Bhutan
-
India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా రైలులోనూ మన దేశం నుంచి విదేశాలకు వెళ్లవచ్చనే సంగతి మీకు తెలుసా? త్వరలో భారత్- భూటాన్ల మధ్య నడవబోయే రైలు దీనిని సాకారం చేయనుంది. అస్సాంలోని కోక్రాఝర్ నుంచి భూటాన్లోని గెలెఫు వరకు రైల్వే లైన్ వేయడానికి భారత రైల్వేలు(Indian Railways) ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్)ప్రతినిధి తాజాగా మీడియాకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు.ప్రతిపాదిత 69.04 కి.మీ రైల్వే లైను అస్సాంలోని కోక్రాఝర్ స్టేషన్ను భూటాన్లోని గెలెఫుకు అనుసంధానిస్తుందని, ఇందుకోసం రూ.3,500 కోట్లు వ్యయం అవుతుందని ప్రతినిధి తెలిపారు. ఈ రైల్వే లైన్కు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదం పొందాల్సివుంది. ఈ ప్రాజెక్టులో బాలజన్, గరుభాస, రునిఖాత, శాంతిపూర్, దద్గిరి గెలెఫు.. ఇలా మొత్తం ఆరు కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ రైల్వే మార్గం భారత్-భూటాన్ సంబంధాలను బలోపేతం చేస్తుంది.ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి(Cultural exchange)ని పెంపొందిస్తుంది. ఈ రైల్వే లైను ఏర్పాటుపై భూటాన్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. భారత్- భూటాన్లను రైలు ద్వారా అనుసంధానించేందుకు రెండు దేశాలు 2018 నుండి చర్చలు జరుపుతున్నాయి. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు అధికారికంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ రైలు మార్గంలో రెండు ప్రధాన వంతెనలు, 29 భారీ వంతెనలు, 65 చిన్న వంతెనలు, ఒక రోడ్డు ఓవర్ బ్రిడ్జి, 39 రోడ్డు అండర్-బ్రిడ్జిలు, 11 మీటర్ల పొడవు గల రెండు వంతెనలు నిర్మాణం కానున్నాయి. -
ప్రధాని మోదీతో భూటాన్ రాజు భేటీ
న్యూఢిల్లీ: భారత్, భూటాన్లు తమ మధ్య భాగస్వామ్యాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. రెండు దేశాల మధ్య సహకారంలో ఇంధన రంగం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, టెక్నాలజీపై దృష్టి పెట్టాలని అంగీకారానికి వచ్చాయి. భారత్లో రెండు రోజుల పర్యటనకు గురువారం ఢిల్లీకి చేరుకున్న భూటాన్ రాజు జిగ్మే ఖెసర్ నంగ్యేల్ వాంగ్చుక్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించారు. థింపు ఆర్థిక ఉద్దీపన కార్యక్రమానికి తోడ్పాటునిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. -
భూటాన్లో అనిల్ అంబానీ ప్రాజెక్ట్లు అభివృద్ధి
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్లో ప్రాజెక్ట్లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ గెలెఫు మైండ్ఫుల్నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్ సంస్థలు వాటి షేర్ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. -
భారత్.. భూటాన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?
దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ సందర్భంగా.. భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (BFDA)తో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్, భూటాన్ మధ్య ఆహార భద్రత అమలుకు సంబంధించిన ఒప్పందం జరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం.. ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఎఫ్డీఏ మధ్య సాంకేతిక సహకారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆహార భద్రత, వాణిజ్య సౌలభ్యం విషయంలో భూటాన్తో మా భాగస్వామ్యంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుందని.. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జీ కమల వర్ధనరావు పేర్కొన్నారు. బీఎఫ్డీఏతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే బలమైన, సమర్థవంతమైన ఆహార భద్రత ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నాయకత్వాన్ని అంగీకరించామని బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా (Gyem Bidha) పేర్కొన్నారు. భారత్, భూటాన్ మధ్య సురక్షితమైన ఆహార వాణిజ్యాన్ని సులభతరం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అన్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భూటాన్ దేశానికీ చెందిన బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా, బీఎఫ్డీఏ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారులు హాజరయ్యారు.India and Bhutan Deepen Cooperation on Food Safety and Regulatory StandardsThis Agreement underscores a mutual commitment to enhance food safety, aligning regulatory frameworks, simplifying the Food Import Procedure and fostering technical collaborationRead here:…— PIB India (@PIB_India) September 22, 2024 -
570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం
అదానీ గ్రూప్ భూటాన్లో 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు తాజాగా భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, గౌతమ్ అదానీలు ఒప్పందంపై సంతకాలు చేశారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. భూటాన్లోని చుఖా ప్రావిన్స్లో 570 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దేశంలోని డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ ఆధ్వర్యంలో జరుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిని అదానీ ప్రశంసించారు. భూటాన్లో హైడ్రోపవర్, ఇతర ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్నగౌతమ్అదానీ తన ఎక్స్ఖాతాలో ఈ పర్యటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గేతో సమావేశంకావడం చాలా సంతోషంగా ఉంది. చుఖా ప్రావిన్స్లో 570 మెగావాట్ల గ్రీన్ జలవిద్యుత్తు ప్రాజెక్ట్ ఏర్పాటుకు డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందం జరిగింది. అనంతరం భూటాన్ కింగ్ జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యాం. మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయడానికి భూటాన్ చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు. -
భూటాన్లో ప్రధానికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం(మార్చ్ 22) ఉదయం భూటాన్ వెళ్లారు. ప్రధానికి భూటాన్లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆ దేశ ప్రధాని షెరిగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్తో ద్వైపాక్షిక సంబంధాల విషయమై ప్రధాని చర్చలు జరుపుతారు. భూటాన్ రాజుతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గత వారమే భూటాన్ ప్రధాని భారత్లో ఐదు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింంది. భూటాన్తో భారత్ సంబంధాలు విశిష్టమైనవని తెలిపింది. కాగా, భూటాన్లో షెరిగ్ టోబ్గే ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ చెప్పినా నిర్ణయం మారదు -
ప్రధాని మోదీ భూటాన్ పర్యటన వాయిదా.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. ‘భూటాన్లోని పారో విమనాశ్రయం వద్ద గల ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చి 21-22 తేదీల్లో ప్రధాని భూటాన్ పర్యటనను వాయిదా వేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. కొత్త తేదీలపై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలియజేస్తాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రేపు(గురువారం) ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆ దేశంలో మోదీ పర్యటించాల్సి ఉంది. భారత్ సన్నిహిత, సరిహద్దు దేశం భూటాన్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతాయని అంతా ఆకాంక్షించారు. అయితే షెడ్యూల్ సందర్శనకు ఒక రోజు ముందు పర్యటన వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో భూటాన్లోని రోడ్లమీద.. మోదీకి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున పోస్టర్లు అంటించారు. ఇదిల ఉండగా గత వారం భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే అయిదు రోజులపాటు భారత్లో పర్యటించారు. గత జనవరిలోభూటాన్ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించిన తర్వాత టోబ్గే తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారు. చదవండి: రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. -
దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఒకనొక ఇంటర్వ్యూలో ఈమా దత్షి రెసిపీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. నిజానికి ఈమా దత్షీ రెసిపీ భూటాన్ వంటకం. తన అభిమానులకు ఈ వంటకం గురించి షేర్ చేశారు దీపికా. ఈ రెసిపీ రుచి, తయరీ విధానాల గురించి పంచుకున్నారు. గతేడాది దీపికా ఏప్రిల్ 2023లో భూటాన్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ ప్రత్యేక భూటాన్ వంటకంపై మనసు పారేసుకున్నానని, ఇప్పుడది తన ఫేవరెట్ డిష్ అని చెప్పుకొచ్చారు ఆమె. ఇంతకీ ఏంటా ఈమా దత్షి రెసిపీ. ఏ కూరగాయాలకు సంబంధించిన వంటకం అంటే.. ఈమా దత్షి అనేధి భూటాన్ జాతీయ వంటకం.దీన్ని పచ్చి ఎర్ర మిరపకాయలు, చీజ్, మిరియాలు, ఉల్లిపాయలు, టొమాటోలతో కలిపి చేసే ఒక విధమైన రెసిపీ. దీన్ని లంచ్ లేదా డిన్నర్ టైంలో కర్రీగా తినదగిన రెసిపీ. దీన్ని ఎవ్వరైనా పదినిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించొచ్చు. ఎలా చేయాలంటే...? టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నల్ల మిరియాలు తదితర పదార్థాలన్నింటిని తీసుకుని వాటిపై కాస్త నూనె పొయ్యండి. పాన్లో ఒక కప్పు నీరు పోసి పదార్థాలను బాగా కలపి పెద్దమంటపై ఉంచండి. అలాగే పాన్పై మూత పెట్టండి. వేడిని ఎక్కువ పెంచి పది నిమిషాలు ఉడకనివ్వండి. కూరగాయాలు ఉడికన తర్వాత మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. వెంటనే స్టవ్ని మీడియంలో పెట్టి.. కాస్త నెయ్యి, కొద్దిగా చీజ్, కొద్దిగా మసాల వంటివి కూడా వెయ్యండి. అంతే ఈమా దత్షి రెడీ. ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. జొంగ్ఖా భాషలో ఈమా అంటే మిరపకాయ. ఇక దట్షి అంటే చీజ్ అని అర్థం. వాటితో చేసే రెసిపీ కాబట్టి దీన్ని 'ఈమా దత్షి' అని పిలుస్తారు భూటాన్ వాసులు. View this post on Instagram A post shared by Leaping Windows (@leapingwindows) (చదవండి: స్టన్నింగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
"పెనిస్ విలేజ్"! ఆ గ్రామంలోని ఏ గోడపై చూసినా..!
అత్యంత విచిత్రమైన గ్రామం. ఇక్కడ ఏ గోడ చూసినా విస్తుపోతాం. ప్రతి ఇంటి గోడపైనే ఆ చిత్రమే ఉండటం విశేషం. గోడలపై చిత్రించే ఆ చిత్రాలు ఎంతలా అవి భాగమంటే ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలపై కూడా అదే చిత్రం. కొత్తగా వచ్చినా పర్యాటకులు ఈ గ్రామం తీరుని చూసి ఖంగుతింటారు. ఆ ఆకృతి పట్ల ఉన్న నమ్మకం వింటే నవ్వు వచ్చేలా ఉంటుంది. ఆ చిత్రాలు చూడటానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. అక్కడ ప్రజలు దీన్ని ఓ ఆచారంగానే గాక అవే తమకు మంచి చేశాయని ప్రగాడంగా నమ్మడం మరింత విచిత్రంగా ఉంటుంది. ఇంతకీ అక్కడ గోడలపై ఎలాంటి చిత్రాలు ఉంటాయంటే.. భూటాన్లోని థింపు నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే ఈ పునాఖా లోయలోని సోప్సోఖా అనే గ్రామానికి వెళ్లగలుగుతాం. అక్కడ కనిపించే ప్రతి గోడపై నిటారుగా 'మానవ పురుషాంగం" ఆకృతి దర్శనమిస్తుంది. వినేందుకు ఇబ్బందిగా ఉన్న ఇది నిజం. ఆ గ్రామంలో ప్రతి ఇంటి మీదే కాదు! దేవాలయాలు, ప్రభుత్వ సంస్థల గోడలపై కూడా ఆ ఆకృతి ఉంటుంది. ఇది వారి ఆచారం, నమ్మకాలకు సంబంధించింది. ఈ ఆకృతిలో ఉండే హస్తకళ దుకాణాలు కూడా ఎక్కువే. ఎలాంటి నిషేధం లేకుండా యథేచ్ఛగా ఈ ఆకారంలోని బొమ్మలు, శిల్పాలు అక్కడ అముమ్మతుండటం విశేషం. ఆఖరికి టీ షర్టు, పోస్టర్లపై కూడా ఈ ఆకృతి తప్పనిసరిగా ఉంటుంది. ఈ సంప్రదాయనికి మూలం 15వ శతాబ్దపు బౌద్ధ సన్యాసి ద్రుక్పా కున్లేకి చెందినదని చెబుతారు అక్కడి ప్రజలు. అతను బౌధ్ధమతాన్ని వ్యాప్తి చేసే సాంప్రదాయేతరు పద్ధతులకు అత్యంత ప్రసిద్ధి. లోతైన ఆధ్యాత్మక సందేశాలను తెలియజేయడానికి ఇలా ఫాలస్(పురుషాంగం ఆకృతిలో)లో ఉండే వాటిని వినియోగించడంతో ఇలా అక్కడ వాళ్లంతా తమ ఇంటి గోడలపై ఆ చ్రితాన్ని తప్పనిసరిగా వేయించుకుంటారు. అంతేగాదు ఆయనకు చెందిన మఠం ఆగ్రామంలోనే ఉంది. దీంతో ప్రజలు ఆ గ్రామాన్ని ప్రముఖ తీర్థక్షేత్రంగా భావించి తండోపతండాలు వచ్చి ఆ మఠాన్ని దర్శించుకుంటారు . ముఖ్యంగా మహిళలు, సంతానలేమితో బాధపడే జంటలు ఈ గ్రామంలోని మఠాన్ని సందర్శించడానికి వస్తారు. దీన్ని సంతానోత్పత్తి క్షేత్రంగా చెబుతారు. అక్కడకు వచ్చిన భక్తులను ఫాలస్ ఆకృతిలో ఉన్న చెక్కతోనే ఆశ్వీరదించడం మరింత విచిత్రం. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత ఆ జంటలకు తప్పనిసరిగా సంతానం కలుగుతుందని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అలా సంతానం కలిగిన జంటల గాథలు కూడా అక్కడ దేవాలయంలో ఉంటాయి. ఆఖరికి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఆ మఠం లేదా ఆ సన్యాసి పేరు మీదగా పేర్లు పెడుతారు. ఈ చిహ్నం వారిని దుష్టశక్తులకు దూరం చేసి, సంతానోత్పత్తిని కలిగించే అదృష్ట గుర్తుగా విశ్వసిస్తారు అక్కడి ప్రజలు. అక్కడ భూటాన్లోని ప్రతి ఇంట్లో ఈ గ్రామం నుంచి కొనగోలు చేసిన ఫాలస్(పురుషాంగం ఆకృతి)లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ నమ్మకం కాస్త నవ్వు తెప్పించినప్పటికీ.. అక్కడ అడుగు పెట్టాలంటే కఠిన నిబంధనలు అనుసరించాల్సిందే. అంతేగాదు భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం కూడా. అందుకు ఇది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
భూటాన్లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. తన ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది సమంత. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భూటాన్లో ఉన్న సమంత.. డాట్షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం పంచుకుంది. భూటాన్లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేద ట్రీట్మెంట్ బాగా ఫేమస్. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్ చేస్తూ..''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్ ప్రజలు స్టోన్ బాత్ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్ హాట్ టబ్లోకి చేరుతాయి. ఈ ప్రక్రియలో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్ని వివరించింది సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) మజిల్ పెయిన్, ట్రావెల్ సిక్నెస్, మజిల్ - బోన్ రిలేటెడ్ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, స్టొమక్ సిక్నెస్ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్ ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ వంటి ప్రదేశాలకు వెళ్లింది. ఇప్పుడు భూటాన్లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
చైనా కొత్త ఎత్తులు
ప్రపంచమంతా కొత్తగా రాజుకున్న ఇజ్రాయెల్ – గాజా లడాయిపై దృష్టి కేంద్రీకరిస్తున్న తరుణంలో చడీచప్పుడూ లేకుండా చైనా పావులు కదిపింది. మన సన్నిహిత దేశాలైన భూటాన్, శ్రీలంకలతో ఒప్పందాలు కుదుర్చుకుని మనల్ని ఇరకాటంలో పడేసింది. చైనాలో పర్యటించిన భూటాన్ విదేశాంగమంత్రి తాండీ దోర్జీతో చైనా ఉప విదేశాంగమంత్రి సన్ వీ డాంగ్ సంప్రదింపులు జరిపి ఇరుదేశాల సరిహద్దు వివాదాన్నీ పరిష్కరించుకోవటానికి ఉమ్మడి సాంకేతిక నిపుణుల బృందం ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నారు. రెండు దేశాల మధ్యా దౌత్యసంబంధాలు ఏర్పాటుచేసు కోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అటు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే కూడా చైనా సందర్శించి ఆ దేశం తలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)లో తమ దేశం పాలుపంచుకుంటుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై త్వరలో సంతకాలవుతాయని సంయుక్త ప్రకటనలో తెలిపారు. భూటాన్, శ్రీలంక రెండూ సార్వభౌమాధి కారం వున్న దేశాలు. తమ ప్రయోజనాలకు తగినట్టు అవి నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ ఒప్పందాల పర్యవసానాలు భారత్ భద్రతతో ముడిపడివుండటం మనల్ని కలవరపరిచే అంశం. శ్రీలంక మాటెలావున్నా భూటాన్తో మనకు ప్రత్యేక అనుబంధం వుంది. 2007 వరకూ భూటాన్తో వున్న స్నేహ ఒడంబడిక ప్రకారం మన దేశం ఆమోదించిన 21 దేశాలతో మాత్రమే అది దౌత్య సంబంధాలు ఏర్పర్చుకునేది. యూపీఏ హయాంలో ఈ ఒప్పందం గడువు ముగిసినా మన దేశం చొరవ తీసుకోకపోవటం, ఈలోగా ఆ ఒప్పందం కింద భూటాన్కి అప్పటివరకూ ఇచ్చే సబ్సిడీలు ఆగిపోవటం సమస్యలకు దారితీసింది. ఆ దేశంలో ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోయాయి. వాస్తవానికి భూటాన్ ఉత్తర సరిహద్దులో వున్న చంబీలోయ ప్రాంతాన్ని తమకు ధారాదత్తం చేయమని చైనా కోరినా అది భారత్ భద్రతకు సమస్యలు తెచ్చిపెడుతుందన్న ఏకైక కారణంతో భూటాన్ తిరస్కరించింది. 2005లో భూటాన్ రాజు ఐచ్ఛికంగా రాచరిక ఆధిప త్యాన్ని వదులుకుని రాజ్యాంగబద్ధ పాలనకు బాటలు పరిచారు. అటు తర్వాత నుంచి భూటాన్ ఆలోచన మారింది. దేశానికి గరిష్ఠంగా మేలు చేసే విదేశాంగ విధానం అనుసరించాలన్న అభి ప్రాయం బలపడింది. అలాగని 2017లో డోక్లామ్లో చైనాతో వివాదం తలెత్తినప్పుడు భూటాన్ మన సాయమే తీసుకుంది. అయితే మన దేశం మరింత సాన్నిహిత్యంగా మెలిగివుంటే అది చైనా వైపు చూసేది కాదు. డోక్లామ్కు దగ్గరలో చైనా భూగర్భ గిడ్డంగుల్ని నిర్మిస్తోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మన దేశాన్ని నిరుడు హెచ్చరించింది. అలాగే అక్కడికి సమీపంలో ఒకటి రెండు గ్రామాలను సృష్టించి ప్రజలను తరలించిందన్న వార్తలొచ్చాయి. డోక్లామ్ ప్రాంతం భారత్– భూటాన్– చైనా సరిహద్దుల కూడలి. అలాంటిచోట చైనా రోడ్డు నిర్మాణానికి పూనుకోవటం వల్ల 2017లో వివాదం తలెత్తింది. మన దేశం గట్టిగా అభ్యంతరాలు తెలపటంతో చైనా వెనక్కు తగ్గింది. కానీ ఆనాటి నుంచీ భూటాన్ను బుజ్జగించే ప్రయత్నాలు అది చేస్తూనేవుంది. ఒకపక్క మనతో వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడ్డ వివాదాల పరిష్కారానికి ఏ మాత్రం సిద్ధపడకుండా, చర్చల పేరుతో కాలయాపన భూటాన్తో మాత్రం సన్నిహితం కావటానికి చైనా ప్రయత్నించటంలోని ఉద్దేశాలు గ్రహించటం పెద్ద కష్టం కాదు. ఇటు శ్రీలంక సైతం మన అభ్యంతరాలను బేఖాతరు చేసి బీఆర్ఐ ప్రాజెక్టులో పాలుపంచు కునేందుకే నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో మనల్ని దెబ్బతీసేందుకు మనకు సన్నిహితంగా వుండే దేశాలను రుణాలతో, భారీ ప్రాజెక్టులతో తనవైపు తిప్పుకునే చైనా ప్రయ త్నాలు ఈనాటివి కాదు. భారీ నౌకాశ్రయాలు, రహదారులు, విమానాశ్రయాలు నిర్మించేందుకు తమ ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా చైనా అందించిన రుణాలు లంకను కుంగదీశాయి. విదేశీ మారకద్రవ్యం నిల్వలు చూస్తుండగానే అడుగంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గుల్లయింది. ధరలు పెరిగిపోవటం, నిత్యావసరాల కొరత ఏర్పడటం పర్యవసానంగా నిరుడు తీవ్ర నిరసనలు పెల్లుబికి రాజపక్స సోద రులు, వారి కుటుంబసభ్యులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మన దేశం శ్రీలంకకు తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. బీఆర్ఐ ప్రాజెక్టుకు అంగీకరించి, చైనా ఇస్తున్న రుణాలకు ఆమోదముద్ర వేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని ఈనెల 11న కొలంబోలో జరిగిన హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సదస్సు సందర్భంగా మన విదేశాంగమంత్రి జైశంకర్ హెచ్చరించారు. నిరుడు దేశంలో సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర 20 దేశాలున్న పారిస్ క్లబ్తో పాటు మన దేశం కూడా శ్రీలంకకు ఒక షరతు పెట్టింది. రుణాల చెల్లింపులో ఒకే విధమైన నిబంధనలు అనుసరించాలని, ద్వైపాక్షిక ఒప్పందం పేరుతో ఎవరికీ వెసులు బాటు ఇవ్వరాదని తెలిపాయి. అయినా చైనా విషయంలో అందుకు భిన్నమైన మార్గాన్ని శ్రీలంక ఎంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం జాగ్రత్తగా అడుగులేయాలి. మన వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో చైనాతో ఒప్పందాలు కుదుర్చుకొనరాదని శ్రీలంక, భూటాన్లకు నచ్చజెప్పాలి. ఏ కారణాలు వారిని చైనా వైపు మొగ్గు చూపేందుకు దారితీస్తున్నాయో గ్రహించి మనవైపు ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకోవాలి. సకాలంలో సరైన కార్యాచరణకు పూనుకుంటే మనకు సానుకూల వాతావరణం ఏర్పడటం పెద్ద కష్టం కాదు. -
భూటాన్ వెళ్లేవారికి శుభవార్త! ఆ ఫీజు సగానికి తగ్గింపు
హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. "సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది. పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జూన్లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు. -
అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..
అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్, ఛిరంజ్, ధేమాజీ, దిబ్రుగర్హ్, కోక్రజార్హ్, నల్బరి, టిన్సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అయితే.. తూర్పు భూటాన్లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది. దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. The Royal Government of Bhutan has informed us that tonight there will be an excess release of water from the Kurichu Dam. We have alerted our district administrations to remain vigilant and assist the people in every possible way in case the water breaches the Beki and Manas… — Himanta Biswa Sarma (@himantabiswa) July 13, 2023 అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు. ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
‘డోక్లాం’పై భూటాన్తో టచ్లో ఉన్నాం
న్యూఢిల్లీ: డోక్లాం అంశానికి సంబంధించి భూటాన్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా తెలిపారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్చుక్తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఐదుసూత్రాల రోడ్మ్యాప్ను వాంగ్చుక్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. భేటీ వివరాలను క్వాట్రా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డోక్లాంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. భద్రతకు సంబందించిన అన్ని అంశాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చి పుచ్చుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భూటాన్ రాజు పర్యటన దోహదపడుతోందన్నారు. అసోంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్లోని గెలెపు వరకు రైల్ లింక్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో భూటాన్ క్రమంగా చైనాకు దగ్గరవుతోందన్న అభిప్రాయాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్చుక్తో చర్చలు ఫలప్రదంగా జరిగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన గౌరవార్థం విందు ఇచ్చారు. డోక్లాం.. అతి కీలకం వ్యూహాత్మకంగా డోక్లాం భారత్కు అత్యంత కీలకం. 2017లో అక్కడ భారత, చైనా సైనికులు ఏకంగా 73 రోజుల పాటు ఎదురెదురుగా మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. భూటాన్లో తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో రోడ్డు వేసేందుకు చైనా ప్రయత్నించడం ఘర్షణకు కారణమైంది. దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. విపత్తుల స్పందనకు సమగ్ర వ్యవస్థ: మోదీ ప్రాకృతిక విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్రమైన సన్నద్ధత వ్యవస్థ అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతంలో తలెత్తే విపత్తులు దానికి సుదూరంలో ఉన్న ప్రాంతాలపై కూడా భారీ ప్రభావం చూపించే ఆస్కారముందని గుర్తు చేశారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధత వ్యవస్థపై జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవలిషన్ ఫర్ డిజాస్టర్ రెజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో ఇప్పటికే 40 దేశాలు భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు. ఈ విషయమై ఒక్క తాటిపైకి వచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న చిన్న, పెద్ద దేశాలకు ఈ సదస్సు చక్కని వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. విపత్తు బాధితుల్లో ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో ఆదుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేసుకునే దిశగా కృషి జరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. విపత్తుల వేళ తక్షణ ఉపశమనంతో పాటు సాధ్యమైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడటంపై దృష్టి సారించాలన్నారు. ఇందుకు రవాణా సదుపాయాలతో పాటు సామాజిక, డిజిటల్ సదుపాయాలు కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
డోక్లామ్పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు
ఆరేళ్లుగా డోక్లామ్ అంశంపై భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ అంశంపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది కూడా. ఈ నేపథ్యంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ చేసిన వ్యాఖ్యలు భారత్ని టెన్షన్లో పడేశాయి. ఇంతవరకు చైనా ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే..ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని షెరింగ్ అన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చింకుందాం. అయినా మూడు సమాన దేశాలే. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా అని అన్నారు. ఒకరకంగా భూటాన్ తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతమిచ్చింది. కాగా, భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతమే డోక్లాం. దీన్ని ట్రై జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఐతే ఈ ఎత్తైన పీఠభూమి(డోక్లాం) సిలిగురి కారిడార్కి సమీపంలో ఉంది. సరిగ్గా చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్ పాయింట్ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏమి చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్ ప్రధాని షెరింగ్ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది. దశాబ్దాలుగా ఈ ట్రై జంక్షన్ పాయింట్ అంతర్జాతీయ పటంలో బటాంగ్ లా ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం చైనాకి ఉత్తరాన, భూటాన్కి ఆగ్నేయం, భారత్కి పశ్చిమాన ఉంది. అయితే చైనా ఆ ట్రై జంక్షన్ని బటాంగ్ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కి.మీ దూరంలో ఉన్న మౌంట్ గిమ్మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం చైనాలో భాగమవుతుంది. ఇది భారత్కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. చైనా 2017 నుంచి డోక్లాం విషయంలో వెనక్కి తగ్గినట్లే తగ్గి..డోక్లాం వెంబడి నేరుగా తూర్పున భూటాన్ భూభాగంలో ఉన్న అమోచు నది లోయం వెంబడి విస్తరించే యత్నం చేసింది. ఈ భూటాన్ భూభాగం గుండా అనేక గ్రామాల మధ్య చైనా రహదారిని నిర్మిచింది. తద్వారా భూటాన్ తన భూభాగాన్ని చైనా అప్పగించవలసి వచ్చిందన్న అక్కసుతో ప్రధాని షెరింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భూటాన్ భూభాగంలోకి చైనా చొరబడిందని పలు వార్తలు వచ్చినప్పటికి భూటాన్ దాన్ని ఖండిస్తూ ఎలాంటి చొరబాటు జరగలేదని సమర్థించుకుంది. పైగా చైనా దొంగతనంగా ఆక్రమించిన భూభాగాలను భూటాన్ ప్రాంతాలు కాదని భూటాన్ వాదిస్తోందని భారత్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు డాక్టర్ బ్రహ్మ చెల్లానీ అన్నారు. అంతేగాదు గతేడాది ఇరుపక్షాలు(చైనా, భూటాన్ నిపుణలు) కున్మింగ్లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 20 రౌండ్లకు పైగా చర్చలు జరిపింది. సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు భూటాన్ పేర్కొంది. చైనాతో తనకు పెద్దగా సరిహద్దు సమస్యలు లేవని, ఇంకా కొన్ని భూభాగాలను గుర్తించలేకపోయినట్లు చెప్పుకొచ్చింది. పైగా ఒకటో, రెండో సమావేశాల తదనంతరం విభజన రేఖను ఏర్పాటు చేసుకుంటామంటూ.. చైనాను వెనకేసుకు వచ్చే యత్నం చేస్తోంది. (చదవండి: ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..) -
రూ.37 వేలకే తులం బంగారం! ఇలా చేస్తే మీ సొంతం
భారతీయులకు బంగారం అంటే అత్యంత ప్రీతి. దాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ముఖ్యంగా మహిళలయితే బంగారం ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉంటారు. ఇదీ చదవండి: Currency Notes: రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన! దేశంలో బంగారం 90 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. 2022 ఏడాదిలో విదేశాల నుంచి దాదాపు 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. ఇందుకోసం దాదాపు 36.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. బంగారంపై భారతీయులకు ఉన్న ఆసక్తిని గ్రహించిన భూటాన్.. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫుయంషోలింగ్, థింపులకు వచ్చేవారు ఎలాంటి ట్యాక్స్ లేకుండానే బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది. దీంతో భారత్లో కంటే తక్కువ ధరకే అక్కడ బంగారం కొనుక్కోవచ్చు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! భూటాన్ దేశ నూతన సంవత్సరం, భూటాన్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 21న ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ ప్రచురించింది. భారత్తో పోలిస్తే ధరలు కాస్త తక్కువగా ఉండటంతో ప్రస్తుతం చాలా మంది భారతీయులు దుబాయ్ వెళ్లి బంగారం కొంటున్నారు. తులం బంగారం రూ.37 వేలే.. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం భారత్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,600పైగానే ఉంది. అదే భూటాన్లో 10 గ్రాముల బంగారం 37,588.49 భూటనీస్ ఎన్గూల్ట్రమ్ (బీటీఎన్)గా ఉంది. ఒక బీటీఎన్ భారత రూపాయితో దాదాపు సమానంగా ఉంది. అంటే భారతీయులు రూ.37,588కే తులం బంగారం కొనుక్కోవచ్చన్న మాట. మరి షరతులు? భూటన్లో భారతీయులు పన్ను రహిత బంగారం కొనుగోలు చేయాలంటే సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఫీ (ఎస్డీఎఫ్) రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సెర్టిఫైడ్ హోటల్లో ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది. టూరిస్టులు అమెరికా డాలర్లతోనూ బంగారం కొనుగోలు చేయొచ్చు. ఈ ఎస్డీఎఫ్ టూరిజం ట్యాక్స్ను 2022లోనే భూటాన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. భారతీయులు ఒక వ్యక్తి.. ఒక రోజుకు రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాలి. ఇతర దేశస్థులయితే 65 నుంచి 200 డాలర్ల వరకు చెల్లించాలి. ఈ ఎస్డీఎఫ్ ట్యాక్స్ కట్టిన వారు మాత్రమే ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనేందుకు అర్హులు. ఈ బంగారాన్ని లగ్జరీ వస్తువులు విక్రయించేడ్యూటీ ఫ్రీ ఔట్లెట్స్లో కొనుగోలు చేయొచ్చు. ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ విభాగం నిబంధనల ప్రకారం విదేశాల నుంచి భారత్లోకి మగవారైతే రూ.50 వేల విలువైన బంగారం, మహిళలయితే గరిష్టంగా రూ.లక్ష విలువైన బంగారం తెచ్చుకోవచ్చు. అంతకు మించి తీసుకువస్తే కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! In a bid to boost tourism Indian and other SDF fee paying tourists coming to Phuentsholing or Thimphu in Bhutan can now buy tax free gold. The only condition being you have to stay in a tourist certified hotel and pay SDF. The gold will be much more cheaper than in India. — Tenzing Lamsang (@TenzingLamsang) February 24, 2023 -
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం
PM Modi Conferred With Bhutan's Highest Civilian Award: భారత ప్రధాని మోదీకి భూటాన్ దేశం నుంచి అరుదైన గౌరవం లభించింది. భూటాన్ దేశం తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని అత్యున్నత పౌర పురస్కారం నాడగ్ పెల్ గి ఖోర్లోతో సత్కరించింది. ఈ క్రమంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ అత్యున్నత గౌరవ పౌర పురస్కారం అయిన న్గదాగ్ పెల్ గి ఖోర్లోతో నరేంద్ర మోడీని సత్కరించడం తమకు చాలా సంతోషంగా అనిపించిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతేకాదు గత కొన్నేళ్లుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మోదీజీ తమకు అందించిన స్నేహపూర్వక సహాయసహకారాలు, మద్దతును గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పైగా భూటాన్ ప్రజలు మోదీజీని గొప్ప ఆధ్యాత్మిక మహోన్నత వ్యక్తిగా భావిస్తున్నారని అన్నారు. ఈ మేరకు తాము ఈ అత్యున్నత పురస్కార వేడుకను వైభవోపేతంగా జరుపుకోవాలని భావిస్తూ భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం అని భూటాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఫేస్బుక్లో పేర్కొంది. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) -
కోవిడ్ సక్సెస్ స్టోరీ.. ఒకే ఒక్క మరణం
సాక్షి, హైదరాబాద్: గతనెల 7న భూటాన్ రాజధాని థింపూలోని ఒక ఆసుపత్రిలో 34 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్తో మృతి చెందాడు. అతడు అప్పటికే కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆ వ్యాధి నుంచి బయటపడ లేకపోయాడు. అయితే ఏడాదికి పైగా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా భూటాన్లో నమోదైన ఒకే ఒక్క కరోనా మరణం అదే. సోమవారం నాటికి ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 866 మాత్రమే. అగ్రరాజ్యం అమెరికా సహా సైన్స్లో ముందంజలో ఉంటూ, అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలతో సుసంపన్న దేశాలుగా ఉన్న ఐరోపా, ఇతర పశ్చిమదేశాల్లో నేటికీ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఏడాది క్రితం బయటపడ్డ ఈ ప్రాణాంతక వైరస్ ధనిక, పేద దేశాలు అనే తేడా లేకుండా ఆయా దేశాల్లోని వైద్య, ఆరోగ్య వ్యవస్థలను పూర్తిగా తల్లకిందులు చేసింది. ఆర్థిక వ్యవస్థలు సైతం కుదేలయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిన్న దేశం, అంతగా ఆర్థిక.ఇతర వనరులు, మౌలికసదుపాయాలు లేని భూటాన్ కోవిడ్ను పూర్తిగా నియంత్రించడమే కాకుండా... ఇప్పటికీ ఒకే ఒక మరణం వంటి అద్భుతమైన రికార్డ్ను ఎలా సాధించగలిగింది? మొత్తం 337 డాక్టర్లు మాత్రమే... ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న సందర్భంలో భూటాన్ పని అయిపోయినట్టేనని కొందరు భావించారు. మొత్తం 7,60,00 జనాభాకు వారి వద్ద ఉన్నది 337 మంది డాక్టర్లు మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. భూటాన్లో డాక్టర్ల నిష్పత్తి డబ్ల్యూహెచ్వో సూచించిన దాంట్లో సగం మాత్రమే. వీరిలో ఒక్కరు మాత్రమే అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్లో శిక్షణ పొందారు. కేవలం 3 వేల మంది మాత్రమే హెల్త్కేర్ వర్కర్లున్నారు. కరోనా శ్యాంపిల్స్ పరీక్ష చేసేందుకు ఒకే ఒక పీసీఆర్ మిషన్ అందుబాటులో ఉంది. ఐరాస లెక్కల ప్రకారం... అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం. తక్కువస్ధాయిలో తలసరి జీడీపీ ఉన్న దేశం. అయినా ఈ మహమ్మారిని సమర్థంగా ఎలా ఎదుర్కొంది? అత్యంత వేగంగా కార్యాచరణ అమలు... మొదటి కరోనా హెచ్చరికలు అందగానే వెంటనే, వేగంగా ఈ దేశం స్పందించింది.కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేసింది. 2019 డిసెంబర్ 31న చైనా అంతు తెలియని న్యూమోనియా వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. ఆ వెంటనే జనవరి 11న భూటాన్ జాతీయ సన్నద్ధ ప్రణాళికను సిద్ధం చేసి, జనవరి 15 నుంచే శ్వాసకోశ సంబంధిత లక్షణాలున్న వారి స్క్రీనింగ్ మొదలుపెట్టింది. తమ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల నుంచి దేశంలోకి వచ్చే ఎంట్రీ పాయింట్లలో ‘ఇన్ఫ్రారెడ్ ఫీవర్ స్క్రీనింగ్’చేపట్టింది. మార్చి 6న కోవిడ్–19 మొదటికేసు వచ్చినట్టు ప్రకటించింది. అది కూడా 76 ఏళ్ల అమెరికన్ టూరిస్ట్. మరో 6 గంటల 18 నిముషాల్లోనే అతడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంటాక్ట్లో వచ్చేందుకు అవకాశమున్న 300 మందిని గుర్తించి వారిని క్వారంటైన్కు పంపించేసింది. కరోనా బారిన పడిన వ్యక్తిని విమానంలో అమెరికాకు పంపించింది. చావు తప్పదని భావించిన ఆ వ్యక్తిని కూడా భూటాన్లో తొలుత తీసుకున్న చర్యలే రక్షించాయంటూ అమెరికన్ డాక్టర్లు పేర్కొనడం విశేషం. నిబంధనలు కచ్చితంగా పాటించారు... మార్చి నుంచి భూటాన్ ప్రభుత్వం ప్రతీరోజు కరోనా సంబంధిత అప్డేట్స్ను ప్రకటించడంతో పాటు హెల్ప్లైన్లను ఏర్పాటుచేసింది. ఇతర దేశాల పర్యాటకులపై నిషేధం విధించింది. స్కూళ్లు, ప్రభుత్వసంస్థలు, జిమ్లు, సినిమా థియేటర్లను మూసేసింది. మాస్క్లు, చేతుల పరిశుభ్రత, వ్యక్తుల మధ్య దూరం వంటి వాటిని కఠినంగా, నిరంతరంగా అమలు చేసింది. కోవిడ్ను మహమ్మారిగా డబ్ల్యూహెచ్వో ప్రకటించిన ఆరు రోజులకు అంటే మార్చి 16న వైరస్ సోకే అవకాశముందని భావించిన వారందరినీ తప్పనిసరి క్వారంటైన్కు పంపించింది. వీరిలో వేలాది మంది వివిధ దేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న భూటాన్ పౌరులున్నారు. టూరిస్ట్ హోటళ్లలో క్వారంటైన్లో ఉన్న వారందరికీ ఉచిత వసతి, ఆహారం అందించింది. పాజిటివ్ కేసులుగా తేలిన వారందరినీ విడిగా ఐసోలేట్ చేసింది. వారందరికీ కూడా వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు ‘సైకలాజికల్ కౌన్సెలింగ్’ఇప్పించే ఏర్పాటు చేసింది. మార్చి చివరకల్లా ఆ దేశ వైద్యశాఖ అధికారులు తప్పనిసరి క్వారంటైన్ కాలాన్ని కూడా 14 రోజుల నుంచి 21 రోజులకు (డబ్ల్యూహెచ్వో ప్రకటించిన దాని కంటే వారం ఎక్కువ) పెంచారు. ఈ విధంగా లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా క్వారంటైన్లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు పరీక్షించి తగిన వైద్యాన్ని అందజేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాని వ్యాప్తి నియంత్రణ చర్యలపై పెద్దగా దృష్టి పెట్టని కాలంలోనే భూటాన్ భారీస్థాయిలో టెస్టింగ్, ట్రేసింగ్ కార్యక్రమాన్ని చేపట్టడంతో, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఒక మొబైల్ యాప్ను సైతం తయారు చేసింది. గత ఆగస్టు నెలలో క్వారంటైన్ వెలుపల తొలి కోవిడ్–19 కేసును గుర్తించారు. దీంతో మూడువారాల లాక్డౌన్ అమలుచేశారు. టెస్టింగ్, ట్రేసింగ్ మరింత ఉధృతం చేయడంతో పాటు దేశంలోని ప్రతీ ఒక్క కుటుంబానికి ఆహారం, నిత్యావసరాలు, మెడిసిన్ అందజేశారు. గత డిసెంబర్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్కు సంబంధించి తొలి కేసును గుర్తించారు. దీంతో మరోసారి మరింత కఠినమైన లాక్డౌన్ విధించారు. మళ్లీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలతో వైరస్ బారిన పడకుండా ప్రజలను మేల్కొలిపారు. ఆపన్నులను ఆదుకున్నారు... గత ఏప్రిల్లో భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నామ్జ్యేల్ వాంగ్చుక్ ఓ సహాయనిధిని ప్రారంభించి దాని ద్వారా జీవనోపాధిని కోల్పోయిన 35 వేల మందికి 19 మిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని అందజేశారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, అసహాయులుగా ఉన్న వారు కలిపి మొత్తం 51 వేల మందికి శానిటైజర్లు, విటమిన్లున్న మందులు, ఆహార వస్తువులు, ఇతర కేర్ ప్యాకేజ్లు అందజేశారు. నిబద్ధత, అవగాహన.. ప్రజల భాగస్వామ్యం దేశ ప్రధాని మొదలుకుని మంత్రులు, ఇతర స్థాయిల్లోని నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రాత్రి పగలు అనే తేడాలు లేకుండా మహమ్మారిని ఎదుర్కునే విధుల్లో నిమగ్నమయ్యారు. దేశ ఆరోగ్య మంత్రి వాంగ్మో కొన్ని వారాలపాటు ఇంటికి వెళ్లకుండా రాత్రిళ్లు మంత్రిత్వశాఖ కార్యాలయంలోనే ఉండిపోయారు. ప్రధానమంత్రి లోటే త్సెరింగ్ స్వయానా ప్రముఖ ఫిజీషియన్. లాక్డౌన్ కాలంలో తన ఆఫీసులోని కిటికీ వద్దనున్న కూర్చీలోనే ఆయన రాత్రిళ్లు నిద్రించారు. క్వారంటైన్ కేంద్రాల కోసం యజమానులు తమ హోటళ్లను ఉచితంగా అందించారు. రైతులు తమ పంటలను విరాళం ఇచ్చారు. వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేషనల్ కార్ప్స్ ఆఫ్ ఆరెంజ్ యూనిఫామ్డ్ వాలంటీర్లు ‘డే సూంగ్’లో చేరి ప్రజలకు సేవలందించారు. అప్రమత్తత కలిగిన సమర్థ నాయకత్వం, ప్రజారోగ్య సూచనలు పాటించడానికి ప్రజల వద్ద తగినంత నిత్యావసరాలు, మందులు, డబ్బు ఉండేలా చూసుకోవడం, దేశ ఉమ్మడి హితం కోసం వ్యక్తిగతంగా, సాముహికంగా కొన్ని త్యాగాలు చేయకతప్పదనే అవగాహన ప్రజలు కలిగి ఉండటం (సామాజిక బాధ్యత)... ఇవన్నీ భూటాన్ కోవిడ్ను విజయవంతంగా అదుపు చేయడానికి దోహదం చేశాయి. చిన్నదేశమైనా ఈ దేశ ప్రజల నుంచి అగ్రరాజ్యం అమెరికా, సంపన్న పశ్చిమ దేశాలు, చివరకు మనం కూడా నేర్చుకోవాల్సింది కొంతైనా ఉందని చెప్పొచ్చు. -
డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్
న్యూఢిల్లీ : తమ భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిందంటూ వస్తోన్న వార్తల్ని భూటాన్ ఖండించింది. అలాంటిది ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్గైల్ ‘మా భూభాగంలో చైనా గ్రామం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఏం జరగలేదు’ అని స్పష్టం చేశారు. ‘చైనా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసింది’ అంటూ చైనాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షెన్ షివే ట్వీట్ చేశారు. దీనిపై భారత్ భూటాన్ రాయబారి స్పందించారు. ‘నేను ఆ ట్వీట్ని చూశాను. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అన్నారు. ఇక చైనా తాజాగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్న గ్రామం మూడేళ్ల కిందట భారత్-చైనా సైన్యాలు ఘర్షణ పడిన డోక్లామ్కి సమీపంలోనే ఉండటం గమనార్హం. చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్లోని సీనియర్ ప్రొడ్యూసర్గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసితులు నివసిస్తున్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబంధించిన ఫోటోలని ట్వీట్ చేశారు. అయితే, తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్ను భారత్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్ చేశారు. ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ) చైనా ‘ఐదు వేళ్ల’ వ్యూహం సరిహద్దు భూభాగాలపై కన్నేసిన చైనా వాటిని ఆక్రమిచుకోవడానికి ‘ఐదు వేళ్ల’ వ్యూహాన్ని అమలు చేస్తోది. దానిలో భాగంగా టిబెట్ని కుడి చేతి అరచేయిగా భావించగా.. లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ప్రదేశ్లని ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఇక బీజింగ్ ‘సలామి స్లైసింగ్’ వ్యూహాన్ని తాజాగా నేపాల్లో అమలు చేసి చేసింది. దానిలో భాగాంగా నేపాల్ భూభాగాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించినట్లు సమాచారం. న్యూఢిల్లీ-ఖట్మాండ్ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సమయంలో డ్రాగన్ ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు తెలిసింది. ఇక ఈ చర్యలని ఉద్దేశిస్తూ ‘మావో కలని నిజం చేయడానికి జిన్పింగ్ కృషి చేస్తున్నాడని’ చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే భారత్ 17,000 అడుగుల ఎత్తులో లిపులేఖ్ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల కైలాస్ మానససరోవర యాత్రికులకు ప్రయాణ సమయం కలిసి వస్తుంది. (చదవండి: తప్పు ఒప్పుకున్న ట్విట్టర్ ) -
సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. డోక్లాం పీఠభూమి తమ భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్కి మద్దతిస్తోంది. -
వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!
బ్రిటన్: వర్షాలు మావనాళి మనుగడకు ఎంతో అవసరం.. అదే ఉగ్రరూపం దాలిస్తే.. ఎంతటి భయంకర పరిస్థితులు తలెత్తుతాయో గత వారం రోజులుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఏటా వర్షాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నష్టాని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ వర్షాలకు నదులు కోసుకుపోవడం.. వరద బీభత్సం వంటి వాటి గురించి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వర్షాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వర్షాలు భారీ శిఖరాలను సైతం కదిలిస్తాయని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. భూగర్భ శాస్త్రవేత్తలకు పర్వతాలపై వర్షం ఎలా ప్రభావం చూపిస్తుందో సమర్థవంతంగా అధ్యయనం చేయడంలోనే కాకుండా, వందల ఏళ్ల క్రితం శిఖరాలు, లోయలు ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు సహకరిస్తాయి. (చదవండి: కలిసికట్టుగా ఊడ్చేశారు.. టీంవర్క్ అంటే ఇది) పీర్-రివ్యూ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురించబడిన ‘క్లైమెట్ కంట్రోల్స్ ఆన్ ఎరోషన్ ఇన్ టెక్టోనికల్లీ యాక్టీవ్ ల్యాండ్స్కేప్స్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనాన్ని డాక్టర్ బైరాన్ ఆడమ్స్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించింది. ఇందుకు గాను, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన బృందం తూర్పు హిమాలయాల్లో భాగామైన భూటాన్, నేపాల్లో అధ్యయనం నిర్వహించింది. బ్రిస్టల్ క్యాబోట్ ఇన్స్స్టిట్యూట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ రాయల్ సొసైటీ డోరతీ హోడ్కిన్కి చెందిన డాక్టర్ బైరాన్ ఆడమ్స్ ఈ అధ్యయనం కోసం అరిజోనా స్టేట్ యూనివర్శిటీ (ఏఎస్యూ), లూసియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులతో కలిసి పనిచేశారు. నదులు వాటి క్రింద ఉన్న రాళ్ళను క్షీణింపజేసే వేగాన్ని కొలవడానికి వారు ఇసుక రేణువుల లోపల విశ్వ గడియారాలను ఉపయోగించారు. టెక్టోనిక్స్పై వాతావరణం ప్రభావాన్ని అధ్యయనం చేయడం ఈ స్టడీ ప్రధాన లక్ష్యం. (చదవండి: 'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు') ఈ స్టడీ ప్రధాన రచయిత, డాక్టర్ బైరాన్ ఆడమ్స్ మాట్లాడుతూ, భూటాన్, నేపాల్ అంతటా గమనించిన "ఎరోషన్ రేట్ ప్యాటర్" ను పునరుత్పత్తి చేయడానికి బృందం అనేక సంఖ్యా నమూనాలను పరీక్షించింది. కోత రేటును ఖచ్చితంగా అంచనా వేయగల ఒక నమూనాను వారు గుర్తించగలిగారు. ఆ తర్వాత, వర్షపాతం "కఠినమైన భూభాగాలలో కోత రేటు" ను ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి పరిశోధకులు ఈ నమూనాను ఉపయోగించారు. -
కొత్త పంచాయితీ ఎత్తుకున్న చైనా
న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్ కంట్రీ మరోసారి భూటాన్తో సరిహద్దు పంచాయితీ ఉందంటూ కొత్త రాగం అందుకుంది. పొరుగునున్న భూటాన్తో తూర్పు ప్రాంతంలో సరిహద్దు వివాదాలున్నాయని చైనా తొలిసారి అధికారికంగా ప్రకటించింది. చాలా ఏళ్లుగా నెలకొన్న ఈ వివాదం ఇంకా ముగియలేదని తెలిపింది. చైనా, భూటాన్ సరిహద్దుల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాల్లో.. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వివాదాలు సమసిపోయాయని, తూర్పు ప్రాంతంలో వివాదం అలాగే ఉందని చైనా శనివారం వెల్లడించింది. అయితే, భూటాన్తో ఉన్న సరిహద్దు వివాదంలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత్ను ఉద్దేశించి చైనా స్పష్టమైన సూచన చేసింది. కాగా, చైనా చెప్తున్న తూర్పు ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్నందున భారత్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. (చదవండి: లవ్ ఇండియా : ట్రంప్ వైరల్ ట్వీట్) ఇదిలాఉండగా.. 1984 నుంచి 2016 వరకు చైనా భూటాన్ మధ్య 24 సార్లు చర్చలు జరిగాయి. ఇవన్నీ ఇరు దేశాల మద్య ఉన్న పశ్చిమ, మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినవేనని భూటాన్ పార్లమెంట్ డాటా ప్రకారం తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ.. తూర్పు సరిహద్దు ప్రాంతంపై ఎలాంటి వివాదాలు తెరపైకి రాలేదని భూటాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక చైనా తాజా ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటన నేపథ్యంలోనే డ్రాగన్ దేశం తాజా వివాదాన్ని లేవనెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో భూటాన్తో ఉన్న తూర్పు ప్రాంత వివాదం కొత్తదేమీ కాదని, ఏళ్లుగా నలుగుతోందని చైనా తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటోంది. (చదవండి: రాయని డైరీ: జిన్పింగ్ (చైనా అధ్యక్షుడు)) -
ఆ వార్తలు అవాస్తవం: భూటాన్
గువాహాటి: అస్సాంకు, భూటాన్ నుంచి వచ్చే నీటి సరఫరా సహజంగానే ఆగిపోయిందని, ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదని భారత ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అస్సాంకు వచ్చే నీటిని భూటాన్ నిలిపివేయడంతో పాకిస్తాన్, చైనా, నేపాల్ మాదిరిగా ఇప్పుడు భూటాన్ కూడా సరిహద్దుల్లో భారత్ను ఇబ్బందులకు గురిచేస్తుందంటూ గురువారం మీడియాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను భూటాన్ ఖండిస్తూ ‘నీటి పారుదల సహజంగానే ఆగిపోయింది. అంతే కానీ మేము నీటిని నిలిపివేయలేదు. అస్సాంకు సరఫరా అయ్యే నీటిలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మరమ్మత్తులు కూడా చేయిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడిస్తూ.. భూటాన్, అస్సాం నీటి సరిహద్దు వివాదామంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. (ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!) #WATCH: Assam Chief Secy Kumar Sanjay Krishna says, "Irrigation water comes to Assam from hills of Bhutan, but there was boulder which stopped the flow. We talked to Bhutan & they immediately cleared it. There's no dispute & to say that they stopped the water to Assam is wrong." pic.twitter.com/aNPNxclgJO — ANI (@ANI) June 26, 2020 దీనిపై భూటాన్ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ... ‘‘మేము అస్సాంలోని ప్రాంతాలకు నీటిపారుదల సరఫరాను నిలిపివేశామని ఆరోపించి ప్రచరించిన మీడియా నివేదికలు అవాస్తవం. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. స్నేహపూర్వక ప్రజలు(భూటాన్-అస్సాం) మధ్య వివాదం సృష్టించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల వ్యవసాయం కోసం భూటాన్లో నిర్మించిన ఈ డాంగ్ ఛానెల్ నీటిని 1953 నుంచి అస్సాం, భూటాన్ రైతులు వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నారు. అస్సాం వరిసాగుకు ఈ నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీంతో భూటాన్ నీటి సరఫరాను నిలిపివేసినట్లు వార్తలు రావడంతో సరిహద్దుల్లో అస్సాం రైతులంతా ధర్నా చేసినట్లు గువాహటి ప్రజలు పేర్కొన్నారు. -
కోహ్లికి కోహ్లి రాయునది...
న్యూఢిల్లీ: అత్యద్భుతమైన ఆటతో, అనితర సాధ్యమైన ఘనతలు సాధిస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు క్రికెట్ శిఖరాన ఉన్నాడు. 11 ఏళ్ల క్రితం అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే అంతకంటే ముందే మరో ఐదేళ్లు వెనక్కి వెళ్తే అప్పటికే ఆటలో తనదైన ముద్ర కోసం కోహ్లి తపిస్తున్నాడు. కానీ లక్ష్యం చేరగలడో లేదో తెలీదు. కానీ ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉంటుందనే నమ్మకం. ఆ సమయంలో తోడుగా తండ్రి కూడా ఉన్నాడు (కోహ్లి 18 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు). మొత్తంగా 15 ఏళ్ల కుర్రాడిలో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు! మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి ఆ కుర్రాడి అంతరంగాన్ని ఆవిష్కరించాడు. గొప్ప క్రికెటర్గా ఎదగాలనుకుంటున్న ఒక 15 ఏళ్ల కుర్రాడి కథతో రూపొందించిన ‘సూపర్ వి’ అనే యానిమేటెడ్ సిరీస్ కోసం విరాట్ ఈ తరహా ప్రయత్నం చేశాడు. ఒకవైపు తన గురించి తాను (కోహ్లి ముద్దు పేరు చీకూ) లేఖలో రాస్తూనే మరోవైపు అదే వయసు పిల్లలకు ఒక దిశానిర్దేశం చేశాడు. మంగళవారం తన 31వ పుట్టిన రోజు సందర్భంగా రాసిన ఈ లేఖలోని విశేషాలు చూస్తే... ‘హాయ్ చీకూ...నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎన్నో అడగాలనుకుంటున్నా నేను కొన్నింటికే సమాధానమిస్తా. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో తెలియనప్పుడు ఆపై దక్కేది మధురంగా, ప్రతీ సవాల్ అద్భుతంగా ఉంటుంది. ప్రతీ నిరాశ కొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు. లక్ష్యంకంటే ప్రయాణం ముఖ్యం. ఆ ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉంటుంది. విరాట్... నీకు లభించే ప్రతీ అవకాశం ఉపయోగించుకోవడం ముఖ్యం. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దు. జీవితంలో ఓటములు సహజం. కానీ ప్రయత్నించడం మాత్రం మరచిపోవద్దు. నిన్ను ప్రేమించేవాళ్లు, ఇష్టపడనివాళ్లూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా నీపై నువ్వు నమ్మకముంచు. డాడీ బహుమతిగా షూస్ ఇవ్వలేదని బాధపడవచ్చు. అంతకంటే ఎక్కువగా పంచిన ప్రేమను ఆస్వాదించు. కొన్ని సార్లు ఆయన కఠినంగా ఉన్నా అది నీ బాగు కోసమే. తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ బేషరతుగా మనల్ని ప్రేమించేది వారే. నీ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో నీ మనసు చెప్పిందే విను. పెద్ద కలలు కనడం కూడా ఎంత ముఖ్యమో ఈ ప్రపంచానికి చూపించు. చివరగా ఆ పరోఠాల రుచిని బాగా ఆస్వాదించు. మున్ముందు అవి మరీ ప్రియంగా మారిపోవచ్చు’ -
ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు, పది ప్రాంతాలు, పది నగరాల జాబితాను ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్కు దక్కగా రెండో స్థానం ఇంగ్లండ్కు, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు ఆక్రమించాయి. ఆ తర్వాత పర్యటించాల్సిన ప్రాంతాల్లో సెంట్రల్ ఆసియాలోని సిల్క్ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్లోని తొహొకు, అమెరికాలోని మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని టెంగారా, భారత్లోని మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి. తప్పక చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్బర్గ్, వాషింఘ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీలో బాన్, బొలీవియాలోని లా పాజ్, వాంకోవర్, భారత్లోని కోచి, యూఏయీలోని దుబాయ్, కొలరాడోని డెన్వర్ నగరాన్ని ‘లోన్లీ ప్లానెట్’ ఎంపిక చేసింది. కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటాన్ను చూడాల్సిన మొదటి దేశంగా, ‘టైమ్లెస్ ట్రెజర్’గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్లో చారిత్రక కట్టడాలు, చర్చులు చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు వేటికి ప్రసిద్ధో, వాటిని ఎందుకు చూడాలో ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకంలో వివరించింది. -
చిరుత హెలికాప్టర్ పేలి ఇద్దరు పైలెట్లు మృతి
థింపూ/భూటాన్: భారత రక్షణ దళానికి చెందిన చిరుత హెలికాప్టర్ పేలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. భారత సైనిక శిక్షణ బృందం(ఐఎమ్టీఏఆర్)కు సంబంధించిన చాపర్ తూర్పు భుటాన్ యంగ్పుల్లా డొమెస్టిక్ ఎయిర్పోర్టుకు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం క్రాష్ అవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోగమంచుతో కూడిన వాతావరణం వల్లే హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. భారత ఆర్మీకి భూటాన్లో శిక్షణను ఇస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకులంగా లేకపోవడంతో..ఐఎమ్టీఏఆర్ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అరుణాచల్ప్రదేశ్లోని కిర్ముకు చేరుకోగానే రెడియో సిగ్నల్స్ తెగిపోయాయి. ఈ క్రమంలో హెలికాప్టర్ ప్రమాదాన్ని అంచనా వేయలేక పోయామని భారత ఆర్మీ అధికారి కొల్ అమన్ అనంద్ పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని.. భారత వైమానిక దళం, ఆర్మీ హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టామన్నారు. మరణించిన వారిలో భూటాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ రాయల్, ఏవియేషన్ కార్ప్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. -
యువత అద్భుతాలు చేయగలదు
థింపూ: భవిష్యత్ తరాలపై ప్రభావం చూపగలరీతిలో అద్భుతాలు చేయగల శక్తిసామర్థ్యాలు భూటాన్ యువతలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నైపుణ్యవంతులైన యువత భూటాన్ను సరికొత్త ఎత్తుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయనీ, ఈ సమస్యలకు పరిష్కారం కొనుగొనేందుకు మనకు తెలివైన యువతీయువకులు ఉన్నారని వెల్లడించారు. ఆలోచనలు, సృజనాత్మకతపై ఎలాంటి పరిమితులు విధించుకోవద్దని ప్రధాని సూచించారు. భూటాన్ పర్యటనలో భాగంగా ఆదివారం థింపూలోని ‘రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్’లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మోదీ మాట్లాడారు. యువత లక్ష్యాన్ని గుర్తించాలి.. ‘ప్రపంచం గతంలో ఎన్నడూలేనన్ని అవకాశాలను ఈరోజు ఇస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలు, ఇతర రంగాల్లో భూటాన్ దూసుకుపోతే మీ 130 కోట్ల మంది స్నేహితులు మౌనంగా ఉండరు. ఆనందం, గర్వంతో చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం భారత్ పలురంగాల్లో చరిత్రాత్మక రీతిలో పురోగమిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, విపత్తుల నిర్వహణవరకూ భూటాన్తో కలిసి పనిచేసేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘అంతరిక్షం’లో సహకారం బలోపేతం.. అంతరిక్ష రంగంలోనూ భారత్ భూటాన్తో సంబంధాలను పటిష్టం చేసుకుంటోందని ప్రధాని మోదీ చెప్పారు. ‘మేం ‘థింపూ గ్రౌండ్ స్టేషన్ ఆఫ్ సౌత్ఏసియా శాటిలైట్’ను ప్రారంభించాం. ఉపగ్రహాలతో టెలిమెడిసిన్, దూరవిద్య, సహజవనరుల మ్యాపింగ్, వాతావరణాన్ని అంచనా వేయడంతో పాటు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయవచ్చు. మేం ఇటీవల చంద్రుడిపైకి చంద్రయాన్–2ను ప్రయో గించాం. భూటాన్ కూడా త్వరలోనే ఓ చిన్న ఉపగ్రహాన్ని సొంతంగా సమకూర్చుకోబోతోంది. భవిష్యత్లో భూటాన్కు చెందిన యువ శాస్త్రవేత్తలు భారత్కు వచ్చి తమ ఉపగ్రహాన్ని డిజైన్ చేసుకోవడంతో పాటు ప్రయోగాన్ని వీక్షిస్తారని ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. తాను రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ ప్రశంసించడంపై స్పందిస్తూ, గౌతమబుద్ధుని ప్రభావంతోనే ఆ పుస్తకం రాసినట్లు మోదీ చెప్పారు. భూటాన్ అర్థం చేసుకుంది: సంతోషం ప్రాముఖ్యతను భూటాన్ అర్థం చేసుకుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘భూటాన్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలాఉంది. ఇక్కడ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతులు ఒకదానితో మరొకటి సంఘర్షణ పడకుండా కలిసి ముందుకు సాగుతాయి. సంతోషం యొక్క ప్రాముఖ్యతను, దయాగుణం గొప్పతనాన్ని భూటాన్ అర్థం చేసుకుంది’ అని మోదీ తెలిపారు. తర్వాత మోదీ భారత్కు తిరుగుపయనమయ్యారు. -
భూటాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
-
‘మా స్నేహం మిగతా దేశాలకు ఆదర్శం’
థింపూ : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పొరుగు దేశం భూటాన్ వెళ్లారు. పారో విమనాశ్రయంలో ఆయనకు భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ ఘనస్వాగతం పలికారు. సిమ్తోఖా జొంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో షేరింగ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ‘భారత్, భూటాన్ దేశాల భౌగోళిక అంశాల్లో భారీ తేడాలున్నప్పటికీ.. నమ్మకాలు, విలువల్లో ఇరు దేశాలు ఒకే దృక్పథంతో ఉంటాయి. రెండు దేశాల మధ్య ఉన్న మితృత్వం పట్ల చాలా ఆనందంగా ఉంది. భారత్, భూటాన్ స్నేహబంధం మిగతా దేశాలకు ఆదర్శం’ అన్నారు. దౌత్యపరమైన అంశాల్లో, భూటాన్కు ఆర్థికంగా చేయూతనందించడంలో భారత్ సాయం ఎన్నడూ మరువలేనిదని చెప్పారు. 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత్ లక్ష్యానికి భూటాన్ తనవంతు తోడ్పాటునందిస్తుందని స్పష్టం చేశారు. ఇండియా తన లక్ష్యాన్ని చేరుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆకాక్షించారు. ఇదిలాఉండగా.. థింపూ ఎయిర్ పోర్టులో దిగిన అనంతరం ప్రధాని మోదీకి సైనిక వందనంతో స్వాగతం పలికారు. ‘సుందర భూటాన్లోని ప్రజల నుంచి మరచిపోలేని స్వాగతం లభించింది’అని మోదీ ట్వీట్ చేశారు. Prime Minister @narendramodi prayed at the Semtokha Dzong in Thimphu earlier today. pic.twitter.com/wIVKtbuwlR — PMO India (@PMOIndia) August 17, 2019 -
‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’
‘వెన్ యూ ఆర్ ఇన్ రోమ్.. బీ ఏ రోమన్’(రోమ్ వెళ్తే రోమన్ లానే ప్రవర్తించు) అనేది సామెత. అంటే మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నామో.. అక్కడి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ.. మర్యాదగా నడుచుకోవాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇలాంటి విషయాల్లో భారతీయులు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు బాలీవుడ్ టెలివిజన్ నటుడు సిద్ధాంత్ కార్ణిక్. ఈ మధ్యే ఆయన భూటాన్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రశాంతతను భంగపరుస్తున్న భారతీయ పర్యాటకులను ఉద్దేశిస్తూ.. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సిద్ధాంత్ కొందరు భారత పర్యాటకులను చూపిస్తూ.. ‘వారంతా ఎంత బిగ్గరగా అరుస్తూ మాట్లాడుతున్నారో చూడండి. ఏదో వారి ఇంటి పెరట్లోనో.. హాల్లోనో ఉన్నట్లు భావిస్తూ.. బిగ్గరగా మాట్లాడుతూ.. ఇక్కడి ప్రశాంతతను భంగపరుస్తున్నారు. మనం పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఈ దేశంలో మనం మన దేశ రాయబారులుగా భావించబడతాం. అలాంటప్పుడు ఇక్కడి ఆచార వ్యవహరాలను గౌరవిస్తూ.. వారి ప్రశాంతతకు భంగం కలగకుండా ప్రవర్తించడం మన విధి. భూటాన్లో ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ చాలా మంది భారత పర్యాటకులు కనిపిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ మన పాత అలవాట్లను ఇక్కడకు తీసుకురావడం మంచిది కాదు. ఇక్కడి ప్రశాంతతను, శుభ్రతను భంగం చేసే హక్కు మనకు లేద’ని తెలిపారు. ఈ వీడియో పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పదించారు. ‘భూటాన్ చాలా శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశం. ఇలాంటి అవగాహన వీడియో రూపొందించినందుకు ధన్యవాదాలు. కొందరిలోనైనా ఈ వీడియో మార్పు తెస్తుంది. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఐఏఎస్లకన్నా టీచర్లకే జీతాలెక్కువ!
భూటాన్ ప్రభుత్వం నూతన వేతన సవరణలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. ప్రధాని లియోంచన్ లొటే సెరింగ్ నాయకత్వంలో వేతన సవరణపై ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో దేశంలో ఉపాధ్యాయులు, వైద్యుల వేతనాలు సివిల్ సర్వీసు ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువవుతాయి. ఇంతకుముందు ప్రతిభ ఆధారిత ప్రోత్సాహకాలిచ్చిన ప్రధాని సెరింగ్... తాజాగా విద్య, వైద్య సిబ్బంది వేతనాలను భారీగా పెంచారని భూటాన్ మీడియా వెల్లడించింది. తాజా పెంపు ప్రకారం పదేళ్లకన్నా తక్కువ అనుభవం ఉన్న టీచర్లకు 35 శాతం వృత్తి భత్యం ఇస్తారు. 10–20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి 45 శాతం, 20 ఏళ్లకు మించి సర్వీసు ఉన్న వారికి 55 శాతం వృత్తి భత్యం చెల్లిస్తారు. దీంతోపాటు భూటాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వృత్తిపరమైన ప్రమాణాల మేరకు వీరికి అనుభవాన్నిబట్టి 10 నుంచి 20 శాతం భత్యం అదనంగా లభిస్తుంది. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్లకు 45 శాతం, స్పెషలిస్టులకు 55 నుంచి 60 శాతం వృత్తి భత్యం ఇస్తారు. నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అనుభవాన్నిబట్టి 35 నుంచి 55 శాతం భత్యం లభిస్తుంది. దీని ప్రకారం లెక్కేస్తే... పదేళ్ల అనుభవం ఉన్న టీచరు, పీ5 గ్రేడ్ డాక్టర్కు 29,935 గల్ట్రమ్ (ఎన్యూ–భూటాన్ కరెన్సీ) కంటే ఎక్కువ జీతం వస్తుంది. పీ3 సివిల్ సర్వీసు అధికారి జీతం 28,315 గల్ట్రమ్. ప్రభుత్వంలో డైరెక్టర్ హోదాలో ఉన్న ఐఏఎస్కు 44,120 ఎన్యూ వేతనం ఉంటే పీ2 గ్రేడ్ టీచర్, డాక్టర్ల జీతం 46,835 ఎన్యూలకుపైగా ఉంటుంది. భూటాన్ ప్రభుత్వంలో అత్యధిక వేతనం పొందే ఉద్యోగం కేబినెట్ సెక్రటరీ. ఆయనకు 82 వేలకుపైగా జీతం వస్తుంది. తాజా వేతన సరవణలో ఈఎస్1 గ్రేడ్ పొందిన డాక్టర్లు 90 వేలకుపైగా జీతం పొందుతారు. -
హోటెల్.. మోటెల్.. పటేల్!
వాషింగ్టన్: హోటెల్, మోటెల్, పటేల్ వాలాస్.. అంటూ ప్రధాని నరేంద్రమోదీ గుజరాతీ పటేల్ వర్గం వారితో సరదా సంభాషణ జరిపారు. శుక్రవారం ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ‘సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్’ సమావేశంలో పాల్గొన్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘హోటెల్, మోటెల్, పటేల్ వాలాలుగా మీరు ప్రసిద్ధులు కదా. మీ మోటెల్కు అతిథి ఎవరైనా వచ్చినప్పుడు భారత్ గురించి టీవీలో ఓ ఐదు నిమిషాల వీడియో క్లిప్పింగ్ చూపలేరా? అతిథులు టీవీ ఆన్ చేయగానే భారత్లో వారు చూడగలిగే ప్రదేశాలను తెలుసుకుంటారు. ఆ విధంగా ఒక్కొక్కరు ఐదుగురు విదేశీయులు భారత్ను సందర్శించేలా చేయండి. స్వదేశంలో మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకున్నా.. ఈ ఒక్క పని చేస్తే దేశానికి గొప్ప సేవ చేసిన వారవుతారు’ అని ప్రధాని మోదీ అన్నారు. ఒక్కొక్కరు ఐదుగురు విదేశీయులను భారత్కు వచ్చేలా ప్రోత్సహించటం ద్వారా దేశ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ‘భారతీయ సంతతి ప్రజలున్న చోట దేశాభివృద్ధి జరుగుతుందని పరిచయమున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మన పిల్లలు, స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కడున్నా టాపర్లుగానే నిలుస్తారని, మన డాక్టర్లు నిజాయతీ పరులనీ, కష్టపడే తత్వంగల వారని ఆయా దేశాల అధికారులు కూడా నమ్ముతారు’ అని అన్నారు. భారత్ను అపఖ్యాతి పాలు చేసేందుకు, ఉగ్రవాదంపై తన వైఖరే సరైందని అంతర్జాతీయంగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న పొరుగుదేశం (పాక్పై)పై విజయం సాధించటంలో ప్రవాస భారతీయులు ఎంతో తోడ్పాటు అందించారని కొనియాడారు. గుజరాత్కు చెందిన పటేల్లు అమెరికాలోని హోటెల్, మోటెల్ వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించారు. 2014లో ప్రఖ్యాత స్మిత్సోనియన్ మ్యాగజీన్ తన వ్యాసంలో.. ‘అమెరికాలోని మోటెళ్లలో సగం భారతీయ అమెరికన్ల యాజమాన్యంలో ఉన్నాయి’ అని పేర్కొంది. ‘అమెరికాలోని అంతర్ రాష్ట్ర రహదారుల పక్కన ఉండే మోటల్స్లో రాత్రిళ్లు బస చేయాలనుకునే వారికి తక్కువ ధరలోనే బెడ్లు దొరుకుతాయి. మరీ ముఖ్యంగా అది భారతీయులకు చెందిన మోటెల్ అయి ఉంటుంది’ అని న్యూయార్క్టైమ్స్ 1999లో తెలిపింది. యోర్క్ వర్సిటీ క్యాంపస్ డైరెక్టర్ రఘునాథన్ 2015 నాటి తన బ్లాగ్లో.. అమెరికాలో పటేళ్ల జనాభా 2.57లక్షలు. అమెరికాలోని టాప్ 500 కుటుంబాల్లో ‘పటేల్’ పేరు 174వ ర్యాంకులో ఉంది. అమెరికాలో 22వేల భారతీయుల హోటళ్లుండగా వాటి వ్యాపారం 8.80 లక్షల కోట్లు. వాటిలో 70శాతం గుజరాతీలవే అందుకే వారిని ‘పటేల్స్, అ లా మోటెల్స్’ అంటుంటారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని భేటీ న్యూఢిల్లీ: భూటాన్ ప్రధాని షెరింగ్ టాబ్గే శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వ్యూహాత్మక రంగాల్లో సహకారం బలోపేతంపై వారు చర్చించారు. భారత్, భూటా న్, చైనా సరిహద్దుల్లోని డోక్లాం అంశం కూడా చర్చకు వచ్చింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పర్యటనకు వచ్చిన త్సెరింగ్కు మోదీ ఘన స్వాగతం పలికారని విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. వారి చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు. కాగా, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు. -
భూటాన్ భారత్కు హ్యాండిస్తే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం సంక్షోభం సమసిసోయిందని సరిహద్దులో చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా-భూటాన్లు సంధి చేసుకుంటే.. మధ్యలో భారత్ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. గురువారం విదేశాంగ శాఖ ప్రతినిధులతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... డోక్లాం ప్రస్తావన తీసుకొచ్చారు. ‘సరిహద్దులో సమస్య సమసిపోయినట్లేనని చెబుతున్నారు. అలాంటప్పుడు చైనా-భూటాన్లు ఓ ఏకాభిప్రాయానికి వస్తే భారత్ పరిస్థితి ఏంటి? సమస్యసాత్మక ప్రాంతంలో ఆ రెండు పొరుగు దేశాలు భూ ఒప్పందం చేసుకునే అవకాశాలు లేకపోలేదు కదా!. ఆ దిశగా మీకు ఏమైనా సమాచారం ఉందా?’ అని విదేశాంగ కార్యదర్శిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కార్యదర్శి విజయ్ గోఖలే.. అలాంటి అవకాశం ఉందని చెబుతూనే... పరిస్థితులు మాత్రం అందుకు సానుకూలంగా లేవని చెప్పటం కొసమెరుపు. అయితే ఈ విషయంలో భారత్ వెంటే తాము ఉంటామన్న సంకేతాలను భూటాన్ అందించిందని ఆయన వివరించారు. ఇక రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా స్పందిస్తూ... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. జూలై 2017 తర్వాత ఎలాంటి మోహరింపులు చోటు చేసుకోలేదని చెప్పారు. గత నెలలో శాటిలైట్ ఇమేజ్లు అనుమానాస్పద కట్టడాన్ని సూచించినప్పటికీ.. అది తమ సరిహద్దులోనే చేపడుతున్నట్లు చైనా వివరణ ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఈ ప్యానెల్.. సరిహద్దు సమస్యలు, రక్షణ చర్యలపై అధికారులతో భేటీలో సుదీర్ఘంగా చర్చించింది. -
భూటాన్లో రావత్, దోవల్ రహస్య పర్యటన
న్యూఢిల్లీ: ఈ నెల మొదటి వారంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భూటాన్లో రహస్యంగా పర్యటించిన సంగతి ఆలస్యంగా వెలుగుచూసింది. వారు భూటాన్ అధికారులతో డోక్లాంలో భద్రతా పరిస్థితి, చైనా నిర్మిస్తున్న రక్షణ మౌలిక వసతులపై చర్చించినట్లు తెలిసింది. డోక్లాం చుట్టుపక్కలా పెరుగుతున్న చైనా ఆర్మీ ప్రాబల్యం, రక్షణలో భారత్, భూటాన్ల మధ్య సహకారాన్ని సమీక్షించారు. ఫిబ్రవరి 6–7 తేదీల్లో ఈ పర్యటన జరిగిందని, సానుకూల ఫలితాలు వెలువడ్డాయని ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నాయి. భారత్, చైనాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన తరువాత భూటాన్లో మన ఉన్నతాధికారులు పర్యటించడం ఇదే తొలిసారి. అంతకు మూడు రోజుల ముందు ప్రధాని మోదీ భూటాన్ ప్రధానితో గువాహటిలో సమావేశవడం గమనార్హం. -
భూటాన్ ప్రధానితో ప్రధాని మోదీ భేటీ
-
భూటాన్ యువరాజుకు చెన్నపట్టణ బొమ్మలు
సాక్షి, బెంగళూరు: మొదటి సారిగా భారత పర్యటనకు వచ్చిన భూటాన్ రాజ దంపతుల కుమారునికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకకు చెందిన ప్రముఖ హస్తకళాకృతుల్లో ఒకటైన చెన్నపట్టణ బొమ్మలను అందజేశారు. భూటాన్ రాజు జిగ్మే నామ్గల్ వాంగ్చుక్ తన భార్యా, ఏడాదిన్నర వయస్సున్న కుమారుడితో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ రాజ దంపతులతో సమావేశమైన నిర్మలా సీతారామన్ యువరాజుకు ఒక కుందేలు బొమ్మతో పాటు కొన్ని చెన్నపట్టణ బొమ్మలను బహుమతిగా అందజేశారు. యువరాజుకు అందజేసిన బొమ్మలు రాజదంపతులను ఆకట్టుకున్నాయంటూ నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. చెన్నపట్టణ బొమ్మలతో ఆడుకుంటున్న బుల్లి యువరాజు -
భారత్-భూటాన్ దోస్తీ.. చైనా ఏమంటోంది?
పొరుగు దేశాలైన భారత్-భూటాన్ మధ్య అనుబంధం రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో ఈ విషయమై చైనా ఆచితూచి స్పందించింది. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో భారత్కు అండగా నిలిచిన భూటాన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించడంపైనా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేసింది. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటే చూడాలని చైనా భావిస్తోందని పేర్కొంది. తాజాగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్చుక్ భారత్ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ ఈ రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించేకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత్-భూటాన్ మధ్య సాధారణ సంబంధాలను మేం కోరుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో చైనాకు విరుద్ధంగా భారత్కు మద్దతునిచ్చినందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింత్ తనను కలిసిన భూటాన్ రాజు ఖేసర్ను ఎంతగానో ప్రశంసించారు. కోవింద్ ప్రశంసలపై స్పందిస్తూ.. ’ భారత సరిహద్దు బలగాల అతిక్రమణ ఘటనను మీరు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మా వైఖరేంటో ఎన్నోసార్లు తెలియజేశాం. దౌత్యమార్గాల్లో ఈ వివాదాన్ని భారత్-చైనా సముచితమైన రీతిలో పరిష్కరించుకున్నాయని మేం భావిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, భద్రతల కోసం చారిత్రక ఒప్పందాలకు కట్టుబడి భారత్, చైనాతో కలిసి పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం’అని ఆమె అన్నారు. -
డోక్లాం.. మళ్లీ చైనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా- భూటాన్ సరిహద్దు సమీప వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో డ్రాగన్ చర్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. భారత్తో తగువులాడి, ఆపై బలగాలను ఉపసంహరించుకున్న చైనా.. ఇప్పుడు భూటాన్ భూభాగంలో భారీ రోడ్డును నిర్మిస్తోంది. ఇందుకోసం సైనిక బలగాలతోపాటు భారీ యంత్రాలను అక్కడ మోహరింపజేసింది. కాగా, చైనా తీరుపై భూటాన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్- చైనాల మధ్య ఆగస్టు 28న జరిగిన చర్చల్లో.. డోక్లాం నుంచి సైన్యాలను ఉపసంహరించాలనే ఒప్పందం కుదిరింది. దీంతో వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరుదేశాల సైన్యాలూ వెనక్కి జరిగాయి. భారత విదేశాంగ శాఖ సెప్టెంబర్ మొదటివారంలో చేసిన ప్రకటనలోనూ డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలు లేవని పేర్కొంది. అయితే, భారత్-చైనా సైన్యాలు పరస్పరం తలపడిన ప్రాంతం నుంచి ఉత్తరదిశలో చైనా కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మొత్తం 12 కిలోమీటర్ల రోడ్డు పనులను సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అదేరోజు సాయంత్రం ఢిల్లీలోని భూటాన్ రాయబారి వెట్సొప్ నమ్గెల్.. చైనా రాయబారి లూ జవోహుయ్ను కలిసి చర్చలు జరిపారు. సమస్య ఇంకా పరిష్కారం కానందున, మరో దఫా చర్చలు జరుపుతామని భూటాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తోన్న భారత్ ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన చేయలేదు. -
డొక్లామ్లో మళ్లీ రోడ్డేస్తున్న చైనా..!
న్యూఢిల్లీ : డొక్లామ్లో పీఠభూమి వివాదానికి మళ్లీ తెర లేచాలా ఉంది. చికెన్ నెక్ ప్రాంతంలో రోడ్డు వేసే ప్రక్రియను నిలిపేసి, సైన్యాన్ని వెనక్కు పిలిచిన చైనా.. గత వివాదాస్పద ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో మళ్లీ రోడ్డు వేయడం ప్రారంభించింది. దాదాపు 500 మంది చైనా జవాన్లు రోడ్డు నిర్మిస్తున్న కార్మికులకు రక్షణగా ఉంటున్నట్లు తెలిసింది. చైనా రోడ్డు నిర్మిస్తున్న ఈ ప్రాంతం నుంచి యాటుంగ్ పట్టణానికి కేవలం 20 కిలోమీటర్లే. ప్రస్తుతం చైనా రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతం అతి శీతలంగా ఉంటుంది. చలికాలంలో మంచు దుప్పటిని పరుచుకుంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. దీంతో జవాన్లు, కూలీలు యాటుంగ్లో బస చేస్తూ రోడ్డు నిర్మాణ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు భారతీయ ఆర్మీ అధికారి తెలిపారు. పట్టణం చేరువలో ఉండటంతో అవసరమైతే మరింత మంది సైనికులను మొహరించే వెసులుబాటు చైనాకు ఉందని ఆయన చెప్పారు. -
మోదీలా ఊయల ఊగలేను!
► చైనా, భూటాన్ రాయబారులతో భేటీపై రాహుల్ వ్యాఖ్య ► కీలక పరిణామాలు తెలుసుకోవడం నా బాధ్యత: రాహుల్ ► రాహుల్ భేటీ వివరాల్ని బయటపెట్టాలన్న బీజేపీ న్యూఢిల్లీ: భారత్లోకి చైనా సైనికులు చొరబడ్డ సమయంలో ఆ దేశ అధ్యక్షుడితో కలసి ప్రధాని మోదీ ఊయల్లో విహరించారని, తాను అలాంటి వ్యక్తిని కాదని రాహుల్ గాంధీ విమర్శించారు. సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. జూలై 8న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చైనా, భూటాన్ రాయబారుల్ని కలిశారన్న విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశం కావడంపై ఆయన స్పందిస్తూ.. ముఖ్యమైన అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకోవడం తన బాధ్యత అని ట్వీట్ చేశారు. ‘నేను చైనా రాయబారి, మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు, భూటాన్ రాయబారిని కలిశాను. చైనా రాయబారిని కలవడంపై మీరు అంతగా ఆందోళన చెందుతుంటే.. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ముగ్గురు కేంద్ర మంత్రులు ఎందుకు చైనాలో అధికారికంగా పర్యటిస్తున్నారో చెప్పండి?’ అని రాహుల్ ప్రశ్నించారు. జూలై 8న తమ దేశ రాయబారిని రాహుల్ గాంధీ కలిశారని చైనా రాయబార కార్యాలయం తన అధికారిక వెబ్సైట్ పేర్కొంది. ప్రస్తుత భారత్–చైనా సంబంధాలపై ఇద్దరూ చర్చించుకున్నారని అందులో వెల్లడించింది. అయితే సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ వార్తను తొలగించారు. రాహుల్ భేటీని కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘ఇది మర్యాదపూర్వక భేటీ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు విదేశీ రాయబారుల్ని అప్పుడప్పుడు కలవడం మామూలే’నని వివరణ ఇచ్చారు. ఈ భేటీకి అంత ప్రాధాన్యం లేదని.. జీ5 సభ్య దేశాలైన చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా ప్రతినిధుల్ని కూడా గతంలో కాంగ్రెస్ నేతలు కలిశారని తెలిపారు. చైనా రాయబారి ల్యుయో ఝావోహ్యుయ్, భూటాన్ రాయబారి వెట్సాప్ నమ్గ్యేల్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివ శంకర్ మీనన్లను రాహుల్ కలిశారని, ఇది చాలా సాధారణ విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేశ ప్రయోజనాల పట్ల పూర్తి జాగరూకతతో ఉన్నారని, సరిహద్దుల్లో ఉద్రిక్తతపై ఆందోళన చెందుతున్నారన్నారు. ఏం మాట్లాడారు: బీజేపీ చైనా రాయబారిని రాహుల్ కలవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే భేటీలో ఏ మాట్లాడుకున్నారో ఆయన బయటపెట్టాలని బీజేపీ ప్రతినిధి విజయ్ చౌతాయ్వాలే డిమాండ్చేశారు. సమావేశం వివరాల్ని దాచిపె ట్టారని, అందువల్ల కాంగ్రెస్ నేతల దేశభక్తిపై సందేహాలు తలెత్తుతున్నాయని, ఈ విషయంపై వివరణ ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోరారు -
చైనా ది డేంజర్
-
1962లో అక్కడ..ఇప్పుడు సిక్కింలో!
-
1962లో అక్కడ..ఇప్పుడు సిక్కింలో!
సరిహద్దులో చైనా దుశ్చర్యలు సాక్షి నాలెడ్జ్ సెంటర్ : భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధమే వస్తే భారత్ 1962నాటి పోరులోకంటే ఎక్కువగా నష్టపోతుందని చైనా హెచ్చరిస్తోంది. భారత్, భూటాన్, చైనా సరిహద్దులకు ఆనుకుని ఉన్న డోకా లా పీఠభూమిలోకి చైనా తన సరిహద్దు రహదారి విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలను భారత సేనలు అడ్డుకోవడం తాజా ఉద్రిక్తతలకు దారిదాసింది. జమ్మూ–కశ్మీర్ నుంచి ప్రారంభమయ్యే భారత– చైనా సరిహద్దు మధ్యలో నేపాల్, భూటాన్ను వదిలేసి సిక్కిం, అరుణాచల్ప్రదేశ్తో ముగుస్తుంది. మొత్తం సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు. సిక్కిం సెక్టార్లో ఈ సరిహద్దు 220 కిలోమీటర్లు. 1962లో భారత్, చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతాలు అక్సాయ్చిన్ (కశ్మీర్), అరుణాచల్ ప్రదేశ్(మెక్ మోహన్ రేఖ వెంట) కావడంతో యుద్ధం ఆ రెండు చోట్లా జరిగింది. ఆ ఏడాది అక్టోబర్ 20న ఈ రెండు ప్రాంతాల్లో మొదలైన యుద్ధం నవంబర్ 21 వరకు కొనసాగింది. భారత్ ఓటమితో అక్సాయ్చిన్ చైనా వశమైంది. ప్రస్తుత వివాదం భూటాన్, చైనా మధ్యే! భూటాన్ను ఆనుకుని డోకా లా పీఠభూమిలో చైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే భారత్కు సమస్యలు ఎదురవుతాయి. భారత ప్రధాన భూభాగాన్ని 8 ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ‘సిలిగుడి కారిడర్’(చికెన్నెక్) భవిష్యత్తులో చైనా దాడులకు లక్ష్యంగా మారే ప్రమాదముంది. వాస్తవానికి డోకా లా.. చైనా–భూటాన్ల వివాదం. భూటాన్తో భారత్కు ఉన్న సత్సంబంధాలు, దాని రక్షణ బాధ్యత దృష్ట్యా భారత సైనికులు భూటాన్ సైన్యానికి మద్దతుగా నిలవడం చైనాకు రుచించలేదు. డోకా లా వివాదంపై భూటాన్, చైనాల మధ్య 16సార్లు చర్చలు జరిగిన ఫలితం లేకపోయింది. భారత్ నుంచి సైనిక సాయం తీసుకోవడం ద్వారా ఈ చిన్న హిమాలయ రాజ్యం తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లఘించిందని చైనా ఆరోపించింది. నేపాల్ను గతంలో తనవైపు తిప్పుకున్నట్టే ఇప్పుడు భూటాన్నూ నయానో భయానో దారిలోకి తెచ్చుకోవడానికి చైనా వ్యూహం పన్నినట్టు కనిపిస్తోంది. అరుణాచల్ప్రదేశ్ తనదని వాదిస్తున్నట్టే డోకా లా కూడా తనదేనని చెబుతోంది. డోకా లా ఉద్రిక్తత సైనికపరంగా పెద్దవైన భారత్, చైనాల మధ్య నిజంగానే యుద్ధానికి దారితీస్తే అది సిక్కిం సెక్టార్లోని 220 కి.మీ. సరిహద్దుకే పరిమితమౌతుందా, లేకపోతే ఇతర సెక్టార్లకూ విస్తరిస్తుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. -
బుస కొడుతున్న డ్రాగన్
బలగాలను ఉపసంహరించుకుని, తప్పులు దిద్దుకోవాలని భారత్కు చైనా హెచ్చరిక బీజింగ్: సిక్కిం సరిహద్దు వివాదంపై చైనా మాటలు శ్రుతిమించుతున్నాయి. భారత్ పంచశీల సూత్రాలను ఉల్లంఘిస్తోందని, తన బలగాలను ఉపసంహరించుకుని తప్పులు దిద్దుకోవాలని పొరుగు దేశం మరోసారి హెచ్చరించింది. ‘సిక్కిం సమీపంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు వల్ల తమ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురువుతాయంటూ భారత్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. భారత చర్యలు ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయి. 1950లో చైనా, భారత్, మయన్మార్లు శాంతియుత సహజీవనం కోసం పంచశీల సూత్రాలను ఆమోదించడం తెలిసిందే. అయితే భారత్ ఆశ్చర్యకరంగా వేరే దేశంలోకి చొరబడి అంతర్జాతీయ సంబంధాల మౌలిక నిబంధనలను తుంగలోకి తొక్కుతోంది. భారత సైనికులు మా భూభాగంలోకి చొరబడటం తీవ్రమైన విషయం’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెన్ సువాంగ్ బుధవారం ఆరోపించారు. భారత సైనికులు ఇంకా తమ భూభాగంలోనే ఉన్నారని చెప్పారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు భారత్ సాధ్యమైనంత త్వరగా తన బలగాలను వాపసు తీసుకుని ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థాయికి వచ్చేలా చూడాలన్నారు. ‘1890నాటి సైనో–బ్రిటిష్ ఒప్పందం.. సిక్కిం సరిహద్దు గింపోచీ పర్వతం నుంచి మొదలవుతోందని చెబుతోంది. మా రోడ్డు నిర్మాణం ఆ పర్వతానికి 2 కి.మీ అవతల సాగుతోంది. భారత్ ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని ఆరోపించారు. భూటాన్తో వివాదం లేదు: డోకా లా ప్రాంతం ప్రాచీన కాలం నుంచి చైనా అధీనంలో ఉందని గెన్ పేర్కొన్నారు. సరిహ ద్దు విషయంలో ఒక అంగీకారం లేకున్నప్పటికీ డోకాలాపై భూటాన్తో తమకెలాంటి వివాదమూ లేదన్నారు. భారత ప్రధాని నెహ్రూ అప్పటి చైనా ప్రధాని ఎన్లైకి రాసిన లేఖలో భూటాన్ను చైనాలో అంతర్భాగంగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. అలాంటిదేమీ లేదని గెన్ అన్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో భారత్కు వెళ్లే తమ పౌరులకు ట్రావెల్ అలర్ట్ జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
ఆ బ్రాండ్కు డిమాండ్ లేకే..
► భూటాన్ దేశం బీర్లు నేల పాలు! ► కాలం చెల్లడంతో పారబోత మాక్లూర్(ఆర్మూర్): ఎండ కాలంలో బీర్లకు ఎం తో డిమాండ్ ఉంటుంది. కానీ ఓ బ్రాండ్ బీర్లను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కాలం చె ల్లాయి. దీంతో వాటిని పారబోయాల్సి వచ్చిం ది. మాక్లూర్ మండలంలోని మాదాపూర్ సమీ పంలోని తెలంగాణ రాష్ట్ర బేవరేజేస్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఎంఎల్ డిపో)కు నుంచి జిల్లా వ్యా ప్తంగా మద్యం సరఫరా అవుతుంది. జిల్లాలో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు సాగుతుం టాయి. కానీ భూటాన్ దేశానికి చెందిన డ్రక్ 1100 అనే బీర్లను కొనుగోలు చేసేవారు కరువవడంతో కాలం చెల్లాయి. దీంతో అధికారులు రెండు రోజుల క్రితం 1,070 కేసుల బీర్లను డిపో అధికారులు పారబోశారు. దీంతో సుమారు రూ. 16 లక్షల 70 వేల నష్టం బీర్ల కంపెనీకి జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి కంపెనీ ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. వైన్స్ నిర్వాహకులు సదరు కంపెనీ బీర్లను కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఏడాదిగా డిపోలోనే నిల్వ ఉండడంతో కాలం చెల్లాయని అధికారులు తెలిపారు. బీర్ల శాంపిళ్లను ల్యాబ్కు పంపించగా ఏడాది క్రితమే కాల్లం చెల్లాయని రిపోర్టు రావడంతో పారబోశామని పేర్కొన్నారు. గతంలోనూ కాలంచెల్లిన మద్యాన్ని పారబోసినా, ఇంత భారీస్థాయిలో పారబోయడం ఇదే తొలిసారని డిపో అధికారులు చెబుతున్నారు. -
బాహుబలి రిలీజ్ తరువాత జక్కన్న ప్లాన్స్
బాహుబలి సినిమా కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డ రాజమౌళి, త్వరలో లాంగ్ హాలీడే ట్రిప్ కు వెళ్లనున్నాడు. ఈ శుక్రవారం బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా హాలీవుడ్ సినిమాలకు కూడా షాక్ ఇస్తున్న బాహుబలి ఇండియన్స్ సినిమా కలెక్షన్ల రికార్డ్ లను బద్ధలు కొట్టడం కాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతటి భారీ చిత్రం తరువాత రాజమౌళి కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు. బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకొని భూటాన్ వెళ్లనున్నాడు. ఆసియాలో సంతోషకరమైన దేశంగా భూటాన్ కు పేరుంది. చాలా రోజులుగా భూటాన్ చూడలనుకుంటున్న జక్కన్న తన హాలీడే ట్రిప్ ను అక్కడే ప్లాన్ చేశారు. అంతేకాదు మహాభారతాన్ని ఇప్పట్లో తెరకెక్కించనన్న రాజమౌళి, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా కథలు సిద్ధం చేశారని, త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తానని వెల్లడించారు. -
పాక్పై వేటుకు భారత్కు తోడుగా మరిన్ని దేశాలు
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ను ఒంటరి చేయాలన్న భారత్ ప్రయత్నంలో తొలి అడుగుపడింది. త్వరలో ఇస్లామాబాద్ లో జరగనున్న సార్క్ సమావేశానికి హాజరవడం లేదని ఇప్పటికే భారత్, అప్ఘనిస్థాన్ స్పష్టం చేయగా అదే వరుసలో ఇప్పుడు మరో రెండు దేశాలు చేరనున్నాయి. తాము కూడా సార్క్ సమావేశాలకు వెళ్లడం లేదని బంగ్లాదేశ్ ప్రకటించినట్లు అధికార వర్గాల సమాచారం. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ పదేపదే జోక్యం చేసుకుంటుందని, తమ నిరసన తెలియజేసేందుకు ఇదే తగిన సమయం అని పేర్కొంటూ ఆ దేశం సార్క్ సమావేశానికి హాజరుకావడం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో దక్షిణాసియా దేశాలకు తాము ఎప్పటికీ సహకరిస్తుంటామని ఒక ప్రకటనగా చెప్పింది. ఇదే బాటలో భూటాన్ నిలిచింది. కొన్ని సార్క్ దేశాలు ఇప్పుడు ప్రాంతీయ ప్రశాంతతను, భద్రతను ఉగ్రవాదం కారణంగా కోల్పోతున్నాయని భూటాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రాంతంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుండంతోపాటు సార్క్ లో సభ్యత్వం ఉన్న కొన్నిదేశాల్లో శాంతియుత వాతావరణాన్ని ఉగ్రవాదం చెడగొడుతున్న కారణంగా తాము కూడా ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా వారు బంగ్లాదేశ్, భూటాన్ లేఖలు కూడా పంపించినట్లు తెలుస్తోంది. -
అడవి మార్కు పార్కు!
భూటాన్ ఆనందమంటే కొత్త ఫ్యాషన్లోనో, లేటెస్ట్ ఐఫోన్లోనో ఉండదని భూటాన్ ప్రజల్ని చూశాకే తెలుస్తుంది. ఉన్నదాంతో తృప్తిపడటం... టీవీ, రేడియో, ఇంటర్నెట్ కాలుష్యాల్ని పట్టించుకోకపోవటం... దేశంలో 50 శాతం భూ భాగాన్ని జాతీయ పార్కుగా రక్షించటం... దేశాభివృద్ధిని గ్రాస్ నేషనల్ హ్యాపినెస్లో కొలవటం... ఇవన్నీ భూటాన్లో మాత్రమే సాధ్యం. భూటాన్లో చాలా భాగంలో జనావాసాలుండవు. పర్యాటకులు అక్కడికి వెళితే... జనారణ్యంలో లేని ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తుంది. మరో చిత్రం... అక్కడ పేద-గొప్ప తారతమ్యాలు తక్కువ. పండగల్లో రాజ కుటుంబీకులూ సామాన్యులతో ఆడిపాడతారు. ఒకోసారి యాత్రికులనూ కలుస్తారు. భూటానీల్లో మూడింట రెండొంతుల మంది రోజుకు కనీసం 8 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. వాహనాలూ తక్కువ. కాలుష్యాన్ని వదిలే కంపెనీలూ తక్కువే. అందుకే ఆరోగ్యం వారి సొంతం. ప్రపంచంలో అత్యంత మారుమూల ఆలయమేదంటే... భూటాన్లోని పారో తక్సంగ్ లేదా టైగర్స్ నెస్ట్ను చెప్పుకోవాలి. కష్టపడి అక్కడికి చేరితే... ఆ కష్టాన్నంతా మరిచిపోవచ్చంటారు సందర్శకులు. ఇక్కడికి వెళితే భూటాన్ ప్రజల ఆనందానికి కారణం కూడా తెలుస్తుందంటారు. మనకైతే వీసా అక్కర్లేదు. మరి వెళ్దామా? ఎలా వెళ్లాలి? * భూటాన్కు విమాన సర్వీసులు పెద్దగా లేవు. ‘పారో’ విమానాశ్రయం ఒక్కటే కొన్ని దేశాలను కలుపు తోంది. దేశంలో ఢిల్లీ, కోల్కతాల నుంచి మాత్రమే విమానాలున్నాయి. ముందుగా బుక్ చేసుకుంటే ఢిల్లీ నుంచో, కోల్కతా నుంచో తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.15వేల లోపే ఉంటాయి. * రైలు మార్గంలో వెళ్లేవారైతే మొదట కోల్కతా, కాన్పూర్, రాంచీ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు చేరుకోవాలి. అక్కడి నుంచి న్యూజల్పాయ్గురికి రైలు సర్వీసులు ఎక్కువే ఉన్నాయి. న్యూజల్పాయ్గురి జిల్లాలోని హషిమొర రైల్వే స్టేషన్లో దిగితే... అక్కడి నుంచి భూటాన్ 17 కిలోమీటర్ల దూరం. * హషిమొర నుంచి క్యాబ్లు, జీప్లు, బస్సులు ఎక్కువే. అక్కడి నుంచి సరిహద్దుల్లో ఉన్న జైగామ్ను చేరుకోవాలి. అక్కడే చెక్పోస్టు. భూటాన్లోకి ప్రవేశించడానికి పర్మిట్ ఇచ్చేదిక్కడే. ఈ పర్మిట్ థింపు, పారో ప్రాంతాలకే వర్తిస్తుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ప్రత్యేకంగా చెప్పాలి. * ఇండియాకు చెందిన కారులో భూటాన్ వెళ్లొచ్చు గానీ... దానిక్కూడా పర్మిట్ ఉండాలి. లేదంటే స్థానిక టూర్ ఆపరేటర్ సాయం తీసుకోవచ్చు. * వీసా అక్కర్లేదు కానీ... ఐడెంటిఫికేషన్ కోసం పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండాలి. ఏ సీజన్లో వెళ్లొచ్చు? * మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో అటు తీవ్రమైన చలి, ఇటు తీవ్రమైన ఎండలు ఉండవు. ఇదే మంచి సమయం. - రద్దీని తప్పించుకోవటానికైతే కాస్త చలి ఎక్కువైనా డిసెంబరు, జనవరి ఫిబ్రవరి నెలలు ఉత్తమం. * అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను బట్టి చూస్తే... అన్నినెలల్లోనూ ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. -
భూటాన్లో ప్రిన్స్ జంట
థింపు: బ్రిటన్ యువరాజు విలియం, కేట్ దంపతులు గురువారం భూటాన్ పర్యటనకు వచ్చారు. రాజధాని థింపులో వారికి అధికారులు సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా స్వాగతం పలికారు. విలియం, కేట్లు భూటాన్లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్, రాణి జట్సన్ పేమాను వారు తషికో డోంగ్ కోటలో కలుసుకున్నారు. భారత్నుంచి విలియం దంపతులు గురువారం ఉదయం థింపు చేరుకున్నారు. గురువారం రాత్రి విలియం, కేట్ గౌరవార్థం భూటాన్ రాజు విందు ఏర్పాటు చేశారు. వీరు శనివారం ఆగ్రాకు వస్తారు. ఖడ్గమృగాన్ని చంపిన వేటగాళ్లు: బుధవారం రాత్రి విలియం దంపతులు అస్సాం గువాహటిలో కజిరంగా జాతీయ పార్కు సమీపంలోని రిసార్టులో ఉండగానే భారీ భద్రతను కూడా లెక్కచేయకుండా వేటగాళ్లు పార్కులో ఖడ్గమృగాన్ని వేటాడి చంపి దాని కొమ్మును తీసుకెళ్లారు. అధికారులు గురువారం ఖడ్గమృగం కళేబరాన్ని కనుగొన్నారు. -
పోలీసుల అదుపులో అంతర్జాతీయ నేరస్తుడు
అంతర్జాతీయ నేరస్తుడు మేడ్చల్కు చెందిన ముల్లంగి సుధాకర్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. భుటాన్ దేశంలో 10 తులాల బంగారం దొంగతనం కేసుతో పాటు 11 హత్యకేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు పరారీలో ఉన్నారు.. సైబరాబాద్ పరిధిలో కూడా అతడిపై అనేక కేసులు ఉన్నాయి.పోలీసులకు చిక్కిన సుదాకర్ వద్ద నుంచి 75 తులాల బంగారం, ఎఫ్జెడ్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. -
చూతము రారండోయ్!
అక్కడ ‘అభివృద్ధి’ని ఆర్థిక పరిభాషలో కొలవరు. ఆనందానికి సంబంధించిన విషయాలతోనే కొలుస్తారు. అక్కడ ‘జీడిపి’ కంటే ‘జీఎన్హెచ్’ (గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్)కే ప్రాధాన్యత ఇస్తారు. భూటాన్ అంటే అందమైన సంతోషం! భూటాన్ను చూడడమంటే భూతలస్వర్గ విహారం!! ‘మా అందాలివిగో’ అన్నట్లుగా భూటాన్ ప్రభుత్వం, దేశంలోని దైనందిన జీవితపు సొగసు, కట్టడాలపై కొన్ని ఫోటోలను విడుదల చేసింది. వాటిని చూస్తే... భూటాన్ను చూడని వాళ్లు... ‘‘తప్పక చూడాలి’’ అనుకుంటారు. భూటాన్ను చూసిన వాళ్లు, ఫోటోలను కూడా చూస్తే- ‘‘మరోసారి తప్పకచూడాలి’’ అనుకుంటారు. మచ్చుకు రెండు ఫోటోలు...మహాద్భుతం కదూ! -
పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట : జైట్లీ
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతలు, స్మగ్లింగ్కు అడ్డుకట్టవేయడం కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి మరింత సహకారాన్ని తీసుకోవాలని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. గురువారమిక్కడ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రెండో ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛా వాణిజ్యం సక్రమంగా జరగాలంటే పన్ను ఎగవేతలు, పన్నులను తప్పించుకునే ధోరణులకు చెక్ చెప్పాల్సిందేనన్నారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవడంతో పాటు ఆర్థిక పరమైన అవకతవకను ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక కస్టమ్స్ విభాగాల అధిపతులు కూడా హజరయ్యారు. -
భూటాన్తో రక్షణ బంధం!
థింపూ: భూటాన్, భారత్ దేశాల రక్షణ.. పరస్పరం సంక్లిష్టంగా పెనవేసుకుని ఉన్న అంశమని, ఈ రెండు దేశాల రక్షణను వేరువేరుగా చూడడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసిం ది. అందువల్ల పరస్పర అందోళనలపై ఇరుదేశాలు సానుకూలంగా స్పందించడం చాలా ముఖ్యమని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అలాగే, తన పర్యటనకు.. భూటా న్, చైనా దేశాల మధ్య జరుగుతున్న సరి హద్దు చర్చలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మూడో దేశ ప్రభావం లేని స్థాయిలో భారత్, భూటాన్ సంబంధాలున్నాయని పేర్కొన్నారు. నూతన శిఖరాలకు చేరగల శక్తి, సామర్ధ్యాలు ఇరుదేశాలకు ఉన్నాయన్నారు. భూటాన్ పర్యటన సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్, ప్రధాని షెరింగ్ టాబ్గేలతో వేర్వేరుగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. 2003 లో భూటాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదులను తరిమేయడంలో ఆ దేశం చూపిన చొరవను ఈ సందర్భంగా ప్రణబ్ గుర్తుచేశారు. భూటాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే పొరుగుదేశం కాదని ప్రశంసించారు. అలాగే, ఇం డో, భూటాన్ సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న భూటాన్ పౌరులకిడ్నాప్ ఘటనలను తీవ్రంగా తీసుకున్నామని ప్రణబ్ తెలిపారు. రాష్ట్రపతికి ఘనస్వాగతం రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భూటాన్ చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్ను కూడా కాదని.. స్వయంగా విమానాశ్రయానికి భార్యతో సహా వెళ్లి మరీ.. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్ భారత రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గన పారో విమానాశ్రయానికి 50కిమీల దూరంలో ఉన్న భూటాన్ రాజధాని థింపూకి రాష్ట్రపతి వెళ్లారు. దారి పొడవునా రోడ్డుకిరువైపులా భారత్, భూటాన్ జాతీయ జెండాలు చేతబూనిన విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. థింపూలో సైనిక వందనం స్వీకరించిన అనంతరం.. ప్రణబ్ముఖర్జీ, వాంగ్చుక్లు చర్చలు జరిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య విద్యారంగం సహా పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదరనున్నాయి. 26 ఏళ్ల తరువాత ఒక భారత రాష్ట్రపతి భూటాన్ పర్యటిస్తుండటం ఇదే ప్రథమం. -
దౌత్యానికి మోడీ కొత్త భాష్యం
మన ప్రధాని భారత్కు తిరిగివచ్చిన వెంటనే భూటాన్ విదేశీ వ్యవహారాల శాఖ చైనా దిమ్మతిరిగే ప్రకటన చేసింది. భూటాన్లో ఎప్పటికీ చైనా దౌత్య కార్యాలయాన్ని అనుమతించబోమన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. మన జనాభా 125 కోట్లు. మనలో 5వ వంతు కూడా లేని పాకిస్థాన్కు మనల్ని అస్థిరపరచే సాహసం ఎలా వచ్చింది? 30 ఏళ్ల క్రితం సమస్యలతో కునారిల్లిన చైనా సూపర్ పవర్ ఎలా కాగలిగింది? చైనా ముద్దుగా పిలుచుకునే ‘ముత్యాల హారం’ (పాకిస్థాన్, నేపాల్, బంగ్లా, శ్రీలంక) దేశాలను వేలకోట్ల పెట్టుబడు లతో ముంచెత్తిస్తోంది. ఇవన్నీ కాంగ్రెస్/యూపీఏ పాలన దుష్ఫలితాలే. ఇలా చతికిలపడిన భారత్ దౌత్య వ్యవహారాలను గాడిన పెట్టే బృహత్ కార్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ భుజాలకెత్తుకున్నారు. బెదిరింపులకు లొంగని ప్రధాని దేశ ప్రయోజనాల కోసం బెదిరింపులకు, హూంకరింపులకు తలొ గ్గేదిలేదని ప్రమాణస్వీకారం రోజే మోడీ రుజువు చేశారు. సార్క్ దేశాల ప్రతినిధుల సమక్షంలో తాను బాధ్యతలు స్వీకరించాలని అనుకున్నదే తడవుగా ఆయన పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను పిలవ టానికి వీలులేదని ఎప్పటిలాగే తమిళ పార్టీలు హెచ్చరించాయి. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ లాగే మోడీ బెదిరి, ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆ పార్టీలు భావించి ఉండవచ్చు. కిందటి నవంబర్లో కొలంబోలో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్(చోగమ్) సదస్సు జరిగింది. దీనికి మన్మోహన్ హాజరు కావలసి ఉంది. కానీ యూపీఏ భాగస్వామి డీఎంకే, ఇతర పార్టీలు ప్రతిఘటించాయి. ఎల్టీటీఈపై జరిగిన యుద్ధంలో వేలాది మంది తమిళులను ఊచకోత కోసిన శ్రీలంకకు భారత ప్రధాని ఎలా వెళతారన్నది వారి ప్రశ్న. ఆ బెదిరింపులకు మన్మోహన్ తలొగ్గి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ను పంపించి తన ప్రభుత్వం కూలిపో కుండా కాపాడుకున్నారు. ఇలాంటి బెదిరింపులే వచ్చినా మోడీ ఏంచేశారో తెలుసు. మహీంద రాజపక్స వచ్చి వెళ్లారు. తమిళ పార్టీల బెదిరింపులకు లొంగి యూపీఏ శ్రీలంకతో దౌత్య సంబంధాలను గాలికి ఒదిలేయటం చైనాకు అనుకూలించింది. ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఖర్చుతో హంబన్ తోట ఓడరేవును మెగాపోర్టుగా నిర్మించే బాధ్యతను చైనా తీసుకుంది. 900 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, కొలంబో - కతునాయకే ఎక్స్ప్రెస్వే, 322 కిలోమీటర్ల క్యాండీ - జాఫ్నా ఎ-9 జాతీయ రహదారి, ఇంకా పదుల సంఖ్యలో భారీ ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం కూడా మన పారిశ్రామికవేత్తలను పంపించి గృహనిర్మాణం, రహదారులు, థర్మల్ విద్యుత్ వంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చు కున్నా చైనాతో పోలిస్తే ఇవి 10 శాతం కూడా లేవు. మోడీ హయాంలో ఈ లోటు తీరడమే కాక చైనా ప్రాబల్యం తగ్గించేందుకు శ్రీలంక యోచిస్తుందని భావించవచ్చు. తీస్తా నదీ జలాల వివాదం, భారత్లోకి అక్రమ చొరబాట్ల గురించి బంగ్లాదేశ్తో విభేదాలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి యూపీఏ ప్రయత్నించలేదు. దీనిని అవకాశంగా తీసుకొని చైనా బంగ్లాకు సహాయాన్ని అందిస్తూ వస్తోంది. సేతీ నదిపై 750 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రానికి చైనా 1.6 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడుతోంది. బంగ్లాపై చైనాకు ఇంత ప్రేమ ఎందుకు? అక్కడ ఉన్న 60 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజవాయువు నిక్షేపాలు ఒక కారణం. గ్యాస్ని వెలికితీసే పరిజ్ఞానం బంగ్లాకు లేకపోవ టంతో ఆ అవకాశాన్ని వాడుకొని తమ దేశానికి తరలించుకుపోవాలని చైనా ఆలోచన. బంగ్లాను తమవైపు తిప్పుకోగలిగితే పాకిస్థాన్లాగే ఈ దేశాన్ని కూడా భారత్కు పక్కలో బల్లెంలా మార్చవచ్చన్నది చైనా దురాలోచన. బ్రిక్స్ సదస్సులో అరుదైన గౌరవం ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోడీ వ్యక్తిత్వాన్ని సభ్య దేశాలు గుర్తించాయి. ప్రపంచ బ్యాంకు తరహాలో ఏర్పాటు చేయబోయే కొత్త ఆర్థిక వ్యవస్థకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని మోడీ సూచించిన పేరును ఖరారు చేశాయి. ఈ బ్యాంకు కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ఆయన పట్టుపట్టారు. కానీ ఇందులో చైనా వాటాధనం ఎక్కువగా ఉండటంతో చివరకు షాంఘై పేరు ఖరారైంది. అయితే కొత్త బ్యాంకుకు ఆరేళ్లపాటు అధ్యక్షత వహించే అవకాశం భారత్ దక్కించుకుంది. మోడీ భూటాన్ యాత్ర ఘనవిజయమే. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్కు - భారత్కు మధ్యన ఉన్న ఈ హిమాలయ దేశం మొదటినుంచి భారత్తోనే సంబంధాలు కొనసాగిస్తోంది. గతంలో మన నేతలు సందర్శిం చిన సందర్భాల్లో మొక్కుబడి ఒప్పందాలు, ఆర్థిక సహాయం ప్రకటనలు ఉండేవి. మోడీ పర్యటన దూరంగా ఉన్న బంధువులను కలుసుకునేందుకు ఒక కుటుంబ ముఖ్యుడు వెళ్లినట్లుగా ఉందే తప్ప దౌత్య పర్యటన లాగా అనిపించలేదు. ప్రపంచపటంలో రేఖా మాత్రంగా ఉన్నప్పటికీ భూటాన్కు భారత్లోని అతిపెద్ద సమస్యను పరిష్కరించే శక్తి ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం భూటాన్లోని వందలాది నదులపై జలవిద్యుత్ కేంద్రాలు నిర్మిస్తే 30,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో 10,000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రాలను 2020 వరకు నిర్మించటానికి భారత్తో ఒప్పందాలు జరిగాయి. నిధుల విడుదల సవ్యంగా జరగకపోవటంతో ఈ ప్రాజెక్టులు గడువులోగా పూర్తికావటం అనుమానమే. వాస్తవానికి భారత్ ఎప్పుడో మేల్కొని ఈ జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణం లేదా సహాయం అందించి ఉంటే ఈపాటికే కనీసం 20,000 మెగావాట్లు అందుబాటులోకి వచ్చేవి. థింపూలో భారత్ సహాయంతో నిర్మించిన సుప్రీం కోర్టు భవనాన్ని నరేంద్రమోడీ ప్రారంభించారు. 600 మెగావాట్ల కొలోంగ్చు జలవిద్యుత్ కేంద్రాన్ని ఉమ్మడిగా చేపట్టటానికి ఒప్పందం కుదిరింది. మన ప్రధాని భారత్కు తిరిగివచ్చిన వెంటనే భూటాన్ విదేశీ వ్యవహారాల శాఖ చైనా దిమ్మతిరిగే ప్రకటన చేసింది. భూటాన్లో ఎప్పటికీ చైనా దౌత్య కార్యాలయాన్ని అనుమతించబోమన్నది ఆ ప్రకటన సారాంశం. నేపాల్లో పెరిగిన ప్రతిష్ట ప్రధాని మోడీ పర్యటనతో నేపాల్లో భారత ప్రతిష్ట ఎవరెస్టును తలపిం చింది. 17ఏళ్ల తరువాత నేపాల్ని సందర్శించిన భారత ప్రధానిగా మోడీ ఒక రికార్డు నెలకొల్పారు. నేపాల్ మావోయిస్టు పార్టీ బలం పుంజుకున్నప్పటి నుండి భారత్ను ఒక శత్రుదేశంగా ప్రచారం చేస్తూ వచ్చింది. దీనితో భారత్తో అవిభాజ్య కుటుంబంలా ఉండే నేపాల్ వ్యవహారాలలో చైనా వేలు పెట్టటానికి అవకాశం ఏర్పడింది. మోడీ లాంటి ప్రధాని రాకపోయి ఉంటే నేపాల్ పాకిస్థాన్లా చైనా అదుపులోకి వెళ్లేదేమో! నేపాల్లోని ఆరువేల నదులు, ఉపనదులపై విద్యుత్ కేంద్రాలను నిర్మించగలిగితే కొన్నివేల మెగా వాట్ల కరెంటు తయారవుతుంది. అందులో 25శాతం మించి ఆ దేశానికి అవ సరం లేకపోవడంతో మిగిలిన దాన్ని భారత్ కొనుగోలు చేస్తుందని మోడీ స్పష్టం చేశారు. భారత్ కొనుగోలు చేసే విద్యుత్తుకు చెల్లించే నిధులతో నేపాల్ సంపన్న దేశంగా మారుతుందని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగం, తక్కువ ధరతో నిర్మించే గృహాలు, ఆరోగ్యం, విద్యా రంగాల్లో పెద్ద ఎత్తున సహకరిస్తామని హామీ ఇచ్చారు. నేపాల్ ప్రజలకు ఆయన ఒక బృహ త్తరమైన కానుకను కూడా తీసుకెళ్లారు. 16 ఏళ్ల క్రితం దారితప్పి అహ్మదా బాద్ చేరుకున్న జీత్ బహదూర్ అనే పదేళ్ల బాలుడి పెంపకం బాధ్యతను తనే తీసుకొని ఈ పర్యటనలో అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ దృశ్యం నేపాలీలను కంటతడి పెట్టించింది. నేపాల్ ప్రభుత్వానికి అనిష్టంగా మారిన 1950 ఒప్పందానికి మార్పులు చేస్తామని మోడీ ఇచ్చిన హామీ సుశీల్ కొయిరాల ప్రభుత్వానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మోడీ పర్యటించిన ఆగస్టు 3, 4 తేదీలను నేపాల్ సెలవు దినా లుగా ప్రకటించింది. రెండు నెలల్లోనే దౌత్య సంబంధాల్లో మోడీ సాధించిన ఈ అద్భుతాలు వచ్చే ఐదేళ్లలో భారత్ను అగ్రదేశాల సరసన నిలబెడతాయని ఆశించవచ్చు. (వ్యాసకర్త ఎంఎల్ఏ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు) -
విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్కు జైలు శిక్ష
థింపు: భూటాన్లో ఓ విద్యార్థిని చితకబాదినందుకు ప్రిన్సిపాల్కు మూడు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతో పాటు 11,250 రూపాయిల జరిమానా కూడా విధించింది. మోంగర్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. విద్యార్థిని ఏడాది పాటు పాఠశాల నుంచి సస్సెండ్ చేసినందుకుగాను ప్రిన్సిపాల్ అతనికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విద్యార్థి పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని, జూనియర్ విద్యార్థి పట్ల కఠినంగా వ్యవహరించాడని ప్రిన్సిపాల్ కోర్టుకు తెలిపాడు. అయితే ప్రిన్సిపాల్ విద్యార్థిని కేబుల్ వైర్తో విచక్షణరహితంగా కొట్టడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. విద్యార్థి పట్ల క్రూరంగా వ్యవహరించడం జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని కోర్టు పేర్కొంది. -
భారత్ అభివృద్ధి చెందితే భూటన్ కు మేలు: మోడీ
భూటాన్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో భాగంగా ఆదేశ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భూటాన్ తమకు సన్నిహిత దేశమని, ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సామాన్యలు హక్కుల కోసం భూటాన్ రాజ కుటుంబం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలు కోరుకుంటుందని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్లోనూ కొనసాగుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, భూటాన్ మధ్య సాంస్కృతిక బంధాలు ఉన్నాయన్నారు. రాబోయే దశకంలో ఇంధన భద్రత కీలకమైందన్నారు. భారత్లో ప్రభుత్వాలు మారినా భూటాన్లో సత్సంబంధాలు కొనసాగాయని మోడీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందితే భూటాన్కు మేలు జరుగుతుందన్నారు. బలమైన, స్థిరమైన ప్రభుత్వాలు ఉంటేనే పొరుగు దేశాలకు సాయం చేయగలమని మోడీ వ్యాఖ్యానించారు. తొలి పర్యటనలోనే భూటాన్కు రావటం ఆనందంగా ఉందన్నారు. కాగా భూటాన్ సుప్రీం కోర్టు భవనాన్ని నిన్న మోడీ ప్రారంభించారు. -
భూటాన్తో బంధం బలోపేతం
తొలి విదేశీ పర్యటనలో ప్రధాని మోడీ భూటాన్ రాజు, ప్రధానులతో చర్చలు భూటాన్ సుప్రీం కోర్టు భవనాన్ని ప్రారంభించిన మోడీ థింపు: ప్రధాని హోదాలో తొలి విదేశీ పర్యటనకు భూటాన్ను ఎంచుకున్న నరేంద్ర మోడీ ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ప్రతిన బూనారు. ఇరు దేశాల సంబంధాలను ‘బీ4బీ’(భూటాన్ కోసం భారత్, భారత్ కోసం భూటాన్)గా ఆయన అభివర్ణించారు. మోడీ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం భూటాన్ రాజధాని థింపు చేరుకున్నారు. ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో శాంతి భద్రతలు, పర్యాటకం తదితర అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధికి విస్తృత సహకారం, ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్యలపై ప్రధానంగా చర్చించారు. తర్వాత తోబ్గే.. మోడీకి విందు ఇచ్చారు. తమ దేశంలో ప్రభుత్వం మారినప్పటికీ భూటాన్ సంతోష, సౌభాగ్యాలకు భారత్ కట్టుబడి ఉందని, ఇరు దేశాల మధ్య సంప్రదాయ అనుబంధాలు ఉన్నాయని మోడీ విందులో అన్నారు. సంతోషానికి పొరుగున ఎలాంటి దేశముందన్నది కీలకమని, కొన్నిసార్లు సుఖసంపదలున్నా శాంతి దొరకని పరిస్థితి ఎదురయ్యే పొరుగు దేశం దొరుకుతుంటుందన్నారు. అంతకు ముందు.. అభివృద్ధికి చేయూతలో భాగంగా భారత్ రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మించిన భూటాన్ సుప్రీం కోర్టు భవన సముదాయాన్ని మోడీ ప్రారంభించారు. భారత్లో చదువుకుంటున్న భూటాన్ విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాలను రెట్టింపు చేస్తున్నట్లు(రూ.2 కోట్లకు పెంపు) ప్రకటించారు. భూటాన్ యువతకు 20 లక్షల పుస్తకాలు, పత్రికలను అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూటాన్తో దౌత్యసంబంధాలు నెలకొల్పుకోవడానికి, ఆ దేశాన్ని బుజ్జగించడానికి చైనా యత్నిస్తున్న నేపథ్యంలో మోడీ తొలి విదేశీ పర్యటనకు ఆ దేశాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘన స్వాగతం: భారత విదేశాంగ విధానంలో భూటాన్కు ప్రత్యేక గుర్తింపునిస్తూ పర్యటనకు విచ్చేసిన మోడీకి థింపులో ఘన స్వాగతం లభించింది. మోడీకి, ఆయన వెంట వచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్లకు పారో విమానాశ్రయంలో భూటాన్ ప్రధాని తోబ్గే, ఆయన కే బినెట్ మంత్రులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. మోడీ సోమవారం భూటాన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసగింస్తారు. భూటాన్ వెళ్లిన వంట మనిషి: ఇంటి భోజనాన్ని ఇష్టపడే మోడీకి భూటాన్లో గుజరాతీ వంటలు వండిపెట్టేం దుకు ఢిల్లీలోని గుజరాత్ భవన్ వంటమనిషి థింపు వెళ్లాడు. వారం నుంచి అతడు థింపులోనే ఉన్నాడు. -
భూటాన్ లో మోడీకి రెడ్ కార్పెట్
-
భూటాన్ లో మోడీకి రెడ్ కార్పెట్
భూటాన్: రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటన్ చేరుకున్నారు. భూటాన్ లోని పారో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. భూటన్ భద్రతాదళాలు ఇచ్చిన గౌరవ వందనాన్ని ప్రధాని మోడీ స్వీకరించారు. ప్రధానిగా మోడీకి ఇదే తొలి విదేశీ పర్యటన. స్థానిక కాలమానం ప్రకారం మోడీ 11.40 నిమిషాలకు థింపూ కు చేరుకున్నారు. నరేంద్ర మోడీతో పాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ లు పర్యటిస్తున్నారు. -
విహారం: ఆ‘హా’... ఏమి అందమిది !
మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఒత్తిడి లేని ఆధునిక జీవన శైలి పొందలేరు. ఎందుకంటే ఆ రెండూ ఒకదాంట్లో ఒకటి విడదీయలేనంతగా కలిసిపోయాయి. మనం చేయగలిగినదంతా దాన్నుంచి కాస్త విరామం తీసుకోవడమే. మరి అలాంటి విరామం కాస్త సుదీర్ఘంగా తీసుకోవాలంటే పదండి భూటాన్ పోదాం. మన పక్క దేశం. కానీ తనివితీరని ప్రదేశాలకు కొదవ లేదు. అందునా ‘హా వ్యాలీ’కి వెళ్లామంటే... అక్కడ్నుంచి తిరిగి రావడానికి మనసు ససేమిరా ఒప్పుకోదు. ఓ వారం రోజుల పాటు ఇలాంటి చోట గడిపి వస్తే.. ఆహా అద్భుతం అనిపించదూ! అందుకే వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి.. భూటాన్లోని ‘హా’ లోయకు బయల్దేరండి! సముద్ర మట్టానికి దాదాపు 4 వేల మీటర్ల ఎత్తులో ఓ ప్రాంతం.. అక్కడో పెద్ద లోయ... ఆ లోయ కింది భాగంలో గ్రామం.. కొండలపై ఏటవాలుగా ఇళ్లు.. కంటికి కనిపించేంత దూరంలో హిమాలయాల అందాలు.. శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయాలు... ప్రశాంతతకు నిలయమైన ఆశ్రమాలు.. రకరకాల జంతువులు, ఎన్నో రకాల పళ్లతోటలు.. ఎప్పుడూ చల్లగా ఉండే వాతావరణం. వాహనాల రొద లేదు.. జనాల హడావుడి లేదు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలాంటి ప్రశాంతమైన సందర్శనీయ పర్యాటక స్థలం... మనకు అందుబాటులోనే ఉంది. ఆహా అనిపించేలా ఉండే ఆ సుందర ప్రదేశమే హా వ్యాలీ! హా లోయ... భూటాన్లోని హా జిల్లాలో ఉంది. భూటాన్ రాజధాని థింఫు నుంచి 130 కిలోమీటర్ల దూరంలో హా జిల్లా ఉంది. హా లోయకు పొరుగున పారో, చుఖా, సంత్సె జిల్లాలుంటాయి. భూటాన్లోని ఏకైక విమానాశ్రయం పారోలో ఉంది. అక్కడి నుంచి హా లోయకు 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. హా లోయ 1700 చదరపు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే దేవుడు 1700 చదరపు కిలోమీటర్ల భూ కాన్వాస్పై గీసిన చక్కటి ప్రకృతి చిత్రమిది. ఒకప్పుడు ఇక్కడ అనిమిస్ట్ సంప్రదాయం ఉండేది. భారత్కు చెందిన గురు పద్మసంభవ ఇక్కడ బౌద్ధమత వ్యాప్తి చేశాడు. ఆయన్ని ఇక్కడి వారు దేవుడిలా కొలుస్తారు. కమర్షియలిజం తక్కువ హా లోయ ఒక ప్రశాంతమైన బౌద్ధ వనంలా ఉంటుంది. ఇక్కడ పర్యాటకం ఇంకా పొల్యూట్ అవలేదు. ఇంతకుముందు అంటే 2002కు ముందు ఇక్కడ పర్యాటకం పరిమితం. ఇతర దేశాల పర్యాటకుల్ని అనుమతించేవారు కాదు. ఇక్కడ అద్భుతమైన అందాలున్నా ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టిపెట్టలేదు. ఐతే ఇంటర్నెట్ విస్తరించాక హా లోయ అందాల గురించి ప్రపంచానికి తెలిసింది. నెమ్మదిగా ఈ లోయకు ప్రచారం పెరగడంతో 2002 నుంచి విదేశీ పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. హా జిల్లాలో దాదాపు 80 శాతం అడవులే ఉంటాయి. ఎటు చూసినా కనువిందైన ప్రకృతి అందాలు పారవశ్యంలో ముంచెత్తుతాయి. పారో విమానాశ్రయం నుంచి హా లోయకు ప్రయాణించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఆ ప్రయాణమే ఒక టూర్. అతిశయోక్తి అనిపించొచ్చు గాని... స్వర్గానికి దారి ఇలానే ఉంటుందేమో అనిపించేలా ప్రకృతి దానిని తీర్చిదిద్దింది. ఆ దారిలో కొండలు, మలుపుల్ని దాటుకుంటూ చల్లని వాతావరణంలో ప్రయాణించడం హాయిగా ఉంటుంది. దారిలో అక్కడక్కడా ఆశ్రమాలుంటాయి. టా జాంగ్ ప్రాంతంలో మూడు శతాబ్దాల నాటి భూటాన్ జాతీయ మ్యూజియం ఉంది. భూటాన్ దేశానికి చెందిన ఆయుధాలతో పాటు చరిత్రకు సంబంధించిన అనేక విశేషాలు ఇక్కడ చూడొచ్చు. చొమోల్హరి, జికు డ్రేక్ పర్వతాలతో పాటు కొన్ని సరస్సులు కూడా దాటుకుని హా లోయకు చేరుకోవచ్చు. హా లోయ... కొన్ని అతిచిన్న గ్రామాల సమూహం. అక్కడ గ్రామ కుటీరాల్లో విడిది పొందే అవకాశం ఉంది. హోటళ్లలో కూడా విడిది చేయవచ్చు. అవి కూడా గ్రామీణుల ఇళ్ల నిర్మాణాలను పోలి ఉంటాయి. హా లోయలో ఉండటం ఒకరకమైన అనుభూతి అయితే... లోయ చుట్టూ ఉండే ఉండే కొండల పైకి చేరుకుని లోయను చూడటం మరో అద్భుతమైన అనుభూతి. ఆ అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని ఆస్వాదించడానికి రెండు కళ్లు చాలవు. ప్రజల జీవన శైలి హా వ్యాలీ... ‘హా జిల్లాలో’ ఉంది. జిల్లా మొత్తం జనాభా ఎంతనుకున్నారు? కేవలం 12 వేలు. లోయకు ఆనుకుని ఉండే కొండలపై నుంచి ఏటవాలుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటారు ఇక్కడి ప్రజలు. ఆ ఇళ్లలో విడిది చేయడం కూడా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. హా లోయ నుంచి హిమాలయాల సమీపంలోకి వెళ్లేందుకు కూడా టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హా జిల్లాలో ఎక్కువగా గోధుమలు పండిస్తారు. అక్కడక్కడా తక్కువ విస్తీర్ణంలో వరి కూడా పండుతుంది. కానీ పళ్లు వంటి వాణిజ్య పంటలపైనే స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వరి వేసే విస్తీర్ణం తగ్గింది. ప్రజలు ఎక్కువ అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తారు. వారి ప్రధాన ఆదాయ వనరు అటవీ ఉత్పత్తులే. గుర్రాలు, పందులు, కోళ్లతో పాటు జడల బర్రె (యాక్)లను పెంచుతారు. ఇవి మంచు-చలి ప్రదేశాల్లో ఉంటాయి. దేవాలయాలు... ఆశ్రమాలు హా లోయ ఆలయాలకు, ఆశ్రమాలకు ప్రసిద్ధి. ఇక్కడ 7వ శతాబ్దంలో నిర్మించిన వైట్, బ్లాక్ టెంపుల్స్ చాలా ప్రసిద్ధమైనవి. మూడు పర్వతాల మధ్య ఎత్తయిన ప్రదేశంలో వీటి నిర్మాణం జరిగింది. అద్భుతమైన అందాల మధ్య విశాలంగా నిర్మించిన ఈ ఆలయాలను సందర్శించుకోవడం వర్ణనాతీతమైన ప్రశాంతతను, అనుభూతిని ఇస్తుంది. హా గోప్నా అనే మరో ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధమైంది. డ్రక్యెల్ అనే పెద్ద ఆశ్రమం కూడా హా లోయలో చెప్పుకోదగ్గది. ఇక్కడ వందల సంఖ్యలో బౌద్ధ సన్యాసులు ఉంటారు. ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. దీనికి దాదాపు నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఎలా వెళ్లాలి? కలకత్తా నుంచి, అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నుంచి భూటాన్కు టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫ్లైట్లో వెళ్లాలి అనుకుంటే మూడు రోజుల ట్రిప్ అయినా సరిపోతుంది. లేకపోతే ఏడురోజుల ట్రిప్ అవసరం. అపుడు చిన్న దేశమైన భూటాన్ మొత్తం తిరగొచ్చు. నేరుగా పారో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి టూర్ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకైనా... మంచి పేరున్న సంస్థల ప్యాకేజీల ద్వారా వెళ్లడం మంచిది. -
పర్యావరణహిత పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణహితమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి భూటాన్లో మంచి అవకాశాలున్నాయని ఆ దేశ ప్రధానమంత్రి లియోంఖెన్ షెరింగ్ టొబ్గే అన్నారు. తమ దేశంలో మెరుగైన పని వాతావరణం, నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవడం ద్వారా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ భారత పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ‘పెట్టుబడుల కేంద్రంగా భూటాన్’ అనే అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐటీ, మౌలిక సదుపాయాల కల్పన, సాంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం, విద్యా రంగాలను పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యరంగాలుగా గుర్తించామని చెప్పారు. భారత్, భూటాన్ పరస్పరం కలిసి పనిచేయడానికి, కార్యాలయాలు నెలకొల్పడానికి అవకాశముందన్నారు. తమ దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయని చెప్పారు. భూటాన్ ప్రధాని ఆహ్వానంపై సీఐఐ సానుకూలంగా స్పందించింది. ఆరు నెలల్లో సీఐఐ ప్రతినిధి బృందం భూటాన్లో పర్యటిస్తుందని సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తెలిపారు. మనవరాలిని కలిసేందుకు: భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టొబ్గే, ఆయన సతీమణి హమ్తోషి డొమాలు మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్ శివారులో ఉన్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించారు. వీరి మనవరాలు గలేక్ 10+2 చదువుతోంది. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ‘స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం’లో భాగంగా ఏటా నాలుగు నెలలపాటు చదువుతోపాటు ఇతరత్రా శిక్షణ పొందేందుకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో 15 రోజులక్రితం 40 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చారు. వీరిలో భూటాన్ ప్రధాని షెరింగ్ టొబ్గే మనవరాలు గలేక్ కూడా ఉంది. కాగా మంగళవారం హైదరాబాద్ను సందర్శించిన టొబ్గే దంపతులు తమ మనవరాలిని చూసేందుకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కు వెళ్లారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం ఐదున్నర గంటలకు పాఠశాలకు చేరిన ఈ దంపతులకు స్కూల్ ప్రిన్సిపాల్ ఓంకార్ జోషి ఘనస్వాగతం పలికారు. అనంతరం టొబ్గే దంపతులు తమ మనవరాలు గలేక్తోపాటు ఇతర విద్యార్థులతో ముచ్చటించారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి చదువులపై ఆరాతీశారు. అనంతరం రాత్రి 7.20కి తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.