Chaganti Koteshwara Rao
-
అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి!
అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. అలా గౌరవించడంలో ఎంత లీనమయి ఉంటారంటే అసలు భగవంతుడే స్వయంగా వచ్చినా ఏమరుపాటు పొందుతారు. సీతారాముల విగ్రహాలను అలంకరించడానికి తులసీదాసు గంధం తీస్తుంటాడు. రామలక్ష్మణులు స్వయంగా అతిథులుగా వస్తారు. వచ్చి ఆ గంధం తమకు పూయమంటారు. ఇది సీతారాములకే మీకు కాదు వెళ్ళండంటాడు. వారు వెళ్ళబోతుంటే.. హనుమ చిలకరూపంలో వచ్చి అసలు విషయం చెబుతాడు. రాజకుమారుల రూపంలో ఉన్న వారిని అప్పుడు చందనాదులతో సేవించి దర్శనం పొందుతాడు తులసీదాసు.ఇక్కడ నీకున్నదేదో ఇక్కడ శరీరం వదిలిపెట్టేయడంతోనే సరి. కానీ ఈ శరీరంతో ఉండగా నలుగురికి పనికివచ్చే మంచి పని చేసినప్పుడు అది మాత్రమే పుణ్యంగా నీ వెంట వస్తుంది. మనం ఈ శరీరాన్నిగానీ, ద్రవ్యాన్నిగానీ, శక్తినిగానీ దేనిని వాడకుండా దాచుకోవడం సాధ్యమయ్యేది కాదు. అది కాలంతో వెళ్ళి΄ోవలసిందే. మెరుపు ఎలా వచ్చిపోతుంటుందో అలా భోగాలు వచ్చి పోతుంటాయి తప్ప వాటి వలన ఏ ఫలితమూ ఉండదంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయాలు, చంద్రోదయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఆయుర్దాయం కరిగిపోతుంటుంది. ఆయువు ఉన్న కాలంలో ఎవరు తమ జీవితాన్ని పండించుకుంటారో వారు గట్టెక్కుతారు. ఆ అదృష్టం అతిథిపూజ చేసిన గృహస్థుకు సులభంగా దక్కుతుంది. అతిథి కూడా ఏ అవసరం వచ్చినా గృహస్థుదగ్గరకే ΄ోతాడు తప్ప ఇతర ఆశ్రమాలవారిని ఆశ్రయించడు. మన దేశ ద్రవ్యం మన దేశంలోనే చెల్లుబాటవుతుంది కదా. ఇతర దేశాలకు ΄ోవాలంటే విదేశీమారక ద్రవ్యం అవసరం. అలాగే ఇక్కడ చేసిన మంచిపని .. మారక ద్రవ్యంలాగా శరీరం విడిచిపెట్టినా పుణ్యం రూపంలో నీ వెంట వస్తుంది.గృహస్థాశ్రమంలో మరో విశేషం ఉంది. దంపతుల మనసు ఏకీకృతమయితే పరమ సంతోషంగా, పరమ ప్రశాంతంగా జీవితం హాయిగా గడుస్తుంది. సాధారణంగా ఇద్దరున్నప్పుడు ఒకరు మరొకరితో ముఖాముఖి మాట్లాడితే తప్ప ఒకరి భావాలు మరొకరికి అర్థం కావు. కానీ దాంపత్యంలో అది పండిందని గుర్తు ఏమిటంటే – ఆయన ఆమెతో, ఆమె ఆయనతో నోరు విప్పి మాట్లాడనక్కరలేదు. అలా చూపులు చాలు భావ ప్రసరణకు,. ఆ స్థాయికి చేరుకోవడం అంటే రెండు మనసులు ఒకటి కావడం.సీతమ్య ఏ పని చేసినా దీనివలన మా ఆయన కీర్తినిలబడుతుంది గదా అని ఆలోచిస్తుందట. రాముడు ఏ పని చేసినా దీనివల్ల సీత సంతోషిస్తుంది గదా! అని ఆలోచిస్తుంటాడట. కొంతకాలం గడిచాక ఒకరికి ఏ అవసరం వచ్చినా మరొకరు అడగాల్సిన పనిలేకుండానే దానిని నెరవేరుస్తారు. పట్టాభిషేక ఘట్టం. అందరికీ అన్నీ ఇచ్చేసారు. చిట్టచివర సీతమ్మ తన మెడలోంచి హారం తీసి పట్టుకున్నది. నీ ప్రశాంతతకు, మన దాంపత్యానికి, మన కలయికకు కారుకులయిన వారికి దానిని అనుగ్రహించు అన్నాడు రాముడు. వెంటనే సీతమ్మ దానిని హనుమకు ఇచ్చేసింది. రాముడు ఫలానా అని పేరు చెప్పక΄ోయినా ఆమె గ్రహించేసింది. దాంపత్యం పండినప్పుడు ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంటాయి. కారణం – రెండంటూ ఉంటే కదూ.. ఉన్నది ఒకటే అయిపోతుంది. - చాగంటి కోటేశ్వరరావు -
ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది?
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మూడవది – హోమోదైవో.. దేవ యజ్ఞం. వేదమంత్రాల పఠనంతో భగవంతుడిని ఉద్దేశించి హోమం చేస్తూ నైవేద్యాలను సమర్పించాలి – హుతో హోమః... అంటే యజ్ఞయాగాది క్రతువులు. మహాభారతంలో శాంతిపర్వంలో అంపశయ్యమీద పడుకుని భీష్మాచార్యుల వారంటారు..‘‘అసలు ధర్మానికంతటికీ ఇరుసువంటివాడు గృహస్థు... ఓ ధర్మరాజా! గృహస్థులేని నాడు ఈ సృష్టే లేదు. గృహస్థులేని నాడు ఈ ధర్మచక్రం తిరగనే తిరగదు.’’ అని. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సును గృహస్థే ఇస్తాడు. ఇతర ఆశ్రమాల వాళ్ళు ఇవ్వరు. గృహస్థు ఇచ్చిన హవిస్సును దేవతలు తిని సంతుష్ఠులై వర్షం కురిపిస్తారు... ఎక్కడ..? గృహస్థు ఇంట్లోకాదు, ఆ ్ర΄ాంతమంతా కురిపిస్తారు. ‘‘అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః/ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవః... ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః/ అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి’’... అంటే ఇది ఒక చక్రం. తిరుగుతోంది. ప్రాణులు పుట్టాలి అంటే అన్నం (ఆహారం) తినాలి. అన్నసారం స్త్రీలో శోణితంగా, పురుషునిలో శుక్రంగా మారి రెండూ కలిసి సృష్టి జరగాలి. బిడ్డలు పుట్టాలి. దీనికంతటికీ మూలమైన అన్నం పుట్టాలంటే పంటలు పండాలి.. అంటే వర్షం పడాలి... వర్షం పడాలంటే... యజ్ఞం జరగాలి.అన్నం, నీరు ఎంత కాలం దొరుకుతాయో అంతకాలమే ధర్మం ఉంటుంది. వాటిలో మొదట నీరు. ఇవి దొరకనప్పుడు ఎన్ని ధర్మాలు, నీతులు, ప్రవచనాలు చెప్పినా వినేవారు కానీ, ΄ాటించేవారు కానీ లోకంలో ఉండరు. ధర్మం తప్పి΄ోతుంది. ‘ఆ΄ోవా ఇదగుం సర్వం...అమృతం వా ఆపః...’’ నీరు అమృతం. ్ర΄ాణులన్నీ ఆ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నం, నీరు కావాలంటే వర్షం పడాలి... అలా పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞ కర్మ సముద్భవమ్... కర్మ చేస్తే వస్తుంది. అదెవరు చేయాలి?... ఒక్క గృహస్థు మాత్రమే.. పక్కన ధర్మపత్నితో కూడుకుని ఉన్నవాడు మాత్రమే యజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఈ సృష్టి ఏర్పడుతుంది, నిలబడుతుంది, లయమవుతుంది. ప్రశాంతత కలుగుతుంది. అందరూ నిర్వర్తించాల్సిన ధర్మాన్ని అందరూ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ధర్మచక్రం సవ్యంగా తిరుగుతుంది.ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాడయినా తల్లిపా లమీద ఆధారపడాల్సిందే. తల్లి లేకపోతే సృష్టి లేదు. అలాగే గృహస్థాశ్రమం మిగిలిన అన్ని ఆశ్రమాలకు తల్లిలాంటిది. ఆ గృహస్థులేని నాడు మిగిలిన ఆశ్రమాల వాళ్ళకు భిక్ష లేనే లేదు... ఈ మాటలు నావి కావు.. మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ముడు చెప్పినవి. రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు కూడా ఇదే అంటాడు..‘‘అన్నయ్యా ! నీకు తెలుసు కదా! గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం... నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే గొప్పది.’’ ‘హోమో దైవో బలిర్భౌతో...’’ హవిస్సు ద్వారా దేవతలకు అన్నం పెట్టిన గృహస్థుకు సమస్త భూతములు, ప్రాణులను కూడా పోషించే కర్తవ్యం ఉంది. భీష్ముడు మరో మాట కూడా చెప్పాడు... గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పడూ సంసార లంపటంలో పడి ఉంటారు, వారు అగాధంలో పడి΄ోయారని అనుకుంటున్నావేమో ... గృహస్థుకు మోక్షం లేదని ఎవరన్నారు !!! దేవతలకు అన్నం పెడుతున్న గృహస్థుకు కూడా మోక్షం లభిస్తుంది.-చాగంటి కోటేశ్వరరావు -
పిందె.. పండు...వైరాగ్యం
రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలంటే ధర్మపత్ని సహకారం ఉండి తీరాలి. అంటే నీవు గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తున్నావు. అప్పుడు నీవు ఏమి చేసినా అవి ధర్మంతో కట్టుబడి ఉంటాయి. చేయవలసినవి చేస్తూ తరించి΄ోతుంటావు. కారణం– అడుగున ధర్మం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నీ కర్మలన్నీ శాపాలను విప్పేస్తుంటాయి. అందుకే ఈ తేలిక మార్గాన్ని నిర్దేశించారు. అది లేక΄ోతే ఇంద్రియాలు అకస్మాత్తుగా కాటువేసే అవకాశం ఉంది. అంటే ధర్మచట్రంలో ఉన్న అర్ధకామాలు దేనినయినా అనుభవించు... క్రమ క్రమంగా ఒక వయసు వచ్చేసిన తరువాత ధర్మానుష్ఠాన బలం వైరాగ్య సుఖాన్నిస్తుంది. క్రమేణా ఒక నిరాసక్తత, ఒక అనుభవం బయల్దేరుతుంది లోపల. అంటే బలవంతంగా అంటించుకున్నది కాదు, అది ఈశ్వర కృపతో వచ్చేది. వైరాగ్యమంటే.. ఈ సుఖాలన్నీ ఒక సుఖాలా... అనిపించడం... ఏమీ పట్టించుకోకుండా అని కాదు. గాలి తన పని తాను చేసుకు΄ోతుంటుంది. జాజి పందిరి మీదినుంచి ΄ోతే పరిమళభరితం అవుతుంది..అప్పుడు గాలిని అభినందిస్తే ΄÷ంగి΄ోదు. ఒక కళేబరం మీది నుంచి΄ోయినప్పుడు దుర్గంధాన్ని వ్యాపింపచేస్తుందని అభిశంసిస్తే అది కృంగి΄ోదు. దాని పని అది చేసుకుంటూ ΄ోతుంది. అలా ΄÷ంగి΄ోవడాలు, కుంగి΄ోవడాలు లేకుండా... నీ కర్తవ్యం నీవు చెయ్యాలి. నీ నిజాయితీ నీ అంతరాత్మకు, ఈశ్వరుడికి తెలిస్తే చాలు..‘‘లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ/ చీకాకున్ బడనీ మహాత్ముడననీ../ మూకీభావమునన్ తిట్టనీ త్రోయనీ / నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!’’ అంటారు శంకరాచార్యులు. నీ స్వచ్ఛత ఈశ్వరుడికి తెలిసినంత కాలం నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన ముందు కూడా నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే... పూజామందిరంలోకి వెళ్ళు.. లెంపలేసుకుని క్షమాపణలడుగు.‘ఈశ్వరా! నా వల్ల ఇటువంటి అపరాధం మళ్ళీ జరగకుండు గాక!’ అని శరణువేడుకో. చాలు.ఎవరయితే ద్వంద్వాలకు అతీతులయిపోతున్నారో వారు నాకు దగ్గరవుతున్నట్లు.. అంటాడు గీతాచార్యుడు. వైరాగ్యం క్రమంగా సత్యాన్ని అంగీకరించే స్థాయికి తీసుకువెడుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం కరిగిపోతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ శరీరం ఉండగానే నీవు చేయవలసిన కర్తవ్యాలు నెరవేర్చు. సద్వినియోగం చేసుకో. అంటే మంచి విషయాల్లోనే అనురక్తి ఉంటుంది తప్ప లౌకిక విషయాలపట్ల నిరాసక్తత పెరగడమే వైరాగ్యం. ‘కోటిమంది వైద్యులు కూడి వచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు’. అంటే ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది..?. పిందెకూ పండుకూ తేడా తెలుసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. పిందె పట్టుకుని ఉండాలి. పండు తనంతటతాను విడి΄ోయి పడి΄ోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే పట్టుకోవాల్సిన వయసులో అన్నీ పట్టుకో... ధర్మబద్ధంగా. విడవాల్సి వచ్చినప్పుడు నిస్సంకోచంగా విడిచేసెయ్. కొబ్బరికన్నా పెంకును గట్టిగా పట్టుకునే వాళ్ళు ఎవరుంటారు... నీళ్ళు లోపలికి ఎప్పుడు ఎలా వెళ్ళాయో తెలియదు, ఎలా ఆవిరయ్యాయో తెలియదు. లోపల గురుగుడుమంటూ ఉంది... అంటే విడిపోయింది. పూర్ణాహుతికి పనికొస్తుంది. అంటే ఈ శరీరం నేను కాదు...ఆత్మ అని అనుభవంలోకి రావడమే వైరాగ్యం. దీనికి ఈశ్వరకృప ప్రధానమయినా, నీ కర్మాచరణ లేకుండా ఈశ్వర కృప ఉండదు. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : అర్థము అంటే..!!!
సుఖాన్ని... కామాన్ని ధర్మము చేత కట్టాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. అందుకే కన్యాదాత కన్యను తీసుకొచ్చి ధర్మపత్నిగా ఇచ్చేటప్పుడు వరుడితో... ‘కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై’ అంటాడు. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి నీరు... అలాగే కామం ఒక ప్రయోజనం కోసం... అందువల్ల అది ధర్మంచేత కట్టబడాలి. ఆయనకు సంతానం కలిగి పితృరుణంనుండి విముక్తుడు కావాలి. ఆయన యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. వివాహం చేయాలంటే పత్ని ఉండాలి. ఆమె లేనప్పుడు ఈ కార్యక్రమాలు వేటికీ కూడా ఆయన అర్హుడు కాడు... ఈ నియమాలు ఎవరో ఒకరు పెట్టినవి కావు. శాస్త్రం నిర్దేశించినవి. అంటే ధర్మపత్నిని స్వీకరించకుండా పుణ్యకార్యాలు చేయడం, తరించడం ఎలా సాధ్యం? అందుకే జీవితం పండించుకోవడానికి అవసరమయిన సాధనాన్ని కన్యాదాత ఇస్తున్నాడు. నిజం చె΄్పాలంటే ... కొడుకు పుడితే.. వాడు ప్రయోజకుడయితే.. వాడు ధార్మికంగా బతికితే... అప్పుడు తల్లీదండ్రీ, ఆపైన ఉన్నవాళ్ళు .. తరువాత అత్తగారు, మామగారు తరిస్తారు. పుత్ అను పేరుగల నరకం నుంచి త్రాయతే.. రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు. కుమార్తెను కన్యాదానం చేశాను.. అనుకోండి. అప్పుడు నాకు పది తరాల ముందూ, పది తరాల వెనకా నాతో కలిపి 21 తరాలు తరించి΄ోతాయి. ఈ సంతానం కలగడానికి కారణం ఎవరు? నా ధర్మపత్ని. ఆమె వల్ల సంతానం కలిగితే ఇంత గొప్ప ప్రయోజనం సిద్ధించింది. అందువల్ల కామము ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలంటే.. భార్యాభర్తలు చెలియలికట్ట దాటకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ‘చెలియలికట్ట’ అనే సాంఘిక నవల రాశారు. అందులో... వివాహం ద్వారా కామము ధర్మం చేత ఎందుకు కట్టబడుతుందో ప్రతి΄ాదించారు. సముద్రం అనంత జలరాశి. చాలా శక్తిమంతం. అది అనుకుంటే ఊళ్ళను సునాయాసంగా ముంచేయగలదు. అయినా దానికదిగా .. చెలియలికట్ట దాటకూడదని.. ఒక నియమం పెట్టుకుంది. ఆడుకుంటున్నట్లుగా అక్కడిదాకా వస్తాయి. ఎదురుగా వచ్చిన వాళ్ళ ఆచారాలు కడిగి అలలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాళ్ళు కడిగాయి కదా అని అతి చేసి తెగించి మరింత ముందుకు వెడితే.. ప్రమాదం ముంచుకొస్తుంది.‘ధర్మేచ, అర్థేచ, కామేచ ఏషా నాతి చరితవ్యా..’ – ఇది ప్రమాణం. ‘మామగారూ! ఇప్పుడు నాకు అర్థమయింది. మీరు నాకు ఇంతటి మహోపకరణాన్ని ఇచ్చారు. నేను ఈమెను అతిక్రమించను. ఈమె నాకు ప్రధానంగా ధర్మబద్ధ జీవితానికి ఒక సాధనం. ఈమెను నేను ధర్మపత్నిగా స్వీకరించినందుకు నా జీవితం పండాలి. చేయగలిగిన పుణ్యకార్యాలు చేయాలి. అసలు నేను నా భార్యతో కలిసి చేయవలసివేమిటో నాకు తెలియాలి. మేమిద్దరం చేయీచేయీ పట్టుకుని ప్రయాణించాలి. తద్వారా నేనూ తరించాలి, ఆమే తరించాలి.’ అనుకుని ఆచరిస్తాడు. అలా కామము ధర్మము తో కలిసినప్పుడు అర్థము ప్రభవిస్తుంది. అర్థము – అంటే? బంగారం, ఇళ్ళు, వస్తు, వాహనాలు కాదు... మరి నిజమైన సంపద ఏది? పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలే అసలు సిసలైన సంపద. అదే అర్థము ప్రభవించడం అంటే.-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..
మనం ఏ విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా ‘‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ...’’ శాస్త్రమే ప్రమాణం. మనకు బుద్ధికి తోచిన దానితో నిర్ణయం చేయడం సనాతన ధర్మంలో భక్తి అనిపించుకోదు. మనం ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం... అని కాదు ఎన్ని ఏ మేరకు పాటిస్తాం అన్నది ప్రధానం. ఈ విషయాన్నే రామాయణంలో సీత ‘ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తనే / తథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జితా..’ అంటూ రావణాసురుడికి బోధ చేస్తుంది.అలా మనం ఏదయినా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు ప్రమాణం శాస్త్రం. పుట్టుకతో ప్రతివారికీ మూడు రుణాలుంటాయి.. అని శాస్త్రం అంటుంది. అవి రుషి రుణం, దేవరుణం, పితృరుణం. ‘నేనెప్పుడు చేశానండీ ఈ రుణాలు, నేనెలా రుణగ్రస్తుడనయ్యాను’ అన్న ప్రశ్న అన్వయం కాదు. శాస్త్రవాక్కు కనుక అందరికీ ఉంటుంది. వీటిలో ఒక రుణం విషయంలో మాత్రం దానిని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ అవసరం ఉండదు. అది రుషిరుణం. సనాతన ధర్మంలో మనందరం రుణపడి΄ోయింది రుషులకు. మంత్రానికి రుషి ద్రష్ట. వేదమంత్రాలను ధ్యానంతో దర్శించి, విని మనకు స్వరంతో అందించాడు. ఆయన కూడా మనలాగే జీవించినవాడే అయినా రుషి తర్పణం అని... రుషికి వేరు తర్పణం ఉంటుంది.రుషి మన నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆశించలేదు, ఏ సత్కారాన్నీ, ఏ బిరుదునూ కోరుకోలేదు. కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమని, మనందరికీ కటికచీకటిలో కాంతిరేఖ కనపడాలని, మన జీవితాలు సుసంపన్నం కావాలని, మార్గం చూపించాలని వేదాల ద్వారా అందించి ధర్మానుష్ఠానికి ప్రమాణాన్ని కల్పించాడు. అలాగే ఒకవేళ మనం ఇవన్నీ చదవగలమో లేదో, స్వరంతో మంత్రం చెప్పగలమో లేదో, మంత్రభాష్యాన్ని అర్థం చేసుకోగలమో లేదో, అసలు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో రుషులు పురాణాలను ఇతిహాసాలుగా అందించారు.వ్యాసభగవానుడు 18 పురాణాలను అందించాడు. ‘‘నమో’స్తు తే వ్యాస విశాల–బుద్ధే/ఫుల్లరవిందయత –పత్ర–నేత్ర/యేన త్వయా భారత–తైల–పూర్ణః/ప్రజ్వలితో జ్ఞాన–మయః ప్రదీపః’’ అంటారు. అంతటితో ఆగకుండా ఆయన పరమ దయాళువై వేదాల సారాన్ని అందరూ చదువుకుని అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. వేదం చదువుకుంటే ఏది తెలుస్తుందో మహాభారతం చదువుకున్నా అదే తెలుస్తుంది.సూర్యవంశాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే /వేదః ప్రచేతసదాచిత్ సాక్షాత్ రామాయణాత్మనాః’’ వేదములు ప్రతి΄ాదించిన బ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే ఆ వేదమే రామాయణ కావ్యంగా వచ్చింది. వేదం ఏం చెప్పిందో తెలియనప్పుడు రామాయణం చదువుకుంటే చాలు. మనకు ఆ ప్రయోజనం నెరవేరుతుంది. రాముడు ఏ పరిస్థితుల్లో ఏం చేసాడో, మానవాళికి అదే వేదం విధించిన కర్తవ్యం కూడా. అందుకే ఎవరయినా అత్యంత విశ్వాసంతో ఒక విషయాన్ని తదేక దృష్టితో నమ్మి ఆచరించేవారయితే ‘రుషి సమానులు’ అంటారు. ఆయన ఒక ‘రుషి’ అంటారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అదీ.. దాంపత్యం అంటే..!
పిల్లలకు వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు పాటించే ప్రామాణికాల్లో శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం తరువాత చివరిది లక్షణం. లక్షణం అంటే భౌతికమైన అందం. లోకంలో గుణాలు ఎంత గొప్పవో, అందం కూడా అంత గొప్పది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. రుక్మిణీదేవి శ్రీ కృష్ణ పరమాత్మను ఇష్టపడింది కేవలం ఆయన బాహ్య సౌందర్యం చూసి కాదు.ఎన్నో గుణాలు వివరించి... ‘కృష్ణా! ఇన్ని గుణాలు నీలో ఉన్నాయి కాబట్టే నాకు నీవంటే అంత ప్రీతి’’ అని ఆమె ప్రకటించింది. భౌతికమైన అందం ఉండాలి. వధూవరులు ఒకరికి ఒకరు తగినవారయి ఉండాలి. నూతన దంపతులను చూసినప్పుడు ‘ఆ పిల్ల చేసుకున్న అదృష్టం’ అనో, ‘ఆ పిల్లవాడిది అదృష్టం అంటే’... అని అనకూడదు. ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు’ అనాలి. ఆ తరువాత ప్రేమతో, ఆర్ద్రతతో గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం ఆ దంపతుల వంతు.దేవుడి విషయంలో అయినా సరే, ఇదే మర్యాద పాటిస్తారు. శంకరాచార్యులవారు శివానందలహరిలో పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె ఎంత తపస్సు చేసిందో ఈయనకు భార్య కాగలిగింది. ఈయన ఎంత తపస్సు చేసాడో అటువంటి భార్య లభించింది. అదీ దాంపత్యం అంటే. అలా అల్లుకుపోవాలని భగవంతుడే మనకు నేర్పాడు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ‘నీవు నాతో ఏడు అడుగులు నడిచావు'! ఇకపైన..
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి యువతీ యువకు లకు ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని రామాయణం నిర్దేశించింది. వాటిలో వ్యక్తిత్వం ఒకటి. భార్య ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి... ఆమె నీతో కలిసి పుట్టలేదు. నీతో కలిసి పెరగలేదు. వేరొకరి ఇంట పుట్టింది. ఎవరికో కూతురు. ఆమెకూ ఆశలు ఉంటాయి. కోరికలున్నాయి, సంతోషం కావాలి, ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె సంతోషం గా ఉండేటట్టు చూడవలసిన మొట్టమొదటి కర్తవ్యం మామగారిది. తరువాత భర్తది. రామాయణంలో మామగారి పేరు చెప్పగానే ఆయన ఆ΄్యాయతను తలచుకుని సీతమ్మ పరవశించిపోతుంది. ఇది మానవీయ సంబంధాలకు భారతదేశం చేసిన పట్టాభిషేకం.అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశిష్టమైన విషయాన్ని చెప్పారు. సప్తపది అయితే తప్ప వివాహ తంతు పూర్తి అయినట్టు కాదు.. అంటారు. ఏడడుగులు నడిచిన తరువాత వరుడు – వధువుతో ఒక మాట అంటాడు. ‘నీవు నాతో కలిసి ఏడు అడుగులు నడిచావు కాబట్టి ఇకపైన ‘నీవు నాకు మంచి స్నేహితురాలివికా. నా మనసు ఎరిగి ప్రవర్తించు’ అంటాడు. అంటే – జన్మతః అనుబంధం కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. ఇక జీవితానికి నిర్ణయాత్మక శక్తి ఆమెయే.స్నేహమంటే మనసు మనసుతో కలవాలి. ఒకరు మరొకరికి అర్థం కావాలి. వారి సంతోషం కోసం... ఇవతలివారి వైపునుంచి కొంత త్యాగం ఉంటుంది. అలాగే వీరి సంతోషం కోసం అవతలివారి వైపునుండి కొంత త్యాగం ఉంటుంది. ఇలా జరిగితేనే దాంపత్యం సంతోషంగా సాగుతుంది.అలా కాక నీకిది సంతోషం కాకపోయినా నాకిది ఇష్టం, నేనిది చేస్తాను.. అన్నప్పడు గృహస్థాశ్రమం అర్థం ఏమిటి? దాంపత్య లక్ష్యం నీరుకారిపోతుంది. అది కాదు... ఒకరి సంతోషానికి మరొకరు కారణం కాగలగాలి. సుమనస్క... అంటారు. అంటే నీవు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తా. అలా మనిద్దరం అరమరికలు లేకుండా సఖ్యంగా సంతోషంగా మంచి స్నేహితులుగా ఉందాం. నాకున్న బలహీనతలేమిటో, బలమేమిటో నీవు తెలుసుకోవాలి.అలాగే నీ బలాలు, బలహీనతలు నేను తెలుసుకోవాలి. వాటికి తగిన విధంగా మనం నడుచుకుంటూ, తప్పులు చేస్తే మన్నించుకుని సర్దుకుపోతూ ప్రేమగా ఉండాలి. అంతే తప్ప ఒకరి తప్పులు మరొకరు వెతకడమే ధ్యేయంగా సంసారం చేస్తూ, ఇద్దరి పరువును, కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్ఠను బజారుకీడ్చవద్దు. ఒకరిపట్ల మరొకరు అవగాహనతో, ఆప్యాయతతో, ప్రేమతో సంతోషంగా బతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం.బయట ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా... ఇంటికొచ్చి ఒకరి ముఖం మరొకరం చూసుకోగానే ఉపశమనం పొందగలగాలి. సాహచర్యంలో పరస్పరం శాంతి పొందాలి. ఒకరం తప్పు చేస్తే మరొకరం ప్రేమ తో మందలించుకోగలగాలి. అరమరికలొద్దు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి వారం సంస్కరించుకుందాం.’’ అనుకోవాలి.అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత అవగాహనతో ప్రారంభం కావాలో, సుఖమయమైన సంసార జీవితానికి ప్రేమ ఎంత అవసరమో పెద్దలు తెలియపరుస్తారు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి ఒక యువకుడికి, ఒక యువతికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని శ్రీరామాయణం నిర్దేశించింది. వాటిలో మొదటిది శీలం. అంటే స్వభావం. అది పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి ఆధ్యాత్మిక చింతన, మరికొందరికి చిత్రలేఖనం.... అలా అది వారికి బాగా ఇష్టమైన విషయంగా ఉంటుంది. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఒకరికి ఇష్టమైన విషయం మరొకరికి కూడా ఇష్టమేనా, అయిష్టం లేదు కదా.. అని చూస్తారు. ఆ పరిశీలన పెద్దలు చేస్తారు.తరువాత వయస్సు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. రెండు కళ్ళల్లో ఏది మంచిదంటే ఏమని చెప్పగలం? బండి చక్రాలు రెండూ సమన్వయంతో పనిచేయాలి. జీవితం నుండి మొదట ఆయన నిష్క్రమిస్తే.. ఆవిడ పుణ్యకార్యం చేయదు. ఆమె వెళ్ళి΄ోతే...ఆయన తమ కడుపున పుట్టిన కూతురును కూడా కన్యాదానం చేయలేడు. ఆవిడ నిష్క్రమణతోనే ఆయనకు పుణ్యకార్యం చేసే అధికారం కూడా ΄ోతుంది. అందువల్ల ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి ఉంటేనే సౌభాగ్యం, సంతోషం. అంటే వాళ్ళ వయసులో ఎవరు పెద్దయితే గొప్ప అన్నదానికన్నా ప్రధానమైనది– ఒకరు నడిపించాలి, మరొకరు నడవాలి–అనేది. ఇక్కడ నడిపించేవారిది ఎక్కువ, నడిచేవారిది తక్కువ అనుకోకూడదు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. వరుడి వయసు పెద్దదయి ఉండాలి–అన్నారు. వయస్సు అంటే కాలం. కాలం అనుభవానికి, అవగాహనకు గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో.. వాళ్ళుఅనుభవాన్ని, అవగాహనను ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివాం అన్నదానికన్నా... దానికి అనుభవం ఎంత తోడయింది... అన్నది ప్రధానం. ఒక ఉద్యోగానికి వెడితే అనుభవం ఎంత అన్నదాని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వివాహం విషయంలో.. లోకజ్ఞానం, లోక ప్రవృత్తిని సరిగా అర్థం చేసుకుని భార్యకు అవగాహన కలిగించగలిగిన వాడయి ఉండాలి.అనుభవం అన్నమాటలోనే అంతర్లీనంగా ఉండే విషయం– భార్యపట్ల పరమ ప్రేమతో మెలుగుతూ ఆమెకు రక్షకుడయి ఉండాలన్నది. ఆమె గుణాలు, ప్రతిభ ప్రకాశించడానికి ఆయన అవకాశం కల్పించగలగాలి. ఆమె బలహీనతలు... శారీరకం కావచ్చు, నడవడిరీత్యా కావచ్చు... వాటిని కప్పగలగడంతోపాటూ ఆమె గౌరవమర్యాదలు తగ్గకుండా చూడగలగాలి. సంసారాన్ని సాఫీగా నడపడంలో ఆమెకు ఆయన అనుక్షణం అండగా నిలవాలి. ఒక అమాయకురాలైన కూతురు తెలిసీ తెలియక చేసే తప్పులను తల్లిదండ్రులు ఎలా సరిదిద్దుతూ కాపాడుతుంటారో భార్యను అలా కాపాడుకోగలిగి ఉండాలి. అది భర్త లక్షణం. భార్యది – అంకిత భావం. పిచ్చి ప్రేమ. భర్త ప్రేమకు కారణం ఉంటుంది. భార్య ప్రేమకు కారణం ఉండదు. అనుగమించడం, అంకితభావంలో మసులు కోవడం ఆమె కర్తవ్యం. ఆమెకు ప్రేమను పంచడం, ప్రతి కష్టంలో ఆమెకు రక్షణగా నిలవడం ఆయన బాధ్యత. ఆమెది పాతివ్రత్యం. ఆయనది ఏకపత్నీవ్రతం. అందువల్ల ఎక్కువ తక్కువలను వారి మధ్య ΄ోల్చిచూడకూడదు. కామసంబంధమైన ప్రవత్తి కలిగినా ఆయన దృష్టిలో ఆమె వినా మరొకరికి స్థాన ఉండదు. ఆమెకు ఆయనే సర్వస్వం. ఇది దాంపత్యం. ఇదే గృహస్థాశ్రమం. ఇది సనాతన ధర్మ వైభవం.-చాగంటి కోటేశ్వరరావు -
‘అమ్మా గంగమ్మా! నన్ను రక్షించు!’ నిజానికి ఆమె శక్తి ఏపాటిది అంటే..?
'సర్వసాధారణంగా మనం ఏదయినా ఒక విషయాన్ని పరిశీలించాలనుకుంటే అనేక గ్రంథాలు చూడాల్సి ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా అటువంటి అనుబంధం కలిగిన ఒక మహాపురుషుని నోటివెంట వచ్చిన కీర్తన అదే పెద్ద గంగ. శాబ్దిక గంగ. గంగలాగే ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తన .. శాబ్దిక గంగ కూడా ప్రవహించింది. అది పెద్ద పల్లవి, పెద్ద పెద్ద చరణాలతో ఉండదు. సులభంగా ఉంటుంది. గంగే మాం పాహి.. అంటారు ఆయన. ‘ఓ గంగమ్మా! నన్ను రక్షించు’ అని. నిజానికి రక్షించేది ఎవరు? దేవతలు. ఎప్పుడయినా ఏదయినా దుష్కర్మ అనుభవించాల్సి వస్తే, కష్టం తరుముకొస్తుంటే.. దానిని తొలగించగలిగిన వాడు భగవంతుడు. కానీ గంగమ్మ కూడా అలాగే రక్షించగలదు – అన్న నమ్మకంతో దీక్షితార్ వారు ‘అమ్మా గంగమ్మా! నన్ను రక్షించు’ అన్నారు. నిజానికి ఆమె శక్తి ఏపాటిది అంటే..' భాగవతంలో పరీక్షిత్తు ఏడు రోజుల్లో మరణిస్తానని గంగానదీతీరంలో ప్రాయోపవేశం చేసాడు. దాన్ని ఆంధ్రీకరించిన పోతన ఎంత గొప్పగా చెప్పారంటే.. ‘‘అమ్మా! నిను? జూచిన నరు? బొమ్మా యని ముక్తి కడకు? బుత్తు వ?ట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!" అర్థం.. అమ్మా! అని తన వంక చూస్తే చాలట. పామ్మా.. అని మోక్షానికి పంపించివేస్తుందట. అంతే.. పూజలు మరేమీ అఖ్కర్లేదు.‘ నీ రూపంతో ఒక్కసారి నాకు ఎదురుగా రామ్మా... గంగమ్మా... నిన్ను చూడాలని ఉందమ్మా.. అంటారు. ఆమె శక్తి అంత గొప్పది. శ్రీనాథుడు కాశీఖండంలో ఓ మాటంటారు.. ‘‘గంగానది, గంగానది, గంగానది..’’ అని ఉచ్చరిస్తే చాలు.. అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయనక్కరలేదు. రాత్రి పడుకోబోయేముందో.. పాద్దున లేస్తున్నప్పుడో.. ఆ గంగానది వైభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ.. ‘గంగానది గంగానది గంగానది’ అని ఎవరు తలచుకుంటారో వారి పాపాలన్నీ ఆమె తీసేస్తుంది.. అంటారు. అదీ ఆమె ఘనత. గంగానదిలో ఉన్నది నీరు కాదు.. ఆ నదికి ఒక అధిష్ఠాన దేవత ఉంది. ఆమె అనుగ్రహిస్తుందన్న నమ్మకం సనాతన ధర్మానిది. దీక్షితార్ వారు‘గంగే మాం పాహి’ అన్నారంటే... ఆయనకు అంత నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని కలిగించినది ఎవరు.. ఆయన ఏ కావ్యాలూ పఠించలేదు.. ఎక్కడా చేరి చదువుకోలేదు. గురువుగారయిన చిదంబర యోగి శుశ్రూషలో తెలుసుకున్న విషయాలు అవి. గురువు గారి మీద నమ్మకం అంత గట్టిగా ఉండబట్టే... ఆయన నీవు గంగానదిలో మునిగి చెయ్యిపెట్టి తడుము.. అనగానే మారుమాట మాట్టాడ కుండా వెళ్ళి వెతికితే.. ఆయనకు వీణ లభించింది.. అది ఆయనను వాగ్గేయకారుణ్ణి చేసింది. ఆ నమ్మకంతోనే ఆయన గంగమ్మను కొనియాడుతూ కీర్తన చేస్తూ.. గంగేమాం పాహి! అన్నారు. అది ఆయన నోటివెంట గంగా ప్రవాహంలా.. శాబ్దికగంగగా ప్రవహించింది. ఆయన ఎక్కడా శాస్త్రాలు చదువుకోక పోయినా ఈ కీర్తనలో ఆయన ఎన్నో పౌరాణిక విషయాలను.. అవి కూడా గాఢతతో ఉన్న విషయాలను సులభమైన భాషలో ప్రస్తావించారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రజల ఆనందం ఆయన కళ్లలో చూశా.. : చాగంటి కోటేశ్వరరావు
సంగారెడ్డి: చాగంటి కోటేశ్వరరావు మూడు రోజుల పాటు ఇచ్చిన ప్రవచనాలతో సిద్దిపేట గడ్డ పునీతమైందని, ఆధ్యాత్మిక విలువలకు సిద్దిపేట భవిష్యత్తులో నిలయంగా మారనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో చాగంటి కోటేశ్వరరావు మూడో రోజు చేసిన ప్రవచనాలను మంత్రి హరీశ్రావు సుమారు రెండు గంటల పాటు ఆలకించారు. ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు రోజుల పాటు చాగంటి ఇచ్చిన ప్రవచనాల భావం భావి తరాలకు అందించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవలో సిద్దిపేట ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. చాగంటి కోటేశ్వరరావుది మధుర స్వరం అని, తన ప్రవచనాల ద్వారా తలరాత మార్చుకునేలా చేస్తున్న దిశా నిర్దేశకుడని పేర్కొన్నారు. చాగంటి అంటే స్నేహాన్ని పెంపొందించుకునే వ్యక్తిత్వం అని, తన మాటలతో కోట్లాది ప్రజల మనస్సు గెలిచి ఇంటిపేరు సార్థకత చేసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రవచనం చెప్పడానికి ఒక్క నయా పైసా తీసుకోని కోటేశ్వరరావు కోట్లాది ప్రజల ప్రేమ పొంది. నిజంగా కోటీశ్వరుడు అయ్యాడని కొనియాడారు. ఒక సామాజిక, ఆధ్యాత్మిక ఉద్యమకారుడుగా చాగంటిని మంత్రి అభివర్ణించారు. సీఎం కేసీఆర్ చాగంటి కి గొప్ప అభిమాని అని, అప్పుడప్పుడు చాగంటి ప్రవచనాలు వింటారని చెప్పారు. మళ్లీ అవకాశం ఉంటే సిద్దిపేటకు రావాలని మంత్రి కోరారు. ప్రజల ఆనందం ఆయన కళ్ల్లలో చూశా.. నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే గొప్ప మనస్సు మంత్రి హరీశ్రావులో ఉందని, రంగనాయక సాగర్ నీటి రిజర్వాయర్ గురించి కరువు శాశ్వత సెలవు అంటూ వివరిస్తున్న సమయంలో ప్రజల సంతోషం తన కళ్లలో చూసినట్టు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. అది ఒక సేవ చేయాలనే గుణం ఉన్న వారికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడో రోజు మానవీయ విలువలు అంశంపై ఆయన ప్రవచనాలు చెప్పారు. మాట ఒక వజ్రం లాంటిదని, మనిషి విలువ మాటల్లో ఇట్టే తెలిసి పోతుందన్నారు. ఒక మంచి మాట కష్టాన్ని దూరంచేస్తే, అదే మాట ఇతరులకు కష్టం తెస్తుందని పేర్కొన్నారు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట రావాలని సూచించారు. కొన్ని జీవులకు పలుకులు వస్తాయి కానీ బుద్ధి ఉండదని, అదే మనిషికి పలుకులు, బుద్ధి రెండూ ఉంటాయని చెప్పారు. పది మంది కోసం పడిన కష్టం, చేసిన దానం మనిషి వెంట పుణ్యంగా వస్తుందని, సిద్దిపేట అన్నదాతలకు నిలయంగా ఉందని కొనియాడారు. అందరినీ కలుపుకుని ప్రయాణం చేయడం మనిషి ఉన్నత విలువన్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించారు. -
మనసుకు హత్తుకునేలా...
గొప్ప వాక్కును కొందరు మహాత్ములు పద్యరూపంలో చెప్పారు. మరి కొందరు గద్యరూపంలో చెప్పారు, ఇంకొందరు గీతం రూపంలో చెప్పారు. పోతన భాగవతాన్ని పద్య, గద్యరూపంలో చెప్పారు. ప్రధానంగా పద్య రూపంలో చెప్పారు. పద్యానికి ఉన్న లక్షణం –అది ఛందోబద్దం. నాలుగుసార్లు చదివితే అది నోటికొచ్చేస్తుంది. జ్ఞాపకంలో ఉండిపోతుంది. జీవితంలో ఏది ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవాలో, అలా ఉంచుకుని సందర్భాన్నిబట్టి గుర్తు తెచ్చుకుని సానుకూలంగా ఆచరణలో పెట్టుకోగలిగిన వాటిని ఛందోబద్దంగా ఇస్తే అవి మనసుకు హత్తుకుని మనకు అవసరాన్నిబట్టి ప్రయోజనం కలిగిస్తాయి. కానీ అంత జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని వాటిని గద్యరూపంలో(వచనంగా) అందించాడు పోతన, పద్యం, గద్యం కలిసి రాసినప్పుడు. తెలుగులో పద్యరూపంలో చెప్పినట్టుగానే, సంస్కృతంలో శ్లోకరూపంలో చెప్పారు. ఒక పద్యాన్ని చదవడంకన్నా, ఒక శ్లోకాన్ని చదవడంకన్నా, మేము వాక్యరూపంలో ఉన్న వచనాన్ని(గద్యాన్ని) చదువుకుని ప్రయోజనం పొందుతామని ఇష్టపడేవారికి గద్యంలో కూడా అందుబాటులో ఉంచారు. మరికొందరు చాలా తేలికగా అవతలివారికి బోధ చేయడానికి గీతం రూపంలో అందించారు. గీతం అంటే పాట. పాట మనసును రంజింప చేస్తుంది. సహజంగా పుట్టుకచేత క్రౌర్యం ఉన్నవి కూడా సంగీతం వినబడేటప్పటికి అవి వాటి క్రూరత్వాన్ని ఆ కాసేపు పక్కనబెట్టేస్తాయి. అలాగే గాఢమైన అజ్ఞానంతో ఏమీ తెలియనివారు కూడా సంగీతంతో కూడిన గీతం వినేటప్పటికి గొప్ప శాంతిని పొందుతారు. పశువులు కావచ్చు, పసిబిడ్డలు కావచ్చు .. పాటవినేటప్పటికి ఒక తన్మయావస్థకు లోనుకావడం జరుగుతుంది. ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ కాసేపు ఏడుపు ఆపేస్తారు. మనసు శాంతిని పొందుతుంది. సమాజ హితం కోసం పద్యరూపంలోగానీ, గద్య, గీత రూపాల్లో కానీ ఎవరు ఏమీ ఆశించకుండా వాక్కులుగా వెచ్చించారో వారు శాశ్వత్వాన్ని పొందారు. ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు? గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము? బాసి కాలుచే/ సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.’ అంటాడు పోతన. నేను సమాజహితాన్ని కోరి పలుకుతున్నాను తప్ప నేనేమీ ఆశించడంలేదన్నాడు.. అదే శాశ్వతమైనది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అలా చేయవచ్చా... అది అవమానం కదూ !!!
మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎనలేని కృషి చేసిన సమర్ధ రామదాసు గారు చెప్పిన మరో సూత్రం – జ్ఞాన సముపార్జన, ప్రచారం. ఇంట్లో మంచి మంచి చిత్తరువులు, మంచి పరుపులు, మంచి మంచాలు, కుర్చీలు, ఇతర అలంకార సామాగ్రి ఎలా ఉంచుకుంటామో... ప్రతి ఇంటా కూడా చదవదగిన పుస్తకాలు కొన్ని ఉండి తీరాలి. చదివిన పుస్తకాల మీద చర్చ కూడా జరుగుతుండాలి. ఇంటి పెద్ద ఒక మంచి పుస్తకం చదివి దానిలో తనకు నచ్చిన అంశాలు ఏ పేజీల్లో ఉన్నాయో ఆ పుస్తకం ముందుండే తెల్లకాగితంపై రాసి ఉంచాలి. పిల్లలు ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా వాటిని చదివి పుస్తకంపట్ల ఆసక్తి పెంచుకుంటారు. చదివిన పుస్తకంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తూండాలి. అప్పడు తీరికసమయాల్లో వాటిని చదవడానికి అందరికీ ప్రేరణ కలుగుతుంది. నిజానికి ఇంటి సంపద వృద్ధిలోకి రావాలన్నా, ఇంటి గౌరవం ఆచంద్రార్కం కొనసాగాలన్నా.. ఆ ఇంటి యజమాని ఎన్ని పుస్తకాలు చదివి, ఎన్ని పుస్తకాలగురించి అలా రాసి భద్రపరిచి ఉంచాడన్నది ముఖ్యం. అదే వారికి నిజమైన ఆస్తి. అదే తరువాత తరాలవారిలో స్ఫూర్తి రగిలిస్తుంది, వారినీ ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు కొనడం పెద్ద కష్టమేమీ కాదు, పుస్తకాలు భద్రపరచడం భారం కూడా కాదు. ‘మా ఇంట్లో పుస్తకాలు చదివేవారు లేరండీ.. అని ఇచ్చేయడం ఆ కుటుంబానికి చాలా అవమానకరమైన విషయం. చదివే వాళ్ళు లేకపోవడమేమిటి! చదివేవాళ్ళు ఉండాలి. ప్రతివాళ్లూ పుస్తకాలు ఒక నియమంగా చదవాలి. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలనుంచి బయటపడడానికి అవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అవి మనకు మనశ్శాంతినిస్తాయి. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే కాదు... మన జీవితాలను, మన పిల్లల జీవితాలను ఉద్ధరించడానికి ఇది పనికొస్తుంది–అని అనుకున్న ప్రతి పుస్తకం ఆ ఇంట తప్పనిసరిగా ఉండాలి. పుస్తకాలు లేని జ్ఞానాన్ని ఇస్తాయి, ఉన్న జ్ఞానాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఆ జ్ఞానాన్ని పదిమందితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందే కానీ తరిగేది కూడా కాదు. అందరూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులతో, ఇంటికొచ్చిన అతిథులతో, ఆత్మీయులతో జరిపే సమావేశాల్లో, విందులు, వినోదాల్లో కలిసిన సన్నిహితులతో వారు చదివిన మంచి పుస్తకాలపై చర్చ పెట్టాలి. అలాగే పిల్లలున్న ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతరత్రా శుభకార్యాల్లో, దూరప్రయాణాలు వెళ్ళేవారికి మంచి మంచి పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి. వీలయితే ఆ పుస్తకాల ప్రాధాన్యతను, వాటిని ఎందుకు బహూకరిస్తున్నది వాటిపై రాసి సంతకం చేసి ఇస్తే... వారితో మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీపట్ల వారికి, వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. వారు కూడా వాటిని చదివి ఎంత ప్రభావితమవుతారో, ఎంత శాంతి పొందుతారో మాటల్లో చెప్పలేం. సమర్ధ రామదాసుగారి లాగా గురుస్థానాల్లో ఉన్న వారు ఇటువంటి విషయాలను ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి... సమాజ అభ్యున్నతికి ఇది అవసరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
ఓ చెంచాడు అయినా లేకపోతే...
కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మన పక్షాన లేడు.. అనుకుంటాం. దేముడు చల్లగా చూసాడు–అని సుఖం కలిగినప్పుడు అనుకుంటుంటాం. కానీ భగవంతుడికి ఏ పక్షపాతమూ లేదు, ఆయన ఎవరిపక్షాన ఉండడు. ‘‘దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో/ ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:/ తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః / సమప్రవత్తికః కదా సదాశివం భజామ్యహమ్.’’ కటిక నేలనుంచీ, హంసతూలికా తల్పం వరకూ, మహారాజు నుండి సామాన్యుడి వరకు, మిత్రపక్షం అనీ, శత్రుపక్షం అనీ తేడా లేకుండా అన్నిటినీ సమాన దృష్టితో చూసే ఆ సదాశివుడికి నమస్కారం.. అంటాం. వివేకానందుడు చెప్పినట్టు – ఈ ప్రపంచమంతా నీ పూజా మందిరంగా చూసే శక్తి రావాలి. భగవంతుడిని ఏమార్చి ఆయనను మన పక్షానికి తీసుకురావడం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన ప్రీతి పొందేది మన నడవడికనుబట్టే. మన నడవడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. మనం సముద్రమంత ప్రయత్నం చేయవచ్చుగాక, కానీ ఓ చెంచాడంత భగవదనుగ్రహం ఉండకపోతే కార్యాలు సఫలీకృతం కావు. ‘ఆచార్య ప్రభవో ధర్మః. ధర్మం అనేది కేవలం పుస్తకాలలో చదువుకుంటేనో, అన్నీ నాకు తెలుసనుకుంటేనో అన్వయం కాదు. నీవు ఎంత అనుష్ఠించావో అదే ధర్మం. ధర్మాత్ముడు.. అనిపించుకోవాలంటే నీ నడవడిక మొత్తం ధర్మబద్ధంగా ఉండాలి. ఆచరించినది ధర్మం. ఆచరించనిది ఎప్పటికీ ధర్మం కాదు. అమెరికాకు అధ్యక్షులుగా చేసినవారిలో చిరస్మరణీయుడైన అబ్రహాం లింకన్ ఒక మాటన్నారు...‘‘దేముడు నీ పక్షాన ఉన్నాడా అని ఆలోచించడం కాదు, దేముడి మార్గంలో నీవు ఉన్నావా !’’ అని చూసుకొమ్మన్నారు. ఆయన బాల్యంనుంచీ అలానే బతికారు. నిరుపేద. చిన్నతనంలో ఒక దుకాణంలో పనిచేస్తుండేవాడు.. ఒక వినియోగదారుడి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సొమ్ము తీసుకున్నారు. ఆ తరువాత లెక్కలు చూసుకుంటుంటే తెలిసింది. దుకాణం మూసేసి అర్థరాత్రి వినియోగదారుడి ఇల్లు వెతుక్కుంటూ పోయి తాను ఎక్కువగా తీసుకొన్న మొత్తాన్ని ఇచ్చేసి మరీ వచ్చాడు. అదీ అనుష్ఠానం లో ధర్మం అంటే... ఈ పరిణతి ఆయన ఎంతసేపు పూజ చేసాడు, ఎంత సేపు ప్రార్థన చేసాడు.. అన్న దానినిబట్టి రాలేదు... చిన్నతనం నుంచి అదే నిబద్ధతతో బతకబట్టి వచ్చింది. మీకు ధర్మంపట్ల అనురక్తి ఉండి ఆచరించినదేదో అదే ధర్మం. అదే సదాచారం. ధర్మంపట్ల అనురక్తి లేకుండా స్వప్రయోజనం చూసుకుంటే అది దురాచారం. ఎక్కడ సదాచారం ఉన్నదో అక్కడ భగవదనుగ్రహం ఉండి తీరుతుంది. ఎక్కడ సదాచారం లేదో అక్కడ దేముని కృప ఎలా సాధ్యం! నీకు ఆకలేస్తే నువ్వే తినాలి. నీకు నిద్రవస్తే నీవే నిద్రపోవాలి. అలాగే నీ నడవడికలో దోషాలను నీవే దిద్దుకోవాలి. సదాచారం పెరుగుతూ ఉండాలి, దురాచారం తగ్గుతూ పోవాలి. ధర్మం చెప్పేది కూడా... నీవు నన్ను కాపాడు.. నేను నీ పక్షాన ఉండి నిన్ను కాపాడతా...అనే. -
ఆగు! జవాబు చెప్పి ముందుకు కదులు!!!
ఏదయినా ఒక ముఖ్యమైన పని చేద్దామనుకున్నప్పుడు మనలోంచి అనేక భావాలు ఒక్కసారి బయటికి వస్తాయి. ఎలా అంటే...మండుతున్న కట్టెను నేలకేసి కొడితే చెలరేగే నిప్పురవ్వల్లాగా అవి లేస్తాయి. అప్పుడు మనలో ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణ మీలో ఉన్న మిమ్మల్ని ఐదు ప్రశ్నలతో నిలదీస్తుందనీ, వాటిలో ఏది మీరు ఎంచుకుంటారో దాన్ని బట్టి మీ స్వభావాన్ని సమాజం అంచనా కడుతుంది. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కూడా తన స్వీయరచన ‘ఇండామిటబుల్ స్పిరిట్’లో ఇదే చెప్పారు. మీరేదయినా పని సంకల్పించుకుని దాని అమలుపై మీమాంసలో ఉన్నప్పుడు మొదట మీలోని పిరికితనం ఒక ప్రశ్న వేస్తుంది..ఇది నీకు ప్రమాదకరం కాదు కదా! అని... అంటే ‘నాకు ఏ ఇబ్బందీ లేదు, నా క్షేమానికి భంగపాటు కలగదు’ అని జవాబు ఇచ్చుకుని ముందుకు సాగారనుకోండి. ఎప్పుడూ తన క్షేమం గురించే చూసుకొనేవాడు...ఇతరుల క్షేమం గురించి పట్టించుకోడని సమాజం అర్థం చేసుకుంటుంది. మీలో ఉన్న దురాశ మిమ్మల్ని ఆపి ‘ఈ పని చేస్తే మనకేమిటి లాభం? మనకేమయినా మిగులుతుందా?’ అంటుంది. ‘నాకు బాగా కలిసొస్తుంది. బాగా వెనకేసుకోవచ్చు కూడా’ అని జవాబిచ్చారనుకోండి. ఇంత ఆశబోతు, ప్రతిదానికీ నాకేమిటని చూసుకునేవాడివల్ల నలుగురికీ ఉపయోగం లేకపోయినా వీడితో జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది సమాజం. వెంటనే గర్వం మీ దారికి అడ్డు తగిలి ‘క్షేమం, లాభంసంగతి దేముడెరుగు. కనీసం నీకు పేరయినా వస్తుందా.. నిన్ను గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటారా?’ అని అడుగుతుంది. ఎంతసేపూ పేరుకోసం ఆరాటపడతాడు తప్ప మిగిలినవి పట్టించుకోడు... అని సమాజం అనుకుని మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. దాటుకుని పోబోతున్న మీకు మీ ఆకాంక్ష అడ్డుతగులుతుంది. ‘‘అవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు. కనీసం సుఖపడతావా.. నీ శరీరానికికానీ, మనసుకు కానీ సుఖం లభిస్తుందా?’ అంటుంది. ‘తనవరకు సుఖంగా ఉంటేచాలనుకుంటాడు.. మిగతావారు ఎటుబోయినా నాకేమిటి అనుకుంటాడు.’ అనుకుని ఇరుగూ పొరుగూ కూడా ఎవరూ దగ్గరకు రానీయరు. చివరగా తనవంతుకోసం వేచి చూస్తూ ఉన్న అంతరాత్మ అప్పుడు కాస్తగట్టిగానే అడుగుతుంది ‘‘నీవు చేస్తున్న పని సరైనదేనా, ధర్మమేనా..ఆలోచించు’’ అంటుంది. ‘ఎందుకు ఆ పని చేస్తావు, తప్పుకదా, నీకు నాలుగు డబ్బులు మిగలొచ్చు, నీకు సుఖమివ్వవచ్చు, పేరు కూడా రావచ్చేమో.. కానీ దానివల్ల ఎంతమందికి నష్టం, ఎందరికి కడుపుకోత..? ఆలోచించు, తొందరపడకు’ అని పదేపదే హెచ్చరిస్తుంది. నీవు జీవితంలో ఎవ్వరికీ జవాబుదారీ కాకపోవచ్చు. కానీ నీ అంతరాత్మను దాటుకుని, దాని మాటలు ఖాతరు చేయకుండా పోయిననాడు... అపరాధభావంతో నలుగురిలో ఉన్నా ఒంటరివైపోతావు...అది ఎప్పుడూ శాపమే. అంతరాత్మ ప్రబోధం విని నడుచుకున్న నాడు, నీవు ముందుంటావు, సమాజం నీ వెనుక నడుస్తుంటుంది, నిన్ను అనుసరిస్తూ, నీకు బాసటగా కూడా. -
సీఎం జగన్ను కలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
-
ఆ రుతువు వచ్చేవరకూ ఆగాలి... తప్పదు
మామిడి కాయలంటే ఇష్టం. మొక్క తెచ్చావు. నీళ్ళుపోసావు... ఇంకా కాయలు రాలేదని రోజూ బిందెలకు బిందెలు నీళ్ళుపోస్తే కాయలు రావు. మొక్క చెట్టు కావాలి... అయినా వసంత రుతువుకూడా రావాలి.. అప్పుడే పూత పూస్తుంది, అది పిందెగా మారుతుంది. ఆ పిదప కొంత కాలానికి కాయ... ఆ తరువాతే పండు... అప్పటిదాకా ఓర్పు ఉండాలి. వేచి చూడాలి. ఎప్పుడో కాయ కాస్తుందని ఇప్పటినుంచే నీళ్ళెందుకు పోయడం.. అని మానేస్తే మొక్క బతకదు... అంటే ఓర్పుతోపాటు నీ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. ప్రతి దానికీ ఒక నియమం, ఒక సమయం ఉంటాయి. అప్పటిదాకా వేచి చూడగల ఓర్పు ఉండడంతో పాటూ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. వెనకటికి ఓ రాజుపై శత్రువులు విరుచుకు పడ్డారు. రాజు ఓడిపోయాడు. నిరాశతో రాజు అన్నీ వదిలేసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంటే... సైనికులు, ఆంతరంగికులు అందరూ నచ్చచెప్పారు. మనం కొంతకాలం ఆగుదాం.. మళ్ళీ శత్రువుపై యుద్ధం ప్రకటిద్దాం.. అని చెప్పినా వినకుండా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఓరోజున రాజు ఒక చెట్టుకింద కూర్చుని... దగ్గర్లోనే ఒక సాలెపురుగు గూడు అల్లడానికి నానా తంటాలు పడడాన్ని ఆసక్తిగా గమనించాడు.. అది గూడు అల్లే క్రమంలో చాలాసార్లు పోగు తెగి కిందపడిపోతున్నది... పలుమార్లు అలా చేసిన తరువాత చివరికి అది గూడు పూర్తిగా అల్లి మధ్యలో సౌకర్యవంతంగా కూర్చుని గూడుకు చిక్కుకున్న పురుగులను హాయిగా తింటున్నది. ఇది చూసిన రాజుకు జ్ఞానోదయమయింది. వెంటనే వెళ్ళి తన పరివారాన్ని చేరదీసి సర్వసన్నద్ధం అయ్యేవరకు ఆగి... ఓ రోజున యుద్ధం ప్రకటించాడు. శత్రురాజును సునాయాసంగా ఓడించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ప్రతిదానికీ ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం ఎక్కడా ఆపకుండా పూర్తిచేయాలి, ఫలితం వచ్చేవరకూ ఓర్పుగా వేచి చూడాలి. తొలితరానికి చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్ జగదీశ్ చంద్రబోస్ ఆంగ్లేయ ప్రొఫెసర్లతో సమానమైన అర్హతలు, ప్రతిభాపాటవాలు కలిగినా, వారితో సమానంగా తనకు వేతనం ఇవ్వనందుకు నిరసనగా జీతం ముట్టుకోకుండా తన వృత్తిని మూడేళ్ళపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే అదే అంకితభావంతో కొనసాగిస్తే... చివరకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దిగొచ్చి ఆయన్ని సన్మానించి పెంచిన జీతం పాత బకాయిలతో సహా చెల్లించింది. కార్యసాధనలో ఓర్పు ఎంత ముఖ్యమో... ప్రయత్నాలను చివరిదాకా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: ఒక్క చెట్టు పెట్టు... పుణ్యం మూటకట్టు
చెట్టు అనేది ఎంత గొప్పది... ఒక మొక్క నాటడం, దానికి నీళ్ళు పోయడం, చెట్టయ్యేదాకా దానిని సంరక్షించడం... అది చెట్టుగా మారిననాడు అది నాటినవాడికి, పెంచినవాడికి, సంరక్షించినవాడికి ఎంత ఫలితం లభిస్తుందనే దానికి మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే... లోకంలో శరీరం కలిగిన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మనుష్యులే కానక్కరలేదు. శరీరం ఉన్న ప్రతి ప్రాణికీ దాని పోషణకు ఆహారం కావాలి. అది సమయానికి పడకపోతే ఆకలికి విలవిల్లాడిపోతాయి. ఆకలి గొప్ప బాధ.. క్షుత్ అగ్ని.. అది అగ్నిహోత్రం, మంట. ఆ మంట తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలేస్తే మొదట ఏది పోతుంది... ధర్మం. ఆకలేసిన వాడికి ధర్మ విచక్షణ ఉండదు. అయ్యా! నా ప్రాణం పోయినా సరే ధర్మాన్ని కాపాడతాను, ఏదీ దొంగిలించను అనడు కదా ! చివరకు తెగించి దొంగతనానికి పాల్పడి అయినా ఆ బాధ తీర్చుకుంటాడు. ఆ మంట అటువంటిది. దహించి వేస్తుంది. అందుకే ఆకలి అన్నది ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మనుష్యులకే కాదు, సమస్త ప్రాణులకూ ఆహారం కావాలి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు... ఆకలితో ఉన్న మనుష్యులకు వారి ఆర్తిని చూసి జాలిపడి ఎవరయినా ఆహారమిస్తారు.. వీటి ఆకలి ఎవరు తీరుస్తారు? చెట్టు. దానికి కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, కాయలు, పళ్ళను కూడా ఇస్తుంది. దానిని ఆశ్రయించి మనుష్యులే కాదు, క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి. దాని బెరడులో చేరిన వందలాది క్రిములు వాటి ఆకలిని అక్కడ తీర్చుకొంటాయి. జంతువులు ఆకులు తింటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడమే కాక కాయలు, పండ్లు తింటాయి. కొన్ని చిగుళ్ళను తింటాయి. ఎన్నో రెక్కల పురుగులు దాని పూలమీద వాలి ఆకలి తీర్చుకుంటాయి. రాలిన కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు భూమిలో కలిసి అక్కడున్న ఎన్నో పురుగులకు ఆహారమవుతాయి. ఒక చెట్టు... ఒక్క చెట్టే ఇన్నింటికి జీవాధారమవుతున్నది. మొక్కనాటిన వాడు, చెట్టుగా చేసినవాడు తరువాత కాలంలో శరీరాన్ని వదిలివేయవచ్చు గాక. కానీ అసంఖ్యాకమైన జీవులకు కేవలం ఆకలి తీర్చడమే కాక, వాటి ప్రాణాలను కూడా నిలబెట్టాడు, ఎన్నో జీవులు సేదదీరడానికి కారణమయ్యాడు. చెట్టు ప్రాణవాయువు వదులుతుంది. ప్రకృతి సమతౌల్యతను కాపాడుతుంది. అది మనుష్యులతోపాటూ అనేక జీవులకు ప్రాణాధారంగా నిలబడుతుంది. అటువంటి మంచి పనికి కారణమయ్యాడు కనుక వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వారి శరీరం పతనమయిన తరువాత దేవతలు స్వాగతం పలికి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెడతారట. అంతేకాదు ఎన్నో ప్రాణులకు కొన్ని సంవత్సరాల పాటు ఆకలిబాధ తీర్చాడు కనుక వారిని మేం సేవిస్తాం అని దేవతలు అంటారట. చెట్లను పెంచే పనిని ప్రోత్సహించడానికి, మనుషులు తమకే కాకుండా సమస్త జీవకోటిపట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి, ప్రకృతి సమతుల్యత కాపాడేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన పూర్వీకులు‘‘యావంతి ఖాసంతి ఫలాని వృక్షాత్ క్షుద్వహ్ని దగ్ధా ...’’ అంటూ ఒక శ్లోకం ద్వారా చేసిన ధర్మబోధ ఇది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువాణి: అమ్మ ప్రేమకన్నా...
పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే. ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు. కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ.... ... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి. అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Chaganti Koteswara Rao: సహవాస ఫలం
కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...అంటున్న బద్దెన పద్యం ఇస్తున్న సందేశం ఏమిటంటే.. దుర్జనులతో స్నేహం చేయద్దని! అగ్నిహోత్రం కట్టెను పట్టుకుని కాల్చడం మొదలుపెడుతుంది. మంట వ్యాపించేకొద్దీ ఆ కట్టెను ఆశ్రయించి ఉన్న పురుగూపుట్రా అన్నీ పారిపోతాయి. అగ్నితో సంపర్కం పొందాక ఒక్క పురుగు కూడ లోపల ఉండలేదు. అలాగే సత్పురుషులతో సహవాసం చెయ్యడం మొదలుపెడితే నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా పడిపోతాయి. ఈశ్వర భక్తిచేత మారని గుణాలు కూడా మంచివారితో కలిసి ఉంటే తొలగిపోతాయి. మహాత్ముల చెంత చేరిన లోభిలో కూడా మార్పు వస్తుంది. తాను కూడా ఒక రూపాయి దానం చేసి సమాజం కోసం నిలబడాలన్న ఆలోచనలతో పరివర్తన చెందుతాడు. రావణాసురుడిని నమ్ముకున్న వారందరూ నశించిపోయారు. ఒక్కడు మిగల్లేదు. రామచంద్ర మూర్తిని నమ్ముకుని ఆయనతో కలిసున్న వారి సంగతి ఏమిటి! కొన్ని కోట్ల వానరాలు చచ్చిపోయినా, చిట్టచివర దేవేంద్రుడు ప్రత్యక్షమయి రాముడిని వరం కోరుకొమ్మంటే...‘నాకోసమని యుద్ధం చేయడానికి వచ్చి ఏ వానరాలు మరణించాయో అవన్నీ తిరిగి బతకాలి’ అని కోరుకున్నాడు. అటువంటి సత్పురుషుడిని ఆశ్రయించినందుకు చివరకు క్షేమంగా తిరిగి వెళ్లగలిగాయి. ‘‘కళత్రాణి సౌమ్యాని మిత్రవర్గం తథైవచ యధైచ్ఛసి చిరం భోక్తుం మా కృథారామ విప్రియమ్... ’ దుర్మార్గుడయిన వ్యక్తి ఇంట్లో ఉంటే– తల్లికీ తండ్రికీ మనశ్శాంతి ఉండదు. భార్యాబిడ్డలు ప్రశాంతంగా బతకలేరు. ఇటువంటి దుర్మార్గుడు మా కుటుంబ సభ్యుడైనాడని బంధువులు, మిత్రులు అందరూ తలదించుకుంటారు. ఆయన ఉండే వీథిలోని వాళ్ళు, ఆ దుర్మార్గుడి ఊరివాళ్ళు కూడా విసుక్కుంటారు. ఒకవేళ ఆ దుర్మార్గుడే పాలకుడయితే ఆ జిల్లా, ఆ రాష్ట్రం పాడయిపోతుంది. అలా దుర్మార్గుడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉన్న ఇతరులు కూడా అతని ప్రభావానికి బలయిపోతారు. దుర్జనులతోడి సంపర్కం ప్రమాదకరం. వర్షపునీటితో గలాగలా పారినా ఏటినీళ్ళు ఎవరూ తాగరు, పుణ్యస్నానాలు చేయరు. అది వెళ్ళి గంగానదితో కలిస్తే...అది కూడా గంగే అయిపోతుంది. దానికీ ఆ పవిత్రత దక్కుతుంది. అక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. అదే గంగానది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలోంచి నీళ్ళు ఇంటికి కూడా తెచ్చుకోం. గంగ... గంగగా ఉపయుక్తం. ఏరు గంగలో కలిస్తే గంగయిపోయింది. గంగ సముద్రంలో కలిస్తే సముద్రమయింది. తాత్వికంగా అది గొప్పదే..కానీ గంగ గంగగా ఉన్నప్పటి ప్రయోజనం సముద్రంలో కలిసిన తరువాత ఉండదు. ఒక చీమ పూలదండలో ఉన్నది. ఆ దండను రాజు మెడలో వేసారు. చీమ నెమ్మదిగా పాకుతూ కిరీటం పైకి చేరుకుంది. దానిని చూసినా ఎవ్వరూ అక్కడనుండి తొలగించే సాహసం చేయలేదు. రాజు స్వయంగా గ్రహిస్తే తప్ప దాన్ని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే నువ్వు ఎవరితో ఉన్నావన్నదాన్నిబట్టి నీ స్థాయి, గౌరవం మారిపోతుంటుంది. కాబట్టి త్యజదుర్జన సంసర్గమ్... భజసాధు సమాగమమ్... మహాత్ములతో, సత్పురుషులతో కలిసి ఉండండి... వారు మిమ్మల్ని నిందించినా, వారి సాంగత్యాన్ని వదులుకోకండి. వారితో కలిసి ఉన్న కారణంగా మీ దుర్గుణాలు పోగొట్టుకోవడమే కాకుండా, మీరు కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను. నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు. అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు. అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది. అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు. శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!! అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో ప్రతి క్షణం ఆచితూచి అడుగేస్తుండాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి – సుమతిమీ కింకరులం ..
‘‘ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ...’’ అంటూ బద్దెనగారు ఇంకా ... ‘‘పాఱకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!... అని కూడా అంటున్నారు. పాఱకుమీ రణమందున అంటే... యుద్ధరంగంలోకి దిగినవాడు యుద్ధం చేసితీరవలసిందే... శరీరత్యాగానికి సిద్ధపడే పోతాడు. అసలు నిజానికి ఆ ఆలోచన కూడా రాదు వీరుడికి...విజయ సాధనే ఏకైక లక్ష్యం.. దాన్ని సాధించాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు, ఉండకూడదు కూడా. ఒకవేళ సగంలో వెనుదిరిగితే... అది అత్యంత హేయమైన చర్య. వీరుడిగా గౌరవం పొందడు. కురుక్షేత్ర సంగ్రామ సమయం లో ‘నేను అర్జునుడిని ఓడిస్తా..’ అని కర్ణుడు మాట్లాడినప్పుడల్లా.. భీష్మాచార్యుడు... ‘‘గతంలో ఎన్నిమార్లు నువ్వు అర్జునుడితో తలపడ్డావు.. ద్రౌపదీ స్వయంవరమప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయావు, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు బాణప్రయోగం చేస్తే పారిపోయావు, ఘోష యాత్ర జరుగుతున్నప్పుడు చిత్రసేనుడితో పోరాడలేక నువ్వు పారిపోతే అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి అందర్నీ కాపాడాడు... ఇన్నిసార్లు ఓడినవాడివి నీవిప్పుడు అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలు ఎందుకు పలకడం...’’ అనేవాడు. అయితే ఇప్పుడు యుద్ధాలు లేవు కానీ అంతకంటే క్లిష్టమైన జీవిత సమస్యలున్నాయి... ఏదయినా పోరాటమే... పోరాటానికి దిగేటప్పుడు దాని అంతు తేలుస్తా... అనే ఉక్కు సంకల్పంతో పోరాడాలి.. ఒకసారి పోరాడడం మొదలయిన తరువాత దాన్ని మధ్యలో వదిలేయకూడదన్నదే బద్దెన సందేశం. ఆయన ఇంకా ఏమంటున్నారు... ‘మీరకుమీ గురువలాజ్ఞ మేదిని సుమతీ’... పూర్తిగా పక్వానికి రాని పండ్లను తినడం, బంధువులను దూషించడం, ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం ఎంతగా నిషిద్ధమో... అలాగే గురువుగారు చెప్పిన మాటలను పూర్తి శ్రద్ధతో ఆలకించి, ఆచరించడం కూడా అంతే అవసరం. ఆత్మబుద్ధి సుఖంచైవ... కొన్ని సంక్లిష్ట సందర్భాల్లో మనం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మన మనసు కు తట్టిన ఆలోచనలు మంచివే, వాటిని ఆచరించడానికే మనసు మొగ్గు చూపుతుంటుంది కానీ... గురుబుద్ధిర్విశేషతః... అటువంటప్పుడు సందర్భాన్నిబట్టి గురువుగారు గతంలో చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవి మన ఆలోచనలకంటే మెరుగ్గా ఉంటాయి కనుక వాటిని కూడా శ్రద్ధగా పరిశీలించాలి. అప్పుడు మంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. అందువల్ల గురువుగారికి ఆయన మాటలకు ఎప్పుడూ ఆ గౌరవం ఇవ్వాలి. తాటక సంహారం తరువాత సుబాహుణ్ణి చంపగా, మారీచుణ్ణి దూరంగా తరిమికొట్టాడు రామచంద్రమూర్తి. రుషులందరూ వచ్చి పిల్లవాడివయినా దేవేంద్రుడిలాగా పోరాడావయ్యా... అంటూ బాగా పొగిడారు. సాధారణంగా పిల్లలను అందరిముందు పొగిడితే కించిత్ గర్వం వస్తుంది. విశ్వామిత్రుడు వారి గురువు. మరుసటిరోజు ఉదయాన రామలక్ష్మణులు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి ‘‘ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ, ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కరవావ కిం..’’ అన్నారు వినయ విధేయతలతో. అంటే–‘‘హే గురువర్యా! దశరథ మహారాజుగారి కుమారులు, కోసల రాజ్యానికి రాకుమారులు..అనే దృష్టితో మమ్మల్ని చూడకండి. మీ కింకరులం..అంటే మీ సేవకులం.. ఇది చేసి పెట్టు .. అని శాసించండి. అది అలా చెయ్యడం మా జీవితానికి అదృష్టంగా భావిస్తాం.. మీరలా ఆజ్ఞాపిస్తే.. మేము మీ అనుగ్రహానికి పాత్రులయినట్టు లెక్క...’’ అన్నారు. అదీ గురువులపట్ల ఉండాల్సిన గౌరవం, విధేయత... బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నిన్ను సంతోషంగా కానీ.. దుఃఖంతో కానీ.. ఉంచేది నీ మనసే!
మీరు పిల్లలు... మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాటిదే శతక నీతి కూడా... ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు...’ సూక్తి సుమతీ శతకం లోనిది. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి... అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు. పోతన గారు ఓ మాటంటారు... ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే...లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు....అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు. నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా... లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది. అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా... అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే. అది అయిపోగానే ... మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది... 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ... నీవు దొరికిన దానితో తృప్తిపడి... నిత్యం సంతోషంగా ఉంటే... నీ జీవితాంతం అలా ఉండగలిగితే... ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా... అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే... నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు. ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావు... అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు... అబ్దుల్ కలాం గారు.. ఎఫ్.ఎ..ఐ.ఎల్..ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్... అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు... అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Chaganti Koteswara Rao: ఈ తమ్ముడు మళ్ళీ దొరకడు!
‘ఇమ్ముగ చదువనినోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్, తమ్ముల పిలువని నోరును...’’ అన్న సుమతీ శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాం. లోకంలో స్నేహితులు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. చిన్నతరగతులనుంచీ, కళాశాలలు ...ఆ తరువాత ఉద్యోగాల్లో ...అలా అన్ని స్థాయుల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వేళ ల్లో దొరుకుతారు. పెళ్ళిళ్ళు తదితరాలతో బాంధవ్యాలు కలిసి బంధువులు కూడా కొత్తగా దొరుకుతుంటారు. పుట్టగానే పరమేశ్వరుడిచ్చిన బంధుత్వం మాత్రం అమ్మానాన్నలతోనే. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు వాళ్ళు కోరుకునేది, నీవు వాళ్ళకు ఏదో చేయాలని కాదు, నీకు వాళ్ళేం చేయగలరని...! ఆ ఆర్తి సహజంగా వాళ్లకు తప్ప వేరెవరికీ ఉండనే ఉండదు. అటువంటి వాటిలో ఒకటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉండే అనుబంధం. నాతో కలిసి పుట్టిన వాళ్ళతో అనుబంధం అపూర్వం. నా తమ్ముడు ఈ జన్మకంతటికీ వాడే నా తమ్ముడు. అక్క ఈ జన్మకు ఆమే అక్క. నేను చాలామందిని చెల్లెళ్ళగా చూడవచ్చు. కానీ మా అమ్మానాన్నల కడుపున నాతో కలిసి పుట్టిన చెల్లి అదొక్కతే. దానితో సమానం మాత్రం ఎవరూ కారు, కాలేరు. వాచికంగా.. ఆమె నా చెల్లెలి తో సమానం అంటాం. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం సాధ్యం కాదు. తోడబుట్టినవాడు అంటే ఆ అనుబంధం మరొకరితో ఉండదుగాక ఉండదు. శ్రీ రామాయణం లో రావణాసురుడు ప్రయోగించిన శక్త్యాయుధం ఒకటి లక్ష్మణుడిని తాకి ఆయన కిందపడి మూర్ఛిల్లాడు. యుద్ధంలో ఉన్న రాముడు వెంటనే వచ్చి తమ్ముణ్ణి పట్టుకుని బావురుమని ఏడ్చాడు. ‘‘దేశేదేశే కళత్రాణి దేశేదేశే చ బాంధవః తం తూ దేశ నా పశ్యామి యాత్ర భ్రాత్ర సహోదరః’’ అన్నాడు. భార్య దొరుకుతుంది, బంధువులు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. కానీ వాడొక్కడే ఈ జీవితానికి. అంత అపురూపం రా అన్నదమ్ములు. నువ్వే లేకపోతే నాకెందుకురా ఈ రాజ్యాలు, ఈ సుఖాలు? నాకోసం అడవికి వచ్చావు, నా కోసం యుద్ధానికి వెళ్లావు, నువ్వే పడిపోయిన నాడు నాకు మిగిలిన సుఖాలు అన్నీ ఏకమై తిరిగి లభించినా, వాటివల్ల ప్రయోజనమేమిటి?’’ అని అడిగాడు. తోడబుట్టినవాడు వెళ్ళిపోయిన తరువాత బతుకు శూన్యమని భావించాడు. రామలక్ష్మణ భరత శ్రత్రుఘ్నులు నలుగురూ పట్టాభిషేక సమయానికి బతికే ఉన్నారు. వాలి సుగ్రీవుల్లో వాలి మరణించాడు. రావణ కుంభకర్ణులు ఇద్దరూ పోగా విభీషణుడొక్కడు మిగిలాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మైత్రీబంధం చూసి అక్కడే ఉన్న విభీషణుడు ‘మేం మా సోదరులతో ఇలా బతకలేక పోయాం...’ అని చాటుగా కళ్ళొత్తుకున్నాడు. సుగ్రీవుడి కళ్ళు చెమర్చాయి. అన్నగారు బాగా పెద్దవాడయి పోయిన తరువాత కూడా నెమ్మదిగా వాహనం దిగుతుంటే తమ్ముళ్ళు గబగబా వెళ్ళి చెయ్యి ఆసరాగా ఇచ్చి ‘అన్నయ్యా! జాగ్రత్త’ అంటూ తీసుకువస్తుంటే, ఏ విషయమైనా అన్నయ్యకు చెప్పి చేస్తుంటే.. తమ్ముళ్ళ మంచీచెడూ విచారించే అన్నయ్య ఎప్పుడూ వాళ్ళకు తోడుగా ఉంటే అసలు ఆ ఇంట ఎంత ఆరోగ్యం, ఎంత ఆయుర్దాయం ఉంటుందో... ఆ రక్తసంబంధం ఉన్నవాళ్లు కలుసుకోవడం ఎంత సంతోషంగా ఉంటుందో..!!! -
chaganti koteswara rao: బతుకుబాటకు దారిదీపం
మనిషి వృద్ధిలోకి రావడానికి తప్పకుండా నేర్చుకుని తీరవలసినది నీతి శాస్త్రం. ఆ నీతిని పాటించకపోతే తాను ఒక్కడే పతనమయిపోడు. తనతోపాటూ చుట్టూ ఉండే సమాజం కూడా భ్రష్టుపట్టే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తిన్న అన్నం కొద్దిగా కలుషితం అయితే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే అనారోగ్యం వస్తుంది. కానీ ఒక ఊరివారందరూ దాహం తీర్చుకునే చెరువు విషపూరితం అయితే ఊరంతా అస్వస్థతకు గురవుతుంది. అయితే నీతి విషయంలో మాత్రం... ఒక వ్యక్తి నీతి తప్పితే కేవలం ఆ వ్యక్తి మాత్రమే పతనమయిపోడు, సమాజంలో ఉన్న అనేకమంది దాని దుష్ప్రభావానికి లోనవుతారు. అంతేకాక అతని తాత్కాలిక సుఖాలను ఆదర్శంగా భావించే అపరిపక్వ మనస్కులూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే చిన్నతనంలోనే నీతి శాస్త్రాలను బాగా చదువుకోవాలి. తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేంత సులభంగా మనకు శతకాలు అందుబాటులో ఉన్నాయి... ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చక్కటి పద్యాల రూపంలో ఉన్నాయి. శతకం అంటే నూరు పద్యాలతో ఉన్న గ్రంథం అని. కానీ నూరే ఉండాలన్న నియమం లేదు. శతకం – అంటే ‘నూట ఎనిమిది’ అన్న అర్థం కూడా ఉంది. 108 కానీ, 116 కానీ పద్యాలు ఉండడం సంప్రదాయంగా వస్తోంది. కొన్నిచోట్ల అవి దాటిన శతకాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో లేనిది తెలుగులో మాత్రమే ప్రత్యేకంగా కనిపించేది మకుటం. ప్రతి పద్యం చివర మాటకానీ, చివర పంక్తి కానీ, కొన్నిసార్లు చివరి భాగం కానీ, సీస పద్యాలవంటి వాటిల్లో అయితే చివరి పద్యం కానీ మకుటం అవుతుంది. సుమతీ అనీ, దాశరథీ! కరుణాపయోనిథీ! అనీ, విశ్వదాభిరామ వినురవేమ... అనీ ఉంచారు. వీటిలో భక్తికి సంబంధించినవి, ఆవేదనను వెళ్ళగక్కేవి, ప్రకృతిని వర్ణించేవి ... ఇలా చాలా శతకాలు ఉన్నా తెలుగు భాషలో నీతి శతకాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. పెద్దలు, పరిశోధకుల పరిశీలన ప్రకారం శతక రచన ప్రారంభం అయింది నన్నయతో అంటారు. భారతాన్ని ఆంధ్రభాషలో రచన ప్రారంభం చేసే సమయంలో ఆయన రాసిన కొన్ని పద్యాల చివరన ఆదిశేషుని ఉద్దేశించి ‘..నాకు ప్రసన్నుడయ్యెడున్’ అన్న మకుటంతో ముగించారు. ఇది తరువాత కాలంలో శతక రచనకు ప్రేరణనిచ్చాయంటారు వీరు. విద్యార్థులకు సంబంధించినంతవరకు అత్యంత ప్రధానమైనది నీతి శతకం. తెలుగులో ఇలా వచ్చిన మొట్టమొదటి శతకం – సుమతీ శతకం. కాకతి రుద్రమదేవి దగ్గర సామంత రాజుగా ఉన్న భద్ర భూపాలుడు .. బద్దెన అనే పేరుతో అందరికీ పనికి వచ్చే నీతుల సమాహార స్వరూపంగా దీనిని రచించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు, పౌరులు, సమాజంలోని విభిన్న వర్గాలవారు, చివరకు కవులు కూడా తెలుసుకోవాల్సిన నీతి సూత్రాలను ఇందులో పొందుపరిచారు. ఏవి పాటించాలో, ఏవి పాటించకూడదో, వేటిని మనిషి ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలో దీనిలో ప్రతిపాదించారు. వీటిని కంఠస్థం చేసుకుని ధారణలో ఉంచుకుంటే.. జీవితంలో క్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుని ఏ దారీ కనిపించ నప్పడు ఇవి వాటంతట అవే గుర్తుకు వచ్చి కాపాడతాయి. సుమతీ శతక పద్యాలు ‘సుమతీ’ అన్న మకుటంతో ముగుస్తాయి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: నిలుపుకోవలసిన అలవాట్లు -
ఆయన కంఠం భగవద్గీత రూపంలో..
ఉపాసన– ఉప.. సమీపానికి వెళ్ళడం. పరమేశ్వరుని, పరాశక్తిని తెలుసుకోవడానికి అంతర్ముఖత్వం పొంది దగ్గరగా జరగడం. అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా...’’ ఆవిడ బయట దొరుకుతుందా? అంతర్ముఖాన్ని పొందితే దొరుకుతుంది. ద్యానంలో లోపలకి వెడితే, ఆ నిశ్శబ్దంలో అక్కడ కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే అక్కడ అమ్మవారి పాదమంజీరాల సవ్వళ్ళు వింటూ, ఆమె పాదాల జంట చూసి యోగి పారవశ్యాన్ని పొందుతాడు. అలా లోపలికి వెళ్లారు విద్వాంసులందరూ... నాదోపాసన చేసి శబ్దం ఎక్కడినుంచి పైకి వస్తుందో ఆ స్థానానికి వెళ్లిపోయారు, అక్కడ లయమయిపోయారు. అందుకే భారతీయ సంస్కృతిని అంతటినీ ఉద్దీపింపచేసిన ప్రధానమైన కళల్లో ఒకటి సంగీతం. పాట పాడుకోవడం వచ్చినవాడు, దానికి స్వరాలు వేస్తూ తాను ఆనందాన్ని పొందుతూ, సభనంతటినీ ఆనందపెట్టేస్తారు. అది భగవతి అనుగ్రహం. తెలుగునేల నిజంగా గర్వపడాలి. చలనచిత్రసీమలో పాటలు పాడినా వారు తగినంత నేపథ్యం లేకుండా విజయాలు సాధించలేదు. ఘంటసాల వేంకటేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, భానుమతీ రామకృష్ణ గార్లు... ఘంటసాలగారు శరీరం విడిచి చాలా కాలమయినా... ఇప్పటికీ మనం వేంకటాచలం వెడితే ఆనంద నిలయం దగ్గర ఆయన కంఠం మనకు భగవద్గీత రూపంలో కనబడుతుంటుంది. కీర్తి శరీరులు కావడం అంటే ఇదే కదూ! బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి సాంబమూర్తిగారు. హరికథలు చెప్పేవారు. కొన్నేళ్ళపాటు దీక్ష తీసుకుని... నెల్లూరు పట్టణంలో ప్రాతఃకాలంలో కీర్తనలు పాడుకుంటూ వీథివీథి తిరుగుతూ భిక్షాటనతో సేకరించిన బియ్యం తదితర విరాళాలతో ఏటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో అపూర్వంగా నిర్వహించారు. ఆయన చేసిన త్యాగరాజోపాసన, దాని అనుగ్రహాల ఫలితమే కుమారుడు బాల సుబ్రహ్మణ్యం దేశవిదేశాల్లో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు. అలాగే ఎవరెవరు ఎక్కడెక్కడ సంగీతంలో చేసిన ఉపాసన ఉత్తినే పోలేదు. భగవద్భక్తితో రామనామం పట్టుకున్నవాడిని, పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడిని ఏ స్థానానికి చేర్చాడో... వారి వెనుక ఉన్న వాళ్లను రక్షించాడో నాదోపాసన చేసి సంగీతాన్ని నమ్ముకున్న వాళ్ళను కూడా అలాగే కాపాడాడు. భానుమతీ రామకృష్ణగారు అంతటి విద్వాంసురాలు, లబ్దప్రతిష్టులు కావడానికి కారణం వారి తల్లి... ఆమె కీర్తనలు చాలా బాగా పాడేవారు. తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఒక్కొక్కప్పుడు వారి కుటుంబం కడుపునిండా తినడానికి కూడా నోచుకోని పరిస్థితులు ఎదురయితే పెరట్లోని బచ్చలి కూర నీళ్ళలో ఉడికించి దానితో నీరసంగా రోజులు వెళ్ళదీస్తూ కూడా త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడుకుంటూ సమస్త బాధల్నీ మరిచిపోయేవారు. ఆ భార్యాభర్తలు చేసిన ఉపాసనా ఫలితం భానుమతి గారి గంధర్వగానం రూపంలో మనల్ని పరవశుల్ని చేసింది. అదీ నాదోపాసన అంటే... అదీ శాశ్వతత్వాన్ని పొందడం అంటే. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నాదోపాసనతో సర్వేశ్వరుని చేరడానికి సంగీతం ఓ సాధనం
వాగ్గేయకారులైన ముత్తుస్వామి దీక్షితార్ వారి గురువు చిదంబర యోగి. తల్లిదండ్రులను విడిచిపెట్టిపోయి, బ్రహ్మచారిగా కాశీపట్టణంలో చాలాకాలం వారిని సేవించారు. ఒకనాడు గురువుగారు పిలిచి ‘‘నాయనా ముత్తుస్వామి! నువ్వూ నేనూ విడిపోయే కాలం ఆసన్నమయిందిరా..’’ అన్నారు. ‘‘అయ్యో గురువుగారూ.. కాశీ పట్టణ వాసం, విశ్వనాథ అభిషేకం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ సేవనం, గురువుగారి శుశ్రూష.. ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలి. అటువంటి అమంగళకరమైన మాటలు అనకండి’’ అన్నారు. ‘‘అమంగళకరం కాదు నాయనా, శరీరంతో వచ్చిన వాడు శరీరాన్ని విడిచిపెట్టవలసిందే, బెంగపెట్టుకోకు. ఈ వేళ నేను ముందు స్నానం చేయడం కాదు. నీవు చేయాలి’’ అన్నారు. గురువుగారి ఆజ్ఞమేరకు ముత్తుస్వామి దీక్షితార్ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుండగా చేతికేదో తగిలింది. పైకెత్తారు. ‘యాళి’ అని పౌరాణిక మృగం ఆకారంలో ఉంది. ఇప్పటికీ కంచి వరదరాజ స్వామి దేవస్థానంలో స్తంభం మీద చెక్కబడి ఉంటుంది. గంగా ప్రసాదంగా దీక్షితార్ వారికి దొరికిన చిన్న వీణకు ఈ యాళి చిన్న గుమ్మడికాయ ఆకారంలో ఇతర వీణల్లో లాగా కింద కాకుండా పైకి ఉంటుంది. దాని మీద ‘శ్రీరామ’ అని రాయబడి ఉంది. తరువాత కాలంలో దానిమీద సంగీతం పాడుకుంటూ పరవశించి పోయేవారు. నాకిది ఉందా లేదా అన్న చింత లేదు. నిత్య తృప్తులు. ఒకసారి తిరుత్తణి కొండమీద కూర్చుని కీర్తన చేస్తుంటే సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించినట్లయి వెంటనే కొన్ని కీర్తనలు చేసారు. అవి తరువాతి కాలంలో ‘తిరుత్తణి కీర్తనలు’గా ఖ్యాతికెక్కాయి.. చిట్టచివరన కూడా ‘పశుపాశ విమోచినీ కామాక్షీ’ అంటూ... ‘‘అమ్మా కామాక్షీ! పశుపాశాలను కోసి వేయగలిగిన దానివి. అద్వైత మోక్షాన్ని, కైవల్యాన్ని ఇవ్వగలిగిన తల్లీ కామాక్షీ, ఈ పాశములను కోసేయమ్మా..’’ అంటూ కీర్తన చేస్తున్నారు. పాశం చేత కట్టబడేది పశువు. మనందరం పశువులమే. మనకు పాశాలు ఏముంటాయనుకోవద్దు. మనం చేసుకున్న గత జన్మ కర్మలే మనకు పాశాలు. అది జన్మస్తంభం. దానికి కట్టబడడం, చేసుకున్న కర్మల ఫలితాలను జనన మరణాలుగా అనుభవిస్తూ... అలా తిరుగుతుంటాం. నువ్విక పశువువి కాదని కర్మపాశాలను తెగకోసి.. పశుపతిలో కలిపేస్తుంది ఆ తల్లి. అందుకని ఆయనలా వేడుకుంటూ కీర్తన చేస్తుంటే... శిష్యులు ఎదురుగా కూర్చుని ఉన్నారు. అలా పాడుతుండ గా ఒక దివ్యజ్యోతి ఆయన శరీరంలోంచి వచ్చి పూజామందిరంలో ఉన్న కామాక్షిలో లయమయిపోయింది. నాదోపాసన చేత తరించారు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత గొప్పగా ఈశ్వరుడిని సేవించుకున్నామన్నది లక్ష్యంగా బతికారు. అంటే నాదోపాసనతో సర్వేశ్వరుని చేరడానికి సంగీతాన్ని ఒక సాధనంగా స్వీకరించారు. బాహ్యంలో రంజకత్వం, మానసికోల్లాసం ఉన్నా భారతీయ సంగీతం పరమ ప్రయోజనం మాత్రం ఈశ్వరుని చేరుకోవడమే. అందుకే ఉపాసన అన్న మాట సంగీతానికి కూడా అన్వయమయింది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అర్థం ఉంటేనే అది శబ్దం అవుతుంది
ఒక దేశ సంస్కృతి కబళింపబడి, రూపుమాసిపోతే ప్రజలలో విచ్చలవడితనం పెరిగిపోతుంది. అది అనాచారానికి, పతనానికి కారణమవుతుంది. రాజులు పరిపాలించినా, ప్రజాస్వామిక ప్రభుత్వాలు పాలించినా సంస్కృతికి విశేష ప్రాధాన్యమిచ్చి దానిని కాపాడుకోవడం ఒక ఎత్తయితే... ప్రజలు తమంత తాముగా తమ కళలపట్ల, తమ సంస్కృతి పట్ల జాగరూకలై దానిని రక్షించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. భారతీయ సంస్కృతికి సంబంధించిన వైభవంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. బాహ్యంలో అంటే పైకి మనోరంజకత్వం ఉంటుంది. రంజకత్వం లేకుండా ‘కళ’ అనేది ఉండదు. అది మనలను రంజింప చేయాలి. అని చెప్పి కేవలంగా మనోరంజకత్వం కోసమని హద్దు లేకుండా పరిధి దాటిపోయి అర్థం లేకుండా దిగజారుడుతనంతో కిందకొచ్చేసి...‘ఇదిగో మేం మనసులను రంజింప చేస్తున్నాం చూడండి’ అన్న మాట భారతీయ కళలకు వర్తించదు. మన కళల్లో పైకి మనోరంజకత్వం కనిపించినా... తుట్టతుది ప్రయోజనం మాత్రం అపురూపమైన శరీరాన్ని ఉపయోగించి ఆ కళల ద్వారా పరమేశ్వరుడిలో ఐక్యం కావడమే లక్ష్యంగా ఉంటుంది. దానికోసం ఉపాసన, దానికోసం అనుష్ఠానం, దానికోసం సాధన, దాని కోసం సమస్త కళలు... వాటిని అందించడానికి ‘సంస్కృతి’. అంతే తప్ప కేవలం మనోరంజకత్వం కోసం దేనినీ ప్రతిపాదన చేయరు.అందుకే నవరసాలుంటాయి. వాటి చివరి ప్రయోజనం... భక్తిమార్గంలో మనిషిని ప్రయాణింపచేసి, భక్తితో కూడిన కర్మాచరణలు చేసిన కారణం చేత ప్రీతిపొందిన పరమేశ్వరుడు చిత్తశుద్ధిని ఇస్తే, ఆ పాత్రత ఆధారంగా జ్ఞానాన్ని కటాక్షిస్తే, ఆ జ్ఞానం ద్వారా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కోసం కళలు ఉపయోగపడతాయి. కేవలం మనోరంజకత్వం కోసం కళలను, సంస్కృతిని ఉపయోగించడం ఈ దేశ ఆచారం కాదు. ఈ దేశ ప్రజలు ఏ కళని అభ్యసించినా, దాని ప్రయోజనం భగవంతుడిని చేరడమే. అది లేని నాడు ఆ జీవితానికి అర్థం లేదు. మీరు సంగీతమే తీసుకోండి. సంగీతమంటే కంఠాన్ని ఉపయోగించి పాడడం అనుకుంటాం. కానీ శాస్త్రం దీన్ని ఎలా చెబుతున్నదంటే... వాద్యంచ, నృత్యంచ, గీతంచ...సంగీతమదిముచ్యతే’ అంటున్నది. అంటే వాద్యం, గీతం, నృత్యం... ఈ మూడూ కలిస్తేనే సంగీతం.. అంటున్నది. అంతేతప్ప గొంతుతో పాడే పాట ఒక్కదాన్నే సంగీతమనలేదు. శబ్దాన్ని సహకారంగా తీసుకుని, భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరిస్తుంది...లేదా శబ్దాన్ని సృజిస్తుంది. శబ్దానికీ, ధ్వనికీ తేడా ఉంది. ధ్వని అర్థాన్నివ్వదు. పిల్లవాడు ఆడుకుంటూ నోటితో చేసే ధ్వనులకు అర్థం ఉండదు. ఏ అర్థాన్నీ సూచించకపోతే దాన్ని ధ్వని అంటారు. అర్థాన్ని ప్రతిపాదిస్తే దాన్ని శబ్దం అంటారు. సనాతన ధర్మం తాలూకు జీవం అంతా శబ్దం మీద ఆధారపడి ఉంది. వేదానికి కూడా శబ్దమనే పేరు. వేదాన్ని ‘శబ్దరాశి’ అని కూడా అంటారు. వేదంలో ఏ శబ్దానికి పట్టాభిషేకం చేసారో,..శబ్దబ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి..అని సరస్వతీ దేవిని ఎలా ప్రార్థన చేసారో, అటువంటి ఆ తల్లి స్వరూపమయిన శబ్దంలో సంగీతానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భారతీయ సంగీతపు చరమ ప్రయోజనం పరమేశ్వరుని చేరుకొనుటయే. అందుకే నాదోపాసన అంటారు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సంస్కృతి గుండెకాయ లాంటిది
కళల పరిపూర్ణస్థాయి కారణంగా ఒక సమాజపు, ఒక దేశపు సంస్కృతిని నిర్ణయిస్తారు. ‘కళ’ అన్న మాటకు అర్థం ‘వృద్ధి చెందునది’, ‘వృద్ధి చెందించునది’– అని. అందుకే చంద్రకళలు అంటాం. అది ప్రకాశిస్తుంది, ప్రకాశింప చేస్తుంది. పెరుగుతుంది, పెంచుతుంది. అటువంటి ‘కళ’ను – దేనికోసం సమాజం అనుష్ఠిస్తుంది? ఆ కళలవల్ల ప్రధానమైన ప్రయోజనాలు ఏముంటాయి? అసలు కళలు ఎందుకోసం సమాజంలో అనుష్ఠానం లోకి వచ్చాయి? వాటిని ఎందుకు నేర్చుకుంటారు? దేనికోసం వాటిని తప్పనిసరిగా జీవితాల్లో భాగంగా చేసుకుంటారు? వాటి ద్వారా ఏం ప్రతిపాదన చేస్తారు? ఒక కీర్తన పాడితే, ఒక నృత్యం చేస్తే, ఒక బొమ్మ గీస్తే, ఒక రాతిని చెక్కి శిల్పంగా మలిస్తే వాటి వెనుక ఏదయినా సందేశం ఉంటుందా? దేనికోసం చేస్తారు వాటిని? వాటికి ఆధారంగా ఏవయినా శాస్త్రాలు ఉంటాయా? అవి ఏవయినా ప్రతిపాదనలు చేస్తాయా? అవి ఏ భావనలను ఆవిష్కరిస్తాయి? ఒక వాద్యాన్ని మోగిస్తే దేనికోసం అలా చేస్తారు? అసలు ఎటువంటి వాద్యాలను మోగిస్తారు? ఎటువంటి వాద్యాలను, ఎక్కడ అనుమతిస్తారు? ఏవి వినవచ్చు, ఏవి వినకూడదంటారు? వేటిచేత ఎవరు కళలను అనుష్ఠానంలోకి తెచ్చుకున్నారో, ఎవరు వాటిని అభ్యసించారో, ఎవరు ప్రావీణ్యం సంపాదించారో వారిని కళాకారులని అంటారు. ఆ నైపుణ్యాలతో సమాజానికి ఏం అందించాలని వారు ప్రయత్నిస్తున్నారు? ఒక దేశంలో కళల సమాహార స్వరూపంగా ఉండి, అక్కడి సమాజానికి ఒక సందేశాన్ని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించే దానిని ఆ దేశ సంస్కృతి అంటారు. ఒక దేశంలో అందరూ సహృదయ సంపన్నులే ఉండరు. ఆ దేశం చాలా గొప్పదేశం అయి ఉండవచ్చు, గొప్ప సంస్కృతికి ఆలవాలం కావచ్చు, తిరుగులేని పరమ సత్యాన్ని ఆవిష్కరించి దాన్ని అక్కడి ప్రజలకు అందించే ప్రయత్నం చేసే కళాకారులున్న దేశమయి ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆ దేశంలో ఒక్కడుకూడా సంఘ వ్యతిరేకమయిన భావనలో ఉండడు అనీ, లేదా దుర్మార్గపు ఆలోచనలతో కూడుకున్నవాడు ఒక్కడూ కూడా ఉండడు –అనీ అధర్మపరులు అసలే ఉండరని సిద్ధాంతీకరించడం సంభవం కాదు. కానీ కొద్దిమంది అలా ఉంటే దోషభూయిష్టమైన పరిస్థితికి కారణం కాదా? వారి ప్రభావం సంస్కృతిపై పడదా? అంటే...వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు మొదట గుండె పరిశీలిస్తాడు. గుండె సక్రమంగా కొట్టుకుంటున్నదనుకోండి. మిగిలిన శరీర భాగాల్లో రుగ్మత ఏర్పడినా, వ్రణాలు ఏర్పడినా చికిత్సలతో వాటిని తొలగించడం ఆయనకు తేలిక. అసలు గుండే సరిగ్గా లేకపోతే, అసలా వ్యక్తే ఉంటాడన్న నమ్మకం లేకపోతే, ఇతర భాగాలకు వైద్యుడు చికిత్సలు అందించి ప్రయోజనం ఉండదు. గుండెకాయ లాంటిదే సంస్కృతి కూడా. సంస్కృతి వర్ధిల్లినంతకాలం, ఇది దేశంలో నిలబడినంతకాలం, వ్రణాల వంటి కొంతమంది దుర్మార్గులు బయల్దేరినా, శరీరానికి కలిగే పీడ సంబంధమైన వ్యాథులవంటి కొందరు దురాచార తత్పరులు ప్రవర్తించినా, దానికి వచ్చే దోషం ఏమీ ఉండదు. అది దిద్దబడుతుంది. సంస్కృతి నిలబడుతుంది. గుండెమీదే దాడి జరిగి దేశ సంస్కృతి ఛిన్నాభిన్నం అయిననాడు ఆ దేశ కీర్తి తరిగిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సత్సంగం.. సద్గ్రంథం
ప్రకృతిలో మరే జీవికీ లేని సౌలభ్యం ఒక్క మనుష్యునికే ఉన్నది. పుట్టుకతో ఒకవేళ స్వభావంలో దోషమున్నా, చెడు గుణాలున్నా, వాసనాబలంగా గతజన్మల నుంచి దోషభూయిష్టమైన విషయాలు మనసు పుచ్చుకున్నా రెండు కారణాల చేత అతను బుద్ధిని మార్చుకోగలడు. మంచి కార్యక్రమాలవైపు మనస్సును మళ్ళించగలడు. అలా అత్యంత ప్రభావవంతమయినవి, బుద్ధిని ప్రచోదనం చేయగలిగినవి, మనిషిని సత్కర్మాచరణవైపు నడిపించగలిగినవి రెండు ఉన్నాయి లోకంలో–ఒకటి సత్సంగం, మరొకటి–మంచి పుస్తక పఠనం. సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కూడిక. మనం ఏకాలంలో జీవిస్తున్నామో, ఆ కాలం లోనే కొంతమంది మహాత్ములు కూడా జీవిస్తుంటారు, మంచి గుణాలు కలిగిన కొంతమంది పెద్దలు జీవిస్తుంటారు, సమాజంలో లబ్ధప్రతిష్టులయినవారు, శాస్త్రాన్ని తెలుసుకుని, దానిప్రకారం అనుష్ఠానం చేసేవారు నిరంతరం శాంతికోసం పరితపించేవారు కనబడుతుంటారు. ప్రయత్న పూర్వకంగా అటువంటివారితో స్నేహాన్ని పెంచుకుని వారికి దగ్గరగా జీవించగలగడం, వారితో కలిసి ఉండడం... అనేది మన మనసును మంచి మార్గం వైపు మళ్ళించడానికి తోడ్పడుతుంది. కొన్ని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివి, మంచి విషయాలను బాగా మనసుకు పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో దానికి కోటి వంతు కాలంలో మార్పు తీసుకురాగలగినది–మంచి వ్యక్తులతో కలిసి ఉండడం. అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరంలో–‘‘సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’’ అంటారు. మంచి మనుషులతో కలిసి ఉన్నంత మాత్రం చేత అది విశేష ప్రభావాన్ని చూపుతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెబుతుండేవారు... ఏనుగు తనంతట తానుగా ఎవరికీ లొంగదు. కానీ మావటికి లొంగి ఉంటుంది. అయినా నడుస్తూ నడుస్తూ దారిలో కనిపించిన చెట్ల కొమ్మలను తొండంతో విరిచే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ మావటి దాని తొండంమీద చిన్న దెబ్బ వేయగానే తొండాన్ని దించేస్తుంది. అలాగే మంచివారితో కూడి ఉన్న కారణం చేత మనం కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. సమకాలీన సమాజంలో మంచి వ్యక్తులతో కలిసి జీవించడం ప్రయత్నపూర్వకంగా వారి స్నేహాన్ని పొందడం ఎంత గొప్ప లక్షణమో, మంచి పుస్తకాలు ఇంట్లో ఉండడం – అంతమంది మహాత్ములు ఇంట్లో ఉండడంతో సమానం. వివేకానందుడు రాసిన పుస్తకాలు, రామకృష్ణ పరమహంస ప్రవచనాలతో ఉన్న పుస్తకాలు, కంచి కామకోటి పూర్వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణాలు, శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్యవాక్కులు... ఇటువంటి మహాత్ముల మాటలతో కూడిన పుస్తకాలు ఇంట్లో ఉండడం అంటే అటువంటివారితో కలసి జీవించడంతో సమానం. మీరెప్పుడెప్పుడు అటువంటి వారినుండి నాలుగు మంచి మాటలు విందామని అనుకుంటున్నారో అప్పుడప్పుడు సిద్ధంగా ఉండి మీతో మంచి బోధలు చేయడానికి వాళ్ళు మీ ఇంట్లోనే కుర్చీ వేసుకుని సిద్ధంగా కూర్చోవడంతో సమానం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మనిద్దరం ఒకరికొకరం జీవితంలో కలిసి నడుద్దాం
మనకు శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది. ఏడు అడుగులు కలిసి నడిస్తే సఖ్యత సిద్ధిస్తుంది–అని. అందుకే వివాహంలో సప్తపది చేస్తారు. ప్రారంభంలోనే ఒక మాట అంటారు. మనిద్దరం ఏడడుగులు వేస్తున్నాం సఖీ–అని పిలుస్తాడు. ‘‘ఓ నెచ్చెలీ! మనిద్దరం ఒకరికొకరం జీవితంలో కలిసి నడుద్దాం. ఇదిగో నా చేయి పట్టుకో’’.. అని తాను ముందుండి భార్యను నడిపించాల్సిన వాడు కాబట్టి ఆయన ముందు నడుస్తాడు. ఆయన వెంట ఆమె నడుస్తుంది. వయసులో కొద్దిగా పెద్దవాడిని భర్తగా తెస్తారు. అనుభవం ఉన్నవాడు, పరిణతి ఉన్నవాడు కాబట్టి నడిపించగలిగినవాడై ఉంటాడు. కాబట్టి ఆయన చిటికెన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆమె నడుస్తుంది. ఏడడుగులు వేస్తూ మంత్రాలు చెబుతారు. ఒక్కొక్క మంత్రం చెబుతూ ఒక్కొక్కటి కోరుతారు. మొదటి అడుగు చేత ‘అన్నం సమృద్ధిగా లభించుగాక’తో మొదలుబెట్టి వరుసగా బలం లభించుగాక, కర్మ లభించుగాక, కర్మ వలన సౌఖ్యాలు లభించుగాక, యజ్ఞం చేసెదము గాక, రుతు సంబంధమైన సుఖాలన్నిటినీ అనుభవించెదము గాక, పశుసమృద్ధిని పొందెదము గాక...అని ఏడు రకాలయిన సమృద్ధులను కోరుతూ జీవితంలో ప్రస్థానం చేసి కలిసి మెలిసి అన్ని సుఖాలు అనుభవించి చిట్టచివరకు – ఈ సుఖాలు కూడా సుఖాలేనా అన్న వైరాగ్యాన్ని పొంది భగవంతుని పరిపూర్ణ అనుగ్రహానికి నోచుకోవాలి.హోమప్రక్రియలో భర్త .. ఎన్నడూ నీవు జుట్టు విరబోసుకుని, రొమ్ము బాదుకుంటూ ఏడవవలసిన పరిస్థితి కలుగకుండుగాక! నీవు సంతోషంతో పదిమంది బిడ్డలను కనెదవు గాక! నేను నీకు 11వ కుమారుడిగా అగుదును గాక’’ అంటాడు. ఎందుకు 11వ కుమారుడు అవడం? పదిమంది పిల్లల్ని కనీపెంచీ పెద్దచేసీ ఆమె అనుభవాన్ని పొందుతుంది. ఇంతమందిని వృద్ధిలోకి తెచ్చిన–ఆయన మాటను పిల్లలు వినకపోతే పక్కకు వెళ్ళి అలిగి కూర్చుంటాడు. అప్పుడు పిల్లలు –‘‘నాన్నగారు కోపం వచ్చి కూర్చున్నారు. చెబితే వినరు. ఇంకా ఎందుకు మీకీ తాపత్రయం? మేం పెద్దవాళ్ళమయ్యాం కదా.. నాన్నగారూ...’’ అని వాళ్ళు నాన్నగారితో మాట్లాడడానికి భయపడి పక్కకు వెడతారు. నువ్వు కూడా అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోకేం. చిన్నతనంలో పిల్లలు మారాం చేస్తే వారిని బుజ్జగించినట్లు నన్ను కూడా బుజ్జగించు. నన్ను 11వ కుమారుని చేసుకో. నీవు నాకు శాంతి స్థానంగా ఉండు’’ అని అడుగుతాడు భర్త. వివాహక్రతువులో స్త్రీపురుషుల మధ్య, వధూవరుల మధ్య అటువంటి పరిణతి కల్పించి దంపతులుగా వాళ్ళ జీవితం పండించుకోవడానికి కావలసిన సమస్త క్రతువుల సమాహారమే వివాహం. అటువంటి వివాహ వ్యవస్థను ఆదరించి, గౌరవించి ఆ మంత్రాలకు అర్థం తెలుసుకోవాలి... మంత్రభాగం మీద, శాస్త్రం మీద, క్రతువు మీద, పెద్దల మీద గౌరవాన్ని ఉంచి వివాహం చేసుకుంటే అది అభ్యున్నతికి కారణమవుతుంది. అటువంటి వైవాహిక వ్యవస్థ వైభవం ఈ దేశంలో మరింత ద్విగుణీకృతంగా ప్రకాశించాలని ఆ పరమేశ్వరుని పాదాలను పట్టి ప్రార్థన చేస్తున్నా. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వాటికయితే వారంటీలు అడుగుతాం కదా!
ఆయనకు దేవాలయానికి వెళ్ళడమంటే ఇష్టం. రామాయణ, భారత భాగవతాలు చదువుకోవడమంటే ఇష్టం. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం ఇష్టం. ఇప్పుడు ఆయనకు భార్యగా వచ్చే పిల్ల కంటికి అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. జీవితంలో సంతోషంగా గడపడానికి అవకాశం ఇవ్వదు. అందం కొంత కాలం ఉంటుంది. తరువాత జర్జరీ భూతమయిపోతుంది. ఆయన స్వభావానికి తగిన పిల్ల పక్కన ఉన్నప్పుడు ఆయన జీవితం పండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పిల్ల జీవితం కూడా. ఆ పిల్ల భక్తి కలిగిన పిల్ల. పూజలు చేసుకోవడం ఇష్టం. అతిథిని పిల్చి అన్నం పెట్టడం ఇష్టం. సాత్వికంగా మాట్లాడడం ఇష్టం. కానీ భర్త ధూర్తుడు. స్వార్థపరుడు. బాగా డబ్బున్నవాడనీ, బాగా చదువుకున్నవాడనీ ఇచ్చి పెళ్ళి చేసారనుకోండి. ఈ పిల్ల జీవితంలో సంతోషాన్ని ఎలా పొందుతుంది? అందుకే ఎవరికి ఎవరిని ఇచ్చి చేయాలో... స్వభావ పరిశీలన చేయగలవారు పరిణతి కలిగిన పెద్దలు. అదే శీల పరిశీలనం. అంటే పెద్దలు వారి నిర్ణయానికి శాస్త్రం చెప్పిన ప్రాతిపదికల్లో మొదటిది శీలం. మిగిలినవి వరుసగా వయస్సు, వృత్తం, అభివంజం, లక్షణం. మగపిల్లలకు ఆడపిల్లలకంటే ఎక్కువ వయస్సుండాలి. గురువుగా, దైవంగా భావించి భర్తను అనుగమించాలంటే తన భర్త అనుభవం రీత్యా పరిణతి గలవాడై ఉండాలి. వయస్సు ఎక్కువ అంటే ఏ పదో, ఇరవయ్యో అని కాదు. దాంపత్యజీవనం గడపడానికి ఎంత వయోభేదం ఉంటే ఉపయుక్తం అవుతుందో అంతే వయోభేదాన్ని పాటించాల్సి ఉంటుంది. తరువాత వృత్తం. అంటే నడవడి. ఆయనకు పంచె కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమెకు పంచెలు, ఉత్తరీయాలు నచ్చవు. దేవాలయాలకు వెళ్లడం ఇష్టం ఉండదు. మరో పిల్లకు తన అమ్మానాన్నలు తనతో ఉండాలనీ, తనను ఎప్పుడూ ప్రేమగా చూడాలని ఉంటుంది. మరొక ఆమెకు అత్తామామలు కూడా తమతోనే ఉండాలనీ, వారిని బాగా చూసుకోవాలని ఉంటుంది. మంచి నడవడిక కలిగిన వారు జీవిత భాగస్వామిగా వస్తే పదిమందికి ఆ దాంపత్యం ఆదర్శం అవుతుంది. ఘర్షణలకు అవకాశం ఉండదు. ఘర్షణ మొదలయితే అది వాళ్ళిద్దరితో, వాళ్ళపిల్లలతో, వాళ్ల కుటుంబంతో సరిపోదు. ‘‘మా ఇంట్లో మా అమ్మగారు, నాన్నగారు ఎప్పుడూ కీచులాడుకుంటూంటారు. మీ అమ్మగారిని, నాన్న గారిని చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో..బాబోయ్ ..మా అమ్మానాన్నలను చూస్తే భయమేస్తుంది’’ అని పిల్లలు అనే పరిస్థితి రాకూడదు. దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. చుట్టుపక్కల ఉండే పిల్లలకు, పెళ్లంటేనే భయపడి పారిపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. తరువాత చూడాల్సిన అంశం–అభివంజనము.. అంటే వెనక ఉన్న వంశం. ఉభయపక్షాల వంశ చరిత్రలలోని సానుకూలతలను బట్టి వియ్యమందాలి. చివరి అంశం – లక్షణం. అంటే ఒకరికొకరు తగినవారయి ఉండాలి. పెళ్ళికి వచ్చిన అతిథులు వధూవరులలో ఒకరిని చూసి మరొకరిపై జాలిపడేంత దయనీయంగా ఉండకూడదు. చూడచక్కని జంటగా కనిపించాలి. అంటే అంగసౌష్ఠవం, శరీరాకృతులు చక్కగా ఉండాలి. ఏదో ఒక ఫ్యాను, ఒక చేతి గడియారం కొనుక్కుంటేనే ఎన్నాళ్ళు పనిచేస్తుందని గ్యారంటీలు, వారంటీలు అడుగుతాం. అటువంటిది వంశంలో చిరస్థాయిగా కీర్తి పొందవలసిన ఇద్దరిని జత కూర్చాలంటే ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే వివాహాలు కుదిర్చేటప్పడు శాస్త్రం చెప్పిన ఈ ఐదు లక్షణాలను ప్రాతిపదికగా తీసుకుని పెద్దలు మాత్రమే జీవిత భాగస్వాములను నిర్ణయించాల్సి ఉంటుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పెద్దలు నిర్ణయించారు. కానీ...
పితృరుణం నుండి విముక్తి పొందడానికి ధార్మికమైన సంతానాన్ని పొందాలి... అంటే ఎవరు తన పక్కన భార్యగా లేదా భర్తగా కూర్చోవడానికి అధికారాలను పొందవచ్చో పెద్దలు నిర్ణయించిన తరువాత అటువంటి వారిని జీవిత భాగస్వామిగా ఆహ్వానించడం జరుగుతుంది. తద్వారా దంపతులయిన వారు ధార్మికమైన సంతానాన్ని పొందుతారు. ఇది మొదటి ప్రయోజనం. గహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత భార్యపక్కన ఉన్న కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు చేసి చిత్తశుద్ధి పొందడం, దేవతల రుణాన్ని తీర్చుకోవడం రెండవ ప్రయోజనం. భార్యలేని నాడు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అర్హుడు కాడు. ఉత్తరీయం ఎడమ భుజంమీద ఉండడానికి అర్హత ఉండదు. అలా ఉండాలంటే భార్య ప్రాణాలతో ఉండాలి. భార్య ఉంటే తప్ప తన కడుపున పుట్టిన కూతురికి కూడా కన్యాదానం చేయడానికి పీటలమీద కూర్చునే అధికారం ఉండదు. కాబట్టి తాను గృహస్థాశ్రమంలో ధర్మాన్ని నిర్వర్తించడానికి– ధర్మపత్ని అవసరం. భర్త సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం. ఆమె తన జీవితంలో అభ్యున్నతిని పొందడానికి, భగవత్ సేవగా భర్తసేవ చేయడానికి, అమ్మా అని పిలిపించుకుని స్త్రీగా పరిపూర్ణత్వాన్ని పొందడానికి వివాహం అవసరం. అందుకే ఈ మూడూ (పితృ రుణం, రుషిరుణం, దేవరుణం) వివాహానికి ప్రధానమైన ప్రయోజనాలన్నారు. ఈ పద్ధతిలో ఏ పురుషుడికి పక్కన భార్యగా ఎవరు కూర్చోవాలి, ఏ స్త్రీ పక్కన భర్తగా ఎవరు కూర్చోవాలి.. అనేది ఎవరు నిర్ణయించాలి? అది వారి కన్న తల్లిదండ్రులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కారణం– తమ కడుపున పిల్లల సమర్ధత ఏమిటో, మానసికంగా ఉన్న బలాలు, బలహీనతలు ఏమిటో వాళ్ళ పక్కన ఎవరు వచ్చి కూర్చుంటే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా పండుతుందో ఏ శాస్త్ర పరిశీలనం చేయకుండానే తెలుసుకుని సమన్వయం చేయగల సమర్థత జన్మతః సిద్ధించేది ఒక్క తల్లిదండ్రులకే. అందుకే నిర్ణయించాల్సింది ఎవరు అంటే... తల్లిదండ్రులు మాత్రమే. నేనీ మాట అంటున్నప్పుడు ... దానికి ఎంత మాత్రం రంగు అద్దే ప్రయత్నం చేయకూడదు. బయట సమాజంలో మనం చూస్తుంటాం. దానికి ఫలానా ఆయన అధికారి–అని అంటూంటారు. ఒకరికి శరీరంమీద కురుపు వచ్చింది, దానిని కోయాలంటే వైద్యుడే తగిన అధికారి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎం.ఆర్.ఓ నే సరియైన అధికారి. నేరం చేస్తే నేరస్థుడాకాదా అని దర్యాప్తు చేయడానికి రక్షక భటుడే దానికి అధికారి. అలాగే నాకు ఎవరు భార్యగా ఉండాలనేది, నాకు ఎవరు భర్తగా ఉండాలనేది నిర్ణయించేది నా తల్లిదండ్రులు. వాళ్ళే సరైన అధికారులు. ఇది శాస్త్రం కల్పించిన మర్యాద. దేశంలో మనం రూపొందించు కున్న చట్టాలను మనం ఎలా గౌరవించి పాటిస్తున్నామో అలాగే శాస్త్రం ప్రతిపాదించిన విషయాలను కూడా మనం శిరసావహించాల్సి ఉంటుంది. అలా కాని నాడు ఆ సమర్ధత తల్లిదండ్రులకు లేదని ఎత్తి చూపడం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రధానమైన అధికారులు. పెద్దలు నిర్ణయించారు కాన... అని శుభలేఖల్లో వేస్తుంటారు. పెద్దలంటే ఎవరు... శాస్త్రం తెలిసిన వారు. వారిని తల్లిదండ్రులు ఎందుకు సంప్రదిస్తారు... వారు దేన్ని ప్రమాణం చేసుకుని వివాహాన్ని నిర్ణయిస్తారు– అంటే.. శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం, లక్షణం... ఈ ఐదు విషయాలను పరిగణనలోకి తీసుకుని వారు నిర్ణయిస్తారు. -
తోడబుట్టినవారే తొలి బంధువులు
కిష్కింధకాండలో తార చేసిన ప్రసంగం చదువుతుంటే, తార మాట్లాడిన మాటలు వింటూంటే... అన్నదమ్ములన్న వాళ్ళు ఎలా బతకాలో, ఎంత ప్రేమగా ఉండాలో తెలుస్తుంది. సుగ్రీవుడొచ్చి పెద్ద అట్టహాసం చేసాడు. వాలి యుద్ధానికి వెళ్ళాడు. ఒంటినిండా దెబ్బలతో నెత్తురు కారుతుండగా సుగ్రీవుడు తిరిగి వెళ్ళిపోయాడు. ‘‘రామా ! నిన్ను నమ్ముకుని వెళ్ళాను. వాలిని సంహరిస్తానన్నావు. నెత్తురోడుతూ వెనక్కొచ్చా. ఎందుకెయ్యలేదు బాణం?’’ అనడిగాడు. మీరిద్దరూ ఒకేలాగా కనిపించారు. పొరపాటు జరుగుతుందని జంకా. గుర్తుకి నీమెడలో తామరమాలతో వెళ్ళు’’ అని గజ పుష్పమాలవేసి పంపాడు. సుగ్రీవుడు మళ్ళీ వెళ్ళి ‘‘అన్నయ్యా! బయటికి రా యుద్దానికి..’’ అని సింహనాదం చేసాడు. వాలి బయటకు వెళ్ళబోతున్నాడు. తార చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి..‘‘ఒక్కమాట చెబుతాను... సావధానంగా విను’’ అన్నది. ‘‘ఎవరి మీద యుద్ధానికి వెడుతున్నావు. నీ తమ్ముడి మీదనే కదా. ఎవరు నీ తమ్ముడు? ఒక్క తల్లికి, ఒక్క తండ్రికి... ఒక చెట్టుకు పూసిన పూలలాంటి వారు, రెండు కాయల లాంటి వారు మీరిద్దరు. ఎడమ చేయి, కుడిచేయి వేరవ్వచ్చు. కానీ అవి ఒకే దేహానివి. ఇవి రెండూ ఎప్పుడూ కొట్టుకోవు. ఒక చేతికి నొప్పెడితే దాని పని కూడా రెండో చెయ్యి చేస్తుంది. ఒకవేళ నీ తమ్ముడు తప్పుచేసాడే అనుకో. దానికంతగా నెత్తురు కారేటట్లు కొట్టాలా? ఇద్దరూ వీథికెక్కి గదాయుద్ధం చేసుకోవాలా? ఇద్దరూ శక్తిమంతులే కదా. ఒక్కటై నిలబడితే మిమ్మల్ని నిలువరించేవారున్నారా? మీ ఐక్యతను చూసి లోకం ఎంత సంతోషిస్తుంది ?’’ ‘‘ఎందుకయ్యా తమ్ముడితో యుద్ధం చేస్తావు! వానరుడేగా. పైగా తమ్ముడు. తెలిసీ తెలియని వాడు. చిన్నవాడు. తమ్ముడంటే కొడుకులాంటివాడు. తప్పుచేసినట్లు అనిపిస్తే..మందలించు. అయినా వాడే దూరంగా జరిగిపోయాడనుకో. వాడి ఖర్మ. కానీ నీ దగ్గరకొచ్చాడుగా. కొట్టకు. అనునయించు.’’ ‘‘పైగా మరొక్కమాట. నీ చేతిలో చావుదెబ్బలు తిన్నాడా.. అంత నెత్తురు కక్కాడా.. మళ్ళీ వెంటనే వచ్చి సింహనాదం చేస్తున్నాడంటే ఏదో కారణం లేకుండా ఎందుకొచ్చాడు... ఏదో బలం చూసుకోకుండా ఎందుకొచ్చాడు.. నా మాట విను ఏదో ఉంది. నీకు తెలియదు. తొందరపడొద్దు. మీ ఇద్దరి జగడంవల్ల ఆఖరికి ఇద్దరిలో ఒకరే మిగిలిపోతే, మిగిలిన వారు ఎంత ఏడ్చినా రెండవ వారు రారుగా... అలా ఒకర్నొకరు కొట్టుకుని చచ్చిపోకూడదు. తప్పు. తమ్మణ్ణి లాలించు. లోపలికి పిలువు. పిలిచి–‘ఇప్పుడే కొట్టాను. బుద్ధి రాలేదా...మళ్ళీ యుద్దానికి ఎందుకొచ్చావు’ అని అడుగు. నేను వదిననేగా. నాకు బిడ్డడు లాంటివాడే కదా. నచ్చచెప్పడానికి నాకూ అధికారముందిగా... లోకంలో అందరికన్నా బంధువన్నవాడు ఎవరో తెలుసా? తోడబుట్టినవాడే బంధువు. ఎందుకయ్యా తమ్ముడి మెడలు విరిచేస్తానంటావు. లోపలికి పిలువు.. చక్కగా మాట్లాడుకోండి.’’ ‘‘గూఢచారులను పంపి తెలుసుకున్నా. మీ తమ్ముడు రామచంద్రమూర్తితో ఒప్పందం చేసుకున్నాడు. రాముడు అరివీర భయంకరుడు. ఆశ్రయించినవాడిని కాపాడతానని రాముడు కూడా ప్రతిజ్ఞ చేసాడు. తొందరపడి యుద్ధానికి వెళ్ళకు. మీరిద్దరూ పగలు పెంచుకుని ఒకర్ని ఒకరు చంపుకుంటే అక్కరలేని ప్రమాదం వస్తుంది. నాథా! నా మాట విను. తమ్ముడిని పిలువు’’ అంది. తార మాటను తోసిరాజని వెళ్ళిపోయాడు వాలి. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పుట్టిన రోజు
ఎవరికయినా సరే, పుట్టినరోజు అత్యంత ప్రధానమైన పండగ. శాస్త్రంమీద గౌరవం ఉన్న వాళ్ళు ‘నేను పుట్టినరోజు పండగ చేసుకోను’ అని అనకూడదు. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్పరోజు అది. అందుకే ఆరోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు. ఎవరికయినా ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది. కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టిన రోజులతోపాటూ తను పుట్టిన రోజు కూడా ఉంటుంది. ‘‘అమ్మా! ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు’’ అని చెప్పారు డాక్టర్లు మా అమ్మకు. దానికి మా అమ్మగారన్నారట...‘‘వాడు బతికితే చాలు, నేను ఉండకపోయినా ఫరవాలేదు’’ అని. కానీ ఈశ్వరానుగ్రహం, నా అదృష్టం– ఆవిడ బతికింది, నేనూ బతికాను. మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి, జారి కిందపడి బతికిన రోజు మా అమ్మకది. అంటే మా అమ్మకు అది మరో పుట్టిన రోజేగా... అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజు అమ్మకు మరో పుట్టిన రోజవుతుంది. అందుకే పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి? అమ్మకు కొత్త చీర పెట్టి, నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్తబట్టలు కట్టుకోవాలి. అది మర్యాద. సంస్కారవంతుల లక్షణం. అమ్మ సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె బ్రహ్మ. తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది.. అందువల్ల ఆమె స్థితికర్త. ఓ గైనకాలజిస్టు ‘మాతృదేవోభవ’ పేరుతో ఒక పుస్తకం రాసారు. దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో ‘కొలోస్ట్రమ్’ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఊరుతుంది. గర్భసంచీలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు, అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది. అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల, గుండె పనితనాన్ని మందగింపచేస్తుంది. ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్తన్యమిచ్చినప్పుడు ఆ కొలోస్ట్రమ్ బిడ్డ కడుపులోకి వెళ్లి లోపల అడ్డుపడిన నల్లటి మలం బయటకు వచ్చేసి వాడు ఆయుర్దాయం పొందుతాడు. అందుకే అమ్మ స్థితికర్త. అమ్మ ప్రళయ కర్త కూడా. ప్రళయం అంటే చంపేయడం కాదు. నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం. పరమేశ్వరుడు చేసే మహోత్కృష్టమైన క్రియల్లో అదొకటి. అన్ని ప్రాణులకు నిద్రనిస్తాడాయన. అవి నిద్రలో సుఖాన్ని పొందుతాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు... ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అని మొదటి నమస్కారాన్ని అందుకుంటుంది. అమ్మతనం కేవలం స్త్రీయందే ప్రకాశిస్తుంది. అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసినవాడు హింసింపబడి, నశించిపోతాడు. దేవీ భాగవతంలో అమ్మవారి మహిషాసుర మర్దని స్వరూపం అది. ఎక్కడ ఎవడు ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరిస్తాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. -
ఆడతనం కాదు... అమ్మతనం చూడాలి
తండ్రికన్నాకొడుకు శరీరం వేరు, కూతురు శరీరం వేరు. కానీ యదార్థానికి అమ్మకన్నాకూడా బిడ్డ శరీరం వేరు కాదు. నా గోరు తీసి అక్కడ పెట్టాననుకోండి... నానుంచి వేరుచేసినా అది నా గోరే. మనం అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాం. అమ్మ తిన్న అన్నంలోంచి ఈ సప్త ధాతువులు వచ్చాయి. ప్రసవ వేదనపడి, ఎంత కష్టపడి ఈ శరీరాన్ని కన్నదో.. అమ్మ శరీరం లోని ఒక అంతర్భాగం బయటికొచ్చింది తప్ప... గోరు ఊడివచ్చినా అది నాదే అయినట్లు, అమ్మ శరీరంలో ఒక ముక్క ఈ శరీరం కాబట్టి ఇది ఎప్పటికీ మన అమ్మదే తప్ప మనది మాత్రం కాదు. అందుకే అమ్మ అమ్మే. అబ్దుల్ కలాంగారు రాష్ట్రపతి పదవిని చేసి దేశానికి ఖ్యాతి తెచ్చినవాడు. అలాంటి శాస్త్రవేత్త తన స్వీయ రచన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’కి ఉపోద్ఘాతం రాసుకుంటూ ...‘‘అమ్మా! రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు తినడానికి రొట్టెలు లేని రోజుల్లో నేను వచ్చి రొట్టెలు తింటుంటే... నీవు పెడుతూ పోయావు. రుచిగా ఉన్నాయని నీవు చేసినవన్నీ తినేసాను. అన్నయ్య వచ్చి – అసలే యుద్ధంతో గోధుమలు దొరకడం లేదు, రుచిగా ఉన్నాయని నువ్వు తినేస్తుంటే అమ్మ తను తినకుండా అన్నీ నీకు పెట్టేసింది. ఈ రాత్రికి అమ్మ పస్తుండాలి. చూస్కోక్కరలేదా...అమ్మా! నీకున్నాయా అని అడగక్కరలేదా’’ అని కోప్పడ్డాడు –అయ్యో, అమ్మా! నువ్వు తినాల్సినవి కూడా నేనే తినేసానా – అని బేలగా నీకేసి చూస్తుంటే... నీవు చటుక్కున వంగి నా రెండు బుగ్గలమీద ముద్దు పెట్టుకుని –నాన్నా! నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా– అన్నావు. నువ్వు నా కడుపు తడుముతూ పెట్టిన రొట్టెలతో ఏర్పడిన ఈ శరీరం ఈ దేశానికి ఎంత సేవ చేయాలో అంత సేవా చేసిందమ్మా, చేస్తూనే ఉంటుంది. భగవంతుడు అంతిమమైన తీర్పిచ్చే రోజు ఒకటి వస్తుందమ్మా. అప్పుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడున్నా మొట్టమొదట వచ్చి నీ పాదాల దగ్గర వంగి నమస్కారం చేస్తానమ్మా’’ అని రాసుకున్నారు. అమ్మ అన్నమాటలో అంత త్యాగం ఉంది. లోకంలో ఎవరయినా ఏదయినా పదార్ధాన్ని వండి పెట్టారనుకోండి. మనం దానిని తినకపోతే..‘‘ఏవండీ మీరు వంకాయ కూర తినరా’’ అని అడుగుతారు. అదే అమ్మయితే అలా అనదు...‘‘ఏం నాన్నా, బాగా వండలేదా... తినలేదే... రెండో సారి కూడా వడ్డించుకోలేదు. బహుశః కాయలు బాగా లేవేమో, కనరొచ్చాయి ఉంటాయి. నేను బాధపడతానని చెప్పడం లేదు కదూ, రేపు జాగ్రత్తగా చూసి వండుతాలే..’’అని తెగ బాధపడిపోతుంది. అమ్మలా సాకగల వ్యక్తి లోకంలో మరొకరు లేరు. ఆ అమ్మతనం ఎక్కడుందీ అంటే అమ్మతనంలోనే ఉంది. లోకంలో ఆడతనాన్ని మాత్రమే చూసినవాడు దుర్మార్గుడు. అమ్మతనాన్ని చూసినవాడు ధన్యజీవి. ఆడతనం చూసిన వాడు పాలగిన్నె కింద మంట పెట్టిన వాడు. వాడి మనసు పొంగుతుంటుంది. అమ్మతనం చూసినవాడు పొంగుతున్న పాలమీద నీళ్ళు చల్లుకున్నవాడు. మనిషికి సంస్కారం వచ్చేది–ఆడతనంలో అమ్మతనం చూడడంలోనే. అమ్మతనం చూడకుండా ఆడతనం చూడడం దౌర్భాగ్యం. ఈ జాతి అమ్మతనాన్ని ప్రబోధం చేసింది తప్ప ఆడతనాన్ని బజారుకెక్కించుకున్న తత్త్వం ఈ దేశానిది కాదు. ‘‘అటువంటి స్థితి ఈ దేశానికి కలుగకుండా రోజులు సంస్కరింపబడుగాక’’ అని పరమేశ్వరుడిని ప్రార్థించడం మినహా చేయగలిగిందేమీ లేదు. -
మాతా... వందనం
95 ఏళ్ళు వచ్చాయి. ఒళ్ళు బాగా ముడతలు పడిపోయింది. బొమ్మలా చిన్నదిగా మంచంలో ముడుచుకుని పడుకుని ఉంది. రాత్రి 11 గంటలకు కొడుకు ఇంటికి వచ్చి భోజనానికి కూర్చుని రెండు నిమిషాల్లో లేచి పోయాడు. పక్కగదిలో పడుకుని ఉన్న అమ్మ కొడుకుని పిలిచి ‘‘నాన్నా, రెండుమూడు రోజుల్నించి ఇలాగే వస్తున్నావురా, రెండు మూడు నిమిషాల్లో భోజనం ముగించేస్తునావురా... ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా?’’ అంటుంది. వడ్డించక్కరలేదు. వాడు కంచం దగ్గరినుంచి లేచిపోయిన సమయాన్ని బట్టి తల్లి తల్లడిల్లిపోతుంది. దురదృష్టం అంటే... జీవితంలో అమ్మ పోయిననాడే. అమ్మ ఉన్నన్నాళ్ళూ ఓదార్పుకు లోటులేదు. 60 ఏళ్ళు దాటిన కొడుకయినా జ్వరం వచ్చిందని తెలిసి వాడిని దగ్గరికి పిలిచి బొటన వేలితో విభూతి పెట్టి ‘‘చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం’’ అంటూంటే అమ్మ దగ్గర లభించిన ఆ ఓదార్పు ప్రపంచంలో మరెక్కడయినా లభిస్తుందా? అమ్మ శరీరం పడిపోయిన తరువాత అమ్మ కట్టి విప్పిన చీరలను బొంతగా కుట్టుకుని పడుకున్నా సేదదీరుతుంది. అమ్మ కట్టివిప్పిన బట్టకు కూడా అంత ప్రేమ. అది కూడా అంత ఓదార్పునిస్తుంది. అమ్మవేసుకుని విప్పిన చెప్పులు, కళ్ళజోడు వాటిని చూసేటప్పటికి మనసు ఆర్ద్రతను పొందుతుంది. అమ్మలాంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉండదు. అందుకే జగన్మాత అంతటిది కూడా తల్లిని తీసేయవలసి వస్తే బెంగపెట్టుకుంటుందట. వీడు ఇక అమ్మా అని పిలిస్తే నేనేమని జవాబు చెప్పాలి. అలాగని అమ్మచేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు. బిడ్డచేతిలో అమ్మే వెళ్ళిపోవాలి. ఒక్క అమ్మను నేను నీ నుండి తీసేయాల్సి వస్తే ముగ్గురు అమ్మలను చూపించి అప్పుడు తీసేసుకుంటానంటుందట. ‘ఒరేయ్, నేను నీకు భూమాతనిచ్చాను. ఈ తల్లి కూడా తల్లే. నువ్వు ఎక్కడున్నా ఈ అమ్మ ఒడిలోనే ఉంటావ్’ అని ఈ అమ్మనిచ్చింది. తరువాత దేశమాత. ఈ దేశానికంతటికీ అధిష్ఠానం ఉంది. అది దర్శించారు దేశభక్తులు. ఇది ఈ దేశ రుషి సంప్రదాయం. ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు. ‘వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ అన్నాడు బంకించంద్ర ఛటర్జీ. ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు ఎటువంటి వాడో నా దృష్టిలో బంకించంద్ర ఛటర్జీ కూడా అటువంటివాడే. అలా దేశాన్నంతటినీ కూడా ఒక తల్లిరూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు. అలా భూమాతను, దేశమాతను, గోమాతను ఇచ్చాను. అంత వృద్ధాప్యంలో కూడా పుట్టినరోజునాడు వణికిపోతున్న చేతుల్తో తలమీద చెయ్యిపెట్టి అక్షింతలు వేసి లడ్డు చేతిలో పెట్టి తిను అనడం కాదు, ఏదీ నోరు తెరు అని నోటిలో పెట్టి నువ్వు తింటూ ఉంటే సంతోషపడే అమ్మ లేదని రేప్పొద్దున నన్ను నింద చేస్తావేమో, అందుకే నీకు గోమాతని ఇస్తున్నాను’’అంటుందట జగన్మాత. ‘‘పుట్టినరోజునాడు ఆవుపాలు తాగు. అవి తాగితే ఎప్పటికీ నీవు అమ్మ చేతి ముద్ద తిన్నవాడివే అవుతావు’’అని ఒక్క అమ్మను తీసుకోవలసి వస్తే ముగ్గురు అమ్మల్ని చూపించి... ఆ పైన...‘మీ అమ్మ ఎక్కడో లేదు.. నాలోనే చేరింది. నా దగ్గరకు వచ్చి నీవు చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తా’ అంటుందట. అమ్మ అన్నమాట అంత గంభీరం. -
అమ్మ.. బ్రహ్మ
అమ్మ పరబ్రహ్మం. వేదం అందుకే ‘మాతృదేవోభవ’ అంటూ మొదటి నమస్కారం అమ్మకే చేయించింది. అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రిని పరబ్రహ్మంగా చెప్పడం చాలా కష్టం. నమశ్శంకరాయచ..అంది యజుర్వేదం. అన్నివేళలా బిడ్డల సుఖం కోసం ఆరాటపడతాడు కనుక ఈ భూమిమీద తిరుగాడుతున్న శివ స్వరూపం తండ్రి. అంతవరకే. కానీ తల్లి పరబ్రహ్మ స్వరూపం. బిడ్డ పుట్టడానికి తల్లి తన గర్భాన్ని గర్భాలయం చేస్తుంది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. From womb to tomb, she is the most innocent lamb..అని. తల్లి కడుపు దగ్గరినుంచి సమాధి వరకు ఆమె స్పర్శ లేకుండా అసలు జీవనం సాగదు. అంత రాశీభూతమైన అమాయకత్వం. ఏ ప్రతిఫలాన్ని కోరదు. అమ్మ దగ్గర పిల్లలు సేదదీరినట్లుగా లోకంలో మరెక్కడా సేదదీరలేరు. అందుకే శంకరాచార్యులంతటివాడు అయ్యవారి స్తోత్రం చేస్తూ ‘శివానంద లహరి’ అని, అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ‘సౌందర్యలహరి’ అన్నారు తప్ప ‘అంబానంద లహరి’ అనలేదు.సౌందర్యం.. అన్నమాటకు అర్థం బాహ్యంలో శరీరంలో ప్రకాశించే అందం కాదు. అది ఈవేళ ఉంటుంది. ఒక దుర్ఘటన జరిగితే పోతుంది. అందుకే –‘‘మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా’’ అని అంటారు శంకర భగవత్పాదులు. అమ్మది అందం కాదు...సౌందర్యం. అది ఎంత వయసొచ్చినా పెరుగుతుంది తప్ప తరిగేది కాదు. అమ్మ కడుపులో ఉండగా నాభీ బంధం. అమ్మ తాను తిన్న అన్నసారాన్ని నాభిద్వారా బిడ్డకు అందిస్తుంది. కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చిన తరువాత నాభి కోస్తారేమోకానీ హృదయబంధం అలాగే నిలబడి పోతుంది. ఈమె నా తల్లి. వీడు నా బిడ్డడు. ఆ సంబంధం పోదు. చిట్టచివరకు ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, నాగ, కుర్మ, క్రౌకార, ధనంజయ, దేవదత్తములనబడే పది వాయువులలో వ్యాన వాయువు శిథిలమైన ఆస్తిమీద యాజమాన్యపు హక్కు పెట్టుకున్నట్లు శరీరాన్ని ఆశ్రయించి ఉండిపోతుంది...అంటే ఏదో పాడుపడిపోయిన ఒక భవనం ఉంది. దాన్ని ఎవరయినా ఛటుక్కున అమ్మేస్తారేమోనని ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక ఫలకం పెట్టినట్లు... శరీరంలోంచి జీవుడు వెళ్లిపోయినా ఈ శరీరం నాది అని ఒక అభిమాన దేవత ఉండిపోతుంది. అదెప్పుడు పోతుందో తెలుసా... కడుపున పుట్టిన కొడుకు శ్మశానంలో ఆనంద హోమం చేసి ‘‘పిచ్చి అమ్మా! ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది, ముసలిది అయిపోయిందమ్మా ... ఎందుకూ సహకరించదు. దానిలో ఎందుకుంటావ్... మా మీద మమకారంతో కదూ... అమ్మా, మేం యోగ్యమైన మార్గంలో నడుస్తున్నాం. నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలో ప్రవేశించు’’–అని కొడుకు ప్రార్థన చేస్తే వ్యాన వాయువు వదిలిపెడుతుంది. అంటే అమ్మకూ, బిడ్డలకూ ఉండే అనుబంధం ఎంత గాఢంగా ఉంటుందో చూడండి. మాతృత్వంలో ఉండే అద్భుతం అటువంటిది. ఆమె పడని కష్టం ఉండదు. కాలు ఎక్కడ జారుతుందేమో నన్న భయంతో లోపల పెరుగుతున్న పిండంపట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. లోపల భయంకరమైన పంజరం తయారయి సప్తధాతువులు–చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఏర్పడు తుంటే... జీవుడు అందులో ప్రవేశిస్తుంటే... కాలు పెట్టి పిల్లవాడు లోపల కడుపులో తంతే... కిలకిలా నవ్వుతూ.. తన అమ్మతో–‘‘చూడమ్మా! ఇక్కడ వాడు తంతున్నాడమ్మా’’ అని పొంగిపోతుంటుంది. ఫలితం ఆశించని అమ్మ– ‘సౌందర్యం’ అన్న మాటకు పర్యాయపదమయింది. -
త్యాగశీలవమ్మా..!
కోడిపెట్ట అల్పప్రాణి. మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికోడికి అంత ఆనందంతో భరించేదయి ఉంటుంది. కోడిగుడ్డు లోపల పిండం ఉంటుంది. దాన్ని గట్టిగా నొక్కితే పెంకు పగిలిపోయి లోపల ఉన్న పిండం స్రవించి కిందకు జారిపోతుంది. అదే తల్లికోడి కదిలివచ్చి... చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు పెంకు పగిలిపోకుండా దాని కడుపును ఆన్చి దాని శరీరంలోని వేడిని పెంకు ద్వారా పిండానికి అందించి, పొదగబడుతున్న పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోందనే ఆనందాన్ని పొందిన ఆ కోడి ఆ క్షణాల్లో ఎంతగా తన్మయత్వం చెందుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే రామకృష్ణ పరమ హంస ఏమంటారంటే – గుడ్డును పొదుగుతున్న కోడిపెట్ట బొమ్మ గీయగలరేమో గానీ గుడ్డులో పిండం పిల్లగా తయారవుతున్నప్పుడు పొదుగుతున్న తల్లి కోడిపెట్ట కళ్ళల్లోని ఆనందాన్ని ఆవిష్కరించగలిగిన చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టలేదు–అని. పిల్లలు పుట్టిన తరువాత రెక్కల కింద పెట్టుకుని కాపాడుతుంది. ఎక్కడెక్కడ తిరుగుతూ ఆహార సేకరణలో నిమగ్నమై ఉన్నా మధ్యమధ్యలో తలఎత్తి ఆకాశం వంక గద్దలేమైనా వస్తున్నాయేమోనని ఒక కంట కనిపెట్టి ఉంటుంది. నిజంగా గద్ద వస్తే కోడి ఎదుర్కోగలదా! ఎదుర్కోలేదు. కానీ గద్ద కిందకు దిగుతున్నదనిపించిన వెంటనే రెక్కలు విప్పి ఎంతో బాధతో పిల్లల్ని చేరదీసి రెక్కల కింద కప్పేస్తుంది. అంటే దాని ఉద్దేశం–ఒకవేళ గద్ద తన వాడిముక్కుతో పొడిచినా, గోళ్ళతో చెణికినా అది తనకే తగలాలి, తాను చనిపోవాలి... తాను చనిపోయిన తరువాత పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను బతికి ఉండగా మాత్రం తన పిల్లల్లో ఒక్క దానికి కూడా హాని కలగకూడదు. అంటే తాను ప్రాణత్యాగానికి సిద్దపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం తన ప్రాణం కాపాడుకోదు. లోకంలో ఎవరయినా తల్లుల త్యాగానికి ఉదాహరణ చెప్పవలసి వస్తే కోడి రెక్కలకింద పెట్టి పెంచినట్టు ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది–అంటారు. అశుద్ధాన్ని, అమలినమైన పదార్థాలను తినే పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకు వరుసలో ఉన్న సిరములనన్నిటినీ ఇచ్చి వాటి కడుపునిండుతుంటే తాను తృప్తి పొందుతుంది. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది. పుట్టలమీద మొలచిన గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీళ్లు తాగుతుంది. ప్రశాంతంగా కూర్చుని నెమరు వేసుకుంటుంది. అంటే కడుపులోకి పంపిన ఆహారాన్ని మళ్ళీ వెనక్కి నోట్లోకి తెచ్చుకుని తీరికగా నమిలి మింగుతుంది. ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతిపెట్టి నాలుగుమార్లు కుదిపితే తాను కష్టపడి నిల్వ చేసుకున్న పాలను విడిచి పెట్టేస్తుంది. ఆహారాన్ని వెనక్కి తెచ్చుకున్నట్లుగా... ఒకసారి దూడకు వదిలిన పాలను అది వెనుకకు తీయదు, తీయలేదు. సమస్త ప్రాణుల్లో ... ముఖ్యంగా స్త్రీలలో ఉన్న ఈ మాతృత్వం ఒక అద్భుతం. అందుకే వేదం ఆమెకు అంత ప్రాధాన్యతనిచ్చింది. -
శరమ... ఒక మెరుపు
శరమ రాక్షస స్త్రీ. విభీషణుడి భార్య. శరూషుడు అనే గంధర్వుడి కుమార్తె. రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది. కానీ ఒక పెద్ద మెరుపు. విభీషణుడు ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ చతుర్ముఖ బ్రహ్మని ఉద్దేశించి తపస్సు చేసారు. బ్రహ్మ ప్రత్యక్షమవగానే ఒక్కొక్కడు ఒక్కొక్క వరం కోరాడు. ‘‘మనసు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండుగాక!’’ అని విభీషణుడు కోరగా బ్రహ్మ తథాస్తన్నాడు. అందుకే తప్పు చేస్తున్నావని చెప్పినా వినని రావణుడు రాజ్యబహిష్కారం విధిస్తే, విభీషణుడు ధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళిపోయాడు. అప్పుడు విభీషణుడి భార్య ఏం చేయాలి .. ఆమె కూడా ఆయన వెంటే వెళ్ళిపోవాలి. కానీ ఆమె వెళ్ళలేదు. భర్తమీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. తన భర్తకు దూరమైన మరొక స్త్రీ దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడివల్ల కష్టాలు పడుతుంటే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహా పాపం–అని భర్తతో వెళ్లిపోవడం కన్నా, ఇక్కడే ఉండిపోతానని ప్రాణాలకు తెగించి ఉండిపోయింది. యుద్ధం ప్రారంభమవుతుందనగా రావణుడు సీతమ్మ దగ్గరకు వెళ్లాడు...‘‘సీతా! నిన్న రాత్రి రామ లక్ష్మణులు పలువురు వానరులతో కలిసి వచ్చి సముద్రపు ఒడ్డున విడిది చేసారు. నా సేనాధిపతి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్న రాముని శిరస్సును కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణుడు కూడా పారిపోయాడు. రాముడి శిరస్సును నా సైన్యం తీసుకొచ్చింది... ఇదిగో చూడు’’ అని ఒక రాక్షసుడిని పిలిచి తల అక్కడ పెట్టు అన్నాడు. ఇంద్రజాల మహిమ ఎంత గొప్పగా ఉందంటే సీతమ్మ కూడా దిగ్భ్రమ చెందింది. ‘‘చూసావా ధనుస్సు. ఈ కోదండం పట్టుకునే కదా నన్ను సంహరిస్తాడన్నావు... ఈ రాముణ్ణి నమ్ముకునే కదా నా పాన్పు చేరలేదు. రాముడి తల తెగిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు’’ అన్నాడు. సీతమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఆ సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేరక్కడ. అంత శోకంలో ఎవరికయినా మనసు పనిచేస్తుందా... తను కనబడితే చంపేస్తాడని తెలిసినా సరే, నిర్భయంగా శరమ ఆకాశంలో నిలబడింది. రావణుడు చూడలేదు. ఈలోగా ఎవరో వచ్చి రమ్మంటే రావణుడు అటు వెళ్ళాడు. ఆమెను చేరిన శరమ ‘‘అమ్మా సీతమ్మా ! బెంగపెట్టుకోకు. అదంతా రావణుడి మాయ... నేనిప్పుడు ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తిని చూసి వచ్చాను. అయినా రాముడికి విశ్వామిత్రుడి వరం ఉంది కదా. ఆయనకు శ్రమ ఉండదు, జ్వరముండదు. నిద్రపోతున్న ఆయనను ఎవరూ సంహరించలేరు... అటువంటిది ఈ ధూర్తు్తడు ప్రహస్తుడు చంపగలడా... నన్ను నమ్ము... రాముడు పరమ సంతోషంగా ఉన్నాడు’’ అంది. అయినా ఊరడిల్లని సీతమ్మ రావణుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మంది. వెళ్ళి వచ్చిన శరమ ‘‘అమ్మా ఇప్పుడు విను. అవిగో నగారాలు మోగుతున్నాయి...అవిగో భేరీల శబ్దాలు.. యుద్ధసంరంభం జరుగుతున్నది. నిజంగా రావణుడు చెప్పినదే నిజమయితే రాముడు నిహతుడు అయిన తరువాత ఇంకా యుద్ధం ఏముంటుంది? అమ్మా నన్ను నమ్ము. ఉపశాంతికోసం నీ భర్త విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యక్ష దైవమయిన సూర్యుణ్ణి ఉపాసించు’’ అంటూ ఎలా చేయాలో ఉపదేశించింది. అంతటి త్యాగమూర్తులు ఈ దేశ స్త్రీలు. ఇవి కాల్పనిక కథలు కావు. ఇతిహాసాలు. పరమ సత్యాలు. -
ఈ కడుపుకోత ఇంకో తల్లికెందుకు!
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు. అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడి ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా! రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. అది చూసిన అశ్వత్థామ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేసాడు. ఏనుగుల కుంభస్థలాలు బేధించాడు. గుర్రాల్ని చంపేసాడు. ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేసాడు. ఇన్నీ చేసాక అర్జునుడు గుర్తొచ్చాడు. ఐదుగురి కొడుకులను చంపానని తెలిస్తే నన్ను బతకనీయడనుకుని పారిపోయాడు. మరునాడు ద్రౌపదీ దేవి ఏడుస్తున్నది. పాండవులు తిరిగొచ్చారు. అంతకన్నా కష్టం లోకంలో మరొకటి ఉంటుందా ఏ స్త్రీకయినా! ముందు ఐదుగురి శవాలు పెట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది.. ‘నీ కొడుకులను తెగటార్చిన వాడిని పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పారేస్తా, నీ ఇష్టమొచ్చినట్లు శిక్షించు’ అన్నాడు అర్జునుడు. అన్నట్లే అశ్వత్థామను పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేసాడు. వీడే నీ పుత్రులను చంపినవాడు, నీ కాలుతో వీడి తల తన్ను– అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామ దగ్గరకు వెళ్లి–అయ్యా! నా కొడుకులు యుద్ధభూమికి రాలేదు.కవచం కట్టుకోలేదు. ఏ అస్త్ర ప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రి కబళించేసావా? నీకు చేతులెలా ఆడాయి?’ అంది. ఐదుగురు భర్తలు నిలబడి ఉన్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ.. అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ఆవిడ ఏమన్నదో తెలుసా...‘కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా. ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేసాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడయినా ఉంటే–అది సనాతన ధర్మంలో మాత్రమే. -
ఈ జీవితానికి ఈ కష్టాలు చాలు
కుంతీదేవి పడిన కష్టాలు అటువంటి ఇటువంటివి కావు. ఇన్ని ఉత్థాన పతనాలు చూసినా ఎన్నడూ ధర్మం వదిలి పెట్టలేదు. అయినా పరిస్థితులు ఆమెకు ఎప్పుడూ అగ్నిపరీక్ష పెడుతూనే వచ్చాయి. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చదువుతూ నువ్వులు, నీళ్ళు వదులుతున్నారు. ఫలానా వీరుడి పేరు చదవగానే ధర్మరాజు ‘నాకు చెందిన వాడు’ అని ధర్మోదకాలు వదిలాడు. మరొక వీరుడి పేరు చెప్పగానే ‘నాకు చెందిన వాడు’ అని ధృతరాష్ట్రుడు నీళ్ళు నువ్వులు వదిలాడు... కార్యక్రమం ఇలా నడుస్తుండగా... కర్ణుడి పేరు చదివారు. ‘నాకు చెందిన వాడు కాడు’ అని ధర్మరాజు అన్నాడు. ధృతరాష్ట్రుడు అలాగే అన్నాడు. అక్కడే ఉన్న కుంతీదేవి అది విని తట్టుకోలేక పోయింది. యుద్ధ సమయంలో ఆమె శిబిరంలో ఉన్న కర్ణుడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడితే..‘‘అర్జునుడు తప్ప మిగిలిన పాండవుల జోలికి రాను... ఎటుచూసినా నీకు పాండవులు ఎప్పుడూ ఉంటారు’ అని చెప్పాడు. అటువంటి ఔదార్యమున్నవాడిని... తన కుమారుడేనని, కన్యా సంతానమని ఎప్పుడూ చెప్పుకోలేక పోయింది. ఇప్పుడు చిట్టచివరన కనీసం నువ్వులు–నీళ్ళు కూడా దక్కడం లేదు. తల్లడిల్లిపోయింది. భోరున ఏడుస్తూ చెప్పేసింది. నాకు కొడుకు, నీకు సోదరుడు – అంది. ధర్మరాజన్నాడు కదా...‘‘ఎంత తప్పు చేసావమ్మా! కర్ణుడు పెద్దవాడు. పట్టాభిషేకం చేసుకోవాలి. నీవు ఈ రహస్యాన్ని దాచి అన్నను చంపించావు. కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంత సేపు కూడ నిజం దాగకుండు గాక!’’ అని శాపమిచ్చాడు తల్లికి. ఎవరికోసం అష్టకష్టాలు పడిందో ఆ బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది. మహా ఔన్నత్యం కల ఇల్లాలని భీష్మ పితామహుడి ప్రశంసలు కూడా పొందిన కుంతీదేవి చివరకు వైరాగ్యం పొంది, కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ... ‘‘చాలు కృష్ణా, ఉత్థానపతనాలు జీవితంలో ఎన్నో చూశా. ఒక్కొక్కసారి సంతోషించా... ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా. ఎన్ని కష్టాలు పడ్డానో, యాదవులందు నువ్వున్నావని, నా మేనల్లుడివనీ, నేను మేనత్తననీ మమకారం వద్దు. కడుపున పుట్టిన బిడ్డలని మమకారం వద్దు. ఈ మమకారమనే పాశాలు కోసెయ్యవా కష్ణా! ఆ గంగ ఎక్కడ పుట్టిందో చివరకు సముద్రంలో చేరిపోయినట్లుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ నీలోనే ఐక్యమయిపోయేటట్లుగా నువ్వు తప్ప నా మనసులో ఇంకొక ఆలోచన రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా!’’ అని ప్రార్థన చేసింది. కలిసొచ్చినన్నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికే. కాలం కలిసిరానప్పుడు, కాల ప్రవాహానికి ఎదురీదాల్సి వచ్చినప్పుడు చూపిన ధైర్యం, తెగువ, నిబ్బరం చెప్పనలవి కాదు. ద్రౌపదీ దేవి ఎంత గొప్ప స్త్రీ, సింహాసనానికి ఉత్తరాధికారులు కావలసిన ఉపపాండవులను రాత్రికి రాత్రి నిద్రలో అశ్వత్థామ చంపితే... అప్పుడు చూడాలి ఆమె ఆంతరంగంలోని లోతులు, ఆమె ప్రదర్శించిన ఔన్నత్యం ! -
అంతటి ఉదాత్తత పురాణ పురుషుల్లో ఉందా?
మన కావ్య పురాణాలని పరిశీలిస్తే ఉదాత్తమైన మన స్త్రీలతో పోల్చదగిన పురుషులున్నారా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన నడవడిక, చరిత్ర వారిది. కుంతీదేవి కూడా వారిలో ఒకరని చెప్పుకుంటున్నాం కదా... ఆమె చిన్నతనంలో కుంతిభోజుడి ఇంటికి దుర్వాసుల మహర్షి వచ్చారు. నేనిక్కడ కొన్ని నెలలపాటు ఉంటాను, నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినయినా ఏర్పాటు చేయమని అడిగాడు. ఆయన కోపధారి కనుక ఈ పనికి కుంతిభోజుడు తన పత్నులను నియోగించలేదు. దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు. ఆమె ఎంత ఓర్పుతో సేవించిందంటే... ఆయన వెళ్ళిపోతూ ఆమె సేవలకు సంతోషించి–‘‘నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను. నీవు ఏ దేవతని కోరుకుంటావో వారి అనుగ్రహం చేత నీవు సంతానాన్ని పొందుతావు’’ అన్నాడు. మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరమిచ్చాడో మహానుభావుడు !పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు. ఆయనకు కుంతి ఇల్లాలయింది. మహా సౌందర్యవతి. కర్ణుడి కథ చెప్పలేదు. పాండురాజుతో చాలా కాలం సంతోషంగా కాలం గడిపింది. ఎంత అందగత్తె అయినా స్త్రీకి జీవితంలో భరించలేని దుఃఖం ఏమిటంటే.. భర్త సవతిని తీసుకురావడం. ఇంతగా అభిమానించే భార్య ఉండగా మాద్రిని పెళ్ళిచేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అసూయ చెందలేదు. పరమ ప్రేమతో తోడబుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. ఒకసారి ముగ్గురూ శతశృంగ పర్వతం దగ్గర ఉండగా అనుకోని రీతిలో పాండురాజు జింకల రూపంలో క్రీడిస్తున్న మునిదంపతుల మీద బాణ ప్రయోగం చేసాడు. ‘నీవు నీ భార్యతో సంగమిస్తే మరణాన్ని పొందుతావు’’ అని ముని శాపమిచ్చాడు. సంతానం కలగలేదు. ఉన్నత గతులుండవని పాండురాజు బాధపడుతుండగా కుంతి తన వరం గురించి చెప్పింది. భర్త అనుమతితో దేవతను ప్రార్థన చేసింది. యమధర్మరాజు అనుగ్రహంగా ధర్మరాజును, వాయువు అనుగ్రహంగా భీముడిని, దేవేంద్రుడి అనుగ్రహంగా అర్జునుడిని కన్నది. ఆ సమయానికి గాంధారి గర్భిణీ గా ఉంది. అయినా ఆమెకన్నా ముందు సింహాసనానికి వారసులని కన్నది. సవతికి సంతానం లేదు. పాండురాజు తండ్రి కావడానికి వైదికంగా, ధార్మికంగా మార్గాన్ని కల్పించానని సంతోషించింది. కానీ ఆ సంతోషం కొద్ది సేపే. పాండురాజు పిలిచి ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు. వెంటనే మాద్రికి కూడా ఉపదేశించింది. అశ్వనీదేవతల అనుగ్రహం చేత మాద్రి నకుల, సహదేవులను కన్నది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని కోరి ప్రాణత్యాగం చేసాడు. ఆయనను విడిచి ఉండలేనని చెప్పి మాద్రి సహగమనం చేసి శరీరత్యాగం చేసింది. సవతి బిడ్డలని చూడకుండా, తన బిడ్డలకన్నా నకులసహదేవులను ఎక్కువగా ప్రేమించింది కుంతి. ఐదుగురికీ ద్రౌపదీదేవినిచ్చి వివాహం జరిపించింది. ఐదుగురూ కష్టాలూ దాటారు. రాజ్యాన్ని పొందారు..అనుకునేటప్పటికి జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో...ఇంట్లో ఉంటే దుర్యోధనుడు ఏం మాటలు అంటాడేమోనని విదురుడి ఇంట తలదాచుకుంది. కురుక్షేత్రం జరిగింది. అసలు క్షోభ ఆమెకు అప్పుడు మొదలయింది. -
వారి త్యాగాల్లో ఒక్కొక్క మౌళిక సందేశం ఉంది
-
ధర్మం ఎక్కడుంటే అక్కడే విజయం
గాంధారికి బహుసంతానవతి అని వరముంది. ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త, సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా తాను మాత్రం ధర్మపక్షపాతియై ధర్మం విషయంలో ఎక్కడా ఆమె వెనుకంజ వేయకుండా మాట్లాడగలిగిన స్థితిని పొందింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి‘నాకు విజయం కలగాలి’ అని ఆశీర్వచనం చేయమన్నాడు. ఆమె మాత్రం నిర్మొహమాటంగా..‘‘ ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు. ఆయనకు వశవర్తియై ప్రవర్తించు. అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధనా...’’అంది. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు. అందునా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలయి పడిపోతే....ఆమె కోపం అటుతిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది..‘‘అన్నీ నీకు తెలుసు కృష్ణా, వీరందరూ మరణిస్తారని తెలుసు. నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు. దీనికంతటికీ కారణం కృష్ణా నువ్వే... నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని నశించి పోయెదరు గాక.. కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదవుగాక’’ అని శపించింది. దానికి కృష్ణుడు నవ్వి ‘‘అమ్మా! ధర్మానికి వంతపాడినందుకు నాకు నువ్విచ్చే కానుకా ఇది..!!!’’ అన్నాడు. ఆ మాటతో ఇంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచించుకు పోయింది. ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడూ కూడా బతకలేదు కదా... ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా.. అని వ్యాకులత చెంది కుంతిబిడ్డల పంచనజేరి జీవితం గడుపుతూ, భీముడనే మాటలు వినలేక ధతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో శరీరాన్ని విడిచి పెట్టేసింది. అలాగే కుంతీదేవి. ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు, శూరసేనుడి కుమార్తె. అందుకే శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుడు పెంచుకున్నాడు. కాబట్టి కుంతీదేవి అయింది. భారతం చదివితే ఆమెలో ఎన్ని ఉత్థానపతనాలు, ఎంత సహనం, ఎన్ని గొప్ప లక్షణాలు... ఆశ్చర్యమేస్తుంది. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ఎవరి క్షేమసమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు ఒకమాటన్నారు– ‘‘అసలు ఆ కుంతీదేవిలాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం కల తల్లి’’ – అన్నారు. -
మహా పతివ్రత గాంధారి
ఈ దేశంలో కొంతమంది స్త్రీల చరిత్ర పరిశీలిస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి ఉదాత్త స్త్రీలలో గాంధారి ఒకరు. ఆమె సుబలుడనే గాంధార రాజు కుమార్తె. మహా సౌందర్యవతి. మెరుపు తీగ. ఎక్కువ మంది సంతానం కలగాలని వరం పొందింది. సకల సుగుణ రాశి. చిత్రాంగదుడు, చిత్ర వీర్యుల దగ్గరనుంచీ ఎప్పుడూ సంతానం లేక కురువంశం బాధపడుతూ ఉండేది. కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యులవారు ఆమెను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. ధృతరాజు పుట్టుకతో కళ్ళులేనివాడు. అటువంటి వ్యక్తిని అంత సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? సుబలుడు అడిగాడు–‘అమ్మా! నీ కిష్టమేనా’ అని. ఆమె మామూలుగా అంగీకరించడం కాదు, అపారమైన ఔదార్యంతో అంగీకరించింది. ఎవరివలన అవతలివారి వంశం నిలబడితే, కళ్ళులేనివాడు తాను కూడా బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. మహాతల్లి ఇంకా ఏమందో తెలుసా...‘‘నా భర్త ఏవి చూసి సంతోషించడంలేదో అవి చూసి నేను కూడా సంతోషించను..అని చెప్పి తన కళ్ళకు గుడ్డ కట్టేసుకుంది. భర్త పెను వేప విత్తు. పరమ దుష్ట ఆలోచనలున్నవాడు, పెద్ద కొడుకు దుర్యోధనుడు. నూరుగురు కొడుకులు. అల్లుడు సైంధవుడు, నీచుడు.. ఇంతమంది దుష్టుల మధ్యలో ఆమె పుటం పెట్టిన బంగారం. ఆమె ఔదార్యం ఎంతటిదంటే– ఒకనాడు ధృతరాష్టుడ్రు భార్యని పిలిచి అడిగాడు..‘‘పాండవులకు రాజ్యం ఇవ్వకుండా మన కుమారుడికి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. పట్టమహిషివి. నీ అభిప్రాయం ఏమిటి?’’... ఆమె కుండబద్దలు కొట్టినట్లు జవాబిచ్చింది–‘‘ మహారాజా ‘ మీకడుపున పుట్టిన దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మీకు తెలియదా! వాడు నీచుడని తెలిసీ, రాజ్యం ధర్మంగా రాదని తెలిసీ, పాండురాజు కొడుకైన ధర్మరాజుకు వెడుతుందని తెలిసీ ఎందుకు కుట్ర చేస్తారు? మీ తమ్ముడి బిడ్డలు మీ బిడ్డలు కారా? ధర్మరాజుకు దక్కవలసిన రాజ్యం అతనికి ఇవ్వలేరా? కొడుకు, కొడుకన్న పుత్ర వ్యామోహంలోపడి ఎందుకు పరుగెడుతుంటారు? మీరు చక్రవర్తులు, మీరెలా ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వవచ్చు. ఈ కురు సామ్రాజ్యన్నంతటినీ ధర్మరాజుకు ధారాదత్తం చేస్తే ఎదురుపడి ఆపగలిగిన వాళ్లున్నారా? భీష్మద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా. దుర్యోధనుడు నిన్ను చెణకగలడా? వాడిని ధర్మరాజు దగ్గరపెడితే వాడు వశవర్తియై బతకడా? అప్పటికయినా బుద్ధి మార్చుకోడా? మీ కొడుకు దీర్ఘాయుర్దాయం అంతా మీ చేతిలోనే ఉంది మహారాజా! మీ బిడ్డలని పుత్ర పాశములకు వశపడవద్దు. రాజ్యాన్ని ధర్మరాజుకు, ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేయండి.’’ నిజంగా ఎటువంటి ఇల్లాలు ఆ తల్లి, అలా నిలబడగలిగిన వాళ్లు ఈ లోకంలో ఉంటారా? నూరుగురు కొడుకులు చచ్చిపోయిన తరువాత ధర్మరాజు వచ్చి ‘‘అమ్మా! నీ బిడ్డలను అందరినీ చంపిన పాపిష్టివాడిని నేనేనమ్మా, ధర్మం కోసం చంపానే గానీ, నా అంత నేను చంపలేదమ్మా! అది తప్పనిపిస్తే నన్ను కాల్చేయమ్మా’’ అన్నాడు. ఆమె ఒక్కమాట అనలేదు. కళ్ళవెంట నీరు కారింది. ధర్మరాజుని కౌగిలించుకుంది. కాన్నీ ఒక్క బిడ్డకూడా బతికిలేడనే బాధతో ఆమె చూసినపుడు కళ్ళగంత ఒక్కసారి సడలి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజంతటివాడి కాళ్ళు బొబ్బలెక్కాయి. అంతటి పతివ్రత గాంధారి. -
మమజీవనహేతునా...
‘‘సీతమ్మా! నీ భర్త అంత రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసానికి వస్తుంటే, ఆయనను అనుగమించి వచ్చేసావు... అలా వస్తుంటే నీ భర్త చేతకానివాడిలా అనిపించలేదా... రాజ్యాన్ని సముపార్జించుకోలేడూ, తండ్రిని ధిక్కరించలేడూ... ఆయన ధర్మానికి కట్టుబడ్డాడని ప్రశంసాపూర్వకంగా వెంట వచ్చావా తల్లీ... ఎంత గొప్పపని అమ్మా నీవు చేసింది...’’ అని అనసూయమ్మ(అత్రి మహర్షి భార్య) తమ ఆశ్రమానికి వచ్చిన సీతమ్మతో అన్నది. మెచ్చుకుని భర్తను అనుగమించడం కేవలం గుడ్డితనంగా కాదు. అదేదో అయనది అధికారమనీ కాదు, ఆ భర్త పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసింది. ఒక తండ్రి ఆడపిల్లను కంటాడు. నోములు పట్టిస్తాడు, వ్రతాలు చేయిస్తాడు... మంచి భర్త కోసం. ఆ తరువాత... పెళ్ళయి పోయాక వ్రతాలు పడుతుంది... ఎవరి కోసం? భర్తకోసం, అత్తామామల కోసం, పుట్టింటివారి కోసం... సరే.. మరి తనకోసం??? ఏమీ ఉండదు. వాళ్ళ సుఖమే తన సుఖం. అది ఆడపిల్ల గొప్పతనం. అందుకే స్త్రీ వైశిష్ట్యం వేరు. అదే పురుషుడయితే... ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం... అలా తనకోసం చాలా చెబుతాడు. ఆమెకో!!! తనకోసం అంటూ ఏమీ ఉండదు. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలి. పిల్లలు బాగుండాలి. అత్తమామలు, అమ్మానాన్నలు, తోబుట్టువులు, ఆడపడుచులు, బావగార్లూ, మరుదులూ బాగుండాలి... మరి నువ్వో... ‘అందరూ బాగుండడమే నేను బాగుండడం’... అనుకుంటుంది. అందుకే నెలకు పడే మూడువానల్లో ఒక వాన ఉత్తములయిన స్త్రీలవలన పడుతున్నది అన్నది శాస్త్రం. అటువంటి ఔదార్యం కలిగిన ఆడపిల్లకు తండ్రి పరిమితంగానే ఇస్తాడు. పెళ్ళయ్యేవరకు ఉత్తముడయిన వరుణ్ణి చూస్తాడు. పుట్టింటికి వస్తే పసుపు కుంకుమలు ఇస్తారు.. అలా ఆమెకు రక్త సంబంధీకులు కానీ, బంధుగణం కానీ ఎవరిచ్చినా అది పరిమితమే... ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమయిన దాన్ని ఇచ్చేవాడు ఎవరంటే... భర్త ఒక్కడే. కారణం– శాస్త్రంలో ఒక మర్యాదుంది. నేను ఎంత ఐశ్వర్యవంతుడిని అయినా, నేను నా భార్య పాణిగ్రహణం చేయగానే, ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం అంతా ఆమెదయిపోతుంది. నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలన నిర్ణయింపబడుతుంది. ఆమె సౌశీల్యం వల్ల నా ఆయుర్దాయం నిలబడుతుంది. అందుకే ‘మమజీవనహేతునా’ అని చెప్పి మంగళసూత్రం కడుతున్నారు. అందుకే అనసూయమ్మ అంటున్నది... ‘‘అమ్మా! భర్త తాను చేసిన పుణ్యంలో సగభాగం భార్యకిస్తున్నాడు. ఆయన ఐశ్వర్యం అంతా ఆమెదే. ఆయన ఆయుర్దాయానికి నేను కర్త. విశేషించి నేను లేని నాడు ఆయనకు ధర్మం లేదు. నేను తల్లినయి అమ్మా అని పిలిపించుకుని ఆనందాన్ని పొందానంటే దానికి కారణం–ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి. నేను ఎంత నాసిరకం చీర కట్టినా ‘సువాసిని’ అని గౌరవించడానికి కారణం– ఆయన ఉండబట్టే. ఇవన్నీ మరెవరి వలనా సంభవించవు... అందువలననే కులకాంతలు, ఉత్తమమైన స్త్రీలను గౌరవిస్తారమ్మా... శాస్త్రం ఎరిగినవారు.‘‘ఒక్కొక్క మహా పతివ్రత ఈ దేశంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలను శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే... ‘‘సూర్యోదయమవకుండు గాక’’ అని ఆదేశించింది. ధర్మచక్రం నిలబడిపోయిందంతే. అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషుడు పొందగలడో లేదో కానీ పతివ్రతాధర్మంతో స్త్రీ సాధించింది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కర్తవ్యమ్
మామూలుగా సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలని ఉంటాయి. ఈ దేశానికున్న గొప్పతనం ఏమిటంటే... ‘పతివ్రతా ధర్మం’ అని ఒక ధర్మం ఉంది. దానితో స్త్రీలు ఏ పురుషుడికీ అందనంత పైస్థాయికి చేరుకున్నారు. ఆ మాటకు అర్థం – పతి లోటుపాట్లతోకానీ, ఆయనకున్న గుణ విశేషాలతో కానీ ఆమెకు సంబంధం ఉండదు. ఆమె భర్తను పరదైవంగా భావించి తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ పోతుంది. మనం ముందే చెప్పుకున్నట్లు అవతలివారి వలన ఇవతలి వారి ధర్మం మారదు. నేను ఒక ప్రదేశంలో ప్రవచనం చేస్తున్నాను. మీకు అర్థం అయ్యేటట్లు మాట్లాడితే దానిని ప్రవచనం అంటారు. ప్రవచనం చేసేటప్పుడు నా బుద్ధికి తోచిన విషయాన్ని నేనెప్పుడూ చెప్పకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. అనవసరమైన విషయాన్ని కానీ, నేనిలా అనుకుంటున్నానని కానీ ఎప్పుడూ ప్రతిపాదన చేయకూడదు. అదే నేను వేదిక దిగి వెళ్ళిపోయాననుకోండి. నా భార్య ఎదురుగా నిలబడితే నా భర్తృ ధర్మం. నా కుమారుడి ముందు నిలుచుంటే పితృధర్మం. నేను పట్టణంలో నిలబడితే పౌర ధర్మం. నేనెక్కడ నిలబడ్డాను, ఎవరి ముందు నిలబడ్డాను...అన్న దానినిబట్టి ధర్మం నిరంతరం మారిపోతుంటుంది.మారుతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి తప్ప అవతలివాడు అలా ఉంటాడు కాబట్టి నేనిలా ఉంటాననకూడదు. అప్పుడు అది ధర్మం కాదు. ధర్మం ‘కర్తవ్యమ్’ రూపంలో ఉంటుంది. ఆర్ష వాఙ్మయాన్ని పరిశీలిస్తే బాధ్యత అన్న మాట కనపడదు. ‘కర్తవ్యమ్’–అనే మాటే కనిపిస్తుంది. అందుకే రాముణ్ణి విశ్వామిత్రుడు నిద్ర లేపితే..‘‘కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్’ అంటాడు. కర్తవ్యం అంటే ఏమిటి? సూర్యోదయమవుతోంది. అంతకన్నా ముందే విశ్వామిత్రుడు లేచాడు, స్నానం చేసాడు, అర్ఘ్యమిచ్చాడు. రామలక్ష్మణులిద్దరూ నిద్రపోతున్నారు. నిద్రలేపేటప్పుడు ఎప్పుడూ భగవత్ సంబంధం చెప్పి నిద్రలేపాలి తప్ప ఇంకొకలా నిద్రలేపకూడదు. అందుకే ...‘‘అదుగో సూర్యోదయమవుతోంది, రామా! లక్ష్మణా ! లేచి సంధ్యావందనం చేయండి.కర్తవ్యమ్ దైవమాహ్నికమ్... అది మీరు చేయవలసినది, నేను చెప్పవలసినది. అక్కడితో నా కర్తవ్యం పూర్తయింది. ఒకవేళ వారు నిద్రలేవలేదనుకోండి. మరో మారు గుర్తుచేస్తాడు, జీవితాంతం అలా గుర్తు చేస్తూనే ఉంటాడు తప్ప కించిత్ బాధపడడు. రాముడు చేస్తే పొంగిపోడు, చేయలేదని కుంగిపోడు... చెప్పవలసినది చెప్పాడు. అంతవరకే. తన కర్త్యవ్యాన్ని నెరవేర్చాడు.అలాగే నేను ప్రవచనం చేయాలి కాబట్టి చేస్తాను. ఎంతమంది వచ్చారన్న దానితో నిమిత్తం లేదు. ఒకడే వస్తే ఒకలా, పదివేలమంది వస్తే ఒకలా చెప్పకూడదు. ఎంతమంది వచ్చారన్న దానితో నాకు సంబంధం లేదు. ఎంతమంది వింటున్నారన్న దాన్నిబట్టి చెప్పాల్సి వస్తే... ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు ఒక్క రాముడికే చెప్పకూడదు, భగవద్గీతను ఒక్క అర్జునుడికే శ్రీ కృష్ణుడు చెప్పకూడదు, భాగవతాన్ని శుకబ్రహ్మ ఒక్క పరీక్షిత్తుకే చెప్పకూడదు. అంటే ధర్మ నిర్వహణ అవతలివారిని బట్టి ఉండదు. నేను నా ధర్మం చేసుకెళ్ళి పోతానంతే. ఇందులో రాగద్వేషాలుండవు.ఈ దేశంలో స్త్రీలు పరమాద్భుతమైన ఉపాసన చేసారు. ఆయనకున్న గుణ విశేషాలతో సంబంధం లేకుండా దైవస్వరూపమయిన భర్తను దైవంగానే భావించారు. ధర్మశాస్త్ర విశేషమేమిటంటే... పురుషుడు చేసిన పుణ్యంలో సగం భార్యకు వెడుతుంది. కానీ ఆమె చేసే పుణ్యంలో సగభాగం పురుషుడికివ్వరు. -
మారిపోయేది ధర్మమ్,మారనిది సత్యమ్
స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం. ‘ధర్మము’ అనే మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం ఎప్పుడూ కూడా అవతలి వారిని బట్టి ఉండదు. ధర్మం అంటే వ్యావహారికంలో ఒక దీనుడికి జేబులోనుంచి ఒక రూపాయి ఇస్తే ధర్మం చేసాడు అంటూంటారు... ఇది అది కాదు. ధర్మం అంటే–ఎలా ప్రవర్తించమని పరమేశ్వరుడు వేదంలో చెప్పాడో తెలుసుకుని అలా ప్రవర్తించడానికి ‘ధర్మము’ అని పేరు. అందుకే ఏది ధర్మం? అని చెప్పే సాధికారత ఒక్క వేదానికే ఉంది. వేదం తరువాత అటువంటి అధికారం స్మృతికి ఉంది. తరువాత వరుసగా పురాణం, శిష్టాచారాలు, అంతరాత్మ. ఈ అయిదూ ప్రమాణాలు. ‘ధర్మం ఇది’ – అని చెప్పడానికి ఆరవ ప్రమాణం లేదు. ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు తనకి దేశకాలాల్లో ఏది విధింపబడిందో దాన్ని అవతలివారి ప్రమేయం లేకుండా చేస్తారు. అప్పడు అది ధర్మమవుతుంది. అందుకే ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కానీ సత్యం మాత్రం మార్పు లేకుండా ఒక్కలాగే ఉంటుంది. మనం సినిమా చూడ్డానికి వెడతాం. ముందు ఒక తెర ఉంటుంది. ఆ తెర మారదు. 50 సంవత్సరాలపాటు ఆ సినిమా హాలు అలాగే ఉన్నా, అందులో ఇప్పటికి ఏడువేల సినిమాలు వేసినా...ఎంతో మంది ఏడ్చిన వాళ్ళున్నారు, నవ్వినవాళ్ళు ఉన్నారు...పరమానందంతో వెళ్ళిపోయిన వాళ్ళున్నారు... కథలు మారాయి, పాత్రలు మారాయి, బుద్ధులు మారాయి...కానీ తెర మాత్రం అలాగే ఉంది. సత్యమూ అంతే. సత్యం మారదు. మారని దానిని సత్యము అంటారు. మారిపోయే దానిని ధర్మం అంటారు. మారిపోయే ధర్మాన్ని శాస్త్ర విహితంగా ఎవడు పట్టుకున్నాడో వాడు మారని సత్యంగా మారిపోతాడు. అదే మోక్షం.ధర్మం దేశ, కాల, వర్ణ, ఆశ్రమాలనే నాలుగింటినిబట్టి మారిపోతూ ఉంటుంది. ఒక దేశంలో(ప్రాంతంలో అని) ఉన్న ధర్మం మరొక దేశంలో ఉండదు. నేనింట్లో ఎంత పూజ చేస్తానో దానిలో పదోవంతు నేను పై ఊరు వచ్చినప్పుడు కూర్చుని చేస్తే చాలు. ఏకాదశినాడు ఉపవాసం ధర్మం, ద్వాదశినాడు తినడం ధర్మం. దేశాన్నిబట్టి, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. అలాగే వర్ణం కూడా. యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం. అదిలేనంతమాత్రం చేత తక్కువ వారు కాదు. సూర్యనమస్కారం చేసి సూర్యస్తుతి చదివితే చాలు, వారికది ధర్మం. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారికి చదువుమీద దృష్టి పెట్టడం ధర్మం. ఆయనకు ఉపవాసం లేదు. గృహస్థు భార్యతో సహజీవనం చేస్తాడు. భవిష్యత్ అవసరాలకోసం ఇల్లు కట్టుకుంటాడు. ఆయనకా అధికారం ఉంది. వానప్రస్థు భార్యను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళి ఒక కుటీరం కట్టుకుని ఎప్పుడూ తనలో తాను ఆత్మవిచారం చేస్తుంటాడు. పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుని చేరడానికి ప్రయత్నిస్తాడు. చిట్టచివరిదయిన తురీయాశ్రమంలో ఇక దేనితో సంబంధం ఉండదు. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారిలా గృహస్థు బతక కూడదు. గృహస్థులా వానప్రస్థు బతకకూడదు. ఒకరిలా మరొకరు బతకరు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది మారిపోతున్న ధర్మాన్ని పట్టుకునేటప్పుడు అవతలివాడి వలన ఇవతలివాడి ధర్మం మారదు. -
నన్ను పదకొండో కొడుకుగా చూసుకో...
సనాతన ధర్మంలో దంపతుల వైశిష్ఠ్యం, ముఖ్యంగా స్త్రీ వైశిష్ట్యం ఎంత గొప్పగా ఉంటుందంటే... వివాహం అయిపోయిన తరువాత అగ్నికార్యం చేసేటప్పుడు పురుషుడు భార్యను ఉద్దేశించి కొన్ని విషయాలు అడుగుతాడు... వాటిలో ఒకటి–‘‘నీవు పది మంది పిల్లల్ని కని నన్ను పదకొండవ కొడుకుగా చూడు’’–అని. అంటే దానర్థం?భార్య పురుషునికి శాంతి స్థానం. పురుషుడు ఎన్ని ఆటుపోట్లకు గురయినా పురుషుడి శాంతి అంతిమంగా స్త్రీ చేతిలో ఉంటుంది. నేనీ మాట ఉబుసుపోక చెప్పట్లేదు... అగ్ని సాక్షిగా అడుగుతాడు ఇలా... ఆయనకు పదిమంది కొడుకులు పుట్టారు. ఆయన సహస్ర చంద్ర దర్శనోత్సవాలకు అందరూ వచ్చారు. ఏదో పని అలా కాదు ఇలా చేయమని తండ్రి చెబితే ఒక కొడుకు ‘నాన్నగారూ, ఇంకా మీ కెందుకివన్నీ, మేం పెద్దవారమయ్యాం. మేం చూసుకుంటాం. మీరు ఇన్నాళ్ళూ మమ్మల్ని పెంచి పెద్దచేయడంలో మీకు తీరిక దొరకక రామాయణ భారతాలు చదవలేకపోయారు. ఇప్పుడు హాయిగా అవి చదువుకోండి’..అనడంతో తన మాటకు పిల్లలు గౌరవం ఈయడం లేదని అలిగి ఆయన అన్నం తినకుండా ఓ మూలన కూర్చుంటే... ఆయన మనసెరిగిన ఇల్లాలు ఆయనను పిల్లల్ని బుజ్జగించినట్లు బుజ్జగించి, కాస్తచనువుతో గదమాయిస్తూ ఆయనను చేయిపట్టి తీసుకొచ్చి విస్తరి దగ్గర కూర్చోబెడుతుంది. తర్వాత కొద్ది సెకన్లలోనే ఆ కారుమేఘాలన్నీ మాయమయి పరిస్థితి మామూలు స్థాయికి చేరిపోతుంది.రామాయణాన్ని పరిశీలించండి. సీతమ్మ తల్లి పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు తట్టుకున్నాడు. రాజ్యం పోయింది. బెంగ పెట్టుకోలేదు, తండ్రి మరణించాడు, దిగులుపడలేదు. అరణ్యవాసం చేసాడు, రాక్షసులు మీద పడ్డారు, ఎన్నో కష్టాలొచ్చాయి. కించిత్ మథనపడలేదు. సీతమ్మ కనబడలేదు. అంతే! రాముడు ఉగ్రుడయిపోయాడు. అప్పటివరకు చేయనివాడు రావణ సంహారం చేసాడు. రాక్షసులను తుదముట్టించాడు. అంటే అసలు నిజానికి రాముడు శ్రీరాముడిగా సీతమ్మ కారణంగా అంత శాంతిని పొందాడు.అందుకే సుమంతుడు తిరిగి వచ్చిన తరువాత ‘సీతారాములెలా ఉన్నారు?’ అని దశరథ మహారాజు, కౌసల్యాదేవి అడిగితే ముందు సీతమ్మ గురించి చెప్పాడు. పక్కన నా భర్త రాముడు ఉన్నాడని చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది, అంత సంతోషంగా ఉంది’ అన్నాడు. భార్య అంత సంతోషంగా ఉంటే రాముడూ అంత సంతోషంగా ఉన్నాడు. స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం. -
ప్రతి ఇంట గంట మోగాలంటే
ఆడపిల్ల మెట్టినింట కాలుమోపిన క్షణం నుంచే అదే తన స్వస్థలం అయినట్లు అక్కడి వారితో మమేకమయి పోతుంది. అది ఒక్క స్త్రీకే సాధ్యం. పరమేశ్వరుడి సృష్టిలో ఉన్న అద్భుతం. అలా ఆమె అక్కడికి చేరుకోకపోతే ఈ సృష్టి లేదు. ఆమెది మహాత్యాగం. అటువంటి స్థితి కాబట్టే.. ‘‘యత్రనార్యస్తు పూజ్యంతే..’’ ఎక్కడయితే స్త్రీలు పూజింపబడతారో, ‘రమంతే తత్ర దేవతాః’’... అక్కడ దేవతలు సంతోషిస్తూ సంచరిస్తుంటారని అన్నారు. పుట్టుకతోటే ఆప్యాయతకు, త్యాగానికి మారుపేరు ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎంత పొగిడినా తెగిడినా అంతగా పట్టించుకోని ఆడపిల్ల కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రాన కన్నీరు పెడుతుంది. ‘నువ్వే నా ఐశ్వర్యానివి’ అన్నంత మాత్రం చేత ఉబ్బితబ్బిబ్బయి పోతుంది. అంత ఆర్ద్రత కలిగిన హృదయం పురుషుడికి ఉండదు. మగపిల్లవాడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని మాత్రం తరింప చేయగలడు లేదా ఏడుతరాలో, పదితరాలో తరింపచేయగలడు. అదే ఒక స్త్రీ రెండు వంశాలను ఉద్ధరింప చేయగలదు. ఉత్తమమైన నడవడి కారణంగా ఆ పిల్లను కన్న తల్లిదండ్రులు, వాళ్ళ వంశం తరిస్తుంది. మెట్టినింటికి వెళ్ళి ఆ వంశాన్ని తరింప చేస్తుంది. పురుషుడి ధర్మం అంతా స్త్రీ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆర్షధర్మంలో ‘పత్ని’ అనే మాట వాడతారు. పత్ని అంటే తనతో కలిసి యజ్ఞయాగాది క్రతువుల్లో పీటమీద కూర్చునే అధికారాన్ని పొందిన స్త్రీని పత్ని అంటారు. భార్య–అంటే తన చేత భరింపబడునది అన్న అర్థం కారణంగా ఆ మాటను ఎక్కువగా ఉపయోగించరు. ఒక దేవాలయానికి వెళ్ళి పూజచేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా... ‘ధర్మపత్నీ సమేతస్య..’ అంటారు. ‘ధర్మపతీ సమేతస్య...’ అనరు. ఆమెయే ధర్మానికి మారుపేరు. ఆమె లేని నాడు పూజ లేదు. శాస్త్రం ఆధారంగానే మాట్లాడుతున్నా... ఇవి నా సొంతమాటలు కావు. శాస్త్రం... ప్రతి ఇంటా గంట తప్పనిసరిగా మోగాలంటుంది. అంటే పూజ జరగాలి – అని. అది ధర్మపత్ని ఉంటేనే సాధ్యం. ధర్మమే రాశీభూతమై ధర్మస్వరూపిణిగా వస్తుంది. ఆమె మళ్ళీ వేరుగా పూజ చేయాల్సిన అవసరం లేదు. తాను ఉదాత్త సంస్కారవతియై సంసారాన్ని ఉద్ధరిస్తుంది. ఆమె లేకుండా భర్త చేసిన పూజ నిష్ప్రయోజనం అవుతుందంటుంది శాస్త్రం. బ్రహ్మచర్యం దాటాడు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఆ తరువాత ఆచమనీయానికి నీళ్ళను ఎడమచేత్తో వేసుకోకూడదు. పూజాప్రారంభంలో ఆమె వచ్చి ఆయన ఎడమ పక్కన నిలుచుని ఆచమనీయం వేస్తేనే అతడి పూజ ప్రారంభం. అందుకే దేశకాల సంకీర్తనం లో ‘ధర్మపత్నీ సమేతస్య...’ అని చెప్పేది. పైగా ఆమె ఉన్నది కనుక కామం ధర్మం చేత ముడిపడుతుంది. కామం విశృంఖలత్వాన్ని పొందితే లోకంలో ధార్మికమైన సంతానోత్పత్తి ఉండదు. వావి వరుసలు ఉండవు. అందుకే తన కామాన్ని ధర్మంతో ముడివేస్తున్నాడు. ‘నాతి చరామి’ అంటే... ‘నేనీమెను అతిక్రమించను’ అని ఇద్దరూ అంగీకరించుకున్న తరువాతనే ఆమె చెయ్యిపట్టుకుంటున్నాడు. ఇప్పడు ఆయన తేజస్సును ఆమె భరిస్తుంది. అలా కామాన్ని ధర్మంతో ముడిపెట్టడంతో సమాజం సుఖశాంతులతో సజావుగా ధార్మికంగా సాగుతున్నది. అర్థం, ధర్మం, కామం ముడిపడ్డాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఒకరిది అందం.. మరొకరిది ఆకర్షణ
సృష్టి అంత పవిత్రంగా కొనసాగడం కోసం అందాన్నంతటినీ పురుష శరీరంలోనూ, ఆకర్షణను స్త్రీ శరీరంలోనూ పరమేశ్వరుడు నిక్షేపించాడని నేనంటే మీకు అది అనుమానాస్పదంగా తోచవచ్చు. అందుకే నెమళ్ళను పరిశీలించండి. అందమైన ఈకలతో ఉన్న పింఛను విప్పి ఆడేది మగ నెమలి. ఆడ నెమలి పురివిప్పి ఆడదు. రంగురంగుల ఈకలతో ఉన్న తోకతో కోడిపుంజు చాలా అందంగా కనిపిస్తుంది. కోడిపెట్ట అలా ఉండదు. సింహం పెద్ద జూలుతో అందంగా ఉంటుంది. సివంగి అలా ఉండదు. ఇవి చౌకబారుతనంతో చెబుతున్న మాటలు కావు. పరమేశ్వరుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రాబోయే ప్రాణులు మంచి తేజస్సుతో సష్టించబడాలంటే...సృష్టి కార్యమనే యజ్ఞంలో స్త్రీ పురుషులిద్దరికీ ఒక సంతోషం ఉండాలి. అందుకని స్త్రీ, పురుష అనే రెండుగా విభాగం చేసాడు. ఇందులో పురుషప్రాణికి సహజంగా ఉండే శారీరక సౌలభ్యం రీత్యా కొంచెం పైస్థానంలో ఉంచాడు. కానీ దానిని సంస్కరించకపోతే ప్రమాదమని భావించి కొన్ని కఠిన నియమాలు ఉంచాడు. కానీ స్త్రీకి అలాటి కఠిన నియమాలేవీ ఉంచలేదు. ఆమె సహజంగానే శాంత స్వభావి. ప్రేమమూర్తి. విశాల హృదయంతో చూడగల నేర్పరితనం ఆమె యందుంచాడు. తెలుగునాట మనం ఆడపిల్ల అంటాం. ‘ఆడ’ పిల్ల అంటే అక్కడి పిల్ల అని. ఇక్కడ పుట్టింది. కానీ అక్కడికి వెడుతుంది. అది నా స్వస్థానం అంటుంది, అది నా ఇల్లు అంటుంది. ఇది మీ ఇల్లు అంటుంది. అలా ఎందుకు? ఆమె లక్ష్మి. ఆమె నారాయణుడిని వెతుక్కుంటుంది. ఆయన ఎక్కడున్నాడో చూసుకుంటుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు తమ బిడ్డని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోబెడతారు. బుట్టలో ధాన్యం పోసి కూర్చోబెడతారు. అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టినట్లు. వరుడు పీటల మీదికి నడిచి వస్తాడు. వధువు అలా నడిచి రాకూడదు. ఆమె లక్ష్మి. బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తెచ్చి నారాయణుడిదగ్గరకు చేర్చడం కోసం అక్కడ పీటల మీద కూర్చోబెడతారు. ఆమె కూడా మగపిల్లలు ఎలా పుట్టారో అలానే పుట్టింది. వాళ్ళతో కలిసి పెరిగింది. వివాహం అయి వెళ్ళేటప్పడు తన పుట్టింటిని విడిచి పెట్టేస్తుంది. తన ఇంటిపేరు, గోత్రం విడిచిపెట్టేస్తుంది. ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడలేదు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడి చిటికెన వేలు పట్టుకుంది. తన జీవితానికి సంబంధించిన కష్టసుఖాలన్నీ అతని తోడనే అని నడుచుకుంటూ ఖండాంతరాలు దాటి కూడా వెళ్ళిపోతుంది. తాను గర్భిణియై పునర్జన్మ పొందినంత క్లేశాన్ని అనుభవించి బిడ్డను కంటే–మొదట తాతయింది ఎవరు.. తన భర్త తండ్రి. ఆ వంశం తరించింది. ఆ వంశం పెరిగింది. ఆ పిల్ల ఎక్కడి పిల్ల? ఇక్కడ పుట్టినా అక్కడ ఉద్ధరింప చేస్తోంది. అసలు ఆ పిల్లలో ఆ భావన లేదనుకోండి. సృష్టి క్రమం ఇలా సజావుగా సాగుతుందా? కుటుంబాల్లో, జీవితాల్లో మనశ్శాంతి ఉంటుందా? వ్యవస్థలో క్రమశిక్షణ ఉంటుందా? ఒక బాతును నీళ్ళల్లో వదిలితే ఎలా అలవోకగా తిరుగుతుందో అలా అదే తన ఇల్లన్నట్లు, తను అక్కడే పుట్టినట్లు, అక్కడి వారంతా తనవారన్నట్లు అల్లుకు పోతుంది. ఆ భావోద్దీపన పురుషుడికీ ఉంటుందా... -
పంచామృత ప్రవాహం
ఒకానొకనాడు దక్షిణ భారతదేశం అంతటా సంగీతం ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే... కేవలం రాజులమీద పాటలు చెప్పడం... ఇంకా ఎంత హీనస్థితికి దిగజారిపోయిందంటే... రాజుల ప్రియురాళ్లు, ఆ స్థానాలలో నృత్యం చేసే రాజనర్తకులైన వాళ్లమీద పాటలు కట్టి రాజులు ఇచ్చే పడుపు కూడు తిని సంతోషించే స్థాయికి సంగీతకారులు వెళ్లిపోయారు. ఇది నాదోపాసన. ఇలా భ్రష్టుపట్టకూడదన్నది దైవ చింతన కాబోలు.ఇలాభోగం స్థలాభోగం–అని ఆ తిరువాయూరు చేసుకున్న అదృష్టమేమో గానీ అక్కడ ముగ్గురు వాగ్గేయకారులు ఒకే కాలంలో ఐదేసి సంవత్సరాల వ్యవధిలో జన్మించారు. వీరిలో మొదట జన్మించినవారు శ్యామ శాస్త్రిగారు. గొప్ప శ్రీవిద్యోపాసకుడు. అమ్మవారి దగ్గరకెళ్లి ఒక్కో కీర్తన చేస్తుంటే... ఆ తల్లి బుగ్గలు ఎరుపెక్కిపోయి కొడుకుని చూసుకుని మురిసిపోయేదట. అటువంటి శ్యామ శాస్త్రిగారి దగ్గర పాదుకాంత దీక్ష పుచ్చుకున్న వారు ముత్తుస్వామి దీక్షితులు. వీరు మూడవవారు. మధ్యలో వారు త్యాగరాజు. త్యాగరాజు తల్లిదండ్రులు రామబ్రహ్మం, సీతాదేవి. వారికి మొదట ఇద్దరు కుమారులు జన్మించారు. వారిద్దరూ సమాజం నుండి ప్రశంసలందుకున్నవారు కాదు. అదే ఊరి కోవెలలో వెలిసి ఉన్న పరమేశ్వరుడిని త్యాగరాజుగా అక్కడి భక్తజనులు సేవిస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పుత్ర సంతానాన్ని కటాక్షిస్తే ‘నీ పేరు పెట్టుకుంటాం’ అని ఆ తల్లిదండ్రులు మొక్కుకునేవారు. ఆయన అనుగ్రహం కలిగి వారికి మూడవ సంతానంగా కుమారుడు కలిగితే ‘త్యాగరాజు’ అని పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తల్లికి సంగీతంలో ప్రవేశం ఉంది. ఆమె పురంధరదాసు, అన్నమయ్య కీర్తనలు పాడుతుండేవారు. చిన్నతనం నుండీ త్యాగరాజు అమ్మ వెనకే తిరుగుతూ తను కూడా తల్లి గొంతుతో గొంతు కలిపి పాడుతుండేవాడు. అది తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. అలా ఉండగా ఒకనాడు ఆయన ఒక కీర్తన రాశారు. అంటే కూర్చుని రాసింది కాదు. అమ్మ పాడుతూ ఉంటే, ఆ పాట విని ప్రేరణ పొంది, ఆ సీతారాముల పాదాలను మనసులో తలచుకోవడంవల్ల కలిగిన ఆనందం లోపల ఆగలేక.. నిండిపోయిన బిందె అంచుల వెంట నీరు కారిపోయినట్టు.. వారి నోటి వెంట అలవోకగా పంచామృత ప్రవాహమై ప్రవహించి కీర్తనయింది. అదే..‘రఘురామ...స్వామీ, నీకు జయమగుగాక..’. ఇదే ఆయన మొట్టమొదటి కీర్తన. ఆశ్చర్యపోయిన తండ్రి దానిని పండితులకు చూపితే, వారు కూడా మెచ్చుకోవడంతో ఎంత బంగారపు పళ్లెమయినా గోడ చేరుపు కావాలన్నట్లు ఒక గురువుగారి దగ్గర సుశిక్షితుడైతే బాగుంటుందనిపించి శొంఠి వేంకటరమణయ్య దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి పెట్టారు. అలా ఉండగా త్యాగరాజుకు కలిగిన ఆర్తి... ఆ పరమేశ్వరుడికి వినపడింది. సాక్షాత్తూ సంగీతంలో దిట్టయిన నారద మహర్షి రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చి ఆ పిల్లవాడికి రామ మంత్రాన్ని ఉపదేశించారు. బాల త్యాగరాజు ఎంత నిష్ఠగా చేసేవాడంటే.. రోజుకు లక్షా 25వేల సార్లు రామ మంత్రాన్ని జపం చేయడంతో శరీరమంతా మంత్రపుటమైపోయింది. శొంఠి వేంకటరమణయ్య దగ్గర సంగీత పాఠాలు ఎంత అభ్యసించినా కొన్ని కొన్ని సార్లు అనేకానేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతుండేవి. దీనిని తీర్చడానికా అన్నట్లు రామకృష్ణానంద స్వామివారే మరల వచ్చి స్వరార్ణవమనే గ్రంథాన్ని ఆయనకు బహూకరించారు. అలా మరే ధ్యాస లేకుండా త్యాగరాజు సంగీత సాధన సాగింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అన్ని వికారాలకు అదే మూలం
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటూ సామాజిక పరిశుభ్రతకోసం పరితపించిన వారిలో విశేషంగా చెప్పుకోదగిన వ్యక్తి మహాత్మాగాంధీ. అబ్దుల్ కలాంగారు కూడా అందుకే ‘‘స్వచ్ఛమైన భూగోళం కోసం, స్వచ్ఛమైన శక్తికోసం నిరంతరం శ్రమిస్తాను’’ అని విద్యార్థులచేత ప్రమాణం చేయించేవారు. ఇంకొన్ని రోజుల్లో ప్రాణం వదిలిపెట్టేస్తారన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా బాధపడిన అంశం–మన దేశంలో చాలా మంది ఆరోగ్యం నశించిపోవడానికి కారణం– ప్లాట్ఫారమ్ మీద ఆగి ఉండగా ప్రయాణికులు రైళ్లలోని శౌచాలయాల్లో మలమూత్ర విసర్జన చేయడం–అన్న విషయం. అలా చేసినప్పడు అవి స్టేషన్లలోని పట్టాల మధ్యలోనిలిచి పోతాయి. వాటిమీద వాలిన ఈగలు, దోమలు, సూక్ష్మక్రిములు అక్కడే తిరుగుతూ ప్లాట్ఫారాలమీద అమ్మే, ప్రయాణికులు తినే ఆహార పదార్థాలమీద వాలి నేరుగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రైలు ప్రయాణికులలో చంటిపిల్లలు, వృద్ధులు, రోగులు మాత్రమే కాదు, అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వ్యాధిగ్రస్తులవుతారు. చదువుకున్నవారయినా, చదువులేనివారయినా అక్కడ ప్రయాణ హడావుడిలో విచక్షణ కోల్పోయి అనారోగ్యానికి బలవుతున్నారు. విద్యార్థులుగా మీరు దీని పట్ల అవగాహన పెంచుకుని మీరు పాటించడమే గాదు, మీ ఎదురుగా మరెవరయినా స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళలో శౌచాలయాలు వినియోగించకుండా చూడండి.అలాగే పల్లెలు, పట్టణాలు,నగరాలు అనే తేడా లేకుండా అనుసరిస్తున్న మరొక చెడ్డ అలవాటు – బహిరంగ మలమూత్ర విసర్జన. ఇది మన పరిసరాలను, మన ఆరోగ్యాన్నే కాకుండా మన దేశ గౌరవాన్ని కూడా పాడు చేసి అప్రతిష్ఠ తీసుకు వస్తున్నది. మరుగుదొడ్లు కట్టుకుంటామంటే ఇప్పుడు ప్రభుత్వాలుకూడా డబ్బిస్తున్నాయి. అలాగే శక్తి ఎప్పడూ కూడా స్వచ్ఛమైనదై ఉండాలి. నేను ఏది తింటే అది నాకు శక్తిగా మారుతుంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచి రోగనిరోధక శక్తితోపాటూ మంచి శక్తిని కూడా పొందుతున్నా. కుళ్ళిన ఆహారాన్ని తీసుకుంటే వెంటనే శరీరం రోగగ్రస్థమైపోయి నీరసపడిపోతాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వ్యాయామాల ద్వారా బలంగా ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే సమస్త శక్తులకూ కారణమయిన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మరొక ఎత్తు. కళ్ళతో, చెవులతో, ముక్కుతో, స్పర్శతో మనం గ్రహించే వాటితో మన మనసు కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల మనం లోపలికి గ్రహించే వాటిపట్ల మనం సర్వదా అప్రమత్తంగా ఉండాలి. నిల్వ ఉన్న పదార్థాలు, మసాలా పదార్థాలు తీసుకుంటే అవి మీ ఆరోగ్యాన్నేకాక, మీ మనసును కూడా ప్రభావితం చేస్తాయి. అలా కాకుండా మీ మనసును ఎంతగా నియంత్రించి శక్తిమంతం చేసుకుంటే మీమనస్సులోంచి అంత మంచి ఆలోచనలు వస్తాయి. మీరు ఎంత మంచి ఆహారాన్ని పుచ్చుకుంటే అంత మంచి శక్తి మీ శరీరం నుండి విడుదలవుతుంది.నిలకడగా ఒక చోట ఉండగలిగేటట్లు, మీ ఆలోచనలను స్థిరంగా ఉంచగలిగేటట్లు, మీ చదువుసంధ్యలపట్ల మీ శ్రద్ధాసక్తులు నిశ్చలంగా ఉండేటట్లు మీ శరీరాన్ని, మీ మనసును నియంత్రించుకోగలగాలి. ప్రయత్నపూర్వకంగా అది అది అలవాటుగా చేసుకోవాలి. అలా వ్యక్తిగతంగా మీ వద్ధి, తద్వారా మీ వంటి ఉత్తమ పౌరులతో దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అపురూపం హతజోడి:హతజోడి లేదా హస్తజోడి అనేది ఒక అరుదైన మూలిక. రెండు మూడంగుళాల పరిమాణంలో ఉండే ఈ మూలిక చూడటానికి ముకుళించిన హస్తాల రూపంలో ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ఎక్కువగా నేపాల్లోని లుంబినీ లోయలోను, అమర్కంటక ప్రాంతంలోను దొరుకుతుంది. ఉమ్మెత్తజాతికి చెందిన ఒక మొక్కకు చెందిన మూలిక ఇది. మొక్క బాగా ఎదిగిన తర్వాత దాని వేళ్లు జోడించిన చేతుల ఆకారంలోకి రూపుదిద్దుకుంటాయి. హతజోడి మూలికను చాముండేశ్వరీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. దృష్టిదోష నివారణకు, దుష్టశక్తుల కారణంగా తలెత్తే అనర్థాల నివారణకు హతజోడి మూలిక అద్భుతంగా ఉపయోగపడుతుందని తంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. పూజ మందిరంలో చాముండేశ్వరీ దేవి ఎదుట హతజోడి మూలికను ఉంచి, దానిని ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షతలతోను, ధూప దీప నైవేద్యాలతోను అర్చించాలి. దీనిని ఉంచి చాముండేశ్వరి హోమం జరిపించడం మరీ శ్రేష్ఠం. అలా పూజించిన తర్వాత ఎర్రని వస్త్రంలో కట్టి డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీనిని తాయెత్తులో ఉంచి భుజానికి లేదా మెడలో ధరించినట్లయితే, కార్యసిద్ధి, మానసిక స్థైర్యం కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కుదుటబడతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
అతిథిపూజకు ప్రేమే పుష్పం
కుచేలుడు పరమ దరిద్రుడు. బ్రహ్మజ్ఞాని. ఒక్క కాసుదొరికితే పదివేల కాసులని మురిసిపోతాడు. ఉంటే తింటాడు. లేకపోతే మానేస్తాడు. ఎప్పుడూ బ్రహ్మానందంలో ఉండేవాడు. ఒకనాడు భార్య ...‘‘ఏమండీ, కష్ణుడు మీకు స్నేహితుడు కదా, ఒక్కసారి ఆయనను దర్శించుకుంటే మన దరిద్రం తీరిపోతుందికదా !’ అంది. అక్కడికి వెడితే కష్ణుడికి అతిథి అవుతాడు కుచేలుడు. ‘‘నీ సలహా మంచిదే. కానీ స్నేహితుడి దగ్గరకు వెడుతూ ఏమీ పట్టుకెళ్ళకుండా ఎలా..ఏదయినా ఉందా...అయినా నీ పిచ్చికానీ నేను వెడితే మన దరిద్రం పోయేంత ఐశ్వర్యం ఇస్తాడా !!!’’ అని కుచేలుడు అన్నాడు. కలలోసయితం భగవంతుని పేరెత్తని వాడికి కూడా ఆపదవచ్చినపుడు తలచుకోగానే వచ్చి రక్షించే స్వభావం ఉన్నవాడు కదా ఈశ్వరుడు ! అటువంటివాడు నిత్యం భగవంతుని నమ్ముకుని ఉండే మీ కోర్కె తీర్చడా.. వెళ్ళండి’’ అని భార్య చెప్పింది.కుచేలం అంటే చిరిగిన బట్ట. ఆయన ఒంటిమీద ఉన్న బట్టకన్నా దానికి కన్నాలు ఎక్కువ. ఇంట్లో ఉన్న అటుకులను ఆ చినుగుల ఉత్తరీయంలోనే మూటగట్టుకుని కుచేలుడు ద్వారకా నగరంలో కష్ణుడి నివాసం వద్దకు చేరుకున్నాడు. సాక్షాత్ లకీ‡్ష్మదేవి అవతారమైన రుక్మిణితో కలిసి కష్ణుడు హంసతూలికా తల్పంమీద ఉన్నాడు. బయట సేవకులు కుచేలుడిని ఆపి ఎవరికోసం వచ్చావు, ఎవరుకావాలని అడుగుతున్నారు. కష్ణుడు తన ప్రియస్నేహితుడని కలిసిపోదామని వచ్చానని చెప్పాడు. ‘ఎలా వీలవుతుంది ! ఇప్పుడు ఆయన రుక్మిణీదేవితో ఆంతరంగిక మందిరంలో ఉన్నారు. ఇప్పుడు కలిసే అవకాశం లేదు’అని వాళ్ళంటున్నారు. దూరంనుంచి కష్ణుడు కుచేలుడిని చూసి గుర్తుపట్టిఒక్కసారిగా మంచం మీదినుంచి దూకి పరుగుపరుగున వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుని ‘ఎన్నాళ్ళకొచ్చావోయ్, మిత్రమా..’అంటూ తీసుకెళ్ళి తన శయ్యామందిరంలోని హంసతూలికాతల్పంమీద కూర్చోబెట్టాడు. అతిథి సత్కారం ఎలా చేయాలో కష్ణభగవానుడు మనకు నేర్పాడు. అలా కూర్చోబెట్టి‘రుక్మిణీ ! అలా చూస్తావేం. ఇతను బ్రహ్మవేత్త, నా బాల్యమిత్రుడు– కుచేలుడు. బంగారు చెంబుతో నీళ్ళు తీసుకురా’..అని చెప్పి పళ్ళెంపెట్టి అందులో కుచేలుడి పాదాలుంచి రుక్మిణీ దేవి బంగారు కలశంతో నీళ్ళుపోస్తుంటే కడిగి అలా కడిగిన నీటిని పరమ భక్తితో తన తలమీద చల్లుకున్నాడు. పళ్ళెం తీసేసి తన ఉత్తరీయంతో పాదాలు తుడిచి, ఒళ్లంతా గంధం రాసి, విసెన కర్రతో విసిరి, మంచి ధూపం వేసి, హారతిచ్చాడు. ‘మిత్రమా! ఎన్నాళ్ళకొచ్చావ్, మనిద్దరి గురుకులవాసం గుర్తుందా..’ అంటూ పాతజ్ఞాపకాలు గుర్తుచేస్తూ మంచి భోజనం పెట్టి కాళ్ళొత్తి పక్కన కూర్చుని నాకోసం ఏదో తెచ్చి ఉంటావంటూ చొరవగా వెతికి ఉత్తరీయానికి వేలాడుతున్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకుని ‘చాలా బాగున్నాయి’ అంటూ పరమ ప్రీతితో వాటిని పరపర నమిలి తినేసాడు. మరో పిడికెడు తీసుకుని నోట్లో వేసుకోబోతుండగా రుక్మిణీదేవి వారించింది. ఇప్పటికే ఇవ్వాల్సిన ఐశ్వర్యమంతా ఇచ్చేసారు. రెండో గుప్పిటతో మిమ్మల్నీ నన్నూ సమర్పించుకుంటారని వారించింది. అదీ అతిథి పూజంటే. ఇంటికొచ్చినవాడు ఏమిచ్చాడన్నది కాదు ప్రధానం, ఇంటికొచ్చినవాడిపట్ల నీవెలా ప్రవర్తించావన్నది ముఖ్యం. అన్నీ పెట్టక్కర్లేదు, అన్నీ చేయక్కర్లేదు. ఎంత ప్రేమతో నీవు మాట్లాడిపంపించావన్నదికూడా అతిథిపూజే. అతిథిరూపంలో వచ్చినవాడికి నీకున్న వాటినిపెట్టి ప్రీతితో సేవించగలగాలి. వచ్చినవాడు ఈశ్వరుడు అన్నభావనతో, ఆ ప్రేమతో, ఆదరబుద్ధితో చేయాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అతిథి ఈశ్వర స్వరూపం
‘అతిథి’ పరమేశ్వర స్వరూపం అని మనకు ఉపనిషత్తు ప్రబోధం చేస్తుంది. ఉపనిషత్తులు వేదాల చివరి భాగాలు. అందువల్ల అవి మనకు ప్రమాణవాక్కులు. వేదవాక్కుని శిరసా స్వీకరిస్తే అభ్యున్నతిని పొందుతాం కనుక మనం ‘అతిథిదేవోభవ’ అన్న వాక్యాన్ని జీవితంలో పరిపూర్ణంగా విశ్వసించి ప్రవర్తిస్తుంటాం. అతిథి పరమేశ్వర స్వరూపమని చెప్పుకోవడానికి కారణం – ధనం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో ఉండే భౌతికమైన ధనం. రెండవది మానసిక ధనం. మూడవది పుణ్యరూపమయిన ధనం. ఈ మూడూ సమానమైన ప్రాతినిధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోకపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో – సరస్వతీదేవి, లక్ష్మీదేవి..ఇద్దరి అనుగ్రహం అవసరమేనని అంటారు. సరస్వతీకటాక్షం లేని లక్ష్మీదేవికటాక్షం బాహ్యంలో భయహేతువు. ఐశ్వర్యం ఉంది. చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో–ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తనకున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు. అదే సరస్వతీకటాక్షంతో కూడుకున్న లక్ష్మీకటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవారికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత చదువున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. ‘ఇవన్నీ నావి కావమ్మా, నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి’ అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువవుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం. రెండవది మానసిక ధనం. అంటే శాంతి. శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అంటాం. తాను శాంతంగా ఉండాలి. పదిమందిని శాంతంగా ఉంచగలగాలి. ప్రశాంతంగా ఉండడం కన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏదీ లేకపోయినా ‘నాకేం తక్కువయిందని’..అన్నభావనతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనంకన్నా చాలా గొప్పది. ఐశ్వర్యమయినా, ఆనందమయినా మానసికమైన ధనాన్ని ఆవహించి ఉంటాయి. మూడవది పుణ్యధనం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? జ్ఞానం కలుగుతుందనీ, దానివల్ల పునారావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతతకానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుందిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడినుంచి వస్తుంది? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది? అందుకే నీ పుణ్యం ఖాతాను పెంచడానికి పరమేశ్వరుడే అతిథి రూపంలో వస్తాడు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నీలోని గుడికి... 18 మెట్లు
మనిషి మనసులో దైవత్వం ఉంటే... మనిషి ఉనికి ఆలయం అవుతుంది. 2018లో ఈ 18 మెట్లను అధిరోహించి... మీలోని దైవత్వాన్ని చాటి చెప్పండి. మీలోని సుగుణాలతో... సమాజంలోపరివర్తనకు దారులు వేయండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి... మీ కోసం అల్లిన విశిష్ఠ సుమమాల ఇది. సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు... ‘‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’’ అన్నారు. అందుకాయన– ‘‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను’’ అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం. 1 . సంస్కారబలం ఉండాలి సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది. 2 . మోహాన్ని పోగొట్టుకోవాలి మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు. ‘‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు. 3 . తప్పొప్పుల కూడిక ఈప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి... ‘‘నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు? 4. మాట వినడమన్నది తెలుసుకోవాలి మహాభారతం సమస్తసారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు. 5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్ కలాం గారి మాటలు చదవండి. 6 .బాగుపడినా, పాడయిపోయినా కారణం–జడత్వమే జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం. 7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ‘‘సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది. 8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి. 9. కోపాన్ని తగ్గించుకోవాలి మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు. 10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి. 11. వినండి, వినడం నేర్చుకోండి ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... వారి జీవితం చక్కబడుతుంది. 12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి. ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి. 13. మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి పదిమందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి. 14. నిరాశను దరిచేరనివ్వకండి అబ్దుల్ కలాంగారి కెరీర్ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు. 15. మంచి మంచి పుస్తకాలు చదవండి ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి. 16. ఆరాధించడం కాదు... ఆదర్శంగా తీసుకోవాలి ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్ క్రికెట్ చూడటం కాదు. టెండూల్కర్ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి. 17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి. 18. పొగడ్తకు పొంగిపోకండి ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంతమోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి. - నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
శిష్యుడి కోసం...
శైవసంప్రదాయంలోని 63మంది నాయనార్లలో సోమసిమార్ నాయనార్ ఒకడు. ‘యజ్ఞం చేస్తూ... స్వాహా అన్నప్పుడు అగ్నిముఖంగా కాకుండా పరమేశ్వరుడు నేరుగా వచ్చి హవిస్సు పుచ్చుకోవాలి’ ఇది ఆయన కోరిక. ఇదెలా సాధ్యం? పరమశివుడిని తీసుకురాగలిగిన సుందరమూర్తి నాయనార్ను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎప్పుడూ శివభక్తులతో శివమహాసభల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఆయన దర్శనం దొరకడం దుర్లభం. అందుకు ఆయన ఒక మార్గం ఆలోచించాడు. నది ఒడ్డున దొరికే తోటకూరలాంటి ఒక రకం ఆకుకూరను క్రమం తప్పకుండా ప్రతి రోజూ తీసుకెళ్ళి సుందరమూర్తి నాయనార్ వాళ్ళ వంటవాడికిచ్చి వచ్చేవాడు. వంటవాడు వండిపెట్టేవాడు. సుందరమూర్తి నాయనార్ తింటూండేవాడు. నెలలు గడిచాయి. యజమాని అడగలేదు ఇదెక్కడిదని, వంటవాడూ చెప్పలేదు. ఆయన తెస్తూనే ఉన్నాడు, ఈయన తింటూనే ఉన్నాడు. ఉన్నట్లుండి అక్కడి నదికి వరదలొచ్చాయి. పాపం సోమసిమార్ నాయనార్ ఆ ఆకుకూరను తీసుకురాలేకపోయాడు. ఓ వారం గడిచింది. ఆ ఆకుకూరను తినడానికి అలవాటుపడిన సుందరమూర్తి వంటవాడిని అడిగాడు, అదెందుకు చేయడం లేదని. ‘‘ఏమో ఎవరో రోజూ తీసుకొచ్చి ఇస్తున్నారు, మీకు వండి పెట్టమని. నాలుగు రోజులనుంచి తీసుకు రావట్లేదు’ అన్నాడు. ‘అది నెలల తరబడి తింటున్నానా, నా సప్తధాతువుల్లో కలిసిపోయిందా, ఎందుకు తెచ్చాడో తెలుసుకుంటాను, ఈసారి వచ్చినప్పుడు నా దగ్గరికి పంపు’ అని సుందరమూర్తి చెప్పాడు. వారం తర్వాత వరదలు తగ్గగానే సోమసిమార్ నాయనార్ మళ్ళీ ఆకుకూర తీసుకుని వచ్చాడు. వంటవాడు వెంటనే ఆయనను యజమాని దగ్గరకు పంపాడు. ‘‘ఎందుకు తెస్తున్నావ్, నీకసలు ఏం కావాలి ?’’ అని అడిగాడు సుందరమూర్తి నాయనార్. ఎవరూ చుట్టూ లేకపోతే చెబుతానన్నాడు. ఆయన దర్బార్లోని వారిని బయటకు పంపి చెప్పమన్నాడు. ‘‘నేను యజ్ఞం చేస్తున్నాను. శివుడు నీవు పిలిస్తే వస్తాడు. పిలిచి తీసుకు రా. నేను స్వాహా అన్నప్పుడు ఆయన చెయ్యిపట్టాలి. హవిస్సు అగ్నిముఖంగా ఇవ్వను. ఆయన చేతిలోనే పెడతా. తినాలి. ఇది నా కోరిక.’’ అని వివరించాడు. ఆకుకూర తిన్నందుకు సుందరమూర్తి నాయనార్ అన్నాడు కదా –‘‘అడుగుతా శివుణ్ణి, ఒకవేళ ఆయన రానంటే తప్పు నాదికాదు’’ అన్నాడు. వెళ్ళి అక్కడి త్యాగరాజస్వామిని (వాగ్గేయకారుడు కాదు, అక్కడ శివుడి పేరు త్యాగరాజస్వామి) అడిగాడు. ఆయన బదులిస్తూ–’’నువ్వడిగావు కాబట్టి వస్తా, కానీ శివుడిగా రాను. నా ఇష్టం వచ్చినట్లు వస్తా. నన్ను గుర్తుపట్టి పెడితే తింటా. లేదంటే వెళ్ళిపోతా.’’ అన్నాడు. ఆయన తిరిగొచ్చి సోమసిమార్నాయనార్కు అదే చెప్పగా ఆయన అందుకు అంగీకరించి వెళ్ళి యజ్ఞం చేస్తున్నాడు. 11వరోజు పండితులందరూ వేదమంత్రాలు చదువుతుండగా పరమశివుడు ఛండాల రూపంలో కుక్కలు పట్టుకుని, కల్లుకుండ పట్టుకుని లోపలికి వచ్చాడు. అక్కడున్న పండితులందరూ లేచి పరుగులు తీస్తుండగా, ‘పరమశివుడు వచ్చాడు. రండిరా’’అంటూ సోమసిమార్ నాయనార్ అందర్నీ వెనక్కి పిలిచాడు. వాళ్ళు అనుమానంగా వచ్చారు హవిస్సు చేతిలో పెట్టగా పరమానందభరితుడై శివుడు ఆయనను తనలో ఐక్యం చేసుకున్నాడు. అదీ ఆచార్య వైభవం అంటే. అటువంటి ఆచార్యుడు శిష్యుడికోసం ఏమైనా చేయగలడు. ఇది తిరువారూర్ క్షేత్రంలో జరిగింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బ్రహ్మ చేసిన బొమ్మ
ధర్మసోపానం మూడు లోకాలుగా, మూడు కాలాలుగా, మూడు మూర్తులుగా కనబడేవాడు పరమశివుడు. ఆయన శివ స్వరూపుడు. శివ అంటే మంగళం, శోభనం, శుభం. అటువంటి మంగళములు చేసేవాడికి సదాశివ’ అనిపేరు. ‘అమంగళం’ చేయడం ఆయనకు తెలియదు. కారణం– ఆయన తండ్రి కనుక. ఆ పరమ శివుడు, ఆ బ్రహ్మ, ఆ విష్ణువు ఈ ముగ్గురు మూర్తులు ఈ లోకంలో ఎవరిగా ఉన్నారు? కంటితో చూడడానికి వీలయిన రూపంలో ఎక్కడ తిరుగుతున్నారో ఎలా గుర్తుపట్టడం ? ’నమశ్శంకరాయచ, మయస్కరాయచ’ అంది వేదం. శంరాయచ అంటే తండ్రి. శం కరోతీతి శంకరః – ’శం’ అంటే సుఖం, తండ్రి ఈ లోకంలో చేసే అద్భుత కార్యం–తన కడుపున పుట్టిన బిడ్డ సుఖం కోసం అహరహం శ్రమించడం. తనకోసంగా తాను ఫలానా దానిని పొందాలన్న కోర్కె ఏదీ ఉండదు. అది తనబిడ్డ పొందితే చాలు. పరమానందాన్ని పొందుతాడు. ’కొడుకుకు లేకపోయినా ఫరవాలేదు, పాడయినా ఫరవాలేదు, నేను మాత్రం సుఖం అనుభవించాలి’ అన్న కోర్కె ఎందుకుండదంటే– పరమేశ్వరుని కారుణ్యమెటువంటిదో తండ్రి దయ అటువంటిది. ఈశ్వరుడు ఎందుకు దయతో ఉంటాడంటే దానికి కారణమేదీ ఉండదు. అందుకే నిర్హేతుక కృపాపాత్రులం–అంటూ ఉంటారు. ఏ కారణం లేకుండా ఆయన దయను వర్షిస్తుంటాడు. కన్నతండ్రికూడా అంతే. చతుర్ముఖ స్వరూపంలో ఉన్న పరమాత్మ మనకు భువనము, భోగము, తనువు, కరణము అనే నాలుగింటిని అనుగ్రహిస్తుంటాడు. అవి లేకపోతే మన కర్మలను పోగొట్టుకోవడం సాధ్యం కాదు. గత జన్మలో చేసుకున్న పాపాలు కానీ, పుణ్యాలు కానీ సుఖదుఃఖాల రూపంలో అనుభవించనంతకాలం, కర్మల శేషం పోనంత కాలం, మోక్షమన్న మాట ఉండదు. అందుకే చిత్తశుద్ధిని కోరుకుంటారు. చింతపండు, ఉప్పు, పసుపు పెట్టి పాత్రలు తోమితే పాత్ర తళతళా మెరుస్తుంది. ఆ మెరుపు కొత్తగా వచ్చింది కాదు, పాత్రకున్న మెరుపుకు అడ్డుపడిన చిలుము తొలగిపోవడంవల్ల పాత్ర యథాస్థితిలో భాసించింది. నేను ఆత్మకాదు, నేను శరీరం–అనే అవివేకం అనేది మనల్నిపట్టి ఉన్న చిలుము. అదిపోవాలంటే మనం ఈశ్వరార్పణం కావాలి. దానితో ప్రీతిపొందిన ఈశ్వరుడు చిత్తశుద్ధిని ప్రసాదిస్తాడు. అప్పుడు ఉన్నది ఉన్నట్లు భాసిస్తుంది. అలా చిత్తశుద్ధిపొందే అవకాశం ఒక్క మనుష్యజన్మకే ఉంది. ఈ మనుష్య జన్మలో భగవన్నామ స్మరణతో ఆ చిలుము తొలగిపోవడానికి ఉపకరించేది శరీరం. భగవన్నామం పలుకగలిగిన శరీరం, భక్తిని పొందడానికి, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అనువైన శరీరం, గురు సేవ చేయడానికి అవకాశమిచ్చే శరీరం ఒక్క మనుష్య శరీరం మాత్రమే. అటువంటి ‘శరీరాన్ని ఇవ్వడానికి సాక్షాత్ బ్రహ్మరూపంలో తండ్రే దానికి తగిన వ్యూహాన్ని అందిస్తాడు. ఆ వ్యూహం ఆచరణలో తండ్రి హృదయం నుంచి చైతన్యంగా మారి, దాని ఫలితంగా తేజస్సు జారితే కుమారుడిగా జన్మిస్తాడు’ అని వేదవాక్కు. అందుకే ‘ఆత్మవైపుత్ర నామాసి’. హృదయంనుండి జారిన బిందువు కనుక కొడుకు తన రూపమై లోకంలో తన బొమ్మగా, తన ప్రతిబింబంగా తిరుగుతుంటాడు. అందుకే తండ్రికి అత్యంత సంతోషాన్ని కలుగచేసేది, ఎక్కడలేని తృప్తినిచ్చేది ఏది? అంటే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకు శరీరాన్ని అలా కౌగిలించుకుంటే చాలు. తండ్రికి ఎంతో ఉపశాంతి కలుగుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గిరిజనులది ప్రేమగల హృదయం
-
వినడం చేతకావాలి...
మానవీయం మనుష్యుడిగా పుట్టిన రాముడు కూడా ఎన్నో చోట్ల తప్పులు చేయబోయాడు. ఒకానొకప్పుడు సీతమ్మ కనబడనప్పుడు రాముడికి చాలా కోపం వచ్చేసింది. ‘ఈ లోకాలన్నింటినీ లయం చేసేస్తాను, దేవతలు కూడా సంచరించలేరు, బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణా!’ అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేసి ఉంటే... విద్య నేర్పిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తలవంచుకుని ఉండేవారు. తన భార్య కనబడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా! లక్ష్మణస్వామి వచ్చి, కాళ్ళ మీద పడ్డాడు. ‘‘అన్నయ్యా ! చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో - రాముడు మంచివాడు, ధర్మం తప్పడని నీ నడవడి చేత నీకు కీర్తి అలా ఉంది. మచ్చ వస్తుందన్నయ్యా! వద్దన్నయ్యా! ధర్మం తప్ప వద్దన్నయ్యా! నీవు ఇలా చేస్తే - ‘రాముడు ఒకసారి ధర్మం తప్పి బాణాలు వేయలేదా’ అన్న మాట శాశ్వతంగా నిలిచిపోతుంది. ధర్మాన్ని వదిలిపెట్టవద్దన్నయ్యా !’’ అంటాడు. ‘‘తమ్ముడా! నీవు చెప్పినది కూడా నిజమే’’ అని తన కోపాన్ని నిగ్రహించుకుంటాడు రాముడు. నీకు తెలియకపోవచ్చు. వినడం చేత కావాలి. తెలియకపోవడం తప్పు కాదు. ఒకరు చెప్పినప్పుడు వినడం చేతనై ఉండాలి. అది కూడా నాకు చేత కాదంటే... ఇక ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేడు వాణ్ణి! రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే. మంచి మాట వినకపోవడమే. చివరకు పది తలలు తెగి పడిపోయాడు. దుర్యోధనుడిదీ అదే పరిస్థితి. ఇంకాస్త ముందుకుపోయి ‘జానామి ధర్మం న చ మే ప్రవృత్తి, జానామ్య ధర్మం న చ మే నివృత్తి’ అన్నాడు. ‘ధర్మం నాకు తెలియదా? తెలుసు! కానీ అలా చేయాలనిపించడం లేదు. ధర్మం ఏమిటో నేను చదువుకోలేదా? చదువుకున్నాను! కానీ నా కిష్టం ఉండదు - అలా చేయడం! అయినా నాలోని ఈశ్వరుడే నా చేత చేయిస్తున్నప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతారు?’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇలా మెట్టవేదాంతం చెప్పబట్టే, తొడలు విరిగిపడిపోయాడు కురుక్షేత్రంలో. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. మంచిమాట విన్నప్పుడు దానికి అనుగుణంగా నీ నడవడిక మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు. ధర్మాచరణ చేత తృప్తి పొందాలి. ‘‘చూడు నాయనా! ‘నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలన్నారమ్మా’- అని ఇప్పటివరకు ‘ధర్మం...ధర్మం’ అంటూ దానికి కట్టుబడి వెళ్ళిపోతానంటున్నావు. అది అంత సులభం కాదు. రేపు మీ ఆవిడను తీసుకుని అడవుల గుండా వెళుతున్నప్పుడు క్రూరమృగాలు అరిస్తే, నీ భార్య ఉలిక్కిపడి నిన్ను పట్టుకుంటే... ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద పవ్వళించవలసిన నా భార్య ఇంత కష్టపడడమేమిటని అప్పుడు తిరిగి వచ్చి నాన్న గారి మీద తిరగబడకూడదు. ధర్మం తప్పకుండా ఉండాలి. అలా ఉండగలవా? ఏ ధర్మం కోసమని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో, ఆ ధర్మానికి కట్టుబడి వచ్చే కష్టనష్టాలు తట్టుకోగలవా? ‘తట్టుకోగలను’ అని అనుకుంటే ఆ ధర్మమే నిన్ను సదా రక్షించుగాక !’’ అని కౌసల్య అంటుంది. ‘‘యం పలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ, స వై రాఘవా శార్దూల ధర్మస్త్వామభిరక్షతు’’ అని తల్లిగా కైకేయి చెప్పిన శ్లోకం రామాయణంలో బంగారు పాత్రలో పోసిన అమృతం లాంటిది. రాముడు ఎంతగా తట్టుకుని నిలబడ్డాడంటే... చివరకు ఒక రాక్షసుడు కూడా ఆయన గురించి చెబుతూ, ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ అనక తప్పలేదు. ‘అయ్యా! నాకీ సుఖం అనుభవించాలనుంది. నేనిది అనుభవించవచ్చా?’ అని కొందరికి సందేహం. అంతరాత్మ చెప్పింది ప్రమాణం చేసుకో! ‘ధర్మమే, అనుభవించేయ్’ అన్నప్పుడు అనుభవించు. ‘వద్దు! అది ధర్మచట్రంలో ఇమడదు’ అన్నప్పుడు దాని జోలికి వెళ్లకు. ‘పంచదార పరమాన్నం తెల్లగా, బెల్లం పరమాన్నం నల్లగా ఉంది. నాకు తెల్లగా ఉన్నది తినాలనిపిస్తోంది. తిననా?’ సన్న్యాసివి కాదు కదా! గృహస్థువు. తప్పేమీ లేదు. దేవుడికి నైవేద్యం పెట్టి, కొద్దిగా ఇతరులకు పెట్టి, మిగిలినది నీవు తినేసెయ్. ఏ తప్పూలేదు. ‘అయ్యా ! నా పక్కనున్నావిడ నల్లగా, ఎదురుగా ఉన్న ఆవిడ తెల్లగా కనిపిస్తోంది.’ అది ధర్మ చట్రంలో ఇమడదు. అధర్మం. అలాంటి ఆలోచనలు రానీయకు అన్నప్పుడు వదిలేసెయ్. అదొక్కటే తీర్పు. ఎందుకంటారా! ఇది మర్త్య లోకం. ఇందులో నువ్వు శాశ్వతంగా ఉండవు. ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను లెక్కలడుగుతాడు. ఈ జన్మలో ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకో. మిగిలిన జీవరాశులేవీ ఇలా విముక్తి పొందలేవు. అలా పొందగలిగినదీ, శాస్త్రాన్ని పట్టుకోగలిగినదీ, గురువును సేవించగలిగినదీ- భగవన్నామం పలుకగలిగినదీ, మంచిమాట చెప్పగలిగినదీ, తాను తరించగలిగినదీ, దేవత కాగలిగినదీ, ఉత్తరోత్తర జన్మలలో మనుష్య జన్మలోకి వచ్చి మళ్లీ ఇంకా ఎదగగలిగిన స్థితి పొందగలిగినదీ, ధర్మాన్ని విడిచిపెట్టి కిందకు వెళ్ళి కొన్ని కోట్ల జన్మల వెనక్కి పడిపోయి స్థావర జంగమమైపోగలిగినదీ కూడా మనుష్యుడే! నువ్వు ఏమవుతావన్నది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రోగాలెందుకు వచ్చాయని వైద్యుడు అడగడు. ‘ఇక చేయకు అలాంటి పనులు. నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి పంపిస్తా’ అంటాడు. భగవంతుడు కూడా అంతే! ఒకసారి తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడిపోయావు. నిన్ను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఈశ్వరుడి అనుగ్రహాన్ని, గురువు యొక్క సౌలభ్యాన్ని , శాస్త్ర పరమార్థాన్ని, ధర్మం వైశిష్ట్యాన్ని సమన్వయం చేసుకుని తరించగల స్థితి మానవుడికి ఒక్కడికే ఉంది. ఇతరాలకు లేదు. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుని, ఈశ్వరానుగ్రహాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత అవసరమో గుర్తించిననాడు దాని వైభవం మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మాచరణ ద్వారా తరించగల అవకాశాన్ని పరమేశ్వరుడు మనందరికీ ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పాలలా పొంగండి.. కానీ ఒలకకండి!
విద్య - విలువలు వ్యక్తిత్త్వ వికసనముకు సంబంధించి ఇప్పటివరకు రెండు విషయాలు ప్రస్తావించుకున్నాం. మొదటిది - Physically Fit (ఆరోగ్యంతో ఉండాలి), రెండవది - క్ఛ్ట్చడ అ్ఛట్ట (అధ్యవసాయంతో ఉండాలి) అంటే జీవితంలో ప్రతి విషయంలో స్పష్టతతో ఉండాలి. ఇక ఇప్పుడు- విషయాన్ని ధారణ చేసి, నిర్ణయం చేసేటప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకుని దాని ప్రకారం చేసే ప్రజ్ఞతో ఉండాలి. ఈ లక్షణం ఉన్నవారు దేశ సౌభాగ్యానికి కారణమవుతారు. అంటే మరింత సూటిగా మీకు అర్థం కావాలంటే ఇది ఎలా ఉండాలంటే - Intellectually sharp and emotionally well balanced too - అన్ని సందర్భాల్లో సునిశిత ప్రజ్ఞతోపాటూ, భావోద్రేకాల పరంగా సమతౌల్యతతో ఉండాలి. పొంగనివి పాలు కావు. అతిగా పొంగినవి ఉపయోగపడేవి కావు. పొంగనివాటిని పాలు అనరు, నీళ్ళు అంటారు. పొంగే లక్షణం పాలకుంటుంది. అగ్నిహోత్రం మీద పెట్టినప్పుడు పాలు పొంగాలి. కానీ అవి పొంగి నిప్పులో పడిపోయాయనుకోండి... అవి పనికి రావు. ముందు నిలబడి అవి పొంగినప్పుడు వాటిమీద నీళ్ళు చల్లితేనే అవి పనికొస్తాయి. జీవితంలో కూడా ఈ పొంగు ఉండాలి. అది ఉన్నవాడు జీవితంలో ఏదైనా సాధించగలడు. మాట విన్నాడనుకోండి. ఒక పొంగు ఉండాలి. ఒక కుతూహలం ఉండాలి. ఒక ఉత్సాహం ఉండాలి. నేను దీన్ని పాటిస్తాను, నేను దీనిపట్ల ఉత్సాహంతో ప్రవర్తిస్తాను, నేను దీనిని ఎందుకు సాధించలేను? నేనెందుకు అధ్యయనం చేయలేను, ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనలేను... అన్న ఉత్సాహం ఉండాలి. అదే సమయంలో అత్యుత్సాహం పనికిరాదు. నేనొక్కడినే చేసేస్తాను. మీరెవ్వరొద్దు - అని అనకూడదు. ‘‘అయ్యా! ఈ పని చేయకండి’’ అని పెద్దలు అన్నప్పుడు, చేయకుండా ఆగిపోగలిగిన నియంత్రణ ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే... సమతౌల్యతతో ఉన్నాడని అంటారు. అయినా జీవితంలో ఉద్రేకపడకుండా ఎవరుంటారు? కోపం లేకుండా ఎవరుంటారు? కానీ కోపం వచ్చిందనుకోండి. దానికి వశపడి పోకూడదు. కోపానికి వశపడిపోయారా, నోటివెంట రాకూడని మాటలు వచ్చేస్తాయి. ఎక్కడివరకు అవసరమో అక్కడివరకే కోపం. వ్యవస్థలో ఒక దోషం ఉండి దాన్ని చక్కదిద్దాలనుకున్నప్పుడు కోపం అక్కడివరకు ఉండాలి. చక్కదిద్దడమన్న ప్రయోజనం నెరవేరిన తరువాత కోపాన్ని విడిచిపెట్టాలి. పాము శరీరంలో కుబుసం పుడుతుంది. కుబుసం దాని శరీరంలో అంతర్భాగం. కానీ ఆ కుబుసం ఉన్నప్పుడు దానికి కళ్ళు సరిగా కనబడవు. అందుకే పాము దాన్ని వదిలిపెట్టేస్తుంది తప్ప ఉంచుకోదు. కోపం రావడం తప్పుకాదు. ఒక్కొక్కసారి కోపాన్ని నటించడం అవసర మౌతుంది. నేను పూజ చేసుకుంటున్నాననుకోండి. పండగకని ఒక్కసారిగా బంధువులంతా వచ్చి పెద్దగా మాట్లాడుతూ హడావిడి చేస్తున్నారు. పూజ సాగడంలేదు. అందరినీ బ్రతిమలాడుతూ ఉంటే పూజలో ఏకాగ్రత కుదరదు. గట్టిగా కోప్పడితే చిన్నబుచ్చుకుంటారు. బయటికొచ్చి ఒక్కసారి గంభీరంగా చూడాలి. అంతే! అర్థం చేసుకుని అంతా ప్రశాంతంగా అయిపోతారు. పూజ పూర్తవగానే ’’రండ్రా అందరూ తీర్థ ప్రసాదాలు పుచ్చుకుందురుగాని’’ అని నవ్వుతూ పలకరించాననుకోండి. నేను నటించిన కోపం ప్రయోజనం నెరవేరడమేగాక, మళ్ళీ ఎవరూ నొచ్చుకోకుండా అంతా సుఖాంతమైపోతుంది. అలాకాక కోపానికి వశపడిపోయాననుకోండి. నేను ఊగిపోతాను. దానివల్ల ఉపయోగాలేవీ లేకపోగా, అనర్థాలే ఎక్కువ. అందుకే ఎమోషన్ (భావోద్రేకం) ఎక్కడ అవసరమో అక్కడివరకే దాన్ని వాడాలి తప్ప కట్టుతప్పి ప్రవర్తించకూడదు. ఉత్సాహం మంచిదే. అత్యుత్సాహం ప్రమాదకరం. అందరూ శ్రమదానం చేద్దామని వచ్చారు. గురువుగారు కూడా వచ్చారు. ‘అయ్యో గురువుగారూ, మీరు చేయడమేమిటి, మీరు కూర్చోండి... ముందు మీరు కూర్చోండి’’ అని పదేపదే ఆయన్ని కాలు కదపకుండా ఇబ్బందిపెట్టడమేమిటి? ఆయన అలా కూర్చుంటే గురువుగారెందుకవుతారు? పదిమందికి ఆయన ఎలా మార్గదర్శకుడయ్యాడు? పదిమంది శ్రమదానం చేస్తున్నప్పుడు ఆయనా చేద్దామని వచ్చాడు. ఆయన చేయదగినదేదో ఆయన చేస్తున్నాడు. ఆయన చేయకూడనిదేదో ఆయనకు తెలియదా? ఇదే అత్యుత్సాహం. పరిమితిని దాటిపోకూడదు. ‘మీరు నలుగురు కలిసి ఈ పని చేయండి’ అన్నాననుకోండి. ఎందుకండీ, అదెంత పని నేనొక్కణ్ణే చేసేస్తా’ అనకూడదు. శ్రీరామాయణంలో ఇటువంటి వ్యక్తులు కొందరు కనబడతారు. అంగదుడు అటువంటి వ్యక్తే. హనుమ అంతటివాడికి నూరు యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ దర్శనం చేయడం ఎంత కష్టమయిందో తెలుసుకదా. లంకనుంచి వచ్చిన తరువాత సీతమ్మ దర్శనం అయిందని చెప్పడానికి హనుమ వచ్చినప్పుడు. అంగదుడన్నాడు కదా - ‘‘ఈపాటిదానికి ఇదంతా రాముడికి చెప్పడమెందుకు, లక్ష్మణుడికి చెప్పడమెందుకు, సుగ్రీవుడికి తెలపడమెందుకు? మనం నలుగురం వెళ్ళి రావణాసురుడిని చంపి సీతమ్మను తెచ్చి రాముడికి ఇచ్చేస్తేపోలా?’’ నిజంగా యుద్ధకాండ జరిగినప్పుడు రావణాసురుడిని గెలవడం రామలక్ష్మణులకు, కొన్ని కోట్ల వానరములకు అంత తేలిగ్గా ఏం జరగలేదు. అంత ఎమోషనల్గా మాట్లాడకూడదు. పదిమంది చేయవలసిన పనిని పదిమందీ కలిసి చేయాలి. దేవుడి పల్లకీ పట్టుకోవాలి, పదిమంది కలిసి పట్టుకోవాలి. వందమంది ఉన్నారనుకోండి. మనకు బలమున్నా నేనొక్కడినే పట్టుకుంటానంటే ఎట్లా? అది అందరూ పట్టుకుని తరించే మార్గం. పది అడుగులు వేసి మరొకడికి ఇచ్చేయాలి. ఆకలేసింది. పదిమందీ తిన్న తరువాత తింటానంటే ఎలా? ఏది ఎప్పుడు చేయాలో ఏది పదిమందితో కలిసి పంచుకోవాలో ఆ ఎరుక, ఆ ప్రజ్ఞ ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆవేశాన్ని అణచుకుని ఆచితూచి మాట్లాడాలి. మరీ అతిగా వెడితే అత్యంత ప్రమాదకరమవుతుంది. అందుకే కోపంలో, ఉద్రేకంలో, ఆవేశంలో, భావ ప్రకటనలో సమతుల్యత ఉండాలి. సందర్భాన్ని బట్టి సమయోచితంగా వ్యవహరించడం తెలుసుకోవాలి. మీకున్న తెలివితేటలకు మీకున్న విద్యార్హతలకు, మీకు సమాజంలో రాబోయే హోదాకు... ఇటువంటి నైపుణ్యాలు తోడయితే మీ వ్యక్తిత్వం వికసించడమే కాదు, పరిమళిస్తుంది, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని పరిమళభరితం చేస్తుంది. ఒకప్పుడు కిష్కింధకాండలో సీతమ్మ దర్శనానికి వెడితే సాయం సమయం అయిపోయి సుగ్రీవుడిచ్చిన కాలం దాటిపోయింది.ఒక బిలంలోకి వెళ్లారు. ‘‘వెనక్కివెడితే మా బాబాయిచంపేస్తాడు. అసలు మా బాబాయి నన్ను యువరాజును చేసిందేచంపెయ్యడానికి. నేనంటే ఆయనకు ఎప్పుడూ ఇష్టంలేదు. అందుకని ప్రాయోపవేశం చేసేద్దాం. ఇక్కడే చచ్చిపోదాం’’ అంటాడు. ఇటువంటి వ్యక్తులు ఇప్పటికీ సమాజంలో మనకు తారసపడుతుంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జిగురుకు భయపడితే పనసతొనలు ఎప్పటికీ తినలేరు
విద్య - విలువలు జీవితంలో పొరబాట్లు జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అది జీవితాన్ని మార్చుకోవడానికి పనికి రావాలి. ఇకపై నేనెటువంటి పొరబాటు చేయకూడదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనిషికి ఆర్ద్రత ఉండాలి, మనసులో తడి ఉండాలి. అది ఉంటే-ఎవరైనా ఏవైనా ఒక మంచి మాట చెప్తే దానిని మనసులో నాటుకునేటట్లుగా, గుర్తుపెట్టుకునేటట్లుగా వినే లక్షణాన్ని ఇస్తుంది. ఇదొక్కటి ఉంటే-మీకు జీవితంలో ఏది తెలియకపోయినా వృద్ధిలోకి వస్తారు. ఎవరు చెప్పినా అది మంచి మాటయితే వినగలగాలి. శ్రీ రామాయణంలో ఎప్పుడైనా, ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు రామచంద్రమూర్తి అందర్నీ కూర్చోబెట్టుకుని పేరుపేరునా అడుగుతాడు. తప్పు చెప్పినా, ఒప్పు చెప్పినా వింటాడు. విమర్శ చేయడు. చివరన శాస్త్రంతో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకుంటాడు. మనకు కూడా జీవితంలో ఇది అలవాటు కావాలి. రేపు పొద్దున మీరు అధికారులౌతారు. జీవితంలో సమున్నత స్థితికి వెడతారు. అందుకని చెపుతున్నా. ఎవరిలోనైనా మంచి చూడడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉండడమే కాదు, మీ దగ్గరికి వచ్చిపోయే వాళ్లు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇంతకన్నా మనుష్య జన్మకు ప్రయోజనం లేదు. మీరు ఎంత పెద్ద స్థానంలో ఉండండి, మీరు అశాంతిగా ఉండి, మీ దగ్గరికి వచ్చినవాడు కూడా అశాంతిగా వెళ్లిపోతే, జీవితంలో అంతకన్నా నరకం మరొకటి ఉండదు. నేను తెల్లవారుఝామున లేచాను. ఇంకా స్నానాదికాలు కాలేదు. గంట ఐదయింది. లేచి తలుపులు తీసుకుని బయటికి వచ్చాను. అప్పటికే విభూతి పెట్టుకుని వచ్చి ఒకాయన దభాల్న నా కాళ్లమీద పడ్డాడు. ‘‘ఏవయ్యా! ఎంకొచ్చావు?’’ అని అడిగితే, ‘‘... ఫలానా ఊరు నుంచి వచ్చానండీ. మా ఊరు ఉపన్యాసాలకు వస్తారా’’ అని అడిగాడు. ‘ఖాళీ దొరక్క చచ్చిపోతుంటే తెల్లవారకముందే వచ్చేసాడేందిలాగా...’ అని నేను అనుకోవచ్చు. కానీ - ఇంత పొద్దున్నే అయితే ఎవరూ ఉండరు, నేను ప్రశాంతంగా ఉంటాననుకొని నాతో మాట్లాడాలనుకుని వేకువఝామున మూడోగంటకే లేచి స్నానం, పూజ చేసుకుని నన్ను ఒప్పించడానికి ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాడో, నన్ను చూడగానే మాట రాక దభాల్న నేలమీద సాష్టాంగపడ్డాడన్న భావన నాకు కలగాలి. అప్పుడు... కనీసంగా పలకరించినా వచ్చినవాడు సంతోషిస్తాడు. ‘నీవొచ్చిన పని మంచిదే నాయనా, కానీ నాకు చాలా ఒత్తిడిగా ఉంది. ఎక్కడా ఖాళీలేదు. ఏమనుకోకు. నే ను రాలేను’ అని మంచిమాటలు ప్రశాంతంగా చెప్పి పంపించాననుకోండి. వచ్చిన పని కాకపోయినా సంతోషంగా వెడతాడు. అబద్ధాలొద్దు. ఉన్న మాట ప్రసన్నతతో చెప్పు. కోపం వ్యవస్థను చక్కబరచడానికే తప్ప అన్యథా ప్రదర్శించకూడదు. అదే నేనతని మీద వేళగాని వేళ వచ్చి విసిగించాడని కోప్పడి ఉంటే... అతను ఆ బాధను జీవితాంతం మర్చిపోలేడు. పైగా మనల్ని గురించి కూడా ‘‘ఆయన పైకి అలా కన్పిస్తాడు కానీ ధూర్తతనంగా మాట్లాడతాడు. వెళ్ళలేం దగ్గరికి’’- అని నలుగురికీ చెపుతాడు. అందుకే నీవేదైనా పని చేసేముందు అవతలివాళ్లలో ఉన్న మంచిని గుర్తించడం మొదలుపెట్టు. భార్యను ఎత్తుకెళ్లిన రావణాసురుడిలో కూడా రాముడు ఎంతో కొంత మంచి చూశాడు, విభీషణుడిలో, రాక్షస స్త్రీలలో, అనాగరికుడైన గుహుడిలో కూడా మంచితనం చూశాడు. వేషం చూసి మోసపోవద్దని ఇంగ్లీష్లో ఒక సామెత. మనిషి అందంగా కనిపించినంత మాత్రాన లోపల కూడా అంతే అందం ఉందని చెప్పలేం. పైకి అందంగా కనబడక పోయినా లోపలి సౌందర్యం లేదని చెప్పలేం. కంచి కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర మహాస్వామివారి ఫొటోఎక్కడైనా చూడండి. పొట్ట లోపలికి అంటుకుపోయి, ఉరఃపంజరం పైకి వచ్చి ఉంటుంది. విభూతి రేఖలు కూడా సరిగా ఉండవు. ఇంత లావుగా ఉంటాయి. కుంకుమ బొట్టు కూడా ఇంత పెద్దగా అద్దుకుని ఉంటారు. కాషాయ వస్త్రం తలమీద కప్పుకుని 90 సంవత్సరాల వయసులో రిక్షా ఆసరాగా పట్టుకుని అలా నడిచి వెడుతుంటే... బస్సుల్లో వెళ్లేవాళ్లు కూడా ఆపుకుని దిగి వచ్చి రోడ్డుకు రెండు వైపులా నేలమీద సాష్టాంగపడేవారు. వ్యక్తి గౌరవమనేది ఒక్క రూపంతో రాదు. అంతఃశీలం వల్ల, నడవడిక వల్ల వస్తుంది. ఎదుటివారిలో మంచి చూడడం మొదలుపెడితే, లోకం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. చెడుతనాన్ని పరిశీలించొద్దు... చూడొద్దు అని చెప్పడం కాదు నా ఉద్దేశం, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పనస పండు తొనలు బాగుంటాయి. కానీ జిగురుకు భయపడి విసుక్కుంటుంటే మీరు వాటిని ఎప్పటికీ తినలేరు. మీ చేతులకు నూనె రాసుకోండి, జిగురు అంటకుండా పనస తొనలు ఒలుచుకుని తినొచ్చు. మంచితో చెడు కలిసి ఉంటుంది. చెడుతో కలవకుండా మంచి ఉండడం జీవితంలో సాధ్యం కాదు. నా దగ్గరకు కొంతమంది వచ్చి, ‘‘భగవంతుడంటారు, ఈశ్వరుడంటారు, ఇలా రోడ్లమీద పడి కష్టపడి ఊళ్లు తిరిగి ఉపన్యాసాలు చెప్పి తలబద్దలు కొట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని... ఎందుకొచ్చిన వ్యాపకమండీ. మీరు కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగి. నెల తిరిగేటప్పటికి వేలకు వేల జీతం వస్తుంది. మీ భార్యగారు కూడా ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలు సెటిలయ్యారు. సునాయాసంగా ఇంట్లో కూర్చుంటే నెల తిరిగేసరికి లక్ష పైచిలుకే వస్తుంది. కూర్చుని హాయిగా టీవీ చూస్తూ సంతోషంగా గడపక మీకేం లోటా పాటా! శుభ్రంగా సూటూ బూటూ వేసుకోక, ఆ పంచేమిటి? ఆ లాల్చీ ఏమిటి? ఆ పిలకేమిటి? ఎందుకొచ్చిన కష్టం’’ అంటూంటారు. నేనంటాను... ‘‘అలా ఉండడంలో మీకు శాంతి, ఇలా ఉంటే నాకు శాంతి. ఎవరికి ఎలా శాంతిగా ఉంటే అలాగే ఉంటే సరిపోతుంది. మీ శాంతికోసం నన్ను మార్చకండి. మీకు నచ్చితే నేను చెప్పిన మార్గంలో వెళ్లండి. నచ్చలేదనుకోండి. అలాగే ఉండండి. నేనేమీ బలవంతంగా మీ చేత ప్యాంటూ, చొక్కా విప్పించి పంచె కట్టించడం లేదుగా’’ అంటాను. కాబట్టి అవతలి వారిలో మంచిని చూడండి. కాలం మారలేదు. ఆ మార్పు మనలో వస్తున్నది. మంచి మాటలు వినడాన్ని, ఎదుటివారిలో మంచిని చూడడాన్ని అలవాటు చేసుకోవడం వల్ల, అమూల్యమైన మన వాఙ్మయాన్ని అనుసరిస్తున్నందు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే... ఎప్పటికప్పుడు మన తప్పులను దిద్దుకుంటూ మనల్ని మనం సంస్కరించుకోవడానికి వీలవుతుంది, మన జీవితాలను ప్రశాంతంగా గడపడానికి ఉపయోగపడుతుంది. కంచి కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర మహాస్వామివారి ఫొటోఎక్కడైనా చూడండి. పొట్ట లోపలికి అంటుకుపోయి, ఉరఃపంజరం పైకి వచ్చి ఉంటుంది. విభూతి రేఖలు కూడా సరిగా ఉండవు. ఇంత లావుగా ఉంటాయి. కుంకుమ బొట్టు కూడా ఇంత పెద్దగా అద్దుకుని ఉంటారు. కాషాయ వస్త్రం తలమీద కప్పుకుని 90 సంవత్సరాల వయసులో రిక్షా ఆసరాగా పట్టుకుని అలా నడిచి వెడుతుంటే... బస్సుల్లో వెళ్లేవాళ్లు కూడా ఆపుకుని దిగి వచ్చి రోడ్డుకు రెండు వైపులా నేలమీద సాష్టాంగపడేవారు. వ్యక్తి గౌరవమనేది ఒక్క రూపంతో రాదు. అంతఃశీలం వల్ల, నడవడిక వల్ల వస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కాలమేం మారలేదు, అప్పటికీ... ఇప్పటికీ...
విద్య - విలువలు పొరబాటు ప్రతివాడి జీవితంలో జరుగుతుంది. ఇన్ని మంచి మాటలు చెప్పే నా జీవితంలో కూడా ఏవో పొరబాట్లు జరుగుతుంటాయి. ఎవడైనా తప్పు చేస్తాడు. ఏదో చిన్న చెడు లేకుండా ఎవడూ ఉండడు. తన తప్పు దిద్దుకుని తన జీవితాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి అన్ని అవకాశాలు వచ్చినా సైంధవుడు వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. లోకంలో ‘కాలం మారుతోంది’ అనే తప్పుమాట ఒకటి ప్రచారంలో ఉంది. కాలం మారదు. త్రేతాయుగంలో సూర్యుడు దక్షిణ దిక్కున ఉదయించలేదు, ఇప్పటిలాగే అప్పుడూ ఉదయించాడు, అలాగే అస్తమించాడు. భూమి తిరగడంలో తేడా వచ్చిందా? ఋతువులు మారడంలో తేడా వచ్చిందా? లేదు... కాలంలో ఏ మార్పూ రాలేదు. ఏదయినా మార్పు వచ్చిందంటే మనలో వచ్చింది. రాముడు తెల్లవారుఝామునే లేచేవాడు. మానేసింది మనం. వాళ్లలా బతకడం మానేసి నెపం కాలంమీద నెడుతున్నాం. దుర్మార్గపు బుద్ధుల్లో కూడా మహాభారతకాలానికీ ఇప్పటికీ తేడా ఏమీ లేదు. కోటికాస్యుడు అనే స్నేహితుడితో కలిసి సైంధవుడు అరణ్యం గుండా వెడుతున్నాడు. ద్రౌపదీ దేవి ఆశ్రమంలో పూలు కోసుకుంటున్నది. ఆమె మహా సౌందర్యవతి. వరసకు ఆమె చెల్లెలవుతుంది (సైంధవుడు- కురుపాండవుల చెల్లెలు దుస్సల భర్త). ఆ సమయంలో పాండవులు ఆశ్రమంలో లేరు. వేటకు వెళ్లారు. పాండవులు లేరు కనుక, ఒక్కతే ఉంది కనుక కబురు చేసాడు. అన్నగారే కనుక రమ్మనమంది. ఆ మర్యాదతోనే ఆయనకు మంచినీళ్లు ఇచ్చి పళ్లు తెచ్చిపెట్టింది. దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు ‘‘నేను నిన్ను నా భార్యను చేసుకుందామనుకుంటున్నాను’’ అన్నాడు. ఆవిడ హతాశురాలై ‘‘అన్నా ! నీ నోటివెంట ఈ మాట రావచ్చా ! అన్న చెల్లెలితో ఇలా మాట్లాడవచ్చా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అన్నా’’ అంది. అంతే! ఆమెను అపహరించి రథంలో చాలా వేగంగా తీసుకుపోయాడు. బుద్ధియందు రుగ్మత ఒక నాటిది కాదు. మనుషుల మనసులకు సంబంధించినది. ఒక కాలంలో మంచివాళ్లున్నారు, మరో కాలంలో చెడ్డవాళ్లున్నారన్న సిద్ధాంతం ఎప్పుడూ ఉండదు. చెడు బుద్ధి ఉన్నవాడు ఏ కాలంలో ఉన్నా పాడైపోతాడు. కొద్దిసేపటి తర్వాత పాండవులు వచ్చి విషయం తెలుసుకున్నారు. వెంటనే పరమ వేగంతో వెళ్లి సైంధవుణ్ణి బంధించి పట్టుకొచ్చారు. పాండవుల శక్తి అటువంటిది. ఇక్కడ మీరొక విషయాన్ని గమనించాలి. వ్యక్తిలో దోషం ఉంటే దాన్ని వ్యవస్థకు ఆరోపించి మాట్లాడకూడదు. అలాగే వ్యవస్థలో దోషం ఉంటే దాన్ని అలాగే చూడాలి, వ్యక్తులకు ఆపాదించకూడదు. ఒక డాక్టర్ తప్పుగా ఆపరేషన్ చేస్తే డాక్టర్లందరూ అలా చేస్తారని కాదు కదా, ఒక ఆఫీస్లో ఒకడు లంచం పుచ్చుకుంటే అన్ని ఆఫీసుల్లో అందరూ లంచాలు పుచ్చుకుంటారని కాదు కదా! నేనీమాట ఎందుకు చెప్తున్నానంటే... మీలో కొంతమంది రేపు పాత్రికేయులు కావచ్చు, టెలివిజన్ తదితర ప్రచార సాధనాల్లోకి వెళ్లవచ్చు. ఏ పని చేస్తున్నా వ్యక్తి దోషాన్ని వ్యవస్థ మీద రుద్దకండి.అలాగే వ్యవస్థ దోషాన్ని వ్యక్తులకు ఆపాదించకండి. సైంధవుడు తప్పు చేశాడు. ధర్మరాజు ధర్మాత్ముడు. ఆయనకు కూడా కోపం వచ్చింది. భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు కనుక! కానీ భీముడు కోపంతో సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని... ‘‘కోపంతో చంపేస్తావేమో! ఒక్కటి గుర్తుపెట్టుకో. మన చెల్లెలు పసుపు కుంకుమలు పోతాయి. చెల్లెలు ఇంటికొచ్చి- అన్నయ్యా, నా పసుపు కుంకుమలు తుడిచేశావా? అంటే ఏం చెప్తాం. కోపాన్ని నిగ్రహించుకో’’ అన్నాడు. అయినా భీముడి కోపం చల్లారలేదు. అందుకే అర్జునుడిని తోడిచ్చి పంపాడు. వాళ్లు వెళ్లి సైంధవుణ్ణి బంధించి తీసుకొచ్చి ధర్మరాజు కాళ్లముందు పడేశారు. ‘‘నీచమైన గుణానికి లోనయ్యావు. బావవి కనుక చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా. లేకపోతే చంపేసుండేవాళ్లు నా తమ్ముళ్లు. బుద్ధి మార్చుకుని బతుకుపో’’ అన్నాడు. ఇది ఒక సంఘటనే కావచ్చు. అందరి జీవితాల్లో అన్ని వేళల్లో మంచి సంఘటనలే జరగవు. ఒక్కొక్కసారి పొరబాట్లు జరుగుతాయి. సైంధవుడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు ఈ క్షమాభిక్ష అవకాశంగా తీసుకుని తన తప్పు దిద్దుకుని మంచివాడుగా మారిపోవచ్చు. కానీ ఆయన వెళ్లి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. సైంధవుడు మోక్షం అడిగి ఉండవచ్చు, నాలో ఇక చెడు భావనలు రాకుండా ఈ కాలం ఉన్నంతవరకు మహాత్ముడిగా నా కీర్తి ప్రచోదనం చెయ్యమని అడగవచ్చు. కానీ అలా అడగలేదు. ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్షపెట్టుకుని వారిని చంపగల శక్తి ఇవ్వమని అడిగాడు. ‘‘వారు ధర్మ రక్షకులు. అలా కుదరదు. అయితే ఒక వరం ఇస్తాను. నా పాశుపతాస్త్రం ఉంది కనుక అర్జునుణ్ణి నీవెలాగూ ఓడించలేవు. అర్జునుడు లేని సమయంలో మిగిలిన నలుగురినీ ఒక్కరోజు మాత్రం వారెంత బలగంతో వచ్చినా నీవు ఓడించగలవు’’ అన్నాడు. దానిని అవకాశంగా తీసుకున్న సైంధవుడు అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లగానే ధర్మరాజు, భీముడు, నకుడు, సహదేవులను లోనికి వెళ్లకుండా అడ్డుకుని పాండవుల మీది పగతో చంపేశాడు. ఏమయింది సైంధవుడి జీవితం? - అంత తపస్సు ప్రాణభిక్ష పెట్టిన పాండవుల కొడుకును చంపడానికి మాత్రమే పనికొచ్చింది. తర్వాత చాలా కథ నడిచింది. అర్జునుడు ఊరుకుంటాడా, ఆ మర్నాడు సాయంత్రానికల్లా సైంధవుడి తల నరికేశాడు. ఇది ఎప్పటి మాట. ద్వాపరయుగం నాటిది. ఒక్కరోజు అడ్డుకున్నందుకు, అదీ ఎవరిని.. ఓ నలుగురిని. కానీ ఇప్పటికీ ఒక మంచి పనికి ఎవరడ్డువచ్చినా ‘సైంధవుడిలా అడ్డుపడ్డాడు’ అని అంటూంటాం. అటువంటి అపకీర్తిని శాశ్వతంగా మూటగట్టుకున్నాడు. సైంధవుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది. పొరబాటు ప్రతివాడి జీవితంలో జరుగుతుంది. ఇన్ని మంచి మాట చెప్పే నా జీవితంలో కూడా ఏవో పొరబాట్లు జరుగుతుంటాయి. ఎవడైనా తప్పు చేస్తాడు. ఏదో చిన్న చెడు లేకుండా ఎవడూ ఉండడు. తన తప్పు దిద్దుకుని తన జీవితాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి అన్ని అవకాశాలు వచ్చినా సైంధవుడు వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. ప్రతి వ్యక్తీ మంచీ చెడుల సమాహార స్వరూపం. తన తప్పొప్పులను తాను గుర్తించగలగాలి. పొరబాటు జరిగిందని మృత్పిండంలా నేలమీద పడిపోకూడదు. పైకి లేవాలి. ధైర్యంగా సందర్భాన్ని ఎదుర్కోవాలి. ఎదురైన అవకాశాల్ని తప్పుల్ని దిద్దుకోవడానికి, అభివృద్ధి కొరకు ఉపయోగించుకోగలగాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శ్రద్ధగా వినడం.. ఆచితూచి మాట్లాడటం..
విద్య - విలువలు మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో సంభాషిస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నా... అవతలివాడు చెప్పేది శ్రద్ధగా వినాలి, వింటున్న విషయం మీద అత్యంత జాగరూకతతో ఆలోచన చేయాలి. అలాగే మనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక్కమాట పొల్లుపోకూడదు. కొన్ని ప్రమాదకరమైన ఊతపదాలు అపయత్నంగా దొర్లుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో వృద్ధిలోకి రావడానికి మొట్టమొదట అలవరచుకోవలసింది ఈ నైపుణ్యాలనే. ఒకవేళ అవి లేకపోతే భేషజాలకు పోకుండా నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. నేను గమనిస్తుంటాను... ఈ వేళ చాలామంది విద్యార్థులు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఎందుకు జరిగి ఉండొచ్చన్న పోస్ట్మార్టమ్ మీద ఎక్కువ శ్రద్ధచూపుతుంటారు. ‘‘సరే! ఈ తప్పు జరిగింది, వెంటనే దీన్ని ఎలా సరిదిద్దవచ్చు, సాధ్యమైనంతగా దీన్ని మనం ఎలా సఫలీకృతం చేయవచ్చు’’ అన్నదాని మీద దృష్టి పెట్టండి. విమర్శించడానికి, రాళ్ళు వేయడానికి గుంపులో ఒకడిగా నిలబడడం గొప్పకాదు. ఒకరు చేసిన పొరబాటును వేరొకరు దిద్దడం అనేది విశాల హృదయానికి సంకేతం. ఎప్పుడు కూడా ఎక్కడ నిలబడినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ టెంపో పెంచుకోండి, ఆ తత్త్వాన్ని అలవరచుకోండి. ఒకసారి మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో రైల్లో పోతున్నారు. ఆరోజుల్లో నల్లజాతీయులు నిలబడి వెళ్ళవలసిందే. తలుపుదగ్గర నిలబడి ఉండగా కుడికాలి చెప్పొకటి చటుక్కున జారి కిందపడి పోయింది. వెంటనే గాంధీగారు ఎడమకాలి చెప్పు తీసి బయటికి వదిలేశారు. పక్కన ఉన్నవాళ్ళు విస్తుపోయి అదేమిటని అడిగితే ‘‘కుడికాలి చెప్పుపడిపోయిన తరవాత ఎడమకాలి చెప్పు నేను ఉంచుకున్నా ఉపయోగంలేదు. ఒక్క చెప్పు దొరికినవాడికీ ఉపయోగం లేదు. ఆ చెప్పుకోసం రైలును ఆపలేం కాబట్టి రెండోచెప్పు వదిలేస్తే కనీసం అది దొరికిన వాడికన్నా ఉపయోగంగా ఉంటుందని అలా చేశా’’ అన్నారు. సమయస్ఫూర్తితో అంత త్వరగా అంత మంచి నిర్ణయం చేయగలిగిన సమర్థుడు కనుకనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింసా సిద్ధాంతంతో ఎదుర్కొని ఈ దేశమాత దాస్యశృంఖలాలను తెంచ గలిగాడు. ఏదైనా ఒక విషయంలో అవతలివాడు నోరు విప్పకముందే మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. అలా వచ్చేసిన తరవాత ఎదుటివాడు చెప్పేది వినడానికి మీ మనసు అంగీకరించదు, కాబట్టి మీరు వినరు. అది ప్రతిఘటనకు దారితీస్తుంది. వినే ఓపిక నశించిపోయి అవతలివాడిమీద కోప్పడడం, అతడు చిన్నబుచ్చుకోవడం... ఇది మీ ఆభిజాత్యమని మీరనుకుంటారు. అది ఒక మనిషికి ఉండవలసిన లక్షణం కాదు. అందుకే అవతలివారి మాట బాగా వినాలి. విన్న తరువాత బాగా ఆలోచించాలి. తరవాత తప్పుంటే దిద్దుబాటే చేయాలి. అంతే! అవతలివాడి తప్పు దిద్దడానికి మనం ఉన్నాం తప్ప వాడి తప్పు ఒప్పుకుని వాడిని రాపాడించడానికి కాదని మీరు గుర్తించాలి. అవతలి వ్యక్తిపట్ల ఉన్న ప్రేమను అలాగే ఉంచుకుని కేవలం తప్పు దిద్దే ప్రయత్నం చేస్తూ ఉండాలి, అదీ నిస్వార్థంగా. అంతే తప్ప కేవలం మీ మాట నెగ్గించుకోవడానికి మీరెప్పుడూ ఏ కార్యం చేయకూడదు. మీ మాట ఎప్పుడు నెగ్గించుకోవాలంటే దానివల్ల పదిమందికి ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే అలా చేయాలి. మరో విషయం. పని సానుకూలమైనప్పుడు ఇది నేను జోక్యం చేసుకోవడం’ వల్ల జరిగిందని పొంగిపోకూడదు. ఈశ్వరుడు నాచేత సమయాకూలంగా ఈ కార్యాన్ని చేయించాడని పొంగిపోవాలి. అటువంటి మానసిక స్థితిని మీరు పొందిననాడు మీరు ఎక్కడున్నా ఆ సమాజానికి ఆస్తి. మీరు ఎక్కడున్నా పదిమందిచేత ఆదరింపబడతారు. కొన్ని వందలమంది సంతోషానికి కారణమవుతారు. మీరు పరోక్షంలో కూడా ఆయన ఉండివుంటే’ అన్న ఆలోచన అక్కడివారికి కంది. ఓహో ఇలా కదా ప్రవర్తించాలి’ అని మిమ్మల్ని అనుసరించేవారు తయారవుతారు. అసలు మీకు ఈ నైపుణ్యాలే లేవనుకోండి. మీరు చాలా ర్తత్వమున్న వ్యక్తి అనుకోండి. మీరు ఏ వృత్తిలోనైనా ఉండండి, మీరు నెగ్గుకువస్తారని నేననుకోలేదు. ఒక సబార్డినేట్గా పైఅధికారి కొత్తగా వచ్చి మిమ్మల్ని పక్కన కూర్చో బెట్టుకుని ఏవో కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీరతను చెప్పే మాటవినలేదు. పైగా ‘‘అబ్బా సుత్తేశాడ్రా’’ అంటారు. ఏమిటి సుత్తేసేది, ఆయన అనుభవం ఏపాటిది ? ఆయన ఎన్ని క్లిష్టపరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని ఎంత అనుభవం మూటగట్టుకున్నాడు, అటువంటి అనుభవశాలి దగ్గర కూర్చొని వినడం నా భాగ్యవిశేషమని కూర్చోవాలి కదా! అలా చేయకపోతే ఎవరికి నష్టం ? నేను చాలా మందిని చూస్తుంటాను....ఆఫీసుల్లోకానీ, విద్యాసంస్థల్లోకానీ, సమాజంలో కానీ...... అవతలి వాళ్ళ గురించి తగినంత కారణం లేకుండా, విమర్శించడానికి తగిన భూమిక లేకుండా మాట్లాడుతుంటారు...దీనినే లూజ్ టాక్ అంటారు. వాళ్ళేం తప్పుచేసిన వాళ్ళు కారు, వీళ్ళ డబ్బేమీ తీకెళ్ళినవాళ్ళూ కారు, వీళ్ళ వస్తువులనూ పట్టుకెళ్ళలేదు... మరెందుకలా మాట్లాడడం! మీరు అలానే మాట్లాడుతున్నారనుకోండి. మీతో ఉన్నవాళ్ళు వినివిని... ఈయన అందరి గురించి ఇలానే మాట్లాడుతుంటారు. రేపు నా గురించి కూడా ఇలానే మాట్లాడతారు’’ అనుకుంటారు కదా! మీరు ఇంకొకళ్ళమీద క్రిటికల్ అనాలసిస్ చేసేముందు ఈయన చెప్పింది నిజమే అయి ఉంటుంది’’ వంటి దృక్పథంలో మీ విశ్లేషణ ఉండాలి తప్పించి మీ వారి పరోక్షంలో లూజుగా మాట్లాడినందువల్ల మీకు ఒనగూరే ప్రయోజనం సంగతి అలా ఉంచండి. మీ వ్యాఖ్యలను మళ్ళీ వాళ్ళకు చేరవేసే వాంటారనే విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. చాలామంది ఉద్యోగులు తమ జీవితాల్లో మనశ్శాంతిని మొట్టమొదట్లో పోగొట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలవుతుంటాయి. ‘‘సార్! వీడు నిన్నగాక మొన్న జాయినయ్యాడు. మీ గురించి ఏమన్నాడో తెలుసా .....’’ అలా మోసేస్తాడు. మీరెవరి గురించి వ్యాఖ్య చేసారో వారి పట్ల మీకు మనసులో పూజ్య భావన ఉండొచ్చు. కానీ ఆ ఒక్క వెలితి మాట అన్నందుకు జీవితా పాడవుతాయి. అందుకే నోటిమాటను చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి విడిచి పెట్టాలి. ‘ఇంత కోపాన్ని నటిస్తే తప్ప మనం పరిస్థితిని అధిగమించలేం’ అనుకున్నప్పుడు మాత్రమే కోపాన్ని అభినయించాలి తప్ప ఎప్పుడుపడితే అప్పుడు ఎటువంటి వారిమీదపడితే అటువంటివారిమీద మనం అలవాటు చేసుకున్న నిర్లక్ష్యపు ఊతపదాలు మాట్లాడకూడదు. అందుకే మీ నోటివెంట వచ్చే మాటలను నియంత్రించుకుని మాట్లాడడం అలవాటు చేసుకోండి. పవిత్రమైన వాక్కు, మంగళకరమైన వాక్కు మాట్లాడడం, మీకు అంగీకారం కాని విషయాన్ని ఆవిష్కరించేటప్పుడు ఎంతో చక్కని మాటలతో చెప్పడాన్ని అలవాటు చేసుకోండి. అంతేకానీ చాలా చౌకబారు విషయాలను మాట్లాడకండి. భాష విషయంలో జాగ్రత్తగా ఉండండి. చక్కటి భాషకు చక్కటి తెలుగున్న పుస్తకాలు చదవండి. పోతన భాగవతం చదవండి. మీరు చిన్నతనం అనుకోకపోతే...మీరు చిన్నబుచ్చుకోరనుకుంటే ఒక ప్రశ్న అడుగుతాను... మీలో ఎంతమంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి’ చదివారో చెప్పండి. వాల్మీకి, వ్యాసుడువంటి వాళ్ళు పుట్టిన ఈ దేశంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఏైకక వ్యక్తి ఠాగూర్. అటువంటి వారి పుస్తకాలను కానీ, జనగణమన అధినాయక జయహే!’ అన్న పాటకు పూర్తి అర్థంకానీ, బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం’ గీతానికి పూర్తి అర్థంకానీ తాత్పర్యం కానీ ఎంతమంది చదువుకున్నారు!! గీతాంజలి పుస్తకం కొనివ్వమని మీ నాన్నగారిని అడిగితే, ఆయన ఆ మాత్రం కొనివ్వని వ్యక్తా!!! తేటతెలుగులో అర్థం చేసుకోగలిగిన పద్యాలు రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగా, ఎంకిపాటల నండూరి సుబ్బారావుగారు, వీరేశలింగం పంతులుగారు, చిన్నిచిన్నిమాటలతో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు రచించిన గణపతి’, చంద్రశేఖరపరమాచార్యవారి, భారతీతీర్థస్వామి వారి అనుగ్రహభాషణాలు....అసలటువంటి మహాత్ములు రాసిన పుస్తకాలను చదవండి. ఆ పుస్తకాలు మీమీద ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడండి. వారి అనుభవాలు, వారు ఈ దేశాన్ని రక్షించడానికి పొందిన పరివేదన తెలుసుకున్నవాడు ఉద్యోగంలోకి వెళ్లినతర్వాత బల్లకింద చెయ్యి పెట్టి లంచం పుచ్చుకోగలడా ? అరవిందో దేశ స్వాతంత్య్రంకోసం పోరాడుతుంటే తీసుకెళ్ళి గోవా జైల్లో కాలు పూర్తిగా చాపడానికికూడా వీలులేనంత ఇరుకు గదిలో ఉంచారు. మలమూత్రాలను అక్కడే విసర్జించాలి. ఒక్కసారి మాత్రమే వస్తాడు ఒక వ్యక్తి. ఆ గదిలోని మలాన్ని ఎత్తి బుట్టలో వేకుని వెళ్ళిపోతాడు. ఇనుప ఊచలమధ్యలోంచి మునివేళ్ళతో పట్టుకుని గ్లాసు బయటికి పెట్టి మంచినీళ్ళు తీసుకుని మళ్ళీ జాగత్తగా లోపలికి లాక్కుని తాగితేనే ఆ రోజుకు దాహం తీరేది. పొరబాటున గ్లాస్ కిందపడి నీళ్ళు ఒలికిపోయాయా...మళ్ళీ రేపు మలం ఎత్తేవాడొస్తేనే నీళ్ళు. అరచిగోలపెట్టినా ఏ వ్యక్తీ పలకడు. భారత మాతాకీ జై అంటూ అలా నానా కష్టాలూ పడి జైళ్ళలో సంవత్సరాలపాటు మగ్గి ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. అది మనం లంచాలు పుచ్చుకోవడానికీ, వ్యవస్థలను నాశనంచేయడానికీ తెచ్చింది కాదు. దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్ఠనూ మనం ఇమడింపచేయాలి. దేశంనిండా మంచివాళ్ళు ఉన్నప్పుడు పరిపాలన దుర్మార్గంగా ఎందుకుండాలి ? ఈ లోటు ఏదయితే ఉందో దాన్ని భర్తీచేయాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే రేపటితరం మీది కనుక. మేధావులు, వేదాల్ని, ఉపనిషత్తుల్నీ వడగట్టిన వాళ్లున్న దేశంలో అటువంటి వాళ్ళు ఒక్కళ్లూ లేకుండా ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానాల పాలకమండళ్ళను ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడుందీ దోషం? ఈ దోషాన్ని దిద్దడానికి రేపు కలం పుచ్చుకుని సంతకం చేయాల్సిన అధికారులు మీరు. గాంధీజీ కలలు కన్న దేశాన్ని తీసుకురావాలంటే వాళ్ళలా మీ ఆంతరంగిక వ్యక్తిత్వం తయారు కావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తగు సమయం.. తగిన పని...
విద్య - విలువలు ఒక గోడకట్టాలనుకున్న వ్యక్తి నాదగ్గర ఇటుకలున్నాయికదా అనుకుంటే గోడ లేవదు. ఒక్క సిమెంట్ ఉందంటే గోడ సిద్ధం కాదు. ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, ఇసుక ఉండాలి, నీళ్ళుండాలి, కట్టే తాపీ మేస్త్రీ ఉండాలి... ఇలా అన్నీ సమకూరితేనే గోడ కట్టగలడు. కేవలం బి.టెక్ అయినందువల్ల అతను ఇంజనీరని నేననుకోను. ఒక వ్యక్తి ఎం.బి.బి.ఎస్ అయితే అతను డాక్టరని నేననుకోను. ఎందుకంటే ఒక డాక్టర్ డాక్టరనిపించుకోవడానికి ఒక ఆంతరంగిక వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఒక ఇంజనీరు ఇంజనీరనిపించుకోవడానికి కొన్ని వ్యక్తిగత లక్షణాలుండాలి. ఏ వృత్తివిద్య తీసుకున్నా, ఆ విద్య తాలూకు ప్రత్యేకించి ఉండాల్సిన కొన్ని లక్షణాలుంటాయి. అందుకే నేను గతంలో జడము అనే మాటను అంత వివరంగా ప్రస్తావించాను. తెలియకపోవడం తప్పుకాదు, విషయం తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందించి ఆచరించడానికి సిద్ధం కాకపోవడం మాత్రం నేరమే, కచ్చితంగా దోషమే. హఠాత్తుగా రైల్లో ప్రయాణం చేయాల్సిన అవసరం పడింది. తత్కాల్! దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే... శీఘ్రదర్శనం! ఆశ్చర్యకరమైన విషయ మేమిటంటే- ఆస్పత్రికి వెడితే... నిర్మొహమాటంగా కొంతమంది డాక్టర్లు స్పీడ్ కన్సల్టేషన్! అని బోర్డు పెట్టేస్తున్నారు. గోరుచుట్టున్నవాడయినా, కాళ్లూ చేతులు విరిగి వచ్చినవాడయినా వరస క్రమంలో వెళ్ళాలి. అయితే ఎవరిని ముందు చూడాలి, ఎవరిని కాదనేది డాక్టర్ నిర్ణయించుకోవాలి తప్ప డబ్బున్న పేషంట్ నిర్ణయించుకుంటే ఎలా! ఆ డబ్బు తీసుకుని వాళ్ళని ముందుగా చూసి పంపే డాక్టర్ ఒక డాక్టరా!!! ఆంతరంగిక వ్యక్తిత్వం చచ్చిపోయి కీర్తిని డబ్బుకు అమ్ముకున్నవాడు డాక్టరా! ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకొచ్చారంటే.. అందరూ ఏదో ప్రమాదంలో కాళ్ళు విరిగిన వాళ్లే, చేతులు విరిగిన వాళ్ళే, ముందుగా నిర్ణయించిన సాధారణ చార్జీ చెల్లించుకోగలిగిన వాళ్ళు వారిలో 10 మంది ఉంటే, స్పీడ్ కన్సల్టేషన్ కింద ఎక్కువ మొత్తం చెల్లించుకోగలిగిన వాడు వేలిమీద గోరు మొలిచిందని వస్తే వాడిని ముందు చూసి, ఎముకలు విరిగి బాధతో మెలికలు తిరుగుతున్నవాడిని, నాలుగైదుచోట్ల ఎముకలు విరిగి రక్తమోడుతూ బయటపడి ఉన్నవాడిని గంట తరవాత చూస్తావా? స్పీడ్ కన్సల్టేషన్ ఫీజు చెల్లించినవారు మరో ఐదుగురున్నారు తరవాత చూస్తానంటావా? కాల్చనా నీ చదువు! ఆ చదువు ఒక చదువా, ఆ డాక్టర్ ఒక డాక్టరా! డాక్టర్ హనుమను ఉపాసన చేసి నేర్చుకోవాలి..’’ఇది కాదు నా బతుకు, ఇలా కాదు, నే జీవించవలసింది’’ అని. ఆర్తితో గబగబా బయటకు వచ్చి బల్లమీద మెలికలు తిరుగుతున్న వాడిని ముందుగా చూచినవాడు డాక్టర్. ఒక డాక్టర్ కూడా శాశ్వతంగా ఉండడు. కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఎంత కీర్తిని వారు సంపాదించగలిగారు, ఎంత గౌరవంగా బతకగలిగారు, ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారన్నది వారికి పేరు తీసుకు వస్తుంది, కన్నవాళ్ళకు గౌరవాన్ని తీసుకొస్తుంది. సమాజమంతా ఎంతో సంతోషంగా వారిని ఆదరిస్తుంది. ఒంట్లో ఓపిక ఉండగానే మనం ఏది చేస్తామో అదే మనకు తృప్తి. ఆ ఓపిక పోయిన తర్వాత ‘‘నేనది చేసుంటే బాగుండేది’’అని వగచి ప్రయోజనం లేదు. నేను ఏ స్వార్థంతోనో మీకీ బోధ చేయడం లేదు. నా ఆర్తిని గ్రహించండి. పనికిమాలిన విషయాల మీద దృష్టిపెట్టకండి. చాలామంది విద్యార్థులు పనికిమాలిన కార్యక్రమాలు చాలా చూస్తుంటారు. ఎవరో ఒకావిడ అవతలవాడెవడో తెలియదు, ఫోన్ మోగుతుంది మీ టీవీ వాయిస్ తగ్గించండంటుంది. మీరెవరు, ఏం చేస్తున్నారంటూ అరగంట గడుపుతుంది. తరవాత అడ్వర్టయిజ్ మెంట్లు-పళ్ళు ఏం పెట్టి తోముకోవాలో, ఏం పెట్టి రుద్దుకుంటే జుట్టు ఎంత పొడుగు సాగుతుందో ఎంతసేపు చూసినా పళ్ళు, జుట్టు... ఈ ప్రకటనలే... మీరు కోరుకున్నదో, మీరు కోరుకోనిదో ఓ 5 నిమిషాలు చూపడానికి ఇంత ముఖ్యమైన సమయం వృథా అయిపోతున్నది. అది ఒకసారి పోతే మీరు కావాలనుకున్నది మీరవడం ఎలా సంభవిస్తుంది? తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు.. ఎందుచేతంటే.... ఈవేళ మీకు తెలియదు, భవిష్యత్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో... మీరు పిల్లలు. ఉన్న సమయం దుర్వినియోగమయిపోతోంది.. ఇంటర్లో, ఎంసెట్లో ఎవడు కష్టపడి చదివాడో వాడిస్థితి వేరు. అంత గొప్పగా చదువుకున్నవాడు మంచి కాలేజీలకు లేదా కాలేజ్ ప్లేస్మెంట్స్లో రివ్వున ఎగిరిపోతాడు. ఇంటర్లో రెండేళ్ళు బాగా చదువుకున్నందుకు వాడి భవిష్యత్తుకు భరోసా దొరికిపోయింది. ఎంసెట్లో సరిగా రాయనందుకు ఏదో ప్రఖ్యాతిలేని ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని బయటకు వచ్చిన వాడి తల్లిదండ్రులు పడుతున్న ఆర్తి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చి ఏడుస్తూ వాళ్ళ బాధ వెళ్ళగక్కుకుంటుంటారు. 365 రోజులూ క్రికెట్ ఆడుతూనే ఉంటారు. వాళ్ళకది అలవాటు. దానివల్ల వాళ్ళకు కోట్లు వస్తాయి. వాళ్ళు ఆడతారు. నీవు అదేపనిగా చూస్తూ కూర్చుంటే రేప్పొద్దున ఆరేళ్ళు తిరిగేసరికి ఇంజనీరింగ్ అయిపోయినా ఇంకా నీ జీవితంలో సెటిలవక ’’అమెరికా వెళ్ళి ఎంఎస్ చదువుతాను నాన్నగారూ, మీకున్నదంతా అమ్మి ఇస్తారా’’ అంటే తండ్రి ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉండగా నీవు సైకిల్ మీద బయటికొచ్చి సిగ్నల్ లైట్ దగ్గర ఆగినప్పుడు- నీతోపాటు చదువుకున్న విద్యార్థి 70 లక్షల రూపాయల కారులో ఒక ఐశ్వర్యవంతుడి కుమార్తెను భార్యగా స్వీకరించి గొప్ప అధికారి హోదాలో ముందు డ్రైవర్ కారు నడుపుతుంటే- అదే సిగ్నల్ లైట్ దగ్గర ఆగినప్పుడు- అక్కడే ఆగి ఉన్న నిన్ను చూసి ‘‘ఏరా బాగున్నావా?’’ అని అడిగిన క్షణాన నీవు పోగొట్టుకున్నదేదో నీకు తెలిసివస్తుంది. కాలం ఇక వెనక్కి రాదు. మీరు దానిని సక్రమంగా ఉపయోగించుకోవలసిన సమయంలో సక్రమంగా ఉపయోగించుకున్నారా జీవితం సార్థకమవుతుంది. అందుకే మహాత్ములయిన వారికి క్రోధం ఒక్క కారణం చేత మాత్రమే వస్తుందంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అదెప్పుడంటే....చెయ్యవలసిన పని, చెయ్యవలసిన సమయంలో చెయ్యనివాడిని చూస్తే వస్తుందంటారు. ఈ కాలమంతా మీరు బాగా చదువుకోవలసిన కాలం. ఈవేళ దారుణాతి దారుణమైన స్థితి ఎక్కడుందీ అంటే... అసలు ఏ పిల్లల జీవితాలు తల్లిదండ్రుల మనశ్శాంతికి కారకాలో అది లోపించిన నాడు... ఇంజినీరింగ్లో సరిగా చదవక, మంచి ఉద్యోగంలో సెటిలవకపోతే నేను, నాభార్య లక్షల రూపాయలు సంపాదించినా ‘అయ్యయ్యో, చదువుకోవలసిన సమయంలో మా వాడు సరిగా చదువుకోలేదు. ఎక్కడా ఉద్యోగం లేదు’ అంటుంటే లోపల మనసు కుతకుత ఉడికిపోతుంటుంది. బీటెక్ అయిన తర్వాత జెరాక్స్ సెంటర్లలో పనిచేస్తున్న పిల్లలను చూస్తున్నాం. హైదరాబాద్ వెళ్ళి ఏదో కంప్యూటర్ కోర్స్లో చేరి నేర్చుకుంటానంటే....’’మీ అబ్బాయికింకా ఎక్కడా ఏమీ రాలేదా?’’ అని కనిపించిన వాడల్లా అడుగుతుంటే సిగ్గుతో తలవంచుకుని ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకుని కొడుకును వెంటబెట్టుకుని హైదరాబాద్కు వెళ్ళి చేర్పించి వస్తే.... వాడెందులోనూ సెటిలవక ఇంటికి తిరిగొచ్చేస్తే... తర్వాత సంవత్సరం చదువుకున్న వాళ్ళు కూడా కాలేజ్ ప్లేస్ మెంట్లలో కార్పొరేట్లలో, మల్టీనేషనల్ కంపెనీల్లో జాయిన్ అయిపోతుంటే...ఒకే ఒక్క దోషానికి ఒక ఏడాది సరిగా చదవని దోషానికి వాడు ఏడుస్తూ, వాడి తల్లిదండ్రులు ఏడుస్తూ పదిమందిలో వచ్చి నిలబడలేక ....ఇదంతా... ఏం ఖర్మ... మిమ్మల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులకు. సమయాన్ని వాడుకోవలసిన సమయంలో వాడుకోనివాడు ఎంతటి ప్రజ్ఞావంతుడయినా దానివల్ల ఉపయోగం ఉండదు. సమయాన్ని సక్రమంగా వాడుకోవడమన్నది ఎంతో ప్రధానమైన విషయం. దీనితోపాటుగా జీవితంలో ఒక విషయాన్ని బాగా నేర్చుకోండి. ఈ వేళ మిమ్మల్ని పాడుచేసే వాటిని ఆపగలిగిన శక్తి కలిగిన వ్యవస్థ నాకు ఎక్కడా కనబడడంలేదు. ఇలా పిల్లల్ని పాడుచేయవద్దు. ఆని శాసించగల యంత్రాంగం నాకు కనబడడంలేదు. ఇలా సినిమా తీయవద్దని చెప్పగలిగిన వాడు లేడు. ఇటువంటి సీరియల్ ప్రసారం చేయవద్దని చెప్పేవాడు లేడు. ఇటువంటి వ్యాసం రాయవద్దని చెప్పేవాడు లేడు. ఇటువంటి పుస్తకం ముద్రించవద్దని చెప్పేవాడు లేడు. అందువల్ల మీకు మీరే జాగత్తపడాలి. అటువంటి అక్కరలేని విషయాల జోలికి పోకుండా మీకు మీరే నియంత్రించుకోగలిగిన శక్తి పెంచుకోవాలి. అంటే ఇది ఎంత దారుణమైన విషయమంటే... నిజానికి తల్లిదండ్రులు ఉండి కూడా బిడ్డలను అనాథగా వదిలివేసిన స్థితి ఎటువంటిదో ఈవేళ చదువుకుంటున్న విద్యార్థులకు సమాజం చేస్తున్న ఉపకారం అటువంటిది. కాలం ఇక వెనక్కి రాదు. మీరు దానిని సక్రమంగా ఉపయోగించుకోవలసిన సమయంలో సక్రమంగా ఉపయోగించుకున్నారా జీవితం సార్థకమవుతుంది. అందుకే మహాత్ములయిన వారికి క్రోధం ఒక్క కారణం చేత మాత్రమే వస్తుందంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అదెప్పుడంటే.. చెయ్యవలసిన పని, చెయ్యవలసిన సమయంలో చెయ్యనివాడిని చూస్తే వస్తుందంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
హితవాక్యం... సమాజ హితం...
విద్య - విలువలు ఈ ప్రపంచంలో ఎవడూ ఒప్పులకుప్ప కాదు. ఇన్ని చెబుతున్న నేను పూర్తి ఒప్పులకుప్పనేం కాదు. నాలో దోషం నేను తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి ‘‘... వద్దు, నీకేం లోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి. రాముడికి అపచారం చెయ్యకు...’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడి చేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో ఛస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతే తప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్నా, పదితలలున్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు? రాముడు చెప్పాడు, అంగదుడు, హనుమ, మహర్షులు చెప్పారు, కైకసి చెప్పింది. తండ్రి, మేనమామలు చెప్పారు... ఆఖరున అన్నీ విరిగి యుద్ధభూమిలో నిలబడిపోతే రాముడు ‘ఇప్పటికైనా ఆలోచించు’ అన్నాడు. సీతమ్మ చెప్పింది, భార్య మండోదరి చెప్పింది. ఎవరు చెప్పినా వినలేదు. వినని తలలు తెగిపడిపోయాయి. సీతమ్మ ఎప్పుడో చెప్పింది... ‘నీకు తెలియదా, చెప్పేవాళ్ళులేరా.. చెబితే వినవా, ఎక్కడుంది నీ తప్పు, మాట్లాడకూడనిది మాట్లాడుతున్నావు రావణా, దీని పర్యవసానం ఏమిటో నీవు చచ్చాకే నీకు తెలుస్తుంది’’ చివరకు చచ్చిపడిపోయి ఉంటే మండోదరి వచ్చింది. భర్తను చంపినందుకు రాముడిని తిట్టడానికి వచ్చిందకున్నారంతా. వచ్చి రావణాసురుడి శవాన్ని చూసి ఓరి దుర్మార్గ్గుడా! నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడిందిరా! అన్యకాంతను తీసుకొచ్చావు. లోకాలన్నిటిని గెలవగలిగిన కొడుకుని కన్నాను. నీ కామానికి చంపేసావు, నేను చచ్చిపోతే కాల్చడానికి కొడుకును మిగల్చకుండా చచ్చిన ధూర్తుడా, నీ ఇంద్రియాలకి, నీ కామానికి చచ్చిపోయావురా’’ అంది. అంత వేదం చదువుకున్నాడు, కాంచనలంకాధిపత్యం వహించాడు. పుష్పకవిమానంలో తిరిగాడు... చివరకు ఏమయింది.. మంచి మాట వినలేదు, వెళ్ళిపోయాడు. మహాభారతం సమస్త సారాంశం కూడా ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటు చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. జానామిధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి కేనాపిదేవేన హృదిస్థితేన యథాపవృతోస్మి తథాకరోమి అహంకారబలం అది - ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యకుండా ఉండాలనిపించడం లేదు. అయినా నేను తప్పు చెయ్యడమేమిటి! లోపలున్న ఈశ్వరుడు చేయిస్తున్నాడు. నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడ విరిగి పడి పోయాడు. జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒక్కటే. మాటవినడమన్నది తెలుసుకోవాలి. నీకు తెలియదు, ఎప్పటికీ తప్పుకాదు. అది తప్పని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. శాస్త్రం కూడా ఎంత ఉదారంగా మాట్లాడిందో తెలుసా? తెలియక చేసిన తప్పు క్షమించమంది. తెలిసి చేసిన తప్పుకు క్షమార్పణ లేదు, పాయశ్చిత్తంలేదు. నీవు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎలా? ఆవుపాలధార నేలపాలు కాకుండా కుండలోకి ఎంత జాగత్తగా పిండుతావో పెద్దల మాటల వృథాకానీయకుండా అలా పట్టుకో. వేదం ఒక మాట చెప్పింది. భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవః’’ ‘చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ మేం మంచి మాటలనే వినెదముగాక’ అంటుంది. అలా వినడం చేతకాకపోతే జీవితం పాడయిపోతుంది. పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు. తల్లి, తండ్రి, గురువు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు కాఫీ తాగుతూ ఆయన చెప్పేది వింటుంటానా? అందుకే మహాత్ములు రాసిన పుస్తకాలు చదువుతుంటే అంత శ్రద్ధగా చదవాలి. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థ స్వామివారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కు చదవండి. రామకృష్ణ పరమహంస వారి మాట చదవండి. ఎపిజె అబ్దుల్కలామ్గారి మాట చదవండి. ఒక్కమాట, అటువంటి మహితాత్ములు మాట్లాడితే ఎంత వృద్ధిలోకి వస్తారో తెలుసా? అబ్దుల్ కలామ్గారు చదువుకునే రోజుల్లో శివ సుబ్రమణ్యం అయ్యర్ అని ఒక మేష్టారుండేవారు. తెల్లవారుఝామున లేచి స్నానంచేసి వెళ్ళిన 10 మందికే లెక్కలు చెప్పేవారు. స్కూల్లో పాఠం చెప్పేవారు. ఒక రోజు పాఠం చెబుతూ... పక్షి ఎలా ఎగురుతుందో బ్లాక్ బోర్డు మీద బొమ్మలు వేసాడు. ఎలా కూర్చుంటుంది, ఎగిరేటప్పుడు రెక్కలు ఎలా విప్పుకుటుంది, శక్తినంతా కూడ దీసుకుని రెక్కలు అల్లారుస్తూ శరీరాన్ని పైకి ఎలా లేపుతుంది, తోకతో దిశను ఎలా మార్చుకుంటుందో చెప్పి మీకర్థమయిందా?’ అని అడిగారు. కలాం గారు నిలబడి అయ్యా, మీరు చెప్పడంలో ఏమీ దోషంలేదు, కానీ మేమే అందుకోలేక పోయాం, అర్థం కాలేదు’ అన్నారు. ‘అయితే ఈ సాయంతం 5 గంటలకు సముద్రపు ఒడ్డుకు రండి (ఆ ఊరు సముద్రం పక్కనే ఉంది), నేనూ వస్తాను’’ అని అయ్యర్ చెప్పారు. ఆ సాయంత్రం పక్షులు బారులు బారులుగా వచ్చి వెడుతుంటే వాటి కదలికలను చూపుతూ వివరించి చెప్పారు. కలాం వాటిని చూస్తూ తాదాత్మ్యం చెందాడు. వేకువఝామునే వెళ్ళి గురువుగారిని కలిసి ‘‘నిన్న మీరు చెప్పిన పాఠం విన్నాను, పక్షులను చూచాను. విమానం గురించి విన్నాను. నాకు కూడా అలా గాలిలో ఎగిరేవి నిర్మించాలని ఉంది’’ అని చెప్పారు. అదెలా సాధ్యం?’ అని గురువుగారు అనలేదు. ‘‘నాన్నా, ఈ పరీక్షలు బాగా రాయి. మంచి మార్కులొస్తే చెన్నైలో ఒక కాలేజి ఉంది. అక్కడ సీటు వస్తుంది. అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని బ్రాంచ్ ఉంటుంది, దానిలో చేరితే నీవు కోరుకున్న వ్యక్తివి అవుతావు’’ అన్నారు. ఒక్కమాట... ఆ ఒక్కమాట ఆయన జ్ఞాపకం పెట్టుకుని చెల్లెలు అత్తగారు బంగారం ఇస్తే తాకట్టు పెట్టుకుని చదువుకున్నాడు. తాను కోరుకున్న వ్యక్తి అయ్యాడు. మనకు ప్రాతః స్మరణీయుడయ్యాడు. భారతదేశానికి ఉపగ్రహాలను నిర్మించడంలో సాటిలేనిమేటియై, ఏ మేష్టారు ఎంత ఓర్పుగా మాట్లాడితే ఈ అబ్దుల్ కలాం ఇంతటివాడయ్యాడో, రాష్ట్రపతి భవన్లో కూర్చోగలిగాడో అలాటి అయ్యర్గారిని దృష్టిలో పెట్టుకుని... ‘‘ఆయనలాగా అంతమంది పిల్లలను తయారు చేయడానికి రాష్ట్రపతి భవన్ను విడిచిపెట్టి విశ్వవిద్యాలయాలకు, పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులను కలవడానికి ఇష్టపడి వెళ్ళిపోతున్నాను’’ అని రాసుకున్నారు కలాం, తను రచించిన ‘ఇన్డామిటబుల్ స్పిరిట్’ అనే గ్రంథంలో. అదీ మంచిమాట వింటే ఫలితం. అదీ ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించడమంటే. అదీ తమసోమా జ్యోతిర్గమయ. అదీ సంస్కార వైభవమంటే. చదవండి. అన్నివేళలా క్లాస్ పుస్తకాలే చదవక్కరలేదు. దానితోపాటు సంస్కారమిచ్చే పుస్తకాలు చదవండి. మహాత్ములను దర్శించండి. మీరూ జీవితంలో అలా సమున్నత స్థానాల్లోకి రావాలనీ, మీరూ ఒక దీపమై వేల దీపాలు వెలిగించాలని మీరందరూ వృద్ధిలోకి రావాలని నేను పరిపూర్ణమైన హృదయంతో భగవతిపాదములు పట్టి పార్థిస్తాను. లోకంలో మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమంకోరి మీ హితంకోరి, మీ వృద్ధికోరి మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి ప్రపంచం నలుమూలలా వెతికినా దొరకరు. ఒకవేళ దొరికినా అటువంటి మాట వినేవాడు దొరకడు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలోపడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన నీకేం అర్థమయింది’ అని అడిగాడు. నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నే యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు. బహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వినండి... వినడం నేర్చుకోండి
విద్య - విలువలు ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే, ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి మీరు కానీ, ఒక్క మాట అందులో పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... అటువంటి వాడి జీవితం చక్కదిద్దబడటానికి అవకాశం ఉంటుంది. రామాయణంలో మారీచుడు రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. రామాయణమంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క శ్లోకం ఒక ఎత్తు. అది రాముడు చెప్పడు, విశ్వామిత్రుడు చెప్పడు, వశిష్ఠుడు చెప్పడు. రాక్షసుడైన మారీచుడు చెబుతాడు. కానీ నాకు ఎంతిష్టమో ఆ శ్లోకం. అందులో మారీచుడంటాడు. ‘‘సులభః పురుషః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పత్యస్య క్తాశ్రోతాచ దుర్లభః’’ మీరు ఏది చేస్తే అది కరెక్ట్ అనే వాళ్లు మీకు జీవితంలో చాలామంది దొరుకుతారు. మీరు చేసేది తప్పు. ఇలా చేయొద్దు అనేటటువంటి మిత్రులు ఒక్కరు కూడా ఉండరు. మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు చెప్పేవారు దొరకరు. మీరు ఆఫీసరు అయ్యారనుకోండి. మీరు తప్పు చేస్తే ఆఫీసులో మాట్లాడుకుంటారుగానీ, మీ ఎదురుగా వచ్చి మాట్లాడరు. ఒకవేళ చెప్పినా నిష్పక్షపాతంగా మీ అభ్యున్నతి కోరి చెప్పరు. మీరు గోతిలో పడిపోతున్నా మిమ్మల్ని పొగిడే వారు మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ మీకు మేలు కలిగించే అప్రియమైన మాటలు చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. మీ మేలు కోరి చెప్పేవారి మాటలు పట్టించుకోకుండా మీ అహం దెబ్బతింటుందని దూరంగా పెడితే, మీరు గోతిలో పడిపోక తప్పదు. మారీచుడు చెప్పిన మాట రావణాసురుడు విని ఉంటే రావణుని పతనమే తప్పేది. చెప్పిన మాట వినకపోవడమన్న దోషం నీతో పోదు. నిన్ను నమ్ముకున్న కోట్లాది మంది నీతో పోతారు అన్నాడు. అందుకనే మీరు ఎప్పుడూ శాస్త్ర పఠనం చేస్తూ ఉండాలి. రాక్షసులకు ఎంత జ్ఞానం ఉంటే అంత అపాయం. ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలామంది ఉంటారు. బాగా చదువుకుని, పెద్ద పనిలో ఉన్నవాడు తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవరూ ఉండరు. జ్ఞాని ఖలుడైపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది. చదువుకునే వాడికే క్యారెక్టర్ చాలా అవసరం. రేపొద్దున మీరే సంఘానికి ఉదాహరణలవుతారు. మీకు ఒక మాట మనవి చేస్తాను బాగా గుర్తు పెట్టుకోండి. సచ్చిదానంద శివాభినందనృసింహ భారతి అని శృంగేరి పీఠాధిపతులు అరణ్యం గుండా వెళుతున్నారు. చీకటి పడితే ఆ అరణ్యంలోనే ఒకచోట గుడారాలు వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్ వచ్చాడు అక్కడికి. వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. పీఠాధిపతి త్రికాలవేది. మనిషిని చూడగానే అతనిలో ఉన్నది అంతా చెప్పేస్తారు. అతన్ని చూడగానే ఒక మాటన్నారు. ‘‘నేను మూడు లక్షణాలు చెబుతాను. ఇందులో నీవే స్థాయిలో ఉన్నావో నీవు చెప్పు.’’ ‘‘అడగండి’’ అన్నాడతను. ‘‘అసలు నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వాడిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయే అంత కోపమున్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తరువాత వివరణ చేసి విరుచుకుపడే కోపమున్నవాడివా? అసలు విచారం అన్నదే లేకుండా కోప్పడిపోయి వెళ్లిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా?’’ అని అడిగారు. అది ఎందుకడిగారో అడిగినాయనకు తెలుసు, విన్నాయనకు తెలుసు. ఆయనన్నారు నేను మొదటి కోవకి చెందినవాణ్ణి. నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను. ఆయనన్నారు. ‘‘నీవు నా దర్శనానికి వచ్చావు కదా! నేను నీకిచ్చే కానుక ఒకటే నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు. ‘‘ఎందుకిలా చేశావ్’’ అని అడుగు. నీ జీవితంలో నీవెన్ని తప్పులు చేశావో తెలుస్తుంది.’’ అతను ఇంటికి వెళ్లిపోయాడు. వెళ్లిపోయేసరికి బాగా చీకటి పడింది. వంటవాడిని ‘‘బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు’’ అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే గోధుమ రొట్టెలు తీసుకువచ్చి వణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు. ఈయనకు ఎక్కడాలేని కోపం వచ్చింది. అతను ఓ ఏడెనిమిది రొట్టెలు తింటాడు. ఓ రెండు కూరల్తోటి. రెండు పలుచని రొట్టెలు. అంటే నేను రాననుకొని వీడు తినేశాడు అనుకుని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది. ఇవాళ రెండో స్థాయికి మారి చూద్దామని, ‘‘ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్?’’ అని అడిగాడు. అతనన్నాడు. ‘‘మీ అటెండర్ని పంపించి కదా! సరుకు తెప్పించుకుంటాం. అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నాకోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో, రారో అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి’’ అన్నాడు. నిజంగా ఆ రేంజర్ వలవలా ఏడ్చేశాడు. నేను ఇలా తొందరపడి కొట్టేసి ఉంటే..? ఇలా ఎందరిని నా కోపం చేత కొట్టానో. నేను ఇలా అడిగితే వీడు నా కోసం పడ్డ కష్టం తెలిసిందే. ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నిజంగా మహానుభావుడు ఈ మూడు తరగతులలో దేనికి చెందినవాడవని ప్రశ్నించి ఒకటి నుంచి రెండవ స్థితికి మారమని చెప్పి వెళ్లిపోయాడు. నేను రెండోస్థాయికి వస్తే నా దోషాలు కనపడ్డాయి. నేను ఎంతమందిని కొట్టానో అని ఏడ్చి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన. నేనెందుకు మీకు మనవి చేస్తున్నానంటే మీ దుర్గుణాలను మీరు గ్రహించగలరు. మీలో ఉన్న దుర్గుణాలను మీ ముందు ఎవరూ చెప్పలేరు. మీ లోపాలని మీరు దిద్దుకోవడం ప్రారంభిస్తే, సమాజానికి ఎంతో సేవచేసిన వాళ్లు అవుతారు. మిమ్మల్ని మీరు దోషరహితంగా దిద్దుకోగలిగితే ఈ దేశానికి నీడనిచ్చే చెట్టులాంటి వారు అవుతారు. మీ నీడన ఎందరో సేద తీరుతారు. మీరు రేప్పొద్దున్న ఓ మంచి ఆఫీసర్ అయ్యారనుకోండి. మీ డ్రాఫ్ట్ రాసే అతను ఓ డ్రాఫ్ట్ రాసి పట్టుకొచ్చి మీకిచ్చాడనుకోండి. మీరు అతని డ్రాఫ్ట్ని మెచ్చుకుంటే అతను ఇంకా బాగా పనిచేస్తాడు. బాగా పనిచేసేవాళ్లని అభినందించండి. సంకుచితత్త్వంతో మీకు బాగా ఇష్టమున్న వాళ్లని మాత్రమే అభినందించకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అతని వ్యక్తిత్వం నచ్చినా నచ్చకపోయినా, ఆ పనిని అతను సమర్థంగా చేస్తాడనుకుంటే ఆ పనిని అతనికే అప్పగించాలి. కాళిదాసు రఘుమహారాజు గురించి చెబుతూ... అతను ఎలా పనులు ఒప్పగించే వాడంటే ‘‘రోగి ఔషధిని సేవించినట్లు’’ అని చెబుతాడు. తనకు ప్రియుడా... అప్రియుడా... అన్నదతనికి అనవసరం. అతను ఆ పనికి అర్హుడు అనుకుంటే ఇచ్చేసేవాడు అంతే! ఈవాళ దేశానికి ఉన్న దరిద్రం ఏమిటంటే అది పాటించకపోవడం. కాళిదాసు ఇంకో మాటంటాడు. ‘‘ఆ పదవికి అతను అనర్హుడనుకుంటే తనకు అత్యంత ప్రియుడైనా సరే పాముకరిచిన వేలు తీయించుకున్నట్లు తీసివేసేటటువంటి వాడు. ‘‘అంగుళీ యోర గచ్చతీ’’ అంటాడు కాళిదాసు. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి. నేను మీకు ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. మీరు ఒక గ్రూపు సబ్జెక్టుని చదివితే అది శీల నిర్మాణాన్ని చేయలేదు. జీవితం అనేది ఎత్తుపల్లాలతో ఉండి తీరుతుంది. గ్రూపు సబ్జెక్ట్ మీ జీవితంలో వచ్చే ఉత్థానపతనాల నుంచి రక్షించలేదని తెలుసుకోండి. మట్టిముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారి కిందపడి పోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంత పైకి లేస్తుంది. అలా పైకి లేవగలిగిన శక్తి కోసం మీరు విద్యార్థులయి ఉన్నారు తప్ప చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంక పెట్టారని మీరు మృత్పిండమై పోకండి. మీ వల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిన నాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి. నిర్భయంగా అంగీకరించండి. నే నిది చేశాను. ఈ కారణానికి నేనిది చేశాను. ఒకవేళ మీరు నిజంగా స్వార్థంతో చేస్తుంటే ఇంకా ధైర్యంగా చెప్పేయండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కృష్ణ లీలలు కథలు కాదు సమాజసేవ
ఇవాళ కృష్ణాష్టమి. ఆయన జగద్గురువు. ఇవాళ టీచర్స్ డే కూడా. జగతిలోని గురువులందరికీ వందనాలు. మనకు ఉన్నదే జ్ఞానము అనుకోవడం మూర్ఖత్వం. జ్ఞానం ఉన్నవారిని అనుసరించకపోవడం అవివేకం. చాగంటివారు చల్లని గురువు. జ్ఞానమూ ఉంది, పరిజ్ఞానమూ ఉంది. పరులకు పంచిపెట్టే ప్రజ్ఞా ఉంది. జగద్గురువుకు, జగద్గురువులకు, జగమెరిగిన గురువులకు... సాదర ప్రణామాలు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సాక్షి టీవీ,దినపత్రిక కోసం ‘ఎమెస్కో బుక్స్’ అధినేత దూపాటి విజయకుమార్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. విజయకుమార్: మీ వ్యక్తిగత వివరాలు వినాలని ఉత్సుకతగా ఉంది... దయచేసి చెబుతారా? చాగంటి: మా నాన్నగారు గొప్ప పండితులు, కవి. పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రులోని ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా జీవితాన్ని సాగించారు. జీతంలో కొంత భాగాన్ని పేదపిల్లల చదువుకు వినియోగించేవారు. భక్తి తత్పరులు. ఆయన దృష్టిలో భక్తి అంటే సమాజాన్ని ప్రేమించడం. మా అమ్మ సుశీలమ్మ భర్తను అనుకరించడం మినహా ఏమీ తెలియని సాధ్వి. నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు. అందరూ చదువుకున్నారు. నేను ఎఫ్సీఐలో మేనేజర్గా పనిచేస్తున్నాను. వృత్తి రీత్యా అధికారిని అయినా, ప్రవృత్తి రీత్యా సాయంకాలం ప్రవచనం చేయడాన్ని ఒక అలవాటుగా స్వీకరించాను. నా భార్య సుబ్రహ్మణ్యేశ్వరి రాష్ట్రప్రభుత్వంలో పనిచేస్తూ నాకన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటోంది. నా కొడుకు, కూతురు ఇంజినీర్లే. భగవంతుడు నాకన్నీ ఇచ్చాడు. సంతోషంగా ఉన్నా. విజయకుమార్: ధర్మం అంటే సమాజ హితం అన్నారు. అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందా? మారుతుందా? అసలు ధర్మం స్వరూపం ఏమిటి? చాగంటి: ధర్మం అందరికీ అన్వయిస్తుంది. ప్రత్యేకించి మనిషి జన్మ ఎత్తిన వాడికి ధర్మాన్ని అనుష్ఠించడం అత్యంత అవసరం. పశువులన్నింటికీ ఒకటే ధర్మం. ఆకలేస్తే తింటుంది, భయం వేస్తే భయపడుతుంది, నిద్ర వస్తే పడుకుంటుంది, సంతానం కావాలనుకుంటే కంటుంది, చివరికి శరీరాన్ని వదిలిపెడుతుంది. మనిషి అలా కాదు. మారే ధర్మాన్ని నిరంతరం పట్టుకోవాలి. ధర్మం నాలుగు విషయాల ఆధారంగా మారిపోతుంటుంది. అవి దేశం, కాలం, వర్ణం, ఆశ్రమం. దేశం అంటే.. నేను ఇంట్లో ఉంటే చేసే పనులను ఇంకో ఊరు వెళితే చేయలేను. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యవస్థ వేరే ఊళ్లో ఉండదు. మానసికంగా ధ్యానం చేసి సంతోషించాలి. ఇంట్లో చేసే పూజలో పదోవంతు ఇక్కడ చేస్తే చాలు. కాలం.. ఒక కాలంలో ఉన్నది ఇంకో కాలంలో ధర్మం అవదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. వర్ణం.. యజ్ఞోపవీతం ఉన్న వాడికి సంధ్యావందనం ధర్మం, యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఎవరికి ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికలా విధించింది శాస్త్రం. ఆశ్రమం.. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి. ఒక్కొక్కరిది ఒక్కో ధర్మం. గృహస్థు దానం పడతాడు. బ్రహ్మచారి దానం పట్టకూడదు. వానప్రస్థుకి కుటుంబంతో తాదాత్మ్యత ఉండదు. గృహస్థు తన భార్యాబిడ్డల గురించి పట్టించుకోవాలి. అందుకనే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. ఈ ధర్మాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నవాడు చిట్టచివరికి మారనటువంటి సత్యంగా మారిపోతాడు. సత్యమే ఈశ్వరుడు. నాకు ఒకటి ధర్మం అనిపిస్తే, మరొకరికి మరొకటి ధర్మం అనిపిస్తుంది. వ్యక్తుల అవకాశాన్ని బట్టి ధర్మాన్ని నిర్ణయించే అవకాశాన్ని విడిచిపెట్టలేదు భగవంతుడు. ధర్మానికి శాస్త్రమే నిర్ణేత. ఒక పని చెయ్యాలా, చెయ్యకూడదా, చేస్తే ఎలా చేయాలనేది శాస్త్రం చెబుతుంది. అది చదువుకోవడం, పట్టుకోవడం మనిషి అభ్యున్నతికి కారణాలవుతాయి. ప్రతిరోజూ ధర్మానుష్ఠానం చేసి ధార్మిక జీవితం గడిపితే తను ప్రశాంతంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్లకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఇచ్చి చివరికి సత్యమై నిలిచిపోతాడు. విజయకుమార్: ఆచారం ధర్మానికి మూలం. మరి ఆచారం కూడా నిరంతరం మారుతూ ఉండాలి కదా? చాగంటి: నిజమే. ధర్మం ఎలా మారుతుందో ఆచారం కూడా అలా మారుతుంది. మనిషి స్థితిని దృష్టిలో పెట్టుకుంది శాస్త్రం. ఇలాగే చేయాలి అంటే అందరూ అన్ని వేళలా అలా చెయ్యలేకపోవచ్చు. ఉదాహరణకు 20 మంది కలిసి కాశీ యాత్రకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి 104 జ్వరం రావడంతో స్నానం చేయలేదు. మిగిలినవాళ్లు స్నానం చేశారు. 20 మందీ తిరిగివచ్చారు. వారిలో కాశీలో గంగాస్నానం చెయ్యకుండా తిరిగివచ్చిన అతను కూడా గంగాస్నానం చేసినట్లా.. కాదా... అంటే... గంగాస్నానం కోసమే అతను కాశీకి వెళ్లాడు. శరీరానికి వైక్లబ్యం వచ్చింది. శరీరాన్ని వదిలిపెట్టేసి స్నానం ఎలా చేస్తాడు? కానీ కాశీకి వెళ్లిందే గంగాస్నానం కోసం కాబట్టి అతను కూడా గంగాస్నానం చేసినట్లే. అందుకే మనిషి స్థితిని బట్టి ఆలోచన చేయాలి. ఆరోగ్యంగా ఉంటే తల స్నానం చెయ్యి. జ్వరమొస్తే నడుం వరకూ, ఆ ఓపికా లేకపోతే మూడుసార్లు నీళ్లు చల్లుకో. అది కూడా చేయలేని పరిస్థితి అయితే విభూతి చల్లుకో చాలు. అదీ చేయలేకపోతే మంచం మీదే పడుకుని గోవింద నామం చెప్పు. అదీ చేయలేని స్పృహ లేని పరిస్థితి అయితే కొడుకు పక్కనే కూర్చుని గోవింద అంటే చాలు. తండ్రి స్నానం చేసినట్లే. ఇప్పుడు ఆచారం మారిందా, లేదా! మారింది. మనిషి మనసును ప్రశాంతంగా ఉంచడం కోసం ఆచారకాండ వచ్చిందే తప్ప బాధపెట్టడానికి కాదు. ఆచారం ప్రధాన ఉద్దేశం మనసును పవిత్రం చేయడం. మనసును పవిత్రంగా ఉంచుకోవాలనే తాపత్రయం ఉంది కాబట్టి ఆచారం పాటించాలి. రమణమహర్షి పంచెకట్టుకున్నాడా లేదా అని ఎవరూ అడగరు. గోచి పెట్టుకున్నా ఆయన పరమేశ్వరుడే. ఆ స్థితికి వెళ్లిపోయాక ఆచారంతో సంబంధంలేదు. అప్పటివరకూ ఆచారాన్ని వదిలిపెట్టవద్దు. ఎందుకంటే అది మనసును పవిత్రంగా ఉంచి మనిషిని మనిషిగా బతకడానికి మార్గం చూపిస్తుంది. విజయకుమార్: బట్టతలలు, తెల్లజుట్టు వాళ్లు కనిపించే మీ సభల్లో ఈ మధ్య కుర్రాళ్లు ఎక్కువగా కనపడుతున్నారు. దేవాలయాలకూ కుర్రాళ్లు ఎక్కువగా వస్తున్నారు. పిల్లలు భక్తి మార్గానికి ఎక్కువగా వస్తున్నారు. సమాజంలో వచ్చిన మార్పు వల్ల ఈ తరం ఐడెంటిటీ క్రైసిస్ను ఎదుర్కొంటోంది. కానీ వారికి సమాజ హితమే భక్తి అని చెప్పడానికి మీరేం చేస్తారు? చాగంటి: మనిషికి మనిషితో అనుబంధం ఏర్పడడానికి రెండు కారణాలుంటాయి. సోదరభావం, స్నేహభావం. సోదర భావానికి మన ప్రయత్నం అక్కర్లేదు. నాతో కలిసిపుట్టినవాడు, నా అక్కచెల్లెళ్లున్నారు. వాళ్ల మీద నాకు ప్రేమ. ఎక్కడ ఉన్నా నేను వాళ్లను స్మరించుకుంటే నా మనసు ఆర్ద్రత పొందుతుంది. వాళ్లేదైనా కష్టంలో ఉంటే నా ఖర్చు తగ్గించుకుని వాళ్లకి సాయం చేయాలనిపిస్తుంది. వాళ్లిళ్లలో ఏదైనా శుభకార్యం జరిగితే వెళ్లి పాల్గొనాలనిపిస్తుంది. ఈ సంబంధానికి మూలం మేమంతా ఒక్క తల్లితండ్రీ బిడ్డలం కాబట్టి. భక్తికి ప్రారంభం దేశంలో ఎక్కడుందంటే మేం అంతా ఒక్క తల్లితండ్రుల బిడ్డలమనే. ఎవరా తల్లితండ్రులు? లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి, ఏ పేరైనా పెట్టుకోండి. జాతీయ సమైక్యతకు, సెక్యులరిజానికి మూలాలు ఈ దేశంలో ఎక్కడున్నాయి? భక్తిలో ఉన్నాయి. భక్తి మౌఢ్యం ఎప్పుడూ కాదు. యువతకు భక్తి ఉండి తీరాలి. భక్తిలో రెండు భిన్నమైన విషయాలు ఏకీకృతమవుతాయి. పిల్లలు దేవాలయాలకు వెళ్లడానికి, వినడానికి కారణం అదే. నేను చాలా భయపడుతున్నాననుకోండి ధైర్యంగాలేనని. నేను ధైర్యంగా ఉన్నాననుకోండి, భయంగాలేనని. కానీ భక్తి ఉన్నవాడికి భక్తి, ధైర్యం రెండూ ఉంటాయి. నేను భక్తుణ్ణి అంటే రోజూ వెయ్యి మారేడు దళాలు తెచ్చి పూజ చేస్తానని కాదు. భక్తి అంటే నేను భగవంతుడిని నమ్మానని. తప్పు చేయకుండా నియంత్రించేది భక్తి ఒక్కటే. అందుకే ఈ దేశంలో ఒకప్పుడు ఇంటికి తాళం కప్పలేదు. ఎందుకు లేదంటే తలుపు తీసి వెళ్లిపోయినా ఇంకో వ్యక్తి ఆ ఇంట్లో వస్తువును తీసుకోడు. ఇంకొకడి వస్తువు నాకు బెడ్డ ముక్క. అది నాకు ఈశ్వరుడు ధార్మికంగా ఇస్తే తృప్తి. ఇది మనిషికి తృప్తి, సంతోషం, శాంతినిస్తుంది. దీనివల్ల పక్కవాణ్ణి ఇబ్బంది పెట్టడు, పాడు చేయడు, పాపపు పని చేయడానికి భయపడతారు. దేశమంతా శాంతిభద్రతలుంటాయి. అందుకే భారతదేశం అంటే ఒకప్పుడు శాంతికి పర్యాయపదం. ఇప్పటికీ శాంతిసూక్తం చెబితే, మనుషుల శాంతి గురించి మాట్లాడారు. అంతరిక్ష శాంతి, గోశాంతి, భూశాంతి, వాయుశాంతి. వాయువు ప్రకోపించకూడదు. భూమి ప్రకోపించకూడదు. ప్రజల మనోభావాలు, సంస్కృతి వల్ల పంచభూతాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన భయం భక్తిలో ఉంటుంది. ధైర్యం భక్తిలో ఉంటుంది. భక్తి కలిగిన దేశం కాబట్టే ఈ దేశం ప్రపంచంలో మిగిలిన దేశాలకు నాయకత్వం వహించింది. ఇవాళ మళ్లీ యువత భక్తిలోకి రావడం, భక్తి వల్ల ఆరోగ్యవంతమైన భయాన్ని, ధైర్యాన్ని పొందడం ఎంతో సంతోషించదగ్గ విషయం. నేను ఒకప్పడు భాగవతం గురించి చెబుతూ కృష్ణలీలలన్నీ కథలు కాదు సమాజసేవని చెప్పాను. పూతన సంహారం సమాజసేవ. కాళీయమర్దనం యమునానది నీళ్లు పాడవకుండా చేసిన సమాజ సేవ. కృష్ణుడు సమాజ సేవలో సంతోషం పొందాడు. అవే మనం నేర్చుకోవాలని చెప్పా. ఆ తర్వాత కొద్దిరోజులకి ప్రవచనానికి వెళ్లిపోతుంటే ఒక పిల్ల వచ్చింది మా ఇంటికి. ఎవరు నువ్వనడిగితే బీటెక్ చదువుకుంటున్నాను, మీకు నమస్కారం చేయాలని వచ్చానంది. నేను ప్రవచనానికి వెళుతున్నానమ్మా మళ్లీ వెనక్కివచ్చి నీతో మాట్లాడే సమయం లేదన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు కనబడ్డారు చాలు నమస్కారం అంది. ఇద్దరం లిఫ్టులో దిగుతుండగా నాకు నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించిందని అడిగాను. మీ మాటల వల్ల ప్రేరణ చెందానని చెప్పడంతో ఆశ్చర్యపోయి ఏం ప్రేరణ చెందావని అడిగా. మీరు చెప్పిన కృష్ణలీలలు సమాజ సేవన్నారు అది ప్రేరణ కల్పించిందని, నా స్థాయిలో సమాజ సేవ చేశానంది. కారెక్కబోతున్నవాడిని ఆగి ఏం సమాజ చేశావని అడిగాను. ప్రతిరోజూ ఒక గంట సేపు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి ఓపీ కౌంటర్ దగ్గర కూర్చుంటానని, నిరక్షరాస్యులు, రూపాయి లేని వాళ్లకి, ఓపి టికెట్ రాయడం రానివారికి సహాయపడతానని చెప్పింది. వాళ్లకి వార్డులు చూపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి, మందులిప్పించి పంపిస్తానంది. ఈ మధ్య ఇంట్లో కాలుజారి పడిపోయిన ఒక గర్భిణీని ఇక బతకదు అన్న స్థితిలో తీసుకొచ్చారు. ఆ సమయంలో తాను చేసిన ఉపకారం వల్ల ఆవిడ బతికి ఆడపిల్లకు జన్మనిచ్చిందని, ఆ పిల్లకు తన పేరు పెట్టుకున్నారని, అది తనకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పింది. నేను కారెక్కి వెళ్లిపోతున్నవాడిని ఆగి ఆ పిల్లని వెనక్కి తీసుకెళ్లి పసుపు కుంకుమలు, బట్టలూ ఇచ్చి పంపాను. దీన్ని ఒకసారి టీవీ లైవ్లో చెప్పాను. దాన్ని చూసి చాలామంది పిల్లలు ఇది తమకు నచ్చిందంటూ తాము కూడా సమాజ సేవ చేస్తున్నామని ఉత్తరాలు రాశారు. ఇప్పుడు చెప్పండి. యువత మంచి ప్రేరణ పొందట్లేదా? ఉపకారాలు చేయట్లేదా..? ధైర్యంతో ఉండడం లేదా? భక్తి మనిషిని నిలబెడుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ జాతి గౌరవ ప్రతిష్ఠలు భక్తి చేతనే ఉన్నాయి. సేవ చేయడానికి పెద్ద ఆలోచనలు అవసరమా. ఎంత అవలీలగా చేసేసింది. విజయకుమార్: భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మూలకారణాలు వేదాలు, ఉపనిషత్తులు. వీటిని కోట్ చేస్తూ, మీరు, మీతోపాటు అనేక మంది ప్రవచనాలు చెబుతున్నారు. మీరు మాట్లాడే ప్రతిమాటకు శాస్త్ర ప్రమాణం ఉందనుకునే మాట్లాడుతున్నారా? చాగంటి: నాకు తెలిసున్నంతవరకూ నా బుద్ధికి తోచినట్లు మాట్లాడే ప్రయత్నం చేయాలన్న సంకల్పం కూడా నాకుండదు. ఒకవేళ నా బుద్ధికి తోచిన విషయం గురించి చెప్పాలనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు కదా. సీతారామకళ్యాణం గురించి చెప్పమన్నారంటే కథ తెలియక వాళ్లడగడంలేదు. అందులో ఏదో ధర్మసూక్ష్మం ఉందని, దాన్ని తెలుసుకుని ఆచరించాలని వాళ్ల తాపత్రయం. అప్పుడు అందులో ప్రామాణికంగా ఏ విషయం అంతర్లీనమై ఉందో, పెద్దల చేత అంగీకరింపబడిందో దాన్నే ప్రస్తావించాలి తప్ప నా బుద్ధికి తోచినట్టుగా చెప్పడం అనేది మంచిది కాదు. అందుకనే నేను ప్రమాణానికి కట్టుబడతాను. నాకు తెలిసినంతవరకూ ప్రమాణాన్ని విడిచి స్వబుద్ధికి తోచినవి చెప్పాలనే ఆలోచన నాకు తడుతుందని నేననుకోవడంలేదు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున అన్నానేమో తెలియదు. కానీ నా సంకల్పం ఎప్పుడూ ప్రమాణానికి కట్టుబడాలనే ఉంటుంది. సమన్వయం: ఫణికుమార్ సాక్షి, విజయవాడ విజయకుమార్: ప్రపంచీకరణ ఒక ఉప్పెనలా వచ్చి కొత్త సంస్కృతిని తెచ్చిపెట్టింది. ప్రపంచీకరణలో దేవుడు పర్సనల్ అయ్యాడు. పర్సనల్ గాడ్, ఎటర్నల్ కాస్మిక్ పవర్ మధ్య ఎట్లా ఒక వారధిని నిర్మించుకోవాలి? కొత్త జనరేషన్ పిల్లలు దీన్నెలా అర్థం చేసుకోవాలి? చాగంటి: ఇందులో ఒక గంభీరమైన విషయం నిబిడీకృతమై ఉంది. ప్రపంచమంతా నా కుటుంబం. అందరూ బావుండాలి. ఏ సంస్కృతి, సంప్రదాయానికి చెందినవారైనా సంతోషంగా ఉండాలి. సంస్కృతిని మాత్రం పాడు చేయకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను. రాముడు వానరులు- సుగ్రీవాదులు, రాక్షసులు- విభీషణాదులు, గుహుడు లాంటి ఆటవికులతో స్నేహం చేశాడు, వాళ్లంతా ఆయనకు వశవర్తులు. కానీ ఆయన ఏరోజూ కిష్కింధకు వెళ్లి ఈ సంస్కృతేమిటి, ఈ అల్లరేమిటి, ఈ జీవనం ఏమిటి, మిమ్మల్ని కొంతమందిని నేను కొన్ని సమూహాలుగా అయోధ్యకు తీసుకెళ్లి శిక్షణా తరగతులు పెడతానని చెప్పలేదు. వారి సంస్కృతిని విడిచిపెట్టమని వారికి చెప్పలేదు. అధర్మాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎవరి సంస్కృతిని వాళ్లని కాపాడుకోమని చెప్పాడు తప్ప సంస్కృతిలో వేలు పెట్టలేదు. అందరి సంస్కృతి, సంప్రదాయాన్ని గౌరవించాడు. ప్రపంచీకరణ దోషం అని నేను అనను. విశాలదృక్పథంతో ఉండండి. కానీ సంస్కృతిని విడిచిపెట్టకండి. ఇతర సంస్కృతుల వెంటపడి మన సంస్కృతిని నాశనం చేసుకోకూడదు. కాపాడుకోవాలి. ఇంగ్లీషులో మాట్లాడు, ఫైల్ రాయి. ఇంటికొచ్చి కొడుకుతో పోతన పద్యం చెప్పు. దేవాలయానికెళ్లేటప్పుడు పంచె కట్టుకో. యువతకు ఆ కోణంలో చెప్పాలి. ఎమెస్కో విజయకుమార్