Justice Ramesh ranganathan
-
జస్టిస్ రమేశ్ రంగనాథన్కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్కు పదోన్నతి లభించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంబంధిత ఫైలుపై బుధవారం సంతకం చేశారు. దీంతో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ను నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. బాంబే, గౌహతి, సిక్కిం, కలకత్తా హైకోర్టులకు సైతం ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–04 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్గా ఉన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. -
ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ను ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కూడిన కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం రెండు రోజుల కిందట ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది, 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–2004 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. -
వైద్యురాలి అవతారంతో సర్వారి ఉన్నీసా నిజస్వరూపం
సాక్షి, హైదరాబాద్: చదివింది ఏడో తరగతి. ఆర్థిక సమస్యలతో 2010లో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయాగా చేరింది. తర్వాత ఆస్పత్రికి సూపర్వైజర్ అయింది. ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో ఏకంగా వైద్యురాలి అవతారం ఎత్తింది. వైద్యపరంగా కనీస అర్హతల్లేకున్నా గర్భంలోని పిండాన్ని చిదిమేసింది. ఇదీ సైదాబాద్ డివిజన్ ఐఎస్ సదన్ సింగరేణి కాలనీ లోని గాయత్రి నర్సింగ్ హోంలో జరిగిన దారుణమైన భ్రూణహత్య ఘటనకు పాల్పడ్డ నకిలీ వైద్యురాలు సర్వారి ఉన్నీసా నేపథ్యం. సదరు ఆస్పత్రికి డాక్టర్ రచనా సింగ్ ఠాకూర్ డైరెక్టర్. ఆమె భర్త డాక్టర్ కిరణ్ కుమార్ చౌహాన్ ఎండీ. ఆర్టీసీ ఆస్పత్రిలో పెథాలజీ విభాగంలో రచనాసింగ్కు సర్కారీ కొలువు. ప్రైవేటుగా ఆస్పత్రి నిర్వహించేందుకు ఆమెకు చట్టపరంగా అర్హత లేదు. వీరిద్దరి సూచనల మేరకు ఉన్నీసా గర్భశ్రావం చేసింది. ఉన్నీసాకు ఏఎన్ఎం ఎన్.శోభ, ఆయా లక్ష్మమ్మ సహకరించారని హైకోర్టుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వ్యాజ్యంలో తెలిపారు. గాయత్రి నర్సింగ్ హోం నిర్వాకంపై అంబర్పేటకు చెందిన సందీప్ యాదవ్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. భ్రూణ హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సుల్తాన్బజార్ సహాయ పోలీస్ కమిషనర్ ఎం.చేతనకు అప్పగించామని, మరిన్ని వివరాలకు కొంత సమయం కావాలని సీపీ హైకోర్టును కోరారు. ప్రస్తుతం గాయత్రి నర్సింగ్ హోం మూతపడి ఉందన్నారు. ఆడబిడ్డేనని తెలిసి భ్రూణహత్య చేసినట్లు ఆధారాల్లేవని, గర్భస్రావం ఎవరికి చేశారో గుర్తించలేకపోయినట్లు వివరించారు. పిండాన్ని చిదిమేసిన ఉన్నీసా, రచనా సింగ్, కిరణ్ కుమార్లను కూడా అరెస్ట్ చేసినట్లు నివేదించారు. వీరు ముగ్గురూ నేరాన్ని అంగీకరించారని తెలిపారు. కాగా, ఈ కేసులో తమ వాదనను తెలిపేందుకు సమయం కావాలని గాయత్రి నర్సింగ్ హోం తరఫు న్యాయవాది కోరారు. అందుకు ధర్మాసనం అనుమతిస్తూ విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. -
గర్భస్థ పిండాన్ని చిదిమేస్తారా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పుట్టబోయేది ఆడ బిడ్డని తెలిసి పిండ దశలోనే ప్రాణం తీసేస్తున్న ఘటనలపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పిండాన్ని చిదిమేయడానికి చేతులెలా వస్తున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పిటిషనర్ చెబుతున్న వివరాలు వింటుంటే హృదయం ద్రవిస్తోందని, ఈ ఘాతుకాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టరాదని స్పష్టం చేసింది. దీనిపై లోతుగా విచారించి వాస్తవాల్ని నిగ్గు తేల్చాలని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. సైదాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని గాయత్రి నర్సింగ్ హోంలో చట్ట వ్యతిరేకంగా భ్రూణ హత్యలు పాల్పడుతున్నారంటూ అంబర్పేట్కు చెందిన సందీప్యాదవ్ హైకోర్టు లో దాఖలు చేసిన పిల్ను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది. లింగనిర్ధారణ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి గాయత్రి నర్సింగ్హోంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, గర్భంలో ఉన్నది ఆడపిల్లని తేలితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, నర్సింగ్ హోం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. నర్సింగ్ హోంలో పనిచేసే సూపర్వైజరే వైద్యురాలిగా చలామణి అవుతూ గర్భస్రావాలు చేసేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఈ దారుణాల నుంచి తప్పించుకునేందుకు నర్సింగ్ హోం నిర్వాహకులు పిటిషనర్పై పోలీసు కేసు నమోదు చేశారని చెప్పారు. గర్భాన్ని చేతితో చిదిమేశారని, దీనికి సంబంధించిన వీడియో రికార్డు తన వద్ద ఉందని చెప్పారు. పిటిషనర్ చెబుతున్న వీడియో రికార్డు ఉన్న పెన్ డ్రైవ్ను పరిశీలించి ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని తెలంగాణ సర్కార్ను ధర్మాసనం ఆదేశించింది. చట్ట వ్యతిరేకంగా, మానవత్వానికే మాయని మచ్చలాంటి దారుణాలకు పాల్పడటం నిజమైతే అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై ఏ చర్యలు తీసుకుంటారో వివరించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించింది. -
ఎంసీఐ రూల్స్ మేరకే ఇన్సర్వీస్ కోటా రద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలకు లోబడే పీజీ మెడికల్ సీట్ల భర్తీలో ఇన్సర్వీస్ కోటాను రద్దు చేసి, వెయిటేజీ మార్కు ల విధానాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలియజేసింది. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఇన్సర్వీస్ కోటాను తెలుగు ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ, ఏపీకిచెందిన వైద్యులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర వియలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎంసీఐ నిబంధనల్లోని తొమ్మిది ప్రకారం ఇన్సర్వీస్ కోటాను ఎత్తివేసి వెయిటేజీ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ వాదించారు. అఖిల భారత స్థాయిలో 50 సీట్ల భర్తీ జరుగుతుందని, మిగిలిన సగం సీట్లలో వైద్యులుగా సేవలందించిన వారికి ఇన్ సర్వీస్ కోటాకు బదులు వెయిటేజీ మార్కులు ఇస్తామన్నారు. వెయిటేజీ మార్కుల విధానంలో ఒక్క సీటు కూడా తమకు రాదనే పిటిషనర్ల వాదనను ధర్మాసనం కొట్టేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదాపడింది. -
సీనియర్ న్యాయవాది మూర్తికి హైకోర్టు నివాళి
సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన సీనియర్ న్యాయవాది వీఎల్ఎన్జీకే మూర్తికి హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. మూర్తికి నివాళులు అర్పించేందుకు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూర్తితో తనకున్న అనుబంధాన్ని ఏసీజే గుర్తుచేసుకున్నారు. అంతకుముందు తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు మూర్తి అందించిన సేవలను కొనియాడారు. మూర్తి మృతికి సంతాపంగా అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మూర్తి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
పేర్లు ఇవ్వకుంటే ఫుటేజీ తెప్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పందేలు నిర్వహించిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందేలు నిర్వహించి తీరుతామంటూ సవాళ్లు విసిరిన ప్రజా ప్రతినిధులను తాము టీవీల్లో చూశామని, వారి పేర్లను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పేర్లు ఇవ్వ కుంటే టీవీల నుంచి ఫుటేజీ తెప్పించుకుని వారిని ప్రతి వాదులుగా చేరుస్తామంది. పందేలు జరిపిన నిర్వాహకుల్లో ప్రజా ప్రతినిధులు ఎంతమంది? ఎంతమందిపై కేసులు పెట్టారో చెప్పాలంది. తాము కోరిన వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎస్ దినేష్ కుమార్ సోమవారం విచారణకు హాజరై నివేదిక సమర్పించారు. -
బాబు లేఖ నేపథ్యంలో న్యాయమూర్తుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు కోసం అమరావతిలో ప్రభుత్వం గుర్తించిన భవనాలను పరిశీలించేందుకు న్యాయమూర్తులతో కూడిన ఫుల్కోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఉద్యోగుల విభజనకు ఓ సబ్ కమిటీ, రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియ పరిశీలనకు ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటుకు తాము గుర్తించిన భవనాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు గత డిసెంబర్ 27న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్కు లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజనకుపై న్యాయమూర్తులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏసీజే బుధవారం తన అధ్యక్షతన ఫుల్ కోర్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులందరూ పాల్గొన్న ఈ భేటీ దాదాపు గంటా 10 నిమిషాలు జరిగింది. సమావేశం ఒకింత వాడివేడిగా కొనసాగినట్లు సమాచారం. హైకోర్టు తరలింపుపై కొందరు న్యాయమూర్తులు కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తినట్లు తెలిసింది. హైకోర్టు విభజనపై 2015 మే 1న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్ గుప్తా ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు వల్ల ఎదురయ్యే సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది. అంతేగాక న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఉద్యోగుల భత్యాల పెంపు తదితరాలపైనా న్యాయమూర్తులు చర్చించారు. ఈ రెండింటిపై తమ వైఖరిని ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పాలని న్యాయమూర్తులంతా నిర్ణయించుకున్నారు. మొత్తమ్మీద హైకోర్టు విభజనపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీజే ఓటింగ్ నిర్వహించారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం గుర్తించిన భవనాల పరిశీలనకే మెజారిటీ న్యాయమూర్తులు మొగ్గు చూపారు. హైకోర్టు విభజన ప్రక్రియ నిర్ణయాల్లో న్యాయవాదులను కూడా భాగస్వాములు చేయాలన్న అంశమూ చర్చకు వచ్చింది. వారిని ఈ దశలో భాగస్వాములను చేస్తే సమస్యలు పెరుగుతాయని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడటంతో ప్రతిపాదన పక్కకు వెళ్లింది. సబ్ కమిటీ భవనాలను పరిశీలించి వచ్చాక మరోసారి సమావేశమవాలని ఫుల్కోర్ట్ నిర్ణయించింది. తాత్కాలిక భవనాల్లో హైకోర్టు నిర్వహణకు అవసరమైన సదుపాయాలన్నింటి విషయంలో ఎక్కడా రాజీ పడరాదని న్యాయమూర్తులంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయమై తమకు ఏమేం కావాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఉద్యోగుల విభజనకు వీలైనంత త్వరగా మార్గదర్శకాలు రూపొందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సబ్ కమిటీలో ఐదుమంది ఉండాలని నిర్ణయం జరిగింది. వీటి ఏర్పాటు అధికారాన్ని ఏసీజేకు కట్టబెట్టారు. ముందు భవనాల పరిశీలన కమిటీ, ఆ తర్వాత మిగతావి ఏర్పాటవుతాయి. మరోవైపు, 2015 నాటి జస్టిస్ సేన్గుప్తా ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ న్యాయవాదులు బుధవారం ఏసీజేను కోరారు. దాదాపు 300 మంది సంతకాలతో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు విభజనలో తమనూ భాగస్వాములను చేయాలని కోరారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కూడా ఏసీజేకి ఇదే విధంగా వినతిపత్రం సమర్పించారు. -
‘ఒకేషనల్’ వినతులపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణాధికారుల గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్ ఒకేషనల్ (క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్) పూర్తి చేసిన వారిని అర్హులుగా పరిగణించాలని వచ్చిన వినతులపై తగిన నిర్ణయం తీసు కోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రెండు నెల ల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీ జే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విస్తరణాధికారుల గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి బీఎస్సీ(ఏజీ) పూర్తి చేసిన అభ్యర్థులను అర్హులుగా పరిగణి స్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఒకేషనల్ (క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెం ట్) కోర్సు పూర్తి చేసినవారు తమను కూడా అర్హులుగా పరిగ ణించాలంటూ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం స్పందించక పోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్ల వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని, రెండు నెలల్లో నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఒకటో తరగతి.. కాదు రెండో తరగతి..
సాక్షి, హైదరాబాద్: చదవలేను మొర్రో.. అని పిల్లాడు మొత్తుకుంటుంటే.. ఒకటో తరగతి కాదు రెండో తరగతి చదవాల్సిందేనన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. రెండో తరగతి పాఠాల్ని తన మనవడు అద్వేత్య చదవలేకపోతున్నాడని, ఒకటో తరగతికి డిమోట్ చేయాలన్న తన వినతిని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ బాలుడి నాయనమ్మ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ రిట్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం విచారించింది. స్కూల్ యాజమాన్యం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ధర్మాసనం ముందుకు చేరకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. బాలుడి నాయనమ్మ కోరిక మేరకే అద్వేత్యను రెండో తరగతిలో చేర్చామని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో సింగిల్ జడ్జి ఆమె వ్యాజ్యాన్ని కొట్టివేశారు. దాంతో ఆమె డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. -
రైతు సమితులపై వివరణ ఇవ్వండి
-
రైతు సమితులపై వివరణ ఇవ్వండి
కౌంటర్ దాఖలు చేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం ► రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై పిల్ దాఖలు ► అవి రాజ్యాంగేతర యంత్రాంగమని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు సమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటితో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతుందంటూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను మూడు వారాలకు వాయిదావేస్తూ.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదు.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన జీవో 39ను సవాలు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల రైతు చింపుల సత్యనారాయణరెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన యు.మనోహర్రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాది బి.రచనారెడ్డిలు వాదనలు వినిపించారు. రైతులకు ఒక్కో సీజన్కు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. తగిన సిఫా రసులు చేసే బాధ్యతలను రైతు సమన్వయ సమితులకు అప్పగించిందని కోర్టుకు వివరిం చారు. అయితే ఈ రైతు సమన్వయ సమితుల ను నామినేట్ చేసేది మంత్రులేనని.. ప్రజా విధులను నిర్వర్తించేందుకు ఇలా రాజ్యాంగేతర యంత్రాంగాన్ని సృష్టించే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇలా సమితులు ఏర్పాటు చేయకుండా రాజ్యాం గంలో ఎక్కడా నిషేధం లేదని, నిషేధముంటే చూపాలని పేర్కొంది. దీంతో రైతు సమన్వయ సమితుల్లోని సభ్యులను మంత్రులు నామినేట్ చేయడమన్నది అధికార దుర్వినియోగమే అవుతుందని న్యాయవాదులు వివరించగా... మంత్రులకు ఇలాంటి బాధ్యతలు అప్పగించ కూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టులో కూర్చుని తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని... కోర్టులు ఏ విషయాల్లో అయితే జోక్యం చేసుకోరాదో ఆ విషయాల్లో జోక్యం చేసుకో వాలంటూ కోరుతున్నారని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.. తిరిగి పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తూ... గ్రామస్థాయిలో అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పంచాయతీలు ఉన్నాయని, ఇప్పుడు రైతు సమితుల ఏర్పా టుతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కోర్టుకు నివేదిం చారు. అంతేగా కుండా ఈ రైతు సమన్వయ సమితులకు రూ.500 కోట్లు కేటాయించా రని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం ఈ రూ.500 కోట్లపై ప్రభుత్వ వివరణ కోరింది. దీనికి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి సమా ధానమిస్తూ.. రైతులు పండించిన కొన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) దక్కడం లేదని, వారికి కనీస మద్దతు ధర అందించేందుకే రూ.500 కోట్లు కేటాయిం చామని వివరించారు. రాష్ట్రస్థాయిలో ఇంకా రైతు సమన్వయ సమితి ఏర్పాటు కాలేదని, అది ఏర్పాటయ్యే వరకు నిధులను వ్యయం చేయబోమన్నారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల సిఫారసుల మేరకు రాష్ట్ర స్థాయి సమితి తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు వ్యవ హారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
అభ్యంతరాలున్నా భూ సేకరణ చేసుకోవచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ సవరణ చట్టం (2017) ప్రకారం రాష్ట్ర సర్కార్కు భూ సేకరణ జరిపే అధికారం ఉందని ఉమ్మడి హైకోర్టు చెప్పింది. అయితే భూ సేకరణపై రైతుల అభ్యంతరాల్ని త్వరితగతిన పరిష్కరించాలని.. వారి సమ్మతి, అందుకు అనుగుణంగా జరిగే ఒప్పందాలన్నీ సవరణ చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొంది. అలాగే రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన చట్ట సవరణలతో సంతృప్తి చెందనివారు వ్యాజ్యం దాఖలు చేసుకునే అధికారం వివరించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలు పెండింగ్లో ఉండగానే ఇతర రైతులతో భూ సేకరణ చేపట్టారంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన శ్రీనివాస్, మరికొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం విచారణ సందర్భంగా రైతుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్ కోసం బైలాంపూర్, తానేదార్పల్లి, తానేదార్పల్లి తండా, మామిడ్యాల రైతుల అభ్యంతరాల్ని కొలిక్కి తేకుండానే ఇతర రైతులతో సిద్దిపేట కలెక్టర్ ఒప్పందాలు చేసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం అభ్యంతరాల్ని పరిష్కరించకుండా సెక్షన్ 19 ప్రకారం ఒప్పందాలు చేయరాదన్నారు. అయితే 2013 భూ సేకరణ చట్టానికి సవరణలో సెక్షన్ 30–ఎ చేర్చారని, దీని వల్ల భూ సేకరణ అవార్డు విచారణ దశలోనూ రైతుల అంగీకారంతో భూమిని ప్రభుత్వం సేకరించవచ్చన్న రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ భూ సేకరణపై రైతుల వినతులు, అభ్యంతరాల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. -
స్వాతంత్య్ర సిద్ధిలో న్యాయవాదుల పాత్ర
వారి త్యాగఫలాలే ఈ స్వేచ్ఛా వాయువులు.. స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ సాక్షి, హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్య్ర సిద్ధిలో అనేక మంది న్యాయవాదుల పాత్ర ఉందని, వారి ప్రాణ త్యాగాల వల్లే ఇప్పుడు మనమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. బాల గంగాధర తిలక్, మహాత్మా గాంధీ, లాలాలజ్పత్ రాయ్, బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులంతా కూడా ప్రఖ్యాత న్యాయవాదులని, వీరిని ఈ 71వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకోవడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఉమ్మడి హైకోర్టులో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమరంలో భూలాభాయ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, వీపీ మీనన్ తదితరుల పాత్రను వివరించారు. దేశం లౌకిక రాజ్యమే భారతదేశం లౌకిక రాజ్యమని నమ్మి, దానిని ఆచ రణలో చూపిన గొప్ప వ్యక్తి వల్లభాయ్ పటేల్ అన్నారు. మైనారిటీల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యతని ప్రకటించి, ఆ మేర మైనారిటీలకు అన్ని హక్కులు కల్పించేలా చూశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం 552 రాచరిక రాష్ట్రాలను దేశంలో విలీనం చేయడంలో వల్లభాయ్ పటేల్, రాష్ట్రాల మంత్రిత్వశాఖ కార్యదర్శి వీపీ మీనన్ల కృషి అసాధారణ మన్నారు. పటేల్ కృషి వల్లే ఆధునిక ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటైం దన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా యుద్ధ ఖైదీలుగా నిర్బంధానికి గురైన పలువురు భారత ఆర్మీ అధికారులకు స్వేచ్ఛ ప్రసాదించడంలో భూలాభాయ్ దేశాయ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆరోగ్య సహకరించకున్నా తన బలమైన వాదనలతో ఆ అధికారులు విడుదల య్యేలా చేశారన్నారు. అనంతరం చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్రంగనాథన్ చేతుల మీదుగా అవార్డులు, ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్, తెలంగాణ అదనపు ఏజీ, ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, బార్ కౌన్సిల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎప్పటిలోపు నియమిస్తారు?
♦ సమాచార కమిషనర్ల నియామకంపై హైకోర్టు ♦ కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన సమాచార కమిషనర్, ఇత ర కమిషనర్లను ఎప్పటిలోపు నియమిస్తారో రాతపూర్వకంగా తెలియచేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మా సనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని.. ఈ మేరకు వారి నియామకానికి చర్యలు తీసుకునేలా తెలంగాణ, ఏపీలను ఆదేశించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి పద్మనాభయ్య ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా విభజన జరగకపోవడంతో.. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ.. సమాచార కమిషన్ పునర్వి భజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉందని, అందువల్ల ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు పరస్ప రం సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్క రించుకుంటాయని కోర్టుకు వివరించారు. సమాచార కమిషన్ విభజన జరగాల్సి ఉందని.. కమిషనర్ల నియామకానికి 3 నెలల గడువు కావాలని కోరారు. దీంతో మరి ఈ మూడు నెలల పాటు ప్రజల హక్కు మాటేమిటని ధర్మా సనం ప్రశ్నించింది. ఇక సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియను ఏడాది క్రితమే ప్రారం భించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది పెండింగ్లో ఉందని ఏపీ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు వివరించారు. కమిషనర్ల నియామకం పెద్ద పని కాదన్నారు. అయితే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే పెద్ద పని అని, ఇందుకు కొంత సమయం పడు తుందని తెలిపారు. తమ రాష్ట్రంలోనే తాము సమాచార కమిషన్ ఏర్పాటు చేసుకుంటా మని కోర్టుకు వివరించారు. అనంతరం పిటిషనర్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి స్పందిస్తూ... సమాచార కమిషన్లో 20 వేలకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, దాంతో ప్రజల హక్కులకు భంగం కలుగు తోందని కోర్టుకు వివరించారు. -
ఏం చర్యలు తీసుకున్నారు?
హైకోర్టు విభజనపై కౌంటర్ దాఖలు చేయండి కేంద్రం, ఏపీ సర్కార్కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళ వారం క్యాబినెట్ కార్యదర్శి, కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2015లో తీర్పునిచ్చినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అలాగే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసేలా ఆదేశా లు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది జె.నారాయణస్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నారాయణ స్వామి వాదనలు వినిపిస్తూ 1937లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉందని, అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలంటూ 2015లో ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ తీర్పు అమలు కాలేదన్నారు. -
సైరన్ ఎవరు వాడొద్దో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కార్లపై ఎర్రబుగ్గ, సైరన్ను ఏయే హోదాల్లోని వ్యక్తులు ఉపయోగించరాదో చెప్పాలని పిటిషనర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్లపై ఎరుపు, నీలం రంగుల బుగ్గలు, సైరన్ల విని యోగంపై ఆంక్షలు ఉన్నా దర్పం ప్రదర్శించేందుకు కొందరు సైరన్ను వినియోగిస్తున్నారని, ఈ విషయంలో కేంద్ర నిబంధనలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన న్యాయవాది భావనప్ప హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపగా పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎర్రబుగ్గలు, సైరన్ల వినియోగంపై నిషేధం, ఆంక్షలు ఉన్నా, బహిరంగ ప్రదేశాల్లో, టోల్ గేట్ల వద్ద కొందరు సైరన్లను వాడుతున్నారని చెప్పారు. -
న్యాయవాదిపై కోర్టు ధిక్కార చర్యలు
నరసింహారావుకు నోటీసు జారీ చేసిన ఉమ్మడి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది జీఎల్ నరసింహారావుపై ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాఖ్యలు న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయ పడిన హైకోర్టు, నరసింహారావుకు కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 14(1) కింద నోటీసు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలను ఎందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించరాదో వారం లోపు వివరించాలని అతన్ని ఆదేశించింది. అంతేకాక నరసింహారావును తక్షణమే అదుపులోకి తీసుకోవాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ భోజన విరామ సమయంలో నరసింహారావును అదుపులోకి తీసుకు న్నారు. అనంతరం రూ.25 వేలకు రెండు పూచీ కత్తులు సమర్పించడంతో ఆయన్ను బెయిల్పై విడుదల చేశారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకోవాలి... ప్రభుత్వం అనుమతించిన ధరల కన్నా అధిక రేట్లకు థియేటర్లు టికెట్లు విక్రయిస్తున్నాయని, దీనివల్ల ప్రజలపై కోట్ల రూపాయల మేర భారం పడుతోందని, అందువల్ల సదరు థియేటర్ల నుంచి ఆ మొత్తాలను వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది నరసింహారావు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. టికెట్ ధర విషయంలో వాస్తవాలను అధికారులు కోర్టు ముందుంచలేదని, దీంతో హైకోర్టు పలు ఉత్తర్వులిచ్చిందని, అవి ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని నరసింహారావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీల్ దాఖలు చేసుకోవడమో లేక రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడమో చేయాలే తప్ప, ఆ ఉత్తర్వులను తాము స్వతంత్రంగా విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కారణంతో నరసింహారావు పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది... అనంతరం నరసింహారావు స్పందిస్తూ, న్యాయ స్థానాలు వెలువరించే ఇటువంటి ఉత్తర్వుల వల్ల ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతు న్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందంటూ, అతనికి కోర్టు ధిక్కారం కింద నోటీసు జారీ చేసింది. -
వారిద్దరికీ వేతనాలు చెల్లించండి
రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వరంగల్ జిల్లా హసన్పర్తి కళాశాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు బకాయిలుసహా వెంటనే జీతాలు చెల్లించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. గత మూడు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ వీవీ పద్మజతోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఏపీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్శిటీల మధ్య ఉద్యోగుల పంపిణీ జరిగింది. ఏపీ స్థానికత ఉన్న 33 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు పంపాలని టీఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 58:42 శాతం ప్రకారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జీతాలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే 33 మంది ఉద్యోగుల్లో ఆరుగురు ఉద్యోగులు ఆఫీసులో రిపోర్టు చేయడం లేదని, జీతాలు ఇవ్వాలంటే తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్శిటీ తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపించారు. అయితే కేవలం సంతకం చేసేందుకే వారిని హైదరాబాద్ రావాలని కోరుతున్నారని, ఇక్కడ కార్యాలయంలో వారికి ఎటువంటి పనిని కేటాయించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. వర్సిటీ విభజన సమయంలో వారు హసన్పర్తిలోనే ఉన్నారని, అక్కడి కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని...వారికి జీతాలు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. గత 15 నెలలుగా ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులకు ఎటువంటి పని ఇవ్వకుండానే జీతాలు చెల్లిస్తున్నారని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఈ ఉద్యోగులు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసి వారి నుంచి పని తీసుకోవాలని...వారికి పని ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోతే సంతకాలు చేయడానికి మాత్రమే హైదరాబాద్కు పిలిపించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
అక్రమ బస్సు ఆపరేటర్లపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం, మోటారు ట్రాన్స్పోర్ట్ వర్కర్ల చట్టం, ఏపీ మోటారు ట్రాన్స్పోర్టు వర్కర్ల నిబం ధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించిం ది. ముఖ్యంగా ఏపీ మోటారు ట్రాన్స్పోర్టు వర్కర్ల నిబంధనల ప్రకారం డ్రైవర్ల పని గంటల విషయంలో జరుగుతున్న ఉల్లంఘన లను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకు న్నారోనివేదికలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు దివాకర్ ట్రావెల్స్కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. మోటారు వాహన చట్టాలకు విరుద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో ప్రైవే టు బస్సు ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్లే గత నెల 28న కృష్ణాజిల్లా మూలపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం దని, ఇందుకు చట్టాన్ని అమలు చేయని సం బంధిత శాఖ అధికారులను బాధ్యులను చేయాలని కోరుతూ న్యాయవాది కె.వి.సుబ్బా రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. పర్మిట్లు లేకపోయినా అనుమతులు... చట్టబద్ధమైన పర్మిట్లు లేకపోయినప్పటికీ వేలాది బస్సులకు ఇరు రాష్ట్రాల అధికారులు అనుమతులిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.ఎ.పద్మనాభం చెప్పారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా అనుమతులు తీసుకు ని స్టేజ్ కారేజీలుగా నడుపుతున్నారని, తద్వా రా ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం కలుగు తోందని, అయినా అధికారులు పట్టించు కోవడం లేదని తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు డ్రైవర్ల పని గంటల్లో మార్పులు తీసుకొచ్చింద న్నారు. దీని ప్రకారం డ్యూటీకి మధ్య 8 గంటల విరామం ఉండాలని, వారంలో 72 గంటలకు మించి డ్రైవర్లు పని చేయడానికి వీల్లేదన్నారు. కానీ కొన్ని రూట్లలో డ్రైవర్లు ఏకబిగిన 26 గంటల పాటు పనిచేస్తు న్నార న్నారు. దీంతో అనేక ఘోర ప్రమా దాలు జరుగుతున్నాయని తెలిపారు. స్పందించిన ధర్మాసనం... డ్రైవర్ల పని గంటల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై ఏం చర్యలు తీసుకున్నారో వివరి స్తూ నివేదికలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల రవాణా, కార్మికశాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. మూలపాడు దుర్ఘటనకు కార ణమైన దివాకర్ ట్రావెల్స్కు కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంట ర్లు దాఖలు చేయాలని సూచించింది. -
ఎస్ఎఫ్సీ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని (ఎస్ఎఫ్సీ) ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఎఫ్సీని ఏర్పాటు చేయక పోవడాన్ని సవా లు చేస్తూ హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు విని పిస్తూ, రాజ్యాంగంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరని పేర్కొన్నారు. ఎస్ఎఫ్సీ ఏర్పాటుకు 2015లో జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు దానిని కార్యరూపంలోకి తీసుకురాలేదని వివరించారు. -
చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలి
హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్ తిరుపతి లీగల్: వయో వృద్ధులకు రక్షణగా ఉన్న చట్టాలు, హక్కులపై వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ చెప్పారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ, చిత్తూరు జిల్లా న్యాయసేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రమేశ్రంగనాథన్ మాట్లాడుతూ... వృద్ధులపై జరిగిన నేరాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలతో కూడిన ప్రత్యేకమైన రిజిస్టర్ను ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహించాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. నిరుపేద వృద్ధుల కోసం ప్రభుత్వాలు దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోందన్నారు. న్యాయసేవా సంస్థలు, చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ సంయుక్తంగా తెలుగులో ముద్రించిన పుస్తకాన్ని జస్టిస్ రమేశ్రంగనాథన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్ సెక్రటరీ పి.రాంబాబు, చిత్తూరు జిల్లా జడ్జి సీహెచ్ దుర్గారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి నరసింహరాజు, రాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు పరమేశ్వర్రెడ్డి, 13 జిల్లాల న్యాయసేవా సంస్థల కార్యదర్శులు(న్యాయమూర్తులు), న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నగరంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి వద్దు
హైకోర్టులో పిల్... విచారణకు స్వీకరణ సాక్షి, హైదరాబాద్: నగరంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతినివ్వకుండా ప్రభుత్వానికి, పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఇందిరాపార్క్, ధర్నాచౌక్తో పాటు పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాల నిర్వహణకు పోలీసులు అనుమతులిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ హైదరాబాద్కు చెందిన టి.ధనగోపాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. -
మీ ఆదేశాల మేరకే జీవో 38 తెచ్చాం
మధ్యంతర ఉత్తర్వులను సవరించండి ధర్మాసనాన్ని కోరిన ఏజీ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 కింద భూములమ్మిన వారికిగాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 చట్ట నిబంధనల ప్రకారం జీవో 38 జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు జీవో 123 వర్తింపచేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరింది. ఇందుకు సంబం«ధించి తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై విచారణ జరపాలని విన్నవించింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనమే ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 38 జారీ నేపథ్యంలో జనవరి 5న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే అనుబంధ పిటిషన్ను దాఖలు చేసింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. ఉభయ పక్షాల న్యాయవాదుల సమ్మతితో జీవో 123 చట్టబద్ధతపై తుది విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఈ వ్యాజ్యాలన్నీ విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ తమ అనుబంధ పిటిషన్ను ప్రస్తావించారు. జీవో 38 జారీ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరారు. తుది విచారణ వల్ల జాప్యం జరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ అనుబంధ పిటిషన్పై వాదనలు వినాలన్నారు. ఈ సమయంలో అటు పిటిషనర్లు, ఇటు ఏజీ మధ్య కొద్దిసేపు తీవ్ర వాదనలు జరిగాయి. అనుబంధ పిటిషన్పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనమే విచారిస్తుందని బెంచ్ స్పష్టం చేసింది. -
భూదాన్ బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: భూదాన్ బోర్డును రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వర కు తిరిగి ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించిం ది. ఎప్పటిలోపు బోర్డును ఏర్పాటు చేస్తా రో స్పష్టం చేయాలని, ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ భూదాన్ బోర్డును పునరుద్ధరించకపోవడాన్ని సవా లు చేస్తూ సర్వసేవసంఘ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రేయాస్రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మా సనం, భూదాన్ బోర్డును ఎందుకు ఏర్పా టు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.