writers
-
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
జీవితపు తాళంచెవి
‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకంలో ‘స్ఫింక్స్’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. చివరకు రాజు ఈడిపస్ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్ (ఇప్పటి ఇరాక్ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా! ‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది. సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా! -
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్గా మారింది. సాక్షి మాలిక్ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు..
వారిది ఓ మధ్యతరగతి కుటుంబం.. ఇద్దరూ అక్కా, తమ్ముళ్లు.. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు.. వారి ముందుతరాల్లో ఎవరికీ పుస్తకాలు రాయడమనే మాటే తెలియదు.. అసలు వాటిని చదవడమే గగనమైన కుటుంబం నుంచి వచ్చారు.. అనూహ్యంగా ఇద్దరికీ తెలుగుపై మమకారం పెరిగింది. సాధారణంగా బీటెక్ చదువుకున్న వారిలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ వీరిద్దరూ అందుకు భిన్నం. అక్క ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకోగా.. తమ్ముడేమో విశాఖలోని గీతమ్ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. కానీ వీరిద్దరూ భాషలో పట్టు సాధించి పుస్తకాలు రాస్తూ తమకు తోచినంతలో తెలుగుకు సేవ చేస్తున్నారు. అక్కా, తమ్ముళ్లు ప్రవళిక, ప్రవర్ష్ జర్నీ ఒక్కసారి చూద్దాం.. – సాక్షి, సిటీబ్యూరోతెలుగులో రాయాలనే ఆకాంక్ష అయితే ఉంది.. కాకపోతే పుస్తకాలు రాయడం ఇంట్లో ఎవరికీ అలవాటు లేదు. దీంతో వినూత్నమైన ఆలోచన వారి మదిలో మెదిలింది. 2017లో ‘కరపత్ర’ పేరుతో అవసరం ఉన్న వారికి లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విషయంలో మహేశ్పోలోజు అనే మరోరచయిత వీరిద్దరికీ తోడయ్యాడు. వీరు ముగ్గురూ కలసి దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాలు రాసిచ్చారు. లేఖలు అందుకున్న వారు అభినందనలతో ముంచెత్తడంతో రచయిత కావాలనే తృష్ణ వారిలో మరింత పెరిగింది.ఛాయాదేవి చెత్త కథలు..ప్రవళిక తొలిసారిగా 2017 సమయంలోనే ‘ఛాయాదేవి చెత్త కథలు’ పేరుతో తన తొలి పుస్తకాన్ని తీసుకొచి్చంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ప్రవర్ష కూడా తన తొలి పుస్తకాన్ని ‘కథనై.. కవితనై’ పేరుతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రవళిక మరో పుస్తకాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, ప్రవర్ష్ ‘అభినిర్యాణం’ పేరుతో రెండో పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.అసిస్టెంట్ డైరెక్టర్గా..ప్రవర్ష్ మూడేళ్లు ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ తనకు అస్సలు సంతృప్తినివ్వలేదు. ఇక తనకు ఇష్టమైన రంగంలో రాణించాలని నిర్ణయించుకుని ఆ జాబ్ మానేసి పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. పుస్తక రచయిత మాత్రమే కాదు.. అటు సినిమాలకు పాటలు రాయడం హాబీగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. -
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు. -
నెహ్రూ జాకెట్ సాహిత్యం
నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం. పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం. ‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు. ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్టాక్సు కమిషనర్తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్బుక్లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు. జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు. ‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం. జూమ్లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి. సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి. వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు. అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి! -
సంజీవని కావాలి!
మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం. మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి. మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వే జెస్’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! -
అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య
రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు. వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు.. అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు. ‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా. ‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు. నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు. ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు. ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు. సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట. అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు. ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు. వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు. ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు. వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు. ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్ లెటర్స్ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు. ‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట. ‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు. చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా. ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు. జై శ్రీరామ్... (జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన. - డా. పురాణపండ వైజయంతి) -
రెండో గొంతు
మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు. 1978లో బేస్బాల్ గేమ్ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్రైటర్ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్ టేబుల్ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్ ద విండ్ సింగ్’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది. కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలడీస్’ నవలకు ‘పులిట్జర్’ గెలుచుకుంది. ‘నేమ్సేక్’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్లో కొన్ని ఇటాలియన్ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’. తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్ బెకెట్ పుట్టుకతో ఐరిష్వాడు అయినప్పటికీ ఫ్రెంచ్ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్’ రచయిత కాగలిగాడు. వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది. -
ఎక్సలెంట్ రైటర్స్ ! అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు!
అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు ఉన్నారు తెలుసా? వాళ్లు ఆ సాహసం చేయడం వల్లే ఈ రోజు మనం వాళ్ల గురించి మాట్లాడుకోగలుతున్నాం. ఇక్కడ చెప్పుకోబోయే పిడుగులు పిన్న వయసులోనే చేయి తిరిగిన రచయితలకు మల్లే అద్భుతమైన పుస్తకాలను అవలీలగా రాసేశారు. పుస్తక ప్రియుల చేత ‘ఎక్సలెంట్’ అనిపించుకున్నారు. వాళ్లెవరంటే.. డోరతీ స్ట్రెయిట్ అమెరికన్ రచయిత్రి. 1958లో జన్మించిన డోరతీ.. నాలుగేళ్ల వయసులోనే ‘హౌ ద వరల్డ్ బిగాన్ ’ అనే పుస్తకం రాసి తన అమ్మమ్మకు బహుమతిగా ఇచ్చింది. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? అని తల్లి వేసిన ప్రశ్నే ఆమెలోని రచన సృజనను వెలికి తీసిందట. ప్రస్తుతం ఆమెకు 65 ఏళ్లు. క్రిస్టఫర్ పాయోలీనీ పదిహేనేళ్ల వయసులోనే హైస్కూల్ పూర్తి చేసిన క్రిస్టఫర్ తన మొదటి నవల ‘ఎరగాన్’ రాయడం ప్రారంభించాడు. తన పద్దెనిమిదో ఏట ఆ పుస్తకాన్ని ప్రచురించాడు. అది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో చేరింది. ఆ సిరీస్లో మరో మూడు పుస్తకాలు రాశాడు క్రిస్టఫర్. ఆ సిరీస్ ప్రేరణతో 2006లో పలు సినిమాలూ వెలువడ్డాయి. ఏన్ ఫ్రాంక్ ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’.. ప్రపంచంలో అత్యధికులు చదివిన పుస్తకాల్లో ఒకటి. రెండవ ప్రపంచయుద్ధకాలంలో.. జర్మనీకి చెందిన ఏన్ ఫ్రాంక్ అనే అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని నాజీలు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు ఏన్కు 15 ఏళ్లు. బందీగా ఉన్న సమయంలో.. తమ నరకయాతనను ఎప్పటికప్పుడు డైరీలో రాసింది. అదే ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పుస్తకంగా ప్రచురితమైంది. ఇది హిట్లర్ దాష్టీకాలకు.. నాటి యూదుల ఆవేదనకు సాక్ష్యంగా నిలిచింది. ఏన్.. తను తలదాచుకున్న బంకర్లోనే ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిన రెండేళ్లకు ఈ పుస్తకం ప్రపంచం ముందుకు వచ్చింది. సుమారు 60కి పైగా భాషల్లో అనువాదమైంది. మాటీ స్టెపనేక్ అమెరికన్ సుప్రసిద్ధ కవులు, వక్తల పేర్లలో మాటీ స్టెపనేక్ పేరు కూడా వినిపిస్తుంది. ఆ అబ్బాయి రాసిన జర్నీ త్రూ హార్ట్సాంగ్స్ అనే పుస్తకం బాగా పాపులర్ అయ్యింది. మస్క్యులర్ డిస్ట్రోఫియా బాధితుడైన మాటీ .. చిన్న వయసులోనే అనేక పాటలు, పద్యాలు, కవితలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పీస్ అడ్వకేట్గానూ వ్యవహరించాడు. అనారోగ్య సమస్యలతో 2004లో.. తన 13వ ఏట తనువుచాలించాడు. (చదవండి: హైటెక్ డాన్స్మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!) -
అంతటి హాలీవుడ్ కు సమ్మె ఎఫెక్ట్, నష్టం ఎంతంటే.?
అవును... హాలీవుడ్ సంక్షోభంలో చిక్కుకుంది. ఆరు దశాబ్దాల పైచిలుకు తర్వాత రచయితలు, నటీ నటులు మళ్ళీ ఏకకాలంలో సెట్స్కు దూరం జరిగారు. సినిమాలు, టీవీ షోల నిర్మాణం ఒక్కసారిగా ఆగింది. జీతభత్యాల పెంపు సహా పలు అంశాలపై నిర్మాతల కూటమి (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో చర్చలు విఫలమై మే 2 నుంచి రచయితలు సమ్మె బాట పట్టారు. రెండు నెలల తర్వాత తాజాగా ఈ జూలై 13 నుంచి వేలాది నటులూ జత కలిశారు. సరైన జీతం, మెరుగైన పని పరిస్థితుల డిమాండ్లు తీరకపోవడంతో నటులూ పిడికిలి పైకెత్తారు. ఇక, రచన, నటనలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని నటీనటుల సంఘం (ఎస్ఏజీ), రచయితల సంఘం (డబ్ల్యూజీఏ)... రెండూ వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు అదీ ఒక ప్రధాన కారణమే. జంట సమ్మెల ప్రభావం చిత్రనిర్మాణంలోని ఇతర విభాగాల్లో, అనుబంధ పరిశ్రమల్లోని వేలమందిపైనా పడింది. కార్మికులంతా వీధిన పడ్డారు. అందుకే, ఇది వట్టి వినోదానికి మించిన విషయం. సీఈఓలకు లక్షల డాలర్లిస్తూ, రచయితలు, నటుల దగ్గరకొచ్చేసరికి నష్టాలొస్తున్నాయంటూ బీద అరుపులు అరవడం హాలీవుడ్లోనూ ఉన్నదే. 2000లో అన్నీ కలిపి హాలీవుడ్ వినోద పరిశ్రమకు 500 కోట్ల డాలర్ల లాభాలొస్తే, నెట్ఫ్లిక్స్ చేరికతో 2019కి అది 3 వేల డాలర్లకు దూసుకుపోయింది. రచయితల సంపాదన మాత్రం తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో రచయిత కమ్ నిర్మాత హోదా లోని వారి సగటు జీతం 4 శాతం మేర తగ్గింది. ద్రవ్యోల్బణంతో చూసుకుంటే, ఏకంగా 23 శాతం క్షీణించింది. తాజా స్ట్రీమింగ్ శకం ప్రకంపనలు రచనావృత్తిని తాకాయి. 2000లో టీవీ సీజన్ రైటర్లకు ఏటా 42 వారాల పని దొరికేది. స్ట్రీమింగ్తో సీజన్లు తగ్గి, 20 వారాలకు పడిపోయింది. 11,500 మంది సభ్యులున్న రచయితల సంఘంతో మూడేళ్ళకోసారి నిర్మాతల కూటమి కొత్త జీతభత్యాల ఒప్పందం కుదుర్చుకుంటుంది. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ లాంటి భారీ స్టూడియోలు, నెట్ఫ్లిక్స్, పీకాక్ లాంటి పలు స్ట్రీమింగ్ వేదికలు ఆ నిర్మాతల్లో భాగమే. ఈసారి మే1తో కొత్త ఒప్పందం రావాలి. ఆరు వారాలు చర్చించినా ఫలితం లేకపోయింది. జీతం, పింఛన్, స్ట్రీమింగ్లో పదే పదే ప్రసారంతో రచయితలకు అదనంగా చేయాల్సిన అవశేష చెల్లింపులు (రాయల్టీలు) వగైరా ఎటూ తెగకపోవడంతో కలం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. స్థూలంగా నటీనటులకూ ఇలాంటి సమస్యలే. చర్చలు ఫలించక నటీనటుల సంఘం సైతం తాజాగా షూటింగ్లకు దూరం జరిగింది. గత నవంబర్లో రంగప్రవేశం చేసిన ఛాట్జీపీటీ సైతం సృజనాత్మక రంగాలను కుదిపేస్తోంది. సమీప భవిష్యత్తులో ఏఐతో తమ పొట్ట కొట్టకుండా రక్షణ ఉండాలని రచయితల, నటుల డిమాండ్. ప్రస్తుతం స్ట్రీమింగ్ వేదికలు పెరిగాయి. కంటెంట్ దాహం తీరట్లేదు. దీన్ని అదనుగా చేసుకొని ఏఐ లాంటి వాటి శిక్షణకు తమ స్క్రిప్టులను వినియోగించరాదనీ, తమ రచనల నుంచి కొత్తవి సృష్టించడానికి ఏఐని వాడరాదనీ సృజనకారుల డిమాండ్. నటులు సైతం అనుమతి లేకుండా, పరిహారమి వ్వకుండా ఏఐతో తమ రూపాలనూ, స్వరాలనూ సృష్టించి నటింపజేయరాదంటున్నారు. అది సమంజసమే. నిర్మాతలు మాత్రం నేపథ్యంలోని నటీనటుల స్కాన్లను తీసుకొనే హక్కు తమకు ఉండాలంటున్నారు. తద్వారా వారి రూపాలను ఏఐతో సృష్టించి శాశ్వతంగా వాడుకోనివ్వాలని కోరుతున్నారు. అప్పుడిక పారితోషికమివ్వకుండానే పని జరిగిపోతుందనేది నిర్మాతల ఎత్తు. దీని పైనే తీవ్ర అభ్యంతరం. వెరసి, యావత్ సినీ చరిత్రలోనే రెండో పర్యాయం హాలీవుడ్ స్తంభించింది. 2007లో వంద రోజుల పాటు రచయితల సమ్మెతో ఒక్క క్యాలిఫోర్నియాకే 210 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పుడీ జంట సమ్మెలెంత నష్టం తెస్తాయో? రీషూట్లు, ప్రచారాలు, ప్రీమి యర్లకు నటులు దూరమయ్యేసరికి పూర్తయిన సినిమాలకూ ఇబ్బందే. టీవీ షోల కథ సరేసరి. ఎమ్మీ అవార్డుల ప్రదానం లాంటివీ వెనక్కిపోతాయి. వాటి కన్నా ముఖ్యం సాధారణ కార్మికుల పరిస్థితి. 1960లో నటులు, రచయితలు ఒకేసారి సమ్మె చేసినప్పుడు నటీనటుల సంఘానికి సారథి నటుడు, తర్వాత అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్. అయితే ఈసారి సమ్మె ప్రత్యేకమైనది. సాంకేతికతదే పైచేయి అయి, పని స్వభావం, సుస్థిరతపై ప్రభావం పడేవేళ యాజమాన్యానికీ, శ్రామికులకూ మధ్య బం«ధాల పునర్వ్యవస్థీకరణ అవసరమని గుర్తు చేస్తున్న సమ్మె ఇది. ఛాట్ జీపీటీతో పని చౌక గనక రచయితలు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్ల లాంటి వైట్కాలర్ ఉద్యోగాలు పోతాయని భయం. అలాగని అంతర్జాల యుగంలో నియంత్రణలతో టెక్నాలజీని అడ్డగలమా అంటే అనుమానమే. ఎవరికీ దెబ్బ తగలకుండా మధ్యేమార్గంలో పోవడం విజ్ఞత. దర్శక దిగ్గజం క్రిస్టఫర్ నోలన్ అన్నట్టు తారల సంగతెలా ఉన్నా, ఏఐతో రచయితల, చిన్న నటీనటుల పొట్టకొట్టడం భావ్యం కాదు. నిజానికి, రచన, నటన లాంటి సృజనాత్మక కృషికి మేధ కన్నా మానసిక స్పందన ముఖ్యం. మనిషైతేనేం, మెషినైతేనేం అంతా ఒకటేనని కొందరు అనుకోవచ్చు. అననూవచ్చు. భవిష్యత్తులో అలాంటి ఏఐ ఆధారిత సినిమాలు రావచ్చు. కొత్త ఒక వింతగా ఆకట్టుకోనూవచ్చు. కానీ, ఏ సృజన ఎందుకు గొప్పదవుతుందో, ఎలా జనాదరణ పొందుతుందో యంత్రాలు, డేటాలు చెప్పగలవా? నకిలీ నటులు, కంప్యూటర్ రచయితలతో తయారైన ఏఐ చిత్రాలు నిజమైన సినిమాల అనుభూతిని అందించగలవా? కొద్దికాలానికి ఈ కృత్రిమ మేధాసృష్టి విసుగెత్తవచ్చు. అయితే, అప్పటికే అంతా ఆలస్యమైపోతుంది. హాలీవుడ్లో సమ్మె చేస్తున్నవారి ఆవేదన అదే! -
అవార్డులూ.. బహుమతులూను
‘అవార్డులు రావు. కష్టపడి సంపాదించుకోవాలి’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు ఒకసారి అన్నారు. సాహిత్యం, ఆ మాటకొస్తే ఏ కళైనా ప్రచారం కోరుకుంటుంది. ప్రచారం దేనికి? కీర్తి కోసం అనుకునేవారు కొందరు. కళ నిర్వర్తించాల్సిన పరమార్థం కోసం అనుకునేవారు కొందరు. ఉత్కృష్టమైన కళ మబ్బుల చాటు సూరీడు వలే ఎల్లకాలం దాగి ఉండదు. జనులకు తెలిసే తీరుతుంది. ఆదరణ పొందుతుంది. కాని బంగారు చేటకు కూడా గోడచేర్పు అవసరం అన్నట్టు కొన్నిసార్లు కళ ప్రచారం కావడానికి, ఫలానా కళాకారుడి కృషి చూడండహో అని తెలుపడానికి అవార్డులూ, బహుమతులూ ఉపయోగపడతాయి. అయితే కాలక్రమంలో ఇడ్లీ కంటే చట్నీకి విలువెక్కువైనట్టు కళ కంటే ఈ అవార్డులకు విలువ ఎక్కువై అవార్డు వచ్చినవారు ‘గొప్పవారేమో’ అనే భావన జన సామాన్యులలో ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ఏదో పాత్ర చేత అనిపిస్తారు. చచ్చు పుచ్చు పుస్తకాలు ఎన్ని రాసినా ఒక సరైన అవార్డు కొడితే తల ఎగరేస్తూ తిరగొచ్చు కదా అనుకునే స్త్రీ పురుష సాహితీకారులు నేడు ఇరు రాష్ట్రాలలో తగు మోతాదులో మేట వేశారనే వాస్తవిక అపోహ ఉంది. జోకులు చలామణీలో ఉన్నాయి. ఒక ప్రఖ్యాత కవికి సరస్వతీదేవి ప్రత్యక్షమై ‘వత్సా! కవిత్వం కావలెనా? న్యూఢిల్లీ వారి ఫలానా సాహితీ అవార్డు కావలెనా?’ అని అడిగితే ఆ కవి సెకను తొట్రుపడకుండా ‘కవిత్వమే దయచేయి తల్లీ! అవార్డును ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను’ అన్నాట్ట! మనుషులంటూ ఉన్న ప్రతిచోటా తప్పులు, పొరపాట్లు ఉన్నట్టే అవార్డు అనే మాట ఉన్న చోటల్లా తప్పులూ, పొరపాట్లూ, రాజకీయాలూ, బానిసలకు వరాలూ ఉంటాయి. సాహిత్యంలో సర్వోన్నతమైనదిగా భావించే నోబెల్ పురస్కారం టాల్స్టాయ్కి రాలేదు. ఆయనకు కాకుండా ఆ తర్వాత దాదాపు 39 మంది నవలాకారులకు నోబెల్ ఇచ్చారు. వారంతా ‘మేము టాల్స్టాయ్కి వారసులం మొర్రోయ్’ అన్నారు. గాంధీకి నోబెల్ శాంతి ఇవ్వలేదుగాని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన మార్టిన్ లూథర్ కింగ్కు ఇచ్చారు. చైతన్య స్రవంతికి ఆద్యుడైన జేమ్స్ జాయిస్కి నోబెల్ రాలేదు. కథా చక్రవర్తయిన సోమర్సెట్ మామ్కు ఎందుకివ్వలేదయ్యా అనంటే ‘అతడు అక్కరకు మించిన ప్రచారం పొందాడు’ అని సాకు చెప్పారు. మన దగ్గర రవీంద్రనాథ్ టాగోర్కి సరే, ప్రేమ్చంద్, శరత్లు నోబెల్కు ఏం తక్కువ అని తూకం వేసి నిరూపిస్తే సదరు అవార్డు కమిటీ ఏం చెబుతుందో ఏమో! భారతదేశం వంటి దేశంలో రచయితలు, కవులు కేవలం తన రచనలతో బతికే పరిస్థితులు లేవు. ఎంతో గొప్ప అంకితభావం, ప్రతిభ, రచనాశక్తి, జనహిత అభిలాష కలిగిన రచయితలైనా బతుకు బాదరబందీలకు అవస్థలు పడుతూ కవిత్వమో, కథో రాయాలి. అప్పొసప్పో చేసి పుస్తకాలు వేసుకోవాలి. అవి అమ్ముడు పోకపోతే అటక మీద గుడ్డ కప్పి దాచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో వీరికి తృణమో పణమో ఇచ్చి అవార్డు చేతపెట్టి గౌరవించుకుందాం అనే సదుద్దేశ సాహితీ సంస్థలు అనేకమే వచ్చాయి. ఇవి తమ తమ అభిరుచి, అభిలాషల మేర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినా, వాటిలో ప్రతిష్ఠాత్మకస్థాయి కలిగినవి బహు స్వల్పం కావడంతో ప్రభుత్వపరంగా వచ్చే రాష్ట్ర అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రతిష్ఠాత్మకమై కూచున్నాయి. ‘షేక్స్పియర్కు ఏ అవార్డు వచ్చిందని నేటికీ చదువుతున్నారు’, ‘వేమనకు ఎవరు అవార్డిచ్చా రని ప్రతి నాలుక మీద పలుకుతున్నాడు’ అని ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా యోగ్యులైన సాహితీ కారులకు యోగ్యమైన అవార్డు వచ్చి తీరాలి. లేకుంటే అయోగ్యులు ఆ అవార్డులు పొందుతూ అవార్డుకు అయోగ్యతను తెచ్చి పెడతారు. అసలు సాహితీకారులు తమ వల్ల అవార్డుకు గౌరవం రావాలని కోరుకోవాలేగాని అవార్డు వల్ల తమకు గౌరవం రావాలనుకుంటున్నారంటేనే వీరెంత నిరుపేదలో అర్థం చేసుకోవచ్చు. ఇందుకై ఏళ్ల తరబడి పి.ఆర్ చేయుట, పెద్దలను మచ్చిక చేసుకొనుట, పథకాలు రచించుట, దొంగ పద్ధతిలో షార్ట్లిస్ట్లో చేరుట, కుల సమీకరణలు, ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇన్ని పతన సోపానాల మీద నడిచి అవార్డు తెచ్చుకుని అల్మారాలో పెట్టుకుని పొద్దున్నే అద్దంలో ముఖం ఎలా చూసుకుంటారో వీరు! నలుగురూ తిరిగే చోట తమ పుస్తకం పెట్టి, దాని మీద డబ్బు పెడితే ఆ డబ్బు కోసమైనా ఎవరూ పుస్తకాన్ని తీసుకెళ్లని నాసిరకం రచయితలు, కవులు కూడా ఫలానా అవార్డు కోసం పైరవీ చేసేవారే! వీరికి ఊ కొట్టే దిక్కుమాలిన జ్యూరీలు! ‘అవార్డు వస్తే ఏమవుతుంది’ అనంటే ‘నోరు మూతబడుతుంది’ అనేది ఒక జవాబు. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వపరమైన అవార్డులు తీసుకున్నాక ప్రభుత్వానికి ములాజా అవుతారు. ఈ కారణం చేత కూడా ప్రభుత్వాలు అవార్డులను సృష్టిస్తాయి, ఇచ్చి ప్రోత్సహిస్తాయి. తమిళ రచయిత జయమోహన్ తనకొచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఈ కారణం చేతనే తిరస్కరించాడు. అయితే సరైన రచయితలు తమకు అవార్డుల వల్ల వచ్చిన అదనపు గుర్తింపును జనం కోసం ఉపయోగించడం మంచి స్ట్రాటజీనే! ప్రస్తుతం తెలుగునాట అవార్డుల దుమారం రేగి ఉంది. అవార్డు ఇస్తాం అనంటే గౌరవప్రదమైన సాహితీకారులు పరిగెత్తి పోరిపోయే స్థితి ఉంది. నాణ్యమైన రచనల పట్ల తెలుగు పాఠకలోకం ఉదాసీనత మాని, వాటిని అక్కున జేర్చుకుంటూ, ఆ రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ వెళ్లడమే దీనికి విరుగుడు. పాఠకుడి అవార్డులు, బహుమతులే ఇప్పుడు తెలుగు సాహిత్యానికి శ్రీ సరస్వతీ రక్ష. -
ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!
అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు. ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం. ‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్ జావేద్. 2022లో ‘ద ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రై జ్’ను స్వీకరించారు. ‘నేమత్ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్ ఫారూఖీ ఇంగ్లిష్లోకి అనువదించారు. ఖాలిద్ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్ వ్యాపారవేత్త జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్సైట్లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్ వర్క్’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్లో లాంగ్ లిస్ట్ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్లో షార్ట్ లిస్ట్ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది. ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్ డేస్’ నవలకుగానూ బెన్యామిన్ 2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్ హబీబ్ ఆంగ్లంలోకి అనువదించారు. 2020 సంవత్సరానికి ‘ముస్టాష్’ నవలకుగానూ ప్రైజ్ గెలుచుకున్న ఎస్.హరీశ్ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్ పగల్ నేరత్తు మయక్కమ్’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాక్వీ’ని కూడా ఈ ప్రైజ్ వరించింది. రచయిత ఎం.ముకుందన్ . 2019లో ‘ద ఫార్ ఫీల్డ్’ నవలకుగానూ మాధురీ విజయ్ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు. పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్లిస్టు అటుండనీ, లాంగ్లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు. కానీ ఆ ‘గేమ్’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అయితే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు! -
ఆ రైటర్స్ లేకుండా హిట్టు కొట్టలేరా? సక్సెస్ ఫార్మాలా మిస్ అవుతుందా?
డైరెక్టర్స్ విజయం వెనుక వారి టాలెంట్ ఎంత వుంటుందో..అంతకు మించి రైటర్స్ సపోర్ట్ వుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్ తెలిసిన డైరెక్టర్స్ తక్కువ మంది ఉంటారు. అందుకే డైరెక్టర్స్ చాలా మంది.... స్టోరీతో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగల మంచి రైటర్స్ ను తమ టీమ్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటారు. రైటర్ ప్లస్ డైరెక్టర్ కాంబినేషన్ వర్కౌవుట్ అయితే హిట్ సినిమా గ్యారెంటీ. అలా సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ చాలా మంది వున్నారు. వీరిలో ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు కూడా ఉన్నాడు. అందుకే ఏ డైరెక్టర్ తనకి సెట్ అయిన రైటర్ను మిస్ చేసుకోవాలనుకోడు..రైటర్ మారితే ఆ డైరెక్టర్ తనని తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.సేమ్ స్టిట్యూవేషన్ లో వున్న డైరెక్టర్ నక్కిన త్రినాధ్ రావు ఇప్పుడు సోలోగా సినిమా చేయబోతూ ..తన అదృష్టాన్ని చెక్ చేసుకోబోతున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్తో పాటు సక్సెస్ కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో రైటర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు హీరోలందరూ కథల విషయంలో డైరెక్టర్స్ పై ఆధారపడే వారు. ఇప్పుడు హీరోలు రూట్ మార్చారు. రైటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్క్రిప్ట్, స్క్రిన్ ప్లే డిస్కషన్స్ లో హీరోల జోక్యం పెద్ద గా వుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హీరోలు స్టోరీ తో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై కూడా చాలా ఫోకస్ పెడుతున్నారు. అందుకే రైటర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. స్టోరీ ఫిక్స్ అయిన తర్వాతే హీరోలు డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన దర్శకులు ..ఇప్పుడు సరైన రైటర్స్ లేక ఫెయిల్ అవుతున్నారు. గతంలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ వెనుక త్రివిక్రమ్ రైటర్గా ఉండేవాడు. త్రివిక్రమ్ రైటర్ నుంచి డైరెక్టర్గా టర్న్ తీసుకున్న తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్టర్గా ఒక హిట్ కూడా అందించలేకపోయాడు. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల..రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ తో కలిసి ఉన్నంత కాలం హిట్ సినిమాలు తీశాడు. వారితో విడిపోయిన తర్వాత శ్రీనువైట్ల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. అలాగే దేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ టీమ్ లో సూజాత రంగరాజన్ అనే గొప్ప రైటర్ ఉండేవాడు. ఆయన రోబో సినిమా సమయంలో చనిపోయారు. ఆ తర్వాత శంకర్ సినిమా కథల్లో బలం తగ్గిపోయిందనే మాట వినిపిస్తుంది. అలాగే డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా లాంటి సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్ నుంచి డైరెక్టర్గా టర్న్ తీసుకున్నాడు. కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ కి డైరెక్టర్ గా తన మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో త్రినాధరావు నక్కిన ఇప్పుడు సోలోగా సినిమా చేయాల్సి వస్తోంది. ధమాకా హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్లో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. మరి ఇన్నాళ్లు కలిసి వర్క్ చేసిన రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ లేకుండా నక్కిన త్రినాధరావు ఈ సినిమా తో సక్సెస్ అందుకుంటాడో లేదా చూడాలి. -
అనగనగా ఓ కథ.. రాయలసీమ కథా కార్యశాల
రాయలసీమ కథా కార్యశాల.. అనగానే.. ఏంది కథ? అనుకున్నా.. ఏమిరా వీరశంకర్రెడ్డీ.. దీనివల్ల సమాజానికి లాభం? పొరపాటుగా అలవాటైన సినీ ‘సీమ’యాసలో నన్ను నేను ప్రశ్నించుకున్నా.. నిర్వాహకులకు మోయలేని భారమేమో.. మనుషులు రాకపోతే అవమానమేమో.. నమ్మకంతో కూడిన సందేహం వ్యక్తం చేసుకున్నా.. కడపలో కథా కార్యశాల ముగిసి రెండు వారాలవుతున్నా వదలని ఆ జ్ఞాపకాలు..అనుభూతులు.. అనుభవాలు పై సందేహాలను పటాపంచలు చేశాయి. చంచలమైన మనసుకు జవాబుదారీతనాన్ని నేర్పాయి. సమాజం నుంచే కథ పుడుతుందని.. కథ వల్ల సమాజం అర్థమవుతుందని.. ఇదే సమాజానికి ప్రయోజనకరమని అవగతమైంది. మంచి కథకు మనుషుల కరువేం లేదని.. వచ్చినోళ్లందరూ గొప్ప రచయితలుగా రూపొందకపోయినా సరికొత్త ‘మనుషులు’గా మారతారని .. మనసులను చూసే దృక్పథం ఒకటి అలవాటవుతుందని.. ‘మనో భార’మితి కనిపెట్టినంత సంతోషం వేసింది. హాజరు కోసం నేను గడిపింది కాసేపే అయినా.. కార్యశాల విజయగాథను వినిపించడానికి చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. కథ రాయడం ఓ కళ అని వర్ణించినా.. దానిని శాస్త్రీయంగా చెప్పి, ఇలా చెప్పడం పేద్ద కళ అని నేర్పకనే నేర్పించారు. రెండు రోజుల ప్రయాణంలో కొత్తదారిని కనుక్కునేలా చేశారు. – షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్ కడపలోని విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణం.. ఈ నెల 17, 18 తేదీల్లో రాయలసీమ కథాకార్యశాలకు విచ్చేసిన అతిరథ మహారచయితలు, భావి కథకులతో కళకళలాడింది. సీమకు చెందిన మూడు తరాల రచయితలతో పాటు కథారచనలో మెళకువలు నేర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది వర్తమాన కథకులకు వేదికైంది. లబ్దప్రతిష్టులు జీవితకథలు చెప్పేందుకు ఈ కార్యశాల పాఠశాలలా మారింది. ప్రసిద్ధ కథకులు డా.కేతు విశ్వనాథ్ రెడ్డి, షేక్ హుస్సేన్ సత్యాగ్ని, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణల చేతుల మీదుగా కార్యశాల ప్రారంభమైంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు.. శాంతి నారాయణ, దాదాహయాత్, డా.మేడిపల్లి రవికుమార్, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, జి.ఉమామహేశ్వర్, డా.వి.ఆర్.రాసాని, శ్రీనివాసమూర్తి, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.ఎన్.ఈశ్వర్ రెడ్డి, యువ పరిశోధకులు డా.తవ్వా వెంకటయ్య తదితరుల అనుభవాలకు సజీవశిల్పంలా నిలిచింది. చివర్లో ప్రసిద్ధ రచయిత డా.బండి నారాయణ స్వామితో కథారచన మెళకువలపై ముఖాముఖి నడిచింది. మొత్తానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి కథాకార్యశాల సాహితీలోకంలో సరికొత్త పరిమళాలు వెదజల్లింది. యువ కథకుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది. పేరుకు రాయలసీమ అని పెట్టినా.. గుంటూరు, ప్రకాశం, వైజాగ్, హైదారాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు హాజరు కావడం కార్యశాల ప్రాధాన్యత తెలిపింది. రాయలసీమ కథా కార్యశాలే కాదు.. ఇపుడు హైదరాబాద్ బుక్ఫెయిర్ కూడా విశేషంగా విజయవంతం కావడం.. తెలుగు సాహిత్యం ఎన్నటికీ సుసంపన్నమేనని స్పష్టతనిస్తోంది. 2022 వెళుతూ వెళుతూ సాహితీపంట పడించింది. 2023 తెలుగింట కథల పండుగ తెస్తుందని చెప్పింది. ఉపసంహారం ఇలాంటి కథా కార్యశాలలు మరిన్ని జరగాలి. ప్రతి చోటా నిర్వహించాలి. తద్వారా ప్రతి వ్యక్తి ఒక సంస్కారి కావాలి. ఇంటింటా సాహిత్యం విరబూయాలి. పుస్తక పఠనం మరింత పెరగాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రతి మనసు ఒక పుస్తకమై పరిమళించాలి. ఆపాదమస్తకం అనుభూతించాలి. కొత్తకథకు జీవితమవ్వాలి. కథకు(డికి) ఉండాల్సిన లక్షణాలు కథ జీవితం నుంచి, హృదయం నుంచి రావాలి. జీవితాంతం పాఠకుడి మనసులో నిలిచిపోవాలి. జీవితం పట్ల అవగాహన, విస్తృత పరిశీలన ఉండాలి. విమర్శనాత్మకంగా చూడాలి. కథ ఓ కళ. శ్రద్ధతో నిరంతరం సాహిత్య, జీవిత అధ్యయనం చేస్తే.. దానిని పదికాలాలు కళకళలాడేలా రాయవచ్చు. కథ ముందుగా మనసులో, మెదడులో, హృదయంలో, ఆలోచనల్లో నలగాలి. సమాజమే కథా కార్యశాల. సమాజంలోని చలనాలను, మార్పుని చూడగలగాలి. కథలకు సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రశ్నతోనే జీవితం బాగుపడుతుంది. ప్రశ్నలు వేయండి. వేసుకోండి. ఎంత ఎక్కువ చదివితే అంత చక్కగా రాయగలరు. అన్నీ మన జీవితకాలంలో అనుభవించలేం, చూడలేం.. కాబట్టి చదవాలి. చదవడం ద్వారా జీవితం, అనుభవాలు అక్షరీకరించగలగాలి. కథ ఉద్దేశ్యం వ్యక్తి సంస్కరణ. తద్వారా సమాజ సంస్కరణ. కథ సమస్య నుంచి సంస్కరణ దిశగా ఉండాలి. అయితే సందేశాలు ఇవ్వకూడదు, ఉండకూడదు. మార్పు వస్తుంది. నిదానం కావచ్చు. కానీ తప్పకుండా వస్తుంది. వ్యక్తులు మారితే కానీ సమాజం మారదు. బాహ్య పరిస్థితులు మనిషిని ప్రభావితం చేస్తాయి. పాత కథే అయినా కథాంశం కొత్తగా ఉండాలి. దానిని ఎలా చెప్పాలనే విషయంలో మనదైన దృష్టికోణం కనిపించాలి. కథాంశం దగ్గరే కథ సగం విజయం సాధిస్తుంది. కథకు ఆది..మధ్య..తుది ఉండాలి. ప్రారంభం ఆసక్తిగా.. ముగింపు ఆలోచింపజేసేదిగా ఉండాలి. కథావస్తువుల ఎంపికలో పునరుక్తి లేకుండా చూసుకోవాలి. కథల్లో భాష సూటిగా, స్పష్టంగా, అత్యంత సహజంగా ఉండాలి. కథా శిల్పంలో సర్వం ఇమిడి ఉంటుంది.. శిల్పం వేరు భాష వేరు కాదు. కథ ఎలా చెప్పాలో, ఎవరి కోణంలో చెప్పాలో రచయిత సాధన చేయాలి కనిపించని వ్యవస్థ కూడా కథలో పాత్రేనని గుర్తుంచుకోవాలి. మనిషి మోసం... ప్రాంతానికి, సందర్భానికి అన్వయించుకుంటే ఆశ్చర్యపోయే అంశాలు కథలుగా మారతాయి. ప్రాంతీయత, మాండలికం పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేస్తాయి. పాత్రలు, జీవితం, సమాజం, ప్రకృతిలో సంఘర్షణ తప్పదు పాత్రలకు తమవైన నేపథ్యాలు, వైరుధ్యాలుంటాయి. ఉండాలి. సంఘర్షణ అనివార్యం. సంఘర్షణ ద్వారా పాత్రల మధ్య గొప్ప డ్రామా పుడుతుంది. కథల్లో పాత్రలు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వాస్తవికతకు దగ్గరగా ప్రవర్తించాలి. వర్తమానానికి పునాది చరిత్ర. కథ చీకటి నుంచి వెలుగు వైపు నడిపించాలి . సమాజం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండాలి. కవిలో భావావేశం అవసరం. రచయితలో అనవసరం. రచయితకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. వర్తమాన రచయితలు విమర్శను తట్టుకోవాలి. -
సింహళ తీరంలో నిఘానేత్రం
వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్తోట అంతర్జాతీయ నౌకాశ్రయంలో చైనా సైనిక గూఢచర్య నౌక ‘యువాన్ వాంగ్5’ లంగరేయడానికి శ్రీలంక ఇచ్చిన అనుమతి చర్చోపచర్చలకు దారితీస్తోంది. సదరు పోర్ట్పై పట్టు బిగించిన చైనా, వ్యతిరేకిస్తున్న భారత్ల మధ్య సర్దుబాటు చేసుకోలేక సిలోన్ సతమతమవుతోంది. ఉపగ్రహ, రాకెట్, ఖండాంతర గతిశీల క్షిపణుల ప్రయోగాల ఆచూకీ తెలుసు కొనేందుకు వాడే ఈ ‘యువాన్ వాంగ్’ శ్రేణి పరిశోధక, సర్వే నౌక మన దేశానికి అతి సమీపంలో వారం పాటు తిష్ఠ వేయడం ఆందోళనకరమే. గగనతలాన 750 కిలోమీటర్ల పైగా కన్నేయగల ఈ షిప్పుతో కేరళ, తమిళనాడు, ఏపీల్లోని అనేక పోర్ట్లు చైనా రాడార్లోకి వచ్చేస్తాయి. కల్పాక్కం, కూడంకుళం లాంటి అణుపరిశోధక కేంద్రాలు సహా దక్షిణాదిలోని కీలక ప్రాంతాలూ డ్రాగన్ గూఢ చర్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వార్తలే ఇప్పుడు మన దేశాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. ఆగస్టు 11 నుంచి 17 దాకా సింహళ తీరంలో ఉండే సదరు నిఘానౌక రాక పట్ల శ్రీలంక దేశాధ్యక్షుడితోనే భారత్ తన అభ్యంతరం తెలిపింది. ఆ నౌక తమ దగ్గరకు వస్తున్నది ఇంధనం, అవసరమైన సరుకులు నింపుకోవడానికే అని సిలోన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంకేయులకు భారత్ అందిస్తూ వస్తున్న సాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రశంసాగీతం అందుకొని, అధ్యక్షుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆర్థికకష్టాల్లోనే∙కాదు... అంతకు ముందూ ‘సువసరియా’ అంబులెన్స్ సర్వీసుకు భారత్ సాయమే వేలాది ప్రాణాలు కాపాడిందని గుర్తుచేసుకున్నారు. కానీ మాటల్లోని మెచ్చుకోలుకు భిన్నమైన శ్రీలంక చేతలే సమస్య. ఆసియా, ఐరోపాలను కలిపే సూయజ్ కాలువకూ, మలక్కా జలసంధికీ మధ్య అతి ముఖ్యమైన నౌకాయాన మార్గంలో సింహళం ఉంది. 4500 చమురు ట్యాంకర్లతో సహా దాదాపు 36 వేల నౌకలు ఆ మార్గంలో ఏటా పయనిస్తాయని లెక్క. కొలంబో నౌకాశ్రయం తర్వాత శ్రీలంకలో రెండో అతి పెద్దదైన హంబన్తోట ఆ కీలకమార్గంలోదే! ఆ పోర్ట్ నిర్మాణం ఆలోచన మూడు దశాబ్దాల పైగా ఉన్నా, అనేక తర్జనభర్జనలు, నివేదికల బుట్టదాఖలు తర్వాత 2005లో హంబన్తోట వాసి మహిందా రాజపక్స అధ్యక్షుడయ్యాక మళ్ళీ ఊపిరి పోసుకుంది. చైనా ఆర్థిక సాయంతో పన్నెండేళ్ళ క్రితం 2010లో ఈ అంతర్జాతీయ పోర్ట్ తొలిదశ పూర్తయింది. ఆర్థికంగా ఆట్టే గిట్టుబాటు కాని ఆ నౌకాశ్రయ నిర్మాణం కోసం 15 ఏళ్ళ కాలానికి చైనా ఇచ్చిన అప్పు వడ్డీలపై వడ్డీలతో ఇప్పుడు శ్రీలంక తలపై భారమై కూర్చుంది. చైనా, శ్రీలంక నౌకాసంస్థల సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ పోర్ట్ను స్వల్పకాలిక ప్రయోజనాల నిమిత్తం 99 ఏళ్ళ లీజుకిచ్చి, ద్వీపదేశం తిప్పుకోలేని తప్పు చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే శ్రీలంక క్రమం తప్పకుండా ఆ అప్పుల వాయిదాలు తీర్చాల్సిందేనని చైనా కొండెక్కి కూర్చుంది. డ్రాగన్ విసిరిన ఈ ఋణదౌత్యం వలలో చిక్కుకొని, బయటపడలేక సింహళం సతమతమవుతోంది. హంబన్తోట పోర్ట్పై చైనా నియంత్రణతో హిందూ మహాసముద్ర జలాల్లో తమ ప్రయోజనాలకు భంగమని భారత్, అమెరికాలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా చైనా నిఘానౌక వ్యవహారం ఆ అనుమానాలకూ, ఆందోళనకూ తగ్గట్టే ఉంది. శ్రీలంక ఇటు భారత్, అటు చైనాతో దోస్తీ చేస్తూ, ఇరువైపుల నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. భౌగోళికంగా తనకున్న సానుకూలతను ద్వీపదేశం వాడుకోవాలని అనుకోవడం అర్థం చేసుకోదగినదే. కానీ, ఏకకాలంలో ఇరుపక్షాలకూ కన్నుగీటడమే సమస్య. సింహళం మాత్రం వర్తమాన ఆర్థిక సంక్షోభంలో భారత, చైనాలు రెండూ అండగా నిలిచాయనీ, ఇరుదేశాలూ తమకు కీలక మిత్రులనీ తన వైఖరిని సమర్థించుకుంటోంది. దాని పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపంగా తయారైంది. ఏకకాలంలో ఇద్దరికి కన్నుగీటడం సులభమూ కాదు. సమస్యా రహితమూ కాబోదని ద్వీపదేశానికి మరోసారి తెలిసొస్తోంది. చైనానేమో చట్టబద్ధమైన తన సముద్రజల శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాల్లో ‘సంబంధిత పార్టీలు’ చొరబడడం మానుకోవాలని శ్రీరంగనీతులు చెబుతోంది. నిజానికి, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో చర్యలు చేపట్టేలా చైనా వద్ద ఏకంగా ఇలాంటి ఏడు నౌకలున్నాయి. ఇప్పటికే భూతలంపై బీజింగ్కు ఉన్న ట్రాకింగ్ కేంద్రాలకు ఈ నౌకలు అదనం. అందులోనూ అత్యాధునిక ట్రాకింగ్ సాంకేతికత శ్రీలంకలో లంగరేస్తున్న తాజా నౌక సొంతం. ఈ రెండు నెలలూ హిందూ మహాసముద్ర వాయవ్య ప్రాంతంలో చైనా ఉపగ్రహాల నియంత్రణ, రిసెర్చ్ ట్రాకింగ్ను తమ నౌక చేస్తుందని చైనా అధికారిక ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ శ్రీలంక’ (బ్రిస్ల్) మాట. కానీ, డ్రాగన్ నక్కజిత్తులు తెలిసినవారెవరైనా ఆ మాటల్ని యథాతథంగా విశ్వసించడం కష్టమే. పైగా, 2014లో కొలంబో పోర్ట్లో లంగరేసిన చైనా జలాంతర్గాములతో పోలిస్తే తాజా నిఘానౌక శక్తిసామర్థ్యాలు మరింత ప్రమాదకరం. మీదకొస్తున్న ఈ ముప్పు రీత్యా మనం కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టక తప్పదు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు అది అత్యవసరం. హంబన్తోట నౌకాశ్రయం గనక రేపు చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ (పీఎల్ఏ) నౌకాదళానికి కేంద్రంగా మారితే, భారత్కు ఉత్తరాన, దక్షిణాన డ్రాగన్ ఆధిపత్యంతో మన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. తస్మాత్ జాగ్రత్త! -
అంతం కాదిది ఆరంభం
కొన్నేళ్ళుగా ప్రపంచానికి కంటిలో నలుసుగా మారి, అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిస్ట్ ఉగ్రమూక అల్ఖైదాకు ఇది ఊహించని దెబ్బ. అఫ్ఘానిస్థాన్లోని కాబూల్లో ప్రపంచం కంటపడకుండా నివసిస్తున్న అల్ఖైదా అధినేత అయ్మాన్ అల్–జవాహిరీని అమెరికా మాటు వేసి, జూలై 31 ఉదయం చాటుగా మట్టుబెట్టడంతో ఒక అధ్యాయం ముగిసింది. ‘9/11’ దాడులకు తెగబడిన ముష్కరమూకను నలిపి, నాశనం చేయాలని ప్రపంచపు పెద్దన్న ఇరవై ఒక్క ఏళ్ళుగా పగతో రగిలిపోతోంది. 2011లో ఒసామా బిన్ లాడెన్నూ, ఇప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన జవాహిరీని హతమార్చడం అమెరికా నిఘా వ్యవస్థ ఎంత బలమైనదో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్ను ఉగ్రమూకలకు స్థావరంగా మార్చబోమంటూ తాలిబన్లు చేసుకున్న ‘దోహా ఒప్పందం’లోని డొల్లతనం బయట పడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లాంటివి ఇప్పటికీ ఉగ్రమూకలకు స్వర్గధామాలే అన్న కఠిన వాస్తవం పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచమంతటినీ మరోసారి అప్రమత్తం చేస్తోంది. 1998 ఆగస్టులో తూర్పు ఆఫ్రికాలో అమెరికా ఎంబసీపై బాంబుదాడి నుంచి ‘9/11’గా పాపు లరైన 2001 సెప్టెంబర్ 11 నాటి న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై వైమానిక దాడి వరకు... అగ్రరాజ్యంపై అల్ఖైదా తెగబడిన అనేక సందర్భాల్లో తెర వెనుక సూత్రధారి జవాహిరియే. నేత్రవైద్యుడి నుంచి తీవ్రవాదిగా మారిన 71 ఏళ్ళ జవాహిరి అప్పట్లో అల్ఖైదాలో నంబర్ టూ. 2011లో పాకిస్థాన్లోని అబోటాబాద్లో అమెరికన్ కమెండోలు లాడెన్ను గుట్టుగా మట్టుపెట్టినప్పటి నుంచి ఆ సంస్థకు ఆయనే నంబర్ వన్. అల్ఖైదా కొంత తెర వెనక్కి వెళ్ళాక, ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐసిస్) లాంటి హింసాత్మక జిహాదిస్టు పిల్లమొలకలు మొలిచి, ఐరోపాలో తెగబడడం చూస్తున్నాం. కొంత బలహీనపడ్డా, కార్యకర్తల సమీకరణ సత్తా ఉన్న సైద్ధాంతికుడిగా జవాహిరి అమెరికా మొదలు ఇండొనేసియా దాకా అనేక దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే వచ్చారు. అమెరికా ఎప్పుడో ఆయన తలకు 2.5 కోట్ల డాలర్ల భారీ వెల కట్టింది. భారత్కూ ముప్పు తేవాలని జవాహిరి ఆరాటపడ్డారు. ‘భారత ఉపఖండ అల్ఖైదా’ (ఏక్యూ ఐఎస్)ను ఆరంభిస్తున్నట్టు 2014లోనే ఒక వీడియోలో ప్రకటించిన ఆయన నిరుడు హురియత్ నేత గీలానీ చనిపోయినప్పుడు సంతాపం ప్రకటిస్తూ, కశ్మీర్ అంశాన్ని భుజానికెత్తుకొనే యత్నం చేశారు. ఈ ఏడాది కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తినప్పుడూ సాయుధపోరు చేయాలంటూ ముస్లిమ్ లను రెచ్చగొట్టేందు ప్రయత్నించారు. కానీ, సహనశీల భారతావనిలో ఆ పప్పులుడకలేదు. నిన్నటి దాకా గుర్తు తెలియనిచోట గడుపుతున్నాడనుకుంటున్న ఈ ఉగ్రనేత సాక్షాత్తూ కాబూల్ నడిబొడ్డున, అఫ్ఘాన్ ప్రభుత్వ పెద్దలెందరో నివసిస్తున్న భవనంలో సకుటుంబంగా కాపురమున్న వైనం దిగ్భ్రాంతికరం. నెలల క్రితమే ఆయన ఆచూకీ కనిపెట్టిన అమెరికా గూఢచారులు ఆనుపానులన్నీ చూసుకొని, చుట్టుపక్కల ఎవరికీ ఏమీ కాకుండా చిత్రమైన హిల్ఫైర్ క్షిపణుల రిమోట్ డ్రోన్ దాడితో లక్ష్యాన్ని ఛేదించిన వైనం కొన్నాళ్ళు కథలు కథలుగా చెప్పుకొనే జేమ్స్బాండ్ తరహా విన్యాసం. తాజా ఆపరేషన్తో తీవ్రవాదంపై పోరులో అమెరికా ప్రతిష్ఠ కొంత పెరగవచ్చు. ఉపఖండంలో పర్యవసానాలు అంతకన్నా పెరుగుతాయి. ఏడాది క్రితం అమెరికా సేనలు హడావిడిగా వెనక్కి తగ్గాక, అఫ్ఘాన్లో బలవంతాన పగ్గాలు చేజిక్కించుకున్న పిడివాద తాలిబన్లకూ, వారి ప్రభుత్వానికీ ఇవాళ్టికీ అంతర్జాతీయ గుర్తింపు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో తమకు తెలియకుండానే జవాహిరి తమ నట్టింట్లోనే తలదాచుకున్నాడని తాలిబన్ సర్కార్ బొంకినా నమ్మేవారెవరూ లేరు. తమ దేశ సార్వభౌమాధికారానికి అమెరికా తాజా రహస్య దాడులు విఘాతమని కాబూల్ వాదన. మామూలుగానైతే ఆ మాటకు అంతో ఇంతో మద్దతు లభించేదేమో! కానీ, పది పడగల పాముకు నేటికీ పాలు పోసి పెంచుతున్న వైనం బట్టబయలయ్యాక తాలిబన్లను ఎవరూ బాహాటంగా సమర్థించ లేరు. ఇక, జవాహిరి వ్యవహారంలో పాకిస్థాన్ ఇవ్వాల్సిన సంజాయిషీ సైతం చాలానే ఉంది. దీర్ఘకాలం పాక్లో తలదాచుకొని, ఇప్పుడు అఫ్ఘాన్లోనూ పాకిస్థానీ స్థావర ఉగ్రమూక హక్కానీ నెట్వర్క్ నీడలోనే అల్ఖైదా అధినేత కాలక్షేపం చేశాడనేది సుస్పష్టం. ఇన్నాళ్ళూ కడుపులో పెట్టుకొని కాపాడిన ఉగ్రసారథితో తమకే బంధం లేదని దాయాది దేశం చెబితే హాస్యాస్పదం. ఆ మాటకొస్తే, స్వలాభం కోసం ఇప్పుడు పాకిస్థానే అతని ఉప్పందించిందనే వాదనా వినిపిస్తోంది. తాజా దాడితో అమెరికా పగ చల్లారిందేమో కానీ, ఆన్లైన్ విషప్రచారంతో వివిధ దేశాలకు వ్యవస్థను విస్తరించిన జిహాదిస్టు గ్రూపులు తోక తొక్కిన తాచులా లేచే ప్రమాదం ఉంది. అధినేతను కోల్పోయి ఇప్పటికి ఆ స్థాయి వారసుడెవరూ లేకపోయినా, కొత్త గ్రూపులను కూడగట్టుకొని అల్ ఖైదా ప్రతీకారం తీర్చుకోజూస్తుంది. ఇక తాలిబన్లు సరేసరి. అందుకే, జవాహిరి ఒక్కడి మరణంతో సమస్త ఉగ్రవాదం సమసిపోయినట్టు కాదు. ప్రపంచానికిస్తున్న హామీలకు విరుద్ధంగా ముష్కర మూకలను పెంచిపోషిస్తున్న పాక్, అఫ్ఘాన్లపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. ఉప ఖండంలో శాంతి సుస్థిరతలకు భంగం కలిగించే చర్యల్ని అనుమతించబోమనాలి. అందుకే, ‘9/11’ దాడుల్లో మరణించిన 3 వేల మంది కుటుంబాల కన్నీటి కథకు జవాహిరి అంతం ఒక ముగింపని బైడెన్ అన్నారు కానీ, దశకంఠుడి లాంటి ఉగ్రసంస్థలపై యుద్ధంలో ఇది మరో మజిలీ మాత్రమే! -
ఆత్మహత్యా సదృశం
దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. అవి లేకుండా ఏ పనైనా చేస్తే? పాతికేళ్ళుగా తమ దేశం నుంచి అత్యున్నత స్థాయివారెవరూ పర్యటించని తైవాన్కు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెళతారనడం అలాంటిదే. ఆ వార్త తేనెతుట్టెను కదిలించింది. అమెరికా అధ్యక్షపదవికి తూగే హోదాలో ఉన్న ఆమె ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్నూ సందర్శిస్తారనడంతో చైనాకు పుండు మీద కారం జల్లినట్టయింది. జూలై 28న అమెరికా అధ్యక్షుడు బైడెన్తో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సంభాషిస్తూ, తైవాన్తో చైనా వ్యవహారంలో పరాయివారి జోక్యం సహించబోమని గట్టిగా చెప్పడం దాని పర్యవసానమే. వారాంతంలో తైవాన్ సమీపాన సాయుధ సైనిక విన్యాసాలకూ డ్రాగన్ దిగడంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతకు ఆజ్యం పోసింది. అసలే ఉక్రెయిన్లో యుద్ధంతో కిందా మీదా అవుతున్న ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో చైనాకు ఆగ్నేయ తీరంలో వంద మైళ్ళ దూరంలోని ఒక చిన్న ద్వీపమైనా తైవాన్కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. భౌగోళికంగా అమెరికా విదేశాంగ విధానానికి కీలకమైన స్నేహపూర్వక ద్వీపాల గొలుసుకట్టు మధ్య అది నెలకొంది. తైవాన్ను గనక చైనా స్వాధీనం చేసుకుంటే, పశ్చిమ పసిఫిక్లో దాని పట్టు బిగుస్తుంది. సుదూర గువామ్, హవాయ్ల లోని అమెరికా సైనిక స్థావరాలకూ అది ముప్పే. చైనా మాత్రం తమకలాంటి ఉద్దేశం లేదంటోంది. 1949లో చైనాలో అంతర్యుద్ధంతో కమ్యూనిస్టు పాలన వచ్చినప్పటి నుంచి తైవాన్ ప్రత్యేకంగా ఉంటోంది. సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలతో స్వతంత్ర దేశంగా అడుగులు వేస్తోంది. వాటికన్ కాక, ఇప్పటికి ప్రపంచంలో 13 దేశాలే తైవాన్ సార్వ భౌమాధికారాన్ని గుర్తిస్తున్నాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాలు ‘వన్ చైనా పాలసీ’కే కట్టు బడ్డాయి. ఇతర దేశాలేవీ ఆ ద్వీపదేశాన్ని గుర్తించకుండా ఉండేలా చైనా దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే ఉంది. స్వపరిపాలన సాగిస్తున్నప్పటికీ తైవాన్ తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ అనీ, అది తమలో భాగమనీ మొదటి నుంచీ చైనా వైఖరి. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా సరే దాన్ని తమలో ‘పునరేకీకరించే’ లక్ష్యాన్ని సాధించి తీరాలనేది జిన్పింగ్ మాట. కానీ, అవసరమైతే బలగాలను దించి మరీ, తైవాన్ను తాము కాపాడడానికి సిద్ధమని బైడెన్ ఆ మధ్య అన్నారు. వాస్తవానికి తైవాన్పై చైనా దాడికి దిగితే సైనిక జోక్యం చేసుకోవాలా, వద్దా అనే అంశంలో అగ్రరాజ్యం అమెరికా దీర్ఘకాలంగా ‘వ్యూహాత్మక సందిగ్ధత’ విధానాన్నే అనుసరిస్తోంది. బైడెన్ మాటలు ఏమైనప్పటికీ, తమ వైఖరిలో మార్పు లేదని వైట్హౌస్ వర్గాలే తేల్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉరుము లేని పిడుగులా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు వెళతారనే వార్త తాజా తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇంతలో ఆదివారం మొదలైన ఆమె పర్యటన షెడ్యూల్లో ఇప్పటికైతే సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్ తప్ప తైవాన్ సందర్శన ప్రస్తావన లేకపోవడం ఊరట. వర్తమాన ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు 2017 –21 మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాం నుంచి శరవేగంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇరు దేశాల సంబంధాలు అలా ఉన్నా, అధినేతల స్థాయిలో రెండు గంటల పైగా గత వారం సంభాషణ సాగడం ఓ సాంత్వన. వాతావరణ మార్పు లాంటి వైరుద్ధ్యాలు లేని అంశాలపై చైనాతో మాటామంతీ జరుపుతూనే, దూకుడుకు పగ్గం వేయాలని బైడెన్ ఆలోచన. ఆంక్షలను సడలించేలా ఒప్పించి, అమెరికాకు చైనా సమస్కంధ అగ్రరాజ్యమని అంగీకరింపజేయాలనేది జిన్పింగ్ భావన. కానీ, ఎవరూ పట్టు సడలించడం లేదు. నవంబర్లో మధ్యంతర ఎన్నికలున్న బైడెన్ కానీ, ఈ ఏడాదిలోనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ మహాసభలున్న జిన్పింగ్ కానీ తమ వారి ముందు తగ్గేదేలే అన్నట్టుగానే ఉండాలనుకోవడంతో చిక్కొచ్చి పడుతోంది. ఈ ఏడాది చివరలో ఇద్దరు అధినేతలూ ప్రత్యక్షంగా కలసి, చర్చించుకొనే సూచనలున్నాయి. అయితే, కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న తైవాన్ అంశం మళ్ళీ తెర పైకి వచ్చి, ఉద్రిక్తతలు పెంచుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా తైవాన్లో శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవస్థ సుస్థిరత ప్రపంచానికి అవసరం. జీ7, నాటో, ఈయూ, క్వాడ్ దాకా అన్నీ ఆ మాటే గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే, కంప్యూటర్ చిప్ల ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్దే అగ్రస్థానం. ప్రపంచమంతా వాడే ఫోన్లు, ల్యాప్టాప్లు, వాచీలు, గేమ్స్ కన్సోల్స్లోని ఎలక్ట్రానిక్ సామగ్రికి గుండె లాంటి కంప్యూటర్ చిప్లన్నీ తైవాన్ తయారీయే. ప్రపంచ మార్కెట్లో సగానికి పైగా ఒకే ఒక్క తైవానీ సెమీకండక్టర్ కంపెనీదే అని లెక్క. కొంతకాలంగా తరచూ తైవాన్లో గగనతల చొరబాట్లు సాగిస్తున్న చైనా గనక ఆ దేశాన్ని చేజిక్కించుకుంటే, ప్రపంచంలోని అతి ప్రధాన పరిశ్రమల్లో ఒకటి దాని వశమైనట్టే! అందుకే, తైవాన్లో చీమ చిటుక్కుమన్నా ఆ ప్రభావం అంతటా కనిపిస్తుంది. నిజానికి, చైనా, అమెరికా, తైవాన్లు మూడూ స్థూలంగా ప్రస్తుత యథాతథ స్థితి వైపే మొగ్గుతున్నాయి. కాకపోతే, ఎవరికి వారు అవతలివాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అసలే కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైన పరిస్థితుల్లో యథాతథ స్థితిని కొన సాగనివ్వక ఎవరు కవ్వింపు చర్యలకు దిగినా, జిన్పింగ్ వేరే సందర్భంలో అన్నట్టు అది నిప్పుతో చెలగాటమే! అలాంటి అవివేక చర్యలను అనుమతించడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆత్మహత్యా సదృశమే! -
వ్యక్తి విషాదం
యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను, అన్ని రూపాల్లోని యుద్ధాన్నీ నేను ద్వేషిస్తాను అంటాడు ఆర్చెమ్ చపేయే. ఈ ఉక్రెయినియన్ రచయిత తనను తాను ‘పసిఫిస్ట్’ అని చెప్పుకొంటాడు. శాంతి కాముకుడు అని ఈ మాటకు విస్తృతార్థం. యుద్ధం, హింస... ఏ కోశానా సమర్థనీయం కావు అనేది ఇలాంటివాళ్ల భావన. పాపులర్ ఫిక్షన్, క్రియేటివ్ నాన్ –ఫిక్షన్ రచనలతో ఆర్చెమ్ ఉక్రెయిన్ లో మంచి ఆదరణ ఉన్న రచయిత. నాలుగుసార్లు ‘బీబీసీ ఉక్రెయిన్ బుక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఫైనలిస్టు. ఫొటోగ్రఫీ, విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఈమధ్యే మక్కువ పెంచుకున్నాడు. ఈమధ్యే అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగకముందు! రాజధాని నగరం కీవ్ మీద బాంబుల మోత మొదలుకాగానే ఆయన చేసిన మొదటి పని – ముందు తన కుటుంబాన్ని అక్కడి నుంచి సురక్షితమైన చోటుకు తరలించడం! రెండోది – యుద్ధంలో చేరడానికి తన పేరును నమోదు చేసుకోవడం! యుద్ధం మీద ఆర్చెమ్ అభిప్రాయాలు ఏమీ మారలేదు. కానీ అణిచివేత తన మీద మోపిన యుద్ధం కాబట్టి దీన్నుంచి పారిపోలేనంటాడు. ఓలెహ్ సెన్ త్సోవ్ – రచయిత, దర్శకుడు. ‘క్రిమియా’ ఆయన స్వస్థలం. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా తన అనుబంధంగా మార్చుకున్నప్పుడు చేసిన నిరసనలకు గానూ తీవ్రవాద ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. (బలవంతపు సప్లిమెంట్స్, మెడికేషన్ కలుపుకొని) 145 రోజుల పాటు చేసిన నిరవధిక నిరశనకు గానూ దాదాపు చావు దాకా వెళ్లొచ్చాడు. 2019లో నేరస్థుల బదిలీ ఒప్పందం మీద ఉక్రెయిన్ కు వచ్చాక దాడి నేపథ్యంలో ‘ద సెకండ్ వన్స్ ఆల్సో వర్త్ బయ్యింగ్’ అనే వ్యంగ్య నవల రాశాడు. ఉక్రెయిన్ లో 1990ల నాటి నేరస్థుల గ్యాంగుల నేపథ్యంలో సాగే ‘రైనో’ సినిమా 2020లో విడుదలైంది. దానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే, మళ్లీ యుద్ధం మొదలుకాగానే ప్రాదేశిక భద్రతా దళంలో చేరిపోయాడు. ఇంకా ఈ జాబితాలో స్తానిస్లావ్ అసెయేవ్, క్రిస్టియా వెంగ్రీనియుక్ లాంటి ఉక్రెయిన్ రచయితలూ ఉన్నారు. అమెరికా రచయితలు ఎర్నెస్ట్ హెమింగ్వే, ఇ.ఇ. కమ్మింగ్స్, టి.ఇ. లారెన్స్, జె.ఆర్.ఆర్. టోల్కీన్ లాంటివాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. జె.డి. శాలింజర్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జార్జ్ ఆర్వెల్ స్పానిష్ సివిల్ వార్లో పాల్గొని గాయపడ్డాడు. తెలుగు కవి, కథకుడు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు; మరో రచయిత అంగర వెంకట కృష్ణారావులు కూడా యుద్ధ అనుభవం ఉన్నవారే! అసలు కవిగానో, రచయితగానో ఉండటమే... దానికదే ఒక యుద్ధం కదా! ఈ రచయితలు మనకు గుర్తున్నది వాళ్లు పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, వారి రచనల వల్ల! కాకపోతే అది వారికి ఒక అనుభవంగా పనికివచ్చింది. కానీ ఆ ‘అనివార్యత’ ఎంత దుర్మార్గమైనది? రాసుకోగలిగేవాడు రాసుకునే, ఆనందంగా నర్తించే అమ్మాయి నర్తిస్తూ ఉండగలిగే ప్రపంచాన్ని కోరుకోవడం మరీ అంత పెద్ద కోరికా? లేక, ఇంకో తలంలో వీటన్నింటికీ కారణం అవుతున్న ‘ఇంకో’ మనిషి బుద్ధి అంత చిన్నదా? యుద్ధం అనేది ఏ ఒక్క రూపంలోనో ఉండదని అందరికీ తెలుసు. నేరుగా సరిహద్దు యుద్ధాలు చేయకపోయినా, భిన్నరకాల యుద్ధాల్లో ఎందరు తెలుగు కవులు పాల్గొనలేదు! భావజాల పోరాటాలు మాత్రం యుద్ధం కాదా? సమస్య ఏమిటంటే– ఈ యుద్ధాలు గీతకు అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా అని తేల్చుకునే విపత్కర పరిస్థితిలోకి మనిషిని నెడతాయి. దీనికి స్పందించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అప్పుడు సమూహంగా మాట్లాడటం తప్ప వ్యక్తికి విడిగా చోటుండదు. వ్యక్తి అనేవాడు లేకుండాపోవడం కంటే బౌద్ధిక విషాదం ఏముంటుంది? అవసరాన్ని బట్టి మనిషి వ్యక్తిగానూ, సమూహంగానూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సందర్భంలో గీతకు అటువైపు ఉన్నవాడు కేవలం విడి మనిషిగానే ఉండదలిస్తే! నేటికి సత్యాలుగా కనబడినవి, రేపటికి మబ్బుల్లా కదిలిపోవని ఎవరూ చెప్పలేరు. కానీ యుద్ధాలు, భావజాలాల్లో వర్తమానపు కొలేటరల్ డ్యామేజ్ అనబడే అనివార్య నష్టం లెక్కలోకి రాదు. వీళ్ల వల్ల గాయపడ్డ ఆ ‘ఎదుటి’ మనిషి ఎవరో వీరికి ఎప్పటికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు చేసే లాఠీఛార్జీలో రెండు దెబ్బలు తినేవాడి నొప్పి ఎవరికీ పట్టదు. ఏ కోర్టులూ, ఏ ప్రజాసమూహాలూ దీనికి న్యాయం చేయలేవు. కానీ ఒక్కడు మాత్రం తన జీవితకాలం ఆ రెండు దెబ్బల బరువును మోయాల్సి వస్తుంది. ఆ చివరి మనిషి గాయానికి కూడా లేపనం పూయనంతవరకూ, అసలు ఆ మనిషికి గాయం కాని పరిస్థితులు వచ్చేంతవరకూ మనది నాగరిక సమాజం కాబోదు. వేపచెట్టు మీద వాలి కూసేది ఒక కాకి కాదు. అది ‘ఫలానా’ కాకి మాత్రమే అవుతుంది. దాని కూతకు స్పందనగా వచ్చి జతకూడేది కూడా ఇంకో కేవలం కాకి కాదు. అది మరో ఫలానా కాకి అవుతుంది. రెండూ వేర్వేరు కాకులు... ఇద్దరు వేర్వేరు సంపూర్ణ మనుషుల్లా! అవి వాలిన వేపచెట్టుకు కూడా మనం పేరు పెట్టివుండకపోవచ్చుగానీ అది కూడా దానికదే ప్రత్యేక యూనిట్. దానికదే యునీక్. దాన్ని పోలిన చెట్టు, దానిలాగా కొమ్మలను విరుచుకున్న చెట్టు ఇంకోటి ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మన కాళ్లకు తగిలే పిల్లి లాంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ మనుషులే కేవలం సమూహ అస్తిత్వాలకు పరిమితమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు, ఇంక పక్షులు, జంతువులు, చెట్లూ చేమలను కూడా విడిగా గుర్తించాలంటే మనిషి ఎంత సున్నితం కావాలి! ఎంత సూక్ష్మం కావాలి! -
రైటింగ్ టేబుల్
మగవాడు రాసేటప్పుడు తాను ఒక్కడే ఉంటాడు. స్త్రీ రాసేటప్పుడు ఆమె వెనుక ఇంకా ఆర్పాల్సిన గ్యాస్స్టవ్, పిల్లవాడికి పట్టాల్సిన పాలు, ఆరేయగా లోపలికి తేవాల్సిన బట్టలు, కరెంటు మనిషి మీటర్ కట్ చేసి వెళ్లకుండా కట్టాల్సిన బిల్లు, పెద్దగా కదలికలు లేని అత్తగారికి ఇవ్వాల్సిన మందులు, సంతరోజు తప్పిపోకుండా తేవాల్సిన కూరగాయలు... ఇన్ని ఉంటాయి. మగవాడు– రాసుకోవాలి అనంటే ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. ఒక గది ఇవ్వబడుతుంది. ముఖ్యం అతనికి ఒక రైటింగ్ టేబుల్ ఉంటుంది. ‘కాని నాకు తెలిసి మన దేశంలో రాయాలనుకున్న స్త్రీలకు ఒకే ఒక టేబుల్ ఉంటుంది. అది డైనింగ్ టేబుల్. దానిని శుభ్రం చేసుకుని కూచుని రాసుకోవడమే’ అంది ప్రఖ్యాత రచయిత్రి కమలాదాస్. వర్జీనియా ఊల్ఫ్ కూడా ఇదే మాట అంది– రాయాలనుకున్న స్త్రీలు తాము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఆదాయం కలిగి ఉండాలి... వారికి సొంత గది ఉండాలి. ఆసియాలోనే అతి పెద్దదైన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ ఇటీవల జరిగితే అందులో వర్తమాన భారతీయ రచయిత్రులు ఎందరో పాల్గొని ‘తాము రాస్తున్నాము’ అని గొప్ప ప్రకటన చేస్తే, మగవారు పాల్గొన్న వేదికలపై రాని చర్చ ఈ రచయిత్రులు పాల్గొనే వేదికపై వచ్చింది. అది– రాయడానికి సమయం, కావలసిన మద్దతు గురించి! ‘మీరు ఎన్నయినా చెప్పండి... భారతీయ స్త్రీ రాయాలంటే భర్త సహకారం తప్పదు. మన స్త్రీలు అనేక బాధ్యతల మధ్య సమయం వెతుక్కుని రాయాలి. ఆ సమయానికి భర్త ఆటంకం కలిగిస్తే రాయడం కష్టం’ అంది అనుకృతీ ఉపాధ్యాయ్ అనే రచయిత్రి. ‘నేను ఒక నవల మొదలెట్టాను. లాక్డౌన్ వచ్చింది. రెండేళ్ల పాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నవల పని మూలపడింది. మళ్లీ స్కూళ్లు తెరిచి వాళ్లు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళితే తప్ప రాయడానికి వీలవలేదు’ అంది సిమ్రన్ ధిర్ అనే ఢిల్లీ రచయిత్రి. ‘ఈ గొడవంతా ఎందుకని నేను ఉదయం నాలుగ్గంటలకు లేచి ఆరు వరకు రాస్తాను. రోజుకు 200 పదాలు రాస్తే చాలు అనుకుంటూ నా నవల పూర్తి చేశాను’ అంది శివానీ సిబాల్ అనే మరో రచయిత్రి. స్త్రీల కల్పనాశక్తి వందల ఏళ్ల పాటు మన దేశంలో మౌఖికంగా ఉండిపోయింది. వారు ఆటల్లో, పాటల్లో, పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెప్పిన కథల్లో తమ సృజనను చూపించి సంతృప్తిపడాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే మన దేశ పురాణ జ్ఞానం, జానపద సంపద వాళ్ల నాలుక చివరల నుంచే ఒక తరం నుంచి మరో తరానికి అందింది. కానీ వారు విద్యకూ, కలం పట్టి రాయడానికీ శతాబ్దాలు దూరం ఉన్నారు. రాయడం మొదలెట్టాక, ఇంతకాలం గడిచాక కూడా వారి ఎదుట ఉండాల్సిన సవాళ్లు ఉండనే ఉంటున్నాయి. ‘నేను నా మొత్తం కల్పనా సామర్థ్యాన్ని నా కుటుంబ మర్యాదకు లోబడి కుదించుకోవడానికి అవస్థలు పడ్డాను’ అంది కమలా దాస్. స్త్రీలు రాయవచ్చుగాని అన్నీ రాయకూడదు. కొన్ని కథాంశాలు ముట్టుకోవడం నిషిద్ధం. కొన్ని వర్ణనలు చేయడం నిషిద్ధం. కొన్ని మాటలు వాడటం నిషిద్ధం. స్త్రీలు పాపులర్గా రాసినా, గాఢమైన మానవ ప్రవర్తనలు రాసినా ‘ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు... ఈ కథలోని పాత్ర అనుభవం ఈమె అనుభవమే కాబోలు’ అనే భావనలో మన ఎదగని పాఠకులు, కుటుంబాలు ఉంటాయి. కనుక ఇప్పటి వరకూ మన దేశంలో రాసిన స్త్రీలు తమ పూర్తి శక్తితో రాశారని అనుకోవడానికి లేదు. ఇక మీదట రాస్తారనీ చెప్పలేము. కనపడని సెన్సార్షిప్ ప్రభావం అది. పురుషులకు వృత్తి ఉంటుంది. రాయడం వారి ప్రవృత్తి (ఆప్టిట్యూడ్). అదే స్త్రీలకు అభిరుచి (హాబీ)గా చెప్పబడుతుంది. రాసే స్త్రీలను భర్తలు పరిచయం చేస్తూ ‘ఆ.. ఏవో గిలుకుతుంటుంది లేండి’ అని చిన్నబుచ్చుతారు. కార్టూనిస్టులు రచయిత్రుల తిరిగొచ్చిన రచనలు మోయలేక పారిపోయే పోస్ట్మేన్లను వేసి నవ్విస్తారు. సినిమాల్లో రచయిత్రులవి హాస్యపాత్రలు. నాణ్యత లేని రచన పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఉంటుంది. కానీ స్త్రీలు హేళనకు సాధనాలవుతారు. 1965 నుంచి మన దేశంలో జ్ఞానపీఠ్ ఇస్తుంటే ఇప్పటికి 62 మందికి ఆ పురస్కారం దక్కితే వారిలో కేవలం 9 మందే స్త్రీలు ఉన్నారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటి, సవాళ్లను ఎదుర్కొని, మగ రచయితల రాజకీయాలను జయించి రాగలిగారు కాబట్టే ఈ 9 మందైనా! ‘నేను చెన్నై కన్నెమరా లైబ్రరీలో పని చేశాను. వందల రచయిత్రుల పుస్తకాలు అక్కడ చూశాను. కానీ వారంతా ఒకటీ రెండూ పుస్తకాల వారు. అంటే 18 నుంచి 24 ఏళ్లలోపు రాసిన వారు. బహుశా పెళ్లయిన తర్వాత వాళ్లందరూ రాయడం మానేసి ఉండాలి’ అంది పరమేశ్వరి అనే తమిళ కవయిత్రి ఒక వ్యాసంలో! ఇదే సూత్రాన్ని ప్రతి భాషకూ అప్లై చేస్తే పెళ్లికి ముందు రాసి ఆ తర్వాత ఆగిపోయిన రచయిత్రుల రాయబడని కావ్యాలను హతం చేసినదే మన సమాజం. వెలుతురు అర్థం కాకపోతే చీకటి అర్థం కాదు. స్త్రీ రాయకపోతే పురుషుడు రాసిందీ సంపూర్ణం కాదు. మానవ చిత్తవృత్తులనూ, సంక్షోభ సమయాలలో వారి దిటవునూ, సందర్భాలకు తగినట్టు మారే కపట విన్యాసాలనూ స్త్రీ గమనించినంత సూక్ష్మంగా పురుషుడు గమనించలేడు. ఈ ప్రపంచం అర్థం కావాలంటే స్త్రీ రచన విస్తృతం కావాలి. రాసే స్త్రీలున్న ఇళ్లలో వారికంటూ తప్పక ఒక రైటింగ్ టేబుల్ ఉండాలి. అది లేనంత కాలం మనం పూర్తిగా నాగరికం కానట్టే! స్త్రీలు రాయాలి. స్త్రీ రచనలు వర్ధిల్లాలి. -
స్త్రీవాద విమర్శపై ఉపన్యాస పరంపర
సాహిత్య విమర్శ రంగంలో పని చేస్తున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక కలిసి ‘స్త్రీవాద సిద్ధాంతం – సాహిత్య విమర్శ’ అనే అంశం మీద అంతర్జాల ప్రసంగ పరంపరను నిర్వహించడానికి పూనుకున్నాయి. సాహిత్య అన్వయానికి సంబంధించిన అంశాలతో ఈ ఉపన్యాస పరంపరను రూపొందించాం. అంతర్జాతీయంగా ఆలోచించటం, దేశీయ, సామాజిక, రాజకీ యార్థిక పరిణామాల సంబంధంలో స్త్రీల చరిత్ర నడిచిన దారులను తెలుసుకొనటం; ప్రాంతీయంగా స్త్రీల జీవితానికి సంబంధించి తెలుగు సాహిత్యం నిర్మించి ప్రచారం చేసిన భావజాలాన్ని నిర్ధారించటం, సమాంతరంగా సాహిత్య రంగంలో అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక సంస్కృతిని నిరూపించటం లక్ష్యంగా ఈ ప్రసంగ విషయాలు రూపొందాయి. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) మొదటి నాలుగు ఉపోద్ఘాత ప్రాయమైనవి. తరువాతి 19 మానవ హక్కుల ఉద్యమ నేపథ్యంలో స్త్రీల హక్కుల ప్రశ్నను లేవనెత్తటం దగ్గర ప్రారంభించి ప్రపంచమంతటా స్త్రీలు వివక్షకు గురికావటాన్ని నిరసిస్తూ, కారణాలను అన్వేషిస్తూ, పరిష్కారాలు కోరుకొంటూ స్త్రీలు అనేక స్థాయులలో చేసిన యుద్ధాల, సిద్ధాంతాల అవగాహన కోసం ఉద్దేశిం చినవి. 24వ అంశం నుండి ఆ తరువాతవి అన్నీ భారతదేశ సందర్భం నుండి, తెలుగు సాహిత్య ప్రత్యేకత నుండి స్త్రీల అనుభవాన్ని, స్త్రీవాద భావనలను పరిశీలించేవి. (క్లిక్: ఆ నిషేధం చదువును దూరం చేస్తుంది!) స్త్రీవాద సిద్దాంతంలో సాహిత్య విమర్శలో అభిరుచి, అభినివేశం ఉన్న వాళ్ళందరూ ఈ ఫిబ్రవరి 20 నుండి ప్రతి ఆదివారం ఉదయం 11.00 లకు ప్రారంభమై 1.30 వరకు జరిగే ఈ వారం వారం అంతర్జాల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. సామాజిక మాధ్యమాలలో జూమ్ లింక్ వివరాలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాము. సాహిత్య విమర్శకు, ప్రత్యేకించి స్త్రీవాద విమర్శకు సంబంధించి జరిగే సంభాషణలో భాగస్వాములు కావలసిందిగా విజ్ఞప్తి. – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక -
మా కోరిక వికేంద్రీకరణే!
1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే, 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం! 1953లో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. శ్రీబాగ్ ఒప్పందంలోని ఒక్క అంశం, ఆ రకంగానైనా ఆనాడు ఆచరణలోకి వచ్చింది. దానిని ఇప్పుడు కొనసాగించమనేదే మా గట్టి డిమాండ్. మూడు రాజధానులు కాదు, మూడు వికేంద్రీకరణలు మాత్రమే! కర్నూలులో పరిపాలనా రాజధాని, అసెంబ్లీ, గుంటూరులో ఓ హైకోర్టు, విశాఖలో శీతకాలపు అసెంబ్లీ సమావేశాలు ఉండాలనేది మా అభిప్రాయం. విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వెలుగొందుతుందని మా విశ్వాసం. (చదవండి: ‘ఒకే దేశం, ఒకే ఎలక్షన్’లో మర్మం?) అంతే కాకుండా... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. నదుల అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రణాళికలోని ‘ఆల్మట్టి నుంచి బుక్కపట్నం లింక్ కెనాల్ గురించి కేంద్రంతో, కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలి. గాలేరు–నగరి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) ఎర్ర చందనం స్మగ్లింగ్ను అడ్డుకుని, నిల్వ ఉన్న దుంగలను వేలం వేసి ఆ డబ్బును రాయలసీమ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కడపజిల్లాలో ఉక్కు కర్మాగారం, మల్లవరంలో బీహెచ్ ఈఎల్ ఏర్పాటు, పులరిన్ ఖనిజం వెలికితీత, ఆ ఖనిజాధారిత పరిశ్రమల ఏర్పాటు తదితరాలు మా తక్షణ డిమాండ్లు. శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించే నీళ్ల వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ జరగాలని మేం కోరు కుంటున్నాం. రాజీలేని మా వైఖరి, ఏ అపార్థాలకూ తోవచూపరాదని విశ్వసిస్తూ... – రాయల సీమ కవులు, రచయితలు (కేతు విశ్వనాథరెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణ స్వామి, భూమన్, శాంతినారాయణ, వేంపల్లె షరీఫ్, రాసాని వెంకట్రామయ్య, మధురాంతకం నరేంద్ర, తదితరులు) -
వారిదైన వ్యక్తీకరణ
‘బ్రదర్స్ కరమజవ్’లో ఇవాన, అల్యోషా ఇద్దరూ ఒక హోటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు – గ్లాసు తీసిన తర్వాత టేబుల్క్లాత్ మీద గ్లాసు అచ్చును గమనిస్తాడు ఇవాన్. అంత సున్నితమైన గమనిం పును పాఠకుల దృష్టికి తెచ్చిన దాస్తోయెవస్కీ ముద్ర అది. నోటి దుర్వాసనను చెక్ చేసుకోవడానికి ‘ద క్యాచర్ ఇన్ ద రై’లోని హోల్డెన్ కింది పెదవిని పైకి వంచి ముక్కుకు తగిలేలా గాలి వదులుతాడు. అసలైన సాహిత్య పరిమళాన్ని ఆనందించడానికి శాలింజర్ ఇచ్చిన వివరం అది. ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’లో సముద్రంలో చేపల వేటకెళ్లి వచ్చాక, సామగ్రిని అక్కడే వదిలేద్దామనుకుంటాడు వృద్ధుడు. అక్కడ వదిలేయడం ద్వారా ఎవరికైనా దొంగతనం చేయాలన్న టెంప్టేషన్ ఎందుకు పుట్టిం చాలని తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ వాక్యాన్ని రాసిన దొర హెమింగ్వే. ఆ రచయిత మాత్రమే రాయగలిగే వాక్యం ఆ రచయితను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆ పసి రాకుమారుడు కాంతి గల వీపు కానవచ్చేటట్లుగా బోరగిలపడటం – నున్నని వీపుగల కూర్మావతారంగా కనబడుతున్నదట. ఈ చిత్రిక ‘కవికర్ణ రసాయనము’ లోనిది. అదే పద్యంలో ఇంకా వివిధ భంగిమల్లో దశావతారాలను కళ్లకు కడతాడు సంకుసాల నృసింహకవి. అసలే సూర్యుడు ఒక అగ్నిగుండం. దానికితోడు సాయంకాలం కమలినీ విరహంలో ఉన్నాడు. ఇంక ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో మునిగాడని సూర్యాస్తమయాన్ని దృశ్యమానం చేస్తుంది ‘భాస్కర రామాయణం’. సూర్యుడి వాడిౖయెన కిరణాల తాకిడికి వేగిపోయిన జగత్తు మీద వీచడం కోసం గుండ్రని విసనకర్రగా వికాసం పొందాడని చంద్రోదయాన్ని వర్ణిస్తాడు ‘విష్ణుమాయా విలాసము’ కవి. ఇక ‘గయోపాఖ్యానము’ కర్త – ఆమె సౌందర్యాన్ని చూపడానికి తాను కూడా తగనని అద్దం గుర్తించి, ముఖం చాటేసిందంటాడు. తెలుగు పద్యసాహిత్యం నిండా ఎన్నో గొప్ప వ్యక్తీకరణలు. చలికాలంలో రైల్వే స్టేషన్లో అంచులు పగిలిన కప్పుల్లో టీ తాగుతున్న శాలువా ముసుగులో ఉన్న కూలీలను చిత్రించిన త్రిపుర నుంచి, చెరువులో బెకబెకమంటున్న కప్పలు చీకట్లో మనిషి ఒంటేలు శబ్దానికి ఒక క్షణం నిలిచి, మళ్లీ అరవడం మొదలుపెట్టాయని రాసిన అజయ్ప్రసాద్ దాకా ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ కాలాన్ని నిలిపి చూపే ఎన్నో విలువైన క్షణాలు! తల్లి కాళ్లకు ఒంగి దండం పెట్టే కొడుకుకు తల్లి పాదాల పసుపు వాసన తగలడం; ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే ఉద్యోగిని చీర కుచ్చిళ్లలో చిన్నారి కొడుకు తలదాచుకోవడం; మౌన రుషిని తలపించే కప్ప కూర్చున్న భంగిమ... ఇలాంటి వ్యక్తీకరణలు సాహిత్యానికి ప్రాణం. సూక్ష్మంలో మోక్షం చూపే వాక్యాలివి. ఒక దగ్గర కనబడిన వాక్యం ఇంకో దగ్గర ఉండదు. అది అక్కడికి సర్వ స్వతంత్రమైనది. ఆ కవిదో, ఆ రచయితదో ఇక వారిదే. అలాంటిది ఇంకొకరు ముట్టుకోరు. ఎంగిలి వాక్యాలు రాయలేదని చలాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించింది... అలాంటి ఎంగిలి వాక్యాలు రాయని ఏ రచయితకైనా వర్తిస్తుంది. సాహిత్యానికి మరో వైపు కూడా ఉంది. పునరుక్తి దీని ప్రధాన లక్షణం. లేత భానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి అనే వాక్యాన్ని కథల్లో ఎన్నిసార్లు చదివుంటారు? పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని పత్రిక చదివే పరంధామయ్య ఆదివారపు అనుబంధాల్లో ఎన్నిసార్లు పరామర్శించి ఉంటాడు? పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా బాల్యంలోనే ప్రతిభను చాటే నాయకులు ఎందరు తగిలారు? చిట్టచివరన, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఎందరు కథానాయికలు పయనించి ఉంటారు? ఇలాంటి వ్యక్తీకరణలు ముందుగా ఎప్పుడు, ఎలా వచ్చాయో చెప్పగలిగే సాహిత్య చరిత్రలు మనకు లేవు. అవి వచ్చినప్పుడు తాజావే కావచ్చు. వాటికవే విలువైనవే కావచ్చు. కానీ వాడీ వాడీ అరగ దీయడం వల్ల పాతకంపు కొడతాయి. ఈ జాడ్యం తెలుగుకే పరిమితమైనది అనుకోవాల్సిన పనిలేదు. ‘ఇట్ వజ్ ఎ డార్క్ అండ్ స్టార్మీ నైట్’ (అదొక చీకటి తుపాను రాత్రి) అనే వాక్యం ఎక్కడి నుంచి ఊడిపడిందనే చర్చ ఆంగ్ల సాహిత్యంలో ఈమధ్య బాగా జరిగింది. అదొక చీకటి తుపాను రాత్రి... అని గంభీరంగా ఎత్తుకోగానే తర్వాత ఏమయివుంటుందన్న కుతూహలం సహజంగానే పుడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆ కుతూ హలం నిలుస్తుంది? కథల్లో మహాచెడ్డ ప్రారంభాలకు పెట్టింది పేరుగా ఈ వాక్యాన్ని అభివర్ణించింది ‘రైటర్స్డైజెస్ట్’ పత్రిక. క్లీషేకూ, మెలోడ్రామాకూ, అతిగా రాయబడిన వచనానికీ ఉదాహరణగా నిలిచిన ఈ వాక్యంతో ఎన్నో కథలు మొదలయ్యాయి. బ్రిటన్ర చయిత ఎడ్వర్డ్ బుల్వర్ లిట్టన్ 1830లో రాసిన ‘పాల్ క్లిప్ఫోర్డ్’ అనే నవల ప్రారంభంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. ఆయన ఎంతో సాహిత్యం సృజించినప్పటికీ, ఈ ‘అపకీర్తి’ వాక్యంతో ఆయన కీర్తి నిలిచి పోయిందని సరదాగా వ్యాఖ్యానించారు విమర్శకులు. కానీ తమాషా ఏమిటంటే, 1809లో ‘ఎ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్’ పుస్తకం రాస్తూ వాషింగ్టన్ ఇర్వింగ్ ఇదే వాక్యాన్ని వ్యంగ్యంగా ఉదాహరి స్తాడు. అంటే, అంతకు ఎంతోముందే ఈ వాక్యం సాహిత్యంలోకి చొరబడి పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట! చిన్నకథల పితామహుడు అని చెప్పే ఎడ్గార్ అలెన్ పో కూడా దీన్ని వాడకుండా తమాయించుకోలేకపోయాడు. ‘మాస్టర్లు’ పునరుక్తులు వాడినా వారి ఇతరత్రా విస్తారమైన ప్రతిభలో అవి చెల్లిపోతాయి. కానీ సాహిత్య ‘విద్యార్థులు’ వాటికి దూరంగా ఉండడమే వారిని స్వతంత్రంగా నిలబెడుతుంది. జీవితపు అనుభవం లేకపోవడం, జీవితానికి చేరువగా వెళ్లి వాక్యాలను పిండు కోవడం తెలియనివారు మాత్రమే స్టాక్, ప్లాస్టిక్ వ్యక్తీకరణలను ఏ ప్రయత్న బరువూ లేకుండా తమ రాతల్లోకి తెచ్చేసుకుంటారు. ఎవరిని చదివినా ఒకేలా అనిపించడానికి ఇదే కారణం. -
‘బుల్లెట్ బండి’.. వాళ్లిద్దరికి సన్మానం
సాక్షి, కేశంపేట(హైదరాబాద్): యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న ‘బుల్లెట్ బండెక్కి..’ పాటను రాసిన గేయ రచయితలను ఎంపీపీ రవీందర్యాదవ్ బుధవారం సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో గేయ రచయితలు మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన రాము, లక్ష్మణ్లను శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు -
ఆ సర్జరీ తర్వాత ‘ప్లాస్టిక్ చోప్రా’ అని వెక్కిరించేవారు
ఆకాశమంత జీవితం నిప్పై జ్వలిస్తుంది. నీరై ఎగసిపడుతుంది. ప్రభంజనమై గొంతెత్తుతుంది.ఎప్పడో శేషజీవితంలో పుస్తకం రాసుకుందాం లే...అనుకోకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు పుస్తకాలు రాస్తున్నారు. తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తున్నారు...పుస్తకం పంచభూతాల సమాహారం క్రాకింగ్ ది కోడ్ మై జర్నీ ఇన్ బాలీవుడ్ –ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా ఎవరు? అనగానే వచ్చే సమాధానం బ్యాక్–టు–బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరో అని! ఈయనలో మంచి రచయితను పరిచయం చేసిన పుస్తకం క్రాకింగ్ ది కోడ్. భార్య తహీర కష్యప్తో కలిసి ఈ పుస్తకం రాశారు. చండీగఢ్ నుంచి ముంబైకు ఎంత దూరమో తెలియదుగానీ ‘జీరో టు హీరో’కు మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అలా అని దూరభయంలోనే ఉంటే కలలు ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. ఈ విషయం తెలిసే తన కలల దారిని వెదుక్కుంటూ డ్రీమ్స్ సిటీ ముంబైకి వచ్చాడు ఖురాన. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలకు ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చాడు. ఫేమ్, మై భీ హీరో, మైనే స్ట్రగులర్ హుమ్, టికెట్ టు బాలీవుడ్...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యం. పుస్తకం నుంచి మంచి వాక్యం: మనలోని ‘నాకు అంతా తెలుసు’ అనే ద్వారం మూతపడితే తప్ప ‘తెలుసుకోవాలి’ అనే ద్వారం తెరుచుకోదు. ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్మోడరేట్లీ ఫేమస్ సోహా అలీ ఖాన్ పెద్ద మర్రిచెట్టు కింద చిన్న మొక్క కూడా మొలవదు అంటారు. అదేమిటోగానీ, ఆ పెద్ద నీడ మాటున ‘వ్యక్తిగత ప్రతిభ’ అనేది చాలాసార్లు చిన్నబోతుంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సినిమాల్లో నటిగా తన ప్రతిభ చాటుకున్న సోహా అలీఖాన్ చాలామంది దృష్టిలో పటౌడీ–షర్మిలా ఠాగూర్ల కూతురు మాత్రమే, ఇంకొందరి దృష్టిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సోదరి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని హాస్యధోరణిలో రాసి నవ్వించారు సోహా. తన స్కూల్, కాలేజీ జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఈనాటి సోషల్ మీడియా కల్చర్పై తనదైన శైలిలో రాశారు. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితం అయిదుసార్లు కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిల్చోవాలి.శక్తినంతా కూడదీసుకొని పోరాడాలి. అమ్మ మియా: ఇషా డియోల్ మాతృత్వం మధురిమపై ఇషా డియోల్ రాసిన అద్భుత పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు, ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్ పేరెంటింగ్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. స్థూలంగా చెప్పాలంటే న్యూ మదర్స్కు ఇదొక మంచి గైడ్లా ఉపకరిస్తుంది. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితంలో మంచి విషయాలు అంటే అనుకోకుండా ఎదురయ్యే ఆనందక్షణాలే! అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హాలీవుడ్ వరకు ఎదగడం సాధారణ విషయమేమీ కాదు. తన ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. తన ప్రస్థానంలో ఎదురైన అవమానాలు, చేసిన పోరాటాలను ‘అన్ఫిన్ఫినిష్డ్’లో రాశారు ప్రియాంక చోప్రా. ఒకానొక రోజు ప్రమాదవశాత్తు పెదవి తెగి రూపమే మారిపోయిన సందర్భంలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ‘ప్లాస్టిక్ చోప్రా’ అనే వెక్కిరింపులు ఎదురయ్యాయి. అయితే ఇవేమీ తన విజయానికి అడ్డుపడలేకపోయాయి. పుస్తకం నుంచి మంచి వాక్యం: నీలాంటి వ్యక్తి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నువ్వు మాత్రమే. నీ బలాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నువ్వు మాత్రమే! -
‘మాటల మడుగు’ మెర్సీ.. ‘లవ్ లెటర్స్’ కడలి..
-
లవర్స్ మస్ట్ లెర్న్
ప్రేమను ఎలా నిర్వచిస్తాం? ఏయే సిద్ధాంతాలు చదవాలి ప్రేమను నిర్వచించడానికి? అసలు ‘ఈ’ సిద్ధాంతం ప్రేమకు సరిపోతుందని ఒకటి మనం చెప్పగలమా? ఎన్ని కథలు చెప్పుకున్నా ఇంకేదో మిగిలే ఉంటుంది. ఎప్పటికీ, ఎన్నివిధాలుగా, ఎన్ని కోణాల్లో చెప్పుకున్నా ఇంకా ఏదో చెప్పడానికి ఒకటి మిగుల్చుకున్న ఫీలింగే ప్రేమ. ఆ ప్రేమకు నిర్వచనం వెతుకుతూ కొందరు రచయితలు చెప్పిన మాటలివి... లవర్స్ మస్ట్ లెర్న్ వేలెంటైన్స్ డే రోజున ఒక యువకుడికి ‘ప్రేమంటే ఏమిటి?’ అన్న అనుమానం వస్తుంది. ‘‘స్నేహం+ రొమాన్స్ = ప్రేమ’’ లాంటి గందరగోళపు ఈక్వేషన్స్ వేసుకుంటూ మరింత అయోమయానికి లోనవుతూ ఉంటాడు. ప్రేమ గురించి ప్రాక్టికల్గా బోధించటానికి స్నేహితుడు చేసిన ప్రయత్నాలు ఫలించవు. పెళ్ళయిన మొదటి రాత్రి భార్యని అడిగే మొదటి ప్రశ్న కూడా అదే. ఆ అమ్మాయి కంగారు పడి ఏడ్చినంత పనిచేస్తుంది. ఒక రాత్రి ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. కన్నీళ్ళతో రాత్రంతా మంచానికి ఆనుకుని కూర్చుంటాడు అతను. అకస్మాత్తుగా అతడికి తన ప్రశ్నకి సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది. రచనా జీవితంలో ఇది నా రెండో కథ (1969). పేరు ‘లవర్స్ మస్ట్ లెర్న్’. ఫేస్బుక్లూ, చాటింగులు లేని రోజుల్లో రాసింది. ఇప్పటికీ ప్రేమ పట్ల నా అభిప్రాయం అదే. – యండమూరి వీరేంద్రనాథ్ ప్రేమ: ఒక అనిర్వచనం 1. జీవితం ఒక బాధ. ఆ బాధకు ఔషధం ప్రేమ. ప్రేమ ఒక బాధ. ఆ బాధకు ఔషధం లేదు – మీర్జా గాలిబ్. 2.ప్రేమ ఒక సక్రియాత్మక శక్తి. మనిషికీ, సమాజానికీ మధ్య గోడల్ని కూల్చే ఒక సాధనం. వైయక్తికతని పరిరక్షిస్తూ ఒంటరితనం నుంచీ, పరాయితనం నుంచీ వ్యక్తుల్ని విముక్తం చేసే ఒక ప్రక్రియ. ఇద్దరు వ్యక్తులు ఒక్కటైకూడా తిరిగి ఎవరికివారుగా మిగిలివుండగల అవకాశానికి అందమయిన ఒక అభివ్యక్తి. సమాన హృదయాల సంవేదనల మధ్య ఒక సున్నితమయిన సర్దుబాటు. నమ్మకం, నిజాయితీ, నిబద్ధత, సహనం, సమానత్వం, సహజీవనం, హక్కులు, బాధ్యతల సంయుక్త సమాగమం. ఇద్దరు వ్యక్తులు తమ అస్తిత్వాలను పణం పెట్టి ‘నేను‘ నుంచి ‘మనం‘ దిశగా ఇంద్రియ చైతన్యంతో చేసే ఒక అద్వైత శిఖరారోహణం. పరస్పరాహరణాన్ని పరిహరించే ఒక నైతిక పర్యావరణం. ప్రజాస్వామ్యం ప్రేమ అంతిమ సారాంశం. 3. వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టూ వన్ అండ్ వన్ ప్లస్ వన్ (1+1=1–1+1) – ఖాదర్ మొహియుద్దీన్ నిర్వచనం అనవసరం ప్రేమకు నిర్వచనం ఇవ్వడం అసాధ్యమే కాదు, అనవసరం కూడా. అది అందరి మధ్యా ఒకేలా ఉండదు. మనం ఒక ప్రేమబంధం నుంచి ఏం ఆశిస్తామన్నది ‘ప్రేమ’ మీద ఆధారపడివుండదు. మన మనస్తత్వం మీద ఆధారపడివుంటుంది. కొందరికి ప్రేమ అంటే ఎప్పుడూ కలిసివుండడం, మరికొందరికి ప్రేమ అంటే ఇద్దరూ అన్ని విషయాల్లోనూ ఒకేలా ఆలోచించడం, ఒకే అభిరుచి కలిగివుండడం. ఇంకొకరికి ప్రేమ అంటే ఒకరి కోసం మరొకరు త్యాగాలు చెయ్యడం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి ఇవేవీ ప్రేమ సమగ్ర స్వరూపాలు కావు. ప్రేమ ఎప్పుడూ సాపేక్షమైన విలువే. అందుకే తరచుగా స్త్రీపురుషులు ‘నాకు నీ మీద ఉన్నంత ప్రేమ నీకు నా మీదలేదు’ అని నిందలు వేసుకుంటూంటారు. ప్రేమకు ఎవరి కొలమానాలు వారివి. కానీ ప్రేమ గురించి ఒక్కటి మాత్రం నిజం. అది చచ్చిపోతే మళ్లీ బతకించలేం. బలవంతంగా బతికించాలని ప్రయత్నిస్తే అది ఇన్డిఫరెన్స్గా మిగిలిపోతుంది. సోమర్సెట్ మామ్ అన్నట్టు ఇన్డిఫరెన్స్ అన్నది ప్రేమకు అసలైన చావు. ద్వేషం కంటే కూడా బాధాకరం. ఎందుకంటే అది శాశ్వతం. మరైతే ప్రేమను నిలుపుకోవడానికి ఏం చెయ్యాలి? దీనికి కూడా శాశ్వత పరిష్కారాలు, చిట్కాలు లేవు. కానీ, ఒకరి నుంచి ఒకరు ఎక్కువ ఆశించడం మానేయాలి. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఎంత ఉండాలో, ఒకరికొకరు ‘స్పేస్’ ఇచ్చుకోవడం కూడా అంతగానూ ఉండాలి. అలా స్పేస్ ఇచ్చుకున్నప్పుడు అవిశ్వాసాలు, అనుమానాలు, ఈర్ష్యలు తలెత్తవు. – మృణాళిని ‘ఇదీ’ అని చెప్పలేం! గుండ్రంగా ఉండే భూమికి, దిక్కులు ఎలా నిర్ణయించగలం? సూర్యుడిని ఆధారం చేసుకుని, మార్మికమైన ఈ విశ్వానికి ఒక నిర్వచనం ఇచ్చుకుని... మనం మనుగడ సాగిస్తున్నాం. ప్రేమ కూడా అలాంటి ఒక ఆధారమే. మననీ, మానవ సంబంధాలను.. అర్థం చేసుకోటానికి పనికొచ్చే.. ఆధారం. అది జీవితంలో ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుంది, ఒక్కోలా అర్థమవుతుంది. ఏ దశకి ఆ దశ సత్యమే. ఆయా దశల్లో ఉండే ప్రేమ వల్ల వచ్చే బలం, బలహీనత, గ్రే షేడ్స్.. అన్నీ సత్యాలే. ఫలానా వ్యక్తి నిద్రలో ఫలానా కలని కనాలని ఎలా నిర్దేశించలేమో.. ప్రేమ అంటే ‘ఇది’ అని ఎవరూ సార్వజనీన నిర్వచనం ఇవ్వలేరు. – చైతన్య పింగళి ప్రాథమిక అవసరం ప్రేమ హృదయ సంబంధమైనది, వ్యక్తిగతమైంది. ఒక వ్యక్తిపట్ల గాఢమైన ఇష్టానికి లోనవ్వడం, ఆ వ్యక్తి సాన్నిహిత్యంలో స్వాంతన, శాంతి, భరోసా పొందటం ప్రేమ. పరస్పరం ఒక నమ్మకం, గౌరవం, సమానత్వ భావన కలిగి ఉండటం ప్రేమ. కులం, మతం, డబ్బు, హోదాలాంటి వాటికి తావులేదు. ఏ నిబంధనలు, అడ్డుగోడలు, పరిధులు లేని ప్రేమ పునాదిగా విలసిల్లే సమాజం ఏ దేశానికైనా అవసరం. ఆరోగ్యకరం. – డా. ఎమ్.ఎమ్. వినోదిని ఎందుకనిపిస్తుందో... ఎందుకనిపిస్తుందో... ఎప్పుడూ నాదే నాదే అయిన వొక ఆకాశం కావాలనీ నాదే నాదే అయిన వొక పూవు కావాలనీ– ఎక్కడ ఎలా పుడుతుందో తెలియని ప్రేమకి వొకే వొక్క అర్థాన్ని వెతుక్కోవడం ఐరనీ. అయినా అర్థాలు అడగడమూ, వెతుక్కోవడం మానేయలేని బలహీనత ఆ పదం చుట్టూ– నిండా ముంచెత్తే వానలో కురిసిపోవాలి అంతే, పారదర్శకమైన ఆ నీటి కణాల వెల్తుర్లో స్నానాలు చేయాలి అంతే. అన్నీ దగ్గిర దగ్గిరే వున్నట్టు అనిపించినా, చాలా వాటికి దూరమై పోయిన కాలం మనది. ‘‘నీకేం కావాలి?’’ అన్న ప్రశ్నకి సమాధానం కష్టమైన యుగం. పూలూ ఆకాశాలూ కూడా కేవలం వస్తువులైపోయినప్పుడు, వాటి మీద కూడా వ్యాపార ముద్ర పడిపోతుంది. అట్లాంటప్పడు ప్రేమ కూడా వస్తువే అయి, అమ్మకం మిగులుతుంది. నమ్మకం గుర్తు తెలియని శవమైపోతుంది. ఇంతా జేసి, ప్రేమ కావాలా వద్దా అంటే కావాలి, కొమ్మన పునర్జన్మ చిగురాకులానో, చిగురాకుల మధ్య వొదిగి మెరిసే చంద్ర చాపంలానో! – అఫ్సర్ ప్రేమ.. అసలివేవీ కానిది! నిజంగా నామీద ప్రేమ ఉంటే.. నువ్వు మారతావు. ప్రేమిస్తే సరిపోతుందా.. ఎలా పోషిస్తావు? నీకోసం నేనో కవిత రాశా. నన్ను ప్రేమిస్తే సరిపోదు, నా కుటుంబాన్నీ నీదనుకోవాలి. నువ్విలాంటి దాని(వాడి)వనుకోలేదు.. ఛీ. సారీ మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవట్లేదు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కనీసం ఒక కారు లేదు.. ఎలా? ఇష్టంలేదంటే.. చంపేస్తాను. మా విషయం వేరు, మేం పెళ్లి చేసుకున్నాం. ఆకాశమంత ప్రేమ ఉంది.. కానీ పరిస్థితులూ.. ప్రేమ! బోల్డంత నాటకం నడుస్తుంది ఈ మాట చుట్టూ. కథలు, కవితలు, నాటకాలు, సినిమాలు, పుస్తకాలు, యూట్యూబ్ చానళ్లూ, వాట్సాప్ ఫార్వార్డ్లు.. ఎక్కడ చూస్తే అక్కడ, బోల్డంత ప్రేమ! వ్యక్తులనూ, వ్యవస్థలనూ, వ్యాపారాలనూ నిలబెట్టే ఆలంబన ప్రేమ. ప్రేమ.. సంస్కృతి, సంస్కారం, సంసారం. మానసికం, శారీరకం, సామాజికం. విలువలు, వలువలూ, ముసుగులూ. ఆనందం, విషాదం. ఉత్సాహం, ఉన్మాదం. ప్రేమ! ప్రేమ! అసలివేవీ కానిది. అసలదేంటో నీకు, నాకూ, ఎవ్వరికీ తెలియనిది. – అపర్ణ తోట గులాబీలు ఇవ్వడం కాదు! ప్రేమ అనే విశాలమైన విస్తృతమైన భావానికి నిర్వచనం ఎలా చెప్తాను? అందులో ఎన్ని కాంపోనెంట్స్ వుంటాయి! దయ వుంటుంది. క్షమ వుంటుంది. కరుణ వుంటుంది. గౌరవం వుంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన ఆత్మగౌరవం వుంటుంది. గులాబీలు ఇవ్వడం కాదు. తను ఇష్టపడిన, మోహపడిన వ్యక్తి స్వేచ్ఛను గౌరవించడం ప్రేమ!! – పి. సత్యవతి -
ఇంతకన్నా గొప్ప స్క్రిప్ట్ ఇవ్వగలరా?: వర్మ
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ రచయితలకు ఓ సవాల్ విసిరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు మించిన స్క్రిప్ట్ అందిచగలరా అని ప్రశ్నించారు. ఓ వైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం, ఆయన కొడుకు కార్తీల సీబీఐ విచారణ, కాంగ్రెస్ అవినీతి, బీజేపీ ప్రతీకారం, మనీ లాండరింగ్, నీరవ్ మోదీ బ్యాంకుల కుంభకోణం, ఇంద్రాణి ముఖర్జీ హత్య కేసులను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. వీటన్నిటి కన్నా బలమైన స్క్రిప్ట్తో గొప్ప బాలీవుడ్ రచయితలు ముందుకు రాగలారా? నాకు సందేహమే అని ట్వీట్లో పేర్కొన్నాడు. వర్మ చేసిన ఈ సెటైరిక్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Chidambaram, Karti his Son , Congress Corruption,BJP Vendetta,Money laundering , Nirav Modi , bank scams,Indrani mukherjea and Murder..ALL IN ONE.. Whoaaaa I doubt if the best of Bollywood script writers can come up with a more wilder script than this 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 2 March 2018 -
ఫిరాఖ్, ఫైర్ సినిమాలను తీయగలమా?
సాక్షి, కోల్కతా: నటి, దర్శకురాలు నందితా దాస్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నటులు, రచయితలకు ఇది గడ్డుకాలమని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమని పేర్కొన్నారు. గతంలో తీసిన కళాత్మక, ఉత్తమ సినిమాలను ఇపుడు తీయగలమా అనే భావం కలుగుతోందన్నారు. సంజయ్ లీలా బన్సాలీ చిత్రం పద్మావత్ వివాదంపై స్పందించిన నందితా దాస్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టాటా స్టీల్ సాహిత్యోత్సవంలో పాల్గొన్న ఆమె ఫిరాఖ్,(గుజరాత్ మతవిద్వేషం,మానవహననం నేపధ్యంలో సాగే కథ, నందితా దాస్ దర్శకత్వంలో తొలి చిత్రం, ఉత్తమ చిత్రం అవార్డు ) (2008) , ఫైర్(1996) లాంటి చిత్రాలు తీయడం తనకు ఇపుడు సాధ్యమో కాదో తెలియదుకానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మూవీలు తీయడం ఎప్పటికీ సాధ్యంకాదని అన్నారు. అలాగే ఎన్నోఏళ్ల క్రితం శ్యాం బెనగల్ తీసిన భారత్ ఏక్ ఖోజ్ సినిమాలో పద్మావతికి సంబంధించిన అంశం ఉంటుందని తెలిపారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. అలాంటి చిత్రాలను స్వాగతించాం, కానీ ఇపుడు నటులు, రచయితలు భయానక సమయంలో ఉన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా..ముందుగానే రచయితలు మరింత బాధ్యతగా, సెల్ఫ్ సెన్సార్గా ఉండాలని సూచించారు. దురదృష్టవశాత్తూ సమాజంలోని కొన్ని వర్గాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ అసమ్మతి , భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిని పెంచినప్పటికీ , హింసను ప్రేరేపించడం దారుణమన్నారు. మనకు ప్రతీ సినిమా నచ్చాలని లేదు. అలాగే నచ్చని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసే ప్లాట్ఫాంలు కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆ స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. అలాకాకుండా హింసామార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా తన అప్కమింగ్ మూవీ మాంటోకు సంబంధించన వివరాలను పంచుకున్నారు. విభజన సమయంలో (1946-50) రచయిత సాడాత్ హసన్ మాంటో జీవితంపై ఆధారపడి తీస్తున్న చిత్రానికి సంబంధించి కంటెంటే తనకు ప్రధానమని చెప్పారు. -
ఖదీర్బాబు, సుజాతాదేవికి ‘పెద్దిభొట్ల’ పురస్కారం ప్రదానం
విజయవాడ కల్చరల్: ప్రముఖ కథా రచయిత, కథా పరిశోధకుడు మహ్మద్ ఖదీర్బాబు, బాల సాహిత్య కథా రచయిత్రి డి.సుజాతాదేవి 2017 సంవత్సరానికి గాను పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారాలను అందుకున్నారు. పెద్దిభొట్ల స్ఫూర్తి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన సభలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ రచయిత, కాలమిస్ట్ శ్రీరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల జీవితాలే పెద్దిభొట్ల కథా వస్తువులని, యువ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పురస్కారాల నిర్వాహకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య మాట్లాడుతూ తెలుగు కథా ప్రపంచానికి సేవలు చేస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాలు అందిస్తున్నామన్నారు. సభకు అధ్యక్షత వహించిన అరసం (అభ్యుదయ రచయితల సంఘం) జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెద్దిభొట్ల రాసిన కథలన్నీ ఆణిముత్యాలేనని వివరించారు. ఆయన కథలు ఆంగ్లంలోకి, రష్యన్ భాషలోకి అనువదించబడ్డాయన్నారు. కథారచయితలను లయోలా కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ పరిచయం చేశారు. పురస్కారాలు అందుకున్న ఖదీర్బాబు, సుజాతాదేవి తమ స్పందన తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యురాలు వేలూరి గీతారాణి, ఎవీకే ఫౌండేషన్ నిర్వాహకులు అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గురజాడ పురస్కారానికి జిల్లా కవుల ఎంపిక
– ఈనెల 8న తిరుపతిలో పురస్కారం అందుకోనున్న కర్నూలు కవులు కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): గురజాడ వేంకట అప్పారావు అంతర్జాతీయ ఫౌండేషన్ ఏటా నిర్వహించే గురజాడ స్ఫూర్తి ఉత్సవాలు–2017కు జిల్లాకు చెందిన 10 మంది కవులు ఎంపికైనట్లు ఫౌండేషన్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పుల్లా రామాంజనేయులు గురువారం తెలిపారు. జిల్లాకు 10 మంది చొప్పున రాయలసీమ జిల్లాల్లో 40 మందిని ఎంపిక చేశామన్నారు. కర్నూలు సిల్వర్ డిగ్రీ కళాశాల తెలుగుశాఖాధిపతి డాక్టర్ విజయ్కుమార్, విశ్వవాణి కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్.కే. మద్దిలేటి, రాయలసీమ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ పేరం ఇందిరాదేవి, నంద్యాల దంతవైద్యుడు డాక్టర్ కిశోర్కుమార్, కర్నూలు జిల్లా సాహితీ స్రవంతి అధ్యక్ష, కార్యదర్శులు జంధ్యాల రఘుబాబు, కెంగార మోహన్, మద్దికెర జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కే.సురేష్బాబు, కొలిమిగుండ్ల కళాస్రవంతి వ్యవస్థాపక కార్యదర్శి పల్లోలి శేఖర్బాబు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా నాయకుడు కే.సీ మల్లికార్జున, రచయిత సోమభూపాల్కు ఈ పురస్కారాలను జ్యూరీ కమిటీ ప్రకటించిందన్నారు. ఈనెల 8న తిరుపతిలోని కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రంలో జరిగే సాహిత్య సభలో వీరికి పురస్కారాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సాహితీకారులకు ప్రోత్సాహం ముఖ్యం
కడప కల్చరల్: సాహితీకారులను ప్రోత్సహిస్తే వారి కలాలు మరింత పదునెక్కి ప్రజల పక్షంగా, సమాజాభివృద్ధి పక్షంగా నిలుస్తాయని కవిత విద్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. లలిత కళానికేతన్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వైవీయూ లలిత కళల విభాగం అధిపతి డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి శనివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో సాహితీకారుల అభినందన సభ నిర్వహించారు. ఇటీవల నందలూరులో ఎస్.దస్తగిరి సాహెబ్ స్మారక సాహిత్య పురస్కారాలు పొందిన కథా రచయిత పాలగిరి విశ్వప్రసాద్రెడ్డి, సాహితీవేత్త డాక్టర్ తవ్వా వెంకటయ్య, కొండూరు పిచ్చమ్మ నారాయణరాజు స్మారక సంస్థ అధ్యక్షులు కొండూరు జనార్దన్రాజులను అభినందించారు. ఇంకా జానమద్ది విజయభాస్కర్, గంగనపల్లి వెంకట రమణ, భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, శివారెడ్డి, యల్లేశ్వరరావు, శివారెడ్డి మాట్లాడారు. సత్కార గ్రహీతలు ధన్యవాదాలు తెలిపారు. -
కవులు, పత్రికల ఆలోచన విధానం మారాలి
జేసీ రాంకిషన్ జడ్చర్ల టౌన్ : కవులు, పత్రికల ఆలోచన విధానం మారాలని, సానుకూల ధక్పథంతోపాటు సంఘటితంగా ముందుకు సాగితే పాలమూరు జిల్లా రూపురేఖలు మారతాయని జేసీ రాంకిషన్ అన్నారు. శనివారం జడ్చర్ల బూర్గుల రామకష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలతోపాటు, పాలమూరు జిల్లా సాహితి వికాసం సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరువు, వలసలు, లేబర్ జిల్లాగా పాలమూరును వర్ణించటం సబబు కాదని, అలా ఎందుకు మారిందని ఆలోచించాలన్నారు. విద్య, వైద్యంలో వెనకబడిపోవటం వల్లే పాలమూరు అభివద్ధి కుంటుపడిందని, అక్షరాస్యత శాతం పెరిగితేనే వనరుల సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అందుకే బాగా చదువుకుని మీరే మార్పు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పత్రికల్లోనూ నెగెటివ్ వార్తలు కాకుండా పాజిటివ్ వార్తలు వ్రాయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ఎంతో అనుకూలమైన జిల్లాగా పాలమూరు ఉందని, ఏడాదికిందట పారిశ్రామిక వేత్తలతో కొత్తురూలో సమావేశం నిర్వహించగా ఊహించినదానికన్నా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. కష్ణాపుష్కరాల్లో సేవలందించిన ఎన్ఎస్ఎస్ వలంటీర ్లకు ప్రశంస పత్రాలను అందజేశారు. అంతకు ముందు ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భక్తవత్సల్రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ అనంత్రెడ్డి, కార్యదర్శి నటరాజ్, లయన్స్క్లబ్ అధ్యక్షుడు విశ్వనాథం, సభ్యులు ప్రవీణ్కుమార్, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు తమ్మిరెడ్డి, అశోక్కుమార్, జ్యోతి, ప్రియాంకలు పాల్గొన్నారు. -
ఆసక్తికరంగా రచయితలతో ముఖాముఖి
మలక్పేట : లేఖిని మహిళా చైతన్య సాహితి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రచయితలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని శ్రీసాయి అపార్ట్మెంట్లో జరిగిన ఈ ఈ కార్యక్రమానికి కళారత్న అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె. రామలక్ష్మీ ఆరుద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహిత్య, వ్యక్తిత్వ విలువలు, జీవిత అనుభవాలను నేటి రచయిత్రులతో పంచుకున్నారు. తాను సబ్ ఎడిటర్గా పనిచేసిన సమయంలో జర్నలిజం విలువలను వివరించారు. రచనలు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడారు. సంస్థ అధ్యక్షురాలు వాస ప్రభావతి అధ్యక్షతన జరిగిన ముఖాముఖిలో శీల సుభద్ర, విహారి, సుధమా, శీల వీర్రాజు, కే.బీ. లక్ష్మీ, హైమావతి భీమన్న, తిమిరిష జానకి, పోలప్రగడ రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
'ఐలయ్యకు రక్షణ కల్పించాలి'
సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడేళ్లుగా దేశంలో అసమ్మతిని తప్పుడు పద్దతుల్లో బలవంతంగా అణచివేసే కార్యక్రమం పాలకవర్గ భావజాల మద్దతుతో అధికారికంగా జరుగుతోందని పలువురు రచయితలు ఆందోళన వ్యక్తం చేవారు. ఈ మధ్య ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై బ్రాహ్మణ సంఘాలు బెదిరింపులకు దిగడం ఈ కోవలోకే వస్తాయని, సమాజానికి మేథో దీపదారులుగా ఉండే ఉపాధ్యాయులు, రచయితలు, బుద్ధిజీవులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగానే ఐలయ్యపై దాడిగా భావిస్తున్నామని రచయితలు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ విప్లవకవి వరవరరావు, జీఎస్.రామ్మోహన్, పి.వరలక్ష్మి, ఎన్.వేణుగోపాల్, డాక్టర్ సూరేపల్లి సుజాత, స్కైబాబా, ఎండ్లూరి సుధాకర్ సహా 88 మంది రచయితలు ఒక ప్రకటన విడుదల చేశారు. మేధావి వర్గంపై భౌతిక దాడులు జరగడం, మానసిక ఆందోళనకు గురిచేయడం, ప్రాణ భయానికి లోను చేయడం, ప్రత్యామ్నాయ ప్రభుత్వంల్లా వ్యవహరించడం ఇటీవల బాగా పెరిగిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ఐలయ్యపై కేసులు పెట్టడం, భౌతికంగా బెదిరించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఇది సరైన ప్రజాస్వామిక ధోరణి కాదని భావిస్తూ రచయితలుగా ఖండిస్తున్నామన్నారు. నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కాల్బుర్గి వంటి రచయితల మీద జరిగిన దాడులకు కొనసాగింపుగానే ప్రొఫెసర్ ఐలయ్యపై దాడులు జరుగుతున్నట్లు భావిస్తున్నామన్నారు. ఐలయ్యకు తక్షణం రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక వాదలుఉ, ప్రగతి వాదులు ఐలయ్యకు మద్దతుగా నిల వాలని రచయిత లంతా తమ ప్రకటనలో కోరారు. -
ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే
ఖాసింపై కేసు ఎత్తివేయాలన్న కవులు, రచయితలు హైదరాబాద్: ప్రజాస్వామిక తెలంగాణ, విప్లవోద్యమం కోసం పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం కుట్ర కేసు పెట్టడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని విరసం నేత వరవరరావు అన్నారు. రచయితగా, సంపాదకుడిగా, ప్రొఫెసర్గా ప్రజల్లో పనిచేస్తున్న ఖాసింపై ప్రభుత్వం ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఈ సమావేశంలో వరవరరావు మాట్లాడుతూ... తెలంగాణలో భావ స్వేచ్ఛను దారుణంగా అణచివేస్తున్నారన్నారు. ఈ ప్రమాదాన్ని మొగ్గలోనే అరికట్టాలన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... తెలంగాణ అవతరించడానికి టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కారణం కాదన్నారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలుండటమే నేరమైతే, వారితో నాడు శాంతి చర్చలు జరిపిన ఐదుగురు మంత్రులు కూడా దేశ ద్రోహులు అవుతారని అన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత... ‘మా భావాలపై కత్తులు పెట్టకండి’ అన్నారు. అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువల కోసం ఎవరు మాట్లాడినా వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు. కొనదలిచిన వారిని కొనుక్కుంటున్నారు... కొనటానికి వీలు లేని వారిపై కేసులు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులపై ఆంధ్ర ప్రభుత్వం కూడా పెట్టని కేసులను తెలంగాణ ప్రభుత్వం పెడుతోందన్నారు. తెలంగాణ వ్యతిరేకులంతా మంత్రులయ్యారన్నారు. ప్రొఫెసర్ ఖాసిం మాట్లాడుతూ... తెలంగాణ కోసం పోరాడిన ప్రతి సమయంలోనూ మాపై కేసులు మోపారన్నారు. రచయిత నందిని సిధారెడ్డి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, ప్రజా కళామండలి కోటి తదితరులు పాల్గొన్నారు. -
లండన్లోనూ తప్పని 'అసహనం' సెగ
లండన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని అసహనం తాలూకు నిరసనలు వదిలేలా లేవు. దేశలో అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు, మేధావులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన మోదీకి అక్కడ కూడా ఇదే తరహా నిరసన వ్యక్తమౌతుంది. భారత్లో పెరుగుతున్న అసహనంపై చర్యతీసుకోవాలని మోదీకి సూచించాల్సిందిగా కోరుతూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్కు అక్కడి రచయితలు బహిరంగ లేఖ రాశారు. దీనిలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీతో పాటు సుమారు రెండు వందల మంది రచయితలు సంతకం చేశారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత్లో ఛాందసవాదం, భయానకమైన పరిస్థితులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని, విమర్శకుల గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందనీ దీనిపై మోదీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మోదీ పర్యటన సందర్భంగా మరో వర్గం బ్రిటన్ పార్లమెంట్ భవనంపై 'మోదీ నాట్ వెల్కమ్' అంటూ పోస్టర్ను ప్రొజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అరువు తెచ్చుకున్న హాస్యం!
కథ బలహీనంగా ఉన్నా, కథనం పేలవంగా ఉన్నా... హాస్యం సినిమాని నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే రచయితలు, దర్శకులు కామెడీ పైన బాగా ఆధారపడుతున్నారు. అలా అని అసలు కథే లేకుండా కామెడీతో సరిపెట్టుకోమంటే ఒప్పుకోరు ప్రేక్షకులు. అందుకే కాస్త బలమున్న కథకు, మంచి కామెడీని అద్ది అందించే ప్రయత్నం చేసు ్తన్నారు దర్శకులు. అలాంటి ఓ ప్రయత్నమే ‘అహ నా పెళ్లంట’! ఇదే పేరుతో గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా జంధ్యాల తీసిన చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. మళ్లీ అదే పేరుతో 2011లో దర్శకుడు వీరభద్రమ్ ఓ చిత్రాన్ని తీశారు. అల్లరి నరేశ్ హీరో. హాస్య చిత్రమే అయినా... చక్కని కథా బలం, మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇందులో. అయితే అవేవీ ఒరిజినల్ కాదు. ఒక కొరియన్ సినిమా నుంచి కొట్టుకొచ్చినవి! అల్లరి నరేశ్ ఓ పెద్ద కంపెనీలో పని చేస్తుంటాడు. చేతినిండా డబ్బు... అందమైన గాళ్ఫ్రెండ్... జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుం టున్న సమయంలో ఓ రోజు... పార్టీలో బాగా తాగి ఇంటికి వెళ్లి పడుకుంటాడు. ఉదయం లేచేసరికి పక్కన హీరోయిన్ ఉంటుంది. తను ఎవరో, అక్కడికెలా వచ్చిందో అర్థంకాదు. ఆమెనడిగితే తనకూ తెలియదంటుంది. అవమానంతో ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాతి రోజు హీరోయిన్ అన్నలు నరేశ్ని వెతుక్కుంటూ వస్తారు. తమ చెల్లెలిని పెళ్లి చేసుకొమ్మని కొడతారు. తెలిసి చేయలేదని ఎంత చెప్పినా వినరు. దాంతో హీరోయిన్ని కలిసి, వైద్య పరీక్షలు చేసుకొమ్మని కోర తాడు నరేశ్. టెస్ట్ చేస్తే ఇద్దరి మధ్య ఏం జరగలేదని తెలుస్తుంది. ఆ విషయం అన్నలకు చెప్పడానికి ఊరు వెళ్తారు. అప్పటికే వాళ్లిద్దరికీ పెళ్లి కుదిరిపోతుంది. ఆ పెళ్లి చెడగొట్టుకుని ఎలాగైనా తన గాళ్ప్రెండ్ను పెళ్లి చేసుకోవాలని నరేశ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ క్రమంలో తనలాంటి మంచి కుర్రాడు తమ చెల్లెలికి భర్త కావాలన్న ఉద్దేశంతో హీరోయిన్ అన్నలే ఇదంతా ప్లాన్ చేశారని తెలీడం, గాళ్ఫ్రెండ్ కూడా మంచిది కాదని తెలీడం, హీరోయిన్ పట్ల ప్రేమ పుట్టడం, ఆమెనే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇదీ ‘అహ నా పెళ్లంట’ కథ. ఈ కథ తాము వండిందే అని చిత్ర దర్శకుడు తన పేరు వేసుకున్నా, అది ఏమాత్రం నిజం కాదు. ఆల్రెడీ కొరియన్వాళ్లు వండినదాన్ని తెచ్చి ప్లేటులో పెట్టి మన ప్రేక్షకులకు వడ్డించేశారంతే. ‘గమునియ్ యాంగ్ వాంగ్’ అనే కొరియన్ సినిమాని 2002లో ‘మ్యారీయింగ్ ద మాఫియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఒరిజినల్ చూసి ఇన్స్పయిర్ అయ్యారో, అనువాదం చూసి ముచ్చటపడ్డారో తెలియదు కానీ... అమాంతం ఎత్తుకొచ్చి‘అహనా పెళ్లంట’గా తీసేశారు. కథతో పాటు కథనాన్నీ మొహ మాటపడకుండా దింపేశారు. మోగుతున్న అలారాన్ని ఆపి, లేచి, కళ్లజోడు పెట్టుకుని, తన కాలు అనుకుని హీరోయిన్ కాలుని గోకుతాడు హీరో. అప్పుడే తన పక్కన ఒకమ్మాయి పడుకుని ఉందని తెలుస్తుంది. దీన్ని అచ్చంగా తీసేశారు. చివరికి అక్కడి హీరోకి కళ్లజోడు ఉందని ఇక్కడ కూడా వాడటం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ అన్నలు హీరోని ముప్పు తిప్పలు పెట్టడం, వాళ్లతో హీరో తన కుటుంబానికి మీటింగ్ ఏర్పాటు చేయడం, హీరో హీరోయిన్లు దగ్గరయ్యే సమయానికి గాళ్ఫ్రెండ్ వచ్చి డిస్టర్బ్ చేయడం లాంటి సన్నివేశాలన్నీ మనవాళ్లు బయటకు చెప్పని మాతృకలో ఉన్నవే. హీరోయిన్ తండ్రికి చెస్ ఆడే అలవాటుంటుంది. అది పెట్ట డానికి కారణం... ఒరిజినల్లో హీరోయిన్ తండ్రికి రాళ్లతో ఆడే ఒక రకమైన ఆట అంటే ఇష్టం కావడమే. ఇలా చాలా సీన్లు దించేశారు. పలు చోట్ల సంభాషణలు కూడా ఒకేలా ఉంటాయి. అయితే తెలుగులో దర్శకుడు కామెడీ డోస్ బాగా పెంచారు. నరేశ్కి బాస్గా బ్రహ్మా నందం క్యారెక్టర్ని హైలైట్ చేసి కడుపుబ్బ నవ్వించారు. హీరో మంచితనాన్ని హీరో యిన్ అర్థం చేసుకునే సన్నివేశాల్ని ఆకట్టు కునేలా తీశారు. అలాగే క్యారెక్టరయి జేషన్సలోనూ మార్పు చేశారు. మాతృకలో హీరోయిన్ తండ్రి, అన్నలు గ్యాంగ్స్టర్స్ అయినా కామెడీగా కనిపిస్తారు. కానీ తెలుగులో వాళ్లను సీరియస్గా చేశారు. నాగినీడుతో తండ్రి, శ్రీహరితో పెద్దన్నయ్య పాత్రలు చేయించారు. దాంతో పాత్రలు బరువెక్కి ఆకట్టుకున్నాయి. ఈ విధంగా కొన్ని మార్పులైతే చేశారు. కాకపోతే ముఖ్యమైన సన్నివేశాలన్నీ మాత్రం ఎత్తుకొచ్చారు. ఏదైతేనేం, సినిమా హిట్టు కాబట్టి కాపీ సంగతి మర్చిపోవడమే! -
అనవసరం రాద్ధాంతం నాకు నచ్చదు
న్యూఢిల్లీ: రచయతలు, సినీ దర్శకులు, చరిత్రకారులు తీసుకున్న నిర్ణయంపై వ్యాఖ్యానించేందుకు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తిరస్కరించారు. అవసరమైన వ్యాఖ్యానాలు చేసి లేనిపోని వివాదాలు సృష్టించడం తనకు ఇష్టంలేదన్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీగాగా పేరున్న అమితాబ్.. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని సూచించారు. సెలబ్రిటీ వీడియో బ్లాగింగ్ అప్లికేషన్ వాకౌను గురువారం లాంచ్ చేసిన అమితాబ్ అవార్డులను వెనక్కి ఇస్తున్న వైనం స్పందించాలని మీడియా కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ''అది ఒక ప్రత్యేక పరిస్థితి. ఆచితూచి మాట్లాడాల్సిన సమయం. సెల్రబిటీలు విచక్షణ మర్చిపోయి వ్యాఖ్యానిస్తే పరిస్థితి విషమించే అవకాశం ఉంది'' అని ఆయన కామెంట్ చేశారు. కొంతమంది సెల్రబిటీలు మనసుకు తోచిన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారన్నారు. రెండో ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారని, నిజంగా వాళ్ల ధైర్యానికి మెచ్చుకోవాలంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాస్పద అంశాలపై మాట్లాడేటపుడు సంయమనాన్ని పాటిస్తానని చెప్పుకొచ్చారు. వివాదాన్ని సృష్టించడం తనకు ఇష్టం ఉండదని, అనసర రాద్ధాంతం చేయడం తనకు నచ్చదన్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిట్ కొట్టేసిన బిగ్ బి.. మేధావులు, రచయితలు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇచ్చేయడంపై మాత్రం స్పందించడానికి నిరాకరించారు కాగా కల్బుర్గి దారుణహత్య, దేశంలో పెరుగుతున్న మత ఘర్షణలు, అసహనానికి నిరసనగా చాలామంది రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను, సినీ దర్శకులు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. అటు ఈ వ్యవహారంపై భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఉద్యమబాటలో రచయితలు
న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కు ఇచ్చేసిన రచయితలు మరో ముందడుగు వేశారు. వారు మత అసహనంపై ఉద్యమ బాట పట్టారు. దేశంలో రచయితలు, సామాజిక ఉద్యమకారులు, మేధావులపై జరుగుతున్న హత్యాకాండలు, బీఫ్ వివాదంలో ఓ వ్యక్తిని హత్య చేయడంవంటి ఘటనలపట్ల వారు పలువురు రచయితలు, కళాకారులతో కలసి ఢిల్లీ నడి వీధుల్లో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం వారంతా చేతిలో ప్లకార్డులు, నోటికి నల్లరంగు గుడ్డలు కట్టుకొని మౌన ప్రదర్శనతో ఢిల్లీ వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ.. దానిని నిలువరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యాయం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలిపారు. ఇప్పటి వరకు 40 మంది తమకు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చి వేసిన విషయం తెలిసిందే. ఎంఎం కాల్చుర్గి, హేతువాది నరేంద్ర దాబోల్కర్, గోవింద్ పన్సారే వంటి ప్రముఖులు, బీఫ్ వివాదంలో ఉత్తరప్రదేశ్ లో ఓ ముస్లిం వ్యక్తిని హత్య చేయడంపట్ల నిరసన వ్యక్తం చేస్తూ వారు శుక్రవారం ఈ మౌన ప్రదర్శన చేపట్టారు. -
అవార్డులు వెనక్కివ్వాలా.. ఊహూ నేనివ్వను!
తిరువనంతపురం: దేశంలో జరుగుతున్న పలు ఘటనలకు నిరసనగా పలువురు రచయితలు తమకు గతంలో వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న విషయం ప్రముఖ నటి, నృత్యకారిణి శోభనకు అస్సలు తెలియదట. దీనికితోడు వారికి లేటు వయసులో అవార్డు వచ్చి ఉంటుంది, అందుకే ఇచ్చేశారు.. తాను మాత్రం అవార్డును తిరిగి ఇచ్చేది లేదని కుండబద్దలుకొట్టి మరీ చెప్పింది. కేరళలో జరుగుతున్న 38వ సూర్య ఫెస్టివల్ కోసం తిరువంతనపురం వచ్చినపుడు మీడియా ప్రశ్నించగా శోభన ఈ కామెంట్స్ చేసింది. యూపీలో జరిగిన దాద్రి ఉదంతం గురించి తనకు అస్సలు తెలియనే తెలియదని సెలవిచ్చింది. 'ఏ అవార్డు? అవార్డులు తిరిగి ఇచ్చారా, ఎవరు.... ఏమో నాకు తెలియదు' అంటూ తిరిగి విలేకరులకే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. దీనికి తోడు.. తాను మాత్రం తనకు వచ్చిన అవార్డును తిరిగి ఇచ్చేది లేదని చెప్పేసరికి విలేకరులు కంగుతిన్నారట. దీనిపై ఆమెకు కొంత వివరణ ఇచ్చిన మీడియా, ఈ ఘటనలపై వ్యాఖ్యానించాలని ఇంకొంచెం ఒత్తిడి చేయగా.. బహుశా పెద్ద వయసులో వచ్చింది కాబట్టి వాళ్లు అవార్డులను తిరిగి ఇస్తున్నారేమో...తనకు వచ్చిన అవార్డును మాత్రం ఇవ్వనని కరాఖండిగా తేల్చేసిందిట. ప్రసిద్ధ కన్నడ రచయిత ఎంఎం కల్బుర్గీ హత్య, దాద్రిలో ముస్లిం వృద్ధుని హత్య నేపథ్యంలో దాదాపు 12 మంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన నటి శోభనకు కేరళ రచయిత్రి సారా జోసెఫ్ సహా, కొంతమంది ప్రసిద్ధ రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడం గురించి తెలియకపోవడం ఏంటని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
రచయితలపై తస్లీమా ఫైర్
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని నిరసన వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితల సంఖ్య 30కి చేరింది. ఒకవైపు రచయితలు వరుసపెట్టి తమ పురస్కారాలను వాపస్ ఇస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం వారి నిరసన కల్పితమైనదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై తాజాగా భారత్లో ప్రవాసముంటున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారతీయ రచయితలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై దాడి జరిగినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా అన్యాయాలపై నిరసన తెలియజేయడం తప్పేమీ కాదన్నారు. ఇది కల్పిత నిరసన అని ప్రభుత్వం చేస్తున్న వాదనతో తాను ఏకీభవించడం లేదని, రచయితలు రాజకీయంగా, సామాజికంగా స్పృహ కలిగిన వ్యక్తులని పేర్కొన్నారు. 'నా పుస్తకం పశ్చిమ బెంగాల్లో నిషేధించినప్పుడు, నాపై భారత్లో ఐదు ఫత్వాలు జారీచేసినప్పుడు, బెంగాల్ నుంచి నన్ను వెళ్లగొట్టినప్పుడు, ఢిల్లీలో నెలపాటు నన్ను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు చాలామంది రచయితలు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ జీవించడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఈ విషయంలో రచయితలు మౌనంగా ఉండటమే కాకుండా.. సునీల్ గంగూలీ, శంఖా ఘోష్ వంటి రచయితలు నా పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టచార్యకు కోరారు కూడా' అని తస్లీమా పేర్కొన్నారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారత రచయితలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ఇక్కడ లౌకికవాదమూ సమస్యే! భారత్లో లౌకికవాదం అనుసరించే విధానంలోనూ సమస్య ఉందని, చాలామంది లౌకికవాదులు ముస్లింలకు అనుకూలంగా, హిందూ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని తస్లీమా పేర్కొన్నారు. వారు హిందూ ఛాందసవాదుల చర్యలను నిరసిస్తారు.. అదేసమయంలో ముస్లిం ఛాందసవాదుల దారుణమైన చర్యలను సమర్థిస్తారని తెలిపారు. -
'వెనక్కి ఇవ్వడం అగౌరవపర్చడమే!'
తిరువనంతపురం: దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ ప్రముఖ రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భిన్నంగా స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అండగా నిలబడే హక్కు రచయితలకు ఉందంటూనే.. వారు అవార్డులు వాపస్ ఇవ్వడం ఖండించారు. పురస్కారాలను వెనక్కి ఇవ్వడమంటే.. ఆ గుర్తింపును అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. 'పలువురు రచయితలు అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడంపట్ల వ్యక్తిగతంగా నేను చింతిస్తున్నాను. మేధస్సు,సాహిత్యం, సృజనాత్మకత, విద్య పాండిత్యానికి గుర్తింపు ఈ పురస్కారం. ఇది రాజకీయ చర్య కాదు' అని ఆయన గురువారం మిక్కడ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. 'సాహిత్య అకాడమీ ఒక స్వతంత్ర సంస్థ. మనకున్న ఆందోళన రాజకీయపరమైనది. రచయితలు ఈ రెండింటి మధ్య గందరగోళపడొద్దు. ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పాటుపడాల్సిందే. అంతేకానీ.. పురస్కారాలను అగౌరవపరచవద్దు' అని ఆయన పేర్కొన్నారు. -
'మీదే అసహనం.. కల్పిత నిరసన!'
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అహసనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ పురస్కారాలను వాపస్ ఇవ్వడాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. తమ భావజాలంలోని అసహనం చేతనే వారు కల్పిత నిరసనతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ ఆవుమాంసం తిన్నారనే ఆరోపణలపై దాద్రిలో మహ్మద్ అఖ్లాఖ్ను చంపడం తీవ్ర దురదృష్టకరమని, గర్హనీయమని పేర్కొన్నారు. దాద్రి ఘటన నేపథ్యంలో పలువరు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులు వెనక్కి ఇవ్వడం వెనుక వారి ఉద్దేశాలు ఏమిటని ప్రశ్నించారు. 'ఇది నిజమైన నిరసనా? లేక సృష్టించినదా? ఇది భావజాల అసహనం కాదా?' అని జైట్లీ ప్రశ్నించారు. వామపక్ష వాద, నెహ్రూవియన్ రచయితలు మోదీ ప్రభుత్వంతో తమకు సరిపడటం లేదనే నిరసనలకు పూనుకుంటున్నారని విమర్శించారు. -
'ఎందుకింత రాద్ధాంతం'
సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్న పరిణామాలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..దేశంలో ఎన్నో పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి నిరసనలు తెలుపలేదని.. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జన్సీ విధించినప్పుడు, ఏడాదిన్నర క్రితం జరిగిన ముజఫరాబాద్ అల్లర్ల సమయంలోకూడా మౌనంగా ఉన్నవారు ఇప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ఈ ఘటనలపై మాట్లాడారనీ అయినప్పటికీ ఈ ఘటనలపై విమర్శలు ఆపకపోవడం విచారకరమని రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పురస్కారాలు పొందిన పరిశోధకులు, రచయితలపై తమకు గౌరవం ఉందనీ.. వారి సేవలను, ప్రతిభను గుర్తిస్తూ ఇచ్చిన పుస్కారాలుగా వాటిని చూడాలన్నారు. కాగా దాద్రీ ఘటన, కన్నడ రచయిత కాల్బుర్గి హత్యల నేపథ్యంలో రచయితలు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. రచయితలు, సాహితీ వేత్తలతో పాటు అనువాదకులు సుమారు 27 మంది తమకు లభించిన సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ రచయిత్రి దలిప్ కౌర్ ఏకంగా తనకు లభించిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేశారు. -
సల్మాన్ రష్దీ- రైటర్స్ బ్లాక్...
1980లలో ఒకసారి నాకు రైటర్స్ బ్లాక్ వచ్చింది. ఇది అందరు రచయితలకూ వచ్చేదే. ఏమనుకున్నా రాయలేకపోవడం. అప్పుడే నికరాగ్వా మంచి వేడి మీద ఉంది. పొలిటికల్ రివల్యూషన్... ఎలాగూ ఏమీ రాయట్లేదు కదా అని దాని సంగతి చూసొద్దామని వెళ్లా. ఏముంది. అడుగడుగునా మందుపాతరలే. చావుతో దాదాపు దగ్గరి పరిచయమైంది. ఆ దెబ్బకు రైటర్స్ బ్లాక్ వదిలిపోయింది. వెంటనే లండన్కు తిరిగి వచ్చి ఆ సంవత్సరమే ‘శాటానిక్ వర్సెస్’ మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేశా. (నవ్వుతూ) ల్యాండ్మైన్స్ వల్ల పెద్ద పెద్ద విధ్వంసాలే సృష్టించవచ్చని అనుకోవద్దు. నవలలు కూడా సృష్టించవచ్చు. - సల్మాన్ రష్దీ తన కొత్త వెబ్సైట్ జ్ట్టిఞ://ఠీఠీఠీ. ట్చఝ్చటఠటజిఛీజ్ఛీ.ఛిౌఝ/ మొదలైన సందర్భంగా గతంలో చేసిన వ్యాఖ్యలను పాఠకులకు అందుబాటులో ఉంచుతూ... (అయితే ‘శాటానిక్ వర్సెస్’ (1986) కూడా ల్యాండ్మైన్లానే పేలిందన్న సంగతి ఎవరూ మర్చిపోలేదు. దాని వల్ల రష్దీ ఫత్వా ఎదుర్కొన్నాడు. దేశాలు పట్టాడు. అవస్థల పాలయ్యాడు. ఇవాళ్టికీ భారతదేశంలో ఆ నవల మీద నిషేధం ఉంది) -
బహుభాషా సమ్మేళనంలో మన కలాలు
మంగుళూరు యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, కర్నాటక సాహిత్య అకాడమీ కలిసి మార్చి 18, 2015న మంగుళూరులో నిర్వహిస్తున్న బహుభాషా రచయిత్రుల సదస్సులో తెలుగు నుంచి ముగ్గురు సాహితీకారులు పాల్గొననున్నారు. ఆ రోజు జరిగే కథా సదస్సులో కుప్పిలి పద్మ, విమర్శ సదస్సులో కాత్యాయనీ విద్మహే, కవిత్వ సదస్సులో షాజహానా పాల్గొంటారు. కన్నడ, తమిళ, తుళు, కొంకణి, మలయాళం తదితర భాషల రచయిత్రులతో వీరు వేదిక పంచుకోనున్నారు. తమ తమ విభాగాలలో లబ్ధప్రతిష్టులైన ఈ ముగ్గురూ తమ కృషిని, సమకాలీన స్త్రీ సాహిత్యాన్ని ఈ వేదిక నుంచి తెలియచేయనున్నారు. కాత్యాయనీ విద్మహే కుప్పిలి పద్మ షాజహానా -
ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా!
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక ‘స్వర్గసీమ’పై జనవరి 28న ‘సాక్షి ఫ్యామిలీ’లో వచ్చిన రంగనాయకమ్మ గారి అభిప్రాయానికి ప్రతిస్పందన ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా! - వి.ఎ.కె. రంగారావు, ప్రసిద్ధ సంగీత, నృత్య, కళా విమర్శకులు నాకు రంగనాయకమ్మ రాత దాదాపు ఆరున్నర దశాబ్దాల కిందటే తెలుసు. ఆమె తండ్రి దద్దనాల సత్యనారాయణగారు వెలమ కులస్థులకై నడిపే ‘పద్మనాయక’ పత్రికలో ఆమె రచనలు వస్తుండేవి - దద్దనాల రంగనాయకమ్మనే పేరుతో! ఆ తరువాత ముప్పాళ్ల రంగనాయకమ్మ, అటు పిమ్మట రంగనాయకమ్మ అన్న పేర్లతో వచ్చినవి కొన్ని -- అన్నీ కాదు -- చదివాను. వాటి బాగోగులను చర్చించే అదను యిది కాదు. వాటిలో కొన్ని బాగు, మరికొన్ని ఓగు అని నేను చెప్పితే అది కేవలం నా అభిప్రాయమే అవుతుంది. నాపై అభిమానం ఉన్నవారూ, అందున్న తర్కం సమంజసంగా ఉందనుకొన్న వారూ మెచ్చుకుంటారు. మిగతావారు నొచ్చుకుంటారు. ఎవరి అభిప్రాయాలూ నిత్యసత్యం కావు. ఆనాటికి సరిపోయే వ్యాఖ్యలు. రంగనాయకమ్మ తమ వ్యాసంలో ‘స్వర్గసీమ’ తీసిన దర్శక - నిర్మాత బి.ఎన్. రెడ్డిని దుయ్యబట్టారు. నా దృష్టిలోనే కాదు ఎందరి దృష్టిలోనో అది 11 వేల అడుగుల నిడివిలో దాదాపు పది మంచి పాటలు యిమిడ్చిన మంచి సాంఘికం. అందున్న నాయికను యీనాటి ఫెమినిస్టు దృష్టితో విమర్శించడం తగునా! 1940లలో స్త్రీలు అలానే పతిభక్తి కలిగి, భర్తకు అణిగిమణిగి ఉండుట విధాయకం అనుకొనేవారు కాదా! ఉంపుడుకత్తె పొమ్మంటేనే కావచ్చు తిరిగి వచ్చిన భర్తను ఆహ్వానించడంలో బిడ్డల భవిష్యత్తు పటిష్ఠం చేసుకోవడమూ ఒక భాగం కాకూడదా? ఆ నాయిక ఏడవక ఏడవక ‘ఎనిమిది మంది పెళ్లాలూ, పదహారు వేల ప్రియురాళ్లూ’ (నరకాసురుని చెర విడిపించిన కృష్ణుని భార్యలే వీరూ! నన్నెవరో అడిగినట్లు వాళ్ల మేరేజ్ సర్టిఫికెట్ నేను చూశానా అని అడగకూడదు మరి!) ఉన్న కృష్ణుని ముందే ఏడవాలా, అక్కడ రాముని బొమ్మ పెట్టించాలని దర్శకునికి తెలియదా? అన్నారామె. ఏ రాముడు? రాక్షసుని చెర విడిపించి, ‘నీ యిష్టమైన వాడితో వెళ్లు’ అని సీతతో అన్న రాముడా? నిండుచూలాలైన సీతను పిక్నిక్కి వెళ్లిరా అంటూ అడవిలో వదలి రమ్మని తమ్ముని ఆజ్ఞాపించిన రాముడా!! చేపల పులుసులో వేసే చింతపండు కలగూర పులుసులోనూ వేస్తారు. అది పాత చింతపండా, కొత్తదా అన్నదానిపైనే రుచి ఆధారపడి ఉంటుంది. ఆ సినిమా పాటల కోసమేనా అని అడిగారు. పోట్లాటల కోసం, తెలివైన దోపిడీలు చూపడానికోసం, వొల్లీవొల్లని ముసుగులో సెక్స్ చూపడానికోసం సినిమాలు తీయగా లేనిది పాటల కోసం తీయకూడదా! పాటల విషయంలోనే ఆమె ముద్దపప్పులో కాలేశారు. ‘దునియా అంతా దుఃఖం బాబా, కళ్లు తెరిచి చూడు’ అని వారి ఉల్లేఖనం - సగం సైగల్ (దుఃఖ్కే అబ్ బీతత్ నాహి దిన్ - ‘దేవదాసు’), సగం కె.సి. డే (మన్కీ ఆంఖే ఖోల్ బాబా - ‘భాగ్యచక్ర’ ఉరఫ్ ‘ధూప్ఛా(వ్’). చివరి విషయం మాత్రం సత్యం శివం సుందరంలా నిత్యం. మరి నేను సరాగమాల వాడిని కదా! రచయిత్రులకూ ఒక జబ్బు ఉంది! - కె.ఎన్.టి. శాస్త్రి, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు రంగనాయకమ్మ సినిమా వాళ్లకి ఒక జబ్బు ఉంటుంది అన్న ‘రచన’ను చదివి, ఒక సినిమా దర్శకుడిగా స్పందించకపోతే, మా పురుష దర్శకులందరికీ అవమానమనిపించి, నా స్పందన! ‘స్వర్గసీమ’ చిత్రం బి.ఎన్. రెడ్డిగారు 1945లో తానే స్వయంగా రచించి, పెట్టుబడి పెట్టి, తీసిన సినిమా. డెబ్భై ఏళ్ల తర్వాత - దానిలోని స్త్రీ అలా ఏడ్చింది, ఇలా చేసిందని స్త్రీ వాదాన్ని మళ్లీ రంగనాయకమ్మ గారు చాదస్తంగా వేలెత్తి చూపితే, జీర్ణించుకోలేకపోతున్నాం. ఆమె మర్చిపోయిన అసలు సంగతేమిటంటే, ఆ కళాకారుణ్ణి ‘స్వర్గసీమ’ అనుకుని పాడుకున్న గృహము నుండి, బయటికి లాక్కున్నది కూడా ఒక స్త్రీ మూర్తి. ఆమెలో ఇమిడి ఉన్న కళాకారిణిని బయటకు తీసుకురావడం కోసం అతని కృషి కూడా ఉంది. దానికి ప్రతిఫలంగా, అతనితో కొన్ని రోజులు సరదాలు తీర్చుకుని, తనకు ఒక జీవనోపాధి దొరికిన తక్షణం ఈ కళాకారుణ్ణి పక్కన పెడుతుంది. ఆ కాలఘట్టంలో, ఇంటర్నెట్ - సెల్లు లేవు కాబట్టి, ఈ గృహిణి, ఇలా బట్టలు కుట్టుకుని ‘ఆదర్శ గృహిణి’గా ఉండిపోయిందేమో! బహుశా, ఆమెకు అవకాశాలు అందుబాటులో ఉండి ఉంటే, మరోలా ఏడ్చి ఉండేదేమో! నేటి స్త్రీలు, మన సినిమాల్లో దుమ్ము రేపేస్తుండడం మన రంగనాయకమ్మ గారికి తెలియదంటే, విడ్డూరంగా ఉండడమే కాకుండా కేవలం ఆమెకు అచ్చివచ్చిన విద్య (మగవారిని దుమ్మెత్తిపోయడం)ను ప్రదర్శించుకోవడానికే ఆమె ఈ వ్యాసాన్ని రచించిందని అనిపిస్తుంది. నేటి టీవీల్లో కనపడే భార్యామణులు, అత్తగార్లు ఎలా ప్రవర్తిస్తున్నారో కాస్త గమనించండి. వీరు సబలలు. మగవారిపై ఆధారపడకుండా తమ జీవనోపాధి వెతుక్కున్న స్త్రీమూర్తులు. ఇక్కడ అసలు సంగతేమిటంటే, ఆడ-మగ బొమ్మ-బొరుసులా -ఒక ఏకత్వానికి ప్రతిరూపమే కాకుండా ఒకరు లేక మరొకరు లేరనేది ప్రకృతి నియమం. ఈ విషయం రచయిత్రికి తెలియదంటే నమ్మలేము. పోతే, ఏ రంగంలోనైనా శక్తిసామర్థ్యాలను పెంపొందించుకుంటే, వారు స్వతంత్రంగా, కన్నీరు కార్చుకుంటూ, కుట్టుమిషన్కు పరిమితం కాకుండా ఉండవచ్చుగా? డెబ్భై సంవత్సరాలప్పటి కథను, ఆ కాలానికి అనువుగా తీసిన చిత్రం - ‘స్వర్గసీమ’. తీసినవారికి ఎలాంటి జబ్బులూ లేవు; ఆ కాలంలో వచ్చిన సినిమాను ఇలా స్త్రీ వాదంతో ఈ కాలంలో విమర్శించే రచయిత్రులకే జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను 2002లో తీసిన ‘తిలదానం’ సినిమాలో కూడా భర్త వదిలి నక్సలైట్గా దూరమైతే, మా హీరోయిన్ ఏడుస్తూ ‘నరకాన్ని’ అనుభవిస్తూ ఉండగా, మామ చనిపోతే, ఇరుగుపొరుగు ‘ఈ ‘శని’కి దిక్కు-మొక్కు లేరు, ఈ కర్మ కాండలన్నీ మేమే చేయాల’ని విసుక్కుంటే, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆ శవానికి సంస్కారాలు వద్దని, అనాథ శవంగా మార్చురీకి పంపి తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. చెప్పొచ్చిందేమంటే, స్త్రీయెనా, పురుషుడైనా - తన వ్యక్తిత్వాన్ని నిలపెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ, తన జీవనోపాధికి ఒకరిపై ఆధారపడకుండా ఉంటే, స్వర్గసీమలు ప్రతి వాకిళ్లలోనూ కనబడతాయి. పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
రైట్ టైమ్
చేయి తిరిగిన రచయితలు, కవులు.. ఇప్పుడిప్పుడే కలానికి పదును పెడుతున్న యువతరం.. ఒకచోట చేరి తమ భావాలను పంచుకున్నారు. అభిప్రాయాలను కలబోసుకున్నారు. సీనియర్స్ తమ అనుభవాల నుంచి పాఠాలు చెబితే.. జూనియర్స్ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రచనలో రాణించడమెలా? కథల ఎంపిక ఎలా? శిల్పం ఎలా ఉండాలి? రాసేస్తాం సరే... పబ్లిషింగ్, మార్కెటింగ్ల మాటేమిటి? ఇలా అనేక అంశాలపై ఎడతెగని చర్చకు వేదికైంది సికింద్రాబాద్లోని అవర్ సేక్రెడ్ స్పేస్. రెండు రోజులపాటు జరిగిన రైటర్స్ కార్నివాల్ సలహాలు, సూచనలతో యువ రచయితలకు దిశానిర్దేశం చేసింది. పదహారేళ్ల అనూష నుంచి 65 ఏళ్ల రాజ్కుమార్ చోబ్రా వరకు రచనల్లో వచ్చే ఇబ్బందులు, మంచి రచనకు కావాల్సిన మెలకువలు నేర్చుకున్నారు. ..:: దార్ల వెంకటేశ్వరరావు రచనలు చేయడాన్ని హాబీ చేసుకోవాలని చాలామం దికి ఉంటుంది. మనసులో అందమైన ఊహలు రెక్క లు తొడుక్కుంటాయి. వాటిని కాగితంపై పెట్టాలను కునే సరికి చేయి కదలదు. ఏవేవో కలలు.. కలం పట్టి కళ్లకు కడదామంటే అక్షరం పడదు. ఇలాంటి వారితో పాటు సీనియర్స్ నుంచి సలహా సూచనలు పొందాల నుకుని.. ఆ చాన్స్ దక్కని రచయితలూ ఎందరో.. అటువంటి వారంతా తమ సందేహాలను తీర్చుకుని కొత్త ఉత్సాహం నింపుకొన్నారు. కలం బాటలో.. సాధారణంగా రచనా వ్యాసంగంలోకి రావాలనుకునేవాళ్లు క్లాసిక్స్ చదవడానికే ప్రాధాన్యమిస్తారు. కానీ.. సమకాలీన రచనలూ చదవాలి. ఇది సీనియర్ రచయితలు ముక్తకంఠంతో చెప్పేమాట. అప్పుడే ప్రస్తుత కవిత్వంలో వస్తున్న మార్పులు, స్టాండర్డ్స్ తెలుస్తాయి. కొత్త రచయితలు సొంతంగా పబ్లిష్ చేసుకుని పుస్తకాలు బయటకు తెస్తే అవి కేవలం తెలిసిన వారి వద్దకే వెళతాయి. దీంతో విమర్శలు తక్కువగా ఉండి రచయిత చేసిన పొరపాట్లు తెలియవు. సంప్రదాయ పబ్లిషర్స్ ద్వారా వెళ్తేనే ఎక్కువ మంది దగ్గరకు రచనలు వెళ్తాయి. తప్పొప్పులు తెలుస్తాయి. కేవలం పుస్తకాల పబ్లిషింగ్పైనే ఆధారపడటం వల్ల ప్రయోజనం లేదు. అందరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియాలో పబ్లిషింగ్ ఎలా చేసుకోవచ్చో కూడా ఆలోచించాలి. ఇవన్నీ వివరించి చెప్పిందీ రైటర్స్ కార్నివాల్. సొంత బ్లాగులు నిర్వహించడం, పేరొందిన వెబ్సైట్స్లో ‘ఈ పబ్లిషింగ్’ గురించీ సీనియర్స్ వివరించారు. ‘పెన్’టాస్టిక్ థీమ్.. యువ, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించడానికి, వారికి ‘కొత్త కథ’ల్లోకి దారి చూపడానికి కార్నివాల్ ప్లాట్ఫామ్లా ఉపయోగపడింది. మూడేళ్లుగా రైటర్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. 2012లో డాక్యుమెంట్రీ, జర్నల్స్పై, 2013లో చిల్డ్రన్ రైటర్స్, 2014లో పబ్లిషింగ్ ఎలా.. అనే అంశాలపై నిర్వహిం చారు. నాలుగోసారి సెన్సిటివ్ అంశాలను థీమ్గా ఎంచుకున్నారు. యువ రచయితలు తమ రచనలెలా పబ్లిష్ చేసుకోవాలో ఇందులో వివరించారు. తెలుగు రైటర్స్కూ వేదిక కావాలి... అనితా దేశాయ్ షార్ట్ స్టోరీ రైటర్. వివిధ సామాజికాంశాలపై తన బ్లాగ్తో పాటు వివిధ వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో ఆర్టికల్స్ ప్రచురించారు. ఈ కార్నివాల్లో విడుదల చేసిన ‘సెలబ్రేటింగ్ ఇండియా’ పుస్తకంలో ఆమె రాసిన ‘ఎపిలిప్టిక్’ షార్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. ఫిట్స్ వచ్చే ఓ మహిళ పుట్టుక నుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంతో ప్రస్తుతం ఆమె రాస్తున్న కథ ‘డొమెస్టిక్ మేడ్’. ‘పబ్లిషింగ్లో ఇబ్బందులు, కాపీరైట్ చట్టాల గురించి కార్నివాల్ వల్లే తెలుసుకోగలిగాను’ అని అనితా దేశాయ్ చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ ముక్తేశ్వరరావుకి చిన్ననాటి నుంచి రచనలు చేయడం హాబీ. ‘..కానీ విధి నిర్వహణలో ఒత్తిళ్లతో రచనా వ్యాసంగంపై దృష్టి పెట్టలేదు. పదవీ విరమణతో సమయం దొరికింది. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై ఆర్టికల్స్ రాసినా.. అవి ఆంగ్లంలోనే. తెలుగు రైటర్స్ కు ఇలాంటి వే దిక అవసరం. నేను సైతం కార్నివాల్లో ఉత్సాహంగా పాల్గొన్నా’నంటారాయన. మతం కన్నా.. మానవ సంబంధాలు మిన్న... 65 ఏళ్ల రాజ్కుమార్ ఛాబ్రా స్టేట్మెంట్ ఇది. అందుకే ఆ సంబంధాల్లోని బాంధవ్యాల గురించి ఎక్కువగా రాస్తుంటారాయన. నిత్యం తన కళ్లముందు జరిగే అంశాలే ఆయన కథా వస్తువు. పెళ్లికోసం మతం మారతాడు ఓ కశ్మీరీ పండిట్. మతం మారాక అతని కుటుంబంతో కొనసాగే అనుబంధాలు, బంధాలకు కథా రూపమిచ్చారు. అంతేకాదు... ఓసారి హాంగ్కాంగ్కు వెళ్లిన రాజ్కుమార్ మొబైల్ బ్యాటరీ పాడైంది. కొత్త బ్యాటరీ కొనేందుకు వెళ్తే... అప్పటికే టైమ్ అయిపోయింది. అయినా షాపు యజమాని ఓ మొబైల్ ఇచ్చి అది ఉదయం వరకూ వాడుకోమని, పొద్దున్నే కొత్త బ్యాటరీ తీసుకోమని ఇచ్చాడు. ‘దేశంకాని దేశంలో... ఎవరో ఏమిటో తెలియకుండా ఫోన్ ఇవ్వడం నమ్మకం. అదే మనుషుల మధ్య ఉండే గొప్ప బంధం. వీటి నేపథ్యంతో ఎన్ని కథలై నా రాయొచ్చు’ అంటారు రాజ్కుమార్. ఆయన నుంచి యువ, ఔత్సాహిక రచయితలు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మనసులో మెదిలో ఊహలకు ఎలా అక్షర రూపమివ్వాలో ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘నేను చూసిన ప్రదేశాలు, ప్రకృతి గురించి సొంత బ్లాగ్లో పెడుతుంటాను. ఈ కార్నివాల్ నాకు కొత్త దారి చూపింది’ అని ఆనందంగా చెప్పింది ఇందిర. ఆమెలాంటి ఔత్సాహికులు మరెందరో ఇక్కడ రచనా మెలకువల్ని ‘కలం’ నిండా నింపుకొన్నారు. చాలా నేర్చుకున్నా... చిన్నప్పటి నుంచి చిన్నచిన్న కథలు, కవితలు రాయడం అలవాటు. నేను రాసిన కథలు నా బ్లాగ్లోనే పబ్లిష్ చేస్తుంటాను. ఎమోషనల్ అంశాలపై రాయడమంటే ఇష్టం. ఈ కార్నివాల్లో ట్రాన్స్జెండర్స్ సమస్యల గురించి తెలుసుకోగలిగాను. ఇలాంటి సెన్సిటివ్ అంశాలపై రచనలు చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ చాలా నేర్చుకున్నా. - అనూష, ఇంటర్ ఫస్టియర్ సెల్ఫ్ డిస్కవరీతో... పుట్టుకతోనే అంధురాలిని. 14 ఏళ్లనుంచే తెలుగు, ఇంగ్లిష్లో కథలు, కవితలు రాస్తున్నాను. ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ఇప్పుడు ఇంగ్లిష్ సాహిత్యంలో పీహెచ్డీ చేస్తున్నాను. నేను రాసిన ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి. విజన్ వాయిస్ సాఫ్ట్వేర్తోకంప్యూటర్లో రాస్తుంటాను. నాలాంటి అంధులు, డిజేబుల్డ్ పర్సన్స్లో ఉండేసెల్ఫ్ డిస్కవరీతో ఎక్కువ రచనలు చేయొచ్చు. ఈ మధ్యే ఓ నవల రాయడం ప్రారంభించా. ఒక గ్రామీణ మహిళ కొత్త ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటుంది అనే అంశంపై. సగం పూర్తయింది. దీన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని ఉంది. - జోత్స్న ఫణిజా, రచయిత్రి యువ రచయితలను ప్రోత్సహించాలని... యువ రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మూడేళ్లుగా రైటర్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నాం. ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్. ఈసారి అంధులు, ట్రాన్స్ జెండర్స్తోపాటు కామెడీ అంశాలను చేర్చాం. గతంలోలాగే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉత్సాహంతో వచ్చే సంవత్సరం కూడా కండక్ట్ చేస్తాం. అయితే తెలుగు రచయితల కోసం ప్రత్యేక కార్నివాల్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. - నివే దిత, నివాసిని పబ్లిషర్స్, కార్నివాల్ నిర్వాహకురాలు -
పోతన, పాల్కురికి ఉత్సవాలు
భాగవతం రచించిన బమ్మెర పోతన, తొలి తెనుగు విప్లవ కవి బసవ పురాణ గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి పేర్లతో ఉత్సవాలు నిర్విహ స్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ సాక్షిగా ప్రకటించడం హర్షదాయకం. గత పాలకుల ఏలుబడిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు నిరాదరణకు గురయ్యారు. కనీసం తెలంగాణ ప్రాంతం ఇంతమంది ప్రజాకవులకు, పండితులకు, విద్వత్కవులకు జన్మని చ్చిందన్న ఎరుకను కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతికి ఆకరమైన ఇలాంటి మహనీయులను జ్ఞప్తికి తెస్తూ సాంస్కృతిక కార్యక్రమా లపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించడం ముదావహం. ఈ నేపథ్యంలో పోతన జన్మస్థలానికి ప్రాభవం తీసుకువస్తామని, ఆనాడు బమ్మెర పోతన దున్నిన నాలుగు ఎకరాల్లో స్మారకమందిరాన్ని నిర్మి స్తామని, రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి దేవస్థానం అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించాలి. దీంతో పాటు తెలంగాణ రైతులు, ప్రజలు తమ విముక్తి కోసం అరవైఏళ్ల క్రితం చేపట్టిన మహత్తర సాయుధ పోరాట చరిత్రను కూడా ప్రభుత్వం పాఠ్యాంశాలలో తప్పనిసరిగా చేర్చాలి. - దౌడ్ విజయకుమార్ పరకాల, వరంగల్ జిల్లా -
సాంస్కృతిక తెలంగాణే లక్ష్యం
తెలంగాణ రచయితల సంఘం సభలో వక్తల పిలుపు హైదరాబాద్: సంపూర్ణ సాంస్కృతిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిందని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణ రచయితల సంఘం ప్రారంభ సభ ఆదివారం (జీవగడ్డ విజయ్కుమార్ హాల్) ఎస్.సి.ఈ.ఆర్.టీ.లో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినంత మాత్రాన సరిపోదని, నేడు సంపూర్ణ సాంసృ్కతిక తెలంగాణ నిర్మాణం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందుకు కవులు, రచయితలు, కళాకారులను ఏకతాటి మీద నడిపించేందుకే తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు అవసరమొచ్చిందని తెలిపారు. పల్లె నాలుకల మీద మూలకు పడివున్న జాతీయాలను, సామెతలను సేకరించి కొత్త సోయగాలను అద్ది, తెలంగాణ భాషను సుసంపన్నం చేసుకోవడం నేటి కవుల కర్తవ్యమని అన్నారు. సభను ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య తన పాట ద్వారా ప్రారంభించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఏ ప్రాంతంలో లేని కవులు, కళాకారులు, రచయితలు మన ప్రాంతంలో ఉన్నారని, దీనికి కారణం ఇక్కడ జరిగిన అనేక ప్రజా ఉద్యమాలే అని అన్నారు. ఇక్కడ ఉన్న సాహితీ సంపద మరెక్కడా లేదన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ వలసవాద దోపిడీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది వచన కవిత్వం, పాటేనని తెలిపారు. ఈ సభలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్రెడ్డి, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, వి.శంకర్ ప్రసంగించారు. సంఘం అధ్యక్షుడిగా నందిని సిధారెడ్డి తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా నందిని సిధారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి. శంకర్, కోశాధికారిగా దాస్యం సేనాధిపతితో పాటు ఐదుగురిని సహాయ కార్యదర్శులుగా, ఐదుగురిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా నలుగురితో పాటు ముఖ్య సలహాదారులు దేశపతి శ్రీనివాస్, వేణుగోపాలస్వామి, ఏ.శ్రీధర్లు ఎన్నికైనట్లు సిధారెడ్డి ప్రకటించారు. -
'ప్రభుత్వానికి మిడిమిడి జ్ఞానం ఉండకూడదు'
ప్రభుత్వానికి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానం ఉండకూడదని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యాఖ్యానించింది. ప్రకృతితో ఆడుకుంటే హుదూద్ లాంటి మరిన్ని విధ్వంసాలు ఖాయమని వేదిక ప్రతినిధులు మండిపడ్డారు. అభివృద్ధి పేరు మీద విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం వల్లనే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇటీవల హుదూద్ తుఫాను తీవ్ర ప్రభావం చూపిన చోట్ల రెండు రోజుల పాటు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక బృందం సభ్యులు పర్యటించారు. అనంతరం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. -
కథ: నా పాఠకునితో నేను
నా జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన ఇది. సాధారణంగా గొప్ప రచయితల జీవితాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. మన్నించండి. నేనేమీ అంత గొప్పవాడిని కాదు. బహుశా భవిష్యత్తులో ఎప్పుడైనా అయితానేమో! నా ప్రముఖ పుస్తకాలలో ఒకదానిని చదువుతున్న పాఠకునితో నా పరిచయం గురించి చెప్పడం ఇది. అయితే, ఇలాంటి అనుభవాలను ప్రపంచానికి ముందెవరూ చెప్పినట్లు నాకు గుర్తు రావడం లేదు. ఈ అవకాశం నేనే తీసుకుంటాను. ఇలా చెప్పడం నాకు అంతులేని సంతోషాన్నిస్తోంది. ‘‘నీకిష్టమైన రచయితలు ఎవరు?’’ అడిగాను. చాలా పేర్లు చెప్పాడు. ఆ పేర్లన్నీ రాయడం మర్యాద కాదు. వారిలో ఒకరు కవి. ఆయన కవిత్వం చదివాడు అతను. నాకెంతో సంతోషమైంది. ‘‘ఆ కవిలో ఏమి నచ్చింది?’’ అని అడిగాను. హిలైర్ బెల్లాక్ (1870-1953) హిలైర్ బెల్లాక్ గొప్ప ఇంగ్లిష్ రచయిత. ఆధునికతలో పాత విలువల రక్షణ కొరకు పోరాడిన వ్యక్తి. యువకుడిగా ఆయన చెష్టర్టన్, హెచ్.జి.వెల్స్, జార్జి బెర్నాడ్షా లాంటివాళ్లతో గడిపారు. ఆయన కవి, నవలాకారుడు మరియు పాత్రికేయుడు కూడా. ఆయన రాసిన ‘కాషనరీ టేల్స్ ఫర్ చిల్డ్రన్’ ప్రపంచ వ్యాప్తంగా చదువుతుంటారు. ‘మటిల్డా, హూ టోల్డ్ లైస్ అండ్ బర్న్డ్ టూ డెత్’ నాలుగు కాలాల పాటు రక్షించుకోవలసిన అద్భుత పుస్తకం. వివిధ అంశాలపై ఆయన అనేక పత్రికలలో వ్యాసాలు రాశారు. ఒక మంచి ఆలోచన వచ్చింది నాకు. ఒక దేవదూతే ఆ ఆలోచన కలిగించి ఉంటుంది.‘‘మీతో ఎక్కువ చనువు తీసుకోవడం లేదనుకుంటే, నేను మీ పుస్తకం కొనవచ్చా?’’ అని అడిగాను. ‘‘అదంత బాగుండదేమో!’’ అన్నాడు అతను. చాలా సంవత్సరాల క్రిందటి మాట. నేను గ్రేట్ వెస్టరన్ రైల్వేలో బర్మింగ్హామ్ నుండి లండన్కు పోతున్నాను. నేను మూడవ తరగతి బోగీలో ప్రయాణం చేస్తున్నాను. పొగ తాగే బోగీ అది. నాతో పాటు ఇంకొందరు మాత్రమే అందులో ఉన్నారు. అతని దగ్గర ఉండే నల్లటి సంచి, అతని వాలకం చూస్తే, వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తున్న వ్యక్తిలా ఉన్నాడు. అయితే... అతను ఎవరైనా అయి ఉండొచ్చు. పబ్ మేనేజరు అయి ఉండొచ్చు. ఉరి తీసే మనిషి కూడా కావచ్చు. బలమైన ముఖం అతడిది. చాలా బాగుంది కూడా. చేతులు బలంగా ఉన్నవి. మంచి నడవడిక కలవాడనిపిస్తుంది. ఆకు రాలే కాలం తొలి రోజులవి. వాతావరణం వెచ్చగా ఉంది. అలాంటి వాతావరణంలో నాకొక తోడున్నందుకు ఎంతో హాయిగా ఉంది. బాగా హుషారుగా ఉంది ఆ సమయంలో. నాతోటి ప్రయాణికుడి చేతిలో పుస్తకం చూసి, నా తల తిరిగినట్లయింది. నేను రాసిన ఎన్నో వ్యాసాల పుస్తకాలలో అదొకటి. నాలో నాకే ఇలా అనిపించింది. నిజంగా కీర్తి ప్రతిష్ఠలంటే ఇవే. నేను అందరికీ తెలుస్తున్నాను. అతడు సాధారణ జనాలకు ఒక ప్రతిరూపం. అతడు నా పుస్తకం చదువుతున్నందుకు, అతడంటే నాకెంతో ఇష్టం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ అందమైన ఇంగ్లండు ద్వీపంలో వందల మంది నా పుస్తకాలు చదువుతుంటారు అనిపించింది. ఏదో ఒకటి చదువుతుంటారు. పుస్తకాలు చదివి చదివి చినగకొడుతుంటారు. మళ్లీ మళ్లీ కొంటుంటారు. స్నేహితులతో చెపుతుంటారు. ఎక్కువ ఎక్కువగా కాపీలు అమ్ముడుపోతుంటాయి. ప్రపంచమంతా మారింది. ఆఖరుకు నా రోజు కూడా వచ్చింది. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఎంతో సంతోషంగా ఉన్నదప్పుడు. ఒకలాంటి నిట్టూర్పుతో అతడు ఆ పుస్తకం మురికి సంచీపై పడేశాడు! నావైపు చూసి, ‘‘చెత్త సరకు’’ అన్నాడు. ‘‘అవును’’ అన్నాను నేను. ‘‘ఎందుకు ఆ పుస్తకం చదవాలనుకున్నావు?’’ ‘‘నాకేమీ తెలియదు’’ అని జవాబిచ్చాడు. కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. ‘‘నేను పుస్తకాల షాపుకెళ్లాను. షాపాయన ఈ పుస్తకం చదవమన్నాడు. బహుశా ఆయన పొరపాటున ఈ పుస్తకాన్ని ఇంకొక పుస్తకమనుకొని ఇచ్చివుంటాడు. ఏమైతేనేమి, ఒక షిల్లింగ్ వృథా అయింది’’ అని అన్నాడు అతను. ‘‘ఎవరు రాసిందీ?’’ అని అడిగా. ‘‘నాకేమీ తెలియదు’’ అని అయిష్టంగా జవాబిచ్చాడు. పుస్తకం తీసుకొని, చాలా పేలవంగా నా పేరు తప్పుగా పలికాడు. మళ్లీ పుస్తకాన్ని పడేశాడు. ‘ఆ...’ నిట్టూర్చాడు మళ్లీ. ‘‘అయినా చిత్రంగా ఉంది. ప్రయాణంలో చదవాలనుకోవడమేమిటి? నాకూ ఎందుకో చదవాలనిపించింది. ఈ చెత్త చదవలేకున్నాను’’ అన్నాడతను. అతడు కోపంతో రగిలిపోతున్నాడు. బహుశా పుస్తకం గురించి కాకపోవచ్చు. పుస్తకానికి ఖర్చుపెట్టిన షిల్లింగు గురించి అనిపించింది. ‘‘ఏముంది అందులో?’’ అని అడిగాను. ‘‘నాకేమీ తెలియదు. నాకేమీ అర్థం కాలేదు’’ అన్నాడు. మళ్లీ పుస్తకం తీసుకొని పేరు చూశాడు. ‘‘పుస్తకం పైన చూస్తే ఏమీ అర్థం కాలేదు. తెలివి లేనిదంతా ముద్రించారు. ఎలాంటి కథ లేదు, కమామిషూ లేదు. పత్రికలలో పడిన వ్యాసాలు కలిపి పుస్తకంగా వేశారు’’ అన్నాడు. అతడి మాటలు చాలా బాధించాయి. నిజంగా అవి పత్రికల్లోని వ్యాసాలే! బతుకుదెరువు కోసం పత్రికలలోని వ్యాసాలను పుస్తకంలా వేశాము. అతడిలో కాస్త ఉత్సాహం వచ్చింది. నాతో మాట్లాడాలనే కుతూహలం కనిపించింది. ‘‘అసలు ఇలాంటి పుస్తకాలు ఎందుకు ప్రచురిస్తారు?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘బహుశా డబ్బుకోసం’’ అన్నాను నేను. ‘‘ఉండొచ్చు. అయినా ఇందులో ఏమంత డబ్బు కూడా లేదు’’ అన్నాడు అతను. ‘‘ఈయనను గురించి ఎప్పుడూ వినలేదు. ఇతడిని గురించి ఇంకెప్పుడూ వినాలని కూడా లేదు’’ కిటికీలో గుండా దిగులుగా చూశాడు. ‘‘నీకిష్టమైన రచయితలు ఎవరు?’’ అడిగాను. చాలా పేర్లు చెప్పాడు. ఆ పేర్లన్నీ రాయడం మర్యాద కాదు. వారిలో ఒకరు కవి. ఆయన కవిత్వం చదివాడు అతను. నాకెంతో సంతోషమైంది. ‘‘ఆ కవిలో ఏమి నచ్చింది?’’ అని అడిగాను. వెంటనే అతడిలో మరింత ఉత్సాహం వచ్చింది. ‘‘చాలా గొప్ప కవిత్వం. పదే పదే గుర్తొస్తుంటుంది. మీ ఇంగ్లిషు దేశంలో ఎవ్వరికీ ఏమీ తెలియదు’’. ‘హ్యాజ్ మేడ్ ఆజ్ వ్వాట్ వుయ్ ఆర్’ అని పాడడం మొదలెట్టాడు. ‘‘కవిత్వమంటే ఇది. ఇలా రాయాలి . అది రక్తాన్ని ఓడుస్తుంది’’. ఇంగ్లండు దేశంలో ఎవరూ అలా రాయలేరని అతడి నమ్మకం. మళ్లీ ఆ రచయితదే ఇంకొక పద్యం పలకడం మొదలెట్టాడు. ఈసారి ఇష్టమైన ఒక చిన్నారి గురించి. దానిని ‘సాంబోస్ ప్రయర్’ అంటారట. అది పూర్తిచేసి అలా నిట్టూర్చాడతను. నా వైపు ఎగతాళిగా చూశాడు. తనేదో హృదయాంతరాలాల్లోనుంచి మాట్లాడుతున్నాననుకుంటూ, ‘‘వాళ్లకెలా అబ్బుతుందో ఇది మరి! పెద్ద మేధస్సు! నీవూ, నేనూ రాయలేము. గుప్పెడు బంగారు నాణ్యాలు ఇచ్చినా మనవల్ల కాదు. అది వాళ్లకే సాధ్యమవుతుంది.’’ ‘‘నీవు ఆ రచయితను కలిశావా?’’ అడిగాను నేను. ‘‘దైవమా? లేదు’’ అన్నాడు ఎంతో భక్తితో. అంత గొప్ప అవకాశాలు ఈ మానవమాత్రులకు సాధ్యం కాదు అనే భావం అతనిలో కనిపించింది. రైలు నెమ్మదిగా ఆక్స్ఫర్డ్ను సమీపిస్తున్నది. అతడు వాణిజ్యం చేసేవాడో, మత ప్రవక్తో, కమీషను ఏజెంటో... ఎవరైతేనేమి... సీటు మీద నుండి లేచాడు. సంచీ తీసుకున్నాడు. బహుశా దిగిపోతున్నాడేమో అనిపించింది. ఒక మంచి ఆలోచన వచ్చింది నాకు. ఒక దేవదూతే ఆ ఆలోచన కలిగించి ఉంటుంది. ‘‘మీతో ఎక్కువ చనువు తీసుకోవడం లేదనుకుంటే, నేను మీ పుస్తకం కొనవచ్చా?’’ అని అడిగాను. ‘‘అదంత బాగుండదేమో!’’ అన్నాడు అతను. ‘‘ఏమీలేదు. నాకు ఇక్కడ నుండి లండన్ పోయే వరకు చదువుకోవడానికి ఏమీ లేదు. మనస్సులో రేఖాగణితం చేసి చేసి తలబొప్పి కట్టింది. బాగా అలసిపోయాను’’ అన్నాను. ‘‘ఏమి చేసుకుంటావు?’’ దీనితో అన్నాడతడు. ‘‘ఏమీలేదు. టైముపాసు కోసమే. నాకే పుస్తకమైనా ఫర్వాలేదు. ఆ పుస్తకమైనా ఒకటే.’’సంకోచిస్తూ, అతడు నా కోరికను ఒప్పుకున్నాడు. అతనో నిజాయితీపరుడు. అంత భయంకరమైన చెత్త పుస్తకానికి నేనొక షిల్లింగ్ ఇవ్వడం అతనికిష్టం లేదు. అతడు నాణేన్ని తీసుకొని పుస్తకం నాకిచ్చాడు. ఆక్స్ఫర్డ్లో ఎవరూ ఎక్కలేదు. ప్యడ్డింగ్టన్లో రైలు ఆగలేదు. నిరుత్సాహంగా పుస్తకం తెరిచాను. నా గుండె జారినట్లనిపించింది. అతడు చెప్పింది నిజమే. ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యాసాలను చూసి చాలా కాలమైందనిపించింది. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం చదివాను. నాకే అసహ్యమనిపించింది. కొన్నిచోట్ల నటన. ఇంకొన్ని చోట్ల ఆడంబరం. మరికొన్ని చోట్ల తేలికపాటి రాతలు. ఘోరంగా ఉంది. నేను ఇలాంటి పనిచేసి ఉండాల్సింది కాదు. బాగా ఆలోచించాను. నేను ప్రతివారం ఇలాంటి వ్యాసాలను పోగుచేసి పోగుచేసి పుస్తకాలుగా వేశాను. మరీ పనిగట్టుకొని చేశాను. ఎంత దుర్దశ పట్టింది నాకు. డబ్బు ఎగరగొట్టడము, చెత్త పుస్తకం రాయడం అనే రెండు చెడ్డ పనులలో ఏదో ఒకటి నిర్ణయించుకోమంటే... చెత్త పుస్తకం రాయడాన్నే ఎంచుకుంటాను నేను. కంపు కొట్టే లండన్ పొలిమేరలు వచ్చే లోపే, దక్షిణ ఇంగ్లండు అందాలు నా బాధను కొంత వరకు తగ్గించాయి. ఆ ప్రకృతి అందాలను నా గుండె నిండా పూసుకున్నాను. నా ప్రయాణం ఇలా సాగింది. ఆ రోజు నుండి, ఈ రోజువరకు ఎక్కడైనా, ఎవరైనా నా పుస్తకాలు చదవడం నేను చూడలేదు. ఒకవేళ ఎవరైనా తటస్థిస్తే, అతడు చదివేదాన్ని గురించి అతడితో మాట్లాడను. - ఇంగ్లిష్: హెలైర్ బెల్లాక్ తెలుగు: డా॥ఆరవీటి రామయోగయ్య -
సముద్రం కూడా కొన్ని కథలు వింది...
ఇటీవల రామాయపట్నంలో జరిగిన రెండు రోజుల కథా సమావేశాల్లో రాయడం, నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకోవడం, నడవాల్సిన దారిని అంచనా కట్టడం ప్రధానంగా జరిగిన పని. రైటర్స్ వాక్.... రచయితలు తమలో తాము చర్చించుకోవడం కాకుండా పాఠకులలో కూడా కదలిక తీసుకు రావడానికి ‘పుస్తకాలు చదవండీ’ అంటూ ఈసారి ‘రైటర్స్ వాక్’ నిర్వహించారు. కావలిలో దీనికి వచ్చిన స్పందన అనూహ్యం. ఈసారి చాలామంది కొత్తవాళ్లు. అపర్ణ తోట, రమా సుందరి, కుమార్ కూనపరాజు, అరిపిరాల సత్యప్రసాద్, మహి బెజవాడ, అమర్ అహ్మద్... కొత్తగా రాస్తున్న వీళ్లంతా రెండు రోజుల పాటు సీనియర్ కథకులతో కలసి సమయం గడపడానికి, గత పద్నాలుగేళ్లుగా ప్రతి ఏటా జరుగుతున్న సమావేశాల వరుసలో భాగంగా, కావలి సమీపాన ఉన్న రామాయపట్నం బీచ్ బంగ్లాకు చేరుకున్నారు. ఫిబ్రవరి 15, 16- శని, ఆదివారాలు రాష్ట్రం నలుమూలల నుంచి ఇంకా ఇతర రచయితలు... ముక్తవరం పార్థసారథి, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, డా.వి.చంద్రశేఖరరావు, కాట్రగడ్డ దయానంద్, వి.ప్రతిమ, దాసరి అమరేంద్ర, దగ్గుమాటి పద్మాకర్, లెనిన్ ధనిశెట్టి, గోపరాజు నారాయణరావు, అక్కిరాజు భట్టిప్రోలు, టైటానిక్ సురేష్, పూడూరి రాజిరెడ్డి, జి.ఉమామహేశ్వర్, వేంపల్లి షరీఫ్ , విమల, ఆర్టిస్టులు అక్బర్, అన్వర్... విమర్శకుడు అనంత్... కథా ప్రయాణంలో తమ సాధకబాధకాలు పంచుకోవడానికి వచ్చారు. రాయడం, నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకోవడం, నడవాల్సిన దారిని అంచనా కట్టడం ఈసారి ప్రధానంగా జరిగిన పని. కంటికి కనబడుతున్న సంక్షోభాలు చేతికి లేదా ఊహకు అంది కథగా మారడంలో వస్తున్న వైఫల్యాల గురించి, విరామాల గురించి ఎక్కువ చర్చ జరిగింది. ఒకవైపు మారిన సమాజపు ఫలాలు పొందుతూ మరోవైపు పాత సమాజపు విలువలను ఆశించడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని ఈ రెంటికీ మధ్య సమన్వయాన్ని పాఠకులకు ఇచ్చే కథలు రావలసిన అవసరం ఉందని అల్లం రాజయ్య అన్నారు. యథావిధిగా అందరూ కలిసి తెలుగు కథలు ఇంగ్లిష్లో, ఇతర భాషల్లో అనువాదం కాకపోవడం గురించి ఆ దారిలో ఉన్న అతి పెద్ద ఎడం గురించి ఈసురోమన్నారు. కథలకు బొమ్మలు వేసే- అక్బర్, అన్వర్లతో రచయితల ముఖాముఖి ఈ ఇరువర్గాల మధ్య ఉన్న భారీ దూరాన్ని స్పష్టం చేసి ఆర్టిస్టులూ రచయితలూ తరచూ మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని తెలియపర్చింది. పత్రికల్లో కథల ఎంపిక ఎలా జరుగుతుందో సీనియర్ జర్నలిస్టులు కూడా అయిన వేంపల్లి షరీఫ్, పూడూరి రాజిరెడ్డిలు రచయితలకు తెలియచేస్తే రచయితల కంప్లయింట్లు ఓ మోస్తారు లేచాయి. పత్రికల్లో ఉన్న స్పేస్ తగ్గిపోతున్నందువల్ల ఇక మీదట బ్లాగ్లలో వెబ్సైట్లలో వస్తున్న కథలను కూడా ప్రమాణికమైనవిగా ఆ సంవత్సరం అచ్చయిన కథలుగా సంకలనకర్తలు, విమర్శకులు గుర్తించాలని సూచన. మూసకట్టు చూపు, పడికట్టు రచన కాకుండా వర్తమానంలో రచయితలు మిస్సవుతున్న కోణాల్ని అనంత్ వివరించే ప్రయత్నం చేశారు. కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా ఎందుకు కాసిన్ని పనికొచ్చే పనులు చేయకూడదు? ఈ రచయితల సమూహం తరఫున ఇంగ్లిష్లో హిందీలో ఒక పాతిక కథలను అనువాదం చేసి తెద్దాం అని రాజయ్య సూచించారు. ఇంతవరకూ ఇలాంటి రూపం తీసుకొని ఈ సమావేశాల వల్ల ఇకముందు ఇటువంటి పని జరిగే అవకాశం ఉంది. అందుకు వేదిక సిద్ధమవుతూ ఉండటం ఒక మంచి పరిణామం. ఇంకా కొత్తవాళ్ల సందేహాలు, పాతవాళ్ల సలహాలు, చర్చలు, ఖండనలు మండనలు చాలా ఉన్నాయి. కాని ఈ వేడి కంటే కూడా దీన్ని చల్లబరచే సాయంత్రపు సముద్ర గాలి, నిర్జన ఏకాంత పరిసరాలు, తీరంలో ఎంట్ర కాయల అడ్డదిడ్డ నడక, ఇసుకలో తడి పాదముద్రలు, దగ్గరకు పిలిచి ముఖాన్ని గట్టిగా చరిచే కెరటపు నురగ, అర్ధరాత్రి వెన్నెల్లో జలధి నిశ్శబ్దం, వేకువలో కడలి అంచున ప్రశాంతత వీటి రుచి ఏం చెప్పమంటారు? కథ, కడలి కలిసి రచయితల రోజువారి రొటీన్ రోతని క్షాళనం చేసిన రెండు రోజులు అవి. అద్భుతం. టైటానిక్ సురేష్, అమరేంద్ర, అక్కిరాజుల నిర్వాహణా మహిమ. సరే. అంతా అయ్యిందా? లేచి వస్తుంటే రాబోయే సమావేశాలకు కొల్లేరు నుంచి పిలుపు. అక్టోబర్లోనట. కథతో పాటు పూటకు ముప్పయ్యారు రకాలు రెడీ చేస్తారట. ఇది బాగుంది. ఎంతైనా ఇప్పటి నుంచే ఏం బ్యాగు సర్దుకుంటాం? -
వరంగల్ జిల్లాలో విప్లవ రచయితల సంఘం సభలు
-
నాటకంతో సమాజానికి చక్కటి సందేశం
తిరుపతి కల్చరల్, న్యూస్లైన్: మానవజీవన విధానం, విలువలతో కూడిన నాటకం సమాజానికి చక్కటి సందేశా న్ని అందిస్తుందని ప్రముఖ సాహితీవేత్త లు సర్వోత్తమరావు, ఆకెళ్ల విభీషణశర్మ, ప్రముఖ రచయిత కోటాపురుషోత్తం తెలిపారు. అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మహతి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలకు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు భారతదేశమని, ఆ కళలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదేళ్లుగా బహు భాషా నాటకోత్సవాలను నిర్వహిస్తూ కనుమరుగవుతున్న నాటకాలను పరిరక్షించిడం అభినందనీయమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలను నిర్వహించడం సంతోషకరమన్నారు. మహతిలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఆధ్యాత్మిక నృత్య, నాటకాలను ప్రజలందరూ తిలకించాలని వారు కోరారు. అనంతరం చిన్నారి శ్రీమేధ, సరయూ ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను అలరించింది. మహిషాసురమర్థిని నాటకరూపం ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన శరత్చంద్ర బృందం శివప్రసాద్, సురేష్, హిందుమతి మూషిక వాహన, అష్టపది, శంభోశంకర, వేంకటాచల నిలయం వంటి భరతనాట్య రూపకాలు మైమరపించా యి. చివరిగా వాణి త్రిష ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఈ కార్యక్రమంలో అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ కన్వీనర్ అభినయ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒకరు మెచ్చినంత మాత్రాన అది గొప్ప రచన అయిపోదు....
కొమ్ములు మొలవకుండా చెయ్యి మాత్రమే బాగా వొంపు తిరిగిన రచయితలు ఈ రాతను చదవవలసిన అవసరం ఏమాత్రం లేదని ఇందుమూలముగా ప్రకటించడమైనది. సాహితీ వర్క్షాపుల్లో, పుస్తకావిష్కరణ సభల్లోనూ రచన ఎలా ఉండాలో ఎలా రాయాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బడా రచయితలు చెబుతూనే ఉంటారు. సాహిత్యవ్యాసాలైతే మరిన్ని వొచ్చిపడ్డాయి కుర్ర రచయితల వెన్ను నిటారుగా ఉంచడానికి. మరి పాఠకుల సంగతో? నెమ్మదస్తులు మరియు నోరు పెగలని పాఠకులు మాత్రం కొందరు పత్రికలకు ‘లేఖ’లు రాస్తున్నా ఎక్కువ మంది ముక్కు మూసుకొని కిక్కురుమనకుండా ఎవరు ఏం రాసి పారేసినా ఎలా అచ్చయినా చదివి ఎవరికీ చెప్పుకొనలేక గింజుకు పోతుంటారు. అట్టావారి సణుగుడు/ నసుగుడుకు ప్రతినిధిగా నన్ను నేను ఈ మధ్యనే నియమించుకున్నాను. రచయితలు పరస్పరం పొగుడుకుంటున్న రచనలు మాకు అనగా పాఠకులకు గొప్పగా కనిపించడం లేదని తెలుప విచారించుచున్నాను. కథలు/ రచనలు ఎలా రాయకుండా ఉండవచ్చునో, ఎలా రాసి రంపాన పెట్టకూడదో నాకు ముక్కుపచ్చలారని వయసుకే తెలిసేట్టు ఘాటయిన అనుభవాలు కలిగాయి. నదురుగా ఉన్న ఆడపిల్లని ఎంచుకుని ప్రేమించిపడేసినట్టుగా అప్పట్లో నేను తోచిన ఆలోచనను కథగా రాసి పాడేయాలని నిశ్చయించుకున్నాను. పి.యు.సి.లో మార్కుల సంఖ్య కన్నా కథలే ఎక్కువ రాయడం మంచిదని నాకు నేనే బోధించుకున్నాను. తీరా రాసేను గదాని తాతగారి దగ్గరకెళ్లాను. ఆయన ఏదో పెద్ద పుస్తకమే చదువుతున్నారు. నా మానవప్రయత్నం ఫలించి ఆయన నా కథ విన్నారు. ఆపై చక్కని చిరు బోసి నవ్వొకటి ఇచ్చి, నా చేతికి మొపాసా, చెహోవ్ అనే ఆసాములు రాసిన కథల సంపుటాలు ఇచ్చి, కథ రాసే ముచ్చట ప్లస్ సౌలభ్యం కలవారు ఇలాంటి పుస్తకాలు చదివితే మంచి జరుగుతుందని తాను చదివే పుస్తకం లోంచి తల ఎత్తకుండా సెలవిచ్చి ఊరుకున్నారు. పెద్దలకి ఇక బాగుపడే అవకాశం లేదనిపించేంత కోపం వచ్చింది నాకు. ఈ తల్లావజ్ఘల శివశంకరశాస్త్రి గారితో పనేంటిలెమ్మని వసారాలో కట్టుడుపళ్లు గాజు గ్లాసులోంచి తీస్తోన్న మొక్కపాటి నరశింహశాస్త్రిగారి దగ్గరకెళ్లాను. కథ కొంత విన్నారు. ఎలెన్ పో, మామ్ వంటి పెద్దలిచ్చిన నిర్వచనాలు చెప్పి, చాప్లిన్ స్వీయచరిత్ర, ఒకూరా కుకుజో రాసిన ‘బుక్ ఆఫ్ టి’ చేతిలో పెట్టి, శ్రీపాదవారి కథ దాని శైలీ గురించి చెప్పి ఆశీర్వదించి వెళ్లారు. ఇది పాడిగాదనుకుని పతంజలి శాస్త్రిగారి ముందు నిలబడ్డాను. తాతల కన్నా అన్నలే నయమని సముదాయించుకున్నాను. ఆయన ఇంగ్లిషు పెద్దలతో పాటు తెలుగు మహామహుల కథల జాబితా నోటితో చెప్పి అవన్నీ చదివాకా నేను రాసింది మరోసారి చదువుకుంటే నాకు అదంతా టానిక్కులా పని చేస్తుందని షేక్హ్యాండ్ ఒకటిచ్చి తప్పుకున్నాడు. చావెరుగని ఇంట ఆవాలు సాధించాలని బయలుదేరిన ముసలమ్మలా గింజుకున్నాను. తుదకు నిగనిగలాడే నల్లటి మీసం, గడ్డం వచ్చేనాటికి రాయడం కన్నా చదవటమే సులువని అనవసరంగా తెలిసింది. అబ్బూరి వరద రాజేశ్వరరావు, ఏఆర్ కృష్ణ, తిరుమల రామచంద్ర, గోరా శాస్త్రి, రాంభట్ల, బూదరాజు, జి.కృష్ణ వంటి పెద్దలు కూడా కొత్తగా రాసే రచయితలను ప్రోత్సహించడం కోసం, ఎగసన తొయ్యడం కోసం, మంచి కోరి దీవిస్తారే తప్ప కథలు ఎలా రాయాలో చెప్పి, రాయించలేరని నా వరకు అర్థమయింది. కథ రాయాలంటే, ఎలా రాయడం తెలియడం కంటే కథ ఎలా రాయకూడదో తెలియడం ముఖ్యమని తెలిసొచ్చింది. ఇంకా చాలా తెలిసొచ్చాయి. మనకు తెలిసిందంతా, చదివిందంతా జ్ఞానం అనుకొని ఆ కషాయంలో కథను ముంచి ఆ డికాక్షన్ని అక్షరాల్లో పెడితే అది రాసినవాడికి, చదివినవాడికి, రాసిన విషయానికీ పెద్ద అపకారం అనీ- తెలివితేటలనీ పరిశోధన వంటి పరిశీలనలనీ సోయ లేకుండా కథలోకి చొప్పించరాదనీ- ఆర్ట్లెస్గా, ఏ మాత్రం కళాకాంతులు లేని వాక్యాలతో రాస్తే అది కథకు విద్రోహం అనీ- కథలో టన్నుల కొద్దీ ‘స్టాక్ ఎక్స్ప్రెషన్’లు గల జీడిపాకం వాక్యాలు సాగదీయడం పరమ ఘోరం, నేరం అనీ- కేవలం కథ, సారాంశం, అంశం, విషయం వగైరాలు దృష్టిలో పెట్టుకుని వ్యాసం, కరపత్రం, సంపాదకీయం, ఉపన్యాసం వంటి ధోరణిలో వాక్యాలు ఇటుకల్లా పేరుస్తూ పోవడాన్ని ‘రచన’గా భావించడం బెయిలు దక్కకూడని నేరం అనీ... తెలుసుకొని నలుగురికీ చెప్పాలనిపించింది. చలం, శ్రీపాద, మల్లాది వగైరా అనేక పెద్ద రచయితలను మించి వెలిగిపోయే రచన చేయాలంటే మన కథలపై మనకి నిర్దాక్షిణ్యమైన సద్విమర్శ, విశ్లేషణ, సమీక్షా అవసరమని గమనించాను. అలాగే బాపుగారి బొమ్మ ఉన్నంత మాత్రాన, పాత పత్రికల్లో పూర్వం అచ్చయినంత మాత్రాన అవన్నీ గొప్ప రచనలు కాలేవని గ్రహించాను. మనం దళితులమో, స్త్రీవాదులమో, ఈశ్వర, నిరీశ్వర, వామ పక్షవాదులమో, అరస, విరస, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వాదులమో, చరిత్రకారులమో అయినంత మాత్రానగాని, అట్టివారు మెచ్చినంత మాత్రానగానీ ఏ కథా, ఏ నవలా గొప్పదో, మంచిదో అయి తీరాల్సినదేమీ లేదని ఇవాళ అనేక కథలు, నవలలూ చదువుతోంటే అర్థమయింది. తెలుగువారి గుండెల్లో నిద్రపోయేంతటి కథ అనే ఖడ్గసృష్టి జరగడం అంత సులువుగా సాగే పని కాదనీ అర్థమైంది. అలాగే మనం నలుగురితో మంచిగా ఉన్నంత మాత్రాన, మనం మంచివారిగా నటించినంత మాత్రాన మన కథ గొప్ప కథ అయిపోదని కూడా తెలిసి వచ్చింది. అలాగే శైలి కథను, సారాంశాన్ని మింగేస్తోందని కొందరు రచయితలన్నారు. ఒక గొప్ప శైలి వొచ్చి వస్తువునో, కథనో మింగేస్తున్న దృశ్యం నాకయితే ఎక్కడా కనబడలేదు. అసలు శైలి గురించి, శిల్పం గురించి దృష్టి పెడుతున్నారా? కొందరు కళ (సాహిత్యం) అనే పేరుతో ‘ఎంకరేజ్మెంట్’ అనే లేబుల్ కింద ప్రతి రచయితనూ మెచ్చుకోవడం వెనుక ప్రయోజనకరమైన పాలిటిక్సూ లేకపోలేదు. సమస్త పాఠకులారా చూసి అడుగు వేసినట్టే చూసి, ఆగి, ఆలోచించి రచయితను అభినందించాలని మనవి. చివరగా నిరాశ పరచడం, లేనిదానిని పెకైత్తుకుని దీవించడం రెండూ కుర్ర రచయితలకు ప్రమాదమే. పాఠకులం మనం చదువుతున్నట్టే రచయితలూ అనేకం చదివితే వారికీ మనకీ మంచిదేగదానిపించి ఇంత గోల చేసేను. - శివాజీ అద్దేపల్లికి నాగభైరవ అవార్డు సుప్రసిద్ధ కవి డా. నాగభైరవ కోటేశ్వరరావు పేరున గత నాలుగేళ్లుగా ప్రకటిస్తున్న ప్రతిష్టాత్మక ‘నాగభైరవ పురస్కారాన్ని’ 2013 సం.కుగాను ప్రసిద్ధ కవి అద్దేపల్లి రామమోహనరావుకు ప్రకటించారు. డిసెంబర్ 15న నెల్లూరులో పురస్కార ప్రదానం. దీంతోపాటు నాగభైరవ స్ఫూర్తి అవార్డులను- జలదంకి ప్రభాకర్, శైలజామిత్ర, వడలి రాధాకృష్ణ, షేక్ కరీముల్లాలకు అందిస్తారు. వివరాలకు: 94402 02942 -
నేడు రక్షాబంధన్
కర్నూలు(కల్చరల్), న్యూస్లైన్: అన్న చెల్లెళ్ల బంధం గురించి సినీ కవులు, రచయితలు ఎన్ని గీతాలు, కథలు రాసినా, డెరైక్టర్లు వాటిని ఆకట్టుకునేలా తెరపై ప్రదర్శించినా నిజమైన బంధానికి ఎంతమాత్రం సాటిరావు. బుడి బుడి అడుగుల వయసులో వేలు పట్టుకొని నడిపించిన అన్నయ్య, కొంచెం పెద్దయ్యాక బాగోగులు చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడిన అన్నయ్య అంటే చెల్లికి అమితమైన ప్రేమ. పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లే సమయంలో అన్నయ్య భుజం మీద వాలిపోగానే అలవోకగా ఆ చెల్లి కళ్ల నుంచి జాలువారిన నీరు, ఇంటికి తిరిగొచ్చిన అన్నయ్యను చూసి హర్షాతిరేకంతో అన్నయ్యొచ్చాడంటూ కేకలేసిన చెల్లి అత్తారింటికి వెళ్లిపోగా మూగబోయిన గుమ్మాన్ని చూసిన క్షణంలో అన్నయ్య కళ్ల నుంచి వచ్చే నీరు వారిమధ్య ఆత్మీయ బంధానికి నిదర్శనం. అమ్మ నాన్న తర్వాత తనను అంతగా అక్కున చేర్చుకుని అన్నీ అమర్చే ఒకే ఒక వ్యక్తి అన్నయ్యే. పాలమీగడలా, వెన్నెల తరగలాంటి స్వచ్ఛమైన అన్నా చెల్లెళ్ల అనురాగ బంధానికి అపురూప వేడుకగా ఏడాదికి ఓసారి రక్షాబంధన్ను నిర్వహించుకుంటారు. ఉత్తర భారత దేశంలో ప్రారంభమైన ఈ వేడుక దక్షిణాదిరాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుగుతోంది. నేడు ఆ రోజు రానే వచ్చింది.