Electricity Supply
-
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరో దశాబ్ద కాలంలో 50,500 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 10,095 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగి ఉండగా, 2034–35 నాటికి మరో 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈమేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. లీజుకు చౌకగా సర్కారీ స్థలాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్కు అనుసంధానం చేసి వాటితో వచ్చే విద్యుత్ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇవ్వనున్నారు. సర్కారు స్థలాలను నామమాత్రపు అద్దెతో ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. బిడ్డింగ్ విజేతలకు మార్కెట్ రేటులో 10శాతం లీజు రేటుతో భూములను కేటాయించనుంది. టీజీ–ఐపాస్ ద్వారా డెవలపర్లకు అన్ని అనుమతులు సత్వరంగా జారీ కానున్నాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వీలుంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ప్రభుత్వం ప్రోత్సహించనుంది. జలాశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించనుంది. ఇందుకుగాను నీటిపారుదల శాఖకు డిస్కంలు విద్యుత్లో వాటా/ నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి. = రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు సౌరవిద్యుదుత్పత్తికి అనుకూలత ఉంటుంది. దేశంలో బలంగా గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 5500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. = రాష్ట్రంలోని సబ్స్టేషన్ల వారీగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన జారీచేయనున్నాయి. ఆ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. ప్రోత్సాహకాలివీ.. –పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. –డిస్కంలకు విద్యుత్ విక్రయించే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు. –సూపరై్వజింగ్ చార్జీల మినహాయింపు. –ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. –భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. మెగావాట్ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. – ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు. –పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజు ధరతో 45 ఏళ్ల కాలానికి ప్రభుత్వం కేటాయించనుంది. -
లంచం ఇవ్వలేదని విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు. కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు. అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్మెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు. -
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్కు సంబంధించిన స్టార్టర్ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సరఫరాలో తరచూ తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, మెరుగైన సరఫరా కోసం డిస్కం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం‘థర్మో విజన్’ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. కంటికి కన్పించని అతి సూక్ష్మమైన లోపాలను కూడా ఈ కెమెరాతో గుర్తించే అవకాశం ఉంది. రాబోయే ముప్పును ముందే పసిగట్టడం ద్వారా సరఫరాలో అంతరాయాలను నివారించొచ్చు. ప్రస్తుతం గ్రేటర్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 35 కెమెరాలను సమకూర్చింది. తద్వారా జాయింట్లలో లోపాలు, సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లపై పడుతున్న ఒత్తిడి, ట్రాన్స్పార్మర్లలో ఆయిల్ లీకేజీలు, కేబుళ్లలో తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. నిజానికి భగ్గున మండే ఎండలకు తోడు అధికలోడు కారణంగా ఇన్సులేటర్ల మధ్య పగుళ్లు ఏర్పడుతుంటాయి. వర్షపు చినుకులు పడగానే టఫ్...మంటూ పేలిపోతుంటాయి. లైన్లు, జాయింట్ల మధ్య లూజు కనెక్షన్లు ఉంటాయి. విద్యుత్ ప్రసారం జరిగే క్రమంలో చర్..చర్..మనే శబ్ధంతో ఎర్రటి మినుగురులు ఎగిసిపడుతుంటాయి. షార్ట్సర్క్యూట్ తలెత్తి..వైర్లు తెగిపడే వరకు ఈ సమస్య గుర్తించలేని దుస్థితి. ఈ కెమెరాతో ఈ లోపాలను ముందే గుర్తించే అవకాశం ఉంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఓ సబ్స్టేషన్లో ఆపరేషన్స్ విభాగం ఇంఛార్జీ డైరెక్టర్ నరసింహులు, సీఈ నరసింహస్వామి, బాలస్వా మిలతో కూడిన ఇంజనీర్ల బృందం ఈ థర్మోవిజన్ పరికరాల పనితీరును పరిశీలించారు. -
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రత్యేక పోర్టల్తో అనుసంధానం సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ను రూపొందించనున్నాయి. విద్యాసంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్ఓడీ)కి ఆ పోర్టల్ను లాగిన్ చేసే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్ పోర్టల్లో చేర్చడం/తొలగించడం/సవరణలు(యాడ్/డిలీట్/ఎడిట్) చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్నిబట్టి ఆయా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్ఓడీలు పొందనున్నారు. ఇన్చార్జీలకు ‘ఉచిత’బిల్లులు విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసినా ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్చార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఇన్చార్జి అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు? ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల/కళాశాల/విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరముండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నాయి. విభాగాధిపతుల పర్యవేక్షణ... విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్లో చూసుకోవడానికి వీలుండనుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లావారీగా సైతం ఈ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు. -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వేడి తగ్గింది. ఫలితంగా కరెంటు వినియోగం కూడా తగ్గింది. అది కూడా సాధారణంగా కాదు. ఈ ఏడాది వేసవిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్.. వాతావరణం అనుకూలించడంతో తగ్గుదలలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 211 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 248.985 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోలిస్తే.. ప్రస్తుతం ఇది 15.26 శాతం తక్కువగా నమోదైంది.ఈ నెల ప్రారంభంలో విద్యుత్ డిమాండ్ రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా పైపైకి పరుగులు తీసింది. భానుడి భగభగలను తట్టుకోలేని ప్రజలు ఏసీలు, ఫ్యాన్లను ఆపాలంటేనే భయపడిపోయారు. ఈ నెల 5న రోజువారీ డిమాండ్ 259.173 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఇది గతేడాది జరిగిన వినియోగం 193 మిలియన్ యూనిట్ల కంటే 34.29 శాతం ఎక్కువ. అయినప్పటికీ రాష్ట్రంలో వినియోగదారులకు అవసరమైనంత విద్యుత్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడా కోతలు లేకుండా, డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయడంలో విజయవంతమైంది.అత్యధికంగా థర్మల్ ఉత్పత్తి కొద్దిరోజుల క్రితం వరకూ రాష్ట్రంలో సౌర విద్యుత్ భారీగా పెరిగి దాదాపు రెట్టింపు విద్యుత్ను అందించేది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో అది కాస్త తగ్గింది. అనూహ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం ఏపీ జెన్కో థర్మల్ నుంచి 95.221 మిలియన్ యూనిట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో దాదాపు 45 శాతం జెన్కో థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది. ఇందుకోసం వీటీపీఎస్లో 48,141 మెట్రిక్ టన్నులు, ఆరీ్టపీపీలో 28,984 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 18,313 మెట్రిక్ టన్నుల చొప్పున బొగ్గు అందుబాటులో ఉంది. దీనికి తోడు ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.63 మి.యూ., ఏపీ జెన్కో సోలార్ నుంచి 1.98 మి.యూ. వస్తోంది. ఇక సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 32.999 మి.యూ., సెయిల్, హెచ్పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 30.939 మి.యూ., విండ్ నుంచి 10.937 మి.యూ., సోలార్ నుంచి 15.738 మిలియన్ యూనిట్ల చొప్పున సమకూరుతోంది. సౌర విద్యుత్ గత వారంతో పోలిస్తే దాదాపు సగానికిపైగా పడిపోయింది. మరోవైపు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా సగానికిపైగా తగ్గింది. ప్రస్తుతం యూనిట్ సగటు రేటు రూ.8.433 చొప్పున రూ.17.983 కోట్లతో 21.324 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. -
కరెంటు ఆపడం కొత్తేం కాదు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్ఫార్మర్ తగిలి షాక్కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది. -
కరెంట్ బిల్లులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసే మొత్తం వ్యయ్యాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి ఏటా నవంబర్లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారిఫ్తో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నా, 3 శాతానికి మించరాదని ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది. లేట్ పేమెంట్ సర్చార్జీతో.. విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనందుకు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్చార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గజిట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను, లేట్పేమెంట్ సర్చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. సొంత ట్రాన్స్మిషన్ లైన్లకు లైసెన్స్ అక్కర్లేదు ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్ ప్లాంట్/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం, నిర్వహించడం, గ్రిడ్కు అనుసంధానం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోబడి ఉండాలి. ఇందుకు సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అదనపు సర్చార్జీ బాదుడు వద్దు దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్చార్జీలతో పోలిస్తే స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్చార్జి 110 శాతానికి మించి ఉండరాదు. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్కు సంబంధించిన ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి. -
ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్కట్.. రోగి మృతి
ఎంజీఎం: షార్ట్ సర్క్యూట్తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారి ఆస్పత్రి చీకటిమయంగా మారడంతో రోగులతోపాటు వారివెంట ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయాడు. అయితే ఆ రోగి వ్యాధి తీవ్రతతోనే చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ వార్డు వెనుకాల ఉన్న విద్యుత్ తీగలపై కోతులు చేసిన ఆగ డాలతో వైర్లు ఒక్కోటి పరస్పరం తాకాయి. షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో సాధారణ వార్డుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. జనరేటర్ ద్వారా అత్యవసర వార్డుల(ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఎంఓటీ, ఈఓటీ)కు విద్యుత్ సరఫరా జరిగేది. కానీ జనరేటర్తో లింక్ ఉన్న ఉన్న విద్యుత్వైర్లు కూడా కాలిపోవడంతో గంటపాటు అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మృతి: రోగి బంధువుల ఆరోపణ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయం కారణంగా ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్రావు పల్లె గ్రామానికి చెందిన భిక్షపతి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ఆర్ఐసీయూలో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భిక్షపతికి అమర్చిన వెంటిలైటర్ నిలిచి శ్వాస తీసుకోవడం తీవ్రమైనట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. దీంతో చనిపోయాడని వాపోతున్నారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమేనని తెలిపారు. బాధితుడి మృతిచెందిన సమయంలో వెంటిలెటర్ బ్యాటరీ బ్యాకప్తో కొనసాగుతోందని పేర్కొన్నారు. భిక్షపతి మృతికి విద్యుత్ అంతరాయం కాదని, వ్యాధి తీవ్రతే కారణమని స్పష్టం చేశారు. -
విద్యుత్ పొదుపుతో భవిష్యత్కు వెలుగు
సాక్షి, అమరావతి: ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది.. కానీ విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. బయటి నుంచి చల్లగాలి శరీరాన్ని తాకుతున్నా.. ఫ్యాన్లు, ఏసీలు ఆపడానికి ఇష్టపడం. ఈ విధంగా విద్యుత్ పొదుపులో మనం చేస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదముంది. వచ్చే 39 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వనరులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మేలుకోకపోతే విద్యుత్ వెలుగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అనేక దేశాలు విద్యుత్ పొదుపు చర్యలకు నడుం బిగించాయి. మన దేశంలో ఈ బృహత్తర యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 20 వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. భవిష్యత్ తరాల కోసం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టిస్తోంది. అలాగే భవిష్యత్లో విద్యుత్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటోంది. మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ.. 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. అయితే విద్యుత్ వెలుగులను భావితరాలకు అందించడానికి నేటి తరం కూడా తమ వంతు బాధ్యతగా విద్యుత్ పొదుపు పాటించాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బొగ్గు కొరతతో తిప్పలు.. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. చైనా, ఆ్రస్టేలియాలో బొగ్గు కొరత వల్ల పలు దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్లోనూ విద్యుత్ సంక్షోభం నెలకొంది. శీతాకాలంలోనైనా వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ఉపయోగించాలని.. హీటర్లకు వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. అమెరికాలో గతేడాది కంటే 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధన ధరలు పెరగడంతో అక్కడ ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. భారత్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. అలాంటి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈపీడీసీఎల్కు ఈఈఎస్ఎల్ ప్రశంసలు సాక్షి, విశాఖపట్నం: ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3,265.47 కోట్ల విలువైన 5,062.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆదర్శంగా నిలిచింది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈపీడీసీఎల్ను ఎనర్జీ ఎఫీషియన్సీ సర్విస్ లిమిటెడ్ సీఈవో విశాల్కపూర్ ప్రశంసించారు. అలాగే 2018–19 నాటికి 6.68 శాతంగా ఉన్న నష్టాలను.. 2023–24 సెపె్టంబర్ నాటికి 5.14 శాతానికి తగ్గించుకుంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వి తేజ్ మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టిన పాలసీని అమలుచేస్తూ విజయాలు సాధిస్తున్నాం. పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు ఎక్కువగా జరిగేలా చూస్తున్నాం. రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాం. వినియోగదారులు చేస్తున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తున్నాం’ అని చెప్పారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం
సాక్షి, హైదరాబాద్: బీజే పీ శిష్యరికంతో రాష్ట్ర మంత్రి కేటీరామారావు అసత్య ప్రచారాల్లో రాటుదేలారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ చూసి ఏం చేయాలో అర్థంకాక కోట్లాదిరూపాయలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోని రైతులకు విద్యుత్ సరఫరాపై మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్కు శనివారం ఆయన కౌంటర్ పోస్ట్ చేశారు. ‘నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మిత్రపార్టీ బీజేపీ 40% కమీషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో గ్యారంటీలను 100 రోజుల్లోపు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. ‘తెలంగాణలో కూడా కాంగ్రెస్ దూసుకెళుతుంటే ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ప్రజలు మీ తోడుదొంగల దుమ్ము దులపడం ఖాయం. కాంగ్రెస్ వస్తుంది. తెలంగాణ గెలుస్తుంది’ అని రేవంత్ తన పోస్ట్లో పేర్కొన్నారు. -
Fact Check: కరెంటుంది.. కోతల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు లేవు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కరెంటు కోతలు లేవు. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందుతోంది. అయినా ఈనాడు పత్రిక ‘రైతులకు జగన్ షాక్’ అంటూ ఓ పసలేని కథ అచ్చేసింది. రైతులను అనవసర ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాన్ని ఇచ్చింది. ఈ కథనాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. వ్యవసాయానికి 9 గంటల పాటు కచ్చితంగా ఉచిత విద్యుత్ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈనాడు గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. గ్రామాల్లో రోజుకి నాలుగైదు గంటలు మించి కరెంటు అందడంలేదన్నది పచ్చి అబద్ధమని, అనధికార కోతలు విధిస్తున్నారన్నదీ అవాస్తవమేనని తెలిపారు. అన్నదాతలకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎటువంటి రాజీ లేదని,. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే అదే రోజు మరొక సమయంలో భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ‘సాక్షి’ ప్రతినిధికి సీఎండీలు వెల్లడించిన వివరాలు.. ► గ్రిడ్ లో ఏర్పడే ఫ్రీక్వెన్సీ హె చ్చు తగ్గులను అదుపు చేయడానికి దక్షిణ భారత లోడ్ డిస్పాచ్ సెంటర్ (బెంగళూరు) ఆదేశాలతో ఆటోమాటిక్ లోడ్ షెడ్డింగ్ విధానం అప్పుడప్పుడు అమల్లోకి వస్తుంటుంది. వెంటనే సంబంధిత విద్యుత్ సంస్థల ఇంజనీర్లు పరిస్థితిని అదుపు చేసి సరఫరాలో అంతరాయంలేకుండా చేయడానికి కృషి చేస్తున్నారు. ► ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అక్టోబర్ నెలలో రోజుకు 210 నుంచి 215 మిలియన్ యూనిట్లు ఉండాల్సిన విద్యుత్ వినియోగం దాదాపు 245 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి సరాసరి రోజువారీ వినియోగం 170 నుంచి 180 మిలియన్ యూనిట్లు ఉండేది. బుధవారం రాష్ట్రంలో 234 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. తక్కువ వర్షపాతం వల్ల తగినంత సాగు నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అంచనాలకు మించి పెరిగిపోయింది.వాతావరణ మార్పుల వల్ల పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ కారణాలతో రాష్ట్ర విద్యుత్ గ్రిడ్పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా గ్రిడ్ డిమాండ్కు అనుగుణంగా నిలకడగా ఉంది. ఏ విధమైన ఒడిదొడుకులు ఏర్పడినా పరిస్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా స్వల్పకాలిక మార్కెట్లో విద్యుత్ కొని, సరఫరా చేయడానికి డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని విద్యుత్ కొరత ఏర్పడే సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్తున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి బుధవారం యూనిట్ సగటు రేటు రూ.8.963 చొప్పున రూ.62.554 కోట్లతో 69.789 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశాయి. ► మన రాష్ట్రంలో విద్యుత్ కొరత పరిస్థితులు లేవు. బీహార్లో 7.60 మిలియన్ యూనిట్లు, ఉత్తరప్రదేశ్లో 5.73 మిలియన్ యూనిట్లు, కర్ణాటకలో 4.40 మిలియన్ యూనిట్లు, రాజస్థాన్లో 3.10 మిలియన్ యూనిట్లు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో 47.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ లోటు సున్నాగా ఉంది. -
24 గంటలు కరెంటు ఇవ్వాలి
గరిడేపల్లి: 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొట్టదశలో ఉందని విద్యుత్ కోతలు విధించడంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతోందని, సబ్ స్టేషన్ నుంచి మాత్రం విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. కనీసం 12 గంటలు అయినా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా చేయకపోయినా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగితే 80 శాతం పంట రైతులకు దక్కుతుందన్నారు. ధర్నాలో రైతులు సప్పిడి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊరు చీకట్లో మగ్గుతోందని..
(సూర్యాపేట) : అసలే ఎడతెరిపి లేని వర్షాలు, ఆపై చెరువును తలపించేలా చుట్టూ నీరు.. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఊరు ఊరంతా చికట్లో మగ్గిపోతోంది. దీనిని చూడలేని ఓ యువకుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి సాహసం చేశాడు. నీటిలో ఈదుకుంటూ వెళ్లి.. విద్యుత్ స్తంభంం ఎక్కి మరమ్మతులు చేసి విద్యుస్ సమస్యను తీర్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన కొప్పుల సంతోష్ గౌడ్ స్థానిక లైన్మన్ కింద హెల్పర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనికి తోడు గ్రామానికి పైభాగంలో ఉన్న అయ్యవారికుంట తండా చెరువు నుంచి శంభుని చెరువుకి వచ్చే కరకట్ట తెగిపోయింది. ఈ వరదంతా పాతర్లపహాడ్లోని ముదిరాజ్ కాలనీని ముంచెత్తింది. దీంతో గురువారం రాత్రి నుంచి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని సరిచేయాలని ప్రయత్నించగా చెరువును తలపించేలా చుట్టూ వరద నీరు ఉన్న ఓ స్తంభంపై సమస్య ఉందని గుర్తించారు. ఈ స్తంభంపై మరమ్మతులు చేస్తేనే గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతుందని, లేదంటే చీకట్లోనే గడపాల్సి ఉందని భావించారు. విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న విద్యుత్ హెల్పర్ సంతోష్ గౌడ్ వరదను లెక్కచేయకుండా దిగాడు. చాలా దూరం ఈదుకుంటూ వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చాడు. సంతోష్ గౌడ్ చేసిన సాహసానికి గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్హెచ్వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్షెహర్కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
ఏపీలో ఆల్టైమ్ రికార్డు దాటిన కరెంట్ వినియోగం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం ఆల్టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఎనిమిదేళ్లలో ఇంత రికార్డు స్ధాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. ఎన్నడూ లేని విధంగా 12,660 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ చెబుతోంది. మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ కొనసాగనున్నట్లు విద్యుత్శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ తెలిపారు. అయితే ఊహించని డిమాండ్ ఏర్పడినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో పదిరూపాయిలుండే యూనిట్ విద్యుత్ను 6.40 రూపాయిల నుంచి 7 రూ. లోపు కొంటున్నామని తెలిపారు.విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ..‘అత్యధిక డిమాండ్ కారణంగా ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని లైన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలని సరిచేస్తున్నాం. నున్న- గుడివాడ విద్యుత్ లైన్కు ఏర్పడిన సమస్యలని పరిష్కరిస్తున్నాం. ఏపీలో ఇంత విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు విధించలేదు. సాధారణంగా ఏప్రియల్ నెలలోనే విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నాం కానీ విద్యుత్ వినియోగం రికార్డుస్ధాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసింది’ అని వెల్లడించారు. చదవండి: కోతల్లేని కరెంట్.. ప్రభుత్వ ముందు చూపు వల్లే సాధ్యం -
కోతల్లేని కరెంట్..
నాడు చీకటి రోజులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా విద్యుత్ సరఫరా ఉండదు’ అని అధికారికంగా ప్రకటనలు జారీ అయ్యేవి. ‘ఎండా కాలం కదా.. పవర్ కట్ మామూలే’ అని అప్పటి పాలకులు దబాయించే వారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. వంటింట్లో మిక్సీలు తిరక్క గృహిణులు, హాల్లో ఫ్యాన్ తిరక్క పిల్లలు, ఆఫీసుల్లో ఏసీలు పని చేయక ఉద్యోగులు, జిరాక్స్ సెంటర్ల వద్ద విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. విద్యుత్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజులను గుర్తు చేస్తే చాలు ప్రజలు కథలు కథలుగా చెబుతారు. నేడు వెలుగు జిలుగులు ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్న పదానికి తావు లేకుండా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ రీతినా సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు బయటి మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు చేశారు. సరఫరాలో నాణ్యత పెరిగేలా వ్యవస్థాగత మార్పులు చేశారు. ఈ ఏడాది ఇదివరకెన్నడూ లేనంతగా అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో అక్కడక్కడ ఓవర్లోడ్తో ట్రిప్ కావడం తప్పించి ఏ సమస్యా లేకుండా శ్రద్ధ పెట్టారు. అలాంటి చోట్ల నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు చేసేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. తద్వారా ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్నమాటే వినిపించడం లేదు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వ్యవసాయానికి 18.49 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్గ్రేడ్ చేసింది. తద్వారా 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్కు ఎలాంటి ఢోకా లేకుండా ఏర్పాటు చేసింది. పరిశ్రమలకూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ, ఎక్కడా కోతలన్నదే లేకుండా సరఫరా సవ్యంగా సాగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, ఎండలు మండిపోతుండటం వల్ల విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. అయినా కాసేపు కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గత సంవత్సరం గరిష్ట డిమాండ్తో పోలిస్తే ఇప్పుడు 27.51 శాతం అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్లు వంటి గృహోపకరణాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం రాకార్డు స్థాయిలో పెరిగిపోయింది. రోజువారీ డిమాండ్ 248.985 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 195.266 మిలియన్ యూనిట్లుగా ఉండింది. రోజులో పీక్ డిమాండ్ 12,482 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 9308 మోగావాట్లు మాత్రమే. అంటే 34.10 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,374 మెగావాట్లు, సాయంత్రం వేళల్లో 9,582 మెగావాట్లకు చేరుకుంది. అయినప్పటికీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్కు ఇబ్బంది లేకుండా, డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఇలా దేశంలోనే ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చెప్పడానికి ఇదొక పెరామీటర్గా చెప్పవచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 89.981 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.414 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 43.012 మి.యూ, సెయిల్, హెచ్పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 28.510 మి.యూ, సోలార్ నుంచి 25.605 మి.యూ, విండ్ నుంచి 11.591 మి.యూ, ఇతర మార్గాల్లో 1.496 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.537 చొప్పున రూ.33.936 కోట్లతో 45.023 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ప్రతి రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్ను అందుకోలేక భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జార్ఖండ్లో 4.62 మి.యూ, హర్యానాలో 2.64 మి.యూ, ఉత్తరప్రదేశ్లో 2.03 మి.యూ, కర్ణాటకలో 1.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. సరిపడా బొగ్గు నిల్వలు దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. ఇందులో ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గుకు దాదాపు 40 శాతం నుంచి 50 శాతం అదనంగా బొగ్గును సమకూర్చుకోవాలని, విదేశీ బొగ్గును 6 శాతం దిగుమతి చేసుకుని స్వదేశీ బొగ్గుతో కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా రైల్వే ర్యాక్స్ను పెంచాలని ఏపీజెన్కో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, రైల్వేను కోరాయి. 14 రైల్వే ర్యాకులు సరిపోవడం లేదని, వీటితో పాటు మరో ఆరు ర్యాకులు పెంచాలని అడిగాయి. దీంతో మరో మూడు ర్యాకులు అదనంగా వచ్చాయి. వీటి ద్వారా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి, సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును తీసుకువస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం వీటీపీఎస్లో 83,479 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 30,001 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 29,000 మెట్రిక్ టన్నులు, హిందూజా వద్ద 19200 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటీపీఎస్ పునరుద్ధరణ సోలార్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, థర్మల్ జనరేటర్లు పీక్ లోడ్లో పని చేస్తున్నప్పుడు వీటీపీఎస్ వద్ద జనరేటర్లు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు ట్రిప్ అయ్యాయి. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఆ రోజు వాతావరణం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్ మట్టం తక్కువగా ఉన్నందున శ్రీశైలంలో హైడల్ ఉత్పత్తి అందుబాటులో లేదు. గ్యాస్ పరిమితి కారణంగా గ్యాస్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. అదే సమయంలో వీటీపీఎస్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ఎక్కడా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ సరఫరా దుస్థితిని వ్యూహాత్మకంగా విస్మరిస్తోంది. గంటల తరబడి కోతలు విధించారనే విషయాన్ని దాస్తోంది. అప్పట్లో వేసవిలో కరెంటు పరిస్థితి చెప్పనలవి కాదు. వేసవిలో కాకుండా కూడా కోతలు విధించిన రోజులున్నాయి. పరిశ్రమలకైతే ఏకంగా పవర్ హాలిడేలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు పరిశ్రమలన్నింటికీ తాళం వేయాల్సి వచ్చేది. జిరాక్స్ మిషన్లు, పిండి మరలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, కూలింగ్ వాటర్ ప్లాంట్లు గంటల తరబడి పని చేయక చిరు వ్యాపారులు నష్టాలు చవిచూశారు. విద్యుత్ కోతల గురించి మాట్లాడితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దబాయించే వారు. ‘ఎండా కాలం.. ఆ మాత్రం విద్యుత్ కోత ఉండదా.. ఇప్పుడే కొత్తగా కోతలు విధిస్తున్నా.. ఇది వరకు కోతల్లేవా’ అని ఎదురు దాడికి దిగేవారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం కోత అన్నదే లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. వంకర బుద్ధి చూపిస్తూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్ పోయిన ప్రాంతాలను చూపుతూ దుష్ప్రచారం చేస్తోంది. -
‘24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం’
సాక్షి, విజయవాడ: విద్యుత్ కోతలు ఉండకూదనే తరచు సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతలు అనే సమస్యే రాలేదన్నారు. ఈరోజు(గురువారం) విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో నిర్మించిన మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ‘ 2016లో శంకుస్థాపనలు చేసి వదిలేసిన సబ్స్టేషన్లను మేం పూర్తి చేశాం. విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతల్లేవు. 24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం. రైతులు, పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని సీఎం నెరవేర్చారు. రైతులకు పగటిపూటే విద్యుత్ ఇస్తున్నాం. ఒక విద్యుత్ కనెక్షన్ కూడా పెండింగ్లో లేదు. మేం వచ్చాక లక్షా 25వేల పెండింగ్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. రైతులు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. చంద్రబాబు ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు -
విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్కు సరిపడా విద్యుత్ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్ ఎక్స్చ్ంజ్ (బహిరంగ మార్కెట్)లో విద్యుత్ను షార్ట్ టర్మ్ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అదే నెలలో విద్యుత్ కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. సరఫరాలో నాణ్యత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ట్రాన్స్కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్క్యాప్ వీసీఎండీ ఎస్.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అమెరికాలో భీకర మంచు తుపాను.. 1989 తర్వాత తొలిసారిగా బ్లిజ్జార్డ్ వార్నింగ్
పియెర్రె: అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను (బ్లిజ్జార్డ్) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్ల్యాండ్, ఓరెగాన్ పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి. -
పంటలకు సకాలంలో కరెంట్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు. -
కరెంట్ కోతలపై అన్నదాతల నిరసన
జగిత్యాల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలోని రైతులు ఆదివారం స్థానిక సబ్ స్టేషన్ను ముట్టడించారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులను కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. సబ్స్టేషన్ ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. వ్యవసాయ రంగానికి నిరంతరం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. సమయపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలపాటూ వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు. కాగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గది తాళం తీసి వారికి విముక్తి కల్పించారు. -
పంటలకు ‘కట్’కట!
రైతు: సర్.. నమస్తే! ఏఈ: నమస్తే..చెప్పండి రైతు: సర్.. త్రీఫేజ్ కరెంట్ ఏమైంది? ఇట్లా కట్ చేస్తున్నారు? ఏఈ: (మధ్యాహ్నం) మూడింటికి త్రీఫేజ్ తీయమన్నారండి. మూడింటికి తీస్తున్నాం. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మూడింటి వరకు ఇవ్వమన్నారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఇస్తారో తెల్వదు. రైతు: ఎన్నిరోజులు సర్ ఇట్లా? ఏఈ: తెల్వదండి మాకు. ఇన్ఫర్మేషన్ ఏం ఉండదు. పై నుంచి ఎలా వస్తే అలా ఫాలో అవుతున్నాం. రైతు: 24 గంటలు అంటున్నారు. కనీసం 10 గంటలు కూడా కరెంట్ ఇస్తలేరు. నైట్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎండలు కొడ్తున్నాయి. ఇన్ని రోజుల్లాగా కాకుండా ఇప్పుడు పంటలకి వాటర్ అవసరం. మందు కొడ్తామన్నా నీళ్లు లేవు. ఒకసారేమైన (కరెంట్) ఆన్ చేయగలుగుతరా సర్? ఏఈ: లేదండి.. సాధ్యం కాదు. పై నుంచి ఆర్డర్స్ కదా. మనం ఏమీ చేయలేం. రైతు: 24 గంటలని చెప్పి ఇట్లా కట్ చేస్తే మా పంటలు ఏం కావాలి? ఇప్పుడు కరెంట్ తీస్తే ఎట్లా? .. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన ఓ రైతు, విద్యుత్ శాఖ ఏఈ మధ్య ఇటీవల జరిగిన ఈ ఫోన్ సంభాషణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ రైతు కాల్ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అనధికారికంగా గణనీయ స్థాయిలోనే కోతలు అమలవుతున్నాయి. వ్యవసాయానికి కేవలం 8–10 గంటలు మాత్రమే.. అదీ ఉదయం, రాత్రి రెండు దఫాలుగా త్రీఫేజ్ కరెంట్ సరఫరా జరుగుతోంది. జిల్లాలు, సబ్స్టేషన్ల వారీగా సరఫరా వేళల్లో తేడాలు ఉంటున్నాయి. మధ్య మధ్యలో విద్యుత్ ట్రిప్ అవుతుండటంతో మోటార్లు ఆగిపోయి.. పంటలకు నీళ్లు అందడం లేదని రైతులు వాపోతున్నారు. వేసవికి ముందే కోతలు మొదలవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నిర్మల్, గద్వాల, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పలువురు రైతులు ఆందోళన బాట పట్టారు. విద్యుత్ వినియోగ అంచనాలు తప్పడం, భారీ నష్టాల నేపథ్యంలో బహిరంగ కొనుగోళ్లను తగ్గించడమే కోతలకు కారణమని ట్రాన్స్కో వర్గాలు చెప్తున్నాయి. వినియోగ అంచనాలు తప్పడంతో.. రాష్ట్రంలో మొత్తం 1,65,48,929 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. గృహ విద్యుత్ కనెక్షన్లు 72.85 శాతం, వ్యవసాయ కనెక్షన్లు 15.49 శాతం, పరిశ్రమలు, ఇతర వాణిజ్య కనెక్షన్లు 11.66 శాతం ఉన్నాయి. లెక్కల ప్రకారం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 27 లక్షలకుపైగా ఉంటుంది. గత ఏడాదికి కంటే ఈసారి 5 నుంచి 10 శాతం వరకు విద్యుత్ వినియోగం పెరగొ చ్చని అధికారులు అంచనా వేసుకుంటే.. ఇప్పటికే 15 నుంచి 20 శాతం వరకు పెరిగినట్టు సమాచారం. భారీ నష్టాలు.. తగ్గిన కొనుగోళ్లు.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత సరఫరాతో డిస్కంలపై భారం పడుతోంది. మరోవైపు కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాలతోపాటు ప్రభుత్వ శాఖలు/విభాగాల నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించక.. డిస్కంలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఎన్నడూ లేనట్టుగా 2022–23లో రూ.5,597 కోట్ల మేర చార్జీలను పెంచినా డిస్కంల నష్టాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లను విద్యుత్ సంస్థలు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రోజుకు రూ.70–100 కోట్ల ఖర్చుతో 20–30 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం రూ.20–30 కోట్లతో 5 మిలియన్ యూనిట్లలోపే కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. వేసవిలో కష్టమే! వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్టంగా 14,160 మెగావాట్ల డిమాండ్ నమోదవగా.. ఈసారి 16,000 మెగావాట్ల వరకు ఎగబాకే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో విద్యుత్ కొరత, ధరలు భారీగా పెరగొచ్చని అంటున్నాయి. దీనితో గృహ వినియోగానికీ కోతలు పెట్టక తప్పని పరిస్థితి ఉంటుందని ట్రాన్స్కో వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫొటోలోని రైతు గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురానికి చెందిన కృష్ణయ్య. నాలుగెకరాల భూమి, అందులో 2 బోర్లు ఉన్నాయి. యాసంగిలో ఎకరా పొగాకు సాగు చేశాడు. 3ఎకరాల్లో వరి సాగుకు సిద్ధమైనా.. కరెంటు కోతలు మొదలవడంతో ఒక ఎకరాలోనే వరి నాటు వేశాడు. మిగతా రెండెకరాలు బీడుగానే వదిలేశాడు. ఇప్పటికీ రాత్రి, పగలు బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ పొగాకు, వరికి నీరు పారించుకుంటున్నట్టు చెప్తున్నాడు. రోజంతా బావి వద్దనే.. యాసంగిలో రెండెకరాల్లో మొక్కజొన్న వేశా. పంట 45 రోజుల వయసులో ఉంది. పది రోజులుగా కరెంటు సరిగా ఉండటం లేదు. త్రీఫేజ్ కరెంట్ తరచూ ట్రిప్ అవుతోంది. రెండు, మూడు గంటలు కూడా నీరు పారడం లేదు. రోజంతా పడిగాపులు కాస్తూ మోటార్ ఆన్ చేసుకోవాల్సి వస్తోంది. మరో 10 రోజులు ఇలాగే ఉంటే పంట దెబ్బతింటుంది. – జంగిలి రవి, గుడ్డెలుగులపల్లి, దుగ్గొండి, వరంగల్ -
Telangana: ఇక ప్రతి నెలా సర్దుబాదుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) వసూలు చేసేందుకు లేదా వారికి తిరిగి చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మూడో సవరణ నిబంధనలు–2023ను బుధవారం ప్రకటించింది. ఇంధన/ విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమేటిక్గా విద్యుత్ బిల్లులకు బదిలీ చేసేందుకు ..కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్లా) రూల్స్ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో సైతం ఇంధన సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విజ్ఞప్తి చేయగా, తాజాగా ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన సర్దుబాటు చార్జీలను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములాను సైతం ప్రకటించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లు అమల్లోకి రానున్నాయి. రుణాత్మకంగా తేలితే రిఫండ్ ► తెలంగాణ ఈఆర్సీ నిబంధనల ప్రకారం.. ఎన్ (ఒక నెల) నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను ఎన్+2 (మూడవ నెల)కు సంబంధించిన బిల్లుతో కలిపి ఎన్+3 (4వ నెల) నెలలో డిస్కంలు జారీ చేస్తాయి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించిన తర్వాత రుణాత్మకంగా తేలితే ఆ మేరకు వినియోగదారులకు రిఫండ్ (తిరిగి చెల్లించాలి) చేయాల్సి ఉంటుంది. 30 పైసలకు మించితే ముందస్తు అనుమతి తప్పనిసరి ► యూనిట్ విద్యుత్పై గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్కు 30 పైసలకు మించితే ఆపై ఉండే అదనపు మొత్తాన్ని ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా విధించడానికి వీలులేదు. వ్యవసాయం మినహా అందరిపై వడ్డన.. ► ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయ వినియోగదారులు మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఇంధన సర్దుబాటు చార్జీలు విధించడానికి ఈఆర్సీ అనుమతినిచ్చింది. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కోరింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఆ మొత్తాలను తర్వాతి కాలంలో ఇతర వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించబోమని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గడువులోగా వసూలు చేసుకోవాల్సిందే.. ► నిర్ణీత కాల వ్యవధిలోపు ఎఫ్ఎస్ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాత వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను అనుమతించరు. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతో పాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు కీలకం.. ► ప్రతి ఏటా నవంబర్ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో పాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకుని ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభ, నష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైన పక్షంలో వీటిని సమర్పించే వరకు ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీ అనుమతించిన చార్జీలకు, విద్యుత్ సరఫరాకు జరిగిన వాస్తవ వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల పేరిట వసూలు చేసుకునేందుకు ఈఆర్సీ అనుమతిస్తుంది. -
బొగ్గు కొరతతోనే ఛత్తీస్గఢ్ విద్యుత్ బంద్
సాక్షి, హైదరాబాద్: బొగ్గు లభ్యత లేకనే ఛత్తీస్గఢ్ తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్కో స్పష్టం చేసింది. బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాను నిలుపుదల చేయడంలో వాస్తవం లేదని పేర్కొంది. మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. ‘రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ కరెంట్ బంద్’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ట్రాన్స్కో యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘సొంత అవసరాల బొగ్గు గని (క్యాప్టివ్ మైన్) నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో అడ్డంకుల నేపథ్యంలో రోడ్డుతోపాటు రైలు మార్గాన్ని ఛత్తీస్గఢ్ వినియోగిస్తోంది. ఇతర వనరుల నుంచి కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. ఆలస్యంగానైనా మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి కాప్టివ్ గని కేటాయింపులు జరగడంతో బొగ్గు లభ్యత చేకూరడంతోపాటు విద్యుత్ వేరియబుల్ ధర తగ్గింపునకు దోహదపడింది. దీంతో అధిక ధరలతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను నివారించినట్టు అయింది. తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులకు లోబడి ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సిన బకాయిలను అంగీకరించడం జరిగింది. లేట్ పేమెంట్ సర్చార్జీ రూల్స్–2022 కింద ఆర్ఈసీ/పీఎఫ్సీల ద్వారా పాత బకాయిల చెల్లింపునకు ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ స్థిర ధర (ఫిక్స్డ్ కాస్ట్) మినహా టారిఫ్ విషయంలో ఇతర తీవ్రమైన వివాదాలేమీ లేవు. ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర ధరను ఢిల్లీలోని అప్పీలేట్ ట్రిబ్యునల్లో సవాల్ చేశాం. ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర చార్జీలను పరిగణనలోకి తీసుకున్నా, షార్ట్ టర్మ్ మార్కెట్, ఎక్సే్ఛంజీల విద్యుత్ ధరలతో పోటీపడేలానే ఉంది. విద్యుత్ ధరలను ఛత్తీస్గఢ్ అసాధరణంగా పెంచేసిందనడం సరికాదు. ఎందుకంటే, ఈఆర్సీ ఖరారు చేసిన టారిఫ్ను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది’అని ట్రాన్స్కో తెలిపింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా లేకున్నా, అందుకోసం బుక్ చేసుకున్న ట్రాన్స్మిషన్ లైన్లకు చార్జీలు చెల్లిస్తున్న అంశంపై సైతం ట్రాన్స్కో వివరణ ఇచ్చింది. పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్లతోపాటు పవర్ బ్యాంకింగ్ అవసరాలకు ఈ లైన్లను వాడుకుంటున్నట్టు తెలిపింది. ట్రాన్స్కో, డిస్కంల భిన్న వాదనలు ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై తెలంగాణ ఈఆర్సీకి రాష్ట్ర డిస్కంలు ఇచ్చిన వివరాలు, ‘సాక్షి’ కథనంపై తెలంగాణ ట్రాన్స్కో ఇచ్చిన వివరణ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. బొగ్గు కొరత వల్లే ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా ఆగినట్టు ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో డిస్కంలు ఎక్కడా పేర్కొనలేదు. ఛత్తీస్గఢ్కి ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలతోపాటు మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయంపై వివాదంతోనే సరఫరా జరగడం లేదని తెలిపాయి. బకాయిలిచ్చే వరకు సరఫరా చేయం: ఛత్తీస్గఢ్ ‘మాకు బకాయిపడిన దీర్ఘకాలిక బకాయిలను చెల్లించేవరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయం. తెలంగాణకు 2023–24లో ఎలాంటి విద్యుత్ సరఫరాను పరిగణనలోకి తీసుకోబోం’ అని ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీఎస్పీడీసీఎల్).. ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలియజేసింది. ఈ విషయాన్ని తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)–2023–24లో పొందుపర్చింది. -
ముదిరిన వివాదం.. తెలంగాణకు ఛత్తీస్గఢ్ కరెంట్ బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా పూర్తిగా బంద్ అయింది. ప్రస్తుత (2022–23) ఆర్థిక సంత్సరంలో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ఛత్తీస్గఢ్ సరఫరా చేయలేదు. ధరతోపాటు బకాయిలను ఛత్తీస్గఢ్ భారీగా పెంచేయగా, తెలంగాణ డిస్కంలు అంగీకరించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేస్తున్న విజ్ఞప్తులను ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీఎస్పీడీసీఎల్) నిరాకరిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టంచేసింది. తెలంగాణ డిస్కంలు, సీఎస్పీడీసీఎల్ మధ్య జరిగిన దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం రాష్ట్రానికి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. 2020–21లో 39.67శాతం, 2021–22లో కేవలం 1,631 మిలియన్ యూనిట్ల (19శాతం) విద్యుత్ మాత్రమే ఛత్తీస్గఢ్ సరఫరా చేసింది. 2022–23లో పూర్తిగా నిలిపేసింది. తాజాగా ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు.. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి నివేదించాయి. ఛత్తీస్గఢ్తో వివాదాలు సద్దుమణిగితే 2022–23 రెండో అర్ధ వార్షికంలో 2,713 ఎంయూల (31%) విద్యుత్ సరఫరా జరగొచ్చని అంచనా వేస్తున్నామన్నాయి. భారీగా పెంచేసిన ఛత్తీస్గఢ్ 2022 జూన్ 3 నాటికి బకాయిపడిన రూ.3,576.89 కోట్లను చెల్లిస్తేనే ఒప్పందం మేరకు 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని 2022 సెప్టెంబర్ 23న ఛత్తీస్గఢ్ ఇన్వాయిస్ పంపింది. అయితే, రూ.2,100 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించాల్సి ఉందని అప్పట్లో తెలంగాణ డిస్కంలు బదులిచ్చాయి. తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యూనిట్ విద్యుత్కు రూ.3.90 మాత్రమే చెల్లిస్తామన్నాయి. అయితే, ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఖరారు చేసిన మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం ఆధారంగా ధర చెల్లించాలని ఆ రాష్ట్రం కోరుతోంది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఉత్తర్వులతోపాటు పీపీఏ తుది అనుమతులను సవాల్ చేస్తూ.. తెలంగాణ డిస్కంలు 2018లో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్)లో కేసు వేశాయి. ఎంవోయూ ఆధారంగా ఒప్పందం! ఛత్తీస్గఢ్లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు, సీఎస్పీడీసీఎల్ మధ్య 2015 సెప్టెంబర్ 22న ఒప్పందం (పీపీఏ) జరిగింది. టెండర్లకు బదులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంల సమక్షంలో 2014 నవంబర్ 3న జరిగిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఆధారంగా ఈ పీపీఏ జరిగింది. నాడు చౌకగా వస్తుందని.. నేడేమో నష్టమని.. ఛత్తీస్గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏళ్ల ఒప్పంద కాలంలో రూ.12వేల కోట్ల అదనపు భారం పడనుందని అప్పట్లో విద్యుత్ రంగ నిపుణులు రఘు ఈఆర్సీకి వివరించారు. అయితే, ఛత్తీస్గఢ్ నుంచి చౌకగానే విద్యుత్ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీని కోరింది. తాజాగా ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో మాత్రం రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతోందని తెలంగాణ డిస్కంలు అంగీకరించడం గమనార్హం. ఛత్తీస్గఢ్ విద్యుత్తో జరగనున్న నష్టంపై నాటి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్కుమార్ టీఎస్ఈఆర్సీకి 2016 డిసెంబర్లో లేఖ సైతం రాశారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీవేటు వేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పంపింది. ఛత్తీస్గఢ్ పీపీఏను కొన్ని మార్పులతో అనుమతిస్తూ టీఎస్ఈఆర్సీ 2017 మార్చి 31న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. డిస్కంలకు భారీగా నష్టం వివాదాల్లో ఉన్న బకాయిలను అప్టెల్ తీర్పునకు లోబడి చెల్లిస్తామని, వివాదాల్లేని బకాయిలను.. లేట్ పేమెంట్ సర్చార్జీ రూల్స్–2022 ప్రకారం చెల్లిస్తామని డిస్కంలు ఛత్తీస్గఢ్కు తెలిపాయి. అయినా ఛత్తీస్గఢ్ అంగీకరించడం లేదు. ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నామని డిస్కంలు ఈఆర్సీకిచ్చిన వివరణలో పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ను తెచ్చేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఎల్)కు చెందిన వార్ధా–డిచ్పల్లి–మహేశ్వరం ట్రాన్స్మిషన్ లైన్లో 1000 మెగావాట్ల కారిడార్ను 12 ఏళ్ల కోసం తెలంగాణ డిస్కంలు బుక్ చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ రాకపోయినా పీజీసీఎల్కు ట్రాన్స్మిషన్ చార్జీల (ఏటా రూ.400 కోట్లకు పైగా)ను చెల్లించి నష్టపోతున్నామని ఈఆర్సీకి తెలిపాయి. -
ఇంధన పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) అశోక్కుమార్ చెప్పారు. కేంద్ర విద్యుత్శాఖ ఆధ్వర్యంలోని బీఈఈ సహకారంతో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) విశాఖలో బుధవారం పెట్టుబడుల బజార్ పేరిట సదస్సు నిర్వహించింది. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సదస్సుని అశోక్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచిన పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గొప్ప విషయమన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో జాతీయస్థాయిలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ మొదటి అడుగు వేసిందని, వరుసగా ఇన్వెస్ట్మెంట్ బజార్స్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి పెట్టుబడుల సదస్సులకు విశేష స్పందన లభించటం బీఈఈకి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏపీ ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్వెస్ట్మెంట్ బజార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంధన సామర్థ్య పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఈíసీఎం ఆధ్వర్యంలో ఆర్థికసంస్థల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికత అమలు చేసే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం చేసిన ప్రతిపాదన కేంద్ర ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.15 వేలకోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విధానపరమైన ప్రమాణాలు రూపొందించడంలో ఏపీఎస్ఈíసీఎం ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన చెప్పారు. నిరంతర సరఫరాకు విద్యుత్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తరఫున ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పారు. ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పూర్తిస్థాయి సహాయ, సహకారాలందిస్తుందన్నారు. ఇంధన సామర్థ్యం అభివృద్ధితో ఇంధన భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదకారిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఈపీడీíసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, సూర్యప్రతాప్, పీఎఫ్సీ జనరల్ మేనేజర్ మదన్మోహన్, బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. ‘రైతు చేనుకు కడప మీటరు’ పేరుతో ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులో వాస్తవాలతో వారు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. రైతుల ప్రయోజనానికే మీటర్లు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోఎంఎస్ 22, తేదీ 01.09.2020) ప్రకారం పెడుతున్న ఈ మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల సరిపడా కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో.. దానికయ్యే చార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతుల ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కింద జమచేస్తుంది. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు రైతులకు లభిస్తుంది. కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుంది. తగ్గుతున్న నష్టాలు ప్రస్తుతం ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చాం. రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాల్సి ఉంది. ఈ వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ పద్ధతిలో రీడింగ్ తీయడం కష్టంగా ఉంది. అందుకే స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలు సంకల్పించాయి. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటుచేసిన తర్వాత ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (స్వతంత్ర గ్రూప్) సర్వే రిపోర్టు ప్రకారం నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైంది. ఆ టెండర్లు ఎప్పుడో రద్దు విద్యుత్ సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్ మీటర్లకు డీబీటీ విధానం కోసం ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లను గడువులోపు పూర్తిచేస్తే 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1,800 చొప్పున చెల్లిస్తాం. తర్వాత మిగిలిన మొత్తంతోపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలవ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని ఇస్తాం. వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేశారు. కోవిడ్–19 సమయంలో రూపొందించిన అంచనాల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వం టెండర్లు రద్దుచేసింది. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించిన తర్వాతే కొత్తగా టెండర్లు పిలుస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కో మీటరుకు నెలకు వ్యయం రూ.200.96 పైసలుగా ఖరారైంది. ఏడున్నర సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వీటిలో 80 శాతం సింగిల్ఫేజ్ మీటర్లు కాగా 20 శాతం మాత్రమే త్రీఫేజ్ మీటర్లు. కానీ ఏపీలో వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్ మీటర్లే. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వ అంచనా ధర పదేళ్ల కాలపరిమితికి రూ.6 వేలు. దీనికి అనుగుణంగా మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట తొమ్మిదిగంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించడానికి సుమారు రూ.1,700 కోట్లు ఖర్చుచేసి ఫీడర్లను ఏర్పాటు చేశాం. గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించాం. రానున్నరోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయం మీటరుకు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతోందని ఈనాడు దినపత్రిక రాసిన కథనంలో వాస్తవం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్తో పాటు, పీఈసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంకు సమకూరుతుంది. అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ను కూడా తగ్గించవచ్చు. వ్యవసాయ పంపుసెట్లకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని సంస్థలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. -
తీగ తెగితే.. కరెంటు ఆగాలి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం విద్యుత్ వైర్లను తాకడం వల్లనే జరుగుతున్నాయని, వీటి నుంచి ప్రజలను రక్షించేందుకు విదేశాల్లో అమల్లో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ స్టాండింగ్ కమిటీ సూచించింది. వైరు తెగిపోగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా చేసే ఫీడర్ ప్రొటెక్షన్ రిలే విధానంపై అధ్యయనం చేయాలని చెప్పింది. విద్యుత్ భద్రతపై జాతీయస్థాయిలో మూడేళ్ల తరువాత 6వ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. విద్యుత్ భద్రత, సరఫరాకు ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనలు–2010లో సవరణలు చేయాలని కమిటీ సూచించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. కమిటీ చైర్మన్ గౌతమ్ రాయ్ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు రాష్ట్రాలు సూచన లివ్వాలని కోరారు. వాటిని పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని సవరిం చేందుకు సీఈఏకి నివేదిక పంపుతామని తెలిపారు. కమిటీ మెంబర్ సెక్రటరీ రమేష్కుమార్ మాట్లాడుతూ 2017లో ఈ కమిటీ ఏర్పడి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తోందని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ భద్రతపై అవగాహన నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కండక్టర్ల స్నాపింగ్, లైవ్వైర్లతో జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున వాటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంద న్నారు. సీఈఏ అసిస్టెంట్ డైరెక్టర్ ముకుల్కుమార్ నేతృత్వంలో రాష్ట్ర ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం ఆ«ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముంబై (వెస్ట్), చెన్నై (సౌత్), ఢిల్లీ (నార్త్), కోల్కతా (ఈస్త్), మేఘాలయ (నార్త్ఈస్ట్) ప్రాంతీయ ఇన్స్పెక్టరేట్ల డైరెక్టర్లు, వివిధ రాష్ట్రాల ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ల సిబ్బంది పాల్గొన్నారు. -
సత్ఫలితాలిస్తున్న ‘పాట్’
సాక్షి, అమరావతి: భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) పదేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాట్ వల్ల రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్తో కూడిన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనం ఆదా అయింది. అంతేకాదు.. 2.464 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను కూడా తగ్గించింది. ‘బీఈఈ’ ప్రోత్సాహం పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ కరెంటును సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) పాట్ పథకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను అందిస్తోంది. రాష్ట్రంలో ఏపీఎస్ఈసీఎం ద్వారా 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది. ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందిస్తాయి. తద్వారా ఇంధన ఆదాకు దోహదపడతాయి. పాట్ పథకం లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కూడా బీఈఈ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 4,01,496 సర్టిఫికెట్లను అందించింది. వీటిని పవర్ ఎక్సే్ఛంజ్లో విక్రయించడం ద్వారా ఆ పరిశ్రమలు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించని పరిశ్రమలు ఆ సర్టిఫికెట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి. అలా 2,79,667 సర్టిఫికెట్లను పలు పరిశ్రమలు కొన్నాయి. అన్ని పరిశ్రమలు ‘పాట్’ పరిధిలోకి రావాలి భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్పై చేసే వ్యయం తగ్గుతుంది. పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో పాట్ పథకం వల్ల భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగింది. ఈ పథకం పరిధిలోకి రావాలని అన్ని పరిశ్రమలను కోరుతున్నాం. –కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
ఉచిత విద్యుత్పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఉచిత విద్యుత్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అమలుపై ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వెల్లడించారు. పైసా చెల్లించక్కర్లేదు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులైన రైతులెవరూ కరెంట్ బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, వారి ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆ డిస్కంలను డిమాండ్ చేసే హక్కు రైతులకు లభిస్తుందన్నారు. విద్యుత్ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతులపైకి నెట్టేయకుండా నిరోధించేందుకు మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు. ఒక రైతుకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించదని స్పష్టం చేశారు. అనధికార, అధిక లోడ్ కనెక్షన్లు కూడా క్రమబద్దీకరిస్తామన్నారు. కౌలు రైతులకు కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. మీటర్ల ఏర్పాటుకు రైతులు అనుకూలం మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పథకానికి అనుకూలంగా రాష్ట్రంలో లక్షలాదిమంది రైతులు(97 శాతం) ఇప్పటికే అంగీకార పత్రాలను అందజేశారని అధికారులు మంత్రికి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని, ఆ జిల్లాలో మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. ఈ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 30 ఏళ్ల పాటు ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ప్రత్యేకంగా వ్యవసాయం కోసమే 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. సమీక్షలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీట్రాన్స్కో సీఎండీ శ్రీధర్ పాల్గొన్నారు. -
లైన్మెన్తో గొడవ, రైతుకు షాకిచ్చిన విద్యుత్ సిబ్బంది, ఏకంగా రూ.65వేల బిల్లు
సాక్షి, వికారాబాద్: ఓ సామాన్య రైతు ఇంటికి సంబంధించి నెలకు రూ.65వేల విద్యుత్ బిల్లు రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని సొండేపూర్ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్ వ్యవసాయ కూలీ.. రోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇంటికి సర్వీస్ నంబర్ 58లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతినెల విద్యుత్ బిల్లు సక్రమంగానే చెల్లిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం లైన్మెన్.. రెడ్యానాయక్తో మీటర్ బాగాలేదు వేరే మీటర్ బిగించాలని చెప్పడంతో రైతు.. లైన్మెన్కు రూ.2వేలు ఇచ్చాడు. డబ్బులిచ్చి సంవత్సరం దాటినా కొత్త మీటర్ బిగించకపోవడంతో రెడ్యానాయక్ గత నెల (జూన్)లో లైన్మెన్ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు లైన్మెన్ వచ్చే నెల చూడు నీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని రైతుకు చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం జూలై నెలకు సంబంధించి ఏకంగా రూ.65,240 బిల్లు వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక రైతు విద్యుత్ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కాలుస్తేనే అంత బిల్లు వస్తదిగా అని నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. ఎన్నడూ రానంతగా ఇంతమొత్తంలో విద్యుత్ బిల్లు వస్తే ఎం చేయాలని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతినెల రూ.100లోపు బిల్లు వచ్చేదని దానిని నిర్ణీత గడువులోపు చెల్లిస్తూనే ఉన్నాని.. లైన్మెన్ కావాలనే బిల్లు ఎక్కువ వచ్చేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ ఖజాను వివరణ కోరగా 2014నుంచి రైతు మినిమం బిల్లును ప్రతి నెల కడుతున్నాడని అందుకే రీడింగ్ జామ్ అయ్యి అంత బిల్లు వచ్చిందన్నారు. రైతుకు బిల్లులో రూ.33వేలు తగ్గించామని చెప్పారు. -
యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, పోటెత్తుతున్న గోదావరి వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలోని విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనేక చోట్ల ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు కుప్పకూలాయి. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని రాజమండ్రి, అమలాపురం, రంపచోడవరం, రామచంద్రపురం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు డివిజన్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 5 దెబ్బతినగా ఒక సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. 33 కేవీ ఫీడర్ ఒకటి పాడైంది. 11 కేవీ ఫీడర్లు 29 పాడయ్యాయి. 11 కేవీ స్తంభాలు 534, 11 కేవీ లైన్లు 20 కిలోమీటర్లు, ఎల్టీ స్తంభాలు 557, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 2,326 దెబ్బతిన్నాయి. 4 మండలాలు, 241 గ్రామాలు, 2548 వ్యవసాయ,33226 వ్యవసాయేతర సర్వీసులకు 62 ప్రత్యేక బృందాలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు డిస్కం సీఎండీ సంతోషరావు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, సీఆర్డీఏ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో 33 కేవీ ఫీడర్లు 2, 33కేవీ స్తంభాలు 7, 11కేవీ ఫీడర్లు 13 దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 11కేవీ స్థంభాలు 173 పడిపోగా వాటిలో 104 నిలబెట్టారు. డిస్కం మొత్తం మీద 11కేవీ లైన్లు 3.54 కిలోమీటర్ల మేర తెగిపోగా బుధవారానికి 2.56 కి.మీ మేరకు బాగు చేశారు. ఎల్టీ లైన్లు 12.73 కి.మీ దెబ్బతినగా, 5 కి.మీ సరిచేశారు. ఎల్టీ స్తంభాలు 242 ఒరిగిపోగా 211 స్తంభాలను పునరుద్ధరించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) 77 దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో 31 డీటీఆర్లను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగవచ్చు.. జాగ్రత్త భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశముందని, విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని డిస్కంల సీఎండీలు విజ్ఞప్తి చేశారు. కరెంటుతో సంబంధం ఉండే ఏ వస్తువునైనా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరువాతే తాకాలని సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియజేయాలన్నారు. -
అన్ని చోట్లా పరిశ్రమలు
పటాన్చెరు: దిగుమతులకు చరమగీతం పాడేలా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పది వేల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఆల్ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం,డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడిదార్లకు భరోసా: గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేశారని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదార్లకు భరోసాను కల్పిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించామన్నారు. గ్రీన్ (సాగు), వైట్ (క్షీర), బ్లూ (నీలి – మత్య్స), పింక్ (మాంసాహార), ఎల్లో (ఆయిల్ – వంటనూనె) విప్లవం కొనసాగుతుందని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, 25 లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు (మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం) లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఆల్ప్లా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆల్ప్లా గ్లోబల్ సీఈఓ ఫిలిప్ లెహనర్, సంస్థ ఇండియా ఎండీ వాగీశ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరాయంగా విద్యుత్
సీలేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): భవిష్యత్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని ఏపీ జెన్కో హైడల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో పలు జలవిద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్కల్లా పోలవరం ప్రాజెక్టులో మూడు యూనిట్లు, 2024 జూలైలో మరో మూడు యూనిట్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2026 జనవరి నాటికి అన్ని యూనిట్లను పూర్తిస్థాయిలో ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. విండ్, సోలార్, హైడల్ విద్యుత్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలోని 4 యూనిట్లలో 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా.. అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా కూడా సీలేరు కాంప్లెక్సులో 1,035 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ ప్రాజెక్టు కోసం సర్వేలు చేపట్టామన్నారు. ఇవి పూర్తయితే రాష్ట్రమంతటికీ నిరంతరాయంగా విద్యుత్ అందించగలుగుతామని చెప్పారు. డొంకరాయి పవర్ కెనాల్ మరమ్మతు పనులు 80 శాతం పూర్తయినట్టు చెప్పారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!
వజ్రపుకొత్తూరు రూరల్: బుధవారం ఉదయం 8.30 గంటల సమయం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 15 గ్రామాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడి ఓ వైపు.. ఉక్కపోత మరోవైపు.. వెంటనే పలువురు వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సమాచారమిచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఐదుగురు లైన్మెన్లు, సచివాలయ విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి లైన్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. గంట సమయం గడిచినా సమస్య ఏంటనేది మాత్రం తేలలేదు. కిడిసింగి గ్రామం నుంచి మొదలైన వీరి అన్వేషణ డోకులపాడు వరకు సాగింది. చివరకు రెండున్నర గంటల తర్వాత డోకులపాడులోని చర్చి వద్దనున్న స్తంభంపైన అసలు విషయం బయటపడింది. తీగల మధ్య ఓ తొండ చిక్కుకుపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. దాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం తెలసుకున్న స్థానికులు ‘హమ్మ తొండా.. ఎంత పని చేశావే!’ అంటూ నవ్వుకున్నారు. -
పరిశ్రమలకు పూర్తి విద్యుత్తు
సాక్షి, అమరావతి: ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశ్రామిక రంగానికి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్ సంస్థల అధికారులతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై అన్ని పరిమితులను ఎత్తివేసి సాధారణ స్థితిని పునరుద్ధరించినట్లు మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ సరఫరా కొనసాగించాలనే లక్ష్యంతో అధిక ధరలతో కొనుగోలుకు కూడా వెనుకాడలేదన్నారు. విదేశీ బొగ్గుకు టెండర్లు రాష్ట్రంలో బొగ్గు సరఫరా పర్యవేక్షణకు కోర్ మేనేజ్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా స్థితిగతులను సీఎం తరచూ సమీక్షిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. థర్మల్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, 32 లక్షల టన్నుల విదేశీ బొగ్గు దిగుమతి కోసం టెండర్లు జారీ చేశామని వివరించారు. దేశంలో బొగ్గు సరఫరా ఇంకా సమస్యాత్మకంగానే ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్ సంస్థలకు సూచించారు. ఖరీఫ్కు కొరత రాకూడదు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాకూడదని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటున్నామని, బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్కో జేఏండీ ఐ. పృథ్వీతేజ్, డిస్కమ్ల సీఎండీలు కె.సంతోషరావు, జే పద్మజనార్దనరెడ్డి, హెచ్. హరనాథరావు, డైరెక్టర్ ఏవీకే భాస్కర్ పాల్గొన్నారు. -
పరిశ్రమలకు 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై విధించిన అన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఇంకా కొనసాగుతున్నా, రాష్ట్రంలో నిత్యం 195.26 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొన్నప్పటికీ పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచే పరిశ్రమలపై ఆంక్షల ఎత్తివేత వర్తిస్తుందని ఏపీఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. బొగ్గు కొరత, ఎండలతో.. వేసవి ఉష్ణోగ్రతల ప్రభావంతో గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 235 మిలియన్ యూనిట్లకు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్ విద్యుదుత్పత్తిలో సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పవర్ ఎక్ఛ్సేంజీల్లో యూనిట్ ధర రూ.16 నుంచి రూ.20 వరకూ పెరిగింది. ఫలితంగా సరఫరా తగ్గి కోతలు అనివార్యమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల విద్యుత్ వినియోగంపై నియంత్రణ విధించాల్సి వచ్చింది. డిస్కమ్ల అభ్యర్ధన మేరకు పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తూ ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో.. మే 9న పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసి ప్రభుత్వం ఊరట కలిగించింది. నిరంతరం నడిచే పరిశ్రమలు 70 శాతం విద్యుత్ వాడుకోవడానికి అనుమతిచ్చింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ ఈ నెల 13న ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 15 తరువాత పరిశ్రమలపై ఆంక్షలను పొడిగించలేదు. పరిశ్రమలకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ను అందించాలని, ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యుత్తు సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని ఆంక్షలు, నియంత్రణలను తొలగించడంతో పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఊరట లభించింది. వ్యవసాయం, గృహ విద్యుత్ అవసరాలకు కోతలు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా జరుగుతోంది. -
ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ
నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరేందుకు ఫిన్లాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలంటూ నాటోకు విజ్ఞప్తి చేసింది ఫిన్లాండ్. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. ఈ మేరకు మే 14 నుంచి(శనివారం) విద్యుత్ సరఫరాను ఫిన్లాండ్కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యా విద్యుత్ సరఫరాదారు కంపెనీ రావో నోర్డిక్ మాత్రం చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంతోనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చెల్లింపుల వ్యవహారంపై స్పష్టత ఏంటన్నది ఇటు రావో నోర్డిక్ కంపెనీగానీ, అటు ఫిన్గ్రిడ్ మాత్రం వెల్లడించలేదు. ఫరక్ పడదు ఇరవై ఏళ్ల ఇరు దేశాల వర్తక వాణిజ్యంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్ స్పందించింది. రష్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినంత మాత్రాన ఫరక్ పడదని ప్రకటించుకుంది. సరఫరా చేసుకునేది కొద్ది శాతమే కాబట్టి ఇబ్బంది ఏం ఉండబోదని ఫిన్నిష్ గ్రిడ్ ఆపరేటర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఫిన్లాండ్కు సరఫరా అయ్యేది పది శాతం విద్యుత్ మాత్రమే. ఆ లోటును స్వీడన్ నుంచి దిగుమతి చేయడమో లేదంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమో చేస్తామని ఫిన్లాండ్ ప్రకటించుకుంది. కానీ, రష్యా విద్యుత్ చౌకదనంతో పోలిస్తే.. ఫిన్లాండ్ భరించాల్సిన ఖర్చు ఎక్కువే కానుంది. ఇదిలా ఉంటే.. రష్యా ఫిన్లాండ్తో 1,300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. నాటోలో చేరాలని ఫిన్లాండ్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కేవలం రష్యా బెదిరింపుల మేరకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యం, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. చదవండి👉🏼: ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కీలక నిర్ణయం -
పరిశ్రమలపై తొలగనున్న ఆంక్షలు
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలపై విధించిన ఆంక్షలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సరఫరాపై పరిశ్రమలకు విధించిన కొద్దిపాటి ఆంక్షలను వీలైనంత త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై డిస్కంల సీఎండీలు స్పందిస్తూ.. బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అంతరాయాలు లేకుండా గృహాలకు నిరంతరం, వ్యవసాయానికి పగటిపూట 7గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డైరెక్టర్ ఏవీకే భాస్కర్, డిస్కంల సీఎండీలు సంతోషరావు, పద్మజనార్ధనరెడ్డి, హరనాథరావు పాల్గొన్నారు. -
కరెంట్ కష్టాలకు చెక్.. పునరుత్పాదక విద్యుత్కు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్ముందు కరెంట్ కష్టాలు తలెత్తకుండా.. పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించే లక్ష్యంతో 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ (పీఎస్పీ) ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి పుష్కలంగా నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటు ఇంధన రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అంతేకాక.. మన విద్యుత్ అవసరాలు తీర్చుకుంటూనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండటంతో, రాష్ట్రానికి ఆదాయం సమకూరనుంది. రిపోర్టులన్నీ సిద్ధం.. రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల 33,240 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ పీఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించి టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్లను అధికారులు రూపొందించారు. మొదటి దశలో 6,600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడుచోట్ల నిర్మించే ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేస్తున్నారు. వీటిలో నాలుగు రిజర్వాయర్ల ఆధారిత ఆన్ రివర్ ప్రాజెక్టులు కాగా.. మరో మూడు ఆఫ్ రివర్ ప్రాజెక్టులని అధికారులు చెబుతున్నారు. ఇక మొదటి దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లకు అధికారులు పంపించారు. గండికోట, కురుకుట్టి, కర్రివలసల్లో ఏర్పాటుచేసే పీఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వేను పూర్తిచేశారు. అలాగే.. చిత్రావతి, గండికోట, సోమశిల, కురుకుట్టి, కర్రివలసలలో ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. రెండో దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కూడా న్యూ–రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అధికారులు రూపొందిస్తున్నారు. ఆదాయంతోపాటు యువతకు ఉపాధి ప్రతి వినియోగదారునికి ఇరవై 4 గంటలూ విద్యుత్ సరఫరాను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి పీఎస్పీ ప్రాజెక్టులు దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెన్యువబుల్ ఇంధన ఎగుమతి విధానం కింద పీఎస్పీ ప్రాజెక్టుల్లో తయారయ్యే విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. అదే విధంగా వీటివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది. – ఎస్ రమణారెడ్డి, వైస్చైర్మన్/ఎండీ, ఎన్ఆర్ఈడీసీఏపీ -
సింహాద్రిలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
పరవాడ/పెదగంట్యాడ/సీలేరు: అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహాద్రి ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను కలపాక, గాజువాక 400 కేవీ సబ్స్టేషన్లకు సరఫరా చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వల్ల సబ్స్టేషన్ల లైన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సింహాద్రి ఎన్టీపీసీలోని 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి కల్లా నాలుగో యూనిట్ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరుగుతుందని, బుధవారం ఉదయానికి మిగిలిన 3 యూనిట్ల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. హిందూజా, సీలేరులోనూ అంతరాయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల సాంకేతిక లోపం తలెత్తడంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోనూ 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెందుర్తి 400 కేవీ సబ్స్టేషన్ నుంచి గ్రిడ్కు వెళ్లాల్సిన లైన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో యూనిట్లు ట్రిప్ అవ్వడంతో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లోని పలు చోట్ల తెల్లవారుజామున 3.15 నుంచి 5 గంటల వరకు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో కలపాక వద్ద గల సబ్స్టేషన్లో హై ఇన్సులేషన్ ఫీడర్ ఆగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
సాగు, ఇళ్లకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరెంట్ కష్టాలు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్ను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది. ఇక పరిశ్రమలు మాత్రం ఇంధన శాఖ విధించిన ఆంక్షలను మరికొన్నాళ్లు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వతేదీ వరకు పరిశ్రమలు, హెచ్టీ సర్వీసుల విద్యుత్ వినియోగంపై పరిమితులను పొడిగించేందుకు డిస్కమ్లు చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించింది. డిస్కమ్లు ఏప్రిల్ 8వతేదీ నుంచి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రతతో.. రాష్ట్రంలో తాజాగా రోజూ 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మే నెల మొదటి వారానికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి కొంతమేర కరెంట్ అందుబాటులోకి వస్తుందని భావించినా ఎండల కారణంగా ఏమాత్రం వినియోగం తగ్గలేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు కోసం రోజూ రూ.37.73 కోట్లు ఖర్చు చేస్తోంది. సగం తగ్గించుకుంటే.. గృహ, వ్యవసాయ సర్వీసులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలపై ఆంక్షలు కొనసాగించాల్సి వస్తోందని ఇంధనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ప్రతి రోజూ 50 శాతం మాత్రమే వినియోగించాలని, మిగతా పరిశ్రమలు వారంలో ఒకరోజు పవర్ హాలిడే పాటించాలని నిబంధనలు విధించారు. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా విద్యుత్తు వాడకాన్ని 50 శాతం మేర తగ్గించుకోవాలని, ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్వాహకులు, సంఘాల అభ్యర్థన మేరకు కొన్నిటికి మినహాయింపులు, చార్జీల నుంచి వెసులుబాటును ఏపీఈఆర్సీ కల్పించింది. పవర్ హాలిడే ఇలా ► ఏపీఎస్పీడీసీఎల్లో పరిధిలోని తిరుపతిలో శుక్రవారం, హిందుపురం డివిజన్లో శనివారం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సోమవారం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మంగళవారం, నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లలో బుధవారం, పుత్తూరు డివిజన్లో గురువారం పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్నట్టు సీఎండీ హెచ్.హరనాధరావు తెలిపారు. ► ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖ జోన్–11 డివిజన్లో శుక్రవారం, జోన్–1, జోన్–3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లలో శనివారం, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లలో గురువారం పవర్ హాలిడే ప్రకటించినట్లు సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ► ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరులో శుక్రవారం, విజయవాడలోని గుణదల, మాచర్ల, కందుకూరులో శనివారం, విజయవాడ గ్రామీణ, గుంటూరు–1 టౌన్, మార్కాపురం, చీరాలలో సోమవారం, మచిలీపట్నం, బాపట్ల, అద్దంకిలో మంగళవారం, విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతిలో బుధవారం, గుడివాడ, నరసరావుపేట, దర్శిలో గురువారం పవర్ హాలిడే విధిస్తున్నామని సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
‘చీకటి’ రాజకీయంపై విచారణకు ఆదేశం
శాంతిపురం/తిరుపతి రూరల్: టీడీపీ నాయకులు ప్రమాదం పేరిట విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించి, విద్యుత్ కోతలపై నిరసనలకు దిగిన వ్యవహారంపై ఎస్పీడీసీఎల్ సీరియస్గా స్పందించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ హరనాథరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ నాయకులు శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కెనమాకులపల్లిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని శాంతిపురం సబ్స్టేషన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. కరెంటు పోగానే విద్యుత్ కోతలకు నిరసనగా గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఎమ్మెల్సీ భరత్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.హరిని విచారణ అధికారిగా నియమించింది. ఘటనతో సంబంధం ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ను తొలగించేందుకు ఆదేశాలిచ్చారు. విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులైన ఇతర అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలకు సిఫార్సు చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నట్టు పేర్కొన్నారు. -
త్వరలో మరింత విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల 15వ తేదీ నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నామని, దీంతో త్వరలోనే మరింత విద్యుత్ అందుబాటులోకొస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అనూహ్యంగా విద్యుత్ కొరత ఏర్పడినా, భవిష్యత్లో భారీగా డిమాండ్ ఏర్పడినా తట్టుకునేలా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. పవర్ ఎక్సే్చంజ్లో యూనిట్ రూ.12 నుంచి 16 వరకు ఉండగా, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల చొప్పున పాతికేళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడం కోసం ‘సెకీ’ ద్వారా యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. నేడు టెండర్లకు ఆహ్వానం కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్లో(800 మెగావాట్లు) ఉత్పత్తిని పెంచేందుకు ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే లక్ష టన్నులు దిగుమతి చేసుకున్న (ఇంపోర్టెడ్) మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచినట్టు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల మేరకు ఏపీజెన్కో 18 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం, ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నుల బొగ్గు కోసం టెండర్లను సోమవారం ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రక్రియను నెలలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణపట్నం ఫేజ్–2 ప్లాంట్ను ఈ నెలాఖరుకుగానీ, జూన్ మొదటి వారానికి గానీ ప్రారంభించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినట్లు బి.శ్రీధర్ చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో ఏపీ ట్రాన్స్ కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్దన్ రెడ్డి, కె.సంతోషరావు, ట్రాన్స్ కో డైరెక్టర్ ఏవీకే భాస్కర్, జెన్ కో డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ప్రజల్ని కాల్చిచంపిన వారిని మర్చిపోయారా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై మాట్లాడుతున్న వారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమాలు చేసిన రైతులపై కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఉదంతాలను మరిచిపోయారా.. అని విద్యుత్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఉత్పన్నం కావని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలపై దృష్టిసారించి సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరాపై ఏపీ జెన్కో, ట్రాన్స్కో, నెడ్క్యాప్, ఏపీఎస్ఈసీఎంల అధికారులతో సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ల నుంచి త్వరలో మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆరువేల మెగావాట్ల హైడల్ (పంప్డ్ హైడ్రో స్టోరేజీ) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విద్యుత్ కొరత తాత్కాలికమేనని, మే ఒకటి నుంచి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. రోజుకు 55 మిలియన్ యూనిట్ల కొరత రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని పెద్దిరెడ్డి చెప్పారు. రోజుకు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దీన్లో 30 మిలియన్ యూనిట్లను విద్యుత్ ఎక్సే్ఛంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేసున్నామన్నారు. గృహవిద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్లోను 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. బొగ్గుసరఫరాలో ఎదురవుతున్న సమస్యల కారణంగా థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ వినియోగానికి పరిమితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, నెడ్క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఆంక్షలకు మినహాయింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి పరిశ్రమలకు అమలుచేస్తున్న ఆంక్షలపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూనే పలు పరిశ్రమలు, హెచ్టీ వినియోగదారులకు వాటి నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమలపై అదనపు చార్జీలు విధించడానికి అనుమతిస్తూ, తద్వారా విద్యుత్ డిమాండ్ను సమతుల్యం చేసి, కోతలు పెరగకుండా చర్యలు చేపట్టింది. ఈనెల 22 వరకూ ఆంక్షలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత ప్రభావం రాష్ట్రంపైనా పడిన విషయం తెలిసిందే. రోజుకు సగటున 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఇందులో కనీసం 40 మిలియన్ యూనిట్లు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కానీ, అక్కడ తీవ్రపోటీతో విద్యుత్ దొరకడంలేదు. ఈ నేపథ్యంలో.. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు నివారించడానికి పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. ఇక నిరంతరం విద్యుత్ వాడే పరిశ్రమలు తమ వినియోగంలో 50 శాతం తగ్గించుకుని, మిగతా సగంతో నడుపుకునే అవకాశం కల్పించారు. అంతేకాక.. పగటిపూట నడిచే ఇతర పరిశ్రమలు వారాంతపు సెలవుతో పాటు ఈనెల 22 వరకూ మరోరోజు విద్యుత్ వినియోగించడం కుదరదు. ఈనెల 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా ఇలా డిస్కంలు తాము తీసుకున్న నిర్ణయాన్ని, అందుకు దారితీసిన పరిస్థితులను ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకువెళ్లాయి. వాటిని పరిశీలించిన మండలి.. పవర్ హాలిడే, ఇతర నిబంధలను సమర్థిస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 22 విభాగాలకు మాత్రం వీటి నుంచి మినహాయించాలని సూచించింది. అదే విధంగా.. ఈ నిబంధనలను పరిశ్రమలు ఖచ్చితంగా పాటించేలా చేసేందుకు డిస్కంలు చేపట్టిన చర్యలకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఇకపై పరిశ్రమలు పవర్ హాలిడే, ఇతర నిబంధనలను అతిక్రమించి విద్యుత్ వినియోగిస్తే వాటిపై డిమాండ్ చార్జీలు విధిస్తారు. అవి ప్రస్తుత ధరలకు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పవర్ హాలిడే రోజు విద్యుత్ వాడితే ఒకటిన్నర రెట్లు ఎనర్జీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్యలవల్ల పరిశ్రమలు నిబంధనల మేరకే విద్యుత్ వినియోగిస్తాయి. దీనివల్ల సగటున రోజుకు పరిశ్రమల నుంచి ఆదా అవుతున్న 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ను గృహ, వ్యవసాయ అవసరాలకు మళ్లించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మినహాయింపు పొందిన పరిశ్రమలు, హెచ్టీ సర్వీసులు.. ► ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ► ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ► వార్తాపత్రికల ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ► పోర్టులు, ఏఐఆర్, దూరదర్శన్ ► విమానాశ్రయాలు, విమానయాన సంబంధిత సేవలు ► డెయిరీలు, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు ► ఐస్క్రీమ్ తయారీ పరిశ్రమలు ► కేంద్ర ప్రభుత్వ ఆర్ అండ్ డీ యూనిట్లు ► నీటిపారుదల నిర్మాణ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా ► నావల్ డాక్యార్డ్, విశాఖపట్నం ► చమురు అన్వేషణ సర్వీస్ కనెక్షన్లు, చమురు శుద్ధి కర్మాగారాలు ► రైల్వే ట్రాక్షన్, రైల్వే వర్క్షాప్లు, గూడ్స్ షెడ్లు, రైల్వేస్టేషన్లు ► ఆసుపత్రులు ► పోలీస్స్టేషన్లు, అగ్నిమాపక స్టేషన్లు ► రక్షణ సంస్థలు ► వీధి దీపాలు ► తాగునీటి సరఫరా పథకాలు ► నీటి పనులు, నీటి పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు ► మతపరమైన ప్రదేశాలు ► యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ► మెడికల్ ఆక్సిజన్ తయారీ కర్మాగారాలు -
నెలాఖరుకు నిశ్చింత!
సాక్షి, అమరావతి: విద్యుత్ కొరత తాత్కాలికమేనని, ఈ నెలాఖరు నాటికి సరఫరా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా ఈ నెల 18న విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి తొలి సమీక్ష నిర్వహించనున్నారు. ఇదీ పరిస్థితి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా డిమాండ్, సరఫరాలో అంతరం తలెత్తి పలు రాష్ట్రాలు విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నాయని ఇంధన శాఖ అధికారులు మంత్రి పెద్దిరెడ్డికి తెలియచేశారు. బొగ్గు కొరతతో మహారాష్ట్రలో 1375 మెగావాట్ల లోడ్ చొప్పున రోజూ 3 గంటల పాటు లోడ్ రిలీఫ్ విధిస్తుండగా గుజరాత్లో పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో గురువారం 208 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఏపీ జెన్కో నుంచి 71 ఎంయూ, కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి 40 ఎంయూ, జల విద్యుత్తుతో 6.6 ఎంయూ, సౌర విద్యుత్తుతో 24 ఎంయూ, పవన విద్యుత్ 16 ఎంయూ, హిందుజా 9.4 ఎంయూ, ఇతర ఉత్పత్తి కేంద్రాల ద్వారా 4 ఎంయూ, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి దారుల నుంచి 11 ఎంయూల చొప్పున మొత్తం 182 మిలియన్ యూనిట్లు సమకూరిందని వివరించారు. మరో 26 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నాటికి విద్యుత్ సరఫరా చాలావరకు మెరుగుపడుతుందని వెల్లడించారు. రాబోయే 25 ఏళ్ల పాటు వ్యవసాయ విద్యుత్కు ఇబ్బంది లేకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. ఇబ్బందుల్లోనూ నాణ్యమైన కరెంట్ బహిరంగ మార్కెట్లో కూడా తగినంత విద్యుత్ దొరకని పరిస్థితుల్లోనూ గృహ వినియోగదారులకు వీలైనంత మేర తక్కువ అంతరాయాలతో నాణ్యమైన కరెంట్ సరఫరా జరుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మే 1నుంచి రైతులకు పగటిపూటే 9 గంటలు అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. గృహ, వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నవరత్నాల అమల్లో భాగంగా విద్యుత్కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యుత్తు రంగాన్ని ఆదుకునేందుకు రెండున్నరేళ్లలో దాదాపు రూ.35 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలతో రాష్ట్రంలో విద్యుత్ కొరత అదుపులోకి వస్తోంది. గృహావసరాలకు ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణంగా నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి సైతం పగటిపూట 7 గంటల విద్యుత్ అందుతోంది. 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు రాష్ట్రంలో మంగళవారం 226 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఏపీ జెన్కో, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జల, సౌర, పవన, గ్యాస్ ఆధారిత కేంద్రాల ద్వారా మొత్తం 197 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. 29 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడటంతో బహిరంగ మార్కెట్ నుంచి డిస్కంలు 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాయి. వ్యవసాయ రంగానికి 7 గంటలు, గృహావసరాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి 17.6 మిలియన్ యూనిట్ల మేర లోడ్ రిలీఫ్ అమలు చేసినట్లు ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పంటలు చాలా వరకూ కోతలు పూర్తవ్వడం, కొన్ని పంటలు చివరి దశలో ఉన్నందున వ్యవసాయావసరాలకు రోజుకి 7 గంటలు విద్యుత్ సరఫరా సరిపోతుందని, అయినప్పటికీ కొన్ని చోట్ల 9 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నామని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. నెలాఖరుకు పరిశ్రమలకూ సంపూర్ణంగా.. ఈ నెల 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పవర్ హాలిడేలో భాగంగా ఈ నెల 11 వరకూ పరిశ్రమలకు 72.04 మిలియన్ యూనిట్ల లోడ్ రిలీఫ్ ఇచ్చినట్లు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పరిశ్రమలకు కూడా పూర్తిస్థాయి సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, కొన్ని పరిశ్రమలకు ముందు, మిగతా వాటికి తరువాత దశల వారీగా నియంత్రణలు తొలగిస్తామని ఆయన వెల్లడించారు. -
ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ అప్రమత్తమైంది. వేసవి, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గృహ విద్యుత్కూ డిస్కమ్లు ప్రాధాన్యమిస్తున్నాయి. రోజూ 50 ఎంయూల కొరత రాష్ట్రంలో 2018–19లో మొత్తం విద్యుత్ డిమాండ్ 63,605 మిలియన్ యూనిట్లు ఉండగా 2021–22 నాటికి 68,905 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 8.3 శాతం పెరిగింది. గృహ వినియోగం 32 శాతం, పారిశ్రామిక వినియోగం 6 శాతం, వ్యవసాయ వినియోగం 16 శాతం చొప్పున పెరిగింది. గృహ విద్యుత్ డిమాండ్ 2018–19లో 14,681 ఎంయూలు ఉండగా 2021–22లో 19,355 మిలియన్ యూనిట్లకు చేరింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్ 17,781 మిలియన్ యూనిట్ల నుంచి 18,844 మిలియన్ యూనిట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో వాడకం 10,832 మిలియన్ యూనిట్ల నుంచి 12,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వివిధ రంగాల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా రోజూ 50 మిలియన్ యూనిట్ల మేర కొరత ఎదుర్కొంటున్నట్లు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో నిత్యం 30 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు చేస్తుండగా మరో 20 ఎంయూల కొరత నెలకొంది. ఈ నెలలో విద్యుత్ డిమాండ్ 6,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొరతకు రెండు ప్రధాన కారణాలు.. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో వివిధ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడానికి ఇది ఒక కారణం. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బొగ్గు కొరత కారణంగా కొద్ది నెలలుగా అసాధారణంగా పెరిగాయి. ఇది మరో ప్రధాన కారణం. గతంలో టన్ను బొగ్గు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉండగా ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేలకు చేరింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్ డిమాండ్ను అందుకునేందుకు వివిధ రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోలుపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం యూనిట్ ధర పీక్ అవర్స్లో రూ.12 వరకూ ఉంది. నెలాఖరుకు సాధారణ పరిస్థితి.. ‘‘రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ డిమాండ్ను అందుకునేలా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్యుత్ కొరత కారణంగా పారిశ్రామిక వినియోగంపై కొంతమేర ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆదా చేసిన విద్యుత్ను వ్యవసాయ, గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విద్యుత్ కొరత సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించడంలో రాజీ లేదు’’ – బి.శ్రీధర్, ఇంధన శాఖ కార్యదర్శి -
విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంపు
సాక్షి, అమరావతి: ఇటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే అటు డిస్కమ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 2022–23 రిటైల్ విద్యుత్ సరఫరా ధరలను సవరించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చార్జీలను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి గృహ విద్యుత్ వినియోగదారులపై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం తిరుపతిలో వెల్లడించారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా సగటున 3.26 శాతం పెరిగిన చార్జీల కారణంగా మూడు డిస్కమ్లకు ఏటా దాదాపు రూ.1,400 కోట్ల రాబడి అదనంగా సమకూరనుంది. ఏప్రిల్ 1వతేదీ నుంచి ఈ చార్జీలు అమలులోకి రానున్నాయి. కామన్ టెలిస్కోపిక్ విధానం డొమెస్టిక్ కేటగిరీలో ఉన్న మూడు గ్రూపులను కామన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్తో ఒకే గ్రూపుగా కమిషన్ తాజాగా విలీనం చేసింది. ఈ విధానంలో వినియోగదారుడు తక్కువ స్లాబ్లో చేసిన వినియోగానికి సంబంధిత తక్కువ స్లాబ్ టారిఫ్లో బిల్ వేస్తారు. పేద గృహ వినియోగదారుల కోసం 0–30 యూనిట్ల కొత్త స్లాబ్ను ప్రవేశపెట్టారు. దీనివల్ల యూనిట్లు పెరిగినప్పటికీ స్లాబుల ప్రకారమే బిల్లు పడుతుంది. కమర్షియల్ 2 కేటగిరీ కింద ఉన్న మైనర్, మేజర్ సబ్ కేటగిరీలను విలీనం చేయడంతో నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వినియోగదారులకు ఎనర్జీ ఛార్జీలు తగ్గుతాయి. గృహ విద్యుత్ టారిఫ్ను స్వల్పంగా పెంచినా వీరిలో 90 శాతం మంది సగటు సరఫరా వ్యయం యూనిట్ రూ.6.98 కంటే తక్కువ టారిఫ్లోకి వస్తారు. 75 యూనిట్ల వరకు వినియోగానికి సంబంధించి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వినియోగదారుల సంఖ్య మొత్తం గృహ వినియోగదారుల సంఖ్యలో 50 శాతం ఉంటుంది. వీరికి డిస్కమ్లు కొనుగోలు ధర కంటే తక్కువకే విద్యుత్ను సరఫరా చేస్తాయి. కామన్ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్కు రూ. 8.75 చొప్పున పడుతుంది. ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొదటి 50 యూనిట్లకు యూనిట్కు రూ.2.65, తర్వాత 50 యూనిట్లకు రూ.3.35, ఆ తర్వాత 100 యూనిట్లకు రూ.5.40, చివరి 50 యూనిట్లకు రూ.7.10 చొప్పున పడుతుంది. ఈ లెక్కన మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే. పరిశ్రమలకు ‘టైమ్ ఆఫ్ డే’ రాయితీలు టీఓడీ చార్జీలు పగలు 0.75 పైసలు తగ్గించడం ద్వారా పగటిపూట మాత్రమే పనిచేసే అధిక శాతం పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. పౌల్ట్రీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లకు రాయితీ టారిఫ్, ఆక్వా, పౌల్ట్రీ హేచరీలకు టీఓడీ నుంచి మినహాయింపునిచ్చారు. 2 కిలోవాట్ కంటే తక్కువ, 2 కిలోవాట్ కంటే ఎక్కువ కనెక్టెడ్ లోడ్ కలిగిన మతపరమైన ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని టారిఫ్ను కిలోవాట్కు ప్రస్తుతం ఉన్న రూ.4.80 నుంచి రూ.3.85కు మండలి తగ్గించింది. గోశాలలకు వర్తించే టారిఫ్ను కూడా ఇదే ప్రకారం కుదించారు. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు.. గ్రిడ్ సపోర్ట్ చార్జీలను పునరుద్ధరించాలని డిస్కమ్లు కోరగా కిలోవాట్కి రూ.15 నుంచి రూ.50 వరకు విధించడం ద్వారా సంబంధిత విద్యుదుత్పత్తిదారులకు ఊరట కల్పించారు. ఓ కేటగిరిలోని పారిశ్రామిక వినియోగదారులపై ఓల్టేజ్ సర్చార్జీ విధించాలన్న డిస్కమ్ల ప్రతిపాదనను మండలి అంగీకరించలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా 132 కేవీ కంటే 220 కేవీ ఓల్టేజీ వినియోగదారులకు 0.5 పైసలు తక్కువ టారిఫ్ను మండలి నిర్ణయించింది. పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్కు సంబంధించి విద్యుత్ పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఖర్చులను రూ.3,368, రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే 2022–23లో వినియోగదారుల నుంచి రూ.2,910.74 కోట్ల కంటే తక్కువ మొత్తం మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ వసూలు మొదలవుతుంది. సరఫరా వ్యాపారం సర్దుబాటు ఖర్చులకు సంబంధించి 3వ నియంత్రణ కాలానికి రూ.492 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే ఏపీ ట్రాన్స్కోకు రానున్న పాయింట్ ఆఫ్ కనెక్షన్ (పీఓసీ) ఛార్జీల నుంచి దీన్ని సర్దుబాటు చేయాలని ఆదేశించడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు పోర్టల్ వినియోగదారులు అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకునేందుకు పంపిణీ సంస్థల వెబ్సైట్లలో సౌకర్యాన్ని కల్పించాలని మండలి ఆదేశించింది. పైలట్ ప్రాజెక్ట్లకు రూ.3 కోట్లు విద్యుత్ పొదుపు ఉపకరణాలు, సౌర విద్యుత్తుతో వ్యవసాయం మొదలైన ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టడానికి నెలలోగా తమ బకాయిల నుంచి రూ.కోటి చొప్పున ఏపీసీడ్కోకు మూడు డిస్కంలు మొత్తం రూ.3 కోట్లు విడుదల చేయాలని మండలి ఆదేశించింది. అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయం తిరుపతి రూరల్: వినియోగదారులకు ఊరట కల్పించటంతోపాటు డిస్కంలకు ఆర్థిక భరోసా కల్పించేలా విద్యుత్ టారిఫ్లను ఆమోదించినట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనెట్ హాలులో ఆయన విద్యుత్ టారిఫ్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి టారిఫ్ ప్రకటించినట్లు తెలిపారు. గతంలో ఉన్న మూడు రకాల శ్లాబ్లను ఎత్తివేసి అందరికీ ఉపయోగపడేలా కొత్తగా కామన్ టెలిస్కోపిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఫంక్షన్ హాళ్లు తెరవకున్నా గతంలో నెలకు కిలోవాట్కు విధించిన రూ.100 కనీస చార్జీల్ని ఎత్తివేశామన్నారు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్కు రూ.6.70 ధరను కొనసాగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్సింగ్, రాజగోపాల్రెడ్డి, డిస్కమ్ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, సంతోషరావు పాల్గొన్నారు. -
కరెంట్ బకాయిలపై బాధ్యత తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన నష్టాలతోపాటు కోవిడ్ కారణంగా రాబడి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి బకాయిల వసూలు అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసినందున బకాయిలు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ నెలకొల్పాలని కోరారు. పన్నుల వాటాలో మినహాయించైనా.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్లు చెల్లించాల్సిన రూ.6,111 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించి నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కోరింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభా పక్షనేత పీవీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం ఆర్కే సింగ్ను కలుసుకుని పలు అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ జెన్కో 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ డిస్కమ్లకు విద్యుత్ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో గతేడాది నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చల సందర్భంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఇంతవరకు కొలిక్కి రాలేదని తెలిపారు. తెలంగాణ వాటాగా కేంద్రం విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచైనా మినహాయించి ఆంధ్రప్రదేశ్కు బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు. వినతిపత్రంలో ఇతర అంశాలు.. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్బీపీపీఎల్ ప్లాంట్ కోసం కేవలం 5 ఎకరాలను మాత్రమే వినియోగిస్తోంది. వృథాగా ఉన్న మిగిలిన 748 ఎకరాలను ఎన్టీపీసీ – ఏపీఐఐసీ జాయింట్ వెంచర్తో పవర్ ఎక్విప్మెంట్ తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్ జోన్గా మార్చాలి. ► కరువు నివారణకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 27 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రూ.12,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్పీవీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి రుణ సదుపాయం కల్పించాలి. ఆక్వా రైతులకు బీమా కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు బీమా పాలసీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, కేంద్రం మద్దతిస్తే మెరుగైన తోడ్పాటు అందించవచ్చని నివేదించారు. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. సీడ్, ఫీడ్ అందజేయడంతోపాటు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలాను కలుసుకుని ఈమేరకు పది అంశాలపై వినతిపత్రాన్ని అందజే సింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత వీరిలో ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేటల్లో రూ.75 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్రం అనుమతించిందన్నారు. నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం, పరస్పరం కేసులు నమోదు కావడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పులికాట్ సరస్సులో ఇసుకమేట డ్రెడ్జింగ్కు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వినతిపత్రంలో ఇతర ముఖ్యాంశాలివీ.. ► సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్వా కల్చర్ అథారిటీ ప్రాంతీయ కార్యాలయానికి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఆక్వా రంగం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంలో రూ.15,600 కోట్ల వాటా ఏపీదే. ► ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ తోడ్పాటు ఇవ్వాలి. ► రూ.40 కోట్లతో విశాఖ జిల్లా బండారుపల్లిలో ఆక్వా క్వారంటైన్ సెంటర్కు సవరించిన అంచనాలతో కేంద్రం గ్రాంటు మంజూరు చేయాలి. ► విశాఖలో నౌకాదళ విన్యాసాల సమయంలో జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ► బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. -
వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): వేసవిలో డిమాండ్కు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని రాష్ట్ర ఇంధన శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. విజయవాడ 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్సెట్ మెడోస్లో రూ.3.60 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..వేసవిలో ఎటువంటి పవర్కట్ లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా అందించాలని, అవసరమైతే అదనంగా విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. టీడీపీ హయాంలోని రూ.26 వేల కోట్ల బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన ట్రూఅప్ చార్జీలను సైతం తిరిగి చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రూ.2.49కు లభించే విద్యుత్ రూ.4.84 చెల్లించడానికి గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పీపీఏ చేసుకున్నారో టీడీపీ నేతలు చెప్పాలని అన్నారు. 86 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. తమ పథకాలే తమ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని, వచ్చే ఎన్నికల్లో 150కు పైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. -
పీపీఏ ప్రకారమే చెల్లింపులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) పేర్కొన్న ధరల ప్రకారమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లింపులు చేయాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) ఆదేశించింది. ఇప్పటికీ చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. పవన విద్యుత్కు యూనిట్ రూ.2.43, సౌర విద్యుత్కు యూనిట్ రూ.2.44 చొప్పున చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది. అలాగే, పీపీఏలను పునః సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఉందని, అభ్యంతరాలన్నీ ఈఆర్సీ ముందు ప్రస్తావించుకోవాలని పవన, సౌర విద్యుత్ సంస్థలకు స్పష్టంచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం రద్దుచేసింది. ఈఆర్సీ ముందున్న ఓపీ 17, ఓపీ 27కు సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కొట్టేసింది. ఇక పవన, సౌర విద్యుత్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్లో కోత విధిస్తూ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలుచేస్తూ లోడ్ డిస్పాచ్ సెంటర్ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పవన, సౌర విద్యుత్ కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఇటీవల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. పీపీఏ నిబంధనలను మార్చలేం.. ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల పవన, సౌర విద్యుత్ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయలేకపోతున్నామన్న డిస్కంల వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలను వసూలుచేస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులని చెప్పడం సరికాదని ధర్మాసనం స్పష్టంచేసింది. పీపీఏ నిబంధనలను పార్టీలు గానీ, కోర్టుగానీ మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పీపీఏలను ఏపీఈఆర్సీ పునః సమీక్షించేంత వరకు మధ్యంతర ఏర్పాటుకింద పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని, అవి చట్టానికి అనుగుణంగాలేవని ధర్మాసనం ఆక్షేపించింది. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దుచేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అలాగే.. 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరించి రేట్లను కుదించే అధికారం ఈఆర్సీకి లేదని ధర్మాసనం తెలిపింది. టారిఫ్లో మార్పులతో పెట్టుబడులపై ప్రభావం ‘ప్రజాభిప్రాయాన్ని సేకరించి, డిస్కంల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఏపీఈఆర్సీ పవన విద్యుత్ టారిఫ్ను ఖరారుచేసింది. దీనికి అనుగుణంగానే రూ.30 వేల కోట్ల మేర పవన విద్యుత్ రంగంలో దీర్ఘకాల ప్రణాళికల ఆధారంగా పెట్టుబడులు పెట్టారు. గ్లోబల్ వార్మింగ్, ఉద్గారాల తగ్గింపులో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి దానికి సంబంధించిన టారిఫ్, నిబంధనల్లో మార్పుచేస్తే అది ప్రపంచంలోని పెట్టుబడిదారులపై పడుతుంది. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఒప్పందాలను కొనసాగించేందుకు డిస్కంలు సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. డిస్కంలు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. కాబట్టి డిస్కంల ఆర్థిక పరిస్థితికి మరేదైనా కారణం కావొచ్చుగానీ, పీపీఏలో నిర్ణయించిన టారిఫ్ కాదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
కొందామన్నా బొగ్గు ఇవ్వని కేంద్రం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయానికి ఎటువంటి కొరత రాకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడటం లేదు. పాత, కొత్త బకాయిలు చెల్లిస్తూ ఎప్పటికప్పుడు ఎంత ధర అయినా చెల్లించి బొగ్గును, బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేస్తోంది. భవిష్యత్లోనూ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కొనేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం మేరకు బొగ్గు అందించకపోగా, కొరత రాకుండా నిల్వలు పెంచుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తోంది. సరిపడా బొగ్గు ఇవ్వాల్సిన కేంద్రమే ఇవ్వడం తగ్గించేసి, ఇలా చెప్పడమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నిల్వలు పెంచుకోండి.. బయటకు అమ్మకండి దేశ విద్యుత్ అవసరాల్లో సుమారు 60 శాతం వరకు థర్మల్ విద్యుత్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కేంద్రం తాజాగా రాష్ట్రాలకు తెలిపింది. ఈ అవసరాలు తీర్చడానికి థర్మల్ పవర్ స్టేషన్లలో 9 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడం ద్వారా నిల్వలు పెంచుకోవాలని దేశంలోని దాదాపు 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ఉత్పత్తి సంస్థలు తాము చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొనుగోలుదారుల అనుమతి లేకుండా బయటివారికి విద్యుత్ను విక్రయిస్తే పవర్ ఎక్స్చేంజ్లో మూడు నెలలపాటు పాల్గొనకుండా డిబార్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, జరిమానా విధిస్తామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. దీనికోసం విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 మార్గదర్శకాల్లో క్లాజ్ 6.4లో కొత్తగా ‘జి’ నిబంధన తెచ్చింది. అడిగినా ఇవ్వని కేంద్రం ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం బొగ్గు నిల్వలు పెంచుతాయి. ఈ వేసవిలో రాష్ట్రంలో 225 మిలియన్ యూనిట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా. కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచితే తప్ప వేసవి అవసరాల నుంచి బయటపడలేం. గతేడాది బొగ్గు కొరత ఏర్పడినప్పటి నుంచి కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతోపాటు కోల్, రైల్వే అధికారులు కమిటీగా ఏర్పడి బొగ్గు కేటాయింపులు చేస్తున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియా నుంచి రాష్ట్రానికి రోజువారీ అవసరాలకు మాత్రమే బొగ్గు కేటాయింపు జరుగుతోంది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్ నుంచి రావాల్సినంత బొగ్గు రావడం లేదు. వేసవి కోసం బొగ్గు నిల్వ చేయడానికి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 ర్యాక్ల బొగ్గు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ఆ మేరకు కూడా ఇవ్వడం లేదు. కేవలం 10 నుంచి 12 ర్యాక్లు మాత్రమే వస్తున్నాయి. ఏపీ జెన్కో నుంచి 45 శాతం విద్యుత్ రాష్ట్రంలో ప్రస్తుతం 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. మనకు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటినుంచి 85 మిలియన్ యూనిట్లు, హైడల్ 8.5 మిలియన్ యూనిట్లు, సోలార్ 2.4 మిలియన్ యూనిట్ల చొప్పున 97 మిలియన్ యూనిట్ల మేర రోజు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో అంతర్గత వినియోగం పోనూ 92 మిలియన్ యూనిట్లు గ్రిడ్కు వెళుతోంది. అంటే మొత్తం డిమాండ్లో 45 శాతం ఏపీ జెన్కో ద్వారా సమకూరుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ, కృష్ణపట్నం, ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఎంతైనా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జెన్కో సిద్ధంగా ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి కేటాయింపులు రావడం లేదు. – బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
ఎందుకీ కారు కూతలు! పాత ఫొటోలతో కరెంట్ కోతలంటూ రాతలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఏపీఎస్పీడీసీఎల్ ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాధరావు స్పష్టం చేశారు. ‘ఎందుకీ కోతలు!’ శీర్షికన ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ► కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎల్టీ కేబుల్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఎటువంటి అంతరాయాలు లేవు. ► రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందడం లేదన్న కథనంలో నిజం లేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో మంగళవారం ఆర్టీపీపీలో కెపాసిటర్ ఓల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ సమస్య కారణంగా సబ్ స్టేషన్లు ట్రిప్ కావడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► చిత్తూరు జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవు. ► అనంతపురం జిల్లాలో గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేవు. బుధవారం 18.227 ఎంయూల విద్యుత్ను సరఫరా చేశాం. ప్రతి నెలా రెండో శనివారం లేదా 3వ శనివారం సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్లో దాదాపు 45 శాతం సౌర, పవన, ఇతర వనరుల స్థాపిత విద్యుత్ ఉంది. వీటి నుంచి వచ్చే విద్యుత్ ’తప్పక సేకరణ’ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు ఈ వనరుల నుంచి విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుంది. సౌర కేంద్రాల నుంచి సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ పగటి పూట మాత్రమే లభ్యత ఉంటుంది. ► రోజువారీ గ్రిడ్ డిమాండ్లో కేవలం 4 గంటలు (ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ సమయంలో) మాత్రమే కొంత వరకూ విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి బహిరంగ మార్కెట్ లో ముందురోజు బిడ్డింగ్ విధానంలో సమకూర్చుకుంటున్నాం. ఈ విధానంలో అందుబాటులోకి రాకపోతే రోజువారీ మార్కెట్లో కానీ అత్యవసర మార్కెట్లో కానీ విద్యుత్ సేకరించి కొనుగోలు చేస్తున్నాం. ► రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల నుంచి అందుబాటులో ఉన్నంతవరకు ఎలాంటి బ్యాక్ డౌన్ లేకుండా విద్యుత్ సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఏ విద్యుత్ కేంద్రాన్ని షట్ డౌన్ చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నా వినియోగదారుల సౌకర్యార్ధం ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం ప్రస్తుత రబీ సీజన్లో ఒక్క సెంటు భూమికి కూడా సాగు నీటి కొరత తలెత్తకుండా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. కోతలు లేవు.. నాణ్యమైన కరెంట్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.జనార్దనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎందుకీ.. కోతలు!’ శీర్షికతో ఓ దినపత్రిక ప్రచురించిన కథనంలో నిజం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయనడం అవాస్తవమన్నారు. బుట్టాయగూడెం విద్యుత్ శాఖ అధికారులు లోడ్ రిలీఫ్ కోసం కోతలు విధిస్తున్నారనడం కూడా అవాస్తవమేనని, విద్యుత్ అధికారులు అటువంటి వివరణ ఏదీ ఇవ్వలేదని వెల్లడించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. వినియోగదారులందరికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రి 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన అంతరాయాలను సరిదిద్ది త్వరితగతిన పునరుద్ధరిస్తున్నారని వివరించారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తినప్పుడు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియచేయాలని ఎస్ఈ కోరారు. మడకశిరలో కరెంట్ కోతలు లేవు అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం కరెంట్ కోతలు విధించారన్న వార్తల్లో నిజం లేదని హిందూపురం డివిజన్ డీఈ డి.భూపతి స్పష్టం చేశారు. ఆర్టీపీపీలో సాంకేతిక సమస్యలతో మంగళవారం ఉదయం మాత్రం కొద్ది గంటలు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. విద్యుత్ కోతలపై ఓ పత్రిక ప్రచురించిన కథనం నిరాధారమని మడకశిర ఏడీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ఆ ఫొటో... ఇప్పటిది కాదు నా ఫ్యాక్టరీలో కరెంటు లేకపోవడంతో కార్మికులు ఖాళీగా కూర్చున్నట్లు ఓ పత్రికలో ఫొటో ప్రచురించారు. అసలు ఆ ఫొటో ఇప్పటిది కాదు. ఇటీవల కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం ఓ ఛానల్ వాళ్లు వచ్చి విద్యుత్తు కోతల గురించి మాట్లాడాలని కోరారు. లేని వాటిని ఉన్నట్లు చెప్పడం అన్యాయం. అందుకు నేను ఒప్పుకోలేదు. బుధవారం కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. మంగళవారం మాత్రం రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు మాకు ముందుగానే సెల్ఫోన్కు సమాచారం ఇచ్చారు. – ఆనంద్, టెక్ మనోరా ప్యాకింగ్ పరిశ్రమ యజమాని, మడకశిర ఆగింది అరగంటే.. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశిబుగ్గలో విద్యుత్తు కండెక్టర్ తెగిపోవడంతో బుధవారం సాయంత్రం 6.40 నుంచి 7.14 వరకు 34 నిమిషాల పాటు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. ఇక్కడ కరెంట్ లేక రాత్రంతా గాడాంధకారం నెలకొందనే తరహాలో ఓ పత్రిక ఫోటోలు ప్రచురించింది. -
సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు
సీలేరు: సీలేరు విద్యుత్ కేంద్రం..50 ఏళ్ల చరిత్ర.. నిరాటంకంగా విద్యుత్ కాంతులు..ఇప్పటికీ నంబర్ వన్..అదే వెలుగు..అదే ఖ్యాతి. విద్యుత్ కేంద్రాలలో సరిలేరు నీకెవ్వరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రకృతి సేదదీరిన పచ్చని అడవుల్లో ఒక్కొక్క నీటి బొట్టు ఒకచోట చేరి కొండలు, వాగుల నుంచి జాలువారి నీటి ప్రవాహంలా మారి బలిమెల నదిగా పేరు పొందింది. ఒకచోట నుంచి మరో ప్రాంతానికి పచ్చని కొండల మధ్య నుంచి ఒంపుసొంపులుగా ప్రవహిస్తూ ప్రతి ఊరు, ప్రతి గొంతును తడుపుతూ ఏటా లక్షలాది రైతుల ఆనందానికి చిరునవ్వుగా సీలేరు నది ప్రసిద్ధి చెందింది. 50 ఏళ్ల ముందు స్వదేశీ, విదేశీ పరిజ్ఞానంతో కారడవుల్లో విద్యుత్ కేంద్రాలను నిర్మించి నీటితో విద్యుత్ ఉత్పత్తి తయారయ్యేలా గొప్ప చరిత్రను సృష్టించి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తోంది. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రం స్వాతంత్య్రం వచ్చాక సీలేరు నదిపై 1955 ఆగస్టు నెలలో మొట్టమొదటి సారిగా మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇందులో ఆరు యూనిట్లు ఉన్నాయి. తొలుత మూడు యూనిట్లు ప్రారంభించి, తర్వాత మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేసి 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఏపీ, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉత్పత్తి అయిన విద్యుత్ ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకుని 220 కేవీ లైన్ల ద్వారా ఒడిశాకు సరఫరా అవగా ఏపీ వాటా పెందుర్తి కూడా చేరుతోంది. సీలేరు: 240 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్లో మాచ్ఖండ్ తర్వాత 1960లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఒకటి, రెండు యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1964లో 3,4 యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 220 కేవీ లైన్ల ద్వారా గాజువాకకు, మరో లైన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చేరుతుంది. డొంకరాయి: 25 మెగావాట్స్ సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీటితో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది 1972లో నిర్మించారు. ఈ విద్యుత్ కేంద్రానికి పైన డొంకరాయి డ్యామ్ను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇక్కడ నీరు వృథా కాకుండా రెండు మార్గాల్లో నీరు విడుదలయ్యే విధంగా అప్పటి ఇంజనీర్లు నిర్మించడం విశేషం. మోతుగూడెం(పొల్లూరు): 460 మెగావాట్స్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు మాదంటే మాది అంటూ గొడవలు పడిన విద్యుత్ కేంద్రం ఇది. 1976లో నిర్మించిన ఈ జలవిద్యుత్ కేంద్రంలో ఒకేసారి నాలుగు యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్ 115 మెగావాట్ల చొప్పున మొత్తం 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇదే ప్రాజెక్టులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.537 కోట్ల వ్యయంతో రెండు యూనిట్లు నిర్మించి మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. సీలేరు నది ఇరు రాష్ట్రాలకు సిరి సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలు, జలాశయాలకు నేటికి గొప్ప చరిత్ర ఉంది. పత్రికల్లో ఎన్నో కథనాలు, ఎన్నో రికార్డులు, అవార్డులు వచ్చాయి. బలిమెల నది బలిమెలలో పుట్టి గోదావరి వరకు చేరుతుంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఐడల్ విద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేయడంలో బలిమెల నదే కీలకం. రెండు రాష్ట్రాల విద్యుత్, వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఇక్కడ నుంచే నీటిని సరఫరా చేస్తారు. బలిమెల 32 కిలోమీటర్ల విస్తరణలో ఉంది. శతకోటి ఘనపుటడుగుల నీటి సామర్ధ్యంతో ఉంటుంది. ముందుగా మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం నీరు 86 కిలోమీటర్లు కొండల మధ్య ప్రవహించి బలిమెలలోకి చేరుతోంది. ఇరు రాష్ట్రాలు నీటిని సమానంగా పంచుకుంటారు. ఏపీ వాటాగా ఉన్న నీరు 18 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడలోకి చేరుతోంది. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 30 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడ జలాశయంలోకి చేరుతోంది. డొంకరాయిలో విద్యుత్ తయారై రెండు మార్గాల్లో నీటి విడుదల జరుగుతోంది. రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయిన, గోదావరి పంటలకు నీరు కావాల్సి ఉన్న మెయిన్ డ్యాం ద్వారా నీరు విడుదల చేస్తారు. అలా కాకుండా విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు కెనాల్ ద్వారా ఏవీపీ డ్యామ్కు చేరుతుంది. అక్కడ నుంచి మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి చేరుకుని 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 38 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని కలుపుకుని శబరి నదిలో కలుస్తోంది. అక్కడ నుంచి గోదావరిలోకి చేరుతోంది. గ్రిడ్కు విద్యుత్ అందించడంలో సీలేరుదే ఘనత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో సీలేరు కాంప్లెక్సుకు నేటికి ఓ రికార్డు ఉంది. 50 ఏళ్లు పూర్తయినా విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలుస్తోంది. ఇక్కడ నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికి 50 శాతం విద్యుత్ సీలేరు నుంచే అందుతుంది. ఇటీవల సీలేరును సందర్శించినప్పుడు ఇక్కడ విద్యుత్ కేంద్రాల గొప్పతనం మరింత తెలుసుకున్నాం. – బి.శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ జెన్కో ఇంజనీర్లు, కార్మికుల కృషి వల్లే .. 50 ఏళ్లకు ముందు ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగుల కృషి ఈ విద్యుత్ కేంద్రాల ఘనత. ప్రతి ఏటా డిస్పాచ్ అధికారులు ఇచ్చిన లక్ష్యాలను మించి సమయానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత ఈ విద్యుత్ కేంద్రాలకు ఉంది. ప్రతి ఏటా సీలేరు నుంచి గోదావరి పంట భూములకు నీరు అందిస్తున్నాం. – రాంబాబు, చీఫ్ ఇంజనీర్, మోతుగూడెం అధికారుల ప్రశంసలు మర్చిపోలేను సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉద్యోగం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యుత్కేంద్రాలు కన్నతల్లిలాంటివి. ఇక్కడ ఉద్యోగం చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంపై అధికారుల ప్రశంసలు మర్చిపోలేను. – రమేష్కుమార్, ఏడీ, జలవిద్యుత్ కేంద్రం, సీలేరు. -
వైజాగ్–చెన్నై కారిడార్ పనులు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలకమైన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.5,544 కోట్లతో రెండు దశల్లో ఈ కారిడార్ పనులు జరుగుతున్నాయి. తొలి దశ కింద రూ.2,278.61 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే రూ.815.17 కోట్ల విలువైన పనులు పూర్తికాగా.. మిగిలిన పనులు తుది దశలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.306.56 కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే.. గడచిన రెండున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.508.61 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఇందులో ఇప్పటికే నాయుడుపేట క్లస్టర్లో 1 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి యూనిట్, శ్రీకాళహస్తి–ఏర్పేడు క్లస్టర్కు సంబంధించి విద్యుత్ సరఫరా పనులు పూర్తయ్యాయి. నాయుడుపేట, అచ్యుతాపురం క్లస్టర్కు సంబంధించి నీటి సరఫరా, విద్యుత్ వంటి కీలక మౌలిక వసతులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేవిధంగా ఏపీఐఐసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదలైన రెండో దశ పనులు కాగా, రూ.2,599.56 కోట్లతో రెండో దశకు సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ చేపట్టింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4,125 కోట్లు రుణం రూపంలో సమకూర్చనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,419 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద విశాఖ నోడ్లో నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, చిత్తూరు సౌత్ బ్లాక్ నోడ్లో 13,319 ఎకరాలు, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 2,596 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఒక్కసారి వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి ఏడు రెట్లు, రాష్ట్ర జీడీపీ ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా. 2015లో రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి 2035 నాటికి రూ.7,82,300 కోట్లకు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.11.60 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అదనంగా 1.10 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. -
ఏపీ ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్)కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం 15వ ఇంధన సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించారు. విద్యుత్ పంపిణీలో ఆవిష్కరణల అంశంలో చేస్తున్న కృషిలో ఏపీ ఎస్పీడీసీఎల్ జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఈ సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో భాగంగా జరిగిన ఐసీసీ అవార్డులు–2022 ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా జ్యూరీ సభ్యుల నుంచి ఈ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాథరావు అందుకున్నారు. ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. -
ఇక స్మార్ట్ సబ్స్టేషన్లు!
► అదో విద్యుత్ సబ్స్టేషన్. అక్కడ ఉద్యోగులెవరూ లేరు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ► ఆ సబ్స్టేషన్ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సమాచారం ఇద్దామంటే సబ్స్టేషన్లో ఎవరూ లేరు. అయినా సంబంధిత విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. ... ఇందుకు కారణం సదరు సబ్స్టేషన్ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడమే. ఉద్యోగులు, సిబ్బంది లేకుండా సమాచారం ఎలా వెళ్లిందనేగా మీ అనుమానం? ఆ సబ్స్టేషన్.. స్మార్ట్ సబ్స్టేషన్. ఉద్యోగులు, సిబ్బంది అవసరం లేకుండానే విద్యుత్ సరఫరాలో సమస్య, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైన వెంటనే తెలియజేసేలా సబ్స్టేషన్ను తీర్చిదిద్దుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్స్టేషన్ను పూర్తి స్థాయి ఆటోమేషన్ సబ్స్టేషన్ (స్మార్ట్ సబ్స్టేషన్)గా తీర్చిదిద్దనుంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అంతా కంట్రోల్ రూమ్ నుంచే.. వాస్తవానికి ఇప్పటికే గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్స్టేషన్ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్ స్మార్ట్ సబ్స్టేషన్గా మారనుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్స్టేషన్ను స్మార్ట్ సబ్స్టేషన్గా మార్చేందుకు రూ.50 లక్షల మేర వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ సబ్స్టేషన్లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్స్టేషన్లోని స్కాడ్ కంట్రోల్ రూమ్ నుంచే నడవనుంది. గిడిజాల సబ్స్టేషన్ పరిధిలోని విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్లైన్ ద్వారానే స్కాడ్ కంట్రోల్ రూమ్కు చేరుతుంది. తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలగనుంది. మరింత నాణ్యమైన సేవలు.. ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లను ఆటోమేషన్ కిందకు మార్చాలని భావిస్తున్నాం. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్స్టేషన్లో అమలు చేయనున్నాం. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. స్మార్ట్ సబ్స్టేషన్లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఈపీడీసీఎల్ -
ఏపీలో పెరిగిన సగటు విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. సంక్షోభంలోనూ రికార్డు.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్ వినియోగం అక్టోబర్లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 4,972 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్లో 5,828 మిలియన్ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్లో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 19న గరిష్ట విద్యుత్ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్ డిమాండ్పై ఏపీ ట్రాన్స్కో, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్ లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్ కె.ప్రవీణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
AP: కరెంట్ కోతలంటూ కట్టుకథలు
సాక్షి, అమరావతి: అదిగో పులి.. ఇదిగో తోక లాంటి బెదిరింపులు, కట్టు కథలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై వదంతులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కోవిడ్ ప్రభావం తగ్గి పారిశ్రామిక విద్యుత్ వినియోగం పెరగడం, డిమాండ్ – సరఫరాలో వ్యత్యాసం తదితర పరిణామాలతో దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గమనించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వతేదీన ప్రధాని మోదీకి లేఖ రాయడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా విద్యుత్తు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసరంగా గ్యాస్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పరిస్థితిని ఊహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, బొగ్గు కొనుగోలుకు అత్యవసర నిధులను వెచ్చించడం, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడలేదు. కానీ దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా భారీగా విద్యుత్ కోతలుంటాయని, ముఖ్యంగా రాత్రి వేళ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో గంటల తరబడి చీకట్లు తప్పవంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఈ తరహా వదంతులతో రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. రాత్రి సమయంలో విజయవాడ ఇలా.. లోటు.. లేదు విద్యుత్ కోతలంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, డిస్కమ్ల సీఎండీలు అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈనెల 10వతేదీ నుంచి 14 వరకు విద్యుత్ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్ లోటు మన దగ్గర కంటే ఎక్కువగా ఉంది. అక్టోబర్ 14న ఏపీలో 0.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండగా మరుసటి రోజు నాటికి అది కూడా పోయి లోటు పూర్తిగా జీరో అయ్యింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా డిస్కమ్ పూర్తి స్థాయిలో విద్యుత్ పంపిణీ చేయగలుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని విద్యుత్ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అత్యవసర నిధులతో తీరుతున్న బొగ్గు కొరత ఇంధనశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్కోకు రూ.250 కోట్ల మేర అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తి మెరుగు పరచేందుకు రాష్ట్రానికి అదనంగా ఎనిమిది బొగ్గు రైళ్లు తరలి వస్తున్నాయి. వీటీపీఎస్లో 13,097 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండగా శనివారం 29,806 మెట్రిక్ టన్నులు వచ్చింది. దీనిలో 25,410 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 17,493 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి. ఆర్టీపీఎస్లో 70,411 మెట్రిక్ టన్నుల బొగ్గుకు అదనంగా 19,457 మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఇందులో 12,925 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 76,943 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నంలో 68,459 మెట్రిక్ టన్నులు ఉండగా 8,533 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఇంకా 59,926 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఈ నిల్వలతో మరో మూడు నాలుగు రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. దీనికితోడు వచ్చే ఏడాది జూన్ వరకూ 400 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు శుక్రవారం రూ.20 నుంచి రూ.6.11కి పడిపోవడం గమనార్హం. ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. సాధారంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ఈ నెల 8వతేదీ తరువాత రూ.15 – రూ.20 వరకూ పెరిగినా తాజాగా తగ్గుముఖం పట్టింది. ఆర్టీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం ఏపీ జెన్కో యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని, థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఇంధనశాఖను ఆదేశించారు. థర్మల్ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి 1,600 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి సింగరేణి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చించి సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లలో ఈనెల 15న అధికారులు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. నిరంతర పర్యవేక్షణ విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ నిరంతరం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. నగరాల నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్ సరఫరాను సమీక్షిస్తూ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి సీఎండీ స్థాయి వరకూ అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో డిస్కమ్ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోష్రావు, డైరెక్టర్/గ్రిడ్ – ట్రాన్స్మిషన్, కె.ప్రవీణ్కుమార్, సీఈ/గ్రిడ్, ఏవీ భాస్కర్లతో ఇంధన శాఖ కార్యదర్శి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. సీఎం సూచనల ప్రకారం.. రాష్ట్రంలో నిత్యం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా గత 16 రోజులుగా సగటున రోజుకు ఒక మిలియన్ యూనిట్ కంటే తక్కువగానే లోటు ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. పదహారు రోజులకు కేవలం పది మిలియన్ యూనిట్లు మాత్రమే లోటు నమోదైందన్నారు. దీంతో లోడ్ రిలీఫ్లు చాలా తక్కువగానే విధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, పవర్ యుటిలిటీల అద్భుత పనితీరుతో నాణ్యమైన సరఫరా జరుగుతోందన్నారు. బొగ్గు కొరతను అధిగమించి నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సీఎం సూచనల ప్రకారం తగిన చర్యలు చేపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలాంటి విద్యుత్ కోతలను ఎదుర్కోవడం లేదని, రాబోయే రోజుల్లో కూడా కోతలు ఉండవని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వినియోగదారులకు రోజంతా నాణ్యమైన విద్యుత్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా గణనీయంగా పెరిగినట్లు ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ వివరించారు. నమ్మొద్దు.. మేమే చెబుతాం –విద్యుత్ పంపిణీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎలాంటి సమాచారానైన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వినియోగదారులకు అధికారికంగా తెలియచేస్తామని ప్రకటించాయి. -
కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు
సాక్షి, అమరావతి: బొగ్గు కొరత నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనధికారిక కరెంటు కోతలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో బ్లాక్ అవుట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను షట్డౌన్ చేశారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం.. దేశంలో 116 థర్మల్ విద్యుత్ కేంద్రాలకుగాను 18 కేంద్రాల్లో బొగ్గు లేదు. మిగతా వాటిలో బొగ్గు నిల్వలు ఒక రోజు నుంచి వారం రోజులకు మాత్రమే సరిపోతాయి. ఫలితంగా 15 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బొగ్గు సంక్షోభాన్ని అధిగమించి, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా కరెంటు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రానికి బొగ్గు సరఫరా కొంత మెరుగైంది. ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు సెప్టెంబర్లో సగటున రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 24 వేల టన్నుల వంతున సరఫరా అయింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఇటీవల అది 40 వేల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 20 బొగ్గు రేక్లను కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడానికి అవసరమైన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు చేస్తున్నాయి. అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు, బొగ్గు అనుసంధానం లేకుండానే అత్యవసర ప్రాతిపదికన నిలిచిపోయిన, పనిచేయని పిట్ హెడ్ బొగ్గు గనులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. బాగా పెరిగిన విద్యుత్ డిమాండ్ దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య తేడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో 5,010 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న ఏపీ జెన్కో ప్రస్తుతం 2,300 నుంచి 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆర్టీటీపీఎస్కి చెందిన కొన్ని యూనిట్లు షట్డౌన్ చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ కూడా వాటి సామర్థ్యం కంటే తక్కువగానే విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ నెలలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజుకు 190 మిలియన్ యూనిట్లకు చేరింది. బుధవారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లు ఉంది. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఈనెలలో రోజుకు సగటున 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఎక్కువ వినియోగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి యూనిట్కు రూ.14 నుంచి రూ.20 వరకు వెచ్చించి కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. సాధారణంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ధర భారీగా పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. -
బొగ్గు.. భగ్గు!
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది. రోజూ 80 – 110 ఎంయూల కొరత దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. దొరకని గ్యాస్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే.. రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్టీపీపీ నుంచి, 1,040 మెగావాట్లు హెచ్ఎన్పీసీఎల్ నుంచి, 400 మెగావాట్లు కేఎస్కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్లో కూడా బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పీక్ అవర్స్లో మాత్రమే ‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్ అవర్స్లో కొంత వరకూ పవర్ కట్స్ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి తెలంగాణాలో పరిస్థితి భిన్నం తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల అక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం. -
తేరుకున్న గ్రామాలు
దొండపర్తి (విశాఖ దక్షిణ)/వంగర/విజయనగరం/సీతానగరం/మునగపాక: గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ముంపు గ్రామాలు పూర్తిగా తేరుకున్నాయి. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారు ఇళ్లకు చేరుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరాను 98 శాతం వరకు పునరుద్ధరించారు. విశాఖ విమానాశ్రయంలోకి చేరిన వరద నీటిని మళ్లించడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలోని 30 మండలాల్లో 244 గ్రామాలు జలమయం కాగా.. మంగళవారం నాటికి 95 శాతం గ్రామాలు ముంపు నుంచి పూర్తిగా తేరుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,512 మందిని తరలించగా.. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 8,352 మంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 2,160 మంది మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాలో 12 సబ్స్టేషన్లు దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 198 వీధి దీపాలు ధ్వంసం కాగా.. మరమ్మతులు పూర్తిచేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. 74 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పునరుద్ధరించారు. పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు, నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. పరవాడ మండలం లంకెలపాలెంలో వరద ప్రవాహానికి ఏలేరు కాలువ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. అధికారులు అక్కడకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేయించి లంకెలపాలెం, పరవాడ గ్రామాల మధ్య ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. విశాఖలో జాతీయ రహదారి పక్కన మురుగు కాలువల్లో పూడిక తొలగిస్తున్న సిబ్బంది శ్రీకాకుళంలో ముమ్మరంగా సహాయక చర్యలు శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. వంగర మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టును వరద ముంచెత్తింది. ఫలితంగా సోమవారం అర్ధరాత్రి కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాలు నీటమునిగాయి. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్ డ్రోన్ కెమెరాల సాయంతో వరద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించారు. నాగావళి ఉగ్రరూపంతో అంపిలి, అన్నవరం, గోపాలపురం, చిన్నమంగళాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు. కోలుకుంటున్న విజయనగరం తుపాను దెబ్బ నుంచి విజయనగరం జిల్లా ప్రజలు కోలుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఇవ్వగలిగారు. మరోవైపు తుపాను బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,205 మందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు కలిసి తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుతుండటంతో పంట నష్టాల గణన వేగవంతమైంది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జేసీలు కిశోర్కుమార్, మహేష్కుమార్లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు రైతులు, ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. గొర్రెల కాపరి సురక్షితం విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని కొత్తవలస ఆనకట్ట దిగువన గల మెట్టపైకి గొర్రెలను తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్య సోమవారం చిక్కుకుపోయిన విషయం విదితమే. అతడిని అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం నేవీ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. గోడకూలి వృద్ధురాలి దుర్మరణం విశాఖ జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు కర్రి జోగులమ్మ (65) అనే వృద్ధురాలిపై మంగళవారం ఉదయం పక్కింటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులపాటు భారీ వర్షాలకు గోడ తడిసిపోవడంతో ఈ ఘటన జరిగింది. గోదావరి పరవళ్లు కొవ్వూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4,43,330 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి 8 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు పెరుగుతుండంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి అధికమైంది. అక్టోబర్ నెలాఖరున గోదావరికి ఈ స్థాయి వరద రావడం ఇదే ప్రథమం. 2005 అక్టోబర్ 21 తర్వాత ఇప్పుడే ఈ సమయంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. -
విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, అమరావతి/అరసవల్లి: గులాబ్ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్తో పాటు 33/11 కేవీ సబ్ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 66.58 కిలోమీటర్ల మేర, ఎల్టీ కేటగిరిలోనే 1,719 స్తంభాలు, 678 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమైనట్టు ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది గుర్తించారు. తుపాను వల్ల 24 పట్టణాలు, 103 మండలాలు, 3,821 గ్రామాల్లో 11,26,959 వ్యవసాయేతర, 4,767 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శరవేగంగా పునరుద్ధరణ పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిన విద్యుత్ శాఖ ఈహెచ్టీ సబ్ స్టేషన్, 33/11 కేవీ సబ్స్టేషన్లు 364, ఫీడర్లు 255, స్తంభాలు 75, లైన్లు 5.5 కిలోమీటర్ల మేర బాగు చేశారు. 11 కేవీ ఫీడర్లు 1,255, స్తంభాలు 390, లైన్లు 23.35 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 18.55 కిలోమీటర్లు, ఎల్టీ పోల్స్ 403, ట్రాన్స్ఫార్మర్లు 154 చొప్పున మరమ్మతులు పూర్తి చేశారు. 8,85,419 వ్యవసాయేతర, 1,463 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయానికల్లా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, మిగిలిన జిల్లాల్లో కొన్నిగంటలపాటు అంతరాయం ఏర్పడిందన్నారు. -
విద్యుత్ సంస్థలు చట్టాన్ని అనుసరించాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు చట్టం పరిధిలోనే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి చెప్పారు. విద్యుత్ చట్టం–2003 సెక్షన్ 88 ప్రకారం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంతోపాటు వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలపై ఉందని గుర్తుచేశారు. వర్చువల్గా సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు ఏపీఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్రెడ్డి, ఠాకూర్ రామసింగ్ హైదరాబాద్లోని కార్యాలయం నుంచి, సలహామండలిలోని 16 మంది సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరిచేందుకు పౌరసేవల ప్రమాణాలను (ఎస్వోపీని) సవరించినట్లు తెలిపారు. దీనివల్ల కొన్ని సేవల వైఫల్యంపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు డిస్కంలు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్సీ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. డిస్కంలు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమంగా ప్రయోజనాలు అందించాలని ఆయన సూచించారు. సేవా ఖర్చు తగ్గింపు, విద్యుత్ కొనుగోళ్ల క్రమబద్ధీకరణ, మెరుగుపరచడం, డిస్కంల పనితీరు, ప్రజల సమర్థమైన భాగస్వామ్యం, నియంత్రణ నిర్ణయ ప్రక్రియ, విద్యుత్ లైన్లు పంట చేలపై నుంచి వేయాల్సి వచ్చినపుడు రైతులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సభ్యుల సూచనలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు. -
ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందుల్లేకుండా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇళ్లు నిర్మించే సమయంలో నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా బోర్లు వేస్తోంది. అంతటితో సరిపెట్టకుండా వాటికి మోటార్లు సైతం బిగించడం.. అందుకు విద్యుత్ సరఫరా సమకూర్చడం.. ప్లాట్ల వద్ద కుళాయిల ఏర్పాటుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 76 శాతం లేఅవుట్లలో బోర్లు తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 9,112 లేఅవుట్లలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీటిలో 8,830 లేఅవుట్లలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రూ.920 కోట్లు కేటాయించింది. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లను కేటాయించి పనులను అప్పజెప్పింది. మొత్తం 8,830 లేఅవుట్లకు గాను ఇప్పటివరకు 8,096 లేఅవుట్లలో నీటి సరఫరా పనులు ప్రారంభించారు. వీటిలో 6,687 (76 శాతం) లేఅవుట్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా బోర్లు వేయడం, పక్కనున్న చెరువులు, కాలువల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. 10–20 ఇళ్లకు చేతి బోరింగ్లు, 50–60 ఇళ్లకు రోటరీ బోర్లు, 100–200 ఇళ్లకు డీటీహెచ్ బోర్లు వేస్తున్నారు. ప్లాట్లు ఎక్కువగా ఉండి నీటి వినియోగం ఎక్కువ ఉన్నచోట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందుల్లేకుండా నీటి నిల్వ కోసం స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా బోర్ల నుంచి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నీటిని వినియోగించుకునేందుకు అనుగుణంగా కుళాయి పాయింట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇబ్బందులకు తావివ్వం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలకు ఎలాంటి ఇబ్బందులకు తావివ్వం. లబ్ధిదారులకు అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తుంది. నీటి సౌకర్యం లేకపోతే నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తుతాయని సీఎం వైఎస్ జగన్ ముందే భావించారు. లబ్ధిదారులు ఆ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే బోర్లువేసి, మోటార్లు బిగించి, విద్యుత్ సరఫరా అందిస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం లేఅవుట్లలో నీటి సరఫరా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 76 శాతం లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్లలో ఈ నెలాఖరులోపు నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ పనులు పూర్తిచేస్తాం. ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం. – నారాయణ భరత్గుప్తా, ఎండీ హౌసింగ్ కార్పొరేషన్ -
ఇక సాఫీగా సొరంగం పనులు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాలపై ఆధారపడి చేపట్టిన ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులకు కరెంట్ కష్టాలు తొలగనున్నాయి. ఇన్లెట్ సొరంగంలోకి చేరే నీటిని తొలగించడానికి (డీ వాటరింగ్) అయ్యే కరెంటు చార్జీలను ఇకపై ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో సొరంగం పనులు సాఫీగా ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయ్యింది. గడిచిన రెండేళ్లుగా నీటిని తోడుతున్న ఏజెన్సీ కరెంట్ బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తోంది. ఈ కారణంగా టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో, సొరంగం పనులు ముందుకు సాగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వలు సమృధ్ధిగా పెరగడంతో అటువైపుగా ఉన్న ఇన్లెట్ సొరంగంలోకి భారీగా నీరు చేరింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మరో 10 కిలోమీటర్లు తవ్వాలి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పదిహేనేళ్లయినా సరి గా ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టును 2005లో రూ.2,813 కోట్లతో చేపట్టగా, 15 ఏళ్లయినా పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం రూ.3,152 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. ఒక సొరంగం పూర్తి కాగా రెండో టన్నెల్ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్నగర్లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, మరో 10.10 కి.మీలకు పైగా టన్నెల్ను తవ్వాల్సి ఉంది. అయితే ఈ టన్నెల్ తవ్వకానికి శ్రీశైలం ప్రాజెక్టులో చేరే నీటి నిల్వలతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా ప్రాజెక్టుకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండి ఇన్లెట్ టన్నెల్లోకి భారీగా సీపేజీ నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిల్వ ఎక్కువ ఉన్నప్పుడు నిమిషానికి 5 వేల నుంచి 7 వేల లీటర్ల మేర నీరు ఉబికి వస్తోంది. దీంతో రెండు, మూడు స్టేజీల్లో 20 హెచ్పీ, 30 హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. దీంతో నెలకు రూ.2 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ బిల్లులు చెల్లించడంలో విఫలమవుతోంది. ఇప్పటికి రూ.58 కోట్ల మేర బిల్లులు (ఇరిగేషన్ శాఖ నుంచి ఏజెన్సీకి రావాల్సినవి) పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో డీ వాటరింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేళ్లుగా సొరంగం తవ్వకం పనులు కూడా నిలిచిపోయాయి. టీబీఎంకు ముప్పు నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ ప్రక్రియ జరగక, ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో టన్నెల్లో నీటిమట్టం పెరుగుతోంది. ఇది మరింత పెరిగితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టీబీఎం మునగడం ఖాయం. ఇదే జరిగితే టీబీఎం ముఖ్యమైన పరికరాలతోపాటు విద్యుత్ వ్యవస్థ, కన్వేయర్ వ్యవస్థలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో భారీ ఆర్థిక నష్టంతో పాటు పనులు కొనసాగించేందుకు మరింత గడువు అవసరమవు తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేబినెట్ భేటీ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈ అంశాన్ని ప్రభు త్వం దృష్టికి తెచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన కేబినెట్ ఇకపై ఏజెన్సీ కాకుండా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని, కరెంట్ కట్ చేయరాదని విద్యుత్ శాఖను ఆదేశించింది. టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖకు సూచించింది. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతలను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. -
Telangana : నష్టాల బాటలో డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లు 2019–20లో మరో రూ.6,061 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.4,940.24 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.1,116.29 కోట్లు. దీంతో 2019– 20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటి నికర నష్టాలు ఏకంగా రూ.42,292 కోట్లకు ఎగబాకాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.29,303 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.12,983 కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికల్లో ఈ వివరాలను రెండు డిస్కంలు వెల్లడించాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నికర నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 ముగిసే నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్లు డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా వ్యయంతో పోలిస్తే బిల్లు ల వసూళ్లు, ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీల ద్వారా వస్తున్న ఆదాయం తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచకపోవడం కూడా డిస్కంల నష్టాలకు కారణంగా చెబుతున్నారు. ఖర్చులు ఎక్కువ.. ఆదాయం తక్కువ.. ► టీఎస్ఎస్పీడీసీఎల్ 2019–20లో 45,247 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ కొనుగోళ్లకు రూ.24,907 కోట్లు, జీతాల చెల్లింపులకు రూ.2,314 కోట్లు, ఆపరేషన్ ఇతర ఖర్చులు రూ.261 కోట్లు, రుణాలపై వడ్డీలు రూ.1,489 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.986 కోట్లు, అసాధారణ ఖర్చులు రూ.148 కోట్లు కలిపి మొత్తం రూ.30,108 కోట్లు ఖర్చు చేసింది. విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.24,600 కోట్లు, ఇతరాత్ర ఆదాయం రూ.46 కోట్లు కలిపి మొత్తం రూ.24,647 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థకు 2019–20లో రూ.4,940 కోట్ల నష్టాలు వచ్చాయి. ► టీఎస్ఎన్పీడీసీఎల్ 2019–20లో 20,504 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లకు రూ.11,326 కోట్లు, ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రూ.1,429 కోట్లు, రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.626 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.444 కోట్లు, ఇతర ఖర్చులు రూ.305 కోట్లు కలిపి మొత్తం రూ.14,132 కోట్ల వ్యయం చేయగా, 18,650 ఎంయూల విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.24,647.65 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థ 2019–20లో స్థూలంగా రూ.1,116 కోట్లను నష్టపోయింది. -
అత్యధిక సోలార్ ఉత్పాదక స్టేషన్గా విజయవాడ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విద్యుత్ ఆదాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో అడుగు ముందుకేసింది. విజయవాడ రైల్వే స్టేషన్లో అదనంగా రూ.62 లక్షలతో మరో 65 కిలో వాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్తో ప్లాట్ ఫారాల పైకప్పులు ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ రైల్వేలోనే తొలిసారిగా 130 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్గా విజయవాడ రికార్డు సృష్టించింది. బుధవారం డీఆర్ఎం శ్రీనివాస్ స్టేషన్లోని సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్ను ప్రారంభించారు. 2019 డిసెంబర్లో 4, 5 ప్లాట్ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా మరో 54 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్ను 4, 5 ప్లాట్ఫారాలలో, 11 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్ను 8, 9 ప్లాట్ఫారాలలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్టేషన్ అవసరాలకు వినియోగించే విద్యుత్ సరఫరాలో ఏడాదికి 2.12 లక్షల యూనిట్లను తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.16.36 లక్షలు ఆదా అవుతుంది. -
జగనన్న కాలనీల్లో ‘పవర్’ఫుల్ లైన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అత్యాధునిక హంగులతో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక 90 శాతం తయారైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై గురువారం సమీక్షిస్తారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పటిష్టంగా విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. లే అవుట్లలో ఇళ్ల సంఖ్య, వినియోగించే విద్యుత్ ఆధారంగా ముందే లోడ్ను అంచనా వేశారు. భవిష్యత్తులో లోడ్ పెరిగినా తట్టుకునేలా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతకు ఇందులో ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి వీధిలో రాత్రి వేళ అధిక వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను అమరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహజసిద్ధమైన గాలి, వెలుతురు వినియోగించుకుంటూ తక్కువ విద్యుత్ వినియోగం జరిగేలా విదేశీ సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టనున్నారు. పోల్స్ కనిపించకుండా పవర్.. జగనన్న కాలనీల్లో ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.6,475.41 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. 500 ఇళ్ల కన్నా ఎక్కువ ప్లాట్లు ఉండే లే అవుట్లలో పూర్తిగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కాలనీల్లో వీధి దీపాలకు మినహా పెద్దగా విద్యుత్ పోల్స్ అవసరం ఉండదు. భూగర్భ విద్యుత్ వ్యవస్థ వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు తెలిపారు. తక్కువ ఇళ్లు ఉండే లే అవుట్లలో మాత్రం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో 2,271 లేఅవుట్లకు నెలాఖరుకు డీపీఆర్ కోర్టు వివాదాల్లో ఉన్నవి, వ్యక్తిగతంగా ఇంటి స్థలం ఉన్నవారిని మినహాయిస్తే ఇప్పటివరకూ 17,005 లే అవుట్లకు సంబంధించి 18,77,263 ఇళ్ల విద్యుదీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. 17,92,225 ఇళ్లకు సంబంధించి 14,734 లేఅవుట్ల పరిధిలో విద్యుదీకరణకు సమగ్ర నివేదికలు (డీపీఆర్) రూపొందించారు. ఇందులో భూగర్భ విద్యుత్ సరఫరా చేసే లే అవుట్లు 432, ఇళ్లు 8,36,705 ఉన్నాయి. మరో 2,271 లేఅవుట్లకు సంబంధించి 85,038 ఇళ్లకు విద్యుదీకరణ డీపీఆర్ ఈ నెలాఖరుకు సిద్ధం కానున్నట్లు అధికారులు తెలిపారు. 50 శాతం భూగర్భ విద్యుత్తే జగనన్న కాలనీల్లో 50 శాతం వరకూ భూగర్భ విద్యుదీకరణకే ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం డీపీఆర్లు పూర్తయ్యాయి. మిగతా డీపీఆర్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. రెండు దశల విద్యుదీకరణ ప్రక్రియను 2023కి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. విద్యుదీకరణకు అయ్యే మొత్తాన్ని రుణంగా తీసుకుని డిస్కమ్లకే అందిస్తాం. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. – అజయ్జైన్ (గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) -
విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఏపీ విద్యుత్ సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)తో విద్యుత్ శాఖ సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా దక్షిణాది పవర్ గ్రిడ్కు అనుసంధానం చేసే దిశగా అడుగులు పడతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పవర్ గ్రిడ్ పర్యవేక్షిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్రంతో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో కలిసి రాష్ట్ర అధికారులు చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. రియల్ టైమ్ పద్ధతిలో పర్యవేక్షించేలా.. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సబ్ స్టేషన్లతో విద్యుత్ నెట్వర్క్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాలకు అనుసంధానమై ఉంటుంది. అవసరమైనప్పుడు మనం విద్యుత్ ఇవ్వడం, తీసుకోవడానికి ఈ లైన్లు ఉపయోగపడతాయి. అయితే, అటవీ ప్రాంతాలు, జలాశయాలు, కొండల్లో విద్యుత్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడ ఏ లైన్కు ఇబ్బంది ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని సర్వీసులకు సమస్య రావచ్చు? ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించడం ఎలా? వరదలొస్తే ఏ సబ్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది? ఇలా అనేక రకాల సమాచారాన్ని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అందిస్తారు. అవసరమైనప్పుడు కేవలం మౌస్ క్లిక్ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తేలికగా తెలుసుకునే వీలుంది. ఓవర్ లోడింగ్ సహా అన్ని అంశాలను రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించేందుకు పవర్ గ్రిడ్లకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ నెట్వర్క్ను మ్యాపింగ్ చేసే కార్యక్రమానికి ట్రాన్స్కో శ్రీకారం చుట్టింది. సదరన్ గ్రిడ్లో అమలు చేసేలా.. ఈ విధానానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్స్ కార్పొరేషన్ (పీవోఎస్వోసీవో)లు ఏపీ ట్రాన్స్కోను కోరాయి. దీన్ని మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపే సదరన్ గ్రిడ్లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీ ట్రాన్స్కో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్ స్టేషన్ల జియో ట్యాగింగ్, సరఫరా లైన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ల భౌతిక పరిస్థితి, ఏపీ ట్రాన్స్కో, డిస్కంలకు సంబంధించిన సరఫరా, పంపిణీ నెట్వర్క్ వెరసి ఏపీ గ్రిడ్ మొత్తాన్ని రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించవచ్చు. ఏపీ నెట్వర్క్ మొత్తాన్ని సదరన్ గ్రిడ్ మ్యాపింగ్ చేస్తుంది. దీనివల్ల రియల్ టైం పద్ధతిలో లైన్ల ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్తో పాటు వాతావరణం, లోడ్ షెడ్యూలింగ్ను ముందుగానే అంచనా వేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను పరిశీలించడం, రియల్ టైం పద్ధతిలో లైన్లను తనిఖీ చేయడం వంటి అనేక ఉపయోగాలు ఉంటాయి. -
అసత్య కథనాలతో దుష్ప్రచారం: ఆదా.. కానరాదా?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లపై కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్య కథనాలు ప్రచురించడాన్ని ఇంధనశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పీపీఏలున్న విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరాలో కోత పెట్టినప్పటికీ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి నెల రోజుల్లో రూ.22.7 కోట్లు లాభం చేకూర్చామని స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా డిస్కమ్లకు రూ.48 కోట్లు నష్టం వాటిల్లిందంటూ వాస్తవ విరుద్ధ కథనాలు ప్రచురించారని ఇంధనశాఖ పేర్కొంది. విద్యుత్ కొనుగోళ్లను కట్టడి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని, దీన్ని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గుర్తు చేశారు. ఏపీఈఆర్సీ నిరంతర పర్యవేక్షణ.. నిజానికి విద్యుత్ కొనుగోళ్లపై గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చౌక విద్యుత్నే సాధ్యమైనంత వరకూ కొనుగోలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరంతరం పర్యవేక్షిస్తోంది. గతేడాది డిసెంబర్ 17 నుంచి జనవరి 15వ తేదీ వరకూ జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వివరాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విశ్లేషించింది. బొగ్గు కొరత, కోవిడ్, ఇతర కారణాలు.. ఈ నెల రోజుల వ్యవధిలో ఏపీ విద్యుత్ సంస్థలు 894.1 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశాయి. రాష్ట్ర డిస్కమ్లు కొన్ని చౌకగా విద్యుత్ అందించే ఉత్పత్తి కేంద్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రకారం వీటి ద్వారా డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకూ 3,289.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ యూనిట్ రూ.3.13 చొప్పున డిస్కమ్లకు అందాలి. అయితే ఆయా కేంద్రాల్లో బొగ్గు కొరత, కోవిడ్ ప్రభావం, ఇతర కారణాల వల్ల ముందు రోజు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2,470.79 మిలియన్ యూనిట్లే విద్యుత్ ఇస్తామని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. కానీ వాస్తవంగా విద్యుత్ అందించే రోజుకు రీ షెడ్యూల్ చేసుకుని చివరకు 2,253.27 ఎంయూలే ఇచ్చాయి. 818.5 ఎంయూల విద్యుత్ను అందించలేకపోయాయి. లేని విద్యుత్ ఎలా కొంటారు? పీపీఏల ప్రకారం 818.5 ఎంయూల కొరత ఏర్పడటంతో పీపీఏలున్న ఇతర ఉత్పత్తిదారుల నుంచి అదనంగా విద్యుత్ తీసుకోవాలి. అయితే వాటి దగ్గర ఆ సమయంలో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.68 ఉంది. కానీ మార్కెట్లో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.38 చొప్పున మాత్రమే ఉంది. అంటే ప్రతీ యూనిట్కు సంస్థ 30 పైసల చొప్పున, మొత్తం రూ. 24.6 కోట్లు ఆదా చేసింది. ఇందులో గ్రిడ్ బ్యాలన్స్ కోసం రూ.1.9 కోట్లు తీసివేసినా... రూ.22.7 కోట్లు ఈ నెలలోనే విద్యుత్ కొనుగోళ్లలో ఆదా అయింది. కానీ ఒక వర్గం మీడియా మాత్రం పీపీఏ సంస్థల నుంచే ఈ విద్యుత్ కొంటే నష్టం రాదని అసత్యాలు ప్రచారం చేసింది. అసలు వాళ్ల దగ్గర విద్యుత్ లేనప్పుడు ఎలా కొనుగోలు చేస్తామని విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ.. – శ్రీకాంత్ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి) ఒప్పందం చేసుకున్న సంస్థలు విద్యుత్ ఇవ్వకపోతే మార్కెట్లో విద్యుత్ కొనక తప్పదు. లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడతాయి. కొనే విద్యుత్ను పీపీఏ సంస్థల నుంచే తీసుకోవాలనే వాదన సత్యదూరం. అసలు తమ దగ్గర విద్యుత్ లేదని వారే ప్రకటించినప్పుడు ఇక తక్కువ ధరకు వాళ్లు ఎలా ఇస్తారు? విద్యుత్ కొనగోళ్లను దారికి తేవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. నష్టమని మేం చెప్పలేదే? – జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ ఛైర్మన్ విద్యుత్ కొనుగోళ్లు మరింత పారదర్శంగా ఉండాలని కమిషన్ కోరుకుంటోంది. ఇందులో భాగంగానే వాస్తవాలు తెలుసుకునేందుకు డిస్కమ్ల నుంచి వివరణ కోరాం. అంతేతప్ప మార్కెట్ నుంచి విద్యుత్ కొనడం వల్ల డిస్కమ్లకు నష్టం వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదు. డిస్కమ్లు పంపే వివరాలను కమిషన్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా జరిగే వ్యవహారం. -
విత్తుకు ముందే.. విద్యుత్ సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరు శాతం ఫీడర్ల పరిధిలో ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయ అవసరాలకు పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీజన్ ప్రారంభం కాకముందే విద్యుత్ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నమ్మకమైన, నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఇంధనశాఖ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 2021–22లో 12,232 మిలియన్ యూనిట్ల మేర వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉండవచ్చని అంచనా వేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా సరఫరాకు ఆటంకం కలగకుండా మిగులు విద్యుత్నూ సిద్ధం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్లో పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్లో కొనుగోలు చేసి రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. వంద శాతం ఫీడర్లు రెడీ రాష్ట్రంలో 6,616 వ్యవసాయ ఫీడర్లు ఉండగా పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని 2019లో భావించినప్పుడు 58 శాతం ఫీడర్లకు అందుకు తగ్గ సామర్థ్యం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు రూ.1,700 కోట్లు మంజూరు చేయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లైన్లు, సబ్ స్టేషన్ల శక్తి పెంచారు. 515 ఫీడర్ల స్థాయిని సమూలంగా మార్చారు. ఫలితంగా వంద శాతం ఫీడర్ల పరిధిలో రైతులు వినియోగించే ఉచిత విద్యుత్ సామర్థ్యాన్ని తట్టుకునే వ్యవస్థ అందుబాటులోకొచ్చింది. ప్రతి రైతుకు రూ.35 వేలపైనే ఉచితం కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కృత్రిమ మేధోశక్తి (ఏఐ) ద్వారా 2021–22లో వ్యవసాయ విద్యుత్ వాడకం ఏ సీజన్లో ఎంత ఉంటుందనేది శాస్త్రీయంగా అంచనా వేశారు. ప్రతి హెచ్పీకి వార్షిక విద్యుత్ వినియోగం 1,059 యూనిట్లు ఉంటుందని అంచనా. అంటే ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో 5 హెచ్పీ మోటార్ అమర్చుకుంటే ఏడాదికి 5,295 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ ధర రూ.6.65 చొప్పున ఐదు హెచ్పీ మోటార్ ఉన్న ప్రతీ రైతు కోసం ఉచిత విద్యుత్ కింద ప్రభుత్వం కనిష్టంగా రూ. 35,212 దాకా చెల్లిస్తోంది. కొంతమంది రైతులు గరిష్టంగా 10 హెచ్పీపైనే వాడుతున్నారు. వారికి రెట్టింపు మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏటా రూ.8 వేల కోట్లకుపైనే సబ్సిడీ.. రాష్ట్రంలో ప్రస్తుతం 17.55 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా వీటి మొత్తం సామర్థ్యం 116 లక్షల హెచ్పీ ఉంటుంది. ఇవి ఏటా దాదాపు 12,232 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా రైతుల ఉచిత విద్యుత్ కోసం వెచ్చిస్తోంది. సీజన్ల వారీగా విద్యుత్ వాడకం ఇలా ఖరీఫ్ (జూన్ నుంచి అక్టోబర్).. 4,744.44 మిలియన్ యూనిట్ల (39 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ సీజన్లో రైతులు సగటున 2.20 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. రబీ (నవంబర్ నుంచి మార్చి).. 6,192 మిలియన్ యూనిట్ల (51 శాతం) విద్యుత్ వినియోగం ఉంటోంది. రైతులు సగటున రోజుకు 4.30 గంటల పాటు పంపుసెట్ వినియోగిస్తున్నారు. అన్ సీజన్ (ఏప్రిల్ నుంచి మే).. 1,296 మిలియన్ యూనిట్ల (11 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉన్నట్టు లెక్క తేలింది. ఈ సీజన్లో రైతులు సగటున 1.80 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం విద్యుత్ లభ్యతపై అధికారులు దృష్టి పెట్టారు. ఒక్క పంప్సెట్కూ ఇబ్బంది లేకుండా... ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్కు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. నాణ్యమైన సరఫరా కోసం పంపిణీ సంస్థలను నిలదీసే అధికారం కల్పించేలా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రైతుల ఖాతాల్లోనే వేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది పొడవునా ఏ ఒక్క రోజూ ఏ ఒక్క పంపుసెట్కూ విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాం. అన్ని స్థాయిల్లో విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈ ఏడాది మరింత మెరుగ్గా రైతులకు ఉచిత విద్యుత్ అందబోతోంది. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
ఈదురుగాలులు, వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడి ఐదుగురు మృతిచెందారు. ఈ గాలులు, వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పిడుగులు పడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. కర్నూలు జిల్లాలో మృతిచెందిన వ్యక్తి వైఎస్సార్ జిల్లాకు చెందినవారు. గాలులు, వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. గుంటూరు జిల్లాలో కళ్లాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. నెల్లూరు జిల్లాలో పసుపు పంట దెబ్బతింది. గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. చింతలచెర్వు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ధ్వజస్తంభం పీఠ భాగం పిడుగుపాటుకు దెబ్బతింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండుగంటల పాటు వర్షం కురిసింది. పిడుగుల శబ్దాలతో కొండలు ప్రతిధ్వనించాయి. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం కారణంగా గదులకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధులు, బయట రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రెండురోజుల పాటు వర్షాలు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం, అమరావతిల్లోని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రానున్న 48 గంటల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా తనకల్లులో 5 సెంటీమీటర్లు, ఉరవకొండలో 4, కదిరిలో 2, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 3, గుంటూరు జిల్లా జంగమేశ్వరపురం, ప్రకాశం జిల్లా దర్శి, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తాడేపల్లిగూడెంలలో ఒక సెంటిమీటరు వంతున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
ట్రాన్స్ఫార్మర్లు ఇక చల్లగా..!
సాక్షి, అమరావతి: వేసవిలో నిరంతరాయంగా విద్యుత్ను అందించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని రెండేళ్లుగా గణనీయంగా పెంచింది. సాధారణంగా వేసవిలో ట్రాన్స్ఫార్మర్లపై అత్యధిక లోడ్ పడుతుంది. దీంతో అవి తేలికగా వేడెక్కి, కాలిపోవడమో లేదా ట్రిప్ అయి ఆగిపోవడమో జరుగుతుంటాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వాస్తవ లోడ్ను క్షేత్రస్థాయి సిబ్బంది ముందే అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే వేడిని తగ్గించేందుకు కొద్దిసేపు కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సాధారణంగా ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటినప్పుడు ట్రాన్స్ఫార్మర్లలో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్కో ట్రాన్స్ఫార్మర్లలో లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉండే ఫ్యాన్లు ఆన్ అయ్యి వాటిని కూల్ చేస్తాయి. వినియోగదారులకు అందించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మజనార్థన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం లోడ్ను కంట్రోల్ చేయడం ద్వారానే వేడిని అదుపు చేస్తున్నామని చెప్పారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఎక్కువ లోడ్ ఉండే ప్రాంతాలను గుర్తించి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ఆయిల్ మార్పిడి వేసవి ముందే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ల స్థితిని అంచనా వేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ముందే ఆయిల్ మార్పు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని చెప్పారు. తరచూ చెడిపోతున్న, కాలిపోయే వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.