Prabhu Kiran
-
సీనియర్ పాత్రికేయుడు ప్రభుకిరణ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ సువార్తికులు రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ (63) ఆదివారం కింగ్కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో కన్నుమూశారు. పదిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ప్రభుకిరణ్, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం పెంబర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుత జనగామ జిల్లా పెంబర్తికి చెందిన ప్రభుకిరణ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. అనంతరం క్రైస్తవ మత ప్రవచకులుగా ఉంటూనే ‘సాక్షి’ఫ్యామిలీ సన్నిధి పేజీలో పన్నెండు సంవత్సరాలకు పైగా ఆయన రాసిన సువార్త వ్యాసాలు ఎంతో పాఠకాదరణ పొందాయి. ఆయన మృతి పట్ల సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళి సంతాపం ప్రకటించారు. ప్రభుకిరణ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చదవండి: నేను బతికేలా లేను.. బిడ్డలు, నువ్వు జాగ్రత్త! -
అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య
సిరియా మహా సైన్యాధిపతి, ధీరుడు, యోధుడు, ధనికుడైన నయమానుకు కుష్టురోగం సోకింది. ఆ రోజుల్లో కుష్టువ్యాధి సోకితే ఎంతటివారైనా సమాజ బహిష్కరణకు గురై జీవచ్ఛవాలవాల్సిందే!! అయితే నయమాను ఇంట్లోనే విశ్వాసి అయిన ఒక యూదుబాలిక బానిసగా ఉంది. ఆమె నయమానుకు ఎడారిలో సెలయేటి వంటి చల్లటి కబురు చెప్పింది. తన ఇశ్రాయేలు దేశంలోని ఎలీషా ప్రవక్త ఎంతటి కుష్టువ్యాధినైనా దేవుని పేరిట బాగుచేస్తాడని ఆమె చెబితే, నయమాను ఎలీషా వద్దకు వెళ్ళాడు. ఎలీషా చెప్పినట్టు అక్కడి యొర్దాను నదిలో ఏడుసార్లు మునిగి ఆమె చెప్పినట్టే నయమాను క్షణాల్లో బాగయ్యాడు. నయమాను అత్యానందపడి బోలెడు కానుకలివ్వబోతే ‘నేను నీ వద్ద ఏమీ తీసుకోను’ అని ఎలీషా అతనికి కరాఖండిగా చెప్పి వెనక్కి పంపేశాడు. సిరియా దేశంలో ఎన్నో గొప్ప నదులుంటే, నేను యొర్దాను లాంటి చిన్న నదిలో మునగాలా? అంటూ ఆరంభంలో నయమాను మొండికేస్తే, ఆ బాలికే అతనికి నచ్చజెప్పి యొర్దానులో మునిగేలా చేసింది. కుష్ఠునే కాదు, అంతకన్నా భయంకరమైన అహంకారమనే అతని మరో రోగాన్ని కూడా అలా ఎలీషా అతని కానుకలు నిరాకరించి బాగుచేశాడు. దేవుడు ప్రలోభాలకు లొంగడని, ఆయన తన కృపను, ఈవులను మానవాళికి ఉచితంగా ప్రసాదించే ‘మహాదాత’ అని, తాను కేవలం దేవుని కృపతోనే బాగయ్యానని గ్రహించి, నయమాను వినమ్రుడై తన దేశానికి తిరిగి వెళ్ళాడు (2రాజులు 5: 1–27). ఎన్నేళ్లు బతికి, ఎంత సేవ చేశామని కాదు, చేసిన కొంచెమైనా ఎంత అద్భుతంగా చేశామన్నదే ప్రాముఖ్యం. అందుకే దేవుని సంకల్పాలు నెరవేర్చే వెయ్యేళ్ళ జీవితం కూడా చాలా చిన్నదిగా కనిపించాలన్నాడు ఒక మహాభక్తుడు. అద్భుతమైన ఈ నయమాను ఉదంతంలో ముఖ్యపాత్ర అనామకురాలైన యూదుబానిస యువతిదే!! నేనొక బానిసను, ఇది నా పని కాదు, పైగా నాకేం లాభం? అని ఆమె అనుకుంటే అసలీ అద్భుతమే లేదు. ఒక వ్యక్తి దాహంతో అలమటిస్తున్నాడు, అతని దాహం తీర్చే నీళ్లెక్కడున్నాయో ఆమెకు తెలుసు. పైగా అది దేవుని శక్తిని రుజువుచేసే అపూర్వమైన అవకాశం. వెంటనే ఆమె తనవంతు పరిచర్య చేసి పక్కకు తప్పుకుంది, అజ్ఞాతంగానే ఉండిపోయింది. వేల మైళ్ళ పొడవుండే హైవే తో పోల్చితే ఒక చిన్న మైలురాయి ఎంత? కానీ దాని ప్రత్యేకత దానిదే!! ఇందులో నాకెంత లాభం? అని ఆలోచించకుండా మైలు రాయి తనపని తాను చేసుకొంటుంది. దాహంతో అలమటించే బాటసారికి, ప్రతిఫలాపేక్షలేకుండా నీళ్లిచ్చే పనే నిజమైన సువార్త పని. యేసుప్రభువు తన శిష్యులకు, పరిచారకులకు తన పేరిట అద్భుతాలు చేయమని ఆదేశించాడు. కానీ మీరు అదంతా ‘ఉచితంగా మాత్రమే చెయ్యండి’ అని కూడా అదే వచనంలో ఆదేశించాడు (మత్తయి 10:8). మరి మేమెలా బతకాలి? అంటారా, బతకడానికే అయితే కూలిపని చెయ్యొచ్చు, కలెక్టర్ పనైనా చెయ్యొచ్చు. ‘నేను మీకు అదనంగా సంచిని, జాలెను, చెప్పుల్ని ఇవ్వకుండా పరిచర్య కు పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా?’ అని యేసు ఒకసారి తన శిష్యుల్ని అడిగితే, లేదని వాళ్ళు జవాబిచ్చారు(లూకా 22:35). అంటే, ఏమీ తక్కువకాని జీవితాన్ని దేవుడిస్తాడు. కాని అన్నీ ఎక్కువగా ఉండే జీవితం కావాలనుకునే పరిచారకులే గేహాజీ లాగా (ఈ ఉదంతంలో మరో పాత్ర) ప్రలోభాలకు గురై భ్రష్టులవుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని ఔదార్యంతో నడిచే పరలోకరాజ్యం!!
విశ్వాసిలో స్వనీతి వల్ల అసంతృప్తి తలెత్తడం, పక్కవాడు లాభపడితే అసూయ చెలరేగటం చాలా అనర్థదాయకం. దేవుని ‘సమ న్యాయవ్యవస్థ’పై అవగాహన లోపించినపుడు ఇలా జరుగుతుంది. అందుకే దేవుని అనంతమైన ప్రేమను, అపారమైన సమన్యాయభావనను ఆవిష్కరించే ఒక చక్కని ఉపమానాన్ని యేసుప్రభువు వివరించాడు (మత్తయి 20:1–16). ఒక భూ యజమాని తన ద్రాక్షతోటలో పనికి తెల్లవారుజామునే కొందరు కూలీలను ఒక దేనారానికి (దాదాపు 220 రూపాయలు) కుదుర్చుకున్నాడు. ఆలస్యంగా 9, 12, 3 గంటలకు ముఖ్యంగా సాయంకాలం 5 గంటలకొచ్చిన కూలీల్ని కూడా ‘మీకేది న్యాయమో అదిస్తాను’ అని చెప్పి ఆయన తన తోటలో పనికి పంపాడు. పని చివర కూలీలందరికీ యజమాని సమానంగా ఒక దేనారాన్నిచ్చాడు. అయితే ఎక్కువ సేపు, ఎక్కువ పని చేసినందుకు తమకు ఎక్కువ దొరుకుతుందని ఆశించి, భంగపడిన మొదటి కూలీలు తనపై సణుగుతుంటే, ‘మీకిస్తానన్న కూలి మీకిచ్చానుకదా? అందరికీ సమానంగా ‘పూర్తికూలీ’ నేనివ్వాలనుకొంటే మీకెందుకు బాధ? ఇది నా డబ్బు, నా ఔదార్యం!!’ అన్నాడా యజమాని. అవును మరి, దేవుని ఔదార్యం ముందు ప్రపంచంలోని మానవ నిర్మిత న్యాయవ్యవస్థలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి. న్యాయవ్యవస్థలకు నేరస్థుని శిక్షించడమే తెలుసు. చాలా సమాజాలకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ మాత్రమే తెలుసు. కాని కరడుగట్టిన నేరస్థుని కూడా ప్రేమించి, క్షమించి, సంస్కరించి, తన ప్రేమతో నింపి, అతన్ని సమాజానికి ఆశీర్వాదంగా మార్చే దేవునిది ఉహలకందని ఔదార్యం అన్నది బైబిల్ బోధించే అపూర్వ సత్యం, అద్భుతమైన పాఠం. దేవుని ‘ఔదార్యమే’ పరలోకరాజ్యాన్ని నడిపే రాజ్యాంగం!! మనం దేవుని పని ఎంత కష్టపడి పనిచేస్తున్నామన్నది కాక, ఎంత ‘ఇష్టపడి’ ఆనందంగా పనిచేస్తున్నామన్నది పరలోకపు యజమాని, న్యాయమూర్తి అయిన దేవుడు చూస్తాడు, తన ఔదార్యంతో దానికి ప్రతిఫలాన్నిస్తాడు. రాగానే తమకు పని దొరికిందని ఉదయాన్నే వచ్చిన కూలీలు మొదట ఆనందించారు, కాని ఆలస్యంగా వచ్చి, తక్కువ పని చేస్తున్న కూలీలకన్నా తమకు ఎక్కువ దొరుకుతుందన్న దురాశ తో తమ ఆనందాన్నంతా ఆవిరిచేసుకొని అసంతృప్తితో ఇళ్లకెళ్లారు. కాని చివరలో, ఒక గంట కోసమే వచ్చిన కూలీలు, ఎంతో కొంత కూలీ దొరికినా చాలు, ఆ రోజుకు తమ కుటుంబానికి అన్నం పెట్టుకోవచ్చుననుకొంటుంటే, అనూహ్యంగా ఒక పూర్తి దేనారం దొరకడంతో, యజమాని ఔదార్యానికి ఉబ్బితబ్బిబ్బై పట్టరాని ఆనందం తో ఇళ్లకు వెళ్లారు. అలా, మొదటి కూలీల ఆనందాన్ని ‘దురాశ’ అసంతృప్తి గా మార్చగా. చివరి కూలీల ‘కృతజ్ఞత’ వాళ్ళ దుఃఖాన్ని, లేమిని కూడా అవధుల్లేని ఆనందంగా మార్చిందన్న ‘విశ్వాస నిత్యసత్యాన్ని’ యేసు బోధించాడు. మనకు చెందనిదాన్ని ఆశించడం దురాశేనని, విగ్రహారాధనలాగే దేవునికది హేయమైనదని బైబిల్ చెబుతోంది (కొల 3:5). ఆకాశమంత ఎత్తయిన, మహాసముద్రాలంత లోతైన దేవుని ఔదార్యాన్ని కొలవడం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి, మహామేధావులకు కూడా అసాధ్యమే. కాని దేవుని ప్రేమస్పర్శ తో పరివర్తన చెందిన ఒక పాపి, నిరక్షరాస్యుడైనా సరే, దేవుని ఔదార్యాన్ని అనర్గళం గా వివరించగలడు. దేవునిపట్ల కృతజ్ఞత విశ్వాసి ఆంతర్యంలో అనంతమైన ఆనందపు ఊటల్ని సృష్టిస్తుంది. కాని అసంతృప్తి విశ్వాసి జీవితాన్ని ఆర్పి బూడిదగా మార్చుతుంది. విశ్వాసుల జీవితాల్లో నిత్యశాంతి, కుటుంబశాంతి కరువైందంటే తప్పకుండా వాళ్లలోనే ఏదో లోపమున్నట్టే. కొళాయి విప్పి దాని కింద బిందెను తలకిందులుగా పెడితే అది నిండుతుందా? దేవుని రాజ్య మౌలిక విలువలు, దేవుని రాజ్యాంగ నిర్దేశనలు, దేవుని ఔదార్యానికి అనువుగా ఎప్పటికప్పుడు జీవితాలను ‘సరిచేసుకునే’ విశ్వాసుల్లో అందుకే ఆనందం, సంతృప్తి, జీవన సాఫల్యం సమృద్ధిగా పొర్లిపారుతుంది. ‘నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు’ అన్నాడు ప్రభువు (యోహాను 15:5). దేవుని తోటలో పని దొరికితే, కేవలం ‘అదనపు డబ్బుకు’ ప్రలోభపడి దేవునికి దూరమైన ఈ ఏశావు బాపతు వాళ్ళనేమనాలి? అయితే, తాము పూర్తి కూలి పొందే అర్హత లేనివాళ్లమని గ్రహించి ఎంతో తగ్గింపుతో, కృతజ్ఞత తో దేవుని హత్తుకున్న చివరి కూలీలతోనే దేవుడు తన రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించుకొంటున్నాడు. మనమంతా ఆ వర్గం విశ్వాసులలోనే ఉండాలన్నది దేవుని అనాది సంకల్పం. ఎందుకంటే దేవుని రాజ్యం, మన అర్హతలతో కాదు, దేవుని ఔదార్యంతో నిర్మించబడుతుంది, నడుస్తుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని మురిపించేది పరిమాణం కాదు... నాణ్యత మాత్రమే!
మనకు విజయాన్నిచ్చిన గొప్ప నిర్ణయాలను పదిమందికీ చాటి సంబర పడతాం. కానీ మన నిర్లక్ష్యాలు కొన్నింటికి ఎంతటి మూల్యాన్ని చెల్లించామో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతాం. నిర్ణయాలు, వాటి విజయాలు మనవైతే, నిర్లక్ష్యాలు, వాటి దుష్పరిణామాలు కూడా మనవే కదా? ప్రతినిత్యం వెలుగుతో, ప్రభువు సాన్నిధ్యంతో, ఆనందసంతోషాల వాతావరణంతో అలరారే పరలోకం ఎంతటి నిజమో, తీరనిబాధలు, ఆరని అగ్ని, కటిక చీకటితో కూడిన భయానకమైన నరకం కూడా అంతే నిజం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యేసుక్రీస్తు వారి కొండమీది ప్రసంగంలో భాగంగా ఆయన చేసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన బోధ పరలోకానికి, నరకానికి సంబంధించినది. నాశనానికి, నరకానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, విశాలంగా ఉంటుందని, అందువల్ల అనేకులు ఆ దారినే ఎన్నుకొంటారని, నిత్యజీవానికి దారితీసే ఇరుకు ద్వారాన్ని, సంకుచిత మార్గాన్ని చాలా కొద్దిమందే ఎన్నుకుంటారని ప్రభువు పేర్కొన్న అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఆయన చేసిన కొండమీది ప్రసంగమేనని చాలామందికి తెలియదు. మత్తయి 5,6,7 అధ్యాయాల్లోని 111 వచనాల్లో విస్తరించి ఉన్న ప్రభువు వారి కొండమీది ప్రసంగ మూలాంశం కూడా ఇదే!! తన దారిని ఎన్నుకోవడమంటే, అత్యంత కఠినమైన దారిని ఎన్నుకోవడమే అన్న తిరుగులేని సత్యాన్ని క్రీస్తు ప్రభువే తన బోధల్లో, తన జీవితం లో కూడా స్పష్టం చేశాడు. అయినా సరే, కృపగల దేవుడు తన బిడ్డలకు ఇరుకు ద్వారాన్ని, సంకుచితమైన దారినెందుకిస్తాడు? విశాలమైన ద్వారం, సాఫీగా సాగిపోయే రహదారి లాంటి విశాలమైన దారి ప్రభువుదని భావించి, ఆ మార్గాన్ని ఎన్నుకునే వారే అత్యధికులన్నది రోజూ మనం చూసే ఒక సత్యం. ప్రపంచంలో 95 శాతానికి పైగా ప్రజలు ఎన్నుకునే సువిశాలమైన మార్గం నిత్యనరకానికి ఎలా దారితీస్తుంది? అంటూ ‘మెజారిటీ’ సంఖ్యతో తీసుకునే నిర్ణయాలే సరైనవని నమ్మే ‘ప్రజాస్వామ్యవాదం’ ఇక్కడ పనిచెయ్యదన్నది చాలామంది క్రైస్తవులకు మింగుడు పడని ఒక చేదువాస్తవం. ’మీరు ఇరుకు ద్వారాన, దాని ముందున్న ఇరుకు మార్గాన నడవండి’ అని మనకు చెప్పి ప్రభువు తన మార్గాన తాను నడవలేదు. ఆయన కూడా ఒక సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్లపాటు ఎన్నో ముళ్ళు, గోతులు, అవరోధాలున్న కఠిన మార్గంలో నడిచి, సిలువలో ఘోరమైన శ్రమలనుభవించి, చనిపోవడం ద్వారా తన తిరుగులేని విధేయతతో పరమ తండ్రికి కుడిపక్కన ఉన్న స్థానాన్ని సంపాదించుకున్నాడు. సామాన్య ప్రజలమైన మనకు ఏది ఆయన బోధించాడో, అదే ఆయన తన జీవితం లో ఆచరించి మరీ చూపించాడు. ఆదిమ అపొస్తలులు, క్రైస్తవులు కూడా అదే దారిలో నడిచి పరలోకాన్ని తమ ‘జీవనసాక్ష్యం’ ద్వారా సంపాదించుకున్నారు. ఎలాగైనా సరే ఎక్కువ మందిని క్రై స్తవులను చేస్తే దేవుడు శభాష్ అంటాడన్న దుర్బుద్ధితో, నేటి కొందరు సెలెబ్రిటీ బోధకులు దేవుడు నిర్దేశించిన అత్యున్నతమైన విలువల్ని పలచన చేసి, దేవుని వాక్యాన్ని వక్రీకరించి, సంపదలు, స్వస్థతల వంటి ఈ లోకవిషయాల సాధనకు సువార్తను ముడిపెట్టి, ప్రజల్ని నరకానికి దారితీసే విశాలమైన మార్గంలో తాము ముందుండి మరీ నడిపిస్తున్నారు. ఏదడిగితే అదిచ్చేందుకు, చేతిలో అద్భుత దీపమున్న అల్లావుద్దీన్ కాదాయన. ఆయన సార్వభౌముడైన, పవిత్రతకు మరోపేరైన దేవుడు. మనం వెళ్ళాల్సింది పరలోకానికా, నరకానికా అన్న నిర్ణయాన్ని దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. అది పూర్తిగా మన నిర్ణయమే. అందులో దేవుని బలవంతమేమీ ఉండదు. పెద్ద చర్చి, గొప్ప ప్రసంగం, శక్తిమంతమైన ప్రార్థన వంటి మాటలు మనుషుల్ని మురిపిస్తాయేమో కానీ, దేవుని దష్టిలో ఆ మాటలకు విలువ లేదు. ఎందుకంటే, ఆయన కొలబద్ద పరిమాణాత్మకం కాదు, మనలో అత్యున్నతమైన జీవన విలువల్ని ఆశించే నాణ్యతా దృక్కోణం దేవునిది. అందుకే నాడు కోటీశ్వరులు వేసే కానుకల్ని తృణీకరించి, ప్రభువు ఒక పేద విధవరాలు వేసిన మనః పూర్వకమైన కేవలం రెండు కాసుల కానుకను అత్యున్నతమైనదిగా శ్లాఘించాడు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆయన మారని దేవుడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అరణ్యంలో మారు మోగిన సువార్త స్వరం
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల అవిధేయత, విచ్చలవిడితనం పరాకాష్టకు చేరుకున్న రోజులవి. ధర్మశాస్త్రబద్ధమైన యూదుమతం పూర్తిగా మృతమై, దేవునికి ప్రజలకు మధ్య వంతెనల్లాగా, రాయబారులుగా ఉండాల్సిన ప్రవక్తలు లేకుండా పోగా, ప్రజలు దేవుణ్ణి పూర్తిగా విస్మరించి, యథేచ్ఛగా జీవిస్తున్నారు. యెరూషలేము ఆలయంలో బలులు, ఆరాధనలు యధావిధిగానే జరుగుతున్నా, వాటిని నిర్వహించే యాజకవ్యవస్థ కూడా ఉన్నా, యూదా మతమంతా పూర్తిగా ఒక నామమాత్రపు తంతుగా మారిన అధ్వాన్నపు పరిస్థితులవి. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాలనుకున్న కాలం సంపూర్ణమైన రోజులు కూడా అవే. యెషయా ప్రవక్త యేసుప్రభువు ఆవిర్భావాన్నే కాదు, ఆయన రాకను, త్రోవను సరాళము చేసే యోహాను పరిచర్యను కూడా 700 ఏళ్ళ క్రితమే ప్రవచించాడు. యోహాను పరిచర్యను మత్తయి సువార్తికుడు కూడా ప్రస్తావిస్తూ, ‘ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన తోవలు సరాళము చెయ్యండి, అంటూ అరణ్యంలో కేక వేసే ఒకని స్వరం’ అన్న యెషయా ప్రవచనాన్ని పునరుద్ఘాటించాడు (యెషయా 40:1–5,9). యోహాను తల్లి ఎలీసబెతు, యేసు తల్లి మరియకు బంధువు. అతని తండ్రి జఖర్యా యాజక వంశానికి చెందినవాడు. తన పరిచర్య కోసం ప్రత్యేకించి ‘నాజీరు’ గా పెంచమని దేవుడే స్వయంగా అతని తండ్రి జకార్యాను ఆదేశించి, గొడ్రాలైన ఆయన భార్య ఎలీసబెతుకు యోహానును కుమారుడుగా అనుగ్రహించాడు. దేవుడు తన 400 ఏళ్ళ మౌనాన్ని అలా తానే బద్దలు కొట్టి యేసుక్రీస్తు పరిచర్యకు ఉపోద్ఘాతంగా, యేసు త్రోవల్ని సరాళము చేసే ఆంతరంగిక సేవకుడిగా యోహానును పంపించే వార్తను జఖర్యాకు ప్రకటించాడు. అందుకే స్త్రీలు కనిన వారిలో యోహానును మించిన వారు లేరని యేసుక్రీస్తే ఒకసారి ఆయన్ను శ్లాఘించాడు (లూకా 7:28). యోహాను తన పరిచర్య, ప్రసంగాలకు నిర్జన యూదాఅరణ్యాన్ని వేదికగా, ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాడు. అంటే, వేషధారణకు మారుపేరుగా మారిన పరిసయ్యులు, శాస్త్రులనే యూదుమతాధిపతులుండే యెరూషలేము పట్టణాన్ని వదిలేసి, వారికి దూరంగా యోహాను నిర్జనారణ్యంలోకి వెళ్తే, అతని ప్రసంగాలు విని, మారుమనస్సు పొంది. బాప్తిస్మము పొందేందుకు వందలాదిమంది పట్టణాలు వదిలి అతన్ని చేరేందుకు అడవిబాట పట్టారు. దేవుని అభిషేకం లేని పరిసయ్యుల ప్రసంగాలు యెరూషలేములో మారుమోగినా అవి విని ఎవరూ మారలేదు కానీ, యోహాను ప్రసంగాలు దైవస్వరంగా అరణ్యం లో ప్రతిధ్వనిస్తూ ఉంటే, అశేష ప్రజానీకం ఆయన కోసం అరణ్యానికి తరలి వెళ్లి అవి విని పరివర్తన చెందారు. అలా నిర్భయుడైన ప్రవక్తగా, దేవుడే పంపిన ప్రవక్తగా యోహానును ప్రజలు గుర్తించారు. తన సోదరుడైన ఫిలిప్పు భార్యతో అక్రమ కాపురం చేస్తున్న హేరోదు రాజు ‘అనైతిక జీవితాన్ని’ యోహాను చీల్చి చెండాడి, చెరసాల పాలయ్యాడు, చివరికి శిరచ్ఛేదనానికి కూడా గురయ్యాడు (మత్తయి 14:10). కానీ పరిచర్యలో యోహాను ఏ మాత్రం రాజీపడలేదు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలంటే, ముందుగా తాను కాలుష్యానికి దూరంగా ఉండాలన్నదే అరణ్యంలోకి వెళ్లడంలో యోహాను ఉద్దేశ్యం. అలా డబ్బు, పేరు, అధికారం, వేషధారణ, విలాసాలకు దూరంగా అరణ్యంలో అజ్ఞాతంగా బతుకుతూనే వేలాదిమంది జీవితాల్ని అక్కడికే ఆకర్షించి, వారిని మార్చి, రక్షకుడైన యేసుక్రీస్తు త్రోవల్ని నిబద్ధతతో సరాళం చేసి, యేసు చెప్పులను కూడా విప్పడానికి తాను యోగ్యుడను కానంటూ వినమ్రంగా ప్రకటించి, ఆ యేసుకే బాప్తీస్మాన్నిచ్చి, తద్వారా పరిచర్యలోకి ప్రభువును ఆహ్వానించిన అసాధారణ, విలక్షణ దైవజనుడు యోహాను. – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
అది చిరస్మరణీయమైన క్రిస్మస్!!
అమెరికాలోని విస్కాన్సిన్ లో ఒక షాపింగ్ మాల్ చిరుద్యోగి, ఏడాదంతా కూడబెట్టిన తన డబ్బుతో బహుమానాలు కొని క్రిస్మస్ సమయంలో సాంటాక్లాజ్ గా వాటిని పిల్లలకు పంచుతాడు. అంతా అతన్ని సాంటా అనే పిలుస్తారు. ఒక క్రిస్మస్ సమయంలో చిన్న పిల్లవాడు, వృద్ధురాలైన అతని తాతమ్మ, చేతిలో ఒక పదేళ్ల పాప ఫోటోతో వచ్చి ఆయన్ను కలిశారు. ఎవరీమె? అనడిగాడు సాంటా. ‘నా సోదరి శారా’ అన్నాడా పిల్లాడు. అతన్ని దగ్గరికి తీసుకొని ‘ఇదిగో ఈ బహుమానాల్లో నీకు, నీ సోదరికి కూడా ఏమి కావాలో తీసుకో’ అన్నాడు సాంటా. అపుడతని తాతమ్మ, ‘శారా రక్తకణాల కాన్సర్తో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉంది. ఈ క్రిస్మస్ దాకా ఆమె బతకదేమో అంటున్నారు డాక్టర్లు. కాని శారా ఈ క్రిస్మస్ కు సాంటాను చూడాలనుకొంటోంది. వీలైతే ఒకసారి ఆసుపత్రికి రాగలరా? అని ఆమె సాంటాను కన్నీళ్లతో ప్రాధేయపడింది. శారా కథ విన్న సాంటా బాగా కలత చెంది, సరేనన్నాడు. ఆ సాయంత్రమే తన సాంటాడ్రెస్లో అతను ఆసుపత్రికి వెళ్ళాడు. గదిలో శారా అస్థిపంజరంలాగా మంచం పైన ఉంది. ఆమె తల్లి, తండ్రి, తమ్ముడు, తాతమ్మ, మరొక ఆంటీ చుట్టూ ఉన్నారు. కృశించిన ఆమె వంటి నిండా మచ్చలున్నాయి. కీమోథెరపీతో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి. గదినిండా మృత్యువు వాతావరణం. సాంటా మనస్సు చివుక్కుమంది. అయినా తమాయించుకొని, సాంటా పద్ధతిలో ఒహ్హో.... అంటూ పెద్దగా ఆనంద శబ్దాలు చేస్తూ గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూసి ఆనందం పట్టలేక ‘సాంటా ...’ అంటూ శారా గట్టిగా అరిచి మంచం మీది నుండి లేవబోయింది. సాంటా పరిగెత్తుకెళ్లి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఆమె పక్కనే కూర్చున్నాడు. శారా ఆనందంతో సాంటాకు ఏవేవో ఊసులు చెబుతోంది. కన్నీళ్లు ఆపుకొంటూనే సాంటా అవన్నీ వింటూ తాను కూడా చెబుతున్నాడు. శారాలో అంత ఆనందాన్ని చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి కూడా అంతు లేకుండా పోయింది. దానికి కారకుడైన సాంటాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలో నర్స్ వచ్చి, ఇక వెళ్లిపోవాలంటూ సైగచేసింది. ‘శారా, ఒక దేవదూతను నీకోసం ప్రత్యేకంగా నియమించమని దేవుని ప్రార్ధిస్తాను’ అన్నాడాయన. అంతా కళ్ళు మూసుకోగా, సాంటా ఆమె మంచం వద్ద మోకరిల్లి, శారా తల మీద చేయి పెట్టి,‘దేవా ఈ చిన్న బిడ్డను ముట్టండి, శారా వ్యాధిని బాగుచెయ్యండి’ అంటూ ప్రార్ధించాడు. అంతా ‘ఆమెన్’ అన్న వెంటనే, ‘సైలెంట్ నైట్...’ అనే సాంప్రదాయక క్రిస్మస్ కీర్తనను సాంటా శ్రావ్యంగా అందుకోగా, చెమ్మగిల్లిన నేత్రాలతో సారాతో సహా అంతా కలిసి అద్భుతంగా పాడారు. ‘శారా, నేను చనిపోతున్నాను అనికాక, నేను బాగవుతాను అన్న భావన ఇక నుండి నీలో బలపడాలి. ఈ వేసవిలో నువ్వు నీ స్నేహితులతో తనివి తీరా ఆడుకోబోతున్నావు. వచ్చే ఏడాది క్రిస్మస్ సమయంలో నా మాల్ కు వచ్చి నన్ను కలుసుకోబోతున్నావు’ అని సాంటా శారాకు ధైర్యం చెప్పాడు. మెరిసే కళ్ళతో శారా ‘సరే సాంటా’ అంది . సాంటా శారాకు ఆటవస్తువులివ్వలేదు, ఆ క్రిస్మస్కు జీవితంపై ‘ఆశ’ అనే గొప్ప బహుమతినిచ్చాడు. అంతా ఆయన్ను హత్తుకొని సాగనంపారు. శాంటా రాకతో అక్కడి శ్మశానవాతావరణం కాస్తా పండుగ వాతావరణమైంది. ఏడాది తరువాత మాల్కు ఒకమ్మాయి వచ్చి సాంటాను కలిసి ‘నేను గుర్తున్నానా సాంటా?’ అనడిగింది. పిల్లలందరితో అన్నట్టే ‘ఎందుకు గుర్తులేవు? ఉన్నావు’ అన్నాడు సాంటా. ‘పోయిన ఏడాది నన్ను చూసేందుకు మీరు ఆసుపత్రికి వచ్చారు’ అని ఆమె అంటూండగానే సాంటాకు గుర్తొచ్చి ‘నీవు శారావు కదూ’ అన్నాడు అత్యాశ్చర్యంగా. అద్భుతం!! జుట్టు బాగా పెరిగి, ఎంతో బొద్దుగా, అందంగా, ఆరోగ్యంగా ఉంది శారా. ఆనందబాష్పాలతో శారాను సాంటా హత్తుకున్నాడు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఈసారి ఆమె బొమ్మల కోసం రాలేదు. తనలాంటి పిల్లలకు పంచమంటూ బోలెడు ఆటబొమ్మలు, వస్తువులు తెచ్చిచ్చి వెళ్ళింది. ‘ఇది నేను ఎన్నటికీ మర్చిపోలేని క్రిస్మస్’ అంటూ, శారాకిచ్చిన ‘కొత్త జీవితం’ అనే బహుమానానికి ఆకాశం వైపు చూస్తూ సాంటా దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. నిరుపేదలు, ముఖ్యంగా నల్లజాతీయుల జీవితాల్లో క్రిస్మస్ ఆనందాన్ని నింపేందుకు కొందరు క్రై స్తవ పెద్దలు అమెరికాలో 1773 లో నెలకొల్పిన సంప్రదాయమే సాంటా క్లాజ్ గా ప్రసిద్ధి చెందింది. ఇవ్వడంలోని ఆనందాన్ని, తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడుగా ఇచ్చిన ‘క్రిస్మస్’ ద్వారా దేవుడు మానవాళికి నేర్పించాడు. అది అర్ధం కాక, జీవితంలో ఆనందించడం తెలియని, ఇతరులు ఆనందిస్తే ఓర్వలేని, ‘డబ్బు దండగ’ అని అన్నింటినీ కొట్టి పారేసే కొందరు ‘క్రై స్తవ పరిసయ్యులు’, అసలు క్రిస్మస్ చేసుకోవచ్చా? సాంటా క్లాజ్ సంప్రదాయం బైబిల్లో ఉందా? అంటూ కోడిగుడ్డుపై ఈకలు లాగుతుంటారు. సెల్ ఫోన్లు, ఫేస్బుక్ బైబిల్లో ఉన్నాయా? మరి వాటినెందుకు వాడుతున్నారు? మరి కొందరైతే, క్రిస్మస్, తోటివారు, పేదల పట్ల మన ప్రేమను చూపే పండుగైతే, ఎన్ని ప్రసంగాలు చేస్తే లేదా ఎన్ని వింటే అది అంత గొప్ప క్రిస్మస్ అని భావించే స్థాయికి దిగజారారు. మనది అనుదినం దేవుని ప్రేమను ప్రకటించే జీవితమైతే, ఏడాదికి 365 క్రిస్మస్ పండుగలు చేసుకొంటున్నట్టే. లేకపోతే, యేడాదికి కనీసం ఒకటైనా అర్థవంతమైన క్రిస్మస్ చేసుకోవద్దా?? (అమెరికాలో మార్క్ లియొనార్డ్, ఆయన భార్య సుసాన్ లియొనార్డ్ అనే జంట సాంటా క్లాజ్ లుగా ఎన్నో ఏళ్ళ పాటు పేద పిల్లల జీవితాల్లో ఆనందాన్ని నింపి, తమ అనుభవాలను ఒక పుస్తకంగా రాశారు. అందులోని ఒక వాస్తవ గాథ ఇది). – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
సర్వోన్నతుడే దీనుడై దిగివచ్చిన క్రిస్మస్
ఆది నుండీ ఉన్న యేసుక్రీస్తు అనే ’జీవవాక్యాన్ని’ తాము చెవులారా విన్నామని, ఆయన్ను కళ్లారా చూశామని, మూడున్నరేళ్ళపాటు ఆయన్ను నిదానించి అనుభవించామని, తమ చేతులతో ఆయన్ను తాకామని ఆయన శిష్యుడైన యోహాను ప్రభువుతో ఉన్న తన అనుబంధాన్ని తన పత్రికలో అత్యద్భుతంగా వర్ణించాడు(1 యోహాను 1:1). కారు, ఇల్లు, టివి, కుర్చీలు, సోఫాలుఇలాంటి విలువైన వస్తువులన్నీ పాతబడిపోతాయి. కానీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉన్న సజీవమైన అనుబంధాలు మాత్రం పాతబడవు. ఇక దేవునితో ఉండే బాంధవ్యమైతే అసలు పాతబడేదికాదు కదా, అది నిత్యనూతనమైనదని యోహాను అంటాడు. అందుకే యోహాను యేసుకు ’జీవవాక్యం’ అనే బిరుదుని చ్చాడు. పౌలు స్థాపించిన ఎఫెసీ అనే గొప్ప చర్చికి యోహాను చాలాకాలం పాస్టర్ గా ఉన్నాడు. ఆ చర్చిలో గ్నోస్టిక్స్ అంటే, విశ్వాసం కన్నా దేవుని గూర్చిన జ్ఞానం చాలా గొప్పదని వాదించే ‘మహాజ్ఞానులతో’ ఆయన చాలా సమస్యలనెదుర్కొన్నాడు. తాను మనిషికి అర్ధమై అతనితో కలిసి పోయేందుకు వీలుగా, అత్యంత సామాన్యుడు, నిరాడంబరుడైన వ్యక్తిగా ఈ లోకానికి దిగివచ్చి, అందరిలాగా ‘నేను పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చెయ్యడానికి వచ్చిన దాసుడినని’ యేసుప్రభువే ప్రకటించుకుంటే(మత్తయి 20:28), దేవుడు నరుడు, దాసుడు కావడమేమిటి? లాంటి ‘అతిభక్తిపూర్వక’ ప్రశ్నలు లేవెనెత్తి, తన జీవనశైలిద్వారా ఆయన నిరూపించుకున్న అత్యున్నతమైన మానవీయ విలువలను కాక, ఆయనకు ఎలాగూ ఉన్న దైవత్వాన్ని మాత్రమే విశ్వసించడానికి, ప్రకటించడానికి పూనుకున్న ఆ ‘జ్ఞానుల’ వాదనలను యోహాను తన స్వీయానుభవపూర్వకమైన ఈ విశ్వాస ప్రకటన ద్వారా నిర్వీర్యం చేశాడు. దేవుడే తగ్గాడంటే, తాము కూడా తగ్గాల్సి వస్తుందని జంకే బాపతువాళ్ళు ‘ఈ జ్ఞానులు’. అందుకే ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో తాను తాకిన, చూసిన, విన్న, అనుభవించిన దేవుడు అంటాడు యోహాను. తాను పరలోకాధిపతి అయి ఉండి కూడా, ఈ లోకంలోని సాధారణ మనుషులు తనను విని, చూసి, తాకి, తనతో సహవసించడానికి వీలుగా, వారిలో ఒకడిగా జీవించేందుకు గాను మనకు తోడుగా ఉండే’ ఇమ్మానుయేలు’ దేవుడుగా ప్రభువు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్’ సంబరం, సంరంభం. దేవుడే మనిషిగా దిగిరాగా, మనిషి మాత్రం లేనిపోని డాంబికాలకు పోయి తనను తాను దేవునికన్నా గొప్పవాడిగా ఉహించుకొంటూ, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల పేరిట తోటి మనుషులను దూరంగా పెట్టడం ఎంత ‘అమానవీయమో’ తెలిపే సందర్భమే క్రిస్మస్. దేవుడే దీనుడై యేసుక్రీస్తుగా దిగివచ్చి మానవాళికి దీనత్వాన్ని ప్రబోధించాడు. తనను తాను తగ్గించుకోవడం అనే ‘దీనత్వం’ సర్వోత్కృష్టమైన మానవ ధర్మమని, దేవుడు అహంకారాన్ని ఏవగించుకొని దీనులను ఆదరిస్తాడని ‘బైబిల్’ చెబుతోంది. మానవాళి దీనత్వాన్ని అలవర్చుకోవాలన్నదే క్రిస్మస్ ఇచ్చే నిరంతర సందేశం!! – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
కోవిడ్ లోనూ క్రిస్మస్ ఆనందం!!
లోకపరమైన అభ్యున్నతిని ఆశీర్వాదంగా భావించవద్దు. అవసరాలకు మించిన డబ్బు, సంపదలు, గిడ్డంగుల నిండా ఆహారముండటమే గొప్ప జీవితమైతే, అత్యంత హేయమైన సంస్కృతులకు నిలయంగా ఉన్న బబులోను సామ్రాజ్యంలో కూడా అవన్నీ ఉన్నాయని, దేవుడు తన ప్రజల జీవితాల్లో కోరుకునేది ధర్మశాస్త్రబద్ధమైన నీతి, నియమాలు, మౌలిక విలువలు, దైవభయంతో కూడిన పరిశుద్ధజీవితమని యెషయాప్రవక్త హెచ్చరించాడు (యెషయా 1:2–31). మితిమీరిన సంపదలు, అహంకారంతో, అంధత్వంలో కూరుకుపోయిన ఇశ్రాయేలీయులకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు. అనూహ్యంగా, బబులోను సైన్యాలు చేసిన దాడిలో ఒక్క రోజులోనే వాళ్ళ జీవితాలు తలకిందులయ్యాయి. తాము పరలోకపు రాజధానిగా భావించిన యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు ధ్వంసం చేసి పాడుదిబ్బగా మార్చారు, సుందరమైన ఆలయాన్ని కొల్లగొట్టి, దానిలోని బంగారాన్నంతా దోచుకుపోయారు. తాము తిరుగులేని శూరులము, మేధావులమనుకున్న చాలామందిని బబులోనుకు బానిసలుగా చెరపట్టుకొని వెళ్లారు. వాళ్ళ కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ప్రకాశవంతమైన వాళ్ళ దేశం కాస్తా చీకటికూపంగా మారింది. అయితే దేవుడు వాళ్ళను 70 ఏళ్ళ చెర తర్వాత మళ్ళీ వెనక్కు తెచ్చినా, పూర్వవైభవం మాత్రం వాళ్లకు మళ్ళీ దక్కలేదు. ఈ సారి రోమా ప్రభుత్వ నిరంకుశ పాలన వారిని యెరూషలేములోనే మరింత అణిచివేసింది. అంధకారంలో ఉన్నవాళ్లు వెలుగు కోసం, ఆపదలో కూరుకుపోయినవాళ్లు సహాయకుని కోసం, బానిసత్వం లో మగ్గిన ప్రజలు స్వాతంత్య్రం, ఆత్మగౌరవాన్ని ప్రసాదించే విమోచకుని కోసం ఎదురు చూస్తారు. అందుకే బాధిత ప్రజల ఆక్రందనలకు జవాబుగా మానవచరిత్రనంతటినీ క్రీస్తుకు పూర్వం, క్రీస్తుశకం అనే రెండు భాగాలుగా విడదీస్తూ, రెండువేల ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన యేసుక్రీస్తులో ఒక గొప్ప వెలుగును, కృపామయుడైన సహాయకుణ్ణి, మహా విమోచకుణ్ణి, ‘దేవుని రాజ్యం’ అనే ఒక నవలోకనిర్మాతను లోకం కనుగొంది. దేవుని అద్వితీయ కుమారుడైన దైవలోకనిత్యపాలకుడే, ‘యేసుక్రీస్తు’ నామధారిగా, అతిసామాన్యమైన మానవరూపిగా, బేత్లెహేమనే కుగ్రామంలో, ఒక పశువుల శాలలో శిశువుగా ఈ భూగ్రహంపైన పాదం మోపాడు. మెస్సీయాగా దైవకుమారుడు ఈ లోకానికి వస్తాడని బైబిల్ చెబితే, మేధావులు, సంపన్నులు, పాలకుల భవంతుల్లో ఆయన జననం, ఆగమనం కోసం ఎదురుచూసిన ఆత్మీయ అజ్ఞానులైన యూదులు, ఒక నిరుపేదగా, సాదాసీదాగా జన్మించిన రక్షకుని గుర్తించలేకపోయారు. అయితే వాళ్ళు పోగొట్టుకున్నదే, సర్వలోకానికి మహా భాగ్యమైంది. ఈసారి ప్రభువు యూదులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి వరప్రదాత, సార్వజనిక విమోచకుడయ్యాడు. కటిక చీకట్లో కూడా తప్పక ఒక కాంతిరేఖ ఉద్భవిస్తుందన్న ‘ఆశల్ని’ రేకెత్తిస్తూ, విమోచకుని రాకను మరోసారి గుర్తు చేస్తూ ఈ కోవిడ్–19 విపత్తులో ‘క్రిస్మస్’ మళ్ళీ రానే వచ్చింది. దీన్ని డబ్బు దండగ చేసుకునే పండుగలా కాదు, ఆడంబరాల కోసం కాదు, దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుచేసే ఒక శుభప్రదమైన ఘడియగా గుర్తించి పదిమందికీ సాయం చేసి దేవుని ప్రేమను ప్రకటిద్దాం, ఆత్మీయానందాన్ని పొందుదాం, దేవుని ప్రేమతత్వాన్ని మనసారా అనుభవిద్దాం. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవునికి తలవంచాలి, అన్యాయాన్ని ఎదిరించాలి..
‘రాజీపడటం’ అనే మాటే బైబిల్లో ఎక్కడా కనిపించదు. కానీ క్రైస్తవంలో, చర్చిల్లో మాత్రం ఇపుడు ఎక్కడ చూసినా రాజీపడటమే కనిపిస్తోంది. ఇశ్రాయేలీయుల నాయకులైన మోషే, అహరోను, దేవుని ఆరాధించేందుకు అరణ్యంలోకి మూడు దినాల ప్రయాణమంత దూరం వెళ్ళడానికి తన ప్రజలను అనుమతించమని దేవుడు ఆదేశిస్తున్నాడని ఐగుప్తు రాజు ఫరోకు తెలిపారు. నన్ను ఆదేశించడానికి ఆ దేవుడెవరు (ఐగుప్తీయులకు ఫరోయె దేవుడు మరి)? మిమ్మల్ని పోనిచ్చేదిలేదన్నాడు ఫరో. ఆ దశలో దేవుడు ఐగుప్తు మీదికి తెగుళ్లు పంపడం మొదలుపెట్టగా, మూడు దినాల ప్రయాణమంత దూరం కాదు కానీ, కొద్ది దూరం వెళ్లి దేవుణ్ణి ఆరాధించి వెనక్కి రండంటూ ఫరో కొంత వెనక్కి తగ్గాడు. దేవుని ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, అందులో రాజీపడబోమని తాము కోరినట్టుగా తమను పంపమని మోషే పట్టుబట్టగా, దేవుడు మరికొన్ని తెగుళ్లు పంపాడు. పోనీ, పురుషులు మాత్రమే వెళ్లిరండంటూ ఫరో మరి కొంత తగ్గాడు. అలా కనీసం తమ కుటుంబాల కోసమైనా వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారని ఫరో ఆలోచన. అది కూడా కుదరదని, దేవుని ఆదేశాల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని మోషే బదులిచ్చాడు. మళ్ళీ తెగుళ్లు సోకగా, పశువులన్నీ ఇక్కడే వదిలేసి కుటుంబాలతో వెళ్ళవచ్చని ఫరో మరింత తగ్గినా, మోషే అందుకు ఒప్పుకోలేదు. ఇక ఈ సారి దేవుడు ఐగుప్తీయుల ప్రతి ఇంట్లోనూ వాళ్ళ జేష్ఠ కుమారుడు చనిపోయే భయంకరమైన విపత్తును సృష్టించాడు. దాంతో, ఫరో పూర్తిగా దిగివచ్చి, అప్పటికప్పుడు ఐగుప్తు వదిలి వెళ్లేందుకు ఇశ్రాయేలీయులను ఆదేశించాడు (నిర్గమ 8:28, 10:11, 24). అయితే దేవుడు కావాలనే, దగ్గరి దారిలో కాకుండా, ఎఱ -
బుద్ధిహీనతతో చేజారిన సువర్ణావకాశం
అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ తన ఆర్ధిక సలహాదారుడు జె.కె.గాల్ బ్రెత్ ఇంటికి ఫోన్ చేశాడు. ఆయన పడుకున్నాడని పనిమనిషి ఎమిలీ జవాబిచ్చింది. ‘నేనెవరో తెలుసా? ఆయన్ను లేపు’ అన్నాడా అమెరికా అధ్యక్షుడు. ‘నేను గాల్ బ్రెత్ గారికి పనిచేస్తున్నాను, అమెరికా అధ్యక్షునికి కాదు’ అని జవాబిచ్చి ఆమె ఫోన్ పెట్టేసింది. ఆగ్రహించాల్సింది పోయి, లిండన్ జాన్సన్ ఆమె పనితీరును మెచ్చి ఎమిలీని వైట్ హౌస్లో నియమించాడు. యజమాని మనసెరిగి, మెలిగి, ఆయన్ను మెప్పించడం అనే అంశంపైన యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు (మత్తయి 25:14–30). ఒక భూస్వామి తన ముగ్గురు దాసులను పిలిచి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఒకరికి ఐదు తలాంతులు, ఇంకొకరికి రెండు తలాంతులు, మూడవవాడికి ఒక తలాంతు ఇచ్చి మరో దేశానికి వెళ్ళిపోయాడు. ఒక తలాంతు వెయ్యిడాలర్ల విలువచేసే వెండితో సమానం. భూస్వామి చాలా కాలానికి తిరిగొచ్చి లెఖ్ఖ అడిగితే మొదటివాడు తన ఐదు తలాంతులు వాడి మరో ఐదుతలాంతులు సంపాదించానని చెప్పగా ఆయన ఎంతో సంతోషించి వాటిని కూడా అతనికే ఇచ్చేశాడు. రెండవ వాడు కూడా మరో రెండు తలాంతులు సంపాదించానని చెబితే అతనికి కూడా అదే చేశాడు. మూడవ దాసుడు మాత్రం ఆయనిచ్చిన ఒక తలాంతునూ భద్రంగా తెచ్చిచ్చి, ‘నీవు చాలా కఠినుడివి. దీన్ని పోగొడితే శిక్షిస్తావని భయపడి, గుంత తవ్వి దాన్ని భద్రంగా దాచాను. నీది నీవు తీసుకో’ అన్నాడు. యజమాని అందుకు ఆగ్రహోదగ్రుడై, అతనివన్నీ మిగిలిన ఇద్దరికిచ్చి, చీకటి గదిలో అతన్ని బంధించాడు. అసలేం జరిగింది? ఈ ముగ్గురూ నిజానికి బానిసలు. బానిసలకు స్వాతంత్య్రం ఉండదు, హక్కులుండవు. వాళ్ళ పూర్తి జీవితం, సమయం, సామర్ధ్యం పైన యజమానికే పూర్తి హక్కులుంటాయి. అలాంటిది, యజమాని వారిని నమ్మి వాళ్లకు తలాంతులిచ్చి, ఆ బానిసలను కాస్తా తన ఆస్తిలో భాగస్వాములను చేశాడు. ఆ తలాంతులతో ఏదైనా చెయ్యగలిగిన స్వాతంత్య్రాన్ని వారికిచ్చాడు. వారి సామర్థ్యాన్ని గుర్తించి వారికి తనతో సమానమైన స్థాయినిచ్చాడు. చాలా కాలం తర్వాత తిరిగొచ్చాడంటే, వాళ్ళు తమ సామర్థ్యాన్ని పెంచుకొని ప్రయోజకులయ్యేందుకు వారికి బోలెడు సమయమిచ్చాడు. అయితే మూడవ వాడు మూర్ఖుడై, అతితెలివి తేటలకు పోయి యజమాని ఉగ్రత పాలయ్యాడు. యజమాని మళ్ళీ వచ్చేదాకా దొరికిన సమయాన్నంతా సోమరితనంతో, నిష్ప్రయోజకంగా గడిపాడు. వెయ్యి డాలర్ల విలువ చేసే వెండినైతే జాగ్రత్తగా కాపాడాడు కాని, డబ్బుతో వెలకట్టలేని ఆయనిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాన్ని, గుర్తింపును, ముఖ్యంగా సమయాన్ని మాత్రం దుబారా చేశాడు. తాళం వేసి గొళ్ళెం మర్చిపోవడమంటే ఇదే. చాలా మంది విశ్వాసులు, దేవుడిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాల్ని, సమయాన్ని దుబారా చేస్తూ, డబ్బును ఆస్తులను మాత్రం ‘జాగ్రత్తగా’ కాపాడుకోవడమే తెలివైన విధానమనుకొని, బాధ్యతారహితంగా బతుకుతారు. అలాంటి సోమరులు, పిసినారులకు జీవితంలో సుఖముండదు, సమాజంలో పరువుండదు, జీవన సాఫల్యం అసలే ఉండదు. భూస్వామి అసలు బాధ, కోపమేమిటంటే, తాను అంతటి సువర్ణావకాశమిచ్చినా, ఆ మూడవ వాడు మారలేదు, ఆత్మీయంగా ఎదగలేదు, ప్రయోజకుడు కాలేదు. పైగా యజమాని ఔదార్యాన్ని, ప్రేమను, కృపను అర్థం చేసుకోకుండా, తన దౌర్భాగ్యాన్ని తెలుసుకోకుండా, ‘నీవు విత్తని చోట కోసేవాడవంటూ’ ఆయనపైనే అభియోగం మోపాడు. రేపు పరలోకంలో మన ‘ప్రోగ్రెస్ రోపోర్టుల్లో’ ఇవే వ్యాఖ్యలుంటాయేమో జాగ్రత్త!! దేవుని మనసు, ప్రణాళికల మేరకు, పదిమందికీ ప్రయోజనం కలిగిస్తూ ఆయన్ను ఎంత మెప్పించామన్నదే మన ప్రతిభకు, విలువకు గీటురాయి. కరెన్సీ కట్టలెన్ని కూడబెట్టినా దేవుని దృష్టిలో అవి కేవలం చెత్త కాగితాల గుట్టలే!! కాబట్టే, ఆ రోజున దేవాలయంలో పెద్దమొత్తాలిచ్చిన ధనికులంతా డాంబికంతో తమ ఫలాన్ని పోగొట్టుకొని పరలోకంలో పరమ నిరుపేదలుగా మిగిలిపోతే, ఒక పేద విధవరాలు మాత్రం కేవలం రెండు కాసులిచ్చి దేవుని మనసు గెలుచుకొని పరలోకంలో అందరికన్నా ధనికురాలు, ధన్యురాలైంది. –రెవ.టి.ఏ.ప్రభుకిరణ్ -
‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’
శరీరంలో కళ్ళది, వాటిని కాపాడే కనురెప్పలది చాలా కీలకమైన పాత్ర. కనురెప్ప రక్షక కవచంగా ఉంటూ కనుగుడ్డును కాపాడటమే కాదు, తన నిరంతర కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తేమను ఒక పొరలాగా కనుగుడ్డుపై వ్యాపింపజేస్తూ కంటి పనితీరును మెరుగుపర్చుతుంది. తానే సృష్టించిన అలాంటి కనుపాపను, కనురెప్పలను ప్రస్తావిస్తూ దేవుడు జెకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చిన భద్రతా వాగ్దానం ఎంతో ఆదరణకరమైనది కూడా. ‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’ అన్నాడు దేవుడు తన ప్రజలతో (జఖర్యా 2:8). దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తపర్చిన ఈ వచనం అసమానమైనది. ఇక మోషే అయితే, తమ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, దేవుడు తమను కనుపాపలాగా కాపాడాడని స్తుతించాడు(ద్వితీ 32:10). ఎవరైనా సరే తనకు, తన కుటుంబానికి కోరుకునేది సంపూర్ణమైన భద్రత. ప్రాచీనకాలంలో రాజులు భద్రత కోసం ఎల్తైన స్థలాలు, కొండల మీద తమ కోటలు, తామున్న పట్టణాల చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కట్టుకునేవారు. కాని 30 వేల అడుగుల ఎత్తున ఎగిరే యుద్ధ విమానాల నుండి క్షణాల్లో ఎగిసి వచ్చే క్షిపణులు, అత్యంత విధ్వంసకమైన బాంబులున్న నేటి కాలంలో ఎత్తైన ప్రాకారాలు, కోటగోడలకు, అసలు ‘ఎత్తు’ అనే మాటకే అర్థం లేకుండా పోయింది. కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ అనే క్రిమి, ఇంతటి మహాప్రపంచాన్ని వణికిస్తోందంటే, దేవుని ఈ వాగ్దానం మరుగున పడిందా? లేక మనిషి తన భద్రత కోసం తాను చేసే భద్రతా వ్యూహాలు, ఏర్పాట్లు, తయారుచేసుకున్న ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయా? మనిషి కనుగుడ్డును ముట్టడమే కష్టమైతే, దేవుని కనుగుడ్డును ముట్టడం మరెంత కష్టం? ఆయన బిడ్డలమైన మనల్ని శత్రువు ముట్టడం, నష్టపర్చడం, మనపై దాడి చెయ్యడం కూడా అంతే అసాధ్యమంటాడు దేవుడు. మరి ప్రపంచమంతటా నెలకొన్న కనీ వినీ ఎరుగని భద్రతారాహిత్యానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు మనం తప్పక జవాబు తెలుసుకోవాలి. జఖర్యా ప్రవచించే నాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 70 ఏళ్ళ బబులోను చెరనుండి విడుదలై అప్పుడప్పుడే యెరూషలేముకు తిరిగొచ్చారు. దేవుని ప్రజల్ని, దేవుడే చెరలోకి పంపడమేమిటన్న ప్రశ్న వాళ్లందరిలోనూ ఉంది. కొందరు, బబులోను చక్రవర్తి మమ్మల్ని చెర పాలు చేసి దేవుని కనుగుడ్డును ముట్టినట్టే కదా? అని జఖర్యా ప్రవక్తను నిలదీసి ఉంటారు కూడా. అయితే తమ ప్రవర్తన మార్చుకొమ్మని రెండొందల ఏళ్ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించినా ప్రజలు మారలేదు. దేవుని భయం సమసిపోయి, ప్రజలు కేవలం పేరుకే దేవుని ప్రజలుగా జీవిస్తున్న కారణంగానే వారి జీవితాలలో, సమాజంలో భద్రత కరువైంది. దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెడితే తీవ్ర పర్యవసానాలు తప్పవు. విధేయులై దేవుని ప్రసన్నతను, అపారమైన ఆశీర్వాదాలను పొందని వారు, దేవునికవిధేయులై జీవితాలు, కుటుంబాల్లో బాగుపడ్డవారు మీకెక్కడా కనిపించరు. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవునిలో అంతకంతకూ ఎదిగిన అనుభవం కూడా ఉండాలి. అలా కాకుండా ఎంతో వాక్యం తెలిసినా విశ్వాసంలో ఎదగక, డబ్బు, అధికారం, పేరు, ఆరోగ్యం, సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదమన్న ‘బాలశిక్షస్థాయి’ విశ్వాసం లోనే ఉండిపోతే, అదే అన్ని సమస్యలకు మూలం. ప్రజల్లో మార్పునకు కూడా అదే ఆటంకం. మనం నమ్మే లోక నియమాలను, మనకు నచ్చని దైవిక విధివిధానాలకు అన్వయించే ‘అతి పోకడలే’ ఈ రోజు మనమెదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఆత్మీయ రుగ్మత. మారని దేవునితో సాగే మన సాంగత్యానికి రుజువేమిటంటే, దినదినం మనం దేవుని సారూప్యంలోకి మారడమే!! మనం దేవుని ప్రజలమైతే, మన పరలోకపు తండ్రియైన దేవుని లక్షణాలు లోకానికి మనలో స్పష్టంగా కనిపించాలి. ఆ స్థాయిలో మనలో దేవుని ఆశీర్వాదాలకు, భద్రతకు అంతు ఉండదు. అపుడు, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడే అంటాడు దేవుడు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని ప్రణాళికలను నెరవేర్చడమే ఆశీర్వాదం
సూర్యుని చూడలేకపోయినా, సూర్యుని ‘నీడ’ లో సేదదీరగలం. అలాగే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడకున్నా, దేవుని నీడను, కృపను, ముఖ్యంగా ఆయన అదృశ్యహస్తపు మహాశక్తిని ఎస్తేరు తన జీవితంలో అడుగడుగునా అనుభవించింది. ఎస్తేరు ఒక సాధారణ యువతి, బబులోనులో యూదుబానిస, తనవాళ్లంటూ లేక మొర్దేకై అనే బంధువు వద్ద ఆశ్రయం పొందిన అనాథ. కాకపోతే ఎస్తేరు పుష్కలంగా దైవభయమున్న అసమానమైన సౌందర్యవతి. బబులోను మహారాణి వష్తి పదవీచ్యుతురాలైనపుడు, వందలాదిమంది లో అనామకురాలైన ఎస్తేరు ఆ పదవికి ఎంపికై, బబులోను సామ్రాజ్యానికి మహారాణి కావడం వెనుక దేవుని అదృశ్య హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. తాను మహారాణినయ్యానంటూ ఆమె ఎప్పుడూ విర్రవీగలేదు. కాని, బైబిల్ భాషలో చెప్పాలంటే, తగిన సమయంలో దేవుడు తనను హెచ్చిస్తాడన్న విశ్వాసంతో బలిష్టమైన ఆయన చేతికింద దీనమనసుతో, దైవభయంతో ఆమె జీవించింది(1పేతురు 4:6). అయితే తల్లిగర్భంలో ఆకృతిని కూడా పొందక మునుపే ఎస్తేరు పట్ల సంసిద్ధమైన దేవుని అనాది సంకల్పం అమలయ్యే రోజొకటి రానే వచ్చింది. యూదులకు బద్ధశత్రువులైన అమాలేకీయుల అగగు అనే రాజు సంతతికి చెందిన హామాను(1సమూ 15:8) తాను ప్రధానమంత్రి కాగానే, బబులోను సామ్రాజ్యంలోని యూదులందరి ఊచకోతకు ముహూర్తం కూడా నిర్ణయించాడు. ఎస్తేరు పెంపుడు తండ్రి మొర్దేకై ఆ సమాచారాన్ని ఎస్తేరుకు చేరవేసి, చక్రవర్తిని కలిసి ఆ తాకీదును రద్దుచేయించమన్నాడు. ఎస్తేరు యూదురాలన్న విషయం అత్యంత రహస్యం. అందువల్ల ఇపుడా విషయం తెలిస్తే చక్రవర్తి అహేష్వేరోషు ఆమెకు మరణదండన విధించవచ్చు. పైగా ఆహ్వానం లేకుండా చక్రవర్తి సన్నిధికి వెళ్లిన వారికి, ఆయన ప్రసన్నుడైతే తప్ప, విధిగా మరణ దండన విధించాలన్న చట్టం ఉంది. సమస్య ఒక మహాపర్వతం లాగా ఎదురైతే, ఎంత భక్తి ఉన్నా ప్రాణభయానిదే పై చెయ్యి అవుతుంది. ఎస్తేరు ప్రాణభయాన్ని వ్యక్తం చేయగా, మొర్దేకై ‘నీవు మౌనం వహిస్తే, దేవుని తన ప్రజలకు మరో విధంగా సహాయం చేస్తాడు. కాని ఈ సమయం కోసమే నిన్నింతగా హెచ్చించిన దేవుని సంకల్పాన్ని నీవు నిర్వీర్యం చేస్తున్నావేమో చూసుకో!!’ అంటూ సరైన సమయంలో, సరైన హెచ్చరిక చేశాడు. ఆ వెంటనే నేను నశిస్తే నశిస్తాను, కాని దేవుని ప్రజల్ని కాపాడుతానని ఎస్తేరు తీర్మానించుకొని, తన కోసం ప్రార్ధించమంటూ మొర్దేకైని, తన యూదుప్రజలను వేడుకొంది. వాళ్ళ ప్రార్ధనా బలంతో, కొండంత విశ్వాసంతో ఎస్తేరు చక్రవర్తి సన్నిధికి వెళ్లగా, ఆయన ప్రసన్నుడై ఆమె కోరినట్టే తాకీదును రద్దు చేసి, యూదుల్ని సంహరించాలనుకున్న హామానును, అతని కుటుంబాన్నంతటినీ నాశనం చేశాడు. అలా ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి, తన వాళ్ళైన వేలాది మంది ప్రాణాలు కాపాడింది. దీనంతటిలో ఎస్తేరుది ప్రత్యక్షపాత్ర కాగా, మొర్దేకైది పరోక్షమైనదైనా అత్యంత ప్రధానమైన పాత్ర. ఒకానొక కీలకమైన దశలో, ఎస్తేరును దేవుని ఆలోచనతో అనుసంధానం చేసి, ఆమెను కార్యోన్ముఖురాలిని చేశాడతను. ఈ మొర్దేకై పాత్రను విశ్వాసుల కుటుంబాల్లో తల్లిదండ్రులు, చర్చిల్లో పాస్టర్లు నిర్వహించాలి. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవాళ్లు. ఇపుడు తల్లిదండ్రులే పిల్లలకు భయపడే ఆధునిక విష సంస్కృతి వ్యాపిస్తోంది. పిల్లలకు ‘ఇది తప్పు’ అని తల్లిదండ్రులు చెప్పడమే తప్పైపోయిన ‘భ్రష్ట యుగం’ మనది. ఇప్పటి పాస్టర్లు బైబిల్లో మర్మాలు, కొత్త కొత్త విషయాలు గొప్పగా చెబుతారు. కాని ‘తప్పును తప్పు’ అని ధైర్యంగా చెప్పే పరిస్థితే లేదు.‘కరెక్షన్’ అంటే ‘దిద్దుబాటు’ లేని కుటుంబాలు, చర్చీలే సమాజాన్ని ఛిద్రం చేస్తాయి. పూర్వం నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ కుటుంబాల్ని ఎంతో గొప్పగా నిర్మించుకొని పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే, ఎంతో చదువున్న నేటి తరం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యలేక గాలికొదిలేస్తున్నారు. ‘నేనొక పల్లెటూరివాణ్ణి, నాది నిరక్షరాస్య నేపథ్యం’ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు, ఈ నాటి ఉన్నతస్థితిలో దేవునికి, నీ వాళ్లకు ఏం చేశావన్న ప్రశ్నకు జవాబుందా? ఇళ్లలో, చర్చిల్లో ఎస్తేరులు, మొర్దేకైలు లేక విశ్వాసులు, వాళ్ళ పిల్లల జీవితాల్లో దేవుని ప్రణాళికలు నెరవేరకపోతే, అదొక మహా సంక్షోభం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!
దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితనాన్ని నైలు నదిలో, ఒక జమ్ముపెట్టెలో ఒంటరిగా గడిపాడు. ఫరో కుమార్తె తీసుకెళ్లి రాజభవనంలో పెంచినా, అక్కడా తనవాళ్లెవరూ లేని ఒంటరితనమే నలభై ఏళ్ళ పాటు మోషేను వెంటాడింది. తన వాళ్ళనుకొని హెబ్రీయుల వద్దకు వెళ్తే వాళ్ళతణ్ణి ఈసడించి మరింత ఒంటరి వాణ్ణి చేశారు. ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి పారిపోయి, అక్కడ తనకు పిల్లనిచ్చిన మామతో మందలు మేపుతూ, తన జీవితానికంటూ ఒక గమ్యం, లక్ష్యం, అర్ధం కనబడని పరిస్థితుల్లో మోషే మరో నలభై ఏళ్ళు గడిపాడు. అలా ఎనభై ఏళ్ళు నిండిన పండు వృద్ధుడై జీవితాంతంలో తానిక ప్రజలకు కాని, తన దేవునికి కాని చేయగలిగిందేమీ లేదనుకొని తీవ్ర నిస్పృహకు, తీరని ఒంటరి భావనకు లోనైన దశలో మోషే రాసిన 90వ కీర్తన, బైబిల్లోని 150 కీర్తనల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైనది. ఎంతో ప్రతిభ కలిగి, దేవునిలో అత్యున్నతంగా ఎదిగి కూడా, దేవుడు తన ద్వారా ఏం చెయ్యాలనుకొంటున్నాడో తెలియని పరిస్థితుల్లో, అదిక తన జీవిత చరమాంకమనుకొని ‘మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు, అధికబలముంటే ఎనభై సంవత్సరాలు’ అని ఆ కీర్తనలో మోషే పాడుకున్నాడు (కీర్తన 90:10). అయితే దేవుడతని ఆలోచనలు తారుమారు చేస్తూ, హోరేబు కొండమీద ఒక మండే పొద ద్వారా ప్రత్యక్షమై ‘ఇది నీ జీవితానికి అంతం కాదు, ఆరంభం’ అన్నట్టుగా తన దర్శనాన్నిచ్చాడు. తన ప్రజల్ని దాస్య విముక్తులను చేసి, ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించే అత్యంత ఆశీర్వాదకరమైన పరిచర్యను మోషేకు అప్పగించాడు. ఆ నలభై ఏళ్ల పరిచర్యతో మోషే జీవితానికి సాఫల్యత, సార్థకత లభించి, తాననుకున్నట్టుగా 80 ఏళ్లకు కాక, 120 ఏళ్లకు విజయవంతంగా జీవితాన్ని ముగించుకున్నాడు. దేవునికున్న అత్యంత విశేషమైన లక్షణాల్లో ఒకటి ‘ఆయన ఆశ్చర్యకరుడు’ అన్నది (యెషయా 9:6). మానవాళిని, లోకాన్ని ఆశ్చర్యపర్చడంలో దేవుని మించిన వారు లేరు. కరోనావైరస్ లోకాంతానికి సూచన అంటూ హడావుడి చేస్తున్నారు. చర్చిల్లో, విశ్వాసుల్లో నాణ్యత, పరిపక్వత, నిబద్ధత తగ్గి, మాలిన్యం, రాజకీయాలు, ప్రచారాలు, ధనమొహం, వేషధారణ, ఆడంబరాలు, అహంకారం పెచ్చరిల్లి, దేవుని స్థానాన్ని అవి ఆక్రమించిన పరిస్థితుల్లో, కరోనావైరస్ ఒక ప్రమాద ఘంటిక!! కరోనావైరస్ ఈ అవలక్షణాలన్నింటినీ అంతం చెయ్యాలి, అంతం చేస్తోంది కూడా. పది నెలలుగా చర్చిలు నడవడం లేదు, మొన్నటిదాకా దేవుని స్థానాన్ని చర్చి తీసేసుకుంటే, కరోనావైరస్ విశ్వాసుల్ని ఇపుడు మళ్ళీ దేవుని పాదాల వద్దకు తెచ్చింది. మనిషి ఆలోచనల్ని తారుమారు చేసి, ఆయన తన పద్ధతిలో తన ప్రణాళికల్ని అమలు చేసి ఆశ్చర్యపరిచే దేవుడని మరోసారి రుజువైంది. తాను మహా అయితే 80 ఏళ్ళు బతుకుతానేమో అని మోషే అనుకుంటే, దేవుడతనికి 120 ఏళ్ళ ఆయుష్షునివ్వడమేకాక, జీవితంలోని అతని చివరి దశను అద్భుతమైన పరిచర్యతో నింపి దేవుడతణ్ణి ఆశ్చర్యపరిచాడు. తననాశ్రయించిన ఎవరి జీవితాన్నైనా అనూహ్యమైన ఆశీర్వాదాలతో నింపి, అంతాన్ని ఆరంభంగా, ఆనంద సముద్రంగా మార్చగల సమర్థుడు దేవుడు. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు దుర్భరమైన ఏకాంత కారాగారావాసాన్ని గడిపినా, అతని దీక్ష, దర్శనం మసకబారలేదు. మనసుని పిండి పిప్పి చేసే ఏకాంతంలోనూ దేవుడే తనతోపాటు ఉండి జైల్లో తాను బలహీనపడకుండా కాపాడాడని తనకు అత్యంత సన్నిహితుడైన మెథడిస్ట్ బిషప్ పుంవలానాకు జైలు నుండి రాసిన ఒక లేఖలో మండేలా పేర్కొన్నాడు. అయితే తన క్రైస్తవ సాక్ష్యాన్ని బహిరంగం చేసి ప్రజల్లో రాజకీయవిభేదాలకు కారణం కావడం కన్నా, ఆ విశ్వాసాన్ని తనకు, తన దేవునికి మధ్య గల అత్యంత అపురూపమైన బంధంగా దాచుకోవడమే తనకిష్టమని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు. సంకుచితత్వానికి మారుపేరైన డాంబిక క్రైస్తవులకు ఈ మార్మికత అర్థం కాదు. దుర్భరమైన జైలుజీవితం నేపథ్యంలో కూడా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ఆయన అందించినసేవల్లో అణువణువునా క్రైస్తవ క్షమ, ప్రేమా సౌరభమే గుబాళిస్తుంది. తనను ఆశ్రయించిన వారికెవరికైనా జీవనసార్థకతను, సాఫల్యాన్నివ్వడానికి దేవుడు ఏ దశలోనైనా సిద్ధమే. – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
ఎంతో బలమున్నా నిర్వీర్యుడైన సమ్సోను
శత్రువు ఆయుధాలతో మన ఎదురుగా ఉంటే మనం గెలవొచ్చు. కాని ఆ శత్రువే విషంగా మారి మన రక్తంలో కలిస్తే, చనిపోవడమొక్కటే మనకున్న మార్గం. ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులనే శత్రువులు అలాంటి వారే. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఎదుర్కోవలసిన ఏడు శత్రుజనాంగాల జాబితాలో నిజానికి ఫిలిష్తీయులు లేరు (యెహోషువా 3:11). కాని న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను ఏలిన 300 ఏళ్లలో ఫిలిష్తీయులు గ్రీసు దేశం నుండి ఐగుప్తుకు, అక్కడినుండి వెళ్లగొట్టితే వచ్చి ఇశ్రాయేలీయులుంటున్న కనాను దేశపు దక్షిణప్రాంతాల్లో శరణార్థులుగా నివసించారు. ఎందుకంటే ఇనుప పనిముట్లను, ఆయుధాలను, ఇనుప రథాలను చెయ్యడంలో ఫిలిష్తీయులది అందె వేసిన చెయ్యి. అందువల్ల ఫిలిష్తీయులను తమ మధ్య నివసించడానికి అనుమతించడంలో ఇశ్రాయేలీయులకు ప్రయోజనం కనిపించింది. కనానులోని శత్రువులను సంహరించి, ఓడించిన దేవుని ప్రజలు ఇలా కొత్త శత్రువులొచ్చి తమ మధ్య దూరకుండా అడ్డుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు చాలా కాలం ఫిలిష్తీయులను తమ పొరుగువారుగా, ఇనుప పనిముట్లు చేసిపెట్టే పనివారుగానే పరిగణించారు. పైగా ఫిలిష్తీయుల పురుషులు బలవంతులైతే, వాళ్ళ స్త్రీలు చాలా అందమైనవారు కావడంతో, ఇశ్రాయేలు యువకులు అక్కడి నుండి స్త్రీలను తెచ్చుకొని పెళ్లిచేసుకోవడం కూడా మామూలయింది. కనానుదేశంలో అన్యజనాంగాలతో సాంగత్యం చేయవద్దంటూ దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి ఇశ్రాయేలీయులు చేసిన ఈ దుష్కార్యానికి పర్యవసానంగా ఫిలిష్తీయులే ఒక దశలో ఇశ్రాయేలీయులను ఏలడం ఆరంభించి 70 ఏళ్లపాటు వారిని కఠినంగా పాలించారు. ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడేందుకు దేవుడు సమ్సోను అనే న్యాయాధిపతిని అపుడు ఎన్నుకున్నాడు. అంతదాకా పిల్లలు లేని మనోహా అనే ఇశ్రాయేలీయుని భార్యతో దేవుడు మాట్లాడి, ఆమెకు తానొక కొడుకునివ్వబోతున్నానని, అతడు చాలా బలవంతుడవుతాడని, అయితే అతన్ని దేవునికి ‘ప్రతిష్ఠితుడుగా’ ప్రత్యేకించి పెంచాలని, ఇశ్రాయేలీయులను అతను ఫిలిష్తీయుల నుండి రక్షిస్తాడని ఆమెను తెలిపాడు. అలా మొదలయ్యింది ఎంతో బలవంతుడుగా పేరొందిన సమ్సోను కథ. అప్పటికే ఇశ్రాయేలీయుల జీవనశైలిలో ఫిలిష్తీయుల సంప్రదాయాలు చాలా కలిసిపోయాయి. ఫిలిష్తీయుల నుండి దేవుని ప్రజల్ని రక్షించడానికి ప్రత్యేకంగా తమకు పుట్టిన బాలునికి అతని తల్లిదండ్రులు ‘సమ్సోను’ అనే ఫిలిష్తీయుల పేరు పెట్టడమే దానికి రుజువు. సమ్సోనును ఎంతో బలవంతుడుగా దేవుడు పుట్టిస్తే స్త్రీలను మోహించి తన బలాన్నంతా వారికే ధారపోసే దుర్బలుడయ్యాడు సమ్సోను. పైగా తల్లిదండ్రుల నియంత్రణ కూడా అతని మీద లేదు. చివరికి దెలీలా అనే ఫిలిష్తీ స్త్రీని మోహించి ఆమెతో సహవసించి, అలా ఫిలిష్తీయులకు బందీగా చిక్కి, వాళ్ళు అతని కళ్ళు కూడా పెరికివేసేంత బలహీనుడయ్యాడు. కాకపోతే అంధుడై కూడా దేవుని సహాయంతో ఒక గుడి స్తంభాలు పడగొట్టడం ద్వారా వారి దేవాలయాన్ని కూల్చి వేలాదిమంది ఫిలిష్తీయులను ఒక్కసారిగా హతమార్చి సమ్సోను తన పగ తీర్చుకున్నాడు. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఎన్నో గొప్పకార్యాలు చేయడానికి పుట్టిన సమ్సోను అలా కేవలం తన పగ మాత్రం తీర్చుకొని చనిపోయాడు. దేవుడిచ్చిన బలం తన సొంతమని అతను నమ్మడం, అతని తల్లిదండ్రులు కూడా అతన్ని సరిగ్గా నడిపించలేక పోవడమే అతని సమస్య అయ్యింది. శత్రువును గెలిచేవాడు బలవంతుడైతే, స్వీయనిగ్రహంతో తనను తాను గెలిచేవాడు మహా యోధుడని సమ్సోను తెలుసుకోలేకపోయాడు. అత్యున్నతంగా కనిపించే పర్వతాల అసమానశక్తి రహస్యం, అదృశ్యంగా భూమి లోపల ఉండే వాటి పునాదుల్లో ఉంటుందన్న రహస్యం తమను తాము నిగ్రహించుకునేవారికి, తగ్గించుకునేవారికే తెలుస్తుంది. ఎంతో బలమున్న సమ్సోను నిర్వీర్యం కావడానికి అతని హృదయంలోని అపరిశుద్ధతే కారణమైంది. – రెవ.డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాసికి దేవుడే విలువైన ఆస్తి
డబ్బు, ఆస్తులు మనకు గుదిబండలు కాకూడదు, అవి ఆకాశంలో స్వేచ్ఛగా, ఆనందంగా ఎగిరేందుకు తోడ్పడే రెక్కలు కావాలి. అబ్రాహాముది యూఫ్రటీసు మహానదికి అవతలి వైపున్న మెసొపొటేమియా దేశం. అది ఎంతో అందమైన భవనాలు, సంపన్నులు, యోధులుండే ప్రాంతం. ఒకప్పుడు ఎంతో ఎత్తైన బాబేలు గోపురాన్ని కట్టేందుకు పూనుకున్నది అబ్రాహాము పూర్వీకులే. అలాంటి భవనాలను, సంపన్నతను, శూరులైన తన స్వజనులను వదిలేసి, నాకు దేవుడు మాత్రమే చాలనుకుని, దేవుని ఆజ్ఞతో 1200 మైళ్ళ దూరం ప్రయాణించి వచ్చి కనాను దేశంలో గుడారాల్లో వినమ్రంగా, నిరాడంబరంగా నివసించిన గొప్ప విశ్వాసి అబ్రాహాము. ఆయన తనకున్న కొద్దిమంది సేవకులతోనే కనానులో ఒకసారి నలుగురు రాజులను ఓడించిన మహా యోధుడు కూడా (ఆది 14:5–7). కనానులో దేవుడాయనకు గొప్ప ఆస్తినిచ్చినా అతిశయపడకుండా దేవుడే తన విలువైన ఆస్తి అని భావించిన నిగర్వి. అబ్రాహాము ఒకసారి దేవునితో, నాకు వంశోద్ధారకుడు లేకపోతే, ఆస్తినంతా నా వద్ద బానిసగా ఉన్న ఏలీయాజరుకే ఇచ్చేస్తానన్నాడు (ఆది 15:20). నిజానికి తన సోదరుని కుమారుడైన లోతును అబ్రాహాము తన వెంట తెచ్చుకొని పెంచి పెద్దవాణ్ణి చేశాడు. అలాంటి తన రక్తసంబంధియైన లోతుకు తన ఆస్తి ఇవ్వాలనుకోవడం అందరూ చేసే లోకపరమైన ఆలోచనే. కాని తన రక్తసంబంధికి కాక తన బానిసకు ఆస్తినంతా ఇచ్చేయాలనుకోవడం అబ్రాహాములో పరిమళించిన క్రైస్తవం!! ‘క్రీస్తు యేసుది అయిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి’ అంటుంది బైబిల్ (ఫిలి 2:5). యేసు తన ఈ ‘గొప్ప మనసునే’ వెలలేని ఆస్తిగా మనకిస్తాడు. అదే మన జీవితాన్ని, కుటుంబాన్ని పరలోకానందంతో నింపుతుంది. మన నాణ్యతను తేల్చుకోవడానికి పెద్ద పరీక్షలు అఖ్ఖర్లేదు. ఇంట్లో మన పనివాళ్లను మనం చూసే పద్ధతిలోనే అది తేలిపోతుంది. పనివాళ్లను రాచిరంపాన పెట్టే యజమానులు పైకి ఎంత ప్రార్ధనాపరులు, పండితులు, విశ్వాసులైనా ఆంతర్యంలో వాళ్ళు దేవునికి విరోధులే!!. మన పనమ్మాయి, మన కార్ డ్రైవర్, మనమూ పరలోకంలో అంతా సమానులమై పక్కపక్కనే కూర్చుంటామన్న సత్యాన్ని గ్రహించిన రోజున మన జీవితాలు మారిపోతాయి. గుడారంలో ఉంటూ కూడా అబ్రాహాము పరలోకానందంతో నివసించాడు. దేవుని మనసును అనుకరిస్తూ, అలవర్చుకొంటూ సమృద్ధియైన క్రైస్తవంతో జీవిస్తూ, ఆయన తన గుండెలోనే ఒక గొప్ప గుడి కట్టి తన ప్రభువును అందులో ప్రతిష్టించుకున్నాడు. ఈ గుడిలో ఆరాధనలు ఆగవు, ఈ గుడికి ‘లాక్ డౌన్’లో కూడా తాళాలు పడవు. విశ్వాసి గుండెగుడిలో నుండి పారే నిరంతర ‘ఆరాధనామృతధార’ జీవితాన్ని, లోకాన్ని ప్రేమతో, పవిత్రతతో, ఆనందంతో ముంచెత్తుతుంది. – రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్ -
చర్చి వెలిగే లైట్ హౌస్లాగా ఉండాలి
దేవుని అద్భుత సత్యాలతో కూడిన బైబిల్ ఇంట్లో ఉన్నా రోజుల తరబడి దాని జోలికి వెళ్లకుండా విశ్వాసి ఉంటున్నాడంటే, దేవుడంటే ‘ఆకలి’ మందగించిందని, ఆకలి లేక పౌష్టికాహార లోపం ఏర్పడి అతని జీవితం అన్ని రకాల అనర్థాలకూ కారణమైందని అర్థం. తాను స్థాపించిన కొరింథీ చర్చిలో అసూయలు, కలహాలు, విభేదాలు, విభజనలకు ‘ఆత్మీయపౌష్టికాహార సమస్యే’ కారణమని. ఆ చర్చికి రాసిన మొదటి లేఖలో పౌలు వాపోయాడు. ‘అప్పట్లో మీరు బలహీనులు కాబట్టి నేను మిమ్మల్ని పాలతో పోషించాను. కాని ఇంతగా ఎదిగిన తర్వాత కూడా మీరింకా పాలే తాగే స్థితిలోనే ఉన్నందువల్ల మరింత బలహీనులై, ‘నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా(పేతురు) వాడను, నేను క్రీస్తు వాడను’ అంటూ నాలుగు వర్గాలుగా చీలిపోయి శరీరసంబంధుల స్థాయికి దిగజారారు’ అని పౌలు బాధపడ్డాడు( 1:12, 3:1–9). అది కుటుంబమైనా, చర్చి అయినా, దేశమైనా ఆత్మీయ జ్ఞానం కొరవడితే ’అనైక్యత’ ప్రబలి, మానసిక శాంతి కరువై అన్ని అనర్ధాలకూ రాచబాట వేస్తుంది. పరలోకానందంతో వెలిగిపోవలసిన జీవితాలు,కుటుంబాలు, సమాజం, చర్చిల్లో అశాంతి నిండిన నరకపు చీకట్లు కమ్మడానికి దేవుడంటే ‘ఆకలి’మందగించి ఏర్పడిన ‘ఆత్మీయ పౌష్టికాహార లోపమే’ ప్రధాన కారణం. కొరింథీ పట్టణం గ్రీసులో ఏడు లక్షల మంది జనాభా కలిగిన గొప్ప వర్తకపు పట్టణం. కాని బోలెడు డబ్బున్న కొరింథీలో ప్రజలు మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకొని భ్రష్టులవుతున్నారు. అలాంటి కొరింథీలో పౌలు సువార్త ప్రకటించినప్పుడు మొదట బాగా వ్యతిరేకత ఎదురైంది. అయితే దేవుడు ’ఇక్కడ నాకు చాలా జనముంది, ధైర్యంగా మాట్లాడు’ అంటూ పౌలును బలపర్చగా, ప్రయాసపడి ఈ చర్చిని స్థాపించాడు (అపో.కా.18:5–11). ’ఈ పట్టణంలో నాకు చాలా జనముంది’ అని ఆరోజు ప్రభువంటే అక్కడొక గొప్పచర్చి అవుతుందనుకున్నాడు కాని, ’కొరింథీ పట్టణంలో భ్రష్టులైన చాలా మందికి నా అవసరం అంటే దేవుని అవసరం ఉంది, ‘కొరింథీ చర్చి’ నా ప్రతినిధులుగా వారిని సరిదిద్ది పరలోకపు ఆనందంతో నింపాలన్నదే నాటి దేవుని మాటల అంతరార్థమని పౌలుకు ఇప్పుడర్థమవుతోంది. భ్రష్టులైన వారికి వారికి వెలుగు చూపించి సరిదిద్దే లైట్ హౌస్ గా దేవుడు కొరింథీ చర్చిని నియమిస్తే, అసలు లైట్ హౌస్ లోనే చీకటి కమ్ముకున్న విషాదం కొరింథీ చర్చిది, ఈ నాటి మనందరిదీ కూడా!! గొప్ప దైవసేవకుడు, ‘సాల్వేషన్ ఆర్మీ’ సంస్థాపకుడు విలియం బూత్ ఒకసారి తన ఏడేళ్ల కొడుకు ఎడ్వర్డ్ బూత్ ను లండన్ లో ఒక బార్ కు తీసుకు వెళ్ళాడు. ‘జూదం, మద్యపానంతో నిండిన ఈ బార్ కు నన్నెందుకు తెచ్చావు నాన్నా?’ అని ఎడ్వర్డ్ అడిగితే ‘వీళ్లంతా దేవుని పిల్లలే. కాని దారి తప్పారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దే గొప్ప సేవ నీవు చెయ్యాలని చెప్పడానికే ఇక్కడికి తెచ్చాను’ అన్నాడు విలియం బూత్. తండ్రిని మించిన తనయుడుగా ఎడ్వర్డ్ బూత్ ఆ తర్వాత చేసిన అద్భుతమైన సేవ ఫలితంగా లండన్లోని బార్లు, జూదం జరిగే కేంద్రాలు మూతపడ్డాయి. లోకానికి వెలుగు చూపించాల్సిన బాధ్యత చర్చిది. కాని చర్చిలోనే చీకటి నిండితే అది వెలగని లైట్ హౌస్ లాంటిదే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని సమన్యాయ పాలనా వ్యవస్థ!!
అంతా తప్పుచేసి పట్టుబడి శిక్షకు లోనవుతారు. కాని దానియేలు ప్రార్థన చేసి పట్టుబడ్డాడు, శిక్షగా ‘సింహాలగుహ’ లో వేయబడ్డాడు. దానియేలు, అతని ముగ్గురు యూదుస్నేహితులు, బబులోను సామ్రాజ్యంలోని యూదుబానిసల కుటుంబాలకు చెందిన వారు. కొన్ని వందల మంది అలాంటివాళ్ళున్నా, తాము యూదులమన్న ప్రత్యేకతను మర్చిపోకుండా ఆ నలుగురూ జీవించారు. బబులోను రాజైన నెబుకద్నెజరు సంస్థానంలో 15 –17 ఏళ్ళ వయసులోనే ఉన్నతసేవల కోసం ప్రతిభను బట్టి వాళ్ళు ఎంపికై శిక్షణ పొందారు. అలా తమ ప్రత్యేకతను కాపాడుకొంటూ అంచెలంచెలుగా ఎదగడానికి దేవుడు వారికి సాయం చేశాడు. ధర్మశాస్త్రానుసారం వాళ్ళు తమ దేవునికే ప్రార్థన చేసేవారు. దానియేలయితే, రాజులు కని మర్చిపోయిన కలల్ని కూడా గుర్తుచేసి మరీ వాటిని విడమర్చి చెప్పేంత ప్రతిభావంతుడయ్యాడు. అలా బబులోను, పర్షియా, ఆ తర్వాత మాదీయుల సంస్థానాల్లో దానియేలు తన ప్రతిభ, సమగ్రత, నమ్మకత్వంతో గవర్నర్ స్థాయికి ఎదిగాడు. కాని దానియేలుకు శత్రువులు కూడా అసంఖ్యాకం అయ్యారు. దానియేలు ప్రతిరోజు యూదు పద్ధతిలో మూడు సార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాడన్న విషయం తెలిసి, అతని శత్రువులు ముప్పైరోజులపాటు దేశంలో రాజైన దర్యావేషుకు తప్ప మరెవరికీ ప్రార్థన చేయకూడదన్న ఒక ఆజ్ఞను రాజుగారి ద్వారా తయారు చేయించారు. అయినా రాజాజ్ఞను ఉల్లంఘించి, తన ఇంటి కిటికీ తలుపు తెరిచి అందరికీ తెలిసేలా అతను ప్రార్థన చేశాడు. ఫలితంగా ఇష్టం లేకున్నా రాజుగారు దానియేలును సింహాల గుహలో వేశాడు. విచిత్రమేమిటంటే, ఆకలితో ఉన్న సింహాల మధ్య కూడా దానియేలు హాయిగా నిద్రపోగా, రాజభవనంలో పరుపుల పైన పడుకున్న రాజుగారికి, అతన్ని పట్టించిన శత్రువులకు మాత్రం ఆ రాత్రి నిద్రపట్టని కాళరాత్రే అయ్యింది. మరునాడే, రాజు దానియేలును విడిపించి అతని శత్రువులందరినీ అదే గుహలో వేసి సంహరించాడు. విశ్వాసి ఎక్కడుంటే ఆ ప్రదేశాన్నే దేవుడు తన సన్నిధితో పరలోకంగా మార్చుతాడు. అపాయాలు, సమస్యలు, చిక్కుముడుల మధ్య కూడా విశ్వాసి హృదయంలోనే దేవుడు పరలోకానందపు ఊటలు నింపుతాడు. తాను సంతకం చేసిన ఆజ్ఞకు తానే బందీగా మారేంత బలహీనుడయ్యాడు ఆ రాజు. కాని రాజాజ్ఞలు, లోకాదేశాలకు అతీతమైన దేవుని సమన్యాయ, సమధర్మ పాలనావ్యవస్థలో దేవుడు పరలోకానందాన్ని రాజులకు, బానిసలకు కూడా న్యాయంగా, సమానంగా పంచుతాడు. దక్షిణాఫ్రికా విమోచనోద్యమం ముగిసి అక్కడ సమన్యాయ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతున్న 1989లో, అక్కడి జులు తెగకు చెందిన రాజు దానికి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. ఎవరు చెప్పినా అతను వినని పరిస్థితుల్లో, బ్రిటిష్ ప్రభుత్వం బిషప్ టాటూ గారిని ఆయన వద్దకు పంపింది. బిషప్ గారు అతని ముందు నిలబడి, ‘నేను బిషప్ను, మీరు రాజు గారు. అయితే మిమ్మల్ని, నన్ను కూడా పాలించే అత్యున్నతమైన దేవుని ప్రార్థిద్దాం, మనిద్దరం మోకరిద్దాం, అనగానే, ఆ రాజు సింహాసనం దిగి, మోకరించాడు. బిషప్ గారి ప్రతిపాదనకు అంగీకారం కూడా తెలిపాడు. లోకమా? దేవుడా? అన్న మీమాంస ఎదురైతే, దేవుని ఆశ్రయించడమే క్షేమం, వివేకం. – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
మరణాన్ని మట్టికరిపించిన మహోదయం!!
శుభశుక్రవారపు మరుసటి ఆదివారం ఇంకా తెల్లారక ముందే. జెరూసలేం డేట్ లైన్ తో మగ్దలేనే మరియ అనే శిష్యురాలు యేసుక్రీస్తు సజీవుడయ్యాడంటూ ఆయన పునరుత్థాన శుభవార్తను ప్రపంచానికి ‘అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్’ గా ప్రకటించింది. ఈ శుభవార్త ప్రబలి, యేసు మరణంతో విషాదంలో ఉన్న ఆయన అనుచరుల్లో పుట్టెడు ఆనందాన్ని నింపింది. కానీ యేసును చంపి తామేదో గొప్ప విజయం సాధించామని విర్రవీగుతున్న ఆయన శత్రువుల గుండెల్లో మాత్రం అది రైళ్లు పరుగెత్తించి ‘నష్టనివారణ’ చర్యలకు వారిని పురికొల్పింది. యేసు సిలువలో అసలు చనిపోనే లేదని, కేవలం మూర్ఛపోయిన యేసు స్పృహలోకొచ్చి నడుస్తూ ఎక్కడికో వెళ్లిపోయాడని కొందరు, అసలు యేసు అనే వ్యక్తే చరిత్రలోనే లేడని, ఆయన బోధలు, జీవితం, మరణం, పునరుత్థానం ఇదంతా కట్టుకథ అని మరికొందరు అబద్ధాలు ప్రచారం చేసినా, యేసు పునరుత్థానుడయ్యాడన్న ‘సత్యం’ వెయ్యింతల బలంతో అచిరకాలంలోనే ప్రబలి, ఆయన పునరుత్థానమే పునాదిగా ‘క్రైస్తవం’ భూదిగంతాలకు వ్యాపించింది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకడం మనుషులకు కొత్త, ఒక వింత కావచ్చు కానీ, జనన మరణాలకు అతీతుడైన దేవునికి కాదు కదా? మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, విశ్వానికంతటికీ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా, రక్షకుడుగా ’పుట్టి’, ’మరణించి’, ‘పునరుత్థానుడై’ ఉండకపోతే దేవుని సరిగ్గా, పూర్తిగా అర్థం చేసుకోవడం మనిషికి అసాధ్యమే. దేవుడేమిటో అర్థమయితేనే, ఆయన దృష్టిలో ఒక నలుసంత కూడా లేని మానవుణ్ణి దేవుడు ప్రేమించడమెంత గొప్ప విషయమో అర్ధమవుతుంది. ఊరికే దేవుడూ, దేవుడూ అంటాం కానీ ఆ దేవుణ్ణి తెలుసుకునే స్థాయి మనిషిది కాదు. అందుకే మనిషిలో ఇంత మిడిసిపాటు, డాంబికం!! తన ప్రేమ మనిషికర్థమయ్యే రూపంలో, యేసుక్రీస్తుగా దేవుడు ఈ భూగ్రహాన్ని దర్శించేందుకు పుట్టి, చనిపోయి, పునరుత్థానుడై మానవాళిని తన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించి వారికి తనదైన శాశ్వతత్వాన్నిచ్చేందుకు ఈ విశ్వంతో సంబంధమే లేని ఒక పరలోకరాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. దేవుడు విశ్వాన్నంతా సృష్టించి, మనిషిని మాత్రం తన అద్భుతమైన స్వరూపంలో చేసి, అతన్ని ఈ విశ్వాన్ని ఏలే రాజుగా నియమించాడని బైబిల్ చెబుతోంది(ఆది 1:28). అలా ప్రేమ, క్షమాపణ వంటి దైవిక స్వభావ లక్షణాలతో వర్ధిల్లి విశ్వాన్ని మనిషి తన గుప్పిట్లో పెట్టుకోవాలని దేవుడాశిస్తే, దారితప్పి స్వార్థపరుడైన మనిషి ఈ విశ్వానికి సమాంతరంగా ఒక ‘డబ్బు ప్రపంచాన్ని’ నిర్మించుకొని క్రమంగా దానికి దాసుడయ్యాడు. ఒక రాజుగా విశ్వాన్ని ఏలాల్సిన మనిషి చివరికి కంటికి కనిపించని వైరస్ క్రిములకు కూడా గడగడలాడే ఇప్పటి దీనస్థితిని కొని తెచ్చుకున్నాడు. ప్రపంచమంతా ఎంతో కల్లోల భరితంగా ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో, మానవాళి పట్ల దేవుని శాశ్వతమైన ప్రేమను, ఔన్నత్యాన్ని, ప్రణాళికలను గుర్తు చేసేదే యేసుపునరుత్థాన పర్వదినం... హేపీ ఈస్టర్... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అసత్యాల్నిచీల్చి చెండాడిన సత్యం!
యూదులు రెండువేల ఏళ్ళ క్రితం పస్కా పండుగనాడు యేసుక్రీస్తును శుక్రవారం రాత్రి సిలువ వేసి చంపి, అరిమతై యోసేపు అనే ఒక రహస్య క్రైస్తవునికి చెందిన రాతిసమాధిలో ఆయన్ను ఖననం చేశారు. అయితే యేసుక్రీస్తు తాను మునుపే ప్రకటించినట్టుగా, ఆదివారంనాటి తెల్లవారు జామునే పునురుత్థానుడు కాగా, తిరిగి సజీవుడైన యేసుక్రీస్తును విశ్వాసులైన స్త్రీలు మొదట చూశారు. వారిద్వారా ప్రభువు శిష్యులు తెలుసుకొని వెళ్లి ఖాళీ సమాధిని చూశారు. అయితే ప్రభువే వారికి ప్రత్యక్షమై తనను తాను కనపర్చుకున్నాడు. ఆ విధంగా యేసు పునరుత్థానమే పునాదిగా క్రైస్తవం ఆరంభమైంది. అలా చాలా కొద్దిమందితో, యేసును సిలువ వేసిన యెరూషలేమే కేంద్రంగా, ఆయన్ను సిలువ వేసిన యూదుల మధ్యే ఆరంభమైన క్రైస్తవంలోకి యూదులతో సహా ఎంతో మంది చేరుతూండగా అది ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించి, ఈనాడు 210 కోట్ల మంది విశ్వాసులున్న అతి పెద్దమతంగా ప్రపంచంలో సుస్థిరమైంది. ప్రపంచ చరిత్రలో అలా జరిగిన ఒక కుట్ర పటాపంచలై యేసుక్రీస్తు సారథ్యంలో ప్రేమ, క్షమాపణలే ముఖ్యాంశాలుగా ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంగా క్రైస్తవం తన ఉనికిని చాటుకుంది. పామరులు, పిరికివాళ్ళు, సమాజంలో ప్రాబల్యం లేనివాళ్లయిన విశ్వాసులతో కూడిన క్రైస్తవం ఇంతటి స్థాయికి ఈనాడు ఎలా ఎదిగింది? ఆ పిరికివాళ్ళనే దేవుడు తన శక్తితో నింపాడు. ‘మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము...’ అంటూ వేలాదిమంది యూదుప్రముఖుల సమక్షంలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని, ఆయన పునరుత్థాన మహా ఘటనను శిష్యులైన పేతురు,యోహాను కలిసి అవి జరిగిన కొద్దిరోజులకే యెరూషలేము మహాదేవాలయ ప్రాంగణంలో ప్రకటించారు. విశేషమేమిటంటే, నాడు పస్కాపండుగ రాత్రి గెత్సేమేనే తోటలో ప్రార్థనలో ఉన్న యేసుక్రీస్తును యూదా ఇస్కరియోతు అనే మరో శిష్యుని విద్రోహం కారణంగా రోమా సైనికులొచ్చి నిర్బంధించినపుడు, యేసు ఎవరో నాకసలు తెలియదంటూ మూడుసార్లు నిర్లజ్జగా బొంకి పేతురు పారిపోయిన ఉదంతాన్ని కూడా తన సువార్తలో ఎంతో విపులంగా ప్రస్తావించిన లూకా సువార్తికుడే, యేసును కుట్రచేసి చంపిన యూదు మతపెద్దలు, శాస్త్రులున్న గుంపును ఉద్దేశించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును కళ్లారా చూసిన నూతనోత్తేజంతో ఇది జరిగిన దాదాపు 55 రోజులకే పేతురు ఆత్మవశుడై ఎంతో ధైర్యంగా చేసిన ఈ ప్రకటనను కూడా తన అపొస్తలుల కార్యాల గ్రంథంలో ప్రస్తావించాడు (లూకా 22:39–62), (అపో.కా 3:15). సిలువ వెయ్యడానికి సైనికులు యేసుక్రీస్తును నిర్బంధించి తీసుకెళ్తుంటే ప్రాణభయంతో ఆయన్ను వదిలేసి పారిపోయిన పిరికి పేతురుకు, అది జరిగి రెండు నెలలైనా కాకముందే ‘మీరంతా యేసు హంతకులు, యేసు హత్యకు, ఆయన పునరుత్థానానికి కూడా మేము సాక్షులం’ అంటూ నిలదీసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అది క్రైస్తవానికి యేసుక్రీస్తువారి పునరుత్థాన శక్తి ద్వారా వచ్చింది. వాస్తవమేమిటంటే, క్రీస్తును తెలుసుకొని ఆయన అనుచరులముగా క్రైస్తవులమైతే అయ్యాము కానీ, ఆయన పునరుత్థానశక్తిని మాత్రం పూర్తిగా అవగాహన చేసుకోలేక దాన్ని పొందలేక పోతున్నాము. పునరుత్థానశక్తికి లోకపరమైన శక్తితో ఏమాత్రం పోలికలేదు. ఒక రాయిని కొండమీది నుండి భూమ్మీదికి తోసేందుకు తోడయ్యేది మామూలుగా లోకంలో అందరిలోనూ ఉండే శక్తి అయితే అదే బండరాయిని భూమ్మీదినుండి కొండ మీదికి దొరలించేందుకు ఉపకరించేది యేసుప్రభువు వారి పునరుత్థాన శక్తి!! యేసుప్రభువు వారి ప్రేమ, క్షమాపణ అనేవి అర్థమైతేనే ఈ శక్తి అర్థమవుతుంది, లభ్యమవుతుంది. రెండువేల ఏళ్ళ క్రితం నాటి ్రౖకైస్తవంలో ఎక్కువగా పామరులు, సామాన్యులే ఉన్నారు కాని వాళ్ళు క్రైస్తవాన్ని భూదిగంతాలకు విజయవంతంగా తీసుకువెళ్లడం వెనుక ఈ శక్తి ఉంది. అందుకే ఆ శక్తిని తాను తెలుసుకోవడానికే ప్రయాసపడుతున్నానని మహా అపొస్తలుడు పౌలు అన్నాడు (ఫిలిప్పి 3:11). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అస్పృశ్యతపై ఒక సమరయుని సమరం!
ఒకసారి ఎంతో భావగర్భితమైన ఉపమానాన్ని యేసుప్రభువు చెప్పాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉత్తరాన యేసుప్రభువు నివసించిన నజరేతు గ్రామమున్న గలిలయ ప్రాంతానికి, దక్షిణంలోని యెరూషలేము పట్టణానికి మధ్య రాకపోకలకు రెండు మార్గాలున్నాయి. ఒకటేమో సమరయ గ్రామాల గుండా వెళ్లే దగ్గరి మార్గం. కానీ సమరయులు అంటరానివారు గనుక సనాతన యూదులు ఆ మార్గంలో వెళ్లేవారు కాదు. రెండవది దూరమార్గం కానీ సనాతన యూదులుండే యెరికో లాంటి పట్టణాల గుండా వెళ్లే మార్గం. అయితే దొంగల బెడద కూడా బాగా ఉన్న మార్గమది. ఒకసారి ఆ మార్గంలోనే సనాతన యూదుడొకతను ప్రయాణమై వెళ్తూ దొంగల బారినపడ్డాడు. దొంగలతన్ని బట్టలతో సహా పూర్తిగా దోచుకొని విపరీతంగా కొట్టి కొనప్రాణాలతో దారిపక్కన పడేశారు. అపుడు అతనిలాగే సవర్ణులు, సనాతనులైన ఒక యాజకుడు, లేవీయుడు అటువైపు వచ్చికూడా అతన్ని పరామర్శించకుండా వెళ్లిపోగా, ఒక సమరయుడు అటుగా వెళ్తూ అతన్ని చూసి, పరామర్శించి, అతని గాయాలు కట్టి, ఆ మార్గంలోనే ఉన్న ఉన్న ఒక పూటకూళ్లవాని ఇంట్లో అతన్నిచేర్చి, అతనికయ్యే ఖర్చంతా భరించాడు. మనవాళ్లే కదా అనుకున్న యాజకుడు, లేవీయుడు స్వార్ధపరులై అతన్ని ముట్టుకోవడం కాదు కదా కనీసం చూడకుండా మొహం చాటేసి వెళ్ళిపోగా, ఏ అంటరాని వాళ్లకయితే దూరంగా ఉండాలనుకొని యెరికో దారినెన్నుకొని ఆపదల్లో పడ్డాడో, ఆ అంటరానివాడే ఆప్తుడై అన్ని సపర్యలూ చేసి క్షతగాత్రుని బతికించాడు. మతపరంగా ప్రముఖులు, జ్ఞానులైన ఆ యాజకుడు, లేవీయుడి కన్నా. అంటరానివాడైన ఆ సమరయుడే నిజమైన పొరుగువాడు, అసలైన విశ్వాసి అని యేసుప్రభువు తేల్చి, విశ్వాసానికి నిజమైన ప్రామాణికతనిస్తూ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న నియమం కన్నా అతున్నతమైనది మరొకటి లేదని బోధించాడు. అలా క్రైస్తవానికి ఈ బోధే మూలరాయి అయ్యింది. అయితే యేసుక్రీస్తు జీవితంలో నుండి పెల్లుబికిన ఇలాంటి విశిష్టమైన బోధలతో ఆవిర్భవించిన ‘క్రైస్తవం’,ఒక ‘మతం’ స్థాయికి దిగజారడంతో సమస్యలన్నీ మొదలయ్యాయి. నిజమైన ప్రేమ, సోదరభావం, సౌభ్రాతృత్వానికే కాదు, స్వార్ధం, పగ, ద్వేషం, వివక్షకు కూడా కుల, మత, ప్రాంతీయాది విభేదాల్లేవు, సరిహద్దులు అసలే లేవన్నదే ఇందులోని తాత్పర్యం!! ఈ సూక్ష్మం అర్ధమైతే, క్రైస్తవంలోనే కాదు ప్రపంచంలోనే అసలు సమస్యలు లేవు. ’అయ్యో! మన మనవాడే కదా!’’ అన్న జాత్యాభిమానంతోనైనా ఆపదలో ఉన్న వాడిని ఆదుకోని ’పచ్చి స్వార్థపరులు’ ఆ యాజకుడు, లేవీయుడైతే,‘నన్ను అంటరాని వాణ్ని చేసిన దుర్మార్గుడితను’ అని ఈసడించుకోకుండా, అతన్ని కాపాడిన ‘మహోన్నతమైన ప్రేమ, మానవత్వం’ ఆ సమరయుడిది. మనం తరచుగా వాడే ‘మనవాడు’, ‘పగవాడు’ అన్న పదాలు ఎంత అర్ధరహితమైనవో తెలిపే బోధ ఇది. మనల్ని ఆపదలో ఆదుకున్నవాడే మనవాడు, పొరుగువాడనీ, మొహం చాటేసే ‘మనవాళ్ళు’ పగవారికన్నా తక్కువైనవారేమీ కాదని తెలుపుతూ, మానవత్వాన్నే పునర్నిర్వచించిన పునాదిరాయి ఈ బోధ! పెద్దలు సౌకర్యార్థమై కొన్ని శాఖల్ని మనలో ఏర్పాటుచేసినా, ఒక డినామినేషన్ కాకి మరో డినామినేషన్ మీద వాలనంత వైషమ్యం, ప్రేమకు, ఐక్యతకు మారుపేరైన క్రైస్తవంలో మనకెందుకుందో లోకానికి, దేవునికి కూడా ఒకరోజున మనం సంజాయిషీ చెప్పాలి. ప్రాణం మీది తీపితో ఒక సర్జరీ చేయించుకునేటపుడు ‘డాక్టర్’ మనవాడా?’ అని ఆలోచించని వారికి, పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు ‘మనవాళ్ళా’? అని అడగని వారికి, కొన్ని సందర్భాల్లోనే ‘మనవాళ్ళా?’ అనడిగే సంకుచితత్వమా? పుట్టుకతోనే ఎవరూ విశ్వాసులు కాదు. అలాగని ఎన్నేళ్లైనా క్రీస్తు సారూప్యం ఏర్పడకుంటే, అసలు క్రైస్తవులమే కాదు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
దాతృత్వం.. ప్రార్థన.. ఉపవాసం..
రహస్యంగా సాగాలి!పాత నిబంధన కాలంలో దేవుడు తన న్యాయసంవిధాన సూత్రావళిగా మోషేకిచ్చిన పదాజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రానికి పొడిగింపుగా, కొత్తనిబంధన కాలపు విశ్వాసులకు కరదీపికగా, యేసుప్రభువే స్వయంగా ఆ ధర్మశాస్త్రానికిచ్చిన వినూత్నమైన భాష్యం ఆనాడు యేసుప్రభువు కొండమీది చేసిన ప్రసంగం!! ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అమలుపర్చడమే దేవుని ప్రసన్నుని చేసుకోగలిగిన ఏకైక మార్గమైతే, అది మానవమాత్రులకెంత అసాధ్యమో ధర్మశాస్త్రమే రుజువు చేస్తుంది. అత్యున్నతమైన ధర్మశాస్త్రపు పవిత్రతా స్థాయిని ప్రామాణికం చేసుకుంటే, ఈ లోకంలో అందరూ పాపులే అని నిర్వచిస్తుంది బైబిల్ (రోమా 3:23). అందువల్ల కొత్తనిబంధన కాలపు విశ్వాస జీవితానికి యేసు ప్రభువు వారి కొండమీది ప్రసంగం పునాది లాంటిది. దేవుని మహిమ కోసం విశ్వాసి బాహాటంగా చెయ్యవలసిన అనేక విషయాలతోపాటు, దేవుని మహిమ కోసం, తన మేలుకోసం విశ్వాసి పరమ రహస్యంగా చేయవలసిన మూడు ప్రధానమైన అంశాలను కూడా యేసుప్రభువు తన కొండమీది ప్రసంగంలోనే ప్రకటించాడు. విశ్వాసి మొదటిగా తన ‘దాన ధర్మాలను’, రెండవదిగా’ ప్రార్థనను’, మూడవదిగా తన ‘ఉపవాస దీక్ష’ను చాలా గుప్తంగా, రహస్యంగా చెయ్యాలని యేసుప్రభువు ఆదేశించాడు. ఇవి సలహాలు కాదు, ప్రభువిచ్చిన చాలా స్పష్టమైన ఆదేశాలు. అది తెలియకే, గోప్యత లోపించిన మన ప్రార్ధనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరుప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం మనకు, మన కుటుంబాలకూ రావడం లేదు. విశ్వాసి ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని ప్రభువు ఆదేశించాడు. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయి. చర్చికి కానుకగా బెంచీలిచ్చి, వాటి వెనక తమ పేర్లు రాయించుకుంటే, ఆ పేర్లు ఈ లోకంలోనే ఉండిపోతాయి కానీ పరలోకంలో దేవుని జీవగ్రంథంలో మాత్రం రాయబడవన్నది తెలుసుకోవాలి. పేదలకు చేసే ధర్మం గురించి యేసు ఇలా చెప్పాడు కానీ దేవునికిచ్చే కానుకల గురించి కాదంటూ కొందరు పాస్టర్లు తమ స్వార్థం కోసం దీనికి వక్రభాష్యం చెబుతారు. ఒక పేద విధవరాలు గుప్తంగా ఇచ్చిన చిరుకానుకను ప్రభువెందుకు శ్లాఘించాడో అర్థమైతే, ఈ వాస్తవమేమిటో బోధపడుతుంది. ఇక ప్రార్థనయితే, గది తలుపు లేసుకొని మరీ రహస్యంగా చేయాలన్నది ప్రభువాదేశం. కానీ ఆనాటి పరిసయ్యుల్లాగే, జీవితం లో ఎన్నడూ రహస్య ప్రార్థన చెయ్యని వారు కూడా మైకుల్లో సుదీర్ఘంగా ప్రార్థన చేసేందుకు ఉబలాట పడుతుంటారు. దేవుని సంబోధిస్తూ, దేవునికే చేసే మన ప్రార్థన అసలు ఇతరులెందుకు వినాలి? చర్చిల్లో ప్రార్థనలకు, కుటుంబ ప్రార్థనలకు అతీతమైనది, ఆశీర్వాదకరమైనది విశ్వాసి తన ప్రభువుతో ఏకాంతంగా చేసే రహస్య ప్రార్ధన. ఇదే బలమైన ప్రార్థనాజీవితమంటే!! పోతే అందరికీ తెలిసేలా ఉపవాస దీక్షలు చెయ్యడానికి కూడా తాను వ్యతిరేకమని, అదంతా వృథా ప్రయాస అని కూడా ప్రభువు స్పష్టం చేశాడు. ఈ మూడూ ఎంత రహస్యంగా చేస్తే అవి మనకంత ఆశీర్వాదకరమవుతాయి. అవెంత బహిరంగంగా చేస్తే, మనమంతటి వేషధారులమవుతాము. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, దేవుడు చెప్పినట్టు చేయాలి కదా... అలా కాకుండా మాకు తోచినట్టే చేస్తాం అంటే, ఎండమావుల్లో నీళ్లు వెదకడమే కాదా?? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆశకు మరో పేరు క్రిస్మస్
గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను కొలంబస్ చిగురింప చేశాడు. మనిషిని బతికించే పనిని ఆక్సిజన్ కన్నా ‘ఆశ’ ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్’!! ఇటలీకి చెందిన మహా నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ అప్పటి స్పెయిన్ రాజుగారి ఆజ్ఞ మేరకు సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం ఇండియాను చేరేందుకు పశ్చిమ దిక్కు నుంచి ఒక కొత్త దారి కనుక్కోవడానికి 15వ శతాబ్దంలో నౌకాయానం చెయ్యడానికి పూర్వం ప్రపంచమంతా బల్లపరుపుగా ఉందని, అందువల్ల నౌక సముద్ర ప్రయాణంలో ఎక్కడో ఒక చోట, ప్రపంచం చివరి అంచు నుంచి లోతుల్లేని అగాథంలోకి పడిపోతుందని అంతా నమ్మేవారు, భయపడేవారు కూడా. అయితే కొలంబస్ నౌకాయానం విజయవంతం కావడం వల్ల రెండు విషయాలు తెలిశాయి. యూరోప్ తదితర ప్రాంతాలకు అంతవరకు తెలియని అమెరికా అనే ఒక ఖండమున్నదని కొలంబస్ అక్కడికి చేరడం వల్ల లోకానికి తెలిసింది. పైగా ప్రపంచం బల్లపరుపుగా లేదని, ఒక అంచు నుంచి అగాథం లోకి పడిపోవడం కాదు, గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను కొలంబస్ చిగురింప చేశాడు. మనిషిని బతికించే పనిని ఆక్సిజన్ కన్నా ‘ఆశ’ ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్’!! లోకాన్నితన ప్రేమ, క్షమతో నింపి తద్వారా సరికొత్త దైవిక రాజ్యాన్ని నిర్మించాలన్న దేవుని అనాది సంకల్పంతో, దృఢమైన అభిమతంతో రెండు వేల ఏళ్ళ క్రితమే తొలి క్రిస్మస్ వెలిసింది, మరొక మతాన్ని ఆరంభించేందుకు కాదు, మనిషి తన కోసం తాను కాకుండా, తనను తాను ప్రేమించుకున్నంతగా తన పొరుగువాణ్ణి కూడా ప్రేమించడంలోనే అతనికి జీవన సాఫల్యమున్నదని తెలిపే ఒక విలక్షణమైన, విశిష్టమైన జీవన విధానాన్ని ఆవిష్కరించిన రక్షకుడుగా దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఆవిర్భవించాడు. అంతే తప్ప ఒక కొత్త మతాన్ని ఆరంభించే ఉద్దేశం యేసుకు లేదు. ఆ కారణంగా, కత్తుల నడుమ నిర్మలమైన కలువపూవై, నెత్తుటి మరకలతో ఎర్రబారిన ఆకాశంలో ఎగిరే శ్వేత శాంతికపోతమై, ఒంటరితనంతో నిరాశాజీవిగా బతుకుతున్న మనిషితో, నీకు నేనున్నానంటూ అభయాన్నిచ్చిన ఒక ప్రియనేస్తమై యేసుక్రీస్తు రక్షకుడుగా క్రిస్మస్ ద్వారా లోకంలోకి అడుగుపెట్టాడు...ఆయన ఆకాశాన్ని తన సింహాసనంగా, భూమిని తన పాదపీఠంగా కలిగిన మహోన్నతుడైన ప్రభువని బైబిల్ వర్ణిస్తుంది (యెషయా 66:1–4). అయితే ఆనాడు విశ్వమంతటికీ సృష్టికర్త, పాలకుడు, యజమాని అయిన దైవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనాన్ని సూచించే ఆర్భాటం లేదు, కోలాహలం కూడా లేదు. స్వాగతోత్సవాలు, సన్మాన సభలు, విందులు, వినోదాల సందడే లేదు. రక్షకుని ఆగమన సూచనగా దేవుడు ఆకాశంలోనే ఒక అసాధారణమైన తారను పుట్టిస్తే, అది చూపే దారిలో తూర్పు దేశపు జ్ఞానులు రక్షకుని చూసేందుకు యెరూషలేముకొస్తే, అక్కడి యూదుల రాజైన హేరోదు పిలిపిస్తే యూదు పండితులు వచ్చి, యూదయ దేశపు చిన్న గ్రామమైన బేత్లెహేములో రక్షకుడు అంటే మెస్సియా పుడతాడని బైబిల్ చెబుతోందంటూ వివరించారు (మత్తయి 2:5). యెరుషలేములాంటి గొప్ప పట్టణముండగా, అక్కడికి కేవలం అయిదు కిలోమీటర్ల దూరంలోని బేత్లెహేము అనే అనామకమైన ఒక పేద గ్రామంలో రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తియైన దైవకుమారుడు పుట్టడమేమిటో ఆ జ్ఞానులకు అర్థం కాలేదు, హేరోదు చక్రవర్తికీ అదేంటో అర్థం కాలేదు, ఆ బైబిల్ వచనాన్ని చదివి వినిపించిన యూదు పండితులకైతే ఆ వచనం పట్ల అసలు విశ్వాసమే లేదు. వాస్తవమేమిటంటే ఆ వచనాన్ని ఆనాడు ఎవ్వరూ నమ్మలేదు. ఒకవేళ నమ్మి ఉంటే, హేరోదు పురమాయింపుతో అతని సైనికులు లేదా బైబిల్ ప్రవచనాన్ని విశ్వసించే ఎవరైనా యూదు పెద్దలు పక్కనే ఉన్న బేత్లెహేముకు ఆ జ్ఞానులతో పాటే ఆ రోజే వెళ్లే వాళ్లు. అప్పుడు ప్రపంచానికంతటికీ రక్షకుని జన్మశుభవార్త ‘బ్రేకింగ్ న్యూస్’గా ఆరోజే తెలిసి ఉండేది. కాని దేవుడు తన మహా కార్యాలు, అనాది సంకల్పాల నెరవేర్పు కోసం, ధనవంతులు, పండితులు, అధికారమున్న గొప్పవాళ్లను కాక, పామరులను, నిరుపేదలను, బలహీనులను ఏర్పరచుకొని వారిని వాడుకొంటాడని బైబిల్ చెబుతోంది (మత్తయి 11:25). యేసుక్రీస్తు నూటికి నూరు పాళ్లూ పేదల పక్షపాతి, దీనబాంధవుడని చెప్పడానికి బైబిల్ నిండా, ముఖ్యంగా కొత్తనిబంధన నిండా వచనాలున్నాయి.మెస్సీయాగా యేసు రాజభవనాల్లో, చక్రవర్తులు, కుబేరుల ఇళ్లలో పుట్టబోడని దేవుడు స్పష్టం చేశాడు. పుడమినేలే రారాజు పశువుల పాకలో పుడతాడని చెప్పే ప్రవచనాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. పేద కుటుంబానికి చెందిన భక్తిపరురాలైన ఒక కన్యక పరిశుద్ధాత్మ శక్తితో యేసును గర్భం దాల్చుతుందని, యోసేపు అనే భక్తిపరుడు, నీతిమంతుడైన మరో పేద యువకుడు యేసుప్రభువుకు ఇహలోకంలో సంరక్షక తండ్రిగా ఉంటాడని, ఆయన జననం బేత్లెహేములో జరుగుతుందని దేవుడు ముందే వెల్లడించాడు. అలా, కోటానుకోట్ల నక్షత్ర మండలాల సముదాయమైన మహా విశ్వానికంతటికీ సృష్టికర్త, పాలకుడూ అయిన దైవకుమారుడు ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా, చడీ చప్పుడు చెయ్యకుండా, ఒక నలుసంత పరిమాణానికి తనను తాను తగ్గించుకొని, కన్య గర్భంలోకి ప్రవేశించి, తొమ్మిది నెలల పాటు మరియ గర్భంలో పిండస్థ శిశువుగా ఎదిగి, బేత్లెహేములోని సత్రంలో కూడా మరియ, యోసేపులకు తలదాచుకునే చోటు దొరక్కపోగా, వాళ్ళున్న పశువుల పాకలోనే యేసు జన్మించాడు. ప్రపంచంలో మానవాళి దృష్టికొచ్చిన అద్భుతాల్లోకెల్లా, అత్యంత అద్భుతమైన సంఘటన, చరిత్రను తిరగ రాసిన పరిణామమిది. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలున్నాయి. పాత నిబంధన గ్రంథంలోని 39 పుస్తకాల్లోనూ యుద్ధాలు, మరణాలు, రక్తపు మరకల హింసాత్మక ఘటనలుండగా, కొత్త నిబంధనగా పిలిచే చివరి 27 పుస్తకాలూ యేసుప్రభువు వారి శాంతి సందేశంతో నిండి ఉన్నాయి. యుద్ధాలు, హింసాకాండ నేపథ్యంలో శాంతిదూతగా యేసు జననాన్ని ఎలా సమర్థిస్తారు? ఒక మార్గాన్ని వేస్తున్నప్పుడు, నేలను తవ్వి గుల్ల చేయాల్సివస్తుంది, అడ్డుగా ఉన్న కొండల్ని పేల్చి, లేదా తొలచి చదును చేయాల్సి వస్తుంది. అలా బలప్రయోగంతో సరళం చెయ్యబడిన పర్యవసానంగా రక్షణ మార్గం ఏర్పడగా, అందుకోసమే అనివార్యమైన హింసాత్మకత పాత నిబంధనలో చెలరేగింది. అయినా యేసుప్రభువు రక్షకుడుగా దిగివచ్చిన తర్వాత కూడా క్రై స్తవం పేరుతో ఈ రెండువేల ఏళ్లలో చాలాసార్లు చరిత్ర రక్తసిక్తమయ్యింది. కారణం? యేసుప్రభువు ఈ లోకానికి సంపూర్ణంగా అర్థం కాకపోవడం ఒక కారణమైతే,.దేవుని కుమారుడుగా శాంతి సందేశాన్ని మోసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రబోధాల ప్రత్యేకతను, విశిష్టతను అర్థం చేసుకోలేని మధ్య యుగాల చర్చిల్లో పేరుకు మాత్రమే క్రై స్తవులైన వాళ్ళు ఎక్కువగా ఉన్న కారణంగా, ఆచరణలో నియంతృత్వపు పోకడలతో క్రై స్తవాన్ని ‘విస్తరించడానికి’ పూనుకున్న యూరోప్ దేశాల చక్రవర్తులు మరొక కారణం. యేసుప్రభువు శాంతి సందేశాన్ని, ప్రేమ, క్షమాపణే పునాదిగా కలిగిన విలక్షణమైన, విశిష్టమైన ఆయన రక్షణ సువార్త మార్గాన్ని, వాళ్లంతా ఒక ‘మతం’ స్థాయికి దిగజార్చారు. దైవిక మార్గం ఏదైనా సరే అది మతం స్థాయికి దిగజారిన ప్రతిసారీ మానవాళి తీవ్రంగా నష్టపోయి, దిగజారిన విలువల రూపంలో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. దేవుని కన్నా యాజకులు, పరిచారకులు, పూజారులుండే చర్చిలు, దేవాలయాల వ్యవస్థ ప్రాబల్యం నానాటికీ ఎక్కువ కావడమే ఒక మతం స్థాయికి దైవికత దిగజారిందనడానికి స్పష్టమైన సూచన. ముఖ్యంగా మధ్య యుగాల్లో ఈ కారణం వల్లనే చర్చి దేవుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకొని విశ్వాసుల మీద కనీ వినీ ఎరుగని దమనకాండను, దౌర్జన్యాన్ని సాగించింది. అయితే చరిత్రలో ఇలా హింసకు పాల్పడిన ఘటనలున్నా, మరోవైపు క్రై స్తవానిదైన ప్రత్యేక ప్రేమ, క్షమా సౌరభం లోకాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, తమ జీవితాలనే ప్రేమపూర్వక క్రీస్తు సందేశంగా మలచుకున్న మదర్ థెరిసాలాంటి ఎంతోమంది నిస్వార్ధపరులైన పరిచారకులు, గొప్ప అపొస్తలులు, దైవ జనులు ఒక మతం స్థాయికి దిగజారకుండా క్రై స్తవాన్ని ఎత్తి పట్టుకున్నారు. ఉద్యోగాలు, అడ్మిషన్ల దరఖాస్తుల్లో ‘మతం’ అనే కాలమ్ ఉంటే, దాన్ని క్రై స్తవులు వాడుకోవడానికి బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే, క్రై స్తవం ఒక మతం కాదు. అది యేసు జీవించి, తన అనుచరులు కూడా అలాగే జీవించాలని ఆశించి, ఆదేశించిన ఒక విలక్షణమైన జీవన శైలి. క్రీస్తులాగా జీవించడం, తాను ఒకవైపు కరుగుతూ మరోవైపు లోకానికి ప్రేమ అనే వెలుగును పంచే కొవ్వొత్తి లాంటి జీవితం క్రై స్తవం!! క్రైస్తవం అంటే కొన్ని ఆచారాలు, నియమాలు,ఆరాధనా విధానాలు, నమ్మకాలు, సంప్రదాయాలు కాదు. ముందు క్రీస్తు అనుచరుని జీవితం మారాలి. అలా అతనిలో వచ్చిన మార్పు వల్ల ప్రభావితమైన లోకంలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి. అదే నిజ క్రై స్తవానికున్న శక్తి. విశ్వాసులు, పరిచారకులు ముందు తమకున్న మతం ముసుగు తీసేసి, నిజాలు చెప్పడం ఆరంభించాలి. సొంత డబ్బా వాయించుకునే ప్రచారార్భాటాలు మానెయ్యాలి. ‘నా సభకు లక్షమంది వచ్చారు’ అని ప్రకటించుకోవడం ‘అర్ధసత్యమే’ అని తెలుసుకోవాలి. ఎవరికి వారు గొప్పగా చాటింపు వేసుకోవడం మతపరమైన డాంబికం. అలా కాక ‘నా సభలో వాక్యం విన్న వారిలో వంద మంది తమ జీవితాన్ని మార్చుకున్నారు’ అని చెబితే అది పూర్తి సత్యం. అర్ధసత్యాలమీద, పరిచారకుల అతిశయాస్పద ప్రకటనల మీద, అసత్యాల మీద ఆధారపడేది మతం!! పరిచారకుల జీవితమే నిత్య సందేశంగా, నిస్వార్థం, పారదర్శకత, ప్రేమ, క్షమాపణే సూత్రంగా పరిఢవిల్లేది యేసు బోధించి, ఆచరించిన నిజ క్రై స్తవం. అదే బేత్లెహేములో నాటి తొలి క్రిస్మస్లో పరిమళించిన నిరాడంబరమైన, నిస్వార్థమైన, అనంతమైన దేవుని స్వచ్ఛమైన ప్రేమ!!! రక్తంకన్నా చిక్కనిది దేవుని ప్రేమ... ‘క్రిస్మస్’ను ఇపుడు మనమంతా ఆనందోత్సాహాలు, వేడుకలకు ప్రతీకగా జరుపుకొంటున్నాము కాని చరిత్రలో రెండువేల ఏళ్ల క్రితం తొలి క్రిస్మస్ జరిగిన బేత్లెహేములో పట్టపగలే చీకట్లు కమ్మి, అక్కడి వీధుల్లో రక్తపుటేరులు ప్రవహించాయన్నది వాస్తవం. యూదులరాజుగా యేసు జన్మించాడంటూ తూర్పు దేశపు జ్ఞానులు తెచ్చిన వార్త నాటి యూదులదైన యూదా రాజ్యానికి రాజుగా ఉన్న హేరోదులో కలవరాన్ని సృష్టించింది. తన సింహాసనానికి అడ్డొస్తారేమోనన్న అనుమానంతో తన సొంత కొడుకులిద్దరినే చంపిన నియంత, అత్యంత క్రూరుడు హేరోదు రాజు. ఇపుడు యూదుల రాజుగా పుట్టిన యేసును వదిలేస్తాడా? బేత్లెహేములో పుట్టినట్టుగా లేఖనాలు చెబుతున్న యేసును పూజించి తిరిగొచ్చి, ఆ వివరాలను తనకు తెలిపితే తాను కూడా వెళ్లి పూజిస్తానంటూ హేరోదు జ్ఞానులకు మాయ మాటలు చెప్పి పంపగా, దేవుడు దర్శనంలో కనిపించి వారికి హేరోదు కుట్రను బట్టబయలు చేశాడు. జ్ఞానులు యేసును దర్శించుకొని, కానుకలు సమర్పించి, పూజించి, దైవాజ్ఞ మేరకు హేరోదు వద్దకు తిరిగి వెళ్లకుండా, మరో మార్గంలో తమ దేశాలకు వెళ్ళిపోయి నిజంగానే జ్ఞానులనిపించుకున్నారు. తాను మోసపోయానని గ్రహించిన హేరోదు రాజు, శిశువైన యేసును హతమార్చే కుట్రలో భాగంగా, యూదయలోని రెండేళ్ల లోపు మగ శిశువులందరినీ చంపించగా, దేశమంతటా హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. కాని దేవుడప్పటికే యోసేపు, మరియ, బాలుడైన యేసును బేత్లెహేము నుండి ఐగుప్తుకు దాటించి హేరోదు కుట్రను భగ్నం చేశాడు. నీళ్లకన్నా రక్తం చిక్కనిదైతే కావచ్చు, కాని దేవుని ప్రేమ రక్తం కన్నా చిక్కనిది. శాంతి ప్రదాతయైన యేసు ఆగమన శుభవేళ, బేత్లెహేము ఆ పరిసర ప్రాంతాలన్నీ తమ పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లాయి, అక్కడి వీధులు రక్తసిక్తమయ్యాయి. కాని దైవకుమారుడైన యేసు స్థాపించబూనిన ప్రేమ, శాంతి, క్షమాపణా సామ్రాజ్యాన్ని బలవంతులు,పాలకులు తమ స్వార్ధం,ఈర‡్ష్య,ఆగ్రహం, అభద్రతాభావం, నియంతృత్వం, క్రూరత్వం, దౌర్జన్యంతో ఆదిలోనే మట్టుపెట్టేందుకు చరిత్రలో చేసిన తొలి ప్రయత్నం విఫలమయింది. ఈ పిలాతు దుర్మరణం తర్వాత, ఇతని స్థానంలో యూదయ రాజుగా నియమింపబడిన పొంతి పిలాతు పిరికివాడు, అందరితో రాజీపడటమే తన సింహాసనాన్ని పదిలపరచుకునే మార్గమని నమ్మినవాడు. అందుకే యూదులతో మంచివాడిననిపించుకునేందుకు యేసును సిలువవేసి ఆయన చరిత్రకు ముగింపు పలకాలన్న అతని కుట్ర కూడా యేసు పునరుత్థానంతో, ఆ తర్వాత క్రై స్తవచర్చి ఆవిర్భావంతో భగ్నమైంది. అమాయకుల కన్నీళ్లతో తడిసిన ఈ తొలి క్రిస్మసే ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించిన క్రీస్తు ప్రేమ సామ్రాజ్యానికి తొలి వేదిక అయ్యింది. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యం, హింస, హత్యల నేపథ్యంలోనే యేసు ప్రభువు వారి క్షమా, కృపా, రక్షణా కేతనం ఉవ్వెత్తున రెప రెపలాడింది. విశేషమేమిటంటే ఒకప్పుడు లోకాన్నంతా గడగడలాడించిన రోమా సామ్రాజ్యం కాలగర్భంలో కలిసి ఆనవాళ్లే లేకుండా పోయింది. కాని శుభవార్త ఏమిటంటే యేసుప్రభువు ఆవిష్కరించిన ప్రేమ సామ్రాజ్యం మాత్రం పరలోక ప్రాభవంతో ఇన్నివేల ఏళ్లుగా అణువణువునా విస్తరిస్తూనే ఉంది. చెడుపైన శాశ్వత విజయం ఎప్పుడూ శాంతిదే అన్నది కేవలం ఒక నినాదం కాదు, అది చరిత్ర చెప్పే సత్యమన్నదే క్రిస్మస్ ప్రకటించే నిత్య సందేశం. క్రిస్మస్ను ప్రత్యేకం చేసుకోండి... ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకమైన క్రిస్మస్గా మీ జీవితంలో మిగిలిపోవాలనుకుంటే ఆ నాటి తొలి క్రిస్మస్ స్ఫూర్తితో కొన్ని పనులు చేయవచ్చు. బహుశా ఎంతోకాలంగా మాటలు నిలిచిపోయిన మిత్రులు, బంధువులకు ఈరోజు సెల్ఫోన్లో హలో చెప్పండి! ఏవో చిన్న చిన్న గొడవలు (పెద్దవైనా ఫర్వాలేదు), మాటపట్టింపులు ఉన్న కారణంగా రాకపోకలు ఆగిపోయిన మీ బంధువులు, మిత్రుల ఇంటికి ఒక చిన్న ‘క్రిస్మస్ కేక్’తో వెళ్లి వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తండి. మీరన్న ఒక మాట లేదా మీ పొరపాటు కారణంగా మనసు నొచ్చుకుని మీతో ముభావంగా ఉన్నవారిని ఒకసారి ప్రేమతో పలకరించి వారికి క్షమాపణ చెప్పండి. మీ సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతోకొంత సాయం అందచేయండి. ఆప్తులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వారిని, ఆసుపత్రులలో పడక మీద ఉన్న మీకు తెలిసిన వారిని వారి బంధువులను పరామర్శించి మీ ప్రేమను తెలుపండి. మీరు మీకోసం తయారు చేసుకున్న కేక్లు ఎంత తీయగా ఉంటాయో అప్పుడు తెలుసుకోండి. మీ ఇంట్లో ఈ క్రిస్మస్కు అలంకరించిన దీపాలు ఎంతగా మిరుమిట్లు గొలుపుతాయో అప్పుడు మీరే గ్రహిస్తారు. ఒక్కసారిగా మీ హృదయం, జీవితం కూడా ఎంత తేలికవుతుందో మీరే గ్రహిస్తారు. అన్నీ ఈ ఒక్కరోజే చేయాల్సిన అవసరం లేదు. ఈ వారమంతా క్రిస్మస్ వారమే! ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఈ పనులకు పూనుకోండి. ఇవి పుట్టెడు ఆనందాన్నిచ్చే చిట్టిచిట్టి పనులు. ఇదే ఏసుప్రభువు బోధించిన ప్రేమమార్గం. ఈ మార్గంలో ఎవరికీ ఓటమి లేదు. అంతా విజేతలే! సారీ చెప్పినవారు, చెప్పించుకున్న వారు అంతా సమానులే! ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఇది ఎన్నటికీ విఫలంకాని విజయసూత్రమని ప్రభువే రుజువు చేసి చూపించాడు. ఇదే మనమంతా అనుసరించాల్సిన మార్గమనీ ఉద్బోధించాడు. అంతా యేసుప్రభువులు కానక్కరలేదు. ఎందుకంటే కాలేరు కూడా! అయితే ఆయన బోధించిన ఈ మార్గంలో మనమంతా ఒకటి రెండు అడుగులు వేసినా ఈ లోకం అనూహ్యంగా ఆనందమయమవుతుంది. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అంతా అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా క్రిస్మస్ జరుపుకోవడానికి ఇది అత్యుత్తమమైన మార్గం. -
కొండపైన దర్శనం...లోయల్లో సేవా సాఫల్యం...
యేసుప్రభువు గలిలయ సముద్ర తీరంలోని ఒక కొండ పైన చేసిన ప్రసంగంలో మానవాళికి ‘పరలోక ధన్యత’ను ప్రకటించాడు. పేదరికం, శ్రమలు, లేమి, ఆకలిదప్పుల వంటి ఎలాంటి సామాజిక అపశ్రుతులకు, ప్రతికూలతలకూ తావులేని ‘దేవుని రాజ్యాన్ని ‘తన కొండ మీది ప్రసంగం’ ద్వారా ఆవిష్కరించాడు. అక్కడినుండి ఆరంభమై, మరో కొండయైన గొల్గొతాపై జరుగనున్న తన సిలువ యాగం దాకా సాగనున్న‘మానవాళి రక్షణ మార్గ ప్రయాణం’లో మజిలీగా శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని వెంటతీసుకొని రూపాంతర కొండగా పిలిచే మరో కొండకు యేసుప్రభువు వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు ఆ ముగ్గురికీ తన పరలోక మహిమ రూపాన్ని చూపించాడు. పాత నిబంధన నాటి మోషే, ఏలీయా కూడా కొండ మీదికి దిగి రాగా అక్కడ యేసుప్రభువుతో వారి ‘శిఖరాగ్ర సమావేశం’ జరిగింది. అయితే యేసుప్రభువు, మోషే, ఏలీయాలు పాల్గొన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆ ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశానికి దేవుడు పేతురు, యాకోబు, యోహానులనే అల్ప మానవులను కూడా పిలవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. యేసు దేవస్వరూపుడు, మోషే ధర్మశాస్త్ర యుగానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి కాగా, మరి పేతురు, యాకోబు, యోహాను ఎవరికి ప్రతినిధులు? యేసుప్రభువు తన సిలువ యాగం ద్వారా ఆవిష్కరించబోతున్న సరికొత్త దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరబోతున్న విశ్వాసులందరికీ ఆనాడు వాళ్ళు ప్రతినిధులు. ఆ శిఖరాగ్ర సమావేశంలో ‘ఇక్కడే ఉండిపోవడానికి పర్ణశాలలు కడతానంటూ’ పేతురు చేసిన వ్యాఖ్యను, ‘ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి’ అంటూ ఈ సమావేశాన్ని నిర్వహించిన పరిశుద్ధాత్ముడు వారినుద్దేశించి ఇచ్చిన ఆజ్ఞను సువార్త భాగాలు ప్రస్తావించాయి. లోక మలినానికి దూరంగా ఉన్నహిమాలయాలతో సహా మహా పర్వతాల్ని ఆధ్యాత్మిక స్థావరాలుగా అన్ని మతాల్లాగే యూదు మతం కూడా పరిగణించేది. గొప్ప ఆధ్యాత్మిక దర్శనాలను దేవుడు తన ప్రజలకు కొండ పైన ఇస్తాడు. కానీ ఆ దర్శనాల నెరవేర్పు కోసం‘సేవా క్షేత్రాలను’ మాత్రం కొండ కింది లోయల్లోని సామాన్య ప్రజల సమక్షంలో చూపిస్తాడు. ’కొండ మీదే ఉండిపోదాం’ అని ఎవరికి, మాత్రం ఉండదు? పేతురుకు కూడా అలాగే అనిపించింది, కానీ ‘దర్శన సాఫల్యం’ మాత్రం లోయల్లోని పాపులు, కరడు గట్టిన నేరగాళ్లు, దుర్మార్గులకు దేవుని ప్రేమను ప్రకటించడంలో ఉందని, అందుకు యేసు మాట వినండని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుని పక్షంగా మాట్లాడటం అంటే ప్రసంగించడం అందరికీ ఇష్టమే, కానీ దేవుని మాటలు వినడమే చాలా కష్టం. కానీ యేసు తన తండ్రి మాటలు విని, లోబడి లోయల్లోకి దిగి వెళ్లి వారిని ప్రేమించి ప్రాణత్యాగం చేశాడు. పేతురు, యాకోబు, యోహాను కూడా భూదిగంతాలకు వెళ్లి దేవుని ప్రేమను ప్రకటించి హత సాక్షులై తమ దర్శనసాఫల్యం పొందారు. అలా లోయల్లోని గొంగళిపురుగులను తమ అద్భుతమైన పరిచర్యతో విశ్వాస పరివర్తన చెందిన సీతాకోక చిలుకలుగా మార్చడానికి ఆనాటి రూపాంతర పర్వత శిఖరాగ్ర సమావేశం దిశానిర్దేశం చేసింది. కేవలం యూదులకే అంతవరకూ పరిమితమైన విశ్వాస జీవితం, నాటి రూపాంతరానుభవపు సార్వత్రిక దర్శనంతో, సర్వలోకానికి వర్తించే అపూర్వ ప్రేమమార్గమైంది. స్వనీతి, తామే జ్ఞానులం, తామే అధికులమన్న అహంకారానికి ప్రతీకగా మారిన యూదులు అనే గొంగళిపురుగు నుండే, సాత్వికత్వం, ప్రేమ, క్షమా అనే ఆత్మీయ సౌందర్యానికి ప్రతీకగా ‘క్రైస్తవం’ ఆవిర్భవించింది. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం ఇ–మెయిల్: prabhukirant.@gmail.com -
దేవుని అండతోనే మహా విజయాలు!!
కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్పజీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకరయుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళా డు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే వచ్చి తనతో తలపడమంటూ సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఆ స్థితిలో దావీదు గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతును మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు గొప్పవిజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు. దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’లోకి వారు ఎదగలేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల బలం, మారణాయుధాలు, వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మకవిశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్ని రోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతి కుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి వృక్షంగా ఎదుగుతుంది. ప్రతి విశ్వాసిలో కూడా దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో వృక్షరూపం దాల్చినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన మన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్ చెప్పే గొప్ప సత్యం. మారణాయుధాలతో, కండబలంతో కాక, దేవుని పట్ల గల అచంచల విశ్వాసమనే మహాయుధంతోనే వాటిపై విజయం సాధించగలమన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెల లేని ఆత్మీయ పాఠం. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
ఆవగింజంత విశ్వాసంతో అనూహ్యమైన దీవెనలు
ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకాయన చనిపోవడంతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పుతీర్చలేదని తెలిసి, అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరినీ తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడం కూడా ఇబ్బందే అయ్యింది. రోజూ సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితం ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన అశక్తత, దిక్కుతోచని స్థితిలో, ఎలీషా ప్రవక్త ’నేను నీకేమి చెయ్యాలని కోరుకొంటున్నావు? నీ వద్ద ఏముంది?’ అనడిగాడు. ’కుండలో కొంచెం నూనె ఉంది’ అని ఆమె జవాబిచ్చింది. ’వెళ్లి అందరి వద్దా వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడం ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతకమని ఎలీషా చెప్పగా, ఆమె అలాగే చేసింది. అవమానంతో జీవించవలసిన ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అనూహ్యంగా స్వాభిమానం, సమద్ధి, ప్రశాంతత వైపునకు నడిపించాడు(2 రాజులు 4:1–7) నీవద్ద ఏముంది? అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవీ అంటూ తన సమస్యలన్నీ ఏకరువు పెట్టినా, తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతం జరిగి ఉండేది కాదు. ‘కానీ నావద్ద కొంచెం నూనె ఉంది’ అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదం చేసింది. మరో విధంగా చెప్పాలంటే, ’ ఇన్ని బాధల్లోనూ ’నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది’ అని ఆమె పరోక్షంగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణం, అప్పులవాళ్ళ వేధింపులు, పూటగడవని లేమి, ఒంటరితనం, బెదిరింపులు, నిస్సహాయత్వం, భరించలేని వత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితం పైన ఆశలేమాత్రం లేని పరిస్థితుల్లో ఆమెకున్న ’ఆవగింజంత విశ్వాసమే’ ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది. జీవితంలో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతప్తి, కతజ్ఞత కలిసిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతుంది. ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడం కాని ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం, ఆమెలోని ఆవగింజంత విశ్వాసం. ‘చనిపోయిన నా భర్త భక్తిపరుడు’ అని ఆమె ఎలీషాకు చెప్పింది. తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనం అశక్తులమే కానీ విశ్వాసులముగా మనం మహా బలవంతులం!! దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనేరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ, ‘చుట్టూ బోలెడు సమస్యలున్నాయి, జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కాని నా గుండెలో దేవునిపట్ల కొండంత విశ్వాసముంది, అందువల్ల ఆనందంగా ఉన్నాను, నువ్వు దిగులుపడకు ’ అని ఆయన పేర్కొన్నాడు. కొండంత అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో లోకాన్నెదుర్కొనవచ్చని యేసుప్రభువే చెప్పాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దైవజ్ఞానమే దీవెన
నీకున్నదంతా వదిలేసి నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే, అబ్రాహాము మరో ప్రశ్న దేవునికి వెయ్యకుండా సంపూర్ణ విధేయతతో తానున్న గొప్ప మెసొపొటేమియా ప్రాంతాన్ని వదిలి అదేమిటో కూడా తెలియకుండానే కనాను దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. దాదాపు ఏడొందల ఏళ్ళ తర్వాత ఆయన సంతానమైన ఆరు లక్షలమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు వదిలి అదే వాగ్దాన దేశానికి అరణ్యం గుండా మళ్ళీ వెళ్తున్నపుడు, ’కనాను దేశమెలా ఉంటుందో, అక్కడి పరిస్థితులేమిటో తెలుసు కునేందుకు మొదట మన వాళ్లలో కొందరిని అక్కడికి పంపిద్దాం’ అని సూచిస్తే, దేవుని సమ్మతితో గోత్రానికి ఒక్కరు చొప్పున 12 మందిని కనాను దేశానికి మోషే పంపాడు. దేవుని నిర్ణయాలకు నిర్ద్వందంగా తలవంచిన అబ్రాహాము విశ్వాసానికి, ‘ముందు ఆ దేశాన్ని చూద్దాం ఆ తర్వాతే అక్కడికెళదాం’ అన్న ఇశ్రాయేలీయుల అవిశ్వాసానికి అసలేమైనా పోలిక ఉందా? మరేం జరిగింది?’ అంత గొప్ప దేశాన్ని, అంతటి బలవంతులను మనలాంటి బలహీనులు ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ అవిశ్వాసంతో గుండెలు బాదుకొంటూ మాట్లాడిన పదిమందిని బట్టి, యొహోషువ, కాలేబు తప్ప మిగిలిన ఆరు లక్షలమందీ దేవుని ఉగ్రత వల్ల అరణ్యంలోనే రాలిపోగా, అరణ్యంలో జన్మించిన వారి సంతానమైన కొత్త తరం మాత్రమే వాగ్దాన దేశాన్ని చేరింది (ద్వితీ 1:22–40). అందుకే జీవం, మరణం కూడా మన నాలుక వశంలోనే ఉంటాయని బైబిల్ బోధిస్తోంది (సామె18:21). తనను తాను ఓడించుకోవడంలో, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడంలో మనిషి తనకు తానే సాటి. కారు చీకట్లో తదుపరి అడుగు ఎక్కడ పడబోతోందో తెలియకున్నా, తనను నడిపించే దేవుని నమ్మి అద్భుతంగా, అత్యంత భద్రంగా విశ్వాస ప్రయాణాన్ని పూర్తి చేసి గమ్యాన్ని చేరిన అబ్రాహాము కోవకు చెందిన విశ్వాసులు కొందరైతే, జీవితంలో ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ,‘గొప్ప ప్లానింగ్’ తో ముందుకు సాగాలన్న లోకజ్ఞానంతో ప్రయాణించి గమ్యం తప్పి, అగాధమైన గుంటలో పడే అవిశ్వాసులు చాలా మంది. దేవుని వాగ్దానాలు, నిర్ణయాలు ఎప్పటికీ నమ్మదగినవే, శిరోధార్యమే!! విశ్వాసానికి లోకజ్ఞానాన్ని జోడిస్తే అదే అవిశ్వాసమవుతుంది. ఆ అవిశ్వాసం వల్లనే చాలా జీవితాల్లో శాపాలు, అపజయాలు, అనర్థాలు. అందుకే విశ్వాస ప్రయాణం మన పంచేంద్రియాల పర్యవేక్షణలో కాకుండా, పరిశుద్ధాత్ముని నేతృత్వంలో సాగాలన్నది మనపట్ల దేవుని నిత్య సంకల్పం (2 కొరింథీ 5:6). పంచేంద్రియాల శక్తినే మహా జ్ఞానమనుకొంటున్న నేటి ‘భ్రష్ట సంస్కృతి’కి పూర్తిగా భిన్నమైనది దేవుని సన్నిధి, వాగ్దానాలతో కూడిన దైవజ్ఞానం. దైవజ్ఞానం అనే పవిత్రమైన తైలంతో నిండిన విశ్వాసిలో లౌక్యం, లాభార్జన, స్వార్థం, పేరుప్రఖ్యాతులతో కూడిన ‘లోకజ్ఞానం’ అనే నీళ్లు ఏ మాత్రం ఇమడవు. దైవజ్ఞానానికి, లోకజ్ఞానానికి మధ్య, తోటకూరకు, కలుపుమొక్కకు, తేనె చుక్కకూ, ఆముదానికీ మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. తన జ్ఞానంతో మనిషి అత్యున్నత శిఖరాలకు ఎదగడం దేవునికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఆ జ్ఞానం మనిషిని దేవుని నుండి, మానవీయ, నైతిక విలువల నుండి వేరు చేస్తేనే సమస్యలొస్తాయి. పరలోకాన్ని, అపారమైన ఆశీర్వాదాలనూ పొందేందుకు దేవుని విశ్వసించాలి, దైవజ్ఞానాన్నిచ్చే బైబిల్ను విశ్వాసి శ్రద్ధగా చదవాలి. ఆ దైవజ్ఞానం లేనందువల్లే ఆనాడు లక్షల మంది ఎంతో తెలివున్నా అవిశ్వాసులై అరణ్యంలో రాలిపోయి, పరలోకానికి సాదృశ్యమైన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేక పోయారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్, prabhukirant@gmail.com -
దేవుడే సర్వం స్వాస్థ్యం
ఏది కొరతగా ఉంటుందో దానికి ఖరీదెక్కువ అంటుంది అర్థశాస్త్రం. ఆ లెక్కన ప్రపంచంలో ‘ఆనందానికి’ ఉన్నంత కొరత మరి దేనికీ లేదు. అందుకే జీవితంలో ఆనందాన్ని పొందేందుకు మనిషి దేనికైనా సిద్ధపడుతున్నాడు. ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో సౌలు రాజు అతని కుమారులు కూడా గిల్బోవ పర్వతం వద్ద హతం కాగా, ఆ వెంటనే దేవుని అభీష్టం మేరకు ఇశ్రాయేలు పెద్దలంతా కలిసి హెబ్రోను రాజధానిగా దావీదుకు పట్టాభిషేకం చేశారు. పిదప ఇశ్రాయేలీయులలో పన్నెండు గోత్రాల ప్రజలు, వారి పెద్దలు కూడా మనస్ఫూర్తిగా దావీదుకు మద్దతు తెలిపారు. వాళ్ళ మధ్య ఎన్నో తగాదాలున్నా, దావీదుతో కలిసి తమ ఇశ్రాయేలు దేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న ప్రగాఢమైన కోరికే వారిని కలిపింది, అందుకు పురికొల్పింది (1 దిన. 11,12,13 అధ్యాయాలు). దావీదు పట్టాభిషేక మహోత్సవం తర్వాత ఇశ్రాయేలు ప్రజలంతా కలిసి హెబ్రోనులో కూడుకొని ఒక గొప్ప పండుగ చేసుకున్నారని, ఎంతో సంతోషాన్ని పొందారని, ఆయా గోత్రాల యుద్ధ వీరులంతా తమ తమ ఆయుధాలు ధరించి మరీ ఆ వేడుకకొచ్చారని బైబిల్ చెబుతోంది (1 దిన 12:37–40). వాళ్ళ సంతోషానికంతటికీ ఒకే ఒక కారణం దావీదు!! ఎందుకంటే ఎన్ని శ్రమలున్నా ఆనందించడమెలాగో దావీదుకు తెలుసు. తన జీవితంలో ఆనందం ఉన్నవాడే ఇతరులను ఆనందింపజేయగలడు. సౌలును రాజుగా తిరస్కరించి దావీదును దేవుడు ముందే అభిషేకించినా, సింహాసనాన్ని కుట్రలతో కాక దేవుని సమయంలో పొందేందుకు ఆయన దైవభయంతో కనిపెట్టాడు. ఆ లోగా సౌలు చేతుల్లో ఎన్నెన్నో కష్టాలు, విపత్తులననుభవించాడు. దైవాభిషిక్తుడైన రాజై ఉండికూడా, నలభై ఏళ్ళు తలవంచుకొని జీవించాడు. తొందరపడితే రాజ్యం ముందే దొరికేది కానీ రాజ్యప్రజల ప్రేమ అతనికి దొరికుండేది కాదు. ప్రజలంతా సౌలు వర్గం, దావీదు వర్గంగా విడిపోయి తమలో తామే పోరాటాలకు దిగితే, రాజ్యమంతా అల్లకల్లోలమై ఉండేది. కాని ఇపుడు జరిగిన దావీదు పట్టాభిషేకంతో ఇశ్రాయేలీయుల రాజ్యమంతా ఆనందం వెల్లివిరుస్తోంది. జీవితంలో దేవుని సంకల్పాల నెరవేర్పు కోసం, ప్రతిదానికి దేవుని సమయం కోసం ఓపిగ్గా ఎదురు చూడటమే విశ్వాసి సాధించగల నిజమైన విజయం. ‘ఎదురుచూడటం’ అనే మాట అర్థాన్ని కోల్పోయిన అత్యంత వేగవంతమైన కాలంలో మనం బతుకుతున్నాం. కాలానికి అసలు యజమాని దేవుడే!!. ఆయన తన సంకల్పాలు మనం నెరవేర్చేందుకు తన కాలంలో కొంత మనకు ‘ఆయుష్కాలం’ రూపంలో కానుకగా ఇచ్చాడు. అదే జీవితమంటే!! అందువల్ల దేవుణ్ణి అర్థం చేసుకొంటూ ఆయన అభీష్టం మేరకు జీవించడంలోని ఆనందాన్ని ఒక్క విశ్వాసి మాత్రమే అనుభవించగలడు. దేవుణ్ణే కాదు, మనచుట్టూ ఉన్న పరిస్థితులను, మారుతున్న సంస్కృతులను, వాటి ఒత్తిడులను కూడా మనం దైవజ్ఞానంతోనే అర్థం చేసుకోవాలి. అలా కాక సొంతజ్ఞానంతో వాటిని అనుసరించేవారు, వాటికి బానిసలవుతారు. నాటి ఇశ్రాయేలీయులకు దేవుని లేఖనాల జ్ఞానం బాగా ఉండేది. అందుకే తమ దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులను లేఖనజ్ఞానంతోనే అర్థం చేసుకొని ఆనందించారు. ఆ దైవజ్ఞానం ఈనాడు విశ్వాసుల్లో, వారి కుటుంబాల్లో, చర్చిల్లో కూడా కొరతగా ఉంది. అందుకే అన్ని హంగులున్నా ఆనందం, శాంతి ఎండమావులయ్యాయి. ప్రాథమికంగా మనం ఈ లోకానికి ఎక్కడినుండి వచ్చాం, ఎందుకొచ్చాం, ఎక్కడికి వెళతాం? అన్నది తెలుసుకోవడానికే దైవజ్ఞానం అవసరం. ఆ స్పష్టతే జీవితంలో ఆనందానికి మూలకారణం అవుతుంది. మరుక్షణంలో బతికుంటామో లేదో తెలియకున్నా, కాలమంతా నాదే, లోకమంతా నాదే అన్న పద్ధతిలో విశృంఖలంగా బతకడమే అన్ని వత్తిళ్లకు, ఆనందం పొందలేకపోవడానికి కారణం. అందుకే ‘దేవా, నీవు నాకు తెలిసిన దానికన్నా బాగా నేను నీకు తెలుసు. అందుకే నీ నిర్ణయాలు నాకు శిరోధార్యం, నీవే నా స్వాస్థ్య భాగం’ (1 దిన. 17:18–27) అన్న దావీదు విశ్వాసమే అతని ఆనందమయ జీవిత రహస్యం. - డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సాధారణత, సాత్వికతలే విశ్వాసి ఆభరణాలు
నిశ్శబ్దంగా ప్రార్థనలు సాగుతున్న చర్చిలో అతని సెల్ఫోన్ పొరపాటున మోగింది. పాస్టర్ కోప్పడ్డాడు, విశ్వాసులంతా అతన్ని వింతజీవిలాగా చూశారు, భార్యాపిల్లలు కూడా విసుక్కున్నారు. అతను ఇక ఎన్నడూ చర్చికి వెళ్ళలేదు. సంయమనం, క్షమాపణ, పరస్పర గౌరవం, ప్రేమ, మృదుభాష్యం, సహకారధోరణి, సత్స్పందన, సహృదయం ఇవన్నీ విశ్వాసులు, చర్చిల్లో విధిగా ఉండాలన్నది యేసు బోధ, అభిమతం, జీవితం కూడా. వాటినే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు సొంతం చేసుకొని స్వలాభం కోసం బ్రహ్మాండంగా వాడుకొంటున్నారు. పరిసయ్యులు, అంటే ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రం చదివి దానికి భాష్యం చెప్పే మతపెద్దల జీవనశైలి ఆరోజుల్లో అత్యున్నతమైన విలువలతో నిండి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాని వారు దైవప్రతినిధులుగా కంటే, దేవునికి తామే మారుపేర్లమన్నట్లు నిరక్షరాస్యులను, సామాన్యులను, నిరుపేదలను పురుగుల కన్నా హీనంగా చూసేవారు. అందుకే బలహీనులు, నిరుపేదలు, నిరాశ్రయులతో మమేకమై జీవించిన యేసు ‘వారు మీతో చెప్పినట్టు చెయ్యండి, కాని వారు చేసినట్టు చెయ్యకండి. మోయలేనంత భారాన్ని వాళ్ళు మీ భుజాలమీద పెడతారు, కాని తమ వేలితోనైనా దాన్ని వారు కదిలించరు’ అంటూ శాస్త్రులు, పరిసయ్యుల నీతిని ఎండగట్టాడు (మత్త23:3.4). వారి నీతికంటె మీ నీతి ఉన్నతంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించరని ఆయన సాధారణ విశ్వాసులను హెచ్చరించాడు (మత్త 5:20). క్రీస్తు జీవితంలో, బోధల్లో ప్రతిధ్వనించిన, పరిమళించిన సోదరప్రేమ, సుహృద్భావం, క్షమాపణ, మృదుభాష్యం, సాత్వికత్వం, నిర్మలత్వం చర్చిలు, విశ్వాసుల కుటుంబాల్లో కనిపించకపోతే వారు ఆయన అనుచరులు ఎలా అవుతారు? తన బోధలు మాటల్లో, ప్రసంగాల్లోకన్నా విశ్వాసుల జీవితాల్లో ఆచరణలో కనిపించాలని కోరుకున్న యేసు ప్రభువుకు అసంతృప్తిని మిగుల్చుతూ, ప్రసంగాల హోరుతో కూడిన ‘ధ్వని కాలుష్యమే’ తప్ప, ఆయన బోధలతో జీవనసాఫల్యం పొందిన విశ్వాసుల దాఖలాలేవీ? తాను దేవుడై ఉండీ, యేసుప్రభువు సామాన్య ప్రజలతో కలిసిపోయి జీవించగా, నిరుపేదలు, సామాన్య ప్రజలు తమను తాకినా మైలపడిపోతామన్న విధంగా నాటి పరిసయ్యులు అంగరక్షకులను వెంబడేసుకొని మరీ వారికి దూరంగా వీధుల్లో తిరిగే వారు, సరిగ్గా ఈనాటి సెలెబ్రిటీ దైవసేవకుల్లాగే!! ‘‘సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు (మత్త 5:5)’’ అన్న క్రీస్తు బోధనల సర్వసారాంశమే మనకర్ధం కాకపోతే, ఆచరణీయం కాకపోతే ఎలా? విశ్వాసుల మధ్య అసూయ, శత్రుత్వం ఏ రూపంలో కూడా ఉండేందుకు దేవుడు అనుమతించడు. తన అన్న ఏశావుతో శత్రుత్వమే ఆదిమ పితరుడు యాకోబును అతని జన్మస్థలం కానాను వదిలి పారిపోయేలా చేసింది. సొంత సోదరుడైన యోసేపుతో శత్రుత్వమే అన్నలు అతన్ని బానిసగా అమ్మేయడానికి దారి తీసింది. ఆ శతృత్వభావమే మోషే ఫరోకు దూరంగా మిద్యానుకు పారిపోయేలా చేసింది. కాని కొత్తనిబంధన కాలపు క్షమాముద్రపడిన పేతురు స్వభావరీత్యా బొంకేవాడు, బలహీనుడైనా, మార్పునొంది క్షమాపణోద్యమానికి మూలస్తంభమయ్యాడు. మునుపు యేసుప్రభువును, ఆయన చర్చిని విపరీతంగా ద్వేషించిన అపొస్తలుడైన పౌలు యేసుప్రేమలో తడిసి మారిపోయి ప్రపంచమంతా క్షమాపణా సువార్తను ప్రకటించాడు, సహనానికి ప్రతీకగా మారాడు. శత్రుత్వం, అసూయాతత్వం చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు, నాగరికతలు సమసిపోవడానికి కారణమయ్యాయి. డాబు, దర్పం, ఈర‡్ష్య, పోటీతత్వాలకు స్వస్తి పలికి సరళంగా, సాత్వికంగా, ప్రేమాపూర్ణతతో జీవించడమే దేవునికి మనమివ్వగలిగిన గొప్ప బహుమానం. నిజమైన పశ్చాత్తా్తపంతో కలిగిన మారుమనస్సు విశ్వాసిలో దీనత్వాన్ని రగిలిస్తుంది. దీనత్వాన్ని కలిగిన విశ్వాసులు ఈ లోకాన్నే పరలోక రాజ్యంగా మార్చుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
కుటుంబవ్యవస్థే సమాజానికి కీలకం...
ఎఫ్రాయిము మన్యంలో నివసించిన యాజక వంశీయుడైన లేవీయుడు ఎల్కానా (న్యాయా 17:7). హన్నా అతనికి రెండవ భార్య, వారికి పిల్లలు లేరు. ఇశ్రాయేలీయుల మందిరం అప్పట్లో షిలోహులో ఉండేది. ప్రజలంతా అవిధేయులై దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న కారణంగా దేవుని ప్రత్యక్షత పూర్తిగా అరుదైపోయి, నిర్ణయాత్మకత, పటిష్టత లోపించిన ఎలీ లాంటి అసమర్థ యాజకుని ఆత్మీయనాయకత్వంలో దేవుని మందిరం తన ప్రాభవాన్ని కోల్పోయిన చీకటి రోజుల్లో హన్నా ప్రార్థనలకు జవాబుగా సమూయేలు ప్రవక్త ఒక వ్రతపుత్రుడుగా జన్మించాడు. హన్నా తాను మొక్కుకున్నట్టుగానే, ఇంకా పసిబాలుడుగానే ఉన్న సమూయేలును తెచ్చి మందిరంలో పరిచర్యకు ప్రతిష్టించింది. సమూయేలును మందిరంలోనే వదిలి హన్నా వెళ్ళిపోయింది. అలా సమూయేలు ప్రవక్త పసివాడుగా ఉన్నప్పటినుండే ఆలయంలో దేవుని పరిచర్యను నిబద్ధతతో చెయ్యడం ఆరంభించాడు. సమూయేలుతో దేవుడు పసితనం నుండే మాట్లాడుతూ ఉండటంతో, దేవుని ప్రత్యక్షతలు మళ్ళీ ఆరంభమై చీకటి రోజులకు తెరపడింది. ఇది కుటుంబ వ్యవస్థ సాధించిన ఘన విజయం. లేవీయులంతా దేవుని మందిరపు దరిదాపుల్లోనే నివసించాల్సి ఉండగా, ఏ కారణంవల్లో షిలోహు మందిరానికి దూరంగా ఎఫ్రాయిము మన్యంలో నివసించిన ఎల్కానా దేవుని మందిరాన్ని మర్చిపోకుండా ఏటేటా దర్శించిన విశ్వాసి కాగా, నాకొక కుమారుణ్ణి ప్రసాదిస్తే అతన్ని నీ సేవకు ప్రతిష్ఠిస్తానంటూ మొక్కుబడి ప్రార్థన చేసి తన మాటకు కట్టుబడిన అంతకన్నా గొప్ప విశ్వాసి హన్నా!! అలా హన్నా తన ప్రార్ధనతో గొడ్రాలితనమనే తన వ్యక్తిగత సమస్యను తీర్చుకుంది, దేవుని ప్రత్యక్షత కరువైన ఆనాటి ఇశ్రాయేలీయుల ఆత్మీయ సమస్యను కూడా తన కుమారుడైన సమూయేలు ద్వారా పరిష్కరించింది. ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు అటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని కూడా ఎంత గొప్పగా ఈనాడు కూడా ప్రభావితం చెయ్యగలరన్న దానికి ఎల్కానా, హన్నాలే ప్రత్యక్ష సాక్ష్యం. కొడుకు పుడితే తమకెంతో ప్రయోజకుడవుతాడు, వృద్ధాప్యంలో అండగా ఉంటాడన్న స్వార్థంతో సమూయేలును వాళ్ళు తమవద్దే ఉంచుకోవచ్చు. కానీ తమ ప్రయోజనాలకన్నా, సమాజ ప్రయోజనాలు, దేవుని సంకల్పాలే మిన్న అని నమ్మిన ఆదర్శ దంపతులు వారు. అప్పుడే పాలు విడిచిన, బహుశా కేవలం మూడేళ్ళ వయసున్న తన పసి కుమారుణ్ణి, అతని ఆలనాపాలనా ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆలయంలో ఒంటరిగా వదిలి వెళ్తున్నపుడు హన్నా హృదయం ఎంతగా తల్లడిల్లిందో మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి కౌగిలిలో వెచ్చగా ఒదిగి హాయిగా పడుకోవాల్సిన సమూయేలు, ఇకనుండి మందిరంలో రాతినేలపై ఒక్కడే పడుకోవలసి ఉంటుందని హన్నాకు తెలుసు. అందుకు ఆమె ఒక పరిష్కారాన్ని కనుగొంది. అంత పిన్నవయసులోనూ ఆమె తన కుమారునికి దేవుణ్ణి పరిచయం చేసింది(1సమూ 1:28). ఇకనుండి దేవుడే తన కుమారునికి తోడుగా ఉండాలని, ఉంటాడని ఆమె నమ్మింది. అలా తల్లిదండ్రులిద్దరి ఆత్మీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎదిగిన సమూయేలు త్వరలోనే గొప్ప ప్రవక్తగా ఆ దేశంలో స్థిరపడి ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకత్వాన్నిచ్చాడు. సౌలు, దావీదు చక్రవర్తుల కాలంలో రాచరిక వ్యవస్థకు, ప్రజలకు మధ్య గొప్ప అనుసంధానకర్తగా ఉంటూ చీకటి రోజులను కాస్తా అటు ఆత్మీయంగా, ఇటు లోకపరంగా కూడా క్షేమకాలంగా మార్చడంలో ముఖ్యపాత్ర వహించాడు. తమ పిల్లలకు అన్నీ ఇచ్చేందుకు, వారి భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దేందుకు ఆరాటపడే తల్లిదండ్రులు వారికి దేవుణ్ణివ్వడం, దేవుణ్ణి పరిచయం చెయ్యడంలో మాత్రం ఎంతో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ’ఇదిగో మీ అమ్మ, నాన్న, మామ, తాత, అమ్మమ్మ’ అంటూ మాటలు రానప్పుడే పిల్లలకు అందర్నీ పరిచయం చేసే తల్లి, తండ్రి, ‘ఇదిగో నీ దేవుడు’ అని కూడా పరిచయం చెయ్యాలి. తల్లి ఒడి వెచ్చదనం, తండ్రి నేతృత్వంలోని భద్రతా భావంతోపాటు దేవుని నిత్యసహవాసం, ఆదరణ, విశ్వాసపు తొలిపాఠాలు పసితనంలోనే పిల్లలకు ఉగ్గుపాలతోపాటు రంగరించి పోయాలి. అలాంటి పెంపకంలోనే పిల్లలు సమాజ కల్యాణానికి పాల్పడే గొప్ప విశ్వాసులుగా తయారవుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రలోభాలకు అతీతం ప్రభువు నేర్పిన విశ్వాసం
‘నన్ను వెంబడించండి’ అన్న యేసుప్రభువు వారి ఆహ్వానంలోని ఆంతర్యం, విశ్వాసులకు ఈ లోకసంబంధమైన ఐశ్వర్యాలు, అత్యున్నత హోదాలు, అధికారాలివ్వడమే అని నమ్మడం, ఆయన ఆవిష్కరించి, ప్రకటించిన పరలోకరాజ్య సంబంధమైన బోధనలు, విలువల తాలూకు లోతైన అవగాహన లేకపోవడమే !!. అదే నిజమైతే యేసుప్రభువు ఒక రిక్తుడిగా, దాసుడుగా, కటిక పేదవాడిగా ‘తలవాల్చుకోవడానికైనా స్థలంలేని’ ఒక నిరుపేదగా ఈలోకానికి విచ్చేసి జీవించవలసిన అవసరమే లేదు. సౌమ్యంగా, సాత్వికంగా, దీనంగా, తలవంచి బతకడంలోని శక్తిని, ఔన్నత్యాన్ని యేసుప్రభువు రుజువు చేసినంతగా మరెవరూ మానవ చరిత్రలో రుజువు చేయలేదు. యేసుక్రీస్తే కాదు, ఆనాటి ఆయన ప్రియ శిష్యులు, అనుచరులంతా అలాగే నిరుపేదలుగా, అనామకులుగా, అధికారానికి దూరంగా జీవించారు, తమ ఆ అసమాన జీవన శైలితోనే సమాజాన్ని ప్రభావితం చేసి క్రైస్తవానికి పునాది రాళ్లు వేశారు. రోమా ప్రభుత్వ నిరంకుశత్వం అవధులు దాటి ప్రజల్ని అన్ని విధాలుగా పీడిస్తున్న చీకటి యుగంలో యేసు ఈ లోకంలో కాలు పెట్టి, చేసిన తన అసాధారణమైన బోధల్లో, ఒక్కటంటే ఒక్క విమర్శ, వ్యాఖ్య కూడా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేయకపోవడమే ఈ లోకాధికారాలకు, ప్రలోభాలకు, పోకడలకు అతీతమైనది క్రైస్తవమని స్పష్టంగా రుజువు చేస్తోంది. యేసుప్రభువులాగే ఆదిమకాలపు ఆయన శిష్యులు కూడా ధైర్యంగా అన్ని చోట్లా పరలోకరాజ్య సువార్త ప్రకటించారు, ప్రతిఘటన, వ్యతిరేకత ఎదురైతే మౌనంగా వహించారు లేదా మరో చోటికి తరలి వెళ్లారు తప్ప వారు ఎదురు దాడులు చెయ్యలేదు, ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు సృష్టించ లేదు, మానవ హక్కుల ప్రదర్శనలు చెయ్యలేదు. ఈ అహింసా, ప్రతిఘటనా రహిత విధానంలోనే ఆనాటి అపొస్తలులు ఆసియాలో, ఐరోపా అంతటా క్రైస్తవాన్ని నెలకొల్పారు, పైగా వారు వేసిన క్రైస్తవం పునాదులు ఇన్ని వేల ఏళ్ళ తర్వాత కూడా ఐరోపాలో అత్యంత పటిష్టంగా ఉన్నాయి. అంతియొకయ, ఈకొనియా, లుస్త్ర పట్టణాల్లో అపొస్తలుడైన పౌలు, ఆయన అనుచరుడైన బర్నబా అత్యంత ప్రభావ భరితంగా సువార్త పరిచర్య చేశారు. యేసుప్రభువు పునరుత్థానమైన 18 ఏళ్ళ తర్వాత, చర్చిలు బాగా వర్ధిల్లుతున్న కాలంలో, పౌలు తన మొదటి మిషనేరీ ప్రయాణం పూర్తి చేస్తున్నపుడు, ఈ ప్రాంతాల్లో వాళ్ళు విపరీతమైన శ్రమలు పొందారు. వారిమీద యూదులు రాళ్లు రువ్వితే ఆ ధాటికి ఒకదశలో పౌలు చనిపోయాడేమోనని కూడా భావించారు. అక్కడ పట్టణాల్లో బహిష్కరణకు కూడా వారు గురయ్యారు. అయినా మౌనంగా మరో చోటికి వెళ్లిపోయారు తప్ప వారు ఎదురు తిరగలేదు (అపో.కా.14:1–28). పైగా కొన్నాళ్ళకు అక్కడి చర్చిలను బలపరచి, ప్రోత్సహించడానికి మళ్ళీ వచ్చినపుడు, అనేక శ్రమలను అనుభవించడం ద్వారానే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామంటూ, విశ్వాసంలో అలా స్థిరంగా ఉండాలంటూ విశ్వాసులకు బోధించారు(14:21.22). విశ్వాసంలో స్థిరంగా ఉండడమంటే శ్రమలనెదుర్కోవడమేనని వారి బోధల తాత్పర్యం. ప్రభువు అప్పగించిన పరిచర్యలో శ్రమలు అంతర్భాగం అన్నది బైబిల్ చెప్పే నిత్య సత్యం. శ్రమలొచ్చినపుడు, మనవల్ల ఏదో తప్పు జరిగిందనుకొంటూ సిగ్గుతో తలవంచడం కాదు, గర్వంగా తల ఎత్తుకోవాలి. ఎందుకంటె నిజమైన పరిచారకులెన్నుకున్న దారే శ్రమలతో కూడిన యేసుప్రభువు దారి. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
హృదయాన్ని పదిలంగా చూసు కోవాలి...
హెబ్రోను నుండి దావీదుపురం లేదా యెరూషలేముకు తన రాజధానిని మార్చిన తర్వాత అక్కడ దావీదు చక్రవర్తి తన నివాసం కోసం గొప్ప రాజప్రాసాదాలను, తన సిబ్బంది, సైన్యం కోసం వందలాది ఇళ్లను కట్టించాడు. అత్యంత పవిత్రమైన దేవుని నిబంధన మందసాన్ని కూడా దావీదుపురానికి తెచ్చి, ఒక గుడారం వేసి అందులో ఉంచాడు. అయితే ఎంతో దీనస్థితి నుండి చక్రవర్తి స్థాయికి ఎదిగిన తానేమో దేవదారు పలకలు పొదిగిన మహా భవనాల్లో నివసించడం, తన ఔన్నత్యానికి కారకుడైన దేవదేవుని ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యమైన నిబంధన మందసమేమో తాత్కాలికమైన ఒక గుడారంలో ఉండటం దావీదుకు బాధకలిగించింది. వెంటనే ప్రవక్తయైన నాతానును దావీదు పిలిపించి, దేవుని నిబంధన మందసం కేంద్రంగా ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలనుకొంటున్నానని ప్రకటించాడు.దేవునికి మందిరం కట్టాలనుకోవడమనేది ఎంతో ఉదాత్తమైన ఆలోచన, అందులో తప్పేముంది? అన్న భావనతో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ నాతాను దావీదుకు జవాబిచ్చాడు (1 దిన 17:1–14). అదే సమస్య అయ్యింది. రాజులకైనా, సామాన్య ప్రజలకైనా, ప్రవక్తగా నాతాను ప్రతి విషయాన్నిదేవుని సన్నిధిలో విచారించి తెలుసుకొని వారికి బదులివ్వాలి. కాని అది చక్రవర్తి ఆలోచన, పైగా మందిరం కడతానంటున్నాడు కదా, అందులో తప్పేముంది? అన్న ఉద్దేశ్యంతో నాతాను ’నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ’ రాజుకు పూర్తి స్వేచ్ఛనివ్వడం దేవుడు హర్షించలేదు. నాకు మందిరాన్ని దావీదు కాదు, అతని కుమారుడైన సొలొమోను కడతాడంటూ ఆ రాత్రి దేవుడు నాతానుతో సెలవిస్తే, అదే విషయాన్ని నాతాను మరునాడు దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు దేశానికి దావీదు చేసినంత సేవ మరెవరూ చేయకున్నా, మందిరం కట్టే ఘనతను మాత్రం దేవుడు అతనికియ్యలేదు. అలా దావీదు కట్టిన మహా మందిరంగా చరిత్రలో పేరుగాంచవలసిన యెరూషలేము మందిరం, దేవుని చిత్తంతో సొలొమోను కట్టిన మందిరంగా ప్రసిద్ధి చెందింది. దేవుని పనులు మనుషుల ఆలోచనలతో కాదు, దైవాభీష్టం మేరకు జరిగినప్పుడే లోక కల్యాణమవుతుంది. దైవప్రతినిధిగా నాతాను దేవుని సంకల్పాన్ని తెలుసుకోకుండా, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ దావీదును ప్రోత్సహించడం దేవునికి రుచించలేదు. పైకి మహాచక్రవర్తిగా అందరి మన్ననలందుకొంటున్న దావీదు హృదయం లోపలి పొరల్లోని రహస్యపుటాలోచనలు, దురాలోచనలు ప్రవక్తే అయినా మానవమాత్రుడైన నాతానుకు తెలియదు, కాని దేవదేవునికి తెలుసు. దావీదు, చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న రహస్యాలోచనతో మందిరాన్ని కడతానంటున్నాడా లేక నిజంగా దేవుని మహిమ కోసమే కడతానంటున్నాడా... అన్నది దేవుడు తెలుసుకోలేడా? అందుకే, హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధిగలది అంటోంది బైబిల్ (యిర్మీ 17:9). బైబిల్లో దైవిక విషయాల్లో ‘హృదయం’ అనే ప్రస్తావన వచ్చినపుడు, అది శరీరానికంతటికీ రక్తప్రసరణ చేసే ‘గుండె’గా కాక, మానవ జీవన స్థితిగతులన్నింటికీ మూలమైన, కీలకమైన నిర్ణయాలను చేసే ఒక ‘ఆలోచనావ్యవస్థ’గా దాన్ని అర్థం చేసుకోవాలి. దావీదు అది సరిగ్గా అర్థం చేసుకున్నాడు గనకే దేవుని ఆలోచనకు సమ్మతి తెలిపాడు, ‘నా హృదయానికి ఏక దృష్టిననుగ్రహించు’ అంటూ ప్రార్థించాడు (కీర్తన 86:11), తన నడవడిక, ఆలోచనల్లో ఏవీ దేవునికి అగోచరం కాదంటూ దేవుని స్తుతించాడు (కీర్తన 139). జీవితంలో మనం ఆయా నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశించి, జీవితాన్ని శాసిస్తాయి. అయితే దేవుని సహాయంతో కాక మానవ హృదయంతో ఆలోచించి తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీర్ఘకాలంలో తీరని అశాంతిని రేపి జీవితాన్ని దుర్భరం చేసిన ఉదంతాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల స్వభావసిద్ధంగా ఒక ‘స్వతంత్ర ఆలోచనా వ్యవస్థ’గా పని చేయాలనుకునే మన హృదయానికి ‘దేవుని వాక్యం’ అనే కళ్లెం వేయడం శుభప్రదమైన పరిణామం. విచ్చలవిడితనం, అహంకారం, స్వార్థం, దుర్మార్గం వంటి అనేక పాపాలకు ప్రాప్తిస్థానంగా దుర్గంధపూరితమై ఉన్న హృదయానికి స్వచ్ఛమైన దైవవాక్యంతో ఉదకస్నానం చేయించాలి. దేవుణ్ణి అలా అక్కడే స్థిరప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడది జీవజలాల ఊటలకు, లోకళ్యాణకారకమైన ఆలోచనలకు, చెరగని పవిత్రతకు స్థిర నివాసమై జీవితంలో శాంతి పరిమళించడానికి పునాది అవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చిన్న విజయమైనా దేవుని తోడ్పాటుతోనే సాధ్యం!!
అపజయమంటే ఎవరికైనా బాధే!! కొన్ని అపజయాలైతే ఎన్నటికీ మర్చిపోలేని చేదు అనుభవాలను మిగిల్చి ముందుకు సాగకుండా చేస్తాయి. కాని విశ్వాస జీవితంలో అపజయాలు కొన్నిసార్లు అవసరమవుతాయి కూడా. కొన్ని అపజయాల్లో నేర్చుకున్న అత్యంత విలువైన పాఠాలు భవిష్యత్తులో మహా విజయాలకు పునాది రాళ్ళవుతాయి. అందుకే దావీదు ‘శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను’ అంటాడు( కీర్తన 119:71). గొప్ప పట్టణమైన యెరికోలో సాధించిన ఘనవిజయం నేర్పిన పాఠాలకన్నా ఎంతో చిన్నదైన హాయి పట్టణంలో ఎదురైన ఘోరపరాజయం, ఇశ్రాయేలీయులకు, వారి నాయకుడైన యెహోషువకు అత్యంత విలువైన పాఠాలు నేర్పింది. యెరికోలో ఆకాను అనే వ్యక్తి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన ఉదంతంతోపాటు, దేవుని వాగ్దానాలు, సహాయం మీదకన్నా, ‘అది చాలా చిన్న పట్టణం, రెండుమూడు వందల మంది చాలు హాయిని జయించడానికి’ అంటూ వేగులవాళ్ళు తెచ్చిన సమాచారం మీద పూర్తిగా ఆధారపడ్డ కారణంగా యెహోషువ, అతని జనులు అక్కడ ఘోరంగా పరాజయం పాలయ్యారు. పైగా యెరికో దాడిలో, దేవుని ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యమైన దేవుని మందసం ఇశ్రాయేలీయులతోనే ఉంది. అలా యెరికో జైత్రయాత్రలో దేవుడే ప్రత్యక్షపాత్రను నిర్వర్తించాడు. అందుకే ఆ పట్టణాన్ని అంత సునాయాసంగా ఇశ్రాయేలీయులు గెలిచారు. యెరికో చాలా పెద్ద పట్టణం కదా దేవుని తోడుండాలనుకున్నారు, హాయి చాలా చిన్నదే కాబట్టి దేవుని తోడు అఖ్ఖర్లేదు, లక్షలమంది సైన్యమూ అవసరం లేదు, రెండు మూడువేలమంది మాత్రం చాలునన్న తప్పుడు వ్యూహం పన్ని, దారుణంగా ఓడిపోయారు. యెరికో విజయాన్ని ఆస్వాదించే అవకాశమే లేకుండా హాయి ఘోరపరాజయం ఇశ్రాయేలీయులను పూర్తిగా కుంగదీసింది (యెహోషువ 7). ఎన్నో గొప్ప విజయాలు సాధించిన విశ్వాసుల జీవితాల్లో చాలా చిన్నచిన్న విషయాల్లో ఎదురయ్యే అపజయాలే శాంతి, సంతృప్తి లేకుండా దిగజార్చుతాయి. ‘నేను’ ‘నా’ అన్న పదజాలం, భావజాలం దేవుని తోడ్పాటు అఖ్ఖరలేకుండా ముందుకు సాగవచ్చునన్న నకిలీ ధీమాను విశ్వాసికి కలుగజేస్తాయి. ప్రపంచాన్ని శాసించే స్థాయిని చేరుకున్న గొప్ప విశ్వాసులు, ఇంట్లో భార్య, పిల్లలే తమ మాట వినని దీనపరిస్థితుల్లో అంతర్గతంగా కుంగి కుమిలిపోయే దుస్థితి ఏర్పడేందుకు దేవుని విస్మరించడమే కారణం. యెరికోలో అసలు యుద్ధమే జరుగలేదు, కాని దేవుడు వారితో ఉన్నందున ఘనవిజయం సొంతమైంది. హాయి పట్టణస్థులు సంఖ్యలో కొద్దిమంది, పైగా చాలా బలహీనులైనా, దేవుడు తమతో లేని కారణంగా ఎంతో బలవంతులైన ఇశ్రాయేలీయులు ఓడిపోయి పారిపోవలసి వచ్చింది. విషయం చిన్నదైనా, ఎంతో పెద్దదైనా దేవుని తోడ్పాటు ఉంటేనే జీవితంలో విజయం వరిస్తుందున్న ప్రాథమిక పాఠాన్ని విశ్వాసి నేర్చుకోవాలి. నిజానికి యెరికో విజయం తర్వాత హాయిపై దాడికి వెళ్ళడానికి ముందు యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటే ఇంత అనర్ధం జరిగుండేది కాదు. యెరికో విషయంలో ఆకాను అనే వ్యక్తి చేసిన పాపాన్ని దేవుడు అప్పుడే తెలిపి ఉండేవాడు, ప్రాయశ్చిత్తం జరిగి ఉండేది, హాయిలో మొదటే విజయం వరించి ఉండేది. కుటుంబంలో పరిస్థితులు విషమించిన తర్వాత మోకరించి ప్రార్ధించేకంటే, తల్లిదండ్రులు ఆరంభం నుండీ ప్రార్ధనా జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిని విస్మరించకుండా ఉంటే కుటుంబాల్లో శాంతికి విఘాతం కలుగదన్నది విశ్వాసులు తెలుసుకోవాలి. విజయాలు సాధించేవారికే అపజయాల ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. దేవునితో ఎడతెగని బాంధవ్యమే జీవితంలో, కుటుంబంలో శాంతి పరిమళించడానికి ప్రధాన కారణం. జీవితంలో విజయాలు, అపజయాలు అంతర్భాగం. కాని అపజయం పొందిన తర్వాత దేవుని ప్రార్ధించి, నిందించే బదులు మన జీవితంలో ఉన్న ఆకానులను, అవిధేయతలను ముందు తెలుసుకొని పరితాపం చెందాలి. అది జరగకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా ఎంత ప్రార్ధించినా ఫలితముండదు సరికదా అపజయాలు కొనసాగుతూనే ఉంటాయి. బాక్సింగ్ లో తిరుగులేని జగద్విజేత మహమ్మద్ అలీ మార్చి 8,1961న తనతో తలపడుతున్న జో ఫ్రేజియర్ అనే బాక్సర్ను బాక్సింగ్ రింగ్లోనే తూలనాడుతూ అత్యంత అవమానకరంగా మాట్లాడాడు. బాక్సింగ్లో నేను చక్రవర్తిని, నన్ను ఓడించేవాడే లేడు, నువ్వెంత, నీ బలమెంత... ఒక చీమలాగా నిన్ను నలిపేస్తానంటూ హుంకరించాడు. ఆ తర్వాత కొద్దినిముషాలకే జో ఫ్రేజియర్ కొట్టిన ఒకే ఒక అనూహ్యమైన దెబ్బకు దిమ్మతిరిగి కిందపడిపోయి ప్రపంచ చాంపియన్షిప్ను చేజార్చుకున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అన్నింటికీ మూలం మన హృదయమే
ఆదిమ అపోస్తలులైన పేతురు, యోహాను ఎక్కడికెళ్లినా తమ వెంట ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆదరణను తీసుకెళ్లేవారు. వారి సాంగత్యంలో ప్రజలు ఎంతో ఆదరణ పొందేవారు, వాళ్ళు స్పర్శిస్తే చాలు ప్రజలు పరిశుద్ధాత్మపూర్ణులయ్యేవారు. వారినోట ప్రజల కోసం ఎప్పుడూ శాంతి, సాంత్వన, సహృదయపూరితమైన మాటలే వెలువడేవి. అందువల్ల తండోపతండాలుగా ప్రజలు వారిని కలుసుకోవడానికి వచ్చేవారు. ’పరిశుద్ధాత్మశక్తి’ వల్ల వారికి లభిస్తున్న ప్రజాదరణ చూసి అసూయచెంది, అది పొందితే తనకు కూడా అంతటి ప్రజాభిమానం లభిస్తుందన్న దురాలోచన ఆరోజుల్లో సీమోను అనే గారడీ వాడికి వచ్చింది. వెంటనే కొంత ద్రవ్యం వారి వద్ద పెట్టి, తనకు కూడా పరిశుద్ధాత్మ శక్తి వచ్చేలా చెయ్యమని అర్థించాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందాలనుకోవడంలో తప్పు లేదు. కానీ తద్వారా మరీ ఎక్కువగా గారడీలు చేసి మరింత ప్రజాభిమానం సంపాదించాలనుకోవడం, పైగా ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మశక్తి పొందాలనుకోవడం అతను చేసిన తప్పు. పేతురుకు, యోహానుకు సహజంగానే ఆగ్రహం కలిగింది. ‘నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు..నీవు ఘోరమైన దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. వెంటనే మారుమనస్సు పొంది దేవుని క్షమాపణ వేడుకొమ్మని వారతన్ని హెచ్చరించారు. మన ప్రవర్తన తాలూకు వేర్లు, మూలాలు మన హృదయంలో ఉంటాయని యేసుప్రభువు తన బోధల్లో ‘ఆత్మీయ రోగనిర్ధారణ’ చేశారు. ‘దుష్పవ్రర్తన’ అనే విషవృక్షం తాలూకు వేర్లు మన గుప్పెడు హృదయంలోనే అగోచరంగా ఉంటాయంటూ పరిసయ్యులు, శాస్త్రులను ఉద్దేశించి ప్రభువు చేసిన బోధ నాటి యూదుసమాజంలో పెద్ద దుమారాన్నే లేపింది. అందుకే వారాయన్ను చంపి తీరాలన్న తీర్మానానికి వచ్చారు. ప్రభువు చేసిన ఆ బోధ అప్పుడూ ఇప్పుడూ కూడా అన్ని తరాలు, వర్గాలు, వయసులవారికి వర్తిస్తుంది. బయటికి మన మొహంలో కనిపించే భావాలకు, లోపాలు హృదయంలో రహస్యంగా పెల్లుబికే లావా కు అసలు పొంతన ఉండదు. కొందరు పైకి తెగ నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోలోపల అందరి మీదా ఏడుస్తుంటారు, పక్కవాళ్ళమీద లోలోనే పళ్ళు కొరుకుతూంటారు, విద్వేషం ఇతివృత్తంగా మాటల్లో ‘విషం’ చిమ్ముతూ పైశాచికానందం పొందుతూంటారు. నరహత్య, దోపిడీ, వ్యభిచారం, దైవాజ్ఞాతిక్రమం వంటి అత్యంత హేయమైన పాపాల జాబితాలోకి ఈ ప్రవర్తన రాదేమో కానీ ఈ విద్వేషపూరిత ప్రవర్తన అన్ని పాపాలకన్నా ఎంతో ప్రమాదకరమైనది. మనలో అంతర్గతంగా ఏదైనా ‘చేదువేరు’ మొలిచి మనం దైవకృప పొందేందుకు అడ్డుపడకుండా జాగ్రత్తపడాలని పౌలు భక్తుడు విశ్వాసులను హెచ్చరించాడు హెబ్రీ 12:15). అంతర్గతంగా మనలో చేదువేరంటూ ఉంటే అది ఏదో ఒకసారి మొలకెత్తక మానదు, వటవృక్షంగా మారకా తప్పదు. ఇతరులను ద్వేషించి, వారిపై రహస్యంగా విషం చిమ్మే వాళ్ళు సాధారణంగా తమ జీవితాల్లో ఏదో సాధించాలని ఉబలాటపడి అది జరగక బొక్క బోర్లా పడ్డవాళ్లే!! అలా వారిలో వేళ్లూనిన ఆత్మన్యూనతా భావం, అభద్రతా భావం ఇలాంటి దుష్పవ్రర్తనకు పురికొల్పుతుంది. పరిశుద్ధాత్మశక్తి నిండిన విశ్వాసుల జీవితాల్లో, హృదయాల్లో ఆనందం, శాంతి, సంతృప్తి తాలూకు మంచి నీళ్ల ఊటలు నిరంతరం నిండి ఉంటాయి. వారి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఆదరణ పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా మన హృదయాలను పరిశుద్ధపర్చుతాడు. అందుకే ఆ శక్తితో నిండిన చర్చిలు, విశ్వాసులు, పరిచారకుల మాటలు, క్రియలు ఆత్మీయ పరిమళంతో, ఆనందంతో నిండి ఉంటాయి. పాపం, రోజూ అందరినీ తన గారడీతో బోల్తా కొట్టించే సీమోను అనే గారడీ వాడు తన కుయుక్తితో ఆరోజు పేతురు, యోహానును కూడా బోల్తా కొట్టించబోయి తానే బోల్తా పడ్డాడు, అడ్డంగా దొరికి పోయాడు!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సాటిలేని నోవహు విశ్వాసం
భ్రష్టత్వంతో నిండిపోయిన లోకాన్నంతా మహా జలప్రళయం ద్వారా నిర్మూలించి ఒక సరికొత్త లోకాన్ని పునర్నిర్మించాలనుకున్న దేవుడు, అందుకు నోవహును, అతని కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు. దేవుని తీర్పు నుండి తనను తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఒక ఓడను నిర్మించుకొమ్మని దేవుడే ఆదేశించాడు. విశ్వంలోని జీవులన్నింటిలో ఒక ఆడ, మగ జతను కూడా దాంట్లో చేర్చి ప్రళయం నుండి కాపాడేందుకు వీలైనంత పెద్ద ఓడ నిర్మాణం కోసం దేవుడు నోవహుకు కొలతలిచ్చాడు. లోకమంతా బలాత్కారం, భ్రష్టత్వంతో నిండిన నేపథ్యంలో దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించిన విశ్వాసులుగా నోవహు, అతని కుటుంబం అలా చరిత్ర, బైబిల్ పుటలకెక్కారు. ఒక సరికొత్త లోకంలో భాగం కానున్న జీవరాశి తాలూకు ‘విత్తనాలన్నీ’ ఓడలోకి ప్రవేశించిన తర్వాత, దేవుడు ఇంత పెద్ద లోకంలో నీవొక్కడివే నాకు నీతిమంతుడివిగా కనిపించావంటూ ప్రకటించి నోవహును, అతని కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించమని ఆదేశించి, వాళ్ళు లోనికి వెళ్లిన తర్వాత దేవుడే ఓడ తలుపును బయటి నుండి మూసివేశాడు(ఆది7:1,16). నీతిమంతుడైన నోవహును అతని కుటుంబాన్ని ఓడ లోపల భద్రపరిచిన దేవుని ప్రణాళికలో, ఆ ఓడ తలుపును దేవుడే బయటినుండి మూసివేయడం ఒక ప్రాముఖ్యమైన భాగం!! లేకపోతే జలప్రళయం ఆరంభమైన తర్వాత ఓడలోకి ప్రవేశించేందుకు తలుపు బయట జరిగే విపరీతమైన తొక్కిసలాటను, అలా ఎదురయ్యే తీవ్రవత్తిడిని తట్టుకోవడం నోవహుకు సాధ్యమై ఉండేది కాదు. అందుకే ఆ తలుపును బయటి నుండి తానే మూసేసి తాననుకున్నపుడు తెరిచే వీలును దేవుడు తన వశంలో పెట్టుకున్నాడు. జీవితం, కుటుంబం మనదే అయినా వాటిలో కొన్ని అంశాలను మాత్రం దేవుడు తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు. అదే మనకు ఆశీర్వాదం కూడా!! ఓడలో నోవహు ఒక ఏడాదిపాటు ఉన్నాడు. బయట ఏం జరుగుతోందో అతనికి తెలియదు, ఓడ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా అతనికి తెలియదు. కాని దేవుడు ఆ తలుపును తన సంరక్షణ కోసమే మూసి ఉంచాడని, దేవుడు తప్పక దాన్ని ఒకరోజు తెరిచినప్పుడు తాను తన కుటుంబం ఒక సరికొత్త ప్రపంచంలోకి కాలుపెడతామన్న గొప్ప విశ్వాసం నోవహుది. చుట్టూ గాఢాంధకారం ముసిరిన అననుకూల పరిస్థితుల్లో కూడా, ఒకరోజు దేవుడు తన తేజోమయ పరిస్థితుల్లోకి తనను ప్రవేశపెడతాడన్న అద్భుతమైన విశ్వాసం నోవహుది. రాత్రి పడుకొంటూ తెల్లారి ఉదయాన్ని చూస్తాననుకోవడం విశ్వాసమే. కాని కొన్ని వందల కాళరాత్రుల అనుభవాల నేపథ్యంలో కూడా, దేవుడివ్వబోయే ఒక గొప్ప సూర్యోదయం కోసం ఎదురుచూడటం, నోవహు జీవితంలో మనం చూసే, దేవుడు కోరుకునే అసామాన్యమైన విశ్వాసం. ఓడ లోపలున్న నోవహు తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా? అని ఎదురు చూడలేదు. ఓడ లోపలి జీవకోటినంతా కొత్త ప్రపంచం కోసం భద్రపరిచేందుకు, సిద్ధపర్చేందుకు దేవుడు తనకిచ్చిన పరిచర్యలో, తన కుటుంబంతో సహా సంపూర్ణంగా నిమగ్నమయ్యాడు. ‘దేవుడు తన పని తన సమయంలో చేసేలోగా, దేవుడు అప్పగించిన పనిని నేను నిబద్ధతతో చేస్తాను’ అన్నది నోవహు విశ్వాసం, సిద్ధాంతం!! దేవుడిచ్చిన కొలతల్లో, దేవుని అభీష్టం మేరకు ఓడను నిర్మించడం ద్వారా, లోకం తనను చూడకున్నా, తనను దేవుడు చూస్తు్తన్నాడన్న దైవభయంతో ఓడ లోపలి పరిచర్యనంతా నిబద్ధతతో చేసిన మహా దైవజనుడు నోవహు. మహా ప్రళయం లో అంతా తుడిచిపెట్టుకుపోగా నోవహు ఉన్న ఓడ ఒక్కటే మిగిలింది, తద్వారా నోవహు విశ్వాసం కూడా ఇన్ని తరాలుగా సజీవంగా మిగిలింది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మెట్లు దిగడంలోని ‘ఆనందం’...
అతి సాధారణమైన జీవన స్థితిగతుల ప్రస్తావనతో, అత్యంత మర్మయుక్తమైన పరలోక సత్యాలను ఆవిష్కరించిన మహా ప్రబోధకుడు యేసుప్రభువు. ఆయన పరలోకంలో ఉండే దేవుడు. మరి భూలోకానికి ఎందుకొచ్చాడు? అన్నది అప్పుడు, ఇప్పుడు కూడా అంతా వేసే ప్రశ్న. అందువల్ల తన ఆగమన ఉద్దేశ్యాన్ని యేసు ఒక ఉపమానంలో అద్భుతంగా వివరించాడు. ఒక కాపరికి వంద గొర్రెలుండేవట. వాటిలో ఒకటి తప్పిపోతే, ఆ కాపరి మిగిలిన తొంబై తొమ్మిది గొర్రెలనూ వదిలేసి, దాన్ని వెదికి, చివరికి కనుగొని దాన్ని భుజాన వేసుకొని ఇంటికొచ్చి అది దొరికినందుకు తన కుటుంబంతో, స్నేహితులతో కలిసి చెప్పుకుని ఆనందించాడట. (లూకా 15:4–7). తన వారే అయిన మానవాళి తనను విడిచి తప్పిపోతే, వారిని వెదికి మళ్ళీ పొందేందుకు దేవుడు ’పరమ కాపరిగా’, యేసుక్రీస్తుగా ఈ లోకానికొచ్చాడని అలా వివరించాడాయన. అందుకు ’పోగొట్టుకోవడం’ అనే ఒక జీవితానుభవాన్ని వాడుకొని ఆ సత్యాన్ని ఆయన తెలిపాడు. పొందే అనుభవాలకన్నా, పోగొట్టుకునే అనుభవాలే జీవితంలో అత్యంత విలువైన పాఠాలను నేర్పిస్తాయి. పోగొట్టుకున్నపుడున్న బాధకన్నా, వాటిని తిరిగి పొందినప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువగా సంతోషిస్తామని దేవుడే తన అనుభవంగా వివరించిన ఉపమానమిది. కేవలం నాలుగు వచనాల ఈ ఉపమానంలో నాలుగుసార్లు ‘సంతోషం’ అనే మాటను ప్రభువు వాడాడంటే, అదెంత ప్రాముఖ్యమైన అనుభవమో అర్థం చేసుకోవచ్చు. లోకంలో అంతా అంతిమంగా వెదికేది ’సంతోషం’, ’ఆనందం’ కోసమే. కోటానుకోట్ల ఆస్తిపాస్తులున్న కుబేరులు కూడా ‘ఆనందం’ కరువైన నిరుపేదలుగా బతుకుతున్న ఆధునిక జీవనశైలిలో దాన్నెలా పొందాలో ప్రభువు చెప్పాడు. కొత్తదేదైనా సంపాదించుకున్న ‘ఆనందం’ కేవలం తాత్కాలికమైనది. కానీ పోగొట్టుకున్నది సంపాదించుకున్న ఆనందం చాలా గొప్పది, శాశ్వతమైనది. మనం పోగొట్టుకున్నది గాడి తప్పిన మన జీవితమే కావచ్చు, దారితప్పిన, మనల్ని వదిలేసిన మన సంతానం, తోబుట్టువులు కూడా కావొచ్చు. పోగొట్టుకున్న మన పరువు, ప్రతిష్టలూ కావొచ్చు. అయితే మనల్ని వదిలేసిన వాళ్ళే మళ్ళీ మనల్ని వెదుక్కొంటూ వెనక్కి రావాలన్నది లోకం చేసే వాదన. అలా కాదు, మనమే వారిని వెదికి తిరిగి సమకూర్చుకోవాలన్నది దేవుడు తానే ఆచరించి మనకు చేస్తున్న ప్రతిపాదన. మనమున్న చోటినుండి రెండు మెట్లు దిగి వెళ్ళడానికి అడ్డొచ్చేది మన ‘అహమే’!! అందువల్ల చాలాసార్లు మన ఆనందానికి అడ్డుకట్ట వేసేది కూడా అదే. కాని పరలోకం నుండి భూలోకానికి దిగిరావడానికి దేవునికే లేని ‘అహం’ రెండు మెట్లు దిగడానికి మనిషికెందుకటా? వినోదాన్ని ఆనందంగా భ్రమిస్తున్న, ఆనందాన్ని సంపాదించుకోవడానికి అనేక అడ్డుదార్లు తొక్కుతున్న నేటి లోకానికిది దేవుడు చూపించిన నిజమైన మార్గం. అందరికీ ఆనందాన్నిచ్చే దేవునికే పరమ ఆనందాన్నిచ్చిన అనుభవం, పోగొట్టుకున్న పాపిని తిరిగి సంపాదించుకున్నప్పుడన్న సత్యాన్ని బైబిల్లో చదివినప్పుడల్లా నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి (లూకా 15:10). ఆనాడు యేసుప్రభువు ప్రవచనాలు విన్నవాళ్లలో తామెంతో నీతిమంతులమన్నట్టు పోజులు కొట్టే పరిసయ్యులు, శాస్త్రులున్నారు, పరమ పాపులుగా లోకం ముద్రవేసిన సుంకరులు, వేశ్యలు కూడా ఉన్నారు. పరిసయ్యుల చెవులకెక్కి వారిని మార్చలేని ఆయన బోధ ఎంతోమంది నాటి ‘పాపులను’ మార్చింది. అందుకే దేవుని వద్దకు తిరిగి రావాలనుకొని తొంబై తొమ్మిది మంది ‘నీతిమంతుల వల్ల కలిగే సంతోషం కన్నా, దేవుని కృపకు పాత్రుడైన ఒక పాపి వల్ల కలిగే సంతోషం పరలోకంలో ఎంతో గొప్పదని ప్రభువన్నాడు (15:7). అందుకే దేవుడు దీనులు, అభాగ్యులు, నిరుపేదలు, లోకం విసర్జించిన పాపుల పక్షపాతి అన్నది నిత్యసత్యం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడు ‘నో’ చెబితే ఆశీర్వాదం!!
మన వాహనాలకు బ్రేకులెందుకుంటాయి? వేగాన్ని అదుపు చేయడానికి అనుకొంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, బ్రేకులుంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళడానికి వెనకాడని మీరు, అదే బ్రేకుల్లేని వాహనమైతే, దాన్ని ఆపే అవకాశం లేదు గనుక, గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడానికి కూడా సంకోచిస్తారు. అంటే బ్రేక ుల ఉద్దేశ్యం వాహనాన్ని ఆపడమే కాదు, మరింత వేగంగా వెళ్ళడానికి వీలు కల్పించడం కూడా అన్నది సుస్పష్టం. మన జీవిత ప్రయాణాల్లో, మన ప్రణాళికల్లో దేవుడు బ్రేకులు వేసేది కూడా మనల్ని అడ్డుకోవడానికి మాత్రమే కాదు, మనం ఆయన సంకల్పం మేరకు మరింత వేగం పుంజుకోవడానికి కూడా!! కొత్తనిబంధన కాలపు చర్చిని పరిశుద్ధాత్మదేవుడు పెంతెకొస్తు పండుగ నాడు యెరూషలేములోని మేడగదిలో స్థాపించాడు (అపొ.కా 2వ అధ్యాయం). కాని ఆనాటి అభిషేకంతో అక్కడినుండి బయలుదేరి అపొస్తలులుగా బయలువెళ్లిన వాళ్లంతా ప్రపంచంలోని నలుమూలల్లో ఆ చర్చి శాఖల్ని స్థాపించారు. వారిలో ప్రాముఖ్యమైనవాడు అపొస్తలుడైన పౌలు. అనేక పట్టణాలు, ప్రాంతాల్లో ఆయన ఆ చర్చి శాఖల్ని ఎన్నో స్థాపించాడు. అలా స్థాపిస్తూ యూరోప్ నుండి ఆసియా ఖండానికి వెళ్ళాలన్న పౌలు ప్రయత్నానికి దేవుడు ఒకరోజు బ్రేకులు వేశాడు (అపొ.కా.16:6). అపుడు దేవుని సంకల్పం కొరకు ఎదురుచూసిన పౌలుతో దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. మాసిదోనియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తమ వద్దకు వచ్చి తమకు సువార్త చెప్పమని వేడుకొంటున్న ఒక దర్శనాన్ని పౌలు ఒక రాత్రి చూశాడు. మాసిదోనియా ప్రాంతం అలెగ్జాండర్ చక్రవర్తి జన్మభూమి, అతని సొంత స్థలం. ఆయన తర్వాత రాజ్యమేలిన చక్రవర్తులు ఆయన మీదున్న అసూయతో ఆ ప్రాంతాన్నంతా కొల్లగొట్టి బూడిద చేశారు. ఫలితంగా పేదరికం, అరాచకం, మితిమీరిన విచ్చలవిడితనం రాజ్యమేలే ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్ళడానికి సాహసించేవారు కాదు. అందుకే పౌలు అక్కడికి వెళ్లాలనుకోలేదు. కాని దేవుడు అతని ప్రయాణానికి బ్రేకులు వేసి మరీ ఆ ప్రాంతానికి పంపించాడు. ఫలితంగా మాసిదోనియా ప్రదేశంలో ఆయన అక్కడి రాజధానియైన ఫిలిప్పిలో, బెరయ అనే పట్టణంలో, థెస్సలొనీక పట్టణంలో కూడా చర్చి శాఖల్ని అద్భుతమైన రీతిలో ఆయన స్థాపించాడు. ఆ విధంగా ఆయన ముందనుకొన్న మార్గంలో కాకుండా ఇపుడు మరో మార్గంలో కొనసాగి కొరింథీ వంటి ఇంకా అనేక ప్రాముఖ్యమైన ఇతర పట్టణాల్లో కూడా విజయవంతంగా చర్చి శాఖల్ని స్థాపించాడు. మరోవిధంగా చెప్పాలంటే పౌలు చేసిన సువార్త యాత్రంతటినీ మాసిదోనియాకు ముందు ఆ తర్వాత అని విభజించగలిగినంత ప్రభావాన్ని ఆయన మాసిదోనియా సౌవార్తిక పర్యటన చూపించింది. దేవుడు మన ఆలోచనలకు సమ్మతి తెలుపకుండా నిరాకరించినపుడు, వాటిని అడ్డుకున్నపుడు, అంతకన్నా మెరుగైనదేదో ఆయన ఇవ్వబోతున్నాడని, లేదా మనం తలపెట్టిన దానిలో మనకు కనిపించని, అర్ధం కాని హానికరమైన అంశమేదో ఉందని అర్ధం. దేవుడు మనకు’నో’ చెప్పినపుడు దేవుడసలు మనల్ని ప్రేమిస్తున్నాడా? అన్న అనుమానం రాకమానదు. అయితే ఆయన ప్రేమించేవాడు గనుకను మనల్ని అడ్డుకొంటున్నాడన్న విశ్వాస స్థాయిలోకి మనం ఎదగాలి. అప్పుడు ఆయన ’నో’ చెబితే మనం ఆయనకు ’థాంక్ యు’ చెబుతాం. మనం ప్రవేశించాలనుకున్న తలుపును దేవుడు మూసిస్తే దాన్నే తెరవమంటూ పదే పదే బాదడం విశ్వాసం కానే కాదు. ఆ ద్వారం నీ స్థాయికి సరిపోదని అంతకన్నా శ్రేష్టమైన ద్వారాన్ని, మార్గాన్ని ఆయన నీ కోసం సిద్ధపరచాడని తెలుసుకోవాలి. ఒక్కసారి మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే, మనకు దేవుడు బ్రేకులు వేసిన సందర్భాల కారణంగా ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనకు చేకూరాయో మనకే అర్ధమవుతుంది. మనముందున్న జీవన ప్రయాణమంతా తెలుసుకోగలిగిన విజ్ఞత, శక్తి ఏ మానవునికి లేదు. అదంతా ఎరిగిన సర్వజ్ఞానిగా దేవుడు మన ప్రయాణాన్ని అడ్డుకొని మరో తెలియని మలుపు తిప్పితే, అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఉందా? అలా దేవుని చేతిలో చెయ్యి వేసి ప్రయాణించగలగడంలోని నిర్భయత్వం, నిశ్చింతా ఎంతో విలువైనది కాదా? – రెవ. డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవుని మనసు తెలుసుకోవాలి, గెలవాలి...
మహాబలుడు గొల్యాతును చూసి ఇశ్రాయేలీయుల సైనికులంతా జడిసిపోతుంటే, బలం లేనివాడు, ఇంకా బాలుడే అయిన దావీదు ముందుకొచ్చి తాను అతనితో తలపడి అతన్ని ఎదిరిస్తానన్నాడు. కాకలు తీరిన వీరుల వంటి నా సైనికులు చెయ్యలేని పని, గొర్రెల కాపరివి, బాలునివైన నీవెలా చేస్తావని సౌలు రాజు ప్రశ్నిస్తే, దావీదు తన అనుభవాల్లో ఒకటి ఆయనకు వివరించాడు. ఒకసారి దావీదు తన గొర్రెలమందను కాస్తుండగా ఒక సింహం, ఎలుగుబంటి కలిసి మంద మీద దాడి చేసి ఒక గొర్రెపిల్లను నోటకరుచుకొని పారిపోతుంటే తాను వాటిని ఎదిరించి, తరిమి ఆ గొర్రెను విడిపించానని, అవి తనమీద దాడి చేస్తే వాటిని కొట్టిచంపానని దావీదు చెప్పాడు. సింహం, ఎలుగుబంటి నుండి రక్షించిన యెహోవాయే గొల్యాతు నుండి కూడా తనను రక్షిస్తాడని దావీదు తన విశ్వాసాన్ని వెల్లడించాడు. జరిగిందేమిటంటే, గొల్యాతును దావీదు ఎదిరించగా, దేవుడు దావీదును కాపాడటమే కాదు, గొల్యాతును దావీదు చేతికి అప్పగించాడు. అతన్ని సంహరించి ఇశ్రాయేలు సైన్యానికి దావీదు ఎంతో అనూహ్యమైన ఘనవిజయాన్ని సాధించిపెట్టాడు (1 సమూ 17:33–51). దావీదును తదుపరి రాజుగా దేవుడభిషేకించిన కొన్నాళ్లకే జరిగిన ఘటన ఇది. సంకల్ప బలానికి, శరీర దారుఢ్యానికి అసలు సంబంధమే లేదు. ఆనాడు యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికులంతా మహా బలవంతులే అయినా గొల్యాతును చూసి జడుసుకున్నారు. యుద్ధవిద్యలు తెలియనివాడు, గొర్రెల కాపరి, దుర్బలుడైన దావీదు మాత్రం అంతటి బలవంతుణ్ణి గెలిచి విజయం సాధించి పెట్టాడు. తనను గెలిపించేది తన దేవుడైన యెహోవాయేనన్న అతని విశ్వాస ప్రకటనలోనే అతని ఘనవిజయం ఖాయమైంది (17:37). నిజానికి ఒక గొర్రెపిల్లే కదా, పోతేపోయింది, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయంటూ దావీదు తన ప్రాణాలు తాను దక్కించుకున్నా అడిగేవారు లేరు, తప్పు బట్టే వాళ్లు కూడా లేరు. నిజానికి ఆ రెండు క్రూర మృగాలు దావీదును గాయపర్చినా, అతన్ని చంపినా, ఒక్క గొర్రెపిల్లకోసం అంత సాహసం అవసరమా? అంటూ అంతా అతన్నే నిందించేవారు. ఎందుకంటే గొర్రెపిల్లను వదిలేసి ప్రాణాలు దక్కించుకోవడమే తెలివి, గొర్రెపిల్ల కోసం ప్రాణాలకు తెగించడం తెలివి తక్కువ పని అన్నది లోకజ్ఞానం. కాని దావీదు తన ఉద్దేశ్యాలను నెరవేర్చే తన ఇష్టానుసారుడైన వాడంటాడు దేవుడు(అపో.కా.13:22). దావీదుకు దేవుని మనసు బాగా తెలుసు, అందుకే బలంలేని ఒక గొర్రెపిల్లకోసం తన ప్రాణాలకు తెగించాడు. యేసుక్రీస్తులో లోకానికి పరిచయం చేయబడిన దేవుడు కూడా పూర్తిగా దుర్బలులు, నిరాశ్రయులు, పీడితుల పక్షపాతి. ఆయన అనుచరులైన విశ్వాసులు కూడా అదే సిద్ధాంతాన్ని, స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎంతసేపూ బలవంతులు, ధనికుల కొమ్ము కాస్తూ బలహీనులను చిన్న చూపుచూసే విశ్వాసులు, పరిచారకులు ఎన్నటికీ యేసు అనుచరులు కాలేరు. లోకంలో వినిపించే ఆకలి కేకలు, పీడితుల ఆక్రందనలు, అంతటా కనిపించే బలవంతుల దోపిడీ, దౌర్జన్యం క్రైస్తవ విశ్వాసిని సవాలు చేసి అతన్ని ఆ దిశగా కార్యోన్ముఖుణ్ణి చేయకపోతే, ఆ విశ్వాసం లోపభూయిష్టమైనదనే అర్థం. అమెరికాలో నల్ల జాతీయుల బానిసత్వం నైతికంగా చాలా దారుణమనే అబ్రహాం లింకన్ తొలుత భావించేవాడు. కాని క్రైస్తవ విశ్వాసంలో ఎదిగే కొద్దీ అక్కడి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్న భావన అతనిలో బలపడి చివరికి దేశంలోని తెల్లజాతీయులంతా ఒకవైపు వ్యతిరేకిస్తున్నా దేశాధ్యక్షుడిగా తెగించి నల్లజాతీయుల బానిసత్వాన్ని శాశ్వతంగా నిషేధిస్తూ, వారిని సమాన పౌరులను చేస్తూ జనవరి 1863లో ఆయన చేసిన చట్టం అమెరికా దేశ చరిత్రనే తిరగ రాసింది. చట్టాలను, దేశాలు, రాజ్యాల చరిత్రను కూడా తిరగరాసే శక్తిని దేవుడు విశ్వాసుల్లో నింపగలడు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సమన్యాయం క్రైస్తవం ఈ ప్రపంచానికిచ్చిన బహుమానాలు. అలాంటి క్రైస్తవం లోనే దోపిడీ, దౌర్జన్యం, అసమానత్వం ప్రబలితే అదెంత అవమానకరం? – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని దృష్టిలో విశ్వాసమంటే క్రియలే!!
కారుచీకట్లో, కాకులు దూరని కారడవిలో దారితప్పిన వ్యక్తి గమ్యం చేరడు, ప్రాణాలతో కూడ ఉండడు. అందువల్ల అడవంతా ఎరిగిన ఒక మార్గదర్శకుడు అతని చెయ్యిపట్టుకొని సరైనదారిలోకి నడిపించడం అవశ్యం. దారి తప్పిన మానవాళిని దేవుడే యేసుక్రీస్తుగా అలా చెయ్యిపట్టుకొని దగ్గరుండి సరైన మార్గం లోనికి నడిపించడమే ‘రక్షణ’ అని బైబిల్ చెబుతోంది. గ్రీసు దేశానికి చెందిన తీతు అనే అన్యుడు అపొస్తలుడైన పౌలు పరిచర్య ద్వారా రక్షింపబడి అతని అనుచరుడిగా మారాడు. తానే బాగా శిక్షణనిచ్చిన తన అనుచరులను పౌలు తాను స్థాపించిన చర్చిల్లో కాపరులుగా నియమించాడు. అలా క్రేతు అనే ద్వీపంలోని చర్చికి తీతును నాయకుడిగా నియమించి, ఆ చర్చిని నడిపించడానికి అవసరమైన సలహాలు, నియమావళితో కూడిన ఒక పత్రికను అతనికి రాశాడు. అదే తీతుకు రాసిన పత్రికగా కొత్తనిబంధన గ్రంథంలో చేర్చబడింది. క్రేతు లోని ఆనాటి చర్చికే కాదు, ఈనాటి ప్రతి చర్చికి, విశ్వాసికీ కూడా మార్గనిర్దేశనం చేసే పత్రిక అది. దేవుడు సమస్త దుర్నీతినుండి మనల్ని విమోచించి, సత్క్రియాసక్తి గల తన సొత్తయిన ప్రజలుగా మనల్ని చేసుకోవడానికి, మనల్ని పవిత్రపర్చడానికి తనను తాను సిలువలో అర్పించుకున్నాడంటుంది ఆ పత్రిక (తీతు 2:14). కొత్త నిబంధన సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలో ప్రస్తావించిన తీతు పత్రికను విశ్వాసులు ఎంత తరచుగా చదివితే అంత ప్రయోజనకరం. తల్లిదండ్రుల పోలికలు, స్వభావాలు పిల్లల్లో కనిపించడం అనివార్యం. యేసుక్రీస్తు ప్రేమలో మలచబడి ఆ పరలోకపు తండ్రికి ఆత్మీయ సంతానంగా పరివర్తన చెందిన విశ్వాసుల్లో కూడా దేవుని ముద్ర, ఆనవాళ్లు కనిపించి తీరాలి. దేవుడు పరిశుద్ధుడని, ప్రేమామయుడని బైబిల్ నిర్వచిస్తోంది (పేతురు 1:15,16).అయితే ఆయన ప్రేమ పూర్తిగా క్రియాత్మకమైనది. అందుకే ఎక్కడో పాతాళంలో పడిపోయిన మనిషిని వెదకడానికి లోకానికి యేసుక్రీస్తుగా మానవరూపంలో అతడున్న చోటికి దిగి వచ్చి మరీ అతన్ని రక్షించి ఆకాశమంత ప్రేమను చూపించాడు దేవుడు. దారితప్పిన మానవాళిని తిరిగి సంపాదించుకోవడం కోసం దేవుణ్ణి ఇలా కార్యోన్ముఖుణ్ణి చేసిన రెండు లక్షణాలు ఆయన పరిశుద్ధత, ప్రేమ. అందుకే విశ్వాసులు పవిత్రతను, సత్క్రియాసక్తిని పెంపొందించే దైవిక ప్రేమను కలిగి ఉండాలంటుంది తీతు పత్రిక. కానీ ఈ రోజుల్లో టార్చిలైటు వేసినా కనిపించని లక్షణాలు ఈ రెండే! పవిత్రతకు బదులు లౌక్యం, ప్రేమకు బదులు స్వార్ధం రాజ్యమేలుతున్న రోజులివి. దేవునికి ‘పాపం’ అత్యంత హేయమైన విషయమని బైబిల్ చెబుతున్నా అది అన్ని రూపాల్లోనూ తిష్టవేసుకొని కూర్చున్న పరిస్థితి చివరికి చర్చిల్లో, క్రైస్తవమంతటా కూడా కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఇక స్వార్థం సంగతి చెప్పనవసరం లేదు. అంతెందుకు, మొన్న కేరళలో వరదలొచ్చి అంతా కొట్టుకుపోయిన మహావిపత్తులో చర్చిలు, విశ్వాసులు ఏ మాత్రం స్పందించారు? అక్కడ కేరళలో హాహాకారాలు చెలరేగుతుంటే, ఇక్కడ చర్చిలన్నీ ఎప్పటిలాగే ఆరాధనలు, ప్రార్థనల్లో బిజీ!! అదేమంటే, ప్రార్థన చేస్తున్నామన్న జవాబొకటి. అవతల ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తూ ఉంటే మనకున్నదేదో అతనికి పెట్టి ఆకలి తీర్చకపోగా, ప్రార్థన చేస్తున్నానంటే దాన్ని ప్రేమ అంటారా, స్వార్థమంటారా? దానికి తోడు ‘వాట్సప్’ లో వరదల ఫోటోలు, విశేషాలు మాత్రం జోరుగా ఫార్వర్డ్ చేసేసి గొప్ప సేవచేశామన్నట్టు పోజులు. ఎంత తిన్నావు? ఎంత సంపాదించావు? అని కాక ఎంత పెట్టావు? అనడిగే దేవుడాయన. పౌలు ప్రియ శిష్యుడైన తీతుకు ఆ మనసుంది గనుకనే యెరూషలేములో కరువు తాండవిస్తున్నపుడు అక్కడి వారి సహాయార్ధం నిధుల సమీకరణకు కొరింతి చర్చికి వెళ్లి వారి కానుకలు సమీకరించి తెచ్చి యెరూషలేములో బాధితులకు పంచాడు (2 కొరింథీ 8:16). మనం సత్క్రియల ద్వారా కాక దేవుని కృప వల్లనే రక్షింపబడ్డాము కాని రక్షింపబడిన తర్వాతి మన క్రియలు ఆయన ప్రేమను ఎంతగా ప్రకటించాయన్నదే దేవుని ప్రసన్నుని చేస్తాయి, ఆయన రాజ్యాన్ని నిర్మిస్తాయి. చర్చికి పరలోకంలో అలంకార వస్త్రాలుగా దేవుడిచ్చే ‘పరిశుద్ధుల నీతి క్రియలు’ అవే మరి!! (ప్రకటన 19:8). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడే మౌనం వహిస్తే..?
‘నిశ్శబ్దం’ కొంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాతే మనల్ని భయకంపితులను చేస్తుంది. ఒకవేళ దేవుడే నిశ్శబ్దం వహిస్తే?? అది మరీ భయం కలిగించే పరిణామం. ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో ఇశ్రాయేలు దేశంలో అదే జరిగింది. అహాబు రాజు, అతని భార్య యెజెబెలు ప్రతిష్టించిన ‘బయలు’ అనే కొత్త దేవుని మోహంలో పడి ఇశ్రాయేలీయులంతా జీవము కల్గిన దేవుణ్ణి విస్మరించిన ఆ ‘చీకటికాలం’లో తీవ్రమైన క్షామం, దేవుని మౌనం వారికి దుర్భరమయ్యాయి. దేవుడు నిశ్శబ్దం వహించాడంటే, ఆయనకిష్టం లేని ఏదో అంశం లేదా పరిణామం విశ్వాసుల జీవితాల్లో లేదా కుటుంబంలో ఉందని అర్ధం. ఇశ్రాయేలీయులను కంటికి రెప్పలా కాపాడుతూ కనాను అనే వాగ్దాన దేశానికి తన బాహువుల మీద మోసుకొచ్చినట్టుగా వారిని తీసుకొని వస్తే నిజదేవుని ఆరాధనలతో ప్రతిధ్వనించవలసిన వారి ఇశ్రాయేలు దేశంలో, అహాబు భార్యయైన యెజెబెలు తన దేశమైన సీదోను నుండి తెచ్చి దేశమంతటా గుడులు కట్టి నిలబెట్టిన ‘బయలు’ దేవుని ప్రతిమల ఎదుట మోకరించడమే వారి క్షమార్హం కాని పాపమయ్యింది. ఈ లోకంలోని వాతావరణమంతా బయలు దేవుని ఆధీనంలోనే ఉంటుందన్నది సీదోనీయుల విశ్వాసం. అంతకాలం వర్షాలు క్రమం తప్పకుండా విరివిగా కురవడం కూడా ఆ ‘బయలు’ చలవేనన్న విశ్వాసం ఇశ్రాయేలీయులలో బలపడుతూండటంతో దేవుడు మూడున్నరేళ్ల పాటు వర్షం పడకుండా నిలిపివేశాడు. దాంతో బయలు దేవునికి ప్రజల పూజలు ముమ్మరమయ్యాయి. ఐనా వర్షాలు పడలేదు సరికదా దేశమంతటా కరువు తాండవించింది. ఆ దశలో మూడున్నరేళ్ల తర్వాత కర్మెలు పర్వతం మీద ఏలీయాకు బయలు దేవుని ప్రవక్తలకు మధ్య జరిగిన ’ప్రార్ధనల పోటీ’లో, వర్షం కురిపించడానికి వందలాది మంది బయలు ప్రవక్తలు చేసిన ప్రార్ధనలు విఫలం కాగా, ఇశ్రాయేలీయుల దేవుని పక్షంగా ఏలియా ఒక్కడే ఒంటరిగా నిలిచి చేసిన ప్రార్థన ఫలించి విస్తారమైన వర్షం పడింది. ఫలితంగా కర్మెలు పర్వతం మీద ఇశ్రాయేలీయుల్లో ఆ రోజున గొప్ప పశ్చాత్తాప విప్లవం, పునరుజ్జీవం పెల్లుబుకగా, వాతావరణం ఎవరి అధీనంలో ఉందో, ఎవరు నిజమైన దేవుడో అక్కడికక్కడే తేలిపోయింది(1 రాజులు 17,18 ఆధ్యాయాలు). ఆయన బిడ్డలమైన మనపట్ల దేవునిదెప్పుడూ తండ్రి మనస్సే!! చిన్నపుడు ఏదైనా తప్పు చేయాలంటే నాన్న కఠినంగా శిక్షిస్తాడన్న భయం కన్నా, రోజంతా గల గలా మాట్లాడుతూ అన్నీ తానే అయి ఎంతో ప్రేమతో చూసుకునే అమ్మకు తెలిస్తే ఆమె బాధపడి మౌనం వహిస్తుందేమోనన్న భావనే తప్పు జరగకుండా అడ్డుకునేది. తల్లిదండ్రులు శిక్షించినా, మౌనం దాల్చినా పిల్లల్ని బాధపెట్టేందుకు కాదు, వారిని సరిదిద్దేందుకే కదా? ఆనాడే కాదు, ఇప్పుడు కూడా విశ్వాసుల వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో దేవుడు మౌనం వహించాడన్న భావన కలిగితే వెంటనే స్వపరీక్ష చేసుకోవాలి. మనలో ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ దారి తప్పాము అన్నది తెలిసికొని పశ్చాత్తాప పడితే, దేవుడు మౌనం వీడుతాడు, ఆశీర్వాదాల వరద మళ్ళీ ఆరంభమవుతుంది.ప్రపంచంలో ఒక పాపి పశ్చాత్తాపపడితే ఆ భావనకున్న శక్తి ఎంతటిదంటే, అది దేవుని మనసును పూర్తిగా కరిగించేస్తుంది. ఆశీర్వాదాలు మనదాకా రాకుండా అడ్డుకొంటున్న పరిస్థితులను దేవుడే తొలగిస్తాడు. అయితే మనం పశ్చాత్తాపపడితేనే అది జరుగుతుంది. – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు?
‘యేసు పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు’ అని బైబిల్లో ఉంటుంది (మార్కు 1:35). ప్రార్థన చేయడానికి యేసుప్రభువు తరచు అరణ్యప్రదేశానికి ఏకాంతంగా వెళ్లేవాడన్నది బైబిల్లోని నాలుగు సువార్తల్లోనూ తరచుగా చదివే ఒక ప్రధానాంశం. ప్రశాంత వాతావరణంలో, ఏకాంతంలో ఆయన ప్రార్థించేవాడన్నది సుస్పష్టం. దేవునితో ఏకాంతంగా ఆరాధనలో గడిపే అనుభవం ప్రతి విశ్వాసికీ అత్యంత విలువైనది. దేవునితో విశ్వాసి అత్యంత సన్నిహితంగా మనసు విప్పి మాట్లాడే అనుభవం, దేవుడు కూడా విశ్వాసితో ఎంతో ప్రియంగా, స్పష్టంగా, మృదువుగా మాట్లాడే అనుభవం అది. ఇలాంటి అనుభవంలోనే విశ్వాసి ఎంతో బలవంతుడవుతాడు, తనను బలపరిచే దేవుని శక్తితో దేనినైనా సాధించగలనన్న నమ్మకంలోకి ఎదుగుతాడు (ఫిలిప్పి 4:13). యేసు విశ్రాంతి దినం నాడు సమాజ మందిరానికి వెళ్లి అక్కడ ఇతరులతో కలిసి దేవుని ఆరాధించేవాడు. ఇప్పుడు కూడా ప్రతి ఆదివారం నాడు చర్చికెళ్తున్నాం. కానీ ప్రభువుతో ఏకాంతంగా ఆరాధనలో, ప్రార్థనలో గడిపే అత్యంత విలువైన వ్యక్తిగత అనుభవానికి మాత్రం మనలో చాలామంది ఎంతో దూరంగానే ఉన్నారు. దేవునితో లోతైన వ్యక్తిగత ప్రార్థనానుభవం లేని క్రైస్తవులు, శ్వాస తీసుకోకుండా బతకాలనుకునే జీవులే!! దేవుడు వారంలోని ఏడు రోజుల్లో ఒక రోజును విశ్వాసి తనను ఆరాధించడానికి నియమించాడు. ఆ దినాన్ని సంపూర్ణంగా తనతోనే గడపాలని దేవుడు నిర్దేశించారు. దాన్నే సబ్బాతు లేదా విశ్రాంతి దినం అని బైబిల్లో పేర్కొన్నారు. అపొస్తలులు కొత్త నిబంధన కాలంలో ప్రభువుదినమైన ఆరాధనా దినంగా ఆదివారాన్ని నిర్ణయించి పాటించారు. దాన్నే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు పాటిస్తున్నారు. కాదు ఆదినుండీ ఉన్నట్టుగానే విశ్రాంతి దినాన్ని శనివారంగానే కొంతమంది పరిగణిస్తున్నారు. గల్ఫ్ లాంటి దేశాల్లోని విశ్వాసులైతే అక్కడి పరిస్థితులను బట్టి శుక్రవారాన్ని ఆరాధన దినంగా పాటిస్తున్నారు. వారంలో అది ఏ దినం అన్నది ప్రాముఖ్యం కానే కాదు. ఆ రోజును ఎంత నాణ్యమైన ఆరాధనలో గడుపుతున్నామన్నది, ఆ ఆరాధన విశ్వాసిలో ఎంతటి మార్పు తెస్తోందన్నదే దేవుని దృష్టిలో అత్యంత విలువైన విషయం. దేవునితో ఏకాంత ఆరాధనానుభవంలో విశ్వాసిలో క్రమంగా సాత్వికత్వం, దేవుని పట్ల విధేయత, నమ్మకత్వం, పొరుగు విశ్వాసుల పట్ల ప్రేమ, సహోదరభావం పెంపొందుతాయి. ఆ ఆరాధనానుభవంలోనే దేవుడు విశ్వాసిని నలుగగొట్టి తన సారూప్యంలోకి మార్చుకుంటాడు. ఆరాధనానుభవం లేనివారే అహంకారులు, అతిశయపడే వారుగా మిగిలిపోతారు. వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. దేవుని సన్నిధిలో తలవంచే అనుభవం ద్వారానే, విశ్వాసికి లోకాన్ని తలెత్తి ఎదిరించే ధైర్యం, తెగింపూ వస్తుంది. అత్యాధునిక జీవన శైలిలో, దైనందిన జీవనోపాధి కోసం గడిపే సమయం పోగా మిగిలిన సమయాన్నంతా మనం సెల్ఫోన్, టివి, వాట్స్అప్, ఫేస్బుక్ లాంటి ప్రసార మాధ్యమాలకే మనం కుదువబెట్టేస్తున్న పరిస్థితుల్లో ఇక దేవునితో గడిపే సమయం మనకెక్కడిది? దేవునితోనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా బాగా తగ్గిపోయింది. అందుకే విశ్వాసులు, చర్చిలు, కుటుంబాలు తద్వారా సమాజం కూడా నానాటికీ బలహీనపడుతున్నాయి. ఇదంతా మనందరి ‘ప్రైవసీ’ మీద జరుగుతున్న సాంకేతిక దాడి!! సకాలంలో కళ్ళు తెరవకపోతే దేవునికే కాదు, మన జీవిత భాగస్వాములకు, పిల్లలకు, తోబుట్టువులకు కూడా పరాయివాళ్లమవుతాం. సెల్ఫోన్తోనే ఆరంభమై, దాంతోనే మీ రోజు ముగుస్తూ ఉంటే, మీరు ఆ ప్రమాదానికి దగ్గర్లోనే ఉన్నారు. అలాకాకుండా మీ దినం దేవునితో ఆరంభమై, దేవునితోనే ముగుస్తూ ఉంటే అపారమైన ఆశీర్వాదాలు మీవెంటే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
నింపాల్సింది హుండీలను కాదు... పేదల కడుపులను
అపొస్తలుడైన పౌలు తన శరీరంలో ఉన్న ఒక ముల్లును తీసెయ్యమంటూ మూడుసార్లు దేవుని ప్రార్థించాడు. అయితే దేవుడు ఆ ముల్లు తీసెయ్యలేదు కాని నా కృపను నీకిస్తాను, అదే నీకు చాలు’ అని జవాబిచ్చాడు (2 కోరి12:8,9). ప్రార్థిస్తే్త దేవుడు దేన్నైనా అనుగ్రహిస్తాడన్న అభిప్రాయం చాలామందిది. జీవితాల్లో ముళ్లు లేని వాళ్ళంటూ ఎవరున్నారు? కుదుటబడని ఆరోగ్యం, తీరని ఆర్థిక సమస్య, సఖ్యత కొరవడిన దాంపత్యం, స్థిరపడని పిల్లలు, పైకి అన్నీ ఉన్నట్టే ఉన్నా ఏదో కరువైనట్టున్న వెలితి, కుటుంబంలో అశాంతి... ఇలా ఆ ముల్లు ఏదైనా కావచ్చు. కాని ప్రార్థించినా దాన్ని తీసివేయడంలో దేవుడు జాప్యం చేస్తున్నపుడు, ఒక విశ్వాసిగా మన ప్రతిస్పందన ఏమిటి? నా ముల్లునే గనుక దేవుడు తీసేస్తే, ఇంకెంతో గొప్పగా దేవుని పరిచర్య చేసి ఉండేవాడినని అనుకొంటున్నారా? సువార్త వ్యాప్తిలో, ఆదిమ చర్చిల స్థాపనలో, కొత్తనిబంధన బైబిల్ భాగాలు రాయడంలో అగ్రగణ్యుడు పౌలు. పౌలు మూడు మిషనరీ యాత్రలతోపాటు మరెన్నో ప్రయాణాలు చేశాడు. ‘ఈ ముల్లొకటి దేవుడు తీసేస్తే ఇంకా మరెన్నో ప్రయాణాలు చేసి సువార్తను మరిన్ని వేలమందికి ప్రకటిస్తాను, ఇంకెన్నో కొత్త చర్చిలు స్థాపిస్తాను’ అని పౌలు ఒకవేళ భావించినా అందులో తప్పేముంది?. కానీ అతని ముల్లును తీసేయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఆ ముల్లే అతనిని నలుగగొట్టి ఒక విశిష్టమైన విశ్వాసిగా తీర్చిదిద్దుతుందని దేవునికి తెలుసు, దేవుడిచ్చిన కృప ద్వారా పౌలుకు కూడా కాలక్రమంలో అది అర్థమయింది. అదే దేవుని సార్వభౌమత్వం అంటే. మనం ఏమి చెయ్యగలం? ఏమి చేస్తున్నాం? అన్నదానికన్నా మనం ఏమిటి, మన సాక్ష్యం ఏమిటి, మనం ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నామన్నదే దేవుడు మనలో నిశితంగా చూసే విషయం. విలియం కేరీ (1761–1834) మహా భక్తుడు. ఇంగ్లాండ్ దేశాన్ని వదిలేసి ఇండియాకొచ్చి ఇక్కడి భాషలు నేర్చుకొని బెంగాలీ, ఒరియా, అస్సామీస్, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లోకి పూర్తి బైబిల్ను, తెలుగులోకి కొత్త నిబంధన బైబిల్ను తర్జుమా చేయడమే కాదు, ఆయన రామాయణాన్ని కూడా హిందీలోకి అనువదించాడు.ఇండియాలో క్రైస్తవం వ్యాప్తి చేసిన మిషనేరీలకు పితామహుడు విలియం కేరీ. మనం ఏం చేశామని కాదు, మనం ఏమిటి? అన్నది దేవుడు ప్రధానంగా పరిశీలిస్తాడు.దేవుని ఈ కొలబద్ద సంక్లిష్టమైనదే కాదు, చాలా సరళమైనది కూడా. దేవుని మెప్పించడం కష్టమే కానీ దేవుని హృదయ స్పందనను తెలుసుకోగలిగితే మాత్రం అది చాలా సులువు. పొరుగునే ఆకలితో అలమటిస్తున్న పేదకుటుంబానికి పచ్చడి మెతుకులతో కనీసం చద్దన్నమైనా పెట్టకుండా, వంద మంది పాస్టర్లను పిలిచి వాళ్లకు విందు చేస్తే దేవుడు ప్రసన్నుడై మన ‘పరలోకపు అకౌంట్’లో బోలెడు పుణ్యం జమ చేస్తాడనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే!! కడుపారా తిని విలాసాలు అనుభవిస్తున్న వారికి దేవుని పేరిట పరమాన్నం పెట్టి, బెంజి కార్లు కొనివ్వడం కన్నా, ఒక పేదవాడి కడుపు నింపడానికి కాసింత గంజి పొయ్యడమే దేవుని దృష్టి్టలో అత్యంత విలువైన విషయం, అదే విశ్వాసికి ఆశీర్వాదాలు తెచ్చే మహా పుణ్యకార్యం. ఉన్నవాడికి ఇంకా ఇంకా తోడిపెట్టడం, దాన్ని దేవుడు హర్షిస్తాడనుకోవడం పూర్తిగా అవివేకం. చర్చిల్లో, ఆలయాల్లోని హుండీలను బంగారం, వెండి, వజ్రాలతో నింపేందుకు అత్యుత్సాహ పడే విశ్వాసులు చాలా మంది ఉంటారు, దేవునితో కాక తోటిప్రజలతో శభాష్ అనిపించుకోవడానికే వాళ్ళ తాపత్రయమంతా!! యేసుప్రభువు చెప్పిన ఉపమానంలో, గాయాలతో రోడ్డు పక్కన నిస్సహాయంగా పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి కూడా, పరామర్శించకుండా తమ దేవాలయ బాధ్యతలే ముఖ్యమనుకొని ముఖం తిప్పుకొని వెళ్లిపోయిన ఒక యాజకుడు, ఒక లేవీయుడు దేవుని ప్రసన్నతకు పాత్రులు కాలేదు (లూకా 1010:25–37). పొరుగువాడిని ప్రేమించకుండా, దేవుని కోసం మాత్రం గొప్ప కార్యాలు చేశామంటూ విర్రవీగిన చాలామంది ‘గొప్పవాళ్ళ’ పేర్లు దేవుని జీవగ్రంథంలో కనిపించకపోతే మనం పరలోకంలో అవాక్కైపోతామేమో జాగ్రత్త!! పౌలు ముల్లును దేవుడు తీసెయ్యలేదు కానీ అతనికి తన కృపను సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడు ఏ విషయాల్లో ప్రసన్నుడవుతాడన్నది, దేవుని విశిష్ట హృదయ స్పందన ఏమిటన్నది దేవుని కృప తమ జీవితాల్లో సమృద్ధిగా నిండి ఉన్నవారికి ఎప్పటికప్పుడు అర్థమవుతుంది. మన జీవితాలు దైవజ్ఞానంతో కన్నా, దేవుని కృపతో నిండినవైతే అదే నిజమైన ఆశీర్వాదం. అంతేకాదు, దేవుని ప్రసన్నుని చేసే కార్యాలు చేపట్టేందుకు దేవుని కృప వారికి శక్తినిస్తుంది. అందుకే ‘హుండీలు కాదు, పేదల కడుపులు, జీవితాలు నింపండి’ అన్నదే దేవుని నినాదం, అభిమతం. దైవకృపలో, విశ్వాసంలో ఎదిగే కొద్దీ దేవుని ఈ హృదయం విశ్వాసికి స్పష్టంగా అర్థమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సాహసియైన విశ్వాసికి లోకమే దాసోహమంటుంది
బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక రాత్రి పీడకల వచ్చింది. అది తనకు జరుగబోయే ఏదో కీడును సూచించేదన్న విషయం రాజుకర్థమైంది. అయితే విచిత్రంగా రాజు తన కలను మర్చిపోయాడు. అందువల్ల తాను కన్న కలను చెప్పి, దాని అర్థాన్ని కూడా విడమర్చి చెప్పాలని రాజు తన సంస్థానంలోని శకునగాండ్రను. జ్ఞానులను, గారడీవాళ్లను, జ్యోతిష్కులను, జ్ఞానులను ఆదేశించాడు. ఎంతటివారైనా ఆ కల ఏదో తెలిస్తే దాని అంతరార్థం చెప్పగలరు కానీ, ఒక వ్యక్తి కన్న కలను చెప్పడం లోకంలో ఎవరికి సాధ్యం? వాళ్లంతా అదే జవాబిస్తే రాజు అత్యాగ్రహం చెంది వాళ్లందరినీ హతమార్చమని ఆదేశించాడు. రాజుగారి సంస్థానంలోనే జ్ఞానులుగా యూదుడైన దానియేలుతో పాటు అతని స్నేహితులైన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే అతని మరో ముగ్గురు యూదు స్నేహితులున్నారు. విషయం తెలిసి దానియేలు ధైర్యం చేసి రాజును దర్శించి తనకు కొంత గడువిస్తే స్వప్నభావాన్ని తెలియజేస్తానని విన్నవించుకొని గడువు తీసుకున్నాడు. నెబుకద్నెజరు యూదుడు కాడు, బబులోను యూదుదేశమూ కాదు. దానియేలు తదితర యూదులంతా బబులోనులో, రాజు చెరలో బానిసలుగా ఉన్నారు. మరి బబులోను దేశ మూలనివాసులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో దానియేలు వంటి బానిసలు ఏం చెయ్యగలరు? దానియేలు, అతని ముగ్గురు స్నేహితులూ బలహీనులు, బానిసలే కావచ్చు కానీ వారు నమ్మే దేవుడు వారి లోకంలోని రాజులందరికన్నా ఎంతో బలవంతుడు. పైగా నేనంటాను, వాళ్ళు నలుగురి ప్రార్ధనలు, ఆరాధనలతో బబులోను మహా పట్టణంలో ఒక ’చర్చి’ వెలిసింది. అది నలుగురే ఉన్న ఒక చిన్న చర్చీయే కాని ఇపుడు రాజు గారి తీరని సమస్యను తీర్చేందుకు, ఆయన ఆదేశించిన నరమేధాన్ని అడ్డుకొనేందుకు సాహసంతో పూనుకొంది. దానియేలు, అతని స్నేహితులూ కలిసి దేవుని సన్నిధిలో ఎంతో ఆసక్తితో ప్రార్ధించగా జ్ఞానానికి, మర్మాలకు, సత్యానికి, వెలుగుకు ప్రాప్తిస్థానమైన దేవుడు రాజు కలను, దాని భావాన్ని కూడా దానియేలుకు తెలియజేశాడు. వెంటనే దానియేలు రాజు సముఖానికి వెళ్లి అతని కలను, దాని భావాన్ని వివరించగా రాజు అత్యానందంతో వారికి కానుకలిచ్చి సన్మానించాడు. ఆ దేశంలో ఒక ప్రమాదం జరుగకుండా అలా అక్కడి చర్చి పూనుకొని అడ్డుకొంది. అదే నిజమైన చర్చి అంటే. చర్చి, అందులోని విశ్వాసులు కూడా సాహసానికి, చైతన్యానికి, క్రియాశీలతకూ మారుపేరుగా ఉండాలి. దేవుని పనిలోనే కాదు, సామాజిక బాధ్యతల నెరవేర్పులో కూడా చర్చి ముందు వరుసలో నిలబడాలి. అదంతా దేవుడు చూసుకుంటాడులే అనుకునేవారు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని చేతకానివాళ్ళు, వేషధారులు. దానియేలు అతని స్నేహితులూ అలాంటి వారు కాదు. వారు స్వచ్ఛమైన దైవభక్తి కలిగినవారు, ప్రతి విషయంలో దేవునికి మహిమనిచ్చేవారు, దేవునికి మాత్రమే భయపడేవారు, పొరుగువారి సమస్యలకు ప్రతిస్పందించేవారు. ఇవన్నీ విశ్వాసిలో దేవుడు చూడదల్చుకొంటున్న లక్షణాలు. విశ్వాసి పిరికివాడు కాదు, పిరికివాడు విశ్వాసి ఎన్నటికీ కాడు. తమ భక్తితో, సాహసంతో బబులోనువంటి మహా సామ్రాజ్యాన్ని దానియేలు శాసించాడు. తన సొంత జ్ఞానమనే పాదాల మీద కాదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నిలబడేవాడు నిజంగానే బలమైన విశ్వాసి. అతనికి లోకమే దాసోహమంటుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆనందించలేదు.. అంగలార్చాడు..!
ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు గిల్బోవ పర్వతం వద్ద జరిగిన యుద్ధంలో యోనాతానుతో సహా దావీదుకు బద్ధశత్రువైన సౌలు ముగ్గురు కుమారులూ చనిపోయారు. ఓడిపోతున్న సౌలును ఫిలిష్తీయులు తీవ్రంగా గాయపర్చారు. శత్రువుల చేజిక్కడం ఇష్టం లేక తనను కత్తితో చంపమని సౌలు తన అస్త్రాలు మోసే సైనికుని కోరితే అతడు భయపడి ఒప్పుకోకపోగా, తనకత్తిమీద తానే పడి సౌలు ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక అమాలేకీయుడు సౌలు కిరీటాన్ని, కంకణాలను తొలగించి అక్కడినుండి పరుగెత్తుకొంటూ వచ్చి వాటిని దావీదుకిచ్చి సౌలు మరణవార్తను తెలిపాడు. పైగా కొనప్రాణంతో ఉన్న సౌలు ఇక ఎట్లైనా చనిపోతాడనుకొని తానే చంపి వచ్చానని అతను తెలియజేశాడు. తనను అంతకాలంగా భీకరంగా వెంటాడి, తీవ్రశ్రమల పాలు చేసిన తన బద్ధశత్రువు సౌలు చనిపోయాడని తెలిస్తే దావీదు గొప్పగా సంతోషిస్తాడని, అతని శిబిరంలో ఆరోజు విందులు వినోదాలు జరుగుతాయని, తనను సన్మానిస్తారని ఆ అమాలేకీయుడు ఉహించాడు. కాని సౌలు, యోనాతాను, ఇంకా ఇతర ఇశ్రాయేలు వీరుల మరణవార్త, దేవుని ప్రజలపై ఫిలిష్తీయుల విజయవార్త విని దావీదు దుఃఖంతో కుప్పకూలిపోయి శిబిరంలో ఉపవాస దినాన్ని ప్రకటించాడు. పైగా అభిషిక్తుడైన సౌలు రాజును ఎలా చంపావంటూ నిలదీసి దావీదు ఆ అమాలేకీయునికి మరణశిక్ష విధించాడు.. పైగా వారి సంస్మరణార్ధం దావీదు ఒక విలాపగీతాన్ని రచించి యూదా వారికి నేర్పించాడు (2 సమూయేలు 1:1–27). అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశ్యాలన్నీ నెరవేరుస్తాడని దేవుడన్నాడు (1 సమూ 13:14,అపో.కా.13:22). సౌలు భ్రష్టుడే, తనను చంపాలని ఎంతో తీవ్రంగా ప్రయత్నించిన బద్ధశత్రువే, కాని ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడే అతన్ని నియమించిన విషయాన్ని దావీదు మర్చిపోలేదు. ఎన్నో ఆశలతో తాను తన ప్రజలకు రాజుగా నియమించిన సౌలు అలా భ్రష్టుడైపోవడం, అంత అవమానకరంగా ఓటమిపాలై చనిపోవడం మొదట దేవుని హృదయాన్ని ఎంతో గాయపరిచి దుఃఖం కలిగించింది. మనం ఓడిపోతే, పడిపోతే, అభాసుపాలైతే ’చేజేతులా చేసుకున్నాడు, అనుభవించనివ్వు’ అని సంతోషించేవాడు కాదు దేవుడు. మనం పైకి లేవడానికి, నిలదొక్కుకోవడానికి, జీవితాల్ని సరిచేసుకోవడానికి లెక్కలేనన్ని అవకాశాలిచ్చే మన పరలోకపు తండ్రి ఆయన. లోకంలో పడిపోనివాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు ఎవరూ లేరు. దావీదే కాదు, ఆ మాటకొస్తే బైబిల్ లోని మరే ఇతర భక్తుడు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అంతా ఎప్పుడో ఒకసారి పడిపోయిన వారే. అయితే కృపతో దేవుడందించిన సహాయ హస్తాన్ని అందుకొని పైకిలేచినవారే!! ‘నేను ధూళిని, బూడిదను’ అని విశ్వాసులకు జనకుడైన అబ్రాహామే ప్రకటించుకుంటే (ఆది18:27), మమ్మల్ని మించిన వారు లేరంటూ ఎవరైనా మీసాలు మెలేస్తే అదెంత హాస్యాస్పదం? సౌలు తన శత్రువు, భ్రష్టుడన్న విషయాన్ని దావీదు మర్చిపోయి ఒకరాజు స్థాయికి తగినవిధంగా అతని సంస్మరణ ఆచార క్రియలు చేపట్టడం అతని గొప్పదనం. దేవుని మనసును పసిగట్టి ఆ మేరకు వ్యవహరించడం దావీదు వద్దే నేర్చుకోవాలి. గొప్ప భక్తులే అయినా వాళ్ళూ మనుషులే, మలినులే అన్న విషయాన్ని ఎంతో నిజాయితీతో బయలుపర్చిన బైబిల్ అందుకే పరిశుద్ధగ్రంథమని పిలువబడుతోంది. మాలిన్యం అసలు లేని వాళ్లు కాదు, యేసుప్రభువు కృపతో మాలిన్యం నుండి వేర్పర్చబడినవారే దేవుని రాజ్యాన్ని అత్యద్భుతంగా నిర్మించి పునీతులయ్యారు. ‘పరిశుద్ధత’ దేవుడు మనకు తన ప్రేమకొద్దీ తొడిగే వస్త్రమే తప్ప అది మనం కష్టపడి సాధించే ’కిరీటం’ కాదు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పరివర్తనకు చిరునామా యోహాను!!
శిష్యుల్లో యాకోబు, యోహాను అనే సోదరులకు ‘ఉరిమెడివారు’ (బొయనెర్గెస్) అని యేసుప్రభువే పేరు పెట్టాడు (మార్కు 3:17). ఉరుము ఒక్క క్షణం కోసం అందరి దృష్టీ ఆకర్షిస్తుంది, జడిపిస్తుంది కూడా. అంతమాత్రాన ’ఉరుము’ సాధించేదేమీ ఉండదు. ఈ ఇద్దరి జీవితం, ముఖ్యంగా యోహాను జీవితం అలాంటిదే. యేసు శిష్యుడు కాని ఒక వ్యక్తి దయ్యాల్ని వెళ్లగొడుతుంటే యోహాను అతన్ని అడ్డుకొని ప్రభువుతో చీవాట్లు తిన్నాడు(మార్కు 9 :38). యేసును, ఆయన శిష్యులను గ్రామంలోకి స్వాగతించని సమరయులమీదికి ఆకాశంనుంచి అగ్ని కురిపించి నాశనం చేయమని సూచించి ప్రభువుతో మరోసారి తిట్లు తిన్నాడు (లూకా 9:51). పరలోకంలో ప్రభువుకు కుడి ఎడమ స్థానాల్లో కూర్చునేందుకు తమ తల్లితో సిఫారసు చేయించుకొని భంగపడిన దురాశపరుడు యోహాను. ఉరుము లాగే దుందుడుకుతనం, ఆవేశం, హడావుడి, క్షణికోత్సాహం, శబ్దగాంభీర్యం యోహాను లక్షణాలు. అయితే ప్రభువు తన శిష్యుడిగా చేర్చుకున్న తొలిరోజుల అతని వ్యక్తిత్వమిది. అతని లోపాలన్నీ తెలిసే ప్రభువు అతన్ని శిష్యుడిగా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఏ మాత్రం విలువలేని ఈ ‘ఉరుము’ ప్రభువు సహవాసంతో ఎదిగి కాలక్రమంలో వెలకట్టలేని ’వజ్రం’గా మారి దేవుని రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించింది. యోహాను ఎంతగా ఎదిగాడంటే, సిలువలో వేలాడుతున్న యేసును శిష్యులంతా వదిలేసి ప్రాణభయంతో పారిపోతే, అతనొక్కడే సిలువలోని ప్రభువు పక్కనే ధైర్యంగా నిలబడ్డాడు. ప్రభువుశక్తికి అంతకాలంగా సాక్షిగా ఉన్న యోహాను, మానవాళికోసం సిలువలో నిస్సహాయుడిగా వేలాడిన ప్రభువులో దైవత్వాన్ని, క్షమాపణను మరెక్కువగా చూశాడు. అదే అతని జీవితాన్ని సమూలంగా మార్చింది. అందుకే కొత్త నిబంధనలో ఒక సువార్తను, ప్రకటన గ్రంథాన్ని, మూడు పత్రికల్ని యోహాను రాశాడు. ‘దయ్యాలు వెళ్లగొట్టే ఫలానావాడు మనవాడు కాడు’ అన్న అతని ‘స్వార్థపరత్వం’ యేసుసాన్నిహిత్యంలో ’అంతా మనవాళ్ళే’ అన్న సార్వత్రికతగా మారింది. సమరయులను దహించేద్దామన్న అతని ఆగ్రహం, ఆవేశం, పరుశుద్ధాత్ముని ప్రేరణతో మానవాళికి ప్రభువు రాసిన ’ప్రేమపత్రిక’ గా పేరొందిన ’యోహాను సువార్త’ రాయడానికి అతన్ని పురికొల్పింది. ఎవరెక్కడున్నా నేను మాత్రం యేసు కుడి ఎడమ స్థానాల్లో ఉండాలన్న అతని ‘సంకుచితత్వం’, యేసు ప్రభువు రెండవ రాకడకు ముందు కడవరి రోజుల్లో ఈ లోకం ఎంత అధ్వాన్నంగా తయారు కానున్నదో ప్రజలందరి శ్రేయస్సు కోసం వివరించే ప్రకటన గ్రంథాన్ని రాసే ‘ఆత్మీయత’ గా మారింది. శరీరం లావు తగ్గించే వ్యాపారంలో ఉన్నవాళ్లు ’ముందు’, ’తర్వాత’ అన్న శీర్షికలతో వేసే ఫొటోల్లాగా, ప్రభువు లోకి వచ్చినపుడు మనం ఎలా వున్నాం, ప్రభువు సహవాసంలో గడిపిన ఇన్నేళ్ళలో ఎంతగా పరిణతి చెందామన్న ఒక స్వపరిశీలన, అంచనా ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఒకప్పుడు విలువలేని ‘ఉరుము’ లాంటి యోహాను, ఆదిమ సౌవార్తిక ఉద్యమానికి స్తంభంలాంటివాడని పౌలు స్వయంగా శ్లాఘించాడంటే అతను ఆత్మీయంగా ఎంతగా ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు (గలతి 2:9). యేసుప్రభువును ఎరుగని ‘అంధకారం’ కంటే యేసుప్రభువులో ఉండికూడా ఎదగని, మార్పులేని ’క్రైస్తవం’ విలువలేనిదే కాదు, ప్రమాదకరమైనది కూడా. అత్యంత ప్రమాదకరమైన నేరస్థులకు రోమా ప్రభుత్వం విధించే భయంకరమైన శిక్షల్లో ఒకటి పరవాస శిక్ష. భయంకరమైన సర్పాలు, క్రూరమృగాలుండే ఎడారుల్లాంటి దీవుల్లో ఆ నేరస్థులను వదిలేస్తే క్షణక్షణం ప్రాణ భయంతో, ఆకలితో అలమటిస్తూ వాళ్ళు చనిపోతారు. అందరికీ యేసుప్రేమను బోధిస్తూ, ప్రభుత్వ భయం మాత్రమే తెలియవలసిన ప్రజలను ప్రేమామయులను చేస్తున్న అత్యంత ’భయంకరమైన నేరానికి’ గాను, రోమా చక్రవర్తి యోహానుకు పత్మసు అనే ఎడారిలాంటి భయంకరమైన ద్వీపంలో పరవాస శిక్షను విధించారు. కాని ఆ ద్వీపంలో యేసుప్రభువు నిత్యప్రత్యక్షతను క్షణక్షణం అనుభవిస్తూ ఆతను ప్రకటన గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు. అనుక్షణం మృత్యువు వెంటాడే పత్మసు ద్వీపంలో, యేసుసాన్నిహిత్యంతో యోహాను క్షణక్షణం పరలోకజీవితాన్ని జీవించాడు. యోహానులో ఇంతటి పరివర్తనకు కారకుడైన యేసుప్రభువు మనలో ఆ మార్పు ఎందుకు తేవడం లేదు? అనే ప్రశ్నను ప్రతి విశ్వాసి వేసుకోవాలి. అయితే జవాబు మనలోనే ఉంది. మారడానికి మనం సిద్ధంగా లేమన్నదే మనందరికీ తెలిసినా మనం ఒప్పుకోని జవాబు. సొంతప్రచారం చేసుకొంటూ, వ్యాపారం తరహాలో పరిచర్యను మార్కెటింగ్ చేసుకునే ‘ఉరిమేవాళ్ళు’ కాదు, ప్రేమతో, పరిశుద్ధతతో, నిస్వార్థతతో జీవిస్తూ లోకాన్ని ప్రభువు ప్రేమ అనే వెలుగుతో నింపుతూ ‘చీకటిని తరిమేవాళ్ళు’ దేవునికి కావాలి. - రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
అలాంటి దానివల్ల ప్రయోజనం ఏమిటి?
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అంటే నన్ను వెంబడించేందుకు అనర్హుడు అన్నాడు ఒకసారి యేసుప్రభువు (మత్తయి 10:38).అవమానానికి, క్రూరత్వానికి, ఓటమికి, శాపానికి, పాప శిక్షకు మరో రూపమైన సిలువను, దైవత్వానికి మానవరూపిగా అందరి ఆరాధనలకు పాత్రుడైన యేసుప్రభువు మోసి అదంతా భరించడమే ఎంతో అనూహ్యమైన విషయమైతే, నా అనుచరులు కూడా సిలువను మోయాలని ప్రభువు పేర్కొనడం, యేసు అనుచరులుగా విశ్వాసుల పాత్ర ఎంత క్లిష్టమైనదో తెలుపుతోంది. యేసుప్రభువు కప గురించి మనమంతా తరచుగా మాట్లాడుతాం, అతిశయపడతాం కూడా!! కానీ యేసుకోసం జీవించడమంటే, సిలువను మోయడమన్న యేసు నిర్వచనాన్నిమాత్రం కావాలనే విస్మరిస్తాం. ఇదే నేటి మన ప్రధాన సమస్య. చాలామంది సత్ క్రైస్తవులకు, క్రైస్తవ పండితులకే ఇది మింగుడుపడని విషయం. ప్రతిపనినీ సులభంగా, శ్రమ లేకుండా కంప్యూటర్ల సహాయంతో చేసుకునే నేటి సరళ జీవనశైలి లో, మనం సిలువను మోయడమేమిటి? అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సిలువను మోయడమంటే ఏమిటి? అన్నది తెలుసుకునే ముందు మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. యేసుప్రభువు ఏవేవో ఆకర్షణలు, ఆశలు, లాభాలు ముఖ్యంగా గొప్ప జీవితాన్ని ఎరగా వేసి మనల్ని తన అనుచరుల్ని చేసుకోలేదు. ఆయనది లోక విధానాలకు పూర్తిగా విరుద్ధమైన శైలి. లోకం అనేక ప్రలోభాలు చూపి ప్రజల్ని ఆకర్షించుకొంటుంది. నేటి క్రైస్తవంలో కూడా అదే జరుగుతోంది. క్రైస్తవులు తమకు ‘అనుకూలమైన’ పరిచారకులు, చర్చిలకోసం తెగ వెదుక్కొంటున్నారు. యేసును నమ్ముకుంటే మీరడిగిందల్లా ఇస్తాడని బోధించేవారు ఈరోజు సెలెబ్రిటీలు. అలా బోధించే చర్చీలు నిండిపోయి కాసుల వర్షం కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలకు కావలిసింది ఇదే. కానీ నన్ను వెంబడిస్తే మీ జీవితం వడ్డించిన విస్తరి అవుతుందని యేసు ఎన్నడూ బోధించలేదు. మిమ్మల్ని లోకపరంగా గొప్పవారిని చేస్తానని ఆయన అనలేదు. కానీ లోకాన్ని సుసంపన్నం చేసేంతగా ఆశీర్వాదకారకులవుతారని మాత్రం చెప్పాడు(అపో.కా 3:25). కానీ స్వచ్ఛందంగా సిలువను మోస్తూ తనను వెంబడించడమే నిజక్రైస్తవమని యేసుప్రభువు స్పష్టం చేశాడు. యేసు మోయడంతో చరిత్రలో సిలువ అర్ధమే మారిపోయింది. లోకానికి పాపక్షమాపణను ప్రసాదించడమే కాక, తనను భయంకరంగా చిత్రహింసలు పెడుతున్న వారినందరినీ క్షమించమని ప్రార్థించడం ద్వారా యేసుప్రభువు లోకానికి క్షమించడం అంటే ఏమిటో నేర్పాడు. ఆ క్షమాపణే ప్రధాన ఇతివృత్తంగా క్రైస్తవ విశ్వాసి జీవితం సాగాలన్నదే యేసుప్రభువు అభిమతం. ‘సిలువను మోస్తూ నన్ను వెంబడించండి’ అంటే మీ జీవితంలో క్షమాపణా పరిమళం నిండనివ్వండి అని అర్థం. ఎవరిని క్షమించాలి? అనడిగితే ‘అందరినీ’ అంటాడు ప్రభువు. పైగా ప్రభువు సిలువను మోసింది మానవాళికి పాపక్షమాపణను ప్రసాదించడం కోసం, లోక కళ్యాణం కోసం. విశ్వాసి బతకవలసింది కూడా పొరుగువారి క్షేమం కోసం, పదిమందికీ తద్వారా సమాజానికి మేలు చేయడానికే అన్నది ‘సిలువను మోయండి’ అని చెప్పడంలో యేసు ఉద్దేశ్యం. ‘సిలువ వేయడం’ మాత్రమే తెలిసిన లోకానికి యేసు ఇలా ‘సిలువ మోయడం’ నేర్పాడు. ఆ ఉద్యమాన్ని తన అనుచరులు ముందుకు తీసుకెళ్లాలని ఆశించాడు. ఈనాడు ‘నేను, నాకుటుంబం’ అనే పరిధిని దాటి ఆలోచించలేని స్వార్థంలో మనమంతా కూరుకుపోయాము. మరి ’నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాన్ని ప్రేమించు’ అన్నమూలస్తంభం లాంటి క్రీస్తు ప్రబోధాన్ని ఈరోజుల్లో పట్టించుకునేదెవరు? సిలువను మోయడమంటే క్షమిస్తూ బతకడం, పదిమందికోసం బతకడం అని యేసు సిలువను మోసి నిరూపించాడు, అదే ఆయన మనకు బోధించాడు. క్షమాపణాస్వభావం లేని, పొరుగువాని క్షేమాన్ని గురించి ఆలోచించలేని, లోకాన్ని ప్రభావితం చెయ్యలేని ’బలహీన క్రైస్తవాన్ని’ యేసు ప్రబోధించలేదు. ఒకవేళ మనమంతా అనుసరిస్తున్నది అదే క్రైస్తవమైతే జాగ్రత్తపడవలసిన సమయమిది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సమ్సోను చేసిన మూడు తప్పిదాలు
సమ్సోను బలవంతుడే కాదు, తెలివైనవాడు కూడా. కాని తల్లిదండ్రుల కన్నా తానే తెలివైనవాడిననుకొని వారు వారిస్తున్నా వినకుండా అన్యురాలైన ఫిలిష్తీయుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళికాస్తా పెటాకులై సమస్యలు రాగా, 300 నక్కల్ని పట్టుకొని, వాటి తోకలకు దివిటీలు కట్టి రాత్రిపూట వాటిని ఫిలిష్తీయుల పొలాల్లోకి పంపి, వారి చేలన్నీ తగులబెట్టి తన పగా, ఆగ్రహం చల్లార్చుకున్నాడు. జిత్తులమారి జంతువైన ఒక్క నక్కను పట్టుకోవడమే గగనమంటారు వేటగాళ్లు. కాని 300 నక్కలని పట్టుకున్నాడంటే సమ్సోను ఎంత తెలివైనవాడై ఉండాలి? కాని అతని తెలివితేటలు, నేర్పరితనం అతని పెళ్లిని కాపాడలేకపోయాయి. తన తల్లిదండ్రులకన్నా తానే తెలివైనవాడిననుకొని వైవాహిక జీవితాన్ని పాడుచేసుకోవడం అతను చేసిన మొదటి తప్పు. తాను దేవునికన్నా తెలివైనవాడిననుకొని అతను రెండవ తప్పు చేశాడు. మొదటి పెళ్లి పాడైనా, స్వజనుల్లోనే ఒకమ్మాయిని అతను పెళ్లి చేసుకొని స్థిరపడి ఉంటే సమస్య అంతటితో సమసిపోయి ఉండేది. తనతో పెళ్లి కాని స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వ్యభిచారమని దేవుడు స్పష్టంగా చెబితే, ఆ ఆజ్ఞను అతను పెడచెవిని పెట్టి స్త్రీ వ్యామోహంలో పడి కొట్టుకుపోయి అనేకమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అలా అతని పతనానికి కారణమైన దెలీలా ఉచ్చులో చిక్కాడు. విశ్వాసి వివాహం చేసుకొని తన భార్యతో చక్కగా కాపురం చేసుకొంటూ దేవునికి మహిమకరంగా జీవించాలి. లేదా స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలనుకుంటే మంచి బ్రహ్మచారిగా జీవించవచ్చు. కాని సమ్సోను పెళ్లి చేసుకోకుండా, బ్రహ్మచారిగానూ బతక్కుండా, పరస్త్రీలతో ’సహజీవనం’ ఆరంభించాడు. ఇది పచ్చి వ్యభిచారమే!! అంటున్నాడు దేవుడు. నేటి నవనాగరికతలో ఇది ప్రధానభాగమైంది. ఈనాడు యువతీయువకులు పెళ్లి కాకుండానే సహజీవనం చెయ్యడం సాధారణమైంది. క్రైస్తవం దీనిని ఒప్పుకోదని తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ఇలాంటి వారికి చర్చిల్లో కూడా ఆమోదముద్ర వెయ్యకూడదు. ఇలా వివాహేతర సహజీవనం చేసేవాళ్ళు క్రైస్తవానికి, మన సమాజానికి కూడా చీడపురుగుల్లాంటివాళ్ళని గమనించాలి. పోతే తాను సాతాను కన్నా తెలివైవాడిననుకొని సమ్సోను మూడవ పొరపాటు చేశాడు. సాతాను చేస్తున్న కుట్రలో భాగంగానే తాను దెలీలాకు దగ్గరయ్యానని అతను గ్రహించలేదు సరికదా, దెలీలా ఎంత, సాతాను ఎంత? అన్న అతినమ్మకంతో కూడిన దూకుడు ధోరణిలో వెయ్యిమంది దెలీలాలు కూడా తననేమీ చేయలేరని అతను భావించాడు. మన శత్రువైన సాతాను మనకన్నా బలవంతుడు, తెలివైనవాడేమీ కాదు నిజమే, కాని అతడు చాలా యుక్తిపరుడని మర్చిపోవద్దు (ఆది 3:1). ఒక పరస్త్రీ వ్యామోహంలో పడి తన రహస్యాలన్నీ బట్టబయలు చేసుకొని సైతానుకు లోకువయ్యాడు, శత్రువులకు బందీగా చిక్కి తన జీవితాన్ని మధ్యలోనే విషాదాంతం చేసుకున్నాడు. ఈ మూడు పొరపాట్లు చేసే వాళ్లకు సమ్సోను ఉదంతం గుణపాఠం కావాలి. మన తల్లిదండ్రుల కన్నా మనకు ఎక్కువ పట్టాలు, డిగ్రీలుండొచ్చు. కాని జీవితం వాళ్లకు నేర్పిన జ్ఞానం ముందు మనది మిడిమిడి జ్ఞానమే. దేవుని ప్రతి ఆజ్ఞా మన జీవితాలను శాంతి మార్గంలో నడిపేదేనని తెలుసుకొని, వాటిని పాటించాలి, అలా దేవుణ్ణి ఘనపర్చాలి. సాతానుకు భయపడొద్దు, కాని నిష్కపటంగా జీవిస్తూనే సాతానుకు దూరంగా జాగ్రత్తగా, వివేకంతో మెలగాలి (మత్తయి 10;16), సులువుగా చిక్కుల్లో పడే ప్రతి పరిస్థితికీ అలా దూరంగా ఉండాలి. తన బలంతో ఎంతోమందిని మట్టికరిపించిన సమ్సోను తనను తాను నిగ్రహించుకోలేని బలహీనుడయ్యాడు.. దేవునికి, ఆయన సంకల్పాలకు దూరమై, విశ్వాసి ఎలా బతకకూడదో అందుకు ఉదాహరణ అయ్యాడు.. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
కరువు తాకని దాతృత్వం ఆమెది...
షోమ్రోనులో భయంకరమైన కరువు తాండవిస్తున్న రోజులవి. దేవుని ఆదేశంతో ఏలియా ప్రవక్త సారెపతు ఊరికి వెళ్ళాడు. అక్కడ ఊరి వెలుపల ఎదురైన ఒక విధవరాలిని మంచి నీళ్లడిగాడు. కరువులో గుక్కెడు మంచినీళ్లు కూడా బంగారం కన్నా విలువైనవైనా, ఆమె మంచినీళ్లివ్వబోతుంటే, ఒక చిన్న రొట్టె కూడా చేసి ఇవ్వమన్నాడు. ఆమె ఇవ్వననలేదు కానీ, తనకు, తన కొడుక్కు సరిపడా కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రం ఉన్నాయని, వాటితో రొట్టెలు చేసుకొని అవే చివరి ఆహారంగా తిని, ఇక చనిపోవడానికి సిద్ధపడుతున్నామని తెలిపింది. ‘అమ్మా ఆ కొంచెంలోనే నాకొక చిన్న రొట్టె చేసివ్వు. మిగిలిన దానితో నీవు, నీ కొడుకు తినండి. అపుడు అది మీ చివరి ఆహారం కాదు, నీ తొట్టిలోని పిండి, బుడ్డిలోని నూనె ఎన్నటికీ తరగకుండా చేయబోయే దేవుని పోషణలో అది మీ తొలి ఆహారమవుతుందని బదులిచ్చాడు. ఆమె నమ్మి ఆయన చెప్పినట్టు చేసింది. అలా ఆమెది షోమ్రోను దేశమంతటిలో కరువులో కూడా నిశ్చింతగా చాలినంత ఆహారంతో బతికిన ఏకైక నిరుపేద కుటుంబం అయ్యింది (1 రాజులు 17:8–24). బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలున్నాసంతృప్తి, ప్రశాంతత లేని నిరుపేదలున్నారు, అయితే చేతిలో అదనంగా చిల్లిగవ్వ లేకున్నా ఎంతో నిశ్చింతగా, ప్రశాంతంగా బతికే ధనవంతులున్నారు. దేవుడు బోలెడు వనరులిస్తే దేవుని సేవ బ్రహ్మాండంగా చేయాలనుకోవడం మంచిదే. కానీ ఆ స్థాయిని దేవుడు నీకిచ్చేముందు, నీకున్న కొంచెంలోనే కొంత దేవునికి ప్రీతిపాత్రంగా ఖర్చు చేయగలవా? అన్నది దేవుడు తప్పక చూస్తాడు. ఈ చిన్న పరీక్షలోనే చాలా మంది ఫెయిల్ అవుతుంటారు, తద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకొంటూ ఉంటారు. సారెపతు విధవరాలు అన్యురాలు. అయినా, తన వద్ద ఉన్న కొంచెం పిండి, కొంచెం నూనెతో తొలి రొట్టె చేసి ప్రవక్తకిచ్చింది, దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో అలా గొప్ప మార్కులతో నెగ్గింది. దేవుడు అన్యాయస్థుడు కాడు, అందుకే ఇశ్రాయేలీయులు విఫలమైన చోట, అన్యుల విశ్వాసాన్ని ఘనపర్చి వారిద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నాడు. రూతు అన్యురాలు, రాహాబు అన్యురాలు అయినా వారు దేవునికి తమ ఘన విశ్వాసం ద్వారా ప్రియులయ్యారు, దేవుడు వారిని దీవించి ఏకంగా యేసుక్రీస్తు వంశావళిలోనే చేరే భాగ్యాన్నిచ్చాడు. తాము ఎంతో గొప్పగా పరిచర్య చేస్తేనే దేవుడు ప్రసన్నుడవుతాడనుకొంటారు చాలామంది. మన జీవితంలోని నిస్వార్ధత, దాతృత్వం, పొరుగువారిపట్ల ప్రేమ వంటి సుగుణాలు ముందుగా దేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేస్తాయి. మన సాక్ష్య జీవితం ద్వారా ప్రభువు కృప అనే సజీవ జలనిధిలోనికి మన వేర్లు లోతుగా పాతుకు పోయినపుడు, వర్షం లేని క్షామకాలం మనల్ని చింతకు గురిచేయదని, కరువులో కూడా మనం ఫలిస్తూ, పచ్చగా ఉంటామని బైబిల్ చెబుతోంది (యిర్మీ17:8). మనకున్న దీన స్థితిలోనే దేవునికి నమ్మకత్వం చూపిస్తే, అత్యున్నతమైన ఆశీర్వాదాలను దేవుడు మన ఒడిలో వేస్తాడు. దేవుడు పెట్టే చిన్న పరీక్షలో ముందు నెగ్గితే, దీవెనల బాటలో ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. వేలాదిమందిని ఆదుకొని, వారికి అన్నం పెట్టే ఆశీర్వాదాన్ని నీకు దేవుడివ్వాలనుకొంటున్నావా?.నీ తల్లిదండ్రులను, నీ తోబుట్టువులను నీవు ఎలా చూస్తున్నావన్నది దేవుడు గమనిస్తున్నాడని గుర్తుంచుకో. పదోతరగతిలోనే పదిసార్లు తప్పి బయటపడినవాడికి, పిజి పట్టా తేలికగా ఎలా దొరుకుతుంది? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మనిషి దేవుని చేతిపని...
ప్రశ్నించడం సైన్స్కు పునాది, ప్రశ్నించకుండా విశ్వసించడం మత విశ్వాసానికి పునాది. దేవుడు కంటికి ఎందుకు కనపడడంటూ సైన్స్ మతాన్ని. మిలియన్ల ఏళ్ళ క్రితమా, అదెలా? అని మతం సైన్స్ను వేళాకోళం చేయవచ్చు. ఏది ఏమైనా కొన్ని కాదనలేని సత్యాలున్నాయి. దేవుడు మనిషిని సృష్టించాడని, అదికూడా తన రూపంలోనే సృష్టించాడని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దాదాపు 44 మంది భక్తాగ్రేసరులు ఒకే విశ్వాస సూత్రం అంతర్లీనమైన మూలాంశంగా వివిధ కాలాల్లో రాసినట్టుగా బైబిల్ చెబుతోంది. ఈ రెండు వచనాల్లో దేవుడు మనల్ని సృష్టించాడని 3 సార్లు, దేవుడు తన రూపంలోసృష్టించాడని 4 సార్లు పేర్కొన్నారు. ఇక్కడ విషయమేమిటంటే మనిషి దేవుని చేతి పని, విశేషమేమిటంటే మనిషిది దైవ స్వరూపం. అవధుల్లేని సృజనాత్మకత, అనంతమైన ప్రేమకలిగిన దేవుని సంకల్పానుసారం మనిషి సృష్టించబడ్డాడన్న సత్యం, సృష్టిలో మనిషి అపురూపత్వాన్ని, విలక్షణత్వాన్ని చాటుతుంది. మనిషి దేవుని సృష్టి అని నమ్మడమంటే, అంతిమంగా దేవుని విశ్వసించడమే. దేవుడే నన్ను సృష్టించాడని నమ్మిన మరుక్షణం నుండి మనిషి జీవితం సమూలంగా పరివర్తన చెందుతుంది. ఆ వెంటనే ప్రతి చర్చి కూడా మార్పు చెందుతుంది. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడంటే తన కుమారుడు లేదా కుమార్తెగా సృష్టించాడని అర్థం. అంటే మనిషి దేవుని స్వరూపధారి. అంతే కాదు, మనిషి దేవుని లాగే హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. ఆ ఆలోచనాపటిమే, ఈనాడు ప్రపంచంలో అత్యద్భుతమైన అంశాలన్నింటినీ కనుగొని అతడు ఆవిష్కరించడానికి కారణమయింది. ప్రాచీనకాలంలో విస్తారమైన సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు తమ ప్రజలకు చక్రవర్తులెవరో తెలియడం కోసం తన రాజ్యం నిండా తమ మూర్తులను ప్రతిష్టించేవారు. దేవుని సువిశాల సామ్రాజ్యమైన ఈ విశ్వంలో ఆయన తన స్వరూపమున్న మూర్తులుగా మానవాళిని నిర్మించాడు. మనం విశ్వానికి దేవుని రాయబారులం. ఆ విశ్వాన్ని సృష్టించి పాలించే దేవుడున్నాడని చాటే ఆయన సామంత రాజులం మనం. దేవుని పక్షంగా ఈ లోకాన్ని, సర్వ సృష్టినీ పాలించే పాలకులం కూడా. ఇదీ మన విలువ, స్థాయి, దేవుడు మనకిచ్చిన అపురూపమైన ఆధిక్యత, గుర్తింపు మనకు. ఆయన మనిషిని తనతో సహవసించడానికి సృష్టించాడు. అందుకే దేవుని కనుగొనేదాకా మనిషిలో ఒకలాంటి అసంతృప్త భావన ఉంటుంది. దేవుని కనుగొని ఆయనతో సహవసించడమే అతని జీవితానికి సంపూర్ణత్వాన్నిస్తుంది. దేవుడు తన స్వరూపంలో సృష్టించిన కారణంగానే విశ్వంలో మనిషికి అంతటి విలువ, గౌరవమర్యాదలున్నాయి. అందుకే ఎన్నో కాంతి సంవత్సరాల వేగంలో ప్రయాణించి గ్రహాలన్నింటినీ పరిశోధించినా, గాలించినా మనిషి లాంటి అద్భుతమైన సృష్టి విశ్వమంతటిలో మరెక్కడా కనిపించదు. ఆయన స్వరూపధారులమన్న గ్రహింపుతోనే మన విశిష్ట వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. దేవుని స్వరూపాన్ని ధరించుకోవడంలో కొన్ని బాధ్యతలు కూడా మనవయ్యాయి. సాటి మనిషిని గౌరవించి, ప్రేమించి విశ్వానికి అతన్ని కూడా సాటిహక్కుదారును చేసే ప్రేమపూర్వక బాధ్యతను దేవుడిచ్చాడు మనకు. దేవుని స్వరూపంతో పాటు, దేవుని సృజనాత్మకత, శక్తి, ప్రేమకూడా మనలో నిక్షిప్తమైంది. అసలైన ఈ మానవ వైశిష్ట్యాన్ని ఆది మానవుడు దేవుని పై చేసిన తిరుగుబాటు చెరిపివేసింది. కాని తన అద్వితీయకుమారుడైన యేసులో మళ్ళీ అదంతా మానవాళికి ఇయ్యబడింది. యేసు జీవితం, స్వరూపం,ç Ü్వభావం, ప్రేమా, కరుణ, క్షమ అంతా మానవత్వంలో అమరిన, ఇమిడిన దైవత్వమే! అందుకే విశ్వాసులు ఆ క్రీస్తు సారూప్యతలోకి మారడమే జీవన సాఫల్యమని అపొస్తలుడైన పౌలు అన్నాడు (రోమా 8:29). – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
ఆత్మను శుద్ధి చేసే ఆరాధన...
విశ్వాసికున్న రెండు నేత్రాలు ‘ఆరాధన’, ‘పరిచర్య’. విశ్వాసికి, దేవునికి మధ్య ఉండే అనుబంధం ఆరాధనైతే. విశ్వాసికి, తోటి ప్రజలకు మధ్య ఉండే అనుబంధం పరిచర్య. విశ్వాసి పరిచర్యకు గుండెకాయలాంటిది ఆరాధన, అతన్ని గొప్ప పరిచారకుడిగా మార్చేది కూడా ఆరాధనే!! ఆరాధనా జీవితంలో మనం ఎంత బలంగా ఉంటామో, పరిచర్యలో అంత ఫలభరితంగా ఉంటాము. బేతని గ్రామ సోదరీమణుల్లో మరియ ఆరాధనను, మార్త పరిచర్యను ఎన్నుకున్నారు. అయితే నేనెన్నుకున్న మార్గమే గొప్పదని చెప్పుకోబోయి మార్త యేసుప్రభువు మందలింపునకు గురయ్యింది. ‘నీ కోసం నేను చాలా పరిచర్య సన్నాహాల్లో ఉన్నాను, మరియను కూడా నాకు తోడుగా పంపించవా?’ అన్న మార్తతో, ‘మార్తా, నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు కాని మరియ ఉత్తమమైనదాన్ని ఎన్నుకుంది’ అన్నాడు యేసుప్రభువు (లూకా 10:38–42). ఆరాధన, పరిచర్య ఈ రెండూ ప్రాముఖ్యమైనవే కాని వాటిలో ఆరాధన ఉత్తమమైనదని ప్రభువే ఇలా స్పష్టం చేశాడు. తీరికే లేనంత పరిచర్యలో తలమునకలై ఉన్నట్టు వ్యవహరించే విశ్వాసులు, పరిచారకులు తమ జీవితాల్లో నిజమైన ‘ఆరాధన’కు ఎంత సమయం కేటాయిస్తారన్నది ప్రశ్నార్థకమే. పోనీ, చర్చిల్లో గడిపే రెండు గంటల్లోనూ ‘ఆరాధన’ ఎంత సేపుంటుందన్నది కూడా మరో పెద్ద ప్రశ్న!! ఈ రోజుల్లో చర్చిలో జరిగేదంతా ‘కార్యక్రమమే’ కదా!! వాస్తవానికి Program అనే ఆంగ్ల పదం రంగస్థల వినోదానికి అంటే ‘నటన’కు సంబంధించింది. మధ్యయుగాల్లో అది చర్చి ఆరాధనల్లో ప్రధాన భాగమైంది. చర్చిలో పరిచయాలు, మెచ్చుకోవడాలు (గొప్ప కానుకలు వేసే వారిని, గొప్ప వారిని), నివేదికలు, ప్రకటనలు, కొరియోలు, డాన్సులు, పాటలు, ప్రార్థనలు పోగా సింహ భాగం ప్రసంగానిదే అయితే ఇక ఆరాధనేది? పోతే కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి రెండు పాటలు పాడి (మధ్యలో మినీ ప్రసంగం...) చాలా గొప్ప ఆరాధన చేశామనుకొంటున్నాం. ఆనాడు బేతనిలో మరియ చేసిన ఆరాధనలో కాని, సమరయ స్త్రీ యాకోబు బావి వద్ద ప్రభువు సమక్షంలో నేర్చుకొని చేసిన ఆత్మ, సత్యంతో కూడిన ఆరాధనలో కాని ఇవేవీ జరుగలేదని గమనించండి. ఆత్మతో, సత్యంతో విశ్వాసి చేసే ఆరాధనలో, పరితప్త భావనతో విశ్వాసి గుండె పగిలి ముక్కలై ప్రభు పాదాలమీద పరుచుకొంటుంది. అప్పుడు దేవుడు ఒక కొత్త గుండెను తనకు అమర్చి తనను ఆలింగనం చేసుకున్న క్షమానుభవానికి విశ్వాసి లోనవుతాడు. ఇది అప్పుడప్పుడూ కాదు, నిరంతర ఆత్మీయ ప్రక్రియ. మన శరీరంలోని ఐదారు లీటర్ల రక్తాన్ని కిడ్నీలు రోజుకు 400 సార్లు శుద్ధి చేసినట్టే, ఆత్మీయ శుద్ధి ప్రక్రియ కూడా ప్రభువు పాదాల వద్ద నిరంతరంగా సాగడమే నిజమైన ఆరాధన!! శరీరం కన్నా, ఆత్మకే ఎక్కువ శుద్ధీకరణ అవసరం. ఆత్మతో, సత్యంతో జరిగే ఆరాధనలోనే, ముఖ్యంగా ప్రభువుతో ఏకాంతంలోనే అది సాధ్యం. ఈ రహస్యం తెలియనందువల్లనే చర్చిలు, విశ్వాసులు బలహీనులుగా ఉన్నారు. పైగా నిండా అపరిశుద్ధత ఉన్నా, పైకి గొప్ప పరిచర్య చేస్తున్న పరిచారకులు ఆ కారణంగానే పుట్టుకొస్తున్నారు. నటనతో కలుషితమైన నేటి ఆరాధనల దుష్పభ్రావమిది. ఆత్మతో, సత్యంతో చేసే నిజమైన ఆరాధనలో మనం పవిత్రులమవుతాం, దేవుని వెయ్యి పర్వతాల ఆత్మీయశక్తికి వారసులమవుతాం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
తలవంచి లోకాన్ని జయించే విశ్వాసి...
తుఫాను వస్తుంది, రెండు మూడు రోజుల్లో సమసిపోతుంది. కానీ దాని విధ్వంసక శక్తిని ఎదురాడి నిలదొక్కుకున్న మహావృక్షాలు ఎన్నో ఏళ్ళపాటు నిలిచిపోతాయి. యాకోబు కుమారుల్లో ఒకడైన యోసేపు జీవితం అంతా తుఫానుమయమే. సద్వర్తనుడు, భక్తిపరుడు, తాము చేసే తప్పుడు పనుల సమాచారమంతా తండ్రికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న యోసేపంటే అతని అన్నలందరికీ ఈర‡్ష్య, ద్వేషం. పైగా తండ్రి యాకోబు అతన్ని బాగా ప్రేమిస్తున్నాడన్న కారణంగా పీకలదాకా యోసేపంటే కోపం. యోసేపునకు సొంత అన్నలే కనిపించని బద్ధ శత్రువులయ్యారు. అందులోను ఏ విశ్వాసి పట్లనైతే దేవునికి ప్రత్యేకమైన తలంపులు, సంకల్పాలున్నాయో ఆ విశ్వాసికి చుట్టూ శత్రువులుంటారు. యాకోబు కుమారులందరిలోకి యోసేపు పట్ల దేవునికి అద్భుతమైన దైవసంకల్పాలున్నాయి. ఆ కారణంగానే అతని జీవితం తుఫానులమయమైంది. అన్నలు అతన్ని ఈజిప్తు దేశవాసులకు బానిసగా అమ్మేసి, అతన్ని అడవిలో క్రూరమృగమేదో చీల్చి తినేసిందని తండ్రికి అబద్ధం చెప్పారు. తప్పుడు ఆరోపణపై అతను జైలుకెళ్లాడు. కానీ దేవుని కృపవల్ల ఇలాంటి ప్రతి తుఫానూ అతన్ని పైమెట్టుకెక్కించే ఆశీర్వాదంగా దైవ హస్తం మార్చింది. అప్పటి మధ్యప్రాచ్య దేశాలన్నింటినీభయంకరమైన కరువు ఎన్నోయేళ్లపాటు కబళించబోతోందని దైవ ప్రేరేపణతో ఫరోకు తెలియజెప్పి, ఆ కరువునెట్లా ఎదుర్కోవాలో కూడా ఒక పథకాన్ని రూపొందించి ఇవ్వగా, దాన్ని అమలుచేసేందుకు ఈజిప్టు దేశానికి ప్రధానమంత్రి గా యోసేపు నియమించబడ్డాడు. బానిసగా ఉన్నా, జైలులో ఉన్నా, ప్రధానమంత్రి అయినా, ఎక్కడున్నా యోసేపు దేవునికి ఎంతో విధేయుడై బతికాడు, అదే అతని విజయరహస్యం. ఒక బానిస చివరికి ఆ దేశానికే ప్రధానమంత్రి కావడం నిజంగానే ఒక అసాధారణ ఉదంతం. అయితే దేవుని సంకల్పాల నెరవేర్పుకోసం నిరంతరం శ్రమించే విశ్వాసి బానిసలాంటి దీనస్థితిలో లేకున్నా, ప్రధానమంత్రిలాంటి అత్యున్నత పదవిలో లేకున్నా, ప్రశాంతభరిత జీవితాన్ని ఆస్వాదిస్తూ వందలాదిమందికి మేలుచేసే పరిస్థితుల్లోనే దేవుడు పెడతాడు. అయితే దేవుని పట్ల విధేయతే ఫలభరితమైన జీవితానికి బలమైన పునాది. నోబెల్ బహుమతి పొందేంత జ్ఞానమున్నా దేవుడు మనల్ని వాడుకోవడానికి అది ఏమాత్రం పనికి రాదు. ఒక్కోసారి మహావృక్షాలు తుఫాను తాకిడికి నేలకూలితే. గాలికి తలవంచే బలహీనమైన వరిచేను తుఫానును తట్టుకోవడం చూస్తుంటాము. దేవునికి ఎంతగా తలవంచితే విశ్వాసి అంతగా బలవంతుడవుతాడు, ఆ విధేయతే అతన్ని లోకానికి అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభు కిరణ్ -
మరణాన్ని జయించిన రోజు
యెరూషలేము పట్టణం శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి కూడా నిద్రపోలేదు. ఎంతో సౌమ్యుడు, సాధుజీవి, సద్వర్తనుడైన యేసుక్రీస్తును అత్యంత పైశాచికంగా సిలువకు మేకులు కొట్టి, రక్తం ఏరులై పారేలా కొరడాలతో కొట్టి చంపిన తరువాతి రాత్రులవి. అయితే ఆదివారం తెల్లవారు జామునే ఆయన పార్థివ దేహానికి సుగంధద్రవ్యాలు పూసే ఒక యూదు తంతును పూర్తిచేసేందుకు సమాధి వద్దకు వెళ్లిన మగ్దలేనే మరియ తదితర స్త్రీలకు ఆయన దేహం కనిపించలేదు. రోమా ప్రభుత్వం యూదు మతపెద్దల అభ్యర్థన మేరకు యేసును ఉంచిన సమాధికి రాజముద్రవేసి కావలి వారిని కూడా నియమించింది. ఆయన దేహాన్ని ఎవరైనా దొంగిలించుకు పోయారా? అని అంతా భయపడుతూ వుండగా, అంతలోనే యేసుప్రభువు మగ్దలేనే మరియకు కనిపించి ఆమె పేరు పిలిచి మరీ పలకరించాడు. అక్కడ సమాధిలో ఒక దూత కూడా యేసు తిరిగి సజీవుడయ్యాడన్న ‘బ్రేకింగ్ న్యూస్’ను ప్రకటించింది. యెరూషలే మంతటా ఈ వార్త దావానలంలా వ్యాపించింది. అంతా యేసు సమాధి వైపే పరుగెత్తడం ఆరంభించారు. అంతటా ఎంతో ఆశ్చర్యం, మహదానందంతో నిండిన వాతావరణం వ్యాపించింది. ఆనందం పట్టలేక పట్టణస్థులంతా ముఖ్యంగా నిరుపేదలు, సామాన్యులు, బలహీనులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆడవారికైతే వారి ఆనందానికి హద్దే లేదు. అదే ఈస్టర్ ఆదివారంగా క్రైస్తవ లోకంలో ప్రాచుర్యం పొందింది. మానవ చరిత్రలో ఆ శుక్రవారం, ఆ ఆదివారం కూడా ఎన్నటికీ మరపురానివి. మనిషిలోని దుర్మార్గం, అతని చేతిలో అసత్యంగా రూపాంతరం చెందిన ఒకప్పటి ‘సత్యం’, యేసుక్రీస్తును సిలువవేసి చంపడం ద్వారా విజయం సాధించిన రోజు శుక్రవారమైతే, యేసుక్రీస్తు అన్ని కుట్రలు, దుర్మార్గమూ, దౌర్జన్యాన్ని పటాపంచలు చేసి సమాధిని, మరణాన్నీ గెలిచి సజీవుడు కావడం ద్వారా దీనులు, పాపులు, నిరాశ్రయులందరికీ నవోదయాన్నిచ్చిన దినం ఆ ఆదివారం... యేసుక్రీస్తు మానవరూప ధారియైన రక్షకుడుగా ఈ లోకానికి తన పరమ తండ్రి ఆదేశాలు, సంకల్పాలను అమలు పర్చడానికి విచ్చేసిన దైవకుమారుడు, అంటే అన్నివిధాలా దేవుడే!!!. అలాగైతే జననానికి, మరణానికి, పునరుత్థానానికి దేవుడు అతీతుడు కదా... మరి ఇదంతా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న తప్పక రావాలి. నాలుగేళ్ల ఒక బాలుడు నీళ్లు పెద్దగాలేని ఒక బావిలో పడ్డాడు. అయ్యో అంటూ బోలెడు జనం బావి చుట్టూ గుమి కూడారు. అంతా ఎవరికి తోచినట్టు వారు వాడికి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సలహాలిస్తున్నారు. వాడసలే భయకంపితుడై ఉన్నాడు. పైగా పసితనం, అంతా గందరగోళం.. గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంతలో ఒకాయన బావి వద్దకొచ్చి లోనికి తొంగి చూచాడు. వెంటనే అక్కడున్న ఒక తాడు తన నడుముకు కట్టుకొని అక్కడున్నవారితో తనను లోనికి దించమన్నాడు. అతన్ని చూసి పిల్లాడు మహదానందంతో డాడీ అని గట్టిగా అరిచి తండ్రిని కరిచి పట్టుకున్నాడు. తండ్రి కూడా వాడిని చంకకేసుకొని గట్టిగా కరుచుకొని, తమను పైకి లాగమన్నాడు. పిల్లాడు బావిలో పడిపోతే అందరికీ సానుభూతే!! కాని పర్యవసానాలోచించకుండా చనిపోయేందుకు కూడా తెగించి కొడుకును కాపాడుకునే శక్తి ఒక్క తల్లి, తండ్రి ప్రేమకు మాత్రమే ఉంటుంది. శుక్రవారం నాడు సిలువలో అదే జరిగింది. పాపిని కాపాడేందుకు పరమతండ్రి కుమారుడిగా, రక్షకుడుగా చనిపోయేందుకు కూడా సిద్ధపడి యేసుప్రభువు బావిలోకి దూకాడు. నేను చనిపోయినా ఫరవాలేదు, నా కొడుకు బతికితే చాలు అనుకునేదే నిజమైన తండ్రి ప్రేమ. పరమతండ్రిలో ఆయన అద్వితీయ కుమారుడు, కుమారునిలో పరమ తండ్రి సంపూర్ణంగా విలీనమైన అపారమైన ప్రేమ ఆ దైవత్వానిది. బావిలోనుండి కొడుకుతో సహా బయటికొచ్చిన సమయమే యేసు మరణాన్నీ గెలిచి సజీవుడైన ఈస్టర్ ఆదివారపు నవోదయం. యేసు సజీవుడయ్యాడన్న వార్త యెరూషలేములో ప్రకంపనలు రేపింది. యేసుమరణంతో విర్రవీగి రెండు రోజులపాటు మీసాలు మెలేసిన చాందస యూదుమతాధిపతులకు ఇపుడు ఏం చేయాలో తోచడం లేదు. యేసు శిష్యులు ఆయన మృతదేహాన్ని దొంగిలించారంటూ డబ్బిచ్చి వదంతులు సృష్టించబూనారు. అయితే ఎప్పుడూ సత్యం ముందు అసత్యం వెలవెల బోతుంది. ఆయన సజీవుడైన రోజు తర్వాత సరిగ్గా 50 రోజులకు పెంతెకొస్తు అనే పండుగ నాడు వందలాదిమంది తన అనుచరులు చూస్తుండగా యేసుప్రభువు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అలా యేసు సిలువలో చనిపోవడం, మూడవనాడు సజీవుడు కావడం, మళ్ళీ పెంతెకొస్తు నాడు ఆయన ఆరోహణుడు కావడం కళ్లారా చూసిన అనుభవంతో ఆయన అనుచరుల జీవితాలు సమూలంగా పరివర్తన చెందాయి. ఆయన సజీవుడైన దేవుడు అన్న నిత్యసత్యం వారి జీవితాల్లో లోతుగా ప్రతిష్ఠితమై వారంతా ఒక బలమైన చర్చిగా శక్తిగా ఏర్పడి, ఆ తర్వాత సువార్త సత్యం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు సంసిద్ధమయ్యే ధైర్యాన్ని వారికిచ్చింది. యేసుప్రభువు దీన్నంతా ఒక చిన్న ఉదాహరణతో వివరించాడు. గోధుమగింజ ఫలించాలంటే, అది నేలలో ముందుగా చావాల్సి ఉంటుందని యేసు ఒకసారి అన్నాడు (యోహాను 12 :24 ). మొక్కగా పునరుజ్జీవనం పొందే ముందు విత్తనం నేలలో అనుభవించే ప్రక్రియను ఆయన మరణంతో పోల్చాడు. మొలకెత్తి పెద్దదైన తర్వాత నేలను తవ్వి చూసినా ఆ విత్తనం కనిపించదు. విత్తనంగా అది తన గుర్తింపును కోల్పోవడం ద్వారా ఒక మొక్కగా రూపించబడి ఎన్నో ఫలాలిచ్చే ఆశీర్వాదస్థితికి చేరుతుంది. మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్ అనుభవం. యేసుప్రభువు నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని అని కూడా ప్రకటించి, తానన్నట్టే చనిపోయి తిరిగి లేవడం ద్వారా తానే జీవాన్నని రుజువు చేసుకున్నాడు. తనలాగే విశ్వాసులు కూడా పురుత్థానం చెంది పరలోకంలో తమ దేవుని సహవాసంలో నిత్య జీవితాన్ని పొందుతారని ప్రభువు బోధించాడు. మొక్కగా పునరుజ్జీవనం పొందే ముందు విత్తనం నేలలో అనుభవించే ప్రక్రియను ఆయన మరణంతో పోల్చాడు. మొలకెత్తి పెద్దదైన తర్వాత నేలను తవ్వి చూసినా ఆ విత్తనం కనిపించదు. విత్తనంగా అది తన గుర్తింపును కోల్పోవడం ద్వారా ఒక మొక్కగా రూపించబడి ఎన్నో ఫలాలిచ్చే ఆశీర్వాదస్థితికి చేరుతుంది. మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్ అనుభవం. – రెవ.డా.టి.ఎ.ప్రభు కిరణ్ -
దేవుని పని విశ్వాసులందరిదీ
నిజమైన భక్తి అడుగంటినపుడు మూఢభక్తి రాజ్యమేలుతుంది. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకూ మధ్య తరతరాలుగా బద్ధ వైరం. అప్పట్లో షిలోహు అనే పట్టణంలో ఏలీ అనే ప్రధాన యాజకుని నేతత్వం లోని దేవుని మందిరంలో దేవుని ‘నిబంధన మందసం’ ఉండేది. కానీ ఏలీ అసమర్థత యాజకత్వంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్న కారణంగా దేవుడు వారి మధ్య నుండి తన సన్నిధిని తీసివేశాడు. యాజకులున్నారు, మందిరముంది, మందసముంది కాని అక్కడ లేనిదల్లా దేవుడే! ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధాల్లో ఆ కారణంగా ఇశ్రాయేలీయులు వరుసగా ఓడిపోయారు. మందసం తమతో పాటే యుద్ధభూమిలో ఉంటేనైనా గెలుస్తామేమోనన్న మూఢవిశ్వాసంతో మందసాన్ని మందిరంనుండి తొలగించి ఇశ్రాయేలీయులు తమ వెంట ఒకసారి యుద్ధానికి తీసుకెళ్లారు. అయితే ఈసారి మరీ భయంకరంగా ఓడిపోయారు. పైగా ఫిలిష్తీయులు ఆ మందసాన్ని వారివశం నుంచి తప్పించి చేజిక్కించుకు వెళ్లారు. ఇశ్రాయేలీయుల మధ్య, దేవుని మందిరంలో దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉండాల్సిన ‘నిబంధన మందసం’, దాన్ని కాపాడలేకపోయిన ఏలీ అనే ప్రధాన యాజకుని అసమర్ధత వల్ల, ఇశ్రాయేలీయుల విచ్చలవిడి జీవితంవల్ల శత్రువుల వశమైంది. నిజానికి ఇశ్రాయేలీయులకు కాదు, వారి దేవునికే శత్రువులు భయపడేవారు. కాని ఇప్పుడు దేవుడు వారితో లేడన్నది రుజువుకావడమేకాక, పవిత్రమైన నిబంధన మందసాన్ని కూడా కాపాడుకోలేక పోయిన నిష్పయ్రోజకులు, దుర్బలులు ఇశ్రాయేలీయులన్న అపవాదు కూడా ఇపుడు దేవుని ప్రజలకొచ్చింది.నాటి మందిరం ఈనాటి చర్చికి, నాటి యాజకులు నేటి పాస్టర్లకు సాదృశ్యం. విశ్వాసుల్లో దైవభయాన్ని నింపి సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత పాస్టర్లది, ఇతర దైవ పరిచారకులది వారి ఆధ్వర్యంలోని చర్చిలది. దైవపరిచారకులు దారితప్పిపోతే చర్చికొచ్చే విశ్వాసులు ఆత్మీయంగా భ్రష్టులవుతారు. ఆవు చేనిలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? దేవుని పని పూటగడవడానికి, జీవనోపాధికి, ఆస్తులు సంపాదించుకోవడానికి చేసే వత్తి కాదు. తొలినాళ్లలో కూడా దేవుడు తన ప్రజల్లోని లేవీయులనే ఒక గోత్రీకులను తన సేవకోసం ప్రత్యేకించుకొని వారికి అన్ని గోత్రాలవారికిచ్చినట్టు వాగ్దానభూమిలో భాగాలివ్వకుండా ‘నేనే మీ స్వాస్త్య భాగమన్నాడు’. వారికి కావాలనే భూములు, ఆస్తులివ్వలేదు. ఆ లేవీయులైన యాజకులు పవిత్రంగా, నిబద్ధతతో పని చేసినంతకాలం అక్కడి మందిరం కూడా పవిత్రంగా నిలిచింది, ప్రజల్లో దేవుని భయాన్ని నింపి వారిని సన్మార్గులను చేసింది. ఆ తర్వాత ఏలీ లాంటి అసమర్థులు, అపవిత్రులు, దేవునికన్నా తమ సంతానాన్నే ఎక్కువగా ప్రేమించే యాజకుల హయాంలో ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది, ప్రజలు మార్గం తప్పి భ్రష్టులయ్యారు. పరిస్థితి అప్పుడూ ఇప్పుడూ అంతే. ఏ చర్చి చూసినా ఏమున్నది గర్వకారణం? అన్నట్టుగా ఉన్న నేటి పరిస్థితుల్లో అక్కడి అవినీతిని, అపవిత్రతను రూపుమాపేందుకు విశ్వాసులే పూనుకోవాలి. ప్రేమ, క్షమ, నిబద్ధత, నిస్వార్థతకు నిలయంగా ఉండాల్సిన పాదిర్లు, చర్చిలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే దేవుడు లేని, నిబంధన మందసమూ లేని నాటి షిలోహు మందిరం లాగా ప్రాభవం కోల్పోయిన శిథిలాలే మిగులుతాయి. పుష్కలంగా, కష్టపడకుండా డబ్బు దొరికే రంగాల్లోని వారు తమ పిల్లల్ని కూడా ఆవే రంగాల్లోకి వారసులుగా తెస్తుంటారు. ఈనాడు దేవుని సేవలో కూడా అదే చూస్తున్నాం. అయితే డబ్బే ప్రధానమైన ఏ రంగంలోనైనా దేవుడుండడన్నది వేరుగా చెప్పాలా? దేవుని పని ఒక్క యాజకులది మాత్రమే కాదు విశ్వాసులందరిదీ. చర్చిల్లో, దైవపరిచర్యల్లోని పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యత కూడా దేవుని ప్రేమించేవారందిరిదీ. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
పరిస్థితిని మార్చే ప్రార్థన
పరమ దుర్మార్గులు, క్రూరులు అయిన నీనెవె ప్రజలకు దుర్గతి కలుగబోతోందని ప్రకటించి పరివర్తన చెందేందుకు దేవుడు వారికొక అవకాశమిద్దామనుకున్నాడు. వారికి ఈ విషయం ప్రకటించే బాధ్యతను యోనా అనే ప్రవక్తకిచ్చాడు, అయితే యోనా అవిధేయుడై నీనెవెకు కాకుండా తర్షీషు అనే చోటికి పారిపోయేందుకు ఓడలో ప్రయాణమయ్యాడు. నీనెవె లోని లక్షా ఇరవై వేలమంది ఉజ్జీవానికి దేవుడు సంకల్పిస్తే, ఆ సంకల్పాన్ని నిర్వీర్యం చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తే దేవుడూరుకుంటాడా? యోనా ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుంది. ఆ విపత్తు యోనా అవిధేయతకు దేవుడు చూపిస్తున్న ఉగ్రత అని తెలుసుకున్న మిగతా ప్రయాణికులు, యోనాను సముద్రంలోకి విసిరేశారు. అక్కడ దేవుడు నియమించిన ఒక మహా మత్స్యం, యోనాను మింగగా, మూడు రోజులపాటు యోనా దాని గర్భంలో మోకరించి పాశ్చ్యాత్తాప ప్రార్థన చేశాడు. తాను నీనెవెకు వెళ్తానని మొక్కుబడి కూడా చేశాడు. అప్పుడు దేవుడాజ్ఞ ఇయ్యగా మత్స్యం అతన్ని ఒడ్డున కక్కి వేసింది. వెంటనే యోనా నీనెవె పట్టణానికి వెళ్లి దేవుని మాటలు ప్రకటించగా, అంతటి దుర్మార్గులూ అనూహ్యంగా సాధువులైపోయి, ఉపవాసప్రార్థనలు చేసి తమ దుర్మార్గతను వదిలేశారు. అంతకాలం దుర్మార్గత అనే దుర్గంధంతో నిండిన నీనెవె పట్టణం, దేవుని ప్రేమ, క్షమ అనే అద్భుతమైన పరిమళంతో నిండిపోయింది. నరకం ఒక్కసారిగా పరలోకంగా మారితే ఎలాఉంటుందో నీనెవెలో ప్రత్యక్హంగా యోనాకు అనుభవమైంది. రగిలే ఒక నిప్పురవ్వే, ఉవ్వెత్తున లేచే మహాజ్వాలను సృష్టిస్తుంది.. తాను మారి ఉజ్జీవించబడితేనే విశ్వాసి తానున్న సమాజాన్ని మార్చి ఉజ్జీవింప చేయగలడు. దేవుడెవరో ఎరుగని లక్షా ఇరవైవేల మంది నీనెవె ప్రజలను మార్చడం కన్నా, తానెన్నుకున్న, తన సొంతవాడైన యోనాప్రవక్తను మార్చడానికే దేవుడు ఎక్కువగా శ్రమించవలసి వచ్చింది. అంతటి దుర్మార్గులైన నీనెవె ప్రజలూ ఒక్క ప్రసంగంతోనే తాము చేసేది తప్పని తెలుసుకున్నారు. కాని దేవునికెంతో సన్నిహితుడై వుండీ, ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా పోవడం తప్పని యోనాకు అనిపించలేదు. అయితే నీనెవె ప్రజల దుర్మార్గత అయినా, యోనా చూపించిన అవిధేయత అయినా, దేవుని దష్టిలో పాపమే!! నాలాంటి పవిత్రుడు నీనెవె ప్రజలవంటి దుర్మార్గుల వద్దకు పోవడమేమిటి? అనుకున్నాడు యోనా. నువ్వూ , నీనెవె ప్రజలూ సమాన పాపులే అన్నాడు దేవుడు. పాపాల్లో చిన్నవి, పెద్దవి అని లేవు. దేవుని దృష్టిలో ఎంతదైనా, ఏదైనా పాపం పాపమే. పాపి దాని నుండి విడుదల కావల్సిందే. దుర్మార్గులైన పాపులు, ఆంతర్యంలో పాపంతో నిండినా పైకెంతో పరిశుద్ధంగా నటించే వేషధారులు... అంతా దేవుని దృష్టిలో సమానమే. అయితే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు నీనెవె ప్రజలనూ వదులుకోలేదు, యోనాను కూడా వదులుకోలేదు. మిమ్మల్ని, నన్నూ వదులుకోడు. యోనా ప్రార్థన అతని జీవితాన్ని, నీనెవె ప్రజల ఉపవాస ప్రార్థన వారందరి జీవితాల్ని మార్చింది. కోరికలు తీర్చే ప్రార్థనలు కాదు, జీవితాల్ని మార్చుకునే ప్రార్థనలు ఈ లెంట్లో చేద్దాం. – రెవ.డా.టి.ఏ.ప్రభు కిరణ్ -
ఒక అబల ప్రార్థనతో ఘనవిజయం
దేవుని ఔన్నత్యమేమిటంటే, పరివర్తన చెందిన ఒక పాపికి పరలోకాన్ని మరింత ఆనంద భరితం చేసే శక్తినిచ్చాడు (లూకా 15 :7,10). పరలోకంలో దేవుణ్ణి కదిలించి జవాబును పొందగలిగిన శక్తిని అబలయైన ఒక స్త్రీకిచ్చాడు. హన్నా అనే స్త్రీ ఎల్కానా అనే ఒక యూదునికి రెండవ భార్య, పైగా గొడ్రాలు. అసలే స్త్రీని చిన్న చూపు చూసే నాటి సమాజంలో ఆమె గొడ్రాలైనా, వితంతువైనా ఆమె అవమానాలకు అంతేలేదు. అందువల్ల తన భర్తతో షిలోహులోని దేవుని మందిరానికొచ్చిన ప్రతిసారీ ఆమె తన సమస్య కోసం ప్రార్థించేది. అయినా ఆమె సమస్య తీరలేదు. కానీ ఆమె అవమానాలు అధికమైన పరిస్థితుల్లో ఒకసారి ఆమె తన’ ఆత్మనంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ’ ప్రార్థించింది (1సమూ 1:15). అవసరాల కోసం ప్రార్థించడం విశ్వాస జీవితంలో ప్రాథమిక స్థాయి. కాని దేవుని సంకల్పాలతో మన సంకల్పాలు కలిసిపోయేలా ’ఆత్మను కుమ్మరిస్తూ’ ప్రార్ధించడం అత్యున్నత స్థాయి. విశ్వాసుల ప్రార్థన ఆ స్థాయిలోనే అంటే ఆత్మతో, సత్యంతో చేసేదిగానే ఉండాలని యేసుప్రభువు బోధించాడు (యోహాను 4:24). ఆనాడు షిలోహులో యాజకులు, విశ్వాసులున్నారు. బలులు, అర్పణలు, ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ అక్కడ దేవుని ప్రత్యేక్షత లేదు. అదీ ఆనాటి ‘ఆత్మీయ సంక్షోభం’! వాళ్ళ జీవితాలు ఆలయానికి దగ్గరగా ఉన్నాయి, దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా జీవించినా, ఆలయానికొచ్చి తృణమో, ఫలమో చెల్లిస్తే చాలు దేవుడు ప్రసన్నమైపోతాడన్నది వాళ్ళ ధీమా. ఈ ‘చీకటి’తో పోరాడి ప్రజల్ని తిరిగి దేవుని వైపునకు మళ్లించే ఒక ప్రవక్త కోసం అపుడు దేవుడు ఎదురుచూస్తున్నాడు. హన్నా సరిగ్గా అదే సమయంలో దేవా నాకొక కుమారుణ్నిస్తే నీకే ప్రతిష్ఠిస్తానంటూ ప్రార్థించింది. మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించే స్థాయిలో ప్రార్థించడమంటే, ప్రజలకోసమైన దేవుని సంకల్పాలతో విశ్వాసి ప్రార్థనలు ఏకీభవించడమన్నమాట. హన్నా అదే చేసింది. నాకొక కొడుకునిస్తే నీవు ఎదురుచూస్తున్న యాజకుడిగా అతన్ని తీర్చిదిద్దుతానని తనకు తెలియకుండానే ఆమె దేవునితో ఒప్పందపడింది. మనమంతా కూడా అదే చేయాలి. వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఇచ్చిన బాలుడే సమూయేలనే ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆయన ఇశ్రాయేలీయులకు అద్భుతమైన నాయకుడయ్యాడు. సౌలు రాజును, దావీదు చక్రవర్తిని ఆయనే అభిషేకించాడు. ఆ దావీదు ద్వారా ఇశ్రాయేలీయులలో గొప్ప విప్లవమే వచ్చింది. ఇదంతా హన్నా అనే ఒక అబల సాధించిన ప్రార్థనా విజయమే, ఆమె సంకల్పబలమే!!! – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
లెంట్లో దేవునితో సాన్నిహిత్యం
యేసుక్రీస్తుకు ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఉంది. ‘దేవుడు మనకు తోడు’ అని దానర్థం. దేవుడెప్పుడూ భక్తులకు తోడుగానే ఉంటాడు కదా! యేసుకు ప్రత్యేకంగా ఆ పేరు ఎందుకొచ్చింది? ‘తోడు’ అంటే విశ్వాసికి ఎంతో చేరువలో ఉండే దేవుడని అర్థం. విశ్వాసులకు, భక్తులకూ దూరంగా అక్కడెక్కడో ఉండే దేవుడు యేసురూపంలో మానవాళికి అత్యంత చేరువగా వచ్చి, వారితోనే కొద్దికాలం నివసించి, వారికష్టసుఖాల్లో పాలు పంచుకొని వారిలాగే అన్ని కష్టాలూ అనుభవించిన దైవకుమారుడని ఆయనకు పేరు. దేవుడిలా మనిషికి చేరువ కావడం పక్కన పెడితే, విశ్వాసి దేవునికి దగ్గరయ్యే కొన్ని మార్గాలను బైబిలు సూచించింది. ఈ నలభై రోజులూ చాలామంది క్రైస్తవులు ఎంతో నిష్ఠగా, పవిత్రంగా ఆచరించే ‘లెంట్’ అంటే ఉపవాస దీక్ష అందుకు ఉద్దేశించినదే!! ఈ ఉపవాస దీక్షను ఎంత కఠోరంగా, ఎంత నిష్ఠగా ఆచరించామని కాకుండా, దీక్ష కారణంగా దేవునికి ఎంత దగ్గరమయ్యామన్నది ప్రాముఖ్యం. ఎక్కడో అమెరికాలో ఉంటున్న కొడుకు తమ దగ్గరికి వచ్చేస్తున్నానని చెబితే తల్లిదండ్రులు ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోతారో, ‘లెంట్’ అసలు ఉద్దేశ్యం నెరవేరే విధంగా ఆ దీక్షను ఆచరిస్తే, విశ్వాసి ఆ విధంగా తనకు చేరువ కావడం చూసి దేవుడు కూడా అంతే ఆనందిస్తాడు. సొంతింటికి రావడంలో కొడుకు ఉద్దేశ్యం ‘అమ్మానాన్నా నాకు మీరే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులు’ అని చెప్పడమే కదా! ‘లెంట్’లో చేసే ఉపవాస దీక్ష కూడా దేవునికి అదే మాట చెప్పకనే చెబుతుంది. కొన్ని గంటల కోసం ఆహార పానీయాలు మానడమే, మాంసాహారాన్ని తాత్కాలికంగా త్యజించడమే ఉపవాసమనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. ‘లెంట్’ కాలంలో దేవుని వాక్యాన్ని చదవడం కాదు, శ్రద్ధతో ధ్యానం చేయాలి. లోకంలో నిమగ్నమై లోకానందం కోసం అప్పటిదాకా చేసిన పనుల స్థానంలో దేవుని కోసం చేసే పనులు చేపట్టాలి. ఎవరితోనైనా మనస్పర్థలు, పగలు, కోపాలుంటే అవి అలాగే పెట్టుకొని ఉపవాసం చేయడం వ్యర్థమైన పని. గిన్నెను శుభ్రంగా తోమకుండా ఎంగిలి గిన్నెలోనే వంట చేయడంతో సమానమది. క్షమాభావం, పొరుగు వారు, పేదల పట్ల ప్రేమ వ్యక్తం చేసే రోజులుగా లెంట్ దినాలుండాలి. ఎంత భోజనాన్ని దేవుని కోసం వదిలేస్తామో అందుకు పదిరెట్ల భోజనం మన కారణంగా నిరుపేదలు తినగలిగితే, దేవునికి మనం నిజంగా చేరువైనట్టే! ఉపవాస దీక్షను ఒక తంతులాగా, ఆచారంగా కాదు, ఎంతో నిష్ఠ, దేవుని పట్ల ప్రేమతో చేస్తే దేవునికి చేరువవుతాం. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
సౌవార్తిక ఉద్యమంలో బలమైన పాత్ర 'ఆమె'దే!
సమాజం అనుసరించే ద్వంద్వ ప్రమాణాలకు బలై స్త్రీ ద్వితీయశ్రేణికి చెందిన జీవిగా, కేవలం వినోద సాధనంగా, పిల్లల్ని పుట్టించే యంత్రంగా పరిగణింపబడుతున్న సమాజంలోకి యేసు అరుదెంచి స్త్రీలను గౌరవించే విషయంలో ఒక విప్లవాన్నే తెచ్చాడు. నాటి స్త్రీలు బయటి ఆవరణాన్ని దాటి ఆలయం లోపలికి ప్రవేశించకూడదు. సమాజ మందిరంలో పురుషులతో సమానంగా కూర్చోకూడదు. పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను స్త్రీలు తాకకూడదు. పురుషుడు భార్యతోనైనా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకూడదు. స్త్రీని ఇన్ని కట్టుబాట్లకు బానిసగా మార్చిన నాటి సమాజంలో యేసుక్రీస్తు వారికి అత్యంత గౌరవప్రదమైన స్థానాన్నిచ్చాడు. దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన వ్యక్తిత్వాన్నిచ్చి సృష్టించాలనుకున్నప్పుడు అతన్ని పురుషునిగా, స్త్రీగా చేశాడు. అంటే తనను రెండుగా విభజించి ఆ రెండు భాగాలుగా స్త్రీ పురుషులను దేవుడు సృష్టించాడు. కాని కాలక్రమంలో సమాజం దైవాభీష్టానికి వ్యతిరేకంగా పురుషాధిక్య సమాజంగా మారందని యేసు తన బోధలు, కార్యాల ద్వారా హెచ్చరించాడు. అధమజాతికి చెందిన ఒక సమరయ స్త్రీకి యాకోబు బావి వద్ద యేసు అనేక గంటలపాటు ప్రవచనం చెప్పి ఆధ్యాత్మిక లోతులు వివరించాడు (యోహాను 4:7–26). పాపం చేస్తూ, దొరికిన స్త్రీని ‘అమ్మా’ అని అనునయంగా సంబోధించి మరణ శిక్ష నుండి తప్పించి క్షమించాడు. (యోహాను 8:10–11). రక్తస్రావమనే ఎంతో ఇబ్బందికరమైన వ్యాధితో బాధపడుతున్న స్త్రీని బాగు చేసి ఆమెకు శాంతిని ప్రసాదించాడు. పద్ధెనిమిదేళ్లపాటు నడుము వంగిపోయి వ్యధననుభవిస్తున్న స్త్రీని బాగు చేసిన ఆమెను ‘అబ్రాహాము కుమార్తె’గా ప్రకటించాడు (లూకా 18:16). తనను అత్తరుతో అభిషేకించిన ఒక పాపాత్మురాలైన స్త్రీని అంతా ఈసడించుకుంటే ఆయన మాత్రం ఆమెను పొగిడాడు. మరియ ఆయన పాదాల దగ్గరే కూర్చొని రోజంతా ఆయన మాటలు వింటూంటే ఆమె ఎన్నుకున్నది అత్యుత్తమమైన మార్గమన్నాడు. సిలువను మోస్తూ కూడా యెరూషలేము కుమార్తెలను ఓదార్చాడు. సిలువలో వేలాడుతూ తన తల్లి బాధ్యతల్ని శిష్యునికప్పగించాడు. తాను పునరుత్థానుడియ్యానని అందరికీ చెప్పమంటూ మగ్దలేనె మరియను ఆదేశించి ఆమెను తొలి సువార్తికురాలిని చేశాడు. విశ్వంలో, ఆకాశంలో స్త్రీది సమాన భాగమని, ఆమెది సగభాగమని ఆచరణలో ప్రకటించిన మహా విప్లవకారుడు యేసుక్రీస్తు. స్త్రీని గౌరవించి ప్రోత్సహించడమే సమాజ పురోగతికి గీటురాయి అని ఆయన బోధలు చెబుతాయి. ఆదిమకాలం నుండి ఇప్పటిదాకా సౌవార్తిక ఉద్యమంలో, చర్చి చరిత్రలో స్త్రీది చాలా ప్రధానమైన పాత్ర. ఒక బలమైన సమాజానికి పునాది బలమైన కుటుంబమైతే, బలమైన కుటుంబ నిర్మాణంలో ముఖ్యపాత్ర తల్లిగా, భార్యగా స్త్రీదే!! స్త్రీకి సమాన హోదానిచ్చి గౌరవించనివాడు అనాగరికుడు, క్రైస్తవ స్ఫూర్తికి విరుద్ధమైన వాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆత్మసౌందర్యాన్ని ఆస్వాదించే దేవుడు
యేసుక్రీస్తు ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్లాడు. ‘దేవాలయపు రాళ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అక్కడి అలంకరణలు చూడండి’ అంటూ అంతా దేవాలయ సౌందర్యాన్ని ప్రభువుకు వర్ణించి చెబుతున్నారు. దేవాలయం గొప్పదనాన్ని దేవునికే వర్ణించి చెబుతున్న కొందరు భక్తుల సాహసమిది. కాని ఎంత గొప్పది, అందమైనదైనా దేవాలయం దేవునికన్నా గొప్పదెలా అవుతుంది? యేసు వారికి జవాబు చెబుతూ, ‘ఈ దేవాలయమంతా ధ్వంసమై పాడుదిబ్బగా మారే రోజొకటి రాబోతోంది, అప్పుడు ఇంత అద్భుతమైన రాళ్లూ ఒకదాని మీద మరొకటి నిలవకుండా పడదోయబడ్తాయంటూ ప్రవచనం చెప్పాడు. ఆ తర్వాత దాదాపుగా 45 ఏళ్లకు అంటే క్రీస్తు శకÆ 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి దేవాలయన్నాంతా ధ్వంసం చేశాడు. దేవాలయ నిర్మాణంలో భక్తి కొద్దీ రాయికీ రాయికీ మధ్య బంగారాన్ని కరిగించి నింపగా, టైటస్ చక్రవర్తి ఒక్కొక్క రాయీ తొలగించి రాళ్లమధ్యలో ఉన్న బంగారాన్నంతా వెలికితీయించి దోచుకుపోయాడు. యేసు చెప్పిన మాటలు అలా అక్షరాలా నెరవేరాయి (లూకా 21:5–9). దైవకుమారుడైన యేసు సౌందర్యాన్ని ఆస్వాదించడా? ఆయన సృష్టించేదీ, ఆస్వాదించేదీ బాహ్యసౌందర్యాన్ని కాదు, ఆత్మసౌందర్యాన్ని. ఇది జరగడానికి ముందు ఆయన దేవాలయంలో కానుకల పెట్టె దగ్గర కూర్చొని, అందులో పెద్దమొత్తాల్లో కానుకలు వేసి అక్కడి యాజకుల ద్వారా గొప్పదాతలుగా ప్రకటనలు చేయించుకుంటున్న చాలామంది భక్తుల డాబూదర్పాన్ని, వేషధారణను, పైకి ఎంతో గౌరవంగా కనిపిస్తున్నా ఆంతర్యంలో గూడుకట్టుకొని ఉన్న వారి మాలిన్యాన్ని, పాపపు కంపును ఆయన అర్థం చేసుకున్నాడు. అంతలో ఒక పేద విధవరాలు తన వద్ద ఉన్న రెండే రెండు కాసులనూ ఎంతో రహస్యంగా వేసి నిశ్శబ్దంగా వెళ్లిపోగా ఆమె ఆత్మసౌందర్యం, అంతరంగంలో దేవుడంటే ఆమెకున్న ప్రేమ యేసును ముగ్ధుణ్ణి చేసింది. ఆమె అందరికన్నా అధికంగా కానుక వేసిందని, అయినా తమ సమృద్ధిలో నుండి దేవునికి అర్పిస్తే, తానే లేమిలో ఉండి కూడా ఆమె తనకు కలిగినదంతా దేవునికిచ్చిందని ప్రభువు శ్లాఘించాడు (లూకా 21:1–4). భక్తులకూ, ఆయన శిష్యులకూ దేవాలయపు రాళ్లలో, అలంకరణల్లో సౌందర్యం కనిపిస్తే, యేసుకు ఒక పేద భక్తురాలి త్యాగంలో ఆమె వేసిన చిరుకానుకలో ‘ఆత్మసౌందర్యం’ కనిపించింది. గొప్ప కానుకలు వేసిన వారికి యాజకుల మన్ననలు, మెప్పు లభించాయి. రెండే కాసులు వేసిన పేద విధవరాలికి ఏకంగా దేవుని ప్రశంసే లభించింది. గొప్ప కానుకలు వేసిన భక్తులు, వారిని ప్రశంసించిన యాజకులూ కాలక్రమంలో చనిపోయారు, దేవాలయమే కొంతకాలానికి ధ్వంసమైంది. కాని ఆ పేద విధవరాలి చిన్న కానుక మాత్రం క్రీస్తు ప్రశంస కారణంగా చరిత్రపుటల్లోకెక్కి ఇన్నివేల ఏళ్ళుగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. దేవుణ్ణి మెప్పించేది అనిత్యమైన కానుకలు కాదు, శాశ్వతమైన ఆత్మసౌందర్యమన్నది మరోసారి రుజువైంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
వెలిగేదీ... వెలిగించేదీ!!
బేతనియ సోదరీమణులు, లాజరు అక్కలు మరియ, మార్త మంచి విశ్వాసులు. కాకపోతే ఇద్దరూ చెరో తెగకు చెందినవారు. వారింట్లో యేసు ఎన్నోసార్లు ఆతిథ్యం పొందాడు. యేసు వచ్చింది మొదలు వెళ్లేదాకా తనకు తోచిన సపర్యలు, మర్యాదలు చేస్తూ చెమటలు కక్కుతూ ఆయన మెప్పుకోసం మార్త తాపత్రయపడేది. మరియ ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన మాట్లాడే ప్రతి మాటా ఆలకిస్తూ తన్మయురాలై జీవనసాఫల్యానికి దారి వెదుక్కునేది. ప్రభువు కోసం పని చేసే హడావిడిలో ఆయన మెప్పు పొందడమే మార్త లక్ష్యం కాగా, యేసు మాటలు ఆలకిస్తూ ఆయన మనసు తెలుసుకొని ఆ మేరకు జీవించాలన్నది మరియ ఉద్దేశ్యం. వారిద్దరిలో ఎవరు గొప్ప? అన్న ప్రస్తావన ఒకసారి వస్తే, ‘మార్త నాకోసం బోలెడు పనులు చేయాలనుకొని తొందర పడుతోంది కాని మరియ మాత్రం అవసరమైనది, అత్యుత్తమమైనది, ఆమె నుండి ఎన్నడూ తీసివేయబడనిది ఎన్నుకున్నదని యేసు అన్నాడు (లూకా 10:38–42). మరియ, మార్తలిద్దరూ విశ్వాసులే కాని మరియ ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసి అని యేసే స్వయంగా శ్లాఘించాడు. దేవుని కోసం తమకు తోచిందల్లా చేసే ‘క్రైస్తవం’లో హడావిడి కనిపిస్తుంది కాని దానివల్ల దేవుని రాజ్య నిర్మాణం జరగదు. ఆకులు, కొమ్మలూ విస్తారంగా ఉన్నా ఫలాలనివ్వని వృక్షాల్లాంటివి ఈ పరిచర్యలు. పరస్పర ప్రేమ, క్షమాపణ, త్యాగం, పవిత్రత, దైవికత పునాదిరాళ్లుగా కలిగిన లోకాన్ని ప్రభావితం చేసి పరివర్తన తెచ్చే దేవుని రాజ్యనిర్మాణం, దేవుని సంకల్పాలు, ఉద్దేశ్యాల మేరకు జరగాలి. అందుకు ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన మాటల్ని శ్రద్ధగా ఆలకించ గలిగిన పరిచారకులు కావాలి. అలా దేవుని సంకల్పాలు తెలుసుకొని వాటికి విధేయులైన వారితోనే దేవుని రాజ్యనిర్మాణం సాధ్యమవుతుంది. కాని ఈనాడు మరియ, మార్తలే అత్యధికంగా కనిపిస్తున్నారు, వారే హడావుడి చేస్తున్నారు. దేవుని పేరుతోనే ఎజెండాలతో, ధనార్జనే, పేరు సంపాదించుకోవడమే ప్రధానోద్దేశ్యంగా కలిగిన పరిచారకుల హడావిడి అంతటా కనిపిస్తోంది. సాత్వికత్వం మచ్చుకైనా కనపడని ‘సొంత సామ్రాజ్యాల్లాంటి పరిచర్యలు, చర్చిలు వెలుస్తున్నాయి. ఈ లోకాన్ని పరలోకంగా మార్చగల ‘దేవుని రాజ్యనిర్మాణం’ ఒక నినాదంగా మిగిలిపోయింది. భజనలు, ప్రార్థనలు, పాటలు, డప్పులు, ప్రసంగాల హోరులోఅసలు దేవుడున్నాడా లేదా అన్నది గమనించకపోవడం విచారం. తాను వెలుగుతూ, లోకాన్ని ప్రేమ, త్యాగం, క్షమతో నింపుతూ నింగికెగిరే రాకెట్ లాంటిదే క్రైస్తవం. అదే దేవుడు కోరుకునే అత్యుత్తమ విశ్వాసం. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
అయోమయంలో స్పష్టతనిచ్చిన పెంతెకొస్తు!
జలప్రళయం తర్వాత మానవ సమాజాన్ని సరికొత్తగా నిర్మించాలని దేవుడు సంకల్పించాడు. అంతే! షీనారు (ఇప్పటి ఇరాన్, ఇరాక్ ప్రాంతం) ప్రజలు ఆకాశాన్ని అంటే రాజగోపురాన్ని నిర్మించడం ఆరంభించారు. భూమిని సేద్యం చేసి తమకోసం, సమాజం కోసం ధాన్యం పండించే సమయాన్ని, శక్తిసామర్థ్యాలను ఒక గోపుర నిర్మాణం కోసం తద్వారా పేరు సంపాదించుకోవడానికి వెచ్చించడంలోని నిషీ ప్రయోజకత్వాన్ని, స్వార్థాన్ని దేవుడు పసిగట్టి వారిలో అనేక భాషలు సృష్టించి ఒకరి మాటలు మరొకరికి అర్థం కాకుండా చేసి గోపుర నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. అదే బాబెలు గోపురం!! ఆ తర్వాత ప్రజలంతా ప్రపంచం నలుమూలలకూ చెదరిపోయారు (ఆది 11:1–9). అలా బాబెలు గోపురమైతే ఆగిపోయింది కాని, అలా చెదరిపోయిన ప్రజలు స్థాపించిన బబులోను, పర్షియా రోమ్, గ్రీకు, బెజెంటైన్, అరేబియా, బ్రిటిష్, తాలూకు ‘గోపురాలు’ వెలిసి చరిత్రలో మానవాళిని యథాశక్తి పీడించాయి, దోచుకున్నాయి, ఆధిపత్యం చేశాయి. సమాజానికి దేవుడు కేంద్రంగా లేకుండా చేసే చాలా ప్రయత్నాలకు అవి ఆజ్యం పోశాయి. ఆనాడు భవన నిర్మాణాన్ని రాళ్లకు బదులు ఇటుకలతో, అడుసుకు బదులు మట్టికోటతో చేయవచ్చునన్న‘టెక్నాలజీ’ ని షీనారు ప్రజలు కనుగొన్నారని, అందుకే గోపురం నిర్మించాలనుకున్నారని బైబిలు చెబుతోంది (ఆది 11:3). అలా నానాటికీ విస్తరిస్తున్న ‘మానవజ్ఞానం’ అంటే నేటి భాషలో టెక్నాలజీ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నట్టు పైకి కనిపిస్తున్నా, అంతర్గతంగా, ఆత్మీయంగా మనిషిని నానాటికీ ఒంటరివాణ్ణి, నిస్సహాయుణ్నీ చేస్తున్నదన్నది వాస్తవం. మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ, దేవునికీ మధ్య అంతరాన్ని అది నానాటికీ అధికం చేస్తోందన్నది కూడా వాస్తవం!! ఆ నేపథ్యంలోనే దేవుడు యేసుక్రీస్తుగా పరలోకాన్ని వదిలి మనిషికి అందుబాటులోకి వచ్చాడు. దేవుడే కేంద్రంగా ఉండే కొత్త నిబంధన తాలూకు కృపాయుగానికి ఆవిష్కరణ చేశాడు. అది యేసు ఆరోహణం తర్వాత 50 వ రోజున అంటే పెంతెకొస్తు పండుగనాడు ఆరంభమయ్యింది. (అపొ.కా.2:1–13). బాబెలు గోపురంతో ఆరంభమైన సంక్షోభానికి దేవుడు పెంతెకొస్తు పండుగతో పరిష్కారాన్నిచ్చాడు. బాబెలు గోపురం వద్ద ఒకే ప్రాంతపు ప్రజలు తమ మాటల్ని ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోయారు. కాని పెంతెకొస్తు నాడు ఎన్నో దేశాల వారు మరెన్నో భాషల్లో మాట్లాడుతూ కూడా ఒకరికొకరు అర్థం చేసుకునే అద్భుతాన్ని దేవుడు చేశాడు. అలా శక్తినొందిన క్రైస్తవం ప్రపంచం నలుమూలలకు హతసాక్షులను పంపింది. బాబెలు అయోమయానికి పెంతెకొస్తు అనుభవం స్పష్టతనిచ్చి, దిశానిర్దేశం చేసింది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడు మీముందుంటే... ఆశీర్వాదాలు మీ వెంటే
క్రైస్తవమంతా దేవుడు వాడుకున్న, దేవునికి, ఆయన సంకల్పాలకు విశ్వాసంతో తలవంచి విధేయత చూపిన ఒక వ్యక్తి ‘అబ్రాహాము’తో ఆరంభమైంది. మానవాళితో సహా విశ్వాన్నంతా సృష్టించి, దానంతటికీ యజమాని అయిన దేవుణ్ణి మానవాళి సృష్టి, ఆరంభంలోనే కొన్ని తరాల తర్వాతే పక్కన పెట్టి ఆరాధనల పేరిట నరబులుల, దుర్బలుల శ్రమదోపిడి, దేవాలయాల్లోనే శృంగారం, మితిమించిన విగ్రహారాధన వంటి దుష్ట సంప్రదాయాలను అనుసరిస్తున్న నేపథ్యంలో, దేవుడు అబ్రాహాము ద్వారా తన మార్గనిర్దేశనం చేశాడు. మధ్య ప్రాచ్య ప్రాంతమైన మెసొపొటేమియా (ఇప్పటి ఇరాన్, ఇరాక్ ప్రాంతం)లో ఉన్న అబ్రాహామును ‘నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్లు’అని ఆదేశించాడు. ‘ఏదేశానికి? అదెలా ఉంటుంది?’ అన్న ఎదురు ప్రశ్న వేయకుండా అప్పటికప్పుడు దైవాజ్ఞ పాలనకు అబ్రాహాము నడుము కట్టి బయలుదేరాడు. లోకాన్ని ప్రశ్నించడం అనేది మనిషి నైజంలో ఉంది. అయితే లోకాన్ని ప్రశ్నించడం హేతువాదమనిపిస్తుంది. దేవుణ్ణి ప్రశ్నించకపోవడమే నిజమైన విశ్వాసమనిపిస్తుంది. ‘నీవు వెళ్లు’ అన్న దైవాజ్ఞ పాలన వెనుక అబ్రాహాముకు ఆ దేవుని శక్తి సామర్థ్యాలు, ప్రేమాపూర్ణత పట్ల అవగాహన ఉంది. ఆ అవగాహనలో నుండే అతని విశ్వాసం పుట్టింది. ప్రశ్నించడం హేతుబద్ధమే కాని అది అవిశ్వాసం!! తల వంచి దేవునికి అవిధేయులం కావడం వల్ల లోకం సృష్టిలో మనం బలహీనులం కావచ్చు. కాని అదే ఆశీర్వాదాలకు ఆరంభం!! అందుకే తన పట్ల మానవాళి భక్తిశ్రద్ధలకు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని ప్రామాణికం చేశాడు. కొత్త ఏడాది ముంగిట్లో నిలబడ్డ మనతో కూడా నీవు వెళ్లు అంటున్నాడు దేవుడు. రాబోయే 365 రోజుల కాలఖండంలో మనకేమేమి అనుభవాలు ఎదురుకానున్నాయో మనకు తెలియదు. కాని ‘నీవు నేను చూపించే దేశానికి వెళ్లు’ అని దేవుడాదేశిస్తే విధేయుడై Ðð ళ్లిన అబ్రాహాము పాలు తేనెలు ప్రవహించే కనానులో కాలు పెట్టినట్టే, మీరూహించని ఆశీర్వాదాలు, ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతాలు చలిచూడనున్న మరో ఏడాదిలోకి మీరు కాలుపెట్టబోతున్నారు. ఎందుకంటే ‘నీవు వెళ్లు’ అని ఆదేశించిన దేవుడే అబ్రాహాముకు ముందుగా నడిచినట్టే, మీరు కాలు పెట్టకమునుపే ‘కొత్త ఏడాది’లో ఉన్న దేవుడు మీతోపాటు ఉంటాడు. కనానులో అబ్రహాము కరువునెదుర్కొన్నాడు. కాని అలా జరిగిన ప్రతిసారీ ఆయన విశ్వాసంలో స్థిరపడ్డాడు. రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. ఇప్పుడిప్పుడే మనం కాలుపెట్టిన కొత్త ఏడాదిలోనూ కొన్ని చేదు అనుభవాల్లో కూడా అసాధారణమైన దైవకృపను, ఆయన సాన్నిధ్యాన్ని మీరనుభవిస్తారు. దేవుడున్న చోట లోకసంబంధమైన భయమనేది ఉండదు. అందువల్ల ‘మీకు దేవుడు ముందుం టే, విజయాలు, ఆశీర్వాదాలు మీ వెంటే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
వర్ణించలేని అసమాన ప్రేమ!
దేవుణ్ణి అర్థం చేసుకున్నదానికన్నా, అపార్థం చేసుకోవడమే చాలా ఎక్కువ. ఎంతసేపూ మనుషుల్లో తప్పులు వెతికి దండించేవాడు, కోపిష్టి వాడన్నది పలువురి అభిప్రాయం. అందుకే ఆయన్ని ప్రేమించే వారికన్నా, ఆయన దండిస్తాడని జడిసి భయపడే వాళ్లే చాలామంది. కాని బైబిల్ మాత్రం దేవుడు ప్రేమౖయె ఉన్నాడు. అంటుంది. (1 యోహాను 4:8). దేవుడు, ప్రేమ ఏమాత్రం విడదీయలేనివి. దేవుడు దండించిన సందర్భాలు ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఉంటాయి. అయితే విశ్వాసిని అకారణంగా బాధించేందుకుగాక, విశ్వాసిని సరిచేసి, అతన్ని ఇంకా అత్యున్నతమైన ఆశీర్వాదాలకు పాత్రుని చేయడమే ఆయన ఉద్దేశ్యం. ఆయన స్వభావరీత్యా ప్రేమామయుడే కాదు, మనమంతా ఆయనకు అత్యంత ప్రియమైన వారమని కూడా అర్థం చేసుకోవాలి. మానవాళిని ప్రేమించి, అతనికి సర్వసౌకర్యాలు, శాంతి, సంతోషం, సంతృప్తి కలిగించేందుకుగానూ వారి కోసమే విశ్వాన్నంతా దేవుడు సృష్టించాడని కూడా బైబిలు చెబుతోంది. అందుకే యేసుప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు పావురం లాగా ఆయన మీదికి దిగిరాగా, ‘నీవు నా ప్రియ కుమారుడవు, నీలో నేను సంతోషిస్తున్నాను’ అన్న తండ్రిౖయెన దేవుని స్వరం ఆకాశం నుండి వినబడింది. వెంటనే అపవాది ఆయన్ను అరణ్యంలోకి కొనిపోయి 40 రోజుల పాటు ఎన్నో విధాలుగా శోధించినా, ఆయన వాటికి లొంగక విజయం సాధించడం ద్వారా తన పరలోకపు తండ్రి పట్ల తనకు గల ప్రేమను కూడా రుజువు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో ఎప్పుడూ లోటు చేయడు. ఆ ప్రేమకు మన ప్రతిస్పందనలోని లోపాలు, మారని మన జీవితాలే దేవుని ఆశీర్వాదానికి ప్రతిబంధకాలవుతాయి. బకెట్లోని వేడినీళ్ల జోలికి వెళ్లవద్దని వారించినా వినని కొడుకును తండ్రి ఒక దెబ్బ వేస్తాడు ప్రేమగానే. అయినా వినకుండా వేడి నీళ్లతో ఒళ్లు కాల్చుకున్న కొడుకును తండ్రి భుజాన వేసుకుని డాక్టర్ వద్దకు ఏడుస్తూ పరుగెత్తుతాడు. అంతకన్నా మించిన ప్రేమతో. దేవుని ప్రేమ లోతు, వెడల్పు, పొడవెంతో అనుభవిస్తేనే అర్థమవుతుంది. బైబిలంతా క్షుణ్ణంగా చదివినా దేవుని ప్రేమ మాత్రం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే దేవుని ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయగల భాషను, పదజాలాన్ని మానవుడిప్పటికీ కనిపెట్టలేడు. బైబిల్ చదివి దేవుడుతో కొంత అవగాహన పొందవచ్చు కాని నిరంతర ప్రార్థన అనే ఆత్మీయ వ్యాయామం, క్రమశిక్షణ, సంపూర్ణి విధేయతతోనే దేవుని ప్రేమ అర్థమవుతుంది. మనకు గుచ్చుకునే ముల్లు మనకన్నా దేవున్ణే ఎక్కువగా బాధిస్తుందన్న పారలౌకిక సత్యం ఆ స్థాయిలోనే బోధపడుతుంది. వ్యాపారంలో పెట్టుబడి బల్ల లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు. కాని మన సమయాన్ని, ధనాన్ని, ప్రతిభా పాటవాలను దేవుణ్ణి ప్రేమించి ఆయనకోసం పెట్టుబవడిగా పెడితే నష్టం వచ్చే ప్రసక్తే లేదు. డబ్బుతో కొలవలేని, కొనలేని శాంతి సమాధానాలు ఆ దారిలో పుష్కలంగా మన సొంతమవుతాయి. చాచిన హస్తాలతో దేవుడు మనకోసం ఎప్పుడూ సిద్ధమే!! ఆ దృశ్యం కనపడకుండా మనల్ని ప్రబోధాలు, ప్రతికూలతలు శాసిస్తున్నాయి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విధేయతతోనే దేవుని కార్యాలు సాధ్యం!
ఎంతో ఎల్తైన, దృఢమైన, అత్యంత దుర్భేద్యమైన యెరికో పట్టణ ప్రాకారాలు ఇప్పుడు యెహోషువాకు, ఆయన జనులైన ఇశ్రాయేలీయులకు ఎదురుగా ఉన్నాయి. వాగ్దాన దేశమంతా స్వతంత్రించుకోవడానికి యెరికోను స్వాధీనం చేసుకోవడం కీలకం, అత్యంత ఆవశ్యకం కూడా. ఏ విధంగా చూసినా యెరికోలో విజయం శక్తికి మించిన కార్యం! అందరి కళ్లూ నాయకుడైన యెహోషువాపైన ఉన్నాయి. కాని అతని కళ్లు మాత్రం దేవునివైపు చూస్తున్నాయి. ‘మీరంతా ప్రాకారాల చుట్టూ ఆరు రోజులపాటు రోజుకొకసారి తిరగండి, ఏడో రోజు ఏడు సార్లు తిరగండి. అప్పుడు అవి కూలిపోతాయి’ అన్నాడు దేవుడు (యెహోషువా 6:2–4). అంత పెద్ద సమస్యకు ఇంత చిన్న పరిష్కారమా? అవి వాటంతట అవే కూలిపోతాయా? సణగడం, గొణగడం అలవాటే అయిన ఇశ్రాయేలీయులు బహుశా ఇలా ఆలోచిస్తున్నారేమో! దేవుని ఆదేశం విని ఎవరెలా ప్రతిస్పందించారో బైబిలులో రాయలేదు కాని ఆజ్ఞలు అందిన వెంటనే వారందరినీ నాయకుడైన యెహోషువ ప్రాకారాల చుట్టూ ప్రదక్షిణకు పురికొల్పి వారితోపాటు నడిచాడు. నలభై ఏళ్ళ అరణ్యవాసంతో దేవుడు చేసిన అద్భుతాలన్నింటికీ ప్రత్యక్షసాక్షిగా దేవుని బాహుబలాన్ని అతను కించిత్తు కూడా సంశయించలేదు. దేవుడేదైనా అన్నాడంటే అది జరిగి తీరుతుందన్నది అతని విశ్వాసం. అందుకే దేవుని ఆదేశాలపాలనకు ‘విధేయత’తో ఉపక్రమించాడు. ఎర్రసముద్రాన్ని రెండు పాయలు చేయడం, క్రమం తప్పకుండా ఆకాశం నుండి మన్నా కురిపించడం, బండ నుండి పుష్కలంగా నీళ్ళు వెలికితీయడం వంటి కార్యాలు చేసిన దేవునికి యెరికో ప్రాకారాలు కూల్చడం ఎంత పని? అన్నది యెహోషువా విశ్వాసం. అందుకే అతనిలో అంత విధేయత! దేవుని విశ్వసిస్తే దేవుని పట్ల విధేయత కూడా పుష్కలంగా ఉండాలి. విశ్వాసం, విధేయత పర్యాయ పదాలు. దేవుడు ‘చేసిన’ అద్భుతాలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఆయన చేయబోయే కార్యాలకు ‘విధేయత’ పునాది వేస్తుంది. మనం చాలాసార్లు ‘విశ్వాస పరీక్ష’లో నూటికి నూరుశాతం మార్కులతో పాసవుతాం కాని ‘విధేయతా పరీక్ష’లోనే ఫెయిల్ అవుతుంటాం. విశ్వాస విజయాలకు గండి పడేది మన విధేయత పలచబడినప్పుడే! ఏడు రోజుల తర్వాత కూలిపోయే గోడలచుట్టూ, ఏడు రోజులూ ఇశ్రాయేలీయులను ‘ప్రదక్షిణం’ చేయించిన విధేయత యెహోషువది. ఆ సమయంలో అతని కళ్లు సమస్యౖయెన ప్రాకారాల మీద కాదు, వాటిని కూల్చేస్తానన్న దేవునిఇదివరకటి అద్భుతాలమీద ఉన్నాయి. నాకున్న యెరికో గోడలాంటి సమస్యను దేవుడు తీర్చడంలేదన్న వ్యసన భావంతో ఉన్నారా? దేవుడు ఇదివరకే చేసిన అద్భుతాలను మననం చేసుకోండి. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్నీ మరువకుండా జ్ఞాపకం చేసుకోండి. అది విధేయతతోనే సాధ్యం. మీ విధేయతే మరో అద్భుతానికి దారి సరాళం చేస్తుంది. ఆరో రోజున వారి విధేయతకు బహుమానంగా దేవుడు యెరికో గోడలు కూల్చాడు. అక్కడి నుంచే ఇశ్రాయేలీలను గొప్ప జనాంగంగా కట్టడం ఆరంభించాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
క్షమాపణే దివ్యౌషధం!
దైవాజ్ఞ ధిక్కారానికి పాల్పడ్డ తొలి మానవులైన ఆదాము, హవ్వల దుశ్చర్యతో మానవ చరిత్రలో ఆరంభమైన దిగజారుడుతనం వారి కుమారుడైన కయీను కారణంగా మరింత వేగవంతమయింది. తన అర్పణను కాకుండా తన తమ్ముడైన హేబెలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడన్న అక్కసుతో కయీను హేబెలను చంపి మానవ చరిత్రలో తొలి నరహంతకుడయ్యాడు. అది చూసిన దేవుడు నీ తమ్ముడెక్కడ అని నిలదీస్తే ‘అతనికి నేను కావలివాడనా?’ అంటూ దేవునికే ఎదురు తిరిగి దేవుని ఉగ్రత కారణంగా స్థిరత్వం లేక చంచలుడై జీవితాంతం అతనూ అతని జనాంగం కూడా దేశదిమ్మరులయ్యారు. అలా కయీను కారణంగా లోకానికి కోపం, అసూయ, అక్కసు, హత్య, అబద్ధం, దైవధిక్కారం, విద్వేషం వంటి ఎన్నో అవలక్షణాలు పరిచయమయ్యాయి. కాని ‘నీ తమ్ముడెక్కడ?’ అన్న దేవుని ప్రశ్నకు ‘నన్ను క్షమించు ప్రభూ!’ అని కయీను బదులిచ్చి ఉంటే, దేవుని క్షమాశక్తితో మానవ చరిత్రలో ఎంతో పతనానికి అడ్డు కట్టపడి ఉండేది (ఆది 4:2–15). నిజమే, పాపాలు మూటకట్టుకోవడమంటే తేలిక కాదు. దైవాశీర్వాదాలు సంపాదించుకోవడం, పగ, కోపం మనిషిని మరుగుజ్జుగా మార్చితే చేసిన తప్పుకు క్షమాపణ అడగడం ద్వారా ఆ మనిషే హిమాలయమంత ఎత్తుకు ఎదుగుతాడు. బలహీనులు తమ తప్పును ఒప్పుకోలేరు, క్షమాపణ అడగలేరు కూడా. క్షమాపణ అడగడం అత్యంత బలవంతుల సులక్షణం. క్షమించే వ్యక్తి కన్నా క్షమాపణ అడిగే వ్యక్తి ఉన్నతమైనవాడు. ఎందుకంటే క్షమాపణతో తనకు లభ్యమయ్యే ప్రశాంతత, ఆనందం, ఆహ్లాదంలో కొంత భాగాన్ని క్షమించే వ్యక్తికి కూడా అతడు పంచుతాడు గనక. మన దౌర్భాగ్యమేమిటంటే, క్షమించమన్న భావనే కాని సారీ లాంటి నామమాత్రపు పదజాలాన్ని సృష్టించుకుని, అద్భుతమైన క్షమాశక్తిని మనమే నిర్వీర్యం చేసుకున్నాం. నిజమైన ప్రేమ అంటే క్షమించే నిరంతర శక్తి. అన్నది యేసుప్రభువు బోధల్లో, జీవితంలో కూడా నిరూపితం అయింది. లోకానికున్న ఏ రుగ్మతనైనా, మానవాళికున్న ఎంతటి దౌర్భాగ్యాన్నైనా స్వస్థపరచి ఆనందాన్ని పునరుద్ధరించగలిగిన దైవాస్త్రం, దివ్యౌషధం క్షమాపణ!! అపరాధ భావనతో బరువెక్కిన జీవితాన్ని, మన గుండెను క్షమాపణ శక్తితో దూదిపింజకన్నా తేలికగా మార్చుకోగలిగి కూడా పగ, కక్ష, ప్రతీకా రానికి పాల్పడి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం ద్వారా మనిషి అవివేకమంతా బయట పడుతోంది. మనం విషం తాగుతూ మన శత్రువులు చనిపోవాలనుకోవడమే, శత్రువులను క్షమించడానికి నిరాకరించి పగను పెంచుకోవడమన్న నెల్సన్ మండేలా మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే క్షమాశక్తిని ఎరిగిన సద్వర్తనుడు ఆయన. అందుకే ముళ్లకంపను కూడా పూలగుత్తిగా మార్చే శక్తి క్షమాపణది!! దేవుని అంతులేని ఔన్నత్యం, శక్తి ఆయన క్షమా స్వభావం ద్వారానే విడివడి, మానవాళిని పరలోక పౌరులను చేస్తుంది. ఈ లోకాన్ని ప్రేమ అనే పరిమళంతో నింపుతుంది. – రెవ.డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాసిని చక్కదిద్దే ముల్లు!
గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందడం దేవుని సృష్టిలో ఒక మహాద్భుతం. అదే ఒక సీతాకోకచిలుక గొంగళిపురుగుగా మారితే..? అది ఆ తర్వాత వినాశకరమైన, వికృతమైన పరిణామం. ఈనాడు మన చుట్టూ జరుగుతున్న పరిణామమిది. మనిషికున్న రోగాలన్నింటికీ మందులున్నాయేమోగానీ, అతనిలోని జీవన ప్రమాణాలు, విలువల దిగజారుడుకు విరుగుడు మందు లేదు. పైకి ఎంతో హుందాగా, అందంగా కనిపించే సభ్యమానవుని ఆంతర్యంలోని దిగజారుడుతనం అనే గొంగళిపురుగు స్వభావానికి ప్రతిరూపమే ఈనాడు సమాజంలో పెచ్చరిల్లుతున్న హింస, ఊచకోతలు, పగలు, ప్రతీకారాలు, కుట్రలు, అందమైన ఉద్యానవనంగా ఉండేందుకు దేవుడు నిర్దేశించిన మానవ జీవితాలు, అతని చుట్టూ ఉన్న సమాజంలో విలువలూ, ప్రమాణాలూ అంతరించిపోయి క్రమంగా పాడుదిబ్బగా మారుతున్న నేటి పరిస్థితికి కారణం మనిషి తన పూర్వపు గొంగళి పురుగు స్వభావాన్ని సంతరించుకోవడమే!! ఇది మనిషికీ, మొత్తం సమాజానికే ఒక ముల్లుగా మారింది. మరేం చేయాలి? తన జీవితంలో కూడా ఒక ముల్లు ఉండిందని, మూడుసార్లు ప్రార్థించినా దేవుడు దాన్ని తొలగించలేదు సరికదా, దాన్ని భరించేందుకు చాలినంత పనిస్తానన్నాడని, నా కృప నీకు చాలునని దేవుడు బదులిచ్చాడని పౌలు రాసుకున్నాడు (2 కొరింథి 12:7–9). అదే అపొస్తలుడైన పౌలు గొప్పదనం!! అపొస్తలుల్లో అత్యంత ప్రభావంతో కూడిన పరిచర్య చేసిన పౌలు నిజానికి నేను ప్రార్థన చేస్తే తిరుగు లేదు, నేను ఏదడిగితే అది దేవుడిచ్చాడు అని రాసుకోవచ్చు. ఆ ముల్లు ప్రస్తావన తీసుకు రావలసిన అవసరమే లేదు. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పుకోగలిగిన తన అందమైన సీతాకోకచిలుక లాంటి జీవితంలో, అబద్ధాలాడే లేదా ఆ నిజాలను కప్పిపుచ్చే తన పూర్వపు గొంగళిపురుగు స్వభావాన్ని అతను మళ్లీ ఆశ్రయించదలచుకోలేదు. విశ్వాస జీవితంలో విజయమంటే అదే!! ప్రార్థనా జీవితమే అన్ని ముళ్లకు, సమస్యలకూ పరిష్కారం. ప్రార్థిస్తే దేవుడు ఆ ముల్లు తొలగించవచ్చు. ఒకవేళ ఆ ముల్లు కొనసాగడమే దేవుని సంకల్పమైతే, దాన్ని భరించే శక్తిని దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించవచ్చు. దేవుడు తన సంపూర్ణ శక్తిని కృప ద్వారా మన జీవితాల్లో ప్రవహింపజేసినప్పుడు అది అన్ని రంగాలనూ తాకి ఆనందమయం చేస్తుంది. మనిషి పతనమయ్యే ప్రమాదం ఉందనుకుంటే ముల్లును నలుగగొట్టడం ద్వారా అతని పతనాన్ని అరికట్టి ఆశీర్వాదపు బాటకు మళ్లించేదే దేవుని కృప!! సముద్రంలోని నీళ్లను, ఆకాశపు నక్షత్రాలను, లోకంలోని ఇసుక రేణువులను కొలువలేనట్టే దేవుని కృపను కూడా కొలువలేము. దేవుని శక్తి నిరూపణ ఆ కృప ద్వారానే జరిగి అవసరమైతే నలగగొట్టి అయినా సరే, విశ్వాసిని అతని ద్వారా సమాజాన్ని శాంతిమయం, ఆనందదాయకం చేస్తుంది!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సంశయం లేని నమ్మకమే దృఢవిశ్వాసం
మతం మనిషికుంది. దేవునికి లేదు. ఈ విధి విధానాలను బోధించడానికి, అమలు చేయడానికీ తనకంటూ ప్రత్యేక జనాంగంగా యూదులను ఏర్పర్చుకున్నా, యేసుకీస్తు వంశావళిలోనే రూతు అనే మోయాబీయురాలిని దేవుడు చేర్చడం ఆయన సార్వత్రికతకు స్పష్టమైన నిదర్శనం (మత్త 1:5). రూతు మోయాబీయాలనే అన్యురాలు. యూదు దేశంలో క్షామం ఏర్పడినప్పుడు నయోమి అనే తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకుని ఎలీమెలెకు అనే వ్యక్తి మోయాబు దేశానికి వలస వెళ్లాడు. కాని అక్కడ మరిన్ని కష్టాలెదురై, ఎరీమెలకు, అతని ఇద్దరు కుమారులు చనిపోగా, వారిద్దరిలో ఒకరికి భార్యౖయెన రూతు తన అత్తను, ఆమె దేవుణ్ణి గొప్పగా విశ్వసించి ఆమెతో సహా వారి స్వస్థలమైన బెత్లెహాముకు తిరిగొచ్చింది. బతకడానికి వలస వెళ్లిన నయోమి కుటుంబం అక్కడ మరింత చితికిపోయి అలా తిరిగొచ్చింది. అయితే ధర్మశాస్త్రం వితంతువుల పునర్వివాహాన్ని అదే వంశంలో కొన్ని షరతులకు లోబడి జరిగేందుకు అనుమతించింది. ఆ పరిస్థితులలో పూట గyì చేందుకుగాను రూతు కోతలు జరుగుతున్న కాలంలో పరిగె ఏరుకోవడానికి, బోయజు అనే గొప్ప యూదు విశ్వాసికి చెందిన పొలానికి వెళ్లింది. చేలల్లో పంట కోసే సమయంలో కొన్ని పనలు, ధాన్యం నిరుపేదలు, పరదేశుల కోసం వదలాలన్న దేవుని నిబంధన మేరకు బోయజు ఆమెను తన పొలంలో పరిగె ఏరుకోమన్నాడు. పైగా ఆమె గురించి ఎంతో దయగా మాట్లాడి ఆమెను బాధించ వద్దని తన పనివారిని హెచ్చరించాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో, బోజయు తన ‘బంధువు ధర్మం’ చొప్పున రూతును పెళ్లాడగా వారికి మనుమడైన యెష్షయికి దావీదు జన్మించాడు. ఆ దావీదు వంశంలోనే యేసుక్రీస్తు కూడా జన్మించాడు. అలా రూతు మోయాబీయురాలైనా, ఒక రాజవంశంలో భాగమైంది. దేవుని సంకల్పాలు అనూహ్యమైనవి, అమరమైనవి కూడా!! పరిగె ధాన్యాన్ని ఏరుకోవడానికి ఒక పరదేశిగా, నిరుపేదగా వెళ్లిన రూతును దేవుడు కనికరించి బోయజు అనే సద్వర్తనుడు, సొంత వంశస్తుని పొలానికి నడిపించి, చివరికి అతన్నే భర్తగా అనుగ్రహించి, యేసుక్రీస్తు వంశావళిలో భాగమయ్యే ధన్యతను దేవుడామెకిచ్చాడు. దేవుని విశ్వసించడమే రూతు చేసిన పని. ఆ తరువాత జరిగిందంతా దేవుని సంకల్పం మేరకు జరిగిపోయింది. అందుకే ఆయన మన గురించి చింతించే దేవుడని బైబిలు చెబుతోంది (1 పేతురు 5:7). విశ్వాసానికి విరుద్ధాంశం సంశయం!! విశ్వాసుల జీవితాల్లో అశాంతిని రేపేవే సంశయాలు, సందిగ్ధాలు!! దేవుని పట్ల మనకున్న విశ్వాసంలో స్పష్టత, దృఢత్వం ఉండాలి. ఆశీర్వాదాల వరదకు అవే కారణాలవుతాయి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వాసికి నిజమైన అలంకారం విధేయతే!
పరాక్రమం హద్దులు దాటితే అది అరాచకం సృష్టిస్తుంది, అనర్థదాయకమవుతుంది. దావీదు సైన్యాధిపతి యోవాబు విషయంలో అదే జరిగింది. ఎన్నో యుద్ధాల్లో అతను దావీదుకు చేదోడు వాదోడుగా నిలిచి యుద్ధాలు గెలిపించాడు. కాని అతనిది కుట్రపూరితమైన స్వభావం, నిచ్చెనలెక్కే విషయంలో అందెవేసిన చేయి. తనవంటి శూరులే అయిన అబ్నేరు, అమాశాను చక్రవర్తి అయిన దావీదు ఆజ్ఞకు విరుద్ధంగా చంపి, దావీదు సైన్యానికి చివరికి రాజకుమారుడైన అబ్షాలోమును కూడా రాజాజ్ఞను ఉల్లంఘించి స్వయంగా చంపాడు. యోవాబు మహా పరాక్రమవంతుడే, కాని ‘విధేయత’లో అత్యంత బలహీనుడు. విజ్ఞత, విచక్షణ, లోపించిన పరాక్రమమతనిది. అలాటి వాడివల్ల దేశానికి మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుందన్న ముందు చూపుతో, దావీదు తన వారసుడైన సొలోమానుకు యోవాబు చేసిన రాజవ్యతిరేక చర్యలు వివరించి చెప్పి యోవాబు విషయంలో ‘నీకు తోచినట్టుగా చేయమని’ హెచ్చరించాడు. తానెంతో పరాక్రమవంతుణ్ణని, తనకెదురు లేదని భావించే యోవాబు ‘విచ్చలవిడితనం’తో సోలోమోను శత్రువులతో కలిశాడు. అదే అదనుగా భావించి సోలోమోను అతన్ని హతమార్చి, తనకూ, దేశానికీ కూడా ఉన్న బెడదను శాశ్వతంగా రూపుమాపాడు. లోకంలో చాలామంది జ్ఞానులు, పరాక్రమవంతులు, విజ్ఞుల బలహీనత తకున్న ‘హద్దులు’ తెలుసుకోలేకపోవడమే. ఎంతటి శూరుడైనా రాజాజ్ఞకు బద్ధుడు. ఈ చిన్న విషయం అంతటి పరాక్రమవంతుడైన యోవాబుకు తెలియకపోవడం ఆశ్చర్యం. శూరుని విధేయతే అతని పరాక్రమానికి వన్నె తెస్తుంది. దేవుని పరిచర్య ‘బ్రహ్మాండంగా’ చేసే చాలా మంది దైవ జనుల్లో, ఆ దేవుని పట్ల ‘విధేయత’ లోపించిన ప్రతిసారీ వారిలో ఒక యోవాబు కనిపిస్తాడు. దేవుడు అప్పగించిన పనిని మనం ఎంతో గొప్పగా చేస్తున్నామన్నది ఏమాత్రం ప్రాముఖ్యం కాదు. దేవుని పట్ల ఎంత విధేయంగా ఉంటున్నార్నదే వారి ప్రతిభకు గీటురాయి. ఎంతో శూరులనుకున్న చాలామంది చివరి దశలో ఆత్మీయంగా, కేరక్టర్ పరంగా దిగజారి చరిత్రహీనులు కావడానికి దారి తీసిన ఒకే కారణం దేవునిపట్ల వారి అవిధేయత. విశ్వాసికి నిజమైన అలంకారం విధేయతే! గొప్ప పనులు చేయడం ద్వారా కాదు, దేవుడు చెప్పిన పనులు చేయడం ద్వారా దేవునికి ప్రీతిపాత్రమవుతాం. యేసుప్రభువు చెప్పిన ఒక ఉపమానంలోని యజమానికి తాను చెప్పినట్లు చేసిన తన సేవకుణ్ణి ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా!’ అని అభినందిస్తాడు. దేవుని దృష్టిలో గొప్ప దైవజనులుండరు. నమ్మకమైన విధేయ దైవజనులు మాత్రమే ఉంటారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
లోకం వద్దనుకున్నవాళ్ళే దేవునికి కావాలి!
పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని యేసు తన శిష్యుల ఎంపిక ద్వారా ఆవిష్కరించాడు. వారి ఎంపికకు ముందు ఒక కొండపైకి వెళ్లి ఒక రాత్రంతా ప్రార్థించాడు. తరువాత 12 మందిని తన శిష్యులుగా ఏర్పర్చి వారికి ‘అపొస్తలులు’ అంటే ‘పంపబడినవారు’ అనే పేరు పెట్టారు. ఆయన పరిచర్య చేసేది ఈ లోకంలో మూడున్నరేళ్ళు. తన మరణం, పునరుత్థానం, పరలోకారోహణం తరువాత తన రెండవ రాకడ సమయం దాకా క్షమాసువార్తను, దేవుని ప్రేమతత్త్వాన్ని లోకమంతా చాటించే మహాకార్యం కోసం దేవుడు ఈ పన్నెండుమందినీ ఏర్పర్చారు. మూడున్నరేళ్లపాటు తనతోనే వారిని పెట్టుకొని అద్భుతమైన తర్ఫీదునిచ్చాడు. కాని ఆ మూడేళ్లలో వారి పోకడలు చూసిన వారికి వాళ్ళసలు యేసు శిష్యులయ్యేందుకు అర్హులేనా? అన్న అనుమానం రాకమానదు. రాత్రంతా ప్రార్థనలో గడిపిన యేసు ఇలాంటి వారినా ఎన్నుకున్నది? అని అంతా ముక్కున వేలేసుకున్నారు (లూకా 6:12–19). వారిలో ఒకరైన యూదా ఇస్కరియోతు అయితే ఏకంగా యేసుకు ద్రోహమే చేశాడు. ఇదొక ఊహాత్మక సన్నివేశం! ఈనాటి ఒక గొప్ప కంపెనీకి ఆ 12 మంది బయోడేటా, ప్రొఫైల్ పంపారట! కంపెనీ ఉన్నతాధికారి ఇచ్చిన విశ్లేషణ ఇది ‘మీ 12 మంది శిష్యుల వివరాలు విశ్లేషించాము. వారిలో చాలామందికి తగిన విద్య లేదు, వృత్తిపరమైన అవగాహన లేదు, వారి కుటుంబాలు కూడా గొప్పవి కాదు. పేతురు దుడుకువాడు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. అతని సోదరుడు ఆంద్రెయకు అసలు నాయకత్వపు లక్షణాలేలేవు. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను పూర్తిగా స్వార్థపరులు. వారికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ప్రతీదీ అనుమానించే తోమా మీ బృందంలో కొనసాగితే అందర్నీ చెడగొడ్తాడు. ఎందుకంటే అనుమానానికి అక్కాచెల్లెళ్లు బంధువుల బోలెడుమంది ఉంటారు. పన్నులు వసూలు చేసే గొప్ప ఆదాయ వనరులున్న వృత్తి కన్నా మీరు అప్పగించి ఆత్మల సంపాదన వృత్తి గొప్పదని భావించి మీతో చేరిన మత్తయికి సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తాలేదు. యాకోబు కుమారుడైన యూదా, సీమోను తదితర శిష్యులంతా తీవ్రవాద స్వభావం కలిగినవారు. ఆ పన్నెండు మందిలో ఒక్క యూదా ఇస్కరియోతు అనే ఆ వ్యక్తికి మాత్రమే పట్టుదల, ముందుచూపు, వ్యూహారచనా సామర్థ్యం ఉంది. అతనొక్కడే మీరిచ్చే ఉద్యోగానికి అర్హుడు’ అన్నది విశ్లేషణ. కాని దేవుడు మనుషుల్లాగా ఆలోచించడు. పనికిరాని వారని లోకం ముద్రవేసినా వారే భూ దిగంతాలకు సువార్త తీసుకువెళ్ళి ఈనాటి క్రైస్తవానికి బీజం వేశారు. లోకం మిమ్మల్ని విసర్జించి ఆడిపోసుకొంటోందా? దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన దృష్టిలో అంతా అర్హులే! అంతా ఆశీర్వాదాలకు పాత్రులే, ఆశీర్వాదాల పంపకానికి పాత్రులే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
శిక్షించడం కాదు... క్షమించడమే దేవుడి శక్తి
యేసుక్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యలు ఒక స్త్రీని తెచ్చి ఆయన ముందు నిలబెట్టి, ‘ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంటోంది. మరి నీవేమంటావు? అని ప్రశ్నించారు. ఆనాటి సమాజంలో పరిసయ్యలు, శాస్త్రుల దౌర్జన్యం అంతా యింతా కాదు. రానున్న కొద్దిరోజుల్లో వాళ్లు తనకు కూడా వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి సిలువ శిక్ష వేయించనున్న ఘనులని యేసుకు తెలుసు. ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమన్న స్త్రీని క్షమించమని ప్రభువంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ చేస్తున్నారంటూ ఆయన మీద నేరారోపణ చేయాలని, రాళ్లతో కొట్టి చంపండని తీర్పు చెబితే, మరి అందర్నీ క్షమించాలన్న నీ బోధ మాటేమిటని నిలదీయాలన్నది వారి పన్నాగమని ప్రభువుకర్థమైంది. అందుకే వారికి చిక్కనివిధంగా ప్రభువు జవాబిచ్చాడు. ‘‘రాళ్లతో కొట్టండి కాని ఎన్నడూ పాపం చేయనివాడు మొదటి రాయి వేయాలని ప్రభువు ఆదేశించడంతో అంతా బిత్తరపోయి ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ‘‘నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక ముందు పాపం చేయకుండా జీవించు’’ అని చెప్పి ఆ స్త్రీని ప్రభువు పంపించాడు (యోహాను 8:1–11). ఈ సంఘటన తర్వాతే ‘నేను లోకానికి వెలుగును’ అన్న అద్భుతమైన ప్రకటనను ప్రభువే చేశాడు (8:12). ప్రభువు వెలుగు కాబట్టే, ఆయన వెలుగులో ఆ స్త్రీ చేసిన పాపం మాత్రమే కాదు, ఆమె పాపి అంటూ రాళ్లతో కొట్టేందుకు సిద్ధమైన వారందరి పాప జీవితం బట్టబయలయింది. ‘తీర్పు’ చెప్పేవాడు అన్నివిధాలా నిర్దోషిగా, ఆదర్శప్రాయమైనవారిగా ఉండాలన్న కనీస సూత్రాన్ని పాటించని నాటి సమాజం, నేటి సమాజం కూడా యేసుక్రీస్తు వెలుగులో దాని డొల్లతనమంతా బట్టబయలవుతోంది. ఎంతటి కఠినమైన తీర్పైనా చెప్పగల పాపరహితుడైన యేసుక్రీస్తు, శిక్షించడానికి కాకుండా పాపిని రక్షించడానికి, అలా అతన్ని సంస్కరించి లోకానికి ఆశీర్వాదంగా మార్చడానికి సమర్థుడన్నది చరిత్ర చెప్పే సత్యం!!! అలా యేసుక్రీస్తు ‘క్షమాశక్తి’ చేత సంపూర్ణంగా నింపబడిన ఒకనాటి పాపులు, పామరులు, అణగారిన వర్గాలవారే చరిత్రను తిరగరాశారు. ‘దేవుని శక్తి’కి కేంద్రాలయ్యారు. ‘మేమింత గొప్పవాళ్లం కదా, పాపులమెలా అవుతాం?’ అన్న భావనతో ఉన్నవారికి దేవుని శక్తి అర్థం కాదు. మన జీవితాల్లో దేవుని శక్తి నిరూపణ, దేవుని క్షమాపణతోనే ఆరంభమవుతుంది. దేవుని క్షమాపణ పొందకుండా దేవుని ద్వారా గొప్పగా వాడబడటం అసాధ్యం. దేవుడు క్షమించిన విశ్వాసి దేవుని చేత గొప్పగా వాడబడకుండా ఉండటం అసాధ్యం. రాళ్ల కుప్పలకింద శవంగా మారవలసిన నాటి స్త్రీ, ఆ తర్వాత ప్రభువు పరిచారికగా మారి ఎందరికో ఆశీర్వాదంగా మారడం దేవుని శక్తికి నిదర్శనమే కదా!! – రెవ. టి.ఎ.ప్రభుకిరణ్ -
కాళ్లు కడిగిన ప్రభువాయన!
హోలీవీక్ రేపు ఉదయం యేసుకు సిలువ శిక్ష. ఈ రాత్రి తనకు అత్యంత సన్నిహితుడైన 12 మంది శిష్యులతో చివరి పస్కా పండుగ ఆచరించాడు. సిలువలో బలికావడానికి ముందుగా విందు భోజనం! విందుకు ఆహ్వానించిన వ్యక్తి అతిధుల్లో అత్యంత ప్రముఖులు, మతబోధకుల కాళ్లు కడగడం యూదా సంప్రదాయం!! ఆహ్వానించిన వ్యక్తి పాత్రను యేసు స్వీకరించి విందులో శిష్యులందరి పాదాలు వంగి కడిగి తువాలుతో శుభ్రంగా తుడవడం శిష్యులు తట్టుకోలేకపోయారు. తనకు యూదా ఇస్కరియోతు ద్రోహం చేసి అప్పగించబోతున్నాడని ఎరిగి అతని పాదాలు కూడా ప్రభువు కడిగాడు. ఏ విధంగా చూసినా శిష్యులంతా యేసుప్రభువు కన్నా తక్కువవారు, కొద్ది గడియల్లో సిలువనెక్కనున్న యేసును వదిలి ప్రాణ రక్షణ కోసం పారిపోనున్నవారు. వారిలో ఒకరైతే యేసును అప్పగించనున్నవాడు... ఇలాంటి వారి పాదాలను ప్రేమతో కడిగాడు యేసుక్రీస్తు. పాదాభివందనాలు చేయించుకోవడం, పాదాలు కడిగించుకోవడమే గొప్పతనానికి సూచనగా విశ్వసించే లోకానికి తలవంచడం, ఒకరిపాదాలు ఒకరు కడుగుకునేంతగా ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం నిజమైన గొప్పతనమని, అలా తమను తాము తగ్గించుకునేవారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడని యేసు ఆచరణాత్మకంగా నిరూపించాడు. యేసులాంటి బోధకుడు లోకంలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే బోధించిన ప్రతి అంశాన్ని జీవితంలో ఆచరించి చూపించాడాయన. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవాలయాన్ని శుద్ధి చేసిన యేసు
దాదావీదు సమకూర్చిన సామాగ్రి, సంపదతో రాజధాని యెరూషలేములో సొలొమోను ఓ ఆలయాన్ని నిర్మించాడు. దేవుడు దాన్ని తన మహిమతో నింపాడు. కాలక్రమంలో ఇశ్రాయేలీయులకు దేవుని కన్నా ఆలయమే ప్రాముఖ్యమైంది. ఈ రోజుల్లో కూడా దేవునికి విశ్వాసికి మధ్య వారధిగా ఉండాల్సిన ఆలయం, వారిద్దరికీ మధ్య అడ్డుగోడగా మారింది. అప్పటికే ఆలయాన్ని నెబుకద్నెజరు అనే బబులోను రాజు ధ్వంసం చేస్తే, హేరోదు దాన్ని పునర్నిర్మించాడు. అయినా ఆలయం మతపరమైన అవినీతికి, మతదౌర్జన్యానికి నిలయంగా మారగా నాటి యూదు మతపెద్దలు, యాజకులు కలిపి ఒక ‘దళారీ వ్యవస్థ’గా మారి ప్రజల్ని దేవుని పేరిట పీడించి ధనార్జనకు పూనుకున్నారు. దైవకుమారుడైన యేసు ఆలయ ప్రక్షాళనకు పూనుకొని అక్కడి వ్యాపారులు, దళారుల మీద కొరడా ఝుళిపించాడు. ఎంతో సౌమ్యుడు, శాంతిపిపాసి అయినా యేసుప్రభువు ఆలయావినీతి పట్ల ఉగ్రరూపమెత్తాడు. దైవ నివాసాన్ని దొంగల గుహగా మార్చారంటూ అక్కడి వారిని పారదోలాడు. దేవుడు సృష్టించని ‘డబ్బు’ క్రమేణా ఆలయంలో దేవుని స్థానాన్నే ఆక్రమించిన దుర్మార్గతను, ప్రేమకు మారుపేరుగా ఉండాల్సిన దైవమానవ బంధాల్లో ‘వ్యాపార సంస్కృతి’ విస్తరించడాన్ని యేసు జీర్ణించుకోలేకపోయాడు. స్వయంగా దేవాలయ ప్రక్షాళనకు పూనుకున్నాడు. దేవునికన్నా దేవాలయాలు, చర్చిలే ఎక్కువ విశిష్టతను పొందడం దేవుని అవమానించడమే! దేవుని దృష్టిలో డబ్బు చిత్తుకాగితాలే, వెండి బంగారాలు ఇనుపముక్కలే! ఆయనకు కావలసింది విశ్వాసిలో నిర్మలత్వం, ప్రేమ, పదిమందికీ ప్రయోజనకరంగా మారగల విశ్వాసం, పేదల పట్ల ఆదరణ! – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
ప్రతి అనుభవమూ ఆణిముత్యమే!
చార్లిస్ ఫ్రాన్సిస్ ఆడమ్స్ 19వ శతాబ్దపు మహా మేధావి. ఆయన కొడుకు బ్రూక్ ఆడమ్స్ కూడా గొప్ప మేధావి. తండ్రి చార్లెస్ తన డైరీలో ఒక రోజు ‘మా అబ్బాయి బ్రూక్తో చేపల వేటకు వెళ్లాను. దినమంతా వృధా అయింది’ అని రాసుకున్నాడు. ఆ రోజు గురించే బ్రూక్ తన డైరీలో ‘నాన్న నాతో చేపల వేటకు రావడం మహదానందకరం. మరువలేని రోజు ఇది’ అని రాసుకున్నాడు.ముందు మన జీవితం విలువ తెలిస్తే ఆయా అనుభవాల అంతరార్థం తెలుస్తుంది. అయితే మనకంటూ జీవితోద్దేశ్యం కూడా ఒకటుండాలి. ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించిన పౌలును, అతని అనుచరులను అక్కడివారు ఎదిరించి తీవ్రంగా కొట్టి జైలులో వేశారు. పౌలు, ఆయన బృందం జైలులో పాటలు, ప్రార్థనలతో గడిపారు. దేవుని సంకల్పంతో ఆ రాత్రి భూకంపం వచ్చి చెరసాల తలుపులు తెచుకున్నాయి. ఖైదీల సంకెళ్లు విడిపోయాయి. అయినా ఒక్క ఖైదీ కూడా పారిపోకపోవడం నాటి రాత్రి జరిగిన అద్భుతం! పౌలు పాటలు, ప్రార్థనలు, మాటలు వారిని జైలులో అంతగా కట్టివేశాయి. చివరకు ఖైదీలు, జైలరు అతని కుటుంబం కూడా ఆ రాత్రి రక్షణ పొందారు (అపొ.కా. 16:16-40). నైరాశ్యం, నిట్టూర్పులు, రోదనలతో నిండిన జైలు ఆ రాత్రి గొప్ప సువార్త సభకు, ఆత్మల సంపాదనకు వేదిక అయింది. అలా అత్యంత ప్రతికూలతలో, అర్ధరాత్రివేళ అపురూపమైన ఫిలిప్పీ చర్చి ఆవిర్భవించింది. అప్పుడు డైరీలుంటే ‘దెబ్బలు తిని జైలు పాలైన కాళరాత్రి’ అని రాసుకునే బదులు ‘కరడు కట్టిన ఖైదీలను, కఠినాత్ముడైన జైలరును దేవుడు రక్షించిన శుభరాత్రి’ అని పౌలు రాసుకొని ఉండేవాడు. మనిషికి ప్రధాన శత్రువు, మిత్రుడు కూడా అతని దృక్పథమే. దేవుని ప్రేమ మనకర్థం కాకపోతే మన జీవితం విలువ మనకు అర్థంకాదు. ప్రాణమిచ్చేందుకు కూడా సిద్ధపడి ప్రసవంలో బిడ్డను కంటుంది కాబట్టే తల్లి తన బిడ్డను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తుంది. దేవుని త్రాసులో ఒకవైపు తన పరలోక భూలోక వైభవాన్నంతటినీ, మరోవైపు ‘పాపిని’ పెడితే, పాపి ముందు అదంతా తేలిపోయింది కాబట్టే యేసుక్రీస్తు అదంతా వదిలేసి, రిక్తుడిగా, దాసుడుగా, సాత్వికుడుగా ఈ లోకానికి పాపిని రక్షించేందుకు వేంచేశాడు. చివరకు రక్షకుడుగా సిలువలో ప్రాణమిచ్చి మరీ పాపిని గెలుచుకున్నాడు. ఏది వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న దాన్ని బట్టే మనం పొందాలనుకుంటున్నది ఎంత విలువైనదో అర్థమౌతుంది. కోటీశ్వరులకు, ప్రతిభావంతులకు, పాలకులకు, ఉన్నత వర్గాల వారికి ఈలోకం పెద్ద పీట వేస్తుంది. కానీ సర్వశక్తిమంతుడు, సర్వైశ్వర్యమంతుడూ అయిన దేవుడు మాత్రం పేదలు, పాపులు, దాసులు, బలహీనుల కోసమే తాపత్రయపడ్తాడు. ఒక వ్యక్తికి అనుకోకుండా ధనమో, పదవో, మరేదైనా లాభమో కలిసొస్తే లోకం చప్పట్లు కొడుతుంది. కానీ ఒక పాపి పరివర్తన చెందిన ప్రతిసారీ పరలోకం ఆనందసంబరాలతో మారుమోగుతుందని యేసుక్రీస్తే ప్రకటించాడు (లూకా 15:7). పడిపోయిన వారిని పునరుద్ధరించడమే ఇతివృత్తంగా ‘దేవుని ప్రేమ కథ’ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ ఆనందాన్ని అర్థం చేసుకునే ఆదిమ విశ్వాసులు, భక్తులు, స్వచ్ఛందంగా ఉరికంబాలెక్కారు. పులులకు ఆహారంగా వేయబడ్డారు. సజీవంగా దహనమయ్యారు. వారి ప్రాణత్యాగ సాక్ష్యాలే సజీవ విత్తనాలై సువార్తోద్యమానికి అంకురార్పణ చేసేశాయి. రుమేనియా జైలులో విశ్వాసియైన ఖైదీని ఒక అధికారి చితకబాదుతూ ‘నిన్ను కొట్టకుండా ఆపే శక్తినీ దేవునికి, నీకూ ఉందా?’ అని విర్రవీగాడు. ‘‘నువ్వెంత కొట్టినా నిన్ను ప్రేమించకుండా నన్ను ఆపే శక్తి నీకుందా?’ అని సవాలుతో కూడిన జవాబిచ్చాడు మహాభక్తుడైన రిచర్డ్ వర్మ్బ్రాండ్ అనే ఆ ఖైదీ.’’ - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ prabhukiran123@rediffmail.com -
అందరివాడు దేవుడు...
అడపాదడపా పూజలు చేసి ముడుపులిస్తే చాలు. దేవుడు ప్రసన్నుడవుతాడన్నది చాలామందికున్న ఒక చులకన భావం. ఆది మానవుడైన ఆదాము హవ్వల కుమారులు కయీను, హేబెలు ఒకసారి దేవునికి కానుకలర్పించారు. దేవుడు కయీనుని తిరస్కరించి మేబెలు కానుకలు స్వీకరించాడు. దాంతో అసూయపడిన కయీను పగబట్టి తమ్ముడైన హేబెలును హత్య చేశాడు. విశ్వాన్నే సృష్టించి పాలించే దేవునికి నా కానుక ఎంత? ఆయన కోరేది నా కానుకలా, నా సత్ప్రవర్తనా? అన్న ఇంగితం కోల్పోయిన కయీను అలా చరిత్రలో తొలి హంతకుడయ్యాడు. దేవునికి దూరమైతే, విశ్వాసం లోపిస్తే ఎదురయ్యేవి ఈ అనర్థాలే. ‘నిషిద్ధ ఫలాన్ని తింటే మీరు దేవునితో సమానమవుతారు’ అన్న అపవాది అబద్ధాన్ని నమ్మి ఆ ఫలం తిన్న ఆదాము, హవ్వలు, ‘దేవుడు తమను ఆయన పోలికలోనే సృష్టిస్తే మళ్లీ దేవుళ్లము కావడమేమిటి? అన్న కనీస జ్ఞానం లోపించి అవిధేయులయ్యారు. అలా సాతాను సృష్టించిన ఒక అబద్ధం, అవిధేయతకు ఆ తరువాత తరంలో అసూయ, కోపం, పగకు తద్వారా హత్యకు మానవాళిని పురికొల్పింది. అలా తరాలు గడిచేకొద్దీ మనిషికి దేవునితో అంతరం పెరిగింది. ఆ దూరం కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని మనిషిలో ఏర్పర్చింది. అత్యంత పరిశుద్ధుడైన దేవుడు అక్కడెక్కడో దూరంగా అందకుండా ఉంటాడని, నానా ప్రయత్నాలు చేస్తే తప్ప ఆయన ప్రసన్నుడు కాడని మనిషి అలా సిద్ధాంతీకరించుకున్నాడు. సూర్యుడెక్కడో కోట్లాది మైళ్ల దూరంలోనే ఉన్నా ఆయన కిరణాలు రోజూ భూమిని తాకకుండా ఉంటాయా? దేవుడూ అంతే! సూర్యుణ్ణి, ఆయన రశ్మిని విడదీయలేనట్టే దేవుణ్ణి, ఆయన స్వభావమైన ప్రేమనూ విడదీయలేము. ఆయనెక్కడున్నా ఆయన ప్రేమ, కృప మనిషికి నిత్యం అందుబాటులోనే ఉంటుంది. విశ్వాన్నే సృష్టించి పరిపాలించే దేవుడు గుప్పెడైనా లేని మనిషి గుండెలో నివాసం ఉండాలనుకోవడం ఎంతో ఆశ్చర్యకరం. తిరుగులేని ఆయన ప్రేమకు నిదర్శనం కూడా. - రెవ. టి.ఎ.ప్రభుకిరణ్