apepdcl
-
కూటమి నేతలకు మేతగా...!
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామనే మాటను పక్కన పెట్టి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంతటితో ఆగకుండా విద్యుత్ శాఖ ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించి కొందరు నేతలకు లబ్ధి కలిగించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను సైతం కాల్చివేసి ఖాళీ స్థలాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖలో రూ.100 కోట్లకుపైగా విలువైన 2.20 ఎకరాల స్థలాన్ని బహుళ అంతస్తుల భవనం పేరిట కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. సొంత లాభమే లక్ష్యంగా..విశాఖపట్నం నగరంలోని గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా రోడ్డును ఆనుకుని సుమారు 2.20 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్యాలయాలు, ఉద్యోగుల అతిథి గృహం ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న రెండు అంతస్తుల భవనంలో విశాఖపట్నం పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. అదేవిధంగా విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పనుల కోసం 11 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి ఇక్కడ ఉన్న అతిథి గృహం ఒక్కటే వసతి కల్పిస్తోంది. అయితే, ఆ భవనాలను నేలమట్టం చేసి రూ.100 కోట్లకు పైగా విలువ చేసే స్థలాన్ని బహుళ అంతస్తుల భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కార్పొరేట్ సంస్థలకు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలకు ఆర్థికంగా భారీ లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.ఇందులో భాగంగా కొత్తగా నిర్మించే భారీ భవనంలోని ఒకటి, రెండు అంతస్తుల్లో ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యకలాపాలకు అవకాశం కల్పించడం, లేదా నగరంలోనే సాగర్నగర్ వద్ద నిర్మిస్తున్న మరో భవనంలోకి విశాఖ సర్కిల్ ఆఫీసును తరలించడం అనే రెండు ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాల్సిందిగా సర్కిల్ అధికారులను ఆదేశించింది. మరోవైపు తమ కార్యాలయాన్ని కాల్చివేసి విలువైన స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలతో సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారి కంపెనీ స్థలాలను ఇలా లాక్కొని ప్రైవేట్ డెవలపర్లకు అప్పగించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సెలవులో రెండు డిస్కంల డైరెక్టర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఫైనాన్స్ డైరెక్టర్గానూ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఇన్చార్జ్ ఫైనాన్స్ డైరెక్టర్గానూ ఉన్న దండగల చంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు సెలవు మంజూరు చేసింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన కోరిన మేరకు ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు 17 రోజులు సెలవు ఇస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డిసెంబర్ 1వ తేదీన పబ్లిక్ హాలిడేని వినియోగించుకోవడానికి కూడా చంద్రంకు అనుమతినిచ్చారు. అయితే వాస్తవానికి ఈ నెల 15తోనే చంద్రం పదవీకాలం ముగుస్తోంది. ఇటీవల విద్యుత్ సంస్థల్లో పదిమంది డైరెక్టర్ల చేత బలవంతంగా కూటమి ప్రభుత్వం రాజీనామా చేయించింది. వారితో పాటు ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న డైరెక్టర్ల పోస్టుల భర్తీకి విద్యుత్ సంస్థలు నోటిఫికేషన్ను జారీ చేశాయి. కానీ చంద్రం కొనసాగింపుపై నిర్ణయం వెలువడనప్పటికీ ఆ పోస్టుకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. చంద్రంపై ఎందుకంత ప్రేమ.. ప్రభుత్వం మారిన వెంటనే చంద్రం టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిని కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించుకున్నారు. వ్యాపార వేత్త అయిన తన మామ సాయంతో రాష్ట్ర మంత్రులను తరచుగా కలుస్తూ తన పోస్టును పదిలం చేసుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశారు.ఏపీసీపీడీసీఎల్లో ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టును తనకు ఇవ్వాల్సిందిగా కూటమి మంత్రులను చంద్రం కోరారు. వారి ఆశీస్సులతో ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ)తో నియమితులయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రెండు డిస్కంలకు ఒక్కరే ఫైనాన్స్ డైరెక్టర్ అనే కొత్త సంప్రదాయానికి తెరదీశారు. అయితే చంద్రాన్ని ఇంకా కొనసాగించడానికి నిబంధనలు అడ్డురావడంతో ఏం చేయాలనేదానిపై ఇంధన శాఖ కసరత్తు చేస్తోంది. -
విద్యుత్ సంస్థల్లో కొత్త సర్కిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో కొత్తగా 13 సర్కిళ్లు(జిల్లా కార్యాలయాలు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. కొత్తగా వచ్చిన జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది. అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతోపాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించలేదు. దీంతో దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు మూడు డిస్కంలు పాత పద్ధతిలోనే విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిçÜ్తున్నాయి.చివరికి సర్కిళ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లు ఆగస్టు 21వ తేదీన, ఏపీసీపీడీసీల్ అదే నెల 27న ప్రభుత్వాన్ని కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.‘సాక్షి’ కథనంతో కదలికఈ నేపథ్యంలో ‘కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?’ శీర్షికతో గత నెల 30న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంధన శాఖ అధికారులతో నివేదికలు తెప్పించుకుని చర్చించింది. తాజాగా 13 కొత్త సర్కిల్స్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. ఎటువంటి ఆర్థక భారం పడకుండా ఇప్పుడు ఉన్నవారినే పాత, కొత్త సర్కిళ్లకు సర్దుబాటు చేయాల్సిందిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలను పంపాలని సీఎండీలకు సూచించారు. కొత్త సర్కిళ్లు ఏర్పడితే ప్రజలకు విద్యుత్ సేవలు మరింత చేరువవుతాయి. అదేవిధంగా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. దూరం(కిలో మీటర్లు), హెచ్టీ సర్వీసులు, ఎల్టీ సర్వీసులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, వాటి సామర్థ్యం, సబ్ స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి. -
చినబాబు చెప్పారు చేయాల్సిందే
సాక్షి, అమరావతి : చేతికొచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాము చెప్పిన పని క చ్చితంగా చేసి తీరాల్సిందేని కూటమి నేతలు ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ.. ‘చినబాబు’ చెప్పారని రాత్రికి రాత్రే రాజమహేంద్రవరం ఎస్ఈ పోస్టుకు సంబంధించిన ఆదేశాలను మార్చేయడం విద్యుత్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న గొర్లె ప్రసాద్ను రాజమహేంద్రవరం ఎస్ఈగా పదోన్నతిపై నియమిస్తూ డిస్కం సీఎండీ ఐ.పృధ్వీతేజ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం సీఎంఓలోని ఓ ఉన్నతాధికారి ద్వారా మంత్రి లోకేశ్కు తెలియడంతో వెంటనే ఆ ఆదేశాలు రద్దు చేసి, తాను చెప్పిన అధికారిని ఆ పోస్టులో నియమించాలని చెప్పారు. ఈ మేరకు ఆ ఉన్నతాధికారి ఏపీఈపీడీసీఎల్ సీఎండీని ఫోన్లో దీనిపై హెచ్చరించారు. సీఎంఓ ఆగ్రహాం వ్యక్తం చేయడంతో ప్రసాద్ను కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్(ఆపరేషన్స్)గా పంపి, ఆ స్థానంలో ఉన్న కె.తిలక్ కుమార్ను రాజమహేంద్రవరం ఎస్ఈగా నియమిస్తూ అర్ధరాత్రి 11.30 గంటల తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఈ సంఘటన విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణం ఏమంటే.. ఎన్నికల ముందు అవినీతి కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యురాలిగా తిలక్ భార్య ఆయనకు చికిత్స అందించారని తెలిసింది. బాబు సూచనల మేరకు వైద్యం అందించినందుకే ఆమెకు నజరానాగా ఆమె భర్తకు ఎస్ఈ పోస్టును కట్టబెట్టారని సమాచారం. కాగా, ఇంధన శాఖలో ఇప్పటికే జేఎండీలు, ఎండీలు, డైరెక్టర్లు అంటూ పది మందికి పైగా ఉన్నతాధికారుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. వారి స్థానంలో తమ వారిని నియమించేందుకు రూ.కోట్లల్లో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈ పోస్టుకు రూ.50 లక్షల వరకు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుత్శాఖలో వింత ఆచారం
సాక్షి, అమరావతి: విద్యుత్శాఖలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నవారి విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఉద్యోగవర్గాల్లో సంచలనం సృష్టించింది. డిప్యుటేషన్పై వచ్చినవారు శాశ్వతంగా అక్కడే పనిచేసేలా జారీచేసిన ఈ ఉత్తర్వులు.. సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించాయి. ఒక ప్రభుత్వ విభాగంలో ఒక అధికారినిగానీ, సిబ్బందిగానీ వారి సొంత కారణాలతోనో, ఆ శాఖ అవసరానికో ఒకచోటు నుంచి మరోచోటుకి, ఒక శాఖ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్పై పంపడం సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి కాలాన్ని కూడా చాలా తక్కువగా నిర్ణయిస్తారు. అంటే మూడునెలల నుంచి ఏడాది పాటు తాత్కాలిక విధుల్లో కొనసాగేలా ఆ ఆదేశాలు ఇస్తుంటారు.అయితే ఒకసారి ఒక చోటుకిగానీ, ఒక శాఖకుగానీ వెళ్లిన వారిలో కొందరు అక్కడి నుంచి తిరిగిరావడానికి ఇష్టపడరు. మరికొందరు ఎప్పుడు వెనక్కి వచ్చేద్దామా అని చూస్తుంటారు. వారికిచ్చిన గడువు ప్రకారం డిప్యుటేషన్ను పొడిగించడం, రద్దుచేయడం వంటివి ఉన్నతాధికారులు చేస్తుంటారు. ఇదీ సాధారణంగా జరిగేది. రాష్ట్రంలో 11 జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త ఆచారం పుట్టుకొచ్చి0ది. ఇచ్చిపడేశారంతే.. ఏపీఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం (కార్పొరేట్ ఆఫీస్) విశాఖపట్నంలో ఉంది. అక్కడ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ హోదాల్లో 35 మంది ఉద్యోగులు డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. వీరిలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న వారు ఉన్నారు. 2015 నుంచి 2023 వరకు ఏటా కొంతమంది చొప్పున వీరంతా వచ్చారు. ఏటా వీరి విజ్ఞప్తిని, సంస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిప్యుటేషన్లు పొడిగిస్తున్నారు. కానీ సడన్గా ఏమైందో ఏమోగానీ.. ఇకపై వీరు ఎన్నాళ్లయినా కార్పొరేట్ ఆఫీసులోనే ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ 35 మందికి ఇకపై ఏటేటా డిప్యుటేషన్ పొడించాలా, రద్దుచేయాలా అనే చర్చే రాకుండా చేసేశారు. ఇకపై వీరంతా పర్మినెంట్గా కార్పొరేట్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తించేలా సంస్థ ఫైనాన్స్, హెచ్ఆర్డీ విభాగం డైరెక్టర్ డి.చంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జిల్లాల నుంచి ఎవరైనా ఉద్యోగి విశాఖకు డిప్యుటేషన్పై వెళ్లాలంటే ఇప్పుడున్నవారు ఉద్యోగ విరమణ చేస్తేగానీ కుదరదు. ఇలాంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలు సీఎండీ స్థాయిలోనే తీసుకుంటారు. అలా కాకుండా డైరెక్టర్ స్థాయి అధికారి ఉత్తర్వులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయనే చర్చ విద్యుత్ ఉద్యోగుల మధ్య జరుగుతోంది. ఏటా ఎందుకని.. డిప్యుటేషన్లపై ఏటా ఫైలు నడపడం పెద్ద ప్రాసెస్గా ఉంటోంది. అలాంటిదేం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినప్పటికీ ఈ డిప్యుటేషన్లను ఎప్పుడైనా రద్దుచేసే అధికారం సంస్థకు ఉంది. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విశాఖలో ‘అండర్ కరెంట్’
సాక్షి, అమరావతి: విశాఖలో విద్యుత్ వ్యవస్థను సంపూర్ణంగా మారుస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యంత సురక్షిత విద్యుత్ సరఫరాకు భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం వెలుగులు ప్రసరించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.720 కోట్లతో ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయి. నగరంలో విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూగర్భ విద్యుత్ లైన్లతో రీప్లేస్ చేయాలని ఏపీఈపీడీసీఎల్ భావిస్తోంది. సగానికి తగ్గనున్న ప్రసార నష్టాలు భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ సముద్రతీర ప్రాంతంలోని 28 సబ్స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 115 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 349 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 940 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు, 660 రింగ్ మెయిన్ యూనిట్ (ఆర్ఎంయు)లు, 986 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు), 1,498 ఫీడర్ పిల్లర్లు, 9,179 సర్వీస్ పిల్లర్లు నిర్మించారు. 1,03,281 సర్వీసులను భూగర్భ విద్యుత్ వ్యవస్థతో అనుసంధానించారు. దీంతో ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, సాగర్నగర్, బీచ్ రోడ్, జాతీయ రహదారి–16 ప్రాంతాల్లో ఇటీవల తుపాన్ల సమయంలోను నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను తొలగించి భూగర్భంలోకి మార్చనున్నారు. ఇందుకోసం రూ.157 కోట్లతో మూడు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్)లు, 35 ఇండోర్ 33/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. వీటికోసం 613.31 కిలోమీటర్ల మేర కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించారు. ఏపీఈపీడీసీఎల్ ప్రస్తుత ప్రసార నష్టాలు 6 శాతంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల శాతాన్ని సగానికి తగ్గించవచ్చని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. కరెంటు తీగలకు తగులుతున్నాయని చెట్లను నరికేయాల్సిన అవసరం ఉండదు. కొత్త మొక్కలను కూడా నాటి నగరాన్ని పచ్చదనంతో నింపవచ్చు. ఈ కేబుళ్లు ప్రత్యేకం నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా భూగర్భ విద్యుత్ లైన్లు ఉండాలి. సరైన వైర్, కేబుల్ ఎంచుకోవడంపైనే ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాటి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేబుల్ను ఎక్కడ ఉపయోగిస్తారు, గేజ్ పరిమాణం, స్ట్రాండ్డ్ సాలిడ్, వోల్టేజ్ రేటింగ్, ఇన్సులేషన్, జాకెట్ రంగు వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. వైర్లు, కేబుల్స్ రెండింటినీ భూగర్భ నిర్మాణంలో ఉపయోగించవచ్చు. భూగర్భ తీగను రాగి, అల్యూమినియంతో తయారు చేస్తారు. రాగి తీగ సురక్షితంగా భూమిలో మనగలుగుతుంది. దీనిచుట్టూ అత్యంత భద్రతనిచ్చే పొర ఉంటుంది. ఈ కేబుళ్లు కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. వైర్కు మట్టికి మధ్య ఒక కండ్యూట్ (గొట్టం) యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. సరికొత్త విశాఖను చూస్తాం విశాఖ సాగరతీర ప్రాంతంలో ఇప్పటికే భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చాలా వరకు పూర్తయింది. నగరంలో మిగిలిన ప్రాంతాల్లోను భూగర్భ విద్యుత్ లైన్లు వేస్తున్నాం. మొత్తం పనులు పూర్తయితే విశాఖలో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. సరికొత్త విశాఖను చూస్తాం. ప్రజలకు అత్యంత సురక్షితంగా, నాణ్యమైన నిరంతర విద్యుత్ అందుతుంది. డిస్కం పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలోను 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ప్రగతి బాటలో విద్యుత్ రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ రంగం ప్రగతి బాటలో పయనిస్తోందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చేసిన పనులు, సాధించిన ఫలితాలు, అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. ట్రాన్స్కో, జెన్కో, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఎస్ఈసీఎం సంస్థలకు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను మంత్రి పెద్దిరెడ్డి బుధవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పురోగాభివృద్ధి విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. 99 శాతం మంచి చేసి, ఎక్కడో ఒక శాతం పొరపాటు జరిగితే దానినే పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని మంత్రి ఉద్ఘాటించారు. విద్యుత్ సమర్థ వినియోగానికి సంబంధించి రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్కు రాష్ట్రపతి అవార్డుతో పాటు, ఏపీ ట్రాన్స్కో, డిస్కం, నెడ్కాప్లకు జాతీయ అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర వినియోగానికి పోగా.. మిగిలిన మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. వచ్చే మార్చిలో ఆర్టీపీఎస్ 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిశీలించి ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఉన్నతాధికారులు బి.శ్రీధర్, మల్లారెడ్డి, పద్మా జనార్దన్రెడ్డి, సంతోష్రావు, రమణారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఫ్లైయాష్ ఉత్పత్తిదారులు, వినియోగదారుల కోసం పోర్టల్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడలోని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ(పర్యావరణం) నీరబ్కుమార్ ప్రసాద్, కార్పొరేషన్ ఎండీ ఖజూరియా, చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్తో కలిసి బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు ఏర్పాటు చేసిన పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. -
అన్నదాత అడిగిందే తడవుగా విద్యుత్ కనెక్షన్
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వేగంగా మంజూరు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,420 వ్యవసాయ సర్వీసులు అందజేశారు. డిస్కంల వారీగా పరిశీలిస్తే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది (2022–23 ఆర్థిక సంవత్సరం) ఇప్పటివరకూ 33,794 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను అధికారులు అందజేశారు. మరో 33,099 సర్వీసులకు ఈ నెలాఖరుకల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లాల్లో ఈ ఏడాది 4,525 సర్వీసులను రైతులకు అందించారు. 3,687 సర్వీసులను ఈ నెలలో మంజూరు చేయనున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ఇక ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకూ 19,101 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు మంజూరు చేశారు. విజయవాడ సర్కిల్ పరిధిలో 6,411, గుంటూరు సర్కిల్ పరిధిలో 2,064, ఒంగోలుæ సర్కిల్ పరిధిలో 11,479, సీఆర్డీఏ పరిధిలో 88 చొప్పున మరో 20,042 కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. రూ.1,700 కోట్ల ఖర్చు వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా తీసుకునే సౌర విద్యుత్ను 9 గంటలపాటు పగటిపూటే పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,700 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా హై–ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్వీడీఎస్) పథకం ద్వారా రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయనున్నారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటిని బాగుచేయడం కోసం రూ.102 కోట్లు ఖర్చవుతోంది. అయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆ మేరకు అవసరమైన మెటీరియల్ కూడా ఆయా జిల్లాల స్టోర్లలో అధికారులు సిద్ధంగా ఉంచారు. -
నాణ్యమైన పరికరాలనే కొంటున్నాం..
సాక్షి, అమరావతి: డిస్కమ్ పరిధిలో వివిధ పనుల కోసం నాణ్యమైన పరికరాలనే కొనుగోలు చేస్తున్నామని ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. డిస్కంలో నాసిరకం తీగలు, పరికరాలను కొనుగోలు చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. వివిధ పనులకు టెండర్ల స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రూపొందించే ప్రక్రియలో భాగంగా బిడ్డర్ అర్హతను తెలుసుకోవడం కోసం కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ను ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్కు అనుగుణంగా తయారు చేస్తారని తెలిపారు. ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో రివర్స్ బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా కాంట్రాక్టర్కు టెండరు దక్కాక సంబంధిత ఫ్యాక్టరీలో పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి థర్డ్ పార్టీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్తో పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరికరాల తరలింపునకు అనుమతించి, ఆయా ఫ్యాక్టరీల నుంచి సంస్థ పరిధిలోని స్టోర్లకు తరలిస్తామని తెలిపారు. స్టోర్లకు చేరిన పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి మరోసారి పరీక్షించాకే వాటిని స్టాక్లోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో అమర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ పనుల్లో, పరికరాల్లో నాణ్యత ప్రమాణాలను పరీక్షించేందుకు డిస్కంలలో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. అలాగే, డిస్కంలో లైన్మెన్ పోస్టులను కుదించేశారని పేర్కొనడంలో కూడా వాస్తవం లేదని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు క్షేత్రస్థాయిలో నియామకాలు జరగలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలకు ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. దీంతో 2019 అక్టోబర్లో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 3,088, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2,859 ఎనర్జీ అసిస్టెంట్లను నియమించినట్లు వివరించారు. -
ప్రజలపై పైసా భారం లేకుండా స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అవాస్తవం మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్లతో ప్రయోజనం స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ -
నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. ‘రైతు చేనుకు కడప మీటరు’ పేరుతో ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులో వాస్తవాలతో వారు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. రైతుల ప్రయోజనానికే మీటర్లు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోఎంఎస్ 22, తేదీ 01.09.2020) ప్రకారం పెడుతున్న ఈ మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల సరిపడా కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో.. దానికయ్యే చార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతుల ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కింద జమచేస్తుంది. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు రైతులకు లభిస్తుంది. కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుంది. తగ్గుతున్న నష్టాలు ప్రస్తుతం ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చాం. రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాల్సి ఉంది. ఈ వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ పద్ధతిలో రీడింగ్ తీయడం కష్టంగా ఉంది. అందుకే స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలు సంకల్పించాయి. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటుచేసిన తర్వాత ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (స్వతంత్ర గ్రూప్) సర్వే రిపోర్టు ప్రకారం నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైంది. ఆ టెండర్లు ఎప్పుడో రద్దు విద్యుత్ సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్ మీటర్లకు డీబీటీ విధానం కోసం ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లను గడువులోపు పూర్తిచేస్తే 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1,800 చొప్పున చెల్లిస్తాం. తర్వాత మిగిలిన మొత్తంతోపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలవ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని ఇస్తాం. వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేశారు. కోవిడ్–19 సమయంలో రూపొందించిన అంచనాల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వం టెండర్లు రద్దుచేసింది. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించిన తర్వాతే కొత్తగా టెండర్లు పిలుస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కో మీటరుకు నెలకు వ్యయం రూ.200.96 పైసలుగా ఖరారైంది. ఏడున్నర సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వీటిలో 80 శాతం సింగిల్ఫేజ్ మీటర్లు కాగా 20 శాతం మాత్రమే త్రీఫేజ్ మీటర్లు. కానీ ఏపీలో వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్ మీటర్లే. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వ అంచనా ధర పదేళ్ల కాలపరిమితికి రూ.6 వేలు. దీనికి అనుగుణంగా మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట తొమ్మిదిగంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించడానికి సుమారు రూ.1,700 కోట్లు ఖర్చుచేసి ఫీడర్లను ఏర్పాటు చేశాం. గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించాం. రానున్నరోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయం మీటరుకు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతోందని ఈనాడు దినపత్రిక రాసిన కథనంలో వాస్తవం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్తో పాటు, పీఈసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంకు సమకూరుతుంది. అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ను కూడా తగ్గించవచ్చు. వ్యవసాయ పంపుసెట్లకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని సంస్థలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. -
సరికొత్త సాంకేతికత.. ఇక ఫ్యూజులు కాలవు!
సాక్షి, అమరావతి: సీరియస్గా టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పోతే వచ్చే అసహనం అంతా ఇంతా కాదు. గాలిలేదు.. వానలేదు.. కరెంటెందుకు పోయిందోననుకుంటూ వెంటనే పక్కింటివాళ్లకు ఉందోలేదో చూస్తుంటాం. తీరా వీధిలో కొందరికి ఉండి మనతోపాటు కొందరికి లేదని గుర్తించాక అప్పుడు అర్థమవుతుంది.. ఫ్యూజు కాలిపోయిందని. వెంటనే కరెంట్ ఆఫీసుకు ఫోన్చేస్తే విద్యుత్ సిబ్బంది వచ్చి ఫ్యూజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ వద్ద పోయిందో పరిశీలిస్తారు. కానీ ఎందుకు కాలిపోయిందో తెలియాలంటే మాత్రం ఆ లైన్లన్నీ వెదకాలి. దానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను తప్పించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మినియేచర్ కాంటాక్ట్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీసీబీ). విజయవాడలో ఎంసీసీబీల ఏర్పాటును మొదలుపెట్టారు. ప్రస్తుతం 40 వేల ట్రాన్స్ఫార్మర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తామని, దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తామని ఏపీసీపీడీసీఎల్ చెబుతోంది. నాణ్యత, రక్షణ విజయవాడలోని ముఖ్యకూడళ్లలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజు బాక్సుల స్థానంలో రెండువైపుల ఎంసీసీబీ ఉండే కేబుళ్లు అమర్చారు. విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడినప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. సమస్య ఉన్న లైనుకు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపేస్తాయి. లైనులో ఎక్కడ సమస్య వచ్చిందనే విషయాన్ని కూడా సూచిస్తాయి. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ కంచె ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమార్గంగా ఉంది. ఆ కంచె కూడా వివిధ కారణాల వల్ల పాడైపోతోంది. అది గమనించకుండా అటు వెళ్లిన మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడాల్సి వస్తోంది. ఎంసీసీబీ వ్యవస్థలో రెండువైపులా ఇన్సులేటెడ్ కేబుళ్లు ఉండటం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉండదు. మేమే ముందు ఒక్కో ఎంసీసీబీకి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతోంది. వీటిని అతి తక్కువ ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రక్షణ లభించడంతోపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది. దీంతో లైన్లాస్ తగ్గి అంతిమంగా డిస్కంకు, వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అదీగాకుండా తుప్పుపట్టిన ఇనుప ఫ్యూజుబాక్సుల స్థానంలో ఎంసీసీబీతో కూడిన ట్రాన్ఫ్ఫార్మర్లు చూడ్డానికి బాగుంటాయి. నగర సుందరీకరణలో ఇవి కూడా భాగమవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎంసీసీబీలను మా డిస్కంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. – జె.పద్మాజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ -
విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్యాంపు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రస్తుతం హైదరాబాద్ రెడ్హిల్స్లోని సింగరేణి భవన్ నుంచే ఏపీఈఆర్సీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారిఫ్పై కూడా విశాఖపట్నం నుంచే ఆన్లైన్ ద్వారా ఏపీఈఆర్సీ విచారణ జరిపింది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే ఇక్కడి నుంచి ఈఆర్సీ ఏడాదిలో కొద్దిరోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్రంగంలో విద్యుత్ చార్జీల నిర్ణయంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఈఆర్సీ పాత్ర కీలకమైంది. అటువంటి ఈఆర్సీ క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటైతే.. విశాఖ కాస్తా విద్యుత్రంగ కార్యకలాపాలకు వేదికగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మారనున్న డిస్కంలు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లోనూ మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. జిల్లాల పరిధుల మేరకు డిస్కంల పరిధులను కూడా మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు కసరత్తు మొదలుపెట్టాయి. కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు అనుగుణంగానే మార్పులు చేపట్టాలని డిస్కంలు నిర్ణయించాయి. కొత్తగా వ్యవసాయ డిస్కం : రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. కొత్తగా వ్యవసాయానికి పాతికేళ్ల పాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్ఏపీఎస్సీఎల్)ను ఏర్పాటు చేస్తోంది. దీంతో నాలుగు అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1,91,29,441 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో దాదాపు 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటిని ప్రత్యేకంగా వ్యవసాయ డిస్కం పరిధిలోకి తెస్తారు. ఈ డిస్కం కోసం ప్రత్యేకంగా కొందరు అధికారులు, సిబ్బందిని నియమించాలి. మారుతున్న పరిధులు ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలున్నాయి. ఎస్పీడీసీఎల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత 2019లో ఏపీసీపీడీసీఎల్ పేరుతో మూడో డిస్కంను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, సీఆర్డీఏ పరిధిలోని సర్వీసులను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మూడును నాలుగు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో వీటి పరిధిలోకి ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొత్త ప్రాంతాలు కొన్ని వస్తాయి. కొన్ని ప్రాంతాలు వేరుపడతాయి. దీంతో వీటి పరిధులూ మారతాయి. వాటికి అనుగుణంగా కార్యాలయాలు, సిబ్బందిని మార్చాలి. మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) నేతృత్వంలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్ల వారీగా డివిజన్ ఇంజనీర్(డీఈ) కార్యాలయాలున్నాయి. ప్రతి డివిజన్లో నాగులుకు పైగా సెక్షన్ (ఏఈ) కార్యాలయాలున్నాయి. పునర్వ్యవస్థీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26 అవుతుంది. వీటికి అనుగుణంగా ఎస్ఈ, డీఈ, ఏఈ కార్యాలయాలను కూడా డిస్కంలు పునర్వ్యవస్థీకరించాలి. ప్రస్తుతం 13 ఉన్న ఎస్ఈ స్థాయి అధికారుల సంఖ్య 26 అవుతుంది. వీటన్నింటికీ ఎస్ఈ స్థాయి అధికారులను నియమించాలి. దీంతోపాటు డీఈ, ఏఈ కార్యాలయాల్లోనూ మార్పులు రానున్నాయి. దీని కోసం డిస్కంలు కసరత్తు మొదలుపెట్టాయి. అర్హులైన వారికి ప్రమోషన్ ఇచ్చి కొత్త జిల్లాలకు పంపాలని డిస్కంలు భావిస్తున్నట్లు సమాచారం. -
కృష్ణపట్నం ప్లాంటుకు కన్సల్టెన్సీ
సాక్షి, అమరావతి: శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని (కృష్ణపట్నం ప్లాంటును) మూడో యాజమాన్యానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియను అధ్యయనం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) బోర్డు సమావేశం గురువారం విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగింది. ఏడుగురు సభ్యులున్న బోర్డులో ఇద్దరు తెలంగాణ అధికారులు ఉన్నారు. వీరు మాత్రం కృష్ణపట్నం ప్లాంటు నిర్వహణపై ఏపీ నిర్ణయానికి అభ్యం తరం తెలిపినట్లు సమాచారం. కానీ మెజారిటీ సభ్యులు ఏపీ నుంచి ఉండటంతో వారు కన్సల్టెన్సీ నియామకానికి మొగ్గుచూపారు. -
APEPDCL ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్కు సమాచారం వస్తుంది. ఈ యాప్లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరి క్షేమం కోరి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ అంతరాయాల షెడ్యూల్ను ముందే తెలుసుకునేలా రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్టీఎఫ్ఎంఎస్)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విద్యుత్ కొనుగోలు లెక్కలు సిద్ధం
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు 2017 నుంచి 2020 వరకు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చుల లెక్కలను సమర్పించేందుకు అనుమతి ఇ వ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) కోరాయి. 2017–18 సంవత్సరంలో చేసిన ఖర్చును 2018–19 సంవత్సరానికి, 2018–19లో చేసిన ఖర్చును 2019–20కి అన్వయించమని విజ్ఞప్తి చేశాయి. యూనిట్కు రూ.3.68 నుంచి రూ.4.62 వరకు వెచ్చించినట్లు ఈపీడీసీఎల్, రూ.3.68 నుంచి రూ.4.63 వెచ్చించినట్లు ఎస్పీడీసీఎల్ వెల్లడించాయి. వీటి ఆధారంగా పూర్తిస్థాయిలో ‘పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్’ గణాంకాలను సమర్పిస్తామని తెలిపాయి. డిస్కంలు చెప్పిన ధరలపై అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఏపీఈఆర్సీ వివిధ వర్గాల విద్యుత్ వినియోగదారులను కోరింది. డిస్కంల ప్రతిపాదనలపై ఫిబ్రవరి 2వ తేదీన వర్చువల్గా విచారించనున్నట్లు తెలిపింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలకు అవకాశం! ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్ ఎల్డీసీ) ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్–2006కి సంబంధించి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలుకు అవకాశం కల్పించేలా వీటిని రూపొందించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిబంధనలతోనే ఏపీఈఆర్సీ నడుస్తోంది. నియామకాలు, కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేయాల్సి ఉంది. కేంద్ర విద్యుత్ చట్టం–2003 ప్రకారం నిబంధనలు తయారు చేస్తున్నట్లు ఏపీఈఆర్సీ గతంలోనే తెలిపింది. తాజాగా డిస్కంలకు సంబంధించి రెగ్యులేషన్స్లోని 7వ నిబంధనను సవరించాలని ఏపీఎస్ఎల్డీసీ కోరింది. దీనివల్ల డిస్కంలు పరస్పరం తమ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు విద్యుత్ కొనుగోలులో జరిగే ఆలస్యాన్ని అరికట్టవచ్చు. దీనికి సంబంధించిన ప్రతిదీ లోడ్ డిస్పాచ్ సెంటర్కు తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సవరణపై జనవరి 12వ తేదీలోగా ప్రజలు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలపాలని ఏపీఈఆర్సీ కోరింది. అనంతరం కొత్త రెగ్యులేషన్స్ను ప్రకటించనుంది. -
‘ఏపీఈపీడీసీఎల్’ ఆదాయానికి ‘చెక్’!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంసలో చెక్కుల మాటున సాగుతున్న గోల్మాల్ మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజుల కిందట శ్రీకాకుళం సర్కిల్లో చెక్కులు చెల్లించిన హెచ్టీ వినియోగదారులపై సర్చార్జి వేసి, వసూలైన సొమ్మును పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. అలానే విశాఖ సర్కిల్ పరిధిలో జరిగిన అవకతవకలపై సర్కిల్ రెవెన్యూ అధికారులు తాజాగా అవినీతి నిరోధక శాఖకు, ట్రాన్స్కో విజిలెన్స్కు 62 పేజీల సమగ్ర నివేదికను అందజేశారు. 13 మందిపై ఆరోపణలు విశాఖపట్నంలోని ఓ భారీ పరిశ్రమ ప్రతినెలా విశాఖ సర్కిల్ కార్యాలయానికి అందజేసిన తమ విద్యుత్ బిల్లులకు సంబంధించిన చెక్కులు 2017, 2018 సంవత్సరాల్లో సకాలంలో నగదుగా మారలేదు. గడువు తేదీ ముగిశాక ఒక రోజు నుంచి ఐదు రోజులకు జమ అయ్యేవి. నిజానికి నిర్ణీత గడువు పూర్తయ్యాక చెల్లించే బిల్లులపై లేట్ పేమెంట్(ఎల్పీ) చార్జి వసూలు చేయాలి. కానీ అలా జరగకుండా నగదు వచ్చినట్టుగానే అప్పట్లో విశాఖ సర్కిల్ అధికారులు రికార్డుల్లో నమోదు చేసేశారు. దీంతో డిస్కంకు రావాల్సిన ఎల్పీ ఆదాయం పోయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఫిర్యాదు అందడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు, ట్రాన్స్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విశాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీవో) ప్రసన్నకుమార్కు విశాఖ సర్కిల్ అధికారులు తాజాగా అందించారు. దాదాపు రూ.15 లక్షలు ఎల్పీ నష్టం జరిగినట్టు ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఆ రెండేళ్ల కాలంలో పనిచేసిన సీనియర్, జూనియర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లతో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను బాధ్యులుగా తేల్చారు. కేసు విచారణను వారంలోగా పూర్తి చేస్తామని చీఫ్ విజిలెన్స్ అధికారి ఏవీఎల్ ప్రసన్నకుమార్ చెప్పారు. కాగా, ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొంత మంది కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులు లబ్ధి పొందాలని చూస్తున్నట్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి చెప్పాడు. ఓ కంపెనీకి కొన్ని వెసులుబాట్లు కల్పించిన మాట వాస్తవమని తెలిపారు. కానీ అవి కేవలం కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేసినట్టు తెలిపాడు. శ్రీకాకుళం వ్యవహారంలో త్వరలో చర్యలు ఇదిలా ఉండగా, శ్రీకాకుళం రెవెన్యూ కార్యాలయం(ఈఆర్వో)లో హెచ్టీ వినియోగదారుల నుంచి చెక్కులు తీసుకుని సకాలంలో బ్యాంకులో డిపాజిట్ చేయలేదు. ఫలితంగా వారిపై ఎల్పీ పడింది. కొంత మంది గొడవెందుకని ఆ మొత్తాన్ని చెల్లించేశారు. కానీ ఆ సొమ్ము సంస్థకు చేరలేదు. దీనిపై అక్కడి ఎస్ఈ మహేందర్తో పాటు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. బాధ్యులపై చర్యలకు డిస్కం సీఎండీకి సిఫారసు చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈఆర్వో అక్రమార్కులపై వేటు పడే అవకాశం ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు.. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నం సర్కిల్లో జరిగిన చెక్కుల వ్యవహారం గత సీఎండీల కాలంలోనిది. దానిపైనా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. తప్పుచేసిన వారెవరినీ ఉపేక్షించేది లేదు. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి. డిసెంబర్ నెల (నవంబర్లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులను పరిశీలించిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈఆర్సీ ఆదేశాలతో వెనక్కి.. 2014–15 నుంచి 2018–19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో విద్యుత్ బిల్లులు ట్రూఅప్ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. వినియోగదారులకు రూ.196.28 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఇలా ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్ కింద వసూలు చేశాయి. ఐదేళ్ల క్రితం నాటి ట్రూఅప్ చార్జీలు కావడంతో అప్పటికి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్వీసులు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోకి వచ్చాయి. వీటికి ఏపీసీపీడీసీఎల్ బాధ్యత తీసుకుని రూ.28 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట దక్కింది. -
ఐదేళ్ల ‘ట్రూ అప్’పై విచారణ
సాక్షి, అమరావతి: ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల వసూలు సబబేనని కొందరు, ఆ భారం ప్రజలపై వేయరాదని మరికొందరు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సూచించారు. రాష్ట్ర ప్రజలపై సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల నుంచి మొదలుపెట్టిన ఐదేళ్ల ఇంధన సర్దుబాటు చార్జీలపై ఏపీఈఆర్సీ సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించింది. 2014–15 నుంచి 2018–19 వరకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలు, వాస్తవ ఖర్చుల ఆధారంగా రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మండలిని కోరాయి. దీన్లో రూ.3,669 కోట్ల వసూలుకు అనుమతి ఇస్తూ ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఉత్తర్వులిచ్చింది. ట్రూ అప్ చార్జీలపై ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని, అవగాహన కల్పించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను సుమోటోగా తీసుకున్న ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేసి, ట్రూఅప్ చార్జీలపై ప్రజల అభిప్రాయాలు మరోసారి సేకరించాలని నిర్ణయించింది. గతనెల 19న నిర్వహించిన విచారణలో 86 మంది అభిప్రాయాలు వెల్లడించారు. సోమవారం ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి పారిశ్రామిక, వాణిజ్య, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించారు. 45 మంది విచారణకు హాజరుకాగా 15 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. ట్రూ అప్ చార్జీలు విధించడాన్ని కొందరు సమర్థించారు. విచారణలో ఏపీఈఆర్సీ సభ్యులు రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామాసింగ్, కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో వేధింపులు!
సాక్షి, అమరావతి: జనరల్ మేనేజర్ స్థాయి అధికారి, మరో అధికారి తమను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లోని ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తమను రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉంచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విధి నిర్వహణలో ఉండగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. పరస్పర అంగీకార బదిలీలకూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇదే జనరల్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గతంలో విశాఖ సర్కిల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనలో జనరల్ మేనేజర్పై కేసు నమోదైందని, మరో అధికారిపై కూడా రాజమండ్రి, విశాఖపట్నంలో వేధింపుల ఫిర్యాదులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. సీజీఎం స్థాయి అధికారి వారికి వత్తాసు పలుకుతుండటం తమను మరింతగా బాధిస్తోందని, తమను గానీ, వారిని గానీ బదిలీ చేసి ఈ వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వారు సీఎండీని, ఇతర ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. డిస్కంలో అధికారుల వేధింపులపై తమకు అందిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు విచాణకు ఆదేశించినట్లు ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జాయింట్ మేనేజర్ కర్రి వెంకటేశ్వరరావు తెలిపారు. -
విద్యుత్ శాఖలో ఉద్యోగాల వెలుగులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఎనర్జీ అసిస్టెంట్ (జూనియన్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి "https://www.apeasternpower.com/' ఏపీఈపీడీసీఎల్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019లో భర్తీ చేయగా.. మిగిలిన 398 పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్, వైరింగ్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు చేసిన పురుష అభ్యర్థులు అర్హులు. అలాగే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాతపరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణులైనవారిని మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)కు పిలుస్తారు. ముఖ్యమైన తేదీలు ఇలా.. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24 ► రాత పరీక్ష: అక్టోబర్ 10 (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు) ► రాత పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 22 ► ఫిజికల్ టెస్ట్ (విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ చూడటం, సైకిల్ తొక్కడం): నవంబర్ 1 – 6 ► ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: నవంబర్ 15 ► నియామక పత్రాలు అందజేత: నవంబర్ 17 ► పత్రాలు అందుకున్నవారు ఏఈలకు రిపోర్ట్ చేయాల్సింది: నవంబర్ 29 ► ఓరియెంటేషన్ కార్యక్రమం: నవంబర్ 30 – డిసెంబర్ 1 వరకు ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సెక్రటరీలకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరిక: డిసెంబర్ 2 -
ఏపీఈపీడీసీఎల్: జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(ఏపీఈపీడీసీఎల్).. ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► పోస్టులు: ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2) ► మొత్తం పోస్టుల సంఖ్య: 398 ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021 ► వెబ్సైట్: https://apeasternpower.com -
ఆంధ్రప్రదేశ్లో లైన్మెన్ ఉద్యోగాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రామ/వార్డు సెక్రటేరియట్స్లో ఉన్న 86 ఎనర్జీ అసిస్టెంట్(జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, పోల్ క్లైబింగ్, మీటర్ రీడింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 3వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్మెన్ ట్రేడ్ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్(ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్ /ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్)లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు: 31.01.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్(పోల్/టవర్ క్లైబింగ్ టెస్ట్), మీటర్ రీడింగ్ టెస్టుల ద్వారా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ► పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. పోల్ క్లైబింగ్ ► పోల్ క్లైబింగ్ టెస్ట్లో భాగంగా.. 15 నిమిషాల వ్యవధిలో పోల్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించి.. పోల్ క్లైబింగ్లో విఫలమైతే ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తారు. మీటర్ రీడింగ్ ► రాత పరీక్షతోపాటు పోల్క్లైబింగ్లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో మీటర్ రీడింగ్ పరీక్షలకు పిలుస్తారు. ఎంపిక తర్వాత ► ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15000 చొప్పున వేతనంగా అందిస్తారు. వీరు గ్రామ పంచాయతీ/వార్డులలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్/వార్డు సెక్రటేరియట్స్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, అలాగే ఎస్సీ/ఎస్టీ వారు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి: 03.05.2021 ► వెబ్సైట్: www.apcpdcl.in టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు -
ఎంత వాడితే అంతే బిల్లు : నాగలక్ష్మి
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. కరెంట్ బిల్లులు పెరిగినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. లాక్డౌన్ కారణంగానే గత నెల రీడింగ్ తీయలేదని నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెలలో రెండు నెలల రీడింగ్ తీసుకున్నామని, అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని, ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంతో విద్యుత్ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు. ఒకవేళ కరెంట్ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ సెంటర్ 1912కి కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, కరెంట్ బిల్లులు చెల్లించడానికి జూన్ 30వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. టారిఫ్లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్ విధానంలోకి తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేవిధంగా టారిఫ్ తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే ఏడాది మొత్తం ఒకటే టారిఫ్ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్ అమల్లో ఉండేదని నాగలక్ష్మి తెలిపారు. -
స్తంభం ఎక్కేద్దాం... కొలువు కొట్టేద్దాం..
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొలువుల జాతర కొనసాగుతోంది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న గ్రామ సచివాలయాల వ్యవస్థలో విద్యుత్ శాఖ తరఫున సేవలందించే జూనియర్ లైన్మెన్ల నియామక ప్రక్రియ నిఘా నీడలో మంగళవా రం ప్రారంభమైంది. విజయనగరం దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంగణంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ వై.విష్ణు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎంపికల్లో మొదటి రోజు 92 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 528 పోస్టుల భర్తీకి నిర్వహిస్తోన్న ఎంపికలకు 1575 మందికి విద్యుత్ శాఖ అధికారులు కాల్ లెటర్లు పంపించారు. ఇందులో మొదటి రోజు 316 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా... 224 మంది మాత్ర మే హాజరయ్యారు. ఎంపికలకు వచ్చిన అభ్యర్థులకు ముందుగా పది, ఐటీఐ, ఇతర అర్హత ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. అనంతరం 8 మీటర్ల విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడిం గ్, సైక్లింగ్ అంశాల్లో అభ్యర్థి వ్యక్తిగతల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. 5 బ్యాచ్లుగా నిర్వహించిన ఎంపికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసు బందో బస్తు నియమించారు. ఈ ఎంపికల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనలో వెనుదిరగగా.. మరికొందరు స్తంభం ఎక్కడంలో విఫలమయ్యారు. పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలన్న సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయగా... విశాఖ కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఏపీఈపీడీసీఎల్ సీజీఎం పీవీ సత్యనారాయణ, డీజీఎం విజయకుమారిలు దగ్గరుండి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి... విద్యుత్ భవనం ఆవరణలో నిర్వహించిన జూనియర్లైన్మన్ ఎంపికల కోసం విద్యుత్ శాఖ అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఎంపికల్లో కీలకమైన స్తంభం ఎక్కడంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందుస్తు భధ్రతాచర్యలు చేపట్టారు. స్తంభం దిగువ భాగంలో రెండు అడుగుల ఎత్తులో ఇసుక, రంపం పొట్టు వేయడంతో పాటు అభ్యర్థి జారి పడిపోతే పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేశారు. అభ్యర్థి స్తంభం మధ్యలోనే ఉండిపోతే కిందకు దించేందుకు నిచ్చెనెలు సిద్ధం చేశారు. ఈప్రక్రియను ఐదుగురు డివిజన్స్థాయి ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే, చాలా మంది అభ్యర్థులు ఉద్యోగం ఆశతో తమకు అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి పాట్లు పడ్డారు. టెస్ట్ కోసం పోల్ ఎక్కిన దుర్గా ప్రసాద్ అనే అభ్యర్థి కాలు జారీ పోల్ మీద నుంచి కింద పడిపోయాడు. సుమారు 8 మీటర్ల ఉండే పోల్ ను అభ్యర్థులు ఎక్కాల్సి ఉంటుంది. అదే క్రమంలో పోల్ ఎక్కుతున్న నెల్లిమర్ల జరజాపుపేటకు చెందిన దుర్గా ప్రసాద్ 6 మీటర్ల ఎత్తులో వెళ్లేసరికి ఒక్కసారిగా చేతులు జారీ కింద పడిపోయాడు. నడుముకి గాయమైంది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు అభ్యర్థిని అంబులెన్స్లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి.. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 528 జేఎల్ఎం పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహిస్తోన్న ఎంపికల్లో అభ్యర్థులకు తప్పనిసరిగా స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి. సామర్థ్యం లేనివారు ఎంపికలకు హాజరుకాకపోవడం మంచిది. కోరుండి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. ఐదురోజుల పాటు జరిగే ఎంపికలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. వీడియో చిత్రీకరణ జరుగుతుంది. కార్పొరేట్ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారులు ఎంపికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బుధవారం నుంచి ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుంది. – యాగంటి విష్ణు, ఎస్ఈ -
కాంట్రాక్టర్ మాయాజాలం
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): ఏపీఈపీడీసీఎల్లో ఆయనో మానవ వనరులను సరఫరా చేసే కాంట్రాక్టర్.. 2014 వరకు సాధారణ వ్యక్తి.. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ట్రాన్స్కోలో చక్రం తిప్పాడు. అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకుని ఉన్నతాధికారుల్ని వలలో వేసుకున్నాడు. నూతనంగా ఏర్పాటు చేసే సబ్స్టేషన్లలో ఉద్యోగాలు వేయిస్తానని ఉద్యోగ స్థాయిని బట్టి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు వెలుగులోకి రావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని కాంట్రాక్టు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. ఉద్యోగుల ‘స్పందన’లో శుక్రవారం బాధితులు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కు వినతి పత్రాన్ని అందజేయడంతో ఇది చర్చనీయాంశమైంది. ఒక కాంట్రాక్టర్ వల్ల తాము ఏ విధంగా ఇబ్బందులు పటుతున్నదీ వారు జిల్లా ఉన్నతాధికారి వద్ద వాపోయారు. వివరాల్లోకి వెళితే ...ఎన్.స్వామినాయుడు ఎంఎస్ సాయి మణికంఠ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. 2012 వరకు విద్యుత్ రంగ సంస్థలో ఏపీ ట్రాన్స్కో 139/33 కేవీ డీజీఎన్పీ(చావుల మదుం సమీపంలో ఉన్న) సబ్ స్టేషన్లో సబ్ ఇంజినీర్(హైస్కిల్డ్)గా పార్ట్టైం సూపర్వైజర్గా పని చేసేవాడు. ఆ తరువాత ఉద్యోగం మానేసి రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ డిప్లమా సర్టిఫికెట్ సంపాదించి కాంట్రాక్టర్ అవతార మెత్తాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి అప్పటి మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అండతో ఏపీఈపీడీసీఎల్లో చక్రం తిప్పాడు. అప్పట్లో అవుట్ సోర్సింగ్లో పనిచేసే వారిని పర్మినెంట్ చేసేవారు. ఖాళీ అయిన స్థానాల్లో అవుట్ సోర్సింగ్లో కొత్తవారిని నియమించేవారు. ఈమేరకు ఉద్యోగాలు వేయించేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా విజయనగరం జిల్లాలో 200 ఖాళీలను భర్తీ చేశాడని చెబుతున్నారు. విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి అని చెప్పుకుంటున్నారు. అప్పట్లో ట్రాన్స్కో, ఏపీఈపీడీసీఎల్ సంస్థల్లో కొందరు అధికారుల సహకారంతో రూ.వందల కోట్లు ఆర్జించాడని బాహటంగానే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్లాయనే వాదన ఉంది. కారుణ్యం లేదు... జిల్లాలోని నర్సీపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్స్టేషన్లో వేరొక కాంట్రాక్టర్ 11 మందిని కారుణ్య నియామకాలు చేపట్టారు. నెల రోజుల తరువాత గ్లోబల్ టెండర్ విధానంలో స్వామి నాయుడుకు ఆ కాంట్రాక్టు టెండర్ బదాలాయించారు. గతంలో జరిపిన కారుణ్య నియామకాల ద్వారా చేరిన వారిని భయాందోళనలకు గురిచేసి తొలగించేశారు. స్థానిక మంత్రి అయ్యన్నపాత్రుడుతో కుమ్మక్కయి ఒక్కో ఉద్యోగానికి రూ.7లక్షలకు అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా నర్సింగబిల్లి సబ్ స్టేషన్లో 11 మందిని నియమించారు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ సహకారంతో గతంలో నియమించిన వారిని తొలగించి కొత్తవారిని చేర్చారు. ఇది అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులతో భయపెట్టారు. ఈ అరాచకాలను తట్టకోలేక దేవీప్రసాద్ అనే స్కిల్డ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు... వీరు చేసిన అవకతవకలు బయటపడడంతో పశ్చిమగోదావరి జిల్లాలో టెండర్లను రద్దు చేస్తూ ఈపీడీసీఎల్ సీజీఎం–ఓ అండ్ సీఎస్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. తాడేపల్లి డివిజన్లో టెండర్ రద్దు చేస్తూ 2019 జూన్ 15న బ్లాక్లిస్టులో పెట్టారు. ఈ వ్యక్తి కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని తిరిగి టెండర్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామినాయుడు అరాచకాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బాధితులు కోరుతున్నారు. ఈమేరకు ‘స్పందన’ కార్యక్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి... ఇటీవల 2018–19లో 132/33 కేవి సబ్స్టేషన్లలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించి కారుణ్య నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారంలోనూ అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. వాచ్మన్ ఉద్యోగానికి రూ.5లక్షలు, ఐటీఐ చేసిన వారికి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి రూ.10లక్షలు, డిప్లమా చేసిన వారికి రూ.9లక్షలు వంతున వసూలు చేశారనే వాదన ఉంది. అరాచకాలపై విచారణ జరపాలి కాంట్రాక్టర్ చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ జరపాలి. చాలా చోట్ల ఉద్యాలు వేయిస్తామని నమ్మించి మా లాంటి నిరుద్యోగుల నుంచి లక్షల్లో దోచుకున్నాడు. పాత ఉద్యోగుల్ని రాజకీయం చేసి తొలగించేలా చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రమేయం ఉంది. – ఎం.కృష్ణ, అనకాపల్లి -
అక్రమార్కులకు ‘షాక్’ ఇస్తారా?
సాక్షి, విజయనగరం: కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అక్రమార్కులకు బంగారు బాతుగుడ్డుగా మారింది. అవినీతి, అక్రమాలకు ఆలవాలంగా తయారైంది. సంస్థలో అక్రమ నియామకాలు, అడ్డగోలు ఇంక్రిమెంట్లు, తుపాన్లలో నిధుల దుర్వినియోగం వంటి ఎన్నో అడ్డదారి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎండీలుగా వ్యవహరించిన వారు, కీలకస్థానాల్లో ఉన్న మరికొందరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో ఈ అక్రమాలకు బాధ్యులపై చర్యలకు అడుగు ముందుకు పడడం లేదు. మూడు నెలల క్రితం ఈపీడీసీఎల్లో నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ రూ.కోట్లు చెల్లించారు. కానీ వీరికి ఇంక్రిమెంట్లు ఇవ్వడం ట్రాన్స్కో తేల్చి చెప్పినా ఇందుకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. ఈ 32 మంది నుంచి రికవరీ చేయాలని ట్రాన్స్కో ఆదేశించినా ఇప్పటిదాకా కొద్దిమంది నుంచే తప్ప మిగతా వారి నుంచి వసూలు చేయలేదు. అలాగే తిత్లీ తుపానులో ఈపీడీసీఎల్కు రూ.349 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులోనూ పెద్ద ఎత్తున నిధుల స్వాహా జరిగింది. పనులు చేయకుండానే చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చెల్లించడం, మెటీరియల్ కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు చూపి కోట్లాది రూపాయల నిధులను మింగినట్టు ఆరోపణలొచ్చాయి. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు బంధువుల పేరిట ఉన్న సంస్థ నుంచి కండక్టర్ల కొనుగోలు చేసినట్టు చూపించి సొమ్ము స్వాహా చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతటి భారీ కుంభకోణంపై కూడా ఎలాంటి చర్యలు లేవు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా జిల్లాల్లోని సర్కిల్స్ నుంచి సీనియర్ అసిస్టెంట్లను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీలు చేయడం వెనక భారీగా చేతులు మారాయన్న విమర్శలు సంబంధిత అధికారులపై వచ్చాయి. అంతేకాదు.. స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ల రెండేళ్ల టెండరు గడువు 2019తో ముగిసింది. కానీ వారు అడగకుండానే అప్పటి సీఎండీ హెచ్వై దొర 2020 వరకు కాంట్రాక్టు పొడిగించేశారు. అలాగే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా లక్షల్లో అమ్ముడుపోయినా సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు. మరోవైపు 15 ఏళ్ల క్రితం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఈపీడీసీఎల్లో వివిధ పోస్టుల్లో 29 మందిని నియమించారు. వీరిలో 28 మంది నకిలీలేనని దీనిపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు తేల్చి నివేదికలిచ్చారు. చర్యలు తీసుకోవాలని రెండు మార్లు సిఫార్సు చేశారు. అయినా వీరు ఇప్పటికీ ఉద్యోగాల్లోనే కొనసాగుతూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఇలా ఈపీడీసీఎల్లో చిన్నా చితకా కాదు.. భారీ అక్రమాలు, అవినీతి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. 172 సబ్స్టేషన్ల ఏర్పాటులో ఎస్టిమేట్ రేట్లకంటే ఎక్కువకు మెటల్ కొనుగోలు చేయడంలోనూ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. పదేళ్ల నుంచి కొనుగోలు ఆర్డర్ ప్రకారం సకాలంలో సప్లై చేయనందుకు పోల్స్ తయారీ సంస్థలకు విధించిన పెనాల్టీనీ మాఫీ చేసి రూ.38 కోట్లు వెనక్కి చెల్లించడం పెను దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి సెల్వరాజన్ వీటిన్నిటిపై దృష్టి సారిస్తారా? లేదా? ఈ సవాళ్లన్నిటీ ఆమె ఎలా ఎదుర్కొంటారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
‘కళా’ గారూ.. కాపాడరూ?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో జరిగిన ఇంక్రిమెంట్ల కుంభకోణంలో సూత్రధారులైన అధికారుల్లో కలవరం మొదలైంది. చర్యల నుంచి తప్పించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఎలాగైనా కాపాడంటూ విద్యుత్తు శాఖ మంత్రి కళా వెంకట్రావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఈపీడీసీఎల్లో ఇంక్రిమెంట్ల స్కాం’ శీర్షికతో ఇటీవల సాక్షి ప్రథాన సంచికలో కథనం ప్రచురించిన సంగతి విధితమే.ఈ వ్యవహారంలో 32 మంది ఉద్యోగులకు అడ్డగోలుగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం, దీనిని ట్రాన్స్కో కూడా తప్పు పట్టిన నేపథ్యంలో ఈ ఇంక్రిమెంట్ల సొమ్మును వడ్డీతో సహా రికవరీ చేయాలని ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్య ఉత్తర్వులిచ్చారు. బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. దీంతో సూత్రధారుల్లో కలవరం మొదలైంది. ఇదీ పరిస్థితి నిబంధనలకు విరుద్ధంగా ఇంక్రిమెట్లు పొందిన వారిలో విశాఖపట్నం ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో 12 మంది, ఇతర సర్కిళ్లలో మరో 20 మంది వెరసి 32 మంది ఉద్యోగులున్నారు. వీరు ఇంక్రిమెంట్లు పొందడంలో కీలక పాత్ర పోషించిన వారిలో సీజీఎంలు, ఎస్ఏవో, ఏఏవోలతో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. ఉద్యోగులకు లక్షలాది రూపాయలు లబ్ధి చేకూర్చడానికి వీరు వివిధ రూపాల్లో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తమపై చర్యలు తీసుకోకుండా చూడాలంటూ విద్యుత్శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావును ఈ అధికారులు ఆశ్రయించినట్టు తెలిసింది. ఇందులో జోక్యం చేసుకుంటే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో వారికి భరోసా ఇవ్వలేదని సమాచారం. -
మా డేటా మాదే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వెబ్సైట్ల హ్యాకింగ్తో విద్యుత్ సంస్థలు కళ్లు తెరిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్లను వేరుచేసే ప్రక్రియను ముమ్మరం చేశాయి. వీలైనంత త్వరగా డేటాను సొంతంగా నిల్వ చేసుకోవాలని భావిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల డేటా హ్యాకింగ్ నేపథ్యంలో తాజా పరిస్థితిని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు గురువారం సమీక్షించారు. డిస్కమ్ల వెబ్సైట్లు హ్యాక్ అయినప్పటికీ.. డేటాను తిరిగి పొందే వీలుందని చెబుతున్నారు. వెబ్సైట్లను నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్)తో డిస్కమ్ల సీఎండీలు సంప్రదింపులు జరిపారు. అనంతరం నిర్వహించిన అంతర్గత సమీక్షలో అనేక అంశాలను గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. వీటికి సంబంధించిన డేటాను డిజిటలైజ్ చేసే ప్రక్రియ 2012లోనే ప్రారంభమైంది. 2015లో టీసీఎస్తో ఒప్పందం చేసుకున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది. అప్పట్లో ప్రైవేట్ సంస్థకు దీని నిర్వహణ బాధ్యతను అప్పగించాయి. వీటికి సంబంధించి సర్వర్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బ్యాకప్ మాత్రం తిరుపతిలోని దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిస్కమ్లు సొంతంగా డేటా స్టోరేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్) కూడా పూర్తి చేసినట్టు డిస్కమ్ల సీఎండీలు తెలిపారు. భద్రతలో లోపాలున్నాయా? రెండేళ్ల క్రితం దక్షిణ ప్రాంత పరిధిలో ఆన్లైన్ టెండర్లు లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. అత్యంత రహస్యంగా నిర్వహించాల్సిన ఈ ప్రక్రియను పోటీ సంస్థలకు లీక్ చేయడంపై దుమారం రేగింది. అప్పట్లో సాంకేతిక కమిటీ వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల కాంట్రాక్టుల వివరాలు లీకవ్వడంపై కమిటీ ఎలాంటి వివరాలను సేకరించలేకపోయింది. డేటా మొత్తం ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వెబ్సైట్ హ్యాక్ కావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. మరోవైపు వెబ్ డేటా తెలంగాణలో ఉండటం వల్ల భద్రత లేదని అధికారులు భావిస్తున్నారు. అక్కడి సర్వర్లపై తెలంగాణ సంస్థలకే పూర్తి అధికారం ఉండటం కూడా సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఆన్లైన్ సేవలకు బ్రేక్ అంతర్జాతీయ హ్యాకర్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) వెబ్సైట్ను హ్యాక్ చేయడంతో ఆ సంస్థకు సంబంధించిన ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆన్లైన్లో సొమ్ము చెల్లించే వారికి ఇబ్బంది తలెత్తింది. డిస్కంల వెబ్సైట్లు హ్యాక్ అయి అప్లికేషన్ సర్వర్కు వైరస్ ఇంజెక్ట్ అయినట్టు తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాటి లింకు కట్ చేశారు. అప్పట్నుంచి ఇతర డిస్కంలతోపాటు ఈపీడీసీఎల్ వెబ్సైట్ కూడా ఆన్లైన్లో కనిపించడం లేదు. ఈ వెబ్సైట్ ద్వారా మన రాష్ట్రంలో రోజుకు సగటున 10 వేల లావాదేవీలు జరుగుతున్నాయి. హ్యాకింగ్ వల్ల మూడు రోజులుగా ఆన్లైన్ చెల్లింపులు స్తంభించిపోయాయి. ఈపీడీసీఎల్ డేటాను వేరే సర్వర్లో ఉంచామని, అందువల్ల డేటాకు వచ్చిన ముప్పు లేదని ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్ (ఐటీ) శ్రీనివాసమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. హ్యాక్ అయిందా..డేటా చెరిపేశారా? వెబ్సైట్ల హ్యాకింగ్ నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో అనేక వాదనలు విన్పిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రధానంగా టెండర్ల వివరాలు, విద్యుత్ బిల్లుల వివరాలు మాత్రమే ఉంటాయి. హ్యాకర్లకు దీనివల్ల ప్రయోజనం ఏమిటనే వాదన తెరమీదకొచ్చింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్న నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం వస్తే విద్యుత్ శాఖలోని అక్రమాలపై విచారణ జరిపే వీలుంది. డిస్కమ్ల పరిధిలో గత ఐదేళ్లుగా అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇటీవల కవర్డ్ కండక్టర్ల కుంభకోణంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయం ఉందనే ఆరోపణలు బయటకొస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విలువైన సమాచారం తొలగించే ప్రయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాకప్ డేటా ఉన్నప్పటికీ, అవసరమైన డేటాను తొలగించి, ఇతర డేటాను తిరిగి స్టోర్ చేసే వీలుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలకు ఎంతమాత్రం అవకాశం లేదని డిస్కమ్ల సీఎండీలు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా హ్యాకింగ్పై పూర్తిస్థాయి విచారణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఫొని తుపాను రేపు (3న) ఒడిశాలోని గోపాల్పూర్, చాంద్బలీల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో తీవ్ర ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఫొని తుఫానుపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర కోస్తా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు తీర ప్రాంతం వెంట గంటకు 90 నుంచి 120 కి.మీల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను పంపుతున్నామని, అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి వనరులకు, విద్యుత్కు అంతరాయం కలిగితే సకాలంలో నీరందించేందుకు వీలుగా ట్యాంకర్లను, జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల్లో కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. నిత్యావసర సరుకులను, మందులను, మంచినీటి ప్యాకెట్లను, కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ విద్యుత్కు అంతరాయం కలిగితే తక్షణం పునరుద్ధరించడానికి వీలుగా ప్రతి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో 500 విద్యుత్ స్తంభాలు, రెండు జేసీబీలు, ఇతర మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవన్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి డి.వరప్రసాద్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈవో బాబు సహాయక చర్యలను వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. 3వ తేదీ సాయంత్రం 5గం.ల 35 నిమిషాల సమయంలో ఒడిశాలోని గోపాల్పూర్, చాంద్బలీ ప్రాంతాల మధ్య తుపాన్ తీరాన్ని దాటొచ్చన్నారు. దీని ప్రభావం ఒడిశా తీరంపై అధికంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కచ్చా గృహాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన పునరావాసం కల్పించాలని సీఎస్ను ఆదేశించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామన్నారు. తుపాన్ ఎఫెక్ట్... పవర్ సెక్టార్ అలర్ట్ ‘ఫొని’ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అప్రమత్తమయింది. తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రలో, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ చూపనుంది. దీంతో గతంలో హుద్హుద్, తిత్లీ తుపాన్లు సృష్టించిన పెనుబీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, సంతబొమ్మాళి, పోలాకి, గార, నందిగామ మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోడానికి ఐదు వేల మంది కార్మికులను శ్రీకాకుళం జిల్లాకు తరలించారు. అలాగే తుపానుకు విద్యుత్ స్తంభాలు కూలిపోయిన పక్షంలో వాటి స్థానంలో అమర్చడానికి 12 వేల స్తంభాలను ఆ జిల్లాకు పంపారు. వాటిని పాతడానికి అవసరమైన 30 పోల్ డ్రిల్లింగ్ మిషన్లు, 70 పవర్ రంపాలు, క్రేన్లను సిద్ధం చేశారు. తగినన్ని ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు (విద్యుత్ తీగలు), ఇన్సులేటర్లను అందుబాటులో ఉంచారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల సిబ్బందిని శ్రీకాకుళం జిల్లాకు పంపారు. నాలుగు మండలాలకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)ను, మూడు సబ్ స్టేషన్లకు ఒక జనరల్ మేనేజర్, ఒక్కో సబ్స్టేషన్కు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఫీడర్కు ఒక ఏఈఈ చొప్పున ఇన్చార్జులను నియమించినట్టు ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బొడ్డు శేషుకుమార్ చెప్పారు. ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపనయ్య బుధవారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు ఆయన అక్కడే ఉండి అవసరమైన సహాయ, పునరావాస పనులను సమీక్షిస్తారు. సమాచారం కోసం శ్రీకాకుళం (94906 12633), విశాఖపట్నం (0891–2853854)కంట్రోల్ రూంలలో సంప్రదించాలని ఆపరేషన్స్ డైరెక్టర్ శేషుకుమార్ కోరారు. -
కొత్త ‘దొర’ ఎవరు?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)కు కొత్త సీఎండీ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సీఎండీగా ఉన్న హెచ్వై దొర రాజీనామాతో ఈ ప్రతిష్టాత్మక పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లలో ఒక డిస్కంకు ఐఏఎస్, మరొక డిస్కంకు నాన్ ఐఏఎస్లు సీఎండీలుగా నియమించాలన్న నిబంధన ఉంది. దానికి లోబడే సీఎండీల నియామకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు ఐఏఎస్ అధికారి ఎంఎం నాయక్, ఈపీడీసీఎల్కు నాన్ ఐఏఎస్ అధికారి హెచ్వై దొర ఉన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో దొర సీఎండీ పదవి నుంచి సోమవారం వైదొలిగారు. ఈ స్థానంలో మరొకరిని నియమించే వరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్కు తాత్కాలికంగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇన్నాళ్లూ డిస్కంల్లో డైరెక్టర్, సీఎండీ పోస్టులకు వయసుతో పనిలేకుండా పదవీ విరమణ చేసిన వారిని కూడా నియమించేవారు. ఇకపై డిస్కం/ట్రాన్స్కో/జెన్కోల్లో డైరెక్టర్, సీఎండీ పోస్టులను 60 ఏళ్ల లోపు వారికే ఇచ్చేలా ఈనెల 15న ప్రభుత్వం సవరణ చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ జీవోను జారీ చేసినట్టు స్పష్టమవుతోంది. సీఎండీ దొర చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో పదవీ విరమణ చేసిన వారు పోటీ పడకుండా అడ్డుకట్ట వేయడంలో భాగంగానే దీనిని విడుదల చేసినట్టు తేటతెల్లమవుతోంది. కొత్త జీవో ప్రకారం ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారే సీఎండీ/డైరెక్టర్ పోస్టులకు అర్హులవుతారు. అంటే ఇకపై రిటైర్ అయిన వారికి ఆ పోస్టుల్లో అవకాశం ఉండదన్నమాట! వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్కు కొత్త సీఎండీని నియమించాల్సి ఉంటుంది. ఒక డిస్కంకు ఐఏఎస్, మరో డిస్కంకు నాన్ ఐఏఎస్ ప్రాతిపదికన ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు ఐఏఎస్ అధికారి ఎంఎం నాయక్ సీఎండీగా కొనసాగుతున్నారు. ఈ లెక్కన ఈపీడీసీఎల్కు నాన్ ఐఏఎస్ నియామకం జరపాల్సి ఉంది. ఇప్పుడు ఈ పోస్టుకు ఎవరు అర్హులన్న దానిపై ఈపీడీసీఎల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎండీ పదవికి డైరెక్టర్ లేదా చీఫ్ ఇంజినీర్/చీఫ్ జనరల్ మేనేజర్లు అర్హులు. ఈపీడీసీఎల్లో ప్రస్తుతం ఉన్న ఇద్దరు డైరెక్టర్లు బి.శేషుకుమార్, చంద్రశేఖర్లు పదవీ విరమణ చేసి కొనసాగుతున్నవారే. తాజా జీవో వల్ల వారికి సీఎండీ అయ్యే అవకాశం లేదు. ఇక సీజీఎంలుగా పి.సింహాద్రికుమార్, కె.సత్యనారాయణమూర్తి, జి.శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు. వీరు ఏడాది, ఏడాదిన్నరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈపీడీసీఎల్కు కార్తికేయమిశ్రా రిక్వెస్ట్? మరోవైపు ఈపీడీసీఎల్ సీఎండీ పదవికి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్పీడీసీఎల్కు ఆయన ఏడాదిన్నర కాలం సీఎండీగా పనిచేశారు. గతంలో కొద్దిరోజులపాటు ఆయన ఈపీడీసీఎల్కు కూడా ఇన్చార్జి సీఎండీగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్నాళ్ల క్రితం ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించాలంటూ ప్రభుత్వానికి విన్నవించినట్టు సమాచారం. మారిన పరిస్థితుల్లో ఆయనకు అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే ఎస్పీడీసీఎల్కు నాన్ ఐఏఎస్ సీఎండీని నియమించే వీలుంది. కాగా నేడో, రేపో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రానుండడంతో ఆయన నియామకానికి వీలుపడదని చెబుతున్నారు. అందువల్ల సార్వత్రిక ఎన్నికలయ్యే దాకా ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్నే కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు నాయక్ మంగళవారం ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచే స్వీకరించారు. -
కాంట్రాక్టర్ల సమ్మెట..
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) రాజమహేంద్రవరం సర్కిల్లో కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్(ఎస్ఎస్ఆర్) సవరణలో ధరలు పెరగకపోగా, తగ్గించడంతో తమకు గిట్టుబాటు కాదంటూ నెల రోజుల నుంచి పనులు నిలిపివేశారు. చివరగా 2014 ఏప్రిల్లో ఎస్ఎస్ఆర్ రేట్ల సవరణ జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో 2014 ఎస్ఎస్ఆర్ రేట్లలో ఏపీఈపీడీసీఎల్ మార్పులు చేసింది. ఆ మార్పుల్లో పాత రేట్లలో పెరుగుదల లేకపోగా సగటును 30 శాతం రేట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఎస్ఎస్ఆర్ రేట్లు ఏడాదికి ఒకసారి సవరిస్తారు. ఆయా జిల్లాల్లో కూలీల అందుబాటు, రేట్లు ఆధారంగా కలెక్టర్లు ఏటా లేబర్ చార్జీలు నిర్ణయిస్తారు. ఆ మేరకు ఏపీఈపీడీసీఎల్ కూడా జిల్లాల వారీగా ఎస్ఎస్ఆర్ రేట్లు నిర్ణయిస్తుంది. ఫలితంగా ఐదు జిల్లాల్లో ఎస్ఎస్ఆర్ రేట్లు భిన్నంగా ఉన్నాయి. 30 శాతం మేర తగ్గిన రేట్లు... ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన సవరించిన ఎస్ఎస్ఆర్ రేట్లతో 2014–15 రేట్లను పోల్చితే పెరగకపోగా సరాసరి 30 శాతం ప్రస్తుతం తగ్గిపోయాయి. 2014–15లో విద్యుత్ స్తంభాన్ని కిలోమీటర్ దూరం తరలిస్తే రూ.545 ఇచ్చేవారు. అదే రెండు కిలోమీటర్లకు రూ.681, మూడు కిలోమీటర్లకు రూ.818, ఐదు కిలోమీటర్లలోపు దూరానికి రూ. 980లు చెల్లించేవారు. అయితే తాజాగా ఇవన్నీ ఎత్తివేసిన ఏపీఈపీడీసీఎల్ ఎంత దూరం విద్యుత్ స్తంభం తరలించినా రూ.510 చెల్లించేలా ఎస్ఎస్ఆర్ రేట్లను సవరించింది. స్తంభాలు పాతే గుంతలు తొవ్వితే గతంలో రూ.357 చెల్లించగా ప్రస్తుతం ఆ రేటును రూ. 312.50లకు తగ్గించారు. స్తంభం పాతినందుకు పాత రేటు రూ.575 ఉండగా, తాజాగా ఆ రేటు రూ.507లకు కుదించారు. గృహ అవసరాలకు వినియోగించే విదుత్య్ వైరు కిలో మీటర్ మేర స్తంభాలపై అమర్చినందుకు గతంలో రూ.1797 చెల్లించగా, ప్రస్తుతం ఆ రేటులో రూ.297 కోత విధించి రూ.1500లకు పరిమితం చేశారు. పాత విద్యుత్ తీగలను తొలగించి కొత్త తీగలను అమర్చినందుకు ఉన్న రేట్లను రూ.1390 నుంచి రూ.690లకు కుదించారు. గిట్టుబాటు కాదంటున్న కాంట్రాక్టర్లు... 2014–15 ఆర్థిక ఏడాదిలో జరిగిన ఎస్ఎస్ఆర్ రేట్ల సవరణలో వాస్తవానికి అధికంగా రాజమహేంద్రవరం సర్కిల్లో రేట్లు నిర్ణయించామని ఏపీఈపీడీసీఎల్ భావించి తాజా నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మూడేళ్ల తర్వాత సవరించిన ఎస్ఎస్ఆర్లో రేట్లు పెంచకపోగా తగ్గించిన రేట్లతో తమకు గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్లు అధికారులకు తేల్చిచెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన సవరించిన ఎస్ఎస్ఆర్ రేట్లు అమలులోకి వచ్చాయి. అప్పటి నుంచి రేట్లను సవరించాలని విజ్ఞప్తి చేస్తూ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. అయితే సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నెలరోజుల నుంచి కొత్త పనులు చేపట్టడం ఆపేశారు. వినియోగదారులు డీడీలు చెల్లించిన మూడు నెలల లోపు విద్యుత్శాఖ అధికారులు వారి పనులు పూర్తి చేయాలి. అయితే ప్రస్తుతం కాంట్రాక్టర్లు పనులు చేయకపోవడంతో రాజమహేంద్రవరం సర్కిల్లోని ఐదు డివిజన్లలో వందలాది పనులు పెండింగ్లో ఉన్నాయి. తుపాను హెచ్చరికలతో ఆందోళన... ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు తుపాను హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లాలోని విద్యుత్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. తుపాను వల్ల స్తంభాలు కూలి, వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. తిరిగి విద్యుత్ పునరుద్ధరణలో కాంట్రాక్టర్ల వద్ద ఉండే సిబ్బందే కీలక ప్రాత పోషిస్తారు. నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులో లారీ అదుపు తప్పి ఢీకొట్టడంతో 20 స్తంభాలు కూలిపోయాయి. అ సమయంలో విద్యుత్ అధికారులు, సిబ్బందే అష్టకష్టాలు పడి మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి తిరిగి పునరుద్ధరించారు. కాంట్రాక్టర్లు ఎలాంటి సహాయం అందించలేదు. ప్రస్తుతం పాత రేట్లు చెల్లిస్తూ కొత్త రేట్లలో మార్పులు చేర్పులు చేస్తే తాము పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టర్లు అధికారులకు చెబుతున్నారు. -
బదిలీ బంతాట...!
- విద్యుత్ శాఖలో వింతలు – ఒకే ప్రాంతంలో 23 ఏళ్లు ఉన్నా బదిలీ లేదు – జూనియర్లను బదిలీ చేసిన అధికారులు – సినియారిటీ కోసం మూడు జాబితాల రూపకల్పన – పట్టించుకోని ఉద్యోగ సంఘాలు – ఆవేదన వ్యక్తం చేస్తున్న బదిలీ అయిన జూనియర్లు సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో జరిగిన బదిలీల్లో అనేక చిత్రాలు చోటుచేసుకున్నాయి. సీనియర్లను బదిలీ చేయాల్సిన ఈపీడీసీఎల్ జూనియర్లను బదిలీ చేసింది. బదిలీల్లో పారదర్శకత లోపించే విధంగా సీనియారిటీ నిర్థారణకు అధికారులు మూడు జాబితాలను రూపొందించారు. చివరి రోజు వరకు ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగులు తికమక పడ్డారు. బదిలీ ప్రక్రియ ముగిసినా తర్వాత చూస్తే 23 ఏళ్లు ఒకే స్టేషన్లో పని చేస్తున్నా ఉద్యోగులను బదిలీ నుంచి తప్పించుకున్నారు. వారికన్నా జూనియర్లు మాత్రం బదిలీ అయ్యారు. విద్యుత్ శాఖలో ఒకే స్టేషన్లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న వారిని బదిలీ చేయాలి. అదేవిధంగా మొత్తం పోస్టుల్లో బదిలీలు 20 శాతానికి మించకూడదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలు తమ తమ పరిధిలో బదిలీలు చేపట్టాయి. సీనియారిటీ నిర్థారణ కోసం ఏపీఈపీడీసీఎల్ మూడు జాబితాలు తయారు చేయడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ మాత్రం ఒకే జాబితా తయారు చేసి సీనియారిటీ ప్రకారం బదిలీ చేసింది. మూడు జాబితాలతో నష్టపోయిన జూనియర్లు... స్టేషన్లో ఐదేళ్లుకుపైగా, పోస్టులో మూడేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మొదటి జాబితా, పోస్టులో మూడేళ్లకు పైగా ఉన్న ఉద్యోగులతో రెండో జాబితా, స్టేషన్లో ఐదేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మూడో జాబితాను ఏపీఈపీడీసీఎల్ తయారు చేసింది. మొదటి జాబితా ప్రకారం రాజమహేంద్వరం సర్కిల్లో బదిలీలు చేపట్టింది. ఇక్కడే జూనియర్లకు అన్యాయం జరిగింది. ఏపీఎస్పీడీసీఎల్ తయారు చేసిన లిస్టులో స్టేషన్లో సీనియారిటీ, తర్వాత పోస్టులో ఎంత కాలం ఉన్నారో (మూడేళ్లకు తక్కువగా ఉన్నా) సీనియారిటీ ప్రకారం తయారు చేసింది. కానీ ఏపీఈపీడీసీఎల్లో మాత్రం మొదటి లిస్టులో స్టేషన్లో ఐదేళ్ల సీనియారిటీ, పోస్టులో మూడేళ్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది. ఇక్కడ ఒకే స్టేషన్లో 23 ఏళ్లుగా పని చేస్తున్న వారు పోస్టులో మూడేళ్ల పూర్తి కాలేదని మొదటి లిస్టులో చేర్చలేదు. వీరిని స్టేషన్లో సీనియారిటీ ప్రకారం మూడో జాబితాలో చేర్చారు. ఇక రెండో లిస్టును పోస్టులో సీనియారిటీ ప్రకారం సిద్ధం చేశారు. ఇవిగో బదిలీ ‘చిత్రాలు’... ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి చిత్రాలు చోటుచేసుకున్నాయో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ల(జేఏఓ) ఉద్యోగుల బదిలీల తీరును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతాయి. రాజమహేంద్రవరం సర్కిల్ (జిల్లా మొత్తం)లో మొత్తం 17 మంది జూనియర్ అకౌంట్ ఆఫీసర్లున్నారు. ఇందులో మొదటి లిస్టు (స్టేషన్, పోస్టు సినియారిటీ)లోకి కేవలం 9 మందే వచ్చారు. వీరిలో 13 ఏళ్ల ఏడు నెలల 26 రోజుల స్టేషన్ సీనియారిటీ, మూడేళ్ల 9 నెలల 29 రోజులతో జి.కృష్ణారావు అనే ఉద్యోగి మొదటి స్థానంలో ఉండగా కె.వరప్రసాద్రావు అనే ఉద్యోగి స్టేషన్, పోస్టులు రెండింటిలోనూ ఐదేళ్ల 4 నెలల 29 రోజులతో చివరి స్థానంలో ఉన్నారు. మొత్తం 17 మంది జేఏఓలలో ఒకే స్టేషన్లో వివిధ క్యాడర్లలో 23 ఏళ్ల ఐదు రోజులతో వి.సుజాత అనే ఉద్యోగి మొదిటి స్థానంలో ఉన్నారు. ఆమె తర్వాత కె.ఎస్.వి.విజయలక్ష్మి 22 ఏళ్ల 9 నెలల 10 రోజులు, కె.మోహనరావు 22 ఏళ్ల 18 రోజులు, నక్కా రాజేశ్వరి 21 ఏళ్ల 11 నెలల 31 రోజులు, జి. కృష్ణారావు 13 ఏళ్ల 7 నెలల 26 రోజులు, సీహెచ్.అగస్థేశ్వరరావు 10 ఏళ్లు, కె.రవీంద్రబాబు 9 ఏళ్ల 9 నెలల 29 రోజులు, ఎం. సాల్మన్రాజు ఆరేళ్ల 3 నెలల 31 రోజులు, వి.సత్యనారాయణ మూర్తి 5 ఏళ్ల 11 నెలల 22 రోజులుగా పని చేస్తున్నారు. అయితే వీరందరినీ బదిలీల ప్రక్రియలోకి తీసుకోని అధికారులు పోస్టులో ఐదేళ్ల సీనియారిటీ ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేశారు. ఒకటో జాబితాలో మొదటి స్థానంలో ఉన్న జి.కృష్ణారావు అనే ఉద్యోగిని కూడా బదిలీ చేయని అధికారగణం తర్వాత ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేసింది. వీరందరూ స్టేషన్, పోస్టులలో ఒకే సీనియారిటీ ఉన్న వారు కావడం గమనార్హం. ఒకే స్టేషన్లో 23 ఏళ్లుగా ఉన్న ఉద్యోగులను బదిలీ చేయని ఉన్నతాధికారులు ఆ స్టేషన్లో ఐదేళ్లు అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న జూనియర్ అధికారులను బదిలీ చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యోగుల సంఘాలు కూడా మిన్నకుండిపోవడంతో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ శాఖలో బదిలీలు
రాజమహేంద్రవరం ఆపరేషన్ డీఈగా రాజబాబు కన్స్ట్రక్షన్ డీఈగా శ్యాంబాబు బదిలీ ట్రాన్స్ఫార్మర్ డీఈగా సాల్మన్రాజు సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో బదిలీలు ముగిశాయి. డీఈ, ఏడీఈ, ఏఈ, పరిపాలన, అకౌంట్స్ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం సర్కిల్లో రాజమహేంద్రవరం డివిజన్ ఆపరేషన్ డీఈగా ఉన్న జి.శ్యాంబాబును అదే డివిజన్ కన్స్ట్రక్షన్ డీఈగా బదిలీ చేశారు. ఆ స్థానంలో అదే డివిజన్లో కన్స్ట్రక్షన్ డీఈగా పనిచేస్తున్న ఎస్.రాజబాబును నియమించారు. రాజమహేంద్రవరం డివిజన్ ట్రాన్స్ఫార్మర్ డీఈగా ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం ఆపరేషన్ డీఈ పనిచేసిన సోల్మన్రాజును నియమించారు. రాజమహేంద్రవరం డివిజన్ ట్రాన్స్ఫార్మర్ డీఈగా ఉన్న ఎ.రవికుమార్ను జంగారెడ్డిగూడెం ఆపరేషన్ డీఈగా పంపారు. విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం కమర్షియల్ విభాగంలో ఏడీఈగా ఉన్న కె.రాంబాబును కొత్తపేట ఆపరేషన్ ఏడీఈగా బదిలీ చేశారు. ఈ స్థానంలో పని చేస్తున్న వై.డేవిడ్ను అమలాపురం సబ్డివిజన్ కన్స్ట్రక్షన్ ఏడీఈగా నియమించారు. వీరితో పాటు రాజమహేంద్రవరం సర్కిల్లో 11 మంది ఏఈలను, 8 మంది జూనియర్ అకౌంట్ ఆఫీషర్స్తోపాటు వివిధ విభాగాల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేశారు. -
1912తో విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం
– సీజీఆర్ఎఫ్ అధ్యక్షుడు డి.ధర్మారావు – రాజమహేంద్రవరంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కారవేదిక దానవాయిపేట(రాజమహేంద్రవరం) : విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే తక్షణమే సంబంధిత అధికారులు వారి సమస్యలను పరిష్కరిస్తారని, ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) అధ్యక్షుడు డి.ధర్మారావు తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరంలోని ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక అధ్యక్షుడు, విశ్రాంత జిల్లా జడ్జి డి.ధర్మారావు పాల్గొన్ని వినియోగదారుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2016 సెప్టెంబర్ నుంచి ఐదు జిల్లాలో(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ)లో వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించామన్నారు. 2016లో 336 ఫిర్యాదులు వస్తే 332 విద్యుత్ సమస్యలను పరిష్కారించామని, 2017లో 370 ఫిర్యాదులు 235 సమస్యలను పరిష్కారించామని తెలిపారు. కోన్ని ఫిర్యాదుల్లో సంస్థ అధికారుల నుంచి వినియోగదారులకు నష్టపరిహారం అందజేసినట్టు వెల్లడించారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన, శాశ్వత అంగవైకల్యం పొందిన బాధితుడికి సంస్థ ద్వారా రూ.ఐదు లక్షలు నష్టపరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక సభ్యులు కె.బాలాజీ, పి.వి.రమణరావు, బాలాజీ ప్రసాద్ పాండే, రాజమహేంద్రవరం టౌన్–1 ఏడిఈ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఫోరంతో సమస్యల పరిష్కారం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ ఫోరంను అందుబాటులోకి తీసుకువచ్చామని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కన్సూ్యమర్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ ఫోరమ్ చైర్పర్సన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డి.ధర్మారావు అన్నా రు. శనివారం స్థానిక డీఈఈ కార్యాలయంలో విద్యుత్ విని యోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పలు సమస్యలపై ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ధర్మారావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటరు, బిల్లింగ్లో సమస్యలు, కొత్త సర్వీసులు ఇవ్వడానికి నిరాకరణ, ఇతర సమస్యలను ఫోరం తక్షణమే పరిష్కరిస్తుందన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1912ను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతేడాది సెప్టెంబర్ 2 నుంచి ఇప్పటివరకు 201 కేసుల విషయంలో తీర్పులు చెప్పామన్నారు. బిల్లింగ్లో 112, మీటరు సమస్యలు 8, లోవోల్టేజీ సమస్యలు 10, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ఫోరం ఏర్పాటుతో 5 జిల్లాల్లోనూ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అధికారులు కె.బాలాజీ, పీవీ రమణరావు, బాలాజీ ప్రసాద్ పాండే, డీఈఈ ఎస్.జనార్దన్రావు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ఏపీఈపీడీసీఎల్కు ‘మీ–సేవ’లు
కస్టమర్ సర్వీస్ సెంటర్ల నుంచి తొలగనున్న పలు సేవలు అధికారులకు స్పష్టం చేసిన సీఎండీ ఎంఎం నాయక్ సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సేవలను వినియోగదారులకు అందించేందుకు మీ–సేవ కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో 67 కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా మాత్రమే ఏ సేవకైనా దరఖాస్తు చేసే వెసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ వాటిని నడుపుతోంది. ఇక మీదట దశల వారీగా వాటిలో అందుతున్న సేవలను మీ సేవ కేంద్రాలకు బదలాయించి అక్కడి నుంచే ప్రజలకు అందేలా చేయాలని డిస్కం భావిస్తోంది. ఈ విషయాలను అధికారులకు సీఎండీ ఎంఎం నాయక్ స్పష్టం చేశారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి ఐదు జిల్లాల సర్కిల్ అధికారులతో సీఎండీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కస్టమర్ సర్వీస్ సెంటర్ల అంశంపై సీఎండీ ప్రధానంగా చర్చించారు. ఐదు జిల్లాల్లోనూ వందలాది మీ–సేవ కేంద్రాలు ఉన్నందున కేటగిరి 1,2,7 విద్యుత్ కొత్త సర్వీసుల కోసం దరఖాస్తులను వాటి ద్వారా స్వీకరించే ఏర్పాటు చేస్తే వినియోగదారులకు వెసులుబాటు కలుగుతుందని అధికారులకు సీఎండీ సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐటీ జీఎం శ్రీనివాసమూర్తి ధ్రువీకరించారు. రానున్న రోజుల్లో అన్ని సేవలను మీ సేవా కేంద్రాల నుంచే అందించాలని డిస్కం భావిస్తున్నట్లు ‘సాక్షి’కి ఆయన వెల్లడించారు. -
ఏపీఈపీడీసీఎల్ ఇన్చార్జి సీఎండీగా నివాస్
సాక్షి, విశాఖపట్నం ఏపీ ఈపీడీసీఎల్ ఇన్చార్జి సీఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఎండీగా ఉన్న రేవు ముత్యాలరాజు నెల్లూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన విషయంతెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి బాధ్యతలను నివాస్కు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ను సీఎండీగా నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. యలమంచిలి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ యలమంచిలి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న ఎస్.శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. ఆయనను కౌన్సెలింగ్లో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత ఆ పోస్ట్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సీహెచ్ ప్రమీలను నియమించారు. దీంతో ఎస్.శ్రీనివాసరావును గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.సత్యనారాయణను యలమంచిలి మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. -
వచ్చే మార్చి నాటికి అన్ని ఇళ్లకు కరెంటు
కొవ్వూరు (పశ్చిమగోదావరి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి తమ పరిధిలో ఉన్న ఇళ్లన్నిటికీ విద్యుత్ సౌకర్యం సమకూర్చనున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ్ధ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఆర్. ముత్యాలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇందుకోసం కేంద్రం రూ.120 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అక్టోబర్ నాటికి ఐదు సర్కిళ్లను పేపర్ లెస్ కార్యాలయాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా బ్యాంకుల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
విశాఖలో రూఫ్టాప్ సోలార్ ఎక్స్పో 2015
ఈ నెల 22 నుంచి 3 రోజులపాటు నిర్వహించనున్న ఏపీఈపీడీసీఎల్ సాక్షి, విశాఖపట్నం: సౌర విద్యుత్పై ప్రజల్లో అవగాహనను పెంచి, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) విశాఖలో ఈ నెల 22,23,24 తేదీల్లో 'రూఫ్టాప్ సోలార్ ఎక్స్పో'నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో విశాఖ బీచ్రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జరిగే ఈ ఎక్స్పోలో సోలార్ విద్యుత్ వినియోగం,లాభాలు, ఉత్పత్తి, అమ్మకం వంటి అంశాలపై పలు ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సోలార్ విద్యుత్ రంగంలో నిష్ణాతులైన పంపిణీదారులు, ఉత్పత్తిదారులు, సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగానికి చెందిన నిపుణులు ఈ మూడు రోజుల ఎక్స్పోలో పాల్గొంటారు. సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చే బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల వారు ప్రజలకు సలహాలు, సూచనలు అందిస్తారు. దేశంలో తొలిసారిగా భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ సోలార్ ఎక్స్పో సందర్భంగా చిన్నారులకు, యువతకు సోలార్ ఎనర్జీపై వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పోటీలు జరుగుతాయి. 17లోగా రిజర్వ్ చేసుకోవాలి: సోలార్ ప్రదర్శనలో పాల్గొనదలిచిన ఉత్పత్తి, విక్రయదారులు ఈ నెల 17వ తేదీలోపు నిర్ణీత రుసుము చెల్లించి రిజర్వ్ చేసుకోవాలని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్(కమర్షియల్, ఆర్ఎ,పిపి) బి.రమేష్ప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9490608195, 9440812384 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఖర్చు భారీ.. స్పందన సారీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఏర్పాటు చేసిన సీజీఆర్ఎఫ్ (కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రీడ్రసల్ ఫోరం)కు స్పందన కరువైంది. ప్రతినెలా నిర్వహిస్తున్న ఈ గ్రీవెన్స్ డేకు పదుల్లోపే ఫిర్యాదులు అందుతున్నాయి. బిల్లుల నమోదులో నిర్లక్ష్యం, కొత్త మీటర్లు, కనెక్షన్ ఇవ్వడంలో అలసత్వం, లో వోల్టేజీ తదితర సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సీజీఆర్ఎఫ్ కమిటీ ఈనెల 15న ఏలూరులో గ్రీవెన్స్ నిర్వహించగా 11 ఫిర్యాదులే అందాయి. 16న రాజమండ్రిలో ఏర్పాటు చేయగా ఇద్దరే వచ్చారు. ఈ నెల 21న శ్రీకాకుళంలో నిర్వహించిన గ్రీవెన్స్లో నాలుగే ఫిర్యాదులందాయి. కాగా విజయనగరంలో ఈనెల 23న, విశాఖలో ఈనెల 28న గ్రీవెన్స్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకిలా? 2005లో ఏర్పాటైన సీజీఆర్ఎఫ్లో ఇద్దరు సీఈలు, ఓ ఎస్ఈ సభ్యులుగా ఉంటారు. రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. వాస్తవానికి సీజీఆర్ఎఫ్ నిర్వహణకు ఈపీడీసీఎల్ సంస్థ భారీగా ఖర్చు చేస్తోంది. పలు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. గ్రీవెన్స్లో అందిన దరఖాస్తుల పరిశీలన, సమస్య పరిష్కారానికి 45 రోజుల గడువిచ్చినా.. వారంలోపే పరిష్కారం లభిస్తోంది. అయితే త్రిసభ కమిటీ వద్దకు రాకుండా వినియోగదారుల్ని ఆ శాఖ సిబ్బందే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ స్థాయిలోనే సమస్య పరిష్కరించేస్తామని, పదో పరకో ఇచ్చేస్తే పని అయిపోతుందని చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పెండింగ్ పరిస్థితి ఏంటి? ఐదు జిల్లాల్లో 2014లో 444 ఫిర్యాదులు నమోదైతే అందులో త్రిసభ్య కమిటీ 440 దరఖాస్తులకు మోక్షం కల్పించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 126 ఫిర్యాదులొస్తే 54 పరిష్కారమయ్యాయి. 72 పెండింగ్లో ఉన్నాయి. దీనికి కోర్టు లావేదేవీలు, హియిరింగ్ పూర్తిస్థాయిలో లేకపోవడం, సమయానికి సిబ్బంది వినియోగదారుల వద్దకు వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించకపోవడమే కారణమని తెలుస్తోంది. పాత కమిటీ గడువు ముగిసిపోవడం, మళ్లీ కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టడం, పెండింగ్ దరఖాస్తుల్ని పరిశీలించే క్రమంలో ఇబ్బందులొచ్చినట్టు తెలిసింది. గ్రీవెన్స్ నిర్వహించే నోడల్ అధికారి(డీఈ, టెక్నికల్)కి ఇతర బాధ్యతలు అప్పగించడం కూడా జాప్యానికి కారణమని తెలుస్తోంది. పోస్టుకార్డు రాసినా.. ఇదే విషయమై త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాసరావు, ఎం.వై.కోటేశ్వరరావు, భాస్కరరావుల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గ్రీవెన్స్కు హాజరుకాలేనివారు కనీసం తెల్లకాగితం, పోస్టుకార్డుపైన అయినా తమ సమస్య రాసి పంపినా స్పందిస్తామన్నారు. ఫిర్యాదుల రిజిస్ట్రేషన్, ఎస్సెమ్మెస్, ఎక్నాలెడ్జ్మెంట్ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. తాము బాధ్యతలు స్వీకరించాక ఇప్పటివరకు 76 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. -
సోలార్ పంపుసెట్లు వాడండి
- రైతులకు ఏపీఈపీడీసీఎల్ ఏడీఈ సూచన - సోలార్ పంపుసెట్లపై రైతులకు అవగాహన సదస్సు రాజానగరం: విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు సోలార్ పంపుసెట్లను వినియోగించుకోవడం మంచిదని ఏపీ ఈపీడీసీఎల్ రాజమండ్రి డివిజన్ ఏడీఈ జేపీబీ నటరాజన్ అన్నారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. సోలార్ పంపు సెట్ల వినియోగంపై ఆసక్తి ఉన్న రైతులు విద్యుత్ శాఖ అధికారులను కలిసి తమ పేర్లను నమోదు చేయించుకోవాలని నటరాజన్ సూచించారు. వారికి 30 శాతం సబ్సిడీతో వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పరికరాలను అమరుస్తామన్నారు. నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ నానిబాబు మాట్లాడుతూ సూర్యరశ్మి నుంచి వచ్చే విద్యుత్తో వ్యవసాయ మోటార్లు పనిచేసే ప్రక్రియకు హార్స్పవర్ని బట్టి ధర ఉంటుందని తెలిపారు. 1.5 హెచ్పీ మోటారుకు రూ. 2 లక్షల 28 వేలు, 2 హెచ్పీ మోటారుకు రూ. 3 లక్షల 42 వేలు, 3 హెచ్పీ మోటారుకు రూ. 5 లక్షల 70 వేలు, 5 హెచ్పీ మోటారుకు రూ. 9 లక్షల 12 వేలు వ్యయం అవుతుందన్నారు. ఈ మొత్తంలో 30 శాతం సబ్సిడీగా ఉంటుందన్నారు. ఈ పంపు సెట్లకు బోరు లోతును, మోటారు సామర్థ్యాన్ని బట్టి నీటిని సులువుగా తోడేందుకు అవసరమైన ప్యానల్స్ను ఏర్పాటు చేస్తారన్నారు. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాలతోపాటు విద్యుత్ సరఫరా లేని సమయంలోను ఈ విధానాన్ని ఉపయోగించవచ్చన్నారు. సోలార్ పంపు సెట్టును డీసీ లేదా ఏసీ ఇండక్షన్ మోటార్స్తో కూడా ఉపయోగించవచ్చన్నారు. సోలార్ ప్యానల్స్ను వీఎఫ్డీ అనే పరికరాల సాయంతో ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న మోటారుతో అనుసంధానం చేయవచ్చన్నారు. దీని నిర్వహణకు ఎటువంటి అనుభవమూ అవసరం లేదన్నారు. 20 సంవత్సరాల గ్యారంటీతో సోలార్ పంపు సెట్లను రైతులకు అందజేస్తున్నామని నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ నానిబాబు తెలిపారు. సోలార్ ప్యానల్స్ ద్వారా పంపు సెట్ను వాడటం వలన మోటారు జీవిత కాలం కూడా పెరుగుతుందన్నారు. ఇలా తరగతిలో బోధన చేసినట్టుగా కాకుండా ప్రాక్టికల్గా సోలార్ పంపు సెట్ల పని విధానాన్ని తెలియజేస్తే బాగుంటుందని రైతులు సూచించారు. రాజానగరం, సంపత్నగరం విద్యుత్ సబ్స్టేషన్ల ఏఈలు సుబ్రహ్మణ్యం, మదర్స్షా పాల్గొన్నారు. -
రూ.48 కోట్లతో పుష్కరాల పనులు
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు ప్రకాశంనగర్ (రాజమండ్రి) : గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుత్ శాఖలో రూ.48 కోట్లతో పనులు చేస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు వెల్లడించారు. పుష్కరాల పనులపై తమ శాఖకు చెందిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో ఆయన రాజమండ్రి ఎస్ఈ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ.30 కోట్లతో, పశ్చిమగోదావరిలో రూ.18 కోట్లతో పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 6 కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా 33 కేవీ లైన్ల ఇంటర్ లింక్, 11 కేవీ, ఎల్టీ లైన్లను పూర్తిగా మారుస్తామన్నారు. పుష్కరాల పనులకు ఇన్చార్జిగా లక్ష్మీనారాయణ (హెచ్ఆర్) వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు సీజీఎంలు ఆయనకు సహాయకులుగా ఉంటారని, ఈ ముగ్గురూ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ఈ గంగాధర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఈ టీవీ సూర్యప్రకాశ్, డీఈ శ్యామ్బాబు, ఏడీఈ సామ్యూల్ పాల్గొన్నారు. -
100 రోజుల విద్యుత్ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి
విజయనగరం మున్సిపాలిటీ: ఏపీఈపీడీ సీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో చేపడుతున్న 100 రోజుల ప్రణాళిక పనులపై దృష్టి సారించాలని ఎస్ఈ సి.శ్రీనివాసమూర్తి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. దాసన్నపేట విద్యుత్ భవనంలో జిల్లాలోని అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికల పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి సామగ్రిని ప్రతి వారం తెప్పిం చుకుని పనులను ప్రణాళికా బద్దంగా చేయాలని చెప్పారు. మొత్తం 100 రోజుల వ్యవధిలో ప్రతిపాదించిన పనులన్నింటినీ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, ఏబీ స్విచ్లు ఏర్పాటుతో పాటు లూజ్ స్పాన్స్ సరిచేయటం, ఒరి గిన, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్పు చేయటం వంటి పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలన్నారు. చేసే పనులను పక్కగా నిర్వహించ టం ద్వారా సమస్యలను అధిగమించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వం వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో అందుకు సన్నద్ధం కావాలని సూచించారు. అనంతరం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, బిల్లుల వసూళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. బిల్లుల వసూళ్ల విషయంలో శతశాతం లక్ష్యాలను సాధించి సంస్థను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ టెక్నికల్ డీఈటీ ఎల్.ఆర్.దైవప్రసాద్, ఎస్ఈ వెంకటరాజు, విజయనగరం డీఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు పలు విభాగాల డీఈలు, ఏడీఈలు, ఏఈలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ సాధ్యమేనా...?
విజయనగరం మున్సిపాలిటీ:ఏపీఈపీడీసీఎల్ అధికారులు నిరంతరం విద్యు త్ సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 2 నుం చి ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు సన్నద్ధ మవుతున్నారు. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న విద్యు త్ కనెక్షన్లలో వ్యవసాయ, గృహావసర విద్యుత్ కనెక్షన్లకు వేర్వేరుగా ఫీడర్లు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు.తద్వారా గృహావసర విద్యు త్ కనెక్షన్లకు 24 గంటల పాటు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల పాటు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం చేపట్టే పనులకు రూ. 107. 29 కోట్ల అవసరమని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబుకు ప్రతిపాదించారు. జిల్లాలో మొ త్తం 6 లక్షల 30 వేల 404 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 31,816 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా రుు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు గృహవసర విద్యుత్ కనెక్షన్లకు ఒకే ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అధికంగా ఉండే వి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అధిక లోడు వినియోగించడంతో విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కడి చిన్నపాటి అ వాంతరం తలెత్తినా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట అధికారులు కోతలు విధించేవారు. ఈ సమస్యను గుర్తించి న అధికారులు రెండు ఫీడర్లను వేరు చేయడం ద్వా రా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు కార్యచరణ రూపొందించారు. ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల పాటు, గృహావసర విద్యుత్ కనెక్షన్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో రెండింటి అనుసంధానంతో ఇప్పటివరకు మొత్తం 146 ఫీడర్లు ఉండగా...అందులో ఆర్ఈసీఎస్ పరిధి లో 10 ఫీడర్లు, పూసపాటిరేగ మండలంలో 11 ఫీడర్లు, ఐటీడీఏ పరిధిలో ఉన్న మూడు ఫీడర్లతో పాటు జియ్యమ్మవలస, గంట్యాడ, కొమరాడ, మెట్టవలస, కుమరాం, మాదలింగి ప్రాంతాల్లో ఆరు ఫీడర్లను విభజిం చారు. దీంతో మిగిలిన 116 ఫీడర్లను వేరే చేసేందుకు మొత్తం రూ.107.29 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,472 కిలోమీటర్ల మేర 11కెవి హెచ్టీలైన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే 383 కిలోమీటర్ల మేర 6.3 కెవి లైన్ లు, ప్రస్తుతం 6.3కెవి గా ఉన్న 80 కిలోమీటర్ల విద్యుత్ లైన్ను 11 కెవి కెపాసిటీకి పెంచనున్నారు. 100 కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు రెండు, 63 కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఆరు, 40 కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 142, 25కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్ఫార్మర్లు 415, 16కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 774, 15కెవి సింగిల్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మరో 332 ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 13 రైల్వేక్రాసింగ్ పాయింట్ల వద్ద 470 మీట ర్ల మేర అండర్ గ్రౌం డ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 131.89 కిలోమీటర్ల పొడవున త్రి ఫేజ్ ఫోర్ వైర్లైన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మరికొన్ని నూతన పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. అరుుతే ఈ పనులన్నింటికి జిల్లాకు రూ.107.29 కోట్లు అవసరమని గుర్తించగా.. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలో ఈ తరహాలో పనులు చేపట్టేందుకు సుమారు రూ.600 కోట్ల వరకు అవసరముంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో నిధు లు వెచ్చించి విద్యుత్ ఆధునికీకరణ పనులు చేపట్టడం పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రా ష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో ఈ తరహా అభివృద్ధి పనులు ఎంతవరకు సా ధ్యపడతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
కోతలు మొదలు
సాక్షి, రాజమండ్రి : వేసవికాలం రాకుండానే విద్యుత్ కోతలకు అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపులో ఉంచడానికి తమదైన పంథాను అవలంబించారు. వాతావరణంలో శీతల పవనాలు తగ్గి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో మంగళవారం జిల్లాలో విద్యుత్తు వినియోగం ఈ సీజన్లోనే రికార్డు స్థాయికి చేరింది. దీనికి కళ్లెం వేసేందుకు విద్యుత్తు సరఫరాలో కోతలు విధించారు. జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి రాత్రి వరకూ రెండు నుంచి మూడు గంటల పాటు కోతలు విధించి లోడ్ తగ్గించారు. మరోవంక 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం కలిగిన డొంకరాయి జల విద్యుత్తు కేంద్రంలో సాంకేతిక లోపాలు ఏర్పడడం కూడా విద్యుత్తు పంపిణీకి శరాఘాతమైందని ఏపీఈపీడీసీఎల్ లోడ్ మానిటరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. కోతలు ఇలా.. రాజమండ్రి రూరల్, సిటీ, పాయకరావుపేట, రాజోలు ఫీడర్ల పరిధిలో ఉదయం రెండు గంటలు కోత విధించిన అధికారులు రాత్రి ఒక గంట పాటు సరఫరా నిలిపివేశారు. పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, రూరల్ ప్రాంతాల్లో ఉదయం మూడు గంటలు సరఫరా నిలుపుచేసిన అధికారులు సాయంత్రం మరో గంటసేపు ఆదా చేశారు. రామచంద్రపురం, కోనసీమ ప్రాంతాల్లో రెండున్నర గంటల నుంచి మూడు గంటలు కోతలు అమలు చేశారు. లోడ్ పెరిగిందిలా... జిల్లాలో సాధారణ రోజుల్లో గంటకు సగటున 220 నుంచి 240 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉంటుంది. వానాకాలంలో ఉదయం, చలికాలంలో రాత్రి వినియోగం కొంత తగ్గుతుంది. ఈ కాలంలో వినియోగం 180 నుంచి 220 మెగావాట్లు ఉంటుంది. వేసవిలో ఈ వినియోగం సాయంత్రం 250 దాటి 290 వరకూ ఉంటుంది. కానీ మంగళవారం జిల్లాలో వినియోగం 290 మెగావాట్లకు చేరడంతో అధికారులు అంతకు మించి పెరగకుండా నియంత్రించే ప్రయత్నం చేశారు. ఫలితంగా ప్రజలు కోతలను చవిచూడాల్సి వచ్చింది. -
విద్యుత్ బకాయిలు రూ.350కోట్లు
విజయనగరం విద్యుత్ విభాగం, న్యూస్లైన్ : ఏపీఈపీడీసీఎల్ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాలో రూ.350 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయినట్లు సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు చెప్పారు. మొత్తం బకాయిల్లో రూ.250 కోట్ల వరకు ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందినవి కాగా.. మిగిలిన రూ.100 కోట్లు సాధారణ విద్యుత్ కనెక్షన్ల నుంచి వసూలు కావలసి ఉందన్నారు. విజయనగరం జిల్లాలోనే రూ.14 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. వినియోగదారులకు సత్వర సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయూలన్నారు. బిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి సంస్థ ఆర్థికాభివృద్ధికి తోత్పడాలని సూచించారు. దాసన్నపేట విద్యుత్ భవనంలో విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో బిల్లుల వసూళ్లు, అభివృద్ధి పనులు, విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ల నిర్వహణ పనులు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే అభివృద్ధి సాధించడం కష్టమంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో నూతనంగా ఎనిమిది సబ్స్టేషన్లు నిర్మించేందు కు రూ.15 కోట్లు నిధులు మంజూరయ్యూయని చెప్పా రు. విజయనగరం డివిజన్ పరిధిలో ని నెల్లిమర్ల మండలం కొండవెలగాడ, గరివిడి మండలం కోనూరు, చీపురుపల్లి మండలం కె.పాలవలస, విజయనగరం పట్టణంలోని మయూరి జంక్షన్, పద్మావతి నగర్ ప్రాంతాల్లో ఈ సబ్స్టేషన్లు నిర్మించనున్నట్టు తెలిపారు. బొబ్బిలి డివిజన్ పరిధిలోని తాళ్లబురిడి, నెమలాం, గరుడిబిల్లిలో మరో మూడు సబ్స్టేష న్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. వీటి నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కోటి రూపాయలతో విజయనగరం-డెంకాడ ఇంటర్ లింకింగ్ లైన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1982 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు లక్ష్యం కాగా ఇప్ప టి వరకు 911 కనెక్షన్లు మంజూరు చేసినట్టు చెప్పారు. మరో 500 కనెక్షన్ల కోసం పనులు జరుగుతున్నాయన్నారు.హెచ్వీడీ పథకం కింద రూ.38.65 కోట్ల నిధులతో మూడు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను ఏడు వేల కనెక్షన్లను మార్చడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్స్ డెరైక్టర్ వజ్జి కృష్ణ, చీఫ్ జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ దత్తి సత్యనారాయణ, విజయనగరం డీఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి,బొబ్బిలి డీఈ లక్ష్మణరావు పాల్గొన్నారు.