Revenue staff
-
తహసీల్దార్లకు మినహాయింపు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్సభ సెగ్మెంట్ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్సభ ఎన్నికలకు ఆర్ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈసీకి సీఎస్ లేఖ కాగా, సొంత లోక్సభ సెగ్మెంట్లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం. లోక్సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది. -
బయోమె‘ట్రిక్’తో బియ్యం మాయం
సాక్షి, కామారెడ్డి: బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. కరోనా నేపథ్యంలో రేషన్ సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయడంతో బియ్యం దొంగలకు వరంగా మారింది. ఫలితంగా రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని అక్రమాలకు తెరలేపారు. ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు సంబంధించిన బియ్యాన్ని కాజేస్తున్న వైనం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లను సేకరించి రెవెన్యూ సిబ్బంది సహకారంతో బియ్యాన్ని దారి మళ్లించారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో కొందరు డీలర్లు మహబూబాబాద్, భద్రాద్రి, మంచిర్యాల జిల్లాలకు చెందిన లబ్ధిదారుల పేరిట పెద్ద ఎత్తున బియ్యాన్ని తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఎల్లారెడ్డి పట్టణంలో ఒక రేషన్ దుకాణం, బాన్సువాడ పట్టణంలో రెండు దుకాణాలు, బీర్కూర్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్, దామరంచ గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు డీలర్లతో పాటు సహకరించిన వీఆర్వో, వీఆర్ఏలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఐదుగురు వీఆర్ఏలను, ఒక వీఆర్వోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దుర్వినియోగం ఈ దందా ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. ఆహార భద్రత కార్డుల ద్వారా పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తుండగా.. అక్రమాలకు అలవాటు పడిన కొంత మంది రేషన్ డీలర్లు, మాఫియా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ తమ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనా కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకుని కొత్త దారులు వెతికారు. బయోమెట్రిక్కు బదులు రెవెన్యూ సిబ్బంది ఆథరైజేషన్తో సరుకులు పంపిణీ చేస్తుండటంతో సిబ్బందిని మచ్చిక చేసుకుని లబ్ధిదారుల బియ్యాన్ని మింగేస్తున్నారు. అది కూడా ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి సంబంధించిన నెలనెలా మిగిలిపోతున్న బియ్యాన్ని మింగేశారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది. అక్రమాలకు హైదరాబాద్తో లింకు..! పొరుగు జిల్లాల లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసే మాఫియాకు హైదరాబాద్తో లింకు ఉన్నట్టు తెలుస్తోంది. బియ్యం మాఫియా ఎంచుకున్న కొన్ని రేషన్ దుకాణాల ద్వారా అక్కడి సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఇతర జిల్లాల లబ్ధిదారుల పేరుతో బియ్యాన్ని కాజేస్తోంది. దీనికి హైదరాబాద్లోని మాఫియా, యంత్రాంగం అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లు రాజధాని నుంచే డీలర్ల వాట్సాప్లకు వచ్చినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పౌరసరఫరాల అధికారులు ఇతర జిల్లాలపై దృష్టి సారించారు. -
ప్రభుత్వ భుములను కొట్టేసిన రెవెన్యూ సింబ్బంది
-
ఏమైతదో ఏమో.. కిటికీలో నుంచే దరఖాస్తులు
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారిని లోపలికి అనుమతించడం లేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం కార్యాలయం సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం తర్వాత విధుల్లోకి చేరిన రెవెన్యూ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. -
దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
సాక్షి, టెక్కలి: శ్రీకాకుళం మండలం పరిధిలో అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవాలని ప్రయత్నించిన వీఆర్ఓలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్ఓ, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు టెక్కలి ఆర్డీఓ ఎస్.భాస్కర్రెడ్డికి వినతిపత్రం గురువారం అందజేశారు. భైరి, కరజాడ, బట్టేరు, పొన్నాం, నైరా ప్రాంతంలో రాత్రి సమయంలో అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకోవాలని ప్రయత్నించిన వారిపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కొన్ని సందర్భాల్లో విధులు చేపడుతున్న వీఆర్ఓ లకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి నందిగాం: ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న వీఆర్వోలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని వీఆర్వో సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వర్రావు లకు సంఘీభావంగా మధ్యాహ్నం భోజన సమయంలో స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ పరిధిలోని నైరా వద్ద గురువారం రాత్రి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్వోలపై దాడి చేయడం హేయమైన చర్యన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం తగదని హితవు పలికారు. అలాగే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో వీఆర్వోలు సురేష్, అప్పన్న, మురళీ, రాంజీ, వైకుంఠరావు, ఖగేశ్వర్రావు, కృష్ణారావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారులపై దాడి
అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. మీ అంతు చూస్తామని బెదిరించారు. నిర్మాణం జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారు. అయినా అధికారులు భయపడకుండా అక్రమంగా వేసిన భారీ షెడ్ను ధ్వంసం చేశారు. ఆక్రమణలకు పాల్పడడంతో పాటు దాడికి పాల్పడ్డ టీడీపీ నేత కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. మధురవాడ(భీమిలి): టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు కుటుంబ సభ్యులు విశాఖ రూరల్ మండలం పరదేశిపాలెం రెవెన్యూ సర్వే నెంబరు 109 మారికవలసలోని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసిన భారీషెడ్ను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. ఈ క్రమంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిర్మాణం తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై డీజిల్ పోసుకుని మాజీ కార్పొరేటర్ భార్య బెదిరింపులకు దిగారు. అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు నోటికొచ్చినట్లు తిడుతూ వీఆర్వో అప్పారావును తోసేశారు. దీనిపై టీడీపీ నేత మన్యాల సోంబాబు, అతని కుమారుడు, కుటుం బ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసుతో పాటు వి«ధి నిర్వహణలో ఉద్యోగులను అడ్డగించి, దాడికి దిగిన నేరాలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని విశాఖ రూరల్ మండల తహసీల్దారు శేషగిరిరావు చెప్పారు. అంతేకాకుండా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి పశువుల పాక పేరుతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని భారీ షెడ్ వేసిన విషయాన్ని వివరిస్తామన్నారు. ఇదీ వ్యవహారం సర్వే నెంబరు.109లో తన పాఠశాలను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి సదరు వ్యక్తి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రయత్నాలపై పలు దఫాలుగా సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితం కావడంతో ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు చెక్ పెడుతున్నారు. తాజాగా ఇదే సర్వే నెంబరులో పశువుల పాక నిర్మాణం కోసమని హైకోర్టు అనుమతి తెచ్చుకుని పక్కనే ఉన్న సుమారు రూ. 5కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సుమారు 400గజాల విస్తీర్ణంలో భారీ షెడ్ నిర్మాణానికి ఉపక్రమించారు. దీనిపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘అడ్డకునేదెవరు?’ అనే శీర్షికన కథనం ప్రముఖంగా ప్రచురితమైంది. దీనిపై విశాఖ రూరల్ మండల తహసీల్దారు శేషగిరిరావు స్పందించారు. ఆయన ఆదేశాలు మేరకు ఇన్చార్జ్ ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో కె. అప్పారావు పరిశీలన చేసి ఇక్కడ నిర్మాణం జరుగుతున్న భారీ షెడ్కు ఏ రకమైన కాగితాలు లేక పోవడంతో షెడ్ను నేల మట్టం చేశారు. అధికారులు ఏమన్నారంటే.. ఇక్కడ మన్యాల సోంబాబు తన తల్లి పేరుతో కోర్టు నుంచి పశువుల పాక నిర్మాణానికి అనుమతి తెచ్చి నిర్మాణం చేశారు. అది కాకుండా పక్కనే ఉన్న కోట్లు విలువ చేసే 45 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు మరో భారీ షెడ్ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా పంచనామా చేస్తుండగా వాచ్మెన్ ఆధార్ కార్డు కోసం షెడ్లోకి వెళ్లిని సిబ్బందిని టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులు గృహనిర్భందం చేశారు. ఇదేమని ప్రశ్నించిన వీఆర్వో అప్పారావును బెదిరించారు. ఇతర రెవెన్యూ సిబ్బందిపైనా బెదిరింపులకు దిగి, దాడికి యత్నించారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత
చిత్తూరు,రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాళెం సమీపంలో అక్రమంగా నిర్మించిన 28ఇళ్లను బుధవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో కిరణ్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. సర్వే నంబర్ 506–1లోని 1.28 ఎకరాల వాగు పోరంబోకు స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, షెడ్లను తొలగించారు. బాధితులు అడ్డుకుని, తమ ఆక్రోశించినా అధికారులు పట్టించుకోలేదు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ సాయంతో ఇళ్లను కూల్చివేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వంక పోరంబోకు స్థలంలో ఇళ్లను నిర్మించడంతోనే తాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూల్చివేతకు పూనుకున్నట్లు విచారణాధికారి కిరణ్ చెప్పారు. అయితే పేదలు నిర్మించుకున్న రెండు సెంట్ల స్థలమే మీకు కనిపిస్తుందా...? అంటూ స్థానికులు రెవెన్యూ సిబ్బందిపై ఎదురుతిరిగారు. ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికులను వారించారు. తహసీల్దార్ మాధవక్రిష్ణారెడ్డి, ఆర్ఐలు ఈశ్వర్, వసంత్, వీఆర్వో, వీఆర్ఏలు సుమారు 20మంది ఈ పనులను పర్యవేక్షించారు. అయితే తాము రూ.10 వడ్డీతో అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయొద్దని, రెండు రోజులు గడువు ఇస్తే తామే నిర్మాణాలను తొలగించి రేకులు, తలుపులు, సిమెంటు రాళ్లను తీసుకెళ్తామని బాధితులు విజ్ఞప్తి చేసినా అధికారులు ఖాతరు చేయలేదు. విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ హరిప్రసాద్రెడ్డి, యోగేశ్వరరెడ్డి, సీపీఎం నేతలు నరసింహారెడ్డి, సెల్వరాజ్ అక్కడకు చేరుకుని బాధితుల పక్షాల అధికారులతో మాట్లాడారు. అయితే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఆగదని, అయితే బాధితుల్లో అర్హులైన పేదలుంటే వారు అర్జీలు ఇస్తే న్యాయం చేస్తామని విచారణాధికారి హామీ ఇచ్చారు. దీంతో చేసేది లేక స్థానికులు వెనుతిరిగారు. ఆత్మరక్షణలో రెవెన్యూ సిబ్బంది గత మూడు నెలల్లోనే అక్రమ కట్టడాలు నిర్మించినట్లు షార్ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా తెలుస్తోందని భావించిన విచారణాధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రేణిగుంట రెవెన్యూ సిబ్బంది ఆత్మరక్షణలో పడ్డారు. గత తహసీల్దార్ హయాంలో ఇచ్చిన అనుభవ ధ్రువపత్రాలతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో కొందరు వీఆర్వోలు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఎన్నికలకు ముందు అనధికారిక కట్టడాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ కట్టడాలకు కొందరు వీఆర్వోలు పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని, ప్రస్తుతం ఇళ్లు కూల్చేయడంతో బాధితులు వారిని శాపనార్థాలు పెడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. గతంలో అనుభవ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసినప్పటికీ ఎక్కడైనా ఫిర్యాదులొస్తే రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే గత నాలుగు నెలలుగా కొందరు వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలకు ఊతమిచ్చి రూ.లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతోనే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణాలు ఇటీవల కాలంలోనే జరిగినట్లు అధికారులు ధ్రువీకరించుకున్నారు. అయితే ఈ అక్రమాల వెనుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరిపైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన అక్కడున్న సిబ్బందిని హెచ్చరించడంతో కొంతమంది టెన్షన్కు గురవుతున్నట్టు సమాచారం. పలు ప్రయాసలకోర్చి నిర్మించుకున్న పేదలు మాత్రం బలిపశువులైపోగా, ఆమ్యామ్యాలకు పాల్పడిన వారు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత మిగిలిన చోట్ల కొనసాగుతుందన్న సంకేతాలు అందడం పలువురిలో గుబులు రేపుతోంది. ఇళ్ల కూల్చివేత బాధితుల రాస్తారోకో మండలంలోని ఎర్రమరెడ్డిపాళెంలో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో బాధితులు బుధవారం సాయంత్రం హైవేపై రాస్తారోకో చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ పేదల నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేసిన ఏవో కిరణ్కుమార్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బలప్రయోగంతో ఇళ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకివాకం మాజీ సర్పంచ్ భాస్కర్యాదవ్ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. గాజులమండ్యం పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. -
‘రద్దు’పై ఐక్య ఉద్యమాలు జేఏసీగా ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ శాఖను స్వతంత్రంగా, ఇప్పుడున్న విధంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తే ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం సీసీఎల్ఏ కార్యాలయ ఉద్యోగులు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ సంఘాలన్నింటినీ కలుపుకొని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డారు. మంగళవారం హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శాఖ భవిష్యత్తు, సీఎం కేసీఆర్ చెబుతున్న కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెవె న్యూ శాఖను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగ సంఘాల అభి ప్రాయాలు తీసుకున్నారు. జేఏసీగా ముందుకెళ్లడంతోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బుధవారం కలిసి పరిస్థితిని కూలంకషంగా వివరించాలని, ఆయన్ను కలిశాకే భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు. ప్రతి శాఖలోనూ అవినీతి.. తెలంగాణను అవినీతిరహితంగా మార్చాలంటే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తే సరిపోతుందా అని నేతలు ప్రశ్నించారు. ‘ఏ శాఖ లో అవినీతి లేదు? అన్ని శాఖల్లో అవినీతి, అలసత్వ ఉద్యోగులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేశారని పొగిడి నెల జీతం బోనస్గా ఇచ్చిన సీఎం.. ఇప్పుడు మమ్మల్ని బద్నామ్ చేయడం ఎంత వరకు భావ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 94 శాతం రికార్డులను నవీకరించినా ఒక్క రైతు నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులపై నిందలు మోపడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘మనిషి జననం నుంచి మరణం వరకు రెవెన్యూశాఖదే కీలక పాత్ర. ఇది ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ఎన్నో సేవలు చేస్తున్న రెవెన్యూ శాఖను అవినీతి శాఖగా చిత్రీకరించడం శోచనీయం’ అని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. కొన్ని శాఖలు తెలంగాణ కోసం అదనంగా 2 గంటలు పనిచేస్తామని చెప్పి కేవలం రెండు గంటలే పనిచేస్తున్నా కన్నెత్తిచూడకుండా నిరంతరం పాలనా వ్యవహారాల్లో తలమునకలయ్యే రెవెన్యూ శాఖను రద్దు చేసే ఆలోచన చేయడమేమిటని ప్రశ్నించారు. రెవెన్యూశాఖ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు రెవెన్యూ శాఖ పరిరక్షణ కోసం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్గా వంగా రవీందర్రెడ్డి (ట్రెసా), సెక్రటరీ జనరల్స్గా గరిక ఉపేందర్రావు (వీఆర్వోల సంక్షేమ సంఘం), గోల్కోండ సతీష్ (వీఆర్వోల సంఘం), కో చైర్మన్గా విజయరావు (వీఆర్వోల సంక్షేమ సంఘం), రమేశ్ బహదూర్ (డైరెక్ట్ రిక్రూటీ, వీఆర్ఏ సంఘం), రాజయ్య (వీఆర్ఏల సంఘం), కోశాధికారిగా నారాయణరెడ్డి (ట్రెసా), కన్వీనర్గా చంద్రమోహన్ (డిప్యూటీ కలెక్టర్ల సంఘం)లను ఎన్నుకున్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలను స్వాగతించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం సరికాదు... సమగ్ర భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకురావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మంచిదే. కానీ కొత్త చట్టం పేరిట రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఆలోచన సరికాదు. రెవెన్యూ పనులను ప్రైవేటుకు అప్పగిస్తే వ్యతిరేకిస్తాం. భూ సమగ్ర సర్వే చేసి హద్దు రాళ్లు నాటిన తర్వాతే ప్రక్షాళన చేస్తే రెవెన్యూ సమస్యలకు ఆస్కారం ఉండేది కాదు. భూమి ఒకరిది, రికార్డులో మరొకరిది ఉన్న కేసులు చాలా ఉన్నాయి. నిపుణుల కమిటీ వేసి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే రెవెన్యూ వివాదాలకే తావుండేది కాదు. ధరణి వెబ్సైట్ను తహసీల్దార్ ఫ్రెండ్లీగా మార్చాలి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘టాస్’ను వ్యతిరేకిస్తున్నాం. దాని వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయి. మంత్రులకు సర్వాధికారాలు ఇవ్వడం సీఎం ఇష్టం. కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం వల్ల అందరికీ లాభం జరుగుతుంది. – వంగా రవీందర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
నల్లగొండకు అత్యధికం... వరంగల్ అర్బన్కు అత్యల్పం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ సిబ్బంది కేటాయింపుపై స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) అవసరమైన రెవెన్యూ సిబ్బందిని నిర్ధారిస్తూ సర్క్యులర్ విడుదలైంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ కార్యాలయాలకు ఈ సర్క్యులర్ ఇప్పటికే చేరింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, మండల కార్యాలయాల్లో కలిపి మొత్తం 9,891 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంది. జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వో), డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో), అడ్మినిస్ట్రేటివ్ అధికారులు/తహశీల్దార్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, రికార్డ్ అసిస్టెంట్లు, డ్రైవర్, జమేదార్లు, ఆఫీస్ సబార్డినేట్లు, చౌకీదార్లు, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులు, మండల సర్వేయర్లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, చైన్మెన్లు.. ఇలా మొత్తం 18 కేటగిరీల్లో సిబ్బందిని పంపిణీ చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాకు 482 మందిని కేటాయించగా, అత్యల్పంగా వరంగల్ అర్బన్ జిల్లాకు 200 మందిని కేటాయించారు. ఇక హైదరాబాద్కు 289 మందిని కేటాయించారు. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు 2016లో ఇచ్చిన జీవో నంబర్ 157 ద్వారా మంజూరు చేసిన 284 పోస్టులను కూడా ఇందులో కలిపినట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది పంపిణీపై కలెక్టర్లు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జిల్లాకో డీఆర్వో: రాష్ట్రంలోని 31 జిల్లాలకు 31 మంది డీఆర్వోలను కేటాయించారు. రంగారెడ్డి (5), కామారెడ్డి (4), నల్లగొండ, నాగర్కర్నూలు, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ముగ్గురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్ (అర్బన్), రాజన్నసిరిసిల్ల జిల్లాలకు ఒక్కరు చొప్పున ఆర్డీవోలను కేటాయించారు. మిగిలిన జిల్లాలకు ఇద్దరు ఆర్డీవోలను మంజూరు చేశారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఒక జమేదార్ పోస్టును ఇచ్చారు. తహశీల్దార్ స్థాయి అధికారులను అత్యధికంగా నల్లగొండ (40), రంగారెడ్డి (38) జిల్లాలకు కేటాయించారు. అత్యల్పంగా వరంగల్ అర్బన్ (18), గద్వాల (19)కు మంజూరు చేశారు. ఒక్కో మండలానికి ఒకరు చొప్పున సర్వేయర్లు, మండల గణాంక అధికారులను కేటాయించారు. ఒకరి నుంచి నలుగురు వరకు అదనంగా చైన్మెన్లను ఒక్కో మండలానికి మంజూరు చేశారు. దాదాపు ప్రతి జిల్లాకు నాలుగు రికార్డు అసిస్టెంట్ పోస్టులను కేటాయించగా, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్కర్నూలు, నల్లగొండ జిల్లాలకు ఐదుగురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ముగ్గురు చొప్పున కేటాయించారు. రంగారెడ్డిలో మాత్రం అత్యధికంగా ఏడుగురు రికార్డు అసిస్టెంట్లు ఉండనున్నారు. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులను కేటాయించారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్కర్నూలు, నల్లగొండ జిల్లాలకు మూడు, రంగారెడ్డికి 5 చొప్పున పోస్టులు మంజూరు చేశారు. -
కొక్కొక్కో.. కోట్లు
సాక్షి, నెట్వర్క్: తూర్పుగోదావరి జిల్లాలో జూదరాయుళ్లు చెలరేగిపోయారు. సుమారు 400 బరులకు పైగా ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నుంచి జూదప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ మూడు రోజులు రూ.800 కోట్లకుపైగా కోడి పందేలు జరిగాయని అంచనా. ఒకప్పుడు ఊరి పొలిమేరలకు, కొబ్బరి తోటలకు పరిమితమైన పందేలు ఇప్పుడు మెయిన్ రోడ్లకు దగ్గరగా బహిరంగంగానే సాగాయి. యు.కొత్తపల్లిలో అయితే పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోనే పందేలు జరిగాయి. డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలం ఆర్.బి.కొత్తూరులో పండుగ మూడు రోజులు రూ.5 కోట్ల మేర, పనసపాడు– తిమ్మాపురం సరిహద్దులో రూ.10 కోట్ల మేర, తుని నియోజకవర్గం తేటగుంటలో రూ.మూడు కోట్ల మేర పందేలు నడిచాయి. జగ్గంపేట మండలం మర్రిపాకలో పందేలు చూసేందుకు వచ్చినవారి నుంచి రూ.300 చొప్పున నిర్వాహకులు వసూలు చేయడం గమనార్హం. పందేనికి కనీస ధర రూ.30 వేలుగా నిర్ణయించారు. కిర్లంపూడి, వేళంక, కాట్రేవుల పల్లెలో భారీ పందేలు జరిగాయి. పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ సొంత గ్రామం పి.దొంతముర్రులో రూ.మూడు కోట్లు, ఇసుకపల్లి, పిఠాపురంలలో రూ.ఆరు కోట్ల మేర పందేలు సాగాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 25 కోట్ల మేర పందేలు జరిగాయని తెలుస్తోంది. అల్లవరం మండలం గోడి, గోడిలంక, అల్లవరం, రెళ్లుగడ్డ, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి, గొల్లవిల్లి, భీమనపల్లిలో అడ్డూ అదుపులేకుండా పందేలు జరిగాయి. కోడి పందేలకు తోడు పలుచోట్ల అశ్లీల నృత్యాలను నిర్వహించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తంలో గొల్లవిల్లి, భీమనపల్లిలో అశ్లీల నృత్యాలను నిర్వహించడం గమనార్హం. మినీ స్టేడియాలను తలపించిన బరులు పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన బరులతోపాటు వాటి పక్కనే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిశాయి. ఫలితంగా బరులు జాతరలను తలపించాయి. జిల్లాలో రూ.700 కోట్ల మేర పందేలు సాగాయి. కోడిపందేలు, పేకాటల్లో రూ.కోట్లు చేతులు మారితే గుండాట, కోతాటల్లో రూ.లక్షలు, రూ.వేలు చేతులు మారాయి. ఒక్కో కోడి పందెం కనీసం రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు సాగింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు మూడురోజులూ పందేలు జరిగే ప్రాంతాల వైపు రాకపోవడం గమనార్హం. బరుల వద్దే మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లాలో 30 వరకూ పెద్ద బరులు ఏర్పాటు చేయగా.. మరో 200 వరకూ చిన్న బరులు సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లో మినీ స్టేడియాలను తలపించేలా భారీ షామియానాలు, వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన పందేలకు తెలంగాణ నుంచి కూడా జూదరులు భారీగా తరలివచ్చారు. లక్షల్లో పందేలు జరిగాయి. కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డు వద్ద మంగళవారం రాత్రి కోతాట, గుండాట ఆడుతున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల్లో సుమారు 45 బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో కోడిపందేల్లో భాగంగా జరిగిన కొట్లాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. నరసాపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా కోడిపందేలు, పేకాట, గుండాట సాగాయి. నరసాపురం పట్టణంలో రోడ్డు పక్కన తోపుడుబళ్లపై పెట్టి మరీ గుండాట ఆడించారు. టీడీపీ నేతలు దగ్గరుండి నిర్వహించడంతో పోలీసులు కన్నెత్తి చూడలేదు. మార్టేరులో ఫ్లడ్లైట్ల వెలుగులో కోడిపందేలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో 16 చోట్ల బరులు ఏర్పాటు చేశారు. విజయవాడలో విచ్చలవిడిగా కోతముక్కాట కృష్ణా జిల్లాలో రూ.500 కోట్ల మేర కోడి పందేలు సాగాయని అంచనా. జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే కోడిపందేలు, గుండాట, పేకాట జరిగాయి. కంకిపాడు, ముసునూరు, బాపులపాడు, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, మైలవరం, గన్నవరం, పామర్రు మండలాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా విజయవాడ నగరంలోని ప్రముఖ హోటళ్లలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కోతముక్కాట విచ్చలవిడిగా సాగింది. ఒక్కో కోసుకు రూ.లక్ష చొప్పున పందేలు జరిగాయి. సంక్రాంతి మూడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. గుంటూరు జిల్లాలో కూడా రూ.350 కోట్ల మేర కోడి పందేలను నిర్వహించినట్టు తెలుస్తోంది. రేపల్లె రూరల్ మండలంలోని బొబ్బర్లంక, గుడ్డికాయలలంక, నిర్మల్ నగర్, చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, బలుసులపాలెం, నిజాంపట్నం మండలం అడవులదీవి, దిండి, కొత్తపాలెం, తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొత్తబొమ్మువానిపాలెం పుష్కరఘాట్ల వద్ద అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో పందేలు సాగాయి. కోడి పందేలకు అనుబంధంగా గుండాట, కోతముక్క, చక్రం ఆటలు జరిగాయి. కొత్తబొమ్మువానిపాలెంలో తెనాలి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మరీ కోడిపందేలు నిర్వహించారు. గతేడాది కోడి పందేల కేసులు కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెరవెనుకే ఉండి ఫోన్ ద్వారా అన్నీ తానై పర్యవేక్షించారు. విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా భీమిలి–విజయనగరం సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు సాగగా యలమంచలి, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలో మారుమూల ప్రాంతాల్లో పందేలు సాగాయి. జిల్లావ్యాప్తంగా రూ.80 కోట్ల మేర పందేలు కాశారు. విజయనగరం జిల్లాలో జూదంతోపాటు కోడి, పొట్టేలు పందేల కోసం రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశారు. పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే చిందులు ‘ఏం తమాషాగా ఉందా? కోళ్లు ఎలా పట్టుకెళతావు? కోళ్లకు కత్తులేమైనా కట్టామా? జూదమేమైనా ఆడిస్తున్నామా? మీరు వాంటెడ్గా చేస్తున్నారు.. చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు. పో... వెళ్లిపో.. మీ డీఎస్పీని రమ్మను’ అంటూ గుంతకల్లు టూటౌన్ ఏఎస్ఐ తిరుపాల్పై అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ చిందులు తొక్కారు. బుధవారం పాత గుంతకల్లు ఏరియా అంకాలమ్మ ఆలయ సమీపంలోని పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక టీడీపీ నేతలు కొందరు కోడి పందేలు నిర్వహించారు. ఈ సమాచారం టూటౌన్ పోలీసులకు చేరడంతో ఏఎస్ఐ తిరుపాల్, కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఇతర పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందేపు కోళ్లను స్టేషన్కు తరలిస్తుండగా.. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అడ్డుకొని పోలీసు సిబ్బందిపై బూతు పురాణం అందుకున్నారు. ‘ఏం తమాషాలు చేస్తున్నారా? సంప్రదాయాలను కాపాడాల్సిందిపోయి అడ్డుకుంటారా?’ అంటూ కోపంతో ఊగిపోయారు. పోలీసుల నుంచి బలవంతంగా కోళ్లను తీసుకుని మళ్లీ పందేలు నిర్వహించడం గమనార్హం. -
చుక్కలు చూపుతున్న ‘ధరణి’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రూపొందించిన ‘ధరణి’వెబ్సైట్ రెవెన్యూ సిబ్బందికి చుక్కలు చూపెడుతోంది. పాస్ పుస్తకాల జారీలో జరిగిన తప్పుల సవరణకు వెబ్సైట్ సహకరించడం లేదని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు ధరణి పోర్టల్లో కనపడటం లేదని, అవసరం లేని వాటికి పాస్ పుస్తకాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఒక్క ఖాతాను నమోదు చేసేందుకు నాలుగు దశల్లో బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుండటంతో చాలా సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోందని, దీనివల్ల ఇతర రెవెన్యూ పనులు పెండింగ్లో పడిపోతున్నాయని వారంటున్నారు. దీంతో భూ రికార్డుల సవరణ పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. ఈనెల మొదట్లోనే ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ధరణి పోర్టల్లో మార్పులు చేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ధరణి వెబ్సైట్ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులివే: - తప్పులు సరిచేయడం కోసం కొన్ని సర్వే నంబర్లను వెబ్సైట్లో నమోదు చేసినా అవి కనిపించడం లేదు. - ప్రతి రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయాలంటే ఆ రైతు ఆధార్ నంబర్ తప్పనిసరి. ఆధార్ నంబర్లు గతంలో ఇవ్వని వారు, ఫొటోలు లేని రైతులు వారి ఆధార్ నంబర్లు, ఫొటోలు మీ సేవా కేంద్రాల్లో అప్లోడ్ చేయించినా ధరణి పోర్టల్లో కనిపించడం లేదు. దీంతో డిజిటల్ సంతకాలు ఆగిపోతున్నాయి. - ప్రతి ఎంట్రీకి తహసీల్దార్లు రెండుసార్లు బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోంది. ఎంట్రీకి ముందు, తర్వాత నిర్ధారణ కోసం రెండుసార్లు బయోమెట్రిక్ ఇస్తున్నారు. ప్రతి ఎంట్రీకి డేటాఎంట్రీ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్, నాయిబ్ తహసీల్దార్, తహసీల్దార్ డిజిటల్ సంతకాలు చేయాలి. ఇన్నిసార్లు బయోమెట్రిక్ అవసరం లేదని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఖాతాను నిర్ధారించే సమయంలో వీఆర్వో, తహసీల్దార్ బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందన్నది వారి అభిప్రాయం. - ఒక పట్టాదారుకు ఒక ఖాతాలో రెండు సర్వే నంబర్లు ఉండి.. అందులో ఒక సర్వే నంబర్లో ఇంటి స్థలం, మరో సర్వే నంబర్లో వ్యవసాయ భూమి ఉంటే ఒక సర్వే నంబర్కు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం అవసరమవుతుంది. కానీ డిజిటల్ సంతకం కోసం ఆ ఖాతా నంబర్ను నమోదు చేస్తే రెండు సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది బయోమెట్రిక్ ఇచ్చిన వెంటనే ఇంటి స్థలం ఉన్న సర్వే నంబర్కు కూడా డ్రాఫ్ట్ పాస్ పుస్తకం కనిపిస్తోంది. దీంతో తహసీల్దార్లు ఆ రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయలేకపోతున్నారు. - ధరణి వెబ్సైట్ ద్వారా భూముల మ్యుటేషన్ అవకాశం కూడా కల్పించారు. అయితే ఒక భూమిపై ఎక్కువ కొనుగోలు లావాదేవీలు జరిగినప్పుడు కేవలం మొదట రిజిస్ట్రేషన్ జరిగిన కొనుగోలు లావాదేవీలో ఉన్న వ్యక్తి పేరు మాత్రమే కనిపిస్తోంది. ఆ తర్వాత లావాదేవీల వివరాలు కనిపించడం లేదు. - ధరణి పోర్టల్ నెట్వర్క్, సర్వర్ కూడా చాలా తక్కువ వేగంతో పనిచేస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో సకాలంలో డేటా ఎంట్రీ కావడం లేదు. - డిజిటల్ సంతకం చేసే ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. సాంకేతిక కారణాల వల్ల డిజిటల్ సంతకం చేసే క్రమంలో అనేక తప్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ రైతుల ఖాతా నంబర్లను నమోదు చేసిన క్రమంలో ఏదైనా తప్పులు వస్తే వాటిని సరిచేసే అవకాశం సీనియర్ అసిస్టెంట్లు, నాయిబ్ తహసీల్దార్లకు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు. - మిగిలిన సర్వే నంబర్లు నమోదు చేసే అవకాశం ధరణి పోర్టల్లో కల్పించారు. అయితే ఒక సర్వే నంబర్లో మిగిలి పోయిన సబ్ సర్వే నంబర్లను నమోదు చేసేందుకు ప్రాథమిక సర్వే నంబర్ కనిపించడం లేదు. - డిజిటల్ సంతకం చేసేందుకు ఒక ఖాతాలోని అన్ని సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. అదే ఖాతాలోని ఇంటి స్థలాలు, వివాదాస్పద భూములు, అమ్ముకున్న భూముల వివరాలు కూడా కనిపిస్తున్నాయి. -
ఎవరడ్డుకుంటారో చూస్తా!
ద్వారకాతిరుమల: ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న మహిళా తహసీల్దారు ముందు ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. తవ్వకాలను ఎవరడ్డుకుంటారో చూస్తా.. పనులు కానివ్వండంటూ రెవెన్యూ అధికారుల ముందే అతడు హడావిడి చేశాడు. ఇంత ధీమాగా అతడు హల్చల్ చేయడానికి కారణం అతను వెనకున్న టీడీపీ నేతలేనని తెలుసుకున్న తహసీల్దారు చివరకు వెనక్కి తగ్గారు. వివరాలు ఇవి.. ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట గ్రామంలోని సర్వే నంబర్ 91/1ఎ లోని 19 సెంట్ల బండిదారిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్ తహసీల్దారు టీడీఎల్ సుజాతకు బుధవారం ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకం పనులను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ, ట్రాక్టర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో రాళ్లకుంటకు చెందిన చుక్కా నాని అక్కడికి చేరుకుని పనులు తానే చేయిస్తున్నానంటూ తహసీల్దారుకు చెప్పాడు. అంతటితో ఆగకుండా ఫిర్యాదు చేసింది ఎవరంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం ప్రారంభించాడు. దీంతో నానికి, ఫిర్యాదుదారుడైన లక్ష్మణ్కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో అక్కడికి కొందరు టీడీపీ నాయకులు చేరుకున్నారు. దీంతో నాని తహసీల్దారును సైతం లెక్కచేయకుండా పనులను ఎవరు అడ్డగిస్తారో రండి చూస్తానంటూ సవాల్ విసిరాడు. కలెక్టరొచ్చినా భయపడేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. అప్పటికే నియోజకవర్గ ముఖ్య నేత నుంచి తహసీల్దారుకు ఫోన్ రావడంతో ఆమె చేసేది లేక వెనక్కి తగ్గారు. మొక్కుబడి జరిమానాలతో సరి రాళ్లకుంటలో నిర్మిస్తున్న వేబ్రిడ్జికి, ఓ రియల్ ఎస్టేట్ భూమి మెరకకు ఈ మట్టిని తోలుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఒక జేసీబీతోపాటు 9 ట్రాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. టీడీపీ నేతల ఒత్తిడి కారణంగా తహసీల్దారు జేసీబీతో పాటు, ఒక ట్రాక్టరును మాత్రమే లెక్కలో చూపారు. అక్రమంగా మట్టి తవ్వినందుకు జేసీబీకి రూ.10 వేలు, ఒక ట్రాక్టరుకు రూ.5 వేలు జరిమానా విధిస్తున్నట్టు తహసీల్దారు సుజాత విలేకర్లకు తెలిపారు. -
కలెక్టరమ్మ మాటతీరు మార్చుకో..
సాక్షి, వనపర్తి/వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూరికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. దీంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో వనపర్తి కలెక్టర్ నోటి దురుసు, సస్పెన్షలపై ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు అధికారులు లేకపోవటంతో వెనుదిరిగారు. సస్పెన్షన్పై రచ్చ కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం రాత్రి శ్రీరంగాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్ఓ వెంకటరమణలపై రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించక పోవడం, చెక్కుల కంటే పాస్పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏంటని ఆగ్రహించారు. అలాగే ఆదివారం ప్రత్యేక పనిదినం విధులు నిర్వహించలేదని వీఆర్ఓ వెంకటరమణపై ఒకేసారి ఒకే మండలంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశించారు. అలాగే ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్ఓ, గోపాల్పేట మండలం బుద్దారం వీఆర్ఓలను కూడా వేటు వేసినట్టు సమాచారం. ఆ సందర్భంగా కలెక్టర్ అధికారులను దుర్భాషలాడినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కలెక్టర్పై విమర్శలు వస్తున్నాయి. పనిలో వెవకబడిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. గతంలో విద్యాశాఖలో ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. అప్పట్లో ఉపాధ్యాయులంతా ఏకతాటిపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో కలెక్టర్ వెనక్కి తగ్గారు. ఒక్కటైన రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ తీరు బాగాలేదంటూ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు ఏకమై నిరసన బాట పట్టారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైనప్పటినుంచి రెవెన్యూ ఉద్యోగులు నిర్విరామంగా పని చేస్తున్నారు. సెలవులు తీసుకునే అవకాశం కూడా లేకపోవటంతో పనివత్తిడికి గురయ్యారు. అయినప్పటికీ ఇతర జిల్లాలతో పాటుగా ప్రోగ్రెస్ సాధించామని వారి వాదన. ఆరునెలలుగా పది మందికిపైగా రెవెన్యూ సిబ్బందిపై వేటు పడిందని, ఎప్పుడు ఎవరు కలెక్టర్ ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందోనన్న భయంతో పని చేయాల్సి వస్తుందని అంటున్నారు. కలెక్టర్ నోటి దురుసు, అన్యాయంగా సస్పెన్షన్లపై నిరసన చేస్తున్నట్లు బ్యానర్ తయారు చేయించి ధర్నాకు దిగారు. నిరసనలో భాగంగా తహసీల్దార్ శ్రీనివాస్రావు కంటతడి పెట్టారు. ఎన్నో ఏళ్లుగా రాత పూర్వకంగా ఉన్న రికార్డులను కంప్యూటరీకరణ చేస్తుండటంతో అవగాహన లేక తప్పులు దొర్లాయని, వాటికి రెవెన్యూ సిబ్బందిని బాధ్యులుగా చేయడం సరైంది కాదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖండించారు. కలెక్టర్ తీరు మార్చుకోవాలని, సస్పెన్షన్కు గురైన వారిని విధుల్లో చేర్చుకోవాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఒకేసారి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు మానేసి నిరసన చేపట్టడంతో ఈ విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన కార్యాలయాలు రెవెన్యూ ఉద్యోగుల మూకుమ్మడి నిరసనతో జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలు అధికారులు లేక వెలవెలబోయాయి. దీంతో వివిధ పనుల కోసం గ్రామీణ ప్రాంతాల వచ్చిన రైతులు, విద్యార్థులు అధికారులు లేక అసౌకర్యానికి గురయ్యారు. -
డబ్బుంటే సుబ్బారావు.. లేకుంటే సుబ్బిగాడు!
ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగర పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు పన్నులు విధిచండం.. పన్నుల్లో మార్పులు, అనధికారిక భవనాలకు విధించే పన్నులు.. తదితర పనుల్లో రెవెన్యూ విభాగం ఆర్ఐలు, రెవెన్యూ విభాగం బాధ్యతలు చూస్తున్న అసిస్టెంట్ కమిషనర్, ఇతర సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైసలివ్వందే ఫైలు కదిలే పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఆదాయాలే లక్ష్యంగా రెవెన్యూ విభాగం సిబ్బంది నగరపాలక ఖజానాకు గండి కొడుతున్నారు. గజిట్ ప్రకారం కేటాయించిన జోన్ల్లో ఇష్టానుసారంగా బహుళ అంతస్థులకు కొలతల్లో అవకతవకలు చేసి భారీగా తగ్గించి పన్నులు విధిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కుళాయి కనెక్షన్లు, కరెంటు కనెక్షన్ల కోసం క్రయ విక్రయాలు జరిపిన డీకే పట్టాలకు ఎటువంటి ఆస్తి హక్కు కల్పించకుండా మౌలిక వసతుల కోసం విధించాల్సిన సూపర్స్ట్రెక్చర్ (ఎస్ఎస్) ట్యాక్సుల సైతం నిలిచిపోతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ చాంబర్లో వందల కొద్ది దస్త్రాలు పేరుకుపోతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ పనితీరుపై కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. భవన అనుమతులు పొందిన భనాలకు సంబంధించి నిర్మించిన ఎక్స్ట్రా ఫ్లోర్లకు సైతం పన్నులు విధించకుండా పక్కన పెడుతున్నారు. ప్లాన్ లేకుండా నిర్మించిన భవనాలైనా, అనుమతులు మీరి నిర్మించిన భవనాలకైనా నూరుశాతం పన్ను అదనంగా విధించాలి. అయితే మామూళ్లకు అలవాటుపడిన రెవెన్యూ విభాగం పన్నుల విధింపులో తమ చేతివాటం చూపుతూ నగరపాలక ఖజానాకు నష్టం తెస్తున్నారు. రెవెన్యూ విభాగం సిబ్బంది అధికార పార్టీ వారికి, డబ్బు ఉన్న వాళ్లకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఎన్నో బహుళ అంతస్థుల భవనాలు, వ్యాపార సముదాయాలకు రూ.లక్షల్లో మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పెద్ద పెద్ద భవనాలకు పన్ను విధించేటప్పుడు పరిశీలించాల్సిన ఓఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖజానాకు గండిపడుతున్నా ఓఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారులు కఠిన చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. ఆర్ఐలు విధించిన పన్నులపై పూర్తి పరిశీలన చేస్తే అక్రమ పన్నులు బట్టబయలు అవుతాయని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ నేతల అండదండలతోనే.. అధికార పార్టీ నాయకులు నగరంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, అవినీతి పన్నులు, అక్రమార్కులకు అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అక్రమాలకు అండగా ఉంటూ అధికారులతో సంప్రదింపులు చేస్తూ తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికారిక కట్టడాలు, అక్రమ పన్నులు, భవన నిర్మాణ అనుమతులు, సివిల్ పనుల టెండర్లు ఇలా ప్రతి పనిలో అధికార పార్టీ చోటామోటా నాయకుల హవా కొనసాగడం గమనార్హం. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు ఒక న్యాయం, డబ్బు, హోదా, అండదండలు ఉన్న పర్గాలకు మరో న్యాయం పాటించకుండా సమన్యాయం పాటించి నగరపాలక సంస్థకు నష్టం జరగకుండా సకాలంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. పన్నుల విధింపులు, వసూలు సక్రమంగా జరిగితే వచ్చే ఆదాయంతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
‘రిజిస్ట్రేషన్’ బాధ్యతలకు మేం సిద్ధమే
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాల నిర్వహణకు రెవెన్యూ వర్గాలు అంగీకరించా యి. ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల భర్తీ తదితర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినందునే ఇందుకు అంగీకరిస్తున్నట్టు టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతం కుమార్ తెలిపారు. ఆదివారం టీజీటీఏ కార్యవర్గ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత వస్తుందని, ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు దగ్గరవుతాయన్నా రు. ప్రభుత్వం తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఈ భేటీలో టీజీటీఏ కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు ముంతాజ్, విష్ణుసాగర్ పాల్గొన్నారు. -
రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్?
సాక్షి, హైదరాబాద్ : నాలుగు నెలలుగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్గా ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉన్నతస్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఎప్పుడో నిజాం నవాబు నాటి రికార్డులను ఎంతో శ్రమకోర్చి ప్రక్షాళన చేసిన క్షేత్రస్థాయి వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి సీసీఎల్ఏ సిబ్బంది వరకు ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తారని, ఏప్రిల్ నెల జీతంతోపాటు బోనస్ వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ గత నెలలోనే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మరోవైపు ఈ ప్రోత్సాహకం విషయంలో ఏం చేద్దామన్న దానిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) ప్రతిపాదిస్తున్న విధంగా సిబ్బంది మొత్తానికి నెల జీతం బోనస్గా ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.18 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుందని రెవెన్యూ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అయితే రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మొత్తం 40 వేల మంది సిబ్బందికీ బోనస్ ఇవ్వాలా లేదా భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న వీఆర్ఏలు, వీఆర్వోలు, తహసీల్దార్లు, ఇతర కార్యాలయ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్డీవో కార్యాలయాల నుంచి కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల సిబ్బంది వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందున అందరికీ బోనస్ వర్తింపజేయాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనస్ ఎవరికి ఇస్తారన్నది త్వరగా తేల్చి వీలుంటే మార్చి లేదా ఏప్రిల్ నెల జీతంలో బోనస్ జమ చేస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
టీఆర్ఎస్లో వసూల్ రాజాలు
రంగారెడ్డి/అత్తాపూర్: పార్టీ పేరు చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న కొందరు వసూల్ రా జాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ సీరియస్గా వ్యవహరిస్తుంది. అధికారం అడ్డం పెట్టుకుని అడ్డదారిన సంపాదిస్తున్న వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వారిని పార్టీ నుంచి స స్పెండ్ చేయడంతోపాటు చట్టపరంగా శిక్షించడానికి వెనుకాడటం లేదు. తాజాగా జరుగుతున్న సంఘటనలే దీనికి ఉదాహరణ.... ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారికి అండగా ఉండి రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేస్తానని డబ్బులు వసూలు చేసి సస్పెండ్కు గురైన అత్తాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్రంపల్లి యాదగిరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి... గుర్రంపల్లి యాదగిరి గత కొన్ని రోజులుగా అత్తాపూర్ డివిజన్లో నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి అనుమతులు లేవని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇదేక్రమంలో వారం రోజుల క్రితం అత్తాపూర్ భరత్నగర్ కాలనీలో ఉన్న ఓ ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నుంచి రూ. 25వేలు తీసుకున్నాడు. ఇందు కోసం రెవెన్యూ సిబ్బంది రాకుండా చూస్తానని నమ్మబలికాడు. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాలలో రావడంతో అతడిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరుసటి రోజు రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ, వీఆర్వో గుర్రపల్లి యాదగిరిపై తమ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తన పేరును దేవాలయ శాఖ అధికారుల వద్ద వాడి బద్నాం చేశాడని అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరామ్రెడ్డి, డివిజన్కు చెందిన మరో ఇద్దరు తాము ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నాలుగు ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆధారాలతో సహా గుర్రంపల్లి యాదగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. చేసిన నేరాలను అంగీకరించడంతో రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మల్లికార్జున్ తెలిపారు. తాజాగా మరొకరు... గుర్రంపల్లి యాదగిరి కథనం మరువక ముందే అధికార పార్టీకి చెందిన మరో నేత వీడియోకి చిక్కినట్లు సమాచారం. దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో నిర్మాణం చేపడుతున్న ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలకు పైగా డబ్బులు తీసుకున్నాడని అతడి వెన్నంటే ఉండే అనుచరుడు మ రో రూ. 10 వేలు తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ వీడియో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేకు కూడా చేరినట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో ఆ నాయకుడిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధినాయకత్వం సిద్ధమవుతుంది. అతడే మరో రెండు చోట్ల కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలిసిందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. రేపో మాపో అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వస్తుందని నాయకులు పేర్కొంటున్నారు. -
రికార్డుల సవరణ.. రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రికార్డుల సవరణ శరవేగంగా జరుగుతోంది. రికార్డులను పరిశీలించిన తర్వాత రైతుల వద్ద ఉన్న వివరాలకు, రికార్డులకు మధ్య ఉన్న తేడాలను రెవెన్యూ యంత్రాంగం సరి చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూముల రికార్డులను పరిశీలించారు. అందులో 45 లక్షలకు పైగా ఎకరాల భూమి సరి చేయాల్సిందిగా తేలింది. ఈ సరి చేయాల్సిన భూమిలో ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల రికార్డులను సరి చేసినట్టు భూ ప్రక్షాళన గణాంకాలు చెపుతున్నాయి. ఆ ప్రకారం నమోదైన మొత్తం తప్పుల్లో 55 శాతం వరకు రికార్డులను సరి చేశారు. మరోవైపు రెవెన్యూ రికార్డులను సరి చేసేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది సొమ్ములు అడుగుతున్నారని, చిన్న తప్పులను కూడా కాసులు లేనిదే సరిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. చాలా వరకు చిన్న సవరణలే.. వాస్తవానికి రికార్డుల సవరణకు అవసరమైన విషయాలను పరిశీలిస్తే చాలా వరకు చిన్న చిన్న పొరపాట్లే ఉన్నాయని భూ రికార్డుల ప్రక్షాళనలో అర్థమవుతోంది. ఎక్కువగా సర్వే నంబర్లలో తప్పులు, పట్టాదార్ల పేర్లలో క్లరికల్ తప్పులు, పౌతి చేయాల్సినవి, ఆన్లైన్ రికార్డుల్లో ఎక్కించాల్సినవి, మ్యుటేషన్ అప్డేట్ చేయాల్సినవి, పాస్ బుక్కుల వివరాలు ఆన్లైన్లో ఎక్కించాల్సినవి.. ఇలా అన్నీ ఉన్నపళంగా సరి చేసేందుకు వీలైన తప్పులే 90 శాతానికి పైగా నమోదవుతున్నాయి. ఇక కోర్టు కేసులు, అటవీ భూములు, అసైన్డ్ భూముల్లో నమోదవుతున్న పొరపాట్లను ఇప్పటికిప్పుడు సరిచేసే అవకాశం లేదు. దీనికితోడు దాదాపు 3 లక్షల సర్వే నంబర్లలో భూమి ఎక్కువగా ఉంటే రికార్డుల్లో తక్కువగా ఉండటం, రికార్డుల్లో ఎక్కువగా ఉండి భూమి తక్కువ ఉండటం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ రికార్డులను కూడా సర్వే చేయకుండా నివృత్తి చేయలేని పరిస్థితి. ఇలాంటివన్నీ కలసి 10 శాతం వరకు ఉంటున్నాయి. కోర్టు కేసులైతే ఇప్పటివరకు 24 వేల సర్వే నంబర్లలోని భూముల్లోనే వచ్చాయి. అసైన్డ్, ఫారెస్టు అన్నీ కలిపినా 85 వేల సర్వే నంబర్లకు మించలేదు. రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యే సరికి కూడా ఈ గణాంకాల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. దీంతో చిన్న తప్పులను సరిచేసేందుకు పెద్దగా సమయం తీసుకోవడం లేదని, రైతుల అంగీకారంతో రికార్డులను సవరించి 1బీ ఫారాలు ఇచ్చి సంతకాలు తీసుకుంటున్నామని, వాటిని గ్రామసభల్లో అంటిస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. 31 నాటికి కష్టమే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పుల సవరణ శరవేగంగా జరుగుతున్నప్ప టికీ డిసెంబర్ 31 నాటికి ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల సవరణ లో భాగంగా రోజుకు 40 వేల వరకు సర్వే నంబర్లను సరి చేస్తున్నామని, అలా చేసినా మరో 10 లక్షలకు మించి పూర్తయ్యే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఇంకా వేగంగా చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశముం దని, దీనికితోడు ఈ రికార్డులను ఆన్లైన్ చేసేందుకు ఇంకా సమయం తీసుకుంటుంద ని వారంటున్నారు. ప్రక్రియ సజావుగా సాగాలంటే కనీసం మరో నెలరోజులైనా గడువును పొడిగించాలని కోరుతున్నారు. ‘ఆమ్యామ్యాలు’ ఇవ్వాల్సిందే..! రికార్డుల ప్రక్షాళనలో క్షేత్రస్థాయిలో ‘ఆమ్యామ్యాలు’ నడుస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరి చేసేందుకు ఎకరాల లెక్కన రైతుల నుంచి రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎకరానికి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు డిమాండ్ను బట్టి వసూలు చేసి తప్పులు సరి చేస్తున్నారని, ఇదేమంటే తాము పై అధికారులకు ఇచ్చుకోవాలని వీఆర్వోలు చెబుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో రెవెన్యూ అధికారులపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అయితే అందరు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయకపోయినా, రైతు అవసరాన్ని బట్టి గట్టిగానే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతుండటం గమనార్హం. -
భయపెట్టిన భూకంపం
యూనివర్సిటీ క్యాంపస్/యాదమరి: జిల్లాలోని తమిళనాడు సరిహద్దు మండలాల్లో శనివారం అర్ధరాత్రి భూకంపం కలకలం సృష్టించింది. యాదమరి మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పలుమార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాలను సందర్శించి సమాచారం సేకరించారు. ఈ వివరాలను హైదరాబాద్లోని నేషనల్ జియోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్కు సమాచారం అందించారు. చిత్తూరుకు 30 కిమీ దూరంలో అర్ధరాత్రి 01.02 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని, వీటి తీవ్రత 2.6గా నమోదైనట్లు వారు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, చిత్తూరు జిల్లా ప్రమాదకర జోన్లో లేదని సేఫ్ జోన్లోనే ఉందని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్వీయూకు చెందిన ప్రొఫెసర్లు తెలిపారు. మళ్లీ ప్రకంపనలు.. యాదమరి మండలం తాళ్లమడుగులో ఆదివారం రాత్రి 7–8గంటల మధ్య నాలుగు పర్యాయాలు కంపించింది. భూమి కదలడం, పెద్ద శబ్దాలు రావడంతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. -
ఇసుక లెక్కలు సరే..
♦ నిబంధనల అమలు ఎక్కడ? .. ♦ కఠిన శిక్షలు ఏమయ్యాయి? ♦ ‘సాక్షి’ కథనంతో అధికారుల్లో చలనం వచ్చినా.. తాడేపల్లిరూరల్ : ‘పర్యవేక్షకులే ఇసుకాసురులు’ శీర్షికన ఈనెల 20న ప్రచురించిన ‘సాక్షి’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక రీచ్లలో గురువారం నుంచి రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చి వెళ్లే వాహనాల లోడింగ్ వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎవరికి తోలుతున్నారనే విషయాలను కూడా సేకరిస్తూ లారీ నంబర్తో కలిపి ఆధార్ కార్డ్ను లింక్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఉచిత ఇసుక పాలసీలో నిబంధనలను మాత్రం గాలికొదిలేశారు. ఎవరైనా తప్పు చేస్తే కఠిన శిక్షలు తప్పవని వివిధ శాఖలకు చెందిన అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారం రీచ్ల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించకూడదు. కానీ గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ లాంటి మహానగరాలకే ఇసుక తరలిపోతోంది. అంతేగాక నిబంధనల ప్రకారం ట్రాక్టర్లకు, చిన్న చిన్న ఆరు టైర్ల టిప్పర్లకే లోడ్ చేయాల్సి ఉండగా, రాజధాని ప్రాంతంలో 10 టైర్లు, 12 టైర్లు, 14 టైర్ల వాహనాలకు కూడా లోడ్ చేసి, ఇతర రాష్ట్రాలకు దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదిమాత్రం అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టగానే రీచ్ల సమీపంలోనూ, ప్రధాన రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఈ చెక్ పోస్టులు కనిపించకపోవడం గమనార్హం. ఏదో తూతూమంత్రంగా రెవెన్యూ శాఖ అధికారులతో లెక్కలు తీసినంతమాత్రాన దోపిడీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. రెవెన్యూ అధికారులు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కలు వేస్తున్నారే తప్ప రాత్రి సమయంలో తరలిపోయే లక్షల టన్నుల ఇసుక లెక్కలు ఎలా తీస్తారో స్పష్టత లేదు. -
అధికారులను అడ్డుకున్న పాము
తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహాలను తరలిస్తున్న అధికారులకు అనుకోని అవాంతరం ఎదురైంది. పురాతన విగ్రహాలను తీసుకెళ్తున్న రెవెన్యూ సిబ్బందిని పాము వెంబడించడంతో.. అధికారులు ఆ విగ్రహాలను అక్కడే వదిలి పరుగులు తీశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన భూస్వామి రాజా తన పొలాన్ని బుల్డోజర్ల సాయంతో చదును చేయిస్తున్న క్రమంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాలను పరిశీలించారు. పురాతన శివలింగం, వీరభద్రుడి విగ్రహంతో పాటు ఆనవాళ్లు కోల్పోయిన మరో విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. దీంతో తహశీల్దార్ కనకదుర్గ వాటిని స్వాధీనం చేసుకొని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించేందుకు తీసుకెళ్తుండగా.. ఓ పాము ఆమెను వెంబడించింది. రెవెన్యూ సిబ్బంది అందరు ఆమె వెంట ఉన్నా.. పాము మాత్రం కేవలం విగ్రహాలు పట్టుకున్న ఎమ్మార్వోనే వెంబడించింది. దీంతో భయాందోళనలకు గురైన రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం కార్యాలయానికి వెళ్లిన సిబ్బందికి కూడా విచిత్ర అనుభవాలు ఎదురవుతుండటంతో పాటు ఆందోళన పెరిగిపోవడంతో.. ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహాలను గురువారం తిరిగి యధాస్థానానికి చేర్చారు. ఈ విషయం సమీప గ్రామాలకు పాకడంతో విగ్రహాలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. -
అధికారుల కనుసన్నల్లోనే!
♦ రాయకూర్ కెనాల్ వద్ద ఇసుక డంప్లు ♦ ప్రభుత్వ అనుమతుల పేరుతో పక్కదారి.. ♦ ఒక్కో ఇసుక ట్రాక్టర్కు రూ. 2,300 ♦ అత్యవసరం అయితే రూ. 2,500 ♦ చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బంది కోటగిరి : ఇసుక అనుమతుల విషయంలో సామాన్యులకు చుక్కలు చూపే అధికారులు.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కళ్లముందే సాక్ష్యాలున్నా.. చర్యలకు ముందుకు రావడం లేదు. సులేమాన్ఫారం సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట వద్ద కొందరు ఇసుక వ్యాపారులు ఇసుకను డంప్ చేస్తున్నారు. దీనిని రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుకతో పాటు ఇటుక బట్టీల నుంచి తరలించిన ఇటుకలనూ ఇక్కడ డంప్ చేసి తర్వాత తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ పనులకుగాను మండలంలోని పోతంగల్ లేదా కొడిచర్ల మంజీర నది నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు వారంలో ఓ రోజు అనుమతి ఇస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇసుక వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారికి కొన్ని ప్రాంతాల్లో వీఆర్వోలు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అనుమతుల పేరుతో కొందరు వేబిల్లులు పొంది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతితో లబ్ధిదారుడు మంజీర నదినుంచి ఒక ట్రాక్టర్ ఇసుకను తరలించాలంటే సుమారు వెయ్యి రూపాయలు ఖర్చవుతాయి. అదే ఒక ఇసుక ట్రాక్టర్ను ఇసుక వ్యాపారి రూ. 1,900 నుంచి 2,300 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుకకు రూ. 2,500 లు కూడా వసూలు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారుల అనుమతి లభించడం కష్టమైనవారు వ్యాపారులనుంచి ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ స్థలాల్లో ఇసుక డంప్లు కానీ ఇటుక డంప్లు కానీ ఏర్పాటు చేయడం నేరం. అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతులు తీసుకోకుండా ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేసులు పెడుతాం. ఎవరినీ ఉపేక్షించం. ఇసుక వ్యాపారులకు వీఆర్వోలు సహకరిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటాం. - రాజేశ్వర్, తహసీల్దార్ -
‘రియల్’దందా..!
జిల్లా కేంద్రం శ్రీకాకుళమైనా, మండల కేంద్రం పాతపట్నమైనా... మరే పట్టణంలోనైనా.. మూడు సెంట్లు స్థలం దొరికితే సొంత ఇల్లు కట్టుకోవాలని భావించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో సొంత జిల్లాలో ప్లాట్ కొనుక్కోవాలని ఆశ పడేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ పరిస్థితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారగా...కొంతమంది అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారితో కుమ్మక్కయ్యే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకూ ముడుపులు బాగానే ముడుతున్నాయి. ఫలితంగా విలువైన ప్రభుత్వ భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. అందమైన బ్రోచర్లు చూసి, బ్రోకర్ల మాటలు విని వాటిని కొనుక్కున్నవారంతా నిలువునా మోసపోతున్నారు. ఇలాంటి వ్యవహారానికి పాతపట్నంలో వెలుగు చూసిన వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం పరిసరాల్లో సుమారు 30 వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు వెలిశారుు. ఈ సంస్థలు వేసిన లేఅవుట్లలో ప్రభుత్వ భూములున్నాయి. ఇలా దాదాపు 27 ఎకరాల భూమి ఇటీవల కాలంలో కబ్జా అయిపోయింది. ఈ అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలుపుతున్నారు. వారు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను నయానో, భయానో లొంగదీసుకొని వ్యవహారం చక్కబెడుతున్నారు. ఇలా సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి లేఅవుట్ల కింద మారిపోయింది. ఇందులో చాలావరకూ గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములు ఉన్నాయి. వాటిని విక్రయించే హక్కులేకున్నప్పటికీ రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అండతో లాక్కొంటున్నారు. వాటిని పక్క సర్వే నంబర్ల ఆధారంగా వారసత్వ భూములుగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేస్తున్నారు. పోరంబోకు భూమికి ఎసరు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన పాతపట్నం పరిసర గ్రామాలకు చెందినవారు, అలాగే పరిసర గిరిజన గ్రామాల్లో ఉద్యోగాలు చేస్తూ పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం తదితర అవసరాల కోసం పాతపట్నంలో నివాసం ఉంటున్నవారు రియల్ ఎస్టేట్లలో ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండుకు తగ్గట్లుగా కొందరు అధికార పార్టీ నాయకులు, ముఖ్యనేతల అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తారు. పాతపట్నం పరిసరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా, ప్రభుత్వ భూములపై కన్నేశారు. వాటి పక్కనే జిరాయితీ భూములు కొనుగోలు చేసి, ఆ ముసుగులో ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు. ఉదాహరణకు ప్రహరాజుపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 32లో కొంతమంది రైతులకు జిరాయితీ భూమి ఉంది. దాన్ని కొనుగోలు చేసిన ఓ రియల్ఎస్టేట్ సంస్థ ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమికి సర్వే నంబరు 32/1/ఎగా సబ్డివిజన్ చేసి 1.83 ఎకరాలను కాజేశారు. దీన్ని వారసత్వ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై కొంతమంది గ్రామస్థులు ఎన్కంబరేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా... అసలు ఆ సర్వే నంబరు, సబ్డివిజన్ లేదని అధికారులు ధ్రువీకరించారు. అధికారులు గుర్తించినవి కొన్నే కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 30లో 1.53 సెంట్లు, సర్వే నంబరు 31లో పోరంబోకు గయ్యాలు 60 సెంట్లు, సర్వే నంబరు 33లోని జగ్గయ్య కోనేరు 2.56 ఎకరాలు, అలాగే రంకిణి పంచాయతీ చిన్నపద్మాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 3లో 55 సెంట్లు ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందంతా కలిపి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిలో ఐదో వంతు కూడా లేదు. సర్వే నంబరు 31లో 1.50 ఎకరాలు, 32లో 2.56 ఎకరాలు, 35లో 3.89 ఎకరాలు, 35/2లో 21 సెంట్లు, 35/3లో 24 సెంట్లు, 35/4లో 87 సెంట్లు, 35/5లో 1.04 ఎకరాలు, 36లో 6.78 ఎకరాలు, 36/1లో 5.18 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్ లేఅవుట్ల్లో కలిసిపోయాయి. సుమారు 22 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమి విలువ రూ.10 కోట్లు పైమాటే. ‘కమీషన్’ కక్కుర్తి డీ పట్టా ఆధారంగా ప్రభుత్వ భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వారిని బుట్టలో వేసి భూమిని అప్పగించిన బ్రోకర్లకు ఎకరాకు రూ.లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ కమీషన్ను రియల్ వ్యాపారులు ముట్టజెప్పుతున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుండటంతో కొంతమంది బ్రోకర్లు రియల్ వ్యాపారులుగా మారిపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. పాతపట్నం పరిసరాల్లో వెలిసిన చాలా లేఅవుట్లకు పంచాయతీ అఫ్రూవల్స్ లేవు. ప్లానులు, అనుమతులూ లేవు. భూమార్పిడి రుసుం చెల్లించిన దాఖలాలు లేవు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి వేసిన వెంచర్లను గుర్తించాం. ఆయా లేఅవుట్ల్లో సర్వే చేయించాం. రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ స్థలాన్ని తొలగించాం. రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. -ఎన్.దాలినాయుడు, తహసీల్దారు, పాతపట్నం -
అవినీతికి పాల్పడితే కఠినచర్యలు
భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ భూపాలపల్లి: సాదా బైనామాల భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్లపై వీఆర్ఓలు, సర్పంచ్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. లావాణి, పోడు భూములు, ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారికి ఈ పథకం వర్తించదన్నారు. 2014 జూన్ 2లోపు ఇతరుల నుంచి కొనుగోలు చేసిన భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని, అంతేకాక ఒక కుటుంబానికి ఐదెకరాల లోపు మాత్రమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వర కు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, ఆర్ఐ రహమాన్, పలు గ్రామాల సర్పంచ్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
కంచే చేను మేస్తే..
►రెవెన్యూ సిబ్బంది చేతివాటం ►పేరు, సర్వే నంబర్లు లేకుండా పట్టాలు ►వీఆర్వోలు, వారి బంధువుల పేర్లతో భూముల మార్పు ►పట్టా భూములుగా మారుతున్న ప్రభుత్వ భూములు కలువాయి మండలం నూకనపల్లిలో సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమి మీరయ్య పేరుతో ఉంది. ఈ భూమిని స్థానిక వీఆర్వో తన తల్లిపేరుతో మార్పు చేశాడు.నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్మోపురు గ్రామంలో సర్వే నంబర్ 89-డీలో 2.74 ఎకరాల భూమి వెంకటసుబ్బారెడ్డి పేరుతో ఉంది. దీనిని వీఆర్వో తన పేరుతో మార్పు చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. కంచే చేను మేసిన చందాన రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పేదల భూములు పరిరక్షించాల్సిన రెవెన్యూ సిబ్బంది రాబందుల్లా మారుతున్నారు. చేతివాటం ప్రదర్శించి నిరుపేదల భూములును ఆక్రమించి పేర్లు మార్పు చేస్తున్నారు. నెల్లూరు(పొగతోట) : అల్లూరుకు చెందిన సత్యనారాయణకు సర్వే నంబర్ 348-1లో ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి భూముల అనుభవం మరోకరి పేరుతో ఉందని రికార్డులో నమోదు చేశారు. పాసుపుస్తకాల కోసం సత్యనారాయణ అధికారుల చుట్టు తిరుగుతుంటే భూములు నీపేరుతో లేవని అధికారులు చెబుతున్నారు. చిల్లకూరు మండలంలో ఇదే పరిస్థితి. సమస్య ఏంటని మండల రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తే పక్క పోలం అతను ఫిర్యాదు చేశాడు. దీంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని చెప్పడం గమనర్హం. ఇలా రెవెన్యూలో జరుగుతున్న లీలలు అన్నీఇన్ని కావు. కొందరు అధికారులు రెవెన్యూ భూములను దర్జాగా పట్టా భూములుగా మార్చేస్తున్నారు. పేరు, సర్వే నంబర్లు లేకుండా నివాసస్థలాలు, భూముల కేటాయింపు పట్టాలు బయటకు వస్తున్నాయి. పట్టా వెనుక తహసీల్దార్ సంతకం, కార్యాలయం స్టాంప్ వేసి ఉంటున్నాయి. నాలుగేళ్ల క్రితం నెల్లూరు తహసీల్దార్గా పని చేసిన అధికారి నేటికి నివాసస్థల పట్టాలు ఇస్తున్నారు. ఒక్కొక్క పట్టా రూ.లక్ష - 2 లక్షల వరకు పలుకుతోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారిపోయాయి. అధికారులు, సిబ్బంది కుమ్మకై భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. నష్టపోయిన బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరగడం వారి వంతైంది. ఆక్రమణల పర్వం.. జిల్లా పరిశ్రమల స్థాపనకు అనుకులమైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు అధికంగా జరుగుతున్నాయి. అధికారపార్టీని అడ్డుపెట్టుకొని కొందరు రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ భూములు ఆక్రమిస్తున్నారు. ఈ ప్రక్రియలో కోట్లాది రూపాయాలు చేతులు మారుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై అనేక ఫిర్యాదులు వస్తున్నా ఉన్నాతాధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండాపోతుంది. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడే రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భూముల పేర్లు మార్పు విషయం పరిశీలిస్తాం. పేర్లు మార్పు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు పరిరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. న్యాయం చేయండి : గ్రామంలోని సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమిని 1992లో నా భర్త మీరయ్యకు కేటాయించి పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి భూమి సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. రెవెన్యూ సిబ్బంది భూమిని అతని తల్లి పేరుతో మార్పు చేసుకున్నాడు. జిల్లా అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఖాసింబీ, నూకనపల్లి -
బుచ్చిపేట ఇసుక ర్యాంపు మూసివేత
నరసన్నపేట : బుచ్చిపేట ఇసుక ర్యాంపును అధికారులు మంగళవారం మూసివేశారు. నరసన్నపేట ఎస్ఐ ఎన్ లక్ష్మణ తోపాటు రెవెన్యూ సిబ్బంది వెల్లి ర్యాంపును క్లోజ్ చేస్తూ రోడ్డు మార్గంలో ట్రెంచ్లు తవ్వించారు. బోర్డులు పెట్టారు. రెండు రోజులుగా గ్రామస్తులు ఇసుక ర్యాంపుపై ఆందోళన చెందుతున్న విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం మైన్స్ అధికారులకు పరిశీలించమని సోమవారం ఆదేశించారు. ర్యాంపులో అనుమతికి మించి ఇసుక తవ్వకాలు జరిగాయని ప్రస్తుతం తవ్వేందుకు అనుకూలంగా లేదని సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై ర్యాంపును మూసి వేశామని ఎస్ఐ హెచ్చరించారు. -
రెవెన్యూ జేబుకు చిల్లు
► అతీగతీ లేని ప్రొటోకాల్ నిధులు ► రూ. కోటి విడుదల చేశామని ప్రకటించిన ప్రభుత్వం ► అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ► తీర్చే మార్గం కనిపించక ఆందోళనస గుంటూరు ఈస్ట్ : మహా సంకల్పం నుంచి నేటి వరకు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రెవెన్యూ సిబ్బంది భుజస్కందాలపై వేసుకుని పని భారంతో పాటు ఆర్థిక భారం వారే భరించి విజయవంతం చేశారు. ప్రొటోకాల్ ఖర్చుల కింద జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేశామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేటి వరకు ఒక్క రూపాయి కూడా రెవెన్యూ సిబ్బందికి అందకపోవడంతో వారు ఆందోళన లో పడ్డారు. రాజధాని కేంద్రమైన నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో రాష్ర్టస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో ప్రొటోకాల్ నిమిత్తం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై పడింది. కొన్ని కార్యక్రమాలు రెండు రోజులకు ముందే ఖరారవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ స్థాయి సిబ్బందికి అన్ని పనులు పురమాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశిస్తారే కానీ, ఆర్థిక సహకారం ఇవ్వరు. అధికారులు,సిబ్బంది ఆ వారం రోజులు రాత్రనక పగలనక పని చేయడంతో పాటు ప్రొటోకాల్ ఖర్చులన్నీ వారే భరించాల్సి వస్తోంది. గతంలో సంవత్సరానికి మూడు పెద్ద కార్యక్రమాలు జరిగేవి. అప్పుడప్పుడు మంత్రులు వచ్చినప్పుడు కొంత ఖర్చు ఉండేది. ఇది వారికి పెద్ద భారమయ్యేది కాదు. మహా సంకల్పం, క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన, తెనాలి రైతు సదస్సు వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించిందే కానీ, వాటికి సంబంధించి ప్రొటోకాల్ నిధులు ఒక్క పైసా రెవెన్యూ సిబ్బందికి చెల్లించలేదు. వీటికి తోడు శాసనసభాపతి, జిల్లాకు చెందిన మంత్రులు,ఇన్చార్జి మంత్రి జిల్లాలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. రాజధాని కావడంతో ఇతర మంత్రులు, సీఆర్డీఏ నేపథ్యంలో విదేశీ అతిథులు జిల్లాకు వస్తున్నారు. ఇటీవల టీడీపీ మహిళా విభాగం నాయకురాలి ప్రమాణ స్వీకారానికి ప్రొటోకాల్ ఖర్చులు రెవెన్యూ సిబ్బందే భరించాల్సి రావడంతో వారు ఆవేదనకు గురైనట్లు వార్తలొచ్చాయి. గొంతెమ్మ కోర్కెలు.. ఒక్కో అతిథికి ఒక్కో అలవాటు. రెవెన్యూ సిబ్బందికి అతిథుల గొంతెమ్మ కోర్కెలు శిరోభారంగా మారాయి. ఓ అతిథి ఉదయాన్నే సమోసాలు కోరగా, మరో అతిథి న్యాప్కిన్ టవల్స్ తిరస్కరించి అప్పటికప్పుడు కొత్త న్యాప్కిన్ టవల్స్ కోరారు. ఉదయం సాయంత్రం భోజనాలే కాక ఫలహారాలతో పాటు ఇతర వ్యసనాలకు కూడా సిబ్బంది పరుగులు తీయాల్సి వస్తోంది. నిధులు ఏమైన ట్టు.. అసలు ప్రభుత్వం విడుదల చేసిన కోటి రూపాయలు ప్రొటోకాల్ నిధులు ఏమయ్యాయనేది రెవెన్యూ సిబ్బందిని కొంతకాలంగా తొలుస్తున్న ప్రశ్న. ప్రభుత్వం ప్రకటించడమే కానీ విడుదల చేయలేదా? విడుదలైన నిధులను వేరే పనులకు మళ్లించారా? అసలు ఆ నిధులు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరక్క రెవెన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారు. ప్రొటోకాల్ నిధులొచ్చినప్పుడు తీర్చవచ్చని అప్పుగా తెచ్చిన డబ్బు ఇప్పుడు ఎలా తీర్చాలా అని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికైనా అధికారులు ప్రోటోకాల్ ఖర్చులు చెల్లించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
భూమాయ!
♦ ఫార్మా భూసేకరణలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ♦ మీర్ఖాన్పేటలో రికార్డులు తారుమారు పహణీల్లో తప్పుడు నమోదులు.. ♦ అక్రమాలకు పాల్పడిన వీఆర్ఓలు సస్పెండ్ చేస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం ఔషధనగరి భూసేకరణలో రెవెన్యూ యంత్రాంగం హస్తలాఘవం ప్రదర్శించింది. తప్పుడు రికార్డులు సృష్టించడం ద్వారా పరిహారం కైంకర్యం చేసేందుకు ప్రయత్నించింది. కందుకూరు మండలం మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం.112లో జరిగిన భూమాయపై విచారణ జరిపిన జిల్లా యంత్రాంగం.. ఇద్దరు ఇంటి దొంగలపై వేటు వేసింది. ఇదే అంశంపై గత నెల 26న ‘లెక్కతప్పింది’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన యంత్రాంగం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీకి వేలాది ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులోభాగంగా మీర్ఖాన్పేట సర్వే నం. 112లోని 613 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు భూముల సర్వే చేసిన అధికారులు లెక్క తేలిన విస్తీర్ణం చూసి బిత్తెరపోయారు. తొలుత 2008-09, 2012-15 పహణీల ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ లెక్క కాస్తా 691 ఎకరాలు తేలింది. వెలుగు చేసిన అక్రమాలపై మరింత లో తుగా దర్యాప్తు జరిపిన రెవెన్యూ యం త్రాంగం మొత్తం విస్తీర్ణం కంటే అదనంగా 343 ఎకరాలు ఉన్నట్లు గుర్తిం చింది. ఈ భూ బాగోతం వెనుక గ్రామ రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషిం చినట్లు నిర్ధారణ అయ్యింది. పహణీల్లో తప్పుడు నమోదు ద్వారా కొందరు నకిలీలు భూసేకరణ పరిహారాన్ని కాజేయాలని ఎత్తుగడ వేసినట్లు స్పష్టమైంది. వాస్తవ విస్తీర్ణకంటే ఎక్కువగా ఉన్నట్లు కొందరు తమ పేర్లను రికార్డుల్లో నమోదు చేయించుకున్నట్లు తేటతెల్లమైంది. అక్రమార్కులతో వీఆర్ఓల మిలాఖత్! ఇటీవల ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా గ్రామానికి వెళ్లిన రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికిగాకుండా... పహణీల్లో ఉన్న విస్తీర్ణానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ రావడంతో యం త్రాంగం విస్తుపోయింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికార్డులపై అనుమానం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ రజత్కుమార్ షైనీ 112 సర్వే నంబర్లోని మొత్తం పహణీలను నిశితంగా పరిశీలించాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. ఈ మేరకు సర్వే ల్యాండ్ రికార్డ్స్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓతో కలిసి మీర్ఖాన్పేట భూముల వ్యవహారంపై లోతుగా విచారించారు. దీంతో అక్రమాల డొంక బయటపడింది. 1989-90 నుంచి ఇప్పటివరకు ప్రతి రికార్డును పరిశీలించిన అధికారులు.. ఈ భూ బాగోతం వెనుక గతంలో పనిచేసినవీఆర్ఓల పాత్ర ఉన్నట్లు నిగ్గు తేల్చారు. ఎలాంటి రుజువులు, సాక్ష్యాలు లేకుండానే పహ ణీ పట్టాకాలమ్లలో పేర్లను నమోదుచేసినట్లు గుర్తించారు. గతంలో ఇక్కడ వీఆర్ఓలుగా పనిచేసిన డి.లక్ష్మీ నర్సిములు, డి.రవీందర్, ఏ.రాములు (చనిపోయారు), పి.రాములు (రిటైర్డ్), జే.శ్రీనివాసులు, కె.నర్సింహ రెవెన్యూ రికార్డులను తారుమారు చే శారని, వీరిరువురిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్కు సిఫారసు చేశారు. ఈ మేరకు జేసీ-1 రజత్కుమార్ వీఆర్ఓలు శ్రీనివాసులు, నర్సింహ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. కుర్మిద్ద ‘ఫార్మా’ భూమి రీసర్వేకు ఆదేశం యాచారం : ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్న కుర్మిద్దలో గల సర్వే నంబరు 311లోని భూమిని రీ సర్వే చేయాలని జేసీ రజత్కుమార్ సైనీ ఆదేశించారు. ఈ సర్వే నంబరులో సాగుకు యోగ్యమైన భూమి తక్కువగా ఉండడం, పరిహారం కోసం పలువురు రైతులు నకిలీ పట్టాదారు, పాసు పుస్తకాలు సృష్టించి, అధిక విస్తీర్ణంలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి 311 సర్వే నం బరులో మొత్తం భూమి 375 ఎకరాలు ఉండగా ఇందులో 213 ఎకరాలు అసైన్డ్ చేయడం జరిగింది. ఈ భూమిలో దాదాపు 30 నుంచి 40 ఎకరాల వరకు సాగుకు యోగ్యంగా లేకపోవడంతో పలువురు దీనిని వదిలేసి వెళ్లారు. మిగతా 13 ఎకరాల్లో తండా, రెండెకరాల్లో రోడ్డు నిర్మాణం ఉంది. కందుకూరు, యాచా రం మండలాల సరిహద్దులో 124 ఎకరాల్లో గుట్ట ఉంది. అసైన్డ్ చేసిన భూమి కంటే ఎక్కువ భూమిలో పట్టాదారు, పాసుపుస్తకాలు, కబ్జాలో ఉన్నట్లు ఫిర్యాదు నేపథ్యంలో రీ సర్వేకు జేసీ ఆదేశించినట్లు తెలిసింది. ఈ సర్వే నంబరులోనే 2005-06లో, 2009-10లో 54 మంది నకిలీ సర్టిఫికెట్లు, పట్టాదారు, పా సుపుస్తకాల సృష్టించి, బ్యాంకుల్లో పంట రుణాలు పొందినట్లు వెలుగులోకి రావడంతో సంబంధిత వ్యక్తులపై కేసులు కూ డా నమోదు చేశారు. దీంతో సోమ, మం గళవారాల్లో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో రీసర్వే చేయనున్నట్లు సమాచారం. -
మొండి ఘటాలు!
♦ కడప నగర పాలక సంస్థలో సగం కూడా వసూలు కాని పన్నులు ♦ అధికార పార్టీ అండతో మొండి కేస్తున్న బడా నేతలు ♦ ఎక్కువ మొత్తంలో బకాయిలన్నీ వారివే ♦ ఇరువైపులా ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది సతమతం కడప కార్పొరేషన్ : ఓ వైపు 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా కడప నగర పాలక సంస్థలో మాత్రం పన్నులు సగం కూడా వసూలు కాలేదు. నగరంలోని ప్రైవేట్ ఆస్తుల నుంచి రావలసిన పన్ను రూ.22 కోట్లకు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.12 కోట్లు మాత్రమే వసూలైంది. కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల నుంచి కూడా రూ.15 కోట్లు రావలసి ఉంది. కడప నగరంలో పేరు, పలుకుబడి ఉన్న అధికార పార్టీ నేతలే ఎక్కువ మొత్తంలో పన్నులు బకాయిపడి చెల్లించకుండా మొండికేస్తున్నారని కార్పొరేషన్ వర్గాలు వాపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలైన ఆర్అండ్బీ, హరిత, ఇతర కార్యాలయాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పన్ను వసూలు కావలసి ఉంది. మార్చి అఖరు నాటికి 100 శాతం కలెక్షన్ చేయాలని మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఒకవైపు, మరోవైపు అధికారపార్టీ నేతల మొండి వైఖరి, బెదిరింపులతో నగర పాలక రెవెన్యూ అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు. పెద్దమొత్తంలో పన్ను బకాయిపడ్డ వారి సంస్థలు, ఇళ్ల ముందు ఆందోళన నిర్వహిస్తున్నా ఆశించినంత ఫలితం కనిపించడం లేదు. బకాయిలు వసూలు చేసేందుకు రెవెన్యూ సిబ్బంది వెళితే రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న వారి నుంచి కమిషనర్కు ఫోన్లు చేయిస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాగేతై పన్నులు వసూలు చేయడం తమ వల్ల కాదని నగర పాలక సంస్థ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్లు వరుసగా ఆస్తి పన్నుపై వడ్డీ మినహాయించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం లోటు బడ్జెట్ను సాకుగా చూపి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదు. దీంతో చాలా మంది బకాయిదారులు వడ్డీ మాఫీ అవుతుందనే ఆశతో పన్ను చెల్లించకుండా మొండికేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి డిమాండ్ నోటీసులు, రెడ్ నోటీసులు, ట్యాప్ కనెక్షన్ నోటీసులు, ఆక్యుపై నోటీసులు జారీ చేశారు. ఆస్తులు వేలం వేసైనా పన్నులు రాబట్టాల్సిందేనని ఉన్నతాధికారులు జప్తు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేసేందుకు కృషి చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ పి. చంద్రమౌళీశ్వర్రెడ్డి తెలిపారు. సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించామన్నారు. -
నత్త నడకన భూ పంపిణీ !
* ఇప్పటికి 28 శాతమే లక్ష్య సాధన * లక్ష్యం 8,634 ఎకరాలు.. పంపిణీ చేసింది 2,449 ఎకరాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు భూపంపిణీ పథకం నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది (2015-16) లక్ష్య సాధన మరీ తీసికట్టుగా మారింది. నిర్దేశించుకున్న లక్ష్యాలకు కేవలం 28 శాతం మేరకేసాధించడంతో.. రాబోయే రోజుల్లో ఇది ఏవిధంగా వేగం పుంజుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ భూమి తగినంత లేకపోవడంతో ఎకరాకు రూ. 2-7 లక్షల మధ్య వెచ్చించి ప్రైవేట్భూమి కొనుగోలు చేసి వ్యవసాయాధార ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి బడ్జెట్ కేటాయించింది. అయితే భూమి కొనుగోలుకు సంబంధించి వివిధ ప్రక్రియలను పూర్తిచేయడం అటు జాయింట్ కలెక్టర్ మొదలుకుని కిందిస్థాయిలో రెవెన్యూ సిబ్బందికి, ఇటు ఎస్సీకార్పొరేషన్ ఈడీ మొదలుకుని, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇబ్బందిగా పరిణమించింది. మొత్తం 2,878 మంది లబ్ధిదారులకు 8,634 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ఎస్సీ కార్పొరేషన్.. 9 జిల్లాల (హైదరాబాద్ మినహా) అధికారులను ఆదేశించింది. అయితే ఇప్పటివరకు (ఈనెల 12 నాటికి) కేవలం 903 మందికి 2,449.61 ఎకరాలు మాత్రమే పంపిణీచేశారు. లక్ష్యసాధనలో ఒక్క మహబూబ్నగర్ జిల్లా మాత్రమే 54 శాతం సాధించి మెరుగ్గా ఉండగా, మెదక్ 43, ఆదిలాబాద్ 42, వరంగల్ జిల్లా 29 శాతం లక్ష్యాలను సాధించాయి. మిగిలిన ఇతర జిల్లాలు 20 శాతం లోపున్నాయి. రంగారెడ్డి జిల్లా కేవలం 12 మందికి 35.39 ఎకరాలు పంపిణి చేసి అట్టడుగున నిలిచింది. భూమి కొనుగోలుకు రూ.431.70 కోట్లు అందుబాటులో ఉంచగా, కేవలం రూ.103.82 కోట్లు ఖర్చుచేశారు. పంపిణీ చేసిన భూమిలో 659 మంది లబ్ధిదారులకు 1,814 ఎకరాలు మాత్రమే భూమి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను అందజేశారు. ఇంకా మూడోవంతు మందికి భూమిని రిజిష్టర్ చేయాల్సి ఉంది. అదీగాక ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి అభివృద్ధికి తీసుకున్న చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో లబ్ధిదారులకు ప్రయోజనం కలగడం లేదు. -
తమ్ముళ్ల మాయాజాలం
రెవెన్యూ సిబ్బంది సాయంతో రికార్డుల తారుమారు భూమి లేకున్నా వెబ్ల్యాండ్ ద్వారా ఒన్బీ పత్రాలు పొందిన వైనం లబోదిబోమంటున్న హక్కుదారులు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు నక్కపల్లి: మండలంలో అమలాపురంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది సాయంతో రికార్డులు తారుమారుచేసి వెబ్ల్యాండ్లో తమపేర్లు నమోదుచేయించుకున్నార ంటూ పలువురు రైతులు ఆరోపించారు. తమ భూములతోపాటు సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని తమపేరిట నమోదు చేసుకున్నారని వారు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, అమలాపురం సర్పంచ్ గోవిందు ఆధ్వర్యంలో సోమవారం డీటీ లక్ష్మీనరసమ్మకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ సర్పంచ్ అండదండలతో భూమిలేని కొంతమంది టీడీపీ కార్యకర్తలు వన్బీ రిజిస్టర్లో ఫొటోలు, పేర్లు అక్రమంగా నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ఇందుకు బదిలీపై వెళ్లిన ఓ వీఆర్వో సహకరించారని పేర్కొన్నారు. వన్బీలో అక్రమంగా నమోదు చేసిన ఫొటోలు, పేర్ల తమ భూములుగా వెబ్ల్యాండ్లో తమపేరున మార్చుకున్నారని అసలు హక్కుదారులు పెంటకోటనాగరాజు, రోకళ్లశ్రీను, సూర్యారావు,పెంటకోట సోములు,అప్పారావు,నారాయుడు,రమణ,సత్తిబాబాబు, రావి అప్పారావు,వెంకటేశ్వరరావు,చేకూరి సత్యనారాయణరాజు, అప్పలరాజు ఆరోపించారు. ఎలా మారిందంటే..: సర్వే నంబరు 237/1బి,278/5లలో ఎన్సీసీ బ్లూవాటర్కు చెందిన 2.27ఎకరాల భూమిని సూరిబాబుపేరున, పెంటకోట సూరిబాబు కుటుంబానికి చెందిన సర్వే నంబరు 229/3ఏ277/4,230/4లో సుమారు 2.80 ఎకరాల భూమిని కనకలక్ష్మి పేరున, చేకూరి సత్యనారాయణరాజు , రావి అప్పారావుకు చెందిన సర్వే నంబరు 227/10226/ 5226/10ఎం,331/3బీల్లో 2.92 ఎకరాల భూమినికూడా కాశీరావుపేరున మార్పు చేశారన్నారు. వీటికి 1706,1707,1708 నంబర్లతో వెబ్ల్యాండ్లో మార్చి వన్బీ నకళ్లు పొందారన్నారు. ఈరైతులెవరికి గ్రామంలో భూములు లేవన్నారు. తమ కు చెందిన భూములను వారి పేరున మార్చి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెందిన సర్వే నంబరు 329/3ఏలో 0.59 ఎకరాలను గరికిన కనక మ్మ,(ఖాతనెం1707) 410/1లో 3 ఎకరాలను చింతకాయల రమణమ్మ(ఖాతానెం1711) సర్వే నంబరు 417/1లో 2.27 ఎకరాలను వంకా రమణమ్మ (ఖాతా నంబరు 1712) సర్వే నంబరు 409/3లో 0.20, 409/2బీలో 0.39(ఖాతా నంబరు1713) వంకారమణమ్మ పేరున వెబ్ల్యాండ్, ఒన్బి రిజిస్టరులో నమోదు చేశారన్నారు. నష్టపరిహారం కోసమే: మండలంలో చందనాడ, రాజయ్యపేట, వేంపాడు, ఎన్నర్సాపురం, అమలాపురం, నెల్లిపూడి, బోయపాడు, డీఎల్ఫురం తదితర గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకోసం ప్రభుత్వం 5వేల ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్లో అమలాపురం కూడా ఉంది. భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఒకరికి చెందిన భూములను మరొకరిపేరున మార్చి రూ.లక్షల్లో నష్టపరిహారం కాజేసుందుకే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పన్నాగం పన్నారని బాధిత రైతులు ధ్వజమెత్తారు. ఇక్కడి నుంచి బదిలీపై మాడుగుల మండలం వెళ్లిన వీఆర్వో రాజేశ్వరరావు సహకారంతోనే ఈ అక్రమాలు జరిగాయాని వారు ఆరోపించారు. ఇలా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ఇప్పటికే సస్పెన్షన్కు సిఫార్సు చేశారు. విచారణ చేపడతాం: రైతుల ఫిర్యాదు విషయాన్ని తహశీల్దార్ సుందరరావు వద్ద ప్రస్తావించగా విచారణకు చర్యలు తీసుకుంటామన్నారు. వీఆర్వో వల్లే ఇందంతా జరిగి ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవిషయాన్ని సమగ్రంగా విచారించాలని ఆర్ఐ అశోక్ను ఆదేశించగా ఒన్బీలో మార్పులు జరగడం వాస్తవమేనన్నారు. ఫోటోలు అతికించి పేర్లు మార్చారని సర్వేనంబర్ల వద్ద మరొకరి ఫొటోలు,పేర్లు అతికించారన్నారు. మార్పుచేసిన చోట తహశీల్దార్, ఆర్ఐ సంతకాలు లేవన్నారు. విచారణ జరిపి పూర్తినివేదిక అందజేస్తామన్నారు. ప్రభుత్వభూములను వెబ్ల్యాండ్లో నమోదుచేస్తే తొలగిస్తామన్నారు. -
బ్యాంకులకు టోకరా
‘నకిలీ’లు బ్యాంకులకే కన్నం వేశారు. బోగస్ పాస్పుస్తకాలతో బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. సర్కారు స్థలాలను తనఖా పెట్టి కొందరు.. లేని భూమిని పట్టాదారు పుస్తకాల్లో చూపించి మరికొందరు.. దొంగ పాస్పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో ఇంకొందరు బ్యాంకులకు టోకరా కొట్టారు. బ్యాంకర్ల హస్తలాఘవం.. రెవెన్యూ సిబ్బంది అండదండలతో గుట్టుగా సాగిన ఈ అవినీతి పరంపర వెలుగులోకి వస్తోంది. జిల్లాలో దాదాపు రూ.5 కోట్ల మేర కుంభకోణంజరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన యంత్రాంగం.. ఈ బాగోతంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. - బోగస్ పాస్పుస్తకాలతో రూ.5 కోట్ల మేర కుచ్చుటోపీ - అధికారుల విచారణతో వెలుగులోకి అక్రమాల చిట్టా - బ్యాంకర్ల హస్తం.. రెవెన్యూ సిబ్బంది చేతివాటం సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: గతంలో పహాణీ, పట్టా పాస్పుస్తకాలను అట్టిపెట్టుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు దొంగ పాస్పుస్తకాలను సృష్టించి సర్కారీ స్థలాలను రికార్డుల్లోకెక్కించి బ్యాంకర్లను తప్పుదోవ పట్టించారు. రుణగ్రహీత దరఖాస్తును నిశితంగా పరిశీలించకుండా.. క్షేత్రస్థాయిలో భూమి స్థితిగతులను తెలుసుకోకుండా రుణాలివ్వడంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఇటీవల ఈసీలు, ఆన్లైన్ పహాణీలను తప్పనిసరి చేయడంతో ఈ అవినీతి గుట్టు బయటపడింది. ఇప్పటికే యాచారం, మర్పల్లి, మంచాల, మోమిన్పేట, షాబాద్, గండేడ్, ధారూరు తదితర మండలాల్లో నకిలీ పాసు పుస్తకాలతో బ్యాంకులను మోసగించినట్లు రెవె న్యూ, బ్యాంకు యాజమాన్యాలు గుర్తించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ పాసు పుస్తకాల రాకెట్ను తలదన్నెలా జిల్లాలోనూ ‘బోగస్’ చిట్టా బహిర్గతమవడం అధికారవర్గాలను విస్మయపరుస్తోంది. తిలాపాపం.. తలా పిడికెడు! నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందడమే కాకుండా.. రుణ మాఫీ కూడా వర్తింపజేయడంతో సర్కారు ఖజానాకు భారీగా చిల్లు పడింది. బోగస్ పట్టాల సృష్టిలో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తహసీల్దార్/ ఆర్డీఓ కార్యాలయాల నుంచి తస్కరించిన పాస్పుస్తకాల్లో ఫోర్జరీలతో బినామీలను సృష్టించి బ్యాంకులకు టోపీ పెట్టారు. బ్యాంకర్లు కూడా పాస్ పుస్తకాలు అసలువా? నకిలీవా అనేది తేల్చుకోకపోవడం.. రికార్డుల్లో నమోదైన భూమిపై క్షేత్రస్థాయిలో తెలుసుకోకపోవడం నిధుల దుర్వినియోగానికి దారి తీసింది. అంతేకాకుండా మీ-సేవ కేంద్రాల్లో రికార్డులను ట్యాంపరింగ్ చేసి వాటి ద్వారా రుణాలు తీసుకున్న విషయాన్ని కూడా బ్యాంకర్లు పసిగట్టలేకపోయారు. రుణ వితరణలో దళారీల ప్రమేయం కూడా తోడు కావడంతో రుణాలు అనర్హుల పాలయినట్లు తెలిసింది. నకి‘లీలలు’ మచ్చుకు కొన్ని.. - యాచారం మండలం నక్కర్తమేడిపల్లి, పల్లె చెల్కతండా, నల్లవెల్లి, మంతన్గౌరెల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను పాస్పుస్తకాల్లో చూపి.. బ్యాంకులను మోసం చేశారు. ఇప్పటికే దాదాపు 150 మంది నకిలీ పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. ఈ తతంగంలో ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. - మంచాల మండలం బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాస్బుక్కులతో పెద్ద సంఖ్యలో బినామీ రైతులు రుణాలు పొందగా.. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీకి సైతం అర్హుల య్యా రు. గ్రామపంచాయతీలో అర్హుల వివరాలను ప్రదర్శించిన సమయంలో అనర్హుల చిట్టా బయటపడింది. దీంతో స్థానిక రెవెన్యూ యంత్రాంగం పట్టాదారు పుస్తకాల జారీపై పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించింది. - మోమిన్పేట మండలం చిట్టెంపల్లి, రాళ్లడుగుపల్లి, ఎన్కెపల్లి, మోమిన్పేట, మర్పల్లి మండలం మొగిలిగుండ్ల, కోంశెట్టిపల్లి, కోటమర్పల్లి గ్రామాల్లో 25 మంది ఖాతాదారులు బోగస్ పీటీ బుక్కులతో బుధేరా కార్పొరేషన్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా పొందారు. - పరిగి మండల పరిధిలోని రంగాపూర్, మాదారం, రాఘవాపూర్, లఖ్నాపూర్, నస్కల్, సయ్యద్మల్కాపూర్, మల్లెమోనిగూడ, గండేడ్ మండలంలో రెడ్డిపల్లి, బల్సుర్గొండ, బల్సుర్గొండ తండా, కొండాపూర్లలో, దోమ మండల పరిధిలోని గూడూరు, పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల, తిర్మలాపూర్, తదితర గ్రామాల్లోని భూములకు సంబంధించి పలువురు రైతులు వెయ్యి ఎకరాలపై బినామీలు పాసుపుస్తకాలు సమర్పించి దాదాపు రూ.3కోట్ల మేర రుణాలు పొందారు. ఈ తంతును గుర్తించిన అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. -
ఇసుకాసురులకు షాక్
ఇసుక మాఫియాకు ‘షాక్’ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా.. ఇసుకాసురుల ఆగడాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ మేరకు అటు మహారాష్ట్ర సర్కారుతోపాటు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అధికారులు ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగారు. రెవెన్యూ, టీఎస్ఎండీసీ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ సురేష్కాకనీ బిలోలి సైతం ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. కలెక్టర్ ఆదేశాలతో బిలోలి తహసీల్దార్ సురేఖస్వామి, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. గురువారం అర్థరాత్రి మహారాష్ట్రలోని మచూనూరు ప్రాంతం నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 23 లారీలను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయూనికి తరలించారు. అంతేకాకుండా ఈ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి లారీ యజమానుల వివరాలు... ఎప్పుటి నుంచి తరలిస్తున్నారు... వంటి వివరాలు సేకరించి సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఉన్నతాధికారులు శుక్రవారం బిచ్కుంద మండలం పుల్కల్లో విచారణ చేపట్టారు. అనుమతి లేని చోట్ల ఇసుక తవ్వకాలకు సంబంధించి స్థానిక ఆర్ఐ అజయ్, వీఆర్వో కిశోర్రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బీర్కూర్ గ్రామ శివారులోని మంజీరా పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న ఇసుక క్వారీని టీఎస్ఎండీసీ జీఎం రాజశేఖర్రెడ్డి, మైన్స్ ఆర్ఐ హరిప్రసాద్ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. శాండ్ రీచ్ అసిస్టెంట్లు సతీష్, అనిల్ వద్ద పలు అంశాలపై ఆరా తీశారు. 39,900 ఘనపు మీటర్ల ఇసుక తరలించడానికి అనుమతి ఉండగా... ఇప్పటి వరకు 18 వేల ఘనపు మీటర్ల ఇసుక తరలించినట్లు వారు అధికారులకు తెలిపారు. ఆ తర్వాత వారు ఇసుక తవ్వుతున్న స్థలానికి వెళ్లి హద్దులు గమనించారు. ఈ సమయంలో స్థానిక రైతులు అక్కడికి వచ్చి అధికారులతో తమ బాధను వెళ్లదీసుకున్నారు. లోతుగా తవ్వడం వల్ల భూగర్బజలాలు అడుగంటుతున్నాయని... ఇసుకక్వారీని నిలిపివేయాలని కోరారు. పట్టాభూమిలో మట్టివచ్చే వరకు ఇసుక తవ్వకానికి అనుమతి ఉందని టీఎస్ఎండీసీ జీఏం వారికి సమాధానమిచ్చారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఇసుక తరలిస్తున్నారని.. రాత్రంతా రవాణా సాగుతోందని రైతులు చెప్పగా... అలా చేస్తే రెడ్హ్యాండెడ్గా తమకు పట్టివ్వాలని ఆయన సూచించారు. పదుల సంఖ్యలో లారీలు క్వారీలోగాని, రోడ్లపైగాని నిల్చోకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అరుుతే టీఎస్ఎండీసీ, మైన్స్ అధికారులు తనిఖీకి వచ్చిన విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. క్షేత్రస్థాయి నుంచి... అక్రమ ఇసుక వ్యాపారానికి సంబంధించి క్షేత్ర స్థాయి నుంచి చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ యోగితా రాణా సిద్ధమయ్యూరు.ఇసుక తవ్వుకోవడానికి ఎంత వరకు అనుమతి ఉంది.... తవ్వకాలు ఎక్కడివరకు జరిగాయని స్వయంగా తనిఖీలు చేయూలని అధికారులను ఆమె ఆదేశించారు. రెవెన్యూ, టీఎస్ఎండీసీ అధికారుల సంయుక్త విచారణను ముమ్మరం చేయూలని, అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని... లేనిపక్షంలో శిక్ష తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. తనిఖీల అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందిపైనేనా... మరోవైపు ఇసుక మాఫియాలో కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని కీలక బాధ్యులను వదిలేస్తున్నారే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇసుక కాంట్రాక్టర్గా కొనసాగుతున్న ఓ న్యాయవాది పరిమితులకు మించి ఇసుకను తవ్వుకున్నారు. ఇదివరకే 1,093 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించినట్లు సమాచారం. దీని విలువ రూ.70 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నా... బహిరంగ మార్కెట్లో రూ. 4 కోట్లు ఉంటుందని అంచనా. అక్రమంగా ఇంత పెద్ద మొత్తంలో ఇసుక తరలించడంపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
ఈతకెళ్లి కానరాని లోకానికి..
నగరి : ఈత సరదా ప్రాణాలను హరించింది. ఇంటి పరిసరాల్లో అడుకుంటూ పక్కన ఉన్న చెరువులోకి ఈతకెళ్లిన అక్క, తమ్ముడు కనరానిలోకానికి వెళ్లిపోయారు. ఈ ఘటన తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులను శోకసంద్రం లో ముంచింది. చిత్తూరు జిల్లా, విజ యపురం మండలం కేవీశ్రీరామపురం గ్రామానికి చెందిన సురేష్, సుమతి దంపతులకు సంగీత (11), కుమార్(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంగీత నగరి మున్సిపల్ పరిధి కోర్టు వెనుక ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ 6వ తరగతి చదువుతోంది. అలాగే కుమార్ తల్లిదండ్రుల దగ్గర ఉంటూ స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఆడి కృతిక కావడంతో హాస్టల్ సెలవు ప్రకటించారు. దీంతో సంగీత తన సొంత ఊరైన కేవీశ్రీరామపురానికి వచ్చింది. సాయంత్రం తన తమ్ముడుతో ఆడుకుంటూ పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్లారు. ఈత నేర్చుకొందాం అని సరదాగా సంగీత, కుమార్ పక్కనే ఉన్న చెరువులోకి దిగి లోతుకు వెళ్లి ముగి పోయి మృత్యువాతపడ్డారు. పక్కన పొలంలో పశువుల కాపర్లు గుర్తించి విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. మీరు లేని జీవితం మాకు వద్దు నాయనా... అసలే పేద కుటుంబం. ఒక్క రోజు పనికి వెళ్లకపోయినా జీవనం గడిచిదే చాలా కష్టం. అయిన పిల్లలను ఎలాగైనా మంచి చదువు చదివించి ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. పిల్లలు పెరి గి బాగా చదివి ప్రయోజకులు అవుతారని అనుకున్నామని, ఇలా చెరువు తన పిల్లలను పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బిడ్డలు కళ్ల ఎదుట శవాలుగా పడుకుని ఉంటే మేము ఎవ్వరి కోసం బతకాలి, ఎందు కు బతకాలి అని విలపించారు. ఆ పిల్లలను చూడడానికి వచ్చిన బంధువులు సైతం వారి తల్లిదండ్రులను ఓదార్చలేకపోయారు. పిల్లల తల్లిదండ్రులు, బం దువుల రోదనలు చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఆ పిల్లల మృతి ఆ గ్రామాన్నే శోకసంద్రంలో ముంచేసింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది మృతదేహాలను సందర్శించి సమాచారం సేకరించారు. -
ఎన్ని ప్లాన్లు బాబోయ్!
పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటంలా తయారైంది భోగాపురంలో ఎయిర్పోర్టు వ్యవహారం. ప్లాన్-1, ప్లాన్-2 అంటూ ఎయిర్పోర్టుపై రోజుకో అలైన్మెంట్తో స్పష్టత లేని ప్రభుత్వ ప్రకటనలు..భోగాపురం మండల ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కోరకంగా ప్రకటిస్తూ అధికారుల్ని కూడా గందరగోళంలో పడేస్తున్నారు. ఇంతవరకూ భూసమీకరణ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ, లక్ష్యాలు నిర్దేశించి సర్వే సిబ్బందిని గ్రామాల్లోకి పంపిస్తున్నారు. అక్కడ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. చివరికి అధికారులను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారు. ఎయిర్పోర్టుకు కావాల్సిన స్థలంపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడంతో మధ్యలో తాము నలిగిపోతున్నామని సర్వే, రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి 15వేల ఎకరాలు సేకరిస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన ప్రకటించారు. అయితే ఎయిర్పోర్టును కేవలం 6వేల ఎకరాల్లోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మే 3వ తేదీన స్వయంగా ప్రకటన విడుదల చేసి వెల్లడించారు. ఆ మరుసటి రోజున విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లతో విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అదే ప్రకటన చేశారు. మే 13న జిల్లాకొచ్చిన పురపాలక మంత్రి పి.నారాయణ ఎయిర్పోర్టుపై చేసిన సమీక్షలో 5వేల ఎకరాలైతే సరిపోతాయని, ఆమేరకు భూ సమీకరణ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు తమకు సూచించారని చెప్పారు. ఆ తర్వాత మే 15వ తేదీన కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మీడియాతో మాట్లాడుతూ 3వేల ఎకరాల్లోనే భోగాపురం ఎయిర్పోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి భిన్నంగా గత నెల 22వ తేదీన 5040ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మిస్తున్నట్టు మంత్రి మృణాళిని ప్రకటించారు. ఇప్పుడా ప్లాన్ను కూడా కాదని 5551ఎకరాల్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి ప్రకటించారు. అసలు ఎయిర్పోర్టుకు ఎంత భూమి కేటాయిస్తారో ఇప్పటికే స్పష్టం చేయడం లేదు. ఒకవేళ తాజాగా ప్రకటించిన 5551ఎకరాల్ని ఎయిర్పోర్టుకు పూర్తిగా కేటాయిస్తే అక్కడి నిర్వాసిత, బాధిత రైతులకు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపుతో పాటు పునరావాసం కల్పించేందుకు మరో 3,500ఎకరాల వరకు వేరే చోట సేకరించాల్సి ఉంటుంది. అంటే ఈ భూమి కోసం మరో ప్రాంత రైతుల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది.ఆ ప్రాంతాలు ఏవని ముందే చెబితే అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుందని గుట్టుగా ఉంచుతున్నారు. ఎయిర్పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చెందిన ప్రత్యామ్నాయ భూములిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నా ఆ తర్వాత ఏ మారుమూల ప్రాంతంలో ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి రైతులు అంగీకరిస్తే ఆ తర్వాత ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తోందని పేరు చెప్పని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా భూసమీకరణ సర్వే మొదలు పెట్టేముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ప్రచురించకుండా, నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది వెళ్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం భిన్నమైన ప్రకటనలు చేస్తూ రైతులతో మైండ్గేమ్ ఆడుతోంది. రైతులు ఒప్పుకుంటే పెద్ద ఎత్తున భూసమీకరణ చేసి, వ్యాపారం చేసుకుందామని భావిస్తోంది. కానీ, డామిట్ కథ అడ్డం తిరిగినట్టు బతుకుపై బెంగ.. భవిష్యత్తుపై భయంతో రైతులు సమష్టిగా వ్యతిరేకించడంతో సర్కార్ ప్లాన్ వర్క్ అవుట్ కావడం లేదు. -
‘భూమి కొనుగోలు’కు అవినీతి చెదలు
♦ ఎస్సీ కార్పొరేషన్, రెవెన్యూ సిబ్బంది, దళారుల ఉమ్మడి దందా ♦ మొత్తం కొనుగోళ్లపై ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు ♦ అధికారులు, సిబ్బంది పాత్రపై ఆరా ♦ ఏసీబీ ట్రాప్తో రెండు శాఖల్లో కలకలం ఒకటి, రెండు రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి .. ఒకటి, రెండు రోజుల్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకంలో రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చేతి వాటం ప్రదర్శించడాన్ని సీరియస్గా పరిగణిస్తున్నాం. ఈ కుంభకోణంలో పెద్దల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు శాఖల అధికారులపై విచారణ కొనసాగుతుంది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం. నిజాలు త్వరలో వెలుగు చూస్తాయి. - ‘సాక్షి’తో ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వరంగల్ క్రైం : బడుగు, బలహీన వర్గాలకు భూములు ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ పథకానికి అవినీతి చెదలు పట్టింది. జిల్లావ్యాప్తంగా ఆయా గ్రా మాల్లో భూములను కొనుగోలు చేసి అక్కడి ని రుపేద దళితులకు పంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణ చేపట్టారు. జి ల్లాలో ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 261 ఎకరాల 23 గుంటల సాగు భూములను ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు మాత్రమే చెల్లించాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ ధరకు రైతులు భూములు అమ్మడానికి సిద్ధంగా లేరని సాకు చెప్పి ప్రభుత్వానికి నివేదిక అందించి భూముల రేటును రూ.5 లక్షల నుంచి 8 లక్షలు చేశారు. ఇప్పటి వరకు ఎస్సీ కార్పోరేషన్ కొనుగోలు చేసిన భూముల్లో స్థానిక మార్కెట్ ధర ప్రకారం రూ.3 లక్షలే ఎక్కువగా ఉన్నాయి. భూముల కొనుగోలు బాధ్యతను రెవెన్యూ, రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు అప్పగించడంతో అందివచ్చిన అవకాశాన్ని వారు తెలివిగా ఉపయోగించుకున్నారు. పహణీల్లో మార్పులకు లక్షల్లో వసూలు రైతులు విక్రరుుంచే భూములు తమవే అరుునప్పటికీ కొన్ని సర్వే నంబర్లలో పహాణీల్లో తప్పులు దొర్లడం, వేరే వ్యక్తులు పేర్లు ఉండడం రెవెన్యూ అధికారులకు కలిసొచ్చింది. ప్రభుత్వానికి అమ్మేందుకు ఈ తప్పులు అడ్డంకిగా ఉండడంతో వారిని సరిచేసేందుకు కూడా స్థానిక వీఆర్వోలతోపాటు ఆపై రెవెన్యూ అధికారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నారుు. దళారీ వ్యవస్థ కీలక పాత్ర.. భూముల కొనుగోలు పథకం చేపట్టగానే గ్రామాల్లో కొందరు రాజకీయ దళారులు రంగం మీదికి వచ్చారు. అటు రైతులు, ఇటు అధికారులతో అన్నీ తామై మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎవరి వాటా ఎంతో ముందే తేల్చేశారు. అన్ని మాట్లాడుకున్నాకే ధర నిర్ణయూనికి వెళ్లారు. రైతుల భూములకు రేట్లు పెంచడం దగ్గరి నుంచి చెక్కులు అందేవరకు వీరి కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం నడుస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఆరు నెలల క్రితం జరిగిన ఒక సర్వసభ్య సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన ఓ జెడ్పీటీసీ తనకు తెలియకుండా గ్రామాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని కలెక్టర్ ఎదుట వాపోయూరు. ఆ తర్వాత కూడా ఆయనకు కనీస సమాచారం లేకుండానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలో భూముల కొనుగోలు జరగడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఎస్సీ కార్పొరేషన్, రెవెన్యూ శాఖలకు, రైతులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన కమీషన్లు తీసుకున్న దళారులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించింది. వారిపై కూడా కేసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ కార్పొరేషన్ దందాపై ఏసీబీ అధికారుల సీరియస్.. ఇదిలా ఉండగా రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీకి ట్రాప్ అయినప్పటికీ ఈ అవినీతి వ్యవహారంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారుల చేతివాటమే ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఎస్సీ కార్పొరేషన్లో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇందులో అన్నిస్థాయిల అధికారులకు వాటాలు ఉన్నట్లు గుర్తించారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు చెక్కులు అందాలంటే ప్రతీ చోట డబ్బులు వసూలు చేసున్నట్లు తెలుస్తోంది. ఇలా జిల్లావ్యాప్తంగా భూసేకరణచేసిన ఆయా గ్రామాల నుంచి అవినీతిపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. పెద్దమొత్తంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఇందులో భాగస్వాములు అరుునట్లు తెలియడంతో ఏసీబీ అధికారులు మరింత లోతుగా కేసును పరిశోధిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలోనూ చేతివాటం.. ఎస్సీ కార్పొరేషన్ భూములు కేటాయించే అర్హుల జాబితా తయారీలో కూడా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామసభలు ఏర్పాటుచేసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ పక్కదోవపడుతోంది. ఆయా గ్రామాల్లో డ బ్బులు ఇచ్చిన వారి పేర్లతో మాత్రమే లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో రెవెన్యూ అధికారులతోపాటు సర్పంచ్వంటి నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక జాబితాపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన భూములు ఇవే.. పర్వతగిరి మండలం వడ్లకొండలో 17 ఎకరాలు, శాయంపేట మండలం కాట్రపల్లిలో 80 ఎకరాల 30 గుంటలు, నర్మెట మండలం అమ్మాపూర్లో 10.7 ఎకరాలు, నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో 57 ఎకరాలు, వేములపల్లిలో 60 ఎకరాలు, పాలకుర్తి మండలం సిరిపన్నగూడెంలో 17.4 ఎకరాలు, ముత్తారంలో 24 ఎకరాలు, కొడకండ్ల మండలం పెద్దవంగరలో 34 ఎకరాల 20 గుంటలు సేకరించారు. మహబూబాబాద్ డివిజన్లోని ఒక గ్రామంలో కూడా రూ.3 లక్షలు పలికే భూమిని రూ.5 లక్షల 40 వేలుగా ధర నిర్ణయించారు. ఇదే డివిజన్లోని మరో గ్రామంలో కూడా మూడు లక్షలు ఎకరాకు ఉండగా మరో రెండు పెంచేసి వాటాలు నిర్ణయించుకున్నారు. -
సంతకం సమర్పయామి..
‘డిజిటల్ కీ’తో అక్రమాలకు తెర తీస్తున్న రెవెన్యూ సిబ్బంది, ఆపరేటర్లు రూ.లక్షలు దండుకుంటున్న వైనం నమ్మకంతోనే ‘కీ’ అప్పగిస్తున్నామంటున్న తహశీల్దార్లు నిడమానూరుకు చెందిన సుబ్బయ్యకు నాలుగెకరాల సొంత భూమి ఉంది. తాత తండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించింది. బ్యాంకు రుణం తీసుకుందామని మీసేవా సెంటర్కు వెళ్లి అడంగల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ భూమి పట్టాదారుగా వేరొకరి పేరు వచ్చింది. ల్యాండ్ రికార్డ్సులో పేరు మారిపోయింది. సత్యనారాయణపురానికి చెందిన నవీన్కు అత్యవసరంగా కుల ధ్రువీకరణ పత్రం కావాల్సి వచ్చింది. మీ సేవా కేంద్రం వద్దకు వెళ్లిన నవీన్ అవసరాన్ని పసిగట్టిన దళారులు రూ.2 వేలు ఇస్తే రెండే నిమిషాల్లో ధ్రువీకరణ పత్రం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. జేబులో డబ్బులు లెక్కించే లోపే ధ్రువీకరణ పత్రం చేతికందింది. గాంధీనగర్ : దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా మారింది రెవెన్యూ శాఖలో డిజిటల్ కీ వ్యవహారం. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. తహశీల్దార్ల ఉద్యోగం కంప్యూటర్ ఆపరేటర్ల గుప్పెట్లో పెట్టినట్టయింది. రెవెన్యూ సేవలను సులభతరం చేయడానికి రికార్డులను కంప్యూటరీకరించి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. నిత్యం వందలాది సర్టిఫికెట్ల జారీకి సంతకాలు చేయాలంటే జాప్యమవుతోంది. దీనికోసం డిజిటల్ సిగ్నేచర్ పరికరం ‘డిజిటల్ కీ’ని తహశీల్దార్లకు ప్రభుత్వం అందజేసింది. ఈ డిజిటల్ ‘కీ’లకంగా మారింది. అడంగల్, 1బి రిజిస్టర్ల కాపీలు మీ-సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ల సేవలు కీలకంగా మారాయి. పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు రెవెన్యూ వెబ్ల్యాండ్లో భూమి యజమాని వివరాలు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఆ శాఖ నిబంధనలు విధించింది. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. భూమి రికార్డులు ఆన్లైన్ చేయడం, మీ సేవా కేంద్రాల ద్వారా అడంగల్, 1బి వంటివి జారీ చేస్తుండడంతో రైతులకు వీఆర్వోల అవసరం అంతగా ఉండడం లేదు. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం అంతకంతకూ పెరిగింది. ‘డిజిటల్ కీ’ చేతికందితే చాలు భూమి రికార్డులు తారుమారై క్షణాల్లో సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. ఇవేవీ తహశీల్దార్కు తెలియకపోవడం విశేషం. అధికారులకు తీరిక లేక.. స్మార్ట్విలేజ్, టెలికాన్ఫరెన్స్ల పేరుతో తహశీల్దార్లకు క్షణం తీరిక ఉండటంలేదు. దీంతో తమ అధీనంలో ఉండాల్సిన ‘డిజిటల్ కీ’ని ఆపరేటర్లకు, కార్యాలయ సిబ్బందికి అప్పగించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అక్రమాలు ఇలా జరుగుతున్నాయి.. జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల కార్యాలయ సిబ్బంది ఆ విధులు నిర్వరిస్తున్నారు. వీరికి డిజిటల్ ‘కీ’ చేతికందితే చాలు మండలం భూమి రికార్డులన్నీ గుప్పిట్లో ఉన్నట్లే. ఈ నేపథ్యంలో ఆపరేటర్లే కీలకమన్న విషయం తెలుసుకున్న రియల్టర్లు నేరుగా వారితోనే సంబంధాలు నెరుపుతున్నారు. ఆపరేటర్లకు భారీగా సొమ్ము ఎరచూపుతున్నారు. ఇంకేముంది డిజటల్ టోకెన్ను దుర్వినియోగం చేస్తున్నారు. భూమి రికార్డుల్లో పేర్లు మార్చేస్తున్నారు. తహశీల్దార్ ప్రమేయం లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, రికార్డుల్లో పేర్లు మార్పు, డిజేబుల్ (ఏదైనా సర్వే నంబరు వద్ద ఈ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే, మీసేవ కేంద్రానికి వెళ్లిన వారికి తహశీల్దార్ వెరిఫికేషన్ అని చూపుతుంది) అనే అప్షన్ను ఉపయోగించి మీ సేవా కేంద్రాల్లో వివరాలు రాకుండా చేసి రైతులను తహశీల్దార్ కార్యాలయాలకు, వీఆర్వోల వద్దకు రప్పించుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ లక్షలు సంపాదించుకుంటున్నారు. ఇవిగో అక్రమాలకు నిదర్శనాలు.. కానూరు గ్రామంలో ఓ రైతుకు సంబంధించిన రికార్డుల్లో పేర్లు మార్చేశారు. అడంగల్లోని పట్టాదారు, అనుభవదారు వరుసలో గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి పేర్లు నమోదు చేశారు. ఇంకేముంది రికార్డుల్లో అక్రమార్కులు చేరిపోయారు. ఆ భూమి యజమాని మీ-సేవ కేంద్రానికి వెళ్లి చూసుకోగా పేర్లు మారిపోవడంతో విస్తుపోయాడు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయి. విజయవాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ప్రమేయం లేకుండా నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. తహశీల్దార్కు కొందరు సమాచారం అందించడంతో నిఘా పెట్టారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఆపరేటర్గా పని చేస్తున్న మహిళా వీఆర్ఏ రోజాపై చర్యలు తీసుకున్నారు. పశ్చిమ కృష్ణాలోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ చేతి వాటం ప్రదర్శించింది. రియల్టర్లతో సంబంధాలు పెట్టుకుని ల్యాండ్ రికార్డుల్లో పేర్లు మార్చి సుమారు రూ.5 లక్షల వరకు అర్జించినట్లు సమాచారం. కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన తహశీల్దార్ సదరు వీఆర్ఏను పక్కన బెట్టారు. నూజివీడు డివిజన్ పరిధిలోని జిల్లా సరిహద్దులో ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో ఆపరేటర్గా పని చేస్తున్న వ్యక్తి తహశీల్దార్ హోదాలో చెలామణి అవుతున్నాడు. గతంలో పని చేసిన తహశీల్దార్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వీఆర్వోలందరినీ శాసించే స్థాయికి చేరాడు. సిబ్బందిపై నమ్మకంతోనే : ఆర్.శివరావు, అర్బన్ తహశీల్దార్ పని ఒత్తిడి కారణంగా సిబ్బందిపై నమ్మకంతో డిజిటల్ కీ పాస్వర్డ్ చెప్పాల్సి వస్తోంది. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి. -
రెండు రెళ్లు ఆరు
ఈయన పేరు క్రిష్ణమూర్తి. మదనపల్లె మండలం పాళ్యంకొండకు చెందిన ఈ రైతు చిన్నతిప్పసముద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారు ఆభరణాలను కుదువపెట్టి నవంబర్ 5, 2013న ఖాతా నంబరు 563721942పై రూ.35 వేల రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారులకూ రెవెన్యూ సిబ్బందికీ పట్టాదారు పాసుపుస్తకం, రేషన్కార్డు, ఆధార్కార్డును క్రిష్ణమూర్తి ఇచ్చారు.కానీ.. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణవిముక్తి పథకం లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో క్రిష్ణమూర్తి లబోదిబోమంటున్నాడు. ఒక్క క్రిష్ణమూర్తే కాదు.. అన్ని ఆధారాలు సమర్పించిన 2.56 లక్షల మంది రైతులకు రుణ విముక్తి పథకంలో స్థానం దక్కలేదు. - తప్పులతడకగా రైతు ‘రుణ విముక్తి’ లబ్ధిదారుల జాబితా - ఆధార్, రేషన్కార్డులు సమర్పించినా జాబితాలో తప్పించిన వైనం - 5.62 లక్షల నుంచి 3.06 లక్షలకు లబ్ధిదారుల తగ్గింపు - నేడు రుణవిముక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నిక ల్లో హామీల వర్షం కురిపించిన చంద్రబాబు.. గద్దెనెక్కాక వాటిని నెరవేర్చడం నీరుగార్చుతున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ హామీ అమలే అందుకు పరాకాష్ట. రైతు రుణ విముక్తిగా పేరు మార్చి ఆ హామీనే చంద్రబాబు మాఫీ చేస్తున్నారని కర్షకలోకం మండిపడుతోంది. రైతు రుణ విముక్తి పథకాన్ని గురువారం సీఎం చంద్రబాబు చిత్తూరులో ప్రారంభించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించింది ఒక్క వ్యవసాయ రుణాల మాఫీ హామీనని ఆ పార్టీ నేతలూ.. రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారాన్ని కట్టబెట్టిన హామీనే సీఎం చంద్రబాబు మాఫీ చేస్తున్నారు. జిల్లాలో డిసెంబర్ 31, 2013 నాటికి 8,70,231 మంది రైతులు రూ.11, 180.25 కోట్లను వ్యవసాయ రుణాల రూపం లో బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబా బు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఒక్క సంతకంతో ఆ రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. కానీ.. ఆ హామీ అమలుకు చేసిన తొలి సంతకంతోనే రైతులను పరిహసించారు. రోజుకో తిరకాసు.. పూటకో విధానంతో ఏకంగా వ్యవసాయ రుణల మాఫీని.. రైతు రుణ విముక్తిగా చంద్రబాబు మార్చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(ఎకరానికి ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలన్నది ఎస్ఎల్బీసీ తీర్మానిస్తుంది- దాన్నే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటా రు) వర్తింపజేసి, ఆధార్, రేషన్కార్డులతో ముడిపెట్టి.. సాగుచేసిన పంటలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని బ్యాంకర్లకు హుకుం జారీ చేశారు. ప్రభుత్వం జారీచేసిన తిరకాసు మార్గదర్శకాల మేరకు 5,62,932 మంది లబ్ధిదారులు రైతు రుణ విముక్తి పథకానికి అర్హులుగా బ్యాంకర్లు తేల్చారు. ఆ మేరకు ప్రభుత్వానికి జాబితాను పంపారు. కనీసం ఆ జాబితానైనా యథాతథంగా ఆమోదించాల్సి న ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. ఆధార్కార్డు.. రేషన్కార్డు.. పట్టాదారు పాసుపుస్తకంలో పేర్కొన్న అంశాలకు సరిపోవడం లేదనే సాకు చూపి 2,56,388 మంది రైతులను రుణ విముక్తి పొందడానికి అనర్హులుగా ఏకపక్షంగా తేల్చేసింది. కేవలం 3,06,544 మంది రైతులు మాత్రమే రైతు రుణ విముక్తి పథకం కింద అర్హులుగా రెండు విడతలుగా విడుదల చేసిన జాబితాల్లో స్పష్టీకరించింది. కనీసం 3.06 లక్షల మంది రైతులకైనా పూర్తి స్థాయిలో రుణ విముక్తిని కల్పిస్తారా అంటే అదీ లేదు. ఆ రైతులకు కేవలం రూ.894 కోట్ల మేర మాత్రమే రుణ విముక్తి ద్వారా దక్కే అవకాశం ఉందని బ్యాంకు అధికారవర్గాలు లెక్కలు వేస్తుండడం గమనార్హం. రైతు రుణ విముక్తి పథకంతో జాప్యంతో రైతులపై రూ. 939 కోట్ల అపరాధ వడ్డీ భారం పడింది. ఆ వడ్డీ భారం కన్నా రుణవిముక్తి పథకం ద్వారా రైతులకు దక్కుతోందని తక్కువ కావడం గమనార్హం. ప్రభుత్వ నిర్వాకం వల్ల లబ్ధిదారు ల జాబితా తప్పులతడకగా మారడం.. 2.56 లక్షలమంది పేర్లు గల్లంతవడంతో రైతు రుణ విముక్తి వారోత్సవాల్లో భాగంగా గ్రామాలకు వెళ్లడానికి అధికారులు, టీడీపీ ప్రజాప్రతి నిధులు జంకుతుండడం కొసమెరుపు. -
మళ్లీ తుపాను ముప్పు
శ్రీకాకుళం పాతబస్టాండ్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతుండటంతో జిల్లాకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఈ తుపాను మరింత బలపడే అవకాశముందన్న సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆధికారులను ఆదేశించారు. తీర ప్రాంత మండలాల తహశీల్దార్లను అప్రమత్తం చేశారు. అయా మండలాల్లో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, తుపాను వస్తే ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నాహాలతోపాటు బియ్యం, కిరోసిన్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువులను తగినంతగా సమకూర్చుకోవాలని గురువారం సాయంత్రమే ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచిస్తూ మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించాలని, గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. -
ల్యాండ్.. మీ 'దయా'!
* అభివృద్ధికి భూమి ఆటంకాలు * శ్రద్ధ చూపనంటున్న రెవెన్యూ సిబ్బంది * నిధులు మంజూరైనా సాగని నిర్మాణాలు * చీమకుర్తి నగర పంచాయతీకి తీరని కష్టాలు చీమకుర్తి: దేవుడు కరుణించినా.. పూజారి జాలి చూపలేదట. నగర పంచాయతీ స్థాయి పెంచేందుకు.. కీర్తి పంచేందుకు ఎన్నో నిర్మాణాలు కావాలి. అందుకే వాటి కోసం ప్రభుత్వం నిధుల మంజూరుకు అనుమతించింది. కానీ అధికారులు మోకాళ్లడ్డుతారే! నిర్మాణాలకు అవసరమైన స్థలాలు కేటాయించరే! ఇలాంటి పరిస్థితుల్లో చీమకుర్తి నగర పంచాయతీ కొట్టుమిట్టాడుతోంది. ప్రజలకు అవసరమైన పనులకు దిక్కులేకుండా పోతోంది. రెండేళ్ల క్రితమే చీమకుర్తి నగర పంచాయతీగా ఆవిర్భవించింది. ప్రజలంతా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కానీ అప్పటి నుంచి కష్టాలు పెరిగాయే కానీ ఫలితం మాత్రం శూన్యం. మున్సిపల్ భవనం సమకూరేనా? మొదటి నుంచి నాటి పంచాయతీ భవనంలోనే మున్సిపాలిటీ కూడా కొనసాగుతోంది. సొంత బిల్డింగ్ కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసింది. అయితే స్థల సమస్య కొలిక్కి రాలేదు. పంచాయతీ భవనం ఆనుకొని ఉన్న తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే 88 సెంట్ల స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించారు. తహశీల్దార్ ద్వారా ఆర్డీఓ నుంచి కలెక్టర్కు ప్రతిపాదనల ఫైలు పంపించారు. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. సాంకేతిక కారణాల వల్ల ఫైలును రెవెన్యూ అధికారులు తిరిగి వెనక్కు తీసుకున్నారు. ఇదంతా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అప్పటి దాకా కాంగ్రెస్ను తిట్టిపోసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం సాధించలేకపోయింది. రవాణాశాఖ మంత్రి ఏరియా! చీమకుర్తికి చెందిన శిద్దా రాఘవరావు ప్రస్తుతం రాష్ర్ట రవాణాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ నాయకులే అభివృద్ధిపై శ్రద్ధ చూపించడంలేదని అధికారులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతం తాలూకూ పాలనపై విమర్శలు గుప్పించడమే కానీ తక్షణ కర్తవ్యం గుర్తించడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనప్పటికీ.. సకాలంలో వాటిని వినియోగించకుంటే తిరిగి వెనక్కు వెళ్లే ప్రమాదం నెలకొంది. గారెలున్నాయ్.. బూరెలున్నాయ్ పాయసం..పులిహోరా నోరూరిస్తోంది కానీ ఏం లాభం తింటే రోగం.. రుచికరమైన వంటకాలను అలా చూస్తూ ఉండాల్సిందే! సరిగ్గా.. ఇలాగే! చీమకుర్తి మున్సిపాలిటీ పరిస్థితి ఉంది ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్ దీని ద్వారా కోట్ల రూపాయల రాయల్టీ వేలాది మంది పౌరులు.. ఇలా ఈ పట్టణం అయ్యింది మున్సిపాలిటీ! వివిధ అభివృద్ధి పనులకు డబ్బులు మంజూరయ్యాయి ఇక తిరుగులేదనుకుంటుంటే.. వాటి నిర్మాణాలకు భూములు కేటాయించరు.. మున్సిపల్ భవనం.. డంపింగ్ యార్డు.. ఎస్ఎస్ ట్యాంకు.. ఇలాంటి ప్రతిపాదనలన్నీ జనంకల్లి ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి... చెత్త పోసే దిక్కులేదు చీమకుర్తి పట్టణంగా మారిన తర్వాత నివాస గృహాలు పెరిగిపోయాయి. దుకాణ సముదాయాలు, తోపుడు బండ్ల వ్యాపారులు కూడా ఎక్కువయ్యారు. దీనికితోడు గ్రానైట్ వ్యర్థాలు ఎలాగూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో రోజూ క్వింటాల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీనంతటినీ తరలించాలంటే డంపింగ్ యార్డు కావాలి. కానీ చీమకుర్తికి ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో చెత్తంతా పాటిమీదపాలెం పోయేదారిలోనున్న రెండు ఎకరాల్లో రోడ్డుకు సమీపంలోనే వేస్తున్నారు. ఆ చోటు కూడా సరిపోకపోవడ ంతో చెత్తంతా రోడ్డుమీదకు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. సమస్య పరిష్కారం కోసం పాటిమీదపాలెం సమీపంలో 10 ఎకరాలు డంపింగ్ యార్డు కోసం పరిశీలించినట్లు మున్సిపాలిటీ అధికారులు గత శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేకు తెలియ జేశారు. ఇదిలా ఉంటే సమస్యను తహశీల్దార్ దృష్టికి తీసుకుపోయి డంపింగ్కు అవసరమైన స్థలాన్ని గుర్తించటంలో మున్సిపాలిటీ అధికారులు ఏడాదిగా కుస్తీలు పడుతూనే ఉన్నారు. దాహార్తి తీర్చేందుకూ ముందుకు రారు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా చీమకుర్తి మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు దాదాపు రూ. 52 కోట్లతో ప్రతిపాదనలను పంపించారు. రామతీర్థం రిజర్వాయర్లోని తాగునీటిని చీమకుర్తి పరిసరాల్లోకి తీసుకొచ్చి స్టోర్ చేస్తే ప్రజల దాహార్తి తీరుతుంది. దీనికోసం కావాల్సింది కేవలం ఒక్క ఎకరా మాత్రమే! కానీ ఈ విషయంలోనూ రెవె న్యూ అధికారులు మున్సిపాలిటీవారికి సహకరించక పోవడంతో మహత్తర పథకానికి మంగళం పాడినట్లయింది. మహిళా స్వశక్తి భవన్కు నిధులొచ్చినా.. మహిళా స్వశక్తి భవన్ నిర్మించేందుకు మున్సిపాలిటీకి ఏడాది క్రితం రూ. 25 లక్షలు మంజూరయ్యాయి. అలాగే కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్ పేరుతో రెండు భవనాలకు మొత్తం రూ. 22 లక్షలు కూడా మంజూరు చేశారు. నిర్మాణాలకు అవసరమైన భూములు అందజేస్తామంటున్న రెవెన్యూ అధికారులు.. మున్సిపాలిటీ అధికారులను తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. -
శిక్షా... కక్షా...
డీలర్లపై నాయకులు కన్నెర్ర చేస్తున్నారు. పాత కక్షలను మదిలో ఉంచుకుని తాజాగా జరిగిన చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ శిక్ష విధిస్తున్నారు. హుదూద్ సాయం సరుకుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలను ఆయుధాలుగా చేసుకుని తమకు వ్యతిరేకులైన రేషన్ డీలర్లపై దండెత్తుతున్నారు. దీనికోసం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు అనూహ్యంగా డీలర్లు కూడా గొంతు పెంచారు. ఢీ అంటే ఢీ అంటూ నాయకులకే సవాల్ విసురుతున్నారు. తమను మానసిక క్షోభకు గురి చేస్తే సరుకులు పంపిణీ చేయలేమని, నవంబర్ ఒకటి నుంచి సమ్మె చేస్తామ ని అల్టిమేటం జారీ చేశారు. డీలర్లు, నాయకుల మధ్య గొడవ ఇప్పుడు ప్రజల పీకల మీదకు వచ్చింది. విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో డీలర్లు రాజకీయంగా బలవుతున్నారా అంటే అవుననే సమాధానమే విని పిస్తోంది. చాలా చోట్ల డీలర్లను తొలగిద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ సంఘటితంగా ఉన్న వారిని ఏం చేయలేని కొందరు రాజకీ య నాయకులు ఆయా డీలర్లపై ‘హుదూద్’ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారని తెలిసింది. పరిహారం అందించడంలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, లబ్ధిదారులకివ్వాల్సిన బియ్యంలో కోత విధిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ వారిని అధికారులతో సస్పెండ్ చేయిస్తున్నారు. దీంతో డీలర్లు కూడా తిరగబడుతున్నారు. అక్రమంగా విధిస్తున్న సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.. నవంబర్ ఒకటి నుంచి రేషన్ సరుకుల సరఫరాను బంద్ చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. తమ పార్టీ, వర్గం కాని డీలర్లను తప్పించేందుకు పలువురు నాయకులు ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నారు. హుదూద్ రూపంలో ఇప్పటికి వారికి అవకాశం వచ్చింది. పరిహారం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ...తమకు నచ్చని డీర్లపై కూడా పనిలోపనిగా ఫిర్యాదు చేయిస్తున్నారని సమాచారం. రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. మరో వైపు రెవెన్యూ సిబ్బంది దాడులు చేస్తూ సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఆగ్ర హించిన రేషన్ డీలర్లు సమ్మె చేస్తామని ప్రకటించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇటీవల జిల్లాలోని బీభత్సం సృష్టించిన తుపాను తాకిడికి నష్టపోయిన బాధితులకు బియ్యం తదితర నిత్యావసరాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సరకుల్లో ముఖ్యంగా బియ్యం పంపిణీలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్డుదారులకు ఇచ్చే 25 కిలోల బియ్యంలో మూడు నుంచి 5 కిలోల బియ్యం తక్కువగా ఉంటున్నాయనీ, పది కిలోలు ఇచ్చిన చోట 2కిలోలు తక్కువ ఉంటున్నాయనీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన డీలర్లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్, జాయింట్ కలెక్టర్కు, ఆర్డీఓకూ ఆదేశించారు. మరోపక్క పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత కూడా డీలర్లపై గుర్రుగా ఉన్నారు. పలు చోట్ల ఈ ఆరోపణలు రావడంతో ఎనిమిది మంది డీలర్లను ఒకేసారి సస్పెండ్ చేశారు. మరో పక్క దాడులు కొనసాగుతున్నాయి. తుపాను బాధితులకు పంపిణీ చేస్తున్న నిత్యావసరాల్లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరికలు కూడా పంపిస్తుండటంతో డీలర్లు మండిపడుతున్నారు. కమీషన్ లేకుండా పంపిణీ చేస్తే బహుమతి ఇదా...? డీలర్ల ఆవేదన మరోలా ఉంది. జిల్లాలో తాము ఎక్కడా బియ్యం తరలించి అమ్ముకోలేదనీ, బియ్యం తరుగుతో వస్తున్నాయనీ, తరుగుకు గురవుతున్న గోడౌన్లలో దాడులు నిర్వహించకుండా కొద్దిపాటి తేడా వచ్చినా తమను జైలుకు పంపిస్తామనీ, కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ తమను మానసికంగా హింసిస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో ఆరు లక్షల మందికి సరుకులను ఎటువంటి కమీషన్ లేకుండా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందుకు మాకు సస్పెన్షన్లు బహుమతా అని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎవరికైనా బియ్యం ఇవ్వకుండా పంపించేశామా చెప్పండని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 1362 రేషన్ షాపుల్లో 6,61,296 రేషన్ కార్డులుండగా ప్రతి నెలా రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఇప్పుడు డీలర్లు సరుకులు పంపిణీ చేయకుండా సమ్మె చేస్తామనడంతో వారికి సరుకుల సరఫరా ప్రశ్నార్ధకమయింది. డీలర్ల అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలనీ లేకుంటే నిరవధికంగా సరుకులను పంపిణీ చేయబోమని చెబుతున్నారు. అయితే దీనికి అధికారులు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా డీలర్లు పనిచేయడంతో సస్పెండ్ చేయక తప్పదని చెబుతున్నారు. మరో ముగ్గురు డీలర్ల సస్పెన్షన్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న మరో ముగ్గురు డీలర్లను సస్పెండ్ చేస్తున్నట్టు విజయనగరం ఆర్డీఓ జే వెంకటరావు తెలిపారు. నెల్లిమర్ల మం డలం సారిపల్లి, టెక్కలితో పాటు మరో గ్రామానికి చెందిన డీలర్ను సస్పెం డ్ చేసినట్టు ఆయన చెప్పారు. డీలర్లు తుపాను బాధిత కుటుంబాలకు సరఫరా చేస్తున్న రేషన్ సరకులకు పక్కదారి పట్టించడం, అవకతవకలకు పాల్పడటం వంటి కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పార్టీలకతీతంగా సస్పెండ్లు చేస్తున్నాం. సస్పెన్షన్లు ఊరికే చేయలేదు. రాజకీయంగానూ చేయలేదు. బాధితులకు ఇవ్వాల్సిన బియ్యం సక్రమంగా అందించకపోవడం, ఒక్కరికే పలు కార్డులకు సంబంధించిన బియ్యం అందివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం సరుకులు సరఫరా చేయాలి. అలా చేయడం లేదు. అందుకనే కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ ప్రకారమే చేస్తున్నాం. కమిటీ సమక్షంలో సరుకులు సరఫరా చేస్తే అక్రమాలుండవని అలా చెప్పాం కానీ, అదేదో ప్రొటోకాల్ అనుకుంటే ఎలా? సమ్మె చేస్తామంటే ఎలా? ఆదేశాలిచ్చిన కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చుకోవాలి గానీ ఇలా ప్రకటిస్తారా? - జే వెంకటరావు, ఆర్డీఓ, విజయనగరం. ప్రొటోకాల్ పాటించకుంటే సస్పెండ్ చేస్తారా? బియ్యం పంపిణీకి ప్రొటోకాల్ పాటించలేదని మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. వేరే ఎవరో వచ్చి ఫొటోలు తీసుకున్నా, అరకేజీ బియ్యం తక్కువ వచ్చినా సస్పెండ్ చేస్తున్నారు. ఇది అన్యాయం. జిల్లాలో తుపాను బాధితులకు ప్రభుత్వమే సహాయం చేస్తుండటంతో తాము కూడా ముందుకు వచ్చి కమీషన్ లేకుండా సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఇదే మా నేరమా? ఇందుకు సస్పెన్షన్లు బహుమతా?? మంచినూనె, పంచదార విషయంలో ఎందుకీ అనుమానం రాలేదు. బియ్యం గోడౌన్లలో తరుగు వస్తోంది. వారిపై చర్యలు తీసుకోకుండా మాపై చర్యలా? బియ్యం కూడా ప్యాకెట్లుగా ఇవ్వమనండి అందరికీ పంచేస్తాం. 50 కిలోల బస్తాలో 650 గ్రాములు ఎక్కువగా ఇవ్వాల్సిందిపోయి తిరిగి రెండు కేజీలు తగ్గిస్తున్నారు. ఆ లోటు భర్తీ చేసుకుంటున్నాం. దీనికే క్రిమినల్ కేసులు పెడతారా? అందరి సస్పెన్షన్లు బేషరతుగా ఎత్తేయాలి. లేకుంటే నవంబర్ ఒకటి నుంచి సరుకులు సరఫరా బంద్ చేస్తాం. - బుగత వెంకటేశ్వర రావు రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు -
రికార్డు ‘కబ్జా’
►రఘునాథపాలెం మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫట్ ►ఖమ్మం మున్సిపాలిటీకి చెందిన 100 ఎకరాల భూమి హుష్కాకి ► ఎన్నెస్పీ భూమి కనిపిస్తే కబ్జానే.. ►చెరువు శిఖం, సీలింగ్, ఇనాం భూముల్లోనూ ఉల్లంఘనలు ►లక్ష్మీనర్సింహస్వామి,ఆంజనేయస్వామి గుడి భూములూ స్వాహా ►అనుమతుల్లేకుండానే కేటగిరీల మార్పు ► ఏకంగా ఇంటి నంబర్లే ఇచ్చేసిన మున్సిపల్ అధికారులు ►రిజిస్ట్రేషన్ల కోసం చేతులు మారిన కోట్ల రూపాయలు ►‘ఆపరేషన్ భూరైడింగ్’లో వెల్లడయిన ప్రాథమిక సమాచారం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అది గుడి భూమి అయినా.. బడి భూమి అయినా.. ఇనాం భూమి అయినా.. సీలింగ్ భూమి అయినా... చెరువు శిఖమయినా... మున్సిపాలిటీదైనా, నాగార్జునసాగర్ కాల్వదైనా... కబ్జాకు కాదేదీ అనర్హం అనుకున్నారో ఏమో... జిల్లా కేంద్రానికి ఆనుకుని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా భాగమై ఉన్న రఘునాథపాలెం మండలంలో భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేశారు. ప్రభుత్వ భూములంటే మరీ అలుసన్నట్టు ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ఉల్లంఘనలు జరిగాయి. ఇదేదో సాదాసీదాగా చెపుతున్నది కాదు... జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో గత నెల 26, 27 తేదీల్లో రెవెన్యూ సిబ్బంది మూకుమ్మడిగా నిర్వహించిన సర్వేలో ప్రాథమికంగా వెల్లడయిన వాస్తవమిది. ఈ సర్వేలో వెల్లడయిన అంశాల్లోని విశ్వసనీయ వివరాల ప్రకారం ఒక్క రఘునాథపాలెం మండలంలోనే దాదాపు 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. ఇందులో పేదలకు అసైన్ చేసిన భూముల నుంచి ఇనాం భూముల వరకు ఉన్నాయి. ఎలాంటి ఎన్వోసీలు, ఓఆర్సీలు లేకుండా ఏకంగా పట్టాదారుల పేర్లు మారిపోవడం, ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరికి భూ మార్పిడి చేయడం.. చెరువు భూముల్లో ఇళ్లు కట్టుకున్నా మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వడం బట్టి చూస్తే ఇక్కడ జరుగుతున్న భూదందా ఏపాటిదో అర్థమవుతోంది. అసలు ప్రభుత్వ రికార్డుల్లో ఒకటి ఉంటే వాస్తవంగా ఆ భూమిలో మరో రకమైన కార్యకలాపాలు జరుగుతుండడం గమనార్హం. మిగితా భూములను రిజిస్టర్ చేసిన దాని కన్నా ఇలాంటి స్థలాలను రిజిస్టర్ చేసుకోవడం మామూలు విషయం కాదని, ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. మొత్తం మీద కేవలం రెండు రోజుల పాటు కొందరు సిబ్బంది కలిసి ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలోనే పెద్ద ఎత్తున ఉల్లంఘనలు వెలుగులోకి వస్తే, ఈ వివరాల సేకరణను ఒక ప్రాజెక్టుగా తీసుకుని సర్వే చేస్తే ఇంకా ఎంత భూమి బయటకు వస్తుందో, ఎంతమంది కబ్జాసురులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల లీలలు వెలుగులోనికి వస్తాయోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే నోటీసులు... ఆపరేషన్ భూరైడింగ్ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ఉల్లంఘనలుగా తేలిన భూముల్లో ఉన్న వారికి త్వరలోనే నోటీసులు అందజేస్తామని రెవెన్యూ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. ఇది కేవలం ప్రాథమికంగా తెప్పించిన సర్వేనేనని, దీనిలో చాలా భూములపై మరోసారి తనిఖీ ఉంటుందని, ఇందుకోసం త్వరలోనే డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించాయి. ఈ భూముల సర్వేకు సంబంధించి వచ్చిన సమాచారాన్నంతటినీ క్రోఢీకరించి విభాగాలు, కేటగిరీల ద్వారా విభజించి అసలు వాస్తవమేంటనే దాన్ని మరోసారి నిర్ధారించుకుంటామని తెలిపాయి. ఉల్లంఘన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయిన తర్వాతే నోటీసులిస్తామని, ఈ సర్వేలో వెల్లడైన ఉల్లంఘనకు సంబంధించిన భూములను అనుభవిస్తున్న సంస్థలు, వ్యక్తులు భయపడవద్దని, పూర్తిస్థాయిలో నిర్ధారణ అయిన తర్వాతే చర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు నిర్వహించింది ప్రాథమిక విచారణ మాత్రమేనని రెవెన్యూ అధికారులంటున్నారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం నిర్వహించిన సర్వేకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్రామాల వారీగా ఉల్లంఘనలు ఇలా ఉన్నాయి.... రఘునాథపాలెం: సర్వే నెంబర్ 11లో నర్సింహులకుంట చెరువులోని 2 ఎకరాలను కబ్జా చేసి రోడ్డు వేశారు. 218లో ఉన్న 2 ఎకరాల కుంట భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారు. 407లో ఉన్న ఏడెకరాల శిఖం భూమిలో ఏకంగా కాలనీ ఏర్పాటయింది. దాని వివరాలు లభించడం లేదు. 351లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఏడెకరాల భూమిని కబ్జా చేసి వ్యవసా యం చేస్తున్నారు. 355లో శారదా కళాశాల సమీపం లో ఉన్న సీలింగ్ ల్యాండ్లో 8 మందికి 2 ఎకరాల భూమిని వ్యవసాయం కోసం అసైన్ చేశారు. దానిలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయేతర కార్యకలాపాలు సాగుతున్నాయి. 30లో ఎకరం అసైన్డ్ భూమిని కబ్జా చేశారు. 93లో ఎస్సీ కాలనీకి అసైన్ చేసిన 8ఎకరాల 33గుంటల భూమిని వే రే వ్యక్తి అనుభవిస్తున్నారు. 111,112లోని మూడెకరాల గుడి భూమికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద పాస్పుస్తకాలున్నాయి. 371 సర్వే నంబర్లోని 10 ఎకరాల 35 గుంటల ఇనాం భూములను ప్లాట్లు చేశారు. బల్లేపల్లి: సర్వే నెంబర్ 41లో ఉన్న శ్మశానవాటికలో అర ఎకరం కబ్జాకు గురయింది. పాపటపల్లి: సర్వే నెంబర్ 149లోని 110 ఎకరాల అసైన్డ్ భూమి సేల్డీడ్ చేసి వేరే వ్యక్తులు కొనుక్కున్నారు. వారు పేదలయితే అసైన్డ్ కమిటీ ద్వారా నిర్ధారించి వారికే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. 118లో ఉండాల్సిన చెరువులో 12 ఎకరాల భూమి కనిపించడం లేదు. 89 లో ఉండాల్సిన ఏడెకరాల చెరువు ప్రభుత్వ రికార్డుల్లో ఓ రకంగా ఉంటే వాస్తవంగా వేరే రూపంలో ఉంది. ధంసలాపురం: సర్వే నెంబర్ 178లో 128 ఎకరాల్లోని చెరువులో 40 ఎకరాల భూమి కబ్జాకు గురయింది. శ్రీరాంహిల్స్లోని సర్వే నెంబర్ 49లో హౌసింగ్బోర్డుకిచ్చిన స్థలాన్ని బహిరంగ వేలం ద్వారానే విక్రయించినా అందులో 10 శాతం భూమిని పేద వర్గాలకు ఇవ్వాలన్న నిబంధన ను పాటించలేదు. కోయచెలక: సర్వే నెంబర్ 192లో 119 ఎకరాల 20 గుంటల భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం అసైన్చేశారు. కానీ ఆ భూమిలో ఎలాంటి ఇళ్లు నిర్మించలేదు. అందులో 4ఎకరాల భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారు. ఆరు ప్లాట్లను కబ్జా చేసి పత్తి పండిస్తున్నారు. 149లో ఉన్న 80 ఎకరాల పెద్ద చెరువు శిఖం భూమిలో 7.5 ఎకరాలు కబ్జాకు గురయింది. 150,151, 229 సర్వే నెంబర్లలోని 5ఎకరాల 31 కుంటల ఇనాం భూమిని ఓఆర్సీలు లేకుండా అమ్ముకున్నారు. చిమ్మపూడి: సర్వే నెంబర్ 48లోఉన్న 195 ఎకరాల అసైన్ భూమిలో 80 శాతం అమ్ముకున్నారు. 20 ఎకరాలు కబ్జా అయింది. 512లోని మూడెకరాలు ఖాళీ జాగా ఉంది. 163లోని 71 ఎకరాల చెరువులో 2 ఎకరాలు కబ్జాకు గురయింది. మంచుకొండ: సర్వే నెంబర్ 338లో ఉన్న 211 ఎకరాల ప్రభుత్వ భూమిలో 168 ఎకరాలు అసైన్ చేశారు. దీనిలో 73 ఎకరాల్లో ఉల్లంఘనలున్నాయి. సర్వే నెంబర్ 37లోని 37 ఎకరాల సీలింగ్ భూమి అన్యాక్రాంతమైంది. 282లోని ఎర్రచెరువులో 16 ఎకరాల 60 గుంటల భూమిని 18 మంది కబ్జా చేశారు. 354లో ఉన్న భూమిని ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాల కోసం సేకరించినా.. ఇప్పటికీ ఆ భూమిని అసలు పట్టాదారుడే అనుభవిస్తున్నాడు. వెలుగుమట్ల: సర్వే నెంబర్ 548 లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయింది. దీనిపై సమగ్ర సర్వే జరపనున్నారు. 564లో ఉన్న 22 కుంటల కారిజ్ఖాతా ఇనాం భూమిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. 565లోని శిఖం భూమిలో 8 ఎకరాలు కబ్జాకు గురయింది. 396 లో ఉన్న రెండెకరాల ఎన్నెస్పీ స్థలంలో రోడ్డు వేసి వెం చర్లు చేస్తున్నారు. 138, 140లో ఉన్న దాదాపు 5 ఎకరాల ఎన్నెస్పీ భూమి కూడా కబ్జాకు గురయింది. దీని ని జాయింట్ సర్వే చేయనున్నారు. 135, 137లో ఉన్న మూడెకరాల ఎన్నెస్పీ భూమిని ఎవరో అమ్ముకున్నారు. ఖమ్మం రెవెన్యూ: సర్వే నెంబర్ 123లో ఉన్న 189.33 కుంటల భూమిలో 100 ఎకరాలు మున్సిపాలిటీకి కేటాయిం చారు. అందులో అన్నీ ప్రైవేటు సముదాయాలు వెలి శాయి. థియేటర్లు, కల్యాణమండపాలు నిర్మించారు. పాకబండ: సర్వే నెంబర్ 66లోని 34 ఎకరాల 11 కుంటల భూమిని 144 మంది కబ్జా చేశారు. సర్వే నెంబర్ 4లోని 4,500 గ జాల భూమిని దాసాంజనేయస్వామి గుడి కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. అందులో ప్రైవేటు వ్యక్తులు ఇళ్లు కట్టుకున్నారు. మున్సిపాలిటీ వారు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారు. బుర్హాన్పురం: సర్వే నెంబర్ 105లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి గుడి భూమిలో 23 ఎకరాలను 400 మంది కబ్జా చేశారు. అందులో ఉన్న ఐదెకరాల ఎన్నెస్పీ భూమి కూడా కబ్జాకు గురయింది. 292,293లోని 4 ఎకరాల 28 కుంటల శిఖం భూమి కూడా కబ్జా అయింది. 5లో మూడెకరాలు ఖబర్స్థాన్ కోసమని రికార్డుల్లో ఉంటే అక్కడ పక్కాఇళ్లున్నాయి. ఎస్పీ కార్యాలయం సమీపంలోని 489లో అన్నీ ప్రైవేటు భవంతులు వెలిశాయి. 217లో ఉండాల్సిన 41.25 ఎకరాల ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల్లో ఉల్లంఘనలు జరగ్గా 15 ఎకరాలు కబ్జాకు గురయింది. 35, 38, 39, 40 సర్వే నెంబర్లలోని గుంటి మల్లేశ్వరి దేవస్థానంలో 3 ఎకరాలు కబ్జా అయింది. ఈర్లపూడి: సర్వే నెంబర్ 554లోని 300 ఎకరాల అసైన్ భూమిని 43 మంది కొనుక్కున్నారు. 73లోని మూకుడికుంట చెరువులో 19 ఎకరాలు కబ్జాకు గురయింది. వేపకుంట్ల: సర్వే నెంబర్ 196,197లోని 50 ఎకరాల చెరువు భూముల్లో 20 ఎకరాలను కబ్జా చేశారు. 26లోని ఇనాం భూమిని ఓఆర్సీలు లేకుండానే 41 మంది కొనుగోలు చేశారు. చింతగుర్తి: సర్వే నెంబర్ 56లో 28 ఎకరాల 30 కుంటల చెరువు శిఖం భూమి ఉంది. ఇందులో 10.28 ఎకరాలు అసైన్ చేశారు. ఈ శిఖం భూమిని ఎలా అసైన్ చేశారు, ఎవరు చేశారనేది తేలాల్సి ఉంది. 266లో ఉన్న 941 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఇందులో సీలింగ్, పట్టా, అసైన్ భూములున్నాయి. దీనిని రీసర్వే చేయనున్నారు. రేగుల చెలక: సర్వే నెంబర్ 85లో ఉన్న 25 ఎకరాల్లో మూడు గ్రానైట్ కంపెనీలకు భూమిని లీజుకిచ్చారు. ఈ భూమిలో గ్రానైట్ కంపెనీలు బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూముల్లో వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. 57,58,60 సర్వే నెంబర్లలో బల్వత్ఇనాం భూములను ఓఆర్సీ లేకుండా వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి బదలాయించారు. 9లో ఉన్న 1.15 కుంటల శిఖం భూమిని 14 మందికి ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. 145లో ఎకరం భూమి కబ్జాకు గురయింది. ఖానాపురం: 37 సర్వే నెంబర్లోని 153 ఎకరాల భూమిలో 86 ఎకరాల 29 కుంటల భూమిని మూడువేల మంది బీపీఎల్ కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించారు. ఇందులో కేవలం 80 ఇళ్లు మాత్రమే కట్టి ఉన్నాయి. మిగిలిన 67 ఎకరాల భూమిని రెండు మినరల్స్కు 20 ఏళ్ల లీజుకిచ్చారు. 94లో ఉన్న ఎకరం భూమి రికార్డుల్లో శ్మశానవాటిక అని ఉండగా, అది ఖాళీగానే ఉంది. 321లో 45 ఎకరాల 39 కుంటల్లో 10 ఎకరాలు టీఎన్జీవోలకు కేటాయించగా, అందులో 90శాతం ఖాళీగానే ఉన్నాయి. అదే సర్వేనెంబర్లో 15.39 ఎకరాలను ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కబ్జా చేసి నివసిస్తున్నారు. 94లోన్న 15 కుంటల ఊరచెరువు స్లూయిజ్ కూడా కబ్జాకు గురయింది. మూడెకరాలు ఒయాసిస్ రిక్రియేషన్ క్లబ్కు కేటాయించినా క్లబ్ పనిచేయడం లేదు. 234లో ఉన్న 129 ఎకరాల 4 కుంటల లకారం చెరువు శిఖం భూమిపై డీటైల్డ్ సర్వే చేయనున్నారు. వి.వి.పాలెం: సర్వే నెంబర్ 101లో ఉన్న 150 ఎకరాలకు గాను 111 ఎకరాలు అసైన్ చేశారు. అందులో 34 ఎకరాల్లో ఉల్లంఘనలుండగా, 37 ఎకరాలు కబ్జా అయింది. 158లో ఉన్న ఎకరం సీలింగ్ భూమిని కబ్జా చేశారు. 66లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి చెందిన 24 గుంటల భూమి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేశారు. అదే గ్రామంలోని 9 ఎకరాల 23 కుంటలు కబ్జాకు గురయింది. -
బోగస్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం
వీరఘట్టం: వీరఘట్టం మండలంలో ఉన్న బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘బియ్యం బొక్కుతున్న ‘తెల్ల’దొరలు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా అధికారుల నుంచి తహశీల్దార్ ఎం.వి.రమణకు వచ్చిన ఆదేశాల మేరకు బోగస్ కార్డుల ఏరివేతకు రెవెన్యూ సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మండలంలో అనర్హులకు రేషన్కార్డులు ఉన్న విషయాన్ని గుర్తించామని, ఇకపై మరింత వేగవంతంగా ఏరివేత కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అనర్హులకు రేషన్ కార్డులు ఉన్న విషయాన్ని ఎవరైనా గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకొస్తే వారి పేర్లును గోప్యంగా ఉంచడంతో పాటు అక్రమాలకు పాల్పడేవారిని శిక్షిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు అర్హత కలిగిన వారు ఉంటే రేషన్కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే అర్హత లేక తెల్లరేషన్కార్డులు వినియోగిస్తున్న వారు స్వచ్ఛందంగా అప్పగిస్తే వారిని అభినందిస్తామంటున్నారు. -
8 ఇసుక లారీల సీజ్
బొబ్బిలి రూరల్:మండలంలోని కారాడ గ్రామంలో వేగావతి నదినుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8లారీలను ఆర్ఐ, వీఆర్వోలు మంగళవారం సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకోగానే ఇసుక అక్రమరవాణాదారులు కొందరు పారిపోగా మరికొందరు లారీలలో ఇసుకను తిరిగి వేగావతి నదిలో పోసి పారిపోయారు. కొంతమంది పారిపోగా మిగిలిన 8లారీలను సిబ్బంది పట్టుకున్నారు. ఈ లారీలతో ఇసుకను చీపురుపల్లి, విజయనగరం నుంచి విశాఖవైపు తరలిస్తున్నట్లు రెవెన్యూసిబ్బంది గుర్తించారు. పట్టుకున్న లారీలను తహశీల్దార్కార్యాలయానికి తరలించి సీజ్చేశారు. ఇసుక తరలిస్తున్న లారీలను, నదిలో తిరిగి ఇసుక పారబోస్తున్న లారీలను సిబ్బంది వీడియో తీశారు. కాగా ఇసుకలోడుతోపట్టుబడిన లారీలకు ఒక్కోదానికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు తహశీల్దార్ బి.మసీలామణి తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో పట్టపగలే ఇలా 8ఇసుక లారీలు పట్టుబడడం ఇదే తొలిసారి. గత ఏడాది ఓసారి పలు ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకోవడంతో అప్పట్లో పెద్ద వివాదం అయింది. పలువురు రాజకీయనాయకుల జోక్యంతో సమస్య అప్పట్లో మరింత ముదిరింది. మళ్లీ ఇన్నాళ్లకు 8లారీలను పట్టుకోవడంతో సంచలనం రేగుతోంది. నాయకుల జోక్యం...? ఇసుకాసురులను రెవెన్యూ సిబ్బంది పట్టుకోవడంతో చీపురుపల్లి ప్రాంతానికి చెందిన టీడీపీ ప్రముఖ నాయకుడు, అధికారులు, ఇక్కడి రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన లారీల్లో టీడీపీ నాయకుడికి చెందినవే 5వరకు ఉన్నట్లు సమాచారం. దీంతో కేసును తారుమారుచేయడానికి గాని సీజ్ చేసిన లారీలను ఖాళీ వాహనాలుగా చూపేందుకు గానీ యత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. చంపావతి ఇసుకతో లారీ పట్టివేత గుర్ల: ప్రభుత్వ అనుమతులు లేకుండా స్థానిక చంపావతి నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ లారీని అదుపులోకి తీసుకుని పది వేల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేశామని తహశీల్దారు ఉమాకాంత్ ఫాడి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలాగే మూడు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న తరువాత పరారయ్యారన్నారు. వాటికి సంబంధించిన వివరాలు స్థానిక పోలీసు స్టేషను, ఆర్టీఓకు తెలియజేశామని చెప్పారు. మరోసారి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తూ వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. చంపావతినది, కెల్లగెడ్డ, గడిగెడ్డ ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు మహేష్, సీనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి, ఆర్ఐ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అధికారులా...మాకో లెక్కా?
పభుత్వ హెచ్చరిక బోర్డులు విరిచి, పాక వేసి దర్జాగా చెరువు గర్భం దున్నిన వైనం పెట్రేగుతున్న ఆక్రమణదారులుఆయకట్టు రైతుల కలవరం ఆ చెరువు ఆయకట్టు రైతుల అమాయకత్వమో, రెవెన్యూ సిబ్బంది మెతక వైఖరో తెలియదు గానీ అప్పలమ్మపాలెం, కుముందానిపేట గ్రామాల్లోని ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడోసారి అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ దర్జాగా చెరువు గర్భాన్ని దున్నేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాక్షాత్తూ తహశీల్దార్ వేయించిన హెచ్చరిక బోర్డు పీకిపారేసి అదే స్థలంలో మరలా పెద్దపాక వేసేశారు. అంతేకాదు...చెరువునీరు అడ్డంగా ఉందన్నట్టుగా గట్టు తెగనరికి నీటిని వదిలేశారు. వివరాలివి. రావికమతం: మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏటా జరుగుతున్న ఈ దౌర్జన్యంపై సదరు చెరువు ఆయకట్టు రైతులు మడకా సత్యారావు, మదుమంతి శ్రీను, రాజాన అప్పారావు, చల్లపురెడ్డి అప్పారావు, మడకా శ్రీను, అప్పారావు, మిరియాల గోవింద, నాగేశ్వరరావు తదితర 40 మంది రైతు లు ఏటా అధికారులకు, ప్రజా ప్రతినిధులకూ మొరపెట్టుకుంటున్నారు. వారు తూతూ మంత్రంగా ఏవో చర్యలు చేపడుతున్నారు. మళ్లీ ఏడాది పరిస్థితి షరామామూలే. అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబరు 196, 235 లో నల్లకొండమ్మతల్లి చెరువు ఉంది. ఆ చెరువు గర్భం ఆరెకరాలు, కాగా మరో రెండెకరాలను సమీప ఆయకట్టు రైతులు వేరొక రైతు నుంచి కొనుగోలు చేసి చెరువుకు కేటాయించేశారు. కాగా గ్రామంతో పాటు, కుముందానిపేట, గదబపాలెం గ్రామాలకు చెందిన పోతల నర్సింగరావు, ఇంగళపు పేరయ్య, శ్రీను, కటారి సత్తిబాబు, శలాది సత్తిబాబు, మారబోయిన చిన్నలు చెరువు గర్భంతో పాటు తాము కొనుగోలు చేసి చెరువుకు కేటాయించిన భూమిని సైతం ఆక్రమించి దున్నేసారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో చెరువు దున్ని, పాకలు వేసి, గట్టు నరికినందుకు కలెక్టర్కు, తహశీల్దార్కు ఫిర్యాదు చేయగా వాటన్నిం టినీ తొలగించి, వారిపై కేసులు కూడా నమోదు చేశారన్నారు. మళ్లీ గట్టు నరికేయడంతో పాటు చెరువులో పాకలు వేసేసారని, చెరువు మొత్తం దున్నేశారని ఆయకట్టురైతులు వాపోయారు. ఆ చెరువుకు గతంలో పని కి ఆహార పథకంలో రూ. 2లక్షలతోనూ, ఉపాధి హామీ పథకంలో రూ.4 లక్షల యాభైవేల వ్యయంతోనూ పనులు చేపట్టామని, ఇపుడు ఆయా బంటాలు కూడా ఆక్రమణదారులు కలియ దున్నేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ పాసుపుస్తకమే కారణమా? గతంలో ఆక్రమణదారులు ఆ చెరువుకు రెండు కిలోమీటర్ల దూరంలోని 237, 240 సర్వే నంబర్లుతో పాసు పుస్తకాలు చేయించి వాటిని ఆధారంగా చూపుతూ ఈ చెరువును దున్నేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీనిపై గత ఏడాది మండల సర్వేయర్ సర్వేలో రుజువైంది. ఆ సర్వే ఆధారంగా చర్యలు కూడా తీసుకున్నారు. రావిచెరువు కూడా : దీనితో పాటే అప్పలమ్మపాలెం రావిచెరువును కూడా ఆ గ్రామానికి చెందిన మరికొంత మంది రైతులు శనివారం సాయంత్రం దున్నేశారు. అయితే ఎవరు దున్నినదీ ఇంకా తెలియరావడం లేదని ఆ ఆయకట్టు రైతులు తెలిపారు. దీనిపై వీఆర్వో శ్రీనుకు ఫిర్యాదు చేసామని, సోమవారం కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్నట్టు తెలిపారు. కాగా ఈ విషయమై ఆర్ఐ గంగరాజును సాక్షి సంప్రదించగా చెరువును మళ్లీ దున్నేసిన వైనం తమ దృష్టికి వచ్చిందన్నారు. తహశీల్దార్ భాస్కరరావుకు తెలియజేశామన్నారు. ఆక్రమణ దారులపై నోటీసులు కూడా సిద్ధమయ్యాయన్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
ఆన్లైన్లో సర్కారు భూములు
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఏ మండలంలో చూసినా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని రెవెన్యూ సిబ్బంది సాయంతో కొందరు కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారు. ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తోంది. సర్కారు భూముల వివరాలను సేకరించి కంప్యూటరులో నిక్షిప్తం చేస్తున్నారు. త్వరలో ఆన్లైన్లో ఉంచనున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు.. కొత్త పరిశ్రమలు.. సంస్థల ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ సిబ్బంది ఇందులో తలమునకలయ్యారు. భూముల నిక్షిప్తం ఇలా...: ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, మేతపోరంబోకు, శ్మశాన స్థలాలు, డొంకలు, వసతిగృహాలు, పాఠశాల స్థలాలు తదితర భూముల ప్రస్తుత పరిస్థితి.. అవి ఏ రూపంలో ఉన్నాయి.. బల్క్ డిజిటల్ సైనింగ్ పద్ధతి ద్వారా వెబ్ల్యాండ్లో నమోదు చేస్తున్నారు. వీటిని సర్కారు భూమి పేరుతో ఆన్లైన్లో ఉంచనున్నారు. దాంతో ఎక్కడి నుంచైనా ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ప్రభుత్వానిదో.. కాదో తాజా పరిస్థితిని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కబ్జాదారుల ఆటలు కొంతవరకు అరికట్టవచ్చు. ప్రభుత్వ భూముల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తే.. రెవెన్యూ అధికారులతో సంబంధం లేకుండా భూముల స్థితి, స్వభావం తదితర వివరాలనునెట్లోచూసి తెలుసుకునే వీలుంది. దీంతోపాటు రెవెన్యూ కార్యాలయంలో అధికారులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. అధికారుల సైతం ప్రభుత్వ భూములను భిన్నాలుగా మార్చి పట్టాలిచ్చే విధానానికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది. -
మీసేవల్లో అపకీర్తి..!
ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు వేలల్లో వసూళ్లు - కులం, నివాస సర్టిఫికెట్ల జారీలోనూ... - మీసేవ నిర్వాహకులతో రెవెన్యూ సిబ్బంది మిలాఖత్ - సామాన్య ప్రజలకు తప్పని తిప్పలు కలెక్టరేట్ : విద్యార్థులు, తలిదండ్రుల అవసరాలను ఆసరాగా తీసుకుని కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల పత్రాలు జత చేసి దరఖాస్తు చేసినా... కొర్రీలు పెట్టి మరీ తోసిపుచ్చుతున్నారు. ప్రస్తు తం కళాశాలలు ప్రారంభం కావడం, కౌన్సిలిం గ్ తేదీలు వెల్లడైన నేపథ్యంలో విద్యార్థులకు కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అవసరంగా మారాయి. ఇదే అదనుగా భావించిన ఒకరిద్దరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ సిబ్బంది చేతివాటం జిల్లాలో ఎక్కువగా ధ్రువీకరణ పత్రాల తాకిడి ఉన్నది హన్మకొండ మండలానికే. దీంతో నగరంలోని కొన్ని మీ సేవ కేంద్రాల సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మిలాఖత్ అయి దర ఖాస్తుదారుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.30 చెల్లించాల్సి ఉండగా... అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. అదనంగా చెల్లించిన వారికి 24 గంటల్లో పత్రాలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా వసూలు చేసిన డబ్బుల్లో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుందని కలెక్టరేట్ సమీపంలోని పలు మీసేవ కేంద్రాల నిర్వాహకులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులకూ ఆదాయ పత్రాలు దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువుల నిమిత్తం ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిన ఆసరాగా చేసుకున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే విధంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొంది ప్రభుత్వం నుంచి ఫీజులు పొందుతున్నారు. గతంలో అధికారులు చేపట్టిన విచారణలో ఈ తతంగం బహిర్గతమైంది. ఈ దందాలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నారుు. ఇక అన్ని సక్రమంగా ఉన్నా.. ఉద్దేశపూర్వకంగా తోసిపుచ్చుతున్న దరఖాస్తుల విషయంలో బాధితుల గోడు వర్ణనాతీతం. తమ బాధను అధికారులు సైతం వినే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం రెవెన్యూ కార్యాలయంలో ఒకరిద్దరు చేస్తున్న అక్రమ వ్యవహారం వల్ల అందరికీ అపకీర్తి వస్తోంది. ఇదే విషయంపై ఇటీవల సిబ్బం దితో సమావేశమైన తహసీల్దార్ డాక్టర్ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పరోక్షంగా సదరు సిబ్బందిని హెచ్చరిం చినట్లు సమాచారం. కాగా, అనర్హులకు జారీ చేస్తున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సంతకం ఉంటోందా...లేక ఇష్టారాజ్యంగా చేస్తున్నారా.. అన్న విషయంలో అధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
ముందే ఓటేసిన ఉద్యోగులు
నగరవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం చొరవ చూపిన సైబరాబాద్ కమిషనర్ పలుచోట్ల ఓటేసిన 5000 మంది ఉద్యోగులు సాక్షి, సిటీబ్యూరో: నగరవ్యాప్తంగా సోమవారం మినీ పోలింగ్ జరిగింది. వివిధ ప్రాంతాల్లో పోలీసులు, పలువురు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ముందే వినియోగించుకున్నారు. ఈ నెల 30న పోలింగ్ సందర్భంగా విధినిర్వహణలో పాలుపంచుకొనే ఉద్యోగుల కోసం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. పోస్టల్ బ్యాలెట్ను ఏర్పాటు చేయించారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సోమవారం సైబరాబాద్లో రోడామేస్త్రీ నగర్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, మేడ్చల్, నేరేడ్మెట్, చైతన్యపురి, సరూర్నగర్, రాజేంద్రనగర్ తదితర పాంతాలలోని ప్రభుత్వ కళాశాలలో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు వరకు కొనసాగింది. సుమారు 5000 మంది సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటును సీల్డ్కవర్లో పెట్టి బాక్స్లో వేశారు. ఈ బాక్స్లను సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత ఓట్లు లెక్కించేటపుడు తెరిచి లెక్కిస్తారు. పది సంవత్సరాల నుంచి తాము ఓటు హక్కును వినియోగించుకోలేదని, కమిషనర్ చొరవతో ఈ సారి త్వరగానే ఓటు హక్కును వినియోగించుకోగలిగామని పలువురు పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. -
వంద కొట్టు టోకెన్ పట్టు
సాక్షి, చెన్నై: అధికారంలోకి వస్తే ఉచిత పథకాలు దరి చేరుస్తానంటూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, కుటుంబ కార్డుదారులకు ఉచిత గ్రైండర్, మిక్సీ, టేబుల్ ఫ్యాన్ల పంపిణీకి శ్రీకారం చుట్టినారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా వీటి పంపిణీ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పక్షం ఉచితాల పంపిణీని మరింత వేగవంతం చేసింది. దీంతో ఉచితాలను త్వరితగతిన తీసుకోవాలన్న ఆత్రుత కుటుంబ కార్డుదారుల్లో పెరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోకెన్లు అందజేస్తున్నారు. ఈ టోకెన్ల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాలకు వేలాదిగా జనం తరలి వస్తుండటంతో గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి. దీన్ని ఆసరాగా తీసుకున్న రెవెన్యూ సిబ్బంది కొందరు తమ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారు. తమ చేతులను ఎవరు అయితే, తడుపుతారో వారికి త్వరితగతిన టోకెన్లను ఇచ్చేస్తున్నారు. చాప కింద నీరులా ఈ తంతు సాగుతూ వస్తున్నా, బహిరంగంగా బయటకు పొక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో తిరువాన్నీయూరులో గురువారం జరిగిన శిబిరంలో రెవెన్యూ సిబ్బంది బండారం బయట పడింది. జనం తిరగబడటంతో ఆ సిబ్బంది పరుగులు పెట్టాల్సివచ్చింది. రూ.వంద కొట్టు: తిరువాన్నీయూరు పరిసరాల్లో బుధవారం నుంచి టోకెన్ల పంపిణీ సాగుతోంది. ప్రత్యేక శిబిరానికి జనం వేలాదిగా తరలి రావడంతో రెవెన్యూ సిబ్బంది తమ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారు. కుటుంబ కార్డుదారుల వివరాల్ని సేకరించి, ఇళ్ల వద్దకే టోకెన్లు తెచ్చి ఇస్తామంటూ పంపించేశారు. గంటల తరబడి క్యూలో బారులు తీరడం కన్నా, ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తే మంచిదేనన్న నిర్ణయంతో లబ్ధిదారులు వెనుదిరిగారు. గురువారం ఉదయం నుంచి రాజీవ్ గాంధీ నగర్, తిరువాన్నీయూరు కుప్పం, శ్రీనివాస నగర్ పరిసరాల్లో టోకెన్ల పంపిణీలో నిమగ్నం అయ్యారు. ఇంటింటికి వెళ్లి టోకెన్ ఇచ్చే క్రమంలో ముందుగా రూ. 100 తమకు ఇవ్వాల్సిందేనని వచ్చిన సిబ్బంది పేర్కొనడంతో లబ్ధిదారులు విస్తుపోయూరు. కొందరు చేతులు తడపగా, మరి కొందరు తిరగబడే పనిలో పడ్డారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే వచ్చిన ఉచిత పథకాలకు లంచమా..? అంటూ శివాలెత్తారు. టోకెన్లు ఇస్తే సరి అని గ దమాయించడంతో సిబ్బంది అక్కడి నుంచి ఉడారుుంచారు!. అయినా వెంటాడి మరీ శిబిరం వద్దకు వచ్చిన పలువురు లబ్ధిదారులు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం మీడియాకు చేరింది. ఉచితాలకు చేతులు తడిపే వ్యవహారం వెలుగులోకి రావడంతో సంబంధిత శాఖ వర్గాలపై సీఎం జయలలిత కొరడా ఝుళిపించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రె‘వెన్ను’లో వణుకు
చీపురుపల్లి, న్యూస్లైన్: చీపురుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బం ది అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తట్టుకోలేక వణికిపోతున్నారు. నాయకులు చెప్పింది చేయలేక, చేయకుండా ఉండలేక సతమతవుతున్నారు. దీంతోవారి పరిస్థితి ‘ముందుగొయ్యి... వెనుకనుయ్యి’ అన్నచందంగా తయారయింది. అసలే పీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం..అందులోనూ నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి మండలంలో విధులు నిర్వహించే అధికారులకు ఒత్తిళ్లు ఉండడం సహజమే అని అనుకోవచ్చు. కానీ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పని చే స్తున్న అధికారులు ఆస్థాయిని దాటిపోయి ఒత్తి ళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో భీతిల్లి మూకుమ్మడిగా సెల వుపెట్టేంత వరకూ సిద్ధమవుతున్నారు. ఒకవేళ మూకుమ్మడి సెలవులు వీలుకాకపోతే ఎలాగైనాఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని బతికి బట్టకట్టాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహశీల్దార్ వరకు అం దరిదీ అదే పరి స్థితి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతి చిన్న పనికి సర్పంచ్ నుంచి మంత్రి బంధువుల వర కూ నేతలందరూ ఒత్తిడి తీసుకువస్తున్నారని అధికారులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికార పార్టీ కు చెందిన కార్యకర్తలు పనులు పూర్తి చేయాలంటూ హుకుంజారీచేస్తున్నట్లు తెలిసింది. అం దులోభాగంగానే భూములు లేనివారికి భూము లు ఉన్నట్లురికార్డులు సృష్టించాలని, భూములు లేని వారికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, డి-పట్టా భూములను ధనికుల పేర్లుతో ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అసలే కొత్తగా విధుల్లో చేరామని, తమకు బోలెడంత భవిష్యత్తు ఉందని, వీరు చెప్పినవన్నీ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని గ్రామ రెవెన్యూ అధికారులు వేడుకుంటున్నా అధికార పార్టీ నేతలు వినిపించుకోవడం లేదు. దీనికి తోడు తహశీల్దార్ ను కూడా బెదిరిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లరాదని, ఏ తనిఖీలు చేయొద్దని, సీట్లోనే కూర్చొని, వచ్చిన ఫైళ్లపై సంతకా లు చేసుకోవాలంటూ నేతలు ఆర్డర్లు జారీ చేస్తున్నారు. తహశీల్దార్ టి.రామకృష్ణ సైతం ప్రొహిబిషన్లో ఉండడంతో ఏం చేయా లో తెలియక సతమతమవుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ బాధలన్నీ భరించే కంటే ఎక్కడికైనా బదిలీ చేసుకుని వెళ్లిపోతే మంచిదని వారంతా భావిస్తున్నారు. -
ఆధార్ కేంద్రాల్లో భారీగా వసూళ్లు
=ఆధార్ కేంద్రాల్లో భారీగా వసూళ్లు =ప్రయివేటు వ్యక్తుల నిర్వహణతో అవినీతి =కొన్నిచోట్ల అనధికార కేంద్రాల ఏర్పాటు =నగదు బదిలీపై అమలు కాని =సుప్రీం ఆదేశాలు సుప్రీం సూచనల్ని బేఖాతరు చేస్తున్నారు. నగదు బదిలీకి ఆధార్ తప్పనిసరంటున్నారు. కార్డుల్లేని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సాకుతో ఆధార కేంద్రాల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులిస్తేనే నమోదు చేస్తున్నారు. అనధికార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయివేటుకు బాధ్యతలు అప్పగించడంతో భారీగా వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డుల పంపిణీ తుది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రతి గ్రామంలో కార్డుల్లేని జనాభా వందల్లో ఉన్నారు. యలమంచిలి, న్యూస్లైన్ : సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపించడం లేదు. నగదు బదిలీకి డిసెంబర్ నెలాఖరు గడువు విధించడంతో ఆధార్ కార్డులు లేనివారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా జనాభా 42 లక్షల 90 వేలు కాగా ప్రకారం 39 లక్షల 99వేల మంది ఆధార్లో నమోదు చేయించుకున్నట్టు అధికార యంత్రాంగం చెబుతోంది. మూడు లక్షల దరఖాస్తుల్ని తిరస్కరించారు. దాదాపు అయిదు లక్షల కార్డుల ఆచూకీ తెలియకపోగా 30 లక్షల కార్డులు తయారైనట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆధార్ కార్డుల పంపిణీలో అధికారుల వద్ద ఉన్న లెక్కల కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు వల్లే అక్రమాలు ఆధార్ కార్డుల తయారీ బాధ్యత ప్రయివేటుకు అప్పగించడంతో అక్రమాలను నియంత్రించే అధికారం అధికారులకు లేకుండా పోయింది. ఇటీవల జిల్లాలో ఆధార్ నమోదు వేగవంతానికి మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో అనధికారికంగా రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ఎస్.రాయవరం మండలంలో ఏకంగా అధికారులకు తెలియకుండానే ఆధార్ కేంద్రాలను నడుపుతుండటం విశేషం. ఆధార్ సిబ్బంది వసూళ్లపై రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ‘వాళ్లు మా మాట వినడం లేదని’ వాపోవడం గమనార్హం. ఆధార్ కేంద్రాల్లో పొరపాట్లను సరిచేయకుండానే జిల్లాలో 45 శాశ్వత ఆధార్ కేంద్రాలకు అనుబంధంగా మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆపరేటర్ల పరీక్షలోనూ అక్రమాలే ఆదార్ కేంద్ర ఆపరేటర్లు యూడీఏఐ పరిధిలో సిఫి నిర్వహించే కంప్యూటర్ పరీక్షను ఆన్లైన్లో రాయవలసి ఉంది. ఇందుకు 10వ తరగతి విద్యార్హతతో ఎస్బీఐలో రూ.300 చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రకటించిన తేదీలో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ వినియోగానికి సంబంధించిన పలు అంశాలను సిలబస్లో చేర్చారు. పరీక్ష తప్పినవాళ్లు మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించింది. ఈ పరీక్షకు మధ్యవర్తులు తెరపైకి వస్తున్నారు. అసలు పరీక్ష రాయకుండానే రూ.2500 వరకు చెల్లిస్తే ధ్రువపత్రాన్ని చేతిలో పెడుతున్నారు. ఇటీవల కొందరు ఆపరేటర్లతో బేరసారాలు కూడా జరిగాయని సమాచారం. -
దొంగలు పడిన ఆర్నెల్ల్లకు..
చీరాల, న్యూస్లైన్ : టన్నులకొద్దీ ఇసుకతో రోజుకు 350 నుంచి 400 లారీలు వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల నుంచి అక్రమంగా తరలి వెళ్తుంటాయి. ఇది రోజూ జరిగే తంతే. ఇదేదో చాటుమాటున జరిగే వ్యవహారం కూడా కాదు. బహిరంగంగా, బరితెగించి పగలు..రాత్రి అన్న తేడా లేకుండా ఇసుక దిబ్బలను కొన్నేళ్లుగా కొందరు అక్రమార్కులు తోడేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద ఎత్తుగా ఉండే ఇసుక దిబ్బలు ఇప్పుడు ఇరవై అడుగుల లోతుగా మారి నీటి కుంటలయ్యాయి. వాల్టా చట్టం చట్టుబండలైంది. కేవలం శాస్త్రీ్తయ్ర పద్ధతి ద్వారా సిలికా ఇసుకను తవ్వుకునేందుకు మాత్రమే కొద్ది మందికి అనుమతి ఉంది. అదీ కూడా కొన్ని ఎకరాల పరిధిలో మాత్రమే. కానీ వేటపాలెం, చినగంజాం, చీరాల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలను తవ్వేశారు. ఈ అక్రమ తవ్వకాలకు అధికార పార్టీకి చెందిన బడా నేతలతో పాటు అనేక మంది అండగా ఉన్నారు. ఇన్నాళ్లూ అధికారులెవరూ దాడులు చేసిన దాఖలాలు లేవు. రోజూ వందల సంఖ్యలో వెళ్తున్న లారీలను వదిలి అప్పుడప్పుడు ఒకటో రెండో ట్రాక్టర్లను పట్టుకొని జరిమానాలు విధించి డాబుగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవారు. ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్ల్లో నీరు చేరడంతో అందరూ ఈ ప్రాంతంపై పడ్డారు. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత అన్నట్లుగా అడ్డగోలుగా ఇసుకను తవ్వేశారు. పోలీసుస్టేషన్కు, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఠంచన్గా మామూళ్లు ముట్టాయి. ఇవి కాక లారీలు వెళ్లే సమయంలో ఆపిన పోలీస్ సిబ్బందికి, ఇతర అధికారులకు దారి పొడవునా మామూళ్లు ముట్టచెప్పి లారీలు బయల్దేరేవి. ఈ వ్యవహారం కొన్నేళ్ల పాటు జరిగిపోయింది. పత్రికలు కోడై కూశాయి. ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. దొంగలు పడిన ఆరు నెలలకు.. అన్న చందంగా భారీ ఎత్తున తర్వాత ఏమైందో ఏమో కానీ మేము నిద్ర లేచింది ఇప్పుడే అన్నట్లుగా వేటపాలెం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇసుక తవ్వకాలపై దాడులు జరిపారు. జిల్లా అధికారుల అదేశాల మేరకు మండల పరిధిలోని పందిళ్లపల్లి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న పది లారీలు, మూడు ట్రాక్టర్లను అధికారులు శనివారం పట్టుకున్నారు. పట్టుకున్న వాహనాలను పోలీసుస్టేషన్కు తరలించారు. లారీలకు, ట్రాక్టర్లకు జరిమానా విధించాల్సిందిగా మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఆర్ఐ రాజేశ్, వీఆర్వోలు సత్యనారాయణ, ఎస్సై అంకబాబు పాల్గొన్నారు. -
పోస్టు ద్వారా పాస్బుక్
విశాఖ రూరల్, న్యూస్లైన్ : పట్టాదారు పాస్పుస్తకాల జారీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. రెవెన్యూ సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట పడనుంది. వ్యవసాయ భూముల కొనుగోలు సమయంలో రూ.100 చలానా కడితే 45 రోజుల్లో పోస్టు ద్వారా పట్టాదారుపాస్ పుస్తకం ఇంటి అడ్రసుకు బట్వాడా కానుంది. ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో పాస్పుస్తకాల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. డిమాండ్ బట్టి పాస్ పుస్తకానికి రూ.10 వేల నుంచి రూ.50 వేలు వరకు రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అడిగినంత ముట్టజెప్పినా అనేక మందికి ఏళ్ల తరబడి పాసుపుస్తకాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో వాటి జారీని సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లు, విస్తీర్ణం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడినట్టయింది. కొత్త విధానం ప్రకారం తాజాగా భూముల కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునే సందర్భంలో పట్టాదారు పాసుపుస్తకాల కోసం అదనంగా రూ.100 చలానా తీయాల్సి ఉంటుంది. పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే భూముల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆ శాఖ అధికారులు ఆన్లైన్లో రెవెన్యూ శాఖకు సమాచారాన్ని చేరవేస్తారు. దీని ఆధారంగా రెవెన్యూ సిబ్బంది ఆయా భూములకు సంబంధించి తమ కంప్యూటర్లలో యజమాని పేరు, కొనుగోలు చేసిన విస్తీర్ణం మార్పు చేసి ఆన్లైన్లో వెంటనే సమాచారాన్ని హైదరాబాద్కు పంపుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. పాస్పుస్తకాల జారీ కోసం ఒక ప్రైవేటు ఏజెన్సీని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రెవెన్యూ కార్యాలయాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులు కొత్త పట్టాదారు పాస్పుస్తకం ముద్రించి నేరుగా భూముల యజమానులకు పోస్ట్లో పంపుతారు. అది పూర్తికాగానే ట్యాంపర్ ప్రూఫ్తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు(కార్డులు) జారీ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తవుతుంది. గ తంలో భూముల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొనుగోలుదారు పేరు, వయసు, ఊరు వివరాలు మాత్రమే రాయించే వారు. ఇక నుంచి ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, చిరునామా రాయిస్తేనే కొనుగోలుదారు పేరు మీద ముద్రించే పట్టాదారు పాస్పుస్తకం నేరుగా పోస్టులో ఇంటికే వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం పోస్టులో వచ్చే పాస్పుస్తకం లామినేషన్కార్డు రూపంలో ఉంటుందని, ప్రస్తుతం ఉన్నట్టు పుస్తక రూపంలో ఉండదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ప్రస్తుతానికి ఈ విధానం అమలులో ఉంటుంది. దశల వారీగా పాత వారికి కూడా ఈ పద్ధతిని అమలుకు అవకాశముంది.