Rangareddy dist
-
సెల్ టవర్ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ నిరసన
సాక్షి, కడ్తాల్: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్లో వెంకటేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సెల్ టవర్ దిగబోనని అతను భీష్మించుకొని కూర్చున్నాడు. దాదాపు గంటసేపు టవర్పైన ఉండి నిరసన తెలిపిన వెంకటేశ్ను పోలీసులు, స్థానికుల నచ్చజెప్పి కిందకు దించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రెండో రోజు ఆదివారం కూడా సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు పట్టువిడవడం లేదు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేయగా.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
సింధు హరితహారం
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పాటిల్ జన్మదినం సందర్భంగా శనివారం హరితహారం నిర్వహించారు. ఆశ్రమంలో కమ్లేష్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొక్కలు నాటారు. శాంతివనం నర్సరీ నిర్వాహకులు శరవణన్ మాట్లాడుతూ.. గురూజీ జన్మదినం సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా 64 నగరాల్లో 64 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. -
రాఖీ పండుగ వచ్చిందంటే.. రాజన్నే గుర్తొస్తడు
సాక్షి, మహేశ్వరం: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చాటేది రాఖీ పండుగ. అన్ని పండుగలకంటే రాఖీ నాకు ఎంతో ఇష్టం. దివంగత నేత, అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదటి రాఖీ నేనే కట్టేదానిని. నాకు ఒక తమ్ముడు నర్సింహారెడ్డి ఉన్నాడు. రాజశేఖరరెడ్డి అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాతే మా తమ్ముడికి కట్టేదానిని. రాజన్న కూడా నన్ను సొంత చెల్లెలుగా చూసుకునేవారు. రాఖీ పండుగ వచ్చిందంటే రాజశేఖరరెడ్డి అన్నే గుర్తొస్తడు. నేను చదువుకునే రోజుల్లో రాఖీ పండుగ రోజున మా తమ్ముడికి రాఖీని పోస్టులో పంపించేదాన్ని. ఇప్పుడు రాఖీ పండుగ రోజున మా తమ్ముడి ఇంటికి వెళ్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. -
చిన్నారిపై లైంగిక దాడి
సాక్షి, పూడూరు(రంగారెడ్డి): సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు ఓ 55 ఏళ్ల వ్యక్తి. తన మనవరాలి వయసుండే బాలికకు చాకెట్ల ఆశ చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన జాండ్ర రాయకోటి(55) కొంతకాలం క్రితం గ్రామం నుంచి వెళ్లి పోయాడు. ఆయనను భార్య, కుటుంబీకులు వదిలేశారు. ఈనేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆయన తిరిగి స్వగ్రామం పెద్ద ఉమ్మెంతాల్కు వచ్చాడు. స్థానికంగా టీవీలు, ఫ్యాన్ల రిపేరింగ్తోపాటు ఎలక్రీషియన్గా పని చేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోని ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి(5)కి తరచూ చాక్లెట్ల ఆశ చూపించి సెల్ఫోన్లో బొమ్మలు చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మరోమారు రాయకోటి తన ఇంట్లో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడగా తీవ్రరక్తస్రావం అయింది. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. బాధితురాలి కుటుంబీకులు జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో రాయికోటిపై దాడి చేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు చన్గోముల్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని పరిగి ఠాణాకు తరలించి విచారణ జరిపారు. సోమవారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ హఫీజ్, సీఐ మొగులయ్య తెలిపారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రాయకోటిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
అయ్యో మల్లికార్జునా!.. ఎంత పనిచేశావయ్యా!
సాక్షి, కాజీపేట: దైవదర్శనం చేసుకుని... మొక్కలు చెల్లించుకున్నారు.. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఇళ్లకు బయలుదేరారు.. మధ్యలో కాసేపు విరామం తీసుకుని భోజనం పూర్తిచేశా రు.. ఆ తర్వాత వాహనంలో బయలుదేరిన వారికి అదే చివరి ప్రయాణం అవుతుందని తెలియదు.. ఒక్కసారి మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న పగడాల దుర్గాప్రసాద్తో పాటు ఆయన భార్య, చిన్నకుమారుడు, అక్కా, బావలు కన్నుమూశారు.. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరంతో ఆ కుటుంబంలో దుర్గాప్రసాద్ తల్లి, మరో కుమారుడు మాత్రమే మిగలడం విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వద్ద జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన దుర్గాప్రసాద్ కాజీపేట వాసి కాగా.. మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రహమత్నగర్కు చెందిన దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భార్య, కుమారుడు, అక్కాబావలతో కలిసి ఆదివారం వెళ్లాడు.. దైవదర్శనం అనంతరం అక్కడే బస చేసిన వారు సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు.. అయితే, అదే చివరి ప్రయాణమవుతుందని వారికి తెలియదు.. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా అమనగల్లు వద్ద భోజనం చేసి వస్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి లారీ దూసుకొచ్చింది. ఆ లారీని వీరు వెళ్తున్న ఇన్నోవా వేగంగా ఢీకొట్టింది.. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, ఆయన భార్య, విజయలక్ష్మి, కుమారుడు శంతన్కుమార్తో పాటు అక్కాబావలు పద్మ, రాజు సైతం మృతి చెందారు.. వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు అందులో చిక్కుకుపోయాయి.. ప్రమాదంలో దుర్గాప్రసాద్, ఆయన సతీమణి, కుమారుడు మృతి చెందగా అనారోగ్యంతో ఇక్కడే ఉండిపోయిన తల్లి, ఆస్ట్రేలియాలో ఉంటున్న మరో కుమారుడు శ్రయాజ్ మాత్రం కుటుంబంలో మిగిలినట్లయింది.. విషయం తెలియగానే ఆయన నివాసముండే రహమత్నగర్తో పాటు పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లన్న దర్శనం కోసం.. కాజీపేట 52వ డివిజన్ రహమత్నగర్ కాలనీకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పగడాల దుర్గాప్రసాద్ (50) తన భార్య విజయలక్ష్మి(46), చిన్నకొడుకు శంతన్కుమార్(25), హైదరాబాద్ కు చెందిన బావ రాజు, అక్క పద్మతో కలిసి ఆదివారం ఉదయం కర్నూల్ జిల్లా శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసిన వారు దైవదర్శనం అనంతరం సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఓ హోటల్లో భోజ నం చేశారు. ఈమేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగ ల్లు మండలం మేడిగడ్డతండా గేటు వద్ద హైదరా బాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న లారీ కుడివైపున ఉన్న శ్రీలక్ష్మీ గణపతి వే బ్రిడ్జి వద్దకు ఒక్కసారిగా మళ్లింది. దీంతో వేగంగా వస్తున్న ఇన్నోవా లారీ ముందు భాగంలోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, శంతన్, రాజు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి, పద్మజ ఆమనగల్లు ప్రభుత్వాçస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారం భించేలోపే కన్నుమూశారు. ఇన్నోవా డ్రైవర్ ఖలీల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పోలీసు అధికారుల పర్యవేక్షణ ఆమన్గల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గప్రసాద్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కాజీపేటకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లను సీపీ డాక్టర్ విశ్వనా«థ్ రవీందర్ పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించి సోమవారం రాత్రిలోగా పోస్టుమార్టం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ మేరకు మృతదేహాలు మంగళవారం తెల్లవారుజాము వరకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిసింది. కాజీపేట సీఐ అజయ్తోపాటు పోలీసు సిబ్బంది మృతుడి ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. దుర్గాప్రసాద్ పెద్దకుమారుడు శ్రయా జ్ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరగా మంగళవారం మధ్యాహ్నంలోగా హైదరాబాద్ చేరుకుంటాడని తెలిసింది. ఆయన కాజీపేటకు రాగానే పోలీసులాంఛనలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కేసుల ఛేదనలో దిట్ట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో పనిచేసిన దుర్గాప్రసాద్కు ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉంది. ఎక్కువగా క్రైం విభాగంలో పనిచేసిన ఆయన కేసుల ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించేవాడని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పనితీరును మెచ్చిన అధికారులు ఎక్కువగా నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇచ్చేవారని తెలిసింది ఇదీ కుటుంబ నేపథ్యం రైల్వేలో లోకో ఇన్స్పెక్టర్గా పనిచేసే పుల్లయ్య 1971లో రహమత్నగర్లో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. పుల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆమన్గల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురు పద్మ, అల్లుడు రాజు, కొడుకు దుర్గాప్రసాద్, కోడలు విజయలక్ష్మి, మనవడు శంతన్కుమార్ మృతి చెందారు. కొద్దికాలం క్రితం పుల్లయ్య మరణించడంతో తల్లి పూలమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఇక దుర్గాప్రసాద్ కుమారుడు శంతన్కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. పెద్దకుమారుడు శ్రయాజ్ ఆస్ట్రేలియాలో ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. దైవభక్తి ఎక్కువ దుర్గా ప్రసాద్కు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. 2018లో పదోన్నతి వచ్చిన తరక్వాత పలు దేవాలయాలకు వస్తానని మొక్కుకున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇటీవలే వేములవాడ, కొండగట్లు ఆలయాలను కుటుంబ సభ్యులతో సందర్శించుకోని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిసింది. శనివారం విధులు నిర్వర్తించిన దుర్గాప్రసాద్ ఆది, సోమవారం రెండు రోజుల పాటు సెలవు పెట్టి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ దైవ దర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. అధికారుల సంతాపం వరంగల్ క్రైం/రామన్నపేట: హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ మృతి పట్ల వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ నరసింహ, ఏసీపీ నర్సయ్య, మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, దీపక్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్కుమార్ తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి ప్రకటించి సంతాపం తెలిపారు. ఉద్యోగుల దిగ్భ్రాంతి వరంగల్ క్రైం: మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గాప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియగానే సహచర ఉద్యోగులు, పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాం తికి గురయ్యారు. 1990 బ్యాచ్కి చెందిన దుర్గాప్రసాద్ మొగుళ్లపల్లి, మడికొండ, స్టేషన్ఘున్పూర్, సుబేదారి, మట్టెవాడ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2014 డిసెంబర్లో జరిగిన బదిలీల్లో మట్టెవాడ వెళ్లారు. అక్కడే ఆయనకు 2018 ఫిబ్రవరిలో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి వచ్చింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి తీర్ధయాత్రలకు వెళ్లిన తన కొడుకు, కుమార్తెల కుటుంబాలు కన్నుమూశాయన్న విషయం తెలుసుకున్న దుర్గప్రసాద్ తల్లి పూలమ్మ బోరున విలపిస్తున్నారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు, పెద్దకూతురు, అల్లుడితో పాటు భార్య, కోడలు ప్రమాదంలో చనిపోయారని ఇంటి పక్కల వారు చెప్పడంతో తల్లి ఆచేతనంగా మారిపోయింది. మాట రాకుండా మంచంలోనే పడిపోవడం చూపరులను కలిచివేసింది. ఉన్నతాధికారుల పరిశీలన ఆమనగల్లు:ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్ఐ మల్లీశ్వర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్నోవా వాహనంలో చిక్కుకున్న మతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. ఇక ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఘటన స్థలాన్ని సోమవారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ ప్రసాద్రావ్, షాద్నగర్ ట్రాఫిక్ సీఐ సునీల్, ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి పరిశీలించారు. అందరితో కలివిడిగా.. రోడ్డు ప్రమాదంలో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబం రహమత్నగర్లో అందరితో కలివిడిగా ఉండేవారు. పండుగలు, పబ్బలకు హాజరవుతూ చిన్నాపెద్ద తేడా లేకుండా కలిసిపోయే వారు. వినాయక చవితి, శ్రీరామనవమి, ఉగాది వేడుకలను కాలనీవాసులతో కలిసి ఘనంగా రుపుకోవడానికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా నిర్వహణకు చేయూతనిచ్చేవారు. సహచర మిత్రుల్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి పరిష్కరించేవాడనే పేరుంది. -
ఒకే రోజు ఇద్దరు అగ్రనేతల పర్యటన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభావం చవిచూసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు తొలిసారిగా వస్తున్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని శంషాబాద్ నుంచి పూరించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9న క్లాసిక్ కన్వెన్షన్–3 పక్కన ఉన్న మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించాలని భావిస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నుంచి 50 వేలకుపైగా పార్టీ శ్రేణులను సమీకరించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్చార్జులకు అప్పగించారు. ఈ సభా వ్యవహారాలను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందటంతో ఇక్కడ విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలవడం కలిసొచ్చే అంశమని పరిగణనిస్తున్నాయి. మరోసారి ఉనికి చాటేలా.. మరోపక్క టీఆర్ఎస్ పార్టీ తన ప్రాబల్యాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని 9న చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో నిర్వహించ తలపెట్టింది. కొన్ని రోజులుగా పార్టీ వర్గాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు హాజరవుతున్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టాన తర్వాత తొలిసారి కేటీఆర్ జిల్లాకు వస్తుండడంతో ఆయన ఘనంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సన్నాహక సభకు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి దాదాపు 20 వేల మందిని తరలించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి కలిసొచ్చేనో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ పోటెత్తింది. గతంతో పోలిస్తే ఈసారి భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన రాజకీయపక్షాలు.. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా ప్రోత్సహించాయి. ఓటు విలువను తెలుపుతూ ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించిన ప్రచారం కూడా పోలింగ్ పెరగడానికి దోహదపడింది. 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 65.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 67.34 శాతం నమోదైంది. గ్రామీణుల హుషారు! పట్టణ నియోజకవర్గాలతో పోలిస్తే ఈసారి గ్రామీణ సెగ్మెంట్లలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. షాద్నగర్, కల్వకుర్తి స్థానాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి షాద్నగర్లో 7.63 శాతం, కల్వకుర్తిలో 6.01 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నియోజకవర్గాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొనడం.. ప్రతి ఓటు విలువైనదే కావడంతో ధన ప్రవాహం కూడా భారీగానే జరిగింది. దీంతో వలస ఓటర్లకు గాలం వేసిన పార్టీలు ఓటర్లను తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాయి. కొందరు అభ్యర్థులు ఏకంగా రోజువారీ కూలీని పంపిణీ చేశారు. మందు, విందు షరా మామూలే. ఈ నేపథ్యంలోనే ఓట్లేసేందుకు గ్రామీణులు పల్లెబాట పట్టారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఇలా ఓటెత్తిన చైతన్యం ఎవరిని గెలిపిస్తుందోనని చర్చించుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం అభ్యర్థుల్లో దడ పుట్టిస్తోంది. శివార్లలో స్వల్పమే అయినా.. శివారు నియోజకవర్గాల్లోనూ ఓటింగ్శాతం పెరిగింది. వాస్తవానికి ఈ సెగ్మెంట్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో పోలింగ్ జరగకపోయినా గత ఎన్నికలతో పోలిస్తే అధికంగా నమోదు కావడం సానుకూల పరిణామం. శేరిలింగంపల్లి స్థానంలో 2014లో 47.9 శాతం నమోదు కాగా.. ఈ సారి 48.51 శాతం నమోదైంది. అంటే 0.61శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. అలాగే ఎల్బీనగర్లో 2.07 శాతం, మహేశ్వరంలో 1.03 శాతం పోలింగ్ ఈ సారి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ప్రజలు ఎక్కువగా ఈ నియోజకవర్గాల పరిధిలో స్థిరపడ్డారు. వీరందరికి అటు గ్రామాల్లో.. ఇటు నగరంలోనూ ఓట్లు ఉన్నాయి. దీంతో తమ స్వస్థలాల్లో ఓటేసేందుకే వీరు ప్రాధాన్యం ఇస్తుండడంతో శివారు సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం తరుగుదలకు కారణమవుతోంది. ఎప్పటికప్పుడు పలుచోట్ల నమోదైన ఓట్లను ఏరివేస్తున్నామని ప్రకటిస్తున్నా అది ఆచరణలో కనిపించడం లేదు. దీనికితోడు శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు నివసిస్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఓటేయడానికి ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. దీంతో గ్రామీణ సెగ్మెంట్ల కంటే చాలా తక్కువగా ఇక్కడ ఓటింగ్శాతం నమోదైంది. మరోవైపు నువ్వా..నేనా అన్నట్లు పోరు సాగిన చేవెళ్లలో 0.14శాతం పోలింగ్ పెరిగింది. పట్నంలో తగ్గిన పోలింగ్ ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తక్కువగా పోలింగ్ జరిగింది. ఈ రెండింటిలోనూ 2శాతం కంటే తక్కువ పోలింగ్ జరగడంతో ఏ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీస్తుందో అంతుచిక్కడం లేదు. హోరాహోరీగా పోరు సాగిన నేపథ్యంలో ప్రజానాడి ఏమిటో అంచనా వేయడం క్లిష్టంగా మారింది. మరోవైపు పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు గెలుపోటములను విశ్లేషించుకుంటున్నారు. ఓటింగ్ సరళిని మదింపు చేస్తూ బూత్లవారీగా తమ ఖాతాలో పడే ఓట్లను లెక్కిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో నమోదైన ఓటింగ్ శాతానికి అనుగుణంగా ఎవరికెన్ని ఓట్లు పోలవుతాయనేదానిపై అంచనాకొస్తున్నారు. -
మహేశ్వరం..ఎవరికో వరం
మహేశ్వరం: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇబ్రíహీంపట్నం, మలక్పేట్ నియోజకవర్గాల నుంచి విడిపోయి 2009లో మహేశ్వరం ఏర్పడింది. కందుకూరు, సరూర్నగర్, బాలాపూర్, మహేశ్వరం మండలాలతోపాటు ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లతో ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్ కేబినెట్లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి మహిళా హోశాఖ మంత్రిగా చరిత్ర సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకొని ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి కారు గుర్తుతో పోటీకి దిగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొత్తం 17 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రధానంగా ముగ్గురి మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహాకూటమి భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్ సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అందెల శ్రీరాములుయాదవ్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈనేపథ్యంలో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు. అభివృద్ధిని ప్రచారం చేస్తూ.. తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మరోమారు విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తాను ప్రత్యేక చొరవతో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేశారు. గొర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతుబీమా పథకాలే తన గెలుపుకు తోడ్పడుతాయని భావిస్తున్నారు. అన్ని గ్రామాలు, తండాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ సర్కారు పథకాలే తనను మరోమారు గెలిపిస్తాయనే ధీమాతో తీగల ఉన్నారు. సర్కారు వైఫల్యమే అస్త్రంగా.. మహాకూటమి అభ్యర్థి (కాంగ్రెస్) సబితారెడ్డి తెలంగాణ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఆమె ఎండగడుతున్నారు. దీంతోపాటు తాజా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై ఉన్న వ్యతిరేకతను, ఆయన అసమర్థతతో నియోజకవర్గం వెనుకబడిందని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను ప్రచారం చేస్తూ విరివిగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అన్నివర్గాల ప్రజలకు తెలియజేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. తనను గెలిపిస్తే మహేశ్వరాన్ని మరో హైటెక్ సిటీగా మారుస్తానని సబితారెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీసీ వాదంతో ముందుకు మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ చాపకింద నీరులా దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తనను గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గ రూపురేఖలను మార్చేస్తానని ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్ర సర్కారు సాయంతో అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. బీసీవాదంతో ముందుకెళ్లి కుల సంఘాలను ఏకం చేసి వారిని ఆకర్షిస్తున్నారు. దీంతోపాటు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ అనుబంధ సంస్థల మద్దతుతో ముందుకెళ్తున్నారు. ఇటీవల మహేశ్వరంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్, సరూర్నగర్లో అమిత్షా సభలు విజయవంతం కావడంతో కేడర్లో జోష్ నెలకొంది. మహేశ్వరం గడ్డపై కాషాయం జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఓటర్ల సంఖ్య ఇలా.. మొత్తం: 40,23,212 పురుషులు: 2,19,014 స్త్రీలు: 2,04,147 ఇతరులు: 50 ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు : 17 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు టీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి ప్రజాకూటమి అభ్యర్థి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి కమలం నుంచి అందెల శ్రీరాములు యాదవ్ పోటీ -
ఇక.. ప్రలోభాల జాతర
నోళ్లకు తాళం పడింది. మైకుల మోత ఆగిపోయింది. మూడు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి బుధవారం బ్రేక్ పడింది. మరో 24 గంటల్లో తుదిపోరు ప్రారంభం కానుంది. కీలకఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చివరి నిమిషంలో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఓటర్లకు నగదు ఆశ జూపుతున్నారు. ఇప్పటికే మందు, విందులతో నిండిపోయిన పల్లెలు.. రాజకీయం క్లైమాక్స్ చేరడంతో మరింత హాట్హాట్గా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 163 మంది బరిలో నిలిచారు. కేవలం ప్రధాన పార్టీలేగాకుండా తొలిసారి చిన్నా చితక పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గెలుపే ధ్యేయంగా జట్టుకట్టిన టీడీపీ–కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కూటమి ఒకవైపు.. మరోసారి విజయం సాధించాలని ముందస్తు సమరానికి సై అన్న టీఆర్ఎస్ మరోవైపు.. మెరుగైన ఫలితాలను సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇంకోవైపు.. పోటాపోటీగా సమరక్షేత్రంలోకి దిగాయి. మొదటి రోజే అభ్యర్థులను ప్రకటించి శంఖారావం పూరించిన గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం మినహా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు. మంత్రులు కేటీఆర్, హరీష్రావు సైతం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలుపెరగకుండా.. శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అతిరథ మహారథులతో ప్రచారపర్వం కొనసాగించిన ఆ పార్టీ అధినేత రాహుల్గాంధీ మునుపెన్నడూలేని రీతిలో బహిరంగ సభలు, రోడ్షోల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ముందస్తు సంకేతాలు రావడమే తరువాయి రాజేంద్రనగర్లో దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్లో పర్యటించారు. అగ్రనేతలు గులాంనబీ అజాద్, అజారుద్దీన్, సినీ తారలు విజయశాంతి, నగ్మా, కుష్బూ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. చంద్రబాబు సైతం.. ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, మహేశ్వరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సినీ నటుడు బాలకృష్ణ ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. హోరెత్తించిన కమలదళం బీజేపీ అధినేత అమిత్షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, హాన్స్రాజ్, గంగ్వార్, స్మృతి ఇరానీ, పురందేశ్వరి, స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద తదితరులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కమలం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాన పార్టీలకు దీటుగా ఇబ్రహీంపట్నం, షాద్నగర్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్లు దక్కకపోవడంతో ఏనుగెక్కిన మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్లు ప్రజాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థులకు తీసిపోని రీతిలో ప్రచారం హోరెత్తించారు. ఉరుకులు పరుగులకు తెర ఉరుకులు పరుగులకు తెరపడింది. ఇక ఉత్కంఠ మిగిలింది. ఎన్నికల క్రతువులో కీలక రోజుగా భావించే ఈ కొన్ని గంటల్లో ఫలితాన్ని తారు మారు చేసేందుకు అభ్యర్థులు తెర వెనుక రాయ‘బేరాలు’ కొనసాగిస్తున్నారు. ఓటరును బుట్టలో వేసుకునేందుకు ఎత్తులు.. చీకట్లో చిత్తులు చేసే కార్యక్రమం మొదలు కానుంది. వీరి భవితవ్యం 11న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. -
కొడంగల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరీ
కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఒకవైపు.. గెలుపే లక్ష్యంగా టీర్ఎస్ ఎంచుకున్ననరేందర్రెడ్డి మరో వైపు బరిలో ఉన్నారు. ఇద్దరు ఉద్దండుల రాజకీయ రణరంగంలో కొడంగల్ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారనే అంశంపై ఉత్కంఠ సాగుతోంది. కొడంగల్: కొడంగల్లో పోరాటం నువ్వా.. నేనా అనేలా సాగుతోంది నియోజకవర్గంలోని సెకండ్ కేడర్ నాయకులు చాలా మంది ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. కుల సంఘాల ప్రతినిధులను నరేందర్రెడ్డి తన వైపునకు తిప్పుకొన్నారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. 7న జరిగే ఎన్నికల్లో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. నేతలిద్దరూ గెలుపు తమదేనని చెబుతున్నా.. చివరికి ఏం జరుగుతుందోననే భయం వీరి లో కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కొడంగల్పై దృష్టిసారించి రేవంత్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించు కుంటున్నారు. రేవంత్రెడ్డి మాత్రం తనకు 30 వేల మెజారిటీ వస్తుందని, ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారని పేర్కొంటున్నారు. కొడంగల్ నియోజకవర్గం చుట్టూ హై టెన్షన్ వైరులా తాను కాపాలా ఉన్నానని.. తాను ఉన్నంత వరకు కొడంగల్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు జరిగిన ఎన్నికలు ఒకవంతు అయితే డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో వంతుగా మారాయి. అభ్యర్థులిద్దరూ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమి తెలియని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. నువ్వా.. నేనా ! కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం పేరుతో రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి మంత్రంతో టీఆర్ఎస్ నరేందర్రెడ్డి జనానికి దగ్గరవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నేతగా ఉన్న రేవంత్ తనదైన ప్రణాళికతో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రెండేళ్లుగా ప్రతీ గ్రామంలో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను ఓవర్ టేక్ చేసే విధంగా రేవంత్ ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో రాటుదేలిన రేవంత్రెడ్డి తన గెలుపు కోసం వేస్తున్న ఎత్తుగడలు స్థానికులకు అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగా మంగళవారం సీఎం కేసీఆర్ కోస్గి సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేయాలని రేవంత్ పిలుపునివ్వడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎటువైపు.. నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు ఉన్నారో అంతుపట్టడం లేదు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీని గెలిపించారు. కొడంగల్ ఆది నుంచి కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట. ఒకదఫా కాంగ్రెస్ను గెలిపిస్తే.. మరోసారి టీడీపీకి అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల వరకు కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ ఉండేది. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షాలుగా నిలిచాయి. అసెంబ్లీ సెగ్మెంట్కు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 సార్లు సార్వత్రిక ఎన్నికలు కాగా ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐదుసార్లు, టీడీపీ నాలుగు సార్లు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు గెలిచారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
ప్రచారంలో దూసుకుపోతున్న ‘ఏనుగు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏనుగు.. జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసిస్తోంది. యూపీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే బహుజన్ సమాజ్ (బీఎస్పీ) పార్టీ మన జిల్లాలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను ‘బెహన్జీ’ మాయవతి అక్కున చేర్చుకున్నారు. టికెట్లు కేటాయించి ఆదరించారు. ఏనుగు గుర్తుతో రంగంలోకి దిగిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మేడ్చల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్లో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో రెబల్గా బరిలో దిగిన నక్కా ప్రభాకర్గౌడ్ బీఎస్పీ పార్టీ గుర్తుపై పోటీచేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల గెలుపోటములలో నిర్ణయాత్మక శక్తిగా మారిన ప్రభాకర్.. చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకెళుతున్నారు. మొదట్నుంచి మేడ్చల్లో సొంతవర్గాన్ని కూడగట్టిన ఆయన మాయవతితో బహిరంగ సభ నిర్వహించి బలాన్ని ప్రదర్శించారు. బీసీ కార్డును ప్రయోగించడం ద్వారా ఆయా వర్గాల్లో బీఎస్పీకి ఉన్న ఆదరణ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. జవహర్నగర్, మేడ్చల్ ప్రాంతాల్లో ఉత్తరాది ప్రాంత ఓటర్లు ఎక్కువగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. షాద్నగర్లోనూ ఐరావతం షాద్నగర్ సెగ్మెంట్లోనూ అంబారీ సవారీ చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన వీర్లపల్లి శంకర్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తొలుత ఇండిపెండెంట్గా బరిలో దిగాలని నిర్ణయించుకున్న ఆయన చివరి నిమిషంలో జాతీయ పార్టీ గుర్తుతో పోటీకి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ అభ్యర్థిగా కదనరంగంలోకి దూకిన శంకర్ ముఖ్య పార్టీల అభ్యర్థులకు తీసిపోని విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేవలం ఈ మూడు నియోజకవర్గాలే గాకుండా ఎల్బీనగర్ మినహా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని సెగ్మెంట్ల బరిలో బీఎస్పీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో చిన్నా చితక పార్టీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ టికెట్ల కూడా గిరాకీ వచ్చింది. కాగా, మూడు స్థానాల్లో ప్రత్యర్థులను గట్టిగా ఢీకొంటున్న ఏనుగు.. ఇతర నియోజకవర్గాల్లో మాత్రం ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. కూటమికి తలనొప్పి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ను ఆశించిన మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఏనుగెక్కారు. కాంగ్రెస్ టికెట్ రాకపోగా.. సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంతో నిరాశ చెందిన ఆయన బీఎస్పీ బీ–ఫారం దక్కించుకున్నారు. ఏనుగు గుర్తుపై పోటీచేస్తున్న మల్రెడ్డి కాంగ్రెస్ కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారపర్వాన్ని కొనసాస్తుండడంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. గత ఎన్నికల్లో ఆయన సోదరుడు రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి ఆ ఓటు బ్యాంకేగాకుండా కాంగ్రెస్ శ్రేణులు కూడా కలిసివస్తాయని మల్రెడ్డి బ్రదర్స్ అంచనా వేస్తున్నారు. అంతేగాకుండా ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు కూడా గణనీయంగా ఉండడం అనుకూలం కానుందని భావిస్తున్నారు. -
కేసీఆర్ అప్పులు పెంచారు
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. తాండూరులో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాటాడారు. తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసిన కేసీఆర్ రీ డిజైన్లకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతానికి సాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఖర్చు మొదట్లో రూ.10 వేల కోట్లు ఉంటే.. రీడిజైన్ చేసి.. రూ.60 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తా మని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులు రూ.17 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల అప్పు ఉందని తెలిపారు. కానీ కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బంగారుమయమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ రూ.300 కోట్ల బంగళాలో విశ్రాంతి తీసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చార్మినార్లో కలుపుతాం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. తాండూరు ప్రాంత ప్రజల, నిరుద్యోగుల ఆకాంక్షలను విరుద్ధంగా జిల్లాను జోగులాంబ జోన్లో కలిపి అన్యాయం చేశారన్నారు. ఈ ప్రాంతం కంది సాగుకు ప్రసిద్ధి పొందిందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న కంది బోర్డు ఏర్పాటు కలను తీరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ టౌన్ మంజూరుచేయగా, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శాటిలైట్ టౌన్కు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. తాండూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. స్టోన్ పరిశ్రమ కారణంగా వెలువడుతున్న కాలుష్య నియత్రంణకు చర్చలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రులను కూడా అప్గ్రేడ్ చేసి, ఈఎస్ఐ దవాఖానా సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాత తాండూరులో ఫ్లైఓవర్ లేదా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పారు. నాపరాతి పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి వ్యాపారాన్ని దివాలాతీసే విధంగా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. జిల్లాలోని కోట్పల్లి, శివసాగర్, జుంటుపల్లి, సర్పన్పల్లి, తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని వివరించా దొరల పాలన అంతం కావాలి రాష్ట్రంలో దొరల పాలన అంతం కావాలంటే ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. మన భూములు, నీళ్లు, నిధులు మనకు దక్కాలన్నారు. చండీయాగాలు చేస్తే ప్రజలు అభివృద్ధి చెందరని, ప్రజారంజకమైన పాలన సాగించాలని తెలిపారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పాటనై వస్తున్నానమ్మో అంటూ గద్దర్ తాను రాసిన పాటలను ఆలపించి సభికులను ఉత్తేజపరిచారు. ఆయన పాట పాడుతున్న సమయంలో రాహుల్గాంధీ ఆసక్తిగా గమనించడం విశేషం. కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి కమీషన్లు.. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పైసలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, కమీషన్లు మాత్రం కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వెళ్తున్నాయని టీజేఎస్ అధినేత, ఫ్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏ ఒక్కడివల్లనో తెలంగాణ రాష్ట్రం రాలేదని, ఎంతోమంది త్యాగాలు, బలిదానాల కారణంగానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగావకాశాల కోసం నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. -
‘పట్నం’లో పాగా ఎవరిదో!
ఇబ్రహీంపట్నం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలయిక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ముఖ్యంగా నాలుగు పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్, మహాకూటమి(టీడీపీ), బీఎస్పీ, బీజేపీల మధ్య హోరాహోరీగా ఉంది. సీపీఎంకు నియోజకవర్గంలో కొంతమేర బలం ఉన్నా ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటీని తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 2,57,681 మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 20.14 శాతం ఎస్సీలు, 7.55 శాతం ఎస్టీలు ఉన్నారు. ఉపాధి ఆవకాశాలు తక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అసంఘటిత కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉన్నారు. ఔటర్ రింగురోడ్డు, రాష్ట్రీయ, అంతర్గత రోడ్లు ఉన్నాయి. వివిధ రక్షణ, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. 2004 ఎన్నికల వరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానం నియోజకవర్గాల పునర్విభజనతో కందుకూరు, మహేశ్వరం మండలాలు విడిపోయాయి. నగర శివారులోని హయత్నగర్ మండలం రూరల్ గ్రామాలు (ప్రస్తుతం అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో) ఇందులో కలిశాయి. అనంతరం జనరల్గా మారింది. ఈనేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలబోతగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏర్పడింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగానే జరిగాయి. 2009 ఎన్నికల్లో.... 2009లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో 1,96,880 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై గెలిచారు. మంచిరెడ్డి 9,216 ఓట్ల మెజార్టీతో విజయం సా«ధించారు. రెండుసార్లు గెలిచిన మంచిరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో 2,30,388 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.81 లక్షల ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్రెడ్డికి 48,397 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మల్రెడ్డి రాంరెడ్డికి 37,341 ఓట్లు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన క్యామ మల్లేష్కు 36,865 ఓట్లు, టీఆర్ఎస్ నుంచి కంచర్ల చంద్రశేఖర్రెడ్డికి 21,779 ఓట్లు వచ్చాయి. మంచిరెడ్డి 11,056 ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయదుందుభి మోగించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. హ్యాట్రిక్పై మంచిరెడ్డి గురి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన మంచిరెడ్డి ఈసారి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఈసారి ఆయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ పథకాలే తనను గెలుస్తాయని చెబుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,57,681 తాజా జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2,57,681 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 1,14,739 మంది ఓటర్లున్నారు. గత పదేళ్లలో దాదాపు 10 వేల ఓట్లు పెరిగాయి. పథకాలపైనే మంచిరెడ్డి ఆశలు అధికార పార్టీ కావడం, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నమ్ముకొని తాజామాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జనాల్లోకి వెళ్తున్నారు. మరోసారి తనను గెలిపించాలని కోరుతున్నారు. సర్కారు ప్రవేశపెట్టిన పథకాలే శ్రీరామరక్ష అని, అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి ఈ ప్రాంత భూములను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇస్తున్నారు. సర్కారు వైఫల్యాలే అస్త్రంగా సామ.. ముందుకు మహాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డి(టీడీపీ) ప్రభుత్వ వైఫల్యాలు, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డిపై జనాల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆక్రమాలు, భూదందాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని చెబుతున్నారు. అసంతృప్తుల అండతో మల్రెడ్డి.. గతంలో మలక్పేటకు పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి అవినీతి బాగోతం బయటపెడతానంటూ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ అసంతృప్తి నేతలందరూ మల్రెడ్డికి మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పథకాలే అస్త్రంగా.. కేంద్రంలో ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వచ్చిన పథకాలను వివరిస్తున్నారు బీజేపీ అభ్యర్థి అశోక్గౌడ్. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
చేవెళ్లలో నువ్వా.. నేనా!
చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నియోజకవర్గం 1952లో ఏర్పడిన నాటినుంచి ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సెంటిమెంటుగా మారిన ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. గతంలో తొమ్మిది పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టిన నియోజకవర్గం ప్రజలు మరోసారి గెలిపిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అస్త్రంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం ప్రయత్నిస్తోంది. ఎవరు ఎన్ని సార్లు గెలుపు కాంగ్రెస్ – 9 టీడీపీ – 4 జనతాపార్టీ – 1 ఇండిపెండెంట్ – 1 ప్రస్తుత ఓటర్ల సంఖ్య మొత్తం – 2,21,887 పురుషులు – 1,13,972 మహిళలు – 1,07,893 ఇతరులు – 22 పోలింగ్ కేంద్రాలు – 292 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ స్థానంగా ఉన్న చేవెళ్ల 2009లో ఎస్సి రిజర్వుడుగా మారింది. దీంతో 25 సంవత్సరాలనుంచి అధికారంలో ఉన్న పట్లోళ్ల కుటుంబం మరోస్థానానికి బదిలీ కావాల్సి వచ్చింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాలె యాదయ్యను రంగంలోకి దించగా, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అనుభవం ఉన్న కెఎస్.రత్నంను తెలుగుదేశంపార్టీ పోటీకి నిలిపింది. ఈపోటీలో టీడీపీ అభ్యర్థి కెఎస్ రత్నం గెలుపొందారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలో కేఎస్ రత్నం టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్పార్టీ నుంచి కాలె యాదయ్య రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం ప్రజలు మరోసారి కాంగ్రెస్కు జైకొట్టారు. అది కూడా తెలంగాణవాదంతో ప్రత్యేక రాష్ట్రంలోని అధిక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు పట్టం కడితే.. ఇక్కడ చేవెళ్ల గడ్డ కాంగ్రెస్కు అడ్డా అని నిరూపించారు. గెలుపొందిన కాలె యాదయ్య కాంగ్రెస్పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేఎస్. రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీకి దిగారు. బలపడుతున్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి హిమాయత్నగర్ మాజీ సర్పంచ్ కంజర్ల ప్రకాశ్ పోటీచేస్తున్నారు. ఇయన గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీకి నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేకపోవటంతో ప్రధాన పార్టీగా పోటీలో ఉంటున్నా గెలుపు సాధించలేకపోతుంది. నియోజకవర్గంలోక్యాడర్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. మరి ఇది వారికి ఏ స్థాయిలో కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే. ఇక మిగిలిన ఆరు మందిలో ఒక్కరు జుట్టు భీమయ్య స్వతంత్ర అభ్యర్థి కాగా మిగిలిన ఐదు మందిలో ఒక్కరు బీఎస్పీ పార్టీ నుంచి కె. సునిల్కుమార్, జైస్వరాజ్పార్టీ నుంచి ఎ. నర్సింహులు, బహుజన రాజ్యం పార్టీ నుంచి ఉప్పరి శ్రీనివాస్, అలిండియా సమతాపార్టీ నుంచి జి. చిన్న మానిక్యం, రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా నుంచి రవీందర్ మాలలు చేవెళ్ల అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలమధ్యనే పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెంటిమెంటే ఆయుధంగా కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సెంటిమెంటు ప్రాంతమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి భావించారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమమైనా, ప్రచారకార్యక్రమైనా , చివరకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైనా చేవెళ్లనుంచి ప్రారంభించడం ఆనవాయితీగా మార్చారు. అదే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పాటిస్తూ ఎన్నికల బస్సు యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించింది. చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డికి గట్టి క్యాడర్ ఉంది. ఆమె అదేశాలను పాటించి కాంగ్రెస్పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా ఉన్న కేఎస్ రత్నం సైతం తనకంటూ ప్రత్యేక క్యాడర్ను టీఆర్ఎస్లో ఉండగానే తయారు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్లోకి మారటం, ఆయన క్యాడర్కూడా కాంగ్రెస్లోకి రావటంతో మరింత బలం చేకూరింది. సంక్షేమ పథకాలే అస్త్రంగా టీఆర్ఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కాలె యాదయ్య నాలుగున్నరేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారినప్పుడుఆయనతోపాటు కొంత మంది ప్రజాప్రతినిధులు మాత్రమే టీఆర్ఎస్లోకి మారారు. గ్రామాల్లో ఉన్న పూర్తిస్థాయి కాడ్యర్ మారలేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొత్తగా టీఆర్ఎస్ క్యాడర్ను ఇప్పుడిప్పుడే తయారు చేసుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరుతున్నవారితో పార్టీకి బలం పెరుగుతోందని టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రజాధరణ ఉందని మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే లక్ష్యంగా పార్టీ క్యాడర్ మొత్తం పనిచేస్తోంది. సైలెంట్గా దూసుకుపోతున్న బీజేపీ భారతీయ జనతాపార్టీ నియోజకవర్గంలో సైలెంట్గా ప్రచారంలో దూసుకుపోతున్నది. అభ్యర్థి కంజర్ల ప్రకాశ్ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ప్రదాన మంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పథకాలే పార్టీకి అండగా నిలుస్తాయని అదేస్థాయిలో అభివృద్ది జరుగుతుందని బీజేపీని గెలపించాలని కోరుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పూర్థిస్థాయిలో క్యాడర్ లేకపోయినా ప్రజలకు కేంద్రం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. కనిపించని ఇతర పార్టీల ప్రచారం ప్రధాన పార్టీలు మినహాయిస్తే పోటీలో ఉన్న మిగత ఆరుగురు అభ్యర్థుల ప్రచారం ఎక్కడా కనిపించటం లేదు. ఒక్క బీఎస్పీ అభ్యర్థి కె. సునిల్కుమార్, బహుజన రాజ్యం పార్టీ అభ్యర్థి ఉప్పరి శ్రీనివాస్లు ప్రచారం కొనసాగిస్తున్నారు. మిగతా అభ్యర్థుల ప్రచారం బహిరంగంగా ఎక్కడ కనిపించటం లేదు. నియోజకవర్గం వివరాలు నియోజకవర్గంలో చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్, నవాబుపేట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గం 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారింది. షాబాద్, నవాబుపేట మండలాల్లో ఎక్కువగా ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉండటంతో నియోజకవర్గాన్ని ఎస్సీకి రిజర్వుడు చేశారు. ఎస్సీ జనాభా తరువాత స్థానం బీసీలదే. బీసీ ఓటర్లు సైతం రెండో స్థానంలో ఉండటంతో బీసీ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. నియోజకవర్గం హైదరాబాద్కు కూత వేటు దూరంలో ఉండటంతోపాటు నగర వాతావారణానికి ప్రజలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. నియోజకవర్గంలోని మొయినాబాద్లో చిల్కూరి బాలాజీ దేవాలయం ఎంతో పేరుగాంచింది. ప్రశాంతమైన వాతవారణంలో ఎలాంటి పొల్యూషన్ లేని ప్రాంతంగా చేవెళ్ల నియోజకవర్గం ఉంది. -
మంచిరెడ్డి కిషన్రెడ్డికి అచ్చొచ్చిన 6666
ఇబ్రహీంపట్నం రూరల్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి తన కారును సెంటిమెంట్గా భావిస్తున్నారు. హోండసీటీ 6666 నెంబరు గల కారులో ప్రచారం చేస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఈ కారులోనే ప్రచారం చేసి గెలుపొందారు. మళ్లీ అదే సెంటిమెంట్ పాటిస్తున్నారు. కొత్తకార్లు ఉన్నప్పటికీ ఆయన పాత కారునే వాడుతున్నారు. అదేవిధంగా ప్రచార పత్రాల్లో, వాల్పోస్టర్లలో ఒక పక్కన ఎర్రబొట్టును వాడటం కూడా ఆయన ప్రత్యేకతట. -
మై ఓట్.. నాట్ ఫర్ సేల్!
షాద్నగర్ టౌన్: ‘మై ఓట్ నాట్ ఫర్ సేల్’ అనే చైతన్య నినాదం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఏ ముంది ప్రత్యేకత అనుకుంటున్నారా ఇది ఎన్నికల సంఘం రూపకల్పన చేసినట్లు ముద్రించి ఉంది. ఈ నినాదం అధికారిక పిలుపు అయితే ఇదొక శుభపరిణామం. ఓటు కోసం ఐదు వందల రూపాయలు ఇస్తుండగా తిరస్కరిస్తున్నట్లు అర్థం వచ్చేలా తీర్చిదిద్దడంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. చూసిన చాలా మంది ఇతర వ్యక్తులకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్నారు. అంతేకాకుండా అందరి దృష్టిని ఆకట్టుకోవడానికి చాలా మంది వాట్సాప్ స్టేటస్ ఫొటో ఉపయోగిస్తున్నారు. ఇలాంటి నినాదాలు అందరిని ఆకట్టుకోపోయినా కొందరైనా నీతి, నిజాయితీగా ఓటు వేసేలా దోహదపడే ఆస్కారం కచ్చితంగా ఉంటుంది. ప్రచార మాధ్యమాల్లో ప్రమాణ సందేశాలు .... అన బడే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, నోటుకు, మధ్యానికి, కులానికి, మతానికి సంక్షేమ పథకాలకు లొంగకుండా విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటానని ప్రమాణం చేస్తున్న సందేశాలు ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటి తరహా సందేశాలు ప్రజాస్యామ్యానికి ఎంతో అవసరం అనే అభిప్రాయాలను చాలా మంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి ఉద్యోగి ఓటేసేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టల్ బ్యాలెట్పై యంత్రాంగం నిశిత దృష్టి సారించింది. ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది వంద శాతం తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో 26.18 శాతం మందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఇంత తక్కువ శాతం మంది ఓటేయడాన్ని సీరియస్గా తీసుకున్న యంత్రాంగం.. ఈసారి ప్రతిఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విధానంపై దాదాపుగా అవగాహన కల్పించారు. మైక్రోఅబ్జర్వర్లకు మాత్రం వచ్చేనెల 2వ తేదీన తర్ఫీదు ఇవ్వనున్నారు. పది వరకు అవకాశం.. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల విధుల్లో సుమారు 35 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు పాల్గొనున్నారు. వీరంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిర్దేశిత ఫార్మాట్లో ఫారంలను పూర్తి చేసి ఇక్కడ ఉన్న డ్రాప్ బాక్స్లో బ్యాలెట్ను వేయాల్సి ఉంటుంది. ఈనెల 27 నుంచి ఫారం–12లను (పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు పత్రం) ఉద్యోగులకు అందజేస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను ఇవ్వనున్నారు. నిర్దేశిత ఫార్మాట్లో పూర్తిచేసి వచ్చేనెల 10వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ను డ్రాప్ బాక్స్లో వేయొచ్చు. లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా ఉద్యోగుల ఓటు హక్కు ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ చిరునామాకు పంపొచ్చు. ఇప్పటివరకు 1,545 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. -
నీట్గా ఉంటే ఎక్కువ పైసల్!
సాక్షి,రాజేంద్రనగర్: ‘ఏం యాదన్న.. ఈమధ్య రోజూ టిక్..టాక్ తయారైపోతున్నావు. ఏంది సంగతి. ఆ ఏమి లేదు నర్సన్న. కూలీ అయితే రోజూ ఎలాగో అలా... పొయ్యేటొళ్లం. ఇప్పుడు ఎన్నికలు కదా. అందుకే ఉదయమే తానం చేసి, ఇస్త్రీ చేసిన బట్టలు ఏసుకొని ప్రచారానికి పోతున్న. గిట్ల మంచిగ తయారై పోతే నాలుగు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే టిక్.. టాక్గా తయారై పోతున్నా. ’ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా బలగం చూపించుకుంటున్నారు. దీంతో నేతలు మహిళలతో పాటు పురుషులను రప్పించుకుంటున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ ప్రాంతాల్లో పని చేస్తే కూలీలను సైతం తమ వెంట తీసుకువెళ్తున్నారు. నేరుగా వారి వద్దకు వెళ్లకుండా వారి తరఫున ఉన్న కాంట్రాక్టర్లు, ఏజెంట్లు, మేస్త్రీలు వారిని ఆశ్రయిస్తున్నారు. మామూలుగా వెంట తిరిగే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు డబ్బును ఇస్తున్నారు. ఓ మోస్తారు నాయకులుగా కనిపించేందుకు వారిని ప్రతిరోజు నీట్గా రెడీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉన్న వారికి ఇతరుల కంటే డబ్బు ముట్టజెబుతున్నారు. -
ప్రచార సందడి
సాక్షి, నెట్వర్క్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బుధవారం ప్రచార సందడి నెలకొంది. మంత్రి కేటీఆర్ వివిధ ప్రాంతాల్లో రోడ్డు షో, ప్రచారం నిర్వహించారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు యువత భారీగా తరలివచ్చింది. రాములమ్మ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కేటీఆర్ రోడ్డుషోలకు కార్యకర్తలు, జనం భారీగా హాజరయ్యారు. తాండూరులో హెలికాప్టర్ దిగి సభకు వస్తున్న రాములమ్మ తాండూరులో భవనాలు ఎక్కి విజయశాంతి ప్రసంగం వింటున్న జనం చేవెళ్లలో కూటమి అభ్యర్థి రత్నంను గెలిపించాలని చెబుతున్న రాములమ్మ మొయినాబాద్ రోడ్షోలో మాట్లాడుతున్న కేటీఆర్ మొయినాబాద్ రోడ్ షోకు హాజరైన ప్రజలు -
రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓటు గల్లంతు
రాజేంద్రనగర్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓటు గల్లంతవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాజేంద్రనగర్ కృష్ణానగర్ హైదర్గూడ ప్రాంతానికి చెందిన రామకృష్ణ చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఆయనకు విధులను కేటాయించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి బుధవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్బాగ్ గురునానక్ స్కూల్లో బుధవారం సంబంధించిన కార్యక్రమం జరిగింది. రామకృష్ణ తన ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ కార్డు డబ్ల్యూపీకే 2581933తో పోలింగ్ బూత్కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది లిస్టులో పరిశీలించి రామకృష్ణ ఓటు లేదని నిర్ధారించారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రామకృష్ణ మరోసారి లిస్టు అంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వెనుతిరిగాడు. ఒక అధికారి పేరు ఓటర్ లిస్టులో లేకపోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
వ్యూహాల్లో అ‘ద్వితీయం’
షాద్నగర్ టౌన్: ఎన్నికల్లో విజయతీరం చేరుకోవాంటే ఎత్తుకు పైఎత్తులు వేయాలి. ప్రత్యర్థులు వేసిన ఎత్తులను చిత్తు చేయాలంటే రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గరుపడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వాటిని నేతలు పసిగట్టి అప్రమత్తం అయితే ఫలితాన్ని సునాయసంగా అందుకోవచ్చు. అందుకు తగ్గట్లు నేతలు పావులు కదపాలి. తద్వారా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రతి గల్లీకి వెళ్లి చక్రం తిప్పలేరు. దీనికోసం ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలు అద్వితీయమైన వ్యూహాలు రచిస్తూ పార్టీతోపాటు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధాన అనుచరులే అండ.. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు ఉంటారు. వీరే పార్టీ అభ్యర్థులకు ప్రధాన అనుచరులుగా ఉంటూ వారికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తుంటారు. వీరు కార్యకర్తలను ఏకం చేయడం, ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మామూలు సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర అన్ని పార్టీల్లో కీలకంగా మారుతుంటుంది. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచించడం.. గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేసి పావులు కదుపుతున్నారు. బరిలో ఉండే తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుల సమాచారాలను చేరవేస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. అనుక్షణం.. అప్రమత్తం అనుక్షణం ప్రత్యర్థి పార్టీ నాయకుల కదలికలను గమనిస్తూ వారి కోటలను బద్దలు కొట్టి తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు పావులు కదుపుతుంటారు. పార్టీ బలాన్ని పెంచడంతో పాటుగా ఎదుటి పార్టీలో అలకబూనిన నేతలను, అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి అక్కున చేర్చుకొని సరికొత్త వ్యూహాలను అమలు చేసే బాధ్యతను నేతలు తమ భుజాలపై వేసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడి ఓట్లు వేయించి ఎన్నికల్లో ఆధిపత్యం కొనసాగేలా దూసుకెళ్తున్నారు. అన్ని తామై వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణినేతలు ఆయా గ్రామాల్లో ముందుకు సాగుతున్నారు. గెలుపోటముల్లో కీలక పాత్ర ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల్లో రెండో శ్రేణి నేతలది కీలక పాత్ర. ఎన్నికల నేపథ్యంలో ప్రతిచోట నాయకులు పార్టీలు మారడం, కొత్త వారిని పార్టీల్లోకి చేర్చడంలో అభ్యర్ధుల ప్రధాన అనుచరులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే ఎన్నికలు జరిగే సమాయానికి ఓటర్లను ఆకట్టుకొని వారి ద్వారా ఓట్లు వేయించే విషయంలోనూ వీరిపాత్ర అద్వితీయం. ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానంగా ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లు పాలించాలంటే ఈ నేతలే కీలకంగా మారుతున్నారు. -
కేసీఆర్పై విజయశాంతి ఫైర్
సాక్షి, చేవెళ్ల: ‘దొరా.. కేసీఆర్.. ఇదేంది అన్నా.. తెలంగాణ వస్తే ఏమో చేస్తావని అనుకున్నాం కానీ, ఏమి చేయాలేదు’ అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏదో చేస్తావని నమ్మిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. దళితబిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పావా లేదా అన్నా... గుర్తు తెచ్చుకోండి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబ సభ్యులంతా పడి అమ్మా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని కేసీఆర్ అడిగారన్నారు. ప్రజలకు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి.. లోపల తననే ముఖ్యమంత్రి చేయమని అడగటంపై సోనియా ఆశ్చర్యపోయారని, దీంతో సోనియా.. దళితబిడ్డనే ముఖ్యమంత్రిని చేయాలి నేను మిమల్ని ముఖ్యమంత్రి చేయను, నీవు నా పార్టీలో చేరవద్దు అని పంపించారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, అలాంటి దేవతను విమర్శించే హక్కు, స్థాయి కేసీఆర్కు, కేటీఆర్కు, కవితకు లేదన్నారు. ఇంటింటికో ఉద్యోగం, దళితులకు భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు అన్ని ఇచ్చి హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు ఆశీర్వదించాలని సభలు పెడుతున్నారని, మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాపీ, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తుందని, ఏడాదికి పేదలకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నారు. 5లక్షల వరకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అనుకున్నామని, జిల్లాకు ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రాలేదన్నారు. అప్పుడు ఓట్లు కోసం వచ్చాడు, ఇప్పుడు ఓట్ల కోసం వస్తాడని విమర్శించారు. ఈ ప్రాంతానికి ప్రాణహితను అడ్డుకున్నాడు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దానిని పాలమూరు ఎత్తిపోతల అని మార్చాడన్నారు.ఆ నీళ్లు వస్తాయో రావో తెలియదన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు. కేస్ రత్నంను అప్పుడు కొన్ని దుష్టశక్తులు కలిసి ఓడించాయని, ఈసారి భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి పి.వెంకటస్వామి, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్రెడ్డి, రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, డైరెక్టర్ అగిరెడ్డి, మహిళా నాయకురాలు సదాలక్ష్మీ, నాయకులు గోపాల్రెడ్డి, వెంకటేశంగుప్తా, వసంతం, మధుసూదన్గుప్తా, రవికాంత్రెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్గౌడ్, టేకులపల్లి శ్రీను, శ్రీదర్రెడ్డి, కె.రామస్వామి, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, రఘువీర్రెడ్డి, విఠలయ్య, శివానందం, ప్రకాశ్గౌడ్, శంకర్, ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డిలో పారుతున్న డబ్బు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికలంటేనే డబ్బు.. డబ్బులున్న నేతలకే టికెట్లు.. నీళ్లలాగా డబ్బులు ఖర్చు పెడితేనే నలుగురు వెంట తిరిగేది.. ఏంటీ డబ్బు గోల అనుకుంటున్నారా..? రాజధాని శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఒక్కో అభ్యర్థి ప్రచార వ్యయం సగటున రూ.20 కోట్లు దాటుతుందంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.120 కోట్ల దాకా కూడా ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అంచనా వేసుకోవచ్చు. రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు వ్యయం చేసే నియోజకవర్గాల్లో జిల్లాలోని రెండు సెగ్మెంట్లను ఎన్నికల సంఘమే స్వయంగా గుర్తించింది. ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. ఎన్నికల సంఘం లెక్కలు అలా ఉంటే.. బుధవారం జరిగిన ఐటీ సోదాల్లో కొడంగల్ ప్రధాన పార్టీ అభ్యర్థి బంధువు ఫామ్హౌజ్లో కోట్ల రూపాయలు దొరికాయనే వార్తలు జిల్లాలో డబ్బుల చర్చకు కారణమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాలో ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా డబ్బు గోలే. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నుంచి నాయకులను ప్రసన్నం చేసుకునేంతవరకు, పోస్టర్లు, కరపత్రాల నుంచి డిజిటల్ ప్రచారం వరకు నిధులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చుకు అధికారిక లెక్కలేమీ లేకపోయినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చలు, అంచనాలను బట్టి జిల్లాలో ఈ ఎన్నికలకు రూ.450 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇది కేవలం అంచనా మాత్రమే. ఈ సెగ్మెంట్లపై ఈసీ నిఘా ఇబ్బడిముబ్బడిగా ధనప్రవాహం జరిగే అవకాశమున్నట్లు గుర్తించిన శాసనసభ నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాద్నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలుండగా.. వికారాబాద్లో కొడంగల్, తాండూ రును గుర్తించింది. ఈ సెగ్మెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. మరోవైపు సంపన్నులు పోటీ చేస్తున్న శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం స్థానాలపై డేగ కన్ను వేయాలని సూచించింది. ఈ నియోజకవర్గాల పరిధిలో జరిగే బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా వ్యవహారాలను నిశితంగా పరిశీలించాలని నిర్దేశించింది. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి సోదాలు నిర్వహించడం ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీచేసింది. పరి‘మితి మీరుతోంది’ వ్యయ పరిమితిని రూ.28 లక్షలకే కట్టడి చేసినా.. ఇవి కేవలం అధికారిక చిట్టా పద్దులకే పరిమితమవుతోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ధన ప్రవాహం రెట్టింపయింది. చావో.. రేవో తేల్చుకోవాలని భావిస్తున్న ఉద్ధండులు ఈసారి బరిలో ఉండడంతో ఖర్చుకు వెరవడంలేదు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసిన మరుక్షణమే టీఆర్ఎస్ అభ్యర్థులు రణక్షేత్రంలోకి వెళ్లారు. దీంతో మొదటి రోజు నుంచే జేబు చిలుము వదిలించుకోవాల్సిన పరిస్థితి తలెత్తెంది. ఇక నామినేషన్ల పర్వం మొదలు కావడం.. ప్రత్యర్థులు కూడా ఖరారు కావడంతో దూకుడు పెంచాల్సి వచ్చింది. వీరి పరిస్థితి ఇలా ఉంటే సమరాంగణంలోకి ఆలస్యంగా వచ్చామని ఆ వేదనతో ఉన్న ప్రజా కూటమి అభ్యర్థులు కూడా ఇతర పార్టీలకు దీటుగా ఖర్చు చేస్తున్నారు. సందడే.. సందడి ముందస్తు ఎన్నికలకు నగారా మోగడమే తరువాయి గ్రామాల్లో పండగ వాతావరణం ఏర్పడింది. టికెట్ల కోసం బలప్రదర్శన, సమావేశాలు, ఊరేగింపులు పేరిట రోజుకో నేత ‘సమ్తృప్తి’ పరుస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ప్రచార పర్యానికి పాల్గొనే శ్రేణులకు ప్రతి రోజూ విందు, మందు ఏర్పాటు చేస్తున్న అభ్యర్థులు.. దిగువ శ్రేణి నేతల గొంతెమ్మ కోరికలను తీర్చడానికి భారీగా నగదును ఆఫర్ చేస్తున్నారు. కేవలం సొంత పార్టీ నాయకులే గాకుండా ప్రత్యర్థి శిబిరాలను కూడా బలహీనపరిచేందుకు తృణమో ఫణమో ముట్టజెప్తున్నారు. ఇవేగాకుండా కుల సంఘాలు, యువజన సంఘాల డిమాండ్లను నెరవేర్చడానికి తలూపుతున్నారు. క్రికెట్ కిట్లు, వంట సామగ్రి, టెంట్లు, కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, గోపురాలకు హామీలు ఇస్తూ ముందస్తుగా కొంత సమర్పించుకుంటున్నారు. పోలింగ్కు ఇంకా వారం రోజుల గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో ఎన్నికల వ్యయం కాస్తా తారస్థాయికి చేరే అవకాశముంది. -
ఎన్నికలు.. మద్యం.. మాంసం..
సాక్షి, రంగారెడ్డి : ఎన్నికల ప్రచారం జోరు మీదుంది. ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అలిసిపోతున్న నాయకులు, కార్యకర్తలు సేద తీరడానికి చల్లని బీరు, మద్యం కోసం వైన్స్ల బాటపడుతున్నారు. అభ్యర్థులు సైతం తమ అనుచరులు.. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా మందుతో కూడిన విందులు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మద్యం మాత్రమే కాకుండా ప్రతిరోజు మాంసాహారం తప్పనిసరి అయింది. దీంతో మార్కెట్లో ఇప్పుడు మద్యం దుకాణాలతో పాటు చికెన్, మటన్ షాపులు సైతం కళకళలాడుతున్నాయి. దీంతో పనిలో పనిగా వంటలు, కేటరింగ్ చేసే వాళ్లకు మంచి చేతి నిండా పని దొరుకుతోంది. కడుపు నిండా తిండి.. ఎన్నికల ప్రచారం ప్రారంభంతో హోటళ్ల వద్ద సందడి పెరిగిపోయింది. చాయ్ తాగుతూ బాతాకానీ కొట్టే వారు కొందరైతే.. అభ్యర్థుల వెంట తిరిగి అలిసిపోయిన వారు ఘుమఘుమలాడే బిర్యానీల కోసం హోటళ్ల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో హోటళ్లలో బిర్యానీ సైతం దొరకడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో ఇప్పుడు బిర్యానీ దొరకడం కొంత కష్టంగానే మారిందని చెప్పవచ్చు. -
ఎన్నికల వేళ.. చేతినిండా ‘పని’
ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇది కొందరికి ఉపాధిమార్గంలా మారింది. మరో పదిరోజుల పాటు చేతినిండా దొరుకుతుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని వ్యాపారులు మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల జేబు ఖాళీ అవుతుండగా.. కొందరు ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ‘నాలుగు రాళ్లు’ పోగేసుకుంటున్నారు సాక్షి,శంషాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం అడ్డాకూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. భవన నిర్మాణ కార్మికులుగా పనిచే సే వీరు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోతున్నారు. పొద్దంతా చేమటోడిస్తే వచ్చే దినసరి వేతనం కన్నా అభ్యర్థుల వెంట కొన్ని గంటలు తిరిగి ప్రచారం చేస్తే వచ్చే సొమ్ముతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా దొరుకుతుండగా ఎన్నికల ప్రచారానికే ‘జై’ కొడుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయా పార్టీలు తమ ప్రచారానికి వీరిని ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు. వీరు నేరుగా ఉదయం లేవగానే ఆయా అభ్యర్థి ఇళ్లకు వెళ్లి అక్కడే అల్పాహారం పూర్తి చేసుకుని ప్రచారానికి వెళ్తున్నారు. ప్రతిరోజు వీరికి రూ. 500 వందల నుంచి 700 వందల వరకు నేతలు చెల్లిస్తున్నారు. కళాకారులు ధూంధాం ఎన్నికల ప్రచారంలో కళాకారులది కీలక పాత్ర. గొంతెత్తి వీరు పాడే పాటలకు ప్రచారానికి వన్నె తెస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తక్కువ సంఖ్యలో ఉండే కళాకారులు అభ్యర్థులకు దొరకడమే కష్టంగా మారింది. వారిని వెతికి పట్టుకునే పనిలో ఆయా పార్టీల నేతలు అష్టకష్టాలు పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం వీరికి మంచి డిమాండ్ ఉంది. మిగతా సమయాల్లో ఖాళీగా ఉండే కళాకారుల బృందాలు ఇప్పుడు బీజీబీజీగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు. పరిమళిస్తున్న పూల దుకాణాలు బరిలో నిలిచిన అభ్యర్థి ఇంటి నుంచి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు అభిమానులు వారిని పూలదండలతో ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది. సన్మానాలకు సత్కారాలకు పుష్పగుచ్చాలు.. పూలదండలు తప్పనిసరి. దీంతో పూలదండలు తయారు చేసి అమ్మేవారికి చేతినిండా పని దొరకవడంతో గిరాకీ అమాంతం పెరిగిపోయింది. యాభై రూపాయల దండ కాస్త డెబ్బై నుంచి వంద వరకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో వ్యాపారి కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు పూల విక్రయాలు జరుపుతున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అనిమార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రచారంలో ప్రస్తుతం కీలకభూమిక పోషిస్తున్న సామాజిక మాధ్యమాలవైపు చూస్తున్నారు. మంచి కంటెంట్తో ఫేస్బుక్, ట్విట్టర్లలో ప్రచారం చేసి పెట్టడానికి డిజిటల్ మార్కెటింగ్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిజిటల్ మార్కెటింగ్ చేసే వారికి చేతినిండా పనిదొరుకుతోంది. ట్రావెల్స్కు డిమాండ్ ట్యాక్సీలు.. ట్రావెల్స్ అన్ని కూడా ఇప్పుడు బిజీగా మారిపోయాయి. ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్న సమయాల్లో పార్టీల అనుచరగణాన్ని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతల బహిరంగ సభలు నియోజకవర్గ పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ ఏర్పాటు చేసిన సమయాల్లో వాహనాలు దొరికే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పవచ్చు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ ‘స్టీరింగ్’ నిండా పని దొరికింది. -
ఎన్నికల సిత్రాలు
మీ శ్రమలో తోడై.. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం బీజేపీ పరిగి అభ్యర్థి ప్రహ్లాద్రావు రోడ్షో, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు తమ పనుల్లో నిమగ్నమైన ఉండగా వారికి సహకరించారు. తనను గెలిపిస్తే ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. – దోమ: బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. కారు గుర్తుకు ఓటెయ్యాలో.. మహేశ్వరం టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి సోమవారం మండల పరిధిలో ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పులిమక్త గ్రామంలో ఆయన బతుకమ్మ ఎత్తుకున్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కటింగ్ చేస్తా.. ఓట్లు రాబడుతా.. ధారూరు మండల పరిధిలో సోమవారం వికారాబాద్ స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ అనుచరులు విస్తృతంగా ప్రచారం చేశారు. సింహం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఓ హెయిర్ సెలూన్లో గడ్డం గీస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. – ధారూరు -
పోస్టల్పై నిరాసక్తి !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్పై ఉద్యోగులు, సిబ్బంది ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఓటు వినియోగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటూ ఎంతో కీలకం. దీనిని గుర్తించిన ఎన్నికల సంఘం.. ఎలక్షన్ విధుల్లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోంది. అయితే, ఉద్యోగులు, సిబ్బంది పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విధుల్లో పాల్గొన్న వారిలో 73.82 శాతం మంది పోలింగ్కు దూరంగా ఉంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరిసారిగా 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానంలో పోలైన ఓట్ల తీరును చూస్తే ఈ విష యం స్పష్టమవుతోంది. 2014లో ప్రస్తుతం కొత్త రంగారెడ్డి పరిధిలోకి వచ్చే ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 35 వేల మందికిపైగా అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఇందులో 9,165 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. అంటే మొత్తం ఓట్లలో కేవలం 26.18 శాతం మందే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటేసినా చెల్లడం లేదు.. అధికారులు, ఉద్యోగులు కొందరు బాధ్యతాయుతంగా ఓటేసినా.. పలు తప్పిదాల వల్ల కొన్ని సందర్భాల్లో అవి చెల్లుబాటు కావడం లేదు. ఇలా పనికిరాకుండా పోతున్న ఓట్ల శా తం కూడా గణనీయంగానే ఉండడం కలవరానికి గురిచేస్తోంది. విద్యావంతులు కూడా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటేయలేకపోవడంపై పలువురు ఉన్నతాధికారులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ విధానంపై పలుమార్లు అవగాహన కల్పించినా పూర్తిస్థాయిలో మార్పు రాకపోవడానికి కారణం నిర్లక్ష్యమేనని విశ్లేషిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ జె.రాజేశ్వర్రెడ్డి గత ఎన్నికల్లో జిల్లా పరిధిలో 34.06 శాతం ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 9,165 మంది ఉద్యోగులు, సిబ్బంది ఓటు వేయగా.. ఇందులో 6,043 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. మరో 3,122 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పూర్తిసా ్థయిలో ఓటు వినియోగించుకోకపోవడానికి, ఒకవేళ ఓటేసినా అవి చెల్లుబాటు కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ జె.రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఆ సమస్యలను అధిగమిస్తే వినియోగించుకున్న ఓటు నూరుశాతం చెల్లు బాటు అవుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆసక్తి లేకపోవడానికి కారణాలు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఈఆర్ఓ) దగ్గరి నుంచి పోస్టల్ బ్యాలెట్ను తీసుకోకపోవడం. ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వుల కాపీతోపాటు ఫారం–12 సకాలంలో అందించకపోవడం. ఓటర్ల జాబితాలో ఉన్నట్లుగా తన ఓటుకు సంబంధించిన పార్ట్, సీరియల్ నంబర్ వివరాలను తప్పుగా నమోదు చేయడం. ఎన్నికల విధుల్లో పనిచేసే వారికి సకాలంలో డ్యూటీ ఆర్డర్స్ అందకపోవడం. ఫారం–12లో తప్పుడు చిరునామా పేర్కొనడం. తీసుకున్న బ్యాలెట్ పేపర్రు నిర్ణీత సమయంలోగా ఆర్ఓకు అందజేకపోవడం. తిరస్కరణకు గల కారణాలు డిక్లరేషన్పై సంతకం చేయకపోవడం. బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయకపోవడం. గెజిటెడ్ ఆఫీసర్తో ధ్రువీకరించకపోవడం. ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్ను 13బి కవరులో పెట్టకపోవడం. పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్ను ఒకే కవరులో పెట్టడం. పోస్టల్ బ్యాలెట్లో సంతకం లేకపోవడం (గోప్యత లేకపోవడం). ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు మార్క్ చేయడం. ఏ అభ్యర్థికీ మార్క్ చేయకపోవడం. కొన్ని సందర్భాల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేశారో తెలియకుండా పైన.. కింద మార్క్ చేయడం. -
9 రోజులే గడువు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల ప్రచారానికి తొమ్మిది రోజులే మిగిలి ఉంది. ఎన్నికల నగారా మోగకముందే ప్రచారపర్వానికి గులాబీ పార్టీ శ్రీకారం చుట్టింది. 50 రోజులుగా ఎడతెరిపిలేకుండా ప్రచారాన్ని సాగిస్తున్న ఆ పార్టీ అభ్యర్థులు ప్రతీ ఇంటి గడప తొక్కుతుండగా.. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థుల ఖరారు తేల్చని ప్రజాకూటమి ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి దూకింది. కౌంట్ డౌన్ మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో కమలం పార్టీ కూడా జాప్యం చేయడంతో ప్రచారంలో వెనుకబడే ఉంది. అయితే, ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లతో ఈ మూడు పార్టీలు జిల్లాలో హోరెత్తిస్తున్నాయి. ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల రాకతో ఈ వారం రోజులు జిల్లాలో ప్రచారపర్వం తారస్థాయికి చేరనుంది. టాప్ గేరులో కారు కారు గేరు మార్చింది. ప్రచారంలో స్పీడు పెంచింది. ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొదటి విడత ప్రచారాన్ని పూర్తిచేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రెండో విడత ప్రచారానికి వస్తున్నారు. ఆదివారం షాద్నగర్, ఇబ్రహీంపట్నం, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన గులాబీ బాస్.. మంగళవారం ఆమనగల్లుకు రానున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన అభ్యర్థుల ఖరారు మొదలు.. క్షేత్రస్థాయి ప్రచారంలో తలమునకలైన టీఆర్ఎస్ పార్టీ తాజాగా వేగం పెంచింది. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. మంత్రులు కేటీఆర్, హరీష్రావులు ఇప్పటికే జిల్లాలో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొన్ని ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ రాకతో... కారుకు దీటుగా కాంగ్రెస్ కూడా ప్రచారంలో వేగం పెంచింది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీలు ఉమ్మడి జిల్లా పరిధిలోని మేడ్చల్లో ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి రాహుల్గాంధీ జిల్లా పర్యటన ఖరారైంది. కొడంగల్, తాండూరు, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభలు, రోడ్షోల్లో పాల్గొననున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రచారపర్వం తారస్థాయికి చేరనుంది. ఇప్పటికే ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. మిగతా స్థానాల్లో.. మలివిడత ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మలిదశలో మిగతా నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిలు పోటీచేస్తున్న కొడంగల్, మహేశ్వరంలో తుది విడతప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈ నియోజకవర్గాలపై గులాబీ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కాషాయదళం కూడా.. భారతీయ జనతాపార్టీ కూడా ప్రచారంలో జాతీయ నేతలను రంగంలోకి దింపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మొదలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ను ఎన్నికల ప్రచారానికి రప్పిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా చెప్పుకుంటున్న పరిపూర్ణానంద స్వామి జిల్లాతో పలు సభల్లో ప్రసంగించారు. తాండూరు, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన మంగళవారం కల్వకుర్తి సెగ్మెంట్లోని తలకొండపల్లిలో జరిగే మహిళా సదస్సుకు హాజరుకానున్నారు. మరోవైపు డిసెంబర్ 2వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఆమనగల్లుకు రానున్నారు. అలాగే, మేడ్చల్, ఎల్బీనగర్లో జరిగే రోడ్షోల్లోనూ పాల్గొంటారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నెలాఖరులో తాండూరులో పర్యటించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కమలం పార్టీ... మరింత దూసుకెళుతోంది. -
ఎన్నికల సిత్రాలు
పెద్దశంకరంపేట(మెదక్): తిరుమలాపూర్ కాలనీలో ముందు బీజేపీ ప్రచార రథం వెళ్తుండగా దాని వెనకాల టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తూ కనిపించారు. స్థానికులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించారు. మంచూరియా మంచిగ చేస్తా...! గెలిపిస్తే అభివృద్ధి చేస్తా.. జోగిపేట(అందోల్): అందోలు టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ ప్రచారంలో భాగంగా జోగిపేటలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటెర్లో మంచూరియా తయారు చేసి సందడి చేశారు. ఎంపీ బీబీ పాటిల్ తయారైన మంచూరియాను ప్లేటులో వేసి కార్యకర్తకు అందించారు. దరువేస్తా.. ఓటెయ్యండి హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి లింగ్సాన్పల్లిలో డప్పు కొట్టి ప్రచారంలో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కొలిమి నేను పెడతా.. కారుకు ఓటెయ్యి తాతా కంగ్టి(నారాయణఖేడ్): టీఆర్ఎస్ జిల్లా నాయకురాలు గీతారెడ్డి శుక్రవారం తడ్కల్లో కమ్మరి కొలిమి వద్దకు వెళ్లి కొడవలికి కొలిమి పెడుతూ పని చేస్తున్న వడ్రంగిని ఓటు అడిగారు. -
గులాబీ జోష్
సాక్షి,రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి. ముందుగా తాండూరులో సభ నిర్వహించారు. అనంతరం సీఎం పరిగికి చేరుకున్నారు. ఆ తర్వాత షాద్నగర్, ఇబ్రహీంపట్నంలో సభలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు, జనం భారీగా సభలకు తరలిరావడంతో నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఆద్యంతం గులాబీ దళపతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మధ్యమధ్యలో కేసీఆర్ విసిరిన పంచ్లు ఆకట్టుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభకు ముందు కళాకారుల ఆటాపాటలు ఉత్సాహపరిచాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం సభ సైడ్లైట్స్ తాండూరుకు మధ్యాహ్నం 1:10 గంటలకు కేసీఆర్ చేరుకున్నారు. 1:20 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని సభ ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, బీజేపీ, టీడీపీ నాయకులకు కేసీఆర్ టీఆర్ఎస్ కండువాలను కప్పి ఆహ్వానించారు. 1:26 గంటల నుంచి 1:57 గంటల వరకు కేసీఆర్ ప్రసంగించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభా స్థలం నుంచి కేసీఆర్ హెలిపాడ్ వద్దకు బయలుదేరారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాండూరు నుంచి హెలికాప్టర్లో పరిగికి వెళ్లారు. సభలో కేసీఆర్తో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు. సీఎం కేసీఆర్కు వినతిపత్రం అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి. తాండూరు ప్రాంతానికి చెందిన పర్యాద కృష్ణమూర్తి చిరకాల మిత్రుడన్న కేసీఆర్. తాండూరులో సభా ప్రాంగణం సరిపోకపోవడంతో జనాలు రోడ్లపై నిలబడి కేసీఆర్ ప్రసంగం ఆసక్తిగా విన్నారు. ఓ బాలుడు సభలో గులాబీ జెండాతో సందడి చేశాడు. సభకు వస్తుండగా హెలికాప్టర్లోంచి కోట్పల్లి ప్రాజెక్టును చూడగా పూర్తిగా ఎండిపోయందని కేసీఆర్ ప్రసంగంలో పేర్కొన్నారు. తాండూరులో దుమ్ము, ధూళితోపాటు కాలుష్యాన్ని తగ్గిస్తామని కేసీఆర్ హామీ. మేడలపై నుంచి కేసీఆర్ను చూసిన జనాలు. ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో కేసీఆర్ సభాస్థలికి చేరుకోకముందే ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి తమ ప్రసంగం ముగించారు. సాయంత్రం 5: 30 గంటలకు సీఎం హెలికాప్టర్ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొని కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. 5:40 గంటలకు హెలిపాడ్లో దిగింది. 5:54 గంటలకు సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 30 నిమిషాల పాటు సీఎం ప్రసంగించారు. కండువా కప్పి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్తోపాటు ఆయన అనుచరులను సీఎం టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. క్యామ మల్లేశ్ పేరును తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించిన సీఎం. హెలికాప్టర్లో వచ్చి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు వెళ్లిన కేసీఆర్. క్యామ మల్లేశ్కు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం ప్రకటించగానే సభలో చప్పట్లు. -
ఆదివారం ‘ఎఫెక్ట్’
సాక్షి,రాజేంద్రనగర్: సెలవురోజు ఆదివారం కావడంతో కిందిస్థాయి నాయకులు, చోటామోట లీడర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం, ఆపై ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల వద్దే ఉంటారని భావించిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేయాలని భావించారు. బలగం చూపించుకోవడానికి జనం అవసరం కావడంతో చోటామోట లీడర్లు, గల్లీస్థాయి నాయకులను ఆశ్రయించారు. ప్రచారం తర్వాత బిర్యానీ, మద్యం, ఆపై డబ్బులు ఇస్తామని హామీ ఇస్తేనే వస్తామని వారు తెగేసి చెప్పడంతో చేసేది లేక నేతలు అంగీకరించాల్సి వచ్చింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆదివారం పెద్దఎత్తున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ ‘విజయం’ ఖాయం
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న కుట్రలు, కుతంత్రాలకు తెరదించుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు మండలాలకు చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు వంద నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యత అప్పగిందని చెప్పారు. ఇందుకోసం హెలికాప్టర్ వసతి కల్పించారని తెలిపారు. కేసీఆర్ను అధికారంలోకి తెచ్చుకోవడానికి అడ్డదారిలో పయనిస్తున్న వారి వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం కొనసాగిస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రలా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ప్రచారం నిమిత్తం హెలికాప్టర్లో ఆసిఫాబాద్కు వెళ్లారు. -
మెజారిటీల్లో రికార్డు..
సాక్షి, పరిగి (రంగారెడ్డి): జిల్లా హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల నుంచి తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిర్వహించిన 2014 అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు అత్యధికంగా ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. 1999నాటి ఎన్నికల్లో ఉప్పల్ నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి తూళ్ల దేవేందర్గౌడ్కు అత్యధిక మెజారిటీ లభించింది. 77,883 ఓట్లతో ఆయన విజయం సాధించారు. 1983 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమావెంకట్రాంరెడ్డి 64 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. 1952 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎంబీ గౌతం అత్యల్ప మెజారిటీతో గెలుపొందారు. ఎస్సీఎఫ్ పార్టీకి చెందిన కేకే మానెపై 1,490 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి పోటీ చేసిన గౌతంకు 13,432 ఓట్లు, మానెకు 11,942 ఓట్లు దక్కాయి. దీంతోపాటు వికారాకాబాద్ ద్విసభ్య సెగ్మెంట్గా ఉండేది. జనరల్ స్థానానికి బరిలో దిగిన మర్రి చెన్నారెడ్డి భారీ మెజారిటీతో నెగ్గారు. సోషలిస్ట్ నేత రామారావుపై 31,850 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఓటమిపాలైన రామారావుకు 11,985 వచ్చాయి. 1957లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అత్యల్ప మెజారిటీ నమోదైంది. పీడీఎఫ్ అభ్యర్థి హన్మంత్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎన్ లక్ష్మీనరసయ్య 2,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అత్యధిక మెజారిటీ వికారాబాద్ సెగ్మెంట్లో వచ్చింది. ద్విసభ్య సెగ్మెంట్గా ఉండగా.. జనరల్ స్థానానికి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 21,195 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి ఎన్ఎం జైసూర్యపై విజయఢంకా మోగించారు. 1962 ఎన్నికల్లో..అత్యల్ప మెజారిటీతో తాండూరు నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి సి.శేఖర్పై 268 ఓట్లతో నెగ్గారు. మొత్తం 34,200 ఓట్లకుగాను చెన్నారెడ్డికి 15,658 ఓట్లు, శేఖర్కు 15,390 ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎన్ లక్ష్మీ నరసయ్య 21,921 ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థి కేపీ రెడ్డిపై విజయం పూరించారు. మొత్తం 35,588 ఓట్లకు గాను నరసయ్యకు 27,295 మంది ఓటేశారు. కేపీ రెడ్డికి 5,374 ఓట్లు దక్కాయి. 1967 ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీ పరిగి నియోజకవర్గంలో నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ షరీఫ్పై స్వతంత్ర అభ్యర్థి కమతం రాంరెడ్డి కేవలం 850 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాంరెడ్డికి 21,087 ఓట్లు, షరీఫ్కు 20,237 ఓట్లు పోలయ్యాయి. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రా దేవి 14,441 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ కేఆర్ అబ్బయ్యకు 4,560 ఓట్లు, సుమిత్రకు 19,001 ఓట్లు దక్కాయి. 1972లో అతి తక్కువ మెజారిటీతో వికారాబాద్ సెగ్మెంట్లో స్వతంత్ర అభ్యర్థి వీబీ తిరుమలయ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత టీఎన్ సదాలక్ష్మిపై 4,691 ఓట్లతో నెగ్గారు. తిరుమలయ్యకు 19,339 ఓట్లు, సదాలక్ష్మికి 14,648 ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.అనంతరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థి కేకే మూర్తిపై 31,251 ఓట్లతో ఆయన నెగ్గారు. అనంతరెడ్డికి 44,061 ఓట్లు, మూర్తికి 12,812 ఓట్లు వచ్చాయి. 1978లో చేవెళ్ల నియోజకవర్గంలో అత్యల్ప మెజారిటీతో జనతా పార్టీ అభ్యర్థి సి.ప్రతాపలింగం గెలుపొందారు. ఇందిరా కాంగ్రెస్ నేత టీఆర్ ఆనందంపై 5,319 ఓట్లతో గెలుపొందారు. ప్రతాప్నకు 26,071 ఓట్లు, ఆనందంకు 20,752 ఓట్లు దక్కాయి. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రాదేవి విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, జనతా పార్టీ నేత కేఆర్ కృష్ణస్వామిపై 23,561 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగింది. చివరకు 64 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి టీపీ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఉమావెంకట్రాం రెడ్డి నెగ్గారు. ఉమకు 34,853, టీపీ రెడ్డికి 34,789 ఓట్లు దక్కాయి. అలాగే పరిగిలోనూ ఇదే తరహాలో టఫ్ ఫైట్ కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఏ.షరీఫ్ 85 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి కేఏ రెడ్డిపై విజయం సాధించారు. తాండూరు సెగ్మెంట్లో భారీ మెజార్టీ నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.మాణిక్యరావు.. స్వంతంత్ర అభ్యర్థి ఎస్.సాయిరెడ్డిపై 18,297 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. 1985 ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో అత్యల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.చంద్రశేఖర్ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎస్.బాలప్పపై 14,203 ఓట్ల మెజారిటీ సాధించారు. భారీ మెజారిటీతో చేవెళ్ల సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి పట్లోళ్ల ఇంద్రారెడ్డి విజయఢంకా మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.విక్రంకుమార్ రెడ్డిపై 39,805 ఓట్ల మెజారిటీ పొందారు. అతి తక్కువ ఓట్లతో 1989లో వికారాబాద్ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్.. కాంగ్రెస్ అభ్యర్థి వీబీ తిరుమలయ్యపై నెగ్గారు. 3,964 ఓట్ల మెజారిటీ సాధించారు. అత్యధిక మెజారిటీ మేడ్చల్ నియోజకవర్గంలో నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఉమావెంకట్రాంరెడ్డి 20,823 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఎస్.ఉమాదేవిపై గెలుపొందారు. 1994 ఎన్నికల్లో తాండూరు నుంచి టీడీపీ అభ్యర్థి పట్నం మహేందర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.నారాయణరావుపై 10,191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహేందర్కు 41,135 ఓట్లు, నారాయణరావుకు 30,944 ఓట్లు పోలయ్యాయి. చేవెళ్లలో టీడీపీ అభ్యర్థి పట్లోళ్ల ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పి.పాండుపై 64,603 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఇంద్రారెడ్డికి 85,437 మంది ఓటెయ్యగా.. పాండుకు 20,834 మంది ఓటర్ల ఆశీర్వాదం లభించింది. 1999 ఎన్నికల్లో.. అతి తక్కువ ఓట్ల తేడాతో వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బి.మధురవేణిపై టీడీపీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ నెగ్గారు. ఈయనకు కేవలం 203 మెజారిటీ లభించింది. చంద్రశేఖర్కు 52,733 ఓట్లు దక్కగా.. మధురవేణికి 52,530 ఓట్లు లభించాయి. అత్యధిక మెజారిటీతో తూళ్ల దేవేందర్ గౌడ్ రికార్డు సృష్టించారు. మునుపెన్నడూ లేనివిధంగా 77,883 భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.హరివర్ధన్రెడ్డిపై విజయ కేతనం ఎగురవేశారు. గౌడ్కు 1.93 లక్షల ఓట్లు, హరివర్ధన్రెడ్డికి 1.15 లక్షల ఓట్లు దక్కాయి. 2004లో వికారాబాద్ సెగ్మెంట్లో అతి తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బి.మధురవేణిపై టీఆర్ఎస్ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ గెలుపొందారు. ఈయనకు 2001 ఓట్ల మెజారిటీ దక్కింది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ఎస్.భూపాల్రెడ్డిపై 41,585 ఓట్ల మెజారిటీని సాధించారు. నియోజకవర్గాల పునర్శిభజన జరిగిన తర్వాత 2009లో తొలిసారిగా జరిగిన ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ శేరిలింగంపల్లి సెగ్మెంట్లో నమోదైంది. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై కాంగ్రెస్ అభ్యర్థి 1,327 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కూకట్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నర్సింగ్రావుపై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నెగ్గారు. ఈయనకు 28,183 ఓట్ల మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య గెలుపొందారు. టీఆర్ఎస్ నేత కేఎస్ రత్నంపై 781 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యాదయ్యకు 64,182 ఓట్లు, రత్నానికి 63,401 ఓట్లు దక్కాయి. శేరిలింగంపల్లిలో అత్యధిక మెజారిటీ టీడీపీ అభ్యర్థి అరికెపూడి గాంధీకి లభించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కె.శంకర్గౌడ్పై 77,257 ఓట్ల మెజారిటీ సాధించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇది రెండో అత్యధిక మెజారిటీ. గాంధీకి 1.29 లక్షల ఓట్లు, శంకర్కు 53 వేల పైచిలుకు ఓట్లు దక్కాయి. -
ఓటేస్తూ సెల్ఫీలు వద్దు
షాద్నగర్ టౌన్: ఇటీవల సెల్ఫీలు తీసుకోవడం జనానికి ఓ సరదాగా మారిపోయింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇట్టే సెల్ఫోన్ కెమెరాతో బంధిస్తున్నారు. విందులు, వినోదాలు, శుభకార్యాలు, విహార యాత్రలతో పాటుగా మిత్రులు, బంధువులతో సరదాగా గడిపే సన్నివేశాలను సెల్ఫీలు తీసుకుంటుంటారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ను సైతం యువత సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రంలో ఓటేస్తూ సెల్ఫోన్తో సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే ఇబ్బందులు తప్పవు. ఓటేస్తూ పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలు దిగడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఓటేస్తూ సెల్ఫీలు దిగడం నిషేధం పోలింగ్ కేంద్రంలో ఓటేస్తూ సెల్ఫీలు తీసుకోవడాన్ని ఎన్నికల సంఘం పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఓటరు అలా చేస్తే 49ఎం(ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు ఎన్నికల అధికారులు ఓటరును బయటకు పంపించేస్తారు. ఆ ఓటును ఎన్నికల నియమావళిలోని 17ఏలో నమోదు చేస్తారు. అయితే, ఓట్ల లెక్కింపు సమయంలో సదరు ఓటును పరిగణలోకి తీసుకోరు. ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసి సెల్ఫీలు తీసుకొని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా మెలగడం మంచిది. ఎన్నికల్లో ఒక్కో ఓటు కూడా ఎంతో కీలకం. ఈనేపథ్యంలో సెల్ఫీలు కట్టిపెట్టి నిబంధనలు పాటించి ఈవీఎంలో తమకు నచ్చిన నేతకు ఓటు వేసి బయటికి రావాలి. -
బ్యాలెట్ బాక్సులను ఎడ్లబండ్లపై తరలించాము
దాదాపు 30 ఏళ్ల క్రితం చాలా గ్రామాలకు బ్యాలెట్ బాక్సులను ఎడ్ల బండ్లపై తరలించేవాళ్లం. పోలీసులు వాటివెంట నడుస్తూ రక్షణగా వచ్చేవారని రిటైర్డ్ తహసీల్దార్ చిన్నయ్య పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేది.. నాటికి నేటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రెవెన్యూ శాఖలో పనిచేసి నాలుగు పర్యాయాలు ఎన్నికల విధులు నిర్వహించిన ఆయన అనుభవాలు తన మాటల్లోనే.. సాక్షి,పరిగి: 1969లో రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరాను. నా మొదటి డూటీ ఎలక్షన్ ఎల్డీసీగా ప్రారంభించాను. అనంతరం తహసీల్దార్ హోదాలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నాలుగు ఎన్నికల్లో పాలుపంచుకున్నాను. ఎన్నికల నిర్వహణ, సౌకర్యాలు, రవాణా తదితర అంశాల్లో అందే ఫిర్యాదులు ఇలా అనేక అంశాల్లో నాటితో పోలిస్తే నేడు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం చాలా గ్రామాలకు జీపులాంటి వాహనాలు వెళ్లేందుకు రోడ్లు ఉండేవి కావు. దీంతో చాలా గ్రామాలకు బ్యాలెట్ బాక్సులను ఎడ్లబండ్లపై తరలించాల్సి వచ్చేది. పోలీసులు వాటికి కాపలాగా నడుచుకుంటూ వెనకాలే వచ్చేవారు. తడకలతో పోలింగ్ స్టేషన్లు .. చాలా గ్రామాల్లో పోలింగ్ బూతుల ఏర్పాటుకు గదులు కూడా ఉండేవి కాదు. స్కూల్ బిల్డింగుల్లో ఒకటో రెండో గదులు ఉండేవి. దీంతో తాత్కాలికంగా తడకలతో గదులను ఏర్పాటు చేసేవాళ్లం. రాత్రిళ్లు నిద్రించేందుకు కూడా సిబ్బందికి గదులు ఉండేవి కావు. ఇక మహిళా సిబ్బంది కష్టాలు అన్నీఇన్ని కావు. రాత్రంతా సిబ్బందికి జాగారమే.. ఇప్పుడు ఈవీఎంలు వచ్చాక పని విధానం చాలా సులభమైంది. వాటిని చెక్ చేసుకోవటానికి టెక్నికల్ పర్సన్లు కూడా ఉంటున్నారు. కాని అప్పట్లో ప్ర తి బ్యాలెట్ పేపర్ను చెక్ చేయాల్సి వచ్చేది. తప్పులు ఉన్న పేపర్లు ఏమైన ఉన్నా.. పేరు.. గుర్తులు ఏమైనా మారినా వాటిని ప్రత్యేకంగా లెక్క కట్టాల్సి వచ్చేది. వాటిపై ముందుగానే ముద్రలు వేసుకోవాల్సి వచ్చేది. దీంతో సిబ్బంది రాత్రిళ్లు నిద్ర కూడాపోయే వారు కాదు. మూడు రోజుల ముందే ఏర్పాట్లు అధికారులందరూ పోలింగ్కు మూడు రోజుల ముందే ఏర్పాట్ల కోసం గ్రామాల్లో శ్రమించాల్సి వచ్చేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లోనే కౌంటింగ్ జరిగితే ఇంకా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఓట్లు లెక్కింపునకు టేబుళ్లు కూడా దొరికేవి కాదు. ఒక్కోసారి టేబుళ్లు కూడా టౌన్ నుంచి తీసుకు వెళ్లాల్సి వచ్చేది. గ్రామాల్లో కుర్చీలు కూడా ఉండేవి కాదు. అప్పట్లో ఎన్నికల ఖర్చు బాగా తక్కువ అప్పట్లో ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా బాగా తక్కువగా ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రూ. 5–15 లక్షలలోపు ఉండేది. ఇప్పుడు రూ. 1–1.5 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. అప్పట్లో సిబ్బందికి ఇచ్చే టీఏ, డీఏలు కూడా బాగా తక్కువగా ఉండేది. ప్రలోభాలు లేవు ప్రస్తుతం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో డబ్బు, మద్యం పాత్ర చాలా తక్కువగా ఉండేది. డబ్బుల పంపిణీ, తరలింపు తదితర ఫిర్యాదులే వచ్చేవి కావు. గ్రామాల్లో కల్లు, అక్కడక్కడా గుడుంబా, సారా పంచుతున్నట్లు ఫిర్యాదులు వచ్చేవి. అప్పట్లో నాయకులు.. ఓట్లు వేయకుంటే మా పొలంలోంచి పశువులను వెళ్లనీయం. దారి మూసేస్తాం. టెనెన్సీ రద్దు చేయిస్తాం వంటి బెది రింపులకు పాల్పడేవాళ్లు. టెక్నాలజీ పెరగడంతో పని సులువు ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులకు పని బాగా తగ్గింది. అప్పట్లో ఏది అవసరం ఉన్నా టైప్మిషన్పై క్లర్కులు రేసే కాగితాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. రూట్ మ్యాప్లు కూడా గీసుకునే వాళ్లం. ఇప్పుడంతా కంప్యూటర్మయం. ప్రతి కార్యాలయంలో ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు అందుబాటులో ఉంటున్నాయని విశ్రాంత తహసీల్దార్ చిన్నయ్య ఎన్నికల నిర్వహణపై నాటి తన అనుభవాలను పంచుకున్నారు. -
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు
సాక్షి, వికారాబాద్/షాద్నగర్: ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరించి మంచి పేరుప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి రామకృష్ణారావుది షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల స్వగ్రామం. మర్రి చెన్నారెడ్డిది వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం సిరిపురం. జిల్లాల పునర్విభజనలో భాగంగా షాద్నగర్ రంగారెడ్డి జిల్లాలో కలిసింది. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో 1899లో నర్సింగ్రావు, రంగనాయకమ్మ దంపతులకు రామకృష్ణారావు జన్మించారు. 1948 అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆయన విద్యా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. వినోబాభావే చేపట్టిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు. 1952లో షాద్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత ఎల్ఎల్రెడ్డిపై 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ఉండటంతో తొలిముఖ్యమంత్రి పదవిని రామకృష్ణారావు అలంకరించారు. ఆయన తన హయాంలోనే రక్షిత కౌలుదారు(టెనెంట్) చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. అనంతరం 1956లో విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956–1960లో కేరళ, 1960–1962 ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1967 సెప్టెంబరు 14న ఆయన కన్నుమూశారు. బూర్గుల గ్రామంలో రామకృష్ణారావు స్మారక స్థూపాన్ని ప్రజలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ముద్ర వేసిన మర్రి.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి‘ పార్టీని ఏర్పాటు చేసి తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఈయన స్వగ్రామం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామం. మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు 1919 జనవరి 13 జన్మించారు. ప్రాథమిక విద్యను సిరిపురంలోనే పూర్తిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారంలో తన మేనమామ కొండా వెంకట రంగారెడ్డి వద్ద ఉంటూ ప్రాథమికోన్నత, వికారాబాద్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీసీ పూర్తి చేసి ఉస్మానియాలోనే డాక్టర్గా కొంతకాలం పనిచేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1952, 1957లో వికారాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తాండూరు నుంచి పోటీచేశారు. 1962,1967లో విజయం సాధించారు. అనంతరం 1978లో మేడ్చల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1978–79, 1989–90లో రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించారు. దీంతోపాటు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 27 ఏళ్ల పిన్నవయసులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేసి రికార్డు సృష్టించారు. తమిళనాడు గవర్నర్గా ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన తన మేనమామ మీద ఉన్న అభిమానంతో ఆయన పేరుమీదే కొండా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. -
గుస్సా రంగయ్య చాల్లే తగ్గయ్య !
సాక్షి, రంగారెడ్డి: ‘మల్లేశన్నా.. గిదేందే గిట్లయింది.. పాపం గా రమేసన్న నిన్నట్నుంచి శానా పరేశాన్గ ఉన్నడు’ ఎంకటేసు ఏడ్పు ముకం ఏస్కొని అంటుంటే.. నాకర్తం కాలె. ఏందే ఏమైంది పొద్దున పొద్దున్నే గీ ఏడ్సుడేంది.. సక్కగ సెప్పుమల్ల.. జరంత కసిరిన. ‘నువ్ గూడ గుస్సానె. గిట్ల గుస్సా అయ్యే గా రమేసన్న గిప్పుడు తల పట్టుకున్నడు’ అని అన్నడు. ‘సర్లే గా రమేసన్న కోపం ఎందుకయ్యిండో సెప్పు’ అనంగానె ‘గీ రమేసన్నకి పార్టీవోల్లు టికెట్ ఇవ్వలేద్ గదా.. గప్పట్నుంచి అన్న పార్టీ ఆపీసుకాడ అర్తాల్ జేస్తుండు. నాలాంటోళ్లు నల్గురు తమ్ముల్ని పోగేసి.. లొల్లి మీద లొల్లి చేసిండు’ టెన్సన్ పట్లేక అడ్డంపడి ‘గట్లనా.. ఏమైంది.. దెబ్బకి టికెట్ ఇచ్చేసిండ్రా’ అనడిగిన. ‘ఏం ఇచ్చేది.. చేతిలో చిప్ప! నీ ఇస్టం మల్ల గంత గుస్స అయితే నీ దారి నువ్ చూస్కో అనేసిండ్రంట.. పార్టీ పెద్దోల్లు. దీంతో అన్న అరె తమ్మీ నా పని ఖల్లాస్! గీ పెద్దోల్లు నెత్తిపై గుడ్డేసిండ్రని ఏడ్సుడే ఏడ్సుడు.’ ఎంకటేసం అంటుంటె నాకు నవ్వు ఆగలే. అసలు ఎందుకు నారాజ్ ఐతరు.. ‘అడిగేటోల్లుంటుండ్రని. మీకు దెల్వదు ఎవర్నయిన సతాయించాలంటె, గిట్ల కోపం వచ్చిందని మూతి బిగించి కూర్సొంటారు. అంటె ఎవరిపై కోపమైతమో ఆల్లు దగ్గర్కొచ్చి గడ్డం పట్కొని ‘ఏమైంది.. ఎందుకు కోపం’ అని అడగాలె. గప్పుడు గీల్లింక సురు చేస్తరు. నాకది కావాలె.. గిదెందుకు తేలె అని అనేటోల్లు కొందరయితే... గా దినం నన్నట్లంటివి.. అని పాత కతలు దీస్తరు.. సిన్నోల్ల లెక్క వేరు. పాపం ఆల్లు అంతా సూస్కొని గుస్సాలోకి దిగాలె. అందుకె ఇంటికి కొత్త సుట్టాలొచ్చినపుడే గిట్లాంటి పీట్లు చేస్తరు. కొత్తోల్ల ముందు తోకలిప్పిన గీల్లకి ఏం గాదు. గా పెద్దోల్లు గట్టిగ అర్వాలన్నా.. నాల్గు పీకాలన్నా.. యాడ ఇజ్జత్ పోతదోనని బయంతో సేతులు కట్టేస్కుని లోలోపల పండ్లు కొరుకుతూ ‘గీ సుట్టాల్ పోనీ బిడ్డా ! ఉంటాది నీకు ’అనుకోవాలంతె. అయితె అందర్కి గట్లా కల్సిరాదె. ఒక్కోసారి ఎంత కోపం వచ్చినా ఎవరూ లెక్కజేయరు. అంతెందుకు.. గిప్పుడు ఎలచ్చన్లోనె సూడుండ్రి. పాపం టికెట్ రాలేదని అలిగి రోడ్డెకిండ్రు అందరు. ఇంకొందరయితే ఎన్కాల జనాల్నేసుకుని రచ్చరచ్చ జేసిండ్రు. తొడల్గొట్టి సవాల్లు సేసిండ్రు. గది జూసి పార్టీ వాల్లు రెండ్రెండు టికెట్లు యాడికెల్లి పట్కువచ్చేది. సరె మీరె జర సముదాయించండి కొంతమందిని పంపిండ్రు. గయితె ఆల్లు ఎంత కిందామీద పడినా గుస్సా సార్లు తగ్గలె. గిట్ల గాదని..’ సర్లే ఇగ మీ యిస్టం..’ అని సేతులెత్తేసిండ్రు. గీల్లతో మహా అయితే ఐదారు వేల ఓట్లు పోతయ్.. పోనీ చేసుడేముంది అంటుండ్రంట. అంతేగాదు.. గీ ఓట్లుగూడ గుస్సా సార్లు సెప్పినోల్లకే ఏసేస్తరనేముంది? అని లేచెల్లిపోయిండ్రు. పాపం ఈల్లకింక పరేసాన్. అరె జర కోపం వచ్చిందని సెప్తే అయిదో పదో పైసలిచ్చో.. గెల్సినంక ఏదైనా పదవిస్తం అనకుండా.. గిట్ల జేస్తిరేంది సార్లు అని తలపట్టుకున్నరట. ఊర్కుండ్లేక ఉబ్బసాన్కి మందు తీస్కొనిండంటే గిదే మల్ల!! – రామదుర్గం మధుసూదనరావు -
మీ నేత గురించి తెలుసుకోండి ఇలా..
షాద్నగర్ టౌన్: ఎన్నికల సంగ్రామంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులు నియమావళి ప్రకారం నామినేషన్కు సంబంధించిన పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, వారిపై నమోదైన కేసులు, ఆదాయ మార్గాలు, విద్యార్హతల గురించిన వివరాలను తెలుసుకోవాలని ఆయా నియోజకవర్గ ఓటర్లకు కుతూహలంగా ఉంటుంది. ఒక్క క్లిక్తో అన్ని విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్లను అప్లోడ్ చేసింది. (ceotelangana.nic.in) అనే వెబ్సైట్లో అభ్యర్థుల అఫిడవిట్లను అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ ఎలక్షన్ 2018 ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే ఎన్నికల నియమ నిబంధనలు, నోటిఫికేషన్, ప్రభుత్వ ఉత్తర్వులు, అఫిడవిట్లు ఇలా రకరకాల వివిధ రకాల సమాచారం కనిపిస్తుంది. దానిలో అఫిడవిట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోగానే అందులో నామినేషన్ వేసిన అభ్యర్థుల అఫిడవిట్లు కనపిస్తాయి. అందులో అభ్యర్థికి సంబంధించిన సమగ్ర సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. అఫిడవిట్కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
364 నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 305 మంది అభ్యర్థులు 364 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వరుస కట్టారు. ఈ ఒక్కరోజే అత్యధికంగా 180 మంది అభ్యర్థులు 231 సెట్లను ఆర్ఓలకు అందజేశారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీగా జనసమీకరణ చేశారు. పోటాపోటీగా జనాలను తరలించి బలప్రదర్శన చేశారు. నామినేషన్ల దాఖలుతోనే తామేమిటో తెలియజేయాలనే తపన దాదాపు అందరిలోనూ కనిపించింది. కార్లు, బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. కళా బృందాలను సైతం రంగంలోకి దించాయి. శ్రేణులు భారీ జెండాలు చేతబట్టి ఉర్రూతలూగాయి. గ్రామాల నుంచి మొదలుకొని నియోజకవర్గ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు అక్కడక్కడా సభలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్యనాయకులు కూడా నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యధికంగా ఎల్బీనగర్లో.. ఎల్బీనగర్ నియోజకవర్గానికి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తం 58 మంది తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత స్థానంలో శేరిలింగంపల్లికి 49 దాఖలయ్యాయి. అతి స్వల్పంగా చేవెళ్ల స్థానానికి 25 నామినేషన్లు అందాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీగానే నేమినేషన్లు వేశారు. కాగా, మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. -
364 నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 305 మంది అభ్యర్థులు 364 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వరుస కట్టారు. ఈ ఒక్కరోజే అత్యధికంగా 180 మంది అభ్యర్థులు 231 సెట్లను ఆర్ఓలకు అందజేశారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీగా జనసమీకరణ చేశారు. పోటాపోటీగా జనాలను తరలించి బలప్రదర్శన చేశారు. నామినేషన్ల దాఖలుతోనే తామేమిటో తెలియజేయాలనే తపన దాదాపు అందరిలోనూ కనిపించింది. కార్లు, బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. కళా బృందాలను సైతం రంగంలోకి దించాయి. శ్రేణులు భారీ జెండాలు చేతబట్టి ఉర్రూతలూగాయి. గ్రామాల నుంచి మొదలుకొని నియోజకవర్గ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు అక్కడక్కడా సభలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్యనాయకులు కూడా నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యధికంగా ఎల్బీనగర్లో.. ఎల్బీనగర్ నియోజకవర్గానికి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తం 58 మంది తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత స్థానంలో శేరిలింగంపల్లికి 49 దాఖలయ్యాయి. అతి స్వల్పంగా చేవెళ్ల స్థానానికి 25 నామినేషన్లు అందాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీగానే నేమినేషన్లు వేశారు. కాగా, మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య చేవెళ్ల25, చివరి రోజు12 ,ఇబ్రహీంపట్నం 39, చివరి రోజు 25, షాద్నగర్ 32, చివరి రోజు 2 ,కల్వకుర్తి 30, చివరి రోజు14 , మహేశ్వరం 27, చివరి రోజు 20, రాజేంద్రనగర్ 45 , చివరి రోజు 23 -
కాంగ్రెస్లో ఇంటి‘పోరు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్కు ఇంటిపోరు మొదలైంది. తిరుగుబాటు అభ్యర్థుల వ్యవహారం పార్టీకి చికాకు కలిగిస్తోంది. సర్దుకుపోవాలని సముదాయించినా ఏకంగా బరిలో దిగి సవాల్ విసురుతుండడంతో ఆత్మరక్షణలో పడింది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు ఆశావహులు అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు. ఆరు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఈ నేతలు.. సమాజ్వాది, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తుండడం కాంగ్రెస్ను కలవరపరుస్తోంది. వీరి బలం గెలిచే స్థాయిలో లేకున్నా గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్కు చెమటలు పట్టిస్తోంది. తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, వికారాబాద్, శేరిలింగంపల్లి స్థానాల నుంచి ఇండిపెండెంట్లుగా బరిలో దిగిన అభ్యర్థులకు స్థానికంగా గట్టి పట్టుంది. వికారాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ ఎ.చంద్రశేఖర్ ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఘనత ఉంది. గత ఎన్నికల వేళ టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన ఈసారి టికెట్ లభిస్తుందని ఆశించారు. అయితే, టికెట్ను మాజీ మంత్రి ప్రసాద్కుమార్కు ఖరారు చేయడంతో చంద్రశేఖర్ అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని భావించిన ఆయన అభ్యర్థుల జాబితా వెల్లడించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధిష్టానం పెద్దలు కొప్పుల రాజు బుజ్జగించినా మెత్తబడని చంద్రశేఖర్.. స్వతంత్ర అభ్య ర్థిగా నామినేషన్ వేశారు. ప్రధాన పార్టీలకు దీటు గా ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టిన చంద్రశేఖర్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. తాడోపేడో తేల్చుకోవడానికి... ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్గా రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 2014లో ఇదే స్థానాన్ని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్కు లభించింది. దీంతో మహేశ్వరం స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించినా స్నేహపూర్వక పోటీగా పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బీ–ఫారంను కూడా అందజేసింది. దీంతో మహేశ్వరంలో తాను రంగంలోకి దిగి.. ఇబ్రహీంపట్నం నుంచి సోదరుడు రాంరెడ్డిని రెబల్గా బరిలోకి దించారు. అక్కడ.. ఇక్కడ రెండు స్థానాల్లోనూ మల్రెడ్డి బ్రదర్స్కు చుక్కెదురైంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో టికెట్ సంపాదించాలని సర్వశక్తులొడ్డిన మల్రెడ్డి.. మహాకూటమికి ఈ స్థానాన్ని కేటాయించడంతో కుంగిపోయారు. అయినా, వెనక్కి తగ్గకుండా పోటీచేయడం ద్వారా సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా బరిలో దిగే అవకాశముందని గమనించిన ఏఐసీసీ బుజ్జగింపుల కమిటీ మల్రెడ్డి రంగారెడ్డిని పిలిపించి మాట్లాడినా మెత్తబడకపోగా.. సోమవారం బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి సవాల్ విసిరారు. కొత్త కండువాతో శంకరన్న.. మాజీ మంత్రి శంకర్రావు కూడా పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. కంటోన్మెంట్ సీటును కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు కేటాయించిన అధిష్టానం.. షాద్నగర్ నుంచి తనకు లేదా తనయకు కేటాయించాలని పట్టుబట్టారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అభ్యర్థిత్వానికే పార్టీ నాయకత్వం పచ్చజెండా ఊపడంతో కినుక వహించిన శంకరన్న హస్తం పార్టీకి గుడ్బై చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరుక్షణమే సమాజ్వాదీ పార్టీ కండువాతో ప్రత్యక్షమయ్యారు. మాజీ శాసనసభ్యుడు కేఎస్ రత్నం చేరికతో టికెట్ రాకుండా పోయిందని ఆవేదన గురైన డీసీసీ మాజీ సారథి పడాల వెంకటస్వామి కూడా రెబల్గా బరిలో దిగారు. మూడు పర్యాయాలుగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా తనకు గాకుండా ఇతరులు కట్టబెట్టడాన్ని తప్పుబడుతున్న ఆయన పార్టీ నాయకత్వంపై నిరసనగళం వినిపిస్తున్నారు. కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా టీడీపీకి కట్టబెట్టిన శేరిలింగంపల్లిలోనూ తిరుగుబాటు తప్పడంలేదు. మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమేగాకుండా కూటమి అభ్యర్థిని చావు దెబ్బతీస్తానని శపథం చేస్తున్నారు. రాజేంద్రనగర్ సీటును కూడా టీడీపీ కేటాయించడంతో నిరాశకు గురైన మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్రెడ్డి పోటీచేయనున్నట్లు ప్రకటించినప్పటికీ బుజ్జగింపుల కమిటీ మాట్లాడడంతో శాంతించారు. అయితే, ఈ స్థానం నుంచి వేణుగౌడ్, ఒకరిద్దరు స్వతంత్రులుగా బరిలో దిగడం గమనార్హం. తాండూరు అభ్యర్థిత్వం కోసం ఢిల్లీ, హైదరాబాద్లోని కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేసి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీకి రాజీనామా చేయడమేగాకుండా ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. ఇదిలావుండగా, ఈయన ఈ నెల 25న తాండూరు ఎన్నికల ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. -
ఆద్యంతం.. ఆసక్తికరం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీం పట్నం రాజకీయం తొలి నుంచి ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. నామినేషన్ చివరి రోజు కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మహాకూటమి టికెట్ వ్యవహారం చివరి క్షణం వరకు ఉత్కంఠను తలపించింది. ఆఖరి వరకు కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్నానని ప్రకటించిన మల్రెడ్డి రంగారెడ్డి చివరిగా ‘ఏనుగు’ ఎక్కడంతో కథ సుఖాంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇబ్రహీంపట్నం రాజకీయం.. నామినేషన్ల ప్రక్రియ ముగిసేవరకు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సీట్ల సర్దుబాటులో టీడీపీకి కేటాయించిన ఈ సెగ్మెంట్కు ఆ పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని ఖరారు చేసింది. ఎల్బీనగర్ను ఆశించిన ఆయన ఇబ్రహీంపట్నం కట్టబెట్టడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో అలకబూనిన సామను అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సముదాయించడంతో మెత్తబడ్డారు. నిరీక్షించి.. నిట్టూర్పు విడిచి ఈ నేపథ్యంలో బీ–ఫారం తీసుకునేందుకు ట్రస్ట్ భవన్కు వెళ్లిన సామ రంగారెడ్డికి నిరాశే మిగిలింది. బీ–ఫారం ఇచ్చేముందు అందరూ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన నాయకత్వం సామకు బీ–ఫారం ఇవ్వకుండా నిరీక్షించేలా చేసింది. సాం కేతిక కారణాలను చూపుతూ పక్కనపెట్టడంతో ఇదేదో తేడాగా ఉందని గమనించిన సామ రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్లు టీటీడీపీ అధ్యక్షుడు రమణను కలిసి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. అయితే, టికెట్ కేటాయింపుపై సామ చేసిన వ్యాఖ్యలు బాధించాయని వాపోయిన రమణ.. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి సామకు బీ–ఫారం ఇచ్చి పంపారు. ఉదయమే పిడుగు.. బీ–ఫారం లభించడంతో ఊపిరి పీల్చుకున్న సామ రంగారెడ్డి సోమవారం నామినేషన్ వేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఈ మేరకు మహాకూటమి నేతలు, శ్రేణులంతా ఇబ్రహీంపట్నం తరలిరావాలని సూచించారు. అంతలోనే పిడుగులాంటి వార్త ఆయన చెవిలో పడింది. అదేమంటే కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డికి ఆ పార్టీ బీ–ఫారం అందజేసిందనే వార్త. దీన్ని రూఢీ చేసుకునేందుకు అనేక మార్గాల ద్వారా ప్రయత్నించినా ఫలించకపోవడంతో చేసేదేమీలేక ఆయన అనుకున్న సమయానికి నామినేషన్ వేశారు. సీన్ కట్ చేస్తే.. మొదట్నుంచి ఈ సీటును ఆశించిన మల్రెడ్డి రంగారెడ్డి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలను కొనసాగించారు. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించిన అభ్యర్థిగా సామ రంగారెడ్డిని ప్రకటించినప్పటికీ సామ నిరాసక్తత కారణంగా తిరిగి కాంగ్రెస్కు వదిలేస్తారని మల్రెడ్డి భావించారు. కాదు కూడదంటే స్నేహపూర్వక పోటీకి ఒప్పుకుంటారని, అందులో భాగంగా బీ–ఫారం దక్కుతుందని అంచనా వేశారు. కొందరు అగ్రనేతలు ఇచ్చిన భరోసాతో అట్టహాసంగా సోమవారం నామినేషన్ వేయాలని భావించారు. ఆయన అంచనాకు అనుగుణంగా పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రానికి తరలివచ్చాయి. మహాకూటమికి సీటు కేటాయించినా కాంగ్రెస్ బీఫారం తనకే వస్తుందని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లేవరకు ప్రకటించిన మల్రెడ్డి ఆఖరికి బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. కాగా, ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. మల్రెడ్డికే టికెట్ అని నమ్మించి చివరికి రాకపోవడంతో కార్యకర్తలు ఊసూరుమన్నారు. -
నేతల అడ్డా.. చేవెళ్ల గడ్డ
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నగరానికి ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రసిద్ధి గాంచింది. ఓటర్లలో చైతన్యంలోనూ, జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులను అందించడంలోనూ విశిష్టమైన గుర్తింపు పొందింది. ఒక నియోజకవర్గం నుంచి ఒక్కరో ఇద్దరో ఎమ్మెల్యేలు ఇతర నియోజకవర్గాలకు ఎన్నికవుతుండడం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. కానీ చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో సబితారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి మంత్రులుగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్సీలు పట్నం నరేందర్రెడ్డి, యాదవ్రెడ్డిలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వారే. చేవెళ్ల గడ్డ రాజకీయ నాయకుల అడ్డాగా ప్రత్యేకత చాటుకుంటోంది. సాక్షి, చెవెళ్ల : పట్లోళ్ల సబితారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెం దినవారు. ప్రస్తు తం మహేశ్వరం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. దివంగత మాజీ హోంమంత్రి పి. ఇంద్రారెడ్డి సతీమణి ఈమె. 2000 ఏప్రిల్ 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసురాలిగా అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. చేవెళ్ల నియోజకవర్గ చరిత్రలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి మొదటి సారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొంది వైఎస్సార్ మంత్రి వర్గంలో భూగర్భజలవనరుల శాఖమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలకు చేవెళ్ల రిజర్వు అయ్యింది. దీంతో ఈ నియోజకవర్గాన్ని తప్పని పరిస్థితులలో వదిపెట్టాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ సూచనమేరకు జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంనుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన మంత్రివర్గంలో దేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో పోటీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. పట్నం మహేందర్రెడ్డి స్వగ్రామం షాబాద్ మండలం గొల్లూరుగూడ. మేనమామ దివంగత ఇంద్రారెడ్డి ప్రోత్సాహంతో 1994లో టీడీపీ నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అనూహ్య రీతిలో గెలుపొందారు. ఆ తరువాత 1999లో వరుసగా రెండోసారి గెలిచారు. 2004లో ఓటమి చెందారు. తిరిగి 2009లో 2014లో విజయం సాధించారు. తెలంగా ణ రాష్ట్రంలో తొలి రవాణశాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాను శాసించే నాయకునిగా ఎదిగారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా, జిల్లా రాజకీయల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారవేత్త అయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామం శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామం. ఈయన సికింద్రాబాద్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత వ్యాపారవేత్తగా మారి బోర్వెల్స్ పరికరాలు తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించారు. స్నేహితుడిగా ఉన్న అప్పటి ఎమ్మెల్యే పి.ఇంద్రారెడ్డితో విభేదించి రాజకీయాలలో చేరారు. తెలుగుదేశం పార్టీనుంచి చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి 1999లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికలలో సబితారెడ్డిపై కూడా ఓటమిపాలయ్యారు. హైదరాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్సాఆర్ సూచనమేరకు మేడ్చల్ నియోజకవర్గంనుంచి 2009లో పోటీచేసి మొదటిసారిగా విజయం సాధించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కొరగాని సాయన్న రత్నం మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. 1995లో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజ ర్వు కావడంతో టీడీపీలోకి వచ్చారు. ఇంద్రారెడ్డి అనుచరుడిగా ఉండడంతో శంషాబాద్ జెడ్పీటీసీగా పోటీచేయించి జిల్లా పరిషత్ పదవిని కట్టబెట్టారు. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం చించల్పేట గ్రామానికి చెందిన వ్యక్తి కాలె యాదయ్య. స్థానిక సంస్థల్లో ఎంపీపీ. జెడ్పీటీసీ స్థాయినుంచి వచ్చిన ఆయన చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రత్నంపై గెలుపొంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పట్నం మహేందర్రెడ్డి స్వయాన సోదరుడు పట్నం నరేందర్రెడ్డి. ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి కొండగల్ ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు. 2010లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి మరోసారి అవకాశం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా కలిసిన కొండగల్లో కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ విధంగా ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ టికెట్ అశించినా టికెట్ రాక రెబల్గా పోటీ చేస్తున్న పీ. కార్తీక్రెడ్డి కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తియే. -
అమ్మ కోసం కార్తీక్రెడ్డి సీటు త్యాగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాడు కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ద మనస్సు చేసుకొని పోటీకి దూరమైన అమ్మ.. నేడు తల్లి బరిలోకి దిగేందుకు వీలుగా తన సీటును త్యాగం చేసిన కుమారుడు. ఇలా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్రెడ్డిలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లగా.. కార్తీక్కు చేవెళ్ల ఎంపీగా పోటీకి లైన్క్లియర్ చేసేందుకు సబిత తన మహేశ్వరం సీటును త్యాగం చేశారు. ఇప్పుడు మహేశ్వరం సెగ్మెంట్ను సబితకు కేటాయించగా.. కూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కార్తీక్కు సీటు త్యాగం తప్పలేదు. పాత కథ పునరావృతం 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన పట్లోళ్ల కార్తీక్రెడ్డి చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే మహేశ్వరం శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధనను కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తేవడంతో తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం మహేశ్వరం సిట్టింగ్ స్థానాన్ని త్యజించారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కార్తీక్కు లభించింది. ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కార్తీక్కు పరాభవం ఎదురైంది. దీంతో కొద్ధిరోజుల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సబిత.. ఈ సారి పాత స్థానమైన మహేశ్వరం నుంచి, కార్తీక్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ రెండు స్థానాల టికెట్లు తమకు ఖాయమని భావించారు. అయితే, అనూహ్యంగా ఈ సారి కూడా ‘ఫ్యామిలీకి ఒకే టికెట్’ షరతును వర్తింపజేయాలని హైకమాండ్ నిర్ణయించడంతో కార్తీక్ నీరుగారారు. అయితే, ఈ నిబంధన కార్యరూపం దాల్చదని చివరి నిమిషం వరకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నెరిపారు. సొంత పార్టీని ఒప్పించడానికి సతమతమవుతున్న ఆయనకు మిత్రపక్షం రూపంలో చుక్కెదురైంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని ఎగురేసుకుపోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో కుంగిపోయిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పడమేగాకుండా.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, మహేశ్వరంలో అమ్మ పోటీ చేస్తుండడంతో తన రాజీనామా ప్రభావం ఆమెపై పడకూడదని భావించారు. రాజీనామా నిర్ణయంపై వెనుకడుగువేశారు. దీంతో నాడు కార్తీక్ కోసం తల్లి సీటును త్యాగం చేయగా.. ఈ సారి తల్లి కోసం తనయుడు సీటును త్యజించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
అధికారమే ‘హస్తం’ లక్ష్యం
రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త‘గతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నేడు నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుండడంతో ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో పాటుగా ఛరిష్మా ఉన్న నేతలతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఈనెల 28న వికారాబాద్, తాండూరులో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ స్థాయిల్లోనే బహిరంగ సభలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎక్కువమందిని తరలించడంతోపాటు నాయ కులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటోంది. సోమవారం నామినేషన్లు ముగిసిన అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈనెల 23నుంచి రాష్ట్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సభలను ఏర్పాటుచేయాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల కేంద్రాల్లో 28న బహిరంగసభలను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించింది. 28న నిర్వహించే సభల్లో సోనియాగాంధీ పాల్గొంటారా.. లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే నెల 2 నుంచి రెండు, మూడు రోజులపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో ఆయన కొడంగల్, పరిగిలో సభలను ఏర్పాటు చేసేందుకు నేతలు చర్యలు తీసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్లో నిర్వహించే సభలో రాహుల్గాంధీ పాల్గొనే అవకాశం మెండుగా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈనెల 20 తరువాత రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రచారం నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రచారం ప్రక్రియ వచ్చే నెల 5న ముగిసేవరకు నిత్యం కొనసాగనుంది. విజయశాంతి ప్రచారం.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్గాంధీ తదితర ముఖ్యులు ప్రచారంలో పాల్గొనని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా మరికొంతమంది స్టార్డమ్ ఉన్న నేతలు, సినీ, సామాజిక రంగాల ప్రముఖులతో ప్రచారం నిర్వహించేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలకు కేవలం 20 రోజులే సమయం ఉన్నందువల్ల ప్రచారంలో దూకుడు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉండాలని అభ్యర్థులకు సూచిస్తోంది. అయితే, తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతోపాటు ఆయన వర్గంనేతలను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు. నారాయణరావు ఇండిపెండెంట్గా బరిలో ఉన్నా.. ఇతర సీనియర్ నాయకులు అభ్యర్థికి సహకరించకపోయినా గెలుపు కష్టమేననే సంకేతాలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చేరినట్లు నేతలు చెబుతున్నారు. -
మోదీ పాలన జనరంజకం
సాక్షి, కడ్తాల్: ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, ప్రజలంతా మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని రేషన్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఆచారికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాల పేరిట, ప్రజలను మభ్యపెట్టి అన్యాయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని దుయ్యబట్టారు. తన సోదరుడు దేశ ప్రధానిగా కొనసాగుతున్నా ఇప్పటికీ తాను రేషన్డీలర్గా ఉన్నానని తెలిపారు. దేశంలో రేషన్ డీలర్లకు కిలోకు 70 పైసలు కమీషన్ ఇస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 20పైసలే ఇస్తున్నారని, డీలర్లు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ప్రధాని రేషన్ డీలర్ల కమీషన్ను 70 పైసలకు పెంచారని గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఉద్యోగాలు కల్పించక, నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సేవకుడిగా పనిచేస్తా: ఆచారి 35 ఏళ్లుగా కల్వకుర్తి నియోజకవర్గ సమస్యలపై పోరాడుతునే ఉన్నానని, తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సేవకుడిగా పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి కోరారు. రోడ్షోలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అంటూ మాటలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. దేశంలో మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం ఆచారి సమక్షంలో ఎర్రోల శంకర్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిప్రసాద్, ఎంపీటీసీ వీరయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, నాయకులు రవీందర్రెడ్డి, ఆనంద్, డాక్టర్ రమేశ్ ఉన్నారు. -
నారాజ్ వద్దు నాయనా..
మూతిమీద గొట్టి.. మందులేసుడంటే గిదే! అగ్గల్లే అంటించిండ్రు.. గిప్పుడు దాన్ని ఆర్పుతామని నల్గురు మనుసుల్ని నీల్ల కుండలిచ్చి పంపిండ్రంట గా డిల్లీ కాంగ్రెస్ పెద్దోలు. గిదేమన్న పనికొచ్చె పనేనా? అరె బై ఊర్కే ఉండేటోల్ని గిచ్చుడేంది?. మల్లీ నొప్పిగుంద.. మంటగుంద అంటూ అడుగుడేంది? బేకార్ కాకపోతె. నిన్న మొన్నటి దాక టికెటొస్తది.. నీకే వస్తదని మస్తు ఆసబెట్టిండ్రు. గిప్పుడేమో సేతులెత్తి.. సారీ.. గీసారి నీకు ఇస్తలేం! అంటే గా ఆశావహ సారు ఏం గావాలె? టికెట్ కోసం గాంది బవన్ కాడ.. డిల్లీలో పార్టీ ఆపీసు కాడ గూర్కా లెక్క గస్తీల్గాస్తె.. సివారకర్కి తియ్యలేక పోతె ఇంట్లో ఊర్లో.. ఇజ్జత్ ఉంటదా మల్ల. నెత్తిపై తువ్వాలేస్కొని నల్గురికి ముకం సూపలేక దిరగాలంటె ఎంత నామోషీ. సాక్షి, రంగారెడ్డి: కాంగ్రెసోల్లు తెలుగు తమ్ముల్లతో గాల్లతో గీల్లతో జట్టు కట్టి కూటమి అంటూ కొత్త కొట్టుపెట్టిండ్రు గాదె. గప్పట్నుంచి గీల్ల లెక్కలన్ని దప్పుతున్నయ్. అసలు ఎవరికైన గాని ఆసపెట్టుడే బడా గలత్. కొందరు ఇండ్లల్ల చిన్నపిల్లల్కి నీకు గది కొనిస్త గిది కొనిస్త అంటూ ఊరిస్తరు. పాపం గీ పిలగాల్లు ఎప్పుడు మల్ల.. ఎప్పుడు మల్ల అంటూ సతయిస్తుంటరు. లాస్ట్కి ఇప్పుడు గాదులె మల్లీ.. అనగానె గా పిల్లలు తుస్సుమంటరు. కొందరు పిల్లల్ది గీ లెక్కగాదు. మాటిచ్చినంక కొన్లేదంటె నరకం సూపిస్తరు. గట్లాంటోల్ల విసయంలో జర జాగ్రత్తగ ఉండాలె. మా తమ్ముడి కొడుకున్నడు. గాడు గిదే బాపత్. ఏదైన కొనిస్త అంటె.. పక్కానా అని అడుగుతడు. పొరపాట్న మాటిచ్చినం అంటె ఇంగ సచ్చినట్లే. తగుల్కుంటే తలపట్టుకోవాలె. నువ్ గది కొనిచ్చేదంక గంట గంటకి అడుగుతునే ఉంటడు. అరె నేం కొనిస్తా బిడ్డా! జర ఆగరాదె.. అన్నా ఆడు వదలడు. ఎప్పుడో చెప్పు అంటునే ఉంటడు. గీ బాద పడ్లేక ‘రారా బై కొనిస్త గాని.. సావగొడ్తున్నవ్’ అని తీసుకెల్లాల్సిందె. గందుకే మా తమ్మినింటికెవరైనా వచ్చినపుడు అరె నీకేం గావాల్నో చెప్పు.. అంటె సాలు...‘మీకు తెల్వదు గమ్మునుండండి. కొనిస్తమంటె గాడు వదలిపెట్టడు అంటూ అడ్డంపడ్తుంటడు. నిజం చెప్పాలంటె గిట్లనే ఉండాలె. ఎవరైనా మాట ఇస్తె ఎంట పడుడే. గప్పుడు గాని ఆల్లు ఎనకాముందు చూస్కోక మాటివ్వరు. గీ ఆశావహుల కతలూ పిల్లల్లెక్కె. ఇంట్లో కూసున్నోల్లకి ఆశపెట్టి.. డబ్బులు కర్చు పెట్టించి.. గిప్పుడు లేద్లేదు అంటె గాళ్లు అల్లాడుతుండ్రు. గిదేంది సార్ మొన్ననే ఇస్తమంట్రి కదా అంటే మాట్లాడకుండ తప్పించుకుంటుండ్రు. లిస్ట్ల పేరు లేదని దెల్సినప్పుడే అగ్గిమీద గుగ్గిలం అయిండ్రు. కొందరు పార్టీ ఆపీస్ల ఆగమాగం చేసిండ్రు. ఇంకొందరు సొంత దుకానం పెట్టుకుంటం అంటూ రెబల్గా బరిలో దిగుతుండ్రు. కొందరు పేరున్నోల్ల లీడర్లకే టికెట్లు గల్లంతయినయ్. ఆల్లు గిప్పుడు ఊర్కున్నట్లు కన్పించినా...ముందు ముందు గేం లొల్లి పెడ్తారో అని డిల్లీ పెద్దలనుకుంటుండ్రు. పాపం గీ పొత్తులని వచ్చిన కోదండరాం సారు కత మరీ దీనం. జనగామ నుంచి జగడం చేస్త అంటున్నా.. అయ్యో మా రాహుల్ దొర చెప్పిండ్రు మీరు గా సీటు పొన్నాల కోసం త్యాగం జెయాలె అన్నంక.. గా సారు మాత్రం ఏం జేస్తడు? చిక్కిందే శివప్రసాదమనుకుండు. గానీ పాతోల్లు గట్ల కాదె. కాంగ్రెస్ల గీ తిరుగుబాటు పోతురాజులు దగ్గరదగ్గర ఇరవై మంది దాకా తేలిండ్రు. గాల్లు గట్ల గిట్ల కాదు. పోటీలో ఉన్నోల్లకి అగ్గిపెడ్తరు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతేనేం నేనే పోటీ జేస్తనంటుండు విజయరామారావు సారు. గీపోట్లు టీఆర్ఎస్లోనూ ఉన్నయ్. ఖమ్మం అశ్వారావుపేట మరికొన్నిట్ల టీఆర్ఎస్ తిరుగు జెండాలు కనిపిస్తున్నయ్! సిటీలో ముషీరాబాద్ టికెట్ లొల్లి గట్లనే ఉంది. కాంగ్రెస్ డిల్లీ పెద్దలు గిది గమనించె ఏకంగా బుజ్జగింపు కమిటీ ఏసిండ్రు. ఆల్లు వచ్చి ఈల్లని సముదాయించి ఏ లొల్లి జరక్కుండ చూసుకెవాలె! గిదయ్యే పనేనా అంటె ...ఏమో చూడాలె! – రామదుర్గం మధుసూదనరావు -
ఎన్నికల హోరు.. ‘బిర్యానీ’ జోరు
సాక్షి, రాజేంద్రగనర్: నియోజకవర్గ పరిధిలోని హోటళ్లలో తినేందుకు బిర్యానీ లభించడం లేదు. ఎన్నికల నేపథ్యంలో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో బిర్యానీ కొరత నెలకొంటోంది. సాధారణ రోజుల్లో రాత్రి వరకు లభించే బిర్యానీ ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చినా దొరకడంలేదు. హైదర్గూడ, అత్తాపూర్, ఆరాంఘర్ చౌరస్తా, దుర్గానగర్, శంషాబాద్, నార్సింగి తదితర ప్రాంతాల్లోని ప్రధాన హోటళ్లు బిర్యానీకి పెట్టింది పేరు. ఈ ప్రాంతాలలోని హోటళ్లలో బిర్యానీ తినేందుకు స్థానిక ప్రాంత వాసులతో పాటు ప్రయాణికులు, వాహనాదారులు ఆసక్తి చూపుతారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ హోటళ్లల్లో బిర్యానీ అమ్మకాలు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీ అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. తమ తమ అనుచరులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో బిర్యానీలను భోజనంగా అందజేస్తున్నారు. దీంతో బిర్యానీలకు కొరత ఏర్పడింది. ఇదేమని అడిగితే ఎన్నికల సీజన్ కదా.. అని యజమానులు అంటున్నారు. -
కొత్త, పాతల ‘పోరు’!
ప్రస్తుత ఎన్నికల్లో పోటీ కొత్త, పాత నేతల మధ్య కొనసాగుతోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం జూనియర్లు .. సీనియర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. పలు సార్లు ఎమ్మెల్యేలుగా కొనసాగి ప్రస్తుతం పోటీలో ఉన్నవారు కొత్త నేతలతో పోటీ పడుతున్నారు. ఏకంగా టీఆర్ఎస్ మూడు చోట్ల కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదే సమయంలో వికారాబాద్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఏడో సారి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో నాలుగు సార్లు గెలువగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు.తాండూరు నుంచి పోటీ చేస్తున్న పట్నం మహేందర్రెడ్డి ఆరోసారి పోటీ చేస్తుండగా గతంలో నాలుగు సార్లు విజయం సాధించి ఒక సారి ఓడారు. షాద్నగర్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న శంకర్రావు ఐదో సారి పోటీ చేస్తుండగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఇక మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్న సబితారెడ్డి ప్రస్తుతం నాల్గో సారి పోటీ చేస్తుండగా గతంలో చేవెళ్ల నుంచి రెండు సార్లు, మహేశ్వరం నుంచి ఒక సారి విజయం సాధించారు. ఇక కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి ప్రస్తుతం మూడో సారి పోటీ చేస్తుండగా గతంలో రెండు సార్లు విజయం సాధించారు. సాక్షి, పరిగి: టీఆర్ఎస్ ఈ సారి మూడు చోట్ల కొత్త వారికి టికెట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోనే హాట్ టాపిక్గా మారిన కొడంగల్లో రేవంత్రెడ్డిపై పోటీకి పట్నం నరేందర్రెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. హేమాహేమీలైన ఇద్దరు మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్కుమార్, ఎ. చంద్రశేఖర్రావు పోటీలో ఉన్నా వికారాబాద్లోనూ టీఆర్ఎస్ కొత్త వ్యక్తి సబితానంద్కు టికెట్ కేటాయించింది. ఇదే సమయంలో పరిగిలోనూ టీఆర్ఎస్ కొత్త వ్యక్తికే టికెట్ కేటాయించటం గమనార్హం మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి తనయుడు కొప్పుల మహేశ్రెడ్డిని పరిగి నుంచి టీఆర్ఎస్ బరిలో దింపింది. చంద్రశేఖర్ ఏడోసారి పోటీ.. వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ పోటీ పడుతున్నారు. ఇతను నాల్గో సారి పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు గెలవగా ఒక సారి ఓటమిపాలయ్యారు. మరో మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్రావు ప్రస్తుతం ఇండిపెండెంట్గా 7వ సారి పోటీ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ తరపున కొత్త వ్యక్తి ఆనంద్ మొదటి సారిగా పోటీ చేస్తున్నారు. మహేందర్రెడ్డి ఆరోసారి.. తాండూరు నియోజకవర్గం నుంచి మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రస్తుతం ఆరో సారి పోటీ చేస్తున్నారు. గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఓసారి ఓడారు. కాంగ్రెస్ నుంచి చేస్తున్న పైలెట్ రోహిత్రెడ్డి రెండో సారి పోటీ చేస్తుండగా గతంలో ఓ సారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పటేల్ రవిశంకర్ మొదటి సారి పోటీ చేస్తున్నారు. వంశీచంద్రెడ్డి రెండోసారి.. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున వంశీచంద్రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న జైపాల్ యాదవ్ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఐదో సారి బరిలో దిగుతున్నారు. ఇక బీజేపీ తరపున ఐదో సారి ఆచారి పోటీ చేస్తుండగా ఆయన ఇంకా గెలుపు రుచి చేడలేదు. గత ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్ల తోడాతో ఓటమిపాలయ్యారు. సబితారెడ్డినాలుగో సారి.. మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరçఫున మాజీ మంత్రి సబితారెడ్డి నాల్గో సారి పోటీ చేస్తున్నారు. గతంలో చేవెళ్ల, మహేశ్వరం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మూడో సారి పోటీ చేస్తుండగా గతంలో ఒక సారి ఓడి, ఒక సారి గెలుపొందారు. హైదరాబాద్ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్రెడ్డి మూడో సారి పోటీ చేస్తున్నారు. గతంలో ఒక సారి ఓడి ఒక సారి గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ తరపున కొత్త వ్యక్తి కొప్పుల మహేశ్రెడ్డి పోటీ చేస్తున్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అతను మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి టికెట్ ఖరారు కానప్పటికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు పోటీ చేసే అవకాశం ఉంది. అతను గతంలో ఓసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రశాశ్గౌడ్, రేవంత్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, మంచిరెడ్డి మూడో పర్యాయం.. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో పోటీ చేసిన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం హ్యాట్రిక్పై కన్నేశారు. ఇక కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించగా ఆ పార్టీ కొత్త వ్యక్తి గణేశ్గుప్త పేరు ఖరారు చేసింది. అయితే కాంగ్రెస్ తరపున కార్తీక్రెడ్డి గట్టిగా టికెట్ కోసం పట్టుబట్టడంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు రంగంలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా మొదటి సారి పోటీ చేస్తున్నవారే. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మూడో సారి పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా మొదటి సారి పోటీ చేస్తున్నారు. షాద్నగర్ నుంచి కాంగ్రెస్ తరపున ప్రతాప్రెడ్డి మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి గెలిచి ఒక సారి ఓడారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అంజయ్య యాదవ్ సైతం మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా గతంలో ఒక సారి ఓడి ఒకసారి గెలుపొందారు. ఆ స్థానం నుంచి ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్రావు ప్రస్తుతం ఐదోసారి పోటీ చేస్తుండగా గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉంది. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి కేఎస్ రత్నం మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో పోటీ చేసిన రెండు పర్యాయాల్లో ఒక సారి గెలుపొంది మరోసారి ఓటమి పాలయ్యారు. అతనికి గతంలో జెడ్పీ చైర్మన్గా పని చేసిన అనుభవం ఉంది. ఇక టీఆర్ఎస్ తరపున మాజి ఎమ్మెల్యే కాలే యాదయ్య బరిలో ఉన్నారు. ఇతను రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రస్తుతం మూడో సారి పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక కూటమి తరపున సామ రంగారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, రెండు సార్లు ఓడారు. గతంలో ఓ సారి పోటీ చేసి ఓడిన క్యామా మల్లేష్లు కాంగ్రెస్ రెబల్గా పోటీ చేస్తున్నారు. -
పట్నంలో హై‘డ్రామా’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం టికెట్పై ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. చివరి నిమిషంలో టీడీపీ నేత సామ రంగారెడ్డి బీ–ఫారానికి నోచుకోకపోవడం సస్పెన్స్ని తలపిస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి దక్కడం.. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పట్నం నుంచి పోటీ చేస్తానని సామ పేర్కొన్నారు. అయితే ఆదివారం ఎన్టీఆర్ భవన్లో బీ–ఫారాల అందజేత కార్యక్రమానికి హాజరైన సామ రంగారెడ్డికి చుక్కెదురైంది. పార్టీ బీ–ఫారం ఇవ్వకపోవడంతో ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అక్కడే ఉన్నసామ రంగారెడ్డి చివరకు ఖాళీచేతులతో వెనుదిరిగారు. రాజేంద్రనగర్ టీడీపీ అభ్యర్థి గణేష్గుప్తాకు పార్టీ బీఫాం అందజేసింది. బీ–ఫారాలు అందుకున్న 12 మంది నేతలతో ఆ పార్టీ ప్రతిజ్ఞ చేయించింది. ప్రతిజ్ఞ చేసిన వారిలో సామ సైతం ఉన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు బీ–ఫారం అందజేయలేదని.. ఆయన సన్నిహితులు చెబుతున్నా వ్యూహాత్మకంగానే పక్కన బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క టీడీపీ సీనియర్ నేత, స్థానికుడు రొక్కం భీంరెడ్డి సైతం ఈ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆయన అమరావతికి వెళ్లి బాబుని కలిశారు. 37 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఇబ్రహీంపట్నం సీటును తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం. అంతేగాక ఇబ్రహీంపట్నం స్థానానికి సామ రంగారెడ్డి పేరు ఖరారు చేయడంపై కాంగ్రెస్ కాస్త విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయన స్థానికేతరుడని, ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదని భావిస్తోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో సామ గెలుపు అంత సులువుకాదనే పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీంతో ఈ స్థానం తమకే కావాలని టీడీపీ అధిష్టానంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈ స్థానంపై కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఆశలు వదులుకోకపోవడం మరింత బాలాన్ని చేకూర్చుతోంది. పార్టీ తనకే బీ–ఫారం ఇస్తుందని ధీమా వ్యక్తం చేయడంతోపాటు సోమవారం నామినేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది -
రేవంత్ రోడ్షో
కడ్తాల్(కల్వకుర్తి): కడ్తాల్ మండల కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్రెడ్డి శనివారం రోడ్షో నిర్వహించారు. కాంగ్రెస్, మహకూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైసిగండి, కర్కల్పహడ్, ఎక్వాయిపల్లి గేట్, వాస్దేవ్పూర్ గేట్ల వద్ద కార్యకర్లు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కడ్తాల్ మండల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డితో కలిసి పూలమాల వేశారు. కాగా, రేవంత్రెడ్డి రోడ్ షోలో తలకొండపల్లి సింగిల్విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, రేవంత్మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్అలీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చారకొండ వెంకటేశ్, సూదిని రాంరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీక్యానాయక్, ప్రచార కార్యదర్శి లక్ష్మీ నర్సింహారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఎంపీటీసీలు చేగూరి వెంకటేశ్, లక్ష్మయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
గులాబీ గెలుపే లక్ష్యంగా
జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మంత్రి మహేందర్రెడ్డి.. 6వ సారి గెలుపే లక్ష్యంగా తాండూరులో ప్రచారం చేస్తున్నారు. 24 ఏళ్లుగా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. పదవులు, కుర్చీలు శాశ్వతం కాదని, పేరు, ప్రఖ్యాతలే శాశ్వతమనే సిద్ధాంతాన్ని నమ్మి.. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి చేరువయ్యారు. నియోజవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఈయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సాక్షి, తాండూరు: మూడు దశాబ్దాల పాటు మహరాజుల కంచుకోటగా ఉన్న తాండూరులో 1994 నుంచి పట్నం మహేందర్రెడ్డి పాగా వేశారు. అంతకు ముందు రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న మహరాజుల రాజధానిఈ నియోజకవర్గం. కొమ్ములు తిరిగిన నేతలు సైతం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సాహసించలేదు. తొలిసారిగా ఓ 27 ఏళ్ల యువకుడు టీడీపీ తరఫున తాండూరులో బరిలో నిలిచారు. అనూహ్య రీతిలో మహరాజులను ఓడించి విజయ దుందుబి మోగించారు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి గెలుపొందారు. 2004లో మహానేత వైఎస్సార్ అనుకూల పవనాలు వీయడంతో ఓటమి పాలయ్యారు. అయినా 5 ఏళ్ల పాటు తాండూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. 2009లో తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరోసారి విజయం సాధించారు. సీఎం కేసీఆర్ కేబినెట్లో రవాణాశాఖ మంత్రిగా సేవలందించారు. కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి తాండూరును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా మహేందర్రెడ్డి జనాదరణ ముందు తలవంచాల్సిందేననేలా దూసుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లా బాధ్యతలు.. తాండూరులో నిర్విరామంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆపద్ధర్మ మంత్రి మహేందర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డిని ఓడించేందుకు మంత్రి హరీశ్రావు నాయకత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్కు కానుక ఇస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. -
కష్టాల్లో కమలం
జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ పరిస్థితి రోజురోజుకు మసకబారుతోంది. ఒంటరి పోరాటంతో అధికారంలోకి రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా శ్రేణులకు దిశానిర్దేశం చేయడం బాగానే ఉన్నప్పటికీ.. పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. రెండున్నర నెలల క్రితం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, మహాకూటమి గెలుపుగుర్రాలను ఇటీవలే వెల్లడించారు. బీజేపీ మాత్రం మొదటి జాబితాలో తాండూరు, రెండో జాబితాలో కొడంగల్ స్థానానికి అభ్యర్థినిప్రకటించింది. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా ఇప్పటివరకు వికారాబాద్, పరిగి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. సాక్షి, వికారాబాద్: జిల్లాలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు కరణం ప్రహ్లాద్రావు మనస్తాపంతో శుక్రవారం కంటతడి పెట్టారు. కుల్కచర్లకు చెందిన ఈయనకు ఇతర పార్టీల నుంచి ఎన్నోసార్లు ఆహ్వానాలు వచ్చినా సొంతగూటిని వీడలేదు. పార్టీ బలోపేతానికి ప్రహ్లాద్ చేస్తున్న కృషి కారణంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఈ క్రమంలో పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపారు. ఎవరూ పోటీ కూడా లేకపోవడంతో టికెట్ దాదాపు ఖరారైనట్లేనని భావించారు. కానీ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు. మరికొంత మంది మండల బాధ్యులు పదవులు త్యజించారు. అనుచరులు, కార్యకర్తలు సైతం వీరి నిర్ణయాన్ని సమ్మతించారు. తిరుగుబాటు కొడంగల్: కొడంగల్ బీజేపీ అభ్యర్థి నాగూరావ్ నామాజీపై అదే పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు తిరుగుబాటు ప్రకటించారు. తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలో సమావేశమై నాగూరావ్ తీరుపై నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు. పార్టీ సంప్రదాయాలు, సిద్ధాంతాలను పాటించని వ్యక్తికి టికెట్ రావడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు కరెంటు రాములు, విజయవర్ధన్, రామూనాయక్, బంటు రమేష్, ఆవుల ఓంప్రకాశ్, దుబ్బాస్ కిష్టయ్య తదితరులు ఉన్నారు. తాండూరులో పరిస్థితి అధ్వానం... తాండూరులోనే కాస్తంత ఆశలు పెట్టుకున్న బీజేపీ అధిష్టానానికి ఇటీవల నెలకొన్న పరిణామాలు మింగుడు పడటం లేదు. మెజార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఎన్ఆర్ఐ రవిశంకర్ పటేల్కు టికెట్ కేటాయించడంతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడారు. ఏళ్ల తరబడి సేవలందించిన తాండూరు సెగ్మెంట్ ఇన్చార్జి రమేష్కుమార్ సైతం కమలాన్ని వీడి గులాబీ గూటికి చేరారు. ఈయతో పాటు వందల మంది కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. బీజేపీ అభ్యర్థి రవిశంకర్ పటేల్ ఒంటెత్తు పోకడలతో పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొదటి విడతలోనే టికెట్ దక్కించుకున్న రవిశంకర్ మాత్రం ఇప్పటికీ ప్రచారాన్ని వేగవంతం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలతోపాటు పార్టీ శ్రేణుల నుంచి సైతం స్పందన కరువైంది. కొడంగల్లో స్థానికేతర అభ్యర్థి... కొడంగల్ నియోజకవర్గం నుంచి నారాయణపేటకు చెందిన నాగూరావు నామోజీకి టికెట్ కేటాయించారు. ఇక్కడి నుంచి పోటీకి స్థానికులెవరూ ఆసక్తి చూపకపోవడంతో స్థానికేతరుడికి టికెట్ కేటాయించింది. ఈయన నామినేషన్ వేసిన సమయంలోనూ వేళ్లమీద లెక్కించేత మంది నాయకులు, కార్యకర్తలే రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి రేవంత్రెడ్డి, టీఆర్ఎస్ నుంచి నరేందర్రెడ్డి బలమైన అభ్యర్థులుగా బరిలో ఉండటంతో బీజేపీ నామమాత్రమే కానుంది. వికారాబాద్, పరిగి టికెట్లు ఇంకెప్పుడో... వికారాబాద్, పరిగి సెగ్మెంట్ల నుంచి బీజేపీ అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించలేదు. నామినేషన్కు కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పరిగికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ కుమారునికి టికెట్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండగా.. వికారాబాద్ అభ్యర్థి ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
ఒకే మైదానం కోసం ఇద్దరు సీఎంలు దరఖాస్తు?
తాండూరు టౌన్: జిల్లా ప్రజలు ఒకే రోజు ఇద్దరు సీఎంలను చూడనున్నారా..? అనే చర్చ ప్రస్తుతం తాండూరులో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల సందర్భంగా ఈ నెల 25న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తాండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇదే రోజున బీజేపీ నేతలు సైతం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సభ నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులకు సంబంధించిన సభలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే నిర్వహించేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆదిత్యనాథ్ సభ కోసం ఈ నెల 16న బీజేపీ నాయకులు కళాశాల ప్రిన్సిపల్ నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే రోజున కేసీఆర్ బహిరంగ సభను సైతం ఈ మైదానంలోనే నిర్వహించేందుకు టీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. తాము కూడా 25న సభ కోసం మైదానం కావాలని ప్రిన్సిపల్ వద్ద అనుమతి తీసుకున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇరువురు సీఎంల సభలను ఒకే రోజు.. ఒకే గ్రౌండ్లో ఎలా నిర్వహిస్తారనే విషయంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇద్దరు సీఎంల సభలకు భద్రతాపరమైన అనుమతులు లభిస్తాయో..? లేదో..? అనే వివరాలు తేలాల్సి ఉంది. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ఒక పార్టీకి చెందిన సమావేశాన్ని మరో మైదానానికి తరలిస్తారని భావిస్తున్నారు. -
నెరవేరని ఆకాంక్ష
మినీ స్టేడియం ప్రారంభం, డిగ్రీ కాలేజీ నిర్మాణం ఇక్కడి ప్రజలకు కలగానే మారుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థులు, క్రీడాకారుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్లుగా ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇవ్వడం, అనంతరం పాలకులు పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో విద్యార్థులు, క్రీడాకారులకు ఇబ్బందులు షరామామూలుగానే మారుతున్నాయి. సాక్షి, షాద్నగర్ రూరల్: షాద్నగర్ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల అభివృద్ధి కోసం 1994 సెప్టెంబర్ 22న అప్పటి ప్రభుత్వంలోని యువజన క్రీడల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్రావు శంకుస్థాపన చేశారు. పాతికేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఎట్టకేలకు సుమారు నాలుగేళ్ల క్రితం నిర్మాణం పూర్తయింది. అయినా, నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారే తప్పా సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయడం లేదు. పాలకులు మినీ స్టేడియం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మినీ స్టేడియంలో నిర్మించిన భవనం ప్రారంభం కాకముందే శిథిలావస్ధకు చేరుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు శిక్షణ తీసుకునేందుకు, తమ ప్రతిభను వెలికితీసేందుకు సరైన వేదిక లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు మినీ స్టేడియాన్ని ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. నత్త నడకన నిర్మాణం పట్టణంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం నేటికి కొనసాగుతూ నత్త నడకను తలపిస్తోంది. సుమారు ఆరేళ్ల క్రితం ప్రారంభమైన పనులు నేటికీ పూర్తి కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే డిగ్రీ కళాశాలను కొనసాగిస్తున్నారు. ఉదయం జూనియర్ కళాశాల, మధ్యాç ßæ్నం సమయంలో డిగ్రీ కళాశాలను కొనసాగిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు. } కళాశాలకు హాజరయ్యేందుకు సమయానికి బస్సుల సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విద్యతోనే అభివృద్ది సాధ్యమని చెపుతున్న పాలకులు, అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డిగ్రీ కళాశాల భవ న నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యా ర్థులు డిమాండ్ చేస్తున్నారు ఈ పల్లెలు.. ఒకప్పటి నియోజకవర్గ కేంద్రాలు గతంలో షాబాద్, మద్దూరు నియోజకవర్గాలు షాబాద్(చేవెళ్ల): నిజాం కాలంలో ఇప్పటి షాబాద్ నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతుండేది. 1949లో షాబాద్ నియోజకవర్గంగా అవతరించింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కొండా వెంకటరంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత 1954లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కొండా వెంకట రంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి రామారావు చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 1962లో చేవెళ్ల నియోజకవర్గం ఏర్పడింది. షాబాద్ మండలాన్ని చేవెళ్ల నియోజకవర్గంలో కలిపారు. 1972లో తిరిగి షాబాద్ మండలాన్ని చేవెళ్ల నియోజకవర్గం నుంచి విడదీసి పరిగి నియోజకవర్గంలో కలిపారు. అప్పట్లో పరిగి నుంచి ఒకసారి కమతం రాంరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత అహ్మద్ షరీఫ్ ఒకసారి, కొప్పుల హరీశ్వర్రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో షాబాద్ మండలాన్ని తిరిగి చేవెళ్ల నియోజకవర్గంలో కలిపారు. అయితే, నాటి నుంచి నేటి వరకు షాబాద్ మండలం అభ్యర్థుల గెలుపుఓటముల విషయంలో కీలకంగా మారింది. అప్పటి మద్దూరు.. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.. ప్రస్తుత వికారాబాద్లో కొనసాగుతున్న మద్దూరు మండలం నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1962 సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలో మూడు రెవెన్యూ సమితిలు ఉండేవి. మద్దూరు, కోయిలకొండ, ధన్వాడ. ఈ మూడు రెవెన్యూ సమితిలను కలిపి జనాభా ప్రతిపాదికన మద్దూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేసి ఎస్సీకి రిజర్వ్డ్ చేశారు. అనంతరం మద్దూరు రెవెన్యూ సమితితో పాటు కొడంగల్ రెవెన్యూ సమితిని కలిపి కొడంగల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. అయితే, మద్దూరు రెవెన్యూ సమితిలో ప్రస్తుత మద్దూరు, కోస్గి, దామరగిద్ద మండలాలు ఉండేవి. 1962లో జరిగిన ఎన్నికల్లో నారాయణపేటకు చెందిన ఈ.బసప్ప(కాంగ్రెస్) స్వతంత్ర అభ్యర్థి నర్సింగ్రావుపై గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో మద్దూరు, కోస్గిని కొడంగల్లో కలిపారు. దామరగిద్ద సమితి నారాయణపేట నియోజకవర్గంలో కలిసింది. ఇక జిల్లాల ఏర్పాటు సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి మహబూబ్నగర్ జిల్లాలో కలిపేశారు. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో చేర్చారు. ఈ పల్లెలు.. ఒకప్పటి నియోజకవర్గ కేంద్రాలు పాలకులు పట్టించుకోవాలి పట్టణంలో మినీ స్టేడియం పనులు పూర్తయినా ప్రారంభించడం లేదు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రాంతంలో క్రీడాకార్లుల్లో మంచి ప్రతిభ ఉంది. దానిని గుర్తించి వెలికితీయాల్సిన అవసరం ఉంది. – స్వాములు, పీఈటీ, షాద్నగర్ హామీలు నెరవేర్చాలి ప్రతి ఎన్నికల్లో డిగ్రీ కాలేజీ, మినీ స్టేడియం విషయంలో నేతలు హామీలు ఇస్తున్నారే తప్పా తర్వాత పట్టించుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సర్కారు వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలి. ప్రస్తుతం విద్యార్థులు, యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – టీజీ శ్రీనివాస్, వొకేషనల్ కళాశాల అధ్యాపకుడు, షాద్నగర్ -
ప్రచారం గావాలె.. పైసల్ దీయాలె !
దునియాల గొప్పోల్లు కావాలంటె.. పని చేసుడొకటే గాదు తమ్మీ.. దాన్ని బాగా ప్రచారం చేసుకోవాలె. పీఎం అయినా.. సీఎం అయి¯నా సరిగా ప్రచారం లేకుంటె మూల కూర్సునుడే! అరె ఈల్లేందిర బై గాదేవుల్లకే ప్రచారం చేస్కోక తప్పలేదు. గా విస్నుమూర్తి.. చక్రం తిప్పిండని.. గా రాముడు విల్లు విరిసిండని.. గవేవో కతల్ కతల్గ సెబుతూ.. పురానాలని జనాల్లోకి వదిలిండ్రు. గిది ప్రచారం గాదె. మార్కెట్ల కొత్త సెల్పోన్ మొదలు పెద్ద పెద్ద కార్ల దాకా అమ్ముడు కావాలంటె గీ ప్రచారం చేస్కోవాల్సిందె. గంతెందుకు ఇండ్లల్ల పంక్షన్లు అయితె.. కొందరు పనిగట్టుకుని జనాల్ని గుంపేసి గంటల్ గంటల్ తమ గొప్పలు సెబుతుంటారు సూడు.. గది కూడా ప్రచారమె! పురాన దినాల్లో పండగెప్పుడొస్తదో గుల్లో పూజార్ని అడిగేటోల్లు.. ఆల్లు గింత పెద్ద పంచాంగం పుస్తకం దీసి ఏ దినమో సెప్పేటోల్లు. గిప్పుడు గట్ల కాదు. స్టైలు మార్సిండ్రు. శివరాత్రి వచ్చిన.. ముక్కోటి ఏకాదసి వచ్చిన గుళ్ల ముందు పెద్ద పెద్ద ప్లెక్సీలు కడ్తుండ్రు. గంతెందుకు ఇండ్లల్లో పెండ్లి చేస్తే పంక్షన్ హాల్కాడే కాదు, ఆల్లుండె గల్లీ ముందర ప్లెక్సీలు పెడ్తుండ్రు. తెల్సిందా తమ్మీ మనం ఏ పని జేసినం.. జేస్తున్నం గనేది ఎంత ముక్యమో.. గా పని మనమే చేస్తున్నమని ప్రచారం చేసుడు కూడా! గంత ముక్యం! తమ్మీ గిప్పుడీ ఎలచ్చన్ల కూడా గింతె! రోజూ ప్రచారం అంటె ఆసామాసీ గాదె. గల్లి గల్లీలోని ఇండ్లకెల్లాలె.. రోడ్లపై తిరగాలె.. ఎప్పుడు ముకాలు సూడని కొత్తోల్లని బట్కుని అన్న.. తమ్మీ.. అక్క.. అమ్మా గెట్లున్నావె.. గంతా బాగేనే అని నవ్వుతూ ఓట్లు అడగాలె (అడుక్కోవాలె). మరి కాండేటే గివన్నీ సెయ్యాలంటె యాడవుతది? మస్తు జనాలు కావాలె. ఆల్లు మాత్రం యాడికెల్లి ఒస్తరు. ఎవరి పని వాల్లకుంటది. గా పన్లన్ని వదిలేస్కుని గీ కాండేట్ల ఎన్క తిరగితే.. ఇగ బతుకు బాగు పడినట్లె! జెండా పట్టాలె.. జై కొట్టాలె.. దినం.. దినమంత గీల్ల ఎంట ఉండాలె. ఒక్కమాటలో సెప్పాలంటె పెండ్లి చేసుడెంత కస్టమో.. గీ ప్రచారం గంతె కస్టం. ఇల్లు గట్టి సూడు.. పెల్లి జేసి సూడు.. అన్నారు గానీ.. ఎలచ్చన్ల ప్రచారం చేసి సూడు అని గూడ చెప్పాలె.. గీ పరేసాని తీరుడెట్లని కాండేట్లు ఓ పక్కన బుర్ర కరాబ్ చేస్కుంటుండ్రా.. గీల్లని సూసి’ అరె సాబ్ బేపికర్గ ఉండుండ్రి. మేం ఉన్నం గాదె అంటూ ముఠామేస్త్రిలు తయారయిండ్రు! ఈల్లు కొత్తగ ప్రచార దుకానం తెరిసింండ్రంట! రోజూ బిల్డింగ్ల పనికెల్లే కూలీలు గిప్పుడా పని బంద్ పెట్టి ప్రచారాల కెలుతుండ్రు! గదైనా గిదైనా పొద్దెక్కెంగానె కూలీ తీసుడు లెక్కే గాదె అనుకుంటుండ్రంట! అడ్డాల్లో కూలీలు ప్రతిరోజూ ఒకే తాన పనికెల్లరు కద. గిది కూడా గట్లనే జేస్తె కాండేటు కొంప కూలుడే! ఇయ్యాల కాంగిరేసు అబ్యర్తికి జై కొట్టి...రేపు కారు పార్టీకి జై కొట్టాలంటె గెట్లా...ఆల్లు పొరపాట్న కారు బదులు చెయ్యంటె గా కాండేటు ఏ కాల్వలో దుంకాలె? గందుకే మన ముఠామేస్త్రీలు గీ గడబిడ లేకుండా ఎవ్రు ఏ పార్టీకి జై కొడ్తుంటారో.. గీ ఎలచ్చన్లు ముగిసేదాకా ఆల్ల కాడనే కొలువు పెడ్తారంట! కూలోల్లు కూడా గిదేందో బాగుంది.. డబ్బిస్తరు.. బిరియానీ పెడ్తరు.. రాత్రికి మందు పోస్తరు. ఈ నెల్నాల్లన్న కూలీకెల్లి గా బండ పని చేసుడు తప్పుతది గంతె సాలు అనుకుంటుండ్రంట! జెండాలు పట్టే జనాలు తక్కువైండ్రని కర్నాటక.. మహారాష్ట్ర నుంచి కూడా తోలుకొస్తుండ్రంట! గెలుసుడు.. సోలుడు మాటేందో గానీ కూలీలు జరంత కుసీగా కనిపిస్తుండ్రు. నెలరోజులు జై కొట్టిండ్రు మరి ఓటెయ్యాలె అంటే మాత్రం.. బిడ్డా గిది గిదే...గది గదే అంటుండ్రంట! గంతే గద. యాడ నొక్కాలో గాదు.. యాడ తొక్కాలో తెల్సినోడే ఓటరు. అరె డైలాగ్ మంచిగచ్చిందె.. తమ్మీ..రాస్కో! -రాయదుర్గం మధుసూదన్ రావు -
గులాబీలో ‘రచ్చ’
టీఆర్ఎస్ వికారాబాద్ అభ్యర్థి మెతుకు ఆనంద్కు టికెట్ ఇస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని రగిలిపోతున్నారు. పార్టీ టికెట్ ఆశించిన వారంతా ఆనంద్కు వ్యతిరేకంగా జట్టుకట్టారు. గెలుపు గుర్రానికే అవకాశమివ్వాలని అధిష్టానానికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. పార్టీ ప్రారంభం నుంచి గులాబీ జెండా మోస్తున్న వారందరినీ కాదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్కుమార్ గెలుపుకు పరోక్షంగా పచ్చ జెండా ఊపారని ఆరోపిస్తున్నారు. వికారాబాద్/ధారూరు : ధారూరు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఒకరిపై ఒకరు కుర్చీలు లేపుకొన్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ టికెట్ను డాక్టర్ మెతుకు ఆనంద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న ఓ వర్గంలోని కొంతమంది నాయకులు అభ్యర్థికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తంచేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆనంద్ మద్దతుదారులు.. ఆందోళనకారులను కొట్టి తరిమేశారు. ఫంక్షన్ హాల్నుంచి బయటకు వచ్చిన అసమ్మతి నాయకులు భయంతో పరుగులు పెట్టారు. వీరిని వెంబడించిన రెండోవర్గం నాయకులు వెంబడించి చితకబాదారు. ఇరువర్గాల వారు రోడ్డుపై పరుగు తీస్తున్న దృశ్యాలు సినిమా షూటింగ్ను తలపించాయి. పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాంరెడ్డి ఎంతగా వారిస్తున్నా వినకుండా.. కొండాపూర్కలాన్ గ్రామ నాయకుడు వడ్డె యాదయ్యతో పాటు మరికొందరిపై దాడిచేసి తరిమికొట్టారు. యాదయ్య వీరి నుంచి తప్పించుకుని పరుగుతీశాడు. కాగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ గొడవలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించబోమని వేణుగోపాల్రెడ్డి తన ప్రత్యర్థి వర్గాన్ని హెచ్చరించారు. అనంతరం సమావేశం ప్రారంభమైంది. అయితే టీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జ్ కుమ్మరి శ్రీనివాస్కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కొంతమంది శ్రీనివాస్పై సమావేశం స్టేజీపైనే దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఈ దృశ్యాలను రికార్డింగ్ చేస్తూ గొడవను అడ్డుకున్నారు. పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆనంద్ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వినకుండా... వికారాబాద్లో పోటీ మాజీమంత్రులు ప్రసాద్కుమార్, చంద్రశేఖర్ మధ్యే ఉంటుందని అధిష్టానానికి పదేపదే చెప్పినా తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ధారూరు మండల శ్రేణులు శుక్రవారం రెండు వర్గాలుగా చీలిపోయాయి. హన్మంత్రెడ్డి, వండ్ల నందు వర్గానికి చెందిన నాయకుడు వడ్డె యాదయ్యను.. పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి వర్గీయులు కుర్చీలు, రాళ్లతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది క్షణాల్లో పార్టీ అభ్యర్థి ఆనంద్ సమావేశానికి వస్తారనే సమయంలో ఈ గొడవ చోటుకోవడం ఆయనపై ఉన్న అసమ్మతిని సూచించింది. గాయాల పాలైన వడ్డె యాదయ్య వేణుగోపాల్రెడ్డితో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర కేసు నమోదైంది. టికెట్ వచ్చిందనే ఆనందం ఉన్నప్పటికీ.. అసమ్మతి నుంచి బయటపడేదెలా అంటూ ఆనంద్ తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ మారడమే ఉత్తమమని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొంతమంది అసమ్మతి నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండగా.. మరి కొందరు స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ వైపు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
సాక్షి, వికారాబాద్ : ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిని ప్రచార అస్త్రంగా వినియోగించుకునేందుకు ఏఐసీసీ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రణాళిక రెడీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుత ఎన్నికల్లో రేవంత్ను స్టార్ క్యాంపేయినర్గా వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రూట్ మ్యాప్ను ఖరారు చేయనుంది. కొడంగల్ను సమన్వయం చేసుకుంటూనే ఇతర సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాలని ఆదేశించింది. తెలంగాణలోని 69 సెగ్మెంట్ల లో నిర్వహించే సభలు, సమావేశాల్లో రేవంత్ పాల్గొననున్నారు. సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు చాపర్ సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రేవంత్రెడ్డి సైతం ధ్రువీకరించారు. దీనికి అనుగుణంగానే కొడంగల్లోని ఆయన నివాసం ఎదుట హెలిపాడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇందుకోసం పోలీసు శాఖ అనుమతులు రాలేదని సమాచారం. పర్మిషన్ వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుం టుందని రేవంత్ వాఖ్యానించారు. స్టార్ క్యాంపెయినర్.. రేవంత్రెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అధిష్టానం ఎలా వినియోగించుకుంటే అలా సేవలందిస్తా.. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కేసీఆర్ను గద్దె దింపి.. ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తా.. రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం అధిష్టానం ప్లాన్ చేస్తోంది. వారిచ్చి న షెడ్యూల్ను అనుసరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. ఈ నెల 19న నామినేషన్ వేశాక ప్రచారం ప్రారంభిస్తాను. – రేవంత్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 19న నామినేషన్.. రేవంత్రెడ్డి ఈ నెల 19న నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నామినేషన్ రోజున భారీ జన సమీకరణకు సన్నద్ధమవుతున్నారు. మరుసటి రోజైన 20వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. కొడంగల్లోనూ ఏమాత్రం తగ్గకుండా ప్రచారానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకున్నారు. 20 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రేవంత్ ప్రచారం కొనసాగనుంది. 69 సెగ్మెంట్లలో పర్యటన.. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపేయినర్గా ప్రచార బరిలో దిగనున్న రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మొ త్తం 69 సెగ్మెంట్లలో నిర్వహించనున్న సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఈయన ప్రచారానికి తన సొంత నియోజకవర్గం కేంద్ర బిందువు కానుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు హెలికాప్టర్ వినియోగించనున్న నేపథ్యంలో.. రేవంత్ నిత్యం కొడగంల్లోని తన నివాసం నుంచే బయలుదేరి తిరిగి రాత్రి ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. వరుసగా రెండు రోజులు రాష్ట్రంలోని పలు సెగ్మెంట్లలో పర్యటించనున్న ఆయన ఒక రోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటిం చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలా కొడంగల్లోనూ గ్యాప్ రాకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకూ బిజీబిజీగా ఉండనున్నారు. -
పల్లె పాలన నుంచి అసెంబ్లీకి..
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న, గతంలో పోటీ చేసిన వివిధ పార్టీల నేతలందరూ స్థానిక సంస్థల నుంచి వచ్చిన వారే.. వీరి రాజకీయ ప్రస్థానం పల్లె నుంచి మొదలైంది. అంచెలంచెలుగా వివిధ పదవులు చేపట్టి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జైపాల్యాదవ్, దివంగత పట్లోళ్ల ఇంద్రారెడ్డి, కేఎస్.రత్నం, కాలె యాదయ్య, గడ్డం ప్రసాద్కుమార్, మల్రెడ్డి రంగారెడ్డి, మంచిరెడి కిషన్రెడ్డి ఉన్నారు. వీరిలో కొందరు మంత్రి పదవులను సైతం చేపట్టారు. ఎంపీటీసీ పదవితో తిరిగిన దశ వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థల నుంచే ప్రారంభమైంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన ఆయన 2001లో కోట్ మర్పల్లి నుంచి ఎంపీటీసీకి పోటీ చేసి విజయం సాధించారు. ఆ విజయం ఆయన రాజకీయ జీవితాన్నే మార్చివేసింది. అనూహ్యంగా మర్పల్లి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు లభించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో ఆయన ఎంతో చనువుగా ఉంటూ మర్పల్లి మండల అభివృద్ధికి కృషి చేశారనే ప్రచారాం ఉంది. 2008లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఎ. చంద్రశేఖర్ తన పదవికి రాజీనాయ చేయడంతో వికారాబాద్ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వికారాబాద్ కాంగ్రెస్ టికెట్ను గడ్డం ప్రసాద్ కుమార్కు ఇచ్చారు. ప్రసాద్ కుమార్ గెలుపు బాధ్యతలను అప్పటి గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఎ.చంద్రశేఖర్పై ప్రసాద్ కుమార్ విజయం సాదించారు. మొదటి సారి విజయం సాధించిన ఏడాదికే 2009లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్కే టికెట్ ఇచ్చింది. దీంతో ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి రెండో సారి విజయం సాధించారు. 2012లో కిరణ్ కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సంజీవరావు చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా.. హయత్నగర్: అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తొర్రూర్కు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా సర్పంచ్ స్థాయినుంచి స్వశక్తితో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1981లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. అనంతరం తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్గా పనిచేశారు. టీడీపీలో తెలుగురైతు జిల్లా అధ్యక్షునిగా ఉన్న అయన 1994లో మలక్పేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మొదటిసారి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్కుమార్పై విజయం సాధించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2004లో మలక్పేట్ నుంచి కాంగ్రేస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిపై గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. 2009లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్ దక్కక పోవడంతో మహేశ్వరం నుంచి భరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి ఆయన తమ్ముడు రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. మోత్తం మీద నాలుగు సార్లు పోటీ చేసిన మల్రెడ్డి రెండు సార్లు గెలిచి రెండుసార్లు ఓడిపోయారు. నియోజక వర్గాల పునర్విభన అనంతరం తనకు పట్టున్న ప్రాంతాలు విడిపోవడం ఆయనకు కలిసిరాలేదు. సర్పంచ్ నుంచి మంత్రిగా.. చేవెళ్ల: మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన దివంగత పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1981లో కౌకుంట్ల సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు ఆయన జనత పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవటంతో 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అ తరువాత ఆయన వెనుదిరిగి చూడకుండా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జెడ్పీ చైర్మన్ టు ఎమ్మెల్యే.. చేవెళ్ల: నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన కేఎస్ రత్నం శంషాబాద్ జేడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి 1995లో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. అ తరువాత టీడీపీ తరుఫున హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో చేవెళ్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మళ్లీ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగి.. చేవెళ్ల: నియోజకవర్గంలోని నవాబుపేట మండలం చించల్పేట గ్రామానికి చెందిన కాలె యాదయ్య స్థానిక సంస్థల రాజకీయలనుంచే వచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్పార్టీలో ఉన్న అయన 1992 నుంచి 1995 వరకు నవాబుపేట మండలంలో ఒకేసారి సింగిల్ విండో చైర్మన్గా, డీసీఎంఎస్ డైరెక్టర్గా, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్గా పనిచేశారు.1995–2000 వరకు నవాబుపేట జెడ్పీటీసీగా, 2001–2006 వరకు నవాబుపేట ఎంపీపీగా పనిచేశారు. కాంగ్రెస్పార్టీలో సీనియర్ నాయకునిగా పనిచేసిన ఆయన 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో చేవెళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. 2014లో చేవెళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్పార్టీ నుంచి గెలుపొందారు. గెలిచిన అనంతరం టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రథమ పౌరుడి నుంచి.. ఇబ్రహీంపట్నం: సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నాయకుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎల్మినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి నిజాం కళాశాలలో గాడ్యుయేషన్ పూర్తిచేసి ఆంధ్రాబ్యాంక్లో క్లర్క్ ఉద్యోగంలో చేరారు. ఈ దశలో 1980లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. చదువుకున్న వ్యక్తిని గ్రామానికి సర్పంచ్ను చేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఉద్యోగం చేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డిని సర్పంచ్గా పోటీ చేయాలని గ్రామస్థులు పట్టుబట్టడంతో.. సర్పంచ్ బరిలో నిలబడి విజయం సాధించారు. 25 ఏళ్ల వయస్సులో సర్పంచ్గా గెలిచిన కిషన్రెడ్డి, వెనుతిరిగి చూడకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. 1985 నుంచి 1990 వరకు ఎల్మినేడు సింగిల్విండో చైర్మన్గా డీసీసీబీ డైరెక్టర్గా పనిచేశారు.1994–96 మధ్యకాలంలో జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శిగా, 1997 నుంచి 2004 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు ఏపీఐడీసీ చైర్మన్గా కోనసాగారు. 2009లో టీడీపీ నుంచి ఇబ్రహీంపట్నం స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి శాసనసభ్యుడిగా తిరిగి గెలుపొందారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించేందుకు ఇబ్రహీంపట్నం నియోజవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి.. కొడంగల్: మాజీ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ఆయన 2006లో టీడీపీ పక్షాన జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. 2008లో స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. 2009లో కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఏడు వేల మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కొడంగల్ నియోజకవర్గంలో 14వేల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చల్లంపల్లి నుంచి మొదలై... ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి.జైపాల్యాదవ్ రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచి మొదలైంది. రెండు సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నిక కావడం విశేషం. తలకొండపల్లి మండలం చల్లంపల్లికి చెందిన జి.జైపాల్యాదవ్ 1981లో తొలిసారిగా చల్లంపల్లి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1988లో మరోసారి చల్లంపల్లి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1995లో తలకొండపల్లి నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా విజయం సాధించారు. 1999లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన జైపాల్యాదవ్ తొలిసారి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఉమ్మడి జిల్లాలోని వంగూరు మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2009లో రెండో సారి టీడీపీ తరఫున కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా 2014లో కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుత ఎన్నికలలో మరోసారి జైపాల్యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. -
కొడంగల్ కు బావ.. పట్నంకు బామ్మర్ది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికార పార్టీలో నంబర్–2 స్థానంలో ఉన్న బావ, బామ్మర్దులకు మరో కొత్త సవాల్ ముందుకొచ్చింది. మన జిల్లాలో రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతలను ఇరువురు మంత్రులు భుజాన వేసుకోవడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గాలపైనే పడింది. ప్రధానంగా కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ రేవంత్రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ స్థానంలో గులాబీ పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతలను బావ హరీష్రావు చేపట్టగా.. రియల్ ఎస్టేట్, విద్య, వాణిజ్య, ఐటీ రంగానికి నెలవైన ఇబ్రహీంపట్నంలో కారు జోరు పెంచే బాధ్యతను బావమరిది కేటీఆర్ స్వీకరించారు. ఇద్దరూ అధికార పార్టీకి స్టార్ క్యాంపెయినర్లే కావడం.. అదీ స్వయానా బావామరదులు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.æ రాష్ట్రవ్యాప్తంగా 20 కీలక నియోజకవర్గాలను గుర్తించిన గులాబీ బాస్ కేసీఆర్.. వీటిలో ప్రచార వ్యూహాలను అమలు చేసే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించారు. ప్రత్యర్థి బలంగా ఉన్న, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న, సొంతపార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉన్న స్థానాలను ఎంపిక చేశారు. ఇందులో మన జిల్లాలో కొడంగల్, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లను గుర్తించారు. ఈ రెండు స్థానాలను ప్రతిష్టాత్మకంగా భావించిన గులాబీ అధినాయకత్వం.. వీటి గెలుపు బాధ్యతలను హరీష్రావు, కేటీఆర్కు కట్టబెట్టింది. పట్నంలో కేటీఆర్ గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి(టీడీపీ) గులాబీ గూటికి చేరినా.. ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్నట్లు టీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించింది. కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలున్నప్పటికీ సొంత పార్టీ నేతల్లోనూ లుకలుకలుండడం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు అంతర్గత సర్వేలో తేలడంతో ఈ సెగ్మెంట్పై పట్టు సాధించేందుకు మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ రంగంలోకి దించింది. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను సద్దుమణిగేలా చేయడం, ప్రత్యర్థులను బలహీనపరిచే బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో విజయ పతాకం ఎగురవేయడం కేటీఆర్కు సవాలుగా మారింది. రేవంత్ ఓటమే ధ్యేయంగా.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఓటమే ధ్యేయంగా టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆర్నెల్ల క్రితమే టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ను ఉప ఎన్నికల్లో ఓడించాలని భావించింది. అయితే, ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కు కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఇవ్వడంతో ఉప ఎన్నికకు చాన్స్లేకుండా పోయింది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే చావుదెబ్బ తీయాలని అధికారపార్టీ అనుకుంది. అందుకనుగుణంగా కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు రాష్ట్ర కేబినెట్ అంతా ఏదో ఒక సందర్భంలో నియోజకవర్గంలో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అంతేగాకుండా 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన గురునాథ్రెడ్డి స్థానే ఎమ్మెల్సీ నరేందర్రెడ్డిని బరిలో దించనున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో గురునాథ్ వర్గీయుల నుంచి అసమ్మతి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్నికలొప్పుడొచ్చినా టికెట్ ఖాయమని తేలడంతో నరేందర్రెడ్డి పూర్తిస్థాయిలో కొడంగల్పైనే దృష్టిపెట్టారు. మరోవైపు సోదరుడు, మంత్రి మహేందర్రెడ్డి కూడా నరేందర్ను గెలిపించడం కోసం తనదైన శైలిలో వ్యూహాలు రూపొందించారు. అనూహ్యంగా శాసనసభ రద్దు కావడం.. ఎన్నికలకు నగారా మోగడంతో ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడం టీఆర్ఎస్కు తప్పనిసరి అయింది. శాసనసభ లోపల, బయటా మాటల చాతుర్యంతో కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డిని ఓడించకపోతే చికాకు తప్పదని గులాబీ దళపతి కేసీఆర్ అంచనా కొచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ని మట్టికరిపించేందుకు ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్రావును తెరమీదకు తెచ్చారు. స్టార్ క్యాంపెయినర్గా నరేందర్రెడ్డిని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను అప్పగించారు. -
ఎవరూ.. నచ్చలేదు
కొత్తూరు : నోటాకు పోలయ్యే ఓట్లు తూటాల కంటే బలమైనవి. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం, ప్రమాదం ఉంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా జాతీయ ఎన్నికల కమిషన్ ఈవీఎం యంత్రాలపై నోటా(పై అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదు) ఆప్షన్ను ప్రవేశపెట్టింది. అయితే, నోటాకు పోలవుతున్న ఓట్ల సంఖ్య రానురానూ పెరుగుతూ వస్తోంది. కొన్ని సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో కొందరు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014లో కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి కేవలం 78 ఓట్లతో గెలుపొందారు. అయితే, ఈ నియోజకవర్గంలో నోటాకు 1,139 ఓట్లు పోలవడం గమనార్హం. నోటాకు బదులు అభ్యర్థులకు ఈ ఓట్లు పోలై ఉంటే గెలుపోటముల ఫలితం మరోలా ఉండేది. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 14 మందికి, ఎల్బీనగర్లో 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తే 24 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు.. ►షాద్నగర్ నియోజకవర్గంలో 1,93,094 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,54,985 ఓట్లు, నోటాకు 846 ఓట్లు పోలైయ్యాయి. 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా 8 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►కల్వకుర్తి నియోజకవర్గంలో 1,99,714 ఓట్లు ఉండగా 1,61,799 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,139 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 11 మంది బరిలో దిగగా ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►చేవేళ్ల నియోజకవర్గంలో 2,05,757 ఓట్లకు 1,62,571 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,226 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గం నుంచి మొత్తం 14 మంది పోటీచేయగా 5 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ రావడం గమనార్హం. ►శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,91,281 ఓట్లకు అభ్యర్థులకు 28,294 ఓట్లు, నోటాకు 2,053 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 22 మంది పోటీచేయగా 14 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 3,87,355 ఓట్లకు 2,29,586 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,332 పోలయ్యాయి. 24 మంది అభ్యర్థులు పోటీ చేయగా 14 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► మహేశ్వరం నియోజకవర్గంలో 4,03,729 ఓట్లలో అభ్యర్థులకు 2,17,679 ఓట్లు, నోటాకు 1,394 ఓట్లు వేశారు. నియోజకవర్గం నుంచి 22 మంది పోటీ చేయగా 15 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► ఎల్బీనగర్ నియోజకవర్గంలో 5,29,717 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 2,50,852 ఓట్లు, నోటాకు 2241 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 30 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 24 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి. ►ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 2,30,388 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,81,443 ఓట్లు, నోటాకు 768 ఓట్లు పోలయ్యాయి. 27 మంది అభ్యర్థులు పోటీ చేయగా 17 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ►పరిగిలో మొత్తం 2,11,875 ఓట్లకు 1,50,178 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,301 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక్కడ పది మంది బరిలో దిగగా ఐదుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► తాండూరు నియోజకవర్గంలో 1,89,216 ఓట్లకు అభ్యర్థులకు 1,33,324 ఓట్లు, నోటాకు 1,302 ఓట్లు పోలైయ్యాయి. పది మంది పోటీ చేయగా ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ►కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 1,97,649 ఓట్లకు అభ్యర్థులకు 1,38,300 ఓట్లు, నోటాకు 1,135 ఓట్లు పోలయ్యాయి. 8 మంది పోటీ చే యగా ఒకరికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 1,95,951 ఓట్లు ఉండగా 1,37,901 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,040 ఓట్లు పోలయ్యాయి. 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా 7 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. -
పట్నం.. వారసత్వానికి దూరం
సాక్షి, ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు కొత్తేమికాదు. తల్లిదండ్రుల్లో ఎవ్వరైనా రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యే, ఎంపీగా ఎదిగితే.. తదనంతరం ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కుటుంబసభ్యుల్లో ఎవ్వరినో ఒకరిని రాజకీయంగా ప్రొత్సాహిస్తారు. తమతోనే రాజకీయ ప్రస్థానం ముగిసిపోవద్దని వారసత్వ పరంపర కోనసాగాలని తపన పడతారు. అందుకు అనుగుణంగా వారసులకు తర్ఫీదు నిస్తూ రాజకీయాలు చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్యేలుగా కోనసాగారు. వారి కుటుంబసభ్యుల్లో ఎవ్వరూ కూడా వారి స్థానాలను భర్తీ చేసేందుకు రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోలేదు. 1952 ద్విసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంబీ గౌతమ్, పీడీఎఫ్ నుంచి పిల్లయిపల్లి పాపిరెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగారు. వారి సంతానం ఎవ్వరూ రాజకీయాల్లోకి రాలేదు. స్థానికేతరుడైన లక్ష్మీనర్సయ్య 1957, 1962,1967లో మూడుసార్లు వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి కుటుంబసభ్యులేవ్వరో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియదు. స్థానికుడైన యాచారం మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డి 1972లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అ తదుపరి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో అయన సంతానం రాజకీయాల్లో రాలేదు. 1978లో కాంగ్రెస్ నుంచి సుమిత్రాదేవి గెలిచినా అనారోగ్యంతో మధ్యలోనే కన్నుమూశారు. ఆమె కుటుంబ వివరాలు ఈ ప్రాంత ప్రజలకు తెలియవు. తదనంతరం 1981, 1983లో జరిగిన ఉపఎన్నిక, సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా ఏజీ కృష్ణ గెలిచారు. అతనికున్న ఒక్క కుమారుణ్ణి సైతం నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయకపోవడం గమనార్హం. అందరికీ ఆదర్శం 1985లో టీడీపీ నుంచి గెలిచిన సత్యనారాయణ పరిస్థితి అదే. కుటుంబసభ్యులనేవ్వరిని అయన రాజకీయాల్లోకి రానివ్వలేదు. 1989, 1994లో రెండు సార్లు సీపీఎం తరుపున గెలిచిన కొండిగారి రాములుకు భార్య, ఇద్దరు కూమారులు ఉన్నప్పటికీ రాజకీయాలకు వారు దూరంగానే ఉన్నారు. టీడీపీ నుంచి 1999లో పుష్పలీల గెలిచినా కుటుంబ సభ్యులేవ్వరు రాజకీయాల్లోకి రాలేదు. 2004లో సీపీఎం నుంచి గెలిచిన మస్కు నర్సింహకు ఇద్దరు కుమారులు. రాజకీయాల్లో అయన కొనసాగుతున్నా కుటుంబసభ్యులను ప్రోత్సాహించలేదు. టీడీపీ నుంచి 2009, 2014 రెండుసార్లు గెలిచిన మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. అయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి తండ్రి వెంట రాజకీయాల్లో కొనసాగుతున్నా.. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి అయన ఎదగలేదు. గత ఎమ్మెల్యేల వారసులేవ్వరూ రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గన్ని పాలించిన దాఖలాలులేవు. పలు నియోజకవర్గల్లో ఎమ్మెల్యేల వారసులుగా వారి కుటుంబసభ్యులు రాజకీయాల్లో రాణిస్తున్నా.. ఈ నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేవకపోవడం గమనార్హం. ఎంబీ గౌతమ్, పిల్లాయి పాపిరెడ్డి, లక్ష్మీనర్సయ్య, సుమిత్రాదేవి, ఏజీ కృష్ణ, సత్యనారాయణలు స్థానికేతరులుగా.. అనంతరెడ్డి, కొండిగారి రాములు, కొండ్రు పుష్పలీల, మస్కు నర్సింహ, మంచిరెడ్డి కిషన్రెడ్డి స్థానికులుగా ఎమ్మెల్యేలుగా పనిచేశారు -
ఆ ‘నలుగురు’ మహిళా మంత్రులు
మహిళామణులు అసెంబ్లీలో అడుగుపెట్టడమేగాక ఆయా శాఖలకు మంత్రులుగా పనిచేసి రాష్ట్ర రాజకీయ యవనికపై తమదైన ముద్రవేశారు. పురుషులకు ధీటుగా కీలక పదవులు చేపట్టి ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల్లో తమ సత్తా చాటారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఏడుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా .. ఇందులో నలుగురికి మంత్రులుగా పనిచేసే అవకాశం లభించడం విశేషం. గనుల శాఖ నుంచి మొదలుకుని హోం తదితర అత్యున్నత శాఖలకు బాధ్యత వహించి భేష్ అనిపించారు. కాంగ్రెస్, టీడీపీలు మాత్రమే మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొండ్రు పుష్పలీలను లక్కీ మినిస్టర్గా రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఈమెకు అమాత్య యోగం దక్కడమే ఇందుకు కారణం. ఆయా పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు మూడునాలుగు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టినా మంత్రి పదవులు వరించలేదు. ఇందుకు భిన్నం పుష్పలీల. 1999 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుం చి టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఈమె.. కాంగ్రెస్ అభ్యర్థి ఏ గంగారం కృష్ణపై విజయం సాధించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమె మహిళా, సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొం దిన పుష్పలీల.. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారు. మంత్రిగా సుమిత్రాదేవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి విజయఢంకా మోగించిన దళిత నాయకురాలు, స్వాతంత్య్ర సమరయోధురాలు సుమిత్రాదేవి మంత్రిగా పనిచేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. ఈ ఘనత మరే మహిళా నాయకురాలు సాధించలేదు. 1957, 62 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి గెలుపొందగా.. ఆ తర్వాతి మూడుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మేడ్చల్ నుంచి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దిగిన ఆమె.. జనతా పార్టీ అభ్యర్థి కేఆర్ కృష్ణస్వామిని ఓటమి రుచిచూపించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. సబితారెడ్డికి పెద్దపీట.. చేవెళ్ల చెల్లెమ్మగా పేరుగాంచిన పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2004లో తొలిసారిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఈమెకు చోటుదక్కింది. చేవెళ్ల సెగ్మెంట్ నుంచి బరిలో కి దిగిన ఆమెకు వైఎస్సార్ మంచి ప్రాధాన్యత ఇచ్చా రు. ఆ తర్వాత 2009లో చేవెళ్ల నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో.. మహేశ్వరం నుంచి పోటీచేసి.. మాజీ మేయర్, టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఈ దఫా వైఎస్సార్ తన క్యాబినెట్లో రాష్ట్ర హోం, జైళ్లు, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. వైఎస్సార్ మరణం తర్వాత రో శయ్య హయాంలోనూ సబితా హోంమంత్రిగా కొనసాగారు. ఈమె భర్త పట్లోళ్ల ఇంద్రారెడ్డి 2000లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రాజకీయ ప్రవే శం చేసిన ఈమె.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1963 మే నెలలో తాండూరులో జన్మించిన సబితా.. 41 ఏళ్ల వయసులో తొలిసారిగా మంత్రి అయ్యారు. ఉమా వెంకట్రాంరెడ్డికి కీలక బాధ్యతలు మేడ్చల్ అసెంబ్లీ నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన ఉమా వెంకట్రాంరెడ్డి పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీపీ రెడ్డిపై గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు ఈమె. ఆ తర్వాత మరోసారి 1989లో విజయం సాధించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఆయన మంత్రివర్గంలో మొదటగా మంత్రి పదవి వరించలేదు. 1990 డిసెంబర్ 3న చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కింది. గృహనిర్మాణం, సూక్ష్మ నీటిపారుదల, గనుల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 1990 వరకు పనిచేశారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్రెడ్డి కేబినెట్లోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991 ఆగస్టు 5 నుంచి 1992 వరకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా సేవలందించారు. -
తుది అంకం
తొలిజాబితాలో వీరికి.. శనివారం విడుదల చేసే తొలి జాబితాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, రేవంత్రెడ్డి (కొడంగల్), తాజా మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి (పరిగి), వంశీచంద్రెడ్డి (కల్వకుర్తి), మాజీ ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి (ఎల్బీనగర్), ప్రతాపరెడ్డి (షాద్నగర్), కూన శ్రీశైలంగౌడ్ (కుత్బుల్లాపూర్) పేర్లు ఉండే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, బహుళ పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, మేడ్చల్, చేవెళ్ల నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది. కాగా, టీడీపీ అడుగుతున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్ సహా టీజేఎస్ ప్రతిపాదిస్తున్న మల్కాజిగిరిని పక్కనపెట్టినట్లు సమాచారం. వికారాబాద్ సెగ్మెంట్ విషయంలో సోనియా నేతృత్వంలోని సీఈసీ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగినట్లు తెలిసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కూర్పు తుది అంకానికి చేరింది. ఈ నెల పదో తేదీన తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ.. పోటీ తీవ్రంగా నెలకొన్న నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా జాబితా వడపోతపై కసరత్తు చేసిన స్క్రీనింగ్ కమిటీ.. గెలుపుగుర్రాల ఎంపికలో సామాజిక సమీకరణలు, సమర్థతను పరిగణనలోకి తీసుకుంటోంది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లోని ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగింపులు చేస్తోంది. కాగా, ఒకరే ఆశిస్తున్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో మహేశ్వరం, కల్వకుర్తి, కొడంగల్, పరిగి, ఎల్బీనగర్, షాద్నగర్ స్థానాలున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా వెల్లడిలో జరుగుతున్న జాప్యంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. బుజ్జగింపులతో దారికి.. ఇద్దరు, ముగ్గురు పొటీపడుతున్న నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరగకుండా ఏఐసీసీ జాగ్రత్తపడింది. ఇలా పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్ల ఆశావహులతో సంప్రదింపులు జరిపింది. ప్రత్యర్థుల బలాబలాలు, సామాజికవర్గాల సమతుల్యతల కారణంగా టికెట్ దక్కకపోయినా.. కలిసికట్టుగా పనిచేయాలని మార్గనిర్దేశం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్/ఎమ్మెల్సీ తదితర పదవులతో సముచిత గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. అసమ్మతి చల్లారినట్లేనని భావించిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన స్క్రీనింగ్ కమిటీ.. ఇంకా వివాదాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన వాటిని మాత్రం పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, తాండూరు, మేడ్చల్, రాజేంద్రనగర్, వికారాబాద్ నియోజకవర్గాల నేతలతో హైకమాండ్ మాట్లాడింది. కొన్ని స్థానాల నుంచి ఒకరికే ఆహ్వానం పలకడం.. మరికొన్ని చోట్ల ఇద్దరిని పిలిపించి మాట్లాడడంతో టికెట్ ఎవరికిస్తున్నారో.. ఎవరిని బుజ్జగిస్తున్నారో ఆర్థం కావడం లేదు. సబిత డుమ్మా.. చంద్రశేఖర్ హాజరు అభ్యర్థుల ఖరారులో ప్రతిష్టంభన తొలగించేందుకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చంద్రశేఖర్ను హస్తినకు రావాలని స్క్రీనింగ్ కమిటీ వర్తమానం పంపింది. ఈ మేరకు చంద్రశేఖర్ కమిటీ ఎదుట హాజరై వికారాబాద్ స్థానంపై తన వాదన వినిపించారు. ఈ స్థానాన్ని మాజీ మంత్రి ప్రసాద్కుమార్ కూడా ఆశిస్తుండగా.. చేవెళ్ల సీటును స్క్రీనింగ్ కమిటీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, సబిత మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహేశ్వరంతోపాటు తన కుమారుడు కార్తీక్రెడ్డి రాజేంద్రనగర్ సీటును ఆశిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన ఉన్నందున ఈ అంశంపై ఆమెతో మాట్లాడాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం టికెట్ రేసులో ఉన్న మల్రెడ్డి బ్రదర్స్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో కూడా స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. ఎవరికి టికెట్ ఇచ్చినా.. సమన్వయంతో పనిచేయాలని, టికెట్ దక్కనివారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే, మేడ్చల్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ గూటికి చేరిన తోటకూర జంగయ్యయాదవ్తో ఒకేసారి మాట్లాడి.. దిశానిర్దేశం చేసింది. రాజేంద్రనగర్పై కన్నేసిన సినీ నిర్మాత బండ్ల గణేశ్తో కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చర్చించారు. తాండూరు సీటుకు పోటీపడుతున్న పైలెట్ రోహిత్రెడ్డి, లక్ష్మారెడ్డిలకు హితోపదేశం చేసిన కమిటీ.. ఎవరికి టికెట్ వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించింది. -
కారు ఆటో ఢీ, ఐదుగురి మృతి
-
లింగంపల్లిలో ఘోర ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి : యాదాద్రి జిల్లాలో ఆదివారం జరిగిన దుర్ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఐదుగురు శ్రమ జీవులను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆటోలో కూరగాయలను హైదరాబాద్ తీసుకువస్తూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలే ఉండటం హృదయ విదారకం. వివరాలు.. చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్స కోసం ఇబ్రహీం పట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
వంట నూనె ప్యాకెట్లో ఎలుక దర్శనం
-
4 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం
-
ఆధార్కు 'వంద'నం
► మీ సేవ, ఆధార్ నమోదు కేంద్రాల్లో అడ్డగోలుగా వసూళ్లు ► సేవ ఏ రకమైనా రూ.వంద నుంచి రూ.200 దండుకోవడమే ► సామాన్యుల జేబులకు చిల్లు ► ప్రభుత్వ చార్జీల అమలు ఊసెత్తని ప్రైవేటు ఫ్రాంచైజీలు ► ఎక్కడా కనిపించని సిటిజన్ చార్టర్ ► అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు శూన్యం మీ సేవ, శాశ్వత ఆధార్ నమోదు (పీఈసీ) కేంద్రాలు నిలువు దోపిడీకి చిరునామాగా మారాయి. ఏదైనా సేవ కావాలని సామాన్యుడు ఆ కేంద్రాల గడప తొక్కితే.. ఇక డబ్బులుపిండుకోవడమే ప్రైవేటు ఫ్రాంచైజీల వంతైపోయింది. హీనపక్షం రూ.వంద నుంచి రూ. రెండు వందల దాకా ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. కొన్ని రోజులుగా జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ సాగుతున్నా.. అధికారులు మాత్రం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు.. ఎవరైనా సమాచారం ఇచ్చినా దానిని పెడచెవిన పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాలకు ఆధార్ తప్పనిసరి. ఐదేళ్లలోపు చిన్నారులకూ ఆధార్ నంబర్ ఉండాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అంగన్వాడీలో చిన్నారుల నమోదు నుంచి మొదలుకొని బ్యాంకింగ్ సేవలు, వాహనాల కొనుగోళ్ల వరకు అన్నీ ఆధార్తోనే ముడిపడి ఉన్నాయి. ఇటువంటి వారందరికీ ఆధార్ సేవలు అందించేందుకు జిల్లాలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ప్రైవేటు మీ సేవ కేంద్రాల్లోనే నెలకొల్పారు. జిల్లాలో ఇలా దాదాపు 30 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఆధార్ నమో దు చేసుకునే వారి నుంచి ఒక్క పైసా కూడా ఫ్రాంచైజీలు తీసుకోకూడదు. ఉచితంగానే వివరాలు నమోదు చేయా లి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టం చేసినా ఫ్రాంచైజీలు మాత్రం పట్టించుకోవ డం లేదు. కొత్తగా వివరాల నమోదుకు రూ.100 నుంచి రూ.150 దాకా ప్రజల నుంచి వసూలు చేస్తుండడం గమనార్హం. ఉచితమని సామాన్యులకు తెలియకపోవడంతో అందినకాడికి దండుకుంటున్నారు. వేలిముద్రల అప్డేట్, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ తదితర వాటిని అప్డేట్ చేస్తే రూ. 25 డబ్బులు తీసుకోవాలి. కానీ ఈ చార్జీలు ఎక్కడా అమలు కావడం లేదు. అన్నింటికీ రూ. వంద ఇస్తేనే.. ఆధార్ సేవలు అందుతున్నాయి. బాదుడే సేవ నిబంధలనకు విరుద్ధంగా చార్జీ వసూలు చేయడంలోనూ మీ–సేవ కేంద్రాలు ఏమాత్రం తీసిపోవడం లేదు. పలు రకాల ప్రభుత్వ సేవలను ప్రజలకు సలువుగా, వేగవంతంగా అందించేందుకు మీ–సేవకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 30కిపైగా ప్రభుత్వ శాఖల పరిధిలోని సుమారు 320 రకాల సేవలు ఈ కేంద్రాల ద్వారా ప్రజలు పొందుతున్నారు. జిల్లాలో 302 మీ సేవ కేంద్రాలు ఉండగా.. వీటిలో 8 నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. మిగిలిన 294 ప్రైవేటు ఫ్రాంచైజీల చేతుల్లో ఉన్నాయి. జిల్లాలో నిత్యం సగటున తొమ్మిది వేల మంది ప్రజలు మీసేవ కేంద్రాల ద్వారా సేవలు పొందుతున్నారు. అత్యధికంగా రెవె న్యూ, వ్యవసాయ శాఖల పరిధిలో వినియోగించుకుంటున్నట్లు అధికారుల అంచనా. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వీస్ చార్జీతోపాటు అదనంగా ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు పిండుకుంటున్నారు. సేవ రకాన్ని బట్టి.. అదనంగా రూ. 50కి పైగా వసూలు చేస్తున్నారు. ఇంకొన్ని ఫ్రాంచైజీలు రూ.వంద వరకు దండుకుంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలు అన్ని రకాల సేవలపై బాదుడు తప్పడం లేదు. చివరకు రేషన్కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా రూ.వంద తీసుకుంటున్నారు. సేవా రుసుం, చట్టపరమైన చెల్లింపులకు మించి ఒక్కపైసా కూడా అదనంగా ఆశించకూడదు. కానీ, ఇది ఏ కేంద్రంలోనూ జరగడం లేదన్నది బహిరంగ సత్యం. నిబంధనల ప్రకారం ప్రతి కేం ద్రంలో పౌర సేవల వివరాలు, చార్జీలను తెలిపే చార్ట్ ఉండాలి. ఇది ఏ కేంద్రంలోనూ కనిపించకపోవడం గమనార్హం. పైగా అదనంగా డబ్బులు తీసుకున్న మేరకు.. బిల్లులు ఇస్తారా అంటే అదీ లేదు. ఇలా అడుగడుగునా నిబంధనల అతిక్రమణ జరుగుతున్నా అధికారులు దృష్టి సారించిన దాఖలాలు శూన్యం. దీంతో ప్రైవేటు ఫ్రాంచైజీలు చెప్పిందే చార్జీగా మారింది. యాజర్ చార్జీ పెంచినా.. మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యూజర్ చార్జీలను పెంచింది. ప్రతి సేవపై అదనంగా రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఈ చార్జీలు ఈ నెల ఏడో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఆయా సేవల రకాన్ని బట్టి తమకు ఇస్తున్న కమీషన్ ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ప్రైవేటు ఫ్రాంచేజీలు పలుమార్లు ప్రభుత్వానికి విన్నమించాయి. దుకాణాల అద్దె, విద్యుత్ చార్జీలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే తమకు కేంద్రాల నిర్వహణ గుదిబండగా మారిందని వివరించారు. ఈ నేపథ్యంలో యూజర్ చార్జీలను ప్రభుత్వం పెంచినా.. ప్రజలనుంచి అడ్డగోలు వసూలు తీరు మాత్రం మారలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వివరణ కోసం జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్కు ‘సాక్షి’ ఫోన్ చేయగా.. ఆయన నుంచి స్పందన కరువైంది. -
పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచార యత్నం
-
ప్రేమ పేరుతో వేధించాడని విద్యార్థిని ఆత్మహత్య
-
నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ : నకలీ నోట్లను చలామని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2. 65 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. మోమిన్పేట మండలం సోమ్లానాయక్ తండాకు చెందిన రవీందర్, ప్రకాశ్ ఇద్దరు దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులకు ఆగంతకులు సమాచారం అందంచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి వెల్లడించారు.