t-hub
-
విదేశాల వైపు ‘టీ–హబ్’ చూపు
సాక్షి, హైదరాబాద్: భారత స్టార్టప్ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న ‘టీ–హబ్’... విదేశాల్లోనూ తనదైన ముద్ర వేసే దిశగా దూసుకువెళుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్ల కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మార్కెట్లలోకి భారతీయ స్టార్టప్ల ప్రవేశం, కార్యకలాపాలకు ఊతమివ్వడం, అక్కడి నిపుణుల మార్గదర్శనం, నిధుల సేకరణ లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే సమయంలో విదేశీ స్టార్టప్లు భారత్తోపాటు దక్షిణాసియా దేశాల్లో కార్యకలాపాలు విస్తరించుకునేందుకు సాయం అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ‘టీ–బ్రిడ్జ్’అనే అనుబంధ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. భారతీయ స్టార్టప్ల ఆవిష్కరణలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి వ్యాపారపరంగా విజయవంతం అయ్యేలా తీర్చిదిద్దడంలో ‘టీ–బ్రిడ్జి’క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పోరేట్ సంస్థలు, స్టార్టప్లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్లు (ప్రోత్సాహక సంస్థలు), విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను ‘టీ–బ్రిడ్జి’అనుసంధానం చేసి... భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించేందుకు అనువైన వాతావరణాన్ని సిద్ధం చేసింది. 42 దేశాల్లో మార్కెట్తో అనుసంధానం.. భారతీయ, అంతర్జాతీయ స్టార్టప్ల ఆవిష్కరణలు, మార్కెటింగ్, నిధుల సేకరణకు వీలుగా టీ–హబ్ 42 దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటివరకు 300కు పైగా భారతీయ స్టార్టప్లు, మరో 200కుపైగా అంతర్జాతీయ స్టార్టప్లు తమ ఆవిష్కరణలను మార్కెటింగ్ చేసుకునేందుకు టీ–హబ్ అంతర్జాతీయ ఒప్పందాలు దోహదం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్లను విస్తరించేందుకు ‘ఇండియా మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (ఐమ్యాప్), గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (జీమ్యాప్)’వంటి కార్యకలాపాలను చేపట్టింది. అమెరికా మార్కెట్లోకి భారతీయ స్టార్టప్ల ప్రవేశం, అక్కడి నిపుణుల మార్గనిర్దేశనం కోసం సిలికాన్ వ్యాలీలోని ‘ఫాల్కన్ ఎక్స్’సంస్థతో టీ–హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘కొరియాకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల స్టార్టప్ ఏజెన్సీ (కొస్మె)’తోనూ టీ–హబ్కు భాగస్వామ్య ఒప్పందం ఉంది. అంతర్జాతీయ సంస్థ రెడ్బెర్రీతో కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఉత్తర అమెరికాలో ఆవిష్కరణల ఔట్పోస్ట్ను ఏర్పాటు చేసింది. గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా పేమాట్రిక్స్, ఆన్కానీ విజన్, డేటావెర్స్ వంటి భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయంగా మార్కెట్ను విస్తరించుకోవడంతోపాటు అనేక భాగస్వామ్యాలు, పెట్టుబడులను సాధించగలిగాయి.టీ–హబ్ప్రయాణంలో మైలు రాళ్లు ఇవీ..» వివిధ రంగాలకు చెందిన 2వేలకుపైగా స్టార్టప్లకు మార్గదర్శనం, నిధుల సేకరణ, నెట్వర్కింగ్లో ఊతం అందించింది. » పెట్టుబడి సంస్థలు, కార్పోరేట్ సంస్థలు తదితరాల నుంచి స్టార్టప్లకు రూ.1,300 కోట్లకు పైగా నిధుల సేకరణలో సాయం చేసింది. » ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, పైలట్ ప్రాజెక్టులు తదితర అంశాల్లో 200కుపైగా కార్పోరేట్ సంస్థలతో స్టార్టప్లు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. » ఎంట్రప్రెన్యూర్షిప్, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పర బదిలీ తదితరాల కోసం 100కు పైగా కార్యక్రమాలు, వర్క్షాప్లను నిర్వహించింది. » అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్లకు అవకాశాల కోసం విదేశీ సంస్థలు, ఇంక్యుబేటర్లు తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. నేపాల్సంస్థలతోనూ ఒప్పందాలునేపాల్, భారత్ నడుమ ఆవిష్కరణలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా టీ–హబ్ ఇటీవల నేపాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖతోపాటు అక్కడి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంస్థ ‘డోల్మె’తోనూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక బదిలీ, రెండు దేశాల నడుమ దృఢమైన ఆర్థిక బంధం ఏర్పడేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంటోంది. -
పరిశోధనల హబ్గా హైదరాబాద్
సాక్షి,హైదరాబాద్: సబ్మెరైన్ల తయారీలో వినియోగించే పదార్థాల అభివృద్ధి కోసం హైదరాబాద్లో ఎన్నో పరిశ్రమలు పనిచేస్తున్నాయని ఇప్పుడు పరిశోధనలు, అభివృద్ధికి భాగ్యనగరం కేంద్రంగా ఉందని రక్షణరంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మాజీ చైర్మన్ జి.సతీశ్రెడ్డి పేర్కొన్నారు. టీ–హబ్ వేదికగా ‘వేదజ్ఞానం, ఆధునిక సాంకేతికత’పై శ్రీవీటీ సంస్థ రజతోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఐకాన్ భారత్’అంతర్జాతీయ సదస్సును సతీశ్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సదస్సు ద్వారా విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్ను ‘విశ్వ గురువు’గా చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రాచీన శాస్త్రీయతకు ఆధునికతను కలిపే చక్కటి వేదిక ఇదని సతీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మ నిర్భరత సాధించాలంటే ముందుగా మెటీరియల్స్, తయారీరంగంలో నూతన సాంకేతికత విషయంలో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. దేశీయంగా కీలకమైన మెటీరియల్స్ అభివృద్ధి చేయడంలో ఎంతో ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. సబ్మెరైన్ల తయారీలో, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమానాల తయారీలో 80% ముడి పదార్థాలు భారత్లోనే తయారయ్యాయని గుర్తు చేశారు. దేశీయ ఉత్పత్తి, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందని చెప్పారు. శ్రీవీటీ నిర్వహిస్తున్న పరిశోధనల ద్వారా వివిధ మెటీరియల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, గత 25 ఏళ్లుగా ఈ వర్సిటీ దేశంలోని వివిధ సంస్థలతో కలసి పని చేసిందని చెప్పారు. ఈ సదస్సుకు గౌరవ అతిథిగా బిట్స్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంగోపాల్రావు హాజరయ్యారు. సదస్సులో టీ–హబ్ సీఈవో శ్రీనివాస్ మహంకాళీ, సీఎస్ఐఆర్ మాజీ డీజీ డాక్టర్ శేఖర్ మండే తదితరులు పాల్గొన్నారు. -
అబ్బురపరచిన ‘ప్రత్యేక’ ఆవిష్కరణలు.. స్ఫూర్తి నింపిన ప్రసంగాలు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) హైదరాబాద్లోని టీ హబ్ 2.0లో ఏర్పాటు చేసిన అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్ 4.0 (ATS 4.0) నాలుగో ఎడిషన్ ముగిసింది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘టీఎస్ఐసీ ఇన్క్లూషన్ టాక్స్’ పేరుతో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని టీఎస్ఐసీ నిర్వహించింది. దివ్యాంగులు, అంధులు, ప్రత్యేక అవసరాలవారు, విభిన్న ప్రతిభావంతులు ఇలా ప్రతిఒక్కరూ ఇతరులతో సమానంగా ముందుకు సాగడం, అభివృద్ధి సాధించడంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాత్రపై వివిధ సంస్థలు, ఎన్జీవోలకు చెందిన పలువురు తమ ప్రసంగాలను వినిపించారు. దీంతోపాటు దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల వ్యక్తుల కోసం రూపొందించిన అబ్బురపరిచే పలు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించారు. అసిస్టెక్ ఫౌండేషన్ (ATF) కోఫౌండర్, సీఈవో ప్రతీక్ మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత, ఎన్ఐఈపీఐడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ డా. అంబాడి, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కౌన్సెలర్ టి.వి. ఐశ్వర్య, భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహేందర్ వైష్ణవ్, ఐటీఈ&సీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, యూత్4జాబ్స్ వ్యవస్థాపకురాలు మీరా షెనాయ్ తదితరులు ప్రసంగించారు. సమగ్ర సమాజాన్ని రూపొందించడంలో ఆవిష్కరణల కీలక పాత్రపై తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టీఎస్ఐసీ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం పేర్కొన్నారు. -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్లో ఘజియాబాద్కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్ను రూపొందించింది. హైదరాబాద్కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది. -
24న స్టార్టప్ల ‘డీ2సీ అన్లాక్డ్’ సమావేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మర్చంట్ ఫస్ట్ చెకవుట్ నెట్వర్క్ సంస్థ సింపుల్, టీ–హబ్ సంయుక్తంగా జూన్ 24న హైదరాబాద్లో కమ్యూనిటీ ఆధారిత స్టార్టప్ వ్యవస్థాపకుల సమావేశం డీ2సీ అన్లాక్డ్ను నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఎడిషన్లు నిర్వహించగా ఇది పదోది. ఇందులో డీ2సీ సంస్థల వ్యవస్థాపకులు.. బ్రాండ్లకు గుర్తింపు, డిజిటల్ మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి, సింపుల్ సహ వ్యవస్థాపకులు నిత్యా శర్మతో పాటు హైదరాబాదీ బ్రాండ్లయిన స్కిపీ ఐసాపాప్స్ సహ వ్యవస్థాపకులు రవి కాబ్రా, గేర్ హెడ్ మోటర్స్ వ్యవస్థాపకుడు నిఖిల్ గుండా, పిప్స్ సీఈవో ప్రశాంత్ గౌరిరాజు తదితరు పాల్గొంటారు. డీ2సీ బ్రాండ్లను నిర్మించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశ్రమలోని తోటి వారితో సమావేశమయ్యేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండగలదని నిత్యా శర్మ తెలిపారు. -
సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ‘నల్సార్’న్యాయ విశ్వవిద్యాలయంతో కలిసి దేశంలోనే మొదటిసారిగా సైబర్ క్రైమ్ చట్టాన్ని తెస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. తెలంగాణ చేయబోయే సైబర్క్రైమ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. సోమవారం టీ–హబ్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం 2022–23’వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగ వృద్ధికి సంబంధించిన అన్ని సూచీల్లో రాష్ట్రం జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతోందని చెప్పారు. బెంగళూరుకు దీటుగా హైదరాబాద్ను నిలబెడతామని రాష్ట్ర అవతరణ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా.. కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక అనుమానాలు ఎదురైనా, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగినా తెలంగాణ తన సొంత ప్రణాళికలతో ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తూ వస్తోందని కేటీఆర్ చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే 9 ఏళ్లుగా ఐటీ శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నామని వివరించారు. అమెరికా, యూకే పర్యటనలో తాను సాధించిన పెట్టుబడి ప్రకటనలను, గత ఏడాది కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన వివరాలను కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటామని.. ప్రాథమిక మౌలిక వసతుల నుంచి అంతరిక్షం దాకా తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని, కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టి పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీలోనూ అద్భుత ప్రగతి ఫార్మా, బయో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 2032 నాటికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతాయని ప్రకటించిందని.. ఐటీఐఆర్ అమలు చేయకున్నా ఆ గడువుకు 9 ఏళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ రంగం మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్రావు, వీ హబ్ సీఈఓ దీప్తిరావు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏరోస్పేస్లో స్టార్టప్లకు ఊతం
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో కలిసి టీ–హబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ద్వారా వైమానిక, రక్షణ రంగాల మార్కెట్లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. స్టాటిస్టా సంస్థ నివేదిక ప్రకారం 2021 నుంచి 2027 మధ్య వైమానిక, రక్షణ రంగాల మార్కెట్ వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 13.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో టీ–హబ్, హెచ్ఏఎల్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ను అందుకునేదిశగా.. స్టార్టప్లకు అవసరమైన నైపుణ్యం, వనరులు, మార్కెట్తో అనుసంధానం, ఆవిష్కరణల కోసం అవసరమయ్యే సాయాన్ని టీహబ్, హెచ్ఏఎల్ సంయుక్తంగా సమకూరుస్తాయి. స్టార్టప్ల ఆవిష్కరణలకు రూపం ఇచ్చేందుకు ఏరోస్పేస్ రంగ నిపుణుల తోడ్పాటు ఇప్పించేందుకు హెచ్ఏఎల్ చర్యలు చేపడుతుంది. స్టార్టప్లకు అవసరమయ్యే మార్గదర్శనం, శిక్షణ, విజయం సాధించేందుకు అవసరమైన అన్ని వనరులను టీ–హబ్ సమకూరుస్తుంది. ఏరో స్పేస్ రంగంలో కొత్త అవకాశాలు: టీ–హబ్ సీఈఓ ఎంఎస్ఆర్ ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్లకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు హెచ్ఏఎల్తో తమ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. టీ–హబ్ వనరులు, హెచ్ఏఎల్ నైపుణ్యాల కలబోతతో స్టార్టప్ల ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో బలంగా ఉన్న ఆవిష్కరణల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్లను సరైన దిశలో నడిపేందుకు టీ–హబ్తో తమ భాగస్వామ్యం మంచి ఉదాహరణగా నిలుస్తుందని హెచ్ఏఎల్ (ఇంజనీరింగ్, పరిశోధన అభివృద్ధి) డైరక్టర్ డీకే సునీల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ ప్రణాళికలో భాగంగా పన్నులు పోగా మిగిలే హెచ్ఏఎల్ లాభాల్లో 2 శాతాన్ని సాంకేతిక రంగంలో పనిచేస్తున్న స్టార్టప్ల కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టీ–హబ్ ఇప్పటికే అనేక విజయాలు సాధించిందని వివరించారు. -
సాంకేతిక కేంద్రంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పారిశ్రామికవేత్తలు, నూతన ఆవిష్కర్తలకు తెలంగాణ రాష్ట్రం జాతీయ సాంకేతిక కేంద్రంగా మారిందని, అందులో‘టి–హబ్’పాత్ర కీలకమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన టి–హబ్ ఏడవ వార్షికోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన 26 స్టార్టప్ కంపెనీలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ఏడేళ్లలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్లోని ప్రభుత్వం, విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, పెట్టుబడిదారులు మొదలైన కీలక వాటాదారులతో స్టార్టప్లను అనుసంధానం చేయడంలో టి–హబ్ కృషి ఎంతో ఉందన్నారు. దేశ ఆర్థిక పునాదిని బలోపేతం చేయడంతోపాటు ప్రపంచస్థాయి సాంకేతిక అభివృద్ధికి ప్రేరణగా, ప్రపంచ పోటీదారుగా రాష్ట్రం నిలిచేందుకు టి–హబ్ ఉపయోగపడిందని తెలిపారు. -
తెలంగాణ స్టార్టప్ల హబ్.. ప్రపంచంలోనే అతిపెద్దది (ఫొటోలు)
-
స్టార్టప్ గుండె చప్పుడు ‘టీ–హబ్’ డబ్
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్రావు మంగళవారం ప్రారంభించనున్నారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఈ రెండో దశలో.. ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం గమనార్హం. మంగళవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీ–హబ్ సీఈవో ఎం.శ్రీనివాస్రావు సోమవారం పరిశీలించారు. అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ కావడంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మంగళవారం ఉదయమే సీఎం కేసీఆర్ టీ–హబ్ను ప్రారంభిస్తారని భావించినా.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్టార్టప్ రంగ నిపుణులతో సదస్సులు ఉండటంతో సాయంత్రానికి వాయిదా వేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్రెడ్డి, స్కైమోర్ వ్యవస్థాపకుడు దేశ్పాండ్, అథేరా వెంచర్స్ ఎండీ కన్వల్ రేఖి తదితరులతోపాటు సిలికాన్ వ్యాలీ ప్రముఖులు, పలు యూనికార్న్ల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కూ యాప్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, హీరో మోటార్స్, పోంటాక్, వెబ్ 3.0లతో టీ–హబ్ ఎంఓయూలు కుదుర్చుకోనున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తమ స్టార్టప్లు, యూనికార్న్ల ప్రతినిధులను సన్మానించనున్నట్టు వెల్లడించారు. టీ–హబ్ భవనం లోపలి దృశ్యం, పరిశీలిస్తున్న కేటీఆర్. చిత్రంలో రంజిత్రెడ్డి టీ–హబ్ 2.0 ప్రత్యేకతలివీ.. 2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ మొదటి దశ నిర్మించిన విషయం తెలిసిందే. అనూహ్య స్పందన లభించడం, అది విజయవంతం కావడంతో.. మరింత భారీగా టీ–హబ్ రెండో దశ (టీ–హబ్ 2.0)ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. రూ.400 కోట్ల వ్యయంతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ–హబ్ రెండో దశలో ఏకకాలంలో 4 వేల స్టార్టప్లకు అవసరమైన వసతి కల్పించవచ్చు. తొలిదశతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దదైన రెండోదశ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా అవతరించనుంది. టీ–హబ్ మొదటిదశలో ప్రాథమిక స్థాయి వసతులు అందుబాటులో ఉండగా.. తాజా రెండో దశలో అత్యాధునిక వసతులు జోడించారు. ‘స్పేసెస్’ అనే కొరియన్ సంస్థ టీ–హబ్ రెండో దశ భవనాన్ని అత్యంత సృజనాత్మకంగా ‘శాండ్ విచ్’ నమూనాలో డిజైన్ చేసింది. పది అంతస్తుల్లో టీ–హబ్ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతం ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది చివర వరకు అదనంగా నెలకో అంతస్తు చొప్పున వినియోగంలోకి తేనున్నారు. ఇందులో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. స్టార్టప్ సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్లో టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆవిష్కరణలకు రూపాన్ని ఇచ్చే ‘టీ–వర్క్స్’ను ఈ ఏడాది ఆగస్టులో, ఇమేజ్ సెంటర్ను మరో ఏడాదిన్నరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశలో ఎవరెవరికి అవకాశం ► మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ► ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, హైదరాబాద్లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. ► కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. ► ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు. ► ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది. ► వ్యక్తిగతంగా లేదా ఒక చిన్న బృందంగా ఏర్పడి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చే వారికి.. వారి ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన అన్ని హంగులు టీ–హబ్ 2లో అందుబాటులో ఉంటాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) టీ–హబ్ తొలిదశ స్ఫూర్తితో! ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 2015లో టీ–హబ్ తొలిదశ ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్లో కేవలం ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, జీనోమ్ వ్యాలీలో కలిపి మూడు ఇంక్యుబేటర్లు మాత్రమే ఉన్నాయి. టీ–హబ్ ఏర్పాటుతో ఆవిష్కరణల వాతావరణం పెరిగి ప్రస్తుతం 57 ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. టీ–హబ్ తొలిదశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1,100 స్టార్టప్లు మొదలవగా.. రూ.10 వేల కోట్ల ఫండింగ్ అందినట్టు అంచనా. మూడు యూనికార్న్లు (స్టార్టప్లుగా ప్రస్థానం మొదలుపెట్టి రూ.8వేల కోట్ల టర్నోవర్కు చేరుకున్న సంస్థలు) ఇక్కడి నుంచే ప్రస్థానం ప్రారంభించగా.. అందులో రెండు యూనికార్న్లు నేరుగా టీ–హబ్తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. తొలిదశలో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ స్టార్టప్లకు 20శాతం మేర కేటాయించారు. ఇదే తరహాలో రెండో దశలోనూ ఎమర్జింగ్ టెక్నాలజీ స్టార్టప్లకు ప్రాధాన్యత ఇస్తారు. – జయేశ్ రంజన్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రెండో దశలో ఎవరెవరికి అవకాశం మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుకు ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, హైదరాబాద్లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. వ్యక్తిగతంగా లేదా చిన్నబృందంగా ఏర్పడి కొత్త ఆలోచనతో వచ్చే వారికి.. ఆ ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన హంగులన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది. -
రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోలు మనుషులకు మద్దతు మాత్రమే ఇస్తాయని, మనుషుల స్థానాన్ని భర్తీ చేయవని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈఓ శ్రీకాంత్ సిన్హా తెలిపారు. రోబోలను తయారు చేయ డానికి, వాటి సేవలను విస్తృతపరచడానికి నగరంలోని టి–హబ్ వేదికగా అతిపెద్ద రోబోటిక్స్ ఆర్ అండ్ డి ఎకో సిస్టమ్తో హెచ్–ల్యాబ్ను హెచ్–బోట్స్ ఆవిష్క రించింది. గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరైన టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం లు మాట్లాడుతూ.. జనాభాలో 15 శాతం మంది వికలాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడపడానికి సహాయపడే రోబోలను తప్పనిసరిగా తయారు చేయాలని హెచ్–బోట్స్ను కోరారు. కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి రాష్ట్ర ఇన్నో వేషన్ సెల్ విశేషంగా కృషి చేస్తోందని డాక్టర్ శాంత థౌతం తెలిపారు. హెచ్–ల్యాబ్లతో రోబోటిక్స్ రంగంలో వినూత్న ఆవిష్కరణలను తీసుకురానున్నామని ఫౌండర్ కిషన్ పేర్కొన్నారు. -
సాంకేతిక సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: వాతావరణ పరిస్థితులు లేదా విద్రోహ చర్యల వల్ల తలెత్తబోయే ప్రమాదాలను రైల్వే సిబ్బంది ముందే పసిగట్టడంలో నెలకొన్న సాంకేతిక సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే.. ఇప్పుడు ఈ విషయంలో స్టార్టప్ కంపెనీల సాయం కోరుతోంది. ఈ మేరకు రూ. 3 కోట్ల వరకు ఆర్థికసాయం, మేధోహక్కుల కల్పన వంటి అంశాలతో కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై దక్షిణమధ్య రైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్కుమార్ జైన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు బృందంతో చర్చించింది. తొలుత 11 రకాల సమస్యలను స్టార్టప్ల ముందుంచింది. దీనికి టీ–హబ్ సానుకూలంగా స్పందించింది. 11 సమస్యలు ఇవే.. 1. విరిగిన పట్టాను గుర్తించే సాంకేతికత కావాలి. 2. పట్టాలపై ధ్వంసమయ్యేంత ఒత్తిడి ఉంటే ముందుగానే గుర్తించగలగాలి. 3. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంపు సమస్యను అధిగమించే ఏర్పాటు కావాలి. 4.రైల్వే ట్రాక్ తనిఖీలో కచ్చితత్వం ఉండే వ్యవస్థతోపాటు అన్ని లోపాలను సులభంగా గుర్తించే సాంకేతికత కావాలి. 5. అధిక బరువు వల్ల వ్యాగన్ల చక్రాలు దెబ్బతినే పరిస్థితి ఉంటే దాన్ని ముందే గుర్తించే వ్యవస్థ కావాలి. 6. ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్కు సంబంధించి 3 ఫేజ్ కరెంటును వాడే వాటిల్లో సమస్యలు ఆన్లైన్లో గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేయాలి. 7. గూడ్సు రైళ్లలో ఎక్కువ సరుకు పట్టేలా వ్యాగన్లను ఎలా మార్చాలి. 8.ట్రాక్ను మెరుగ్గా శుభ్రం చేసే సులభ విధానం కావాలి. 9. సిబ్బందికి పునఃశ్చరణ కోర్సులకు సంబంధించి యాప్లు రూపొందించాలి. 10.వంతెనల తనిఖీ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ద్వారా జరిగేలా సాంకేతికత రూపొందించాలి. 11. ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం డిజిటల్ వ్యవస్థ కావాలి. -
ఫాల్కన్ ఎక్స్తో ‘టీ–హబ్’ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన టెక్నాలజీ యాక్సలేటర్ ‘ఫాల్కన్ ఎక్స్’ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించనున్న గ్లోబల్ స్టార్టప్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ల సమ్మేళనం)లో రాష్ట్రానికి చెందిన టీ–హబ్ భాగం పంచుకోనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలనుకొనే భారతీయ అంకుర సంస్థలు పాల్గొనాలని ఆహ్వానించింది. అత్యంత ప్రభావం చూపగలిగే స్టార్టప్లను ఎంపిక చేసేందుకు, కొత్త మార్కెట్లలో ప్రత్యేకించి అమెరికాలో ఆయా స్టార్టప్లు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని పేర్కొంది. జూలైలో మొదలయ్యే ఈ కార్యక్రమం 5 వారాలపాటు కొనసాగనుంది. వందకుపైగా వెంచర్ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ కంపెనీలు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపుతుండగా మూడు అత్యుత్తమ స్టార్టప్లకు లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున ఫాల్కన్ ఎక్స్ నిధులు అందించనుంది. స్టార్టప్లు తమ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఫాల్కన్–ఎక్స్తో కుదిరిన భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్రావు తెలిపారు. ప్రపంచ స్టార్టప్ రంగంలో భారతీయ స్టార్టప్లకు శరవేగంగా గుర్తింపు లభిస్తోందని ఫాల్కన్–ఎక్స్ సహ వ్యవస్థాపకుడు మురళి చీరాల అన్నారు. టెక్నాలజీ నిపుణులు, పెట్టుబడిదారులైన బీవీ జగదీశ్, రాజిరెడ్డి, ఆశుగుప్తా, ప్రదీప్ ఆస్వాని, ప్రవీణ్ అక్కిరాజు తదితరులు ఫాల్కన్–ఎక్స్లో మురళి చీరాలతో కలిసి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. -
ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు!
ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లు చోటు సంపాదించారు. ఈ విషయాన్ని టీ-హబ్ తన ట్విటర్ వేదికగా పోస్టు చేసింది. టీ-హబ్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఆ ముగ్గురికి అభినందనలు తెలిపారు. టీ-హబ్ తన ట్విటర్ వేదికగా ఇలా పోస్టు చేసింది.. "ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 #ForbesIndia30U30 జాబితాలో చోటు సంపాదించిన అనిల్ కుమార్ రెడ్డి(26), సందీప్ శర్మ(26), సారంగ్ బోబాడే(26)లకు అభినందనలు. నేడు, సామాజిక కారణాలకు మేము ఎలా మద్దతు ఇస్తున్నామో పునర్నిర్వచించడం మా #Lab32 ఉద్దేశ్యం" అని పేర్కొంది. డొనేట్ కార్ట్ దాతలు చేస్తున్న సాయం.. భాదితులకు సక్రమంగా అందుతుందా అన్న అనుమానాలు తలెత్తకుండా హైదరాబాద్కు చెందిన అనిల్ కుమార్ రెడ్డి(26), సందీప్ శర్మ(26), సారంగ్ బోబాడే(26) డొనేట్ కార్ట్ పేరిట ఈ ఆన్లైన్ వేదికను ప్రారంభించారు. నాగ్పూర్ ఐఐటీలో చదివిన వీరు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో పలువురు దాతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేగాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకు వచ్చే దాతలు.. వారిచ్చే సామగ్రిపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా పని చేసేందుకు అనేక ఎన్జీవోలు ఉన్నాయని గుర్తించిన వారు ఓ ఆలోచన చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయం తెరిచి https://www.donatekart.com వెబ్సైట్ను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1500 స్వచ్ఛంద సంస్థలను ఇందులో చేర్చి వాటికి వారథిగా మారారు. 👏👏👏 https://t.co/u53d8z1iib — KTR (@KTRTRS) February 7, 2022 ఇన్నోవేషన్ అవార్డు ఎంపిక ఎవరైనా దాతల సాయం కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో నమోదు చేసుకొని వారికి కావాల్సిన అవసరాన్ని వివరించాలి. అప్పుడు వారి విజ్ఞప్తిని ఎన్జీవోలు, దాతలు పరిశీలించి నేరుగా వెళ్లి సాయం చేస్తారు. ఇలా నాలుగేండ్లలో దాదాపు రూ.70 కోట్ల క్రౌడ్ ఫండింగ్ సమకూర్చి నిస్సాహాయులు, పేదలు, నిరాశ్రయులకు లబ్ధి చేకూర్చారు. కేవలం కొవిడ్ పంజా విసిరిన కాలంలోనే రూ.55 కోట్ల క్రౌడ్ ఫండింగ్తో అనేక వర్గాలకు సాయం చేశారు. దీంతో డొనేట్ కార్ట్ వ్యవస్థాపకుల కృషిని గుర్తించిన నాస్కామ్ 2018లో ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపిక చేయగా.. మంత్రి కేటీఆర్ వారికి అందజేశారు. ఇప్పటి వరకు పది లక్షల మంది దాతలు 1,000 ఎన్జీవోలకు రూ.150 కోట్లకు పైగా విరాళాలు అందించారు. (చదవండి: చదువు కోసం ఎన్ని కష్టాలో ? పేటీఎం విజయ్ శేఖర్ శర్మ!) -
ఆవిష్కరణలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఔత్సాహిక యువతకు సేవలు అందిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ హబ్’కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్ కార్యకలాపాలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి సంస్థలు ఏర్పాటైనట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్’ద్వారా గ్రామీణ యువతకు, విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. పాఠశాల విద్యార్థుల వినూత్న ఆలోచనలకు అండగా నిలిచేందుకు పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్ కల్చర్ను అలవాటు చేయాలని, ఈ దిశగా విద్యా శాఖతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. టీ హబ్ ద్వారా సాంకేతిక ఆవిష్కరణలతో పాటు గ్రామీణ, సామాజిక ఆవిష్కరణల పైనా దృష్టి సారించాలన్నారు. వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్, వీ హబ్ వంటి సంస్థల ద్వారా సహకారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో రవి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. టీ హబ్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కార్యకలాపాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
ఇతర ప్రాంతాలకూ ‘నెక్సస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ స్టార్టప్లకు తోడ్పాటునిచ్చేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటైన ’నెక్సస్ స్టార్టప్ హబ్’ తాజాగా ఇతర ప్రాంతాలకూ కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. టి–హబ్ తరహా భాగస్వాములతో జట్టు కట్టే దిశగా చర్చలు జరుపుతోంది. సోమవారమిక్కడ టి–హబ్లో డిఫెన్స్ స్టార్టప్స్ వర్క్షాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎరిక్ అజూలే ఈ విషయాలు తెలియజేశారు. అమెరికా ప్రభుత్వ సహకారంతో నెక్సస్ స్టార్టప్ హబ్ తొలిసారిగా భారత్లోనే ఏర్పాటైందని ఆయన చెప్పారు. ‘‘దీనిద్వారా ఇప్పటిదాకా 93 స్టార్టప్ సంస్థలకు శిక్షణ అందించాం. సుమారు రెండేళ్ల కాలంలో ఇవి దాదాపు 5.6 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించాయి. వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి’’ అని ఎరిక్ వివరించారు. మరోవైపు, రక్షణ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారంతో ముందుకెడుతున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ (తాత్కాలిక) ఎరిక్ అలెగ్జాండర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి వర్క్షాప్లు తోడ్పడతాయన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్ను హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఇందులో మార్ఫిడో టెక్నాలజీస్, కాన్స్టెలీ సిగ్నల్స్ వంటి 15 పైగా స్టార్టప్లు పాల్గొంటున్నాయి. రక్షణ రంగంలో వ్యాపారావకాశాల గురించి స్టార్టప్ సంస్థలు అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ నెల 18, 19న హైదరాబాద్లోనే జరగనున్న అమెరికా– భారత్ రక్షణ రంగ సదస్సులో కూడా పాల్గొనే అవకాశం స్టార్టప్స్కు దక్కనుంది. దిగ్గజాలతో అవకాశాలకు వేదిక.. లాక్హీడ్ మార్టిన్ వంటి రక్షణ రంగ దిగ్గజ సంస్థల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఇలాంటి వర్క్షాప్లు తోడ్పడతాయని స్టార్టప్ సంస్థ కాన్స్టెలీ సిగ్నల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సత్య గోపాల్ పాణిగ్రాహి తెలిపారు. కీలకమైన మేథోహక్కులు, దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాల గురించి అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుం దని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాడార్ సిమ్యులేషన్ సిస్టమ్స్ను రూపొందించే కాన్స్టెలీ సిగ్నల్స్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. సహ వ్యవస్థాపకుడు అవినాష్ రెడ్డితో పాటు నలుగురితో ప్రారంభమైన తమ సంస్థలో ప్రస్తుతం 12 మం ది సిబ్బంది ఉన్నారని పాణిగ్రాహి తెలిపా రు. దేశీయంగా ఇప్పటిదాకా రెండు సిస్టమ్స్ విక్రయించామని, వీటి ఖరీదు రూ. 50 లక్షల నుంచి రూ.8–10 కోట్ల దాకా ఉంటుందని తెలిపారు. -
హైదరాబాద్ కుర్రాడి ‘ఆసీ టికెట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత పాశం భరత్రెడ్డికి చక్కగా సరిపోతుంది. సొంతగడ్డపై రెండు కంపెనీలు ఏర్పాటు చేసి... విజయవంతంగా నడిపిస్తున్న భరత్రెడ్డి... టీ–హబ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆస్ట్రేలియాలోనూ అడుగుపెట్టాడు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్ల్యాండ్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్లో చేరి... అక్కడా వ్యాపారావకాశాలు వెదికాడు. ఆస్ట్రేలియాలో వ్యవస్థీకృతంగా స్పోర్ట్, ఈవెంట్స్కు ముందుగా టికెట్లు బుక్ చేసుకునే పూర్తి స్థాయి ఆన్లైన్ సౌకర్యం లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారంగా మార్చి ‘ఆసీ టికెట్’ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. దీనికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫండ్ రూపంలో సాయం చేసింది కూడా!!. కంపెనీ విశేషాలు ఆయన మాటల్లోనే.. వారికి పెద్ద ఉపశమనం.. వీకెండ్ వచ్చిందంటే ఆస్ట్రేలియాలో అత్యధికులు సైక్లింగ్, బోటింగ్, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, మోటార్ రేసెస్, క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడల్లో మునిగిపోతారు. ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే టికెట్లు ఆన్లైన్లో కొనుక్కునే అవకాశం లేకపోవడం. క్రీడా స్థలంలోనే టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆస్ట్రేలియా ప్రభుత్వ సిడ్నీ స్టార్టప్ హబ్లో మా ప్రణాళికను వారి ముందుంచాం. మా బ్లూ ప్రింట్ చూసి వారు మెచ్చుకున్నారు. రూ.10 లక్షల సీడ్ ఫండ్ సమకూర్చారు. భవిష్యత్తులో మరింత ఫండ్ దక్కే అవకాశమూ ఉంది. మా సేవల ద్వారా ఇప్పుడు స్థానికులకు పెద్ద ఉపశమనం లభించనుంది. నవంబరులో పూర్థి స్థాయిలో.. ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్టు నిర్వహించాం. విజయవంతంగా పలు ఈవెంట్ల టికెట్లు విక్రయిం చాం. నవంబరు 26న ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 క్రికెట్ మ్యాచ్ ఉంది. దీనికోసం మూడో వారంలోనే యాప్ను అందుబాటులోకి తెస్తాం. ఈ యాప్ కూడా హైదరాబాద్లోని మా కంపెనీలో రూపుదిద్దుకుంటోంది. డిసెంబరులో పెద్ద ఎత్తున ఫుట్బాల్ మ్యాచ్లున్నాయి. మంచి సీజన్ కూడా. ఇది మాకు కలిసి వస్తుంది. ఆసీటికెట్.కామ్లో ఐదుగురు సభ్యులం పనిచేస్తున్నాం. హైదరాబాద్ టీహబ్లో మేం ఏర్పాటు చేసిన సంక్రంక్ గ్రూప్, ఇండియాఈలెర్న్ సంస్థల్లో ప్రస్తుతం 18 మంది పనిచేస్తున్నారు’’ అని భరత్రెడ్డి వివరించారు. -
టీ హబ్ పనితీరు భేష్: యూఏఈ మంత్రి
హైదరాబాద్: నగరంలోని టీ హబ్ పనితీరు బేషుగ్గా ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని టీహబ్ను ఆయన శుక్రవారం సందర్శించారు. టీ హబ్ వద్ద రాష్ట్ర ఐటీ మంత్రి కె తారకరామారావు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ యూఏఈ మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం టీ హబ్లో అన్నిప్రధాన ప్రాంతాలను, స్టార్టప్లను, సమావేశ గదిని, నిర్మాణాన్ని షేక్ అబ్దుల్లా పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యాపార అవకాశాలను మరింత మెరుగుపర్చేందుకు యూఏఈని సందర్శించాలని కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. యూఏఈ మద్దతుతో మార్కెటును దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తులు, సమస్యల పరిష్కారం దిశగా స్టార్టప్ల రూపకల్పనకు చొరవ చూపేందుకు ఇద్దరు మంత్రులు అంగీకరించారు. సహజసిద్ధ వనరులు, నీరు వంటి అంశాలపై సంయుక్తంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఆయనకు కేటీఆర్ వివరించారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్గా టీ హబ్ను రూపొందించామని, ఇంతకన్నా మరింత పెద్దగా టీ హబ్–2 తుది మెరుగులు దిద్దుకుంటోందన్నారు. ఆగస్టులో బ్లాక్ చైన్ కాంగ్రెస్ బ్లాక్చైన్ టెక్నాలజీపై పూర్తిస్థాయి దృష్టి పెడుతున్నామని, ఇది సమస్యల పరిష్కారంలో ఎంతో ఉపయుక్తంగా ఉందని యూఏఈ మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు మొదటివారంలో హైదరాబాద్లో అంతర్జాతీ య స్థాయి బ్లాక్చైన్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్నామని, ఇందులో పాల్గొనాలని యూఏఈ మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. యూఎస్పీ శిక్షణ కేంద్రం భారతదేశంలో నాణ్యమైన ఔషధాలు తయారీ లక్ష్యంగా ఫార్మారంగంలోని వారికి, ఇతర గ్రాడ్యుయేట్లకు మార్గదర్శిగా నిలిచే ప్రతిష్టాత్మక యూఎస్పీ శిక్షణ సంస్థ హైదరాబాద్లో శుక్రవారం కొత్తగా ప్రారంభమైంది. ఒక మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ప్రతిష్టాత్మక యూఎస్పీ శిక్షణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, యూఎస్పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.వి.సురేంద్రనాథ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. -
ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఐఫా ఉత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీ-హబ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన స్వరమాత్రికుడు ఏఆర్ రెహమాన్.. తెలంగాణ సర్కారును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'క్రియేటివిటీ ఇన్ ఇన్నోవేషన్' అనే అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్లో రెహమాన్, సౌండ్ డిజైనర్ రసూల్ పోకుట్టి, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్లు పాల్గొన్నారు. నిర్దేశిత అంశంపై దాదాపు గంటపాటు సాగిన డిస్కషన్లో రెహమాన్, రసూల్లు అనేక విషయాలు చెప్పుకొచ్చారు. రెహమాన్ మాట్లాడుతూ.. 'ఇది(టీ-హబ్) గవర్నమెంట్ బిల్డింగ్ కదా.. చాలా బాగుంది. ఇక్కడి గవర్నమెంట్ కూడా నాకు బాగా నచ్చింది'అని ప్రశంసించారు. అటుపై తన కెరీర్ ప్రారంభాన్ని గుర్తుచేసుకుంటూ.. సంగీతమే జీవితం అవుతుందని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు. 'సంగీతం కోసమే నేను పుట్టానన్న విషయం నాకెప్పుడూ తెలియదు. కానీ మా అమ్మ మాత్రం దాన్ని బలంగా నమ్మింది. ఏనాటికైనా నేనొక మంచి సంగీతకారుణ్ని అవుతానని ఆమె విశ్వసించింది. కెరీర్ ప్రారంభంలో.. సంగీత పరికరాలు, సరంజామా ఏదీ లేని నా రికార్డింగ్ రూమ్లో కూర్చొని.. ఎప్పటికైనా ఈ గదినిండా సంగీత పరికరాలు నిండిపోవాలని అనుకునేవాణ్ని' అని రెహమాన్ చెప్పారు. '1986 తర్వాత బయటి సంగీత దర్శకుల దగ్గర పని చేయడం మానేసి, సొంతగా ప్రాక్టీస్ మొదలుపెట్టా. నిరంతరం నేర్చుకోవడం, సాధన చేయడమే సంగీత రంగంలో అసలైన పెట్టుబడి. అవకాశాల గురించి ఆలోచించకుండా సాధనపైనే దృష్టిపెట్టా. మనం ఎంత సమర్థులమైతే మన దగ్గరికి అంతమంది వస్తారు. ఆ తర్వాత మన స్థాయిని ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి. మరింత ఉత్సాహాన్ని నింపుకోవాలి. అప్పుడు వెనకబడిపోవటం అనేది జరగదు' అని రెహమాన్ సందేశం ఇచ్చారు. రసూల్ పోకుట్టి మాట్లాడుతూ 'సౌండ్ మిక్సింగ్ అనేది కూడా ఓ కళేనని నాకు అవార్డు ('స్లమ్డాగ్ మిలియనీర్'కు) వచ్చేదాకా చాలా మందికి అర్థం కాలేదు. సౌండ్ మిక్సింగ్లో ఆసియా వాసికి ఆస్కార్ రావడానికి 81 ఏళ్లు పట్టిందటేనే అర్థం చేసుకోవచ్చు.. దానిపై మనకున్న అవగాహన ఏమిటో! మనం ఏం చదివామనేది కాకుండా ఎంత నేర్చుకున్నాం అనేదానిపైనే నిలదొక్కుకోగలం'అని అన్నారు. -
హైదరాబాద్లో క్వాల్కామ్ ఇన్నోవేషన్ ల్యాబ్
టీ–హబ్తో చేతులు కలిపిన కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్... హైదరాబాద్లో ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తోంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో ఇలాంటి ల్యాబ్ ఒకటుంది. హైదరాబాద్లో ఉన్న కంపెనీ కార్యాలయంలో ఏప్రిల్లో ఈ ల్యాబ్ను నెలకొల్పుతున్నట్టు క్వాల్కామ్ ఇండియా ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శశి రెడ్డి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. స్టార్టప్లు తమ వ్యాపార ప్రణాళికను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ఈ ల్యాబ్ దోహదం చేస్తుందన్నారు. స్టార్టప్లు అభివృద్ధి చేసిన ఉత్పాదనకు అనుగుణంగా చిప్ల డిజైన్ చేపడతామని వెల్లడించారు. కాగా, కంపెనీ ఎంపిక చేసిన స్టార్టప్లకే ల్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా (క్యూడీఐపీ) కార్యక్రమం కింద దేశంలో కంపెనీ సుమారు రూ.60 కోట్లు వ్యయం చేస్తోంది. స్టార్టప్లకు ఫండింగ్.. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా టీ–హబ్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీ–హబ్ ఫౌండర్ శ్రీనివాస్ కొల్లిపర, సీఈవో జయ్ కృష్ణన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. టీ–హబ్లో ఒక ల్యాబ్ను సైతం క్వాల్కామ్ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్, స్మార్ట్ సిటీస్ లక్ష్యంగా పనిచేస్తున్న స్టార్టప్లు ఈ ల్యాబ్ను వినియోగించుకోవచ్చు. టీ–హబ్ మెంటార్గా వ్యవహరిస్తుంది. ఇక క్యూడీఐపీలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 14 స్టార్టప్లను ఎంపిక చేసి ఒక్కొక్కదానికి రూ.6.80 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారు. ఫైనల్స్కు చేరిన నాలుగు కంపెనీలకు ఒక్కోదానికి రూ.68 లక్షలు ఇస్తామని శశి రెడ్డి తెలిపారు. -
డిజిటల్ తెలంగాణకు గూగుల్ సాయం
రాష్ట్ర ప్రభుత్వం–గూగుల్ మధ్య ఒప్పందం సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ తెలంగాణకు గూగుల్ తనవంతు సాయం అందించనుంది. క్లౌడ్ టెక్నాలజీ వినియోగం, గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు, చిన్న, మధ్యతరహా వ్యాపారాల్లో ఆన్ లైన్ వినియోగంలో ప్రభుత్వానికి సహకారం అందించనుంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం–గూగుల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్, గూగుల్ ఇండియా డైరెక్టర్ చేతన కృష్ణ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. టీహబ్లో ప్రారంభించిన స్టార్టప్లకు క్లౌడ్ వినియోగంలో గూగుల్ సహకరించనుంది. రాష్ట్రంలో బీటెక్, ఎంసీఏ విద్యారు్థలకు ఆండ్రాయిడ్లో శిక్షణకు కోర్సులు ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ వెబ్సైట్లను మొబైల్ ఫ్రెండ్లీగా మార్చడానికి సహకరిస్తుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఆన్ లైన్ పాయాలను కల్పించడం, గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటల్ తెలంగాణ సాధనలో గూగుల్ ముఖ్య భాగస్వామి అని, భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాల్లో గూగుల్ సహకారం తీసుకుంటామన్నారు. -
చేయిచేయి కలిపితే అసాధ్యమేమీ లేదు
శాస్త్ర పరిశోధనలను వ్యాపారస్థాయికి అభివృద్ధి చేయడమే ‘రిచ్’ లక్ష్యం ⇒ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ⇒ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభం ⇒ ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు లాభాలపై దృష్టి పెట్టాలి: సుజనా ⇒ ఇది వినూత్న ప్రయత్నం: ప్రఖ్యాత శాస్త్రవేత్త మషేల్కర్ సాక్షి, హైదరాబాద్: టీ–హబ్తో సృజనాత్మక తను, టీ–ఐపాస్తో ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలును సులభతరం చేసిన తెలంగాణ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాల పరిశోధనల ఫలితాలను సామాన్యుల చెంతకు చేర్చేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని అన్ని పరిశోధన శాలలు, అత్యున్నత విద్యాసంస్థలు, పారిశ్రా మికవేత్తలు, పెట్టుబడిదారులను ఒక దగ్గరకు చేరు స్తూ.. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్)ను ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనలకు విలువలు జోడించడం, వాటిని ఉత్పత్తులు, సేవలుగా మార్చడంలో ఎదు రవుతున్న ఇబ్బందులను పరిష్కరించడం తోపాటు వ్యాపారస్థాయికి అభివృద్ధి చేయడం రిచ్ ప్రధాన లక్ష్యాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రిచ్ సంస్థ ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడి ఐఐసీటీలో జరిగిన సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో మేథోసంపత్తికి కొరత లేదని, అయితే ఎవరికి వారు తమదైన పంథాలో ఒంటరిగా పనిచేయడం వల్ల దేశం అగ్రస్థానానికి ఎదగలేకపోతోందని, ఈ కొరతను తీర్చే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం రిచ్ను ఏర్పాటు చేసిందని, చేయిచేయి కలిపితే అసాధ్యమేమీ లేదని అన్నారు. ఐఐసీటీ, సీసీఎంబీ, ఇక్రిశాట్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టి ట్యూట్తోపాటు మేథోహక్కుల పరిరక్షణ కోసం నల్సార్, వ్యాపార అవకాశాల విస్తరణ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రిచ్తో కలసి పనిచేస్తాయని వివరించారు. అత్యధిక యువశక్తి కలిగిన భారత్ ఆలోచించడం మొదలుపెడితే ఊహించని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయన్నారు. భాగ్యనగరంలో అందుబాటులో ఉన్న వృత్తినైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, ఫార్మా, రక్షణ రంగ పరిశ్రమల విస్తృతులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధిలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు రిచ్ ఉపయో గపడుతుందని చెప్పారు. రక్షణ రంగంలో పనిచేస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు హైదరాబాద్లోనే దాదాపు వెయ్యి వరకూ ఉన్నాయని, వీటన్నింటి ద్వారా నగరానికి సమీప భవిష్యత్తులో రూ.30 వేల కోట్ల వ్యా పారం రానుందని అన్నారు. కేంద్రం అందించే నిధులతో పరిశోధనలు చేస్తున్న ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు లాభాలపై దృష్టి పెట్టాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనాచౌదరి పేర్కొన్నారు. ‘రిచ్’ ఏర్పాటు చారిత్రాత్మకం.. ‘రిచ్’ ఏర్పాటు చారిత్రాత్మకమైన విషయమని, పారిశ్రామిక, పరిశోధన, వ్యా పార సంస్థలు కలసికట్టుగా చేపట్టే కార్యక్రమం ప్రపంచంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదని సీఎస్ఐ ఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ఏ మషేల్కర్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటవుతున్న రిచ్ ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను డిజైన్ చేయడం తోపాటు వాటిని ఇక్కడే తయారు చేయడం ద్వారా ఉపాధి కల్పనకు అవకాశం లభిస్తుందన్నారు. రిచ్ సంస్థలో రూ.50 కోట్లతో రీసెర్చ్ టు మార్కెట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమితులైన ఐఎస్బీ మాజీ ఉపకులపతి అజిత్ రంగ్నేకర్ మాట్లా డుతూ.. సీఎస్ఐ ఆర్, డీఆర్డీవో సంస్థలతో పాటు అనేక సంస్థలను భాగస్వాములను చేస్తామని, ఒకట్రెండు ఏళ్లలో మరిన్ని ఆవిష్కరణలు చేయడం తోపాటు వాటిని వాణిజ్య స్థాయికి చేరు స్తామన్నారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పాపారావు, రెడ్డీస్ ల్యాబ్స్, శాంతా బయోటెక్ అధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
నోవార్టిస్తో టీ-హబ్ ఎంవోయూ
హైదరాబాద్: ఆరోగ్య రంగంలో సాంకేతికతను పెంచేదిశగా టీ-హబ్ నోవార్టిస్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్(ఎన్హెచ్పీఎల్)తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. రాష్ట్రంలో హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్టెక్ అంశాల్లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీహబ్తో కలిసి నోవార్టిస్ పనిచేస్తుంది. నోవార్టిస్కు చెందిన ఆరోగ్య, పరిశోధన, అభివృద్ధి రంగాల నిపుణులు టీ-హబ్ సమన్వయంతో స్టార్టప్ సంస్థలకు మార్గనిర్దేశం చేస్తారని టీ-హబ్ సీఈవో జే కృష్ణన్ తెలిపారు. ఫార్మారంగంలో మరిన్ని పరిశోధనలకు ఈ అవగాహన ఒప్పందంతో ఎంతో తోడ్పడుతుందని నోవార్టిస్ ప్రతినిధి సుబోధ్ దేశ్ముఖ్ తెలిపారు. -
సృజనాత్మకతతోనే స్టార్టప్లు
♦ మద్రాస్ ఐఐటీలో మంత్రి కేటీఆర్ ♦ పరిశోధనలకు మరింత ఊతమివ్వాలి ♦ ఐఐటీలతో పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తేనే దేశంలో అంకుర పరిశ్రమ (స్టార్టప్)ల వాతావరణం వృద్ధి చెందుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఉన్నత ప్రమాణాలతో బోధించే ఐఐటీ తరహా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వాలని కోరారు. కొత్త తరం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన జరగాలని... ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్ వంటి సంస్థలను నెలకొల్పిందని తెలిపారు. దేశంలో స్టార్టప్ల బలోపేతం అంశంపై సోమవారం మద్రాస్ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని తెలిపారు. యువశక్తిని గుర్తించాలి.. యువశక్తిని గుర్తిస్తూ కొత్త భారతాన్ని నిర్మించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని... యువత పరిశోధనల వైపు మళ్లినప్పుడే ఫేస్బుక్, టెస్లా తరహా వినూత్న ఆవిష్కరణలు మన దేశంలోనూ సాధ్యమవుతాయని పేర్కొన్నారు. దేశ యువత ఐటీ రంగంలో విస్తృత నైపుణ్యం కలిగి ఉందని.. దానిని స్టార్టప్ల రంగంతో అనుసంధానం చేయాల్సిన అవసర ముందని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన టీ–హబ్, కొత్తగా ఏర్పాటు చేసే టీ–టవర్స్ లాంటి కార్యక్రమాలను దేశంలోని ప్రతి ఒక్క యువకుడు, విద్యార్థి ఉప యోగించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా టీ–హబ్ పనితీరు, స్టార్టప్ ఈకో సిస్టంకు అందిస్తున్న ప్రోత్సాహం, టీ–బ్రిడ్జ్ ద్వారా సిలి కాన్ వ్యాలీతో అనుసంధానం కోసం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ వివరించారు. ప్రతిష్టాత్మక ఐఐటీ వంటి సంస్థలతో కలసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తన ప్రసంగం తర్వాత విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ భాస్కర్ రామూర్తి, పరిశ్రమలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి త్రైమాసికంలో శంకుస్థాపనలు
కొత్త ఐటీ, పరిశ్రమల ప్రాజెక్టులపై కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇమేజ్ టవర్, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం తలపెట్టిన ఎస్ఎంఈ టవర్, టీ–హబ్ రెండో దశ ప్రాజెక్టుల భవన నిర్మాణ పనులకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పరిశ్ర మలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మీ సేవా కేంద్రాల సేవలను మరింత విస్తరింపజేయాలన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల పనితీరుపై శుక్ర వారం సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలు, ఐటీ శాఖల్లో ఫైళ్లను 48 గంటల్లో పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఏడాదిలో నూతన ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ లు పని చేయాలన్నారు. టీఎస్–ఐపాస్ తర హా విప్లవాత్మక విధానం ద్వారా పరిశ్రమల శాఖ గతేడాది గణనీయ పురో గతి సాధించిందన్నారు. తెలంగాణ వస్తే పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వెళ్లిపోతాయన్న ప్రచారాన్ని తిప్పి కొట్టి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలిపారని పరిశ్రమల శాఖ ఉద్యోగులను మంత్రి అభినందించారు. కొత్త పరిశ్రమలతో పాటు ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు సహకారం కోసం కొత్త కార్యక్రమాలను రూపొందిచాలని కోరారు. మహిళా, దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, మానవీయ కోణంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఢిల్లీ రెసిండెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
మారిషస్ ప్రధానితో కేటీఆర్ భేటీ
ఆవిష్కరణలు, పర్యాటకం, నైపుణ్య రంగాల్లో భాగస్వామ్యంపై చర్చ సాక్షి, హైదరాబాద్: ముంబై పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం మారిషస్ ప్రధానమంత్రి అనెరుధ్ జుగ్నాథ్తో సమావేశ మయ్యారు. ఆవిష్కరణలు, పర్యాటకం, నైపుణ్యం, ఆయుష్ రంగాల్లో పరస్పర భాగ స్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. రెండేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాల కోసం టాస్క్ ఏర్పాటు చేసి చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యా ర్థులు, యువకులను ఉద్యోగార్థులుగా తీర్చిది ద్దే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య వారిధిగా వ్యవహరిస్తూ టాస్క్ ఆధ్వ ర్యంలో చేపడుతున్న శిక్షణా కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు. అదే విధంగా నైపుణ్య శిక్షణా రంగంలో మారిషస్ అద్భు తమైన ప్రగతి సాధించిందని కొనియాడిన కేటీఆర్ ఆ అనుభవాలను తెలంగాణతో పంచుకోవాలని కోరారు. ఇందుకోసం అధి కారికంగా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కేటీఆర్ ఆసక్తి కనబరిచారు. పర్యాటక రంగంలో సహకారం ఆవిష్కరణల రంగంలో దేశానికే రోల్మోడల్ గా నిలిచిన టీ-హబ్ ఈ మధ్యే ఏడాది పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. దేశంలో ఇన్నో వేషన్ ఎకో వ్యవస్థను టీ-హబ్ బలోపేతం చేసిందని, విజయవంతమైన ఈ ప్రయో గాన్ని విసృ్తతపర్చేందుకు టీ-హబ్-2ను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, మారిషస్ మధ్య అవగాహన ద్వారా ఈ రంగంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేగాకుండా తెలంగాణ నుంచి మారి షస్కు పర్యాటకులు భారీగా వెళతారని, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు మారి షస్కు పరిచయం చేసేందుకు ఈ పరిణామా న్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో తెలంగాణ, మారిషస్ పరస్పరం సహకరించుకోవాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రగతి అభినందనీయం జుగ్నాథ్ మాట్లాడుతూ పలుసార్లు తెలంగాణ ను సందర్శించిన తమ దేశ ప్రతినిధి బృం దాలు ఇక్కడి విధానాల గురించి సానుకూల త వ్యక్తం చేశాయన్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన రెండేళ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతి అభినందనీయమన్నారు. విభిన్న రం గాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళుతున్న తెలంగాణలాంటి రాష్ట్రంతో పరస్పర అవగా హనకు, భాగస్వామ్యానికి మారిషస్ సిద్ధంగా ఉంటుందని కేటీఆర్కు హామీ ఇచ్చారు. -
స్టార్టప్స్కు టీ సర్కారు అండ
హైదరాబాద్ : దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ-హబ్ను ఏర్పాటు చేసి స్టార్టప్స్ను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరింత మంది ఔత్సాహికులకు బాసటగా నిలవాలని నిర్ణయించింది. అద్దె, విద్యుత్ చార్జీలు, ఇంటర్నెట్ వ్యయాల్లో కొంత మొతాన్ని భరించాలని యోచిస్తున్నట్టు తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) వెల్లడించారు. టీ-హబ్ వెలుపల ఉన్న ఇతర ఇంక్యుబేటర్లు, కార్యాలయాల్లోని స్టార్టప్స్కు తోడ్పాటు అందించి వాటి అభివద్ధిలో పాలుపంచుకుంటామని చెప్పారు. గచ్చిబౌలిలో జెడ్ గ్లోబల్ ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ ఎస్ఎంఈల కోసం ఎస్ఎంఈ టవర్ను గచ్చిబౌలిలో నెలకొల్పుతామని పేర్కొన్నారు. హైదరాబాద్లో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న డేటా అనలిటిక్స్ పార్కులో ఫ్రాక్టల్ అనలిటిక్స్ యాంకర్ యూనిట్గా వస్తోందని చెప్పారు. రంగాల వారీగా పునరుద్ధరణ.. ఖాయిలాపడ్డ కంపెనీలను రంగాల వారీగా పునరుద్ధరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల్లో డిస్కౌంట్ ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. మైనింగ్, స్పిన్నింగ్ కంపెనీలు కూడా ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నాయన్నారు. ఎస్ఎంఈలకు రుణ సాయం.. హైదరాబాద్లోని 1,300లకుపైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో 90 శాతం ఎస్ఎంఈలే. మొత్తం 4 లక్షల మందికిపైగా ఉద్యోగుల్లో 2.5 లక్షల మంది ఈ ఎస్ఎంఈల్లో పనిచేస్తున్నారు. అవసరమైనన్ని నిధుల సేకరణ లో ఈ రంగ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వీటికి సాయం అందించే విషయమై కోటక్ మహీంద్రా, సిడ్బితో చర్చించినట్టు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో జెడ్ గ్లోబల్.. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ జెడ్ గ్లోబల్ హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ను గచ్చిబౌలిలో నెలకొల్పింది. ఇప్పటికే కంపెనీకి యూఎస్, యూకేతోపాటు పుణే, నోయిడాలో ఆఫీసులున్నాయి. తమ సంస్థలో 550 మంది పనిచేస్తున్నారని కంపెనీ సీఈవో వై.కరణ్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్లో ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను డిసెంబరుకల్లా 100కు చేరుస్తామని చెప్పారు. -
భారత్తో అమెరికా మైత్రికి ఉజ్వల భవిష్యత్
-టీ హబ్ను సందర్శించిన అమెరికా ఉప సహాయ కార్యదర్శి ఏంజెలా -బ్రెగ్జిట్ పరిణామాలపై ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి -ఎన్ఎస్జీ అంశంతో మద్దతు కొనసాగుతుందని ప్రకటన హైదరాబాద్: భారత్తో అమెరికా మైత్రీ బంధానికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఏంజిలా ప్రైస్ అగ్లేర్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ( క్లైమేట్ ఛేంజ్) రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఏంజెలా.. శనివారం హైదరాబాద్లోని టీ హబ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. టీ హబ్లోని స్టార్టప్ల సీఈఓలతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్న భారత్, అమెరికా సంబంధాలు.. ఇటీవలి కాలంలో మరింత బలోపేతం అయ్యాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి వాషింగ్టన్ పర్యటన.. అమెరికా కాంగ్రెస్లో మోడి చారిత్రాత్మక ప్రసంగం.. ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయి వంటివని వ్యాఖ్యానించారు. భారత్తో సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా అత్యంత ఆసక్తితో వున్నారన్నారు. మిలిటరీ, రక్షణ, ఇంధనం, ఆర్దిక అంశాలు.. తదితరాల్లో భారత్తో తాము బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు ఏంజెలా వెల్లడించారు. వాణిజ్య సంబంధాల పరంగా భారీగా వృద్ది సాధించే అవకాశం ఇరు దేశాలకు వుందన్నారు. 130 కోట్ల జనాభా కలిగిన భారత్లో 40శాతం మంది 20ఏళ్ల లోపు వారే కావడంతో భారీ వృద్దిరేటుకు అవకాశం వుందన్నారు. కేవలం ఏడాది వ్యవధిలో అమెరికాతో పాటు విదేశీ పెట్టుబడుల్లో హైదరాబాద్ 27శాతం వృద్ది రేటు సాధించడాన్ని ఏంజెలా ప్రస్తుతించారు. బ్రెగ్జిట్ పరిణామాలపై ఆసక్తి ప్రజాస్యామ్యాన్ని ముఖ్యమైన, సంక్షిష్టమైన వ్యవస్తగా పేర్కొన్న ఏంజెలా.. బ్రెగ్జిట్కు బ్రిటన్ పౌరులు అనుకూలంగా ఓటు వేయడాన్ని ఏంజెలా ప్రస్తావించారు. బ్రెగ్జిట్ పరిణామాలపై భారత్ తరహాలో తామూ ఆసక్తితో ఎదురుచూస్తున్నామన్నారు. అక్కడి వ్యవస్త గాడిన పడేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అణు సరఫరా బృందంలో ఇతర దేశాల వైఖరిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని.. అయితే సభ్యత్వం విషయంలో భారత్కు తమ మద్దతు కొనసాగుతుందని ఏంజెలా వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ప్యారిస్లో భారత్, అమెరికాతో సహా పలు దేశాల నడుమ కుదిరిన ఒప్పందాన్ని ఆచరణలోకి తేవడంపై దృష్టి సారించామన్నారు. టీ -హబ్ పనితీరు భేష్ టీ హబ్ పనితీరు అద్భుతంగా వుందని.. గత నెలలో ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా కాలిఫోర్నియాలోని ఐ హబ్తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రస్తావించారు. ఈ రెండు ప్రముఖ హబ్ల నడుమ కుదిరిన ఒప్పందం.. క్లైమేట్ ఛేంజ్ను ఎదుర్కొనేందుకు ఔత్సాహికులకు ప్రోత్సాహంగా వుంటుందన్నారు. ఔత్సాహికులకు ప్రోత్సాహం, శిక్షణ , అభివృద్ది, పెట్టుబడులు సమకూర్చడం ద్వారా టీ హబ్.. యువతకు కొత్త అవకాశాలు లభించేందుకు తోడ్పడుతుందన్నారు. 20 ఏళ్లుగా హైదరాబాద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోందని ఏంజెలా ప్రైస్ అగ్లెర్ వ్యాఖ్యానించారు. -
అందుకే తెలంగాణలో పెట్టుబడులు: కేటీఆర్
హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా మారిందని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. దీని ద్వారా 12 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తుందని ఆయన వెల్లడించారు. కాగా ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్కు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్... మాట్లాడుతూ టాటా బోయింగ్ వైమానిక విడి భాగాల సంస్థ తెలంగాణకు రావడం సంతోషకరమన్నారు. దీంతో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే పరిశ్రమల శాఖ విషయంలో గత ఏడాది వృద్ధిని సాధించామని, ఇక వచ్చే ఏడాదిపై దృష్టి పెట్టామన్నారు. అలాగే అపాచీ, హెలికాప్టర్ల ప్రధాన భాగాన్ని తయారు చేయడానికి బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో ఒప్పందం జరిగింది. కాగా రక్షణమంత్రి మనోహర్ పరీకర్ మాట్లాడుతూ రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం సరైన ప్రక్రియగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో బోయింగ్కు శంకుస్థాపన జరిగిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో స్పష్టమైన విధానాలుండాలని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. Presenting the Industry & Commerce dept's 2015-16 annual progress report today. Will outline achievements of last year & plans for 2016-17 — KTR (@KTRTRS) 18 June 2016 -
రైతుల కోసం టెక్ హ్యాకథాన్
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతులకు టెక్నాలజీ లాభాలు అందాలన్న లక్ష్యంతో మెట్టపంటల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), మైక్రోసాఫ్ట్, టీ-హబ్లు హైదరాబాద్లో రెండురోజుల పాటు హ్యాకథాన్ నిర్వహించాయి. రైతు సమస్యలకు టెక్నాలజీతో పరిష్కార మార్గాలను చూపే లక్ష్యంతో నిర్వహించిన ‘హ్యాక్4ఫార్మర్స్’లో ‘డిజిటల్ అగ్రి, రూరల్ ఈ-మార్కెటింగ్’ (డేర్-ఈ) యాప్ విజేతగా నిలిచింది. వివిధ మార్కెట్లలో ధరలు, కొనుగోలుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించే ఈ యాప్ను ఇక్రిశాట్, మైక్రోసాఫ్ట్ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు రూపొందించారు. ఇక్రిశాట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్విన్సన్, టీ-హబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమా అయ్యర్ హ్యాకథాన్ వివరాలను వెల్లడించారు. డేర్-ఈ బృందం ఆలోచనను ఒక ఉత్పత్తి/సేవగా రూపాంతరం చెందేందుకు టీ-హబ్ సహకరిస్తుందని రమా అయ్యర్ తెలిపారు. అన్నిరంగాలను ప్రభావితం చేస్తున్న టెక్నాలజీ సామర్థ్యాన్ని రైతులకూ అందించే లక్ష్యంతో హ్యాకథాన్ నిర్వహణకు ఇక్రిశాట్ ముందుకొచ్చిందని సంస్థ డెరైక్టర్ జనరల్ బెర్గ్విన్సన్ తెలిపారు. హ్యాకథాన్లో మొత్తం 11 బృందాలు పొల్గొన్నాయి. -
ఫైనాన్షియల్ టెక్నాలజీ అభివృద్ధిపై యస్ బ్యాంక్ దృష్టి
టీ హబ్తో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ టెక్నాలజీ సేవల (ఫిన్టెక్) అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ యస్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో భాగంగా పలు ఆర్థిక సేవలను అందించే స్టార్టప్లను ప్రోత్సహించడానికి టి-హబ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యస్ బ్యాంక్ కంట్రీ హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్) రితేష్ పాయ్ మాట్లాడుతూ ఫిన్టెక్ ద్వారా ఖాతాదారుల సంఖ్యను త్వరగా పెంచుకోవచ్చన్నారు. 2004లో బ్యాంకు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 20 లక్షల మంది ఖాతాదారులు ఉంటే రీచార్జ్ వాలెట్ వంటి ఫిన్టెక్ సేవలను ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే 2.5 కోట్ల మంది సేవలను వినియోగించుకున్నారన్నారు. అదే వర్చువల్ కార్డును 8 వారాల్లోనే 15 లక్షల మంది వినియోగించుకుంటున్నారన్నారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని త్వరలోనే ఈ కామర్స్ డెలివరీ కోసం స్మార్ట్ బాక్స్, ఇతర ఆర్థిక సేవలను అందించే వాటికోసం ‘స్లిమ్ అండ్ స్లీవ్’ వంటి సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. టి హబ్తో ఒప్పందం ద్వారా మోసాలకు తావులేని చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. -
టీహబ్ ను సందర్శించిన రాజీవ్ చంద్రశేఖరన్
మెంటార్గా వ్యవహరించాలని కోరిన కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు, బీపీఎల్ ఎల క్ట్రానిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ చంద్రశేఖరన్ శనివారం టీ-హబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా టీ-హబ్లో ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువ పారిశ్రామిక వేత్తలకు టీ-హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం సచివాలయానికి వచ్చి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వం తరపున స్టార్టప్స్ కోసం ఇంక్యుబెటర్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..సాధ్యమైతే ఇక్కడి స్టార్టప్స్కు మెంటార్గా వ్యవహరించాలని కోరారు. టీ-హబ్తో భవిష్యత్తులోనూ సంబంధాలు కొనసాగించాలన్నారు. -
మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకే..
టీ-హబ్కు వచ్చానన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భేటీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని మీలో నిర్మించుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆశయాన్ని సడలనివ్వవద్దు మీ విజయాల్లో భాగమవుతాం.. టీ-హబ్తో కలసి పనిచేస్తాం స్టార్టప్లకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తాం మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం వైట్స్పేస్ టెక్నాలజీ దీనిపై స్థానిక పారిశ్రామికవేత్తలకు సహకరిస్తామని వెల్లడి మంత్రి కేటీఆర్తో కలసి టీ-హబ్ను సందర్శించిన సత్య నాదెళ్ల స్టార్టప్లకు టీ-హబ్ అద్భుత అవకాశం.. ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సహకారంతో పలు కార్యక్రమాలు: కేటీఆర్ తరగతి గదుల డిజిటైజేషన్కు సహకరించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక (స్టార్టప్) పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు టీ-హబ్తో కలసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ‘మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకే హైదరాబాద్కు వచ్చా, మీ విజయాల్లో భాగ మవుతా’నని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పేర్కొన్నారు. స్టార్టప్లను ఆశయమే ముందుకు నడిపిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని సడలనివ్వవద్దని సూచించారు. టీ-హబ్ ఒక అద్భుత అవకాశమని.. ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలను కల్పించడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. ఇందుకోసం స్థానిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టీ-హబ్ను సత్య నాదెళ్ల సందర్శించారు. మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టీ-హబ్ సీఈవో జే కృష్ణన్, టీ-హబ్ వ్యవస్థాపకుడు కొల్లిపర శ్రీనివాస్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల టీ-హబ్ మొత్తం కలియదిరిగారు. ఇక్కడి వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. టీ-హబ్కు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ‘‘స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ టీ-హబ్తో కలసి పనిచేస్తుంది. మీ విజయాల్లో భాగమయ్యేందుకు ఇక్కడికి వచ్చాను. అన్నింటికీ మించి మీ కలల నుంచి స్ఫూర్తి పొందేందుకు వచ్చాను. స్టార్టప్లు మూడు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. మిమ్మల్ని ముందుకు నడిపేది ఆశయమే.. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆశయాన్ని సడలనివ్వవద్దు. మీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని మీలో నిర్మించుకోండి. పట్టుదలతో లక్ష్యం దిశగా వెళ్లే సంస్కృతిని సంస్థలో నెలకొల్పండి. దీనిని సంస్థలో ఎంత సజీవంగా ఉంచుకోగలుగుతారో... వ్యాపారంలో అంత స్థిరత్వాన్ని ప్రతిఫలంగా పొందగలుగుతారు..’’ అని సత్య నాదెళ్ల సూచించారు. పారిశ్రామికవేత్తలకు టీ-హబ్ అద్భుత అవకాశమని కొనియాడారు. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలను కల్పించడం ప్రశంసనీయమన్నారు. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో అవకాశాల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ కెన్యాలో తక్కువ ధరతో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ‘వైట్స్పేస్ టెక్నాలజీ’ని వినియోగించింది. దీని గురించి సత్యనాదెళ్ల వివరించారు. మారుమూల/చిట్టచివరి గమ్యంతో అనుసంధానం (కనెక్టివిటీ) కోసం ఈ పరిజ్ఞానం ఎంతో ప్రయోజనకరమని ఆయన చెప్పారు. తన దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో అనుసంధానం ఒకటని పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ అవసరాలకు తగినట్లుగా మారుమూల ప్రాంతాలతో అనుసంధానమయ్యేలా ఈ సేవలను తక్కువ ధరకు అందించగల పారిశ్రామికవేత్తలు మనకు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ‘మన హైదరాబాదీ సత్య నాదెళ్ల...’ అంటూ మంత్రి కేటీఆర్ అక్కడున్న పారిశ్రామికవేత్తలతో పేర్కొనబోతుండగా... సత్య నాదెళ్ల జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘నేను ఇక్కడ పెరిగిన సమయంలో ఏ టీ-హబ్ లేదు.. టీ అక్షరానికి దగ్గరగా ట్యాంక్బండ్ మాత్రమే ఉండేది..’’ అని నవ్వుతూ పేర్కొన్నారు. వైఫల్యాలపైనే విజయాల నిర్మాణం ఔత్సాహికులతో మాట్లాడిన సందర్భంగా పలు ప్రశ్నలకు సత్య నాదెళ్ల సమాధానాలిచ్చారు. వైఫల్యాలను మీరెలా తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘‘ వైఫల్యం గురించి పట్టించుకోవద్దు. దాని నుంచి నేర్చుకునే పాఠాలే ముఖ్యమైనవి. ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. మళ్లీ ఓటమి పాలు కాకుండా జాగ్రత్తపడాలి. ప్రపంచంలో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారే. నేనూ అలాంటి అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకున్నాను. గత వైఫల్యాల నుంచి నేర్చుకున్నదానిపైనే నా విజయాలు నిర్మితమయ్యాయి..’’ అని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్తో కలసి పనిచేస్తాం: కేటీఆర్ సత్య నాదెళ్లతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అద్భుతమైన అనుభవమని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్తో సహకారం విషయంలో వివిధ అంశాల్లో పరిశీలన జరిపామని... వారితో కలసి ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. స్టార్టప్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు మైక్రోసాఫ్ట్తో కలసి పనిచేయాలని భావిస్తున్నామని... సత్య నాదెళ్ల సైతం ఈ విషయంలో ఆసక్తితో ఉన్నారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ‘వైట్స్పేస్ టెక్నాలజీ’పై పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని.. మారుమూల ప్రాంతాలకు ఐటీ సేవల అనుసంధానం సమస్యను దానితో అధిగమించాలని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సహకారంతో స్థానిక పారిశ్రామికవేత్తలే ఈ సేవలను అందించాలని సత్య నాదెళ్ల కోరుకుంటున్నారని చెప్పారు. క్లౌడ్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఎన్నో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సుస్థిరంగా నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని కేటీఆర్ చెప్పారు. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాల గదులను డిజిటలైజ్ చేసేందుకు సహకారం అందించాలని మైక్రోసాఫ్ట్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, నాస్కాం చైర్మన్ బీవీ మోహన్రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ సీఈవో జీవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు హైదరాబాద్కు సత్య నాదెళ్ల
-
నేడు హైదరాబాద్కు సత్య నాదెళ్ల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం (డిసెంబర్ 28) హైదరాబాద్ వస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భాగ్యనగరంలో అడుగుపెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్కు రావడం ఇది రెండోసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంకుబేటర్ ‘టి-హబ్’ను ఈ సందర్భంగా సత్య నాదెళ్ల సందర్శించనున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి ఒక గంటపాటు టి-హబ్లో గడపనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీ-హబ్లోని స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నేడు అల్పాహారం(బ్రేక్ఫాస్ట్) చేయనున్నారు. పలు ప్రాజెక్టుల కోసం టెక్నాలజీ అమలుకు ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. -
టీ హబ్కు సత్యనాదెళ్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో ప్రారంభించిన టీహబ్కు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల రానున్నారు. టీ హబ్కు సలహాదారుగా ఉండమని ఇప్పటికే సత్యనాదెళ్లను తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఐఐఐటీలోని టీహబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనుద్దేశించి ఆయన ప్రసగించనున్నారు. ఈ పర్యటనలో ఆయన 3 నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్ లోనే గడపనున్నారు. ఈ నెల 28న టీ హబ్ను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నాన్నారని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి జయేశ్ రాజన్ తెలిపారు. -
ఆలోచనలకు పురుడు పోసే అద్భుత దీపం
-
ఆలోచనలకు పురుడు పోసే అద్భుత దీపం
టి-హబ్ భవనాన్ని ప్రారంభించిన రతన్ టాటా దేశానికి ముఖచిత్రంగా మారనుందని ప్రశంస పరిశ్రమలకు కావాల్సింది మంచి ఆలోచనలని వెల్లడి గొప్ప ఆవిష్కరణలకు వేదిక కావాలి: గవర్నర్ నరసింహన్ గూగుల్, ఫేస్బుక్, ట్వీటర్ తర్వాత కొత్త ఆవిష్కరణ ఇక్కడ్నుంచే రావాలి: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్ దేశానికి ముఖ చిత్రంగా మారనుందని టాటా సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా అన్నారు. రూ.40 కోట్ల వ్యయంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టి-హబ్ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారం. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, సైంటిస్టులను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలకు స్థాపనకు కావాల్సింది డాలర్లు కాదు. మంచి ఆలోచనలు ఉంటే చాలు’’ అని అన్నారు. టి-హబ్ భ వనంలోని అన్ని అంతస్థులను రతన్టాటా పరిశీలించారు. కార్యక్రమానికి హాజరైన స్టార్టప్స్ ప్రతి నిధులు, మీడియా ప్రతినిధులతో ముచ్చటిం చారు. ఏదైనా ఉత్పత్తిని విభిన ్నంగా తయారు చేయడం ద్వారానే అది ప్రజల మన్నన పొందుతుందని చెప్పారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన 17 నెలల కాలంలోనే తెలంగాణ టి-హబ్ వంటి గొప్ప ఆవిష్కరణను తేవడం అభినందనీయమన్నారు. ఎన్నో మంచి ఆలోచనలు ప్రోత్సాహం లేక కళాశాలల్లోనే మరణిస్తున్నాయని వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, కళాశాలల ప్రిన్సిపల్స్ టి-హబ్ను సందర్శించేలా చేసి, యువత ఆలోచనలకు ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పట్ట ణ ప్రాంతాలతో పాటు గ్రామీణుల నైపుణ్యాన్ని కూడా గుర్తించాలని, గ్రామీణ పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం కల్పించాలని సూచిం చారు. యువత ఆలోచనల నుంచి గొప్ప ఆవి ష్కరణలను తెచ్చేందుకు టి-హబ్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఐటీతో పాటు తాగునీరు, ఇంధనం, ఆరోగ్య రంగాల్లో ఆవిష్కరణలు అవసరమన్నారు. సామాన్యుడికి ఉపకరించే సామాజిక ఆవిష్కరణలపైనా శ్రద్ధ చూపాలన్నారు. టి-హబ్ ప్రయోగం విజ యవంతమై ట్రెండ్ సెట్టర్గా నిలవాలన్నారు. యువతకు సరైన వేదిక: కేటీఆర్ భారతీయులు వారి సామర్థ్యాలను వినియోగించి అనేక దేశాల్లో సేవలందిస్తున్నారని, దేశీయంగా మాత్రం వారికి సరైన అవకాశం కల్పించలేకపోయామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 లక్షల మంది యువత ఉన్న మన దేశంలో.. వారి ఆలోచనలను ఆవిష్కరించుకునే అవకాశాన్ని ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించలేదన్నారు. 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణలో టి-హబ్ రూపంలో ప్రభుత్వం సరైన వేదికను యువతకు అందించిందన్నారు. కేవలం హైదరాబాద్, తెలంగాణ యువతకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్మైండ్స్కు టి-హబ్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. గూగుల్, ఫేస్బుక్, ట్వీటర్ తర్వాత వచ్చే కొత్త ఆవిష్కరణ ఇండియా నుంచే కావాలన్నది త న అభిమతమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. యువతలోని ఆలోచనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టి-హబ్ నిర్మించిందన్నారు. టి-హ బ్ ప్రారంభం తెలంగాణకు శుభ పరిణామమని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి చెప్పారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో 200 స్టార్టప్స్కు చెందిన 800 మందికి ఇక్కడ అవకాశం ఉందన్నారు. దేశంలో మిలియన్ల కొద్దీ ఆలోచనలు కలిగిన బిలియన్ మైండ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ టెక్నాలజీల సమ్మేళనంతో వినూత్న అవిష్కరణలకు టి-హబ్ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎ.గాంధీ, టి-హబ్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు శ్రీనిరాజు, అని త్రామ్, పీజే నారాయణన్, శశిరెడ్డి, వాణి కొల్లా తదితరులు పాల్గొన్నారు. విలేకరులు, స్టార్టప్స్ ప్రతినిధులతో టాటా ముచ్చటించారు. విశేషాలివీ.. పశ్న: దేశంలో మత సామరస్యంపై మీ స్పందన ఏంటి? ఇటీవలి ఘటనలపై ఏమంటారు? రతన్: దేశంలో అన్ని మతాల వారు కలసిమెలసి నివసిస్తున్నారు. శతాబ్దాలుగా మతసామరస్యం పరిఢవిల్లుతోంది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుంది. ఇటీవల జరిగిన ఘటనలపై స్పందించను. ప్ర: భవిష్యత్తులో ఎలాంటి పరిశ్రమలకు అవకాశాలున్నాయి? రతన్: ఈ కామర్స్, రిటైల్ రంగాలే కాకుండా మెడికల్, హెల్త్కేర్, లైఫ్ సెన్సైస్, త్రీడీ ప్రింటింగ్ రంగాల్లో మంచి అవకాశాలుంటాయి. ప్ర: స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి? రతన్: డబ్బు సంపాదన కోసమే వచ్చే స్టార్టప్స్ అన్నీ విజయవంతం కావు. సమాజంలో అందరికీ అన్ని వసతులు అందుబాటులో ఉండడం లేదు. ఈ అంతరాన్ని తగ్గించేలా స్టార్టప్స్ దృష్టి పెడితే మంచిది. ప్ర: స్టార్టప్స్కు మీ వైపు నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది? రతన్: దేశం పలు రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా ఎంటర్ప్రైన్యూర్ దేశంగా భారత్ నమోదు కాలేకపోయింది. స్టార్టప్స్ ద్వారా ఆ ఘనత సాధించేందుకు వీలు దొరుకుతుంది. స్టార్టప్స్కు నా తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం తన టైగర్ పవర్ను ప్రపంచానికి చూపే సమయం ఆసన్నమైంది. ప్ర: ఇంత పెద్ద టాటా గ్రూప్ను ఎలా స్థాపించగలిగారు? రతన్: నేను బాధ్యతలు చేపట్టే నాటికే టాటా గ్రూప్ పెద్ద కంపెనీ. దాన్ని మరికొంత అభివృద్ధి చేశానంతే! ప్ర: నానో కారు ఎందుకు ఫెయిలైంది? రతన్: ఇతర కార్లతో దాన్ని పోల్చిడం వల్ల. అందుకే అది పోటీలో నిలవలేదన్నట్లుగా అనిపిస్తోంది. కానీ భద్రతకు, అన్ని రకాల వాతావరణాలకు అది అనువైనదని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ప్ర: టాటామోటార్స్ అభివృద్ధికి మీరేమైన సలహా ఇస్తారా? రతన్: ప్రస్తుతం నేను అందులో లేను. కనుక సలహాలివ్వను ప్ర: మిమ్మల్ని బాగా ఉత్తేజపరిచిన సంఘటన ఏమిటి? రతన్: సారీ.. ఇంత పబ్లిగ్గా అడిగితే ఎలా చెప్పగలను! ప్ర: టి-హబ్లో మీరేమైనా పెట్టుబడులు పెడుతున్నారా? రతన్: ప్రస్తుతం ఇంకా అలాంటి ఆలోచనలు చేయలేదు -
టి-హబ్ ప్రారంభం రేపే
హైదరాబాద్: ఐటీ రంగంలో పరిశ్రమలను స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్ను గురువారం సాయంత్రం 4 గంటలకు టాటా గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రతన్టాటా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా గవర్నర్ నరసింహన్, మంత్రి కె.తారక రామరావు హాజరుకానున్నారని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు. యువత కలలు తీర్చే టి-హబ్.. ప్రదేశం గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణం నిర్మాణ వ్యయం రూ. 40 కోట్లు విస్తీర్ణం 70 వేల చదరపు అడుగులు అవకాశం 200 స్టార్టప్ కంపెనీలకు చెందిన 800 మందికి.. ప్రత్యేకత దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్, ప్రపంచ స్థాయి ప్రమాణాలు నిర్వహణ ప్రభుత్వ, ప్రైవేటు (మైక్రోసాఫ్ట్, గూగుల్, సైయంట్ తదితర సంస్థల) భాగస్వామ్యంతో మెంటార్స్ ఐఎస్బీ, ఐఐటీహెచ్, ఐఐఐటీ, నల్సార్ లా యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలను ఆకర్షించి హైదరాబాద్కు రప్పించడం -
’ఆలోచనతో వచ్చి ఆవిష్కరణతో వెళ్లండి’
-
5న టీ-హబ్ ప్రారంభం
బిజినెస్ సొల్యూషన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: ఔత్సాహిక పారిశ్రామిక వేత్త (స్టార్టప్)లను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన టి-హబ్ను నవంబర్ 5న టాటా గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గురువారం బెంగళూరులో‘డిస్కవర్ బిజినెస్ సొల్యూషన్స్’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ ప్రో త్సాహకానికి ప్రభుత్వ ప్రాధాన్యతను వివ రించారు. ఐటీ రంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఇన్నోవేట్-ఇంక్యుబే ట్-ఇన్కార్పెట్ నినాదంతో ముందుకెళ్తున్నా మన్నారు. కాగా, అంతర్జాతీయ వస్తు ప్రద ర్శన కేంద్రంలో సీ-బిట్ పేరుతో ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రదర్శనను ప్రారంభించిన కేటీఆర్...సమాచార, సాంకేతిక రంగం తోపాటు డిజిటైజేషన్లో కర్ణాటకకు తాము గట్టి పోటీ ఇవ్వనున్నట్లు చెప్పారు. బయోకాన్ చైర్పర్సన్తో భేటీ ‘బయోకాన్’ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాను మంత్రి కేటీఆర్ గురువారం బెంగళూ రులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయ నున్న ఫార్మాసిటీ, టీ-హబ్ల ద్వా రా పరిశ్ర మల స్థాపనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. పెట్టుబడిదారు లు వ్యాపారాన్ని సులువుగా నిర్వహిం చుకు నేందుకు ప్రభు త్వం చేపట్టాల్సిన చర్యలపై మజుందార్ కేటీఆర్కు సూచనలు చేశారు. -
రేపు ఢిల్లీలో పర్యటించనున్న కేటీఆర్
హైదరాబాద్ సిటీ : రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి కె.తారక రామావు ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ వెళుతున్నారు. ఆయన కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడులతో భేటీ కానున్నారు. వీరితో పాటు హడ్కో చైర్మన్ రవికాంత్ను కలిసి వాటర్గ్రిడ్కు అదనపు ఆర్ధిక సాయం గురించి చర్చించనున్నారు. ఈ ముగ్గురు కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ శాఖా పరమైన అంశాలపై చర్చిస్తారు. టి-హబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి రావాల్సిందిగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను ఆహ్వానిస్తారు. -
'టీ-హబ్'కు ముహూర్తం ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీ-హబ్కు శుక్రవారం ముహూర్తం ఖరారైంది. త మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ఉదయం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా టీహబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.