Rajasthan Elections 2018
-
ముఖాల్లో మాత్రమే విజయ దరహాసం
సాక్షి, న్యూఢిల్లీ : కుడి ఎడమల అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లతో కలిసి ఉల్లాసంగా నవ్వుతున్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దానికి ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్’ అని కూడా శీర్షిక తగిలించారు. ఫొటోలో ఉన్న ముగ్గురిలోనూ విజయ దరహాసం కనిపిస్తోంది కానీ, అది అర్ధ సత్యం మాత్రమే. మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు ముగ్గురు సీఎంలను ఎంపిక చేయడంలో రాహుల్ గాంధీ తన నిర్ణయాత్మక నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు తేలిన రోజునే మూడు రాష్ట్రాల సీఎంలను రాహుల్ గాంధీ ఖరారు చేయాల్సింది. ముఖ్యమంత్రి పదివికి పోటీపడిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లను ఒప్పించడానికి ఆయనకు ఇన్ని రోజులు పట్టడం, పార్టీమీద ఇంకా ఆయన పట్టు సాధించలేదనడానికి నిదర్శనం. ఈ రోజు గహ్లోత్, సచిన్లు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెల్సిందే. రాజస్థాన్తో పోలిస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ను ఖరారు చేయడం చాలా సులువు. అయినా ఆయన పేరును ఖరారుచేయడానికి రాహుల్ గాంధీ మూడు రోజుల సమయం తీసుకున్నారు. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘెల్ పేరును రాహుల్ మరింత ఆలస్యంగా ఆదివారం నాడు ప్రకటించారు. రాజస్థాన్ సీఎం పదవికీ గహ్లోత్, సచిన్ పైలట్లు పోటీ పడుతున్నారని, వారిద్దరు తమకు అనుకూలంగా కార్యకర్తలతోని ర్యాలీలు నిర్వహించారన్న విషయం రాహుల్ గాంధీకి తెల్సిందే. సీఎం పదవికి సచిన్ పైలట్ వైపు ముందునుంచి మొగ్గుచూపిన రాహుల్ గాంధీ పార్టీ పెద్దల సలహా మేరకు గహ్లోత్ను అంగీకరించక తప్పలేదని, సచిన్ను డిప్యూటీగా ఒప్పించినప్పటికీ గహ్లోత్ను ఒప్పించలేకపోయారన్న విషయం ఇంటా బయట తెల్సిందే. ఒకరకంగా గహ్లోత్, రాహుల్, సచిన్ పైలట్లలో ఎవరు విజయం సాధించలేదు. గహ్లోత్కు సీఎం పదవి దక్కినప్పటికీ డిప్యూటీగా సచిన్ వద్దన్న మాటను నిలబెట్టుకోలేకపోయారు. సచిన్ను సీఎంగా కోరుకున్న రాహుల్ అలా చేయలేకపోయారు. ఇక సీఎం పదవిని ఆశించిన సచిన్ డిప్యూటీగా సర్దుకోవాల్సి వచ్చింది. రాజస్థాన్ శాసన సభ్యులు ముఖ్యమంత్రి ఎన్నికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని చేసినప్పుడు ఠక్కున సీఎం పేరును ప్రకటించి నిర్ణయాత్మక నాయకత్వాన్ని నిలబెట్టుకునే అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. ఊగిసలాట ధోరణి వల్ల పార్టీ పట్ల అంతగా పట్టులేదనే సందేహం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చినట్లు అయింది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదుర్చేందుకు మూడు రోజుల సమయం తీసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. పార్టీని నడపడంలోనే నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించలేని ఓ నాయకుడు రేపు దేశానికే ఎలా నాయకత్వం వహిస్తారన్న అనుమానం ప్రజలకు కలగక మానదు. -
పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!
జైపూర్: రాజ్కుమార్ రోట్.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్కుమార్.. రాజస్తాన్ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రాజ్కుమార్ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
సీఎం గహ్లోత్, డిప్యూటీ పైలట్!
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నేత అశోక్ గహ్లోత్(67), యువ నేత సచిన్ పైలట్(41) మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్ గాంధీ చేసిన యత్నాలు ఫలించాయి. సీఎంగా అశోక్ గహ్లోత్ను, డిప్యూటీ సీఎం పదవికి పైలట్ను ఎంపిక చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆ ఇద్దరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేసి, లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎడారి రాష్ట్రం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్కు రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ తెరదించారు. సీనియర్ నేత అశోక్ గహ్లోత్ ముఖ్యమంత్రిగా, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ను ఉపముఖ్యమంత్రిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయిచిందని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు జైపూర్ చేరుకుని గవర్నర్ కల్యాణ్సింగ్తో భేటీ అవుతారని తెలిపారు. ప్రమాణ స్వీకారం తేదీ ఆ తర్వాతే ఖరారవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. పైలట్తో కలిసి రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తా’ అని గహ్లోత్ తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో గహ్లోత్తో కలిసి అద్భుత ఫలితాలను సాధించాం. ఇదే జోరును 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ కొనసాగిస్తుంది. కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేస్తాం’ అని సచిన్ పైలట్ తెలిపారు. 2013 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్..ఇటీవలి ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుని బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేత అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మూడుసార్లు చర్చలు జరిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధులపై పార్టీ సీనియర్ నేతలతోపాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనూ రాహుల్ భేటీ అయ్యారు. అంతిమ నిర్ణయాన్ని అధ్యక్షుడు రాహుల్కు వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా తీర్మానించిన తర్వాత హైకమాండ్ నిర్ణయాలను పాటించి తీరాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలిపారు. అయితే, పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో రాహుల్ సఫలీకృతులయ్యారు. అందుకే ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. అనంతరం ముగ్గురు నేతలు సంతోషాన్ని పంచుకుంటున్న ఫొటోతోపాటు ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్తాన్’ అనే కామెంట్ను ట్విట్టర్లో ఉంచారు. మద్దతుదారుల ఆనందోత్సాహాలు సీఎంగా అశోక్ గహ్లోత్, డెప్యూటీ సీఎంగా సచిన్ పైలట్లను అధిష్టానం ఖరారు చేయడంతో ఇద్దరు నేతల మద్దతుదారులు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి గహ్లోత్ మద్దతుదారులు జైపూర్లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయనే సీఎం అవుతారని ఆసక్తిగా ఉన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎంగా ఎంపికైన ప్రకటన వెలువడగానే స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. డోళ్ల చప్పుళ్లతో నృత్యాలు చేశారు. సచిన్ పైలట్ మద్దతుదారులు కూడా సందడి చేశారు. పీసీసీ కార్యాలయం మద్దతుదారులతో నిండిపోయింది. ఇద్దరు నేతల నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింధియా తిరస్కారం.. సచిన్ అంగీకారం మధ్యప్రదేశ్, రాజస్తాన్ల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని దాదాపు మూడు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టాయి. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సీనియర్లు, పార్టీ అధ్యక్షుడు రాహుల్తోపాటు సోనియా గాంధీ, ప్రియాంక కూడా పాలుపంచుకున్నారు. సింధియా, పైలట్లలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్, ప్రియాంక గట్టిగా వాదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనిద్వారా కాంగ్రెస్లో యువరక్తానికి ప్రాధాన్యం ఉంటుందనే విషయం చాటి చెప్పాలని వారు వాదించారని వెల్లడించాయి. అంతిమంగా వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్ను మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరస్కరించగా రాజ స్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో సీఎం పీఠానికి అర్హత సాధించేందుకే పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 1988లో రాజీవ్ హయాంలో శివ్ చరణ్ మాథుర్ సీఎంగా ఉండగా గహ్లోత్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. కాంగ్రెస్ కట్టప్ప.. గహ్లోత్! రాజస్తాన్ కాబోయే సీఎం గహ్లోత్ కాంగ్రెస్కు ‘కట్టప్ప’ వంటివారు. మూడు తరాలుగా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా వ్యవహరించడమే గహ్లోత్కు సీఎం పదవి దక్కేందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గహ్లోత్లోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించింది ఇందిరా గాంధీ. రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకు దోహదపడింది సంజయ్ గాంధీ. ఆయనను రాజస్తాన్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసి రాష్ట్ర రాజకీయాలకు పంపింది రాజీవ్ గాంధీ. సోనియాగాంధీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న గహ్లోత్ ఇప్పుడు రాహుల్ గాంధీకి అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ చంద్రగుప్తుడయితే గహ్లోత్ చాణక్యుడు. గాంధీ కుటుంబం మరుగున పడ్డ సమయంలో ప్రభుత్వ, పార్టీ పగ్గాలు చేపట్టిన పివీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారితో కూడా గహ్లోత్ సత్సంబంధాలు నెరపారు. ఆయన అనుసరిస్తున్న గాంధేయవాదం, ఆడంబరాలకు పోకుండా ఉండటం, నిజాయితీ, హుందాతనం ఇవన్నీ గహ్లోత్ను ఉత్తమ నేతగా తీర్చిదిద్దాయి. ఎన్నికల వ్యూహ రచనలో నిష్ణాతుడిగా పేరొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ రాని నేపథ్యంలో అనుభవజ్ఞుడు, రాజకీయ నిర్వహణ దక్షుడు అయిన గహ్లోత్ అవసరం రాష్ట్రానికి, పార్టీకి ఎంతైనా ఉందని అధిష్టానం భావించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ నుంచి మెజారిటీ సంఖ్యలో ఎంపీలను పంపాలంటే గహ్లోత్ వంటి రాజనీతిజ్ఞుడు సీఎం పీఠంపై ఉండాలని అధిష్టానం భావించింది. లోక్సభ ఎన్నికల వరకు గహ్లోత్ను తనతోనే ఉంచుకోవాలని రాహుల్ అనుకున్నారు. ‘పైలట్’కు కోపైలట్ బాధ్యతలు జైపూర్/న్యూఢిల్లీ: డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ యువనేత విమానాల్ని సైతం నడపగలడు. అంతే చాకచక్యంతో 2013లో ఘోర పరాజయం పాలైన పార్టీని 2018లో విజయతీరాలకు నడిపించారు. కానీ, శుక్రవారం నాటి పరిణామాలతో ఆయన కోపైలట్ బాధ్యతలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనే సచిన్ పైలట్(41)!. దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కొడుకైన సచిన్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి నియోజకవర్గం దౌసా నుంచి 2004లో ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. 1995లో అమెరికాలో పైలట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్గానూ పనిచేశారు. 2013లో రాజస్తాన్లో పార్టీ ఘోర పరాజయం అనంతరం..మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా తలపాగా ధరించబోనని శపథం చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని బలోపేతం చేసేందుకు, జనంతో మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఇంగ్లిష్ వార్తా చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో ధాటిగా మాట్లాడగలిగే సచిన్.. గ్రామీణ ప్రజలతోనూ అంతే సులువుగా మమేకమై పోతారనే పేరుంది. కాంగ్రెస్ విజయంతో పైలట్ మళ్లీ అందమైన ‘సాఫ’ ధరించనున్నారు. -
గహ్లోత్ ఓ పొలిటికల్ మెజీషియన్!
రాజస్తాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక పార్టీ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ కృషి చాలా ఉంది. రాష్ట్రంలో పార్టీ మనుగడే ప్రమాదంలో పడిన క్లిష్ట సమయంతో తన అనుభవంతో, వ్యూహాలతో పార్టీకి జీవం పోశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ సీఎం రేసులో, యవ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పోటీ పడుతున్నారు. గహ్లోత్ది ఇంద్రజాలికుల కుటుంబం. చిన్నతనంలో తండ్రికి (బాబు లక్ష్మణ్ సింగ్) సహాయకుడిగా ఇంద్రజాల ప్రదర్శనల్లో పాల్గొనేవారు. రాజకీయాల్లోకి రాకుంటే మెజీషియన్ అయ్యేవాడినని గతంలో అన్నారు. రాహుల్, ప్రియాంక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సమక్షంలో వారి ముందు గహ్లోత్ ఇంద్రజాల విద్య ప్రదర్శించే వారని చెబుతుంటారు. గహ్లోత్ మాలి కులస్ధుడు. గాంధేయవాదిగా పేరొందిన గహ్లోత్ మతాచారాలను ప్రేమిస్తారు. వాటిని పాటిస్తారు. గహ్లోత్కు సాత్వికాహారమే ఇష్టం. సూర్యాస్తమయం నుంచి తెల్లారేదాకా ఏమీ తినరు. ఇందిర గుర్తించిన నేత ఈశాన్య భారతం శరణార్ధుల సమస్యతో సతమతమవుతున్న సమయంలో ఇందిరా గాంధీ అక్కడి శరణార్థి శిబిరాల్ని సందర్శించారు. అక్కడ వాలంటీర్గా పనిచేస్తున్న గహ్లోత్ మొదటి సారి కలుసుకున్నారు. అప్పటికి గహ్లోత్కు 20 ఏళ్లు. గహ్లోత్లోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిర ఆయనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇండోర్లో జరిగిన ఏఐసీసీ సమావేశానికి హాజరయిన గహ్లోత్కు అక్కడ సంజయ్గాంధీతో పరిచయమయింది. త్వరలోనే గహ్లోత్ సంజయ్కు అత్యంత ఆప్తుడిగా మారారు. గహ్లోత్ను సంజయ్ ఏరికోరి మరీ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాజస్తాన్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. ఎమర్జెన్సీకాలంలో సంజయ్ బృందం చేపట్టిన మురికివాడల నిర్మూలన, కుటుంబ నియంత్రణ వంటి పలు కార్యక్రమాల్లో గహ్లోత్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాకే గహ్లోత్ ఢిల్లీలో, రాజస్తాన్లో ఒక వెలుగు వెలిగారు. రాజీవ్ మంత్రివర్గంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. రాజకీయంగా ఎంత ఎదిగినా స్నేహితులు, సామాన్య ప్రజలతో కలిసి మెలిసి ఉండటం గహ్లోత్కు అలవాటు. గహ్లోత్ తన సొంత ఊరైన జోధ్పూర్లో రోడ్డుపక్క టీ బడ్డీ దగ్గర కూర్చుని వచ్చే పోయే వారితో ముచ్చటించేవారు. రెండు సార్లు సీఎం 1998 నుంచి2003 వరకు, 2008 నుంచి 2013 వరకు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా ఉన్న గహ్లోత్ కేంద్రంలోనూ పలు కీలక పదవులు అలంకరించారు. సైన్సు, లాలో డిగ్రీలు చేసిన ఆయన ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1951, మే3న జోధ్పూర్లోని మహామందిర్లో జన్మించారు. ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయిన గెహ్లాట్ ప్రస్తుతం సర్దార్పుర నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
తేల్చాల్సింది రాహులే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/జైపూర్: బీజేపీ నుంచి రాజస్తాన్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారుచేయడంపై కసరత్తును ముమ్మరం చేసింది. బుధవారం జైపూర్లో జరిగిన పార్టీ నూతన శాసనసభా పక్ష సమావేశంలో సీఎం ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొత్త సీఎంను ఎంపికచేసే బాధ్యతను పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ కల్యాణ్ సింగ్ను విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సీఎం పదవికి రేసులో ఉన్న సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్ ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజస్తాన్ కొత్త సీఎంపై రాహుల్ గాంధీ గురువారం నిర్ణయం తీసుకుంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే వెల్లడించారు. రాజస్తాన్ అసెంబ్లీలో ఉన్న 200 స్థానాలకు గాను 199 చోట్ల పోలింగ్ జరగ్గా, కాంగ్రెస్ 99 సీట్లు, బీజేపీ 73 సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) ఒక సీటును కైవసం చేసుకోవడంతో ఆ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించింది. ఇతరులు, స్వతంత్రులు కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా మంతనాలు.. ఏఐసీసీ ప్రతినిధిగా జైపూర్ వెళ్లిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం జరిగింది. గంటల తరబడి చర్చలు జరిపినా తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక చేసేదేమీ లేక సీఎం ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశం ముగిశాక వేణుగోపాల్ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎల్పీ భేటీ, ఎమ్మెల్యేల అభిప్రాయలతో కూడిన నివేదికను రాహుల్కు సమర్పిస్తామని అవినాశ్ పాండే తెలిపారు. రాజస్తాన్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధేనని, కాబట్టి సీఎంను కూడా ఆయనే ఎంపిక చేయాలని రాష్ట్ర నాయకుడు పరశురాం మోర్దియా అన్నారు. ఇదిలా ఉండగా, సీఎం ఎంపిక బాధ్యతను రాహుల్కు కట్టబెట్టాక కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ ప్రశ్నించారు. మరోవైపు, ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత రాక ముందే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కాంగ్రెస్ నాయకుల బృందం గవర్నర్ కళ్యాణ్సింగ్ను కోరింది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ల నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయి, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తమకు ఉందని తెలిపారు. ఢిల్లీకి గహ్లోత్, పైలట్ అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లలో ఒకరిని రాజస్తాన్ సీఎంగా ఎంపికచేయడం కాంగ్రెస్ కాస్త తలనొప్పిగా మారింది. ఇక వారిద్దరితోనే నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్న రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకున్నారు. గత ఐదేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడిన పైలట్కే సీఎం పదవి అప్పగించాలని రాహుల్ కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే గతంలో పదేళ్లు సీఎంగా పనిచేసిన అశోక్ గహ్లోత్ అంతర్గత వ్యవహారాల్ని చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఆయనైతేనే సమర్థంగా నడపగలరని భావిస్తున్నారు. పైలట్, గహ్లోత్లను ఒకేచోట కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని రాహుల్ యోచిస్తున్నారు. సీఎం పదవి కోసం వారిద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తినా లోక్సభ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని భావించిన రాహుల్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
సింధియా, సచిన్లకు షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి తమకు దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్ యువ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లకు నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా పేరును పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించి ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు కమల్నాథ్ను ప్రతిపాదించడంతో అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో కావాల్సిన మెజారిటీకి ఒక్క సీటు తక్కువ రావడం, ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్కు కేవలం ఐదు సీట్ల దూరంలో ఉండడం వల్ల అనుభవజ్ఞులు కావాలన్నది సీనియర్ల వాదన. ఇక రాజస్థాన్ విషయంలో అశోక్ గెహ్లాట్ను ముఖ్యమంత్రిని చేసి, సచిన్ పైలట్ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అయితే డిప్యూటీ సీఎం పదవికి సచిన్ పైలట్ పేరును స్వయంగా అశోక్ గెహ్లాట్ తిరస్కరించారని తెల్సింది. పార్టీకి పూర్తి మెజారిటీ రాని ప్రస్తుత సమయంలో సంకీర్ణ రాజకీయాలు నడపాలంటే రెండు అధికారిక కేంద్రాలు ఉండరాదన్నది గెహ్లాట్ వాదన. యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లకు వయస్సు ఉన్నందున వారికి మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంటుందన్నది పార్టీలో సీనియర్ల వాదన. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ముందుగా ఖరారు చేయలేదు. అలా చేస్తే ముఠాలు ఏర్పడుతాయని, ఫలితంగా పరాజయం ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్లో సచిన్ పైలట్లు పార్టీలో ఆధిపత్య పోరును పక్కనపెట్టి పార్టీ విజయం కోసం చిత్తశుద్ధితో కషి చేశారు. రాహుల్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇస్తారని వారి నమ్మి ఉండవచ్చు. అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు రాహుల్ గాంధీ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత జూనియర్లతోపాటు సీనియర్లను కలుపుకుపోవాలని నిర్ణయించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ ఆఫీసు బేరర్లు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండేలు సచిన్కు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రయిన అశోక్ గెహ్లాట్కు రాష్ట్ర ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. ఇక కమల్నాథ్ వరుసగా తొమ్మదోసారి పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అధిష్టానం ఆయనకే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. చత్తీస్గఢ్ రేస్లో చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి పార్టీ రాష్ట్ర చీఫ్ భూపేశ్ భాగెల్, అవుట్ గోయింగ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీఎస్ సింగ్ దేవ్, మాజీ కేంద్ర మంత్రి చరణ్దాస్ మహంత్; పార్టీ ఏకైక ఎంపీ తామ్రధ్వాజ్ సాహు పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడే అయినప్పటికీ భాగెల్కు పదవి దక్కక పోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను రాసిన టీఎస్ సింగ్ దేవ్కు దక్కవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి శాసన సభ్యులు తమ నాయకుడిని అధికారికంగా ఎన్నుకుంటారు. -
విజయం వైపు నడిపిన ‘పైలెట్’
జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలెట్ కుమారుడే సచిన్ పైలెట్(41). ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలెట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2004లో దౌసా నియోజకవర్గం నుంచి ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సచిన్ 1995లో అమెరికాలో ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పలుమార్లు పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్గానూ పనిచేశారు. డ్రైవింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రముఖులు.. గెలుపోటములు రాజస్తాన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే(ఝల్రాపటన్), పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్ను ఝల్రాపటన్ నియోజకవర్గంలో వసుంధరాపై కాంగ్రెస్ బరిలోకి దించింది. వసుంధరా చేతిలో ఆయన 34,980 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్ భిల్వారా స్థానం నుంచి 74వేలకు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముఖ్య నేతల్లో జోహ్రీలాల్ మీనా(రాజ్గఢ్–లక్ష్మణ్గఢ్), మదన్ ప్రజాపత్(పచ్పద్ర), జహీదా ఖాన్(కమన్), రామ్లాల్ జాట్(మండల్), ప్రశాంత్ బైర్వా(నివాయి) ఉన్నారు. అలాగే, బీజేపీ నేతల్లో సంతోష్(అనూప్గఢ్), కాలూరామ్(దాగ్), సామారామ్ గరైసా(పిండ్వారా–అబు), జగ్సిరామ్(రియోదార్) విజయం సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధుల్లో సందీప్ కుమార్(తిజారా), వజీబ్ అలీ(నాగర్) గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన సీపీఎం ఈసారి బల్వాన్ పునియా (భద్ర), గిరిధారీలాల్ మహియా (శ్రీ దుంగార్గఢ్)లను గెలిపించుకుంది. నీటి వనరుల మంత్రి రామ్ ప్రతాప్, రెవెన్యూ మంత్రి అమ్రారామ్, గోపాలన్ మంత్రి ఓతారాం దేవసి(సిరోహి), పర్యాటక శాఖ మంత్రి యూనస్ఖాన్ ఓటమి పాలయ్యారు. -
ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’
రాజస్తాన్లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్పుట్లు, జాట్లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్ ఖాన్, రాజ్పాల్ సింగ్ షెకావత్, అరుణ్ చతుర్వేది, శ్రీచంద్ క్రిప్లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు.. అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్పుత్రులు వెర్సస్ రాజేగా మారిపోయాయి. రాజ్పుత్కు చెందిన గ్యాంగ్స్టర్ ఆనందపాల్ సింగ్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్పుత్ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్ యంత్రాంగం రాజే సర్కార్ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. పైలెట్+ గెహ్లాట్= కాంగ్రెస్ గెలుపు బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అయింది. సీనియర్ నేత గెహ్లాట్కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్ సక్సెస్ అయ్యారు. ఇక సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్ విజయానికి కారణమైంది. కాంగ్రెస్కు సవాలే రాజస్తాన్లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది. -
పీఠం ఎవరిది?
రాజస్తాన్ ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, రాజయాల్లో కాకలు తీరిన అశోక్ గెహ్లాట్ ఒకవైపు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువనేత సచిన్ పైలెట్ మరోవైపు సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. అలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్ పార్టీని పటిష్టం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కృషి ఎంతైనా ఉంది. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి బీజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్కు మళ్లించడానికి సచిన్ పాటుపడ్డారు. రాహుల్ ఆశీస్సులు కూడా తనకే ఉండడం సచిన్కు కలిసొచ్చే అంశం. ఇందిర మెచ్చిన గెహ్లాట్ అశోక్ గెహ్లాట్ను కూడా కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూడలేదు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్లో గెలిచిన శక్తిమంతుడైన నాయకుడు గెహ్లాట్. సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనను మించిన వారు లేరన్న పేరుంది. ఇందిరాగాంధీ మెచ్చిన గెహ్లాట్ సోనియాకు సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అనుచరగణం ఆయనకు ఎక్కువే. వారు మళ్లీ గెహ్లాట్నే సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్కు అత్యంత అవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి పార్లమెంట్ ఎన్నికలను కూడా సమర్థంగా నడిపించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ హిందూత్వ కార్డు, రాహుల్ ఆలయాల సందర్శన వంటి వ్యూహాలు గెహ్లాట్వే. అలాంటి ఉద్ధండుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెడితే లోక్సభ ఎన్నికల్ని కూడా సమర్థంగా నడిపిస్తారన్న అంచనాలున్నాయి. ఇక ప్రజాకర్షణ గెహ్లాట్కే అధికం. వివిధ సర్వేల్లో గెహ్లాట్ సీఎం కావాలని 35 శాతం మంది కోరుకుంటే, సచిన్ పైలెట్ సీఎం కావాలని 11 శాతం మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. వచ్చే ఏడాదే లోక్సభ ఎన్నికలు ఉన్నందున గెహ్లాట్ సేవలను రాజస్తాన్కే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్టు సమచారం. -
ఎడారి రాష్ట్రం ‘హస్త’ గతం
జైపూర్: ఊహించినట్లే రాజస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ప్రభావం చూపాయి. వసుంధరా రాజే నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రేసులో ఉన్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సైతం తమతమ స్థానాల్లో గెలుపొందారు. ఇక సీఎం ఎవరో తేల్చాల్సిన బాధ్యత అధిష్టానంపై పడింది. ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్లో సమావేశమై తమ నేతను ఎన్నుకోనున్నారు. నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అల్వార్ జిల్లాలోని రామ్గఢ్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిలిపివేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 100 కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 100, బీజేపీ 70 వరకు సీట్లు గెలుచుకున్నాయి. దీంతోపాటు బీఎస్పీ మూడు చోట్ల గెలిచి, మరో మూడు చోట్ల ముందంజలో ఉంది. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మూడు చోట్ల మెజారిటీ దిశగా ఉంది. సీపీఎం ఒక స్థానం గెలుచుకుని, మరో చోట ముందంజలో ఉంది. దాదాపు 12 చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశా లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ మధ్య సయోధ్య ఉందని చూపుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సచిన్ పైలెట్ మాట్లాడుతూ..స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి రెబెల్స్గా బరిలోకి దిగి గెలుపొందిన చాలామంది మా పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. నేడు జైపూర్లో జరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీకి పరిశీలకునిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు’ అని తెలిపారు. ఈ సమావేశం అనంతరం పార్టీ పరిశీలకులు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న పైలెట్, అశోక్ గెహ్లాట్లతోపాటు ఎమ్మెల్యేలందరితో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన నివేదికను అందజేస్తారు. బుధవారం సాయంత్రం జైపూర్లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎన్నికతోపాటు పలు విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అవినాష్ పాండే మీడియాకు తెలిపారు. గెహ్లాట్, పైలెట్ కాకుండా మరెవరైనా సీఎం రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా ఆ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఎమ్యెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుని ఆ నివేదికను హైకమాండ్కు అందజేస్తాను. అంతిమ నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే ఉంది’ అని కేసీ వేణుగోపాల్ వివరించారు. దేశమంతటా ఇదే ట్రెండ్: సచిన్ పైలెట్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశమంతటా సాధిస్తుందని సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాష్ట్రంలో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇది చరిత్రాత్మక దినం’ అని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్ధులు సహా భావసారూప్యం కలిగిన అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారు’ అని ఆయన తెలిపారు. ‘ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు, బీజేపీని వదిలి వచ్చే అభ్యర్ధులను కూడా కలుపుకుని పోతాం. మా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని గెహ్లాట్ తెలిపారు. -
రాజస్ధాన్లో మేజిక్ మార్క్కు చేరువగా కాంగ్రెస్
జైపూర్ : రాజస్ధాన్లో కాంగ్రెస్ ఆధిక్యత నిలుపుకుంటూ విజయపతాకం ఎగురవేసింది. పాలక బీజేపీతో హోరాహోరీ పోరులో సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకుఅ అవసరమైన మేజిక్ ఫిగర్ 100 సీట్లు కాగా, కాంగ్రెస్ ఇప్పటికే 102 స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, బీఎస్పీ ఐదు స్ధానాల్లో ఇతరులు 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్కు కలిసివచ్చింది. అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ దిశగా కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సచిన్ పైలెట్ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై దొరికిన బ్యాలెట్
జైపూర్ : రాజస్థాన్లో ఎన్నికల అధికారులు బ్యాలెట్ యూనిట్లను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బరాన్ జిల్లాలో కిషన్ గంజ్ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని షహాబాద్లో రోడ్డుపైనే బ్యాలెట్ యూనిట్ లభించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎం మిషిన్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. రోడ్డుపై లభించిన బ్యాలెట్ యూనిట్ను కిషన్గంజ్లోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్ సింగ్ హఠాన్మరణంతో ఆల్వార్ జిల్లా రామ్గఢ్ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. ఓటింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. -
ఈవీఎంలు జాగ్రత్త!
న్యూఢిల్లీ: రాజస్తాన్, తెలంగాణల్లో హోరాహోరీ పోరు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఈవీఎంల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘మధ్యప్రదేశ్లో ఈవీఎంలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. కొన్ని ఈవీఎంలు స్కూల్ బస్సును ఎత్తుకెళ్తే మరికొన్ని రెండు రోజులపాటు కనిపించకుండాపోయాయి. ఇంకాకొన్ని ఓ హోటల్లో తాగుతూ కనిపించాయి. మోదీ హయాంలో ఈవీఎంలకు అతీంద్రియ శక్తులుంటాయి’అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన 48 గంటల తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్రూంకు చేరాయన్న వార్తలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే, ఆ ఈవీఎంలు అదనంగా ఉంచినవే తప్ప పోలింగ్కు వాడినవి కాదని ఈసీ పేర్కొంది. స్ట్రాంగ్ రూంలలోని ఈవీఎంలకు తాము కల్పించిన మూడంచెల భద్రతపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. -
శరద్ యాదవ్ మాటలు సిగ్గుచేటు
జైపూర్: ఎన్నికల ప్రచారంలో తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన బుధవారం శరద్యాదవ్ మాట్లాడుతూ ‘రాజే చాలా లావై పోయారు, ప్రజలు ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు అవమానంగా అనిపించింది. నిజానికి ఇది మహిళా జాతికే అవమానం, ఆయన మాటలతో నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఒక అనుభవమున్న సీనియర్ నేత నుంచి ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం ఊహించలేదు’ అని ఆమె ఝలావర్లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిసారించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె కోరారు. శరద్ యాదవ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రసారం కావడంతో ప్రజల నుంచి కూడా ఆయన మాటలపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మొదట్లో ఆమె నాజూకుగా ఉంది. ఇప్పుడు విపరీతంగా లావైపోయింది. ప్రజలు ఆమెకు విశ్రాంతినిస్తే బావుంటుంది’’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ఓటింగ్పై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ ప్రభావం ఎంతన్నది తేలనుంది. -
రాజస్తాన్లో 74% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. గత 2013 ఎన్నికల్లో 75.23% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్ సింగ్ హఠాన్మరణంతో ఆల్వార్ జిల్లా రామ్గఢ్ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4.74 కోట్ల ఓటర్ల కోసం 51, 687 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. స్వల్ప ఘటనలు మినహా రాష్ట్ర మంతటా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. సీఎం అభ్యర్ధి వసుంధర 2003 నుంచి పోటీ చేస్తున్న ఝల్రాపటన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. వసుంధర ప్రధాన ప్రత్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ తనయుడు మాన్వేంద్రసింగ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా గట్టి పోటీ నిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈయన కాషాయాన్ని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతోపాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తుండగా ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా బీజేపీ ఏకైక ముస్లిం అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి యూనస్ ఖాన్ బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో దౌసా, అజ్మీర్ లోక్సభ స్థానాల నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన పైలట్ ఈసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు. దాదాపు 130 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 160, కాంగ్రెస్కు 25 మంది సభ్యుల బలం ఉంది. తాజా ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. మైళ్ల దూరం నడిచి... జోధ్పూర్: రాజస్తాన్లో 199 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాథూర్, మండి వంటి ప్రాంతాల్లో పోలింగ్ ఓ గంట ఆలస్యంగా ప్రారంభమవ్వగా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న బర్మార్, జైసల్మేర్ జిల్లాల ప్రజలు ఎడారిలో కొన్ని మైళ్ల దూరం నడిచి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలు వీరు నివసించే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉంటాయి. దూరాన్ని సైతం లెక్క చేయకుండా మారుమూల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్కు హాజరయ్యారు. ఈసారి పోలింగ్లో పాల్గొన్న మహిళలు సంఖ్య కూడా పెరిగింది. 101 ఏళ్ల పాలీదేవి అనే మహిళ బర్మార్లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. అలాగే బుండి జిల్లా హిందోలీ ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల కుస్నీబాయ్ చేతి కర్ర సాయంతో ఓటు వేసేందుకు వచ్చారు. జోథ్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బరన్ జిల్లా సుఖ్నాయర్ గ్రామ ప్రజలు ఓటింగ్లో పాల్గొనలేదు. తమ గ్రామ సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకపోవడంతో నిరసన తెలుపుతూ ఓటింగ్కు దూరంగా ఉన్నామని తెలిపారు. -
‘సెమీఫైనల్స్’ హీరో ఎవరు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్ల్లో పోలింగ్ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్నౌ– సీఎన్ఎక్స్ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రం మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్ తేల్చగా, కాంగ్రెస్ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్ – సీఓటర్ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్లో కాంగ్రెస్దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్ అంచనా. ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్, సీ ఓటర్–రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, న్యూస్24–పేస్ మీడియా, న్యూస్ ఎక్స్ నేత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది. వసుంధర రాజే, సచిన్ పైలట్ ‘మధ్యప్రదేశ్’ హోరాహోరీ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్సింగ్ చౌహాన్పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి. పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు! ‘పీపుల్స్ పల్స్’ కాంగ్రెస్కే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. ప్రాంతాల వారీగా అంచనా.. ► గ్వాలియర్: కాంగ్రెస్ పాపులారిటీ పెరిగింది ► బుందేల్ఖండ్: కాంగ్రెస్దే ఆధిపత్యం ► బాగేల్ఖండ్: కాంగ్రెస్దే ఆధిపత్యం ► మహాకోశల్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ► మాల్వా: కాంగ్రెస్కు మొగ్గు ► భోపాల్: బీజేపీకి స్వల్ప మొగ్గు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య మిజోరం ‘చే’జారుతుందా? ఈశాన్య భారత్లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్ఎన్ఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి. మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్ఎఫ్తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్ఎఫ్ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎంఎన్ఎఫ్కు 15–19 సీట్లు, కాంగ్రెస్కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో హంగేనా? బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్పోల్లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన కాంగ్రెస్ ఛత్తీస్గఢ్(జే), ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్సింగ్తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సీఎం రమణ్సింగ్ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్లో నువ్వా–నేనా ఛత్తీస్గఢ్లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్సింగ్కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి. అజిత్ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్ బాఘెల్, తామ్రధ్వజ్ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు. తెలంగాణలో 115 కోట్లు.. రాజస్తాన్లో 12 కోట్లు.. సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు. 4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. -
ఏ పార్టీది విజయమో చెప్పేది ‘మెవధ్’
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ దక్షణ మధ్య ప్రాంతమైన మెవర్ లేదా మెవధ్లో శుక్రవారం ఉదయం నుంచే పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతం విజయానికి రహదారి అని, ఏ పార్టీ విజయం సాధించి ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందో నిర్ణయించేది ఈ ప్రాంతం ఓటర్లేనన్నది రాజకీయ విశ్లేషకులు విశ్వాసం. ఇక్కడి ఓటర్లకు ఓ విచిత్రమైన ఆనవాయితీ ఉంది. 1998 నుంచి ఈ మెవధ్ ప్రాంతం ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు తప్ప, ఏనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన దాఖలాలే లేవు. అందుకనే 1998 నుంచి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తోందని రాజకీయ పరిశీలకుల అవగాహన. మెవధ్ పరిధిలోకి రాజస్థాన్లోని భిల్వారా, చిత్తోర్గఢ్, ప్రతాప్గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ఉదయ్పూర్ జిల్లాలు, ఝలావర్ జిల్లాలోని పిరవ తెహసిల్తోపాటు మధ్యప్రదేశ్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి. రాజస్థాన్లోని 200 సీట్లకుగాను రాజస్థాన్లోని మెవ«ద్ ప్రాంతంలో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ఏకంగా 25 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను గెలుచుకోగా, మరో సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. అంతకుముందు ఐదేళ్ల క్రితం, అంటే 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెవద్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ ప్రాంతం ఓటర్లు ఈ రోజు కూడా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం ఆనవాయితీగా మారిందిగదా అని ఓటేస్తున్నారా లేదా నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? అంటూ ఈ ప్రాంతం ఓటర్లను మీడియా కదిలించగా, తామేమి గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రావడం లేదని, ఈసారి వ్యతిరేకించడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని వారన్నారు. ‘రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. నిరుద్యోగం బాగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వ్యాపారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా బాగా నష్టపోయారు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, డీజిల్, కరెంట్ ధరలు బాగా పెరిగిపోయాయి’ అని వారన్నారు. ‘మా నాన్నది ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి వ్యవసాయంపై పెట్టారు. కనీసం పెట్టుబడి కూడా లేదు. అందుకనే నేను పొరపాటున కూడా వ్యవసాయం జోలికి వెళ్లదల్చుకోలేదు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంది. నేను చదువుకోవాలనుకోవడానికి ఒక కారణం మోదీ ఇచ్చిన హామీనే. అయితే ఆయన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది’ చిత్తోర్గఢ్కు చెందిన 18 ఏళ్ల యువకుడు మాన్సింగ్ తెలిపారు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బీజేపీ హనుమంతుడి కులం గురించి చర్చిస్తోందని బేగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బాబూ రామ్ విమర్శించారు. ‘2013 అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీజేపీకే ఓటేశాను. ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించాను. ఏం జరిగిందీ? పాలకులు కుల గోత్రాల గురించి, జాతి, మతాల గురించి, పటేల్, రాముడి విగ్రహాలు గురించి మాట్లాడుతున్నారు. విగ్రహాలేమైనా ప్రజలకు తిండి పెడతాయా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓపియం పంటకు కొత్త లైసెన్సులూ కారణమే! గంజాయి (ఓపియం) పంటకు 2017లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లైసెన్స్ నిబంధనలను మార్చిందని, ఫలితంగా ఇక్కడ ఎంతో మంది రైతులు లైసెన్సులు కోల్పోయారని, అది కూడా తమ ఆగ్రహానికి కారణమని ఓటర్లు చెబుతున్నారు. దేశంలో లైసెన్స్లతో ఉత్పత్తవుతున్న గంజాయితో 60 శాతం మెవధ్లోనే పండిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రాజ్పుత్లు కూడా ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లో దీపికా పదుకోన్ నటించిన ‘పద్మావత్’ సినిమాను నిషేధించాల్సిందిగా తాము దేశవ్యాప్తంగా ఆందోళన చేసినా వసుంధర రాజె ప్రభుత్వం తమకు న్యాయం చేయలేక పోయిందని, దాంతో తమ ప్రతిష్ట దెబ్బతిన్నదని ‘మెవర్ క్షత్రియ మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కృష్ణావత్ తెలిపారు. మేవధ్ ప్రాంతంలోని 16 అసెంబ్లీ సీట్లలో ఆదివాసీలు 73 శాతం ఉన్నారు. వారంతా కూడా పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 11 సీట్లలో కొత్తగా ఆవిర్భవించిన ‘భారతీయ ట్రైబల్ పార్టీ’ పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల వల్ల పాలకపక్ష ఓట్లే చీలుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
రాజస్తాన్ లైవ్ అప్డేట్స్: రికార్డు స్థాయిలో పోలింగ్
సాయంత్రం 5 : రాజస్థాన్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రం మొత్తంలో రికార్డు స్థాయిలో 72.7 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3.30 : రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతో ఫతేపూర్లోని సుభాష్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద అలజడి రేగింది. ఇరు వర్గాల వారు ఒకర్నొకరు నిందించుకుంటూ వాహనాలకు నిప్పుబెట్టారు.దీంతో 30 నిముషాలపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. పోలీసులు స్పందించి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేయడంతో పోలింగ్ తిరిగి ప్రాంభమైంది. రాజస్థాన్లో ఇప్పటివరకు 60 శాతం పోలింగ్ జరిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 2.30 : మహిళా ఓటర్లకు తిప్పలు తప్పటం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గంటల పాటు వేచి ఉన్నప్పటికి ఓటు వేసే అవకాశం వస్తుందో రాదో అన్న అనుమానాలతో మహిళా ఓటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. దుంగర్పూర్ జిల్లా దమ్బోలాలో అధికారులు మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అందంగా పోలింగ్ స్టేషన్ను తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 2.00 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 49.15 శాతం ఓటింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1.30 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 5నెలల చంటిబిడ్డను ఒడిలో ఎత్తుకుని విధులు నిర్వహిస్తోంది ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్. క్యూలైన్లో నిలుచుని ఉన్న ఓటర్లు వారిని ఆసక్తిగా చూడటం పరిపాటిగా మారింది. మధ్యాహ్నం 1 గంట వరకు 41.53 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1.00 : డీజీపీ ఒపి. గల్హోత్రా, స్పెషల్ డీజీ ఎన్ఆర్కే రెడ్డిలు పోలీస్ హెడ్ క్వాటర్స్లోని కంట్రోల్ రూం వద్దనుంచి ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాలలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 : జోధ్పూర్ రాజవంశీకులు గజ్ సింగ్ అతని భార్య.. సర్థార్పుర నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం: 194లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజ్మెర్ సౌత్లోని నాధ్ద్వారా, అల్వార్ అర్బన్ ప్రాంతాలలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం 12.00 : అత్యంత వయస్కురాలు 105 ఏళ్ల షాజ్హా అనే వృద్ధురాలు జైపూర్లోని కిషన్పురలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. వీల్ ఛైర్ల సదుపాయం లేకపోవటంతో పోలింగ్ బూత్ వరకు చేతులపై మోసుకుంటూ తేవాల్సివచ్చింది. కొన్ని చోట్ల వృద్ధులకు, దివ్యాంగులకు భద్రతా సిబ్బంది సహాయపడుతున్నారు. ఉదయం 11 గంటల వరకు 21.89 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 11.30 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జొతలి అనే గ్రామంలో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం ఒక ఓటరు మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జొతలి గ్రామస్తులు గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే వరకు ఓటు వెయ్యబోమని తేల్చిచెప్పారు. దీంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది. అధికారులు మాత్రం వారిని ఒప్పించి ఓటు వేయించటానికి ప్రయత్నిస్తున్నారు. యూనియన్ మినిష్టర్ అర్జున్ రామ్ మెగ్వాల్.. బికనెర్లోని పోలింగ్ బూత్ నెం: 172లో ఓటు హక్కును వినియోగించుకోవటానికి క్యూలైన్లో నిల్చున్నారు. ఉదయం 11.00 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు పూనమ్ జి. గోయల్ పోల్ బూత్లో సెల్ఫీ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోను ట్విటర్ ఖాతాలో ఉంచి, కాంగ్రెస్కు ఓటేశానంటూ చెప్పుకొచ్చారు. ఈ సంఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జలోర్ : అహోర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం: 253, 254లలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. ఉదయం 10.30 : కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ జోధ్పూర్లోని బూత్ నెం:106లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9.30 గంటల వరకు 10.15 శాతం ఓటింగ్ నమోదైంది. బికనెర్ : కిసమిదెసర్లోని బూత్ నెం: 172లో ఈవీఎం సాంకేతిక సమస్యల వల్ల కొత్త ఈవీఎంను ఏర్పాటు చేశారు. ఉదయం 10.00 : కేంద్ర సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్పూర్లోని పోలింగ్ బూత్ నెం: 128లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోధ్పూర్ జిల్లాలో 90 ఏళ్ల వృద్ధుడు ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని సర్థార్పుర నియోజకవర్గంలోని బూత్ నెం: 104 వద్దకు ఓ వ్యక్తి మోసుకువచ్చాడు. ఉదయం 9 గంటల వరకు 6.11 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 9.30 : యూనియన్ మినిష్టర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ జైపూర్లోని వైశాలి నగర్ బూత్ నెం: 252లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్తాన్ హోం మినిష్టర్ గులాబ్ చంద్ కటారియా ఉదయ్పుర్లోని ఓ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ జైపూర్లోని జలుపుర.. గౌర్ విప్ర్ సీనియర్ సెకండరీ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జలోర్ : అహోర్లోని పోలింగ్ బూత్ నెం: 253, 254లలో ఈవీఎంలు సరిగా పనిచేయకపోవటం కారణంగా పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం 9.00 : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జల్వార్లోని జల్రపతాన్ నియోజవర్గం బూత్ నెం:31ఎ పింక్ పోలింగ్ బూత్లో ఓటు వేశారామె. ఎన్నికల అధికారులు.. మహిళలు ఓటు వేయటానికి అనువుగా పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తంలో దాదాపు 200 పింక్ పోలింగ్ బూత్లు ఉన్నాయి. అజ్మెర్ సౌత్లోని బూత్ నెం:71లో పోలింగ్ ఆలస్యమైంది. పోలింగ్ అధికారులు బూత్ వద్దకు ఆలస్యంగా చేరుకోవటంతో భారీ సంఖ్యలో జనం క్యూలైన్లో నిలిచిపోయారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణతో పాటు భద్రతా సిబ్బంది ప్రతి వాహనాన్ని నిశితంగా పరీక్షిస్తున్నారు. ఉదయం 8.30 : రాజస్తాన్ హోం మినిష్టర్ గులాబ్ చంద్ కటారియా తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఉదయ్పూర్లోని శివాలయంలో పూజలు నిర్వహించారు. జైపూర్లోని పలు పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్కు ఆటంకం ఏర్పడింది. ఉదయం 8.00: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుసలో నిలబడ్డారు. ఉదయం 7.00: రాజస్తాన్లోని సర్థార్పుర నియోజకవర్గం బూత్ నెం:106లో మాక్పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 200 స్థానాలకు గాను 199 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. -
హోం మంత్రి కటారియాకు ఈసారి కష్టాలే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్లోని ప్రతిష్టాకరమైన ఉధంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన హోం మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియాకి మొదటి సారి ఓటమి భయం పట్టుకుంది. అదీ సొంత పార్టీ నాయకుడే కాకుండా ఇంతకాలం తన సహచరుడిగా ఉన్న దల్పత్ సురాణా నుంచే. పైగా ఆయన కూడా కటారియాలాగా జైనుడే కావడం గమనార్హం. 74 ఏళ్లు వచ్చినప్పటికీ యువతరానికి అవకాశం ఇవ్వకుండా ఆరోసారి కూడా కటారియా రంగంలోకి దిగడంతో, తాను తిరుగుబాటు అభ్యర్థిగా జనతాసేన టిక్కెట్పై నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని సురాణా తెలిపారు. మొదటినుంచి ఆరెస్సెస్ అండ కలిగిన కటారియాకు బీజేపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ‘నా లక్ష్యం ఒక్కటే కటారియాను ఓడించడం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు’ అని సురాణా వ్యాఖ్యానించారు. కటారియా తన తల బిరుసుతనంతో పార్టీలో ఎవరినీ ఎదగకుండా చేశారని ఆయన విమర్శించారు. తాను బరిలోకి దిగకపోతే కటారియాకు ప్రత్యర్థిగా నిలబడే దమ్ము ఎవరికీ లేదని, అందుకనే మొన్నటివరకు ఆయన అనుచరిడిగా కొనసాగిన తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 44 వేల మంది జైన ఓటర్లు ఉన్నారని, వారంతా ఇదివరకు కటారియాకే మద్దతిచ్చారని, ఇప్పుడు సురాణాకు ఇస్తున్నారని, ఆయనకు మద్దతిస్తున్న బ్రాహ్మణ నాయకుడు మంగేలాల్ జోషి తెలిపారు. ఆరెస్సెస్లోని యువత కూడా సురాణాకే మద్దతిస్తోంది. సురాణా ఎన్నికల్లో విజయం సాధించాక తిరిగి బీజేపీ పార్టీలోకి వస్తారని ఆ యువత భావిస్తోంది. కటారియాపై తిరుగుబాటు అభ్యర్థి సురాణా ఒక్కరే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ వీరాభిమాని, నమో విచార్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రటాలియా కూడా పోటీ చేస్తున్నారు. కటారియాను రాజ్పుత్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కటారియాను ఓడించే సత్తా ఎవరికి ఉంటే వారికే మేము ఓటు వేస్తాం’ అని ‘మేవర్ క్షత్రియా మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కష్ణావత్ తెలిపారు. ఇదివరకు తామంతా బీజేపీకే మద్దతు ఇస్తూ వచ్చామని, మేవర్లో 28 సీట్లుంటే బీజేపీ ఇద్దరు రాజ్పుత్లకు మాత్రమే సీట్లు ఇచ్చిందని, ఈ కారణంగా ఈ సారి తాము బీజేపీని ఓడించేందుకే కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. కటారియా మాత్రం అంతిమంగా విజయం తనదేనని చెబుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక మాట్లాడండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలపై ప్రజలు కోపంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ అంశాలను ప్రజలు ఇప్పుడు మరచిపోయరని అన్నారు. మరి ఉద్యోగాల హామీ గురించి ప్రస్తావించగా, పకోడీల లాంటి థియరీ నాకోటి ఉందని, దాంతోని యువతను ఆకట్టుకున్నానని ఆయన చెప్పారు. కానీ ఆయన మొహంలో అంతకుముందున్న ధీమా కనిపించడం లేదు. -
'రాజే'రికం కొనసాగేనా?
రాజస్తాన్లో 25 ఏళ్లుగా ఏ పార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదు. తిరిగి అదే సంప్రదాయం పునరావృతమవుతుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న వసుంధర రాజే సర్కార్ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదనే అంచనాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో అప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో బాగా కలిసొచ్చింది. కేవలం మోదీ ఇమేజ్ మీదే బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సారి కూడా మోదీ అంటే ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ.. వసుంధరా రాజే పరిపాలనే బీజేపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్లో రాజే మళ్లీ సీఎం కావాలని కేవలం 24% మంది మాత్రమే కోరుకున్నారు. ఇక ఇండియాటుడే సర్వేలో 35% మంది రాజేకు జై కొట్టారు. ప్రజల్లో మాత్రమే కాదు పార్టీలో కూడా అంతర్గతంగా ఆమెపై అసమ్మతి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామంటూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బహిరంగంగానే వెల్లడిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రభావితం చూపే అంశాలు రోజురోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగంతో యువత తీవ్ర అసంతృప్తితో ఉండడం ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్లతో రైతన్నలు నిరసనలకు దిగుతూనే ఉన్నారు. రైతుల్లో అసంతృప్తిని గుర్తించిన రాజే ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసింది. రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ చర్యతో 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ‘వసుంధరా సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైంది. అందుకే స్థానిక ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఓడించారు. కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. నిజానికి బీజేపీ పరిపాలనలో వాస్తవంగా లబ్ధి పొందింది లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్య మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఈ సారి అమలు కాని హామీలేవీ ఇవ్వలేదు. పాజిటివ్ డెవలప్మెంట్ అన్న అంశాన్నే తీసుకొని ముందుకు వెళుతోంది. అదే పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది’ అని రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పేర్కొన్నారు. -
ఎడారిలో దుమ్మురేపేదెవరో?
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ బీజేపీ, కాంగ్రెస్ల్లో ఎన్నికల ఫీవర్ పెరిగిపోతోంది. ఈ రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొని ఉండడంతో పై చేయి సాధించడానికి ఎవరికి వారే వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరెంత దూకుడు ప్రదర్శించినా పోలింగ్ రోజు బూత్ స్థాయిలో మేనేజ్మెంట్ చెయ్యగలిగినవారే కింగ్లు. బీజేపీ ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచి వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా చైతన్య పరచడం కోసం 10 లక్షల మందికిపైగా పార్టీ కార్యకర్తలను బూత్ వర్కర్లుగా నియమించింది. 7లక్షల మందికి పైగా పార్టీ సభ్యులు పోలింగ్ రోజు బూత్ దగ్గరే ఉండి పార్టీ ఓట్లు ఎటూ జారిపోకుండా చూస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏకంగా బూత్ మేనేజ్మెంట్ కమిటీలో 13 లక్షల మందిని నియమించింది. జనం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా వీరు చర్యలు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51,796 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్కో కేంద్రం వద్ద 27 మంది కార్యకర్తలు ఉండి పోలింగ్ క్షణం క్షణం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ రోజు కోసం రచించిన వ్యూహంలో ఏ మాత్రం తేడా రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ కార్యకర్తల్ని ముందు ఉంచి షో నడిపించనున్నారు.. ఇక బీజేపీ ఆరెస్సెస్ కేడర్ బలంపైనే ఆధారపడింది. ముఖాముఖి పోరు ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు నెలకొని ఉండడంతో రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడో ప్రత్యామ్నాయం ఎక్కడా బలంగా లేకపోవడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఘన్శ్యామ్ తివారి, హనుమాన్ బేణివాల్ ఆర్ఎల్పీ వంటి పార్టీలు తమదే విజయమంటున్నాయి. 15 నియోజకవర్గాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారిని స్వస్థలాలకు రప్పించి ఓటు వేయించడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. రాజే, గెహ్లాట్ దృష్టి బయటే! ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంపైనే దృష్టి సారించారు. పార్టీ అభ్యర్థుల తరఫున వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజే తన సొంత నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను తన కుమారుడు, పార్టీ ఎంపీ అయిన దుష్యంత్ సింగ్, కోడలు నిహారిక రాజేలకు అప్పగించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపైనే దృష్టి సారించిన గెహ్లాట్ (సర్దార్పుర) నియోజకవర్గంలో ప్రచారాన్ని కుమారుడు వైభవ్ గెహ్లాట్, కోడలు హిమాంశి, భార్య సునీత చూసుకుంటున్నారు. ప్రచారంలో కులకలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం దగ్గర్నుంచి రామభక్త ఆంజనేయుడు కులం వరకు ఈ సారి ఎన్నికల ప్రచారంలో కలకలాన్ని రేపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు సీపీ జోషి, విలాస్రావ్ మట్టెమ్వార్ వంటి వారు ప్రధాని మోదీ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మోదీ తండ్రి ఎవరంటూ ప్రశ్నించడం కూడా కలకలం రేపింది. దీనికి కౌంటర్గా కమలనాథులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోత్రం అంశాన్ని లేవనెత్తి ఆ పార్టీని ఇరుకున పెట్టారు. -
చాయ్వాలా కోర్టు మెట్లెక్కించాడు
సుమేర్పూర్/దౌసా: నాలుగు తరాలపాటు దేశాన్ని పాలించిన గాంధీల కుటుంబాన్ని నేడు ఓ చాయ్వాలా కోర్టు వరకు తీసుకొచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2011–12 ఆర్థిక సంవత్సరంలో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీల ఆదాయపు పన్ను వివరాలను తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారమే అనుమతివ్వడం తెలిసిందే. పాలి, దౌసా జిల్లాల్లో మోదీ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో నేను చూస్తా. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన కుటుంబాన్ని కోర్టుకు తీసుకొచ్చిన టీ అమ్మే వ్యక్తి ధైర్యాన్ని చూడండి’ అని మోదీ అన్నారు. అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మైకేల్ క్రిస్టియన్ను యూఏఈ నుంచి భారత్కు తీసుకొచ్చిన అంశాన్నీ మోదీ ప్రస్తావించి కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు. మైకేల్ నోరు తెరిస్తే తమ పేర్లు బయటకొస్తాయని గాంధీ కుటుంబం వణికిపోతోందనీ, ఇది వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకున్న కుంభకోణమని మోదీ అన్నారు. ‘మైకేల్ రాజకీయ నేతలకు సేవలందించాడు. ఇప్పుడు ఆ రహస్యాలను బయటపెడతాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం’ అని మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్లోని కుంభారం ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అని తప్పుగా పలికారు. దీనిపై మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ అంతా అయోమయంలో కూరుకుపోయిన పార్టీ అనీ, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దని కోరారు. గాంధీల కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందనీ, తమ పార్టీకి దేశమే కుటుంబమనీ, కాబట్టి మరోసారి రాజస్తాన్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్లో ముగిసిన ప్రచారం రాజస్తాన్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ–కాంగ్రెస్ల మధ్య సాగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రానికి ముగిసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలుండగా 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 199 మంది మహిళలు, 830 మంది స్వతంత్రులు సహా మొత్తం 2,274 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆళ్వార్ జిల్లాలోని రామగఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ ముఖ్య ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మొత్తం 4.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 130 స్థానాల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉండనుంది. మరో 50 సీట్లలో ఇరు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
ఈ సారి సహారియాల ఓటు ఎవరికి ?
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 72 మంది ఆకలితో చనిపోయారనే వార్త 2002లో జాతీయ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. వారిలో 47 మంది ఒక్క రాజస్థాన్లోని కిషాన్గంజ్ సమితిలోనే చనిపోవడం గమనార్హం. వారంతా కూడా సహారియా తెగకు చెందిన వారే కావడం మరింత గమనార్హం. ఈ ఆకలి చావులకు వ్యతిరేకంగా నాడు సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన పర్యావసానంగానే 2006లో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్)’, 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చాయి. కిషన్గంజ్ నియోజకవర్గంలోని ధిక్వాణి, రతాయి, ఖైరాయ్ గ్రామాల్లో సహారియాలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం రాజస్థాన్ రాష్ట్ర జనాభాలోనే 40 శాతం ఉన్న సహారియాలను షెడ్యూల్డ్ తెగల కింద గుర్తిస్తున్నారు. వారికి ఈ కిషన్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1985లోనే కేటాయించారు. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో నివసిస్తూ అటవి ఉత్పత్తులపై ఆధారపడి బతికిన సహారియాలు అడవులు ధ్వంసమవడం, పలచపడడం తదితర కారణాల వల్ల మైదాన ప్రాంతాల్లోకి వచ్చిపడ్డారు. అక్షరాస్యత ఏమాత్రంలేని వీరంతా కూలినాలి చేసుకుని బతికేవారే. చాలాకాలం వీరు భూస్వాముల వద్ద, ధనిక రైతుల వద్ద వెట్టి చాకిరి చేస్తూ బతికారు. ఆ చాకిరి నుంచి వీరికి విముక్తి కల్పించిందీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి కనీసం వంద రోజులు పని కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఏడాది క్రితం తాను 24 రోజులు పనిచేశానని, వాటికి కూలీ నేటి వరకు రాలేదని బరన్ జిల్లాలోని ధిక్వాని గ్రామానికి చెందిన కమలేష్ భాయ్ తెలిపారు. ఈ ఎన్నికలలోగానైనా కూలీ డబ్బులు వస్తాయని ఆశించానని, రాలేదని ఆమె చెప్పారు. డబ్బులు రాకపోతే ఆకిలితో చావడమో, వెట్టి చాకిరికి వెళ్లిపోవడమో తప్పేట్లు లేదని ఆమె వాపోయారు. మూడేళ్ల క్రితం వరకు ఉపాధి హామీ పథకం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, అప్పుడు తనతోపాటు ఎన్నో కుటుంబాలు భూస్వాముల వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందామని ఆమె తెలిపారు. మూడేళ్లుగానే నిధులు లేవంటూ ఆమె సతాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె ఆరోపణలతో మిగతా గ్రామాల ప్రజలు కూడా ఏకీభవించారు. ‘ఉపాధి హామీ పథకం మా జీవనాధారం’ అని రతాయ్ గ్రామానికి చెందిన అనితా సహారియా వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా ఈ పథకం ఎందుకనో సవ్యంగా అమలు జరగడం లేదని ఆమె విమర్శించారు. 2008–10 సంవత్సరాలతో పోలిస్తే వంద రోజులు పని పొందిన వారి సంఖ్య పదింటిలో ఒకటికి పడిపోయినట్లు అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. ప్రజా పంపిణీ పథకం కింద తమకు రేషన్ సరుకులు కూడా సరిగ్గా అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆధార్కార్డులతో అనుసంధానించిన రేషన్ మిషన్లు తమ వేలి ముద్రలను గుర్తించక పోవడం వల్ల డీలర్లు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు. 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తనకు మూడంటే మూడుసార్లు మాత్రమే రేషన్ ఇచ్చారని, వేలి ముద్రలను యంత్రం గుర్తించకపోయినా డీలరు దయతలచి మూడు సార్లు ఇచ్చారని 72 ఏళ్ల హల్కీ భాయ్ తెలిపారు. రేషన్ సరుకులు అందక పేద ప్రజలు దీపావళి రోజున కూడా పస్తులున్నారంటూ స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఆ వారంతో సెప్టెంబర్, అక్టోబర్ రేషన్ కోటాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కేంద్ర పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, స్వచ్ఛ భారత్ పథకాలేవి తమకు అందుబాటులోకి రాలేదని కిషన్గంజ్ నియోజకవర్గం పరిధిలోని సహారియాలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మంత్రి ఆవాస్ కింద తమ లబ్దిదారుడికి ఒకే ఒక ఇల్లు మంజూరయిందని, మొత్తం ఇంటికి 1.40 లక్షల రూపాయలను మంజూరు చేయాల్సి ఉండగా కేవలం మొదటి విడతగా 52 వేల రూపాయలను మాత్రమే విడుదల చేశారని, దాంతో పైకప్పు నిర్మించకుండా వదిలేశారని బాధితుడు తెలిపారు. బ్రాహ్మణులు, రాజ్పుత్లు అన్యాయంగా ఇళ్లను మంజూరు చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఇక ఉజ్వల పథకం కింద ఉచితంగా మంజూరైన గ్యాస్ కనెక్షన్ను మొదటి సిలిండర్ అయిపోగానే మూలన పడేశామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. సిలిండర్ రీఫిల్లింగ్కు వెయ్యి రూపాయలను తాము ఎక్కడి నుంచి కడతామని వారంటున్నారు. అక్కడక్కడ అధ్వాన్నంగా కట్టిన మరుగుదొడ్లు కూడా మూలన పడ్డాయని వారు ఆరోపించారు. ఈసారి ఎవరికి ఓటేస్తారని వారిని ప్రశ్నించగా, ఎప్పటిలాగా కాంగ్రెస్కే ఓటేస్తామని వారు చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా ప్రస్తుత ప్రభుత్వం తమను ఏనాడు పట్టించుకోలేని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున హీరాలాల్ సహారియా, బీజేపీ తరఫున హేమ్రాజ్ మీనా కుటుంబాలే మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ కిషన్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్మలా సహారియా పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున లిలిత్ మీనాలు పోటీ చేస్తున్నారు. -
పదిసార్లు ‘భారత్ మాతాకీ జై’ అంటా
జైపూర్/హనుమాన్గఢ్: ‘భారత్ మాతాకీ జై’ అనొద్దంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను ఆదేశిస్తున్నారనీ, ఇక నుంచి ప్రతిచోటా 10 సార్లు తాను ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నినాదాన్ని పలకొద్దని చెప్పడం ద్వారా రాహుల్ భరత మాతను అవమానించారని మోదీ ఆరోపించారు. రాజస్తాన్లో ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్గాంధీ ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల ర్యాలీలో భారత్ మాతాకీ జై అని మోదీ అంటున్నారు. కానీ ఆయన దేశం కోసం కాకుండా కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారు. ఇక నుంచి ఆయన అనిల్ అంబానీకీ జై, నీరవ్ మోదీకీ జై, మెహుల్ చోక్సీకీ జై, లలిత్ మోదీకీ జై అని నినాదాలివ్వాలి’ అని అన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ ‘కాంగ్రెస్కు ఓ రాజవంశీకుడు ఉన్నాడు. భారత్ మాతాకీ జై అని మోదీ అనకూడదంటూ ఆ రాజవంశీకుడు ఈ రోజు ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని నేను ధిక్కరిస్తూ ఇక నుంచి లక్షల మంది సాక్షిగా ప్రతిచోటా నేను పదిసార్లు భారత్ మాతాకీ జై అని నినదిస్తాను’ అని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు భారత్ మాతాకీ జై అని అరుస్తూ వీరమరణం పొందారనీ, కానీ రాహుల్ భరత మాతను అవమానిస్తున్నారని మోదీ ఆరోపించారు. అత్యాచారం కేసుల్లో దోషులుగా ఉన్న వారి కుటుంబీకులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందనీ, మహిళలెవరూ ఆ పార్టీకి ఓటు వేయకూడదని ఆయన కోరారు. ఎర్ర, పచ్చి మిరపకు తేడా తెలీదు.. రాహుల్కు ఎర్ర మిరపకాయలు, పచ్చి మిరపకాయలకు మధ్య తేడా కూడా తెలీదని మోదీ ఎద్దేవా చేశారు. ‘పచ్చి మిరప కన్నా ఎర్ర మిరపకు ధర ఎక్కువ ఉంటుందని మీరు చెబితే.. అయితే రైతులంతా ఎర్ర మిరపనే సాగు చేయాలని ఆయన అంటాడు. ‘ఈ దేశానికి తొలి ప్రధాన మంత్రి ఒక రైతు బిడ్డ అయ్యుంటే, సర్దార్ పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే ఇప్పుడు రైతులకు ఇన్ని సమస్యలు ఉండేవే కావని నేను గట్టిగా చెప్పగలను. ఒక్క కుటుంబంలోని నాలుగు తరాల వారు 70 సంవత్సరాలు చేసిన పాపాల ఫలితం ఇది. వారి తప్పులను నేను సరిచేస్తున్నాను. కాంగ్రెస్కు చిత్తశుద్ధి, దూరదృష్టి, సిక్కుల మనోభావాలపై గౌరవం ఉండి ఉంటే నేడు కర్తార్పూర్ గురుద్వారా పాకిస్తాన్ అధీనంలోకి వెళ్లేది కానేకాదు. భారత్లోనే ఉండేది. ఇన్నాళ్లూ భారతీయ సిక్కులు గురుద్వారాను సందర్శించేందుకు ఎన్నో తిప్పలు పడేవారు. ఆ తప్పును ఇప్పుడు మేం సరిచేస్తున్నాం’ అని మోదీ చెప్పారు. -
అశోక్ గెహ్లాటా లేదా సచిన్ పైలటా?
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీకి ఏడవ తేదీన జరుగనున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ గెలుస్తుందా లేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ? అన్న విషయాన్ని స్థానిక ప్రజలెవరూ మాట్లాడుకోవడం లేదు. వారంతా తదుపరి ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అవుతారా ? అశోక్ గెహ్లాట్ అవుతారా? అని చర్చించుకుంటున్నారు. జో«ద్పూర్లో గతవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీకి సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ చేస్తున్న సేవల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా మూడుసార్లు సచిన్ పైలట్ పేరును ప్రస్తావించి, ఆ తర్వాత రెండుసార్లు గెహ్లాట్ పేరును ప్రస్తావించడంతో రాహుల్, పైలట్వైపు మొగ్గుచూపుతున్నారని ప్రేక్షకులు భావించారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి ఇరువురిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ మొదలయింది. జో«ద్పూర్ నుంచి జైపూర్ మార్గంలో చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో ప్రజలను మీడియా ప్రశ్నించగా గెహ్లాట్నే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాలి గ్రామంలోనైతే కొంత మంది ప్రజలు గెహ్లాట్ను రాజస్థాన్ గాంధీ అని పిలుస్తున్నారు. ఇక ఆజ్మీర్, దౌసా ప్రాంతాల ప్రజలు మాత్రం సచిన్ పైలట్నే సీఎంగా కోరుకుంటున్నారు. మహిళలు కూడా ఆయనకే ప్రా«ధాన్యతనిస్తున్నారు. పైలట్ దౌసా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. గెహ్లాట్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆయనపై ఎలాంటి అవినీతి మచ్చ పడలేదు. పైగా ఆయన రాష్ట్ర అభివద్ధి కోసం చేసిన కషి, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఉచిత ఔషధాల పథకాలకు ప్రజల నుంచి ఎంతో ప్రశంసలు వచ్చాయి. ఆయన అనంతరం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజె, అధికారంలోకి రాగానే ఉచిత ఔషధాల స్కీమ్ను రద్దు చేశారు. కష్టాల్లో, సుఖాల్లో గెహ్లాట్ సారు తమకు అండగా నిలబడ్డారని ప్రజలు చెప్పారు. వసుంధర రాజే దర్శనభాగ్యమే ప్రజలకు కలగదని వారంటున్నారు. అయినప్పటకీ 2003, 20013 ఎన్నికల్లో గెహ్లాట్ ఓడిపోయారు. ఇదే ఆయనకు ఆఖరి అవకాశమనే ఉద్దేశంతో గెహ్లాట్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా ? అని ఓ గుంపును ప్రశ్నించగా, ఆ గుంపులోని ఓ ముసలాయన స్పందిస్తూ ‘ మా దగ్గర ముసలోలమే నిర్ణయం తీసుకొని యువతీ యువకులకు చెబుతాం, వారు కూడా మా మాట గౌరవిస్తారు’ అని చెప్పారు. రాజస్థాన్లో ఇప్పటికే భూస్వామ్యమే కనిపిస్తోంది. అక్కడ ఎవరైనా గ్రామీణ మహిళను పిల్లలెంత మంది అని అyì గితే బాలురు ఎంతో లెక్కగట్టి చెబుతుంది. బాలికల లేరా ? అని ప్రశ్నిస్తే ‘వో తో లడికియా హై’ అనే సమాధానం వస్తుంది. అక్కడ టీనేజీ అమ్మాయిలను అడిగినా సరే, ‘లడికియోం కే సాత్ భేద్ భావ్ హోతా హై నా’ అని చెబుతారు. సవాయ్ మధోపూర్ బస్టాండ్లో మధ్య వయస్కురాలిని ప్రశ్నించగా సచిన్ పైలట్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘పైలట్ యువకుడు, కష్టపడి పనిచేస్తారు. ‘శక్తికి ప్రతీక, నేడు శక్తే భక్తి’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ వర్గాలను కదిలిస్తే గెహ్లాట్, పైలట్లో తమకు ఎవరు ముఖ్యమంత్రయినా ఫర్వాలేదని అన్నారు. వారి వారి నియోజక వర్గాల పరిధిని వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా యువత పైలట్ను సీఎంగా కోరుకుంటుంటే పెద్దలు పాలనానుభవం కలిగిన గెహ్లాట్ను కోరుకుంటున్నారు. గెహ్లాట్, పైలట్ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని, ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవుతాయని, ప్రజల గురించి పట్టించుకోరని బీజేపీ నాయకులు రాష్ట్రంలో తెగ ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోలేదు. పైగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వసుంధర రాజె అభ్యర్థిత్వాన్ని మార్చే దమ్ము మోదీ, అమిత్ షాలకు లేకపోయిందని ప్రజలు భావిస్తున్నారు. గత నెల వరకు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని బీజేపీ మద్దతుదారులు కూడా భావించారు. బికనర్, కిసాన్గఢ్ ప్రాంతంలోని పది పదిహేను సీట్లలో కాంగ్రెస్ టిక్కెట్ల పంపకంలో గందరగోళం జరగడం, రెబెల్స్ రంగంలోకి దిగడం వల్ల ఆ సీట్లను కాంగ్రెస్ ఓడిపోయే ప్రమాదం ఉందని, ఆ సీట్లు తమకు సానుకూలంగా మారే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం తుది ఘట్టంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేయడంతో వారిలో కొంత ఉత్సాహం రేకెత్తింది. -
మీరెక్కడ నేర్చుకున్నారు?
జోధ్పూర్: హిందూ మతంపై తన పరిజ్ఞానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. సాధారణ పనివాడిని (కామ్దార్) అయిన తనకు హిందూ మతం గురించి పూర్తిగా తెలియదని, కానీ నామ్దార్ (రాహుల్)కు మాత్రం దాని గురించి మాట్లాడే హక్కు ఉందని వ్యంగ్యంగా అన్నారు. హిందూయిజాన్ని మీరెక్కడ నేర్చుకున్నారని కాంగ్రెస్ను ప్రశ్నించారు. రాజస్తాన్లోని జోధ్పూర్లో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘హిందూ మతం గురించి పూర్తిగా తెలుసని నామ్దార్ గొప్పలకు పోతున్నారు. సాధువులు, పండితులు కూడా అలాంటి ప్రకటనలు చేయలేదు. నేను మాత్రం ఓ సాధారణ పనివాడిని. ఎంతో పురాతనమైన, విశిష్ట సంస్కృతితో కూడిన హిందూయిజం, హిందుత్వల గురించి సంపూర్ణంగా ఎప్పుడూ తెలుసుకోలేను’ అని అన్నారు. గాంధీ కలల్ని వమ్ము చేశారు.. పారిశుధ్యంపై గాంధీజీ కన్న కలల్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని మోదీ ఆరోపించారు. తమ వంశాన్ని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకోవాలని వారు ఆరాటపడ్డారని మండిపడ్డారు. గాంధీ స్వప్నాల్ని నిజం చేసే బాధ్యత ఇప్పుడు తనపై ఉందని తెలిపారు. విదేశీయులు కూడా ఇప్పుడు భారత్లో వివాహాలు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని, మన పర్యాటక రంగ అభివృద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. ‘ఫకీర్ గాంధీ(జాతిపిత గాంధీ) ప్రజల మనసుల్లో ఉంటే నామ్దార్(రాహుల్) గాంధీని మరచిపోతారనే భయంతోనే వారు గాంధీజీ ఆశయాల్ని విస్మరించారు’ అని అన్నారు. పారిశుద్ధ్యంతోనే పర్యాటకం.. అధికారంలోకి వచ్చాక భవనాలు, వంతెనలు, హోటళ్లు నిర్మిస్తానని హామీ ఇవ్వలేదని, మరుగుదొడ్లు మాత్రమే కడతానని మాటిచ్చానని తెలిపారు. పర్యాటక రంగానికి పారిశుద్ధ్యమే కీలకమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదన్నారు. ‘కాంగ్రెస్ దేశాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలు పాలించింది. వారు పారిశుద్ధ్యం గురించి మాట్లాడటం ఎప్పుడూ వినలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్తో దేశం శుభ్రం కావడమే కాకుండా పర్యాటక రంగం కూడా వృద్ధి చెందింది. వీధి వ్యాపారుల నుంచి ప్రయాణ కంపెనీల వరకు ఎందరికో పర్యాటకం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. దేశంలో ఆకర్షణీయ పర్యాటక గమ్యస్థానాల్లో రాజస్తాన్ కూడా ఒకటిగా ఎదిగింది. జోధ్పూర్, ఉదయ్పూర్, జైసల్మీర్లలో కోటలు మోదీ అధికారం చేపట్టాక వచ్చాయా? కాంగ్రెస్ హయాంలో లేవా? అయినా పర్యాటకం అప్పుడు ఎందుకు అభివృద్ధి చెందలేదు?’ అని ప్రశ్నించారు. సరైన ప్రచారం లేకనే కాంగ్రెస్కాలంలో పర్యాటక రంగంలో కాస్త వెనకబడ్డామని ఆయన అన్నారు. నెహ్రూకు వ్యవసాయం తెలీదు తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 134వ జయంతి సందర్భంగా మోదీ.. ఆయనతో పాటు తొలి ప్రధాని నెహ్రూను ప్రస్తావించారు. విదేశీయుల దాడిలో ధ్వంసమైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణకు రాజేంద్ర ప్రసాద్ హాజరుకావడంపై నెహ్రూ అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎప్పుడూ చొక్కాపై గులాబీ పువ్వు ధరించే నాయకుడికి తోటల గురించి తెలుసు కానీ, రైతులు, వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అందువల్లే రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని పరోక్షంగా నెహ్రూను ఉద్దేశించి అన్నారు. -
ఎన్నికలప్పుడే ఆలయాల సందర్శన
బన్సుర్/జైపూర్: కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాల సందర్శనకు వెళతారని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజస్తాన్లోని జైపూర్లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలు ఆలయాలు సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మిగతా సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఆలయాలు, గోవులు ఆ పార్టీకి ఎన్నికల ప్రచారాంశాలు కావొచ్చు. కానీ బీజేపీకి అవి సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం’ అని రాజ్నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అవసరమైతే పాకిస్తాన్కు సాయం చేస్తామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ‘నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను ఒక్కటే చెబుతున్నా. అఫ్గానిస్తాన్లో ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదులపై అమెరికా సాయంతో పోరాడుతోంది. పాక్లో ఉగ్రవాదులపై ఒంటరిగా పోరాడలేమని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం భావిస్తే భారత్ సాయం కోరవచ్చు’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు. భారత్–పాక్ల మధ్య కశ్మీర్ అన్నది సమస్యే కాదనీ, అది భారత్లో అంతర్భాగమని రాజ్నాథ్ పునరుద్ఘా టించారు. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలోనూ జరిగాయని కాంగ్రెస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని దేశప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? సైన్యం అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ఉంటే ప్రజలకు తెలిసేది కాదా? ఈ ఆపరేషన్ను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎవరికి భయపడ్డారు?’ అని రాజ్నాథ్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని అల్లాహ్ ఓడిస్తాడన్న ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘మతం, కులం ఆధారంగా చేసే రాజకీయాలపై మాకు నమ్మకం లేదు’ అని అన్నారు. -
రాజస్థాన్లో రాహుల్ గాంధీ పర్యటన
-
మోదీజీ మీరెలాంటి హిందువు
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో నేతల మాటల వాడి పెరిగింది. శనివారం ఉదయ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ..‘తను హిందూనంటూ ప్రధాని మోదీ చెబుతుంటారు. కానీ, ఆయనకు హిందూయిజం మూలాలు అర్థం కావు. ఆయన ఎలాంటి హిందువు?’ అని ప్రశ్నించారు. ‘హిందూయిజం సారం ఏమిటి? ప్రతి ఒక్కరిలోనూ విజ్ఞానం ఉంటుంది. మన చుట్టూతా విజ్ఞానం ఉంది. ప్రతి జీవికీ విజ్ఞానం ఉంటుంది. ఇదే కదా భగవద్గీత చెబుతోంది?’ అని అన్నారు. 2016లో భారత్ బలగాలు పాక్ భూభాగంపై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ను కూడా ప్రధాని మోదీ అప్పటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకున్నారని రాహుల్ ఆరోపించారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా ఇలాంటి సైనిక చర్యలు మూడు జరిగినా అవి బయటకు వెల్లడికాలేదని తెలిపారు. యూపీఏ హయాంలో నిరర్ధక ఆస్తులు రూ.2 లక్షల కోట్ల మేర ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.12 లక్షల కోట్లకు పెరిగిపోయాయని విమర్శించారు. ఆ అగత్యం రాకూడదు?: సుష్మ మంత్రి సుష్మా స్వరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందూయిజం గురించి రాహుల్ గాంధీ ద్వారా తెలుసుకోవాల్సిన ఆగత్యం ప్రజలకు రాకూడదని కోరుకుంటున్నా. ఆయన మతం, కులం ఏమిటో తెలియక రాహుల్తోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయంలో ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు. -
భూ స్కాంతో వాద్రా కోట్లు ఆర్జించారు
జైపూర్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత బావ రాబర్ట్ వాద్రా భారీ భూ కుంభకోణానికి పాల్పడి, డబ్బు బాగా వెనకేశారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజస్థాన్లో ఎన్నికల ర్యాలీల్లో ఆరోపించారు. రాబర్ట్ వాద్రాకు చెందిందిగా భావిస్తున్న బికనీర్లోని స్కైలైట్ హాస్పిటాలిటీ భూములు కొనుగోలు చేసేందుకు అప్పులిచ్చిన ఒక సంస్థకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పన్ను రాయితీలు కల్పించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో నెహ్రూ–గాంధీ కుటుంబం అల్లుడు(వాద్రా) భారీగా కమీషన్లు పుచ్చుకున్నారని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమ పద్ధతుల్లో ఇచ్చిన రుణాలే ఇప్పుడు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా మారాయన్నారు. రాజస్తాన్లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘అంగదుని పాదం’ అని అభివర్ణించారు. రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. విచారణకు వచ్చే వారం హాజరు కావాల్సిందిగా కోరింది. నవంబర్లో జారీ చేసిన మొదటి సమన్లకు వాద్రా స్పందించలేదు. ప్రముఖ స్టీల్ కంపెనీ ఒకటి దేశ సరిహద్దుల్లోని సుమారు వందెకరాల స్థలం కొనుగోలు చేసేందుకు వాద్రా సంస్థలకు రుణం ఇవ్వడంపైనా ప్రశ్నించనుంది. వాద్రాకు చెందిన పలువురు వ్యక్తులపై గతంలో ఈడీ దాడులు కూడా చేపట్టింది. -
చెలిమెలో కమలం వికసించేనా?
రాజస్తాన్లో ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఇక్కడి ప్రజలు ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న బీజేపీ ఈ ఆనవాయితీని బ్రేక్ చేయాలని తహతహలాడుతోంది. ఒకవేళ బీజేపీ ఈసారి అధికారాన్ని నిలబెట్టుకుంటే.. అది ‘ముఖ్యమంత్రి జల స్వావలంబన యోజన’ కారణంగానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 12 వేల గ్రామాల్లో ఈ పథకం విజయవంతగా సాగుతూ ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. అంటే సుమారు 60 నియోజకవర్గాల్లో ఈ పథకం బీజేపీకి ఓట్లు కురిపించే అవకాశం ఉంది. విపక్షాలన్నీ మిగిలిన రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తుంటే.. బీజేపీ మాత్రం పథకం ద్వారా లబ్ధిపొందిన నియోజకవర్గాల్లో దీన్నే ప్రచారం చేస్తోంది. ఈ పథకం పూర్తిస్థాయి వ్యూహరచన, కార్యాచరణ మొత్తం మన తెలుగు వ్యక్తిదే కావడం గమనార్హం. జలవనరుల నిపుణుడు, తెలంగాణ బీజేపీ నేత వెదిరె శ్రీరాం చేస్తున్న భగీరథ ప్రయత్నమే ఈ ‘ముఖ్యమంత్రి జల స్వావలంభన యోజన’. రాజస్తాన్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ పథకం ద్వారా అమలు చేస్తున్న ఈ చతుర్విధ జల సంరక్షణ విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు నీతిఆయోగ్ ప్రణాళిక రచిస్తోందంటే.. మన తెలుగోడి సత్తా ఏ స్థాయిలో సత్ఫలితాలు అందిస్తుందో అవగతమవుతుంది. రాజకీయంగా కీలకమే ఇలా వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంపిక చేసి ఎడారి రాష్ట్రంలో నీటి సంరక్షణ కోసం వసుంధరా రాజే తీవ్రంగా శ్రమించారు. దీన్నో యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లారు. సాగునీరుతోపాటు తాగునీటిని అందించే విషయంలో తన లక్ష్యాలను నిపుణులతో పంచుకున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమిష్టిగా కదలడంతో ఒక ఉద్యమంలా మారిన ఈ జల సంరక్షణ పథకం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోంది. ఇప్పుడదే రాజకీయంగా ఆమెకు అనుకూలంగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ 60 నియోజకవర్గాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం రాజకీయంగా వసుంధరకు అత్యంత అవసరం. అటు కాంగ్రెస్కు కూడా ఈ పథకం విజయవంతంగా అమలైన ప్రాంతాల్లో రాజే ప్రాభవానికి వీలైనంత గండి కొట్టడం చాలా అవసరమే. అందుకే నీటి వసతి సంగతి సరే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ప్రచారం చేస్తోంది. దీంతో రాజకీయంగా ఈ 60 నియోజకవర్గాలు అధికారంలోకి రావాలనుకునే వారికి కీలకమ్యాయి. జలవనరులను సమకూర్చడంతో బీజేపీ, రాజేపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతున్నందున దీని ప్రభావం ఈ ప్రాంతాల్లోనూ ఉంటుందనేది కాంగ్రెస్ అభిప్రాయం. నీటి బొట్టును ఒడిసిపట్టి.. కరవు కాటకాలతో నిత్యం తల్లడిల్లుతున్న రాజస్థాన్లో నీటి కొరతను కొంతమాత్రమైనా తీర్చే ప్రయత్నంలో.. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం సాయాన్ని రాజే తీసుకున్నారు. రాజస్తాన్లో సగటు వర్షపాతం 564.89 మిల్లీమీటర్లు మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో 171 మి.మీ. ఉంటే కొన్ని ప్రాంతాల్లో 970 మి.మీ. వరకు ఉంటుంది. ఇలాంటి ఎడారి ప్రాంతాన్ని శ్రీరాం సాయంతో హరిత రాజస్తాన్గా మార్చేందుకు రాజే సంకల్పించారు. ముఖ్యమంత్రి జల స్వావలంబన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణకు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ టి.హనుమంతరావు ప్రతిపాదించిన ‘చతుర్విధ జల సంరక్షణ’ ప్రక్రియను శ్రీరాం వెదిరె ఇక్కడ అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులైన జక్కిడి జంగారెడ్డి, అఫ్సర్ నాణ్యత పర్యవేక్షణ అధికారులుగా ప్రత్యేక డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్ మాజీ చీఫ్ ఇంజినీర్ రమేష్ సాంకేతిక సాయం అందిస్తున్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాన నీటి చుక్కలను ఒడిసిపట్టి వాటిని భూమిలో ఇంకేలా చేసేందుకు మూడు రకాలుగా కందకాలు తవ్వడం, వాటి కింది భాగంలో చిన్న, చిన్న ఊట చెలిమలు సృష్టించడం, ఇంకా కింది ప్రాంతంలో చెరువులు, చెక్ డ్యాములు నిర్మించడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో భాగం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగిస్తున్నారు. శాటిలైట్ మ్యాపులు, డ్రోన్ల సహాయంతో సర్వే చేసి జల సంరక్షణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. సమ్మిళిత నీటి సూచికలో పైపైకి ఇటీవల నీతిఆయోగ్ విడుదల చేసిన సమ్మిళిత నీటి సూచికలో రాజస్తాన్ 2015–16లో 13వ స్థానంలో ఉండగా 2016–17లో 10వ స్థానానికి ఎగబాకింది. అన్ని రాష్ట్రాల కంటే 2016–17లో రాజస్తాన్కు ఎక్కువ స్కోర్ పెంచుకుంది. భూఉపరితల నీటి వనరులను సృష్టించడం, పాత నీటి వనరులను రీఛార్జ్ చేయడం, నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేయడం, ప్రజల భాగస్వామ్యం పెరగడం వంటి అంశాల ఆధారంగా రాజస్తాన్ ఈ స్కోర్ సాధించింది. డ్రోన్లు, శాటిలైట్ మ్యాప్ల ఆధారంగా నీటి వనరుల అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఈ పథకం రాజస్తాన్ ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో.. ఒక నిర్ణయాత్మక శక్తిగా, ఫలితాలను నిర్ణయించే శక్తిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదారేళ్లు చేస్తే.. వంద శాతం.. – శ్రీరాం వెదిరె, ఆర్ఎస్బీఏ ఛైర్మన్ ఐదారేళ్లు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే రాజస్తాన్లో 100% ఫలితాలు సాధించవచ్చు. ఈ ప్రక్రియను స్వయంగా తిలకిస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అమలు చేయాలని కోరుతున్నారు. ప్రధాని సూచన మేరకు దేశవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని నీతిఆయోగ్ భావిస్తోంది. ఈ పథకం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అమూల్యమైన ప్రయోజనం చేకూరుతుంది. గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తాగునీరందుతోంది. తృణ ధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతోపాటు బత్తాయి వంటి ఉద్యానవన పంటల విస్తీర్ణం కూడా పెరుగుతోంది. బీడు భూముల్లో పంట సాగుతోపాటు పశుగ్రాసం కూడా లభిస్తుండడంతో పశుసంపద కూడా వృద్ధి చెందనుంది. .:: రాజస్తాన్ నుంచి లెంకల ప్రవీణ్ కుమార్ -
కాంగ్రెస్ నేతతో నేలకు ముక్కు రాయించిన యువకులు
జైపూర్ : రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాంగ్రెస్ నేతకు ఘోర అవమానం ఎదురైంది. నిర్లక్ష్యంగా కారు నడిపి తమపై బురద పడేసాడంటూ కొంత మంది యువకులు... ఆయనను అడ్డగించి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. అసలేం జరిగిందంటే.... కాంగ్రెస్ పార్టీకి చెందిన భగవతి లాల్.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ సాగ్వారా పట్టణంలో ర్యాలీకి హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. జోసావా గ్రామం చేరుకోగానే అక్కడ ఉన్న నీటి గుంటను గమనించకుండా కారును వేగంగా పోనిచ్చారు. ఈ సమయంలో రోడ్డు పక్కన ఉన్న నలుగురు యువకులపై బురద పడింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు ఆయన కారును చేజ్ చేసి మరీ ఆపారు. హడావుడిగా వెళ్తున్న కారణంగానే ఇలా జరిగిందని చెప్పినా వినకుండా.. ఆయనను మోకాళ్లపై నిలబెట్టి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై దుగన్పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ కుమార్ గురువారం స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘భగవతి లాల్తో దురుసుగా ప్రవర్తించిన ఆ యువకులను వారి సామాజిక వర్గానికి(పాటీదార్) చెందిన పెద్దలు పిలిచి మందలించారు. అంతేకాకుండా భగవతిని ఎలా అయితే అవమానించారో అదే రీతిలో(వాళ్లతో నేలకు ముక్కు రాయించి) వారికి క్షమాపణ కూడా చెప్పించారు’ అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
124 స్థానాల్లో కొత్త ముఖాలు
భారత్లో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా సిట్టింగ్లకు లేదంటే గత ఎన్నికల్లో ఓడిన వారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. సిట్టింగ్ల విషయంలోనైతే రిస్క్ తీసుకోకుండా కొనసాగిస్తాయి. కొత్తవారికి తీసుకుని మళ్లీ మొదట్నుంచీ ప్రారంభించడం ఎందుకని ఆలోచిస్తాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంటే తప్ప అభ్యర్థిని మార్చరు. కానీ రాజస్తాన్లో మాత్రం సీన్ పూర్తి భిన్నంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్లు కలిసి సిట్టింగ్లను ఏకపక్షంగా విశ్రాంతినిచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మొత్తం 200 నియోజకవర్గాల్లో.. కేవలం 33 చోట్ల మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29 సీట్లలో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తోంటే, 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. వీరిలో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఒకరు. బీజేపీ అభ్యర్ధులకు పోటీగా గత ఎన్నికల్లో వారి చేతిలో ఓడిపోయిన వారినే కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టడం విశేషం. రెండు పార్టీలు 43 నియోజకవర్గాల్లో గత ఎన్నికల అభ్యర్ధులను మార్చాయి, 124 చోట్ల కొత్త ముఖాలకు అవకాశం కల్పించాయి. -
సమస్యలకు కొరతే లేని చోట ఆ మాజీ సీఎం మళ్లీ గెలుస్తారా?
రాజస్తాన్ సర్దార్పుర నియోజకవర్గ పరిశీలన అదే నియోజకవర్గం, అవే సమస్యలు, అభ్యర్థులూ పాత వాళ్లే.. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారైనా ఫలితాలు కొత్తగా వస్తాయా? ఇది రాజస్తాన్లోని సర్దార్పుర నియోజకవర్గం గురించి. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నాలుగు సార్లు సర్దార్పుర నుంచే ఎన్నికయ్యారు. రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013 ఎన్నికల్లో గెహ్లాట్పై పోటీ చేసి ఓడిపోయిన శంభు సింగ్ ఖేతాసర్కే బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో గెహ్లాట్పై ఖేతాసర్ 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ వేవ్లో కూడా తట్టుకొని నిలబడ్డ అతి కొద్ది మంది కాంగ్రెస్ నాయకుల్లో గెహ్లాట్ ఒకరు. ఈ సారి కూడా తనదే గెలుపన్న ధీమాలో ఉన్నారు. కుల సమీకరణలే కీలకం సర్దార్పుర నియోజకవర్గం నుంచి గెహ్లాట్ ఇప్పటివరకు 4సార్లు గెలిచారు. అన్నిసార్లు ఆయనను కులసమీకరణలే గెలిపించాయి. సర్దార్పురలో మెజార్టీ ఓటర్లు మాలీలు. ఆ తర్వాత స్థానాల్లో ముస్లింలు, రాజ్పుత్లున్నారు. ఇక జాట్లు, ఇతర వెనుకబడిన కులాల ప్రాబల్యం కూడా ఎక్కువే. 40 వేల వరకు ఉన్న మాలీలు, 30 వేల ముస్లిం ఓటర్లు గెలుపోటముల్ని శాసించగలరు. గెహ్లాట్ మాలీ సామాజికవర్గానికి చెందినవాడు కావడంతో వారి అండతోనే ఆయన నెగ్గుతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో గెహ్లాట్కి వ్యక్తిగత కరిజ్మా కూడా ఎక్కువే. అందుకే ఆయన్ని ఓడించడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేసి బీజేపీ భంగపడింది. ఖేతాసర్ పోటీ ఇవ్వగలరా? 2013 ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ కనీవినీ మెజార్టీ సాధించింది. అప్పటికే ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో ఆయన హవా బాగా కనిపించింది. అంతటి మోదీ వేవ్లో నెగ్గలేకపోయిన శంభు సింగ్ ఖేతాసర్ ఈసారి గెహ్లాట్కు పోటీ ఇవ్వగలరా అన్నదే ప్రశ్న. అందులోనూ ఖేతాసర్కు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. మూడు సార్లూ ఓడిపోయారు. 2008లో ఓషియన్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంతో సంతృప్తి చెందారు. 2009 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ టిక్కెట్పై పాలీ నియోజకవర్గం నుంచి ఘోరంగా ఓటమిపాలయ్యారు. అశోక్ గెహ్లాట్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా నెగ్గారు. రాజ్పుత్ సామాజికవర్గానికి చెందిన ఖేతాసర్ ఈ సారి ఓషియన్ నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ బీజేపీ అధిష్టానం మళ్లీ గెహ్లాట్పైనే పోటీకి దింపింది. ఎవరినో ఒకరిని పోటీకి నిలిపాలన్న ఉద్దేశంతో ఖేతాసర్కు టిక్కెట్ ఇచ్చి రాజే చేతులు దులుపుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. సర్దార్పుర నియోజకవర్గంలో మాలీ, ముస్లింల తర్వాత రాజ్పుత్లు కూడా గణనీయంగానే ఉన్నారు. వారంతా బీజేపీపై ఆగ్రహంతో ఉండడంతో రాజ్పుత్ అయిన శంభు సింగ్కు వారి మద్దతు కూడా లభించే అవకాశం లేదు. ఇలా అన్నివైపుల నుంచి ఖేతాసర్ ఏ మాత్రం బలమైన అభ్యర్థి కాలేరన్న అంచనాలున్నాయి. అయితే ఈ సారి గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు శంభు సింగ్ ఖేతాసర్. ‘గత ఎన్నికల్లో గెహ్లాట్ గెలిచారంటే అధికారం వాళ్ల చేతుల్లో ఉంది. ఒక సీఎంను ఓడించడం అంత సులభం కాదు. అందుకే ఆయన నెగ్గారు. ఈసారి అలాకాదు. గెహ్లాట్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అంతే. అందుకే ఈ సారి గెలుపు నాదే’ అని ధీమాగా చెబుతున్నారు. అయినా వసుంధరే టార్గెట్.. జోధ్పూర్ నగరంలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్దార్పుర ఒకటి. ఈ నియోజకవర్గంలో సమస్యలకు కొరతే లేదు. మౌలిక సదుపాయాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎక్కడా సరైన రోడ్లుండవు. పారిశుద్ధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తాగునీటి సరఫరా అధ్వాన్నంగా ఉంది. చాలా ప్రాంతాల్లో పైపు లైన్లే గల్లంతయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో మురుగునీటి పైపులు పగిలిపోయి.. తాగునీటి పైపుల్లో కలిసిపోయాయి. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలకు కలుషిత నీరే దిక్కుగా మారింది. ఈ సమస్యలు పరిష్కారం చేసేందుకు.. గెహ్లాట్ చొరవతీసుకున్న సందర్భమే లేదు. సర్దార్పుర సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో సమస్యలపై గెహ్లాట్ సీఎం వసుంధరా రాజేనే టార్గెట్ చేశారు. జోధ్పూర్ నగరంలో ఉన్న సర్దార్పుర అభివృద్ధి చేయడంలో రాజే నిర్లక్ష్యం వహించారంటూ ఎన్నికల ప్రచారంలో గెహ్లాట్ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నా సొంత నియోజకవర్గం కాబట్టే.. రాజే జోధ్పూర్ను నిర్లక్ష్యం చేశారు. నియోజకవర్గంలో సమస్యలు ∙సరైన రహదారులు లేవు ∙నాసిరకమైన పారిశుద్ధ్య వ్యవస్థ ∙నీటి సరఫరా లోటుపాట్లు ∙మౌలిక సదుపాయాలు కరువు మొత్తం ఓటర్లు 2.10 లక్షలు మాలీలు 40 వేలు ముస్లింలు 30 వేలు రాజ్ పుత్లు 25 వేలు ఎస్సీ, ఎస్టీ 35 వేలు -
ఆంజనేయుడు దళితుడన్న సీఎంకు నోటీసు
జైపూర్: హనుమంతుడిని దళితుడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు హిందూ సంస్థ ఒకటి లీగల్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాజస్తాన్లోని ఆల్వార్ జిల్లా మాలాఖేడాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు. ప్రజలంతా రామభక్తులకే ఓటేయాలి. రావణులకు కాదు’ అని అన్నారు. దీంతో యోగికి రాజస్తాన్ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా నోటీసులు పంపారు. -
కామ్దార్ X నామ్దార్
భరత్పూర్/నాగౌర్: డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్ని కామ్దార్, నామ్దార్ మధ్య పోరుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. తనని తాను కామ్దార్(పనిచేసే వ్యక్తి)గా చెప్పుకునే మోదీ..రాహుల్ను నామ్దార్(గొప్ప వంశీయుడు) అని తరచూ వ్యంగ్యంగా సంబోధిస్తున్న సంగతి తెలిసిందే. మూంగ్ (పెసర), మసూర్ (ఎర్ర పప్పు) పప్పుధాన్యాల మధ్య తేడా తెలియని కాంగ్రెస్ నాయకులు దేశమంతా తిరుగుతూ రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నిహిత వర్గం నిస్సిగ్గుగా మావోయిస్టులను విప్లవకారులని కీర్తించడం శోచనీయమన్నారు. రాజస్తాన్లోని నాగౌర్, భరత్పూర్లలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. ఈ రెండు సభల్లోనూ ప్రధాని రైతు సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించారు. అమరుడిని అవమానించారు.. ఇటీవల ఛత్తీస్గఢ్లో నక్సల్స్తో జరిగిన ఎన్కౌంటర్లో భరత్పూర్కు చెందిన ఓ జవాన్ మృతిచెందిన సంగతిని మోదీ ప్రస్తావించారు. అమర జవాన్ను అవమానిస్తూ కాంగ్రెస్ నాయకులు మావోయిస్టులను విప్లవకారులని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భరత్పూర్ అమరుడిని అవమానించిన వారిని క్షమిస్తారా? అని సభకు హాజరైన ప్రజల్ని ప్రశ్నించారు. ‘నామ్దార్’ సన్నిహితులు కొందరు ఆర్మీ చీఫ్ని వీధి రౌడీ అని పేర్కొన్నారని, కొన్నాళ్ల కిత్రం కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ రాజేసిన వివాదాన్ని గుర్తుచేశారు. ‘నేనూ మీ లాంటి వాడినే. మీరు బతికినట్లే నేనూ బతికా. నామ్దార్ మాదిరిగా మనం బంగారు చెంచాతో పుట్టలేదు’ అని మోదీ పరోక్షంగా రాహుల్ను దెప్పిపొడుస్తూ ప్రసంగించారు. రైతులు, వ్యవసాయం గురించి ఏమీ తెలియని నామ్దార్ రైతాంగం సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసి ఉంటే, రైతులు రుణ ఊబిలో చిక్కుకునే వారు కాదన్నారు. రైతుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని మోదీ పేర్కొన్నారు. -
‘తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది’
జైపూర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పుష్కర్లోని బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించినప్పుడు రాహుల్ గాంధీ తన గోత్రానికి బదులు తన నానమ్మ తండ్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గోత్రం చెప్పారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ర్యాలీలో రాజే మాట్లాడుతూ ‘రాహుల్ తన గోత్రం ఏంటో చెప్పలేదు. ఆయన పేర్కొన్నది నెహ్రూ గోత్రం. పూజ సందర్భంగా రాహుల్ తన తండ్రి రాజీవ్ గాంధీ, తాత ఫిరోజ్ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన ఎందుకనో అలా చేయలేదు’ అని రాజే వ్యాఖ్యానించారు. కాగా పుష్కర్ ఆలయంలో రాహుల్ తన గోత్రం ‘దత్తాత్రేయ’ అని, తాను కశ్మీరీ బ్రాహ్మణుడిని అని తెలిపినట్లు ఆ పూజ నిర్వహించిన పూజారి వెల్లడించిన విషయం తెలిసిందే. -
ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు
జైపూర్: ఏడాదికి 30 వేల ప్రభుత్వ, 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుల ఆదాయం రెట్టింపు తదితర భారీ హామీలతో రాజస్తాన్లో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. వచ్చే నెల 7న ఎన్నికలు జరగనున్న రాజస్తాన్లో అధికార బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విడుదల చేశారు. ముఖ్యమైన హామీలు ►ప్రతీ ఏడాది ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ప్రైవేటు రంగంలో సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాల (స్వయం ఉపాధి సహా మొత్తం ఐదేళ్లలో 50 లక్షలు) సృష్టి. ఎన్ఆర్ఈజీఏ తరహాలో పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక ఉపాధి హామీ పథకం. 21 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 భృతి. ►ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల అప్పులను రైతులకు ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగంలో సహకార రుణాలను మరింత విస్తరించడం. ►తూర్పు రాజస్తాన్ కాలువల ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలకు సాగు, తాగునీరు. దీన్ని ప్రధాన ప్రాజెక్టుగా పరిగణించి త్వరగా పూర్తి చేయడం. ప్రతీ డివిజన్లో ఒక జిల్లాను ఎంచుకుని అక్కడ సేంద్రీయ వ్యవసాయం, ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడం. ►బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించడంతోపాటు పాక్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం. ►మేవాత్ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరిన్ని చెక్పోస్ట్ల ఏర్పాటు. ►ప్రస్తుతం మినా (Mina)లు ఎస్టీల్లో ఉండగా, మీనా (Meena)లను కూడా ఎస్టీల్లో చేర్చేలా కేంద్రానికి సిఫారసు. గిరిజనుల ఉప ప్రణాళిక కోసం ఐదేళ్లలో రూ. 5,000 కోట్లు. ►విద్యా విధానాల రూపకల్పనలో ప్రైవేటు పాఠశాలలు లేదా సాధికార కమిటీల సహాయం తీసుకోవడం, వేద విద్య కోసం ప్రత్యేక మండలి ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు. ►అనైతిక కార్యకలాపాల గురించి చెప్పేందుకు వాడుతున్న ‘గోరఖ్ ధంధా’ పదాన్ని వాడకుండా నిషేధం విధించేందుకు కొత్త చట్టం. ‘గురు గోరఖ్నాథ్’ అనుచరులను మనోభావాలను దెబ్బతీసేలా ఈ పదం ఉండటంతో నిషేధం విధించాలని నిర్ణయం. -
యుద్ధానికి వెళ్లే జవాన్లు కెమెరాలు పట్టుకెళ్తారా..?
-
‘సర్జికల్’పై సాక్ష్యాలు కావాలట!
భిల్వారా: ముంబైలో 2008, నవంబర్ 26న లష్కరే తోయిబా ఉగ్రవాదుల మారణహోమం సమయంలో దేశభక్తి గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, రెండేళ్ల క్రితం భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్పై మాత్రం వీడియో సాక్ష్యాలు అడిగారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ దారుణానికి పాల్పడినవారిని ఎన్నటికీ విడిచిపెట్టబోమనీ, సరైన సమ యం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ముంబైపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడిచేసి 166 మందిని బలికొన్న ఘటనకు సోమవారంతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్లోని భిల్వారాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఉగ్రవాదం, మావోయిజంపై కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. రిమోట్ కంట్రోల్ పాలన నడిచేది.. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్పర్సన్, అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లక్ష్యంగా మోదీ విరుచుకుపడ్డారు. ‘‘నవంబర్ 26... పదేళ్ల క్రితం ఇదే రోజున ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఓ మేడమ్(సోనియా) రిమోట్ కంట్రోల్తో పాలించేవారు. ముంబైపై ఉగ్రవాదులు దాడికి తెగబడి మన ప్రజలు, భద్రతా బలగాలను హత్య చేసినప్పుడు కేంద్రంతో పాటు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. నాకు బాగా గుర్తుంది. దాడి జరిగిన సమయంలో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఉగ్రదాడులను ఖండించిన వివక్ష నేతలపై అప్పట్లో అధికార కాంగ్రెస్ నేతలు అంతెత్తున ఎగిరిపడ్డారు. ‘ఇది యుద్ధం. పాకిస్తాన్ భారత్ పై దాడిచేసింది. కానీ ప్రతిపక్షాలన్నీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో అన్ని పార్టీలు కేంద్రానికి అండగా నిలవాలి. ఉగ్రదాడులపై రాజకీయాలు చేయడం సరికాదు’ అంటూ నీతులు చెప్పారు. కానీ రాజస్తాన్ ఎన్నికల్లో గెలిచేందుకు ఈ ఉగ్ర ఘటనను ఓ అస్త్రంగా కాంగ్రెస్ నేతలు వాడుకున్నారు’’ అని మోదీ దుయ్యబట్టారు. ‘ముంబై’ దోషులను విడిచిపెట్టబోం.. ‘2016 సర్జికల్ దాడులతో భారత సైన్యం ఉడీ ఉగ్రదాడి ఘటనపై ప్రతీకారం తీర్చుకుంది. శత్రువులను వారి ఇంట్లో దూరి చావుదెబ్బ కొట్టింది. ఇలాంటి గొప్ప సమయంలో కాంగ్రెస్ నేతలు ఏమడిగారో తెలుసా? సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయనటానికి వీడియో సాక్ష్యాలను చూపాలన్నారు. ఆపరేషన్ల సమయంలో సైనికులు చేతిలో కెమెరాలు తీసుకుని వెళతారా? వాళ్లు తమ ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడేందుకు వెళ్లారు. ఈ సమయంలో మాత్రం కాంగ్రెస్ నేతలకు పదేళ్ల క్రితం వల్లించిన దేశభక్తి ప్రవచనాలు గుర్తుకురాలేదు’ అని ప్రధాని మండిపడ్డారు. నా కులంపైనే కాంగ్రెస్కు మక్కువ.. ‘ఉగ్రవాదులు, నక్సల్స్, మావోయిస్టులు.. చిన్నారుల చేతికి తుపాకులు ఇచ్చి అమయాకులను చంపుతున్నారు. ఓవైపు ఇలాంటి ఉగ్రమూకలకు అర్థమయ్యే భాషలో కేంద్రం జవాబిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన అనుచరగణం నక్సలైట్లను విప్లవకారులుగా కీర్తిస్తూ సర్టిఫికెట్లు అందజేస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ కాంగ్రెస్ నేతలు నా కులం గురించి, నా తండ్రి పేరు గురించి బాగా అడుగుతున్నారు. కానీ ఓ భారత ప్రధానిగా నేను అమెరికాకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయితే అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రమే ఆయన మాట్లాడతారు. నా కులం గురించి అడగరు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజల కులాలకు ప్రధానిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని ప్రధాని మోదీ చెప్పారు. -
‘అభిశంసన’తో జడ్జీలనే బెదిరించారు
ఆల్వార్/విదిశ: అయోధ్య కేసును ఈ ఏడాది తొలి నాళ్లలో విచారించాలనుకున్న సుప్రీంకోర్టు జడ్జీలను అభిశంసన పేరిట కాంగ్రెస్ బెదిరించిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. లాయర్లు కూడా అయిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కొందరు..ఈ కేసును 2019 లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా సాగదీసేందుకు ఈ ఎత్తుగడ వేశారని విమర్శించారు. రాజస్తాన్లోని ఆల్వార్, మధ్యప్రదేశ్లోని విదిశలో ఆదివారం జరిగిన ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తన తల్లిదండ్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే ధైర్యం లేకే తన కులం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కులతత్వం, పేదలు, అణగారిన వర్గాలపై ద్వేషాన్ని కాంగ్రెస్ నరనరాల్లో నింపుకుందని ధ్వజమెత్తారు. అది ప్రమాదకర క్రీడ.. ఆల్వార్ సభలో మోదీ మాట్లాడుతూ రాజ్యసభలో తనకున్న సంఖ్యాబలం చూసుకుని కాంగ్రెస్ సుప్రీంకోర్టు జడ్జీలను బెదిరిస్తోందని ఆరోపించారు. ‘ పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగిలే కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త ప్రమాదకర క్రీడను ప్రారంభించింది. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి కేసుల విచారణ టైం టేబుల్ను తయారుచేయకుంటే, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, లాయర్లు అయిన కొందరు వ్యక్తులు అభిశంసన పేరిట ఆ జడ్జిని బెదిరిస్తారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా మేధావులు ఈ ప్రమాదకర ధోరణిని ఎండగట్టాలి. మోదీ కులం ఆధారంగా ఓట్లు పడతా యా? మోదీ జన్మస్థలం ఆధారంగా రాజస్తాన్ భవిష్యత్ నిర్మితమవుతుందా?’ అని ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ప్రధాని ప్రశ్నించారు. మోదీ దిగువ కులానికి చెందిన వాడని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు. నా తల్లిదండ్రులు పదవులు చేపట్టలేదు.. తన తల్లిదండ్రుల్ని కాంగ్రెస్ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల్లోకి లాగడంపై విదిశలో జరిగిన సభలో మోదీ మండిపడ్డారు. గాంధీ– నెహ్రూ కుటుంబంపై చేసిన విమర్శల్ని సమర్థించుకున్న మోదీ..తన తల్లిదండ్రులు వారిలా రాజకీయాలు, ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తించలేదని పేర్కొన్నారు. ‘నామ్దార్ (రాహుల్ను ఉద్దేశించి) అండ చూసుకునే కాంగ్రెస్ నాయకులు 30 ఏళ్ల క్రితం చనిపోయిన నా తండ్రికి రాజకీయాల్లోకి లాగుతున్నారు. లేవనెత్తడానికి వారికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదు. అందుకే నా తల్లిదండ్రులు లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా తల్లి ఇంటికే పరిమితమై పూజలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతోంది. రాజ్నీతిలోని ‘ఆర్’ అనే పదం కూడా ఆమెకు తెలియదు’ అని మోదీ అన్నారు. మోదీ 50వ ‘మన్కీ బాత్’ న్యూఢిల్లీ: మాసాంతపు ‘మన్కీ బాత్’ ప్రసంగ కార్యక్రమాన్ని రాజకీయాలకు దూరంగా ఉం చి, ప్రజల ఆకాంక్షలకు వేదికగా చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన వ్యక్తిగత, ప్రభు త్వ విజయాల్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదన్నారు. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ‘మన్కీ బాత్’ ఆదివారం 50వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో రేడియో అత్యంత శక్తిమంతమైన సాధనమని, అందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు మోదీ చెప్పారు. కుటుంబాల్లో యువత, పెద్దల మధ్య కమ్యూనికేషన్ అంతరం ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి చర్చిస్తే భావవ్యక్తీకరణ ప్రభావవంతంగా ఉంటుందన్నారు. చదువు, అలవా ట్లు, జీవన శైలి గురించి మాత్రమే యువతరం తో చర్చిస్తున్నామని, అలాకాకుండా ఎలాంటి హద్దుల్లేకుండా, ఏమీ ఆశించకుండా జరిపే చర్చలతోనే ఫలితం ఉంటుందన్నారు. -
రాణికి రాజ్పుత్ సవాల్!
రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఝల్రాపాటన్. రాష్ట్ర రాజధాని జైపూర్కు 347 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలో గుళ్లు గోపురాలు ఎక్కువ. అందుకే గుడి గంటలు అన్న అర్థంలో ఝల్రాపాటన్ పేరు వచ్చింది. వరుసగా మూడుసార్లు అక్కడినుంచి వసుంధరా రాజే సులభంగానే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడి ఎన్నిక ఏకపక్షంగానే ఉంటుందని భావించిన నేపథ్యంలో.. చివరి నిమిషంలో కాంగ్రెస్ కత్తిలాంటి అభ్యర్థిని రంగంలోకి దించింది. మొన్నటివరకు బీజేపీ ముఖ్య నేతగా ఉండి.. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మానవేంద్ర సింగ్ (బీజేపీ మాజీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు)ను రాజేపై పోటీలో నిలబెట్టింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. మొన్నటివరకు రాజే, మానవేంద్ర సింగ్.. బీజేపీలోనే ఉన్నా.. ఒకరంటే ఒకరికి పడదు. అదే వైరం ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకునేవరకు వచ్చింది. ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఆ తర్వాత రాజకీయ వైరం ముదిరి.. వంశ ప్రతిష్ట, ఆత్మగౌరవం వంటి మాటలు తెరపైకి రావడంతో వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి. 2014కు ముందు వరకు వసుంధర రాజే, జస్వంత్ సింగ్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యమే ఉండేది. అయితే.. గత సార్వత్రిక ఎన్నికల్లో జస్వంత్ సింగ్ తన సొంత రాష్ట్రమైన రాజస్తాన్లో బర్మార్ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించడమే వీరి మధ్య వివాదాన్ని రాజేసింది. జస్వంత్ ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతారోననే భయంతో ఆయనకు టికెట్ రాకుండా రాజే అడ్డుకున్నారు. తీవ్ర మనస్తాపంతో జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బర్మార్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. 4లక్షల ఓట్లను సాధించి ప్రజల్లో తనకున్న పట్టును చాటుకున్నారు. ఆ తర్వాత బాత్రూమ్లో పడిపోయి కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయన కుమారుడు మానవేంద్ర సింగ్ను కూడా పార్టీలో పైకి రాకుండా రాజే అడ్డుకున్నారు. దీంతో నాలుగేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న మానవేంద్ర సెప్టెంబర్లో బర్మార్లో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహించారు. రాజే హయాంలో రాజ్పుత్లకు జరుగుతున్న అవమానాలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాతే కాంగ్రెస్ గూటికి చేరారు. సత్సంబంధాలపైనే రాజే విశ్వాసం ఝల్రాపాటన్ నియోజకవర్గంపై వసుంధర రాజేకు మంచి పట్టుంది. మూడు సార్లుగా ఆమె ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికవుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ చంద్రావత్పై ఏకంగా 60వేల ఓట్ల మెజార్టీని సాధించారు. తన నియోజకవర్గం విషయంలో మాత్రం ఆమె పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అక్కడి ప్రజలతో ఒకరకంగా కుటుంబ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి కూడా బాగా కృషి చేశారు. అద్భుతమైన రోడ్లు వచ్చాయి. విమానాశ్రయం ఏర్పాటైంది. కోటాలో 300పైగా సున్నపురాయి ఫ్యాక్టరీల్లో కార్మికుల మెరుగైన జీవన ప్రమాణాల కోసం చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలు. అయితే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో కొందరు వ్యాపారస్తుల్లో నెలకొన్న అసంతృప్తి, నియోజకవర్గంలో విస్తారంగా సంత్రాలు సాగు చేస్తున్న రైతులు నిండా అప్పుల్లో మునిగిపోవడం, ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల్ని శాసించే రాజ్పుత్లు సర్కార్పై కోపంగా ఉండడం వంటి అంశాలు రాజేకు ఇబ్బందిగా మారాయి. స్థానికుడు కాదు.. కానీ! మానవేంద్ర సింగ్ స్థానికుడు కాకపోవడం ఆయనకు ముళ్లబాటగానే మారొచ్చనే విశ్లేషణలు వినబడుతున్నాయి. బర్మార్ పార్లమెంటు పరిధిలో ఉన్న షియో నియోజకవర్గానికి మానవేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి చాలా చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బర్మార్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ రాజేపై యుద్ధానికి అధిష్టానం మానవేంద్ర సింగ్ను ఎంపిక చేయడంతో.. మొదట్లో ఆశ్చర్యపోయినా తర్వాత పోటీకి సిద్ధమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, రాజ్పుత్ల మద్దతుతోనే నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. రాజ్పుత్ల ఆత్మగౌరవ నినాదాన్ని బాగా జనంలోకి వెళ్లేలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వసుంధరా రాజేకున్న అహంకారాన్ని, తాను ఎదర్కొన్న అవమానాల్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఈ పోరాటాన్ని రాజే వర్సెస్ జస్వంత్ సింగ్ మధ్య పోరాటంగా ఆయన చిత్రీకరిస్తున్నారు. సీఎంగా ఉన్న రాజేను ఆమె సొంత నియోజకవర్గంలో ఢీకొట్టడం అంతం సులభం కాదని మానవేంద్రకూ తెలుసు. ఇవీ కులం లెక్కలు ఈ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నాయి. ముస్లింలు అత్యధికంగా 50వేల మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో దళితులు (35 వేలు)న్నారు. ధకారాలు, రాజ్పుత్లు చెరో 20 వేల మంది వరకున్నారు. సోంధియా రాజ్పుత్లు 15వేలు, బ్రాహ్మణులు, వైశ్యులు 20 వేల మంది ఉంటే.. గుజ్జర్లు 12 వేలు, దాంగి , పటీదార్ సామాజిక వర్గాల ఓటర్లు 16 వేల వరకు ఉన్నారు. సంప్రదాయంగా ఇక్కడ బీజేపీకి ముస్లింలు, దళితులు అండగా ఉంటున్నారు. ఈసారి వారి ఓట్లనే రాజే నమ్ముకున్నారు. గతంలో రాజ్పుత్లు కూడా బీజేపీ వెంటే నడిచినప్పటికీ ఈసారి ఆ పరిస్థితి లేదు. -
కౌన్ బనేగా..టోంక్పతి!
రాజస్తాన్తోపాటు యావద్భారతం దృష్టిని ఆకర్శిస్తున్న స్థానం రాజస్తాన్లోని టోంక్ నియోజకవర్గం. తొలిసారి అసెంబ్లీ బరిలో దిగిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల్లో ఒకడైన సచిన్ పైలట్కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఇన్నాళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న టోంక్లో గెలవడం సచిన్కు ఆవశ్యకం కూడా. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా చివరి నిమిషంలో సచిన్ను టోంక్నుంచి పోటీ చేయించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు, గుజ్జర్లు ఎక్కువగా ఉండే టోంక్లో గుజ్జర్ నేతగా సచిన్ గెలవడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ భావించింది. అయితే.. బీజేపీ కూడా ఆఖరి నిమిషంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్ను బరిలోకి దింపింది. ఇప్పటికే ఇక్కడ బీజేపీకి గణనీయమైన ఓటుబ్యాంకు ఉంది. దీనికితోడు ముస్లింను బరిలో దించడం ద్వారా సచిన్కు సరైన సవాల్ విసరాలనేది బీజేపీ వ్యూహం. సచిన్ కరిజ్మాపై విశ్వాసం తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సచిన్కు పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాజేశ్ పైలెట్ కుమారుడిగా ఆయనకో ఇమేజ్ ఉంది. అందుకే ఎక్కడ నుంచి పోటీ చేసినా నెగ్గడం సచిన్కు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ.. బీజేపీ చివరి నిముషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్సింగ్ను పక్కన పెట్టి యూనస్ ఖాన్కు టిక్కెట్ ఇవ్వడంతో రసవత్తర పోటీకి తెరలేచింది. ఇద్దరూ కొత్తవారే టోంక్లో కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్లుగా ముస్లిం అభ్యర్థినే నిలబెడుతూ వస్తోంది. ఈ సారి ఆ సంప్రదాయాన్ని కాదని సచిన్ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గానికి సచిన్ పైలెట్ పూర్తిగా కొత్త. కానీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో టోంక్లో ‘మేరా బూత్, మేరా గౌరవ్’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొంత పట్టు సాధించారు. 2004లో దౌసా నుంచి 2009లో అజ్మీర్ నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాతో ఓటమిపాలయ్యారు. లోక్సభకు ఆయన ప్రాతినిధ్యం వహించిన దౌసా, అజ్మీర్లకు సరిగ్గా మధ్యలో టోంక్ నియోజకవర్గం ఉంది. సచిన్ తన చిన్నతనంలో టోంక్ జిల్లాలోని దేవ్నారాయణ్ ఆలయానికి (గుజ్జర్ల తమ కులదైవంగా భావిస్తారు) వస్తూ ఉండేవారు. ఈ ఏడాది సెప్టెంబర్లో తన ఇద్దరు కుమారులతో కలిసి సచిన్ ఈ దేవాలయాన్ని సందర్శించారు. బీజేపీ తరఫున బరిలో ఉన్న యూనస్ ఖాన్ కూడా నియోజకవర్గానికి కొత్తవారే. ముస్లిం ఓటర్లే అండగా ఉంటారన్న నమ్మకంతో బీజేపీ ఆయన్ను బరిలో దింపింది. రాష్ట్రంలో బీజేపీ టిక్కెట్ ఇచ్చిన ముస్లిం అభ్యర్థి యూనస్ మాత్రమే. దీద్వానా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన యూనస్ ఖాన్.. సీఎం రాజేకు సన్నిహితుడు. రాజస్థాన్ ప్రభుత్వంలో రాజే తర్వాతి స్థానంలో ఉన్నారు. అటు పైలెట్, ఇటు ఖాన్ ఇద్దరూ టోంక్కి కొత్తవారే. దీంతో వారి వ్యక్తిగత కరిజ్మా, కులసమీకరణలే కీలకం కానున్నాయి. మామ అండ కలిసొచ్చేనా? సచిన్ అభ్యర్థిత్వం స్థానిక ముస్లింలలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. మెజార్టీ ఓట్లు ఉన్న తమని కాదని గుజ్జర్కు టిక్కెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు. మైనార్టీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కూడా. అయితే సచిన్ పైలెట్కు పిల్లనిచ్చిన మామ, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫారుఖ్ అబ్దుల్లా అల్లుడికి అండగా నిలిచారు. ఫారుఖ్ అబ్దుల్లాకి టోంక్లోని సైదీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈ ఇంటి పెద్ద డాక్టర్ అజ్మల్ సైదీ, ఫరూక్ అబ్దుల్లా ఒకే కాలేజీలో చదువుకున్నారు. దీంతో ఫరూక్ తరచూ టోంక్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ముస్లిం కుటుంబమంతా సచిన్ను తమ అల్లుడిగా భావిస్తోంది. ఒక పేరున్న నేత తమ నియోజకవర్గంలో విజయం సాధిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశపడుతోంది. సచిన్కు అండగా ఉంటామని ఆ కుటుంబం హామీ ఇచ్చింది. అజ్మల్ సైదీ కుమారుడు సాద్ సైదీ మొన్నటివరకు టోంక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో మంచి పట్టున్న మరో నవాబు అఫ్తాబ్ అలీఖాన్ కూడా సచిన్ పైలట్కే మద్దతు తెలిపారు. -
సం‘కుల’ సమరం.. ఎవరిదో విజయం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రతిపాదికన ఓట్ల సమరం సాగుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కులం కార్డును బలంగా వాడుకుంటున్నాయి. ఒక కులానికి చెందిన వారిపై అదే కులానికి చెందిన వారికి పోటీ దించాయి ప్రధాన పార్టీలు. దాదాపు 31 నియోజకవర్గాల్లో ఇదే రకమైన పోటీ నెలకొంది. డిసెంబర్ 7న ఎన్నికలకు జాట్ సామాజిక వర్గానికి బీజేపీ, కాంగ్రెస్ 33 సీట్ల చొప్పున కేటాయించాయి. బీజేపీ 26, కాంగ్రెస్15 స్థానాల్లో రాజ్పుత్లను పోటీకి దించాయి. ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం 60 సీట్లుపైగా దక్కాయి. బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వెనుక బడిన కులాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వగా, అధికార బీజేపీ కేవలం ఒఏ ఒక్క టికెట్ కేటాయించింది. 15 నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన వారినే బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోటీకి నిలిపాయి. బ్రాహ్మణులు ఏడు చోట్ల, రాజ్పుత్లు నాలుగు స్థానాల్లో, గుజ్జర్లు, యాదవులు రెండు చోట్ల ముఖాముఖి తలపడుతున్నారు. రాజస్థాన్లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించేప్పుడు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కులాన్ని దృష్టిలో పెట్టుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా రాజ్పుత్ల మద్దతుతో బీజేపీ ముందుకు సాగుతోందని, ఈసారి పరిస్థితి మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే కాంగ్రెస్కు లాభించనుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.05 శాతం, కాంగ్రెస్కు 33.7 శాతం ఓట్లు వచ్చాయి. 2008 శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ 34.27 శాతం, హస్తం పార్టీ 36.82 శాతం ఓట్లు దక్కించుకున్నాట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి సం‘కుల’ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో డిసెంబర్ 11న తేలనుంది. -
మోదీ-షా హవా; కొత్త ట్విస్ట్
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా ద్వయం ముద్ర కనిపించడం లేదు. 2014లో ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వీరి ముద్ర స్పష్టంగా కనిపించింది. బీజేపీలో అన్ని తామే వ్యవహరించి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ మోదీ-షా జోడీ ముందుండి నడిపించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్న రమణ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజే సొంత గొంతుక విన్పిస్తున్నారు. బీజేపీలో అగ్రస్థాయి వ్యూహకర్తల బృందంలో అమిత్ షా, మోదీకి సమానంగా పరిగణించబడుతున్న వీరు మోదీ-షా ద్వయంపై ఆధారపడకుండానే ముందుకు పోతున్నారు. మోదీ ప్రధాని పీఠమెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా 19 రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో జరిగిన జార్కండ్, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాలక పగ్గాలు దక్కించుకుంది. హరియణాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాషాయ పార్టీ సఫలమైంది. ఇదే ఏడాది చివరి జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్లోనూ పాగా వేసింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి అధికారాన్ని పంచుకుంది. బీజేపీకి 2015 కలిసిరాలేదు. అదే ఏడాది ఢిల్లీ, బిహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో కమలం పార్టీకి చుక్కెదురైంది. అసోంలో గెలుపుతో 2016లో ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన కమలనాథులు, అదే సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఎన్నికల్లో భంగపడ్డారు. 2017లో ఉత్తరప్రదేశ్లో భారీ విజయంతో పాటు ఉత్తరాఖండ్, హిమచల్ప్రదేశ్నూ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలోనూ విజయఢంకా మోగించి ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా మారింది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ గుజరాత్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మోదీ-షా సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. అయితే ఈ ఏడాదిలో కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి బీజేపీకి ఝలక్ ఇచ్చాయి. తాజాగా జరుగుతున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మోదీ-షా ముద్ర అంతగా కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న రమణ్ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజె బలమైన నాయకులు. తమకు తామే సొంతంగా వ్యూహాలను అమలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో మోదీ-షా జోడికి పెద్దగా పని లేకుండా పోయింది. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. ఒకవేళ బీజేపీ ఇక్కడ మళ్లీ గెలిస్తే ఆ ఘనత అంతా రమణ్ సింగ్కే దక్కుతుంది. రాజస్థాన్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ రాజే వెనక్కు తగ్గడం లేదు. మోదీ-షా ముద్ర లేకుండానే తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆమెను తప్పించే సాహసం చేయలేకపోతోంది బీజేపీ అధిష్టానం. ఈశాన్య రాష్ట్రం మిజొరంలోనూ మోదీ-షా ముచ్చట లేదు. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణలో బలమైన నాయకులు లేకపోవడంతో మోదీ-షా మ్యాజిక్ పైనే స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీనికనుగుణంగానే మోదీ-షా ప్రచార పర్వాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ-షా హవా నడిచింది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయాల్లో వీరే ఆధిపత్యం చెలాయించారు. బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడంతో అన్ని విజయాలన్నీ వీరి ఖాతాలోకి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుని తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం ఈ ఎన్నికల్లోని విశేషం. ఇక్కడ బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తే మోదీ-షా ‘ముద్ర’ మాయం కావడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. -
ఆత్మకు లేదు శాంతి
రాజస్తాన్లోని జోద్పూర్, ఆ చుట్టుపక్కల పరిసరాలను కలిపి ‘మర్వార్’ అంటారు. మర్వార్ అంటే ‘ఎడారి ప్రాంతం’ అని అర్థం. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఓట్ల పంట పండించుకునేందుకు రెండు కుటుంబాల వారు ప్రయత్నిస్తున్నారు. రాజస్తాన్లో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా జో«ద్పూర్ డివిజన్లోని ఓసియాన్ స్థానానికి దివ్య మదెర్నా, లూనీ స్థానానికి మహేంద్ర బిష్ణోయ్ పోటీ చేస్తున్నారు. దివ్య.. మహిపాల్ మదెర్నా కూతురు. మహేంద్ర.. మల్ఖాన్ బిష్ణోయ్ కుమారుడు. ఆ అమ్మాయి తండ్రి, ఈ అబ్బాయి తండ్రి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఒక సెక్సు కుంభకోణంలో ఏడేళ్ల క్రితం జో«ద్పూర్ డివిజన్లో జరిగిన భన్వారీ దేవి అనే నర్సు కిడ్నాప్–హత్య కేసులో వీళ్లిద్దరూ.. విచారణకు పెద్దగా సమయం పట్టకుండానే.. దోషులుగా నిర్ధారణ అయి, ఆరేళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. భన్వారీ హత్య జరిగే నాటికి మహిపాల్.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి. మల్ఖాన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్లు జైల్లో ఉండగానే 2013 ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు 2018 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ తమ స్థానాలలో తమ వారసులకే టికెట్లు లభించేలా జైలు నుంచే వీళ్లు మంతనాలు జరపగలిగారు. ‘‘మా నాన్నను కుట్ర పన్ని ఇరికించారు. ఆయన నా దగ్గర లేకపోవడం నా జీవితంలో పెద్ద లోటు. ఈ ఎన్నికల్లో గెలిచి ఆయన పరువు నిలబెడతాను’ అని మహిపాల్ కూతురు దివ్య అంటోంది. మహిపాల్ను అరెస్ట్ చేసినప్పుడు జాట్ కులస్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. మల్ఖాన్ అరెస్టు సమయంలో బిష్ణోయ్లు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఈ రెండు కులస్థులదీ ఓ మోస్తరు ఓటు బ్యాంకు. ఆ వోటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్న క్రమంలోనే ఇప్పుడూ ఆ రెండు కుటుంబాల్లోని పిల్లలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. 2013 ఎన్నికల్లో మహిపాల్ భార్య లీల, మల్ఖాన్ తల్లి ఆమ్రీదేవి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆశించిన విధంగా సానుభూతి దక్కకపోవడంతో ఇద్దరూ ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో నిలబడిన దివ్యదీ, మహేంద్రదీ సుసంపన్నమైన అనువంశిక రాజకీయ వారసత్వం. దివ్య తాతగారు పరాశ్రమ్ మదెర్నా తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్కి ఆయన శక్తిమంతమైన జాట్ అభ్యర్థి. దివ్య తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా, కొంతకాలం మంత్రిగా ఉన్నారు. దివ్య తల్లి లీల కాంగ్రెస్లో క్రియాశీల కార్యకర్త. మహేంద్ర బిష్ణోయ్ తాతగారు రామ్సింగ్ బిష్ణోయ్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మహేంద్ర తండ్రి మల్ఖాన్ జైలుకు వెళ్లబోయేముందు వరకు కూడా ఎమ్మెల్యే. ‘‘నా తండ్రి కోసమైనా నేను ఈ ఎన్నికల్లో గెలిచితీరుతాను’’ అని మహేంద్ర అంటున్నాడు. అయితే భన్వారీ ‘ఆత్మ’ ఘోష వీళ్లను గెలవనివ్వదన్న ప్రచారం జోద్పూర్ డివిజన్లో జరుగుతోంది. భన్వారీ కిడ్నాప్ – హత్య కేసు 2011 సెప్టెంబర్ 1న భన్వారీదేవి అదృశ్యం అయ్యే నాటికి ఆమె వయసు 36 ఏళ్లు. జోద్పూర్ జిల్లాలోని జలివాడ ఉప ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్నారు. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. రూపవతి అయిన భన్వారీకి అధికార కాంగ్రెస్ పార్టీలోని రాజకీయనాయకులతో సన్నిహిత పరిచయాలున్నాయి. ఆ పలుకుబడితో రెండేళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి ఆమె నిరాశకు గురై, తనని నమ్మిన రాజకీయ నాయకుల్ని బ్లాక్మెయిల్ చెయ్యడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఓ సెక్సు కుంభకోణానికి సాక్షిగా మారారు. అది ఆమె కిడ్నాప్కు, హత్యకు దారి తీసింది. ఇందుకు కుట్ర పన్నారన్న నేరారోపణ నిజం కావడంతో మహిపాల్ మదెర్నా, మల్ఖాన్ బిష్ణోయ్లకు జైలు శిక్ష పడింది. -
పొలిటి'కలే?'
‘మహిళలకు ఓటు హక్కే కాదు..ఎన్నికల్లో నిలబడే హక్కు ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం’ అంటారు చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బచెలెత్. మన దగ్గర స్త్రీలకు ఆ హక్కు ఉంది.. వినియోగించుకుని ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులూ అయినవారున్నారు.. అవుతున్నారు కూడా. అయితే, హక్కు ఉంటే సరిపోదు..ఆ వాతావరణం..స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఉండాలి. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలంటే మహిళలు గడపదాట గలిగే వెసులుబాటు ఒక్కటే కాదు. ఇంటి బాధ్యతల నుంచి కూడా వెసులుబాటు. ఫలానా పనులు ఆడవాళ్లు మాత్రమే చేయాలి అన్న నియమనిబంధనల నుంచి వెసులుబాటు. కొన్ని సాంఘిక కట్టుబాట్ల నుంచి కూడా వెసులుబాటు చాలా అవసరం. మహిళలకు పాలనలో సమభాగస్వామ్యం కావాలంటే మిగిలిన బాధ్యతల నుంచి వెసులుబాట్లు తప్పనిసరి. దీన్ని ఇటీవలి ఎకనామిక్ సర్వే కూడా వెల్లడించింది. మరో కోణం రాజకీయాల్లో స్త్రీల భాగస్వామ్యం పెరగకపోవడానికి మరో కోణం కూడా కనిపిస్తుంది. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అబ్బాయిలు నచ్చిన పార్టీలో చేరి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అమ్మాయిలకు ఆ అవకాశం ఉండట్లేదు. చదువు తర్వాత ఉద్యోగం.. లేదంటే వెంటనే పెళ్లి తప్పనిసరి. కాదనుకొని వెళ్లినా రక్షణ సమస్యగా మారుతుంది. ఇప్పటికీ మన దేశంలో పాలిటిక్స్ అంటే మహిళలకు రిస్క్ అనే భావనే. మరి ఇప్పుడు ఉన్న మహిళా నేతలు వచ్చినా.. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు చాలా తక్కువే. - తండ్రికి వారసురాలిగానో.. భర్తకు ప్రతినిధిగానో.. కుటుంబ రాజకీయ, వ్యాపార లావాదేవీలకు టూల్గానో మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం మినహా.. ఆసక్తితో, లక్ష్యంతో, ప్రజాసంక్షేమ కాంక్షతో, విధాన నిర్ణయాల్లో భాగస్వామి కావాలనే తపనతో, పూర్తి అవగాహనతో వచ్చిన వాళ్లు చాలా తక్కువ. - మహిళలు రాజకీయాల్లో కీలకంగా ఉండుంటే.. ఈ రోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితే ఉండకపోయేది. మారిన ఎన్నికల చిత్రం రాజకీయాల్లోకి రావాలంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి. ప్రజాజీవితంతో మమైకమైన జీవనశైలిని పాటిస్తుండాలి. ప్రశ్నించే తత్వం కావాలి. ఇప్పుడు వీటన్నిటికన్నా.. డబ్బు ముఖ్యం. మనీతో పవర్.. పవర్తో మనీ.. రొటేట్ అవుతున్నాయి. కుటుంబ వారసత్వంతో వచ్చిన వారికి ఆర్థిక, నైతిక మద్దతుతోపాటు అంగబలమూ ఉంటోంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్గా రావాలనుకునే వారికే అన్ని ఇబ్బందులు. ప్రధాన పార్టీలూ అంత తర్వగా వీరిని ఆహ్వానించట్లేదు. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఏం చెప్పింది? 2017–18 సంవత్సరానికి నిర్వహించిన ఈ సర్వేలో 49 శాతం మహిళా జనాభా ఉన్న మన దేశంలో వాళ్ల రాజకీయ భాగస్వామ్యం కేవలం 15 శాతమేనని తేలింది. రువాండా లాంటి దేశంలో పార్లమెంట్లో 60 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉంటే మనం 15 శాతంతో ఈజిప్ట్, బ్రెజిల్, మలేషియా, శ్రీలంక, థాయ్లాండ్ వంటి దేశాల సరసన ఉన్నాం. - ఇంటర్– పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ విమెన్ విభాగం ఇచ్చిన ‘విమెన్ ఇన్ పాలిటిక్స్ –2017’ అనే నివేదికను కూడా ఈ సర్వే ప్రస్తావించింది. - ఆ నివేదిక ప్రకారం 2016, అక్టోబర్ నాటికి దేశంలో ఉన్న 4, 118 మంది ఎమ్మేల్యేలలో మహిళల శాతం కేవలం తొమ్మిది. - 2010 నుంచి 2017 వరకు అంటే ఏడేళ్లలో చట్టసభల్లో (లోక్సభ)పెరిగి మహిళా భాగస్వామ్యం ఒక్క శాతమే. - ఇంటి బాధ్యతలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ భారం, కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్లే మహిళలు రాజకీయాల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారని సర్వే తేల్చింది. ఎంత మందికి అధికారం? ఇప్పుడు ఎన్నికైన వాళ్లకెంతమందికి అధికారం ఇచ్చారని మనం పార్టిసిపేషన్ గురించి మాట్లాడుకోవాలి? తెలంగాణ ప్రభుత్వంలో ఎంత మంది మహిళలకు పదువులున్నాయి? మహిళా కమిషన్ కూడా లేదు. వెల్ ఎడ్యూకేటెడ్, అవేర్నెస్, ఉత్సాహం ఉన్న సూరేపల్లి సూజాత లాంటి వాళ్లకు ఏ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి? అసలు పొలిటికల్ పార్టీస్కే మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదు. ఇలా అయితే విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా పెరుగుతుంది.? – రమా మేల్కొటే, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకురాలు కార్యకర్తలే అడ్డు చెప్తరు.. ఎలక్షన్లలో నిలబడ్డానికి ఆడవాళ్లు ఉత్సాహంగానే ఉన్నరు. అయితే టికెట్లిచ్చే దగ్గర పార్టీ పెద్దలు ఎంత పక్షపాతంగా ఉన్నరో, కార్యకర్తలూ అంతే ఉన్నరు. మగవాళ్లకే సీట్లివ్వాలని ఒత్తిడి చేస్తరు. వాళ్లను గెలిపించేందుకే కష్టపడ్తరు. ఎందుకంటే మగవాళ్లు వస్తే వాళ్లు తింటరు, వీళ్లకు తినిపిస్తరు అని. అదే ఆడవాళ్లయితే అంత అవినీతికి పాల్పడరు కదా. అందుకే కార్యకర్తలకు ఫాయిదా ఉండదు. అందుకే మహిళలకు సపోర్ట్ చేయరు. అయినా మహిళలు నిలబడాలే. – సి. బాలేశ్వరి,గృహిణి, హైదరాబాద్ వేరుగా ఓ పార్టీ పెట్టి.. రాజకీయ చైతన్యం మహిళ్లో పెరిగింది. కానీ.. భాగస్వామ్యం తగ్గింది. దీనికి మార్కెట్ సంస్కృతి ఒక కారణం. డబ్బు, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల ధైర్యంగా ముందుకొస్తున్నవాళ్లు మహిళల సంఖ్య తక్కువే. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందిన వారు సైతం ఇతరుల మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? మహిళలమే సపరేట్గా ఓ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేయట్లేదు. పార్టిసిపేషన్ పెరగాలంటే ఇవన్నీ అవసరమే. అన్నిరకాలుగా ప్రెషరైజ్ చేయాలి. – డాక్టర్ సమున్నత, అసిస్టెంట్ ప్రొఫెసర్, బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ ప్రయోజనాలెన్నో.... - మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల సమాజ ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది. సున్నితత్వం పెరుగుతుంది. - అవినీతి, దుబారాలకు తావుండదు. నేరాల, ఘోరాల నియంత్రణ జరుగుతుంది. - దేశానికి స్త్రీ కోణం అవసరం. ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీ తనం, ఖర్చులకు ఒక లెక్కా, పత్రం, మౌలిక సదుపాయల వసతి, అందరికీ ఉపాధి.. ఇవన్నీ అవలీలగా నిర్వహించగల సమర్థురాలు స్త్రీయే. - స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా మనం ఇంకా మౌలికసదుపాయాలు, అందరికీ ఉపాధి దగ్గరే ఆగిపోయాం. దీనికి కారణం.. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగకపోవడమే. - భవిష్యత్కి ఘనమైన చరిత్ర ప్రేరణ కావాలంటే వర్తమానం ఆరోగ్యంగా ఉండాలి. ఆలోచన ఉన్న స్త్రీలకు అవకాశం కావాలి. ఇప్పుడు చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రశ్నించాలి. తమ సంఖ్య పెంచుకునేలా ప్రయత్నించాలి. రాజకీయాల్లోనూ మన ఉనికి చాటడానికి మరో ఉద్యమానికి ఊపిరి పోసైనా సాధించుకోవాలి. ధాయ్.. ది లవ్ డాక్టర్ శంకర్దాదా ఎంబీబీఎస్ గుర్తుందా? రోగులకు వైద్యం కన్నా ప్రేమపూర్వకమైన మాటలు అవసరమంటూ చిరంజీవి చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి ఓ వైద్యుడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో నిలిచి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ధాయ్ అక్సర్ అనే డాక్టర్.. ప్రజాస్వామ్యాన్ని ప్రేమపూర్వకంగా మార్చాలన్న లక్ష్యంతోనే ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. జబల్పూర్(ఉత్తరం) నియోజకవర్గంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రేమతంత్రమంటే అందరినీ ఏకం చేయడమేనని ఆయన నిర్వచిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన పదిసార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ.. డాక్టర్ గారి ప్రేమ మంత్రం ప్రజలకు పెద్దగా పట్టలేదు. పోటీ చేసిన ప్రతిసారీ ఆయనకు ధరావతు కూడా దక్కలేదు. ఇవేవీ ధాయ్లో ఉత్సాహాన్ని నీరుగార్చలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడంపై పెద్దగా ఆందోళన లేదని, ప్రజల్లో ప్రేమను పెంచేందుకు పాతికేళ్లుగా కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతమున్నది నిజమైన ప్రజాస్వామ్యం కాదంటున్నారు ఈ అభినవ శంకర్దాదా. అసలు రాజకీయ పార్టీల అవసరం లేదని, అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చోవాలని, ఎలాంటి ప్రచారాలను అనుమతించకూడదని, ప్రజలు ఎవరి ప్రభావం లేకుండా ఒకరిని ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికైనా తన సిద్ధాంతాలకు ప్రాచుర్యం వస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఈయనకు కొందరు శిష్యులు కూడా ఉన్నారు. వీళ్లకు ఆయన సిద్ధాంత ప్రవచనం చేస్తుంటారు. మరి ఇంటి ఖర్చులు ఎలాగంటారా? పెద్దవాళ్లిచ్చిన ఆస్తులపై అద్దెలతో డాక్టర్ సాబ్ కాలం వెళ్లబుచ్చుతున్నారు. మంగళవారం ఛత్తీస్గఢ్ తుదివిడత ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు పెళ్లిలో ఓటు సందడి! ప్రజాస్వామ్య మనుగడ ప్రజల భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంటూ ఊదరగొట్టే పలువురు మేధావులు ఎన్నికలు వచ్చే సరికి ఓటేయడానికి బద్ధకిస్తారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన అతహుల్లాఖాన్ అందరిలాగా కాదు. సామాజిక కార్యకర్తగా ప్రజలను చైతన్యం చేయడం తన బాధ్యతగా భావిస్తారు. తాజాగా తన కుమారుడి పెళ్లి వేడుకలో ఓటు ప్రాముఖ్యత గురించి పోస్టర్లు అతికించడం ద్వారా ఖాన్ వార్తల్లో నిలిచాడు. పెళ్లిలో విందులు, బహుమతులతో పాటు అతిథులకు ఓటేయాలంటూ కరపత్రాన్ని ఇచ్చారు. ‘ఓటు వేయడం ప్రతిఒక్కరి నైతిక బాధ్యత. నా నగరంలో ప్రజలకు ఆ బాధ్యత మరొక్కమారు గుర్తు చేశాను’ అని ఆయన వినమ్రంగా చెబుతున్నారు. సెంటిమెంట్ పాయింట్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎవరికివారు ప్రచారం ఉధృతం చేశారు. చాలామంది అభ్యర్థులు కేవలం ప్రచారంతో సరిపెట్టుకోకుండా సెంటిమెంటు, చిట్కాల ద్వారా అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. తమ అదృష్ట దీపాలుగా భావించే భార్యనో, చెల్లినో, కుమారుడినో ప్రచారంలోకి తీసుకుపోవడం, బియ్యాన్ని పంచడం, తులసి పూజలు చేయడం.. ఇలా ఒకటేమిటి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. సెంటిమెంట్ తమను గట్టెక్కించాలని మొక్కుకుంటున్నారు. ప్రధాన నిర్ణయాలు తీసుకునేముందు తల్లి కాళ్లకు నమస్కరించడం ఒక అభ్యర్థి అలవాటైతే, తులసి పూజ చేయకుండా బయటకు అడుగెయ్యకపోవడం మరొక అభ్యర్థి ఆచారం. తల్లి ఆశీర్వాదం తనకు ఎప్పుడూ కలిసివస్తుందని, ప్రతిరోజూ ఆమెకు నమస్కరించే ప్రచారం ఆరంభిస్తానని బీజేపీ అభ్యర్థి ఒకరు చెప్పారు. మరో కాంగ్రెస్ అభ్యర్థికి తన నియోజకవర్గంలోని ప్రతి గుడిని దర్శించిరావడం రివాజుగా మారింది. మహిళా అభ్యర్థుల్లో ఎక్కువమంది తులసి పూజకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పూజతో తమకు పాజిటివ్ శక్తి వస్తుందని వారు నమ్ముతారు. మధ్యప్రదేశ్ ప్రజల్లో బియ్యం పంచితే అదృష్టం వరిస్తుందని నమ్మకం ఉంది. అందుకే ఒక అభ్యర్థి మూడురంగుల బియ్యాన్ని నియోజకవర్గ ప్రజలందరికీ పంచుతున్నాడు. ఏమాత్రం తగ్గనంటున్న ఆయన ప్రత్యర్థి ప్రజలందరికీ పసుపు బియ్యాన్ని పంచడం ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థులు పార్టీ గుర్తయిన కమలం పువ్వును ఇస్తున్నారు. కొందరు కుటుంబసభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు మాత్రం ఈ సెంటిమెంట్లకు నవ్వుకుంటున్నారు. ఆ నాలుగు రాష్ట్రాలు 12 శాతం! సీట్లలో మహిళల వాటా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మహిళలకు ఇచ్చిన సీట్లు చాలా తక్కువే. గతంలో ఇచ్చి్చన సీట్ల కంటే తక్కువనే చెప్పుకోవాలి. ఛత్తీస్గఢ్లో బీజేపీ 15 మంది, కాంగ్రెస్ 13 మంది మహిళలకు సీట్లు ఇస్తే.. రాజస్తాన్లో బీజేపీ 21 మంది, కాంగ్రెస్ 27 మంది అతివలను బరిలో దింపాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 28, బీజేపీ 24 మంది మహిళలకు పార్టీ టికెట్లు ఇచ్చాయి. అయితే మిజోరంలో మాత్రం బీజేపీ ఆరుగురు మహిళలకు సీట్లివ్వగా.. కాంగ్రెస్ ఒక్కరినే బరిలో దింపింది. దేశవ్యాప్తంగా మహిళల ఓట్ల శాతం పెరుగుతోందని సర్వేల్లో వెల్లడవుతున్నప్పటికీ.. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్యలో పెరుగుదల అనుకున్నంత వేగంగా లేదు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య 68. ఇది మొత్తం ఎంపీల సంఖ్యలో 12% మాత్రమే. చట్టసభల్లో మహిళల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన 33% రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చితే.. మనకు168 మంది మహిళా ఎంపీలు ఉంటారు. అయితే రాజకీయ ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఈ అంశం ఆలస్యమవుతోంది. -
రాజస్థాన్లో బీజేపీ వ్యూహాత్మక మార్పు
-
పల్లే.. పట్టు!
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. భారత దేశంలో వ్యవసాయ రంగానికి సమస్యలు మొదట్నుంచీ తీవ్రంగానే ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో రైతు ఆందోళనలు రాజకీయ రంగు పులుముకోవడం ఆయా రాష్ట్రాల్లో అధికార పక్షాలకు సవాల్గా మారింది. ఈ ఎన్నికల్లో రైతు సమస్యలను ççప్రసావిస్తూ వెళ్తేనే ఓట్లను ప్రభావితం చేయవచ్చని విపక్షాలు గుర్తించాయి. అందుకే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నియోజవకర్గాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకే అధికారం అందనుందనేది సుస్పష్టం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలుచేస్తేనే భారత వ్యవసాయ రంగ పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఈ రంగంలోని నిపుణులు కోరుతున్నారు. ఇది గత 15 ఏళ్లుగా దేశమంతా వినిపిస్తున్న డిమాండ్. కానీ.. ప్రభుత్వాలు మాత్రం ఈ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ తమ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి వీలున్నన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవేవీ అన్నదాతకు పూర్తి భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, చీడ పీడ పెరగడం– సరైన నీటి వనరులు లేకపోవడంతో వ్యవసాయ దిగుబడులు తగ్గడం వంటివి రైతును కుంగదీస్తున్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకునే ఉపశమన చర్యల కంటే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. పలుచోట్ల ఆత్మహత్యలు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో గతేడాది జరిగిన రైతు ఆందోళనలు, తదనంతర పరిణామాల్లో ఆరుగురు రైతులు పోలీసు కాల్పుల్లో చనిపోవడం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి. ఇది శివరాజ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. దీనికితోడు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయనే విమర్శలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నప్పటికీ.. రైతు సమస్యలే ప్రభుత్వ ఏర్పాటును శాసించబోతున్నాయనేది నిర్వివాదాంశం. అసంఘటిత రంగానికి దెబ్బ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు కారణంగా అసంఘటిత రంగ కార్మికులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మార్కెట్లో చెలామణీకి సరిపోయేంతగా నగదు అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కొనేవారి వద్ద, అమ్మేవారి వద్ద డబ్బుల్లేకపోవడంతో మార్కెట్ దెబ్బతింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో దీంతో నష్టం వచ్చింది. పట్టణ ప్రాంతాల్లోలాగా డిజిటల్ లావాదేవీలు.. గ్రామీణ ప్రాంతాలకు వెంటనే అందుబాటులోకి రాకపోవడం, ఇలాంటి లావాదేవీలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో సమస్యలు ఎక్కువగా కనిపించాయి. ఈ క్రమంలోనే వివిధ అంశాల కారణంగా దేశ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గింది. ఆ తర్వాత ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ.. చిరువ్యాపారులు, కార్మికరంగానికి జరిగిన నష్టం పూడ్చలేకపోయారు. అటు రైతుల విషయంలోనూ ప్రభుత్వం మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంచినప్పటికీ.. రైతులు పండించిన మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో సమస్య మొదటికే వచ్చింది. 200 జిల్లాల్లో కరువు ఈ ఏడాది గతం కన్నా రుతుపవనాలు సరిగ్గానే ఉన్నప్పటికీ.. దేశలోని 600 జిల్లాలకు గానూ 200 జిల్లాల్లో కరువు పరిస్థితులే ఉన్నాయి. వాటిల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్లో జిల్లాలు కూడా ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయకపోవడంతో కూలీలు కూడా దుర్భర జీవితాన్నే గడుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లోనూ కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభా 12.4 కోట్లు. వీళ్లంతా ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నారనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ గ్రామీణ నియోజకవర్గాల్లో బీజేపీపై పూర్తి పైచేయి సాధించింది. అయితే ఈ సారి వీరి దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వంపై రైతులు, చిరువ్యాపారలు వ్యతిరేకతను పక్కనపెడితే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన దానికన్నా.. తాము రైతులకు చేసిన మేలే ఎక్కువని బీజేపీ చెబుతోంది. అసంతృప్తి ఎదురైతే? 2004లో వాజపేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కూడా గ్రామీణ భారతంలో పూర్తిగా పరిష్కారం కాని సమస్యలున్నాయి. రైతులు, రోజు కూలీలు, కార్మికుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే ఎన్డీయే సర్కారు మౌలిక సదుపాయాల రంగం పైనే ఎక్కువ దృష్టి సారించింది. భారత్ వెలిగిపోతోందని విశ్వసించింది. అదే నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గ్రామీణ ప్రాంత ఓటరు నిర్ణయం కారణంగా.. బీజేపీ ఓడిపోయింది. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజా నిర్ణయానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు గీటురాయిగా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీ సంప్రదాయ ఓటర్లలో బ్రాండ్ మోదీ, బీజేపీ మధ్య స్పష్టమైన విభజన ఉంది. 2014 తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా గెలుస్తోందంటే.. దానికి మోదీ మ్యాజిక్ కారణం. మరి ఆ మోదీ మ్యాజిక్ ఈ సారి ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లను మెప్పిస్తుందో లేదో మరి కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ‘గుజరాత్’లో మోగిన ఘంటికలు గతేడాది డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల సమస్యలే ఎన్నికల ప్రధాన అజెండాగా మారాయి. అప్పుడే బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగాయి. మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీపై విముఖత వ్యక్తమైంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. గుజరాత్ జనాభాలో దాదాపుగా 43% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. వారంతా బీజేపీకి అండగా నిలవడంతో ఆ పార్టీ ఎన్నికల్లో గట్టెక్కింది. గుజరాత్తో పోలిస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత ఓటర్లు తక్కువ. మధ్యప్రదేశ్లో 28%, రాజస్తాన్లో 25%, ఛత్తీస్గఢ్లో 23% మాత్రమే పట్టణ ఓటర్లు ఉన్నారు. వీరి సాయంతోనే ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అంత సులభం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మందసౌర్ ఘటనతో మేల్కొన్న శివరాజ్ సింగ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో రైతుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ‘భవాంతర్’ స్కీమ్ ద్వారా సోయా, మొక్కజొన్న వంటి పంటలపై క్వింటాల్కు మార్కెట్ రేటుకు అదనంగా రూ. 500 ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కొంతమేర వ్యతిరేకతను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. రాజస్తాన్లో పరిస్థితి ఏమాత్రం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు! రాజస్తాన్లో పాకిస్తాన్తో సరిహద్దు రేఖ వెంట గ్రామాల్లో రైతులకు అసెంబ్లీ ఎన్నికలు కొత్త చిక్కులు తెచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో శ్రీగంగానగర్ జిలాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గ్రామస్తుల కదలికలపై పరిమితులు విధించారు. ఈ షరతులతో రైతులకు పొలం పనులు చేసుకోవడం కష్టంగా మారింది. ఈ జిల్లాలో దాదాపు 50 గ్రామాలు సరిహద్దు రేఖ వెంబడి ఉన్నాయి. వీటిలో ఐదు గ్రామాల్లో బీఎస్ఎఫ్ పోస్టులు కూడా ఉన్నాయి. విత్తడం నుంచి కాపు కోతవరకు ప్రతిపనికి రైతులు బీఎస్ఎఫ్ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఏ పనైనా ఉదయం 9–4 గంటల మధ్యలోనే ముగించాలనడంతో ఇబ్బంది అవుతోందని రైతులంటున్నారు. దీనికితోడు మూడు అడుగులకు పైన పొడవు పెరిగే పంటలు వేయకూడదని ఆంక్షలున్నాయని వాపోయారు. దీంతో చెరకు లాంటి వాణిజ్య పంటలు కాదని కేవలం కూరగాయలను పండిస్తున్నామని చెప్పారు. కొంతమంది రైతులు ఈ ఆంక్షలకు జడిసి పొలంపనికి పోవడమే మానేశారు. సరిహద్దు కంచె నిర్మాణం కోసం 1982లో పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. వీరిలో చాలామందికి ఇంతవరకు పరిహారం దక్కలేదని అక్కడి ప్రజల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ సారవంతమైన భూముల కారణంగా పొలాలకు రేట్లు ఎక్కువ. అయితే ఈ ఆంక్షల కారణంగా పెద్దగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అయితే.. ఇన్ని ఇబ్బందులున్నా ఇక్కడి ప్రజలకు మాత్రం బీఎస్ఎఫ్ వాళ్లంటే చాలా అభిమానం ఉండడం కొసమెరుపు. ఒట్టేసి చెబుతున్నా..! ఎన్నికల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టబోనని ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి బల్లగుద్ది చెబుతున్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చటానికే జోగి బరిలో ఉన్నారన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వడంమో, బీజేపీ మద్దతు తీసుకోవడమో చేయను’అని భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహెబ్, షాడానీ ప్రకట్ తదితర ఎనిమిది మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలపై మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రమాణం చేశారు. ఇదంతా తనపై బురదజల్లేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల ప్రచారమని దుయ్యబట్టారు. బీజేపీతో జట్టు కట్టడం కన్నా చావడమే మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో సీజేసీ, బీఎస్పీ, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని కాంగ్రెస్ భయపడుతోంది. ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో బీజేపీపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని జోగి వైపుకు మరలించి తద్వారా కూటమిని బలహీనపరచాలని కాంగ్రెస్ యోచిస్తోంది. -
రండి.. రండి.. అక్కడ దొరక్కపోతే ఇక్కడ టికెటిస్తాం!
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను జయించేందుకు బీజేపీ.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా మేథోమధనం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాల అనంతరం జాబితాలు విడుదల చేస్తున్నాయి. రాజస్తాన్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే తీరాలన్న పట్టుదలతో ఈ రెండు పార్టీలున్నాయి. అందుకే ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి ఈ పార్టీలో.. ఈ పార్టీ నుంచి వచ్చిన వారికి ఆ పార్టీలో టికెట్లు ఇచ్చేస్తున్నాయి. వాస్తవానికి రెండు పార్టీలు కూడా ఎన్నికలకు ముందు.. కేవలం టికెట్ల కోసమే పార్టీలో చేరే వారికి బీ–ఫారం ఇవ్వొద్దనుకున్నాయి. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి పక్క పార్టీలనుంచి వచ్చే వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ ‘నో’ చెప్పాల్సిందేనని ఏఐసీసీ సమావేశాల్లో స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. వసుంధరా రాజేను ఓడించాలంటే.. బీజేపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్కే నచ్చజెబుతున్నారు. దీంతో పారాచ్యూట్ నేతలకు ఇరు పార్టీలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి. మొత్తం 152 పేర్లతో విడుదలైన కాంగ్రెస్ జాబితాలో నలుగురు వివిధ పార్టీల నేతలకు టికెట్ ఇచ్చింది. జాబితా విడుదలకు నిమిషాల ముందు పార్టీలో చేరిన వారికీ టికెట్ ఖరారు చేసింది. అటు, బీజేపీ కూడా కాంగ్రెస్, బీఎస్పీ నుంచి వచ్చిన నేతలకు పిలిచి టికెట్లు ఇస్తోంది. ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే.. పార్లమెంటుకు 152 పేర్లతో కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో పలువురు సీనియర్లకు స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు రంగం సిద్ధం చేసే ఉద్దేశంతో మాజీ ఎంపీలు, సీనియర్ నేతలను కూడా ఎమ్మెల్యేలుగా బరిలో దిగాల్సిందేనని ఆదేశించింది. పాతిక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 20 మందికి తొలి జాబితాలో చోటు లభించింది. జాబితా విడుదలకు ఒకరోజు ముందే కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేత హరీష్ మీనాకు డియోలి ఉనియారా టికెట్ కేటాయించగా.. మరో ముగ్గురు బీజేపీ నేతలకు టికెట్లు ఇచ్చారు. సచిన్ తొలి ఎన్నికలు సీఎం రేసులో ఉన్న సచిన్ పైలట్కు టోంక్ స్థానాన్ని, అశోక్ గెహ్లాట్కు సర్దార్పుర సీటును కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం సచిన్కు ఇదే మొదటి సారి. టికెట్ లభించిన సీనియర్లలో కేంద్ర మాజీ మంత్రి సీపీ జోషి, గిరిజా వ్యాస్, రామేశ్వర్ దూది, అజ్మీర్ ఎంపీ రఘు శర్మ, దౌశ ఎంపీ హరీశ్ మీనా, మాజీ ఎంపీ రఘువీర్ మీనా తదితరులున్నారు. గెహ్లాట్కు అసెంబ్లీ టికెట్ కేటాయించడాన్ని బట్టి ఆయన్ను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని నాయకత్వం భావిస్తున్నట్టు అర్థమవుతోంది. కాగా, కాంగ్రెస్ తొలి జాబితాలో 19 మంది మహిళలు, 9 మంది ముస్లింలు, 30 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారు. 16 మందికి విశ్రాంతినిచ్చిన బీజేపీ కాంగ్రెస్ తొలి జాబితా విడుదలకు ఒకరోజు ముందే 31 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. సిట్టింగ్లలో 16 మందికి టికెట్ నిరాకరించింది. దీంతో రెండు జాబితాల్లో కలిపి మొత్తం 37 మంది సిట్టింగులకు ఉద్వాసన పలికినట్టయింది. 19 మంది మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. తొలి రెండు జాబితాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. రాజే వద్దన్నప్పటికీ దాదాపు 13 మంది సీనియర్ నేతల కుటుంబ సభ్యులకు రెండో జాబితాలో చోటు లభించింది. అన్నీ పాత ముఖాలే.. సిట్టింగుల్లో చాలా మందిపై అసంతృప్తి ఉన్నందున కొత్తవారికి టికెట్లు ఇస్తారనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగింది. అయితే తొలి రెండు జాబితాలు చూస్తే మాత్రం ఈ కొత్తదనమేదీ కనిపించలేదు. సిట్టింగులకే ఎక్కువ సీట్లివ్వడంతోపాటు.. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన వారికీ ఈసారి అవకాశాన్నిచ్చారు. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని బీజేపీ సీనియర్ నేతలంటున్నారు. బికనేర్, షెకావతీ ప్రాంతాల్లో కొత్తవారెవరూ ఆసక్తి చూపకపోవడంతోనే పాతవారికి అవకాశం ఇచ్చామని చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో కొత్తవారికి అవకాశమిస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లవుతుందని పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వసుంధరా రాజే చెప్పారు. ఈ సమయంలో మార్పు మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజేకు వ్యతిరేకంగా వెళ్లొద్దనే బీజేపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఏదేమైనా ఇరు పార్టీలు గెలుపుకోసం.. నిర్దేశించుకున్న నిబంధనలు పక్కనపెట్టి మరీ ముందుకెళ్తున్నాయి. రాజేను ఓడించాలని! రాజస్తాన్లో రసవత్తర పోరుకు కాంగ్రెస్ తెరలేపింది. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి వసుంధరా రాజేపై మొన్నటివరకు రాష్ట్ర బీజేపీలో కీలకనేతగా ఉండి.. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మానవేంద్ర సింగ్ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. మానవేంద్ర సింగ్ రాకతో.. ఝాల్రాపటన్లో పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాజీ నేత, మోదీని విమర్శించిన జస్వంత్ సింగ్ కుమారుడే మానవేంద్ర సింగ్. అయితే.. కాంగ్రెస్కు అభ్యర్థులు కరువైనందునే మానవేంద్రను బరిలో దించారని రాజే విమర్శించారు. -
రాజ్పుత్ వర్సెస్ రాజ్పుత్
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేసేందుకు తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కొడుకు, శివ్ ఎమ్మెల్యే మాన్వేంద్ర సింగ్ పేర్కొన్నారు. రాజ్పుత్ నాయకుడిని అవమానించినందుకు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ టికెట్పై గెలుపొందిన మన్వేందర్ సింగ్ ఇటీవలే ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలరాపటాన్ నుంచి మన్వేంద్ర పోటీ చేస్తారని పేర్కొంది. ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు.. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన మన్వేందర్ సింగ్కు ఏ సీటు కేటాయించాలో అర్థం కాకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఆయనను నిలబెట్టారని వసుంధర రాజే అన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని ఆమె వ్యాఖ్యానించారు. 2003 నుంచి మూడు పర్యాయాలు అక్కడి నుంచి గెలిచిన విషయాన్ని మరోమారు గుర్తుచేశారు. కాగా వసుంధర రాజే నాయకత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్వేంద్ర సింగ్ను ఆమెపై పోటీకి దించడం ద్వారా సీఎంను చాలా తేలికగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ సంకేతాలు జారీ చేస్తోంది. అంతేకాకుండా ఈ టికెట్ను రాజ్పుత్కే కేటాయించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
రాజస్థాన్ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా
-
నయా 'రాజ'రికం
రాచరికం అంతమైపోయినా, రాజ్యాలు మాయమైనా.. వాళ్ల రక్తంలో మిళితమైన అధికార ఆరాటం తగ్గలేదు. మారిన సామాజిక పరిస్థితుల్లో నాటి రాజ్యాధికారానికి సమానమైన వేదిక రాజకీయమేనని వాళ్లకు అర్ధమైంది. ఇదే రాజకుటుంబాలను పాలిటిక్స్వైపు నడిపించింది. రాజుల గడ్డ రాజస్తాన్లో అధికార పీఠంపై రాజ కుటుంబీకుల ముద్ర స్పష్టంగా కనబడుతోంది. వీరు అధికారంలో ఉండటమో.. లేక వీరి మనుషులు ప్రభుత్వాలను శాసించడమో పరిపాటిగా మారింది. రాజా హనుమంత్ సింగ్, రాణీ గాయత్రీ దేవి మొదలుకుని నేటి వసుంధరా రాజే వరకు రాజకుటుంబాలకు రాజకీయాలపై ఆసక్తి చాలా ఉంది. దాదాపు అన్ని రాజ కుటుంబాలు స్వాంతంత్య్రానంతరం తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఒక దశలో ఎంఎల్ఏ, ఎంపీ సీట్ల వరకు పరిమితమైన రాజకుటుంబీకులు క్రమంగా రాష్ట్రం మొత్తం ప్రాభవాన్ని విస్తరించుకొని చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా చేజిక్కించుకున్నారు. అయితే దీన్నుంచి ఒక్క రాజ కుటంబానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. రాజస్తాన్లోని ‘టాంక్’రాజవంశీయులు ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీ వరాలతో విలీనం స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో 500కు పైగా చిన్నా చితకా సంస్థానాలుండేవి. పటేల్ వ్యూహంతో ఇవన్నీ ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి. అయితే ఈ విలీనాలకు అంగీకరించేందుకు రాజకుటుంబాలకు భారీ వరాలు ఇవ్వాల్సివచ్చింది. తర్వాత కాలంలో ఇందిరాగాంధీ ఈ రాజభరణాలను రద్దు చేసింది. అప్పటికే రాజకుటుంబాలకు ప్రాముఖ్యత మెల్లిగా తగ్గుతూ వస్తోంది. అయితే.. తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు రాజకీయాలే సరైన మార్గమని నాటి మహారాజులు భావించారు. దీంతో ప్రజాజీవితాలతో సంబంధం లేని పలు రాజకుటుంబాలు.. తమ వంశం పేరు ఆధారంగా రాజకీయ నాయకులుగా మారిపోయారు. రాజస్తాన్లో ఈ తరహా మార్పు ఎక్కువగా కనిపించింది. 1950–70 దశకాల్లో రాజ కుటుంబీకులు ఎక్కువమంది రాజకీయాల్లోకి ప్రవేశించారు. చక్రం తిప్పిన విజయ, వసుంధర రాజస్తాన్ రాజకీయాల్లోకి రాజకుటుంబీకుల రాక ఆకస్మికంగా జరగలేదు. తగ్గుతున్న ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నమే వారిని రాజకీయాలవైపు నడిపించింది. వీరంతా మొదట్లో స్వతంత్ర సభ్యులుగానే పోటీ చేశారు. దీంతో వీరికి గెలిచిన ప్రాంతాలపై మాత్రమే వీరికి పట్టుండేది. ఈ సమయంలో జోధ్పూర్కు చెందిన రాజా హనుమంత్ సింగ్ రాజస్తాన్లోని మాజీ మహారాజులు అందరినీ ఏకం చేసి ‘రామరాజ్య పరిషత్’అనే ఓ గ్రూపును ఏర్పాటుచేశారు. అయితే 1952లో ఆయన అనూహ్య మరణంతో ఈ సమాఖ్య చెల్లాచెదురైంది. తర్వాత కాలంలో బికనేర్ మహారాజా కర్నిసింగ్ ఈ నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు గెలిచారు. ఆ తర్వాత మహారాణి గాయిత్రీ దేవి స్వతంత్రపార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి ఎదురు నిలిచారు. తొలిసారి ఎంపీగా ఎన్నికై అందరినీ ఆకర్శించారు. గ్వాలియర్ మహారాణి విజయరాజే సింధియా, ధోలపూర్ రాణి వసుంధర రాజే రాజకీయాల్లో ఎదిగారు. వసుంధర రాజే రాజ కుటుంబం నుంచి తొలి సీఎంగా నిలిచారు. మైభీ రాజా హూ! రాజస్తాన్లో సంస్థానాలు, రాజకుటుంబాలు ఎక్కువ. ఈ కుటుంబాల్లోని ప్రముఖులు క్రమంగా ఆయా పార్టీల తరుఫున తమకు పట్టున్న ప్రాంతాల్లో పోటీ చేశారు. పేదల గుడిసెల్లో రొట్టెలు చేయడం, రోడ్లు శుభ్రపరచడం వంటి పనులతో ప్రజలతో బంధం ఏర్పరుచుకున్నారు. దీంతో కాస్త పేరున్న వారు కూడా తామూ రాజకుటుంబీకులమని చెప్పుకున్నారు. ఈ విపరీత ధోరణులను నిరసిస్తూ 1962 ఎన్నికల్లో రామ్ మనోహర్ లోహియా ఒక రాజ ప్రముఖుడికి వ్యతిరేకంగా పేద దళిత మహిళను నిలబెట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నేతలు ఎక్కువగా తమను తాము రాజకుటంబీకులుగా చెప్పుకుంటుంటారు. ‘టోంక్’ల రూటే సెపరేటు! రాజకీయాలకు ఈ నవాబులు దూరం రాజస్తాన్ రాజవంశీకులందరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటే.. టోంక్ సంస్థానం మాత్రం ఈ వాసనకు దూరంగా ఉంది. టోంక్ స్టేట్ ఖాందాన్ నిబంధనలు–1944 కింద ఈ వంశానికి చెందిన దాదాపు 615 మంది నెలకు వెయ్యిరూపాయల పింఛను అందుకుంటున్నారు. జైపూర్, అల్వార్, భరత్పూర్, జోధ్పూర్, బికనీర్, జైసల్మేర్, పాలి తదితర సంస్థానాధీశులంతా నేతలవుతున్నా టోంక్ నవాబులు మాత్రం ఆసక్తి చూపలేదు. 19వ శతాబ్దిలో ఈ రాజవంశం బలమైన మిలటరీ శక్తిగా పేరొందింది. బ్రిటీషర్లకు, అఫ్గాన్లకు కుదిరిన ఒప్పందం కింద 1808లో టోంక్ సంస్థానం ఆవిర్భవించింది. అయితే ఇందిర అధికారంలోకి వచ్చి రాజభరణాల రద్దు, లాండ్ సీలింగ్ తెచ్చాక పరిస్థితులు మారిపోయాయి. నవాబు వంశ మూల ఆర్థిక వనరులపై ఈ రెండు అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ మార్పు తర్వాత ప్రధాన పార్టీల తరఫు అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడానికే నవాబులు పరిమితం అయ్యారు. బైరాన్సింగ్ షెకావత్కు వీరి మద్దతు ఉండేది. ప్రస్తుత నవాబు ఢిల్లీలో నివసిస్తుండగా, కుటుంబంలోని వారంతా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. -
రాజస్థాన్లో బీజేపీకి ఎదురుదెబ్బ
-
'హిందీ' మూడ్ 'ఎటో'?
రేపటి దేశ భవిష్యత్తును హిందీ మాట్లాడే రాష్ట్రాలే నిర్ణయించబోతున్నాయి. రాజస్తాన్ నుంచి బిహార్ వరకు విస్తరించి ఉన్న హిందీబెల్ట్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన వారికే ఢిల్లీ పీఠానికి మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లు కీలకంగా మారబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 ఎంపీ స్థానాలుండగా.. 2014లో బీజేపీయే 63 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ మోదీని సీఎం చేయాలంటే ఈ మూడు చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటుచేయడం బీజేపీకి అత్యంత ఆవశ్యకం. అటు కాంగ్రెస్కు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. రాహుల్ను ప్రధానిని చేయాలనుకుంటున్న ఏఐసీసీ పెద్దల కల నెరవేరాలంటే ఈ మూడు చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. అందుకే ఏదేమైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తమ అస్త్ర, శస్త్రాలకు పదునుపెడుతున్నాయి. మిజోరంలో ఒక్క లోక్సభ స్థానమే ఉండటం.. తెలంగాణలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోవడంతో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ తరఫున ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతను ఆరెస్సెస్ భుజాన వేసుకుంది. పట్టణ నియోజకవర్గాలతోపాటు, ఎస్సీలు, ఆదివాసీలకు రిజర్వ్డ్ అయిన చోట్ల కూడా సంఘ్ పని కారణంగా బీజేపీపై వ్యతిరేకత ఉండకపోవచ్చని తెలుస్తోంది. జోగితో నష్టమెవరికి? ఛత్తీస్గఢ్లో చివరి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య 10 సీట్ల తేడా మాత్రమే ఉంది. 2013లో ఓట్ల తేడా కూడా 0.75% మాత్రమే. చిన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్లే బీజేపీ నెగ్గిందనే విశ్లేషణలున్నాయి. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత ఉంది. అయితే ఈ వ్యతిరేకతను అందిపుచ్చుకునే క్రమంలో కాంగ్రెస్కు అజిత్జోగి రూపంలో నష్టం జరుగుతుందని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ సీఎంగా ఉన్న జోగి కొత్త పార్టీ ఏర్పాటుచేయడం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతల్ని రాహుల్ గాంధీ స్వయంగా మోస్తున్నప్పటికీ.. జోగి రూపంలో ముప్పు కాంగ్రెస్కు ఎంత నష్టం చేస్తుందో చెప్పలేని స్థితి. రాజేయోగం ఉందా? బీజేపీకి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నది రాజస్థాన్లోనే. సీఎం వసుంధరా రాజేపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల్లో ఆమెకున్న పట్టు, ఆరెస్సెస్ అండదండల కారణంగా బీజేపీ అధిష్టానం.. సీఎం అభ్యర్థిని మార్చే సాహసం చేయడంలేదు. అభ్యర్థుల జాబితాలోనూ రాజే మార్క్ స్పష్టంగా కనిపించింది. అయితే.. రాజస్తాన్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న రాజ్పుత్లు బీజేపీకి దూరం కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. రాజ్పుత్ వర్గానికి చెందిన ఆనంద్పాల్ సింగ్ ఎన్కౌంటర్.. ఆ తర్వాత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడం వంటి ఘటనలతో రాజ్పుత్లు బీజేపీకి ఓటేయరంటూ విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇది బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ రాష్ట్రంలో గెలుపు ఖాయం అని నమ్ముతున్న కాంగ్రెస్.. ఇతర రాష్ట్రాల్లోలాగా ఆధిపత్య పోరు లేకుండా స్థానిక నేతల మధ్య సమన్వయంతో ముందుకెళ్తోంది. పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కలిసిపని చేస్తుండటం కాంగ్రెస్కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. శివరాజసం నిలిచేనా! మధ్యప్రదేశ్ అసెంబ్లీ పోరులో హోరాహోరీ పోరు నెలకొంది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్పై చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అయితే దీన్ని పూర్తిగా తనకు అనకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా 8.5%. అయితే ఈసారి ఎవరు గెలవాలన్నా 9–10% తేడా లక్ష్యంగానే ప్రచారం చేయడం, వ్యూహాలను పన్నడం ఆధారపడి ఉంటుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్నాథ్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మధ్య విభేదాలతో.. కార్యకర్తల్లో ఇంకా పూర్తిగా ఎన్నికల జోష్ రాలేదు. అయితే.. ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలతో బీజేపీకి దళితులు, అగ్రవర్ణాలు దూరమవుతారని తాజా సర్వేలంటున్నాయి. అటు, కాంగ్రెస్ కూడా ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది. బుందేల్ ఖండ్, మహాకౌశల్, బాఘేల్ ఖండ్ ప్రాంతాల్లో అగ్రవర్ణాల ఓట్లు బీజేపీని దెబ్బతీస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో హిందుత్వ ఓట్లను సంపాదించుకునేందుకు రాహుల్ శివభక్తుడిగా మారారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ హిందుత్వ ఛాయలు కనబడుతున్నాయి. రైతే ఎన్ని‘కల’ రాజు! మధ్యప్రదేశ్లో రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు బీజేపీని భయపెడుతున్నాయి. గతేడాది మందసౌర్లో అల్లర్లు, ఆరుగురు రైతుల మృతి, పలు వ్యవసాయరంగ సమస్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో రైతులతోపాటు ఇతర వర్గాల్లోనూ ప్రభుత్వంపై కాస్తంత విముఖత వ్యక్తమవుతోంది. అయితే రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలకు ముందే చౌహాన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పంటలకు అధికర ధర వచ్చేలా భుగ్తానా యోజనను తీసుకొచ్చారు. ఈ పథకమే తన పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఎంపీల కష్టమే ఎక్కువ! పార్లమెంట్ సభ్యులతో పోలిస్తే దేశంలోని వివిధ అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు ఏడాదిలో తక్కువ రోజులు పనిచేస్తున్నారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు మరింత తక్కువ రోజులు కష్టపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. సగటున దేశంలో ఎమ్మెల్యేలు ఏడాదికి దాదాపు 28– 46 పనిదినాలు నమోదు చేయగా, పార్లమెంటు సభ్యులు ఏటా 70 పనిదినాలు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. 2011––2016 కాలంలో దేశంలోని 26 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చట్టసభల పనిగంటలను సంస్థ విశ్లేషించింది. ప్రజల తరఫున ఎన్నికైన సభ్యులు ప్రజా సమస్యలను చర్చించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని నివేదిక గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. 26 అసెంబ్లీల్లో 50 శాతం అంటే దాదాపు 13 అసెంబ్లీలు సరాసరిన ఏడాదికి కేవలం 28 రోజులే సమావేశమవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎక్కువగా బడ్జెట్ సెషన్లోనే అసెంబ్లీలకు హాజరవుతున్నారు. మిగిలిన సెషన్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏడాదికి కేరళ, కర్నాటక అసెంబ్లీలు సుమారు 46 రోజుల పాటు సమావేశమవుతున్నాయి. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర(45 రోజులు), ఒడిషా(42 రోజులు), జమ్ము అండ్ కాశ్మీర్(39 రోజులు) ఉన్నాయి. తక్కువ పనిదినాలు నమోదు చేస్తున్న అసెంబ్లీల జాబితాలో నాగాలాండ్, ఢిల్లీ, సిక్కిం తొలిస్థానాలు ఆక్రమించాయి. ఇదే సమయంలో పార్లమెంటులో లోక్సభ సభ్యులు ఏడాదికి సుమారు 70 పనిదినాలు, రాజ్యసభ సభ్యులు 69 పనిదినాలు నమోదు చేశారు. పార్లమెంటులో కూడా బడ్జెట్ సెషన్లోనే హాజరు శాతం ఎక్కువ. అసలు కంటే కొసరే ..! మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అక్కడి ఎమ్మెల్యేల వేతనానికి సంబంధించిన వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రభుత్వం జీతాలు, అలవెన్సుల రూపంలో ఈ దఫా ఎమ్మెల్యేలకు చెల్లించిన మొత్తం అక్షరాల రూ.149 కోట్లు. ఎన్నికల ప్రచారం ఊపందకున్న నేపథ్యంలో.. సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ కింద సమర్పించిన దరఖాస్తుకు అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన సమచారం ఇది. దీని ప్రకారం మొత్తం 231 మంది శాసనసభ్యులు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఏప్రిల్ 2013 నుంచి సెప్టెంబర్ 2018 వరకు జీతాల కింద రూ.32 కోట్లు చెల్లించారు. అదే సమయంలో అలవెన్సుల కింద రూ.117 కోట్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యేల టీఏల కింద రూ. 34.03 కోట్లు వెచ్చించారు. ఇక్కడి ప్రజల కోసం ఎమ్మెల్యేలు ఎంత కష్టపడి పని చేశారో తెలియదు కానీ.. వారి జీతం కంటే అలవెన్సులే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2017–18 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర తలసరి అదాయం రూ.79,907 కాగా.. శాసన సభ్యుల ఏడాది సగటు ఆదాయం రూ.14.48 లక్షలుగా ఉంది. -
హనుమతో కలవరం!
రాజస్తాన్లో చిన్న పార్టీలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొన్నటివరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంటుందన్న పోరు ఇప్పుడు మూడో కూటమి రంగంలోకి దిగటంతో మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఈ మూడో కూటమే ఇరు జాతీయ పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. గత ఎన్నికల వరకు బీజేపీలోనే బలమైన జాట్వర్గం నేతగా ఉన్న హనుమాన్ బేణీవాల్.. గతనెల 29న రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ)ని స్థాపించారు. బీజేపీ సీనియర్ నేతగా ఉండి.. రాజేతో విభేదించి బయటకొచ్చి భారత్ వాహినీ పార్టీ (బీవీపీ)ని ఏర్పాటుచేసిన బీజేపీ ఎమ్మెల్యే ఘన్శ్యామ్ తివారీ కూడా ఆర్ఎల్పీతో కలిశారు. మరికొన్ని చిన్న పార్టీలను కలుపుకుని మూడో ఫ్రంట్ ఏర్పాటుకు వీరు సిద్ధమవుతున్నారు. అయితే.. 130 స్థానాలే టార్గెట్గా పనిచేస్తున్న ఈ కూటమితో బీజేపీ, కాంగ్రెస్ల్లో కలవరం మొదలైంది. 30 చోట్ల పవర్ఫుల్ హనుమ జాట్ వర్గం నేతగా బీజేపీ విజయాల్లో హనుమాన్ పాత్ర విస్మరించలేనిది. రాజస్తాన్లో 14–15% జనాభా ఉన్న జాట్లు దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో హనుమాన్ బేణీవాల్ ఈ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరనేది సుస్పష్టం. కులాభిమానాలు బలంగా పనిచేసే రాజస్తాన్లో ఆర్ఎల్పీ ప్రభావం గణనీయంగా ఉంటుందనేది బీజేపీ, కాంగ్రెస్లకు జీర్ణించుకోలేని విషయం. ‘అయితే బీజేపీ లేదంటే.. కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీలను చూసి చూసి జనం విసుగెత్తిపోయారు. ఈ పార్టీల అవినీతితో విరక్తిచెందారు. అందుకే రాష్ట్ర ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. వారి నమ్మకాలను వమ్ము చేయబోం’ అని బేణీవాల్ ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈయన ‘కిసాన్ హుంకార్ మహా ర్యాలీ’లకు జనం పోటెత్తుతుండటంతో.. ఏ స్థాయిలో ఈయన ప్రభావం ఉండొచ్చనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. ఘనశ్యాముడూ కలిస్తే.. భారత్ వాహినీ పార్టీ (బీవీపీ)ని స్థాపించిన మాజీ బీజేపీ సీనియర్ నేత ఘన్శ్యామ్ తివారీ తక్కువోడేం కాదు. రాష్ట్రంలో 7% ఉన్న బ్రాహ్మణ ఓట్లకు ఘన్శ్యామ్ తివారీ నేతగా ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన్శ్యామ్ కూడా సొంతపార్టీ పెట్టుకోవడం బీజేపీకి పెద్ద దెబ్బే. దీనికి తోడు ఘన్శ్యామ్ కనీసం 20 స్థానాలను ప్రభావితం చేయగలడు. ఈయనకు బ్రాహ్మణులతోపాటు ఇతర అగ్రవర్ణాల్లోనూ మంచి పట్టుంది. దీంతో ఆర్ఎల్పీ, బీవీపీ కలిసి మూడో ఫ్రంట్గా ఏర్పడి పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే బీజేపీకే ఎక్కువ నష్టం అని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే కాంగ్రెస్కు కూడా జాట్, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ఓట్లు తగ్గతాయనే భావనా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన హనుమాన్, ఘన్శ్యామ్లు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 130 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్ఎల్పీ 30 చోట్ల గెలవగలదని బేణీవాల్ అంచనా. బీజేపీ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టిన గిరిజన నాయకుడు కిరోలీలాల్ మీనా తిరిగి బీజేపీలో చేరడంతో.. మీనా ప్రభావం ఉన్న 70 చోట్ల వదిలిపెడితే.. మిగిలిన 130 సీట్లలో క్రియాశీలకంగా మారాలని వ్యూహాలు పన్నుతున్నారు. ఎవరీ హనుమాన్? హనుమాన్ బేణీవాల్ 2013 వరకు బీజేపీలో సీనియర్ నాయకుడు. వసుంధరా రాజేపై తరచూ అసమ్మతి గళం వినిపించేవారు. 2013 ఎన్నికలకు ముందు కూడా రాజేపై అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో ఖిన్వసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గత అయిదేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతినే ప్రధానాస్త్రం చేసుకొని విమర్శలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం ఆర్ఎల్పీని స్థాపించి.. రాష్ట్రంలో మూడో కూటమి రాగాన్ని ఆలాపిస్తున్నారు. బలమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత. జాట్, ముస్లిం, యాదవ, కుమావట్ వంటి సామాజిక వర్గాల మద్దతు తమకే ఉంటుందని హనుమాన్ భావిస్తున్నారు. ముసుగులో ‘డేరా’ వద్దకు... గత ఎన్నికల సమయంలో డేరా బాబా ఆశీస్సుల కోసం, ఆయన శిష్యగణం ఓట్ల కోసం రాజకీయ నాయకులు బహిరంగంగా ‘డేరా సచ్చా సౌదా’ కేంద్రాలకు క్యూ కట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి బాబా జైలుపాలయ్యాడు. అయితే ఇప్పటికీ డేరా బాబాను అభిమానించే అనుచరగణం గణనీయంగానే ఉంది. దీంతో రాజకీయ నాయకులు సచ్చా సౌదా కేంద్రాల్లో కీలక వ్యక్తుల మద్దతు కోసం పాకులాడుతున్నారు. కానీ గతంలోలాగా బహిరంగంగా ఆయా కేంద్రాల వద్దకు పోతే విమర్శల పాలవుతామన్న భయంతో రహస్యంగా సచ్చాసౌదాల లీడర్లతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పంజాబ్, హర్యానాల్లో డేరా బాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ రాష్ట్రాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముఖ్యంగా శ్రీగంగానగర్, హనుమాన్నగర్ లాంటి ప్రాంతాల్లో చాలామందికి ఇప్పటికీ డేరాబాబా దేవుడికిందే లెక్క. ఎన్నికల వేళ డేరా భక్తగణం అండ ఉంటే ఈజీగా గట్టెక్కవచ్చని నాయకుల అంచనా. అయితే ఇప్పటివరకు ఫలానా నాయకుడికి ఓటేయమని డేరా నుంచి భక్తులకు అధికారిక ఆదేశాలు రాలేదు. గత ఎన్నికల్లో డేరా పాపులారిటీ ఉన్న 11 సీట్లలో 9 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల పరిధిలో డేరాకు దాదాపు 10 లక్షల మంది అనుచరులున్నారు. ఇంత కీలకం కాబట్టే రాజకీయపార్టీల నేతలు డేరా అనుగ్రహం కోసం పాకులాడుతున్నారు. సామాన్య ప్రజల్లో పలచనకాకుండా ఉండేందుకు తమ యత్నాలను సీక్రెట్గా కొనసాగిస్తున్నారు. -
ట్వీట్..హీట్!
సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నామని బీజేపీ అంటోంది. కానీ..కొన్ని కొన్ని సార్లు ఆ దూకుడే పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. బీజేపీలో ఉన్న విభేదాలను బట్టబయలు చేస్తోంది. బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పుట్టిన రోజునాడు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రాజస్థాన్ బీజేపీ శాఖ చేసిన ట్వీట్ కలకలం రేపింది. ట్విట్టర్లో పోస్టు చేసిన శుభాకాంక్షల పోస్టర్లో యశ్వంత్ సిన్హాను బీజేపీ నేత అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను దుయ్యబడుతూ, ఆయనపై తిరుగుబాటు చేసి పార్టీకి గుడ్బై చెప్పిన ఒక నేతకి జన్మదిన శుభాకాంక్షల్ని చెప్పడం వెనుక రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అన్న దిశగా రాష్ట్ర బీజేపీలో పుకార్లు వినిపిస్తున్నాయి. వసుంధరా రాజే, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు మధ్య నెలకొన్న విభేదాలు అందరికీ తెలిసినవే. ఆరెస్సెస్ అండదండలతోనే నెగ్గుకొస్తున్న రాజే...æ అడ్వాణీ శిబిరంలోనే మొదట్నుంచి కొనసాగుతూ ఉన్నారు. చాలా మంది సీఎంల్లాగా ప్రధాని మోదీ ఇమేజ్తోనే పార్టీ గెలుస్తుందని ఆమె ఎన్నడూ చెప్పలేదు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉందన్న ధీమాతోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ, షా ద్వయానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన యశ్వంత్ సిన్హాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం అంటే అమిత్ షాపై యుద్ధం ప్రకటించిందని అనుకోవాలా? లేదంటే బీజేపీ ఐటీ సెల్ తప్పిదమా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. శుభాకాంక్షలు చెబితే తప్పేంటి? బీజేపీ ఐటీ సెల్ మాత్రం దీనిని చాలా తేలిగ్గా తీసుకుంది. పార్టీకి చెందినవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా ఒక నేతకి శుభాకాంక్షలు చెబితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తోంది. ‘రాజకీయ నాయకులకి శుభాకాంక్షలు అందజేయడం మా సంస్కృతి. ప్రత్యర్థి పార్టీల నేతల్ని విష్ చేస్తే తప్పేంటి? సచిన్ పైలట్, అశోక్ గెహ్లట్ల పుట్టిన రోజులకూ పోస్టర్లు విడుదల చేశాం. వారికి శుభాకాంక్షలు చెప్పాం. అదేవిధంగా ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన సిన్హాకు చెప్పాం’ అని బీజేపీ రాజస్థాన్ ఐటీ సెల్ఇన్చార్జ్ హీరేంద్ర కౌశిక్ అన్నారు. సోషల్ మీడియా పోస్టుపై ప్రధాన మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. అయితే పోస్టర్లో బీజేపీ నేతగా సిన్హాను పేర్కొనడం పొరపాటేనని అంగీకరించారు. అయితే పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే సిన్హాకు శుభాకాంక్షలు చెప్పారని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొరపాటే అయితే ఎన్నికల వేళ ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని అంటున్నారు. రాజస్తాన్లో ‘శ్యానా కాకా’ సిరీస్ రాజకీయ నాయకులు ఓట్ల కోసం వింత వింతగా ప్రచారాలు చేయడం చూస్తున్నాం. రాజస్తాన్లో పాలన అధికారులు కూడా కొత్త శైలిలో ప్రచారానికి శ్రీకారం చూట్టారు. అయితే వీరి ప్రచారం ఓట్ల కోసం కాదు.. ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రజలపైన ఎక్కువగా ఉండడంతో.. దాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని..రాజస్తాన్లోని బూందీ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన మహేశ్ చంద్ డిజిటల్ కార్టూన్ సిరీస్ ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో ఓటు హక్కు పట్ల చైతన్యం కల్పించడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి, ప్రముఖ కార్టూనిస్ట్ సునీల్ జంగీద్తో కలిసి ‘శ్యానా కాకా’ (తెలివైన కాకా) అనే కార్టూన్ సిరీస్ను ప్రారంభించారు. ఆసక్తి గొలిపే కార్టూన్లతో సందేశాలను ఓటర్ల ఫోన్లకు వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నారు. కార్టూన్ రూపంలో సందేశం పంపితే ఓటర్లలో ఆసక్తి పెరగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రాజేపై ఎస్పీ భార్య పోటీ! సీఎం వసుంధరా రాజేపై.. రాజస్తాన్ పోలీస్ శాఖలో ఎస్పీగా పనిచేస్తున్న ఓ అధికార భార్య పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముకుల్ చౌదరీ.. తన భర్త ఎస్పీ పంకజ్ చౌదరీతో కలిసి నేరుగా సోనియా గాంధీని కలవడం రాజస్తాన్లో చర్చనీయాంశమైంది. ఝల్రాపటన్లో రాజేపై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాతో మాట్లాడారని సమాచారం. ముకుల్ తల్లి బీజేపీ ప్రభుత్వంలో (బైరాన్సింగ్ షెకావత్ సీఎంగా ఉన్నప్పుడు) మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? లేదా? అన్న అంశాన్ని పక్కనపెట్టి రెండు నెలల క్రితమే రాజే లక్ష్యంగా ముకుల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం అవినీతిలో కూరుకుపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఝల్రాపటన్ నేను పుట్టిన ఊరు. అందుకే ఈ గడ్డకు న్యాయం చేయాలని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. వసుంధర రాజే ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. నాకు అవకాశం ఇవ్వండి మార్పు చేసి చూపిస్తా’ అని ఆమె తన ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈమె భర్త పంకజ్ ప్రస్తుతం రాజస్తాన్ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్సీఆర్బీ) ఎస్పీగా పనిచేస్తున్నారు. -
'ప్రగతి' ప్రదాత ఆమే 'నిర్ణేత'
ఆడది వంటింటి కుందేలనే సామెత ఎప్పుడో పాతదైపోయింది. ఆకాశంలో.. అవకాశంలోనూ సగమని నిరూపిస్తూ అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. అయితే అతివలు తక్కువగా రాణిస్తున్న, వీరి ప్రభావం కొంతమేర మాత్రమే కనిపిస్తున్న ఏకైక రంగం రాజకీయమే. పురుషాధిక్య రాజకీయ రంగంలో చోటుకోసం మహిళ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. వీరికి పట్టు చిక్కడం లేదు. ఆడవారికి 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండూ అటకెక్కింది. ఇంత జరుగుతుంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏదైనా సాధించగలిగే సత్తా ఉందా? అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వమే. ఎందుకంటే వరల్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనలో అవాక్కయ్యే వాస్తవాలు వెల్లడయ్యాయి. మహిళా ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాలు.. పురుషులతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ పరిశోధనలో స్పష్టమైంది. భాగస్వామ్యం పెరుగుతోంది అసలు రాజకీయ నాయకురాళ్లు దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యానికి సమర్థులేనా? అనే అంశంపై జరిపిన పరిశోధనలో.. మహిళల సామర్థ్యంపై ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు ఎమ్మెల్యేలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిపై జరిపిన పరిశోధనలు సరికొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ‘ప్రభుత్వ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే అంశాల్లో మహిళా రాజకీయ నేతల భాగస్వామ్యం మెల్లిగా పెరుగుతోందని మా సర్వేలో తేలింది’ అని పరిశోధకులు తెలిపారు. అభివృద్ధిలో ముందంజ 1992 నుంచి 2012 వరకు దేశవ్యాప్తంగా 4,265 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. దీంట్లో.. మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 4.5% నుంచి 8% పెరిగినట్లు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళా రాజకీయ నేతలకు నేరచరిత తక్కువగా ఉంటోంది. మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పురుష ఎమ్మెల్యేల కన్నా 15.25% అభివృద్ధి ఎక్కువగా జరిగినట్లు వెల్లడైంది. ఈ స్థానాల్లో జీడీపీలోనూ 1.85% ఎక్కువ వృద్ధి కనిపించింది. పనిపైనే శ్రద్ధ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే.. పురుషులపై కేసులు మహిళలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పురుష ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటం, ఆస్తులు సంపాదించుకోవడం వంటి కార్యక్రమాలపైనే ఆసక్తి చూపుతున్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ మహిళా నేతలున్న నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయి. ఇద్దరూ నిధులు తీసుకురావడంలో సమానమైన ఆసక్తులే కనబరుస్తున్నప్పటికీ.. పని పూర్తిచేయడంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికితోడు అనవసర ఖర్చుల్లేకుండా.. ప్రతిపాదిత మొత్తంలోనే ప్రాజెక్టులు పూర్తిచేస్తున్న ఘనత కూడా మహిళలకే దక్కుతోంది. స్ఫూర్తితో ముందుకు పనిలో సాధించిన విజయంతో స్ఫూర్తిని ముందుకు పోవడంలోనూ మహిళలో ముందువరుసలో ఉన్నారు. పనిని విభజన చేసుకుని పూర్తి చేయడంలోనూ వీరిదే పైచేయి. అవకాశవాదంగా వ్యవహరించడంలో మహిళల శాతం తక్కువే. ప్రస్తుత భారతదేశంలో 4,118 ఎమ్మెల్యేలుండగా.. మహిళల సంఖ్య 9% మాత్రమే. 2018 జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభాలో మహిళల సంఖ్య 48.5%. ఆ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యమూ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే. 2013 ఎన్నికల్లో వసుంధరా రాజేని గద్దెనెక్కించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈ సారి కూడా మహిళలనే ఆమె నమ్ముకున్నారు. మరి మహిళా ఓటర్లు రాజేను మళ్లీ సీఎం చేస్తారా? వాస్తవానికి ఒకప్పుడు రాజస్తాన్లో మహిళలు ఓటరు జాబితాలో కూడా పేరు ఇవ్వడానికి ముందుకురాలేదు. కానీ వసుంధర రాజే ప్రచార శైలి కారణంగా మహిళల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘మన రాష్ట్రంలో రెండే కులాలు ఉన్నాయి. ఒకటి పురుషులు, రెండు మహిళలు. మహిళా సాధికారత కోసం మేము ఎన్నో పథకాలు తెచ్చాం. ఇక మనం ఎవరి ఎదుట చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు’ అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఎన్నికల ర్యాలీల్లో పదే పదే మహిళా ఓటర్లను ఉద్దేశించి చెబుతున్నారు. వసుంధరా రాజేలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఎనలేని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, మధ్య మధ్యలో జోకులు వేస్తూ, తన సంభాషణా చాతుర్యంతో ఓటర్లను కట్టిపడేస్తుంటారు. ఎన్నికల సభల్లో ఆమె మాట్లాడుతూ ఉంటే మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఆమె ఎన్నికల ర్యాలీలకు మహిళలు పోటెత్తుతున్నారు. రాజే పట్ల ఎనలేని ఆరాధనాభావం కనబరుస్తున్నారు. అయితే అన్ని రంగాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర కేవలం మహిళల అండదండలతో అధికారాన్ని సంపాదించుకోగలరా అన్నది ప్రశ్నే. మరోవైపు కాంగ్రెస్ కూడా మహిళలే తమ తురుపు ముక్కలంటూ ప్రసంగాలు చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళల్ని అందలం ఎక్కిస్తామని, మరో అయిదేళ్లలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సగం వాటిల్లో మహిళల్నే ముఖ్యమంత్రుల్ని చేస్తామంటూ హామీలైతే గుప్పిస్తున్నారు. కానీ సీట్లు విషయానికొచ్చేసరికి మొండిచేయి ఇస్తు్తన్నారు. వెనుకబాటులో మొదటి స్థానం బడికి వెళ్లాల్సిన చిన్నారుల కాళ్లకి మెట్టెలు కనిపిస్తాయి. బంగారం లాంటి బాల్యం నాలుగ్గోడల మధ్య నలిగిపోతుంటుంది. బాల్యవివాహాల్లో ఇప్పటికీ రాజస్థానే టాప్. మహిళలపై అకృత్యాల్లో మూడో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నలుగురి మధ్యలోకొచ్చి మాట్లాడరు. ఓటరు జాబితాలో పేరు ఇవ్వడానికీ ఇష్టపడరు. ఓటు వెయ్యడానికి వచ్చినా తండ్రి, భర్త, కొడుకు ఎవరికి వెయ్యమంటే వారికే. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత కేవలం 52%. చదువులేకపోవడం, చిన్నప్పుడే సంసార భారాన్ని మోయాల్సి రావడం వల్ల మహిళల్లో చైతన్యం తక్కువ. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలతో వేలి చుక్కే వజ్రాయుధం అన్న సంగతి గ్రహిస్తున్నారు. 2013లో మొదటిసారిగా అత్యధికంగా మహిళలు ఓటు వినియోగించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జలోర్ జిల్లా దాదల్ గ్రామంలో 2013లో మొదటి సారిగా మహిళలు పోలింగ్ బూత్ల దగ్గర క్యూ కట్టారు. చట్టసభల్లో ఎక్కువే రాజస్థాన్ మహిళల్లో వెనుకబాటు కనిపించినా చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రం ముందువరసలోనే ఉంది. బీహార్ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రాజస్థానే. మొత్తం 200 స్థానాలున్న అసెంబ్లీలో 2008లో తొలిసారి 29 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ 23 మందికి టిక్కెట్లు ఇస్తే, బీజేపీ 32 మందికి ఇచ్చింది. ఇక 2013లో కాంగ్రెస్ 24 మందికి ఇస్తే, బీజేపీ 26 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 27 మంది మహిళలు ఎన్నికైతే అందులో బీజేపీ నుంచే 23 మంది ఎన్నికయ్యారు. రాజేతో పాటు నలుగురు మంత్రులుగా ఉన్నారు. రాజే పథకాలు అమ్మాయి పుట్టినప్పటి నుంచి యుక్తవయసు వచ్చే వరకు, పెళ్లి నుంచి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేంతవరకు వసుంధర రాజే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం దగ్గర్నుంచి, నిరుపేద మహిళలకు ఉచితంగా మొబైల్ ఫోన్ల వరకు పలు పథకాలు మహిళల మనసుని దోచుకున్నాయి. రాజశ్రీ యోజన , జనని సురక్ష యోజన, మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరేలా భామాషా యోజన, ‘ఈ– సఖి’ పేరుతో డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమం, మహిళలకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ, ఇలా మహిళలకు అండగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అంతకు ముందు అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నప్పుడు కూడా జనని శిశు సురక్ష యాత్ర, శుభలక్ష్మి యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, రాజే తన పథకాలతో మహిళా ఓటర్లను పూర్తిగా తనవైపు తిప్పుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి మద్దతుతో ఈ సారి రాజే గట్టెక్కుతారా వేచి చూడాల్సిందే. రాజస్థాన్ మొత్తం ఓటర్లు 4.74 కోట్లు మహిళా ఓటర్లు 2.27 కోట్లు - 1972లో వెయ్యి మంది పురుషులకు 723 మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటే 2013 నాటికి వెయ్యి మంది పురుషులకు 899 మంది మహిళలు ఓటు వేశారు. - 2008లో 65% మంది మహిళా ఓటర్లు మాత్రమే ఓటు వినియోగించుకుంటే 2013 వచ్చేసరికి అది 10% పెరిగింది. గత ఎన్నికల్లో 75% మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. (భారత్లో మహిళా ఓటర్ల వినియోగం సగటున 65%) మహిళా ఓటర్లు పెరగడం వెనక.. - పెరుగుతున్న అక్షరాస్యత - రాజకీయ వార్తలపై ఆసక్తి పెరగడం - రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరగడం - స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం లాభమెవరికి? మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంతో మొదట వీరంతా కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహిళాధ్యక్షులున్న పార్టీకే ఆడవారి ఓట్లు ఎక్కువగా పడ్డాయి. కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, యూపీలో మాయావతి, తమిళనాట జయలలిత, పశ్చిమబెంగాల్లో మమత ఈ వర్గం ఓట్లను సంపాదించుకోగలిగారు. అయితే రాను రానూ వీరిలో వస్తున్న మార్పు కారణంగా ఈ ఓటు బీజేపీవైపు మళ్లుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సరిసమానమైన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్నీతి – సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 30% మహిళలు బీజేపీ వైపు ఉంటారన్న సీఎస్డీఎస్ అంచనా వేసింది. మహిళల క్యూ పెరుగుతోంది దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్ శాతం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) అనే సంస్థ చేసిన పరిశోధనలో మహిళల ఓటింగ్ శాతానికి సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ 65.5% కాగా.. పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సీఎం అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు మిజోరంలో కాంగ్రెస్, మిజోనేషనల్ఫ్రంట్ తరఫున సీఎం అభ్యర్థులుగా పోటీ పడుతున్న లాల్ థన్వాలా, జోరామ్తంగపై పెండింగ్ క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలు వీరిద్దరే కావడం గమనార్హం. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను గౌహతి హైకోర్టు అందించింది. ఈ కేసులు నిరూపితమైతే ఈ ఇద్దరు జైలు శిక్ష అనుభవించక తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నామినేషన్ పేపర్లలో కొన్ని స్థిరాస్తులను దాచిపెట్టి చూపించారని లాల్ థన్వాలాపై కేసు ఉంది. తనపై ఈ కేసు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు థన్వాలా తాజా నామినేషన్ పేపర్లలో వెల్లడించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడనుంది. ప్రతిపక్ష నేత జోరామ్తంగపై రెండు పెండింగ్ కేసులున్నాయి. కుట్ర, విధ్వంసం, సాక్ష్యాల విధ్వంసం, అనైతికంగా అధిక ఆస్తులుండడం తదితరనేరాలు ఈకేసుల్లో పోలీసులు ఈయనపై ఆరోపించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు దాదాపు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఎన్నికలపై 12 లక్షల ట్వీట్లు ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గత వారం రోజుల్లో 12 లక్షల ట్వీట్లు రికార్డయ్యాయని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తెలిపింది. ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ట్వీట్లలో వినియోగించేందుకు ఒక ప్రత్యేక ఎమోజీని సైతం అందుబాటులోకి తెచ్చామని ట్విట్టర్ తెలిపింది. ప్రజల్లో ప్రముఖంగా చర్చకు వచ్చే అంశాలకు ప్రాచుర్యం కల్పించే చర్యలు చేపట్టామని తెలిపింది. డిసెంబర్ 23 వరకు ప్రజలు AssemblyElections2018 emoji పేరిట ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ట్వీట్లు చేయవచ్చని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక హ్యాష్ట్యాగ్స్ కేటాయించామని ట్విట్టర్ తెలిపింది. వసుంధరా రాజే.. ఫస్ట్ దేశంలోనే వరుసగా అత్యధిక కాలం మహిళా సీఎంగా పనిచేసిన రికార్డును రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఆమె...సోమవారానికి 3,639 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. ఈమె 2,735 రోజులు మహిళా సీఎంగా పనిచేశారు. ఇంకా కొనసాగుతున్నారు. వివిధ దశల్లో ఎక్కువ రోజులు పనిచేసిన సీఎంగా షీలాదీక్షిత్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈమె మొత్తం వివిధ కాలాల్లో 5504 రోజులు సీఎంగా పనిచేశారు. వీధినాటకాలు..ఇంద్రజాల ప్రదర్శనలు.. సోషల్ మీడియాతో ప్రతి ఓటర్ను చేరవచ్చని ప్రతి పార్టీ భావిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ కొత్తపంథా అవలంబిస్తోంది. నవీన సాంకేతికత ఆధారంగా పనిచేసే సోషల్ మీడియాతో పాటు సాంప్రదాయ రూపాలైన వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనలతో ఓటర్లను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రచారం చేయనుంది. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసుకు పలు డ్రామా గ్రూపులను, ఇంద్రజాలికులను పిలిపించి వారిలో సరైనవారిని ఎంచుకొంది. ఇలా ఎంపికైన వారు ఇకమీదట రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పయనమై బీజేపీ ప్రభుత్వం చేపట్టినఅభివృద్ధి పనులను ప్రజలకు వీధినాటకాల రూపంలో వివరించనున్నారు. ఎంతో వడపోత అనంతరం తాను ఎంపికయ్యానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తానని ఒక కళాకారుడు చెప్పాడు. ఈ విధంగా సాంప్రదాయ కళారూపాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడం గతంలో కూడా చేశామని బీజేపీ ప్రతినిధి చెప్పారు. వీధినాటకాల కళాకారులతో పాటు ఆరుగురు ఐంద్రజాలికులను కూడా పార్టీ ప్రచారం నిమిత్తం ఎంచుకున్నట్లు చెప్పారు. 2013 ఎన్నికల్లో కూడా చౌహాన్ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు ఇదే తరహాలో మ్యాజిక్ ప్రదర్శకులను ఎంచుకున్నామని, గుజరాత్ గత ఎన్నికల్లో సైతం ఇలా కళారూపాలతో ప్రదర్శనలు జరిపామని పార్టీ వర్గాలు చెప్పాయి. వీటి ద్వారా మరింత ప్రభావంతంగా ప్రజల్లోకి వెళ్తామన్నాయి. -
మేనిఫెస్టోలో ఉండాల్సిందే!
రాజస్తాన్లో రాజకీయ పార్టీలకు విద్యార్థులు (18 ఏళ్ల లోపు వారే) తమ డిమాండ్ల చిట్టాను ఇచ్చారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లను ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. ఓటు హక్కు లేదని తమ డిమాండ్లను చిన్న చూపు చూడొద్దని.. భవిష్యత్ ఓటర్లుగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ డిమాండ్లకు జైపూర్లో జరిగిన ‘దశమ్’ కార్యక్రమం వేదికైంది. రాష్ట్ర విద్యా హక్కు చట్టం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా 18 ఏళ్ల లోపువారే. వీరంతా కలిసి కూర్చుని పలు డిమాండ్లు రూపొందించారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల సరఫరా, స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం, గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడం వంటి అంశాలున్నాయి. పలు అంశాలతో ఓ బుక్లెట్ను రూపొం దించి.. దీన్ని కార్యక్రమానికి హాజరైన అన్ని పార్టీల ప్రతినిధులకు అందించారు. వీటిని పార్టీలన్నీ తమ మేనిఫెస్టోల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థి ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఈ అంశాలపై చర్చించాలని కూడా నిర్ణయించారు. రాజస్తాన్ జనాభాలో 41% మంది 18 ఏళ్ల లోపు వారే. వచ్చేసారి వీరి ఓట్లే పార్టీలకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్లపై ఆచితూచి స్పందించాల్సిందే. అక్కడ మహిళ గెలవలేదు! రాజస్తాన్లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి నేటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా గెలవలేదు. హదోటీ ప్రాంతంలోని ఈ ఆరు చోట్ల 1952 నుంచి ప్రతిసారీ పురుష ఓటర్లే గెలుస్తూ వస్తున్నారు. ఇవి కోటా (ఉత్తర), కోటా (దక్షిణ), పిపాల్దా, బరన్, అంతా, అత్రు, మనోహర్ థానా, కేశోరాయ్ పటన్ నియోజకవర్గాలు. అయితే ఇక్కడ మహిళలు పోటీ చేయలేదా అంటే.. అదీ కాదు. ప్రతిసారీ కనీసం ఇద్దరు, ముగ్గురు మహిళలు పోటీలో ఉంటూనే ఉన్నా గెలవడం లేదు. ‘ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు కానీ.. వారికి సీట్లు మాత్రం ఇవ్వడం లేదు. అవన్నీ పురుషాధిక్య పార్టీలే’ అని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. హదోటీ ప్రాంతంలోని 18 నియోజకవర్గాల్లో మొత్తం మీద ఇప్పటివరకు కేవలం పదంటే పదిమంది మహిళలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో ప్రస్తుత సీఎం వసుంధరా రాజేనే నాలుగుసార్లు విజయం సాధించారు. -
రె‘బెల్స్’ మోగుతాయని..
రాజస్తాన్లో ముస్లింలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న పలు నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఉండొచ్చన్న అంచనాలు కాంగ్రెస్ను భయపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులు కలిసి కాంగ్రెస్ కొంప ముంచారు. ఈ నియోజకవర్గాల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులకు మధ్య ఓట్ల తేడా సదరు నియోజకవర్గంలో ఇతర ముస్లిం అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్ల కన్నా తక్కువ. అంటే సదరు రెబెల్స్ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశారనేది సుస్పష్టం. అయితే ముస్లిం పెద్దలు మాత్రం బలహీన అభ్యర్థులను నిలబెట్టినందుకే కాంగ్రెస్ ఓటమిపాలయిందని విమర్శిస్తున్నారు. 2013లో కాంగ్రెస్ 16 నియోజకవర్గాల్లో ముస్లింలను నిలబెట్టింది. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. కానీ అందరూ ఓడిపోయారు. ప్రస్తుతం రాజస్తాన్ అసెంబ్లీలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అది కూడా బీజేపీ నుంచి గెలిచినవారే. గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా తక్కువ మంది ముస్లింలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే కాంగ్రెస్లో కష్టపడి పనిచేసినవాళ్లకు గుర్తింపు ఉండదని, చివరి నిమిషంలో ఎవరో వచ్చి టికెట్ తన్నుకుపోతారని టోన్ నియోజకవర్గంలో రెబెల్గా పోటీ చేసిన సౌద్ సైదీ విమర్శించారు. ఇలాంటి విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఇటీవలే పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ అసంతృప్తులను చల్లబరిచేందుకు ఓ వేదికను ఏర్పాటుచేశారు. రాజస్తాన్లో దాదాపు 14 స్థానాల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. బీజేపీ కారణమా? ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న స్థానాల్లో బీజేపీ కావాలని స్వతంత్ర ముస్లిం అభ్యర్థులను నియమిస్తోందని కాంగ్రెస్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అయితే కేవలం ఈ ఒక్క అంశమే తమ ఓటమికి కారణం కాదని పీసీసీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నిజామ్ ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులకు సీట్లివ్వడమే తమ కొంపముంచిందని ఆయన విశ్లేషిస్తున్నారు. రెబెల్స్, స్వతంత్రులు లేకుంటే ముస్లి ప్రాబల్యమున్న స్థానాలన్నీ తమ ఖాతాలోకే వచ్చేవని వాపోయారు. అయితే కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్దులు బలహీనులు కావడం వల్లనే వారు ఓడిపోయారని రాజకీయ విశ్లేషకుడు అష్ఫాక్ కాయంఖని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బలమైన ముస్లిం లీడర్స్ ఎదగడాన్ని సహించదని, అందుకే కావాలని బలహీనులను బరిలోదింపి ఓడించిందని విమర్శించారు. జనాభాలో 12% ఉన్న ముస్లింల ప్రయోజనాలను కాపాడాలని, వారికి తగినన్ని సీట్లు కేటాయించాలని సెక్యులర్ పార్టీలకు రాజస్తాన్ ముస్లిం ఫోరం విజ్ఞప్తి చేసింది. గౌరవప్రదంగా చూడకుంటే ఇతర అవకాశాలను పరిశీలించడానికి ముస్లింలు వెనుకాడరని, ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడడాన్ని మానుకోవాలని ఫోరం కన్వీనర్ క్వారీ మొయినుద్దీన్ హెచ్చరించారు. -
రాజస్తాన్ కాంగ్రెస్దే!
న్యూఢిల్లీ: రాజస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు ఇండియాటుడే సర్వేలో తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కేవలం 35% ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని 43%, ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని 39% కోరుకున్నారు. 18% తమకు తెలియదని బదులిచ్చారు. ముఖ్యమంత్రిత్వం కోసం అశోక్ గెహ్లాట్(కాంగ్రెస్)కు 35%, వసుంధర రాజె(బీజేపీ)కు 31%, సచిన్ పైలట్(కాంగ్రెస్)కు 11% మద్దతిచ్చారు. రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్ల పరిధిలో 10,136 మందిని సర్వేలో భాగంగా సంప్రదించారు. అత్యధికులు ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రధానిగా మోదీపై మాత్రం సానుకూలత వ్యక్తమైంది. ‘కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధిస్తుంది. దళితులు, ముస్లింలలో బీజేపీపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కంచుకోటల్లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ పట్టు కోల్పోతోంది’ అని విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరి పోరు ఉంది. బీజేపీ ప్రభుత్వం నిలుపుకునే అవకాశం 52% ఉందని సర్వే పేర్కొంది. ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక కారణంగా బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశముందని తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని 42%, ప్రభుత్వం మారాలని 40% కోరుకుంటున్నట్టుగా వెల్లడైంది. 18% తెలియదంటూ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 29 ఎంపీ స్థానాల్లోని 11,712 మంది నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. నిరుద్యోగం, వ్యవసాయరంగ సమస్యలు, ధరల పెరుగుదల, తాగునీటి సమస్య వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశాలుగా మారినట్టు తేలింది. జ్యోతిరాదిత్య సింధియాను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ మరింత పుంజుకుని ఉండేదని అభిప్రాయపడ్డారు. యువ ఓటర్లలో జ్యోతిరాదిత్యకు మంచి ప్రజాదరణ ఉన్నట్టు వెల్లడైంది. ఛత్తీస్గఢ్: మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని 43%, ప్రభుత్వం మారాలని 41%, తెలియదని 16% స్పందించారు. ఈ ఫలితాల ఆధారంగా ఇక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 55% ఉందని నిపుణుల సహకారంతో ఇండియా టుడే విశ్లేషించింది. అజిత్జోగి ‘జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్’పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐలతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీకి లాభిస్తుందని పేర్కొంది. ఈ కూటమి వల్ల కాంగ్రెస్కే ఎక్కువ నష్టమని విశ్లేషించింది. నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో మాత్రం బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు వెల్లడైంది. వరసగా మూడుసార్లు సీఎంగా కొనసాగుతున్నా, జనాదరణలో మాత్రం రమణ్సింగ్ ముందు వరసలోనే ఉన్నారు. సీఎంగా 44% రమణ్సింగ్కు, 23% కాంగ్రెస్ నేత భూపేష్ భాఘేల్,కు, 13% అజిత్ జోగికి మద్దతిచ్చారు. జోగి నేతృత్వంలోని కూటమికి 7% సానుకూలత చూపారు. ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ నియోజకవర్గాల్లోని 4,486 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. -
ఓటింగ్ వైకుంఠపాళి...
ఎన్నికల వేళ ఓటర్లలో చైతన్యం పెంచేందుకు రాజస్తాన్లోని బర్మార్ జిల్లా యంత్రాంగం విన్నూత్న ఆలోచన చేసింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు, ఓటర్లలో ఓటింగ్పై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా సరికొత్త వైకుంఠపాళిని తయారు చేసి ప్రదర్శిస్తోంది. దాదాపు 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ మెగా వైకుంఠపాళి సాంప్రదాయక వైకుంఠపాళిలాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో పాముల ఉండే స్థానాలను ఓటర్ల నియమావళి ఉల్లంఘనలు, ఓటు అమ్ముకోవడం, కులపిచ్చితో ఓటేయడం, మందు, డబ్బుకు లొంగి ఓట్లు వేయడం తదితర తప్పులు సూచిస్తుంటాయి. సమయానికి ఓటర్ లిస్టులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఓటు వేయడం, తోటివారిలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని రేకెత్తించడం, ఓటింగ్ వేళ దివ్యాంగులకు, పెద్దలకు సాయం చేయడం తదితరాలు నిచ్చెనల స్థానంలో ఉంటాయి. గతంలో జల సంరక్షణ కోసం ఇదే తరహాలో వైకుంఠపాళిని వినియోగించామని బర్మార్ జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆ సమయంలో తమ ప్రయత్నం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కిందని తెలిపింది. దీంతో ఈ సారి ఓటర్లను జాగృతపరిచేందుకు వైకుంఠపాళిని వినియోగించుకోవాలని భావించినట్లు జిల్లా కలెక్టర్ శివప్రసాద్ మదన్ నకాటే చెప్పారు. ఈ దఫా కూడా తమ యత్నానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమ యత్నానికి బర్మార్ నగరంలో మంచి స్పందన వచ్చిందని, త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దీన్ని ప్రదర్శించే యత్నాలు చేస్తామని తెలిపారు. ఓటేయాలంటూ భయపెట్టే బందిపోట్లు! ఓటేయకపోయారా? మీ సంగతిచూస్తాం అనే బందిపోటు ముఠా ఒకటి రాజస్తాన్లోని ధోల్పూర్ ప్రాంతంలో ఉండేది. 2013 ఎన్నికలకు ముందు వరకు కూడా ఈ ముఠా ప్రభావం ఎక్కువగానే ఉండేది. బందిపోట్లు ఓటేయమని భయపెట్టడం వినడానికి వింతగానే ఉండొచ్చు. ఇంతలా బెదిరిస్తున్నారంటే ఇందులో తిరకాసు ఏదైనా ఉండొచ్చనే అనుమానం రావట్లేదా? అగ్గదీ! అక్కడే అసలు సంగతుంది. ఈ బ్యాచ్ అంతా.. తాము చెప్పిన అభ్యర్థికే ఓటేయాలని బెదిరిస్తుంది. వేయకపోతే తర్వాత మీ సంగతి తేలుస్తామని హెచ్చరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎవరు గెలవాలో వీళ్లే నిర్ణయిస్తారు. ఈ ప్రాంతంలోని బారీ నియోజకవర్గంలోని 20 గ్రామాల్లో ఈ బందిపోటు ముఠా ప్రభావం ఉందని.. వీరందరినీ అరెస్టు చేస్తే గానీ ఎన్నికలు సరిగ్గా జరగవని అక్కడి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ పోలీసులను కోరుతున్నారు. గతంతో పోలిస్తే వీరి ప్రభావం కాస్తంత తగ్గినట్లు కనిపిస్తున్నా పూర్తిగా బెడద పోయినట్లు కాదంటున్నారు. ఈ బృందంలోని జగన్ గుర్జార్ అనే బందిపోటు భార్య 2017 ఉప ఎన్నికల్లో ధోల్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేవలం 112 సీట్లు మాత్రమే సంపాదించారు. తొలిసారి రంగంలోకి మహిళా సీఆర్పీఎఫ్ మధ్యప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల కోసం తొలిసారిగా మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు పనిచేయబోతున్నారు. భోపాల్, ఉజ్జయిని, ఇండోర్ ప్రాంతాల్లో వీరికి విధులు అప్పగించారు. ‘ఇప్పటివరకు వారికిచ్చిన విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. అందుకే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తొలిసారిగా వీరికి బాధ్యతలు అప్పగించాం’ అని సీఆర్పీఎఫ్ ఐజీ పీకే పాండే వెల్లడించారు. పోలీసుల నుంచి డీఎస్పీ స్థాయి వరకు వివిధ హోదాల్లో 90 మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. అవసరమైతే మరింత మందిని మోహరిస్తామని పాండే తెలిపారు. 1986–87లో తొలిసారిగా సీఆర్పీఎఫ్లోకి మహిళలకు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి వీరు పురుషులతో సమానంగా విధులను నిర్వర్తిస్తున్నారు. మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దక్షిణ బస్తర్ ప్రాంతంలోనూ 240 మంది మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు డ్యూటీలో ఉన్నారు. -
అర్థమయ్యేలా చెప్పడానికో పథకం!
రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండంటే రెండే నెలల్లో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తామని కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వాగ్దానం చేశారు. రాజస్తాన్ ఎన్నికల ఇంచార్జ్గా ఉన్న జవదేకర్.. జైపూర్లోని ఓ మురికివాడలోని ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో ఓ బామ్మ, తాతయ్య దగ్గరికెళ్లి.. ‘బీజేపీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?’అని అడిగారు. దీనికి అటు, ఇటూగా వారు సమాధానం చెప్పడంతో ప్రభుత్వ పథకాల కరపత్రాన్ని అందించారు. అయితే ‘అయ్యా! మేం చదువుకోలేదు. ఇందులో ఏముందో మాకు అర్థం కాదు’అని వాళ్లు సమాధానమిచ్చారు. దీనికి ఒక్క క్షణం ఆలోచించిన జవదేకర్ అక్కడున్న వాళ్ల మనవడు, మనవరాలిని పిలిచి.. నానమ్మ, తాతలకు చదవటం నేర్పించాలని సూచించారు. ‘బడికెళ్తున్న చిన్నారులు.. సమయం దొరికినపుడల్లా నిరక్షరాస్యులైన మీ పెద్దలకు చదువు నేర్చించాలి’అని సూచించారు. ఇందుకోసం రెండు నెలల్లో ఓ పథకాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు. పెద్దలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అక్కడ నీటి కొరతే ప్రతిపక్షం రాజస్తాన్లో అజ్మీర్ నగరంలో రెండ్రోజులకోసారి నల్లా నీళ్లొస్తాయి. అదీ అరగంట సేపే. అజ్మీర్ల్ వాసులు.. ఇలా రెండ్రోజులకోసారి నీళ్లు పొందడమే ఓ వైభోగం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్దగా నదుల్లేవు. ఉన్న చిన్నా చితకా వాగులు కూడా ఎప్పుడూ ఎండిపోయే ఉంటాయి. నీటికొరత తీర్చేందుకు ఏ ప్రభుత్వం దీర్ఘకాల కార్యాచరణతో పనిచేయలేదు. ఈసారి కొరత గతంలో కన్నా తీవ్రంగా ఉండటంతో.. నీటికొరతే ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షంగా మారనుంది. 2009లో ఇలాగే తీవ్ర దుర్భిక్షం ఎదురైనపుడు పౌర, కార్మిక సంఘాలు, మార్కెట్ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘నీరివ్వకుంటే ఓటేయబోం’అని ఉద్యమాన్ని లేవనెత్తాయి. ఇది నాటి వసుంధరా రాజే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అజ్మీర్ తాగునీటి అవసరాల కోసమే బీసల్పూర్ డ్యామ్ కట్టారు. కానీ ప్రభుత్వం.. రాజకీయ అవసరాల కోసం ఈ నీటిని టోంక్, జైపూర్ నగరాలకు తరలించడం కారణంగానే ఇక్కడ కరువు ఏర్పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ దర్గా దర్శనం రాజస్తాన్లోని మార్వార్ ప్రాంతం పేరు చెబితే బంజరు భూములు, వడగాలులు గుర్తొస్తాయి. కానీ ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు సూఫీ సంస్కృతికి, సాధువులకు అడ్డాగా ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా నాగౌర్లోని 13వ శతాబ్దంనాటి ఖాజీ హమీదుద్దీన్ దర్గా చాలా ఫేమస్. ఇక్కడికి స్థానికంగా ఉండే ఆలయాల పూజారులు సహా అన్ని మతాలను విశ్వసించేవారు వస్తారు. ఎన్నికల సమయంలోనైతే ఈ దర్గా కు వచ్చి దర్శనం చేసుకోని పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు ఉండరనే చెప్పాలి. సుఫీ బాబా పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులందరూ క్యూ కడతారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలాగా దీనికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కకపోయినా, ఎన్నికలప్పుడు మాత్రం బాగా సందడి ఉంటుంది. సుఫీ గురువైన ఖాజీ హమీదుద్దీన్ వెజిటేరియన్గానే జీవితం గడిపారని ఈ దర్గా సంరక్షకులు చెబుతారు. -
నెగ్గుతామా.. నాథూలాల్జీ?
మరు నిమిషం ఏమవుతుందో ఎవరికీ తెలీకపోయినా, తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం తగ్గదు. భవిష్యత్ చెప్పే వాళ్లంటే ప్రజలకు భలే మోజు. చిలక జోస్యుల దగ్గర నుంచి నోస్ట్రడామస్ వరకు ఇందుకే పాపులర్ అవుతుంటారు. రాజకీయ నాయకుల్లో ఈ ఆసక్తి మరీ అధికం. ఎన్నికల వేళ నాయకులకు కాలునిలవదు. గెలుస్తామా, గెలవమా అనే మీమాంసతో జోతిష్యంపై మరింతగా ఆధారపడుతుంటారు. ఇలాంటి నేతలంతా ప్రస్తుతం రాజస్తాన్లోని కరోయ్ నగరానికి బారులు తీరుతున్నారు. రాజస్థాన్లోని భిల్వారాకు 20 కి.మీ దూరంలోని చిన్నగ్రామం కరోయ్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల రాజకీయనాయకులు ఈ ఊరికి క్యూ కడుతున్నారు. ఈ ఊర్లో పండిట్ నాథూలాల్ భైరూలాల్ వ్యాస్ అనే 96 ఏళ్ల జ్యోతిష్కుడి కోసం బారులు తీరుతున్నారు. ఎన్నికల సంరంభం ఆరభం కాగానే పార్టీ టికెట్ వస్తుందా? లేదా? అని, షెడ్యూలు వచ్చాక ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని, ఎన్నికల తర్వాత మంత్రి అవుతామా? లేదా? అని తెలుసుకునేందుకు వ్యాస్ వద్దకు వస్తుంటారు. ఆయన లెక్కే వేరు! వ్యాస్ జోస్యంపై పెద్దవాళ్లకు నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల కాలంలో ఈ నమ్మకం మరింత బలపడేందుకు కారణం... ప్రతిభాపాటిల్ సింగ్. దేశంలోనే అత్యున్నత స్థానాన్ని ఆమె అందుకోబోతున్నట్టు ఎవరు ఊహించడానికి ముందే ఆయన తన భవిష్యవాణిలో వెల్లడించారు. నాధూలాల్ను కలుసుకునేందుకు తన భర్త దేవీసింగ్ పటేల్తో కలిసి ప్రతిభాపాటిల్ వెళ్లినపుడు ఆమెకు వ్యాస్ ఈ విషయం తెలియజేశారు. ఈ జోస్యం నిజం కావడంతో తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వ్యాస్ను ఆమె ఆహ్వానించారు. నాథూలాల్ ప్రాభవం ప్రతిభాసింగ్తోనే మొదలు కాలేదు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబాని కూడా గతంలో వ్యాస్ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వివిధ అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఉండేవాళ్లు. ధీరూభాయ్తో పాటు గతంలో యూపీ, ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన అమర్సింగ్, ప్రసుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు వ్యాస్ శిష్యబృందంలో సభ్యులుగా ఉన్నారు. పలువురు విదేశీ భక్తులు కూడా ఆయనను కలుసుకునేందుకు వస్తుంటారు. ప్రత్యేకత ఏమిటి? సంస్కృత జ్యోతిష విధానం ‘భృగు సంహిత’లో వ్యాస్ నిష్ణాతులు. ఆయన లెక్క తప్పదని ప్రజల్లో నమ్మకం. భృగు సంహిత ఆధారంగా వ్యాస్ జరగబోయే విషయాలపై రాజకీయశిష్యులకు జోస్యం చెబుతుంటారు. ఆయన చెప్పినట్లు జరుగుతుందనే నమ్మకంతో నేతలు వ్యాస్ చెప్పే సూచనలను, సూచించే పూజలను తప్పక పాటిస్తుంటారు. కేవలం గెలపోటములపై సలహాలే కాకుండా, గెలుపునకు ఏమి చేస్తే బావుంటుంది, ఎలాంటి వ్యూహాలు చేపడితే బావుంటుందన్న దానిపై కూడా సలహాలు తీసుకుంటున్నారు. ‘ సమాజం సాంకేతికరంగంలో అభివృద్ధి సాధిస్తున్నా సాంస్కృతిక మూలాలు మరిచిపోకుండా స్మృతీ ఇరానీ వంటి వారు జ్యోతిషాన్ని నమ్ముతున్నారు. నమ్మకమే వారిని గెలిపిస్తోంది’’అంటారు వ్యాస్. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే కూడా తన శిష్యురాలేనని చెప్పారు. స్మృతీతో పాటు వసుంధర భవిష్యత్ గురించి చెప్పిన జోస్యాలు ఫలించాయని వ్యాస్ చెబుతుంటారు. -
ఓటు కోటకు కులం బలం
అభ్యర్ధి గుణగణాలు, పార్టీల హామీల కన్నా కులమే మన ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఈ కులాల కుంపట్లు ఎన్నికలప్పుడు ఆగకుండా రగులుతుంటాయి.కుల రహిత సమాజానికి కట్టుబడ్డామనే రాజకీయనాయకులు తమ స్వార్ధం కోసం ఎక్కడికక్కడ కులకుంపట్లు ఆరిపోకుండా రాజేస్తుంటారు. దీంతో ఎన్నికల్లో కులమే బలంగా మారుతోంది. ఈ దఫా రాజస్తానంలో కుల రగడ ఎక్కువైంది. క్యాస్ట్ పాలిట్రిక్స్ ఊపందుకున్నాయి. భారత ఎన్నికల్లో అర్ధబలానికి ఉన్నంత ప్రాధాన్యం అంగబలానికి కూడా ఉంది. చాలా చోట్ల కులమే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తుంటుంది. రాజస్థాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ ఎన్నికల్లో కులం ప్రభావం అధికం. రాజస్తాన్ ఎన్నికల్లో ప్రాంతీయ సమస్యలు, అంశాలకన్నా కులం,వర్గం డామినేషనే ఎక్కువ. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలు ప్రస్తావించినా చివరికి అభ్యర్థి గెలుపును నిర్ణయించేది ఓటర్ల మదిలో మెదిలేది కులమే. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక కులం మెజారిటీగా ఉండటం, ఎన్నికల్లో దాని ప్రభావం కనబడడం చూస్తాం. రాజస్థాన్లో మాత్రం అటు రాజ్పుత్లు, ఇటు జాట్లు సమ ఉజ్జీలుగా ఉన్నారు. వీరితో పాటు గుజర్లు, మీనాలు కూడా ఇటీవల కాలంలో కీలకంగా మారారు. ఏ కులం ఎక్కడ? రాష్ట్రంలో ఒక్కోకులానికి ఒక్కో ప్రాంతంలో పట్టు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో రాజ్పుత్ల వాటా 12శాతం. వీళ్లు దాదాపు 25 నియోజకవర్గాలో నిర్ణయాత్మక శక్తిగా, మరో 25 స్థానాల్లో ప్రభావిత శక్తిగా ఉన్నారు. శ్రీగంగానగర్, బికనీర్, జుంజును, సికార్, జోధ్పూర్, బర్మార్ జైలస్మేర్, చిత్తోర్గఢ్ ప్రాంతాల్లో రాజ్పుత్లు బలంగా ఉన్నారు. జాట్లు కూడా జనాభాలో దాదాపు 12శాతం ఉన్నారు.రాజ్పుత్ల తర్వాత బలమైన వర్గంగా ఉన్న వీరు డజన్ జిలాల్లోని 25 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా, మరో 25–30 స్థానాల్లో ప్రభావిత శక్తిగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 9 శాతం ఉన్న గుజ్జార్లు, 7 శాతం ఉన్న మీనాలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా పట్టు సాధిస్తున్నారు. దాదాపు 50 – 60 అసెంబ్లీ స్థానాల్లో వీరు గెలుపోటములను నిర్ణయించే పరిస్థితిలో ఉన్నారు. మాధోపూర్ లోక్సభ నియోజకవర్గంలో వీరు చాలా కీలకంగా మారారు. మారుతున్న సమీకరణలు రాజ్పుత్లు పూర్వకాలం నుంచి బీజేపీకి అనుకూలంగా ఉంటే, జాట్లు, ముస్లింలు, ఎస్సీ,ఎస్టీలు కాంగ్రెస్కు మద్దతు నిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ సమీకరణాలు కొంచెం అటూఇటూ అయ్యాయి. బీజేపీకి రాజ్పుత్లు దూరం కావడం,జాట్లు కాంగ్రెస్కు ఎదురుతిరిగే పరిస్థితులు ఏర్పడంతో ఈ సారి ఎన్నికల్లో కుల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది ఆసక్తిదాయకం. మరోవైపు గుజ్జార్లు బీజీపీ పంచన చేరుతోంటే మీనాలు కాంగ్రెస్ నీడకు వస్తున్నారు. ఎస్టీలుగా ఉన్న మీనాలకు గుజ్జార్లకు మధ్య రిజర్వేషన్లకు సంబంధించి తీవ్ర పోరాటం జరుగుతోంది. తమను ఓబీసీల్లోంచి ఎస్టీలుగా మార్చాలని గుజ్జార్స్, అలా చేస్తే తమకు ఇక్కట్లు వస్తాయని మీనాలు ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లను ఏ పార్టీ కాపాడుతుందో దానికే ఓటు వేయడానికి ఈ రెండు వర్గాలు నిర్ణయించుకున్నాయి. మరోవైపు గతంలోలాగా కేవలం రాజ్పుత్లు, జాట్లను నమ్ముకుంటే అధికారం దక్కదని రాజకీయ పార్టీలకు స్పష్టమయింది. అందుకే అన్ని కులాలకు తమ ప్రచారంలో ప్రాధాన్యమిస్తున్నాయి. అంతే కాకుండా అవసరమనుకుంటే రాజ్పుత్,జాట్ వర్గాల్లో ప్రధాన నేతలనైనా పక్కకు తప్పిస్తున్నాయి. తాజాగా రాజ్పుత్లలో మంచి పట్టున్న మానవేంద్ర సింగ్ను వదులుకోవడానికి బీజేపీ పెద్దగా ఆలోచించలేదు. అలాగే, మానవేంద్ర సింగ్ను పార్టీలోకి చేర్చుకుంటే పార్టీకి ఇప్పటివరకు అండగా ఉన్న జాట్లకు ఆగ్రహం వస్తుందని తెలుస్తున్నా కాంగ్రెస్ వెనకడుగు వేయలేదు. ఇరు పార్టీలూ ప్రధాన కులాలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో మెజార్టీ కులం ఏదిఉంటే అక్కడ ఆ కులం అభ్యర్థిని నిలబెడుతున్నాయి. రెండురకాల రాజకీయం రాజస్థాన్లో రాజకీయాలు రెండు రకాలుగా నడుస్తున్నాయి. కులాల ఆధారంగా నడిచేవి ఒకటయితే, రిజర్వేషన్ల పేరుతో నడిచేవి మరోరకం. కులాల వారి రాజకీయాల్లో కులం వారంతా మూకుమ్మడిగా ఒకరికే ఓటు వేస్తారు. ప్రయోజనాలు కూడా అందరూ పొందుతారు. ఇక రిజర్వేషన్ రాజకీయాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం తమను లాభదాయక కేటగిరిలో పెడుతుందనే దాన్ని బట్టి ఓట్లు వేస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల ప్రచారంలో కులం పేరును తరుచు ప్రస్తావించాలని కూడా అభ్యర్థులకు గట్టిగా చెబుతున్నాయి. ప్రచారంలో ఆయా కులాలకు తమ హయాంలో లభించిన ప్రయోజనాలను వివరిస్తుంటాయి. రాజపుత్రులు వర్సెస్ జాట్స్ రాజపుత్రుల రాజ్యమైన రాజస్థాన్లో చరిత్ర కాలం నుంచి వారిదే ఆధిపత్యం. రాజపుత్ర సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాకా కూడా కొంత కాలం వారి హవా నడిచింది. 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో వీరి ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో 160 సీట్లకుగాను 54 సీట్లలో రాజ్పుత్లు గెలిచారు. జాట్లు 12సీట్లు,బ్రాహ్మణులు 22స్థానాలు గెలుచుకున్నారు. కాలక్రమేణ ప్రజల మనసుల్లో రాచరిక భావనలు తొలగిపోవడంతో రాజ్పుత్ల ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఆ మేరకు జాట్ల బలం పెరిగింది. 1957లో జరిగిన ఎన్నికల్లో రాజ్పుత్లు కేవలం 26 స్థానాలు మాత్రమే గెలుచుకోగా జాట్లు 23 చోట్ల పాగా వేశారు. -
ఛత్తీస్గఢ్లో హై అలర్ట్..
మావోయిస్టుల వరుసదాడులతో అతలాకుతలమవుతున్న ఛత్తీస్గఢ్లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఓవైపు భద్రతా బలగాలు అడవులన్నీ గాలిస్తుంటే.. మరోవైపు మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆరు జిల్లాల్లో పరిస్థితి గంభీరంగా ఉంది. అయితే, మారుమూల ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనన్న పట్టుదలతో.. ఎన్నికల సంఘం 65వేల మంది కేంద్రీయ, రాష్ట్ర పోలీసు బలగాల సాయంతో ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతను పర్యవేక్షిస్తోంది. ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలి’ అని పైనుంచి ఆదేశాలొచ్చాయని సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. రాజస్తాన్ దళితుల 24 గీ7 కంట్రోల్రూమ్ ఎన్నికలు రాగానే.. ప్రధాన, ప్రాంతీయ పార్టీల నుంచి చిన్నా, చితకా పార్టీల వరకు తమ అభ్యర్థుల ప్రచార సరళిని గమనించేందుకో, కార్యకర్తలతో అనుసంధానంలో ఉండేందుకో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటుచేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా రాజస్తాన్లో దళితుల కోసం 24 గంటల కంట్రోల్రూమ్ ఏర్పాటైంది. దళిత సంఘాలన్నీ ఏకమై దీన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఏయే పార్టీలు దళితుల గురించి ఎలాంటి హామీలిస్తున్నాయని గమనించడం, ఆయా హామీలపై అవసరమైనప్పుడు స్పందించడం, ఎన్నికల నేపథ్యంలో దళితులు, బడుగు బలహీనవర్గాలు ఇచ్చే ఫిర్యాదులపై అధికారులను అప్రమత్తంత చేయడం వంటి పనులను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా నిర్వర్తిస్తారు. మొత్తంగా ఎన్నికల సందర్భంగా దళితుల హక్కులకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూడటమే దీని ఏర్పాటువెనక ముఖ్యోద్దేశమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఆ రెస్టారెంట్ ఇప్పుడో హాట్ టాపిక్! మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఇండోర్లోని ‘యంగ్ తరంగ్’అనే చిన్న రెస్టారెంట్లో స్నాక్స్ తిన్నారు. రుచికరమైన మసాలా చాట్ను రాహుల్ సంతోషంగా లాగించేశారు. నిజానికి ఆ రెస్టారెంట్ యజమాని బీజేపీ అభిమాని. శివరాజ్ సింగ్ చౌహాన్పై అభిమానం కొద్దీ సీఎం ఫొటోను రెస్టారెంట్లో ఎదురుగా పెట్టుకున్నారు. ఈ కారణంతోనే రెస్టారెంట్ పేరు హాట్ టాపిక్గా మారింది. హోటల్కు వచ్చే వారందరికీ.. రాహుల్ మా హోటల్లోనే భోజనం చేశారని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. ‘ శివరాజ్ చౌహాన్ ఫొటో పక్కనే రాహుల్ ఫొటో పెడతా’అంటున్నాడు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ గురించి ఇండోర్ నగరమంతా చర్చ జరుగుతోంది. -
వీటి సత్తా తక్కువేం కాదు!
రాజస్తాన్లో అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, ఎలాగైనా సీఎం పీఠం దక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్కు చోటామోటా పార్టీలు ప్రధాన సమస్యగా మారాయి. పేరుకు జాతీయ పార్టీలైనా ఓట్ల పరంగా ప్రాంతీయ పార్టీలతో సమానమైన సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలు, బీవీపీ, ఆర్ఎల్పీ లాంటి స్థానిక పార్టీల హడావుడి పలు నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. తక్కువ ఓట్ల శాతంతో పూర్తి ఫలితాలు తారుమారయ్యే పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండు పెద్ద పార్టీలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 200 స్థానాల్లో 30 చోట్ల ఇలాంటి పార్టీల ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. గ్రామీణ నేపథ్యం, దళితుల ఓట్ల ప్రభావం ఉన్న చోట్ల బీఎస్పీ, సీపీఎం, ఐఎన్ఎల్డీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)ల ప్రభావం ఎక్కువగానే ఉంది. బీజేపీ రెబల్ నేత ఘన్శ్యామ్ తివారీ ఏర్పాటు చేసిన భారత్ వాహినీ పార్టీ (బీవీపీ) ప్రభావం రెండు, మూడు స్థానాలకు మించి ఉండకపోవచ్చంటున్నారు. 2008లో కాంగ్రెస్ పార్టీకి 96 సీట్లు రాగా.. ఆరుచోట్ల గెలుపొందిన బీఎస్పీ.. గెహ్లాట్ ప్రభుత్వంలో చేరేందుకు విముఖత వ్యక్తం చేసింది. బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. అది పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలమని విశ్లేషకులంటున్నారు. ప్రాంతీయ పార్టీలు 30 చోట్ల ప్రభావం చూపిస్తే.. కాంగ్రెస్కు మరోసారి కర్ణాటక లాంటి పరిస్థితులు ఎదురుకావొచ్చని భావిస్తున్నారు. హవా ఇలా.. - 2013లో కాంగ్రెస్ అవకాశాలను ఎన్పీపీ, బీఎస్పీలు దెబ్బతీసిన నియోజకవర్గాలు 40 - జాట్ నేత హనుమాన్ బేణీవాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ బీవీపీతో పొత్తు. 200 స్థానాల్లో పోటీ - మోదీ ప్రభావం ఉన్నా బీఎస్పీకి,ఎన్పీపీకి 12% ఓట్లు వచ్చాయి. - 2008లో నాలుగుసీట్లలో గెలిచిన ఐఎన్ఎల్డీ బీఎస్పీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయం - సికార్, శ్రీ గంగానగర్ జిల్లాల్లో ప్రభావవంతంగా రైతుల ఆందోళనలు ముందుండి నడిపిన సీపీఎం -
మేము ఓడిపోయే అవకాశాలే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ‘రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాం, మధ్యప్రదేశ్లో అటూ ఇటుగా ఉంది. ఇప్పుడే చెప్పలేం, ఛత్తీస్గఢ్లో ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలివి. ఛత్తీస్గఢ్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నందున ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉండాల్సినంత వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ పట్ల మాత్రం ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం విశేషం. ఆయన మంత్రుల పట్ల, ఎక్కువ మంది శాసనసభ్యుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం కొత్తవారికి సీట్లు ఇస్తామని ప్రకటించారు. అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రజలు వ్యతిరేకిస్తున్న సిట్టింగ్ సభ్యులకు టిక్కెట్లు రావన్న మాటే. ఆదివాసీల బలమైన నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ దయాళ్కు గాలం వేసి అక్టోబర్ 13వ తేదీనే బీజేపీ లాక్కుంది. ఎన్నికల నాటికి ఆయన అనుచర నాయకులు మరికొంత మంది వచ్చి బీజేపీలో చేరే అవకాశం ఉంది. అటు కేంద్రంలో, ఇటు పార్టీలోను అధికారంలో ఉన్న బీజేపీకి అపార పార్టీ నిధులు ఉన్నాయి. ఆ నిధులతోని గతంలోలాగా ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థులను కొనేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అంతాగఢ్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేసిన మంతురామ్ తర్వాత బీజేపీలో చేరిపోవడం తెల్సిందే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్ భిండ్ లోక్సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా భగీరథ్ ప్రసాద్ను ప్రకటించాక ఆయన్ని బీజేపీ లాక్కుంది. ఆదివాసీల్లో, దళితుల్లో ఎంతో ఆదరణ కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీల నాయకుడు రమణ్ సింగ్ బీజేపీలో చేరడం పెద్ద దెబ్బకాగా, కాంగ్రెస్ వినాశనమే తన లక్ష్యమని చెప్పుకుంటున్న అజిత్ జోగి పార్టీ ఈసారి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతో చేతులు కలిపి చత్తీస్గఢ్లో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ. కాంగ్రెస్ పార్టీకి, పాలకపక్ష బీజేపీకి కేవలం 0.7 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్న నేపథ్యంతో మూడో పార్టీ పోటీకి రావడం అన్నది బీజేపీకే ఇక్కడ కలసి వచ్చే అవకాశం. బలహీనమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్లో బలమైన నాయకత్వం లేకుండా పోయింది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ భగేల్కు వ్యతిరేకంగా ఇటీవలనే ఆడియో స్టింగ్ ఆపరేషణ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన టక్కెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను పరిశీలించేందుకు ఐదుగురు సీనియర్లతో ఓ కమిటీని వేశారు. రాష్ట్ర మంత్రి రాజేష్ మునత్కు వ్యతిరేకంగా బ్యూఫిల్మ్ సీడీని విడుదల చేసిందీ భూపేశ్ అని తేలడం, అందులో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ సదరు మంత్రి కేసు పెట్టడంతో భూపేశ్ గత సెప్టెంబర్ నెలలోనే అరెస్టయ్యారు. కేసు విచారణ కొనసాగుతోంది. ప్రచారంలోనూ వెరీ పూర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ మరీ పూర్గా ఉంది. రమణ్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుమ్మెత్తి పోయాల్సిన కాంగ్రెస్ పార్టీ, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాత్రమే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పైగా రమణ్ సింగ్ను ఎవరు కూడా పల్లెత్తుమాట అనడం లేదు. అందుకు కారణం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన ద్వారా ఏదో విధంగా లబ్ధి పొందడటమే. రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే చాలా అంశాలే ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్రంలోని అతివిలువైన జాతీయ వనరులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం, కొత్త రాజధాని నిర్మాణం పేరిట నిధులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడమని సామాజిక కార్యకర్త విక్రమ్ సింఘాల్ తెలిపారు. పైగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఎలాంటి పంచ్ లేకుండా చప్పగా సాగుతుంటే, బీజేపీ ప్రచారం దూకుడుగా సాగుతోందని ఆయన తెలిపారు. ఏ రకంగా చూసినప్పటికీ ఈసారి కూడా కాంగ్రెస్కు అక్కడ ఓటమి తప్పేట్లు లేదు.