Rice mills
-
సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్లో ఐటీ సోదాలు
కాకినాడ క్రైం: కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు చేపడుతున్న సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంస్థ కేంద్రంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కాకినాడ తిలక్రోడ్లో ఉన్న సంస్థకు చెందిన మూడు గోడౌన్లతో పాటు జగన్నాథపురంలోని సంస్థ మేనేజర్ కళ్యాణపు అశోక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు బృందాలు తనిఖీల్లో పాల్గొనగా రెండు బృందాలు అశోక్ ఇంట్లో తనిఖీలు చేపడుతున్నాయి. ఓ బృందం సంస్థ గోడౌన్లను జల్లెడ పడుతోంది. అశోక్ ఇంటి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్ 23వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టెల్లా ఎల్ పనామా నౌక నుంచి 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కాకినాడ తీరం నుంచి అక్రమంగా ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్లేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. వెంటనే సీజ్ ద షిప్ అంటూ అధికారులను ఆదేశించారు. ఈ బియ్యం సత్యం బాలాజీ ఇండస్ట్రీస్కి చెందినవిగా తేలింది. దీంతో ఆదాయపన్ను శాఖ అప్రమత్తమై సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో గడచిన నాలుగు రోజు లుగా తనిఖీలు నిర్వహిస్తోంది. కొనసాగింపుగా కాకినాడలోనూ సోదాలు నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితం పెద్దాపురం లలితా రైస్ ఇండస్ట్రీస్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు స్వల్ప వ్యవధిలోనే సత్యం బాలాజీ ఇండస్ట్రీస్లో సోదాలు నిర్వహించడం, ప్రభుత్వ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయడం బియ్యం వ్యాపారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. -
ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు రైస్మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్సీఐ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు. 25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిమిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.డిఫాల్టర్లపై ఉక్కుపాదంగతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్తోపాటు వచ్చే రెండు సీజన్ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది. కలెక్టర్ల పర్యవేక్షణ...జిల్లాల వారీగా రైస్మిల్లుల్లో సాగే సీఎంఆర్పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి. -
ఒకే ఒక్క రైస్ మిల్లు... రూ. వంద కోట్ల ధాన్యం దగా
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు. వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
బడా, లోకల్ మిల్లింగ్ కంపెనీలు కొనేలా!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్ రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతీ లాట్ను ఒక లక్ష టన్నులుగా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. వార్షిక టర్నోవర్లోనూ భారీ మార్పులు తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్తో పాటు రూ.100 కోట్ల నెట్వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్ను రూ.100 కోట్లకు, నెట్వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు. ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. -
అదనపు ధాన్యమంతా ఎగుమతులకే
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... ‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరే... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో మిలు్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. నిర్దేశత సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఎఫ్సీఐ కొర్రీలు పెడుతోంది. దాదాపు 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. -
మిల్లుల్లోనే కోటి మెట్రిక్ టన్నులు!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు గడువు పెంచుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎఫ్సీఐ గోడౌన్లకు చేరడం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఇప్పటికే ఏకంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్టు పౌర సరఫరాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 2020–21 యాసంగి మొదలు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉంది. తాజాగా 2022–23 వానాకాలం సీజన్కు సంబంధించి రైతుల నుంచి సేకరించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కూడా మిల్లులకు చేరింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్మిల్లులు ధాన్యం నిల్వలతో నిండిపోయినట్లు తెలుస్తోంది. ఇలావుండగా జనవరి నెలాఖరులోగా మరో 50 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సజావుగా సాగని మిల్లింగ్.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేటప్పుడే 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాలని పౌరసరఫరాల శాఖ మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటుంది. అయితే మిల్లర్లు ఏనాడూ 45 రోజుల్లో మిల్లింగ్ పూర్తి చేసిన దాఖలాల్లేవు. ఇక గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఎంతగా అంటే 2020–21 సంవత్సరపు యాసంగి ధాన్యం 2.03 ఎల్ఎంటీలను ఇక మిల్లింగ్ చేయలేమని మూడు నెలల క్రితం చేతులెత్తేసేంత వరకు. ప్రస్తుత వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండగా, 2021–22 వానాకాలం ధాన్యం 70.22 ఎల్ఎంటీల్లో 20.83 ఎల్ఎంటీలు మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇక అదే ఏడాది యాసంగికి సంబంధించిన 50.39 ఎల్ఎంటీల ధాన్యంలో ఇప్పటివరకు కేవలం 13 ఎల్ఎంటీలు మాత్రమే మిల్లింగ్ జరిగింది. ఇంకా 36.93 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇలా గత మూడు సీజన్లకు సంబంధించి 59.79 ఎల్ఎంటీల ధాన్యం అంటే సుమారు 40 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. ఐదు నెలల్లో 34 ఎల్ఎంటీలే మిల్లింగ్! సీఎంఆర్ విషయంలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, సీఎంఆర్ అప్పగింతలో ఆలస్యంపై కేంద్రం గత జూలైలో సీరియస్ అయింది. సీఎంఆర్ తీసుకునేది లేదని రాష్ట్రానికి అల్టిమేటం ఇచ్చింది. అప్పటికి రాష్ట్రంలో మూడు సీజన్లకు సంబంధించి 93.76 ఎల్ఎంటీల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. మొత్తం మీద ఆగస్టు నుంచి తిరిగి సీఎంఆర్ తీసుకునేందుకు ఎఫ్సీఐ ముందుకు వచ్చింది. దీంతో మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిల్లింగ్ చేస్తున్నప్పటికీ.. ఐదు నెలల్లో లెవీ కింద ఎఫ్సీఐకి అప్పగించిన బియ్యం 34 ఎల్ఎంటీలే కావడం గమనార్హం. అంటే నెలకు 10 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలకు 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 6.85 లక్షల మంది రైతుల నుంచి 40.06 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. వచ్చే జనవరి నాటికి మరో 50 ఎల్ఎంటీల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లుల్లోని ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికార యంత్రాంగం మిల్లర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
ఫోర్టిఫైడ్ రైస్గా తడిసిన ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రైస్మిల్లుల్లో తడిసిన ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ (పౌష్టికాహార బియ్యం)గా రాష్ట్ర ప్రభుత్వం మార్చనుంది. గత యాసంగిలో సేకరించిన 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులు, వాటి ఆవరణల్లో నిల్వ చేయగా అకాల వర్షాలకు భారీఎత్తున ధాన్యం తడిసిపోవడం తెలిసిందే. ప్రాథమిక అంచనా మేరకు 4.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని తేలింది. ఈ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం సాధ్యం కానందున పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్గా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశా లిచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్ రైస్ను సెంట్రల్ పూల్ కింద సేకరించేందుకు గతంలోనే ఒప్పుకొంది. రాష్ట్రంలోని కుమురం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పేద గిరిజనులకు రేషన్ బియ్యంగా ఫోర్టిఫైడ్ రైస్నే పంపిణీ చేస్తున్నందున తడిసిన ధాన్యాన్ని ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఫోర్టిఫైడ్ రైస్గా 5 ఎల్ఎంటీ... రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో గత మూడు సీజన్లకు సంబంధించి 90.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం నిల్వలుగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. అందులో 2020–21 యాసంగికి సంబంధించి 4.86 ఎల్ఎంటీ ఉండగా 2021–22 వానకాలానికి సంబంధించి 35.70 ఎల్ఎంటీ, మొన్నటి యాసంగికి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ మూడు సీజన్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్ను మిల్లింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవగా యాసంగిలో తడిసిన ధాన్యం 4.5 లక్షల మెట్రిక్ టన్నులు పోను మరో 3 లక్షల మెట్రిక్ టన్నులను 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్గా మిల్లింగ్ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తడిసిన ధాన్యం సమస్య కొంతమేర తీరనుంది. చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కోసం.. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సేకరించిన ధాన్యం నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫోర్టిఫైడ్ బియ్యంగా సెంట్రల్ పూల్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ను ఢిల్లీకి పంపారు. యాసంగిలో సేకరించిన 50.39 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 34 ఎల్ఎంటీ ముడిబియ్యం ఎఫ్సీఐకి ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకల శాతమే అధికంగా ఉంటుందని టెస్ట్ మిల్లింగ్ ఫలితాల్లో తేలినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో క్వింటాలు ధాన్యానికి 55 శాతం మాత్రమే బియ్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని కేంద్రం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బియ్యంగా తీసుకుంటే సమస్య ఉండదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఉన్న 5 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ రైస్ కోసం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ముందుగా కేటాయించింది -
బియ్యంపై కయ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్మిల్లులు మూతపడి మూడు వారాలు దాటింది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వలేదనే సాకును చూపుతూ రాష్ట్రం నుంచి బియ్యాన్నే సేకరించకూడదనే తీవ్రమైన నిర్ణయం కేంద్రం తీసుకుంది. ఈనెల 7వ తేదీ నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడాన్ని నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3,250 రైస్ మిల్లులు మూతపడ్డాయి. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని వేచి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనుచూపు మేరలో స్పష్టత కనిపించడం లేదు. సీఎంఆర్ లేకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సొమ్ము ఆగిపోయింది. మరోవైపు మిల్లుల్లో నిండిపోయిన ధాన్యం నిల్వలు మిల్లింగ్ లేక ముక్కిపోతున్నాయి. మిల్లుల ఆవరణల్లో నిల్వ ఉంచిన సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యంపైన టార్పాలిన్లు కప్పినా, వర్షం, తేమకు మొలకలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు రాస్తున్న లేఖలకు ఎలాంటి స్పందన లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో కస్టమ్ మిల్లింగ్ అవుతున్న గత వానాకాలం వడ్లు 40 ఎల్ఎంటీలకు తోడు యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం మిల్లులు, వాటి ఆవరణల్లో పేరుకుపోయాయి. దాదాపు 90 ఎల్ఎంటీల ధాన్యం, కస్టమ్ మిల్లింగ్ అయిన మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లోనే ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. తప్పు దిద్దుకున్నా స్పందించని ఢిల్లీ.... కరోనా ప్రబలిన తరువాత 2021 మార్చి నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కార్డు (ఎన్ఎఫ్ఎస్సీ)లు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 53.68 లక్షల ఎన్ఎఫ్ఎస్ కార్డులకు గాను 1.92 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన కోటా 1.90 ఎల్ఎంటీల బియ్యాన్ని పంపిణీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సేకరించింది. కానీ ఈ బియ్యాన్ని వివిధ కారణాల వల్ల పంపిణీ చేయలేదు. దీనిపై ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ లేఖ రాసింది. బియ్యం పంపిణీ చేయనందున సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని, ఆ కోటాను ఈనెల 18 నుంచి ఆరునెలల పాటు ప్రతినెలా ఇస్తామని లేఖ రాసింది. ఈ మేరకు 18 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ ఆ విషయాన్ని కూడా తెలియజేసింది. రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకునే విషయంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఢిల్లీకి వెళ్లి మరీ అధికారులను కోరారు. అయినా ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదు. రూ.1,700కు కొనేందుకు మిల్లర్లు సిద్ధం రాష్ట్రం నుంచి సీఎంఆర్ తీసుకోకుండా ఎఫ్సీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ధాన్యాన్ని వేలం పద్ధతిలో మిల్లర్లకే అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయమై మిల్లర్లు ఇటీవల సమావేశమై ప్రభుత్వం ధాన్యాన్ని తమకు విక్రయిస్తే కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్వింటాలు ధాన్యాన్ని రూ.1700 లెక్కన కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్గా విక్రయించుకుంటామని కూడా వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చి, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. కేంద్రం తనకు తోచినప్పుడు ఇచ్చే డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తూ, భారమైన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో బియ్యం తీసుకోకుండా కేంద్రం మొండి వైఖరితో వ్యవహరించడం రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించడమే. రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసే విధానాన్ని తీవ్రంగా ఎండగడతాం. – గంగుల కమలాకర్, మంత్రి, పౌరసరఫరాల శాఖ -
టెస్ట్ మిల్లింగ్కు రెండు వంగడాలు
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల వచ్చే నూకల శాతాన్ని పరీక్షించేందుకు మైసూర్కు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) శాస్త్రవేత్తల బృందాలు ఈ నెల 20 నుంచి రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, యాదాద్రి భువన గిరి, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, వనపర్తి జిల్లాల్లోని 11 మిల్లులను టెస్ట్ మిల్లింగ్ కోసం శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. మొదటి విడతగా మే 27, 28, 29 తేదీల్లో శాస్త్రవేత్తలు మిల్లులను పరి శీలించి, ఎన్నిరకాల వడ్లు పండిస్తారో తెలుసుకుని వాటి నమూనాలను సేకరించిన విషయం తెలిసిం దే. యాసంగిలో రైతాంగం అత్యధికంగా సాగు చేసే వెయ్యిపది (ఎంటీయూ 1010) రకంతోపాటు మ రో స్థానిక వంగడాన్ని తాజాగా టెస్ట్ మిల్లింగ్ కో సం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన 11 మిల్లుల్లో ఈ రెండు రకాల ధాన్యాన్ని ఆయా మిల్లుల సామర్థ్యానికన్నా ఐదు రెట్లు అధికంగా అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి జూలై ఒకటో తేదీ వరకు టెస్ట్ మిల్లింగ్ ప్రక్రియ సాగనుంది. మొదటి, రెండో విడత పరీక్షల ఫలితాలను బేరీజు వేసుకొని నూక శాతాన్ని ప్రకటించనుంది. ఏయే జిల్లాల్లో ఏ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే ఎంతశాతం నూకలు వస్తున్నాయో పరీక్షించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. తదనుగుణంగా ప్రభుత్వం మిల్లులకు పరిహారం ఇవ్వాలని భావిస్తోంది. బాయిల్డ్ రైస్ వద్దనడంతో వచ్చిన చిక్కు తెలంగాణలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఎక్కువగా నూక అవుతుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం రావాలి. కానీ, యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే కొన్ని జిల్లాల్లో 40 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా మిల్లింగ్ చేయడం వల్ల నూక శాతం తగ్గి, ఔటర్న్ రేషియో నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కానీ, కేంద్రం ఇక నుంచి బాయిల్డ్ రైస్ను తీసుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే కష్టనష్టాలను ఓర్చి అయినా యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగానే ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన మిల్లే.. మే నెలలో శాస్త్రవేత్తలు వచ్చి జిల్లాలో వివిధ రకాల వడ్ల శాంపిల్స్ను సేకరించారు. మిల్లులను సైతం పరిశీలించారు. శాస్త్రవేత్తలే మిల్లులను ఎంపిక చేసుకున్నారు. టెస్ట్ మిల్లింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా నుంచే టెస్ట్ మిల్లింగ్ ప్రారంభం కానుంది. –హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, సిద్దిపేట -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
రైస్ మిల్లుల్లో ఎఫ్సీఐ తనిఖీలు ఆపాలి: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) చేస్తున్న దాడులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గుంగుల కమలాకర్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎఫ్సీఐ తనిఖీల వెనుక కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్సీఐ దాడులంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లులలో ఉద్దేశ్య పూర్వకంగానే ఎఫ్సీఐ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోంది. రైతులు పండించిన పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం ఉద్దేశ్య పూర్వకంగానే తనిఖీలు చేయిస్తోంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తి అయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం. చదవండి: (అక్రమాలపై ఎఫ్సీ‘ఐ’) కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రైస్ మిల్లులలో ఎఫ్సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉంది.. మేము వ్యతిరేకించడం లేదు అయితే ఇప్పుడిప్పుడే కోతలు పూర్తయ్యి ధాన్యం వస్తోంది. కాబట్టి ఇది సమయం, సందర్భం కాదు. దీనివల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుంది.. రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేస్తే సహకరిస్తామని' తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. చదవండి: (4.54 లక్షల బస్తాలు మాయం) -
పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్సీఐ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) శ్రీకారం చుట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఎఫ్సీఐ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని ప్రతి రైస్మిల్లును ప్రత్యక్షంగా తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్(పీవీ) చేయాలని, ప్రతి బస్తా లెక్క తేల్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తనిఖీ కార్యక్రమం మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక మిల్లుల్లో తనిఖీలు కొనసాగాయి. ఆయా జిల్లాల పౌరసరఫరా అధికారులతో కలిసి ఎఫ్సీఐ అధికారులు బృందాలుగా ఏర్పడి మిల్లుల్లో నిల్వలను, రికార్డులను పరిశీలించారు. పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం, బియ్యం బస్తాలను లెక్కించారు. తనిఖీల్లో తేలిన అంశాలతో ఓ నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఎఫ్సీఐ అధికారులు తెలిపారు. అక్రమాలపై అనుమానంతోనే.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసే విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానిస్తున్న ఎఫ్సీఐ ఇక నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాతే బియ్యం సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ వల్ల కాలయాపన జరిగి, నిర్ణీత సమయంలో సీఎంఆర్ ఇవ్వలేమన్న పౌరసరఫరాల శాఖ వాదనను తోసిపుచ్చిన ఎఫ్సీఐ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని ఏడు ఎఫ్సీఐ డివిజనల్ కార్యాలయాల పరిధిలోని 33 జిల్లాల్లో ఉన్న అన్ని రైస్ మిల్లుల్లో ఈ తనిఖీలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా వేర్హౌసింగ్ గోడౌన్ డిపోల మేనేజర్లు, ఇతర అధికారులతో 62 బృందాలను ఎఫ్సీఐ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి అధికారులు ఉన్నారు. వీరు ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి తమకు కేటాయించిన డివిజన్లలోని జిల్లాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ జరపనున్నారు. రెండు సీజన్ల ధాన్యం తనిఖీ గత ఏడాది (2020–21) యాసంగి సీజన్తో పాటు మొన్నటి వానాకాలం (2021–22) సీజన్లకు సంబంధించిన ధాన్యంపై తనిఖీలు సాగుతున్నాయి. గత యాసంగి సీజన్కు సంబంధించి 475 మిల్లులు, వానాకాలం సీజన్ ధాన్యంకు సంబంధించి 1,825 మిల్లులను తనిఖీ చేయనున్నారు. తనిఖీలకు అనుగుణంగా ధాన్యం బస్తాలను అందుబాటులో ఉంచాలని ఎఫ్సీఐ ఇప్పటికే మిల్లుల యాజమాన్యాలను ఆదేశించింది. కాగా గత మార్చి నెలలో 958 మిల్లుల్లో తనిఖీ నిర్వహించగా, 40 మిల్లుల్లో నిల్వల్లో తేడా ఉన్నట్లు ఎఫ్సీఐ అధికారులు గుర్తించారు. 4.54 లక్షల బ్యాగుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. తనిఖీల తర్వాతే వానాకాలం బియ్యం సేకరణ గత యాసంగికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గడువు ముగియడంతో సీఎంఆర్ గడువును నెలరోజలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇంకా నిర్ణయం రాలేదు. కాగా ఇప్పుడు యాసంగి ధాన్యానికి సంబంధించి తనిఖీలు జరపనున్న 475 మిల్లుల్లో సీఎంఆర్ ఎంతమేర పూర్తయిందో తెలియదు. ఒకవేళ సీఎంఆర్ పూర్తయితే.. యాసంగి సీజన్లో ఆయా మిల్లులకు వచ్చిన ధాన్యం, ఇచ్చిన బియ్యం లెక్కలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి బేరీజు వేసుకొని అక్రమాలు జరిగాయో లేదో తేల్చనున్నారు. వానాకాలం సీఎంఆర్ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయి, అక్రమాలు లేవని తేలేంత వరకు బియ్యాన్ని సేకరించకూడదని ఎఫ్సీఐ నిర్ణయించుకుంది. ఇక నుంచి బియ్యం సేకరించేటప్పుడు బియ్యం ఎప్పటివో (ఎంత పాతవో) తేల్చే పరీక్షలు నిర్వహించాలని కూడా అధికారులకు ఎఫ్సీఐ ఆదేశాలు ఇచ్చింది. కాగా రైస్ మిల్లుల్లో జరిగే తనిఖీలకు అధికార యంత్రాంగం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు సూచించింది. జిల్లాల్లో తనిఖీలు సాగాయిలా... – ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో 3, ఖమ్మంలో 2, కొణిజర్ల 1, ఖమ్మం రూరల్లో 1, వైరాలో 3 మిల్లుల్లో తనిఖీలు జరిగాయి. జిల్లాలో మొత్తం 56 మిల్లులు ఉండగా 10 మిల్లుల నిర్వాహకులు ధాన్యం కేటాయింపునకు అనుగుణంగా సీఎంఆర్ బియ్యం ఇచ్చే సమయంలో ఆలస్యం చేస్తున్నట్టుగా తేలిందని సమాచారం. – మంచిర్యాల జిల్లాలో నస్పూర్, కిష్టంపేట, చెన్నూరు, కత్తెర శాల, ఆస్నాద్ శివారు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లుల సామర్థ్యం, ట్రక్ షీట్లు తదితర వివరాలు పరిశీలించారు. గత మార్చి నెలలో జరిపిన తనిఖీల్లో జిల్లాలో ఎక్కడా ధాన్యం, బియ్యం సరఫరాలో తేడాలు గుర్తించలేదు. తాజా తనిఖీల్లో మాత్రం కొన్ని మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలకు సంబంధించి స్వల్ప తేడా గుర్తించినట్లు సమాచారం. – జోగుళాంబ గద్వాల జిల్లా లోని అయిజ పట్టణంలోని రైస్ మిల్లులను ఎఫ్సీఐ మేనేజర్లు కృష్ణమోహన్ , వెంకట సాయిరాం సివిల్ సప్లయిస్ అధికారి నరసింహారావు తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. – మహబూబాబాద్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో నిల్వలను ఎఫ్సీఐ అధికారులు భీమ్లా నాయక్, శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. నర్సింహులపేట మండలం పెద్దనాగారం శ్రీ శ్రీ పారాబాయిల్డ్ మిల్లు, మరిపెడ మండలంలోని ఎల్లంపేట లక్ష్మీ పారాబాయిల్డ్ మిల్లులో ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలు, ఎఫ్సీఐకి పంపాల్సిన సీఎంఆర్ వివరాలు పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. – జగిత్యాల జిల్లాలో నాలుగు బృందాలుగా ఎఫ్సీఐ అధికారులు రైస్మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నిడమనూరు, నకిరేకల్, చిట్యాలతో పాటు సూర్యాపేట జిల్లా కోదాడలోని పలు మిల్లులో తనిఖీలు కొనసాగాయి. -
బలవర్థక ఆహారమే లక్ష్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్ రైస్పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన బియ్యం) అంశం తెరపైకి వచ్చింది. గతేడాది రబీకి సంబంధించి సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సిన రైస్ మిల్లర్లు ఇకపై బలవర్థకమైన బియ్యాన్ని కలిపి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లులకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ) నిర్ణయం మేరకే ఆదేశాలిచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.89లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్తో కూడిన బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. క్వింటాల్కు ఒక కిలో.. గత రబీ సీజన్(2020–21)లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లులకు ఇచ్చిన విషయం విధితమే. ఈ బియ్యంలో బలవర్థకమైన బియ్యాన్ని మిలితం చేసి ఇవ్వాలని ఎఫ్సీఐ ఆదేశించింది. ఒక్కో క్వింటాల్ బియ్యంలో కిలో బలవర్థక బియ్యాన్ని కలపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన బలవర్ధక బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంలో మిళితం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వెంటనే మిల్లులు ఈ మిక్చర్ ప్లాంట్లను అమర్చుకోవాలని ఆదేశించింది. బలవర్థక బియ్యంలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఈ ఫోర్టిఫైడ్రైస్ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
సన్న రకం.. ‘ధర’హాసం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈ ఇద్దరే కాదు.. ఉమ్మడి నల్లగొండలో సన్నరకం ధాన్యాన్ని మిల్లుల్లో విక్రయిస్తున్న రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఈ నెల మొదట్లో ఎక్కువ మందికి క్వింటాకు రూ.1,700, కొంతమందికి రైతులకు రూ. 1,960లోపే చెల్లించిన మిల్లర్లు.. ఇప్పుడు సర్కారు మద్దతు ధర రూ. 1,960 కన్నా ఎక్కువగా గరిష్టంగా రూ. 2,300 వరకు ఇస్తున్నారు. దీంతో రైతులు సంబురపడిపోతున్నారు. కారణమిదీ.. జిల్లాలోని మిల్లర్లు సన్నరకం ధాన్యాన్నే ఎగుమతి చేస్తారు. ఈ ధాన్యాన్ని రా రైస్గా మార్చి హైదరాబాద్ సహా దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాలకు ప్రతి ఏడాది ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల ఆయా ప్రాంతాల వ్యాపారులు పెద్ద ఎత్తున సన్నరకం కావాలని కోరడంతో ధాన్యం కొనుగోళ్లను పెంచినట్లు మిల్లర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న ధాన్యం విక్రయించేందుకు వస్తున్న రైతులు తగ్గడంతో మిల్లర్లు పోటీపడి మరీ ఎక్కువ ధరకు కొంటున్నారు. ఒక్క మిర్యాలగూడలోనే 83 మిల్లులు సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. చివరి దశకు సన్నరకం అమ్మకాలు నల్లగొండ జిల్లాలో సన్నరకం ధాన్యం 6,09,758 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో రైతులు తాము తినేందుకు పక్కనపెట్టుకున్నవి పోనూ మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముతారని అధికారులు అంచనా వేశారు. మిల్లర్లు ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. దీంతో ధాన్యం రాక తగ్గింది. యాదాద్రి జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లకు గాను 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ఎక్కువ శాతం సాధారణ రకమే. సూర్యాపేట జిల్లాలో 4,51,623 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి రాగా ఇందులో సగానికిపైగా ఇప్పటికే మిల్లర్లకు అమ్మేశారు. ఇలా వచ్చే ధాన్యం తగ్గుతుండటం, వ్యాపారుల నుంచి డిమాండ్ ఉండటంతో రేటు పెరుగుతోంది. ఈయన పేరు పేరం వెంకన్న. ఊరు నేరేడుచర్ల మండ లం నర్సయ్యగూడెం. తనకున్న ఐదెకరాలతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకొని చింట్లు రకం ధాన్యం సాగు చేశాడు. పదెకరాల్లో పండిన ధాన్యాన్ని 15 రోజుల కిందట క్వింటాకు రూ.1,700 చొప్పున విక్రయించాడు. తాజాగా ఆదివారం ఐదెకరాల ధాన్యాన్ని క్వింటా రూ.2,300 చొప్పున అమ్మాడు. ఒక్కో క్వింటాపై రూ. 600 ఎక్కువ రావడంతో సంతోషించాడు. -
‘వడ్లు దంచంగా రాడే.. వండంగ రాడే’.. ఈ పాట ఎక్కడైనా విన్నారా?
‘వడ్లు దంచంగా రాడే... వండంగ రాడే...’ వడ్లు దంచుతూ ఆ శ్రమను మర్చిపోవడానికి పల్లె మహిళలు పాడే పాట. ఇప్పుడంటే రైస్ మిల్లుల్లో బియ్యం పట్టిస్తున్నారు కానీ... తెలంగాణ పల్లెల్లో వెనుకట ఎంత ఉన్నవాళ్లైనా వడ్లు రోట్లో పోసి దంచి బియ్యం చేయటమే. ఆ ప్రక్రియలో శ్రమ అధికం. తమ బలాన్నంతా రోకలిపై ప్రయోగించి దంచాల్సి వచ్చేది. ఆ శ్రమ ఎక్కువగా లేని అనువైన సంప్రదాయ బియ్యం దంపుడు పద్ధతి మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కనిపించింది. అది కట్టెలతో తయారు చేసిన టెక్కి యంత్రం. రెండు కర్రల మధ్య భారీ చెక్కను పెట్టి, దానికి రోకలిని బిగించారు. ఆ చెక్క(టెక్కి)ని తొక్కితే రోకలి పైకి లేస్తుంది. వదిలేసినప్పుడు కింద సొర్కెలో ఉన్న వడ్లు దంచి బియ్యంగా మార్చేస్తుంది. వాటిని చెరిగి, మిగిలిన మెరిగలను మళ్లీ దంచుతారు. మిల్లుల్లో పాలిష్ చేసిన బియ్యంలో లేని పోషకాలెన్నో ఈ దంపుడు బియ్యంలో ఉంటాయి. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ దంపుడు బియ్యం ప్రయోజనాలు దంపుడు బియ్యం(ముడి బియ్యం) చూడటానికి ఇంపుగా లేకపోయినా చాలా పోషక విలువలున్నాయి. ముడి బియ్యంలో ఉన్న పీచు అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ముడి బియ్యం ఊక నుంచి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది. దంపుడు బియ్యం తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా రక్త నాళాల్లో కొమ్ము పేరుకోకుండా కాపాడుతుంది. – చింతల అరుణ్రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
వరికి ఎసరెందుకు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 25కుపైగా రాష్ట్రాల్లో వరి పండిస్తున్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వరే ప్రధాన పంట. వరి ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) నేరుగా కొనుగోలు చేయకుండా.. కస్టమ్ మిల్లింగ్ విధానంలో తీసుకుంటుంది. అంటే.. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కొని రైతులకు డబ్బులు చెల్లిస్తాయి. తర్వాత ఆ ధాన్యాన్ని రైస్మిల్లులకు పంపి మిల్లింగ్ చేయిస్తాయి. ఇందుకోసం మిల్లులకు డబ్బులు చెల్లిస్తాయి. మిల్లింగ్ ద్వారా ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఎఫ్సీఐకి పంపుతాయి. ఎఫ్సీఐ ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని ‘డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ పూల్’ విధానం ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రేషన్ డిపోలకు సరఫరా చేస్తుంది. ఎఫ్సీఐ ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువగా బియ్యాన్ని సేకరిస్తుంది. ♦దేశవ్యాప్తంగా 2020–21లో 12.23 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా.. ఎఫ్సీఐ 25 రాష్ట్రాల నుంచి 5.99 కోట్ల టన్నులు సేకరించింది. ఇందులో ముందుజాగ్రత్త కోసం చేసే నిల్వ (బఫర్ స్టాక్) 1.35 కోట్ల టన్నులుపోగా.. మిగతా బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతుంది. క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యం వస్తేనే.. ఎఫ్సీఐ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు కనీసం 68 కిలోల బియ్యం రావాలి. కానీ రాష్ట్రంలో యాసంగి ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూకల శాతం పెరుగుతోంది. బియ్యం తగ్గుతున్నాయి. దీనికి ఎఫ్సీఐ అంగీకరించదు. అదే ధాన్యాన్ని పారాబాయిల్డ్ మిల్లుల్లో ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మార్చితే ఎఫ్సీఐ ప్రమాణాల మేరకు 68కిలోలకుపైగా వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాయిల్డ్ రైస్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, వీలైనంత వరకు ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే ఎఫ్సీఐ ఇకముందు బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పడంతో సమస్య మొదలైంది. ♦ గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభు త్వం.. రైతులకు రూ.17 వేల కోట్లకుపైగా చెల్లించింది. ఆ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుటివరకు లక్ష్యంలో 50 శాతమే ఎఫ్సీఐకి పంపారు. ఎఫ్సీఐ గోడౌన్లకు బియ్యం చేరితేనే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి. వరిసాగు భారీగా పెరగడంతో.. తెలంగాణలో గతంలో కంటే వరిసాగు భారీగా పెరిగింది. గతంలో సాధారణంగా 26 లక్షల ఎకరాల్లో వరి పండించేవారు. కొన్నాళ్లుగా సాగునీటి సమస్య తీరడం, వాతావర ణం అనుకూలిస్తుండటం, విద్యుత్ సరఫరా బాగుండటం తో.. ప్రస్తుతం సాగు 60 లక్షల ఎకరాలకు చేరింది. కొన్నేళ్లలో నే ఇంత భారీగా సాగు, ధాన్యం దిగుబడి పెరగడంతో.. దాని కి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం పెరిగింది. మరోవైపు.. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా సమస్యకు దారి తీసింది. ♦ తెలంగాణలో గత యాసంగిలో పెరిగిన పంట విస్తీర్ణంతో ఏకంగా 92.33 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిరాగా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించింది. కానీ కేంద్రం 24.60 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని, మిగతా పచ్చి బియ్యంగా ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో రెండు సీజన్లలో పండిన పంటలో ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం కలిపి 90 లక్షల టన్నులు సేకరించాలని కోరింది. దీనికి కూడా అంగీకరించని కేంద్రం.. వానకాలం పంటను పూర్తిగా తీసుకుని, యాసంగిలో 44.75 లక్షల టన్నులే సేకరించేందుకు ఒప్పుకొంది. 2021–22 వానాకాలం (ప్రస్తుత సీజన్) పంటలోనూ 40 లక్షల టన్నుల పచ్చి బియ్యం (రా రైస్) మాత్రమే సేకరిస్తామని చెప్పింది. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం కొనబోమని స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి కేరళ, తమిళనాడు, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియాలకు సుమారు 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం ఎగుమతి అవుతాయని అంచనా. వరిలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడితే.. యాసంగిలో రాష్ట్ర రైతులు.. ధాన్యం దిగుబడి అధికంగా ఉండి, చీడపీడలు అంటని రకాలనే సాగుచేస్తారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న వాతావరణ పరిస్థితులు, సీడ్ కంపెనీల లాబీయింగ్ వంటికారణాలతో.. కొన్నేళ్లుగా ఒకే తరహా వంగడాలను సాగుచేస్తున్నారు. యాసంగి సమయంలోనూ మిల్లింగ్లో నూకలుగా మారని వంగడాలు ఉన్నా.. ఆ దిశగా రైతులు, సీడ్ కంపెనీలు ఆలోచించడం లేదని రైస్మిల్లర్ల సంఘం నేత తూడి దేవేందర్రెడ్డి చెప్తున్నారు. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ వంటి వంగడాలు యాసంగిలో కూడా మంచి దిగుబడి వస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల కన్నా వరిలోనే ప్రత్యామ్నాయ వంగడాలను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ పంటలివే.. ♦ మొక్కజొన్న, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, శనగలు, పెసర్లు, ఉలువలు తదితరాలు ♦ వేరుశనగ, నువ్వులు, సన్ఫ్లవర్, కుసుమలు, ఆముదం, ఇతర నూనె పంటలు ♦ ఇతర ఆహార పంటలు, పొగాకు సాగు వానాకాలం పంట కొనుగోళ్లూ తక్కువే.. రాష్ట్రంలో వానాకాలం పంటను చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో పంట కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి 2,34,517 మంది రైతుల నుంచి 14.84 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. రూ.2,415 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా.. రూ.489.6 కోట్లను మాత్రమే జిల్లాలకు విడుదల చేశారు. అయితే ఆలస్యమైనా వానకాలం కొనుగోళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి యాసంగిపైనే పడింది. ఇతర రాష్ట్రాల్లో ‘బాయిల్డ్’ గొడవెందుకు లేదు? దేశవ్యాప్తంగా చూస్తే.. కేరళలో మాత్రమే అత్యధికంగా 80 శాతం ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, హరియాణా, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ యాసంగిలో పండిన ధాన్యాన్ని కొంతమేర ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. కానీ మరీ తెలంగాణ స్థాయిలో ఉండదు. ఆ రాష్ట్రాలలో ఉన్న భూసార పరిస్థితులకు తోడు.. వాటికి ఆనుకొని ఉన్న సముద్రం కారణంగా ఎండాకాలంలోనూ గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో ధాన్యం ఎక్కువగా నూకలు అవదు. కొంతమేర ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అయినా అది ఆ రాష్ట్రాల అవసరాలకు సరిపోనుంది. దీనివల్లే కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పినా.. ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురుకాలేదు. కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూపులు! ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. యాసంగిలో వరి వేయవద్దని హెచ్చరిస్తూనే, ఏ బియ్యం ఎంత మేర కొంటారో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సాగు విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో ఈనెల 18న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆదివారం మంత్రులు, అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. రెండు రోజులు అక్కడే ఉంటామని, ఉప్పుడు బియ్యం కొనుగోళ్లకు కేంద్రం ఒప్పుకోకపోతే రైతులు యాసంగిలో ఏ పంట వేయాలో సూచిస్తామని తెలిపారు. దీంతో రైతులు ముఖ్యమంత్రి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. పచ్చిబియ్యంగా మార్చలేకనే.. వానలు సరిగాపడి, నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు రైతులను పంటల కోసం ప్రోత్సాహించాల్సింది పోయి.. వరి పండించకూడదని కేం ద్రం చెప్పడం సరికాదు. రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని పచ్చిబియ్యంగా మారిస్తే.. నూకల శాతం పెరిగి ఎఫ్సీఐకి విక్రయించలేని పరిస్థితి. అందుకే కొన్నేళ్లుగా బాయిల్డ్ రైస్గా ఎఫ్సీఐకి ఇస్తున్నాం. యాసంగిలో కూడా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనేందుకు ముందుకు రావాలి. అంతకు మించి ప్రత్నామ్నాయం లేదు. - సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు, అఖిల భారత రైతు సంఘం చట్టం ప్రకారం కేంద్రం కొనాల్సిందే.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందే. ఆ చట్టం కింద ప్రతీ ఒక్కరికి ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం వరి తగ్గించాలనుకుంటే.. ఫలానా పంట వేస్తే మద్దతు ధరకు కొంటామని ముందే చెప్పాలి. ప్రతీ గింజ కొంటా మని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎందుకు చెప్పింది? ఏ ఆధారం చేసుకొని కేసీఆర్ ఈ ప్రకటన చేశారు? పచ్చిబియ్యం విషయంలో నూకలు వస్తాయంటున్నారు. ఇది ప్రాసెసింగ్ సమస్య. సేకరణ సమస్య కాదు. ఈ విషయంపై మిల్లర్లతో కూర్చొని చర్చించుకోవాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ప్రత్యామ్నాయ పంటలను మద్దతు ధరలకు కొనాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యామ్నాయ పంటలను మద్దతుధరకు కొనేలా హామీ ఇవ్వాలి. కేరళ తరహాలో బోనస్ ఇవ్వాలి. మద్దతు ధరలు లేని ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేయాలని చెప్తోంది. ఇందులో ఆవాలు, ఆముదం పంటలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో లేవు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించాలి. ఈ యాసంగిలో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుండే సరఫరా చేయాలి. – టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతుసంఘం -
ధాన్యం కొనుగోలు చేయాలి
-
‘ప్రజాపంపిణీ’ పక్కదారి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రైస్మిల్లులు సీఎమ్మార్ (కస్టం మిల్లింగ్ రైస్) చిల్లు పెడుతున్నాయి. మర ఆడించాల్సిన ధాన్యాన్ని తెరచాటుగా పక్కదారి పట్టిస్తు న్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం పెద్ద ల పాలవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దా టి అక్రమార్కుల చెంతకు చేరుతున్నాయి. రాష్ట్రంలో దారి ద్య్రరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ప్రతినెలా ప్రభుత్వం రూపాయికి కిలోబియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సరఫరా చేస్తోంది. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొని, మర ఆడించి ఇచ్చేలా రైస్మిల్లులకు సీఎమ్మార్(కస్టం మిల్లింగ్ రైస్) కేటాయిస్తోంది. మర ఆడించినందుకుగాను మిల్లర్లకు చార్జీలు సైతం చెల్లిస్తోంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థలో పందికొక్కులు చేరి సీఎమ్మార్ బియ్యాన్ని బొక్కేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో సీఎమ్మార్ ధాన్యం యథేచ్ఛగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలుతోంది. గద్వాల – కర్ణాటక – తమిళనాడు.. ఉమ్మడి పాలమూరు నుంచి సీఎమ్మార్ ధా న్యం ప్రధానంగా మూడు దశల్లో రాష్ట్ర సరి హద్దులు దాటుతోంది. గద్వాల నుంచి కర్ణా టకలోని రాయచూర్.. ఆ తర్వాత గంగావ తి జిల్లాలోని కాటుక టౌన్కు.. అక్కడి నుంచి తమిళనాడులోని గంగై పట్టణానికి త రలుతోంది. రాష్ట్రంలో ధాన్యానికి అధికంగా క్వింటాల్కు రూ.1,880 ధర పలుకుతుండగా, గంగైలో రూ.3 వేలకుపైగా పలుకుతోంది. క్వింటాల్కు అధికంగా రూ.1,000 నుంచి రూ.1,200 వరకు వస్తుండటంతో అక్రమార్కులు అక్కడికి దొంగచాటుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం గద్వాల జిల్లాలో ఈ నెల 18న సీఎమ్మార్ ధాన్యాన్ని తరలిస్తూ పట్టుబడిన మూడు లారీలే. ఇవే నిదర్శనం.. ►గతేడాది యాసంగిలో గద్వాల జిల్లాలో 1,27,476 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 29 రైస్ మిల్లులకు సీఎమ్మార్ కింద కేటా యించారు. సరిగ్గా మర ఆడిస్తే 85,489 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. అయి తే ఇప్పటివరకు 23,170 మెట్రిక్ టన్నులను మాత్రమే మిల్లర్లు ప్రభుత్వానికి అ ప్పగించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడు వు ఈ నెలాఖరులోపు ఇంకా 62,319 మెట్రిక్ టన్నుల బి య్యాన్ని అప్పగించాలి. వారంలో ఇంతమొత్తం అప్పగించడం సాధ్యం కాదనేది సుస్పష్టం. అటు మిల్లుల్లో సీఎమ్మార్ కింద కేటాయించిన ధాన్యం నిల్వలు కనిపించడం లేదని సివిల్ సప్లయ్ వర్గాలే చెబుతున్నాయి. అంటే 70 శాతం మేర ధాన్యం తమిళనాడుకు తరలిపోయినట్లు తెలుస్తోంది. ►శ్రీ ఆంజనేయ రైస్ మిల్లుకు గత యాసంగికి సంబంధించి 2,883.320 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ ధాన్యం కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 421.900 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి చేరింది. ఇంకా 1499.924 మెట్రిక్ టన్ను ల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 18న ఈ మిల్లు నుంచి 1,399 బస్తాల ధాన్యాన్ని రెండు లారీల్లో తమిళనాడుకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతోపాటు వేరొకరికి చెందిన మరో లారీలో 600 బస్తాల ధాన్యం తరలుతుండగా అధికారులు మల్దకల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. గద్వాల స్టేషన్కు తరలించిన ఈ వాహనాలను తప్పించేందుకు ఓ ప్రజాప్రతినిధి తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. వీరిపై ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత 6ఏ కేసు నమోదు చేశారు. 50 శాతం వాటా.. గత ఏడాది యాసంగిలో గద్వాల జిల్లా నుం చే కాకుండా నారాయణపేట, నాగర్కర్నూ ల్, వనపర్తి జిల్లాల నుంచి కూడా ధాన్యం సేకరించారు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే రంగప్రవేశం చేసి సీఎమ్మార్ కింద మిల్లులకు కేటాయింపులు చేశారు. ఆ తర్వాత రేషన్ మాఫియాను తెర ముం దు ఉంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగానికి ముందు రేషన్ దందా నిర్వహిస్తున్న ముఖ్యులతో ఆయన సమావేశమై 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. మూడు లారీలు పట్టుబడిన క్రమంలో రేషన్ మాఫియాకు చెందిన ఓ లీడర్ ‘మాకేం మిగులుతాంది.. ఆయనకే సగం పోతాంది’అని తెలిసిన వారి వద్ద వాపోయినట్లు సమాచారం. నెలనెలా రేషన్ మాఫియా నుంచి ఆమ్యామ్యాలు అందుతుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా.. లేక సదరు ప్రజాప్రతినిధి కంటపడితే బదిలీ కాక తప్పదని భయపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. రైస్ మిల్లులకు ప్రభుత్వం సీఎమ్మార్ ధాన్యాన్ని కేటాయించింది. ఈ క్రమంలో ఈ నెల 18న మూడు లారీలలో అక్రమంగా ధాన్యం తరలివెళ్తుండగా పట్టుకుని పోలీసుస్టేషన్కు తరలించాం. మూడు లారీలలో రెండు వేల బస్తాల ధాన్యం పట్టుబడింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై 6ఏ కేసు నమోదు చేశాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో పెద్దల పాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – రఘురామ్శర్మ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల -
‘ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: యాసంగికి సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫ్సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారం పౌరసరఫరాలభవన్లో కమిషనర్ అనిల్ కుమార్తో కలసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించా రు. యాసంగి సీజన్లో మొత్తంగా 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, సీఎంఆర్ కింద బియ్యంగా మార్చి 64 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్సీఐ తీసుకుందని తెలిపారు. -
సీఐ గారి రైస్మిల్ కథ!.. సుప్రియ పేరుతో
సాక్షి, పట్నంబజారు(గుంటూరు తూర్పు): ఇదీ ఒక సీఐ గారి రైస్మిల్ కథ.. రైస్ మిల్లులో ప్రజల సొమ్మును కొల్లగొట్టారు. ‘సుప్రియ పేరుతో రైస్మిల్ పెడుతున్నా.. పెట్టుబడి పెడితే షేర్లు ఇస్తా.. దీంతో పాటు మిల్లులో ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు’.. కోట్లాది రూపాయలు వసూలు చేశారు.. మిల్లు తెరుచుకుంది.. సంపాదన బాగానే ఉంది.. అందుకు పెట్టుబడి పెట్టిన వారికి.. అప్పులిచ్చిన వారికి మాత్రం ఇప్పటికీ షేర్లు రాలేదు సరికదా ఉద్యోగాలు వచ్చింది లేదు. ఇదంతా చేసింది ఒక పోలీసు అధికారి. ఓ నాలుగు కేసులు ఆయనపైనా, మరో రెండు కేసులు ఆయన భార్యపైనా నమోదయ్యాయి. అయితే స్టేషన్ స్థాయి అధికారులు కేసుల విచారణలో పక్షపాతం చూపుతున్నారనే విమర్శలొస్తున్నాయి. గుంటూరు రేంజ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బత్తుల శ్రీనివాసరావు ఎస్ఐ, సీఐగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్లో ఉన్నారు. ఖాకీ దుస్తులను అడ్డుపెట్టుకుని నిలువు దోపిడీకి తెరదీశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధనలకు నీళ్లొదిలేశారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో రైస్మిల్లు కడుతున్నానంటూ జనం నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. చదవండి: (టీడీపీతో ఒప్పందంతోనే సీఎంపై పవన్ విమర్శలు) కేసుల పరంపర ఇలా... ►గుంటూరు శ్రీనివాసరావుతోటకు చెందిన బండ్లమూడి బిందు వద్ద 2016 సంవత్సరంలో రూ. 1 కోటి 40 లక్షలు అప్పుగా తీసుకుని, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో బాధితురాలు నగరంపాలెంలో పీఎస్లో ఫిర్యాదు చేయడంతో ఆయనతోపాటు భార్యపైనా కేసు నమోదైంది. ►తెనాలికి చెందిన యండ్రాతి చంద్రమ్మ అనే మహిళ వద్ద 2018 సంవత్సరంలో రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారనే ఫిర్యాదు మేరకు టూటౌన్లో కేసు నమోదైంది. ►విశాఖపట్నంలోని గాజువాకలో తనకు బంధువైన ఏలిషా వద్ద రూ.29 లక్షల వరకు తీసుకుని మోసం చేయటంపై గాజువాక పీఎస్లోనూ కేసు నమోదైంది. తన రైస్మిల్లుకు సంబంధించి షేర్లు ఇస్తామని నమ్మబలికి అతన్ని మోసం చేయటంపై ఫిర్యాదు చేశాడు. ►గుంటూరు నగరంలో నివాసం ఉండే పాపాబత్తుల ప్రభుదాస్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేశారు. ఈ క్రమంలో పరిచయమైన సీఐ బత్తుల శ్రీనివాసరావు అతని రైస్మిల్లులో షేర్లు ఇవ్వటంతో పాటు, సూపర్వైజర్గా ఉద్యోగం ఇస్తా మని నమ్మబలికి రూ.34 లక్షల 84 వేల నగదును తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయితే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు వాపోతున్నాడు. ►పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే విధంగా షేర్ ఇస్తామని, తన బినామీల ద్వారా రూ.25 లక్షలు వరకు తీసుకున్నారని, అందులో ఆయనే సాక్షిగా ఉన్నారని బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు తెరదీసి.. డబ్బులు తీసుకున్న ఏ ఒక్కరికీ తిరిగి ఇవ్వకపోగా, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. సీఐ స్థాయిలో ఉన్న శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేసినప్పటికీ, ఉన్నతాధికారులు తప్ప, స్టేషన్ అధికారులు పట్టించుకోవటంలేదు. మాపై దయ ఉంచి.. డబ్బులు ఇప్పించండయ్యా! నేను రిటైర్మెంట్ అవ్వగానే వచ్చిన డబ్బులన్ని సీఐ బత్తుల శ్రీనివాసరావుకే ఇచ్చా. నా జీవితకాలం కష్టం తీసుకెళ్లి ఆయనకిచ్చా. కుటుంబ పెద్దగా రిటైర్మెంట్ తరువాత ఏదో వ్యాపారం చేద్దామకున్నా.. తప్ప, పోలీసు అయి ఉండి ఆయన మోసం చేస్తారని అనుకోలేదు. నా డబ్బులు, మిగిలిన బాధితులకు తిరిగి డబ్బులు తిరిగి ఇప్పించాలి. – పాపాబత్తుల ప్రభుదాస్, శ్రీనగర్, గుంటూరు కేసులు వాస్తవమే సీఐ హోదాలో ఉన్న బత్తుల శ్రీనివాసరావుపై పలు కేసులు నమోదైన మాట వాస్తవమే. పూర్తిస్థాయిలో కేసులు విచారిస్తున్నాం. ఆరోపణల నేపథ్యంలోనే బత్తుల శ్రీనివాసరావును సస్పెండ్ చేశాం. గుంటూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. మరెవరైనా బాధితులు ఉన్నారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నాం. –సీఎం తివిక్రమవర్మ, డీఐజీ -
బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని రేఖ రైస్ మిల్లు అక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాపతినిధి అండగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందువల్లే గత ఏడాది డిసెంబర్లో విచారణ నివేదిక అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అయితే గద్వాల టీఆర్ఎస్ పార్టీలో మూడు వర్గాలు ఉండగా.. ఓ వర్గం నేతలు జిల్లాస్థాయి అధికారికి మద్దతు ఇస్తున్నారని, మరో వర్గం తటస్థంగా ఉందని తెలిసింది. వారికి పోటీగా ఉండే ఇంకో వర్గం నేతలు రేషన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపై ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీని కారణంగానే ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు చెప్తున్న వివరాలు కూడా ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. ఒకరిపై కేసు నమోదుకు ఆదేశాలు ‘‘రేఖ రైస్మిల్లులో పట్టుబడిన 170.05 క్వింటాళ్ల రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులను తప్పుదోవ పట్టించిన ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గణపతిరావుపై కేసు నమోదు చేయాలని చెప్పారు. ఈ మేరకు గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’’అని ఇన్చార్జి డీఎస్ఓ రేవతి తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇతర అధికారులపై చర్యలకు సంబంధించి పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ఈ లెక్కన రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్టేనా? అందులో పేర్కొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్, సీఐ, ఎస్సైలపై చర్యలుంటాయా.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘రేషన్’ బియ్యం వ్యవహారం ఇదీ.. 2020 అక్టోబర్ 2న గద్వాల శివారులోని రేఖ రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు ఆ మిల్లులో సోదాలు నిర్వహించారు. 341 సంచుల్లో (170.05 క్వింటాళ్లు) రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. పట్టుబడినది రేషన్ బియ్యం కాదంటూ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్.గణపతిరావు తప్పుడు నివేదిక రూపొందించి బురిడీ కొట్టించాడు. దీనిపై అప్పట్లో పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గతంగా వివాదం చెలరేగింది. ఈ విషయం బయటికి రావడంతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మిల్లులో సీజ్ చేసిన బియ్యాన్ని ల్యాబ్కు పంపగా రేషన్ బియ్యమేనని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో ఆరా తీశారు. రేఖ మిల్లులో బియ్యం పట్టుబడ్డ రోజు గణపతిరావు విధుల్లోనే లేరని, తప్పుడు అనుమతి పత్రాలను రూపొందించి అధికారులకు ఇచ్చారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి గద్వాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తోపాటు మరో ఐదుగురి హస్తం ఉన్నట్టు తేల్చి గత ఏడాది డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆ నివేదిక మూలనపడగా.. తాజాగా గత నెల 21న గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో డీటీ గణపతిరావుపై కేసు నమోదు చేశారు. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. -
మిల్లు ఆగలేదు
సాక్షి, అమరావతి: రబీ పంట చేతికొచ్చే సమయంలోనే కరోనా ముంచుకొచ్చింది. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ ప్రకటించినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోని రైస్ మిల్లులు పూర్తిస్థాయిలో పనిచేశాయి. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైస్ మిల్లులను అత్యవసర సేవలు పరిధిలోకి తీసుకు రావడంతో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలిగాయి. లాక్డౌన్ ప్రకటించిన తొలి 10 రోజుల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు, తహసీల్దార్లు రైస్ మిల్లులు పని చేయడానికి వీలుగా సిబ్బంది, కార్మికుల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతోపాటు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసింది. వైఎస్ తర్వాత జగనే.. గతంలో రైస్ మిల్లులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదుకోగా.. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రంగాన్ని ఆదుకున్నారని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ హయాంలో రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్టీ విద్యుత్ పరిమితిని 100 హెచ్పీకి పెంచితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏప్రిల్ నుంచి ఎల్టీ పరిమితిని 150 హెచ్పీకి పెంచారు. లాక్డౌన్ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం చిన్న రైస్ మిల్లులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇదే సమయంలో మూడు నెలల పాటు మినిమమ్ డిమాండ్ చార్జీలను రద్దు చేయడంతో అనేక మిల్లులు లబ్ధి పొందాయి. ఒక్కొక్క మిల్లుకు కనీసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ప్రయోజనం కలిగింది. బియ్యం రీసైక్లింగ్కు చెక్ ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డులపై అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. గతంలో రేషన్ బియ్యం మిల్లులకు వచ్చేవి. వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్లోకి వెళ్లేవి. ప్రభుత్వ చర్యలతో రీసైక్లింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 800 మిల్లుల్లో సార్టెక్స్ మెషిన్లు ఉన్నాయి. ఒక్కో మెషిన్ ఏర్పాటుకు రూ.60 లక్షల వరకు అవుతుందని అంచనా. ఎల్టీ పరిమితిని 150 హెచ్పీకి పెంచడం, ప్రభుత్వం గ్యారెంటీతో రుణాలు ఇస్తుండటంతో చాలా మంది మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాతికేళ్ల డిమాండ్ నెరవేరింది రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్టీ పరిమితిని 150 హెచ్పీకి పెంచాలని 25 ఏళ్లుగా కోరుతున్నాం. రాజశేఖరరెడ్డి హయాంలో 100 హెచ్పీకి తీసుకెళితే.. ఆయన తనయుడు సీఎం జగన్ 150 హెచ్పీకి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ కింద రుణాలకు గ్యారెంటీ ఇస్తుండటంతో బ్యాంకులు రుణాలివ్వడం ప్రారంభించాయి. – గుమ్మడి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇబ్బందుల్లేకుండా చేశారు లాక్డౌన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పూర్తిస్థాయిలో 14 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేశాం. తూర్పు గోదావరి జిల్లాలో 350 మిల్లులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. – అంబటి రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వ ధరే ఎక్కువగా ఉంది లాక్డౌన్ సమయంలో ప్రారంభంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమకు చిన్నపాటి ఇబ్బందులొచ్చినా ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కృష్ణా జిల్లాలో 250 వరకు మిల్లులు ఉన్నాయి. విదేశాలకు ఎగుమతి చేసే ధర కంటే ప్రభుత్వం కొనుగోలు ధరే ఎక్కువగా ఉంది. అందుకని మొత్తం బియ్యాన్ని ప్రభుత్వానికే సరఫరా చేస్తున్నాం. – పి.వీరయ్య, పిన్నమనేని వీరయ్య అండ్ కంపెనీ -
పెద్దాపురంలో ఐటీ అధికారుల సోదాలు
-
లలితా రైస్ మిల్స్లో ఐటీ దాడులు
-
లలితా రైస్ మిల్స్లో ఐటీ దాడులు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లలితా రైస్ మిల్స్లో ఐటీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఏడు బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ తనిఖీలు జరిపారు. కాగా లలితా రైస్మిల్స్ యజమానులు మట్టే ప్రసాద్, శ్రీనివాస్.. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అత్యంత సన్నిహితులు. ఖరీదైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షాటెక్స్ యంత్రాలతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులుగా వీరికి పేరుంది. కాగా మట్టే సోదరులు.. ఒక షాటెక్స్ యంత్రానికి అనుమతి తీసుకుని, దాని పేరు మీద మరిన్ని షాటెక్స్ యంత్రాలతో బియ్యాన్ని మిల్లింగ్ చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో అచ్చంపేట వద్ద మాజీ హోంమంత్రి చినరాజప్పకు క్యాంప్ కార్యాలయం భవనాన్ని మట్టే సోదరులే బహుమతిగా ఇచ్చారని ప్రచారం ఉంది. -
బుక్కిందంతా కక్కాల్సిందే
సాక్షి, మిర్యాలగూడ : సంచలనం కలిగించిన తవుడు జీఎస్టీ బుక్కిన కేసును సెంట్రల్ జీఎస్టీ విజిలెన్స్ అండ్ ఇంటలిజెన్స్ అధికారులు పకడ్బందీగా విచారిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన తవుడు రవాణా జీఎస్టీలో ఎంత బుక్కారో అంతకు మూడింతలు కక్కించే విధంగా విచారిస్తున్నారు. మిర్యాలగూడలో ఉన్న 15 మంది తవుడు కమీషన్ ఏజెంట్లను ఐదు రోజుల పాటు విచారించిన అనంతరం వైజాగ్లోని సెం ట్రల్ కార్యాలయానికి రికార్డులు తరలించారు. కాగా రికార్డుల ఆధారంతో పాటు కమీషన్ ఏజెంట్లు చెప్పిన విషయాల ఆధారంగా రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. మిర్యాలగూడలో 80 పార్బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా సగానిపైగా మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తవుడు జీఎస్టీ కేసును మిల్లర్లకు ఇచ్చిన నోటీసుల ఆధారంగా విచారించనున్నారు. వైజాగ్ కార్యాలయంలో విచారణ తవుడు జీఎస్టీ ఎగ్గొట్టిన కేసులో నోటీసులు అందుకున్న రైస్ మిల్లర్లను వైజాగ్లోని ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి విచారణకు హాజరుకావాలని నోటీసులలో ఇంటలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చిన మిల్లర్ల పూర్తి సమాచారం విజిలెన్స్ అండ్ ఇంటలిజెన్స్ అధికారుల వద్ద ఉన్నందున వారు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగానే వైజాగ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. నోటీసులు ఇచ్చిన మిల్లర్లందరినీ అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయిలో విచారించనున్నారు. మూడింతలు కక్కాల్సిందే తవుడు జీఎస్టీలో మోసానికి పాల్పడిన మిల్లర్లు, కమీషన్ ఏజెంట్ల నుంచి జీఎస్టీ ఉన్నతాధికారులు మూడింతలు కక్కించనున్నారు. బ్యాం కు ఖాతాలతో పాటు మెయిల్ సమాచారం, బిల్లులు, రికార్డులు పూర్తి స్థాయిలో వైజాగ్ కార్యాలయానికి తరలించారు. కాగా మిర్యాలగూడ జీఎస్టీ కార్యాలయంలో ఒక్కొక్క కమీషన్ ఏజెంటు వారీగా విచారించిన అధికా రులు వైజాగ్ కార్యాలయంలో మిల్లర్లను ఒక్కొక్కరిగా విచారించనున్నారు. మిల్లర్ల తర్జనబర్జన తవుడు జీఎస్టీ బుక్కిన కేసులో సెంట్రల్ జీఎస్టీ ఉన్నతాధికారులు విచారిస్తున్నందున మిర్యాలగూడలోని మిల్లర్లు తర్జనభర్జన పడుతున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ చుట్టూ చెక్కర్లు కొట్టిన మిల్లర్లు బుధవారం అత్యవసరంగా మిర్యాలగూడలోని రైస్ మిల్లర్ల భవనంలో సమావేశం నిర్వహించుకున్నారు. సమావేశంలో తవుడు జీఎస్టీ బుక్కిన కేసులో నోటీసులు అందుకున్న విషయంపై చర్చిం చారు. అదే విధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెలలో నిర్వహించాల్సి ఉండగా తవుడు జీఎస్టీ విచారణ జరుగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల మాయాజాలం
-
రైస్మిల్లర్లపై పిడుగేసిన బాబు ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వ్యవసాయాధార సిక్కోలు జిల్లాలో ఏకైక పెద్ద పరిశ్రమ రంగం ఏదైనా ఉందంటే... అవి రైస్మిల్లులే! ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది ఉపాధి కల్పిస్తున్నాయి! కానీ గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రైసుమిల్లుల యజమానులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది! ఈ కాలంలో 15 రైసుమిల్లులకు మూత కూడా వేసేశారు! ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు రైసుమిల్లుల ఉనికికే చంద్రబాబు ప్రభుత్వం ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. కస్టమ్ రైస్మిల్లింగ్ (సీఎంఆర్)పై కొత్త విధానంతో ఏకంగా వాటి ఆయువుపట్టుపైనే దెబ్బకొట్టింది. జిల్లాలో సీఎంఆర్ను కాంట్రాక్టు విధానంలో ఏకంగా ఒక వ్యక్తి లేదా ఒక కార్పొరేట్ సంస్థకు గంపగుత్తగా అప్పగించేందుకు చాపకింద నీరులా ఏర్పాట్లు చేసింది. ఈ గండం నుంచి తమను ఆదుకోవాలని రైసుమిల్లర్లు మంత్రి అచ్చెన్నకు మొరపెట్టుకున్నా చివరకు ఆయన కూడా ఆ కాంట్రాక్టు విధానానికే తెరవెనుక సహకారం అందించారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో వరి ప్రధాన పంట. దాదాపు 5.50 లక్షల మంది రైతులు ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారు 2.10 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇంచుమించి 9 లక్షల నుంచి పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. ఈ పంటలో 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ సీఎంఆర్ కింద రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది. ఇలా సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని రైసుమిల్లులకు అందిస్తోంది. అలా వచ్చిన ధాన్యాన్ని రైసుమిల్లుల్లో మరపట్టి 67 శాతం బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి రైసుమిల్లర్లు అందజేస్తున్నారు. జిల్లాలో 328 రైస్మిల్లులు ఉన్నాయి. ఇంచుమించు ఇవన్నీ సీఎంఆర్పై ఆధారపడే పనిచేస్తున్నాయి. ఇవన్నీ చిన్న మిల్లులే. ఒక్కో మిల్లు నిర్మాణానికి కనీసం రూ.2 కోట్లు వరకూ పెట్టుబడి అవసరం. జిల్లాలోని రైసుమిల్లర్లు తమ సొంత పెట్టుబడితో పాటు బ్యాంకు రుణాలపై ఆధారపడి ఈ వ్యాపారం చేస్తున్నారు. సీఎంఆర్లో సర్కారు తప్పటడుగులు... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ఈ సీఎంఆర్ విధానంలో తప్పటడుగులు వేస్తూనే ఉంది. దీని ఫలితంగా రైసుమిల్లర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లో మిల్లులను నడపాలంటే సీఎంఆర్ ఒక్కటే ఆధారంగా మిగిలింది. సెక్యూరిటీ డిపాజిట్ పెంచేయడం, సకాలంలో ధాన్యం సేకరణ చేయకపోవడం, గత నాలుగేళ్లుగా బకాయి ఉన్న సుమారు రూ.20 కోట్ల మొత్తాన్ని నేటికీ చెల్లించకపోవడం తదితర కారణాలు రైసుమిల్లర్లకు గుదిబండగా మారాయి. అంతేకాదు మిల్లింగ్ చార్జీలు కూడా సరిగా చెల్లించకుండా అధికార పార్టీ నాయకుల సన్మానాలకు, నజరానాలకే దారి మళ్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే రైసుమిల్లర్లను దివాళాతీసేలా వ్యవహరించడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన 15 మిల్లులు మూతపడ్డాయి. ఇది చాలదన్నట్లుగా మిగతా మిల్లులపైనా ప్రభుత్వం గుదిబండను వేసింది. రైసుమిల్లర్లకు తీవ్ర నష్టమే... కొత్త విధానంలో సీఎంఆర్ అంతా ఒకే వ్యక్తి లేదా కార్పొరేట్ సంస్థ చేతికి అప్పగించడం వల్ల రైసుమిల్లర్లకు ధాన్యం వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో రైసుమిల్లులను మూసేయడం తప్ప యజమానులకు మరో మార్గం కనిపించట్లేదు. జిల్లాలో దాదాపు రైసుమిల్లర్లు అందరూ నష్టాల్లోనే ఉన్నారు. వారంతా ఏదో ఒక బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్నవారే. కొత్త విధానమే అమలైతే తాము మరింత నష్టాల ఊబిలో కూరుకుపోతామని, మిల్లులను బ్యాంకులు జప్తు చేసే పరిస్థితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సామాజికవర్గ వ్యక్తి కోసం... ఇకపై సీఎంఆర్ కింద రైసుమిల్లర్లకు ధాన్యం ఇచ్చే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. శ్రీకాకుళం జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియ అంతా ఒకే వ్యక్తి లేదా ఒకే కార్పొరేట్ సంస్థకు కట్టబెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైల్ నంబరు ఎఫ్సీఎస్ 13034/11/2018–పీడీఎస్–ఏపీఎస్–సీఎస్సీఎల్ పేరుతో ఇందుకు సంబం« దించిన ఉత్తర్వులను సర్కారు గుట్టుచప్పుడు కాకుండా జారీ చేసింది. ఒకటీ రెండు రోజుల్లో సింగిల్ టెండరు విధానంలో చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన వ్యక్తికి అప్పగించేందుకు ఏర్పా ట్లు కూడా చేసేసినట్లు తెలుస్తోం ది. ఈ టెండరు ప్రక్రియ కూడా రహస్యంగానే నిర్వహించి మమ అనిపించేయనున్నారంటే దీని వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని స్పష్టమవుతోంది. కూలీల ఉపాధిపై ప్రభావం... ఒక్కో రైసుమిల్లుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండొందల మంది వరకూ కూలీలు, కళాసీలు, డ్రైవర్లు, వాహనాల యజమానులు ఆధారపడి జీవిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో దాదాపు 70 వేల మందికి ఈ రైసుమిల్లింగ్ పరిశ్రమే జీవనోపాధి కల్పిస్తోంది. చంద్రబాబు సర్కారు దొంగదెబ్బతో రైసుమిల్లులు మూతపడితే వారి కుటుంబాలన్నీ రోడ్డున పడాల్సిందే. చేతులెత్తేసిన అచ్చెన్న... ఈ ఐదేళ్లలో జిల్లాలోని రైసుమిల్లర్లు మంత్రి అచ్చెన్న చెప్పినట్లుగానే నడుచుకున్నారు. ఆయనకు సంబంధించిన పలు కార్యక్రమాలకు నిధులనూ సమకూర్చుతూ వచ్చారు. అయినా వారికి ఏనాడూ ఎలాంటి సహాయం చేయకపోవడం గమనార్హం. కనీసం సర్కారు నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన రవాణా చార్జీలను కూడా ఇప్పించలేకపోయారు. తీరా ఇప్పుడు గంపగుత్తగా ఒకే వ్యక్తికి సీఎంఆర్ను కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు చేసిన కుయుక్తులను అడ్డుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో విశాలమైన రైసుమిల్లర్లు, రైతులు, కార్మికులు, కూలీలు, డ్రైవర్ల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా వ్యక్తిగతమైన, తమ అధినేతకు సంబంధించిన వ్యక్తులకు దోచిపెట్టేందుకే మొగ్గు చూపిం చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది పొట్టగొట్టడం అన్యాయం... టీడీపీ నాయకులు తమ స్వార్థం కోసం వేలాది మంది పొట్టగొట్టడానికైనా వెనుకాడరనడానికి సీఎంఆర్ విధానంలో రహస్య మార్పులే నిదర్శనం. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఓ వ్యక్తి ప్రయోజనాల కోసం జిల్లాకు ఆధారమైన రైసుమిల్లింగు పరిశ్రమనే దెబ్బతీస్తారా? ఇది చాలా అన్యాయం. అధికారులు స్పందించి తక్షణమే ఆ సింగిల్ టెండరు విధానాన్ని నిలిపేయాలని డిమాండు చేస్తున్నాం. – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకుడు -
చెట్టును ఢీకొన్నకారు..ముగ్గురి మృతి
సాక్షి, ధర్మారం/కొడిమ్యాల: రైస్మిల్ ప్రారంభోత్సవానికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మామ, అల్లుడు, కూతురు మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి క్రాస్రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడిమ్యాలకు చెందిన రాగి వీరేశం(77), అతని కూతురు కొండూరి పద్మా వతి(50), అల్లుడు మనోహర్(55) ప్రాణాలు కో ల్పోగా.. సరోజన చికిత్స పొందుతుంది. కొడి మ్యాల మండల కేంద్రానికి చెందిన వీరేశం, సరోజన దంపతులకు నలుగురు కూతుళ్లు. రెండో కూతురు పద్మావతి, భర్త మనోహర్ ముప్పై ఏళ్ల క్రితం కరీంనగర్లో స్థిరపడ్డారు. వీరేశం, సరోజన దంపతులు మూడు రోజుల క్రితం కరీంనగర్లోని రెండో కూతురు ఇంటికి వెళ్లారు. సోమవారం నాలుగో కూతురుకు సంబంధించిన రైస్మిల్ ప్రారంభోత్సవం వెల్గటూర్ మండలం గుల్లకోటలో ఉంది. ఈ కార్యక్రమానికి అత్తమామలు వీరేశం, సరోజన, తోడల్లుడు మనోహర్, పద్మావతి దంపతులు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి ఎక్స్రోడ్డు వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మామఅల్లుళ్లు వీరేశం, మనోహర్ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. పద్మావతి, సరోజన తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్మావతి ప్రాణాలు విడిచింది. సరోజన చికిత్స పొందుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో కొడిమ్యాలలో విషాదం నెలకొంది. మృతుడి అల్లుడు రేణికుంట శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్సై ప్రేమ్కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ వెంకటరాంరెడ్డి, సీఐ నరేందర్ సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. కొడిమ్యాలలో విషాదం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన ప్రమాదంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విషాదం అలుముకుంది. అందరితో కలుపు గోలుగా ఉండే వీరేశం మృతితో మండల కేంద్రంలో ఆయన పరిచయస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
లక్ష్యానికి మించి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బియ్యం సమకూర్చుకునే విషయంలో జిల్లా అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ.. ధాన్యం కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్స్ మిల్లింగ్ రైస్ విధానంతో మిల్లర్లకు కేటాయించి.. మిల్లింగ్ చేయించే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించిన అధికారులు.. అంచనాలకు మించి కొనుగోలు కేంద్రాలకు రావడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో జిల్లాలో సంక్షేమ పథకాలకు వినియోగించే బియ్యానికి ఇబ్బంది లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అధికారులు సేకరించిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి తీసుకుని వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించనున్నారు. ప్రధానంగా జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం జిల్లా నుంచి సేకరించిందే కావడం విశేషం. జిల్లా అవసరాలకు మించి ధాన్యం సేకరించిన అధికారులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దాదాపు 7వేల మెట్రిక్ టన్నులు పంపించారు. అక్కడ అనుకున్న స్థాయిలో పంట దిగుబడులు లేకపోవడం.. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాకపోవడంతో ధాన్యాన్ని అక్కడికి తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఆయా రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం దామాషా ప్రకారం మిల్లింగ్ చేసి.. బియ్యంగా చేసి.. మార్చి చివరి నాటికి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం మిల్లింగ్ జరుగుతున్న తీరును పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని రేషన్ షాపులతోపాటు ఐసీడీఎస్ కేంద్రాలకు, పలు సంక్షేమ పథకాలకు వినియోగించనున్నారు. అయితే ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేసే బియ్యం పూర్తిస్థాయిలో సన్న రకాలుగా ఉండే బియ్యాన్ని సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 86 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఐకేపీ ద్వారా 14, పీఏసీఎస్ల ద్వారా 72 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. లక్ష్యానికి మించి ధాన్యం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 7,349.480 మెట్రిక్ టన్నులు కేటాయించారు. దీనికి సంబంధించి మిల్లర్లు అందించిన బియ్యాన్ని ఆ జిల్లాకే ఉపయోగించనున్నారు. ఇలా కేటాయించారు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అందించింది. వీటిలో 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అందించిన 7,349.480 ధాన్యం పోను.. ఖమ్మం జిల్లాలో 1,43,201 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అందజేశారు. అందులో మిల్లర్లు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 40,635.420 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించారు. కాగా.. ఇంకా రావాల్సిన 54,817.591 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మార్చి 31వ తేదీలోగా పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. జిల్లాలో 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.. జిల్లాలోని రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారు. ఈసారి అత్యధికంగా కొనుగోళ్లు జరగడంతో ఈ అవసరాలు తీరిపోగా.. ఇంకా కొద్దిమొత్తంలో బియ్యం మిగిలే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రేషన్ దుకాణాల కోసం నెలకు 6,228.096 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా.. అంగన్వాడీ కేంద్రాలకు 90 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అంటే నెలకు 6,318.096 మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి ఉంటుంది. ఏడాదికి 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. మిల్లర్ల నుంచి దాదాపు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుండడంతో ఈ అవసరాలకు పోను.. కొంత మేరకు మిగిలే అవకాశం ఉంది. అయితే వచ్చే ఈ బియ్యంలో 5వేల నుంచి 10వేల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఇక్కడ ఎవరూ ఉపయోగించకపోవడంతో బియ్యాన్ని ఎఫ్సీఐకి విక్రయించనున్నారు. అయితే పూర్తిస్థాయిలో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలకు పోను.. సుమారు 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిగిలే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మద్దతు ధర పెరగడంతో.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేశారు. 2017–18లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. కేవలం 39,360 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గత ఏడాది గ్రేడ్–‘ఏ’ ధాన్యం క్వింటా ధర రూ.1,590 ఉండగా.. కామన్కు రూ.1,550 నిర్ణయించారు. ఈ ఏడాది గ్రేడ్–‘ఏ’ క్వింటా ధాన్యం రూ.1,770, కామన్ రకం రూ.1,750 నిర్ణయించారు. దీంతోపాటు పంట దిగుబడి కూడా కొద్దిమేర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపారు. అవగాహనతోనే సాధ్యం.. ఈ ఏడాది లక్ష్యానికి మించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో కంటే మద్దతు ధర పెరగడంతోపాటు నీటి సౌకర్యంతో ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. దీంతో అనుకున్న లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేయగలిగాం. క్షేత్రస్థాయి అధికారులు కూడా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
రైస్ మిల్లులపై విజి‘లెన్స్’
విశాఖపట్నం, రాంబిల్లి(యలమంచిలి), యలమంచిలిరూరల్: తెరువుపల్లి పరిధిలో రాంబిల్లి మండలం ఎస్సీ కాలనీ వద్ద గల సత్యనారాయణ రైస్ అండ్ ఫ్లోర్ మిల్లుపై శనివారం అర్ధరాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. అప్పటికే మిల్లు బయట కోటా బియ్యం బస్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో ఆటోలో 18 బస్తాలు బియ్యం రాగానే అక్కడే మాటువేసిన విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు నేతృత్వంలో డీఎస్సీ పీఎం నాయుడు పర్యవేక్షణలో విజిలెన్స్ అధికారులు దిమిలికి చెందిన చక్కా సత్యనారాయణ అలియాస్ నానాజీకి చెందిన రెండు రైసుమిల్లులు, వాటికి ఆనుకొని ఉన్న గదిలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ స్థాయిలో రేషన్ బియ్యం నిల్వలు బయట పడ్డాయి. 130 టన్నుల బియ్యం బస్తాలు పట్టుబడినట్టు విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. ఈ బియ్యం విలువ రూ 40 లక్షలు ఉంటుందన్నారు. ఆటోను సీజ్ చేసి, ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కోటా బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులో రీసైక్లింగ్(పాలిష్)చేసి నాణ్యత గల బియ్యంగా మార్కెట్లో అమ్మడంతో పాటు పౌర సరఫరాల శాఖకు పంపడం చేస్తున్నారని తెలిపారు. రైసుమిల్లు యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాగా గతంలో కూడా ఈ రైసుమిల్లులో రేషన్ బియ్యం పట్టుబడిన ఘటలున్నాయి. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, విజిలెన్స్ తహసీల్దార్ సుమబాల, సీఎస్డీటీ మురళి తదితరులు పాల్గొన్నారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతోంది. విజిలెన్స్ దాడులతో కలకలం దిమిలి వద్ద రైసుమిల్లులపై ఆదివారం అధికారులు దాడులు చేయడం కలకలం సృష్టించింది. పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. అయితే ఇలా పట్టుకున్న కేసులు కోర్టుల్లో వీగిపోవడం, అధికారుల ఉదాసీనత కారణంగా పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. ఇకనైనా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకొని పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
సర్కారు బకాయి రూ.152 కోట్లు
ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీపై మరో పిడుగు పడింది. రైస్మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.152 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిధులు లేమి సాకుతో ఏడాది కాలం జాప్యం చేసిన ప్రభుత్వం ఇకనైనా బకాయిలు విడుదల చేయాలని మిల్లర్లు కోరుతున్నారు. ఆకివీడు : రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లులకు ప్రధాన పరిశ్రమగా ఉంది. పశ్చిమలో గత ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 26.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంను మరాడించగా సుమారు 12.10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చింది. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించిన మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాది కాలంగా ప్రభుత్వం వద్దే ఉంచుకోవడంతో పరిశ్రమ ఒడుదుడుకులు ఎదుర్కోవడంతోపాటు, దాని ప్రభావం అనుబంధ రంగాలు, రైతులపై పడుతోంది. రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీపై ఆర్థిక భారం పడింది. ఏడాది కాలంగా మిల్లర్లు ధాన్యాన్ని మరాడించినందుకు అయ్యే విద్యుత్ చార్జీలు, పెరిగిన కార్మికుల జీతాలు, పరిశ్రమలోని ఇతర ఉద్యోగుల జీతాలు, పీఎఫ్, ఇతరత్రా ఖర్చులు భరాయిస్తూ ప్రభుత్వానికి సీఎమ్మార్ బియ్యం చెల్లిస్తున్నారు. జిల్లాలో రైస్ మిల్లులు : 375 మిల్లర్లకు ప్రభుత్వ బకాయి : రూ. 152 కోట్లు గత ఖరీఫ్, రబీలో దిగుబడి : 26.70 లక్షల మె.ట సీఎమ్మార్ బియ్యం : 12.10 లక్షల మె.ట. క్వింటాలుకు ఇస్తున్నది రూ.12.50 మాత్రమే క్వింటాలు ధాన్యం మరాడించేందుకు ప్రభుత్వం రూ.15 మజూరు చార్జి ప్రకటించగా, బిల్లు చెల్లించే సరికి రూ. 12.50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారని, మిగిలిన రూ.2.50 పైసలు ధాన్యం కిరాయిల కింద మినహాయించడం సరైన పద్ధతి కాదంటున్నారు. క్వింటాలు ధాన్యం మరాడించేందుకు విద్యుత్ చార్జి రూ.30 వ్యయమవుతోందని మిల్లర్లు వాపోతున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ము విద్యుత్ చార్జీలకు సరిపోవడంలేదని, ఇతరత్రా ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 అవుతున్నప్పటికీ, అసలు చెల్లించాల్సిన చార్జీలు చెల్లించకపోవడంతో మిల్లులు ఎలా నడపాలని మిల్లర్లు వాపోతున్నారు. తేమ శాతంలో కూడా దగా జరుగుతోందని ప్రభుత్వం ధాన్యంలో తేమ 17 ఉండాల్సి ఉండగా అంతకు మించిన తేమతో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. 3 శాతం తేమ ఉండగా ఒక శాతం తరుగు మాత్రమే చెల్లించడం దారుణమంటున్నారు. నెలల తరబడి మిల్లుల వద్దే నిల్వలు ధాన్యాన్ని ఆరబెట్టి, నెట్లు కట్టి, నిల్వ ఉంచి మరాడించగా వచ్చే బియ్యాన్ని 15 రోజుల్లో ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. అయితే నెలల తరబడి బియ్యం మిల్లర్ల వద్దే నిల్వ ఉంటున్నాయి. గోదాములు ఖాళీ లేకపోవడంతో మిల్లుల వద్దే నిల్వ ఉంచడం వల్ల కూలీలకు అదనంగా రెండు, మూడు పర్యాయాలు కూలి చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ధాన్యం, బియ్యం ఎగుమతులు, దిగుమతులు, రవాణా చార్జీలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా నేటికీ చెల్లించలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ వచ్చే ఖరీఫ్ సీజన్లో మిల్లింగ్ వ్యవస్థ ఏవిధంగా పని చేస్తుందోనని, ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, బిల్లులు ఏవిధంగా వస్తాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైస్మిల్లర్ల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నిధులు లేవని కరాఖండీగా చెప్పడంతో మిల్లర్లు అయోమయంలో పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ విధానం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్ల వద్ద మరాడించి, బియ్యాన్ని తిరిగి తీసుకోవడాన్ని కస్టమ్ రైస్ మిల్లింగ్ (సీఎమ్మార్) విధానంగా ప్రభుత్వం నామకరణం చేసింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కస్టమ్ మిల్లింగ్ విధానం కొనసాగుతోంది. భారత ఆహార సంస్థ ద్వారా గతంలో బియ్యం సేకరించి రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయ్ ద్వారా రేషన్ షాపులకు సరఫరా చేస్తుండేది. రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి 70 శాతం ఎఫ్సీఐకి, 30 శాతం ప్రైవేటు మార్కెట్లో అమ్ముకునే విధంగా కేంద్రం అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లర్లకు మరాడించే పద్ధతిని అమలులోకి తీసుకువచ్చింది. కస్టమ్ చార్జీలు కస్టమ్ రైస్మిల్లింగ్ విధానంలో ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం మరాడించేందుకు, ఆరుదలలో తరుగు ధాన్యానికి, తేమ శాతంకు, ధాన్యం, బియ్యం నిల్వ ఉంచినందుకు, వాటì ని ఎగుమతి, దిగుమతి చేసినందుకు చార్జీలు చెల్లిస్తుంది. ఆయా చార్జీల నిమిత్తం గత ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలోని మిల్లర్లకు రూ.152 కోట్ల మేర బకాయి పడింది. పౌర సరఫరాకు వినియోగం కస్టమ్ రైస్ మిల్లింగ్ ద్వారా వచ్చే బియ్యాన్ని జిల్లాలోని 12,26,123 మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 18,484.610 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఆయా ఎఫ్సీఐ, స్టేట్ వేర్ హౌసింగ్స్, ప్రైవేటు గోదాములలో బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నారు. జిల్లాలో అధికంగా పండిన బియ్యాన్ని ఇతర జిల్లాలకు సరఫరా చేయకపోవడంతో ఆయా గోదాముల్లో ఖాళీలు ఏర్పడటంలేదు. దీంతో మిల్లర్లకు గోదాముల సమస్య ఏర్పడింది. ఆర్థిక ఇబ్బంది నష్టమే జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయి సకాలంలో చెల్లించకపోవడం మిల్లర్లకు తీవ్ర నష్టమే. కస్టమ్ విధానం మంచిదే అయినప్పటికీ బిల్లుల బకాయిలతో మిల్లర్లు, రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోదాముల సౌకర్యం కల్పించి, ఖరీఫ్ సీజన్కు ముందే గత బకాయిలు చెల్లించాలి. – గొంట్లా సత్యనారాయణ, కార్యదర్శి, రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆకివీడు బకాయిల చెల్లింపునకు తీవ్ర ప్రయత్నాలు రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రికార్డులు ప్రభుత్వానికి నివేదించాము. మిల్లర్లు గత ఖరీఫ్కు 2వేల మెట్రిక్ టన్నులు, రబీలో 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిలున్నాయి. – పొదిలి వెంకట కొండయ్య, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయీస్ -
తప్పు మీద తప్పు..!
సాక్షి, గుంటూరు: చీకట్లో నల్లపిల్లిని వెతుకుతున్నారన్న హైకోర్టు వ్యాఖ్యలను మైనింగ్ అధికారులు నిజం చేస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి నోటీసులు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిన అక్రమ మైనింగ్పై రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలతో చేయిస్తున్న విచారణ తీరే ఇందుకు నిదర్శనం. హైకోర్టు మొట్టికాయలు మొట్టడంతో తామేదో పొడిచేస్తాం.. అక్రమాలను నిగ్గుతేలుస్తాం అన్నట్టుగా ఫోజు పెట్టి విచారణ మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తీరు హాస్యాస్పదంగా మారింది. ఉండటానికి సరైన నివాసం కూడా లేని వాళ్లు వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించి రూ.కోట్లు సంపాదించారని, అలాగే 1998లో మరణించిన వ్యక్తి 2013లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డాడంటూ నోటీసులిచ్చి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విచారణ పేరుతో మైనింగ్ అధికారులు ఇంకో అడుగు ముందుకేసి స్వామిభక్తి చాటుకోవడంలో భాగంగా పత్తి, బియ్యం, మైదాపిండి మిల్లుల వారికి కూడా తెల్లరాయి అక్రమ తవ్వకాలతో సంబంధం ఉందని నోటీసులిచ్చి, మిల్లులను మూతవేయించారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టుకు ఈ జాబితాను కూడా నివేదించడం గమనార్హం. తమ ఎమ్మెల్యేను కాపాడేందుకే... గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, ఇతర అధికార పార్టీ పెద్దలను తప్పించే యత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణను సీబీసీఐడీకి అప్పగించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చేస్తున్న విచారణ తీరు ఈ ఆరోపణలను బలపరుస్తోంది. అక్రమ మైనింగ్లో కీలక పాత్ర పోషించిన వారిని వదిలేసి సంబంధంలేని ముగ్గురాయి మిల్లుల యజమానులను, అమాయక కూలీలు, టిప్పర్, ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లకు సైతం నోటీసులు జారీచేస్తున్నారు. పైగా వారిని పోలీసు స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారు. రైస్మిల్లులు, కాటన్ మిల్లులకు అక్రమ మైనింగ్కు సంబంధం ఏంటనేది మైనింగ్ అధికారులు, సీబీసీఐడీ అధికారులకే తెలియాలి. మైనింగ్ మాఫియా నుంచి తెల్లరాయి కొనుగోలు చేసి ముగ్గు, చిప్స్ తయారు చేసే మిల్లులకు నోటీసులు ఇస్తే పర్వాలేదు. నిజంగా ముగ్గు, పల్వరైజింగ్ మిల్లులు నడుస్తున్నప్పటికీ ఆ పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆ బిల్డింగ్లో రైస్ మిల్లు, కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, ఇతర పరిశ్రమలు నడిచాయనే అవగాహన కూడా లేకుండా ఆ పేర్లతో నోటీసులు జారీ చేశారు. తాము తప్పించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేత ఏస్థాయిలో తన పరపతిని ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు. నోటీసులు ఇచ్చాం విద్యుత్ శాఖ అధికారుల నుంచి సేకరించిన మీటర్ల ఆధారంగా మిల్లులకు నోటీసులిచ్చాం. గతంలో కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, రైస్మిల్లులు ఇలా ఏ పరిశ్రమ పేరుతో అయితే కరెంటు మీటరు తీసుకున్నారో ఆ పేరుతో నోటీసులిచ్చాం. ఆపేరుతో అక్కడ పరిశ్రమ నడవకపోతే యజమానులు మాకు తెలియజేయాలి. వెంటనే మా అధికారులను పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత వారు చెప్పినట్లు మైనింగ్కు సంబంధం లేని పరిశ్రమ అయితే నోటీసులు వెనక్కు తీసుకుంటాం. – విష్ణువర్ధన్, మైనింగ్ ఏజీ -
కావలిలో విజిలెన్స్ దాడులు
కావలిరూరల్: కావలిలో మంగళవారం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్.శ్రీకంఠనాథ్రెడ్డి పర్యవేక్షణలో విజిలెన్స్ డీఎస్పీ పి.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలో మొత్తం మూడు టీములుగా పట్టణంలోని రెండు పండ్ల దుకాణాలు, రుద్రకోటలోని రైస్ మిల్లుపై దాడిచేశారు. కాగా మండలంలోని రుద్రకోటలో ఉన్న శ్రీబాలాజి రైస్మిల్లుపై మంగళవారం తెల్లవారుజామున విజిలెన్స్ డీఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అనధికారికంగా ఉన్న 3,500 ఖాళీ బియ్యం బస్తాలను, రేషన్ షాపుల నుంచి సేకరించినట్లు భావిస్తున్న 100 బియ్యం బస్తాలను గుర్తించారు. అలాగే కృష్ణపట్నం పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా తనిఖీల విషయమై మిల్లు యజమాని నారపరెడ్డి నుంచి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దాడుల సమాచారం తెలుసుకుని పరారైనట్లుగా భావిస్తున్నారు. మామిడి పండ్ల దుకాణాలపై పట్టణంలోని మేదరవీధిలో ఉన్న అడుసుమల్లి జయరామయ్య పండ్ల దుకాణం, ఐదులాంతర్ల సెంటర్లో ఉన్న పసుపులేటి హరిప్రసాద్ పండ్ల దుకాణాలపై మంగళవారం ఉదయం విజిలెన్స్ డీఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు ఉపయోగించే ఇథిలిన్ రిఫైనర్, క్రిపాన్, గ్రీన్ థ్రిల్ రసాయనాలను గుర్తించారు. వాటిని సీజ్ చేసి, మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐలు ఆంజనేయరెడ్డి, పి.వీరనారాయణ, విజిలెన్స్ సీఎస్డీటీ పద్మజ, డీసీటీఓ విష్ణు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎస్.రామచందర్, కె.సతీష్కుమార్, కావలి తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ ఎస్.విష్ణుకిరణ్, వీఆర్వోలు బాలకోటయ్య, రహంతుల్లా, నాగభూషణం పాల్గొన్నారు. -
పెద్దాపురంలో రైస్ మిల్లుపై..
తూర్పుగోదావరి, పెద్దాపురం: విజిలెన్స్ ఎస్పీ గంగాధర్ ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్ అధికారులు పెద్దాపురం పట్టణంలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి, సీఐ బి.సాయిరమేష్ తహసీల్దార్ గోపాలరావులకు అందిన సమాచారం మేరకు స్థానిక నాగంపేట సమీపంలోని సూర్య రైసుమిల్లులో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుమారు 450 కేజీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. దీంతో మిల్లులో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువ గల బియ్యం, ధాన్యంతో పాటు అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సాయి రమేష్ తెలిపారు. మిల్లు అధినేత బి ప్రసాద్పై ఆహార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు తరలించనున్నట్టు ఆయన వెల్లడించారు. -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలోని రెండు రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 10, 630 క్వింటాళ్ల ధాన్యంను సీజ్ చేశారు. ఒకే అనుమతితోనే రెండు రైస్ మిల్లులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. రైతుల నుంచి భారీ మొత్తంలో ధాన్యం సేకరించి ఎఫ్సీఐకి(ప్రభుత్వానికి) తరలించకుండా అమ్ముకున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. -
రైస్మిల్లుపై విజిలెన్స్ దాడులు..
► భారీగా ధాన్యం పట్టివేత ఖమ్మం జిల్లా : జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన వేలాది బస్తాల ధాన్యం, బియ్యంను సీజ్ చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో ప్రసాద్ మోడ్రన్ రైస్ మిల్ పై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. సుమారు 6 వేల బస్తాల ధాన్యం, 278 క్వింటాల బియ్యం, 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మిల్లింగ్ ఆపేసి మిల్లుకు మూతవేశారు. -
సీఎంఆర్ ఇవ్వని వారిపై కఠిన చర్యలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా చేయని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలు లో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్ సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడుతున్న రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీలోపు వంద శాతం సీఎంఆర్ సరఫరా చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించా. డీఎస్ఓ టి. ధర్మారెడ్డి, డీఎం కొండయ్య, ఏఎస్ఓలు, సీఎస్డీటీలు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. వినతులు సత్వరమే పరిష్కరించండి : జేసీ ప్రజలు సమస్యలపై అందజేసిన వినతులను సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్కు వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన వాటిని మీ–కోసం ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సమావేశంలో జేసీ–2 రాజ్కుమార్, డీఆర్వో మార్కండేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ 14 ఫిర్యాదులు కలెక్టరేట్లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్కు 14 మంది ఫోన్ చేసి ఫిర్యాదులు చేశారు. జేసీ ఇంతియాజ్ డయల్ యువర్ కలెక్టర్కు ఫోన్ చేసిన వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
రూ.115 కోట్లు నొక్కేశారు !
గన్నీల పేరిట రైస్ మిల్లర్ల చిలక్కొట్టుడు 2009 నుంచి పౌరసరఫరాల శాఖకు 2.84 కోట్ల గన్నీ బ్యాగుల బాకీ మిల్లర్లకు తొత్తులుగా మారిన పౌరసరఫరాల శాఖ అధికారులు ముక్కుపిండి వసూలు చేయాలని కమిషనర్ నిర్ణయం రేపు హైదరాబాద్లో డీఎం, డీఎస్వోలతో సీవీ ఆనంద్ సమీక్ష సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) అందించకుండా ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టిన రైస్ మిల్లర్లు గన్నీ సంచుల విషయంలోనూ కక్కుర్తి ప్రదర్శిస్తున్నారు. గన్నీ బ్యాగే కదా!...అదేం భాగ్యం అనుకుంటున్నారా?....ఒకటి, రెండు బ్యాగులు కాదు సుమా...ఏకంగా 2.84 కోట్లకుపైగా గన్నీ బ్యాగులను మిల్లర్లు నొక్కేశారు. వీటి ఖరీదెంతో తెలుసా....రూ.115 కోట్లు. అక్షరాల నూటా పదిహేను కోట్ల రూపాయలు. 2009 నుంచి నేటి వరకు దాదాపు ఏడేళ్లుగా పౌరసరఫరాల సంస్థకు గన్నీలను అప్పగించకుండా తమ జేబులో వేసుకుంటున్నారు. ప్రతి ఏటా సీజన్ అయిపోయిన వెంటనే గన్నీ బ్యాగులను స్వాధీనపర్చుకోవాల్సిన పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆ విషయాన్నే మర్చిపోయారు. మిల్లర్లకు తొత్తులుగా మారారు. వాళ్లిచ్చే అమ్యామ్యాలకు కక్కుర్తి పడ్డారు. అంతిమంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చే పనికి ఒడిగట్టారు. అడుగడుగునా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్న ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టికి గన్నీల వ్యవహారం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు ఎన్నీ గన్నీ సంచులు బకాయి పడ్డారు? వాటి విలువ ఎంత? అని లెక్కలేసే పనిలో పడ్డారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం...రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.45 కోట్ల గన్నీ సంచులు మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు బకాయిపడ్డట్లు తేలింది. వాటి విలువ ఏకంగా రూ.203 కోట్లుగా నిర్దారించారు. అందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.115.99 కోట్లు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి సీజన్లో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించిన అనంతరం వాటిని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఖరీఫ్, రబీసహా ప్రతి సీజన్లో మిల్లర్లు అడిగనన్ని గన్నీ బ్యాగులను అందిస్తున్నారు. వాస్తవానికి ఏ మిల్లర్కు ఎంత ధాన్యం అప్పగిస్తామో...అందుకు అవసరమైన గన్నీ బ్యాగులను మాత్రమే సరఫరా చేయాలి. అందులో సగం కొత్తవి, సగం పాతవి అందజేయాలి. కానీ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు మిల్లర్లంటే వల్లమాలిన ప్రేమ. మిల్లర్లు ఎన్ని గన్నీ బ్యాగులు అడిగితే అన్ని ఇచ్చేస్తున్నారు. పైగా ఇష్టమైన మిల్లర్లు కదా! అని దాదాపు ప్రతి ఏటా ఎక్కువ శాతం కొత్త గన్నీ బ్యాగులే సరఫరా చేస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మిల్లర్లకు 2,84,78,892 గన్నీ బ్యాగులను సరఫరా చేసినట్లు లెక్క తేలింది. వీటిలో 1,52,79,139 గన్నీ బ్యాగులు కొత్తవే. ఒక్కో కొత్త గన్నీ బ్యాగు ధర రూ.50 లు. ఈ లెక్కన వీటి ఖరీదు రూ.76.40 కోట్లు. ఇవిపోగా మిగిలిన 1,31,99,753 గన్నీ బ్యాగులు ఒకసారి వాడినవి. వీటికి సంబంధించి ఒక్కో బ్యాగు ఖరీదు రూ.30లుగా లెక్కకట్టిన అధికారులు రూ.39.60 కోట్లుగా నిర్దారించారు. పాత, కొత్త గన్నీ బ్యాగుల ఖరీదు రూ.115.99 కోట్లుగా లెక్కించారు. ఇంత పెద్ద మొత్తంలో గన్నీ బ్యాగులు బకాయి పడినా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్ధకంగా మారింది. రైస్ మిల్లర్లంతా అంటకాగుతూ వారిచ్చే అమ్యామ్యాలకు ఆశపడి సంస్థకు రావాల్సిన బకాయిలను వసూలు చేయకుండా మిన్నుకుండిపోయారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పౌరసరఫరాల సంస్థ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం హైదరాబాద్లో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు, డీఎస్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. గన్నీ బ్యాగుల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతోపాటు ఆ మొత్తాన్ని ఏ విధంగా వసూలు చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. ముగిసిన సీఎమ్మార్ గడువు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లర్లకు ఇచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) గడువు ముగిసింది. జిల్లాలోని మిల్లర్లకు 2015–16 సంవత్సరానికి గాను 604679 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంస్థ అప్పగించింది. వాటిని మరగా ఆడించి 407297 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(67 శాతం) సంస్థకు అందించాల్సి ఉంది. అయితే సీఎవ్మూర్ అప్పగించేందుకు నెలల తరబడి మొండికేసిన మిల్లర్లు సీవీ ఆనంద్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాక కొరడా ఝుళిపించారు. దీంతో ఇప్పటి వరకు 405350 మెట్రిక్ టన్నుల (99.52 శాతం) బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అప్పగించారు. ఇంకా 1947 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. మిల్లర్లకు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్నందున కమిషనర్ సకాలంలో సీఎమ్మార్ అప్పగించిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
రైసుమిల్లుపై విజిలెన్స్ దాడులు
62 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం వనంతోపు (పొదలకూరు) : మండలంలోని వనంతోపు సెంటర్లో ఉన్న శ్రీవెంకటేశ్వర రైసుమిల్లుపై శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 62 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్రెడ్డి పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. శుక్రవారం పొదలకూరుకు సమీపంలో 14 బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న ఆటోను పట్టుకున్నట్టు తెలిపారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు వనంతోపు రైసుమిల్లుపై నిఘా పెట్టామన్నారు. ఈ రైసుమిల్లులో 2014లో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు గుర్తు చేశారు. ఆటోలో తరలిస్తున్న 14 బస్తాల బియ్యం కూడా వెంకటేశ్వర రైసుమిల్లుకేనని డ్రైవర్ తన వాగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిపారు. మొత్తం 40 క్వింటాళ్ల బియ్యం రూ.92 వేలు విలువైనవిగా పేర్కొన్నారు. 6ఏ కేసును నమోదు చేయనున్నట్టు చెప్పారు. పొదలకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణామర్చంట్స్, రేషన్ షాపుల నుంచి రైసుమిల్లు యజమాని బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టించి సీఎంఆర్ బియ్యంలో కలిపి ప్రభుత్వ గోదాములకు పంపుతున్నట్టు వెల్లడించారు. వెంకటేశ్వర రైసుమిల్లుకు సీఎంఆర్ ధాన్యం సేకరించేందుకు ఈ ఏడాది అనుమతులు ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం పొదలకూరు కిరాణా మర్చంట్స్లో 250 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. రేషన్కార్డుహోల్డర్లు బియ్యంను అమ్మితే కార్డులను రద్దు చేస్తామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై అళహరి వెంకటేశ్వర్లు, ఏఓ ధనుంజయరెడ్డి, పొదలకూరు సీఎస్డీటీ గిరి, సిబ్బంది పాల్గొన్నారు. -
రైస్ మిల్లులపై డీఎస్ఓ దాడులు
కావలి: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఇవ్వకుండా బయట మార్కెట్లో అక్రమంగా అమ్ముకుంటున్నారన్న సమాచారంతో బుధవారం రెండు రైస్మిల్లులపై డీఎస్ఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. మద్దూరుపాడు పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీమారుతి మోడరన్ రైస్ ఇండస్ట్రీస్, మండలంలోని కొత్తసత్రంలో ఉన్న మరో రైస్మిల్లులో డీఎస్ఓ బృందం తనిఖీలు చేపట్టింది. 5 నెలలుగా ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి రైతులకు చెందిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే మిల్లర్లు అక్రమంగా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం. ఇందులోని ఒక మిల్లరు గత సీజన్లోని ఇలాంటి అక్రమాలకు పాల్పడటంతో ఆ మిల్లు సేల్స్ ట్యాక్స్, ఆర్సీ, ట్రేడర్స్ను అధికారులు బ్యాంకులో ఉంచినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్కు అదే ప్రాంగణంలో మరో పేరుతో ఆర్సీ అధికారులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త ట్రేడర్స్ పేరుతో ఉన్న ఆర్సీని అడ్డం పెట్టుకుని రైతుల నుంచి స్వీకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ద్వారా మిల్లులకు తెప్పించుకుని బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు డీఎస్ఓకు సమాచారం అందడంతో ఆయన ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. మిల్లు ప్రాంగణంలో ఉన్న ధాన్యపు నట్టులను టెక్నికల్ సిబ్బంది ద్వారా కొలతలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కొలతలు గురువారం కూడా జరుగుతాయని తర్వాత∙పూర్తి వివరాలు తెలియజేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. డీఎస్ఓతో పాటు ఏఎస్ఓలు లక్ష్మీనారాయణ రెడ్డి, పుల్లయ్య, డీటీలు సురేంద్ర, హరినాథ్, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
కోవూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని రైస్ మిల్లులపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రైస్ మిల్లుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు. -
రైస్ మిల్లులు దాటని రేషన్ బియ్యం
ఈ నెల 20 వరకు గడువు విధించిన పౌరసరఫరాల శాఖ సాక్షి, హైదరాబాద్: రేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యం రైస్ మిల్లుల్లోనే ముక్కిపోతోంది. పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి రెండు, మూడు నెలల్లో ప్రభుత్వానికి అందించాలి. కానీ, 2013-14 ఏడాదికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటి వరకు అందజేయలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో 46 రైస్ మిల్లులపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ప్రతి సీజన్లో పౌర సరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ కింద మిల్లర్లకు అందజేస్తుంది. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. 100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చిబియ్యం (రారైస్) అయితే 67 క్వింటాళ్లు, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) అయితే 68 క్వింటాళ్లు మిల్లర్లు ఇవ్వాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చినందుకు గానూ ప్రభుత్వం పచ్చి బియ్యానికి క్వింటాల్కు రూ.15, ఉప్పుడు బియ్యానికి రూ.25 చెల్లిస్తుంది. కస్టమ్ మిల్లింగ్ ద్వారా వచ్చిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తుంది. మిల్లర్లు సకాలంలో బియ్యం అందజేయకపోయినా... పీడీఎస్ అవసరాలకు బియ్యం సరిపోకపోయినా ప్రభుత్వం పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. 2014-15 సంవత్సరంలో సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్పై కసరత్తు చేస్తున్న పౌరసరఫరాల శాఖ 2013-14 ఏడాది సంబంధించిన కస్టమ్ మిల్లింగ్పై దృష్టి సారించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం సేకరించి ఇచ్చిన ధాన్యంలో 46 మంది మిల్లర్లు ఇంకా 16,270 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయలేదని గుర్తించింది. వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పౌరసరఫరాల శాఖ ఫిబ్రవరి 20 నాటికి బియ్యం అప్పజెప్పని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక 2014-15 ఏడాదిలో సేకరించి మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి సైతం ఈ నెల చివరి నాటికి కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేయాలని గడువు విధించింది. -
ముగిసిన తనిఖీలు
విజయనగరం కంటోన్మెంట్ :జిల్లాలోని రైస్ మిల్లులపై అధికారులు రెండు రోజులకే దాడులను ముగించారు. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన జిల్లాలో ఒకే రోజున నాలుగైదు మిల్లులను తనిఖీ చేశారు. అనంతరం 21న బలిజిపేటలో ఒక మిల్లును తనిఖీ చేశారు. దీంతో తనిఖీలకు ఫుల్స్టాప్ పెట్టినట్టే. అటు విజిలెన్స్ కాని, ఇటు పౌర సరఫరాల శాఖ కాని చేపట్టిన తనిఖీల్లో మిల్లుల పొరపాట్లు ఏమీలేవని తేల్చేశారు. దీంతో అధికారులు కూడా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇక విజిలెన్స్ అధికారులు మాత్రం దాడులు నిర్వహించాక నివేదికను కూడా పౌర సరఫరాల శాఖకు ఇవ్వలేదు. దీంతో వారి తరఫున కూడా ఎటువంటి చర్యలూ లేవని చెబుతున్నారు. ఈ తనిఖీల ద్వారా అక్రమా లు వెలుగులోకి వస్తాయనుకుంటే.. సాదాసీదాగా ఉండడంతో మిల్లర్లు ఖుషీగా ఉన్నారు. అసలు దీనంతటికీ కారణం ప్రభుత్వ పెద్దల ఆదేశాలేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు ప్రభుత్వ పరమైన కొన్ని కార్యక్రమాలకు సహకరిస్తున్నందున వారికి సహాయంగా ఈ తనిఖీలను మమ అనిపించాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు సమాచారం. వినియోగించని బియ్యం ఏమవుతున్నట్టు..? జిల్లాలో వినియోగించ ని రేషన్ బియ్యం ఏమవుతున్నట్టో అధికారులకే చెప్పాలి. వాస్తవానికి జిల్లాలో చాలామంది కార్డుదారు లు ఈ బియ్యాన్ని వినియోగించడం లేదు. బియ్యాన్ని గ్రామం నుంచి మండలంతో పాటు డివిజన్ స్థాయిలో చాలా మంది వ్యా పారులు ఓ ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. కానీ మిల్లర్లు మాత్రం తమ కు ఎటువంటి రేషన్ బియ్యం రావని, వచ్చినా తామే అధికారులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం తరలించండి జిల్లాలోని 118 రైస్ మిల్లుల్లో వాటి సామర్థ్యం కంటే ఎక్కువగా ధాన్యం వేయించుకుని చోద్యం చూస్తున్న మిల్లుల నుంచి సామర్థ్యం ఎక్కువ ఉన్న మిల్లులకు తరలించాలని జేసీ బి. రామారావు.. డీఎస్ఓ కె. నిర్మలాబాయిని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి ఆధిపత్యం ఉన్నవారి మిల్లులకే ధాన్యం చేరాయి. ఈ మిల్లుల్లో ధాన్యం గుట్టలుగా పేరుకుపో యినా నిబంధనల మేరకు 67 శాతం బియ్యాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వడం లేదు. దీంతో ఇటువంటి మిల్లులను గుర్తించారు. దాదాపు 15 మిల్లుల యజమానులు తమ సామర్థ్యానికి మించి ధాన్యం నిల్వలను ఉంచుకున్నారు. ఇటువంటి వారితో పాటు సామర్థ్యం ఉన్నా.. కొన్ని మిల్లుల్లో గింజ ధాన్యం లేకపోవడాన్ని అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. వీటిని మాత్రం సరి చేస్తున్నట్టు గురువారం నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించిన నోట్ తయారు చేస్తున్నారు. -
రైస్ మిల్లులు అమ్మబడును
ఒకప్పుడు జిల్లా నుంచి నూకలు ఎగుమతి చేసినా పొరుగు రాష్ట్రాల్లో విపరీతమైన గిరాకీ ఉండేది. దొడ్డు రకం వడ్లకైతే చెప్పనక్కర్లేదు. మిల్లింగ్ అయిన వెంటనే ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు సీన్ మారింది. నూకలు కాదు కదా... దొడ్డు బియ్యం పంపినా అక్కడ కొనేవారే కరువయ్యారు. ధైర్యం చేసి దొడ్డు వడ్లు కొందామన్నా అవి కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఉప్పుడు బియ్యం పరిస్థితి మరీ హీనం. వాటిని తీసుకునే నాథుడే లేడు. నాడు ధాన్యాగారాలుగా విలసిల్లిన కరీంనగర్ జిల్లాలోని రైస్ మిల్లులు నేడు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 50 మిల్లులు అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. -పెద్దపల్లి/సుల్తానాబాద్ పెద్దపల్లి/సుల్తానాబాద్: తెలంగాణలో రైస్ మిల్లులు అత్యధికం గా కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ 800 పైగా రైస్మిల్లులుండగా వీటిలో 430 పారాబాయిల్డ్ రైస్మిల్లులే. కేరళ, పశ్చిమబెంగాల్, గు జరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గతంలో భారీ రైస్మిల్లుల వ్య వస్థ లేదు. దీంతో బియ్యం కోసం ఆయా రా ష్ట్రాలు రైస్ మిల్లులు అధికంగా ఉన్న కరీంనగ ర్, నల్గొండ జిల్లాలపై ఆధారపడేవి. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి మారింది. మొన్నటి వరకు 50 రైస్ మిల్లులు కూడా కేరళలో నేడు 150 మిల్లులు వెలిశాయి. మొన్నటి వరకు జిల్లా లో అధికంగా ఉత్పత్తి అయ్యే దొడ్డు రకం బి య్యానికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో డిమాండ్ ఉండేది. ఆయా రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లో నివసించేవారు అత్యధికంగా ఈ బియ్యాన్ని కొనుగోలు చేసేవారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు వరిసాగు మొదలుకావడంతో ఇక్కడ డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. మరోవైపు అక్కడక్కడ ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దొడ్డు బియ్యాన్ని ఉత్పత్తి చేద్దామని భావించినా ఆ రకం వడ్లు లభించడమే గగనంగా మారింది. పోటీ తీవ్రం రైస్మిల్లుల యజమానుల్లో పోటీ తీవ్రతరమైం ది. గ్రూపులు, రాజకీయాలు ఎక్కువయ్యాయి. అధికారుల దాడులూ పెరిగాయి. అధిక లాభాలొస్తాయనే భావనతో కోట్లు అప్పుతెచ్చి కొత్తగా రైస్ మిల్లులు స్థాపించిన వారు పోటీ తట్టుకోలేకపోతున్నారు. అనుభవరాహిత్యం వల్ల నష్టాలబాటలో పయనిస్తున్నాయి. దీనికితోడు నెలవారీగా మిల్లుకు వస్తున్న విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఒక్కో మిల్లుకు సగటున ప్రతినెలా రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. తడిసిమోపెడవుతున్న నిర్వహణ ఒక్కో రైస్మిల్లు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల పేరిట సగటున ప్రతినెలా రూ.3-5 లక్షలు భరించాల్సి ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, తప్పనిసరిగా జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి రావడంతో రైస్ మిల్లుల యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మారిన లెవీ విధానం కూడా మిల్లర్లకు శరాఘాతమైంది. 25 శాతం లెవీని మాత్రమే తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన ధాన్యం అమ్మకం తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం చెల్లించే మిల్లింగ్ చార్జీలు కూడా 1984 నాటి టారిఫ్ను అమలు చేస్తుండటంతో మిల్లర్లకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేద ని తెలుస్తోంది. తెలంగాణ టు ఛత్తీస్గఢ్ .ఇక్కడ రైస్మిల్లుల నిర్వహణ తలకుమించిన భారం కావడంతో మిల్లర్లు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితి కొంత ఆశాజనంగా ఉండటంతో అటువైవు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సుమారు 50 మంది మిల్లర్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అక్కడ వ్యాపారం చేయడం వల్ల ఏ మేరకు లాభం ఉంటుందనే అంశంపై సర్వే నిర్వహించి వచ్చారు. తెలంగాణతో పోలిస్తే అక్కడే లాభాలు అధికంగా వచ్చే అవకాశాలున్నాయనే భావనకు వచ్చిన వారు అటువైపు వెళ్తున్నారు. లక్కీ లాటరీ అటు పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక, ఇటు ఇక్కడే ఉండి వ్యాపారాన్ని కొనసాగించలేని యజమానులు రైస్మిల్లులను అమ్మకానికి పెట్టారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లోనే ఏకంగా 50 వరకు రైస్మిల్లులు అమ్మకానికి బేరం పెట్టారు. బయటవారు ఆయా మిల్లులను కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో తమ భాగస్వాముల్లోనే ఒకరు తీసుకుంటేనే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఎవరు తీసుకోవాలనే దానిపైనే భిన్నస్వరాలు వ్యక్తం కావడంతో లాభం లేదనుకున్న భాగస్వాములు లాటరీ వేసుకుంటున్నారు. చిట్టీలపై పేర్లు రాసి ఒక బాక్స్లో వేసి అందులో ఒక చిట్టీని తీస్తున్నారు. ఆ చిట్టీపై ఎవరి పేరు ఉంటే వారే రైస్ మిల్లును స్వాధీనం చేసుకోవాలి. మిగిలిన భాగస్వాములకు డబ్బులు చెల్లించాలి. దీంతో లాటరీలో పేరొచ్చిన వారి ముఖాల్లో వెలుగు లేకుండా పోతోంది. సంక్షోభంలో ఉన్న రెస్ మిల్లును ఎలా బయటపడేయాలో, మిగిలిన భాగస్వాములకు డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొంపముంచుతున్న కరెంట్ బిల్లులు రైస్మిల్లు నుంచి బియ్యం గింజ తీయకపోయినా నెలకు రూ.83 వేలు మినిమమ్ చార్జీ కింద చెల్లించాలి. ఏడాదిలో నాలుగు నెలలే మిల్లులు నడుస్తాయి. మిగిలిన ఎనిమిది నెలలు కూలీల వేతనంతోపాటు కరెంట్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఇలా రూ.25 లక్షల అదనపు భారం రావడంతో మిల్లులు నష్టాల బారిన పడుతున్నాయి. - ముత్యాల రాజన్న, మిల్లు యజమాని(పెద్దపల్లి) 1984 నాటి మిల్లింగ్ చార్జీలే.. ప్రభుత్వం మిల్లింగ్ చార్జీ కింద క్వింటాల్కు రూ.23 చొప్పున మిల్లర్లకు చెల్లిస్తుంది. 1984లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే ఇప్పటికీ అమలవుతోంది. అప్పటితో పోలిస్తే కరెంట్ చార్జీలు, నిర్వహణ వ్యయం పది రెట్లు పెరిగాయి. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినప్పటికీ మిల్లింగ్ చార్జీలు పెంచకుండా అన్యాయం చేస్తోంది. గుజరాత్లో క్వింటాల్కు రూ.60 చెల్లిస్తున్నారు. కనీసం ఆ మేరకైనా ఇక్కడ చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో రాబోయే కాలంలో మిల్లు యజమానుల ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదమూ లేకపోలేదు. - మొగుళ్లపల్లి కష్ణమూర్తి, మిల్లు యజమాని(పెద్దపల్లి) కేంద్రమే ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వమే రైస్మిల్లర్లను ఆదుకోవాలి. పరిశ్రమలకు రాయితీ ప్రకటించాలి. సివిల్ సప్లై అధికారులు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇబ్బందులు చేయడంతో మిల్లులు అమ్మకాలకు ఉన్నాయ. కొత్తవారిని ఆదుకోవాలి. - ఎడవెల్లి రాంరెడ్డి, రైస్మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కోళ్ల పరిశ్రమ మాదిరిగా ఆదుకోవాలి కోళ్ల పరిశ్రమ తరహాలోనే రైస్మిల్లులకూ సబ్సిడీనిచ్చి ఆదుకోవాలి. నష్ట నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. నష్టాల్లో ఉన్న మిల్లర్లకు రుణాలు చెల్లించేందుకు తగిన గడువు ఇవ్వాలి. ఇబ్బందులు పెట్టేలా ఉండరాదు. - పల్లా మురళి, రైస్ మిల్లర్స్ సలహాదారుడు, సుల్తానాబాద్ -
సంక్షోభంలో రైస్ మిల్లులు
మెదక్: లెవీ సేకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైస్ మిల్లులు సంక్షోభంలో పడ్డాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్న బియ్యం లెవీని 75 శాతం నుంచి 25శాతానికి తగ్గించడంతో బిన్ని మిల్లులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేం ద్రం కస్టం మిల్లింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టడంతో మిల్లర్లు విలవిలలాడుతున్నారు. దరిమిలా జిల్లాలో ఉన్న 76 బాయిల్డ్ రైస్ మిల్లులు, 200 రా రైస్మిల్లులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద సబ్సిడీ బియ్యాన్ని సరఫరా చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం 75శాతం లెవీని అనుమతించేది. రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన వరిధాన్యంలో 75శాతం బియ్యాన్ని లెవీ కింద ఎఫ్సీఐకి సరఫరా చేసే అవకాశం ఉండేది. మిగతా 25శాతం స్వేచ్ఛా మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. మిల్లర్లు కొనుగోలు చేసిన 100 క్వింటాళ్ల ధాన్యం నుంచి 67క్వింటాళ్ల ధాన్యాన్ని లెక్క గడతారు. ఇందులో లెవీ నిబంధనల ప్రకారం 75శాతం అంటే 50 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వానికి, 17క్వింటాళ్లు అంటే 25శాతం మిల్లర్లకు వెళ్తుండేది. కాని ప్రస్తుతం లేవిని 25శాతానికి తగ్గించడంతో 17క్వింటాళ్లు ప్రభుత్వానికి, 50 క్వింటాళ్లు మిల్లర్లకు వెళ్తుంది. ఎఫ్సీఐ కింద క్వింటాల్ బియ్యానికి సుమారు రూ.2100 చెల్లిస్తుండేవారు. దీంతో ఇది మిల్లర్లకు గిట్టుబాటుగా ఉండేది. 25శాతం లెవీతో మిల్లర్ల లబోదిబో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించి 17శాతం తేమను అనుమతించి ఎఫ్సీఐకి 75శాతం ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ బియ్యాన్ని సరఫరా చేసే వారు. మిగతా 25శాతం బియ్యాన్ని స్వేచ్ఛా మార్కెట్లో అమ్ముకునేవారు. కాని ప్రస్తుతం స్వేచ్ఛా మార్కెట్లో బియ్యం అమ్ముకోవాలంటే సాటెక్స్ మెషిన్లలో మరపట్టిన బియ్యం అవసరం ఉంటుంది. సాటెక్స్ మెషిన్ కొనుగోలు చేయాలంటే ఇందుకు సుమారు రూ.1.25కోట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో మొత్తం 76బాయిల్డ్ రైస్ మిల్లులు, 200 రా రైస్మిల్లులు ఉన్నాయి. గత ఏడాది 50వేల టన్నుల కస్టం మిల్లింగ్ రైస్, 1లక్ష15వేల టన్నుల రా బియ్యం, 1లక్ష10వేల టన్నుల బాయిల్డ్ రైస్ బియ్యం, 30వేల టన్నుల స్వేచ్ఛా విఫణి వియ్యం వెరసి సుమారు 3లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. గిట్టుబాటు కాని ధరలు కస్టం మిల్లింగ్ కింద 1 క్వింటాల్ ధాన్యాన్ని మర ఆడిస్తే ప్రభుత్వం కేవలం రూ.15ల చార్జి చెల్లిస్తుంది. ఇది 22 ఏళ్ల క్రితం నిర్ణయించిన ధర. అప్పట్లో రూ.1.20 పైసలకు యూనిట్ ఉన్న విద్యుత్ ధర నేడు రూ.9.10లకు చేరింది. అలాగే రవాణా ఖర్చులు, మెషినరీ రిపేర్లు, హమాలీల కూలీలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం చార్జీలు మాత్రం పెంచలేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూస్తే క్వింటాల్ ధాన్యానికి రూ.40లు చెల్లిస్తున్నట్లు మిల్లర్లు చెప్పారు. కస్టం మిల్లింగ్ కింద కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.200లు రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఐకేపీలు, సొసైటీల ద్వారా ధాన్యం సేకరణ చేసేందుకు నిర్ణయించింది. అయితే హమాలీ, కమిషన్లు రూ.200ల మేర మిగిలించుకొని మిగతా డబ్బులు తమకు తమకు ఇస్తే కస్టం మిల్లింగ్ చేయడానికి తాము సిద్ధమేనని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. -
ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బు చెల్లించాలి
మెదక్ మున్సిపాలిటీ,న్యూస్లైన్: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పౌర సరఫరాలు, ఐకేపీ, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, తహశీల్దార్లు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే కేంద్రాల్లోని ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించని పాపన్నపేట డిప్యూటీ తహశీల్దార్, సివిల్ సప్లయ్ అధికారికి మెమో జారీ చేయాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల అధికారి రత్నంను ఆదేశించారు. కొనుగోలు కోసం ఎంత ధాన్యం వస్తుంది...ఎన్ని రోజుల్లో కొనుగోలు చేస్తారో అంచనా వేసుకున్నాకే కేంద్రాలను మూసివేయాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాల నమోదులో ఎలాంటి జాప్యం చేయరాదన్నారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 70 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయని, బియ్యంతోపాటు ఇతర సరుకులు కూడా సరైన సమయంలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీకి సిద్ధం చేయాలని ఆయన సూచించారు. డీడీలు సకాలంలో చెల్లించని డీలర్లపై శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత తహశీల్దార్లపై ఉందన్నారు. గతంలో గుర్తించిన ప్రభుత్వ భూముల్లో బోర్డులు పాతడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, ఈ పనిని పది రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ వనజాదేవి, డీఎస్ఓ ఏసురత్నం, పంచాయతీరాజ్ అధికార్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు. -
సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి
గజ్వేల్, న్యూస్లైన్: గజ్వేల్లో బుధవారం జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సొంత నియోజకవర్గమైన గజ్వేల్లోనే కేసీఆర్ తొలి పర్యటనకు సిద్ధమైన వేళ.. అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఈ ఏర్పాట్లను మంత్రి హరీష్రావు.. కలెక్టర్ స్మితాసబర్వాల్, జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీబాజ్పాయ్లతో పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో సమీక్షించారు. అనంతరం పిడిచెడ్ రోడ్డు వైపున అన్నపూర్ట రైసుమిల్లు సమీపంలోని మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని చౌరస్తాను సైతం మంత్రి హరీష్రావు, కలెక్టర్, జేసీ, ఎస్పీలతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ షెడ్యుల్ ఇదే.. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు వర్గల్లోని విద్యాసరస్వతి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. 2.30 గంటలకు ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు చేరుకుని బైక్ ర్యాలీలో పాల్గొంటారు. 2.30 గంటలకు గజ్వేల్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.30 గంటలకు ప్రజ్ఞా గార్డెన్స్లో నియోజకవర్గ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష జరుపుతారు. రాత్రి 7.15గంటలకు జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. -
తెల్లారిన బతుకులు
సుల్తానాబాద్, న్యూస్లైన్ : పొట్ట చేత పట్టుకొని రాష్ట్రం రాష్ర్టం వచ్చిన ముగ్గురు వలస జీవుల బతుకులు తెల్లాయిపోయాయి. పొద్దంతా పనిచేసిన అలసటతో ఆదమరిచి నిద్రపోతున్న వారిని లారీ తొక్కడంతో శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రవిశంకర్ రైస్మిల్లులో శనివారం వేకువజామున జరిగింది. బీహార్ రాష్ట్రం మస్తాపూర్ జిల్లా రోసేరా మండ లం కల్యాణ్పూర్ గ్రామానికి చెందిన పదిహేను మంది కార్మికులు వారం రోజుల క్రితం రైస్మిల్లులో పనిచేసేందుకు ఇక్కడికి వచ్చారు. శుక్రవారం పని ముగిసిన తర్వాత భోజనాలు చేసి మిల్లు ఆవరణలో అందరూ ఒకేచోట వరుసగా పడుకున్నారు. రాత్రి 2.15 గంటల ప్రాంతంలో మేడిపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ నుంచి ఓ లారీ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన డ్రైవర్ మాల విరమణకు వెళ్లగా, క్లీనర్ సాయిలుకు లారీని అప్పగించాడు. అతడు నిద్రిస్తున్న కార్మికులను గమనించకుండా లారీని రివర్స్ తీసుకోగా వెనుక చక్రాల కింద ముగ్గురు నలిగిపోయారు. పొట్ట, ఛాతి భాగం మీదుగా లారీ ఎక్కింది. తీవ్రగాయాలైన సుకేందర్సదా(22) ఆర్తనాదాలు చేయడంతో మిగతా వారికి మెళకువ వచ్చింది. ప్రాణభయంతో అందరూ గట్టిగా అరవడంతో సాయిలు లారీని నిలిపివేసి అక్కడినుంచి పరారయ్యాడు. అప్పటికే దీప్సదా(20), శ్యాంసుందర్ సదా(25) మృతి చెందారు. సుకేందర్సదాను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. అతడు ఆర్తనాదాలు చేయడం వల్లే తమకు మెళకువ వచ్చిందని, లేకుంటే తామంతా ప్రాణాలు కోల్పోయేవారమని ప్రత్యక్ష సాక్షులు రంజిత్సదా, మంజులసదా, శ్యామ్సావ్, అనిల్సదా బోరున విలవిస్తూ చెప్పారు. లారీ క్లీనర్ సాయిలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ముగ్గురు వలస జీవుల ప్రాణాలు గాలిలో కలిశాయని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణారావు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, కార్మిక సంఘ నేతలు రాములుగౌడ్, కృష్ణారెడ్డి సందర్శించి కార్మికులకు సంతాపం తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి కల్వల శ్రీనివాస్ అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై రామకృష్ణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైస్మిల్లు నిర్వాహకులు మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు అంత్యక్రియల కోసం రూ.50వేలు ఇచ్చారు. -
ఈ కొక్కులను పట్టేదెలా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం కలెక్టరేట్, న్యూస్లైన్: నిరుపేదల కడుపు నింపాల్సిన చౌక బియ్యం రాజకీయ రాబంధులకు భోజ్యంగా మారుతున్నాయి. చౌక బియ్యాన్ని కాజేసి రైస్ మిల్లుల్లో మళ్లీ పాలీష్ చేసి.. సన్న బియ్యంగా మార్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆకాశమే హద్దుగా బియ్యం స్మగ్లర్లు చెలరేగిపోతున్నా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా దాడులు చేస్తూ, అరకొర బియ్యాన్ని పట్టుకుని చేతులు దులుపుకుంటున్నారు. స్టేజ్-1 బియ్యం రవాణా (కందుకూరులోని ఎఫ్సీఐ గోదాముల నుంచి 24 స్టాక్ పాయింట్లకు సరఫరా), స్టేజ్-2 రవాణా(24 స్టాక్ పాయింట్ల నుంచి 2,685 చౌక దుకాణాలకు సరఫరా)ను ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో చేజిక్కించుకున్నారు. ఆ క్రమంలోనే అక్రమ రవాణాకు తెరతీశారు. ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులు.. బియ్యం రవాణా కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. ఎఫ్సీఐ గోదాములు, స్టాక్ పాయింట్లలోనే బియ్యాన్ని కాజేస్తూ.. బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11,53,713 కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 1,19,969, తెల్ల కార్డులు 8,55,784, ట్యాప్ కార్డులు 10,759, రచ్చబండ-1, 2 కార్డులు 70,209, రచ్చబండ-3 కార్డులు 96,997 ఉన్నాయి. ఇవి కాకుండా గులాబీ కార్డులు 54,529 ఉన్నాయి. గులాబీ మినహా తక్కిన రేషన్కార్డుల లబ్ధిదారులకు ప్రతి నెలా 2,685 చౌకదుకాణాల ద్వారా 14,745.756 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎఫ్సీఐ గోదాముల నుంచి స్టాక్ పాయింట్లకు బియ్యాన్ని తరలించే క్రమంలోనే క్వింటాలుకు సగటున ఐదు కేజీల బియ్యాన్ని దొంగలిస్తున్నారు. స్టాకు పాయింట్లలోనూ ఇదే కథ. క్వింటాలుకు సగటున నాలుగు కిలోల చొప్పున బొక్కేస్తున్నారు. అంటే.. ఎఫ్సీఐ గోదాములు, స్టాక్ పాయింట్ల నుంచే నెలకు కనిష్టంగా 1179.66 టన్నుల బియ్యాన్ని రవాణా కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారు. డీలర్ల చేతిలో బోగస్ కార్డులు : జిల్లాలో ఇటీవల ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ సర్వేలో 24,431 రేషన్కార్డులు బోగస్వని తేలింది. సర్వే పూర్తయితే మరో 25 వేల బోగస్ కార్డులు తేలుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే.. జిల్లాలో దాదాపు 49 వేల బోగస్ కార్డులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీటిలో అధిక శాతం చౌక దుకాణాల డీలర్ల వద్ద ఉన్నాయి. వీటి ద్వారా కొట్టేస్తున్న 980 టన్నుల బియ్యాన్ని డీలర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. కొంత మంది డీలర్లు పేదలకు ఇచ్చే రేషన్లోనూ కోత పెట్టి పక్కదారి పట్టిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు తెలియకుండానే బియ్యాన్ని స్వాహా చేస్తున్నారు. సాక్షాత్తు మంత్రి శైలజానాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలోని కల్లూరు అగ్రహారంలో ఆంజనేయులు (కార్డు నంబర్ : డబ్ల్యుఏపీ 1213012001245) కార్డుపై నలుగురు కుటుంబ సభ్యులున్నారు. ఒక్కో వ్యక్తికి నాలుగు కేజీల చొప్పున 16 కేజీల బియ్యం అందించాలి. అయితే ప్రతి నెలా నాలుగు కేజీలు మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయమై నెల క్రితం ప్రజావాణికి వచ్చి ఆంజనేయులు గోడు వెళ్లబోసుకున్నాడు. మూడు రోజుల్లోనే పంపిణీ ముగింపు: రేషన్ డీలర్లు సరుకులను పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు. మూడు రోజుల్లోనే ముగించేస్తున్నారు. ప్రతి నెలా 15లోపు డీలర్లు సరుకులకు డీడీలు తీయాలి. 20 నుంచి వచ్చే నెల ఒకటో తేదీలోగా డీలర్లకు సరుకులు సరఫరా చేయాలి. అయితే... చాలా మంది డీలర్లు సకాలంలో డీడీలు తీయడం లేదు. సరుకులు కూడా డీలర్లకు ఆలస్యంగా అందుతున్నాయి. ఫలితంగా పేదలు అవస్థలు పడుతున్నారు. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా... రెండు, మూడు రోజులు పంపిణీ చేసి మమ అనిపిస్తున్నారు. ఉదయం పూట పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో కూలీలు అధిక శాతం మంది వాటిని తీసుకోలేకపోతున్నారు. అలాంటి వారికి రేపు రండి... ఎల్లుండి రండంటూ చివరకు ఎగనామం పెడుతున్నారు. పేదలకు సరఫరా చేస్తోన్న 14,745 మెట్రిక్ టన్నుల్లో 12 వేల టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ అవుతోన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. అంటే.. అధికారిక లెక్కల ప్రకారమే 2,245 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఘరానా మోసం : ఎఫ్సీఐ గోదాములు, స్టాక్ పాయింట్లు, రేషన్ డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని స్మగ్లర్లు రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యానికి తవుడును కలిపి మళ్లీ పాలీష్ చేయిస్తున్నారు. సన్న బియ్యంగా మార్చి కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ కేజీ రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి ఉరవకొండ, కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర, రామగిరి, హిందూపురం, గోరంట్ల ప్రధాన కేంద్రాలుగా మారాయి. దీన్ని అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాల శాఖ అధికారులు నిద్రపోతున్నారు. తూతూ మంత్రంగా మాత్రమే దాడులు చేస్తున్నారు. బియ్యం లారీ పట్టుబడితే సరుకును స్వాధీనం చేసుకుని 6ఏ కేసు నమోదు చేస్తున్నారు. రవాణాలో పాలుపంచుకున్న వారిని మాత్రం వదిలేస్తున్నారు. కళ్యాణదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ వారానికి కనీసం రెండు సార్లయినా అధికారులకు దొరికిపోతున్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పూర్తి స్థాయి పోలీసు విచారణ చేపడితేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. అక్రమ రవాణాపై దృష్టి సారిస్తున్నాం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాం. జిల్లా నుంచే కాకుండా కర్నూలు జిల్లాలోని బనగానపల్లి కేంద్రంగా కూడా ఎక్కువగా అక్రమ రవాణా సాగుతోంది. మన జిల్లాలో తరలిస్తూ పట్టుబడిన వాటిపై లోతుగా విచారణ చేపడుతున్నాం. ఇక ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యంపై ఆ జిల్లాలకు వెళ్లి విచారణ చేయలేని పరిస్థితి ఉంది. - శాంతకుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారి -
రైస్మిల్లులపై విజిలెన్స్ దాడులు
త్రిపురారం, న్యూస్లైన్ : మండల కేంద్రంలోని రెండు రైస్ మిల్లులపై బుధవారం విజిలెన్స్ అధికారులు దా డులు నిర్వహించారు. 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. బాబుసాయిపేట రోడ్డు సమీపంలో ఉన్న శ్రీనివాస మోడరన్ రైస్ మిల్లుల్లో నర్సింహ అనే వ్యాపారి ప్రజల వద్ద కొనుగోలు చేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువ చేశాడు. అదే వి ధంగా వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్లులో వెంకటేశ్వ ర్లు అనే వ్యాపారి 85 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిలు వ ఉంచాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి బి య్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బియ్యా న్ని తుంగపాడులో ఉన్న వంశీసాయి రైస్ మిల్లులో అప్పగించారు. ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ స్వామి తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఓ శ్రీధర్రెడ్డి, కానిస్టేబుల్ విష్ణువర్దన్, గిరి, సివిల్ సప్లయ్ ఆర్ఐ వాజీద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
తీగలాగితే
సాక్షి, ఏలూరు :గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లుల నిర్వాహకులు చేస్తున్న విద్యుత్ దోపిడీని ఆ శాఖ అధికారులు బట్టబయలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రైస్మిల్లులో తీగను లాగితే పశ్చిమగోదావరి జిల్లాలోనూ డొంకలు కదులుతున్నాయి. రెండురోజులుగా విద్యుత్ శాఖ అధికారులు జిల్లాలోని రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకూ 148 మిల్లులపై దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ వినియోగిస్తున్న 40 మిల్లులపై కేసులు నమోదు చేశారు. వాటి నుంచి రూ.14.30 లక్షలను అపరాధ రుసుంగా వసూలు చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు డిటెన్షన్ ఆఫ్ ఫిలఫరేజ్ ఆఫ్ ఎనర్జీ (డీపీఈ) విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఎన్.గంగాధర్ (విశాఖపట్నం) పర్యవేక్షణలో మన జిల్లా డీపీఈ విభాగం డీఈ రాజ్కుమార్, ఏడీఈలు వెంకటేశ్వర్లు, సత్యమోహన్, హెచ్డీ మీటర్ ఏడీఈలు అంబేద్కర్, ఉమామహేశ్వరరావు బృందంగా ఏర్పడి రైస్ మిల్లులపై దాడులు నిర్వహించారు. జిల్లాలో 580 రైస్మిల్లులు ఉన్నాయి. ఇవన్నీ హెచ్టీ విద్యుత్ సర్వీసులతో నడుస్తున్నాయి. సాధారణంగా హెచ్టీ వినియోగదారులు విద్యుత్ మోసాలకు పాల్పడే పరిస్థితి ఉండదని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. ఎందుకంటే హెచ్టీ మీటర్ల రీడింగ్ను ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే డీఈ, ఏడీఈ స్థాయి అధికారులు తీస్తుంటారు. మీటర్లో ఏ విధమైన లోపాలున్నా బిల్లులో వచ్చే తేడా వారికి తెలిసిపోతుంది. అంతేకాకుండా ఏ ఫీడర్ పరిధిలో ఎంత లోడ్ పడుతుందనేది కూడా తెలుస్తుంది. అయి నా మిల్లర్లు విద్యుత్ను అదనంగా వినియోగిస్తున్నారంటే విద్యుత్ శాఖ స్థానిక సిబ్బంది సహకారం తప్పనిసరిగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రైసుమిల్లుపై దాడులు
కోవూరు/నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్లైన్: చౌకదుకాణం బియ్యాన్ని అక్రమంగా తరలించి రీసైక్లింగ్ చేస్తున్న సమాచారంతో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదివారం కోవూరు మండలంలోని ఇనమడుగు రోడ్డులో ఉన్న వెంకటసాయి లక్ష్మి రాబాయిల్డ్ రైసుమిల్లు, శెట్టిగుంటరోడ్డు పరమేశ్వరి రైసుమిల్లుపై దాడులు చేశారు. పరమేశ్వరి రైస్మిల్లులో తనిఖీలు చేసిన అధికారులు 67.5 క్విం టాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.2.36 లక్షలు అని జేసీ తెలిపారు సుమారు రూ.10 లక్షల విలువైన 934 బస్తాల బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలోని పలు రైసుమిల్లర్లు పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని రీ సైక్లింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రేషన్ బియ్యాన్ని కల్తీ చేసి నాణ్యమైన బియ్యంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే ఇలా అక్రమ వ్యాపారం చేస్తున్న పలు రైసుమిల్లులపై నిఘా పెట్టేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు ప్రతి రోజు ఏదో ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. కొడవలూరు మండలం సీఎస్ పురం, కోవూరు మండలం ఇనమడుగు రోడ్డులోని రైసు మిల్లులపై ఈ బృందాలు దాడులు చేసి పేదల బియ్యాన్ని సీజ్ చేశాయన్నారు. ఆయా మిల్లర్లపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో డీఎస్ఓ ఉమమహేశ్వరరావు, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ధర్మారెడ్డి, కోవూరు తహశీల్దారు సాంబశివరావు, నెల్లూరు, కావలి ఏఎస్ఓలు శంకర్, శ్రీహరి, సీఎస్డీటీ వెంకట్రావు, వీఆర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
బ్లాక్లిస్టులో 3 వేల రైస్ మిల్లులు
సాక్షి, హైదరాబాద్: గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి లెవీ బకాయిలు ఉన్నాయంటూ 3 వేల రైస్ మిల్లులను భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బ్లాక్లిస్టులో పెట్టడంపై మిల్లర్లు మండిపడ్డారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో లెవీ తీసుకోబోమనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్బాబును శుక్రవారం సచివాలయంలో కలిసి ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా మంత్రికి పరిస్థితి వివరించారు. ‘గత సీజన్లో 55 లక్షల టన్నుల లెవీ(98.5 శాతం) బియ్యం ఇచ్చాం. 2-3 % లెవీ బియ్యం బకాయిలు ఉన్న కొన్ని మిల్లులను కూడా బ్లాక్లిస్టులో పెడతారా?’ అని మిల్లర్లు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
పేదోడి బువ్వకు.. ఎసరు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించకపోవడం అంటే ఇదే. ఏ ఒక్క పేదవాడూ ఆకలికి తల్లడిల్లవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం రేషన్దుకాణాల ద్వారా అందిస్తోంది. అయితే, ఈ బియ్యం నెలానెలా వినియోగదారులకు సక్రమంగా అందడం లేదు. పౌరసరఫరాల శాఖలోని కొందరు ఉద్యోగులు, ఏళ్లుగా పాతుకుపోయి చక్రం తిప్పుతున్న మరికొందరు రేషన్డీలర్లు, ఇంకొందరు రైస్మిల్లుల యజమానులు అంతా కలిసి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. ఇందులో ఎవరి వాటాలు వారికి ముట్టజెబుతుండడంతో అంతా గప్చుప్గా నడిచిపోతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిత్యం పదుల సంఖ్యలో రేషన్బియ్యం లారీలకు లారీలే మాయమవుతున్నాయి. ఇటు డీలర్లు, అటు సివిల్ సప్లయీస్ ఉద్యోగులు కొందరు అనుసరిస్తున్న విధానం నివ్వెర పరిచేలా ఉంది. ఇదీ.. కథ ప్రతినెలా తనకు కేటాయించిన కోటా బియ్యాన్ని మెజారిటీ డీలర్లు గోడౌన్ల నుంచి లిఫ్ట్ చేయడం లేదు. ఉదాహరణకు ఒక డీలర్కు వంద క్వింటాళ్ల బియ్యం కోటా కేటాయించినట్లయితే, ఆ మొత్తానికి డీడీలు కట్టినా గోడౌన్ల నుంచి కేవలం 75 క్వింటాళ్లు మాత్రం తీసుకుపోయి, మరో 25 క్వింటాళ్ల బియ్యాన్ని గోదాములోనే బ్యాలెన్సు ఉంచుతున్నారు. తమ దుకాణాల పరిధిలో కార్డుదారులకు అరకొరగా పంపిణీ చేసి అయిపోయిందనపిస్తున్నారు. వాస్తవానికి ప్రతినెలా 20వ తేదీ దాకా రేషన్షాపుల్లో బియ్యం, ఇతర సరుకులు వినియోగదారులకు అందాలి. కానీ, అలా జరగడం లేదు. ఇక, గోదాములో బ్యాలెన్సు పెట్టిన బియ్యాన్ని అటు నుంచి అటే మిల్లులకు తరలిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతోనే.. కొందరు డీలర్లు, డిప్యూటీ తహసీల్దారులు(సీఎస్), ఆర్ఐలకు, కొన్ని చోట్ల గోడౌన్ల మేనేజర్లకు ఇందులో భాగస్వామ్యం ఉంది. ఈ బియ్యాన్ని కొందరు రైస్మిల్లుల యజమానులే నేరుగా కొనుగోలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం సివిల్ సప్లయీస్ ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తి డీ లర్లకు కిలోకు రూ.13, రూ.14, రూ.15 చొప్పున అవసరాన్ని బట్టి చెల్లించి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ రేషన్ బియ్యం అత్యధికంగా నార్కట్పల్లిలోని ఓ మిల్లుకు, అదే మాదిరిగా హాలియా ప్రాంతంలోని మరో మిల్లుకు చేరుతున్నాయి. ఇటీవల లారీలకు పట్టుకుంటున్నారని గమనించి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆటోలను ఐస్క్రీం బండ్లలా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. షాపుల్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బ్యాగులు మార్చి అనుమానం రాకుండా జాగత్త్ర పడుతున్నారు మరికొందరు డీలర్లు. కర్నూల్ రైస్, రిలయన్స్ తదితర బ్యాగుల్లో వీటిని నింపి ఊరు దాటిస్తున్నారు. ఇక, బియ్యం రవాణా విషయానికి వస్తే స్టేజ్-1, స్టేజ్-2లలోనే అక్కడక్కడే మారుతూ తతంగమంతా జాగ్రత్తగా నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో పలువురు అధికారులు, యూనియన్ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధుల మద్దతున్న మిల్లర్లకు భాగస్వామ్యం ఉండడంతో ఎవరిపై ఎలాంటి చర్యలూ ఉండడం లేదు. కొరవడిన నిఘా... ఉన్నతాధికారుల నిఘా కొరవడడం వల్లే రేషన్ బియ్యం వినియోగదారులకు అందకుండా మిల్లర్లకు చేరుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలువురు సీనియర్ డీలర్ల వద్ద బోగస్ కార్డులు ఉన్నాయి. బోగస్ కార్డుల ఏరివేతలోనూ అక్రమాలు చోటుచేసుకోవడంతో కొందరి దగ్గర వంద నుంచి రెండొందల దాకా బోగస్కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అధిక కోటా కేటాయించుకుని అదనపు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. జిల్లాలో ఇంకా పలుచోట్ల బినామీ డీలర్లు కూడా ఉన్నారని సమాచారం. డీలర్గా పేరొకరిది, రేషన్ దుకాణం నడిపేది మరొకరు. వీరి నుంచి మామూళ్లు ముడుతుండడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. ఇటీవల హుజూర్నగర్ సీఐ ఆధ్వర్యంలో అక్రమంగా రవాణ అవుతున్న రేషన్ బియ్యం లోడు లారీని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నిందితులను శనివారం ఎస్పీ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, పేదోడి బియ్యం పేదోడికే దక్కేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖ ఉన్నతాధికారులపైనే ఉంది. -
జోగుతున్న నిఘా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రైస్ మిల్లులు, ఇతర నిత్యావసర సరుకులకు సంబంధించి అక్రమ నిల్వలపై పౌర సరఫరాలశాఖ 2012లో జిల్లా వ్యాప్తంగా 320 కేసులు నమోదు చేసింది. సన్న బియ్యం ధర క్వింటాల్కు గత ఏడాది రూ.3400 ఉండగా ప్రభుత్వ నివేదిక ప్రకారం ఇప్పుడది రూ.4200గా ఉంది. బియ్యంతోపాటు అన్ని సరుకుల ధరల తీరు ఇలాగే ఉంది. కానీ, కేసుల నమోదు మాత్రం పెరగలేదు. 2013లో ఆగస్టు వరకు (ఎనిమిది నెలలు) 92 కేసులు మాత్రమే నమోదు చేసింది. ధరలు పెరిగినప్పుడు విస్తృతంగా తనిఖీలు చేయాల్సిన నిఘా విభాగం ఈ పనిని పక్కనబెట్టింది. తనిఖీలు ఎందుకు పెరగడం లేదనే ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ ఏడాది నమోదు చేసిన తక్కువ కేసుల్లో సైతం అధికారులు స్వయంగా దాడులు చేసిన వాటికంటే ఇతరులు ఫిర్యాదు చేస్తే నమోదు చేసినవే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తోడు బడా వ్యాపారులు, రైస్ మిల్లర్లతో... అధికారులకు ఉన్న అనుబంధాలే తనిఖీలు తగ్గడానికి ప్రధాన కారణమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇంత తక్కువ తనిఖీలు జరిగిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవని అంటున్నారు. ఒక్క కేసూ పెట్టరా... పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో 27 మంది నిఘా సిబ్బంది ఉన్నారు. వీరికి తోడు ప్రతి మండలంలో ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డెప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఉంటారు. రెవెన్యూ వారిని మినహాయించినా... పౌర సరఫరాల శాఖలోని 27 మంది సిబ్బంది నెలకు ఒకటి చొప్పున తనిఖీలు చేసినా 27 అవుతాయి. ఆ లెక్కన ఈ ఎనిమిది నెలల్లో 251 కేసులు అయ్యేవి. వ్యాపారులు, రైస్ మిల్లర్లతో జిల్లా అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా అధికారులు తనిఖీలు తగ్గించేశారు. అడపాదడపా ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు తనిఖీలు చేసి అక్రమ నిల్వలు గుర్తించినా కేసులు మాత్రం నమోదు చేయడం లేదు. జిల్లా అధికారుల సహకారంతో కేసులు లేకుండా చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా పౌరసరఫరాల శాఖను కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తీవ్రంగా తప్పుబట్టారు. మంగళవారం జరిగిన జిల్లా ఆహార సలహా సంఘం సమావేశంలో అక్రమ నిల్వలపై కేసుల అంశం ప్రస్తావనకు వచ్చింది. చౌకధరల దుకాణాలు, నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేసిన వారిపై గతేడాది, ఈ ఏడాది నమోదు చేసిన కేసుల సంఖ్యలో తేడాపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఇలా ఎందుకు జరుగుతోందని జిల్లా పౌర సరఫరాల అధికారి బి.చంద్రప్రకాశ్ను గట్టిగా ప్రశ్నించారు. రేషన్ షాపుల్లోనూ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని గ్రామ సందర్శనలో ఫిర్యాదులు వస్తున్నా ఏం చేస్తున్నారని అడిగారు. నిఘా విభాగం ఏం చేస్తోందని, నెలకు ఒక్క కేసు కూడా నమోదు చేయని సిబ్బంది ఉన్నారా? అని మందలించారు. తనిఖీల విషయంలో తీరు మారకుంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీఎస్వో మిన్నకుండిపోయారు. కలెక్టర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో జిల్లా పౌర సరఫరాల శాఖలో నిఘా విభాగం పూర్తిగా నిద్రావస్థలో ఉందని తెలుస్తోందని సమావేశంలో ఉన్న మిగతా సభ్యులు అభిప్రాయపడ్డారు. జిల్లా సరఫరా అధికారి ఉదాసీనత వల్లే తనిఖీలు తగ్గాయని వీరంతా వ్యాఖ్యానించారు. కలెక్టర్ సమీక్ష తర్వాతైనా నిఘా విభాగం నిద్రమత్తు వీడుతుందో లేదో చూడాలి మరి ! -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
కల్వకుర్తి, న్యూస్లైన్: శనివారం కల్వకుర్తి పట్టణంలోని పలు రైస్మిల్లులపై విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 359 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్చేశారు. హైదరాబాద్ సిటీ యూనిట్-2కు చెందిన విజిలెన్స్ అండ్ ఎ న్ఫోర్స్మెంట్ అధికారులు పట్టణంలోని రవికుమార్ రైస్మిల్లో 82 క్వింటాళ్లు, వెంకటేశ్వర రై స్మిల్లో 51 క్వింటాళ్లు, 22 క్వింటాళ్ల నూకలు, వాసవి రైస్మిల్లో అక్రమంగా దాచిన 70 క్విం టాళ్ల బియ్యాన్ని సీజ్చేశారు. నిబంధనలకు వి రుద్ధంగా.. ఎలాంటి అనుమతులు పొందకుం డా అక్రమంగా బియ్యాన్ని విక్రయిస్తున్నారనే వి శ్వసనీయ సమాచారంతో దాడులు కొనసాగిం చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రైస్మిల్లుల నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చే యనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో డీటీటీఓ సునితారెడ్డి, ఎస్ఐలు నాగేశ్వర్, సంతోష్కుమా ర్, తహశీల్దార్ హేమమాలిని పాల్గొన్నారు. వారి వెంట స్థానిక తహశీల్దార్ శ్యాంసుందర్, ఆ ర్ఐ చారి ఉన్నారు.