advertising
-
మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేల్స్, మార్కెటింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా మహా కుంభ మేళా–2025 ప్రత్యేక ప్రకటనల హక్కులను దక్కించుకుంది. కుంభ మేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగనుంది. ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్లో భాగమైన శ్రేయాస్ మీడియా వెండింగ్, అమ్యూజ్మెంట్ జోన్స్, ఫుడ్ కోర్ట్ సహా పలు కార్యకలాపాల హక్కులు సైతం పొందింది. రూ.6,300 కోట్లతో యూపీ ప్రభుత్వం నిర్వహించనున్న ఈ మేళాకు దేశ, విదేశాల నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో జరిగే ఈ మెగా ఈవెంట్ భారత చరిత్రలో అత్యంత గొప్ప కుంభ మేళా అవుతుందని శ్రేయాస్ మీడియా ఫౌండర్ జి.శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రకటనలు, బ్రాండింగ్కు కంపెనీలు సుమారు రూ.3,000 కోట్లు వెచి్చంచే అవకాశం ఉందన్నారు. మేళా వేదికగా బ్రాండ్లను కోట్లాది మందికి చేర్చడానికి సంస్థ తనకున్న అపార అనుభవం, అసమాన నైపుణ్యాన్ని ఉపయోగిస్తుందని చెప్పారు. -
ఏఏఏఐ అధ్యక్ష నియామకం
హైదరాబాద్: సౌత్ ఏషియా ఆఫ్ గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సీఈవో అయిన ప్రశాంత్ కుమార్, అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్గా మరోసారి ఎన్నికయ్యారు. ముంబైలో సమావేశమైన ఏఏఏఐ వార్షిక జనరల్ బాడీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి కొత్త పాలకమండలిని ఎన్నుకుంది. హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో అయిన రాణా బారువా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మోహిత్ జోషి, సంతోష్ కుమార్, కె.శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని కొత్త ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. -
ఆ వ్యాధులకు ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ వల్ల మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘవ్యాధుల వస్తాయని అందరికీ తెలిసిందే. నిపుణులు కూడా వీటికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ చాలామంది వాటిని తినే అలవాటుని మానుకోరు. పైగా అందుకు తగ్గట్టు యాడ్లు కూడా ఆకర్షణీయంగా వస్తాయి. అందులోనూ ప్రముఖులు, సెలబ్రెటీలే వాటిని ప్రమోట్ చేయడంతో నిపుణుల సలహాలను పక్కకు పెట్టేస్తుంటారు. అందువల్లే దేశమంతటా ఊబకాయం, మధుమేహ వ్యాధుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడూ ఆ విషయం నిపుణులు జరిపిన తాజా నివేదికలో తేలింది. ఆయా ఫుడ్స్ యాడ్స్ తప్పుదారి పట్టించి..తినేలా ప్రేరేపిస్తున్నట్లు న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్ఏపీఐ) 50 షేడ్స్ ఆఫ్ ఫుడ్ అడ్వర్టైజింగ్ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలో ఢిల్లీలో అందుబాటులో ఉన్న ప్రముఖ, ఆంగ్ల, హిందీ దినపత్రికల్లో వస్తున్న సుమారు 50 ఫుడ్ ప్రకటనలను పరిశీలించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. భావోద్వేగాలు రేకెత్తించేలా అనారోగ్యకరమైన ఆ ఆహార ఉత్పత్తులను ప్రముఖులచే అడ్వర్టైజింగ్ చేపించి, వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ల సమయంలోనూ, సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్ఏపీఐ) కన్వీనర్, పీడియాట్రిక్ అరుణ్ గుప్తా నివేదించారు. అంతేగాదు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వస్తున్న వాణిజ్య ప్రకటనలపై ముగింపు పలికేలా ప్రస్తుత నిబంధనలను సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఆయా ప్రొడక్ట్లు వందగ్రాములు/మిల్లీ లీటర్కు ఎన్ని పోషకాలు ఉంటున్నాయనేది బోల్డ్ అక్షరాలతో బహిర్గం చేసే చర్యలకు పిలుపునిచ్చారు. కాగా, ఇటీవలే ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఈ ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో 10 ఏళ్లలోపు వయసుగల పిల్లల్లో పదిశాతానికి పైగా ఎక్కువ మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారని పేర్కొంది.(చదవండి: అరటి కాండంతో చాట్..! ఎప్పుడైనా ట్రై చేశారా..?) -
మనీమంత్ర కవితాగానం
‘కష్టపడగానే సరిపోదు... ఆ కష్టానికి తగిన ఫలితం ఉండాలి. ప్రతిభ ఉండగానే సరిపోదు... దానికి తగిన ప్రతిఫలం ఉండాలి’ అంటుంది కవితా షెనాయ్. అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన కవితకు వినియోగదారుల నాడి తెలుసు. తగిన ప్రతిభ, సామర్థ్యాలు ఉండి కూడా నష్టాలతో చతికిల పడుతున్న కంపెనీలను చూసిన తరువాత ‘వోయిరో’ స్టార్టప్కు శ్రీకారం చుట్టింది. ఈ సాస్(సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) స్టార్టప్ దక్షిణ ఆఫ్రికాలోని ‘డీఎస్టీవీ’ చానల్తో సహా మనదేశంలోని పెద్ద వోటీటీ ప్లాట్ఫామ్లు, డిజిటల్ పబ్లిషర్లతో కలిసి పనిచేస్తోంది.... మేకప్ ఆర్టిస్ట్, వీడియో ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకున్న కవిత షినాయ్ ఆ తరువాత ఎడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆనంద్ గోపాల్, అనీల్ కారట్, జితిన్ జార్జ్లతో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘వోయిరో’ సాస్ స్టార్టప్ మొదలుపెట్టింది. దీనికిముందు కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడానికి తన బృందంతో కలిసి స్వయంగా కంటెంట్ క్రియేట్ చేసేది. ముంబై యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుకున్న కవిత మార్కెటింగ్ కమ్యూనికేషన్ కంపెనీ ‘లోవ్ లింటస్’ తో కలిసి పనిచేసింది. ఆ తరువాత యూ ట్యూబ్ టీమ్తో పనిచేసింది. చదివిన చదువు, పెద్ద సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ‘వోయిరో’ ప్రయాణంలో తనకు ఉపకరించాయి. ఒక స్టార్టప్కు తొలి విజయ సంకేతం... నిధుల సమీకరణ. నిధుల సమీకరణకు సంబంధించి ‘వోయిరో’కు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇక రెండో సవాలు ఇతరులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఎంతోమందితో మాట్లాడి, ఎన్నో సలహాలు తీసుకోవడం ద్వారా రెండో సవాలును కూడా అధిగమించింది. డిజిటల్ పబ్లిషర్స్, వోటీటీ ప్లాట్ఫామ్ల ఆదాయ వృద్ధికి కంటెంట్ను మానిటైజేషన్ చేయడం అనేది కీలకం. మార్కెట్, సాంకేతికత, డేటా అనే మూడురకాల అంశాలలో పట్టు ఉండాలి. అది కవితా షెనాయ్ పనితీరులో కనిపిస్తుంది. డిజిటల్ పబ్లిషర్లు, వోటీటీ ప్లాట్ఫామ్స్తో ‘వోయిరో’కు సంబంధించి సేల్స్ టీమ్, యాడ్ ఆపరేషన్ టీమ్, ఫైనాన్స్ టీమ్, స్ట్రాటజీ టీమ్ అనే నాలుగు బృందాలు కలిసి పనిచేస్తాయి. మీడియా కంపెనీలకు రెవెన్యూ అనలటిక్స్ను అందుబాటులో తీసుకురావడం నుంచి బలమైన ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) స్ట్రాటజీని అనుసరించడం వరకు తనదైన దారిలో ప్రయాణిస్తోంది వోయిరో. కోవిడ్ కల్లోల సమయంలో అన్ని కంపెనీల లాగే ‘వోయిరో’కు సమస్యలు ఎదురైనప్పటికి వోటీటీ పరిశ్రమ, కంటెంట్ స్పేస్ పుంజుకోవడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ‘మీడియాతో అంటే నాకు ఉన్న ఇష్టం, అభిమానం వోయిరో ఆవిర్భావానికి కారణం అయింది. డిజిటల్ పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లకు వివిధ విషయాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అనే ఉద్దేశంతో ఈ వెంచర్ ప్రారంభించాం. లాభాల కంటే కూడా ఇతరులకు సహాయం చేయాలి, వారి విధానాలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వోయిరో ప్రారంభించాం. అయితే అది అంత సులువైన విషయం కాదని అర్థమైంది. మా ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకొని ముందుకు వెళుతున్నాం. మీడియా, డిజిటల్ పబ్లిషర్లు నష్టపోకుండా మార్గనిర్దేశం చేయడం మా లక్ష్యం’ అంటుంది కవిత షెనాయ్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది వ్యాపార ప్రస్థానంలో ‘ఇక ముందుకు వెళ్లలేము’ అని నిరాశపడే పరిస్థితి రావచ్చు. దీనికి లొంగిపోకుండా పట్టుదలతో ముందుకు వెళితే విజయం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మన ఓపిక, కష్టపడేతత్వం గెలుపును నిర్ణయిస్తాయి. ‘వోయిరో’ ప్రారంభానికి ముందు ఇండస్ట్రీ పెద్దల నుంచి కుటుంబసభ్యులు, స్నేహితుల వరకు ఎంతోమంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఓటీటీకి సంబంధించి మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తూ మా పనితీరును మెరుగు పరుచుకుంటూ, పరిధిని విస్తరిస్తూ వెళ్లాం. – కవితా షెనాయ్, వోయిరో–ఫౌండర్, సీయివో -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ షాక్!
(2022 నాటికి) ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ సేవలు. 200 మిలియన్ల మంది అమెజాన్ ప్రైమ్ మెంబర్లు. కేవలం నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అమెజాన్కు వచ్చే ఆదాయం 35.22 బిలియన్ డాలర్లు ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్ల నుంచి జరిగే వ్యాపారం విలువ12.9 బిలియన్ డాలర్లు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు ఇవేం సరిపోలేదట్లుంది. ఓటీటీ విభాగంలో అమెజాన్ ప్రైమ్కు ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్త ఏడాది నుంచి అమెజాన్ ప్రైమ్లో వీడియోలు చూసే సమయంలో యాడ్స్ను ప్రసారం చేయనున్నారు. తద్వారా మరింత ఆదాయాన్ని గడించనున్నారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ యూజర్లకు షాకిచ్చింది. ఇతర ఓటీటీ ప్లాట్పామ్ నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది జనవరి 29 నుంచి అమెజాన్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో ఇకపై యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే ప్రకటనలపై అమెజాన్ యూజర్లకు మెయిల్కు సమాచారం అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న యాడ్స్ ఆప్షన్ వద్దనుకునే యూజర్లు నెలకు 3 డాలర్లు అంటే నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్ల ఏడాదికి రూ.11,575 వసూలు చేస్తుంది. తాజాగా యాడ్స్ వద్దనుకునే యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. ఓటీటీల్లో సరికొత్త సాంప్రదాయం అమెరికాలో అమెజాన్ ప్రైమ్, మ్యాక్స్, పారామౌంట్ ప్లస్, నెట్ఫ్లిక్స్, డిస్నీప్లస్ ఇలా ఐదు ఓటీటీ దిగ్గజ సంస్థలున్నాయి. వాటిల్లో మ్యాక్స్, పారామౌంట్ ప్లస్లు 2021లోనే వీడియోల్ని వీక్షించే సమయంలో యాడ్స్ను ప్రసారం చేసేలా కొత్త సాంప్రదాయానికి తెరతీశాయి. ఆ తర్వాత 2022లో నెట్ఫ్లిక్స్ సైతం యాడ్స్ను డిస్ప్లే చేసింది. ఇప్పుడు అమెజాన్ సైతం వీడియోలపై ఆయా కంపెనీల ప్రకటనలు ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో యాడ్స్ ప్రసారం చేస్తున్నామని, అమెరికా, యూకే, జర్మనీ, కెనడాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు చెందిన యూజర్లకు మెయిల్ చేసింది. -
ఏఏఏఐ డైరెక్టరుగా ‘శ్లోకా’ శ్రీనివాస్ ఎన్నిక
హైదరాబాద్: అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టరుగా శ్లోకా అడ్వరై్టజింగ్ ఎండీ, సీఈవో కె. శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు. డైరెక్టర్ల బోర్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వరుసగా రెండోసారి ఎవరైనా ఎన్నికవడం ఇదే ప్రథమం. అడ్వరై్టజింగ్, మార్కెటింగ్లో శ్రీనివాస్కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది. డైరెక్టర్ల బోర్డుకు మరోసారి ఎన్నికవడంపై శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ వ్యాపార విధానాలు అమలయ్యేలా చూసేందుకు బోర్డు సభ్యులతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఏఏఏఐ ప్రెసిడెంట్గా గ్రూప్ ఎం మీడియా సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. అలాగే, హవాస్ మీడియాకు చెందిన రాణా బారువా ఏకగ్రీవంగా వైస్–ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. -
డిజిటల్ ప్రకటనలకూ ఓ లెక్కుంది!
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పత్రికలో ప్రకటన ఇస్తే ప్రకటన సైజును బట్టి దాని ధరను అభ్యర్థుల ఖర్చుల కింద లెక్కిస్తారు. మరి యూట్యూబ్, వెబ్సైట్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ఎక్స్ (ట్విట్టర్)లో అభ్యర్థులు ఇచ్చే ప్రకటనల పరిస్థితి ఏంటి? వాటికీ ఓ లెక్కుంది అంటోంది ఎన్నికల సంఘం. సోషల్ మీడియాలో అభ్యర్థులు ఇస్తున్న ప్రకటనలను ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆ ప్రకటనల వ్యయాన్ని లెక్కించి వారి ఎన్నికల ఖర్చు పద్దుల్లో నమోదు చేస్తున్నారు. వీటి రేట్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ పాలసీ మేరకు ఈసీ నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సర్క్యులర్ను జారీ చేసింది. యూట్యూబ్లో వ్యూస్ను బట్టి యూట్యూబ్లో అభ్యర్థుల ప్రకటనకు వచ్చిన వ్యూస్ మేరకు అధికారులు ప్రకటన ఖర్చును లెక్కిస్తున్నారు. యూట్యూబ్లో వచ్చిన ప్రకటనకు ఒక వ్యూకు 30 పైసల చొప్పున ధర నిర్ణయించారు. వెబ్సైట్లలో ప్రకటనకు సంబంధించి లైక్ (ఇంప్రెషన్స్)ల ఆధారంగా అభ్యర్థుల ఖర్చును లెక్కిస్తున్నారు. 300/350 పిక్సెల్ సైజు డిస్ప్లే బ్యానర్ ప్రకటనకు 1 సీపీటీఐ (కాస్ట్ పర్ థౌజెండ్ ఇంప్రెషన్స్) రూ.35 చొప్పున లెక్కిస్తున్నారు. సంబంధిత వెబ్సైట్కు ఉన్న యూజర్స్ మేరకు ఈ రేటు హెచ్చుతగ్గులుంటాయని అధికారులు చెప్పారు. 20 లక్షలకు మించి యూజర్లు ఉన్న వెబ్సైట్ హోం పేజీలో ఇచ్చే వీడియో ప్రకటనకు రూ.75 వేలుగా నిర్ణయించారు. ఫొటో ప్రకటనకు రూ.25 వేలుగా లెక్కిస్తున్నారు. ప్రైం టైమ్, నార్మల్ టైమ్లను దృష్టిలో ఉంచుకుని ఈ రేట్లలో హెచ్చుతగ్గులుంటాయి. బల్క్ ఎస్ఎంఎస్ తమ గుర్తుకు ఓటేయాలని పంపే బల్క్ ఎస్ఎంఎస్లకూ ఎన్నికల సంఘం ఓ రేటును నిర్ణయించింది. ఇంగ్లి‹Ùలో 160 క్యారెక్టర్లు, స్థానిక భాషల్లో 70 క్యారెక్టర్లున్న ఒక్క ఎస్ఎంఎస్కు రూ.2.80 చొప్పున రికార్డు చేస్తున్నారు. సినిమా థియేటర్లలో ఇచ్చే ప్రకటనలకు 500 సీటింగ్ కెపాసిటీకి మించి ఉన్న థియేటర్లో ఇచ్చే ప్రకటనలకు ప్రతి 10 సెకన్లకు రూ.15.30 చొప్పున, 500లోపు సీటింగ్ సామర్థ్యం ఉన్న థియేటర్లలో రూ.13.26 చొప్పున లెక్కిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల వివరాలివ్వాలి ఎన్నికల సంఘం డిజిటల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జిల్లాల్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసింది. సంబంధిత అధికారులు డిజిటల్ మీడియాలో అభ్యర్థులు ఇస్తున్న ప్రకటనలను పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కొత్తగా అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇవ్వడం తప్పనిసరి చేయడం గమనార్హం. -పి.బాలప్రసాద్ -
ది అడ్వర్టైజింగ్ క్లబ్ చైర్మన్గా రానా బారువా
అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా పరిశ్రమకు చెందిన అపెక్స్ బాడీ అడ్వర్టైజింగ్ క్లబ్ నూతన మేనేజింగ్ కమిటీని ప్రకటించింది. తమ 69వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2023-2034 సంవత్సరానికి సంబంధించి హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో రానా బారువాను అధ్యక్షునిగా నియమించింది. మాజీ అధ్యక్షుడు పార్థ సిన్హా మేనేజింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగనున్నట్లు అడ్వర్టైజింగ్ క్లబ్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తన నియామకం గురించి.. రానా బారువా మాట్లాడుతూ, “దాదాపు 70 చరిత్ర కలిగిన సంస్థ ది యాడ్ క్లబ్కు ప్రెసిడెంట్గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త తరం, ఔత్సాహికులకు మెరుగైన సేవలు అందిచాలనేది తమ లక్ష్యమని.. ఇందుకోసం వివిధ రంగాల్లో వైవిధ్యమైన లీడర్స్ అపరిమిత అవకాశాల్ని, సేవల్ని అందించేందుకు తమ ఉత్తమమైన మేనేజ్మెంట్ టీమ్తో కలిసి ముందుకెళ్తామన్నారు. ఇండస్ట్రీలోని కొత్త ప్రతిభను ఆకర్షించడానికి, మహిళా సాధికారతకు, భవిష్యత్తు నాయకులను ప్రోత్సహించడం, వైవిధ్యాన్ని అభివృద్ధి చేయడం, ఈక్విటీ, చేరికలను పెంచేందుకు ప్రగతిశీల పొత్తులు, సంభాషణలను ప్రోత్సహించడానికి తామంతా కలిసి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి కట్టబడి ఉంటామని చెప్పారు. అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫీస్ బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు ► రానా బారువా - అధ్యక్షుడు ►ధీరజ్ సిన్హా - ఉపాధ్యక్షుడు ►డాక్టర్ భాస్కర్ దాస్ - కార్యదర్శి ►శశి సిన్హా - జాయింట్ కార్యదర్శి ►మిత్రజిత్ భట్టాచార్య - కోశాధికారి మేనేజింగ్ కమిటీ సభ్యులు ►అవినాష్ కౌల్ ►మాల్కం రాఫెల్ ►ప్రశాంత్ కుమార్ ►పునీత ఆరుముగం ►శుభ్రాంశు సింగ్ ►సోనియా హురియా ► సుబ్రహ్మణ్యేశ్వర సమయం కో-ఆప్టెడ్ పరిశ్రమ నిపుణులు ►అజయ్ కాకర్ ►ప్రదీప్ ద్వివేది ►విక్రమ్ సఖుజా డ్వర్టైజింగ్ క్లబ్ను మరింత ముందుకు నడిపేందుకు ప్రతిభ నైపుణ్యం, సంబంధిత విభాగాల్లో లోతైన అనుభవం ఆధారంగా ఎంపికైన మరికొంత మంది వ్యక్తులు ► అజయ్ చాంద్వానీ ► అలోక్ లాల్ ► అనూషా శెట్టి ► లులు రాఘవన్ ► మన్షా టాండన్ ►నిషా నారాయణన్ ►రాజ్ నాయక్ ►సత్యనారాయణ రాఘవన్ ►వికాస్ ఖంచందాని -
ఆ యాడ్తో బాద్షాకి చిక్కులు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిక్కుల్లో ప డ్డారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు ఆయన ఇల్లు ముట్టడికి కొందరు విఫలయత్నం చేశారు. ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించేలా షారూక్ వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు. అన్టచ్ ఇండియా ఫౌండేషన్కు చెందిన కొందరు బాంద్రాలోని షారూక్ ఇంటి బయట నిరసనలకు దిగడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షారూక్ ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేసి కొందరు యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఏ23 అనే ఆన్లైన్ రమ్మీ పోర్టల్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న షారూక్ ఇటీవల దానికి సంబంధించిన ఒక వాణిజ్యప్రకటన(యాడ్)లో నటించారు. ఆ యాడ్లో ‘పదండి కలిసి ఆడదాం’ అని షారూక్ వ్యాఖ్యానిస్తారు. ఈ అడ్వర్టయిజ్మెంట్పై అన్టచ్ యూత్ పౌండేషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యువతని పక్కదారి పట్టిస్తున్నాయని అన్టచ్ ఇండియా ఫౌండేషన్ విమర్శించింది. -
గుదిబండ.. ‘అప్పు’డే!.. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు మరోసారి వెలుగులోకి
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అప్పులపై టీడీపీతో పాటు దాని అనుబంధ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. 2019 నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు అప్పులుండగా 2023 మార్చి నాటికి రూ.4,42, 442 కోట్లకు చేరినట్లు తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అసెస్ చేస్తోందా? 2019 మే నుంచి ఏపీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? ఆర్థిక పరిస్థితిని అంచనా వేశారా?..’’ అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు వ్యవహ రిస్తోందని తేల్చి చెప్పారు. ద్రవ్యలోటు తగ్గింపు, వివేకంతో కూడిన రుణ నిర్వహణ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో సుస్థిరత, పారదర్శకతను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బీఎంను అసెంబ్లీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను, ఆర్ధిక పరిమితులను అమలు చేస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం పరిశీలన చేస్తూ ఉంటుందని వివరించారు. కాకి లెక్కలతో పరిపాటిగా.. టీడీపీ దుష్ప్రచారానికి నిత్యం వంత పాడుతున్న ఎల్లో మీడియా అప్పులపై తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో మరోసారి తేటతెల్లమైంది. ఒకసారి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో కథలు అల్లటం ఎల్లో మీడియాకు రివాజుగా మారింది. ఈ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నా రహస్యంగా అప్పులను దాచారనే విధంగా ఎల్లో మీడియా అవాస్తవాలను వండి వారుస్తోంది. పరిమితులకు లోబడే అప్పులు తీసుకుంటున్నామని, టీడీపీ హయాంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు స్పష్టం చేసింది. తీసుకున్న అప్పులను సామాజిక హితం కోణంలోనే ఖర్చు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు, నగదు బదిలీతో పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. కోవిడ్ సమయంలోనూ డీబీటీతో పేదలను ఆదుకోవడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా చర్యలు తీసుకుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇవన్నీ ముమ్మాటికీ నిజమని రుజువైంది. ఈ గణాంకాలను ఆర్బీఐ నివేదిక ప్రకారం వెల్లడిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా పాఠకులకు తప్పుడు సమాచారాన్ని చేరవేయకుండా విశ్వసనీయతతో జర్నలిజం విలువలను పాటించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
సెలెబ్రిటీలపై ఫిర్యాదుల వెల్లువ.. లిస్ట్లో ఎంఎస్ ధోనీ టాప్!
ముంబై: వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆయా ఉత్పత్తుల మంచీ, చెడుల గురించి మదింపు చేయడంలో చాలా మటుకు సెలబ్రిటీలు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అడ్వర్టైజింగ్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఏఎస్సీఐ తెలిపింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! 2022 ఆర్థిక సంవత్సరంలో 55 ప్రకటనలకు సంబంధించి సెలబ్రిటీలపై ఫిర్యాదులు రాగా గత ఆర్థిక సంవత్సరం ఇది ఏకంగా 803 శాతం పెరిగి 503 యాడ్లకు చేరింది. వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ప్రకారం సెలబ్రిటీలు తాము నటించే యాడ్ల గురించి ముందస్తుగా మదింపు చేయాలి. కానీ ఏఎస్సీఐ పరిశీలించిన 97 శాతం కేసుల్లో సెలబ్రిటీలు ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఎంఎస్ ధోనీ టాప్ పది ఉల్లంఘనలతో క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సెలబ్రిటీల లిస్టులో అగ్రస్థానంలో ఉండగా, ఏడు ఉల్లంఘనలతో యాక్టర్ కమెడియన్ భువన్ బామ్ రెండో స్థానంలో ఉన్నారు. గేమింగ్, క్లాసికల్ విద్య, హెల్త్కేర్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో అత్యధికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం వివిధ మీడియా ఫార్మాట్లలో ఏఎస్సీఐకి 8,951 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 7,928 కంప్లైంట్లను సమీక్షించింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్పై కీలక ప్రకటన -
ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది. ► 23 శాతం మంది క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్సైట్ల ద్వారా మోసపోయారు. ► 10 శాతం మంది వెబ్సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు. ► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది. ► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. ► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు. ► సంబంధిత ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు. ► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు. ► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు. ► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. ► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది. -
ప్రకటనలపై వ్యయాలు 15 శాతం అప్
ముంబై: దేశీయంగా ఈ ఏడాది ప్రకటనలపై వ్యయాలు 15.5% పెరిగి రూ. 1.46 లక్షల కోట్లకు చేరనున్నాయి. 2021తో పోలిస్తే 2022లో పరిశ్రమ 15.7 శాతం వృద్ధి చెందిందని అంచనాలు నెలకొన్నాయి. మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం ఈ అంచనాలను వెలువరించింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న టాప్ 10 మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉండనుందని, అడ్వర్టైజింగ్పై వెచ్చించే వ్యయాల విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంటుందని గ్రూప్ఎం వివరించింది. స్థూల ఆర్థిక అస్థిరతలు, అంతర్జాతీయ పరిణామాలు గత మూడేళ్లుగా ప్రకటనకర్తల వ్యాపారాలు, అడ్వర్టైజింగ్ వ్యయాలపై ప్రభావం చూపాయని సంస్థ సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. 2023లో ప్రకటనల వ్యయాలకు టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. బీమా, రిటైల్, ఫిన్టెక్, గేమింగ్, ట్రావెల్, పర్యాటకం మొదలైన విభాగాల నుంచి ఊతం లభిస్తుందని గ్రూప్ఎం బిజినెస్ ఇంటెలిజెన్స్ హెడ్ పర్వీన్ షేక్ చెప్పారు. ఈ ఏడాది గ్రామీణ ఎకానమీ కూడా పుంజుకోగలదన్నారు. టాప్ మెట్రోలను దాటి ఇతర ప్రాంతాలకూ 5జీ సేవలు విస్తరిస్తుండటం, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం తదితర అంశాలూ ప్రకటనకర్తలు అడ్వర్టైజింగ్పై మరింతగా వెచ్చించేందుకు దోహదపడగలవన్నారు. డిజిటల్దే పైచేయి.. గ్రూప్ఎం అంచనాల ప్రకారం మొత్తం ప్రకటన వ్యయాల్లో సింహభాగం వాటా డిజిటల్ మీడియాదే ఉండనుంది. అత్యంత వేగంగా 20 శాతం వృద్ధితో ఏకంగా 56 శాతానికి చేరనుంది. టీవీ మాధ్యమం వాటా మాత్రం స్వల్పంగా 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది. ప్రింట్ మాధ్యమంలో ప్రకటనలపై వ్యయాలు మరింతగా తగ్గి 11 శాతం (2022లో) నుంచి ఈ ఏడాది 10 శాతానికి పరిమితం కానున్నాయి. విలువపరంగా మాత్రం ప్రింట్లో ప్రకటనలు రూ. 13,519 కోట్ల నుంచి రూ. 14,520 కోట్లకు పెరగనున్నాయి. -
డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔట్డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్ మీడియా సంచలనం సృష్టిస్తోంది. కంపెనీ ఏర్పాటైన రెండేళ్లలోనే అన్ని మెట్రో నగరాల్లో 3,200 పైచిలుకు స్క్రీన్లతో విస్తరించింది. యాపిల్, ఆడి, మలబార్ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రకటనలను డిజిటల్ తెరలపై టీ–హబ్, డీఎల్ఎఫ్, లోధా, హైహోమ్, అరబిందో, ఇనార్బిట్ తదితర వందలాది గృహ సముదాయాలు, కమర్షియల్ ప్రాజెక్టులు, మాల్స్లో ప్రదర్శిస్తోంది. భారత్లో ఔట్డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా నిలిచామని బెల్ ప్లస్ మీడియా కో–ఫౌండర్లు గాయత్రి రెడ్డి చప్పిడి, దేవ్ అభిలాష్ రెడ్డి కొత్తపు తెలిపారు. ఏడాదిలో 20,000 స్క్రీన్లు, 20 నగరాలకు చేరుకోవాలన్నది లక్ష్యమన్నారు. తొలిసారిగా..: రెండు డిస్ప్లేలతో దేశంలో తొలిసారిగా స్క్రీన్లను ఏర్పాటు చేశామని గాయత్రి వివరించారు. ‘అత్యాధునిక సాఫ్ట్వేర్తో వినూత్న అనుభూతి, అతి తక్కువ ఖర్చు, సౌకర్యంతోపాటు ప్రకటనలను కస్టమైజ్ చేసుకునే వీలుండడం వల్లే సక్సెస్ అయ్యాం. స్క్రీన్కు ఉండే సెన్సార్తో ఎంత మంది వీక్షించారో తెలుసుకోవచ్చు. పైన ఉండే డిస్ప్లేలో బ్రాండ్ల ప్రకటనలు, కింది డిస్ప్లేలో సంబంధిత సొసైటీ నోటీసులు, అసోసియేషన్ సందేశాలు, కార్యక్రమాలు ప్రదర్శిస్తాం. సొసైటీలకు సేవలు ఉచితం. పైగా వారికి అద్దె చెల్లిస్తాం. క్లయింట్కు బెల్ ప్లస్ అప్లికేషన్ ఇస్తాం. ప్రకటనల కంటెంట్ను వారే ఎంచుకోవచ్చు’ అని తెలిపారు. -
ఎలాన్ మస్క్కు అమెజాన్ బంపరాఫర్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ట్విటర్లో ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏడాదికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ట్విటర్ బాస్గా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టారు. వచ్చీ రాగానే సంస్థలో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ట్విటర్లో మస్క్ చర్యలతో దిగ్గజ కంపెనీలు వేలకోట్లు నష్టపోయాయి. ఆ నష్టభయాన్ని ముందే గుర్తించిన ఇతర సంస్థలు ట్విటర్లో అడ్వటైజ్మెంట్లను నిలిపివేశాయి. అయితే ఈ తరుణంలో టెక్ దిగ్గజం యాపిల్తో పాటు అమెజాన్లు ప్రకటనల్ని పునఃప్రారంభించాలని భావిస్తున్నాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్లను ఊటంకిస్తూ.. ట్విటర్లో యాపిల్ ప్రకటనలను తిరిగి ప్రారంభించనున్నట్లు మస్క్ చెప్పారు. ఈ విషయంపై అమెజాన్, యాపిల్ సంస్థలు ఇప్పటి వరకు స్పందించక పోవడం విశేషం. -
GenderNext: ప్రకటనల్లో నేటి మహిళ
కురులకు షాంపూలు.. మేనికి సబ్బులు.. వంటింట్లో కుకర్, మిక్సీలకే కాదు పురుషులు వాడే షేవింగ్ క్రీములకూ మహిళలను చూపించనిదే ఏ ప్రకటనా ఉండదనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రకటనల్లో మహిళా శక్తిని ఏ విధంగా చూపుతున్నారనే అంశం మీద అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), ఫ్యూచర్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో జెండర్ నెక్ట్స్ పేరిట ఓ స్టడీ నిర్వహించింది. ‘నేటి ఆధునిక రోజుల్లోనూ వాణిజ్య ప్రకటనల్లో చాలా వరకు మహిళల్ని ఇంకా మూస పద్ధతిలోనే చూపిస్తున్నారు’ అనేది ఈ స్టడీలో తేలింది. ప్రకటనల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై చేసిన లోతైన పరిశీలన ఇది. దాదాపు 600 ప్రకటనల్ని పరిశీలించిన అనంతరం మహిళల శక్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు జెండర్ నెక్ట్స్ స్టడీ నిరూపించింది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి మహిళను ఆంక్షల్లో చూపెట్టడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసింది. సంధించిన బాణాలు పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్, గాడ్జెట్స్, వీల్స్, విద్య, మనీ... సంబంధిత ప్రకటనలపై స్టడీ చేసిన అనంతరం కొన్ని ప్రశ్నలను రూపొందించి, వాటిని ఆన్లైన్ వేదిక ద్వారా ‘నేటి కాలంలో ప్రకటనలు మహిళల్ని ఎలా చూపిస్తున్నాయి? మహిళలు తమను తాము ఎలా భావిస్తున్నారు? తమను ఎలా చూపాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నలకు వృత్తి ఉద్యోగాలలో ఉన్న మహిళల నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ పరిశోధనలో భాగంగా అన్ని రకాల ప్రకటనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జెండర్ నెక్ట్స్ స్టడీకి ప్రధాన ఆథర్ గా వ్యవహరించిన లిపికా కుమరన్ మాట్లాడుతూ ‘ప్రకటనల్లో సానుకూల అంశాలున్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టయిజింగ్లో కొన్ని హానికరమైన స్టీరియో టైప్స్ పాత్రలున్నాయ’న్నారు. మహిళలకు సవాల్! మహిళలు ఆహారం తీసుకునే అలవాటును అత్యంత సున్నితంగా చూపడం పట్ల స్టడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే మిగిలిన వారంతా విశ్రాంతిగా కూర్చుని ఉండగా మహిళలు ఆపసోపాలు పడుతూ ఇంట్లో పనులు చేస్తున్నట్టు చూపడం, షాపింగ్లో అధికంగా ఖర్చు చేసేవారన్నట్టు, బ్యూటీ యాడ్స్లో మగవాళ్ల చూపులకు నచ్చే విధంగా ఉండేలా చూపడం, టెక్నాలజీ, గాడ్జెట్స్ వాడకంలో మహిళల శక్తి తక్కువ అన్నట్టు చూపడంతో పాటు మగ సెలబ్రిటీలు మహిళలకు సవాళ్లు విసురుతుండడం, ఆదేశాలు ఇస్తుండడం.. వంటివి అభ్యంతరకరంగా తేల్చారు. డిటర్జెంట్, ఫుడ్కు సంబంధించినవన్నీ మహిళల చేత మహిళలకోసమే రూపొందించినట్టుగా ఉండటం కూడా ఇందులో ప్రధానంగా గుర్తించారు. అంగీకరించని నేటి తరం ప్రకటనలపై విభిన్న వర్గాల మహిళలు సైతం ఈ అభ్యంతరాల్ని సమర్థించారు. స్వయం సమృద్ధి దిశగా తమ ప్రయాణానికి ప్రకటనలు నేస్తాలు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇంట్లో పనంతా నెత్తినేసుకునేలా చూపడాన్ని నవ యువ వధువులు అంగీకరించడం లేదు. అలాగే మహిళా దినోత్సవం రోజున ఇచ్చే ప్రకటనల్లో... ఎన్నో కష్టాల తర్వాత మహిళలు విజేతలు అయినట్టుగా చూపడం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిశోధన ఫలితాల అనంతరం ప్రకటనల్లో మహిళల పాత్ర మెరుగుదలకు గాను అస్కీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ అధ్యయనం కోసం జాతీయ, ప్రాంతీయ ప్రకటనదారులు, ఏజెన్సీ, విధాన నిర్ణేతలు, న్యాయవాదులు .. ఇలా అందరు నిపుణులు సంప్రదించారు. ‘ప్రకటనలలో మహిళలను హానికరమైన మూసపద్ధతుల్లో చూపడం వల్ల యువతుల మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, వీటి వల్ల వారు సమాజంలో తమ విలువను ఏ విధంగా చూస్తారు’ అనే అంశాన్ని ఈ స్టడీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఒక పాల ఆధారిత ఉత్పత్తి కంపెనీ తన యానివర్సరీ వేడుకల్లో భాగంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో భార్య, అమ్మ, అత్త, అమ్మమ్మ స్థానంలో ఉన్న ఆడవాళ్లందరూ మగవాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టేవారిగానే చూపారన్న అభియోగాలను సోషల్మీడియా వేదికగా ఎదుర్కొంటోంది. -
షరతులు వర్తిస్తాయి..: ఓటీటీ.. ఇంకాస్త చౌకగా!
(మంథా రమణమూర్తి) మిగిలిన దేశాలు వేరు. ఇండియా వేరు. ఇక్కడ రేటే రాజు. నాణ్యత, సర్వీసు వీటన్నిటిదీ ఆ తరువాతి స్థానమే. ధర కాస్త తక్కువగా ఉంటే... ఓ అరకిలోమీటరు నడిచైనా వెళ్లి తెచ్చుకునే మనస్తత్వం సగటు భారతీయ వినియోగదారుది. వినోదాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇపుడిపుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. కోవిడ్ కాలంలో వీక్షకుల సంఖ్య పెంచుకోవటమే లక్ష్యంగా ఎడాపెడా ఆఫర్లిచ్చేసి... కంటెంట్ కోసం వందల కోట్లను ఖర్చు చేసిన ఓటీటీలు... పరిస్థితులిపుడు సాధారణ స్థాయికి రావటంతో ఆదాయంపై దృష్టి పెట్టాయి. లాభాలు రావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో... సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికోసం ఉచితం... ప్రీమియం.. పే–పర్ వ్యూ వంటి పలు మోడళ్లను వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నాయి. ఇదే జరిగితే... ఓటీటీ యుగంలో మరో దశ మొదలైనట్లే. వినియోగదారులకు మరింత నాణ్యమైన కంటెంట్... మరింత తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెట్ఫ్లిక్స్కు తత్వం బోధపడింది.... ప్రపంచ ఓటీటీ రారాజు నెట్ఫ్లిక్స్లో... ఎన్నటికీ ప్రకటనలు ఉండవని సీఈఓ రీడ్ హేస్టింగ్స్ కొన్నాళ్ల కిందటి వరకూ పదేపదే చెప్పారు. 2011 నుంచీ ప్రతి ఏటా రెండంకెలకు తగ్గని ఆదాయ వృద్ధి... అసలు సబ్స్క్రయిబర్లు తగ్గటమనేదే లేని చరిత్ర నెట్ఫ్లిక్స్ది. అదే ధీమాతో ఇటీవల రేట్లు పెంచేసి, పాస్వర్డ్ షేరింగ్కు ప్రత్యేక ఛార్జీలు విధించారు. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో నెట్ఫ్లిక్స్కు 2 లక్షల మంది గుడ్బై కొట్టేశారు. ఇది ఊహించని షాక్. ఒక్కసారిగా షేరు పడిపోవటమే కాదు... వందల కొద్దీ ఉద్యోగాలూ పోయాయి. ఏప్రిల్– జూన్లోనూ ఈ షాక్ కొనసాగింది. ఏకంగా 10 లక్షల మంది మైనస్ కావటంతో సంస్థ పునరాలోచనలో పడింది. సబ్స్క్రిప్షన్ ఆదాయంపైనే ఆధారపడితే కష్టమని... అవసరమైతే చార్జీలు తగ్గించి ప్రకటనలు కూడా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ‘ప్రకటనల విషయంలో కాస్త పరిణతి ఉన్న మార్కెట్లలో ముందు మొదలుపెడతాం’ అన్నారు రీడ్. యాడ్ మార్కెట్ విషయంలో ఇండియా పరిణితి చెందిందో లేదో తెలీదు గానీ.. ఇక్కడ వచ్చే ఏడాది మొదటి నుంచీ నెట్ఫ్లిక్స్ తెరపైప్రకటనలు మాత్రం కనిపించబోతున్నాయి. అమెజాన్కు ఆ అవసరం లేదా? ప్రకటనతో కూడిన వీడియో ఆన్ డిమాండ్ (ఏవీవోడీ) సేవలపై స్ట్రీమింగ్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. డిస్నీ హాట్స్టార్ ఇప్పటికే ఏవీవోడీ మోడల్ను అమలు చేసి భారతీయుల మది గెలుచుకుంది. నెంబర్–1 స్థానంతో పాటు 3.6 కోట్ల యాప్ డౌన్లోడ్స్తో దేశంలో అత్యధిక వాటానూ సొంతం చేసుకుంది. ఎంఎక్స్ ప్లేయర్, జీ, ఊట్, సోనీ లివ్, సన్ నెక్స్›్ట వంటి ఇతర స్ట్రీమింగ్ సంస్థలు కూడా డిస్నీ మాదిరిగా సబ్స్క్రిప్షన్ ఆదాయం ఒక్కటే అయితే కష్టమన్న ఉద్దేశంతో ప్రకటనలకు ఎప్పుడో గేట్లు తెరిచేశాయి. యాడ్స్ ఆదాయం భారీగా వస్తుండటంతో ఇంతటి పోటీని సైతం తట్టుకోగలుగుతున్నాయి. దీనిపై ట్రస్ట్ రీసెర్చ్ అడ్వయిజరీ (ట్రా) సీఈఓ చంద్రమౌళి నీలకంఠన్ను ‘సాక్షి’ సంప్రతించగా.. ‘‘అవును! ధర తగ్గితే మధ్య మధ్యలో కొన్ని ప్రకటనలొచ్చినా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఓటీటీ కంపెనీలు అవసరమైన మోడళ్లను తెచ్చే పనిలోపడ్డాయి. అమెజాన్ మాత్రం తన ప్రైమ్ వీడియో తెరపై ప్రకటనలకు చోటివ్వకపోవచ్చు. ఎందుకంటే దాని ప్రధాన వ్యాపారం వీడియో కంటెంట్ కాదు. తన సభ్యులకిస్తున్న రకరకాల సర్వీసుల్లో ఇదీ ఒకటి. దానికి నిధుల కొరత కూడా లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓటీటీ తెరపై ప్రకటనలు ఇపుడిపుడే పెరుగుతున్నాయని. వచ్చే ఏడాది కాలంలో దీనికొక రూపం రావచ్చని చెప్పారాయన. ‘‘ఇండియా మిగతా దేశాల్లాంటిది కాదు. ఇక్కడ ప్రాంతీయ భాషల బలం ఎక్కువ. వీడియో కంటెంట్లోనూ వాటికి ప్రాధాన్యముంది. అందుకే స్థానిక చానెళ్లు కూడా ప్రకటనల విషయంలో ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తాయి’’ అన్నారు. ఆహా... నెట్ఫ్లిక్స్ దారిలోనే తెలుగు కంటెంట్కు ప్రత్యేకమైన స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’ కూడా ఇపుడు ఏవీవోడీ వైపు చూస్తోంది. దీనిపై సంస్థ బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రామ్శివ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘మన మార్కెట్ చాలా భిన్నం. తక్కువ ధరకో, ఫ్రీగానో వచ్చే కంటెంట్లో కొన్ని యాడ్స్ ఉన్నా వీక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అన్నారాయన. ప్రీమియం కోరుకునేవారి కోసం ప్రస్తుత ప్లాన్లు యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. యాప్ యానీ సంస్థ 2022 నివేదికలో... దేశంలో డిస్నీ హాట్స్టార్కు 3.6 కోట్లు, అమెజాన్కు 1.7 కోట్ల యూజర్లు ఉన్నట్లు వెల్లడించింది. నెట్ఫ్లిక్స్కు 43–45 లక్షల సభ్యులుంటారనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇది దేశీ టాప్–10లోనూ లేదు. యాడ్స్ను స్కిప్ చేయాలని ఉన్నా... అందుకోసం ప్రీమియం మొత్తాన్ని వెచ్చించాలంటే మాత్రం చాలా మంది వెనకాడుతున్నారని, అందుకే ఏవీవోడీ ద్వారా ఓటీటీ సంస్థలు భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించనున్నాయని డెలాయిట్ 2022 నివేదిక తెలిపింది. ‘‘ఏవీవోడీ మార్కెట్ మున్ముందు ఎస్వీవోడీని దాటిపోతుంది. 2021 లో 1.1 బిలియన్ డాలర్లుగా (రూ.8,800 కోట్లు) ఉన్న ఏవీవోడీ మార్కెట్ 2026 నాటికి 2.4 బిలియన్ డాలర్లకు (రూ.19,200 కోట్లు) చేరుతుంది. ఇదే సమయంలో ఎస్వీవోడీ మాత్రం 80 లక్షల డాలర్ల్ల (రూ.6,400 కోట్లు) నుంచి 2.1 బిలియన్ డాలర్లకు (రూ. 16,800 కోట్లు) చేరుతుంది’’ అని డెలాయిట్ అంచనా వేసింది. మొత్తంగా దేశంలో ఓటీటీ మార్కెట్ వచ్చే పదేళ్లలో 20% కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 10.2 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉండగా 2026 నాటికి వీరి సంఖ్య 22.4 కోట్లకు చేరుతుందని డెలాయిట్ తెలిపింది. యాడ్స్ నుంచి ప్రీమియంవైపు కూడా...! చేతిలో కంటెంట్ ఉన్నపుడు దాన్ని యాడ్స్తో... యాడ్స్ లేకుండా ఎలాగైనా చూపించవచ్చన్నది ఓటీటీ సంస్థల ఉద్దేశం. అందుకే అగ్రిగేషన్ సేవలు కూడా అందిస్తూ ఏవీవోడీ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్.... ఇటీవలే రూ.299 వార్షిక సభ్యత్వ రుసుముతో ఎంఎక్స్ గోల్డ్ పేరిట ప్రీమియం సేవలు ఆరంభించింది. ప్రస్తుతం భారతీయ ఏవీవోడీ మార్కెట్లో ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్, డిస్నీ హాట్స్టార్దే హవా. ఈ 3 సంస్థలకూ ఉమ్మడిగా 65 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇవి వినోద కంటెంట్తో పాటు అగ్రిగేషన్, స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం వీటికి కలిసొస్తోంది. నెట్ఫ్లిక్స్ లాంటి ప్లేయర్లు కూడా వస్తే ఏ మార్పులొస్తాయో తెరపై చూడాల్సిందే!. -
రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. దేశీ మార్కెట్లో ఇంటర్నెట్, మొబైల్స్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మీడియా, ప్రకటనలు ఇందుకు ఊతమివ్వనున్నాయి. సంప్రదాయ మీడియా నిలకడగా వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2026 నాటికి టీవీ అడ్వర్టైజింగ్ రూ.43,000 కోట్లకు చేరనుంది. తద్వారా అంతర్జాతీయంగా ఈ విషయంలో అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్ తర్వాత అతి పెద్ద టీవీ అడ్వర్టైజింగ్ మార్కెట్గా భారత్ అయిదో స్థానం దక్కించుకోనుంది. 2022లో భారతీయ మీడియా, వినోద పరిశ్రమ 11.4 శాతం వృద్ధితో రూ. 3.14 లక్షల కోట్లకు చేరనుంది. ఓటీటీలకు సబ్స్క్రిప్షన్ ఊతం .. దేశీయంగా ఓటీటీ వీడియో సర్వీసులు వచ్చే నాలుగేళ్లలో రూ. 21,031 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందులో రూ. 19,973 కోట్లు సబ్స్క్రిప్షన్ ఆధారిత సర్వీసుల నుండి, రూ. 1,058 కోట్లు వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) విభాగం నుండి రానున్నాయి. ఓటీటీల వృద్ధికి సబ్స్క్రిప్షన్ సర్వీసులు ఊతమిస్తున్నాయని, 2021లో ఓటీటీల మొత్తం ఆదాయంలో వీటి వాటా 90.5 శాతంగా ఉండగా .. 2026 నాటికి 95 శాతానికి చేరుతుందని నివేదిక తెలిపింది. జనాభా పరిమాణం, మొబైల్ ఆధారిత ఇంటర్నెట్ వీడియోల వినియోగం.. ఓటీటీ మార్కెట్ వేగవంతంగా వృద్ధి చెందడానికి దోహదపడనున్నాయి. వార్తాపత్రికలు అప్..: 2021లో మొత్తం వార్తాపత్రికల ఆదాయం రూ. 26,378 కోట్లుగా ఉండగా, 2026 నాటికి 2.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్) రూ. 29,945 కోట్లకు చేరనుంది. అప్పటికల్లా భారత న్యూస్పేపర్ మార్కెట్ .. ఫ్రాన్స్, బ్రిటన్ను కూడా దాటేసి అయిదో స్థానానికి ఎదుగుతుంది. ఈ వ్యవధిలో దినపత్రికల కాపీల విక్రయాల్లో (పరిమాణంపరంగా) వృద్ధి నమోదు చేసే ఏకైక దేశంగా భారత్ నిలవనుంది. ప్రింట్ ఎడిషన్ రీడర్షిప్లో 2025 నాటికి చైనాను దాటేసి అతి పెద్ద మార్కెట్గా నిలవనుంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2022లో రూ.35,270 కోట్లుగా ఉండనున్న టీవీ ప్రకటనల విభాగం 2026 నాటికి 23.52% వృద్ధితో రూ. 43,568 కోట్లకు చేరనుంది. ► అనేక సంవత్సరాల పాటు వేగంగా వృద్ధి చెందిన భారతీయ టీవీ అడ్వర్టైజింగ్ మార్కెట్.. 2020లో కోవిడ్–19 కారణంగా మందగమనం బారిన పడింది. దీంతో 2019తో పోలిస్తే 2020లో 10.8% క్షీణించింది. ఇది తాత్కాలిక అవరోధమే. 2021లో ఈ విభాగం 16.9% వృద్ధి చెంది రూ. 32,374 కోట్లకు చేరింది. ► దేశీ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ మార్కెట్ 2026 నాటికి 12.1% వార్షిక వృద్ధితో రూ. 28,234 కోట్లకు చేరనుంది. మొబైల్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఇంటర్నెట్ ప్రకటనల మార్కెట్ ఆదాయంలో గతేడాది ఈ విభాగం వాటా 60.1%గా ఉండగా.. 2026 నాటికి 69.3 శాతానికి చేరనుంది. ► వచ్చే నాలుగేళ్లలో వీడియో గేమ్స్, ఈ–స్పోర్ట్స్ విభాగం ఆదాయం 18.3 శాతం సీఏజీఆర్తో రూ. 37,535 కోట్లకు చేరవచ్చని అంచనా. ► దేశీ సినిమా పరిశ్రమ 2026 నాటికి రూ. 16,198 కోట్లకు చేరనుంది. -
IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా?
పెట్టుబడిగా పెట్టిన ప్రతీ రూపాయిపై కనీస లాభం సంపాదించడమే వ్యాపారం... ముంబైలో అంబానీ అయినా ఊర్లో కిరాణా కొట్టు నడిపే వ్యక్తి అయినా ఈ విషయంలో ఒకేలా ఆలోచిస్తారు. మరి ఐపీఎల్లో ప్రసారహక్కుల కోసం వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన సంస్థలు ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలతో ఉంటాయి? ఐదేళ్ల కాలానికిగాను వారు చెల్లించబోయే మొత్తానికి ‘గిట్టుబాటు’ అవుతుందా! ప్రసార హక్కుల కోసమే మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐపీఎల్ ఎలా ఉండబోతోంది? కేవలం వ్యాపార ప్రకటనలతోనే తమ పెట్టుబడితో పాటు లాభాలను తీసుకోవడం ఈ సంస్థలకు సాధ్యమేనా! ఇంకా చెప్పాలంటే ఈ భారీ మొత్తం వల్ల ఐపీఎల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఆసక్తికరం! రూ. 118.02 కోట్లు... టీవీ, డిజిటల్ విభాగాలు కలిపి చూస్తే ఒక్కో ఐపీఎల్ మ్యాచ్కు ప్రసారకర్తలు చెల్లించబోయే మొత్తం ఇది. ఇంకా వివరంగా చెప్పాలంటే 410 మ్యాచ్లలో మ్యాచ్కు 40 ఓవర్ల చొప్పున (ఎక్స్ట్రా బంతులు కాకుండా) 98,400 బంతులు... అంటే ఒక్కో బంతి విలువ అక్షరాలా 50 లక్షలు! టీవీలో అయితే ‘స్టార్’ సంస్థ ప్రతీ మ్యాచ్కు కనీసం రూ. 57.5 కోట్లు, డిజిటల్ ప్లాట్ఫామ్పై ‘వయాకామ్–18’ కంపెనీ ప్రతీ మ్యాచ్కు రూ. 50 కోట్ల కేవలం ప్రసార హక్కులకు మాత్రమే బీసీసీఐకి చెల్లించబోతోంది. దీనికి అదనంగా ఆయా సంస్థలకు బోలెడు ఖర్చులు! మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం కోసం కెమెరాలు, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు, కామెంటేటర్లు, ఉద్యోగులకు చెల్లింపులు, ఇతర సాధారణ ఖర్చులకు సొంత డబ్బు వాడాల్సిందే. ఇలాంటి స్థితిలో ఒక్కో మ్యాచ్కు వారు ఆశించే మొత్తం తిరిగి రావడం సాధ్యమేనా! ప్రసారకర్తల కోసం ఐపీఎల్ వీక్షణంలో కూడా పలు మార్పులకు బీసీసీఐ అంగీకరించవచ్చు. ప్రకటనలే ప్రధానం... ఇన్నింగ్స్కు 2 చొప్పున ‘స్ట్రాటజిక్ బ్రేక్’లతో పాటు ఓవర్ల మధ్యలో విరామ సమయం తదితరాలు కలిపి ప్రస్తుతం ప్రకటనల కోసం గరిష్టంగా ఒక టి20 మ్యాచ్లో 2,400 సెకన్లు (40 నిమిషాలు) అందుబాటులో ఉన్నాయి. 2022 ఐపీఎల్ మ్యాచ్లకు 10 సెకన్ల ప్రకటనకు సుమారు రూ.15 లక్షల వరకు ‘స్టార్’ వసూలు చేసింది. దీంతో పాటు ‘కో ప్రజెంటర్’ పేరుతో గరిష్టంగా ఒక్కో వ్యాపార సంస్థ నుంచి రూ. 180 కోట్ల వరకు... అసోసియేట్ స్పాన్సర్ ద్వారా గరిష్టంగా రూ. 105 కోట్ల వరకు తీసుకుంది. ఇతర అనుబంధ అంశాలు (ఫోర్లు, సిక్స్లు, ఫాస్టెస్ట్ బాల్) తదితరాల ద్వారా మరో రూ. 300 కోట్లు, హైలైట్స్ ప్యాకేజీల ద్వారా రూ. 200 కోట్ల వరకు అదనంగా ‘స్టార్’ ఖాతాలో చేరాయి. ఇది ఐపీఎల్ ప్రకటనలకు సంబంధించి తాజా పరిస్థితి. సాధారణంగా ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రకటనల రేటు సుమారు 10–15 శాతం పెరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం చూస్తే ఇది సరిపోదు. కనీసం 80 శాతం వరకు రేటు పెంచాల్సి ఉంటుంది. ఇది అంత సులు వేమీ కాదు. లీగ్పై ఎంత క్రేజ్ ఉన్నా... ప్రకటన దారులు అంత సులువుగా ముందుకొస్తారా అనేది ప్రశ్న. ఈ ఏడాదితో పోలిస్తే మున్ముందు మ్యాచ్ల సంఖ్య పెరగడం సానుకూలాంశం కాగా... అభిమానులు రెండున్నర నెలలు సుదీర్ఘంగా సాగే లీగ్పై ఒకే స్థాయిలో ఆసక్తి చూపిస్తారా అనేది సందేహమే. 2022లోనే వ్యూయర్షిప్ 30 శాతం తగ్గినా... దాని ప్రభావం తాజా వేలంపై పడలేదు కాబట్టి సమస్య గా అనిపించలేదు. కానీ మున్ముందు చెప్పలేం. అయితే అన్ని లెక్కలు చూసుకున్నాకే పెద్ద సంస్థలు హక్కుల కోసం బరిలోకి దిగి ఉంటాయి. కాబట్టి బయటకు కనిపించని లెక్కలూ ఉండవచ్చు! ఇలా కూడా జరగొచ్చు... ఇంత భారీ మొత్తానికి హక్కులు అమ్మిన తర్వాత రాబోయే సీజన్లలో ప్రసారకర్తల భిన్న డిమాండ్లను బోర్డు సహజంగానే గౌరవించాల్సి రావచ్చు. ‘స్ట్రాటజిక్ టైమౌట్’లను 5 ఓవర్లకు ఒక్కోసారి చొప్పున మ్యాచ్కు ఆరు వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యాచ్లో ఎక్కడ వీలైతే అక్కడ ప్రకటనలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సహజంగానే మ్యాచ్ వ్యవధి కూడా పెరగడం ఖాయం. కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే ప్రకటనల మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ చూడాల్సి రావచ్చు! డిజిటల్ కోసం భారీ మొత్తం చెల్లించిన ‘రిలయన్స్’ ఐపీఎల్ కోసం ఎక్కువ మొత్తంతో ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేసే అవకాశమూ ఉంది. ఈ భారీ ఒప్పంద ప్రభావం పడే కీలక అంశాన్ని చూస్తే ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టి20 సిరీస్లకు మంగళం పలికినట్లే! ఐపీఎల్ ప్రభావం, దానితో ముడిపడి ఉన్న డబ్బు, ఐసీసీని శాసించగలిగే బీసీసీఐని చూస్తే ప్రపంచకప్లో మినహా ఇతర అంతర్జాతీయ టి20లు కనిపించకపోవచ్చు. అన్నింటికి మించి ఫాంటసీ లీగ్లు, క్రికెట్ బెట్టింగ్ మరింతగా విజృంభించడం ఖాయం! సాక్షి క్రీడా విభాగం -
నకిలీ వ్యాపార ప్రకటనలను నమ్మొద్దు: రామ్రాజ్ కాటన్
హైదరాబాద్: తమ సంస్థ పేరుకు కళంకం తెచ్చే కళంకం దురుద్దేశంతో కొందరు గతవారం నుంచి ఆన్లైన్ ద్వారా నకిలీ వ్యాపార ప్రకటనలను చేస్తున్నారని రామ్రాజ్ కాటన్ సంస్థ ఆరోపించింది. అలాంటి మోసపూరిత నకిలీ వార్తలను నమ్మొద్దని కస్టమర్లను కంపెనీ కోరింది. ‘‘కొంతమంది రామ్రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో వాట్సప్ యాప్ ద్వారా కొన్ని లింకులను అందిస్తూ క్రిస్మస్, కొత్త ఏడాది ఆఫర్ బహుమతిగా రూ.20,000 లభిస్తాయనే అనే వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. కస్టమర్లు ఈ మోసపూరిత లింకులను నమ్మి ఓపెన్ చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థిక పరమైన నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కావున ఇటువంటి సమాచారాన్ని పంచుకోవద్దు. వ్యాప్తి చేయవద్దు’’ అని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మోసగాళ్లను వెదికి పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. -
ఇక బస్సులపై ప్రకటనలు ఉండవు.. అతిక్రమిస్తే...
సాక్షి, హైదరాబాద్: బస్సులపై ప్రకటనల విధానానికి ఆర్టీసీ స్వస్తి పలికింది. ఇంతకాలం బస్సులపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ అనుమతించింది. దీన్ని ఆదాయ మార్గంగా చేసుకుంది. వీటి రూపంలో సాలీనా సగటున రూ.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ పొందుతోంది. కానీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పుడు ఈ ప్రకటనల విధానాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆర్టీసీ బస్సులపై ఎలాంటి ప్రకటనలను అనుమతించదు. ఎవరైనా.. ప్రకటనల పోస్టర్లను అతికిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇది అమలులోకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ నగరంలో కొన్ని సంస్థలకు ఆర్టీసీ నోటీసులు జారీ చేసింది. వాటిపై పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతోంది. (చదవండి: ప్రేమవివాహం సాఫీగా సాగిన జీవనం.. ఇటీవల కష్టంగా ఉందని లెటర్ రాసి..) ఆర్టీసీ బ్రాండ్కు అడ్డు.. బస్సులపై మరకలు చాలా కాలంగా ఆర్టీసీ బస్సులపై ప్రైవేటు సంస్థలు ప్రకటనలు ఏర్పాటు చేసుకునే విధానాన్ని సంస్థ అనుసరిస్తోంది. క్రమంగా సంస్థ నష్టాల బాట పడుతుండటంతో అదనపు ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆదాయ మార్గంగా చేసుకుని, ప్రకటనల విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది. ప్రకటనల సంఖ్య పెరిగేలా ప్రత్యేకంగా ప్యాకేజీలను కూడా ప్రకటించేది. ఇదిలా ఉండగా ఆర్టీసీని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న ఎండీ సజ్జనార్, తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్సులపై ప్రకటనలు ఏర్పాటు చేస్తుండటంతో, ఆర్టీసీ లోగో, ఆ బస్సు కేటగిరీ పేరు కూడా కనిపించని గందరగోళం నెలకొంది. అది ఎక్స్ప్రెస్ బస్సా, ఆర్డినరీ బస్సా అని కూడా గుర్తించలేక కొందరు డ్రైవరును అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది. అన్నింటికంటే మించి, పోస్టర్ల వల్ల బస్సు బయటి భాగం అసహ్యంగా మారుతోంది. గతంలో ప్రకటలను ఆర్టిస్టులు రంగులతో గీసేవారు. ఆధునిక పరిజ్ఞానం విస్తరించి వినయిల్ పోస్టర్ల విధానం రావటంతో రంగులు వేసే పద్ధతి మాయమైంది. ప్రకటనల చిత్రాలు, రాతలను వినయిల్ పోస్టర్లపై ముద్రించి వాటిని బస్సులపై అతికిస్తున్నారు మళ్లీ ఆ ప్రకటన గడువు తీరాక పోస్టర్లను తొలగిస్తారు. తొలగించిన తర్వాత దానికి వాడిన జిగురు అలాగే అతుక్కుని ఉంటోంది. దానికి దుమ్ము, వాహనాల పొగ, ఇతర చెత్త అతుక్కుని బస్సు అందవిహీనంగా మారుతోంది. మహిళల ఫిర్యాదుపై స్పందన.. ఇటీవల ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై ఎండీ సజ్జనార్ తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ఈ ప్రకటనలపై ఫిర్యాదులు చేశారు. అర్ధనగ్నంగా ఉన్న మహిళల చిత్రాలతో కూడిన సినిమా ప్రకటనలు ఇబ్బందిగా ఉన్నాయని, ఆ బొమ్మలు మహిళలను కించపరిచేలా ఉంటున్నాయని, వాటిని చూస్తూ ఆకతాయిలు రోడ్లపై మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. వీటన్నింటి ఆధారంగా ఆయన అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పోస్టర్ల వల్ల ఇబ్బందులున్నాయని, వాటిని నిలిపివేయాలని తాను చాలా కాలంగా కోరుతున్న విషయాన్ని ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మిగతా అధికారుల అభిప్రాయాలు కూడా తీసుకుని సజ్జనార్ ప్రకటనలపై నిషేధం విధించారు. అనుమతి లేకుండా ఎవరు పడితే వారు బస్సులపై ప్రకటనల పోస్టర్లు అతికించటం కూడా అలవాటుగా ఉండేది. ఇప్పుడు దానిని సజ్జనార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరైనా అలా అతికిస్తే ఆ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను అదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టే బాధ్యతను ఆయా డిపో మేనేజర్లకు అప్పగించారు. వారు ఎక్కడికక్కడ కేసులు పెట్టడం ప్రారంభించారు. (చదవండి: కన్నీటి గాథ: అనాథలుగా ఆడబిడ్డలు) -
మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్బెర్గ్
ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలతో ఫేస్బుక్తో పాటు అనుసంధానంగా ఉన్న ఇన్స్ట్రాగ్రామ్ యూజర్లు తగ్గిపోతున్నారు.వారికోసం వందల కోట్లు ఖర్చు చేసేందుకు మార్క్జుకర్ బెర్గ్ సిద్ధమయ్యారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్..ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటూ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరుతో నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక వెలుగులోకి రావడంతో ఇన్స్ట్రాగ్రామ్ యూజర్లు ఇతర సోషల్ మీడియా సైట్స్ను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. అందుకే చేజారిపోతున్న యజర్లను అట్రాక్ట్ చేసేందుకు, కొత్త యూజర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇన్స్ట్రాగ్రామ్ ఈ ఏడాది వార్షిక యాడ్ బడ్జెట్లో టీనేజ్ యూజర్స్ కోసం సుమారు 390 మిలియన్ డాలర్లను (ఇండియన్ కరెన్సీలో రూ. 29,26,36,50,000.00) యాడ్స్ రూపంలో మార్క్జుకర్ బెర్గ్ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ఇన్ స్ట్రాగ్రామ్పై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్లకు వరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇన్ స్ట్రాగ్రామ్ నుంచి 35శాతం మంది యూజర్లు స్నాప్ చాట్కు ,30శాతం మంది యూజర్లు టిక్ టాక్ వైపు మొగ్గుచూపారని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి.అయితే వారిని నియంత్రించేందుకు యాడ్స్పై భారీ ఖర్చు పెట్టనుంది. ముఖ్యంగా టీనేజ్ యూజర్లు తగ్గిపోవడంపై ఇన్ స్ట్రాగ్రామ్ ముప్పుగా భావిస్తోంది. అందుకే యాడ్స్ లేదా, ఇతర మార్కెటింగ్ స్ట్రాటజీల్లో 13 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న కిడ్స్ యూజర్ బేస్ పెంచుకునేందుకు 'Instagram kids' పేరుతో యాప్ను బిల్డ్ చేస్తోంది. ప్రస్తుతం ఆ యాప్ను బిల్డ్ చేయడం నిలిపివేసినట్లు ఇన్స్టా హెడ్ ఆడమ్ మోసేరి తెలిపారు. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం -
రోజీతో అంత వీజీ కాదు
-
ఎప్పటికింకా రోజీ వయసు ఇరవై రెండేళ్లే!
పేరు: రోజీ వయసు: 22 పౌరసత్వం: దక్షిణ కొరియా క్వాలిఫికేషన్: మాంచి అందగత్తె వృత్తి: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సంపాదన : ఏడాదికి ఎనిమిదిన్నర యూఎస్ డాలర్లు మన కరెన్సీలో.. ఆరు కోట్ల రూపాయలకు పైనే. ఇన్స్టాగ్రామ్లో దాదాపు తొంభై వేల దాకా ఫాలోవర్స్ ఉన్నారు ఈ చిన్నదానికి. సుమారు వందకు పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. పైగా పైసా రెమ్యునరేషన్ తీసుకోదు!!. వీటన్నింటికితోడు బోలెడంత టైమూ సేవ్ చేస్తోంది కూడా. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫొటోలు చూసి.. ‘అబ్బా ఫాలో అవుదాం.. ఫ్లర్ట్ చేద్దాం’ అనుకుంటున్నారేమో!. రోజీతో అంత వీజీ కాదు!!. ఇక్కడ మీరూ చూస్తున్న అందమైన అమ్మాయికి జీవం లేదు. ఎందుకంటే అసలు మనిషే కాదు కాబట్టి.. View this post on Instagram A post shared by 로지_버추얼 인플루언서 (@rozy.gram) టెక్నాలజీ చేసిన మాయే ఇదంతా. కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించిన సూపర్ మోడల్ ఈ రోజీ. అనంత విశ్వంలో విశాలమైన విషయం ఏదైనా ఉందీ అంటే.. అది మనిషి బుర్రే. తన పరిధిని మించి బుర్రకు పదునుపెట్టే మనిషి.. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ ఆలోచనలతో అద్భుతమైన ఆవిష్కరణలకు కారణం అవుతుంటాడు. అలాంటిదే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ట్రెండ్. సృష్టికి ప్రతిసృష్టిలా మనిషి రూపాల్ని సృష్టించి.. వ్యాపారంలో సంచలనాలకు నెలవుగా మారుతోంది మనిషి మేధస్సు. కృత్రిమ మేధస్సు ద్వారా రోజీ లాంటి ఎన్నో క్యారెక్టర్లను సృష్టించి.. డిజిటల్ సెలబ్రిటీలతో ఫాలోవర్స్కు గాలం చేసి వ్యాపారం చేయిస్తున్నారు. ఈరోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారేందుకు ఎక్కువ మందికి ఆస్కారం ఉంటోంది. అయితే విమర్శలకు తావు లేని ఇన్ఫ్లుయెన్సర్ను సృష్టించాలనే ఆలోచన నుంచి పుట్టిందే రోజీ. అడ్వర్టైజింగ్ రంగంలో, కమర్షియల్ స్పేస్లో వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఇప్పడు సెన్సేషన్గా మారింది. దక్షిణ కొరియా నుంచి మొదలైన ఈ ట్రెండ్.. హ్యూమన్ ఇన్ఫ్లుయెన్సర్లకు గట్టి పోటీ ఇస్తోంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. వాస్తవ ప్రపంచం, మనుషులతోనూ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సన్నిహితంగా కదిలినట్లు బిల్డప్ ఇవ్వడం. View this post on Instagram A post shared by 로지_버추얼 인플루언서 (@rozy.gram) కిందటి ఏడాది అగష్టులో సిడూస్ స్టూడియో ఎక్స్.. రోజీని సృష్టించింది. కిందటి ఏడాది డిసెంబర్ నుంచి రోజీ అకౌంట్ను యాక్టివ్ చేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే బిలియన్ వాన్(ఎనిమిదిన్నర లక్షల డాలర్లు) సంపాదించింది రోజీ ఏఐ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. View this post on Instagram A post shared by 로지_버추얼 인플루언서 (@rozy.gram) అడ్వాంటేజ్లు మనిషి కాదు.. కాబట్టి, వివాదాలకు, విమర్శలకు తావు ఉండదు. కావాలని ఎవరైనా గోల చేస్తే తప్ప అభ్యంతరాలు వ్యక్తం కావు. బోలెడంత టైం సేవ్ అవుతుంది. టెక్నికల్ అంశాలకు తప్పించి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం పడకపోవచ్చు. ఒక్కసారి క్యారెక్టర్ను సృష్టించడం.. అవసరమైన మార్పులు చేసుకోవడం తప్పించి పెద్ద హడావిడి ఉంటుంది. పైగా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. వీటన్నింటికి తోడు జ్వరం నుంచి కరోనా లాంటి మహమ్మారులేవీ సోకలేవు. వయసు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అవసరమైతే ఫాలోవర్స్ను ఎట్రాక్ట్ చేసేలా మార్పులు సైతం చేయొచ్చు. View this post on Instagram A post shared by 로지_버추얼 인플루언서 (@rozy.gram) దక్షిణ కొరియాలో షిన్హాన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ టాప్ పొజిషన్. అలాంటి కంపెనీ రోజీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ఈ యాడ్ యూట్యూబ్లో 11 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. డిజిటల్ సెలబబ్రిటీలు.. విన్సెంట్.. పాతికేళ్లు దాటని కుర్రాడు. సారీ.. 100 శాతం కంప్యూటర్ జనరేటెడ్ క్యారెక్టర్ ఇతను. సువా కూడా సూపర్ మోడల్గా రాణిస్తోంది. రేసిజం హద్దుల్ని చేరిపేస్తూ సృష్టించిన క్యారెక్టర్ సూడు.. శాంసంగ్, బాంమెయిన్ లాంటి బడా బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. రియా కీమ్.. ఎల్జీ ఎలక్రా్టనిక్స్ యాడ్స్ కోసం పుట్టిన క్యారెక్టర్. అమెరికా ప్రముఖ కంపెనీ బ్రడ్.. లిల్ మిక్యుయెలా అనే డిజిటల్ సెలబ్రిటీ ద్వారా 10 మిలియన్ డాలర్లు సంపాదించింది గత ఏడాదిలో.. - సాక్షి , వెబ్డెస్క్ ప్రత్యేకం చదవండి: టెక్నాలజీ చేసిన ఘోర హత్య ఇది -
వెల్లువెత్తనున్న ప్రకటనలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకటనలు, మార్కెటింగ్ కార్యకలాపాలకు కంపెనీలు 2021-22లో పెద్ద ఎత్తున వ్యయం చేయనున్నాయి. కోవిడ్-19 కారణంగా 2020లో భారత ప్రకటనల పరిశ్రమ విలువ పరంగా 21.5 శాతం తగ్గింది. ప్రస్తుత సంవత్సరంలో 23.2 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.80,123 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మారుతి సుజుకి, అమూల్, ఎల్జీ, పార్లే, పెప్సికో, వివో, మారికో, ఇమామి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్కు భారీగా ఖర్చు చేయనున్నాయి. కొన్ని సంస్థలు గతం కంటే 50 శాతం వరకు అధికంగా వెచ్చించనున్నట్టు సమాచారం. ఆదాయంతోపాటు మార్కెట్ వాటాను పెంచుకునే వేటలో కంపెనీలు ఖర్చుకు వెనుకాడడం లేదు. డిమాండ్ నేపథ్యంలో.. కొన్ని నెలలుగా కస్టమర్లు వస్తువులు, ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తుండడం కంపెనీలను ఆకట్టుకుంటోంది. మహమ్మారి మూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన వ్యాపారం నుంచి రికవరీకి 2021-22లో చేసే వ్యయాలు దోహదం చేస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. వేసవిలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల పానీయాలు, ఐసీ క్రీమ్స్ వంటి విభాగాలకు డిమాండ్ ఉంటుంది. ఈ విభాగాల్లో వ్యాపారం సాగిస్తున్న కంపెనీలు ఆ మేరకు ప్రకటనలు, మార్కెటింగ్పై వ్యయాలను పెంచనున్నాయి. గతేడాది డిజిటల్ ప్రకటనలకు పరిమితమైన ఈ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వేదికలనూ వినియోగించు కోనున్నాయి. ప్రధానంగా ప్రింట్ మీడియా కీలకం కానుందని కాంటినెంటల్ కాఫీ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పటా్నయక్ తెలిపారు. ఎఫ్ఎంసీజీ రంగం 15-20 శాతం అధికంగా వ్యయం చేయనుందని అన్నారు. ఖర్చుల్లోనూ పోటీయే.. ప్రకటనలు, మార్కెటింగ్ కోసం చేసే వ్యయాల్లోనూ కంపెనీలు పోటీపడుతున్నట్టు ఉంది. 2021-22లో ఎల్జీ ఏకంగా రూ.650 కోట్లు వ్యయం చేయనుంది. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం అధికం. ఇప్పటి వరకు ఎల్జీ ఇండియా ఈ స్థాయిలో ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంచనాలను మించి మార్కెట్ రికవరీ అయిందని, ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. బ్లూ స్టార్ రూ.35 కోట్ల నుంచి రూ.64 కోట్లకు బడ్జెట్ పెంచింది. గతేడాది లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నుంచి కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాయి. దాదాపు 2019-20 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వ్యయాలు చేశాయి. ముందు వరుసలో ఎఫ్ఎంసీజీ.. భారత్లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ విషయంలో ముందున్నాయి. ఆ తర్వాత ఈ-కామర్స్, ఆటోమొబైల్, టెలికం, రిటైల్, డ్యూరబుల్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రకటనలు ప్రధానంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రియల్టీ రంగం ప్రధాన ఆకర్షణ అని బ్రాండింగ్ సేవల్లో ఉన్న జాన్రైజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. గతంలో లేని విధంగా ఆరోగ్య బీమా, మ్యూచువల్ ఫండ్స్ ప్రకటనలూ వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఇక్కడి మార్కెట్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు వంటి పెద్ద నగరాలు, ఖర్చులకు వెనుకాడని కస్టమర్లు ఉండడమూ కంపెనీలకు కలిసి వస్తోందని వివరించారు. చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం -
కుదరదంటే కుదరదు
‘‘ఈ విషయంలో నా మనసు మారదు. కుదరదంటే కుదరదు’’ అంటున్నారట లావణ్యా త్రిపాఠి. ఇంతకీ ఏ విషయం గురించి ఈ బ్యూటీ ఇంత పట్టుదలగా ఉన్నారంటే... కొన్ని ఉత్పత్తులను ప్రచారం చేసే విషయంలో. వాణిజ్య ప్రకటనలంటే మంచి ‘చెక్’ అందుతుంది. మరి.. భారీ పారితోషికం అందించే ఆ చెక్ని లావణ్య ఎందుకు కాదనుకుంటున్నారంటే అవి ‘లిక్కర్ బ్రాండ్స్’కి సంబంధించిన ప్రకటనలు కాబట్టి. ఆరోగ్యానికి హాని కలిగించేవాటిని ప్రమోట్ చేయడం కుదరదని చెప్పేశారట. ఇటీవల కొన్ని ప్రముఖ లిక్కర్ బ్రాండ్లు లావణ్యని సంప్రదిస్తే ‘నో’ చెప్పేశారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్స్ప్రెస్’ చేస్తున్నారు. ఇందులో లావణ్య హాకీ ప్లేయర్. ఈ సినిమా కోసం హాకీ నేర్చుకున్నారు. అలాగే కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో అథర్వకు జోడీగా ఓ సినిమా చేస్తున్నారు. -
బ్రాండింగ్ ఇక సరికొత్తగా..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా సమయంలో బ్రాండ్లకు కష్టకాలం వచ్చింది. విశ్వసనీయమైన వినియోగదార్లు కూడా బ్రాండ్లను మరచిపోతున్నారు. ఈ సమయంలో బ్రాండ్లు మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలి. వినియోగదార్లతో సన్నిహిత సంబంధాన్ని ఎర్పరచుకోవాలి. బ్రాండ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న హైదరాబాద్కు చెందిన ‘జాన్రైజ్ అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండింగ్’ లాక్డౌన్ సడలింపుల వేళ ఒక సర్వేను నిర్వహించింది. కస్టమర్లను చేరుకోవడంపైనే ఇప్పుడు కంపెనీలు దృష్టిసారించాయని సర్వేలో తేలింది. బ్రాండ్లు కొత్త పరిస్టితులను అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని జాన్రైజ్ డైరెక్టర్ సుమన్ గద్దె వెల్లడించారు. ప్రపంచం అంతా సాధారణ స్టితికి రావాలని ఎంతలా ప్రయత్నిస్తుందో.. అంత కంటే ఎక్కువగా కంపెనీలు తమ వినియోగదార్లతో అనుబంధాన్ని పెంచుకోవడానికి కృషి చేయాల్సి ఉందన్నారు. బ్రాండ్లకు ప్రచారం కల్పించడం కోసం వ్యాపార ప్రకటనలపై డబ్బులు పెట్టడానికి అసలు వెనకాడకూడదని కంపెనీలు అంటున్నాయని చెప్పారు. ‘‘మా క్లయింట్ల జాబితాలో మరిన్ని బ్రాండ్లు చేరుతూనే ఉన్నాయి. కోవిడ్ కంటే ముందుతో పోలిస్తే ఆదాయాలు తగ్గినప్పటికీ.. వ్యాపార ప్రకటనలపై, బ్రాండ్ కమ్యూనికేషన్పై మరిన్ని వ్యయాలు చేయడానికి కంపెనీలు సిద్దంగా ఉన్నాయి’ అని జాన్రైజ్ డైరెక్టర్ చైతన్య బోయపాటి తెలిపారు. కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి.. సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది 27–35 వయసున్న వారున్నారు. 42.4 శాతం మంది ముందుగా తమ పిల్లల దుస్తులు, బొమ్మలు, ఇతరత్రా వస్తువులను కొనాలని భావిస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 53.8 శాతం మంది స్నేహితులను కలవాలనుకుంటున్నారు. 9 శాతం మంది సౌందర్యం, వెల్నెస్ ఉత్పత్తుల షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ సురక్షితమైనదని 60 శాతం మంది గట్టిగా విశ్వసిస్తున్నారు. 49 శాతం మంది సమీప భవిష్యత్లో మాల్స్కు వెళ్లే ప్రసక్తి లేదని అంటున్నారు. దుస్తులు, ఆభరణాల షాపింగ్పై 18 శాతం మందే ఆసక్తి కనబరిచారు. 58 శాతం మంది సినిమా థియేటర్లు, వినోదానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక స్విగ్గీ, జొమోటో లేదా సొంత డెలివరీ వ్యవస్థలున్న రెస్టారెంట్లు డెలివరీ అత్యంత సురక్షితం అన్న శక్తివంతమైన సందేశాన్ని పంపితేనే నిలదొక్కుకోగలుగుతాయి. ఇవి ఆహారంతో పాటు భద్రత చర్యల గురించి ప్రకటనల ద్వారా తెలియజెబుతూ వినియోగదార్ల మెదడులోకి ఎక్కాలి. రిటైలర్లు పాత ధోరణి నుంచి బయటకు వచ్చి కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి అని సర్వేలో తేలింది.æ -
డిజిటల్ ప్రకటనల్లోకి ‘డిజిటల్ కైట్స్’
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ ప్రకటన రంగంలోకి కొత్త సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘డిజిటల్ కైట్స్’ పేరుతో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్లోకి అడుగు పెట్టింది. తద్వారా వెబ్సైట్లకు, బ్రాండ్లు లేదా ఏజెన్సీలకు తన సేవలను ఉచితంగా అందించనుంది. వివిధ బ్రాండ్లు, ప్రచురుణకర్తలు ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఒక కొత్త ఎకో సిస్టంను సృష్టిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్లాట్పాంలో ముఖ్యంగా గోప్యతకు బలమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆడియన్స్ ప్రైమ్ , ఆడియన్స్ ప్లే అనే రెండు ప్రధాన ఉత్పత్తులను డిజిటల్ కైట్స్ లాంచ్ చేసింది. 'ఆఫ్లైన్ కస్టమర్లు,' లేదా 'మల్టీ-ఛానల్ మార్కెటింగ్' తమ లక్ష్యమని పేర్కొంది. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, రీటైల్ అండ్ కన్సూయర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ట్రావెల్ అండ్ టూరిజం తదితర రంగాలకు తన సేవలను అందించనుంది. డిజిటల్కైట్స్పై పనిచేయడం ప్రారంభించినప్పుడు, డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టంలో చాలామంది వాటాదారులను గమనించామనీ, ఆయా కంపెనీలు, వాటి రోడ్బ్లాక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి వ్యాపారాలకు గణనీమైన విలువను ఎలా అందించాలో పరిశీలించామని డిజిటల్ కైట్స్ సీఈవో దినేష్ గంటి తెలిపారు. గూగుల్ , ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వాల్స్ వెలుపల బ్రాండ్లు తమ మొదటి పార్టీ సీఆర్ఎం డేటాను ప్రభావితం చేయలేవు. ఇందుకు చాలా సాంకేతిక పరిష్కారాలు ఉన్నప్పటికీ, బహిరంగ గుర్తింపు తీర్మానం లేకపోవడం వల్ల అవి భారతదేశంలో పనిచేయవని తెలిపిన ఆయన తాము అతిపెద్ద యూజర్ రిజల్యూషన్ పరిష్కారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీని డిజిటల్ కైట్స్ ఉత్పత్తులతో మిళితం చేసి, తద్వారా బ్రాండ్లు, ప్రచురణకర్తలు అన్ని మార్కెటింగ్ ఛానెళ్లలో మొదటిసారిగా కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చాలా పెద్ద ప్రచురణకర్త సంస్థలతో మాట్లాడుతున్నామనీ అతి త్వరలో కొన్ని పెద్ద భాగస్వామ్య ప్రకటనలు చేయబోతున్నామని డిజిటల్ కైట్స్ సీవోవో రఘు తెలిపారు. తమకు హైదరాబాద్, ముంబై , న్యూఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయన్నారు. యాభై మంది ఉద్యోగులు వివిధ ఉత్పత్తులు, కార్యక్రమాలపై పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే తమకు వే 2 ఆన్లైన్ ఇంటరాక్టివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మద్దతు ఉన్నట్టు ప్రకటించారు. ఆడియన్స్ ప్లే : యాప్స్, వెబ్సైట్లకు ఉద్దేశించింది. ఇది ఆయా ఆఫ్లైన్. ఆన్లైన్ యూజర్ టచ్ పాయింట్స్, సెగ్మెంట్ నుండి డేటాను ఏకీకృతం చేయడానికి, వారి ప్రేక్షకులను బ్రాండ్లతో మెరుగుపరచడానికి, ప్రైవేట్గా భాగస్వామ్యానికి అనుమతిస్తుంది. ఆడియన్స్ ప్రైమ్ : బ్రాండ్లు, ఏజెన్సీలకుద్దేశించింది. మొదటి సీఆర్ఎం డేటాను ఆన్బోర్డ్ చేయడానికి, ప్రఖ్యాత ప్రచురణకర్తల నుండి సముచిత ప్రేక్షకుల విభాగాలతో పాటు ప్రోగ్రామాటిక్, సోషల్, ఇమెయిల్ మొదలైన బహుళ ఛానెల్లలో అనుమతికి వీలు కల్పిస్తుంది. ఇవి రెండూ డిజిటల్ కైట్స్ యూజర్ రిజల్యూషన్ టెక్నాలజీ ఆధారితంగా పనిచేస్తాయి. ఇవి ఆఫ్లైన్, ఆన్లైన్ ఐడెంటిఫైయర్లైన ఇమెయిల్, కుకీలు, అడ్వర్టైజింగ్ ఐడిలు, మొబైల్ నంబర్లు మొదలైన వాటి ద్వారా వినియోగదారులను గుర్తిస్తుంది. అందువల్ల బ్రాండ్లు, ప్రచురణకర్తలు తమ వినియోగదారులతో వివిధ డివైస్లు, ఛానెళ్లలో కమ్యూనికేట్ చేయడానికి అనుమతి లభిస్తుంది. -
ప్రకటనలపై ఫేస్బుక్ నియంత్రణ
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ ఉపయోగిస్తున్నప్పుడు మీరెప్పుడైనా ఓ విషయాన్ని గమనించారా. ఫేస్బుక్లో వచ్చే ప్రకటనలు చూసి.. ఇది ఇప్పుడే ఎక్కడో చూశానే అని మీకెప్పుడూ డౌట్ రాలేదా?.. ఈ యాడ్లో వచ్చిన కంటెంట్ను ఎక్కడో బ్రౌజ్ చేశానే అని అనిపించలేదా.. కచ్చితంగా చాలామందికి అనిపించే ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ఫోన్లో మనం ఉపయోగించిన ఇతర యాప్లు, బ్రౌజర్లు, వెబ్సైట్లు, ఇతర డేటా ప్రకారమే ఫేస్బుక్లో మనకు ప్రకటనలు వస్తుంటాయి. దీనికి కారణం ఫేస్బుక్ మనం చేసే ప్రతీ కార్యకలాపం పైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తాజాగా దీనిపై ఫేస్బుక్ స్వీయ నియంత్రణ విధించుకోనుంది. ఇకపై మనం చూసిన వెబ్సైట్లు, బ్రౌజర్లలో యూజర్ కార్యకలాపాల ప్రకారం ఫేస్బుక్లో ఇచ్చే ప్రకటనలను తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. దీనికోసం ఫేస్బుక్ యాప్లో ఓ ఆప్షన్ను తీసుకురానుంది. యూజర్లు సంబంధిత సెక్షన్లోకి వెళ్లి ‘ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’అనే ఆప్షన్ను ఆఫ్ చేసుకోవాలి. అయితే దీంట్లో ఓ మెలిక ఉంది. ఆఫ్ చేసినప్పటికీ ఫేస్బుక్ మీ డేటాను ట్రాక్ చేయడం ఆపదు. కేవలం దానికి సంబంధించిన ప్రకటనలు మాత్రమే తక్కువ సంఖ్యలో వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ను సౌత్ కొరియా, ఐర్లాండ్, స్పెయిన్ల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఆప్షన్ను ఇతర మార్కెట్లలోకి ఎప్పుడు ప్రవేశపెట్టేది స్పష్టతివ్వలేదు. -
పెయిడ్ న్యూస్, ప్రకటనలను గుర్తించాలి
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ గ్రామీణ, అర్బన్ నియోజకవర్గాలకు నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ధీరజ్ కుమార్ గురువారం కలెక్టరేట్లోని ఎన్నికల కార్యాలయాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీవీప్యాట్లు, ఈవీఎంల అవగాహన కేంద్రాన్ని పరిశీలించారు. ఈవీఎంల ఉపయోగం, వీవీప్యాట్ల వినియోగంపై సిబ్బంది ని వివరాలు అడిగారు. అనంతరం ఎన్నికల మీడియా కేంద్రంలో పర్యటించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారం, ప్రకటనల రికార్డింగ్ లోకల్ కేబుల్ టీవీల్లో ఏ విధంగా రికార్డు చేస్తున్నారు? వాటిని ఏ విధంగా పరిశీలిస్తున్నారని ఆరా తీశారు. వార్త పత్రికల్లో ప్రచురణ అవుతున్న అనుమానిత చెల్లింపు వార్తలు, ప్రకటన క్లిప్పింగులను పరిశీలించారు. స్వీప్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నిక ల ముఖ్య సమాచారమంతా మీడియా ద్వారానే తెలుస్తున్నందున, ప్రతి సమాచారాన్ని మీడియా ద్వారానే ప్రజలకు తెలియజేయాలన్నారు. కలెక్టర్ రామ్మోహన్ రావు వివరిస్తూ ఎంసీసీ కమిటీ ఆధ్వర్యంలో ప్రవర్తన నియామావళి ఉల్లంఘన జరగకుండా ఎక్కడికక్కడ టీంల ద్వారా తనిఖీలు చేయిస్తున్నామన్నారు. స్థానిక సెలబ్రెటీల ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నామని, కేబుల్ టీవీల్లో ప్రసారమయ్యే ప్రకటనపై వీడి యో సర్వేలెన్స్ బృందాల ఆధ్వర్యంలో రోజువారి కార్యక్రమాలు పరిశీలించి ప్రకటనలపై రిటర్నింగ్ అధికారులతో అభ్యర్థులకు, పార్టీలకు నోటీసులు జారీకి ఆదేశాలిచ్చామన్నారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, అనుమానిత చెల్లింపు వార్తపై ఏరోజుకారోజు ఆర్వోలకు వివరాలు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్పోస్టు వద్ద రవాణా, ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లాకు వచ్చే వాహనా లపై నిఘా పెట్టామని, అనుమానిత డబ్బు, మ ద్యాన్ని సీజ్ చేస్తున్నట్లు వివరించారు. ఎంసీసీ నోడల్ అధికారి సింహాచలం, డీఆర్వో అంజయ్య, సమాచార శాఖ డీడీ మహ్మద్ ముర్తుజా ఉన్నారు. -
మూడుసార్లు నేర చిట్టా ప్రచురణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తమ నేరచరిత్రకు సంబంధించిన సమాచారాన్ని మీడియాలో మూడు రోజులు ప్రకటనల రూపంలో వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ప్రజాప్రయోజన ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా న్యాయ శాఖ ఉత్తర్వులను అనుసరించి ఎన్నికల అఫిడవిట్ ఫారం–26ను సవరించినట్లు తెలిపింది. దీని ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు, గతంలో శిక్షకు గురైన అభ్యర్థులు ఆయా కేసుల వివరాలను మీడియా ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి పోలింగ్ తేదీకి ముందు రెండు రోజుల వరకు మూడుసార్లు పత్రికల్లో, న్యూస్ చానెళ్లలో ఈ డిక్లరేషన్ ఇవ్వాలి. ఉదాహరణకు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు నవంబరు 22, పోలింగ్ తేదీ డిసెంబరు 7. కాబట్టి, డిక్లరేషన్ ప్రచురణ నవంబరు 23 నుంచి డిసెంబరు 5 మధ్య మూడు వేర్వేరు రోజుల్లో ఉండాలి. పత్రికల్లో అయితే ఫాంట్ సైజ్ 12గా ఉండాలి. నియోజకవర్గ పరిధిలో విస్తృత సర్క్యులేషన్ కలిగి ఉన్న పత్రికల్లో ఈ ప్రకటన జారీచేయాలి. టీవీల్లో అయితే పోలింగ్ ముగి సే సమయానికి 48 గంటల ముందు వరకు మూడుసార్లు వేర్వేరు తేదీల్లో డిక్లరేషన్ ప్రసా రం కావాలి. డిక్లరేషన్ క్లిప్పింగ్లను జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల వ్యయ ఖాతాలతోపాటు సమర్పించాలి. తమ నేర చరిత్రను సొంత పార్టీకి వెల్లడించినట్లు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి సమర్పించే ఫారం–26లోని నిబంధన 6(ఎ)లో పేర్కొనాలి. రాజకీయ పార్టీలు కూడా.. తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉన్నట్లయితే పత్రికలు, టీవీ చానెళ్లలో పార్టీలు డిక్లరేషన్ ఇవ్వాలి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి పోలింగ్కు రెండు రోజుల ముందు వరకు మూడుసార్లు పత్రికలు, న్యూస్ ఛానెళ్లలో ఈ వివరాలను వెల్లడించాలి. ఈ క్లిప్పింగ్లను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సమర్పించాలి. అప్పటివరకు ప్రభుత్వ వసతి పొంది, బకాయిలు చెల్లించకుండా ఉంటే ఆ సమాచారాన్ని అభ్యర్థులు ఫారం–26లో వెల్లడించాలి. -
మితిమీరిన సృజనాత్మకత
వాణిజ్య ప్రకటనల్లోని మితిమీరిన సృజనాత్మకతకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి దేశంలోనూ ఒక ‘వాచ్డాగ్’ ఉంటుంది. అలాగే స్వీడన్లోనూ ఉంది. స్త్రీలను తక్కువ చేసేలా ఉన్న ఒక మూస తరహా ప్రకటనపై ఆ వాచ్డాగ్ తాజాగా కొరడా ఝళిపించి, దానిని నిషేధించింది. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి కనుక మీ పాత ఉద్యోగాన్ని మానేసి, ఈ కొత్త ఉద్యోగంలో చేరండి అంటూ ఇంటర్నెటెట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ‘బానోఫ్’.. ఫేస్ బుక్లో ఒక ప్రకటన పెట్టింది. ఆ ప్రకటనలో ఒక అబ్బాయి తన గర్ల్ఫ్రెండ్తో వెళుతూ, ఇంకో అమ్మాయి వైపు చూస్తుంటాడు. ఆ అబ్బాయి ఫొటో మీద ‘యు’ అని, గర్ల్ఫ్రెండ్ ఫొటో మీద ‘యువర్ కరెంట్ ఎంప్లాయర్’ అని, ఆ ఇంకో అమ్మాయి మీద ‘బానోఫ్’ అని రాసి ఉంటుంది. దీనిపై పెద్దగా విమర్శలు రానప్పటికీ.. స్త్రీలను తేలిక భావనతో చూసే పాతకాలపు ధోరణికి ఈ ప్రకటన ఒక నిదర్శలా ఉంది కనుక వెంటనే దీనిని తొలగించాలని స్వీడన్ వాణిజ్య ప్రకటనల నియంత్రణ సంస్థ ఆదేశించింది. -
‘ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలు నిషేధించండి’
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రజాధనంతో ఇచ్చే రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ ఆదివారం ఓ లేఖ రాసింది. తెలంగాణలోని ఆపద్ధర్మ ప్రభుత్వం, నాలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం భారీ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రసార మాధ్యమాలకు, పత్రికలకు, వెబ్సైట్లకు ప్రకటనలు ఇస్తున్నాయని లేఖలో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతో ఇచ్చే ప్రకటనలకు ప్రజాధనం ఖర్చు చేయకుండా తెలంగాణ సీఎస్కు ఆదేశాలివ్వాలని కోరింది. -
తెలుగు ప్రకటనలకు గూగుల్ సపోర్ట్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్నెట్లో తెలుగు ప్రకటనలు ఇచ్చేవారికి గూగుల్ ఇండియా శుభవార్త చెప్పింది. గూగుల్ యాడ్స్ ఫ్లాట్ఫామ్స్ అయిన యాడ్ వర్డ్స్, యాడ్ సెన్స్లలోని సాంకేతికతను ఇకపై తెలుగు ప్రకటనలకు కూడా అందించనున్నట్టు తెలిపింది. ప్రాంతీయ భాషలైన హిందీ, బెంగాలీ, తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సాంకేతికత అందుబాటులో ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. తెలుగులో వెబ్సైట్లు, బ్లాగ్లు నిర్వహించేవారు ఇకపై గూగుల్ యాడ్ సెన్స్లోకి సైన్ ఇన్ అయి ప్రకటనలు పొందడమే కాకుండా తమ సైట్లలో ప్రకటనలు ఇచ్చేలా అడ్వర్టైజర్స్ను ఆకర్షించవచ్చని తెలిపింది. తద్వారా ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ‘గూగుల్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఈ సాంకేతికతపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి గూగుల్ ఇండియా వర్క్షాపులు కూడా నిర్వహించింది. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ దక్షిణాసియా ఉపాధ్యక్షుడు రాజన్ ఆనంద్ మాట్లాడుతూ.. భారత్లోని ప్రాంతీయ భాషాభిమానులకు ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడం కోసమే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. తద్వారా గూగుల్ యాడ్స్ ఫ్లాట్ఫాంపై భారతీయ భాషలకు మద్దతు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రాంతీయ భాషల్లో మెరుగైన సమాచారం అందించడం కోసం పరిశ్రమలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాల్సి ఉందన్నారు. దీంతో దేశ అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రకటనకర్తలకు కూడా తమ ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఇవ్వడం సులభతరం అవుతుందన్నారు. -
‘తుపాకీ’ ప్రకటనలకు ఫేస్బుక్ నో
న్యూయార్క్: అమెరికాలో తుపాకీ సంస్కృతిపై విపరీతమైన చర్చ నడుస్తున్న వేళ సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ల(18 ఏళ్లలోపు వారు) ఫేస్బుక్ ఖాతాల్లో తుపాకుల విడిభాగాలు, అనుబంధ ఉపకరణాల ప్రకటనలు ప్రదర్శించడంపై నిషేధం విధించింది. మైనర్ల ఖాతాల్లో ఆయుధాలు, బుల్లెట్ల అమ్మకాల ప్రకటనల్ని ఫేస్బుక్ ఇప్పటికే నిలిపివేసింది. ఫేస్బుక్ తాజా నిర్ణయం ప్రకారం తుపాకీలను నడుముకు పెట్టుకునేందుకు వాడే బెల్టులు, హోల్స్టర్లతో పాటు ఫ్లాష్లైట్ల ప్రకటనల్ని నిషేధించారు. ఈ విధానం జూన్ 21 నుంచి అమల్లోకి రానుంది. -
ఫేస్ తెలీకపోయినా.. మనసు గ్రహిస్తుంది
మీకు వంటలంటే ఇష్టమా? ఫేస్బుక్లో వంటలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తుంటారా? అలాగైతే ఫుడ్కి సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్స్ మీ వాల్పై ఎప్పుడైనా గమనించారా? మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువా? ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా పోస్టు లేదా షేర్ చేస్తూ ఉంటారా? అలాగైతే ఆరోగ్య ఉత్పత్తుల యాడ్స్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండాలి..! మా ఇష్టాయిష్టాలు ఫేస్బుక్కు ఎలా తెలుసు..? అని ఆశ్చర్యపోకండి ఇదో వాణిజ్య వల..!! మీ అలవాట్లు, అభిరుచులు, ఇష్టాయిష్టాలన్నింటినీ గ్రహించి, వాటిని క్రోడీకరించి వాణిజ్య ప్రకటనదారుల చేతుల్లో పెట్టేస్తోంది ఫేస్బుక్. తద్వారా తాను సొమ్ము చేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనం నాడి పసిగట్టి తాను యాడ్స్ రూపంలో కోట్లు కొల్లగొడుతోంది. వాణిజ్య ప్రకటనల ఆదాయంలో గూగుల్ తర్వాత స్థానం ఫేస్బుక్దే.. ప్రజల అలవాట్లనే తన ఆదాయానికి మార్గం చేసుకుని 400 కోట్ల డాలర్ల యాడ్ రెవెన్యూ సాధించింది. కేంబ్రిడ్జి ఎనలిటికా డేటా లీకేజీ వ్యవహారం తర్వాత ఫేస్బుక్ వినియోగదారుల్ని ఎలా ఆకర్షిస్తోందన్న అంశంలో ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మీ ప్రొఫైల్లో ఉన్న సమాచారం మొత్తాన్ని అంచనా వేస్తుంది. మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారు? ఏ కాలేజీలో చదివారు.. మీ విద్యార్హతలు.. మీరు రిలేషన్లో ఉన్నారా? వంటి అంశాల ద్వారా మీరు ఎలాంటి విషయాలకు ఆకర్షితులవుతారో గ్రహిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్లో లొకేషన్ ఆప్షన్ ఆన్ అయి ఉంటే చాలు.. అడుగు తీసి అడుగు వేసినా ఫేస్బుక్ పసిగట్టేస్తుంది. మీరు ఏయే ప్రాంతాలకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? వంటి విషయాల ద్వారా మీ అభిరుచుల్ని తెలుసుకుంటుంది. ఆన్లైన్లో మీరు చేసే బుకింగ్ల ద్వారా మీకున్న ఇష్టాయిష్టాలపై ఒక అంచనాకి వస్తుంది. మీరు చేసే పోస్టులు, షేర్ చేసే విషయాలు, కొట్టే లైక్లు, పెట్టే కామెంట్స్ కూడా ఫేస్బుక్ రూపొందించే మార్కెట్ వ్యూహాలకు ముడిసరుకులే. చివరికి మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వ్యక్తులని బట్టి మీకున్న ఆసక్తుల్ని పట్టేయగలదు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తూ మార్కెటింగ్ కంపెనీలకు సమాచారాన్ని అందించడం ద్వారా వాణిజ్య ప్రకటనల్ని తెచ్చుకుంటోంది. అంతేకాదు వాణిజ్య ప్రకటనదారుల కోసం ఫేస్బుక్ పిక్సెల్ అనే టూల్ని రూపొందించింది. ఎఫ్బీకి యాడ్స్ ఇవ్వాలనుకునే కంపెనీలు ఈ టూల్ని తమ వెబ్సైట్లో పెట్టడం ద్వారా వినియోగదారుల ప్రతీ చర్యా తెలుసుకోగలరు. మీ వాల్ మీదనున్న యాడ్ను క్లిక్ చేసిన తర్వాత మీరేం చేసినా పిక్సెల్ టూల్తో తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న సమాచారంతో ప్రకటనదారులు తమ యాడ్స్కి మరింత మెరుగులు దిద్దుతారు. రీ టార్గెటింగ్ అనే టూల్ ద్వారా మీకు ఇష్టమైన ఉత్పత్తుల్ని గ్రహించుకుని, వాటిని మీరు కొనేలా ఉసిగొల్పుతారు. ఇలా కనీసం మీ ఫేస్ తెలీకపోయినా, మీ మనసు గ్రహిస్తుంది.. అదే ఇప్పుడు ఫేస్బుక్కు పెట్టుబడి. -
ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ జోరు!
న్యూఢిల్లీ: ఈ కొత్త ఏడాది ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్దే అంటోంది యాడోమంత్ర డిజిటల్. ఈ సంస్థ ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ను అందిస్తుంది. హైస్పీడ్ మొబైల్ నెట్వర్క్ విస్తరణ, ఇంటర్నెట్ వినియోగం పెరుగుదల వంటి పలు అంశాలు ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ జోరుకు దోహదపడతాయని తాజాగా తన నివేదికలో పేర్కొంది. ఇక అడ్వర్టైజింగ్ జోరులో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్ వంటి వాటితో వీడియో వీక్షణంతోపాటు వీడియో అడ్వర్టైజింగ్ కూడా పెరుగుతుందని వివరించింది. ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ విభాగపు ఆదాయం గతేడాది దాదాపు రెండు రెట్లు పెరిగిందని పేర్కొంది. ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ పరిశ్రమలో 2016లో 200 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపింది. -
ట్రంప్ అనూహ్య నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన ప్రచార వ్యయాన్ని అనూహ్యంగా పెంచారు. ఇప్పటి నుంచి ఎన్నికల తేదీ వరకు ప్రచార ప్రకటనల కోసం 140 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ సీనియర్ కమ్యూనికేషన్ అడ్వైజర్ జెసన్ మిల్లర్ తెలిపారు. ఈ 140 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లను టెలివిజన్ యాడ్లకు ఉపయోగించనుండగా... మరో 40 మిలియన్ డాలర్లను డిజిటల్ యాడ్ల కోసం ఖర్చుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి హిల్లరీ కంటే తక్కువ ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొస్తున్న ట్రంప్.. అనూహ్యంగా తన ప్రచార వ్యయాన్ని పెంచడం విశేషం. దీంతో హిల్లరీ అంచనాలు వారానికి 11 మిలియన్ డాలర్లుగా ఉండగా.. ట్రంప్ 16 మిలియన్ డాలర్లతో ప్రచార వ్యయంలో దూకుడు పెంచారు. -
తప్పుదోవ పట్టిస్తే సెలబ్రిటీలకు ఐదేళ్ల జైలు!
- ప్రకటనలపై వినియోగదారుల చట్టంలో కొత్త నిబంధనలు న్యూఢిల్లీ: ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించాలని కొత్త ముసాయిదా చట్టం చెప్తోంది. ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఏప్రిల్లో తన సిఫారసులను సమర్పించింది. వీటిని అధ్యయనం చేసిన వినియోగదారుల మంత్రిత్వశాఖ.. సెలబ్రిటీలను బాధ్యులను చేయటం, కల్తీకి కఠిన శిక్ష విధించటం వంటి కొన్ని కీలక సిఫారసులను ఆమోదించింది. ఈమేరకు ముసాయిదా బిల్లులో చేయదలచుకున్న మార్పులపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సారథ్యంలో కేంద్ర మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమై చర్చించనుంది. అనంతరం వీటిని కేబినెట్ ఆమోదం కోసం మంత్రివర్గానికి నివేదిస్తారు. వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులకు.. ఆయా ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ. 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష.. రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ముసాయిదాలో నిబంధనలు చేర్చినట్లు ప్రభు త్వ వర్గాలు తెలిపాయి. అలాగే కల్తీ విషయంలో కూడా ఇదే తరహా శిక్షలతో పాటు.. లెసైన్స్ రద్దు చేయ టం వంటి చర్యలను సిఫారసు చేసినట్లు సమాచారం. -
తప్పుదోవ పట్టిస్తే సెలబ్రిటీలకు ఐదేళ్ల జైలు!
-
రాందేవ్ కు మరో భారీ షాక్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ కంపెనీలకు పోటీగా దూసుకు వస్తున్న యోగా గురు రాందేవ్ కంపెనీ పతంజలికి మరోసారి ఎదురు దెబ్బతప్ప లేదు. ఇటీవల వంట, హెయిర్ నూనెల ప్రకటనతో ఇబ్బందులు పడ్డ పతంజలి సంస్థకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఎస్సీఐ) మళ్లీ మొట్టికాయలు వేసింది. దేశ ప్రకటనలపై వాచ్డాగ్ స్కానర్ గా ఉన్న ఈ సంస్థ 'దాంత్ కాంతి' టూత్ పేస్టు ప్రకటనలో పతంజలి తప్పుడు విషయాలు పేర్కొంటోందని తెలిపింది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ ఆదరణ పొందిన 'దాంత్ కాంతి ' ప్రకటనలో చెబుతున్నట్టుగా ఎఫెక్టివ్ గా లేదని వివరించింది. దంతస్రావం, వాపు, చిగురులు బ్లీడింగ్, పళ్లు పసుపు రంగులో కి మారడం సెన్సిటివిటీ, చెడువాసన లాంటి సమస్యలకు బాగా పనిచేస్తుందనేది నిరూపించబడలేదని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన ద్వారా పతంజలి మోసానికి పాల్పడిందని తెలిపింది. క్రిములు, సూక్ష్మజీవులనుంచి పళ్లను దీర్ఘకాలం రక్షిస్తుందని ప్రకటించి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. అలాగే సంస్థ మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె పతంజలి ప్రకటనలు, పండ్ల రసాలు, పశువుల దాణా ప్రకటనల పై కూడా సందిగ్ధతను వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలలోని విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేసింది పతంజలితోపాటుగా సహా అనేక కంపెనీ యాడ్స్ పై అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కెల్లాగ్ ఇండియా, లోరియల్, కాల్గేట్ పామోలివ్ వంటి కంపెనీ ప్రకటనలను కూడా సంస్థ తప్పుబట్టింది. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది. న్యూ గార్నియర్ కంప్లీట్ డబుల్ యాక్షన్ ఫేస్ వాష్ , హెచ్ యు ఎల్ ఇన్ స్టెంట్ వైట్నింగ్ ప్రకటనలపై సంస్థ తీవ్రంగా స్పందించింది. న్యూ గార్నియర్ వైట్ పూర్తి డబుల్ యాక్షన్, లోరియల్ ప్రకటనల్లో చెప్పినట్టుగా తక్షణం తెల్లబడటం వాస్తవం కాదని తేల్చి చెప్పింది. కేవలం క్రీమ్ ల వల్ల తెల్లగా కనిపిస్తారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. డార్క్ స్పాట్స్ పై పోరాటం... తక్షణం తెల్లబడటం ఇదంతా మోసమని ఎఎస్సీఐ తెలిపింది. ఊహలతో ఆయా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. వినియోగదారులను మరోసారి ఆలోచించాలని కోరింది. మొత్తం 141 ఫిర్యాదులను విచారించిన సంస్థ 67 ని సమర్థించింది. ఫుడ్ అండ్ బ్యావెరేజెస్ రంగంలో దేశంలో మిస్ లీడింగ్ యాడ్స్ పై దేశ సర్వోన్నత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) తో గత వారం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎఎస్సీఐ ఈ నివేదికలు రూపొందించింది. -
రాందేవ్కు మరో షాక్
కోలకతా: ప్రముఖ యోగాగురు రాందేవ్ కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలికి భారీ షాక్ తగిలింది. సంస్థ కు చెందిన వంట నూనెల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) మరో కీలక అడుగువేసింది. ఇటీవల తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసిన సంస్థ పతంజలి కి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కేంద్ర అనుమతుల సంస్థను కోరింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఎఐ పేర్కొంది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను విచారించిన సంస్థ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ వాదన. ఈ తాజా పరిణామంపై పతంజలిని వివరణ కోరగా....షోకాజ్ నోటీసులు తమకు అందిన తరువాత స్పందిస్తామని సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. పెట్రోలియం ప్రొడక్ట్ అయిన హెగ్సాగెన్ ద్రావకం క్యాన్సర్ కారకమన్న తమవాదనను సమర్ధించుకున్నారు. -
రాందేవ్ బాబాకు ఝలక్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి పై ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) భారీ ఝలక్ ఇచ్చింది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది. తనకు అందిన సుమారు 156 ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లెటర్ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పతంజలి కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్, కేశ్ కాంతి న్యాచురల్ హెయిర్ క్లెన్సర్ తదితర ప్రకటలపై సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే పతంజలి ఆయుర్వేద సంస్థ మాత్రం తన ప్రచారాన్ని గట్టిగానే సమర్ధించుకుంది. వాస్తవాలు, పరిశోధనల ఆధారంగానే తమ ప్రచారాన్ని రూపొందించామని, ఎవరినీ తప్పుదారి పట్టించే ఆలోచన లేదంటూ వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై పతంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మంచి పదాలను వాడటమే అతని తప్పయింది...!
నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు గుప్పిస్తున్న ఓ విత్తనాల వ్యాపారి.. భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. తన సీడ్ దుకాణంలో అమ్మకాలు ఎక్కువగా జరిపేందుకు ఇష్టానుసారంగా వాడుతున్న పదాలు... చివరకు అతడి పీకలమీదకు తెచ్చిపెట్టాయి. మా విత్తనాలే అత్యుత్తమమైనవి అంటూ చేస్తున్న ప్రచారానికి వేలకొద్దీ డాలర్లు జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హాంగ్ ఝూ నగరంలో ఫాంగ్ అనే వ్యక్తి 'ఫాంగ్లిన్ ఫూ రోస్టెడ్ సీడ్స్' దుకాణం నిర్వహిస్తున్నాడు. వేయించిన విత్తనాల సంచులు, బిల్ బోర్డులపై ఉత్తమ, గొప్ప, అంటూ ప్రింట్ చేసి మరీ అమ్మకాలు జరపడంతో అతినికి సుమారు 30.360 డాలర్ల జరిమానా పడింది. తనకు స్థానిక మార్కెట్ పర్యవేక్షణ విభాగంనుంచీ గతవారం నోటీసులు అందాయని, ప్రకటనల చట్టాన్ని అతిక్రమించినందుకు ఫైన్ విధించినట్లు అందులో పేర్కొన్నారని షాపు యజమాని ఫాంగ్ చెప్తున్నాడు. హాంగ్షూ పేరుతో ఫాంగ్ మరో మూడు దుకాణాలతోపాటు, ఆన్లైన్ అమ్మకాలు కూడ నిర్వహిస్తున్నాడు. అయితే తాను దాదాపు ఇరవై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నానని, మంచి క్వాలిటీ ముడి పదార్థాలనే అమ్ముతున్నానని, అందుకు సరిపోయే మంచి పదాలనే తన ప్రచారానికి వాడుకుంటున్నానని చెప్తున్నాడు. అటువంటి పదాలు వాడటం చట్ట విరుద్ధమని తెలిస్తే తాను ఆపని చేసి ఉండేవాడిని కాదని లబోదిబోమంటున్నాడు. అయితే నోటీసులు అందిన వెంటనే ఫాంగ్ తాను వాడిన పదాల్లో మార్పులను చేసినా ఉపయోగిం లేకపోయింది. రెండునెల్ల క్రితమే ఫాంగ్ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు తమకు నివేదిక అందిందని, ప్రాధమిక విచారణ అనంతరం అది నిజమేనని తేలిందని అధికారులు చెప్తున్నారు. అయితే ది బెస్ట్, గ్రేటెస్ట్ వంటి పదాలు మార్పు చేయడంలో ఫాంగ్ సహకారాన్ని పరిగణలోకి తీసుకొని అతనికి తక్కువ జరిమానా విధించేందుకు నిర్ణయించామని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ప్రకటనలకు అతిశయోక్తి పదాల వాడకాన్ని చైనా బ్యాన్ చేసింది. కొత్త చట్టాన్ని అతిక్రమించినవారికి జరిమానా తప్పదని వెల్లడించింది. ఈ కొత్త చట్టం సెప్టెంబర్ నెల్లో అమల్లోకి కూడ వచ్చింది. ఆ తర్వాత కూడ ఫాంగ్ ప్రకటనల్లో మార్పులు చేయకపోవడంతో భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అయితే ఫాంగ్ ఖాతాదారులు కొంతమంది అతడికి జరిమానా విధించడం అన్యాయమంటున్నారు. నోటీసులు అందిన తర్వాత ఫాంగ్ పదాల్లో మార్పులు చేసినా అంత పెద్దమొత్తంలో జరిమానా కట్టాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు ప్రకటనల చట్టాల్లో వచ్చే మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హాంగ్ ఝూ టియాన్స్ లాయర్స్ ఫర్మ్ న్యాయవాది యో గ్జియోజువాన్ అంటున్నారు. అయితే ప్రభుత్వం కూడ పెద్ద మొత్తంలో జరిమానాలు విధించే ముందు... కొత్తగా చట్టాల్లో వచ్చిన మార్పులు, చేర్పులపై కొంత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. -
అమ్మో... మరీ ఇంతలానా?
వన్ ఫైన్ మార్నింగ్... ముంబైలోని 34 అంతస్తుల ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్. 34వ అంతస్తు నుంచి కిందకి చూడాలంటేనే గుండె జారిపోతుంది. అలాంటిది ఆ అంతస్తు పై నుంచి ఓ అమ్మాయి... ఇద్దరి సాయంతో కిందకు వేలాడుతూ, యాక్షన్ చేస్తున్నారు. దారిన పోయేవాళ్లందరూ టెన్షన్గాచూస్తున్నారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసమేనేమో అనుకున్నారంతా! కానీ అదంతా కేవలం యాడ్ చిత్రీకరణ కోసమే. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు శ్రద్ధాకపూర్. ఓ ప్రొడక్ట్కు సంబంధించిన వాణిజ్యప్రకటన కోసం రిస్కీ షాట్లో నటించడానికి ఆమె రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను తన ట్విటర్లో ‘సో... వెయిట్లెస్..’అంటూ షేర్ చేశారామె. అమ్మో...అంత రిస్కా అని సన్నిహితులు అంటున్నా, శ్రద్ధా కపూర్ మాత్రం మరేం ఫరవాలేదంటున్నారు. ‘ఆషికీ-2’ చిత్రంతో డ్రీమ్గాళ్గా ప్రేక్షకుల హృదయాలను మీటిన శ్రద్ధాకపూర్ తన ఇమేజ్ను అంచెలంచెలుగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే డాన్స్ నేపథ్యంలో ‘ఏబీసీడీ-2’ నటించారు. ఇప్పుడు తాను నటిస్తున్న ‘బాగీ’ చిత్రంలో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. అందుకేనేమో యాక్షన్ సీన్లలో నటించడానికి సై అంటున్నారు. -
ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు
టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వాణిజ్య పత్రికలో ఫ్రంట్ పేజి పై ఒక చేత్తో బూటు పట్టుకొని విష్ణు మూర్తి అవతారం లో ఉన్న ధోనీ ఫోటో ముద్రించారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ.. గత ఫిబ్రవరిలో విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ధోనితో పాటు.. పత్రిక ఎడిటర్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తాజాగా.. నవంబర్ 7న ధోనీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వివాదానికి దారితీసిన ఈ పత్రిక 2013 ఏప్రిల్ లో విడుదల అయ్యింది. ఇక మరో వైపు ఇదే ఫోటో పై కర్ణాటకలోని ఓ సంఘ సేవకుడు జయకుమార్ హిరామత్ సైతం కోర్టులో కేసు వేసాడు. -
ప్రకటనలతోనే గుర్తింపు
ప్రముఖ హీరోయిన్ స్థాయి కోసం పోరాడుతున్న నటీమణుల్లో తాప్సీ ఒకరు. వాణిజ్య ప్రకటనలతో నట జీవితాన్ని ప్రారంభించిన ఈ ఉత్తరాది బ్యూటీ సినిమా రంగప్రవేశం చేసి నంబర్వన్ హీరోయిన్ అయిపోదామనే కలలుకన్నారు. అయితే ఆమె ఆశించినట్లుగా దక్షిణాది భాషలైన తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చినా టాప్ హీరోయిన్ కల ఇంకా నెరవేరలేదు. తమిళం, తెలుగు భాషల్లో యువ హీరోలందరి సరసన నటించారు. అయినా ఎందుకనో తాప్సీ హీరోయిన్గా సరైన స్థాయికి చేరుకోలేకపోయారు. ప్రస్తుతం అవకాశాలు కూడా అంతంత మాత్రమే. లారెన్స్తో నటించిన కాంచన-2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై తాప్సీ చాలాఆశలు పెట్టుకున్నారు. మరో విషయం ఏమిటంటే చిత్రాలపై నమ్మకంపై వాణిజ్య ప్రకటనల్లో నటించకుండా దూరం అయ్యారు. దీంతో పునరాలోచనలో పడ్డ తాప్సీ మళ్లీ వాణిజ్య ప్రకటనల్లో నటించాలనే నిర్ణయానికి వచ్చారట. అలాంటి తరుణంలో ఒక క్రీమ్ యాడ్లో నటించే అవకాశం రావడంతో మరోమాట లేకుండా ఒప్పేసుకున్నారట. ఆమె మాట్లాడుతూ అమ్మాయిలకు అందం అవసరమే అయితే అందుకోసం తానెప్పుడూ క్రీమ్లు లాంటి సౌందర్యసాధనాలను వాడలేదు అన్నారు. తనది సహజసిద్ధమైన అందం అని కూడా కాస్త గర్వంతో కూడిన భావాన్ని వ్యక్తం చేశారు. ఇక వాణిజ్య ప్రకటనల్లో నటించడం గురించి తాప్సీ తెలుపుతూ హీరోయిన్లకు వాణిజ్య ప్రకటనల్లో నటించడం అవసరం అన్నారు. వాటి ద్వారానే నిత్యం టీవీల ద్వారా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని అన్నారు. -
ఉజ్వలమైన కెరీర్కు.. క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్
దేశవిదేశాల్లో దినదిన ప్రవర్థమానమవుతున్న రంగం.. అడ్వర్టైజింగ్. నేటి మార్కెటింగ్ యుగంలో ప్రతి వస్తువుకూ ప్రచారం అవసరమే. అందుకే ప్రకటనల రంగం అభివృద్ధి పథంలో సాగుతోంది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం క్లయింట్లు అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ క్లయింట్లకు, ప్రకటన సంస్థకు మధ్య వారధిగా పనిచేసే నిపుణులుంటారు. వారే.. క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లు. ఏజెన్సీకి వీరు వెన్నెముక లాంటివారు. క్లయింట్ల అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకొని ఏజెన్సీకి తెలియజేస్తారు. సంస్థ వ్యాపార కార్యకలాపాలు, మనుగడ వీరి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీల సంఖ్య పెరుగుతుండడంతో క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లకు కూడా డిమాండ్ అధికమవుతోంది. ప్రకటనలు, ప్రచారంపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు. ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజూ నూతన అనుభూతి: క్లయింట్ సర్వీసింగ్ నిపుణులకు ప్రకటన సంస్థలతోపాటు కార్పొరేట్ ఆర్గనైజేషన్లు, వస్తూత్పత్తుల సంస్థలు, టీవీ చానళ్లలోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అడ్వర్టైజింగ్తో ముడిపడి ఉన్న ప్రతి రంగంలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. సర్వీసింగ్ మేనేజర్లు నేరుగా క్లయింట్లతో మాట్లాడాల్సి ఉంటుంది. వారి అవసరాలకు అనుగుణంగా ప్రకటనలు రూపొందించడం, ప్రచారం చేసిపెట్టడం వంటి బాధ్యతలను పర్యవేక్షించాలి. కస్లమర్ల ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించాలి. సంస్థ వ్యాపారాన్ని పెంచేది క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లే. ఇందులో ప్రతిరోజూ కొత్తగానే ఉంటుందని, విసుగుదల రాదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. నైపుణ్యాలు: క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లు తీవ్ర ఒత్తిళ్ల మధ్య కూడా కష్టపడి పనిచేయగలగాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ తప్పనిసరిగా ఉండాలి. బిజినెస్ సెన్స్ అవసరం. ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ పెంచుకోవాలి. టైమింగ్సతో నిమిత్తం లేకుండా పగలు, రాత్రి ఎప్పుడైనా పనిచేసే సామర్థ్యం ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కచ్చితంగా కాపాడుకోవాలి. అర్హతలు: గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అడ్వర్టైజింగ్/మార్కెటింగ్లో డిప్లొమా కోర్సు చదివి, క్లయింట్ సర్వీసింగ్ రంగంలో అడుగుపెట్టొచ్చు. మాస్ కమ్యూనికేషన్/ఎంబీఏ కోర్సులు చదివినవారు సైతం ఇందులో రాణించొచ్చు. వేతనాలు: పనిచేస్తున్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్థాయిని బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఎంబీఏ పూర్తిచేసి, ఈ రంగంలో కొంత అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు పొందొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీకి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వేతనం అందుతుంది. అకౌంట్ ఎగ్జిక్యూటివ్కు రూ.18 వేల నుంచి రూ.20 వేలు, సీనియర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్కు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, అకౌంట్ మేనేజర్కు రూ.26 వేల నుంచి రూ.34 వేలు, అకౌంట్ డెరైక్టర్కు ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షలు, మేనేజ్మెంట్ సూపర్వైజర్కు ఏడాదికి రూ.12 లక్షలు, క్లయింట్ సర్వీసింగ్ డెరైక్టర్కు రూ.11 లక్షల నుంచి రూ. 17 లక్షల దాకా వేతనాలు ఉంటాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-ఢిల్లీ వెబ్సైట్: www.iimc.nic.in జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ వెబ్సైట్: www.xaviercomm.org జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. వెబ్సైట్: http://jbims.edu/ -
ప్రకటనలతో చంద్రబాబు కాలయాపన
వెంకటాచలం: అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రకటనలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాల యాపన చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. సామాజిక పింఛన్ల కమిటీల్లో టీడీపీ కార్యకర్తలను నింపి ఆర్భాటం చేస్తున్న చంద్రబాబులో ప్రజలకు మేలు చేయాలన్న ధోరణి కనిపించడం లేదని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి పార్టీ కార్యకర్తలను కమిటీల్లో వేయడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పింఛన్ల కమిటీల నిర్వాకంతో అర్హులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో ఒకరికే పింఛన్ అంటూ పెన్షన్లు పొందుతున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. వికలాంగులకు 80 శాతం వికలత్వం ఉంటేనే రూ. 1,500 పెన్షన్ ఇస్తామని చెప్పడం చూస్తుంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం వికలత్వం పొందాలా అని ఆయన గట్టిగా ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రైతులను , స్వయం సహాయక సంఘాల మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. కాగా ఎమ్మెల్యేతో పాటు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టీరింగ్కమిటీ సభ్యులు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల పరి షత్ ఉపాధ్యక్షులు శ్రీధర్ నాయుడు, సర్పంచ్ పోట్లూరు మణెమ్మ, కోడూరు ప్రదీప్రెడ్డి, కనుపూరు కోదండరామిరెడ్డి, డబ్బుగుంట వెంకటేశ్వర్లు, మందల పెంచలయ్య, నడవల నాగ రాజా గౌడ్,పాశం ప్రభాకర్, నాటకం శ్రీనివాసులు, వెలిబోయిన వెంకటేశ్వర్లు, కొణిదన మోహన్ నాయుడు, కొణిదన విజయ భాస్కర్ నాయుడు, అడపాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జేడబ్ల్యూటీ మైండ్సెట్కు అవార్డుల పంట
హైదరాబాద్: అడ్వర్టైజింగ్ దిగ్గజం జేడబ్ల్యూటీ మైండ్సెట్ తాజాగా యాడెక్స్-2013లో ‘ది ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్’సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. అవార్డులు దక్కిం చుకున్న కేటగిరీల్లో బెస్ట్ కంటిన్యూయింగ్ క్యాంపెయన్ ఆఫ్ ది ఇయర్ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రకటనలకు సంబంధించి).. ఆర్ట్ డెరైక్టర్ ఆఫ్ ది ఇయర్ (చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి).. కాపీరైటర్ ఆఫ్ ది ఇయర్ (ఏపీ టూరిజంకు సంబంధించి) ఉన్నాయి. జేడబ్ల్యూటీ మైండ్సెట్- 8 బంగారం,4 వెండి పురస్కారాలతో పాటు ది ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్ సహా మొత్తం 13 పురస్కారాలు దక్కించుకుంది. పురస్కారాలను గెలుచుకున్న ఇతర బ్రాండ్ల ప్రకటనల్లో మిన్టాప్ (డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్), బొటానికా, చార్మినార్ (హెచ్ఐఎల్), ఓరియంట్ ఎలక్ట్రికల్స్ ఉన్నాయి. అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, సాక్షి మీడియా స్పాన్సర్ చేసింది. హైదరాబాద్లోని 34 ఏజెన్సీల నుంచి ఈ ఏడాది 500 పైగా ఎంట్రీలు వచ్చాయి. అడ్వర్టైజింగ్ రంగ దిగ్గజం కేవీ శ్రీధర్ సారధ్యంలో పలువురు ప్రముఖులు వీటిని పరిశీలించి అవార్డులకు ఎంపిక చేశారు. స్థానికంగా తమ సంస్థ అత్యుత్తమ క్రియేటివ్ ఏజెన్సీ అని ఈ పురస్కారాలతో మరోసారి నిరూపితం అయినట్లు జేడబ్ల్యూటీ మైండ్సెట్ మేనేజింగ్ డెరైక్టర్ రామ్ గేదెల పేర్కొన్నారు. క్లయింట్లకు తమ సంస్థ పట్ల విశ్వాసాన్ని కూడా ఈ అవార్డులు ప్రతిబింబిస్తున్నట్లు తెలిపారు. -
బీ ఖాతాలకు త్వరలో మోక్షం
16న బీఎంపీసీ ఎన్నికలు 15న నామినేషన్ల స్వీకరణ అదే రోజు అభ్యర్థుల ప్రకటన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగర పరిధిలో రెవెన్యూ భూముల్లో నివేశన స్థలాలను (బీ ఖాతా) కొనుగోలు చేసి, ఏ ఖాతాల (క్రమబద్ధీకరణ) కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న వారికి శుభ వార్త. హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ (బీఎంపీసీ)కి ఈ నెల 16న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కమిటీ ఏర్పాటయ్యే వరకు బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చవద్దని హైకో ర్టు ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. నగరంలో ఇప్పటికే అనుమతి పొందిన లేఔట్లు, వాటిల్లో నిర్మించిన అపార్ట్మెంట్లకు ఏ ఖాతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయితే సొంతంగా నివేశనాలు కొనుగోలు చేసిన వారికి ఈ ఆదేశాలు వర్తించడం లేదు. రాష్ట్రంలోని పట్టణాల పరిధుల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను నిర్ణీత ఫీజు వసూలు చేయడం ద్వారా అక్రమ-సక్రమ పథకం కింద క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని వ్యక్తిగత నివేశనాలను ఈ పథకం కిందే చేర్చారు. అయితే బీఎంపీసీని ఏర్పాటు చేసేంత వరకు అలాంటి నివేశనాలను క్రమబద్ధీకరించవద్దని హైకోర్టు ఆదేశించింది. దీని వల్ల ఆ కమిటీ ఏర్పాటు కోసం వ్యక్తిగత నివేశనాలను కలిగి ఉన్న వారు ఇన్నాళ్లూ ఎదురు చూస్తూ గడిపారు. కమిటీని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం గత నెల 25న బెంగళూరు ప్రాంతీయ కమిషనర్కు సూచించింది. 18 మంది సభ్యులు .. బీఎంపీసీలో మొత్తం 18 మంది సభ్యులుంటారు. బీబీఎంపీ కార్పొరేటర్లు, బెంగళూరు మెట్రోపాలిటన్ ఏరియా (బీఎంఏ)లోని జిల్లా, తాలూకా, గ్రామ పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఆ 18 మందినీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఇద్దరు సభ్యులను ఎన్నుకుంటారు. ఓటర్లందరూ పోటీ చేయడానికి అర్హులే. ఈ నెల 15న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమాలుంటాయి. అదే రోజు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఏకగ్రీవమైతే అదే రోజు వెల్లడిస్తారు. కాగా బీఎంపీసీలో పది మంది నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు జాతీయ రాజధాని ప్రాంతీయ ప్రణాళిక మండలి ఈ సభ్యులను నామినేట్ చేస్తుంది. -
అప్రెంటిస్ షిప్ మేళాకు విశేష స్పందన
భారీగా హాజరైన వృత్తి విద్య విద్యార్థులు 1186 ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అప్రెంటిస్ షిప్ మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తరలిరావడంతో కళాశాల ఆవరణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఇంట ర్మీడియట్లో ఇంజినీరింగ్, పారామెడికల్ తదితర ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అప్రెంటిస్ షిప్కు ఎంపిక చేయడం కో సం ఈ మేళా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ(సీజీఎం) రాజారావు మాట్లాడుతూ వృత్తి విద్యాకోర్సు లు పూర్తిచేసి విద్యార్థులు అప్రెంటిస్షిప్ పూర్తి చేయడం ద్వారా వారిలో స్వయం ఉపాధి నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. చెన్నై బోర్డు ఆఫ్ డెరైక్టర్ వీఎస్.పాండే, హైదరాబాద్లోని ఎస్ఐవీఈ రీడర్ జి.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ అప్రెంటిస్ షిప్ వల్ల భవిష్యత్లో జీవితానికి అవసరమైన మెళకువులు నేర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్ వి ద్య ఆర్ఐఓ మలహల్రావు, జిల్లా వృత్తి విద్యాధికారి ఎ.పరాంకుశం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు వి.లక్ష్మారెడ్డి, కోదండపాణితో పాటు టీఎస్ ఎన్పీడీసీఎల్, సింగరేణి కాలరీస్ కం పెనీ లిమిటెడ్తో పాటు హైదరాబాద్కు చెందిన శ్రీ సాఫ్ట్ సొల్యూషన్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటా ర్స్, ఎస్కార్ట్ ఎంటర్ప్రైజెస్, పలు ప్రైవేటు ఆస్పత్రులు ప్రతినిధులు పాల్గొని తమ కంపెనీల్లో అప్రెంటిస్ షిప్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, కామ ర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లోని 1043 వేకెన్సీలు, మధ్యాహ్నం 2 నుంచి సా యంత్రం 5గంటల వరకు పారా మెడికల్ అగ్రికల్చర్ విభాగాల్లోని 143 వేకన్సీల్లో అభ్యర్థుల ఎంపిక జరిగింది. -
కోడ్ దాటితే కొరడా
రాజకీయ పార్టీలకు హెచ్చరిక సక్రమంగా ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ విశాఖ రూరల్, న్యూస్లైన్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీల ప్రతినిధులు విధిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ నిబంధనల ప్రకారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కోర్టులో కేసు వేస్తే అభ్యర్థులను పోటీ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందన్నారు. ఈ విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు వివరించి మోడల్కోడ్ను ఉల్లంఘించకుండా చూడాలన్నారు. పత్రికలకు ప్రకటనలు ఇచ్చే ముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతి మంజూరవుతుందన్నారు. ఈవీఎంలకు సీలు వేసినపుడు పార్టీ ప్రతినిధులు తనిఖీ చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ ప్రవీణ్కుమార్, టీడీపీ ప్రతినిధి బి.ఎల్.ఎన్.మణిశంకరనాయుడు, బీజేపీ నుంచి పి.వి.నారాయణరావు, సీపీఐ నుంచి ఎం.పైడిరాజు, సీపీఎం ప్రతినిధి కె.లోకనాధం పాల్గొన్నారు. విమర్శలకు అవకాశం లేకుండా విధులు ఎన్నికల నిర్వహణలో ఏ రాజకీయ పార్టీ నుంచి విమర్శలకు తావులేకుండా విధులు నిర్వహించాలని జిల్లా అధికారులకు భన్వర్లాల్ సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పుస్తకాన్ని సక్రమంగా చదవాలన్నారు. లేదంటే పొరపాట్లు జరిగే అవకాశముందన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు ఫారం-26లో ఉన్న 7 పేజీలలో పూర్తి వివరాలు పొందుపరచాలన్నారు. నామినేషన్ తిరస్కరణ నిబంధనలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జేసీ ప్రవీణ్కుమార్, సీపీ శివధర్రెడ్డి,ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 54వేల కొత్త దరఖాస్తులు ఓటరుగా నమోదుకు జిల్లాలో 54 వేల కొత్త దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. వాటన్నింటినీ ఈ నెల 20వ తేదీ నాటికి పరిశీలించి, ఏప్రిల్ మొదటి వారంలోగా స్మార్ట్ ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 9న నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో ఒక దరఖాస్తు రాని, బూత్లెవెల్ అధికారు(బీఎల్వో)లు గైర్హాజరైన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమం మళ్లీ ఉంటుందన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే దరఖాస్తు సమర్పించాలని సూచించారు. కేంద్రాలకు రాని బీఎల్వోలపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. -
అడ్వర్టైజింగ్ అంటే... అరేంజ్డ్ మ్యారేజే!!
ఈ దేశంలో ప్రత్యేకంగా విద్యాసంస్థలు లేని ఒకే ఒక రంగం అడ్వర్టైజింగ్... ఎందుకో తెలుసా... ప్రతి మనిషికీ బాగా తెలిసినది అదే. నామకరణంతోనే అడ్వర్టైజింగ్ మొదలవుతుంది. ఒక మనిషికి పేరు పెట్టడం అంటే... అది ఒక బ్రాండింగ్. ఆ లెక్కన చెప్పుకుంటే చేపకు ఈతలా... మనిషికి స్వతహాగా అబ్బే ఒక కళకు ఫినిషింగ్ స్కూల్ వంటిది ముద్రా ఇన్స్టిట్యూట్. ప్రకటనలకు సంబంధించి ఆసియాలో పుట్టిన మొట్టమొదటి అడ్వర్టైజింగ్ స్కూల్ అది. దాన్ని స్థాపించింది ఒక తెలుగు వాడు... సామాన్యమైన జీవితంతో మొదలుపెట్టి ప్రకటనల రంగంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న ఏజీ కృష్ణమూర్తి. సింపుల్గా ఏజీకే. ఆయన అనుభవాలు వింటుంటే... టైమ్ మెషీన్లో మనం ముందుకు, వెనక్కు పోయినట్టు ఉంటుంది. ఆయన అడ్వర్టైజింగ్ రంగంలో తొందరపడి కూసిన కోయిల కాదు... ఎర్లీ బర్డ్! ప్రకటనల రంగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే... అన్ని రంగాలతో దానికి సంబంధం ఉంటుంది. అందుకే ఆయన అనుభవాల్లో అనేక కొత్తకొత్త విషయాలుంటాయి. ఆయన ఉద్దేశంలో- అడ్వర్టైజింగ్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్డ్ మ్యారేజ్! పెళ్లి చేసేటపుడు ఇరు కుటుంబాలు తమ పిల్లల గురించి చెప్పుకుంటారు. అది అడ్వర్టైజింగ్ తప్ప మరేమీ కాదు. అబ్బాయి తరపు వారు పిల్లాడి లక్షణాలు, చదువు, ఆదాయ వ్యయాలు వంటివి చెప్పుకోవడం, అమ్మాయి తరపు వారు ఆమె గుణగణాలు, చదువు సంస్కారాల గురించి చెప్పుకోవడం అడ్వర్టైజింగే కదా. ఎప్పటికప్పుడు మనం సాధించిన అభివృద్ధిని చాటుకోవాలి. లేకపోతే చీకట్లో కన్నుకొట్టినట్టు ఉంటుంది. అది నీకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే, ఈ చెప్పుకోవడంలోనూ పద్ధతులు, పరిమితులు, ప్రమాణాలు ఉండాలి. తరాలు మారిన కొద్దీ ఆలోచనలు, ఆసక్తులు మారుతున్నపుడు చెప్పే విధానం కూడా మారాలి. అపుడే వినియోగదారుడికి కనెక్ట్ అవుతుంది. దేశంలో ఇపుడు అడ్వర్టైజింగ్ మార్కెట్ దాదాపు పాతికవేల కోట్ల వరకు ఉంది. ఇందులో ప్రకటనల రూపకల్పనలో వైఫల్యం వల్లనో, రాంగ్టైమింగ్ వల్లో, రిలవెన్స్ లేకపోవడం వల్లో.. ఇలా కారణాలు ఏవైనా ప్రకటనలు లక్ష్యంగా పెట్టుకున్న వినియోగదారులను చేరుకోకపోవడం వల్ల ఈ ఇండస్ట్రీలో అయ్యే ఖర్చులో 70-80 శాతం వ్యయం వల్ల ఆశించనంత ప్రయోజనం కలగట్లేదు. ప్రకటనలు సక్సెస్ అయితే బ్రాండ్ వాల్యూ వస్తుంది. లేకపోతే సవాలక్ష ఉత్పత్తుల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అందుకే అడ్వర్టైజింగ్ ఎంత అవసరమో అది అద్భుతంగా, కాలానుగుణంగా ఉండటమూ అంతే అవసరం అన్నది ఏజీకే మాట. దీని గురించి ఆయనను కదిపితే ఎన్నో విషయాలు... వాటిలో కొన్ని. మీ దృష్టిలో అడ్వర్టైజింగ్ అంటే ఓ వస్తువు ఉనికిని చాటడమేనా? ‘మీరు చెప్పింది ఎవరూ వినకపోయినా, మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోయినా ఇక అదంతా వృథా’ అని ఓ ప్రముఖుడు చెప్పాడు. అంటే మీరు చెప్పడం ప్రధానం కాదు... ఎదుటి వాడు దానిని వినడం ప్రధానం. ఓ వస్తువు ఉనికిని ప్రభావవంతంగా చాటాలి. ఒక ఉత్పత్తి జనంలోకి కాదు, జనం ఆలోచనల్లోకి వెళ్లాలి. ప్రొడక్ట్ అవసరాన్ని తీరుస్తుంది, బ్రాండ్ అవసరాన్ని తీరుస్తూ మానసికోల్లాసాన్ని కూడా కలిగిస్తుంది? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్... అవసరానికి-కోరికకు (need-want) తేడాయే బ్రాండ్. కారు అవసరం అనుకుంటే... ఓ పేరున్న కారులో తిరగాలనుకోవడం కోరిక. ఇక బ్రాండింగ్ విషయానికొస్తే ఒళ్లు కప్పుకోవడానికి ఏదైనా గుడ్డ చాలు. అందులో మనకు ఆనందాన్నిచ్చేలా, మన అందాన్ని పెంచేలా, మనకు నచ్చేలా ఉందని వినియోగదారుడు ఫీలయ్యేలా చేసేదే బ్రాండ్. అందుకే సాల్ట్కు కూడా బ్రాండ్ అవసరమైంది. బ్రాండ్ ఒక ఫీల్, అది ఒక నమ్మకం. ప్రతి బ్రాండ్ తన బౌండరీ ఏంటో తెలుసుకుని ఆ పరిధుల్లో ఉంటే మంచి జరుగుతుందన్నారు. ఎలా? ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ నచ్చవు. ఒక సబ్బుందనుకోండి. ఒకటే సబ్బును సంపన్నుడికి, పేదోడికి అమ్మాలనుకుంటే అది కుదురుతుందా? అవసరాలు, ప్రయారిటీలను బట్టి ఉత్పత్తి రావాలి. ఉత్తరాది వాడికి దక్షిణాది వాడికి, పట్టణం వాడికి-పల్లెటూరి వాడికి వినియోగదారీ తత్వంలో తేడా ఉంటుంది. దాన్ని గుర్తించాలి. బ్రాండ్ తన పరిధి ఏంటో తెలుసుకోకుంటే విజయం స్థానంలో అపజయం నిలుస్తుంది. మీరు కొత్తగా రాసిన ‘అడ్వర్టైజింగ్ కథలు’ పుస్తకంలో ఒక బ్రాండ్ వ్యక్తిత్వం, పర్సనాలిటీ చాలాకాలం ఒకేలా ఉండాలి అన్నారు. పేరు, లోగోలు మారిన బ్రాండ్లు కూడా ఉన్నాయి కదా..? ఇంకో విషయం... నేటితరం ఎక్కువగా మార్పును ఆశిస్తుంది... మరి ఈ వైరుధ్యాన్ని ఎలా విశ్లేషిస్తారు. ? యూటీఐ- యాక్సిస్ బ్యాంకుగా మారడం, ఎయిర్టెల్ లోగో మారడం... ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నా ఉద్దేశం మార్పు అసలు వద్దని కాదు. తరచూ మారకూడదు. మీ పేరును ఒకసారి మార్చుకుంటే బాగుంటుంది. కానీ పదేపదే మార్చుకుంటే ఎవరికైనా గుర్తుంటుందా చెప్పండి? కొన్ని ప్రత్యేక అవసరాల్లో మార్పు వస్తుంది. అయితే, ఆ మార్పు తర్వాత మళ్లీ మళ్లీ మార్పు రాకూడదు. కాన్స్టంట్గా ఉంటేనే అది జనం నోళ్లలో నానుతుంది. జనానికి గుర్తుండనిది బ్రాండే కాదు. కాలేదు కూడా! ఈ పుస్తకంలో మరో విచిత్రమైన పోలిక కనిపించింది. పిల్లలు, చెట్లు, బ్రాండ్లు... ఈ మూడింటిని ఒకే దృక్పథంతో చూడాలన్నారు. దీని అర్థమేంటి? పిల్లలయినా, చెట్లయినా చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఒక బ్రాండు ఏర్పడాలన్నా, అది ఎప్పటికీ నిలవాలన్నా, మరింత వృద్ధి నమోదు చేయాలన్నా దాన్ని పిల్లలను చూసుకున్నంత శ్రద్ధగా, చెట్టును పెంచినంత జాగ్రత్తగా డీల్ చేయాలి. లేకపోతే.. శ్రమ వృథా అవడం మినహా మరేమీ ఉండదు!