనే దాని దగ్గర్నుంచి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆఫీస్ కు ఎలా వెళ్లాలి లాంటి వాటికోసం మానసిక శక్తిని వెచ్చించడం వల్ల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. అందుకే చాలామంది టాప్ అచీవర్స్ ఇలాంటి చిన్నచిన్న విషయాలకు ప్రాథాన్యం ఇవ్వరు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు మంగలి దగ్గరకు సమయం వృథా చేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే ఆ చింపిరి జుట్టు. ఇక ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎప్పడూ బ్లూ జీన్స్ మాత్రమే ధరిస్తాడు. అమెజాన్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ జుకర్ బర్గ్ కూడా అంతే. ఏ డ్రెస్ వేసుకోవాలనే నిర్ణయం కోసం తమ మానసిక శక్తిని వెచ్చించకుండా ముఖ్యమైన నిర్ణయాల కోసం ఆదా చేసుకుంటారు. ఎంత కష్టమైనప్పటికీ మీరు ఇష్టపడే పనులే చేయండి ఐన్ స్టీన్ అంటే కేవలం భౌతిక శాస్త్రం మాత్రమే కాదు. ఆయన వయోలిన్ వాయిస్తాడు. పడవ కూడా నడుపుతాడు. తనకు మనసు బాలేనప్పుడు, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆయనీ పనులు చేస్తాడు. అలాగని ఐన్ స్టీన్ గొప్ప సెయిలర్ కాదు. కనీసం ఈత కూడా రాదు. పడవ బోల్తాకొట్టి మునిగిపోతుంటే జాలర్లు కాపాడిన సందర్భాలున్నాయి. అయినా ఎందుకు సెయిలింగ్ చేస్తాడంటే... ‘‘సముద్రంలో విహారయాత్ర ప్రశాంతతనిస్తుంది. విభిన్న దృక్కోణాలనుండి ఆలోచించడానికి అద్భుత అవకాశాలు కల్పిస్తుంది’’ అని ఆయనే చెప్పాడు. అందుకే మీ సబ్జెక్ట్ తో పాటు మీరు ఆనందించే ఒక హాబీని అలవాటు చేసుకోండి. అందులో మీరేం నిష్ణాతులు కావాల్సిన అవసరంలేదు. అది మీకు కావాల్సిన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఫలితంగా మీ ఒత్తిడి తగ్గుతుంది, మీ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. పజిల్ మైండ్సెట్ను కలిగి ఉండండి. జీవితంలో అనేకానేక సమస్యలు వస్తుంటాయి. వాటికి భయపడి పారిపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. సమస్యలను పజిల్ లా చూసి పరిష్కరించుకునే మైండ్ సెట్ ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు కొత్త విధానం గురించి ఆలోచించవచ్చు. ఐన్స్టీన్ అలాగే చేసేవాడు. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక పజిల్గా చూసి పరిష్కరించుకునేవాడు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు ముందు చాలామంది శాస్త్రవేత్తలు కాంతి వేగంతో కదిలే వస్తువులను చూశారు. కానీ ఐన్స్టీన్ మాత్రమే దాన్ని ఒక పజిల్ లా చూశాడు. సాపేక్ష సిద్ధాంతంతో పరిష్కరించాడు. అందుకే తప్పొప్పుల గురించి ఆలోచించకుండా పజిల్ పరిష్కారంపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఆకర్షించే విషయాల గురించి లోతుగా ఆలోచించండి ‘‘మీకు ఆసక్తిని కలిగించే ప్రశ్న ఎదురైతే సంవత్సరాల తరబడి దాన్నే పట్టుకుని ఉండండి. లోతుగా అన్వేషించండి. దానిపై పట్టు సాధించండి. అంతేతప్ప సులువుగా అందే విజయాలతో సంతృప్తి చెందకండి’’ అని ఐన్ స్టీన్ కూడా ఒక లేఖలో చెప్పారు. అంతేకాదు.. ‘‘సమస్య క్లిష్టతను చూసి కుంగిపోకూడదు. ప్రయత్నిస్తే దేన్నయినా అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. కావాల్సిందల్లా పట్టువిడవని ప్రయత్నం మాత్రమే’’ అని తన స్నేహితుడు డేవిడ్ బోమ్ కు రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఉదాహరణకు నేను ఎస్వీ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక వ్యక్తిని కలిశాను. ఆయన ప్రపంచంలో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తి. కానీ ఏ ఒక్క సబ్జెక్ట్ లోనూ లోతైన అవగాహన లేదు. దీన్నే హారిజంటల్ లెర్నింగ్ అంటారు. అంటే.. అన్నీ పైపైన నేర్చుకోవడం. నేనేమో పాతికేళ్లుగా ‘జీనియస్’ అనే ఒకే పదాన్ని పట్టుకుని ఉన్నా. దాని పూర్వాపరాలు, లోతుపాతులు అర్థం చేసుకునేందుకు, పిల్లల్లోని జీనియస్ ను వెలికితీసే మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. దీన్నే వర్టికల్ లెర్నింగ్ అవసరం. ఏ రంగంలోనైనా పట్టు సాధించి, పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే ఈ వర్టికల్ లెర్నింగ్ అవసరం. రాజకీయాలు మిమ్మల్ని ఆవేశంతో లేదా నిరాశతో నింపనివ్వవద్దు. మనం రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు మనల్ని నిత్యం అనేక విధాలుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాగని ఆ రాజకీయాల్లో మునిగి, మీ లక్ష్యాన్ని జారవిడుచుకోకండి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఇజ్రాయిల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని ఐన్ స్టీన్ ను కోరారు. ‘‘రాజకీయాలు తాత్కాలికం. కానీ నా ఫార్ములాలు శాశ్వతం’’ అంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. జీవితం ప్రశాంతంగా సాగాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి. సోషల్ మీడియా కాలంలో ఇది చాలా అవసరం. స్నేహితుడు, పరిచయస్తుడు లేదా పూర్తిగా అపరిచితుడు చేసిన పోస్ట్ వల్ల ఎలా కోపంతో ఊగిపోయామో లేదా గంటలు గంటలు వాదించామో ఒక్కసారి గుర్తుచేసుకోండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ఎవరి అభిప్రాయమూ మారదని తెలిసినా అలా సమయం వృథా చేస్తూనే ఉంటాం. మీరు రాజకీయాల్లో రాణించాలనుకుంటే అందులో సమయం వెచ్చించండి, లేదంటే దాని మానాన దాన్ని సాగనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. అధికారానికి గుడ్డి విధేయత సత్యానికి అతి పెద్ద శత్రువు నోబెల్ గ్రహీత జోహన్నెస్ స్టార్క్ వంటివారు కూడా ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంతోపాటు, దానికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి జాతీయవాదాన్ని చేర్చి ఐన్ స్టీన్ పై దాడి ప్రారంభించారు. ఈ కుతంత్రాలు హాస్యాస్పదమైనవి, హానిచేయనివిగా ఐన్ స్టీన్ మొదట భావించినప్పటికీ, వాటిని తట్టుకోలేక అమెరికా పారిపోవాల్సి వచ్చింది. అందుకే "అధికారానికి గుడ్డిగా విధేయత చూపడం సత్యానికి అతిపెద్ద శత్రువు" అని చెప్పాడు. సోషల్ మీడియా కాలంలో, ఫేక్ న్యూస్ యుగంలో ఇది మరింత ముఖ్యమైనది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, అధికారంలో ఉన్నవారి చుట్టూ మేధావులు కూడా చేరి భజనలు చేయడం మీరు గమనించే ఉంటారు. అలా చేయడం ‘మంద మనస్తత్వం’, ‘సామూహిక పిచ్చితనం’ అంటాడు ఐన్ స్టీన్. అందుకే అధికారాన్ని గుడ్డిగా విధేయత చూపకండి. విమర్శనాత్మక దృష్టితో చూడండి. సైన్స్, సత్యం, విద్య అందరికీ... కొందరికి మాత్రమే కాదు 1930లలో వలస వెళ్లి 1940లో పౌరసత్వం పొందిన తర్వాత కూడా ఐన్స్టీన్ తరచుగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవాడు. అందుకే FBI 1932లో ఐన్స్టీన్పై ఒక ఫైల్ను ప్రారంభించింది. అయినా ఆయన అదరలేదు, బెదరలేదు. అమెరికాలోని తొలి నల్లజాతి కళాశాల అయిన లింకన్ యూనివర్శిటీని సందర్శించి ఉపన్యాసాలు ఇచ్చాడు. "సత్యం కోసం శోధించే హక్కు, సత్యమని భావించే వాటిని ప్రచురించి, బోధించే హక్కు" ఉండాలని ఉద్యమించాడు. సైన్స్ ద్వారా వెలికితీసిన ఆవిష్కరణలు, ఫార్ములాలు ఏ జాతికి, దేశానికి లేదా వర్గానికి చెందినవి కావు, మానవాళి అందరికీ చెందినవని ఎలుగెత్తి చాటాడు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా మారుతున్న కాలంలో ఈ దృక్పథం మరింత అవసరం. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం
ముంబై నగర మురికివాడల్లో నివసించే పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో 32 ఏళ్లుగా నిమగ్నమైన ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంది సింగ్ రావత్. సుదీర్ఘ బోధనా అనుభవంలో పిల్లల మనస్తత్వాన్ని దగ్గరుండి అర్ధం చేసుకున్న మానసిక నిపుణురాలు. పిల్లలు రోల్ మోడల్గా భావించే ఈ టీచర్ ఇన్నేళ్లుగా చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది. ‘‘మూడు దశాబ్దాలకు పైగా పిల్లలతో కలిసి ఉండటం వల్ల వారి మనస్తత్వాన్ని సులువుగా అర్థం చేసుకునే స్థితి నాకు అలవడింది. ఆ ఆలోచనతో ‘మేము, పిల్లలు, వారి మనస్తత్వశాస్త్రం’ పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. టీచర్గా పిల్లల మనస్తత్వంపై, వారి వికాసంపై అనేక రకాల పరిశోధనల కథనాలు నేను రాసిన పుస్తంలో ఉన్నాయి. ఇవన్నీ టీచర్లకు, తల్లిదండ్రులకు మార్గదర్శకం అవుతాయి. ఇది పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పిల్లల మనసులను చదవాలి హైపర్ యాక్టివ్, కోపం, పిరికితనం... ఇలా పిల్లలు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లల వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని వారితో మాట్లాడాలి. పిల్లల ప్రవర్తన వెనక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేరు. బాల్యంలో పిల్లల మనసులో నిలిచిపోయే విషయాలు లేదా సంఘటనలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రోజూ తల్లిదండ్రుల పోట్లాడుకుంటుంటే పిల్లవాడికి భవిష్యత్తులో పెళ్లి పట్ల విముఖత ఏర్పడుతుంది. లేదా తన జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలో అర్థం కాకపోవచ్చు. చదువుకోవడానికి వచ్చే మురికివాడల పిల్లల జీవితం సంపన్నుల పిల్లల కంటే భిన్నంగా ఉంటుంది. వారి సమస్య లు, అవసరాలు లెక్కలేనన్ని ఉంటాయి. ప్రేమ, ఆప్యాయత వారికి లభించడం లేదు. ఈ పిల్లలకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఇంట్లో వాతావరణం బాగుండదు. దీని ప్రభావం కొన్నిసార్లు వారి హృదయాన్ని, మనస్సును గాయపరుస్తుంది. అప్పుడు వారు క్లాసులో మౌనంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు. అలాంటి పిల్లలను పక్కకు తీసుకెళ్లి వారితో మాట్లాడతాను. వారి మనస్సులను చదువుతాను. వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. క్లాసులో పిల్లలెవరూ విచారంగా, మౌనంగా ఉండకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాను. తల్లిదండ్రులూ అర్థం చేసుకోలేరు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతాను. వారి ఇంటి, మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటాను. వారి పొర పాట్లను ప్రేమగా వారికి తెలియజెబుతాను. పిల్లల ముందు ఎలా ఉండాలి, వారితో ఎలా మాట్లాడాలో వివరిస్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పోట్లాడుకోవడం చూసిన పిల్లలు స్కూల్లో ఇతర పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ పిల్లల ఇంటి వాతావరణం వారి బాల్యాన్ని నాశనం చేసే సామాజిక సమస్య. వారి జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. చిన్న పిల్లల మనసు అర్థం చేసుకోవాలంటే వాళ్ల మనసు లోతుల్లోకి వెళ్లాలి. వాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే వాళ్ల కష్టాలు అర్థం చేసుకోవడం తేలికైంది. అప్పుడు పిల్లలు కూడా నేను చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ప్రారంభించారు. హృదయ విదారక కథలు కుటుంబంలో తగాదాలు, ఇల్లు కూలిపోవడం, అమ్మ లేదా నాన్న కొట్టడం, కొన్నిసార్లు సవతి తండ్రి, కొన్నిసార్లు సవతి తల్లితో బాధలు... దీంతో ఈ పిల్లల బాల్యాన్ని తుంగ లో తొక్కేసినట్టవుతుంది. ఈ పిల్లలను తిరిగి స్కూల్కు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. భయపెట్టే సంఘటనలు రోహన్ (పేరుమార్చాం) తన మనసులో ఏదో దాచుకుంటున్నట్టు, భయం భయంగా ఉండేవాడు. నేను అతనితో మాట్లాడినప్పుడు అతను విపరీతంగా ఏడవడం ప్రారంభించాడు. వారి ఇల్లు చాలా చిన్నది కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఒకే గదిలో పడుకునేవారు. తన తల్లిదండ్రులు రాత్రిపూట వ్యక్తిగతంగా గడపడం చూశాడు రోహన్. తన తండ్రి అమ్మను హింసిస్తున్నాడని మనసులో భయం పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా మదనపడుతుండేవాడు. తల్లిదండ్రులకు, ఆ పిల్లవాడికి కౌన్సెలింగ్ ఇచ్చాక సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆరవ తరగతి చదువుతున్న సోఫియా (పేరు మార్చాం) తన డైరీలో ఏదో రాసుకోవడం గమనించాను. అడిగితే, ఎవరూ చూడకుండా చూపిస్తానంది. క్లాస్ రూమ్ నుంచి మరో గదికి తీసుకెళ్లి అడిగితే, డైరీ చూపించింది. ఆ డైరీ చదివినప్పుడు నా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సోఫియా తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంది. తన తల్లితో కలిసి కొత్త తండ్రి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొత్త తండ్రి, అతని తమ్ముడు సోఫియాను బాధపెడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరికీ ఏమీ చెప్పలేక తన తండ్రికి డైరీలో ఉత్తరాలు రాసుకుంది. ఆ తర్వాత వాళ్ల అమ్మను కలిసి మాట్లాడాను. ఆమె సోఫియా పట్ల జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు, మరెన్నో గాథలు పిల్లల నుంచి తెలుసుకున్నవి, పరిష్కరించినవి ఉన్నాయి. టీచర్ని కావాలనుకున్నాను.. ముంబైలోని సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగాను. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనుకున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఫీజు కట్టడానికి డబ్బుల్లేక ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. మాంటిస్సోరి కోర్సు చేశాను. ఇదే పిల్లలకు నన్ను దగ్గర చేసింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో నేను పనిచేసే చోట ప్రిన్సిపల్ బీఎడ్ కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత రెండేళ్లకు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి అయింది. అత్తింటి ప్రోత్సాహంతో ఎం.ఏ. డిగ్రీ పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచడంతో పాటు ఇంటి పనులు, స్కూల్ పనుల వల్ల సమయం అస్సలు ఉండేది కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక పీహెచ్డీ పూర్తిచేశాను. నాకూతురు మెడిసిన్ చదువుతుండగా నేను పీహెచ్డీ చేస్తున్నాను. అలాగని నా జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. కుటుంబంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, కష్టాలు ఎదురైనా పూర్తి నిజాయితీతో నా పని చేస్తూ వచ్చాను. నేను చదువు చెప్పే పిల్లలు బాగా రాణిస్తున్నారని అర్థమయ్యాక నాకు చాలా ఆనందం కలుగుతుంది. -
పిల్లల్లో మొండితనం.. మంచికా..? చెడుకా..?
కవిత, సురేష్ తమ బిడ్డ సుమనతో కలిసి షాపింగ్కు వెళ్లారు. అక్కడ ఒక బొమ్మ సుమనకు నచ్చింది. అది కావాలని అడిగింది. ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి, వద్దన్నారు. లేదు, నాకది కావాలి అని మంకుపట్టు పట్టింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే! ‘‘నాకా బొమ్మ కావాలీ’’ అంటూ కిందపడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా కంట్రోల్ అవ్వడం లేదు. మాల్లో అందరూ వాళ్లనే చూస్తున్నారు. సిగ్గనిపించింది. చేసేదేంలేక ఆ బొమ్మ కొనిచ్చారు. ఇది చదువుతుంటే మీ అనుభవమూ గుర్తొచ్చింది కదా! పిల్లలు తమకు కావాల్సిన దానికోసం మొండిపట్టు పట్టడం, హఠం చేయడం తల్లిదండ్రులందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలియక, పిల్లలు అడిగింది ఇచ్చేసి సమస్య నుంచి బయటపడతారు. అయితే అలా చేయడం వల్ల పిల్లల్లో అలాంటి మొండితనం తగ్గకపోగా, పెరుగుతుందని, అలాంటి ప్రవర్తన పెరిగేందుకు తామే కారణమవుతున్నామని చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లల్లో మొండిపట్టు సాధారణం పిల్లల్లో మంకుతనం తమ భావోద్వేగాలను, బాధను ప్రదర్శించే ప్రక్రియ. తమ కోపం, నిరాశ, విచారం లేదా నిరాశ వంటి తీవ్రమైన భావోద్వేగాలను ‘టాంట్రమ్స్’ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఆ క్రమంలో అరుస్తారు, తంతారు, కొడతారు, వస్తువులను విసిరేస్తారు, ఊపిరి బిగపడతారు లేదా కదలకుండా కూర్చుంటారు. వయసు పెరిగే కొద్దీ, పిల్లలు భాష, భావోద్వేగాల నియంత్రణ పెంపొందించుకునే కొద్దీ ఈ ప్రవర్తన తగ్గుతుంది. సాధారణంగా ఈ మంకుతనం 15 నిమిషాలు ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ ప్రవర్తనకు తల్లిదండ్రులు ఏమాత్రం అటెన్షన్ చూపినా అది రెట్టింపవుతుంది. ‘వద్దు’ అని చెప్పింది ఇచ్చారంటే, ఆ ప్రవర్తనను ప్రోత్సహించినట్లు అవుతుంది. దాంతో భవిష్యత్తులో వాళ్లకు ఏం కావాల్సి వచ్చినా అదే మంకుతనం ప్రదర్శిస్తారు. అందువల్ల పిల్లల్లో ఈ మంకుతనం, మొండితనం తగ్గాలంటే వారికి భావోద్వేగాల గురించి అవగాహన కల్పించడం, వాటినెలా ప్రాసెస్ చేయాలో, కోపాన్నెలా నియంత్రించడం నేర్పించాలి. మొండితనానికి విరుగుడు... మూడేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు చిన్నచిన్న విషయాలకే నిరుత్సాహానికి గురవుతారు. తమ అవసరాలను ఎలా కమ్యూనికేట్ చేయాలో అప్పుడప్పుడే నేర్చుకుంటుంటారు. సొంతంగా పనిచేయాలని, అన్వేషించాలని కోరుకుంటారు. వాటిని ఎవరైనా అడ్డుకున్నప్పుడు మొండితనం ప్రదర్శిస్తారు. అందువల్ల ఏ విషయం వారిలో మొండితనాన్ని ప్రేరేపిస్తుందో తల్లిదండ్రులు గుర్తించాలి. బిడ్డలు తమ భావోద్వేగాలను మాటల్లో ఎలా వ్యక్తీకరించాలో ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి టాంట్రమ్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందువల్ల మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి భావాలను వివరించే పదాలను ఉపయోగించండి. దానివల్ల తమ అవసరాలు, కోరికలు, ఆందోళనల గురించి మీకు మాటల్లో చెప్పే వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు సినిమా చూస్తున్నప్పుడు, పాత్రలు భావోద్వేగాలను వ్యక్తం చేసినప్పుడు వాటి గురించి చెప్పండి. బొమ్మల పుస్తకాల్లో సంతోషంగా, దుఃఖంగా, కోపంతో, ఆకలితో లేదా అలసిపోయిన వంటి భావాలను వారికి చూపించండి. మీ భావోద్వేగాలను చెప్పడం ద్వారా వారు దాన్ని అనుకరిస్తారు. తమకు కావాలనుకున్నది దొరకని సందర్భాల్లో కూడా పిల్లలు సానుకూల ప్రతిచర్యలు చూపినప్పుడు, తగిన ప్రవర్తనలో నిమగ్నమైనప్పుడు వారిని మెచ్చుకోండి, బహుమతి ఇవ్వండి. ఉదాహరణకు, మీ బిడ్డ కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేయకుండా శాంతంగా ప్రవర్తించినప్పుడు ‘‘నువ్విలా కూల్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అని మెచ్చుకోండి. పిల్లలు మొండితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కష్టమే. కానీ ఆ సమయంలో మీరే కోపంతో అరిస్తే లేదా కొడితే.. అలాంటి సందర్భాల్లో అదే సరైన ప్రవర్తనని పిల్లలు భావిస్తారు, దాన్నే అనుకరిస్తారు. అందువల్ల పిల్లలు మంకుతనం చూపినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. దాన్ని చూసి వాళ్లూ నేర్చుకుంటారు. దారి మళ్లింపు అనేది మరో ప్రభావవంతమైన వ్యూహం. ముందుగా, పిల్లల మంకుపట్టుకు కారణమయ్యే ట్రిగ్గర్ను గుర్తించండి. బహుశా వారు దుకాణంలో ఒక బొమ్మను చూసి కావాలంటున్నారు. దాన్నుంచి వారి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ‘మీ దగ్గర బొమ్మ లేదు కాబట్టి ఏడవడం సరికాదు. అక్కడ చాలా ఆటలున్నాయి. కలిసి ఆడుకుందాం రా!’ పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వడం వారికి సాధికారతను అందిస్తుంది, మొండిపట్టును నివారిస్తుంది. ఉదాహరణకు, ప్లేగ్రౌండ్లో ఇంకా ఉండాలని మొండిపట్టు పట్టినప్పడు ‘సరే, ఇంకో ఐదు నిమిషాలు ఆడుకుంటావా లేక ఇంటికి వెళ్లి ఐస్క్రీమ్ తిందామా?’ అని నిర్ణయం వారికే వదిలివేయవచ్చు. టాంట్రమ్స్ నియంత్రణకు మీరు ఎంచుకున్న పద్ధతులను నిలకడగా ఉపయోగించడం ద్వారా మీ పిల్లల్లో మొండితనాన్ని కొద్ది కాలంలోనే నియంత్రించవచ్చు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది!
‘మా పెద్దోడు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ చిన్నోడికే అస్సలు బాధ్యత లేదు. ఏం చెప్పినా పట్టించుకోడు. వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను’ అన్నారు సుబ్బారావు. ‘మా పెద్దపాప ఇంట్లో అన్ని పనులూ అందుకుంటుంది. కానీ చిన్నపాప మాత్రం ఎప్పుడూ డాన్స్, స్పోర్ట్స్ అంటూంటుంది. దాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడంలేదు’ చెప్పారు కోమలి. ఇంటికి పెద్ద బిడ్డ యజమాని లాంటి వాడు, బాధ్యతగా ఉంటాడు. రెండో బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు. చివరివాడు బాధ్యతలేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది నిజమేనని నమ్మేవాళ్లూ ఉంటారు.. ఇదంతా ట్రాష్ అని కొట్టేసేవాళ్లూ ఉంటారు. దీనిపై సైకాలజిస్టులు కూడా అధ్యయనం చేశారు. ప్రముఖ ఆస్ట్రియన్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ అడ్లర్ 20వ శతాబ్దం ప్రారంభంలో బర్త్ ఆర్డర్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కుటుంబంలో జన్మించిన క్రమం బిడ్డ ప్రవర్తన, భావోద్వేగాలు, ఇతర వ్యక్తులతో సంబంధాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. మొదటి బిడ్డలు ఎక్కువ శ్రద్ధ (బాధ్యత), మధ్యస్థ శిశువులు తక్కువ శ్రద్ధ (ఎక్కువ స్వాతంత్య్రం)ను పొందుతారనే ఆలోచనలో కొంత నిజం ఉండవచ్చు. చివరి బిడ్డలకు ఎక్కువ స్వేచ్ఛ (తక్కువ క్రమశిక్షణ) లభిస్తాయి. అయితే బర్త్ ఆర్డర్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధాలు, జన్యువులు, పర్యావరణం, సామాజిక.. ఆర్థిక స్థితి వంటి అంశాలు కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పేరెంటింగ్ స్టైల్ అనేది పిల్లల వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేస్తుందనేది అనేక పరిశోధనల సారాంశం. అడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఏ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటి బిడ్డ అడ్లర్ బర్త్ ఆర్డర్ సిద్ధాంతం ప్రకారం, తొలి సంతానం.. వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ శ్రద్ధ, సమయాన్ని పొందుతారు. కొత్త తల్లిదండ్రులు అప్పుడే పిల్లల పెంపకం గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు న్యూరోటిక్గా కూడా ఉండవచ్చు. మొదటి సంతానం టైప్ A వ్యక్తిత్వాలతో బాధ్యతాయుతమైన నాయకులుగా ఉంటారు. కుటుంబంలోకి రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకు కేటాయించే సమయం తగ్గడంవల్ల రెండో బిడ్డను చూసి అసూయపడతారు. ఆ తర్వాత తన తోబుట్టువుల పోషణ బాధ్యత తీసుకోవాల్సి రావడం వల్ల ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట జన్మించిన పిల్లలు అధునాతన అభిజ్ఞాభివృద్ధిని కలిగి ఉంటారని పరిశోధన కనుగొంది, ఇది చదువులో మంచి ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. మిడిల్ చైల్డ్ తనకన్నా పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు మధ్య విభేదాలకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నందున, మధ్య పిల్లలు కుటుంబంలో శాంతిని కలిగించేవారుగా ఉంటారని అడ్లర్ సూచించాడు. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించేందుకు, ఆదరణ పొందేందుకు వారిని ఆహ్లాదపరచేలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో నిరంతరం పోటీలో ఉన్నట్లు అనిపించవచ్చు. వీరిలో అభద్రతా భావం, తిరస్కరణ భయం, బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. తిరస్కరణ పట్ల సున్నితంగా ఉంటారు. తోబుట్టువులకు భిన్నంగా నిలబడాలనుకున్నప్పుడు తిరుగుబాటు లక్షణాలను కలిగి ఉంటారు. మధ్య పిల్లలు తమ తల్లులతో సన్నిహితంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆఖరి బిడ్డ చివరి బిడ్డ పుట్టే కాలానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అనుభవం ఉండటం వల్ల కొన్నిసార్లు తక్కువ కఠినంగా ఉంటారు. చివరి బిడ్డ అని గారాబంగా పెంచడంవల్ల, మిగతావారితో పోల్చినప్పుడు చెడిపోయినట్లు కనిపిస్తారు. చిన్నపిల్లలుగా దొరికే స్వేచ్ఛవల్ల కలివిడిగా, స్నేహంగా, చార్మింగ్గా ఉంటారు. అయితే ఈ పిల్లలు తక్కువ స్వీయ–నియంత్రణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడవచ్చు. మేనిప్యులేటివ్గా, అపరిపక్వంగా, సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తారు. ఏకైక సంతానం కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్నవారు తల్లిదండ్రుల దృష్టిని, వనరులను తోబుట్టువులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలతో ఎక్కువగా సంభాషిస్తారు కాబట్టి, వయసుకు మించి పరిణతి చెందినట్లు కనిపిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదిస్తారు. తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల అధిక అంచనాల కారణంగా అన్నీ ఫర్ఫెక్ట్గా ఉండాలనే ధోరణి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతమైనదాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. సాధిస్తారు. స్వావలంబన, ఊహాత్మక ధోరణి ఉంటుంది. సెన్సిటివ్గా ఉంటారు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
ఈజీ మనీ వెంట పరుగెత్తి ఆత్మహత్య
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్ విద్యార్థి నవీన్ క్రిప్టో ట్రేడింగ్లో నాలుగు లక్షల రూపాయలు నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. జగిత్యాల జిల్లాకు చెందిన నవీన్ పేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి వడ్రంగి. బహూశా ఆ పేదరికం నుంచి త్వరగా బయటపడాలనే ఆలోచనే నవీన్ను క్రిప్టో ట్రేడింగ్ వైపు నడిపి ఉండవచ్చు. త్వరగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో నవీన్ క్రిప్టో ట్రేడింగ్ కోసం.. నవీన్ తన పేరుపై ఒకటి, తండ్రి పేరుపై ఒకటి క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. భారీగా పెట్టుబడి పెట్టి అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నా కానీ డబ్బు సరిపోలేదు. క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించలేకపోయాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువతను బుట్టలో వేసుకునేలా ఈజీ మనీ పేరుతో ఈ మధ్యకాలంలో చాలా రకాల స్కీములు వస్తున్నాయి. అవి యువతను సులువుగా ఆకర్షిస్తాయి. కానీ ఈజీ మనీ స్కీమ్లలో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ విషయం తెలియని యువత నవీన్లా ఆ వలలో చిక్కుకుపోతారు. అప్పుల భారం నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుల భారం నుంచి తప్పించుకోలేమనే భయం వెంటాడుతుంది. తన కష్టం చెప్తే తల్లిదండ్రులు మరింత బాధపడతారని ఆ విషయం ఇంట్లో చెప్పలేరు. ఎగతాళి చేస్తారని స్నేహితులతో పంచుకోలేరు. క్రమక్రమంగా ఒంటరితనంతో బాధపడతారు. ఎటుచూసినా కష్టాలే కనిపిస్తాయి. పరిష్కారం గురించి ఆలోచించే శక్తిని కోల్పోతారు. గ్యాంబ్లింగ్ డిజార్డర్.. నవీన్ ప్రవర్తన గ్యాంబ్లింగ్ డిజార్డర్కు దగ్గరగా ఉంది. ఇది ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గుర్తించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. తమకు కావాల్సిన స్థాయి ఎక్సయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు వేస్తుంటారు. సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. జూదంలాంటి వ్యాపారంలో వచ్చిన నష్టాలను మళ్లీ దానితోనే భర్తీ చేయాలని ప్రయత్నిస్తారు. ఆ విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్తారు, విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేరు. వీటన్నింటివల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా ఇతర మానసిక రుగ్మతలకు లోనవుతారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో నవీన్లా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? ఆత్మహత్య భావనలున్నవారు తమ బాధను మాటల్లో, చేతల్లో పరోక్షంగా వెల్లడిస్తూనే ఉంటారు. ఈ విషయాలను గమనించి, మద్దతుగా నిలవడం ద్వారా వారిని కాపాడుకోవచ్చు. • ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండటం, పనితీరు క్షీణించడం వంటి మార్పులను గమనించాలి. • ఎవరైనా తరచూ నిస్సహాయ భావాన్ని వ్యక్తం చేసినా, బయటపడే మార్గం లేనట్లు మాట్లాడుతున్నా వారి బాధను అర్థం చేసుకోవాలి. • ఎవరైనా క్రమబద్ధీకరించని వ్యాపారం లేదా అప్పులు పేరుకుపోవడం వంటి ప్రమాదకర ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటే మద్దతుగా నిలవాలి. • తీవ్రమైన మానసిక కల్లోలం, తీవ్రమైన అపరాధం లేదా అవమానం గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. • ఎమరేమనుకుంటారో అని భయపడకుండా తమ సవాళ్లను చర్చించే వాతావరణాన్ని సృష్టించాలి. • ఆర్థిక కార్యకలాపాలలో ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడంలో ఫైనాన్షియల్ లిటరసీని ప్రోత్సహించాలి. • కష్టాలు, నష్టాల వల్ల వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించాలి. కౌన్సెలింగ్ తీసుకునేలా ప్రోత్సహించాలి. • స్నేహితులు, కుటుంబం, సలహాదారులతో బలమైన మద్దతు వ్యవస్థలను రూపొందించాలి. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
మావాడు ఎవరితోనూ కలవడండీ
‘‘మావాడు చిన్నప్పటి నుంచీ ఎవరితోనూ కలవడు సర్. ఎప్పుడూ ఒంటరిగా తన పని తాను చేసుకుంటాడు. ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ వాడు ఏమాత్రం ఇంట్రెస్ట్ట్ చూపించడం లేదు. ఎవరినైనా ప్రేమించావా? అని అడిగితే అలాంటిదేం లేదంటాడు. సమస్య ఏమిటో అర్థం కావడం లేదు’’ ఆనందమూర్తి ఆవేదన. ఆయన చెప్పింది మొత్తం విన్నాక.. చేతన్తో మాట్లాడాలని చెప్పాను. అయితే మాట్లాడటానికి చేతన్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలా మొక్కుబడిగా మాట్లాడాడు. చిన్నప్పటి నుంచీ స్నేహితులెవరూ లేరని చెప్పాడు. ‘ఎందుకలా?’ అని అడిగితే ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’ అని సమాధానమిచ్చాడు. ‘గాళ్ ఫ్రెండ్స్?’ అని అడిగినా అదే సమాధానం. ‘మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు?’ అనే ప్రశ్నకు ‘ఎవ్వరితోనూ లేదు. నాతో నేనే’ అని చెప్పాడు. అతని మాటల్లో ఎలాంటి భావోద్వేగాలూ లేవు, ఫ్లాట్గా సాగాయి. తన తల్లి కూడా అలాగే ఉంటుందని అతని మాటల్లో తెలిసింది. అతనిది కేవలం సిగ్గు, బిడియం, మొహమాటం కాదని, ఇంట్రావర్ట్ కూడా కాదని అర్థమైంది. క్లినికల్ ఇంటర్వ్యూ, సైకో డయాగ్నసిస్ అనంతరం అతను ‘స్కిజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్’ (ఎస్సీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. మూడు నుంచి ఐదు శాతం వ్యక్తుల్లో ఈ రుగ్మత కనిపిస్తుంది. సైకోథెరపీతోనే పరిష్కారం.. పర్సనాలిటీ డిజార్డర్ అంటే వ్యక్తిత్వంలో లోపాలు రుగ్మతలా మారడం. వీటిని నయం చేయడానికి ఎలాంటి మందులూ లేవు. సైకోథెరపీ ద్వారానే సహాయం చేయగలం. కానీ ఎస్సీపీడీ ఉన్నవారికి ఇతరులతో సంబంధాలే ఇష్టం ఉండదు కనుక థెరపీకి కూడా ఆసక్తి చూపరు. కుటుంబ సభ్యులే తీసుకురావాల్సి వస్తుంది. ఎస్సీపీడీ పరిష్కారానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలను నిశితంగా పరిశీలించి, వారి ఆలోచనలు వారి చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఇతరులతో సంబంధాల ప్రాధాన్యం, ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తారు. సమస్య మూలాన్ని, కుటుంబ కారణాలను అర్థం చేసుకునేందుకు ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది. గ్రూప్ థెరపీ ద్వారా సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడవచ్చు. ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. ఒంటరితనమే ఇష్టం.. ఎస్సీపీడీ లక్షణాలు బాల్యంలో ఉన్నప్పటికీ టీనేజ్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు స్కూల్లో, పనిలో, సామాజిక పరిస్థితుల్లో, ఇతర రంగాల్లో పనితీరును కష్టతరం చేస్తాయి. ఒంటరిగా పనిచేసే ఉద్యోగాలైతే ఫర్లేదు, లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రుగ్మత లక్షణాలు.. ♦ సన్నిహిత సంబంధాలను కోరుకోరు, ఆనందించరు. ♦ ఒంటరిగా ఉంటారు, పనులన్నీ ఒంటరిగా చేయాలనుకుంటారు. ♦ భావోద్వేగాలను వ్యక్తపరచడంలో, ప్రతిస్పందించడంలో కష్టపడతారు. ♦ లక్ష్యాలను చేరుకోవాలనే ఉత్సాహం ఉండదు. ♦ ఇతరుల ప్రశంసలు లేదా విమర్శలకు ప్రతిస్పందించరు. ♦ సరదా, సంతోషం, స్పందనలేని రాయిలా కనిపిస్తారు. ♦ లైంగిక సంబంధాలపై ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. బాల్యంలో నిర్లక్ష్యానికి గురయితే.. పర్సనాలిటీ డిజార్డర్లను గుర్తించడం కష్టం. వాటికి సరైన కారణాలను గుర్తించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎస్సీపీడీకి కూడా కారణమేమిటో తెలియదు. జన్యుపర సంబంధం ఉందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. భావోద్వేగాలను పట్టించుకోని వాతావరణం వల్ల ఈ రుగ్మతకు గురయ్యే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే, బాల్యంలో మానసికంగా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉండే తల్లిదండ్రులను కలిగి ఉండటం ఈ రుగ్మత ఏర్పడటానికి దోహదం చేస్తుంది. నిర్ధారణ కష్టం.. ఎస్సీపీడీతో సహా ఇతర వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించడం చాలా కష్టం, ఎందుకంటే వ్యక్తిత్వ క్రమరాహిత్యం ఉన్న చాలామంది వ్యక్తులు తమ ప్రవర్తన లేదా ఆలోచనా విధానంలో సమస్య ఉందని భావించరు. మీలో కానీ, మీ సన్నిహితుల్లో కానీ ఎస్సీపీడీ ఉందని భావించినప్పుడు ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి. వారు మీ బాల్యం, మానవ సంబంధాలు, పనిలో మీ ప్రవర్తనపై ప్రశ్నలడిగి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి, పరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com. -
కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే రౌడీబేబీ! ధైర్యంగా ఫేస్ చేయకపోతే..!
సత్య తెలివైన విద్యార్థి. కానీ ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఐఐటీ సీట్ రాలేదు. ప్రస్తుతం లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ మూడు నెలలుగా అతన్ని ఓ సమస్య వేధిస్తోంది. ఎగ్జామ్ పేపర్ చేతిలోకి తీసుకోగానే ‘‘బాగా రాయలేనేమో’’ అనే ఆలోచన మనసులోకి దూరుతోంది. అంతే.. అప్పటివరకూ గుర్తున్నది కూడా మర్చిపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నాన్నకు చెప్పుకుని ఏడ్చాడు. వాణి ఒక అథ్లెట్. స్టేట్ లెవెల్లో బెస్ట్ రన్నర్గా నిలిచి, నేషనల్ మీట్కు ప్రిపేర్ అవుతోంది. కానీ రన్నింగ్ ట్రాక్ మీదకు వెళ్లగానే ‘‘నేను గెలవలేనేమో’’ అనే ఆలోచన మనసును హిట్ చేస్తోంది. అంతే.. వేగం తగ్గుతోంది. సెకన్ల వ్యవధిలో ఓడిపోతోంది. ట్రాక్ ఎక్కినప్పుడు ఆ ఆలోచన రాకుండా ఎంతో ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. నేషనల్ విన్నర్ కావాలన్న తన ఆశ నెరవేరుతుందో లేదోనని తీవ్రంగా బాధపడుతోంది. సత్య, వాణిల్లానే చాలామంది విద్యార్థులు, యువతులు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు. అది ఐఐటీ, నీట్, ఎంసెట్, స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఏవైనా..! ఒక్క నెగటివ్ ఆలోచన వారిని.. గమ్యం నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు తీసుకువెళ్తుంది. ఆ ఒక్క నెగటివ్ ఆలోచన మూలాల్ని అర్థం చేసుకుని పరిష్కరించుకోగలిగితే.. గమ్యాన్ని చేరుకోగలరు, అనుకున్నది సాధించగలరు. లొంగకపోతే సాయం అవసరం... నెగటివ్ కామెంట్స్తో వేధించే రౌడీని, దాని గొంతును సరిచేయడం అందరికీ అంత సులువు కాదు. అలాంటప్పుడు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. వారు రకరకాల పద్ధతుల ద్వారా నెగటివ్ సెల్ఫ్ టాక్ను తగ్గించుకునేందుకు సహాయపడతారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అనేది వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తనలను గుర్తించడంలో, సవాలు చేయడంలో సహాయపడుతుంది. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, మైండ్ఫుల్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ద్వారా ఆందోళన వల్ల శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించుకోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆందోళనను రేకెత్తించే పరిస్థితులను క్రమక్రమంగా పరిచయం చేసే ఎక్స్పోజర్ థెరపీ భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సత్య విషయంలో మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్, వాణి విషయంలో తక్కువ దూరం పరుగెత్తడం వంటివి ప్రాక్టీస్ చేయాలి. వారు సాధించిన విజయాలను హైలైట్ చేయడం, పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్పై దృష్టి పెట్టడం వారి విశ్వాసాన్ని పెంచుతుంది, వారి కృషిని కొనసాగించడానికి వారిని ప్రేరేపిస్తుంది. వారి ఆందోళన గురించి కుటుంబం, స్నేహితులు లేదా కోచెస్తో మాట్లాడమని ప్రోత్సహించడం అవసరమైన అవగాహనను, మానసిక మద్దతును అందిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. మనసులో అల్లరి చేస్తుంటుంది.. సత్య, వాణిల్లానే చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి అయినప్పుడు ఎక్కడ ఫెయిలవుతామోనని భయపడుతుంటారు. అది వారి పనితీరును దెబ్బతీస్తుంది. దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. దీనికి కారణం వారి మనసులోని రౌడీబేబీ (బులీ). చిన్నప్పుడు స్కూల్లో ఎలాగైతే ఎగతాళి చేస్తారో, ఏడిపిస్తారో (బులీయింగ్) అలాగే మనసులోని రౌడీ అల్లరి చేస్తుంటుంది. నువ్వు చేయలేవు, నువ్వు ఫెయిలవుతావు అంటూ అబద్ధాలు చెప్తుంటుంది. వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. దాంతో ఆలోచనలు రేసుగుర్రాల్లా పరుగెత్తుతాయి. చేతులకు చెమటలు పడతాయి. కొందరికి చేతులు వణుకుతాయి కూడా. ఆ భయాందోళనల్లో తమకు తెలిసినదాన్ని కూడా మర్చిపోతారు. తమ పర్ఫార్మెన్స్ను కాస్తంత మందగిస్తుంది. అది చాలు కదా లక్ష్యం చేజారడానికి. లోగొంతును సవరించుకోవాలి.. మనసులోని రౌడీ బేబీని అలా వదిలేయాల్సిన అవసరంలేదు. దానిపై పోరాటం చేయవచ్చు. అందుకు మొదట చేయాల్సింది బులీకి అసలు కారణాన్ని కనుక్కోవడం. దానికి బహూశా గత వైఫల్యాలు, పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడి, జడ్జ్ చేస్తారనే భయం వంటివి కారణాలు కావచ్చు. ఆ తర్వాత రౌడీ బేబీతో మాట్లాడి మచ్చిక చేసుకోవాలి. కరకుగా ఉండే రౌడీ బేబీ గొంతును కాస్తంత సరళంగా లేదా సరదాగా మార్చేయండి. నా వంతు కృషి చేయగలను, నా తప్పుల నుంచి నేర్చుకుంటాను.. అని మనసులోని మాటలను మార్చండి. నిశ్శబ్దంగా ఉండటం, నిదానంగా శ్వాస తీసుకోవడం ద్వారా రౌడీని శాంతింపచేయండి. చిన్న చిన్న పరీక్షల్లో మనసులోని రౌడీని ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా?
‘మాకు ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచీ వాడికి కావాల్సినవన్నీ చేశాం. ఇక్కడే బీటెక్ చేశాడు. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే జాబ్ చేస్తున్నాడు. వాడికీ నాకూ మధ్య కమ్యూనికేషన్ చాలా తక్కువ. ఏదైనా వాళ్లమ్మతోనే చెప్తాడు. కానీ మొన్నీ మధ్య విడుదలైన యానిమల్ మూవీ చూశాక నాకు కాల్ చేశాడు. చిన్నప్పుడు తనను నేను పట్టించుకోకపోవడం వల్లే తన జీవితం నాశనమైందని గొడవ పడ్డాడు. ‘అదేంట్రా.. నీకు కావాల్సినవన్నీ చేశా కదా. బాగా చదువుకుని అమెరికాలో జాబ్ చేస్తున్నావు. నీ జీవితం నాశనమైంది ఎక్కడ్రా?’ అని చెప్పినా వినడం లేదు. ‘చిన్నప్పుడు నన్ను నువ్వు అస్సలు పట్టించుకోలేదు. బాగా తిట్టావ్, కొట్టావ్. అందుకే నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్నయ్యాను. ఇప్పుడు ఇక్కడ రోజూ ఆల్కహాల్ తాగుతున్నా’ అని బాంబు పేల్చాడు. వాడితో ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడి మాటల తర్వాత నేను కూడా ఆ సినిమా చూశా. నిజంగా పిల్లలను నెగ్లెక్ట్ చేస్తే ఫలితాలు అంత తీవ్రంగా ఉంటాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను’ కాంతారావు ఆందోళన, ఆవేదన, సందేహమూనూ! యానిమల్ మూవీ చూసిన చాలామంది ఇలాంటి ఆందోళననే వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పట్టించుకోకపోవడం, కొట్టడం, తిట్టడం వల్ల దుష్పరిణామాలు నిజమే అయినా.. నాటకీయత కోసం ఆ సినిమాలో చాలా ఎక్కువ చేసి చూపించారు. అయితే సమస్యేమీ లేదంటారా? సమస్యేమీ లేదనడం లేదు. పిల్లలపై సినిమాల ప్రభావంకంటే తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువని గుర్తించమంటున్నా. పిల్లలను నిర్లక్ష్యం చేయడం, కొట్టడం, తిట్టడంలాంటి చర్యల ఫలితాలు అందరికీ ఒకే విధంగా ఉండవు. కొందరు ఆ పరిస్థితులతో సర్దుకుపోతారు, కొందరు పట్టించుకోరు. కానీ సున్నితమైన మనసున్న పిల్లలు మనసులోకి తీసుకుని తీవ్రంగా బాధపడతారు. మానసిక సమస్యల పాలవుతారు. ఎవరు ఎలా స్పందిస్తారనేది ఆ పిల్లల జీన్స్, కుటుంబ పరిస్థితులు, ఎదురైన అనుభవాలు, వాటిని చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది. బాల్యంలో నిర్లక్ష్యానికి గురికావడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇతరులను విశ్వసించలేరు. నిరాశ, ఆందోళన, అటాచ్మెంట్ సమస్యలు రావచ్చు ∙హఠాత్తుగా ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.శారీరక హింసను ఎదుర్కొన్న పిల్లల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, మాదక ద్రవ్యాల వినియోగానికి దారితీయవచ్చు. ఎమోషనల్ అబ్యూజ్ వల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్తో పాటు పర్సనాలిటీ డిజార్డర్స్కు గురికావచ్చు. సెక్సువల్ అబ్యూజ్ వల్ల ఆత్మహత్య ఆలోచనలు, డిసోసియేషన్, ఈటింగ్ డిజార్డర్స్కు లోనవ్వచ్చు. దీర్ఘకాలం అబ్యూజ్కు గురైన పిల్లల్లో పర్సనాలిటీ డిజార్డర్స్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే కొన్ని సమస్యలు వారి వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతాయి. పేరెంటింగ్ కీలకం.. బాల్యం జీవితానికి పునాదిలాంటిది. అందుకే అది దృఢంగా, సంతోషకరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల జీవితాలను ఉల్లాసభరితంగా తీర్చిదిద్దాలి. సరైన తీరులో పెంచడం ద్వారా పిల్లల్లో మానసిక సమస్యలు, వ్యక్తిత్వ లోపాలను నిరోధించవచ్చు. అందుకు ఏం చేయాలంటే... పిల్లలతో ఎంత సమయం గడిపామనే దానికంటే ఎలా గడిపామనేది ముఖ్యం. పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపండి ∙శారీరకంగా, మానసికంగా సురక్షితంగా భావించే ఇంటి వాతావరణాన్ని సృష్టించండి. మంచిగా మాట్లాడటం, కౌగలించుకోవడం ద్వారా మీ ప్రేమ, ఆప్యాయతలను తరచుగా వ్యక్తపరచండి. పిల్లల భావాలు, అనుభవాలు సానుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా మీతో పంచుకునేలా ప్రోత్సహించండి. వారి మాటలను ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా వినండి ∙మీ సొంత భావాలు, అనుభవాల గురించి వారి వయస్సుకు తగిన విధంగా పిల్లలతో పంచుకోండి ∙పిల్లల ప్రవర్తనకు స్పష్టమైన నియమాలు, సరిహద్దులను ఏర్పాటు చేయండి. వాటి వెనుక ఉన్న కారణాన్ని వివరించండి. వాటిని స్థిరంగా అమలు చేయండి. తప్పు చేసినప్పుడు శిక్షించడం కంటే మంచి ప్రవర్తనను మెచ్చుకోవడంపై దృష్టిపెట్టండి. పెద్దలను గమనించడం, అనుకరించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మీ మాటలు, చర్యలను గమనించుకోండి. పిల్లల్లో మీరు చూడాలనుకుంటున్న దయ, గౌరవం, సానుభూతి, బాధ్యతలను మీరు చూపిస్తూ రోల్ మోడల్గా నిలవండి. ఇతరులతో సానుకూల సంబంధాలు ఏర్పరచుకోవడంలో సహాయపడండి. సంఘర్షణలను పరిష్కరించుకోవడం నేర్పండి. మీ అభిరుచులను పిల్లలపై రుద్దకుండా వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహించండి. వారి స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశాలను కల్పించండి. మీ పిల్లల ప్రవర్తనలో లేదా భావోద్వేగాలలో మార్పులు గమనిస్తే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. -సైకాలజిస్ట్ విశేష్,psy.vishesh@gmail.com -
పిల్లలను మంచిగా పెంచడం ఎలా?
‘మా పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది సర్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ పట్టుకునే ఉంటారు. వాళ్లతో ఎలా డీల్ చేయాలో అర్థం కావడంలేదు.’ ‘మా పాపతో వేగలేకపోతున్నాం సర్. మొబైల్లో రైమ్స్ పెట్టకపోతే అన్నం కూడా తినదు’. ’‘మావాడు టాబ్తోనే ఉంటాడు. మనుషులతో అస్సలు మాట్లాడటం లేదు.’ కౌన్సెలింగ్ కోసం వచ్చిన చాలామంది తల్లిదండ్రులు ఇలా.. టెక్నాలజీ వల్ల తమ పిల్లలు ఎలా పక్కదారి పడుతున్నారో చెప్పుకుని బాధపడుతుంటారు. మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నామనేది కొట్టిపారేయలేని నిజం. వాటి నుంచి పిల్లల దృష్టిని మళ్లించడానికి పేరెంట్స్ పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఏమైనా చిట్కాలు దొరుకుతాయేమోనని యూట్యూబ్ ఓపెన్ చేస్తే.. అలవికాని చిట్కాలు కనిపిస్తాయి. కొందరు వాటిని నమ్మి, ఆచరించి, ఫలితాలు కనిపించక బాధపడుతుంటారు. ఈ సమస్యను తప్పించేందుకే ‘మంచి’ పిల్లలను పెంచడం ఎలా? అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు ఏళ్లుగా అధ్యయనం సాగిస్తున్నారు. ఎంత డిజిటల్ యుగంలో ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా పిల్లలను పెంచే ప్రాథమిక అంశాలేమీ మారలేదు. పిల్లలు తమ లక్ష్యాలను సాధించాలని, ఆనందంగా జీవించాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాంటి పిల్లలను పెంచాలంటే కఠిన శిక్షలు అవసరంలేదనీ, ఖరీదైన కార్పొరేట్ స్కూళ్ల అవసరం అంతకన్నా లేదని, జస్ట్ ఆరు సూత్రాలను ఆచరిస్తే చాలని చెప్తున్నారు హార్వర్డ్ సైకాలజిస్టులు. ఆ ఆరు సూత్రాలేమిటో ఇప్పుడు, ఇక్కడ తెలుసుకుందాం. 1) మీ పిల్లలతో సమయం గడపండి ఇది అన్నింటికీ పునాది వంటిది. మీ పిల్లలతో క్రమం తప్పకుండా సమయాన్ని వెచ్చించండి. వారి గురించి, ప్రపంచం గురించి, వారు దానిని ఎలా చూస్తారు అనే విషయాల గురించి ఓపెన్–ఎండ్ ప్రశ్నలు అడగండి. వారి ప్రతిస్పందనలను చురుకుగా వినండి. దీనిద్వారా మరొక వ్యక్తి పట్ల ఎలా శ్రద్ధ కనబరచాలో వారికి చూపిస్తున్నారు. ఇంకా తనో ప్రత్యేక వ్యక్తి అని, తనదో ప్రత్యేక వ్యక్తిత్వమని గుర్తుచేస్తుంటారు. 2) ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పండి గట్టిగా మాట్లాడితే పిల్లలు నొచ్చుకుంటారని చాలామంది పేరెంట్స్ ముఖ్యమైన విషయాలను కూడా నెమ్మదిగా, సున్నితంగా చెప్తుంటారు. దీంతో పిల్లలు వాటిని ఏమాత్రం పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, టీమ్ వర్క్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారో టీచర్లు, కోచ్లను అడిగి తెలుసుకోమంటున్నారు. 3) ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించండి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎవరెవరు ప్రభావితమవుతారో, వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలో మీ పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి. ఉదాహరణకు మీ పిల్లలు ఏదైనా గేమ్ లేదా టీమ్ యాక్టివిటీ నుంచి తప్పుకోవాలను కుంటే.. వారిపై అరిచి భయపెట్టకుండా, దానివల్ల ఏర్పడే పరిణామాలు వివరించండి. అసలు సమస్య మూలం ఎక్కడుందో గుర్తించి, టీమ్ పట్ల కమిట్మెంట్తో ఉండమని ప్రోత్సహించండి. 4) సహాయం చేయడం, కృతజ్ఞతతో ఉండటం నేర్పించండి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే వ్యక్తులు ఉదారంగా, కరుణతో, సహాయకారులుగా, క్షమించే వారుగా ఉంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అలాంటి వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తోబుట్టువులకు సహాయం చేయమని పిల్లలను అడగండి. సహాయం చేసినప్పుడు థాంక్స్ చెప్పండి. తద్వారా వాళ్లు కూడా కృతజ్ఞతలు తెలపడం నేర్చుకుంటారు. అలాగే అసాధారణమైన దయను ప్రదర్శించినప్పుడు వారిని మెచ్చుకోండి. 5) విధ్వంసక భావోద్వేగాలను చెక్ చేయండి పిల్లల్లో కూడా కోపం, అవమానం, అసూయలాంటి నెగెటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ను గుర్తించడం, వాటికి పేరు పెట్టడం, ప్రాసెస్ చేయడంలో సహాయం చేయడం, సురక్షితమైన కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ వైపు మార్గనిర్దేశం చేయడం చాలా అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలి. అలాగే పిల్లల భద్రత దృష్ట్యా వారికి స్పష్టమైన, సహేతుకమైన సరిహద్దులను నిర్దేశించడమే కాకుండా, అవి వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. 6) బిగ్ పిక్చర్ చూపించండి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా పిల్లల సర్కిల్ చాలా చిన్నది. ఆ సర్కిల్లోని వ్యక్తుల పట్లే వారు ప్రేమ, శ్రద్ధ, సానుభూతి చూపిస్తారు. అయితే ఆ సర్కిల్ వెలుపల ఉన్న వ్యక్తుల గురించి కూడా వారు శ్రద్ధ వహించేలా చేయడం అవసరం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని, వారి సమస్యను వారి కోణంలో అర్థం చేసుకోవాలని ప్రోత్సహించడం ద్వారా, టీవీలో వచ్చే అలాంటి సంఘటనలను వివరించడం ద్వారా పిల్లల్లో సహానుభూతిని పెంచాలి. ఈ ఆరు సూత్రాలు పాటిస్తే ఒక శ్రద్ధగల, గౌరవప్రదమైన, నైతికత గల పిల్లలను పెంచడం సాధ్యమేనని, దీనికంటే ముఖ్యమైన పని మరేదీ లేదని హార్వర్డ్ సైకాలజిస్టులు చెప్తున్నారు. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
అనిత ఈ కాలం పిల్ల కాదని మెచ్చుకునేవారు.. కానీ భర్తకు అసలు విషయం తెలిసి..
షాపింగ్కి ఆడవాళ్లు ముందుంటారని అందరూ అంటుంటారు. కానీ అనితకు షాపింగ్ అంటే చిరాకు. తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా వెళ్లేది కాదు. ఇల్లు, కాలేజీ తప్ప మరోచోటికి కదలదు. ఎక్కడికైనా వెళ్లినా అక్కడేమీ తినదు. ఎంత అవసరం వచ్చినా పబ్లిక్ రెస్ట్ రూమ్లకు వెళ్లదు. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏంటంటే కనీసం సెల్ఫోన్ కూడా వాడదు. దాంతో అందరూ ‘అనిత ఈ కాలం పిల్ల కాదమ్మా’ అని మెచ్చుకునేవారు. ఇంజినీరింగ్ ఫైనలియర్లో ఉండగానే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న హరికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి వేడుకల్లో కూడా బిడియంగానే ఉంది. పెళ్లి కూతురుకు సిగ్గు ఎక్కువ అనుకున్నారు అందరూ. ఆ తర్వాత బెంగళూరులో కాపురం పెట్టారు. వీకెండ్స్లో హరి బయటకు వెళ్దామన్నా వద్దనేది. కొత్తదనం వల్ల అనుకున్నాడు. కానీ కూరగాయలకు కూడా బయటకు వెళ్లకపోవడం, దగ్గర్లోని షాపింగ్ మాల్కి వెళ్లాలన్నా వణికిపోవడం గమనించి.. సమస్య ఏమిటని అడిగాడు. కొత్త వ్యక్తులను కలవాలన్నా, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలన్నా తనకు భయమని, అలాంటి సందర్భాల్లో గుండె వేగం పెరుగుతుందని, ఆందోళనగా ఉంటుందని చెప్పింది. అది సిగ్గు కాదని, ఏదో మానసిక సమస్య అని హరి అర్థం చేసుకుని ఆన్లైన్ కౌన్సెలింగ్ కోసం సంప్రదించాడు. అనితతో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె సోషల్ ఫోబియా లేదా సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ లేదా అఈతో బాధపడుతోందని అర్థమైంది. అది సిగ్గు, బిడియం కాదు.. సిగ్గు కంటే అఈ భిన్నంగా ఉంటుంది. సిగ్గు పదిమందిలో కలవడానికి మాత్రమే అడ్డుపడితే, అఈ షాపింగ్, జాబ్ లాంటి రోజువారీ కార్యకలాపాలనూ కష్టతరం చేస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారికి తమ భయాలు అహేతుకమని తెలిసినా, వాటిని అధిగమించ లేరు. తమను ఇతరులు గమనిస్తుంటారని, తమ గురించే మాట్లాడుకుంటారని ఆందోళన చెందుతుంటారు. టీనేజ్లో ప్రారంభమయ్యే ఈ సమస్య దాదాపు 8 నుంచి 10 శాతం మందిలో ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అఈకి కచ్చితమైన కారణం తెలియదు. అయితే భౌతిక, జీవ, జన్యుపరమైన కారకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడే సెరటోనిన్, డోపమైన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. అలాగే బాల్యంలో శారీరక, మానసిక హింస, తల్లిదండ్రుల అతి నియంత్రణ, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులూ కారణం కావచ్చు. జనాల్లోకి వెళ్లాలంటే వణుకు ► అఈని నిర్ధారించడానికి ఎలాంటి వైద్య పరీక్ష లేదు. కుటుంబ చరిత్ర, వ్యక్తి లక్షణాలను బట్టి నిర్ధారిస్తారు. ప్రతి ఒక్కరూ కొన్ని సమయాల్లో ఆందోళనకు గురవుతారు. అఈ ఉన్న వ్యక్తులు ఇతరులు తమను ఏమైనా అనుకుంటారేమో, అవమానిస్తారేమో నిరంతరం భయపడుతుంటారు. ► మొహం ఎర్రబడటం, వికారం, చెమటలు పట్టడం, వణుకు, కండరాలు పట్టేయడం, తల తిరగడం, గుండెవేగం పెరగడం, మైండ్ బ్లాంక్ అయినట్లు అనిపించడం, మాట్లాడటం కష్టమవ్వడం లాంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. ► తన భయాందోళనలను ఇతరులు గమనిస్తారనే ఆందోళన, దీన్నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ తీసుకోవాలని భావించడం, ఆందోళన కారణంగా స్కూల్ లేదా కాలేజీ లేదా వర్క్ ఎగ్గొట్టడం వంటి మానసిక లక్షణాలు ఉంటాయి. మనిషిని బట్టి థెరపీ అఈతో బాధపడుతున్న వ్యక్తుల్లో మూడింట ఒక వంతు మంది కనీసం పదేళ్లపాటు దీన్ని సమస్యగా చూడరు. చూసినా సహాయం కోరరు. దీన్ని అధిగమించేందుకు రకరకాల థెరపీలు సహాయపడతాయి. అయితే ఏ థెరపీ ఎంత బాగా పనిచేస్తుందో వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి ఒక రకమైన చికిత్స మాత్రమే అవసరమైతే కొందరికి వివిధ థెరపీల కలయిక అవసరం కావచ్చు. కౌన్సెలింగ్, సైకోథెరపీ, లైఫ్ స్టైల్ మార్పులు, మందులతో దీన్ని ఎదుర్కోవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, మెడిటేషన్, యోగా లాంటివి ఒత్తిడిని మేనేజ్ చేయడానికి సహాయపడతాయి రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం, నిద్ర వంటివి ఆందోళనను కొంతవరకు తగ్గిస్తాయి. మనసైన వారితో మనసు విప్పి మాట్లాడటం కూడా ఆందోళన, ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలను సానుకూలమైన వాటితో భర్తీ చేయడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) సహాయం చేస్తుంది. ప్రతికూల భావాలు ఉన్నప్పటికీ విలువలతో ఎలా జీవించాలో acceptance and commitment థెరపీ ద్వారా తెలుసుకుంటారు. సామాజిక సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి గ్రూప్ థెరపీ సహాయ పడుతుంది. గ్రూప్లో పనిచేయడం వల్ల మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. సామాజిక పరిస్థితులను నివారించే బదులు క్రమంగా ఎదుర్కొనేందుకు ఎక్స్పోజర్ థెరపీ సహాయపడుతుంది. ఇవన్నీ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో జరగాలి. కౌన్సెలింగ్, థెరపీలతో రుగ్మత తగ్గకపోతే సైకియాట్రిస్ట్ని కలసి మందులు వాడాల్సి ఉంటుంది. -సైకాలజిస్ట్ విశేష్ -
అశ్వాలు ఆందోళన తగ్గిస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయట పడేందుకు వివిధ రకాల చికిత్సా పద్ధతులను పాటించే ఉంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మరో కొత్త తరహాలో సాంత్వన అందించవచ్చని సైకాలజిస్ట్ నిమ్రా మీర్జా చెబుతున్నారు. దాని పేరు ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’... అంటే గుర్రాలతో స్నేహం చేయడం, వాటితో సహవాసం వల్ల కూడా మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీనికి గుర్తింపు ఉండగా, మన దేశంలో బెంగళూరు, చెన్నైల్లో ఈ పద్ధతి వచ్చేసింది. ఇక తెలంగాణలో తొలిసారి ఈ థెరపీని నిమ్రా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన నిమ్రా ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. ఈ థెరపీలోనూ లోతైన అధ్యయనం చేశారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ (ఈఎఫ్టీ)లో కూడా పట్టా పొందిన ఆమె హార్స్ రైడర్గా పలు పోటీల్లో పాల్గొన్నారు. తొలిసారి రానున్న ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది. అజీజ్ నగర్లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ)లో నిమ్రా మీర్జా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్స్ రైడింగ్కు సంబంధించి ప్రాథమికాంశాలు, గుర్రాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మంచి రైడర్గా మారేందుకు అవసరమైన సూచనలతో పాటు థెరపీకి సంబంధించిన పలు అంశాలను నిమ్రా వివరించారు. ‘హార్స్ రైడింగ్ అంటే చాలా మంది ఒక ఆటగా మాత్రమే చూస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను కరిగించి శారీరకంగా మంచి ఫలితాలు అందించడం రైడింగ్లో సహజంగా కనిపించే ప్రయోజనం. కానీ రైడింగ్తో పాటు గుర్రాలను మచ్చిక చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వారిపై, కొన్ని రకాల మానసిక వ్యాధులతో బాధడుతున్నవారిపై కూడా ఈ థెరపీ బాగా పని చేస్తుంది. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వారు సైతం ఈ ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీతో కోలుకున్న అనుభవం నా ముందుంది. కొత్తగా వచ్చిన ఈ చికిత్స ఎక్కువ మందికి చేరాలనేదే మా ప్రయత్నం’అని నిమ్రా వివరించారు. మున్ముందు కూడా హెచ్పీఆర్సీ కేంద్రంగా ఈ చికిత్స అందిస్తామని ఆమె వెల్లడించారు. -
పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. స్నేహితుల బలవంతంతో అతడు..
జానకి, రమేష్లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. జాతకాలు సహా చివరకు అన్నీ కుదిరిన అమెరికా సంబంధం దొరికింది. అక్కడున్న స్నేహితులతో అతని గురించి ఎంక్వయిరీ చేయించారు. అన్నీ బాగున్నాయని తెలుసుకున్నాక సంబంధం ఫిక్స్ చేశారు. వరుడి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి ఆర్భాటంగా చేశారు. వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ సమర్పించారు. పెళ్లయిన 15 రోజులకే కూతుర్ని ఆనందంగా అమెరికా పంపించారు. ∙∙ అమెరికా వెళ్లిన కొత్తల్లో సునీత కాపురం పిక్నిక్స్, పార్టీలు, సైట్ సీయింగ్లతో సంతోషంగా సాగింది. మూడునెలల తర్వాత ఫ్రెండ్స్తో పార్టీ అని వెళ్లిన సునీల్ తాగి వచ్చాడు. అదేమిటని అడిగితే ‘ఫ్రెండ్స్ బలవంతం చేశార’ని చెప్పాడు. ఆ తర్వాత వారం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ తాగడంతో పాటు మాంసాహారం కూడా తిన్నాడు. అది చూసి సునీత షాకయ్యింది. అదేమిటని నిలదీస్తే ‘‘పెళ్లికి ముందు సవాలక్ష చెప్తాం, అలాగని అన్నిటికీ మడి కట్టుకుని కూర్చుంటామా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్లాగే ఉండాలి’’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. వీటన్నింటికీ మించి మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం, ఎడాపెడా అబద్ధాలు చెప్పడం, అడిగితే చేయి చేసుకోవడం సునీతను కలచివేసింది. ‘‘నువ్వో పల్లెటూరి బైతువి, నిన్ను చేసుకోవడం నా ఖర్మ’’ అంటూ రోజూ తిట్టేవాడు. ఇవన్నీ భరించలేక సునీత డిప్రెషన్కి లోనయ్యింది. సునీల్ ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వాళ్లమ్మ వాళ్లింట్లో దింపేసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పుడుగాని జానకి, రమేష్లకు అసలు విషయం తెలియలేదు. వాళ్లు ఫోన్లో అడిగితే... ‘‘సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నదాన్ని నాకు కట్టబెట్టి అన్యాయం చేశారు. మీ అమ్మాయి నాకు అక్కర్లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా’’ అని చెప్పి, నెల తిరిగేసరికి విడాకుల నోటీస్ కూడా పంపాడు. దాంతో సునీత మరింత డిప్రెషన్కి లోనయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెను కౌన్సెలింగ్కి తీసుకొచ్చారు. ∙∙ వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరు శారీరక, మానసిక, లైంగిక అవసరాలు ఉంటాయి. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమైనా భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవేవీ గుర్తించకుండా జానకి, రమేష్లు చేసిన తప్పే చేస్తుంటారు. పెళ్లికి కులం, గోత్రం, జాతకాలు కలిస్తే చాలనుకుంటారు. మంచి జాబ్ ఉంటే భేషనుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వారిద్దరి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. ప్రయత్నించినా సునీల్ లాంటి వారు నెగెటివ్ పాయింట్స్ దాచి పాజిటివ్స్ను మాత్రమే ముందుంచుతారు. ఈ సమస్యకు పరిష్కారమే ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్. ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్లో ఏం జరుగుతుంది? ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్ అనేది జంటలను మానసికంగా వివాహానికి సిద్ధం చేయడానికి సహాయపడే చికిత్స. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలరని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకరికొకరు వారి వైవాహిక సంబంధాన్ని గురించి వారి దృక్కోణాలను అంచనా వేయడానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి విడివిడిగా ప్రశ్నలు అడుగుతారు. ఫైనాన్స్, కమ్యూనికేషన్, నమ్మకాలు, విలువలు, ఆప్యాయత, సెక్స్, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు, డెసిషన్ మేకింగ్, యాంగర్ మేనేజ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, లైఫ్ స్టైల్, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంలాంటి వివిధ అంశాల గురించి చర్చిస్తారు. ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్ వల్ల ఉపయోగాలు ►వివాహ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కాబోయే వధూవరులను సిద్ధం చేస్తుంది ►తమను తాము మార్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి, భాగస్వాములతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది ►వధువు లేదా వరుడు మానసికంగా వివాహానికి సిద్ధమైనట్టయితే.. తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సరైన దారి చూపుతుంది ►వ్యక్తిగత యోగ్యతలను అంచనావేయడానికి బదులుగా భాగస్వాముల మధ్య అనుకూలతను అంచనా వేసుకోగలరు ►జంట మధ్య సానుకూల దృక్పథం ఏర్పడుతుంది ►భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి, వివాహానికి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడానికి సహాయపడుతుంది ►సంఘర్షణ–పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని! -
PTSD: సొంత తాతే తన పట్ల, తన చెల్లి పట్ల నీచంగా.. అందుకే ఆమె ఇలా..
రియాకు 15 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా తనను తాను గాయపరచు కుంటోంది. ఎందుకలా చేస్తుందో పేరెంట్స్ అడిగినా, ఫ్రెండ్స్తో అడిగించినా ఏమీ చెప్పలేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఫ్రెండ్స్ సలహాపై పేరెంట్స్ ఆ అమ్మాయిని కౌన్సెలింగ్కి తీసుకొచ్చారు. ఆమెతో మాట్లాడినప్పుడు కూడా కారణమేంటో చెప్పలేదు. రెండు మూడు సెషన్లతో ఆమె నమ్మకం సంపాదించుకున్న తర్వాత తన మనసులోని బాధను బయటపెట్టింది. తన 8 నుంచి 12 ఏళ్ల వరకు సొంత తాతే తనను లైంగికంగా వేధించాడని బోరుమని ఏడ్చింది. ఆ విషయం ఎవరికైనాచెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఎవ్వరికీ చెప్పలేదంది. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని తన చెల్లీ చెప్పిందని, ఆయన ఏడాది కిందట చనిపోయాడని తెలిపింది. తాత తనతో, చెల్లితో ప్రవర్తించిన విధానం అమ్మానాన్నలకు చెప్తే నమ్మకపోగా... ఇద్దరినీ కలిపి తిట్టారనీ చెప్పింది. తాను ముందే చెప్పి ఉంటే చెల్లెలైనా సేఫ్గా ఉండేదని, చెల్లెలికి అలా జరగడానికి తానే కారణమని బాధపడింది. చెల్లెల్ని చూసినప్పుడల్లా తాత గురించి పేరెంట్స్కు చెప్పకుండా తప్పుచేశాననే గిల్టీ ఫీలింగ్ చంపేస్తోందని, తాను చేసిన తప్పుకు శిక్షగా చెయ్యి కోసుకుంటున్నానని తెలిపింది. తానలా శిక్ష అనుభవించినప్పుడే మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటోందని తెలిపింది. ∙∙∙ కుటుంబ సభ్యుల మరణం, రక్తసిక్తమైన చావుని కళ్లారా చూడటం, చంపేస్తామనే బెదిరింపులు, యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, తీవ్రమైన గాయం, లైంగిక హింసకు గురికావడం లాంటి అత్యంత బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారిని అవి జీవితాంతం వెంటాడుతుంటాయి. ఆ సంఘటన జరిగింది ఒకసారే అయినా దాన్ని మర్చిపోలేకపోతుంటారు. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్కు గురైన రియాకు ఆ జ్ఞాపకాలు పదేపదే గుర్తొచ్చి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీన్నే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అంటారు. పీటీఎస్డీ లక్షణాలు.. ►బాధాకరమైన సంఘటనలు పదేపదే గుర్తొస్తుంటాయి ∙దానికి సంబంధించిన పీడకలలు రోజూ భయపెడుతుంటాయి. ►ఆ సంఘటనకు సంబంధించిన ఆలోచనలు, ప్రాంతాలు తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తాయి ∙వాటిని నివారించేందుకు రోజూ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ►కొందరిలో బాధాకరమైన సంఘటనలకు సంబంధించి మతిమరపు ఏర్పడుతుంది∙ ►ప్రపంచం, వ్యక్తులు ప్రమాదకరమైనవనే నమ్మకాలు ఏర్పడతాయి. ►ఒంటరిననే భావన కమ్మేస్తుంది. రోజువారీ పనులపై ఆసక్తి తగ్గుతుంది నిరంతరం భయం, కోపం, అపరాధ భావన, అవమానాలతో కుమిలిపోతుంటారు∙ ►స్నేహం, ప్రేమ, దయ, కరుణలాంటి సానుకూల భావోద్వేగాలను అనుభవించలేకపోతారు చిరాకు, విధ్వంసకర ప్రవర్తన, నిద్రలేమి, ఏకాగ్రత లేమి, హైపర్ విజిలెన్స్ ఉంటాయి. ►రియాలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. చెల్లెలిపై వేధింపులకు తాను చెప్పకపోవడమే కారణమనే అపరాధ భావన, తాను చెప్పినా పేరెంట్స్ నమ్మలేదనే బాధ ఆమె మనసును నిత్యం దహించివేస్తున్నాయి. ►లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో పీటీఎస్డీ ప్రధాన సమస్యగా మారుతుంది. ఇది వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, డిఫెన్స్ సిస్టమ్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమను తాము హింసించుకునేలా ప్రేరేపిస్తుంది. రియా చేసిందదే. తనకు తానే శిక్ష వేసుకుంటోంది. ఏం చెయ్యాలి? ►ప్రతి ఏడుగురిలో ఒకరు రియాలా బాల్యంలోనే లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. లైంగిక వేధింపులకు గురైన వారిలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అది జీవితాంతం వేధించే పీటీఎస్డీగా మారుతుంది. దీన్ని డీల్ చేయడంలో ముందుగా పేరెంట్స్కి కౌన్సెలింగ్ అవసరం. ఆ తర్వాత క్వాలిఫైడ్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ల ద్వారా థెరపీ, చికిత్స అవసరం ఉంటుంది. ►లైంగిక హింసకు పాల్పడేవారిలో ఎక్కువమంది సన్నిహిత బంధువులో, తెలిసినవారో అయ్యుంటారు ∙తల్లిదండ్రులు నిత్యం జాగరూకతతో ఉండాలి. బాల్యంలోనే గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి ∙తమపట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా పేరెంట్స్కి చెప్పవచ్చనే భరోసా కల్పించాలి ►పీటీఎస్డీ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెస్ బాల్స్ ఉపయోగించవచ్చు ∙అనుచిత ఆలోచనలను తప్పించుకోవడానికి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది ►మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మైండ్ఫుల్ నెస్ ప్రాక్టీస్ సహాయపడుతుంది ∙ప్రతికూల ఆలోచనలు, బాధాకరమైన జ్ఞాపకాలు వచ్చినప్పుడు స్టాప్ అనే పదాన్ని మనసులో చూడండి ►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, ఐ మూవ్ మెంట్ డిసెన్సిటైజేషన్ అండ్ రిప్రాసెసింగ్((EMDR)), ట్రామా–ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (TF&CBT) లాంటి థెరపీ పద్ధతులు సహాయపడతాయి∙ న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీలోని VK Dissociation టెక్నిక్ జ్ఞాపకాల నుంచి దూరమయ్యేందుకు సహాయపడుతుంది. ►సాధారణంగా 12 నుంచి 16 సెషన్లు కౌన్సెలింగ్కి హాజరవ్వాల్సి ఉంటుంది. ►యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగించేందుకు సైకియాట్రిస్ట్ని సంప్రదించి యాంటీ డిప్రసెంట్ పిల్స్ వాడవచ్చు. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా? -
ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే..
Attention Deficit Hyperactivity Disorder: సుమంత్ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు. కానీ సుమంత్ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్వర్క్ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది. సుమంత్ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్–డెఫిషిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD).. ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది. కారణాలు– పర్యవసానాలు ఏడీహెచ్డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు. అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు. స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు. కనీసం ఆరు లక్షణాలు ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. చంచలత్వం (attention deficit) లక్షణాలు: వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం ∙టాస్క్స్ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు హైపర్యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ లక్షణాలు: ►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం ►సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం ►తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం ►ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం ►తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం ►ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం ►ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. తల్లిదండ్రులు ఏం చేయాలి? ►ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్గా మీరేం చేయొచ్చంటే.. ►మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి ►పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి ►వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి ►మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి ►ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో అఈఏఈ అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. ►పేరెంటింగ్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి. ►సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ►మందులు మెదడులోని న్యూరోట్రాన్సి్మటర్లు డోపమైన్, నోర్ ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్ ను మెరుగుపరుస్తాయి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
సాఫ్ట్వేర్ జాబ్.. సహోద్యోగితో పెళ్లి! అమెరికాలో కాపురం.. కానీ, ఆ భయం వల్ల..
Acrophobia: గోపీ హైదరాబాద్లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. నాలుగేళ్లు పనిచేశాక తన సహోద్యోగినే పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే ఆన్సైట్ అవకాశం వచ్చింది. ఇద్దరూ సంతోషంగా అమెరికా వెళ్లారు. ఆఫీసు 36వ అంతస్తులో ఉందని అక్కడకు వెళ్లాక తెలిసింది. అంతే.. ఒంట్లో వణుకు మొదలైంది. ఎలాగోలా ధైర్యం చేసి ఆఫీసుకు బయలుదేరాడు. అక్కడ లిఫ్ట్లో రాడ్ గట్టిగా పట్టుకుని 36వ అంతస్తుకు చేరుకున్నాడు. ఊపిరాగినట్లనిపించింది. ఎవరూ చూడకుండా గోడ సాయంతో కేబిన్ చేరుకుని కుర్చీలో కూర్చున్నాడు. సాయంత్రం డ్యూటీ అయిపోయేంతవరకు మనసంతా తీవ్రమైన ఆందోళనగా ఉంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కుర్చీలోంచి లేస్తే పడిపోతానేమోనని విపరీతమైన భయం. అందుకే సాయంత్రం డ్యూటీ అయ్యేంతవరకు కుర్చీలోంచి కదల్లేదు. సాయంత్రం డ్యూటీ అయ్యాక ఎలాగోలా కష్టపడి ఇంటికి చేరుకున్నాడు. అలా వారం రోజులు ఆఫీసుకు వెళ్లాక ఇక తనవల్ల కాదనిపించింది. జాబ్ రిజైన్ చేస్తానంటూ భార్యకు చెప్పాడు. ఎందుకని అడిగితే.. ఏదో కారణం చెప్పాడు. అది సరైన కారణమని ఆమెకు అనిపించలేదు. దాంతో వాగ్వాదం మొదలై, వాగ్యుద్ధంగా ముగిసింది. ఎత్తయిన ప్రదేశాలంటే వణకడాన్ని ఏమంటారు? సాధారణంగా అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. కొందరికి పిల్లంటే భయం, మరికొందరికి కుక్కంటే భయం, ఇంకొందరికి పామంటే భయం. అలాగే ఎత్తయిన ప్రదేశాలంటే అందరికీ ఎంతో కొంత భయం ఉంటుంది. ఎత్తయిన ప్రాంతాల నుంచి కిందకు చూస్తే చాలామందికి అసౌకర్యంగా ఉంటుంది. కొందరికి కొద్దిపాటి వణుకుగా అనిపించవచ్చు. అందుకే ఎత్తులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఆ జాగ్రత్త, ఆ భయం అతిగా మారి, ఆ పరిస్థితులను తలచుకుంటేనే వణుకు వస్తే, అలా ఆరు నెలలపాటు ఉంటే దాన్ని ‘ఫోబియా’ అంటారు. ఇది ఒక మానసిక సమస్య. ఇలాంటి ఫోబియాలు చాలా ఉన్నాయి. వాటిలో గోపీలా ఎత్తయిన ప్రదేశాలంటే వణికిపోవడాన్ని ‘అక్రోఫోబియా’ అంటారు. ఈ ఫోబియా ఉన్న వ్యక్తులకు ఎత్తయిన ప్రదేశాలన్న ఊహే వణుకు తెప్పిస్తుంది. ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోతామనే భయమే మనసులో ఉంటుంది. అందువల్ల మెట్లు ఎక్కడం, బాల్కనీ దగ్గర నిలబడటం, బహుళ అంతస్తుల భవనాల్లో పనిచేయడం లాంటి వాటిని తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడయినా ఎత్తయిన ప్రదేశంలో ఉండాల్సి వస్తే ఆందోళనతో గుండె వేగంగా కొట్టుకుంటుంది, తల తిరిగినట్లు, ఊపిరాగినట్లు అనిపిస్తుంది. ఎవరికి రావచ్చు? అక్రోఫోబియా ఏ వయస్సులోనైనా రావచ్చు. అయితే ఇలాంటి నిర్దిష్ట భయాలు బాల్యంలో వచ్చే అవకాశాలు ఎక్కువ. బాల్యంలో ఎదురైన ఏదో ఒక భయం కలిగించే అనుభవాన్ని అతిగా జనరలైజ్ చేయడం వల్ల, అతిగా ఆలోచించి భూతద్దంలో చూడటం వల్ల అది ఫోబియాగా మారుతుంది. ఈ భయాలు టీనేజర్స్లో, యువకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మహిళల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి. కారణాలేమిటి? అక్రోఫోబియాకు కారణం ఏమిటో కచ్చితంగా తెలియదు. అక్రోఫోబియా కలిగి ఉండటం అనేది ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం లేదా మనల్ని మనం బాధించు కోవాలనే సహజ మానవ ఆందోళన నుంచి ఉత్పన్నమవుతుందని చెప్తారు. ఎత్తు నుంచి∙పడిపోవడం వల్ల మీరు అనుభవించే నొప్పి గురించి ఆలోచించడం, మనసులో ఆ దృశ్యాన్ని పదేపదే చూస్తూ బాధపడటం అక్రోఫోబియా పెరగడానికి కారణం అవుతుంది. నివారణ ఉందా? దాదాపు మూడు నుంచి ఆరుశాతం మందిలో అక్రోఫోబియా ఉంటుంది. ఈ ఫోబియా మీకుందని మీరు గుర్తిస్తే.. ఎత్తయిన ప్రదేశంలో ఉన్నప్పుడు కిందకు చూడకుండా మీ దృష్టిని హరైజాన్పై నిలపండి. మీకు సమీపంలో నిశ్చలంగా ఉన్న వస్తువులను చూడండి. అవసరమైతే మీ కదలికలను ఆపేయండి. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, డీప్ బ్రీత్, యోగా వంటివి ప్రాక్టీస్ చేయండి. అయితే ఇవన్నీ అప్పటికి ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప మీ ఫోబియాను పరిష్కరించవు. అందువల్ల మీ ఫోబియాకు సరైన సైకోథెరపీ పొందడం అవసరం. మీరెంత త్వరగా కౌన్సెలింగ్ తీసుకుంటే అంత త్వరగా మీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మీలో ఆందోళన, నిరాశ, నిస్పృహలు పెరగడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. అక్రోఫోబియాకు ప్రస్తుతం ఎటువంటి నివారణ లేదు. అయితే ఎక్స్పోజర్ థెరపీ, వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీవంటి పద్ధతులతో చికిత్స చేయవచ్చు. న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా ఒకటి నుంచి మూడు సెషన్లలోనే ఫోబియా నుంచి ఉపశమనం పొందవచ్చు. భయాన్ని ఎదుర్కోవటానికి, భయం లేదా ఆందోళన లక్షణాల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు ఒక్కోసారి మందులు కూడా అవసరమవుతాయి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి? -
OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి..
Obsessive-Compulsive Disorder: సునీత తెలుగు టీచర్. సంప్రదాయ కుటుంబం. ప్రతి పనీ పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచీ అలవాటు. అయితే కరోనా తర్వాత ఆమె ప్రవర్తన విపరీతంగా మారింది. కరోనా లేదని తెలిసినా శానిటైజర్ వాడకం ఆపలేదు. కూరగాయలు, పండ్లు, సరుకులు.. ఏవి తీసుకువచ్చినా శానిటైజ్ చేయాల్సిందే. స్నానానికి వెళ్లిందంటే గంట పాటు బయటకు రాదు. ఏమాత్రం అశుభ్రంగా ఉన్నా ఏదైనా వైరస్ వస్తుందేమోనని విపరీతమైన భయం. గిన్నెలు పదేపదే కడుగుతూనే ఉంటుంది. హాల్లో వస్తువులు ఏ మాత్రం ఆర్డర్ తప్పినా తట్టుకోలేదు. పిల్లలపై అరిచేస్తుంది. ‘ఏంటమ్మా నీ చాదస్తం?’ అని పిల్లలంటున్నా పట్టించుకోదు. ఆయనది ఇంకో తీరు సునీత భర్త సుకుమార్ది మరో సమస్య. అతనికీ మధ్య ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఆఖరుకు గుడికి వెళ్లి విగ్రహాల్ని చూసినా లైంగికపరమైన ఆలోచనలు వస్తున్నాయి. తల్లి, చెల్లి గురించి కూడా అలాంటి ఆలోచనలు వస్తుండటంతో ఎవరికీ చెప్పలేక, చెప్పుకోలేక తనలో తానే మథన పడిపోతున్నాడు. తాను తప్పుడువాడిని కనుకే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని అపరాధభావంతో కుంగిపోతున్నాడు. ఒక్కోసారి బలవన్మరణ ఆలోచనలు అతని మనసును కమ్మేస్తున్నాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సునీత, సుకుమార్ ఇద్దరిదీ ఒకటే మానసిక సమస్య.. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ). అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం (అబ్సెషన్స్), ఒకే పని పదేపదే చేయడాన్ని నియంత్రించుకోలేకపోవడం (కంపల్సివ్) ఆ వ్యాధి లక్షణాలు. కొందరిలో అబ్సెషన్ లేదా కంపల్సివ్ లక్షణాలుంటే, మరికొందరిలో రెండూ ఉంటాయి. కానీ అది ఒక మానసిక సమస్య అనే విషయం చాలామందికి తెలియక తమలో తామే మథనపడుతూ ఉంటారు. ఈ రుగ్మత వల్ల సమయం విపరీతంగా వృథా అవుతుంది, జీవితం దుర్భరంగా మారుతుంది. ఓసీడీ లక్షణాలు ►అనుచిత, అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం. వీటితో డిస్టర్బింగ్గా ఉండడం. ►తమ గురించి తాము అతిగా ఆందోళన చెందడం, లేదా ఇతరుల గురించి వారికేదైనా ఆపద వస్తుందేమోనని భయపడడం. ►అన్నీ పరిశుభ్రంగా ఉండాలనుకోవడం. వస్తువులు మురికిగా ఉన్నాయనో, కల్తీ అయ్యాయనో ఆందోళనచెందడం లేదా వాటిని పదేపదే శుభ్రపరచుకోవడం ►తాళం వేశామా లేదా? అలారం పెట్టామా? గ్యాస్ ఆఫ్ చేశామా లేదా? అని పదేపదే చెక్ చేయడం. ►అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం, అందుకోసం పదేపదే సర్దడం. ►కొన్ని పనులను ప్రతిసారి నిర్దిష్టమైన పాటర్న్లో చేయడం లేదా పదేపదే చేయడం ►అవతలి వ్యక్తి తాను చెప్పింది వింటున్నారో లేదో అన్న అనుమానంతో చెప్పిన విషయాన్ని పదేపదే చెప్పడం ►ముట్టుకుంటే క్రిములు వస్తాయనే భయంతో ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఈ లక్షణాలు కనపడగానే మీకు మాత్రమే ఈ సమస్య వచ్చిందని బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు డేవిడ్ బెకమ్, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకోణ్, ప్రియాంక చోప్రా కూడా ఈ రుగ్మత నుంచి బయటపడిన వారే. జనాభాలో రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. మహిళల్లో, పురుషుల్లో దాదాపు సమానంగా ఉంటుంది. అయితే 10–25 శాతం మందికి తమకు సమస్య ఉందనే విషయమే తెలియదు. 15శాతం మంది బలవన్మరణానికి ప్రయత్నించవచ్చు. ఎందుకొస్తుంది? ఓసీడీకి జన్యుపరమైన, పర్యావరణ కారకాలు రెండూ ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఓసీడీ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదడులోని నాడీకణాల మధ్య సమాచార మార్పిడికి సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మీటర్ అవసరం. దాని పరిమాణం తగ్గితే మతిమరపు, ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బాల్యంలో భౌతిక, లైంగిక దాడికి గురైనప్పుడు, ప్రమాదం బారినపడ్డప్పుడు, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యలున్నప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. కరోనా వల్ల ఈ రుగ్మత బారినపడ్డ వారి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఏం చేయాలి? ఓసీడీ లక్షణాలు కనిపించగానే ఎవరికి వారు తమ ఆలోచనలను ఆపేసేందుకు, అణచివేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ అవి మరింత బలంగా వస్తాయి. అలాగే పదేపదే చేస్తున్న పనులను బలవంతంగా ఆపేసేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. ఆ ఆందోళన తగ్గేందుకు మైండ్ఫుల్నెస్, వ్యాయామం లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే వెంటనే సైకాలజిస్టును కలవండి. ఆయన డయాగ్నసిస్ ద్వారా మీ రుగ్మతను నిర్ధారిస్తారు. మీ భయాలు, ఆందోళనలు తగ్గించేందుకు సైకోథెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. మీ అవాంఛిత ఆలోచనలు, అసహజ ప్రవర్తనకు మూలమైన విశ్వాసాలను మార్చుకునేందుకు సహాయపడతారు. ఎక్స్పోజర్, రెస్పాన్స్ ప్రివెన్షన్ ద్వారా మీ అలవాట్లను మార్చేందుకు సహాయపడతారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్కు రిఫర్ చేస్తారు. మెదడులో తగ్గిన సెరటోనిన్ స్థాయిలను పెంచడానికి ఆయన మందులు సూచిస్తారు. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Toxic Positivity: ‘పాజిటివిటీ పిచ్చి’ పడితే అంతే సంగతులు! అతి సానుకూలతతో అనర్థాలే! మీలో ఈ లక్షణాలుంటే వెంటనే.. Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. -
గతి తప్పితే మతి తప్పినట్టే!
ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు రోజుల తరబడి ముభావంగా మారిపోయారనుకోండి.. అతడు లేదా ఆమె మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు లెక్క! అంతేకాదు.. మామూలు రోజుల్లో ఆడుతూ పాడుతూ చేసే పనులను కూడా అయిష్టంగానో, తప్పదన్న ట్టుగానో చేస్తున్నా, అవసరానికి మించి లేదా చాలా తక్కువగా నిద్రపోతున్నా, బకాసురుడి పెద్దన్నలా అతిగా తింటున్నా, 2,3 ముద్దలతోనే ఇక చాలు అనేస్తున్నా.. ఏవో మానసిక సమస్యలే ఉన్నట్లు భావించాలని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లక్షణాలే కాదు.. ఇంకా బోలెడన్ని ఉన్నాయి. మద్యం, ధూమపానాలను మొదలుపెట్టినా, ఎక్కువ చేసినా, రోజువారీ పనులు పూర్తి చేసుకోవడంలో విపరీతమైన బద్దకం ప్రదర్శిస్తున్నా, అయిష్టత చూపినా మానసిక సమస్యల బాధితులే. ఈ లక్షణాలన్నీ పెద్దగా హాని కరం కాకపోవచ్చు. కానీ ఇతరులను గాయపరచడం లేదా తనను తాను గాయపరచు కోవడం వంటివి తీవ్రమైన మానసిక సమస్యలకు సూచికగా భావించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికీ వినిపించని శబ్ధాలు తమకే వినిపిస్తున్నాయని ఎవరైనా చెబుతున్నా, లేదా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయని చెబుతున్నా, భ్రాంతికి గురవుతు న్నామన్నా అనుమానించాల్సిందేనని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైద్యులతో సంప్రదింపుల తర్వాతే నిర్ధారణ మనిషన్నాక కష్టసుఖాలు ఉండవా? వాటికి స్పందించకుండా ఎలా ఉండటం? అని అనుకుంటున్నారా? అది కూడా నిజమే. అందుకే కేవలం భౌతికపరమైన లక్షణాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తికి మానసిక సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రాలేం. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షలు జరపాల్సి ఉంటుంది. అయితే ఇవి, కనిపించే లక్షణాలకు ఇతర కార ణాలు ఏవీ లేవని నిర్ధారించుకునేందుకు మాత్ర మే చేస్తారు. ఇంకోలా చెప్పాలంటే మానసిక సమస్యలను నిర్ధారించేందుకు నిర్దిష్ట పరీక్షలేవీ లేవు. మానసిక వైద్యులతో సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే ఈ విషయంలో కచ్చితమైన నిర్ధారణకు రాగలమంటున్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ గౌరవ్ గుప్తా. అలాగే వారి మానసిక స్థితిని, ఆలోచనల తీరు తెన్నులను అర్థం చేసుకునేందుకు సైకలాజికల్ ఎవాల్యుయేషన్ (మానసిక స్థితిని అంచనా వేయడం) చేపడతామని, రకరకాల ప్రశ్నలు వేసి వాటి సమాధానాలను విశ్లేషించడం ద్వారా ఏ రకమైన చికిత్చ చేయవచ్చన్న నిర్ధారణకు వస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మనో సమస్యల నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రూపొందించిన ‘డయాగ్నస్టిక్ అండ్ స్టాటస్టికల్ మాన్యు వల్ ఆఫ్ మెంటల్ హెల్త్ (డీఎస్ఎం–5)ను సంబంధిత నిపుణులు ఉపయోగిస్తుంటారు. మంత్రాలతో అయ్యే పనికాదు.. మానసిక సమస్యల చికిత్సకు మంచి మాట ఎంత ఉపయోగ పడుతుందో, మందులూ అంతే బాగా పనికొస్తాయి. కాకపోతే ఏది ఎప్పుడు వాడాలన్న విచక్షణ ఉండాలి. మందులు, మాటలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలను సరి చేసుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. అయితే ఈ అంశాల విషయంలో చికిత్స ఎవరికి వారికే ప్రత్యేకం. ఒకరికి వాడిన పద్ధతి ఇంకొకరికి పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను కలిపి వాడటం మరింత ప్రభావశీలిగా పనిచేస్తుంది. మంత్రాలు, తంత్రాలతోనో, తాయత్తులు తావీదులతోనో అయ్యే పని అస్సలు కాదు. మాటలతో పరిష్కరించే సైకాలజిస్టులు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సైకోథెరపిస్టులు ముగ్గురూ మానసిక సమస్యల వైద్యులే. ముగ్గురూ మానసిక సమస్యల పరిష్కారం కోసమే పనిచేçస్తుంటారు. కానీ విధివిధానాలు పూర్తిగా వేర్వేరు.మందులు కాకుండా కేవలం మాటల ద్వారా, కొన్ని ప్రత్యేక పద్ధతుల సాయంతో మానసిక సమస్యలను పరిష్కరించేవారు సైకాలజిస్టులు. కౌన్సెలింగ్, హిప్నాసిస్, ఎన్ఎల్పీ వంటి వాటి ద్వారా చికిత్స అందిస్తారు. మందులు అస్సలు ఇవ్వరు. చట్టం ప్రకారం ఇవ్వకూడదు కూడా. థెరపీలతోనూ సత్ఫలితాలు కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ వంటి పద్ధతులను సైకోథెరపిస్టుల ఉపయోగిస్తుంటారు. మన ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చి, మన ప్రవర్తనను సరిచేసి సమస్యను పరిష్కరించడం కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ. ఇందులోనే కొంచెం భిన్నమైన పద్ధతులను ఉపయోగించే ఇంకో చికిత్సా పద్ధతి డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ. ఇక ఎక్స్పోజర్ థెరపీ విషయానికి వస్తే, ఇందులో సమస్యకు అసలు కారణాన్ని దశలవారీగా పరిచయం చేస్తూ పరిష్కారం వెతకడం. ఉదాహరణకు బల్లి అంటే భయముంటే, ముందుగా బల్లి బొమ్మను చూపి ఆ తరువాత రబ్బరు బల్లిని ముట్టు కోమని, ఆ తరువాత అసలు బల్లిని చూపడం చేస్తారు. ఈ క్రమంలో బల్లి అంటే ఉండే భయం తొలగిపోతుంది. డ్రగ్స్, మద్యం, ధూమపానంతోనూ సమస్యలు మన తల్లిదండ్రులు, ముందుతరాల నుంచి మనకు వచ్చే జన్యువులు, బాహ్య ప్రపంచంలో ప్రభావం చూపే అంశాలు మానసిక వ్యాధులకు ప్రధాన కారణం. జీవనశైలి అలవాట్లు వంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. డ్రగ్స్, మద్యం, పొగ తాగడం, ఇతర అలవాట్లు ఇందులో ముఖ్యమైనవి. కుటుంబంలో లేదా ఉద్యోగం చేస్తున్న చోట పరిస్థితులు, పరిణామాలపై ఎలా స్పందిస్తున్నారన్న దాన్నిబట్టి మానసిక ఒత్తిడిని అంచనా వేయొచ్చు. ఏదైనా సమస్య తలెత్తిన ప్రతిసారీ భయపడి వెనుకంజ వేయడం, లేక ఆవేశంగా స్పందించడం వంటివి ప్రతికూల అంశాలే. నేటి జీవన విధానంలో ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నేర్చుకోవాలి. ఎవరైనా ఎప్పటిలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుసుకుని మానసిక నిపుణుడి దగ్గరకు తీసుకువెళితే వారు తిరిగి సాధారణ జీవనం సాగించే అవకాశం ఉంటుంది. స్వసహాయం కూడా.. మానసిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉన్న ఇంకో పద్ధతి స్వసహాయం.అంటే మనకు మనమే సాయం చేసుకోవడం. సమస్యకు కారణాలను గుర్తించడం, పరిష్కారానికి ఉన్న మార్గాలను చిత్తశుద్ధితో అమలు చేయడం, అవసరమైనప్పుడు ఇతరుల సాయం తీసుకోవడం వంటివి ఈ స్వసహాయ పద్ధతిలో చేసే పనులు. మందులిచ్చేది సైకియాట్రిస్టులే మానసిక సమస్యలకు మందులు ఇవ్వగలిగిన వారు సైకియాట్రిస్టులు మాత్రమే. మనోవ్యాకులతను దూరం చేసేందుకు వీరు యాంటీ సైకాటిక్స్, ఆంగ్జియోలిటిక్ మందులను వాడతారు వీరు. ఆసక్తికరంగా ఇవేవీ సమస్యకు చికిత్స అందించవు. కాకపోతే లక్షణాలు మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి అంతే. మనకు ఆనందాన్ని కలుగజేసే సెరటోనిన్ వంటి రసాయనాలు శరీరానికి బాగా ఒంటబట్టేలా చేస్తాయి ఈ మందుల్లో కొన్ని. సకాలంలో స్పందించకపోతే సమస్య తీవ్రం చేస్తున్న పనులను ఇష్టపూర్వకంగా చేయకపోవడం, కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోలేకపోవడం, ఆలోచనలు భావోద్వేగంతో కూడుకున్నవి కావడం.. ఇలాంటివి ఎవరిలో ఉన్నా వారికి మానసిక నిపుణుల చేత చికిత్స చేయించాలి. ఇతరులతో పోల్చి చూసుకుని బాధపడడం, తమ జీవితం ఏమై పోతుందోననే అనవసర ఆందోళన, ఆదుర్దా పడుతున్న వారు మానసిక అనారోగ్యానికి గురైనట్టు లెక్క. ఇలాంటి వారు మానసిక ఒత్తిళ్ల బారిన పడుతున్నారని గుర్తించి, వాటి పరిష్కార మార్గాలు అన్వేషించకపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఏ వ్యక్తి అయినా ఒత్తిళ్లతో ఎక్కువ రోజులు ఉంటే మెదడులోని కెమికల్ కాంపోజిషన్ దెబ్బతిని, న్యూరో ట్రాన్స్మీటర్ల పనితీరుపై ప్రభావం చూపి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వారికి సకాలంలో చికిత్స అందించగలిగితే తేలిగ్గా బయటపడుతారు. -కంచర్ల యాదగిరిరెడ్డి -
Kanala hindola: ఆటలకు మానసిక బలం
ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడాలి. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగేవారు స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నావారు. కాని అందరూ అలా ఉండరు. ఆటల్లో రాణించాలంటే వారిని ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రత్యర్థి గురించి ఆందోళనలు ఉంటాయి. చిన్నపిల్లల దగ్గరి నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకూ ఈ ఒత్తిడి తప్పించుకోని వారు ఉండరు. మరి వీరికి సాయం? హిందోళ వంటి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ను కలవడమే. ‘మైండ్ లీడ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆటగాళ్ల ఒత్తిడిని తొలగిస్తూ వారికి అవసరమైన మానసిక బలం అందిస్తోంది హైదరాబాద్ వాసి హిందోళ. ‘స్పోర్ట్స్ సైకాలజీ అనేది ఒకటుంటుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. దాని అవసరం ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఈ రంగంలో ఈ సైకాలజీ అవసరం ఎంతో ఉంది’ అంటోంది హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న హిందోళ. అందుకు డియర్ కామ్రెడ్లోని ఒక సీన్ను ఉదాహరిస్తూ.. ‘లిల్లీ క్రికెటర్గా రాణిస్తున్న అమ్మాయి. రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. మంచి నైపుణ్యం ఉన్న అమ్మాయి సడెన్గా డిప్రెషన్ బారిన పడుతుంది. ఎవరికీ అర్థం కాదు. ఎవరూ అర్థం చేసుకోలేరు. క్రికెట్టే లోకంగా బతికిన ఆ అమ్మాయి మూడేళ్లపాటు మానసికంగా ఒంటరైపోతుంది. ఆసుపత్రి పాలైన ఆ అమ్మాయిని హీరో వచ్చి ఆమెను మానసిక వేదన నుంచి బయటికి తీసుకొస్తాడు. అందరి జీవితాల్లోనూ అలాంటి హీరోలు ఉండకపోవచ్చు. కానీ, మానసిక స్థైర్యం ఇవ్వగలిగేవాళ్లు ఉండాలి. ఇటీవల తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడేది. సడెన్గా అకాడమీకి రావడం మానేసింది. ఆ స్పోర్ట్స్ అకాడమీకి సైకాలజిస్ట్గా పనిచేస్తున్న నేను ఏమైందని తెలుసుకోవడానికి వారి తల్లిదండ్రులను సంప్రదించాను. తనను కష్టపెడుతున్న సమస్యలు ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. తోటి వారి నుంచి వస్తున్న కామెంట్స్ ఆమెను ఆ ఆట నుంచి తప్పుకునేలా చేశాయి. ఈ విషయంపై కొన్నిరోజుల పాటు చేసిన కౌన్సెలింగ్ ఆమెలో మార్పు తీసుకువచ్చింది. లేదంటే, ఇదే ప్రభావం ఆమె చదువుమీద ఆ తర్వాత తన కెరియర్ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అవి కోచ్ల ద్వారా కావచ్చు, తోటి క్రీడాకారుల ద్వారా కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, మరేవిధమైన మానసిక సంఘర్షణ అయినా కావచ్చు. ఇలాంటప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్టుల మద్దతు అవసరం అవుతుంది’ అని వివరించింది ఈ మైండ్లీడ్ ఛాంపియన్. అకాడమీలో సైకాలజిస్ట్గా.. తను చేస్తున్న వర్క్స్, ప్రణాళికల గురించి వివరిస్తూ – ‘బెంగళూరులోని పదుకొనే ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్’లో పనిచేస్తున్నాను. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్స్తోనూ మాట్లాడుతుంటాను. దీంతో ఏ స్థాయిలో స్పోర్ట్ సైకాలజీ అవసరం అనేది మరింత క్షుణ్ణంగా అర్ధమవుతుంది. చాలామంది క్రీడలలో మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ పక్కన పెట్టేస్తారు. మన దేశంలో అయితే చాలా వరకు దీనిని విస్మరిస్తుంటారు. అందుకే, క్రీడాకారులందరికీ మానసిక శిక్షణను అందుబాటులో ఉంచాలని ఆన్లైన్లో మైండ్లీడ్ ప్రోగ్రామ్ ద్వారా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను. బలమైన స్థితి క్రీడలకు మానసిక బలం అవసరమని విదేశీయులకు బాగా తెలుసు. అందుకే వారు ప్రతి పోటీలో స్పోర్ట్స్ సైకాలజిస్ట్ల గైడెన్స్ తప్పక తీసుకుంటారు. మన దేశంలో కూడా దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇంకా రకరకాల భావజాలాలు ఉన్నాయి. అమ్మాయిలను ఓ స్థాయి వరకే క్రీడలకు పరిమితం చేస్తుంటారు. కుటుంబం, బయట, అకాడమీ, స్కూల్, కాలేజీ.. ప్రతిచోటా వెనక్కి లాగడానికే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాను. దీని ద్వారా అథ్లెట్లు, కోచ్లు, బృందాలు, తల్లిదండ్రులకు, సహాయక సిబ్బందికి వినూత్నమైన విధానంలో మానసిక శిక్షణతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాను. రాహుల్ ద్రావిడ్తో... ఈ భిన్నమైన కోర్సును ఎంచుకున్నప్పుడు మా అమ్మ మాలతి, నాన్న సుధాకర్ల మద్దతుగా నిలిచారు. వారి వల్లే ఈ రంగంలో మరింతగా కృషి చేయగలుగుతున్నాను. ఈ మైండ్ లీడ్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ కాలేజీలలో వర్క్షాప్స్ నిర్వహించబోతున్నాను. గ్రామీణ స్థాయి క్రీడాకారులలోనూ మానసిక చైతన్యం నింపే దిశగా కృషి చేస్తున్నాను’ అని వివరించింది ఈ యువ స్పోర్ట్స్ సైకాలజిస్ట్. ఆటలు పరిచిన బాట ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటల్లో ఆసక్తి ఎక్కువ. బహుశా కేంద్రీయ విద్యాలయంలో చదవడం, అక్కడ అన్ని ఆటల్లో పోటీపడటం వల్ల క్రీడలు నా జీవితంలో కీలకమయ్యాయి. నా దృష్టి ఎక్కువగా బ్యాడ్మింటన్పై ఉండేది. అదే నన్ను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్కి పరిచయం చేసింది. ఈ రంగంలో కొత్త కొత్త వ్యక్తులను కలిశాను. గెలుపు కోసం ప్రయత్నించేవారితో కలిసి ఉండటం వల్ల ప్రతిరోజూ నన్ను నేను కొత్తగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇందులో ఉండే చేదు అనుభవాలు, పంచుకున్నవారి వేదనలు.. ఇవన్నీ నా కెరియర్ని డిసైడ్ చేసుకునేలా చేశాయి. అందుకే, స్కూల్ చదువు పూర్తవగానే స్పోర్ట్స్ సైకాలజీ దిశగా అడుగులు వేశాను. దీనికోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్ నుండి సైకాలజీ, జర్నలిజం అండ్ ఉమన్ స్టడీస్లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ చేయడానికి మణిపూర్ వెళ్లాను. ఇక్కడే క్రీడలలో మైండ్ఫుల్నెస్పై ప్రయోగాత్మక పరిశోధన చేశాను. భారతదేశంలోని అథ్లెట్ల కోసం సొంతంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాను.’ కె.హిందోళ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి -
సైకాలజీ మారాలి
డాక్టర్ దగ్గరికి వెళ్లొస్తే.. ‘ఏమైంది?’ అని అడుగుతారు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లొస్తే..‘ఏమైందో’.. అనుకుంటారు! మనవాళ్ల సైకాలజీ ఇంకా ఇలాగే ఉంది.పిచ్చివాళ్లుగా ముద్ర వేసేస్తారు. పశ్చిమ దేశాల్లో అలా ఉండదు.‘వెరీ కామన్’ అంటారు దీప్తి. మన దగ్గర కూడా..సైకాలజీ వైద్యాన్ని కామన్ చేసేందుకుఇండియా వచ్చేస్తున్నారు ఆమె. ఈ సందర్భంగా డాక్టర్ దీప్తిని ‘సాక్షి’ పలకరించింది. మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన మన సమాజంలో చాలా తక్కువ. తక్కువ అంటే అవగాహన కల్పించేవాళ్లు తక్కువ. అదే పశ్చిమ దేశాల్లో అరటి పండు ఒలిచిపెట్టినంత సులువుగా మెంటల్ హెల్త్ గురించి అర్ధమయ్యేలా చెప్పే ప్రొఫెసర్లు ఎక్కువగా కనిపిస్తారు. ఈమధ్యనైతే షార్ట్ ఫిల్మ్లు కూడా తీసి, ప్రజలకు చక్కగా మానసిక ఆరోగ్యం గురించి వివరిస్తున్నారు అక్కడి ప్రొఫెసర్లు. వారి తరహాలోనే హైదరాబాద్కు చెందిన సైకాలజిస్ట్ దీప్తి మనదేశంలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఒక వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో బిహేవియర్ థెరపిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ దీప్తి. మారుస్తాను చూడండి హైదరాబాద్లో పుట్టి పెరిగిన పోచంపల్లి దీప్తి జైన్ యూనివర్సిటీలో సైకాలజీ డిగ్రీ చేసి కొన్నాళ్లు చైల్డ్ సైకాలజిస్ట్గా ఆటిజమ్ పిల్లలకు వైద్యం చేశారు. పెళ్లితో అమెరికా వెళ్లి సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అయితే తన ప్రాక్టీస్ సమాజహితం కోసమే తప్ప డాలర్ల కోసం కాదన్నారామె. ‘‘భారతీయ సమాజం అనేక అపోహలతో నిండిపోయి ఉంది. సైకాలజీ, మెంటల్ హెల్త్ గురించి మాటల్లో చెప్పలేనంత శూన్యత ఆవరించి ఉంది. అమెరికాలో తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షలు, చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్లు గమనిస్తే సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. మన దగ్గర ఆ పని చేయడానికి సందేహిస్తారు. ఎందుకంటే సైకియాట్రిస్ట్ కాదు కదా కనీసం సైకాలజిస్ట్ ను కలిసినా సరే.. పిచ్చి అని ముద్ర వేసేస్తారు. ఆ క్షణం నుంచి బంధువులు, సన్నిహితులు కూడా ఆ పిల్లలను అనుమానంగా చూస్తారు. అయితే పిల్లల విషయంలో ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తోంది. కానీ ఈ మార్పు నగరాలకే పరిమితమై ఉంది. సైకాలజీ కౌన్సెలింగ్ సర్వీస్ను పట్టణాలకు కూడా తీసుకెళ్లగలిగితే గ్రామాలకూ అందుబాటులోకి వచ్చినట్లే. అందుకోసమే నా ప్రయత్నం’’ అన్నారు దీప్తి. కౌన్సెలింగ్, బిహేవియర్ అనాలిసిస్, కార్పోరేట్ ట్రైనింగ్, హాలిస్టిక్ సైకాలజీ ఆమె ప్రత్యేకాంశాలు. ఇంకా, దూషణ–నిర్లక్ష్యం, మానవ అక్రమ రవాణా, పిల్లల పెంపకం, కుటుంబ బంధాలు, పనిచేసే చోట హింస, సి.పి.ఆర్. ఫస్ట్ ఎయిడ్ వంటి వాటికీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అవన్నీ సినిమాల్లో ‘‘ఒకప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండి, అవి ఇద్దరి మధ్య దూరానికి కారణమవుతుండేవి. వాటిలో చాలా వరకు తరాల అంతరాలే కనిపించేవి. ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరగడానికి తరం అంత అంతరం అవసరం ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య కూడా పూడ్చలేనంత అగాధాలు ఏర్పడుతున్నాయి. మా దగ్గరకు వచ్చే ఆడవాళ్లు నుంచి వచ్చే తొలి మాట ‘నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు. నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు’ అనేదే ఉంటుంది. కొంతమంది మగవాళ్ల నుంచి కూడా ఇలాంటి ఆరోపణ వినిపిస్తుంటుంది. కానీ తక్కువ. ఈ తరహా భావజాలం మన సమాజంలోనే ఎక్కువ. ఇందుకు సినిమాలు కూడా కారణమే. భార్య లేదా భర్త తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడం కోసమే తమ ఇరవై నాలుగ్గంటల సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఉంటాయి. సాహిత్యం, సినిమాల్లోనే ఇలా ఉంటుంది. నిజ జీవితం ఇలా ఉండదు. ఉండాలన్నా సాధ్యం కాదని వాళ్లు సమాధాన పడేటట్లు చెప్పాల్సిన అవసరం మనదేశంలో చాలా ఎక్కువగా ఉంది’’ అన్నారు దీప్తి. లోపం తెలుసుకోవాలి ‘‘ఒకసారి అమెరికాకు వెళ్లిన అమ్మాయి తిరిగి వచ్చేటప్పుడు స్కర్టు, స్లీవ్లెస్లో విమానం దిగుతుందని ఊహిస్తుంటారు మన దగ్గర. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు నార్మల్ కుర్తా వేసుకున్నాను. నన్ను చూడగానే నా ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా ‘ఏమిటి అమెరికా నుంచి ఇలా వచ్చావు’ అని అడిగారు. పాశ్చాత్య దేశాల మీద మనకున్న పెద్ద అపోహల్లో ఇదొకటి. అక్కడ జనం ఆఫీసుకి, కాలేజ్కెళ్లేటప్పుడు నార్మల్గా ఉంటారు. పిక్నిక్లు, పార్టీల్లో మాత్రమ్లే స్కిన్ షో చేసే దుస్తులు ధరిస్తారు. మనం ఆ విభజన రేఖను కోల్పోతున్నాం. పైగా కాలేజ్కి ఆఫీస్కి కూడా పార్టీకి హాజరైనట్లు దుస్తులు ధరించడమే కాక తమ మేకోవర్కు కాంప్లిమెంట్లు రావాలని ఎదురు చూస్తుంటారు. దీనిని మానసిక వ్యాధిగా పరిగణించరు. కానీ, ఇదీ ఒక మానసిక జాడ్యమే. ఆత్మవిశ్వాసం లేని వాళ్లలోనే ఈ లక్షణం ఎక్కువ. ఇలాంటి లక్షణాన్ని గమనించిన వెంటనే వాళ్లకు చిన్నపాటి కౌన్సెలింగ్ ఇస్తే మామూలవుతారు. కొంత మేరకు పరిణతి ఉన్న వాళ్లకు కౌన్సెలింగ్ అవసరం కూడా ఉండదు. ఇది లోపం అని తెలిస్తే చాలు, కౌన్సెలింగ్ అవసరం లేకుండా తమకు తాముగా పరివర్తన చెందడానికి ప్రయత్నిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే ఇండియాకి వచ్చి మన సమాజం కోసం పని చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు దీప్తి. ‘‘పెళ్లికి ముందు ఇండియాలో ఎన్జీవోతో కలిసి ఆటిజమ్ పిల్లల కోసం పని చేశాను. పెద్దవాళ్ల కోసం పని చేయాల్సింది చాలా ఉందని యూఎస్కి వెళ్లిన తర్వాత తెలిసింది. అందుకే భారతీయ సమాజానికి పనిచేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను’’ అన్నారామె. మెంటల్ హెల్త్పై ఫిలిం ఫెస్టివల్ మానసిక ఆరోగ్యం థీమ్తో కేరళలో ప్రస్తుతం షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. నవంబర్ 8 మొదలైన ఈ చిత్ర ప్రదర్శన 27 వరకు ఉంటుంది. ఇండియా, యునైటెడ్ కింగ్డమ్లకు చెందిన విద్యావంతులు, నటీనటులు కలిసి రూపొందించిన చిత్రాలివి. మానసిక ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి విజువల్ మీడియా సహకారం తీసుకోవాలన్న ఆలోచనతో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లు యూకేలోని ‘ది మాంట్ఫోర్ట్ యూనివర్సిటీ’ ప్రొఫెసర్ రఘు రాఘవన్ తెలిపారు. మానసిక ఆరోగ్యం గురించిన అనేక సంగతులను ఈ లఘు చిత్రాల్లో చిత్రీకరించినట్లు తెలియచేశారాయన. చిత్రం నిడివి నాలుగు నిమిషాలకు మించకూడదనే నిబంధనను పాటిస్తూ 237 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అందులో 77 సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని కమిటీ ముందుకు వచ్చాయి. మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ హెడ్ డాక్టర్ మీనా అయ్యర్ ఆధ్వర్యంలోని జ్యూరీ సభ్యులు ఇరవై చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సినిమా వేరు.. జీవితం వేరు..
‘మేం చూసిన క్రైం సీరియళ్లు, సినిమాల్లో నేర సన్నివేశాల ప్రేరణతో దిశను చంపిన తరువాత ఆధారాలు మాయం చేయాలనుకున్నాం. అందుకే శవాన్ని చటాన్పల్లికి తీసుకెళ్లి పెట్రోల్తో కాల్చాం’ అని దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు విచారణలో పోలీసులకు తెలిపారు. ‘దంగల్ సినిమా చూశాక.. నా కూతురిని స్కేటింగ్లో జాయిన్ చేశాను. ఏడాది ప్రాక్టిస్ తరువాత 2018 ఔరంగాబాద్ నేషనల్స్లో గోల్డ్మెడల్ సాధించడం జీవితంలో మరువలేని అనుభూతిని ఇచ్చింది’ అని ఓ తండ్రి తన కూతురిని చూసి మురిసిపోయాడు. సినిమా, టీవీ సీరియళ్లు చాలా శక్తిమంతమైన మాధ్యమాలు. ఇవి రెండువైపులా పదును ఉన్న కత్తుల వంటివి. వీటి ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుంది. ప్రజల ఆలోచనలను ఇవి మార్చగలవు. ప్రభుత్వాలను పడగొట్టగలవు. మంచి వ్యక్తులను తయారుచేయగలవు. 2016లో దంగల్ సినిమా విడుదలయ్యాక మైదానాలకు వచ్చి ప్రాక్టీస్ చేసే యువతులు, బాలికల సంఖ్య పెరిగింది. అయితే మంచి కంటే చెడు త్వరగా వ్యాపించడం ఆందోళనకరంగా మారింది. సినిమాలు, యూట్యూబ్, ఇతర వెబ్ సిరీస్లు, క్రైం సీరియళ్లు ప్రజలను ముఖ్యంగా టీనేజర్లను కలుషితం చేస్తున్నాయి. మితిమీరిన హింస, విశృంఖలతతో పెడదోవ పట్టిస్తున్నాయి. మనిషిని మృగం కంటే భయానకంగా మారుస్తున్నాయి. 2014లో విడుదలైన దృశ్యం సినిమా హత్యోదంతాన్ని అనేక మంది హంతకులు వాడుకున్న తీరు విస్మయం గొలుపుతోంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో నమోదైన పలు హత్య కేసుల్లో నిందితులు శవాన్ని, సాక్ష్యాలను మాయం చేసిన తీరు ఆ సినిమాలో చూపినట్లే ఉండటం ఆందోళన కలిగించే అంశం. కానీ, సినిమాలో హీరో కాబట్టి దొరకలేదు. నిజ జీవితంలో మాత్రం వారంతా 24 గంటల్లో పోలీసులకు పట్టుబడటం గమనార్హం. నియంత్రణ కరువు యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ పరిధిలోకి రావు. అందుకే హత్యలు, అశ్లీల సన్నివేశాలతో నింపేసి ట్రైలర్లను ముందు యూట్యూబ్లో వదులుతున్నారు. సినిమా సెన్సార్కు వెళ్లినప్పు డు ఆ దృశ్యాలకు కత్తెరపడుతోంది. యూట్యూబ్లో వ్యూస్ కారణంగా వీరు పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నా యి. అందుకే నిర్మాతలు లాభాల కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ బోర్డు కిందకి రాకపోవడంతో వాటిలో ప్రసారమయ్యే సీరియళ్లు, సినిమాల్లో ఎలాంటి కత్తెర ఉండదు. ఇప్పుడు ప్రతీ స్మార్ట్ఫోన్లో యూట్యూబ్, వెబ్ చానళ్ల యాప్లు డీఫాల్ట్గా వచ్చేస్తున్నాయి. ఫోన్లో ఉచిత డేటా కూడా ఉంటుంది. అవే యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. వెబ్ చానళ్లలో ప్రసారమయ్యే పలు సీరిస్లలో అధికశాతం విదేశాలవే. అక్కడ వీటికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. సెన్సార్ సర్టిఫికెట్లు ఉంటాయి. కానీ, అందులో కంటెంట్ భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉండటమే ఇక్కడ సమస్య. పైగా నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో చిత్రీకరించి మరీ చూపిస్తున్నారు. వీటి వల్ల వివాహేతర సంబంధాలు, చిన్నారులపై లైంగిక దాడులు, అనైతిక బంధాలు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు వంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల జరిగిన దిశ హత్యాచారం, హయత్నగర్ ఉదంతాలే దీనికి నిదర్శనంగా మారాయంటే అతిశయోక్తి కాదు. – సాక్షి, హైదరాబాద్ చట్టాలు చేయాలి ప్రస్తుతం ఇంటర్నెట్లో ప్రసారమవుతున్న పలు వెబ్ సిరీస్లు మన దేశానికి సంబంధించినవి కావు. వారి దేశాల్లో అలాంటి సన్నివేశాలు తప్పు కాదు. సమస్యల్లా అవి మన దేశంలో ప్రసారం కావడమే. అందుకే, వీటిపై మరింత నిఘా పెరగాలి. పలు యాప్స్ కూడా టీనేజీ పిల్లలను పెడదోవపట్టిస్తున్నాయి. విపరీతంగా నేరాలు, అడల్ట్ కంటెంట్తో వారి బుర్రలను పాడుచేస్తున్నాయి. వీటికి కళ్లెం వేసేందుకు ‘ఒక ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థ’ఏర్పాటు కావాలి. ఆ బాధ్యత కేంద్రం చేతుల్లోనే ఉంది. -అనిల్ రాచమల్ల,ఎండ్ నౌ ఫౌండేషన్ త్వరలో నిర్మాత, రచయితలతో సమావేశం సినిమాలు టీనేజీ పిల్లలపై బాగా ప్రభావం చూపుతాయి. కొన్ని సినిమాల వల్ల వీరిపై చెడు ప్రభావం పడుతోంది. వీటి వల్ల సంభవించే నేరాల్లో అమాయక ఆడపిల్లలు బలవుతున్నారు. ఒక్కోసారి వారే నిందితులవుతున్నారు. అందుకే, వీటిపై బాధ్యత తీసుకోవాల్సిందే. సినిమాల్లో హింస, అశ్లీలత, ఇతర అభ్యంతర సన్నివేశాలకు పగ్గాలు వేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్మాత, రచయితలతో సమావేశం ఏర్పాటు చేసి చెడు సినిమాల వల్ల సమాజంపై పడుతున్న దుష్ప్రభావాన్ని వివరించాలనుకుంటున్నాం. – ఐజీ స్వాతి లక్రా పశ్చాత్తాపం కనబడదు సినిమాలు, ఇతర వీడియోలు చూసి నేరాలకు పాల్పడేవారిది చాలా భయంకర మనస్తత్వం. తమకు కావాల్సిన దానికోసం ఎంత కైనా తెగిస్తారు. పోలీసులకు చిక్కినందుకు బాధపడతారు తప్ప.. చేసిన తప్పుకు చింతించరు. వారి చర్యల వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడతార న్న చింత వారిలో అణువంతైనా ఉండదు. ఏది ఏమైనా.. వారు అనుకున్నదే చేస్తారు. అందుకే వీరి నేరాలకు కన్నవారు, కట్టుకున్నవారు బలవుతుంటారు. – వీరేందర్, సైకాలజిస్ట్ -
ఆడపిల్లకు జీవితమే ఒక పోరాటం
స్త్రీకి అయినా.. పురుషుడికి అయినా తన జీవితాన్ని తాను జీవించే స్వేచ్ఛ ఉన్న సమాజం కావాలి. ఒకరి మీద ఆధారపడని తత్వాన్ని ఉగ్గుపాలత తాగుతున్నఅమ్మాయిలు.. అలవోకగా నాలుక జారే అహంకారాన్ని ఇంకా వదిలించుకోలేని అబ్బాయిలు.. ఈ రెండు స్వభావాల మధ్య ఘర్షణ తలెత్తని సమ సమాజం అయి ఉండాలి. అది మాతృస్వామ్యమూ కాదు... పితృస్వామ్యమూ కాదు వ్యక్తిస్వామ్య సమాజం... వ్యక్తివాద సమాజం పురుడుపోసుకోవాలి.అందుకోసం ఒక పోరాటమే చేయాల్సి ఉంటుంది. అలాంటి పోరాటమే చేసిన కిరణ్మయి పరిచయమిది. ‘పితృస్వామ్య సమాజంలో మగవారి చేతుల్లో, చేతల్లో లైంగిక దోపిడీకి గురయ్యాను’ అంటూ బాధిత మహిళలు ‘మీ టూ’తో కలుస్తున్నా.. అతడిలో చలనం రాలేదు. అంతమంది మగవాళ్లు నిస్సిగ్గుగా లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే నేను మాత్రం వాళ్లకు తీసిపోవడం ఎందుకనుకున్నాడో ఏమో.. ‘మీ టూ’ వేధించేవాడినే అని నిరూపించుకున్నాడు. ఓ రోజు పెద్ద హోటల్లో ఈవెనింగ్ పార్టీ జరుగుతోంది.చురుగ్గా ఉన్న కిరణ్మయిని ఫాలో అయ్యాడు. పలకరించాడు, ప్రశంసించాడు. ఫోన్ నంబర్ అడిగాడు. ‘ఫోన్ నంబరు ఇవ్వలేను, కావాలంటే ఫేస్బుక్లో ఫాలో అవండి’ అన్నదామె సున్నితంగానే. తెల్లవారిందో లేదో... మొదలయ్యాయి ఫేస్బుక్లో పోస్ట్లు. ప్రతి పది– పదిహేను నిమిషాలకో పోస్ట్. ఆమె అచీవ్మెంట్స్కి ప్రశంసలు, మాట తీరుకు మెచ్చుకోళ్లు, ఆమెకి పొగడ్తలు. ఆమె రెస్పాండ్ కానందుకు నిష్ఠూరాలు, రెస్పాండ్ కాకపోవడం పొగరుకి నిదర్శనం అంటూ అభియోగాలు. కనీస మర్యాదలు తెలియకపోవడం, సంస్కారం లేని చర్యలు అంటూ ఆరోపణలు మొదలయ్యాయి. పనిలో పనిగా తన దేహదారుఢ్యం అంత గొప్ప ఇంత గొప్ప అంటూ కొలతలు, ఫొటోలు కూడా. తనతో జీవితం పంచుకుంటే ఒనగూరే సౌఖ్యాల వివరణ. అన్పార్లమెంటరీ కామెంట్లు. అసభ్యకరమైన దూషణలు. సాయంత్రానికి దాదాపుగా నలభై పోస్టులున్నాయి. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా ఉండి, సాయంత్రం వరకు ఫేస్బుక్లోకి లాగిన్ కాకపోవడంతో కిరణ్మయికి ఎదురైన చేదు అనుభవం ఇది. ఊహించని ట్రోలింగ్కి తల తిరిగిపోయిందామెకి. పట్టించుకోకుండా ఊరుకోవాలా? పట్టించుకుని పోరాడాలా? అనే మీమాంస. ఒక్క క్షణం ఆమెకి రామగుండం, ఫెర్టిలైజర్ సిటీలో తన బాల్యం, సాహసం, వ్యక్తిత్వ పరిరక్షణ వంటివన్నీ గుర్తుకు వచ్చాయి. డిగ్రీలో ట్యూషన్ చెప్పాను ‘‘మా నాన్న వీరేశ్ బాబు రామగుండంలో ఎరువుల కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అమ్మ దేవకి. నాకంటే ముందు ఇద్దరమ్మాయిలున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేదాన్ని. స్కూల్కి స్కేటింగ్ చేసుకుంటూ వెళ్లడం, పదహారేళ్లకే బైక్ నడపడం అలవాటయ్యాయి. సిక్త్స్ క్లాస్ నుంచి పుస్తకాలు చదవడం అలవాటైంది. స్కూల్డేస్లోనే అయాన్ రాండ్, మాక్సిమ్ గోర్కీలను చదివాను. రామగుండంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల వాళ్లూ ఉండేవాళ్లు. మినీ ఇండియాను తలపించేది. కేంద్రీయ విద్యాలయం చదువులో ‘అమ్మాయి– అబ్బాయి’ అనే నిబంధనలేవీ ఉండేవి కాదు. ఆ వాతావరణం నుంచి డిగ్రీకి ఏలూరు రావడం కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లనిపించింది. మనిషి మనిషిలా బతికితే చాలనే ఫిలాసఫీ నాది. దాంతో ఎక్కడికి వెళ్తే అక్కడికి తగినట్లు అలవాటు పడిపోతాను. అమ్మానాన్నలను ఇంకా డబ్బు అడగడం ఏమిటని డిగ్రీలో ఉన్నప్పటి నుంచి ట్యూషన్లు చెప్పాను. పీజీ సీట్ వచ్చినా చేరకుండా ఉద్యోగం కోసం హైదరాబాద్కొచ్చేశాను. ప్రతిదీ సాహసోపేతంగానే ఉండాలనుకుంటాను. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాను. పెరుగన్నమైనా సరే ఇష్టంగా తింటాను. ఇష్టం లేకపోతే ఏ పనినీ చేయను. రకరకాల సెక్టార్లలో పని తెలియడం కోసమే మూడు కంపెనీలు మారాను. ప్రతి పుట్టిన రోజు కూడా రిమార్కబుల్గానే ఉండాలనుకుంటాను. బైక్ రైడింగ్ కూడా అలాంటిదే. ఇదీ నా లైఫ్ స్టయిల్. సెటిల్ కావడం అంటే... చాలామంది అంటున్నట్లు... చాలా మంది అనే కాదు, మా అమ్మానాన్న కూడా అంటున్నట్లు జీవితంలో సెటిల్ కావడం అంటే ఏమిటో, దానికి నిర్వచనం ఏమిటో నాకు అర్థమే కాదు. సెటిల్ కావడం అనే భావనకు వెనుక చాలా జీవితం ఉంది. ఐబీఎమ్ ఉద్యోగానికి రిజైన్ చేసి హైదరాబాద్ నుంచి గౌహతికి పోనురాను టికెట్లు కొన్నాను. రెండు తేదీల మధ్య నెల రోజులున్నాయి. చేతిలో మ్యాప్ తో గౌహతిలో దిగిపోయాను. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిమ్, మిజోరాం రాష్ట్రాల్లో పర్యటించాను. 2015లో బైక్ రైడర్ ట్రావెలర్గా మారాను. 2016లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ (కెటుకె) బైక్ రైడ్ చేశాను. రాయల్ ఎన్ఫీల్డ్ మీద హైదరాబాద్లో బయలుదేరి బంగాళాఖాతం తీరం వెంబడి కన్యాకుమారి చేరాను. అక్కడి నుంచి అరేబియా సముద్రం మీదుగా కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కశ్మీర్ చేరాను. కెటూకె బైక్ రైడ్ చేసిన తొలి తెలుగమ్మాయిని. ఇండియన్ బైక్ రైడర్స్లో కర్దూంగ్ లా కి సోలో రైడ్ చేసిన సెకండ్ ఉమన్ని కూడా. మరో రెండు సౌత్ ఇండియన్ బైక్ టూర్లు చేశాను. హిందీ భాషలో కూడా రాష్ట్రానికీ రాష్ట్రానికీ ఉచ్చారణ తేడాలో ఉంటుంది. గ్రామీణులకు నా ఉచ్చారణ అర్థం కాక కొన్ని చోట్ల కొట్టబోయినంత పని చేశారు కూడా. ఇదంతా చెప్పడం ఎందుకంటే... ప్రతి గడ్డు పరిస్థితినీ సున్నితంగా అధిగమించడం, ఆ తర్వాత తలుచుకుని ఆనందించడం తెలుసు నాకు. ఇప్పుడు సొంత కంపెనీ నిర్వహణ చాకచక్యంగా చేసుకుంటున్నాను. అలాంటిది ఒక వ్యక్తి నా వెనుకే నడుస్తూ నా దృష్టిలో పడడానికి ప్రయత్నించి, తనను తాను పరిచయం చేసుకుని ‘మీ ట్రైనింగ్ సెషన్స్ చూశాను, చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి’ అని మాటలు కలిపాడు. మరుసటి రోజే ఫేస్బుక్లో అసభ్యకరమైన కాన్వర్జేషన్ మొదలు పెట్టాడు. అతడిని నివారించడానికి చేసిన ప్రయత్నంలో అతడిని ‘బ్లాక్’ చెయ్యడంతో పాటు పోలీస్ కంప్లయింట్ వరకు వెళ్లాల్సి వచ్చింది. పోరాటం మొదలైంది నన్ను ట్రోల్ చేసిన వ్యక్తిని నిరోధించడమే నా ఉద్దేశంగా మొదలైన పోరాటం ఆఖరుకి పోలీసు డిపార్టుమెంట్ మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద పోరాటంగా మారింది. మొదట షీ టీమ్స్కి ట్విటర్లో ట్వీట్, ఈ మెయిల్ కూడా పెట్టాను. ట్వీట్కి స్పందిస్తూ స్వయంగా పోలీస్ స్టేషన్కి రావాలన్నారు. అలాగే వెళ్లాను. వాళ్ల ట్వీట్కి స్పందించినట్లు నన్ను మరో ట్వీట్ చేయమన్నారు. అలాగే చేశాను. భరోసా టీమ్కి రిపోర్టు, సైబర్ క్రైమ్ స్టేషన్లో రిపోర్టు.. ఇలా తిరుగుతూనే ఉన్నాను. ఎవరికీ అడ్రస్ చేయకుండా కంప్లయింట్ రాసిమ్మన్నారు, అలాగే రాశాను. ఈ మెయిల్ కూడా చేశాను. రెండు రోజుల తర్వాత నేను కేసు ప్రోగ్రెస్ ఏమిటని విచారిస్తే... ‘ఏసీపీ సర్ ఎఫ్ఐఆర్ ఆపేశారు, మీకు తెలిసిన వ్యక్తే కాబట్టి పిలిచి మాట్లాడుకోండి అని చెప్పమన్నారు’.. ఇదీ నాకు ఇచ్చిన సమాధానం! నేను, అతడు మాట్లాడుకుని పరిష్కరించుకునే విషయమే అయితే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తానసలు? నా కేసు విచారణ కోసం మళ్లీ భరోసా టీమ్కి, పోలీస్ స్టేషన్లకి తిరగ్గా తిరగ్గా కంప్లయింట్ ఇచ్చిన పన్నెండు రోజులకు ఫైల్ చేశారు. అది కూడా తప్పులచిట్టా. నేను చెప్పని విషయాలేవేవో ఉన్నాయందులో. నా ఫేస్ని న్యూడ్ ఫొటోలతో మార్ఫింగ్ చేసి ఎఫ్బీలో పెట్టాడని ఉంది ఎఫ్ఐఆర్లో. నేను ఆ ఎఫ్ఐఆర్ని ఆమోదిస్తే కోర్టు విచారణలో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేను కాబట్టి నాది ఫేక్ కేసుగా పరిగణిస్తారు. అతడు నా మీద రివర్స్ కేసు పెట్టడానికి దారి తీసే పరిణామం అది. ఇలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించే కొద్దీ ఒక మగవాడిని కాపాడడానికే పోలీసు వ్యవస్థ పని చేస్తోందా, అబ్యూజ్కు గురైన మహిళ గోడు పట్టనే పట్టదా... అని కూడా అనిపించింది. దిద్దుబాటు అవసరం ఇంత ధైర్యం, మొండితనం ఉన్న నాకే ఇలా జరిగితే... ఒక మామూలమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? మనిషికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థ మగవాడికి మాత్రమే రక్షణ కవచంలా మారిపోతే ఎలా? మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే వరకు మొండితనం, పట్టుదల నాలో ఉండబట్టి అతడిని అరెస్ట్ చేసే వరకు వ్యవస్థ మీద పోరాటం చేయగలిగాను. ఏ దశలో అయినా నేను ఇంకా ఏం చేద్దాంలే అన్నట్లు నిరాశ చెంది ఉంటే ఈ రోజు అతడు సమాజంలో ధీరుడిలా తిరుగుతుండేవాడు. ఇది అతడి తప్పు అనడం కంటే మన వ్యవస్థలో ఉన్న లోపం అనే చెప్పాలి. మగవాళ్లు సెన్సిటైజ్ అయితే మీటూ అంటూ ఉద్యమించే పరిస్థితి ఆడవాళ్లకు ఉండదనుకుంటున్నాం. కానీ నిజానికి దిద్దుబాటు అవసరం ఉన్నది పాలన వ్యవస్థలకు, వాటిలో కరడు కట్టి ఉన్న సమన్వయలోపాలకే’’. ఆత్మగౌరవ పోరాటం ‘నన్ను ఎఫ్బీలో ట్రోలింగ్ చేసిన వ్యక్తి మీద దయచేసి చర్యలు తీసుకోండి’ అని గొంతు చించుకుని పోరాడాల్సి వచ్చింది. ప్రతి దశలోనూ ఒక్కో పోలీస్ అధికారి ‘మీకేం కావాలి’ అని అడిగేవాళ్లు. ‘నాకు న్యాయం కావాలి. నన్ను అవమానించిన, నా గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇదే నాక్కావలసింది’ అని చెప్పేదాన్ని. అయితే వాళ్లకు అది నచ్చేది కాదు. ఈ ధోరణి వల్ల నా కంప్లయింట్ కాపీతో సరిపోలేటట్లు ఎఫ్ఐఆర్ సరిదిద్దే వరకు ఒక పోరాటం చేయాల్సి వచ్చింది. నల్సార్ యూనివర్సిటీకెళ్లి ఒపీనియన్ తీసుకుని, నా అడ్వొకేట్ మిత్రుల సహాయంతో ప్రతి దశలోనూ ఒక యుద్ధం చేసినంత పనైంది. మొత్తానికి 24 రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు – కిరణ్మయి, బైక్ రైడర్, సైకాలజిస్ట్ – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
వృత్తి ధర్మం
‘‘నాకొక ఒర్జినల్ దెయ్యం కావాలి’’ అన్నాడు వ్యాస్. ‘‘కమెగైన్’’ అన్నాడు త్రిలోక్ మల్హోత్రా.‘‘ఎస్. ఒక నిజమైన దెయ్యాన్ని చూడాలని నా మనసు కోరుకుంటోంది’’ అన్నాడు వ్యాస్. ‘‘గాడ్.. నాకేమని వినిపించిందంటే.. మీరొక వర్జిన్ దెయ్యాన్ని కోరుకుంటున్నారని’’ అంటూ పెద్దగా నవ్వాడు మల్హోత్రా. ఆ నవ్వుతో అతడిపై వ్యాస్కి ఇంప్రెషన్ పోయింది. ‘‘మీ వల్ల కాదని నాకు అర్థమైంది. బై’’ అని విసుగ్గా పైకి లేచాడు. మల్హోత్రా ఖిన్నుడయ్యాడు. ‘నీ వల్ల కాదులే’ అని ఒక వ్యక్తి లేచి వెళ్లడానికి సిద్ధపడటం అతడి సర్వీసులో అదే మొదటిసారి. సర్వీసంటే పెద్దగా ఏం కాదు. దెయ్యాల్ని కళ్లారా చూపిస్తాడు. భక్తులు దైవ దర్శనానికి క్షణమైనా నోచుకోవడం కష్టం అవుతుందేమో కానీ, భయస్థులు మల్హోత్రా దగ్గరకు వచ్చాక దెయ్యాన్ని చూడకుండా వెళ్లరు. కొంతమందికి మాత్రం అక్కడి వరకూ వచ్చాక అనిపిస్తుంది.. దెయ్యంతో గేమ్స్ ఎందుకని. చివరి క్షణంలో వెనక్కి వెళ్లిపోతారు. త్రిలోక్ మల్హోత్రా భూత వైద్యుడు కాదు. భూత శాస్త్రజ్ఞుడు. దెయ్యాలు ఉన్నాయా లేవా అని పరిశోధనలు చేసే స్థాయిని అతడెప్పుడో దాటేశాడు. దెయ్యాల్ని పట్టి వాటిపై ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నాడు. ఏట్లో చేపల్ని పట్టినట్లుగా అతడు శ్మశానాల్లో దెయ్యాల్ని పట్టేస్తాడు. ఆ పట్టేయడం గమ్మత్తుగా ఉంటుంది. గంగా జలాన్ని నేరుగా సీసాలోకి పట్టినట్లు.. దెయ్యాల్ని సీసాల్లో బంధించేసి తన ల్యాబ్కి తెచ్చేసుకుంటాడు. ‘‘మీ వృత్తి ధర్మం మీద నాకు సందేహాలు మొదలయ్యాయి మిస్టర్ మల్హోత్రా. నేను ఒరిజినల్ దెయ్యం అన్న మాటను మీరు ఎప్పుడైతే వర్జిన్ దెయ్యం అని తీసుకున్నారో.. మీరొక నాన్సీరియస్ డెవిల్స్ సైంటిస్ట్ అని అర్థమైంది. వృత్తి మీద గౌరవం లేనివాళ్లే ఇలా.. ఆడవాళ్లతో పోలికలు తెచ్చి గంభీరమైన వాతావరణాన్ని తేలికపరుస్తారు’’ అన్నాడు వ్యాస్. ‘‘అంటే.. మీరు ఆడవాళ్లను తేలికపరుస్తున్నారా వ్యాస్’’ అన్నాడు మల్హోత్రా. ‘‘నేను తేలికపరచలేదు మల్హోత్రా. దెయ్యాల్లో ఆడ మగ పోలికలు తెచ్చి, మీరే ఆడవాళ్లను తేలికపరిచారు. ఎట్ ద సేమ్ టైమ్ దెయ్యాలను! ఎట్ ద సేమ్ టైమ్ మీ వృత్తిని!’’ అన్నాడు వ్యాస్. మళ్లీ ఒకసారి నవ్వబోతూ ఆగాడు మల్హోత్రా. ‘‘మీరు అనుమతిస్తే నేను మరొకసారి నవ్వాలనుకుంటున్నాను మిస్టర్ వ్యాస్’’ అన్నాడు. ఆ విరుపు వ్యాస్కి అర్థమైంది. ‘‘నవ్వండి. కానీ.. ఒర్జినల్ దెయ్యమా? వర్జిన్ దెయ్యమా అనడం.. ఇట్సే బ్యాడ్ జోక్’’ అన్నాడు వ్యాస్. ‘‘రైట్. మిస్టర్ వ్యాస్. చెప్పండి. మీ మనసు ఏం కోరుకుంటోంది. దెయ్యాన్ని చూడాలనా? దెయ్యాలను చూడాలనా?’’.. అడిగాడు మల్హోత్రా. ‘‘ఎలాగైనా పర్లేదు మల్హోత్రా. కానీ మీరు సమాజాన్ని ఉద్ధరించే సైకాలజిస్టులానో, పత్రికల్లో దెయ్యం కథలు రాస్తుండే అతి తెలివి రచయితల్లానో దెయ్యాలను చూపించడాన్ని నేను ఇష్టపడను. ‘దెయ్యాలు ఎక్కడో ఉండవు.. మనసులోనే ఉంటాయి’ అంటాడు సైకాలజిస్ట్. ‘దెయ్యాలు లేవని చెప్పడానికే దెయ్యాలు ఉన్నాయని రాస్తున్నాను’ అంటాడు రచయిత. ఈ ట్రాష్ అంతా నాకు అక్కర్లేదు. అందుకే ఒర్జినల్ దెయ్యం కావాలని మిమ్మల్ని అడిగాను. ఒర్జినల్ అంటే.. అది నా కళ్లకు కనిపించాలి. అది నా మీదకు రావాలి. అది చూసి నేను భయంతో చచ్చినంత పనవ్వాలి. అది నన్ను తరుముకుంటూ ఉంటే నేను పెద్దగా రంకెలు పెడుతూ పారిపోతుండాలి. అలాంటి దెయ్యం! తెల్లటి పొగను చూపించి, అదే దెయ్యం అంటే నమ్మను. సమీపంలో ఏదో వింత వాసన వస్తోంది.. అదే దెయ్యం అంటే నమ్మను. కిర్రుమని చప్పుడవుతుంటే అదే దెయ్యం అని నమ్మను. కిటికీలు టపటప కొట్టుకుంటుంటే అదే దెయ్యం అని నమ్మను. మీరు నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి ఇదే దెయ్యం అని చూపిస్తే, అప్పుడు నేను నమ్ముతాను’’ అన్నాడు వ్యాస్. మౌనంగా విని, మౌనంగా ఉండిపోయాడు మల్హోత్రా. ‘‘ఏమిటాలోచిస్తున్నారు మల్హోత్రా. మీరైనా నాకొక స్పష్టమైన దెయ్యం రూపాన్ని చూపిస్తారనే అశిస్తున్నాను’’ అన్నాడు వ్యాస్. ‘‘తప్పకుండా’’ అన్నాడు మల్హోత్రా. అని, ‘‘ఒకటి చెప్పండి మీరు బయట ఉండి, లోపలి దెయ్యాల్ని చూడాలనుకుంటున్నారా? లోపల ఉండి బయటి దెయ్యాల్ని చూడాలనుకుంటున్నారా?’’ అడిగాడు. ‘‘అర్థం కాలేదు’’ అన్నాడు వ్యాస్. ‘‘బయట ఉండి లోపలి దెయ్యాల్ని చూడడం అంటే.. నా ల్యాబ్కి వెళ్లి, అక్కడి సీసాల్లోని దెయ్యాల్ని చూడ్డం. లోపల ఉండి బయటి దెయ్యాలను చూడ్డం అంటే.. శ్మశానానికి వెళ్లిపోయి అక్కడ తిరుగుతుండే దెయ్యాల్ని చూడ్డం’’.. చెప్పాడు మల్హోత్రా. వ్యాస్కి కొంతే అర్థమైంది. ‘‘ల్యాబ్కి వెళ్లడం వరకు ఓకే. శ్మశానానికి వెళ్లినప్పుడు అక్కడి దెయ్యాలు, మనమూ అంతా బయటే ఉంటాం కదా. మరి లోపల ఉండి బయటి దెయ్యాల్ని చూడ్డం ఏమిటి?’’ అని అడిగాడు. నల్లటి దారం ఒకటి చూపించి, ‘‘ఇది చేతికి కట్టుకుంటే మనం లోపల ఉన్నట్లే. మనం బోనులో తిరుగుతూ, సఫారీలో క్రూర జంతువుల్ని చూస్తూ వెళ్తాం కదా. అలా’’ అన్నాడు మల్హోత్రా. ‘‘అయితే శ్మశానానికే వెళ్దాం’’ అన్నాడు వ్యాస్. ఆ రాత్రి మల్హోత్రా కంటే ముందే శ్మశానానికి చేరుకున్నాడు వ్యాస్. అయితే మల్హోత్రా ఇచ్చిన నల్లదారం కట్టుకోవడం మర్చిపోయాడతడు. శ్మశానంలోకి వచ్చాక అక్కడి ఎగుడు దిగుడు దిబ్బల్ని, అక్కడక్కడా ఉన్న అస్థికల్ని, ఆ మసక వెలుతురులో వ్యాపిస్తున్న పొగలనీ చూశాక.. ఎందుకో తను చేస్తున్నది పిచ్చి పని అనిపించిందతడికి. మల్హోత్ర ఎంతకూ రాకపోతుంటే, మంచిదే అయిందని అక్కడి నుంచి వెనుతిరిగాడు. నాలుగడుగులు వేశాడో లేదో.. మల్హోత్రా వస్తూ కనిపించాడు! వస్తూ కనిపించాడో, Ðð ళ్తూ కనిపించాడో వెంటనే అర్థం కాలేదు వ్యాస్కి. ‘‘నీకంటే ముందే వచ్చాను వ్యాస్.. నా సీసాలోకి ఏ దెయ్యమైనా దొరుకుతుందేమోనని. ఒక్కటీ కనిపించలేదు. అలాగని నువ్వేం నిరాశపడకు. నువ్వు కోరుకుంటున్నట్లు నీ చెయ్యి పట్టుకుని నీకు దెయ్యాన్ని చూపించే పూచీ నాది’’ అన్నాడు మల్హోత్రా. ఇద్దరూ కలసి నడుస్తున్నారు. ముందు వ్యాస్ నడుస్తున్నాడు. వెనుక మల్హోత్రా నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాక వ్యాస్కి ఎవరో తన చెయ్యి పట్టుకున్నట్లనిపించి వెనక్కి తిరిగి చూశాడు. మల్హోత్రానే. కానీ మల్హోత్రా చెయ్యి మాత్రమే వ్యాస్ చేతిని పట్టుకుని ఉంది. మల్హోత్రా ఎక్కడో.. దూరంగా.. చాలా దూరంగా.. తనవైపే నవ్వుతూ చూస్తున్నాడు. గుండె గుభేల్మంది వ్యాస్కి. దెయ్యాన్ని చూడాలను కోడానికి ధైర్యం అక్కర్లేదు. దెయ్యాన్ని చూడ్డానికి మాత్రం ధైర్యం కావాలని ఆ తర్వాతనైనా అతడు అనుకున్నాడేమో తెలీదు. - మాధవ్ శింగరాజు -
వినాలి.. మాట్లాడాలి
‘ఏరా! పెద్దవాడిని అయిపోయాననుకుంటున్నావా’ అంటూ టీనేజ్లోకి అడుగుపెట్టిన పిల్లలతో తల్లిదండ్రులు తరచు అంటుంటారు. ‘లాలయేత్ పంచవర్షాణి, దశవర్షాణి తాడయేత్, ప్రాప్త్యేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్’ అని శాస్త్రం చెబుతోంది. పిల్లలకు పది సంవత్సరాలు వచ్చేవరకు వారిని మృదువుగా దండించవచ్చు. పదహారేళ్ల వయసులోకి వచ్చిన పిల్లలను స్నేహితులుగానే చూడాలి అని ఈ శ్లోకం చెబుతోంది. టీనేజ్లోకి వచ్చారంటే వారిక పిల్లలు కాదు, కొద్దిగా ఎదిగారని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు మెళకువగా పిల్లలతో ఆచితూచి మాట్లాడాలి. ఈ మాట.. ఏళ్లుగా సైకాలజిస్టులు చెబుతున్నదే. ఈ వయసులో హార్మోన్లలో మార్పులు రావడం కారణంగా, వారి ప్రవర్తనలో మార్పు వస్తుందనే విషయం తల్లిదండ్రులకు అనుభవమే కనుక, పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వేరే దారి లేదు. వారిని మన మార్గంలోకి తెచ్చుకోవడానికైతే.. మొదట వారి ధ్యాసను మనం చెబుతున్న మాట వైపు మళ్లించుకుని, మనం చెప్పదలచింది నొప్పించకుండా చెప్పాలి. వారు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటున్నామన్న భావన కూడా వారికి కలగాలి. కొంతమందికి వయసొచ్చిన పిల్లలతో మాట్లాడేందుకు టాపిక్లే దొరకవు! ఎన్ని లేవు చెప్పండి? లేటెస్ట్గా వచ్చిన సినిమాలు, సినిమాలో బాగా నటించిన హీరో, పాటకి అందంగా డ్యాన్స్ చేసిన పద్ధతి.. ఇటువంటి విషయాలను ఎంతో ఆశ్చర్యం గొలుపుతున్నట్లుగా కనుబొమ్మలు ఎగరేస్తూ వారితో షేర్ చేసుకోవచ్చు. సినిమాలు అని ప్రత్యేకంగా అనడం దేనికంటే ఆ వయసులో వినడానికైనా, మాట్లాడడానికైనా వారికి ఆసక్తి కలిగించేవి సినిమాలు, క్రీడలు.. వంటివే కదా. ఇలా మాట్లాడుతున్నప్పుడు పిల్లలు రకరకాల ప్రశ్నలు వేస్తారు. కొన్నిసార్లు సహనం నశించిపోయేవరకు విసిగిస్తూనే ఉంటారు. అటువంటప్పుడే తల్లిదండ్రులు సహనాన్ని, చిరునవ్వును కోల్పోకూడదు అంటున్నారు పేరెంటింగ్ నిపుణులు. ఒక్కోసారి పిల్లలు చులకనగా మాట్లాడి, పెద్దవారి మనసులను గాయపరుస్తారు. అంతమాత్రాన పెద్దలు తిరిగివారిని గాయపరిచే మాట అనకూడదు. వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎక్కువ ఆశించి, వారి మీద ఒత్తిడి పెట్టడమే పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించడానికి కారణం అవుతోంది. చదువొక్కటే జీవితం కాదని పెద్దలు అర్థం చేసుకుని, పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి, ఆ అంశాలకు చెందిన ఉదాహరణలు చెబుతూ, వారి మీద ప్రేమ చూపుతూ, వారికి కొత్త కొత్త విషయాలు చెబుతూ, వారిని మంచివారుగా తీర్చిదిద్దవచ్చునని కూడా అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. -
దేవ జాలం
మనుషులకు మంచి విషయాలు చెప్పడానికి పట్టాభిరామ్ ఇంద్రజాలాన్ని వాడుతారు అలా సమాజంలో అనుబంధాలను, ఆప్యాయతలను, అనురాగాలను పెంపొందించే కృషి చేశారు. మంచి చెప్పడానికి ఇంద్రజాలాన్ని వాడినప్పుడు దైవత్వాన్ని అనుభూతి చెందడానికి దేవజాలమే కరెక్ట్ మేజిక్ ఏమో కదా! మెజీషియన్, సైకాలజిస్ట్ డా.బి.వి.పట్టాభిరామ్ క్లినిక్కి వెళ్లినప్పుడు ఎదురుగా బోర్డుమీద ‘యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ’ (నీ తలరాతకి నువ్వే సృష్టికర్తవు) అనే అక్షరాలు ఆకట్టుకున్నాయి. ఈ మధ్య అతి చిన్న చిన్న సమస్యలే పెద్దవి అయిపోయాయి. మనుషులు మనస్తత్వాలు మరీ సున్నితమైపోయాయంటూ సబ్జెక్ట్లోకి వెళ్లిపోయారు పట్టాభిరామ్. సైకాలజీలో ఇటీవల రెండో పీహెచ్డీ వచ్చిందని ఆనందంగా వివరించిన ఆయన ‘నా వృత్తే నాకు దైవం’ అంటూ చెప్పుకొచ్చారు... దేవుడి గొప్పతనం మీకు మొదటిసారిగా ఎప్పుడు అర్థమైంది? (చిన్నగా నవ్వుతూ) నాకు దేవుడి గొప్పతనం కంటే ముందు మనిషి గొప్పతనం అర్థమైంది. వివరంగా చెబుతారా? నా చిన్నప్పుడు ఓసారి మా ఇంట్లో అంతా జాతకం చూపించుకుంటూ నా జాతకమూ చూపించారు. జ్యోతిష్యుడు నా జాతకం చూసి ‘వీడికి అక్షరమ్ముక్క అబ్బదు. ఈ కుటుంబంలో వీడు మహాదరిద్రుడు అవుతాడు. పైగా 16 ఏళ్ళకు మించి బతకడు’ అని చెప్పాడు. భయపడిపోయాను. మా అమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. ఆవిడ ఆ మాటను కొట్టి పడేస్తూ ‘ఒరే... మా నాన్న 80 ఏళ్లు బతికాడు. నువ్వూ అన్నేళ్లు బతుకుతావు. నీకు ఆయన గుణాలే వచ్చాయి. దిగులు పడకు’ అంది. ఇప్పుడు నా వయసు 66 ఏళ్లు. అమ్మ ఆ రోజు నన్ను అలా ‘మోటివేట్’ చేయకపోతే ఆ దిగులు నాలో అలాగే పడిపోయేదేమో. మనిషి గొప్పతనం మనిషి చేయగల మేజిక్ అప్పుడే నాకు అర్థమైంది. మరి దేవుడెప్పుడు తెలిశాడు? నేను టెన్త్ పాసయ్యాక మా అమ్మ తిరుపతి తీసుకెళ్లింది. గుండు చేయించుకోమంది. నేను చేయించుకోనన్నాను. ‘తప్పు, నేను దేవుడికి మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవాల్సిందే. మొక్కు తీర్చుకోకపోతే దేవుడు శిక్షిస్తాడు’ అంది. నిజమే అనుకొని ‘టోపీ కొనిస్తే గుండు చేయించుకుంటా’న ని చెప్పాను. గుండు చేయించుకున్నాను. టోపీ పెట్టుకున్నాను. తిరిగి వస్తుండగా మా నాన్న నన్నే చూస్తూ ‘టోపీ ఎందుకు పెట్టుకున్నావురా.’ అన్నాడు. ‘అంతా నన్నే చూస్తున్నారు సిగ్గుగా ఉంది’ అన్నాను. ‘అంటే నీ మీద నీకు విశ్వాసం లేదన్నమాట. అమ్మ చెప్పింది కదా అని చేయించుకున్నావు. పైగా దేవుడు శిక్షిస్తాడు అంది కదా. శిక్షించేవాడు దేవుడెలా అవుతాడురా. గుండు చేయించుకోవడం అంటే ఆకర్షణ కారణంగా వచ్చిన అహాన్ని దూరం చేసుకున్నానని చెప్పడానికి సూచిక. అదేదో తప్పు అయినట్టు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు. ఇదెందుకు సిగ్గుపడే పని అయింది చెప్పు’ అన్నాడు. వాస్తవం అనిపించింది. టోపీ తీసి రోడ్డు మీదకు విసిరేశాను. మూఢంగా నమ్మడం అప్పటి నుంచే మానేశాను. లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టాను. అమ్మా నాన్నలు బిడ్డకు జన్మనివ్వడమే కాదు మంచి చెడులను చెప్పి జీవితంలో ఎదిగేందుకు చేయూతనిచ్చే దేవతలు. అమ్మనాన్నలను మించిన దేవతలు లేరు నాకు. ఆ తర్వాత నన్ను నిలబెట్టిన ఈ వృత్తి నాకు దైవం కన్నా ఎక్కువ. ఇంటి కన్నా గుడి పదిలం అన్నారు పెద్దలు. మీరు చెబుతున్నది చూస్తే గుడి కన్నా ఇల్లు పదిలం అన్నట్టుంది? మా అమ్మనాన్నలకు 15 మంది సంతానం. 11 మంది అన్నదమ్ములం. నలుగురు అక్కచెల్లెళ్లు. వాళ్లు అంతమందిని ఎలా పెంచారో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. మా నాన్న తిట్టడం, కొట్టడం చూళ్లేదు నేను. కొన్ని నియమాలు మాత్రం కఠినంగా ఉండేవి. అందరం ఒకేసారి కూర్చొని భోజనం చేయాలి, రాత్రి 9కి అందరూ పడుకోవాలి. కలిసి పంచుకొని తినడంలో ఆనందం, కంటి నిండా నిద్రపోవడంలో ఆరోగ్యం ఆయన నుంచి మేం నేర్చుకున్నాం. మా ఇంట్లో అందరూ కళాకారులే. నాకు మేజిక్ కళ అబ్బినట్టే అందరికీ ఒక్కో కళలో ప్రవేశం, ప్రావీణ్యం ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి రెండవ శనివారం అందరం ఒకచోట కలుస్తుంటాం. ఆ రోజు మాకు పెద్ద పండగ. ఏ ఒక్కరు మిస్ అయినా వాళ్లేదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతుంటారు. ఈ రోజుల్లో ఇంట్లో ఉండేది ఇద్దరో, ముగ్గురో.. అయినా ఒకరినొకరు మాట్లాడుకోరు. ఫోన్లలో చాట్ చేస్తూనో, టీవీ చూస్తోనో గడిపేస్తారు. మాట్లాడుకోవాలి, ఏది మాట్లాడకూడదో తెలుసుకొని ఆచరించాలి, కలిసి భోజనం చేయాలి, కుటుంబంలో అందరి మధ్య స్పర్శ ఉండాలి, ప్రశంస ఉండాలి, నవ్వు ఉండాలి.. ఇవి లేకనే బయటివారితో తమ ఆనందాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లను వదిలి గుళ్లూ, గోపురాలలో కాలక్షేపం చేస్తున్నారు. మిమ్నల్ని మీరు హిప్నటైజ్ చేసుకుంటారా? ప్రతి రోజూ హిçప్నటైజ్ చేసుకుంటాను. మనల్ని మనం తెలుసుకోవడం అవసరం. పాజిటివ్ ఆలోచనలు ఎంత పెంచుకుంటే అంత ప్రశాంతమైన జీవితం మనదవుతుంది. చెడు నన్ను పట్టుకుందా దాన్ని శుభ్రం చేసుకుంటాను. మంచి ఎక్కడైనా ఉందా అది తీసుకుంటాను. ఈ విధానంలో గొప్ప ప్రశాంతత చేకూరుతుంది. మీ దగ్గరకు వచ్చే కేసులలో ఈ కేసు దేవుడే డీల్ చేయాలని చేతులెత్తేసిన సందర్భం? అలాంటిదెప్పుడూ లేదు. పరిష్కారం చేయలేని కేసులంటూ ఏమీ ఉండవు. దాన్ని డీల్ చేసే విధానాలే వేరు వేరుగా ఉంటాయి. మనం చెప్పే విధానంలో ఆ క్లారిటీ ఉండాలి. నాకీ పని చేయడం రాదు, నేను ఇలాగే ఉంటాను అంటుంటారు కొందరు. అదొట్టి మూర్ఖత్వం. ముందు ఆచరణలో పెడితే తర్వాత అదే అలవాటవుతుంది. దేవుడి మహిమ వల్లే ఈ కేసు పరిష్కారం అయిందనుకున్న సందర్భం ఉందా? మీరు వచ్చే ముందే ఈ (‘సత్య నాదెళ్ల’ పుస్తకం చూపిస్తూ) పుస్తకం చదువుతున్నాను. ఈయనకి ఐఐటీలో సీటు రాలేదు. బిట్స్ పిలానీలో సీటు రాలేదు. డొనేషన్ కట్టి చదివాడు. కంప్యూటర్ ఇంజనీర్ కావాలన్నది ఆశయం. అతను ఇందులో చెప్పుకున్నాడు.. ‘నా గదిలో మా అమ్మ లక్ష్మీదేవి బొమ్మ పెట్టేది.. మా నాన్న కార్ల్మార్క్స్ బొమ్మ పెట్టేవాడు... నేను క్రికెటర్ జయసింహ ఫొటో పెట్టుకునేవాణ్ణి’ అని. ఆయన తన కలను నెరవేర్చుకోవడం కోసం కృషి చేశాడు. ఇప్పుడు మహామహా మేధావులు సైతం ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. ‘యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ’. నీ నుదుటి రాత దేవుడు రాయడు. పెన్ను, పేపర్ నీ చేతిలోనే ఉంది. నువ్వేది రాసుకుంటే అదే నీ జీవితం. నువ్వు కృషి చేయి. నీకు నేచర్ సపోర్ట్ చేస్తుంది. అంతేకానీ, దేవుడి మహిమలు అంటూ ఏమీ లేవు. మేజిక్ అంటే మాయ కదా! డబ్బు మాయ, పదవి మాయ, మోహం మాయ.. మనిషి ఏ మాయ నుంచి జాగ్రత్తగా ఉండాలి. డబ్బు గొప్పది. దీని కోసమేగా అందరం పనిచేసేది. మనిషి తనకు సరిపడా ఉన్నా ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. తరతరాలకు. ఆ డబ్బే అతన్ని సుఖపెడుతుంది. ఆ డబ్బే దుఃఖపెడుతుంది. డబ్బు మాయను అర్థం చేసుకొని ఆనందంగా బతికితే చాలు. మీ భార్యను మాయ చేసిన సందర్భం ఉందా? (నవ్వుతూ) మాయ అని చెప్పలేను. కానీ, వాస్తవంగా ఆలోచించినది ఆచరణలో పెట్టడానికి పెళ్లయ్యాక నాకు ఐదేళ్లు పట్టింది. మా ఆవిడకు గుళ్లకు వెళ్లడం, సంప్రదాయాలను పాటించడం చాలా ఇష్టం. అవి నన్నూ పాటించమంటే కష్టంగా ఉండేది. నా వృత్తికవి అడ్డంకి కూడా. ఇలా చెప్పి ఆమె మనసును నొప్పించకూడదు. అందుకని ఓ ప్లాన్ వేశాను. ‘ఏడాదిలో రెండుసార్లు అంటే, జనవరి 1న షిరిడీ వెళ్దాం. పెళ్లిరోజున తిరుపతిలో ఉందాం’ ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లాన్ ఇంకో పదేళ్లయినా అలాగే కంటిన్యూ అవుతుంది. సంప్రదాయాలను మూఢంగా కాకుండా లాజికల్గా ఆలోచించి చేయమని చెబుతుంటాను. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందండీ అంటుంది. అలా అయితే బిల్గేట్స్ ఇంటి ముందు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి చెప్పు అంటాను నవ్వేస్తూ.. ఆలోచనల్లో పడుతుంది. ముక్కోటి దేవతలు ఉండగా జనాలు మీతో మొరపెట్టుకోవడానికి వస్తారెందుకు? ఇక్కడే అర్థం అవుతుందిగా. దేవతలు సమస్యలు సాల్వ్ చేయరని. సైకాలజిస్ట్లు అంటే ఎవరు..? ఒకప్పటి తాతయ్యలు, నానమ్మలు. అప్పట్లో వాళ్లు అన్పెయిడ్ కౌన్సిలర్లు. ఇప్పుడు ఇళ్లలో వాళ్లు లేరు. అందుకే మా అవసరం వచ్చింది. మంచి, చెడులు చెప్పి బాంధవ్యాలు చక్కగా ఉండేలా చేసే పెద్దదిక్కులను ఆశ్రమాలకు పంపిస్తున్నాం. కనపడని దేవతలకు మొక్కుకుంటే ఎవరు వింటారు. ఆ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు. దేవుడి సైకాలజీ ఏమిటి? ప్రశాంతంగా ఉండటమే దేవుడి సైకాలజీ అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండే స్థలంలోనే కదా దేవుడు ఉంటాడు. మరి ఆ దేవుడిని పూజించే మనం ప్రశాంతంగా ఉంటున్నామా? చాలా మంది ఫ్యామిలీ ఇష్యూస్తో మా వద్దకు వస్తుంటారు. చెప్పిన మాట పిల్లలు వినడం లేదనో, భార్యాభర్తల బంధం సరిగా లేదనో.. అన్నీ కంప్లైంట్సే. చాలా చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద మనస్పర్ధలుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. అశాంతికి విరుగుడు ప్రశాంతత అని అర్థం చేసుకోవాలి. దేవుడికి కష్టం చెప్పుకోవచ్చా? దేవుడికి కష్టం చెప్పుకుంటారు బానే ఉంది. వింటున్నాడనే నమ్మకం ఉందా. అలా అని నమ్ముతున్నారా? మరి మా దగ్గరకు వచ్చే జనం రోజు రోజుకూ పెరుగుతున్నారు ఎందుకు? అందుకే, మనం మనుషులతోనే మాట్లాడాలి. మనవాళ్లతో మనం మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడాలి. మాట కత్తికన్నా పదునైనది. నువ్వు మంచిగా మాట్లాడకపోయినా ఫర్వాలేదు. ఎదుటివారిని నొప్పించేవిధంగా మాత్రం మాట్లాడకూడదు. అది నీ ఆప్తులైనా సరే. అప్పుడే మనుషుల మధ్య బాంధవ్యాలు బాగుంటాయి. బాంధవ్యాలు బాగుంటే బతుకు బాగున్నట్టే. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఫెయిల్యూరా.. ఫీలవ్వొద్దు..
చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటుంది.. పరాజితులను పట్టించుకునేవారెవరు? మేం పట్టించుకుంటాం అని అంటున్నారు శామ్యూల్ వెస్ట్. శామ్యూల్ ఓ సైకాలజిస్ట్. ఒక కొత్త ఆవిష్కరణ వెనుక వందలాది విఫలయత్నాలు ఉంటాయని చెబుతున్న శామ్యూల్.. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీల కోసం ఓ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నాడు. వచ్చే నెలలో స్వీడన్లో ‘మ్యూజియమ్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ ప్రారంభమవనుంది. గత ఏడేళ్లుగా జయాపజయాలు.. వాటి గురించి జనం ఏమనుకుంటున్నారు? అనే అంశంపై శామ్యూల్ పరిశోధన చేశారు. ‘ఏదైనా కొత్త విషయం ఆవిష్కృతమయ్యే ముందు.. దానికి సంబంధించి 80 నుంచి 90 శాతం ప్రాజెక్టులు ఫెయిలవుతుంటాయి. ప్రతి విజయం వెనుక ఓ అపజయం ఉంటుందని తెలియజెప్పడానికే ఈ మ్యూజియం. అపజయం అంటూ భయపడితే.. నువ్వు కొత్త చరిత్రను సృష్టించలేవు’ అని శామ్యూల్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఫెయిలయిన 60 ఉత్పత్తులు, సేవల వివరాలను ఈ మ్యూజియంలో ఉంచుతారు. ఈ విఫల ఉత్పత్తుల్లో కోకోకోలా తెచ్చిన కాఫీ ఫ్లేవర్డ్ డ్రింక్, టూత్పేస్ట్ కంపెనీ కోల్గేట్ తెచ్చిన ఆహార ఉత్పత్తులు, హార్లే డేవిడ్సన్ పర్ఫ్యూమ్, మొబైల్ కమ్ గేమింగ్ కోసం నోకియా తెచ్చిన ఎన్గేజ్ వంటివి ఉన్నాయి. -
అతడు - ఆమె... ఇతడు - ఈమె
కథ ఎనిమిది గంటలప్పుడు ఎవడో ఎదురుగా వున్న స్టాల్లో న్యూస్పేపర్ కొంటున్నాడు. ఇంటికెళ్ళేవరకూ ఆగలేను అన్నట్టు అక్కడే పేపర్ విప్పి చదివేస్తున్నాడు. నిన్నటికీ ఇవాళ్టికీ మధ్య దేశమేమైపోయిందా అన్న ఆతృత కాబోలు. ఎదురుగా వస్తున్నవాడు సెల్ఫోన్లో మాట్లాడుతూ పెద్దగా నవ్వుతున్నాడు. అంతగా నవ్వే విషయం ఏవుందో మరి..!? ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి వున్నారు. చూడబోతే నేను తప్ప అందరూ ఆనందంగానే వున్నట్టున్నారు. ఛీ.. వెధవ జీవితం..! నేనే ఎందుకిలా ఉసూరంటూ ఏడుస్తున్నానో అర్థంకావడం లేదు. అజంతా హోటల్లోకి దారితీశాను. ఆహా..! ఇక్కడ ఇడ్లీ తినేసింతర్వాత చచ్చిపోయినా ఫర్లేదనిపించింది. టిఫిన్ ముగించి బైటికొచ్చాను. ఇప్పుడేం చేద్దాం..? ఆలోచించాను. కాసేపు ఒంటరిగా వుండాలి. ఒంటరిగా.. ప్రశాంతంగా.. ఏ వెధవా పలకరించకుండా వుండాలి. ఆటో ఎక్కి పార్క్కి చేరుకున్నాను. ఉదయం ఫూట గాబట్టి నేననుకున్నట్టే పార్క్లో జనం లేరు. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. శరత్గాడు వాడి భార్య అంజలి.. ఆ జంటని తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఎలాంటి అరమరికలు, భేదాభిప్రాయాలు లేకుండా అంత అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఎలా వుండగలుగుతున్నారో..?! నాకెందుకు ఇలా అయింది? లోపం ఎక్కడుంది..? ఇంకెక్కడ.. కచ్చితంగా నాలోనే! నేనే అంతటికీ కారణం. ఎవరో సైకాలజిస్టు చెప్పాడట. భార్య కాఫీ ఇచ్చినప్పుడు ‘థాంక్స్’ అనే చిన్నమాట ఉపయోగిస్తే చాలు.. ఆమె ఎంతో సంతోషిస్తుందట. మంచి భోజనం పెట్టినప్పుడు ‘ఈరోజు నీ చేతి వంట అద్భుతం’ అంటే ఆమె పడిన కష్టాన్నంతా మర్చిపోయి ఉప్పొంగిపోతుందట. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలే వారి బంధం గట్టిపడ్డానికి ఎంతో సహకరిస్తాయట. మరి నేనెప్పుైడనా మా ఆవిడకి థాంక్స్ చెప్పానా..? చెప్పినట్టు గుర్తులేదు. అదలా వుంచితే ఒకరి పుట్టినరోజుకి మరొకరు హేపీ బర్త్ డే చెప్పుకోవడం, చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చుకోవడం లాంటివి చెయ్యాలట. ఇవన్నీ శరత్ గాడే చెప్పాడు. మరి నేనేం చేశాను..? పెళ్ళయిన తర్వాత మొదటి పుట్టినరోజుకు శ్రావణికి హేపీ బర్త్ డే అయితే చెప్పాను గానీ తనకేదో బహుమతి ఇవ్వాలన్న ఆలోచనే రాలేదు. ఇక రెండో సంవత్సరం మరీ ఘోరం.. పని ఒత్తిడిలో పడి ఆరోజు ఆమె పుట్టినరోజన్న సంగతే మర్చిపోయాను. అవన్నీ అలా వుంచితే ఆరోజు జరిగిన విషయం.. అది గుర్తుకొస్తే గుండెల్లో ముల్లు గుచ్చుకుంటున్నట్టే వుంటుంది. శ్రావణి నన్ను విడిచి వెళ్ళిపోతుందని నేను ఊహించలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయినా తిరిగి వచ్చేస్తుందిలే అనుకున్నాను. కానీ నిన్న తెలిసిన వార్త.. మనిషిని మనిషిలా వుంచడం లేదు.. గుండెల్లో మంట రేపుతోంది. శ్రావణి నామీద గృహ హింస కేసు పెట్టబోతోందిట. మా అత్తగారి వూళ్ళో వున్న ఓ చుట్టం ద్వారా విషయం తెలిసింది. అప్పట్నుంచి ఒకటే ఆలోచన.. ఏం కాదులే అని సర్దిచెప్పుకొని మనసు మళ్ళించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ ఆలోచనలు అటే వెళ్తున్నాయి. లోపలెక్కడో వున్న ఆశ మళ్ళీ బైటికొచ్చింది. పోనీ శ్రావణికి ఒకసారి ఫోన్ చేస్తే..? ఆత్మాభిమానం వున్న ఏ ఆడదీ మీ దగ్గిర వుండలేదు.. మళ్ళీ నాకు ఫోన్ చెయ్యడానికి గానీ, నన్ను కలవడానికి గానీ ప్రయత్నించకండి.. శ్రావణి వెళ్ళిపోతూ నిప్పులు కురిపిస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఛ.. ఛ.. ఫోన్ చెయ్యడానికి నాకైనా సిగ్గుండాలి. ఫోన్ చేసి ప్రాధేయపడి.. తప్పైపోయిందని ఒప్పుకొని... ఆమెని రమ్మని బ్రతిమాలుకొని.. వద్దు.. వద్దు.. ఇక జీవితాంతం ఆమె ముందు వెధైవపోతాడు. అదీ ఒక బతుకేనా..? ఏం చెయ్యాలిప్పుడు..? సమస్యల్ని తట్టుకోవడానికి ముందు మానసికంగా సిద్ధపడాలట. ఏం జరిగిపోదు అని మనకి మనవే ధైర్యం చెప్పుకోవాలట. ఒకరకంగా సెల్ఫ్ హిప్నాసిస్ లాంటిదన్నమాట. తర్వాత అసలు సమస్య మూలం ఏమిటి? దాన్ని పరిష్కరించుకోవడానికి ఏయే మార్గాలున్నాయి.. అని అన్వేషించాలట. అప్పటికి ఆ సమస్య కొంత తేలికైపోతుందట. ఇవన్నీ మొన్న ఓ వ్యాసంలో చదివాను. నేననుకునేదేమిటంటే ఒడ్డున నిలబడి ఇలాంటి ప్రవచనాలు ఎన్నయినా చెప్పొచ్చు.. సమస్యలో మునిగినోడికే దాని తీవ్రత తెలుస్తుంది. అయినా ఆ రోజెందుకు అలా జరిగిందో అర్థంకావడం లేదు.. ఇప్పుడు తల్చుకుంటే విధి లిఖితం అలా వుందేమో అన్పిస్తోంది. లేకపోతే నేనెందుకంత కోపం తెచ్చుకోవాలి..? జరిగింది మరోసారి నా కళ్ళముందు మెదిలింది. ఆరోజు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆనంద్గాడు పార్టీ ఇచ్చాడు. నిజానికి మందుకొట్టడం అనేది నాకేమాత్రం ఆసక్తి లేని విషయం. కానీ ఎప్పుడో ఇలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సరిగ్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు కాదంటే వాళ్ళెలాగూ విడిచిపెట్టరు కాబట్టి ఏదో కొంచెం అలా సిప్ చేస్తానంతే..! అయితే ఆరోజు మాటల్లో సిప్లు కొంచెం ఎక్కువయ్యాయి. ఇంటికొచ్చేసరికే శ్రావణి కోపంగా వుంది. అప్పటికే చాలాసార్లు నా సెల్కు ఫోన్ చేసిందట. కానీ నా సెల్ ఛార్జింగ్ అయిపోవడం నేను గమనించనే లేదు. మాటల్లోనూ మత్తులోనూ పడి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని కూడా శ్రావణికి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడో ఒకసారి తాగే నాలాంటి వాడికి మేనేజ్ చెయ్యడం చేతకాదు.. శ్రావణి వెంటనే పసిగట్టేసింది. తాగొచ్చారా..? అడిగింది. అసలు ఆ విషయం నేనే తనకి నెమ్మదిగా చెప్దామనుకున్నాను. పరిస్థితి చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందనే నా నమ్మకం. అర్థం చేసుకునేదేమో కూడా.. కానీ శ్రావణి అలా ఫోర్స్గా ఒకేసారి అడిగేసరికి నా ఇగో దెబ్బతింది. అవును.. తాగే వచ్చాను. ఇప్పుడేంటి..? అసహనంగా అన్నాను. సాయంత్రం నుంచి ఫోన్లు చేస్తున్నాను. కనెక్ట్ కావడం లేదు.. కనీసం ఆలస్యమౌతుందని చెప్పాలని కూడా అనిపించలేదా..? అనిపించలేదు.. ఓహొ.. ఇంటికెందుకు వచ్చారయితే..? తెల్లార్లూ అక్కడే వుండాల్సింది.. తీవ్రంగా అంది. సరే.. ఈసారి అలాగే చేస్తాన్లే.. వాదన పెరిగిపోయింది. ఒక స్థాయిలో నేనేం చేస్తున్నానో నాకే తెలీలేదు. ఫలితం.. నా చేయి విసురుగా ఆమె చెంపను తాకింది. శ్రావణి నిర్ఘాంతపడి చూస్తుండిపోయింది. అప్పుడు చూశాను వెనక్కి.. శ్రావణి మేనత్త, మావయ్య! వెనక గది ద్వారం దగ్గర నిలబడి వున్నారు..! వాళ్ళొచ్చారన్న సంగతి నాకప్పటివరకూ తెలీదు. శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇల్లు కూడా దగ్గరే కాబట్టి చూసి పోదామని ఇక్కడికి వచ్చారట. తర్వాత్తెలిసింది నాకు. మా గలాటాకు నిద్రాభంగమై లేచినట్టున్నారు. ఒక్కసారిగా నా మత్తు దిగిపోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది..! శ్రావణి మనసు ముక్కలైంది. తర్వాత ఏం జరగాలో అదే జరిగింది.. నేను ఒంటరిగా మిగిలిపోయాను. పిచ్చెక్కేటట్టు వుంది.. ఏదయితే అదవుతుందని శ్రావణికి ఫోన్ చేశాను. ఆమె కోపంగా ఏమైనా అన్నా సహనంగా వుండాలి అనుకున్నాను. అట్నుంచి హలో.. ఎవరూ..? అని వినిపించింది. అది శ్రావణి గొంతు కాదు. నేను.. సురేష్ను మాట్లాడుతున్నాను.. శ్రావణి లేదా..? అడిగాను. నువ్వా బాబూ.. శ్రావణిని రమ్మని చెప్పడానికి చేశావా..? ఎందుకూ..? కొట్టి చంపెయ్యడానికా..? అది రాదులే బాబూ.. కోర్టు నుంచి నోటీసొస్తుంది.. అందుకో.. ఫోన్ కట్టయింది. ఆ గొంతు శ్రావణి మేనత్తది..! శ్రావణికి నా మీద కోపం తగ్గలేదన్న మాట.. కేసు పెట్టడానికే సిద్ధమైందన్న మాట..! అయిపోయింది.. అంతా అయిపోయింది.. సర్వనాశనం..! పరువు పోయినట్టే..! ‘వీడి మీదేరా.. పెళ్ళాం గృహహింస కేసు పెట్టింది.. స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు’ నాకు వినిపించేలా ఎవరూ అనరు.. నేను వెళ్తుంటే వెనక మాట్లాడుకుంటారంతే..! విరిగిన మనసులు అతకవన్నట్టు శ్రావణితో కలిసుండడం కూడా ఇక అసాధ్యమే అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి..? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? మధ్యాహ్నం రెండు గంటలు.. గది తలుపులు దగ్గరికి వేశాను. మనసంతా బరువుగా అయిపోయింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా నేను చేస్తున్న పని కరక్టే అనిపించింది. వేరే దారి లేదు. నేనంటే వీధిలో.. ఆఫీసులో.. మా ఏరియాలో.. ఓ గుర్తింపు వుంది. మంచివాడు.. ఎవరి జోలికీ వెళ్ళడు.. అని. ఈరోజు.. ఇలాంటి మచ్చతో కాలనీలో నలుగురిలో తిరగడం అంటే.. లేదు.. లేదు.. అంతకంటే చావడం మంచిది. నా సమస్యా సమసిపోతుంది.. శ్రావణి మీద రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా వుంటుంది.. అవును.. అదే కరెక్ట్..! జేబులో నుంచి బైటికి తీశాను.. విషం..! పంటలకు వాడేది.. పెస్టిైసడ్..! గేరంటీగా ఛస్తాను.. ఎంతసేపట్లో చస్తానో..? కడుపులో నొప్పేమైనా వస్తుందా..? సెల్ మోగింది. ఇప్పుడెవడు..? విసుగ్గా తీసి చూశాను. శరత్ గాడు.. ఇప్పుడెందుకు చేస్తున్నట్టో..? కట్టెయ్యబోయి మళ్ళీ మనసు మార్చుకుని పచ్చ బటన్ నొక్కాను. ఎక్కడున్నావ్ రా..? అర్జెంటుగా ఇంటికొచ్చేయ్.. పార్టీ చేసుకుందాం.. అన్నాడు. పార్టీయా..? అవును.. నీలాంటి ఆదర్శదాంపత్యం వున్నవాడికి ప్రతిరోజూ పండగే.. నాలాంటోడి బాధెవడికి చెప్పుకోను..? ఏం పార్టీ..? ఇప్పుడేంటి..? చెల్లెమ్మ ఇంట్లో లేదా..? అయినా నేనిప్పుడు రాలేను.. సహనంగా చెప్పాను. ఏం..? సెలవేగా ఈరోజు..? ఇంకేం చెప్పకు.. నువ్వు రావాల్సిందే.. లేదంటే నేనే మీ ఇంటికొచ్చేస్తాను. వాడి సంగతి నాకు తెలుసు. పట్టుపడితే వదిలే రకం కాదు.. వాడింటి నుంచి మా ఇంటికి రావడానికి ఐదు నిముషాలు కూడా పట్టదు. వస్తున్నాను.. ఇంకేమనాలో తోచక చెప్పాను. ఎందుకిలా జరుగుతోంది..? ఇది కూడా విధి లిఖితమేనా..? సరే.. కానీ.. ఒకసారి నిర్ణయించుకున్నాక నన్నెవడు ఆపగలడు..? కాకపోతే ఓ రెండు మూడుగంటల ఆలస్యం...బాటిల్ని కప్ బోర్డ్ లో పెట్టేసి శరత్ దగ్గరికి బెల్దైరాను. ఆలోచించకు.. కాస్ట్లీ సరుకు.. వేసేయ్.. గ్లాసులో మందు నింపి నావైపు తోసి అన్నాడు. అప్పటికే వాడు గుర్రం ఎక్కి వున్నాడు. మందా..? ఇప్పుడా..? నా గొంతు ఏదోలా ధ్వనించింది. మందేన్రా.. ఏదో విషమన్నట్టు మాట్లాడతావేంటి..? విషం అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాను. ఇప్పుడెందుకీ పార్టీ ఇస్తున్నావో చెప్పనే లేదు.. కంగారును కప్పి పుచ్చుకుంటూ అన్నాను. ఓహో... చెప్తేగానీ తాగవా..? సరే.. అంజలి వూరికెళ్ళింది. మీ ఆవిడ వూరికెళ్ళినప్పుడెప్పుడూ నువ్వు పార్టీ ఇచ్చిన గుర్తు లేదే..?! కరెక్ట్.. ఇప్పుడు కూడా అందుకివ్వడం లేదు.. ఇదసలు పార్టీ కూడా కాదు.. నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలి..? ముందు తాగు.. గద్దించినట్టు అన్నాడు. గ్లాస్ తీసుకొని గడగడా గొంతులో వొంపేసుకున్నాను. ఇప్పుడు చెప్పు.. అయినా భార్య వూరికెళితే విరహంలో మునిగి గంటకోసారి ఆమెకు ఫోన్ చేస్తూ నీ ప్రేమను గుర్తు చెయ్యాల్సినోడివి.. అదే గదా నీ ఫిలాసఫీ.. ఇప్పుడీ దుకాణం ఎందుకు పెట్టావో అర్థం కావడం లేదు.. విసుగ్గా అన్నాను. ట్రాష్.. అదే..నే చెప్పాలనుకుంటున్నది.. ప్రతీ చిన్న విషయంలో భార్యకు థాంక్స్ చెప్పడం, ఎప్పటికప్పుడు ఏదో రకంగా మన ప్రేమను వ్యక్తపరచడం.. అన్నీ ట్రాష్.. అరిచాడు వాడు. ఏమైంది వీడికి..? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్..? కాస్త భయంగా అన్నాను. నరకం.. నరకం చూస్తున్నాన్రా.. ప్రతీ విషయంలో ఆవిడ చెప్పినట్టే వినాలి. నాకంటే పెద్ద జాబ్లో వుంది. ఎందుకులే అని ఎంతగానో కంట్రోల్ చేసుకుంటూనే వున్నాను.. అదేంట్రా.. భార్యాభర్తలు ఎలా వుంటే వారి బంధం బలపడుతుందని సైకాలజిస్టులు చెప్పారో అదే పాటిస్తుంటావ్.. నాక్కూడా పదే పదే చెప్తుంటావ్.. ఈరోజు నువ్వేమిటి ఇలా..?! నా గొంతులో ఎడతెగని ఆశ్చర్యం! నీ మొహం సైకాలజీ.. అవన్నీ నా పద్ధతులు కావు.. తనవి.. ఎమ్మే సైకాలజీ చదివింది నేను కాదు తను..! అక్కడికీ తను చెప్పినట్టు నడుచుకుంటూనే వున్నాను. కానీ నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది కదా..! అయినా నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ వున్నవాళ్ళు దాన్ని ప్రతిసారీ ఏవో పదాల్లోనో లేక మరో రకంగానో వ్యక్తం చేసుకోవాలా..? అలా చేసుకుంటే అది రాన్రాను కృత్రిమంగా తయారౌతుంది. ఏం.. మీ ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడల్లా నువ్వు థాంక్స్ చెబుతావా..? చెప్పకపోతే నీ ప్రేమ మీ ఆవిడకి అర్థం కాదా..? నీ కళ్ళు, నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ.. అసలివి కూడా అక్కర్లేదురా.. వైబ్రేషన్.. అవును.. ఇద్దరి మధ్య కనిపించని ఒక వైబ్రేషన్.. అది చాలు.. భార్యాభర్తల మధ్య అనురాగం నిలిచి వుండడానికి. అసలేమైందిరా..? గొంతు తగ్గించి నెమ్మదిగానే అడిగాను. నటన.. ముసుగు తగిలించుకొని నటించడం నా వల్ల కావట్లేదురా.. మొన్న.. తన పుట్టినరోజు నాడు అలిగింది.. ఉదయాన్నే హేపీ బర్త్ డే చెప్పాన్రా.. మంచి చీర కూడా ముందే కొనేసి వుంచాను. ‘ఎప్పుడూ అర్ధరాత్రి పన్నెండు దాటాక లేపి మరీ చెప్పేవాడివి.. ఈసారి తెల్లారాక తీరిగ్గా చెబుతున్నావ్.. నా మీద ప్రేమ అంతకంతకూ తగ్గిపోతోంది..’ అంది. ఓ వెర్రినవ్వు నవ్వేసి వూరుకున్నాను. అక్కడితో ఆపలేదు.. ఆ సొద కంటిన్యూ అవుతూనే వుంది. నేను బరస్ట్ అయ్యాను. ఇలా వుంటే మరీ కృత్రిమంగా అన్పిస్తోందని చెప్పాను. నా బర్త్ డే రోజు కూడా అర్ధరాత్రి లేపి చెప్పకు... చిరాగ్గా వుంటోంది.. ఇంక ఈ పిచ్చి పనులు చాలు.. ఈసారి మళ్ళీ ఇలా సైకలాజికల్ విషయాలు చెప్తే దవడ పగుల్తుందన్నాను.. అంతే..! యుద్ధం జరిగింది. ఆమె వెళ్ళిపోయింది. నాకంతా ఆశ్చర్యంగా వుంది.. అయినా బాధపడకురా.. ఏదో కోపం మీద వెళ్ళిపోయుంటుంది.. మళ్ళీ వచ్చేస్తుందిలే.. నాకు చేతైననట్టు ఓదార్చాను. రాదు.. మళ్ళీ రాదు.. ఆవిడ సంగతి నీకు తెలీదు.. ఆత్మ.. ఆత్మా.. అదేమిటది..? నాలిక తడబడింది వాడికి. ఆత్మాభిమానం.. అందించాను. అవును అదే.. ఆవిడకి టన్నులకొద్దీ వుందది.. అంచేత ఆవిడ రాదు.. నేను మనసులో విషం పెట్టుకుని ఇంతకాలం నటించానట.. విడాకుల పత్రాలు పంపిస్తుందట.. జీవితాంతం ఒంటరిగా బతికే ధైర్యం తనకి వుందట. మళ్ళీ నాదగ్గరికొచ్చేంత నీచమైన పని చెయ్యదట.. పోయింది.. అంతా పోయింది.. పరువూ మర్యాదా అంతా పోయింది.. నేను పిరికివాణ్ణి.. చాలా పిరికివాణ్ణి.. ఎలాగోలా బతికెయ్యగల గట్టి గుండె నాకు లేదు.. పెళ్ళాం వదిలేసి పోయిందని నలుగురూ అనుకుంటుంటే ఆ అవమానం తట్టుకొని మామూలుగా తిరిగే ధైర్యం అసలే లేదు.. అందుకే తాగాను.. విషం తాగాను.. నువ్వు రాకముందే.. నేను.. విషం.. వాడు టేబుల్ మీద తల వాల్చేశాడు. నా గుండెలు అదిరిపోయాయి.. విషం.. విషం తాగాడా వీడు..?! ఇప్పుడేం చెయ్యాలి..? కాళ్ళు చేతులు ఆడ్డం లేదు.. అంబులెన్స్.. అవును.. అంబులెన్స్కి ఫోన్ చెయ్యాలి.. నెంబరెంత..? చేతులు వొణుకుతున్నాయి.. నెంబర్ నొక్కాను. ఎమర్జెన్సీ వార్డ్ బైట కూర్చున్నాను.. సమయం ముళ్ళ మీద వున్నట్టుగా గడుస్తోంది.. ఎట్టకేలకు కొన్ని యుగాల తర్వాత శరత్ వున్న ఆ గది తలుపు తెరుచుకుంది. నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. నేనేమీ అడక్కమునుపే మీవాడు సేఫ్.. సరైన సమయంలో తీసుకొచ్చారు.. ఇంకాస్త లేటైతే కష్టమయ్యేది.. అన్నాడు లోపల్నుంచి వచ్చిన డాక్టర్. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్నాను. నేను మరో ఇద్దరు ఫ్రెండ్స్కు మాత్రమే ఫోన్ చేశాను. వార్త అలా అలా పాకిపోయింది. గంట గడిచేసరికి అక్కడకి చాలామంది చేరుకున్నారు. సెల్ మోగుతోంది.. చూశాను.. శ్రావణి చేస్తోంది.. నమ్మలేకపోయాను.. ఆన్సర్ చేశాను..ఉదయం మీరు ఫోన్ చేశారా..? అడుగుతోంది. అవును.. మీ మేనత్త మాట్లాడింది.. చెప్పాను. ఆవిడ నాకు చెప్పనే లేదు.. ఇప్పుడే కాల్ లిస్టులో చూశాను.. అడిగితే చెప్పింది. ఆవిడ కోర్టు నోటీసు అదీ ఇదీ అంటోందేమిటి..? ఎంత వొద్దనుకున్నా నా గొంతు కొంచెం వణికింది. అదా.. ఆవిడ కొంచెం ఫెమినిస్టు భావాలున్నావిడ.. మీకు తెలీదా ఏంటి..? అబ్బాయిని కొంచెం జడిపిస్తే గానీ దార్లోకి రాడంది. అక్కడికీ నేను వొద్దని చెప్తూనే వున్నాను.. మరి మీ పెదనాన్న కొడుక్కి నిన్న ఫోన్ చేస్తే అతను కూడా అలాగే అన్నాడు..?! వాడే కదా మీకు బాగా దోస్తు.. వాడికి మీరు చేస్తారని ఆవిడకి తెలుసు. అందుకే ఒకవేళ మీరు ఫోన్ చేస్తే అలాగే చెప్పమని గట్టిగా ఆర్డరేసింది.. నిజమా.. అంతేనా.. నామీద కోపం లేదా నీకు..? ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకు లేదు..? మనింటి కెళ్ళాక చూసుకుందాం.. చెప్పింది శ్రావణి. ఆ గొంతులో కోపం లేదు. నా మనసు దూదిపింజలా తేలిైకపోయింది. సారీ శ్రావణి.. ఏదో మత్తులో.. కోపంలో చెయ్యి చేసుకున్నాను.. తప్పే..! ఇంటికెప్పుడొస్తున్నావ్..? ఇప్పుడు బయల్దేరుతున్నాను.. మీరు ఇంటి దగ్గరే వున్నారు కదా.. అడిగింది. నేనెక్కడున్నదీ చెప్పి.. శరత్ విషం తాగిన సంగతి చెప్పాను. అలా ఎలా జరిగింది..? ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి. అదంతా నువ్వొచ్చాక చెప్తాన్లే.. అన్నాను. సరేనంటూ ఫోన్ కట్ చేసింది. లోపలికెళ్ళాను. శరత్ గాడు కొంచెంగా తేరుకున్నాడు. బలహీనంగా మాట్లాడుతున్నాడు. నన్నెందుకు బతికించావంటూ అడిగాడు. ఆ మాత్రం మాట్లాడుతున్నాడంటే ఇంక వాడికి ఫర్వాలేదనుకున్నాను. అక్కడ మిగతా వాళ్ళకి చూసుకోమని చెప్పి కాసేపట్లో వస్తానని బయటకొచ్చాను. రోడ్డు మీద కొచ్చి కనిపించిన ఆటో ఎక్కి మా ఇంటి అడ్రస్ చెప్పి పొమ్మన్నాను. శ్రావణికి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి అరగంట కూడా పట్టదు. నేను విషం బాటిల్ పెట్టిన కప్ బోర్డ్ శ్రావణిది.. తనొచ్చేలోగా ఆ బాటిల్ని తీసి పారెయ్యాలి..! - ఎం. రమేష్ కుమార్ -
ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు
కడప కల్చరల్ : జీవితం దేవుడిచ్చిన వరం అంటారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వీలైతే మరో నలుగురికి ఉపయోగపడాలని పెద్దలు సూచించారు. కానీ పెంచుకున్న ఆశలు కరిగిపోయినపుడు నిరాశ, నిస్పృహలకు లోనై విలువైన జీవితాలకు మధ్యలోనే చరమగీతం పాడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక సమస్యలతో కొందరు, ప్రకృతి కరుణించక కరువు కాటుతో మరికొందరు, కుటుంబ కలహాలు తదితర కారణాలతో ఇంకొందరు జీవితాన్ని బలవంతంగా ముగిస్తున్నారు. చచ్చి సాధించేది ఏమి ఉండదని, బతికి సమస్యలను ఎదుర్కొని ఓడించినపుడే నలుగురికి ఆ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రముఖ మనస్తత్వ శాస్త్ర నిపుణుడు ఓ.వెంకటేశ్వరరెడ్డి పేర్కొంటున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆయనతోl‘సాక్షి’ ఇంటర్వ్యూ... సాక్షి : ఆత్మహత్యలు సాధారణంగా ఎందుకు చేసుకుంటారు? ఓవీ రెడ్డి : కోరికలు నెరవేరలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అనుకున్నది సాధించలేక పోతున్నామని, అవమానాలకు గురవుతున్నామని భావించేవారు, బలహీనమైన మనసు గల వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. సాక్షి : అది ఆవేశమేనా? ఓవీ రెడ్డి : ఇలాంటి వారు మానసికంగా చాలా ఉద్వేగంగా ఉంటారు. మరణమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారమన్న భావనతో ఉంటారు. సమస్యను రెండవ కోణం నుంచి చూసేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయరు. పైగా క్షణ క్షణం కసిని పెంచుకుంటారు. ఆ భావోద్వేగమే వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతుంది. సాక్షి : యువతలోనే ఎక్కువ..? ఎందుకు..? ఓవీ రెడ్డి : జీవితాన్ని పూర్తిగా చూసి ఉండరు గనుక యువతలో ఆత్మహత్యలు ఎక్కువ. పెద్దలను ఎదిరించడం గొప్పగా భావించి తమకు అన్నీ తెలుసనే భావనతో ఉంటారు. తమ నిజమైన శ్రేయోభిలాషులెవరో నిర్ణయించుకోలేని ఊగిసలాటలో ఉంటారు. తాము వెళ్లే దారి మంచిదో కాదో కూడా తెలుసుకునే అనుభవం ఉండదు. అందుకే సమస్యలు వస్తే మరణమే పరిష్కారమని భావిస్తారు. సాక్షి : యువతలో ఈ ఆలోచన మాన్పలేమా? ఓవీ రెడ్డి : తప్పకుండా మాన్పించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఎదిగిన పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. సానుకూల దృక్పథాన్ని, సమస్యను విభిన్న కోణాల్లో విశ్లేషించే గుణాన్ని పెంచాలి. పిల్లల సమస్యల పరిష్కారంలో వారి స్నేహితులకు భాగస్వామ్యం కల్పించాలి. సమస్యల పాలైన పిల్లలపై కోప్పడితే.. సమస్య మరింతగా పెరిగి వారిలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. సాక్షి : ప్రేమ ఆత్మహత్యల మాటేమిటి? ఓవీ రెడ్డి : తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానసిక దూరమే నూతన వ్యక్తుల అభిమానం పొందాలన్న కాంక్షను కలిగిస్తుంది. యువతలో భౌతిక ఆకర్షణ ఎక్కువ. అందుకే నిండైన జీవితాన్ని ప్రాక్టికల్గా చూసే స్థితి ఉండదు. తమ నిర్ణయంపై విమర్శను అవమానంగా భావిస్తారు. తమ నిర్ణయమే సరైనదన్న మూర్ఖత్వం తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తోంది. అలాంటి వారికి ప్రేమతోపాటు ఎంతో బతుకు ఉందని, ఎన్నో కోణాలలో సమాజంలోని ఎందరికో తమ ప్రేమను పంచాల్సిన బాధ్యత ఉందన్న అవగాహన కల్పించాలి. సాక్షి : రైతు ఆత్మహత్యల సంగతేమిటి? నివారించడం కష్టమా? ఓవీ రెడ్డి : దీన్మి సామాజిక సమస్యగా భావించాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కంటే వ్యవస్థ ప్రభావమే ఎక్కువ. రైతుల్లో ఎక్కువగా పంట నష్టాలే ఆత్మహత్యలకు పురి గొల్పుతుంటాయి. వారికి ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తే గణనీయంగా తగ్గుతాయి. ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదని వారు గ్రహించాలి. అలాంటి ధోరణిని వారిలో గమనిస్తే ఆత్మీయులు, కుటుంబ సభ్యులు సమస్య నుంచి ఆలోచనను మళ్లించాలి. -
28న సైకాలజిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
న్యూశాయంపేట : ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈ నెల 28న హన్మకొండలోని హౌసింగ్బోర్డ్ కాలనీ రోడ్డులో గల మైండ్కేర్ సెంటర్లో ఎన్నికోనున్నట్లు అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి బరుపాటి గోపి తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైకాలజీ పూర్తి చేసిన వారు రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉన్నవారే ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. అదే రోజున సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు కమలాకర్, రాష్ట్ర కార్యదర్శి వేదప్రకాశ్ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో అప్పన మనోజ్కుమార్, కుసుమ రమేష్, ఎం.విజయభాస్కర్రెడ్డి, భుజేందర్రెడ్డి, ఎన్.శ్రీనివాస్,జి.రామాచారి పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యంపై రాయలసీమ సైకాలజిస్ట్లకు శిక్షణ
అనంతపురం సిటీ : ఈ నెల 13 నుంచి రెండ్రోజుల పాటు వృత్తి నైపుణ్యంపై రాయలసీమ ప్రాంత సైకాలజిస్ట్కు శిక్షణ ఉంటుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శిక్షణ పొంద దలచిన వారు కర్నూలులోని కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రైల్వే స్టేషన్ దగ్గర, ఎస్ఆర్పేటకు రావాల్సిందిగా సూచించారు. మరింత సమాచారం కోసం 9441371817లో సంప్రదించాలని కోరారు. -
మాట్లాడుకుందాం రా..!
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు.. ఇన్డెప్త్గా ఈ సినిమా డైలాగ్లో మానసిక ఆరోగ్యానికి కావాల్సినంత మెడిసిన్ దొరుకుతుంది. మంచి ఉద్యోగం.. చక్కటి సంపాదన.. కుటుంబం.. ఇన్నీ ఉన్నా చాలామంది హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కామన్మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు మనసులోని బాధలకు బందీలైపోతున్నారు. ఎదను తొలిచే బాధను మొహమాటంతోనో.. ధైర్యం చాలకో.. ఇతరులతో పంచుకోకుండా అందరిలో ఉన్నా ఒంటరైపోతున్నారు. నాలుగు మాటలతో మానసిక బలాన్ని తిరిగి పొందొచ్చని చెబుతున్నారు సైకాలజిస్ట్లు. ఒత్తిడిని జయించడానికి కౌన్సెలింగ్కు మించిన మందు లేదంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా నాలుగు మంచి మాటలు. - సత్యబాబు ఒక సమస్య తీవ్రమైన మానసిక క్షోభకు దారితీయడానికి దానిని ఇతరులతో పంచుకోకపోవడమే ప్రధాన కారణం. కుటుంబసభ్యులకో.. దగ్గరి స్నేహితుడి కో.. మీ సమస్యలు చెప్పుకుంటే.. గుండె బరువు కాస్త దిగుతుంది. అయితే ఇప్పటి బిజీ లైఫ్లో మనలోని బాధలు చెప్పుకునే వ్యక్తులు కనబడరు. ఒకవేళ చెప్పినా మనల్ని ఎలా అంచనా వేస్తారోనన్న భయంతో చాలా మంది సమస్యలను పెదవి దాటనివ్వడం లేదు. ఏ ఎమోషనైనా షేర్ చేసుకోవడం వల్లే మానసిక ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారు సైకాలజిస్ట్లు. రిలేషన్ బ్రేకప్స్.. చాలా వరకు తీవ్రమైన మానసిక సమస్యలకు కారణం రిలేషన్షిప్ మెయింటనెన్సే. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్.. చినికి చినికి గాలివానలా మారి తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. ఆఫీస్ టెన్షన్స్ ఇంటి కంపౌండ్లోకీ చొరబడి భార్యాభర్తల అనుబంధంపై ప్రభావం చూపుతున్నాయి. టీనేజర్స్లో లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్కు దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్స్కు వస్తున్న వారిలో చాలా మంది లవ్ ఫెయిల్యూర్సే ఉంటున్నారు. పియర్ ప్రెషర్స్.. వేగంగా ఎదిగే అవకాశాలున్న ఐటీ వంటి రంగాల్లో పనితో పాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. మిగతావాళ్లు ఎదిగిపోతున్నారన్న కంపారిజన్ పియర్ ప్రెషర్కు కారణం అవుతోంది. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్కు చెక్ పెట్టొచ్చని అంటున్నారు వైద్యులు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి దశలవారీగా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త డెవలప్ అయిన తర్వాత ఎలాంటి టెన్షన్ అయినా అధిగమించే శక్తి వస్తుంద ంటున్నారు. కౌన్సెలింగ్ క్యాప్సుల్... మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం నగరంలో ఎన్నో కౌన్సెలింగ్ సెంటర్లు వెలిశాయి. అలా ఏర్పా టైందే ‘సేవ’ సంస్థ. ఐటీ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న త్యాగరాజన్ ఈ సంస్థ నెలకొల్పారు. పదహారేళ్లుగా నాలుగు మాటలతో ఎందరికో ఉచితంగా మానసిక బలాన్నిస్తున్నారు. ‘పద్మారావునగర్లో మా సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మానసిక సమస్యలతో వ్యక్తిగతంగా కలసిన వారికి ఇక్కడ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే గాంధీ ఆస్పత్రి వంటి పలు హాస్పిటల్స్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామ’ని ఆయన తెలిపారు. -
మగాళ్ల మర్యాద కాపాడడానికి...
మన కోసం ముంబై కేంద్రంగా పురుషుల హక్కుల కోసం పని చేస్తుంది ‘మెన్స్ రైట్స్ అసోసియేషన్’(యంఆర్ఎ) యంఆర్ఎ ఎజెండా ఇది... బాధిత పురుషులకు న్యాయసహాయం అందించడం. నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన పురుషులకు మానసిక బలాన్ని చేకూర్చడానికి సైకాలజిస్ట్ల చేత కౌన్సెలింగ్ ఇప్పించడం. చట్టాల గురించి అవగాహన కలిగించడం. పురుషులపై సాగుతున్న దుష్ర్పచారాన్ని గురించి వివరించి, దానిని ఖండించడానికి అవసరమైన అవగాహన కలిగించడం. పురుషులపై జరిగే హింసను తగ్గించడం. పురుషుల హుందాతనాన్ని, మర్యాదను కాపాడడం. సమాజంలో లింగవివక్షత లేకుండా చేయడానికి ప్రయత్నించడం. నిస్సహాయ పురుషులకు అండగా నిలవడం. -
బతుకు... బతికించు
నాన్నకు కాసింత జ్వరం వస్తే ఆ కన్న కూతురు తట్టుకోలేదు. దగ్గరుండి మాత్రలు వేసి, తల్లిలా గోరుముద్దలు తినిపిస్తేనే గానీ ఆమెకు శాంతి లభించదు. అదే కూతురు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే ఆ తండ్రి ఎంత క్షోభ అనుభవిస్తాడు? ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చేసిందిగా... మరేం ఫర్వాలేదు. మన జీవితాలు మారిపోతాయి. నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటానమ్మా...’అని ప్రేమగా చేతిలో చేయి వేసి చెప్పిన కొడుకు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణం తీసుకుంటే ఆ తల్లిపేగు ఎంతగా బాధపడుతుంది? ‘ఇంకొంచెం కష్టపడితే చాలురా... ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటా’ అని చెప్పిన మిత్రుడు తెల్లారితే ఫ్యాన్కు వేలాడుతూ కనిపిస్తే స్నేహితులు ఎంత నరకం అనుభవిస్తారు? జీవితంలో అన్ని ప్రశ్నలకూ ఆత్మహత్యలో సమాధానం వెతుక్కునే వారు ఆఖరుకు తమ వారికి ఇలాంటి ప్రశ్నలనే మిగిల్చి వెళుతున్నారు. జిల్లాలోనూ ఆత్మహత్యల ఘటనలు ఎక్కువైపోతున్నాయి. విజయనగరం క్రైం: కాలేజ్లో లెక్చరర్ తిట్టారని ఒక విద్యార్థిని, భర్త వేధింపులు తాళలేక మరో వి వాహిత, ఉద్యోగం రాలేదని ఓ యువకుడు... ఇలా కారణాలేవైనా నిండు ప్రాణా లు బలి తీసుకుంటున్నారు. సమస్యలతో పోరాడలేక జీవితాన్ని బల వంతంగా ముగించేస్తున్నారు. క్షణికావేశంలో కొం దరు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అయినవారి గుండెల్లో ఆరని మంట రగులుస్తున్నాయి. తీరని వేదన మిగులుస్తున్నాయి. కష్టాలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య వల్ల సమస్యలు వస్తాయి గానీ సమసిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇంకా... ముందుగా తెలియజేస్తారు... ఆత్మహత్యకు మొదటి కారణం ఒత్తిడి. తమకు ఆత్మహత్య ఆలోచన వస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలను సీరియస్గా చేయాలకున్న వ్య క్తులు వివిధ రకాల సిగ్నల్స్తో తమ వారిని తెలియజేస్తారు. తమకు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని చూడవచ్చు. ఉత్తరాలూ రాయవచ్చు. ఆత్మహత్య చేసుకుంటాడు అన్న అనుమానం ఉన్న వారిని ఒంటరిగా ఉండనీయకూడదు. తమ విలువ కుటుంబంలో ఎంత ఉందో తెలుసుకోవాలని కొందరు సరదాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. కాని ఒక్కోసారి సీరియస్ అవ్వవచ్చు. తరచూ ఆ మాటలు అనే వారిని వీలైనంత ఆదరణ, అత్మీయత, ప్రేమను కలుగుజేయాలి. కొందరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలని తమ మాటల్లోనే నెగ్గాలని భావిస్తారు. వారిది హిస్టిరికల్ పర్సనాలిటీ. ఇలాంటి వారికి లొంగుతూ వెళ్తే వారు అలాగే కొనసాగుతారు. అసూయ, ఓర్వలేని తనం తన మాట నెగ్గకపోతే నానా హైరానా చేసే వారు అందరి దృష్టి తమవైపు తిప్పుకోవడం కోసం ఏ పనైనా చేస్తారు. తాము ఎవరిని ఆకర్షించాలని అనుకుంటున్నారో వారి సమక్షంలోనే చేయాలనుకుంటారు. డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకునే వారికి వీరు పూర్తి వ్యతిరేకం. ప్రస్తుతం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే..? మీకు తెలిసిన వారికి ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే మొదట అత్మీయులకు బాధను చెప్పుకోవాలి. అలా చెప్పుకోనేలా ఆత్మీయులు వారిని ప్రోత్సహించాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండనీయరాదు. ఏ మాత్రం అనుమానం వచ్చిన సైకాలజిస్ట్ను కలవడం ఉత్తమం. డిప్రెషన్లో ఉన్నప్పుడు... ఆత్మహత్యలు ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసుకుంటారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించవచ్చు. ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వారు ముందుగానే ఇండికేషన్ ఇస్తారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలో గుండె జబ్బు తర్వాత రెండో వ్యాధిగా మానసిక వ్యాధిని గుర్తించారు. ప్రతి ఆరు నిముషాలకు ఒక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకోకుండా డిప్రెషన్లో ఉన్నవారిని ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా మార్చవచ్చును. - డాక్టర్ ఎస్.వి.రమణ, సైకాలజిస్ట్ ప్రశాంతి మానసిక వ్యాధుల కౌన్సిలింగ్ కేంద్రం -
మీ టాలెంట్ మీకు తెలుసా?
ప్రేరణ ప్రతిఒక్కరిలో అంతర్గతంగా ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రజ్ఞ ఉంటాయి. వాటిని గుర్తించి, వెలికితీస్తే అద్భుతాలు సృష్టిస్తారు. బాల్యంలో మందమతులుగా ముద్రపడినవారు సైతం తమ ప్రతిభాపాటవాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. వారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ప్రముఖ బ్రిటిష్ నృత్యకారిణి గిలియన్ లైనీ ఉదంతం కూడా అలాంటిదే. గిలియన్ లైనీ ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలి నుంచి ఆమె తల్లికి ఓ ఉత్తరం వచ్చింది. స్కూల్లో గిలియన్ ప్రవర్తనపై సదరు టీచర్ ఫిర్యాదు చేస్తూ పెద్ద ఉత్తరం రాసింది. చిన్నారి చదువుపై ఆసక్తి చూపడం లేదని, ఎప్పుడూ మందకొడిగా ఉంటోందని అందులో తెలిపింది. అంతేకాకుండా హోమ్వర్క్ కూడా సమయానికి పూర్తి చేయదని, ఇక ఆమె చేతిరాత చాలా ఘోరంగా ఉందని విమర్శించింది. గిలియన్కు లెర్నింగ్ డిజార్డర్ ఉందనే అనుమానం తనను వేధిస్తోందని, ఆమెను అలాంటి విద్యార్థులకు ఉద్దేశించిన స్పెషల్ స్కూల్లో చేర్పిస్తే మంచిదని సలహా కూడా ఇచ్చింది. అంతర్గత నైపుణ్యం మేల్కొంది టీచర్ నుంచి వచ్చిన ఉత్తరం చదివిన గిలియన్ తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. టీచర్ ఇచ్చిన సలహాను పాటించడం కంటే ముందు తన బిడ్డ ఎదుర్కొంటున్న సమస్య, దాని పరిష్కారం కోసం చిన్నారిని సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. వెంటనే గిలియన్ను తీసుకొని వెళ్లి ఒక సైకాలజిస్టును కలిసింది. ఆయన గిలియన్ ముఖ కవళికలను, కాళ్లు, చేతుల కదలికలను నిశితంగా పరిశీలించాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత.. వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ ఆమె తల్లిని బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్లేటప్పుడు గదిలోని రేడియోను ఆన్ చేసి, సౌండ్ పెంచాడు. గదిలో గిలియన్ మాత్రమే ఉంది. ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యం ఒక్కసారిగా మేల్కొంది. కుర్చీలోంచి లేచి రేడియోలో వస్తున్న పాటలకు అనుగుణంగా కాళ్లు, చేతులను లయబద్ధంగా కదపసాగింది. ఇప్పుడు ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. గది బయట ఉన్న సైకాలజిస్టు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని ఆమె తల్లికి చూపించాడు. ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతులేని ఆశ్చర్యానికి లోనైంది. గిలియన్లో ఎలాంటి లోపం లేదని సైకాలజిస్టు తేల్చిచెప్పాడు. ఆమె నృత్యంలో ప్రతిభ చూపుతుందని, శిక్షణ కోసం డ్యాన్స్ స్కూల్లో చేర్పించమని సూచించాడు. సాన పెడితే వజ్రమే అదృష్టవశాత్తూ గిలియన్ తల్లి ఆ సూచనను అమల్లో పెట్టింది. ఇక మిగిలిందంతా చరిత్రే. గిలియన్ లైనీ గొప్ప నృత్యకారిణిగా పేరుగాంచింది. ప్రపంచంలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందింది. తనలోని టాలెంట్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే అత్యంత సంపన్నురాలిగా ఎదిగింది. ఇక్కడ తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది సైకాలజిస్టుకే. ఎనిమిదేళ్ల బాలికలోని ప్రతిభను ఆయన గుర్తించడం వల్లే ఒక గొప్ప డ్యాన్సర్ ప్రపంచానికి లభించింది. ఒక వైద్యుడిగా ఆమెకు మందులు ఇవ్వడం లేదా స్పెషల్ స్కూల్కు పంపడం వంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన గిలియన్లోని సహజ ప్రతిభను పసిగట్టాడు. ఆ ప్రతిభకు సాన పెట్టుకోవడంతో గిలియన్ వజ్రంగా మారింది. మార్కులే కొలమానం కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ కచ్చితంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. మరి వాటినెందుకు గుర్తించలేకపోతున్నారు? మన ప్రతిభను మనం తెలుసుకోకుండా బయటి నుంచి చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. స్కూల్లో పిల్లల ప్రతిభను మార్కుల ఆధారంగా మాత్రమే కొలుస్తుంటారు. మంచి మార్కులు రాకపోతే వారిని అసమర్థులు, బుద్ధిహీనులుగా పరిగణిస్తారు. చదువుపై అంతగా ఆసక్తి లేని పిల్లలకు మరో రంగంలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉండొచ్చు. దాన్ని గుర్తించి వెలికితీసే అవకాశం ఉండాలి. స్కూల్లో మంచి మార్కులు సాధించేవారు మరో రంగంలో వెనుకబడి ఉండొచ్చు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని తెలుసుకోవాలి. కలలను నిజం చేసుకోండి మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నలుగురిలో నిలిపే విశిష్టమైన టాలెంట్ మీలో ఉందా? కలలను నిజం చేసుకొనేందుకు శ్రమించండి. ఎవరికి తెలుసు.. మీలోని ప్రతిభ మిమ్మల్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లొచ్చు. గిలియన్లోని ప్రతిభను కనిపెట్టిన సైకాలజిస్టు అందరికీ అవసరమే. ఆ సైకాలజిస్టు.. మన తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా కావొచ్చు. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారిలో ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉంటే వారికి తెలియజేయండి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
డాక్టర్ టీఎస్ రావ్కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
విజయవాడ, న్యూస్లైన్ : విజయవాడకు చెందిన ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పుస్తక రచయిత డాక్టర్ టీఎస్ రావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈ మేరకు తనకు అప్రూవల్ లేఖ అందినట్లు ఆయన తెలిపారు. యువతరంలో చైతన్యం తెచ్చే విధంగా ‘యువతరానికి ఆత్మీయ లేఖ’ పేరుతో 70 అడుగుల పొడవైన లేఖను(పుస్తక రూపంలో 140 పేజీలు) రచించి ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ సుదీర్ఘమైన లేఖలో యువత నేర్చుకోవాల్సినవి, విడిచి పెట్టాల్సినవి, పాటించాల్సినవి, తీర్చిదిద్దుకోవాల్సినవి, సాధించాల్సినవి ఇలా నూటొక్క అంశాలను అయిదుగా విభజించి పొందుపరచి ప్రదర్శించానన్నారు. 16,500 పదాలతో వంద అంశాలతో, 101 ప్రముఖుల కొటేషన్లతో కూర్చి అందులో విశేషంగా మనం అనే మాటను 150 సార్లు, సమాజం అనే పదాన్ని 23 సార్లు, ప్రపంచం అనే పదాన్ని 13 సార్లు, పాజిటివ్ అనే పదాన్ని 21 సార్లు, సాధిద్దాం అనే పదాన్ని 20 సార్లు ఉపయోగించడాన్ని ఈ లేఖ ప్రత్యేకతగా గుర్తిస్తున్నట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థానక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తనకు పంపిన లేఖలో పేర్కొన్నారని రావు చెప్పారు. రెండున్నర దశాబ్ధాలుగా కౌన్సిలింగ్ రంగంలో విశేష సేవలందిస్తుండగా, ఒకభాషకు సంబంధించి ప్రపంచ రికార్డ్స్ సంస్థగా ఆవిర్భవించిన తెలుగు బుక్ ఆఫ్ రిక్డార్డ్స్లో తన లేఖ నమోదు కావడం సంతోషంగా ఉందని డాక్టర్ టీఎస్ రావు ఆనందం వ్యక్తం చేశారు. -
అయ్యా...పిల్లల మీద అరవకండి!
మానసికం బయట ఎన్ని పనులున్నా, వాటి తాలూకు ఒత్తిడి ఉన్నా, ఎన్ని సమస్యలున్నా...ఇంట్లోకి వచ్చాక మాత్రం ప్రశాంతంగా ఉండడం, కుటుంబంతో సంతోషంగా గడపడం అనేది ‘గృహస్థు లక్షణం’ అంటారు పెద్దలు. కాని కొందరు తండ్రులు మాత్రం బయటి ప్రపంచం ఒత్తిడి, కోపాన్నంతా ఇంట్లో ప్రదర్శిస్తుంటారు. ‘‘నాన్న...మా స్కూల్లో ఇవ్వాళి’’ అని పిల్లాడు తన క్లాసులో జరిగిన విషయాన్ని చెప్పబోతుంటే- ‘‘అబ్బ... రాగానే మెదడు తింటావు.... వెళ్లు’’ అంటూ కసురుకుంటారు కొందరు. పిల్లాడు నాన్స్టాప్గా ఏడవడానికి ఇంతకుమించిన కారణం అక్కర్లేదు కదా! అయితే ఇదేమీ అషామాషీగా తీసుకోవల్సిన విషయం కాదు అంటున్నారు మానసిక విశ్లేషకులు. తరచుగా పిల్లల మీద అరవడం వల్ల, అది వారి ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట. అలాగే, క్రమశిక్షణ పేరుతో పిల్లలని శిక్షించడం వల్ల మార్పు రాక పోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ‘‘పిల్లల పెంపకంలో శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరచుగా అరవడం వల్ల...పిల్లల్లో నాన్న అంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఈ ప్రభావం వల్ల పిల్లలు ఇతరులతో కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అంటున్నాడు డెన్మార్క్కు చెందిన సైకాలజిస్ట్ ఎరిక్ సిగార్డ్. -
విశ్లేషణం: విప్లవాత్మక సృజనజీవి...
‘‘నేనంటే చాలామందికి నచ్చకపోవచ్చు... వాళ్లు నన్ను విమర్శించవచ్చు, అది వాళ్లిష్టం. కానీ నేనెలా ఆలోచిస్తానో మరొకరికి ఎలా తెలుస్తుంది? నా మనసులో ఏముందో వారెలా విశ్లేషిస్తారు?’’ అని ఓ సందర్భంలో వర్మ మండిపడ్డారు. ఆయన లాంగ్వేజ్, బాడీలాంగ్వేజ్, జీవనశైలి ద్వారా ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా తెలుసుకోవచ్చు, విశ్లేషించవచ్చు. స్వార్థపర తత్త్వవేత్త... వర్మ మాట్లాడుతున్నప్పుడు కాళ్లు కుదురుగా ఉండవు... వాటిని షేకాడిస్తుంటాడు. స్వరం మంద్రస్థాయిలో ఉంటుంది. వీటినిబట్టి వర్మది అనుభూతి ప్రధాన వ్యక్తిత్వమని చెప్పవచ్చు. తనకెలాంటి సెంటిమెంట్సూ లేవని వర్మ పదేపదే చెప్పినా... ఆయన భావోద్వేగాలకే అధిక ప్రాధాన్యమిస్తాడు... అయితే అది తన ఫీలింగ్స్కు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని తన దృష్టిలోనే చూస్తుంటాడు. నా పాయింట్ ఏంటంటే... అంటూ తన వాదనను వినిపిస్తుంటారు. దీన్నే ‘ఫస్ట్ పర్సెప్చువల్ పొజిషన్’ అంటారు. ఈ పొజిషన్లోనే ఆగిపోయినవారు ప్రపంచానికి పచ్చి స్వార్థపరులుగా కనిపిస్తారు. తను స్వార్థపరుడినని కూడా వర్మ ఓపెన్గా అంగీకరిస్తాడు. అంతేకాదు స్వార్థమే పరమార్థం అని సిద్ధాంతీకరిస్తాడు. కానీ వర్మ మాటలను నిశితంగా గమనిస్తే ఆయన తరచూ ‘ఫిఫ్త్ పర్సెప్చువల్ పొజిషన్’ నుంచి ప్రపంచాన్ని చూస్తుంటాడనే విషయం తెలుస్తుంది. ఇది సుప్రీమ్ పొజిషన్, గాడ్ పొజిషన్. ఈ దృక్కోణంలో ప్రపంచాన్ని చూసేవారు తత్త్వవేత్తలు లేదా మహాగురువులవుతారు. ‘నేను’ అనే మాటను కాస్త పక్కన పెట్టి గమనిస్తే... ఆయన మాటల్లో ఓ గురువు కనిపిస్తాడు. అతని మాటల్లో సత్యం అర్థమవుతుంది. ఓషో రజనీష్, యూజీ కృష్ణమూర్తిలానే వర్మ ఆలోచనలు కూడా విధ్వంసకరంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను ప్రేమించాలి లేదా ద్వేషించాలి, మధ్యస్థంగా ఉండటం కుదరదు. ఎందుకంటే ఆయన వ్యక్తులను ప్రశ్నించడు, వారిలోని ప్రాథమిక భావనలను ప్రశ్నిస్తాడు, వారి ఆలోచనలోని లోపాల్ని ఎత్తి చూపుతాడు, వారున్న కంఫర్ట్ జోన్స్ను బద్దలు కొడతాడు. అది నచ్చినవారు ‘భక్తుల’వుతారు, నచ్చనివారు శత్రువులవుతారు. ఆయన చేతులూ మాట్లాడతాయి... మాట్లాడేటప్పుడు వర్మ తరచూ చూపుడువేలును తలకు ఆనించుకుంటాడు. ఎదుటివారిని అతను విశ్లేషిస్తుంటాడనే విషయాన్ని ఇది వెల్లడిస్తుంది. తానెంత ఓపెన్గా మాట్లాడినా ఒక్కోసారి తన భావాలను దాచుకునే ప్రయత్నం చేస్తాడని పెదవులకు వేళ్లు/చేయి అడ్డుగా పెట్టుకోవడం వల్ల తెలుస్తుంది. వర్మ నోటితోనే కాదు చేతులతోనూ మాట్లాడతాడు. అదెలాగంటారా? వర్మ మాట్లాడేటప్పుడు ఆయన చేతులు, వేళ్ల కదలికలను గమనిస్తే మీకే తెలుస్తుంది. మాటలకు, చేతుల కదలికలకు మధ్య అద్భుతమైన లయ కనిపిస్తుంది. దీన్నిబట్టి మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాడనే విషయం మనకు తెలుస్తుంది. ఈ క్షణంలోనే జీవిస్తా... సమాజం గురించి నేనెప్పుడూ ఆలోచించను. అందులో ఉన్నాను కాబట్టి ఆ చట్టాలను గౌరవిస్తాను, ఆచరిస్తాను. నాకు నచ్చిందే నేను చేస్తాను... అనడంలో వర్మలోని వ్యక్తివాదం వెల్లడవుతుంది. అలాగని ఇతరులను గౌరవించడనుకుంటే పొరపాటే. ఇతరులను చాలా గౌరవిస్తాడు... అయితే అది తన జీవితంలో చొరబడనంతవరకూ మాత్రమే. ఆయన వ్యక్తులకన్నా, సంఘటనలకన్నా.. ఆలోచనలు, అనుభూతుల గురించే ఎక్కువగా మాట్లాడతాడు. సినిమాకన్నా అది క్రియేట్ చేసే ఫీలింగ్, ఎమోషన్ నాకు ముఖ్యం అని చెప్తాడు. పెళ్లెప్పుడు చేసుకున్నానో నాకు గుర్తులేదు... రేపేం చేస్తానో నాకే తెలియదు... ఇప్పుడేం చేస్తానన్నదే నాకు ముఖ్యం... అన్నప్పుడు ఆయన ఈ క్షణంలోనే జీవిస్తాడనే విషయం తెలుస్తుంది. ‘లివ్ నౌ’ అన్నదే అనేక తత్త్వాల సారాంశం. రామ్ గోపాల్ వర్మ చేసేదీ అదే. - విశేష్, సైకాలజిస్ట్