downfall
-
నవంబర్లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
20 శాతం తగ్గిన మొబైల్స్ ఉత్పత్తి
కోల్కత: మొబైల్స్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–ఏప్రిల్లో ఉత్పత్తి 20 శాతం వరకు క్షీణించింది. గడిచిన ఆరు నెలలుగా స్మార్ట్ఫోన్ అమ్మకాలు తగ్గుతుండడం ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. పరిశోధన సంస్థ కౌంటర్పాయింట్ ప్రకారం.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్లో 30 శాతం, 2023 జనవరి–మార్చిలో 18 శాతం స్మార్ట్ఫోన్స్ సరఫరా తగ్గింది. విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చిలో పడిపోయాయని భారత్లో అతిపెద్ద మొబైల్స్ రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణత.. కేవలం భారత్లో మాత్రమేగాక ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో మొబైల్ ఫోన్ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని కార్బన్తోపాటు ఇతర కంపెనీలకు హ్యాండ్సెట్స్ను తయారు చేస్తున్న జైనా గ్రూప్ ఎండీ ప్రదీప్ జైన్ తెలిపారు. ప్రస్తుత డిమాండ్కు తగ్గట్టుగా కంపెనీలు ఉత్పత్తిని సవరించాయని అన్నారు. ఈ ఒత్తిడి కొన్నాళ్లు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ప్రీమియం సెగ్మెంట్ ఇప్పటికీ స్థితిస్థాపకంగా ఉంది. ప్రారంభ, మధ్యస్థాయి స్మార్ట్ఫోన్స్ విభాగంలో మొబైల్స్ సంస్థలు తయారీని 15–20% కుదించాయని కౌంటర్పాయింట్ రిసర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వివరించారు. పది వారాల నిల్వలు.. ప్రస్తుతం చాలా బ్రాండ్స్ వద్ద 10 వారాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని పాఠక్ వెల్లడించారు. ఉత్పత్తి విషయంలో కంపెనీలు జూన్ వరకు ఇదే స్థితిని కొనసాగిస్తాయని అన్నారు. రెండవ అర్ద భాగంగా చాలా కంపెనీలు స్వల్పంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరించారు. ఉత్పత్తి తగ్గించడం ఈ ఏడాది ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–జూలై, నవంబర్–డిసెంబర్లో సైతం కంపెనీలు తయారీని కుదించాయి. ఇది కేవలం 5–10 శాతం క్షీణతకే పరిమితం అయిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మొబైల్స్ డిమాండ్ ఉత్సాహంగా లేదు. కానీ చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ బి లాల్ తెలిపారు. కొన్ని సంస్థలు హ్యాండ్సెట్స్ను ఎగుమతి చేస్తున్నాయని గుర్తుచేశారు. -
డాలర్ కోటకు బీటలు! బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి....
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! సైనిక, ఆర్థిక దండోపాయాలతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇది. తన మాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనుకుంటున్నారా? అదేమీ లేదు కాని, ఇన్నాళ్లూ ఏ డాలర్ అండ చూసుకొని అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమలదండులా కదం తొక్కుతున్నాయి. దాదాపు 80 ఏళ్లుగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా రాజ్యమేలుతున్న డాలర్ కోటను బద్దలుగొట్టేందుకు కరెన్సీ వార్కు తెరతీశాయి. రష్యాపై ఎడాపెడా ఆంక్షలు విధించి, వేల కోట్ల డాలర్ల ఆస్తులను సీజ్ చేసిన అమెరికా, అలాగే పశ్చిమ దేశాలు భవిష్యత్తులో తమపైనా ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే దిక్కేంటంటూ మేల్కొంటున్నాయి. డాలర్ కరెన్సీ నిల్వలతో పాటు డాలర్లలో వాణిజ్యానికి నో చెబుతున్నాయి. రష్యా, చైనాతో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పలు దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో తమ సొంత కరెన్సీలను మాత్రమే ఉపయోగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే సమీప భవిష్యత్తులోనే డాలర్తోపాటు అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. అసలు డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఎందుకు చలామణీలో ఉంది? డాలర్ను వదిలించుకోవడానికి ప్రపంచమంతా పరుగులు తీయడానికి కారణమేంటి? నిజంగా డాలర్ కుప్పకూలుతుందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుందో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే! డాలర్కు లోకం దాసోహం! అన్ని దేశాలకూ తమ సొంత కరెన్సీలు ఉన్నా, లోకమంతా డాలర్ల వెంటే పరిగెడుతోంది. కేవలం అంతర్జాతీయ వాణిజ్యంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ లావాదేవీల్లో అత్యధిక శాతం డాలర్లలోనే జరుగుతాయి. ప్రపంచంలోని ఏ మారుమూలకెళ్లినా డాలర్ చెల్లుతుంది. డాలర్కు అత్యధికంగా స్టోర్ వేల్యూ ఉండటం వల్ల అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ మెజారిటీ విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వలను డాలర్లలోనే కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ వెలుగొందుతోంది. (ఎయిర్లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!) అంతర్జాతీయంగా డాలర్లు కుప్పలుతెప్పలుగా చలామణీలో ఉండటం వల్ల అమెరికాలో వడ్డీరేట్లు కృత్రిమంగా ఎప్పుడూ కనిష్ఠ స్థాయిల్లోనే కొనసాగేందుకు తోడ్పడింది. ఈ చౌక డబ్బుతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఇళ్లు, కార్లు, ఇలా సకల సౌకర్యాలను ఆ దేశ పౌరులు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు, అక్కడి ఎకానమీ పరుగులకు; సూపర్ పవర్గా అవతరించి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడానికి ఈ డాలర్ దన్నే కారణం. అమెరికా ప్రభుత్వాలు భవిష్యత్తు పరిణామాలను పట్టించుకోకుండా లక్షల కోట్ల డాలర్లను ప్రింట్ చేయడం ద్వారానే ఇదంతా సాకారమైంది. ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అవ్వడం వల్ల డాలర్ను కంట్రోల్ చేయగలమన్న ధీమాతో ఎడాపెడా డాలర్ ప్రింటింగ్ చేసిన అమెరికా అప్పులకుప్పగా మారింది. 2022 నాటికి మొత్తం యూఎస్ అప్పు 31.5 ట్రిలియన్ డాలర్లు (జీడీపీతో పోలిస్తే 120 శాతం పైనే). ఈ డాలర్ అండతోనే వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్తాన్, లిబియా, సిరియా ఇలా అనేక దేశాలను యుద్ధాలతో నేలమట్టం చేసిన అమెరికాకు చివరికి అప్పులతిప్పలు మిగిలాయి. 25 ఏళ్ల క్రితం ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో 72 శాతంగా ఉన్న డాలర్ వాటా ప్రస్తుతం 59 శాతానికి దిగొచ్చింది. ఇప్పుడు రష్యా, చైనాతో నేరుగా కయ్యానికి కాలుదువ్వుతున్న అగ్రరాజ్యానికి గూబ గుయ్యిమంటోంది. యుద్ధభూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ తామేంటో రుచి చూపిస్తున్నాయి ఈ రెండు దేశాలు. ఏకంగా డాలర్కే ఎసరు పెట్టేలా పావులు కదుపుతూ శ్వేతసౌధానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాను తవ్వుకున్న గోతిలోనే... తమ గుమ్మం ముందుకు నాటో విస్తరణను ఆపాలన్న రష్యా మాటను పెడచెవిన పెట్టిన అమెరికా, దాని మిత్ర దేశాలు... ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడంతో ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. డాలర్ పతనానికి ఆజ్యం పోసింది ఇదే! రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పాటు ఆ దేశానికి చెందిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలను అమెరికా ఇంకా పశ్చిమ దేశాలు సీజ్ చేశాయి. ఇలా ఒక సార్వభౌమ దేశ ఆస్తులను స్తంభింపజేయడం చరిత్రలో ఇదే తొలిసారి. రష్యాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుండి తొలగించాయి. ఈ చర్యలతో అమెరికా, యూరప్ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది. ఇదీ చదవండి: దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే... క్రూడ్తో సహా అనేక కమోడిటీల ధరలు ఆకాశాన్నంటి జనాలు గగ్గోలు పెట్టడంతో సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా వడ్డీరేట్లను పెంచాల్సిన పరిస్థితి తెలెత్తింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సహా నాలుగు బ్యాంకులు కుప్పకూలాయి. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. డాలర్ రూపంలో విదేశీ కరెన్సీ నిల్వలు కలిగిన ఏ దేశమైనా తనకు ఎదురుతిరిగితే రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా డాలర్ను వాడుకుంటుందన్న విషయం రష్యాపై ఏకపక్ష ఆంక్షల ఉదంతంతో తేటతెల్లమైంది. అమెరికా ఆధిపత్య ధోరణితో విసిగి పోయిన దేశాలన్నీ డాలర్ను వదిలించుకునే దిశగా చకచకా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ ఊహించని రీతిలో జోరందుకుంటోంది. ‘కింగ్ డాలర్’ ఎప్పుడు ఆవిర్భవించింది? వాస్తవానికి, 105 ఏళ్ల క్రితం డాలర్లలో ప్రపంచ దేశాల ఫారెక్స్ నిల్వలు సున్నా! 1900–1918 వరకు ప్రపంచంలో మూడు ప్రధాన కరెన్సీలు రాజ్యమేలాయి. అవి బ్రిటన్ పౌండ్, జర్మనీ మార్క్, ఫ్రెంచ్ ఫ్రాంక్. ఈ మూడు యూరోపియన్ దిగ్గజాలు అనేక దేశాలను తమ కాలనీలుగా చేసుకొని కొల్లగొట్టిన అసాధారణ సంపదే దీనికి కారణం. 1918 వరకు అసలు అమెరికా డాలర్ సోదిలోనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ పూర్తిగా చితికిపోవడంతో డాలర్ ప్రాభవం మొదలైంది. యూరోపియన్ల యుద్ధకాంక్ష యూఎస్కు వరమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో యూరప్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడంతో డాలర్ దశ తిరిగింది. హిట్లర్ అధీనంలో ఉన్న ఫ్రాన్స్లో అమెరికా మిత్రదేశ బలగాలు విజయవంతంగా సముద్రదాడి చేయడంతో యూరప్పై శ్వేతసౌధం పట్టు బిగించింది. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న అమెరికా, ‘బ్రెటన్ వుడ్స్’ సంప్రదింపుల్లో బ్రిటన్, ఫ్రాన్స్ను గుప్పిట్లో పెట్టుకుంది. ఆ సందర్భంగానే ప్రఖ్యాత ఆర్థికవేత్త కీన్స్ ప్రపంచ తటస్థ రిజర్వ్ కరెన్సీగా డాలర్ను ప్రతిపాదించారు. దీనికి ఆమోదం లభించడంతో, డాలర్ ఆధిపత్యానికి పునాది పడింది. అయితే, 1947లో ప్రపంచ రిజర్వ్ కరెన్సీల్లో బ్రిటిష్ పౌండ్ వాటా 70 శాతం పైనే. మన రూపాయి కూడా పౌండ్తోనే ముడిపడి ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలడం, భారత్ సహా అనేక దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పౌండ్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1954లో తొలిసారి అమెరికా డాలర్ 40 శాతం పైగా వాటాతో పౌండ్ను వెనక్కినెట్టి కింగ్గా అవతరించింది. 1980 నాటికి పౌండ్ వాటా 3 శాతానికి పడిపోవడం విశేషం! రిజర్వ్ కరెన్సీ హోదా అంటే..? ప్రపంచ దేశాల విదేశీ కరెన్సీ రిజర్వ్ల (ఫారెక్స్ నిల్వలు) ఆధారంగా రిజర్వ్ కరెన్సీని పేర్కొంటారు. ఎక్కువ నిల్వలు ఏ కరెన్సీలో ఉంటే అది ప్రపంచ రిజర్వ్ కరెన్సీ కింగ్గా నిలుస్తుంది. ఉదాహరణకు, భారత్కు ఉన్న దాదాపు 580 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వల్లో అత్యధిక మొత్తం అమెరికా డాలర్లలోనే ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం అమెరికా బాండ్లలో పెట్టుబడుల రూపంలో, మరికొంత వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, విదేశీ వాణిజ్య బ్యాంకులు, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో యూరో, జపాన్ యెన్, చైనా యువాన్ వంటి ఇతర కరెన్సీల్లో నిల్వ చేస్తుంది. ఇక బంగారం రూపంలో కూడా కొన్ని ఫారెక్స్ నిల్వలను కొనసాగిస్తుంది. అంటే టాప్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న డాలర్లోనే దాదాపు ప్రపంచ దేశాలన్నీ తమ ఫారెక్స్ నిల్వలను ఉంచుతాయి. దీనికి కారణం విదేశీ ఎగుమతి–దిగుమతులు, విదేశీ రుణాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతరత్రా కరెన్సీ లావాదేవీలన్నీ డాలర్ల రూపంలో జరగడమే. డాలర్ ఆధిపత్యంతో పాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనూ తమ గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా, పశ్చిమ దేశాలు... రుణాల ఎరతో అనే దేశాల ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నాయి కూడా. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు డాలర్పై తిరుగుబాటు చేయడానికి ఇదీ కారణమే! మరోపక్క, అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు, చెల్లింపులను నిర్వహించేందుకు ఏర్పాటైన స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్)పై అమెరికా, యూరప్ దేశాలు పెత్తనం చలాయిస్తున్నాయి. రష్యాను ఈ పేమెంట్ వ్యవస్థ నుంచి ఏకపక్షంగా వెలివేయడం దీనికి నిదర్శనం. స్విఫ్ట్లో డాలర్, యూరో కరెన్సీ లావాదేవీలే అత్యధికంగా ఉండటంతో పశ్చిమ దేశాలు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. డాలర్ రిజర్వ్ హోదా కోల్పేతే... డీ–డాలరైజేషన్.. అంటే అమెరికా అలాగే పశ్చిమ దేశాల ఫైనాన్షియల్ వ్యవస్థ నుంచి ప్రపంచ దేశాలు విడిపోవడం అనేది ఏడాదో రెండేళ్లలోనే జరిగే ప్రక్రియ కాదు. రష్యాపై ఆంక్షల తర్వాత ఇప్పుడిప్పుడే మొదలైన ఈ చర్యలు రాబోయే కొన్నేళ్లలో డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు కచ్చితంగా చరమగీతం పలుకుతాయనేది మెజారిటీ ఆర్థికవేత్తల మాట. వచ్చే ఐదేళ్లలో డీ–డాలరైజేషన్ కారణంగా ఇతర దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోతుందంటూ స్వయంగా యూఎస్ సెనేటర్ మార్కో రూబియో అంచనా వేయడం గమనార్హం. రష్యా విషయంలో ఆంక్షలు బ్యాక్ఫైర్ అవ్వడమే దీనికి సంకేంతం. అంతేకాదు వచ్చే కొన్నేళ్లలో ప్రధాన దేశాలన్నీ తమ సొంత కరెన్సీల్లో (ప్రతిపాదిత బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీతో సహా) వాణిజ్య, ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వాటా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో డాలర్కు డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. అమెరికా బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఇతర సెంట్రల్ బ్యాంకుల వద్దనున్న డాలర్ నిల్వలను తగ్గించుకోవడాన్ని చాలా దేశాలు వేగవంతం చేస్తాయి. దీనివల్ల డాలర్ స్టోర్ విలువ మరింత పడిపోతుంది. వడ్డీరేట్లు భారీగా ఎగబాకే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అమెరికా ట్రెజరీ బ్రాండ్స్ను కొనే దేశాలు కరువవ్వడంతో ఇప్పటిలాగే డాలర్లను ఇష్టానుసారం ప్రింట్ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. ధరలు అంతకంతకూ కొండెక్కి అతి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అంతి మంగా దిగుమతులు గుదిబండగా మారడంతో పాటు అమెరికా ప్రభుత్వ రుణ చెల్లింపులు కష్టతరంగా మారతాయి. నిధుల కోసం పన్నులు పెంచాల్సి వస్తుంది. అంతేకాదు, మనీ ప్రింటింగ్కు గండిపడటంతో, సైనిక వ్యయం పడిపోయి మిలిటరీ పరంగా కూడా ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తం మీద తాజా పరిణామాలు వేగం పుంజుకుంటే డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ హోదాతో పాటు రాజకీయంగా అమెరికా ‘సూపర్ పవర్’ ప్రాభవం కూడా మసకబారుతుందనేది నిపుణుల విశ్లేషణ! చైనా–రష్యా–భారత్ భాయీ భాయీ.. ‘100 ఏళ్లలో జరగని మార్పులను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. మనం కలసి ముందుకు సాగితే ఈ మార్పులు సాక్షాత్కరిస్తాయి’ అంటూ పుతిన్తో జిన్పింగ్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం డాలర్ కోటను బద్దలు కొట్టడమే! రష్యా ఇప్పటికే యూరప్తో పాటు పలు దేశాలకు రూబుల్స్లో మాత్రమే చమురు, గ్యాస్ ఇతరత్రా ఉత్పత్తులను విక్రయిస్తోంది. సౌదీ, ఇరాన్ సైతం తమ సొంత కరెన్సీల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతులకు సై అంటున్నాయి. తద్వారా పెట్రో డాలర్కు షాక్ తగిలింది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు కమోడిటీలదే అత్యధిక వాటా. ఇక ఇప్పుడు ఏకంగా డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు గురిపెట్టి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్యాన్ని చైనా కరెన్సీ యువాన్లతో జరుపుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. మరోపక్క, రష్యాపై అమెరికా ఆంక్షలకు చెక్ చెప్పేందుకు భారత్, చైనా రంగంలోకి దిగాయి. రష్యా నుంచి యథేచ్ఛగా క్రూడ్ ఇతరత్రా కమోడిటీలను కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుండి భారత్ క్రూడ్ దిగుమతులు ఏకంగా 22 రెట్లు ఎగబాకాయి (రోజుకు 1.6 మిలియన్ బ్యారెల్స్). రష్యాతో పెనవేసుకున్న భారత్ మైత్రికి ఇది తర్కాణం. చైనా సైతం రష్యాతో వాణిజ్యాన్ని 30 శాతం పెంచుకుంది. గత ఏడాది రష్యా నుంచి చైనాకు 80 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరగగా, రష్యా నుంచి చైనాకు ఏకంగా 110 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతులు జరిగాయి. ఈ మొత్తం వాణిజ్యం లో మూడు దేశాలు తమ సొంత కరెన్సీలనే ఉపయోగిస్తుండం డాలర్కు మరో బిగ్ షాక్! అమెరికా పక్కలో ‘బ్రిక్స్’ బల్లెం.. ప్రపంచ భౌగోళిక రాజకీయాలనే కాదు ఆర్థిక వ్యవస్థను సైతం శాసించేలా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి అంతకంతకూ బలోపేతం అవుతోంది. ప్రపంచ పెత్తనం చేస్తున్న జీ7 దేశాల (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇటలీ, యూరోపియన్ యూనియన్తో సహా) జీడీపీని 5 బ్రిక్స్ దేశాల జీడీపీ (కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా) అధిగమించడం విశేషం. ప్రపంచ జీడీపీలో జీ7 దేశాల వాటా ప్రస్తుతం 30 శాతానికి పడిపోగా, బ్రిక్స్ దేశాల జీడీపీ వాటా 31.5 శాతానికి చేరింది. అంతేకాదు, సాధారణ జీడీపీలో సైతం ఇప్పటికే బ్రిక్స్ కూటమి అమెరికా జీడీపీని మించిపోయింది. 2035 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించి చైనా నంబర్ వన్ అవుతుందని బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ అంచానా వేసింది. భారత్ సైతం 2075కల్లా అమెరికాను మించిపోతుందని జోస్యం చెప్పింది. మరోపక్క, బ్రిక్స్ కూటమి విస్తరణతో బ్రిక్స్ ప్లస్గా అవతరించే చర్యలు పుంజుకున్నాయి. కీలకమైన సౌదీ అరేబియాతో పాటు ఇరాన్, అర్జెంటీనా, నైజీరియా, యూఏఈ, ఈజిప్ట్, అల్జీరియా, మెక్సికో, వెనెజులా ఇలా మొత్తం 12 దేశాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇదిలాఉంటే, బ్రిక్స్ కూటమి తమ సొంత కరెన్సీ దిశగా అడుగులేస్తోంది. స్విఫ్ట్ స్థానంలో సొంత పేమెంట్ వ్యవస్థను నెలకొల్పనుంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను పెంచుకుంటోంది. చైనా పర్యటనలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా.. డాలర్ బదులు సొంత కరెన్సీలలో వాణిజ్యానికి పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి మరింత విస్తరించి.. కరెన్సీ, పేమెంట్ వ్యవస్థ సాకారమైతే డాలర్కు నిజంగా మరణ శాసనమేనని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. గల్ఫ్.. గుడ్బై! చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ మూడోసారి పగ్గాలు చేపట్టాక రష్యాతో మరింత సన్నిహితం కావడంతో పాటు దౌత్యపరంగానూ సత్తా చాటుతున్నారు. దశాబ్దాలుగా వైరం ఉన్న సౌదీ, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చి అమెరికాకు షాకిచ్చారు. టర్కీ–సిరియా మధ్య సంధి కుదిర్చేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. సౌదీ సైతం యెమెన్తో యుద్ధానికి ముగింపు పలికేలా అడుగులేస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇన్నాళ్లూ అడిస్తున్న యుద్ధతంత్రానికి ఈ పరిణామాలు చెల్లు చెప్పే అవకాశం ఉంది. మరోపక్క ఇరాన్, సౌదీ నుంచి ఇకపై చైనా యువాన్లోనే క్రూడ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైతం తమ సొంత కరెన్సీలో ట్రేడింగ్కు సై అంది. సౌదీ, రష్యాలు సైతం తమ వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పలు రిఫైనరీలను చైనాలో సౌదీ ఆరామ్కో నిర్మించనుంది. ఇందుకు యువాన్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. తొలిసారిగా చైనా బ్యాంకుల నుంచి సౌదీ యువాన్లలో రుణాల కోసం డీల్ కుదుర్చుకుంది కూడా. క్రూడ్ ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్తో పాటు అరబ్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ ఇప్పుడు అమెరికాకు పూర్తిగా ముఖం చాటేస్తుండటం విశేషం. గ్లోబల్ సౌత్.. డాలర్ టార్గెట్! బ్రిక్స్ దేశాలకు తోడు ఇప్పుడు ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం డాలర్ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. డాలర్ అవసరం లేకుండా ఇకపై నేరుగా తమ సొంత కరెన్సీలోనో లేదంటే చైనా యువాన్లోనో వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలు ఓకే అంటున్నాయి. ముఖ్యంగా భారత్ మలేషియా, టాంజానియాతో రూపాయిల్లో వాణిజ్యానికి డీల్ కుదుర్చుకుంది. మరో 18 దేశాలతో కూడా ఇదేవిధమైన ఒప్పందాలకు రెడీ అవుతోంది. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయ్లాండ్ తమ సొంత డిజిటల్ పేమెంట్ వ్యవస్థతో స్థానిక కరెన్సీలో సెటిల్మెంట్కు తెరతీశాయి. ఇప్పుడు 10 దేశాల ఆసియాన్ కూటమి తమ మధ్య వాణిజ్యానికి ఇదే వ్యవస్థను వాడుకోవాలని చూస్తోంది. చైనా పర్యటన సందర్భంగా మలేషియా ప్రధాని ఇబ్రహీమ్, ఐఎంఎఫ్ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు ఆసియా మానిటరీ ఫండ్ (ఏఎంఎఫ్)ను ప్రతిపాదించడం గమనార్హం. తొలిసారిగా యూఏఈ నుంచి చైనా యువాన్లలో గ్యాస్ (ఎల్ఎన్జీ)ను కొనుగోలు చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాలూ డాలర్ను డంప్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. కెన్యా ఇకపై సౌదీ, యూఏఈ నుంచి తమ సొంత కరెన్సీలో క్రూడ్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈజిప్ట్ బ్రిక్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవీ అయితే వీసా, మాస్టర్కార్డ్ల వినియోగాన్ని దేశంలో ఆపేయాలని పిలుపునివ్వడం విశేషం. ఇక లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ తమ ఎగుమతిదారులకు యువాన్ చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకొ స్తోంది. బ్రెజిల్, అర్జెంటీనా లాటిన్ అమెరికా ఉమ్మడి కరెన్సీ ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలు, కుట్రలు, ప్రభుత్వ కూల్చివేతలకు గురైన ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలన్నీ డాలర్పై మూకుమ్మడి ఎటాక్ మొదలెట్టాయి. దీంతో డాలర్, మిలిటరీ, విభజించు–పాలించు... ఈ మూల స్తంభాలపై నిలబడిన శ్వేత సౌధం పునాదులు ఇప్పుడు ఒక్కసారిగా కదిలిపోతున్నాయి. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, ఆర్థిక ముఖచిత్రాన్ని చూస్తుంటే.. డాలర్తో పాటు అమెరికా ఆధిపత్యానికి తెరదించేందుకు మరెంతో కాలం పట్టదనే విషయం కళ్లకు కడుతోంది. - శివరామకృష్ణ మిర్తిపాటి -
టాటా కమ్యూనికేషన్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 326 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 365 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ. 4,587 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,263 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 21% ఎగసి రూ. 1,796 కోట్లను తాకింది. 2021– 22లో రూ. 1,482 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 17,838 కోట్లను అధిగమించింది. 2021–22లో రూ. 16,725 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైంది. ఫలితాల నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం జంప్చేసి రూ. 1,226 వద్ద ముగిసింది. -
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
భారత్ కార్పొరేట్ ఆదాయాలు 12% డౌన్!
ముంబై: భారత్ కార్పొరేట్ ఆదాయాలు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022–23, జనవరి–మార్చి) 10 నుంచి 12 శాతం పడిపోతాయని భావిస్తున్నట్లు క్రిసిల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ తాజా నివేదిక పేర్కొంది. 2021–22 ఇదే కాలంలో ఆదాయాల వృద్ధి 22.8 శాతంగా ఉంది. కంపెనీలు నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వెలువడ్డం గమనార్హం. 47 రంగాలకు చెందిన 300 కంపెనీల గణాంకాల విశ్లేణలనకు అనుగుణంగా తాజా నివేదిక వెలువడింది. హై బేస్ కూడా తాజా అంచనాలు ‘తగ్గించడానికి’ కారణమని క్రిసిల్ వర్గాలు వెల్లడించాయి. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2021–22లో కంపెనీల ఆదాయాల వృద్ధి 27 శాతం కాగా, 2022–23లో ఇది 19 నుంచి 21 శాతానికి పరిమితం కానుంది. ► నిర్వహణా లాభాలు కేవలం 3 శాతంగా ఉండనుంది. ► కంపెనీల ఆదాయాలపై ఎగుమతుల మందగమన ప్రభావం పడనుంది. ► వస్తువులు, ఎగుమతి ఆధారిత రంగాలైన టెక్స్టైల్స్, రత్నాలు–ఆభరణాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఎనేబుల్డ్ సర్వీసుల ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి. ► 2022లో మేలో ఎగుమతి సుంకాలు విధించడం వల్ల స్టీల్ ఉత్పత్తి సంస్థల ఆదాయాలు 7 నుంచి 9 శాతం వరకూ పడిపోవచ్చు. అంతర్జాతీయ మందగమన పరిస్థితులూ దీనికి కారణం కావచ్చు. ► మందగమనం వల్ల అల్యూమినియం ఇండస్ట్రీ ఆదాయాలు కూడా 17 నుంచి 19 శాతం వరకూ పడిపోవచ్చు. ► ఎయిర్లైన్స్, హోటళ్లు, మీడియా, వినోదం, రిటైల్ వంటి వినియోగదారుల విచక్షణ ఉత్పత్తులు ఆదాయ వృద్ధికి దారితీశాయి. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) వంటి వినియోగదారులకు డిమాండ్ వృద్ధి కొనసాగుతుంది. ► హోటళ్ల పరిశ్రమల 98 శాతం పురోగమించే వీలుంది. ఎయిర్లైన్స్ 67 శాతం శాతం పెరిగితే, టెల్కోల ఆదాయాలు 13 శాతం పెరిగవచ్చు. ► ముడి చమురు, నాన్–కోకింగ్ బొగ్గు వంటి కీలకమైన ఎనర్జీ సంబంధ కమోడిటీల ధరలు వాటి గరిష్ఠ స్థాయిల నుండి దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. మందగమన ప్రపంచ డిమాండ్ ప్రభావాన్ని ఈ ‘తగ్గిన ధరలు’ పాక్షికంగా భర్తీ చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, వాణిజ్య పరిమాణాలు పెరగడం వల్ల కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది. -
కుప్పకూలిన క్రిప్టో కరెన్సీ విలువ
-
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్లుక్తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
ఢిల్లీలో వరుణుడి ఉగ్రరూపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుణ దేవుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 74 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2007 తర్వాత నగరంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి. శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాల వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. వాయు నాణ్యత మెరుగుపడింది. గాలి నాణ్యత సూచి ఆదివారం ఉదయం 9 గంటలకు 54గా నమోదయ్యింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం ఇది ‘గుడ్’ కేటగిరీలోకి వస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్కు చేరింది. ఇది ప్రస్తుత సీజన్లో సగటు కంటే తక్కువే కావడం గమనార్హం. శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలు కాగా, శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు. రెండింటి మధ్య వ్యత్యాసం 2.6 డిగ్రీలు. నగరంలో 1969 తర్వాత ఇదే అతి తక్కువ వ్యత్యాసమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1998 అక్టోబర్ 19న ఈ వ్యత్యాసం 3.1 డిగ్రీలు నమోదయ్యందని చెప్పారు. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఢిల్లీలో రుతుపవనాలు గత నెల 29న వెనక్కి మళ్లాయి. రుతుపవనాల సీజన్ ముగిసింది. పశ్చిమ వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. -
కాంగ్రెస్ మునగడంలో క్రియాశీలక పాత్ర గులాం నబీ ఆజాద్దేనా?
ఒకప్పుడు కాంగ్రెస్లో ఆయన తిరుగులేని నేత. ఏ రాష్ట్రానికి ఇన్చార్జీగా వెళితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం. పార్టీలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని బెదిరించే పనిలో కూడా ఉండేవారు. అయినా వినకుండా సొంతంగా పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టించడంలో క్రియాశీలక పాత్ర. కానీ ఇప్పుడు అదే నేత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. ఏభై ఏళ్లపాటు కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించి, పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో పడవ నుంచి జంప్ చేసేశారు. ఆయనే కేంద్ర మాజీ మంత్రి, జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నారు. చదవండి: పవన్ కల్యాణ్ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమని అనడానికి ఇది కూడా నిదర్శనమే అవుతుంది. గతంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అత్యంత విధేయుడుగా ఆజాద్ పేరొందారు. అలాంటి వ్యక్తి పార్టీకి ఎందుకు దూరం అయ్యారంటే రకరకాల విశ్లేషణలు వస్తాయి. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అసమర్దతా? లేక వారిలో ప్రజాకర్షణ కొరవడిపోయిందన్న భావనా? అజాద్ రాజకీయ స్వార్థ చింతనా? తనకు మళ్లీ రాజ్యసభ ఇవ్వలేదన్న ఆక్రోశమా? బీజేపీ విసిరిన గాలమా?.. ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. ఇవన్ని వాస్తవాలే కావచ్చు. అజాద్ చిన్నవయసులోనే పార్టీలో యాక్టివ్ అయ్యారు. దానికి తగినట్లే పదవులు కూడా వచ్చాయి. పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షనేత హోదాను అనుభవించారు. కానీ గతసారి ఆయనకు మళ్లీ ఆ పదవి ఇవ్వలేదు. కర్ణాటకకు చెందిన మరో సీనియర్ నేత మల్లిఖార్జున్కు అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడు కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రాజ్యసభ సీటును రెన్యూ చేశారు. ఇవన్ని ఆయనకు అవమానంగా మారాయి. మరో వైపు కాంగ్రెస్లో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలలో ఈయన ప్రముఖుడు, అప్పటి నుంచే తేడా వచ్చిందన్న సంగతి అర్ధం అయింది. పుండు మీద కారం చల్లినట్లు రాజ్యసభలో అజాద్ రిటైర్ అయిన రోజున ప్రధాని మోదీ ఈయన పట్ల చూపిన జాలి కాంగ్రెస్ వారికే ఆశ్చర్యం కలిగించింది. ఆజాద్ను మోదీ ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అజాద్ బీజేపీలోకి వెళతారని, ఉప రాష్ట్రపతి అభ్యర్థి అవుతారని ఊహాగానాలు వచ్చాయి. అది జరగలేదు. మళ్లీ ఈ మధ్య కాంగ్రెస్లో కాస్త యాక్టివ్ అయ్యారు. ఈ తరుణంలో సడన్గా పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా, నాలుగు పేజీల లేఖ రాసి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. బాడీగార్డులు, పిఏలతోనే రాహుల్ సంప్రదిస్తారని, పిల్ల చేష్టలతో పరువు తీస్తుంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలు లేకపోలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక కోర్టు తీర్పును పూర్వపక్షం చేయడం కోసం ఒక ఆర్డినెన్స్ను తీసుకు వచ్చింది. ఆ తీర్పులో రెండేళ్ల శిక్ష పడితే ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి పోతుందని ఉంది. దానిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ ప్రెస్క్లబ్లో మీటింగ్ పెట్టి మరీ చించివేశారు. దాంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం బాగా డామేజీ అయింది. దానినే ఇప్పుడు అజాద్ కోట్ చేస్తున్నారు. అది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పటివరకు ఎందుకు అజాద్ ప్రశ్నించలేదంటే, అదే రాజకీయం. తన పదవి పోకుండా ఉండడం కోసం అజాద్ మాట్లాడలేదన్నమాట. కాంగ్రెస్ను వీడడమే కాకుండా కశ్మీర్లో ప్రాంతీయ పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. ఈయనకు మద్దతుగా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంటే అధిష్టానానికి ఆగ్రహం వచ్చింది. దాంతో ప్రత్యర్ది పార్టీ అయిన తెలుగుదేశంతో కలిసి జగన్ పై కేసులు పెట్టింది. ఆ ప్రక్రియలో న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడంలో అజాద్ ది కూడా కీలకపాత్రే అన్న అభిప్రాయం ఉంది. ఆ ఒక్క పరిణామంతో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు.. తెలంగాణ ఏర్పాటు హామీ ఇవ్వడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించారు. 2004లో ఏపీలో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికిగాను తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, జి.వెంకటస్వామి వంటివారు పట్టుబట్టారు. ఆ టైమ్లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్య నేత వైఎస్ రాజశేఖరరెడ్డి టీఆర్ఎస్తో పొత్తును వ్యతిరేకించారు. అయినా అజాద్ టి.కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. అవన్ని వెరసి కాంగ్రెస్ పతనానికి దారి తీశాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలలోకి వెళ్లిపోయారు. వారిలో డి.శ్రీనివాస్ కూడా ఒకరు. నెల్లూరు లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో అజాద్ ఒక విషయం బహిరంగంగానే చెప్పారు. వైఎస్ జగన్ కాంగ్రెస్లో ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని, పార్టీని వీడటం వల్ల కష్టాలు పడతారని హెచ్చరించారు. నిజంగానే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా తగ్గించాలన్న తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించి జైలులో పెట్టించిందన్న అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. జగన్ ఫ్యాక్టర్, తెలంగాణ అంశం కలిసి ఏపీలో కాంగ్రెస్ సర్వనాశనం అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ను విలీనం చేసుకోవడంలో విఫలం అయి, కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించుకోలేకపోయింది. కేసీఆర్ వ్యూహరచన, స్పీడ్ ముందు కాంగ్రెస్ విలవిలలాడింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఇలా ఒక్కో పరిణామం తర్వాత మరో పరిణామం సంభవించడం ద్వారా కాంగ్రెస్ కునారిల్లే పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో శరద్ పవార్, మమత బెనర్జీ, మూపనార్,.. ఇలా అనేకమందిని కోల్పోతూ ఇప్పుడు గులాం నబీ అజాద్ను కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. దీని ప్రభావం సహజంగానే దేశ స్థాయిలో కాంగ్రెస్పై పడుతుంది. కశ్మీర్లో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, తదుపరి బీజేపీతో పొత్తు పెట్టుకుని అజాద్ మళ్లీ రాజకీయాలలో కీలకమైన వ్యక్తి అవుతారా? లేదా అన్నది కాలమే తేల్చుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఈక్విటీల్లో ఎఫ్పీఐల వాటా డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్స్టార్ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్–జూన్(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో ఈ విలువ 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 జూన్ క్వార్టర్కల్లా 592 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్ త్రైమాసికంలో ఎఫ్పీఐలు 13.85 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
మెప్పించని విప్రో
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో లాభాలకు గండి పడింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 21 శాతం పతనమై జూన్ త్రైమాసికంలో రూ.2,564 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.18,252 కోట్ల నుంచి రూ.21,529 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.3,243 కోట్లుగా ఉంది. డాలర్లలో చూస్తే ఆదాయం 17 శాతానికి పైగా పెరిగి 2,735 డాలర్లుగా ఉంది. క్వార్టర్ వారీగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 2 శాతం తగ్గి 15 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 2,817–2872 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని, సీక్వెన్షియల్గా (జూన్ త్రైమాసికంతో పోలిస్తే) 3–5 శాతం మధ్య వృద్ధి నమోదు కావచ్చని కంపెనీ పేర్కొంది. ‘‘విప్రో వృద్ధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాం. వీటి ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆర్డర్ల పుస్తకం వార్షికంగా చూస్తే కాంట్రాక్టు విలువ పరంగా 32 శాతం పెరిగింది. పెద్ద డీల్స్ సొంతం చేసుకున్నాం. నేడు ఆర్డర్ల పైపులైన్ ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. మా వ్యాపార వృద్ధికి వీలున్న చోట పెట్టుబడులు కొనసాగిస్తాం. మా క్లయింట్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడంపై దృష్ట సారిస్తాం’’అని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్టే తెలిపారు. ఆపరేటింగ్ మార్జిన్లు 15 శాతంగా ఉన్నాయంటే కనిష్ట స్థాయికి చేరుకున్నట్టేనని కంపెనీ సీఎఫ్వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగి 2.58 లక్షలకు చేరింది. -
అరకొరగానే వరి! కారణాలివేనా? కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్గఢ్లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా.. రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని తెలిపారు. -
కార్మిక శక్తి సర్వే.. దేశంలో నిరుద్యోగం తగ్గిందట!?
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం (15 ఏళ్లు, అంతకుమించి) ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) 8.2 శాతానికి తగ్గింది. 2021 మొదటి మూడు నెలల్లో 9.3 శాతంగా ఉండడం గమనించాలి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన ‘14వ కార్మిక శక్తి సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2021 మొదటి 3 నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కరోనా నియంత్రణ కోసం దీర్ఘకాలం పాటు విధించిన లాక్డౌన్ల ప్రభావం ఉంది. ఇక గతేడాది చివరి మూడు నెలల్లో (2021 అక్టోబర్–డిసెంబర్) నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. అంటే త్రైమాసికం వారీగా చూసినా ఉపాధిలేని వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ► మహిళల్లో నిరుద్యోగ రేటు 2022 జనవరి–మార్చి మధ్య 10.1 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.8 శాతం. 2021 చివరి త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది. ► పురుషుల్లో ఉపాధి లేకుండా ఉన్న వారి రేటు 2022 మొదటి త్రైమాసికంలో 7.7 శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 8.3 శాతంగా ఉంది. ఇక ఏడాది క్రితం ఇదే కాలంలో 8.6 శాతంగా ఉండడం గమనించాలి. ► పట్టణాల్లో నిరుద్యోగ రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ ఇది 47.3 శాతంగా నమోదైంది. ► పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగులు 7.7 శాతంగా ఉన్నారు. ఏడాది క్రితం ఇది 8.6 శాతంగా ఉంటే, గతేడాది చివరి మూడు నెలల్లో 8.3 శాతంగా ఉంది. చదవండి: శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే! -
మార్కెట్లో ద్రవ్యోల్బణం దడ
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను హడలెత్తించాయి. ఎగబాకిన ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్యపాలసీ విధానానికి, ఆర్థిక అస్థిరతకు దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు వారాంతపు రోజున ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 1,017 పాయింట్లు నష్టపోయి 54,303 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 276 పాయింట్లు క్షీణించి 16,201 వద్ద నిలిచింది. స్టాక్ సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.3.11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2,52 లక్షల కోట్లకు దిగివచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ, ఆయిల్అండ్గ్యాస్ వంటి అధిక వెయిటేజీ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఎనిమిది మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు దాదాపు రెండుశాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,974 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,831 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్, హాంగ్కాంగ్, కొరియా మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. ఈసారికి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.., రానున్న రోజుల్లో పెంపు తప్పదనే ఈసీబీ వ్యాఖ్యలతో యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 2% నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,466 పాయింట్లు, నిఫ్టీ 383 పాయింట్లు చొప్పున పెరిగాయి. నష్టాలు ఎందుకంటే..! ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఈ పరిణామం దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర(121.28డాలర్లకు) మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు రెండు నుంచి నాలుగుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం తదితర అంశాలూ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ బజాజ్ ఆటో షేరు రాణించింది. రెండు శాతం లాభంతో రూ.3,965 వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ బైబ్యాక్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చనే వార్తలు షేరు ర్యాలీకి కారణమైంది. ► హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, శ్రీ సిమెంట్ షేర్లు ఈ వారంలో ఐదుశాతం నష్టాన్ని చవిచూశాయి. ► మెడ్ప్లస్ షేరు మూడుశాతం నష్టపోయి రూ.753 వద్ద స్థిరపడింది. -
అదానీ పోర్ట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 1,033 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,072 కోట్ల నుంచి రూ. 4,418 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,527 కోట్ల నుంచి రూ. 3,309 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండు ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 4,795 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 5,049 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ 27 శాతం జంప్చేసి రూ. 15,934 కోట్లకు చేరింది. గంగవరం పోర్టును మినహాయించిన ఫలితాలివి. కాగా.. కార్గో పరిమాణం 312 ఎంఎంటీను తాకినట్లు కంపెనీ సీఈవో కరణ్ అదానీ వెల్లడించారు. ఒక్క ముంద్రా పోర్ట్లోనే 150 ఎంఎంటీ కార్గోను చేపట్టినట్లు తెలియజేశారు. దేశీయంగా ఏ ఇతర పోర్టులోనూ ఈ స్థాయి కార్గో నమోదుకాలేదని వెల్లడించారు. లాజిస్టిక్స్ స్పీడ్ అనుబంధ సంస్థ అదానీ లాజిస్టిక్స్ 29 శాతం అధికంగా 4,03,737 టీఈయూ రైల్ కార్గోను సాధించినట్లు అదానీ పోర్ట్స్ పేర్కొంది. గతేడాది రూ. 11,400 కోట్ల పెట్టుబడులను చేపట్టినట్లు ప్రస్తావించింది. ముంబై, ఇండోర్, పలావ్ల్, రనోలీ, విరోచన్నగర్లలో నిర్మిస్తున్న వేర్హౌసింగ్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) జనవరి–మార్చికల్లా మొత్తం 4 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులోకి రానున్నట్లు వివరించింది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు 5.6 శాతం పతనమై రూ. 710 వద్ద ముగిసింది. -
రెండు నెలల్లో అతిపెద్ద పతనం
ముంబై: ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలతో స్టాక్ మార్కెట్ గురువారం రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్తో సహా దేశీయ కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నష్టాలకు ఆజ్యం పోశాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు భారత వృద్ధి రేటు అవుట్లుక్ను 7.3 శాతానికి కుదించింది. దేశీయ మార్కెట్లో్ల విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, కొనసాగుతున్న రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 1,416 పాయింట్లు క్షీణించి 52,930 వద్ద ముగిసింది. నిఫ్టీ 431 పాయింట్లను కోల్పోయి 16 వేల దిగువున 15,809 వద్ద నిలిచింది. ఈ ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ ఇండెక్స్లు ఏకంగా రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో, నిఫ్టీ 50 షేర్లలో ఐటీసీ(3.50%), డాక్టర్ రెడ్డీస్(అరశాతం), పవర్గ్రిడ్(0.30%) మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, మెటల్స్ అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4,900 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,226 కోట్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే.., ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,139 పాయింట్ల భారీ పతనంతో 53,070 వద్ద., నిఫ్టీ 323 పాయింట్లు క్షీణించి 15,917 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ట్రేడింగ్ మొదలు.., మార్కెట్ ముగిసే దాకా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేక పోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు క్షీణించి 52,670 వద్ద, నిఫ్టీ 465 పాయింట్లు నష్టపోయి 15,775 వద్ద కనిష్టాలను తాకాయి. భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు యూఎస్ రిటైల్ దిగ్గజ సంస్థలు వాల్మార్ట్, అమెజాన్, క్రోగర్, కాస్ట్కోల రిటైల్ అమ్మకాలు బాగా తగ్గాయి. నీరసించిన గణాంకాలు మందగమన సంకేతాలు సూచిస్తున్నాయనే భయాలతో అక్కడి మార్కెట్లు బుధవారం.., 2020 జూన్ తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. వాల్మార్ట్ షేరు ఏకంగా 25 శాతం పడిపోయింది. ముప్పై ఏళ్లలో అతి పెద్ద క్షీణత ఇది. ట్రేడింగ్ ముగిసే సరికి దేశ ప్రధాన ఇండెక్సులు డోజోన్ 3.6%, నాక్డాక్ 4.7%, ఎస్అండ్పీ నాలుగుశాతం క్షీణించాయి. స్టాక్ ఫ్యూచర్లు సైతం గురువారం ఒకటిన్నర శాతం నష్టంతో కదలాడాయి. అమెరికా మార్కెట్ల పతనానికి తోడు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు రెండు శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లకు చెందిన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు 2.50% నష్టపోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు ఎదురీదింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 4.50% దూసుకెళ్లి రూ.279 వద్ద స్థాయిని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 3.5% లాభంతో రూ.276 వద్ద ముగిసింది. ► ప్రపంచ వ్యాప్తంగా ఐటీ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల సెగ దేశీయ ఐటీ షేర్లను తాకింది. విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు 6శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో టాప్ లూజర్లన్నీ ఐటీ షేర్లే కావడం గమనార్హం. ► మార్కెట్లో అస్థిరతను సూచించే నిఫ్టీ వొలిటాలిటీ ఇండెక్స్ పది శాతానికి ఎగసి 24.56 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.6.71 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ రెండున్నర శాతం నష్టంతో రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.6.71 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.249.06 లక్షల కోట్లకు దిగివచ్చింది. రూ‘పాయె’! 77.65కి రికార్డు పతనం ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్ ‘ముగింపు’లో కొత్త చరిత్రాత్మక కనిష్టాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ముగింపుతో చూస్తే 3 పైసలు బలహీనపడి 77.65 వద్ద ముగిసింది. ఇప్పటి వరకూ రూపాయికి ఇంట్రాడే ‘కనిష్టం’ 77.79. మే 17వ తేదీన ఈ పతన స్థాయి నమోదయ్యింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా, భారత్సహా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు దశలోకి ప్రవేశించడం, డాలర్ బలోపేత ధోరణి, దేశంలో ఈక్విటీల బలహీన పరిస్థితి నేపథ్యంలో రూపాయి పతన బాట పట్టింది. రూపాయి బుధవారం ముగింపు 77.62. గురువారం ట్రేడింగ్లో 77.72 బలహీనతతో ప్రారంభమైంది. 77.63కు బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. రూపాయి కొద్ది సెషన్లలోనే 78కి తాకడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
మణప్పురం లాభం పతనం
న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్ మార్చి త్రైమాసికం పనితీరు విషయంలో ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది. నికర లాభం 44 శాతం తరిగి రూ.261 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.468 కోట్లుగా ఉంది. అధిక ఈల్డ్ బంగారం రుణాలను, తక్కువ ఈల్డ్లోకి మార్చడం వల్ల లాభాలపై ప్రభావం పడినట్టు సంస్థ తెలిపింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. సూక్ష్మ రుణాల విభాగంలో నాణ్యమైన వృద్ధిపై, రుణ వసూళ్లపై, బంగారం రుణాల పోర్ట్ఫోలియో బలోపేతంపై తాము దృష్టి సారిస్తామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం సైతం 10 శాతం తగ్గిపోయి రూ.986 కోట్లకు పరిమితమైంది. కానీ, డిసెంబర్ త్రైమాసికంలో ఉన్న రూ.953 కోట్లతో పోలిస్తే 3 శాతానికి పైగా పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 9 శాతం తగ్గి రూ.1,481 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం రుణాల్లో రూ.2లక్షలకు పైన టికెట్ సైజువి 33 శాతంగా ఉంటాయని సంస్థ తెలిపింది. 2021–22 సంవత్సరానికి సంస్థ నికర లాభం 23 శాతం తగ్గి రూ.1,320 కోట్లుగా ఉంది. ఆదాయం 5 శాతం క్షీణించి రూ.6,061 కోట్లుగా నమోదైంది. -
ఈక్విటీల్లో తగ్గుతున్న ఎఫ్పీఐల వాటా
న్యూఢిల్లీ: భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మార్చి త్రైమాసికంలో పలుచబడింది. ఈక్విటీల్లో ఎఫ్పీఐలు కలిగి ఉన్న వాటాల విలువ మార్చి త్రైమాసికం చివరికి 612 బిలియన్ డాలర్లకు (రూ.47.12 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న ఎఫ్పీఐల ఈక్విటీ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో నిరాటంకంగా విక్రయాలు చేస్తుండడం తెలిసిందే. వారి వాటాల విలువ తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇక 2021 మార్చి నాటికి ఎఫ్పీఐల పెట్టుబడుల విలువ 552 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మొత్తం విలువ)లో ఎఫ్పీఐల వాటా విలువ పరంగా 18.3 శాతం నుంచి 17.8 శాతానికి తగ్గింది. మన దేశ ఈక్విటీల్లో ఎఫ్పీఐలు ఎక్కువగా ఆఫ్షోర్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులను హోల్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆఫ్షోర్ ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ రూపంలో ఎఫ్పీఐలు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారు. విక్రయాలు.. మార్నింగ్స్టార్ నివేదిక పరిశీలిస్తే.. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎఫ్పీఐలు ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. 14.59 బిలియన్ డాలర్ల మేర (రూ.1.13 లక్షల కోట్లు) అమ్మకాలు చేశారు. జనవరిలో 4.46 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 4.74 బిలియన్ డాలర్లు, మార్చిలో 5.38 బిలియన్ డాలర్ల చొప్పున విక్రయాలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. ఈక్విటీల్లో రిస్క్ తీసుకునే ధోరణి తగ్గడంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ‘‘త్వరలోనే వడ్డీ రేట్లు పెంచుతానంటూ యూఎస్ ఫెడ్ చేసిన ప్రకటనతో మార్చి త్రైమాసికం ఆరంభంలోనే సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడాన్ని విదేశీ ఇన్వెస్టర్లు వేగవంతం చేశారు’’ అని మార్నింగ్ స్టార్ పేర్కొంది. ఆదుకున్న ఫండ్స్.. దేశీయంగా వృద్ధి ఆధారిత బడ్జెట్, కరోనా మూడో విడత సాధారణంగా ఉండడం కొంత ఉపశమనాన్ని ఇచ్చినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. విక్రయాల ఒత్తిడి కొద్దిగా తగ్గేలా సాయపడ్డాయి. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇనిస్టిట్యూషన్స్ కొనుగోళ్ల ఈక్విటీ మార్కెట్లను చాలా వరకు ఆదుకున్నాయి. సిప్ రూపంలో ప్రతీ నెలా రూ.11వేల కోట్లకుపైనే పెట్టుబడులు వస్తుండడంతో.. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆకర్షణీయ వ్యాల్యూషన్లకు దిగొస్తున్న కంపెనీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. ప్రతికూలంగా మారిన పరిస్థితులు చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికాలో ఈ పరిస్థితులే రేట్ల పెంపునకు దారితీయడం తెలిసిందే. దీంతో ఎఫ్ఫీఐలు భారత ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్పై రష్యా ఫిబ్రవరి చివర్లో యుద్ధం మొదలు పెట్టగా.. రష్యాపై పలు దేశాల ఆంక్షలను చూసి ఇన్వెస్టర్లు అమ్మకాలను మరింత పెంచారు. అప్పటి నుంచి అస్సలు కొనుగోళ్ల వైపే వారు ఉండడం లేదు. 2018 తర్వాత ఫెడ్ మొదటిసారి రేట్లను పెంచడం కూడా ప్రతికూల సెంటిమెంట్కు దారితీసింది. మరిన్ని విడతలుగా రేట్లను పెంచనున్నట్ట కూడా ఫెడ్ స్పష్టం చేసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. 2022లో ఇప్పటి వరకు వారు చేసిన విక్రయాలు 18 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సమీప కాలంలోనూ ఎఫ్పీఐలు భారత ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగించొచ్చని మార్నింగ్ స్టార్ నివేదిక అంచనా వేసింది. -
స్టార్టప్స్లోకి తగ్గిన వీసీ పెట్టుబడులు
ముంబై: గతేడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏప్రిల్లో అంకుర సంస్థల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థల పెట్టుబడులు సగానికి తగ్గాయి. 82 డీల్స్లో 1.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఏప్రిల్లో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 27 శాతం క్షీణించి 5.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చితో పోలిస్తే మాత్రం 11 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ గ్రూప్ ఐవీసీఏ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుతో లిక్విడిటీ (నిధుల లభ్యత) తగ్గవచ్చని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. అయితే, అంతర్జాతీయ ఫండ్ల దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు. పటిష్టమైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్, ఆ నిధులను దక్కించుకోవడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో వర్ధమాన మార్కెట్లకు సారథ్యం వహించవచ్చని వివేక్ వివరించారు. పెట్టుబడులకు రిస్కులు.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు, దేశీయంగా వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు రూపాయితో పోలిస్తే డాలర్ బలపడుతుండటం మొదలైనవి .. వృద్ధి అంచనాలు, పీఈ/వీసీ పెట్టుబడులకు కొంత ప్రతిబంధకాలుగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఏప్రిల్లో వర్స్ ఇన్నోవేషన్స్ అత్యధికంగా 805 మిలియన్ డాలర్లు సమీకరించింది. మీడియా, వినోద రంగంలో ఇది రెండో అతి పెద్ద డీల్. ► భారీ స్థాయి డీల్స్ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించడం కూడా తగ్గి 1.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్లో ఇది 2.7 బిలియన్ డాలర్లు. ► ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐపీవోలు.. వేల్యుయేషన్లు తగ్గే అవకాశం ఉంది. ► ఏప్రిల్లో 16 ఫండ్లు 1.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎనిమిది ఫండ్లు 569 మిలియన్ డాలర్లు సేకరించాయి. భారత్లో పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఎలివేషన్ క్యాపిటల్ ఫండ్ ఈసారి అత్యధికంగా 670 మిలియ్ డాలర్లు దక్కించుకుంది. -
ఫెర్టిలిటీ తగ్గింది.. ఊబకాయం పెరిగింది
న్యూఢిల్లీ: భారత మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో విడత నివేదిక (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) వెల్లడించింది. జనాభా నియంత్రణ పద్ధతులను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సంతానోత్పత్తి సామర్థ్యం 2.2 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఇది బిహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2019–21 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 707 జిల్లాల్లో 6.37 లక్షల ఇళ్లలో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులతో మాట్లాడి నివేదిక రూపొందించారు. పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేందుకు వీలుగా పౌరుల సామాజిక, ఆర్థిక, ఇతర నేపథ్యాలను కూడా సర్వేలో పొందుపరిచారు... సాధికారత సంకేతాలు... మహిళలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారని సర్వే వివరాలు చెప్పకనే చెబుతున్నాయి. ► బ్యాంకు ఖాతాలున్న మహిళల సంఖ్య గత నాలుగేళ్లలో 53 నుంచి 79 శాతానికి పెరిగింది. ► కాలుష్యరహిత, పరిశుభ్రమైన వంట ఇంధనం వాడేవారి సంఖ్య 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది. ► పారిశుద్ధ్య సౌకర్యాలు 49 నుంచి 70 శాతానికి పెరిగాయి. ► కరోనా కాలంలో చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది. ► నీళ్లు, సబ్బు సదుపాయాలున్న వారి సంఖ్య 60 నుంచి 78 శాతానికి పెరిగింది! ► 15–49 మధ్య వయసు వివాహితల్లో ఉద్యోగుల సంఖ్య 31 శాతం నుంచి 32కు పెరిగింది. పెరిగిన ఊబకాయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోలిస్తే ఊబకాయం సమస్య దేశాన్ని బాగా వేధిస్తోంది. ఊబకాయుల సంఖ్య మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 19 నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్ నికోబర్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిల్లో మూడో వంతుకు పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో తగ్గిన కుంగుబాటు చిన్నారుల్లో కుంగుబాటు గత నాలుగేళ్లలో తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కుంగుబాటు 38 నుంచి 36 శాతానికి తగ్గినట్టు తేలింది. పట్టణాల (30 శాతం) కంటే గ్రామీణ బాలల్లో (37 శాతం) కుంగుబాటు ఎక్కువగా ఉంది. మహిళల్లో నాలుగో వంతు యుక్తవయసుకు ముందే పెళ్లాడారు దేశవ్యాప్తంగా 18–29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25 శాతం మంది, 21–29 ఏళ్ల పురుషుల్లో 15 శాతం మంది యుక్త వయసుకు ముందే పెళ్లి చేసుకున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. భారత్లో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు పెళ్లికి యుక్తవయసన్నది తెలిసిందే. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 42 శాతం మంది మహిళలకు యుక్తవయసుకు ముందే పెళ్లయింది. బిహార్ (40 శాతం), త్రిపుర (39), జార్ఖండ్ (35), ఏపీ (33), తెలంగాణ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యుక్తవయసుకు ముందే తాళి కడుతున్న వాళ్ల అబ్బాయిల సంఖ్య బిహార్లో అత్యధికంగా 25 శాతంగా తేలింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్ (24 శాతం), జార్ఖండ్ (22), అరుణాచల్ప్రదేశ్ (21) ఉన్నాయి. మొత్తమ్మీద బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని సర్వే పేర్కొంది. 12 ఏళ్లపాటు, అంతకుమించి చదువుకునే అమ్మాయిలు మిగతా వారికంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. టీనేజీ తల్లుల సంఖ్య ముస్లింల్లో ఎక్కవగా (8 శాతం) ఉంది. గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరిగింది ► గర్భనిరోధక పద్ధతుల వాడకం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ► కుటుంబ నియంత్రణ పాటించని వారి సంఖ్య 13 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. ► ఆస్పత్రి ప్రసవాల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. ► గ్రామీణ ప్రాంతాల్లో కూడా 87 శాతం గర్భిణులు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 94 శాతం. ► గర్భనిరోధం మహిళల బాధ్యతేనని 35.1 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. వీరి సంఖ్య చండీగఢ్లో అత్యధికంగా (69) ఉంది. ► మహిళల్లో గర్భ నిరోధక పద్ధతుల వాడకం వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చని 19.6 శాతం మగవాళ్లు అనుమానిస్తున్నారు! ఇలా భావిస్తున్న వారి సంఖ్య కేరళలో అత్యధికంగా (44.1) ఉంది!! ► అబార్షన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది అవాంఛిత గర్భాన్నే కారణంగా చెప్తున్నారు. ► వీరిలో 16 శాతం అబార్షన్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆసక్తి ఉన్నా అవగాహన లేక, వాటి వాడకం తెలియక దంపతులు ఎక్కువ మందిని కనేవారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావడం మంచి పరిణామం – కేంద్రం -
పసిడి డిమాండ్కు ధర దడ
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 18 శాతం పడిపోయింది. 135.5 టన్నులుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ డిమాండ్ 165.8 టన్నులు. బంగారం ధరలు భారీగా పెరగడమే డిమాండ్ తగ్గడానికి కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2022 క్యూ1’ పేరుతో విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విలువ పరంగా జనవరి–మార్చి కాలంలో బంగారం డిమాండ్ 12 శాతం తగ్గి రూ.61,550 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో ఈ విలువ రూ.69,720 కోట్లు. ► జనవరిలో బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 గ్రాముల ధర (పన్నులు లేకుండా) 8 శాతం పెరిగి రూ. 45,434కు చేరుకుంది. ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం. 2021 జనవరి– మార్చి మధ్య ధర రూ.42,045గా ఉంది. ► మార్చి త్రైమాసికంలో దేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 26 శాతం తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 126.5 టన్నులు. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలువ పరంగా ఆభరణాల డిమాండ్ 20 శాతం క్షీణించి రూ.42,800 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.53,200 కోట్లు. ► 2021 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) ధర రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత, భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి (మహమ్మారి కాలాలను మినహాయించి) భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ 100 ట న్నుల దిగువకు పడిపోవడం ఇది మూడవసారి. ► శుభ దినాల సందర్భాల్లో నెలకొన్న మహమ్మారి భయాలు, బంగారం ధరలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు రిటైల్ డిమాండ్ తగ్గడానికి కారణం. ఆయా కారణాలతో కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నాయి. ► ఈ ఏడాది మొత్తంగా బంగారానికి డిమాండ్ 800–850 టన్నులు ఉండవచ్చు. ► కాగా, మార్చి త్రైమాసికంలో బంగారం విషయంలో పెట్టుబడి డిమాండ్ 5 శాతం పెరిగి 41.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 39.3 టన్నులు. ► విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 13 శాతం పెరిగి రూ.18,750 కోట్లకు చేరుకుంది. ఇది 2021 అదే త్రైమాసికంలో రూ.16,520 కోట్లు. ► పెట్టుబడుల్లో ప్రధానంగా బంగారు కడ్డీలు, నాణేలు ఉన్నాయి. వీటి డిమాండ్ 5 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది. ధరలు పెరగడం, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారాన్ని ఎంచుకోవడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు పసిడి పెట్టుబడుల డిమాండ్కు మద్దతునిచ్చాయి. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఈ కాలంలో సెంట్రల్ బ్యాంక్ 8 టన్నులను కొనుగోలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ 2017 చివరి నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి 200 టన్నులను కొనుగోలు చేసింది. ► 2022 మొదటి త్రైమాసికంలో దేశంలో రీసైకిల్ అయిన మొత్తం బంగారం 88 శాతం పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 14.8 టన్నులు. ► మార్చి త్రైమాసికంలో మొత్తం నికర బులియన్ దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 313.9 టన్నుల నుంచి 58 శాతం తగ్గి 132.2 టన్నులకు పడిపోయాయి. అంతర్జాతీయంగా మెరుపులు... కాగా, మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 34 శాతం పెరిగి 1,234 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం, వంటి అంశాలు దీనికి కారణం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి డిమాండ్ భారీగా వచ్చిందని నివేదిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1, 2022 నివేదిక పేర్కొంది. 2021 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 919.1 టన్నులు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులలో బంగారం కోసం డిమాండ్ వంటి అంశాలు యరో మెటల్కు ఆకర్షణ తీసుకుని వస్తాయిన డబ్ల్యూజీసీ సీనియర్ విశ్లేషకులు లూయిస్ స్ట్రీట్ పేర్కొన్నారు. పలు అంశాల ప్రభావం ధరలపై మార్కెట్లో మిశ్రమ ధోరణి, చైనా నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కోవిడ్పై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక సంఘర్షణలు వంటి అంశాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు గ్రామీణ మార్కెట్లలో డిమండ్ పునరుద్ధరణ, సాధారణ రుతుపవన అంశాలు కూడా యల్లో మెటల్ డిమాండ్పై ప్రభావం చూపుతాయి. – పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
సప్లయి తగ్గింది.. డిమాండ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అందుబాటు గృహాల సరఫరా తగ్గినప్పటికీ.. డిమాండ్ మాత్రం పుంజుకుంది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇన్వెంటరీ 21 శాతం క్షీణించాయి. 2020 జనవరి–మార్చి (క్యూ1)లో 2,34,600 అఫర్డబుల్ యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1,86,150 యూనిట్లకు తగ్గాయని అనరాక్ డేటా వెల్లడించింది. ► రెండేళ్ల కోవిడ్ కాలంలో అఫర్డబుల్ గృహాల సప్లయి తగ్గింది. కరోనా కంటే ముందు 2019 జనవరి–మార్చి (క్యూ1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 70,480 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాల వాటా 44 శాతంగా ఉంది. కరోనా మొదలైన ఏడాది 2020 క్యూలోని గృహాల సప్లయిలో అఫర్డబుల్ వాటా 38 శాతం, 2021 క్యూ1లో 30 శాతం, ఈ ఏడాది క్యూ1 నాటికి 25 శాతానికి తగ్గింది. సప్లయి తగ్గడం వల్ల డెవలపర్లు అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ)ని విక్రయించడంపై దృష్టిసారించారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దీంతో గత రెండేళ్లలో ఏడు నగరాల్లోని అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ 21 శాతం, లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం తగ్గుముఖం పట్టాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 6,27,780 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. ఇందులో 1,86,150 యూనిట్లు రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. అదే గతేడాది క్యూ1లో ఇవి 2,17,63, 2020 క్యూ1లో 2,34,600 యూనిట్లున్నాయి. 2021 క్యూ1లో అత్యధికంగా చెన్నైలో 52%, పుణేలో 33 శాతం, ముంబైలో 27% అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. ► ఇదే రెండేళ్ల కరోనా సమయంలో రూ.2.5 కోట్లకు పైగా ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం మేర తగ్గింది. 2020 క్యూ1లో 41,750 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 42,080కు, ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లకు క్షీణించాయి. అత్యధికంగా ముంబైలో 16 శాతం, కోల్కతాలో 15 శాతం అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. -
నెట్ఫ్లిక్స్కు యూజర్ల షాక్!!
శాన్ ఫ్రాన్సిస్కో: స్ట్రీమింగ్ సేవల దిగ్గజం నెట్ఫ్లిక్స్ షేరు బుధవారం భారీగా పతనమైంది. ఒక దశలో ఏకంగా 39 శాతం క్షీణించి 212.51 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీంతో మార్కెట్ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. దశాబ్ద కాలంలోనే తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో యూజర్లపరంగా భారీ ఎదురుదెబ్బ తగలడం ఇందుకు కారణం. సమీక్షాకాలంలో కొత్తగా 25 లక్షల మంది యూజర్లు చేరతారని అంచనా వేసుకోగా .. దానికి విరుద్ధంగా నికరంగా 2,00,000 మంది సబ్స్క్రయిబర్స్ను నెట్ఫ్లిక్స్ పోగొట్టుకుంది. ఉక్రెయిన్పై దాడులకు నిరసనగా రష్యా మార్కెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మరో 20 లక్షల మంది దాకా యూజర్లను కోల్పోయే అవకాశం ఉందన్న నెట్ఫ్లిక్స్ అంచనాలు.. షేర్హోల్డర్లను కలవరపరుస్తున్నాయి. దీంతో షేరు భారీగా పతనమైంది. కంపెనీ పనితీరుపై సందేహాలతో గత నాలుగు నెలల్లో 150 బిలియన్ డాలర్ల మేర షేర్హోల్డర్ల సంపద కరిగిపోయింది. మార్చి ఆఖరు నాటికి కంపెనీ యూజర్ల సంఖ్య 22.16 కోట్లుగా ఉంది. -
రియల్టీలోకి తగ్గిన పీఈ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల రాక తగ్గింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 4.3 బిలియన్ డాలర్లు (రూ.32,000 కోట్లు) పెట్టుబడులుగా వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020–21)లో పీఈ పెట్టుబడులు 6.3బిలియన్ డాలర్లతో పోలిస్తే 32 శాతం తగ్గాయి. ఈ మేరకు అనరాక్ క్యాపిటల్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 2019–20లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు 5.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2018–19లో రూ.5.6 బిలియన్ డాలర్లు, 2017–18లో 5.4 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. కరోనా రెండో విడత వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండడం రియల్ ఎస్టేట్ రంగంలో పీఈ పెట్టుబడులు తగ్గడానికి కారణమని ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ టీకాలను విస్తృతం గా ఇవ్వడానికితోడు, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడంతో రియల్టీలోకి పీఈ పెట్టుబడుల రాక పుంజుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. వాణిజ్య రియల్ ఎస్టేట్లోకి ఎక్కువ.. ‘‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మొత్తం పీఈ పెట్టుబడుల్లో 80 శాతం ఈక్విటీయే. 2021–22లో అత్యధికంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ పరిశ్రమ పీఈ పెట్టుబడులను ఆకర్షించింది. 38 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోకే వెళ్లాయి. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 22 శాతం, నివాస గృహ ప్రాజెక్టులు 14 శాతం చొప్పున పెట్టుబడులు ఆకర్షించాయి. దేశీయ ఫండ్స్ పెట్టుబడులు 2020–21లో 290 మిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021–22లో 600 మిలియన్ డాలర్లకు పెరిగాయి. కరోనా ఇబ్బందుల తర్వాత నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ఫండ్స్ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి’’అని అనరాక్ క్యాపిటల్ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు. -
నిరుద్యోగిత తగ్గుతోంది
కోల్కతా: దేశంలో నిరుద్యోగితా రేటు తగ్గుతోందని, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తోందని సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీస్ మంత్లీ టైమ్ సీరిస్) డేటా పేర్కొంది. ఫిబ్రవరిలో భారత నిరుద్యోగితా రేటు 8.10 శాతం ఉండగా, మార్చి నాటికి 7.6 శాతానికి దిగివచ్చిందని సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్2 నాటికి ఈ రేటు 7.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశంలో అర్బన్ నిరుద్యోగిత 8.5 శాతం వద్ద, గ్రామీణ నిరుద్యోగిత 7.1 శాతం వద్ద ఉందని తెలిపింది. దేశంలో హర్యానా, రాజస్థాన్, జమ్ము, కాశ్మీర్, బీహార్, త్రిపుర, బెంగాల్లో నిరుద్యోగిత అధికంగా, కర్నాటక, గుజరాత్లో అల్పంగా ఉందని తెలిపింది. గతేడాది మేలో దేశ నిరుద్యోగిత 11.84 శాతంగా నమోదైంది. భారత్ లాంటి పేద దేశానికి 8 శాతం నిరుద్యోగిత కూడా ఎక్కువేనని, దీన్ని ఇంకా తగ్గించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
మృత్తికా సారం తగ్గుతోంది!
నాగ్పూర్: భారతీయ నేలల్లో సేంద్రియ కర్బన (ఎస్ఓసీ) స్థాయి గత 70 సంవత్సరాల్లో 1 నుంచి 0.3 శాతానికి పడిపోయిందని నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథార్టీ (ఎన్ఆర్ఏఏ) తెలిపింది. మృత్తిక స్వరూపం, సారం, నీటిని ఒడిసిపట్టుకోవడంలో ఎస్ఓసీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ సీఈఓ అశోక్ చెప్పారు. ఎస్ఓసీ స్థాయిలు భారీగా పడిపోవడం భూమిలోని అవసర సూక్ష్మక్రిములపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని, దీనివల్ల మొక్కలకు పోషకాలు అందడం తగ్గుతుందని హెచ్చరించారు. సాగు అతిగా చేయడం, ఎక్కువగా ఎరువుల వాడకం, పంటమార్పిడి లేకపోవడం వంటివి ఎస్ఓసీ క్షీణతకు కారణాలన్నారు. జైవిక ఎరువులను వాడడం వల్ల ఎస్ఓసీ స్థాయిని పెంచవచ్చన్నారు. -
మహా పతనం.. ఒక కప్పు చాయ్ రూ.100, లీటర్ పెట్రోల్ 280, కిలో చికెన్ 1000
రావణుడి పాలనలో శ్రీలంక భోగభాగ్యాలతో తులతూగేదని చదివాం! కానీ ప్రస్తుత లంక పరిస్థితి మాత్రం ఆంజనేయుడు దహనం చేసిన తర్వాత లంక లాగా ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో లంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కరోనాతో ప్రారంభమైన ఆర్థిక కష్టాలు ఉక్రెయిన్ యుద్ధంతో చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని దాటుకొని శ్రీలంక నిలబడుతుందా? లేక దివాలా తీస్తుందా? అని ఆర్థికవేత్తలు అనుమానపడుతున్నారు. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ చూడని మహా ఆర్థిక సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు విదేశీ నిల్వలు అడుగంటి అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు తగిన పేపర్లు లేవని ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేయడం, పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఇద్దరు సామాన్య పౌరులు చనిపోవడం లంకలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని సామాన్యుల నుంచి ప్రతిపక్షం దాకా ఆరోపిస్తున్నాయి. లంక విదేశీ మారక నిల్వల్లో క్షీణత 2020 ఆగస్టు నుంచే ఆరంభమైంది. 2021 నవంబర్లో ఈ నిల్వలు ప్రమాదకర హెచ్చరిక స్థాయి దిగువకు చేరాయి. జనవరి 2022లో శ్రీలంక విదేశీ నిల్వలు మరింత దిగజారి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. నిల్వల తరుగుదలతో ప్రభుత్వం నిత్యావసరాల దిగుమతులు చేసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో త్వరలో లంక డిఫాల్ట్ (ఎగవేత) దేశంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటినుంచి లంక విత్తలోటుతో సతమతమవుతూనే ఉంది. 2019లో ఈస్టర్ దాడుల ప్రభావం లంక టూరిజంపై పడి విదేశీ నిధుల రాక తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం కోవిడ్ లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 2020 ఏప్రిల్, జూన్ కాలంలో కేంద్రబ్యాంకు విదేశీ నిధులను ఉపయోగించి 10 వేల కోట్ల డాలర్ల ప్రభుత్వ విదేశీ రుణాలను తీర్చింది. ఇలా ఉన్న నిధులు అప్పుల కింద చెల్లించాల్సిరావడం లంక పరిస్థితిని ఇక్కట్ల పాలు చేసింది. అన్నిటికీ కొరతే విదేశీ నిల్వల తరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల తోడవడంతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల కొరత కనిపిస్తోంది. వీటికి విద్యుత్ కోతలు, నీటి సరఫరా కోతలు తోడవుతున్నాయి. కిరాణా కొట్లు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపుల ముందు భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. దేశంలో విదేశీ మారకం కొరత కారణంగా దిగుమతి దారులు బ్యాంకుల నుంచి ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పొందటం కష్టంగా మారింది. దీనివల్ల నౌకాశ్రయాల్లో కంటైనర్లు పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన లేమితో పలు విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల వ్యవసాయానికి ఉంచిన నీటిని వాడి విద్యుదుత్పాదన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని వల్ల తీవ్రమైన ఆహారకొరత ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా రంగంలో ఔషధాల కొరత తీవ్రతరమైందని లంక ఫార్మా ఓనర్ల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంక్షోభ కారణంగా లంక రేటింగ్ను ఏజెన్సీలు మరింత డౌన్గ్రేడ్ చేసే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే ఇప్పట్లో దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావడం జరగకపోవచ్చని భయాలున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. విత్తలోటుకు కారణమయ్యే లగ్జరీ వాహనాలు, రసాయన ఎరువులు, పసుపులాంటి ఆహార వస్తువుల దిగుమతిని నిషేధించింది.దేశీయ బ్యాంకులు కుదుర్చుకునే ఫార్వార్డ్ కాంట్రాక్టులపై కేంద్ర బ్యాంకు పరిమితులు విధించింది. విదేశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఆకర్షణకు, చెల్లింపుల ప్రవాహం (రెమిటెన్స్ ఫ్లో– దేశంలోకి వచ్చే విదేశీ నిధులు) పెరుగుదలకు కీలక పాలసీలు ప్రకటించింది. విదేశీ సాయం లంకకు సాయం చేయడం కోసం బంగ్లా, చైనాలు కరెన్సీ స్వాపింగ్(అసలును ఒక కరెన్సీలో, వడ్డీని మరో కరెన్సీలో చెల్లించే వెసులుబాటు) సదుపాయాన్ని పొడిగించాయి. దీంతో పాటు చైనా 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇండియా సైతం 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు ప్రకటించింది. పాకిస్తాన్ సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చింది. ఖతార్ తదితర దేశాలు కూడా తగిన సహాయం ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ సాయాన్ని అంగీకరించాలంటే పలు కఠిన షరతులను లంక అంగీకరించాల్సి వస్తుంది. బెయిల్ అవుట్ లేకుండానే తాము గట్టెక్కుతామని, పరిస్థితి త్వరలో చక్కబడుతుందని లంక ప్రభుత్వం, లంక కేంద్ర బ్యాంకు (సీబీఎస్ఎల్) ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై అటు ఆర్థికవేత్తలు, ఇటు ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. చైనా సాయం పేరిట దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఐఎంఎఫ్ను సంప్రదిస్తామని ప్రకటించింది. కప్పు టీ రూ.100 ► దేశంలో టోకు ద్రవ్యోల్బణం 15.1 శాతాన్ని, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతాన్ని తాకాయి. ఇవి ఆసియాలోనే గరిష్టం. ► వంటగ్యాస్ సిలిండర్ ధర గత అక్టోబర్లో 1500 రూపాయలుండగా, ప్రస్తుతం 3వేల రూపాయలకు దగ్గరలో ఉంది. ► పాల పౌడర్ ధరలు పెరగడంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. 100కు చేరింది. ► ఒక గుడ్డు ధర రూ.35కు చేరగా, కిలో చికెన్ రూ.1,000ని తాకింది. ► లీటర్ పెట్రోల్ ధర రూ. 280ని దాటేసింది. ► లంక రూపాయి 30 శాతం క్షీణించి అమెరికా డాలర్తో మారకం 275కు చేరింది. ఇదీ పరిస్థితి ► గత నవంబర్నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు 3200 కోట్ల డాలర్లున్నాయి. ► శ్రీలంక 2021– 26 కాలంలో 2,900 కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ► కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. ► లంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యన్లు, ఉక్రేనియన్ల వాటా దాదాపు 25 శాతం. యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది. ► లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకును దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రేనియన్ కీలకం. ► కరోనాకు ముందు చైనా నుంచి లంకకు లక్షల్లో టూరిస్టులు వచ్చేవారు. కరోనా దెబ్బకు వీరంతా తగ్గిపోయారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
టీవీఎస్ మోటార్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 237 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 290 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 6,095 కోట్ల నుంచి రూ. 6,597 కోట్లకు ఎగసింది. రాల్ఫ్ డైటర్ స్పేథ్ను చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు కంపెనీ బోర్డు పేర్కొంది. 2022 ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకిరానుండగా.. చైర్మన్ ఎమిరిటస్ హోదాలో వేణు శ్రీనివాసన్ కంపెనీ ఎండీ బాధ్యతలు కొనసాగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ3లో స్టాండెలోన్ నికర లాభం రూ. 266 కోట్ల నుంచి రూ. 288 కోట్లకు పుంజుకుంది. వాహన విక్రయాలు ఇలా: తాజా సమీక్షా కాలంలో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 9.52 లక్షల యూనిట్ల నుంచి 8.35 లక్షలకు తగ్గినట్లు టీవీఎస్ మోటార్ వెల్లడించింది. వీటిలో ఎగుమతులు 12 శాతం వృద్ధిని సాధించగా.. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4.26 లక్షల యూనిట్ల నుంచి 4.46 లక్షల యూనిట్లకు పుంజుకున్నాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు 2.5 శాతం నష్టంతో రూ. 637 వద్ద ముగిసింది. -
పేటీఎమ్కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 778 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. పేటీఎమ్ బ్రాండు సర్వీసుల ఈ కంపెనీ గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 536 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే మొత్తం టర్నోవర్ మాత్రం 88 శాతం జంప్చేసి రూ. 1,456 కోట్లయ్యింది. వినియోగదారులకు అందించిన పేమెంట్ సర్వీసుల ద్వారా లభించిన ఆదాయం 60 శాతం ఎగసి రూ. 406 కోట్లకు చేరింది. -
కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!
న్యూయార్క్: గత వారం ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక వారపు కేసులు ఇవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అయితే మరణాల సంఖ్య స్థిరంగా 50వేలకు పైగా కొనసాగుతున్నాయని పేర్కొన్నది. కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5 శాతం పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుదల కనిపిస్తోందని, మొత్తంగా చూస్తే పెరుగుదల రేటు మందగిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో 39శాతంతో అత్యధికంగా కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 36 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అమెరికాలలో మరణాలు పెరిగాయని, ఇతర ప్రాంతాలలో తగ్గాయని వివరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించింది. దేశాలన్నీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరింది. -
‘గ్యాప్’ పెరుగుతోందా? వైట్హౌస్లో ఏదో తేడా కొడుతోంది!
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షరాలిగా చరిత్రకెక్కిన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్కు ‘వైట్హౌస్’లో ప్రాధాన్యత తగ్గుతోందా? బాధ్యతల నిర్వహణలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రముఖ మీడియా సంస్థలు. కమలా హ్యారిస్తో అధ్యక్షుడు జో బైడెన్ కీలక బృందంలోని సభ్యులకు పొసగడం లేదని, ఫలితంగా పాలనా వ్యవహారాల్లో ఆమె పాత్ర క్రమేపీ తగ్గుతోందని ఏఎఫ్పీ వార్తా సంస్థ పేర్కొంది. కమల కమ్యూనికేషన్ డైరెక్టర్ ఆష్లే ఇటైనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని తొలుత వార్తలు వెలువడ్డాయి. ఉపాధ్యక్షురాలికి ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న సైమోన్ సాండర్స్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలగనున్నారు. హ్యారిస్ జట్టులో వీరిద్దరూ అత్యంత ముఖ్యులు. ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారిస్ ఇమేజ్ను పెంచడంలో, ఆమె ప్రతిభను, నాయకత్వ పటిమను విజయవంతంగా అమెరికా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించారు. అత్యంత ముఖ్యులు, సీనియర్లు ఇద్దరూ ఒకే సమయంలో కమలా హ్యారిస్కు దూరమవ్వడం... యాదృచ్చికంగా కాదని ‘సీఎన్ఎన్’ వార్తా సంస్థ అభిప్రాయపడింది. వైట్హౌస్లో అంతా సవ్యవంగా లేదని, ఏదో తేడా కొడుతోందని పేర్కొంది. ‘ముద్ర’పడిపోతుందనే భయమా? కమలా హ్యారిస్కు అత్యంత సన్నిహితురాలైన సైమోన్ సాండర్స్ వైదొలుగుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ వైట్హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకీ ‘ఆమె ఎప్పటికీ బైడెన్– హ్యారిస్ కుటుంబం (సన్నిహిత బృందం)లో సభ్యురాలే. రెండు మూడేళ్లు ఒక పదవిలో పనిచేశాక కొత్త బాధ్యతలు సిద్ధం కావడం సహజమే. తొలి ఏడాది వైట్హౌస్లో పనిచేయడం ఉత్సాహాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అదే సమయంలో కఠోరమైన శ్రమకు, తీవ్ర అలసటకు గురిచేస్తుంది’ అని అన్నారు. ‘సైమోన్ను నేనెంతో అభిమానిస్తాను. తదుపరి ఆమె ఏం చేస్తారనేది తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. బాధ్యతల నిర్వహణలో భాగంగా దాదాపు మూడేళ్లుగా విరామం ఎరుగకుండా దేశాన్ని చుట్టేసింది’ అని హ్యారిస్ స్పందించారు. కమలకు అత్యంత సన్నిహితులుగా శాశ్వత ముద్రపడితే... బైడెన్ హయాంతో పాటు భవిష్యత్తులోనూ తమకు మంచి అవకాశాలు లభించకపోవచ్చనే భయమూ ఆష్లే, సాండర్స్లకు ఉండి ఉండొచ్చని మరికొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. పరిమిత పాత్రపై అసంతృప్తి! జెన్ సాకీ వివరణ ఆమోదయోగ్యంగా లేదని... ఆష్లే, సాండర్స్ ఇద్దరూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే (జవనరి 20) బాధ్యతల నుంచి తప్పుకోవడం అసాధారణమైన పరిణామమేనని సీఎన్ఎన్ పేర్కొంది. విధి నిర్వహణకు ఉపాధ్యక్షురాలు సరైన రీతిలో సన్నద్ధం కాలేదని, పైగా ఆమెకు అంతగా ప్రాధాన్యం కూడా దక్కడం లేదని కమలా హ్యారిస్ కార్యాలయంలో, జట్టులో పనిచేస్తున్న సన్నిహితుల్లో అసంతృప్తి పెరుగుతోంది. రాజకీయంగా చేతులు కట్టేసినట్లుగా భావిస్తున్నానని హ్యారిస్ సన్నిహితుల వద్ద బాధపడినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ఆమె టీంలోని దాదాపు 30 మందితో మాట్లాడాక సీఎన్ఎన్ ఈ అభిప్రాయానికి వచ్చింది. లీగల్ రెసిడెంట్లు, ఇతర మైనారిటీలకు ఓటు హక్కు విషయంలో గట్టిగా కృషి చేసే బాధ్యతను బైడెన్ జనవరిలోనే హ్యారిస్కు అప్పగించారు. చట్టసభల్లో ఈ అంశంలో బిల్లు పాసయ్యే అవకాశాలు బహుస్వల్పం. అలాగే మెక్సికో గుండా అక్రమ వలసలను నిరోధించి, దీనికో పరిష్కారం కనుగొనే బాధ్యతనూ ఉపాధ్యక్షురాలికి అప్పగించారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అక్రమ వలసలు, శరణార్థుల విషయంలో కఠిన వైఖరిని అవలంభించారు. అప్పుడు ఎన్నో వేల మంది పిల్లలను తల్లిదండ్రులకు అమెరికా యంత్రాంగం దూరం చేసిందనే అపవాదు ఉంది. అక్రమవలసలను అడ్డుకొనే విషయంలో బైడెన్కు ముందు పనిచేసిన చాలామంది అధ్యక్షులూ విఫలమయ్యారు. ఇలాంటి కఠినతరమైన, సున్నిత అంశాలను కమలా హ్యారిస్కు అప్పగించారు. వయసు, ఆరోగ్యరీత్యా బైడెన్ (79 ఏళ్లు) రెండోసారి అధ్యక్ష పదవికి పోటీపడకపోవచ్చని, భవిష్యత్తులో డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి కావొచ్చని, అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుందనే అంచనాల మధ్యన బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్ (57 ఏళ్లు) ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమనేది మెజారిటీ మీడియా అంటోంది. రుణ పరిమితిని పెంచుకోవడం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, సంక్షేమ పథకాలపై భారీ ఎత్తున ఖర్చు చేయడానికి సంబంధించిన ప్రతినిధుల సభ, సెనేట్ల ఆమోదం పొందడానికి జో బైడన్ ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలితో ఏర్పడిన గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నాలపై సత్వరం దృష్టి సారించేంత సమయం ఇప్పుడు ఆయనకు లేదని అంటున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారీగా తగ్గిన హెచ్1–బీ వీసాలు
వాషింగ్టన్: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్ ఉండే హెచ్1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్ ఓపెనింగ్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి. రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్బర్గ్ న్యూస్ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్ 2021 నాటికి హెచ్–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్మేటిక్స్ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్డౌన్ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతినివ్వడంతో హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్లో గత ఏడాది మార్చి, ఏప్రిల్లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్బర్గ్ న్యూస్ వెల్లడించింది. -
మదుపర్లకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లో బేర్ స్వైరవిహారంతో గురువారం సూచీలు కుప్పకూలాయి. కొన్నిరోజులుగా బుల్ ఆధిపత్యంతో స్తబ్ధుగా ఉన్న బేర్ ఒక్కసారిగా అదును చూసి పంజా విసిరింది. అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూలతల సంకేతాలు అందాయి. దేశీయ కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. తాజాగా మోర్గాన్ స్టాన్లీ భారత మార్కెట్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేసింది. ఈ అంశాలు దేశీయ మార్కెట్ ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్కెట్ మొదలు.., తుదిదాకా బేర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ నెలకొంది. ఫలితంగా స్టాక్ సూచీలు గత ఆరునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,159 పాయింట్ల నష్టంతో 60వేల దిగువున 59,985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,000 వేల స్థాయిని కోల్పోయి 354 పాయింట్ల పతనంతో 17,857 వద్ద నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదితో తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టం. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలోని మొత్తం షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముంగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,819 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.837 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో రూపాయి 11 పైసలు బలపడి 74.92 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు... ఆసియా మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ ఉదయం 62 పాయింట్ల లాభంతో 61,081 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 18,188 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల కౌంటర్లలో అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో సూచీలు మార్కెట్ ముగిసే వరకూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1365 పాయింట్లు నష్టపోయి 59,778 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు కోల్పోయి 17,799 ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఆరుశాతం నష్టపోయి రూ.225 వద్ద ముగిసింది. ► నష్టాల మార్కెట్లోనూ ఎల్అండ్టీ షేరు రాణించింది. 2% లాభంతో రూ.1814 వద్ద నిలిచింది. ► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటాన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,375 వద్ద స్థిరపడింది. పతనానికి ఐదు కారణాలు... ఎఫ్అండ్ఓ ముగింపు... అక్టోబర్ ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్యేర్ ఆఫ్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు.. ఇటీవల పలు కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల పెరుగదలతో ఆయా కంపెనీల లాభాలు పరిమితమయ్యాయి. చాలా కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూ పింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రస్ షేర్లు 5% నుంచి 2% నష్టపోయాయి. ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ.... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టడం ప్రస్తుత కరెక్షన్కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు రూ.13 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూలతలు... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక రికవరీ అందోళనలతో ఆసియా మార్కెట్లు 1.5%నష్టంతో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ద్రవ్యపాలసీ, యూఎస్ మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో యూరప్, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రేటింగ్ డౌన్గ్రేడ్... అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతుందనే కారణంతో నోమురా, యూఎస్బీ రేటింగ్ భారత స్టాక్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేశాయి. తాజాగా మోర్గాన్స్టాన్లీ మన మార్కెట్ రేటింగ్ ‘అధిక వెయిటేజీ’ నుంచి ‘సమాన వెయిటేజీ(ఈక్వల్ వెయిటేజీ)’ రేటింగ్కు డౌన్గ్రేడ్ చేసింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల డౌన్గ్రేడ్ రేటింగ్ కేటాయింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ సూచీలు దాదాపు రెండుశాతం మేర కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.4.82 లక్షల కోట్లు నషపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘వ్యవస్థలో అధిక లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్ల రూపంలో కొత్త తరం(యువత) పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు 25% ర్యాలీ చేశాయి. ఇప్పటికే అధిక విలువలతో ట్రేడ్ అవుతున్న షేర్లలో ఎఫ్అండ్ఓ ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బుల్ సుదీర్ఘ ర్యాలీ నేపథ్యంలో 10–20 శాతం వరకూ కరెక్షన్కు అవకాశం ఉంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ పట్ల అప్రమత్తత అవసరం’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. -
ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 29 శాతం క్షీణించి రూ. 605 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 852 కోట్లు ఆర్జించింది. ముడిసరుకుల వ్యయాలు పెరగడం ప్రధానంగా ప్రభావం చూపింది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,350 కోట్ల నుంచి రూ. 7,096 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,299 కోట్ల నుంచి రూ. 6,418 కోట్లకు పెరిగాయి. వీటిలో మెటీరియల్స్ వ్యయాలు రూ. 2,646 కోట్ల నుంచి రూ. 4,571 కోట్లకు పెరిగాయి. ఈ కేలండర్ ఏడాది(2021) జనవరి నుంచి ముడిసరుకుల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. దీంతో అన్ని విభాగాలలోనూ స్థూల మార్జిన్లు ప్రభావితమైనట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రొడక్టుల ధరలను పెంచినట్లు తెలియజేశారు. ఇకపైన కూడా ముడివ్యయాలకు అనుగుణంగా ధరలను పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5.2 శాతం పతనమై రూ. 3,004 వద్ద ముగిసింది. -
ఎల్అండ్టీ ఫైనాన్స్.. వీక్
న్యూఢిల్లీ: ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం క్షీణించింది. రూ. 223 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 248 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,509 కోట్ల నుంచి రూ. 3,134 కోట్లకు నీరసించింది. క్యూ2లో గ్రామీణ ప్రాంత రుణ విడుదలలో 51 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. రూ. 4,987 కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేసింది. వీటితోపాటు రిటైల్, రియలీ్ట, ఇన్ఫ్రా విభాగాలలో కలిపి మొత్తం రూ. 7,339 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు వెల్లడించింది. కోవిడ్–19 సెకండ్ వేవ్, స్థూల ఆరి్థక పరిస్థితులు బిజినెస్ వాతావరణంపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. స్థూల మొండిబకాయిలు 5.74 శాతంగా నమోదుకాగా.. కనీస మూలధన నిష్పత్తి 25.16 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 91.5 వద్ద ముగిసింది. -
బుల్ మరోసారి కుదేల్
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండురోజుల పాటు సందడి చేసిన బుల్ బుధవారం చతికిలపడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలతో సెన్సెక్స్ 555 పాయింట్లు పతనమై 59,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 17,646 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, మండుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్ను సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో అధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్ ఇండెక్స్లు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.57 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.262 లక్షల కోట్లు నమోదైంది. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. సెన్సెక్స్ 197 పాయింట్ల లాభంతో 59,942 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 17,861 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ నెలకొన్న ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీల ఆరంభలాభాలన్నీ ఆవిరియ్యాయి. అటు పిమ్మట అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 665 పాయింట్లు పతనమైన 59,080 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు నష్టపోయి 17,613 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. నష్టాలకు నాలుగు కారణాలు... క్రూడ్ పెరుగుదల భయాలు ... సప్లై మందగమనం, డిమాండ్ పెరగడంతో క్రూడాయిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రిటన్లో గ్యాస్ ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 40% ఎగిశాయి. భారత చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ధర పెరగడంతో చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చనే భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. కరెంట్ కోత కలవరం .... దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్లలో నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించడం దలాల్ స్ట్రీట్ను కలవరపెట్టింది. బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తలెత్తి ఉత్పత్తి, వ్యాపారాలపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. భారత్లో 70% కరెంట్ బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ ప్లాంట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ మార్కెట్లను ప్రతికూలతలు ... బాండ్ ఈల్డ్స్, క్రూడ్, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలతో పాటు కార్మికుల కొరతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియాలో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మార్కెట్లు రెండు నుంచి ఒకశాతం నష్టపోయాయి. సెలవుల కారణంగా చైనా ఎక్సే్చంజీలు పనిచేయడం లేదు. యూరప్లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ మార్కెట్లు ఒకశాతం వరకు క్షీణించాయి. అగ్ర రాజ్యమైన అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాల తలెత్తడంతో యూఎస్ ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం మన మార్కెట్పై ప్రభావాన్ని చూపింది. రూపాయి పతనం.... క్రూడాయిల్, డాలర్ విలువ బలపటడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇంట్రాడేలో 74.99 స్థాయికి దిగివచి్చంది. చివరికి 54 పైసలు నష్టపోయి 74.98 స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి ఐదు నెలల కనిష్టస్థాయి. రూపాయి పతనం(డాలర్ బలపడ టంతో)స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ హిందుస్తాన్ కాపర్ 4% లాభపడి రూ.125 వద్ద ముగిసింది. ఈ సంస్థను చేజిక్కించుకునేందుకు వేదాంత ప్రయత్నాలు చేస్తుండటం ఈ షేరు ర్యాలీకి కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు పెరగడం ఓఎన్జీసీ షేరుకు కలిసొస్తుంది. బీఎస్ఈలో 3% లాభపడి రూ.168 వద్ద స్థిరపడింది. -
మార్కెట్లో ‘ఫెడ్’ అప్రమత్తత!
ముంబై: ఇంట్రాడేలో పరిమిత శ్రేణిలో ట్రేడైన సూచీలు బుధవారం చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 78 పాయింట్లను కోల్పోయి 58,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్లు పతనమైన 17,547 వద్ద నిలిచింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ వెల్లడి(బుధవారం రాత్రి)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అంచనాలను ఒక శాతం తగ్గించి పదిశాతానికి పరిమితం చేసింది. ఈ అంశాలు ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 300 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 86 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యాయి. సోనీ పిక్చర్స్ – జీ ఎంటర్టైన్మెంట్ వీలీన ఒప్పందం నేపథ్యంలో మీడియా షేర్లు పరుగులు పెట్టాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మీడియా ఇండెక్స్ 14 శాతం ర్యాలీ చేసింది. ఈ సెప్టెంబర్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరగడంతో రియల్టీ రంగ షేర్లకు కలిసొచ్చింది. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఎనిమిదిన్నర శాతం లాభపడింది. ఎవర్గ్రాండే సంక్షోభం ఓ కొలిక్కిరావడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. ఆటో రంగ షేర్లూ లాభాల బాట పట్టాయి. చైనా రియల్టీ దిగ్గజం ఎవర్గ్రాండే బాండ్లపై కొంత వడ్డీని చెల్లించేందుకు అంగీకారం తెలపడంతో డిఫాల్ట్ ఆందోళనలు తగ్గాయి. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్ స్టాక్ సూచీలు నష్టాల్లో ముగియగా, మిగిలిన అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఒకశాతం పెరగ్గా, అమెరికా ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,943 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,850 కోట్ల షేర్లను కొన్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► వాణిజ్య వాహన ధరలను పెంచడంతో టాటా మోటార్స్ కంపెనీ షేరు మూడుశాతం పెరిగి రూ.310 వద్ద ముగిసింది. ► నోయిడాలోని తన లగ్జరీ ప్రాపరీ్టని రూ.575 కోట్లకు విక్రయించడంతో గోద్రెజ్ ప్రాపరీ్టస్ లిమిటెడ్ షేరు 13 శాతం లాభపడి రూ.1950 వద్ద స్థిరపడింది. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలతో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు వరుసగా 1.50%, ఒకశాతం చొప్పున క్షీణించాయి. ఫెడ్ రేటు యథాతథం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్– ఫెడ్ ఫండ్ రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. దీనితో ఈ రేటు 0.00–0.25 శ్రేణిలో ఇకముందూ కొనసాగనుంది. 2021లో ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతం నుంచి 4.2కు పెంచినప్పటికీ, అమెరికా ఆర్థిక పరిస్థితిలో అనిశ్చితి పూర్తిగా తొలగని నేపథ్యంలో యథాతథ రేట్ల కొనసాగింపునకే ఫెడ్ ఏకగ్రీవంగా మొగ్గుచూపింది. -
రియల్టీ భవిష్యత్తు ఏంటో?
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్ స్కోర్ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్టైమ్ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్లో సెంటిమెంట్ స్కోర్ 50ని దాటితే ఆశావాదం జోన్గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్గా పరిగణిస్తుంటారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, నిరంతర ఆర్థిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్ స్కోర్ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది క్యూ2లో సర్వే పాల్గొన్న 40 శాతం మంది ఆఫీసు లీజు కార్యకలాపాలు వచ్చే ఆరు నెలల కాలంలో మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. క్యూ1లో ఇది 34 శాతంగా ఉంది. అలాగే 21 శాతం మంది ఆఫీస్ అద్దెలు పెరుగుతాయని.. 40 శాతం మంది స్థిరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. 2021 క్యూ2లో 50 శాతం మంది వచ్చే 6 నెలల్లో నివాస విక్రయాలు, లాంచింగ్స్లో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నారని సర్వే వెల్లడించింది. -
చక్కెర షేర్లు.. తియ్యటి ర్యాలీ
న్యూఢిల్లీ: చక్కెర కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు తీపి లాభాలను పంచుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ స్టాక్స్ మంచి ర్యాలీ చేయగా.. ఇక ముందూ లాభాలను ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెజిల్లో చక్కెర సాగు ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగి, భారత కంపెనీలకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బ్రెజిల్లో ఏప్రిల్ నెలలో పంచదార ఉత్పత్తి దాదాపు 35 శాతం వరకూ తగ్గింది. ఈ మేరకు భారత షుగర్ కంపెనీలకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ‘‘బ్రెజిల్ దక్షిణాది ప్రాంతంలో చక్కెర దిగుబడి ఏప్రిల్ నెల మొదటి అర్ధ భాగంలో 6,24,000 టన్నులు. అంతక్రితం ఏడాది ఏప్రిల్లో ఇదే కాలంలో ఉత్పత్తి 9,71,000 టన్నులుగా ఉంది. 2020లో ఇదే కాలంతో పోల్చి చూస్తే చెరకు క్రషింగ్ 30 శాతం తగ్గి 15.6 మిలియన్ టన్నులుగా ఉంది’’ అని చక్కెర ఉత్పత్తిదారుల సంఘం యూనికా పేర్కొంది. అదే సమయంలో భారత్లో మాత్రం పంచదార ఉత్పత్తి 2020 అక్టోబర్ – 2021 సెప్టెంబర్ సీజన్లో 41 లక్షల టన్నుల మేర పెరగడం గమనార్హం. అన్ని షేర్లదీ పరుగే..: ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, బలరామ్పూర్ చినీ, ధంపూర్ షుగర్, దాల్మియా, అవధ్ షుగర్.. ఇవన్నీ కూడా గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ప్రధానంగా గత మూడు నెలల్లోనే 50–100 శాతం మధ్య ర్యాలీ చేసి నూతన గరిష్టాలకు చేరాయి. సరఫరా కఠినంగా మారొచ్చు.. పంచదార ఉత్పత్తికి ప్రపంచంలో బ్రెజిల్ అతిపెద్ద మార్కెట్. ఇక్కడి ఉత్పత్తి పరిస్థితులు భారత్ కంపెనీల లాభాలను నిర్ణయించగలవు. బ్రెజిల్లో ఇప్పటికే చెరకు సాగు సీజన్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సానుకూలించకపోవడంతో సాగు తగ్గిందని.. దీనివల్ల దిగుబడితోపాటు నాణ్యత కూడా క్షీణించొచ్చని అంచనా. దీనికితోడు థాయిలాండ్, ఈయూ సైతం చక్కెర ఉత్పత్తిని పెంచకపోవచ్చని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్–సరఫరా పరిస్థితులు సానుకూలంగా ఉండకపోవచ్చని ఎలారా సెక్యూరిటీస్ తెలిపింది. సైక్లికల్ కాదు.. భారత్లో షుగర్ పరిశ్రమ ధరల పరంగా ఇక ఎంత మాత్రం సైక్లికల్ కాబోదని (హెచ్చుతగ్గులు) జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. పాక్షిక నియంత్రణల నుంచి కూడా బయటకు రావచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, చక్కెర రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చూడాలన్న ఉద్దేశం ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తోంది. చక్కెరకు మద్దతు ధరలు, ఎగుమతి సబ్సిడీలు, ఇథనాల్ రూపంలో మద్దతు వంటి చర్యలు ఈ రంగంలోని కంపెనీలు నిలదొక్కుకునేలా చేస్తాయని పేర్కొంది. ఫలితంగా ఈ రంగంలోని పటిష్టమైన కంపెనీలు మరింత లాభాలు, నగదు ప్రవాహాలను చూస్తాయని జేఎం ఫైనాన్షియల్ అంచనా వేసింది. షేర్ల గమనం కంపెనీ ప్రస్తుత ధర 3 నెలల్లో ఏడాదిలో (రూ.లలో) పెరుగుదల(%) పెరుగుదల(%) అవధ్ షుగర్ 306 60 110 దాల్మియా భారత్ 318 98 364 ద్వారికేష్ షుగర్ 56 75 200 బలరామ్పూర్ చినీ 303 68 190 ధంపూర్ షుగర్ 318 78 206 -
Nifty: 15 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ నష్టపోయింది. డెరివేటివ్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ అంశం సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫైనాన్షియల్ అసెట్స్ విలువలు అనూహ్యంగా పెరిగిపోవడం భారత్ వంటి ఈక్విటీ మార్కెట్లకు ప్రమాదమని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) హెచ్చరించింది. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 338 పాయింట్లు పతనమైన 49,565 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 15వేల దిగువన 14,906 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మెటల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కమోడిటీ ధరలను అదుపులో పెట్టేందుకు చర్యలను తీసుకుంటామని చైనా ప్రకటనతో మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఆర్థిక, ప్రైవేట్ రంగ షేర్లలోనూ చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 406 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి. నష్టాల మార్కెట్లోనూ స్మాల్ క్యాప్ షేర్లు రాణించాయి. ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్ అవుతున్న చిన్న షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఓ దశలో 23,093 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరకు 22,980 వద్ద ముగిసింది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.876 కోట్ల షేర్లు అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.71 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ‘‘ప్రపంచ ప్రతికూలతలు సూచీలను నష్టాల బాటపట్టించాయి. నిఫ్టీ సూచీ 15 వేల స్థాయిని కోల్పోయినప్పటికీ.. 14,900 స్థాయిని నిలుపుకోవడం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. ఇన్వెస్టర్లు దిద్దుబాటుకు ఆస్కారం లేని నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► మార్చి క్వార్టర్లో నికర లాభం ఆరు రెట్లు పెరగడంతో భాష్ షేరు ఏడుశాతానికి పైగా లాభపడి రూ.15846 వద్ద ముగిసింది. ► కరోనా వ్యాధిని నిర్ధారించే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో సిప్లా షేరు 2% లాభంతో రూ.924 వద్ద స్థిరపడింది. ► మెరుగైన క్యూ4 ఫలితాలతో శక్తి పంప్స్ షేరు 15 శాతం లాభపడి రూ.712 వద్ద నిలిచింది. ► టాటా స్టీల్, హిందాల్కో, సెయిల్, జేఎస్పీఎల్ షేర్లు 4–6% క్షీణించడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ శాతం 3% నష్టపోయింది. -
Shopping Mall: షాపింగ్ మాల్స్ ఢమాల్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి పడిపోయిందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, కన్సల్టెంట్స్ చెబుతున్నారు. ఎనమిది నగరాల్లో సగటున షాపింగ్ సెంటర్లలో అద్దెలు నెలకు 4–5 శాతం తగ్గుతున్నాయి. చాలా మాల్స్లో 25 శాతం వరకు అద్దెలు దిగొచ్చాయి. కనీస ఆదాయ గ్యారంటీ ప్రాతిపదికన రిటైలర్లతో మాల్ యజమానులు సాధారణంగా లీజ్ ఒప్పందం చేసుకుంటారు. అయితే గతేడాది లాక్డౌన్ కాలంలో పూర్తిగా అద్దెలు మాఫీ అయ్యాయి. సెకండ్ వేవ్లోనూ.. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి మార్చి వరకు మాల్ యజమానులు అద్దెలు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో వారి మొత్తం ఆదాయం పడిపోయింది. సెకండ్ వేవ్లోనూ ఆదాయం సగానికి వచ్చి చేరిందని పసిఫిక్ గ్రూప్ ఈడీ అభిషేక్ బన్సల్ తెలిపారు. రెంటల్ ఆదాయం 40–50%కే పరిమితమైందని యునిటీ గ్రూప్ డైరెక్టర్ హర్‡్ష బన్సల్ చెప్పారు. కొత్తగా లీజుకిచ్చిన రిటైలర్ల నుంచి అద్దె తగ్గలేదని, అయినా పరిమిత కాలానికి డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ మాల్స్ యజమానుల ఆదాయం 40–50 శాతం పడిపోతుందని కుష్మన్, వేక్ఫీల్డ్ చెబుతోంది. ఇతర ఆదాయాలూ తగ్గాయి.. మొత్తం రెంటల్ ఆదాయంలో మల్టీప్లెక్సుల వాటా 15%. ఇప్పుడు వీటినుంచి ఆదాయం పూర్తిగా రావడం లేదని జేఎల్ఎల్ ఇండియా రిటైల్ సర్వీసెస్ ఎండీ శుభ్రాన్షు పాని పేర్కొన్నారు. అద్దెలే కాకుండా పార్కింగ్, పాప్–అప్ స్టోర్స్, ప్రకటనల ఆదాయమూ కోల్పోయారని సావిల్స్ ఇండియా డైరెక్టర్ హర్షవర్ధన్ సింగ్ తెలిపారు. గతేడాది మార్చి నుంచి వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. మాల్స్ పుంజుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ముప్పులా పరిణమించిందని చెప్పారు. -
మూడోరోజూ అమ్మకాలే
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడో రోజూ అమ్మకాలు కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు అధిక వ్యాల్యుయేషన్ భయాలతో బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో గురువారం విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 51,325 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లను కోల్పోయి 15,119 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరంగా అమ్మకాలు జరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 518 పాయింట్లు కోల్పోయి 51,186 స్థాయిని తాకింది. నిఫ్టీ 131 పాయింట్ల మేర నష్టపోయి 15,078 స్థాయికి దిగివచ్చింది. బ్యాంకింగ్తో పాటు ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియల్టీ షేర్లలోనూ అమ్మకాలు జరిగాయి. నష్టాల మార్కెట్లోనూ ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ‘‘మండుతున్న ముడిచమురు ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. దీంతో ఇన్వెస్టర్లలో... ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే రిస్క్ సామర్థ్యం కొంత తగ్గింది. ఇదే అంశం దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అయితే కంపెనీలు క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడం లాంటి సానుకూలాంశాలు భారత మార్కెట్కు అండగా నిలుస్తున్నాయి.’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగపు అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఓఎన్జీసీ షేరు 8% శాతం అప్... ఓఎన్జీసీ షేరు గురువారం 8% శాతం లాభపడి రూ.111 వద్ద స్థిరపడింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు గానూ ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి రూ.7.5 ట్రిలియన్ల మౌలిక సదుపాయాల ప్రణాళికను ప్రకటించింది. అలాగే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోయాయి. ఈ రెండు అంశాలు సానుకూలంగా మారడంతో ఓఎన్జీసీ షేరు ఇంట్రాడేలో 13 శాతం ర్యాలీ చేసి రూ.115 స్థాయికి చేరుకుంది. -
తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానంలో టీడీపీ పతనం పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఊరూరా చక్రం తిప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కనీసం వార్డు మెంబర్ స్థానాన్ని కూడా దక్కించుకోలేని దీన స్థితికి చేరుకున్నారు. దశాబ్దాల తరబడి పాలించిన వారు పనులు చేయకపోవడం, ఆపత్కాలంలో అక్రమాలకు పాల్పడడం పతనానికి హేతువులయ్యాయి. ముఖ్యంగా తిత్లీ తుఫాన్ పరిహారంలో చేసిన అక్రమాలు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం చేసి, అనర్హులకు లబ్ధి చేకూర్చిన టీడీపీ నేతలకు ఉద్దానం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఏకపక్షంగా ఓట్లేసి టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారందరినీ కసి తీరా ఓడించారు. ఒంటరి మహిళల పింఛన్ల అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు సంక్షేమ పథకాలు, ఉద్దానం అభివృద్ధికి పాటు పడుతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఆ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారిని అధిక సంఖ్యలో గెలిపించుకు న్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో టీడీపీ నేతల పాల్పడిన అవినీతి అంతా ఇంతా కాదు. భూమి లేని వారికి, నష్టం జరగని వారికి పరిహారం ఇప్పించి, వాస్తవంగా భూములుండి, నష్టపోయిన వారికి అన్యాయం చేశారు. ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరికీ తాజా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయు డు, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ కుటుంబీకులకు ప్రజలు షాకిచ్చా రు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వ గ్రామం ఉన్న కవిటి మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు భారీ మెజారిటీతో విజ యం సాధించారు. ఈ మేజర్ పంచాయతీలో కూన రవికుమార్, బెందాళం అశోక్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. అయినా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ స్వగ్రామమైన సోంపేట పంచాయతీలోనైతే ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ 18 వార్డులుండగా ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ పూర్తిగా స్వీప్ చేసింది. తిత్లీ అక్రమాలకు పాల్పడ్డ వారిలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలవ్వడం ఇక్కడ చర్చనీయాంశమైంది. పెద్ద శ్రీరాంపురంలో ప్రతి సారి గెలిచిన టీడీపీ ఈసారి మట్టి కరిచింది. బల్లెడ సుమన్ అనే సామాన్యుడి చేతిలో టీడీపీకి చెందిన సీనియర్ నేత మాదిన రామారావు ఓడిపోయారు. అలాగే, కంచిలి మండలంలోని చిన్న కొజ్జరియా, పెద్ద కొజ్జరియ, శ్రీరాంపురం, జాడు పూడి తదితర గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోవడానికి తిత్లీ అక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు. ఒంటరి పింఛన్ల అక్రమాలు.. భర్తలున్న టీడీపీ మహిళలకు ఒంటరి మహిళల పింఛన్లు మంజూరు చేసి లబ్ధి చేకూర్చిన వైనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపింది. కళ్ల ముందే అనర్హులకు పింఛన్లు ఇవ్వడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. ముఖ్యంగా పింఛన్ల అక్రమాలు జరిగిన బూర్జపాడు, ఈదుపురం, లొద్దపుట్టి, మండపల్లిలో టీడీపీ నేతలు ఘోరంగా ఓడిపోయారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 98 పంచాయతీలకు గాను 83 పంచాయతీలను, పలాస నియోజకవర్గంలో 95 పంచాయతీలకు గాను 87 పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందంటే టీడీపీ అక్రమాలు ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ప్రగతి పరుగులు.. ఉద్దానం ఏరియాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా టీడీపీ పునాదులను పెకిలించేశాయి. కిడ్నీ సమస్య పరిష్కారానికి చేస్తు న్న కృషి, స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. ముఖ్యంగా కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు ఎన్నికల్లో ప్రజలను ఆలోచింప చేశాయి. అలాగే ఉద్దానం ఏరియాలో స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న రూ.700కోట్ల మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న మంచినీళ్లపేట జెట్టీ, కిడ్నీ రోగులకు రూ. 10వేల పింఛను, ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు మందసలో 2965 ఓట్ల మెజారీ్ట, సోంపేటలో 2841 ఓట్ల మెజారీ్ట, కవిటిలో 1700పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఆషామాషీ కాదు. పూండి గోవిందపురంలో ఎప్పుడూ టీడీపీయే గెలిచేది. జమీందారి వ్యవస్థ కొనసాగేది. ఆయనెవరు బొట్టు పెడితే వాళ్లే గెలిచేవారు. ఈసారి ఆ పరిస్థితి మారింది. అక్కడ వైఎస్సార్సీపీ గెలిచింది. లక్ష్మీపురం పంచాయతీలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తినాయుడు కుటుంబీకులు గెలిచేవారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సోంపేట, మందస, మెట్టూరు, గుణుపల్లి, చీపురుపల్లి, రేయపాడు నగరంపల్లిలో ప్రతి సారి టీడీపీయే గెలిచేది. తొలిసారిగా ఘోరంగా ఓటమి పాలైంది. (చదవండి: విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు) మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు.. -
మౌలికం... డిసెంబర్లో 1.3 శాతం ‘మైనస్’
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల గ్రూప్ 2020 డిసెంబర్లో 1.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గ్రూప్ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వరుసగా ఇది మూడవనెల. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40 శాతం పైగా వాటా కలిగిన గ్రూప్లోని క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. 2019 డిసెంబర్లో ఈ గ్రూప్ 3.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. డిసెంబర్ ఐఐపీ గణాంకాలు ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారాల్లో వెలువడనున్నాయి. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన మౌలిక రంగం గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020 డిసెంబర్లో బొగ్గు, విద్యుత్ మినహా అన్ని రంగాలూ క్షీణతను చూశాయి. ► క్రూడ్ ఆయిల్ (–3.6 శాతం), సహజ వాయువు (–7.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.8 శాతం), ఎరువులు (–2.9 శాతం), స్టీల్ (–2.7 శాతం), సిమెంట్ (–9.7 శాతం) క్షీణతలో ఉండగా, బొగ్గు (2.2 శాతం), విద్యుత్ (4.2 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. ► 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, గ్రూప్ ఉత్పత్తి క్షీణత 10.1 శాతంగా ఉంది. 2019–20 ఇదే సమయంలో 0.6 శాతం స్వల్ప వృద్ధి రేటు నమోదయ్యింది. ► కాగా 2020 సెప్టెంబర్లో గ్రూప్ 0.1 శాతం క్షీణత నమోదుచేసుకున్నట్లు తొలి గణాంకాలు పేర్కొనగా, తాజాగా ఈ గణాంకాలను 0.6 శాతం వృద్ధిగా సవరించడం జరిగింది. నిరాశ కలిగిస్తోంది... కీలక మౌలిక రంగం వరుసగా మూడవనెల డిసెంబర్లోనూ క్షీణతలో కొనసాగడం నిరాశను కలిగిస్తోంది. అయితే ఆటో పరిశ్రమ పురోగతి, చమురు యేతర ఉత్పత్తుల ఎగుమతులు తత్సబంధ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే, డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ– ఐఐపీ స్వల్పంగానైనా 0.5 శాతం నుంచి 1.5 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. – అదితి నాయర్ ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
2020లో బంగారం డిమాండ్ ఢమాల్
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2020లో భారీగా 35 శాతం పడిపోయింది. 446.4 టన్నులుగా నమోదయ్యింది. 2019లో 690.4 టన్నులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కఠిన లాక్డౌన్ పరిస్థితులు, ఉపాధి అవకాశాలకు అవరోధాలు, ఆదాయాలు పడిపోవడం, అధిక ధరలు వంటి పలు అంశాలు దీనికి కారణం. అయితే పటిష్ట ఆర్థిక రికవరీ నేపథ్యంలో 2021లో తిరిగి బంగారం డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంది. అధిక స్థాయికి చేరిన ఈక్విటీ మార్కెట్లు, తక్కువ స్థాయి వడ్డీరేట్లు కూడా ఇందుకు దోహదపడతాయి. ‘‘2020 పసిడి డిమాండ్ ధోరణులు’’ అన్న శీర్షికన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2020లో విలువ రూపంలో పసిడి డిమాండ్ 14 శాతం పడిపోయి రూ.1,88,280 కోట్లకు చేరింది. 2019లో ఈ విలువ రూ.2,17,770 కోట్లు. ► ఆభరణాల డిమాండ్ పరిమాణం రూపంలో 42 శాతం పడిపోయి 544.6 టన్నుల నుంచి 315.9 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించి విలువ 22.42 శాతం తగ్గి రూ.1,71,790 కోట్ల నుంచి రూ.1,33,260 కోట్లకు పడింది. ► పసిడి దిగుమతులు 47 శాతం పడిపోయి 646.8 టన్నుల నుంచి 344.2 టన్నులకు చేరాయి. అయితే డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం పెరిగి (2019 ఇదే కాలంతో పోల్చి) చేరడం గమనార్హం. లాక్డౌన్ నిబంధనల సడలింపు దీనికి కారణం. ► 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ కేవలం 4శాతం పడిపోయి పరిమాణం 194.3 టన్నుల నుంచి 186.2 టన్నులకు చేరడం గమనార్హం. వినియోగ సెంటిమెంట్ మెరుగవుతుండడాన్ని ఇది సూచిస్తోంది. పండుగలు, పెండ్లి సీజన్ కూడా దీనికి కలిసి వచ్చింది. 11 సంవత్సరాల కనిష్టానికి గ్లోబల్ గోల్డ్ డిమాండ్ కాగా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 2020లో 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిందని డబ్ల్యూజీసీ నివేదిక వివరించింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ 3,759.6 టన్నులని పేర్కొంది. 2019లో ఈ పరిమాణం 4,386.4 టన్నులు. 2009లో 3,385.8 టన్నులు. కోవిడ్ 19 ప్రేరిత సవాళ్లే పసిడి డిమాండ్ భారీ పతనానికి కారణమని డబ్ల్యూజీసీ వివరించింది. ఒక్క నాల్గవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) చూస్తే, ఏకంగా పసిడి డిమాండ్ 28 శాతం పడిపోయి 1,082.9 టన్నుల నుంచి 783.4 టన్నులుకు పడింది. ఒక్క ఆభరణాల డిమాండ్ నాల్గవ త్రైమాసికంలో 13 శాతం పడిపోయి 590.1 టన్నుల నుంచి 515.9 టన్నులకు చేరింది. ఏడాదిలో ఈ డిమాండ్ 34 శాతం పడిపోయి 2,122.7 టన్నుల నుంచి 1,411.6 టన్నులకు కుదేలయ్యింది. కాగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడుల డిమాండ్ 40 శాతం పెరిగి 1,269.2 టన్నుల నుంచి 1,773.2 టన్నులకు ఎగసింది. ఇందులో అధిక వాటా గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ది కావడం గమనార్హం. ఈటీఎఫ్ల డిమాండ్ ఏకంగా 120 శాతం పెరిగి 398.3 టన్నుల నుంచి 877.1 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 59 శాతం తగ్గి 668.5 టన్నుల నుంచి 273 టన్నులకు చేరాయి. -
జీడీపీ క్రాష్!
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవంతో భారత ఎకానమీ కుప్పకూలింది. ఆర్థిక విశ్లేషకులు, సంస్థలు, విధాన నిర్ణేతల అంచనాలకు మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్డౌన్ దీనికి ప్రధాన కారణం. గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్లోకి జారిపోవడం ఇదే తొలిసారి కాగా, చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో దేశంలో పడిపోయిన పెట్టుబడులు, వినియోగం పరిస్థితులను కరోనా వైరస్ మరింత కుంగదీసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1% అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2%. అధికారికంగా సోమవారం విడుదలైన జీడీపీ లెక్కను పరిశీలిస్తే, త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి. వ్యవసాయ రంగం ఒక్కటే గణాంకాల్లో కొంత ఊరటనిచ్చింది. మిగిలిన దాదాపు అన్ని రంగాల్లో క్షీణ ధోరణి కనిపించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వేయడం క్లిష్టమైన వ్యవహారమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అస్పష్ట ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని పేర్కొంది. అయితే క్షీణ రేటు మైనస్ 15–20% ఉంటుందని పలు విశ్లేషణా సంస్థలు అంచనావేస్తున్నాయి. విలువల్లో చూస్తే... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ –23.9 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నమాట. ఇక కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8% క్షీణించిందన్నమాట. వ్యవ‘సాయం’ ఒక్కటే ఊరట ► వ్యవసాయం: వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ► ఫైనాన్షియల్, రియల్టీ, వృత్తిపరమైన సేవలు: మైనస్ 5.3% క్షీణించింది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: క్షీణత రేటు మైనస్ 10 శాతంగా ఉంది. ► వాణిజ్యం, హోటల్స్ రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగాలు ఎన్నడూ లేనంతగా మైనస్ 47 శాతం పతనమయ్యాయి. ► తయారీ: మైనస్ 39.3% కుదేలైంది. ► నిర్మాణం: మైనస్ 50.3% కుప్పకూలింది. ► మైనింగ్: మైనస్ 23.3% క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్: క్షీణత మైనస్ 7%. ఊహించని షాక్ వల్లే... అంతర్జాతీయంగా ప్రతి దేశాన్నీ షాక్కు గురిచేసిన కరోనా వైరస్ ప్రభావమే తొలి త్రైమాసిక భారీ క్షీణ ఫలితానికి కారణం. జీడీపీ తలసరి ఆదాయం 1870 తరువాత ఎన్నడూ చూడని క్షీణ రేటును చూసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలూ లాక్డౌన్ పరిస్థితి నుంచి బయటపడ్డాక, వృద్ధి ‘వీ’ షేప్లో ఉండొచ్చు. – కేవీ సుబ్రమణియన్, చీప్ ఎకనమిక్ అడ్వైజర్ రికవరీ ఉంటుందని భావిస్తున్నాం... ఊహించిన విధంగానే క్షీణత భారీగా ఉంది. లాక్డౌన్ ప్రభావిత అంశాలే దీనికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలూ బలహీన పరిస్థితి ఉన్నా, క్రమంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని భావిస్తున్నాం. కేంద్రం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ కుదుట పడుతుంది... రానున్న త్రైమాసికాల్లో క్షీణ రేట్లు క్రమంగా దిగివస్తాయి. లాక్డౌన్ కఠిన పరిస్థితులు తొలగుతుండడం దీనికి కారణం. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్, ఆర్బీఐ చొరవలు పరిస్థితిని కుదుటపడేస్తాయని భావిస్తున్నాం. – నిరంజన్ హీరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ 1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు అంటే.. 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. స్వాతంత్య్రానంతరం 1958, 1966, 1980లో చోటుచేసుకున్న మూడు మాంద్యాలకూ ప్రధాన కారణాల్లో ఒకటి తగిన వర్షపాతం లేకపోవడమే. -
ఎలక్ట్రానిక్స్.. నో స్టాక్!
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజూ కొత్త కొత్త మోడళ్లు.. బ్రాండ్ల మధ్య నువ్వా నేనా అన్న పోటీ.. ఇదీ మొబైల్స్, ల్యాప్టాప్స్, టెలివిజన్ సెట్ల పరిశ్రమలో నాలుగు నెలల క్రితం వరకు ఉన్న పరిస్థితి. కోవిడ్–19 కారణంగా ఇప్పుడు వాతావరణం మారిపోయింది. కొత్త మోడళ్ల రాక తగ్గిపోయింది. విక్రేతల వద్ద నిల్వలు నిండుకున్నాయి. పాత స్టాక్తోనే ఇప్పటి వరకు అమ్మకందార్లు నెట్టుకొచ్చారు. ప్రస్తుతం కొత్త స్టాక్ రాక సగానికి తగ్గింది. కొన్ని నెలలుగా విదేశాల నుంచి ముడి సరుకు రాక తగ్గడంతో దేశీయంగా పరిశ్రమ తయారీ అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు తాజాగా ఎలక్ట్రానిక్ విడిభాగాలు పోర్టుల వద్ద నిలిచిపోయాయి. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇవి ఎదురు చూస్తున్నాయి. ముడి సరుకు లేక ప్లాంట్లు మూసివేత దిశగా సాగుతున్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు సగానికి పడిపోయాయని పరిశ్రమ చెబుతోంది. మూసివేత దిశగా ప్లాంట్లు.. ప్రధానంగా చైనా నుంచి వచ్చిన ముడిసరుకు నిల్వలు పోర్టుల వద్ద కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. షావొమీ, ఒప్పో, రియల్మీ, హాయర్, క్యారియర్ మిడియా వంటి కంపెనీల ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. కొన్ని తయారీ కేంద్రాల్లో విడిభాగాలు లేక ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ వారం ప్లాంట్లను మూసివేయక తప్పదని కొన్ని కంపెనీలు అంటున్నాయి. జైనా గ్రూప్ ఇటీవలే ప్లాంటును మూసేసింది. కార్బన్ మొబైల్స్ను ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీకి సాన్సూయ్ టీవీ తయారీ లైసెన్స్ ఉంది. 15 రకాల బ్రాండ్ల ఎల్ఈడీ టీవీలను తయారు చేస్తున్న వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ సైతం ముడిసరుకు లేక ఇబ్బంది పడుతోంది. మొబైల్ ఫోన్లు, టెలివిజన్లకు సంబంధించి 65–70% విడిభాగాల కోసం చైనాపై భారత్ ఆధారపడింది. ఏసర్, హెచ్పీ, డెల్, లెనోవో, ఆసస్ కంపెనీల ల్యాప్టాప్ల సరఫరా సైతం తగ్గింది. కంపెనీల నుంచి సరఫరా 50 శాతమే ఉంటోందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అధికం కావడంతో ల్యాప్టాప్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఆందోళనలో రిటైలర్లు.. కోవిడ్–19 విస్తృతి, దాని ప్రభావంతో మొబైల్స్ విక్రయ రంగం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందోనని పరిశ్రమ ఆందోళనగా ఉంది. నిరుద్యోగిత పెరిగితే స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లు పడిపోతాయి. ఈఎంఐ ద్వారా మొబైల్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య గతంలో 35–40 శాతముండేది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈఎంఐల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఇప్పుడీ సంఖ్య 5 శాతానికి వచ్చింది. పైగా డౌన్పేమెంట్ 35 శాతం కట్టాల్సిందే అన్న నిబంధన అమలు చేస్తున్నారు. దుకాణాలు తెరుచుకున్నా అమ్మకాలు 50 శాతం కూడా లేవు. దీంతో విక్రేతలు ఆందోళనగా ఉన్నారు. అధిక అద్దెలతోనే ముప్పు.. సాధారణ దుకాణాలతో పోలిస్తే మొబైల్ రిటైల్ ఔట్లెట్లు చెల్లిస్తున్న అద్దె ఎక్కువే. ప్రధాన ప్రాంతాల్లో అయితే ఇది ఏకంగా 40–50% అధికంగా ఉంటోంది. దీనికంతటికీ కారణం రిటైలర్ల మధ్య తీవ్ర పోటీయే. అయితే లాక్డౌన్ కారణంగా దుకాణాలు మూసివేశామని, వ్యాపారం జరగనందున అద్దె చెల్లించలేమని రిటైలర్లు భవన యజమానులకు తేల్చిచెప్పారు. అద్దె పూర్తిగా మినహాయింపు ఇస్తేనే వ్యాపారాలు చేసుకోగలమని వారు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని దుకాణాలను మూసివేయాల్సిన స్థితికి వచ్చామని ఓ రిటైలర్ వ్యాఖ్యానించారు. ఫోర్స్ మెజోర్ నిబంధనను అడ్డుపెట్టుకుని జాతీయ బ్రాండ్లు అద్దె చెల్లించడం లేదని ఆయన గుర్తు చేశారు. అయితే ఏదైనా మొబైల్ షాపు ఖాళీ అయితే.. అట్టి దుకాణాన్ని అద్దెకు తీసుకోరాదని దక్షిణాదికి చెందిన మొబైల్ ఫోన్ల రిటైలర్లు నిర్ణయించడం కొసమెరుపు. -
టీసీఎస్ లాభం 8,049 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.6 తుది డివిడెండ్ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్డౌన్ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి. ► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► గత క్యూ4లో ఎబిట్ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది. ► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్ రేటు) 12.1 శాతంగా ఉంది. ► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్కు రూ. 12 మధ్యంతర డివిడెండ్ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్కు రూ.18కు పెరుగుతుంది. మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది. ఉద్యోగాల కోత ఉండదు.. కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కాటేసింది.... మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్ను సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్లోనే సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ సంతృప్తికరంగానే సేవలు... కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం. –ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్ సీఓఓ, ఈడీ -
వృద్ధి 1.5 శాతమే
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు గణనీయంగా మందగించనుంది. 2020–21లో ఇది 1.5–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాల్లో వృద్ధి రేటు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి కానుంది. దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 4.8–5 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాలు తగ్గే కొద్దీ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ పుంజుకోగలదన్నది బ్యాంక్ అంచనా. -
అంబానీ సంపద ఆవిరి
ముంబై: దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద, కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ల పతనంతో గణనీయంగా పడిపోయింది. కేవలం రెండు నెలల వ్యవధిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 35 శాతం పడిపోగా, ముకేశ్ అంబానీ సంపద విలువ కూడా 28 శాతం తగ్గి మార్చి 31 నాటికి 48 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముకేశ్ నికర విలువ 19 బిలియన్ డాలర్లు తగ్గినట్టు హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ పేర్కొంది. ఫలితంగా అంతర్జాతీయంగా కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 8 స్థానాలు దిగజారి 17వ స్థానానికి వచ్చినట్టు హరూన్ తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఇదే కాలంలో (ఫిబ్రవరి–మార్చి) అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ సైతం 37 శాతం (6 బిలియన్ డాలర్లు) తగ్గింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ శివ్నాడార్ సంపద 26 శాతం (5 బిలియన్ డాలర్లు), కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ సంపద 28 శాతం (4 బిలియన్ డాలర్లు) తగ్గినట్టు హరూన్ నివేదిక తెలియజేస్తోంది. స్టాక్ మార్కెట్ల పతనంతోపాటు, రూపాయి విలువ క్షీణించడం భారత పారిశ్రామిక వేత్తల సంపదపై ప్రభావం చూపించినట్టు హరూన్ పేర్కొంది. ఓయో రూమ్స్ ప్లాట్ఫామ్ అధిపతి రితేష్ అగర్వాల్ బిలియనీర్ స్థానాన్ని కోల్పోయినట్టు తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ జెఫ్ బెజోస్ స్థానం చెక్కు చెదరలేదు. 131 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. కాకపోతే, గడిచిన రెండు నెలల్లో బెజోస్ సంపద కేవలం 9 శాతమే తగ్గింది. బిల్గేట్స్ 91 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (బ్యాంక్లపై కరోనా పిడుగు) -
రియల్టీకి కరోనా కాటు
సాక్షి, హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఆర్థిక మాంద్యంతో అనిశ్చితిలో కొట్టుమి ట్టాడుతున్న స్థిరాస్తి రంగాన్ని కరోనా కాటేసింది. ప్రపంచవ్యాప్తం గా నెలకొన్న పరిస్థితులు రియల్టీపై ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించడం తో అప్పటివరకు కనీసం అడుగు కూడా బయటపెట్టే పరిస్థితి లేదు. ఆ తర్వాత కూడా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడితే సరేసరి. ఇదే వాతావరణం కొనసాగినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో రియల్టీ రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. 6 నెలల నుంచి స్తబ్ధత ఆర్థిక మాంద్యం స్థిరాస్తి రంగాన్ని కుదేలు చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి భూముల కొనుగోళ్లు, స్థలాల క్రయ, విక్రయాలు పడిపోయాయి. పెరిగిన ధరలు కూడా రియల్టీపై ప్రభావం చూపాయి. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సహా తెలంగాణలో పరిస్థితి కాస్త మెరు గ్గానే ఉన్నా కొనుగోలుదారులు వేచిచూసే ధోరణి అవలం బించడంతో స్థిరాస్తి వ్యాపారం చతికిలపడింది. ఈ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతామని భావి స్తున్న తరుణంలో కరోనా వైరస్ దేశాన్ని చుట్టేసింది. దీంతో లాక్డౌన్ ప్రకటించడం ఇళ్ల నుంచి కాలు బయట మోపే పరిస్థితి లేకపోవడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు లబోదిబోమంటున్నారు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వాతావరణం కనిపించకపోవడంతో 4–5 నెలల్లోనే లేఅవుట్ లేదా డెవలప్మెంట్ చేసి పెట్టుబడులు రాబట్టాలనుకొనే వారిని వడ్డీల భారం నడ్డి విరచడం ఖాయంగా కనిపిస్తోంది. రూ. 2 కోట్లు గగనమే! ప్రభుత్వ ఆదాయార్జన శాఖల్లో ముఖ్యమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై కరోనా ప్రభావం పడింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడుతోంది. స్థిరాస్తుల లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెలా ఖజానాకు రూ. 560 కోట్ల ఆదాయం వచ్చేది. సెలవులు పోను రోజుకు రూ. 23 కోట్ల మేర రాబడి లభించేది. ప్రస్తుతం రూ. కోటిన్నర మేర మాత్రమే వస్తోంది. -
చలి సంపేత్తోంది..!
అనంతపురం : చలి సంపేత్తోంది బాబాబోయ్ అంటున్నారు జిల్లా జనం. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఆదివారం ఉదయం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లులో 11.9, అగళిలో 12.5, రొద్దంలో 12.8 డిగ్రీలకు పడిపోయింది. అమడగూరు 13.1 డిగ్రీలు, సోమందేపల్లి 13.3, చిలమత్తూరు, నల్లమాడ, గుత్తిలో 13.5, కనగానపల్లి 13.7, గాండ్లపెంట 13.8, పెనుకొండ 13.9 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 17 డిగ్రీల మధ్య ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 27 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 78 నుంచి 90 శాతం మధ్య రికార్డయింది. ఈశాన్య, ఆగ్నేయ గాలులు గంటకు 6 నుంచి 10 కి.మీ. వేగంతో వీచాయి. సాయంత్రం, ఉదయం శీతలగాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈసారి జిల్లావ్యాప్తంగా మంచి వర్షాలు పడటం, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం, పంటలు, కొండలు, అటవీ ప్రాంతం పచ్చదనం సంతరించుకోవడంతో సహజంగానే చలి పెరిగింది. తమిళనాడు, కేరళలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఈనెల మొదట్లో వారం పది రోజులపాటు మేఘాలు ఆవరించడంతో చలి తీవ్రత అంతగా లేదు. కానీ వారం రోజులుగా వాతావరణం మారడంతో చలిపులి ప్రజలను వణికిస్తోంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు చలి ఎక్కువగా ఉంటోంది. వేకువజామున మంచు దుప్పటి పరుచుకుంటోంది. పిల్లలు, వృద్ధులు, రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మడకశిర, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, పెనుకొండ ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగానే ఉంటోంది. -
తగ్గుతున్న గోదావరి
ఏటూరునాగారం : ఎగువ ప్రాంతాల్లో చేరుతున్న నీరు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శాంతించింది. మంగళవారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 7 గంటలకు 7.42 మీటర్లు నీటిమట్టం చేరుకోగా మధ్యాహ్నం 2 గంటలకు 7.20 మీటర్లకు పడిపోయింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు, రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముల్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్లకు ఆనుకొని గోదావరి ప్రవహిస్తోంది. రాంనగర్- రామన్నగూడెం మధ్యలోని లోలెవల్ కాజ్వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు ప్రజల రాకపోకలకు పడవ ఏర్పాటు చేశారు. గోదావరి వచ్చినప్పుడల్లా తమకు ఈ బాధలు తప్పడం లేదని ఆ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ను ఆర్డీఓ మహేందర్జీ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. గోదావరి వరద ఎంత మేర తగ్గిందని కేంద్ర జలవనరుల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఘాట్ వద్ద ఉంటూ గోదావరి వరద ఉధృతిని పరిశీలించి తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆయనవెంట తహశీల్దార్ నరేందర్, ఆర్ఐ సర్వర్పాషా, వీఆర్ఓలు నర్సయ్య, రాములు, మల్లేశం ఉన్నారు. -
నాణ్యత నవ్వులపాలు!
మంత్రి పర్యవేక్షిస్తున్నా నాసిరకం పనులే కూలుతున్న సింగూర్ వరద కాల్వలు పుల్కల్: ఎలాగైనా సింగూర్ వరద కాల్వ పనులను ఈసారి పూర్తి చేయాలనే ఉద్దేశంతో స్వయంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాల్వ పనుల ప్రగతి నివేదికను వాట్సాప్ ద్వారా తనకు ఎప్పటికప్పుడు మెసేజ్ చేయాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్ రావుతో పాటు ఎస్ఈ సురేందర్ను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు సింగూర్ వరద కాల్వ పనులను వేగవంతం చేయడంతోపాటు పర్యవేక్షిస్తున్నారు. కానీ అధికారులు వాహనాలు వెళ్లే ప్రాంతాల్లోనే జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతంతోపాటు పంట పొలాల్లో జరిగే పనులను మాత్రం అధికారులు పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా స్ట్రక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇదేం క్యూరింగ్? సీసీ పనులు చేసిన ప్రతి చోటా కచ్చితంగా నీటితో క్యూరింగ్ చేయాలనే ఆదేశాలు ఉన్నా నీరు అందుబాటులో లేదనే సాకుతో నీరు పోయకుండానే వదిలేస్తున్నారు. దీంతో నిర్మించిన వెంటనే మట్టికుప్పల్లా విరిగిపోతున్నాయి. దీనికి పుల్కల్ మండల పరిధిలోని గొంగ్లూర్ శివారులో గతవారం నిర్మించిన కల్వర్టు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ కల్వర్టును నాసిరకంగా నిర్మించడంతో అప్పుడే కూలిపోయింది. అదే కల్వర్టుకు కింది భాగంతోపాటు పైవరకూ పూర్తిగా బీటలు వారిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. ఇలా పుల్కల్ శివారులోని చిట్టెం చెరువు సమీపంలో ఇసుకతో కాకుండా రాతి పౌడర్తో నిర్మించడంతో పగుళ్లు వచ్చి పెచ్చులూడుతున్నాయి. పట్టించుకోని అధికారులు సింగూర్ వరద కాల్వలను కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రతి సందర్భంలో సింగూర్ వరద కాల్వల నిర్మాణంలో నిర్లక్ష్యం చేసినా, నాసిరకంగా పనులు చేసి నిర్మించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించినా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై సింగూర్ డిప్యూటీ ఇంజనీర్ జగన్నాథంను వివరణ కోరగా కల్వర్టులు నాసిరకంగా నిర్మించడ వల్ల కూలడం లేదని, నీరు లేకపోవడంతో క్యూరింగ్ చేయడం లేదని, అందుకే ఎండ తీవ్రతకు బీటలు వారుతున్నాయని వివరణ ఇచ్చారు. అడవుల్లో నీరు అందుబాటులో లేనందునే క్యూరింగ్ చేయడం లేదని చెబుతున్న మాటలనుబట్టి కాంట్రాక్టర్లతో అధికారులు ఎలా కుమ్మక్కయ్యారో అర్థం చేసుకోవచ్చు. -
వరుస ఉద్యమాలతో కుదేలైన నిర్మాణ రంగం