rera
-
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్డీడ్లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్లో 2 ప్రాజెక్ట్లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
RERA అప్రూవల్ లేకుండా ప్రాపర్టీ కొనుగోలు చేయడం సురక్షితమేనా..?
-
హైడ్రా కూల్చివేతలు.. RERA చట్టం ఏం చెబుతోంది..?
-
యథేచ్ఛగా ‘ప్రీలాంచ్’ దందా!
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల సొంతింటి ఆశలను కొందరు బిల్డర్లు అడియాసలు చేస్తున్నారు. ప్రీ లాంచ్ దందా నిర్వహిస్తూ, ఆకర్షణీయమైన హామీలు ఎరవేస్తూ కోట్లు కొట్టేస్తున్నారు. కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన సాహితీ, భువనతేజ, ఓబిలీ హౌసింగ్ వంటి సంస్థల యజమాను లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, కొనుగోలుదారుల సొమ్ముతోనే అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసేలా ఎత్తుగడలు వేస్తూ చివరికు బిచాణా ఎత్తేస్తున్నారు. తాజాగా కొంపల్లిలో భారతి లేక్వ్యూ పేరిట అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రీలాంచ్ ఆఫర్ పెట్టి రూ.60 కోట్లు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వరకు వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, ప్రీలాంచ్ ఆఫర్ల వలలో చిక్కుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు హైదరాబాద్లో కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా రియల్టర్ల విషయంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఈ దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రియల్ వెంచర్ల విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సైతం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తక్కువ ధరకే చదరపు అడుగు పేరిట..హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు అవతల కూడా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ వ్యయాలు కూడా బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చాలామందికి సొంతంగా 100 లేదా 200 గజాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతున్న ఉద్యోగులు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వలస వస్తున్న వారు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కోకాపేట, గచ్చిబౌలి, మియాపూర్, పటాన్చెరు తదితర డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బడా సంస్థలు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో చదరపు అడుగు విస్తీర్ణం ధర రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో రియల్టర్లు, భూదందాలు చేసేవాళ్లు కరీంనగర్, వరంగల్, విజయవాడ, మెదక్ హైవేల వైపు దృష్టి సారించి నాలుగైదేళ్ల క్రితమే ఈ ప్రీలాంచ్ దందాకు తెరతీశారు. అంటే ప్రజల ఆశనే పెట్టుబడిగా పెట్టి ఫ్లాట్లు నిర్మించి ఇవ్వడం అన్నమాట. అపార్ట్మెంటులో ఫ్లాట్ చదరపు అడుగు ధర రూ.3వేల నుంచి రూ.5వేల లోపు నిర్ణయించి, నిర్మాణానికి ముందే చెల్లించే పక్షంలో ఇలా తక్కువ ధరకు ఇస్తామని చెబుతూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ తరహా వెంచర్లు హైదరాబాద్ పరిసరాల్లో వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తవుతున్నప్పటికీ మోసపోయిన వాళ్లే అధికంగా ఉంటుండటం గమనార్హం. డబ్బులు చెల్లించినప్పటికీ సరైన సమయంలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బిల్డర్ల చుట్టూ కోర్టులు, పురపాలక సంస్థలు, ‘రెరా’ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. నోటీసులకే పరిమితమవుతున్న ‘రెరా’రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడం, వినియోగదారుడి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ‘రెరా’ను అమల్లోకి తెచ్చింది. అయితే ఇది ఏడాది క్రితం వరకు నామ మాత్రంగానే ఉండిపోయింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సత్యనారాయణ గత సంవత్సరం జూన్లో ‘రెరా’ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తరువాత కొంత కార్యాచరణ మొదలైందని చెప్పవచ్చు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 8 ఫ్లాట్లకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణం జరిపినా, ప్రకటనలు విడుదల చేసినా చర్యలు ఉంటాయని ప్రకటించి, తదనుగుణంగా నోటీసులు జారీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే ప్రీలాంచ్ ఆఫర్ల విషయంలో ‘రెరా’కు సైతం పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేకపోతోంది. ప్రీలాంచ్ ఆఫర్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, ప్రకటనలు విడుదల చేసినా నోటీసులు జారీ చేసి, చర్యలకు స్థానిక పురపాలక, పంచాయతీ సంస్థలకు రిఫర్ చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ప్రీలాంచ్ మోసాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రీలాంచ్ దందాల విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులు కూడా ప్రభుత్వం వీటిపై సరైన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్రామ్గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు. -
భారీ జరిమానాలు విధించిన ‘రెరా’
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది. సాహితీ గ్రూప్నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‘ పేరుతో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేస్తున్న కారణంగా ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్ పేరుతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షేక్పేటలో ప్రాజెక్ట్ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ నేచర్కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది. -
హైదరాబాద్లో రియల్ఎస్టేట్ సంస్థల మాయాజాలం.. రెరా మొద్దు నిద్ర!
ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ కేపీహెచ్బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం. ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్పీ కడ్తాల్లో టెంపుల్ టౌన్ వెంచర్ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం. సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్లు.. రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం. హ్యాపెనింగ్ ప్లేస్లలోనే ఎక్కువ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. ప్రీలాంచ్ ప్రాజెక్ట్ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. -
రెరాతో రియల్ దందాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ దందాలకు ఆస్కారం లేకుండా టీఎస్ రెరా (తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) కృషి చేస్తుందని ‘రెరా’ చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. ’’ రాష్ట్రంలో 598 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ అయినా, 8 ఫ్లాట్లను మించి నిర్మించే ఏ అపార్ట్మెంట్కు అయినా... రెరా రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ‘ఏ వెంచర్ కోసం కొనుగోలు దారుల నుంచి వసూలు చేశారో.. ఆ మొత్తంలో 70 శాతం అదే వెంచర్లో ఖర్చు చేయాలి. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మాత్రమే అగ్రిమెంట్ సమయంలో చెల్లించాలి. ప్రాజెక్టు ప్లాన్ మార్చాలన్నా... కొనుగోలు దారుల్లో మూడింట రెండొంతుల మంది అనుమతి తప్పనిసరి’... ఇలాంటి నిబంధనలన్నింటినీ తప్పనిసరి చేసేందుకు ‘రెరా’ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ‘రెరా’ నిబంధనలకు లోబడే.. ప్రతీ ప్రాజెక్టు రియల్ వెంచర్ అయినా, భారీ అపార్ట్మెంట్ అయినా.. ఒప్పందాన్ని ఉల్లంఘించి, ముందుగా చెప్పిన దానికి భిన్నంగా నిర్మాణం జరిపినా, పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా, సౌకర్యాలు కల్పించకపోయినా ‘రెరా’ చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో ఏమూలన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినా, అపార్ట్మెంట్ కట్టినా ‘రెరా’ వద్ద ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించాలి. దీంతో కొనుగోలుదారుడికి, రియల్ వ్యాపారికి అనుసంధానంగా ఈ సంస్థ పనిచేస్తుంది. 2017లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,805 వెంచర్లు, ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ‘రెరా’ వద్దకు రాగా, అందులో 6,770కి అనుమతులు లభించాయి. మరో 35 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా ఈ దరఖాస్తులను కూడా పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సైతం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే ‘రెరా’ చట్టం ప్రకారం రియల్ వెంచర్లు, ఫ్లాట్లతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు (బ్రోకర్లు) కూడా ‘రెరా’ వద్ద రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఇప్పటి వరకు 2,912 మంది ఏజెంట్లు రిజిస్టర్ కాగా, మిగతా వారిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ సత్యనారాయణ సూచించారు. కాగా, గతంలో జరిగిన రియల్ దందాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఆ లావాదేవీలపైనా విచారించి తప్పు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ..
Oldest Real Estate Agent: వయసు శరీరానికే కానీ ఉత్సాహానికి కాదు.. వృద్ధాప్యం దేహానికే కానీ నిరంతరం పనిచేసే తత్వానికి కాదు.. అని నిరూపిస్తున్నారు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ముంబైలోని ములుండ్ మైక్రో-మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎస్ఎం మాల్డే. ఓల్డెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మే 20న మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారేరా) నిర్వహించిన యోగ్యత పరీక్షలో 74 ఏళ్ల వయసులో ఉత్తీర్ణులయ్యారు. 75 శాతం మార్కులు సాధించారు. మాల్డే నాలుగు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఈ వయసులో పరీక్ష ఎందుకు? ఈ వయసులో మాల్డే పరీక్ష ఎందుకు రాశారో మనీ కంట్రోల్ వార్తా సంస్థకు తెలియజేశారు. తాను పరీక్ష రాయడానికి కారణాలు కేవలం రెండే రెండు. ఒకటి ఈ పరీక్ష ఉత్తీర్ణులైనవారికి అధీకృత రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా గుర్తిస్తుంది. రెండోది మరికొన్ని ఏళ్లపాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేయాలనేది. తాను ఇన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్న తనకు అధీకృత గుర్తింపు లేదని, ఈ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాక ఇప్పుడు తనకు గుర్తింపు లభిస్తుందని మాల్డే చెబుతున్నారు. మహారేరా మొదటి బ్యాచ్ పరీక్షకు మాల్డే హాజరయ్యారు. దీని ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అప్పుడు కొంత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తాను కోలుకుని మళ్లీ తన వృత్తిలోకి వచ్చేశానని, మంచి ఇల్లు కొనాలనుకునేవారికి మంచి సలహాలు, సూచనల ద్వారా సహాయం అందిస్తుంటానని మాల్డే పేర్కొన్నారు. తనకు వ్యాపారం అన్నది ప్రాధాన్యం కాదని, కొనుగోలుదారులకు సరైన గైడెన్స్ ఇవ్వాలన్నది తన ప్రథమ సంకల్పమని వివరించారు. అందుకు తనకు ముంబై ప్రాంతంలో మంచి పేరు ఉందని చెప్పారు. చిన్న గది నుంచి ప్రీమియం అపార్ట్మెంట్ వరకు.. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వృత్తిలో తన ప్రయాణం గురించి మాల్డే మాట్లాడుతూ.. తాను ఒక చిన్న గదిలో నివసించానని, ఈ రోజు ములుండ్ ప్రాంతంలో ప్రీమియం అపార్ట్మెంట్లో ఉంటున్నానని గర్వంగా చెప్పారు. 750 చదరపు అడుగుల కార్పెట్తో కూడిన 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అది. తనకు గుర్తింపుతోపాటు అన్ని ఇచ్చిన తన వృత్తికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా మాల్డే కుమార్తె యూకేలో ఉంటున్నారు. తన 40 ఏళ్ల రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కెరీర్లో మాల్డే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో 20,000కుపైగా లావాదేవీలు చేసుంటారు. ఇప్పటికీ నెలలో కనీసం మూడు లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నారాయన. వీటిలో ఒకటి తన కోసం, మరొకటి తన ఉద్యోగుల ఖర్చుల కోసం, మిగిలినది తన ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసమని మాల్డే వివరించారు. కాగా మహారేరా మే 20 న నిర్వహించిన యోగ్యత పరీక్షకు హాజరైనవారిలో 95 శాతం ఉత్తీర్ణులయ్యారని మే 30న ప్రకటించింది. మొదటి బ్యాచ్ పరీక్షకు 423 మంది హాజరుకాగా 405 మంది ఉత్తీర్ణులయ్యారు. గృహ కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వారిధిగా వ్యవహరించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈ పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది మహారేరా నమోదిత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ రిజిస్ట్రేషన్ను వీరు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➦ పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
‘రెరా’ చైర్పర్సన్గా సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్పర్సన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్కుమార్ కూడా రెరా చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన్ను జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపు సబబేనని, అక్కడకు వెళ్లిపోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. రెరా చైర్మన్ పదవి ఖాళీ అయింది. రెరా చైర్మన్తోపాటు సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. చైర్మన్, సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 (శుక్రవారం)తో గడువు ముగిసింది. ఇప్పటికే పలువురు మాజీ సీఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, టౌన్ప్లానింగ్లో విశేష అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడానికి కనీసం నెలరోజులు పడుతుందని భావిస్తున్నారు. కొత్త వారిని నియమించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రెరా చైర్పర్సన్గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
కౌన్ బనేగా ‘రెరా’ చైర్మన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్గా ఎవరు నియమితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఎస్కే జోషి సహా పలువురు పదవిలో ఉన్న, పదవీ విరమణ పొందిన అధికారులు చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు కారణం. ఈనెల 3తో దరఖాస్తు గడవు ముగియనుంది. ఇప్పటికే 50కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్లు చిరంజీవులు, బుసాని వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారులు కూడా బరిలో ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్, టీఎస్ రెరా మాజీ చైర్మన్రాజేశ్వర్ తివారీ ఈసారి దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఎంపిక ఎలా ఉంటుందంటే.. టీఎస్ రెరాకు చైర్మన్, సభ్యుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిబ్రవరి 17ను గడువుగా విధించినా ఆ తర్వాత మార్చి 3 వరకూ పొడిగించింది. రెరా చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అదనపు కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు చైర్మన్ పదవికి అర్హులు. వచ్చిన దరఖాస్తుల్లోంచి రెండు పేర్లను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. అందులోంచి ఒకర్ని ప్రభుత్వం చైర్మన్గా నియమిస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎస్ సోమేశ్కుమార్ లాబీయింగ్ చేశారని, రాష్ట్ర పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా సోమేశ్ పేరు లాంఛనమే అని రియల్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్గా నియమితులైన వాళ్లు ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్లోనే.. స్థిరాస్తిరంగ నియంత్రణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని రూపొందించింది. అయితే రాష్ట్రంలో మాత్రం రెండేళ్లు ఆలస్యంగా 2018లో రెరాను అమల్లోకి తెచ్చారు. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తిస్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు అథారిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయలేదు. ఇలా అథారిటీని ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్, తెలంగాణ ఉండటం గమనార్హం. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, టీఎస్ఐఐసీల నుంచి అనుమతి పొందిన అన్ని నిర్మాణ ప్రాజెక్ట్లు టీఎస్ రెరా పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రెరాలో 5 వేలకుపైగా ప్రాజెక్ట్లు నమోదయ్యాయి. -
నిర్మాణ ప్లాన్స్లో డిజిటల్ ఇన్ఫ్రాను చేర్చాల్సిందే!
న్యూఢిల్లీ: భవంతుల నిర్మాణ ప్రణాళికల్లో నీరు, విద్యుత్, గ్యాస్ మొదలైన వాటికి సదుపాయాలు కల్పించినట్లుగానే డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రా (డీసీఐ)కి కూడా చోటు కల్పించాలని ప్రభుత్వానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. డీసీఐ కల్పన, నిర్వహణ, అప్గ్రెడేషన్ తదితర అంశాలను కూడా తప్పనిసరిగా పొందుపర్చేలా చూడాలని సూచించింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ చట్టం రెరాలో తగు నిబంధనలను చేర్చాలని పేర్కొంది. ‘డిజిటల్ కనెక్టివిటీకి సంబంధించి భవంతులకు రేటింగ్’ అంశంపై ప్రభుత్వానికి ఈ మేరకు ట్రాయ్ సిఫార్సులు చేసింది. అపార్ట్మెంట్లు లేదా రియల్టీ ప్రాజెక్టుల్లో ఏదో ఒక నిర్దిష్ట టెల్కో గుత్తాధిపత్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వైర్లెస్ పరికరాలను ఇన్స్టాల్ చేయడం టెలికం లేదా ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు హోల్డర్ బాధ్యతగా ఉంటుందని ట్రాయ్ తెలిపింది. బిల్డింగ్ల్లో డీసీఐ ప్రస్తుత ప్రమాణాలు, ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు అప్పగించాలని పేర్కొంది. డిజిటల్ సేవల పటిష్టంపై త్వరలో చర్చాపత్రం దేశీయంగా డిజిటల్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోదగిన చర్యలపై కూడా ట్రాయ్ దృష్టి సారిస్తోంది. డివైజ్లు, కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యతపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని రాబోయే నెలల్లో విడుదల చేయనున్నట్లు ఇండియా డిజిటల్ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు. దేశవ్యాప్తంగా టెల్కోలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డివైజ్ల రేట్లు అధికంగా ఉన్నాయని సామాన్య ప్రజానీకం భావిస్తున్న నేపథ్యంలో వాఘేలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే 25 ఏళ్లలో దేశీయంగా డిజిటల్ వినియోగాన్ని వేగవంతం చేయాలంటే డిజిటల్ గవర్నెన్స్ మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీపై విధానాల రూపకల్పన వంటి ఎనిమిది కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని వాఘేలా చెప్పారు. ప్రజోపయోగకరమైన ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ వ్యవస్థలతో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు మన దేశ పరిస్థితులకు ఉపయోగపడేలా వినూత్న డిజిటల్ ఆవిష్కరణలను రూపొందించాల్సిన అవసరం ఉందని వాఘేలా తెలిపారు. -
త్వరలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్థి లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటైన ‘రెరా’కు త్వరలో పూర్తిస్థాయి కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో న్యాయబద్ధమైన ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (రెరా)లను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా స్థాయి అధికారి చైర్మన్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇద్దరు పూర్తిస్థాయి సభ్యులు ఉంటారు. అయితే ‘రెరా’కు ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్కుమార్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రెరాకు వచ్చే దరఖాస్తుల పరిశీలన, అనుమతులు అన్నీ ఆయన నేతృత్వంలోనే సాగేవి. కాగా రియల్ వెంచర్లు, ఫ్లాట్ల నిర్మాణంలో ‘రెరా’ నిబంధనలకు తిలోదకాలిచ్చి పలు సంస్థలు, రియల్ వ్యాపారులు దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పురపాలక శాఖ ఆసక్తి, అర్హత గల వారి నుంచి చైర్పర్సన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తును ఆహ్వానించింది. ఫిబ్రవరి 17వ తేదీలోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని కోరింది. రెరా వెబ్సైట్, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తుదారులకు అవసరమైన అర్హతలు, వేతనం వివరాలన్నీ ఉన్నాయి. -
రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: గృహ కొనుగోలు దారుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. తమ అధికార పరిధిలో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) (రెరా) చట్టం, 2016 నిబంధనల అమలుపై కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సోమవారం ఆదేశించింది. రెరా చట్టం కింద నోటిఫై చేయబడిన అమ్మకపు నిబంధనల ఒప్పందం, వాటి అమలు గురించి నిర్దిష్ట సమాచారం కోరుతూ 2022 మార్చిలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిందని, అయితే ఇప్పటి వరకు కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే స్పందించాయని జస్టిస్ డివై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘రియల్టీకి సంబంధించి కేంద్రం నిర్వహించే కసరత్తును సులభతరం చేయడానికి, మే 15 లేదా అంతకు ముందు రెరా నిబంధనలపై లేవనెత్తిన ప్రశ్నలకు ప్రతిస్పందించాలని మేము అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తున్నాము‘ అని బెంచ్ పేర్కొంది. రాష్ట్రాల నుండి సంబంధిత సమాచారాన్ని స్వీకరించిన తర్వాత అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఈ అంశంలో అమికస్ క్యూరీ దేవాశిష్ భారుకా ధర్మాసనానికి ఒక నివేదిక సమర్పిస్తారని కూడా బెంచ్ పేర్కొంది. కేసు తదుపరి విచారణను జూలై మూడవ వారానికి వాయిదా వేసింది. అమికస్ దేవాశిష్ ఏమి చెప్పారంటే... రెరా నిబంధనలపై నివేదిక ఎంత వరకూ వచ్చిందని అమికస్ను తొలుత బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు కొన్ని స్పందనలు వచ్చాయని, వాటిలో కొన్ని వైరుధ్యాలు కనిపించాయని ఈ సందర్భంగా అమికస్ తెలిపారు. ఈ వైరుధ్యాలకు కారణాలు ఏమిటని తాము కోరినట్లు కూడా ఆయన వివరించారు. కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలకు కేవలం ఐదు రాష్ట్రాలే స్పందించాయని తెలిపారు. నివేదిక సిద్ధమైన తర్వాత దానిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశిస్తామని ఆదేశిస్తామని ఈ సందర్భంగా బెంచ్ పేర్కొంది. నోటిఫై చేయని కొన్ని రాష్ట్రాలు... రెరా అమల్లోకి వచ్చిన తర్వాత 2016లో ‘అగ్రిమెంట్ ఫర్ సేల్’ ముసాయిదాను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపి కేంద్రం పంపి వాటిపై అభిప్రాయాలను కోరింది. కొన్ని రాష్ట్రాలు వీటిని నోటిని చేశాయి. పశ్చిమ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు అసలు ఈ నిబంధనలను నోటిఫై చేయలేదు. రియల్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించిందని, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా రాష్ట్రాలు కొన్ని మార్పులు చేసి నోటిఫై చేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ భాటి గతంలో కోర్టుకు తెలియజేశారు. మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మోడల్ బిల్డర్–కొనుగోలుదారుల ఒప్పందం ఆవశ్యకతను ఉన్నత న్యాయస్థానం జనవరి 17న ఉద్ఘాటించింది. రెరా నిబంధనల ప్రకారం ఏకరీతి నిబంధనలను రూపొందించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దీనిని రాష్ట్రాలకు వదిలివేయడానికి బదులుగా మోడల్ బిల్డర్–బైయర్ ఒప్పందం, మోడల్ ఏజెంట్–కొనుగోలు ఒప్పందాన్ని దేశం మొత్తానికి వర్తింపజేసేలా చర్చలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని కోరుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రత్యేకించి ప్రాథమిక నిబంధనలు, షరతుల విషయంలో కొంత ఏకరూపత ఉండేలా చర్యలు అవసరమని తెలిపింది. ఫ్లాట్ కొనుగోలుదారులు దోపిడీకి గురికాకుండా ఉండేలా కేంద్ర సలహా మండలి రూపొందించిన మోడల్ బిల్డర్–కొనుగోలుదారుల ఒప్పందాన్ని రూపొందించడం ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశమని పేర్కొంది. కేంద్రం అఫిడవిట్ ఏమి చెబుతోందంటే.. ఈ వ్యాజ్యంలో కేంద్రం తన అఫిడవిట్ను దాఖలు చేస్తూ, ‘‘రియల్టీకి సంబంధించి ఒక బలమైన నియంత్రణ యంత్రాంగం ఉంది. గృహ కొనుగోలుదారుల హక్కులు, ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్న రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనల ప్రకారం విక్రయానికి సంబంధించిన ముసాయిదా ఒప్పందం ఇప్పటికే రూపుదిద్దుకుంది. ప్రమోటర్లలో జవాబుదారీ, పారదర్శక విధానాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం’’ అని పేర్కొంది. ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్, అమ్మకం ముందే రియల్టీ ప్రాజెక్టుల రిజిస్టేషన్ను, సకాలంలో యూనిట్ల డెలివరీని చట్టం నిర్దేశిస్తున్నట్లు తెలిపింది. నిధుల మళ్లింపును నివారించడానికి పటిష్ట నియంత్రణలు విధించినట్లు వివరించింది. వినియోగదారుల రక్షణ కోసం రియల్ ఎస్టేట్ రంగంలో మోడల్ బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్ని కలిగి ఉండటం చాలా ముఖ్యమని గతేడాది అక్టోబర్ 4న సుప్రీం కోర్టు పేర్కొంది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. పిల్ నేపథ్యం... రెరా చట్టం కింద వివిధ రాష్ట్రాలు రూపొందించిన నిబంధనలు గృహ వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఈ విషయంలో గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 2016లో కేంద్రం రూపొందించిన నిబంధనలకు– రాష్ట్రాలు రూపొందించిన నిబంధనలకు ఏమైనా తేడాలున్నాయా అని పరిశీలించి 2022 మే మొదటి వారంలోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ విషయంలో న్యాయవాది దేవాశిష్ భారుకాను అమికస్ క్యూరీగా (కేసు విచారణలో న్యాయ సలహాదారు) నియమించింది. రాష్ట్రాలు రూపొందించన నిబంధనలను పరిశీలించడానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సహాయం చేయాలని దేవాశిశ్ భారుకాకు సూచించింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు బిల్డర్–బయ్యర్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) విచారణలో భాగంగా అత్యున్నత ధర్మాసనం ఈ చొరవ తీసుకుంది. రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఏకరూపత ఒప్పందాలను అన్ని రాష్ట్రాలూ అమ లు చేసేలా చర్యలు ఉండాలని ఆయన కోరారు. రెరా చట్టం, 2016 ప్రకారం కస్టమర్లను రక్షించడానికి, రియల్టీ రంగంలో పారదర్శకతను తీసుకురావడానికి బిల్డర్లు, ఏజెంట్, కొనుగోలుదారు ల కోసం మోడల్ ఒప్పందాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి: రియాల్టీ రంగంలో ఈ విభాగానికి భారీ డిమాండ్! -
రియల్ ఎస్టేట్లోకి విదేశీ పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగం విదేశీ ఇన్వెస్టర్లకు కల్పవృక్షంగా మారింది. 2017–21 సంవత్సరాల మధ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి 23.9 బిలియన్ డాలర్ల మేర (రూ.1.79 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్టు కొలియర్స్–ఫిక్కీ నివేదిక తెలిపింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన పెట్టుబడులే 60 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) తీసుకురావడం విదేశీ ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు’ పేరుతో ఈ నివేదిక విడుదలైంది. 2016లో నియంత్రణ పరమైన సంస్కరణలను (రెరా) చేపట్టడంతో భారత రియల్టీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూలత ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ తెలిపింది. ‘‘పారదర్శకత లేమి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు గతంలో భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండేవారు. 2017 నుంచి ఎంతో ఆశావహంతో పెట్టుబడులు పెట్టడం మొదలైంది’’ అని కొలియర్స్ వివరించింది. పెట్టుబడుల వివరాలు.. 2017–21 కాలంలో భారత రియల్టీలోకి 23.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2012–16 మద్య వచ్చిన పెట్టుబడులు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2012–21 మధ్యలో భారత్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మొత్తం 64 శాతంగా ఉంది. 2017–21 మధ్య విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్కు పెద్ద పీట రియల్ ఎస్టేట్లో విభాగాల వారీగా పరిశీలిస్తే.. 2017–21 మధ్య మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఆఫీస్ స్పేస్ వాటా 43 శాతంగా ఉంది. మిశ్రమ వినియోగ రంగం రెండో స్థానంలో, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫీసు ప్రాజెక్టుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2017–21 మధ్య ఏటా 2 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. నివాసిత ప్రాజెక్టుల పట్ల అప్రమత్తత ఎన్బీఎఫ్సీ రంగంలో సంక్షోభం తర్వాత గృహ రంగం పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నివాస ఆస్తుల వాటా మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల ప్రాపర్టీ పెట్టుబడుల్లో 2017–21 మధ్య 11 శాతానికి తగ్గింది. అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఇది 37 శాతంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్ల వైఖరికి అద్దం పడుతోంది. ఆల్టర్నేటివ్ అసెట్స్లోకి వచ్చిన పెట్టుబడులు బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. డేటా సెంటర్ల బూమ్ డేటా స్థానికంగానే నిల్వ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు, డేటా సెంటర్లకు మౌలిక రంగం హోదా తాజాగా కల్పించడం దేశంలో నూతన డేటా సెంటర్ల బూమ్కు దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. -
తెలంగాణ నంబర్4
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యకలాపాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. రెరాలో ప్రాజెక్ట్ల నమోదులో దేశంలోనే తెలంగాణ నాల్గో స్థానంలో నిలిచింది. టీఎస్ రెరాలో 4,002 రియల్టీ ప్రాజెక్ట్లు, 2,017 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,248 ప్రాజెక్ట్లు, 151 మంది మధ్యవర్తులు నమోదయ్యా రు. దేశవ్యాప్తంగా 74,088 ప్రాజెక్ట్లు, 58,790 మంది ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 33,154 ప్రాజెక్ట్లు 11,231 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. గుజరాత్లో 9,689 ప్రాజెక్ట్లు, 2,695 మంది మధ్యవర్తులు, మధ్యప్రదేశ్లో 4,016 ప్రాజెక్ట్లు 935 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్తాన్, కర్ణాటక రెరాలో వెయ్యికి పైగా ప్రా జెక్ట్లు రిజిస్టరయ్యాయి. అత్యల్పంగా ఎన్సీఆర్ రెరాలో 34, పాండిచ్చేరి రెరాలో 194, ఉత్తరాఖండ్లో 332 ప్రాజెక్ట్లు నమోదయ్యాయి. శాశ్వత అథారిటీ లేదు.. తెలంగాణ, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే శాశ్వత రెరా అథారిటీ లేదు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఇంటెర్మ్ రెరా అథారిటీనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రెరాను ఏర్పాటు చేయని రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. -
ఖాళీ స్థలం చూపిస్తారు..మొత్తం చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే ఫ్లాట్..!
సాక్షి, హైదరాబాద్: కస్టమర్లకు ఆకాశంలో పిట్టను చూపించి కింద మసాలా నూరిస్తున్నారు డెవలపర్లు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. సాధారణంగా డెవలపర్ చదరపు అడుగు (చ.అ.) రూ.5 వేలకు విక్రయిస్తుంటాడు. ప్రీ లాంచ్, యూడీఎస్ స్కీమ్స్లో వంద శాతం సొమ్ము చెల్లిస్తే మాత్రం రూ.3 వేలకే అమ్ముతారు. నిర్మాణ అనుమతులు వచ్చి, రెరాలో నమోదయ్యాక ఇందులో ధర రూ.5,500లకు చేరుతుంది. ఎందుకంటే ఆయా అనుమతుల కోసం డెవలపర్ కొంత ఆమ్యామ్యాలు సమర్పించుకుంటాడు కాబట్టి. ఈ ఖర్చును ధరను పెంచేసి భర్తీ చేసుకుంటాడు డెవలపర్. ఇదే ప్రాజెక్ట్లో ప్రీలాంచ్, యూడీఎస్లో కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు చ.అ. రూ.3,500 చొప్పున రీసేల్కు పెడతాడు. కొనేందుకు వచ్చిన ఏ కస్టమర్ అయినా రీసేల్ ప్రాపర్టీకే ఆకర్షితుడవుతాడు. దీంతో డెవలపర్ వాటా ఫ్లాట్లు విక్రయం కాక చేతిలో నిర్మాణ వ్యయం లేక పనులను నిలిపివేస్తాడు. దీంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎవరు నిర్మిస్తున్నారంటే? చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ఇదే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్లను చేపడుతున్నాయి. ఇటీవల కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా యూడీఎస్ స్కీమ్తో పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాయి. ఇటీవలే నానక్రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లిహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ ఇదే తరహా విక్రయాలు చేపడుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా యూడీఎస్ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు లేదా స్థలాల విక్రయాల ప్రచార దందా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. ప్రధాన కంపెనీలు తమ పాత కస్టమర్లకు ఇంటర్నల్ సేల్స్ చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. 100 శాతం పేమెంట్తో ఫ్లాట్లను అమ్మించే ఏజెంట్లకు అధిక శాతం కమీషన్ను అందిస్తున్నాయి. ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్ట్లన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరంతా కేవలం తమ కమీషన్ గురించి ఆలోచిస్తున్నారే తప్ప.. రేపొద్దున సదరు బిల్డర్ అపార్ట్మెంట్ను కడతాడా? లేదా అని ఆలోచించట్లేదు. పొరపాటు బిల్డర్ ప్రాజెక్ట్ను కట్టకపోయినా.. సమయానికి డెలివరీ చేయకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే? ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్)ను రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా.. యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్లకు ఆకర్షితులవుతున్నారు. ఈ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు టీఎస్ రెరాకు 70 వేలకు పైగానే ఫిర్యాదులు అందాయి. కానీ, ఒక్క కేసు నమోదు చేయలేదు. కేవలం నోటీసులు జారీ చేసి జరిమానాలతోనే సరిపెడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెçసులుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే. ప్రభుత్వం ఏం చేయాలంటే? ► హెచ్ఎండీఏ, రెరా విభాగాలకు శాశ్వత చైర్మన్లను నియమించాలి. టౌన్ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. రెరా అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. ► సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్ చేసేలా ఉండాలి. ► రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి. ► రెరా అధికారులు, సిబ్బంది ఆఫీసులో కూర్చోవడానికి బదులు శివారు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటన చేయాలి. అప్పుడే ఏయే బిల్డర్లు మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది. ► ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్బుక్, ఇన్సాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి. ► ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండాలి. రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబరు క్రియేట్ చేసి.. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇ వ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
టీఎస్ రెరాలో 3,630; ఏపీ రెరాలో 2,049
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అండ్ డెవలప్మెంట్ చట్టం (రెరా) అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,049 ప్రాజెక్ట్లు, 149 మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటివరకు 158 ఫిర్యాదులను ఏపీ రెరా పరిష్కరించింది. అలాగే తెలంగాణ రెరాలో 3,630 ప్రాజెక్ట్లు, 1,891 ఏజెంట్లు రిజిస్టర్ కాగా.. ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కరించలేదు. దేశంలో రెరా అమల్లోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో 71,307 ప్రాజెక్ట్లు, దేశవ్యాప్తంగా 56,177 మంది ఏజెంట్లు నమోదయ్యారని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రెరాలో అత్యధికంగా ప్రాజెక్ట్లు రిజిస్టరయ్యాయి. 2019 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మహారాష్ట్రలో 31,664, గుజరాత్లో 9,272, కర్ణాటక రెరాలో 4,497 ప్రాజెక్ట్లు నమోదయ్యాయి. గత రెండేళ్లలో ఆయా రాష్ట్రాల రెరాలో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్లలో 49 శాతం, ఫిర్యాదుల పరిష్కారంలో 128 శాతం వృద్ధి నమోదయింది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల రెరా అథారిటీలు 78,903 ఫిర్యాదులను పరిష్కరించాయి. రెరాకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఉత్తరప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు ముందంజలో ఉన్నాయి. యూపీలో 30,990 కేసులు, హర్యానాలో 16,864 కేసులు పరిష్కారమయ్యాయి. ఇదీ రెరా పరిస్థితి.. నాగాలాండ్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి. 30 రాష్ట్రాలు, యూటీలు రెరా అథారిటీని ఏర్పాటు చేశాయి. ఇందులో 25 రెగ్యులర్ అథారిటీ కాగా, 5 మధ్యంతర అథారిటీలున్నాయి. జమ్మూ అండ్ కశ్మీర్, లడక్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి కానీ అథారిటీలను ఏర్పాటు చేయలేదు. కాగా 28 రాష్ట్రాలు, యూటీలు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, లడక్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, పశ్చిమ బెంగాల్లు ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాలు రెరా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నిర్మాణంలోని ప్రాజెక్ట్లూ రెరాలోకి.. సుప్రీంకోర్టు రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అండ్ డెవలప్మెంట్ చట్టం–2016 పరిధిని విస్తృతం చేసింది. అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లు రెరా పరిధిలోకి వచ్చే వరకూ కంప్లీషన్ సర్టిఫికెట్ పొందలేరని వ్యాఖ్యానించింది. అంటే నిర్మాణం లో ఉన్న ప్రాజెక్ట్లను రెరా పరిధిలోకి చేర్చకుండా రెరా నిబంధనలను బలహీనపరిచిన రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్ట్లను రెరా పరిధిలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెరా జరిమానా విధించిన డెవలపర్లు అప్పీల్కు వెళ్లినా సరే.. జరిమానా మొత్తం లో 25 శాతం రెరా వద్ద డిపాజిట్ చేయాలి. నిలిచిపోయిన ప్రాజెక్ట్లు పూర్తవుతాయి.. సుప్రీం ఆదేశాల మేరకు నిర్మాణంలోని ప్రాజెక్ట్ లు రెరా పరిధిలోకి వస్తే వచ్చే రెండేళ్లలో గృహ నిర్మాణ ప్రాజెక్ట్లు మరింత వేగంగా పూర్తవుతా యని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు రెరా పరిధిలోకి రాని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేయడంపై దృష్టిసారించారన్నారు. దీంతో కొన్నేళ్లుగా నిర్మాణం జరుగుతున్న, మధ్యలో నిలిచిపోయిన గృహాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2014, అంతకంటే ముందు ప్రారంభమై ఇప్ప టికీ పూర్తి కాకుండా 6.29 లక్షల గృహాలున్నాయి. -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్స్పేస్, పార్క్లు, సెట్బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
అవగాహన లేకుండా పెట్టుబడులొద్దు
హోల్సేల్, రిటైల్ వ్యాపార విధానాలు ఎలా ఉంటాయో.. సేమ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) ప్రాజెక్ట్లుంటాయి. హోల్సేల్లో పెద్ద మొత్తంలో మాత్రమే విక్రయిస్తే.. కొనుగోలుదారులకు ఎంత కావాలంటే ఆ స్థాయిలో చిన్న మొత్తంలో విక్రయించడం రిటైల్ వ్యాపార విధానం. ఇదే తరహాలో యూడీఎస్ ప్రాజెక్ట్లలో విక్రయాలు చేస్తుంటారు డెవలపర్లు. ఎప్పుడైతే ఎకరాల నుంచి గజాల చొప్పున కొనుగోళ్లు మొదలయ్యాయో.. అప్పటినుంచి యూడీఎస్ ప్రాజెక్ట్లకు ఆకాశమే హద్దుగా మారింది. పెట్టుబడుల మొత్తాన్ని బట్టి స్థలాన్ని విక్రయిస్తుండటం, సామాన్య, మధ్యతరగతి వర్గాలూ యూడీఎస్ ప్రాజెక్ట్లపై ఆసక్తి చూపిస్తుండటం దీనికి ప్రధాన కారణం. సాక్షి, హైదరాబాద్: యూడీఎస్ ప్రాజెక్ట్లనేవి అనాదిగా ఉన్నవే కానీ, పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) తర్వాత నగదు కొరత కారణంగా చిన్న మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడం మొదలైంది. కోట్ల నుంచి లక్షలకు, ఎకరాల నుంచి గజాల్లోకి ఎప్పుడైతే పెట్టుబడులు రూపాంతరం చెందాయో అప్పటి నుంచి యూడీఎస్ ప్రాజెక్ట్లు కోకొల్లలయ్యాయి. గతంలో ఎకరాల చొప్పున చేసే యూడీఎస్ ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు ఎందుకంటే పెట్టుబడులూ పెద్దగానే ఉంటాయి కాబట్టి. దీంతో డెవలపర్లూ ఆ తరహా ప్రాజెక్ట్లూ పెద్దగా చేసేవారు కాదు. కానీ, ఎప్పుడైతే ఎకరాలకు బదులుగా గజాల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారో అప్పటి నుంచే బిల్డర్లకు కూడా యూడీఎస్ ప్రాజెక్ట్లపై మోజు పెరిగింది. అవగాహన లేకపోతే.. సామాన్యులు, మధ్యతరహా వర్గాలు కూడా యూడీఎస్ ప్రాజెక్ట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తే అంత త్వరగా డెవలపర్లకు చేతిలో నగదు చేరుతుంది. ఇచ్చిన హామీ ప్రకారం బిల్డర్ యూడీఎస్ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. కానీ, నిర్మాణ అనుమతుల్లోనో లేక లే–అవుట్ ప్లాన్, డిజైన్స్లోనో లేక ఇతరత్రా ఇబ్బందులు తలెత్తితే మాత్రం బిల్డర్తో పాటూ ఆ ప్రాజెక్ట్లో పెట్టుబడులు పెట్టిన వారంతా చిక్కుల్లో పడిపోతారు. సాధారణంగా కోట్లలో పెట్టుబడులు పెట్టేవారికి యూడీఎస్ ప్రాజెక్ట్ల విధానాలపై అనుభవం ఉంటుంది. లేకపోతే ప్రొఫెషనల్స్, నిపుణుల సలహా తీసుకోనైనా పెట్టుబడి నిర్ణయం తీసుకుంటుంటారు. అదే సామాన్య, మధ్య తరగతి వారికి ఈ తరహా ప్రాజెక్ట్లపై అవగాహన ఉండదు. తక్కువ ధరకు వస్తుందనేదొక్కటే ఆలోచిస్తారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏ మాత్రం చిన్న సమస్య తలెత్తినా నెత్తినోరు బాదుకున్నా ప్రయోజనం ఉండదు. యూడీఎస్ ప్రాజెక్ట్లు ఎలా ఉంటాయంటే.. స్థలం కొనుగోలు, ప్లాన్స్, డిజైన్స్, అనుమతులు, నిర్మాణ సామగ్రి సమీకరణ.. ఇలా ఏ అంశంలోనూ డెవలపర్ జేబు నుంచి డబ్బులు పెట్టడు. జస్ట్, స్థల యజమానితో ఒప్పందం చేసుకొని ప్రాజెక్ట్ను మార్కెట్లో పెట్టేస్తాడు. ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని అందమైన బ్రోచర్లు ముద్రించి కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. వాటిలో కొంత మొత్తాన్ని స్థల యజమానికి ఇస్తూ కాలం గడుపుతుంటాడు. యజమానికి మొత్తం డబ్బు చేరితే తప్ప రిజిస్ట్రేషన్లు జరగవు. ఆ తర్వాతే నిర్మాణ అనుమతులు, నిర్మాణ పనులు మొదలవుతాయి. నిర్మాణ అనుమతుల్లో ఏమైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సదరు బిల్డర్ ఆ ప్రాజెక్ట్ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నదే లక్ష డాలర్ల ప్రశ్న. స్థల సమీకరణ ఒక్కటే సరిపోదు.. ప్రాజెక్ట్ను చేపట్టాలంటే స్థల సమీకరణ అనేది చాలా చిన్న పార్ట్. దాని కంటే కీలకమైనవి.. విధానం, డిజైన్స్, అనుమతులు, ఆర్థిక శక్తి, విస్తృతమైన మార్కెటింగ్ బృందం ఉండాలి. చాలా మంది కొనుగోలుదారులకు డెవలపర్ పేరు మీద స్థలం తాలూకు కాగితాలు ఉన్నాయో లేవో చూస్తారంతే, మిగిలిన విషయాలు పట్టించుకోరు. ఇదే యూడీఎస్ డెవలపర్లకు అవకాశంగా మారిపోతుంది. న్యాయపరమైన అవగాహన, మార్కెట్ను అధ్యయనం, మంచి కస్టమర్ బేస్.. ఇవేవీ లేకుండానే ‘ఎవడితో కత్తి.. ఎవడితో నెత్తి’అన్నట్లు ఏమాత్రం అనుభవం లేనివాళ్లు బిల్డర్లుగా మారి యూడీఎస్ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. కనీసం ఇటుక కూడా పట్టుకోవడం రాని వాళ్లు కూడా రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తుతున్నారు. డెవలపర్ ట్రాక్ రికార్డ్ను పరిశీలించకుండానే ధర తక్కువ అనగానే సంతోషంతో గంతేసి పెట్టుబడులు పెడుతుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో డెవలపర్ విఫలమై, నిర్మాణం ఆగిపోగానే ఇదేదో ప్రభుత్వ తప్పు అన్నట్లు గగ్గోలు పెడుతుంటారు. ఫలానా డెవలపర్ అన్యాయం చేశాడంటూ ప్రభుత్వాన్ని నిందిస్తుంటారు. పశ్చిమ హైదరాబాద్లో ఎక్కువగా.. గత మూడేళ్లుగా హైదరాబాద్లో యూడీఎస్ ప్రాజెక్ట్లు విపరీతమయ్యాయి. కోకాపేట, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్ వంటి స్థలాల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో యూడీఎస్ ప్రాజెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో ధర తక్కువ అనగానే కొనుగోలుదారులు కూడా సులువుగా బుట్టలో పడతారు. ఇలా చాలా మంది కస్టమర్లు అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు. ఆ ఇన్వెంటరీ అంతా ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. స్థల యజమానులు మార్కెట్ను అతిగా ఊహించుకొని డెవలపర్లను ఎక్కువ మార్జిన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ స్థితిగతులను అర్థం చేసుకోవటం లేదు. దీంతో ప్రాజెక్ట్ నిష్పత్తి పెరుగుతుంది. ఈ 12 సూత్రాలు పాటిస్తే సొంతింటికి చేరినట్లే.. డెవలపర్ గత చరిత్ర, ప్రొఫైల్ చెక్ చేయాలి. గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్లు తెలుసుకో వాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి. పాత ప్రాజెక్ట్లలో ధరల వృద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలి. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్లలో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయో కనుక్కోవాలి. ప్రాజెక్ట్ పూర్తయ్యాక కస్టమర్లతో బిల్డర్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. గడువులోగా నిర్మాణం పూర్తి చేస్తాడా? లేదా? తనిఖీ చేసుకోవాలి. బ్రోచర్లో ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తాడా లేదా తెలుసుకోవాలి. డెవలపర్ ఆర్థిక సామర్థ్యం కనుక్కోవాలి. బహుళ ప్రాజెక్ట్లను చేపట్టే బిల్డర్తో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా సమస్యలు తలెత్తినా వేరే ప్రాజెక్ట్లో అయినా సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. నిర్మాణ అనుమతులు, రెరా నమోదు గురించి భౌతికంగా తనిఖీ చేయాలి. ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల రీపేమెంట్ గురించి ఆరా తీయాలి. డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత గురించి కూడా పరిశీలించాలి. -
రియల్టీకి యూడీఎస్ భూతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) భూతం పట్టుకుంది. అవిభాజ్య స్థలం ధర తక్కువే ఉంటుంది కావచ్చు.. కానీ, స్థలానికి సంబంధించి ఏమైనా న్యాయపరమైన చిక్కులొచ్చినా, నిర్మాణ అనుమతులు రాకపోయినా నష్టపోయేది మాత్రం కొనుగోలుదారులే. యూడీఎస్లో కొనుగోలు చేస్తే కలిగే నష్టాలపై కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. రెరాలో నమోదైన ప్రాజెక్ట్లు, రెరా అనుమతి పొందిన ఏజెంట్ల నుంచి మాత్రం కొనుగోళ్లు జరపాలని సూచిస్తుంది. 2017, జనవరి 1వ తేదీ తర్వాత 500 చ.మీ. లేదా 6 యూనిట్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా) నిబంధనలను పాటించాల్సిందే. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసే ప్రాపర్టీ టీఎస్–రెరాలో నమోదైందో లేదో నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవటం ఉత్తమమని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయికి తగ్గ విలువను, సామాన్యుల పెట్టుబడులకు భరోసాను కల్పించే రెరా ప్రాజెక్ట్లలోనే విక్రయాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయని, దీంతో గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన విస్తరణ, వ్యాపార పెట్టుబడులతో రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్లో అధిక శాతం కొనుగోలుదారులు తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు ఉంటారు. వీరికి నిర్ధిష్టమైన వనరులు, రియల్టీ లావాదేవీలపై అవగాహన కాసింత తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కొనుగోలుదారులు బిల్డర్ల ప్రొఫైల్ను పరిశీలించకుండా తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేస్తుంటారని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెరా నమోదిత ప్రాజెక్ట్లలో కొంటేనే కస్టమర్ల కష్టార్జితానికి పూర్తి విలువ చేకూరుతుందని పేర్కొన్నారు. యూడీఎస్లో కొంటే కొనుగోలు లేదా సమీకరణ చేసిన స్థల విలువకు ప్రామాణికత ఉండదు జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతులు ఉండవు. రెరా అథారిటీ వద్ద నమోదు కాదు. స్థలం అమ్మకం అనధికారిక అగ్రిమెంట్ లేదా జీపీఏ ద్వారా చేస్తారు. రెరా లేదా ఇతర సంస్థల నుంచి కొనుగోలుదారులకు రక్షణ ఉండదు. భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేటు తక్కువే కానీ సురక్షితం ఏమాత్రం కాదు. రెరాలో కొంటే సేకరణ లేదా కొనుగోలులో స్థల విలువకు ప్రామాణికత ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉంటాయి. రెరాలో నమోదు అవుతుంది, రెరా నంబర్ కూడా కేటాయిస్తారు. అమ్మకం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే ఉంటుంది. రెరా అథారిటీలోని పలు నిబంధనలు కస్టమర్లకు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి వివాదాలు తలెత్తినా రెరా అథారిటీ పరిష్కరిస్తుంది. ధర ఎక్కువైనా.. ప్రాపర్టీ మాత్రం సురక్షితం. -
ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి
ట్విన్ టవర్స్ కూల్చివేత తీర్పుపై నిర్మాణ సంస్థ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా అన్నారు. రేరా చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ భవనాలు నిర్మించామని తెలిపారు. అంతేకాదు కోర్టు తీర్పు వల్ల తమ కంపెనీపై చెడు ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడాలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల ట్విన్ టవర్స్ నిర్మిచండంపై ఇటు అలహాబాద్ హైకోర్టుతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూడు నెలలల్లోగా ఈ భవనాలను కూల్చేయడంతో పాటు అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ట్విట్ టవర్స్లో 21 దుకాణాలతో పాటు 915 ప్లాట్స్ ఉన్నాయి. చదవండి: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రియాల్టీ రంగానికి పెనుషాక్లా తగిలింది. రేరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ -2016) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంత తీవ్ర స్థాయిలో కోర్టు తీర్పు వెలువడానికి కారణం ఏంటీ. ఇంత భారీ స్థాయిలో తప్పులు చోటు చేసుకుంటుంటే దాన్ని అరికట్టడంలో రేరా ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు రియాల్టీ రంగంలో చర్చకు దారి తీసింది. రేరా సరిపోదా ? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇతర కోర్టులకు కూడా మార్గదర్శనం కానుంది. ఈ తరహా తీర్పులు మరిన్ని వెలువడితే రియల్టీ రంగంలో ఉన్న వారికి సైతం ఇబ్బంది. రియాల్టీలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటీ వీటిని పరిష్కరించాలంటే రేరా లాంటి చట్టాలే సరిపోతాయా? ఈ వ్యాపారంలో ఉన్న వారు, కొనుగోలుదారులు, ఇతర ప్రభుత్వ విభాగాల బాధ్యత ఏంటీ అనే తెర మీదకు వస్తోంది. - రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు ప్రవేశించాలి. అందుకు అర్హతలు ఏముండాలి అనే విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఈ రంగంపై అనుభవం లేకపోయినా తమ బ్లాక్మనీని వైట్ చేసుకునేందుకు రియాల్టీ రంగంలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. వీరికి ప్రాజెక్టును పూర్తి చేయడం మీద కన్న తమ లాభం, ఇతరత్రా వ్యవహరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి వారి వెంచర్లను నమ్మినవారు మధ్యలో మునిగిపోతున్నారు. రేరా చట్టంతో ఈ సమస్య సమసిపోతుందనుకున్నారు. అయితే వాస్తవంలో అలా జరగడం లేదు - బిల్డర్కి కొనుగోలుదారుడికి మధ్య సమస్య తలెత్తిన సందర్భంలో వాటిని పరిష్కరించడంలో రేరాది ప్రేక్షక పాత్రే అవుతుంది. రేరా చట్టంలో ఉన్న నిబంధనలు లీగల్ ఫైట్ టైమ్ని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా బలంగా ఉండే బిల్డర్లతో కొనుగోలుదారులు లీగల్గా ఎక్కువ కాలం పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్ట్రాక్ కోర్టులు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. - సబ్బు బిళ్ల మొదలు బట్టల వరకు ఏదైనా వస్తువును కొనేప్పుడు దాన్ని పరిశీలించి.. బాగుందని నమ్మితేనే కొంటాం. కానీ రియల్ ఎస్టేట్, ఇళ్ల కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కనీసం నిర్మాణం మొదలుకాకముందే బిల్డర్లు అమ్మకాలు మొదలుపెడతారు. వారి ఏజెంట్లు ఆహా ఓహో అని చెబుతారు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుందని తొందరపెడతారు. మరోవైపు బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సైతం లోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించినా సకాలంలో ఇళ్లు చేతికి అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల సొమ్మును ఈఎంఐ, వడ్డీలుగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో కనీసం ప్రభుత్వ విభాగాలు సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. ఇచ్చిన గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయని బిల్డర్కి ఎటువంటి జవాబుదారితనం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేకుండా పోయింది. చదవండి : 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి -
కశ్మీర్లో ఇళ్లు కొనాలంటే?
శ్రీనగర్ : సుందర కశ్మీర్లో ఇళ్లు కొనాలానేది చాలామంది కల. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పుడు కశ్మీర్లో ఇళ్లు కొనడానికి ఉన్న ప్రధాన ప్రతిబంధకం కూడా తొలగిపోయింది. దీంతో అందరి చూపు కశ్మీర్లో ఆస్తులు కొనాలనే దానిపైనే ఉంది. కశ్మీర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే శాంతిస్తాయా? ఆస్తులు కొందామా? అని ఆలోచిస్తున్నారు. దీనిపై ఎకనమిక్ టైమ్స్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం కశ్మీర్లో ఇళ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో వస్తోన్న అమ్మకాల ప్రకటనలు ఎంతవరకు నిజం? అక్కడ నిజంగా రియల్ ఎస్టేట్ అందుకు అనుగుణంగా ఉంటుందా? అంటూ కొన్ని సమాధానాలను వెతికే ప్రయత్నం చేసింది. కశ్మీర్లో ఇళ్లు కొనాలంటే జమ్మూకశ్మీర్ను జమూకశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. ఇక జమ్మూకశ్మీర్ భారత్లోని మిగతా రాష్ట్రాలతో సమానం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని చట్టాలు, నియంత్రణలు కశ్మీర్కు కూడా మిగతా రాష్ట్రాలతో సమానంగా వర్తిస్తాయి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అపెక్స్లాంటి సంస్థ రెరా(రియల్ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) విధానం ఏవిధంగా రూపుదిద్దుకుంటుందనే దానిపైనే ఆ రాష్ట్రంలో ఇళ్ల కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఆ విధానాల రూపకల్పనపై స్పష్టత రావాల్సింది ఉందని వెల్లడించింది. శ్రీనగర్లో ప్రస్తుతం చదరపు అడుగు రూ.2500 నుంచి రూ.3200 ఉంది. జమ్మూలో రూ.2400 నుంచి రూ.4000 ఉండగా బారాముల్లాలో రూ.2500 నుంచి రూ.3200 ఉంది. అయితే వీటి కొనుగోలుపై స్థానికేతరులకు ఇప్పుడే అనుమతి లేదని చెప్పింది. ఓ రియల్ఎస్టేట్ నిపుణుడు మాట్లాడుతూ.. మిగతా కొండ ప్రాంతపు రాష్ట్రాలతో సమానంగా ప్రభుత్వం జమ్మూకశ్మీర్కు రెరా విధానాలని రూపొందిస్తుందా? లేక మరిన్ని నియంత్రణలు ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆస్తి లావాదేవీలు రెరా పరిమితికి లోబడి ఉంటాయని, సంస్థ ప్రకటన కోసం వేచి ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు అంతకాలం ఆగకపోతే కొనుగోలు లావాదేవీలలో న్యాయ నిపుణుడి సలహా తీసుకోవడం మంచిదని తెలిపారు. జమ్మూకశ్మీర్లో ప్రధానంగా టైర్2, టైర్3 పట్టణాలు రియల్టీ గమ్యస్థానాలుగా మారుతాయి. జమ్మూకశ్మీర్కు రియల్ ఎస్టేట్లో భారీ సామర్థ్యం ఉన్నప్పటకీ ఇంకా ఆ దిశగా సరైన కృషి జరగలేదు. ఇప్పుడు అవకాశం వచ్చినా తక్షణ అభివృద్ధికి సమయం కావాలి. ఎందుకంటే నిబంధనల చుట్టూ చాలా అస్పష్టత ఉంది. పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. వినియోగదారుడు రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. లడాఖ్ నుంచే రియల్ఎస్టేట్ ప్రారంభం కానుందని వెల్లడించారు. స్థానిక రాజకీయాల సహకారం, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయనేది కూడా ముఖ్యమేనని తెలిపారు. ఇంకో నిపుణుడు మాట్లాడుతూ.. 370 రద్దుతో కశ్మీర్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అమాంతం పెరుగుతుంది. ఈ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి స్థానికులు వాళ్ల కళ్ల ముందరే ఉహించని మార్పును చూస్తారు. బాలీవుడ్ తదితర సినిమా ఇండస్ట్రీలు వస్తాయి. భారీ కంపెనీలు అక్కడి మార్కెట్ వృద్ధికి వ్యూహాత్మకంగా పనిచేస్తూ స్థానికులతో కలసి జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక చివరాగా సోషల్ మీడియాలో కశ్మీర్లో విల్లాలు, బంగ్లాలను కొనండని వస్తున్న ప్రకటనలు అవాస్తవమని, కశ్మీర్లో ఆస్తిని సొంతం చేసుకోవాలనుకునే వారు అలాంటి అయాచిత సలహా లేదా ఆఫర్ల వలలో పడొద్దని సూచించారు. -
‘ఇల్లు’ గెలిచింది..!
న్యూఢిల్లీ : గృహాల కొనుగోలుదారులకు సకాలంలో ఇళ్లు అందించకుండా సతాయించే బిల్డర్లకు షాకిచ్చేలా రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కింద ఉన్న సంస్థ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమ్రపాలి ప్రాజెక్టుల్లో గృహాలు బుక్ చేసుకున్న 42,000 మంది పైచిలుకు కొనుగోలుదారులకు ఊరట లభించనుంది. గ్రూప్ సీఎండీ అనిల్ శర్మతో పాటు ఇతర డైరెక్టర్లు, సీనియర్ అధికారులపై ఉన్న మనీల్యాండరింగ్ అభియోగాలపై విచారణ జరపాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. కోర్టు రిసీవర్గా సీనియర్ అడ్వొకేట్ ఆర్ వెంకటరమణిని నియమిస్తున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యు.యు. లలిత్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లీజుల రద్దు తర్వాత నుంచి ప్రాపర్టీలపై పూర్తి అధికారాలు కోర్టు రిసీవర్కు దఖలుపడతాయని తెలిపింది. బకాయిల ను రాబట్టే క్రమంలో గ్రూప్ ప్రాపర్టీల విక్రయానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపింది. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆమ్రపాలి గ్రూప్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, ఇతర అధికారులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇతర బిల్డర్లకు హెచ్చరిక.. తాజా ఆదేశాలు కేవలం ఆమ్రపాలి గ్రూప్నకు మాత్రమే సుప్రీంకోర్టు పరిమితం చేయలేదు. మిగతా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా ముందుగా చెప్పిన గడువులోగా కచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి చేసి, గృహాల కొనుగోలుదారులకు అందించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు కష్టార్జితాన్ని ధారపోసే కొనుగోలుదారులు .. నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొంది. ‘తప్పుడు బిల్డర్ల కారణంగా లక్షల మంది గృహాల కొనుగోలుదారులు మోసపోతున్నారు. కొనుగోలుదారుల డబ్బుతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. కాబట్టి కొనుగోలుదారులకు తమ ఇంటిని దక్కించుకునేందుకు పూర్తి హక్కులు ఉంటాయి‘ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమయానికి గ్రూప్ ప్రాజెక్టులను పూర్తి చేసి అందించని బిల్డర్లపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఆమ్రపాలి గ్రూప్ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించాలని ఎన్బీసీసీని ఆదేశించింది. వారి దగ్గర్నుంచి అదనంగా నిధులు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రమోటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గృహాల కొనుగోలుదారులు మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సూచించింది. దశలవారీగా ఎన్బీసీసీ పనులు పూర్తి చేసే కొద్దీ ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుందని పేర్కొంది. అధికారులపైనా తీవ్ర వ్యాఖ్యలు.. అటు అధికారుల తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘అధికారులు, సంపన్న బిల్డర్లు కుమ్మక్కై సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారుల కష్టార్జితాన్ని ఎలా దోచుకుంటున్నారో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. అనేక ప్రాజెక్టులు పూర్తి కాకుండా పెండింగ్లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. షాక్ కలిగిస్తోంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారందరిపైనా కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉండాలి‘ అని వ్యాఖ్యానించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు గృహ కొనుగోలుదారుల ఫ్లాట్స్ను విక్రయించడం కుదరదని తేల్చి చెప్పింది. ‘ఇప్పటికే జప్తు చేసిన ఆమ్రపాలి ప్రమోటర్లు, ఇతర అధికారుల ఆస్తులను విక్రయించి బకాయిలను రాబట్టుకోవచ్చు‘ అని సుప్రీం కోర్టు తెలిపింది. బ్యాంకులు, అధికారుల నిష్క్రియాపరత్వం కారణంగానే ఆమ్రపాలి ప్రమోటర్లు నిధులను మళ్లించగలిగారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ నేపథ్యంలో బాకీలు రాబట్టుకునేందుకు కొనుగోలుదారులపై కేసులు పెట్టడం గానీ లేదా వారి ఫ్లాట్లను విక్రయించడం గానీ చేయరాదు. గృహాల కొనుగోలుదారులు ఇప్పటికే ఒకసారి మోసపోయారు. బాకీల రికవరీ పేరిట ఆ ప్రాజెక్టులను అమ్మేసి మళ్లీ మోసగించడం సరికాదు. నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు ఆయా సందర్భాలను బట్టి కొనుగోలుదారులకు నెల రోజుల్లోగా రిజిస్టర్డ్ డీడ్స్ ఇవ్వాలి‘ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈడీ కేసు నమోదు.. గృహ కొనుగోలుదారులు కట్టిన సొమ్మును మళ్లించిన ఆమ్రపాలి గ్రూప్.. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టాలను పక్కన పెట్టి నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు కూడా ఆమ్రపాలి గ్రూప్తో కుమ్మక్కై పూర్తి సహకారం అందించారని పేర్కొంది. బాకీలను రాబట్టుకునే క్రమంలో ఆమ్రపాలి గ్రూప్ ప్రాపర్టీలను విక్రయించేందుకు నోయిడా, గ్రేటర్ నోయిడాకు ఎలాంటి అధికారాలు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, ఆమ్రపాలి గ్రూప్, దాని ప్రమోటర్ల మీద మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్రిమినల్ కేసును నమోదు చేసింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్ట నిబంధనల ఉల్లంఘన కింద ఆమ్రపాలి గ్రూప్ ప్రమోటర్లను విచారణ చేయడంతో పాటు వారి అసెట్స్ను ఈడీ జప్తు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ధోనీ కూడా బాధితుడే.. ఇళ్ల కొనుగోలుదారులే కాదు క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ కూడా ఆమ్రపాలి గ్రూప్ బాధితుడే. 2011లో ప్రపంచ కప్ గెల్చిన భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లకు నోయిడాలోని ప్రాజెక్టులో రూ. 9 కోట్ల విలువ చేసే విల్లాలు ఇస్తామంటూ ఆమ్రపాలి ప్రకటించింది. వాటిని కట్టనూ లేదు. ఇవ్వనూ లేదు. అంతే కాదు.. ఆమ్రపాలికి సుమారు 6–7 ఏళ్ల పాటు ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేశాడు. కానీ దానికి కూడా ఆమ్రపాలి గ్రూప్ డబ్బులు చెల్లించలేదు. చివరికి, ఆమ్రపాలి బాధిత గృహాల కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ధోనీ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. రూ. 150 కోట్ల బకాయిలు రాట్టుకోవడం కోసం ఆమ్రపాలిపై కేసు వేశాడు. -
ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేకసార్లు ఆమ్రపాలి గ్రూప్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం తాజా సంచలన తీర్పును వెలువరించింది. సంస్థ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నమోదుతోపాటు అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాగే కంపెనీ డైరెక్టర్లు అందరిపైనా మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను ఆదేశించింది. సంస్థ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఈడీని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది. తద్వారా సుమారు 42వేల గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాదు కోర్టు రిసీవర్గా ఆర్ వెంకట్రామన్ను నియమించింది. భారతదేశం అంతటా అన్ని ప్రాజెక్టుల ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని, అవి సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని, ప్రమోటర్లందరి ఉల్లంఘనలపై నివేదికను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంబంధిత మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. ఇద్దరు ఆడిటర్లలో ఒకరైన అనిల్ మిట్టల్పై విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీం చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని సుప్రీం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఆ నిర్మాణాలను చేపట్టాల్సిందిగా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ను సుప్రీం ఆదేశించింది. నిర్మాణాలు పూర్తైన తర్వాత వినియోగదారులకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా గృహనిర్మాణాల కోసం వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్న కుంభకోణంలో ఆమ్రపాలి చిక్కుకుంది. అలాగే ఆమ్రపాలి గ్రూప్నకు ప్రచారకర్తగా వ్యవహరించిన తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి : అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని -
నివాస గృహ మార్కెట్కు పూర్వవైభవం!
భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గత కొన్నేళ్లల్లో వృద్ధి నెమ్మదించింది. రెరా, జీఎస్టీ వంటివి రియల్ ఎస్టేట్ రంగం కొలుకోవడానికి కీలకమైన అంశాలు. రెరా, జీఎస్టీ అమలు చేసిన తర్వాత దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో 2018లో గృహాల అమ్మకాల్లో 6 శాతం వృద్ధి అంచనాలు వెలువడ్డాయి. 2017తో పోలిస్తే 2018లో 75 శాతం కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాలు జరగ్గా, అమ్ముడు కాని ప్రాజెక్టులు 11 శాతానికి తగ్గాయి. ప్రస్తుతం, గృహ, వాణిజ్య రియల్ ఎస్టేట్లో వృద్ధి కనిపిస్తోంది. దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ట్రిలియ¯Œ డాలర్లుగా ఉండొచ్చని ఒక అంచనా. ఈ రంగం సానుకూలంగా మారడానికి కారణమైన అంశాలను పరిశీలిస్తే...రవి నారాయణసెక్యూర్డ్ అసెట్స్ హెడ్,ఐసీఐసీఐ బ్యాంకు రెరా, జీఎస్టీ 2016లో రెరా చట్టం, 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇవి రియల్ ఎస్టేట్ రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. ఈ నిర్మాణాత్మక సంస్కరణలు నియంత్రణ విధానాన్ని బలోపేతం చేశాయి. అంతేకాకుండా మార్కెట్ స్థిరీకరణకు ఉపయోగపడ్డాయి. దీంతో స్థిరమైన వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ఇవి తోడ్పడ్డాయి. కొనుగోలుదారులకు సాధికారత కల్పించడం ద్వారా గృహాలకు డిమాండ్ గణనీయంగా వృద్ధి చెందడంలో రెరా సహాయపడింది. తద్వారా ఈ రంగంలో సీరియస్గా పనిచేసే సంస్థలు ముందు నిలవడంలో సాయపడుతుంది. సమయానికి ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న భరోసాతోపాటు వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పటికీ ఈ పరిశ్రమ మార్పుల దశలో ఉండగా, దీర్ఘకాలంలో మాత్రం బాగా వృద్ధి చెందనుంది. జీఎస్టీ సైతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ పునరుద్ధరణలో అతి కీలకమైన పాత్ర పోషిస్తోంది. పారదర్శకత, జవాబుదారీతనం, సరళీకృత పన్నుల విధానం సాధ్యమవుతాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి వచ్చింది. ఇది ఈ రంగానికి మరింత ఊతమివ్వడంతోపాటు గృహాలకు డిమాండ్ను సైతం పెంచుతుంది. ప్రీమియం గృహ విభాగంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఇప్పుడు జీఎస్టీ 5 శాతంగా ఉంది. గతంలో ఇది 12 శాతంగా ఉండేది. అందుబాటు ధరల గృహాలకు ఇది 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పుడు ఇ¯Œ పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ను అమలు చేస్తుండడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ గణనీయంగా పెరగనుంది. అందుబాటులో గృహ విభాగం నిర్మాణాత్మక సంస్కరణలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల కొనుగోలుదారులు ముందుకు రావడంతో ఈ రంగంలో రికవరీ సాధ్యమయింది. స్టాండర్డ్ డిడక్ష¯Œ రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగడం, రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగిన వారికి పూర్తి పన్ను రాయితీ, మౌలిక వసతులు, కనెక్టివిటీ అన్నవి మెరుగైన పెట్టుబడులకు కారణమయ్యాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో నివాసిత ప్రాజెక్టుల విభాగం వృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న లక్ష్యమే కారణం. అందుబాటు ధరల గృహ వినియోగదారులు రానున్న కాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి తోడ్పడనున్నారు. మధ్య తరగతికి ప్రయోజనాలు అందుబాటులో గృహ విభాగంలో ఇప్పటికే పెట్టుబడులు కూడా పెరిగాయి. 2018లో నూతన సరఫరాలో ఇది 41 శాతంగా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని 2020 మార్చి వరకు పొడిగించింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యతరగతి వర్గాల (ఎంఐజీ) వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వడ్డీ రాయితీలు అందిస్తున్నారు. 2019 ఏప్రిల్ నాటికి 4.45 లక్షల కుటుంబాలకు రూ.10వేల కోట్ల రాయితీని క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా అందించారు. గృహ రుణ రాయితీలు, స్వల్ప జీఎస్టీ ధరల నుంచి అధిక శాతం కొనుగోలుదారులు ప్రయోజనం పొందుతున్నారు. స్టూడెంట్ హౌసింగ్ వంటి నూతన అస్సెట్ క్లాసెస్ పెరుగుతుండడంతో నివాసిత రియల్ ఎస్టేట్ మార్కెట్ కోలుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘రెరా’... బిల్డర్లు పట్టించుకోరా..?
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారుకు భద్రతా, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) కార్యరూపం దాల్చడంలేదు. పునాది పడే ప్రతి ప్రాజెక్టు, లేఅవుట్ విధిగా ‘రెరా’లో నమోదు కావాల్సిందేనని చట్టం చెబుతున్నా బిల్డర్లు/డెవలప ర్లు పట్టించుకోవడంలేదు. 2017లో ‘రెరా’చట్టం మనుగడలోకి వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 2,500 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు) ఆమోదముద్ర వేస్తే.. అందులో 2,500 ప్రాజెక్టులే పేర్లను నమోదు చేసుకోవడం చూస్తే ‘రెరా’ అమలులో పురపాలక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాతో వెసులుబాటు! స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలో పేర్లను నమో దు చేసుకోని సంస్థలపై కొరడా ఝళిపించాల్సిన సర్కారు.. జరిమానాలతో సరిపెడుతోంది. రూ.3 లక్షల పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో పేరు నమోదు చేసుకోకున్నా ఏం కాదులే అన్న నిర్లక్ష్యం రియల్టీ కంపెనీల్లో కనిపిస్తోంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి అనుమతి పొందిన స్థిరాస్తి సంస్థలు గత నవంబర్ 30 వరకు ఆన్లైన్లో ‘రెరా’లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ తర్వాత రూ. 50 వేల జరిమానాతో గడువు ఇస్తే 50 సంస్థలు ముందుకు రాగా.. రెండోసారి రూ.3 లక్షల పెనాల్టీతో పేర్ల నమోదుకు అవకాశం కల్పించినా ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ చైర్మన్ రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. అవగాహనాలోపం..! వినియోగదారులకు విశ్వాసం, నమ్మకం కలిగించేందుకు వీలుగా ‘రెరా’ను పకడ్బందీగా అమలు చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలం, 8 ప్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తప్పనిసరిగా ‘రెరా’లో నమోదుచేసుకోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70శాతాన్ని ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలనే నిబంధన ఉండటంతో రియల్టర్లు ‘రెరా’లో నమోదుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు భరో సా ఇచ్చేలా.. డెవలపర్లు విధిగా పాటించేలా కొన్ని నిబంధనలు పకడ్బందీగా ఉండటం కూడా వారి వెనుకడుగుకు కారణంగా కనిపిస్తోంది. ‘రెరా’లో నమోదు అనంతరమే.. స్థలాలు, ఫ్లాట్లు విక్రయాలకు చెందిన ప్రచారం నిర్వహించుకోవాలనే షరతు విధించింది. ఈ మేరకు పత్రికా, ప్రసారమాధ్యమా ల్లో ‘రెరా’రిజిస్టర్ నంబర్ను ప్రచురించాలని స్పష్టం చేసింది. బడా సంస్థలు మినహా మధ్యతరగతి రియల్టీ కంపెనీలు ఈ నిబంధనలు పాటించడంలేదు. భూమి పూజ చేసిందే మొదలు ప్లాట్ల బేరాలను సాగిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేస్తున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, తదితర సంస్థల సమన్వయం కొరవడడం కూడా ‘రెరా’లో పేర్లు నమోదు కాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ‘రెరా’కు తగినంత సిబ్బంది లేకపోవడం.. ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం లేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తోంది. రెరా ఆవశ్యకత, చట్టబద్ధత, ప్లాట్ల క్రయవిక్రయాల్లో ఈ చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందనే అం శంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంగానీ, ప్రచారం చేయడంలో పురపాలక శాఖ విఫలమైంది. దీంతో ఈ చట్టంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. భారీగా జరిమానాలు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో బిల్డర్లపై రెరా సంస్థ భారీగానే జరిమానాలు విధిస్తోంది. ఇప్పటివరకు 400 ప్రాజెక్టులపై రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు జరిమానాలు విధించి రూ.3 కోట్లు వసూలు చేసింది. ఇవి కేవలం బడాసంస్థలకు సంబంధించినవి మాత్రమే కాగా, హెచ్ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, అపార్ట్మెంట్ల విషయంలో తాత్సారం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ‘రెరా’అధికారులు మాత్రం మధ్యతరగతి రియల్ మోసాలు తమ వరకు రావడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ‘రెరా’లో నమోదు చేసుకోకుండానే వెంచర్లు చేసి అమ్ముకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే, 2017 జనవరి తర్వాత వెలిసిన లేఅవుట్ల విషయంలో ఇప్పటి నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తామని ‘రెరా’కార్యదర్శి విద్యాధర్ ‘సాక్షి’కి తెలిపారు. అక్రమ లేఅవుట్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కాగానే సమాచారం తమకు వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖతో సమన్వయం కుదుర్చుకునే పనిలో ఉన్నామని, సదరు డెవలపర్కు చెందిన సమస్త సమాచారాన్ని ఆ శాఖ నుంచి తీసుకుంటామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
రెరా ముద్ర ఉన్నదే ‘రియల్’ ఎస్టేట్
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) వద్ద రిజిస్టర్ కాకుండా ఏ బిల్డరైనా, ప్రమోటరైనా ఫ్లాట్లు, భవనాలు, ఇంకా ఏ రకమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును కూడా విక్రయించడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురీ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రియల్ ఎస్టేట్(రెగ్యులేషన్, డెవలప్మెంట్) చట్టం 2016 ప్రకారం రెరా వద్ద రిజిస్టర్ చేసుకోకుండా ఏ బిల్డరు, ఏ ప్రమోటర్.. తమ వెంచర్లను ప్రచారం చేసుకోవడం, బుక్ చేసుకోవడం, విక్రయించడం వంటి కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబడవని ఆయన తెలిపారు. రెరా చట్టం అమల్లోకి వచ్చిన నాటికే నిర్మాణంలో ఉండి ప్రాజెక్టు పూర్తయినట్టుగా జారీ చేసే ధ్రువీకరణ పత్రం పొందని బిల్డర్లు మూడు నెలల వ్యవధిలోగా తమ ప్రాజెక్టును రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోని బిల్డర్లు, ప్రమోటర్లు.. రెరా ఆదేశాలు, మార్గదర్శకాలను అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాంటి వారికి రెరా చట్టంలోని సెక్షన్ 59 కింద మూడేళ్ల జైలు శిక్ష లేదా ప్రాజెక్టు అంచనా వ్యయంలో పదిశాతం జరిమానా విధించే నిబంధన ఉన్నట్టు ఆయన చెప్పారు. రెరా వద్ద రిజిస్టర్ కాని బిల్డర్ల వద్ద ఫ్లాట్లు కొన్న వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తగిన ఫోరంలో ఫిర్యాదు చేసి చట్టపరంగా వారి హక్కులను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. దేశంలో ఎన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులు రెరా వద్ద రిజిస్టర్ అయ్యాయనే వివరాలను తమ మంత్రిత్వ శాఖ సేకరించిందని పేర్కొన్నారు. రెరా వ్యవస్థను ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది కనుక.. ఆ వివరాలన్నీ ఆయా రాష్ట్రాల రెరా వద్దే లభ్యమవుతామని వెల్లడించారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉపందుకున్న కార్గో రవాణా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కార్గో రవాణా గణనీయంగా పెరిగినట్టు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురీ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 2017-18లో 257 మెట్రిక్ టన్నుల సరుకులు రవాణా కాగా, 2018-19 నాటికి అది 669 టన్నులకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్లోని కార్గో హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ ఏడాదికి 20 వేల మెట్రిక్ టన్నుల రవాణా సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఎయిర్ కార్గో రవాణా కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్లైన్స్ సర్వీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 2017లో విశాఖలో అంతర్జాతీయ ఎయిర్ కార్గో టెర్మినల్ ప్రారంభించినట్టు గుర్తుచేశారు. ఈ టెర్మినల్ కార్యనిర్వహణ యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు అప్పంగించడం జరిగిందన్నారు. 558 చ.మీ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ టెర్మినల్లో కార్గో రవాణా నిమిత్తం లోడింగ్, అన్లోడింగ్ కోసం ట్రక్ డాక్ ఏరియా, తనిఖీలు చేపట్టే హాలు, స్ట్రాంగ్ రూమ్, కోల్డ్ స్టోరేజ్, ప్రమాదకరమైన సరుకు నిల్వచేసే షెడ్ వంటి సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. -
టీడీపీ గుప్పెట్లో రెరా
సాక్షి, అమరావతి: పూర్తి స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ని గత ప్రభుత్వం పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది. రాజకీయాలతో సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ స్థాయి అధికారిని చైర్మన్గా నియమించాలని, అలాగే రియల్ ఎస్టేట్ రంగంపై పూర్తి అవగాహన ఉన్న వారిని మెంబర్లుగా నియమించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాటిని బేఖాతర్ చేస్తూ రెరాను టీడీపీ సంస్థగా మార్చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ తివారిని రెరా చైర్మన్గా నియమిస్తే.. కర్నాటకలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించింది. కానీ దీనికి భిన్నంగా మన రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ నియామకం చేయడం గమనార్హం. అంతా ఆ సామాజికవర్గం వారే.. రాష్ట్రంలో ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మొదలు పెట్టాలన్నా, క్రయవిక్రయాలు చేయాలన్నా రెరా అనుమతి తప్పనిసరి. ఇలాంటి కీలకమైన రెరాలో చైర్మన్ దగ్గర్నుంచి.. కింద స్థాయి అటెండర్ వరకు టీడీపీ కార్యకర్తలు.. అందులోనూ అత్యధికంగా అప్పటి అధికార పార్టీకి చెందిన సామాజికవర్గం వారితో నింపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో రెరా మే ఒకటి, 2017 నుంచి అమల్లోకి వచ్చినా పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆగస్టు 10, 2018న చైర్మన్, మెంబర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న రామనాథ్ వెలమటిని చైర్మన్గా నియమించడమే కాకుండా.. పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్న ముళ్లపూడి రేణుక, చందు సాంబశివరావుతో పాటు.. టౌన్ప్లానింగ్లో పనిచేసి పదవీ విరమణ చేసిన విశ్వనాథ్ శిష్టాలను మెంబర్లుగా, చెరుకూరి సాంబశివరావును డైరెక్టర్గా నియమించింది. రామనాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలొచ్చాయి. టీడీపీ, అప్పటి సీఎం కార్యాలయం సూచించిన వారిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. మొత్తం 30 మంది ఉద్యోగులుంటే అందులో గత ప్రభుత్వ సామాజిక వర్గానికి చెందిన వారే 12 మంది ఉన్నారు. అంతేకాదు చైర్మన్గా పదవి చేపట్టినప్పటి నుంచి వివిధ రాష్ట్రాల పర్యటన కోసం ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేశారంటే ఏ స్థాయిలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారో అర్థం చేసుకోవచ్చు. రామనాథ్ అద్దె కింద రూ.35,000 చెల్లిస్తూ రెరా నుంచి మాత్రం ప్రతి నెలా రూ.70,000 తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో కూడా పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, నిర్ణయాల్లో ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీ ఆఫీసులో రెరా ల్యాప్టాప్లు! ‘రెరా’ డబ్బులతో కొన్న ల్యాప్టాప్లను టీడీపీ కార్యాలయానికి తరలించారంటే రెరాను ఒక పార్టీ కార్యాలయంగా ఏ విధంగా వినియోగించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అవసరాల కోసం రెరాకు చెందిన 5 ల్యాప్టాప్ను టీడీపీ కార్యాలయానికి చైర్మన్ సంతకం చేసి మరీ తీసుకెళ్లడం ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న రెరా కార్యవర్గాన్ని తక్షణం రద్దుచేసి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పూర్తి స్వయంప్రతిపత్తి ఉండేలా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రియల్టర్లు కోరుతున్నారు. -
రెరా నమోదిత ప్రాజెక్ట్స్లో నో ఫైర్ సేఫ్టీ
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ నిబంధనలు పాటించని ప్రాజెక్ట్లు సైతం రెరాలో నమోదవుతున్నాయా? రెరాలో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా)లో ఇప్పటివరకు నమోదు చేసుకున్న అపార్ట్మెంట్లలో చాలా వాటిల్లో ఫైర్ సేఫ్టీ గానీ ఇంధన, పర్యావరణ శాఖ నిబంధనలు పాటించలేదు. భవన నిర్మాణ నిబంధన ప్రకారం.. 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ), 15 మీటర్ల కంటే తక్కువ ఉంటే జీహెచ్ఎంసీ నుంచి ఎన్వోసీ ఉండాలి. కానీ, కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు చేపడుతున్న హైరైజ్ భవనాలు మినహా చాలా ప్రాజెక్ట్లు ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదు. అయినా సరే రెరా అధికారులు ప్రాజెక్ట్లను రిజిస్టర్లో చేయడం, గుర్తింపు పత్రం, సంఖ్య కూడా కేటాయించారు. ఈ రోజుల్లో నివాస భవనాల నిర్మాణంలో ఫాల్స్ సీలింగ్, ఫోమ్ సీలింగ్, అదనపు లైట్ల ఏర్పాట్లు, పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ వంటి ఏర్పాట్లు ఎక్కువయ్యాయి. వీటికి వేడిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటంతో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అందుకే ఫైర్ ఎన్వోసీ ఉంటేనే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ప్రమాదాలను ఊహించలేమని రెసిడెన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది. ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా.. రెరాలో నమోదైన చాలా ప్రాజెక్ట్లు ఫైర్ సేఫ్టీ మాత్రమే కాదండోయ్ ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా గాలికొదిలేశాయి. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ), రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతలు వంటి ఏర్పాట్లేవీ లేని ప్రాజెక్ట్లు సైతం రెరాలో రిజిస్టరయ్యాయి. 300 చ.మీ. కంటే ఎక్కువ స్థలంలో నిర్మించే భవనాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాట్లు ఉండాల్సిందే. కానీ, నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటూ శివారుల్లోని అర్హత ఉన్న భవనాల్లోనూ నిబంధనలు పాటించలేదు. ‘‘కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాజెక్ట్లు రెరాలో నమోదైన విషయం వాస్తవమే. సంబంధిత ప్రాజెక్ట్ నిర్మా ణం పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామని’’ రెరా అధికారులు తెలపడం గమనార్హం. -
రిజిస్ట్రేషన్ శాఖతో రెరా అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారులకు భరోసా కల్పించడమే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రధాన లక్ష్యం. రెరాలో నమోదు చేయకుండా విక్రయించే ప్రాజెక్ట్లను, ప్రమోటర్లను, ఏజెంట్లను గుర్తించేందుకు అన్ని రకాల అస్త్రాలను వినియోగిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏల నుంచి అనుమతి తీసుకోగానే సమాచారం అందేలా ఏర్పాట్లు చేసిన టీ–రెరా.. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ మీద కన్నేసింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా సరే చివరికి రిజిస్ట్రేషన్ శాఖ వద్దకు రావాల్సిందే! ఇక్కడే టీ–రెరా వల వేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ వివరాలు టీ–రెరాకు అందుబాటులో ఉండేలా.. శాఖకు లేఖ రాయనుంది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ, టీ–రెరా, రిజిస్ట్రేషన్ శాఖ.. ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే అనుమతులు, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత వస్తుంది. అంతిమంగా కొనుగోలుదారునికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ, తెలంగాణలో 20 శాతం మంది ప్రమోటర్లు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, పారదర్శకంగా ఉండాలని రెరాలో నమోదు చేశాకే విక్రయాలు జరుపుతుంటే.. 80 శాతం మంది మాత్రం కొనుగోలుదారులకు మాయమాటలు, రకరకాల ఆఫర్లతో మోసపూరితంగా అమ్మకాలు చేస్తున్నారని టీ–రెరా పరిశీలనలో తేలింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా, ఎవరు ఎవరితో క్రయ విక్రయాలు జరిపినా సరే అంతిమంగా రిజిస్ట్రేషన్ శాఖకు రావాల్సిందే కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ, టీ–రెరా సమన్వయంగా పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్ వివరాలు తెలిసేలా రెండు విభాగాలను అనుసంధానించనున్నారు. ప్రతి డాక్యుమెంట్, ప్రాజెక్ట్ను రెరా అధికారులు భౌతికంగా పరిశీలించి, రెరాలో నమోదు అయిందా? లేదా? చెక్ చేస్తారు. ఒకవేళ టీ–రెరాలో నమోదు అర్హత ఉండి కూడా రిజిస్టర్ కాకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు. సర్వం టీ–రెరా చేతిలో.. టీ–రెరా, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వంగా పనిచేస్తే.. ప్రమోటర్ ఫొటో, ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు, చిరునామా వంటి సమాచారంతో పాటూ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ప్లాటింగ్ ఏరియా, ప్రాజెక్ట్ వ్యయం, విక్రయ ధర వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. ఇప్పటికే టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రతి ప్రాజెక్ట్, ప్రమోటర్లను గుర్తించేందుకు మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ విభాగాలతో కలిసి పనిచేస్తుమన్నాని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఆయా విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్/ లే అవుట్ సమాచారాన్ని తెప్పించుకొని, భౌతికంగా పరిశీలన చేస్తుమన్నాని చెప్పారు. గడువులోగా రెరాలో నమోదు చేసుకుంటే ఓకే! లేకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. సాక్షి: రెరాలో ఎన్ని ప్రాజెక్ట్లు నమోదయ్యాయి? రెరా: 4634 ప్రమోటర్లు, ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఇందులో 2039 మంది ఏజెంట్లు, 2595 ప్రాజెక్ట్ ప్రమోటర్లు ఉన్నారు. సాక్షి: స్థిరాస్తి కొనుగోలు చేయాలంటే మీ సూచన? రెరా: ఏజెంట్లు, ప్రమోటర్లు ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి లేదా బ్రోచర్లు ఇచ్చి మా ప్రాజెక్ట్లో కొనండి అంటే ముందుగా వాళ్లని అడగాల్సిన మొదటి ప్రశ్న.. మీరు రెరాలో నమోదు అయిన ఏజెంటేనా అని! రెండో ప్రశ్న.. సంబంధిత ప్రాజెక్ట్లో రెరాలో నమోదు అయిందా అని! వీటికి సమాధానం అవునొస్తే ముందడుగు వేయవచ్చు. సాక్షి: ఒకవేళ రెరా ఏజెంట్ అని, నంబరు ఉందని తప్పుడు సమాచారం ఇస్తే? రెరా: రెరా వెబ్సైట్లో రెరా నంబరు, ఏజెంట్ల వివరాలను నిర్ధారించుకునే వీలుంది. ట్ఛట్చ.్ట్ఛ ్చnజ్చ n్చ.జౌఠి.జీn వెబ్సైట్లోకి వెళ్లగానే సెర్చ్ రిజిస్టర్ ప్రాజెక్ట్ అండ్ ఏజెంట్ అనే అప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ప్రత్యేకంగా లింక్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రాజెక్ట్, ప్రమోటర్ పేరు, ఏజెంట్ల నంబర్లు నమోదు చేస్తే చాలు వివరాలన్నీ క్షణాల్లో మీ ముందుంటాయి. సాక్షి: హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఉంది. కానీ, రెరా రిజిస్టర్ కాదు? ఆ ప్రాజెక్ట్లో కొనొచ్చా? రెరా: జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, కార్పొరేషన్, పంచాయతీ ఏ విభాగం నుంచి అయినా అపార్ట్మెంట్ లేదా లే అవుట్ అనుమతి తీసుకున్నా సరే రెరాలో నమోదు చేయకుండా విక్రయాలు జరపకూడదు. ప్రకటనలు కూడా చేయకూడదు. అలా చేస్తే రెరా చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయి. 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన, 9 ఫ్లాట్లు లేదా 501 చ.మీ. నుంచి ప్రారంభమయ్యే ప్రతి అపార్ట్మెంట్, లే అవుట్ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. సాక్షి: రెరా నమోదు గురించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా డెవలపర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటానికి కారణం? రెరా: టీ–రెరాలో ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని నమోదు చేయడంతో పాటూ ప్రాజెక్ట్ ప్రమోటర్లు, డైరెక్టర్ల వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు, కంపెనీ అడ్రస్, ఏజెంట్ల వివరాలు ప్రతి ఒక్కటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే డెవలపర్లకు కష్టంగా ఉంది. ఈ వివరాలు రెరాకు ఇస్తే.. లాక్ అయిపోతామని భావిస్తున్నారు. అందుకే తప్పుడు ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నాం. రెరాలో తప్పుడు నంబర్లు ఇస్తే షోకాజ్ నోటీసులు పంపిస్తున్నాం. సరైన సమాచారం ఇవ్వని వాళ్ల మీద జరిమానాలతో పాటూ కఠిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: రెరాలో ప్రాజెక్ట్లను నమోదు చేయడంతోనే డెవలపర్ల పని పూర్తయినట్టా? రెరా: అది తప్పు. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ నమోదు చేయడంతోనే డెవలపర్ల అసలు పని మొదలవుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రెరాలో ప్రాజెక్ట్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 33 మంది డెవలపర్లకు ప్రాజెక్ట్ను అప్డేట్ చేయమని చెప్పాం. రెరా వెబ్సైట్లో స్క్రోల్ కూడా చేస్తున్నాం. అప్డేషన్ ఫీజు ఏడాదికి రూ.500. -
రెరాలో నమోదు కాలేదా? రూ.50 వేలు జరిమానా!
తెలంగాణలోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఏజెంట్లూ! మీరు ఇంకా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో తమ పేర్లను, ప్రాజెక్ట్లను నమోదు చేయలేదా? అయితే రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సిందే. పెనాల్టీ కట్టి వచ్చే వారం రోజుల్లోగా నమోదు చేసుకోకపోతే మొదటి వారం రూ.లక్ష, ఆ తర్వాతి వారం రూ.2 లక్షలు ఫైన్ తప్పదు. అప్పటికీ రిజిస్టర్ కాకపోతే ఏకంగా ప్రాపర్టీ సీజ్! సాక్షి, హైదరాబాద్: కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం–2016ను అమల్లోకి తీసుకొచ్చిన ఏడాది తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2017లో రెరాను నోటీఫై చేసింది. 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్ టీ– రెరాలో నమోదు చేసుకోవాలన్న విషయం తెలిసిందే. నమోదు గడువును 2018 నవంబర్ 30 వరకు విధించింది. రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్ట్ ప్రమోటర్లపై రెరా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు టీ–రెరా అధికారులు సిద్ధమయ్యారు. 1,200 ప్రాజెక్ట్ల నమోదు.. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్లు అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు టీ–రెరాలో వెయ్యి మంది ప్రమోటర్లు, వెయ్యి మంది ఏజెంట్లు నమోదయ్యారని.. సుమారు 1,200 ప్రాజెక్ట్ల వరకు రిజిస్టరయ్యాయని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మినహా ఇతర ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ప్రమోటర్లు, ప్రాజెక్ట్లు నమోదయ్యాయని ఇవి సుమారు 200 ప్రాజెక్ట్ల వరకుంటాయని చెప్పారు. నేటి నుంచి జరిమానాలు షురూ.. టీ–రెరా రికార్డుల ప్రకారం తెలంగాణలో ఇంకా 2,000–2,500 ప్రాజెక్ట్లు నమోదు కావాల్సి ఉందని సమాచారం. నేటి నుంచి ఆయా ప్రాజెక్ట్ ప్రమోటర్లకు రూ.50 వేల జరిమానా విధించనున్నామని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. వారం రోజుల్లోగా నమోదు కాకపోతే జరిమానాల మొత్తాలను పెంచుతామని, అయితే అది ఎంతనేది ఈనెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అప్పటికీ ముందుకొచ్చి రెరాలో రిజిస్టర్ కాకపోతే ప్రాజెక్ట్ సైట్లను టీ–రెరా బృందం ప్రత్యక్షంగా తనిఖీ చేసి రెవిన్యూ చట్టం కింద ప్రాపర్టీలను సీజ్ చేస్తామని చెప్పారాయన. 2019 మార్చి 31 వరకూ పొడిగించాలి టీ–రెరా ప్రాజెక్ట్లు, డెవలపర్లు, ఏజెంట్ల నమోదు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) కోరింది. ఈ మేరకు పురపాలక నిర్వహణ మరియు పట్టణ అభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్కు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రంలో డెవలపర్లకు రెరా చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని.. నమోదు ప్రక్రియలో డెవలపర్లకు సహాయం చేసేందుకు కూడా కన్సల్టెంట్లు పెద్దగా లేరని అందుకే నమోదు గడువును పొడిగించాలని టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు తెలిపారు. త్వరలోనే 20 మంది డెవలపర్లపై చర్యలు టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్లను అడ్వర్టయిజింగ్ చేసిన 40 మంది డెవలపర్లకు ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. నవంబర్ 20 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిలో కొంత మంది డెవలపర్లు అడ్వర్టయిజింగ్ చేసిన ప్రాజెక్ట్లలో కొన్ని 2015, 2016లో అనుమతి తీసుకున్నవని వివరణ ఇచ్చారని టీ–రెరా అధికారి ఒకరు తెలిపారు. మరొక 20 మంది డెవలపర్లు మాత్రం టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రాజెక్ట్లనే ప్రచారం చేశారని త్వరలోనే వీరికి జరిమానాలు విధించనున్నామని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్ సైట్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశామని త్వరలోనే టీం సైట్ విజిట్స్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రెరా నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్లను రిజిస్టర్ చేయకుండా అడ్వర్టయింజింగ్ చేసినా లేదా విక్రయించినా శిక్షార్హమే. సెక్షన్ 59 ప్రకారం తొలుత ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్ చేయకపోయినా సరే సంబంధిత డెవలపర్కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది. -
రిజిస్టర్ కాకపోయినా రెరా వర్తిస్తుంది
సాక్షి, హైదరాబాద్: రెరాలో ప్రాజెక్ట్లు లేదా డెవలపర్లు, ఏజెంట్ల నమోదు అనేది ఒక ఆప్షన్ మాత్రమే. రెరాలో నమోదు చేయనంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ రెరా పరిధిలోకి రాదని భావించొద్దు. రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే నమోదు కాకపోయినా సరే రెరా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేయవచ్చని మధ్యప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ (రెరా) అథారిటీ చైర్మన్ ఆంటోని డీ సా తెలిపారు. ఇటీవల నగరంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్డబ్ల్యూఏ) 6వ జాతీయ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ‘పట్టణ గృహ విభాగం– రెరా అమలు’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్జ్యూమర్ కోర్ట్లతో సమానంగా అప్పిలేట్ ట్రిబ్యునల్కు అధికారాలుండాలని.. ఇందుకోసం రెరా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పెనాల్టీలు లేదా శిక్షలు అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లదే బాధ్యత. దీంతో జిల్లా కలెక్టర్లకు పని ఒత్తిడి, భారం పెరిగిందని దీంతో ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. అనంతరం తమిళనాడు రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బీ రాజసేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘ఏ చట్టం అయినా సరే ప్రారంభంలో కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. రెరా చట్టం అమలులోనూ అంతే. గత రెండేళ్లుగా రెరా అమలులో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని’’ గుర్తు చేశారు. తమిళనాడులో చాలా ప్రాజెక్ట్స్లో రెరాలో నమోదుకాలేదని, సుమారు వెయ్యి మంది డెవలపర్లకు సుమోటో నోటీసులు పంపించాలని లోకల్ అథారిటీలను ఆదేశించామని తెలిపారు. 7వ షెడ్యూల్డ్లో ఆర్డబ్ల్యూఏను జోడించాలి పౌర నిర్వహణ, నిధుల పంపిణీలకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ) డిమాండ్ చేసింది. ఆర్డబ్ల్యూఏ, అర్బన్ లోకల్ బాడీ (యూఎల్బీ)లను 7వ షెడ్యూల్డ్లో జోడిస్తేనే నిధుల పంపిణీ, నిర్వహణ సులువవుతుందని కాన్ఫిడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ రావు వీబీజే చెలికాని అభిప్రాయపడ్డారు. దీంతో స్థానికంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాకుండా సామాజిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణలో కూడా పౌరులు భాగస్వామ్యులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీటీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. -
40 మంది బిల్డర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) కొరడా ఝళిపించింది. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్ను అడ్వటయిజింగ్ చేసిన 40 మంది డెవలపర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 తేదీలోపు వివరణ ఇవ్వాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టీ–రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. నోటీసులు జారీ చేసిన 40 మంది డెవలపర్లలో ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేయడమే కాకుండా విక్రయాలు కూడా జరిపినట్లు తెలిసింది. రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేసినా లేదా విక్రయించినా సరే సెక్షన్ 59 ప్రకారం.. ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్ చేయకపోయినా రెరా అథారిటీ సంబంధిత డెవలపర్కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది. రెరా జరిమానాలు, శిక్షలివే.. ప్రమోటర్లకు: రెరా అథారిటీ ఆర్డర్లను ఉల్లంఘిస్తే.. సెక్షన్ 59 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా. ♦ ప్రాజెక్ట్ లేదా అమ్మకాలకు సంబంధించిన తప్పుడు సమాచారం అందిస్తే.. సెక్షన్ 60 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా. ఏజెంట్లకు: నమోదు కాకుండా ఫ్లాట్లు/ప్లాట్లను విక్రయిస్తే.. సెక్షన్ 65 ప్రకారం విక్రయించిన ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా. ♦ అప్పిలేట్ ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. సెక్షన్ 62 ప్రకారం ఏడాది పాటు జైలు శిక్ష లేదా ప్రతి రోజు రూ.10 వేలు, గరిష్టంగా ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా. ఇంకా 14 రోజులే.. టీ–రెరాలో ప్రాజెక్ట్ల నమోదు గడువు ఈనెల 30తో ముగస్తుంది. అంటే ఇంకా 14 రోజులే మిగిలి ఉంది. రెరా గడువును పొడిగించే ప్రసక్తే లేదని, డిసెంబర్ 1 నుంచి ప్రాజెక్ట్లను నమోదు చేయని నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసి సెక్షన్ 59 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తామని విద్యాధర్ రావు తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 1,200 మంది ఏజెంట్లు, డెవలపర్లు రిజిస్టరయ్యారు. సుమారు 600ల ప్రాజెక్ట్లు నమోదయ్యాయి. ♦ 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ, మున్సి పాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్టూ రెరాలో నమోదు తప్పనిసరి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్లను అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు కేవలం 600 ప్రాజెక్ట్లే నమోదవ్వటం గమనార్హం. -
జీఎస్టీ లేకుండా ఇల్లు కొంటారా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక కొత్త ప్రాజెక్ట్లను ప్రారంభించడం కంటే పాత నిర్మాణాలను పూర్తి చేయడం మీదే నిర్మాణ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. మరి, నిర్మాణంలో ఉన్న గృహాలు కొనడం బెటరా? లేక రెడీగా ఉన్నవి కొనడం ఉత్తమమా? ♦ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్ల్లో కొంటే ముందుగా కలిసొచ్చేది.. నిర్మాణ ఆలస్యమనేది ఉండనే ఉండదు. అపార్ట్మెంట్ నిర్మాణం కోసం గానీ, వసతుల ఏర్పాట్ల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. రెరా అమల్లోకి వచ్చాక డెవలపర్లు నిర్మాణ గడువును పెంచేశారు. గతంలో ఒక ప్రాజెక్ట్ నిర్మాణ గడువు మూడేళ్లుగా ఉంటే ఇప్పుడది 5–6 ఏళ్లకు పొడిగించారు. ఎందుకంటే రెరాలో గడువు ముగిసిన ప్రాజెక్ట్ డెవలపర్లకు జరిమానా, జైలు శిక్షలు వంటి కఠిన నిబంధనలున్నాయి. ♦ నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్లల్లో కొనుగోలు చేస్తే కలిగే మొదటి ప్రయోజనం.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కట్టాల్సిన పన్లేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లకు 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే నిర్మాణంలో ఉన్న వాటి కంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది సుమీ! చూసిందే కొంటాం: ఫ్లాట్ విస్తీర్ణం, గదుల విస్తీర్ణం, అపార్ట్మెంట్ వ్యూ, నిర్మాణ నాణ్యత, వసతుల ఏర్పాట్లు, శానిటరీ, టైల్స్ ఉత్పత్తుల ఎంపిక వంటివి కళ్లతో ప్రత్యక్షంగా చూసి కొనుగోలు నిర్ణయాన్ని తీసుకునే వీలుంటుంది. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ విషయం ఈ అవకాశంలో ఉండదు. మోడల్ ఫ్లాట్ లేదా లే అవుట్ ఎలివేషన్ చూసి ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. రెడీగా ఉన్న ప్రాజెక్ట్ల్లో కొంటే నిర్మాణంలోని నాణ్యత పరిశీలించిన తర్వాతే కొనుగోలుకు వీలుంటుంది. ఏరియా అభివృద్ధి: రెడీగా ఉన్న ప్రాజెక్ట్ల్లో కొంటే మరొక ప్రయోజనం.. ప్రాజెక్ట్ ఏరియా అభివృద్ధి ప్రత్యక్షంగా తెలుస్తుంది. పరిసర ప్రాంతాల్లోని మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? రవాణా సదుపాయాలు, భద్రత పరిస్థితి ఏంటి? నిత్యావసరాలు ఎంత దూరమున్నాయి? పని ప్రదేశాలు, షాపింగ్ ప్రాంతాలు వంటివి గృహ ప్రవేశం చేయకముందే తెలిసిపోతాయి. అద్దె కలిసొస్తుంది: రెడీగా ఉన్న ప్రాజెక్ట్ల్లో కొంటే.. కొనుగోలు చేసిన వెంటనే గృహ ప్రవేశం చేసేయవచ్చు. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లో కొంటే నిర్మాణం పూర్తయ్యే వరకూ అద్దె, నెలవారీ వాయిదా రెండూ చెల్లించాల్సి వస్తుంది. అదే రెడీగా ఉన్న గృహమైతే.. అద్దె భారం తప్పుతుంది. ఒకవేళ సొంతంగా మీరుండేందుకు కాకుండా పెట్టుబడి కోసం రెడీగా ఉన్న గృహాలు కొనుగోలు చేస్తే గనక ఆపై నెల నుంచి అద్దె వస్తుంటుంది. ఏటేటా విలువ పెరుగుతుంటుంది కూడా. -
ప్రారంభాల్లో క్షీణత విక్రయాల్లో వృద్ధి
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రభావం మొదలైంది. కొత్త గృహాల ప్రారంభాలపై వీటి ప్రభావం ప్రత్యక్షంగా పడుతోంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), రెరా.. ప్రతికూలతలతో హైదరాబాద్లో కొత్త గృహాల ప్రారంభాలు తగ్గిపోయాయి. పైగా ఎన్నికల వాతావరణమూ నెలకొనడంతో కొత్త ప్రాజెక్ట్ల ప్రారంభాల కంటే.. పాత ప్రాజెక్ట్ల నిర్మాణంపైనే డెవలపర్లు దృష్టిసారిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో నగరంలో 5,225 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. మూడో త్రైమాసికం (క్యూ3) నాటికవి 25% క్షీణతతో 4,150కు తగ్గిపోయాయి. విక్రయాలను చూస్తే.. క్యూ2లో 4,750 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ3 నాటికి 2 శాతం వృద్ధితో 4,850కు పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ప్రారంభాల్లో 3 శాతం, అమ్మకాల్లో 9 శాతం వృద్ధి దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్కతా, హైదరాబాద్లో క్యూ3లో 52,150 కొత్త గృహాలు ప్రారంభమయ్యాయి. క్యూ2లో ఇవి 50,600గా ఉన్నాయి. విక్రయాలు క్యూ2లో 61,550 యూనిట్లు కాగా.. క్యూ3 నాటికి 67,175కు పెరిగాయి. అంటే దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో త్రైమాసికం వ్యవధిలోనే కొత్త గృహాల ప్రారంభాల్లో 3 శాతం, అమ్మకాల్లో 9 శాతం వృద్ధి నమోదైదన్నమాట. కొత్త గృహాల్లోనూ 76 శాతం ప్రారంభాలు ముంబై, పుణే, బెంగళూరు, చెన్నైల్లోనే జరిగాయి. రూ.40 లక్షల లోపు ఉన్న గృహాలు 42 శాతం ఉంటే, రూ.40–80 లక్షల లోపు ఉన్న గృహాలు 33 శాతం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలు 25 శాతం వరకున్నాయి. నగరాల వారీగా ప్రారంభాలు చూస్తే.. ఈ ఏడాది క్యూ2లో ఎన్సీఆర్లో 8,475 యూనిట్లు ప్రారంభమైతే.. క్యూ3 నాటికి 50 శాతం క్షీణతతో 4,200కు తగ్గాయి. ముంబైలో క్యూ2లో 14 వేల గృహాలొస్తే.. క్యూ3 నాటికి 42 శాతం వృద్ధితో 19,850 కు పెరిగాయి. బెంగళూరులో క్యూ2లో 8,775 నుంచి క్యూ3లో 18 శాతం క్షీణతతో 7,175కు తగ్గాయి. పుణేలో క్యూ2లో 7,075 నుంచి క్యూ3లో 11 శాతం వృద్ధితో 7,875 యూనిట్లకు, చెన్నైలో క్యూ2లో 4,200 నుంచి క్యూ3లో 15 శాతం వృద్ధితో 4,850కు, కోల్కతాలో క్యూ2లో 2,550 నుంచి క్యూ3లో 59 శాతం వృద్ధితో 4,050 గృహాలకు పెరిగాయి. అమ్మకాల్లో వృద్ధి.. ఎన్సీఆర్లో క్యూ2లో 11,150 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ3 నాటికి 2 శాతం వృద్ధితో 11,350 కు పెరిగాయి. ముంబైలో 15,750 నుంచి 18,200 కు, బెంగళూరులో 14,800 నుంచి 16,250 కు, పుణేలో 8,375 నుంచి 9,300 కు, చెన్నైలో 2,700 నుంచి 2,925లకు, కోల్కతాలో 4,025 నుంచి 4,300లకు పెరిగాయి. -
రెరాలో నమోదు కాకపోతే?
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ప్రారంభమైన నెల రోజులైంది. 2017, జనవరి 1 తర్వాత 5 వేల ప్రాజెక్ట్లు అనుమతి పొందితే.. రెరాలో నమోదైన ప్రాజెక్ట్లు మాత్రం జస్ట్ 17. నవంబర్ 30వ తేదీలోపు ఆయా ప్రాజెక్ట్లు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా తప్పదు. సాక్షి, హైదరాబాద్: 2017 జనవరి 1 తేదీ తర్వాత హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పంచాయతీలు, డీటీసీపీ, టీఎస్ఐఐసీల నుంచి అనుమతి పొందిన ప్రతి ఒక్క నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు చేసుకోవాలి. ఆయా విభాగాల నుంచి 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లుంటే ప్రతి ప్రాజెక్ట్ రెరా పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో జనవరి 1, 2017 తర్వాత జీహెచ్ఎంసీ నుంచి 2,985 ప్రాజెక్ట్లు, హెచ్ఎండీఏ 840 ప్రాజెక్ట్లు, డీటీసీపీ నుంచి 1,122 ప్రాజెక్ట్లను అనుమతులు పొందాయి. ఈ ప్రాజెక్ట్లన్నీ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. 3 దశల్లో రెరా రిజిస్ట్రేషన్.. ఇప్పటివరకు టీఎస్ రెరాలో 450 మంది డెవలపర్లు, 17 ప్రాజెక్ట్ల వివరాలు మాత్రమే నమోదయ్యాయి. రెరాలో నమోదు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. తొలిదశలో నిర్మాణ సంస్థ ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లు నామమాత్రపు రుసుము చెల్లించి రెరాలో రిజిస్టర్ చేసుకోవాలి. రెండోదశలో ప్రాజెక్ట్ వివరాలను, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెరా అధికారులు పర్యవేక్షణ, స్క్రూటినీ వంటివి నిర్వహించి.. అన్నీ సవ్యంగా ఉన్నాయని తేలితే చివరి దశలో రెరా నమోదు పత్రాన్ని అందజేస్తారు. నమోదు చేయకుండా విక్రయిస్తే.. రెరాలో నమోదు చేయకుండా ఫ్లాట్, ప్లాట్ ఏదైనా సరే అడ్వర్టైజింగ్ చేయడం గానీ విక్రయించడం గానీ చేయకూడదు. కానీ, రెరా అమల్లోకి వచ్చి నెల రోజులు గడిస్తున్నా.. నేటికీ యథేచ్ఛగా ప్రకటనలు, ఆఫర్లూ ప్రకటిస్తున్నారని.. విక్రయాలూ జరుపుతున్నారని టీఎస్ రెరా అధికారి ఒకరు తెలిపారు. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా విక్రయించిన పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10% జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. నమోదు రుసుములు.. ఒకసారి రిజిస్ట్రేషన్కు డెవలపర్లకైతే రూ.750, ఏజెంట్లకైతే రూ.500 ఉంటుంది. ప్రాజెక్ట్ను రిజిస్ట్రేషన్ చేశాక.. ప్రతి మూడు నెలలకొకసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ధరలివే.. ♦వెయ్యి చ.మీ. వరకుండే గ్రూప్ హౌజింగ్కు చ.మీ.కు రూ.5, అంతకంటే ఎక్కువైతే చ.మీ. రూ.10. గరిష్ట మొత్తం రూ.5 లక్షలు. ♦ రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ ప్రాజెక్ట్కు గరిష్ట మొత్తం రూ.7 లక్షలు. ♦ వెయ్యి చ.మీ. లోపుండే కమర్షియల్ ప్రాజెక్ట్కు చ.మీ.కు రూ.20, అంతకంటే ఎక్కువైతే చ.మీ.కు రూ.25. గరిష్ట మొత్తం రూ.10 లక్షలు. ♦ ఓపెన్ ప్లాట్లకు చ.మీ.కు రూ.5. గరిష్ట మొత్తం రూ.2లక్షలు. -
రెరాతో కార్మికుల కొరత!
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో స్థిరాస్తి రంగానికి జరిగే ప్రయోజనం సంగతి కాసేపు పక్కన పెడితే.. కార్మికుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. నిర్మాణంలో నాణ్యత అనేది రెరాలో ప్రధానమైన అంశం. ఇందుకోసం నాణ్యమైన నిర్మాణ సామగ్రితో పాటూ నైపుణ్యమున్న లేబర్స్ అవసరమే. కార్మికుల కొరత కారణంగా పెద్ద ప్రాజెక్ట్లకు సమస్య అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న నిర్మాణ గడువు.. నగరంలో చాలా మంది డెవలపర్లు రెరాలోని ఐదేళ్ల వారంటీ నిబంధనకు భయపడి నిర్మాణ గడువును పెంచుతున్నారని అప్పా జంక్షన్కు చెందిన ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. గతంలో 50 ఫ్లాట్లుండే అపార్ట్మెంట్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తే.. ఇప్పుడదే అపార్ట్మెంట్ను మూడేళ్లలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే ఇచ్చిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయని పక్షంలో జరిమానాలు, జైలు శిక్షలున్నాయి. గతంలో అయితే నిర్మాణం కాస్త ఆలస్యమైనా సరే కొనుగోలుదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చు. కానీ, రెరాలో పప్పులేవీ ఉడకవని.. ఎవరైనా కొనుగోలుదారులు రెరా అథారిటీని సంప్రదిస్తే అసలుకే మోసం వస్తుందని ఆయన వివరించారు. టెక్నాలజీ కీలకం.. నాణ్యమైన కాంట్రాక్టర్స్ కొరత పరిశ్రమలో తీవ్రంగా ఉందని.. దీంతో చాలా మంది డెవలపర్లు గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారని సీబీఆర్ఈ దక్షిణాసియా చైర్మన్ అన్షుమన్ మేగజైన్ తెలిపారు. ఇదే అంతర్జాతీయ నిర్మాణ సంస్థలకు దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్మాణ రంగంలో టెక్నాలజీ కీలకంగా మారుతుందన్నారు. టెక్నాలజీ వినియోగించే కంపెనీలకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని సూచించారు. ఉక్కు నిర్మాణాలను నిర్మిస్తే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ టెండర్ల మీద ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఉక్కు నిర్మాణాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు పరిశ్రమ వర్గాలతో పాటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. 30 శాతం కార్మికుల కొరత.. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు ఒడిశా, బిహార్, ఛత్తీస్గఢ్, అస్సాం, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందినవారే. ఆయా ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి కార్మికుల కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులుండగా.. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, ప్లానర్ల కొరత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 6.42 లక్షల మంది సివిల్ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. -
కొనుగోళ్ల జోరు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) బిల్లులతో స్థిరాస్తి రంగంలో పారదర్శకత నెలకొంది. దీంతో రియల్టీలోకి ప్రవాసులు, హెచ్ఎన్ఐల పెట్టుబడులు రావటం పెరిగింది. అమెరికాతో సహా ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లు ప్రతికూలంలో ఉండటంతో అయా దేశాల్లోని ప్రవాసులను మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. గృహ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, మూలధన రాబడి, పన్ను ప్రయోజనాలు వంటివి కూడా కొనుగోళ్ల పెరుగుదలకు కారణాలు. స్వల్ప కాలంలో అధిక రాబడి కారణంగా కొందరు లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తుంటే, మరికొందరేమో ఆధునిక వసతులు, భద్రత వంటి కారణంగా పాత గృహాలను అమ్మేసి మరీ లగ్జరీ ఫ్లాట్లను కొం టున్నారని డెవలపర్ చెప్పారు. నగరంలో ప్రీమియం గృహాల సప్లయి తక్కువగా ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదును బ్యాంకులో దాచుకోవటం లేక బయట వడ్డీలకు ఇవ్వటం చాలా వరకు తగ్గింది. దీని బదులు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలో అధిక రాబడులు పొందొచ్చనే అభిప్రాయం కస్టమర్లలో పెరిగిందని.. ఇవే హైదరాబాద్లో ప్రీమియం గృహాల కొనుగోళ్ల పెరుగుదలకు కారణాలని ఓ డెవలపర్ తెలిపారు. పశ్చిమ జోన్లోనే ఎక్కువ.. ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువైన పశ్చిమ జోన్లోనే లగ్జరీ అపార్ట్మెంట్ల నిర్మాణాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నార్సింగి, గండిపేట్ వంటి ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. ‘‘సుమారు 6 వేల చ.అ. నుంచి వీటి విస్తీర్ణాలుంటాయి. హోమ్ ఆటోమేషన్, 24 గంటలు నీళ్లు, విద్యుత్. కట్టుదిట్టమైన భద్రత. లగ్జరీ క్లబ్హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, థియేటర్ వంటి అన్ని రకాల అత్యాధునిక వసతులుంటాయి. అయితే వసతులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని’’ మరో డెవలపర్ తెలిపారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే నగరంలో భూముల ధరలు తక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలంగా ఉండటం, కాస్మోపాలిటన్ సిటీ, స్థానిక ప్రభుత్వ విధానాలూ వంటివి కూడా ప్రీమియం కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఎన్నారైలు, అధిక వేతనాలుండే ఐటీ, ఫార్మా ఉద్యోగులు, వ్యాపార సంస్థల యజమానులు, ఉన్నతాధికారులు ఈ ఖరీదైన గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంఓ స్టార్టప్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్ కంపెనీల ఉద్యోగులూ ఈ జాబితాలో చేరారు. -
రెరాతో భరోసా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మోసాలకు ఇక తెరపడనుంది. ఆయా నిర్మాణాలకు అనుమతి పొందకుండానే అనుమతి పొందినట్లు ప్రజలను మభ్యపెట్టి ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించే మోసగాళ్లకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్ రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్)యాక్ట్– రెరా’ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఇళ్ల కోసం ప్రజల నుంచి పెద్దమొత్తంలో అడ్వాన్సులు స్వీకరించడమే కాక మొత్తం సొమ్ము వసూలు చేసినా, నిర్ణీత వ్యవధిలో ఇళ్లు నిర్మించకుండా ముప్పుతిప్పలు పెడుతున్న రియల్టర్ల బారి నుంచి సామాన్యులకు రక్షణగా రెరా చట్టం నిలవనుంది. నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టును పూర్తిచేయని వారికి పెనాల్టీలు పడనున్నాయి. 2017 జనవరి1 నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో అనుమతి పొందిన ప్రాజెకులన్నీ రెరా వద్ద నమోదు చేసుకోవాలి. నవంబర్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికావాలి. 500 చ.మీ. కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఇళ్లు, 8 ఫ్లాట్లు దాటిన అపార్ట్మెంట్స్ నిర్మించే అన్ని నివాస, వాణిజ్య భవనాలకు, లేఔట్స్కు ఇది వర్తిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నవారు అనుమతి పొందాక తమ ప్రాజెక్టును రెరా వద్ద నమోదు చేసి, వెబ్సైట్లో వివరాలు పొందుపరచాలి. మూడునెలలకోమారు పనుల పురోగతి వివరాలు అప్డేట్చేయాలి. తద్వారా కొనుగోలుదారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తుంది. అనుమతి పొందిన ప్లాన్ అసలు ప్రతి, రివైజ్ చేస్తే ఆ వివరాలు, ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తవుతుందో ఆ వివరాలు స్పష్టంగా వెల్లడించాలి. ఈ చట్టం వల్ల సామాన్యప్రజల ప్రయోజనాలకు రక్షణతోపాటు రియల్ఎస్టేట్ రంగం పురోగతికీఉపకరిస్తుందనిజీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ ఎస్.దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో2985 ప్రాజెక్టులు.. 2017 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు పొందిన 2985 ప్రాజెక్టులు, హెచ్ఎండీఏ పరిధిలోని 840 ప్రాజెక్టుల వివరాలను రెరా వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. నవంబర్ నెలాఖరులోగా సంబంధిత డెవలపర్లు తమ ప్రాజెక్టుల్ని రెరా వద్ద నమోదు చేయించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శక ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇంకా.. ♦ బిల్డర్లు తమ కంపెనీ వివరాలు, స్థలంపై యాజమాన్య హక్కు,ఆర్థిక పరిస్థితి, చేపట్టే నిర్మాణాల వివరాలు, లీగల్ క్లియరెన్స్లు తదితరమైనవన్నీ వెబ్సైట్లో పొందుపరచాలి. ♦ రెరా అథారిటీ వద్ద వివరాలు నమోదు చేసుకున్నాకే వ్యాపార ప్రకటనలు ఇవ్వాలి. ♦ అనుమతి పొందిన ప్లాన్ను రివైజ్ చేయాల్సి వస్తే ఫ్లాట్లు బుక్చేసుకున్న వారి అనుమతితోనే రివైజ్ చేయాలి. ♦ ప్రాజెక్ట్ అభివృద్ధి ప్రణాళిక, నిర్మిత స్థలం, కార్పెట్ ఏరియా వివరాలు పేర్కొనాలి. ♦ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలపాలి. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తికాని పక్షంలో ఆలస్యం అయ్యే కాలానికి కొనుగోలుదారులు చెల్లించిన సొమ్ముకు బిల్డర్లు వడ్డీ చెల్లించాలి.అలాగే కొనుగోలుదారుల చెల్లింపు ఆలస్యమైనా వడ్డీ కట్టాలి. ♦ ఇళ్ల కొనుగోలుదారులు తాము మోసపోతే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ♦ నిబంధనలను అతిక్రమించే వారికి జరిమానాలతో పాటు జైలుశిక్షలు కూడా విధించవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు ఇలా.. ♦ ఆన్లైన్ద్వారా రెరా వెబ్సైట్కు ఫిర్యాదు చేయాలి. ♦ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ నెంబరును ఫిర్యాదులో పేర్కొనాలి. ♦ నిర్ణీత ఫీజు రూ. 1000 చెల్లించాలి. ♦ డెవలపర్కు రెరా అథారిటీ నోటీసు జారీ చేస్తుంది. ♦ డెవలపర్ నిర్ణీత వ్యవధిలో సమాధానం ఇవ్వాలి. నిర్ణీత తేదీన విచారణకు హాజరు కావాలి. ఫిర్యాదుదారు కూడా హాజరుకావాలి. ఉభయుల వాదనలు విన్నాక అథారిటీ తగిన ఉత్తర్వు జారీ చేస్తుంది. సంతృప్తిచెందని పక్షంలో రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లవచ్చు. -
రెరా.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడం, కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడం, స్థిరాస్తి లావాదేవీల్లో నిబంధనల అమలును ప్రోత్సహించడం, సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కృషి చేయడం, బిల్డర్లు/డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాలను సత్వరంగా పరిష్కరించడం కోసం రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) అథారిటీ (రెరా) పని చేయనుంది. 500 చదరపు మీటర్లకు పైబడిన లేదా 8 అపార్ట్మెంట్లకు మించిన గృహ/వాణిజ్య ప్రాజెక్టులు/ లే అవుట్లను బిల్డర్లు/ డెవలపర్లు తప్పనిసరిగా ఆన్లైన్లో రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక ప్రాజెక్టు రిజిస్ట్రేషన్కు రూ.750 చొప్పున వినియోగదారులు రుసుం చెల్లించాల్సి ఉండనుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సైతం రూ.500 చెల్లించి తప్పనిసరిగా నమోదు కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో బిల్డర్లు, ఏజెంట్లపై రెరా అథారిటీ జరిమానాలు విధించనుంది. దరఖాస్తుకు 30 రోజుల్లోపు రెరా అథారిటీ రిజిస్ట్రేషన్ జరుపుతుంది. హెచ్ఎండీఏ పరిధిలో 840, జీహెచ్ఎంసీ పరిధిలో 2,985, డీటీసీపీ పరిధిలో 1,122 ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. మూడు నెలల ప్రత్యేక గడువుతో నవంబర్ 30లోగా ఈ ప్రాజెక్టులను రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పురపాలక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాజెక్టు ఒరిజినల్ శాంక్షన్ ప్లాన్, నిర్మాణ కాల వ్యవధిని తెలపాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి వివరాలను బిల్డర్లు రెరా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ♦ గ్రూపు హౌజింగ్ ప్రాజెక్టులకైతే ప్రతి చదరపు మీటర్కు రూ.5 చొప్పున 1000 చదరపు మీటర్ల ప్రాజెక్టులకు, ప్రతి చదరపు మీటర్కు రూ.10 చొప్పున 1000 చదరపు మీటర్లకు పైబడిన ప్రాజెక్టలకు రిజిస్ట్రేషన్ చార్జీలు మొత్తం రూ.5 లక్షలకు మించకుండా చెల్లించాల్సి ఉంటుంది. ♦ గృహ, వాణిజ్య మిశ్రమ సముదాయాలు కలిగిన ప్రాజెక్టుల విషయంలో ప్రతి చదరపు మీటర్కు మొత్తం రూ.5 చొప్పున 1000 చదరపు మీటర్ల ప్రాజెక్టులకు, ప్రతి చదరపు మీటర్కు రూ.10 చొప్పున 1000 చదరపు మీటర్లకు పైబడిన ప్రాజెక్టలకు రిజిస్ట్రేషన్ చార్జీలు మొత్తం రూ.7 లక్షలకు మించకుండా చెల్లించాల్సి ఉంటుంది. ♦ వాణిజ్య ప్రాజెక్టులకైతే చదరపు మీటర్కు రూ.20 చొప్పున 1000 చదరపు మీటర్ల వరకు, చదరపు మీటర్కు రూ.25 చొప్పున 1000 చదరపు మీటర్లకు పైబడిన ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ చార్జీలు మొత్తం రూ.10లక్షలకు మించకుండా చెల్లించాల్సి ఉంటుంది. ♦ ప్లాట్ల అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రతి చదరపు మీటర్కు రూ.5 చొప్పున రూ.2లక్షలకు మించకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉండనుంది. ♦ ప్రాజెక్టుల కొనుగోలుదారులు రూ.1000 చెల్లించి రేరా వెబ్సైట్కు తమ ఫిర్యాదులు నమోదు చేస్తే ఆథారిటీ పరిశీలించి పరి ష్కరిస్తుంది. రెరా ఆథారిటీ నిర్ణయం పట్ల సంతృప్తి చెందని పక్షం లో రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ను సంప్రతించవచ్చు. -
ఆంధ్రప్రదేశ్లో 25 తెలంగాణలో 16
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా).. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించే చట్టం. కేంద్రం రెరాను ప్రతిపాదించి రెండేళ్లు దాటినా నేటికీ దేశంలో రెరా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నేటికీ కొన్ని రాష్ట్రాలు కనీసం రెరా నిబంధనలను ఖరారు చేయలేదు. కొన్ని రాష్ట్రాలైతే నిబంధనలను ఓకే చేసి.. ప్రాజెక్ట్ల నమోదు కోసం వెబ్సైట్ అభివృద్ధిని అటకెక్కించేశాయి. సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెరాను అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చూస్తే.. రెరా నిబంధనల ఖరారు, ప్రాజెక్ట్ల నమోదు, ఉల్లంఘనలకు శిక్షలు వంటి అన్ని దశల్లోనూ రెరా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ముందున్నది ఒక్క మహారాష్ట్రనే. అ తర్వాత ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల గణాంకాలను చూస్తే.. ఆంధ్రప్రదేశ్లో 25 ప్రాజెక్ట్లు, 17 మంది ఏజెంట్లు, తెలంగాణలో 16 ప్రాజెక్ట్లు, ఐదుగురు ఏజెంట్లు నమోదయ్యారు. 32,306 ప్రాజెక్ట్లో రెరాలో నమోదు.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32,306 ప్రాజెక్ట్లు, 23,111 ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 17,353 ప్రాజెక్ట్లు, 15,634 మంది ఏజెంట్లు, ఉత్తర ప్రదేశ్లో 3,950 ప్రాజెక్ట్లు, 1,799 మంది ఏజెంట్లు, గుజరాత్లో 3,300 ప్రాజెక్ట్లు, 620 మంది ఏంజెట్లు, కర్ణాటకలో 1,982 ప్రాజెక్ట్లు, 1,069 మంది ఏజెంట్లు, మధ్యప్రదేశ్లో 1,901 ప్రాజెక్ట్లు, 426 మంది ఏజెంట్లు నమోదయ్యాయి. బిహార్లో 40 ప్రాజెక్ట్లు, ఛత్తీస్గఢ్లో 664, గోవాలో 256, హర్యానాలో 400, హిమాచల్ప్రదేశ్లో 20, జార్ఖండ్లో 30, ఒరిస్సాలో 123. పంజాబ్లో 566, రాజస్థాన్లో 807, తమిళనాడులో 635, ఉత్తరాఖండ్లో 155, దాద్రా అండ్ నగర్ హవేలిలో 69, ఢిల్లీలో 14 ప్రాజెక్ట్లు నమోదయ్యాయి. నిబంధనలను ఖరారు చేయనివి: అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, మిజోరాం, కేరళ, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ. నిబంధనలు ఖరారు చేసి.. వెబ్సైట్ ప్రారంభించని రాష్ట్రాలు: అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి. నిబంధనల సడలింపు కేంద్ర ప్రతిపాదించిన రెరా నిబంధనలను చాలా వరకు రాష్ట్రాలు నిబంధనలను సడలించాయి. వాటిల్లో ప్రధానమైనవివే.. ♦ ‘నిర్మాణంలోని ప్రాజెక్ట్లు’ అంశంలో మినహాయింపునిచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో అనుమతులు తీసుకున్న ప్రాజెక్ట్లను రెరా నుంచి మినహాస్తే, మరికొన్ని శ్లాబ్, సగం నిర్మాణం పూర్తయిన వాటిని నిర్మాణంలోని ప్రాజెక్ట్లుగా పరిగణించి రెరా నుంచి మినహాయింపునిచ్చాయి. ♦ నిబంధనలను ఉల్లంఘించిన డెవలపర్లకు విధించే రెరా శిక్షలు, జరిమానాల్లో సడలింపు. ♦ ఎస్క్రో ఖాతా నుంచి సొమ్మును ఉపసంహరించుకునే వీలు కల్పించడం. ♦ నిర్మాణ లోపాలపై ఐదేళ్ల వారంటీ వంటి వాటిని తొలగించడం. ♦ డెవలపర్ల మీద కేసుల నమోదు రుసుములనూ మినహాయించడం. అనుమతులిచ్చే విభాగాలూ రెరా పరిధిలోకి రెరా అసలైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్మాణ అనుమతులిచ్చే ప్రభుత్వ సంస్థలు కూడా రెరా పరిధిలోనే ఉండాలి. అప్పుడు కొనుగోలుదారులకు, నిర్మాణ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అందరికీ జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుంది. – అనూజ్పురీ, చైర్మన్, అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ. -
15 నుంచి రెరాలో నమోదు!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15 నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో ప్రాజెక్ట్ల నమోదు ప్రారంభం కానుంది. రెరా అధికారుల నియామకంతో పాటూ వెబ్సైట్ అభివృద్ధి దాదాపు పూర్తయిందని.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు చెప్పారు. 2017 జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ నుంచి అనుమతి పొందిన అన్ని రకాల నివాస ప్రాజెక్ట్లు రెరాలో నమోదు చేసుకోవాలి. 500 చ.మీ. లేదా 8 కంటే ఎక్కువ ఫ్లాట్లున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన చెప్పారు. ‘‘ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. గతేడాది జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్లు తెలంగాణలో 5 వేలున్నాయి. ఇవన్నీ కూడా రెరాలో నమోదు చేసుకోవాలి. ఈనెల 15 నుంచి రెరా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవు తుంది కాబట్టి అక్కడి నుంచి 3 నెలల గడువు ఇస్తాం. అయినా నమోదు చేసుకోకపోతే నోటీసులు అందిస్తాం. అప్పటికీ స్పందించకపోతే రెరా చట్టం ప్రకారం జరిమానాలు, ఇతరత్రా శిక్షలుంటాయని’’ హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. ప్రాజెక్ట్ నమోదుకు నాలుగంచెలు.. శుక్రవారమిక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో రెరా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యాధర్ రావు మాట్లాడుతూ.. ఒక్క ప్రాజెక్ట్ నమోదు కోసం నాలుగంచెలుంటాయి. రెరా రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లను లెవల్–1 అధికారి పరిశీలించి.. లెవల్–2 అధికారికి పంపిస్తారు. ఇక్కడ ఏజెంట్, డెవలపర్ల డాక్యుమెంట్లను తనిఖీ చేసిన తర్వాత రెరా సెక్రటరీకి వెళుతుంది. ఆయా డాక్యుమెంట్లు, ఇతరత్రా వివరాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత చైర్మన్ ప్రాజెక్ట్ను నమోదుకు అనుమతిస్తారు. ఒక్క ప్రాజెక్ట్ నమోదు కోసం 30 రోజులు, ఏజెంట్ల నమోదుకు 24 గంటల సమయం పడుతుందని చెప్పారు. - తెలంగాణ రెరాలో ప్రాజెక్ట్, ఏజెంట్ల నమోదుతో పాటూ ఫిర్యాదు, నమోదు ఉపసంహరణ, రద్దు వంటి ప్రతి అంశాలకు సంబంధించిన ప్రమాణాలుంటాయని పేర్కొన్నారు. రెరా మీద కొనుగోలుదారులు, డెవలపర్లు ఇద్దరిలోనూ అవగాహన కల్పించాల్సిన అవసరముందని.. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెరా అనేది నమోదు మాత్రమే అనుమతి కాదు.. రెరా అనేది ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే అనుమతి కాదని హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ అన్నారు. ప్రాజెక్ట్కు సంబంధించిన స్థానిక మున్సిపల్ శాఖ అనుమతులు, అగ్నిమాపక, పోలీసు, పర్యావరణ ఇతరత్రా అన్ని ప్రభుత్వ విభాగాల అనుమతులు వచ్చాకే రెరా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతే తప్ప రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అనుమతులొచ్చినట్లు కాదని ఆయన వివరించారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో రెరా అవసరం పెద్దగా ఉండదని.. ఇక్కడి డెవలపర్లలో 95 శాతం నిర్మాణంలో, లావాదేవీల్లోనూ పారదర్శకంగా ఉంటారని చెప్పారు. - గడువులోగా నిర్మాణం పూర్తి చేయకపోయినా, లేక కొనుగోలుదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినా ఇతరత్రా ఉల్లంఘనలు చేపట్టినా సరే రెరా అథారిటీ నుంచి కఠినమైన శిక్షలుంటాయని.. అవసరమైతే ప్రాజెక్ట్, ఏజెంట్, డెవలపర్ల లైసెన్స్లూ రద్దు అవుతాయని హెచ్చరించారు. ఏసీగార్డ్స్లో డీటీసీపీ భవనంలోని క్రింది అంతస్తు తెలంగాణ రెరా కార్యాలయం. డీపీఎంఎస్ మాదిరి ఇబ్బందులొద్దు: క్రెడాయ్ క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ సీహెచ్ రామచంద్రా రెడ్డిలు మాట్లాడుతూ.. ‘‘గతంలో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రాయింగ్స్, ఇతరత్రా డాక్యుమెంట్లు అప్లోడ్ అవ్వక 3–4 నెలల పాటు ఇబ్బందులొచ్చాయని.. రెరా వెబ్సైట్ అమలులో ఇవేవీ లేకుండా చూసుకోవాలని సూచించారు. అన్ని విధాలా పరీక్షించిన అనంతరమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మహారాష్ట్ర రెరా మాదిరిగానే తెలంగాణ రెరాను అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో మాదిరిగా ఇక్కడి కొన్ని విషయాలు అవసరం లేదు. స్థానిక డెవలపర్లకు సులువుగా, అనుకూలంగా ఉండేలా తెలంగాణ రెరాను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణలోని 10 చాప్టర్ల సభ్యులు, ఇతర డెవలపర్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. -
అందుబాటు గృహాలపై రెరా భారం
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన చట్టం. కానీ, దీంతో అందుబాటు గృహాలకు కష్టకాలం వచ్చింది. ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి 7 లక్షల గృహాలు అమ్ముడుపోకుండా ఉంటే.. ఇందులో రూ.40 లక్షలు లోపు ధర ఉన్న అందుబాటు గృహాలు 2.37 లక్షలు ఉన్నాయి. మౌలిక వసతుల లేమి, నాసిరకమైన నిర్మాణాలు, లీగల్ సమస్యలే ఇందుకు కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్కతా, హైదరాబాద్ల్లో 2.37 లక్షల అందుబాటు గృహాలు ఖాళీగా (వేకెంట్)గా ఉన్నాయి. ఈ గృహాలు కూడా సంఘటిత రంగంలోని ప్రైవేట్ డెవలపర్లకు చెందినవే. ప్రభుత్వ గృహ పథకాలు, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్ల గృహాలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రధాన నగరాల్లో సంఘటిత రంగంలోని డెవలపర్లు నిర్మించిన అందుబాటు ప్రాజెక్ట్లు, స్థానిక ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన బడ్జెట్ గృహాలు విక్రయమయ్యాయి. కానీ, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్లు చేపట్టిన నిర్మాణాలు, అసంఖ్యాకమైన చిన్న అపార్ట్మెంట్లు, సుదూర ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు మాత్రం అమ్ముడుపోకుండా ఉన్నాయి. ఎందుకు అమ్ముడుపోలేదంటే? రెరా కంటే ముందు లోప భూయిష్టమైన ప్రాజెక్ట్లను గుర్తించడంతో కొనుగోలుదారులు వెనకపడ్డారు. కానీ, రెరా అమల్లోకి వచ్చాక కస్టమర్లు గుర్తించలేకపోయినా సరే రెరా అథారిటీ, బ్యాంక్లు గుర్తిస్తాయి. దీంతో రెరా అమలయ్యాక గృహాల ఇన్వెంటరీ పెరిగింది. ఇందుకు ప్రధాన కారణాలివే.. మౌలిక వసతులు: అందుబాటు ప్రాజెక్ట్లను ప్రారంభించే ముందు డెవలపర్లు స్థానిక ప్రజల అవసరాలు, గృహ విస్తీర్ణాలపై అధ్యయనం చేయలేదు. కేవలం భూమి తక్కువ ధరకు దొరుకుతుందని, అభివృద్ధి నిబంధనలఖర్చు తగ్గుతుందనే కారణాలతో సుదూర ప్రాంతాల్లో ప్రాజెక్ట్లను నిర్మించారు. పని ప్రదేశాలకు, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో గృహాలను నిర్మించారు. నాసిరకం నిర్మాణాలు: చాలా వరకు అందుబాటు గృహాల డిజైన్, నాణ్యత అంశాల్లో నాసిరకం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. పాత కాలం నాటి డిజైన్లతో నిర్మాణాలుండటం కూడా అమ్మకాలకు అడ్డంకే. నిర్మాణంలో నాణ్యత లేకపోతే అందుబాటు గృహాలైనా, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే ఏళ్లపాటు అమ్ముడుపోకుండా ఉంటాయి. లీగల్ సమస్యలు: చాలా వరకు అందుబాటు గృహ ప్రాజెక్ట్లు స్థానిక సంస్థల అనుమతులు లేకుండా ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాజెక్ట్ల్లో అయితే అనుమతి ఉన్న ఫ్లోర్స్ కంటే ఎక్కువ అంతస్తు నిర్మాణాలున్నాయి. దీంతో అందుబాటు గృహాలు విక్రయానికి నోచుకోవట్లేదు. అమ్ముడుపోవాలంటే? కేంద్రం నిజంగా 2022 నాటికి అంద రికీ గృహాలను అందించాలనే లక్ష్యంతో ఉంటే గనక ముం దుగా ఖాళీగా ఉన్న అందుబాటు గృహాలను ఆక్రమించేయాలి. అంటే ఇన్వెంటరీగా ఉన్న గృహాలను తగ్గించడం తప్ప ఇతర మార్గం లేదు. ♦ నీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు వంటి మెరుగైన మౌలిక వసతులున్న చోటే గృహాలు అమ్ముడుపోతాయి. అందుకే ఎక్కడైతే విక్రయించబడకుండా ఉన్న గృహాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో వెంటనే మౌలిక వసతులను కల్పించాలి. దీంతో వెంటనే ఆయా ప్రాంతా ల్లో గృహాలు అమ్ముడుకాకపోయినా మెల్లగా కొనుగోలుదారులు ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు మొగ్గుచూపే అవకాశముంది. ♦ చిన్న చిన్న అతిక్రమణలు జరిగిన అందుబాటు గృహ ప్రాజెక్ట్లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించాలి. ఒకవేళ అందుబాటు గృహాలు నో డెవలప్మెంట్ జోన్ (ఎన్డీజెడ్) లేదా పర్యావరణ సున్నితమైన ప్రాంతాల్లో నిర్మించినట్ల యితే స్థానిక మున్సిపల్ నిబంధనల్లో మార్పు చేసి ప్రత్యేక స్కీమ్లను తీసుకురావాలి. దీంతో ఆయా ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు గతంలో ముంబైలో సాల్ట్ ప్లాన్ ల్యాండ్స్లో నిర్మాణాలకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వటంతో పెద్ద ఎత్తున అందుబాటు గృహ ప్రాజెక్ట్లు వచ్చాయి. -
కొనుగోలుకు ముందే రెరా ఒప్పందపత్రం
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదైతే తప్ప ఫ్లాట్లు/ప్లాట్లను విక్రయించలేరు డెవలపర్లు. మరి, ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెరా అమలులో లేదు కదా! మరెలా? అంటే ప్రాపర్టీలను విక్రయించకూడదా? నిబంధనల ప్రకారమైతే.. కూడదంటే కూడదు! కానీ, నిర్మాణ సంస్థలేవీ విక్రయాలను ఆపేయట్లేదు. పైగా రెరా వచ్చాక ధరలు పెరుగుతాయని కస్టమర్లను తొందరపెట్టేస్తున్నాయ్ కూడా! కనీసం కొనుగోలుదారులైనా రెరాలో నమోదవ్వని ప్రాజెక్ట్ల్లో ఫ్లాట్లు/ప్లాట్లను కొనుగోలు చేసే సమయంలో ఏం చేయాలి? సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తో సహా ఏపీ, తెలంగాణల్లో రెరా చట్టం నిబంధనలు, ప్రయోజనాల మీద కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఇదే డెవలపర్లకు బ్రహ్మాస్త్రంగా మారింది. రెరాలోని పిచ్చి నిబంధనల కారణంగా భవిష్యత్తులో ప్రాపర్టీల ధరలు 30 శాతం వరకూ పెరుగుతాయని కస్టమర్లకు చెబుతున్నారు. పైగా జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ బాదుడూ తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో భవిష్యత్తు రెరా నిబంధనలేవీ పట్టించుకోకుండానే కస్టమర్లు ముందడుగు వేస్తున్నారు. రెరా మోడల్ అగ్రిమెంట్ రాసుకోండి! కొనుగోలు చేయబోయే ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ వెబ్సైట్ను, బ్రౌచర్ను సందర్శించి సంబంధిత ప్రాజెక్ట్ రెరా నిబంధనల ప్రకారమే ఉందో లేదో పరిశీలించాలి. డెవలపర్ గత చరిత్ర, పూర్తి చేసిన ప్రాజెక్ట్లు, ఆర్థిక క్రమశిక్షణ వంటి వివరాలను ఆరా తీయాలి. నిబంధనల ప్రకారమే ఉందనే రూఢీ అయ్యాక.. ఫ్లాట్లు/ప్లాట్లను కొనేముందు డెవలపర్లతో రెరా నమూనా ఒప్పందం (మోడల్ అగ్రిమెంట్) రాయించుకోవాలి. లేకపోతే రెరా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక.. మీరు సేల్డీడ్ రాసుకుంది లేక మీరు కొనుగోలు చేసింది రెరా అమలులో లేని సమయంలో కాబట్టి రెరా నిబంధనలు మీకు వర్తించవని డెవలపర్లు తిరకాసు పెట్టే ప్రమాదముంది. ∙ఒకవేళ ఇప్పటికే బుకింగ్ సొమ్ము చెల్లించి ఉంటే గనక.. డెవలపర్తో రేపే ఒక కొత్త అగ్రిమెంట్ చేసుకోండి. సంబంధిత ప్రాజెక్ట్ను రెరాలో నమోదు చేస్తానని, రెరా నిబంధనలన్నీ ఈ ప్రాజెక్ట్కూ వర్తిస్తాయని అందులో రాసుకోండి. రెరా మొదలయ్యాక ప్రాజెక్ట్కు సంబంధించిన లే అవుట్, టైటిల్, అనుమతులు, కాంట్రాక్టర్లు, నిధుల సమీకరణ వంటి వివరాలన్నీ రెరా అథారిటీకి సమర్పిస్తామని అగ్రిమెంట్లో ఉండేలా చూసుకోండి. ఐదేళ్ల వారంటీ, టైటిల్ బీమా తప్పనిసరి! రెరా నిబంధనల ప్రకారం కస్టమర్ల నుంచి అడ్వాన్స్గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్మును తీసుకోవటానికి వీల్లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం వెంటనే డెవలపర్, కొనుగోలుదారులు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. పైగా కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతం నగదును ప్రత్యేక బ్యాంక్ ఖాతా (ఎస్క్రో) తెరిచి అందులో డిపాజిట్ చేయాలని, ఈ సొమ్మును కేవలం ఆ ప్రాజెక్ట్కే వినియోగించాలని రెరా చట్టం చెబుతోంది. అందుకే మీరు చెల్లించే సొమ్మును ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందేనని డెవలపర్తో చెప్పండి. ఖాతా వివరాలను తీసుకొని బ్యాంక్లో పునఃపరిశీలించండి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే గడువులోగా ప్రాజెక్ట్ పూర్తికాకపోవచ్చు. అంతేకాదండోయ్.. రెరాలో నిర్మాణంలో వాడే ప్రతి వస్తువులకూ అంటే స్విచ్చులు, వైర్లు, డోర్లు, శానిటేషన్, రంగులు అన్ని రకాల ఉత్పత్తులకూ ఐదేళ్ల వారంటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా డెవలపర్దే. ఇది కూడా అగ్రిమెంట్లో ఉండేలా చూసుకోండి. టైటిల్ బీమా కూడా ఉండాల్సిందే. కార్పెట్ ఏరియా లెక్కనే కొనండి! ప్రస్తుతం డెవలపర్లు సూపర్ బిల్టప్ ఏరియా చొప్పున ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. కానీ, రెరా ఏమంటోందంటే.. కామన్ ఏరియా, సేలబుల్ ఏరియా ఎంతనేది వివరించి.. కేవలం కార్పెట్ ఏరియా లెక్కన మాత్రమే విక్రయించాలని! అందుకే దీని ప్రకారమే కొనుగోలు చేయడం ఉత్తమం. ♦ కార్పెట్ ఏరియా అంటే గది పొడవు, వెడల్పులు. అంటే వాడుకోవటానికి వీలుండే ఏరియా అన్నమాట. సూపర్ బిల్టప్ ఏరియా అంటే కార్పెట్ ఏరియాతో పాటూ బాల్కనీ, వెలుపలి గోడల మందం, లాబీ, లిఫ్ట్, మెట్లు వంటి వాటికి కేటాయించిన స్థలమన్నమాట. అంటే మనం చ.అ.కు చెల్లించే సొమ్ములో సూపర్ బిల్టప్ ఏరియా కూడా కలిసే ఉంటుందన్నమాట. ♦ అసలు కార్పెట్ ఏరియా లెక్కన కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనమేంటంటే.. ప్రతి ప్రాజెక్ట్లో 22–25 శాతం స్థలం కామన్ ఏరియాకు కేటాయిస్తారు. అంటే బాల్కనీ, లాబీ, లిఫ్ట్ వంటి వాటికి! ఉదాహరణకు ఫ్లాట్ ఏరియా 1,500 చ.అ. అనుకుంటే.. ఇందులో 300 చ.అ. స్థలం కామన్ ఏరియాకు పోతుంది. చ.అ.కు రూ.5 వేలనుకుంటే... మొత్తం ఫ్లాట్ ధర రూ.75 లక్షలు. ఇందులో కామన్ ఏరియాకు చెల్లించే మొత్తం రూ.15 లక్షలు. ఇలా అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్ కస్టమర్ చెల్లిస్తాడన్నమాట. సాధారణంగా డెవలపర్లు కామన్ ఏరియాకు 2–3 శాతం అదనంగా వేసుకొని లెక్కిస్తుంటారు. ఇది కూడా ఒకరకంగా కొనుగోలుదారులకు అదనపు భారమే. రెరా అమలయ్యాక డెవలపర్లు ఏం చేస్తారంటే.. కార్పెట్ ఏరియా లెక్కన విక్రయించాలంటే స్థలం తక్కువొస్తుంది కాబట్టి చ.అ. ధరలను పెంచే అవకాశముంది. నిర్మాణంలోని ప్రాజెక్ట్లూ రెరా పరిధిలోకే.. 2017 జనవరి1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్స్, టీఎస్ఐఐసీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లుండే ప్రతి ప్రాజెక్టూ రెరాలోకి వస్తాయి. మరి, 2017, జనవరి1కి ముందున్న ప్రాజెక్ట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లల్లో కొన్న కొనుగోలుదారులకు సమస్యలెదురైతే? ఇదే విషయమై.. ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫోర్ట్స్ (ఎఫ్పీసీఈ) ముంబై, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో కోర్టులను ఆశ్రయించించింది. ‘‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందినవనో లేక 40–60 శాతం వరకు నిర్మాణం పూర్తయినవనో నిబంధనను పెట్టి నిర్మాణంలోని ప్రాజెక్ట్లను రెరా నుంచి మినహాయింపునిచ్చాయి కొన్ని రాష్ట్రాలు. ఇది సరైంది కాదని అసలు సమస్య నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లతోనేనని.. అందుకే వీటిని కూడా రెరా పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది ఎఫ్పీసీఈ. కేంద్రం రూపొందించిన రెరా నిబంధనలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాల రీత్యా నీరుగారుస్తున్నాయని.. నిర్మాణంలోని అన్ని ప్రాజెక్ట్లు కూడా రెరా పరిధిలోకి వస్తాయని ఇటీవల ముంబై కోర్టు తీర్పునిచ్చిందని ఎఫ్పీసీఈ వైస్ ప్రెసిడెంట్ బీటీ శ్రీనివాసన్ తెలిపారు. అవిభాజ్య వాటా ఎవరి పేరు మీద? వాస్తవానికి రెరా నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ స్థల అవిభాజ్య వాటా (అన్డివైడెండ్ షేర్) సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ, ప్రస్తుతం డెవలపర్లు మాత్రం అవిభాజ్య వాటాను కొనుగోలుదారుల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిజానికి ఫ్లాట్ కొనుగోలుదారులెవరైనా సరే ఇదే కోరుకుంటారు కూడా. కానీ, రెరా చట్టం ప్రకారం అవిభాజ్య వాటా సొసైటీ పేరిట ఉండాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో చిక్కులొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొసైటీ పేరిటైతే చిక్కులొస్తాయ్! కొనుగోలుదారులెవరైనా సరే స్థల అవిభాజ్య వాటా కూడా వాళ్ల పేరు మీదే ఉండాలనుకుంటారు. సొసైటీ పేరిట అవిభాజ్య వాటా రిజిస్ట్రేషన్ చేస్తే చిక్కులొస్తాయి. స్థలానికి సంబంధించిన హక్కులు సొసైటీలోని ఒకరిద్దరి చేతుల్లోనే ఉంటుంది. అపార్ట్మెంట్ సొసైటీ ఏర్పడ్డ కొత్తలో ఇబ్బందులుండకపోవచ్చు. కానీ, పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత అపార్ట్మెంట్ పాతబడ్డాక అసలైన సమస్యలొస్తాయి. ‘‘అపార్ట్మెంట్ పాతబడింది. స్థలాన్ని నాకప్పగించండి. కొత్త అపార్ట్మెంట్ను కట్టి మీకందరికి ఫ్లాట్లను ఇచ్చి.. కొన్ని ఫ్లాట్లను నేను విక్రయించుకుంటానని’’ ఎవరైనా సొసైటీ సభ్యులను ప్రలోభ పెట్టే ప్రమాదముంది. సొసైటీలోని ఒకరిద్దరు డబ్బుకు ఆశపడి స్థలాన్ని విక్రయించే ప్రమాదముంది. ఇది అపార్ట్మెంట్లోని యజమానులందరికీ ప్రమాదమే. – జే వెంకట్ రెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ కామన్ ఏరియాలే సొసైటీ పేరిట! మహారాష్ట్రలో లాగా సొసైటీ పేరిట స్థలం కొనుగోలు, నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. ఇక్కడ అపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం నిర్మాణాలుంటాయి. పైగా రెరాలో కార్పెట్ ఏరియా లెక్కన మాత్రమే విక్రయిస్తున్నాం కాబట్టి దాన్ని మాత్రమే యజమాని పేరు మీద.. కామన్ ఏరియాను సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు వెయ్యి గజాల్లోని ప్లాట్లో 20 వేల చ.అ. బిల్టప్ ఏరియాలో అపార్ట్మెంట్ను నిర్మించామనుకుందాం. ఒక్కొక్కరికి 2,000 చ.అ. చొప్పున 10 మంది కస్టమర్లకు విక్రయించాం. ఒక్కొక్కరికి 100 గజాలొస్తుంది. ఇందులో 1,300 చ.అ. బిల్టప్ ఏరియా, 700 చ.అ. కామన్ ఏరియా ఉంటుంది. రెరా ప్రకారం.. 65 గజాలు కొనుగోలుదారుల పేరు మీద, 35 గజాలు సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్థలం మొత్తాన్ని సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే బ్యాంక్లు రుణాలు మంజూరు చేయవు. ఎందుకంటే తనఖా పెట్టుకునేందుకు స్థలం సొసైటీ పేరిట ఉంటుంది కాబట్టి! – సీ శేఖర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు -
రెరాతో రేట్లు పెరగవు!
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో ప్రాపర్టీ ధరలు పెరగవు. ఇదొక నియంత్రణ సంస్థ మాత్రమే. ఇందులోని నిబంధనలతో డెవలపర్లలో క్రమశిక్షణ అలవడుతుంది. నాణ్యమైన ఉత్పత్తుల వాడకంతో క్వాలిటీ నిర్మాణాలుంటాయి. పైగా నిబంధనల అతిక్రమణ, నిధుల మళ్లింపు వంటివేవీ లేకుండా నిర్మాణాలు గడువులోగా పూర్తవుతాయని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్. రాంరెడ్డి తెలిపారు. ♦ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా స్థిరాస్తి ధరలు పెరిగే అవకాశముంది. సిమెంట్, ఇనుము, రంగులు, టైల్స్ వంటి నిర్మాణ సామగ్రిపై పన్నులు గతంలో కంటే జీఎస్టీలో అధికంగా కేటాయించారు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఫలితంగా చ.అ. ధరలూ పెరుగుతాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్లకు జీఎస్టీని 12 శాతంగా కేటాయించారు. దీన్ని 5 శాతానికి తగ్గించాల్సిన అవసరముంది. ♦ 2008–09లో నగరంలో ఎంతైతే ధరలున్నాయో 2018లోనూ అవే ధరలున్నాయి. కానీ, స్థలాలు, నిర్మాణ సామగ్రి ధరలు కార్మికుల వేతనాలు, అనుమతులు, పన్నులు ఇతరత్రా ఖర్చు లు మాత్రం ఐదింతలు పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుం చి సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో 20% ధరలు పెరిగాయి. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 10–15% వరకు ధరలు పెరుగుతాయి. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ల్లో కంటే కొత్తగా వచ్చే ప్రాజెక్ట్ల్లోనే చ.అ. ధరలు పెరుగుతాయి. ♦ఇన్వెస్టర్లయినా, సామాన్య, మధ్యతరగతి ప్రజలైనా సరే ముందుగా కొనుగోలు చేసేది స్థలాలే. అందుకే అభి వృద్ధి తాలూకు పరిస్థితులు కనిపించగానే ముందుగా పెరిగేవి స్థలాల ధరలే. తర్వాతే నివాస సముదాయాల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్లో స్థలాల ధరలు పెరిగేందుకు ప్రధాన కారణం.. మౌలిక వసతుల అభివృద్ధి, మెట్రో రైల్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ల అభివృద్ధి. ♦ వచ్చే రెండేళ్లలో నగరంలో 9 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. దీన్లో సుమారు కొత్తగా లక్ష ఉద్యోగాలొస్తాయి. రియల్టీ పరిభాషలో 1 నాణ్యమైన ఉద్యోగి వస్తే దానికి అనుబంధంగా 7–8 ఉద్యోగ అవకాశాలొస్తాయి. దోబీ, డ్రైవర్, అడ్మినిస్ట్రేషన్ స్టాప్ వంటివాళ్లన్నమాట. వీళ్లందరికీ కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా ఇళ్లు కావాలి. అంటే వచ్చే రెండేళ్లలో 4–5 లక్షల ఇళ్లకు డిమాండ్ ఉంటుందని అంచనా. రూ.40 లక్షల్లోపూ అందుబాటు గృహాలే.. రూ.40 లక్షల లోపు ధర ఉండే గృహాలన్నీ అందుబాటు గృహాల పరిధిలోకే వస్తాయి. ఈ తరహా ఇళ్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉం టుందని, ప్రతికూల సమయంలోనూ అమ్మకాలుంటాయి. నగరం లో అనుమతులొచ్చి నిర్మాణంలో ఉన్న గృహాలు సుమారు 45–50 వేల యూనిట్లుంటాయి. వీటిల్లో 50% గృహాలు రూ.40 లక్షల్లోపే. ♦ అమ్ముడుపోకుండా ఇన్వెంటరీ పెరగడానికి కారణం జాయింట్ డెవలప్మెంట్ వెంచర్లే. జేవీ ప్రాజెక్ట్లో డెవలపర్ తాలూకు ఫ్లాట్లను విక్రయించేస్తాడు. కానీ, ల్యాండ్ ఓనర్ తాలూకు ఫ్లాట్లలో 30–35% మాత్రమే విక్రయించేస్తాడు. మిగిలిన వాటిని భవిష్యత్తు అవసరాల కోసం తన వద్దే ఉంచుకుంటాడు. -
రెరా చట్టం.. స్థిరాస్థి కొనుగోలుదారులకు వరం
సాక్షి, నెల్లూరు: ఏదైనా వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకుంటే నిర్మాణదారు మనకు ఎప్పుడు అప్పగిస్తాడో తెలియదు. ఒక వేళ డబ్బు తీసుకుని మనకు ఇంటిని సరైన సమయానికి అప్పగించకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. తీసుకున్న బ్యాంకు రుణంపై వడ్డీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల కొత్తగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని తీసుకువచ్చింది. నియంత్రణ అధికారుల వద్ద నమోదు ఈ చట్ట ప్రకారం చేపడుతున్న ప్రాజెక్టులను, ఇప్పటికీ కంప్లీషన్ సర్టిఫికెట్(సీసీ)అందుకోని ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టులను నియంత్రణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. దీంతో నిర్మాణ రంగంలోని బిల్డర్లు చేసే మోసాల నుంచి కొగుగోలుదార్లను రక్షించవచ్చు. ఇంతకు ముందు కోర్టు కేసులు, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి మాత్రమే వినియోగదారులు తమకు రావాల్సిన డబ్బును రాబట్టుకునేందుకు వీలుండేది. ఇకపై ఈ ప్రయాసలకు కాస్త విముక్తి కలుగుతుంది. రెరా చట్టంలోని కీలక ప్రతిపాదనలు బిల్డర్లు తాము చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక(ఎస్క్రో) ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల, కొనుగోలుదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతం అదే ఖాతాలో ఉండాల్సిందే. ఈ సొమ్మంతా ప్రాజెక్టు నిర్మాణానికి, భూమి కొనుగోలుకు వెచ్చించాల్సిఉంటుంది. ఒక్క ప్లాట్ అమ్మిన తర్వాత దాని నిర్మాణంలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే తప్పనిసరిగా బిల్డర్ కొనుగోలుదారు నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. దీంతో మధ్యలోనే మళ్లీ ధరలు పెంచే అవకాశం ఉండదు. ప్రతి దశా ప్రాజెక్ట్ కిందే ఈ చట్టం ప్రకారం భవన నిర్మాణంలోని ప్రతి దశా ప్రత్యేక ప్రాజెక్టు కింద లెక్క. ప్రతి దశకూ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ దశలను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారం అందుబాటులో.. ప్రతి బిల్డర్ ప్రాజెక్టు ప్లాన్, లేఅవుట్, ప్రభుత్వ అనుమతులు, ప్రాజెక్టు నిర్మించే భూమిపై హక్కు, ప్రస్తుత స్థితిగతులు, ప్రాజెక్టు ఉప కాంట్రాక్టర్ల వివరాలు, ఎప్పటి లోపు పూర్తవుతుందనే వివరాలను ఆయా రాష్ట్రాల నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. ప్లాట్ కొనుగోలుకు ముందే కొనుగోలుదారులు ఈ వివరాలను ఆయా సంస్థ«ల నుంచి ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది. నిర్మాణదారులకు జైలు, జరిమానా రెరా చట్టం కింద ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పాటించి తీరాలి. లేనిపక్షంలో 3 సంవత్సరాల వరకూ జైలుశిక్ష అనుభవించాలి. అక్కడ కేసు తీవ్రతను బట్టి జరిమానా సైతం ఉండొచ్చు. అలాగే ఈ చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి ప్లాట్ చేతికందిన ఏడాది సమయం వరకూ తలెత్తే నిర్మాణలోపాలను సరిదిద్దే బాధ్యత బిల్డర్ తీసుకోవాల్సిఉంటుంది. బుకింగ్ సొమ్ము ఇలా.. కొంత మంది బిల్డర్లు పూర్తి నిర్మాణ ఖర్చులో 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును బుకింగ్ కోసం అడుగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మకపు ఒప్పందం తర్వాత జరుగుతోంది. కానీ రెరా చట్టం ప్రకారం ప్రమోటర్లు 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును డిమాండ్ చేయకూడదు. మొదట సేల్ అగ్రిమెంట్ను కుదుర్చుకోవాల్సిందే. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే బ్యాంకు రుణం మీద వడ్డీ కట్టాల్సిన బాధ్యత నిర్మాణదారుపై పడుతుంది. దీంతో వినియోగదారునికి వడ్డీ భారం తగ్గుతుంది. -
2017 భరోసా!
భవిష్యత్తు రియల్టీకి సాక్షి, హైదరాబాద్: ‘భవిష్యత్తు రియల్టీ’ అనే సొంతింటికి 2017లో పునాది పడింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, విశ్వసనీయతే లక్ష్యంగా మొదలైన ఇంటి నిర్మాణానికి పెద్ద నోట్ల రద్దుతో తొలి అడుగు పడింది. స్థిరాస్తి రంగ అభివృద్ధి, నియంత్రణ బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ), బినామీ ప్రాపర్టీ చట్టాలతో జోరందుకుంది. మౌలిక రంగ హోదా, క్రెడిట్ లింక్ సబ్సిడీ (సీఎల్ఎస్ఎస్) వంటి వాటితో ప్రోత్సాహకాలూ అందాయండోయ్! ఇకిప్పుడు ఇంటి నిర్మాణమే తరువాయి! రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), ఎలక్ట్రానిక్ ప్రాపర్టీ పాస్ బుక్ (ఈపీపీబీ), అద్దె గృహల చట్టాలతో 2018 నుంచి ‘భవిష్యత్తు రియల్టీ’లో పారదర్శక అడుగులు మొదలవుతాయి!! గృహాల విభాగం: ప్రారంభాలు 50% అమ్మకాలు 30% డౌన్! 2017లో నివాస సముదాయాల విభాగానికి ఏమాత్రం కలిసిరాలేదు. పెద్ద నోట్ల రద్దుతో మొదలైన రియల్ కష్టాలు, రెరా, జీఎస్టీలతో పీకల్లోతుకు చేరాయి. దీంతో కొత్త ప్రాజెక్ట్ల సంగతి దేవుడెరుగు ఉన్న వాటిని విక్రయించేందుకే డెవలపర్లకు చుక్కలు కనిపించాయి. ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో 94 వేల యూనిట్లు ప్రారంభమయ్యాయి. 2016లో ఇదే సమయంతో పోలిస్తే 50 శాతం తక్కువ. అయితే 2017 చివరి త్రైమాసికంలో మాత్రం కాసింత సానుకూల వాతావరణం కనిపించింది. చివరి 3 నెలల్లో 18 వేల కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇక విక్రయాలు పరిశీలిస్తే.. 2017 క్యూ1–క్యూ3లో 1.60 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2016 క్యూ1–క్యూ3తో పోలిస్తే అమ్మకాలూ 30 శాతం తగ్గాయి. ♦ 2017లో నివాస విభాగంలో కనిపించిన కొత్త అంశమేంటంటే.. అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీకి రెక్కలొచ్చాయి. ఇంతకాలం అధిక సప్లయి కారణంగా ఇన్వెంటరీ పెరుగుతూ ఉండేది కానీ, 2017లో కొత్త ప్రాజెక్ట్లకు బ్రేకులు పడటంతో ఇన్వెటరీ అమ్మకాలు పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే మరీనూ! 2016 క్యూ3తో పోలిస్తే 2017 క్యూ3లో దేశవ్యాప్తంగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 8 శాతం తగ్గింది. హైదరాబాద్లో అత్యధికంగా 22 శాతం తగ్గింది. ఆ తర్వాత చెన్నైలో 18 శాతం, బెంగళూరులో 16 శాతం, పుణెలో 7 శాతం, ముంబై, ఎన్సీఆర్ల్లో 6 శాతం తగ్గుదల నమోదైంది. ఆఫీస్విభాగం : 2016తో పోలిస్తే 7% తగ్గుదల! ఈ ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో సుమారు 30.57 మిలియన్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2016లో ఇది 32.87 మిలియన్ చ.అ.లుగా ఉంది. అంటే ఏడాదిలో ఆఫీస్ స్పేస్ విభాగం 7 శాతం తగ్గింది. ఈ ఏడాది హైదరాబాద్లో మొత్తం 10 అతిపెద్ద డీల్స్ జరిగాయి. ఇందులో 1.4 మిలియన్ చ.అ. డీల్ కూడా ఉంది. 2019 ముగింపు నాటికి దేశంలో ఆఫీస్ అసెట్స్ విభాగం 6 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. 2017లో కో–వర్కింగ్ స్పేస్కు డిమాండ్ పెరిగింది. 7 ప్రధాన నగరాల్లో సుమారు 12 లక్షల కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు ఆయా స్థలాలను ఆక్రమించాయి. రిటైల్ విభాగం :47 లక్షల చ.అ. స్థలం రిటైర్డ్ ఔట్! ఈ ఏడాది కొత్తగా 64 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణంలో ఆలస్యం, నిధుల లేమి వంటి ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మాల్స్ 2018 ముగింపు మరో 1.1 కోట్ల చ.అ. మాల్స్ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది మాల్స్ స్థలాల లావాదేవీలు ఎక్కువగా ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగాయి. 2019 ముగింపు నాటికి 7 ప్రధాన నగరాల్లో 2 కోట్ల చ.అ., హైదరాబాద్లో 60 లక్షల చ.అ.ల్లో మాల్స్ స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. దేశీయ రిటైల్ విభాగంలో చరిత్రలోనే తొలిసారిగా మాల్స్ స్థలం ఉపసంహరణకు గురైంది. ప్రతికూల సప్లయి కారణంగా ఢిల్లీ–ఎన్సీఆర్ల్లో 8 మాల్స్ల్లో సుమారు 47 లక్షల చ.అ. స్థలాన్ని ఉపసంహరించుకున్నారు. లాజిస్టిక్ విభాగం: 909 మిలియన్ చ.అ.కు గిడ్డంగుల స్థలం ఈ ఏడాది దేశీయ లాజిస్టిక్ రంగంలో అతిపెద్ద డీల్స్ జరిగాయి. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఇండోస్పేస్లో 500 మిలియన్ డాలర్లతో 1.3 కోట్ల చ.అ.ల్లో 13 ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్ లను కొను గోలు చేసింది. ప్రస్తుతం దేశీయ గిడ్డంగుల పరిశ్రమ 56 వేల కోట్లుగా ఉంది. దేశంలో గిడ్డంగుల స్థలం 909.5 మిలియన్ చ.అ.లుగా ఉంది. 2019 ముగింపు నాటికి మరో 1,439 మిలియన్ చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ఏడాది అమెజాన్ శంషాబాద్ దగ్గర 4 లక్షల చ.అ.ల్లో గిడ్డంగిని ఏర్పాటు చేసింది. మౌలిక రంగ హోదా, సీఎల్ఎస్ఎస్, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా.. 2017 సంవత్సరం ప్రారంభంలోనే కేంద్రం అందుబాటు గృహాలకు మౌలిక రంగ హోదాను అందించింది. దీంతో తక్కువ వడ్డీ రేట్లకు నిధుల లభ్యత పెరిగింది. తొలిసారి గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్)ను ప్రకటించింది. అందుబాటు గృహ నిర్మాణదారులను, కొనుగోలుదారులను ఇద్దరినీ ప్రోత్సహించేందుకు ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గృహాల కార్పెట్ ఏరియాలను పెంచింది. ఎంఐజీ గృహాల కార్పెట్ ఏరియాను 90 చ.మీ. నుంచి 120 చ.మీ.లకు, ఎంఐజీ–2 గృహాల ఏరియాను 110 చ.మీ. నుంచి 150 చ.మీ.లకు విస్తరించారు. దీంతో బడా నిర్మాణ సంస్థలూ అందుబాటు గృహాల ప్రాజెక్ట్లను ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా బ్యాంకులూ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఏడాదిలో గృహ రుణాల వడ్డీ రేట్లు 150–200 బేసిస్ పాయింట్లు తగ్గాయి. -
18శాతం ఢమాలన్న గృహ విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త నిబంధనలతో రూపొందించిన చట్టం రెరా కారణంగా గృహాల విక్రయాలు భారీగా పడిపోయాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దేశంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ మార్కెట్లో డిమాండ్ వరుసగా మందగిస్తోందనీ, సెప్టెంబర్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ ఇది 18శాతం క్షీణించిందని రిపోర్ట్లో తేలింది. హైదరాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం కనిపించింది. రియల్టీ పోర్టల్ ప్రాప్ టైగర్ . కాం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడయ్యాయి. డీమానిటైజేషన్, రియల్ ఎస్టేట్ కొత్త చట్టం రెరా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్లో దాదాపు 53 శాతం క్షీణించి, 22, 115 యూనిట్లకు పడిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా పుణే, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా, అహ్మదాబాద్లో గృహ అమ్మకాలు, అలాగే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ భారీగా పడిపోయిందని నివేదించింది. కేవలం ముంబై, గుర్గావ్లో మాత్రం డిమాండ్ అండ్ సప్లయ్లో పురోగతి కనిపించిందని వ్యాఖ్యానించింది. నోట్ల రద్దు, కొత్త రెరా, జీఎస్టీ కారణంగా 2018 ఆర్థిక సంవతసరంలో రెండవ త్రైమాసికంలో లాంచింగ్, అలాగే అమ్మకాలు ప్రభావితం చేశాయని ప్రాప్ టైగర్ . కాం చీఫ్ ఇన్వెస్ట్మెంటట్ ఆఫీసర్ అంకుర్ ధావన్ చెప్పారు. అయితే జూలై, ఆగస్టు నెలలతో పోలిస్తే, ఫెస్టివ్ పీజన్లో అమ్మకాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో అహ్మదాబాద్లో 46 శాతం భారీ క్షీణతను నమోదుచేసి 2,222 యూనిట్లు విక్రయించింది. బెంగళూరులో 27 శాతం తగ్గి, 6,976 యూనిట్లు, చెన్నై 23 శాతం నీరసపడి 2,945 యూనిట్లు, కోల్ కతాతా 21 శాతం అమ్మకాలు క్షీణించి 2,993 యూనిట్లు, హైదరాబాద్ 18 శాతం తగ్గి 3,356 యూనిట్లను విక్రయాలు జరిగినట్టు తెలిపింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అమ్మకాలు గుర్గావ్ లో 60 శాతం వృద్ధితో 3,342 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబైలో 6 శాతం పెరిగి 12,101 యూనిట్లకు చేరుకున్నాయి. -
రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం
సాక్షి, ముంబై: ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన రియల్ ఎస్టేట్ చట్టం రెరా (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) పరిధిలో తొలి తీర్పు వెలుపడింది. అదీ గృహకొనుగోలుదారుకు అనుకూలంగా ఈ తీర్పు వెలుడింది. అనుకున్న సమయానికి ఇంటిని స్వాధీనం చేయకపోవడంతో బాధితుడు ఆన్లైన్ ద్వారా రెరాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా బిల్డర్ను రెరా ఆదేశించింది. 2016నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని బిల్డర్ చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీనికి తోడు ఆయన చెల్లించిన అడ్వాన్స్ సొమ్మను చెల్లించడానికి సదరు బిల్డర్ నిరాకరించారు. ఈ క్రమంలో బాధితుడు రెరాను ఆశ్రయించారు. రూ.5000 చెల్లింపు ద్వారా మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) వెబ్సైట్ లో ఫిర్యాదుదారు కేసు నమోదు చేశారు. దీన్ని విచారించిన రెరా గృహ కొనుగోలుదారునికి రూ. 26.15 లక్షలను తిరిగి చెల్లించాలని బుధవారం ఆదేశించింది. ముంబైకి చెందిన బిల్డర్కు ఈ ఆదేశాలు జారీ చేసింది. గృహ-కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సంబంధిత చట్టాలు అధికారుల మధ్య మంచి సమన్వయం ఉండాలని మహా రెరా చైర్మన్ గౌతం ఛటర్జీ మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా జైపీ ఇన్ ఫ్రాటెక్ కేసులు ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ప్రాజెక్ట్ డెలివరీలో జాప్యానికి సంబంధించి ఇప్పటివరకు తమకు 98 ఫిర్యాదులను అందుకున్నామన్నారు. కారణం ఏదైనా కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయితే వినియోగదారులే నష్టపోతారని ఛటర్జీ వ్యాఖ్యానించారు.మరోవైపు ఈ ఆదేశాలు జారీ అయినే వెంటనే డెవలపర్ తనుకు చెక్ను అందించారంటూ ఫిర్యాదు దారు సంతోషం వ్యక్తం చేశారు. -
తెలంగాణ రెరా మొదలైంది!
రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? ► 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్లన్నీ రెరా పరిధిలోకే ► అందుబాటు ఇళ్లూ రెరాలో నమోదు తప్పనిసరి ► రెరాతో పరిశ్రమలో పారదర్శకత; కొనుగోలుదారులకు భరోసా ► ఇంటి యజమాని మీరే.. కానీ, స్థలానికి కాదు! స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి 1 తర్వాత అనుమతి పొందిన నివాస, వాణిజ్య సముదాయాలు, లే అవుట్లన్నీ రెరా పరిధిలోకి వస్తాయని తేల్చి చెప్పింది. మరి, స్థిరాస్తి ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? జనవరి 1 తర్వాత అనుమతిపొంది, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లు, వెంచర్లలో విక్రయాల పరిస్థితేంటి? వంటి అంశాలపై స్థిరాస్తి నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది. సాక్షి, హైదరాబాద్ : 2017, జనవరి 1 తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ), డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ, పంచా యతీ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) నుంచి అనుమతి పొందిన నివాస, వాణిజ్య సముదా యాలు, ఓపెన్ ప్లాట్లూ రెరా పరిధిలోకి వస్తాయి. అందుబాటు గృహాలు, ప్రభుత్వం విక్రయించే ఫ్లాట్లూ రెరా పరిధిలోకే వచ్చేస్తాయి. రాజీవ్ స్వగృ హ, గృహకల్ప వంటి ప్రాజెక్ట్లన్నమాట. రెరాలో రిజిస్ట్రేషన్కు ధరలివే.. ్హవెయ్యి చ.మీ లోపు ఉండే గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్లకు చ.మీ.కు రూ.5, అంతకంటే ఎక్కువుండే ప్రాజెక్ట్లకు చ.మీ.కు రూ.10. అది కూడా రూ.5 లక్షల కంటే మించకూడదు. ♦ మిక్స్డ్ డెవలప్మెంట్ (నివాస, వాణిజ్య సముదాయాలు) ప్రాజెక్ట్లకైతే.. వెయ్యి చ.మీ. లోపు ఉండే వాటికి చ.మీ. రూ.10, అంతకంటే ఎక్కువుంటే చ.మీ. రూ.15. రూ.7 లక్షలకు మించకూడదు. ♦ వెయ్యి చ.మీ. లోపు ఉండే వాణిజ్య సముదాయాలకైతే చ.మీ.కు రూ.20, అంతకంటే ఎక్కువుండే ప్రాజెక్ట్లకు చ.మీ. రూ.20. రూ.10 లక్షలకు మించకూడదు. ♦ లే అవుట్ల అభివృద్ధికైతే చ.మీ.కు రూ.5. రూ.2 లక్షలకు మించకూడదు. వసూలు చేసిన సొమ్మెంత; ఖర్చు చేసిందెంత? ఇప్పుడు కొత్తగా ప్రారంభించే ప్రాజెక్ట్లే కాదు ఈ ఏడాది జనవరి 1 తర్వాత మొదలై.. ప్రస్తుతం నిర్మాణంలోని ప్రాజెక్ట్లు కూడా రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. ఆయా ప్రాజెక్ట్ల ఒరిజినల్ అనుమతి పత్రాలు, లే అవుట్ ప్లాన్స్, వసతులు వంటివన్నీ జత చేయాలి. ్హఇప్పటివరకు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మెంత? ఖర్చు చేసిందెంత? మిగిలిన మొత్తమెంత? వంటి వివరాలనూ అందించాలి. గతంలో బిల్టప్ ఏరియా చొప్పున విక్రయించినా సరే.. కార్పెట్ ఏరియా చొప్పున లెక్కేసి అపార్ట్మెంట్ విస్తీర్ణమెంత అనేది వివరించాలి. ♦ కొనుగోలు సమయంలో కస్టమర్లకు ప్రాజెక్ట్ నిర్మాణ గడువు చెప్పిందెంత. ప్రస్తుతం ఏ దశలో ఉంది? గడువు సమయం? వంటి వివరాలన్నీ అనుమతి పొందిన ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్టెర్డ్ అకౌంటెంట్ అనుమతి పత్రంతో అందించాలి. ప్రక్రియ పెరిగిందే తప్ప.. భారం కాదు రెరా అమలుతో డెవలపర్లకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ పెరుగుతుందే తప్ప నిధుల భారం కాదు. కాబట్టి ధరలు పెరిగే అవకాశమే లేదని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జే వెంకట్రెడ్డి చెప్పారు. అంతేకాదు ఐదేళ్ల గ్యారంటీ నిబంధన లిఫ్ట్, జనరేటర్ వంటి వాటికి లేదు కాబట్టి గతంలో ఊహించినట్టుగా 15–20 శాతం ధరలు పెరిగే అవకాశం లేదన్నారు. ‘‘ఇప్పటివరకు ప్రాజెక్ట్ నిధుల కోసం ప్రైవేట్ ఇన్వెస్టర్లనో, బయట వడ్డీలనో ఆశ్రయించేవాళ్లం. కానీ, ఇప్పుడు రెరా కారణంగా నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొంటుంది కాబట్టి బ్యాంకులూ విరివిగా నిధులిస్తాయి. వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. రాత్రికి రాత్రే ధరలు పెరిగే అవకాశం లేదని’’ ఆయన వివరించారు. గడువు ముగిసిందా వడ్డీ భారం డెవలపర్దే.. రెరాతో కొనుగోలుదారులకు కలిగే ప్రధాన ప్రయోజనం వడ్డీ భారం లేకపోవటమే. గతంలో గడువు ముగిసిన ప్రాజెక్ట్లలో ఒకవైపు బ్యాంకు వడ్డీలు భారం కస్టమర్ల మీదే పడేది. కానీ, రెరాతో గడువు ముగిసిందో వడ్డీల భారం డెవలపర్లదే ఉంటుంది. కాబట్టి గడువులోగా గృహ ప్రవేశం చేసే వీలుంటుంది. ♦ భవన నిర్మాణ అనుమతులు పొందేటప్పుడే నిర్మాణ గడువు, ప్రతి మూడు నెలలకొకసారి నిర్మాణం పరిస్థితి, ఖాళీగా ఉన్న ఫ్లాట్ల సంఖ్య వంటి వివరాలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. దీంతో కొనుగోలు సమయంలోనే కస్టమర్లు ప్రాజెక్ట్ వ్యయం, డెవలపర్ చరిత్ర వంటివన్నీ తెలుసుకోవచ్చు. ♦ ఐదేళ్ల గ్యారంటీ నిబంధనను కేవలం స్ట్రక్చరల్ లోపాలకు పరిమితం చేశారు. ఇతరత్రా ఉత్పత్తులకు వార్షిక నిర్వహణ ఒప్పందం (ఏఎంసీ) తీసుకోవాల్సిన బాధ్యత అపార్ట్మెంట్ సంఘానిదే. ఇంటి యజమాని మీరే.. కానీ, స్థలానికి కాదు! ఈ ఏడాది జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్లే రెరా పరిధిలోకి వస్తాయనే నిబంధనతో ప్రస్తుతం నిర్మాణంలోని ప్రాజెక్ట్లకు కొంత గందరగోళం ఏర్పడే అవకాశముంది. ఎలాగంటే.. ఆయా ప్రాజెక్ట్లలో ఇప్పటివరకు జరిగిన అమ్మకాల్లో కామన్ ఏరియా, అన్డివైడెండ్ (అవిభాజ్యపు) వాటాను ఇంటి యజమాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. కానీ, రెరాలో మాత్రంలో దీన్ని అపార్ట్మెంట్ సంక్షేమ సంఘానికి రిజిస్ట్రేషన్ చేయాలని అంటోంది. దీంతో ఆయా ప్రాజెక్ట్లలో ఇప్పుడు కొనుగోలు చేయబోయే కస్టమర్లకు ఈ స్థలం చెందదన్నమాట. అది సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఇంటి యజమాని మాత్రమే మనవుతాం కానీ, స్థలానికి కాదని కొనుగోలుదారులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లల్లో కొనుగోలు చేసే బదులు ఇప్పుడు కొత్తగా నిర్మాణం ప్రారంభించే ప్రాజెక్ట్లను ఎంచుకునే ప్రమాదముంది. దీంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో అమ్మకాలు పడిపోయే ప్రమాదముంది. మరి, ఈ విషయమై అప్పిలేట్ ట్రిబ్యునలే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి చెప్పారు. పరిశ్రమ రెరాతో నిర్మాణ రంగంలో పారదర్శకత చేకూరుతుంది. ఇన్నాళ్లూ అస్తవ్యస్తంగా ఈ రంగం ప్రణాళికాబద్ధంగా తయారవుతుంది. దీంతో అందుబాటు గృహాల విభాగానికి మల్లే నిర్మాణ రంగానికి కూడా పరిశ్రమ హోదా వచ్చే అవకాశముంది. దీంతో ఇతర పరిశ్రమ మాదిరిగానే విరివిగా రుణాలు వచ్చే అవకాశముంది. దేశీయ పెట్టుబడులే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లనూ ఆకర్షించే వీలుంటుంది. రెరా నిబంధనలను పక్కాగా పాటించే స్థానిక సంస్థలకూ కార్పొరేట్ బ్రాండింగ్ ఏర్పడుతుంది. కొనుగోలుదారులు స్థిరాస్తి రంగంలో అక్రమాలకు, నాణ్యతా లోపాలకు తావులేకుండా రెరాలో కఠినమైన నిర్ణయాలుండడంతో కొనుగోలుదారుల్లో నమ్మకం ఏర్పడుతుంది. గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయి కాబట్టి కొనుగోలుదారులు సమయానికి గృహ ప్రవేశాలు చేసే వీలుంటుంది. కొనుగోలు చేయబోయే ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని, డెవలపర్ చరిత్రనూ ముందే తెలుసుకునే వీలుంటుంది. డెవలపర్ల ఏకపక్ష ఒప్పందాలు ఉండవు కాబట్టి.. నిర్భయంగా పెట్టుబడులు పెట్టే వీలుంటుంది. -
ఫైనల్ లే అవుట్ రాలేదా? రెరాలో నమోదు తప్పనిసరి!
♦ విక్రయాలు జరిపే రియల్టీ పోర్టల్స్ కూడా రెరా పరిధిలోకే ♦ డెవలపర్లే కాదు.. బ్రోకర్లు, ఏజెంట్లూ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే ♦ రెరా అమలుతో రియల్టీ బ్రాండ్ అంబాసిడర్లూ ప్రకటనల్లో జాగ్రత్త సాక్షి, హైదరాబాద్ దశాబ్దం క్రితం స్థానిక సంస్థల నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకొని లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు విక్రయించేసి.. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్ల వంటి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జారుకున్నారు డెవలపర్లు. ఫైనల్ లే అవుట్ అనుమతులనూ తీసుకోలేదు. అయితే త్వరలోనే తెలంగాణలో అమల్లోకి రానున్న రెరా నిబంధనల్లో ఫైనల్ లే అవుట్ తీసుకొని వెంచర్లను కూడా రెరా పరిధిలోకి చేర్చారు. దీంతో ఆయా లే అవుట్లలో ఇప్పుడు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను ధిక్కరిస్తే.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఏజెంట్లు రెరా అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ రాష్ట్రంలో మాత్రమే ప్లాట్ల క్రయ విక్రయాలు చేపట్టాలి. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లోనూ స్థలాలను విక్రయించాలంటే సంబంధిత రాష్ట్రంలోని రెరా అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రెరా వద్ద నమోదు చేయని ఫ్లాట్లను గానీ ప్లాట్లను గానీ విక్రయించడానికి వీల్లేదు. కేవలం రెరాలో నమోదు చేసుకున్న లే అవుట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు, బ్రోకర్లు రెరాలో నమోదు చేసుకోని పక్షంలో ప్రతి రోజూ రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. రెరా నిబంధనలను పాటించకపోతే ప్లాట్ విలువలో 5 శాతం జరిమానా, అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను దిక్కరిస్తే మాత్రం ప్లాట్ విలువ 10 శాతం జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష. రెండూ కూడా విధించవచ్చు. టైటిల్ గ్యారెంటీ ఇవ్వాల్సిందే.. హెచ్ఎండీఏ పరిధిలోనే కాదు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని లే అవుట్లను కూడా రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందే. కొనుగోలుదారులకు టైటిల్ గ్యారెంటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పైగా లే అవుట్లలో చేసే మౌలిక వసతులకు ఐదేళ్ల గ్యారెంటీ బాధ్యత కూడా డెవలపర్లదే. బ్రోచర్లో పేర్కొన్న విధంగా వెంచర్లోని అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేయాలి. లేకపోతే స్థల యజమానే కాదు ఏజెంటూ బాధ్యత వహించాల్సి వస్తుంది. ‘‘అనుమతుల, పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసే ప్రభుత్వం మాత్రం డెవలపర్కు టైటిల్ గ్యారెంటీ ఇవ్వదు. కానీ, డెవలపర్ మాత్రం కొనుగోలుదారులకు ఇవ్వాలనడం సరైంది కాదని’’ రామ్ డెవలపర్స్ ఎండీ వనపర్తి రాము తెలిపారు. విక్రయాలు జరిపే పోర్టల్స్ రెరా పరిధిలోకే... ఆన్లైన్ ప్రాపర్టీ పోర్టల్స్ అడ్వరై్టజ్మెంట్ మాత్రమే చేస్తే రెరాలో నమోదు అవసరం లేదు. ఒకవేళ ఆయా పోర్టల్స్ డెవలపర్ల నుంచి కమీషన్ తీసుకొని ప్రాపర్టీలను విక్రయిస్తే మాత్రం రెరాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. ప్రకటనల విషయంలోనూ పోర్టల్స్ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్ట్లు, వెంచర్లను మాత్రమే ప్రచారం చేయాల్సి ఉం టుంది. అలాగే పత్రికలు, ప్రసార మాధ్యమాలు సైతం ఆయా ప్రాపర్టీలకు రెరా నంబరుం టేనే ప్రకటనలను తీసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో కొనుగోలుదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ధరలు పెంచనున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లు.. రెరాలో భవన నిర్మాణ కాంట్రాక్టర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రెరా అమలయ్యాక నిర్మాణ గ్యారెంటీ విషయంలో మాత్రం డెవలపర్కు, కాంట్రాక్టర్లకు మధ్య జరిగే ఒప్పంద పత్రంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, డెవలపర్ల మధ్య జరిగే ఒప్పంద పత్రంలో చ.అ. ధరలు, నిర్వహణ బాధ్యతలు తదితరాలుంటాయి. కానీ, రెరా అమలు తర్వాతి నుంచి భవన నిర్మాణ నాణ్యత విషయంలోనూ కాంట్రాక్టర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఓ డెవలపర్ తెలిపారు. ఎందుకంటే కొనుగోలుదారులకు నిర్మాణ గ్యారెంటీ బాధ్యత వహించేది డెవలపర్లే కాబట్టి! దీంతో ఇప్పటివరకు ఏడాది లీకేజీ నిర్వహణ బాధ్యతలకు మాత్రమే పరిమితమైన ఒప్పంద పత్రం నిబంధనల్లో రెరాతో ఐదేళ్ల గ్యారెంటీ నిబంధన కూడా ఉంటుందని తెలిపారు. అయితే నిర్వహణ కాలపరిమితి పెరగడంతో నిర్మాణ ధరలనూ పెంచక తప్పని పరిస్థితి అని కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సచితానంద్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సాధారణ నిర్మాణాలకు చ.అ.కు రూ.1,200, ఏడంతస్తుల వరకైతే రూ.1,350, ఆపైన నిర్మాణాలకైతే రూ.2 వేలపైమాటే చార్జీలున్నాయి. ఇవి రెరా అమలు తర్వాతి నుంచి సుమారు చ.అ. రూ.50–100 పెరుగుతాయని పేర్కొన్నారు. రియల్టీ బ్రాండ్ అంబాసిడర్లూ జాగ్రత్త.. ఈ మధ్య కాలంలో స్థిరాస్తి సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునే సంస్కృతి పెరిగింది. అయితే గతంలో లాగా అంబాసిడర్లు కేవలం ప్రాజెక్ట్ వారీగా ఒప్పందం చేసుకుంటే సరిపోదు. రెరా అమలయ్యాక సంబంధిత ప్రాజెక్ట్ రెరాలో రిజిస్టరైందా? అనుమతి పత్రాలన్నీ సరిగా ఉన్నాయా? బ్రోచర్లో పేర్కొన్న హామీలనే ప్రకటనల్లోనూ చెబుతున్నాడా? వంటి అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. లేకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించే కొనుగోలుదారులకు బ్రాండ్ అంబాసిడర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు బ్రోచర్లో లేని హామీలను సైతం బ్రాండ్ అంబాసిడర్ల చేత ప్రకటనలు చేయిస్తుంటారు. వీటికి ఆకర్షితులైన కస్టమర్లు కొనుగోళ్లు చేసేశాక.. హామీలు నెరవేర్చలేదనే కారణంగా ఫోరంను ఆశ్రయిస్తే గనక ప్రకటనల్లో నటించినందుకు గాను బ్రాండ్ అంబాసిడర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చే అవకాశముంది. ⇔ ఆంధ్రప్రదేశ్లో నాగార్జున వర్సిటీ పక్కన ఖాజా గ్రామంలో రామకృష్ణ హౌజింగ్ నిర్మిస్తున్న వెనుజియా ప్రాజెక్ట్కు మహేశ్బాబు, హైదరాబాద్లోని బహదూర్పురలో డ్రీమ్ ఇండియా నిర్మిస్తున్న డ్రీమ్ రిసార్ట్కు అనిల్ కపూర్, సువర్ణ భూమి సంస్థకు ఎస్పీ బాల సుబ్రమణ్యం, కె విశ్వనాథ్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. -
పెద్ద నోట్ల రద్దు, రెరా అమలు రియల్టీ పోర్టల్స్
99ఎకర్స్, ప్రొప్టైగర్, మ్యాజిక్బ్రిక్స్, కామన్ఫ్లోర్, హౌజింగ్ వంటివన్నీ నష్టాల్లోనే ♦ ఉద్యోగుల తొలగింపు, వ్యయాలను తగ్గించుకుంటున్న పోర్టల్స్ ♦ ప్రచార అగ్రిమెంట్లనూ రద్దు చేసుకుంటున్న డెవలపర్లు ♦ జీఎస్టీ, ఈపీపీబీలతో భవిష్యత్తు మరింత కష్టం: నిపుణులు దేశంలో రూ.1,000, రూ.500 నోట్ల రద్దు నిర్ణయం స్థిరాస్తి రంగాన్ని కుదిపేసింది. తేరుకునేలోపే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లు (రెరా) రూపంలో రియల్టీని పల్టీకొట్టింది. కేంద్రం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల ఫలితం.. రియల్టీ పోర్టల్స్ నష్టాలు రూ.762 కోట్లు! జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ), సమీప భవిష్యత్తులో ప్రవేశ పెట్టనున్న ఎలక్ట్రానిక్ ప్రాపర్టీ పాస్బుక్ (ఈపీపీబీ) వంటి వాటితో భవిష్యత్తు ఆగమ్యగోచరమేనని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్ దేశంలో ప్రస్తుతం హౌజింగ్.కామ్, ప్రొప్టైగర్, మ్యాజిక్బ్రిక్స్, 99ఎకర్స్, కామన్ఫ్లోర్, ఇండియా ప్రాపర్టీ, రీడయల్, మకాన్ వంటి వెబ్సైట్లు (పోర్టల్స్) ఆన్లైన్ కేంద్రంగా స్థిరాస్తి క్రయ, విక్రయ, అద్దె సేవలందిస్తున్నాయి. వీటిల్లో దాదాపు అన్ని పోర్టల్స్ ప్రధాన ఆదాయ వనరులు క్లాసిఫైడ్సే. అయితే పెద్ద నోట్ల రద్దు, రెరా అమలు తర్వాత స్థిరాస్తి లావాదేవీలు పూర్తిగా మందగించాయి. కొత్త ప్రాజెక్ట్ల సంగతి దేవుడెరుగు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేయడమే నిర్మాణ సంస్థలకు తలకు మించిన భారమైంది. దీంతో డెవలపర్లు పోర్టల్స్కు క్లాసిఫైడ్స్ను ఇవ్వటమూ ఆపేశాయి. ఫలితం పోర్టల్స్ నష్టాల్లో చిక్కుకున్నాయి. ఏడాదికి చార్జీ రూ.15 వేలు ఆ పైనే.. రియల్టీ పోర్టల్స్ క్లాసిఫైడ్స్ (లిస్టింగ్) రెండు రకాలుగా ఉంటాయి. డెవలపర్ల ప్రాజెక్ట్లు, వ్యక్తిగత ప్రాపర్టీల లిస్టింగ్స్. ప్రాజెక్ట్లకైతే ఏడాదికి రూ.15 వేల నుంచి చార్జీలుంటాయి. వ్యక్తిగత ప్రాపర్టీలైతే నెలకు రూ.1,000–2,500 మధ్య చార్జీలుంటాయి. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నిధుల కొరతతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్ల జోలికే వెళ్లట్లేదు. రెరా అమలు తర్వాత నిర్మాణంలోని ప్రాజెక్ట్లూ రెరా పరిధిలోకి వస్తే మరిన్ని చిక్కులనే భావనతో ప్రచారం కంటే ప్రాజెక్ట్ పూర్తి చేయటంపైనే దృష్టిసారిస్తున్నారని హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న రీడయల్ సీఈఓ జీ వెంకట రమణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. కొత్త క్లాసిఫైడ్స్ సంగతి పక్కన పెడితే అప్పటికే చేసుకున్న అగ్రిమెంట్లనూ రద్దు చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో రియల్టీ పోర్టల్స్ ఆదాయం గణనీయంగా పడిపోతుందని చెప్పారు. పోర్టల్స్ యూజర్ల సంఖ్య 60 శాతానికి పైగా పడిపోయిందని అంచనా. నష్టాలకు విలీనాలు, కొనుగోళ్లూ కారణమే.. రియల్టీ పోర్టల్స్ నష్టాలకు ఈ రంగంలో విలీనాలు, కొనుగోళ్లు కూడా కారణాలనే చెప్పాలి. ఆన్లైన్ క్లాసిఫైడ్ సంస్థ క్వికర్.. రియల్టీ ఏజెన్సీ అగ్రిగేటర్, అనలిటిక్ట్ రియల్టీ కంపాస్, కామన్ఫ్లోర్లను కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరిలో హౌజింగ్.కామ్, మకాన్.కామ్లను ప్రొప్టైగర్ కైవసం చేసుకుంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కోల్డ్వెల్ బ్యాంకర్ ఇండియా.. ప్రాపర్టీ బ్రోకర్ ఫవిస్టా.కామ్ను వశం చేసుకుంది. మ్యాజిక్బ్రిక్స్.. ప్రాపర్టీ రీసెర్చ్, అనలిటిక్ట్ ప్రాపర్జీ.కామ్ను కైవసం చేసుకుంది. ఆయా కొనుగోళ్లతో సంస్థల మూలధన వ్యయాలు పెరిగాయి. ఒకవైపు మార్కెట్ బాగాలేక డెవలపర్ల నుంచి ఆదాయం లేక, మరోవైపు నిర్వహణ, ఉద్యోగుల వేతనాల వంటివి భారం కావటంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వెంకట రమణ వివరించారు. ఆన్లైన్ పోర్టల్స్లో యూజర్ల సందర్శన 40 శాతానికి పడిపోయింది. మూలధన, నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఆయా సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వ్యయాలను తగ్గించేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు వైపులా జుట్టుముళ్లే.. ఎక్కువ సంఖ్యలో యూజర్లను ఆకర్షించాలంటే.. ఆయా పోర్టల్స్లో ప్రాపర్టీల లిస్టింగ్ పెద్ద మొత్తంలో ఉండాలి. పోనీ ఇన్వెంటరీని పెంచుదామం టే.. డెవలపర్లు క్లాసిఫైడ్స్ ఇవ్వాలంటే యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. రెండు వైపులా జుట్టుముళ్లు ఉండటంతే చాలా వరకూ పోర్టల్స్ ఏం చేస్తున్నాయంటే.. నకిలీ ప్రాపర్టీల లిస్టింగ్స్తో యూజర్లను, యూజర్ల సామర్థ్యాన్ని చూపించి క్లాసిఫైడ్స్ను పొందుతాయి. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో యూజర్ల సంఖ్య 40 శాతానికి పైగా పడిపోవటంతో క్లాసిఫైడ్సూ దూరమయ్యాయి. అన్ని పోర్టల్స్దీ నష్టాల బాటే.. ఠి2015 ఆర్ధిక సంవత్సరంలో హౌజింగ్.కామ్, ప్రొప్టైగర్, మ్యాజిక్బ్రిక్స్, 99ఎకర్స్, కామన్ఫ్లోర్ వంటి సంస్థల నష్టాలు రూ.462 కోట్లుగా ఉంటే.. 2016 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.762 కోట్లకు చేరాయి. అంటే ఏడాదిలో 65 శాతం నష్టాలు పెరిగాయన్నమాట. ఇక కంపెనీల వారీగా లాభ, నష్టాల గణాంకాలను పరిశీలిస్తే.. -
భాగ్యనగరిలో 3 శాతం తగ్గిన కొత్త ప్రాజెక్ట్లు
♦ దేశంలో16 శాతం తగ్గిన నివాస ప్రాజెక్ట్ల ప్రారంభాలు ♦ అందుబాటు గృహాల్లో మాత్రం 30 శాతం వృద్ధి 2016 మార్చిలో కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ప్రకటన చేసింది. అప్పటి నుంచి 2017 తొలి త్రైమాసికం ముగింపు వరకూ భాగ్యనగరిలో నివాస సముదాయాల ప్రారంభాలు 3 శాతం తగ్గుముఖం పట్టాయి. నగరంలో ఏప్రిల్ 2015– మార్చి 2016 మధ్య 10,125 యూనిట్లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 2016– మార్చి 2017లో మాత్రం 9,775 యూనిట్లకు పడిపోయాయి.– సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్కతా, ముంబై, పుణె.. ఎనిమిది నగరాల్లో 2017 క్యూ1లో 25,800 యూనిట్లు ప్రారంభమయ్యాయి. గతేడాదితో ఇదే సమయంతో పోలిస్తే ఇది 16 శాతం తక్కువ. మరోవైపు అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ నిర్మాణ సంస్థలకు తలకు మించిన భారంగా మారుతోంది. రెరా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటి వాటితో ఈ పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగుతుందని నివేదిక వెల్లడించింది. అందుబాటు గృహాల్లో 30 శాతం వృద్ధి.. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అందుబాటు గృహాలు, లగ్జరీ ప్రాజెక్ట్ల ప్రారంభాలు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 మధ్య కాలంలో అందుబాటు గృహాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015–16 ఇదే సమయంలో 25 శాతంగా ఉది. లగ్జరీ, హైఎండ్ అండ్ యూనిట్ల ప్రారంభాలు మాత్రం ఇదే సమయంలో 11 శాతం నుంచి 13 శాతానికి పెరిగాయి. అయితే ఆయా విభాగాల్లో అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయండోయ్! కొనుగోళ్లూ అంతంతే.. రెరాలోని పలు కఠిన నిబంధనల కారణంగా నిర్మాణ సంస్థలు తమ వ్యాపార శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే కార్యకలాపాలు, నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాల వంటివన్నమాట. దీంతో 2017 మూడో త్రైమాసికం నాటికి పరిస్థితి ఇలాగే ఉంటుందని కుమ్మెన్ వేక్ఫీల్డ్ ఎండీ (ఇండియా) అన్షుల్ జైన్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరాస్తి మూలధన విలువలు తగ్గాయియని పేర్కొన్నారు. రెరా, జీఎస్టీ అమలు వంటి కారణంగా ఈ పరిస్థితి మరో త్రైమాసికం పాటూ కొనసాగుతుందన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగుల తొలగింపు వంటి ప్రతికూల వాతావరణ నేపథ్యంలో కొనుగోలుదారులూ డోలయమానంలో పడ్డారు. దీంతో అమ్మకాలూ తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి సానుకూలంగా మార్చేందుకు మరో 3 నెలల సమయం పడుతుందని’’ జైన్ అంచనా వేశారు. -
రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలేంటో?
నిబంధనలు పాటించని డెవలపర్లు, ఏజెంట్లకూ జరిమానాలు, జైలు శిక్షలు కూడా మహారాష్ట్ర రెరాలో నమోదు చేయకుండా ప్రకటనలు చేసిన ఓ సంస్థ ∙ రూ.1.2 లక్షల జరిమానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొస్తుంది! మాయమాటలతో కొనుగోలుదాలుదారులను మోసం చేసే డెవలపర్లకు కళ్లెం వేస్తుంది!! .. వంటి ఉపోద్ఘాతాలు కాసేపు పక్కన పెడితే.. అసలు రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే డెవలపర్లకు ఎలాంటి శిక్షలుంటాయి? రెరా వద్ద నమోదు చేయకుండా ప్రకటనలు గానీ విక్రయించడం గానీ చేస్తే ఏమవుతుంది? – సాక్షి, హైదరాబాద్ ప్రాజెక్ట్ను రెరాలో నమోదు చేయకపోతే? నివాస, వాణిజ్య సముదాయాలతో పాటూ ఓపెన్ ప్లాట్లను, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లనూ రెరా వద్ద 90 రోజుల్లోగా నమోదు చేయాల్సిందే. లేనిపక్షంలో డెవలపర్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా. ఏజెంట్లకైతే ప్రతి రోజూ రూ.10 వేలు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం వరకు పెనాల్టీ ఉంటుంది. నమోదు చేయకుండా విక్రయిస్తే? రెరాలో నమోదు చేయకుండా ఏ స్థిరాస్తినైనా సరే విక్రయించడం గానీ ప్రకటనలు చేయడం గానీ చేయకూడదు. ఒకవేళ చేసిన పక్షంలో డెవలపర్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకూ జరిమానా ఉంటుంది. అయినా కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాతో పాటూ 3 ఏళ్ల వరకూ జైలు శిక్ష తప్పదు. రెరా నిబంధనలు పాటించకపోతే? డెవలపర్లు, ఏజెంట్లు ఎవరైనా సరే రెరా నిబంధనలను లేదా ఆర్డర్లను పాటించకపోతే ప్రతి రోజూ ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా ఉంటుంది. ఆర్డర్లను ఉల్లంఘిస్తే? అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను, నిర్ణయాలను దిక్కరించినా లేదా ఉల్లంఘించినా డెవలపర్లకైతే ప్రతి రోజూ ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష. లేదా రెండూ విధింవచ్చు. ఏజెంట్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రూ.1.2 లక్షల జరిమానా దేశంలోనే తొలిసారిగా రెరా శిక్షలు మహారాష్ట్రలో మొదలయ్యాయి. చెంబూర్కు చెందిన సాయి ఎస్టేట్ కన్స్ల్టెన్స్.. స్థానిక రెరా వద్ద నమోదు చేయకుండా పలు నివాస ప్రాజెక్ట్లను 12 రోజుల పాటు ప్రకటనలు చేసింది. ఇందుకుగాను మహారాష్ట్ర రెరా సంబంధిత సంస్థకు రూ.1.2 లక్షల జరిమానా విధించింది. రెరా నిబంధనల ప్రకారం.. కొత్త ప్రాజెక్ట్లే కాదు నిర్మాణంలోని ప్రాజెక్ట్లూ రెరా వద్ద నమోదు చేయకుండా విక్రయించడం కాదు కదా కనీసం ప్రకటనలు కూడా చేయకూడదు. -
‘రెరా’ బిల్లును సరళీకృతం చేయాలి
క్రెడాయ్ సూచన విజయవాడ (లబ్బీపేట) : నిర్మాణ రంగంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన ‘ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు (రెరా)ను సరళీకృతం చేయాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రభుత్వానికి సూచించింది. క్రెడాయ్ ఎపీ, విజయవాడ చాప్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో హోటల్ గేట్వేలో రెరా బిల్లుపై బిల్డర్లు, ఇంజినీర్లు, సీఏలు, న్యాయవాదులకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ బిల్లను నవ్యాంధ్రలో ప్రవేశ పెట్టేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచించారు. నిర్మాణరంగ న్యాయ నిపుణులు ఎ. దుర్గాప్రసాద్ బిల్లులో పాటించాల్సిన నిబంధనలు, నిర్మాణ రంగంపై ప్రభావితం చేసే అంశాలను వివరించారు. పలువురు బిల్డర్లు అడిగిన సందేహాలను నివృత్తి చే శారు. క్రెడాయ్ ఏపీ అధ్యక్షులు ఎ. శివారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అథారిటీ బిల్లుపై అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించామన్నారు. క్రెడాయ్ విజయవాడ చాప్టర్ అధ్యక్షులు చిగురుపాటి సుధాకర్, ప్రధాన కార్యదర్శి పి. విజయరామరాజు, విజయవాడ సిటీ ప్లానర్ శ్రీనివాస్, సీఆర్డీఏ డైరెక్టర్ రాముడు, క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షులు సి. శేఖర్రెడ్డి, కె. రాజేంద్ర పాల్గొన్నారు.