Special Article
-
President Droupadi Murmu: ఆవేదనతో చలించిపోయా..
న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆ భయానక సంఘటన గురించి తెలుసుకొని చలించిపోయానని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. మహిళలపై నేరాల పట్ల మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని బుధవారం పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక ఆరి్టకల్లో రాష్ట్రపతి సూచించారు. జూనియర్ డాక్టర్ హత్యపై రాష్ట్రపతి స్పందించడం ఇదే మొదటిసారి. తల్లులు, అక్కచెల్లెమ్మలపై జరుగుతున్న అరాచకాలపై దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఆమె ఉద్ఘాటించారు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయాలు ఉంటే వారిని ఒక వస్తువుగా చూసే అలవాటు పెరుగుతుందని తెలిపారు. స్త్రీలను బలహీనులుగా, తెలివిలేనివారుగా పరిగణించే ఆలోచనా ధోరణిని అందరూ మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ప్రజల దృష్టికోణం మారితే సమాజంలో వారిపై నేరాలు జరగబోవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం చెప్పారంటే... మనం పాఠాలు నేర్చుకున్నామా? దేశంలో సోదరీమణులపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అఘాయిత్యం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నాగరిక సమాజంలో ఆడబిడ్డలు ఇలాంటి అరాచకాల బారిన పడడానికి వీల్లేదు. జూనియర్ డాక్టర్ హత్య పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో నేను కూడా ఉన్నాను. కోల్కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగానే, మరోచోట నేరగాళ్లు చెలరేగిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలు జరగకుండా వ్యూహాలు రూపొందించుకున్నాం. ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చాం. అయినా నేరాలు ఆగడం లేదు. గత 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. కొన్ని మాత్రమే అందరి దృష్టికి వచ్చాయి. మనం నిజంగా పాఠాలు నేర్చుకున్నామా? ఆందోళనలు ముగిసిపోగానే ఘోరాలు మరుగునపడిపోతున్నాయి. వాటిని మనం మర్చిపోతున్నాం. మరో ఘోరం జరిగాక పాత ఘోరాలను గుర్తుచేసుకుంటున్నాం. ఇది సరైన విధానం కాదు. మహిళలపై వక్రబుద్ధిని మొదట్లోనే అడ్డుకోవాలి మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. వాటిని పోరాడి సాధించుకోవాలి. మహిళలకు మరిన్ని హక్కులు దక్కకుండా, హక్కుల విస్తరణ జరగకుండా కొన్ని సామాజిక అచారాలు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. మహిళలను ప్రాణంలేని వస్తువుగా చూసే ధోరణి వారిపై నేరాలకు పురిగొల్పుతోంది. ఈ పరిస్థితిలో కచి్చతంగా మార్పురావాలి. వారి హక్కులను అందరూ గౌరవించాలి. స్త్రీల పట్ల జనంలో ఉన్న దురభిప్రాయాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, సమాజంపై ఉంది. చరిత్రను ఎదిరించే సమయం వచ్చింది. స్త్రీలపై నేరాల పట్ల నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారిపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జరిగిన తప్పులను సరిదిద్దుకోకపోతే సమాజంలోని సగం జనాభా మిగతా సగం జనాభాలాగా నిర్భయంగా జీవించలేదు. మీడియా ధైర్యంగా పనిచేయాలి ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సూచించారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని వివరించారు. మీడియా ఎప్పటికీ సత్యానికే అండగా ఉండాలని చెప్పారు. సత్య మార్గం నుంచి పక్కకు మళ్లొద్దని కోరారు. ‘మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పద్యాన్ని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా వార్తాసంస్థల ఎడిటర్లు బుధవారం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తుంటామని, మరోవైపు మన రోజువారీ ప్రవర్తనలో ఆ భావన కనిపించకపోవడం తనను అప్పుడప్పుడు ఆవేదనకు గురి చేస్తోందని ముర్ము వ్యాఖ్యానించారు. -
వందేళ్లకుపైగా చరిత్ర.. లక్షల తీర్పులు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఒడ్డున ఠీవిగా నిల్చున్న అద్భుత కట్టడం.. భారీ గుమ్మటాలతో చూడగానే ఆకట్టుకునేలా నిర్మాణం.. వందేళ్లకు పైగా చరిత్ర. ఎందరో గొప్ప మేధావులు న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా పని చేసిన భవనం. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారూ అనేకమే. కోట్లాది మందికి న్యాయాన్ని అందించిన సజీవ సాక్ష్యం. గులాబీ, తెలుపు గ్రానైట్లతో రూపుదాల్చిన విశాల భవంతి. నాటి నిజాం ప్రభుత్వానికి, ఉమ్మడి ఏపీ సర్కార్కు, ప్రత్యేక తెలంగాణ సర్కార్కు ఉన్నత న్యాయస్థానంగా నగరం నడిబొడ్డున సేవలందించిన భారీ కట్టడం. ఈ హైకోర్టును బుద్వేల్కు తరలించాలని కొందరు.. వద్దు ఇక్కడే కొనసాగించాలని మరికొందరు.. ఈ వాదనల నేపథ్యంలో కొద్దికాలం క్రితం బుద్వేల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 105 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న హైకోర్టు భవనంపై ప్రత్యేక కథనం.హైకోర్టు ఏర్పాటు ఇలా...’ఆంగ్లేయుల పాలనలో రూపొందించిన అనేక నిబంధనలు నిజాం ప్రభుత్వం అధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా ఇక్కడ కూడా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత పత్తర్ఘాట్లో హైకోర్టును నెలకొల్పారు. 1908లో వచ్చిన వరదల తర్వాత లాల్బాగ్లో ఉండే ఆస్మాన్ ఝా నవాబ్ నివాస గృహంలోకి మార్చారు. 1912లో నగరంలో కలరా వ్యాధి రావడంతో పబ్లిక్ గార్డెన్స్ హాల్కు, అక్కడి నుంచి సాలార్జంగ్ బహదూర్ నివాసానికి తరలించారు. అక్కడ స్థలం సరిపోక ఇబ్బందిపడాల్సి వచ్చింది. దీంతో సైఫాబాద్ని సర్తాజ్జంగ్ నవాబ్ ఇంటికి మార్చారు.హైకోర్టు భవనానికి రూపకల్పన...1915, ఏప్రిల్ 15న ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జైపూర్కు చెందిన శంకర్లాల్ ఆర్కిటెక్ట్గా, మెహర్ అలీఫజల్ ఇంజనీర్గా వ్యవహరించారు. శంషాబాద్ వద్ద గగ న్పహాడ్లోని కొండలను తొలిచి, ఇండో ఇస్లామిక్ శైలిలో పాతబస్తీలోని మూసీనది ఒడ్డున నిర్మించారు. 1919, మార్చి 31న భవన నిర్మాణం పూర్తయింది. మూసీపై నయాపూల్ వంతెన పక్కన హైకోర్టు భవనం ఠీవిగా కొలువుదీరింది. నిజాం కాలం నాటి 18,22,750 సిక్కాల వ్యయంతో 9 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనాన్ని 1920, ఏప్రిల్ 20న ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956, నవంబర్ 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చారు. ఆ తర్వాత పలు అవసరాల నిమిత్తం కొత్త భవనాలు నిర్మిస్తూ వచ్చారు. హైన్ మహల్, నది మహల్, కుతుబ్ షాహీ నిర్మాణాల శిథిలాలపై ఈ చారిత్రక, వారసత్వ హైకోర్టు భవనాన్ని నిర్మించారు.ప్రత్యేక రాష్ట్రం తర్వాత...2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. ఒకే భవనంలో ఏపీ, తెలంగాణ హైకోర్టులు కొనసాగుతూ వచ్చాయి. 2018, డిసెంబర్ 26న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో 2019, జనవరి 1న ఏపీ హైకోర్టు అమరావతికి తరలివెళ్లిపోయింది. తర్వాత ఈ భవనం పూర్తిగా తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు.ముఖ్యాంశాలు...⇒ నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తి: నిజామత్ జంగ్ ⇒ స్వాతంత్య్రానికి పూర్వం జడ్జీల నియామకం చేసింది: నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్⇒ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టుకు తొలి సీజే: జస్టిస్ కోకా సుబ్బారావు⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హైకోర్టు తొలి సీజే: జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్గుప్తా ⇒ పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు రూపకల్పన (ఏపీ హైకోర్టు తరలిన) తర్వాత తొలి సీజే: జస్టిస్ టీబీ రాధాకృష్ణన్⇒ 2019లో నిర్మాణం వందేళ్లు పూర్తి చేసుకుంది⇒ 1948 నుంచి 1950 వరకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కూడా పనిచేసింది. ఉర్దూ అధికారిక భాష కావడంతో ఇక్కడ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ⇒ ప్రధాన భవనంలో 32 కోర్టు హాళ్లు, 38 చాంబర్లు ఉంటాయి. జడ్జీల సంఖ్య పెరిగిందిలా... ప్రస్తుత హైకోర్టు భవనం ప్రారంభించే నాటికి ఉన్న న్యాయమూర్తులు 6 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు 12 1970లో న్యాయమూర్తుల సంఖ్య 321987లో న్యాయమూర్తుల సంఖ్య 362014లో న్యాయమూర్తుల సంఖ్య 61విభజన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 242021లో న్యాయమూర్తుల సంఖ్య 42 -
కల సాకారం కోసం తపించే స్నే‘హితుడు’..
ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్గా రాణిస్తున్న పీజీ.వింద (అష్టాచెమ్మా, సమ్మోహనం, జెంటిల్మన్..ఫేం) నిజమైన హితుడు అని చెప్పాలి. తన కల సాకారంతో పాటు మిత్రులందిరివీ కలిపి మన కలలను సాకారం చేయాలని ఆరాటపడతాడు. సిటీలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు నాకు సహాధ్యాయి. ఇద్దరికీ కళలపట్ల ఆసక్తి, ఏదో సాధించాలన్న తపన.. మా స్నేహబంధంతో పాటు బలపడుతూ వచి్చంది. బేగంపేట్లో ఓ చిన్న గదిలో అద్దెకుంటూ చాలీ చాలని డబ్బులతో బిస్కట్లు, సమోసాలతో కడుపు నింపుకుంటూ.. బహుశా ఇవన్నీ ఎదిగే క్రమంలో చాలా మందికి అనుభవమే కావచ్చు. కానీ.. మా లాంటి స్నేహం మాత్రం అతి కొద్దిమందికే దక్కింది అని సగర్వంగా చెప్పగలను. దర్శకులు శేఖర్ కమ్ములకు నన్ను పీజీ.వింద పరిచయం చేసి కాస్ట్యూమ్ డిజైనర్గా అవకాశం ఇప్పించకపోతే.. బహుశా సినీరంగానికి దూరంగానే ఉండేవాడినేమో. నాలాంటి మరికొంత మంది స్నేహితుల కలల సాకారానికి కూడా సాయం అయ్యాడు. అందుకే ఎందరో ఫ్రెండ్స్.. కానీ కొందరే స్నే‘హితులు’.. అలాంటివారిలో బెస్ట్ పీజీ.వింద. –అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, తెలుగు సినీ దర్శకుడు -
‘ఆధునిక హైదరాబాద్’ ఆ ఇద్దరు మిత్రులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒక అందమైన నగరం. నాలుగు వందల ఏళ్ల చారిత్రక సోయగం. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరం ఇది. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఒకే పాదు నుంచి పూచిన పూలై వికసించాయి. వైవిధ్యభరితమైన స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్ అంటేనే ఆతీ్మయమైన నగరం. ఎంతోమంది గొప్ప స్నేహితులు ఈ నేలపైన పుట్టిపెరిగారు. చరిత్రను సృష్టించారు. ఆదర్శప్రాయమైన స్నేహితులుగా నిలిచారు. నిజాం నవాబుల కాలంలో రాజులకు, ఉన్నతాధికారులకు మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆధునిక హైదరాబాద్ నిర్మాణాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ ఫక్రుల్ముల్క్ బహదూర్. ఇద్దరూ గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయారు. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కలిసి ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదర్శప్రాయమైన, అజరామరమైన వారి స్నేహంపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. అది స్వర్ణయుగం.. ఆ ఇద్దరి స్నేహం హైదరాబాద్ చరిత్రలో స్వర్ణ యుగం. మీర్ మహబూబ్ అలీఖాన్ ఆధునిక హైదరాబాద్ నగరానికి బాటలు పరిచిన గొప్ప పాలకుడు. ఆయన ఆశయాన్ని, ఆలోచనలను ఆచరణలో పెట్టిన పరిపాలనాదక్షుడు ఫక్రుల్ముల్్క. విధినిర్వహణ దృష్ట్యా ప్రధానమంత్రి. ఇద్దరి అభిరుచులు చాలా వరకూ ఒకేవిధంగా ఉండేవి. 1892 నుంచి 1901 ఫక్రుల్ముల్క్ ప్రధానిగా పనిచేశారు. ఇంచుమించు సమయసు్కలు కావడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల పాటు ఆ స్నేహం కొనసాగింది.. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప ప్రతిభావంతుడైన ఫక్రుల్కు సంగీతం, సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. మహబూబ్ అలీఖాన్ కూడా గొప్ప సాహిత్యాభిరుచి కలిగిన వ్యక్తి. ఇద్దరూ కలిసి కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొనేవారు. ఉర్ధూ సాహిత్య వికాసం కోసం మహబూబ్ అలీ ఎంతో కృషి చేశారు. ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టింది ఆయనే. ఎంతోమంది కవులను, కళాకారులను. పండితులను ప్రోత్సహించారు. ఇద్దరు థారి్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలిచారు. అనాథలు, నిస్సహాయులను ఆదుకొనేందుకు ఫక్రుల్ స్వచ్ఛంద సంస్థలకు ధారాళంగా విరాళాలు ఇచ్చేవారు. నిజాంకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా అనేక సమావేశాల్లో, విధానపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా... భావితరాల అవసరాలను, నగర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఇద్దరూ కలిసి అనేక నిర్మాణాలను కొనసాగించారు. రహదారులను నిర్మించారు. కొత్త భవనాలను కట్టించారు. నాటి సంపన్నులు, నవాబుల పిల్లల ఉన్నత చదువుల కోసం 1887లోనే నిజామ్స్ కళాశాలను నిర్మించారు. అనంతర కాలంలో అన్ని వర్గాలకూ చేరువైంది. బాలికల విద్య కోసం మహబూబియా కళాశాల, హైకోర్టు భవనం, అసెంబ్లీహాల్, రైల్వే నిర్మాణం, టెలిఫోన్, బ్యాంకింగ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ వంటి కార్యక్రమాలు మహబూబ్ అలీ హయాంలో చేపట్టినవే. స్కూళ్లు, కళాశాలలు కట్టించారు. ఈ నిర్మాణాలన్నింటిలోనూ నిజాంకు ఫక్రుల్ కుడిభుజంగా నిలిచారు.ఎర్రమంజిల్ ఒక కళాఖండం.. ఆ ఇద్దరి అపురూపమైన, ఆదర్శప్రాయమైన స్నేహానికి చిహ్నంగా ఫక్రుల్ అద్భతమైన ఎర్రమంజిల్ ప్యాలెస్ను కట్టించాడు. ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ రాజ మందిరం అద్భుతమైన మాన్యుమెంట్గా నిలిచింది. ఎత్తయిన ప్రదేశంలో ఈ అందమైన ప్యాలెస్ను కట్టించారు. 1890లో నిర్మాణ పనులు ప్రారంభించగా పదేళ్ల పాటు పనులు కొనసాగాయి. 1900లో ఈ భవన నిర్మాణం పూర్తయింది. దేశంలోని మొఘల్, కుతుబ్షాహీ వాస్తు శిల్పాన్ని, యురప్లోని విక్టోరియన్, గోథిక్ నిర్మాణ శైలిని మేళవించి ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మాంచారు. ఫక్రుద్దీన్ నివాస మందిరం ఇది. సభలు, సమావేశాలు, వేడుకలు, విందులు, వినోదాలతో ఈ ప్యాలెస్ నిత్యం సందడిగా ఉండేది. -
అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. (చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు) తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన. హ్యాట్రిక్ రోల్స్తో అబ్బురపరిచిన స్టార్ సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు. ఆ చిత్రాలు ఇవే.. ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో.. మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్గా, పోలీసాఫీసర్గా, లాయర్గా మూడు పాత్రల్లో మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నోటి దురుసుతో అనర్ధాలు
నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు అనంతం. వాటిని లెక్కించడం గాని, ఊహించడం గాని, వర్ణించడం గాని అసాధ్యం. అటువంటి అసంఖ్యాక అనుగ్రహాల్లో ‘నోరు’ కూడా ఒకటి. కేవలం తినడానికి, తాగడానికి మాత్రమేకాదు, సంభాషణకు, సంవాదానికి, మానవుల మధ్య పరస్పర సంబంధాలకు ఇదేవారధి. దీని వినియోగ తీరుపైనే జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే అమృతపు జల్లు జాలువారుతుంది, ప్రేమామృత కుసుమాలను వికసింపజేస్తుంది. మంచిని పంచి మనిషి గౌరవ మర్యాదల్ని ఇనుమడింప జేస్తుంది. సంఘంలో ఉన్నత స్థానాన్ని సమకూర్చి పెడుతుంది. స్నేహ సౌభ్రాత్రతలను, శాంతి సామరస్యాలను పరిఢవిల్లజేస్తుంది. దుర్వినియోగం చేస్తేమాత్రం విద్వేషం చిలకరిస్తుంది. సమాజంలో అగ్గి రాజేస్తుంది. అశాంతి, అలజడులను సృష్టిస్తుంది. స్థాయిని దిగజారుస్తుంది. ఇహపర లోకాల్లో ఆపదలు తెచ్చి పెడుతుంది. వైఫల్యాలకు కారణమవుతుంది. దైవం దృష్టిలో నోటిదురుసు, దుర్భాష, అశ్లీలం తీవ్రమైన నేరాలు. దీనికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇతరుల మనోభావాలు గాయపరిచేవారిని, అశ్లీలపు మాటలు పలికే వారిని, దుర్భాషలాడేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కొంతమంది పైకి ఎంతో చదువుకున్నవారిలా, ఎంతో భక్తి పరులుగా కనిపిస్తారు. కాని నోటితో ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పరుల మనసు గాయపరుస్తారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారితో ఇలా విన్నవించుకున్నాడు. ‘ఒక స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది. మరెన్నో నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఈ సత్కార్యాల కారణంగా ఆమె గొప్పదాతగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆమెకు నోటిదురుసు ఎక్కువ. ఏదో ఒకటి అని పొరుగువారి మనసు బాధ పెడుతుంది.’ అని నివేదించాడు. ‘అయితే ఆమె నరకానికి పోతుంది.’ అన్నారు ప్రవక్త మహనీయులు. తరువాత ఆ వ్యక్తి ‘‘దైవప్రవక్తా! ఒక స్త్రీ ఫర్జ్ నమాజులు ఫర్జ్ రోజాలు (అంటే, విధిగా పాటించవలసినవి) మాత్రమే ఆచరిస్తుంది. నఫిల్ నమాజులు నఫిల్ రోజాలు (ఐఛ్ఛికం) పాటించడం చాలా అరుదు. దానధర్మాలు కూడా పెద్దగా ఏమీ చేయదు. ఉన్నంతలోనే అప్పుడప్పుడూ కొన్ని జున్నుముక్కలు దానం చేస్తుంది. అయితే ఆమె ఎప్పుడూ ఇరుగు పొరుగు వారిని పల్లెత్తుమాట అనదు. వారి మనసు నొప్పించదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుందని జనం చెప్పుకుంటూ ఉంటారు’ అని విన్నవించు కున్నాడు. ఈ మాట విని ప్రవక్త మహనీయులు, ‘ఆమె స్వర్గవాసి’ అని సెలవిచ్చారు. కనుక నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. హుందాగా సౌమ్యం, నమ్రత ఉట్టిపడే విధంగా మాట్లాడాలి. ఉపయోగంలేని ఉబుసుపోక మాటలకన్నా మౌనంగా ఉండడం ఎంతో మేలు. లేకపోతే అనర్ధాలు జరిగిపోతాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, మాట్లాడిన ప్రతి మాటకూ, పలికిన ప్రతి పదానికీ దైవానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దైవం మనందరికీ ఆచితూచి మంచి మాట్లాడే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆంతరంగిక శుద్ధి
మనిషికి బాహ్య అంగాల శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధి అవసరం అంటుంది బౌద్ధం. ఈ మనోశుద్ధి వల్ల మనస్సు మలిన రహితం అవుతుంది. తేటదనం ఉట్టిపడుతుంది. శారీరక శుద్ధి కంటే మనోశుద్ధే మేలు. మనో వాక్కాయ కర్మల్లో మనో శుద్ధి ఉంటే వాక్కులూ చేసే పనులూ, వాటంతట అవే శుద్ధి అయిపోతాయి. అందుకే అన్నింటికీ అగ్రగామి మనసే’’ అంటుంది ధమ్మపదం. ఎంత విన్నా, ఎంత చదివినా హీనబుద్ధి గలవాడు తమగుణం మానలేడు అంటారు. దేహాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకున్నా అవగుణం ఉన్నవాడికి ఒక్కసారి కాకపోతే ఎప్పుడో ఒక్కసారైనా దేహశుద్ధి తప్పదు. మనోశుద్ధి ఉంటే వారు మణిలా జీవితాంతం రాణిస్తారు. కానీ శారీరక శుద్ధి వల్ల పాపాలు పోయి పుణ్యం వచ్చిపడుతుంది అని నమ్మే పండితుడు చివాట్లు తిన్న కథ ఇది. మగధ దేశంలో మల్లిక అనే ఒక దాసి ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. నిండు యవ్వనంలో ఉన్నా నిలకడ గల మగువ. ఒకరోజు తెల్లవారు జామునే నీటికోసం నదికి పోయింది. మంచు పట్టి ఉంది. చలి వణికిస్తోంది. ఆమె నదీతీరం చేరి అక్కడ నదిలోకి కట్టి ఉన్న మెట్ల మీద నుండి దిగింది. అప్పటికే అక్కడ ఒక పండితుడు నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు. బుడింగిన మునిగి పైకి లేచాడు. ఎదురుగా మల్లిక కనిపించింది. ఆమె అప్పటికే నీరు ముంచుకుని కడవ నడుమున పెట్టింది. ఆ క్షణంలో ఆమె అందాన్ని, వయ్యారాన్ని చూసి, పండితుని మనస్సు చలించింది. అలాగే నిలబడి చలికి వణుకుతూ ఆమె వంకే చూస్తుండిపోయాడు. అతని వాలకం మల్లిక పసిగట్టి– ‘‘అయ్యా నేను దాసిని. ఈ తెల్లవారు వేళ నీటికోసం ఈ నదికి రాక తప్పదు. చలి బాధను భరించకా తప్పదు. కానీ, మీరు దాసులు కారే? తమరెందుకు ఈ వేళ ఇక్కడికి వచ్చారు? ఈ నీట్లో దిగి ఇలా వడ వడ వణికిపోతున్నారు?’’ అని అడిగింది. ‘‘మల్లీ! నీకు ఆమాత్రం తెలియదా? ఈ జలం పవిత్రమైనది. దీనిలో స్నానం చేస్తే ఎప్పటి పాపాలు అప్పుడు కొట్టుకుపోతాయి. ఈ నీట్లో దిగి మూడు మునకలు వేస్తే సరి. చేసిన దోషాలన్నీ హరించుకుపోయి, పుణ్యం పోగుపడుతుంది. ఆ మాత్రం తెలియని అజ్ఞానివి’’ అంటూ మునిగి లేచాడు. మల్లిక నడుమున ఉన్న నీటి కడవను సరిచేసుకుని – ‘‘అయ్యా! నిజమా! నీటిలో మునిగితేనే పాపాలు హరించుకుపోతాయా?’’ అంది అమాయకంగా! ‘‘అవును మల్లికా! ఇది శాస్త్రం’’ అన్నాడు. ‘‘అయితే స్వామీ! మీ కంటే ఎప్పుడూ ఈ నీటిలోనే ఉండే కప్పలు, చేపలు, పీతలు, జలగలు ఎంతో పుణ్యశాలురన్నమాట. మూడు మునకలకే మీకు పుణ్యం పోగుపడితే.. నిరంతరం మునకలేసే అవి ఎంతటి పుణ్యాన్ని పోగుపెట్టుకుని ఉంటాయి? అవును లెండీ, మీకంటే కప్పలే గొప్ప’’ అంటూ నవ్వుతూ మెట్లెక్కి వెళ్ళిపోయింది. తనకు చిత్తశుద్ధి లేదని తెలియ చెప్పడానికే మల్లి అలా వ్యంగ్యంగా మాట్లాడిందని పండితుడు గ్రహించాడు. శారీరక శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాడు. ఆంతరంగిక శుద్ధి జరగాలంటే బుద్ధుని బోధనలే శరణు అని బుద్ధుణ్ణి శరణు వేడాడు. ఆ తరువాత గొప్ప పండితునిగా... శీలవంతునిగా కీర్తిగాంచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
వైద్యుడా.. వందనం.. డాక్టర్స్ డే వెనుక చరిత్ర ఇదే
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృథాయే. అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉంది. అందుకే ప్రజలు వైద్యుడిని సాక్షాత్తు దేవుడిగా భావిస్తారు. ప్రాణాలు నిలిపినందుకు అతడిని దేవుడే అంటూ ప్రజలు దండాలు పెడతారు. పవిత్రమైన ఈ వృత్తిలో రాణిస్తూ విశేష సేవలు అందించే వైద్యులు చరిత్రలో నిలిచిపోతారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): బెంగాల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బిదన్ చంద్రారాయ్ సంస్మరణగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఆదర్శ వైద్యుడిగా ఆయనకుగల ఖ్యాతిని యేటా ఆయన జన్మదినం నాడు డాక్టర్స్ డేగా నిర్వహిస్తూ ఇతర వైద్యులు స్ఫూర్తి పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిదన్ చంద్రారాయ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన 1882 జులై 1వ తేదిన జన్మించారు. 1962 జులై 1నే కన్నుమూశారు. 1991 నుంచి ఆయన సంస్మరణగా వైద్య లోకం డాక్టర్స్ డే నిర్వహిస్తోంది. పవిత్రమైన వృత్తి సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్యం. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాం«ధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. సాక్షాత్తు దేవుడులాంటివాడివంటూ హృదయ పూర్వకంగా నమస్కారం చేస్తారు. అందుకే ఆయనను ‘వైద్యో నారాయణో హరి’ అంటూ గౌరవిస్తారు. అందుకే ఈ వృత్తికి సమాజంలో ప్రథమస్థానం ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలను డాక్టర్ కమ్మని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇతరుల ప్రాణాలు నిలిపే అవకాశం డాక్టర్ వృత్తికి మాత్రమే ఉండడంతోపాటు ప్రస్తుత సమాజంలో ఆశించే ధనం కూడా ఈ వృత్తిలో పుష్కలంగా లభిస్తుంది. గనుక వైద్య వృత్తికి అంతటి డిమాండ్ ఉంది. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా వైద్యుల సంఖ్య, మెడికల్ కళాశాలల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రకటించింది. ఈ ప్రణాళిక సాకారమైతే రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వైద్యుల కొరత ఉండదు. దేవ వైద్యుడు మానవులకే కాకుండా దేవతలకు కూడా వైద్యుడు ఉన్నాడు. ఆయనే ధన్వంతరి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో మూల విరాట్ ఎదురుగా గోడపై ధన్వంతరి కుడ్య శిల్పం ఉంది. పురాణాలు ఆయనను దేవతల వైద్యునిగా పేర్కొంటున్నాయి. అందుకే ఈ దేవాలయంలోని శివునికి వైద్య నాథుడు అని పేరొచ్చింది. ఒకప్పుడు దేవాలయాలే వైద్యాలయాలుగా కూడా సేవలు అందించేవి. చుట్టుపక్కలగల అడవుల్లో లభించే ఆకులు, గరుడు, వేర్లు తదితరాలను ఆలయాల అరుగులపై గుండ్రాళ్లతో మెత్తగా నూరేవారు. ఆ పసర్లతో స్థానికులకు వైద్యం చేసేవారని, అందుకు నిదర్శనంగా జిల్లాలోని పలు దేవాలయాల అరుగులపై నేటికీ మందులు నూరిన గుర్తుగా కల్వాలు (అరుగులపై మందును నూరిన గుర్తులు) కనిపిస్తాయి. పుష్పగిరిలోని వైద్య నాథస్వామి ఆలయానికి అప్పట్లో జిల్లా నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారని తెలుస్తోంది. చరిత్రలో జిల్లాను బ్రిటీషు వారు పాలించే రోజుల్లో కడప నగరంలో హకీం మంజుమియాకు మంచి వైద్యునిగా పేరుంది. యునాని వైద్యునిగా ఆయన ఎంతో విశిష్ఠత సాధించారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు వైద్యం పొందేందుకు ఆయన వద్దకు వచ్చేవారు. ప్రస్తుతం కడప నగరంలోని సిండికేట్బ్యాంకు ఉన్నచోట ఆయన వైద్యశాల ఉండేదని, పేదల వద్ద ఎలాంటి రుసుము తీసుకోకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారని తెలుస్తోంది. ఎందరో నవాబులు, రాజులు తమ సంస్థానానికి వస్తే పెద్ద ఎత్తున ధనం, గౌరవం ఇస్తామని ఆశ పెట్టినా ఆయన కడపలోని పేదలకు వైద్య సేవలు అందించాలని ఇక్కడే ఉండిపోయారు. ఆయన ప్రతిభ గురించి ఎన్నో విశేషమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రోగి స్వయంగా రాలేకపోయినా వారి తల వెంట్రుకగానీ, గోరుగానీ చూపితే వ్యాధి నిర్ధారణ చేసి రోగాలు నయం చేసేవారని ప్రచారంలో ఉంది. ముఖం చూసిన వెంటనే వ్యాధి ఏమిటో చెప్పగలిగే వారని కూడా ఆయనకు పేరుంది. డాక్టర్ల వీధి కడప నగరం క్రిస్టియన్లేన్కు డాక్టర్ల వీధిగా పేరుంది. దాదాపు వంద మీటర్ల పొడవు గల ఆ వీధిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నివాస గృహం లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుకు ఇరువైపుల దాదాపు అన్ని వైద్యశాలలే. అవిగాక స్కానింగ్ సెంటర్లు, ల్యాబోరేటరీలు, అడుగడుగునా మందుల దుకాణాలు ఉన్నాయి. తెలుగునాట ఇలాంటి వీధి మరేది లేదంటారు. -
స్వయం శిక్షణ
నేడు మారుతున్న కాలానికనుగుణంగా పురోభివృద్ధితో పాటు సమాజంలో పగ, వైరం, ద్వేషం, అసూయ, అల్పబుద్ధి, హింస పెరిగి పోతున్నాయి. నైతిక స్వభావంలో లోపం ఏర్పడడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అభ్యుదయాత్మకమైన మనోవైఖరి అలవరచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. నిశ్చయాత్మకంగా ఉండే లక్షణం అలవడినపుడు కష్టాలు ఎదురైనా మనస్సు అదుపు తప్పదు. ఈ క్రమంలో... పరిస్థితులకు భయపడని వాడు తనకు తాను మిత్రుడవుతాడు. స్వయంశిక్షణ అంటే తన ఆలోచనలను, తన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఒక వ్యక్తికి నిశ్చయాత్మకంగా ఆలోచించే శక్తినిస్తుంది. స్వయంశిక్షణ మనస్సును అన్ని రకాలైన బలహీనతల నుంచి రక్షించి జీవితానికి ఒక ప్రత్యేక విలువనూ, యోగ్యతనూ ఇస్తుంది. నైతిక ప్రమాణాలను విశ్వాసంతో క్రమబద్ధంగా అనుష్టించడం ద్వారా విశ్వాసం పెరిగి పరిణితి లభిస్తుంది. ఈ విశ్వాసం పెరగాలంటే క్రమశిక్షణ అనేది అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. క్రమశిక్షణ అనేది ఏదో కొన్ని విషయాలల్లో కాకుండా అన్నింటిలోనూ అలవరచుకోవాలి. ఒక ఇనుప కడ్డీని అయస్కాంతంగా మారిస్తే, అది దాని బరువు కన్నా 12 రెట్లు అధికంగా ఉన్న బరువును ఎత్తగలదు. అయితే అది దాని అయస్కాంత శక్తిని కోల్పోతే మాత్రం ఒక చిన్న గుండు సూదిని కూడా ఎత్తలేదు. మనిషి మనస్సు కూడా అంతే. నిశ్చయాత్మకంగా, నిర్మలంగా, నిలకడగా ఉంటే మనిషి పరిస్థితులను తన అ«ధీనంలో ఉంచుకుని అద్భుతాలు చెయ్యగలడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారందరికీ గుర్తింపు రావడానికి కారణం వ్యతిరేక భావాలను అధిగమించే శక్తి. నిశ్చయాత్మకంగా ఉండడమేనని, వారు తమ మనస్సును నిశ్చయాత్మక భావనలతో నింపి ఉంచడం వల్లనే ఆ స్థాయికి వెళ్ళారని అవగతం చేసుకోవాలి. మనిషి స్వప్రయత్నం తో తనను తాను ఉద్ధరించుకోవాలని, తనను తాను కించపరచుకోకుండా ఉండాలని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియ చేశాడు. మనిషి తనకు తానే శత్రువు, అలాగే, తనకు తానే మిత్రుడు కూడా. ప్రపంచం పట్ల, తమ పట్ల సానుకూలమైన, నిర్మాణాత్మకమైన, నిర్మలమైన స్నేహ వైఖరిని అలవరచుకుని తమకు తామే మిత్రులవ్వాలి. వ్యతిరేక భావాలతో వ్యతిరేక చర్యలు చేపట్టేవారికి బతుకు వ్యర్థం అవుతుంది. దీనికి మన నిత్య జీవితంలో కనిపించే చీమలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. తమను ఎవరైనా ఆపినా, లేక వాటి మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినా చీమలు ఆగవు. అడ్డంగా ఉన్న దాని మీదకు ఎక్కి దానిని దాటుతాయి. లేదంటే మరో మార్గంలో ముందుకు వెళతాయి. కానీ అవి ఆగవు. అంటే దీనివల్ల చేపట్టిన పని పూర్తయ్యే వరకు లక్ష్యాన్ని సాధించే వరకూ ఆగకూడదని నిగూఢం గా చీమలు మనకు తెలియ చేస్తున్నాయి. అలాగే, చీమలు వేసవి కాలంలో శీతాకాలం గురించే ఆలోచిస్తాయి. చలి కాలానికి కావల్సిన ఆహారాన్ని కూడా అవి వేసవిలోనూ సేకరిస్తాయి. అంతేకాదు రుతువుల్లోని మార్పులకు అవి అసంతృప్తి ప్రకటించవు. సముద్రపుటొడ్డున ఇసుకలో సూర్యరశ్మిలో ఆనందిస్తున్నట్టే, ఈత కొట్టడానికి దిగే ముందు సముద్రపు అడుగునుండే బండరాళ్ళ గురించి ఆలోచించాలి. అందువల్ల ఎప్పుడూ ఆచరణాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఆలోచించాలని తెలుసుకోవాలి. చీమ శీతాకాలం గురించి ఆలోచిస్తూనే, ఎంతోకాలం అది ఉండదని, త్వరలోనే దానినుంచి బయటపడతామని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎల్లపుడూ కష్టాల గురించి ఆలోచించకుండా నిశ్చయాత్మకంగా ఆలోచించాలి. ఎందుకంటే చీకటి తరువాత వెలుతురు కూడా వస్తుందని గుర్తెరిగి మసలుకోవాలి. జీవితం పట్ల ఆసక్తి, నిశ్చయాత్మక మనో వైఖ రుల వల్ల ప్రతిబంధకాలను సైతం అధిగమించవచ్చు. మానవ దేహాన్ని, మనస్సును కావల్సిన విధంగా మలచుకోవచ్చు. అంకిత భావం, క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసం, నిశ్చయాత్మక మనో వైఖరి, కష్టపడి పనిచేయడం అనేవి మానవ మేధకు ప్రోత్సాహానిస్తాయి. అలాగే, అపరాధ భావం, వైరం, విచారం లాంటి వ్యతిరేక భావాల్ని తొలగించుకుని ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత, స్వయంశిక్షణ లాంటి విశిష్ట గుణాలు అభివృద్ధి చేసుకుంటే జీవితం నందనవనం అవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ నమ్మశక్యం కానంతటి దక్షత, కౌశలం, దివ్యసంపద ఉన్నాయి. అయినా వాటిని చాలా మంది గుర్తించడం లేదు. అందువల్ల మన గురించి మనం స్వయంగా తెలుసుకోవడానికి మానసికంగా మనల్ని మనం శోధించి, పరిశీలించుకోవాలి. దీనివల్ల మనకు కీడు జరగదు. దీనికి కావల్సింది స్వయంశిక్షణ. గొప్ప పరిశోధనలూ, జీవితంలోని అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ విజయ సాధకులకూ వెనుక ఉన్న రహస్యం ఇదే. వారంతా స్వయం శిక్షణ అలవరచుకోవడమే. ఆరోగ్యకర ఆహారాన్ని స్వీకరించడం, యోగాసనాలు, తదితర వ్యాయామాల ద్వారా శారీరక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే జీవశక్తుల్ని ప్రాణాయామం ద్వారా నియంత్రించి శ్వాస పీల్చడంలో క్రమశిక్షణను అలవరచుకోవచ్చు. వ్యర్థ ప్రసంగాలతో కాలాన్ని, శక్తిని వృథా చేయకుండా మౌనంగా ఉండడం మాటలాడడంలో క్రమశిక్షణ ను తెలుపుతుంది. అలాగే గ్రంథపఠనం ద్వారా ఆలోచనలు, భావనలు పవిత్రం చేసుకోవడం ద్వారా భావనల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ప్రార్థనలు, తీవ్రమైన జప ధ్యానాలు చేయడం ద్వారా వివేచన కలిగి అంతర్గత స్వభావంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. దారంపోగు ఒక్కటిగా ఉన్నపుడు చాలా బలహీనంగా ఉంటుంది. అయితే అలాంటి ఎన్నో దారం పోగులను కలిపి తాడుగా పేనినట్లయితే ఆ తాడు ఏనుగును కూడా బంధించగలదు. అలాగే నిశ్చయాత్మకమైన భావనలు అనే బలవర్ధకమైన నియమిత ఆహారాన్ని మన మనస్సులలోకి ఎక్కించాలి. అప్పుడే మనం యోగ్యులుగా పరిణితి చెందుతాం. వ్యతిరేక భావనల్ని అధిగమించడంలో స్వయం శిక్షణ బాగా తోడ్పడుతుంది. కష్టాలను, ఆపదలనూ ఎదుర్కొనేందుకు దృఢమైన విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ప్రోది చేసుకోవడానికి క్రమ శిక్షణ ఆ క్రమశిక్షణ ద్వారా స్వీయ శిక్షణ అలవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే, మనలో పేరుకుపోయిన వ్యతిరేక భావాల్ని సహజమైన క్రమశిక్షణ ద్వారా తొలగించడం సాధ్యమేనన్న విషయాన్ని గుర్తించి మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్ -
Good Friday Special: వెలుగు పూలు పూయించిన కలువరి సిలువ
మానవాళి రక్షణ కోసం మహోన్నతుని సిలువ యాగం మరణ భయాన్ని పటాపంచలు చేసింది. సాతాను కోరలు చీల్చి వేసింది. అంధకార బంధురమైన జీవితాల్లో వెలుగు పూలు పూయించింది. నిరీక్షణ లేని జీవితాల్లో వెలుతురు కిరణాలు ఉదయింపజేసింది. కరుణామయుని శిలువ యాగం గెత్సెమనే తోట నుంచే ప్రారంభమయింది. శుక్రవారం సిలువకు అప్పగించకముందే గెత్సెమనే తోటలో తన రక్తం స్వేదబిందువులుగా మారే వరకూ ప్రార్థనలో గడిపాడు. లోక పాపాన్నంతా తన వీపుపైన మోసేందుకు సిద్ధమయ్యాడు. ఓ తరుణంలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నానుండి తొలగించమని ప్రార్థించినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకే సిద్ధమయ్యాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకే ఏర్పాటు చేసిన మార్గం సిలువ మార్గం. ఒకవైపు గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థిస్తూ మానవ సాయం కోసం తన శిష్యుల వైపు చూశాడు. శోధనలో పడకుండా మెళకువగా వుండి ప్రార్థించండి అని చెప్పినా వారు నిద్రమత్తులై ఉన్నారు. అప్పుడే తాను ప్రేమించిన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా క్రీస్తు సిలువలో ప్రధాన పాత్రధారిగా మారి 30 వెండి నాణెములకు క్రీస్తును అప్పగించేందుకు మత పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని గెత్సెమనేలో ముద్దుపెట్టుకొని మరీ యేసును అప్పగించాడు. యేసును ఒక బందిపోటు దొంగమీదికి వచ్చినట్లు కత్తులతో వచ్చిన వారిని చూసి కనికరపడ్డాడు తప్ప ఒక్క మాటయినను పలుకలేదు. తన శిష్యులు తనను వదిలి పారిపోగా ఒంటరియైన యేసు ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకువచ్చి వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఇష్టము వచ్చినట్టు గుద్దారు. మరికొంతమంది అర చేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని హేళన చేశారు. ‘తన ప్రియ కుమారుని నలుగగొట్టడానికి ఆ దేవాది దేవునికి ఇష్టమాయెను’ అన్న లేఖనాలు ఈ విధంగా నెరవేరాయి. ఉదయం యేసును బంధించి అధిపతియైన పొంతి పిలాతుకు క్రీస్తును అప్పచెప్పారు. చివరకు అన్యాయపు తీర్పే గెలిచింది. యూదా మత పెద్దలకు భయపడి పొంతి పిలాతు యేసును సిలువకు అప్పగించాడు. వారు యేసును గొల్గొతా కొండకు తీసుకు వచ్చి చేతులు, కాళ్ళలో శీలలు కొట్టి సిలువకు వేలాడదీశారు. ఇరు పక్కల ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు. ‘‘దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కడతానన్నావుగా చేతనైతే నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా’’ అంటూ దూషిస్తూ ‘‘వీడు ఇతరులను రక్షించెను గానీ తన్ను తాను రక్షించుకోలేడంటూ’’ అపహాస్యం ఒకపక్క, రోమా సైనికుల కాఠిన్యం మరోపక్క యేసును బాధపెట్టినా తన తండ్రి మానవుల రక్షణ కొరకు తలపెట్టిన బలియాగంలో తాను సమి«ధగా మిగిలి పోవడానికే సిద్ధపడ్డాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సిలువ మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ వేడికి తాళలేక యేసు మూర్ఛబోయాడు. దాహం అని అడుగగా చేదు చిరకను అందించారు. కొరడాలతో, మేకులతో ఒళ్ళంతా రక్తం ధారలుగా కారుతుండగా చనిపోయాడో లేదోనని పక్కలో బల్లెంతో పొడిచారు. ఆ సమయంలో యేసు మాటలాడిన ఏడు మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తనను హింసిస్తున్న వారిని చూసి యేసు ప్రభువు ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’మంటూ చేసిన ప్రార్థన నభూతో న భవిష్యతిగా చెప్పుకుంటారు. మనలను హింసించే వారి కోసం ప్రార్థించాలి అన్న యేసు సిలువలో తనను చంపుతున్న వారి కోసం చేసిన ప్రార్థన అది సాధ్యమే అని నిరూపించాడు. తనతోపాటు సిలువ వేయబడిన కుడివైపు దొంగ, ‘ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోవాలి’ అంటే ఆ క్షణంలో రక్షణను అనుగ్రహించి నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయమొసంగిన జాలిగల ప్రభువు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఎటువంటి వారికైనా రక్షణ భాగ్యం దొరుకుతుందన్న ఆశావాదాన్ని కలిగించాడు. క్రీస్తు సిలువ మార్గం, ముక్తి మార్గం పాపంలో నశించిపోతున్న మానవాళి ముక్తి కొరకు ఒక మంచి గొర్రెల కాపరిగా తాను ప్రేమించి గొర్రెల కోసం తన ప్రాణాన్ని కలువరిపై ధారపోసి మరణ భయంతో ఉన్నవారికి నిత్యజీవం అనే వెలుగును ప్రసాదించాడు క్రీస్తు.. రెండు వేల సంవత్సరాలైనా ఆ వెలుగు పూలు అందరి మదిలో వెలుగుతూనే ఉన్నాయి. – బ్రదర్ బందెల స్టెర్జిరాజన్ -
ఆ స్ఫూర్తిని మర్చిపోతున్నామా?
చరిత్రలోని అతి గొప్ప సంఘటనలన్నీ మౌనంలోంచే పుట్టుకొచ్చాయి. తిరిగి అవి నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోతున్నాయి. ఒక శతాబ్దం క్రితం అంటే 1920–21లో జరిగిన, చరిత్రను మలుపుతిప్పిన అనేక ఘటనలను ఈ 2021 ఆగస్ట్ నెల మళ్లీ అందరికీ గుర్తు చేస్తోంది. భారతీయ చరిత్రలోని ఆ విశిష్ట దశ అనేక ఘటనల కూర్పుతో నిండి ఉంది. వీటిలో కొన్నింటికి ఈనాటికీ ప్రాధాన్యం ఉండగా, మరికొన్ని తమ విశిష్టతను కోల్పోతున్నాయి. పైగా ఒక వైవిధ్యపూరితమైన సమాజంగా మనుగడ సాధించడం అనే భావనకు ఇప్పటికీ దేశం పూర్తిగా సిద్ధం కాలేదు. అదే సంవత్సరం జమ్షెడ్పూర్లో టాటా స్టీల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ స్థాపన భారతీయ పారిశ్రామిక నగరీకరణ శకం ప్రారంభాన్ని నిర్వచించింది. నాగరికతా సంస్కృతికి ఉక్కు వెన్నెముకగా ఉంటూ వస్తోంది. 1921లో కోహినూర్ ఫిల్మ్ కంపెనీ కోసం కనాజీభాయ్ రాథోడ్ తీసిన భక్త విదుర్ సినిమాపై నిషేధం ఎంత గొప్ప జ్ఞాపకంగా ఉంటోందో.. అదేరకంగా బాబూరావ్ పెయింటర్ తీసిన సురేఖా హరణ్ సినిమాలో వి. శాంతారాం కీలక పాత్ర పోషిస్తూ నటనా జీవితంలోకి అడుగుపెట్టడం కూడా మర్చిపోని జ్ఞాపకమే.. జాతి అనే చారిత్రక ఆకాంక్షకు ప్రాతినిధ్యం వహించడంలో, భారత్ అనే సామూహిక భావనలోంచి పుట్టుకొచ్చిన సెల్యులాయిడ్ స్వప్నాలను దేని తోనూ పోల్చి చూడలేం. జాతీయ ఆకాంక్షను ముందుకు తీసుకుపోవడానికి రెండు మూకీ చిత్రాలు కూడా ఆ సంవత్సరమే ప్రారంభమయ్యాయి. ఈ రెండు సినిమాలు ఏకకాలంలోనే దేశాన్ని అటు కాల్ప నికత వైపు, ఆధునికతవైపు తీసుకుపోయాయి. వీటికి మించిన గొప్ప ఘటన డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ తీసుకొచ్చిన ‘మూక్నాయక్’ పత్రిక. ప్రగతిశీలుడైన కొల్హాపూర్ రాజు సాహు అందించిన ఆర్థిక సహాయంతో ఈ ప్రచురణ వెలుగులోకి వచ్చింది. దళితులు రాసిన కథనాలను ప్రచురించడానికి ఆనాడు ప్రముఖ దినపత్రికలు ఏవీ సుముఖత చూపకపోవడంతో మూక్ నాయక్ ఒక ప్రత్యామ్నాయ మీడియాగా వచ్చింది. ఇది కొద్దికాలం మాత్రమే నడిచినా, అణగారిన వర్గాల హక్కుల పోరాటానికి ఇది నాంది పలికింది. నిశ్శబ్దంగా మొదలైన మరొక మూడు ఘటనలను కూడా ఈ సందర్భంగా పేర్కొనాలి. పరివర్తనా స్థలంగా ఆశ్రమ జీవితం అనే ప్రాచీన భారతీయ భావనను ఇవి వెలుగులోకి తీసుకొచ్చాయి. వేదకాలపు రుషులను మళ్లీ గుర్తుకు తెచ్చే ఈ ముగ్గురు విశిష్ట వ్యక్తులను ప్రపంచం గురుదేవ్, మహాత్మా, మహర్షి అని గుర్తించింది. వారు ఎవరో కాదు. రవీంద్రనాథ్ టాగూర్ (1861–1941), ఎం.కె. గాంధీ (1869–1947), అరబిందో ఘోష్ (1872–1950). వీరిలో చిన్నవాడు ఘోష్. 1947కి 75 సంవత్సరాల ముందు జన్మించిన ఘోష్ బెంగాల్ విభజన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో రాజద్రోహ ఆరోపణలకు గురై సంవత్సరం పాటు జైలుశిక్షను అనుభవించారు. అనంతరం భారతీయ తత్వశాస్త్రంలోని పలు ప్రాపంచిక దృక్పథాలను పునర్నిర్వచిం చడం వైపుగా తన శక్తియుక్తులను మళ్లించారు. పాండిచ్చేరికి తరలి వెళ్లాక, సంప్రదాయాలకు కొత్త భాష్యం చెబుతూ అసమాన శక్తితో వ్యాసాలు రాశారు. ఉనికిలో ఉన్న ప్రతి సంప్రదాయాన్ని ప్రశ్నిస్తూ అతిగొప్ప తాత్విక రచనలను సృష్టిం చారు. ఆయన వ్యాసాలు తొలుత తాను ప్రారంభించిన ‘ఆర్య’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ది డివైన్ లైఫ్, ది సింథసిస్ ఆఫ్ యోగా, ఎస్సేస్ ఆన్ ది గీతా, ది సీక్రెట్స్ ఆఫ్ ది వేదా, హైమ్స్ టు ది మిస్టిక్ ఫైర్, ది రినైజాన్స్ ఆఫ్ ఇండియా, ది హ్యూమన్ సైకిల్ అండ్ ఫ్యూచర్ పోయెట్రీ వంటి పుస్తకాలు రాసి ప్రచురించారు. తన తాత్విక రచనా కృషి అద్భుతంగా కొనసాగుతుండగా 1920లో ఘోష్, ఆర్య పత్రిక ప్రచురణను నిలిపివేశారు. ఉత్కృష్టమైన ధ్యాన యోగ మహాకావ్యం ‘సావిత్రి’పై కేంద్రీకరించేందుకు తన రచనా కృషిని మొత్తంగా నిలిపివేశారు. తర్వాత మూడు దశాబ్దాల తన జీవితాన్ని మానవ జాతి మహా పరివర్తన కోసం, తన యోగ కృషి ద్వారా భూమ్మీదికి అత్యున్నత చైతన్యాన్ని తీసుకు రావడానికి అంకితం చేశారు. ఈ త్రిమూర్తులలో పెద్దవాడైన రవీంద్రనాథ్ టాగూర్ 1921 నాటికి నోబెల్ అవార్డు కూడా పొందారు. ప్రపంచమంతటా రుషిలాగా కీర్తిపొందిన టాగూర్ 1921లోనే విశ్వభారతి విద్యా సంస్థను ప్రారంభించారు. విశ్వమానవ భావనను పెంపొందించే లక్ష్యంతో నేర్చుకునే, సృజనాత్మక కృషిని సాగించే మౌలిక సంస్థ విశ్వభారతి. ఘోష్ లాగే టాగూర్ కూడా ఒక వర్గం మనుషులకోసం, ఒకే జాతి కోసం కాకుండా యావత్ ప్రపంచాన్ని పరిరక్షించేందుకోసం జీవి తాన్నే ప్రయోగశాలగా మార్చుకున్నారు. అయితే గాంధీ ప్రయత్నిం చిన ఆత్మ పరివర్తన మరింత మౌలికమైనది. 1920 ఆగస్టులో తిలక్ మృతితో లాల్ బాల్ పాల్ (లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్) శకం ముగిసిపోయింది. ఆ శూన్యంలోకి ఎం.కె. గాంధీ ఒక శతఘ్నిలా దూసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి కాంగ్రెస్లోని వేరువేరు బృందాలను ఒకటి చేశారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులను భాగం చేసి సేవా దళ్ ఏర్పర్చి జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో యువతకు ప్రేరణగా నిలిచారు. 1920 అక్టోబర్లో గాంధీ గుజరాత్ విద్యాపీఠాన్ని నెలకొల్పారు. ఇది కమ్యూనిటీ శ్రమజీవుల విశ్వవిద్యాలయం. ఇక 1921 డిసెంబర్లో కలకత్తా సమావేశాల్లో కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతను చేపట్టారు. తర్వాత జరిగిందంతా చరిత్రే. భారత్లో గాంధీ ఆశ్రమం తొలి సంవత్సరాలు సాదాసీదాగా మొదలయ్యాయి. ప్రారంభంలో కొచార్బ్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పర్చారు. తర్వాత అహ్మదాబాద్ నగరానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డుకు దాన్ని మార్చారు. మొదట్లో దీనికి సత్యాగ్రహ ఆశ్రమం అని పేరు పెట్టారు. నది ఒడ్డున ఏర్పర్చిన ఈ ఆశ్రమం తర్వాత సబర్మతి ఆశ్రమంగా పేరొందింది. ఒక దశాబ్దం తర్వాత దండికి మహాత్ముడు తలపెట్టిన పాదయాత్ర బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదలించివేసింది. సబర్మతి ఆశ్రమ వాతావరణం, అక్కడ పాటించిన సిద్ధాంతాలు, నిరాడంబరత్వానికి మహా త్ముడి జీవితమే కీలక శక్తిగా పనిచేసింది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నా లేదా విస్మరించినా సరే ఈ మూడు ఆశ్రమాల విశిష్ట గాథలు భారత చరిత్రలోనే అత్యంత కీలక అంశాలుగా ఉంటున్నాయి. అయితే 2021లో సబర్మతి ఆశ్రమాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా మార్చడం రూపంలో అది పెను ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. దీని కోసం ప్రభుత్వం రూ. 1200 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో వివాదాస్పదమైన సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని చేపట్టిన సంస్థే సబర్మతి ఆశ్రమ శిబిరాన్ని ఆధునీకరించే బాధ్యతలు చేపట్టింది. గాంధీ అసాధారణమైన నిరాడంబరత్వం ద్వారానే ప్రపంచంలోనే అత్యంత విశిష్టమూర్తిగా నిలిచి ఉంటున్నారు. ఆయన నిర్మించిన ఆశ్రమం వద్ద ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన వీఐపీ గెస్ట్ హౌస్, ఆడిటోరియం వంటివి గాంధీని, ఆయన నిరాడంబరత్వాన్ని మనం మర్చిపోయేలా చేస్తాయి. సబర్మతి ఆశ్రమ ఆధునీకరణ పథకాలు గాంధీ ఆదర్శాలను గుర్తుకు తీసుకురావడం కాకుండా వాటిని అందరూ మర్చిపోయేలా చేస్తున్నాయి. మన స్వాతంత్య్ర పోరాటాన్ని, టాగూర్ ప్రవచించిన బౌద్ధిక స్వాతంత్య్రాన్ని, అరబిందో ఘోష్ దార్శనికత ప్రబోధించిన ఆధ్యాత్మిక స్వాతంత్య్రాన్ని మొత్తంగా మర్చిపోవాలంటూ తన సమాచార ఫ్యాక్టరీల ద్వారా మనకు చెప్పడంలో క్షణం తీరిక లేకుండా ఉంటున్న ప్రస్తుత పాలనా వ్యవస్థ నుంచి ఇంతకు మించి మనం ఆశించేది ఏమీ ఉండదు. జీఎన్ డెవీ వ్యాసకర్త సాహితీ విమర్శకుడు, సాంస్కృతిక కార్యకర్త -
మనిషి మనీషిగా మారాలంటే..?
►నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత? ►నడత మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఆ సంపద నివ్వటంలో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది. ►ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం , అసహాయులు, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. నిషి పక్షిలా ఆకాశంలో ఎగరగలడు, నీటి అడుగునా ఈదగలడు. భూమిని తొలిచే శక్తి ఉన్నవాడు. భూమి మీద నడవగలిగితే ఈ రోజు ప్రపంచమే స్వర్గమవుతుంది’ అన్నాడు టామి డగ్లస్ అనే కెనడా దేశపు తత్వవేత్త.ఎంత అర్థవంతమైన మాటలు! ఎంత లోతుగా ఆలోచింపచేస్తున్నాయి!! చిత్తశుద్ధితో ఆత్మశోధన చేసుకోమనటం లేదూ!!! మనిషి శక్తి సామర్థ్యాలను, మనిషికున్న పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి ఈ మాటలు.తమ ప్రవర్తనను పరిశీలించుకుని, మదింపు చేసుకుని దానిలోని మంచి చెడులను తెలుసుకుని చెడును పరిహరించుకోవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. మనిషి విస్మరిస్తున్న బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. మనిషి మనిషిగా ఉండటం చాలా కష్టమన్న ఓ కవి మాటల్ని రుజువు చేస్తున్నాయి. ఆ విషయాన్ని సుస్పష్టం చేస్తూ మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తున్నాయి. ఇక్కడ నడవడమంటే మనిషి నడుచుకునే తీరు అని అర్ధం. అంటే ప్రవర్తన. దీనిలో అనేక అంశాలు... మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి, నలుగురిలో మసలే తీరు, ఎదుటి వారి గురించి మనం చేసే ఆలోచనలు, సభ లో మనం నడుచుకునే విధానం, వివాహాది సందర్భాలలో మనముండే పద్ధతి... ఇమిడి ఉన్నాయి. మన ముఖకవళికలు, కనుబొమ ల కదలికలు, నేత్రద్వయ విన్యాసం, కరచరణాల అభినయం మన ఆలోచనా పోకడకు, మనసుకు చిత్తరువులవుతాయి. ఇవే మన నడతకు భాష్యం చెపుతాయి. మన వ్యక్తిత్వాన్ని ఇతరులకు స్ఫురింపచేస్తాయి. మనకు సమా జంలో ఒకగౌరవాన్ని, హుందాతనాన్ని తేవచ్చు లేదా అవి పోయేటట్టు చెయ్యచ్చు. మనలోని భావోద్వేగాలు అక్షరాకృతిని పొంది శబ్దరూపం దాల్చటానికి ముందే మన హావభావాలు, ఆంగికవిన్యాసం మన నడవడిని ఎదుటివారికి చూపిస్తాయి. మనమేమిటో చెప్పేస్తాయి. మనం ఒకరిని నోరారా ప్రేమతో పిలిచినా, ఆ పిలుపు అదే భావనలో వారికి చేరాలంటే వాటికి హావభావాలు తోడవ్వాలి. అప్పుడే వాటి మధ్య ఒక సమన్వయం ఏర్పడుతుంది. లేకపోతే, నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించటమే అవుతుంది. ఇదీ ప్రవర్తనలో అంతర్భాగమే. అందుకనే మన మాటలను, వాటిని ముందుగానే సూచించే శారీరక సంకేతాలమీద, ముద్రల మీద కూడ మనకు నియంత్రణ కావాలి. అది కష్టసాధ్యమే కాని, అసాధ్యమేమి కాదు. అపుడే ఇతరులను నొప్పించకుండా మనగలం. దీనికోసం ప్రయత్నం చేయాలి. మన మాటలతో కాని, చేతలతో కాని ఎదుటివారిని బాధ పెట్టకూడదు. ‘ఒరులేయవి యొనరించిన...’ అన్న శ్లోక సారాంశమిదే. ఇటువంటి వర్తనను అలవరుచుకోగలిగితే మన సంబంధ బాంధవ్యాలు హాయిగా, ఆనందంగా సాగిపోతాయి.నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత?మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోది చేస్తుంది. ఆ సంపద నివ్వటం లో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది.ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం, అసహాయుల, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. వీటిని గొప్ప విషయాలుగా భావిస్తాం. వీటి గురించి చర్చించడం వల్ల ఉపయోగమే లేదు. ఈ అంతర్గత శక్తులు లేదా సుగుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఆచరించగలగాలి. అంటే త్రికరణ శుద్ధి అవసరం. అలా ఆచరించిన వారినే శీలసంపన్నులంటాం. కొన్ని వేలమాటలకు దక్కని ఫలితం, విలువ ఆచరణ వల్ల వస్తుంది. అపుడే ఆ సుగుణాలు మరింతగా శోభిస్తాయి. మనిషికి మంచి నడత చాలా ముఖ్యం. అందుకే అది అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వంటపదార్ధపు రుచి దాని గురించి ఎంతగా మాట్లాడినా, వివరించినా తెలియదు. దాన్ని రుచి చూసినపుడే తెలుస్తుంది. అదే బోధనకు, ఆచరణకు ఉన్న భేదం. అటువంటి వారినే సమాజం గౌరవిస్తుంది. వారే ఆదర్శప్రాయులు. ప్రాతః స్మరణీయులు. వారే మార్గదర్శకులు అవుతారు. మంచి నడత గలవారి మాటలకు ఎనలేని శక్తి వస్తుంది. వారే ఎందరినో ప్రభావితం చెయ్యగలరు. సన్మార్గం చూపించగలరు.టామి డగ్లస్ చెప్పిన మాటల సారమిదే. మనిషి తనలోని శక్తులను మేల్కొలపాలి. నడతకున్న ప్రాముఖ్యతను గుర్తెరగాలి. అదే తనను మంచి మార్గంలో నడిపించగల శక్తి అని తెలుసుకోవాలి. మనిషిని మనీషిగా మార్చే శక్తి నడతే. అపుడు అందరిలోనూ, అంతటా ఆనందమే. – బొడ్డపాటి చంద్రశేఖర్ ఆంగ్లోపన్యాసకులు -
మానవీయ సమాజం కోసమే... ‘ఆద్యకళ’
కళ నేటి మనిషికి విశ్రాంతే కాదు, నిన్నటి మానవుడి చరిత్ర కూడా. చరిత్ర పట్ల ఆసక్తిలేని భారతీయులకు కళల చరిత్ర గురించి ఆసక్తి లేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, భిన్న సమాజాలు సహజీవనం చేసే దేశంలో సమతను సాధించా లంటే భిన్నత్వాన్ని కాపాడుకోవాలి. ఆధిపత్య వర్గాల వెలి వేతకు, పీడనకు గురవుతున్న బాధిత సమూహాల సాంస్కృతిక జీవనం చరిత్ర పొడవునా ధ్వంసమైంది. రాజాస్థానాలను ఆశ్రయించి, మతం నీడలో బతికిన కళలకు నేటికీ అదే ఆదరణ దక్కుతోంది. కానీ, ఉత్పత్తి కులాల కళలు కొన్ని శతాబ్దాలు బతికి బట్టకట్టినా ఇక బతికే పరిస్థితులు లేవు. ఉత్పత్తిలో భాగమైన మనిషి పనిముట్లను ఎట్లా సృష్టిం చాడో అట్లనే ఉత్పత్తి సంబంధాల్లోని ప్రేమానురాగాల్ని చాటు కోవడానికి అనురాగాల పల్లవి అల్లుకున్నాడు. ఆ పల్లవికి రాగాలు పలికే నాదాలు తయారు చేసిండు. పాటతోపాటే ఆటలోకీ అడుగుపెట్టిన మనిషి తాళగతులను నేర్చాడు. చరిత్రలో మానవ సమూహాలు ఎన్ని దారులగుండా నడిచొ చ్చాయో అన్ని వాద్యాలను మోసుకుంటూ ఇక్కడికి వచ్చాయి. ఆ తాళగతులు మనిషి ఆత్మను ప్రతిబింబిస్తే, ఆ కాలపు సమూహాల చరిత్రను వాద్యాలు గుర్తుచేస్తాయి. విశ్వకర్మలు వెయ్యేళ్ల కిందనే ‘రుంజ’ను గఢగఢ మోగించినట్లు సాహిత్య చరిత్ర చెబుతోంది. నాయకపోడు ఆదివాసీల ‘మూగడోలు’, బైండ్లవారు వాయించే ‘జమిడిక’, రాజన్నలు వాయించే ‘చామల్లాలి’, డమడమ మోగే మాదిగ ‘డప్పు’, ఆఫ్రికానుంచి వలసొచ్చిన సిద్దీల ‘మర్ఫా’, కోయల డోలు, చెంచుల ‘జేగంటలు’, గొత్తికోయ మహిళల ‘గుజ్జిడి మొగ్గలు’ సంగీ తంలోని వైవిధ్యాన్నే కాదు, సామాజిక కూర్పులోని వైవిధ్యాన్ని ఎరుకజేస్తాయి. ఈ కళలు మానవ సమాజ వికాసాన్ని చెప్పే పాఠాలు. జానపదుల కళలు అంతరించడమంటే మనిషి అంత రించిపోవడమే. దేవర కొలుపు, పెండ్లి, చావు, సమావేశం డప్పు మోగకుండా మొదలుకాలేదు. యుద్ధబేరీలు మోగించిన చరిత్ర సంగీతానిది. ఉత్పత్తి సంబంధాలు బలహీనపడిన ప్పుడు మానవ సంబంధాలు యాంత్రికమయ్యాయి. ఆ యాంత్రికతలో ఆటపాటలు తగ్గిపోయాయి. సంగీత వాయి ద్యాల అవసరమూ పోయింది. రాజాస్థానాలకు చేరి జావళీలు పాడిన కళలు ఎట్లా బతికాయో ఇప్పుడు సబ్బండ కులాల కళలు కూడా సాంస్కృతిక సారథుల పోషణలో బతుకు తున్నాయి. కానీ, అవి ఉత్పత్తి సంబంధాల్లోని ఆర్తిని వదిలేసి, పాటల పల్లకీలో ప్రభువుల్ని మోస్తున్నాయి. చరిత్రను కూడా ఒక పావుగా వాడుకునే చాతుర్యం ఉన్న పాలకుల పాలనలో ఉన్నాం. కాకతీయుల్ని కమ్మవారిలో కలిపే యమని కోరిన పాలకుడికి లొంగని పండితుడు వాస్తవ చరిత్రను నిలబెట్టినట్టే, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించే వారంతా జానపదుల సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటాలి. ‘‘నెత్తురుమండే, శక్తులు నిండే యువకుల్లారా రారండి’ అన్న పిలుపులు పోయి, మార్కుల కోసం, ర్యాంకుల కోసం వ్యక్తిత్వాలను త్యాగం చేయమంటోంది. మనం చూసున్న నేరాలన్నీ యాంత్రిక జీవనం, మార్కెట్ మనస్త త్వాలు పెంచిన సంకుచిత భావాల ఫలితమే. కాలాన్ని బట్టి బతుకుదెరువుని వెదుక్కునే సంచారుల బతుకు దారితప్పింది. ఆ కళలను కాపాడ లేకున్నా వాటి చరిత్రనైనా కాపాడుకుందాం. పంట లాభాలు ఇవ్వకపోయినా, మరో పంటకు విత్తనాలు పండితే మళ్లీ ఎవుసం చేయాలంటాడు రైతు. ఉత్పత్తి కులాల కళాకారులను తయారు చేయకున్నా విత్తనాల్లాంటి ఆ కళల వాయిద్యాలు పరిరక్షించుకుందామని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంటున్నాడు. రేపటి సేద్యం కోసం జయధీర్ జానపదుల వాయిద్యాలను విత్తనాల్లా పదిలం చేసిండు. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆయన సేకరిం చిన కళాఖండాలన్నిటినీ హైదరాబాద్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనకు ఉంచింది. మన తాతలు రాగాలు పలికించిన ఊదు వాద్యాలు, కొలుపులో మోగిన డప్పులు, పెళ్లిలో పలికిన సన్నాయిలు... ఎన్నెన్నో ఇందులో కొలువుదీర్చారు. సంగీతంతోపాటే వికసిం చిన లిపిని కూడా ఆయన పదిలం చేసే ప్రయత్నం చేసిండు. తొలి శతాబ్దాల నుంచి ఆధునిక కాలం వరకు లిపి పరిణా మాన్ని చెప్పే ఎముకలు, తోలు, తాళప్రతులు, వస్త్రాలు, దస్తావేజులను సేకరించిండు. నలభై ఏళ్లపాటు భద్రపరిచిన ఆ చారిత్రక భాండాగారాన్ని చూద్దాం రమ్మని ‘ఆద్యకళ’ ప్రదర్శ నకు ఆహ్వానిస్తున్నారు. నేడు (1 ఆగస్టు 2021న ఉదయం 11 గంటలకు) ప్రారంభమవుతున్న ఈ ప్రదర్శన కళలకు దూర మైన తరాన్ని మేల్కొలిపి, రేపటికి కొత్తదారులు వేస్తుందని ఆశిద్దాం. పదండి, జయధీర్ చెప్పే ప్రాచీన మానవుడి ‘తొవ్వ ముచ్చట్లు’ వింటూ కొత్తదారిలోకి నడుద్దాం. – నాగవర్ధన్ రాయల జర్నలిస్ట్ -
నవ కవితా యుగ ప్రవర్తకుడు
మహాకవి జాషువా ఆధునిక కవితా యుగ ప్రవర్తకుడు. కవిత్వంలో నూత్నప్రత్యామ్నాయ ఆవిష్కరణలు చేసిన ప్రయోక్త. సామాజిక జీవితం లోని వైవిధ్యాలకు అద్దం పట్టిన చిత్ర కారుడు. అస్పృశ్యతా భారతంలోని వేదనను అక్షరదృశ్యాలు చేసి, ఆకాశ నక్షత్రాలుగా వెలిగించిన సృష్టికర్త. గతించి అర్ధ శతాబ్ది అయినా కవికి మరణం లేదని నిరూపించిన పునరుజ్జీవుడు. వస్తువు ఏదైనా శృతిహితంగా తెలుగు నుడికారపు సొగసుతో చెప్పగలిగిన ధీశాలి. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయే. సుకవి మర ణించె ఒక తార గగనమెక్కే’; ‘రాజు జీవించు రాతి విగ్రహ ములయందు. సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని చెప్పిన జాషువా ప్రజల నాల్కల మీద నర్తిస్తున్నాడు. ఆయన రచించిన ‘గబ్బిలం’ నాకు లండన్ మ్యూజియం లైబ్రరీలో సాక్షాత్కరించింది. వినుకొండ నుండి గుంటూరుకు, గుంటూరు నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి లండన్కు ఎగబాకిన విశ్వకవి జాషువా. ‘గబ్బిలం’ తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలకు ప్రత్యామ్నాయ కావ్యంగా మలచబడింది. ‘చిక్కిన కాసుచే తనివి చెందు అమాయ కుడు’ ఆయన నాయకుడు. గబ్బిలం అనే నామకరణం ద్వారా అస్పృశ్య జీవుని గురించే కాదు, అస్పృశ్యమైన పక్షుల గురించి కూడా ఆయన గానం చేశాడు. ఆయన కవితా ఖండి కల్లో ‘శ్మశానవాటిక’ అద్భుతమైంది. అందులో దళిత తాత్త్విక వాదాన్ని ప్రవేశపెట్టాడు. ‘ఏలే బుగ్గల సౌరు రూపరి యెనో యేముద్దు నిద్రించేనో! యేలీలావతి గర్భ గోళమున వహ్నిజ్వాల జీవించెనో’ అంటూ సాగిన కవితలో దళితవాడ తత్త్వం ఉంది. ఒక గాఢమైన సామాజిక ప్రపంచం ఉంది. జాషువా కవితలో ఒక సత్యం కళతో మమేకమై ఉంటుంది. ‘ఎన్నో యేండ్లు గతించి పోయినవి గానీ’; ‘కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొక్కడైనన్ లేచిరాడు; ‘ఎన్నాళ్లీ చల నంబు లేని శయనంబు’; ‘ఏ తల్లులల్లాడిరో’; ‘కన్నీ టంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్’; పద్యాన్ని వేదనా ప్రకటనకు, జ్వలిత చైతన్య విస్ఫోటనకు, సమస మాజ నిర్మాణోద్యమ సారథ్యానికి ప్రబలవాహికగా మలుచు కున్న క్రాంతదర్శి జాషువా అనుటలో అత్యుక్తి లేదు. ‘చల నంబులేని శయనంబు’ వంటి చిన్నచిన్న పదబంధాలు గుండెను తొలిచివేస్తాయి. మానవ వాక్కులకందతగిన ఆనం దకరమైనట్టియు, రసస్ఫోరకమైనట్టి, నిర్దుష్టమైనట్టి రచనా శిల్పమే కవిత్వం అన్న ఆంగ్ల విమర్శకుని వ్యాఖ్యానంలోని శిల్పం జాషువా కవిత్వంలో భాసిస్తుంది. కరుణరసప్లావి తమైనపుడు ఏమాత్రం హృదయ స్పందన ఉన్నవాణ్ణి కూడా అంతర్ముఖుణ్ణి చేయగల శక్తి ఆయన కవితకున్నది. జాషువా కవిత్వంలో కులతత్వ నిరసన ప్రధానాంశం. ఆయన ముందు ప్రకృతిని పరిశీలించారు. అందులో అసమానతలు లేవు. మనుషుల్లో అసమానతలు ఎక్కువ. ఇవన్నీ కల్పించుకున్నవే. కొందరు కేవలం ప్రకృతి కవులు. మరికొందరు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో ఉన్న సహజ జీవిత గుణాలను మానవులకు ఉత్తేజంగొల్పే దిశగా వర్ణించడం ఉన్నత కవుల లక్షణం. ఆ ఔన్నత్యమే జాషు వాను మహాకవిని చేసింది. ‘ముసలివాడైన బ్రహ్మకు బుట్టి నారు నలువురు కుమారులనుట విన్నాము గాని, పసర మున కన్న హీనుడభాగ్యుడైన ఐదవ కులస్థుడె వ్వరమ్మా! సావిత్రీ?’ ఈ మాటలు కలంలోనుంచి వచ్చినవి గానీ, గళంలోనుంచి జారినవి గానీ కాదు; ఇవి గుండె రాపిడిలో నుంచి లేచిన నిప్పురవ్వలు. ‘అసమ సమాజం బాకులు గుమ్మినపుడు, అంటరానితనం నిషాగ్నులు చిమ్మిన పుడు, దుర్భర దారిద్య్రం వెన్నుడికినపుడు, దురంత వేదన గుండె లలో తుక తుక ఉడికినపుడు’ పెల్లుబికిన ప్రశ్నల వెల్లువ. భారతమ్మోరిని, భారతీయుల్ని నిలదీసి అడుగు తుంది జాషువా కవిత. ఆయన నిజజీవితంలో కూడా కరుణార్ద్ర హృదయుడు. కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచేవారు. పక్షులకు గింజలేసి ఆదరించేవారు. ఆయన నివసించిన వినుకొండ రామణీ యకమైన ప్రదేశం. ఒక పక్క కొండ, మరో పక్క నది, ఇంకో పక్క అడవి, మరో పక్క ఊరు–వాడ. ఆ ప్రదేశాన్ని చూసిన ప్పుడే కవిత్వమొస్తుంది. తండ్రి వీరయ్య యాదవులు. తల్లి లింగమాంబ దళిత స్త్రీ. తలిదండ్రులిద్దరూ వర్ణాంతర వివా హాన్ని ఆ రోజుల్లోనే ధైర్యంగా చేసుకున్నారు. తండ్రి క్రైస్తవ ఫాదర్. తల్లి ప్రేమమూర్తి. తండ్రిలోని గొల్ల సుద్దుల శ్రుతి వచ్చింది. బైబిల్లోని శాంతి, కరుణ, ప్రేమ కవిత్వంలో ప్రవ హించింది. వీరి ‘క్రీస్తుచరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి కావ్యాల్లో ‘ఫిరదౌసి’ అత్యుత్తమ మైనది. మోసపోయిన కవి ఆవేదనను దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. జాషువా మతమౌఢ్యాన్ని నిరసించారు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశ యించు’; ‘వారు చెమ్మటలలోడ్చి ప్రపంచమునకు భోజనం బెట్టు వానికి భుక్తి లేదు’ అని సామాజిక ఆర్థిక దోపిడీని ఎలుగెత్తి చాటారు. పగటి దివిటీలతో ఆయన్ని ఊరేగిం చారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ వరించాయి. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించ బడ్డారు. శ్రీనాథుడిలా కవిసార్వభౌ ముడు. వేమనలా కవితా సందేశం, తిక్కనలా తెలుగు నుడికారపు విన్నాణవ్ు చాటారు. దళితులకు ఆత్మగౌరవం, ఆత్మ సై్థర్యం నేర్పారు. భారత దేశ సృష్టికర్తలుగా వారిని పేర్కొన్నారు. ఆధునిక దళిత కవితా యుగాన్ని సృష్టించారు. శత్రువుల్ని కూడా ఆశ్చర్య చకితుల్ని చేశారు. తన కూతురు హేమలతను సంస్కర్త అయిన గోరా కుమారుడు లవణంకు ఇచ్చి పెళ్లి చేసి విశ్వజ నీనతను చాటాడు. ‘ముంతాజ్ మహల్’, ‘కాందిశీకులు’, ‘బాపూజీ’, ‘నేతాజీ’ వంటి అనేక కావ్యాలు తెలుగు భాషకు సమర్పించాడు. ‘సాలీడు’, ‘గిజిగాడు’ వంటి ఎన్నో కావ్య చిత్రాలు గీశారు. శిశువు, శ్మశానవాటిక వంటి అమేయమైన కవితా ఖండికలు ఒక్కొక్క కావ్యంతో సమానం.‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనేది జాషువాలోనే చూస్తాము. జాతీ యత, మానవత, నవ్యత, శ్రవ్యత, సమత, మమత వంటి అనేక గుణాల శిల్పమే మహాకవి జాషువా. ఆయన పేరు మీద ఒక గొప్ప కళాక్షేత్రాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి మండలంలో జాషువా సాహితీ గ్రంథాలయాలు నిర్మించి ఆయన రచనలను 6వ తరగతి నుండి ఎంఏ వరకు పాఠ్యగ్రంథాలుగా పెట్టి ఆయన కవితా జీవనవ్యవస్థకు ప్రతిష్ట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వా లకు ఉంది. ఈ 50వ వర్ధంతిని ఆయన ప్రజ్వలిత కవితా జీవన మార్గంగా భావిద్దాం. ఆ స్ఫూర్తితో పయనిద్దాం. వ్యాసకర్త ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో (నేడు గుర్రం జాషువా 50వ వర్ధంతి) -
‘అసలు జాకీకి ఒంట్లో భయమే లేదా’
జాకీచాన్ అసలు పేరు చాన్ కాంగ్–సాంగ్. ‘లిటిల్ జాక్’ అనే నిక్నేమ్ ఉండేది. అది కాస్తా ‘జాకీ’గా మారింది. ఆతరువాత ‘చాన్’ వచ్చి చేరి ‘జాకీ చాన్’ అయింది. జాకీ చాన్ ఫైటర్ మాత్రమే కాదు... చక్కని గాయకుడు కూడా. ‘ఒపేరా అకాడమీ’ లో కుంగ్ఫూతోపాటు సంగీత పాఠాలు కూడా నేర్చుకున్నాడు. 11 మ్యూజిక్ ఆల్బమ్లను విడుదల చేశాడు. ‘బెస్ట్ సింగర్’ అవార్డ్ కూడా అందుకున్నాడు. ►సీఫూ(గురువు) చెప్పేదానికి ప్రకారం మార్షల్ ఆర్ట్స్లో జాకీకి అసాధారణమైన ప్రతిభ ఏమీలేదు. కానీ చిలిపితనం, నవ్వించే గుణం ఎక్కువ. గంభీరమైన మార్షల్ ఆర్ట్స్కు కడుపుబ్బా నవ్వించే కామెడీని జత చేసి వెండితెరపై తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ►బ్రూస్లీ లెవెల్కు తీసుకువెళదామనే ఉద్దేశ్యంతో ఒక హాంకాంగ్ నిర్మాత జాకీకి ‘బికమ్ ది డ్రాగన్’ అనే స్క్రీన్నేమ్ తగిలించాడు. అయితే అది అట్టే కాలం నిలవలేదు. ►‘డ్రాగన్ లార్డ్’లో ఒక సీన్ కోసం ఏకంగా 2,500 టేక్లు తీసుకున్నాడట! ఇది అనధికార గిన్నిస్ రికార్డ్. ఇక నిజమైన రికార్డ్ విషయానికి వస్తే ‘చైనీస్ జోడియాక్’ అనే సినిమా కోసం దర్శకత్వం, నిర్మాణం, నటన,సంగీతం, ఆర్ట్ డైరెక్టర్, యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్, ఫైట్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్. కేటరింగ్... ఇలా పదిహేను విభాగాల్లో పనిచేసి గిన్నిస్బుక్ రికార్డ్ సృష్టించాడు. ►‘అసలు ఇతడి ఒంట్లో భయమే లేదా’ అనుకునే జాకీకి రెండు భయాలు ఉన్నాయి. ఒకటి సూదులు, రెండోది జనాల మధ్య మాట్లాడడం. ►జీవితంలో తాను పశ్చాత్తాప పడే ప్రధాన విషయం...తాను సరిగా చదువుకోకపోవడం అంటాడు. పిల్లలకు ‘రోల్ మోడల్’గా ఉండాలనేది కల. ఒకప్పుడు తన రోల్ మోడల్ చార్లీ చాప్లిన్. -
13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు...
నడిపించడమా, కలిసి నడవడమా.. ఏది లీడర్షిప్? రెండూ! ‘యు గో దట్ సైడ్’ అని వేలూ చూపించాలి’, ‘ఇదిగో నాతో రా.. ’ అని చెయ్యీ అందివ్వాలి. పాలిటిక్స్లో మహిళలు ప్రజలకు మరింతగా అందుబాటులో, మరింతగా ప్రజామోదంతో ఎందుకు ఉంటారంటే.. ఇందుకే! ఈ రెండు లీడర్షిప్ క్వాలిటీలూ వాళ్లలో అంతర్నిర్మాణంగా ఉన్నందుకే! అలాంటిది.. శిక్షణ కూడా తోడైతే? ఆమె లీడ్ చేస్తుంది. వర్తమానాన్ని, భవిష్యత్తునీ! అలా పొలిటికల్ లీడర్షిప్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళా బృందం నేడు బయటికి వస్తోంది. 13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు... ‘జన గణ మన.. జన మొర విన, కల నిజమయ్యే.. కాలం ఇదే.. ఛక్ ఛక్ ఛక్..’ మంటూ వస్తున్నారు! అన్ని రంగాల్లోనూ నాయకత్వ స్థానంలో మహిళలు అద్వితీయ శక్తి సామర్థ్యాలతో సంస్థల్ని ముందుకు నడిపిస్తున్నా కూడా రాజకీయ రంగం మాత్రం వాళ్లను వెనక్కి లాగుతోంది. నిజానికి మహిళలు రాణించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి తగిన వేదిక రాజకీయాలే. అందుకే ‘స్త్రీ శక్తి’ స్వచ్ఛంద సంస్థ, సి.ఎ.పి.ఎఫ్. (చీవెనింగ్ ఆలుమ్నీ ప్రాజెక్ట్ ఫండ్) కలిసి మహిళల కోసం ‘షి లీడ్స్’ అనే రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24న వర్చువల్గా ప్రారంభించాయి. ఫస్ట్ బ్యాచ్ అది. శిక్షణ నేటితో పూర్తవుతుంది. ఈ లోపే రెండో బ్యాచ్ మొన్న శనివారమే మొదలైంది. తొలి బ్యాచ్లో 13 రాష్ట్రాలకు చెందిన 50 మంది మహిళలు కోర్సు పూర్తి చేశారు. రాజకీయ నాయకత్వంతోనే సమానత్వ సాధన షీ లీడ్స్ కోర్సులో శిక్షణ ఇస్తున్నవారంతా అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులే! రాజకీయ రంగ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ చేయడం, చట్టసభల్లో ప్రజా సమస్యల్ని లేవనెత్తడం అనేవి షీ లీడ్స్ సిలబస్లోను ప్రధాన అధ్యాయాలు. వాటిల్లో మళ్లీ ఉప–అధ్యాయాలు. రోజుకు 5 గంటల పాటు వారం రోజులు శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేయగానే సర్టిఫికెట్ వస్తుంది. ‘‘అయితే సర్, ఈ సర్టిఫికెట్ మాకు రాజకీయ రంగ ప్రవేశానికి యోగ్యతనిస్తుందా?’’ అని ఓ అభ్యర్థి తొలి రోజు క్లాసులోనే అడిగారు!సహజంగా వచ్చే సందేహమే. ‘‘అసలు మీకు ఈ కోర్సులో చేరాలన్న ఆలోచన రావడమే మీ యోగ్యత. సర్టిఫికెట్ అనేది మీ పాలనా పరమైన పరిజ్ఞానానికి థియరీ రూపం మాత్రమే. ప్రాక్టికల్గా మీరెప్పుడో లీడర్స్ అయిపోయారు’’ అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా చెప్పడం ఫస్ట్ బ్యాచ్ ‘యువ పొలిటీషియన్స్’కి స్ఫూర్తినిచ్చే సమాధానం అయింది. స్ఫూర్తి మాత్రమే కాదు. ఉత్సాహం కూడా. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజీవ్ గౌడ, బీజేపీ లోక్సభ ప్రస్తుత ఎంపీ హీనా గవిట్, సమాజ్వాదీ ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ ‘షీ లీడ్స్’ ఫస్ట్ బ్యాచ్కి రాజకీయ పాఠాలు చెప్పినవారిలో ఉన్నారు. ఈ కోర్సుకు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమొక్రసీ’, నేత్రి, శక్తి సంస్థలు కూడా సహకారం అందించాయి. ‘‘మహిళా నాయకుల్ని ప్రజలు అంగీకరిస్తారు. మహిళా నాయకులూ ప్రజలకు అందుబాటు లో ఉంటారు. అందుకే మహిళలు చొరవగా రాజకీయాల్లోకి రావాలి’’ అని అల్వా తరగతుల ప్రారంభంలోనే చెప్పారు. ‘‘మీరొస్తే రాజకీయాల్లో కులాల ప్రభావం తగ్గుతుంది’’ అంటూ.. రాజకీయాల్లోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల సమాజానికీ, దేశానీ జరిగే మంచి గురించి మాట్లాడారు హీనా గవిట్. రెండో బ్యాచ్ ‘షీ లీడ్స్’ క్లాసులకు ఆప్ పార్టీ నుంచి పృథ్వీరెడ్డి, వందనా కుమారి, మాజీ బీజేపీ ఎంపీ అర్చనా చిత్నిస్ వస్తున్నారు. అసలు ఇలాంటి కోర్సు ఎందుకు అనే ప్రశ్న కూడా క్లాస్ రూమ్లో ఓ విద్యార్థినిని నుంచి వచ్చింది. ‘మంచి ప్రశ్న’ అన్నారే కానీ, ‘ఇలాంటి కోర్సులో ఎందుకు చేరావు?’ అని రాజకీయ గురువులు అడగలేదు. ‘‘పాలిటిక్స్లోనూ ఇదే విధమైన సావధానత ఉండాలి. అలా మహిళా నేతలు మాత్రమే ఉండగలరు. భారతదేశ మహిళా రాజకీయ శక్తిని బలోపేత చేయడం కోసం ఇలాంటి ఒక కోర్సు అవసరం అని మేము భావించాం’’ అని ‘స్త్రీశక్తి’ సంస్థ వ్యవస్థాపకురాలు రేఖా మోడీ అన్నారు. త్వరలోనే కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో షీ లీడ్స్ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. మహిళల స్వభావంలోనే నాయకత్వ గుణాలు ఉంటాయి. అయితే పురుషాధిక్యత ఆ గుణాలను మాటలతో, చేతలతో ఏళ్లుగా అప్రాముఖ్యం చేస్తూ వస్తోంది. బాధితులు ఎవరైతే అవుతారో సహజంగానే వారి స్వరం ప్రశ్నిస్తుంది. వారి పిడికిలి బిగుస్తుంది. వారి గళం నినదిస్తుంది. అందుకే సామాజికంగా కూడా అణచివేతల్ని, అవకతవకల్ని, దౌర్జన్యాలను చూస్తున్నప్పుడు మహిళలే ముందుగా స్పందిస్తారు. వాళ్లే ఎందుకు ముందుగా స్పందిస్తారంటే.. ప్రతి అపసవ్యత పర్యవసానం చివరికి వారి మీదే పడుతుంది. మరీ ఈ రాజకీయ కోర్సులో చేరడానికి అర్హత ఏమిటి? రాజకీయ రంగ ప్రవేశానికి ఈ కోర్సు దారి చూపుతుందా? మళ్లీ రెండు ప్రశ్నలు. రేషన్ క్యూలో నిలుచుని ఉన్నప్పుడు మీ కంటపడిన డీలర్ అక్రమాన్ని మీరు చూస్తూ ఊరుకోకుండా జనం తరఫున వేలెత్తి చూపిన క్షణమే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు. రాజకీయ శిక్షణలో చేరేందుకు కూడా ఆ అడిగే తత్వమే, నిలదీసే ఆగ్రహమే క్వాలిఫికేషన్. -
హ్యాపీ న్యూ ఇయర్ సిల్వీ
జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువ. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అవుతుంది. ఇల్లు సపోర్ట్ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. ‘‘నేనేం గ్రహించానో తెలుసా? జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’’ అంటుంది సిల్వీ. ఉద్యోగం చేస్తుంటుంది తను. టీవీ స్టేషన్లో తనకు ఇష్టమైన ఉద్యోగం. ఉద్యోగంలా చేయదు. ఉద్యోగమే తన జీవితం అన్నంతగా చేస్తుంది. ఆమె జీవితంలో మరికొన్ని కూడా ఉంటాయి. ఇల్లు, వంట, భర్త, ఇంటికి వచ్చిపోతుండే అతిథులు. ‘‘అవన్నీ నువ్వే చూస్కో, నేను చేయలేను..’’ అంటుంది భర్తతో. ఆఖరికి అతిథుల్ని కూడా! ‘‘బాగోదు సిల్వీ.. అతిథులు ముఖ్యం కదా. కొన్నిరోజులు ఆఫీస్కి సెలవు పెట్టేయ్..’’ అంటాడు భర్త. ఆ ఘర్షణలోనే.. ‘జీవితం మనకు అస్సలు ఇష్టం లేనివాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’ అని భర్తతో అంటుంది సిల్వీ. వాపోవడమది. సిల్వీస్ లవ్’ చిత్రంలో సిల్వీ పాత్రధారి టెస్సా థాంప్సన్ జీవితంలో ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ రెండూ ఉంటాయి. రెండిటికీ కలిపి ఒకే సమయం ఉంటుంది. ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ వేటికవి జరిగిపోతున్నా.. ఇష్టమైనవి చేయనివ్వకుండా ముఖ్యమైనవి అడ్డుపడుతున్నప్పుడే.. ‘జీవితం పొద్దెక్కిపోతోందే’ అని మనసు త్వరపడి బలాన్ని కూడదీసుకుని ఇష్టమైనవాటి వైపు పరుగులు తీయాలని చూస్తుంది. ఆ వెనకే.. స్ట్రెస్. కన్నీళ్లు. ఇక్కడ సిల్వీ కూడా ఏడుస్తుంది. అర్థం చేసుకోగలిగిన భర్త అయుండీ, అర్థం చేసుకోలేకపోతున్న స్థితిలో మృదువుగా నెమ్మదైన స్వరంతో సిల్వీతో వాదించి ఆమె గదిలోంచి వెళ్లిపోతాడు. ఇంట్లోని గెస్ట్లకు మర్యాదలు అందించే పనిలో పడతాడు. అది అతడికి ముఖ్యమైన పని కాకుండా, ఇష్టమైన పని అయి ఉంటే కనుక అతడికోసం సిల్వీ తనకు ఇష్టమైన పనిని వదిలి, అతడికి ఇష్టమైన పనిని తన ముఖ్యమైన పనిగా మీద వేసుకుని గెస్ట్లు ఉన్న హాల్లోకి వెళ్లి ఉండేదేమో. ఇష్టమైన పని చేయడానికి వీల్లేకపోవడం ఎంత తీవ్రమైన మానసికమైన ఒత్తిడో ఆమెకు తెలుసు కాబట్టి వెళ్లి ఉండేదే..నేమో. కొండంత పని కలిగించే ఒత్తిడి కన్నా, ఇష్టమైన పనిని పిసరంతైనా చేయడానికి వీల్లేకపోవడం కొండంత ఒత్తిడి. నోటిఫికేషన్ పడకుండానే, దరఖాస్తు చేయకుండానే, ఇంటర్వ్యూ లేకుండానే, అసలు ఇష్టమే లేకుండానే వెళ్లిపోయి తప్పనిసరిగా చేయవలసిన ఉద్యోగం స్త్రీకి.. పెళ్లి, భర్త, ఇల్లు! ఆమెకు ఇష్టమైన ఉద్యోగం వేరే చోట ఎక్కడైనా ఉండొచ్చు సిల్వీకి టీవీ స్టేషన్లో ఉన్నట్లు. ఈ ‘ముఖ్యం’–‘ఇష్టం’ మధ్య ఆ గోడకూ ఈ గోడకూ షటిల్ అవుతూ కింద పడిపోకుండా జీవితాన్ని లాగించేవాళ్లలో స్త్రీలు మాత్రమే ఉంటారని కాదు. జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువే. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అంత సమయాన్ని ఆమెకు ఉదారంగా ఇచ్చేందుకు జీవితమేమీ స్త్రీవాది కాదు. జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది అంటే, జీవితం మనకు అస్సలు ఇష్టం లేని పనులను చేసుకుంటూ పోగలిగినంత పెద్దది కాదనే. ముఖ్యమైన పని ‘స్టేటస్’ను ఇస్తే ఇవ్వొచ్చు. ఇష్టమైన పని ‘సాఫల్యత’ను ఇస్తుంది. ఇంటిముందుకు ఖరీదైన కొత్త కారు రావడం స్టేటస్. స్టేటస్ లేట్ అవుతుంటే ‘ఏంటండీ.. మీరింకా కారే కొనలేదు’ అని ఇంటి ముందుకొచ్చి ఎవ్వరూ అడిగిపోతుండరు. సాఫల్యతకు సమయం మించిపోతుంటేనే.. ‘గడియారం చూసుకున్నావా? జీవితం ఎంతైందో తెలుసా!..’ అని మనసు అదేపనిగా అడగడానికొస్తుంది. సిల్వీపాత్ర ఇటీవలి హాలీవుడ్ చిత్రం ‘సిల్వీస్ లవ్’ లోనిది. సిల్వీ వర్కింగ్ ఉమన్. ఈ కొత్త సంవత్సరం సిల్వీలందరినీ వారికి ఇష్టమైన ఉద్యోగాలను హాయిగా చేసుకోనివ్వాలి. ఇల్లు సపోర్ట్ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. -
ఆ శిశువు మాత్రం...
చుట్టూ గాఢాంధకారం... నల్లని మబ్బుల చాటున చంద్రుడు గుర్రు పెట్టి నిదరోతున్నాడు. గ్రామం గాఢ నిద్రలో ఉంది కదా అని ప్రకృతి కూడా అప్పుడే నిద్రకు ఉపక్రమించింది. పైరగాలి మాత్రం కొద్దిగా మేలుకొని మెల్లని, చల్లని గాలులను వీయిస్తోంది. ఆ గాలికి మైమరచి కొండలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఆ కొండల పక్కనే ఓ చిన్న బొరియ. దాని నిండా పలు రకాల పశువులు. ఇంతలో దూరంగా ఇద్దరు వ్యక్తులు.. చూడటానికి భార్యాభర్తల్లా ఉన్నారు. అసలే అర్ధరాత్రి. చలి గజగజ వణికిస్తోంది. చలికి ఆ స్త్రీ రెండు చేతులు చెవులపై అదిమి పెట్టింది. భార్య చలికి తట్టుకోలేక పోవడాన్ని గమనించి అతడు తన పై వస్త్రాన్ని తీసి ఆమెకు కప్పాడు. సరిగ్గా అప్పుడే చంద్రుడు నిద్రలేచాడు. నల్లని మబ్బుల కనురెప్పలను తెరచి లోకాన్ని చూసాడు. ఏదో చూడకూడని దాన్ని చూశాడు కాబోలు.. తన బాహువులను చూడమన్నట్లు వెన్నెలను విరగబూయించడం ప్రారంభించాడు. గాఢ నిద్రలో మునిగిన గ్రామం చంద్రుడి వెలుగును పట్టించుకోలేదు. ఆ జాబిల్లి వెలుగులో పశువులన్నీ ఓ మానవీయ ఘటనను చూశాయి. తమ వద్దకు వస్తున్న ఆ జంట చూడముచ్చటగా ఉంది. ఆమె నిండు గర్భిణి. ఏ క్షణమైనా ప్రసవం జరిగేలా ఉంది. వీరికి దారి చూపడానికే చంద్రుడు నిద్ర లేచాడా అన్నట్లు ఉందా పరిస్థితి. పసుల పాకలోని జంతువులు నిద్ర లేచాయి. ‘‘ఏంటి వీళ్ళు... ఇటే వస్తున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉంది. వీరెక్కడ సరిపోతారు’’ అందో గాడిద. ‘‘సరేలే ఉన్న దాంట్లో ఇరుక్కుంటారేమో నీకేంటి?’’ అంది పక్కనే ఉన్న మరో గాడిద. ‘‘సరిగ్గా చూడండెహే.. పాపం ఆవిడ ప్రసవానికి సిద్ధంగా ఉంది. నోర్మూసుకుని దారి ఇవ్వండి లేకపోతే తెలుసుగా, కొమ్ములకు ఈ మధ్యే పదును పెట్టా..’’ అని హెచ్చరించింది పక్కనే ఉన్న ఓ పొట్టేలు. ‘‘నిజమే.. అందరూ లేవండి.. మనం ఆ మూలకు వెళదాం’’ అంది గొర్రె. అప్పుడే నిద్ర లేచిన ఓ బుజ్జి మేక తనను కొంటె చూపుతో చూస్తున్న చంద్రుణ్ణి చూసింది. తర్వాత వాళ్ళ అమ్మతో.. ‘‘అమ్మా ఏమయిందే, ఇంకా తెల్లారలేదుగా.. అప్పుడే ఎందుకు లేపుతున్నావ్?’’ అని అడిగింది. ఇంతలో వారు లోనికి రానేవచ్చారు. పశువులన్నీ మరో మూలకు చేరి వారికి కొంచెం చోటిచ్చాయి. అనుకున్నదే అయింది. ఆ స్త్రీ వచ్చిన కొద్దిసేపటికే బంగారులాంటి కొడుకు పుట్టాడు. బుజ్జి మేక ఆ బాలుడి దగ్గర చేరి చెంగు చెంగున గెంతుతోంది. అది చూసి మిగిలిన బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు మే.. మే అని పిల్లాడి చుట్టూ చేరి ఆడుకుంటున్నాయి. ‘‘ఎవరి సహాయం లేకపోయినా సుఖ ప్రసవం జరిగింది.. సంతోషం’’ అంది పొట్టేలు పక్కనే ఉన్న గాడిదతో... ‘‘నిజమే బాలుడు చూడ ముచ్చటగా ఉన్నాడు, నా మీద ఎక్కి కూర్చుంటే నగరమంతా తిప్పుతాను’’ అంది గాడిద. ఇంతలో ఓ గొర్రె పిల్ల కల్పించుకొని.. ‘‘అమ్మా చూడవే... ఈ బాబు అచ్చం నాలాగే ఉన్నాడు’’అంది. ‘‘నిజమేలేవే.. కొంచెం దూరంగా గెంతు.. బిడ్డ మీద పడేలా ఉన్నావు’’ అంది తల్లి. ఇంతలో బిడ్డ దగ్గరకు ఓ ఆవు, పెయ్య దూడ కలిసి వచ్చాయి. ఆ పెయ్య దూడ తన తల్లితో.. ‘‘అమ్మా.. బాబు చూడు నాలాగే ఎర్రగా ఉన్నాడు. ఒక్క మచ్చ కూడా లేదు’’ అంది. నిజమేనన్నట్లు ఆ ఆవు తలూపింది. ఇంతలో మబ్బులన్నీ నిద్ర లేచి గట్టిగా ఆవులించాయి. ఆ శబ్దానికి జంతువులన్నీ భయపడ్డాయి. ఇంతలో ఆ పాకలో గొప్ప వెలుగు పుట్టింది. ఆ వెలుగులో రెక్కలు కట్టుకున్న అందమైన జీవులు ప్రత్యక్షమయ్యాయి. ఏమిటీ వింత అని పెద్ద జంతువులన్నీ గుడ్లు మిటకరించి చూస్తున్నాయి. చిన్ని గాడిదలు, బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు, పెయ్య దూడలు, కోడె దూడలు మాత్రం ఆనందంతో శబ్దాలు చేస్తూ చెంగు చెంగున గెంతుతూ నాట్యం చేస్తున్నాయి. బిడ్డ పుట్టుకతో, జంతు నాట్యాలతో పరవశులైన ఆ రెక్కల జీవులు బిడ్డను పొగిడి తిరిగి వెళ్లిపోయారు...అప్పటి వరకూ ఎగిరిన పసు పిల్లలు అన్నీ అలసిపోయి బిడ్డ చుట్టూ హాయిగా పడుకున్నాయి. పెద్ద జంతువులన్నీ కాసేపు ముచ్చట్లు కొనసాగించి అలాగే నిద్రపోయాయి. వేదనను అనుభవించిన ఆ స్త్రీ సంతోష మైకంతో, ఆత్మీయ ఆనందంతో నిద్రలోకి జారుకుంది. అప్పటివరకు గర్భవతియైన తన భార్యను కాపాడిన భర్త కూడా పడుకున్నాడు. అప్పుడే కన్ను తెరిచిన ఆ బిడ్డ మాత్రం కళ్లు ఇంతింత చేసుకుని లోకాన్ని ప్రేమ, కరుణ, శాంతి దిశగా మేల్కొలపాల్సిన అవసరం ఉందని అనుకుంటూ, తనకు జన్మనిచ్చిన తల్లి వైపు... ఆదరించిన తండ్రి వైపు కృతజ్ఞతతో చూశాడు. ఆ బిడ్డ మాత్రం... సంతోషంతో తనవైపే చూస్తున్న జాబిల్లిని, ఆనంద బాష్పాలను మంచు రూపంలో కురిపిస్తున్న నల్లని మబ్బులను... తన పుట్టుకను గాంచి మిగుల ఆనందపడిన పశు పిల్లలను, వాటి తల్లులను చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ మీద నగరానికి వస్తానని గాడిదకు మనసులోనే మాటిచ్చాడు. అచ్చం నాలాగే ఉన్నాడన్న గొర్రె పిల్లకు, ఎర్రగా ముద్దుగా ఒక్క మచ్చ కూడా లేదన్న పెయ్య దూడకు మీరన్నవన్నీ నిజమే అని తన మనసులో అనుకుంటూ చిరునవ్వుల వర్షం కురిపించాడు. – సృజన్ సెగెవ్ సాక్షి, హైదరాబాద్ -
సర్వోన్నతుడే దీనుడై దిగివచ్చిన క్రిస్మస్
ఆది నుండీ ఉన్న యేసుక్రీస్తు అనే ’జీవవాక్యాన్ని’ తాము చెవులారా విన్నామని, ఆయన్ను కళ్లారా చూశామని, మూడున్నరేళ్ళపాటు ఆయన్ను నిదానించి అనుభవించామని, తమ చేతులతో ఆయన్ను తాకామని ఆయన శిష్యుడైన యోహాను ప్రభువుతో ఉన్న తన అనుబంధాన్ని తన పత్రికలో అత్యద్భుతంగా వర్ణించాడు(1 యోహాను 1:1). కారు, ఇల్లు, టివి, కుర్చీలు, సోఫాలుఇలాంటి విలువైన వస్తువులన్నీ పాతబడిపోతాయి. కానీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉన్న సజీవమైన అనుబంధాలు మాత్రం పాతబడవు. ఇక దేవునితో ఉండే బాంధవ్యమైతే అసలు పాతబడేదికాదు కదా, అది నిత్యనూతనమైనదని యోహాను అంటాడు. అందుకే యోహాను యేసుకు ’జీవవాక్యం’ అనే బిరుదుని చ్చాడు. పౌలు స్థాపించిన ఎఫెసీ అనే గొప్ప చర్చికి యోహాను చాలాకాలం పాస్టర్ గా ఉన్నాడు. ఆ చర్చిలో గ్నోస్టిక్స్ అంటే, విశ్వాసం కన్నా దేవుని గూర్చిన జ్ఞానం చాలా గొప్పదని వాదించే ‘మహాజ్ఞానులతో’ ఆయన చాలా సమస్యలనెదుర్కొన్నాడు. తాను మనిషికి అర్ధమై అతనితో కలిసి పోయేందుకు వీలుగా, అత్యంత సామాన్యుడు, నిరాడంబరుడైన వ్యక్తిగా ఈ లోకానికి దిగివచ్చి, అందరిలాగా ‘నేను పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చెయ్యడానికి వచ్చిన దాసుడినని’ యేసుప్రభువే ప్రకటించుకుంటే(మత్తయి 20:28), దేవుడు నరుడు, దాసుడు కావడమేమిటి? లాంటి ‘అతిభక్తిపూర్వక’ ప్రశ్నలు లేవెనెత్తి, తన జీవనశైలిద్వారా ఆయన నిరూపించుకున్న అత్యున్నతమైన మానవీయ విలువలను కాక, ఆయనకు ఎలాగూ ఉన్న దైవత్వాన్ని మాత్రమే విశ్వసించడానికి, ప్రకటించడానికి పూనుకున్న ఆ ‘జ్ఞానుల’ వాదనలను యోహాను తన స్వీయానుభవపూర్వకమైన ఈ విశ్వాస ప్రకటన ద్వారా నిర్వీర్యం చేశాడు. దేవుడే తగ్గాడంటే, తాము కూడా తగ్గాల్సి వస్తుందని జంకే బాపతువాళ్ళు ‘ఈ జ్ఞానులు’. అందుకే ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో తాను తాకిన, చూసిన, విన్న, అనుభవించిన దేవుడు అంటాడు యోహాను. తాను పరలోకాధిపతి అయి ఉండి కూడా, ఈ లోకంలోని సాధారణ మనుషులు తనను విని, చూసి, తాకి, తనతో సహవసించడానికి వీలుగా, వారిలో ఒకడిగా జీవించేందుకు గాను మనకు తోడుగా ఉండే’ ఇమ్మానుయేలు’ దేవుడుగా ప్రభువు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్’ సంబరం, సంరంభం. దేవుడే మనిషిగా దిగిరాగా, మనిషి మాత్రం లేనిపోని డాంబికాలకు పోయి తనను తాను దేవునికన్నా గొప్పవాడిగా ఉహించుకొంటూ, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల పేరిట తోటి మనుషులను దూరంగా పెట్టడం ఎంత ‘అమానవీయమో’ తెలిపే సందర్భమే క్రిస్మస్. దేవుడే దీనుడై యేసుక్రీస్తుగా దిగివచ్చి మానవాళికి దీనత్వాన్ని ప్రబోధించాడు. తనను తాను తగ్గించుకోవడం అనే ‘దీనత్వం’ సర్వోత్కృష్టమైన మానవ ధర్మమని, దేవుడు అహంకారాన్ని ఏవగించుకొని దీనులను ఆదరిస్తాడని ‘బైబిల్’ చెబుతోంది. మానవాళి దీనత్వాన్ని అలవర్చుకోవాలన్నదే క్రిస్మస్ ఇచ్చే నిరంతర సందేశం!! – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రభాస్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టిన రోజు అభిమానులకు పండగరోజుతో సమానం. దీంతో ఫ్యాన్స్ తాము అరాధించే హీరోకు వీర లెవల్లో బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో ట్విటర్లో మోత మోగుతోంది. అయితే ప్రభాస్ అభిమానులకు నేడు డబల్ ధమాకా.. ఎందుకంటే ఈ రోజు డార్లింగ్ పుట్టినరోజుతోపాటు ఆయన నటించిన రాధే శ్యామ్ సినిమా నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ విడుదల కానుంది. దీని కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ గురించి మీకు ఎంత వరకు తెలుసు.. అతని పూర్తి పేరు, చదివింది ఎక్కడ.. ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకు ఎన్ని తెలుసు. ప్రభాస్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ చుద్దాం.. చదవండి: ప్రభాస్ ఫోటోతో సిటీ పోలీస్ ట్వీట్.. 1.. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. 2.. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివ కుమారి కొడుకు ప్రభాస్. ఇతను ఇంట్లో చిన్నవాడు. తనకు అన్నయ్య ప్రబోధ్, అక్క ప్రగతి ఉన్నారు. 3.. భీమవరంలోని డీఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నారు. 4.. ప్రభాస్ ఇంజనీర్ గ్రాడ్యూయేట్( శ్రీ చైతన్య ఇంజరీంగ్ కళశాల).. ముందుగా తను హోటల్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు.. కానీ హీరోగా మారారు. 5... హిందీలో బాహుబలి ప్రభాస్ మొదటి సినిమా కాదు. దీనికంటే ముందు ‘యాక్షన్ జాక్సన్’ అనే సినిమాలో ఆయన అతిథి పాత్ర పోషించారు. 6... బ్యాంకాక్లోని మేడమ్ టుస్సాడ్స్లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి సౌత్ స్టార్ ప్రభాస్. 7.. కేవలం బాహుబలి సినిమా కోసం నాలుగేళ్లు ఏ సినిమాను ఒప్పుకోలేదు. 8. బాహుబలికి సినిమా కోసం ప్రిపేర్ అవ్వడానికి తన ఇంట్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు. 9. బాహుబలి కోసం ప్రభాస్ సుమారు 30 కిలోలు బరువు పెరిగాడు. 10.. బాహుబలి కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకున్నాడు. 11.. ప్రభాస్కు ఇష్టమైన నటుడు రాబర్ట్ డి నిరో. చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్ -
కలెక్టర్నైనా అమ్మానాన్నకు బిడ్డనే..
అమృతాన్ని పంచేది అమ్మ.. అనురాగాన్ని అందించేది నాన్న.. బాల్యంలో చందమామ రావే అంటూ ఆకాశమే హద్దుగా అమ్మ చేసే ఉపదేశం, నాన్న గుండెలపై ఆడుకున్న క్షణాలు మనిషి జీవితంలో చెరగని జ్ఞాపకాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు తల్లిదండ్రులు.. వారి ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై వారి ప్రేమ అపూర్వమైనది.. అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే. అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.. నేడు నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.. –సాక్షి ప్రతినిధి, కడప తల్లిదండ్రులందరికీ పేరెంట్స్డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా తండ్రి డాక్టర్ విజయ్కుమార్ (గైనకాలజిస్ట్ కమ్ ఎండోస్కోపిక్ సర్జన్), ప్రభుత్వ వైద్యునిగా రిటైర్డ్, తల్లి పద్మజలను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లైఫ్లో ఎప్పుడూ ఒత్తిడి లేకుండా చూశారు. ‘నీ ఇష్టమైనదే చదువు. అందుకోసమే సన్నద్ధమై లక్ష్యం సాధించాలి’ అని చెప్పేవారు.కష్టపడితేనే సుఖం ఉంటుందని మార్గనిర్దేశం చేసేవారు. విమానంలో వెళ్లే స్థోమత ఉన్నా రైళ్లోనే ప్రయాణించమని చెప్పేవారు. ఏసీ కోచ్లో వెళ్లే అవకాశం ఉన్నా స్లీపర్లోనే పంపేవారు. కార్లున్నా ఆటోలోనే వెళ్లమనేవారు. ఏ పనైనా మనం చేసి చూపించిన తర్వాతనే అవతలి వాళ్లకు చెప్పి చేయించుకోవాలనేవారు. నా ఉద్యోగంలో నేను ఇప్పటికీ అదే పాటిస్తాను. నాన్న స్ట్రిట్...అమ్మ గారాబం. పరిస్థితి బ్యాలెన్స్గా ఉండేది. నేను ఒక జిల్లాకు కలెక్టర్ అయినా అమ్మానాన్నల బిడ్డనే. రోజూ ఫోన్లో మాట్లాడతారు...టైంకు భోం చేశావా అని అడుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త అంటారు... ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. వారు లేకపోతే పెద్దవారు లేరన్న భరోసా పోతుంది. వారికి ఏమి కావాలో చూసుకోవాలి. మేము మీకు ఉన్నామన్న భరోసా కల్పించాలి. అప్పుడే వారు ఎక్కువ కాలం మనతో ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల కోసం పరితపిస్తుంటారు.. పిల్లలు పుట్టగానే ఉజ్వల భవిష్యత్తు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నట్లు కలగంటారు. జీవితంలో క్షణం తీరిక లేకుండా బిడ్డల అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. గొప్పవాళ్లుగా తీర్చే ప్రయత్నంలో పుస్తెలు తాకట్టు పెట్టి, ఫీజులు కట్టిన తల్లులు ఉన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన నాన్నలెందరో ఉన్నారు. మనకు జన్మనిచ్చి.. నిలబడటానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి ఇంత మంచి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం! వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామనే భావన వారిలో కలగకుండా చూసుకుంటే చాలు కదా! అదే పిల్లల నుంచి తల్లిదండ్రులు కోరుకునేది. ఉద్యోగ రీత్యా మనం ఎంత బిజీగా ఉన్నా.. రోజుకు ఒక్కసారి, ఒక్క నిమిషం పలకరించినా కన్నవారు సంతోషిస్తారు. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అమ్మా నాన్నలు.. నిజంగా అమృత మూర్తులే. అందుకే మన పురాణాలు ‘మాతృ దేవోభవ... పితృదేవోభవ’అంటూ ఉపనిషత్తులు దేవతల స్థాయినిచ్చి గౌరవించాయి. ఆదివారం నేషనల్ పేరెంట్స్డే సందర్భంగా ప్రముఖుల తల్లిదండ్రుల గురించి వారి మాటల్లోనే... –సాక్షి నెట్వర్క్, కడప తల్లిదండ్రులతో ఎస్పీ అన్బురాజన్(ఫైల్) తోడు–నీడలా అమ్మానాన్న మాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు. నేను నాల్గవ తరగతి చదివేప్పుడు ఇతరుల పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి కాయ కోసుకుని తిన్నదీ గుర్తే....అప్పుడు తోట వాచ్మెన్ వచ్చి అరవడంతోపాటు మా నాన్న(కు) నాగేంద్రకుమార్కు ఫిర్యాదు చేశాడు. ఇంటికి తెచ్చి థర్డ్ డిగ్రీ చూపించారు. అప్పటి నుంచి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. తొమ్మిదో తరగతిలో కోయంబత్తూరులో ఐఏఎస్, ఐపీఎస్ (సివిల్స్)కు ప్రిపరేషన్ గురించి అవగాహన సదస్సు జరిగింది. దానికి కలెక్టర్, కమిషనర్లతో పెద్ద స్థాయి అధికారులు హాజరయ్యారు. మా నాన్న హెడ్మాస్టర్ కావడంతో నన్ను ఒక మంచి స్థాయిలో నిలుపాలన్న ఆశయంతో అక్కడికి తీసుకెళ్లి నాలో స్ఫూర్తి రగిలించారు. సివిల్స్లో మూడుసార్లు దగ్గరగా వచ్చి మిస్ అయిన సందర్భంలో అమ్మ షణ్ముగవల్లీ (టీచర్) చూపిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. బాధలో ఉన్న నాకు ఆమె వెన్నంటే ఉండడంతోపాటు ఓదారుస్తూ మళ్లీ సివిల్స్లో నిలబడేలా చేసింది. ఆమె చూపిన ప్రోత్సాహం.... నాన్న స్ఫూర్తి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తల్లిదండ్రులు ఇద్దరినీ మరిచిపోలేను. పేరెంట్స్డే సందర్భంగా తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. – కేకేఎన్ అన్బురాజన్, ఎస్పీ, కడప మా కోసం నాన్న దూరంగా గడిపేవారు... మాది రాజస్తాన్లోని జయపూర్.. నాన్న జశ్రాం మర్మట్ సీజీఎస్టీలో సూపరింటెండెంట్..అమ్మ విమల గృహిణి..కుటుంబాన్ని నడపడానికి నాన్న చాలా కష్టపడేవారు. పెద్ద కుటుంబం మాది. కష్టపడి పనిచేయడం ద్వారా ముందుకు వెళ్లాలనేది నాన్న మనస్తత్వం. జీవన గమనంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎనిమిదేళ్లపాటు ఒంటరిగా వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే నేను సివిల్స్...చెల్లి ఐఐటీ కోచింగ్ కోసం ప్రిపేరవుతుంటే అమ్మ మాతో ఉండేది. మాకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకునేది. తరచూ మా ఇద్దరికీ మానసిక స్థైర్యాన్ని నూరిపోస్తూ ఉండేది. పెద్ద కుటుంబంలో నాన్న ఒక్కరిదే సంపాదన. మా అవసరాలకు ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు. మా చదువుల సమయంలో వారెన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నాన్న, అమ్మ తోడ్పాటుతో ఐఎఎస్(2019 బ్యాచ్)కు ఎంపికయ్యాను. తొలిసారి అసిస్టెంట్ కలెక్టర్గా కడపకు వచ్చాను. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో సన్నిహితంగా ఉండాలి.. స్నేహితుల మాదిరిగా కలిసిపోతే ఇబ్బందులు ఎదురుకావు. పిల్లలతో మాట్లాడుతుండాలి. వారి అభిరుచులు..ఆకాంక్షలను గుర్తించగలిగాలి.. అలా చేస్తే పిల్లలకు మానసిక ఒత్తిడి ఉండదని నా అభిప్రాయం. మా తల్లిదండ్రులు ఇలానే చేశారు. జీవితం ఒక్కసారే వస్తుంది..దాన్ని ఆనందమయంగా మలుచుకోవాలని మా అమ్మ చెప్పే మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి. -వికాస్ మర్మట్, అసిస్టెంట్ కలెక్టర్, కడప అమ్మ ఆదర్శం.. నాన్న లక్ష్యం మాది రేణిగుంట మండలంలోని ఓ గ్రామం. నాన్న ఎం.సూర్యప్రకాశ్రెడ్డి పారిశ్రామికవేత్త. కుటుంబంలో ఒకరిని అయినా ఉన్నత స్థానంలో నిలపాలని కలలు గన్నారు. అందుకు అనుగుణంగా నాన్న సోదరుడిని ఐఏఎస్లో పెద్ద స్థానంలో నిలబెట్టారు. అయితే మా కుటుంబంలోనూ ఒకరైనా ఉండాలన్న తలంపు నాన్నలో బలంగా ఉండింది. నన్ను సివిల్స్ వైపు నడిపించారు. ఆ రోజుల్లో సివిల్స్ త్రుటిలో మిస్సయినా తర్వాత గ్రూప్–1లో స్థానం సాధించాను. నాన్న లక్ష్యమంతా కూడా ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారిగా ఉండి పేద వర్గాలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని సివిల్స్ వైపు ప్రోత్సహించారు. అమ్మ సావిత్రి కూడా ఆడపిల్లలు ఆర్థికంగా బాగుండాలని చెబుతూ ఉండేది. అందుకు చదువే ముఖ్యం అని చెప్పేవారు. ఐఏఎస్ క్యాడర్ వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. భర్త రోహిత్ కూడా అండగా నిలిచారు. మా బాగు కోసం పరితపించిన కుటుంబ పెద్దలను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటికీ తల్లిదండ్రులు చూపిన దారిలోనే పయనిస్తున్నాను. – ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్, కడప పేరెంట్స్ను బాగా చూసుకోవాలి మా తండ్రి చంద్రకాంత్వర్మ (మద్రాసు ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవారు). తల్లి జ్ఞానేశ్వరి (రిటైర్డ్ స్కూలు టీచర్). ఇద్దరూ నన్నెంతగానో ప్రోత్సహించారు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో మా తల్లి గారు మరింత మద్దతు పలికారు. ఇంజనీరింగ్ ఐఐటీలో చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిలో ఉంటూ సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ఆ సమయంలో మా తండ్రి నాకు అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సామగ్రిని అందించేవారు. అమ్మ నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకుని మరింతగా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత. అది చేయలేనపుడు ఏం సాధించినా ఉపయోగం లేదు. తల్లిదండ్రులను చూసుకోలేని వాడు దేనికీ పనికి రాడు. –సాయికాంత్వర్మ, జేసీ (అభివృద్ధి), కడప వారి కష్టం మాకు రాకూడదని... మాది వేంపల్లె మండలం రామిరెడ్డిగారిపల్లె. దిగువ మధ్యతరగతికి చెందిన సన్నకారు రైతుకుటుంబం. మా తల్లిదండ్రులు ఓబుల్రెడ్డి, గంగమ్మలకు మేము ముగ్గురు సంతానం. నేను పెద్దవాడిని, నాతరువాత తమ్ముడు, చెల్లెలు. అప్పట్లో మా పరిస్థితులు ఎలా ఉండేవంటే స్టోరు బియ్యం ఎప్పుడు ఇస్తారా ? అని ఎదురు చూసేవాళ్లం. మాకోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడేవారు. నేను ఇంటర్లో ఉండగా నాన్న చనిపోయారు. అప్పుడు మా చదువు బాధ్యతలను అమ్మ తన భుజస్కంధాలపైన వేసుకుంది. వ్యవసాయం చేసే అమ్మ అతికష్టం మీద చదివించింది. మా పెద్దనాన్న కూడా మాకు సహకరించారు. పిల్లలు సుఖంగా బతకడం కోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని స్వయంగా చూశాను. పీజీ చివరి సంవత్సరంలో అమ్మ కూడా చనిపోయింది. ఎంఏ ఎకనామిక్స్ పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పించమని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వద్దకు వెళ్లాను. ఆయన గ్రూప్స్ రాయమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాను. గ్రూప్స్ ప్రిపరేషన్కు అయ్యే ఖర్చుల విషయాలన్ని వైఎస్సార్ చూసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు నేను ఆర్డీఓగా పనిచేస్తున్నాను. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకున్న తల్లిదండ్రులు నేను ఈస్థాయికి చేరుకోక ముందే కాలం చేయడం నన్ను ఎప్పటికీ బాధిస్తుంటుంది. ఎప్పుడూ తల్లిదండ్రుల మనస్సు నొప్పించకండి. –ధర్మచంద్రారెడ్డి, ఆర్డీఓ, రాజంపేట విలువలే పునాదిగా పెంచారు.. మా తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోవిందరెడ్డి (విశ్రాంత ఎల్ఐసీ మేనేజర్) విలువలే పునాదిగా పెంచారు. మనకు ఉన్న దాంట్లో పదిమందికి సాయం చేయడం నేర్పారు. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్ విద్య అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తిచేశాను. మా ఇంట్లో నాతో పాటు మా బంధువులు, తెలిసిన వారు కూడా కలిసిమెలిసి చదుకునేవాళ్లం. అందరినీ అమ్మ బాగా చూసుకునేది. 1984లో ఇంజినీరింగ్లో మహిళలు చదవడం తక్కువగా ఉండేది. నాకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదవాలనుకున్న సమయంలో తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. 1984–88 విద్యాసంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఏకైక మహిళా విద్యార్థిని. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే 27 సంవత్సరాలకు పైగా బోధనా రంగంలో రాణించగలిగాను. ప్రస్తుతం వైవీయూకు వైస్ చాన్సలర్గా ఉన్నతస్థానంలో ఉన్నామంటే మా తల్లిదండ్రులు నేర్పిన జీవితపాఠాలే మార్గదర్శకం. వారు నేర్పిన విలువలనే మా పిల్లలకు కూడా నేర్పుతున్నాం. ఇప్పటికీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాం. – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్సలర్, వైవీయూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది మా సొంతూరు పుల్లంపేట మండలం వత్తలూరు. అమ్మ కృష్ణవేణి, నాన్న రామ్మోహన్రాజు. అమ్మ, నాన్న ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణగా పెంచారు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం. నేను చివరి వాడిని. మా ముగ్గురినీ ప్రయోజకుల్ని చేయాలని అమ్మా, నాన్న బాగా తపన పడ్డారు. చిన్నప్పుడు బడిలో అమ్మ, నాన్న వద్దనే మేము చదువుకున్నా, అందరి పిల్లల్లానే మమ్మల్ని చూసేవారు. చదవకుంటే కొట్టేవారు. అప్పట్లో అమ్మ, నాన్నకు తక్కువ జీతాలు అయినా మాలో ఎవరికీ చిన్నలోటు కూడా చేయలేదు. పెద్దన్నయ్య చక్రధర్రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రెండో అన్నయ్య శశిధర్రాజు విద్యుత్శాఖలో సబ్ఇంజనీర్, నేను రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముగ్గురం అన్నదమ్ములం రాజంపేటలో ఒకేచోట నివాసముంటున్నాం. నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మా ఉన్నతిని చేసిన ఆయన ఎంతో సంతోషించారు. అమ్మకు ఏలోటు రానివ్వకుండా కంటికి రెప్పాలా చూసుకుంటున్నాం. -ఈ.భానుమూర్తిరాజు, రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి ప్రతి అడుగులోనూ వారి శ్రమే.. నాపేరు రాచకుంట నాగరాజు. నేను కోడూరులోని అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన పరిశోధనస్థానంలో హెడ్గా విధులు నిర్వస్తిన్నా. సొంతూరు పులివెందుల. నాన్న ఇడుపులపాయ ఎస్టేట్లో మేనేజర్గా పనిచేసేవారు. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. నా ప్రతి అడుగులోనూ తల్లిదండ్రులు రాచకుంట నారాయణ, లక్ష్మీదేవి శ్రమనే కనపడుతుంది. మూడునెలలక్రితం అమ్మ కాలం చేశారు. ఇప్పటికీ వారు పడిన కష్టం, త్యాగం గుర్తుచేసుకుంటూ ఉంటాను. మార్గదర్శకులు మా అమ్మానాన్నలే నా జీవిత ఔన్నత్యానికి మార్గదర్శకులు. నాన్న చిత్తూరు జిల్లాలోని మా గ్రామానికి సర్పంచ్గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అమ్మ గృహిణిగానేగాక నాన్నకు రాజకీయాల్లో స్నేహితురాలిగా ఉంటూ ప్రోత్సహించారు. బిడ్డల బాగోగుల కోసం ఎంత శ్రద్ధ చూపారో గ్రామం అభివృద్దికి కూడా అదే స్థాయిలో కృషి చేశారు. మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయించి నన్ను అందులోనే చదివించారు. చదువుకు మించిన ఆస్తి లేదని బోధించారు. కష్టాలు వచ్చినపుడు సవాలుగా స్వీకరించి విజయం సాధించేవారు పట్టువదలవద్దని నూరిపోశారు. చదువు వరకు పాఠశాల గురువులు మార్గదర్శకులైతే నా జీవితానికి ఉపయుక్తమైన మార్గదర్శనం చేసింది అమ్మా నాన్నలే! నాన్న ముగ్గురు ముఖ్యమంత్రుల నుంచి ఉత్తమ సర్పంచ్గా అవార్డును స్వీకరించారు. మా దంపతులం కూడా అమ్మనాన్నను ఆదర్శంగా తీసుకున్నాం. – శంకర్ బాలాజీ, అసిస్టెంట్కమిషనర్, జిల్లా దేవదాయశాఖ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే... తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. వారి కలలను సాకారం చేసినప్పుడే మన జన్మకు సార్థకత లభిస్తుంది. మానాన్న ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారిగా చూడాలన్నది వారి ఆశ. ఈక్రమంలో చదివించేందుకు ప్రోత్సహించారు. నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నా. మాసొంతూరు నందలూరు. విద్యాభ్యాసం రాజంపేటలోనే సాగింది. ఎంబీఏ హైదరాబాద్లో చేశా. ఆ తరువాత గ్రూప్స్ రాసి డీఎస్పీ అయ్యాను. ఇప్పుడు గుంటూరు డీఎస్పీగా పనిచేస్తున్నా. అమ్మా, నాన్నల కోరిక వల్లే నేను ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నా. యూత్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ‘‘ఫస్ట్ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని గౌరవించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెట్టవద్దు’’. నిజమైన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు తల్లిదండ్రులే. – సుప్రజ, డీఎస్పీ, గుంటూరు –(రాజంపేట టౌన్) -
జిరాక్స్ రాయ్
దేవుడికి నమూనాల అవసరం ఉంటుందా! ఆయన క్రియేటర్. అచ్చులు.. మూసలతో దేన్నీ రిపీట్ చెయ్యడు. ప్రతిదీ దేనికదే కొత్తది తయారవుతుందక్కడ. మరేమిటి.. ఐశ్వర్యారాయ్కి ఇక్కడిన్ని జిరాక్స్ కాపీలు?! రాయ్కి, ‘దేవ్’కి మధ్య ఒప్పందం జరిగిందా! ఇరవై ఏళ్ల క్రితం ఐశ్వర్యారాయ్ ఎలా ఉండేవారు? ఇప్పుడున్నట్లే ఉండేవారు. పెద్దగా ఛేంజ్ లేదు ఆమెలో ఎందుకో మరి! కిందికి వచ్చే ముందే పైన దేవుడితో డీల్ కుదిరి ఉండాలి. ‘స్వామీ.. నన్నెప్పటికీ ఒకేలా ఉంచండి’ అని ఐష్ అడిగితే.. ‘అలా కుదరదు గానీ అమ్మాయీ.. ఎవ్రీ ఇయర్ ఎక్కడో ఒక చోట నీలాంటి అమ్మాయిలు ‘పాప్–అప్’ అయి (పైకి లేస్తూ) అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు’ అని దీవించి ఉంటాడు ఆ దైవమాత్రుడు.. ఈ మానవకన్యను. ‘మిస్వరల్డ్’ అయినప్పుడు ఐశ్వర్య వయసు 21. తొలి సినిమా ‘ఇరువుర్’లో 24. పెళ్లి నాటికి 34. ఇన్ని ఏజ్లలోనూ ఇప్పటికీ ఐశ్వర్య ఒకేలా కనిపించడానికి ఆమె రూపంలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఈ భువిపై మనకు సాక్షాత్కరిస్తూ ఉండటం ఒక కారణం అయి ఉండాలి. కొత్తగా అమ్యూజ్ అమృత అనే అమ్మాయి ఐశ్వర్యలా టిక్టాక్లో దర్శనం ఇస్తోంది. 2002 నాటి ‘కండుకొండైన్ కండుకొండైన్ (నేను కనుగొన్నాను. నేను కనుగొన్నాను) అనే తమిళ చిత్రంలో మమ్ముట్టికి, ఐశ్వర్యకు మధ్య చిన్న సంభాషణ ఉంది. ఆ సంభాషణను టిక్టాక్లో అమ్యూజ్ అమృత ఇమిటేట్ చేశారు. ఆ మాట్లాడ్డం, మాట్లాడుతూ పాజ్లు ఇవ్వడం, కళ్లు తిప్పడం, పెదవులు కదల్చడం.. సేమ్ జిరాక్స్ ప్రింటే ఐశ్వర్యకు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అందులో శుద్ధ సంప్రదాయ కర్ణాటక ఐశ్వర్యలా కనిపించే అమృత తన ఇన్స్టాగ్రామ్ లో ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అన్నట్లు.. భారతదేశంలోని భిన్న సంస్కృతులలో ఐశ్వర్య హావభావాలతో కనిపిస్తుంది. అమ్యూజ్ అమృతను చూస్తే ఐశ్వర్య ఎలా ఫీల్ అవుతారో కానీ.. స్నేహా ఉల్లాల్ని చూసినప్పుడు మాత్రం ‘అరె!!’ అనుకున్నారట. ఐశ్వర్య ఫస్ట్ కాపీ స్నేహా ఉల్లాల్. ‘లక్కీ : నో టైమ్ ఫర్ లవ్’ (2005) చిత్రంతో సడన్గా ఉల్లాల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ‘ఎక్కడ వెతికి పట్టుకున్నాడు ఈ అమ్మాయిని సల్మాన్?’ అని అంతా అనుకున్నారు. అందులో హీరో సల్మానే. ఐశ్వర్య తన ప్రేమను కాదన్నందుకు ఆమెకు పోటీగా సల్మాన్ ఏడు లోకాలు వెతికి ఉల్లాల్ను పట్టుకొచ్చాడని ఆ సినిమాతో పాటే రూమర్లూ రిలీజ్ అయ్యాయి. మస్కాట్లో పుట్టిన ఈ మంగుళూరు అమ్మాయి మన తెలుగులో కూడా నటించింది. ‘ఉల్లాసంగా.. ఉత్సాహంగా’, ‘సింహా’లలో లీడ్ రోల్స్ ఉల్లాల్వి. చక్కగా కుందనపు ఐశ్వర్యారాయ్లా ఉందనుకున్నారు ప్రేక్షకులు. ఆ మాట నచ్చినట్లు లేదు ఉల్లాల్కి. ‘‘మీరు అచ్చు ఐశ్వర్యలా ఉంటారని అంతా అంటుంటారు కదా..’’ అని ఒక ఇంటర్వూ్యలో అడిగిన ప్రశ్నకు.. ‘‘ఐశ్వర్యా! ఎవరూ?!’’ అని చికాకు పడ్డారు కూడా. మరీ ఉల్లాల్లా అచ్చుగుద్దినట్లు ఐశ్వర్యలా లేకపోయినా.. ‘ఆనందం’ (2001) సినిమాలో హీరోయిన్ రేఖా వేదవ్యాస్, అదే ఏడాది విడుదలైన ‘ఇట్లు.. శ్రావణి, సుబ్రహ్మణ్యం’లో తనూరాయ్ కొన్ని యాంగిల్స్లో ఐశ్వర్యను గుర్తుకు తెచ్చారు. ఏళ్లు గడిచాయి. ఐశ్వర్యలా కనిపించిన ఉల్లాల్, రేఖ, తనూరాయ్ మారిపోయారు కానీ, ‘అసలు ప్రతి’ ఐశ్వర్య మాత్రం అలానే ఉండిపోయారు. మరాఠీ నటి మానసీ నాయక్, బెంగాలీ నటి మిష్టీ చక్రవర్తిలో కూడా ఐశ్వర్య పోలికలు ఉంటాయి. అమ్యూజ్ అమృతకు కాస్త సీనియర్లు మానసీ, మిష్టి. మామూలుగానే మనిషిని పోలిన మనిషి కనిపించినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇక ఐశ్వర్యలాంటి వాళ్లు ఏడాదికొకరు అన్నట్లు ప్రత్యక్షం అవుతుంటే ఐశ్వర్యకు వయసు పెరుగుతుందా? వన్నె తగ్గుతుందా? ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఎన్ని గ్యాపులతో ఎన్ని సినిమాల్లో నటించినా ఐశ్వర్యకు అది ఎంట్రీనే తప్ప రీ–ఎంట్రీ అవకపోవడానికి ఆమె కాలాతీత అభినయ సౌందర్యం కానీ, ఆమె సౌందర్యాభినయం గానీ ఆమెలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉండి ఉండొచ్చు. -
అసత్యాల్నిచీల్చి చెండాడిన సత్యం!
యూదులు రెండువేల ఏళ్ళ క్రితం పస్కా పండుగనాడు యేసుక్రీస్తును శుక్రవారం రాత్రి సిలువ వేసి చంపి, అరిమతై యోసేపు అనే ఒక రహస్య క్రైస్తవునికి చెందిన రాతిసమాధిలో ఆయన్ను ఖననం చేశారు. అయితే యేసుక్రీస్తు తాను మునుపే ప్రకటించినట్టుగా, ఆదివారంనాటి తెల్లవారు జామునే పునురుత్థానుడు కాగా, తిరిగి సజీవుడైన యేసుక్రీస్తును విశ్వాసులైన స్త్రీలు మొదట చూశారు. వారిద్వారా ప్రభువు శిష్యులు తెలుసుకొని వెళ్లి ఖాళీ సమాధిని చూశారు. అయితే ప్రభువే వారికి ప్రత్యక్షమై తనను తాను కనపర్చుకున్నాడు. ఆ విధంగా యేసు పునరుత్థానమే పునాదిగా క్రైస్తవం ఆరంభమైంది. అలా చాలా కొద్దిమందితో, యేసును సిలువ వేసిన యెరూషలేమే కేంద్రంగా, ఆయన్ను సిలువ వేసిన యూదుల మధ్యే ఆరంభమైన క్రైస్తవంలోకి యూదులతో సహా ఎంతో మంది చేరుతూండగా అది ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించి, ఈనాడు 210 కోట్ల మంది విశ్వాసులున్న అతి పెద్దమతంగా ప్రపంచంలో సుస్థిరమైంది. ప్రపంచ చరిత్రలో అలా జరిగిన ఒక కుట్ర పటాపంచలై యేసుక్రీస్తు సారథ్యంలో ప్రేమ, క్షమాపణలే ముఖ్యాంశాలుగా ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంగా క్రైస్తవం తన ఉనికిని చాటుకుంది. పామరులు, పిరికివాళ్ళు, సమాజంలో ప్రాబల్యం లేనివాళ్లయిన విశ్వాసులతో కూడిన క్రైస్తవం ఇంతటి స్థాయికి ఈనాడు ఎలా ఎదిగింది? ఆ పిరికివాళ్ళనే దేవుడు తన శక్తితో నింపాడు. ‘మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము...’ అంటూ వేలాదిమంది యూదుప్రముఖుల సమక్షంలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని, ఆయన పునరుత్థాన మహా ఘటనను శిష్యులైన పేతురు,యోహాను కలిసి అవి జరిగిన కొద్దిరోజులకే యెరూషలేము మహాదేవాలయ ప్రాంగణంలో ప్రకటించారు. విశేషమేమిటంటే, నాడు పస్కాపండుగ రాత్రి గెత్సేమేనే తోటలో ప్రార్థనలో ఉన్న యేసుక్రీస్తును యూదా ఇస్కరియోతు అనే మరో శిష్యుని విద్రోహం కారణంగా రోమా సైనికులొచ్చి నిర్బంధించినపుడు, యేసు ఎవరో నాకసలు తెలియదంటూ మూడుసార్లు నిర్లజ్జగా బొంకి పేతురు పారిపోయిన ఉదంతాన్ని కూడా తన సువార్తలో ఎంతో విపులంగా ప్రస్తావించిన లూకా సువార్తికుడే, యేసును కుట్రచేసి చంపిన యూదు మతపెద్దలు, శాస్త్రులున్న గుంపును ఉద్దేశించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును కళ్లారా చూసిన నూతనోత్తేజంతో ఇది జరిగిన దాదాపు 55 రోజులకే పేతురు ఆత్మవశుడై ఎంతో ధైర్యంగా చేసిన ఈ ప్రకటనను కూడా తన అపొస్తలుల కార్యాల గ్రంథంలో ప్రస్తావించాడు (లూకా 22:39–62), (అపో.కా 3:15). సిలువ వెయ్యడానికి సైనికులు యేసుక్రీస్తును నిర్బంధించి తీసుకెళ్తుంటే ప్రాణభయంతో ఆయన్ను వదిలేసి పారిపోయిన పిరికి పేతురుకు, అది జరిగి రెండు నెలలైనా కాకముందే ‘మీరంతా యేసు హంతకులు, యేసు హత్యకు, ఆయన పునరుత్థానానికి కూడా మేము సాక్షులం’ అంటూ నిలదీసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అది క్రైస్తవానికి యేసుక్రీస్తువారి పునరుత్థాన శక్తి ద్వారా వచ్చింది. వాస్తవమేమిటంటే, క్రీస్తును తెలుసుకొని ఆయన అనుచరులముగా క్రైస్తవులమైతే అయ్యాము కానీ, ఆయన పునరుత్థానశక్తిని మాత్రం పూర్తిగా అవగాహన చేసుకోలేక దాన్ని పొందలేక పోతున్నాము. పునరుత్థానశక్తికి లోకపరమైన శక్తితో ఏమాత్రం పోలికలేదు. ఒక రాయిని కొండమీది నుండి భూమ్మీదికి తోసేందుకు తోడయ్యేది మామూలుగా లోకంలో అందరిలోనూ ఉండే శక్తి అయితే అదే బండరాయిని భూమ్మీదినుండి కొండ మీదికి దొరలించేందుకు ఉపకరించేది యేసుప్రభువు వారి పునరుత్థాన శక్తి!! యేసుప్రభువు వారి ప్రేమ, క్షమాపణ అనేవి అర్థమైతేనే ఈ శక్తి అర్థమవుతుంది, లభ్యమవుతుంది. రెండువేల ఏళ్ళ క్రితం నాటి ్రౖకైస్తవంలో ఎక్కువగా పామరులు, సామాన్యులే ఉన్నారు కాని వాళ్ళు క్రైస్తవాన్ని భూదిగంతాలకు విజయవంతంగా తీసుకువెళ్లడం వెనుక ఈ శక్తి ఉంది. అందుకే ఆ శక్తిని తాను తెలుసుకోవడానికే ప్రయాసపడుతున్నానని మహా అపొస్తలుడు పౌలు అన్నాడు (ఫిలిప్పి 3:11). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మహమ్మారిపై మహాపోరు
మందు కనిపెట్టే వరకే ఏ మహమ్మారి అయినా విజృంభిస్తుంది. కనిపెట్టాక తోక ముడుస్తుంది. కరోనా ఇప్పుడు తనకు మందు లేదని విర్రవీగుతోంది. కాని దాని పడగను నులిమేసే పరిశోధనలు సాగుతూ ఉన్నాయి. రాక్షస సంహారం చేసిన నారీమణులు మన పురాణాలలో ఉన్నారు. చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు కరోనా తరిమివేతలోనూ ఉంటారు. లండన్ మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్లో ఈ మహిళా పరిశోధకులు కరోనా గురించి చైతన్యం కలిగించడంలో ముందున్నారు. లండన్లో ఉన్న ‘మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్’లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహిళా పరిశోధకులంతా కలిసి సంతోషంగా సంబరాలు జరుపుకోవాలనుకున్నారు. కాని అంతలోనే వారికి బాధ్యత గుర్తుకు వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్పై తమ పరిశోధక శస్త్రాలను ఎక్కు పెట్టాలని సంకల్పం కలిగింది. అక్కడి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ పరిశోధకులు కొవిడ్ 19 మహమ్మారికి సంబంధించి చర్చించి, ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందిస్తూ, ప్రజలకు ధైర్యాన్నివ్వాలనుకున్నారు. క్రిజిల్ డొన్నెల్లీ విదేశీయుల ద్వారా ఎంతమందికి ఈ వ్యాధి సోకింది, ఏ విధంగా నియంత్రించాలి అనే అంశాల గురించి చర్చిస్తున్నారు క్రిజిల్ డొన్నెల్లీ. ‘మా పరిశోధనలో తేలిన అంశాలను డబ్లుహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)కి అందచేçస్తూ, యుకేలోని ప్రభుత్వ విభాగాలకు, పబ్లిక్ హెల్త్ సెంటర్స్కి వాటిని అందిస్తున్నాం. అదేవిధంగా ఐM్కఉఖఐఅఔ’S గిఉఆSఐఖీఉ లో కూడా ఉంచుతున్నాం. సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రతి ప్రాంతీయ భాషలలో అందచేస్తున్నాం. మీడియాకు సహకరించే బాధ్యత నాది. టీవీ, రేడియో, దినపత్రికలు, ఆన్లైన్ ఔట్లెట్స్ (లైవ్, రికార్డెడ్ ఇంటర్వూ్యలు).. అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను. బిబిసి కరోనా వైరస్ పాడ్క్యాస్ట్లో మొట్టమొదటి ఇంటర్వూ్య ఇచ్చాను. ప్రపంచాన్ని వణికించిన ఎబోలా సమయలో ఈ విధంగా పనిచేసిన అనుభవం నాది’ అంటారు క్రిజిల్ డొన్నెల్లీ. డా. యాన్ కొరీ ‘స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎపిథెమియాలజీ’లో లెక్చరర్గా పనిచేస్తున్నారు డా.యాన్ కొరీ. ‘ప్రజలకు, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారికి ఇది ఒక గడ్డుకాలం. అందరికీ సకాలంలో సరైన సమాచారం అందుతుందనే నమ్మకం లేదు. ఈ వ్యాధి వలన నిజంగానే ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవటం చాలా కష్టం. 2014 – 2016 మధ్య కాలంలో పశ్చిమ ఆఫ్రికాను గడగడలాడించిన ఎబోలా గురించి 2018 నుంచి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంత బాధ్యతగా పనిచేస్తున్నామో, ఇప్పుడు కూడా అదేవిధంగా పని చేస్తున్నాం. మేమంతా కలిసి ఎంతో జాగ్రత్తగా ఈ వ్యాధిని నివారించటానికి, నిర్మూలించటానికి కృషి చేస్తున్నాం’ అంటున్నారు డా. యాన్ కొరీ. వెండీ బార్క్లే కొవిడ్ 19 శ్వాసకోశంలోకి ఏ విధంగా ప్రవేశించి, వ్యాప్తి చెందుతుంది అనే విషయంలో పరిశోధిస్తున్నారు. కొత్త కొత్త శాస్త్రవేత్తల గురించి, నిపుణుల గురించి మీడియాకు విస్తృతంగా సమాచారం అందించిన అనుభవం వీరిది. ‘2000 సంవత్సరంలో సార్స్ విషయం బయట పడినప్పుడే గబ్బిలాలలో కరొనా వైర స్ విస్తృతంగా ఉందని తెలుసుకున్నాం. ఇదొక్కటే ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కాదు. రెండు గబ్బిలాలలోని వైరస్ కలయిక వల్ల ఈ వ్యాధికి సంబంధించి వైరస్ పుడుతోందని తెలిసింది. ఇది నేరుగా గబ్బిలాల నుంచే మనుషులకు సోకుతోందా లేదా గబ్బిలాల నుంచి ఏదైనా మరొక వాహకం ద్వారా మనుషులకు సోకేలా చేస్తోందా అనేది ఇంకా నిర్థారించాలి’ అంటున్నారు వెండీ బార్క్లే. రెబెకా ప్రైస్ సార్స్ – కోవ్ 2 ఏ విధంగా కొవిడ్ 19కు కారకం అవుతున్నాయనే అంశం గురించి పని చేస్తున్న బృందంలో సభ్యురాలు. ‘దేశాలు, ప్రయోగ కేంద్రాల మధ్య అనుంధానం చాలా కష్టం అనుకున్నాను మొదట్లో. కాని ఎంతో అవగాహనతో బాధ్యతగా పనిచేస్తున్నారు’ అంటున్నారు రెబెకా ఫ్రైస్. డా. అన్నా బ్లాక్నీ (పోస్ట్ డాక్టరల్ రిసెర్చర్) ప్రొఫెసర్ రాబిన్ షటాక్స్ బృందంలో కొవిడ్ 19కి ప్రాథమిక వ్యాక్సిన్ తయారీలో పని చేస్తున్నారు. ‘ఈ వ్యాక్సిన్ తయారీకి మాకు 14 రోజుల సమయం పట్టింది. ఇదొక రికార్డు. అవసరమైన వైరస్ను సేకరించి, వ్యాక్సిన్ను రూపొందించాం. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ను జంతువులపై ప్రయోగిస్తున్నాం. మా బృందం రూపొందించిన వ్యాక్సిన్లో స్వయం నిరోధక శక్తి పెంచే ఆర్ఎన్ఎ ఉంది. అంటు వ్యాధులకు ఇది అడ్డుకట్ట వేస్తుంది’ అంటారు డా.అన్నా బ్లాక్నీ. ఒక చిన్న సూక్ష్మజీవి యావత్ ప్రపంచానికి తాళం వేసే స్థితి తీసుకువచ్చినా శాస్త్రవేత్తలు మాత్రం అనుక్షణం ఈ వైరసణ నిర్మూలన కోసం శ్రమిస్తున్నారు. ఈ యజ్ఞంలో కొందరు వైద్యులు ఇప్పటికే ఆహుతయ్యారు. వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ఫలితం రావాలంటే, ప్రజలంతా తప్పనిసరిగా సహకరించాలి. ‘‘వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ/గుండెకు బదులుగా గుండెను పొదిగి.. కొన ఊపిరులకు ఊపిరులూదీ/జీవన దాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించరావా’’ అంటూ ప్రతి ఒక్కరూ వైద్యులను అభినందించాలి. శాస్త్రవేత్తలకు శిరసు వంచి నమస్కరించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. – వైజయంతి ప్రొఫెసర్ అజ్రా ఘనీ ‘సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనాలసిస్’లో తన తోటి ఉద్యోగులతో కలిసి అజ్రా ఘనీ ప్రభుత్వానికి కీలక సమాచారం అందించటంలో అహర్నిశలూ కృషి చేస్తున్నారు. కరొనా వైరస్కి సంబంధించిన అత్యంత ప్రధానమైన సమాచారాన్ని మార్చి 16వ తేదీన అందించారు. ‘మేమంతా కరొనాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో హెచ్చరిస్తున్నాం. 2003లో విజృభించిన సార్స్ వైరస్ సమయంలోనూ, 2009 ఫ్లూ మహమ్మారి వచ్చినప్పుడూ సమాచారాన్ని అందిస్తూ ఏ విధంగా హెచ్చరించామో, ఇప్పుడు కొవిడ్ 19 గురించి కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నాం. కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా అంతకంతకు పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అత్యంత వేగంగా విస్తరిచండం కొవిడ్–19కు ఉన్న ప్రత్యేక లక్షణం, అదే సమయంలో అత్యంత ఆందోళనకరం. 50 మందికి పైగా శాస్త్రవేత్తలు కొవిడ్ – 19 గురించి శాస్త్రీయ సమాచారం ఇవ్వడానికి పరిశోధన చేస్తున్నారు’ అంటున్నారు ప్రొఫెసర్ అజ్రా ఘనీ. -
సంశయం! సంకోచం! సందేహం!
ఛత్రపతి శివాజీకి జిజియాబాయి జన్మనిచ్చిన రోజు ఇది. జన్మను మాత్రమే ఇవ్వలేదు జిజియా. జన్మభూమిని కాపాడే శౌర్యాన్ని ఇచ్చింది. స్త్రీలను, పరమతాలను గౌరవించడం నేర్పింది. భారత, రామాయణాల్ని చదివించింది. బలి చక్రవర్తి గాథల్ని వినిపించింది. యుద్ధతంత్రాలలో నిష్ణాతుడిని చేసి, ఖడ్గాన్ని చేతికి ఇచ్చింది. శివాజీ ఖడ్గధారకు అంతటి పదును తల్లి పట్టిన పాల వల్లనే! అతడొక గొప్పచక్రవర్తి అయ్యాడంటే.. ఆమె ఒక ధీశాలి అయిన తల్లి అవడం వల్లనే! మగపిల్లల్ని గొప్ప యోధులుగా తీర్చిదిద్దిన తల్లులే కాదు, గొప్ప యోధులై.. దేశమాతను కాపాడుకున్న ఆడబిడ్డలూ మన దేశ చరిత్రలో ఎందరో ఉన్నారు. రాణీ లక్ష్మీబాయి, రాణీ పద్మిని, రజియా సుల్తానా, అహల్యాబాయ్ హోల్కర్, మాతా భాగ్ కౌర్, ఒనకె ఓబవ్వ, కేలడి చెన్నమ్మ, బెలవాడి మల్లమ్మ, అబ్బక్క రాణి.. ఎన్ని యుగాలకైనా ధ్వని తీవ్రత క్షీణించని శంఖారావాలు. పునీతా అరోరా, పద్మావతీ బందోపాధ్యాయ, మిథాలి మధుమిత, ప్రియా ఝింగన్, దివ్యా అజిత్ కుమార్, నివేదిత చౌదరి, అంజనా బాధురియా, ప్రియా సేవమ్వాల్, దీపికా మిశ్రా, సోఫియా ఖురేషి, శాంటి టిగ్గా, గనెవె లాల్జీ, గంజన్ సక్సేనా, అవని చతుర్వేది, మోహనాసింగ్, భావనాకాంత్.. తానియా శేర్గిల్.. వర్తమాన రక్షణదళ మహిళా క్షిపణులు. ఐక్యరాజ్యసమితి భారతదళ సభ్యులుగా ఆఫ్రికా దేశాలలో, భారత రక్షణ సేనానులుగా పొరుగు దేశాల్లో.. శాంతిని స్థాపించి వచ్చిన లెఫ్ట్నెంట్ అనువందన జగ్గీ, మేజర్ గోపికా భట్తీ, మేజర్ మధు రాణా, మేజర్, మేజర్ ప్రీతీసింగ్, మేజర్ అనూజా యాదవ్.. యుద్ధభూముల్లో స్త్రీ శక్తిని చాటిన అస్త్రాలు. మహిళల్ని ఆర్మీలోకి కమాండర్లుగా తీసుకోవడం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టులో సోమవారం కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నప్పుడు.. ‘ఎందుకు సాధ్యం కాదూ! సాధ్యం చేసిన, సాధ్యం చేస్తున్న వాళ్ల మాటేమిటి?’ అంటూ పైన ఉదహరించిన వారిలో పదమూడు మంది వర్తమాన మహిళా యోధుల పేర్లను సుప్రీంకోర్టు జడ్జిలు ప్రస్తావించారు. మూడు నెలల్లోగా మహిళల్ని కమాండింగ్ పోస్టులోకి తీసుకోవడం ప్రారంభించాలని తీర్పు చెప్పారు. సైన్యంలోని యుద్ధ విధుల్లో పని చేయాలన్న తపన ఉన్న యువతులకు ఇది ఉత్సాహాన్నిచ్చే తీర్పు. ఐరాస విధుల్లో భారత మహిళా జవాన్లు తొమ్మిదేళ్ల క్రితమే ఢిల్లీ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం సంశయించింది. శత్రువుకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండని ఎయిర్ఫోర్స్లో, నేవీలో పర్వాలేదు కానీ.. శత్రువుకు ఎదురుగా వెళ్లి పోరాడవలసిన సైనికుల బృందానికి మహిళా కమాండర్లని సేనానులుగా పెట్టడం మంచిది కాదు అని ప్రభుత్వ వాదన. వాదన కాదు.. సంశయం! సంకోచం! సందేహం! మహిళల దేహ ధర్మాలు.. యుద్ధ ధర్మాలను సక్రమంగా నెరవేర్చనివ్వవని, మగ సైనికులు మహిళా కమాండర్ మాట వినరనీ, వీళ్లు బట్టలు మార్చుకుంటుంటే వాళ్లు తొంగిచూస్తుంటారనీ, శత్రువు చేతికి మన మహిళ చిక్కితే దేశ ప్రజల హృదయ స్పందనలు హద్దులు, సరిహద్దులు మీరే ప్రమాదం ఉందనీ స్వయంగా ఆర్మీ చీఫే అన్నారు. అయితే.. ‘‘ఇవన్నీ మీరు ఊహించుకుంటున్నవే కానీ.. కర్తవ్య నిర్వహణలో కమాండ్ చేసేందుకు మహిళలు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు’’ అని తీర్పు వెలువరించడానికి ముందు సుప్రీం జడ్జిలు వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు ఉవ్విళ్లూరుతున్న యువతుల్ని నిరుత్సాహపరిచేందుకు మనల్ని ప్రేరేపిస్తున్నది వాళ్ల రక్షణ, వాళ్ల భద్రత మాత్రమేనని అనిపిస్తున్నప్పటికీ దానివెనుక తెలియకుండా ఉన్నది వివక్ష మాత్రమే. అది ఉద్దేశ పూర్వకమైన వివక్ష కాకపోవచ్చు. ‘స్త్రీ, పురుషుడు సమానం కాదు’ అనే ఆదిమ భావన నుంచి నేటి ఆధునిక సమాజం కూడా బయటపడలేక పోతోంది. ఇక ఆర్మీలోనైతే చెప్పే పని లేదు. సైనిక పటాలాలను పురుషుడు మాత్రమే నియంత్రించగలడనీ, సమర వ్యూహాలు, ప్రతిభాపాటవాలు పురుషుడికి మాత్రమే ఉంటాయని దివి నుంచి భువికి ఎవరో చెప్పి పంపించినట్లుగా స్థిరపడిపోయింది. మహిళకు అవకాశం రాక (ఇవ్వక) పురుషుడు దేశ రక్షకుడయ్యాడు కానీ.. దేశ రక్షణ బాధ్యతను మోసే బలం మహిళలకు లేదని కాదు. సోఫియా ఖురేషి భారతదేశ రక్షణ వ్యవస్థలోని సైనిక, వైమానిక, నావికా దళాలలో రెండు రకాౖలñ న నియామకాలు ఉంటాయి. షార్ట్ సర్వీస్ కమిషన్. పర్మినెంట్ కమిషన్. షార్ట్ సర్వీస్లో విధి నిర్వహణ పదేళ్లు మాత్రమే. సామర్థ్యాన్ని బట్టి మరో నాలుగేళ్ల పొడిగింపు ఉంటుంది. పర్మినెంట్ సర్వీసులో ఉన్నవారు పదవీ విరమణ వయసు వచ్చేవరకు విధుల్లో ఉండొచ్చు. అయితే మహిళల్ని ఉదారంగా రక్షణ దళాల్లోకి తీసుకుంటున్న ప్రభుత్వం.. అంతే ఔదార్యంతో వారిని పర్మినెంట్ కమిషన్లోకి తీసుకోవడం లేదు. కోర్టులో దీనిపై తొమ్మిదేళ్లుగా సాగుతూ వస్తున్న వాదోపవాదనల్లోనే.. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మహిళల్ని కూడా పర్మినెంట్ కమిషన్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. దీంతో దళాల్ని ముందుకు నడిపించే (కమాండింగ్) బాధ్యతల్లోకి అతి త్వరలోనే మహిళలూ రాబోతున్నారు. ఈ కేసులో ప్రభుత్వం చేసిన ముఖ్యవాదన.. ‘గ్రామాల నుంచి వచ్చిన మగ జవానులు మహిళా కమాండ్ మాట వినరు.. దాంతో యుద్ధ సమయాలలో శుత్రువును కట్టడి చెయ్యడం మనకు కష్టం అవుతుంది. అది దేశ భద్రతకే ప్రమాదం..’ అని! 1992లో భారత సైన్యంలో చేరిన 25 మంది మహిళా అధికారులలో తొలి కేడెట్ అయిన మేజర్ ప్రియా ఝింగన్.. మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుకు ఒకరోజు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో మన ప్రభుత్వ వాదనకు తగిన సమాధానమే చెప్పారు. ‘‘జవాన్లు మాట వినరని మీరే అనడం ద్వారా.. ‘మహిళా కమాండర్ మాట వినొద్దు’ అని మీరు చెబుతున్నట్లుగా ఉంది’’ అన్నారు ఝింగన్. ఏ సిపాయి అయినా కమాండర్ మాట వినకపోతే సైనిక చట్టాల ప్రకారం పనిష్మెంట్లు ఉంటాయి. పనిష్మెంట్ ఉంటుందన్న భయం ఉంటే.. పై అధికారి పురుషుడైనా, మహిళ అయినా మాట వినే తీరుతారు. ‘మహిళలు కుటుంబం కోసం యుద్ధరంగాన్ని కాదనుకుని పోతారు’ అని మరొక వాదన. అదీ నిజం కాదు. సమర్థతతో, అంకితభావంతో, త్యాగనిర తితో ఏ బాధ్యతనైనా నిర్వర్తించే మనోబలం, నిబద్ధత మహిళల్లో ఉన్నాయి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యవస్థలు విజయవంతంగా, నిరంతరాయంగా నడుస్తున్నాయి. ప్రియా ఝింగన్ భారతీయ సైనికదళం నూట ఇరవై నాలుగేళ్లుగా ఉంది. అంతకు ఏడేళ్ల ముందు నుంచే సైన్యం కోసం మహిళా నర్సుల సేవలు సిద్ధంగా ఉన్నాయి! మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలలో భారత సైన్యంలోని నర్సులు మూడు వందల యాభై మందికి పైగా మరణించడమో, బందీలుగా శత్రువుల చేతికి చిక్కడమో జరిగింది. మరికొందరు అసలు ఏమైపోయారో కూడా తెలీదు. ఆ తర్వాత నలభై ఏడేళ్లకు గానీ మహిళల్ని వైద్యేతర విభాగాల్లోకి తీసుకునే చొరవ చేయలేకపోయింది భారత సైన్యం. తొలిసారి 1992లో నాన్–మెడికల్ విధుల్లోకి మహిళలు ప్రవేశించారు. తర్వాత పదిహేనేళ్లకు మన దేశం నుంచి ఐక్యరాజ్యసమితి తరఫున వందమందికిపైగా మహిళా పోలీసులు శాంతిస్థాపనకోసం లైబీరియా వెళ్లి సమర్థంగా విధులు నిర్వర్తించి వచ్చారు. 2014 నాటికి భారతీయ సైనిక దళంలో 3 శాతానికి, నావికాదళంలో 2.8 శాతానికి, వైమానిక దళంలో 8.5 శాతానికి మహిళ సంఖ్య పెరిగింది. 2015లో తొలిసారి ఫైటర్ పైలట్లుగా మహిళలు యుద్ధవిధుల్లోకీ వచ్చేశారు. -
క్యాన్సర్పై పోరు ఓ యుద్ధతంత్రం
యుద్ధాన్ని గెలవాలంటే యుద్ధతంత్రాన్ని అనుసరించాలి. క్యాన్సర్పై పోరాటం కూడా యుద్ధమే. దానికీ ఓ తంత్రం కావాలి. స్టెమ్సెల్ థెరపీ, లైట్తో ఇచ్చే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలతో చేసే చికిత్సలు, మెట్రానమిక్స్ లాంటి కొత్త కొత్త ప్రక్రియలెన్నో ఉన్నా... మనందరికీ తెలిసినవి కీమో, రేడియేషన్, శస్త్రచికిత్స, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటివి. ఈ ఐదింటిలోనూ దీన్నెప్పుడు, ఎలా, ఏ మోతాదులో వాడాలన్నదే ‘చికిత్సాయుద్ధ(పంచ)తంత్ర’మనుకోవచ్చు. ఇక చిన్నప్పుడు పంచతంత్ర కథలను మనందరం చదివాం కదా. రాజుగారి కొడుకులకు తేలిగ్గా లోకరీతులపై అవగాహన కలిగించడం కోసం విష్ణుశర్మ రాసిందే పంచతంత్రం. క్యాన్సర్పై యుద్ధతంత్రాలను మనం కూడా అంతే తేలిగ్గా అచ్చం పంచతంత్ర కథల్లాగే సులువుగా, తేలిగ్గా తెలుసుకుందాం. అవే క్యాన్సర్–మిత్రలాభం, క్యాన్సర్–మిత్రభేదం, క్యాన్సర్– సంధి, విగ్రహానికి బదులుగా నిగ్రహం కథలు. ఇక చదవండి. అవగాహన పెంచుకోండి. క్యాన్సర్ – మిత్రలాభం లేడిని తినే ఉద్దేశంతో ఓ నక్క దాంతో స్నేహం చేసింది. ఓనాడు లేడి దగ్గరికి వెళ్లి ‘‘దగ్గర్లోని ఓ రైతు పొలంలో రుచికరమైన పచ్చగడ్డి ఉంది. తిందువుగానీ రా’’ అంది. ముందుగా లేడి కాస్త సందేహించినా పచ్చగడ్డి మీద ఆశతో వెళ్లి, అక్కడ రైతు పన్నిన వలలో చిక్కుకుంది. రైతు వచ్చి లేడిని చంపి పారేస్తాడనీ... అప్పుడు దాని మాంసం తాను తినొచ్చని నక్క వేచిచూస్తోంది. తన మిత్రుడైన లేడి కనిపించడం లేదని వెతుకుతూ దాని స్నేహితుడైన కాకి అక్కడికి వచ్చి, పరిస్థితి గ్రహించింది. ‘నువ్వు చచ్చిపడినట్టు నటించు. రైతును నమ్మించడానికి నేను నా ముక్కుతో నిన్ను పొడుస్తున్నట్టు నటిస్తాను. రైతు వల తొలగించగానే పారిపో’ అని ఉపాయం చెప్పింది. ఆ ప్రకారం... లేడి తప్పించుకుంది. ఇప్పుడు మనం ఓ క్యాన్సర్ కథ చెప్పుకుందాం. అది కూడా అచ్చం పై కథలాగే ఉంటుంది. ఓ చిన్నారికి బ్లడ్క్యాన్సర్ సోకింది. అంటే... పాత తెల్లరక్తకణాలు పూర్తిగా చనిపోకముందే కొత్తవి పుట్టుకొస్తూ... రక్తం తన పని తాను చేయకుండా అడ్డుపడటమే ఈ బ్లడ్ క్యాన్సర్. ఇలా క్రమపద్ధతిలో కాకుండా తెల్లరక్తకణాలు అదేపనిగా పుట్టడానికి కారణం టైరోసిన్ కైనేజ్ అనే ఓ రసాయనం. అదిలా అడ్డదిడ్డంగా, అదేపనిగా రక్తంలోని తెల్లరక్తకణాలు పుట్టడానికి దోహదపడుతుంది. ఏదైనా ఉపాయంతో ఆ టైరోసిస్ కైనేజ్ను ఆపేస్తే? అప్పుడు తెల్లరక్తకణాలు పుట్టడమూ ఆగిపోతుంది. దాంతో రోగి ఎప్పటిలాగే ఆరోగ్యంగా, మామూలుగా ఉంటాడు. మన ఈ కథలో రోగి ... ఓ లేడిలాంటి చిన్నారి. టైరోసిస్ కైనేజ్ నక్క. తెల్లరక్తకణాలు పుట్టేలా చేసే అంశం రైతు. టార్గెట్ థెరపీలో ఇచ్చే ‘ఇమాటనిబ్’ లాంటి కొన్ని మందులు కాకిలాంటివి. ఇప్పుడు ఇమాటనిబ్ లాంటి ఆ మందులు లేడిలాంటి చిన్నారిలోకి ప్రవేశించి, టైరోసిస్ కైనేజ్ నక్కను, ఆ మాటకొస్తే రైతునూ కన్ఫ్యూజ్ చేస్తాయి. దాంతో ఇష్టమొచ్చిన రీతిలో, ఓ క్రమపద్ధతి లేకుండా తెల్లరక్తకణాలను పుట్టించే ప్రక్రియ ఆగుతుంది. దాంతో చిన్నారి లేడికి లేచిందే పరుగులా పరుగెడుతూ మునపటిలాగే ఆరోగ్యంగా ఉంటుంది. మరో కథ చూద్దామా! ఒక చోట ధాన్యపు గింజలు చెల్లాచెదురుగా ఉండటం కొన్ని పావురాలు చూశాయి. అక్కడ పరచి ఉన్న వలను చూడకుండా చిక్కుకుపోయాయి. అవన్నీ ఓ ఉపాయం ఆలోచించాయి. సమష్టిగా ఎగిరిపోయి... ఓ ఎలుక సహాయంతో తమ వలను ఛేదించుకున్నాయి. అంటే... ఇక్కడ పనికి వచ్చింది పావురాలూ–ఎలుకల మిత్రత్వం. అలాగే క్యాన్సర్ను ఎదుర్కోవాలంటే కొన్నింటితో స్నేహం చేయాలి. ముందుగా మనం స్నేహం చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి అలవాట్లతో. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే కూరగాయలూ, తాజాపండ్ల వంటివి తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తే... అవి రోగమనే వలను ఎలకల్లా కొరికేస్తాయి. అటు తర్వాత ముందుగానే క్యాన్సర్ను తెలుసుకునే కొన్ని వైద్యపరీక్షలతోనూ మిత్రత్వం వహించాలి. మరో ముఖ్యమైన అంశమైన కుటుంబసభ్యుల తోడ్పాటూ, ఇంకో అంశమైన డాక్టర్ సహాయంతో క్రమం తప్పకుండా తీసుకునే చికిత్స ప్రక్రియలూ... వీటన్నింటి సహాయంతో రోగి ధైర్యం చిక్కబట్టుకుని పావురాల్లా ఎగిరితే... మందులూ, రేడియేషన్, సర్జరీ వంటి ప్రక్రియలు మూషిక మిత్రుల్లా జబ్బును కొరికి పేషెంట్ను రోగవిముక్తం చేస్తాయి. అలాగే రోగి మరికొన్ని చికిత్స ప్రక్రియలతోనూ క్రమం తప్పకుండా స్నేహం చేయాలి. అవే... ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, బయాప్సీ వంటి పరీక్షలు. కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు ఈ పరీక్షలతో వ్యాధిని అనుమానించాక... మరికొన్ని నిర్ధారణ పరీక్షలనూ చేయించాలి. అవే... నిర్దిష్టమైన కొన్ని రక్తపరీక్షలు, మల, మూత్రపరీక్షలు, సీటీ స్కాన్, పెట్ స్కాన్, ఎమ్మారై వంటివి చేస్తారు. సీటీస్కాన్, ఎమ్మారై పరీక్షలు కణితి ఉన్న ప్రదేశాన్ని, దాని పరిమాణాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే పరీక్షలు. ఇలాంటి పరీక్షలతో క్యాన్సర్ రోగి ఎప్పుడూ స్నేహం వహించి ఉండి, క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే... వ్యాధి తగ్గాక కూడా తిరగబెట్టకుండా చూసుకుంటూ జీవితాంతం హాయిగా, అసలు ఒకప్పుడు వ్యాధి వచ్చిన దాఖలా కూడా లేకుండా పూర్తిగా నార్మల్ వ్యక్తిలాగే ఉండవచ్చు. క్యాన్సర్ – మిత్రభేదం ఓ దేశంలో శ్వేతకాష్టుడూ... మద్యముడూ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. శ్వేతకాష్టుడు పైకి తెల్లగా, అందంగా ఉంటాడు. నెత్తిచివర కాష్టంలా మండుతూ ఉంటాడు. ఇలా తెల్లగానూ, మండుతూనే ఉండటం వల్ల వాడికి శ్వేతకాష్టుడు అలియాస్ సిగరెట్టుడు అనే పేరూ ఉంది. వీడికీ ఫ్రెండ్స్ చాలామందే ఉంటారు. చుట్టా, బీడీ, జర్దా, ఖైనీ, గుట్కా, ముక్కుపొడి వీళ్లంతా శ్వేతకాష్టుడి క్లోజ్ ఫ్రెండ్స్. ఇక మద్యముడు కూడా బంగారు రంగున్న పానీయరూపంలోనే గాక రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాడు. ఈ ఇద్దరు మిత్రులంతా దేశంలోని ప్రజల దగ్గరికిపోయి... ‘మిత్రులారా... మీరు స్ట్రెస్సాసురుడూ, టెన్షనుడు అనే రాక్షసుల బారిన పడి నలిగిపోతున్నారు. మమ్మల్ని ఆశ్రయించి... మీరు వారి నుంచి దూరం కావచ్చ’ని చెబుతుంటారు. అలా సదరు స్ట్రెస్సాసురుడూ, టెన్షనుల పీడవిరగడ చేస్తామంటూ...వీళ్లంతా ఆ దేశ అమాయక ప్రజల్ని క్యాన్సరాసురుడికి ఆహారంగా పంపుతుంటారు. అందుకే స్ట్రెస్సాసుర, టెన్షనులను వదిలించుకోవడం కోసం ఈ శ్వేతకాష్టుడు, మద్యములనే ఈ చెడుమిత్రుల స్నేహం నుంచి రక్షించుకోవాలి. ఇందుకోసం మనం రిలాక్సేషన్ ప్రక్రియలూ, యోగా వంటి మంచి మిత్రుల సహాయంతో మిత్రుల రూపంలోని ఆ శత్రువులకు దూరంగా ఉండాలని చెప్పే కథే... క్యాన్సర్–మిత్రభేదం చెప్పే మాట. విగ్రహానికి బదులు నిగ్రహం... పంచతంత్రంలోని విగ్రహానికి బదులు మనం ‘నిగ్రహం’ అనే మరో అంశాన్ని తెలుసుకుందాం. మనం కొన్ని అంశాల పట్ల నిగ్రహం పాటించాలి. ఉదాహరణకు పిజ్జాలు, బర్గర్లలాంటి బేకరీ ఐటమ్స్. ఇవన్నీ చాలా త్వరత్వరగా, రుచిగా తమను తినేయవచ్చంటూ మనల్ని ఊరిస్తుంటాయి. మరికొన్ని ఆహారాల్లోని కలరేటివ్స్ అనే ఆకర్షణీయమైన, అందమైన రంగులు మన కంటిని కట్టిపడేస్తుంటాయి. అప్పటికప్పుడు టెంప్ట్ అయి తినేసేలా మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఇంకొన్ని ఆహారాలైతే రుచికరంగా ఉండేందుకూ, చాలాకాలం పాటు నిల్వ ఉండేందుకు కృత్రిమ నెయ్యి, ప్రిజర్వేటివ్స్ రూపంలో రారమ్మని పిలుస్తుంటాయి. అందుకే వాటి నుంచి నిగ్రహం పాటించాలి. మన ఈ పంచతంత్రలోని ‘నిగ్రహం’ శీర్షికలో మనం తెలుసుకోవాల్సిన అంశాలివి. ఇలా ఈ తంత్రాలన్నింటి మనల్ని క్యాన్సర్ను దూరంగా ఉంచుతాయి. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలూ పాటించినా, క్రమం తప్పకుండా క్యాన్సర్ను నివారించే మిత్రులకు దగ్గరగా ఉండి, క్యాన్సర్ కలిగించే వాటిని దూరంగా ఉండి, క్యాన్సర్ వ్యాక్సిన్ల సహాయంతో సంధి చేసుకుని, నిగ్రహం గా క్యాన్సర్ను కలగజేసే ఎన్నింటినుంచో దూరంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి క్యాన్సర్ రావచ్చు. దురదృష్టవశాత్తూ అలా ఎవరికైనా వ్యాధి వచ్చినా... ఆందోళన పడకుండా మానసిక సై్థర్యం, ధైర్యం కలిగి, చికిత్స చేయించుకుని నిండునూరేళ్లూ జీవించడానికి తోడ్పడే తారకమంత్రాలే పైన చెప్పిన పంచతంత్రాల్లాంటి క్యాన్సర్ యుద్ధతంత్రాలు. క్యాన్సర్ – సంధి ఇక్కడ మన ‘క్యాన్సర్ సంధి’ గురించి కాస్త నేరుగానే తెలుసుకుందాం. కొన్ని క్యాన్సర్లలో అవి వచ్చాక పోరాటం చేయడం కంటే... అవి రాకముందే మనలోని కణాలను కొన్ని రకాల వ్యాక్సిన్లతో సంధి చేసుకునేలా చూడాలి. ఉదాహరణకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం మనకు కచ్చితంగా తెలుసు. అది హెచ్పీవీ అనే వైరస్తో వస్తుంది. అది రాకుండా అమ్మాయిలకు ఓ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అమ్మాయిలందరూ ఆ వ్యాక్సిన్తో సంధి చేసుకోవాలి. అదెలాగంటే... తొమ్మిదేళ్ల వయసు నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందు) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ అండాశయం, గొంతుక్యాన్సర్లు రాకుండా కూడా చేసే అవకాశముందనీ, 40 ఏళ్లు వచ్చే వరకు మహిళలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు. అలాగే హెపటైటిస్–బి వస్తే... అది భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్కు దారితీయవచ్చు. హెపటైటిస్–బి వైరస్ సోకకుండా వ్యాక్సిన్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వేయించుకోవడం ద్వారా కాలేయ క్యాన్సర్ను నివారించుకోవచ్చు. ఇలా మనం సర్విక్స్, కాలేయ క్యాన్సర్లను నివారించడానికి హెచ్పీవీ వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్లతో సంధి చేసుకోవడం ద్వారా... ఆ క్యాన్సర్లను నివారించుకోవచ్చు. ఇలాగే మనం సంధి చేసుకోవడం కోసం మరిన్ని వ్యాక్సిన్లను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా మన విజ్ఞానవేత్తలూ, వైద్యశాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. -
గొల్లపూడి గుడ్బై
గొల్లపూడి మారుతీరావు అనే ఒక్క పేరే అనేక రకాలుగా సాక్షాత్కరిస్తుంది. బుద్ధిజీవులకు ఓ మహా రచయిత దర్శనమిస్తాడు. సినీ జీవులకు ఆ పేరు వినగానే నాగభూషణం లాంటి విలన్ గుర్తొస్తాడు. పత్రికా ప్రపంచంలో జీవనయానం ప్రారంభించి రంగస్థల, సినీ రచయితగా అనేక పాత్రలు పోషించిన ఆయన వేదిక దిగేశారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి విద్యార్థిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగంలోకి దూకేశారు. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి రేడియోకి విస్తరించారు. నాటక రచయితగా కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నారు. రచనా రంగంలో విజయపతాకం ఎగరేసిన గొల్లపూడి సహజంగానే దుక్కిపాటి మధుసూదనరావు దృష్టిని ఆకర్షించారు. అరెకపూడి కౌసల్యా దేవి రాసిన చక్రభ్రమణం నవల ఆధారంగా తెరకెక్కిన డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్ ప్లే రచయి తగా గొల్లపూడిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆ స్క్రీన్ ప్లే రచనకు నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవం స్క్రిప్ట్కు మరోసారి నంది గొల్లపూడిని వరించింది. అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్గా పనిచేశారు గొల్లపూడి. ఎస్.డి. లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. అన్నదమ్ముల అనుబంధం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు డైలాగ్స్ రాసి తన కలానికి మాస్ పల్స్ కూడా తెల్సుననిపించారు మారుతీరావు. కోడి రామకృష్ణ దర్శకుడుగా అరంగేట్రం చేయడానికి ముందుగా అనుకున్న కథ తరంగిణి. అయితే చిత్ర కథానాయకుడు చిరంజీవి అని నిర్మాత కన్ఫర్మ్ చేయడంతో కథ మారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయ్యింది. అందులో ఓ పాలిష్డ్ విలన్ రోల్ ఉంటుంది. దాన్ని ఎవరితో చేయించినా పండదనిపించింది కోడి రామకృష్ణకు. ఫైనల్గా మీరే చేసేయండని గొల్లపూడిని బల వంత పెట్టేశారు. ఆయనా సరే అనేశారు. అలా నటుడుగా తెర ముందుకు వచ్చి సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత అనేక పాత్రలు గొల్లపూడిని వెతుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో అద్భుతంగా పేలినవి అనేకం ఉన్నాయి. అభిలాషలో ఉత్తరాంధ్ర మాండలికంలో ఓ శాడిస్ట్ విలన్ రోల్ చేశారు గొల్లపూడి. బామ్మర్ది అనే ఊతపదంతో ప్రవేశించే ఆ పాత్ర అభిలాష సెకండాఫ్ను నిల బెట్టింది. అలా సినిమా సక్సెస్కు ఊతంగా నిల్చిన అనేక పాత్రలకు గొల్లపూడి ప్రాణం పోశారు. సుమారు 87 చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన గొల్లపూడి నటుడుగా 230 చిత్రాలు చేశారు. క్యారెక్టర్ రోల్స్తో పాటు హాస్యనటుడిగానూ మెప్పించారు. ముఖ్యంగా గుంటనక్క తరహా విలనిజం చేయాలంటే.. గొల్లపూడిదే అగ్రతాంబూలం. గొల్లపూడి నటనలో ఓ నిండుదనం ఉంటుంది. డైలాగ్ మీద పట్టు ఉంటుంది. అద్భుతమైన మాడ్యులేషన్ ఉంటుంది. ఫైటింగులు చేసే విలనీ కాదు... జస్ట్ అలా కూల్గా మాట్లాడుతూ అపారమైన దుర్మార్గం గుప్పించే పాత్రలు పోషించాలంటే చాలా టాలెంట్ కావాలి. అధికారం కావాలి. నాగభూషణం చేయగలిగేవాడు. పాత్రకు న్యాయం చేయడానికి ఒక్కోసారి స్వతంత్రించేవారు కూడా. గొల్లపూడిలో మళ్లీ ఆ స్థాయి నటుడు కనిపిస్తాడు. చిరంజీవి ఛాలెంజ్ మూవీలో స్మిత భర్త పాత్రలో గొల్లపూడి ఆ తరహా విలనీ అద్భుతంగా పండించారు. విస్తృతమైన తన అనుభవాల సారాన్ని అమ్మ కడుపు చల్లగా పేరుతో ప్రచురించారు గొల్లపూడి. ఆయన బాగా ఔట్ స్పోకెన్. ఎటువంటి దాపరికాలూ ఉండవు. తన మనసులో అనిపించింది రాసేస్తారు. అందుకే ఆయన అంత విస్తృతంగా రాసేస్తారు. ఇంటర్ నెట్లో కూడా అంత విస్తారంగా రాసిన రచయితలు అరుదు. అదీ మారుతీయం. వయసు పెరిగిన తర్వాత అడపాదడపా గౌరవప్రదమైన పాత్రల్లో కనిపిస్తూ... అచ్చతెనుగు నుడికారాన్ని వినిపిస్తూ... కనిపించిన నటుడు గొల్లపూడి. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన గొల్ల పూడి కలం ఆయన కన్నుమూసే వరకు అలసట చెందక సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు స్మృతిగా మిగిలిపోయింది. భరద్వాజ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
‘మనీ’ మాట..బంగారు బాట
చిన్నారులకు ఎన్నో విషయాలు నేర్పుతాం. కానీ, డబ్బు (మనీ) దగ్గరకొచ్చేసరికి వారిని దూరం పెడతాం. ఆదాయం, పొదుపు, పెట్టుబడులు.. ఇవేవీ వారికి అంత చిన్న వయసులో అవసరం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ, చిన్న వయసులోనే కదా వారికి ఈత నేర్పిస్తాం. మరి భవిష్యత్తులో ఆర్థిక సాగరాన్ని ఈదే అద్భుత పునాది చిన్నప్పుడే ఎందుకు వేయకూడదు? ఆలోచించండి. ఆందోళనకు గురికాకుండా, సంక్షోభ సమయాల్లో మనీ వ్యవహారాలను ఎలా పరిష్కరించాలన్న కిటుకులను పెద్దలు తమ అనుభవ పాఠాల నుంచి చిన్నారులకు నేర్పించడం ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక విషయాల పట్ల సరైన అవగాహన కలిగిన తల్లిదండ్రులు వాటి గురించి తమ పిల్లలతో చర్చించడం మంచి చేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకానీ, మనీ వ్యవహారాలకు వారిని దూరం పెట్టడం మంచి కంటే నష్టానికే అవకాశం ఉందంటున్నారు. పూర్తిగా అర్థం చేసుకునే వయసులో లేనప్పుడు పిల్లలకు ఆర్థిక విషయాల గందరగోళం ఎందుకు? అన్న ప్రశ్న సహేతుకమే. కానీ, అర్థం చేసుకోలేకపోవడం అన్ని విషయాల్లోనూ కాదు కదా?.. ఈ ప్రశ్న ప్రతి ఒక్క తల్లిదండ్రీ వేసుకోవాలి. కనుక పిల్లలు అర్థం చేసుకోతగిన విషయాల గురించి వారితో చర్చించడం, మనీ వ్యవహారాల గురించి ఇంట్లో చర్చించడం చిన్నారులకు మేలు చేస్తుందని, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహన వారిలో కల్పిస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తీకరిస్తున్నారు. వయసు, అవగాహన ఒక విషయాన్ని అర్థం చేసుకునే శక్తి తమ పిల్లల్లో ఉందా? దాన్ని పరిష్కరించే నైపుణ్యం ఉందా? అన్నది తల్లిదండ్రులకు సాధారణంగా తెలుస్తుంది. ఏడేళ్లలోపు పిల్లలతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడడానికి చాలా మంది సుముఖత చూపరు. కానీ, వారితో మాట్లాడడమే మంచి ఆలోచన అవుతుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు.ఇది వారిలో అనవసర ఆందోళనకు కారణమవ్వడంతోపాటు, ఫలితంగా ఈ విషయాలను ఎవరితోనూ వ్యక్తీకరించేందుకు ధైర్యం చేయకపోవచ్చు. ఇదే ఒత్తిడి వారు పెద్దయిన తర్వాత కూడా కొనసాగుతుంది. ఉదాహరణకు తండ్రి రుణ చెల్లింపుల్లో విఫలమై బ్యాంకు నుంచి వేధింపులకు లోనైతే, దాన్ని చూసిన పిల్లలు పెద్దయ్యాక రుణాలు తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోవచ్చు. అందుకే పిల్లలతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడడం, వారిలో సానుకూల దృక్పథాన్ని కలిగించడం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సానుకూల అభిప్రాయం ఆర్థిక సమస్య ఏదైనా కానీయండి.. దాని పట్ల సానుకూల దృక్పథం అన్నది పిల్లల్లో ఆందోళనను పారదోలుతుంది. ఏదైనా ఒక సమస్య లేదా సంక్షోభాన్ని పెద్దలు ఎదుర్కొంటున్నట్టు అయితే అది.. బడ్జెట్ గురించి, పరిమిత వ్యయాలు, ఆర్థిక క్రమశిక్షణ గురించి పిల్లలకు నేర్పేందుకు అనుకూల సమయం అవుతుంది. ఉదాహరణకు వ్యాపారంలో ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నట్టు అయితే, దానికి దారి తీసిన పరిస్థితుల గురించి వారికి వివరించడం మేలు చేసినట్టు అవుతుంది. ఒకవేళ ఆ సమస్యను పరిష్కరించే విషయంలో చిన్నారుల సలహాలను కోరడం వారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. వ్యయాలను నియంత్రించుకోవడం ఎలా? అంటూ వారి నుంచి సూచనలను రాబట్టడంలో తప్పు లేదు. అయితే, వారి నుంచి ఎటువంటి సూచన, స్పందన రాకపోతే మాత్రం నిందించొద్దు. ఆలోచన తట్టినప్పుడు వచ్చి చెప్పాలని వారిని వెన్ను తట్టాలి. దాచడం అన్ని వేళలా సరికాదు.. పిల్లలకు ఆర్థిక సమస్యల గురించి తెలియకుండా జాగ్రత్తపడడం కూడా మంచి ఆలోచన కాదంటారు నిపుణులు. ముఖ్యంగా 12 ఏళ్ల వయసు నాటికి పిల్లలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి, మనీ వ్యవహారాల గురించి తెలుసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా తమ ఉద్యోగాన్ని కోల్పోతే పిల్లల ముందు ఆందోళన చెందకూడదు. మరో ఉద్యోగం సంపాదించి, కుదురుకునే మార్గాన్ని వారికి తెలియజేయడం వల్ల.. భవిష్యత్తు పట్ల వారిలో నమ్మకాన్ని పెంచిన వారవుతారు. గొడవ పడొద్దు.. ఆర్థికంగా ఎటువంటి సమస్యల్లో అయినా జీవిత భాగస్వామితో పిల్లల ముందు గొడవపడకూడదు. ఇది సమస్యను పరిష్కరించే విషయంలో ప్రతికూల ప్రభావం వారిపై పడేలా చేస్తుంది. అంతే కాదు, భవిష్యత్తులో వారి, వారి జీవిత భాగస్వామితో అనుబంధాలను ప్రభావితం చేస్తుంది. సమస్యను వివరించి, జీవిత భాగస్వామితో కలసి (తల్లిదండ్రి సంయుక్తంగా) దాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లలకు మంచి సందేశాన్ని పంపొచ్చు. అలాగే, ఆర్థిక సమస్యలకు పిల్లలను నిందించడం కూడా తప్పే. ఆర్థిక అంశాల పట్ల పరస్పర అవగా హన పెంపొందించుకోవడం ప్రధానం. పెట్టుబడి అలవాటు ఆర్థికపరమైన ఒక మంచి సలహా పిల్లల జీవితాలను గొప్పగా తీర్చిదిద్దడానికి సాయపడొచ్చు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అన్నదానిని పిల్లలు యుక్తవయసు నాటికే అలవాటు చేయడం భవిష్యత్తులో వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇందుకు ఉదాహరణ ముంబైకి చెందిన శాలినీ రెడ్డి. ఆమె కూడా ఒక మిలీనియల్. కానీ, తోటివారిలా రెస్టారెంట్లలో ఖరీదైన విందులు, ఖరీదైన గ్యాడ్జెట్లపై ఖర్చు చేయడానికి అంత ప్రాధాన్యం ఇవ్వదు. బదులుగా బ్యాంకు ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ఆరంభించింది. అలాగే, రికరింగ్ డిపాజిట్ను కూడా ప్రారంభించింది. తనకు పెద్దగా ఖర్చుల్లేవని, దాంతో వచ్చే పదేళ్లు మరింత అధికంగా ఇన్వెస్ట్ చేస్తానన్నది ఆమె మాట. ఈమె మాత్రమే కాదు.. బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల కామర్స్ విద్యార్థి మానవ్ కూడా ఆర్థిక జ్ఞానం కలిగినవాడే. పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలను ఎన్నింటినో చిన్న వయసులోనే చదివేసిన అతడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ప్రారంభించే ఆలోచనతో ఉన్నట్టు చెప్పాడు. ముందు నేర్పితే ఎంతో లాభం.. ఆర్థిక అక్షరజ్ఞానాన్ని పిల్లలకు విద్యాలయాలు ఇవ్వడం లేదు. చివరికి వారి తల్లిదండ్రులు కూడా ఈ విషయాల గురించి నేర్పడం లేదు. దీంతో అధిక శాతం మంది పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్థిక విషయాలు, బడ్జెట్) గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే సంపాదన జీవితాన్ని ఆరంభిస్తున్నారు. ‘‘డ్రైవింగ్ నేర్చుకోకుండా మీ పిల్లలను బైక్ నడిపేందుకు అనుమతించరు కదా. మరి వారికి కనీస సూత్రాలు కూడా తెలియకుండా ఇన్వెస్టింగ్ ప్రపంచం వైపు అడుగులు ఎలా వేయించగలుగుతాం’’ అని ఆల్ఫా క్యాపిటల్కు చెందిన అసోసియేట్ పార్ట్నర్ దీప్తి గోయల్ ప్రశ్నించారు. చాలా ఇళ్లలో మనీ వ్యవహారాలను పిల్లలతో చర్చించేందుకు ఇష్టపడని వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల అరుదుగా చర్చించడాన్ని చూడొచ్చు. కానీ, చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు జీవితాంతం వారిని నడిపిస్తాయని తెలిసిందే. డబ్బులను నిర్వహించడం గురించి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించినది వారి ఆర్థిక జీవితాలపై ఎంతో ప్రభావితం చూపిస్తుందని ప్లాన్ రూపీ వ్యవస్థాపకుడు అమోల్జోషి పేర్కొన్నారు. తప్పుదోవ ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ మంది తల్లిదండ్రుల్లో ద్రవ్య నిర్వహణ విధానం గురించి తగినంత అవగాహన ఉండడం లేదు. ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల వారిచ్చే సూచన తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. హైదరాబాద్కు చెందిన అర్థయంత్ర నిర్వహించిన అధ్యయనం చెబుతున్నది ఏమిటంటే.. 21–25 వయసు మధ్యనున్న యువ నిపుణుల్లో ప్రతీ ముగ్గురిలోనూ ఇద్దరి నిర్ణయాలు వారి తల్లిదండ్రుల సూచనల మేరకే ఉంటున్నాయని తెలిసింది. సంప్రదాయ బీమా పథకాలను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి కొనసాగుతూనే ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట ఎండోమెంట్ లేదా బైబ్యాక్ పాలసీ తీసుకుని బహుమతిగా ఇవ్వడం చేస్తున్నారు. దీంతో ఆరంభంలో కొన్ని సంవత్సరాల పాటు తల్లిదండ్రులు ప్రీమియం చెల్లించగా, మిగిలిన కాలానికి దాన్ని పిల్లలపై రుద్దుతున్నారు. పైగా తమ పిల్లలకు గొప్ప కానుక ఇస్తున్నామని వారు సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. అంతేకానీ, వారి భవిష్యత్తుకు సరిపోలని ఓ పెట్టుబడి సాధనాన్ని వారి చేతిలో పెడుతున్నామని అర్థం చేసుకోవడం లేదు. బీమా పాలసీలు, పీపీఎఫ్లో పెట్టుబడుల దిశగా పిల్లలను నడిపించడం, ఒత్తిడి చేయడం ఆశించిన ఫలితాలను ఇవ్వదని నిపుణులు సూచిస్తున్నారు. సరైన బాట.. పిల్లలు హైస్కూల్ విద్యకు వచ్చిన నాటి నుంచే వారి పేరిట ఓ బ్యాంకు ఖాతా ప్రారంభించి, డెబిట్ కార్డు ఇవ్వడం ద్వారా ప్లాస్టిక్ మనీని వారికి పరిచయం చేయడం మంచిది. వారు సాధించే ప్రతీ విజయాన్ని ప్రోత్సహిస్తూ కొంత నగదు ప్రోత్సాహకం ఇవ్వాలి. ఆ నగదును వారు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకునేలా వెన్నుతట్టాలి. కార్డు నుంచి రోజువారీ ఖర్చుకు పరిమితులు విధించాలి. ముఖ్యంగా డబ్బు విలువ గురించి వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయడం వల్ల ఎన్నో సానుకూల ఫలితాలను చూస్తారు. పిల్లలు ప్రారంభంలో తప్పటడుగులు వేసినా, వారిని వారు సరిదిద్దుకుంటారు. ‘‘కాలేజీ వయసులో బడ్జెట్ గురించి మూల విషయాలు తెలుసుకోవడం మంచిది. కొంచెం, కొంచెం కలిస్తేనే పెద్ద నిధిగా మారే క్రమం, కాంపౌండింగ్ ప్రయోజనం గురించి వారికి వివరంగా తెలియజేయాలి. అధికంగా ఖర్చు చేయడం సమస్యలకు ఎలా దారితీస్తుందన్నదీ వివరించాలి’’ అని మనీమంత్రా ఎండీ రాజ్ఖోస్లా సూచించారు. ఆర్థిక విషయాల పట్ల సరైన అవగాహన లేని తల్లిదండ్రులు, ఈ విషయంలో నిపుణుల సాయాన్ని తీసుకోవాలి. ఆర్థిక మోసగాళ్ల బారిన పడకుండా వారికి జాగ్రత్తలూ తెలియజేయాలి. టెక్నాలజీ ఎంతో అత్యాధునికతను సంతరించుకుంటున్న ఈ రోజుల్లో సైబర్ నేరాలపై కనీస అవగాహనను పిల్లల్లో కల్పించాలి. -
అసలు నేరస్తులు ఎవరు?
దిశను దారుణంగా హతమార్చిన దుర్మార్గులకు మరణ దండన విధించాలనేవారు కొందరయితే, వాళ్లను ఇంకా ఎందుకు బతకనిస్తున్నారు వెంటనే చంపేయండి, లేకపోతే మీకు తుపాకులెందుకు అని పోలీసులను రెచ్చ గొట్టేవారు ఇంకెందరో. ఫేస్బుక్, ట్విట్టర్లో అడ్డూ అదుపులేకుండా నోటికి వచ్చింది రాస్తున్నారు. మరణదండన వద్దనే వారిని తిడుతున్నారు. లైంగిక నేరాల బాధితులను వివరించే చిత్రాలను చూపవద్దని, వారి పేర్లు వెల్లడి చేయవద్దనే నియమాలను పట్టించుకోకుండా హతురాలి పేరు రాసి, ఫొటోలు వేసి నేరాలు చేసినవారు కోకొల్లలు. సభ్యత సంస్కారాలు కనీస జ్ఞానం కూడా లేకుండా చదువుకున్నవారు, రచయితలు, కవులు, ఫేస్బుక్ నీతివంతులు కూడా ఇష్టంవచ్చినట్టు అనవసరంగా ఈ నేరాలు చేస్తూ, రేప్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరే అర్హత ఉందా? చాటుమాటుగా సాగిన అత్యాచారాన్ని మాటలతో మళ్లీ చేయడంతో సమానం–బాధితురాలి వివరాలు ఫొటోలు ప్రచురించడం. నాలుగైదు రోజులపాటు మీడియాలో, సోషల్ మీడియాలో బాధితురాలి వివరాలను బాధ్యతారహితంగా వాడిన తరువాత పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్ ఆమె పేరు దిశ అని మార్చి పుణ్యం కట్టుకున్నారు. రేప్ బాధితురాలు బతికి ఉంటే ఆమెను వైద్యంపేరుతో మెడికల్ రేప్నకు గురిచేస్తారు. పోలీసులు దర్యాప్తు రేప్నకు పాల్పడతారు. తరువాత కేసు విచారణ పేరుతో లాయర్లు లీగల్ రేప్తో బాధిస్తారు. ఇక సందర్భం వచ్చిన ప్రతిసారీ పత్రికల కలం వీరులు టీవీల కెమెరా వీరులు మీడియా రేప్ సాగిస్తూ ఉంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి వివరాలు రాస్తూ ఫేస్బుక్ వగైరాలలో మాటల అత్యాచారాలు నిర్వహించే నీతిమంతులకు లెక్కే లేదు. ఇటువంటి వాటికి అందరినీ జైళ్లలో పెట్టడం సాధ్యం కాదు. కానీ లైంగిక నేరాల బాధితులైన బాలికలు, మహిళల పేర్లు వెల్లడి చేస్తే రెండేళ్ల కఠిన లేదా సాధారణ కారాగార శిక్ష విధించాలని సెక్షన్ 228ఏ వివరిస్తున్నది. ఐపీసీ సెక్షన్లు 376, 376ఏ, 376బి, 376సి, 376డిలో లైంగిక నేరాల నిర్వచనాలు ఉన్నాయి, ఈ నేరాలలో బాధితురాలి పేరును ప్రచురించినా, లేదా మరేరకంగానైనా వెల్లడించినా (వచన కవితలతో సహా) రెండేళ్ల కఠిన లేదా సాధా రణ కారాగార శిక్షను, దాంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. పరిశోధనకు దర్యాప్తునకు అవ సరమనుకున్నపుడు పోలీసు అధికారి లిఖితపూ ర్వక అనుమతితో బాధితురాలి పేరును ప్రస్తావించ వచ్చు. లేదా బాధితురాలు లిఖితపూర్వక అనుమతితో ప్రచురించవచ్చు. బాధితురాలు జీవించి లేకపోతే లేదా మానసిక స్థిమితం లేకపోతే ఆమె దగ్గరి బంధువు లిఖిత పూర్వకంగా సంబంధిత సంక్షేమ సంస్థ అధ్యక్షుల ద్వారా అనుమతి ఇచ్చి ఉంటే ప్రచురించవచ్చు. కోర్టు వ్యవహారాలలో పేరు రాయడం తప్పనిసరి అనుకుంటే కోర్టు అనుమతితో ప్రచురించవచ్చు. ఈ సెక్షన్ కింద ఇచ్చిన ఒక వివరణలో, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులో బాధితురాలిపేరు ప్రచురించడం నేరం కాదని పేర్కొన్నారు. అంటే సుప్రీం కోర్టు హైకోర్టు కాకుండా మరే కోర్టు తీర్పులోనైనా బాధితురాలి పేరు రాయడం నేరమే అవుతుందని చాలా స్పష్టం. క్రిమినాలజీ అని ఒక బోధనాంశం ఉంది. అందులో నేరాలు చేయడానికి సామాజిక కారణాలు ఏమిటి అని పరిశోధిస్తారు. బోధిస్తారు. చాలా కాలం కిందట అక్కినేని నాగేశ్వరరావు నిర్మించి నటించిన సుడిగుండాలు సినిమాలో కుటుంబంలో పరిస్థితులు, సమాజంలో బలహీనతలు, లోపాలు, పత్రికలు, డిటెక్టివ్ లేదా అశ్లీల నవలలు (ఆనాటి మీడియా) లో వచ్చిన రాతలు, నిరుద్యోగం వల్ల పనిలేని తనం, విచ్చల విడిగాపారే మద్యం, టోకు మద్యం దుకాణాలుగా మారిపోయి, ఆ సొమ్ముమీద బతికే అవినీతి ప్రభుత్వాలు ఏ విధంగా ఒక కౌమార వయస్కుడైన జులాయిని హత్యచేసే స్థాయికి దిగజార్చాయో వివరిస్తూ, అతని నేరానికి దోహదం చేసిన వారు నేరగాళ్లు కారా, అయితే ఎవరెవరిని, ఎందరిని, ఉరి తీయాలి? అని ప్రశ్నిస్తాడు కథానాయకుడు. దిశ విషయంలో కలం వీరులు బాధితురాలి ఫొటో చూపడానికి కారణాలేమిటి? ఈనేరానికి వేలాదిమందిని రెండేళ్ల పాటు జైళ్లలో పెట్టడానికి ముందుగా జైళ్లు కట్టాలి. కడదామా? తరువాత మేపడానికి తిండి ఏర్పాట్లు చేయాలి. చేద్దామా? వ్యాసకర్త మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్, madabhushi.sridhar@gmail.com. -
జీరో ఎఫ్ఐఆర్ ఎప్పుడు, ఎలా?
‘దిశ’ సంఘటన తరువాత ‘జీరో’ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) గురించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతోంది. తమకు అధికార పరిధి లేదన్న కారణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని తీసుకోలేదని ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. నేర సమాచారం అందిన వెంటనే చట్టప్రకారం కేసు నమోదు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలు పోలీసులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఈ విషయం గురించి సర్క్యులర్ని కూడా జారీ చేసింది. తమకు కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేకున్నా ఎఫ్ఐఆర్ని విడుదల చేయాలన్నది ‘జీరో ఎఫ్ఐఆర్’ సారాంశం. నేర తీవ్రత ఎక్కువగా ఉండి, వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయగలిగే కేసుల్లో (కాగ్నిజబుల్) నేర సమాచారం అందుకున్న తరువాత పోలీసులు తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాలని, ఆ విధంగా చేయకపోతే వాళ్లపై భారతీయ శిక్షాస్మృతి లోని సె.166ఏ ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 19, 2019 రోజున కర్ణాటక పోలీసులని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగ్నిజబుల్ నేర సమాచారం అందినప్పుడు పోలీసులు (155లోని) తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. పోలీసులు తమ కోర్టు అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సె.156(1) చెబుతుంది. అందుకని తమ అధికార పరిధిలేని కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ విడుదల చేసిన తరువాత, మొత్తం కేసు డైరీని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీసులకి పంపించాల్సి ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ భావన డిసెంబర్ 2012 సంవత్సరంలో ఢిల్లీలో నిర్భయ సంఘటన తరువాత ఈ జీరో ఎఫ్ఐఆర్ అన్న పదబంధం తెరమీదికి వచ్చింది. ఆ సంఘటన జరిగిన తరువాత నియమించిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో ఈ భావనని ప్రతిపా దించింది. కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేని పోలీసు అధికారి కాగ్నిజబుల్ నేర సమాచారం అందుకుని ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయడాన్ని ఇప్పుడు కొత్తగా జీరో ఎఫ్ఐఆర్ అని అంటున్నారు. నేరం ఎక్కడ జరిగినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రథమ సమాచారాన్ని ఇవ్వవచ్చు. బాధితుల సౌకర్యం కోసం ఈ భావ నని తీసుకొని వచ్చారు. ఇది చట్టంలో ఉన్న విష యమే. లైంగిక నేరాలకు సంబంధించిన సమా చారం అందుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ విడుదల చేయకపోతే వాళ్లు భారతీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం నేరం చేసినట్లు అవుతుంది. అది కాగ్నిజబుల్ నేరం. మహిళల మీద నేరాలు జరిగినప్పుడు వాళ్లు తమకు దగ్గరలో ఉన్న స్టేషన్లో ప్రథమ సమాచారం ఇచ్చే వీలు చిక్కుతుంది. అదే విధంగా హత్య, ఆక్సిడెంట్ లాంటి నేరాలు జరిగినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ విడుదల చేయడంవల్ల సాక్షులను కాపాడటానికి వీలుపడుతుంది. క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్లోని సె.156(1) ప్రకారం తన అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేసే అధికారం పోలీ సులకి ఉంటుంది. అదే నిబంధనలోని సబ్ సెక్షన్ (2) ప్రకారం–పోలీసులు దర్యాప్తు చేయడానికి అధికార పరిధి లేదన్న కారణంగా, ప్రశ్నించే అవ కాశం లేదు. సె.156(3) ప్రకారం నేరాన్ని సె.190 ప్రకారం గుర్తించే అధికారం ఉన్న మేజిస్ట్రేట్ దర్యాప్తుని ఆదేశించవచ్చు. దర్యాప్తు తరువాత తనకి అధికార పరిధి లేదన్న అభిప్రాయానికి పోలీసు అధికారి వచ్చిన ప్పుడు కేసు డైరీని సంబంధిత పోలీసులకి పంపిం చవచ్చు. అంతేకానీ ఎఫ్ఐఆర్ని నమోదు చేయ డానికి నిరాకరించకూడదు. దిశ కేసులో పోలీసులు అధికార పరిధి లేదన్న కారణంగా ఎఫ్ఐఆర్ని విడుదల చేయకపోవడంతో వాళ్లని సస్పెండ్ చేశా రని పత్రికల్లో చూశాం. ఒకవేళ ఆ ఆరోపణ నిజ మైతే వాళ్లు శాఖాపరమైన చర్యలకే కాదు.. భార తీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం కూడా శిక్షార్హులే. జీరో ఎఫ్ఐఆర్వల్ల ఉపయోగాలతో బాటూ నష్టాలూ ఉన్నాయి. కొంతమంది ఈ భావ నని దుర్వినియోగం చేయడంవల్ల బాధితులకి నష్టం కలుగుతుంది. కొంతమంది దురుద్దేశంతో తమ ప్రయోజనాలకి అనుగుణంగా కేసు విషయా లను ప్రథమ సమాచార నివేదికలో పొందుపరిచి, తమకు అనుకూలంగా ఉన్న పోలీసులతో కుమ్మక్కై బాధితులకి నష్టం కలుగజేసే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని పై అధికారులు సరిచేసే అవ కాశం ఉంది. కోర్టులు కూడా సరిచేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ భావనని తీసుకొని తమకు అనుకూ లంగా పోలీసు స్టేషన్లలో కేసులని నమోదు చేయిం చుకొని దుర్వినియోగంచేసే అవకాశం ఉంది. హత్య, అత్యాచారం లాంటి కేసుల విష యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. మిస్సింగ్ కేసులని కూడా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ చట్టబద్ధం. 1976లోనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పకుండా అధికార పరిధితో నిమిత్తం లేకుండా విడుదల చేయాలని చెప్పింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సె.154 ఇదే విష యాన్ని చెబుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం బాధని కలుగజేస్తుంది. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా వాళ్లకే తెలి యాలి. కనీసం నిర్భయ ఘటన తరువాతైనా ఈ విషయాన్ని పట్టించుకోక పోవడం శోచనీయం. దిశ సంఘటన తరువాత అలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగవని ఆశిద్దాం. వ్యాసకర్త, మంగారి రాజేందర్, మొబైల్ : 94404 83001 -
కుల నిర్మూలనతోనే భవిష్యత్తు
మనం పరిశుభ్రమైన దుస్తులు ధరించినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరానివారుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది అని బీఆర్ అంబేడ్కర్ తన తుది ఉపన్యాసంలో అన్నారు. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, గోమాంస భక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని పాటిస్తున్న తెగలను హిందూ మతం వెలివేసి, నీచమైన వృత్తులను అంటగట్టిందని వివరించారు. చివరకు 1956 అక్టోబర్14న 5లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి సామాజిక విప్లవానికి పునాది వేశారు. కుల నిర్మూలన కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం రేపటి భవిష్యత్ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది. ‘‘మనం పదిహేను వందల సంవత్సరాల నుంచి గ్రామ పొలిమేరల కావల నివసిస్తూ, హిందువులు మనసు మారి మనకు సమానత్వం కల్పిస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఏ ఒక్కరూ కూడా అంటరానితనం సమసిపోయే విధంగా మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు. కొందరూ అరకొరగా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అంతేకాక మతం పేరుతో మనం అణగతొక్కబడి శతాబ్దాల తరబడి అంతులేని హింసకూ, అత్యాచారాలకూ గురయ్యాం’’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ క్షేత్రమైన సారనాథ్లోని మహాబోధి సంస్థ ఏర్పాటు చేసిన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 25, 1956న అంబేడ్కర్ చేసిన ఉపన్యాసం ఆయన జీవితంలో చివరి ఉప న్యాసం. అంబేడ్కర్ తన చిట్టచివరి ఉపన్యాసంలో తన జీవితాను భవపు సారాన్ని తన ఆవేదనాశ్రువులుగా దేశప్రజల ముందుంచారు. ముఖ్యంగా అంటరాని కులాలకూ సమానత్వ కాంక్షాపరులకూ ఆయన చివరి వ్యాఖ్యోపానంగా ఈ ఉపన్యాసం ఉంటుంది. ‘‘మనం మురికిగా ఉన్నామని, నీచమైన పనులు చేసి జీవిస్తు న్నామని అందుకే దూరముంచామని వందల ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ వాస్తవంలో, ఈ రోజు మనం మురికిగా లేం. అందరిలానే పరిశుభ్రంగా ఉన్నాం. ఒక మనిషి ఇతను అంటరాని వాడు అని ఇప్పుడు మనల్ని మన వస్త్రధారణను బట్టి నిర్ధారించలేని విధంగా ఉన్నాం. అయినప్పటికీ మన కులం తెలిస్తే, మనం పరిశు భ్రమైన దుస్తులు ధరించినా, మర్యాదగల వ్యాపారం చేసినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరాని వారుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం హిందూమతాన్ని విడిచి పెట్టి సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధించిన, ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది.’’ అంటూ అంబేడ్కర్ తన చివరి ఉపన్యాసంలో ప్రబో ధించారు. అంతే కాదు, అంబేడ్కర్ ఇటువంటి నిర్ణయానికి రావడా నికి ఆయన సాగించిన సత్యశోధన, ఉద్యమకార్యాచరణ, శాసన నిర్మాణాలు కారణమయ్యాయి. అమెరికాలోని కొలంబియా వర్సిటీలో ఉన్నత చదువులకు వెళ్ళిన అంబేడ్కర్ 1916, మే, 9వ తేదీన ఆంత్రోపాలజీ సెమినార్లో ‘‘భారతదేశంలో కులాలు’’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అందులో కులాల పుట్టుకుకు సంబంధించిన చారిత్రక పరిస్థితులను వివరించారు. వివాహ వ్యవ స్థను ఒక సమూహానికే పరిమితం చేసి, ఒక సమూహాన్ని మరో సమూహంతో కలవకుండా చేసి, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడా నికి చేసిన ప్రయత్నం కుల వ్యవస్థ ఏర్పాటుకు కారణమయ్యిందన్న విషయాన్ని అంబేడ్కర్ తన పత్రంలో వివరించారు. ఆ తర్వాత అంబేడ్కర్ రాజకీయ అంశాలపైన దృష్టి కేంద్రీకరిం చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కావాలని, అందులో అంటరా నికులాలతో సహా అందరికీ భాగస్వామ్యం ఉండాలని 1919లో మొదటిసారిగా సౌత్బరో కమిటీ ఎదుట ప్రతిపాదించారు. అట్లా సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో తన వాదనను విని పించారు. 1946లో తన ప్రతిపాదనగా నూతన రాజ్యాంగంలో చేర్చ డానికి వీలుగా ‘స్టేట్స్, మైనారిటీస్’ అనే డాక్యుమెంటును రూపొం దించారు. అయితే కులం పోకుండా ఈ దేశంలో సమానత్వం రాదనే విషయాన్ని అంబేడ్కర్ బలంగా విశ్వసించారు. రాజకీయ హక్కుల కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, కుల నిర్మూలనకు, అంట రానితనం రూపుమాపడానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. అప్పటికీ గాంధీలాంటి సంస్కర్తల మాటలు ఆచరణలో ఎట్లా విఫలమవుతున్నాయో చూపడానికి మహద్ చెరువు సత్యాగ్రహం, కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని కొనసాగించారు. మహద్ చెరువులోని నీటిని కులమతాలకు అతీతంగా అందరూ వినియోగిం చుకోవాలని, ఆనాటి ప్రభుత్వం అనుమతితో చెరువులోకి అడుగుపె డితే, అస్పృశ్యులపై దాడి చేశారు. మహద్ చెరువు పోరాటం మార్చి 20, 1927లో జరిగింది. తర్వాత మూడేళ్ళకు 1930 మార్చి2న నాసిక్ లోని కాలారామ్ దేవాలయంలోకి అంటరాని కులాల ప్రవేశానికి అంబేడ్కర్ ఉద్యమించారు. అది కూడా విఫలమైంది. అక్కడ కూడా హిందువులు అంబేడ్కర్తో సహా అంటరాని కులాలను దేవాలయం లోకి రానివ్వలేదు. అప్పుడు అంబేడ్కర్ హిందూమతం, దాని స్వభావం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు. సరిగ్గా 1930–32 సంవత్సరాల్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం అంటరాని కులాలకు రాజకీయ హక్కుగా ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని అంగీకరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు అంటరాని కులాలను ఉద్ధరించేది తానేనని ప్రకటించుకున్న గాంధీ బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ, ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని రద్దు చేసుకొని, గాంధీ ప్రతిపాదించిన పూనా ఒడంబడికను అయిష్టంగానే అంబేడ్కర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం కూడా అంబేడ్కర్ను బాగా కలచివేసింది. ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో యెవోల అనే పట్టణంలో అక్టోబర్ 12, 1935న జరిగిన అంటరాని కులాల సభలో అంబేడ్కర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ‘దురదృష్ట వశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ నేను హిందువుగా మరణించను’ అని. ఈ ప్రకటన యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. సమా జంలో సమాన గౌరవం, సమానహక్కుల కోసం జరిపిన పోరాటం ఏ విధంగా నిరర్ధకంగా మారిందో చెపుతూ అంబేడ్కర్ ఆందోళన వెలి బుచ్చారు. ఈ ప్రకటనను ఆ సభకు హాజరైన వేలాదిమంది స్వాగతిం చారు. కానీ, అదే స్థాయిలో అగ్రవర్ణాల నుంచి వ్యతిరేకతను కూడా తీసుకొచ్చింది. గాంధీ ఒక వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘అంబే డ్కర్ ప్రకటన ఆందోళన కలిగిస్తున్నది. ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయం ఫలితం ఇవ్వదు’ అని తెలిపారు. దానికి అంబేడ్కర్ ఘాటైన సమాధానమే చెప్పారు. ‘నేను హిందూ మతాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అంటరానికులాల వారు తామెలా వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళనివ్వండి. ఇది గాంధీకి నా సలహా’ అంటూ గాంధీ అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. అదే సమయంలో అంబేడ్కర్ కుల నిర్మూలనకు సంబంధించిన తన సత్యశోధనను ఆపలేదు. అందులో భాగంగానే 1936లో లాహో ర్లోని జాట్పాల్తోడక్ మండల్ సంస్థ ఆహ్వానం మేరకు కుల నిర్మూ లనపై ప్రసంగించడానికి అంబేడ్కర్ అంగీకరించారు. కానీ ఆ సభ జరగలేదు. అయితే ఆ సభ కోసం అంబేడ్కర్ రూపొందించిన డాక్యు మెంట్ ఇప్పటికీ ఒక చర్చకు ప్రాతిపదికగా నిలుస్తున్నది. కుల నిర్మూ లన పుస్తకంలో కులంపై ఎంతో వివరమైన విషయాలను ప్రస్తావి స్తూనే, కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. తన మొట్టమొదటి పరిశో ధనాపత్రం ‘‘కులాల పుట్టుక’’లో పేర్కొన్న వివాహ వ్యవస్థ కులం బలపడడానికి కారణమైందని వివరిస్తూ కులాంతర వివాహాలు, వర్ణాంతర భోజనాలు జరగాలని ప్రతిపాదించారు. పైగా, కులాన్ని సమర్థిస్తున్న ధర్మశాస్త్రాలను రద్దుచేయాలని కోరారు. వీటితో పాటు, హిందూ మతంలో అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా అర్చక వ్యవస్థను ఒక కులానికి పరిమితం చేయరాదని కూడా అంబేడ్కర్ కరాకండీగా చెప్పారు. తన పరిశోధనలను కొనసాగిస్తూనే అంటరాని తనం ఆచరించడానికి గల కారణాలను కనుగొన్నారు. ‘అంటరాని వారెవరు’ అంటూ చేసిన తన శోధనలో ఆయనకు తను ఎటు వెళ్లాలో తెలిసింది. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, ఆవు మాంసభక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని అవలంబిస్తూ్త హిందూమతంలోనికి తిరిగిరాని తెగలను హిందూ మతం వెలివేసిందని, నీచమైన వృత్తులను అంట గట్టిందని వివరించారు. ఆ విధంగా మళ్ళీ అంటరానివారి సొంత మతమైన బౌద్ధంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకే 1944 నుంచి బౌద్ధంపై అంబేడ్కర్ అధ్యయనం సాగించారు. చివరకు 1956 అక్టోబర్, 14న ఐదు లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి గొప్ప సామాజిక విప్లవానికి పునాదివేశారు. అంబేడ్కర్ బౌద్ధంలోకి వెళ్ళాలనే నిర్ణయానికి కారణం ఛాందస హిందూ వాదమే కానీ అంబే డ్కర్ స్వతహాగా కారణం కాదని అంబేడ్కర్ సామాజిక ప్రయాణం మనకు స్పష్టంగా వివరిస్తుంది. అందుకే కుల నిర్మూలన కోసం అంబే డ్కర్ చేసిన పోరాటం రేపటి భవిష్యత్ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
గర్భవాతం ఎందుకొస్తుంది?
మా కజిన్ ‘గర్భవాతం’తో చనిపోయారు. ఎప్పుడో చిన్నప్పుడు పెద్దవాళ్ల మాటల్లో ‘గర్భవాతం’ గురించి విని ఉన్నాను. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి మరణాలు పల్లెల్లోనే ఎక్కువగా జరగడానికి కారణం ఏమిటి? – డి.శాలిని, రాజోలు గర్భిణీ సమయంలో అనేక కారణాల వల్ల కొందరిలో బీపి పెరిగి తల్లిలో శరీరరమంతా నీరు చేరడం, ఫిట్స్ రావటం వంటి సమస్యలను గర్భవాతం లేదా గుర్రపు వాతం అంటారు. మరీ చిన్న వయసులో గర్భం వచ్చిన వారిలో, మరీ బరువు ఎక్కువగా ఉండి గర్భం దాల్చి, గర్భంలో ఎక్కువగా బరువు పెరగటం, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, రక్తంలో రక్తం గూడు కట్టే సమస్యలు ఉన్నవారిలో, తల్లిలో రక్తనాళాలు సరిగా వ్యాకోచించకుండా బీపి పెరగడం జరుగుతుంది. దీన్ని మొదట్లోనే సరిగ్గా గుర్తించలేకపోతే తల్లి మెదడుపైన, కిడ్నీలు, లివర్పైన దుష్ప్రభావం చూపి, ఫిట్స్ రావటం, కిడ్నీలు, లివర్ ఫెయిలవ్వటం, రక్తం గూడుకట్టడం, లేదా కాన్పు సమయంలో బ్లీడింగ్ అవ్వటం, తల్లికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. అలాగే కడుపులో బిడ్డకు రక్తసరఫరా సరిగా అందక బిడ్డ బరువు పెరగకపోవడం, కడుపులోనే చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భవతులు సక్రమంగా డాక్టర్ దగ్గరికి చెకప్లకి వెళ్లి, ప్రతిసారి బరువు, బీపి, బిడ్డ సరిగా పెరుగుతుందా వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండడం వల్ల, బీపి కొద్దిగా పెరిగినప్పుడే, వారి సలహా మేరకు చికిత్స తీసుకుంటూ, త్వరత్వరగా చెకప్లకు వెళ్తూ, బీపి బాగా ముదిరి కాంప్లికేషన్స్ పెరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వడం, డెలివరీ ముందుగానే చెయ్యడం వంటివి పాటించడం వల్ల, తల్లిని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చు. పల్లెల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, వీరు డాక్టర్ దగ్గరికి సరిగా చెకప్లకి వెళ్లరు. బీపి పెరిగినా వీళ్లకి తెలియదు. లక్షణాలు బయటపడేసరికి బీపి బాగా పెరిగి, వ్యాధి ముదిరి అది ప్రాణాంతకంగా మారుతుంది. హాస్పిటల్కి వెళ్ళకుండా కాన్పులు కూడా ఇళ్ళలోనే చేయించుకోవడం, లేదా మంత్రసానుల దగ్గర చేయించుకోవడం ఈ సమయంలో బీపి ఇంకా పెరిగి ప్రాణాపాయస్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. ‘టాక్సొప్లాస్మొసిస్’ అంటే ఏమిటి? గర్భిణిగా ఉన్నప్పుడు శుభ్రత, ముఖ్యంగా స్నానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నాకు ‘ఐరన్’ తక్కువగా ఉంది. ఈ సీజన్లో లభించే ఏ పండ్లలో ‘ఐరన్’ ఎక్కుగా ఉంటుంది?– కె.నీరజ, సోంపేట టాక్సోప్లాస్మా గొండై అనే ప్రొటోజోవల్ పరాన్నజీవి వల్ల టాక్సోప్లాస్మొసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది చాలా వరకు పిల్లుల దగ్గర నుంచి వ్యాప్తి చెందుతుంది. ఈ జీవి పిల్లులతో వృద్ధి చెందుతుంది. దాని సిస్ట్లు పిల్లి యొక్క మలం ద్వారా బయటకు వస్తాయి. ఈ మలం నుంచి ఇతర జంతువులు, మనుషులు శరీరంలోకి ఈ సిస్ట్లు చేరుతాయి. పిల్లి మలం ద్వారా సిస్ట్లు ఉన్న నీరు, మట్టి, వాటిలో పెరిగే కూరగాయలు, వాటిని సరిగా శుభ్రం చెయ్యకుండా తీసుకోవడం వల్ల టాక్సోప్లాస్మొసిస్ వస్తుంది. తలనొప్పి, నీరసం, ఒళ్ళు నొప్పులు, లింఫ్నోడ్స్ వాయడం, కళ్లకు, కండరాలకు, మెదడు, ఊపిరితిత్తులకు పాకకడం, మెదడువాపు, ఫిట్స్, న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. గర్భవతులలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఈ జీవి చేరితే అది మాయ ద్వారా టాక్సోప్లాస్మా బిడ్డకి సోకి అబార్షన్లు, బిడ్డలో మెదడు లోపాలు, కళ్లు పాడవడం, వంటి అవయవలోపాలు, బిడ్డ కడుపులో చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. టాక్సోప్లాస్మాసిస్ రాకుండా ఉండటానికి పిల్లుల నుంచి వాటి మలం నుంచి దూరంగా ఉండాలి, తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లు, కూరగాయలు బాగా కడిగి తీసుకోవాలి, బాగా ఉడకబెట్టిన మాంసం తీసుకోవాలి. బాగా కాసిన పాలు తీసుకోవాలి. గర్భిణిగా ఉన్నప్పుడు పైన చెప్పిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. వీరిలో శారీరక, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. గర్భిణిలలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. మల విసర్జన తరువాత ముందు నుంచి వెనకాలకు శుభ్రం చేసుకోవాలి. రోజు గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యటం మంచిది. స్నానం తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే, చర్మం మెత్తగా ఉండి, చర్మం సాగడం వల్ల కలిగే దురద తక్కువగా ఉంటుంది. గర్భిణీలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. రక్తంలోకి హీమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ తప్పకుండా అవసరం. ఆపిల్స్, దానిమ్మ, స్ట్రాబెరీ, డ్రైఫ్రూట్స్, పల్లీలు, బాదం, వాల్నట్స్, గుమ్మడికాయ గింజలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర్ వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.ఆరంజ్లు, టమాటా, కివి, జామపండులో ఉండే విటమిన్ల వల్ల తీసుకున్న ఆహారం నుంచి ఐరన్ ఎక్కువగా రక్తంలోకి చేరుతుంది. -
నరకమా? అయితే ఓకే!
అనగనగా ఒక ఊళ్లో బాటిల్ కుమార్ అనే తాగుబోతు ఉండెను. ఒకరోజు ఇతడికి మార్గమధ్యంలో ఒక స్వామిజీ ఎదురయ్యెను. ‘‘నాయనా, తాగిన వాళ్లు నరకానికి వెళ్లెదరు అనే విషయం నీవు ఎరగవా?’’ అన్నారు స్వామిజీ. ‘‘నరకమా!’’ అని పెద్దగా అరిచి మందు కొట్టడం ఆపి గజగజా వణకడం ప్రారంభించాడు బాటిల్ కుమార్. గజగజా షేక్ అవుతున్నాడంటే అతనిలో మార్పు వచ్చిందనుకొని సంతోషించారు స్వామి వారు. ‘‘స్వామి నాదొక డౌటు’’ అన్నాడు బాటిల్ కుమార్. ‘‘ఏమిటి నాయనా అది?’’ అడిగారు స్వామిజీ. ‘‘నేను మందు కొట్టడానికి ప్రధాన కారణం నాకు అప్పులు ఇచ్చే అప్పారావు. వాడు లేకపోతే నేను మందు కొట్టే ఛాన్సే లేదు. మరి ఆడు నరకానికెళ్లడా?’’ మందు కొట్టడం ఆపి అడిగాడు బాటిల్ కుమార్. ‘‘ఎందుకెళ్లడు నాయనా...హండ్రెడు పర్సంటు వెళతాడు’’ అని చెప్పారు స్వామిజీ. ‘‘సరే, వాడేదో బుద్ధిలేక అప్పు ఇచ్చాడు అనుకుందాం. అసలు ఆ సారా అమ్మే సుబ్బయ్య లేకపోతే, నేనెందుకు మందు కొంటాను. కాబట్టి తప్పంతా సుబ్బయ్యదే. మరి ఈ సుబ్బయ్య నరకానికి వెళతాడా?’’ అడిగాడు బాటిల్ కుమార్. ‘‘టు హండ్రెడ్ పర్సెంట్ వెళతాడు నాయనా’’ అన్నారు స్వామిజీ. ‘‘సుబ్బయ్య సంగతి వదిలేయండి. ఆ సోమేష్ కూడా వెళతాడా?’’ అడిగాడు బాటిల్ కుమార్. ‘‘సోమేష్ ఎవరు నాయనా?’’ అడిగారు స్వామి. ‘‘సారా కొట్టులో నా గ్లాస్మేట్. మనం తాగి తప్పు చేస్తున్నాం...అని నాలుగు మంచి మాటలు చెప్పకుండా...ఈ భూమండలంలో మనంత అదృష్టవంతులు ఎవరూ లేరు అంటూ సొల్లు మాటలు చెప్పడం తప్పు కాదా!’’ అన్నాడు బాటిల్. ‘‘కచ్చితంగా తప్పే...ఆయన కూడా నరకానికి వెళతాడు నాయనా’’ చెప్పారు స్వామి. ‘‘సరేనండీ, మేమిద్దరం బుద్ధి గడ్డి తిని మందుకొడుతున్నాం అనుకోండి. మరి సారాకొట్టు ముందు చేపలు ఫ్రై చేసి మాకు అమ్మే ఆ చెన్నప్ప మాట ఏమిటి?’’ అడిగాడు బాటిల్. ‘‘ఆయన ఏం చేశాడు నాయనా?’’ ఎప్పటిలాగే అమాయకంగా అడిగారు స్వామి. ‘‘అర బాటిల్తోనే కానిచ్చారేమిటండీ...మీ లెవల్కి తగ్గట్టు ఈరోజు కూడా ఫుల్బాటిల్ కొట్టాల్సిందే...అని రెచ్చగొడుతుంటాడండీ...ఇది తప్పు కదటండీ!’’ అన్నాడు బాటిల్. ‘‘కచ్చింతగా తప్పే...చెన్నప్ప కూడా నరకానికి వెళతాడు నాయనా’’ అని చెప్పారు స్వామిజీ. ‘‘నాయనా, ఇప్పటికైనా మందు మానేస్తున్నావా! లేకపోతే నరకానికి వెళతావు. తెలుసు కదా!’’ అన్నారు స్వామిజీ. ‘‘ఈమాత్రం దానికి భయపడడం ఎందుకు?’’ కూల్గా అన్నాడు బాటిల్ కుమార్. ‘‘నాయనా, నువ్వు వెళ్లబోయేది కులు మనాలి కాదు నరకానికి’’ హెచ్చరించారు స్వామిజీ. ‘‘అయితే మాత్రం ఏమిటండీ...’’ అంటూ స్వల్వ విరామం తరువాత సంతోషంగా మళ్లీ మందు కొట్టడం మొదలెట్టాడు బాటిల్ కుమార్. ‘‘అదేమిటి నాయనా...నరకం అంటే భయపడాల్సింది పోయి అంత సంతోషంగా మందు కొడుతున్నావు?!’’ ఆశ్చర్యంగా అడిగారు స్వామిజీ. ‘‘సంతోషం కాకపోతే ఏమిటండీ, అప్పు ఇచ్చే అప్పారావు నరకానికే వస్తాడు, మందు అమ్మే సుబ్బారావు నరకానికే వస్తాడు, నా గ్లాస్మేట్ సోమేష్ నరకానికే వస్తాడు. ఫిష్ ఫ్రై అమ్మే చెన్నప్ప సరకానికే వస్తాడు. ఇంతకంటే కావాల్సింది ఏముంది! ఇక్కడిలాగే హాయిగా రోజూ మందు కొట్టవచ్చు. స్వర్గంలో ఏముంటుంది నా బొందా’’ అంటూ పెగ్గెత్తాడు బాటిల్ కుమార్. – యాకుబ్ పాషా -
ఆయురారోగ్యమస్తు
ఆయుర్వేదం ప్రపంచంలోనే అతి పురాతన వైద్య విధానం. ఇప్పటికి ప్రపంచంలో మనుగడలో ఉన్న సమస్త వైద్య విధానాల్లోనూ ఇదే అత్యంత ప్రాచీనమైనది. భారత భూభాగంలో పుట్టిన ఆయుర్వేదానికి దాదాపు ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అల్లోపతి, హోమియోపతి తదితర ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచ్చినా, ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆయుర్వేదం ప్రాక్పశ్చిమాలలోని ఇతర దేశాలకూ విస్తరించింది. తాజా అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ విలువ 517 కోట్ల డాలర్లు (రూ.36,665 కోట్లు). రానున్న ఐదేళ్లలో ఈ మార్కెట్ 921 కోట్ల డాలర్ల (రూ.65,316 కోట్లు) మేరకు విస్తరించగలదని మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఆయుర్వేదంపై ఒక విహంగ వీక్షణం... మానవాళిలో వ్యాధుల పట్ల భయం అనాదిగా ఉన్నదే. వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి పురాతన మానవులు తమకు చేతనైన ప్రయత్నాలు చేసేవారు. అందుబాటులో ఉన్న ఆకులు, అలములతోను, మూలికలతోను వ్యాధుల నివారణ కోసం చేసే ప్రయత్నాలలో క్రమంగా కొంత పురోగతిని సాధించారు. నాగరికతలు ఏర్పడిన ప్రతి ప్రాంతంలోనూ సంప్రదాయ చికిత్సా విధానాలు అభివృద్ధి చెందాయి. అదే క్రమంలో భారత భూభాగంలో ఆయుర్వేదం అభివృద్ధి చెందింది. మనవాళ్లు ఆయుర్వేదాన్ని మొదట దేవతలకు, రుషులకు ఆపాదించారు. ధన్వంతరిని వైద్యానికి అధిదేవునిగా మన పురాణాలు వర్ణించాయి. అశ్వనీదేవతలను కూడా దేవ వైద్యులుగా ప్రస్తుతించాయి. ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులను గ్రంథస్థం చేసిన తొలినాటి వైద్యుల్లో చరకుడు, సుశ్రుతుడు ప్రముఖులు. ఆయుర్వేద చరిత్ర తొలి ఆయుర్వేద గ్రంథ రచించిన వాడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన సుశ్రుతుడు ‘సుశ్రుత సంహిత’ రాశాడు. అందులో వనమూలికల ఉపయోగాలతో పాటు పలు శస్త్రచికిత్సా పద్ధతులను కూడా వివరించాడు. సుశ్రుతుడి గ్రంథంలో శాస్త్ర విషయాలు మాత్రమే కాకుండా, కొన్ని పురాణ కల్పనలు కూడా కనిపిస్తాయి. వైద్యానికి అధిదేవత అయిన ధన్వంతరి మానవరూపంలో కాశీరాజుగా అవతరించాడని, తనతో పాటు మరికొందరు శిష్యులకు ఆయుర్వేద వైద్య మర్మాలను బోధించాడని చెప్పుకున్నాడు. సుశ్రుతుడు తన గ్రంథంలో చెప్పిన ధన్వంతరి అవతార గాథ సంగతి ఎలా ఉన్నా, శస్త్రచికిత్సల గురించి అతడు వివరించిన పద్ధతులు నేటికీ అబ్బురపరుస్తాయి. ఒక రోగికి తెగిన ముక్కును తిరిగి బాగు చేయడానికి దాదాపు నేటి ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ తరహా శస్త్రచికిత్స చేసిన ఘనత సుశ్రుతుడి సొంతం. అందుకే ఆయుర్వేద చరిత్రకారులు సుశ్రుతుడిని ‘శస్త్రచికిత్సా పితామహుడు’గా అభివర్ణిస్తారు. ‘సుశ్రుత సంహిత’లో 1120 రకాల వ్యాధులు, 700 ఔషధ వృక్షాలు, ఖనిజ పదార్థాలతో తయారు చేసే 64 రకాల ఔషధాలు, జంతు సంబంధమైన వనరులతో తయారు చేసే 57 రకాల ఔషధాల గురించిన విపులమైన వర్ణన ఉంది. సుశ్రుతుడి తర్వాత క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన చరకుడు ‘చరక సంహిత’ పేరిట మరో సమగ్ర వైద్య గ్రంథాన్ని రాశాడు. ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన చరకుడిని ఆయుర్వేద వైద్య పితామహుడిగా అభివర్ణిస్తారు. ఆధునిక జీవితంలోనూ అనుసరించదగ్గ కీలకమైన జీవన సూత్రాలను చరకుడు తన గ్రంథంలో వివరించాడు. జీవనశైలిలో ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మానవ ప్రయత్నంతో ఆయుర్దాయాన్ని పెంచుకోవడం సాధ్యమేనని చరకుడు చెప్పిన మౌలిక విధానాన్ని నేటి ఆధునిక వైద్య విధానాలూ అనుసరిస్తున్నాయి. నిజానికి క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దికి చెందిన ఆత్రేయుని శిష్యుడైన అగ్నివేశుడు తొలిసారిగా ఆయుర్వేద చికిత్స పద్ధతులను గ్రంథస్థం చేశాడు. అగ్నివేశుడి గ్రంథాన్ని చరకుడు సమూలంగా సంస్కరించి, సమగ్రంగా తిరిగి రాశాడు. చరకుడు సమగ్రంగా సంస్కరించినందున అతడి గ్రంథం ‘చరక సంహిత’గా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ మిగిలి ఉన్న ఆయుర్వేద మూల గ్రంథాలు ‘సుశ్రుత సంహిత’, ‘చరక సంహిత’లు మాత్రమే. ఈ గ్రంథాలలో వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని చరిత్రకారులు చెబుతారు. ‘సుశ్రుత సంహిత’, ‘చరక సంహిత’ గ్రంథాలు క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికి చైనా భాషలోకి అనువదితమయ్యాయి. మధ్యయుగాల్లో అపూర్వ ఆదరణ మధ్యయుగాల్లో ఆయుర్వేదానికి అపూర్వ ఆదరణ ఉండేది. క్రీస్తుశకం 12–15 శతాబ్దాలకు చెందిన దల్హణుడు, సారంగ ధరుడు, భావమిశ్రుడు వంటి వారు పూర్వగ్రంథాలను మరింత మెరుగు పరచారు. స్వయంగా ప్రయోగాలను సాగించి, వాటి ఫలితాలను తమ గ్రంథాల్లో నమోదు చేశారు. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలోనే భారతీయ ఆయుర్వేద మూల గ్రంథాలు పర్షియన్, అరబిక్ భాషల్లోకి అనువదితమై, గల్ఫ్ దేశాలకు చేరాయి. బౌద్ధ భిక్షువుల ద్వారా ఈ గ్రంథాలు అంతకు ముందే చైనా, టిబెట్, జపాన్ తదితర తూర్పు దేశాలకు చేరాయి. అరబిక్లోకి అనువాదమైన ఆయుర్వేద గ్రంథాలు క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నాటికి యూరోప్ చేరుకున్నాయి. పునరుజ్జీవన కాలానికి చెందిన ఇటాలియన్ వైద్యులు అరబిక్ గ్రంథాల ద్వారా తెలుసుకున్న సుశ్రుతుడి శస్త్రచికిత్సా పద్ధతుల ద్వారా రోగులకు చికిత్స చేసేవారు. భారత్లో అప్పటికే విస్తృత వ్యాప్తిలో ఉన్న తెగిన ముక్కుకు చేసే శస్త్రచికిత్స పద్ధతిని (రినోప్లాస్టీ) స్వయంగా పరిశీలించి, నేర్చుకోవడానికి బ్రిటిష్ వైద్యులు ఇక్కడకు వచ్చారు. ‘ఇండియన్ రినోప్లాస్టీ’ విధానంపై ‘జెంటిల్మేన్స్ మ్యాగజైన్’ 1794 సంవత్సరం సంచికలో ప్రచురించారు. సుశ్రుతుడు తన గ్రంథంలో వివరించిన శస్త్రచికిత్స పరికరాలను యూరోపియన్ వైద్యులు మరింతగా మెరుగుపరచారు. జోసెఫ్ కాన్స్టంటీన్ కార్పూ అనే ఇంగ్లిష్ వైద్యుడు 1815లో సుశ్రుతుడి పద్ధతిలో ‘రినోప్లాస్టీ’ శస్త్రచికిత్స చేశాడు. పాశ్చాత్య ప్రపంచంలో జరిగిన తొలి ‘రినోప్లాస్టీ’ సర్జరీ అదే. అయితే, భారత్లో బ్రిటిష్ పాలన మొదలయ్యాక ఆయుర్వేద వైద్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అంతర్జాతీయ సంస్థల గుర్తింపు అంతర్జాతీయ సంస్థలు చాలాకాలం పాటు ఆయుర్వేదాన్ని సాదాసీదా సంప్రదాయ వైద్య విధానంగానే పరిగణిస్తూ వచ్చాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా అంతర్జాతీయ సంస్థలు సైతం ఆయుర్వేదంపై దృష్టి సారించడం మొదలైంది. గడచిన రెండు దశాబ్దాల్లో ఆయుర్వేద ఔషధాల తయారీ పరిశ్రమ వేగం పుంజుకుంది. డబ్ల్యూహెచ్ఓ తొలిసారిగా 2002లో ఆయుర్వేద, మూలికా వైద్యాలకు సంబంధించి ఒక ప్రణాళికను విడుదల చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన మేధా సంపత్తి ప్రణాళికలో ఆయుర్వేదానికి చోటు కల్పించింది. ఆధునిక భారత్లో ఆయుర్వేదం స్వాతంత్య్రానికి ముందు కాలంలోనే కాదు, స్వాతంత్య్రం వచ్చిన చాలాకాలం తర్వాతి వరకు ఆయుర్వేద విద్యాబోధనకు ప్రామాణికమైన విద్యార్హతల నిబంధనలు ఉండేవి కాదు. సంప్రదాయబద్ధంగా ఈ విద్యను నేర్చుకున్న వారే రోగులకు వైద్యం చేస్తూ వచ్చేవారు. భారత ప్రభుత్వం 1970లో ప్రవేశపెట్టిన భారత వైద్య కేంద్ర మండలి చట్టం ఆయుర్వేద విద్యకు ప్రమాణాలను నిర్దేశించింది. ఆయుర్వేదాన్ని ప్రామాణిక పద్ధతుల్లో బోధించే విద్యా సంస్థలకు గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత ఏడాదిలోనే– 1971లో ‘ఆయుష్’ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర భారతీయ వైద్య మండలిని (సీసీఐఎం) ప్రారంభించింది. అదే ఏడాది తొలిసారిగా కేరళ యూనివర్సిటీ పరిధిలోని ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ (బీఏఎం) కోర్సును ప్రారంభించింది. కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా మరికొన్ని కళాశాలల్లోనూ ఈ కోర్సును ప్రారంభించారు. సిలబస్ను మరింత మెరుగుపరచి 1979లో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) కోర్సును, పోస్టుగ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎండీ కోర్సును కూడా ప్రారంభించారు. ఆయుర్వేదంతో పాటు సంప్రదాయ వైద్య విధానాలైన సిద్ధ, యునాని వంటి వైద్య విధానాలను చెందిన పురాతన గ్రంథాలను ఆన్లైన్లో అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం 2001లో ‘ట్రాడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ’ని ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో ఆయుర్వేదం బోధించే కళాశాలలు 209, పీజీ స్థాయి కోర్సులను బోధించేవి 16 కళాశాలలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2,253 ఆయుర్వేద ఆస్పత్రులు, 13,925 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్య విద్యను ప్రామాణీకరించిన తర్వాత ఆయుర్వేదానికి జనాదరణ పెరగడం ప్రారంభమైంది. భారత్లో దాదాపు 77 శాతం జనాభా ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. మనదేశంలోని బీమా సంస్థలు కూడా ఆయుర్వేద వైద్యాన్ని గుర్తిస్తున్నాయి. ఆరోగ్య బీమా క్లెయిమ్స్లో దాదాపు 10 శాతం వరకు ఆయుర్వేద చికిత్స పొందిన వారికి సంబంధించినవి ఉంటున్నాయి. పొరుగు దేశమైన నేపాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో 75 శాతానికి పైగా జనాభా ఆయుర్వేద ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం కూడా ఆయుర్వేదాన్ని గుర్తించింది. కొలంబో యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ మెడిసిన్ ఆయుర్వేదంతో పాటు యునానీలో కూడా డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది. శ్రీలంకలో 62 ఆయుర్వేద ఆస్పత్రులు, 208 డిస్పెన్సరీలు దాదాపు 30 లక్షల మందికి పైగా రోగులకు– అంటే శ్రీలంక జనాభాలో దాదాపు 11 శాతానికి నిరంతరం సేవలందిస్తున్నాయి. అభివృద్ధి పథంలో ఆయుర్వేద మార్కెట్ ఆయుర్వేద మార్కెట్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గడచిన దశాబ్ద కాలం లెక్కలను పరిశీలిస్తే, ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ సగటున 16 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది. ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులకు, పోషకాహార ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ ఉత్పత్తులకు, వాజీకరణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఆయుర్వేద ఉత్పత్తులపై మొగ్గు చూపుతున్న ప్రజల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మన దేశంలో 2015 నాటికి ఆయుర్వేద ఉత్పత్తులు వాడే వారి సంఖ్య జనాభాలో 69 శాతం ఉంటే, 2018 నాటికి ఈ సంఖ్య 77 శాతానికి చేరుకుంది. ప్రధానంగా వనమూలికలతో తయారయ్యే ఆయుర్వేద ఉత్పత్తులు ప్రకృతి సహజమైనవి, దుష్ఫలితాలు దాదాపుగా లేనివి కావడంతో చాలావరకు ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఉత్పత్తులను వాడటానికే ఇష్టపడుతున్నారు. రానున్న కాలంలో ఆయుర్వేద మార్కెట్ మరింతగా విస్తరించగలదని, ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తులకు గిరాకీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగుమతుల్లో చైనా తర్వాతే మనం... సంప్రదాయ మూలికా ఔషధాల ఎగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఎగుమతులతో చైనా ఈ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం భారత్ నుంచి ఏటా రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆయుర్వేద ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల్లో ఏటా సగటున 14 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది. దేశంలో ఆయుర్వేద చికిత్సలకు కేరళ ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఆరోగ్యం కోసం భారత్ వచ్చే విదేశీ పర్యాటకులను కేరళ ఆయుర్వేద చికిత్స కేంద్రాలు ఆకట్టుకోగలుగుతున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ దేశాల్లో ఇటీవలి కాలంలో ఆయుర్వేద ఔషధాలకు ఆదరణ పెరుగుతోంది. జర్మనీలోని బ్రిస్టీన్ నగరంలో ఉన్న ‘యూరోపియన్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద’ యూరోప్లో ఆయుర్వేద పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో ఏటా 150 మంది పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులు చేరుతున్నారు. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో దాదాపు 80 శాతం ప్రజలు సంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని ఆధునిక వైద్యంతో అనుసంధానం చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశాలలో నిర్వహించిన రిఫరెండంలో తేలింది. ఆయుర్వేదాన్ని కొందరు పాశ్చాత్య మేధావులు కుహనా శాస్త్రంగా కొట్టిపారేస్తుండగా, ఆయుర్వేదం కేవలం నమ్మకాలపై ఆధారపడిన వైద్యవిధానం కాదని, పూర్తిగా శాస్త్రీయమైనదేనని యూరోపియన్ ఆయుర్వేద అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మిత్వెదా చెబుతుండటం విశేషం. అయితే, యూరోప్లో ఆయుర్వేద ఉత్పత్తులను ‘హెల్త్ సప్లిమెంట్స్’ లేబుల్తోనే విక్రయిస్తున్నారు. చైనా మూలికా ఔషధాలను మాత్రం ‘మెడిసిన్’ లేబుల్తో విక్రయిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తులను కూడా ఔషధాలుగా గుర్తించాలని మిత్వెదా వంటి నిపుణులు యూరోపియన్ ప్రభుత్వాలను కోరుతున్నారు. మిత్వెదా వంటి వారి విజ్ఞప్తిని యూరోపియన్ ప్రభుత్వాలు పట్టించుకుంటే, ఆయుర్వేద పరిశ్రమ భవితవ్యం మరింత ఆశాజనకంగా ఉంటుంది. మహాభారతంలో ఆయుర్వేదం క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన ‘మహాభారతం’లోనూ ఆయుర్వేద ప్రస్తావన కనిపిస్తుంది. ‘మహాభారతం’ నాటికే ఆయుర్వేదం ఎనిమిది విభాగాలుగా అభివృద్ధి చెందింది. నేటి ఆధునిక వైద్యంలోని వివిధ రకాల స్పెషలైజేషన్లను పోలిన విభాగాలను ‘మహాభారతం’ విపులంగా ప్రస్తావించింది. అవి:కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), కౌమార భృత్య (శిశు వైద్యం), శల్యతంత్ర (ఎముకల వైద్యం), శాలంక్య తంత్ర (చెవి, ముక్కు, గొంతు, కళ్లకు సంబంధించిన వైద్యం), భూతవైద్య (దుష్టశక్తులను వదలగొట్టడం), విషగర వైరోధ తంత్ర (టాక్సికాలజీ), రసాయన తంత్ర (శరీరానికి పునరుజ్జీవం కల్పించే యాంటీ ఏజింగ్ చికిత్స), వాజీకరణ (లైంగిక పటుత్వాన్ని పెంచే చికిత్స). -
పార్శిల్
ఎవరూ? అమెజాన్ నుంచి పార్శిల్ మేమ్... ఓహ్....... ఉండు.... తను బిల్ తీసుకుంటూ....‘అసలు శనివారం డెలివరీ మేమ్. టూ డేస్ ముందే ఇచ్చేశాం చూశారా!’ చిన్న గర్వపు నవ్వుతో చెప్పి వెనుదిరిగాడు. నాకపుడు తెలిస్తేగా... నా ‘ఆ’ ప్రయాణం రెండురోజులు ప్రీ పోన్ అయిందనీ, అతను చింపి ఇచ్చింది దాని తాలూకూ ‘చెల్లు చీటీ’ అనీనూ. నా ఏకైక పుత్రుడికి నేనివ్వబోతున్న పుట్టినరోజు కానుకిది... వాడు మా ఇద్దరి బర్త్ డేలకీ ఏదో సర్ర్పైజ్ ప్లాన్ చేస్తాడెపుడూ. మా ఆఫీసుల్లో తనకు చనువున్న ఆంటీతోనో అంకుల్తోనో కుమ్మౖకై వీడి సర్ర్పైజ్ ప్లాన్లు అమలుచేయించి మమ్మల్ని ఆశ్యర్యపరచటం అలవాటు. మరి నేనూ వాడికివ్వాలిగా... ఎంతో కొంత సర్ర్పైజ్! అందుకే ఇది ఆర్డరు పెట్టా. కానీ ఆ గిఫ్ట్ ఓ జీవితకాలపు సర్ర్పైజ్ తిరిగి నాకే ఇవ్వబోతుందని తెలియటానికి నాకో ఆరుగంటల టైం పట్టింది. టెన్త్ నుంచే సెల్ఫోన్ కొనమని నస మొదలుపెట్టినా సునీలూ, నేనూ ఒకే మాట మీదుండి తర్వాత చూద్దాం అంటూ గడిపేశాం. ఇంటర్ మధ్యలో మళ్ళీ యాగీ మొదలుపెట్టేసరికి నువు బాగా చదివి నైన్ పాయింట్స్ తెచ్చుకో కొంటానని మాట ఒదిలేశాడు సునీల్. ‘ఏడ్చినట్టుంది వాడికి ఆ కెపాసిటీ ఉంది. అది కాస్తా తుంగలో కలుపుద్దనేగా సెల్ ఒద్దనేది.. ఇంటర్ పూర్తి చేయనీ అనలేవా సునీల్?’ అని తను మొత్తుకుంది. అందరికీ ఉంది మమ్మీ క్లాస్లో... ఈ కష్టం పగోడిక్కూడా రాకూడదన్నంత ‘ఫీల్’తో ముఖం మాడ్చుక్కూర్చున్నాడు. ఇక సునీలెక్కడ ఆగుతాడూ... వెంటనే సెల్ఫోన్ రెడీ! తనకి సమకూర్చడమే తెలుసు గానీ కంట్రోల్ చేయడం తెలీదు. మా సుపుత్రుడు ముఖానికి దాన్ని అమర్చుకుని, సెల్లుకు సొంత కవల సోదరుడిలాగా తిరగటం మొదలెట్టాడు. ఎదురుగా నించొని ఏదైనా మనం అడుక్కోవచ్చు. మరేదైనా చెప్పుకోవచ్చు. వాడు మాత్రం అందులోంచి తలెత్తేదే లేదు. ఊ...ఊ..అనటమే. కదిలేదే లేదు. చివరకు టాయిలెట్లోక్కూడా తీసుకుపోతుంటే సహించలేక నాలుగు పద్ధతైన తిట్లు తిట్టాగానీ అవి కూడా సెల్లు దాఖలా అయిపోయాయ్. నా ఎనర్జీ వేస్ట్ అని తెలిశాక వాడిని మానేసి మా గదిలో మేం ఇద్దరం తిట్టుకునేవాళ్ళం. ‘కష్టపడి ఇల్లుకట్టి కల్లుతాగి కూలగొట్టాడట ఎవడో నీలాగే ఏం ఫోన్లో ఏంటో’ అని సునీల్ని సతాయించేదాన్ని. ఓ నెల కాగానే వాడికి సైటు కళ్ళద్దాలు సమకూర్చి పెట్టింది తన బాధ్యతగా ఫోను. వీడికి క్రమంగా వినే అలవాటు పోతే డిగ్రీ ఎలా పూర్తి చేస్తాడూ? అని నాకొకటే దిగులు. బాగా ఆలోచించి ‘ఇది’ ఆర్డరు పెట్టానందుకే! నాకర్థం అయిపోయింది ఇక నా ప్రాణం పోక తప్పదనీ...మూడు బారల దూరంలో అటుతిరిగి కూర్చున్న ముద్దుల కొడుకు తనను ‘చెవులారా’ సాగనంపబోతున్నాడనీనూ. ‘అరే నాన్నా’ వినపడదు పాపం! పొద్దున్నుండి చూస్తున్నదేగా తంతు. కళ్ళు మూసుకుని తలూపుతూంటాడంతే. అబ్బా.. గుండెలపై చేతితో గట్టిగా అదుముకున్నా... అయ్యో..సాయంత్రం మేనకోడలి పెళ్లికి వెళ్ళాలే. ఇక అంతా ఇటే వస్తారేమో! ‘ఒరేయ్...బాబూ...డ్రెస్సింగ్ టేబుల్లోంచి నాలుక కింది మాత్తర్లు తీసీయరారేయ్... అబ్బా....ప్రాణం పోయేట్టుందిరా....నేను నా కంటే నీకే ఎక్కువ అవసరంరో’...ఊ....మ్. నాలో నేనా...పైకా నేను మాట్లాడుతుంటా?! ఏమో. ‘ఒరేయ్..సన్యాసి..ఒక్కసారి ఇటు చూడ్రా’.. బలహీనమైన గొంతు... బలహీనమైన ఆలోచనలూ. బలవంతంగా లేచే ప్రయత్నం.. అబ్బే...ఉహూ... ఇందాకటి వరకూ ఆ అద్దం దగ్గరే కదా చచ్చానూ..ఏ మాత్రం చేయిలాగినా బిళ్ళ చప్పరిద్దునే. నోట్లో నిజంగా మందుబిళ్ళ స్పర్శ...ఒళ్ళు తేలిపోతుందేవిటీ...ఓహో పిల్లాడు చేతులపై ఎత్తుకుని అంబులెన్స్ ఎక్కిస్తున్నందుకా....హమ్మయ్య సేఫబ్బా నేను...ఎంతైనా మా వాడుకూడా నాలాగే వెంట వెంటనే స్పందించి నిర్ణయాలు తీ...సు...కు...ని....అరె..మా సీలింగ్ ఫేన్ నా ముఖం మీదికొచ్చి మరీ తిరుగుతుందెందుకూ. నిజమా...కలా..ఊహా...ఆశా...తెలీలా... ఇంకా ఇక్కడే ఉన్నానేంటీ? హూ... సాయంత్రం నా చుట్టూ చేరి వంటచేసి, నడుం వాల్చి హాయిగా నిద్రలోనే వెళిపోయిందంటమ్మా...ఎంత గొప్ప చావో! అని చెప్పుకుంటారైతే అంతా. ఔను.. వంటచేసే పోవటం...గొప్పేగా మరి.. ఏడుపు నిండిన నవ్వు వచ్చింది. ఆఖరి ప్రయత్నంగా మోచేతిపై లేచే ప్రయత్నం చేస్తూ...చేతికి దొరికిన రిమోట్ వాడికి విసురుదామను...కుంటూండ...గానే...రెండు నిమిషాలు కుదిపేసి జాలీగా భుజాలెగరేసుకుంటున్న కొడుకుని కళ్ళనిండా ‘జాలి’గా చూస్తూండగా....పోయింది.. ఎన్నిటికోసమో ప్రాకులాడిన ప్రాణం! పరుగులెత్తిన ప్రాణం! పిల్లల మీద పెట్టిన ప్రాణం...పువ్వులనీ, పుస్తకాలనీ, భానుమతనీ, శ్రీ శ్రీ అనీ, వెన్నెల్లో ఆడపిల్లా, అమావాస్య చంద్రుడూ... ఎన్నింటినో ప్రేమించిన ప్రాణం...ఆఖరుసారి అంతులేని నిస్సత్తువనూ, నొప్పినీ కలిగించి, తెలియని తీరాలకై వేగంగా బయటపడింది. కోడలితో, మనుమలతో పరిచయం లేకుండానే... వియ్యపోళ్ళని చూడకుండానే... కొడుకు పెళ్లికి పట్టుచీర రెప రెపతో సందడిగా సంతోషంగా తిరగకుండానే...పో..యిం...ది. అరె... ఎంతఖాళీ ఎంత తీరికెంత శాంతీ! ఊహ తెల్సాక ఇంత పనిలేకుండా ఎన్నడూ లేను. ఎత్తులో కూర్చొని కాళ్ళూపుకుంటూ అదే గదిలో ఉన్నా. నా నిర్జీవదేహం మంచంపై పడుంది. కర్రవాటు దూరంలో వాడింకా తలూపుతూ అలాగే కూర్చుని ఉన్నాడు. ఎంజాయ్ చేస్తూ. ఐనా నాకు బుద్ధుండాలి...బర్తడే గిఫ్ట్... బర్త్ డేకివ్వాలిగానీ ముందే చూపిస్తే వీడాగే రకమా?! ఎంజాయ్మెంట్ అంతుచూస్తూ అమ్మ ‘అంత’ మయేది చూడకుండానే కూర్చున్నాడు. ఒక్కసారిగా నాలో బాధ.. ఇపుడొకసారి పోయి ‘దీన్ని’ కనిపెట్టినోడిని రెండు పీకివస్తేనో.. మొన్న వీటిని ధరించి వినపడక రైలు పట్టాలు దాటుతా చనిపోయిన ఒక్కగానొక్క రమగారి పిల్లాడు గుర్తొచ్చాడు. వీడినీ, మా వెధవనీ కూడా పన్లోపని రెండు పీకుతా.. ఎలాగూ కనపడను గాబట్టి. వావ్..మా ఎదవ లేచాడు. ఇప్పుడదిరి, బెదురుతాడు చూడూ...పాపం పిచ్చికన్న! నన్నెంత మిస్ అవుతాడో... వాడు మంచం దగ్గరకొచ్చి ‘మమ్మీ..అన్నం తిందామా?’ ఒక్కసారే అడిగాడు చెవిలోంచి ఒక వైరే తీసి. నేను పలక్కపొయే సరికి ‘సర్లె..నువు పడుకోలే..నేను పెట్టుకుంటాలే’ మళ్ళీ వైరు చెవిలో ఇరికించుకుని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఒరే నీ యయ్య...తట్టిలేపరా..నీయమ్మ కట్టెకాల... నీ అడ్జస్ట్మెంట్ తగలెయ్య.. ఇంత తెలివిలేని వెధవనా నేను కన్నదీ... ఇహ బ్యాంక్ నుండి సునీల్ రావల్సిందేనా..నా అతీ,గతీ తేలాలంటే...ప్చ్. నా శరీరం అలా అంతసేపు ఏ ఐడీ లేకుండా, చచ్చిన మనిషికి తప్ప చచ్చినట్టు ఎవరికీ తెలీక ...ఫ్యాన్ గాలికి ముంగురులు ఊగుతూ పడుంది. నా ఆత్మ జలదరించింది. కానీ ఏదో తెలియని రిలీఫ్...ఎవరితోనూ చేయించుకోకుండా, తల్లిగా, భార్యగా, ఎంప్లాయిగా... క్లీన్ చిట్తో బయటపడ్డాను. ఇదీ మంచిదేలే. ఊహూ... కానేకాదు.. వీడి పెళ్ళి ఆదర్శంగా చేస్తానన్నదీ... కోడలితో ఫ్రెండ్లీగా ఉంటానన్నదీ... మనమరాలికి అంజలి అని పేరు పెడతానన్నదీ...అన్నీ ‘ఆన్లైన్ యమపాశాలు’ తీసుకుపోయాయి. కానీ ఇంత సిల్లీగా.. సింపుల్ గానా పోయేది? సాయంత్రం సునీల్ ‘టీ...టీ.’ అంటూ మంచం చుట్టూ తిరిగి ఎప్పటికో గమనించాక...ఆపై నేనూహించిందే. మేనకోడలి పెళ్ళిజనం అంతా ఖర్చులు కలిసొచ్చి...ఆనందం నుండి విషాదానికీ, సన్నాయి నుండి షహనాయికీ షిఫ్ట్ అయ్యారు. ‘గుత్తొంకాయ చేసిందంటమ్మా వాళ్ళాయన కిష్టమని’ ఒదిన కన్నీళ్ళతో! హు.. చావెవరిదైనాకానీ... గుత్తొంకాయనొదల్రే.. హ..హ...హ’. ‘వాషింగ్ మెషీన్లో బట్టలలాగే ఉన్నాయమ్మా.. మధ్యాహ్నం వేసుకుంది గావునూ.’ పిన్ని ఇంట్లో ఓ రౌండేసొచ్చి ముక్కు పిండుకుంది. కాదెహే...లేవంగానే వేసేసా...మధ్యాహ్నం ఏడుందీ చాకిరేవుకీ...చావురేవైపోతేనూ! ఇంతలో నాకు ఓ షాక్..నా పుత్ర రత్నం కాసేపటికో... కూసేపటికో జరిగిన సీన్లు రివైజై..రియలైజ్ అవటం చూసి తరిద్దామనుకుంటే...వాడు నా పార్థివ శరీరంపై పడి– ‘ఇవిగో అమ్మ నాకోసం కొన్న లాస్ట్ మెమరబుల్ గిఫ్ట్’ అంటూ ఆ నల్లని యమపాశపు ‘ఇయర్ ఫోన్స్’ అందరికీ చూపించి, ముద్దాడుతూ గావురుమంటూ ‘వాటిని’ అతి జాగ్రత్తగా జేబులో దాచుకున్నాడు. అరే..ఒద్దురా...పాపిష్టివిరా...హెడ్ ఫోన్స్ కావవి...హెడ్ కొరివి రా నాకూ! ఎంత శ్రద్ధగా తీసుకున్నానురా వాట్నీ! పగోడిని పంచాంగమడిగితే, మధ్యాహ్నానికే మరణం అన్నాట్ట. అయ్యో...వీడు పూజించేసేట్టున్నాడే. ‘ఏవీ ఇలా చూపించూ. మేమంతా చూస్తాం మీ అమ్మిచ్చిన గిఫ్ ్ట‘పిన్నికి ఏదొక న్యూస్ లేటెస్ట్ ది కావాలి. వాడు తీసిస్తున్నాడు...ఇక నా గురించి మానేసి వాటి గురించే ఈ పూటంతా చెప్పుకుంటారు గావును. ఛ...ఖర్మ..ఖర్మ! హూ..ఇక పొండి. కర్మ కాండలు చేసుకోండి. మీ ఖర్మ... ఇక నా సమయం అయిందో, లేక అక్కడ ఉండాలనిపించలేదో తెలియదు, ఆలోచనారహితమైన నా ఆత్మ ప్రయాణం నా భర్తనీ, కొడుకునీ ఆర్తిగా చూసుకుంటూ ముందుకు సాగింది. ‘అరరే...అరరే...నేడు కన్నీట తేనె కలిసే’ ఎవరి టీవీలోంచో ఇష్టమైన పాట వినపడుతోంది. ►మనూ -
ప్లీజ్ దయచేసి 'లావు' ఉండొద్దు
సాక్షి, గుంటూరు : ఆధునిక జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లతో నేడు పాఠశాల చదివే పిల్లవాడు మొదలుకొని యవకులు, పెద్దల వరకు అధిక బరువుతో(ఊబకాయం) బాధ పడుతున్నారు. ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ నివేదిక ప్రకారం 2030 నాటికి 250 మిలియన్ల మంది 5 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు ఊబకాయులుగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2.8 మిలియన్స్ మంది ప్రజలు ఊబకాయం వల్ల చనిపోతున్నారు. పెరిగిన శరీరం తగ్గించుకోవటం కోసం చాలా మంది ఉదయానే లేచి రోడ్ల వెంబడి పరుగులు తీయటం, జిమ్లలో గంటల కొద్ది వ్యాయామం చేయటం, ఆస్పత్రుల చుట్టూ తిరగటం చేస్తున్నారు. స్థూలకాయంపై ప్రజలకు అవగాహన కల్పించి, దీని బారిన పడకుండా ఉండటం కోసం ఏటా అక్టోబర్ 11న ప్రపంచ స్థూలకాయ వ్యతిరేక దినోత్సం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఊబకాయం(ఒబెసిటీ) కారణాలు... నేడు ఊబకాయం సమస్య అధికమవుతోంది. ఈ సమస్య రోజురోజుకూ పెరగటానికి కారణం అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవటం, మితిమీరిన ఆహారం తినడం, శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోవటమే. వంశపారంపర్యంగా కొంత మందికి ఊబకాయం వస్తుంది. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. జీవన విధానంలో తేడాల వల్ల అధిక బరువు వస్తుంది. పాఠశాలల పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న జనాభాలో మూడో వంతు మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. ఊబకాయంతో రోగాలు... ఊబకాయం వల్ల పిల్లల్లో మధుమేహం వస్తుంది. రక్తపోటు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, లివర్, కీళ్ల నొప్పులు, గురక, నిద్ర సమస్యలు, పిల్లలు పుట్టకపోవటం తదితర వ్యాధులకు గురవుతారు. సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, తగిన శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఊబకాయం బారిన పడకుండా ఉండవచ్చు. ఆహారంలో కొవ్వును తగ్గించవచ్చు శరీరంలోని ఎలాంటి జబ్బులనైనా 70 శాతం ఆహారంతో తగ్గించవచ్చు. తినే ఆహారం కొంచెమైనా అందులో పోషక విలువలు ఉండాలి. ఎలాంటి పరికరాలను వినియోగించకుండానే పళ్ళరసాలు, కాయగూరల రసాలు, పళ్ళు, ఉడకబెట్టిన ఆహారం, ఉడకబెట్టని(రాఫుడ్) తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. వ్యాయామం ద్వారా 20 శాతం జబ్బులను, యోగాతో కొవ్వును కరిగించవచ్చు. – డాక్టర్ షేక్ హుస్సేన్, మెడికల్ ఆఫీసర్ -
రైతు సమస్యల పరిష్కారంతోటే జాతి భద్రత
రెండున్నర దశాబ్దాలుగా భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా మారాయి. పైగా గ్రామీణ రైతు కుటుంబాలపై సామాజిక, మానసిక, ఒత్తిడితో పాటు ఆర్థిక భారం గణనీయంగా పడుతోంది. వీటి వల్ల పిల్లల చదువులు మధ్యలో ఆపివేయటం, మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, కమతాల పరిమాణం తగ్గిపోవడం, పాడి పశువులను అమ్మివేయడం, అధిక విలువ గల పంటలలో దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులను, రైతుకూలీలకు ఆదుకోవడానికి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో 28,866 కోట్ల కేటాయింపులతో (12.66 శాతం) రైతులకు పెద్దపీట వేసింది. ఇది ఇతర రాష్ట్రాల సగటు 6.5 శాతం కేటాయింపుల కన్నా గణనీయంగా ఎక్కువ. జాతీయ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అంచనాల ప్రకారం 1995 నుండి మన దేశంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉండగా 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2015వ సంవత్సరంలో మహారాష్ట్రలో 3,030 మంది, తెలంగాణలో 1,358 మంది, ఏపీలో 516 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2017–18లో దేశంలో రోజూ 10 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని నమోదైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో, ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. రైతుల ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఉపశమన ప్యాకేజీలు, రుణమాఫీ పథకాలు ప్రకటించాయి. రైతులను, రైతుకూలీ లను ఆదుకోవడానికి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేశాయనే చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో 28,866 కోట్ల కేటాయింపులతో (12.66 శాతం) రైతులకు పెద్దపీట వేసింది. కౌలు రైతులతో సహా రైతులందరికి రూ. 12,500 వ్యవసాయ పెట్టుబడి సాయం, పంటల బీమా, 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా, రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా వ్యవసాయ బోర్లు, ఆక్వా రైతులకు విద్యుత్తు సబ్సిడీ, గోదాములు నిర్మిం చడం, విషాదకర పరిస్థితులలో రైతులు మరణించినపుడు తగిన పరిహారం వంటివి చెప్పుకోదగ్గ చర్యలు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పంట సాగుదారు హక్కుల బిల్లు 2019, ముఖ్యంగా రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2 వేలకోట్లతో, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధులు వంటి పథకాలు.. రైతులు, కౌలుదారుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలుగా చెప్పవచ్చు. పత్తి, వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, మినుము, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు పువ్వు మొదలైన పంటల సాగుకు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఖర్చు ఎక్కువని ‘వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘం’ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి రుణసదుపాయం కల్పించేందుకు బ్యాంకులు తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణ, ఒక పంటపోయినపుడు మరో పంట చేతికి వచ్చేంతవరకు రుణదాతలు ఎటువంటి ఒత్తిడి చేయకుండా చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలి. రైతులలో ఆర్థిక స్వావలంబనకై చేపట్టవలసిన కార్యక్రమాలు, చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడు మాత్రమే ఆత్మహత్యలు తగ్గి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాభ్యుదయాన్ని సాధించి భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల ప్రమాదాల అంచనాకు శాన్త్రవేత్తలు కొలబద్దలను తయారు చేశారు. వీటిని ఉపయోగించి ఏఏ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉందో ముందే గుర్తించి తగు నివారణ చర్యలు తీసుకొని వారిని రక్షించవచ్చు. ప్రొ‘‘ మల్లంపాటి శ్రీనివాసరెడ్డి వ్యాసకర్త మాజీ పాలక మండలి సభ్యులు పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ మొబైల్ : 94913 24455 -
ఇంట్లో ‘ఈగలు’... బయట పల్లకీలు!
‘‘సంపద సృష్టి జాతీయసేవ. కనుక సంపద సృష్టికర్తలను అనుమానంతో చూడకూడదు. సంపద సృష్టి అయితేనే కదా దాన్ని పంపిణీ చేయగలం. దేశంలో సంపద సృష్టికర్తలు సంపన్నులే, కాబట్టి వారిని మనం గౌరవించాలి’’. – ప్రధాని నరేంద్రమోదీ,స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ‘‘అమెరికాలో సంపన్నులపై పన్ను రాయితీల ఫలితంగా నేను నా ప్రైవేట్ కార్యదర్శి కన్నా తక్కువ పన్ను చెల్లిస్తుంటాను’’. – వారెన్ బఫెట్, అగ్రగామి అమెరికన్ బిలియనీర్ ఏ దేశ నాయకుడైనా, ప్రధానమంత్రి అయినా జీవితంలో ఎన్ని దేశాలు తన పదవీకాలం ముగిసేలోపు తిరిగి వచ్చాడన్నది ప్రధానం కాదు. తిరిగి తిరిగి ఏం సాధించాడన్నదే చివరికి గణనలోకి వస్తుంది. ప్రజాస్వామ్యం ముసుగులో దేశీయ వ్యవస్థల్ని ఆచరణలో ఎలా భ్రష్టుపట్టించి నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూల్చుతూ వస్తున్నారన్నది గమనించాల్సిన అవసరం ఎప్పటికంటే నేడు ఎక్కువగా ఉంది. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఎక్కువగా కేంద్రీకరించి ఉన్న టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్లో జరిగే మోదీ సభకు, ప్రెసిడెంట్ ట్రంప్ హాజరు కావడం వేరు. అలాంటి సభకు మోదీ మూడవసారి అమెరికా పర్యటన పేరిట హాజ రవడం వేరు. నిన్న మొన్నటిదాకా అమెరికా చదువుకోసం, ఉన్నత విద్యావకాశాల కోసం ఎగబాగుతున్న మన పిల్లల అవసరాల్ని తుంచే ప్రక్రియలో భాగంగా హెచ్– 1బి వీసాలకు మధ్యమధ్యలో ట్రంప్ బ్రేక్ వేస్తూ రావడం మనకు తెలిసిందే. అమెరికా పాలకుల ఆంక్షలపై తన తీవ్ర నిరసనను బాహాటంగా మోదీ ప్రకటించిన ఉదాహరణ లేదు. పైగా మొదటిసారిగా, అమెరికా పర్యటించినప్పుడు ఇండి యాను కొల్లగొట్టిపోయిన వాస్కోడిగామాలాగా అమెరికా గుత్త పెట్టు బడిదారులంతా వాస్కోడిగామాలై తరలిరండి అని ఆహ్వానించిన సంగతీ మరవరాదు. ఆ పెట్టుబడులతో ఇండియాలో సరుకులు ఉత్పత్తి చేసి పెట్టమని (మేక్ ఇన్ ఇండియా) మోదీ కోరినా ఆశించిన లాభాలు లేనిదీ వ్యాపారి వరదన పోడన్న సామెతను అమెరికా గుత్తే దారులు రుజువు చేశారు. మరో వైపున అక్కడ అమెరికా యువతలో పెరిగిపోతున్న నిరుద్యోగ తీవ్రతకు పరిష్కారంగా అటు డెమోక్రాట్ నాయకుడు ఒబామా అయినా ఇటు రిపబ్లికన్ ట్రంప్ అయినా చేస్తున్న పని అమెరికన్ ఓటర్లకు బుజ్జగింపు ఎత్తుగ డగా హెచ్–1 బి వీసాలను క్రమంగా నిరోధిస్తున్నామని ఎర చూపుతున్నారు. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను గత అయిదేళ్లలో లేని తీవ్ర సంక్షోభానికి గురిచేస్తూ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం మరింతగా దిగజార్చుతూ అర్ధంతరంగా, అనాలోచితంగా, ఆకస్మికంగా చెలామ ణిలో ఉన్న పెద్దనోట్లను రద్దుచేసి, మరింత తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దాని దుష్ఫ లితాలను చిన్న పారిశ్రామికులు, పేద, మధ్య తరగతి ప్రజలు, పేద రైతు, కార్మిక ప్రజా బాహుళ్యం కిక్కురుమన కుండా అనుభవించాల్సి వచ్చింది. దీని ఫలితంగా బ్యాంకులు, ఏటీఎంలు మూతపడితే వాటి వద్ద పడిగాపులు పడిన సందర్భంగా 125 మంది బ్యాంక్ ఖాతాదార్లు సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోతే 125 కోట్లమంది భారత ప్రజలు తనకు అండగా నిలిచారని మోదీ ప్రగ ల్భించారు. దేశ ప్రజలు తమ ప్రయోజనాల కోసం నిర్మించుకున్న అగ్ర శ్రేణి రిజర్వు బ్యాంకు నిర్వహణపై బీజేపీ–ఆరెస్సెస్ నిరంకుశ అజమాయిషీ కాస్తా బెడిసి కొట్టింది. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్య తల అధ్యాయాన్ని పక్కకునెట్టి పాలకులు వ్యవహరిస్తూ వచ్చారు. చీలుబాటల రాజకీయం ఆధారంగా పార్లమెంటరీ సంప్రదాయా లను, అందులో అంతర్భాగమైన పార్లమెంటరీ కమిటీలను నిర్వీర్య పరిచారు. కశ్మీర్లో ‘370’వ నిబంధన రద్దుతోపాటు, కొన్ని ఈశాన్య భారత రాష్ట్రాలలో భారతదేశ పౌరులనే నువ్వెవరో, నీ పౌరసత్వాన్ని నిరూపించుకోమని ప్రశ్నించే దశకు పాలకులు దిగజారి పోయారు. వీటన్నింటి పర్యవసానంగా–ముగ్గురు రిజర్వ్బ్యాంక్ గవర్నర్లు, మరి ముగ్గురు ‘నీతి ఆయోగ్’ (ప్రణాళికా సంఘాన్ని చంపి) ఉన్న తాధికారులూ గత అయిదేళ్లలోనూ తప్పుకోవలసి వచ్చింది. ఈ ‘ఈగల మోత’కు తాళ లేక మరోమారు నాయకుడు విదేశంలో ‘పల్లకీ మోత’ను ఆశ్రయించవలసి వచ్చింది. మళ్లీ అవే పెట్టుబడుల కోసం అభ్యర్థన. మన నాయకుడికి హ్యూస్టన్లో అభి నందన సూచకంగా ‘హలో’ (హౌడీ: ‘హలో’ అనీ, ఆహ్వానమనీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తాజా నిఘంటువు అర్థం) చెప్పడం మనం హర్షించదగినదే. కానీ ‘హలో’ చెప్పేవారికి, ఉపాధి కోసం ఉద్యోగార్థులై అక్కడే ఉండిపోయి స్వదేశం వైపు తిరిగి చూడని వారికి, స్థిరాస్తులు, చరాస్తులు రెండు చేతులా సంపాదించి స్థిరపడిన వారికి మన దేశంలో ప్రజా బాహుళ్యం, ఆర్థిక వ్యవస్థ అనుభవిస్తున్న సంక్షోభ పరిణామాలపై కన్నెత్తి చూసే తీరిక ఉండదు కాబోలు పాపం. స్వయంగా అమెరికాలోని గూగుల్, స్టార్ బక్స్ లాంటి అత్యంత గుత్తేదారుల కంపెనీలు అమెరికా విడిచి ఐర్లాండ్ దేశంలో ఎందుకు స్థిరపడా లనుకుంటున్నాయో ఆలోచించాలి. పాపం, ఈ ‘పేద’ కంపెనీలకు అమెరికాలో ఇచ్చే పన్ను రాయితీలు చాలడం లేదట. అందుకని తక్కువ పన్నురేట్లు ఉన్న ఐర్లాండ్కు తరలుతున్నాయట. దీన్నే అమెరికన్లు ‘లాభాల పునాదులు చెక్కు చెదరని ఏర్పాటు’ (బేస్ ఎరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్) అంటారు. అంటే మోదీ, వారెన్ బఫెట్ సంరక్షించగోరుతున్న పెక్కుమంది ‘సంపద సృష్టిక ర్తలు’ తమ లాభాల గురించే ఎక్కువ ఆలోచిస్తారు గానీ, తమ జాతీ (దేశ) ప్రజా సంక్షేమాన్ని గురించి అంతగా ఆలోచించరని సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలయిన కేంద్రీయ సామాజిక శాస్త్రాల అధ్యయన సంస్థ, ఢిల్లీ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్స్ మాల్కోమ్ ఆదిశేషయ, ఆస్తా అహుజా తేల్చి చెప్పారు. బహుశా అందుకనే మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ మహాసభకు హాజరైనా, దేశంలో ఇన్ని రకాలుగా ఆర్థిక రంగంలో జరుగుతున్న అవకతవకల్ని, అవినీతిని, మోసాల్ని ఇంతకు ముందెన్నడూ ఆర్థిక వ్యవస్థ చూడలేదనీ, గుణ పాఠం నేర్వలేదనీ వాపోవాల్సి వచ్చింది. అంతేగాదు, బీజేపీ పాలనలో తొలి అయి దేళ్లలో ప్రజల చేతుల్లో డబ్బు చెలామణి కాక పోవడంవల్ల ఏర్పడిన సంక్షోభాన్ని గత 70 ఏళ్లలో దేశం ఎదుర్కొని ఎరగదని మోదీ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘నీతి ఆయోగ్’ విధాన నిర్ణయ సంస్థ అధిపతి రాజీవ్ కుమార్ విమర్శించాల్సి వచ్చిందని మరవ రాదు. హిందూత్వ రాజకీయం మినహా చరిత్ర, సామాజిక శాస్త్రాల అధ్యయనం నుంచి బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు దూరమైనందుననే దేశానికి ఈ దుస్థితి దాపురించిందని భావించడం అతిశయోక్తి కాజాలదు. ఇదే నిజం కాక పోతే, దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలకులతో సుదీర్ఘకాలంపాటు దేశ స్వాతంత్య్ర సాధన కోసం జరిపిన పోరాటాల ద్వారా, ప్రజల అసంఖ్యాక త్యాగాల ద్వారా గడిం చిన అనుభవం నుంచి తొలి దీపశిఖ దాదాభాయ్ నౌరోజీ ప్రబో ధించిన ‘డ్రెయిన్ థియరీ’ (పరాయి పాలకులు దేశం నుంచి ఊడ్చు కుపోయిన దేశీయ సంపద) చాలు– బుద్ధిగల పాలకులు స్వతంత్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించుకునే సత్తా పొందడానికి. దేశ పౌరులు తాము ఈ దేశం వారమేనని నిరూపించు కోవాల్సిన దారుణ వ్యవ స్థను, సుప్రీంకోర్టును సహితం ధిక్కరించి పాలకులు రుద్దే స్థితికి దేశాన్ని దిగజార్చుతున్నారు. ఎప్పుడైతే ప్రధాని మోదీ.. సంపద స్వయంకర్తలు బడా సంపన్న వర్గాలని తాజాగా ప్రకటించి, జాతీయ జీవనంలో వివిధ రంగాలలోని రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీ వుల్ని, ఇతర ఉద్యోగ, సద్యోగ కష్ట జీవుల సమష్టి శ్రమను కించ పరచడం పాలకుల నైజంగా మారిందో– ఆనాడే సామాజిక ఆర్థిక రంగాలలో దోపిడీ వ్యవస్థలకు పునాది ఏర్పడి బలపడుతూ వచ్చింది. బహుశా అందుకనే అమెరికాలో తిరిగి సోషలిజంవైపు యువత మొగ్గుచూపే ధోరణి కనపడుతోందని ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తుకోవడానికి గల కారణాల్ని ప్రసిద్ధ సామాజిక విశ్లేషకుడు పాల్ స్ట్రీట్ (అమెరికా) ఇలా విశ్లేషించాడు: ‘‘అమెరికా, అమలులో ఉన్న ప్రజాస్వామ్యమని మీరనుకుంటారు, కానీ అది కాదు. ఆ మాటకొస్తే మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యమే కాదు. మరెందులో? ఆరోగ్య బీమాలోనా? కాదు, మానసిక ఆరోగ్య భాగ్య విధానంలోనా? కాదు, కార్మిక సంఘాల సంఘటిత హక్కులలోనా? కాదు, పోనీ క్రిమినల్ న్యాయ వ్యవస్థలోనా? కాదు, దేశ సంపద, ఆదాయ వనరుల పరి రక్షణలోనా? కాదు, నిజం చెప్పాలంటే– జన జీవితానికి చెందిన, వారి నిజమైన ప్రయోజనా లను రక్షించగలది కాదు అమెరికా ప్రజా స్వామ్యం (అమెరికన్ ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్ సౌజన్యంతో). ఇదేదో ఉగ్రవాదుల మేనిఫెస్టో అనుకునే ప్రమాదం ఉంది మరి. అమెరికాలో మెజారిటీ ప్రజలు యువతకు ఉద్యోగాల కల్పనను, వేతనాల పెంపును, నిరుద్యోగభృతిని, సార్వత్రిక వైద్యబీమాను కోరుకుంటు న్నారు. ఈ మాత్రపు ఆందోళనకారుల్నే ట్రంప్ ‘సోషలిస్టులు’గా భావించి ‘అమెరికా ఎప్పటికీ సోషలిస్టు దేశం కాబోదని అమెరికా పార్లమెంట్ శపథం చేయాల’ని కోరాడు నిజానికి, 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి తెరలేపింది అమెరికా పాలకులు, దాని ఒరలో ఇరుక్కు పోయిన ఇండియా లాంటి వర్ధమాన దేశాల పాలకులు. ఆ ఒర నుంచి బయటపడగల ప్రతివ్యూహాన్ని పన్నడంలో విఫలమై, దేశ సంపద సృష్టికి పునాది సామాన్య ప్రజల శ్రమశక్తీ, కార్మిక శక్తేనని గుర్తించక, ‘సంపన్నులే సంపద సృష్టికర్తలనీ, రెండో దఫా ప్రధాని పదవి నుంచి సిద్ధాంతీకరించి దానిపైన ఓ ‘తాతాచార్యుల ముద్ర’ గుద్దేసినంతమాత్రాన భారత ప్రజా బాహుళ్యం సమ్మతించడానికి సిద్ధపడదు– ‘తాజ్మహల్ నిర్మాణానికి, దేవాలయ కట్టడాలకు రాళ్లె త్తిన కూలీలెవ్వరు/ ప్రభువెక్కిన పల్లకీకాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?’ అని ప్రశ్నోపనిషత్ను తెరవకుండా ఉండ జాలరు. కష్టజీవి శ్రమ ఆగిపోతే కాలానికి కళ్లమే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాయని డైరీ.. నరేంద్ర మోదీ (భారత ప్రధాని)
హ్యూస్టన్లో క్లైమేట్ అన్ఫ్రెండ్లీగా ఉంది! ఇండియా–పాక్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం పడి పిచ్ మొత్తం తడిసి ముద్ద అయినట్లుగా ఉంది హ్యూస్టన్ నగరం. ఈ రాత్రికే ‘హౌడీ మోదీ’ ప్రోగ్రామ్. నన్నూ, అమెరికా అధ్యక్షుడినీ కలిపి ఒకే వేదికపై చూడ్డం కోసం యాభైవేల మంది ఎన్నారైలు హ్యూస్టన్కు వస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే న్యూయార్క్ చేరుకుని ఉన్న దేశాధినేతలు కూడా ట్రంప్నీ, నన్ను చూడ్డం కోసం ఈ రాత్రి టీవీలకు దగ్గరగా జరిగి కూర్చుంటారు. ఇమ్రాన్ ఖాన్ మరింత దగ్గరగా జరిగి కూర్చుంటాడేమో! వర్షం ఎంతకూ తగ్గడం లేదు. వర్షం ఎంతకూ తగ్గకపోతే ఆ సాకుతో ట్రంప్ నా కార్యక్రమానికి రాకపోయేందుకు అడ్డంకులేమీ ఉండవు. రేపు సోమవారం ట్రంప్, ఇమ్రాన్ఖాన్ ఇద్దరే విడిగా న్యూయార్క్లో కలుస్తున్నారు. ఒకర్నొకరు చూసుకోగానే, ‘హౌడీ ఇమ్రాన్’ అంటాడేమో ట్రంప్! ‘హౌడీ మోదీ’ అనవలసినవాడు హ్యూస్టన్ రాకుండా, న్యూయార్క్లో ‘హౌడీ ఇమ్రాన్’ అంటే కనుక ఇక వాళ్లిద్దరూ ఒకటయ్యారనే అనుకోవాలి. ఇద్దరూ ఒకటయ్యారంటే మంగళవారం జరిగే సమితి సమావేశంలో తన ప్రారంభోపన్యాసం పూర్తయ్యాక.. ‘వేదికపైకి వచ్చి కశ్మీర్ గురించి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లండి ఇమ్రాన్..’ అని ట్రంప్ ఆహ్వానించినా ఆశ్చర్యం లేదు. హ్యూస్టన్లోని క్లైమేట్ మాత్రమే కాదు, హ్యూస్టన్లో దిగినప్పటి నుంచి ట్రంప్ కూడా నాతో అన్ఫ్రెండ్లీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్లయిట్ దిగ్గానే ‘హౌడీ మోదీ’ అని వాషింగ్టన్ నుంచి ట్రంప్ నాకు ఫోన్ చేస్తారని, అప్పుడు నేను ‘హౌడీ డొనాల్డ్’ అని అనాలనీ అనుకున్నాను. హౌడీ ట్రంప్ అనేకంటే, హౌడీ డొనాల్డ్ అనడం రిథమిక్గా ఉంటుందని! కానీ ఫోన్ రాలేదు! ‘‘వర్షాలు కదా, లైన్లు లేనట్లున్నాయి’’ అన్నారు నాతో ఉన్న హ్యూస్టన్ మేయర్ సిల్విస్టర్ టర్నర్. ‘‘వర్షాలైతే అన్నిచోట్లా ఉంటాయి. లైన్లు లేకపోవడం కూడా అన్నిచోట్లా ఉంటుందా మిస్టర్ సిల్విస్టర్ టర్నర్?’’ అన్నాను. ‘‘సర్, మీరనుకుంటున్నట్లు నేను సిల్విస్టర్ టర్నర్ని కాదు. సిల్విస్టర్ టర్నర్ ప్రతినిధిని’’ అన్నాడు ఆ మనిషి! ‘ఆయనెక్కడా..!’’ అన్నాను. ‘‘సర్, ఆయన దారి మధ్యలో చిక్కుకుపోయినట్లున్నారు’’ అన్నాడు. దారి మధ్యలో చిక్కుకుపోయాడా, ట్రంపే ఫోన్ చేసి దారి మధ్యలో చిక్కుకుపొమ్మని చెప్పాడా?! అనుమానం వచ్చింది నాకు. నిన్న ఒక్కరోజే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ఏడు లక్షల కోట్లు రావడం ట్రంప్ మనసులో పడే ఉంటుంది. నాలుగు నెలల్లో కొట్టుకుపోయిన పదకొండు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డబ్బులో సగానికి పైగా ఒక్క రోజులోనే రికవరీ చేశాడంటే మోదీ సామాన్యుడు కాదని కూడా ట్రంప్ అనుకునే ఉంటాడు. ఇండియా అమెరికాను మించిపోయినా ట్రంప్ భరించగలడు కానీ, మోదీ ట్రంప్ను మించిపోయాడని ప్రపంచం అనుకుంటే మాత్రం తట్టుకోలేడు. ‘‘వస్తాను సర్. వర్షం ఎక్కువయ్యేలా ఉంది’’ అన్నాడు సిల్విస్టర్ టర్నర్ ప్రతినిధి. నాకెందుకో అతడే సిల్విస్టర్ అనిపిస్తోంది. వర్షంలో తడిసి వచ్చిన మనిషిని గుర్తుపట్టలేని వయసుకు నేనింకా రాలేదనే నా నమ్మకం. ‘‘మిస్టర్ సిల్విస్టర్.. ఈ రాత్రి నా హౌడీ మీటింగ్కి ట్రంప్ కాకుండా, ట్రంప్ ప్రతినిధి వస్తున్నట్లయితే ఆ విషయాన్ని మీరు నాకు కాస్త ముందుగా చెప్పగలరా?’’ అని అడిగాను. ‘‘చెప్పగలను మిస్టర్ మోదీ.. అయితే ఎంత పెద్ద వర్షమైనా మరీ ట్రంప్ ప్రతినిధి కూడా రాలేనంతగా కురవదని నా నమ్మకం’’ అన్నాడతను!!! -
భారత తీరానికి యూరప్ హారం
ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలతో మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్ కూడా తమిళనాడు, గుజరాత్లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మతులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా ఏపీ సరుకు రవాణా 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. కోటి జనాభాకు మించని గ్రీస్ దేశం ఏటా ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్తో సమానంగా షిప్పింగ్ బిజినెస్ ద్వారా ఆర్జించడం గమనార్హం. భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశంలోని రెండు తీర ప్రాంతాల్లో ‘సముద్ర వాణిజ్య సముదాయాలు’ (మారిటైమ్ క్లస్టర్ల)ను ఏర్పాటు చేస్తోంది. ఒకటి గుజరాత్లో... రెండోది పొరుగునున్న తమిళనాడులో. మరి సుదీర్ఘమైన తీర ప్రాంతంతో విరాజిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ లోనూ మరో మారిటైమ్ క్లస్టర్ రావాలి. దీనికి కేంద్రం పచ్చజెండా ఊపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇపుడెందుకంటే మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సముద్ర వాణిజ్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నౌకా నిర్మాణాలు, నౌకల మర మ్మతులకు సంబంధించిన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. దీనివల్ల విదేశాల నుంచి మన షిప్ యార్డులకు నౌకా నిర్మాణాల ఆర్డర్లు పెరిగే అవకాశముంది. దీంతో నిపు ణులు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దేశీ యంగా నౌకా నిర్మాణ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలు మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్ కూడా తమిళనాడు, గుజరాత్లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మ తులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా ఏపీ సరుకు రవాణా 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఐరోపాతో భారత ఉప ఖండానికి సరైన వారధి సముద్రమే. తీరప్రాంతాలలో వెలసిన అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్, ప్రపంచం లోనే రెండో చిన్న ఖండమైన యూరప్ స్నేహగీతం ఆలపిస్తున్నాయి. నిజానికి నాగరిక జీవనం ఆరంభం నుంచీ భౌగోళిక, చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన యూరప్ నుంచి రాక పోకలకు భారత్ ప్రధాన ద్వారంగానే ఉంటూ వస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఇరుదేశాల స్నేహపూర్వక సంబంధాలు సుహృద్భావ వాతావ రణాన్ని నెలకొల్పాయి. ఐరోపాకు తూర్పున కాస్పి యన్, పశ్చిమాన అట్లాంటిక్, ఉత్త రాన ఆర్కిటిక్, దక్షిణాన మధ్యదరా సముద్రాలతో పాటు ఆగ్నే యాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం సరి హద్దులుగా ఉన్నాయి. ఇక భారతదేశానికి అత్యధిక జనాభాతో పాటు ఏడు వేల కిలోమీ టర్లకు పైగా సముద్ర తీరం కూడా ఉంది. యూరప్ ఖండాన్ని, భారత్ ఉపఖండాన్ని మిత్ర దేశాలుగా ఉంచుతున్న ఈ సముద్రాలు... ఇరు దేశాల మధ్య వాణిజ్య అవ కాశాలను మరింత పెంచే అవకాశాలనూ అంది స్తున్నాయి. భారతదేశ వాణిజ్యమంతా సముద్రయానం పైనే ఆధారపడి ఉంది. 95 శాతం వ్యాపారం పూర్తిగా సముద్రం మీదుగానే సాగుతోంది. ముడి చమురు దిగుమతులలో భారత్ది 3వ స్థానం. గ్రీస్ నుంచి ఎల్ఎన్జీ, ఎల్పీజీలను దిగుమతి చేసుకోవడంలోనూ భారత్ వాటాయే అధికం. ఇక నౌకాయాన వాణిజ్యంలో ప్రపంచంలోనే మొదటి స్థానం భారత్ది. ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు సాగించే నౌకలలో 50 శాతం గుజరాత్లోని అలంగ్ పోర్ట్ నుంచే సాగుతున్నాయి. భారత నౌకా వాణిజ్యంలో ఎంతగా దూసుకుపోతోందో చెప్ప డానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గ్రీస్, భారత్ దేశాల మధ్య సముద్రయాన వాణిజ్య సంబంధాల వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. ఇక భారత్లోని తీర ప్రాంతంలో 12 శాతం ఆంధ్రప్రదేశ్ సొంతం. 974 కిలోమీటర్ల ఈ తీరంలో ఒక మేజర్ పోర్టు, 14 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భాగ స్వామ్యంలో నిర్వహిస్తున్న మరో 6 పోర్టులూ ఉన్నాయి. సముద్రమార్గంలో అత్యధిక సరుకు రవాణా చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ది గుజరాత్ తరువాతి స్థానం. 2018 నాటికి 15 కోట్ల మెట్రిక్ టన్నులున్న సరుకు రవాణా 2020 నాటికి 16.5 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని 10 శాతం పెరు గుదల నమోదు చేస్తుందనేది తాజా అంచనా. ప్రాచీనకాలం నుంచి సముద్రరవాణాపై ఆధారప డిన గ్రీస్ దేశ జనాభా కోటికి మించదు. గ్రీకుల వాణిజ్యమంతా జల రవాణా ద్వారానే జరుగుతుం డటం మరో విశేషం. అందుకని ఏపీ సముద్ర రవా ణాకు, వాణిజ్యబంధానికి గ్రీస్ దేశం సరిగ్గా సరిపో తుంది. దీని కోసం ఏపీ తీరంలో మరిన్ని పోర్టులు, షిప్పింగ్ కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది. షిప్పింగ్ బిజినెస్ ద్వారా ఏటా 25 బిలియన్ల డాలర్లను గ్రీస్ దేశం ఆర్జిస్తోంది. ఇది ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్తో సమానం. నిజానికి గ్రీస్ స్థాయిలో నౌకా రవాణా, షిప్పింగ్ బిజినెస్లో వృద్ధి సాధిం చేందుకు ఏపీలో అనువైన పరిస్థితులే ఉన్నాయి. తీరప్రాంతంలో వాణిజ్య, వ్యాపారాలు సులభ తరం చేసేలా ప్రభుత్వాలు తగు వి«ధానాలు కూడా రూపొందించాయి. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ వీలు కల్పించాయి. రానున్న రోజుల్లో 35 ఏళ్ల లోపు యువతలో 65 శాతం దేశాభివృద్ధిలో భాగమయ్యే అవకాశం ఉంది. ఇక శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు చేయూతనం దించేందుకు గ్రీస్లో అవలంబిస్తున్న విద్యావిధానాలు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు భారత్లో కూడా అమలవుతున్నాయి. కాబట్టి తగు ప్రణాళిక లతో గ్రీస్ ఆలోచనలు, ఆచరణను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుంచి ఎగుమతులు దిగుమతులు (లక్షల మెట్రిక్ టన్నులలో) పోర్ట్ 2018 2020 నాటికి అంచనా విశాఖపట్నం 600 650 కృష్ణపట్నం 450 500 గంగవరం 230 250 కాకినాడ 200 220 రవ్వ 20 30 డా. గేదెల శ్రీనుబాబు వ్యాస రచయిత పల్సస్ సీఈవో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రితో కలిసి ఇటీవల గ్రీస్లో పర్యటించిన భారత ప్రతినిధి -
తసమదీయ మాయాబజార్!
‘శశిరేఖ కనికట్టు నేర్చిందా?... లేక నా కన్నేమైనా చెదిరిందా?’ అంటాడు శకుని, కేవీరెడ్డి తీసిన మాయాబజార్ సినిమాలో. శశిరేఖ రూపంలోకి పరకాయ ప్రవేశం చేసిన ఘటోత్కజుని విన్యాసాలు చూసి కంగు తింటాడు. కాబోయే అత్తగారి హోదాలో శశిరేఖను తన చెంతకు పిలిపించుకున్న భానుమతీదేవి (దుర్యోధనుని భార్య) దిగ్భ్రాంతికి గురవుతుంది. కొడుకు లక్ష్మణ కుమారుడు గుర్తుకొచ్చి కలవరపడుతుంది. శకునికి కూడా గాభ రాయే. తానే మాయగాడు. తనకే అంతుపట్టడం లేదు. అయినా భానుమతీదేవికి ధైర్యం చెబుతాడు. మనవడు మాలోకం అని మనసుకు తెలిసినా, ఆమె ముందు మాత్రం మనవాడు మందలగిరి పర్వతాన్నయినా సరే పెకిలించగల మొనగాడన్నంత బిల్డప్ ఇస్తాడు. సిని మాలో అక్కడినుంచి మొదలవుతుంది ఘటోత్కజుని విన్యాసం. కనిపించేది శశిరేఖే... కానీ శశిరేఖ కాదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అంతా కనికట్టు అన్నట్టు సాగుతుంది కథ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయా లనూ, పరిణామాలనూ దూరం నుంచి చూసేవారికి కూడా ఒక మాయాబజార్ బైస్కోపు కనబడుతుంది. కాక పోతే ఇది రివర్స్గేర్లో వుంటుంది. అది సన్మార్గులైన పాండవులకు అనుకూలంగా శ్రీకృష్ణుడి ప్రేరణతో ఘటో త్కజుడు సృష్టించిన మాయాబజార్. ఇది ప్రజల ఛీత్కా రానికి గురై, చేసిన తప్పులకు ఎక్కడ బోనెక్కవలసి వస్తుందోనన్న భయంతో ఏపీ ఎల్లో సిండికేట్ అల్లుతున్న మాయాబజార్. సినిమాలోనే చెప్పినట్టు అది అసమదీ యుల (అస్మదీయులు) కోసం. ఇది తసమదీయులు సృష్టించుకున్న మాయాబజార్. రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మొన్ననే వందరోజులు దాటింది. ఇంకా నాలుగు నెలలు కూడా నిండలేదు. ఐదేళ్ల పదవీకాలంకోసం ఏర్ప డిన ప్రభుత్వానికి మామూలుగానయితే మొదటి ఆరు నెలల కాలాన్ని టేకాఫ్ టైమ్గానే పరిగణిస్తారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఈ 114 రోజుల్లోనే సాధించిన విజ యాలు ఒక సరికొత్త జాతీయ రికార్డు. జాతీయ పత్రికలు సంపాదకీయాలతో శ్లాఘించతగిన, మొదటి పేజీల్లో విస్తృత ప్రచారం ఇవ్వదగిన ప్రజోపయోగ కార్యక్రమా లను ప్రభుత్వం చేపట్టింది. ఇది మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరం. భారతదేశం పల్లెల్లోనే వుందని నమ్మిన వ్యక్తి ఆయన. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరా జ్యమని బోధించినవాడు. కానీ మన పాలకులు పల్లె సేవలను పడకేయించారు. ఐదారు గ్రామాలకు కలిపి కూడా ఒక పంచాయతీ కార్యదర్శి లేడు. సర్వేయర్ అనే ఉద్యోగి అంతరించిపోతున్న జాబితాలో చేరాడు. ఎల క్ట్రిక్ లైన్మన్ సేవలకోసం రోజులతరబడి ఎదురు చూడ వలసిన పరిస్థితి. చిన్నచిన్న వైద్యసేవలందించే ఏఎన్ఎమ్ పోస్టులను కూడా భర్తీ చేయకపోవడంతో అరకొరగా వున్న కాంట్రాక్టు ఉద్యోగులతోనే సర్దుకోవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో మారిన అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని దాదాపు 133 రకాల సేవలను 72 గంటల లోపల పరిష్కరించే వ్యవస్థకు శ్రీకారం చుడుతూ గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయడమే కాదు, అందులో పూర్తిస్థాయిలో పనిచేసే 1 లక్షా 34 వేల ఉద్యోగాల భర్తీకి పరీక్షలను కూడా పూర్తిచేశారు. మరో వారం పదిరోజుల్లో వారు ఉద్యోగాల్లో చేరిపోతారు. ఇప్పటికే సుమారు 2 లక్షల 60 వేలమంది గ్రామ వలంటీర్లు కూడా ఉద్యోగాల్లో చేరిపోయారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సేవలను వారు డోర్ డెలివరీ చేయబోతున్నారు. ఒక సంచెడు బియ్యంకోసం కొండలు దిగుతూ, వాగులు, వంకలు దాటుతూ మైళ్ల దూరం కాలినడకన వెళ్లి, రేషన్ దుకాణం మూసివేసి వుంటే ఈసురోమంటూ వెనక్కువెళ్లే గిరిజన గ్రామాలున్న మన ఏజెన్సీ ప్రాంతాల్లో, వారి వాకిట్లోకే రేషన్ సంచిని చేర్చే వ్యవస్థను ఏర్పాటు చేయడం కన్నా మహాత్మునికి ఈ యేడాది ఇవ్వగలిగే నివాళి ఇంకే ముంటుంది?. కేవలం నాలుగు నెలల కాలంలో దాదాపు నాలుగు లక్షల ఉద్యోగావకాశాలను సృష్టించి, భర్తీ చేయడం దేశమంతటా చాటింపు వేయదగిన విజయ గాథ కాదా? దేశం సంగతి దేవుడెరుగు. మన తెలుగు మీడియాను గత మూడు దశాబ్దాలుగా తగులుకున్న పక్షపాతం అనే పక్షవాత రోగం మరింత ముదిరి తెలుగు రాష్ట్రాల్లో కూడా సరైన ప్రచారం లభించలేదు. దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇరవై లక్షలమంది రాసిన పరీక్షను పారదర్శకంగా నిర్వహించి, కేవలం 11 రోజుల్లో ఫలితాలను విడుదల చేయడాన్ని అరిగించుకోలేని ఒక మీడియా సంస్థకైతే వెంటనే డయేరియా సోకింది. ఈ వ్యాధి లక్షణాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం ప్రజారోగ్యం దృష్ట్యా క్షేమకరం కాదు. ప్రభుత్వాధికారులు విరుగుడు చర్యలు చేపట్టి ఉండవలసింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పదవీకాలం అవినీతి ప్రభుత్వాల చరిత్రలో అత్యంత హేయమైన అధ్యాయం. ఇరిగేషన్ను, ఇసు కనూ, మట్టి తవ్వకాలనూ, చివరికి సంక్షేమ కార్య క్రమాలను కూడా స్కామ్లుగా మార్చిన ఘనత దానిది. రాజధాని ఏర్పాటు ప్రహసనాన్ని మొత్తంగా తవ్వితీయ గలిగితే అది ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా ప్రపంచ చరిత్రలో నిలబడిపోతుందని అనేకమంది పరిశీలకుల అభిప్రాయం. ఈ స్కామ్లన్నీ బయటపడితే తమకు పుట్టగతులుండవన్న సంగతి తెలుగుదేశం అధిష్ఠానానికీ, ఆ పార్టీతో అల్లుకుపోయిన మీడియా – కాంట్రాక్టర్లు – వ్యాపారస్తుల సిండికేట్కు బాగా తెలుసు. అందుకే డబ్బులతో ఎన్నికల్లో గెలవడానికి తీవ్రమైన పోరాటం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చివరిదశలో సంబంధాలు చెడిపోవడం వల్ల, కాంగ్రెస్తో జతకట్టి, ఆ పార్టీకి భారీఎత్తున ఆర్థిక సహకారం చేశారనీ ప్రచారం వుంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఓడించడం కోసం వందలకోట్లు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిందని మిత్రపక్షమైన కాంగ్రెస్ నేతలు బహి రంగంగానే అంగీకరించారు. అంటే ఏ స్థాయిలో అక్రమ సంపాదన పోగుబడిందో అర్థం చేసుకోవచ్చు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా అన్నట్టు ప్రజల ఆగ్రహానికి గురైన తెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని స్థాయిలో ఓటమిపాలైంది. తెలంగాణ లోనూ, కేంద్రంలోనూ కూడా అంచనాలు తప్పాయి. ఈ నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని శరవేగంగా అమల్లోకి తెచ్చారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆ పార్టీకి ఉన్న నైపుణ్యానికి మరింత పదునుపెట్టారు. ముందుగా తమ పార్టీలో ఉన్న ‘బిజినెస్ బ్యాచ్’ను బీజేపీలో చేర్పిం చారు. వీరిలో కొంతమంది బీజేపీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వుంటారు. కొందరు జాతీయ మీడియాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని తప్పుడు సమాచారాన్ని ఇక్కడి ఎల్లో మీడియా క్లిప్పింగుల సాయంతో వారికి చేరవేసే పనిలో వుంటారు. సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబా బుకు అనుకూలంగా పనిచేయడానికి వెయ్యిమందికి పైగా నెలజీతంపై నియమించినట్టు సమాచారం. స్థానిక మీడియాతో ఇంతకుముందే వున్న సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం పాలు కానివ్వకుండా కాపాడేందుకొరకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశ పెట్టిన రివర్స్ టెండరింగ్ తెలుగుదేశం గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నది. ఇది ఆచరణలోకి వస్తే తాము చేసిన పాపాలు బట్టబయలవుతాయన్నది ఆ పార్టీ నేతల భయం. అందుకే తొలినుంచీ రివర్స్ టెండరింగ్కు వ్యతి రేకంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. బీజేపీ మాస్క్లు ధరించిన తెలుగుదేశం నేతలు తప్పుడు సమాచారాన్ని, తప్పుడు లెక్కలను అందజేసి కొందరు మంత్రుల చేత తొలుత వ్యతిరేకంగా మాట్లాడించగలిగారు. కొన్ని జాతీయ మీడియా సంస్థలకు కూడా ఇదేరకమైన సమా చారాన్ని అందజేశారు. సమాచారమిచ్చింది బీజేపీ మాస్కుల్లో వున్నవారు కాబట్టి ఇందులో టీడీపీ కుట్రకోణాన్ని ఆ పత్రికలు గుర్తించలేకపోయాయి. నిజంగానే ఆర్థికాభివృద్ధికి నష్టం కలుగుతుందేమో నంటూ కొన్ని పత్రికలు కామెంట్లు రాశాయి. స్థానిక ఎల్లో మీడియాకు ఈమాత్రం చాలు కదా!. మమ్మల్ని ఎల్లో మీడియా అన్నారు.. ఇప్పుడేమంటారు? అంటూ సంపాదక వ్యాఖ్యలు రాసిపారేశారు. ఆ వ్యాఖ్యానం చూసినప్పుడు ఒక సినిమా సన్నివేశం గుర్తుకు వచ్చింది. మహేశ్బాబు నటించిన అతడు అనే సినిమాలో హీరోను చంపేయడానికి తనికెళ్ల భరణితో బ్రహ్మాజీ ఒక ప్లాన్ చెబుతాడు. ‘ఎల్లుండి నూకాలమ్మ జాతర, వాడు గుడి కొస్తాడు. వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు పెడతా, గట్టు దాటగానే వేసేస్తా. అక్కడ తప్పించుకుంటే చుక్కలకొండ దగ్గర మూడు సుమోలు పెడతా, అక్కడ తప్పించుకుంటే సర్వి తోపు దగ్గర ఐదు సుమోలు పెడతా, అక్కడ వేసేస్తా’ అంటాడు. అన్ని సుమోలు ఎందుకురా బుజ్జీ అంటాడు తనికెళ్ల భరణి, అఘోరించావులే అన్నట్టు చూస్తూ. అదే విధంగా పంజాబ్లో రాశారు, ఢిల్లీలో రాశారు అంటూ ఎల్లో మీడియా పెట్టిన ఏకరువును కూడా బ్రహ్మాజీ మాటలకు భరణి స్పందన లాగే జనం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులోని 65వ ప్యాకే జీకి శుక్రవారం జరిగిన రివర్స్ టెండర్ ఏపీ ముఖ్య మంత్రి ఆలోచన నూటికి నూరుపాళ్లు సరైందేనని నిరూ పించింది. 274 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఈ ప్రక్రియ ద్వారా 58 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగారు. అంటే 20 శాతానికి పైగా ప్రజా ధనాన్ని కాపాడారు. గడిచిన నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ వాస్తవి కతకూ, ప్రయత్నపూర్వకంగా మీడియాలో వెలువరి స్తున్న కథనాలకు పొంతనలేదు. ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా రూపుదిద్దుకొంటున్నాయి. అన్ని వసతు లనూ శరవేగంగా కల్పిస్తున్నారు. తొలిదశలో 16 వేల పాఠశాలలు స్వచ్ఛ దేవాలయాలు కాబోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల రూపు మారుతున్నది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నది. నాణ్యమైన ఉచిత విద్యకూ, వైద్యానికి ప్రభుత్వం పూచీపడుతున్నది. రైతుల్లో భరోసా ఏర్పడింది. పదేళ్ల తర్వాత రిజర్వాయర్లన్నీ నీటితో కళ కళలాడుతున్నాయి. తొలిసారిగా పులిచింతల కూడా నిండుగా కన్పిస్తున్నది. పెన్నానది చాన్నాళ్ల తర్వాత ఉరకలేస్తున్నది. కృష్ణా, గోదావరులతోపాటు తుంగభద్ర కూడా కనికరించింది. వర్షాలు కొంత ఆలస్యమైనా అత్య ధిక ప్రాంతాల్లో సగటు వార్షిక వర్షపాతాన్ని దాటాయి. సీజన్ ముగిసేలోపు మిగిలిన ప్రాంతాల్లో కూడా సగటు వర్షపాతం నమోదు కావచ్చు. వచ్చే రబీలో రికార్డు స్థాయిలో పంటల సాగు వుంటుందని అంచనా వేస్తు న్నారు. మద్యనియంత్రణ విధానం ప్రభావం చూపడం ప్రారంభమైంది. కానీ, ఈ సానుకూల వార్తలకు మెజా రిటీగా వున్న మీడియా సంస్థలు పెద్దగా స్థానం కల్పించ లేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంద ర్భంలో అందుకు కారణాలను ప్రభుత్వంపైకి నెట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నానికి యథాశక్తి తోడ్పడ్డాయి. కానీ, స్థానిక ప్రజలకు నిజానిజాలు తెలుసు కనుక ఈ పిచ్చిప్రయత్నం ఫలించలేదు. కోడెల నిర్వాకంపై ప్రజల వైఖరి ఏమిటో పోలింగ్ రోజే తేటతెల్లమైంది. అధికారం కోల్పోయిన తర్వాత, కోడెల కుటుంబ దోపిడీలపై పెద్ద ఎత్తున జనం కేసులు పెట్టారు. వారిలో తెలుగుదేశం సానుభూతి పరులే ఎక్కువ. కోడెల కుటుంబాన్ని జనం ఛీత్కరించుకుంటున్నంత కాలం బాబు ఆయనను దూరం పెట్టారు. నియోజకవర్గంలో పోటీ నాయక త్వాన్ని ప్రోత్సహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తుంటే ఆ పక్కన పార్టీ సమావేశంలో పాల్గొని వెళ్లిపో యాడే తప్ప కోడెలను పరామర్శించలేదు. కానీ, చని పోయిన వెంటనే ఇదేదో అందివచ్చిన అవకాశం అన్న ట్టుగా వాలిపోయి విజయ చిహ్నాలు చూపుతూ ఊరే గడం ‘దేశం’ కార్యకర్తలక్కూడా వెగటు పుట్టించింది. అస్మదీయ ఛానళ్లు మాత్రం ఆయన సేవలో తరించాయి. అలాగే, ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలను నాలుగు నెలల్లో కల్పిస్తే చోటు కల్పించని మీడియా, సానుభూతికోసం చంద్రబాబు తలపెట్టిన ఆత్మకూరు యాత్రకు మాత్రం బ్రహ్మరథం పట్టింది. బహుశా, రాజరాజ చోళుడు లంకను జయించినప్పుడుగానీ, శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించినప్పుడుగానీ ఇంత హడావుడి జరిగి ఉండదు. మాయోపాయాలతో, మీడియా ప్రచారాలతో తాత్కాలిక లబ్ధి జరుగుతుందే మోగానీ, తుది విజయాలు సాధ్యంకావని హిట్లర్–గోబె ల్స్ల నుంచి చంద్రబాబు–ఎల్లో మీడియాల కాలం వరకు ఎన్నోసార్లు రుజువైంది. వెలుగు రేకలు పుడమిని తాకకుండా మబ్బులు అడ్డు కోలేవు. ‘అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతినాపలేరని’ ఏనాడో సుబ్బారావు పాణి గ్రాహి గొంతెత్తి ఆలపించాడు. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
కేంద్ర బడ్జెట్ నిండా హంసపాదులే
ప్రతిదానికి సహేతుకమైన కారణం ఉండి తీరుతుందని హేతువాదులు బల్లగుద్ది వాదిస్తారు. అత్తిపత్తిని తాకితే ముట్టవద్దన్నట్టు ముడుచుకుపోతుంది. అది దాని జీవలక్షణం. ఆ మర్మం తెలియనివారిని దైవ మహిమగా చిత్రించి దగా చేయకూడదు. కొన్నిసార్లు దేశంలో ఏదో మూల ఒక వేలం వెర్రిని పైకి లేపుతూ ఉంటారు. ఒకసారి వినాయకుడు పాలు తాగేస్తున్నాడని తమిళనాడులో సందడి లేచింది. అంతా ఇంతా సందడి కాదు. చెంచాలతో పాలు అందిస్తుంటే పిళ్లయ్యార్ ఆబగా పీల్చేయడం జనం కళ్లారా చూశారు. మర్నాడు హేతువాదులు రంగంలోకి దిగారు. ఇది దైవ మహిమా కాదు, గోంగూరా కాదు. విగ్రహం అంటే రాయి. బయటి వాతావరణానికి అలిసిపోతుంది. దీన్నే ‘స్టోన్ ఫెతిగ్’ అంటారు. అలాంటి సందర్భాలలో శిలలు ద్రవాల్ని సేవిస్తాయని వారంతా నొక్కి వక్కాణించారు. ఆ వేలం వెర్రి రెండో రోజుకి చప్పగా చల్లారిపోయింది. దైవ భక్తులు ఈ చర్యని దేవుడి మహత్యంగానే ఇప్పటికీ నమ్ముతుంటారు. వినే వారుంటే హేతువాదులు శాస్త్రీయ కారణాలను వివరిస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇలాంటి వెర్రి వేషాలు ఉన్నట్టుండి కనిపిస్తూనే ఉంటాయి. మనలాంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల వేళ కూడా ఈ వేలంవెర్రి తలెత్తుతోందని మేధావి వర్గం మొత్తుకుంటూ ఉంటుంది. ‘ఇది కూడా ఒక మాస్ హిస్టీరియానే. ఆనాడు ఇందిరమ్మకి మూకుమ్మడిగా ఎందుకు ఓట్లు వేశారు? తర్వాత ఎందుకు మానేశారు. ఆ హిస్టీరియా అమలులో ఉన్నప్పుడు గడ్డిపరక సైతం బంపర్ మెజారిటీతో గెలి చేస్తుంది’ అంటూ ఆ వర్గం అధిక ప్రసంగం చేస్తుంది. మొదటిసారి మోదీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు కొందరు మాస్ హిస్టీరియా అంటూ ఆక్షేపించారు. తర్వాతసారి, మోదీ బోలెడు జన వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు. సోదిలోకి కూడా రాడని కొందరు ఆశావాదులు తెగ సంబరపడ్డారు. మిగిలిన అందరూ ఓ కట్టు మీద ఉండాలని కూడా తీర్మానించుకున్నారు. ఫలితాలు చూసి దిగ్భ్రమ చెందారు. మెషీన్లు చేసిన మోసమని కూడా సమాధానపడ్డారు. కానీ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు. నరేంద్రమోదీ మరింత వైభవమైన మెజారిటీతో పీఠం ఎక్కారు. పెండింగ్ బిల్లులన్నింటినీ గట్టున వేశారు. కశ్మీర్ వ్యవహారంలో గొప్ప సాహసం చేశారన్నారు. ఇదంతా, ఒక ఎత్తు. రెండోవైపు, ‘ఏవుందీ.. దేశం గుంట పూలు పూస్తోంది. ఎక్కడా పెరుగుదల లేదు. విదేశీ పాలసీలు సరిగ్గా లేవు. స్వదేశీ సిద్ధాంతాలు బాగా లేవు’ అని అంతా దుయ్యబడుతున్నారు. కొందరు ఛాందసవాదులు, ఇవన్నీ కాదు– ‘ఏది రామాల యం ఎక్కడ? రెండోసారి రామయ్య గెలిపించినా రామకార్యం చెయ్యకపోతే ఇహ ఇంతే సంగతులు’ అంటూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. మోదీ చాలా ప్రాక్టికల్గా ఆలోచించి, ఆచరించే నేత. రాముణ్ణి పూర్తిగా నమ్మినా రెండోసారి గెలుపుకి ఆయనే కారణమని పైత్యంగా రామమందిరం పనులకి పునాదులు తీసేంత భక్త శిఖామణి మాత్రం కాదు. రెండోసారి పగ్గాలు పట్టి నాలుగు నెలలు అవుతోంది. ధరల విషయంలో సామాన్యుడు సంతృప్తిగా లేడు. బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతి పద్దుని తిరిగతోడి సమర్థించుకుంటూ వస్తున్నారు. ప్రతి ఖాతాలోనూ, కొత్తగా ఎరువులు గుమ్మరించి, మందులు చిలకరిస్తున్నారు. అంతా ఉద్దీపకాలతోనే అన్నీ నడుస్తున్నాయ్. కేబినెట్లో కొందరికి స్వేచ్ఛగా ఊపిరాడుతోందని, ఇంకొందరికి ఉక్కపోస్తోందని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది. మోదీకి పార్టీ విస్తరణ కాంక్ష తప్ప వేరే కాంక్ష లేదంటున్నారు. ఏమైనా కాస్త తూకం తప్పుతున్నట్టుంది. జాగ్రత్తపడితే మంచిది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఈ ఆర్థికంలో అద్భుతాలు సాధ్యమా?
భారత ఆర్థిక వ్యవస్థ అనే ఏనుగు మరణం గురించిన వార్తలు మరీ అతిశయించిన రూపంలో ఉంటున్నాయి. కానీ అది చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతోందన్నది నిజం. జాతీయవాదం మరీ పాతుకుపోతున్నప్పుడు, వెనుకంజ కూడా జాతిని ఐక్యం చేసే అంశంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీకి లభిస్తున్న ప్రజాదరణ స్పష్టం చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద సవాలు అయిన ఆర్థిక మందగమనాన్ని తోసిపుచ్చి మోదీ అసాధారణంగా పేరు ప్రఖ్యాతులు పొందుతుండవచ్చు లేదా ఏదైనా అద్భుతాన్ని సృష్టించి దాన్ని మరింతగా మెరుగుపర్చవచ్చు కూడా. మోదీ ఆర్థిక వ్యవస్థ బాధ్యతలను నేరుగా చలాయించగలిగితే 2014 నాటికల్లా భారత్ను 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చడం అసాధ్యం కాదు. నా ఈ మాటలు నిజం కావాలని నేను నిజాయితీగా కోరుకుంటున్నాను. అనేక సంవత్సరాలుగా నేను వార్తలను కవర్ చేస్తూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ వచ్చాను. హేతుబద్ధంగా ఉండే ప్రజాస్వామ్య దేశాల్లో లాగా తమ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడ్డానికి సుముఖత చూపని ప్రజలను కూడా కలిశాను. అది నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. కష్టకాలాల్లో హాస్యం, వ్యంగ్యం వికసిస్తూ ఉంటాయి. అయితే అనుమానం, భయం చోటుచేసుకున్నప్పుడు సృజనాత్మకతకు చెందిన రసావిష్కరణ పరవళ్లు తొక్కుతుంటుంది. గతంలో సోవియట్ పాలనపై వచ్చిన అత్యుత్తమ జోక్లు మాస్కోలోని వీధుల్లో, షాపుల్లో వినపడేవట. కానీ గుసగుసల రూపంలో మాత్రమే అని అదనంగా జోడిం చాలి. నిన్నటి గుసగుసలు నేటి వాట్సాప్ ఫార్వర్డ్లుగా మారుతున్న కాలమిది. వాట్సాప్లో వైరల్ అవుతున్న జోకులను ముందుగా ఎవరు కనిపెట్టారో తెలీదు కనుక, పేరు లేకుండా వాట్సాప్లో జోకులు పేల్చడం సురక్షితమైనది. ఈ సీజన్లో బాగా వ్యాప్తిలో ఉన్న అంశం భారతీయ ఆర్థిక వ్యవస్థ. తాజాగా 1.45 లక్షల కోట్ల పన్ను రాయితీతో కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యకు ప్రాధాన్యం లేదు. ప్రతిరోజూ నా ఇన్బాక్స్లో మోదీ ప్రభుత్వ ఉపద్రవపూరితమైన ఆర్థిక వ్యవస్థ గురించి అనేక జోకులు, మెమ్లు వచ్చి చేరుతుం టాయి. వీటిలో మహారాజు, ఆయన ప్రేమించే ఏనుగు గురించిన జోకులు ఎక్కువగా వ్యాప్తిలో ఉంటాయి. దురదష్టవశాత్తూ ఒకరోజు దానికి ప్రాణాంతక జబ్బు వచ్చింది. గుండె పగిలిన మహారాజు తన ఏనుగు చనిపోయింది అన్న వార్తను తన వద్దకు మొదటగా మోసుకొచ్చే వాడి తల నరికిస్తానని హుంకరించాడు. ఒక రోజు అనివార్యమైనదే సంభవించింది. కానీ మహారాజు చెవిన ఆ విషయం చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. చివరకు మావటీవాడు కాస్త ధైర్యం తెచ్చుకుని వణుకుతూ, ‘మహారాజు ఏనుగు ఏమీ ఆరగించలేదని, లేవడం లేదని, శ్వాస పీల్చడం లేదని, స్పందించడం లేద’ని చెప్పాడు. ‘అంటే నా ఏనుగు చనిపోయిందని చెబుతున్నావా’ అని మహారాజు ప్రశ్నించాడు. ‘ఆ విషయం మీరే చెప్పారు మహారాజా’ అని మావటి గజగజ వణుకుతూ చెప్పాడు. ఈ కథలోని ఏనుగువంటిదే ప్రస్తుత మన ఆర్థిక వ్యవస్థ. మన ఏనుగు బహుశా చచ్చిపోయి ఉంటుందని కేంద్ర ప్రభుత్వంలోని అనేకమంది మంత్రులు వివిధ మార్గాల్లో ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఏనుగు చచ్చిపోయింది అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించడానికి ఎవరూ పూనుకోవడం లేదు. మార్క్ ట్వైన్ మాటల్ని అరువు తెచ్చుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థ మరణం గురించిన వార్తలు మరీ అతిశయించిన రూపంలో ఉంటున్నాయి. కానీ అది చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతోందన్నది నిజం. గత జూన్ నుంచి మదుపుదారులకు చెందిన రూ.11 లక్షల కోట్ల మదుపులు ఆవిరైపోయాయి. ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రభుత్వ స్పందన మూడు రకాలుగా ఉంటోంది. ఒకటి, మోదీని ద్వేషించేవారు చేస్తున్న తప్పుడు ప్రచారమే దీనికి కారణం. రెండు, ఆర్థిక మంత్రి తాజా ప్రకటన మరింత విశిష్టమైంది. సరైన గేమ్ ప్లాన్ లేకుండా భారీగా కార్పొరేట్ పన్నురాయితీ కల్పించడం. హౌస్టన్ వీకెండ్లో ఇది పతాశ శీర్షిక అయింది. మార్కెట్లు కొన్నిరోజులపాటు పండగ చేసుకుంటాయి. కానీ ఈ రాయితీని చెల్లించడం కోసం ప్రభుత్వం తన సొంత ఖర్చులను కుదించుకోవడానికి తగిన సాహసం ప్రదర్శించకపోతే ఇది మరింత కరెన్సీని ముద్రించడం ద్వారా మార్కెట్లకు అందించడానికి లేక పేదలపై పరోక్ష పన్ను విధించడానికి మార్గం సుగమం చేసుకుంటుంది. ఇక మూడవదీ చాలా ముఖ్యమైనదీ ఏమిటంటే ఇవి మోదీ రెండో దఫా హయాంలో ప్రారంభ దినాలు మాత్రమే. రెండో దఫా పాలనలో 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కొన్నింటిని మోదీ పరిష్కరించారు. ట్రిపుల్ తలాక్తోపాటు ఏకీకృత సివిల్ కోడ్ వైపు తొలి అడుగు వేశారు. తర్వాత ఆర్టికల్ 370 రద్దు. ఇలాగే మరికొన్ని. బహుశా నవంబర్ మొదట్లోనే రామమందిరం నిర్మాణం ప్రారంభం కావచ్చు. తర్వాత అత్యంత కష్టమైనది, అత్యవసరమైనది వేచి చూస్తోంది. మోదీ ఆర్థిక వ్యవస్థ బాధ్యతలను నేరుగా చలాయించవచ్చు. తాను అలా చేయగలిగితే 2014 నాటికల్లా భారత్ను 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చడం కూడా అసాధ్యం కాదు. నా ఈ మాటలు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. మరొక దృక్పథం ఏమిటంటే, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు సమీపకాలంలో మెరుగుపడవన్నదే. అయితే 2018 మే నెలలో జాతిహితంలో నేను చెప్పినట్లుగానే తనకున్న భారీ ప్రజాదరణమీద మోదీ స్వారీ చేస్తుంటారు. ఆయన ఓటర్లు మాత్రం మోదీకోసం త్యాగాలు చేస్తుంటారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ గత నెల మాతో చేసిన సంభాషణలో అద్భుతరీతిలో దీన్ని వివరించారు. జాతీయవాదం పెచ్చరిల్లుతున్నప్పుడు ప్రజలు ఆర్థికరపరమైన త్యాగాలను ఆమోదిస్తారు అని అన్నారాయన. జాతీయవాదం మరీ పాతుకుపోతున్నప్పుడు, వెనుకంజ కూడా జాతిని ఐక్యం చేసే అంశంగా ఉంటుందని ఖట్టర్ విడమర్చిచెప్పారు. దీనికి సులభమైన ఉదాహరణ ఉంది కూడా. చంద్రయాన్ 2 హృదయాల్ని బద్దలు చేస్తూ విఫలమైన క్షణాల్లో కూడా యావద్దేశం ఆ రోజు రాత్రి 2 గంటలవరకు చంద్రయాన్–విక్రమ్ ల్యాండింగ్ను చూడటానికి మేల్కొని చూస్తూ ఉండటమే. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పుడు కూడా మోదీ ప్రజాదరణ ఆకాశాన్నంటుతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలోని హౌస్టన్లో ఆదివారం రాత్రి జరగనున్న ‘హౌడీ, మోదీ’ (ఎలా ఉన్నారు మోదీ) కార్యక్రమం కోసం జనం మానసిక స్థితిని గమనించండి చాలు. నరేంద్ర మోదీ ఉత్థానం సాంప్రదాయిక రాజకీయ విశ్లేషణలను పటాపంచలు చేసింది. పెద్దనోట్ల రద్దు దారుణ వైఫల్యాన్ని చవి చూస్తూ కూడా భారత్ తనను క్షమించేసింది. నిరుద్యోగం పరాకాష్టకు చేరుకుంది కానీ ఓటింగ్ పరంగా అది మోదీని దెబ్బతీయలేదు. ఎన్నికల సమయంలో నేను దేశ పర్యటనలో ఉన్నప్పుడు ఎంతోమంది సామాన్యులు, పేదలు పెద్దనోట్ల రద్దు వల్ల తామెంతగానో దెబ్బతిన్నామని కానీ దేశం కోసం మనం కొంతమేరకు వ్యక్తిగత త్యాగాలు చేయవలసి ఉంటుందని నేరుగా చెబుతుంటే దిగ్భ్రాంతి చెందాను. మోదీ పట్ల సామాన్యులు ఇదే అభిమానాన్ని కొనసాగించడం అసాధ్యం కాదు. ఇప్పటికే విజయవంతమైన ఎల్పీజీ, టాయిలెట్లు, గ్రామీణ గృహకల్పన, ముద్రా లోన్లు వంటి పథకాలతో పాటు ఇంటింటికీ కుళాయిల ద్వారా నీళ్లు, ఆయుష్మాన్ భారత్ వంటి కొత్త, స్మార్ట్ పథకాలను ప్రభుత్వం పతాక శీర్షికల్లో అద్బుతంగా ప్రచురింపజేస్తున్నంత కాలం మోదీకి జరిగే నష్టమేమీ ఉండదు. తన మొదటి విడత పాలనలో అభివృద్ధితో సంబంధం లేకుండా ఈ పథకాలన్నింటికీ ఆయన నిధులు అందించగలిగారు. ఎక్సయిజ్ పన్ను పెంపు ద్వారా లభించిన సుమారు రూ.11 లక్షల కోట్లతో ఇది సాధ్యమైంది. అభివృద్ధి లేకుండా అదనపు సంపదను సృష్టించడం ఇప్పుడు సాధ్యం కాదు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఈ రాజకీయ ఆర్థిక వ్యవస్థ నాశనం కాక తప్పదు. గతంలో విశేష జనాదరణ పొందిన నేత ఇందిరా గాంధీ. 1972 మొదట్లో బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఆమె ఓ వెలుగు వెలిగారు. ఆమె తప్పేమీ చేయలేదు. ఆమె తన కఠినమైన, వినాశకరమైన పద్ధతిలో వరుసగా ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారు. అదే పద్ధతిలో నిర్మాలా సీతారామన్ పన్ను 42.7 శాతానికి పెంచేశారు. దీంతో ఎంతో కొంత ఆదాయం వస్తుందని అందరికీ తెలుసు. కానీ పన్నుల రాబడి పడిపోయింది. ధనవంతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పేదలు ఆనందపడ్డారు. అప్పట్లో ఇందిర లాభపడినట్టే మనమూ లాభపడుతున్నాం. అదే ఇందిర 1969–73మధ్య ఏ తప్పూ చేయకపోయినా, 1974లో జాతీయం, జాతీయవాద చర్యలతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. సోవియట్ విధానాలతో స్ఫూర్తిపొందిన అనుయాయుల సలహాలతో ధాన్యం, గుడ్ల పరిశ్రమను కూడా జాతీయం చేయడం ద్వారా ఇందిర ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వెంటనే ఆమె తన తప్పును సరిదిద్దుకుంది. అదేవిధంగా మోదీ ప్రభుత్వం భయంతో రూ. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్నును రద్దు చేయడం తీవ్ర నష్టం కలిగిస్తుంది. బహుశా లక్షల్లో ఒకడిగా మోదీ ఈ చరిత్రను తిరగరాయొచ్చు. ఆయనకు అత్యంత సన్నిహితులైనవారు చెబుతున్నట్టుగా ఆర్థిక వ్యవస్థ పగ్గాలను చేబూని అద్భుతం చేయొచ్చు. అది జరగాలని మనం ఆశిద్దాం. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ Twitter@ShekarGupta -
ఫరూఖ్ నిర్బంధం తీవ్ర తప్పిదం
నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాను కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి ప్రజాభద్రతా చట్టం కింద నిర్బంధించడం మతిలేని చర్యే కాదు.. అది భారత రాజ్యాంగ, న్యాయ సంవిధానానికి మాయనిమచ్చగా మిగులుతుంది. జమ్మూ కశ్మీర్ నేతలను నిరంకుశ చట్టాలతో అడ్డుకుంటున్న కేంద్రం ఆ రాష్ట్రాన్ని తన అంతర్గత వలసగా మార్చుకునే దిశలోనే పయనిస్తోంది. మనుషులందరిలాగే, రాజకీయ నాయకులందరిలాగే ఫరూఖ్ అబ్దుల్లా పరిపూర్ణ వ్యక్తి కాకపోవచ్చు. కానీ అయన చేసిన తప్పులు, పాపాలకు మించి ఆయనను పాపాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. కశ్మీర్లో దేశపతాకాన్ని సమున్నతంగా నిలిపిన పార్టీలు రాజకీయ భూమికలో పాలు పంచుకోలేని స్థితిలో కశ్మీర్లోయ ప్రజలకు రాజకీయ నాయకత్వాన్ని అందించే కర్తవ్యాన్ని చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను ప్రజాభద్రతా చట్టం కింద కేంద్రప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవడం భారత రాజ్యాంగ, న్యాయ సంవిధానానికి మాయనిమచ్చగా మిగులుతుంది. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీనుంచి 81 సంవత్సరాల ఈ వయోవృద్ధుడిని గృహనిర్బంధంలో ఉంచారు. కానీ ఆయన ఎక్కడున్నదీ చెప్పాలంటూ తమిళనాడుకు చెందిన ఎమ్డీఎమ్కే అధినేత వైగో హెబియస్ కార్పస్ పిటిషనన్ తో సుప్రీం కోర్టు తలుపులు తట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫరూఖ్పై ప్రజాభద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న ఏ వ్యక్తినైనా 3 నెలల నుంచి రెండేళ్ల వరకు బెయిలు లేకుండా నిర్బంధించవచ్చు. ఈ చర్య ద్వారా కశ్మీర్ రాజకీయ ప్రతినిధులను పూర్తిగా తృణీకరిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా సంకేతాలు పంపినట్లయింది. కశ్మీర్ రాజకీయాల్లో పాలుపంచుకోనీయకుండా జమ్మూ కశ్మీర్ నాయకులను నిరంకుశ చట్టాలతో అడ్డుకుంటున్న కేంద్రం మునుపటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని తన అంతర్గత వలసగా మార్చుకునే వైపుగా పయనిస్తోందనే చెప్పాలి. దీనిపై కేంద్రం అనుమానాస్పద వైఖరిని సమర్థిస్తూ సుప్రీకోర్టు తన ఉజ్వల ప్రతిష్టను మరుగుపర్చుకుందనే చెప్పాలి. సోమవారమే మరొక అంశాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఎ. బాబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్తో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాన్ని గమనించాలి. ‘‘జాతి హితాన్ని, అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సాధారణ జీవితాన్ని పునరుద్ధరించడానికి కావలసిన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇవ్వాలి’’. అయితే జాతిహితం గురించి ఆందోళన ప్రకటిస్తూ, కశ్మీర్ రాష్ట్రంలో వ్యక్తిగత పర్యటనలు చేసుకోవడానికి హామీ ఇస్తున్నట్లు సినీ ఫక్కీ భంగిమలు ప్రదర్శించడానికి బదులుగా గౌరవనీయ న్యాయమూర్తులు న్యాయాన్ని ఎత్తిపట్టడం అనే తమ రాజ్యాంగ విధిని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జడ్జీల ఈ విద్యుక్త ధర్మం నేడు జమ్మూకశ్మీర్లో తీవ్రంగా అప్రతిష్ట పాలవుతూండటం గమనార్హం. ఆగస్టు 6న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు హాల్లో ప్రసంగిస్తూ, ఫరూఖ్ అబ్దుల్లాను అరెస్టు చేయడం కానీ, నిర్బం ధంలోకి తీసుకోవడం జరగలేదని ప్రకటించారు. పైగా, ఫరూఖ్ తన అభీష్టం ప్రకారం తన స్వగృహంలోనే ఉంటున్నారని షా పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి నేషనల్ కాన్ఫరెన్స్ పెద్దాయన ప్రజా భద్రతకే ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం కొత్తగా కనిపెట్టింది. ఆయనను నిర్బంధంలోకి తీసుకునేంత ప్రమాదం ఏం జరిగిందన్నది స్పష్టం కావడం లేదు. జమ్మూకశ్మీర్లో జరుగుతున్న వరుస పరిణామాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని అనుమతించకపోవడం భాగంగానే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారని స్పష్టంగా బోధపడుతోంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను జైల్లో పెట్టడం లేదు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయన స్వగృహంలోని సింగిల్ రూమ్లో ఆయన్ని నిర్బంధించినట్లు తెలుస్తోంది. మనుషులందరిలాగే, రాజకీయ నాయకులందరిలాగే ఫరూఖ్ అబ్దుల్లా పరిపూర్ణ వ్యక్తి కాకపోవచ్చు. కానీ అయన చేసిన తప్పులు, పాపాలకు మించి ఆయనను పాపాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. ప్రస్తుత పాలకులు చరిత్రను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు కాబట్టే 1980లలో కశ్మీర్ రాజకీయాలను అస్థిరపర్చడానికి దారితీసిన వరుస ఘటనలను అందరూ మర్చిపోయి ఉండవచ్చు. 1982లో షేక్ అబ్దుల్లా అస్తమయం తర్వాత, ఇందిరా గాంధీ తన విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్సు 1983 జూన్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఇందిర కోరుకున్నారు. కానీ అలా చేస్తే కశ్మీర్లో తన విశ్వసనీయత పూర్తిగా అడుగంటిపోతుందని స్పష్టంగా గ్రహించిన ఫరూఖ్ అబ్దుల్లా ఇందిర కోరికను గౌరవించకుండా మిర్వాయిజ్ ఫరూఖ్తో పొత్తు పెట్టుకున్నారు. వీరిద్దరి పొత్తు ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఫరూఖ్ 1983 అక్టోబర్లో శ్రీనగర్లో అఖిల భారత ప్రతిపక్ష సదస్సుకు పిలుపునివ్వడం ద్వారా తీవ్రమైన తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఫరూఖ్ చర్యతో ఆగ్రహించిన ఇందిరా గాంధీ అరుణ్ నెహ్రూ, ముఫ్తి మొహమ్మద్లను కూడగట్టి తిరుగుబాటు లేవదీశారు. నాటి జమ్మూకశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ సహకారంతో ఫరూఖ్ పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలై ఆయన బావమరిది జీఎమ్ షా 1984 జూలైలో సీఎం అయిపోయారు. మూడేళ్ల తర్వాత ఫరూఖ్ 1987లో కాంగ్రెస్తో పొత్తుకు అంగీకరించారు. ఆ ఎన్నికల్లో రిగ్గింగు పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో పాలన బాగా దెబ్బతినింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పరిస్థితిని కొలిక్కి తేవడంలో విఫలమయ్యాయి. దీంతో 1989 నాటి లోక్ సభ ఎన్నికలను కశ్మీర్ ఓటర్లు పూర్తిగా బాయ్కాట్ చేశారు. ఇది పాకిస్తాన్ కశ్మీర్ యువతను తిరుగుబాటుకు ప్రేరేపించింది. ఇదే 1989–90లో తీవ్రవాదం పెరగడానికి దారి తీసింది. చివరకు జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సాయుధ పోరాటం ప్రారంభించిన సమయంలోనూ ఫరూఖ్ తనమీద తాను జోకులేసుకుంటూ గడిపేశారు. ఈ నేపథ్యంలోనే జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ జేకెఎల్ఎఫ్ శక్తులు నాటి నూతన హోంమంత్రి ముఫ్తి మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబియ్యాను కిడ్నాప్ చేశారు. ఫరూఖ్ జేకేఎల్ఎఫ్తో చర్చలను వ్యతిరేకిస్తూనే.. రుబియ్యా విడుదలకై జేకేఎల్ఎఫ్పై ఒత్తిడి తేవడం కోసం ఆయన తన కాంటాక్టులను ఉపయోగించారు. చివరకు జేకేఎల్ఎఫ్ నేతలను విడుదల చేసే విషయమై నాటి కేంద్ర మంత్రులు అరుణ్ నెహ్రూ, ఐకే గుజ్రాల్, అరిఫి మొహమ్మద్ ఖా¯Œ తో ఒక కమిటీ ఏర్పాటుకు ఆదేశించడం ద్వారా ఫరూఖ్ తన ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ ఒకే ఒక చర్య ఆరోజు నుంచి కశ్మీర్లో అగ్నిజ్వాలలను రేపుతూనే ఉంది. దీని ఫలితంగా 1990 నుంచి 1996 దాకా ఫరూఖ్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఏవిధంగా చూసినా అది చర్చలను తుపాకీ ఆదేశించిన కాలం. కేంద్రప్రభుత్వం కశ్మీర్లో సాధారణ స్థితి నెలకొన్నదని చూపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. న్యూఢిల్లీలో హెచ్.డి. దేవేగౌడ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల తర్వాత కశ్మీర్కి గరిష్ట స్వయంప్రతిపత్తిని కల్పిస్తామని వాగ్దానం చేసిన తర్వాతే ఫరూఖ్ అబ్దుల్లా బెట్టు వీడి ఎన్నికల్లో పోటీ చేశాడు. 1996 సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఘనవిజయం సాధించింది. బహుశా, మోదీ ప్రభుత్వ కశ్మీర్ విధానంలో తీవ్రంగా ప్రశ్నించదగిన అంశం ఏదంటే, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు, వాటి నేతలను భారత చట్టాలనుంచి మినహాయించి మూక నిర్బంధంలోకి తీసుకోవాలని నిర్ణయించుకోవడమే. ఒక్కమాటలో చెప్పాలంటే కశ్మీర్లో రాజకీయ ప్రక్రియకు కేంద్రం పూర్తిగా తలుపులు మూసేశారు. సీపీఎం నేత నుంచి నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కేడర్లను, నాయకులను ఒక్కుమ్మడిగా నిర్బంధించడాన్ని ఈ అంశమే స్పష్టపరుస్తుంది. కశ్మీర్లో దేశపతాకాన్ని సమున్నతంగా నిలిపిన పార్టీలు రాజకీయ భూమికలో పాలు పంచుకోలేని స్థితిలో కశ్మీర్లోయ ప్రజలకు రాజకీయ నాయకత్వాన్ని అందించే కర్తవ్యాన్ని చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే కానీ మరొకరికి సాధ్యమా? కశ్మీర్ లోయను దేశ అంతర్గత వలసగా ట్రీట్ చేయకుండా కేంద్రం సయమనం వహిస్తే తప్ప ఇది సాధ్యంకాదు. కేంద్ర రాష్ట్రాలు రెండింట్లోనూ చట్టసభల ప్రాతినిధ్యం దేశ పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఇది మన ప్రజాస్వామ్య సౌధానికి గీటురాయి. భవిష్యత్తులో కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికయ్యేవారు ఈ మూడూ ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వారుగానే ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆ మార్గంలో ప్రస్తుతం ఆలోచిస్తోందా? మనోజ్ జోషి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
దక్షిణాది భాషలపై హిందీ పెత్తనం
దక్షిణ భారతదేశంపై హిందీ భాషను రుద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఇది భారత రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ఫెడరిలిజంపై గొడ్డలి వేటు వేయడమే. భారత రాజ్యాంగం దేశీయ భాషల అస్తిత్వానికిచ్చిన స్వేచ్ఛను భగ్నపరచడం తప్ప మరొకటి కాదు. దక్షిణాది భాషలన్నీ అతి ప్రాచీనమైనవి. భారతదేశానికి వలస వచ్చిన అనేక జాతుల భాషలను సంలీనం చేసుకొన్న భాషా జాతులు దక్షిణాది భాషలు. ఇతర దేశీయ దాడులకు ఉత్తర భారతం గురైనంతగా దక్షిణ భారతం గురికాలేదు. అందుకే ఇక్కడ భాషల్లోని మాతృస్వామికత, దేశీయతల పునాది చెక్కు చెదరలేదు. దక్షిణ భారత భాషలు ప్రపంచ భాషా చరిత్రలో అత్యున్నత ప్రాధాన్యం కలిగినవి. నిజానికి తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రవిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాడు మూల ద్రవిడ భాష నుండి ఈ భాషలు ఒకటొకటిగా స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెప్తున్నారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికి వెయ్యి యేండ్లు పట్టింది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగల మీద వుండటాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నాయి. తెలుగులో అతి ప్రాచీన జాతుల్లో సవరలు ఒకరు. వారి పాటలు ఆర్యులకు పూర్వం నాటివి. ఆ సవరుల భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నట్టు గిడుగు శ్రీరామమూర్తిగారు నిరూపించారు. అమిత్ షా ప్రకటనలో ఆర్.యస్.యస్. ఎజెండా వుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటూనే అంతా ‘రామ’ మయం చేయాలంటారు. దక్షిణ భారతదేశంలో సామాజిక సాంస్కృతిక, తాత్విక ఉద్యమాలన్నీ భాషా పునాదిగా పుట్టాయి. ఇప్పటికీ అధిక శాతం మంది నిరక్షరాస్యులుగా వుండి తమ భాషలోనే తమ జీవన క్రమాన్ని నడుపుకొంటున్నారు. చదువుకొనే వారికి, చదువుకోని వారికి ఆయా ప్రాంతీయభాషలే జీవ వాహికలుగా వున్నాయి. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకులు కాదు. కానీ, ఏ భాషనూ ప్రభుత్వం ప్రజ లపై రుద్దకూడదు. వారి వారి ఉత్సాహాన్ని బట్టి భాషను నేర్చుకొంటారు. అప్పుడే భాష వస్తుంది. భాష మెదడు మీద రుద్దితే వచ్చేది కాదు. అది నేర్చుకునే ఔత్సాహికత నుండే వస్తుంది. అంబేడ్కర్ ఈ సందర్భంగా ఫెడరల్ స్ట్రక్చర్ మనుగడ ఆయా దేశీయ భాషల్ని రక్షించి అభివృద్ధి చేయడం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. భాషా రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా పేర్కొన్నారు. ‘‘సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి రాష్ట్రాలు ఎక్కువగా సమతుల్యతలో ఉండడం అవసరమని నేను భావిస్తున్నాను. వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే అది అనుమానాల్ని, అసంతృప్తిని కలిగించడమే కాదు, ఫెడరల్ వ్యవస్థనే విచ్ఛిన్నం చేయగల శక్తులను సృష్టించడం దేశ ఐక్యతకే ప్రమాదకారి అవుతుంది. భాషల అంశం చాలా లోత్తైంది’’. నిజానికి కేంద్రం దక్షిణాది భాషల అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి వుంది. కానీ దేశీయ భాషలను సంస్కృతులను ప్రోత్సహించకుండా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది అత్యంత సంకుచిత రాజకీయం. దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం నుండి సరైన సహకారం లేదు. డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తికి షా ప్రకటన విరుద్ధం. దక్షిణ భారతీయులు అశోకుణ్ని, ఔరంగజేబుని నియంత్రించిన సమర్థులు. దక్షిణాది సంస్కృతులపై దాడి చేసి నిలిచిన వారు లేరు. ఈ సందర్భంగా దక్షిణ భారత ముఖ్యమంత్రులు, భాషావేత్తలు, ప్రజలు ఏకమై మహత్తర పోరాటాన్ని సాగించడం ద్వారా భారతీయ సమైక్యతను సముజ్వలతను కాపాడుకోవాల్సిన చారి త్రక సందర్భం ఇది. ఇది కేవలం హిందీ పేరుతో జరుగుతున్న పాలక వర్గపు రాజకీయ దాడి. అందుకే సామాజిక భాషా శక్తులే కాక రాజకీయ శక్తులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిన సందర్భం ఇది. దక్షిణ భారతీయులు పోరాటమే ఊపిరిగా తరతరాలుగా తమ అస్తిత్వాలను చాటుకొంటున్నారు. ఈ పోరాటంలో మనమూ భాగస్వాములు అవుదాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొబైల్ : 98497 41695 -
ఆర్థిక సంక్షోభానికి ముసుగేల?
దేశంలోని వాహనాల అమ్మకాల పతనానికి, నగర ప్రాంత యువత ఓలా, ఉబెర్ వంటి సంస్థల సేవల వైపు మొగ్గుచూపడమేననీ... వారు కార్లు కొని వాటికి నెలవారీ ఇన్ స్టాల్మెంట్లు కట్టడానికి ఆసక్తి చూపడంలేదనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. అంటే, దేశంలో ఎటువంటి ఆర్థిక దిగజారుడు, మాంద్య స్థితులు లేవని చెప్పేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ వాదన వాస్తవ పరిస్థితితో సరిపోలదు. దేశంలో కార్ల అమ్మకాలు (ఆగస్టు 2019లో 41.09% మేరకు) పతనం అవడానికి కారణం యువతరం వాటిని కొనకపోవడమే. మరి వాణిజ్య, రవాణా వాహనాల అమ్మకాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో, పతనం ఎందుకు జరిగినట్లు? కార్లకు లాగా ఈ వాణిజ్య, రవాణా వాహనాలకు ఓలా, ఉబెర్ల వంటి ప్రత్యామ్నాయాలు లేవన్నది గమనార్హం. మార్కెట్లో డిమాండ్ లేక కార్ల తయారీ కంపెనీ మారుతి సంస్థ లాగానే, వాణిజ్య రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ సంస్థ తన 5 ప్లాంట్లలో సెప్టెంబర్ నెలకుగాను, 5 నుంచి 18 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇక, గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక ఆరోగ్యానికి కొలబద్ధలైన ట్రాక్టర్లు, బైక్ల అమ్మకాల పతనం దేనికి సూచిక? వాటికి కూడా వాణిజ్య వాహనాలలో లాగానే ఇతర రవాణా ప్రత్యామ్నాయాలు లేవు. అలాగే, 2019లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 10% మేరన పెరుగుతాయని అంచనా. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో వారు సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకొంటున్నారన్నమాట. నిజానికి నేడు మార్కెట్లోని అన్ని రంగాలలోనూ, అన్ని రకాల వస్తువులు, సరుకుల అమ్మకాలలోనూ పతనం ఉంది. ఉదా‘‘కు, మిగతా వాటితో పోలిస్తే చాలా వేగంగా, కాస్త తక్కువ ధరకు అమ్ముడుపోయే అమ్మకాలు (బిస్కెట్లు, తల నూనెలు, సబ్బుల వంటివి) జరిపే హిందుస్తాన్ లీవర్ అమ్మకాలు 2018 ఏప్రిల్ జూ¯Œ లో 12% మేరన పెరగ్గా, 2019లో అదే కాలంలో అవి కేవలం 5% పెరిగాయి. అలాగే, అదే కాలానికి గానూ డాబర్ ఇండియా అమ్మకాల వృద్ధి 2018 లో 21% నుంచి, 2019లో 6%కి పడిపోయింది. అలాగే, అదే కాలానికి బ్రిటానియా సంస్థ అమ్మకాల వృద్ధి 2018లో 13% నుంచి 2019లో 6%కి దిగజారింది. నిజానికి ఆగస్టు, 2019 నాటి గోల్డ్మన్ శాక్స్ సంస్థ అంచనాల ప్రకారం, దేశంలో వినియోగ పతనం వాహన రంగంలో 17% మేర ఉండగా, దీర్ఘకాల వస్తువులు, ఇతర సరుకులు తదితరాల అమ్మకం 36% మేరన ఉంది. అంటే, వాహనాల అమ్మకాలలో కంటే దేశంలోని ఇతర అమ్మకాలలో పతనం మరింత అధికంగా ఉంది. ఇది ఆర్థిక మాంద్యస్థితి తాలూకు సూచికే! కాబట్టి ఓలా, ఉబెర్లు మాత్రమే యువజనులలో కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం కాదు. అంతకు మించిన కారణాలు మన ఆర్థిక రంగంలో ఉన్నాయి. నేడు ఆర్థిక మాంద్య స్థితి మన దేశంలో అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వాస్తవానికి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థితే. మన ప్రభుత్వ గణాంకాల ప్రకారమే భారతదేశంలో నిరుద్యోగం, నేడు 45 సం‘‘ల గరిష్ఠ స్థాయిలో ఉంది. ఈ కారణం చేతనే మన దేశంలో కూడా యువజనులు ఆర్థికంగా నిలదొక్కుకోలేని స్థితిలో పడిపోయారు. దేశీయంగా కార్ల అమ్మకాల పతనానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇక చివరిగా, నిన్నగాక మొన్న ‘మింట్ మిలీనియన్ సర్వే’ అధ్యయనం ప్రకారంగా, నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావిస్తోన్న నగర ప్రాంతాలలోని ‘మిలీనియల్స్’లో (కొత్తతరం యువజనులు) 80% మంది నిజానికి తమకు సొంత వాహనం కావాలనే కలను కంటున్నారు. నిజానికి, తమకంటూ సొంత వాహనం కావాలనే ఆకాంక్షలో యువజనులకూ, మధ్య వయస్సూ ఆ పైబడిన వారికీ ఎటువంటి తేడా లేదని ఈ సర్వే తేల్చింది. మరోవైపున ధనవంతుల బిడ్డలు కొనే లగ్జరీ బైక్ల డిమాండ్ 130% పెరిగింది. 2019 ఏప్రిల్ లోనే సాధారణ బైక్ల అమ్మకాలు 16% పడిపోయాయి. అంటే, ఇది కేవలం ఓలా, ఊబ ర్లు యువ జనుల కథే కాదు... ఈ దేశంలోని ధనిక పేద అంతరాల కథ.. ఒకవైపు ధనికుల ఇండియా... మరోవైపున వెలవెలబోతోన్న పేదల, మధ్య తరగతి భారతం కథ ఇది..! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
‘తుఫాను’ ముందు ప్రశాంతత
సైనిక పదఘట్టనలు, బోసిపోయిన పాఠశాలలు, కొనుగోళ్లు లేక డీలాపడిపోయిన పండ్ల షాపులు కశ్మీరులో సాధారణ స్థితి నెలకొంటోందని చెప్పే రుజువులు కానేకావు. ఆరువారాల క్రితం ప్రపంచం ఊహించని తీవ్ర చర్య తీసుకున్నాక, నేటివరకు కేంద్రప్రభుత్వం కశ్మీరులో దెబ్బతిన్న ప్రజల మనోభావాలను చల్లబర్చడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కశ్మీరీల పరాయీకరణ మరింత పెరగనుంది. వేర్పాటువాదులనుంచి ప్రధానస్రవంతి రాజకీయ పార్టీలను వేరు చేసి వారికి సముచిత గౌరవం కల్పించనంతవరకు కశ్మీర్లో ప్రశాంతత ఏర్పడదు. ముస్లిం కశ్మీర్పై ప్రస్తుతానికి విజయం సాధించానని కేంద్రం కలలు కంటున్నప్పటికీ ప్రస్తుత ‘ప్రశాంత వాతావరణం’ కశ్మీరీల ఆమోదానికి ఉదాహరణ అనుకుంటే మాత్రం అంతకుమించిన తప్పిదం మరొకటి ఉండదు. కశ్మీర్లో సాధారణ స్థితి నెలకొంటోందని భారత్ ప్రపంచానికి చూపించదల్చినట్లయితే, మూతపడిన షాపులు, బోసిపోయిన పాఠశాలలు, కొనుగోళ్లు లేక డీలాపడిపోయిన పండ్ల షాపులు.. మీకు మరొక కథను వినిపించవచ్చు. కశ్మీర్ గురించి తక్కిన భారతదేశంలో వినిపిస్తున్న ‘అంతా ప్రశాంతం’ తరహా వార్తలను దాటి చూస్తే శ్రీనగర్ నుంచి సోపియన్ వరకు దక్షిణ కశ్మీర్ మొత్తంగా ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా రోడ్లపై విసిరిన రాళ్లు.. సైనిక, పౌర వాహనాల కదలికను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా కూల్చివేసిన చెట్ల మొదళ్లు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, కనుచూపుమేర సైని కులే కనబడుతున్నారు. షాపులు, వ్యాపార సంస్థలు మూతపడి ఉన్నాయి. శుక్రవారం పూట బాగా రద్దీతో, అశాంతితో, నిరసనలతో కనిపించే రోడ్లు ఎంత నిర్మానుష్యంగా కనబడుతున్నాయంటే కశ్మీరులో ఉద్రిక్తత ఊహిస్తున్న దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు మన అనుభవంలోకి వస్తుంది. ఏదేమైనప్పటికీ 2019 ఆగస్టు 5 నుంచి కశ్మీరు హృదయాంతరాళాల్లో వైరుధ్యానికి సంబంధించిన నూతన అధ్యాయం ప్రారంభమైంది. కశ్మీరులో వివిధ భావజాలాలు, అభిప్రాయాలతో ఘర్షణ పడుతుండే ప్రజానీకాన్ని ఇప్పుడు ఒక సాధారణ భావోద్వేగం చుట్టుముట్టింది. అదేమిటంటే తాము విద్రోహానికి గురైన భావన. భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తోసిపారేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో ఢిల్లీ ప్రదర్శించిన దూకుడు వైఖరి కశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయ వర్గం ఉనికిని భంగపరుస్తూ తీవ్రంగా అవమానపర్చింది. మూడు దశాబ్దాల హింసాత్మక నేపథ్యంలో వీరు న్యూఢిల్లీకి, కశ్మీర్ వేర్పాటువాదులకు మధ్య తటస్థ శక్తిగా నిలిచి ఉండేవారు. స్వయం ప్రతిపత్తి లేక స్వయం పాలన అనే హామీపై తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటూ, ఆ ప్రాతిపదికనే పాకిస్తా¯Œ ను కాస్త దూరం పెడుతూ వచ్చిన ఈ ప్రాంతీయ పాలకవర్గం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటిస్తోంది. రాజకీయ వేర్పాటువాదంతో వ్యవహరించడంలో ప్రధాన స్రవంతి వైఫల్యానికి చెందిన ఉదాహరణలు కోకొల్లలు. వాజ్పేయి నుంచి మన్మోహన్ సింగ్ హయాం దాకా ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కానీ మోదీ ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరించిన వైఖరి నిరంకుశ స్వభావంతోనే కాకుండా ఒక్క రాయితో రెండు పిట్టల్ని చంపిన చందాన కనిపిస్తోంది. ఒకవైపు తమను ఢిల్లీ పూర్తిగా పక్కకు తోసిపారేయడం, మరోవైపున భారత్ ఉద్దేశాలను పసిగట్టడంలో అంధులుగా ఉండిపోయారంటూ తోటి కశ్మీరీ పౌరులు నిందిస్తూ ఉండటంతో కశ్మీర్ లోని భారత అనుకూల పాలకవర్గం పూర్తిగా అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సోపియన్ పట్టణంలో పన్నెండు మంది టాక్సీ డ్రైవర్ల ప్రతిస్పందనలు చూస్తే పెద్దగా తేడా కనిపించలేదు. వారిలో వయసు మళ్లినవారు కశ్మీర్ సెంటిమెంట్లను గౌరవించనందుకు, వేసవి సీజనులో పర్యాటక వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీసినందుకు కేంద్రప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. తన నిర్ణయంతో భారత్ తన కాలుమీద తానే కాల్చుకుంది అన్నది వీరి ఏకైక భావన. స్థానిక ఎమ్మల్యే తన అధినేత మెహబూబా ముఫ్తిలాగానే ముందస్తు నిర్బంధంలో ఉన్నారు. అలాగని తమ రాజకీయ నాయకత్వంపై ఇలాంటి సామాన్య జనానికి పెద్దగా ప్రేమ అంటూ లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీతో గతంలో అంటకాగిన దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని జనాభిప్రాయం. కశ్మీర్కు ప్రస్తుతం ఈ స్థితి తీసుకొచ్చినందుకు వీరే కారణమని అందరూ దూషిస్తున్నారు. అదేసమయంలో కేంద్రం తీసుకున్న దూకుడు చర్యతో కశ్మీరులో ప్రధానస్రవంతికి, వేర్పాటువాదులకు మధ్య అంతరం పూర్తిగా తొలిగిపోయింది. దీన్నే ఒక నిరసనకారుడు స్పష్టంగా చెప్పారు. ‘ఇది చివరి దెబ్బ. కశ్మీర్ కోసం పోరాటం అజాదీకోసం అంతిమ పోరాటంగా మారుతుంది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా మాకు ఇక ఇదే శరణ్యం’. ఇక సంవత్సరాల తరబడి కశ్మీర్, దాని వెలుపలి జైళ్లలోనూ మగ్గిపోయిన వేర్పాటు వాదులు, వారి వారసులు, సోదరులు, పిల్లలు భారతీయ చట్టాలను తామెన్నటికీ అంగీకరించలేమని ప్రకటిస్తున్నారు. ‘మా మతం పాకిస్తాన్ వైపే మొగ్గు చూపుతోంది. అందుకే వారు మాకు మద్దతిస్తున్నారు’ అంటూ జమాత్ ఇ ఇస్లామి కార్యకర్త, వారణాసి జైలులో ఉంటున్న ఉమర్ బషీర్ నైకో బంధువు తేల్చి చెప్పాడు. బహుశా కశ్మీర్ ప్రజానీకంలో బలపడుతూ వస్తున్న ఇలాంటి అభిప్రాయాలే మోదీ ప్రభుత్వాన్ని ప్రస్తుత దూకుడు చర్యకు సిద్ధపడేలా చేశాయన్నది వీరు గమనించకపోవచ్చు. పైగా కశ్మీర్ పండిట్లు 1989లో తీవ్రవాదం ప్రారంభమయ్యాక లోయ విడిచి వెళ్లారన్న చరిత్ర ఆ తర్వాత పుట్టిన కశ్మీర్ వాసులకు ఎవరికీ తెలీదు. ఇక శ్రీనగర్లోని సౌరా ప్రాంతంలో ఇదే సెంటిమెట్ రిపీట్ అయింది. ఆగ్రహోదగ్రులైన యువత భద్రతా బలగాలు ప్రవేశించకుండా కందకాలు తవ్వారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రాళ్లు, పెల్లెట్లు రువ్వుతుండటం కనిపిస్తుంది. సైనికులు పేలుస్తున్న పెల్లెట్లు తలకు తగిలి మంటపెడుతున్నా 22 ఏళ్ల యువకుడు ఆస్పత్రికి వెళ్లడానికి కూడా నిరాకరిస్తూ కనిపించాడు. తాను బయటకు వెళితే చాలు పోలీసులు లాక్కెళతారని. ప్రజా భద్రతా చట్టం కింద 2016లో తనను రెండుసార్లు అరెస్టు చేశారని తాను చెప్పాడు. అంతటా ఆవరించిన నిశ్శబ్ద వాతావరణంలో, నిర్మానుష్యమైన వీధుల్లో సౌరియా ప్రాంతంలో ప్రజాగ్రహం చిన్న తరహా సునామీని తలిపిస్తుంది. కాని అది తన హద్దులను దాటుకుని ముందుకు వెళుతుందా అన్నదే ప్రశ్న. ఇక సమీపంలోని అంకార్ మసీదు వద్ద 22 ఏళ్ల విద్యార్ది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వని పోస్టర్ కింద నిల్చుని ఉన్నాడు. ఈ విద్యార్థి అభిప్రాయంలో ఆర్టికల్ 370 రద్దు అర్థరహితమైన చర్య. మోదీ నేతృత్వంలోని భారత్ ముస్లిం లంటే లెక్కచేయడం లేదని ఢిల్లీ చర్యలు మరోసారి నిరూపించాయని, అందుకే కశ్మీర్కు స్వాతంత్య్రం ఇప్పుడు మరింత అవసరమని అతనంటాడు. వేర్పాటువాదులలో లేదా భారత అనుకూల కశ్మీరీలలో ఇప్పుడు విస్తృతంగా చలామణిలో ఉన్న అనుభూతి ఇదే. ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న అనూహ్య చర్య.. కశ్మీరులో ముస్లింల పాత్రను సామాజికంగా, రాజకీయంగా తగ్గించి హిందుత్వ ప్రాజెక్టును విస్తృతస్థాయిలో అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యమని మెజారిటీ కశ్మీరీలు భావిస్తున్నారు. ఈ చర్య తమ ఆత్మగౌరవంపై పెనుదాడేనని, తమకు ఆర్థిక సాధికారత కల్పిస్తామనే సాకుతో రాజకీయంగా తమ సాధికారతను పెకిలించేస్తున్నారని వీరి ఆరోపణ. మరి దానివల్ల కలిగే ఫలితాలను అనుభవించడానికి భారత్ సిద్ధంగా ఉందా అనేది ప్రశ్న. వాస్తవం ఏదంటే, తర్వాతేం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. సెప్టెంబర్ 27న ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేంతవరకు కశ్మీరులో హింసాత్మక ప్రదర్సనలు జరగకుండా, పౌరులకు గాయాలు తగలకుండా జాగ్రత్తపడాలని భద్రతా దళాలకు గట్టి ఆదేశాలు ఇచ్చారు. కశ్మీరులో కమ్యూనికేషన్లను పునరుద్ధరించాలని, రాజకీయనేతలను విడుదల చేయాలని, మానవహక్కులను కాపాడాలని అంతర్జాతీయంగా భారత్కు వ్యతిరేకంగా గళాలు విప్పుతున్న నేపథ్యంలో తనను తాను గొప్ప ప్రజాస్వామ్యవాదిగా భావిస్తూ అందరూ తనను గౌరవించాలని కోరుకుం టున్న ప్రధాని మోదీకి కశ్మీర్లో నెలకొనే ప్రతి హింసాత్మక ప్రదర్శనా.. ఎంతోకొంత చెడ్డ పేరును కొనితెస్తుదని తెలుసు. అందుకే సైన్యం అతి చర్యలకు పాల్పడకుండా నియంత్రిస్తూనే భద్రతా కారణాల రీత్యా మొబైల్ కమ్యూనికేషన్ల పునరుద్ధరణను కేంద్రం తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ ఒత్తిడుల కారణంగా త్వరలోనే కమ్యూనికేషన్లను పునరుద్ధరించవచ్చు కానీ ప్రధాన స్రవంతి నేతలను విడుదల చేయడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఆరువారాల క్రితం ప్రపంచం ఊహించని తీవ్ర చర్య తీసుకున్నాక, నేటివరకు కేంద్రప్రభుత్వం కశ్మీరులో దెబ్బతిన్న ప్రజల మనోభావాలను చల్లబర్చడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కశ్మీరీల పరాయీకరణ మరింత పెరగనుంది. వేర్పాటువాదులనుంచి ప్రధానస్రవంతి రాజకీయ పార్టీలను వేరు చేసి వారికి సముచిత గౌరవం కల్పించనంతవరకు కశ్మీర్లో ప్రశాంతత ఏర్పడదు. ముస్లిం కశ్మీర్పై ప్రస్తుతానికి విజయం సాధిం చానని కేంద్రం కలలు కంటున్నప్పటికీ ప్రస్తుత ‘ప్రశాంత వాతావరణం’ కశ్మీరీల ఆమోదానికి ఉదాహరణ అనుకుంటే మాత్రం అంతకుమించిన తప్పిదం మరొకటి ఉండదు. మాయా మీర్చందాని వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, అశోకా యూనివర్సిటీ -
పల్నాడులో బాబు ఫ్యాక్షనిజం
‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తీరు గ్రామాల్లో మరింత ఘర్షణ వాతావరణం పెంచేందుకు పనికొస్తుంది గానీ దానివల్ల ఉప యోగం ఉండదు. 10 వేల మందితో ఆత్మ కూరు (పల్నాడు) వెళ్లి ఒక గ్రామంలో రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తే దానివల్ల ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంటుంది. చలో ఆత్మకూరు కార్య క్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందుగానే బాబు వ్యూహరచన చేసుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే వెంటనే దీక్షకు దిగాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని ముందే వ్యూహం సిద్ధం చేశారు. లోకల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు విపరీత ప్రచారం వచ్చేలా జాగ్రత్త తీసుకున్నారు... ప్రసార మాధ్యమాలను ఆకట్టుకుని ఒక కృత్రిమ ఉద్రిక్తతను సృష్టించు కోవడంలో బాబు విజయవంతమయ్యారు’’ – సీనియర్ పాత్రికేయులు సీహెచ్ఎంవీ కృష్ణారావు విమర్శ ఈ వార్త చెవిని పడిన 24 గంటల్లోనే నాటి సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ప్రజాసంబంధాల ప్రధాన అధికారిగా (సీపీఆర్ఓ) పనిచేసిన డాక్టర్ విజయకుమార్ నుంచి మరో పిడుగు లాంటి వార్త దూసుకొచ్చింది. ‘‘2014లో చంద్రబాబు అధికారానికొచ్చినా, నాడు వైఎస్ జగన్ మీలాగా విమర్శలు చేశారా? చివరికి 23 మంది వైసీపీ శాసనసభ్యుల్ని కొంటే నాడు ప్రతిపక్షనాయకుడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు సరికదా, తన పాదయాత్రలో ఆ 23 మంది శాసనసభ్యుల నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా వాళ్లని పేరు పెట్టి విమర్శించలేదు. కానీ వైఎస్ జగన్ను ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీతో ఎన్నుకున్న తర్వాత గత మూడునెలల వ్యవధిలోనే చంద్రబాబు తన విజ్ఞతను కోల్పోయారు. ఈ దూకుడు తగ్గించి సైకిల్కు రిపేర్లు చూసుకోండి’’ అని విజయకుమార్ సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఇలా సీనియర్ పాత్రికేయులు కృష్ణారావు వెలిబుచ్చిన ఆవే దనకు, విజయకుమార్ మాజీ సీఎం పీఆర్ఓగా ప్రకటించిన అసమ్మతి పత్రానికీ మరోవిధంగా లోతైన అర్థం చెప్పాలంటే చంద్ర బాబు ‘చలో ఆత్మకూరు’ ప్రయోగం ‘పల్నాటి వీరచరిత్ర’కు సంబం ధంలేని ఫ్యాక్షనిస్టు (కుట్రదారు) ప్రయోగం! చంద్రబాబు ప్రయోగం ఫ్యాక్షనిజమో కాదో తేల్చుకోవాలంటే మరొక సోషల్ మీడియా వార్త (14–09–2019) వెల్లడించిన విశేషాలతో కూడా పోల్చుకోవచ్చు. ఆ వార్త ప్రకారం వాస్తవాలను ‘తరకటబురకట’ (మేనేజ్) చేయగల నేర్పుతో తెలుగు మీడియానే కాదు జాతీయ స్థాయి ప్రసార మాధ్య మాల్ని కూడా ‘కట్టిపడవేయగల’ నేర్పరి చంద్రబాబు కాబట్టి, చలో ఆత్మకూరు నినాదంతో చేసిన హడావుడితో నేషనల్ మీడియా కూడా బాబు కోసం గొలుసులు తెంచుకుని అదే రోజున పనిచేసింద’ని ఆ వార్త వెల్లడించింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న కాలంనుంచీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా జాతీయ మీడియాలో కొంత భాగాన్ని రకరకాల ప్రలోభాలకు అవినీతికి బాబు అలవాటు చేస్తూ వచ్చిన దుష్ట సంప్ర దాయం సమకాలీన పాత్రికేయులకు తెలియని రహస్యం కాదు! బాబు ఇటీవల పల్నాడులోని ఆత్మకూరును పునాదిగా చేసుకుని రాష్ట్రంలో ఒక సెక్షన్ ప్రసార మాధ్యమాలకు తోడు జాతీయ మీడి యాలోని ఒక భాగాన్ని కూడా ప్రలోభపెట్టి కార్పొరేట్ రంగంలోని కొందరు దిగ్గజాలు, వారి కంపెనీలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీకి పెట్టుబడులు రాకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేయ డాన్ని కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలు బహిర్గతం చేయవలసి వచ్చింది. ఒక్క ఆత్మకూరులోనే కాదు, రాష్ట్రంలోనే వివిధ రూపాల్లో ఫ్యాక్షనిజా నికి తనదైన శైలిలో పాదులు తీస్తూ వచ్చిన చంద్రబాబు ఈ నెల 13–14 తేదీల్లో ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడటానికి కారకుడయ్యారంటే ఆశ్చర్యపోనక్కరలేదు. పైగా విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడుల కోసం కుదు ర్చుకున్న ఒప్పందాలను జగన్ ముఖ్యమంత్రిత్వం లోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరగతోడవలసి వచ్చినందుకు ఈ కొన్ని పత్రి కలు తమ సంపాదకీయాల్లో ఆయుధాలు ఎక్కుపెట్టిన మాటా వాస్త వమే. పారదర్శకత ప్రశ్నార్థకంగా మారిన ఈ విద్యుత్ ఒప్పందాల వల్ల, ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్ల మూలంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, తద్వారా విద్యుత్ వినియోగదార్లపైన భారీగా భారం పడుతు న్నందున– ఆ ఒప్పందాలను తిరగదోడవలసి వస్తోందన్నది దాగని సత్యం. అందువల్ల ఈ అనర్థపు ఒప్పందాల్ని పునఃసమీక్షించుకోవా లన్న నిర్ణయాన్ని కూడా విమర్శిస్తూ కొందరు ‘జాతీయ జర్నలిస్టులు’ ఖండించటం కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటానికా, ప్రజా ప్రయోజనాలను రక్షించడానికా అనేది అర్థం కావటం లేదు. గత బాబు పాలనలో ప్రలోభాలకు లోను అయినందువల్లనే కొన్ని స్థానిక, జాతీయ స్థాయి పత్రికలు, కొందరు జర్నలిస్టులు దిగజారిపోవలసి వచ్చింది. ఇందుకు పక్కా ఉదాహరణగా– మన రాష్ట్రంలోని కొన్ని తైనాతీ దినపత్రికలు, కాదు కాదు.. జాతీయ స్థాయి అగ్రేసర పాత్రికేయుడైన ఎ.ఎన్. సాహనీ మాటల్లో చెప్పాలంటే కొన్ని ‘ఉంపుడు పత్రికలు’ (కెప్ట్ ప్రెస్), ఆ జాతీయస్థాయి పత్రికలు ప్రలో భాల మత్తులో జగన్ ప్రభుత్వంపై నెగెటివ్గా రాసిన సంపాదకీ యాల్ని ఉటంకించి ఉండేవీ కావు, వాటి ఆధారంగా ఆ మరుసటి రోజున కథనాలు అల్లి ఉండేవీ కాదు. పైగా ఆ ఆంగ్ల పత్రికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్పొరేట్ రంగ ప్రయోజనాలకు వత్తా సుగా వచ్చిన సంపాదకీయాలను తెలుగులోకి అనువదించి ఆ ‘పచ్చ’ మీడియా (15వ తేదీ) ప్రచురించి ఉండేదీ కాదు. కారణం– నేషనల్ మీడియాను సాకింది వారే కనుక. ఈ చిచ్చులో అంతర్భాగమే బాబు వర్గం నడిపిన సొంత దొంగ బాధితుల లేదా ‘అద్దె’ బాధితుల శిబిరం, ‘గరుడ శివాజీ’ నుంచి మొదలుపెట్టి ఆత్మకూరులో ‘అద్దె ఆర్టిస్టుల’ శిబిరం దాకా దేకుతూ వచ్చింది. బయటి వారిని శిబిరంలో కూర్చోబెట్టడం కోసం ముద రాగా రూ. 10 వేలు ఇస్తామని ఆశ చూపి మరీ శిబిరానికి చేర్చారని ఆ ‘బిర్యానీ బాధితులే’ స్వయంగా పత్రికల వారి ముందు ‘వాంగ్మూ లమివ్వ’డం బాబు దాచలేని ‘చలో ఆత్మకూరు’ రహ స్యంగా.. సోషల్ మీడియా కోడై కూసింది. ఇందుకు పిడుగురాళ్లవాసి నరసింహారావు, పిన్నెల్లి గ్రామవాసి కొమ్ము ఏసుబాబుల ప్రకటనలే సాక్ష్యం. చివరికి ఎక్కవలసిన బస్సు మిస్సయిన ప్రయాణీకుల్ని సహితం వదలకుండా లాక్కొచ్చి శిబిరంలో కూర్చోబెట్టారంటే బాబు వర్గీయులు ఎంతకైనా తెగించగలరని అర్థమవుతుంది. నిజానికి 12వ శతాబ్ది నాటి పల్నాటి యుద్ధం కూడా బలిసిన రెండు వర్గాల మధ్య రాజ్య విస్తరణ కోసం ‘కోడిపందేల’ చాటున జరిగిన కుమ్ములాటల ఫలితమే. ఎందుకంటే ఆనాటి అసలు పోరంతా రెండు మతాల మధ్య సాగిన ఘర్షణల పర్య వసానమే. శైవ, వైష్ణవ మత తగాదాల మధ్య వైష్ణవ మతావలంబిగా బ్రహ్మనాయుడికీ, శైవ మతావలంబిగా నాగమ్మకు మధ్య జరి గిన సాయుధ సంఘర్షణకు నోరులేని కోళ్లను ‘పందాల’ రూపంలో బలితీసుకున్నారు. ఆ మాటకొస్తే ‘ఉరుమురిమి మంగళంమీద పడిన’ చందంగా హేతువాద దీపిక శిఖగా వర్ధిల్లుతూ వచ్చిన సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన బౌద్ధ ధర్మం వినాశనానికి పల్నాటి యుద్ధ కాలంలోనే శైవ–వైష్ణవాలు కత్తులు దూశాయని మరవరాదు. ఈ యుద్ధంలోనే బడుగు, బలహీన బహుజనాలు ఆబోతుల ఘర్షణ మధ్య లేగదూడలు నలిగి నశించినట్టు, పల్నాటి యుద్ధంలో కూడా నేలకొరిగిన అసంఖ్యాకులు దళిత జాతులు, అమాయకులేనని మర చిపోరాదు. నాడే కాదు, నేడు కూడా పల్నాడులోని మాచెర్ల, గుర జాల, కారెంపూడి ఉత్సవాలు పేరుకు వీరుల ఉత్సవాలుగా జరుపు కొంటూ వస్తున్నా కుల, మత, వర్గ, వర్ణ సంఘర్షణల్లో దఫదఫాలుగా నేలకొరుగుతున్నవారు బడుగు, బలహీన, బహుజన వర్గాలేనన్నది అదే పల్నాటిలోని ఆత్మకూరు ఉదంతాలు కూడా నిరూపిస్తున్నాయి. నాడు రాజ్య విస్తరణ కోసం దళిత బహుజనాల్ని (గోసంగుల్ని) రాచ రికంతో యుద్ధాల్లోకి దించారు. శైవ, వైష్ణవ తగాదాల మధ్య బౌద్ధారా మాలు, చైత్యాలు ధ్వంసమైనప్పుడూ నలిగి నుగ్గయిపోయిన వాళ్లలో దళితులూ బహుళ సంఖ్యలో ఉన్నారని చరిత్రకారుల అభిప్రాయం. కానీ, చరిత్ర పాఠాలు పిల్లలకు బోధించకూడదని ఒకనాడు శాసించిన చంద్రబాబు ఈ పల్నాటి చరిత్రనుంచి గ్రహించవలసిన మంచి పాఠాన్ని కూడా మరిచిపోయి మరో రూపంలో ‘చలో ఆత్మ కూరు’ పేరిట పల్నాటి యుద్ధాన్ని గుర్తుకు తెస్తున్నారు. తాను చేయ బోయే వక్ర విన్యాసాలకు జీవితాంతం ఇప్పటిదాకా ఆయన నిర్వాకం చేస్తున్నది– చరిత్ర వక్రీకరణ మాత్రమే. బాలచంద్రుడు ఇష్టపడిన శ్యామాంగి (సుబ్బాయి) ఒక దళిత బిడ్డ. కానీ ఆమె తల్లి అంటుంది– ‘అయ్యా బాలచంద్రా! మేము సరిసమానులతో చెలిమి చేయగలం. కానీ అలవికాని సంపన్నులతో మాకు పొత్తు మంచిదికాదు. తగిన వాడు మాకు దొరికితే చేనుకి కాపుగా ఉన్నట్టు, చెప్పినట్టు వింటాడు. ముక్కుకు తగిన ముత్యం అందమైనట్టు ఎవరికి తగినవాడే వారికి అందం. నాయనా, బాలచంద్రా కలవారి పొందు కడదాకా ఉండదు’ అన్న ఆ తల్లి మాటల వెనుక అర్థాన్ని తెలుసు కోగలిగిన వారికి.. నేటి ఆత్మకూరులో భూములు, పనులు సంపన్నుల దాష్టీకాల మధ్య కోల్పోయి, ‘పొట్ట’ చేతబట్టుకుని ఇతర ప్రాంతాలకు రక్షణ కోసం ఉరుకులు, పరుగులు పెట్టవలసి రావటం ఎలాంటి ప్రజాస్వామ్యమో చంద్రబాబు, ఆయన వర్గీయులు చెప్పగలగాలి. ప్రసార మాధ్యమా లను ఆయన తన స్వార్థంకొద్దీ ఇన్నేళ్లూ ఎంతగా భ్రష్టుపట్టిస్తూ వచ్చిందీ గతంలో ‘డైలీ టెలిగ్రాఫ్’ (కలకత్తా) దినపత్రిక, ‘బ్లిట్జ్’ (బొంబాయి) వారపత్రిక ప్రలోభాలకు లోనైన జర్నలిస్టుల పేర్లతో సహా బహిర్గతం చేసిన సంగతిని అప్పుడే బాబు మరిచిపోయారా? ఇకనైనా కదిలించకండి అజ్ఞాత జ్ఞాపకాల తుట్టిని. కాలం కలిసి రాన ప్పుడు కార్పొరేట్ శక్తులు సహితం తనతో కలిసిరారు!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నేటికీ జరుపుకోలేకపోవడంతో నాటి తెలంగాణ పోరాట యోధుల ఆత్మలు ఇంకా ఘోషిస్తూనే ఉన్నాయి. నాటి భారత హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యంగా చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తోనే ప్రజలకు స్వతంత్రం లభించింది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నుంచి నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గడం, మైనార్టీల ఓట్ల కోసం పాట్లు కారణం కావచ్చు.. హిందూ మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం పాలనను ఎంతో గొప్ప పరిపాలనగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న భూభాగాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా తెలంగాణలో ఇప్పటికీ నిర్వహించకపోవటం బాధాకరం. తెలంగాణ సాయుధ పోరాట విరమణకు సంబంధించి నాటి కమ్యూనిస్టు ఉద్యమ నేతల మధ్య విభేదాలు ఉండటం కూడా గమనార్హం. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి గోల్కొండ కోట కింద నీ గోరి కడతాం నైజాం సర్కరోడా’ అంటూ నినదించిన నాటి తెలంగాణ పోరాట యోధుల ఆత్మలు ఇంకా ఘోషిస్తూనే ఉన్నాయి. కారణం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేకపోవడమే. ఉద్యమాల గడ్డ తెలంగాణ ఆది నుంచి తన విశిష్టతలను చాటుకుంటోంది. భారతదేశానికి ఆగస్టు 15 1947న స్వాతం త్య్రం వస్తే తర్వాత 13 నెలల 2 రోజులకు అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ స్వేచ్ఛ పొందింది. నిరంకుశ నిజాం నవాబు పాలన నుంచి పూర్తిగా విముక్తమైంది. నాటి భారత హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యంగా చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తోనే ప్రజలకు స్వతంత్రం లభిం చింది. అయితే ఉమ్మడి రాష్ట్ర పాలకులే దుర్బుద్ధితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు. కారణం నిజాం రజాకార్ల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గడమే. హైదరాబాద్ సంస్థానంలో హిందువులను, హిందూ మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం పాలనను ఎంతో గొప్ప పరిపాలనగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారంటే మైనార్టీల ఓట్ల కోసమేనని విడమరిచి చెప్పనవసరం లేదు. రజాకార్ల హింస అమానుషం నిజాం పాలన నుంచి విముక్తి కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు ఎంతోమంది బలిదానాలు చేయవలసి వచ్చింది. రాక్షసత్వానికి మారు పేరు అయిన రజాకార్లు, నిజాం అధికారులు హిందూ మహిళల చేత నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. పన్నులు కట్టలేని నిరుపేద రైతులను మండుటెండలలో వంగోపెట్టి గుండెలపై బండలు ఎత్తిం చారు. సలసల కాగే నూనెలో చేతులు పెట్టించారు. బహిరంగంగా ఉరి తీసేవారు. ఆడపిల్లలను ఎత్తుకు పోయి అత్యాచారాలు చేసేవారు. ఇంకా ఎన్నో దురాగతాలకు పాల్పడేవారు. జైళ్లలో ఉద్య మకారులకు విషం ఇచ్చి చంపేవారు. వీరి దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పరకాలలో వంద మందిని చెట్టుకఅు కట్టేసి కాల్చి చంపేశారు. బీబీ నగర్లో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు చిన్న పిల్లలను సైతం కర్కశత్వంగా నరికేసి ఆ ఊరిపై పడి బీభత్సాన్ని సృష్టించారు. ‘ఉరులమర్రి’ చెబుతున్న సాక్ష్యం రజాకార్లను మూడుసార్లు పారిపోయేలా చేసిన జైరాంపల్లి వాసులు 92 మందిని, కూటిగాట్లలో 25 మంది ఉద్యమకారులను, ఏరుపాలెంలో 70 మందిని, పెరుమాండ్ల సంకేసలో 21 మంది రైతులను, ఈ విధంగా రజాకార్ల ఆకృత్యాలను ఎదురించిన నల్గొండ జిల్లాలో మొత్తం 2,000 మందికి పైగా రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. షోలాపూర్ సమీపంలోని మంగోలు గ్రామంలో 43 మందిని స్త్రీ పురుషులను చెట్లకు కట్టేసి తుపాకీ మడమలతో చచ్చేంతవరకు కొడుతూ పైశాచికానందాన్ని పొందారంటే నిజాం పాలన ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్లో స్త్రీలను వాళ్ళ భర్తలు, పిల్లలు చూస్తుం డగానే చెరిచారు. పంజాగుట్టలో తల్లి కూతుళ్లను కూడా బలాత్కరించారు. నిర్మల్లో వందలాది మందిని మర్రి చెట్టు కొమ్మలకు బహిరంగంగా ఉరి తీశారు. దీనితో ఆ మర్రి చెట్టుకు ‘ఉరుల మర్రి’గా పేరొచ్చింది. కొడకండ్లలో బ్రాహ్మణులను చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడ దీసి కింద మంటపెట్టి సజీవ దహనం చేయటం కేసీఆర్ మెచ్చుకున్న నిజాం పాలనలో రాక్షసత్వానికి కొన్ని మచ్చు తునకలు. దాదాపుగా తెలంగాణ పల్లెల్లో ఇదే దుస్థితి. బలవంతపు మత మార్పిడులు హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణలో మత మార్పిడుల కోసం స్థాపించిన అంజుమన్–2 –తిజ్లిక్–ఎ–ఇస్లాం కాలక్రమంలో మజ్లిస్ ఇథెహాదుల్ ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) అయింది. ముస్లిం ఎక్తేదార్ అంటే ముస్లిం ఆధిక్యత అని సంస్థ నినాదం. ఎంతో మంది హిందువులపై హత్యాచారాలు చేసి, ప్రలోభాలకు గురిచేసి, మరికొంతమందిని బలవంతంగా ముస్లింలుగా మార్చింది ఈ రాక్షస మూక. ఈ దౌర్జన్యాలను రాష్రీ్టయ స్వయం సేవక్ సంఘ్ (ఆరె స్సెస్), ఆర్య సమాజ్తో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా ప్రతిఘటించాయి. రజాకార్ల దౌర్జన్యాలను అడ్డుకునేందుకు దొడ్డి కొమురయ్య, కొమరం బీం, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్, చాకలి ఐలమ్మలాంటి ఉద్యమకారులు ఎందరో ప్రయత్నించి అసువులు బాశారు. కమ్యూనిస్టుల ‘తప్పు’టడుగులు! భారతదేశంలో మొదటినుంచి కమ్యూనిస్టులు చిత్ర విచిత్రమైన విధానాలనే అనుసరిస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన 1948 సెప్టెంబర్ 17 వరకు కొనసాగడానికి వారు కూడా కారణమే. బ్రిటిష్ పాలకులు దేశం నుంచి వెళ్లిపోతూ నెహ్రు నేతృత్వంలోని ప్రభుత్వానికి అధికారాలు అప్పగించారు. దీనితో బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్ధించాలంటూ భారత కమ్యూనిస్టులను కోరడంతో ఒక్కసారిగా వారికి నెహ్రూ గొప్ప కమ్యూనిస్టుగా కనిపించారు. అయితే 1947లో ఉక్రెయి¯Œ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం నిరాకరించేసరికి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ పాలసీ మారి పోయింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నిటిని వ్యతిరేకించాలని తీర్మానించారు. అప్పటినుంచి మిలిటెంట్ కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. నెహ్రూ కూడా వారికి సామ్రాజ్యవాద శక్తుల తొత్తుగా కన్పించారు. దీనితో నెహ్రు ప్రభుత్వాన్ని కూలదోయాలని భారత కమ్యూనిస్టులు తీర్మానించారు. భారత సైన్యంపై గుడ్డి వ్యతిరేకత నిజాం రాజ్యంలో కూడా కమ్యూనిస్టులు నిజాంకు అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ నేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు హైదరాబాద్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘భారత ప్రభుత్వం బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వం. అది బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో లంకె వేసుకుంది. కాబట్టి హైదరాబాద్ సంస్థానంలో భారత సైన్యాల ప్రవేశాన్ని వ్యతిరేకించాలి. హైదరాబాద్ను భారతదేశంలో కలిపి వేసుకునే అన్ని ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలి’ ఇది ఆ ప్రకటన సారాంశం. అంతేకాదు స్వతంత్ర హైదరాబాద్ ఏర్పడాలి అని కూడా నినదిం చారు. దీనితో నిజాంకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. స్వతంత్ర హైదరాబాద్కు మద్దతిచ్చేవారు లేక చతికిలపడ్డ నిజాంకు కమ్యూనిస్టులు మిత్రులుగా మారారు. అంతకుముందు ఇదే నిజాం చేతిలో ఎన్నో ఇబ్బందులు పడ్డ కమ్యూనిస్టుల వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. భారత ప్రభుత్వంతో పోరాడేందుకు నిజాం నుంచి వారికి ఆయుధాలు కూడా అందాయి అంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. నేతల విభేదాల్లో దాగిన చరిత్ర హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం విజయం సాధించినా కమ్యూనిస్టుల అరాచకాలు ఆగలేదు. భారత దేశానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు’ అనే పుస్తకంలో పుచ్చలపల్లి సుందరయ్య కేవలం తెలంగాణ రైతాంగం సాధించుకున్న భూముల పరిరక్షణ కోసమే.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసిన తరువాత కూడా, సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అనుకున్నారని పేర్కొన్నారు. అయితే పార్టీకి చెందిన రావి నారాయణరెడ్డి ‘పోలీస్ చర్యకు కొంతమేరకు భూస్వామ్య వ్యతిరేక స్వభావం కూడా ఉంది. తర్వాత ఏర్పడిన సైనిక పాలకులు రాష్ట్రంలోని జాగీర్దార్ విధానాన్ని రద్దు చేశారు. అభ్యుదయకరమైన ఒక కౌలుదారీ చట్టాన్ని రూపొం దించటం వలన పై అంశం రుజువు అవుతుంది’ అని ‘వీర తెలంగాణ –నా అనుభవాలు, జ్ఞాపకాలు’ పుట 70లో విశ్లేషించారు. ఆయన తన ‘తెలంగాణ నగ్నస్వరూపం’ అనే డాక్యుమెంట్లో నిర్మొహమాటంగా ‘చారిత్రక నేరం.. ఆంధ్ర నాయకత్వం బాధ్యులుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ.. పోలీస్ చర్య తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికీ, మిలటరీకీ వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగిం చడం పెద్ద నేరం. ఈ నేరం హిమాలయ పర్వతం లాంటిదని అంటే తప్పేం కాదు’ అని పేర్కొన్నారు అంటే ఆనాడు భారత కమ్యూని స్టులు చేసిన తప్పుడు నిర్ణయాలు ఎలా ఉండేవో తెలుస్తుంది. హైదరాబాద్ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న భూభాగాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా తెలంగాణలో ఇప్పటికీ నిర్వహించకపోవటం బాధాకరం. జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోం శాఖ సహాయమంత్రి -
జానపదులు అమాయకుల్లా కనబడే సర్వజ్ఞులు
రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ వచ్చినప్పుడు మొదటిసారి చంద్రశేఖర కంబారను కలిసాను. అప్పుడాయన– ‘మీ ప్రాంతంలో ఆసాదులనేవాళ్ళుంటారు. వాళ్ళు జాతర సమయంలో అగ్రవర్ణాలవాళ్ళను బండబూతులు తిడతారు. అయినా వాళ్ళని ఎవరూ ఏమీ అనరు. మీకు వాళ్ళ గురించి తెలుసా? ‘అనడం’ వాళ్ళ కుసంస్కారంగానీ ‘పడటం’ వీళ్ళ సహనశీలత్వంగానీ కాదని తెలుసా?’ అని అడిగారు. ముష్టూరు గంగ జాతర గురించి అడిగిన మొట్టమొదటి సాహితీవేత్త కంబార. ఆయనకి జనపదాలంటే ప్రాణం. లేకపోతే ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దులనించీ బెంగుళూరు వచ్చిన ఆయనకి, చిత్తూరు మారుమూల గ్రామాల్లో జరిగే గంగజాతర గురించి తెలిసే అవకాశం లేదు. కథ, కవనం, కావ్యం, కథనం, నవల, నాటకం ఏదైనా సరే, మౌఖిక సంప్రదాయంలో సాగుతోందీ అంటే అది చంద్రశేఖర కంబార రాసిందని ఇట్టే గుర్తు పట్టేయచ్చు. ఆయన వాక్యం ఆయన చింతన, భావనల అభివ్యక్తి మాత్రమే కాదు. అది ఆయన మనతో ప్రత్యక్షంగా జరిపే సంభాషణ. ఆయన వ్యక్తీకరణలు గతంతో, పెద్దరికంతో, మార్మికతతో, మానవాతీత నిగూఢత్వంతో, వ్యవస్థ కట్టుకున్న మడి పంచెలను పదే పదే చీల్చుకువచ్చే ఆది లైంగికతతోబాటు, జాగృదావస్థను దాటి మనోలోకాల పొడుపులు–విడుపులతోబాటు జాతీయాలు, సామెతల ఆమెతలతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వారిదో విస్మయలోకం. అందులోకి ప్రవేశమేగానీ నిర్గమనం ఉండదు. అందుకే భారతీయ సాహిత్యం వారిని జ్ఞానపీఠంతో పురస్కరించుకుంది. ఇటీవల డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మారక పురస్కారాన్ని అందుకునేందుకు హైదరాబాద్ వచ్చిన కంబారతో చిత్తూరు మాండలికంలో రాసే పశ్చిమ గోదావరి జానపదుడు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి జరిపిన సంభాషణ. జానపదులకీ నాగరీకులకీ తేడా ఏమిటి? ఏ దేశంవారైనా, ఏ మతంవారైనా నాగరీకులంతా పాప ప్రక్షాళన కోసమే దైవాన్ని రూపించుకుంటారు. జానపదులు అలా కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలంగా మానవ జన్మ లభించిందని భావిస్తారు. వారికి పాపం గురించి మాత్రమే తెలుసు–వీరికి పుణ్యం గురించి మాత్రమే తెలుసు. వారిలో అతిశయం ఉంటుంది – వీరిలో కృతజ్ఞత ఉంటుంది. అది లొంగదీయడంలో స్వాతంత్య్రం కోరుతుంది– ఇది వినయంతోనే స్వతంత్రంగా ఉంటుంది. వారు మేధావుల్లా వర్తించే అమాయకులు– వీరు అమాయకుల్లా కనపడే సర్వజ్ఞులు. ప్లేటో ‘రిపబ్లిక్’లాగా, సర్ థామస్ మోర్ ‘యుటోపియా’లాగా మీ ‘శివాపురం’ కూడా ఒక కాల్పనిక ఆదర్శ జనపదం. దీని ప్రత్యేకతలేమిటి? శివాపురానికి కాలిబాట తప్ప మరో దారిలేదు. ఊళ్ళోని వీధులేవీ ఊరు దాటి వెళ్ళవు. శివాపురం పక్కనే ప్రవహించే వాగులో కవిసమయపు కమలాలు వికసించవు. ఆ నీళ్ళలో ఈదడానికి హంసలు రావు. ఊరినిండా మనుషులుంటారు. బింబాలే కాదు, ప్రతిబింబాలూ ఉంటాయి. అవికూడా తమవంతు పాత్రని ఏమారకుండా నిర్వహిస్తూంటాయి. మనం పొగొట్టుకున్నవీ, పోగొట్టుకుంటున్నవీ, పోగొట్టుకోకూడనివీ అన్నీ ఉంటాయి. ఆ కథలు వింటూ రాసిందే నా సాహిత్యం. కథలంటే గుర్తొచ్చింది, ఈ ఆధునిక కాలంలో నగరీకరణం పెరిగిపోతోంది. కథలు చెప్పడం– వినడం తగ్గిపోతోంది. ఎవరెంత నగరీకృతులైనా పుట్టుకతో వచ్చిన వారి భాష (చంపితే తప్ప) చచ్చిపోదు. జానపదులు కొత్తవారితో కలిసినప్పుడు కొత్త పదాల్ని చేర్చుకుంటూ కొత్త భాషని సృష్టించుకుంటారు. కానీ నాగరీకులు పలురకాల ఆకర్షణలతో జానపదుల్ని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ఆకర్షణలకి లొంగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమెరికా వెళ్ళడానికే పుట్టామన్న భ్రమల్లో పడకుండా చూసుకోవాలి. ఎంతమందొచ్చినా ఇంకొంతమందికి చోటివ్వడానికి అదేమీ పుష్పక విమానం కాదు. అది కూడా మనూరిలాంటిదే. భారతీయ గ్రామాలన్నీ వాటి స్వభావాల్ని కోల్పోతున్నాయి. ముందుముందు మీవంటి జానపద సాహిత్యకారులు పుట్టే అవకాశాలు ఉండవేమో అనిపిస్తోంది. ఈనాటి గ్రామాలు అప్పట్లా లేవు. పిల్లలకి కథలు చెప్పడాన్ని పనికిమాలిన పనిగా భావిస్తున్నాం. కానీ తను విన్న కథని వేరొకరికి చెప్పేటప్పుడు పిల్లవాడు తనకి తెలియకుండా తన తెలివితేటల్ని ఉపయోగించి మనం చెప్పని విషయాల్ని కూడా జోడిస్తాడు. అదే సృజన. లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకోలేనివాడు కొత్త పరికల్పనలు చెయ్యలేడు. అవి చెయ్యలేనివాడు కొత్త విషయాల్ని కనిపెట్టలేడు. అందుకే పిల్లలకు కథలు చెప్పాలి, వాళ్ళని కథలు చెప్పనివ్వాలి. తెలుగులో బాలసాహిత్యం రానురానూ తగ్గిపోతోంది. కన్నడంలో ఎలా ఉంది? ఎక్కడి పిల్లలు అక్కడి మట్టిలో ఆడాలి, పాడాలి, అల్లరి చెయ్యాలి. ఆ మట్టి విలువ తెలిస్తే అమ్మ విలువా అమ్మ చెప్పే కథల విలువా తెలుస్తుంది. కానీ మనం వాళ్ళని పుస్తకాలు, కంప్యూటర్, టీవీలకి కట్టేస్తున్నాం. మూడూ నిర్జీవమైనవే. ఇవి పిల్లలు కోరుకున్నవి కాదు. మనం వారికి బలవంతంగా అంటగడుతున్నవి. కృత్రిమ మేధస్సు సమీకరించుకుంటున్న వాళ్ళకి మన జానపద కథలు చెబితే ‘చిలక మాట్లాడిందంటే నమ్మచ్చుగానీ కాకి మాట్లాడ్డమేంటి? కాకమ్మ కథలు చెప్పకు’ అంటూ కథలు వినే ఆసక్తిని పోగొట్టుకుంటాడు. అమ్మ కథలు విననిచోట రాసేవాళ్ళు మాత్రం ఎందుకుంటారు? అందుకే మా కన్నడ బాలసాహిత్యం పరిస్థితి మీ కంటే భిన్నంగా ఏమీ లేదు. జానపదం మీలోని సృజనశీల సాహిత్య రచనకి ఏ విధంగా దోహద పడింది? జానపదం లేకుండా నేను లేను. అది నాకు పరాయిదని అనుకోలేను. నన్ను సమష్టిగా రూపొందించి, సమష్టిలో భాగంగా చూసే కళ్ళిచ్చిందే జానపదం. ఒక బయలాట (వీధి నాటకం లాంటిది) ఉండేది. పేరు ‘అరణ్యకుమారుడి కథ’. అందులో ఒక రాక్షసుడుంటాడు. అతను రాకుమారి దగ్గరకి రాజు వేషంలో వెళ్తూంటాడు. ఆమెతో స్వర్గ సుఖాలనుభవిస్తూంటాడు. ఒకరు మరొకరి వేషంలో స్వేచ్ఛగా తిరుగుతూ యథేచ్ఛగా ప్రవర్తించే ఈ కల్పన నన్ను వెంటాడుతూ ఉండేది. ఒక విధంగా ఇది నా రచనా వ్యాసంగంలో ప్రతిఫలించి రచనల్ని రూపించిన కథ. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం క్రూరంగా ఉండేది. వాళ్ళంటే మాకు భయభక్తులు మాత్రమే ఉండేవి. కానీ, వారి జాత్యహంకారం పట్ల లోపల్లోపల ఒకవిధమైన ఆకర్షణ ఉండేది. వాళ్ళు మాత్రమే స్నానానికి సబ్బులు వాడేవాళ్ళు. వాళ్లు చూడకుండా ఆ సబ్బుల్ని స్పర్శించి ఆనందించేవాళ్ళం. అదే సమయంలో ఎక్కడో బెళగాంలో మార్చ్ ఫాస్ట్ జరుగుతుంటే ఆ బ్యాండు మోతకి ఇక్కడ మా కాళ్ళు వణికేవి. ఆ అమాయకత్వం, ఆ స్వచ్ఛత, అక్కడి భాషలోని మాధుర్యం, భావ ప్రకటనలోని సౌందర్యం, అన్నీ కలిసి నన్నూ నా రచనల్నీ రూపొందించాయి. మీరు మాట్లాడే భాషలాగే మీ సాహిత్య భాషకూడా మాండలికమే. మీరా జానపదుల భాషనే ఎందుకు ఉపయోగిస్తారు? జానపదుల భాషలో అభివ్యక్తి సామర్థ్యం ఎక్కువ. వారి మాటల్లో ధ్వని తరంగాలు నాదమయమై వెలువడతాయి. నాగరికుల భాషలో సంస్కారం ఎక్కువ. వారి మాటలు కూడా వారి ప్రవర్తనలాగే హెచ్చుతగ్గులు లేకుండా ఎలాంటి స్వారస్యం లేకుండా పత్రికా భాషలాగా ఉంటాయి. జానపదుల భాషలోనూ జీవనంలోనూ దాపరికం ఉండదు. మావైపు జానపద కళలు క్రమంగా తమ వైభవాన్ని కోల్పోయి అవసానదశకు చేరుకున్నాయి. మీవైపు పరిస్థితి? విజయనగర సామ్రాజ్య కాలంలో విజయ దశమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మైసూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాలానికి అనుగుణమైన మార్పుల్ని తమలో ఇముడ్చుకుంటున్నాయి. కేవలం మైసూరు సంస్థానానికే పరిమితమైన ఈ ఉత్సవాలని నాడ హబ్బ(రాష్ట్రీయ పర్వదినం)గా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఫలితంగా ఈ ఉత్సవం అన్ని ప్రాంతాలకూ విస్తరించడం, స్థానిక కళలకు ప్రోత్సాహం లభించేలా చెయ్యడం ప్రజాస్వామిక ప్రభుత్వం సాధించిన క్రియాశీల ప్రగతిగా పేర్కొనవచ్చు. జనపదాల్ని కలుషితం చేయడంలో ప్రధానపాత్ర వహిస్తున్నది ఏమిటి? జనపదాల్ని మాత్రమే కాదు, అన్నిరకాల మౌలిక విలువల్నీ కలుషితం చేస్తున్నది మన విద్యావిధానంలోని తారతమ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవాళ్ళకి ఆత్మన్యూనతాభావం, లక్షలు పోసి ప్రభుత్వేతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకి అహంకారం వద్దన్నా పెరుగుతాయి. అందుకే ఒకటి నుండి పదవ తరగతి వరకూ శిక్షణా బాధ్యతని పూర్తిగా ప్రభుత్వమే వహించాలి. బడిలో కాలు పెట్టకముందే తారతమ్యం చూపించే చదువు ఏ సమాజానికైనా ఆరోగ్యకరమైన భవిష్యత్తునెలా ఇవ్వగలదు? కన్నడంలో జాతీయ బహుమతి పొందిన మొదటి చలనచిత్రగీతం మీ ‘కాడుకుదురె ఓడి బందిత్తా’ కూడా జానపదమే. కన్నడ చలన చిత్ర రచయితగా, సంగీతజ్ఞుడిగా, దర్శకుడిగా చిత్రసీమ సిగలో మీరు అలంకరించిన నెమలీకలు ఎన్నో ఉన్నాయి. నేటి చలన చిత్ర పరిశ్రమ గురించి మీ అభిప్రాయం? నమ్మకం విషయంలో విన్నది లేదా చదివినదానికంటే చూసిందానికే ప్రాధాన్యత–ప్రభావం ఎక్కువ. ఈ నమ్మకాన్ని దృశ్య మాధ్యమాలకు చెందిన ఇరవై నాలుగు కళాసాంకేతిక వర్గాలూ కలిసి శక్తివంచన లేకుండా వమ్ము చేస్తున్నాయి. వెండితెర, బుల్లితెర జీవితానికి అద్దం పట్టాలి. వాటిలో జనం తమని తాము చూసుకోవాలి. అద్దంలో అందం, వికారం రెండూ కనిపిస్తాయి. కానీ భ్రమలు కనిపించవు. దురదృష్టవశాత్తూ దృశ్యమాధ్యమాలన్నీ భ్రమల్ని మాత్రమే చూపిస్తూండటం వల్ల ప్రస్తుత పరిస్థితి ఎదురైంది. మిమ్మల్ని వెంటాడిన రచయితలెవరు? కన్నడంలో అల్లమ ప్రభు. ఇంగ్లీష్లో డబ్ల్యూ.బి.ఈట్స్. మీరు రాసినవాటిలో మీకు బాగా నచ్చిన రచన ఏది? రచయితకి తను రాసినవాటిల్లో ఏదైనా ఒక రచన అన్ని విధాలా నచ్చిందీ అంటే తనింక రాయడు. ఏ రచనైనా పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇచ్చిందీ అంటే అతని దగ్గర రాయడానికి ఏమీ మిగలదు. నా రచనల్లో ఏదీ నన్ను సంతుష్టుడిని చెయ్యలేదు. అందుకే నేను రాస్తూనే ఉన్నాను. రాయకపోతే నేనుండను. -
స్వాతంత్య్ర ఫలాల్లోనూ వెనుకబాటు
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం. స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత వంటివన్నీ స్వాతంత్య్రంతో సాకారం అవుతాయనుకున్నారు. భారతదేశంలో సామాన్యుడికి అవసరమైన విద్య, వైద్య, ఉద్యోగాలు, వనరులపై సాధికారత సాధ్యమవుతుందనుకున్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ నిర్మాణంతో మన హక్కులు పరిరక్షింప బడతాయనుకున్నారు. కానీ నేటి భారతదేశ సమకాలీన ఆరి్థక రాజకీయ సామాజిక వాతావరణంలో భారత స్వాతంత్య్ర మూల సిద్ధాంతం విస్మరించబడి ధనికులు ఇంకా ధనికులుగా మారుతుంటే, పేదవారు దుర్భర పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు. నేడు ప్రపంచపటంలో అఖండంగా వెలిగిపోతున్న భారతావని, సాంకేతిక ఎదుగుదలతో అద్భుతాలను సృష్టిస్తూ అంతరిక్షంలో చంద్రయాన్ లాంటి వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇంకోపక్క బాలలపై హత్యాచారాలు, బలహీనులపై బల వంతుల దోపిడీ, పీడన, సమాన హక్కులు సాకారమవ్వకపోవడం, ఆదివాసులపై, దళితులపై దాడులు, రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, జల వివాదాలు, దిగజారుతున్న విద్యా, వైద్య ప్రమాణాలు స్వతంత్ర భారతావనిని తీవ్రంగా బాధిస్తూనే వున్నాయి. భారత రాజ్యాంగంలో భారతీయుడిగా పేర్కొన్న ప్రతి మనిíÙకి ఒకే ఓటు, ఒకే విలువ,సమానత్వం అనేవి స్వతంత్ర భారతావనిలో చాలా ఉన్నతమైన అవకాశాలు.. భారతదేశం ముందు ఎన్నడూ ఎరుగని ఒక మహోన్నత అవకాశం ఈ సామాజిక సమానత్వం ద్వారా భారత పౌరులకు సిద్ధించాయి. కానీ స్వాతంత్య్రానంతరం పాత సంస్థానాధీశులు, రాజులు, రాజ ఉద్యోగులు, అడ్వకేట్లు, విద్యావంతులు సింహభాగం పొందుతూ రావడం జరిగింది. తదనంతరం బడుగు బలహీన అణగారిన వర్గాలకు విద్య, పరిపాలన, రాజకీయ వ్యవస్థలలో సమాన నిష్పత్తిలో అవకాశాలు లేనందున వారి కోసం పూలే, అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, రామ్ మనోహర్ లోహియా మండల్ వంటివారు కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని 18 రాష్ట్రాల నుండి బీసీల నుండి ఒక లోక్ సభ సభ్యుడు కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 12 వందలకు పైగా బీసీ కులాలు ఇప్పటికీ సంచార జాతులుగా జనాభా లెక్కలకు దూరంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా బతుకుతున్నారు. ప్రజలకు విద్య, వైద్యం రాజ్యాంగబద్ధంగా ఉచితంగా ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ ఇది ఆచరణలో మాత్రం ఇప్పటికీ అంతంతమాత్రంగానే వుంది. దేశ జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు పార్లమెంటులో 14 శాతం కూడా వాటా రాలేదు. దేశంలో 2600 బీసీ కులాలు ఉండగా 2550 బీసీ కులాలు పార్లమెంటు గేటు దాటలేదు.. దేశంలోని 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుండి బీసీ కులానికి చెందిన పార్లమెంటు సభ్యులు కూడా లేరు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలలో 10% ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్లో బీసీలకు లేదు. దేశంలో ప్రస్తుత ప్రభుత్వంలో 545 పార్ల మెంటు స్థానాలకు కేవలం 96మంది సభ్యులు మాత్రమే బీసీలు వున్నారు. ప్రజాస్వామ్య వ్యవ స్థలో కొన్ని వర్గాలు అధికారం చేజిక్కించుకోవడానికి ధనబలాన్ని, అంగబలాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ సందర్భంలో దేశ ప్రజల మధ్య వ్యత్యాసాలు తగ్గి ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వచి్చనప్పుడే అన్ని వర్గాల మధ్య అంతరాలు తగ్గి భారత స్వతంత్ర అభీష్టం సిద్ధిస్తుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం ఒక ఉత్సవంగా జరుపుకొని సెలవుగా ప్రకటించినంత మాత్రాన మన బాధ్యత తీరదు. స్వాతంత్య్రం ద్వారా మనకు సిద్ధించిన ఫలాలను అనుభవిస్తూ, బాధ్యతలు నిర్వహిస్తూ, విధి విధానాలను పాటిస్తూ కులం, మతం, వర్గం, లింగం అన్ని అంశాలను సమాన ప్రతిపత్తిలో ఆదరించినప్పుడే స్వాతంత్య్రానికి అసలైన గౌరవం. వ్యాసకర్త జాతీయ బీసీ అధికార ప్రతినిధి, కన్వీనర్, బడుగు బలహీనవర్గాల రాజకీయ ఐక్య వేదిక ‘ 91773 58286 -
స్వరం మారిన స్వాతంత్య్రం
మన స్వాతంత్య్ర సమరయోధులనుంచి ఆధునిక భారత నిర్మాతల వరకు దేశభక్తికి నిర్వచనం ఒక్కటే.. అదే ప్రేమభావన. న్యాయకాంక్షను వ్యక్తీకరించే ప్రేమభావంతోటే బంకించంద్ చటోపాధ్యాయ సుజలాం సుఫలాం అంటూ ఈ నేల గురించి పారవశ్యంతో పాడుకున్నారు. ఠాగూర్ ‘జయహే జయహే’ అంటూ దేశాలాపన చేశారు. మహమ్మద్ ఇక్బాల్ ‘సారే జహాసే అచ్చా’ అంటూ దేశ ప్రేమకు విశ్వజనీన నిర్వచనం ఇచ్చారు. లక్షలాదిమంది స్వాతంత్య్ర సమరయోధులు చివరి శ్వాస వరకు దేశంపట్ల ప్రేమతత్వంతోనే జ్వలించారు. మనిషి పట్ల ప్రేమ, నేలపై ప్రేమ, దేశమాతపై ప్రేమ, తమ స్వాతంత్య్రంపై ప్రేమ.. ఇదే మన సమరయోధుల జ్ఞాపకాలకు శాశ్వతత్వం కలిగించింది. ఏడు దశాబ్దాల స్వాతంత్యం తర్వాత దేశం పట్ల ప్రేమ, దేశభక్తి తమ నిర్వచనం మార్చుకున్నాయేమో.. ప్రేమ స్థానంలో ద్వేషం, విభజనతత్వం రాజ్యమేలుతున్నాయేమో! ఇవన్నీ ఈ స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంలో అవలోకించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేడు భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభదినం. భారతదేశ చరిత్రలో మరచిపోలేని, మరపురాని చారిత్రక క్షణాలకు అద్దం పట్టే రోజిది. బ్రిటిష్ నిరంకుశ రాజరికపు పదఘట్టనలలో దాదాపు రెండు శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు, సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం భారతీయ ఉపఖండం స్వాతంత్య్రం పొందిన దినం ఆగస్టు 15. స్వాతంత్యం సిద్ధించిన తర్వాతే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామికంగా అవతరించిందన్నది వాస్తవం. శ్వేత జాత్యహంకారం ఈ నేలమీద నివసించే ప్రజ లను నల్లకుక్కలుగా ముద్రించి శ్వాస పీల్చడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ దుర్భర పాలననుంచి అష్టకష్టాలు పడి సిద్ధింపజేసుకున్న స్వాతంత్య్రం మనది. అహింసా పోరాటాలు, హింసాత్మక పోరాటాలు, జాతీయ విప్లవోద్యమాలు ముప్పేటగా తలపడిన అనంతరం మాత్రమే పరాయి పాలన నుంచి మనం స్వతంత్ర వాయువులను పీల్చుకోగలిగాం. ఈ దేశం కోసం నిండు మనస్సుతో తపనపడిన లక్షలాది స్వాతంత్య్ర పోరాట వీరుల, వీరనారుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం. వారి చిరకాల స్వప్నాలు సాకారమైన క్షణం నుంచే, వారి ప్రాణ త్యాగాలు ఫలించిన క్షణం నుంచే మనం స్వతంత్ర భారతీయులమయ్యాం. జాతీయవాదం, దేశభక్తి రెండు జోడెద్దుల్లా దేశ పునర్నిర్మాణానికి నాంది పలికిన రోజు 1947 ఆగస్టు 15. ఈ ఆగస్టు 15కి ఎన్నడూ లేని ప్రత్యేకత ఉంది. భారతదేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని ప్రజానీకం కోరుకుంటున్న ఒక భూభాగాన్ని పూర్తి స్థాయిలో దేశంలో విలీనం చేసుకున్న ఘట్టాన్ని మనం నేడు చూస్తున్నాం. ఒక మాజీ సంస్థాన రాజ్యమైన జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తికి చెందిన చివరి అవశేషాలను భారత ప్రభుత్వం అత్యంత సాహసికంగా తొలగించి దాయాది దేశాన్ని సవాలు చేసిన ఉత్కంఠ భరితక్షణాల్లో మనం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గాయపడిన కశ్మీరీ ప్రజల హృదయాలకు ఎలా సాంత్వన పలకగలం అనే దానిపై ఆధారపడే ఇకపై భవిష్యత్ భారత ముఖచిత్రం రూపొందనుంది. అదే సమయంలో దేశ పునర్నిర్మాణానికి నాందిపలికిన జాతీయవాదం, దేశభక్తి భావనలే తీవ్ర చర్చనీయాంశాలుగా మారి దేశానికి దేశమే రెండుగా చీలిపోయిన విపరిణామాలకు కూడా ఈ 73వ స్వాతంత్య్ర దినోత్సవ ఘట్టం అద్దం పడుతోంది. గత ఏడు దశాబ్దాలుగా దేశం వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు పొందటం వాస్తవం. అదే సమయంలో దేశప్రజలకు ఓటు వేసే స్వాతంత్య్రం తప్ప నిజమైన స్వాతంత్య్రం ఇంకా సిద్ధించలేదనే వాదనలు కూడా బలం సంతరించుకోవడమన్నదీ వాస్తవమే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రానికి, నిజమైన స్వాతంత్య్రానికి మధ్యగల తేడాను కొత్తగా నిర్వచించుకోవలసిన క్షణం కూడా వచ్చేసింది. అందుకు చరిత్ర మూలాలు తడమటం తప్పనిసరి. బ్రిటిష్ ఏలుబడిలోని భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ఏర్పడిన భారత సమాఖ్యలో చేరింది మొదలుకుని భారతీయ సంస్థానాల అధికారాలు, సంస్థానాధిపతుల హక్కులు తగ్గుముఖం పట్టే ప్రక్రియ ప్రారంభమైంది. తమ సొంత ఆస్తులు, బిరుదులు, సౌకర్యాలను మాత్రమే తమ వద్ద ఉంచుకునే స్వాతంత్య్రం సంస్థానాధిపతుల అనుభవం లోకివచ్చింది. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా సంస్థానాధీశులు వీటిని పొందుతూ వచ్చారు కానీ 1970లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యాంగ సవరణ ద్వారా సంస్థానాధిపతుల ప్రత్యేక స్వాతంత్రం ఉనికిలో లేకుండా పోయింది. బ్రిటిష్ ప్రభుత్వ హయాం నుంచి స్వతంత్ర భారత ప్రభుత్వం వరకు సంస్థానాధీశులు పొందుతూ వచ్చిన రాజభరణాలు ఒక్క కలంపోటుతో రద్దయ్యాయి. ఈ క్రమంలో పాత భూస్వామ్య సంస్థానాధీశులు రూపం మార్చుకుని కొత్త ప్రభువులుగా అధికార పార్టీల్లో, అధికార స్థానాల్లో బలం పుంజు కున్నారు తప్పితే అప్పుడూ ఇప్పుడూ సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. వ్యవస్థ మారకుండానే దాన్ని వారసత్వంగా పొందే అవకాశం కులీనులకు, భూస్వామ్య ప్రభువులకు అయాచితంగా వరించింది. ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారత ప్రజాస్వామ్యం భూస్వామ్య అవశేషాల ప్రతిరూపంగానే ఉంటోంది. ప్రజలందరికీ ఓటు వేసే స్వాతంత్య్రం మాత్రమే టెక్నాలజీ ప్రభావంతో దక్కింది కానీ నిజమైన రాజకీయ స్వాతంత్రం ఇప్పటికీ విస్తృత ప్రజానీకానికి అందుబాటులో లేదు. మనకంటే చాలా ఆలస్యంగా బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందగలిగిన కెనడా (1982), ఆస్ట్రేలియా (1986), న్యూజిలాండ్ (1986) దేశాలు ఆర్థికాభివృద్ధిలో, పౌరుల సామాజిక, వ్యక్తిగత స్వాతంత్య్రాల విషయంలో ఎంతో ముందంజ వేయగా 1947లోనే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారత దేశంలో సమాజం కానీ, ప్రజలు కాని ఆ దేశాల కంటే ఎంతో తక్కువ స్థాయిలో స్వేచ్ఛను అనుభవిస్తూండటం గమనార్హం. ఒక దేశ పటం కానీ, జాతీయ జెండా కానీ ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే ప్రజల నిజమైన స్వాతంత్య్రాన్ని స్ఫురింపజేయలేవు. ఇక ఓటుహక్కును కలిగి ఉండటం మాత్రమే స్వాతంత్య్రం కాదు. జాతీయ పటం, జాతీయ జెండా, సార్వత్రిక ఓటు అనేవి సుందరమైన భావనలు మాత్రమే. ఏ హక్కులూ లేనిచోట ఓటుహక్కునైనా కలిగి ఉండటం చాలా మంచిదే కావచ్చు కానీ డబ్బు, కండబలం లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమైపోయిన చోట ప్రజల ఓటుహక్కు దాని నిజమైన అర్థంలో ప్రాభవాన్ని కలిగి ఉన్నట్లు కాదు. మన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చాలామంది మాజీ లేక ప్రస్తుత భూస్వామ్య దొరలే కావడం పరమవాస్తవం. ఉన్నావ్ బాధితురాలిపై అత్యాచారం కేసులో ఆరోపణలకు గురైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ తన నియోజక వర్గ ప్రజలకంటే ఎక్కువ స్వాతంత్య్రాన్ని పొందుతుండడం ఈ వాస్తవానికి మరొక రూపం మాత్రమే. ఇక భారత ప్రజల విషయానికి వస్తే కోట్లాదిమంది ఇప్పటికీ కుటుంబం, ఉద్యోగం, సమాజం అనే జైలు గోడల మధ్య ఖైదీలుగా, జైలు గార్డుల్లాగా జీవితాలు గడుపుతున్నారు. అక్షరాలా వీరు తమ తమ బోనుల్లో ఎలాంటి జీవితం గడపాలని తమకు పాలకులు నిర్దేశిస్తున్నారో సరిగ్గా అలాంటి జీవితాన్నే గడుపుతూ వస్తున్నారు. వారి పుట్టుక, వారి మరణం వరకు వారి జీవిత పర్యంతమూ ఇతరుల నిర్ణయానుసారమే నిర్ణయమవుతున్నాయి. సంవత్సరంలో ఒక్క రోజు కూడా వారు తమ ఇష్ట ప్రకారం జీవించలేకపోతున్నారు. ఏం తినాలి, ఏం తాగాలి, వేటిని ధరించాలి అన్నీ కూడా పాలకులు, నిర్దేశించిన మార్గాల్లోనే సాగుతున్నాయి. సమాజ నిబంధనలు, పాలకుల ఆదేశాలు, నిర్ణయాలకు తలొగ్గి మాత్రమే మనం జీవించాల్సి వస్తోంది. అందుకే మన స్వాతంత్య్రం ఇంకా మన ఇళ్లలోకి రాలేదు. ఇంటిబయటనే తచ్చాడుతోంది అంటూ మేధో చింతన మొత్తుకుంటోంది. ఇది నిజమైన స్వాతంత్య్రం కాదు. ఇది మారాలి. చంద్రయాన్, మంగళయాన్, సౌరయాన్ వరకు మన అంతరిక్ష ప్రయోగాలు విజయబాటలో నడుస్తున్నప్పటికీ, ప్రపంచంలోని చాలా దేశాలకంటే మిన్నగా మనం ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు నిండైన అర్థంలో గుబాళించే తరహా విముక్తి మన పౌరజీవితంలో సాధ్యం కాలేదు. కశ్మీర్ నుంచి, కన్యాకుమారి వరకు భారత సమాజంలో జరగాల్సిన నిజమైన మార్పు ఇదే. ఈ 73వ స్వాతంత్య్ర దినోత్సవం మనందరిపై విధించిన పెద్ద బాధ్యత ఇదే. ఇవ్వాళ మన దేశభక్తి, నిజంగా ప్రేమకు సంబంధించిందేనా? అంతరాంతరాల్లో అవును అనిపిస్తున్నప్పటికీ ఎక్కడో సందేహం. కించిత్ అనుమానం.. మన దేశ ప్రేమ మన సోదరులపైనే ద్వేషంగా మారుతోందా? ప్రేమ, ద్వేషం ఒకే నాణేనికి రెండు వైపులుగా ఉంటున్నాయి. ఒకే హృదయంలో రెండు విరుద్ధ భావోద్వేగాలు కలిసి ఉంటున్నాయి. ఒక గణతంత్ర రాజ్యం మనగలిగేందుకు అస్కారమివ్వని అనారోగ్యపరిస్థితి ప్రస్తుతం దేశంలో అలుముకుంటోంది. జాతి మూలాలను పెకిలిస్తున్న ఉగ్రవాదంతో ఏ దేశమైనా కాంతివేగంతో తలపడాల్సిందే. కానీ ప్రతీకారం కోసం ప్రతిజ్ఞ చేయడం మన దేశ భక్తి కారాదు. మానవత్వం కోసం పరితపిస్తున్నవారిని ద్వేషించడం మన భావజాలం కారాదు. ప్రజలందరూ నా కన్నబిడ్డలే అనే అశోకుడి తత్వాన్ని జాతీయ చిహ్నంగా మార్చుకోవడం సరే. దేశం అంతరంగంలో ఆ భావన గుబాళించాలి. దీనికి భిన్నంగా కులం, మతం, రంగు, జాతి, తిండి, అలవాట్లు, సంస్కృతి భేదాల పట్ల మనం ప్రదర్శించే ద్వేషభావం మన రిపబ్లిక్ లేక మన స్వాతంత్య్ర మూలాలనే పెకిలించివేస్తుంది. 73 సంవత్సరాల స్వాతంత్య్రం దేశంముందు విసురుతున్న సవాలు ఇదే. – కె. రాజశేఖర రాజు -
పనస.. ఉంది ఎంతో పస
సిమ్ల యాపిల్లా ఎర్రగా ఆకర్షణీయంగా ఉండదు దోరమగ్గిన జాంపండులా చూడగానే కొరుక్కు తినాలనిపించదు మధురమైన మామిడిలా పళ్లల్లో రారాజు కూడా కాదు కానీ ఆ పండు ఒక రత్నమూ, మాణిక్యమే మన పెద్దలు ఎప్పుడో ఈ విషయాన్ని గుర్తించారు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ ఆ పండు చుట్టూ ఒక పొడుపు కథనే అల్లేసారు. పనస పండులో ఓ పస ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే మనమూ గుర్తిస్తున్నాం.. పాశ్చాత్య దేశాలు కూడా పనసను మనసారా ఆస్వాదించడం మొదలు పెట్టాక ఆ పండు విలువ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. వీగన్ డైట్ ఫాలోయర్లకు పనస పండు ఒక వరంగా మారింది. పనసలో ఉండే ప్రయోజనాలు అందరికీ తెలియజెప్పడానికే జులై 4న ప్రపంచ పనసపండు దినోత్సవం జరుపుకుంటున్నారు. పనస. అదొక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు, పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు.. దాని కర్ర.. ఇలా ప్రతీ భాగమూ అత్యంత విలువైనవి. దాని చుట్టూ ఉన్న మార్కెట్ని చూస్తే విస్తుపోతారు. భారీ సైజు, రవాణాలో సంక్లిష్టత, పండు పై తొక్క తీసి తొనల్ని వలవడం అదో పెద్ద ప్రహసనం కావడంతో జనసామాన్యంలోకి అంతగా వెళ్లలేదు..పనసలో ఆరోగ్య విలువలు గ్రహించాక తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రాష్ట్రీయ ఫలంగా ప్రకటించి మార్కెట్ని విస్తరించే పనిలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ జాతీయ ఫలం కూడా పనసే. వాళ్లు ఎప్పట్నుంచో పనసతో సొమ్ము చేసుకునే పనిలో ఉన్నాయి అమెరికా, యూరప్, బ్రిటన్ దేశాల్లో ఈ పనసంటే పడి చచ్చిపోతారు. కేవలం కేరళ రాష్ట్రం నుంచి ఈ పండు ఎగుమతులు గత ఏడాది 500 టన్నులకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరికి 800 టన్నులు దాటేస్తుందని ఒక అంచనా. పనస కేరళ రాష్ట్రానికి 15 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. పనసపండుకి పుట్టినిల్లు భారత దేశంలోని పశ్చిమ కనుమలు. పండ్లల్లో అతి పెద్దది. ఒక్కో పండు 5 నుంచి 50 కేజీల వరకు తూగుతుంది. 3 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. పనసలో ఏకంగా 300 రకాలు జాతులు ఉన్నాయి. ఉత్పత్తి అయ్యే పళ్లలో రెండేళ్ల క్రితం వరకు 80 శాతం వృథా అయ్యేవి. వీటి విలువ 2వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా పనసతో 200 రకాల వంటకాలు చేయొచ్చు. పనసపొట్టు కూర, పసన దోసెలు వంటి సంప్రదాయ వంటల నుంచి అటు వెస్ట్రన్ ఘుమఘులైన పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఐస్క్రీమ్ వరకు ఎన్నో రకాలు ఉన్నాయి. చివరికి పనస వైన్ కూడా తయారు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలో డైరెక్టర్ పదవిని వదులుకొని వచ్చి మరీ జేమ్స్ జోసెఫ్ అనే కేరళకు చెందిన వ్యక్తి పనసపండులో ప్రయోజనాలు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. జాక్ఫ్రూట్ 365 అన్న కంపెనీ ప్రారంభించి జాక్ ఫ్రూట్ మ్యాన్గా గుర్తింపు సంపాదించారు. శ్రీ పాడ్రే అన్న జర్నలిస్టు తాను నడిపే అడికె పత్రికలో పనస పండుకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ప్రతీ నెల వచ్చే ఈ మ్యాగజైన్లో ఇప్పటివరకు పసనపైనే 32 కవర్ స్టోరీలు వచ్చాయి పరిపూర్ణ ఆహారం పనస పరిపూర్ణ ఆహారానికి మరో రూపం. ఈ పండులో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది.. ఒక కప్పు అన్నంలో కంటే కప్పు పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు 40% తక్కువగా ఉంటాయి. ఇక ఫైబర్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వరి, గోధుమలో ఉండే గ్లూకోజ్లో సగం కంటే తక్కువ పనస పండులో ఉంటుంది. థైరాయిడ్, ఆస్తమా వంటి రోగాలను నియంత్రిస్తుంది. మధుమేహం ఆమడదూరం కేరళ డయాబెటీస్కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడిప్పుడే మధుమేహ గ్రస్తుల్లో వరి, గోధుమ రొట్టెలకు బదులుగా పనస పొట్టు, పనస తొనలు, పిక్కలతో చేసే ఆహారాన్ని రోజూ తీసుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. చక్కెర వ్యాధిని నియంత్రించే శక్తి పనస కాయకి ఉండడంతో దానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది రోమ్లో జరిగిన ఒక అధ్యయనంలో కేరళలో డయాబెటీస్ మందుల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినట్టు తేలింది. పేరు వెనుక కథ పనసకున్న శాస్త్రీయ నామం ఆర్టోకార్పస్, గ్రీకు భాష నుంచి ఈ పదం వచ్చింది. గ్రీకులో ఆర్టో అంటే బ్రెడ్ అని కార్పస్ అంటే పండు అని అర్థం. బ్రెడ్ అంటేనే అందరి కడుపు నింపేది. దానికి తోడు అది పండు కూడా కావడంతో పరిపూర్ణమైన ఆహారంగా మన పూర్వీకులే గుర్తించారు. కానీ అది ప్రాచుర్యంలోకి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. 1563 సంవత్సరంలో పోర్చుగీస్కు చెందిన ఒక స్కాలర్ గరిక డా ఓర్టా అన్న పుస్తకంలో పనసని ప్రస్తావించారు. ఈ పండుని జాకా అని రాశారు. క్రమంగా ఇంగ్లీషులో అది జాక్ ఫ్రూట్గా మారింది. పనసకి ‘‘జేమ్స్’’ బాండ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పేరు జేమ్స్ జోసెఫ్. కొంత కాలం క్రితం వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీలో డైరెక్టర్. ఓసారి ముంబైలో తాజ్మహల్ ప్యాలెస్లో తన క్లయింట్లకి డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్ ఆయన జీవితాన్నే మార్చేసింది. అక్కడ భోజనంలో చెఫ్ హేమంత్ ఓబరాయ్ ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేసి అతిథులకు వడ్డించారు. వాస్తవానికి ఆ పదార్థం పీతలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఆ చెఫ్ కాస్త వినూత్నంగా ఆలోచించి వెజిటేరియన్లు కూడా ఇష్టంగా తింటారని పుట్టగొడుగులతో తయారు చేశారు. రుచి చూస్తే ఆహా అనిపించింది. అతిథులందరూ మైమరిచి తిన్నారు. అప్పుడే జోసెఫ్ మదిలో మష్రూమ్స్కి బదులుగా పనసపళ్లని వాడి ఉంటే దాని రుచి వంద రెట్లు పెరిగేది కదా అన్న ఆలోచన వచ్చింది.. జోసెఫ్ది కేరళ. చిన్నప్పట్నుంచి పనస పండు రుచి బాగా తెలుసు. మాంసం, పుట్టగొడుగుల కంటే పసనపండులోనే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి కదా! దీనినో ప్రత్యామ్నాయ ఆహారంగా ఎందుకు ప్రపంచానికి పరిచయం చేయకూడదు అనుకున్నారు. అమెరికాకు తిరిగి వెళ్లినా అవే ఆలోచనలు ఆయనను వెంటాడాయి. వాటికో రూపం ఇవ్వడానికి కొంతమంది చెఫ్లను సంప్రదించారు. పనస పండుతో విన్నూత్నమైన రుచులు చేయవచ్చునని మాంసాహారానికి బదులుగా ఈ పండుని వాడితే ఆహార భద్రతని అధిగమించవచ్చునన్నది ఆయన ఆలోచన. పనస పళ్ల సీజన్ వచ్చాక ఆ పండుని తెప్పించి తనకు బాగా తెలిసిన చెఫ్తో దగ్గరుండి జోసెఫ్ బర్గర్ చేయించారు. ఆ తొనల్లో మెత్తదనం, ఒక రకమైన తియ్యటి కమ్మదనం, దానిపై డెకరేషన్కు వాడిని పసన పిక్కలు. ఓహో అదో అద్భుతమైన రుచి. ఆలూ బర్గర్ కంటే యమ్మీ యమ్మీగా ఉంది. ఇక పనస పండుతో కేక్ కూడా తయారు చేశారు. వాటి రుచికి సాటిపోటి లేదని అనిపించింది, మెక్డొనాల్డ్లో అమ్మకానికి పెడితే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. అంతే జోసెఫ్ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఉన్న పళంగా నెలకి ఆరెంకలు వచ్చే జీతం, మైక్రోసాఫ్ట్లాంటి సంస్థలో డైరెక్టర్ హోదా అన్నీ వదిలేసుకున్నారు. జాక్ఫ్రూట్ 365 అన్న కంపెనీ ప్రారంభించారు. కొద్ది ఏళ్లల్లోనే పనసతో కోట్లకు పడగలెత్తడమే కాదు, నిలువెత్తు ధనం కుమ్మరించినా రాని పేరు అంతర్జాతీయంగా సంపాదించారు. జాక్ ఫ్రూట్ మ్యాన్గా గుర్తింపు సంపాదించారు. వీగన్లకి వరం వీగన్ డైట్ అంటే ఏమిటో తెలుసు కదా.. పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే ఈ డైట్. ఈ మధ్య కాలంలో క్రీడాకారులందరూ వీగన్ డైట్ను తెగ ఫాలో అవుతున్నారు. భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ కూడా వీగన్గా మారడంతో అసలు ఏమిటీ డైట్ అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మాంసాహారం మాత్రమే కాదు జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలు కూడా ఈ డైట్లో తీసుకోరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శుద్ధశాకాహారులన్న మాట. కక్క ముక్క లేనిదే ముద్ద దిగని వారు రాత్రికి రాత్రి మాంసాహారానికి దూరం కావడం అంత ఈజీ కాదు. అలాంటి వారికి పనస ప్రాణ సమానంగా అనిపిస్తోంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పనసపండుని పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. దీనికి కారణం ఆ పండు తొనలే. వాటిని నములుతుంటే మెత్తగా, రుచిగా అచ్చంగా మాంసం తింటున్న ఫీల్ వస్తుంది. తొనల చుట్టూ ఉండే పీచు కూడా విదేశీయులు ఇష్టంగా తింటారు. మొక్కలతో ప్రొటీన్ వచ్చే ఆహారాలైన పప్పుదినుసులు, గింజలు, పనస వంటి ఇతర పళ్ల మార్కెట్ గత ఏడాది 105 కోట్ల డాలర్ల నుంచి 2025 నాటికి 163 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. గ్రీన్హౌస్ పోరాటంలో కీలకపాత్ర మాంసాన్ని ఉత్పత్తి చేయడం ఎంతో ఖర్చుతో కూడిన పని. దీనికి భారీ భూమి, జల వనులు, పశుపోషణకు ఇతర వనరులు కావాలి. దీని వల్ల 14.5% గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. కానీ పనస అలా కాదు. గ్రీన్ హౌస్ వాయువుల్ని ఆ చెట్టు అత్యధికంగా తీసుకుంటుంది. వరి, గోధు, మొక్క జొన్న పంటల కంటే భవిష్యత్లో పనసకే డిమాండ్ పెరుగుతుందని ఒక అంచనా. ఎందుకంటే పనస చెట్టు పెంచడానికి పెద్దగా శ్రమించనక్కర్లేదు. గాలికి, ధూళికి కూడా పెరిగిపోతుంది. సరిహద్దుల్లేని పనస గత రెండు మూడేళ్లుగా మన దేశంలో పసన విలువ గ్రహించాం కానీ విదేశాలు ఎప్పుడో ఈ పని చేశాయి. వియాత్నం 15 ఏళ్ల క్రితమే పనసపండుకి ప్రాచుర్యం కల్పించడం మొదలు పెట్టింది. 50 వేల హెక్టార్లలో పనసని పండిస్తున్నారు. మలేసియా, ఫిలిప్పీన్స్, కంబోడియా, శ్రీలంక కూడా పనసకి పెద్ద పీటే వేస్తున్నారు. శ్రీలంక వ్యవసాయ శాఖ ఈ పండుని గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు పంపిణీ చేస్తూ పోషాకాహార లోపాలను అధిగమిస్తోంది. పనసకి కొత్త కొత్త రుచులు కల్పించి రకరకాల పదార్థాలను తయారు చేయడంలో వియాత్నం నెంబర్ వన్. మలేసియా జాతీయ విధానంలో పనసకు భాగం ఉంది. అన్ని రంగాల్లో దూసుకుపోయే చైనా 1992 నుంచే పనసను పెంచుతోంది కానీ దానిని సొమ్ము చేసుకోవడంలో ఆ దేశమే నెంబర్ వన్. రోడ్డుకి ఇరువైపులా పనస చెట్లనే నాటిస్తోంది. ఇక ఫిలీప్పీన్స్ పనస పంటపై ఏకంగా కోర్సులే మొదలు పెట్టింది. పనస భలే పసందు జాక్ఫ్రూట్ మ్యాన్గా పేరు పొందిన జేమ్స్ జోసెఫ్ ఎన్ని రకాలు వంటకాలు చేయొచ్చో స్వయంగా ఆలోచించి ప్రయోగాలు చేశారు. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం కావడంతో జోపెఫ్ పంట పండింది. పనసతో ఆయన తయారు చేసిన కబాబ్, బిర్యానీ, మసాల దోశ, పనస రోల్స్, పాయసం, కేకులు, వైన్, పకోడీలు, పిజ్జాలు, బర్గర్లు, ఇలా ఒకటేమిటి అటు సంప్రదాయ వంటలు, ఇటు వెస్ట్రన్ స్టైల్ ఘుమఘుమలు ఎన్నో తయారు చేశారు. జాక్ ఫ్రూట్ అంబాసిడర్ అవార్డు కూడా అందుకున్నారు. కేవలం కేరళలోనే మొత్తం 30 కంపెనీలు పనసకి సంబంధించిన రకరకాల పదార్థాలు చేసి అమ్ముతున్నాయి. పనస ఐస్క్రీమ్లు, చిప్స్, జ్యూస్లు ఒకటేమిటి ఏడాది పొడవునా నిల్వ చేసుకునే ఎన్నో రకాలు తయారై మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలోన్లూ పంట పండుతోంది తెలంగాణలో ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, చిత్తూరులో పనస విస్తారంగా పండుతుంది. ఏపీలో మొత్తం 1197 హెక్టార్లలో, ప్రతీ ఏడాది ఇంచుమించుగా 41 వేల మిలియన్ టన్నుల పంట పండుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పనసకుండే మార్కెట్ని గ్రహించి ప్రోసెసింగ్ యూనిట్లు, చిప్స్ తయారీ ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి వెల్లడించారు. ఈ పండుని రవాణా చేయడానికి వీలుగా చిన్న సైజులో పండేలా సంకర జాతి పనస పండించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 12.4 కోట్లమంది ఇంకా ఆకలితో మాడిపోతున్నారని ప్రపంచ ఆకలి సూచి చెబుతోంది. ఆకలి కేకల్ని తగ్గించడానికి, వివిధ రుచుల్ని ఆస్వాదించడానికి పెద్దగా శ్రమ లేకుండానే ఇళ్లల్లో, వీధుల్లో పనస చెట్లు పెంచితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం. ఆహార భద్రత కూడా. పనస విలువ ఎంతటిదో తెలిసింది కదా, మరింకేం ఈ రుచిని మనసారా ఆస్వాదించండి. జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. అరవింద న్యాయపతి -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వడ్డీ తగ్గుతోంది ! రిటైరయ్యాక ఎలా ?
ఎఫ్డీలపై గణనీయంగా తగ్గుతున్న రాబడి ► ఊహించని రీతిలో పెరుగుతున్న వైద్య వ్యయాలు ► అందుకోసం మూడంచెల భద్రత అవసరం ⇔ అత్యవసర నిధి ⇔ వైద్య బీమా ⇔ ఈక్విటీల్లో పెట్టుబడి ► అనవసర వ్యయాలు తగ్గించుకోవటమూ మంచిదే డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. బ్యాంకు ఎఫ్డీలపై 7 శాతానికి మించి వడ్డీ రావటం లేదు. మరి వడ్డీ ఆదాయాన్నే నమ్ముకున్న విశ్రాంత ఉద్యోగుల పరిస్థితేంటో ఒక్కసారి ఊహించుకోండి? ప్రైవేటు ఉద్యోగాలు కనక చాలామందికి పింఛన్ కూడా లేదు. మరి వాళ్లేం చేయాలి? తక్కువ వడ్డీ రేట్లున్న ఈ పరిస్థితుల్లో జీవనావసరాలను తీర్చుకునేందుకు వారికున్న ప్రత్యామ్నాయాలేంటి? ఇదే ఈ ప్రత్యేక కథనం... గడిచిన రెండు మూడేళ్ల కాలంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగని ఖర్చులేమీ తగ్గిపోవటం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి అవసరాలకు వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలు గతం కంటే ఎక్కువే అయ్యాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు నెలనెలా వడ్డీ ఆదాయంతోపాటు మూల నిధి నుంచి కొంత మేర వినియోగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే మరో ఇబ్బంది ఎదురవుతుంది. తరిగిపోయిన అసలునిధి భవిష్యత్తులో తగినంత ఆదాయాన్నివ్వలేదు. జీవించి ఉన్నంత కాలం అవసరాలను తీర్చే స్థాయిలో అది ఉండకపోవచ్చు. ఇది కూడా ప్రమాదకరమే రిస్క్ సమంజసం కాదు... పెట్టుబడుల ద్వారా అధికంగా ఆదాయం పొందాలన్న ఆలోచనతో రిటైర్మెంట్ కాలంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న నిధిని ఇతర సాధనాల వైపు మళ్లించడం సరికాదు. ఎందుకంటే విశ్రాంత జీవనంలో ప్రశాంతత ముఖ్యం. ఆ సమయంలో ఆదాయం కోసం తీసుకునే రిస్క్ ఆందోళనను పెంచకూడదు. పైగా అసలు నిధికి భద్రత ఎంతో అవసరం. కార్పొరేట్ సంస్థలు చేతులెత్తేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నందున బాడ్ ఫండ్లు, కార్పొరేట్ డిపాజిట్లలో పెట్టుబడులూ సమంజసం కాదు. ఇక ఉన్న అవకాశాలు యాన్యుటీ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లే. యాన్యుటీ పథకాల కంటే ఫిక్స్డ్ డిపాజిట్లలోనే రాబడి ఎక్కువగా ఉంది. తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పరిమితం చేసుకోవడం, రివర్స్ మార్ట్గేజ్ వంటి వాటి ద్వారా అవసరమైనంత పొందడం విశ్రాంత జీవనంలో ఉన్న వారి చేతుల్లో ఉన్న అవకాశాలు. ఆరోగ్యానికి రక్షణ ఉందా? అన్నింటికంటే ఖరీదైనది వైద్యం అని తెలిసిందే. అందుకే మలి జీవితంలో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా ఆరోగ్య రక్షణపై ప్రభావం పడకూడదు. ఇందుకోసం మూడెంచల రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. మొదటిది అత్యవసర నిధి. రెండోది వైద్య బీమా. మూడోది ఈక్విటీల్లో పెట్టుబడులు. వైద్య బీమాలో కొన్ని వ్యాధులు, సర్జరీలకు కవరేజీ ఉండదు. దానికి ఎక్కువ డబ్బే అవసరమవుతుంది. అందుకోసమే మూడో ఆప్షన్. వైద్య వ్యయాలనేవి అనుకోకుండా ఎదురవుతాయి. ఏ స్థాయిలో ఉంటాయన్నదీ ఊహించలేం. అందుకే ఈక్విటీల్లో కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత మేర రక్షణ కల్పించుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఎందుకంటే సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆరోగ్య రంగ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. ఈ లెక్కన సాధారణ వస్తువుల ధరలతో పోలిస్తే వైద్య వ్యయాల పెరుగుదల వేగంగా ఉంటుంది. మరి ఉన్నదంతా తీసుకెళ్లి సురక్షితమైనదన్న యోచనతో ఫిక్స్డ్ డిపాజిట్లలోనే పెడితే వచ్చే నామమాత్రపు వడ్డీ ఆదాయం ఏ మూలకు సరిపోతుందన్నది ఆలోచించాలి. అందుకే కొంత రిస్క్ ఉన్నప్పటికీ ఈక్విటీలో కొంచెం మెరుగైన రాబడులను ఆశించవచ్చు. ఖర్చులకు కళ్లెం వేయాలా? ఇటువంటి సందర్భాల్లో వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం సముచితం. వినోదం, కాలక్షేపం కోసం ఖర్చులకు బదులు జీవన వ్యయాలు, ఆరోగ్య వ్యయాలకే ప్రాధాన్యమివ్వాలి. ‘జీవితమంతా కష్టపడ్డాను ఇప్పుడైనా ఎంజాయ్ చేయకుంటే ఎలా’ అన్న భావన కలగడం అసహజమేమీ కాదు. అయితే మీకు వస్తున్న ఆదాయం మీ ఆకాంక్షలన్నింటినీ తీర్చే స్థాయిలో ఉంటే త్యాగం చేయాల్సిన అవసరం రాదు. కానీ, తక్కువ ఆదాయం ఉంటే మాత్రం కనీస అవసరాలే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలి. ‘రివర్స్’ మందు!! సొంత ఇంటినే ఆదాయ వనరుగా మార్చుకునే ప్రత్యేక సదుపాయం... ఇది అనువైన సమయమే! వడ్డీ రేట్ల క్షీణత నేపథ్యంలో రివర్స్ మార్ట్గేజ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుత రేట్ల ప్రకారం చూస్తే రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్న వారికి రివర్స్ మార్ట్గేజ్ అనువైనదనేది నిపుణుల అభిప్రాయం. విశ్రాంత జీవనంలో ఉన్న వారికి ప్రధానంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే ఆధారం. మరి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతానికి దిగివచ్చేశాయి కనక వడ్డీ ఆదాయానికీ చిల్లులు పడ్డాయి. రూ.50 లక్షలను ఎఫ్డీ చేస్తే గతంలో 9 శాతం వడ్డీ రేటున్నప్పుడు వార్షికంగా రూ.4.5 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 7 శాతం వడ్డీపై ఈ ఆదాయం రూ.3.5 లక్షలకు పడిపోయింది. ఆదాయం ఈ స్థాయిలో తగ్గిపోయినందున రివర్స్ మార్ట్గేజ్ తీసుకోవడానికి ఇది అనువైన సమయమన్నది నిపుణుల మాట. ఎక్కువ బ్యాంకులు 10–12 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తుండగా, ఐవోబీ మాత్రం 9.40 శాతానికే రుణమిస్తోంది. రివర్స్ మార్ట్గేజ్ పనిచేసేదెలా? ఇంటి కోసం రుణం తీసుకున్నామనుకోండి. ఒకేసారి రుణం తీసుకుని... నెలనెలా వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. దానికి రివర్స్లో... మన దగ్గరున్న ఇంటిని బ్యాంకుకు తనఖా పెడతామన్న మాట. బ్యాంకే నెలనెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలా కాకుండా రుణం మొత్తం ఒకేసారి కావాలన్నా జారీ చేస్తుంది. కాల వ్యవధి తర్వాత ఏక మొత్తంలో రుణాన్ని, వడ్డీతో కలిపి తీర్చివేయాలి. 2007లో ఈ పథకం అమల్లోకి రాగా... ప్రారంభంలో ఈ పథకం పట్ల భారీ అంచనాలే వ్యక్తమయ్యాయి. కానీ, వాస్తవంగా చూస్తే ఆదరణ అంతగా లేదు. దీనికి కారణం వడ్డీ రేట్లు అధికంగా ఉండడమే. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు తమ సొంతింటిని రివర్స్ మార్ట్గేజ్ చేసుకునేందుకు అర్హత ఉంది. ఎలా తీసుకుంటే మేలు...? రివర్స్ మార్ట్గేజ్ రెండు విధాలుగా ఉంటుంది. అర్హత మేరకు రుణం మొత్తాన్ని బ్యాంకు ఖరారు చేసిన తర్వాత నెలసరి వాయిదాల రూపంలో లేదా మూడు నెలలు లేదా వార్షికంగా రుణాన్ని తీసుకోవచ్చు. కాదంటే ఏక మొత్తంలోనూ ఇస్తారు. ఒకేసారి రుణాన్ని తీసేసుకుంటే దాన్ని నెలనెలా ఆదాయం కోసం బ్యాంకు ఎఫ్డీ లేదంటే బీమా కంపెనీ పెన్షన్ యాన్యుటీ ప్లాన్లో పెట్టుబడి పెట్టాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుంది. అదే బ్యాంకు నుంచి రుణాన్ని నెలసరి వాయిదాల రూపంలో అందుకున్నట్టయితే, అది రుణం కనుక దానిపై పన్ను పడదు. ఇంటి విలువలో ఎంత రుణం..? రివర్స్ మార్ట్గేజ్లో బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తి మరణించినపుడు మాత్రమే రుణాన్ని వసూలు చేసుకోగలవు. అదే సమయంలో రుణ గ్రహీత మార్ట్గేజ్ కాల వ్యవధి వరకూ జీవించి ఉంటే... బ్యాంకులు రుణ వసూలును వాయిదా వేసుకోవాలి. దీంతో రిస్క్ పెరుగిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు అసలు ఇంటి విలువలో 40 శాతాన్ని మాత్రమే (ఎల్టీవీ) రుణంగా మంజూరు చేస్తున్నాయి. ఎవరికి అనుకూలం...? చక్కగా స్థిరపడిన వారికి తల్లిదండ్రుల పేరిట ఉన్న ఇంటితో దాదాపు అవసరం ఏర్పడదు. అలాంటి పిల్లల తాలూకు తల్లిదండ్రులు రివర్స్ మార్ట్గేజ్ రుణ పథకాన్ని పరిశీలించొచ్చు. అలాగే, వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు అధికం కావడం తరచూ జరుగుతుంటే రివర్స్ మార్ట్గేజ్ ఓ మంచి అవకాశమేనంటున్నారు నిపుణులు. ఒకవేళ ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం తక్కువగా ఉంటే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలూ చూడొచ్చన్నది వారి సలహా. బ్యాంకు ఎఫ్డీల్లోనుంచి పెట్టుబడులను స్వల్పకాలిక డెట్ ఫండ్స్కు మళ్లించడం ద్వారా కొంచెం అధిక రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. విధి, విధానాలు ► 60 ఏళ్లు ఆపైబడిన వారే రుణానికి అర్హులు. దంపతులు ఇద్దరి పేరిటా తీసుకోవచ్చు. కాకపోతే అందులో ఒకరి వయసు 60, ఆపైన ఉండాలి. ► రుణ కాల వ్యవధి గరిష్టంగా 20 ఏళ్లు. బ్యాంకుల మధ్య ఈ విషయంలో తేడాలున్నాయి. వాస్తవానికి తనఖా పెడుతున్న ఇంటి మిగిలిన జీవిత కాలం రుణ కాల వ్యవధికి కీలకం. ► రుణ గ్రహీత మరణానంతరమే బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకుంటాయి. ఉదాహరణకు బ్యాంకు 20 ఏళ్ల కాలవ్యవధితో మార్ట్గేజ్ రుణాన్ని జారీ చేసిందనుకుందాం. రుణగ్రహీత 30 ఏళ్లు జీవించి ఉంటే, అప్పటి వరకూ బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకోవు. ► రుణ గ్రహీత మరణానంతరం అతని వారసులకు రుణాన్ని చెల్లించే హక్కుంటుంది. వారసులు రుణాన్ని చెల్లించేందుకు ముందుకు రాకపోతే, బ్యాంకులు అప్పుడు తనఖాలో ఉన్న ఇంటిని వేలం వేస్తాయి. అలా వచ్చిన ఆదాయంలో రుణం, వడ్డీ పోను ఏమైన మిగిలి ఉంటే ఆ మొత్తాన్ని చట్టబద్ధమైన వారసులకు అందిస్తాయి. ► ఇంటి రుణం మాదిరిగానే ప్రాసెసింగ్ చార్జీలు వంటివి మామూలే. -
మీరు కట్టాల్సిన పన్ను ఎంత?
ఈ సారి బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి పెద్ద మార్పులేవీ చేయకపోయినా... దిగువ మధ్య తరగతి వారికి కొంత ఊరటనివ్వటం.... ఏడాదికి రూ.50 లక్షల పైబడి సంపాదించేవారిపై కొంత సర్చార్జీ వేయటం వంటివి జరిగాయి. ఈ మార్పుల వలన ఎవరికెంత పన్ను భారం పడుతుంది? ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది? పన్నును తగ్గించుకోవటానికి ఉన్న మినహాయింపులేంటి? ఆ మినహాయింపుల కోసం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి వివరాలన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం... సెక్షన్ 80సీ.. ఇంకా మరిన్ని ఆదాయపు పన్ను మినహాయింపులన్నిటిలోకీ అన్నివర్గాలకూ ఎక్కువ మినహాయిం పునిస్తున్నది సెక్షన్ 80సీ మాత్రమేనని చెప్పాలి. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షలను మినహాయించుకునే అవకాశముంది. ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే మినహాయింపులేంటంటే... ప్రావిడెంట్ ఫండ్కు చెల్లించిన మొత్తం ∙మీరు తీసుకున్న గృహ రుణంపై అసలు (ప్రిన్సిపల్) కింద చెల్లించిన మొత్తం ∙పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో (పీపీఎఫ్) చేసే ఇన్వెస్ట్మెంట్. ఇది ఏడాదికి రూ.500 నుంచి 1.5 లక్షల వరకూ చేయొచ్చు. ∙మీ పిల్లల స్కూలు ఫీజు. దీన్లో ట్యూషన్ ఫీజుగా పేర్కొనే మొత్తాన్నే మినహాయిస్తారు. అదీ ఇద్దరు పిల్లల వరకే. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే బీమా ప్రీమియం లు. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే యూలిప్ ప్రీమియంలు. ∙పోస్టాఫీసుల్లో ఎన్ఎస్సీ సర్టిఫికెట్ల కొనుగోలుకు వెచ్చించే మొత్తం. ∙బ్యాంకుల్లో గానీ, పో స్టాఫీసుల్లో గానీ ఐదేళ్ల కాలానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు ∙గమనించాల్సిందేంటంటే ఈ మొత్తం అంశాల్లో దేన్లో ఎంత ఇన్వెస్ట్ చేసినా గరిష్ఠంగా ఒక ఏడాదికి రూ.1.50 లక్షలు మాత్రమే పన్ను మినహాయింపునకు క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. పన్ను మినహాయింపునిచ్చే ఇతర పొదుపు పథకాలు న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్): ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని గతంలో సెక్షన్ 80సీలో భాగంగానే చూసేవారు. కానీ గడిచిన ఏడాది నుంచీ ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసే మొత్తంలో రూ.50,000 వరకూ సెక్షన్ 80సీకి అదనంగా చూపించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం చట్టంలో 80 సీసీడీ పేరిట కొత్త సబ్సెక్షన్ తెచ్చారు. గృహ రుణంపై వడ్డీ: మీరు గృహ రుణం తీసుకుని... అదే ఇంట్లో గనుక ఉంటే, మీరు చెల్లించే వడ్డీలో గరిష్ఠంగా ఏడాదికి రూ.2 లక్షల వరకూ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. విద్యా రుణంపై చెల్లిస్తున్న వడ్డీ: దీనికి పరిమితేమీ లేదు. ఎంత వడ్డీ చెల్లిస్తే అంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం: మీతో పాటు మీ భార్య, పిల్లల వైద్య బీమాకు చెల్లించే ప్రీమియంలో రూ.25,000 వరకూ మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. మీరు గనుక 60 ఏళ్లు దాటినవారైతే ఈ మినహాయింపు 30,000 దాకా ఉంటుంది. మీ తల్లిదండ్రులకు గనుక బీమా చేయిస్తే అదనంగా మరో రూ.25,000 క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. విరాళాలు: నోటిఫైడ్ సంస్థలు, రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో ఆయా సంస్థల్ని బట్టి పూర్తిగా గానీ, 50 శాతం మొత్తాన్ని గానీ మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. తాజా బడ్జెట్ ప్రకారం ఇలాంటి విరాళాలు చెక్కు, లేదా డిజిటల్ రూపంలో చెల్లించాలి. రూ.2,000 వరకూ మాత్రమే నగదు రూపంలో చెల్లించవచ్చు. వ్యాధుల ఖర్చు: ఎయిడ్స్, కొన్ని రకాల కేన్సర్ల వంటి వ్యాధుల చిక్సిత కోసం అసెసీ సొంతంగా కానీ, తనపై ఆధారపడ్డ వారికిగానీ పెట్టే ఖర్చులో రూ.40,000 వరకూ క్లెయిమ్ చేయొచ్చు. ఈ మినహాయింపు పరిమితి రోగి వయసు 60 ఏళ్లు దాటితే రూ.60,000గా, 80 ఏళ్లు దా టితే రూ.80,000గా ఉంది. వైకల్యం ఖర్చు: అసెసీ లేదా తనపై ఆధారపడ్డవారు అంగవైకల్యం బారిన పడితే వారి వైద్య ఖర్చులు, శిక్షణ కోసం చెల్లించే మొత్తంలో రూ.75,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. తీవ్ర అంగవైకల్యమైతే ఇది రూ.1.25 లక్షల వరకూ ఉంది. ఇవండీ మినహాయింపులు: ఇవి కాక మీకు వచ్చే హెచ్ఆర్ఏ గానీ, మీరు చెల్లించే ఇంటద్దె గానీ, ఆఫీసు మీకు చెల్లించే కొన్ని రకాల అలవెన్సులుగానీ... ఇవన్నీ మినహాయింపుల పరిధిలోవే. మీ మొత్తం జీతంలో వీటన్నిటినీ మినహాయించాక మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. అందులో బేసిక్ లిమిట్ను తీసేసి... మిగిలిన మొత్తంపై ఆయా శ్లాబుల్ని అనుసరించి పన్ను విధిస్తారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ? మీకు జీతం రూపంలో వచ్చేది మీ ఆదాయం మాత్రమే. అదంతా పన్ను చెల్లించాల్సిన ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్కమ్) మాత్రం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్ల కింద వివిధ రకాల మినహాయింపులున్నాయి. మనం చేసే పొదుపు నుంచి, మనం కట్టే ఇంటద్దె వరకూ చాలా ఖర్చుల్ని మినహాయించుకునే వీలుంది. ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. దాటితే రూ.5 లక్షల వరకు 5 శాతం, 5–10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50 లక్షలు దాటినవారికి ఈ బడ్జెట్లో కొత్తగా 10 శాతం సర్చార్జి విధించారు. రూ.కోటి ఆదాయం దాటినవారికి గతేడాది బడ్జెట్లోనే 15 శాతం సర్చార్జి వడ్డించారు. -
ఆదరణ తగ్గని పుస్తక పఠనం
ఏటేటా లక్షలాది గ్రంథాల అమ్మకాలు 15 నుంచి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన అందమైన అక్షరాల ఒడి.. జ్ఞానప్రియుల అద్భుత లోకం.. వందలు, వేల సంవత్సరాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న భాండాగారం.. గతాన్ని వర్తమానానికి, వర్తమానాన్ని భవిష్యత్తుకు అనుసంధానిస్తూ మానవసమాజాన్ని నవోత్సాహంతో ముందుకు నడిపించే అద్భుత చోదక శక్తి ‘పుస్తకం’. కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భక్తి, ఆధ్యాత్మికం, చరిత్ర, తత్వశాస్త్రం, మనస్తత్వం, సామాజికం, ఆర్థికం, రాజకీయం, జాతీయం,అంతర్జాతీయం.. అన్ని అంశాలకు ప్రతిబింబం. కాగితాల దొంతరలో కూర్చిన అక్షరాల వెంట పరుగులు పెట్టే నేత్రాలు.. భావాన్ని మనసు పొరల్లో నిక్షిప్తంచేసే మరో ప్రపంచం ‘పుస్తకం’. వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ రాజ్యమేలుతోన్న కాలంలోనూ పుస్తకం వన్నె తరగలేదు. వైభవాన్ని కోల్పోలేదు. పాఠకుడి ఆదరణ, జిజ్ఞాస మేరకు అన్ని రంగాల్లోకి రెక్కలల్లార్చుకొని విస్తరిస్తూనే ఉంది. విభిన్న భాషా సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ నగరంలో వందల ఏళ్లుగా పుస్తకం వర్ధిల్లుతూనే ఉంది. అలా పాఠకుల ఆదరాభిమానాలతోనే మూడు దశాబ్దాలకు పైగా మహానగరంలో ఏటేటా వేడుక చేసుకుంటోన్న పుస్తకం మరోసారి ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు ఇందిరాపార్కు ఎన్టీఆర్ స్టేడియం ‘హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన’కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి,సిటీబ్యూరో సామాజిక మార్పులకు అనుగుణంగా పుస్తకం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. మానవ సంబంధాల్లో, మార్కెట్ సంబంధాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పుస్తకం స్పందిస్తోంది. కాల్పనిక సాహిత్యం, చారిత్రక గ్రంథాలు అప్పటి తరాన్ని ప్రభావితం చేస్తే.. ఇప్పుడు మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రంగాలకు చెందిన పుస్తకం లక్షల మెదళ్లకు పదును పెడుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కెరీర్కు పుస్తకం కేరాఫ్గా మారింది. అయినప్పటికీ సాహితీ పాఠకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. కన్యాశుల్కంలో గిరీశం గిలిగింతలు చూస్తున్నారు. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో ఏముందో తెలుసుకుంటున్నారు. ‘అసమర్ధుని జీవయాత్ర’లోని సాహిత్య సమర్థతను అంచానా వేస్తున్నారు. ప్రతి ఇంటినీ బుల్లితెర ధారావాహికలు ముంచేస్తున్నా.. అక్షరం విలువ తెలిసిన పాఠకుడు నవలను ఆదరిస్తున్నాడు. అందుకే తెలుగు, ఇంగ్లిష్ పుస్తక ప్రచురణ సంస్థలు పదుల సంఖ్యలో మనగలుగుతున్నాయి. విశాలాంధ్ర, నవోదయ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఎమెస్కో వంటి ప్రచురణ సంస్థలు దశాబ్ధాలుగా వివిధ రంగాల పుస్తకాలను ప్రచురిస్తుండగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్ బ్లాక్స్వాన్, కేంబ్రిడ్జి, పియర్సన్, టాటా మెగ్రాహిల్ వంటి పబ్లికేషన్స్ మాధ్యమిక, ఉన్నత విద్యారంగానికి చెందిన ప్రామాణిక పుస్తకాలను ముద్రిస్తూ పాఠకలోకానికి చేరవయ్యాయి. ఓరియంట్ లాంజ్ఞన్, ఇండియా బుక్హౌస్ వంటి సంస్థలు అనేక విలువైన పుస్తకాలను అందజేస్తూనే ఉన్నాయి. రూప పబ్లిషర్స్ నుంచి వచ్చే చేతన్ బగత్, రస్కిన్బాండ్ వంటి రచయితల పుస్తకాల కోసం జిజ్ఞాసాపరులు ఎదురు చూస్తుంటారు. చేతన్ భగత్ ‘టు స్టేట్స్’, ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మైలైఫ్’, ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’, ‘వాట్ యంగ్ ఇండియా’, ‘రెవల్యూషన్ 2020’ వంటి గ్రంథాలు ఇప్పటికీ హాట్కేకులే. రస్కిన్బాండ్ ‘చిల్డ్రన్స్ ఓమ్ని బస్’, గ్రేట్ స్టోరీ ఫర్ చిల్డ్రెన్’, ‘స్కూల్ డేస్ స్కూల్ టైమ్స్’ వంటి పిల్లల పుస్తకాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ ఇప్పటికీ పాఠకుడి మనసు దోచుకుంటూనే ఉంది. పిల్లల కామిక్స్ సైతం విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఆంగ్ల గ్రంథాలు, బిజినెస్, మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీటివ్ పుస్తకాలే కాదు.. తెలుగు సాహితీ గ్రంథాలకు కూడా అద్భుత ఆదరణ ఉంది. మహాకవి శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ 1954 నుంచి ఇప్పటి వరకు 33 సార్లు ముద్రించారు. ఈ పుస్తకం నగరంలో ప్రతిరోజు కనీసం 200 కాపీలు అమ్ముడవుతూనే ఉంది. తస్లీమా నస్రీన్ ‘లజ్జ’ నవల, తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యల సాహిత్యం, ముళ్లపూడి రచనలు, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ,పెద్దిభొట్ల, మధురాంతకం రాజారాం వంటి ప్రముఖ రచయితల కథల పుస్తకాలు, మనస్తత్వ గ్రంథాలు, తెలుగు సినిమా సాహిత్యం, బాపు కార్టూన్లు, వట్టికోట ఆళ్వారుస్వామి ‘మట్టి మనిషి’, ‘గంగు’నవలల కోసం పాఠకులు వెతికి మరీ చదువుతున్నారు. అంతేనా.. మేనేజ్మెంట్ గురించి తెలుసుకునేవారు కూడా రామాయణం. మహాభారతాన్ని చదువుతున్నారు. ఆనాటి పరిస్థితులనునేటి స్థితిగతులకు అన్వయిస్తూ.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేస్తున్నారు. అందుకే జీవిత సత్యాలను చెప్పే ఈ మహాగ్రంథాలు ప్రతి కార్పొరేట్ కార్యాలయంలో కొలువుదీరుతున్నాయి. 15 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 15న 30వ ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ కన్వీనర్ డాక్టర్ ఎస్.రఘు, కార్యదర్శి చంద్రమోహన్ తెలిపారు. 16 నుంచి 10 రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్స్ చాన్సలర్ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ హాజరవుతారన్నారు. తెలుగు సాహిత్యంలోని ధోరణులు, అస్తిత్వ ఉద్యమాలు, రచయితల పాత్ర, కథ, నవల, వచన కవిత–పరిణామ వికాసాలు, ఉద్యమాలు–పాట ప్రభావం, తెలంగాణ సినిమా, అభ్యుదయ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, బాలసాహిత్యం తదితర అంశాలపై సాహితీవేత్తలతో ప్రసంగాలు ఉంటాయని వివరించారు. మహాశ్వేతాదేవి సాహిత్య ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా‡వెంకటేశం, గూడ అంజన్న ప్రాంగణాన్ని డాక్టర్ కె.వి.రమణాచారి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్.గోపి. నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, ఎం.వేదకుమార్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ముదిగంటి సుజాతరెడ్డి, యాకూబ్, సుద్దాల అశోక్తేజ, భూపాల్, ఏలె లక్ష్మణ్ వంటి సాహితీవేత్తలు పాల్గొంటారని తెలిపారు. – సుందరయ్య విజ్ఞానకేంద్రం 280 స్టాళ్లతో ప్రదర్శన.. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు ‘హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన’ మరోసారి వేదిక కానుంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న ఈ వేడుకలో 280 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. శని,ఆది వారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో హైదరాబాద్ పుస్తక ప్రదర్శణ కమిటీ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. -
తోడూ.. నీడ నీవే 'నాన్న'
పిల్లల భవిష్యత్తు కోసం తపించే 'నాన్న' ఆప్యాయత పంచులూ మార్గదర్శిగా నిలుస్తూ.. అనంతపురం కల్చరల్: లాలించి.. లాలపోసి.. అడుగులేయించి.. అక్షరాలు పలికించి అన్నీ తానై తోడూ నీడగా ఉండే 'నాన్న'కు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానముంటుంది. అనురాగానికీ, ఆప్యాయతలకు ప్రతీక మాత్రమే కాదు. మార్గదర్శిగా ఉంటూ పిల్లల బంగారు భవితకు బాటలు వేయడానికి నిరంతరం తపన పడుతుంటాడు. నాన్నతో గడిపిన క్షణాలు ప్రతి వ్యక్తి జీవితంలో మరచిపోలేని మధురానుభూతులు. పెళ్లయి అత్తారింటికి వెళ్లినా ఆడపిల్లకు తండ్రి లాలన పట్లే మక్కువ. ఉద్యోగాలొచ్చి ఎక్కడెక్కడో స్థిరపడే మగపిల్లలను సైతం తండ్రి నేర్పిన క్రమశిక్షణే ముందుకు నడిపిస్తుంది. బిడ్డలను ప్రయోజకులను చేయడంలో తల్లికి ఎంత పాత్ర ఉంటుందో.. తండ్రికీ అంతే ఉటుంది. అందుకే చరిత్ర పుటల్లో 'నాన్న' కోసం ప్రత్యేక రోజును కేటాయించారు. నేడు (ఆదివారం) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.. ఆసక్తికరమైన నేపథ్యం పిల్లలు ఎదుగుతుంటే మౌనంగా ఆనందించే తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఏర్పడిన 'ఫాదర్స్' డే వెనుక ఆసక్తికర నేపథ్యముంది. 1890లో అమెరికాలోని ఆర్కాన్సాస్లో చర్చికి సోనారా అనే అమ్మాయి వెళ్లింది. అక్కడ మదర్స్ డే జరుగుతోంది. అది చూసిన సోనారా.. కుటుంబ అభ్యున్నతికి పాటుపడే నాన్నకూ ఇలాంటి గౌరవం దక్కాలని మత పెద్దలను కోరింది. ఆమె న్యాయమైన కోరిక వాళ్లను కదిలించింది. అంతే.. ఆ అమ్మాయి తండ్రి జాక్సన్ పుట్టిన రోజును ఫాదర్స్ డేగా నిర్వహించాలని నిశ్చయించారు. అది మూడో ఆదివారం కావడంతో అప్పటి నుంచి జూన్ లో వచ్చే ఇదే రోజున ప్రపంచ వ్యాప్తంగా 'ఫాదర్స్ డే' నిర్వహిస్తున్నారు. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఫాదర్స్ డేను ఆ దేశ జాతీయ పండుగగా ప్రకటించారు. తర్వాత అది ప్రపంచ వ్యాప్తమైంది. నాన్నే ఫ్రెండయ్యారు! ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడిచే రోజుల్లో తండ్రి అంటే అత్యంత భయభక్తులుండేవి. ఎదిరించి మాట్లాడటం కాదు కదా.. కావాల్సింది అడగడానికీ జంకేవారు. ఏది కావాలన్నా తల్లిని మాత్రమే అడిగేవారు. అయితే.. కాల చక్రంలో అనేక మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలు చెదిరిపోయాయి. చిన్న కుటుంబాల్లో తండ్రి స్నేహితుడిగా మారిపోయాడు. పిల్లలకు మార్గదర్శిగా ఉంటూనే స్నేహితుడిలా నడిపిస్తున్నాడు. నాన్నంటే ఓ నీడ.. వెన్నంటి ఉండే ఓ గోడ అన్న భావాన్ని ఈ తరం పిల్లలు వ్యక్తం చేస్తున్నారు. -
ఒత్తిడిని అధిగమిస్తేనే జీవితం
మానవ జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సహజమే అరుునా.. శృతిమించడం వల్లే సమస్యలు అధికమవుతున్నాయి.. ఎల్కేజీ చదివే చిన్నారి నుంచి తల నెరిసిన తాతయ్య వరకు అందరికీ సమస్యలే. చదువు, ఉద్యోగం, కుటుంబరీత్యా, ఒంటరితనం ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో అనేక సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రేమించిన యువతి దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాదిగా మారడం, అనుకున్నది సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన, భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం వంటివి సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానసిక సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మానసిక అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కాలంతో పాటు పరుగెడుతున్న సిటీ లైఫ్లో మానసిక ప్రశాంతత లోపించింది. గతంలో ఇళ్ల వద్ద అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, బాబాయి ఇలా పెద్దలనే వారు ఉండేవారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు ఇలా చిన్నవాళ్లు కలహించుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా ఆదిలోనే పరిష్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారిని ఓదార్చేవారు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవల ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఏటా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే వారోత్సవాల్లో మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అంటే 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో మానసిక వైకల్యం (స్కిజోఫ్రీనియా), నివారణోపాయూలపై డబ్ల్యూహెచ్వో అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో అధికశాతం మంది డిప్రెషన్కు గురవుతుండగా, మరికొంతమంది పర్సనాలటీ డిజార్డర్స్, లైంగిక సమస్యలు, భాగస్వామితో విభేదాలు, స్మోకింగ్, మద్యపానానికి అలవాటుపడుతున్నారు. పారానాయిడ్ సైకోట్రిక్ అనే సమస్యకు గురయిన వారికి సకాలంలో చికిత్స అందించనట్లయితే సైకోలుగా మారడం, కుటుంబసభ్యులను హింసించడం, హత్యాయత్నం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా ఉండాలంటే.. మానసిక ఒత్తిడిని గురవరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. ఈర్ష, ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇతరులను చిరునవ్వుతో పలకరించండి.. అభినందించంది.. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి. సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్కు లోనుకావద్దు. జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి. పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి, పొరపాట్లు సరిదిద్దండి. మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు. తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి. భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. దానిని సరిచేసుకుంటే అది మీకు దూరంగా ఉంటుంది. ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు. పిల్లలతో సరదాగా గడపండి.. మాట్లాడండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండండి. -
Wi Fiతో జర భద్రం
ఇంటర్నెట్.. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఆధారపడుతున్న సాధనం. ముఖ్యంగా యువత ఎక్కువగా నెట్కు ఆకర్షితులవుతున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని వారు వైఫై ఎక్కడుంటుందో చూసుకుని మరీ వాడుకుంటున్నారు. అయితే ఈ వైఫైతో ఒకరి ఇంటర్నెట్ కనెక్షన్ను వాడుకోవడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల చేయని తప్పులకు బాధ్యులు కావాల్సి వస్తుందంటున్నారు. నెట్ సెంటర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతీ ఒక్కరు పాస్వర్డ్ సిస్టమ్స్తోపాటు లాక్ వేసుకోవడం, వినియోగించిన తర్వాత ఆఫ్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. వైఫైతో జరిగే అనర్థాలు, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి తదితర విషయాలపై కథనం.. వైఫై అంటే.. వైఫై అంటే వైర్లెస్ ఫెడిలిటీ. రేడియో తరంగాలను ఉపయోగించి ఇంటర్నెట్ కనెక్షన్ పొందే ఒక వైర్లెస్ సాంకేతికత. ఈ వైఫై ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఒక ఇంట్లో లేదా కార్యాలయంలో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్పై ఆధారపడి సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లలో ఇంటర్నెట్ సులువుగా వాడుకోవచ్చు. ఒక హాట్స్పాట్ నుంచి 20 మీటర్లు(66 అడుగులు) వరకు ఇండోర్లో అంతకంటే ఎక్కువ దూరం వరకు అవుట్డోర్లో వాడుకోవచ్చు. ఫైర్వాల్స్ డిజిబుల్ కావద్దు ప్రతీ కంప్యూటర్, రూటర్లలో ఉన్న ఫైర్వాల్స్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఆధునికంగా తయారవుతున్న రూటర్లలో బిల్ట్ ఇన్ ఫైర్వాల్స్ ఉంటున్నాయి. వాటిని డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.అందుకే ఎల్లప్పుడూ ఫైర్వాల్స్ ఆన్లో ఉండేలా చూసుకుంటూ వినియోగించిన ప్రతీ సారి చెక్ చేసుకోవాలి. ఢీఫాల్ట్లు వద్దే వద్దు చాలా వరకు రూటర్లు డీఫాల్ట్ లాగిన్, పాస్ వర్డ్స్తో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనె క్షన్ వినియోగంలో వీటిని కొనసాగించకూడదు. కనెక్షన్ పొందిన వెంటనే సొంతంగా మీరే లాగిన్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. డీఫాల్ట్ వివరాలను హ్యాక్ చేయడం చాలా తేలిక. యాక్సిస్ పాయింట్ అందుబాటులో వద్దు వైఫై కనెక్షన్ ఇన్ స్టాల్ చేసే సందర్భంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని యాక్సిస్ పాయింట్, రూటర్లు బయటివారికి అందుబాటులో లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు కిటికీలకు దూరంగా ఉండడం మేలు. ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్ వదలద్దు ప్రతీ వైర్లెస్ డివైస్కు ఒక ప్రత్యేకమైన మీడియా యాక్సిస్ కంట్రోల్ (ఎంఏసీ) అడ్రస్ ఉంటుంది. యాక్సిస్ పాయింట్లు, రూటర్లు వాటికి కనెక్ట్ అయి ఉన్న ప్రతీ డీవైస్ కు సంబంధించిన ఈ ఎంఏసీ అడ్రస్ను ట్రాక్ చేస్తుంటాయి. హ్యాకింగ్కు దూరంగా ఉండాలంటే వైఫై కనెక్షన్కు సంబంధించిన ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్ను ఎనేబుల్గా ఉంచుకోవాలి. టర్న్ ఆఫ్ విషయం మరవద్దు కొంత కాలంపాటు వైఫై కనెక్షన్ వాడని పక్షంలో నెట్వర్క్ అందుబాటును టర్న్ ఆఫ్ చేయడం మరవకూడదు. నెట్వర్క్ను షట్ డౌన్ చేయడం వల్ల హ్యాకింగ్ చేసుకునేందుకు ఆస్కారం ఉండదు. కనెక్షన్ బ్రేక్ చేయడానికి అవకాశం చిక్కదు. ఆటో కనెక్ట్ అసలే వద్దు వైఫై వినియోగంలో ఆటో కనెక్ట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దు. దీని వల్ల సమీపంలోని ఏ రూటర్ నుంచైనా కనెక్ట్ కావడం వంటి వాటితో మీకు సౌకర్యవంతంగా అనిపించినా, అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుందని మరవద్దు. ఆటోకనెక్ట్ వాడటం వల్ల మీ కంప్యూటర్, కనెక్షన్స్కు సెక్యూరిటీ రిస్క్తో పాటు ఎటాక్స్ ముప్పు ఉంటుందని గుర్తించుకోండి. -
ఆయాసం నుంచి అనాయాస శ్వాసకు
ఆకలేస్తే అన్నం ప్లేట్లో పట్టుకురావచ్చు. దాహం వేస్తే నీళ్లు గ్లాసులో పట్టుకురావచ్చు. కానీ... ఆస్తమా వచ్చిన వారు ఊపిరాడటం లేదంటూ బాధపడుతుంటే... గాలిని ఎలా పట్టుకురావాలి? ఈ పరిస్థితిని ఎలా నెట్టుకురావాలి?... దీనికో మార్గం ఉంది. ఇన్హేలర్ అనే ఒక చిన్న ఉపకరణం సహాయంతో ఆస్తమా ఉన్నవారికి తేలిగ్గా శ్వాస ఆడేలా చేయవచ్చు. మరి... ఇలా ఇన్హేలర్స్ వాడే విషయంలోనూ ఎన్నో దురభిప్రాయాలూ, అపోహలూ రాజ్యమేలుతున్నాయి. ఇన్హేలర్స్ వాడటం రోగుల ఆరోగ్యానికి మంచిదేనా? ఆస్తమా ఉన్నవారికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుందట. మరి డాక్టర్లంతా స్టెరాయిడ్స్ మంచివి కావని అంటుంటారే? అదే నిజమైతే చికిత్సలో భాగంగా ఆస్తమా కోసం స్టెరాయిడ్స్ వాడితే... అవి మరికొన్ని సమస్యలకు దారితీయవా? ఇలాంటి అపోహలూ, సందేహాలూ సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా... ఆస్తమాపై ప్రాథమిక పరిజ్ఞానం కోసం ఈ ప్రత్యేక కథనం. మనలో చాలామందికి మబ్బు పట్టినా, మంచు కురిసినా, వాన ముసిరినా ఊపిరితిత్తులు బిగదీసుకుపోయి శ్వాస సరిగా అందక, ఊపిరి తీసుకోవడం కోసం తహతహలాడిపోతుంటారు. ఇలా ఊపిరికోసం ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితిని ‘ఆస్తమా’ అంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి గంటల కొద్దీ కొనసాగుతూ తీవ్రంగా బాధిస్తుంటుంది. దీన్నే ఆస్తమా ఎటాక్గా అభివర్ణిస్తారు. ఆస్తమా లక్షణాలు ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది. శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతీ గట్టిగా బిగదీసుకుపోయి పట్టేసినట్లుగా ఉండటం. పై పరిణామాల వల్ల కనిపించే తీవ్రమైన ఆయాసం దగ్గు శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఇతర లక్షణాలు : ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలూ కనిపించవచ్చు. అవి... ముక్కులు బిగదీసుకుపోవడం, సైనుసైటిస్ లక్షణాల్లోలా ముక్కు నుంచి స్రావాలు కనిపించడం కొందరిలో ఒంటిపై దద్దుర్లు (ర్యాషెస్), చర్మంపై పగుళ్లు (డర్మటైటిస్) వంటివీ కనిపించవచ్చు. పొరబడే అవకాశాలూ ఉంటాయి... ఆస్తమాలో కనిపించే ఆయాసం, దగ్గు, పిల్లికూతల వంటి లక్షణాలు ఊపిరితిత్తుల్లో కనిపించే ఇతర రుగ్మతల్లోనూ ఉంటాయి. కాబట్టి ఆస్తమా నిర్ధారణకు రోగచరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం. ఇది ఒక్కోసారి దీర్ఘకాలంగా బాధించే ‘క్రానిక్ ఎయిర్ వే ఇన్ఫ్లమేషన్’ అనే రూపంలోనూ కనిపిస్తూ, లక్షణాలు మాటిమాటికీ పునరావృతమవుతుంటాయి. ఒక్కోసారి మనకు సరిపడని పదార్థానికి ఎక్స్పోజ్ అయినప్పుడు గాలిపీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తుల నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. అయితే ఆస్తమా రోగుల్లో కనిపించే సాధారణ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే రోగుల్ని కాస్త సావకాశంగా పరిశీలించి, వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు... రోగికి ఉన్న వ్యాధి చరిత్ర (మెడికల్ హిస్టరీ)ను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. స్పైరోమెట్రీ అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఇందులో రోగి చేత గాలిని ఊదించి, ఆయనెంత బలంగా ఊదుగలుగుతున్నాడనే అంశం ఆధారంగా రోగి వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయన్న విషయం అంచనా వేస్తారు. దీని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక కొన్ని రకాల ఇన్హేలర్స్ సహాయంతో ముడుచుకుపోయిన వాయునాళాలు రిలాక్స్ అయ్యేలా చేయవచ్చు. దీని ఆధారంగా ఒక మందుకు రోగి ఎలా స్పందిస్తున్నాడన్న అంశాన్నీ అంచనా వేస్తారు. కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు... ఇటీవల ఆస్తమాను నిర్ధారణ చేయడంతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోడానికి ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకుపోయేలా చేస్తారు. ఇందుకుగాను మిథకోలైన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. లేదా కొందరిలో వ్యాయామం చేయించి అదే ప్రభావాన్ని కల్పిస్తారు. ఇక ‘పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియను ఉపయోగించి ఇంట్లోనే ఆస్తమా పరీక్ష చేయించవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఉన్న మరో ఉపయోగం ఏమిటంటే... ఒకవేళ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే అది ప్రారంభం కాకముందే కనుక్కోవచ్చు. దీనివల్ల చికిత్సను చాలా త్వరగా మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక పీక్ ఫ్లో ఎంత ఉండాలన్న అంశాన్ని రోగి వయసు, జెండర్, ఎత్తు వంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటిని ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష మనం గాలి వదిలే సమయంలో (నిశ్వాసలో) కార్బన్ డై ఆక్సైడ్ను వదులుతామన్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తమా రోగుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఈ పరీక్షనూ మందులకు వ్యాధి తీవ్రత ఏ మేరకు తగ్గింది, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్ఫ్లమేషన్) పాళ్లు ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి చేస్తారు. రక్తపరీక్ష ఆస్తమాను కనుగొనడానికి ఉద్దేశించిన నిర్దిష్టమైన రక్తపరీక్ష ఏదీ లేకపోయినా... ఆస్తమా వచ్చిన సమయంలో రక్తంలోని ఇజినోఫిల్స్ అనే తరహా తెల్లరక్తకణాలు ఎక్కువగా వృద్ధి చెందినందున వాటికి యాంటీబాడీస్గా వెలువడ్డ ఐఈజీ లేదా ఇమ్యునోగ్లోబ్యులిన్-ఈ కణాలు కనిపిస్తాయి. (అయితే మన కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు కూడా ఇదే తరహా కణాలు కనిపిస్తాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి అది ఎందువల్ల జరిగిందో క్లినికల్గానూ పరీక్షించి, డాక్టర్లు కారణాలను నిర్ధారణ చేస్తారు). ఇక ఏ ప్రత్యేకమైన పదార్థం వల్ల ఆస్తమా ప్రేరేపితమై ఉండవచ్చన్నది కూడా నిర్ణయించడానికి కొన్ని నిర్దిష్టమైన సెన్సిటివిటీ పరీక్షలు చేస్తారు. ఎక్స్-రే వ్యాధి నిర్ధారణలో ఎక్స్-రే పరీక్ష కూడా కీలకమైనదే. అయితే కొన్నిసందర్భాల్లో ఆస్తమా రోగుల ఎక్స్-రే నార్మల్గా కూడా ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఇతర వ్యాధులేమైనా ఈ లక్షణాలకు కారణం కావచ్చా అన్న విషయాన్నీ చాలా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు... ఆస్తమా నిర్ధారణలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేగానీ... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాల ఆధారంగానే దాన్ని ఆస్తమాగా నిర్ధారణ చేయకూడదు. ఇలాంటి లక్షణాలు గుండెజబ్బులు, క్యాన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యలూ ఇలాంటి లక్షణాలనే కనబరుస్తాయి. ఒక్కోసారి ఆస్తమా తీవ్రత తక్కువగానే ఉన్నా రోగికి స్థూలకాయం ఉంటే అప్పుడు లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఆస్తమాలో రకాలు... ఆస్తమాలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... వ్యాయామంతో ప్రేరేపితమయ్యేది: కొందరు తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శ్వాస అందకుండా పోయి, ఆస్తమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దీన్నే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ అంటారు. (అయితే ఇలా వ్యాయామం చేసేప్పుడు ఊపిరి అందకుండా పోయే పరిస్థితి కేవలం ఆస్తమాలో మాత్రమే ఉండదు. ఊపిరితిత్తుల సమస్య, రక్తహీనత (అనీమియా), గుండెజబ్బులు, కండరాల్లో బలహీనత వంటి అనేక సమస్యల్లోనూ ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అయితే కొందరిలో ఈ లక్షణాలు వ్యాయామం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే కనిపిస్తే మరికొందరిలో 15 నిమిషాల్లో కనిపిస్తాయి. అయితే విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టిన గంట తర్వాత సర్దుకోవచ్చు. కానీ వాతావరణం చల్లగా ఉంటే పరిస్థితి విషమించవచ్చు). అలర్జిక్ ఆస్తమా: తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. ఈ సరిపడని పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఆహారం, దుమ్ము/ధూళి, బొద్దింకలు, పుప్పొడి మొదలైనవి. ఇలాంటి సమయాల్లో లక్షణాల తీవ్రత అన్నది వాతావరణంపైనా ఆధారపడి ఉంటుంది. అజీర్తి / పులితేన్పులతో వచ్చే జీఈఆర్డీ సమస్యతో: కొందరిలో ఆహారం తీసుకున్నప్పుడు వారిలో దాన్ని జీర్ణం చేసే ఆసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా కడుపులో మంట/ఆహారం గొంతులోకి వస్తున్నట్లుగా అనిపించడం వంటి సమస్య కనిపిస్తుంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అంటారు. ఈ జీఈఆర్డీ సమస్య కూడా ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నిద్రలో ఈ తరహా సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఆస్తమా వల్ల నిద్ర మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. ఇతర కారణాలతో... ఇక పైన పేర్కొన్నవే కాకుండా పొగాకు పొగ వల్ల, కట్టెల పొయ్యి వద్ద వెలువడే పొగ, రంగుల వాసన సరిపడకపోవడం వంటి ఇతర అంశాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్ప్లేస్ ఆస్తమా’ అంటారు. వీరికి అదే ప్రదేశంలో ఉన్నప్పటికీ వారాంతంలోగానీ, సెలవు రోజునగానీ ఆస్తమా రాదు. ఇక కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. ఆస్తమా ఎందుకు వస్తుంది? మనం శ్వాస పీల్చుకున్నప్పుడు గాలి మన ముక్కు చివరినుంచి ప్రారంభమయ్యే ట్రాకియా అనే గొట్టం ద్వారా మొదలై, ఊపిరితిత్తులు రెండింటిలోకీ వెళ్లడానికి వీలుగా ఈ ట్రాకియా రెండు బ్రాంకియాలుగా చీలుతుంది. అక్కడి నుంచి అనేక శాఖలుగా చీలుతూ ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలై అనే గాలిగదుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో ఈ ఆల్వియోలైలు 30 కోట్ల వరకూ ఉంటాయి. ట్రాకియా, బ్రాంకియా, ఆల్వియోలై... వీటన్నింటికీ లోపలివైపున సన్నటి వెల్వెట్ వంటి పొర ఉంటుంది. కంట్లో నలకపడ్డప్పుడు కన్ను ఎర్రబారి, నీరుకారినట్టే... మన ఊపిరితిత్తులకు సరిపడనిదేదైనా లోపలికి ప్రవేశిస్తే ఈ వెల్వెట్ పొర కూడా ఎర్రబారిపోయి, నీరుకారిపోయినట్లుగా అవుతుంది. అక్కడ కన్ను చిన్నగా మారినట్టే... ఇక్కడ వాయునాళాలూ సన్నగా మారతాయి. దాంతో ఊపిరి అందడం కష్టంగా మారి ఆస్తమా ఎటాక్ మొదలవుతుంది. ఆస్తమా ఎవరెవరిలో ఎక్కువ...? సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇందులో 75 శాతం మంది ఏడేళ్ల వయసు లోపువారే. దీని ఇండ్లలోని పెద్దవారు పాల ఉబ్బసంగా అభివర్ణిస్తుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో ఇది తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. చాలావరకు ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒక రేసులో ఉన్న గుర్రాల్లో ఒకటి ముందుగానే కాస్త వెనకబడి పోయిందనుకోండి. అది పూర్తిగా పుంజుకుని ముందుకు రావడానికి అవకాశాలు తక్కువ. అయితే కొందరు పాల ఉబ్బసాన్ని నిర్లక్ష్యం చేసి, వయసు పెరుగుతున్న కొద్దీ అదే తగ్గుతుందిలే అనుకుంటారు. కానీ ఆ సమయంలో చికిత్స అందించకపోతే ఎదుగుదల సమయంలో ఊపిరితిత్తుల్లో వికాసం సరిగా జరగక కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. కాబట్టి పాల ఉబ్బసం అదే తగ్గుతుందనే అపోహ వద్దు. అది ఏ రకమైన ఉబ్బసమైనా చికిత్స తీసుకోవమే మేలు. ఇక వాతావరణ కాలుష్యం, ఏదైనా పడకపోవడం వంటి అంశాలతో ఇటీవల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆస్తమా కనిపిస్తోంది. చికిత్స ఆస్తమా చికిత్సలో దాన్ని ప్రేరేపించే అంశాలకు దూరంగా ఉండటం అన్నది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందుకోసం... రోగికి ఆస్తమాను ప్రేరేపించే అంశాలను నిర్దిష్టంగా కనుక్కోవడం కూడా చాలా ప్రధానం. ఇందుకోసం ఆస్తమా రోగి తనకు చికిత్స అందించే పల్మునాలజిస్ట్ లేదా అలర్జీ స్పెషలిస్ట్కు ఎప్పుడూ అందుబాటులో ఉండటం ముఖ్యం. ఆధునికమైన మందులు... ఇప్పుడు ఆస్తమా తీవ్రతను తగ్గించడానికి పీల్చేమందులు (ఇన్హేలర్స్/నెబ్యులైజర్స్) కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక నోటి ద్వారా తీసుకునే మందులు సరేసరి. పీల్చే మందుల్లో ఉండే ఔషధం బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి గాలి తేలికగా లోపలికీ, బయటకూ వెళ్లేలా చేస్తుంది. ఇక ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్ఫ్లమేషన్ను) తగ్గించే మందులనూ వాడతారు. ఇలా రెండు రకాల ఇన్హేలర్స్తో చికిత్స చేసి, ఆస్తమా తీవ్రతను తగ్గిస్తారు. దాంతో రోగికి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. ఇటీవల ఐజీఈ అనే తరహా యాంటీబాడీస్తోనూ ఆస్తమాకు చికిత్స చేస్తున్నారు. చికిత్స ఇంట్లోనా... ఆసుపత్రిలోనా...? రోగికి చికిత్స చాలావరకు ఇంట్లోనే జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఊపిరి అందక, శ్వాస సరిగా ఆడకుండా పరిస్థితి తీవ్రమవుతుంటే ఆసుపత్రికి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇంట్లో చేసిన చికిత్సల వల్ల రోగికి తగినంత ఉపశమనం కనిపించకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఒక్కోసారి కృత్రిమ శ్వాస ఇవ్వాల్సిన అవసరమూ రావచ్చు. అందుబాటులోకి రానున్న అత్యాధునిక చికిత్సా విధానాలు : ఇప్పుడు ఆస్తమా చికిత్సలో మరిన్ని అత్యాధునిక చికిత్సావిధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు బ్రాంకియల్ థెర్మోప్లాస్టీ అన్నది అలాంటి విధానాల్లో ఒకటి. ఈ విధానంలో బ్రాంకోస్కోప్ అనే పరికరంతోనూ, ప్రత్యేకమైన వైర్ల సహాయంతోనూ ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవహింపజేసే వాయునాళాల్లో ఉష్ణోగ్రతనూ, వేడిమినీ పెంచేలా చేస్తారు. దాంతో వాయునాళాలు పూర్తిగా వ్యాకోచిస్తాయి. ఇటీవల జరుగుతున్న అధ్యయనాల వల్ల ఈ ప్రక్రియ సత్వర ఉపశమనానికి దోహదం చేస్తుందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అపోహలూ - వాస్తవాలు ఆస్తమా మందుల పట్ల, ఈ ప్రక్రియలో ఉపయోగించే ఇన్హేలర్ల పట్ల, స్టెరాయిడ్స్ విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో కొన్ని... అపోహ : ఆస్తమా నియంత్రణకు ఉపయోగించే ఇన్హేలర్లు ఆరోగ్యకరం కావు. రోగులు వీటికి తేలిగ్గా బానిసలవుతారు. (అడిక్ట్ అవుతారు). వాస్తవం : ఇన్హేలర్లు పూర్తిగా ఆరోగ్యకరం. వీటిని ఉపయోగించడం వల్ల వాటికి ఎవరూ బానిసలు కారు. అవి శ్వాసను పునరుద్ధరించే ప్రాణరక్షకులు. అపోహ : ఆస్తమా చికిత్సలో రోగికి స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ వాడటం మంచిది కాదని డాక్టర్లే చెబుతుంటారు. వాస్తవం : స్టెరాయిడ్స్ కూడా ఒక రకం మందులే. వీటితో వ్యాధిని తేలిగ్గా నియంత్రణలోకి తేవడంతో పాటు, రోగి ప్రాణాలను రక్షించవచ్చు. అయితే స్టెరాయిడ్స్ వల్ల కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమే అయినా రోగికి కలిగే ఉపశమనం, వ్యాధినుంచి అవి కలిగించే రక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సైడ్ఎఫెక్ట్స్ పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. అపోహ : ఆస్తమా అన్నది ఒక్కోసారి ఎక్సర్సైజ్ వల్ల కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి ఆస్తమా వస్తే ఆ వ్యక్తి వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉండాలి. వాస్తవం: ఇది పూర్తిగా అపోహ. ఇప్పుడున్న మందులతో ఆస్తమాను పూర్తిగా నియంత్రణలో ఉంచి, మళ్లీ యథావిధిగా వ్యాయామాలు చేయవచ్చు. ఇప్పుడు ఒలింపిక్ అథ్లెట్లలోనూ చాలామంది ఆస్తమా రోగులు ఉన్నారు. అయినా వారి వ్యాధి, వారి ప్రతిభకూ, వ్యాయామానికీ ప్రతిబంధకం కావడం లేదు. అపోహ : కొన్ని రకాల ఆహారాలు వ్యాధిని ప్రేరేపించి, రోగి పరిస్థితిని పూర్తిగా దిగజారుస్తాయి కాబట్టి రోగులు కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయాలి. వాస్తవం : రోగి... తక్షణం ఆస్తమాను ప్రేరేపించే ఆహారం నుంచి వీలైనంతగా దూరంగా ఉండటం అవసరమే. అయితే ఈ కారణంగా రోగి తనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, పండ్లు వంటి వాటిని పూర్తిగా పరిహరించాల్సిన పని లేదు. తన విచక్షణతో ఏ మేరకు తీసుకుంటే తనకు ఇబ్బంది కలగదో, ఆ మేరకు తీసుకోవచ్చు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి ఇతర అంశాలనూ పరిగణనలోకి... ఆస్తమా రోగికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలూ, ఇతర కండిషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయడం అవసరం. ఉదాహరణకు ఒక మహిళకు ఆస్తమా చికిత్స చేస్తున్నప్పుడు ఆమె గర్భవతా, ఎలాంటి మందులు తీసుకుంటూ ఉంది అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కడుపులో ఉన్న చిన్నారికీ, తల్లికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చికిత్స ప్రణాళిక రచించుకోవాలి. చాలా ప్రాచీనం ఆస్తమా అనేది గ్రీకు మాట. ‘నోటితో శ్వాస’ అనేది దాని అర్థం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు హిపోక్రేటస్ (క్రీ.పూ. 460 - 370) నాటికే ఉన్నట్లు అప్పటి వర్ణనలను బట్టి తెలుస్తోంది. ఇప్పుడు అనేక రకాల ఆధునిక చికిత్సా ప్రక్రియలతో పాటు, తక్కువ మోతాదులోనే ఎక్కువ ప్రభావం చూపే అత్యంత సురక్షితమైన ఔషధాలు, ఇన్హేలర్లు అందుబాటులోకి వచ్చినందున గతంలోలా ఆస్తమా పట్ల అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకెక్కించిన మహనీయుడు అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు. దర్జీ క్లీనర్గా జీవితం మొదలుపెట్టి, దర్శకుడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహిం చారు. భారతీయ చలన చిత్ర నిర్మాతగా, నటుడిగా, దర్శకునిగా, సినిమాటోగ్రాఫర్గా, వ్యాపార వేత్తగా, సంఘ సేవకుడిగా బహుముఖాలను ప్రదర్శించిన ప్రజ్ఞాశాలి. ఆయన్ను అందరూ ఎల్వీ ప్రసాద్గా పిలుస్తారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. - న్యూస్లైన్, అన్నానగర్ ఆణిముత్యాలెన్నో ఆలంఅరా, భక్త ప్రహ్లాద, కాళిదాసు, సీతా స్వయంవరం (హిందీ) బోండాం పెళ్లి, బారిష్టర్ పార్వతీశం, చదువుకున్న భార్య, రాజాపార్వై (తమిళ) వంటి చిత్రాల్లో ప్రసాద్ నటించారు. తెనాలి రామకృష్ణ - ఘరానా దొంగ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఈ చిత్రాల్లో నటించారు కూడా. 25 హిందీ చిత్రాలకు, మరికొన్ని వొరియా, బెంగాలీ చిత్రాలకు ప్రసాద్ దర్శక - నిర్మాతగా వ్యవహరించారు. నటుడిగా పలుపాత్రలు పోషించారు. గృహ ప్రవేశం, ద్రోహి, పల్నాటి యుద్దం, పెంపుడు కొడుకు, కల్యాణం పన్నిపార్ (తమిళం), రాణి (తమిళం) పెళ్లిచేసి చూడు, పరదేశీ, పూంగోదై (తమిళం), మిస్సమ్మ, మంగైర్తిలకం (తమిళం), భాగ్యవతి (తమిళం), కడన్వాంగి కల్యాణం (తమిళం), అప్పు చేసి పప్పుకూడు, తాయిల్లా పిళ్లై (తమిళం), ఇరువరు వుల్లం (తమిళం) చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవార్డులు, రివార్డులు దాదాసాహెబ్ పాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర రత్న, కళాప్రపూర్ణ, కళాతపస్వి, ఉద్యోగపాత్ర (జాతీయ అవార్డు), రాజు శాండో స్మారక అవార్డు (తమిళనాడు) వంటి పలు అవార్డులు ఆయనలోని కళా సరస్వతికి దాసోహం అన్నాయి. సంఘ సేవ కోసం ఆయన పలు చోట్ల కంటి ఆస్పత్రులను నిర్మించారు. 86 ఏళ్ల వయసులో ఎల్వీ.ప్రసాద్ జూన్ 22, 1994లో కాలధర్మం చెందారు. కళకు - కళాకారులకు కాలధర్మం వర్తిం చదని చెప్పడానికే ఆయన తన పేరిట దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేత్ర చికిత్సాలయాలను నెలకొల్పారు. పేదలకు సైతం కారు చవకగా వైద్యసేవలు అందించడమే తన ఆస్పత్రుల ధ్యేయమని ఆయన తన తొలి ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంలో చెప్పిన మాటలు ఆయన జయంతి రోజున స్మరించుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులోని సోమవరప్పాడులో 1908 జనవరి 17న ఎల్వీ ప్రసాద్ జన్మించారు. తల్లిదండ్రులైన అక్కినేని శ్రీరాములు - బసవమ్మకు ప్రసాద్ రెండో సంతానం. వయసుకు మించిన తెలివితేటలు ఆయన్ను విద్యాధికుడ్ని చేయలేకపోయినా అంతకుమించిన ప్రజ్ఞాశాలిని చేశాయి. రామషకీల్ సినిమా డేరాల్లో చూపించే పాత ఫిల్మ్ల షోలు, నాటకాలు ప్రసాద్ను చిన్నప్పుడే ఆకట్టుకున్నాయి. 1924లో ప్రసాద్కు 17 ఏళ్ల వయసప్పుడు ఆయన మేన మామ కూతురైన సౌందర్య మోహనమ్మతో వివాహమైంది. తండ్రి శ్రీరాములు అప్పుల బాధ తాళలేక ఐపీ పెట్టడంతో ప్రసాద్ చూపు మద్రాసు వైపు మళ్లింది. అయితే చెన్నైలో ఆయనకు అవకాశాలు లభించకపోవడంతో ఉత్తర భారతంలోని దాదర్కు మకాం మార్చారు. అక్కడ కోహినూర్ స్టూడియోస్లో కొద్ది రోజులు పని చేశారు. కారణం ఆయనకు హిందీ, ఇంగ్లీష్ భాషలు రాకపోవడమే. దాదర్లోనే ఒక దర్జీ షాపులో క్లీనరుగా ప్రసాద్ చేరారు. కానీ అక్కడ ఇక్కడ ఉండలేక వీనస్ ఫిల్మ్ కంపెనీలో జీతంలేని ఉద్యోగిగా ఉంటూ అక్కడి నుంచి ఇండియా పిక్చర్స్ కంపెనీకి మారారు. అక్కడ సిక్తర్ నవాజ్ అనే వ్యక్తి ప్రసాద్కు స్టార్ ఆఫ్ ది ఈస్ట్ మూకీ చిత్రంలో ఒక చిన్న వేషం ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఇది రిలీజ్ కాలేదు. వీనస్ ఫిల్మ్ కంపెనీ యజమాని ధన్లాల్ సోదరి మోతీ ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ తొలి టాకీ అయిన ఆలంఅరాలో ప్రసాద్కు ఒక చిన్న పాత్ర లభించింది. 1931లో అలంఅరా రిలీజ్ తర్వాత ప్రసాద్కు ఎన్నో లఘుపాత్రలు లభించాయి. అనంతరం హెచ్ ఎం రెడ్డి కాళిదాసు చిత్రంలో ప్రసాద్కు ఒక గుర్తింపులేని పాత్రను ఇచ్చారు. అప్పటికే చిన్నచిన్న పాత్రలు వేసి విసిగిపోయిన ప్రసాద్కు సోమవర పాడులోని తన తల్లిదండ్రులు గుర్తుకురావడంతో తిరిగి సొంతఊరు చేరారు. అయితే తిరిగే కాలు - తిట్టే నోరు వూరికే వుండవన్న సామెతను రుజువు చేస్తూ ప్రసాద్ సకుటుంబంగా బొంబాయికి చేరారు. ఆమీషా తన కమర్ - ఆల్ - జమాన్ చిత్రానికి ప్రసాద్ను అసిస్టెంట్ డెరైక్టర్గా నియమించారు. ఈ చిత్రం నుంచి ప్రసాద్ పేరును షార్టుకట్ చేసి ఎల్.వి.ప్రసాద్గా టైటిల్స్ను చూపడం మొదలైంది. ప్రసాద్ సహాయ దర్శకుడిగా పని చేసిన కష్టజీవి చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆయన పృధ్విరాజ్కపూర్ నిర్వహిస్తున్న పృథ్వి థియేటర్లో చేరి మంచి నటుడిగా గుర్తింపు పొందారు. పృథ్వి రాజ్కపూర్ కుమారుడైన రాజ్కపూర్తో ప్రసాద్ తన మొట్టమొదటి హిందీ చిత్రం శారదాను నిర్మించడంతో ఆయన సుడి తిరిగింది. నిర్మాతగా ఇది ప్రసాద్కు తొలి హిందీ చిత్రం. 1943లో గృహప్రవేశం చిత్రానికి సహాయక దర్శకుడిగా పని చేసిన ప్రసాద్ విధి విలాసంలో భాగమై అదే చిత్రానికి దర్శకుడిగా పని చేయడమే కాక, ప్రధాన భూమికను పోషించి ఆ చిత్రాన్ని ఒక క్లాసిక్ హిట్గా విజయవంతం చేశారు. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు తన ద్రోహి చిత్రంలో ప్రధాన పాత్రను ఇచ్చారు. అదీ మంచి హిట్ కావడంతో దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం తన పల్నాటి యుద్ధం చిత్రంలో మిగిలిన భాగాన్ని దర్శకత్వం వహించాలని కోరారు. (ఈ చిత్రం సగంలో ఉండగా రామబ్రహ్మం జబ్బునపడ్డారు). 1949లో మన దేశం చిత్రాన్ని డెరైక్టు చేశారు. ఇందులో ఎన్టీరామారావును ఒక చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేయించింది ప్రసాద్. 1950లో విజయా పిక్చర్సు వారు తమ షావుకారు చిత్రానికి దర్శకత్వం చేయూలని కోరడంతో అందులో నటించిన ఎన్టీఆర్ - జానకిలకు గొప్ప పేరు వచ్చింది. జానకి ఆనాటి నుంచి షావుకారు జానకిగా ప్రఖ్యాతి పొందింది. అదే సంవత్సరం ఎన్టీఆర్ - ఏఎన్నార్తో ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం బంపర్ హిట్ అయ్యింది. జూపిటర్ ఫిల్మ్స్ తమిళం తెలుగు - హిందీ భాషల్లో నిర్మిస్తు న్న మనోహర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అఖండ విజయంతో అటు ఎల్వీ ప్రసాద్కు, ఇటు నటుడు శివాజీ గణేశన్కు ఎదురులేకుండా పోయింది. 1955లో ఆయన దర్శకుడు డి.యోగానంద్ను పిలిచి తన ఇలవేల్పు చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు.