godavari khani
-
ఎంత పని చేశావు తల్లీ !
కోల్సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహాశివరాత్రి పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన తన ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరు మృతి చెందారు. పిల్లలిద్దరూ తనతో ప్రేమగా, చనువుగా ఉండటం తట్టుకోలేక తన భార్య వారిపై దాడి చేసిందని తండ్రి ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేనరికం.. ఉన్నత విద్యావంతులు.. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్, రమాదేవి దంపతులు. ఇందులో రమాదేవి తండ్రి.. శ్రీకాంత్ తల్లి అన్నాచెల్లెళ్లు కావడంతో మేనరికం కుదరగా 2003 నవంబర్ 4న ఇరువురికి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అజయ్(10), ఆర్యన్(6) ఉన్నారు. శ్రీకాంత్ స్థానికంగానే ప్రభుత్వ మైనార్టీ గురుకులంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, రమాదేవి కొంతకాలం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసి ప్రసుతం ఇంటి వద్దే ఉంటోంది. వీరి పిల్లలు అజయ్ 4వ తరగతి, ఆర్యన్ ఎల్కేజీ చదువుతున్నారు. దంపతుల మధ్య గొడవలు.. కొంతకాలంగా శ్రీకాంత్, రమాదేవిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు తండ్రి శ్రీకాంత్తో చనువుగా ఉంటున్నారని తరచూ చెప్పుకునే రమాదేవి.. కొడుకులను అదే కారణంతో కొట్టేదని చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనార్టీ గురుకులంలో పని చేస్తున్న శ్రీకాంత్ ఆదివారం రాత్రి విద్యార్థులకు పాఠాలు బోధించి అక్కడే పడుకున్నాడు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న తన తండ్రి ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భార్య రమాదేవికి ఫోన్ చేశాడు. శివరాత్రి పూజ కోసం పండ్లు, సామాగ్రి తీసుకురావాలా అని అడిగి ఆమె సూచన మేరకు పూజా సామాగ్రితోపాటు పిల్లలకు తినడానికి అల్పాహారం కూడా తీసుకొని ఇంటికొచ్చాడు. గట్టిగా కొట్టడంతో.. శ్రీకాంత్ ఇంటికి రాకముందే రమాదేవి ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణా రహితంగా దాడి చేయగా తలలు పగిలిపోవడంతో కొడుకులిద్దరూ కుప్పకూలారు. ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ పిల్లలను పిలిస్తే సమాధానం రాకపోగా, గేటుకు లోపలివైపు గడియపెట్టి తాళం వేసి ఉండడంతో అనుమానిం చాడు. స్థానికులను పిలిచి గోడ దూకి ఇంటి ఆవరణలోకి శ్రీకాంత్ వెళ్లే సరికి పిల్లలిద్దరూ తలలు పగిలి రక్తపు మడుగులో మూలుగు తూ కనిపించారు. పక్కనే రక్తంతో తడిసి పగిలిన ఇటుక కనిపించింది. భార్య చేతికి రక్తం మరకలు ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను గోదావరిఖలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి తీవ్రంగా గాయపడిన పెద్ద కుమారుడు అజయ్ చికిత్స పొందుతూ గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. చిన్న కుమారుడు ఆర్యన్కు కూడా తలకు బలమైన గాయాలు కావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్టౌన్ సీఐ పర్శ రమేశ్ పరిశీలించారు. మృతుల తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
‘గుండె’ను పిండేసిన స్ఫూర్తి
సాక్షి, గోదావరిఖని : ప్రాణాపాయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడో ఆర్టీసీ డ్రైవర్. ఒకవైపు గుండెపోటు బాధిస్తున్నా.. 52 మంది ప్రయాణికులు క్షేమండా ఉండాలనే ఏకైక తలంపుతో క్షేమంగా బస్సును రోడ్డు పక్కకు దించాడు. ఆ తర్వాతే తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ స్టీరింగ్పైనే కుప్పకూలిపోయాడు. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు బుధవారం ఉదయం 5.15 గంటలకు వయా యైటింక్లయిన్కాలనీ మీదుగా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. బస్సులో 52 మంది ప్రయాణికులున్నారు. 6.35 గంటల సమయంలో రాఘవాపూర్ సమీపంలో డ్రైవర్ మహేందర్ (45) ఛాతీలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ సమయంలో బస్సు వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఓ వైపు నొప్పి బాధిస్తున్నా బస్సును నియంత్రించి రోడ్డు పక్కన ఆపి.. స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు 108కు ఫోన్ చేసినా.. అది ఆలస్యమయ్యేట్లు కనిపించింది. డ్రైవర్ విషమ పరిస్థితి గమనించిన బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఓసీపీ–3లో పనిచేస్తున్న ఎంవీ డ్రైవర్ వెంకటరమణ, ఈపీ ఆపరేటర్ ఆకుల రాజయ్యలు.. మహేందర్కు ప్రథమ చికిత్స అందించారు. ఓసీపీ–1లో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న తిరుపతి బస్సును నడుపుకుంటూ 10 నిమిషాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మహేందర్ను పరీక్షించిన వైద్యులు.. గుండెపోటుగా నిర్ధారించి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందడంతో.. డ్రైవర్ మహేందర్కు ప్రాణాపాయం తప్పింది. తన ప్రాణాన్ని లెక్కచేయక మహేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి 52 ప్రాణాలు కాపాడారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి కరీంనగర్ తీసుకెళ్లేందుకు అంబులెన్స్లో డీజిల్ లేకపోవడంతో.. కండక్టర్ డబ్బులిచ్చి డీజిల్ పోయించడంతో బండి ముందుకు కదిలింది. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని డ్రైవర్ ప్రాణాలు కాపాడేందుకు బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు పరితపించారు. -
యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
కోల్సిటీ(రామగుండం): యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని అంబేడ్కర్నగర్కు చెందిన నేహ(15) నానమ్మ జులేఖాబేగం వద్ద ఉంటోంది. శనివారం ఆమె నానమ్మ తో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాబాయ్ రజాక్ ఇంటికి వెళ్లింది. సాయంత్రం బాబాయ్, నానమ్మ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో నేహ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ‘నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలేదు’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ కొంతకాలంగా ప్రేమ పేరుతో నేహను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి బాబాయ్, నానమ్మ తెలిపారు. నిం దితుడిని అరెస్ట్ చేయాలని మృతు రాలి బంధువులు, ముస్లింలు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐలు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని వారికి నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నం పెట్టలేదని తల్లిని కడతేర్చాడు
యైటింక్లయిన్కాలనీ (రామగుండం): అన్నం పెట్టలేదనే కోపంతో తల్లినే కడతేర్చాడో కర్కోటకుడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముస్త్యాల గ్రామానికి చెందిన మేరుగు రమ (45) భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులతో కలసి ఉంటూ కూలీపని చేస్తోంది. పెద్ద కొడుకు ప్రశాంత్ చిన్నాచితక పనులు చేస్తూ ఉంటాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రశాంత్ తల్లిని అన్నం పెట్టమని అడిగాడు. ‘నువ్వేం పని లేకుండా తిరుగుతున్నావ్.. అసలు అన్నం వండనేలేదు’అని తల్లి రమ సమాధానం ఇచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రశాంత్ రమ తలపై రోకలిబండతో బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. -
లీకేజీలతో తాగునీటి కష్టాలు
గోదావరిఖనిటౌన్ : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12 డివిజన్లో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎండలు ముదరకముందే నీటి కష్టాలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని స్థానికి ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన తాగు నీటి పైపులు చాలా చోట్ల లీకేజీ కావడంతో నీరు లీకేజీ అవుతోంది. దీంతో ఇక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలందరికీ తాగునీరు అందించాలని కోరుతున్నారు. నీటి కలుషితం.. తాగు నీటి పైపులు లీకేజీ కావడంతో బురద, మట్టి, ఇతర కాలుష్య వస్తువులు కలవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల కొంతమంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడ్డామని స్థానికులు అంటున్నారు. లీకేజీలు అరికట్టి స్వచ్చమైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. సంవత్సరాలు గడిచినా పట్టించుకోవడం లేదు తాగు నీటి పైపులు లీకేజీ అవుతున్నాయని సంవత్సరాల నుంచి అధికారులకు, పాలకులకు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదు. నీటి కాలుష్యంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. – బొద్దుల నరేందర్ తాగునీటి కోసం రోజూ ఇబ్బందే.. తాగు నీటి కోసం ప్రతి రోజూ ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజు 5 కిలోమీటర్ల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నాం. నీరు తెచ్చుకోవడం దిన చర్యలో భాగమైంది. ఎండా కాలంలో మరింత ఇబ్బంది పడుతున్నాం. కాలుష్యం లేని నీరు అందించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. – రాజేశం, స్థానికుడు -
మాస్టర్స్ అథ్లెటిక్స్లో ‘ఖని’ క్రీడాకారుల ప్రతిభ
24 బంగారు, తొమ్మిది రజత పతకాలతో ఓవరాల్ చాంపియన్ గోదావరిఖని : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో గోదావరిఖనికి చెందిన పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 60 ఏళ్ల విభాగంలో టి.మనోహర్రావు లాంగ్ జంప్, హైజంప్, 100 మీటర్ల పరుగు పందెంలో మూడు బంగారు పతకాలు, 70 ఏళ్ల విభాగంలో దామెర శంకర్ షార్ట్పుట్, డిస్కస్త్రో, జావెలిన్ రో బంగారు పతకాలు, 50 ఏళ్ల విభాగంలో గూళ్ల రమేష్ 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెంలో మూడు బంగారు పతకాలు, చాట్ల సంజీవ్ ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్లో బంగారు పతకాలు, అంబాల ప్రభాకర్ జావెలిన్, డిస్కస్త్రో, హ్యామర్త్రోలో మూడు బంగారు పతకాలు, 55 ఏళ్ల విభాగంలో డీఎల్.సామ్యెల్ హైజంప్లో బంగారు పతకం, 50 ఏళ్ల విభాగంలో పర్శరాములు లాంగ్ జంప్లో బంగారు పతకం, 55 ఏళ్ల విభాగంలో తాండ్ర శంకర్ ట్రిపుల్ జంప్లో బంగారు పతకం, 40 ఏళ్ల విభాగంలో కాల్వ శ్రీనివాస్ షార్ట్పుట్లో బంగారు పతకం, డిస్కస్త్రోలో రజత పతకం, 35 సంవత్సరాల విభాగంలో విజయకుమార్ లాంగ్జంప్లో రజత పతకం, పోగుల రామకృష్ణ షార్ట్పుట్లో బంగారు పతకం, ఆట్ల రమేశ్ 800 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం, మహిళలకు సంబంధించి 55 ఏళ్ల విభాగంలో అనుముల కళావతి జావెలిన్ త్రో, షార్ట్పుట్, డిస్కస్త్రోలో మూడు బంగారు పతకాలు, 50 ఏళ్ల విభాగంలో జాగంటి శాంత షార్ట్పుట్, 5 కిలోమీటర్ల వాకింగ్, 200 మీటర్ల పరుగుపందెంలో మూడు బంగారు పతకాలు, మంజుల షార్ట్పుట్లో రజతం, 5 కిలోమీటర్ల పరుగుపందెంలో రజతం, 40 ఏళ్ల విభాగంలో ఉమారాణి వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్లో బంగారు పతకాలు సాధించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న మల్లేశ్ వంద మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం, లాంగ్జంప్లో రజత పతకం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 24 బంగారు పతకాలు, తొమ్మిది రజత పతకాలు సాధించి ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ గెలుచుకుందని మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఆరెపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
గోదావరి ఖనిలో కార్డన్సెర్చ్
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం ఇందిరానగర్లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 13 బైక్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 లీటర్ల కిరోసిన్, క్వింటా బొగ్గును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
కోల్సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఇంక్లయిన్ గనిలో ఎలక్ట్రిషియన్ హెల్పర్గా పని చేస్తున్న సమ్మయ్య (50) బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనుక స్లాబ్కు ఉరేసుకుని ఉండగా స్తానికులు గుర్తించారు. మతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమ్మయ్య కొంత కాలంగా మద్యానికి బానిస కాగా, కడుపునొప్పి, నడుమునొప్పి వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రాజీవ్ రహదారిపై లారీ బీభత్సం
కోల్సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖని సమీపంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఐరన్లోడ్తో చంద్రాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ గోదావరిఖని సమీపంలో చక్రం ఊడిపోవడంతో అదుపుతప్పింది. దీంతో డివైడర్ను ఢీకొని పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు లోకి దూసుకెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం, అయితే ఆ సయయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
టిప్పర్ ఢీ : వ్యక్తి మృతి
కరీంనగర్ : బొగ్గులోడ్తో వెళ్తున్న టిప్పర్ బైక్ను ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని 5వ బొగ్గుగని సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు..కమాన్పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బైరీ మల్లేష్(32) గోదావరిఖనిలోని జీఎమ్ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం బైక్పై గోదావరిఖని వస్తుండగా మూల మలుపు వద్ద టిప్పర్ ఢీ కొనడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (గోదావరిఖని) -
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
గోదావరిఖని(కరీంనగర్) : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, అందు లో 4,300 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందని, అయితే మిగిలిన దానికోసం యుద్ధ ప్రాతిపదికన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవస రం ఉందని సింగరేణి సంస్థ డెరైక్టర్లు వివేకానం ద (ఫైనాన్స్, (పా)), బి.రమేష్కుమార్ (ఆపరేషన్స్), ఎ.మనోహర్రావు (ప్రాజెక్టు, ప్లానింగ్) అన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లోటుగా ఏర్పడిన విద్యుత్ను అందించేందుకు జైపూర్లో 1200 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని, అయితే వీటి కోసం ఏటా 9 మిలియన్ టన్నుల బొగ్గును అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 2015-16లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60.30 మిలి యన్ టన్నులు నిర్ణయించిన నేపథ్యంలో భూగ ర్భ గనులు, ఓపెన్కాస్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడిని కలిసి సంస్థ, గని, ఓపెన్కాస్టులో ఉన్న స్థితిగతులను వివరించేందుకు మల్టీ డిపార్ట్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ త్వరలో నిర్దేశించిన ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం తన పెట్టుబడులను తానే సంపాదించుకుంటూ తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తిని తీసేందుకు ప్రణాళికలు రూపొందిం చిందన్నారు. భూగర్భ గనుల్లో ప్రతి కార్మికుడు తన ఎనిమిది గంటల సమయంలో కేవలం రెం డున్నర నుంచి మూడు గంటలు మాత్రమే పని చేస్తున్నారని, ఓపెన్కాస్టుల్లో యంత్రాలు రోజు లో 12 నుంచి 14 గంటలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ఇలా కాకుండా కార్మికులు, యంత్రాలను బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పని గంటలను పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతోపాటు ఎక్కువ బొగ్గు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి కార్మికుడికి తాము చేసే పని గురించి, సంస్థకు నిర్దేశించిన లక్ష్యాన్ని వివరిస్తూ కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా సహకారం అందించాలని కోరనున్న ట్లు తెలిపారు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీల్లో మైనింగ్, పర్సనల్, ఫైనాన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల నుంచి అధికారులు ఉంటార ని, వారు గనుల్లో, ప్రాజెక్టుల్లో బడ్జెట్ కు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు వివరా లు, రవాణా వివరాలు, ఓఎంఎస్, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి కార్మికులకు ఉద యం, మధ్యాహ్నం షిప్టుల ప్రారంభ సమయం లో వివరించి వారికి అవగాహన కల్పిస్తారన్నా రు. త్వరలో రానున్న ప్రైవేట్ బ్లాకుల నుంచి వెలికితీసే బొగ్గు చౌకగా లభించడం, విదేశీ బొగ్గు దిగుమతి, సింగరేణి బొగ్గును సిమెంట్ కంపెనీలు వాడకపోవడం, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో సింగరేణిలో బొగ్గుకు డిమాండ్ తగ్గనున్నదని, ఈ క్రమంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని కార్మికులకు తెలుపనున్నారన్నారు. వచ్చే మా ర్చి 31 నాటికి ఈ ప్రక్రియ ప్రతి రోజు జరుగుతుందన్నారు. కాగా, తొలుత అధికారులు, కార్మిక సంఘాల నాయకుల నుంచి సూచనలు తీసుకునేందుకు మొదటిసారిగా శనివారం గోదావరిఖనిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమాలోచన సమావేశాన్ని నిర్వహించి సలహాలు స్వీకరించారు. కార్పొరేట్ పర్సనల్ జీఎం సి.మల్లయ్యపంతులు, జీఎంలు సుగుణాకర్రెడ్డి, సుభానీ, వెంకట్రామయ్య, భాస్కర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, మేరుగు రవీందర్రెడ్డి, గోవర్దన్, ఆరెళ్లి పోషం, ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్య, హెచ్ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్, ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఐఎన్టీయూసీ నాయకుడు డాలయ్య పాల్గొన్నారు. -
కోల్బెల్ట్కు జలగండం
గోదావరిఖని : రామగుండం ప్రాంతంలో రానున్న వేసవిలో తాగునీటికి కటకటాలు తప్పేలా లేవు. చలికాలంలోనే నీటి ఎద్దడి తీవ్రత పెరుగుతుండడంతో వేసవిలో నీటిగండం ఎలా ఉంటుందో ఊహించని విధంగా తయారైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరిలో ప్రవాహం లేక నది పూర్తిగా ఎండిపోయింది. కనుచూపు మేరలో గోదారమ్మ ఎడారిని తలపిస్తోంది. దీంతో ఊట నీటినే ఫిల్టర్ చేసి ప్రజలకు అందించాల్సిన పరిస్థితి ఇటు కార్పొరేషన్కు, అటు సింగరేణి యాజమాన్యానికి ఏర్పడింది. 2004లో ఎల్లంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన తరుణంలోనే భవిష్యత్లో కోల్బెల్ట్ ప్రాంతానికి తాగునీటికి ఇక్కట్లు తప్పవని అధికారులకు తెలుసు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసినప్పటికీ కార్పొరేషన్, సింగరేణి యంత్రాంగం దృష్టి సారించకపోవడం వల్ల సమస్య జటిలంగా మారింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో సుమా రు 15వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గోదావరినది ఒడ్డున గల ఫిల్టర్బెడ్ ద్వారా 135 హెచ్ పీ సామర్థ్యం గల మోటార్తో నీటిని తోడి శారదానగర్లోని ట్యాంకుకు చేరుస్తారు. అక్కడినుంచి వివిధ ప్రాంతాలలో గల ట్యాంకులకు సమయానుకూలంగా నీటిని అందిస్తారు. అయి తే ప్రస్తుతం గోదావరినదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నదిలో ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ సమీపంలో నీటికోసం గుంతలు తవ్వి ఊట నీటిని ఫిల్టర్బెడ్లోకి పంపింగ్ చేస్తున్నారు. అక్కడినుంచి పలు కాలనీలకు నీటిని అంది స్తుండగా మరికొన్ని కాలనీలకు ట్యాంకర్లతో నీరందించాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రత్యామ్నాయ చర్యలు ఫలించేనా..? ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు కార్పొరేషన్కు అవకాశం ఉంది. ఇందుకోసం ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు పైపులైన్ నిర్మాణం చేపట్టేందుకు గతంలో జైపూర్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేపట్టింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చింది. నివేదికను గత ప్రభుత్వానికి పంపగా దానిని పక్కనపెట్టేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మేయర్, అధికారులు ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్లోకి వచ్చే కుందనపల్లి శివారులోని పైపులైన్ సిస్టర్న్ నుంచి రూ.20 కోట్లతో కార్పొరేషన్కు తాగునీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించగా సహకారాన్ని అందిస్తామని మంత్రి హరీష్రావు హామీ ఇచ్చారు. ఈ ఫైల్ సీఎం పేషీలో ఉంది. పట్టింపులేని సింగరేణి సింగరేణి సంస్థ గోదావరినది ఇంటెక్వెల్ నుంచి ఆర్జీ-1,2,3 డివిజన్ల పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, పోతనకాలనీ, సెంటినరీకాలనీ వరకు 21.90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదాపు 20వేల క్వార్టర్లకు, మరో 20వేల ప్రైవేటు గృహాలకు నల్లా నీటిని అందిస్తోంది. గోదావరినది వద్ద గల ఫిల్టర్బెడ్ నుంచి 240 హెచ్పీ సామర్థ్యం గల మూడు మోటర్లను నిరంతరం నడిపిస్తోంది. 18 మెగావాట్ల పవర్హౌస్కు సైతం రా వాటర్ను గోదావరినది నుంచే తరలిస్తున్నారు. ప్రస్తుతం నది ఎండిపోగా.. ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల నుంచి ఊటగా వచ్చే నీటిని ఇంటేక్వెల్లో ఫిల్టర్ చేస్తూ క్వార్టర్లకు సరఫరా చేస్తున్నారు. మూడేళ్లుగా వేసవి కాలంలో గోదావరినది ఎండిపోతుంటే సుమారు 40 బోర్లను వేసి నీటిని తోడుతున్నారే తప్ప ప్రత్యామ్నాయ చర్యల గురించి మాత్రం ఆలోచించడం లేదు. ప్రభుత్వం సింగరేణి సంస్థ తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వాడుకునేందుకు ఒక టీఎంసీ నీటిని కేటాయించింది. ప్రాజెక్టు నుంచి గోదావరినది ఒడ్డున ఫిల్టర్బెడ్ వరకు పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.100 కోట్ల వ్యయం అవుతుండడంతో సింగరేణి యాజమాన్యం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. గోదావరినది ఎండిపోయిన ప్రతిసారి సింగరేణి భూగర్భగనుల్లో ఊటగా ఏర్పడే నీటిని ఉపరితలానికి పంపించి అక్కడినుంచి ఫిల్టర్బెడ్లకు తరలించి శుద్ధిచేసి కాలనీలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం యైటింక్లయిన్కాలనీకి గనుల నుంచి వచ్చిన నీటినే సరాఫరా చేస్తున్నట్టు కార్మిక కుటుంబాలు పేర్కొంటున్నాయి. శాశ్వత చర్యలేవీ..? రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఇటు కార్పొరేషన్ గానీ, అటు సింగరేణి గానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా శాశ్వతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ వద్ద గల సిస్టర్న్ నుంచి నది నీటిని తీసుకోవడానికి ఇబ్బంది లేకపోయినా రిజర్వాయర్కు ఏడాది పొడువునా నీటి సరఫరా జరగదు. అలాంటి సందర్భంలో రిజర్వాయర్కు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు శాశ్వతంగా పైప్లైన్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. సింగరేణి సంస్థ కూడా గనుల ఊట నీటిని తాగునీటిగా అందించే ప్రయత్నం చేస్తే నీటిలోని మందం (పార్ట్స్ ఫర్ మిలియన్ -పీపీఎం) ఎక్కువగా ఉంటే అది తాగేందుకు పనికిరాకుండా పోతుంది. అలాగే శారీరక నొప్పులతో లేనిరోగాలను కొనితెచ్చుకున్నట్టవుతుంది. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం సైతం ఎల్లంపల్లి నుంచి పైప్లైన్ నిర్మాణం చేపడితేనే గని కార్మికులు, వారి కుటుంబాలకు దాహార్తిని తీర్చినట్టువుతుంది. ఆ దిశగా సింగరేణి, కార్పొరేషన్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
ఖనిలో అగ్నిప్రమాదం: 20 దుకాణాలు దగ్ధం
కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీనగర్లోని దుకాణాల సముదాయంలో శుక్రవారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు దగ్దమైనాయి. రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీలిచిత్రాలు తీసిన వ్యక్తి అరెస్ట్
కోల్సిటీ, న్యూస్లైన్: గోదావరిఖనిలో నీలిచిత్రాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుర్ర రమేశ్ అనే ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గోదావరిఖని డీఎస్పీ ఆర్.జగదీశ్వర్రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక లక్ష్మీనగర్లో మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న రమేశ్ ఇద్దరు మహిళలను అశ్లీలంగా వీడియో తీశాడు. వీటిలో తాను కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ అశ్లీల చిత్రాలను ఇతర మొబైల్స్కు బ్లూటూత్ ద్వారా పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వన్టౌన్ పోలీసులు సుమోటోగా కేసు దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నీలిచిత్రాలను ఉద్దేశపూర్వకంగా తీసినట్లు తేలింది. వీటిని అడ్డుపెట్టుకుని ఆ మహిళలను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడా? ఇతడికి ఇంకెవరైనా సహకరించారా? ఈయన బారినపడిన మహిళలు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని డీఎస్పీ చెప్పారు. రమేశ్పై నిర్భయ చట్టంతోపాటు 292 సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. మహిళలను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసినా, తీస్తున్నట్లు తెలిసినా తనకు(94407 95133) సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారికి రివార్డు ఇస్తామని, వీరితోపాటు బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. సకాలంలో సమాచారం ఇస్తే బాధితులకు నష్టాన్ని తగ్గించే వీలుంటుందని, బాధితులు పబ్లిక్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందిస్తానని పేర్కొన్నారు. -
గులాబీ జెండా?
గోదావరిఖని, న్యూస్లైన్: రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తొమ్మిది మంది స్వతంత్ర సభ్యులు, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల సహకారంతో టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన మెజారిటీ ఇండిపెండెంట్ సభ్యులను టీఆర్ఎస్ చాకచక్యంతా తనవైపు తిప్పుకుంది. చివరకు వారందరిని టీఆర్ఎస్లో చేర్చుకుని 12వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తు తం 14 మంది టీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ, తొమ్మి ది మంది స్వతంత్ర కార్పొరేటర్లతో టీఆర్ఎస్ క్యాంపు యానాంలో కొనసాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాజరై క్యాంపులో ఉన్న కార్పొరేటర్లతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ యన ఫోన్లో ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ.. స్వతంత్ర కార్పొరేటర్లను ముందుగా టీఆర్ఎస్లో చేర్పించి, ఆ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ గా ఎన్నుకోవాలని నిర్ణయించామని తెలి పా రు. రామగుండం కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లకు టీఆర్ఎస్ 14, బీజేపీ రెండు స్థానాలను గెల్చుకోగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. కాంగ్రె స్ పార్టీ తరఫున 19 మంది విజయం సాధిం చారు. స్వతంత్రంగా గెలిచిన వారిలో నుంచి తొమ్మిది మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ క్యాంపులో చేరిపోయారు. వారందరు 12వ డివిజన్ నుంచి గెలుపొందిన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్గా చేయాలని ఈ సమావేశంలో పట్టుబట్టారు. ఇందుకు టీఆర్ఎస్తో పాటు బీజేపీ సభ్యులు అంగీకరించారు. శిబి రంలో మొత్తం 25 మంది కార్పొరేటర్లు ఉండ గా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మె ల్యే ఓట్లతో టీఆర్ఎస్ సంఖ్యాబలం 27కు చేరనుంది. దీంతో రామగుండం మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోవడం ఖాయమైంది. ఇక డెప్యూటీ మేయర్ పదవిని టీఆర్ఎస్కు వదిలివేయగా... అభ్యర్థి ఎంపికను తమ సభ్యుల నిర్ణయానికే వదిలేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంలో సాగుతున్న తర్జనభర్జనలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లతో పాటు తొమ్మిదిమంది స్వతంత్ర కార్పొరేటర్ల ఖర్చులను మేయర్ అభ్యర్థి లక్ష్మీనారాయణ భరించుకోవాలని, డెప్యూటీ మేయర్ పదవిని ఆశించేవారు మిగతా 13 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్ల ఖర్చును మోయాలని నిర్ణయించారు. 4న క్యాంపునకు కాంగ్రెస్ కార్పొరేటర్లు : రామగుండం మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీ నుంచి తమ కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మాజీ మంత్రి శ్రీధర్బాబు, మాజీ ఎంపీ జి.వివేక్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ ఒకటవ తేదీన గోదావరిఖనిలో జరిగే సమావేశానికి హాజరై క్యాంపు విషయం నిర్ణయం తీసుకునే అవకాశముంది. 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకు తోడు ఆరుగురు స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ ఇప్పటికే ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు. వీరి సంఖ్య కూడా 25కు చేరగా, టీఆర్ఎస్ క్యాంపులోంచి ఎవరైనా రాకపోతారా.. అనే ఆశతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
సింగరేణిలో తేలని గుర్తింపు లొల్లి
సింగరేణి సంస్థలో తెలంగాణ వాదంతో గెలిచిన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ఏర్పడిన అంతర్గత నాయకత్వ సమస్య కార్మికుల పాలిట శాపంగా మారింది. తమ పెత్తనం సాగాలనే ఉద్దేశంతో ఇద్దరు నాయకులు తమ బలాన్ని నిరూపించుకునే క్రమంలో వారి మధ్య గొడవ కోర్టుకు చేరడంతో కార్మికుల సమస్యలన్నీ గాలిలో కలిసిపోయాయి. గోదావరిఖని, న్యూస్లైన్ : 2012 జూన్ 28న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గెలుపొందింది. ఆనాటి నుంచి ఏడాది పాటు సాఫీగానే సాగగా... 2013 ఏప్రిల్ నుంచి యూనియన్లోని ఇద్దరు అగ్ర నాయకులు కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి మధ్య వైరం మొదలైంది. దీంతో సమావేశాలు నిర్వహించుకుని ఒకరినొకరు తొలగించినట్టు ప్రకటించారు. చివరకు కోర్టు సూచన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో యూనియన్కు చెందిన ఆరుగురు ఆఫీస్ బేరర్లకు గోదావరిఖనిలో అంతర్గత ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఆకునూరి కనకరాజు, ప్రధానకార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ గెలుపొందింది. కానీ వారికి అధికారపూర్వకంగా కోర్టు నుంచి లేఖ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏరియాల వారీగా ఉపాధ్యక్షులను కొనసాగించాలని ఆ ఏరియాల ఉపాధ్యక్షులు, అలాగే ఎన్నికలు నిర్వహించే అధికారం సెంట్రల్ లేబర్ కమిషనర్కు లేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సమస్య ఇంకా పెండింగ్లోనే ఉంది. దీనివల్ల 2013 ఏప్రిల్ నుంచి గనులు, డిపార్ట్మెంట్లు, ఏరియాల వారీగా కార్పొరేట్ స్థాయిలో జరగాల్సిన స్ట్రక్చర్డ్ సమావేశాలు నిర్వహించకపోవడంతో కార్మికుల సమస్యలు అనేకం పెండింగ్లోనే ఉన్నాయి. కార్మికుల ప్రమోషన్లు, మ్యాచింగ్ గ్రాంట్పై నిర్ణయం తదితర అంశాలన్నీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలతో కూడా యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో నిర్వహించాల్సిన జేసీసీ సమావేశాలు జరగకపోవడంతో ఆయా సంఘాల నాయకులు కేవలం ఏరియాల స్థాయిలో జరిగే సమావేశాల్లోనే సమస్యలను విన్నవించాల్సి వస్తోంది. టీబీజీకేఎస్లో ఏర్పడిన అంతర్గత నాయకత్వ పోరును పరిష్కరించేందుకు గతం నుంచి టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జూన్ 2 తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుండగా.. శనివారం కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ను టీబీజీకేఎస్లోని కెంగెర్ల మల్లయ్య వర్గం కలిసింది. ఈ సందర్భంగా జూన్ 2 తర్వాత యూనియన్ అంతర్గత సమస్య పరిష్కారం చేస్తానని కేసీఆర్ వారికి హమీ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలోనైనా యూనియన్ సమస్య సమిసిపోతే తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని 65 వేల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
కొత్త సర్కారుపై కోటి ఆశలు
గోదావరిఖని,న్యూస్లైన్: సింగరేణి కార్మికులు కారుకు జైకొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కోల్బెల్ట్ వ్యాప్తంగా గులాబీకి పట్టం కట్టారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది, ఐదు లోక్సభ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల టీఆర్ఎస్ను గెలిపించారు. ఉద్యమ ప్రస్థానంలో అడుగడుగునా అండగా నిలిచి.. ఇప్పుడు అధికారం అప్పగించడంలో ముందున్న సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆ పార్టీ ప్రజాప్రతినిధులపైనే ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. సింగరేణి వ్యాప్తంగా 34 భూగర్భ గనులు, 15 ఓపెన్కాస్ట్ ప్రాజె క్టులు ఉండగా, 64వేల మంది కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తూ అటు ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. అయినప్పటికీ గనికార్మికుల జీవితాలు దినదినగండానే గడుస్తున్నాయి. సింగరేణి ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక సమస్యలతో నల్లసూరీళ్లు సతమతమవుతున్నారు. కార్మికుల సమస్యలను ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మరిచిపోయి శ్రమజీవుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. సింగరేణిలో కొలువుదీరిన స్థానికేతర అధికారులు, ఉన్నతాధికారులు స్థానిక కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షతను ప్రదర్శిస్తున్నారనే అపవాదు ఉంది. ఆ అవమానాలు, అణిచివేతల కారణంగా ఆక్రోశంతో రగిలిపోతున్న కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైన తరుణంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టారు. కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని నియోజకవర్గాల పరిధిలో సింగరేణి సంస్థ విస్తరించి ఉండగా, రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న గనికార్మికులు అక్కడ సైతం గులాబీ జెండానే ఎగురవేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కారుకు పట్టం కట్టారు. దీంతోపాటు పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాద్లలో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ తమ సమస్యలకు విముక్తి కలుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక కార్మికులు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపైనే ఉంది. ఎంపీల గురుతర బాధ్యత ఇది... తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్పై సింగరేణి ప్రాంత అభివృద్ధితో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం చేయడాన్ని గురుతర బాధ్యత. లోక్సభకు పోటీ చేసిన టీఆర్ఎస్ సభ్యులు కోల్బెల్ట్ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలకు ఫనంగా పెట్టి పనిచేస్తున్న గని కార్మికులకు కూడా ఆదాయపు పన్ను మినహారుుంపు ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 1998లో 1,09,000 మంది కార్మికులు పనిచేస్తే నేడు 64 వేలకు వారి సంఖ్య తగ్గింది. కార్మికుల నియూమక ప్రక్రియ చేపట్టాలి. కొత్తగా భూగర్భ గనులను ప్రారంభించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలి. పనిఒత్తిడి కారణంగా విధులకు గైర్హాజరైన దాదాపు 10 వేల మంది కార్మికులను యాజమాన్యం డిస్మిస్ చేసింది. వీరిలో ఇటీవల కొంత మందిని విధులకు తీసుకున్నా వేలాది మంది రోడ్లపైనే బతుకీడుస్తున్నారు. డిస్మిస్ కార్మికులను కూడా బేషరతుగా ఉద్యోగాల్లోకి తీసుకునేలా యాజమాన్యంతో చర్చించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 35 రోజుల పాటు కార్మికులు సకల జనుల సమ్మె చేపట్టి బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి వేలాది రూపాయలు వేతనాలను కోల్పోయారు. ఈ సందర్భంగా రూ. 25 వేలను సమ్మె అడ్వాన్స్ చెల్లించి తిరిగి వేతనాల నుంచి కోత విధించారు. ఆ సొమ్మును తిరిగి కార్మికులకు చెల్లించాలనే డిమాండ్ను ఎంపీలు తమ భూజాలపై వేసుకోవాలి. -
‘రాజిరెడ్డి' కే పట్టం
రాజిరెడ్డి ప్యానల్కు 4,582 ఓట్ల ఆధిక్యం టీబీజీకేఎస్ ఎన్నికల్లో ‘కెంగెర్ల’ ఓటమి హైకోర్టుకు ఫలితాల నివేదన గోదావరిఖని, న్యూస్లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో మిర్యాల రాజిరెడ్డి వర్గం ఘనవిజయం సాధించింది. గోదావరిఖనిలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం ఎన్నిక నిర్వహించగా.. 40,752 ఓట్లకు 24,532 ఓట్లు పోలయ్యాయి. అదేరాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వర కు ఓట్లు లెక్కించారు. రాజిరెడ్డి వర్గానికి 14,499 ఓట్లు, కెంగెర్ల మల్లయ్య వర్గానికి 9,917ఓట్లు లభిం చాయి. మరో 116ఓట్లు చెల్లకుండా పోయాయి. మొ త్తంగా మల్లయ్య ప్యానెల్పై రాజిరెడ్డి ప్యానెల్ 4,582 ఓట్ల మెజారిటీ సాధించింది. గెలుపొందిన ప్యానెల్లో అధ్యక్షుడిగా ఆకునూరి కనకరాజు (కొత్తగూడెం), ఉపాధ్యక్షుడిగా ఏనుగు రవీందర్రెడ్డి (శ్రీరాంపూర్), ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి (ఆర్జీ-3), సంయుక్త కార్యదర్శిగా మేడిపల్లి సంపత్ (మందమర్రి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎ.ఆగయ్య (భూపాలపల్లి), కోశాధికారిగా కె.సారంగపాణి (భూపాలపల్లి) ఉన్నారు. లేబర్ కమిషనర్ (సెంట్రల్) రీజినల్ పీఎం శ్రీవాస్తవ ఓట్ల వివరాల పత్రాన్ని ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి, ఇతర ప్యానెల్ నాయకులకు అందించారు. ఫలితాలను హైకోర్టుకు నివేదిస్తానని, అక్కడినుంచే ఎన్నికైన వారి సమాచారం అధికారికంగా వస్తుందని తెలిపారు. కార్మికుల భారీ ర్యాలీ ఫలితాల ప్రకటన అనంతరం టీబీజీకేఎస్ శ్రేణులు, ఐఎన్టీయూ, ఏఐటీయూసీ, దళిత, ఇతర సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రంగులు చ ల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ.. ఆర్జీ-1 కమ్యూనిటీహాల్ నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ మద్దతిచ్చినా ఓడిన ‘కెంగెర్ల’ టీబీజీకేఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కెంగెర్ల మల్లయ్య ప్యానెల్కు మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్రావు, నల్లాల ఓదెలు, ఎంపీ వివేక్ బహిరంగంగా ప్రకటించారు. అయినా కార్మికులు మల్లయ్య, ఆయన ప్యానెల్కు చెక్పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తరుణంలో టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఒకే యూనియన్లో ఓ వర్గానికి పార్టీ మద్దతిచ్చినా ఓడిన విషయమై పార్టీలో చర్చనీయాంశమైంది. దీని ప్రభావం త్వరలో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఇది కార్మికుల విజయం తమ గెలుపు ముమ్మాటికీ కార్మికుల విజయమేనని టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో గెలిచిన యూనియన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. కార్మిక సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. సింగరేణిని రక్షించుకునేందుకు సికాస తరహాలో పనిచేస్తామన్నారు. త్వరలోనే కేసీఆర్ను కలువనున్నట్లు వెల్లడించారు. -
గెలుపెవరిదో..?
గోదావరిఖని, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. నాలుగు జిల్లాల పరిధిలోని సంఘ సభ్యులైన సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు తరలిరావడంతో గోదావరిఖనిలో రోజంతా సందడి నెలకొంది. టీబీజీకేఎస్లో తలెత్తిన నాయకత్వ వివాదంపై హైకోర్టు ఆదేశం మేరకు హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ పీఎం శ్రీవాస్తవ నేతృత్వంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ప్యానల్ టోపీ, లైటు గుర్తుపై, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ తట్టాచెమ్మస్ గుర్తుపై తలపడ్డాయి. సింగరేణి వ్యాప్తంగా సంఘ సభ్యులైన 40,752 మందికి ఓటుహక్కు ఉండగా, వీరిలో 24,532 మంది పోలింగ్లో పాల్గొన్నారు. మొత్తం 60.19 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండం రీజియన్లో అత్యధికంగా 74.4 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా కొత్తగూడెం రీజియన్లో 37.4 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లోని 26 బూత్లలో పోలింగ్ నిర్వహించారు. పలు కేంద్రాల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండి, బూత్ల సంఖ్య తక్కువగా ఉండడంతో రాత్రి ఏడు గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఉదయం 8 గంటలకు వచ్చినవారు క్యూలైన్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సెయింట్పాల్ స్కూల్, గంగానగర్ సింగరేణి స్కూల్లో లైన్లో నిలుచున్న కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. గోదావరిఖని డీఎస్పీ జగదీశ్వర్రెడ్డి, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్రావు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మహేందర్జీ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. రెండు ప్యానళ్ల మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. కార్మికుల ఓట్లను పొందేందుకు ఆయావర్గాలు మద్యం బాటిళ్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య వల్ల అంతర్గత ఎన్నికలు నిర్వహించడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. సంఘం నాయకత్వ వివాదం హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎన్నికల ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు. -
గెలుపెవరిదో..?
గోదావరిఖని, న్యూస్లైన్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. నాలుగు జిల్లాల పరిధిలోని సంఘ సభ్యులైన సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు తరలిరావడంతో గోదావరిఖనిలో రోజంతా సందడి నెలకొంది. టీబీజీకేఎస్లో తలెత్తిన నాయకత్వ వివాదంపై హైకోర్టు ఆదేశం మేరకు హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ పీఎం శ్రీవాస్తవ నేతృత్వంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ప్యానల్ టోపీ, లైటు గుర్తుపై, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ తట్టాచెమ్మస్ గుర్తుపై తలపడ్డాయి. సింగరేణి వ్యాప్తంగా సంఘ సభ్యులైన 40,752 మందికి ఓటుహక్కు ఉండగా, వీరిలో 24,532 మంది పోలింగ్లో పాల్గొన్నారు. మొత్తం 60.19 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండం రీజియన్లో అత్యధికంగా 74.4 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా కొత్తగూడెం రీజియన్లో 37.4 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లోని 26 బూత్లలో పోలింగ్ నిర్వహించారు. పలు కేంద్రాల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండి, బూత్ల సంఖ్య తక్కువగా ఉండడంతో రాత్రి ఏడు గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఉదయం 8 గంటలకు వచ్చినవారు క్యూలైన్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సెయింట్పాల్ స్కూల్, గంగానగర్ సింగరేణి స్కూల్లో లైన్లో నిలుచున్న కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. గోదావరిఖని డీఎస్పీ జగదీశ్వర్రెడ్డి, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్రావు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మహేందర్జీ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. రెండు ప్యానళ్ల మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. కార్మికుల ఓట్లను పొందేందుకు ఆయావర్గాలు మద్యం బాటిళ్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య వల్ల అంతర్గత ఎన్నికలు నిర్వహించడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. సంఘం నాయకత్వ వివాదం హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎన్నికల ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు. -
నేడు గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఎన్నికలు
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎ స్ ఎన్నికలు గోదావరిఖని వేదికగా ఆదివారం జరుగనున్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపొం దేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల నాయకులు గనుల వద్ద ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న తమ యూనియన్ సభ్యులను కలుసుకుని తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులను గోదావరిఖనికి తరలించేందు ఆయా వర్గాల నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. 2012 జూన్ 28వ తేదీన జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆ తర్వాత వివిధ కమిటీ ల్లో నాయకుల కు పదవులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారని ద్వితీయశ్రేణి నాయకత్వం కినుక వహించింది. దీంతో వారందరూ సింగరేణి వ్యాప్తంగా ఏకం కాగా, వారికి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నాయకత్వం వహించారు. చివరకు అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించినట్లు సమావేశాల్లో ప్రకటించి కోర్టును ఆశ్రయించ డంతో సింగరేణిలో వర్గపోరు నెలకొంది. ఈ మేరకు హైకోర్టు సూచన మేరకు ఆదివారం రీజినల్ లేబర్ కమిషనర్ నేతృత్వంలో గోదావరిఖనిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆర్ఎల్సీ ఐదు కేంద్రాల్లో 11 డివిజన్లకు చెందిన కార్మికులు ఓటు వేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. కాగా శనివారం సాయంత్రం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బందిని ఆర్ఎల్సీ శ్రీవాస్తవ, డీఎస్పీ జగదీశ్వర్రెడ్డి నేతృత్వంలో ఆయా సెంటర్లకు బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సామగ్రితో తరలించారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియా ఓట్లే కీలకం... ఇదిలా ఉండగా, సింగరేణి గుర్తింపు సంఘం అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో సింగరేణిలోని 11 డివిజన్లకు చెందిన 40,752 మంది మంది ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ రామగుండం ఏరియాలోని 10,451 మంది, శ్రీరాంపూర్ ఏరియాలోని 12,358 మంది కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో పోటీ చేస్తున్న అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల ప్యానెళ్లు ఈ రెండు ఏరియాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, శ్రీరాం పూర్ డివిజన్లు గోదావరిఖనికి సమీపంలో ఉండడంతో సభ్య త్వం కలిగిన కార్మికులను ఎక్కువ మందిని తరలించే పనిలో రెండువర్గాల నాయకత్వం నిమగ్నమైంది. కాగా, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లతో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కార్పొరేట్ నుంచి కూడా ఓటు హక్కు కలిగిన కార్మికులను బస్సుల ద్వా రా గోదావరిఖనికి తరలించేందుకు నాయకు లు ఏర్పాట్లు చేశారు. అయితే యాజమాన్యం ఆదివారం ప్లేడేను వర్తింపచేయడంతో కొంత మంది కార్మికులు విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. గనులపై ముగిసిన ప్రచారం... హైకోర్టు ఆదేశాల మేరకు రీజినల్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తున్న టీబీజీకేఎస్ ఆఫీస్ బేరర్ల ఎన్నికల ప్రచారం శనివారం నాటితో ముగి సింది. ఆయాగనులు, ఓపెన్కాస్ట్లపై కెంగెర్ల, మిర్యాల వర్గాల నాయకులు విస్తృతంగా ప్రచా రం చేపట్టి తమ గుర్తులకే ఓటువేయాలని కో రారు. కాగా, తమకు టీఆర్ఎస్ నాయకత్వం మద్దతు ప్రకటించిందని కార్మికులంతా తమకే ఓటు వేసి గెలిపిస్తారని అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య ధీమా వ్యక్తం చేస్తుండగా.. రెండేళ్ల పాలనలో మల్లయ్య కార్మికులకు చేసిందేమీ లేదని, వారు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారని, అందువల్ల కార్మికుల అండ తమకే ఉంద ని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి గెలుపు ధీమాలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
జాతరలో విషాదం
కోల్సిటీ, న్యూస్లైన్: గోదావరిఖని వద్ద సమ్మక్క జాతరకు వచ్చిన ఓ యువకుడు గోదావరినదిలో మునిగి చనిపోయాడు. మహారాష్ట్ర గుగ్గూస్లోని ఇందిరానగర్కు చెందిన పోగుల రతన్(18), మెదక్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్టియర్ చదువుతున్నాడు. గోదావరిఖని ద్వారకానగర్లో ఉంటున్న పెద్దన్నాన్న, పెద్దమ్మ అరికిల్ల పీరయ్య-మల్లమ్మ ఇంటికి రెండ్రోజుల క్రితం వచ్చాడు. గురువారం రాత్రి పీరయ్య కుటుంబసభ్యులు సమ్మక్క జాతర కోసం స్థానిక గోదావరినది దగ్గరకు మొక్కులు తీర్చుకోవాడికి వచ్చి రాత్రి అక్కడే బసచేశారు. శుక్రవారం ఉదయం పీరయ్య కొడుకు కిషోర్, రతన్ కలిసి జాతరకు వచ్చారు. గోదావరిలో స్నానం చేసి వస్తామంటూ కిషోర్, రతన్ నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. కిషోర్ భయంతో అరుపులు వేయడంతో పక్కనే ఉన్న లింగాల రవి అనే యువకుడు అతడిని కాపాడాడు. అప్పటికే రతన్ నీటిలో గల్లంతయ్యాడు. సింగరేణి రెస్క్యూ బృందం, గజ ఈతగాళ్లు మూడు గంటలపాటు గాలించి రతన్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో బంధువులు గుండెలవిసేలా రోదించారు. రతన్ చిన్నప్పుడే తండ్రి మైసయ్య చనిపోయాడు. తల్లి సుగుణ అన్నీ తానై నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తోంది. రతన్ పెద్దన్నయ్య ప్రవీణ్కుమార్కు మార్చి 5న పెళ్లి జరగనుంది. ఇంట్లో అందరు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా, ఈ దుర్ఘటన జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్రలోని స్వగ్రామానికి తరలించారు. మృతుడి పెద్దనాన్న పీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. జాతరకు వచ్చి జాడలేకపాయె.. హుజూరాబాద్, న్యూస్లైన్ : పదో తరగతిలో అత్యధిక మార్కులు రావాలని, తన కుటుంబం సల్లంగ ఉండాలని సమ్మక్క, సారక్క ఆశీర్వాదం కోసం జాతరకు వచ్చిన ఆ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు చెందిన రాగినేని రాములు హమాలీ పని నిమిత్తం తిమ్మాపూర్ మండలం అల్గునూరుకు వలస వెళ్లాడు. అక్కడ కామధేనువు రైస్మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు. రాములు ఒక్కగానొక్క కొడుకు వెంకటేష్(15) అల్గునూరులో పదో తరగతి చదువుతున్నాడు. హుజూరాబాద్లోని రంగనాయకుల గుట్ట వద్ద జరిగే సమ్మక్క జాతరకు గురువారం సాయంత్రం కుటుంబంతో వచ్చాడు. జాతరలో బసచేసి, శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసమని తన మేనమామతో కలిసి ఆటోలో హుజూరాబాద్ శివారులోని కొత్తపల్లి కాకతీయ కాలువ వద్దకు వెళ్లాడు. కాలువలోకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడ్డాడు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో గల్లంతై ఆచూకీ లేకుండా పోయాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు లక్ష్మి, రాములులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలువకు నీటి విడుదల ఆపాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని బంధువులు తెలిపారు. నీటిని ఆపితేనే మృతదేహం దొరికే అవకాశముంది. సమ్మక్కకు చివరి మొక్కు.. ఓబులాపూర్(సిరిసిల్లరూరల్), న్యూస్లైన్: అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు సమ్మక్క-సారక్కలను దర్శించుకొని జాతరలోనే ఆత్మహత్యకు పాల్పడడం మండలంలోని ఓబులాపూర్లో విషాదాన్ని నింపింది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్కు చెందిన నేత కార్మికుడు బొల్లి రామరత్నం(47)కు ఇద్దరు భార్యలు ఉండగా, కుమారుడు, కుమార్తె సంతానం. సాంచాలు నడిపే రామరత్నం కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. దీనికితోడు రెండు నెలల క్రితం కుమార్తె మానస(23) ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనస్తాపం చెందిన రామరత్నం శుక్రవారం ఉదయం 9గంటలకు ఓబులాపూర్లోని సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లాడు. అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత జాతరలోనే మద్యంసీసాలో నైట్రాప్ వేసుకొని తాగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో రామరత్నం కూర్చున్నవాడు కూర్చున్నట్లే మరణించాడు. సిరిసిల్ల టౌన్ సీఐ నాగేంద్రచారి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
డాక్టర్ డిస్మిస్
కోల్సిటీ, న్యూస్లైన్ : విధుల్లో నిర్లక్ష్యంపై వేటు పడింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలోని లేబర్ రూంలో గతేడాది నవంబర్ 3న ఏగోలపు కావ్య ఉరఫ్ సుమతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మరణించిన ఘటనపై రాష్ట్ర వైద్య విధాన పరి షత్(ఏవీవీపీ) కమిషనర్ చర్యలు ప్రారంభించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలంది స్తున్న వైద్యుడు సంతోష్ను విధుల నుంచి తొలగించడంతోపాటు సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, నర్సింగ్ సిబ్బంది నాన్సీ, పుష్ప, స్వాతికి చార్జ్ మెమోలు జారీచేశారు. యైటింక్లయిన్కాలనీ పరిధి అల్లూరుకు చెందిన స్వామి భార్య కావ్యను నవంబర్ 2న పురిటినొప్పులు వస్తే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని కండీషన్ సీరియస్గా ఉందని చెప్పారు. మరుసటి రోజు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి... అందుబాటులో డాక్టర్ లేకపోవడంతో నర్సింగ్ సిబ్బందే పురుడు పోశారు. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన కావ్య తీవ్ర రక్తస్రావంతో అరగంటకు చనిపోయింది. ఘటనపై స్వామి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిషాలోని గ్లోబల్ హ్యుమన్ రైట్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. విచారణ చేయాలని హక్కుల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విచారణ నిర్వహించారు. రెండు ప్రత్యేక బృందాలు విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాయి. వాటి ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ నుంచి జారీ అయిన ఉత్తర్వు కాపీలను బుధవారం వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి పంపించినట్లు డీసీహెచ్ఎస్ అజ్మీరా భోజా తెలిపారు. ఇదే సంఘటనపై ఇటీవల తాత్కాలిక ఏఎన్ఎం సువర్ణ, ఆశ వర్కర్ సుభద్రను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్వో కొమురం బాబు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టారు. అయితే చార్జ్ మెమోలు అందుకున్న సూపరింటెండెంట్, ముగ్గురు నర్సింగ్ సిబ్బంది కమిషనరేట్కు కావ్య మృతిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరణకు కమిషనరేట్ నుంచి సంతృప్తి చెందకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అధికారుల చర్యలతో ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
‘గుర్తింపు’ కార్డు తప్పనిసరి
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్లైన్ : సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్లో ఏర్పడిన అంతర్గత నాయక సమస్యపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈనెల 23వ తేదీన గోదావరిఖనిలో ఏర్పాటు చేసే జనరల్ బాడీ సమావేశంలో ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీవాస్తవ బుధవారం ఇక్కడికి వచ్చారు. స్థానిక సింగరేణి స్టేడియం, సెయింట్పాల్ హైస్కూల్, గంగానగర్ పాఠశాల, సింగరేణి కమ్యూనిటీ హాల్, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్, ఆర్సీఓఏ క్లబ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 23న జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో పాల్గొననున్న కార్మికుల కు ఇబ్బందులు తలెత్తకుండా గోదావరిఖని లో అనుకూలంగా ఉండే పలు ప్రాంతాలను పరిశీలించామని, మొత్తం 25 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. ఈ ఎన్నికలకు రెవెన్యూ అధికారులను ఉపయోగిస్తున్నామని, వారికి ఈనెల 21వ తేదీన శిక్షణ ఇస్తామన్నారు. పోలీస్ సిబ్బం దిని ఎక్కువగా ఉపయోగించనున్నామని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో సంప్రదిస్తామ ని తెలిపారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక లు నిర్వహిస్తామని, అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించకుండా హైకోర్టుకు నివేదిస్తామని పేర్కొన్నా రు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చంతా యూనియన్ ఖాతా నుంచి వాడనున్నామ ని, ఈ విషయాన్ని పోటీలో పడుతున్న ఇరువర్గాలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. కొందరు నాయకులు గనులపైనే ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.. కార్మికులను అయోమయానికి గురిచేయవద్దని సూచించారు. చెక్ఆఫ్ సిస్టమ్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకా రం గుర్తింపు యూనియన్ యాజమాన్యాని కి ఇచ్చిన నివేదిక ప్రకారం 40,752 మంది ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఇందులో గుర్తింపు యూనియన్కు చందా చెల్లిస్తున్నట్లు కార్మికులు సైతం రాత పూర్వకంగా రాసి ఇచ్చారు.. వీరు ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది శాంతి భద్రతల సమస్యగా దారి తీస్తుంది.. తమ పరిధులు దాటి ఏ వర్గం వారైనా ఈ ప్రయత్నానికి పూనుకుంటే వారిపై హైకోర్టుకు నివేదిస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇరు వర్గాలు సహకరించాలి కోరారు. కార్మికులు యాజమాన్యం ఇచ్చిన ‘గుర్తింపు’ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఆర్ఎల్సీ వెంట ఏఎల్సీ ఆర్సీ సాహు, లేబర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పి.లక్ష్మణ్, వీకే ఖరే, నర్సయ్య, సింగరేణి పర్సనల్ జీఎం మల్లయ్యపంతులు, సెక్యూరిటీ జీఎం శివరామిరెడ్డి, అనిల్కుమార్, కె.ప్రకాశ్బాబు, అమానుల్లా తదితరులున్నారు. -
టార్గెట్ డౌటే..!
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనకబడుతోంది. అధికారుల ప్రణాళికాలోపంతో పన్నెండేళ్లుగా లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చిన రికార్డు చెదిరిపోయే ప్రమాదంలో పడింది. ఓబీ టెండర్ల జాప్యం, బొగ్గు రవాణాలో ఇబ్బందులు, పని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిర్దేశిత లక్ష్యసాధనకు రెండు నెలలు కూడా లేకపోవడంతో యాజమాన్యం ఆందోళనలో పడింది. గోదావరిఖని, న్యూస్లైన్ : కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించిన సింగరేణి సంస్థలో 35 భూగర్భ గనులు, 15 ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి 54.30 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు 43.86 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 38.85 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీశారు. అంటే గడిచిన పది నెలల కాలంలో లక్ష్యానికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడి ఉంది. లక్ష్యసాధనకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు, మహాశివరాత్రితో 23 రోజులు, మార్చిలో ఐదు ఆదివారాలకు తోడు హోలీ, ఉగాది పండుగతో 24 రోజుల పనిదినాలున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు మూడు రోజులు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. ఈ జాతరకు సింగరేణి ఉద్యోగులు భారీగా వెళ్తారు. ఈ లెక్కన రెండు నెలల్లో 44 రోజులే పని దినాలున్నాయి. ఈ రోజుల్లో గడిచిన కాలానికి వెనకబడిన 5 మిలియన్ టన్నులతోపాటు 10.45 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాల్సి ఉంటుంది. మొత్తం 15.45 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న లక్ష్యాన్ని రెండు నెలల్లో సాధించడం సింగరేణికి కష్టసాధ్యమని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు బొగ్గు ఉత్పత్తిని వెలికితీసేందుకు సంస్థ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. స్పెషల్ ప్యాకేజీలు, ఇన్సెంటివ్లు ప్రకటిస్తూ ఉత్పత్తి మెరుగుపరిచేందుకు యత్నిస్తున్నా లక్ష్యం చేరడం అనుమానంగానే ఉంది. ఓబీ మట్టి తరలింపే సమస్య ఉత్పత్తిలో కొత్తగూడెం, ఎల్లందు, రామగుండం-3, బెల్లంపల్లి డివిజన్లు లక్ష్యాన్ని సాధించడంలో ముందున్నాయి. మణుగూరు, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా, భూపాలపల్లి, రామగుండం-1, రామగుండం-2, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు లక్ష్యసాధనలో వెనుకబడ్డాయి. ముఖ్యంగా పని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆర్జీ-1లోని మేడిపల్లి ఓసీపీలో 1.5 మిలియన్ టన్నులు, అడ్రియాల షాఫ్ట్బ్లాక్లో 2 మిలియన్ టన్నులు, కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు, భూపాలపల్లి ఓసీపీ, మణుగూర్ ఓపెన్కాస్ట్ల్లో సరైన విధంగా బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయారు. పలు ఓపెన్కాస్ట్ల్లో మట్టి తొలగింపు చేసే కాంట్రాక్టు సంస్థల టెండర్లు పూర్తి కాకపోవడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి జరగలేదు. బొగ్గు రవాణా సరిగ్గా సాగకపోవడంతో పలు సంస్థలు ఇతర సంస్థలు, విదేశీ బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ధర 230 డాలర్ల నుంచి 130 డాలర్లకు పడిపోవడంతో కర్ణాటకలోని పలు సిమెంట్ కంపెనీలు విదేశాల నుంచి వచ్చే బొగ్గును వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీకి ప్రతీసారి అదనంగా బొగ్గును రవాణా చేసే సింగరేణి సంస్థ ఈసారి ఎక్కువ బొగ్గును రవాణా చేయలేకపోయింది. దీంతో పలు సంస్థల యజమాన్యాలు సింగరేణిపై అసంతృప్తితో ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణాళికా లోపం ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి ప్రణాళికా లోపం ఉంది. ఓపెన్కాస్టుల్లో సమయానికి అనుకూలంగా ఓబీ టెండర్లు ఇవ్వాల్సి ఉండగా జాప్యం చేయడంతో మట్టి తరలింపు త్వరగా జరగడం లేదు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. ఇది లక్ష్యంపై ప్రభావం చూపుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల సమయంలోనే అంచనా వేసి ఉత్పత్తి మెరుగుపరిచేందుకు సరైన ప్రణాళికలు వేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చిన రికార్డును ఈ ఏడాది సింగరేణి కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటోంది. ఇన్సెంటివ్లు, స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించినా లక్ష్యం సాధించే పరిస్థితి లేదు. గతేడాది లక్ష్యం 54 మిలియన్ టన్నులు కాగా, 53.19 మిలియన్ టన్నులు సాధించి లక్ష్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే సంస్థాగత లక్ష్యం 53 మిలియన్ టన్నులే కావడంతో లక్ష్యాన్ని సాధించినట్లుగానే పరిగణించారు. ఇలా చేస్తే ఉత్పత్తి మెరుగు సమయం వృథా కాకుండా ఉత్పత్తి ఎక్కువ చేయడం. గనులు, ఓపెన్కాస్టుల్లో ఉన్న మిషన్లు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక. ఓబీ కాంట్రాక్టర్లు మట్టి తీశాక కొంతకాలానికి అక్కడ బొగ్గు తీసేవారు. ఇప్పుడు ఓబీ మట్టి తీశాక వెంటనే ఆ ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి చేయడం. -
కావ్య మృతిపై చర్యలు షురూ..
కోల్సిటీ, న్యూస్లైన్ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో గతేడాది నవంబర్ 3న ఏగోలపు కావ్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి మృతి చెందిన సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు ప్రారంభించారు. కావ్య ప్రసవించిన తర్వాత అం దుబాటులో లేరనే కారణంతో తాత్కాలిక ఏఎన్ఎం సువర్ణ, ఆశ వర్కర్ సుభద్రను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు శనివారం ప్రకటించారు. ఈ ఘట నపై పలుదఫాలుగా విచారణ జరిపిన అధికారులు కేవలం కిందిస్థాయి సిబ్బం దిని బలి చేశారని ఆరోపణలు వస్తున్నా యి.ప్రసవం చేసింది కొందరైతే... తాత్కాలిక సిబ్బందిపై ఎలా చర్యలు తీసుకుంటారనేది పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సోమవారం ఆస్పత్రి ఎదుట ఆం దోళనకు వైద్య సిబ్బంది సిద్ధం అవుతున్న ట్లు సమాచారం. కాగా, కావ్య మృతికి గల పూర్తి వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించకపోవడం గమనార్హం. పలు దఫాలుగా అధికారుల విచారణ కావ్య మృతిపై వచ్చిన మీడియా కథనాలకు.. ఓడిషా రాష్ట్రంలోని గ్లోబల్ హ్యు మాన్రైట్స్ కమ్యూనికేషన్ సంస్థ స్పం దిం చింది. వైద్యులకు బదులు నర్సింగ్ సి బ్బంది ఎలా ఆపరేషన్ నిర్వాహించారని, దీనిపై విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల(ఎన్హెచ్ఆర్సీ) కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఎన్హెచ్ఆర్సీ వెంటనే దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు, గత నెల 18న ఆస్పత్రిలో నలుగురు వైద్యుల బృందం ప్రత్యేక విచారణ చేపట్టారు. పెద్దాపరేషన్ చేశారని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. గత నెల 25న డీఎంహెచ్వో కొమురం బాలు కూడా స్వయంగా మరోసారి విచారణ జరిపారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లతోపాటు ఆస్పత్రిలో ప్రసవం చేసిన నర్సింగ్ సిబ్బంది, మృతురాలి భర్తతో మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే కరీంనగర్లో గత నెల 28న డీఎంహెచ్ వో ఈ ఘటనపై మరోసారి విచారణ జరిపారు. చివరికి తాత్కాలిక ఏఎన్ఎం సువర్ణ, ఆశ వర్కర్ సుభద్ర ను ఉద్యోగులను విధుల నుంచి తొల గిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని డీఎంహెచ్వో కొమురం బాలు శని వారం ప్రకటించారు. నిబంధనల ప్రకార మే చర్యలు తీసుకున్నామని డీఎంహెచ్వో వెల్లడించారు. కాగా, తదుపరి వేటు ఎవరిపై అనేది సస్పెన్సగా ఉంది. -
సౌరవిద్యుత్దే భవిష్యత్
గోదావరిఖని, న్యూస్లైన్ : ప్రకృతి వనరు అయిన సౌరశక్తి విద్యుత్పైనే భవిష్యత్లో ఆధారపడాల్సి వస్తుందని, ఎన్టీపీసీ కూడా వాటికే ప్రాధాన్యతనివ్వబోతోందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అరూప్రాయ్ చౌదరి అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాజీవ్హ్రదారి పక్కన నర్రశాలపల్లి శివారులో నెలకొల్పిన 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని సూచిస్తోందని, ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా రెండు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్బ్లెయిర్లో 5 మెగావాట్లు, ఉత్తరప్రదేశ్లోని దాద్రీలో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుచ్ఛక్తి ప్లాంట్లను ప్రారంభించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రామగుండం వద్ద మొదటి దశ కింద రూ.90 కోట్ల వ్యయంతో 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించామని, రెండో దశ కింద మరో 15 మెగావాట్ల ప్లాంట్ నెలకొల్పుతామని చెప్పారు. సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లతో కాలుష్యాన్ని నియంత్రించొచ్చని, 12 వేల ఇళ్లకు విద్యుత్ అందించవచ్చని తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ ఖర్చు ప్రస్తుతం ఎక్కువగా అవుతున్నా... రాబోయే రోజుల్లో తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామగుండం సోలార్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్ర అవసరాలకే కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోలార్ ప్లాంట్లోని వివిధ దశలను తిలకించి ఒక రోజు ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను పరిశీలించారు. ప్లాంట్ సందర్శన ఎన్టీపీసీ ప్లాంట్ను సీఎండీ సందర్శించారు. నాల్గో యూనిట్లో గ్యాస్లు బయటకు వెళ్లేందుకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. బొగ్గు లభ్యమైతేనే రామగుండం ఎన్టీపీసీ విస్తరణ రామగుండం ఎన్టీపీసీలో విస్తరణ చేపట్టేందుకు నూతనంగా ప్రారంభించనున్న 660 మెగావాట్ల 8, 9 యూనిట్లకు బొగ్గు లింకేజీ సమస్య ఏర్పడిందని, సింగరేణి గానీ, కోల్ ఇండియా నుంచి గానీ అనుమతి లభించిన వెంటనే వాటిని ప్రారంభించనున్నామని ఎన్టీపీసీ సీఎండీ తెలిపారు. ఎన్టీపీసీ-సింగరేణి భాగస్వామ్యంలో తలాయిపల్లి వద్ద బొగ్గు వెలికితీయబోతున్నామని, ఇతర ప్రాంతాల్లోనూ బొగ్గు కోసం అన్వేషణ చేస్తున్నామన్నారు. రామగుండం వద్ద గల బీపీఎల్ ప్రాజెక్టును తీసుకునేందుకు ప్రతిపాదనలు తయారుచేశామని, రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే ఆ ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ ప్లాంట్లను విస్తరించేందుకు, ఏర్పాటు చేసేందుకు రామగుండం ప్రాంతం అనువైన చోటనిపేర్కొన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా బీపీఎల్ స్థల పరిశీలన ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న బీపీఎల్ ప్లాంట్ను తీసుకోవడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సంస్థ సీఎండీ అరూప్రాయ్ బుధవారం ఏరియల్ వ్యూ ద్వారా ఆ సంస్థకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో అధికారులు జెండాలను పాతి గుర్తులు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ ప్లాంట్లో నూతనంగా ఏర్పాటు చేయదలుచుకున్న 8, 9 కొత్త యూనిట్లను నెలకొల్పే ప్రాంతాన్ని, సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుతోపాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేసేందుకు గోదావరినదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా ఆయన ఏరియల్ వ్యూ ద్వారా తిలకించినట్లు తెలిసింది. ఆయా కార్యక్రమాల్లో ఎన్టీపీసీ డెరైక్టర్ టెక్నికల్ ఏకే.ఝా, దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వెంకటేశ్వరన్, రామగుండం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుభాషిస్ఘోష్, సదరన్ రీజియన్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ పి.గోపాలరావు, రామగుండం ప్లాంట్ జీఎంలు రామ్కుబేర్, ఎన్ కే. సిన్హా, ఆర్ఎం రాధాకృష్ణన్, రైనా, ఆర్.హరికుమార్, సోమా ఘోష్ ఉన్నారు. -
ఫిబ్రవరి 23న టీబీజీకేఎస్ ఎన్నికలు
గోదావరిఖని/మంచిర్యాలసిటీ/కొత్తగూడెం, న్యూస్లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం(టీబీజీకేఎస్)లో ఏర్పడిన అంతర్గత నాయకత్వ పోరు కు ఎట్టకేలకు తెరపడనుంది. నాయకుల వర్గపోరు కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తగిన న్యాయం చేసేందుకు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీవాస్తవ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర కు మంగళవారం హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించారు. ఫిబ్రవరి 23వ తేదీన గోదావరిఖని ఏరియాలో జనరల్బాడీ సమావేశాన్ని నిర్వహించి అందులోనే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా యూనియన్ అంతర్గత ఎన్నికలు జరుపుకోవాలని కమిషనర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యూనియన్ బైలాస్ ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవులకు ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్వీకరించి, ఫిబ్రవరి 4వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకా శం కల్పించారు. ప్రచారం కోసం ఆ తర్వాత రోజు 15 రోజుల సమయం ఇచ్చారు. అయితే 15 రోజుల ప్రచారం తర్వాత ఫిబ్రవరి 19నాడే ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ రోజు పనిదినం కావడంతో కార్మికులు ఎక్కువ గా హాజరుకాలేకపోతున్నారు. దీంతో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం సింగరేణికి సెలవుదినం కావడంతో అదేరోజు ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులు ఎక్కువ మంది అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఆర్ఎల్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు యూనియన్లోని ఇరువర్గాల నాయకులు సమ్మతించినట్లు సమాచారం. కాగా, టీబీజీకేఎస్కు సభ్యత్వం చెల్లిస్తున్న మొత్తం 40,576 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, కమిషనర్తో జరిగిన చర్చల్లో ఆర్జీ-3 డివిజన్ నుంచి పెర్కారి నాగేశ్వర్రావు, నాగెల్లి సాంబ య్య, పర్రె రాజనరేందర్, వేగోలపు మల్లయ్య, దేవ శ్రీనివాస్, జైపాల్రెడ్డి, గిటుకు శ్రీనివాస్, గాజుల తిరుపతి పాల్గొన్నారు. ఇక్కడే ప్రారంభమైన వర్గపోరు.. సింగరేణిలో 2012 జూన్ 28వ తేదీన జరిగిన ఐదో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయితే గుర్తింపు సంఘంగా గెలుపొందిన కొంతకాలానికే యూనియన్లో నాయకత్వ పోరు ప్రారంభమైంది. ఈ తరుణంలో యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణం తో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మిర్యాల రాజిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2013 మే 19వ తేదీన గోదావరిఖని లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి, విషయాన్ని కెంగెర్ల వర్గీయులు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అదే నెల 26వ తేదీన శ్రీరాంపూర్లో మిర్యాల రాజిరెడ్డి వర్గీయులు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మల్లయ్యను తొలగించి కొత్తగూడెంకు చెందిన కనకరాజును ఎన్నుకున్నట్లు ప్రకటిం చారు. అప్పటి నుంచి గుర్తింపు యూనియన్లో రెండు కార్యవర్గాలు కొనసాగుతున్నాయి. దీంతో సమస్యలపై చర్చించేందుకు ఎవరిని పిలవాలనే మీమాంసలో సింగరేణి యాజమాన్యం పడిపోయింది. అయితే ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అనంతరం వరంగ ల్ లోని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (వరంగల్) వద్దకు చేరింది. ఈ క్రమంలో ఆగస్టు 27వ తేదీ న యూనియన్ బైలాస్ ప్రకారం నవంబర్ 30 వ తేదీన ఎన్నికలు నిర్వహించుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ తమకు ఎన్నిక లు నిర్వహించిన అనుభవం లేదని జేసీఎల్ పేర్కొనడంతో డిసెంబర్ 31వ తేదీలోగా తిరిగి ఎన్ని కలు జరపాలని, ఆ బాధ్యతలు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ చూడాలని డిసెంబర్ 3న హైకోర్టు నుంచి తీర్పు వెలువడింది. అయి తే కోర్టు నుంచి తీర్పు ఉత్వర్తు కాపీ డిసెంబర్ 20వ తేదీన ఆర్ఎల్సీకి చేరగా నెలారునాటికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉంద ని, అది సరిపోదని తిరిగి ఆర్ఎల్సీ కోర్టును ఆశ్రయించారు. కాగా, ప్రస్తుతం జనవరి 31వ తేదీలోగా యూనియన్లో ఏర్పడిన నాయకత్వ పోరుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇందులో భాగంగా ఈనెల 21, 27, 28 తేదీల్లో హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో యూనియన్ నాయకులతో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యం లో ఫిబ్రవరి 23వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్లో అంతర్గత నాయకత్వ ఎన్నికలు జరిపిందుకు నిర్ణయాలు తీసుకు న్నారు. ఈ పరిణామం సింగరేణి చరిత్రలోనే మొదటిది కాగా వివిధ కార్మిక సంఘాలు ఆసక్తి గా గమనిస్తున్నాయి. ఇక రేపటి నుంచి మిర్యాల, కెంగెర్ల వర్గీయులు ఎన్నికల్లో గెలుపు కోసం పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అయితే మిర్యాల రాజిరెడ్డికి మద్దతుగా నిలిచిన మం చిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆయన బలనిరూపణ చేసుకోవడానికి మరింత ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. గెలుపుకోసం కెంగెర్ల, మిర్యాల వర్గీయుల ఆరాటం.. టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గీయులు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటినుంచే ఆయా ఏరియాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఫోన్లు చేస్తూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, మిర్యాల రాజిరెడ్డికి మద్దతుగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికల్లో ఆయన బలనిరూపణ చేసుకునేందుకు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో గత ఏడాది కాలంగా రాజుకున్న వర్గపోరు ఈ ఎన్నికలతో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని కార్మికులు సంతోషపడుతున్నారు. -
విద్యావంతులుగా తీర్చిదిద్దండి
గోదావరిఖనిటౌన్, న్యూస్లైన్ : ఆడబిడ్డ పుడుతుం దని తెలుసుకుని భ్రూణహత్యలకు పాల్పడవద్దని, వారిని సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని హైకోర్టు జస్టిస్ బి.చంద్రకుమార్ కోరారు. గోదావరిఖని శారదనగర్లోని ప్రభుత్వ యూనివర్సిటీ పీజీ కళాశాలలో శనివారం ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఉనికిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంచి కోసం సమాజంలోని ప్రతిఒక్కరూ కుటుంబ స్థాయి నుంచే మార్పు తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భారతదేశ సంప్రదాయాలను పాటించకపోవడంతోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. జిల్లా ఆరో అదనపు జడ్జి వెంకటకృష్ణయ్య, మంథని మెజిస్ట్రేట్ కుమారస్వామి, న్యాయవాదులు రవికుమార్, రాజయ్య, ఘంట నారాయణ, అమరేందర్రావు, సంజయ్కుమార్, శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత పాల్గొన్నారు. పౌష్టికాహారం ప్రారంభం స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో హైకోర్టు జస్టిస్ బి.చంద్రకుమార్ పౌష్టిక ఆహారాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావని సూచించారు. అనంతరం నిర్భయ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ సుహాసిని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనోధైర్యంతో ముందుకు సాగాలి కరీంనగర్ అర్బన్ : మహిళలు మనోధైర్యంతో ముందుకుసాగాలని, తద్వారా లక్ష్యాలను సాధించాలని హైకోర్టు జడ్జి బి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ‘మహిళలపై అత్యాచారాలు’ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో మాట్లాడారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. నైపుణ్యం పెంచుకుని మంచి వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. జిల్లా జడ్జి నాగమారుతీ శర్మ మాట్లాడు తూ ప్రతి మనిషిలో మానవత్వం ఉండాలన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాదన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాల భాస్కర్రావు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి
గోదావరిఖని, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ఎడారిగా మారుతుందని సీమాంధ్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం చేపట్టి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపడంలో భాగంగా ఆయన చేపట్టిన ఇందిరమ్మ విజయయాత్ర శనివారం ఆదిలాబాద్ జిల్లా నుంచి గోదావరిఖని వద్ద కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడినుంచి యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీ, పెద్దపల్లి, సుల్తానాబాద్ మీదుగా రాత్రికి కరీంనగర్ చేరుకుంది. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాతోపాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన రోడ్షోలో హన్మంతరావు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటాన్ని సోనియాగాంధీ గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఆమె రుణం తీర్చుకోవాలని కోరారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంకా తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయాలనే కుట్రతో కలిసి ఉండాలని నాటకం ఆడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరపకుండా అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఎక్కడ జన్మించాడో చూసుకోవాలన్నారు. హైదరాబాద్లో పుట్టి, ఇక్కడే చదువుకున్న ఆయన ప్రభుత్వ నిధులను మాత్రం చిత్తూరుకు తరలిస్తున్నాడని, ఇదేం నీతి అని ప్రశ్నించారు. చదువుకున్న వాడని సీఎంను చేస్తే అధిష్టానాన్నే ధిక్కరిస్తూ మోసం చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీ పెద్దల ద్వారా ముఖ్యమంత్రి అయిన కిరణ్ నేడు ఢిల్లీ చాలా దూరం అనడం ఆయన దిగుజారుడుతనాన్ని నిదర్శనమన్నారు. నల్గొండ జిల్లా నుంచి నిజామాబాద్ వరకు పోలీసు రక్షణ కల్పించిన ప్రభుత్వం ఒక్కసారిగా ఆదిలాబాద్ జిల్లా నుంచి తగ్గించివేసిందని, ఇందులో సీఎం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కిరణ్ తెలంగాణాలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్ ఆలోచనా విధానంతోనే నేడు తెలంగాణ కల సాకారమవుతోందన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేసేలా వ్యవహరించినందుకే సీఎం తన నుంచి శాసనసభావ్యవహారాల శాఖను తప్పించాడన్నారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందనే విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. యాత్రలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పీసీసీ ప్రధానకార్యదర్శి కోలేటి దామోదర్, ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్రావు, డీసీసీ చైర్మన్ కొండూరి రవీందర్రావుతోపాటు ఆయా ప్రాంతాల్లోని నాయకులు పాల్గొన్నారు. -
రికార్డుల్లో 90.. ఉన్నది ఇద్దరు..!
గోదావరిఖనిటౌన్, న్యూస్లైన్ : ఉంటున్నది ఇద్దరే విద్యార్థులు.. రికార్డుల్లో మాత్రం 90 మంది నమోదు.. ప్రతి నెలా అదే సంఖ్యలో బిల్లులు తయారు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.. ఇదీ గోదావరిఖనిలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ నిర్వాకం. ఈమెను ఉన్నతాధికారులు వేరే ప్రాంతానికి బదిలీ చేసినా.. కొత్తగా వచ్చిన వార్డెన్కు రికార్డులు అప్పగించకపోవడం గమనార్హం. స్థానిక పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గల ప్ర భుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ అక్రమాలకు నిలయంగా మా రింది. విద్యార్థుల రిజిస్టర్లో 90 మంది ఉన్నట్లు రికార్డులు చెబతున్నా.. వసతి గృహంలో ఉంటుంది మాత్రం కేవలం ఇద్దరే విద్యార్థులు. వార్డెన్ నిర్వాహకంపై పలు ఆరోపణలు రావడంతో జిల్లా అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి మంగళవారం హాస్టల్ను తనిఖీ చేశారు. ఈక్రమంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. హాస్టల్లో రెండేళ్ల క్రితం సుమారు 200 వరకు విద్యార్థులుండేవారు. అయితే వారికి సరిపడా సేవలందించడంలో వార్డెన్ రాణి నిర్లక్ష్యం వహించడం వలన క్రమంగా వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకున్న వార్డెన్ విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ బిల్లులు తీసుకుంటూ వచ్చింది. నెలకు సుమారు రూ.60 వేల వరకు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సా ధారణ బదిలీల్లో భా గంగా ఈమెను ఉన్నతాధికారులు వేరే చోటికి బదిలీ చేశారు. హైదరాబాద్లో పని చేసిన వరుణను ఇక్కడికి పంపారు. ఈ నెల 8న వరుణ విధుల్లో చేరగా.. హాస్టల్ రికార్డులను అందిం చడంలో రాణి నిరాకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వరుణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించి జిల్లా సహాయ సంక్షేమశాఖ అధికారిని విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో హాస్టల్లో జరుగుతున్న పరిణామాలపై ఏఎస్వోడబ్ల్యూ రాజేశ్వరి మంగళవారం తనిఖీ చేశారు. గతంలో పని చేసిన వార్డెన్ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. విద్యార్థుల సంఖ్య తగ్గడం, భోజనంలో నాణ్యత లోపిం చడంతో పాటు పలు ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏఎస్వోడబ్ల్యూ తెలిపారు. లెక్కల్లో అయోమయం విద్యార్థులు హాస్టల్లో లేకున్నా యథావిధిగా 90 మంది ఉన్న ట్లు బిల్లులు మాత్రం పాస్ అవుతున్నాయి. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నెలకు భోజనం కోసం రూ. 750, కాస్మోటిక్స్ పేరుతో మరో రూ.25లను అందిస్తోంది. ఈ లెక్కల ప్రకా రం 90 మంది విద్యార్థులకు నెలకు సుమారు రూ.70 వేల వరకు మేయింటనెన్స్ కింద బిల్లులు అందుతున్నాయి. అయితే విద్యార్థులు లేకున్నా.. ఈ బిల్లులు ఎటు వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి అవకతవకలను పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అయ్యో.. దేవుడా..!
గోదావరిఖని/కమాన్పూర్, న్యూస్లైన్ : బంధువుల ఇంట్లో దశదినకర్మకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. అడ్డంగా వచ్చిన పామును తప్పించబోయి బైక్ బ్రిడ్జి కింద పడగా.. తండ్రి, కుమార్తె మృతి చెందారు. తల్లి, కుమారుడికి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. అంతకుముందు సెల్ఫోన్ ప్రమాద విషయం బంధువులకు తెలిపినా.. సంఘటన స్థలాన్ని గుర్తించడానికి రెండు రోజులు పట్టింది. అప్పటివరకు ఆ తల్లీకొడుకులు శవాల పక్కనే ఉండిపోయారు. కమాన్పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కుందారపు శ్రీనివాస్(38), భార్య శ్రీలత, కుమార్తె దీక్షిత(9), కుమారుడు అజయ్రామ్లతో కలిసి ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో తోడల్లుడి బంధువుల ఇంట్లో దశదినకర్మ కార్యక్రమానికి గురువారం ఉదయం తన ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి అదే రాత్రి 7గంటలకు ఈ నలుగురు రొంపికుంటకు బయలుదేరారు. మందమర్రి సమీపంలోని పాలవాగు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా రహదారిపై పాము అడ్డం వచ్చింది. దీంతో ఆందోళనకు గురై దానిని తప్పించే ప్రయత్నం లో వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇవతలి వైపున్న సిమెంట్ దిమ్మెలకు ఢీకొన్న వాహనం వేగంగా బ్రిడ్జి కిందకు దూసుకుపోయింది. వాహనంపై ఉన్న నలుగురు చెల్లాచెదురుగా పడిపోయారు. శ్రీనివాస్కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ముందు భాగంలో కూర్చు న్న కుమార్తె దీక్షిత(9)కూడా తీవ్ర గాయాలపాలైంది. కొంతసేపటి వరకు నీళ్లు కావాలని ఏ డ్చింది. ప్రమాదంలో నడుము, ఒక కాలు విరి గిపోయి పడిపోయిన తల్లి శ్రీలత కదలలేని స్థితికి చేరింది. కుమారుడు అజయ్రామ్కు కూ డా గాయాలైనప్పటికీ చుట్టూ ఏం జరుగుతుం దో గమనిస్తున్నాడు. సోదరి నీళ్ల కోసం ఏడుస్తుండగా తట్టుకోలేక ఆ ఇసుకలో అటు ఇటు తిరిగినా నీళ్లు దొరకలేదు. ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడ్చిఏడ్చి ఆ రాత్రే కన్నుమూసింది. ఓవైపు భర్త, కుమార్తె కళ్లముందే దుర్మరణం పాలుకాగా, తీవ్ర గాయాలపాలైన కుమారుడిని చూ స్తూ ఆ తల్లి ఏమీ చేయలేక.. బయటకు గొంతుపెగలక లోలోపలే ఏడ్చింది. చివరకు గాయాలపాలైన అజయ్ పాకుతూ చుట్టూ కలియతిరగడంతో పడిపోయిన సెల్ఫోన్ కనిపించింది. వెంటనే మందమర్రిలో ఉంటున్న అమ్మమ్మకు ఫోన్ చేసి ‘మాకు యాక్సిడెంట్ అయ్యింది. మేం బ్రిడ్జి కింద ఉన్నాం..’ అంటూ చేసి సమాచారం అందించాడు. వెంటనే ఆమె తరుఫు బంధువులందరికీ ఈ విషయాన్ని చెప్పడంతో.. వారు శుక్రవారం గోదావరిఖనిలోని బ్రిడ్జి మొదలుకొని మందమర్రి వరకు గల బ్రిడ్జిలన్నింటిని తిరిగారు. గోదావరిఖని వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. చివరకు మంచిర్యా ల పోలీసులను ఆశ్రయించారు. ప్రతి బ్రిడ్జి వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న ఫోన్కు రింగ్ ఇవ్వడంతో మందమర్రి సమీపంలోని పాలవాగు వద్ద శనివారం సాయంత్రం క్షతగాత్రులు కని పించారు. వెంటనే గాయాలపాలైన వారిని చికి త్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక వేళ సెల్ఫోన్ చెడిపోయినా.. ఆ రాత్రి ఏవైనా విషపురుగులు బతికున్న వారిని కాటేసినా ఆ కుటుంబంలో ఒక్కరూ మిగిలేవారు కాదు. ప్రమాదం జరిగిన గురువారం రాత్రి 7గంటల నుంచి.. శనివారం సాయంత్రం వరకు దాదాపు రెండు రోజులపాటు మృతదేహాల పక్కనే తల్లి, కుమారుడు ఉండిపోయారు. శ్రీనివాస్ 15 ఏళ్ల నుంచి రొంపికుంట గ్రామంలో వైద్య సేవలందిస్తూ అందరితో కలివిడిగా ఉండేవాడు. గతంలో గ్రామంలో పాఠశాలను నిర్వహించగా.. దానిని ఇతరులకు అప్పగించాడు. పిల్లలు అజయ్రామ్ 5వ తరగతి, దీక్షిత 4వ తరగతి యైటింక్లయిన్కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో చదువుతున్నారు. శ్రీనివాస్, దీక్షిత మృతి చెందడం, శ్రీలత, అజయ్ తీవ్ర గాయాలపాలు కావడంతో రొంపికుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అవినీతిపై పోరాటం
గోదావరిఖని, న్యూస్లైన్ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ఎర్రజెండా పార్టీలదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూని యన్ 14వ మహాసభల సందర్భంగా గోదావరిఖనిలో ఆదివా రం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం మాఫియా, బస్సుల మాఫియా, ల్యాండ్ మాఫియా తదితర మాఫియాల ఆధ్వర్యంలోనే సమాంతర పరిపాలన సాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేవలం ఉత్సవ విగ్రహంగానే పనిచేస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారిపోయి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ పార్టీ తెలంగాణపై వెనక్కి తగ్గితే పాతాలగంగలో కలిసినట్టేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నేడు బీజేపీతో స్నేహం చేస్తున్నారని, తెలంగాణకు అడ్డుతగులుతూ బిల్లు రాకుండా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో పట్టిన గతే రాష్ట్రంలో పడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎర్రజెండా నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. తెలంగాణకు కిరణే అడ్డంకి తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చించకుండా అడ్డుకుంటున్నది సీఎం కిరణేనని సీపీఐ శాసనసభపక్ష నేత గూండా మల్లేశ్, ఉపనేత కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి సీఎంగా ప్రమాణం చేసిన కిరణ్ మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని సజావుగా నడిపించాలని, సభను అడ్డుకునేవారిని మార్షల్స్తో బయటకు పంపించాలని సూచించారు. సభలో ఎమ్మెల్సీ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీజే చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఓబులేశు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, కళవేణి శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పువ్వాడ నాగేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కోల్బెల్ట్కు నీటి కష్టాలు!
గోదావరిఖని, న్యూస్లైన్ : కోల్బెల్ట్ ప్రజలకు నీటి ముప్పు పొంచి ఉంది. తలాపునే గోదావరి ఉన్నా తాగునీటికి నానా తిప్పలు పడే రోజులు రానున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో నీరు కిందకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అవస్థలు తప్పేలా లేవు. కార్మికుల శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న సింగరేణి యాజమాన్యం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాగునీటికి ఖర్చు చేసేందుకు వెనుకంజ సింగరేణి సంస్థ గోదావరి నది ఒడ్డున గల ఫిల్టర్బెడ్ నుంచి పారిశ్రామిక ప్రాంతానికి నీటిని సరఫరా చేస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో నదిలో ప్రవాహం నిలిచిపోయే పరిస్థితి ఉన్నందున సింగరేణి సంస్థకు ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిం ది. సింగరేణి అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు ఏర్పాటు చేసే పైపులైన్లు, స్టోరేజీ ట్యాంకులు.. తదితర నిర్మాణాల కోసం కన్సల్టెంట్ సంస్థతో సర్వే నివేదికను తయారు చేయించారు. ఈ పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.220 నుంచి రూ.250 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను సింగరేణికి అప్పగించింది. సింగరేణి యాజమాన్యం ఈ ఖర్చుకు వెనకడుగు వేసి ఎల్లంపల్లి నుంచి నీటిని పైపులైన్ల ద్వారా తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తు తం సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులో ఊటగా వచ్చే నీటిని మోటార్ల ద్వారా నదిలోకి వదిలితే ఆ నీరే దిగువప్రాంతానికి ప్రవహిస్తోంది. సింగరేణి ఫిల్టర్బెడ్కు ఎగువ ప్రాంతం లో గోదావరిఖని పట్టణం నుంచి వచ్చే మురుగునీరు వచ్చి నదిలో చేరుతోంది. ఇలా ప్రస్తు తం సింగరేణి నీటిని అందిస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం మట్టి, బొగ్గు వెలికితీయగా తయారైన కందకంలో ప్రతీ వర్షాకాలంలో నదిలో వచ్చే వరద నీటిని నింపాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. నిల్వ చేసిన నీటిని తిరిగి కార్మికుల అవసరాలకు ఉపయోగించుకోవాలని చూస్తోం ది. ఈ ప్రయోగం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా... వర్షాలు కురవక వరద రాకపోతే భవిష్యత్లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎల్లంపల్లికి గేట్లు బిగించడంతో ఇప్పటికే కిందవైపునకు నీటి ప్రవాహం నిలిచి పోయినట్లయింది. పాజెక్టు ప్రారంభించే ముం దు స్థానిక అవసరాలకు నీటిని కేటాయించాల్సిందేనంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన నిర్వహించారు. మామూలు రోజుల్లో నే నీటికి ఇబ్బంది ఏర్పడితే.. వేసవిలో అవస్థలు ఎలా ఉంటాయో ఊహించొచ్చు. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ముందుకు సాగకపోగా... సింగరేణి యాజమాన్యం కూడా పట్టింపులేకుండా వ్యవహరిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి ఇబ్బందుల పరిష్కారానికి సింగరేణి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. -
ఎట్లస్తరో చూస్తం
గోదావరిఖని/రామగుండంరూరల్, న్యూస్లైన్: తలాపునే గోదావరినది పారుతున్నా రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీరు ఎందుకివ్వరని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఉపనేత టి.హరీష్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం ఎలా ప్రారంభిస్తారో చూస్తామని సవాల్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రామగుండం మండల ప్రజలకు తాగు, సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల రాజేందర్, హరీష్రావు మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పారుతున్నా ఆ జిల్లాకు నీరందించకపోవడం వల్ల ప్రజలు బతుకుదెరువు లేక వలసపోతున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాకు నీటిని కేటాయించకపోవడంతో ఫ్లోరైడ్ సమస్యతో బతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రామగుండం మండలంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు ఇవ్వకుండా దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రామగుండంప్రాంతంలోని బొగ్గుగనులు, నీటివనరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇంధనంగా నడిపిస్తున్నా.. ఇక్కడి ప్రజలనే ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు జాగలు త్యాగం చేసిన నిర్వాసితులకే జలవనరులపై పూర్తి హక్కులుంటాయనే విషయాన్ని మరువరాదన్నారు. సీపీడబ్ల్యూ పథకంలో నిధుల కేటాయింపునకు సంబంధించిన డిజైన్ (ఫీజుబిలిటీ రిపోర్టు) రూపొందించి ప్రభుత్వానికి ఖర్చు తగ్గించే పని చేసినప్పటికీ దానిని మంత్రి శ్రీధర్బాబు పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారం శాశ్వతం కాదని, మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అభివృద్దిని అడ్డుకుంటే రామగుండం నియోజకవర్గ ప్రజల దృష్టిలో మంత్రి శాశ్వతంగా శత్రువుగా మారుతారని, అనవసరంగా అధికారులపై ఒత్తిడి తేవద్దని వారు సూచించారు. ఇప్పటికే సింగూరు జలాలను మెదక్కు కాకుండా హైదరాబాద్ మీదుగా ఆంధ్రకు తరలించుకు పోయారని, ప్రస్తుతం ఎల్లంపల్లి జలాలను రూ.4,500 కోట్లతో సుజల స్రవంతి పేరుతో హైదరాబాద్కు తరలించుకుపోయేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల గోడు పట్టించుకోకుండా నీటిని తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పెద్దపల్లి జి.వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగా సీమాంధ్ర మంత్రులు రూ.165 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్నట్లు జీఓఎంలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో జిల్లాలోని ఆరు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురికాగా అందులో ఏడు వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. రూ.63 కోట్లతో 20వేల ఎకరాలకు సాగునీరు, రూ.10లక్షలతో ఎల్కలపల్లిలో వాల్వ్ ద్వారా మరో 3వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. పాక్షికంగా ముంపునకు గురయ్యే కుక్కలగూడూర్ను కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మీదుగా బొట్టు నీటిని హైదరాబాద్కు పోనివ్వమని, పైపులు పగులకొట్టి మానేరు డ్యాం నింపుకుంటామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో సిర్పూర్(టి) ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, పార్టీ నేతలు కోరుకంటి చందర్, బుడిగె శోభ, మాడ నారాయణరెడ్డి, గుంపుల ఓదెలు, సోమారపు అరుణ్కుమార్, దీటి బాలరాజు, పెద్దంపేట శంకర్తోపాటు వివిధ గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మహాధర్నా కొనసాగింది. -
స్నేహితులే.. ప్రాణం తీశారు
ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన ఇప్ప చక్రధర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ఓ అమ్మాయిని ప్రేమించిన ‘పాపానికి’ అతడి నిండు జీవితం బలైంది. తన కుమార్తెను చక్రధర్ ప్రేమించడం ఇష్టం లేని అమ్మాయి తండ్రే కిరాయి హంతకుల చేత అతడి ప్రాణాలు తీయించాడు. డబ్బులకు లొంగిపోయి చక్రధర్ స్నేహితులే దగ్గరుండి అతడిని దారుణంగా హత్యచేయించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ హత్యకేసును పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో శనివారం అరెస్టు చూపించారు. గోదావరిఖని డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి వెల్లడించిన వివరాలు.. గోదావరిఖని, న్యూస్లైన్ : గోదావరిఖని అశోక్నగర్లో నివాసముండే డెల్టా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థను నిర్వహించే వాహెద్బేగ్ కుమార్తె అస్మా ఎన్టీపీసీలోని సచ్దేవ పాఠశాలలో చదివేది. అదే పాఠశాలలో ఎన్టీపీసీ ఆటోనగ ర్లో నివాసముండే ఇప్ప చక్రధర్ ఉరఫ్ కన్నయ్య(22) చదివేవాడు. ఇద్దరు ఒకే తరగతి కాకపోయినప్పటికీ వీరిమధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. చక్రధర్ తండ్రి పెంటయ్య సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించగా, 2011లో ఆయన ఉద్యోగాన్ని కుమారుడికి ఇచ్చారు. చక్రధర్ బెల్లంపల్లిలోని శాంతిగనిలో ఉద్యోగం చేస్తుండగా.. అస్మా గోదావరిఖనిలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. 2012 సెప్టెంబర్ 14న అస్మాను తీసుకుని చక్రధర్ వెళ్లగా ఆమె తండ్రి వాహెద్బేగ్ ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టాడు. అదే నెల 25న చక్రధర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించగా, కొద్ది రోజుల తర్వాత బెయిల్పై వచ్చాడు. 2014 జనవరి 20న ఆస్మా మైనారిటీ తీరుతుండగా ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని వీరిద్దరు నిర్ణయించుకున్నారు. తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడంతో ఇది తండ్రి వాహెద్బేగ్కు నచ్చక వీరికి పెళ్లి అయితే తన పరువు పోతుందని భావించి చక్రధర్ను హత్య చేయించాడు. కిరాయి హంతకులు.. చక్రధర్ను చంపేందుకు వాహెద్బేగ్ ఎన్టీపీసీలో నివాసముండే దాసరి ఆనంద్ సహకారంతో అదే ఏరియాలో ఉండే తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తికి కొంత డబ్బు ముట్టజెప్పాడు. కొద్దిరోజుల తర్వాత తాను ఈ హత్య చేయలేనని మణి చెప్పడంతో వాహెద్బేగ్ ఓ పత్రికలో(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తూ పంచాయితీలు చేస్తున్న సంగెపు రాంచంద్రంను సంప్రదించాడు. ఈ హత్యకు మొత్తం రూ.4లక్షలు సుఫారీ ఇచ్చేందుకు మాట్లాడుకున్నారు. అందులో హత్య చేసిన వారికి రూ.2లక్షలు, పథకం రచించిన వారికి రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ముందుగా చక్రధర్ స్నేహితులైన కంది గాంధీ, కె.విజయ్తకు కొంత డబ్బు ఇచ్చి హత్యకు పురమాయించారు. వీరితో ఆ పని సాధ్యపడకపోవడంతో చక్రధర్ను ప్రాణాలతో అప్పగించాలని కోరగా.. ఆ ఇద్దరు అంగీకరించారు. పథకం ప్రకారం దారుణం.. చక్రధర్ నెల రోజులుగా ఇంటివద్దే ఉంటూ డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. చేతిలో డబ్బులు లేకపోవడంతో సెల్ఫోన్ అమ్మివేయడంతోపాటు బైక్ను అమ్మివేసేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో ఈ నెల 18న చక్రధర్ను విజయ్, గాంధీ గోదావరి ఖని బస్టాండ్ వద్దనున్న మద్యం దుకాణం వద్ద కు తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అతిగా మద్యం తాగించారు. తర్వాత బస్టాండ్ సమీపంలోని చెట్లపొదల్లో చీకటిపడే వరకు మళ్లీ మద్యం తాగించారు. ఈలోగా హత్యా పథకం వ్యూహకర్త రాంచంద్రం బెల్లంపల్లికి చెందిన తన స్నేహితుడైన బండి రాజుకు పనిని అప్పగించాడు. రాజు తన స్నేహితులైన బెల్లంపల్లికే చెందిన గుర్రం అశోక్, సుల్తానాబాద్కు చెందిన చెల్ల రమేష్, అదే మండలం నీరుకుల్లకు చెందిన వనపర్తి సతీష్ను ఫోన్ ద్వారా సంప్రదించి పథకం గురించి చెప్పాడు. వెంటనే వీరంతా ఎన్టీపీసీకి చేరుకున్నారు. చక్రధర్ మ ద్యం మత్తులో ఉండడంతో అతడిని ఆదిలాబా ద్ జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయడానికి పథకం వేశారు. అది సాధ్యం కాకపోవడంతో తిరిగి ఎన్టీపీసీ వద్దనే హత్యకు వ్యూ హం పన్నారు. చక్రధర్ను అక్కడికి తీసుకురావాలని గాంధీ, విజయ్లకు సూచించారు. ఎన్టీపీసీ మార్కెట్ వెనకాల వ్యభిచారం చేస్తూ ఓ జంట ఉందని, వారిని బెదిరించి మనం కూడా ఎంజాయ్ చేద్దామని గాంధీ, విజయ్ తన స్నేహితుడైన చక్రధర్ను నమ్మించారు. రాత్రి 9.30 గంటల సమయంలో అతడిని తీసుకుని మార్కెట్ గోడ వెనుకవైపు తీసుకెళ్లి.. అక్కడున్న బండి రాజు, గుర్రం అశోక్, చెల్ల రమేష్, వనపర్తి సతీష్లకు అప్పగించారు. అక్కడ జంట ఉందని నమ్మించేందుకు వీరిలో ఒకరు అమ్మా యి మాదిరిగా చున్నీ ధరించాడు. అనంతరం అదే చున్నీని చక్రధర్ గొంతుకు బిగించారు. అక్కడే ఏదైనా చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని నమ్మించాలనుకునే క్రమంలో ‘ఏందిరా గాంధీ ఇది... నన్ను చంపొద్దు’ అంటూ చక్రధర్ గట్టిగా అరిచాడు. దీంతో రాజు, సతీష్ కలిసి మరింత గట్టిగా గొంతుకు ఉరివేసి, ఆ తర్వాత కత్తితో గుండెభాగంలో పొడిచి, గొంతుకోశారు. తర్వాత అక్కడున్న సిమెంట్ ఇటుకలతో తలపై మోదారు. చక్రధర్ చనిపోయాడని నిర్ధారించుకుని పరారయ్యారు. తొమ్మిది మంది అరెస్ట్... రిమాండ్ చక్రధర్ హత్యకు వాహెద్బేగ్ సుపారీ (కిరాయి హత్య) మాట్లాడుకోగా, అందులో చక్రధర్ స్నేహితులైన గాంధీ, విజయ్లకు మొదటగా రూ.38 వేలు, తర్వాత రూ.8 వేలు ఇచ్చాడు. ఈ హత్యకు పథకం పన్నిన రాంచంద్రంకు రూ.50 వేలు ఇచ్చాడు. మిగతా డబ్బులను శనివారం ముట్టజెపుతానని చెప్పడంతో నిందితులు గోదావరిఖని ప్రాంతానికి వచ్చారు. వీరిలో వాహెద్బేగ్, ఆనంద్ను ఎన్టీపీసీలో, గాంధీ, విజయ్లను గోదావరిఖని బస్టాండ్ వద్ద, రాజు, సతీష్లను రామగుండం బీ-పవర్హౌస్ వద్ద, రాంచంద్రంను పవర్హౌస్కాలనీలోని అతడి ఇంట్లో అరె స్ట్ చేసినట్లు డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. వీరిలో సుల్తానాబాద్కు చెందిన సతీష్పై ఇరవై దొంగతనం కేసులున్నాయని, ఆనంద్, గాంధీలపై రౌడీషీట్ ఉందని చెప్పారు. నిందితులందరిపై రౌడీషీట్ నమోదు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. చిన్నపాటి డబ్బుకోసమే స్నేహితుడి హత్యకు సహకరించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఈ హత్యకు రాజకీయ రంగుపులిమి పోలీసులను ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నించారని, ఇది సరైంది కాదని అన్నారు. నేరం చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. పది రోజుల్లోనే ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషి చేసిన రామగుండం సీఐ నారాయణ, మంథని ఎస్సై ఉపేందర్, రామగుండం ఎస్సై ఎల్.శ్రీను, కానిస్టేబుళ్లు దుబాసి రమేష్, దేవేందర్, కనకయ్య, హోంగార్డులు శ్రీను, కిష్టయ్యలను డీఎస్పీ అభినందించారు. -
మా బతుకులు ఆగం చేయొద్దు
గోదావరిఖని, న్యూస్లైన్ : ‘సింగరేణి సంస్థకు మా విలువైన భూములిచ్చాం... గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని అనుకున్నాం... మా పిల్లలకు నౌకర్లు వస్తయని ఆశపడ్డాం... కానీ, మా బతుకులను బుగ్గిపాలు చేసే అభివృద్ధి మాత్రం మాకొద్దు...’ అంటూ సింగరేణిపై ప్రభావిత గ్రామాల ప్రజలు మండిపడ్డారు. సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 1, 3 గ్రూపు గని, జీడీకే 2, 2ఏ గ్రూపు గని, జీడీకే 5వ గనికి సంబంధించి గతంలో సేకరించిన స్థలం 1272.44 హెక్టార్ల నుంచి 1356.85 హెక్టార్లకు విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేసేందుకు శుక్రవారం స్థానిక సింగరేణి వొకేషనల్ ట్రెయినింగ్ సెంటర్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏటా బొగ్గు ఉత్పత్తిని 1.154 మిలియన్ టన్నుల నుంచి 1.734 మిలియన్ టన్నులకు పెంచేందుకు దీనిని విస్తరించనున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సింగరేణి ప్రభావిత గ్రామాలైన జనగామ, సుందిళ్ల, ముస్త్యాల, జల్లారం గ్రామాల ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అరుణ్కుమార్ సంధానకర్తగా వ్యవహరించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే వివిధ గ్రామాల ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేయగా కొద్ది సేపటికి జనగామ నుంచి 400 మంది ప్లకార్డులు చేతబూని వేదిక వద్దకు చేరుకున్నారు. ‘మా గ్రామం కింద బొగ్గు తీయొద్దు - మా బతుకులు ఆగం చేయొద్దు’ అంటూ నినాదాలు చేశారు. వీరు సభాస్థలి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన నాయకులను మాత్రం లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంలో కూడా సింగరేణికి వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. 54 ఏళ్ల క్రితం తమ భూములను సింగరేణికి ఇష్టంతో అప్పగించామని, కానీ, ఇప్పుడు ఇచ్చేందుకు తమకు ఎందుకు కష్టం అనిపిస్తోందో కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. గ్రామాల్లో కుంటలు ఎండిపోయాయని, పశువులకు తాగేందుకు నీరు దొరకడం లేదని, చెరువులు పూడికతో నిండిపోయి నీరు ఉండడం లేదని, రోడ్లు నెర్రెలు బారాయని, ఇళ్లకు బీటలు పడ్డాయని గ్రామస్తులు ముక్తకంఠంతో తమ అభిప్రాయం వ్యక్తకీకరించారు. సింగరేణి సంస్థ వల్ల అభివృద్ధి జరిగిందని, అదే సమయంలో తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గామాల్లో ఎంతో అభివృద్ధి చేశామని సింగరేణి గొప్పులు చెప్పుకుంటున్నా... వాస్తవంలో కనిపించడం లేదని విమర్శించారు. ఎక్కడో అభిప్రాయం సేకరించేకంటే గ్రామాల్లోకి వచ్చి సింగరేణి వల్ల ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ను కోరారు. అప్పటిదాకా ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జనగామ, ముస్త్యాల గ్రామాల ప్రజలు ఈ సభను గుర్తించడం లేదని పేర్కొంటూ సభాస్థలి నుంచి నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, ఆర్జీ-1 సీజీఎం సుగుణాకర్రెడ్డితోపాటు వివిధ గ్రామాల ప్రజలు, కార్మిక సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు సభ దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సీఐ శ్రీధర్, ఎస్సైలు, సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీగార్డులు బందోబస్తు నిర్వహించారు. ప్రజాభిప్రాయాన్ని నివేదిస్తాం : ఇన్చార్జి కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రజలు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అరుణ్కుమార్ చెప్పారు. ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రజలు కోరారని, కానీ, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని ఆయన వెల్లడించారు. -
ఎన్టీపీసీలో యువకుడి దారుణహత్య
గోదావరిఖని, న్యూస్లైన్: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ వీక్లీ మార్కెట్ సమీపంలో ఇప్ప చక్రధర్ (22) దారుణహత్యకు గురయ్యాడు. అతిగా మద్యం తాగించి చున్నీతో ఉరిబిగించి... అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆటోనగర్కు చెందిన ఇప్ప పెంటయ్య, కనకమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు... కుమారుడు చక్రధర్ ఉన్నారు. పెంటయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ మూడేళ్ల క్రితం మృతిచెందాడు. అతడి ఉద్యోగం చక్రధర్కు రెండేళ్ల క్రితం వచ్చింది. అప్పటినుంచి బెల్లంపల్లిలోని శాంతిగనిలో బదిలీఫిల్లర్ కార్మికుడిగా పనిచేస్తూ.. మందమర్రిలో క్వార్టర్లో ఉన్నాడు. నెలరోజులుగా సొంతింటి నుంచే రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన చక్రధర్ పొద్దుపోయినా చేరలేదు. దీంతో తల్లి, సోదరి తెలిసిన చోటల్లా వాకబు చేశారు. గురువారం వేకువజామున వీక్లీ మార్కెట్ కోసం నిర్మించిన ప్రహరీ అవతల దారుణహత్యకు గురై కనిపించాడు. గొంతుభాగం, చాతీ ఎడమవైపు, నుదురుభాగంలో కత్తిపోట్లు ఉన్నాయి. హత్య విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. డీఎస్సీ ఉదయ్కుమార్రెడ్డి, రామగుండం సీఐ నారాయణ హత్య జరిగిన తీరును పరిశీలించారు. కరీంనగర్ నుంచి డాగ్స్క్వాడ్, క్లూస్టీంను రప్పించి వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తి సమీపంలోని కాలువలో లభ్యమైంది. ‘ఒక్కగానొక్క కొడుకు పోయిండు.. ఇగ మాకు దిక్కెవ్వరు..’ అంటూ తల్లి కనకమ్మ రోధనలు మిన్నంటాయి. ప్రేమ వ్యవహారమే కారణమా..? చక్రధర్కు గోదావరిఖనిలోని అశోక్నగర్కు చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటామంటూ ఏడాది క్రితం ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆమె మైనర్ కావడంతో ఆమె తండ్రి ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు కింద చక్రధర్ కొద్ది రోజులు జైలుకెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే తరచూ బాలిక నుంచి ఫోన్లు వచ్చేవని మృతుడి తల్లి కనుకమ్మ పేర్కొంది. మందమర్రి నుంచి ఇంటికొచ్చాక చాలాసార్లు ఫోన్లు చేసేదని పోలీసులకు వివరించింది. అమ్మాయి తరఫు వారే తన కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని రోధించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాయిలు విస్తరించి.. బతుకులు కూల్చొద్దు
గోదావరిఖని, న్యూస్లైన్: ప్రజలకు నష్టం కలిగిస్తూ, సంస్కృతిని, బతుకును విధ్వంసం చేస్తూ కింద బొగ్గును వెలికితీయడం సింగరేణికి సరైంది కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆదివారం గోదావరిఖని సమీపంలోని జనగామ గ్రామంలో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1లో భూగర్భ గనులను విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం ఈనెల 20న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న నేపథ్యంలో ఈ బహిరంగసభను నిర్వహించా రు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థపై ఎలాంటి కో పం లేదని, గ్రామాల కింద బొగ్గును వెలికితీసినప్పుడు చేపట్టాల్సిన చర్యలను విస్మరించడం సరికాదన్నారు. 54 ఏళ్ల క్రితం జనగామకు చెం దిన 5వేల ఎకరాల భూమిని తీసుకుని జీడీకె 1,2,2ఏ,3,5వ గనులను ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, గ్రామం లో సింగరేణి అన్ని వసతులు కల్పిస్తుందని ఆశపడ్డారని గుర్తుచేశారు. కానీ సింగరేణి యాజ మాన్యం ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడం తో ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. పస్తుతం భూగర్భ గనుల విస్తరణకు భూములను అప్పగించడానికి గ్రామస్తులు వెనుకడుగు వేయడం సరైనదేనని సమర్థించారు. గ్రామంలో పర్యావరణం దెబ్బతిన్నదని, బావులలో నీరు ఇంకిపోయిందని, గోడలు పగుళ్లు తేలాయని, నష్టపరిహారం తక్కువగా చెల్లించారని, తాగేందుకు నీటివసతి కల్పించలేదని సింగరేణిపై ఆయన మండిపడ్డారు. భూగర్భ గనిలో బొగ్గును వెలికితీసిన తర్వాత ఆ స్థలంలో ఇసుకను నింపుతున్నట్లయితే భూమి ఎందుకు కుంగిపోతున్నదో సింగరేణి అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలో రెండు వందల మందితో మాట్లాడితే వారు విస్తరణకు అంగీకరించారని సింగరేణి చెప్పుకుంటోందని, వారెవరో గ్రామస్తులకు తెలియజేయాలని ఆయన అధికారులను కోరారు. గ్రామస్తులకు భూమితల్లితో ఉన్న అనుబంధాన్ని తెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. భూములు లాక్కుని డబ్బులిచ్చామని యాజమాన్యం చెబుతున్నా.. ఆ డబ్బు నిర్వాసితులకు శాశ్వత ఉపాధిని కల్పించడం లేదని, కొన్ని రోజులకు డబ్బులు ఖర్చయిన తర్వాత నిర్వాసితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణంపై ప్రభావం చూపుతూ.. మనిషి జీవన గమనాన్ని దెబ్బతీసేలా బొగ్గు తీసే విధానానికి సింగరేణి, ప్రభుత్వం స్వస్థిపలకాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించాలని సూచించా రు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వాయి దా వేయాలని సింగరేణి అధికారులను కోరాలని, ఒకవేళ సభ నిర్వహిస్తే తమ బతుకులకు భరోసా ఇవ్వాలని వేదికపై కూర్చున్న అధికారులను ప్రశ్నించాలని గ్రామస్తులకు సూచిం చారు. తెలంగాణ జేఏసీ పక్షాన తాము కూడా హైదరాబాద్లో సింగరేణి సీఎండీని కలిసి ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని కోరుతామన్నారు. -
‘హైపవర్’ సిఫార్సులు అమలు చేయాలి
గోదావరిఖని, న్యూస్లైన్ : హైపవర్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, బొగ్గు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమలో మరో 10 శాతం పెట్టుబడులను ఉపసంహరించడం మానుకోవాలని, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పునరుద్ధరించాలని, రిటైర్డ కార్మికుల పెన్షన్ 40 శాతం పెంచాలని, హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని కోరారు. తొమ్మిదో వేతన ఒప్పందాలలో అమలుకాని అంశాలను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, బోనస్ చట్టంను కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్జీ-1 సీజీఎం సుగుణాకర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వై.యాకయ్య, బుర్ర తిరుపతి, మెండె శ్రీనివాస్, కె.గోవిందరాజులు, ఎస్.మల్లికార్జున్, జి.ఆనందం, వంగ రామన్న, ఎండీ గని, సతీశ్, ఆర్.రవి, సీహెచ్ ఉపేందర్, సంజీవ్, సమ్మయ్య, లక్ష్మీ, అంజలి, వనమ్మ, వెంకటేశ్బాబు, ఎస్కె గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ-2లో.. యైటింక్లయిన్కాలనీ : హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఆర్జీ-2 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్, ప్రైవేట్ కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గంట పాటు ఆందోళన చేపట్టిన అనంతరం జీఎం కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిరుపతి, ఓదెలు సంతోష్, సమ్మయ్య, రవిగౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఖని’మార్కెట్లో అగ్ని ప్రమాదం
గోదావరిఖని, న్యూస్లైన్ : గోదావరిఖని కూరగాయల మార్కెట్లో శనివా రం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం జరిగిం ది. 16 దుకాణాల్లోని సుమారు రూ.22 లక్షల విలువైన కూరగాయలు, మసాలా దినుసులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు, బాధితులు తెలి పిన ప్రకారం.. కొత్త కూరగాయల మార్కెట్లోని ఇబ్రహీమ్, రమేశ్, అమీరోద్దీన్, వెంకటేశ్, యాకూబ్, కన్నం మల్లయ్య, రమాదేవి, దేవేందర్రెడ్డి, దేవేందర్, కేతమ్మ, రాజు, వేణుకు చెందిన 1, 2, 3, 4, 5, 6, 11, 12, 13, 14, 15, 16, డి-1(రెండు), డి-2(రెండు) నెం బర్ గల 16 దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. హోల్సేల్ దుకాణాల వద్దకు వచ్చిన కూరగాయలు దింపుతున్న వ్యాపారులు గమనించి పోలీసు లు, ఫైర్సర్వీస్కు ఫోన్ చేశారు. వారు వెంటనే అక్కడకు చేరుకున్నా అప్పటికే సామగ్రి మొత్తం ఖాళీ బూడిదైంది. ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి మం టలు వ్యాపించగా ఆ వేడికి పైకప్పులు కూలి కిందపడ్డాయి. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే కొందరు దుండగులు కావాలనే దుకాణాలను దహనం చేశారని బాధిత వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కూరగాయల మార్కెట్ సమీపంలో మద్యం దుకాణం ఉందని, అక్కడకు వచ్చే మందుబాబులు ఎవరైనా తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రీలీఫ్ ఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తా : మంత్రి శ్రీధర్బాబు బాధిత వ్యాపారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన మార్కెట్ను పరిశీలించారు. ఇప్పటి వరకు అగ్నిప్రమాద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం ఇవ్వలేదని, అయినా అధికారులతో చర్చించి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయా విభాగాల ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేయడంతోపాటు తక్షణ సహాయం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, కమిషనర్ రవీంద్రను ఆదేశించారు. కాగా ‘మాకు రక్షణ కావాలి’, ‘సానుభూతివద్దు-తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలి’ అని బాధితులు ప్లకార్డులు చేతపట్టుకుని మంత్రి వద్ద తమ నిరసన తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేష న్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ పద్మయ్య, కమిషనర్ ఎస్.రవీంద్ర, డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగ య్య, వివిధ పార్టీల నాయకులు కోలేటి దామోదర్, బాబర్ సలీంపాష, కౌశిక హరి, కోరుకంటి చందర్, పాతిపెల్లి ఎల్లయ్య, రావుల రాజేందర్, నిమ్మకాయల ఏడుకొండలు, రాజేశ్శర్మ, ముప్పిడి సత్యప్రసాద్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
‘స్వగృహం కల
గోదావరిఖని, న్యూస్లైన్: సర్కారు నిర్లక్ష్యం వల్ల రాజీవ్ స్వగృహ పథకం పడకేయడంతో మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోతోంది. రామగుండం మండలం కుందనపల్లి శివారు ఇంధన నిల్వల కేంద్రం ఎదురుగా రాజీవ్ రహదారిని ఆనుకుని 28.08 ఎకరాల విస్తీర్ణంలో స్వగృహ సముదాయ నిర్మానాన్ని 2008లో ప్రారంభించారు. ఈ సముదాయానికి అక్షయ కేంద్రం అని నామకరణం చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఆర్ఎస్సీఎల్) ఆధ్వర్యంలో నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో సొంతిల్లు నిర్మించుకోవడం మధ్య తరగతి ప్రజలకు కష్టసాధ్యంగా మారింది. దీంతో పలువురు ఉద్యోగులు, కార్మికులు, ఇతర వర్గాల వారు స్వగృహ సముదాయంలో నిర్ణీత రుసుము చెల్లించి ఇళ్లు బుక్ చేసుకున్నారు. వివిధ కారణాల వల్ల కొంతమంది వెనక్కు తగ్గగా, మరికొంత మంది విడతల వారీగా పూర్తి సొమ్ము చెల్లించి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదేళ్లు గడస్తున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడం, ప్లాట్లు ఎప్పటిలోగా అప్పగిస్తారో కూడా వెల్లడించకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నగరాలు, పట్టణాల్లో భూమి కొని ఇల్లు నిర్మించుకోలేని వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్సార్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని 2008లో ప్రవేశపెట్టింది. జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ మరణానంతరం పాలకుల నిర్లక్ష్యం వల్ల రామగుండం మినహా మిగిలిన అన్ని చోట్ల ఈ పథకం అటకెక్కింది. ఎన్నటికి పూర్తయ్యేనో..? మొత్తం 176 ఇళ్ల నిర్మాణానికి 2008 నవంబర్ 27న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ భవనాలు నిర్మించే స్థలం ఎగుడుదిగుడుగా ఉండడం, పైన ఎన్టీపీసీకి చెందిన హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళుతుండడంతో చాలామంది ఆసక్తిచూపలేదు. చివరకు 177 మంది ముందుకు రాగా భవన నిర్మాణాలు ప్రారంభించారు. ఆయా శ్రేణులకు నిర్ణయించిన మొత్తాన్ని దశలవారీగా చెల్లించేం దుకు అవకాశమిచ్చారు. అక్షయ కేంద్రం రామగుండం, గోదావరిఖనిలకు దూరంగా ఉండడంతో.. చివరకు 30 మంది మాత్రమే మిగిలారు. వీరిలో 25 మంది లబ్ధిదారులు మొత్తం డబ్బులను చెల్లించగా, ఏడాదిలో భవనాలు అప్పగిస్తామన్నారు. పస్తుతం క్లాసిక్ శ్రేణి భవనాలు నాలుగు, ఇంట్రినిక్స్ శ్రేణి భవనాలు 18తోపాటు బేసిక్, సివిక్ భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతున్నా లబ్ధిదారులకు భవనాలు అందుబాటులోకి రాలేదు. కొన్ని భవనాలకు రంగులు వేసినప్పటికీ వాటిలో అవసరమైన సామగ్రిని పొందుపర్చలేదు. కొన్ని కిటికీలకు ఇంకా అద్దాలను బిగించలేదు. పలు భవనాల లోపలి భాగంలో నిర్ణయించిన మేరకు టైల్స్ను ఏర్పాటు చేయలేదు. అమర్చిన టైల్స్ పలుచోట్ల పగిలిపోయాయి. దూరం నుంచి చూస్తే భవనాలు అందంగా కనిపిస్తున్నప్పటికీ దగ్గరకు వెళ్లి చూస్తే వాటి దుస్థితి కళ్లకు కడుతుంది. సివిక్ శ్రేణి భవనాలను తీసుకోవడానికి ఎక్కువ మంది రాకపోవడంతో వాటికి కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల సర్వే చేసినట్టు సమాచారం. మౌలిక వసతులేవీ? అక్షయ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన దారుణంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం గా ఉంది. ఇటీవల అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మా ణం పూర్తి చేశారు. కానీ భూగర్భంలో పైపులను ఎగుడు దిగుడుగా వేయడంతో వర్షాకాలంలో నీరు బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. తిరిగి డ్రైనేజీ పైపులైన్లను పూర్తిగా పెకిలించి మళ్లీ పైపులైన్లు వేస్తున్నారు. డ్రైనేజీ కుండీలు నిర్మించినా అవి ఎక్కడికక్కడ పగిలిపోయాయి. విద్యుత్ లైన్లు వేసినప్పటికీ రెండుచోట్ల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్కటీ అమర్చలేదు. గోదావరినది నుంచి తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయారు. మూడుచోట్ల బోర్లను మాత్రమే తవ్వించారు. కాలనీకి ఉపయోగపడేలా ట్యాంకు నిర్మాణం చేపట్టలేదు. రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల చెట్లపొదలతో అవి నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీస సౌకర్యాలు లేకుండా తాము ఈ భవనాలలో ఎలా నివసించేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఆర్థిక సమస్యలతో ఆలస్యం -ఎ.కొమురయ్య, డీజీఎం, ఏపీఆర్ఎస్సీఎల్ రాజీవ్ స్వగృహ సంస్థకు కొంత ఆర్థిక సమస్య ఉండడం వల్ల భవన నిర్మాణాలు పూర్తి చేయడంలో ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ సమస్య తీరింది. ఇక చకచకా పనులు చేయిస్తున్నాం. వచ్చే జనవరి నాటికి డబ్బులు చెల్లించిన 25 మంది లబ్ధిదారులకు భవనాలను అప్పగిస్తాం. -
ఆదుకోవాల్సినవారే.. ఆగంజేసిండ్రు
‘నా కొడుకు ఎవలకు అన్యాయం చేసినోడు కాదు. సేవ చేసుడే ముఖ్యమనేటోడు. చిన్నతనంలోనే మంచి పేరు సంపాదించుకున్నడు. అయినా కొందరు గిట్టనోళ్లు నా బిడ్డను పొట్టన పెట్టుకున్నరు. రమేష్ను అన్యాయంగా చంపినోళ్లను, దానికి సహకరించిన పోలీసులను గట్టిగ శిక్షించాలె. అప్పుడే నా కొడుకు ఆత్మకు శాంతి కలుగుతది..’ అని గోదావరిఖనిలో 2010 ఫిబ్రవరి 9న హత్యకు గురైన కానిస్టేబుల్ ఎర్రగోల్ల రమేష్ తల్లి కొమురమ్మ తన మనోగతాన్ని వెల్లగక్కింది. - న్యూస్లైన్, గోదావరిఖని గోదావరిఖని, న్యూస్లైన్ : రమేష్ హత్యకేసులో నిందితులుగా పే ర్కొంటూ నలుగురు పోలీస్ అధికారులు, ఇద్ద రు వైద్యులపై కోర్టులో అనుబంధ చార్జిషీట్ దా ఖలు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘మాకు నలుగురు కొడుకులు. రమేష్ మూడో సంతానం. ఆయనకు 2001లో శ్రీవల్లితో పెళ్లి చేసినం. వారికి ఇద్దరు పిల్లలు. కూతురు హసితాసాచి, కొడుకు సాయికౌషద్. ఇప్పుడు రమేష్ లేకపోవడంతో పిల్లల బతుకు ఆగమైంది. పోలీ సులకు నా కొడుకు ఎంతో నమ్మకంగా పనిచేసిండు. వాళ్లేమో నమ్మించి మోసం చేసిండ్లు. రమేష్ పోయిననాడు కేసును రోడ్డు ప్రమాదంగా మార్చితే పైసలు అత్తయని పోలీసులు చెప్పిండ్లు. ఈ విషయం ఎవలకూ చెప్పద్దన్నరు. డ్యూటీలున్న ఓ పోలీస్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయిండని తెలుసుకోకుండా తోటి పోలీ సులే కేసును పక్కదోవ పట్టిచ్చిండ్లు. మా ఉసు రు వాళ్లకు తప్పక తగులుతది. నా కొడుకు గో దావరిఖనిలో పనిచేయనని అన్నడు. వేరేచోట కు పోయేతందుకు ఏర్పాట్లు చేసుకునే టైంలనే రమేష్ను పొట్టన పెట్టుకున్నరు. పోలీస్ పెద్దసారు (డీఐజీ రవిశంకర్ అయ్యన్నార్) చేయవట్టి పోలీసులపై కేసు పెట్టిండ్లు. ఈ హత్యను రోడ్డు ప్రమాదమని నమ్మించిన పోలీసోళ్లను కోర్టుకు పిలిచి శిక్షలు గట్టిగ వెయ్యాలే. ఇలాంటి పరిస్థితి మరేవరికీ రాకుండా చేయాలే..’ అని కొమురమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటాడుతున్న మనోవేదన రమేష్ హత్యను భార్య శ్రీవల్లి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఇద్దరు పిల్లలతో అన్యోన్యంగా ఉన్న ఆమె.. భర్త హత్యతో మనోవేదన చెందుతోంది. నిత్యం భర్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం పల్స్రేట్ పడిపోయి ఆమె కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతోంది. శ్రీవల్లి మాట్లాడే స్థితిలో లేదని ఆమె బంధువులు తెలిపారు. నాన్న గుర్తుకొస్తున్నాడు.. ‘నాన్న రమేశ్ మమ్మల్ని ఎగ్జిబిషన్కు, సినిమాలకు తీసుకెళ్లేవాడు. బజార్కు వెళ్దామంటే వెంట నే వచ్చేవాడు. బిస్కెట్లు, చాక్లెట్లు కొనితెచ్చేవాడు. ఇప్పుడు మాకు నాన్న లేడు. మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. ఆటపాటలు అన్నీ ఇంటివద్దనే. నాన్న గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుపొస్తుంది’ అంటూ రమేశ్ కుమార్తె ఐదో తరగతి చదువుతున్న హసితాసాచి బోరున ఏడ్చింది. ప్రభుత్వ సహకారం కరువు రమేష్ అసాంఘిక శక్తుల చేతిలో హత్యకు గురయ్యాడని భావించిన రాష్ట్ర పోలీసుశాఖ ఆయనను అమర పోలీస్గా గుర్తించి, అతని కుటుం బానికి జ్ఞాపికను అందజేసింది. 2010 అక్టోబర్ 21న అప్పటి డీజీపీ అరవిందరావు రమేష్ కు టుంబానికి రూ.9లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిం చారు. ఇప్పటివరకు ఆ డబ్బులు వారికి అందలేదు. రమేష్ భార్య శ్రీవల్లికి మొదట కమాన్పూర్ మండలంలోని వెటర్నరీ కార్యాలయంలో అటెండర్ పోస్ట్ ఇచ్చారు. ఆమె డిగ్రీ చదువుకోవడంతో కనీసం జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే ఆ ఫైల్ను పక్కన పడేశారు. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహకారంతో కలెక్టర్ ను, హైదరాబాద్లో ఉన్నతాధికారులను కలవగా ఇటీవల అనుమతి లభించింది. ఫైల్ కదిలే సమయంలోనే సచివాలయంలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. కథ మళ్లీ మొదటికి వచ్చింది. నాటినుంచి నేటి వరకు రమేష్ కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పడంలేదు. కోల్బెల్ట్లో చర్చ రమేశ్ హత్యఘటనలో నలుగురు పోలీస్ పెద్దల పాత్రపై ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం కలిగించింది. కేసు సీఐడీ చేతుల్లోకి వెళ్లి మూడేళ్లు కాగా, కథ కంచికి చేరిందని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలో హోంశాఖ ఆ నలుగురిని విచారించేందుకు సీఐడీకి అనుమతివ్వడంతో డొంక కదిలింది. పస్తుతం విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు హబీబ్ఖాన్, రాజేంద్రప్రసాద్, వెంకటరమణ, విద్యాసాగర్లను, కేసును తారుమారు చేసినట్టుగా భావిస్తున్న ఇద్దరు వైద్యులను నిందితులుగా పేర్కొంటూ కరీంనగర్ కోర్టులో సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయడం కోల్బెల్ట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న బుగ్గల శ్రీనివాస్పై ఇప్పటికే చార్జిషీట్ నమోదయ్యింది. చార్జిషీట్లు పూర్తి కావడంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.