hockey world cup
-
‘ప్రతీ మ్యాచ్ గెలవడమే లక్ష్యం’
భువనేశ్వర్: వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించేందుకు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. లీగ్లో మంచి ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హర్మన్ప్రీత్ అన్నాడు. లీగ్లో భాగంగా శనివారం తొలి పోరులో స్పెయిన్తో భారత్ తలపడుతుంది. అనంతరం ఆదివారం స్పెయిన్తో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 18న, 19న జర్మనీతో 21, 22న ఐర్లాండ్తో... 24, 25న ఇంగ్లండ్తో మ్యాచ్లు ఆడుతుంది. ‘హాకీ ఇండియా లీగ్ నుంచి మా శిక్షణ సాగుతూనే ఉంది. ఫిట్నెస్ కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ప్రొ లీగ్లో అన్నీ మ్యాచ్లు గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని హర్మన్ప్రీత్ అన్నాడు. 2026 ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ‘హాకీ ఇండియా లీగ్ ద్వారా దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వారిని సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్లుగా ఎదుగుతారు. స్పెయిన్ గట్టి ప్రత్యర్థి, వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతాం’అని హర్మన్ప్రీత్ పేర్కొన్నాడు. -
‘కామన్వెల్త్’ నుంచి హాకీ, రెజ్లింగ్ అవుట్!
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో హాకీతోపాటు షూటింగ్, రెజ్లింగ్, క్రికెట్ తదితర పదమూడు క్రీడాంశాలను పక్కన బెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఈ అంశంపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటికి మాత్రం వెల్లడించడం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కాగా 1998 కామన్వెల్త్ గేమ్స్లో హాకీని చేర్చాక ఇప్పటివరకు ఆ క్రీడను కొనసాగించారు.అయితే 2026లో మెగా ఈవెంట్కు ఆతిథ్యమిచ్చే గ్లాస్గో (స్కాట్లాండ్) బడ్జెట్ను తగ్గించుకునే పనిలో భాగంగా హాకీకి మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, వీటిని కుదించాలని గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కేవలం నాలుగు వేదికల్లో కుదించిన క్రీడాంశాలను నిర్వహించడం ద్వారా బడ్జెట్ను చాలా వరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.ఇక 2026 ఏడాదిలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉండగా, రెండు వారాల్లోపే ప్రపంచకప్ హాకీ కూడా ఉండటం కూడా సాకుగా చూపే అవకాశముంది. బెల్జియం, నెదర్లాండ్స్లు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ హాకీ టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. హాకీ ఆటను తొలగించాలనుకుంటున్న వార్తలపై స్పందించిన ఎఫ్ఐహెచ్ త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మంగళవారం క్రీడాంశాల విషయమై ప్రకటన వెలువడుతుందని చెప్పింది. 2022 బరి్మంగ్హామ్ గేమ్స్లో పురుషుల విభాగం ఆస్ట్రేలియా జట్టుకు స్వర్ణం లభించగా... భారత జట్టుకు రజతం దక్కింది. కాగా తొలగించేక్రీడల జాబితాలో హాకీ, క్రికెట్, రగ్బీ సెవన్స్, డైవింగ్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, రోడ్ సైక్లింగ్, మౌంటేన్బైకింగ్, రిథమిక్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్ , టేబుల్ టెన్నిస్/పారా టేబుల్ టెన్నిస్, ట్రైయథ్లాన్/పారాట్రైయథ్లాన్, రెజ్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్కు భారత జట్టు ప్రకటన -
భారత్ X జర్మనీ
కౌలాలంపూర్: జూనియర్ ప్రపంచకప్ హాకీలో చక్కని ప్రదర్శన కనబరిచిన భారత్కు నేడు జరిగే సెమీ ఫైనల్లో జర్మనీతో క్లిష్టమైన పోరు ఎదురు కానుంది. పటిష్టమైన జర్మనీ అడ్డంకిని దాటితే ఇంచుమించు టైటిల్ గెలిచినట్లే! ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జర్మనీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి . గత టోర్నీ రన్నరప్ జర్మనీ ఆరుసార్లు (1982, 85, 89, 93, 2009, 13) టైటిల్ గెలిచింది. మరో రెండుసార్లు (1979, 2021) రన్నరప్గా నిలిచింది. అంతటి ప్రత్యర్థి ని దాటుకొని భారత్ నాలుగో సారి ఫైనల్ చేరడం అంత సులువు కాదు. అయితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్పై ఆడిన తీరు, చేసిన పోరాటం, గెలిచిన వైనం చూస్తే భారత్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేటి జట్టు చేతిలో 0–2తో వెనుకబడిన దశనుంచి భారత్ చివరికొచ్చే సరికి 4–3 గోల్స్ తేడాతో డచ్పై జయభేరి మోగించింది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కార్నర్లు లభించినపుడు... గోల్ కీపర్ మోహిత్తో పాటు రక్షణశ్రేణి చూపించిన సయమస్ఫూర్తి, కనబరిచిన పోరాటం అద్వితీయంగా సాగింది. ఇప్పుడు కూడా ఉత్తమ్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే జర్మనీని కట్టడి చేయగలదు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్తో ఫ్రాన్స్ తలపడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కౌలాలంపూర్లో పూల్ ‘సి’లో శనివారం జరిగిన పోరులో యువ భారత్ జట్టు 10–1తో కెనడాను చిత్తు చేసింది. ఈ విజయంతో తమ పూల్లో రెండో స్థానంలో నిలిచిన భారత్ నాకౌట్కు అర్హత సంపాదించింది. భారత జట్టులో ఆదిత్య అర్జున్ (8వ, 43వ నిమిషాల్లో), రోహిత్ (12వ, 55వ ని.), అమన్దీప్ లక్రా (23వ, 51వ ని.) రెండేసి గోల్స్ సాధించారు. విష్ణుకాంత్ (42వ ని.), రాజిందర్ (42వ ని.), కుష్వాహ సౌరభ్ ఆనంద్ (51వ ని.), ఉత్తమ్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్ను జూడ్ నికోల్సన్ 20వ నిమిషంలో చేశాడు. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్... పూల్ ‘డి’ విజేత నెదర్లాండ్స్తో తలపడుతుంది. -
మళ్లీ ఓడిన భారత మహిళలు
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పూల్ ‘సి’ మ్యాచ్లో బెల్జియం 3–2 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. భారత్ తరఫున అన్ను 47వ, 51వ నిమిషాల్లో గోల్స్ సాధించింది. బెల్జియం తరఫున నోవా ష్రూయెర్స్ (5వ నిమిషం), ఫ్రాన్స్ డి మాట్ (42వ ని.), అస్ట్రిడ్ బొనామి (52వ ని.) గోల్స్ నమోదు చేశారు. తొలి, మూడో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించి ముందుగా బెల్జియం 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో అన్ను రెండు గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే చివర్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను సమర్థంగా ఉపయోగించుకున్న బెల్జియం మ్యాచ్ను సొంతం చేసుకుంది. మరో వైపు మంగళవారం మలేసియాలోని కౌలాలంపూర్లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అదే రోజు జరిగే తొలి మ్యాచ్లో కొరియాతో భారత్ తలపడుతుంది. -
భారత్ 12 – కెనడా 0
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్ను భారత జట్టు భారీ విజయంతో మొదలు పెట్టింది. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్లో భారత్ 12–0 గోల్స్ తేడాతో కెనడాను చిత్తుగా ఓడించింది. చిలీలోని శాంటియాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి 4–0తో ముందంజలో నిలిచిన భారత్ తర్వాతి అర్ధ భాగంలో మరో 8 గోల్స్ కొట్టడం విశేషం. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ ఏకంగా నాలుగు గోల్స్తో (26వ నిమిషం, 41వ ని., 54వ ని., 60వ ని.) చెలరేగగా...దీపిక సోరెంగ్ (34వ నిమిషం, 50వ ని., 54వ ని.), అన్ను (4వ నిమిషం, 6వ ని., 39వ ని.) చెరో మూడు గోల్స్ సాధించారు. దీపి మోనికా టోపో (21వ ని.), నీలమ్ (45వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. తమ తర్వాతి మ్యాచ్లో శుక్రవారం జర్మనీతో భారత్ తలపడుతుంది. -
Hockey WC 2023: ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పూల్ ‘డి’లో భాగంగా నేడు ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్లో స్పెయిన్పై 2–0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో 5–0తో వేల్స్ను ఓడించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మ్యాచ్లో భారత్కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. బెల్జియం భారీ విజయం పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. పూల్ ‘బి’లో భాగంగా దక్షిణ కొరియాతో శనివారం జరిగిన మ్యాచ్లో బెల్జియం 5–0తో గెలుపొందింది. బెల్జియం తరఫున హెండ్రిక్స్ (31వ ని.లో), కాసిన్స్ (43వ ని.లో), ఫ్లోరెంట్ (50వ ని.లో), సెబాస్టియన్ డాకియర్ (52వ ని.లో), ఆర్థర్ స్లూవెర్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఇతర మ్యాచ్ల్లో న్యూజిలాండ్ 3–1తో చిలీపై, నెదర్లాండ్స్ 4–0తో మలేసియాపై, జర్మనీ 3–0తో జపాన్పై విజయం సాధించాయి. -
హాకీ ప్రపంచకప్లో భారత్ బోణీ.. స్పెయిన్పై ఘన విజయం
భువనేశ్వర్ వేదికగా జరగుతోన్న హాకీ ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా స్పెయిన్తో జరిగిన పోరులో 2-0 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే హర్మన్ప్రీత్ సింగ్ సేన అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోను ప్రత్యర్ధి జట్టుకు గోల్ సాధించే అవకాశం భారత డిఫెన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా భారత గోల్ కీపర్ కృష్ణ పాఠక్ అద్భుతమైన డిఫెన్సింగ్ స్కిల్స్ను చూపించాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ తరపున అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలిగోల్ సాధించాడు. అనంతరం హార్దిక్ సింగ్ 26 నిమిషంలో రెండో గోల్ను భారత్కు అందించాడు. ఇక భారత తన తదుపరి మ్యాచ్లో జనవరి 15న ఇంగ్లండ్తో తలపడనుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా ఈ మెగా టోర్నీలో శుభారంభం చేసింది. గ్రూపు-డిలోనే భాగంగా వేల్స్తో జరిగిన మ్యాచ్లో 5-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. చదవండి: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. అడవిలో మృతదేహం! -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్లు భువనేశ్వర్లో, 20 మ్యాచ్లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
వరల్డ్కప్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ. 1 కోటి..!
భువనేశ్వర్: భారత హాకీ జట్టుకు ఇప్పటికే ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిషా ప్రభుత్వం ఆటగాళ్లను ఉత్సాహపరిచే మరో ప్రకటన చేసింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ. 1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల 13నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది. గురువారం రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్...ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. -
2023 sports: ఏడాదంతా ఆడేద్దాం!
వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్ కనువిందు చేయనుంది... అనంతరం మహిళల టి20 ప్రపంచకప్తో ధనాధాన్ ధమాకా కనిపించనుంది... మండే వేసవిలో వినోదం పంచడానికి ఐపీఎల్ టోర్నీ... శీతాకాలంలో వన్డే వరల్డ్కప్.... కేవలం క్రికెట్టే కాదు... పంచ్ పవర్ చాటిచెప్పడానికి ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్... ‘పట్టు’పట్టడానికి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్... ‘రాకెట్’తో రఫ్ఫాడించేందుకు బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ‘రయ్ రయ్’ అంటూ సాగిపోయే ఫార్ములావన్ రేసులు... ఇంకా ఎన్నో... ఎన్నెన్నో టోర్నీలు మనను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం... మీ క్యాలెండర్లోనూ ఈ ఈవెంట్స్ను జత చేయండి... తప్పకుండా చూడండి! అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 16 ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ భారత్లో శ్రీలంక పర్యటన జనవరి 3 నుంచి 15 వరకు 3 టి20లు, 3 వన్డేలు భారత్లో న్యూజిలాండ్ పర్యటన జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు 3 వన్డేలు, 3 టి20లు భారత్లో ఆస్ట్రేలియా పర్యటన ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు 4 టెస్టులు, 3 వన్డేలు ఐపీఎల్ టి20 టోర్నీ ఏప్రిల్–మే వెస్టిండీస్లో భారత్ పర్యటన జూలై–ఆగస్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీ జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు వేదిక: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొత్తం జట్లు: 32 ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 23– అక్టోబర్ 8 ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మొత్తం 23 రేసులు ఉన్నాయి. మార్చి 5న బహ్రెయిన్ గ్రాండ్ప్రితో సీజన్ మొదలవుతుంది. అనంతరం వరుసగా బహ్రెయిన్ (మార్చి 5), సౌదీ అరేబియా (మార్చి 19), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 2), అజర్బైజాన్ (ఏప్రిల్ 30), మయామి (మే 7), ఎమిలియా రొమాగ్నా (మే 21), మొనాకో (మే 28), స్పెయిన్ (జూన్ 4), కెనడా (జూన్ 18), ఆస్ట్రియా (జూలై 2 ),బ్రిటన్ (జూలై 9), హంగేరి (జూలై 23), బెల్జియం (జూలై 30), డచ్ (ఆగస్టు 27), ఇటలీ (సెప్టెంబర్ 3), సింగపూర్ (సెప్టెంబర్ 17), జపాన్ (సెప్టెంబర్ 24), ఖతర్ (అక్టోబర్ 8), యూఎస్ఎ (అక్టోబర్ 22), మెక్సికో (అక్టోబర్ 29), సావోపాలో (నవంబర్ 5), లాస్వేగస్ (నవంబర్ 18) రేసులు జరుగుతాయి. నవంబర్ 26న అబుదాబి గ్రాండ్ప్రితో ఎఫ్1 సీజన్ ముగుస్తుంది. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ వేదిక: భువనేశ్వర్, రూర్కెలా (భారత్) జనవరి 13 నుంచి 29 వరకు మొత్తం జట్లు: 16 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 17 నుంచి 22 వరకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్హామ్ మార్చి 14 నుంచి 19 వరకు సుదిర్మన్ కప్ టోర్నీ వేదిక: సుజౌ (చైనా) మే 14 నుంచి 21 వరకు ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా జూన్ 13 నుంచి 18 వరకు చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: చెంగ్జూ సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ప్రపంచ చాంపియన్షిప్ వేదిక: కోపెన్హాగెన్ (డెన్మార్క్) ఆగస్టు 21 నుంచి 27 వరకు ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు ఆసియా చాంపియన్షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఏప్రిల్ 25 నుంచి 30 వరకు సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో (భారత్) నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ వేదిక: బుడాపెస్ట్ (హంగేరి) ఆగస్టు 19 – 27 పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ వేదిక: భారత్ మొత్తం జట్లు: 10 టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్; జనవరి 16 – 29 ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్; మే 28 – జూన్ 11 వింబుల్డన్ వేదిక: లండన్; జూలై 3 –17 యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 28 –సెప్టెంబర్ 10 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 16 –24 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ వేదిక: న్యూఢిల్లీ మార్చి 15 –31 ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్ వేదిక: తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) మే 1 – 14 –సాక్షి క్రీడావిభాగం -
ప్రపంచకప్ టోర్నీకి భారత హాకీ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే!
Men's Hockey World Cup: ఒడిశాలో వచ్చే నెలలో 13 నుంచి 29 వరకు జరిగే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు స్టార్ డిఫెండర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా... అమిత్ రోహిదాస్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ ‘డి’లో ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్లతో కలిసి భారత జట్టు ఉంది. భారత హాకీ జట్టు: శ్రీజేశ్, కృషన్ పాఠక్ (గోల్కీపర్లు), హర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, సురేందర్, వరుణ్, నీలం సంజీప్ జెస్, మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఆకాశ్దీప్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్. చదవండి: Ranji Trophy: వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఆంధ్ర విజయం IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్.. ఐపీఎల్ వేలం విశేషాలు -
'సొంత గడ్డపై భారత జట్టు ప్రపంచ కప్ గెలుస్తుంది’
న్యూఢిల్లీ: వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే హాకీ ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలుస్తుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ పురుషుల హాకీ టోర్నీ భువనేశ్వర్, రూర్కేలా వేదికలపై జనవరి 13 నుంచి 29 వరకు జరుగనుంది. వరల్డ్ కప్ ట్రోఫీ టూర్లో భాగంగా శుక్రవారం ట్రోఫీ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్ సమరం కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 15 పోటీ జట్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటుంది. భారత్ సన్నాహాలు, సన్నద్ధత చూస్తుంటే మరోసారి ప్రపంచ చాంపియన్ అవుతుందని అనిపిస్తుంది. జట్టు సభ్యులంతా కఠోరంగా శ్రమించారు. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రపంచకప్ మాత్రమే కాదు... పారిస్ ఒలింపిక్స్లోనూ భారత జట్టు సత్తా చాటుతుంది’ అని అన్నారు. ఒకప్పుడు హాకీలో భారత్కు ఘనచరిత్ర ఉంది. చివరి సారిగా భారత్ 47 ఏళ్ల క్రితం కౌలాలంపూర్ (1975)లో జరిగిన ప్రపంచకప్లో విజేతగా నిలిచింది. చదవండి: IND-W vs AUS-W: సిరీస్లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే? -
హాకీ ప్రపంచకప్కు సన్నాహాలు
భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్–2023 టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్చంద్ర మహాపాత్రొ అధ్యక్షతన అనుబంధ విభాగాల ఉన్నత అధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్థానిక లోక్సేవా భవన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యన్, క్రీడా విభాగం కార్యదర్శి ఆర్.వినీల్కృష్ణ, వివిధ విభాగాల ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. కటక్, రౌర్కెలా ప్రాంతాల నుంచి అనుబంధ వర్గాలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వరుసగా రెండోసారి హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో 2018లో తొలిసారి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడాకారులు, క్రీడాభిమానులు, నిర్వాహక వర్గాలు టోర్నమెంట్ నిర్వహణకు ప్రసంశలు కురిపించారని గుర్తుచేశారు. ఈసారి గతంకంటే ఘనంగా ఆద్యంతం విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ దఫా ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల నిర్వహించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియం, రౌర్కెలా ప్రాంతంలో హాకీ పురుష ప్రపంచకప్–2023 టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో ప్రభుత్వం నిర్వహించిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నమెంట్ కావడం క్రీడాలోకంలో జయజయ ధ్వానాలు నేటికి మార్మోగడం అద్భుత విజయంగా వివరించారు. హాకీ ప్రపంచకప్ మ్యాచ్ల కోసం రౌర్కెలా స్టేడియం శరవేగంగా సిద్ధమవుతోందని క్రీడా విభాగం కార్యదర్శి వినీల్కృష్ణ తెలిపారు. -
World Cup 2022: అసలైన మ్యాచ్లలో చేతులెత్తేశారు! జపాన్తో పోరులో..
టెరసా (స్పెయిన్): అసలైన మ్యాచ్ల్లో గెలుపొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు వర్గీకరణ పోటీల్లో వరుస విజయాలు సాధించి ప్రపంచకప్లో తొమ్మిదో స్థానంతో ముగించింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 3–1తో జపాన్పై విజయం సాధించింది. ఫార్వర్డ్ ప్లేయర్ నవ్నీత్ కౌర్ (30వ, 45వ ని.) రెండు ఫీల్డ్ గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. జట్టులో మరో గోల్ను దీప్ గ్రేస్ ఎక్కా పెనాల్టీ కార్నర్ ద్వారా (38వ నిమిషం) సాధించింది. జపాన్ జట్టులో నమోదైన ఏకైక గోల్ను యు అసయ్ 20వ నిమిషంలో చేసింది. జపాన్కు లభించిన పెనాల్టీ కార్నర్ను యు అసయ్ పొరపాటు చేయకుండా గోల్పోస్ట్ లోకి పంపడంతో 1–0తో మ్యాచ్లో పైచేయి సాధించింది. భారత శిబిరంలో ఒత్తిడి నెలకొన్నప్పటికీ మూడో క్వార్టర్లో దీప్ గ్రేస్, నవ్నీత్ గోల్స్తో భారత్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? -
ఎట్టకేలకు ఒక విజయం.. ప్రపంచకప్లో భారత్ బోణీ
థెరస (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. ఇప్పటికే పతకం రేసుకు దూరమైన అమ్మాయిల జట్టు వర్గీకరణ మ్యాచ్లో షూటౌట్లో కెనడాను కంగుతినిపించింది. 9 నుంచి 16 స్థానాల కోసం మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో సవిత పూనియా సేన షూటౌట్లో 3–2తో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. కెప్టెన్ సవిత గోల్పోస్ట్ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్లో భారత్ను గెలిపించింది. షూటౌట్ సహా మ్యాచ్ మొత్తమ్మీద ఆమె ఏకంగా ఆరు గోల్స్ను చాకచక్యంగా అడ్డుకుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన షూటౌట్లో భారత్ తరఫున నవ్నీత్ కౌర్, సోనిక, నేహా గోల్స్ సాధించారు. 11వ నిమిషంలోనే మ్యాడిలైన్ సికో కెనడా తరఫున ఖాతా తెరిచింది. ఆ తర్వాత పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. అయితే రెండు క్వార్టర్లు ముగిసినా గోల్ చేయడంలో వెనుకబడిపోయిన భారత అమ్మాయిలపై ఒత్తిడి పెరిగింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు సువర్ణావకాశం వచ్చింది. కానీ నవ్జ్యోత్ కౌర్ కొట్టిన షాట్ గోల్పోస్ట్ బార్ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. మరోవైపు కెనడా ఫార్వర్డ్ లైన్ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించగా, సవిత అసాధారణ డైవింగ్తో వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఎట్టకేలకు భారత అమ్మాయిలు ఆఖరి క్వార్టర్లో అది కూడా మ్యాచ్ ముగిసే సమయంలో కెనడా గెలుపుదిశను మార్చేశారు. 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్పోస్ట్ దిశగా గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్ రీబౌండ్ కాగా సలిమా టేటే సమయస్ఫూర్తితో గోల్గా మలిచింది. దీంతో స్కోరు 1–1తో సమమై షూటౌట్కు దారితీసింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోరులో భారత్... జపాన్తో తలపడుతుంది. -
ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్
భారీ అంచనాల నడుమ ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆతిధ్య స్పెయిన్తో జరిగిన కీలక మ్యాచ్లో సవిత పూనియా నేతృత్వంలోని టీమిండియా 0-1 తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా కనీసం క్వార్టర్స్కు కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత అమ్మాయిలు చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ] Full-time ESP 1-0 IND 📲 - Watch the games LIVE on https://t.co/igjqkvzwmV in 🇨🇦🇰🇷🇨🇳🇯🇵🇿🇦#HWC2022 #HockeyEquals #ESPvIND pic.twitter.com/SrxzXOiU3J — International Hockey Federation (@FIH_Hockey) July 10, 2022 మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా.. మార్తా సేగు గోల్ చేసి స్పెయిన్ను గెలిపించింది. ఈ విజయంతో స్పెయిన్.. న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో పాటు క్వార్టర్స్కు అర్హత సాధించింది. క్వార్టర్స్ మ్యాచ్లు రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. జులై 16, 17 తేదీల్లో సెమీస్.. 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. చదవండి: Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్ -
కీలకపోరులో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
మహిళల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు నేడు పూల్ ‘బి’లో పటిష్టమైన న్యూజిలాండ్తో కీలక సమరానికి సిద్ధమైంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్ల్లోనూ గోల్కీపర్ సవితా పూనియా కెప్టెన్సీలో భారత్.. ఇంగ్లండ్తో, చైనాతో మ్యాచ్లను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ గెలిస్తే... లేదంటే కనీసం ‘డ్రా’ చేసుకుంటేనే క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉంటాయి. -
Hockey World Cup 2022: భారత్ను ఆదుకున్న వందన కటారియా
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో లీగ్ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. నెదర్లాండ్స్లో చైనా జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్ను భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. చైనా తరఫున జియాలి జెంగ్ (26వ నిమిషంలో) గోల్ చేయగా... 45వ నిమిషంలో వందన కటారియా గోల్తో భారత్ స్కోరును సమం చేసింది. -
Hockey World Cup 2022: చైనాతో భారత్ ఢీ.. ఎప్పుడంటే..?
మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భాగంగా నేడు పూల్ ‘బి’ లో చైనా జట్టుతో భారత్ ఆడనుంది. గోల్కీపర్ సవిత పూనియా నాయకత్వంలోని టీమిండియా చైనాపై గెలిస్తే క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. ఇప్పటివరకు చైనాతో 21 సార్లు తలపడిన భారత్ 11 సార్లు గెలిచి, ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదిసార్లు చైనా నెగ్గింది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్దం
టెరసా (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 17 రోజుల పాటు అమ్మాయిలు స్టిక్స్తో అలరించనున్నారు. స్పెయిన్, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో స్పెయిన్తో కెనడా తలపడుతుంది. భారత అమ్మాయిల జట్టు ఆదివారం తమ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఢీకొంటుంది. డిఫెండింగ్ చాంపియన్, టోర్నీ హాట్ ఫేవరెట్ నెదర్లాండ్స్ మరోసారి హ్యాట్రిక్ టైటిళ్లపై కన్నేసింది. 2014, 2018లో విజేతగా నిలిచిన డచ్ అమ్మాయిలు 1983, 1986, 1990లలో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచారు. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యమవని రీతిలో 8 టైటిల్స్ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. భారత మహిళలు గత టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రపంచకప్లోనూ రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. 48 ఏళ్ల అమ్మాయిల ప్రపంచకప్ హాకీ చరిత్రలో భారత్ మెరుగైన ప్రదర్శన ‘నాలుగో స్థానం’. మెగా ఈవెంట్ ఆరంభమైన 1974లో కాంస్య పతక పోరులో వెస్ట్ జర్మనీ చేతిలో ఓడింది. ఆ తర్వాత మళ్లీ పతక పోటీలో ఏనాడు నిలువలేకపోయింది. 4 పూల్స్... 16 జట్లు... పూల్–ఎ: నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, చిలీ. పూల్–బి: భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనా. పూల్–సి: స్పెయిన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, కెనడా. పూల్–డి: ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, దక్షిణాఫ్రికా. చదవండి: SL-W vs IND-W: శ్రీలంకతో భారత్ తొలి పోరు.. -
రెండో విజయంతో క్వార్టర్స్లోకి భారత్
పాట్చెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. జర్మనీ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘డి’ లీగ్ మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (2వ ని.లో), ముంతాజ్ ఖాన్ (25వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
Hockey Men Junior World Cup: యువ భారత్ జోరు...
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ జూనియర్ హాకీ ప్రపంచకప్లో టైటిల్ నిలబెట్టుకునేందుకు మరో అడుగు ముందుకు వేసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జూనియర్ జట్టు 1–0తో బెల్జియంపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ను శారదానంద్ తివారి సాధించాడు. ఆట 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను శారదానంద్ ఎలాంటి పొరపాటు చేయకుండా నేర్పుగా గోల్పోస్ట్లోకి పంపాడు. దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీన్ని తుదిదాకా కాపాడుకొని విజయం సాధించింది. మ్యాచ్ మొదలవగానే బెల్జియం దూకుడు పెంచింది. పదేపదే భారత రక్షణపంక్తిని ఛేదించుకుంటూ దాడులకు పదునుపెట్టింది. అయితే గోల్కీపర్ పవన్ చక్కని సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాల్ని నీరుగార్చాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో జర్మనీ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్పై, అర్జెంటీనా 2–1 తో నెదర్లాండ్స్పై, ఫ్రాన్స్ 4–0తో మలేసియాపై గెలిచాయి. రేపు జరిగే సెమీఫైనల్స్లో అర్జెంటీనా తో ఫ్రాన్స్; జర్మనీతో భారత్ తలపడతాయి. -
FIH Hockey Junior World Cup: హాకీలో జూనియర్ల సమరం
భువనేశ్వర్: టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్యం సాధించడంతో హాకీ ఆటకు కొత్త కళ వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ల బాటలో మరో పెద్ద విజయాన్ని అందుకునేందుకు జూనియర్లు సన్నద్ధమవుతున్నారు. నేటినుంచి జరిగే జూనియర్ ప్రపంచ కప్ హాకీలో భారత జట్టు ఫేవరెట్గా దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన మన టీమ్తో పాటు మరో 15 జట్లు టోర్నీ బరిలో ఉన్నాయి. 2016 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత్...టైటిల్ను నిలబెట్టుకునేందుకు అస్త్ర శస్త్రాలతో రెడీ అయింది. గ్రూప్ ‘బి’లో నేడు తమ తొలి మ్యాచ్లో ఫ్రాన్స్తో భారత్ తలపడుతుంది. ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన భారత సీనియర్ జట్టులో సభ్యుడిగా ఉన్న వివేక్ సాగర్ ప్రసాద్ టీమిండియాకు సారథిగా వ్యవహరించనున్నాడు. గ్రూప్ ‘బి’లో భారత్, ఫ్రాన్స్లతో పాటు కెనడా, పోలాండ్ జట్లు ఉన్నాయి. 25న కెనడాతో... 27న పోలాండ్తో భారత్∙తన తదుపరి మ్యాచ్లను ఆడనుంది. గ్రూప్లో టాప్–2గా నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ డిసెంబర్ 5న జరగనుంది. కరోనా వల్ల స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. మూడో టైటిల్పై గురి... ఇప్పటికే రెండు సార్లు (2001, 2016లలో) చాంపియన్గా నిలిచిన భారత్ టోర్నీలో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. మ్యాచ్లన్నీ భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరగనుండటం భారత్కు కలిసొచ్చే అవకాశం. కోవిడ్–19 దృష్ట్యా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీకి దూరంగా ఉన్నాయి. అయితే టైటిల్ వేటలో జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ నుంచి మన జట్టుకు పోటీ తప్పకపోవచ్చు. జూనియర్ హాకీ ప్రపంచ కప్ను జర్మనీ అత్యధికంగా ఆరు సార్లు గెల్చుకోవడం విశేషం. ఈ టోర్నీ కోసం టీమిండియా గత కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమిస్తోంది. వెటరన్ ఆటగాడు కరియప్ప టీమ్కు కోచ్గా ఉన్నప్పటికీ... సీనియర్ టీమ్ కోచ్ గ్రాహమ్ రీడ్ యువ టీమిండియాపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. సీనియర్ జట్టుతో మ్యాచ్లను ఆడిస్తూ యువ భారత్ను ప్రపంచ కప్ కోసం సిద్ధం చేశాడు. -
‘దాయాది’ని గెలిచి... ప్రపంచాన్ని జయించి...
హాకీలో మన గతం ఎంతో ఘనం. ప్రత్యేకించి ఒలింపిక్స్లో అయితే భారతే చాంపియన్. ఏ దేశమేగినా... ఎవరెదురైనా... ఎగిరింది మన తిరంగానే. అందుకేనేమో మిగతా జట్లు కసిదీరా ఆడినా పసిడి కోసం మాత్రం కాదు! రజతమో లేదంటే కాంస్యమో వాళ్ల లక్ష్యం అయి ఉండేది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు భారత్దే స్వర్ణయుగం. విశ్వక్రీడల్లో ఇంతటి చరిత్ర ఉన్న భారత్కు ప్రపంచకప్ మాత్రం అంతగా కలసిరాలేదు. 1975లో ఒకసారి మాత్రమే భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా టీమిండియా మళ్లీ ప్రపంచాన్ని గెలవలేకపోయింది. ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ సంబరాలెన్ని ఉన్నా... ప్రపంచకప్లో అంతగా లేవు. ఈ వెలితి తీరేలా... ‘ప్రపంచ’ పుటలకు ఎక్కేలా భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసి మరీ ‘కప్’ కొట్టింది. మలేసియా ఆతిథ్యమిచ్చిన మూడో మెగా ఈవెంట్ ఫైనల్ కౌలాలంపూర్లో జరిగింది. టోర్నీలోని హేమాహేమీ జట్లను ఓడించి భారత్, పాకిస్తాన్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లకిది రెండో ప్రపంచకప్ ఫైనల్. 1971లో స్పెయిన్పై ఫైనల్లో నెగ్గి పాక్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్ సాధించగా... 1973లో నెదర్లాండ్స్తో జరిగిన అంతిమ సమరంలో భారత్ షూటౌట్లో ఓటమి చవిచూసి రన్నరప్గా నిలిచింది. చిరకాల ప్రత్యర్థిని ఓడించడం... ప్రపంచకప్ సాధించడం... ఈ రెండింటిని రెండు కళ్లతో చూస్తే మాత్రం ఒత్తిడంతా భారత్పైనే! మరి టీమిండియా ఏం చేసింది? ఒకేసారి ఇద్దరు ప్రత్యర్థుల్ని (పాక్, ఒత్తిడి) ఎలా జయించింది? పోరు హోరెత్తిందిలా... సరిగ్గా 45 ఏళ్ల క్రితం సంగతి. 1975, మార్చి 15న కౌలాలంపూర్లోని మెర్డెకా ఫుట్బాల్ స్టేడియం (అప్పట్లో ఆస్ట్రోటర్ఫ్పై కాకుండా పచ్చిక మైదానంలో హాకీ మ్యాచ్లను నిర్వహించేవారు). దాయాదుల ‘ప్రపంచ’ యుద్ధానికి వేదిక. సహజంగా మలేసియాలో హాకీకి క్రేజ్ ఎక్కువ. పైగా ప్రపంచకప్ ఫైనల్! అందుకే ఆ రోజు జరిగిన మ్యాచ్కు ప్రేక్షకులు పోటెత్తారు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్ల మేనేజర్లు, ప్రేక్షకులే కాదు క్షణాలు, నిమిషాలు కూడా ఎదురుచూస్తున్నాయి... తొలి పైచేయి ఎవరిదని! ఈ ఎదురుచూపుల్లోనే 16 నిమిషాలు గడిచిపోయాయి. ఆ మరు నిమిషమే భారత రణ శిబిరాన్ని నిరాశపరిచింది. బోణీతో దాయాది దరువేసింది. పాక్ స్ట్రయికర్ మహమ్మద్ జాహిద్ షేక్ (17వ నిమిషంలో) సాధించిన గోల్తో తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత సేనపై మరింత ఒత్తిడి పెరిగింది. ఆట పాక్ ఆధిక్యంతోనే సాగుతూ ఉంది. భారత్ దాడులకు పదును పెట్టినా... ఆ ప్రయత్నాలేవీ ఫలించకుండా 43 నిమిషా ల ఆట ముగిసింది. ఆ తర్వాత నిమిషమే భారత విజయానికి తొలి అడుగు పడేలా చేసింది. డిఫెండర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ సుర్జీత్ సింగ్ (44వ నిమిషంలో) చక్కని ఏకాగ్రతతో గోల్ చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అశోక్... సుర్జీత్ చేసిన ఒకే ఒక్క గోల్తో భారత్ మూడడుగులు ముందుకేసింది. స్కోరు 1–1తో సమమైంది. ఒత్తిడి తగ్గింది. టైటిల్పై కన్ను పడింది. సరిగ్గా ఏడు నిమిషాల వ్యవధిలోనే దీనికి సంబంధించిన సానుకూలత ఫీల్డ్లో కనిపించింది. ఒకప్పుడు భారత హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ ఒలింపిక్స్ స్వర్ణాలను సాకారం చేస్తే... ఈసారి ఆయన తనయుడు అశోక్ కుమార్ (51వ నిమిషంలో) ప్రపంచకప్ టైటిల్ను ఖాయం చేసే గోల్ సాధించి పెట్టాడు. కానీ ఈ గోల్పై పాక్ వివాదం రేపినా... బంతి నిబంధనల ప్రకారం గోల్పోస్ట్లోకి వెళ్లిందని రిఫరీ పాక్ అప్పీల్ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆధిక్యం 2–1కు చేరిన ఈ దశలో భారత్ కట్టుదిట్టంగా ఆడింది. రక్షణ పంక్తి పాక్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిరోధించింది. మిగిలున్న నిమిషాలన్నీ పాక్ను ముంచేయగా... భారత్ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ మురిపెమే... ఇప్పటికీ అపురూపం తొలి ప్రపంచకప్ (1971)లో భారత్ కాంస్యంతో పతకాల బోణీ చేసింది. రెండో ఈవెంట్ (1973)లో రజతం గెలిచింది. మూడో ప్రయత్నంలో పసిడి నెగ్గింది. ఇలా వరుసగా మూడు ప్రపంచకప్లలో 3, 2, 1 స్థానాలకు ఎగబాకిన భారత్ చిత్రంగా... ఆ తర్వాత ప్ర‘గతి’ మార్చుకుంది. పతకానికి దూరమైంది. 1975 మెగా ఈవెంట్ తర్వాత 11 సార్లు ప్రపంచకప్ టోర్నీలు జరిగినా... ఇందులో మూడుసార్లు (1982, 2010, 2018లలో) ఈ మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమిచ్చినా సెమీఫైనల్ చేరలేకపోయింది. -
భారత్లో 2021 జూనియర్ హాకీ ప్రపంచకప్
లుసానే: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ను మరోసారి నిర్వహించే అవకాశం భారత్కు లభించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 2021 జూనియర్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్కు కట్టబెడుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. దాంతో భారత్ రెండోసారి ప్రపంచ కప్ను నిర్వహిస్తోన్న దేశంగా ఘనతకెక్కింది. 2016లో తొలిసారి లక్నో వేదికగా ఈ మెగా ఈవెంట్ను నిర్వహించిన భారత్ విజేతగా నిలిచింది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా... ఇప్పటికే జర్మనీ, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్లు అర్హత సాధించాయి. హోస్ట్ హోదాలో భారత్ కూడా ఈ టోర్నీలో ఆడటం ఖాయమైంది. అయితే ఈ మెగా ఈవెంట్ భారత్లో ఎక్కడ, ఎప్పుడు ఆరంభమవుతుందనే వివరాలను ఎఫ్ఐహెచ్ ప్రకటించాల్సి ఉంది. -
హాకీ మెగా ఈవెంట్ మళ్లీ మనకే
లుసానే (స్విట్జర్లాండ్): భారత్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ హాకీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 2023లో జరిగే పురుషుల మెగా ఈవెంట్ను భారత్ నిర్వహిస్తుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శుక్రవారం వెల్లడించింది. 2023 ఆరంభంలో జనవరి 13 నుంచి 29 వరకు ప్రపంచకప్ పోటీలు జరుగుతాయని ఎఫ్ఐహెచ్ తెలిపింది. వేదిక ఎక్కడనేది ఆతిథ్య దేశమే ప్రకటిస్తుందని ఎఫ్ఐహెచ్ పేర్కొంది. బిడ్డింగ్లో భారత్తో పాటు బెల్జియం, మలేసియా దేశాలు పోటీపడ్డాయి. చివరకు భారతే ఆ అవకాశాన్ని దక్కించుకోవడంతో అత్యధికంగా నాలుగుసార్లు మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వనున్న తొలి దేశంగా ఘనతకెక్కనుంది. గతంలో 1982 (ముంబై), 2010 (న్యూఢిల్లీ), 2018 (భువనేశ్వర్)లలో ప్రపంచకప్ పోటీలు జరిగాయి. నెదర్లాండ్స్ కూడా మూడుసార్లు ఆతిథ్యమిచి్చంది. ఇక్కడ సమావేశమైన ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మహిళల ప్రపంచకప్ ఆతిథ్య వేదికని ఖరారుచేసింది. ఈ ఏడాది బోర్డుకు ఇదే చివరి సమావేశం కాగా ఇందులో మహిళల ఈవెంట్ ఆతిథ్య హక్కుల్ని స్పెయిన్, నెదర్లాండ్స్కు సంయుక్తంగా కట్టబెట్టింది. 2022లో జూలై 1 నుంచి 22 వరకు మహిళల ఈవెంట్ జరుగుతుంది. భారత్కు మరోసారి మెగా ఈవెంట్ భాగ్యం దక్కడం పట్ల హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. 2023 ఏడాదితో భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవనుండటంతో మరింత ఘనంగా ఈవెంట్ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. -
భారత్ ప్రత్యర్థి నెదర్లాండ్స్
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత్తో క్వార్టర్స్లో తలపడేందుకు మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ 5–0తో కెనడాను, బెల్జియం కూడా 5–0 స్కోరుతో పాకిస్తాన్ను చిత్తు చేశాయి. దీంతో పాక్ కథ ముగియగా, బెల్జియం క్వార్టర్స్ చేరింది. కెనడాతో జరిగిన పోరులో నెదర్లాండ్స్ తరఫున తిజ్ వాన్ డామ్ (40, 58వ ని.) రెండు గోల్స్ సాధించగా, లార్స్ బాక్ (16వ ని.), రాబర్ట్ కెంపెర్మన్ (20వ ని.), తిరీ బ్రింగ్మన్ (41వ ని.) తలా ఒక గోల్ చేశారు. పాక్తో జరిగిన మ్యాచ్లో బెల్జియం తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ (10వ ని.), కెప్టెన్ థామస్ బ్రిల్స్ (13వ ని.), సెడ్రిక్ చార్లిర్ (27వ ని.), సెబాస్టిన్ డాకిర్ (35వ ని.), టామ్ బూన్ (53వ ని.) ఒక్కో గోల్ సాధించారు. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్తో భారత్; బెల్జియంతో జర్మనీ తలపడతాయి. -
క్వార్టర్స్లో ఇంగ్లండ్
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. సోమవారం జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 2–0తో న్యూజిలాండ్పై, ఫ్రాన్స్ 1–0తో చైనాపై గెలుపొందాయి. ఇంగ్లండ్ తరఫున విల్ కాల్నన్ (25వ ని.), లూక్ టేలర్ (44వ ని.) ఒక్కో గోల్ చేశారు. మరో క్రాస్ ఓవర్ మ్యాచ్లో చైనాపై గెలిచేందుకు ఫ్రాన్స్ చెమటోడ్చింది. ఈ పోరులో నమోదైన ఏకైక గోల్ను టిమోతీ క్లెమెంట్ (36వ ని.) మూడో క్వార్టర్లో సాధించిపెట్టాడు. ఈ 1–0 ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకున్న ఫ్రాన్స్ మ్యాచ్లో గట్టెక్కింది. మంగళవారం జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్ల్లో బెల్జియంతో పాకిస్తాన్; కెనడాతో నెదర్లాండ్స్ తలపడతాయి. -
భళా... భారత్
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పూల్ ‘సి’లో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 5–1తో కెనడాపై ఘనవిజయం సాధించింది. చివరి క్షణాల్లో చిత్తయ్యే జట్టు రొటీన్కు భిన్నంగా చివరి క్వార్టర్లోనే 4 గోల్స్ చేయడం విశేషం. స్ట్రయికర్ లలిత్ ఉపాధ్యాయ్ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ 7 పాయింట్లతో పూల్ టాపర్గా నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించింది. టీమిండియా తరఫున లలిత్ (47వ ని., 56వ ని.) రెండు గోల్స్ చేయగా, హర్మన్ప్రీత్ సింగ్ (12వ ని.), చింగ్లేసనా సింగ్ (46వ ని.), అమిత్ రోహిదాస్ (51వ ని.) తలా ఒక గోల్తో ఘనవిజయానికి ఊతమిచ్చారు. కెనడా జట్టులో నమోదైన ఏకైక గోల్ను ఫ్లొరిస్ వాన్ సన్ 39వ నిమిషంలో కొట్టాడు. ఆట ఆరంభం నుంచే లలిత్ ఉపాధ్యాయ్ పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. తన దాడులకు పదునుపెట్టాడు. అయితే కెనడా శిబిరం అప్రమత్తంగా ఉండటంతో గోల్ అవకాశం చేజారింది. మొదటి పెనాల్టీ కార్నర్ విఫలమవగా, ఆట 12వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ గోల్గా మలచి భారత్కు శుభారంభాన్నిచ్చాడు. అయితే మరో గోల్ కోసం ఇంకో రెండు క్వార్టర్లు పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక చివరి క్వార్టర్ను భారత ఆటగాళ్లు శాసించారు. కెనడా ఫార్వర్డ్లైన్ను ఓ కంట కనిపెట్టుకుంటూనే ప్రత్యర్థి గోల్పోస్ట్ లక్ష్యంగా కదంతొక్కారు. ఈ క్రమంలో చింగ్లేసనా, లలిత్ వరుసగా 46, 47 నిమిషాల్లో గోల్స్ చేయగా, అమిత్ 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. ఆట ముగిసేదశలో లలిత్ ఉపాధ్యాయ్ రెండో గోల్తో కెనడాను దెబ్బకొట్టాడు. సోమవారం లీగ్ దశ మ్యాచ్లు పూర్తయ్యాకే భారత క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారవుతుంది. అం తా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 12న జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్కు పటిష్టమైన నెదర్లాండ్స్ లేదంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఎదురయ్యే అవకాశముంది. మరో మ్యాచ్లో బెల్జియం 5–1తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. పూల్ ‘సి’ నుంచి బెల్జియం, కెనడా జట్లు క్రాస్ ఓవర్ మ్యాచ్లకు అర్హత సాధించాయి. ఆదివారం జరిగే మ్యాచ్ల్లో మలేసియాతో జర్మనీ, పాకిస్తాన్తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
ఆసీస్ అదుర్స్...
ఆస్ట్రేలియా హాకీ జట్టు వరుసగా మూడోసారి ప్రపంచకప్ను సాధించేందుకు అజేయంగా దూసుకెళుతోంది. పూల్ ‘బి’లో శుక్రవారం జరిగిన పోరులో కంగారూ జట్టు 11–0తో చైనాపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్ల్ని గెలిచి లీగ్ దశను ముగించింది. ఆట మొదలైన పది నిమిషాలకే ఆసీస్ ధాటికి చైనా చేతులెత్తేసింది. బ్లేక్ గోవర్స్ (10వ, 19వ, 34వ ని.) హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగాడు. టిమ్ బ్రాండ్ (33వ, 55వ ని.) రెండు గోల్స్ చేయగా, జలెస్కీ (15వ ని.), క్రెయిగ్ (16వ ని.), హేవర్డ్ (22వ ని.), వెటన్ (29వ ని.), వొదెర్స్పూన్ (38వ ని.), ఫ్లిన్ ఒగిలివ్ (49వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఆసీస్కు మెగా టోర్నీలో ఏకపక్ష విజయం కొత్తేం కాదు. 2010 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా 12–0తో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. మరోవైపు ఈ పూల్ నుంచి చిత్రంగా చైనాను అదృష్టం ముందుకునెట్టింది. ఆసీస్తో ఘోరంగా ఓడినా కూడా చైనా క్వార్టర్స్ దారిలో క్రాస్ ఓవర్ నాకౌట్ మ్యాచ్కు అర్హత సాధించింది. ఇదే పూల్లో ఇంగ్లండ్ చేతిలో ఐర్లాండ్ 2–3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు జట్లతో డ్రా చేసుకోవడంతో చైనా పూల్ నుంచి మూడో జట్టుగా నాకౌట్కు అర్హత పొందింది. 10న జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్ల్లో ఫ్రాన్స్తో చైనా, న్యూజిలాండ్తో ఇంగ్లండ్ తలపడతాయి. -
క్వార్టర్స్లో అర్జెంటీనా
భువనేశ్వర్: రియో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనా హాకీ ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అర్జెంటీనా 3–5 గోల్స్ తేడాతో 20వ ర్యాంకర్ ఫ్రాన్స్ చేతిలో ఓడినా పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో నేరుగా క్వార్టర్స్ చేరింది. ఈ మ్యాచ్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఫ్రాన్స్ క్రాస్ ఓవర్ గేమ్కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు ఆచితూచి ఆడినా... రెండో క్వార్టర్లో దూకుడు పెంచిన ఫ్రాన్స్ ఐదు గోల్స్తో దుమ్మురేపింది. గెనెస్టాట్ హ్యూగో (18వ నిమిషంలో), చార్లెట్ విక్టర్ (23వ నిమిషంలో), కాయిస్ అరిస్టిడ్ (26వ నిమిషంలో), బూమ్గార్టెన్ గాస్పర్డ్ (30వ నిమిషంలో), ఫ్రాన్సిస్ గోయెట్ (54వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు. అర్జెంటీనా తరఫున గొన్జాలో (44వ, 48వ నిమిషాల్లో) రెండు, మార్టినెజ్ లుకాస్ (28వ నిమిషంలో) ఒక గోల్ సాధించిన తమ జట్టును గెలిపించలేకపోయారు. స్పెయిన్, న్యూజిలాండ్ మ్యాచ్ ‘డ్రా’ స్పెయిన్, న్యూజిలాండ్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. స్పెయిన్ తరఫున అల్బర్ట్ బెల్ట్రాన్ (9వ నిమిషంలో), అల్వారో ఇగ్లేసియాస్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... న్యూజిలాండ్ తరఫున ఫిలిప్స్ (50వ నిమిషంలో), కేన్ రసెల్ (56వ నిమిషంలో) గోల్స్ చేశారు. పూల్ ‘ఎ’లో లీగ్ మ్యాచ్లు పూర్తి కావడంతో అగ్రస్థానంలో నిలిచిన అర్జెంటీనా (6 పాయింట్లు) నేరుగా క్వార్టర్స్ చేరగా... రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఫ్రాన్స్ (4 పాయింట్లు), న్యూజిలాండ్ (4 పాయింట్లు) క్రాస్ ఓవర్ గేమ్కు అర్హత సాధించాయి. -
నెదర్లాండ్స్కు జర్మనీ ఝలక్
భువనేశ్వర్: రెండు మాజీ చాంపియన్స్ జట్లు జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు ఏకపక్షంగా ముగిసింది. ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్కు చేరువైంది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్తో జరిగిన పూల్ ‘డి’ మ్యాచ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ జర్మనీ 4–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి క్వార్టర్లోని 13వ నిమిషంలో వాలెంటిన్ వెర్గా గోల్తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండో క్వార్టర్లోని 30వ నిమిషంలో మథియాస్ ముల్లర్ గోల్తో జర్మనీ 1–1తో స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్లో రెండు జట్లు గోల్స్ చేయలేదు. ఇక చివరిదైన నాలుగో క్వార్టర్లో జర్మనీ చెలరేగింది. ఆరు నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి నెదర్లాండ్స్కు షాక్ ఇచ్చింది. 52వ నిమిషంలో విండ్ఫెడర్... 54వ నిమిషంలో మార్కో మిల్ట్కౌ... 58వ నిమిషంలో క్రిస్టోఫర్ ఒక్కో గోల్ చేసి జర్మనీ విజయాన్ని ఖాయం చేశారు. చివరిసారి 2002 ప్రపంచకప్లో నెదర్లాండ్స్ను ఓడించిన తర్వాత ఆ జట్టుపై జర్మనీ మళ్లీ నెగ్గడం ఇదే తొలిసారి. 2006, 2010 ప్రపంచకప్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ‘డ్రా’గా ముగి యగా... 2014 ప్రపంచకప్లో జర్మనీపై నెదర్లాండ్స్ 1–0తో గెలిచింది. పాక్, మలేసియా మ్యాచ్ ‘డ్రా’ పూల్ ‘డి’లోని మరో మ్యాచ్లో నాలుగుసార్లు చాంపియన్ పాకిస్తాన్ ‘డ్రా’తో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్లో 0–1తో జర్మనీ చేతిలో ఓడిన పాక్... మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. పాక్ తరఫున అతీక్ మొహమ్మద్ (51వ నిమిషంలో), మలేసియా తరఫున ఫైజల్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. గురువారం జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్ల్లో న్యూజిలాండ్తో స్పెయిన్; ఫ్రాన్స్తో అర్జెంటీనా తలపడతాయి. -
భారత్కు ‘డ్రా’నందం
భారత్ బాగా ఆడింది. తమకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న బెల్జియం జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. కానీ చివరి నిమిషాల్లో తడబడే అలవాటు ఆతిథ్య జట్టును మళ్లీ వెంటాడింది. తుదకు గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది. భువనేశ్వర్ ప్రపంచకప్ హాకీలో భారత్ మరో స్ఫూర్తిదాయక పోరాటం చేసింది. రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియం జట్టును నిలువరించింది. పూల్ ‘సి’లో భాగంగా ఆదివారం భారత్, బెల్జియం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభంలో తడబడినప్పటికీ మ్యాచ్ జరిగేకొద్దీ ఆతిథ్య జట్టు ఆటగాళ్లు పుంజుకున్నారు. ఒక దశలో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను కంగుతినిపించే స్థితిలో నిలిచింది. అయితే చివరి క్షణాల్లో గోల్స్ సమర్పించుకొనే అలవాటును భారత్ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టులో హర్మన్ప్రీత్ సింగ్ (39వ ని.లో), సిమ్రన్జీత్ సింగ్ (47వ ని.లో) చెరో గోల్ చేయగా, బెల్జియం తరఫున హెన్డ్రిక్స్ (8వ ని.లో), సైమన్ గోనర్డ్ (56వ ని.లో) గోల్స్ సాధించారు. ఆఖరి నిమిషాల్లో భారత డిఫెన్స్ కాస్త డీలా పడటంతో ఇదే అదనుగా భావించిన సైమన్ బెల్జియంను ఓటమి నుంచి తప్పించాడు. ఫలితం ‘డ్రా’ అయినా... ఈ పూల్లో భారతే అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో 5–0తో గెలుపు, గోల్స్ పరంగా బెల్జియం కంటే భారత్నే ముందువరుసలో నిలబెట్టింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియం తొలి మ్యాచ్లో (2–1తో) కెనడాను ఓడించినా... గోల్స్ రేట్లో భారతే ఎంతో ముందుంది. ఈ పూల్లో ఇరుజట్లకు ఇక ఒకే మ్యాచ్ మిగిలుంది. ఈ నెల 8న జరిగే మ్యాచ్ల్లో కెనడాతో భారత్, దక్షిణాఫ్రికాతో బెల్జియం తలపడతాయి. ఇవి ముగిశాక తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్కు చేరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అగ్రస్థానంలోనే ఉంటే నేరుగా క్వార్టర్స్ చేరుకుంటుంది. కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా... ఇదే పూల్లో కెనడా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’ అయింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కడంతో రెండు క్వార్టర్లు గోల్ లేకుండానే ముగిశాయి. మూడో క్వార్టర్ చివర్లో దక్షిణాఫ్రికా తరఫున ఎన్కొబిలి ఎన్తులి (43వ ని.) గోల్ చేయగా, రెండు నిమిషాల వ్యవధిలోనే కెనడా కెప్టెన్ స్కాట్ టపర్ (45వ ని.) గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో స్పెయిన్తో ఫ్రాన్స్; న్యూజిలాండ్తో అర్జెంటీనా తలపడతాయి. మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
మన సత్తాకు పరీక్ష!
భువనేశ్వర్: ప్రపంచకప్ను ఘనమైన విజయంతో ఆరంభించిన భారత హాకీ జట్టు పటిష్టమైన బెల్జియంను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను ఓడిస్తే టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెడుతుంది. బుధవారం తొలి మ్యాచ్లో భారత్ 5–0తో దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ఇకపైనా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆ మ్యాచ్లో భారత్ అటాకింగ్లో అదరగొట్టింది. ఫార్వర్డ్లో మన్దీప్ సింగ్, సిమ్రన్జిత్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ మ్యాచ్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ స్ట్రయికర్లంతా ఫామ్లో ఉన్నారు. మన్ప్రీత్ సింగ్ మిడ్ఫీల్డ్లో రాణించాడు. అయితే డిఫెండర్లు హర్మన్ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా, సురేందర్ కుమార్లు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ పంక్తితో పాటు గోల్ కీపర్ పి.ఆర్.శ్రీజేశ్ కూడా పెట్టని గోడలా ఉంటేనే పటిష్టమైన బెల్జియంను భారత్ను నిలువరించగలదు. లేదంటే ఘనవిజయం వెంటే పరాజయం వెక్కిరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారత్కు నిలకడే అసలు సమస్య! ఒక మ్యాచ్లో చెలరేగి... మరుసటి మ్యాచ్లో అలసత్వం ప్రదర్శించడం రివాజే. పైగా ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్కు బెల్జియంతో పేలవమైన రికార్డుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఇరు జట్లు 19 సార్లు తలపడితే భారత్ ఐది మ్యాచ్ల్లోనే గెలిచింది. బెల్జియం మాత్రం 13 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చివరిసారిగా నెదర్లాండ్స్లో ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో తలపడగా... ‘డ్రా’ ఫలితం ఎదురైంది. మరోవైపు రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియం తక్కువ ర్యాంకులో ఉన్న కెనడాపై 2–1తో చెమటోడ్చి గెలిచింది. అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను బెల్జియం ఆటగాళ్లు గోల్స్గా మలచడంలో విఫలమయ్యారు. దీంతో ఓ కూన జట్టుపై పోరాడి గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఒక మ్యాచ్తో, ఒక్క ఫలితంతో ప్రపంచ టాప్–3 జట్టును తక్కువ అంచనా వేయలేం. ఆతిథ్య దేశంపై గెలిచే సత్తా బెల్జియంకు ఉంది. ఫార్వర్డ్, డిఫెన్స్ అందరూ ఒక్క సారిగా కదంతొక్కితే భారత్కు కష్టాలు తప్పవు. ప్రపంచకప్లాంటి మెగా టోర్నీలో ఏ ఒక్క పొరపాటైనా మూల్యం భారీగానే ఉంటుంది. కాబట్టి ఇరుజట్లు కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడాలి. గత మ్యాచ్లో పెనాల్టీ కార్నర్లతో అనుభవమైన బెల్జియంకు భారత్తో ఎలా ఆడాలో తెలుసు. తప్ప కుండా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. పాక్ పరాజయం ప్రపంచకప్ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభారంభం దక్కలేదు. పూల్ ‘డి’లో భాగంగా జర్మనీతో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 0–1తో ఓడిపోయింది. జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్ను మార్కో మిల్ట్కౌ 36వ నిమిషంలో చేశాడు. ఇదే పూల్లోని మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ 7–0తో మలేసియాను చిత్తుగా ఓడించింది. నెదర్లాండ్స్ తరఫున జెరోన్ హెర్ట్బెర్గర్ ‘హ్యాట్రిక్’ సాధించగా... మిర్కో ప్రుసెర్, మింక్ వాన్ డెర్ వీర్డెన్, రాబర్ట్ కెంపర్మన్, బ్రింక్మన్ ఒక్కో గోల్ సాధించారు. ►రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఆస్ట్రేలియా శుభారంభం
భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పూల్ ‘బి’లో భాగంగా శుక్రవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 2–1తో ఐర్లాండ్పై కష్టపడి నెగ్గింది. గత రెండు వరల్డ్కప్ (2010, 2014)లను చేజిక్కించుకొని ‘హ్యాట్రిక్’పై కన్నేసిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభ మ్యాచ్లో గట్టి పోటీ ఎదురైంది. ప్రపంచ నంబర్వన్ ఆసీస్కు పదో ర్యాంకర్ ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. దూకుడైన అటాకింగ్తో పాటు దుర్బేధ్యమైన డిఫెన్స్తో ఒక పట్టాన కొరుకుడు పడలేదు. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్ (11వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (34వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... ఐర్లాండ్ తరఫున షేన్ ఒడోనోగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు 6 పెనాల్టీ కార్నర్లు లభించగా వాటిలో కేవలం ఒక్కదాన్నే గోల్గా మలచగలిగింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఐర్లాండ్ తొలిగోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. 11వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను బ్లేక్ గోవర్స్ గోల్గా మలిచి ఆసీస్కు 1–0తో ఆధిక్యం అందించాడు. మరో రెండు నిమిషాల్లో షేన్ గోల్తో ఐర్లాండ్ స్కోరు సమం చేసింది. ఈ దశలో ఆసీస్ దూకుడైన ఆట తీరుతో పదే పదే ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులకు దిగింది. వాటిని ఐర్లాండ్ రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్లో టీమ్ బ్రాండ్ గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆసీస్ చివరివరకు దాన్ని నిలుపుకొని విజయం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్, చైనాల మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలిసారి ప్రపంచకప్లో దిగిన చైనా చక్కటి ఆటతో ఆకట్టుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2తో నిలిచాయి. ఇంగ్లండ్ తరఫున గ్లెగోర్న్ మార్క్ (14వ ని.లో), అన్సెల్ లియామ్ (48వ ని.లో) గోల్స్ చేయగా... చైనా తరఫున గుయో జియోపింగ్ (5వ ని.లో), దు టలాకే (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రపంచకప్లో నేడు నెదర్లాండ్స్ (VS) మలేసియా జర్మనీ (VS) పాకిస్తాన్ -
భారత్... పాంచ్ పటాకా
ఎప్పుడో 43 ఏళ్ల క్రితం అందుకున్న ప్రపంచ కప్ను ఈసారి సొంతగడ్డపై తప్పకుండా సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు అందుకుతగ్గ ప్రదర్శనతో బోణీ చేసింది. గోల్స్ మీద గోల్స్ కొడుతూ... ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ... సాధికార ఆటతో గోల్ పోస్ట్పై పదేపదే దాడులకు దిగి ప్రత్యర్థిని చిత్తు చేసింది. పలు పెనాల్టీ కార్నర్లు చేజారినా పట్టు జారకుండా చూసుకుంటూ జయభేరి మోగించింది. భువనేశ్వర్: హాకీ ప్రపంచ కప్ వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. పూల్ ‘సి’లో భాగంగా బుధవారం ఇక్కడి కళింగ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. అద్భుత గోల్తో మ్యాచ్ మొదట్లోనే ఫార్వర్డ్ మన్దీప్ సింగ్ (10వ నిమిషంలో) అందించిన ఆధిక్యాన్ని ఆ వెంటనే ఆకాశ్దీప్ సింగ్ (12వ నిమిషంలో) మరింత పెంచగా... ఆ తర్వాత మిడ్ ఫీల్డర్ సిమ్రన్జిత్ సింగ్ (43వ, 46వ నిమిషాల్లో), లలిత్ ఉపాధ్యాయ్ (45వ నిమిషంలో) జట్టు స్కోరును ప్రత్యర్థికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లారు. భారత్ జోరు ముందు అచేతనంగా మారిపోయిన సఫారీలు కనీసం ఖాతా తెరవలేకపోయారు. భారత్ తదుపరి మ్యాచ్ను డిసెంబర్ 2న బెల్జియంతో ఆడుతుంది. ఆసాంతం ఆధిక్యం... కెప్టెన్ మన్ప్రీత్ సింగ్... బాక్స్ ఏరియా లోపల మన్దీప్కు చక్కటి పాస్ను అందించడంతో మ్యాచ్ మూడో నిమిషంలోనే భారత్కు గోల్ అవకాశం దక్కింది. మన్దీప్ దీనిని చేజార్చినా... 10వ నిమిషంలో స్కోరు చేశాడు. భారత ఆటగాళ్ల డ్రాగ్ఫ్లిక్ను దక్షిణాఫ్రికా కీపర్ రసీ పీటర్స్ అడ్డుకోగా, వెనక్కు వచ్చిన బంతిని మన్దీప్ సమయస్ఫూర్తితో నెట్లోకి కొట్టాడు. మరో రెండు నిమిషాల్లోనే సిమ్రన్జిత్ పాస్ను ఆకాశ్దీప్ గోల్గా మలిచాడు. 19వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ విఫలం కాకుంటే ఆధిక్యం మరింత పెరిగేదే. తొలి రెండు భాగాలు సఫారీ రక్షణ శ్రేణిపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన టీమిండియా... మూడో భాగంలో మరింత దూకుడుగా కనిపించింది. ఫలితంగా నాలుగు నిమిషాల వ్యవధిలో మూడు ఫీల్డ్ గోల్స్ నమోదయ్యాయి. వీటిలో రెండు సిమ్రన్జిత్ చేయడం విశేషం. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాకు రెండుసార్లు గోల్ అవకాశాలు వచ్చినా భారత గోల్ కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. అప్పటికే భారీ ఆధిక్యంలో ఉన్న భారత్ విజయం ఖాయమైంది. కెనడాపై బెల్జియం గెలుపు... ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో మూడో ర్యాంకర్ బెల్జియం 2–1తో కెనడాను ఓడించింది. బెల్జియం తరఫున ఫెలిక్స్ డినయిర్ (3వ నిమిషంలో), కెప్టెన్ థామస్ బ్రీల్స్ (22వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పెనాల్టీ కార్నర్ను నెట్లోకి పంపి మార్క్ పియర్సన్ (48వ నిమిషంలో) కెనడా ఖాతా తెరిచాడు. మరే ఆటగాడి నుంచి అతడికి సహకారం అందకపోవడంతో జట్టు ఓటమి పాలైంది. ప్రపంచకప్లో నేడు అర్జెంటీనా(vs)స్పెయిన్ సా.గం. 5 నుంచి న్యూజిలాండ్(vs) ఫ్రాన్స్ రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
టీమిండియా ఆరంభం అదుర్స్
భువనేశ్వర్: స్వదేశంలో జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచకప్ 2018లో భాగంగా తొలి మ్యాచ్లోనే టీమిండియా అదరగొట్టింది. మన్ప్రీత్ సింగ్ సేన 5-0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టీమిండియా జోరును సఫారీ జట్టు ఆటగాళ్లు అడ్డుకోలేక చేతులెత్తేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ మన్దీప్ సింగ్ టీమిండియాకు తొలి గోల్ అందించాడు. మన్దీప్ ఇచ్చిన షాక్ నుంచి సఫారీ జట్టు కోలుకోకముందే ఆకాశ్ దీప్ కోలుకోని దెబ్బ కొట్టాడు. 12వ నిమిషంలో మరో గోల్ కొట్టి టీమిండియా ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అయితే సిమ్రన్జిత్ సింగ్ (43 ని, 46 ని) రెండు గోల్స్ సాధించి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చివర్లో లలిత్ ఉపాధ్యాయ్ మరో గోల్ సాధించడంతో టీమిండియా 5-0తో నిలిచింది. ఆట చివరి వరకు ఇరు జట్లు మరో గోల్ కూడా నమోదు చేయలేదు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది. పూల్ సిలో భాగంగా డిసెంబర్2 న బెల్జియంతో టీమిండియా రెండో మ్యాచ్లో తలపడనుంది. -
విజయీభవ!
భువనేశ్వర్: నాలుగున్నర దశాబ్దాల టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న భారత హాకీ జట్టు భారీ విజయంతో బోణీ చేయాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచ 15వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో నేడు జరిగే పూల్ ‘సి’ లీగ్ మ్యాచ్తో టీమిండియా తమ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. రెండేళ్ల క్రితం స్వదేశంలో కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జూనియర్ వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ప్రస్తుత సీనియర్ జట్టులో ఉన్నారు. రూపిందర్ పాల్ సింగ్, సునీల్లాంటి పలువురు సీనియర్ ఆటగాళ్లను కాదని జూనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని కోచ్ హరేంద్ర సింగ్ సమర్థించుకున్నారు. ‘18 ఏళ్లు దాటిన వారికి వివాహం చేసుకున్నే హక్కు మన రాజ్యాంగం కల్పిస్తోంది. అలా అనుకుంటే ప్రస్తుత భారత జట్టు జూనియర్ జట్టేంకాదు. ఇది చరిత్ర సృష్టించబోయే బృందం. మంచి ఫలితాలు రావాలంటే కాస్త ఓపిక పట్టాలి. ఎలాంటి అనవసర ప్రయోగాలకు పోకుండా ముందుగా రచించిన వ్యూహాలను మైదానంలో అమలు చేయాలని, సహజశైలిలో ఆడాలని మా ఆటగాళ్లకు సలహా ఇస్తున్నాను’ అని ఆయన తెలిపారు. పూల్ ‘టాపర్’గా నిలవాలని... నేరుగా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాలన్నదే తమ తొలి లక్ష్యమని ఆయన వివరించారు. చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకునే అలవాటు భారత్కే కాకుండా ఇతర జట్లకూ ఉందని హరేంద్ర సింగ్ అన్నారు. ఇక ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్ప్రీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్లతో భారత ఫార్వర్డ్ శ్రేణి పటిష్టంగా కనిపిస్తోంది. డిఫెన్స్లో మన్ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా... వెటరన్ స్టార్ గోల్కీపర్ శ్రీజేశ్ మెరిస్తే భారత జట్టుకు తొలి మ్యాచ్లో విజయం లాంఛనమే అనుకోవాలి. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ప్రపంచకప్ సన్నాహాల కోసం తమ సొంత జేబుల నుంచి ఖర్చు చేసిన దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 11 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్ ఆరు మ్యాచ్ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్లో నెగ్గింది. మరో ఐదు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్పై దక్షిణాఫ్రికా నమోదు చేసిన ఏకైక విజయం 2012 లండన్ ఒలింపిక్స్లో రావడం గమనార్హం. మంగళవారమే జరిగే పూల్ ‘సి’లోని మరో మ్యాచ్లో బెల్జియంతో కెనడా తలపడుతుంది. -
ఆరంభం.. అట్టహాసం
భువనేశ్వర్: అగ్ర తారల తళుకులు... బాణా సంచా మెరుపులు... రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు... హుషారెత్తించే పాటలు... మైమరపించే నృత్య ప్రదర్శనల మధ్య... మనుషులంతా ఒక్కటే అని చాటుతూ... 14వ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఆతిథ్య రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో, 16 ప్రాతినిధ్య దేశాల కెప్టెన్ల హాజరీలో జరిగిన ఈ కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, అందాల తార మాధురీ దీక్షిత్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు కట్టిపడేశాయి. మాధురీ భూ దేవీగా అవతరిస్తూ, ప్రపంచ ప్రజలందరినీ తన పిల్లలుగా సంబోధిస్తూ చేసిన ప్రసంగంతో షో ప్రారంభమైంది. ఆమెపై చిత్రీకరించిన ‘ఎర్త్ సాంగ్’ అలరించింది. 1100 మంది కళాకారులతో, షిమాక్ దావర్ కొరియోగ్రఫీలో రూపొందిన ‘ఫ్యూజన్ డ్యాన్స్’ అబ్బురపర్చింది. గుల్జార్ రచించిన ప్రపంచ కప్ అధికార పాట ‘జై హింద్, జై ఇండియా’కు రెహమాన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ మరింత వన్నె తెచ్చింది. ‘డ్రమ్స్’ శివమణి తన వాయిద్యాలతో హోరెత్తించారు. మరోవైపు ప్రపంచకప్లో పాల్గొంటున్న జట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాభిమానులను ఈ కప్ అలరిస్తుందని, భారత దేశ, ప్రత్యేకించి ఒడిశా సంస్కృతిని ప్రపంచానికి చాటుతుందున్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
చక్ దే ఇండియా...!
పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో భారత్... ఎవరికీ సాధ్యంకాని ‘హ్యాట్రిక్’ టైటిల్స్ సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా... అరంగేట్రంలోనే అదరగొట్టే ఆటతీరు ప్రదర్శన చేయాలనే తపనతో చైనా... అందని ద్రాక్షగా ఊరిస్తోన్న టైటిల్ను ఒడిసి పట్టాలని స్పెయిన్... ఆర్థిక సమస్యలతో అసలు పోటీలో పాల్గొంటామా లేదా అనే గందరగోళ పరిస్థితులను అధిగమించిన పాకిస్తాన్... యూరోప్ ఆధిపత్యాన్ని చాటుకోవాలని నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం... రియో ఒలింపిక్స్లో తాము సాధించిన స్వర్ణం గాలివాటం కాదని నిరూపించాలని అర్జెంటీనా... ఈ నేపథ్యంలో ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు జరిగే ఈ హాకీ పండుగకు మంగళవారం తెరలేవనుంది. తొలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. బుధవారం నుంచి అసలు సమరం మొదలవుతుంది. భువనేశ్వర్: ఒకప్పుడు ప్రపంచ హాకీని ఏలిన భారత్ కాలక్రమేణా తమ ప్రాభవం కోల్పోయింది. ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్లో, చాంపియన్స్ ట్రోఫీలో అడపాదడపా మెరుపులు తప్ప... విశ్వ వేదికపై టీమిండియా విశ్వరూపాన్ని ప్రదర్శించి చాలా కాలమైంది. తొలుత ఆధిక్యం సంపాదించడం... ఆ తర్వాత చివరి క్షణాల్లో దానిని చేజార్చుకోవడం... మన జట్లకు అలవాటుగా మారిపోయింది. విదేశీ కోచ్లు వచ్చిపోయినా... స్వదేశీ కోచ్లను నియమించుకున్నా... భారత జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులు వేసేందుకు ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ క్రీడకు కొత్త ఊపిరి తెచ్చేందుకు సీనియర్ పురుషుల ప్రపంచకప్ రూపంలో సువర్ణావకాశం వచ్చింది. సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ సెమీఫైనల్ చేరితే ఆ దిశగా కొత్త ఊపిరి వచ్చినట్టవుతుంది. ఈసారి ఏ స్థానమో? ఎనిమిదేళ్ల క్రితం న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్లో ఎనిమిదో స్థానం... నాలుగేళ్ల క్రితం నెదర్లాండ్స్లో తొమ్మిదో స్థానం పొందిన భారత్ ఈసారి ఆతిథ్య దేశం హోదాలో నేరుగా అర్హత సాధించింది. పూల్ ‘సి’లో దక్షిణాఫ్రికా, కెనడా, బెల్జియం జట్లతో కలిసి భారత్ ఉంది. దక్షిణాఫ్రికా, కెనడా జట్లపై విజయంపై అనుమానాలు లేకున్నా... బెల్జియంతో జరిగే మ్యాచ్ అసలు పరీక్షగా నిలువనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే పూల్ ‘టాపర్’ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమిస్తే టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయమవుతుంది. వెటరన్ గోల్కీపర్ శ్రీజేశ్... ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్ప్రీత్ సింగ్... ఫార్వర్డ్ శ్రేణిలో మన్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, దిల్ప్రీత్ సింగ్... డిఫెన్స్లో మన్ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా ప్రదర్శనపై భారత అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత రెండు ప్రపంచకప్లలో టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా ఈసారీ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. భారత హాకీ జట్టు: మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), పీఆర్ శ్రీజేశ్, కృషన్ పాఠక్ (గోల్కీపర్లు), హర్మన్ప్రీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, సిమ్రన్జిత్ సింగ్, హార్దిక్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, కొతాజిత్, చింగ్లేన్సనా, సురేందర్, లలిత్ ఉపాధ్యాయ్, నీలకంఠ శర్మ, సుమీత్, వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లాక్రా, హారేంద్ర సింగ్ (కోచ్). నేడు సెలవు... ప్రపంచకప్ హాకీ ప్రారంభోత్సవ నేపథ్యంలో భువనేశ్వర్లో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 1.30 వరకే పని చేస్తాయి. సినీ కళాకారులు ఎ.ఆర్.రెహ్మాన్, షారూఖ్ ఖాన్, ప్రభాస్, మాధురీ దీక్షిత్ తదితరులు ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. పాక్ అత్యధికంగా... ప్రపంచకప్లో ఇప్పటివరకు 12 సార్లు పాల్గొన్న పాకిస్తాన్ జట్టు అతధికంగా నాలుగు సార్లు (1971, 1978, 1981, 1994) విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా (1986, 2010, 2014); నెదర్లాండ్స్ (1973, 1990, 1998) మూడేసిసార్లు చాంపియన్గా నిలిచాయి. జర్మనీ రెండుసార్లు (2002, 2006) రెండుసార్లు ఈ టైటిల్ను గెలుపొందగా... భారత జట్టు (1975లో) ఏకైకసారి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాక్తో ఐదుసార్లు తలపడిన భారత్ మూడు మ్యాచ్ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. భారత్... ఒక్కసారే ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రపంచకప్లోనూ ఆడిన నాలుగు జట్లలో ఒకటైన భారత ప్రదర్శన ఈ మెగా ఈవెంట్లో అంత గొప్పగా లేదు. తొలి మూడు ప్రపంచకప్లలో (1971, 1973, 1975) టాప్–3లో నిలిచిన టీమిండియా ఆ తర్వాత ఒక్కసారి కూడా మళ్లీ టాప్–3కి చేరలేకపోయింది. ఓవరాల్గా 91 మ్యాచ్లు ఆడిన భారత్ 39 మ్యాచ్ల్లో గెలిచింది. 41 మ్యాచ్ల్లో ఓడింది. 11 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించింది. మొత్తం 186 గోల్స్ నమోదు చేసి... 178 గోల్స్ను ప్రత్యర్థి జట్లకు సమర్పించుకుంది. విశేషాలు ►13 ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ల సంఖ్య ►25 ఒక్కసారైనా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన జట్లు ►4 సగటున మ్యాచ్లో నమోదైన గోల్స్ ►4 భారత్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ మాత్రమే ఇప్పటివరకు జరిగిన ప్రతీ ప్రపంచకప్లో పాల్గొన్నాయి. ►93 అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్టు నెదర్లాండ్స్ ► 64 అత్యధిక విజయాలు సాధించిన జట్టు ఆస్ట్రేలియా ► 569 ప్రపంచకప్లో జరిగిన మ్యాచ్లు ► 2276 ఈ మెగా ఈవెంట్లో నమోదైన మొత్తం గోల్స్ ► 276 అత్యధిక గోల్స్ చేసిన జట్టు ఆస్ట్రేలియా భారత జట్టు లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ ►నవంబరు 28: దక్షిణాఫ్రికాతో రా.గం. 7 నుంచి ►డిసెంబరు 2: బెల్జియంతో రా.గం. 7 నుంచి ►డిసెంబరు 8: కెనడాతో రా.గం. 7 నుంచి ► మ్యాచ్లన్నీ స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఇంక్ చల్లుతామంటూ స్టార్ హీరోకి బెదిరింపులు
ఈ నెల 27న మెన్స్ హాకీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఒడిషాలోని కళింగ స్టేడియంలో ప్రారంభంకాబోతుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ను ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అయితే తమకు క్షమాపణలు చెప్పకుండా.. షారుక్ ఈ వేడుకలకు హాజరైతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు స్థానిక కళింగ సేన నాయకులు. విషయం ఏంటంటే 17 ఏళ్ల క్రితం షారుక్ ఖాన్ ‘అశోక’ అనే చిత్రంలో నటించారు. చరిత్ర గతినే కాక అశోకుని పథాన్ని మార్చిన కళింగ యుద్ధం నేపథ్యంలో వచ్చిన చిత్రం అశోక. 2001లో షారుక్ ఖాన్, కరీనా కపూర్, జుహీ చావ్లా ప్రధాన ప్రాతధారులుగా సంతోష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే అంటే 2001లోనే ఈ సినిమా పట్ల తీవ్ర నిరసలను వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం ఒడిషా సంస్కృతిని, ఆ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా ఉందని నిరసనల వ్యక్తం చేశారు. ఈ సినిమా ఒడిషాలో కేవలం వారం రోజుల పాటే నడించిందంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా విడుదలయ్యి దాదాపు 17 ఏళ్లు పూర్తయిన కూడా ఇప్పటికి షారుక్ పట్ల నిరసనలు వ్యక్తమవుతుండటం ఆశ్చర్యం. ఈ క్రమంలోనే కళింగ సేన షారుక్కు బెదరింపు సందేశాలు పంపుతోంది. మీ అశోక సినిమాలో మా రాష్ట్ర ప్రజలను కించపరిచేలా చూపించారు. ఇందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. లేదంటే మీ మీద ఇంక్ చల్లడమే కాక నలుపు రంగు జెండా ఎగురవేసి నిరసనలు తెలుపుతాం. మా కార్యకర్తలు దారి పొడవునా ఉంటారు జాగ్రత్త అంటూ షారుక్ని బెదిరిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. -
హాకీ ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్
కరాచీ: ఆర్థిక సమస్యలతో భారత్లో జరిగే హాకీ ప్రపంచకప్లో పాల్గొనడం సందేహంగా మారిన పాకిస్తాన్ జట్టుకు ఊరట లభించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘హైయర్’ పాక్ హాకీ జట్టుకు 2020 వరకు స్పాన్సర్షిప్ అందించేందుకు ముందుకు వచ్చింది. అంతర్జాతీయ పర్యటనలతో పాటు దేశంలో కూడా హాకీ అభివృద్ధికి అండగా నిలుస్తామని ‘హైయర్’ ఎండీ జావేద్ అఫ్రిది ప్రకటించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఒక జట్టయిన పెషావర్ జల్మీకి అఫ్రిది యజమాని కూడా. ఇటీవల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న ఆటగాళ్లకు దినసరి భత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో పాక్ హాకీ సమాఖ్య ఉండటంతో ఆ జట్టు వరల్డ్ కప్కు దాదాపుగా దూరమైంది. తమకు ఆదుకోవాలని పాక్ క్రికెట్ బోర్డును కోరినా... పాత అప్పులే తీర్చలేదంటూ పీసీబీ తిరస్కరించడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. ఈ దశలో దిగ్గజ ఆటగాడు షహబాజ్ అహ్మద్ చొరవతో ఆ జట్టుకు స్పాన్సర్షిప్తో పాటు పాత బకాయిలు తీర్చేందుకు అవకాశం లభించింది. మరోవైపు తమకు సాయం అందించాలంటూ పాక్ హాకీ సమాఖ్య చేసిన విజ్ఞప్తికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం! -
హాకీ ప్రపంచకప్ జట్టు ఇదే
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ప్రపంచకప్లో పాల్గొనే భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించింది. 18 మందితో కూడిన భారత బృందానికి మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 16 వరకు భువనేశ్వర్లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో కలిసి భారత్ పూల్ ‘సి’లో ఉంది. రూపిందర్ పాల్సింగ్, ఎస్వీ సునీల్లకు ఈసారి కూడా చాన్స్ దక్కలేదు. ‘అందుబాటులో ఉన్న వారి నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాం’ అని కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు కప్లో పాకిస్తాన్ పాల్గొనడం సందేహంగా మారింది. అర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ హాకీ సమాఖ్య డబ్బు కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మొర పెట్టుకోగా... పీసీబీ నిరాకరించింద భారత జట్టు: గోల్కీపర్స్: పీఆర్ శ్రీజేశ్, బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్ప్రీత్ సింగ్, బిరేంద్ర లక్డా, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, ఖడంగ్బమ్, సురేందర్ కుమార్, అమిత్ రొహిదాస్. మిడ్ఫీల్డర్స్: మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లెన్సనా సింగ్ (వైస్ కెప్టెన్), నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, సుమీత్. ఫార్వర్డ్స్: ఆకాశ్దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సిమ్రన్జీత్ సింగ్. -
ప్రతీకారం... సెమీస్ ద్వారం!
లండన్: ఒకే మ్యాచ్తో అటు చరిత్ర సృష్టించేందుకు, ఇటు లీగ్ దశ ఓటమికి బదులు తీర్చుకునేందుకు భారత మహిళల హాకీ జట్టుకు చక్కటి అవకాశం. ప్రపంచ కప్లో భాగంగా గురువారం ఐర్లాండ్తో జరుగనున్న క్వార్టర్ ఫైనల్ ఇందుకు వేదిక కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే 1974 తర్వాత టీమిండియా ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరుతుంది. భారత్ (10) కంటే తక్కువ ర్యాంకులో ఉన్నప్పటికీ ఐర్లాండ్ (16) టోర్నీలో నిలకడగా ఆడుతోంది. లీగ్ దశలో అమెరికాను 3–1తో, భారత్ను 1–0 తేడాతో ఓడించింది. ఆతిథ్య ఇంగ్లండ్పై 0–1తో మ్యాచ్ను చేజార్చుకుంది. మరోవైపు రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని టీమిండియా... అమెరికా, ఇంగ్లండ్లతో 1–1తో డ్రా చేసుకుని ఐర్లాండ్ చేతిలో 0–1తో ఓడింది. ప్రి క్వార్టర్స్ అనదగ్గ క్రాస్ ఓవర్ మ్యాచ్లో మాత్రం జూలు విదిల్చి ఇటలీని 3–0తో ఇంటికి పంపింది. ఇదే ఊపును కొనసాగిస్తే రాణి సేన ప్రత్యర్థిపై పైచేయి సాధించగలదు. అయితే, ఐర్లాండ్ కొన్నాళ్లుగా మన జట్టుకు కొరుకుడు పడనిదిగానే ఉంది. ఈ టోర్నీతో పాటు, గతేడాది హాకీ ప్రపంచ లీగ్ సెమీస్లో 2–1తో టీమిండియాను మట్టికరిపించింది. ఈ విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు బరిలో దిగనుంది. గోల్కీపర్ సవిత ఆధ్వర్యంలోని భారత రక్షణ శ్రేణి ప్రస్తుత కప్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తోంది. ఫార్వర్డ్స్ కూడా కుదురుకున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ►రాత్రి గం. 10.25 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
హాకీ ప్రపంచ కప్ క్వార్టర్స్లో భారత్
లండన్: చావో రేవో మ్యాచ్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హాకీ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం మంగళవారం నిర్వహించిన క్రాస్ ఓవర్ మ్యాచ్లో రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు 3–0 గోల్స్ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (9వ ని.లో), నేహా గోయల్ (45వ ని.లో), వందన కటారియా (55వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ విజయంతో భారత్ 1974 తర్వాత ప్రపంచకప్లో మరోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 1974లో జరిగిన తొలి మహిళల ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఏనాడూ లీగ్ దశను అధిగమించలేకపోయిం ది. మళ్లీ 44 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇటలీతో జరిగిన పోరులో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. సమన్వయంతో ముందుకు సాగుతూ అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడులు చేసింది. 9వ నిమిషంలో లాల్రెమ్సియామి చేసిన గోల్తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అనంతరం 45వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను నేహా లక్ష్యానికి చేర్చగా... 55వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్ను వందన కటారియా గోల్గా మలిచింది. ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐర్లాండ్తో భారత్ తలపడుతుంది. పూల్ ‘బి’లో ఐర్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 0–1తో ఓడిపోయింది. -
చావో రేవో...
లండన్: మహిళల హాకీ ప్రపంచకప్లో నిలవాలంటే సత్తా చాటాల్సిన మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం ఏడో ర్యాంకర్ అమెరికాతో పదో ర్యాంకర్ భారత్ తలపడనుంది. రియో ఒలింపిక్ చాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో మ్యాచ్లో ఐర్లాండ్ చేతిలో 0–1తో అనూహ్య పరాజయం పాలైంది. ఈ టోర్నీలో గ్రూప్ టాపర్గా నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగతా నాలుగు బెర్తుల కోసం ఒక్కో గ్రూపులో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ ‘బి’ నుంచి ఐర్లాండ్ 6 పాయింట్లతో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరగా... ఇంగ్లండ్ (2 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. చెరో పాయింట్ సాధించిన భారత్, అమెరికా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్ను కనీసం ‘డ్రా’గా అయినా ముగించాలి. అప్పుడు భారత్ మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ముందంజ వేస్తుంది. మరోవైపు ఇంగ్లండ్తో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న అమెరికా ఐర్లాండ్ చేతిలో 1–3తో ఓడింది. తేలిగ్గా తీసుకుంటే... రెండో ర్యాంకర్ ఇంగ్లండ్తో జరిగిన తొలి పోరులో తుదికంటా ఆధిపత్యం చెలాయించిన భారత్ చివర్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. ఈ పోరులో భారత్కు ఒక్క పెనాల్టీ కార్నర్ అవకాశం కూడా దక్కకపోయినా... చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐర్లాండ్తో జరిగిన రెండో మ్యాచ్లో రాణి రాంపాల్ బృందానికి ఏడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్గా మలచడంలో విఫలమైంది. తమ కన్నా తక్కువ ర్యాంక్ కలిగిన ఐర్లాండ్ను తేలికగా తీసుకున్న భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. గత మ్యాచ్లో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ ఈ పోరులో ఉదాసీనతకు తావు లేకుండా చెలరేగాలని భావిస్తోంది. ఫినిషింగ్ లోపం వల్లే... ‘ఈ పోరులో భారత్ తప్పక గెలిచి తీరాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో మా ప్రణాళికలు బాగున్నాయి. క్రీడాకారిణులు చక్కటి సమన్వయంతో గోల్ అవకాశాలు సృష్టిస్తున్నారు. కానీ ఫినిషింగ్ లోపంతో వాటిని గోల్స్గా మలచలేకపోతున్నారు. గత మ్యాచ్లో మన అమ్మాయిలు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై 15 షాట్లు కొట్టినా... వాటిలో ఒక్కటీ లక్ష్యాన్ని చేరలేదు. ఈ అంశంపై దృష్టి సారించాం. ఐర్లాండ్తో పరాజయం మా మానసిక స్థైర్యంపై ఎలాంటి ప్రభావం చూపదు’ అని కోచ్ జోయెర్డ్ మరీనే అన్నారు. -
గెలిచే మ్యాచ్కు ‘డ్రా’ కార్డు
మ్యాచ్ ముగిసేందుకు ఇక ఆరు నిమిషాలే మిగిలుంది. భారత్ 1–0తో ఆధిక్యంలో ఉంది. పెట్టని గోడలా గోల్ కీపర్ సవిత... దుర్భేద్యమైన రక్షణ శ్రేణి. దీంతో మెగా టోర్నీలో భారత్ శుభారంభమే తరువాయి అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా మ్యాచ్కు ‘డ్రా’ కార్డు పడింది! ఆతిథ్య ఇంగ్లండ్కు ‘డ్రా’నందం మిగిలింది. లండన్: మహిళల హాకీ ప్రపంచకప్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇంగ్లండ్ను భారత జట్టు ఎక్కడికక్కడ కట్టిపడేసింది. భారత్ గెలిచేందుకు, మ్యాచ్ ముగిసేందుకు దగ్గరైన దశలో ఇంగ్లండ్ పెనాల్టీ కార్నర్ ప్రయత్నం సఫలమైంది. భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకోవాల్సి వచ్చింది. ఫలితం చివర్లో అసంతృప్తికి గురిచేసినా... భారత గోల్కీపర్ సవితా పూనియా, రక్షణ పంక్తి పోరాటం మాత్రం అద్వితీయంగా సాగింది. భారత మహిళల జట్టు అంచనాల కు అందనంతగా పోరాడింది. సరిగ్గా మూడు నెలల క్రితం... గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో ఇదే జట్టు చేతిలో 0–6తో భారత జట్టు ఓడింది. మూడో స్థానం కోసం వర్గీకరణ పోరులో చెత్తగా ఆడి కాంస్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు ప్రపంచ రెండో ర్యాంకర్ ఇంగ్లండ్ జట్టుకు పదో ర్యాంకులో ఉన్న భారత్ ముచ్చెమటలు పట్టించింది. ప్రతీ క్వార్టర్లోనూ రెండు, మూడు పెనాల్టీ కార్నర్లు కలిసొచ్చినా ఇంగ్లండ్ను కంగుతినిపించే స్థాయికి చేరింది. రెండో క్వార్టర్ ముగిసే సమయానికి నేహా గోయల్ (25వ ని.) చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే ఇంగ్లండ్ ఐదు పెనాల్టీ కార్నర్లను సంధించగా భారత డిఫెన్స్, గోల్ కీపర్ చాకచక్యంగా అడ్డుకున్నారు. చివరి రెండు క్వార్టర్లలో ఇంగ్లండ్కు మరో నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలొచ్చాయి. ఎట్టకేలకు తొమ్మిదో పెనాల్టీ కార్నర్ను 54వ నిమిషంలో లిలీ ఓవ్స్లే గోల్గా మలచడంతో మ్యాచ్ 1–1 స్కోరు సమమైంది. ఈసారీ సవిత సమర్థంగా అడ్డుకున్నా... రీబౌండ్ అయిన బంతిని భారత డిఫెండర్ దీపిక తప్పించలేకపోయింది. అక్కడే ఉన్న లిలీ గోల్పోస్ట్లోకి తరలించడంతో మ్యాచ్ డ్రా అయింది. 26న రెండో మ్యాచ్లో ఐర్లాండ్తో భారత్ ఆడుతుంది. -
నిరీక్షణ ముగిసేనా..!
లండన్: 44 ఏళ్ల క్రితం తొలిసారి మహిళల హాకీ ప్రపంచకప్ నిర్వహించినపుడు భారత జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మరో ఐదుసార్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్నప్పటికీ టీమిండియా ఏనాడూ మళ్లీ సెమీఫైనల్కు చేరుకోలేదు. అయితే కొంతకాలంగా భారత మహిళల హాకీ జట్టు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటోంది. గతేడాది ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణ పతకం నెగ్గి తమ సత్తా చాటుకుంది. అదే జోరును ప్రపంచ చాంపియన్షిప్లో కొనసాగించాలని... కనీసం టాప్–8లో నిలవాలనే పట్టుదలతో ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతోంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక ఆయా గ్రూప్ల్లో అగ్రస్థానం పొందిన నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత పొందుతాయి. ఆయా గ్రూప్ల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మరో నాలుగు క్వార్టర్ ఫైనల్ బెర్త్ల కోసం పోటీపడతాయి. గ్రూప్ ‘బి’లో భారత్తోపాటు ఆతిథ్య ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా జట్లు ఉన్నాయి. శనివారం జరిగే తమ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్తో ఆడనున్న భారత్... ఆ తర్వాత 26న ఐర్లాండ్తో... 29న అమెరికాతో తలపడుతుంది. ‘ఒత్తిడంతా ఇంగ్లండ్పైనే ఉంటుంది. సొంతగడ్డపై ఆడుతున్న అంశం వారికి అనుకూలం. అయితే ఇటీవల కామన్వెల్త్ గేమ్స్లో ఇంగ్లండ్ను మేము ఓడించిన సంగతి మర్చిపోవద్దు. ఈసారి అలాంటి ఫలితమే సాధిస్తామన్న నమ్మకం ఉంది’ అని భారత మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ వ్యాఖ్యానించింది. ఈ ప్రపంచకప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇతిమరపు రజని భారత్ తరఫున రెండో గోల్కీపర్గా వ్యవహరించనుంది. ప్రపంచకప్లో భారత్ ప్రదర్శన ఏడాది వేదిక స్థానం 1974 ఫ్రాన్స్ 4 1978 స్పెయిన్ 7 1983 మలేసియా 11 1998 నెదర్లాండ్స్ 12 2006 స్పెయిన్ 11 2010 అర్జెంటీనా 9 జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: చైనా, ఇటలీ, కొరియా, నెదర్లాండ్స్ గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, జర్మనీ గ్రూప్ ‘డి’: ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, న్యూజిలాండ్ -
ప్రపంచ కప్ వెనుక ఎవరున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: హాకీ జూనియర్ ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవడం వెనుక ఓ వ్యక్తి అమోఘ కృషి, పట్టుదల ఉన్నాయనే మీకు తెలుసా? గతంలో తాను ఎంచుకున్న క్రీడలో విఫలమైన ఆ క్రీడాకారుడి బోధనలే భారత్కు హాకీ జూనియర్ అండర్-21 ప్రపంచ కప్ను అందించాయంటే ఎంతమంది నమ్మగలరు? కానీ, ఇది నమ్మి తీరాల్సిందే. భారత్ హాకీ జూనియర్ టీంకు శిక్షకుడిగా పనిచేసిన హరేంద్ర సింగ్ ఒక హాకీ ప్లేయర్. జాతీయ టీంకు ఎంపిక చేయకుండా పక్కకు పడేసిన ఓ క్రీడాకారుడు. ఆ సమయంలో తాను ఎంత కుమిలిపోయి ఉన్నాడనే విషయం తాజాగా అతడి మాటలే చెబుతున్నాయి. సాధారణంగా జట్టు విజయం సాధించిన వెంటనే క్రీడాకారులును ప్రశ్నించిన మీడియా అనంతరం కోచ్ హరేంద్ర సింగ్ను ప్రశ్నించింది. ఆ సమయంలో అతడి కళ్లు చెమ్మగిల్లాయి. అంతే కాదు అతడి చెంపల మీదుగా ఆ కన్నీళ్లు దారగా కారాయి. ఈ విజయం వెనుక మీరే ఉండటం ఒక క్రీడాకారుడిగా, కోచ్గా ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా. తన గత స్మృతులు చెప్పారు. తాను ఒక క్రీడాకారుడినని, కసిగా ఆడేవాడినని, ఒకప్పుడు జాతీయ టీంకు ఎంపికచేయకుండా పక్కకు పెట్టారని అన్నారు. అప్పుడే తనకు తాను బోధించుకున్నానని, అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయగలనన్న ఆత్మ విశ్వాసంతో 1998లో కోచ్గా కెరీర్ ప్రారంభించానని చెప్పాడు. ‘ఆరోజే నేను నా అంతరాత్మకు చెప్పుకున్నాను. నేను ఒలింపియన్ను కాకపోవచ్చు.. కానీ నేను ఒలింపియన్లను, ప్రపంచ చాంపియన్లను తయారు చేయగలనని.. దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేయగలనని. ఈ రోజు భారత త్రివర్ణ పతాకం ప్రపంచ కప్పు విజయంతో మరింత ఎత్తులో రెపరెపలాడుతోంది. ఈ క్షణం కోసం నేను ఎదురుచూశాను. ప్రపంచ కప్ భారత్ ఎలాగైనా తన శిక్షణతో గెలవాలని 22 ఏళ్ల జీవితాన్ని శిక్షణకే కేటాయించాను. అది నేడు ఆవిష్కృతమైంది’ అని ఆయన చెప్పారు. బెల్జియంపై 2-1తేడాతో భారత్ జూనియర్ హాకీ టీం విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు హాకీ జూనియర్ ప్రపంచ కప్ సాధించిన యువ క్రీడాకారులకు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు తెలియజేశారు. వారు దేశం గర్వించేలా చేశారని, ఇది నిజంగా చాలా గొప్ప విజయం అని అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఎంజాయ్ ది బెల్జియం చాకోలెట్ బాయ్స్’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. -
భారత కుర్రాళ్ల జోరు
• ఇంగ్లండ్పై 5–3తో విజయం • జూనియర్ హాకీ ప్రపంచ కప్ లక్నో: సొంతగడ్డపై భారత యువ జట్టు అదరగొట్టింది. జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్లో భారత్ 5–3 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తరఫున పర్విందర్ సింగ్ (24వ ని.లో), అర్మాన్ ఖురేషీ (35వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్ (37వ ని.లో), సిమ్రన్జిత్ సింగ్ (37వ ని.లో), వరుణ్ కుమార్ (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టుకు జాక్ క్లీ (10వ ని.లో), విల్ కాల్నన్ (63వ ని.లో), ఎడ్వర్డ్ హోర్లర్ (67వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. సోమవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. -
హాకీలో భారత్కు తొమ్మిదో స్థానం
హేగ్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచ కప్లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తొమ్మిది-పది స్థానాల కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 3-0తో ఆసియా చాంపియన్ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత ఆటగాడు ఆకాష్దీప్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది ఆసియా కప్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆరో నిమిషంలోనే ఆకాష్దీప్ గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. విరామం తర్వాత భారత్ ఇదే జోరు కొనసాగించింది. 42వ నిమిషంలో రూపేందర్ పాల్ సింగ్, 50వ నిమిషంలో ఆకాష్దీప్ మరో గోల్ కొట్టాడు. ఈ మ్యాచ్లో దక్షిణ కొరియా బోణీ కూడా కొట్టలేకపోయింది. -
తొమ్మిదో స్థానం కోసం భారత్ పోరు
హేగ్: హాకీ ప్రపంచ కప్లో నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన భారత్ తొమ్మిదో స్థానం కోసం బరిలోకి దిగనుంది. ఈ ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ ఆసియా చాంపియన్ దక్షిణ కొరియాతో తలపడనుంది. గత ప్రపంచ కప్లో ఎనిమిదో స్థానం సాధించిన భారత్.. ఈ సారి దాని కంటే మెరుగైన స్థితిలో నిలవలేకపోయింది. తాజా ప్రపంచ కప్ గ్రూపు దశలో ఐదు మ్యాచ్లకు గాను భారత్ ఒక్కో విజయం, డ్రా నమోదు చేసింది. దీంతో ఏ గ్రూపులో భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది. -
భారత్ హాకీ జట్టుకు మరో ఓటమి
హేగ్: పురుషుల హాకీ ప్రపంచ కప్ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది. సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్లో భారత్ 0-4తో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. లీగ్ దశలో ఓ విజయం, మరో డ్రాతో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించిన భారత్ నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. భారత్కు దక్కేది నాలుగో స్థానమా లేకా ఐదా అన్నది స్పెయిన్-మలేసియా మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. చివరి మ్యాచ్లో ఆద్యంతం ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాగా భారత ఆటగాళ్లు బోణీ కూడా కొట్టలేకపోయారు. గ్రూప్-ఎలో వరుసగా ఐదు విజయాలు సాధించిన ఆస్ట్రేలియా 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
తొలి విజయంపై దృష్టి!
నేడు మలేసియాతో భారత్ పోరు హాకీ ప్రపంచకప్ సాయంత్రం గం. 6.00 నుంచి టెన్ స్పోర్ట్స్లో ది హేగ్ (నెదర్లాండ్స్): మూడు మ్యాచ్లు ముగిసినా తొలి విజయం కోసం వేచి చూస్తున్న భారత జట్టు నిరీక్షణ శనివారం ముగిసే అవకాశం కనిపిస్తోంది. హాకీ ప్రపంచకప్లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ తలపడనుంది. ఈ గ్రూప్లో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్గా పరిగణిస్తున్నారు. అయితే బలహీన జట్టు అని అలసత్వాన్ని ప్రదర్శిస్తే సర్దార్ సింగ్ బృందానికి మొదటికే మోసం వచ్చే అవకాశముంది. ‘బెల్జియం, ఇంగ్లండ్ జట్లతో ఆరంభ రెండు మ్యాచ్ల్లో భారత జట్టు చక్కగా ఆడింది. అయినప్పటికీ చివరి నిమిషాల్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. మలేసియాపై గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నాను. ఫార్వర్డ్స్ తమకు అందివచ్చిన అవకాశాలను గోల్స్గా మలుస్తారని విశ్వసిస్తున్నాను’ అని కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. -
‘డ్రా’ చేసుకుంటే గొప్ప!
నేడు స్పెయిన్తో భారత్ ‘ఢీ’ హాకీ ప్రపంచకప్ ది హేగ్ (నెదర్లాండ్స్): చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకొని వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత హాకీ జట్టు మూడో పోరుకు సిద్ధమైంది. హాకీ ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో పటిష్టమైన స్పెయిన్తో భారత్ తలపడనుంది. పాదరసంలాంటి కదలికలకు... చిన్న చిన్న పాస్లతో ప్రత్యర్థి రక్షణ వలయంలో దూసుకుపోవడంలో సిద్ధహస్తులైన స్పెయిన్ ఆటగాళ్లను టీమిండియా ఏమేరకు నిలువరిస్తుందనే అంశంపైనే సర్దార్ సింగ్ బృందం అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్లో 70వ నిమిషంలో... ఇంగ్లండ్తో జరిగిన పోటీలో 69వ నిమిషంలో గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్లో ఏం చేస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం భారత జట్టు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే స్పెయిన్ను ‘డ్రా’తో నిలువరిస్తే గొప్ప అనుకోవాలి. రక్షణ శ్రేణిలో లోపాలు సరిదిద్దుకొని... పెనాల్టీ కార్నర్లను లక్ష్యానికి చేర్చడంలో సఫలమైతే మాత్రం భారత్ నుంచి ఈ మ్యాచ్లో విజయాన్ని ఆశించవచ్చు. పొరపాట్లు పునరావృతం చేస్తే మాత్రం ‘హ్యాట్రిక్’ ఓటమి ఖాయమనుకోవాలి. -
ఈసారి ఏం చేస్తారో!
నేడు ఇంగ్లండ్తో భారత్ పోరు హాకీ ప్రపంచకప్ రాత్రి గం. 7.30 నుంచి టెన్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం ది హేగ్ (నెదర్లాండ్స్): బెల్జియంతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో చివరి 15 సెకన్లలో గోల్ సమర్పించుకొని ఓటమి పాలైన భారత్కు సోమవారం మరో పరీక్ష ఎదురుకానుంది. హాకీ ప్రపంచకప్లో భాగంగా గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్తో పోటీపడనున్న భారత్కు మంచి ఫలితం రావాలంటే అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. బెల్జియంపై ఒకదశలో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఆ తర్వాత రెండు గోల్స్ ఇచ్చి ఓటమి పాలైంది. రెండో మ్యాచ్లోనైనా రక్షణపంక్తిలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియా ఈ టోర్నీలో నిలబడే అవకాశాలుంటాయి. మరో పరాజయం ఎదురైతే మాత్రం భారత్ కోలుకోవడం కష్టమే. ‘ఎలా ఆడామన్నది, ఎలా ముగించామన్నది ముఖ్యమే కానీ చివరికొచ్చేసరికి స్కోరునే చూస్తారు. బెల్జియంతో బాగా ఆడినా చివరి 30 సెకన్లలో తారుమారైంది’ అని భారత చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తెలిపారు. ‘తొలి మ్యాచ్లో మెరుగ్గా ఆడినా కీలకదశలో తప్పిదాలు చేశాం. అయితే ఈ మ్యాచ్ ద్వారా లభించిన సానుకూలాంశాలతో ఇంగ్లండ్తో పోరుకు సిద్ధమవుతాం. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోం. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం’ అని భారత కెప్టెన్ సర్దార్ సింగ్ తెలిపాడు. -
మళ్లీ... అదే తడబాటు
బెల్జియం చేతిలో ఓడిన భారత్ చివరి నిమిషంలో గోల్ సమర్పణ హాకీ ప్రపంచకప్ ది హేగ్ (నెదర్లాండ్స్): మళ్లీ అదే తడబాటు... ఆధిక్యంలోకి వెళ్లడం... ఆ తర్వాత ఆధిక్యాన్ని కోల్పోవడం... చివరకు మ్యాచ్నే చేజార్చుకోవడం... కొన్నేళ్లుగా భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. శనివారం మొదలైన హాకీ ప్రపంచకప్లో బె ల్జియంతో జరిగిన మ్యాచ్లో భారత్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మ్యాచ్లో మరో 15 సెకన్ల సమయం... అప్పటికీ ఇరుజట్ల స్కోరు 2-2... డిఫెండర్ల ఏమరుపాటును పసిగట్టిన జాన్ డొమెన్... వాయువేగంతో భారత్ సర్కిల్లోకి దూసుకొచ్చాడు. మెరుపు వేగంతో బంతిని నేర్పుగా గోల్పోస్ట్లోకి పంపాడు. అంతే అప్పటి వరకు ‘డ్రా’ అనుకున్న మ్యాచ్ను బెల్జియం సొంతం చేసుకుంటే... నిమిషంలో ఫలితాన్ని తారుమారు చేసుకొని భారత్ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచకప్ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. కొయెసెరా స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో బెల్జియం 3-2తో భారత్పై గెలిచి శుభారంభం చేసింది. మన్దీప్ సింగ్ (45వ ని.), ఆకాశ్దీప్ సింగ్ (50వ ని.) భారత్కు గోల్స్ అందించగా... ఫ్లోరెంట్ అబెల్ (34వ ని.), సిమోన్ గోంగార్డ్ (56వ ని.), జాన్ డొమెన్ (70వ ని.) బెల్జియం తరఫున గోల్స్ చేశారు. మ్యాచ్ మొత్తం హోరాహోరీగా సాగినా చివరి నిమిషంలో జరిగిన డ్రామాలో భారత్ చేతులెత్తేసింది. మొత్తం ఆరు పెనాల్టీల్లో బెల్జియం ఒక్కదాన్ని వినియోగించుకోగా... భారత్కు దక్కిన ఏకైక పెనాల్టీ కార్నర్ను రూపిందర్ వృథా చేశాడు. ఆసీస్ దూకుడు: మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా 4-0తో మలేసియాను ఓడించింది. గ్లెన్ టర్నర్ (25, 54వ ని.) రెండు గోల్స్ చేయగా, ఎడిల్ ఒకెండెన్ (50వ ని.), జెమీ డ్వేయర్ (52వ ని.) చెరో గోల్ సాధించారు. ఆసీస్ ఆరు పెనాల్టీ కార్నర్లను మిస్ చేసుకోగా, మలేసియా రెండింటిని వృథా చేసుకుంది. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 1-0తో గెలిచింది. అలిస్టర్ బ్రోగ్డన్ (6వ ని.) ఏకైక గోల్ చేశాడు. -
తిమ్మయ్య స్థానంలో యువరాజ్ వాల్మీకి
ప్రపంచకప్ హాకీ జట్టులో మరో మార్పు హేగ్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచకప్ మొదలుకాక ముందే భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో ఫార్వర్డ్ నికిన్ తిమ్మయ్య టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో యువరాజ్ వాల్మీకిని తీసుకున్నారు. కుడి తొడ కండరంలో చీలిక వల్ల తిమ్మయ్యకు నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. రెండు రోజుల కిందట ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడటంతో స్ట్రయికర్ రమణ్దీప్ కూడా ప్రపంచకప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వాల్మీకి మంగళవారం రాత్రి హేగ్కు బయలుదేరి వెళ్లాడు. వరల్డ్కప్లో తన సత్తా మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన వాల్మీకి 2011లో అరంగేట్రం చేసి 38 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. -
1975 ప్రపంచకప్ హీరోలకు సన్మానం
భారత్కు హాకీ ప్రపంచకప్ అందించిన ఆటగాళ్లను హాకీ ఇండియా ఎట్టకేలకు సన్మానించింది. ఇప్పటిదాకా భారత్ ఒకే ఒక్కసారి 1975లో ప్రపంచకప్ గెలిచింది. అయితే మనదేశానికి ఈ ఘనతను అందించిన ఆటగాళ్లను ఇన్నాళ్లూ మరచిపోయారు. ఇన్నాళ్లకు జట్టులోని 16 మంది ఆటగాళ్లను సన్మానించడమే కాకుండా వారికి రూ. 1.75 లక్షల నగదు బహుమతిని హాకీ ఇండియా అందజేసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రస్తుత ఆటగాళ్లు, హాకీ ఇండియా అధికారులు పాల్గొన్నారు. ప్రపంచకప్ విజేతలతో పాటు ప్రస్తుత భారత జట్టు సభ్యులు కలిసి గ్రూప్ ఫోటో దిగారు. -
హాకీలో రూ.1500 కోట్ల పెట్టుబడి
స్టార్ గ్రూప్ నిర్ణయం ముంబై: భారత్లో క్రికెట్కున్న ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఆటకు దీటుగా జాతీయ క్రీడగా పేరు తెచ్చుకున్న హాకీని కూడా పాపులర్ చేసేందుకు స్టార్ ఇండియా గ్రూప్ నడుం బిగించింది. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ క్రీడా చానెళ్ల సంస్థ ఏకంగా ఈ ఆటపై రూ.1500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ‘భారత్లో క్రీడా ప్రసార సంస్థలు క్రికెట్లో మాత్రమే డబ్బులు వెచ్చిస్తాయి. ఇతర క్రీడలవైపు పెద్దగా దృష్టి సారించవు. అయితే ఈ దేశంలో క్రీడా ప్రాముఖ్యత మారేలా చూడడమే మా ఉద్దేశం. మేం సరైన చోటే డబ్బును ఖర్చు చేయనున్నాం. భారత్లో హాకీ మరింత ఎదిగే అవకాశం ఉంది. అయితే దానికి తగిన వనరులు కావాల్సి ఉంది. స్థానిక లీగ్స్, అంతర్జాతీయ ఈవెంట్స్, 2018లో హాకీ ప్రపంచకప్ ద్వారా అభిమానులకు ఈ ఆట మరింత చేరువయ్యే అవకాశం ఉంది’ అని స్టార్ ఇండియా హెడ్ ఆఫ్ బిజినెస్ నితిన్ కుక్రేజా తెలిపారు. అలాగే శనివారం నుంచి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్ను మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు ఈ మ్యాచ్లను ప్రసారం చేసే స్టార్ ఇండియా గ్రూప్ రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. హాకీ చరిత్రలోనే తొలిసారిగా మ్యాచ్ సందర్భంగా 20 కెమెరాలను ఉపయోగించనుంది. స్టార్ స్పోర్ట్స్ 3 ద్వారా హిందీ కామెంటరీతో కూడా మ్యాచ్లను ప్రసారం చేయనుంది.