The ruling party
-
పైరవీల కొలువు
♦ వైద్య శాఖ ఉద్యోగాల్లో అధికార పార్టీదే హవా... ♦ కలెక్టర్ ఆదేశాలను తప్పుదారిపట్టిస్తున్న నేతలు ♦ ఒత్తిళ్లకు తలొగ్గి అర్హులను పక్కన పెట్టిన యంత్రాంగం ♦ అనర్హుల కోసం చేతుల మారిన కాసులు సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఏదైనా శాఖ ద్వారా పనులొస్తే తమవారికే అప్పగించాలి. పోస్టుల్లోనూ తమవారినే నియమించాలి. పథకాలు ఏవైనా వస్తే తాము చెప్పినవారికే మంజూరు చేయాలి. ఇదీ ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీ సాగిస్తున్న దందా... వారి పైరవీల వల్ల నిజమైన అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందనడానికి కిల్లాడ అనూరాధ ఉదంతం ఒకఉదాహరణ మాత్రమే. వెలుగులోకి రానివెన్నో ఇలాంటివి ఉన్నాయి. అసలేమైందంటే... ఐటీడీఏ పరిధిలోని వైద్య, ఆరోగ్యశాఖలో 6 స్టాప్నర్సు, 6 ఏఎన్ఎం, నాలుగు ఫార్మసిస్టు, పార్వతీపురంలోని సీమాంక్ సెంటర్లో 2 స్టాఫ్ నర్సు పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11లోగా దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 12న స్క్రూట్నీ, 13న మెరిట్ లిస్టు ప్రకటిస్తామని చెప్పారు. 14న గ్రీవెన్స్ సెల్ అదే రోజున ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని నోటిఫికేషన్లో వివరించారు. కానీ ఈ నెల 14న ఓసారి, 16న మరోసారి అభ్యర్థులు వెళ్లినా అక్కడ మెరిట్ లిస్టు పెట్టలేదు. రోజు లు గడుస్తున్నా తమకు సమాచారం అందకపోవడంతో ఈ నెల 24న డీఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా పోస్టులు భర్తీ చేసేశామని చెప్పారు. మెరిట్లో ముందున్న వారు విషయం తెలిసి అవాక్కయ్యారు. కార్యాలయ సిబ్బందిని అడిగితే దరఖాస్తులందిన తరువాత ప్రభుత్వం కొన్ని నిబంధనలు మార్చి అభ్యర్థులను ఎంపిక చేసిందని చెప్పుకొచ్చారు. పైరవీలకే పెద్దపీట జిల్లాలోని ఏజెన్సీలో పనిచేసేందుకు భర్తీ చేస్తున్న వైద్య శాఖ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా పలువురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల సూచనలు, సిఫార్సు లేఖలతోనే ఈ పోస్టుల ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నా వారికి అందకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులు, కార్యకర్తలు సూచించిన వారికే పోస్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు దరఖాస్తు చేసుకునే ఈ పోస్టులపై కన్నేసి తమ అనుయాయులకు కట్టబెట్టుకున్న నాయకులు వైద్యుల పోస్టుల భర్తీకి మాత్రం కృషి చేయలేకపోవడం విచారకరం. -
దేవరపల్లిలో దౌర్జన్య కాండ
• దళితుల భూముల్లో అధికార పార్టీ దౌర్జన్యం • సాగు భూములను లాగేసుకున్న సర్కారు • పోలీసులను అడ్డుపెట్టి అర్ధరాత్రి తవ్వకాలు • నీరు–చెట్టు పేరుతో నిధుల స్వాహాకు ఎత్తుగడ • జీవనోపాధి కోల్పోయిన దళిత కుటుంబాలు • ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలు • జిల్లా వ్యాప్తంగా 100 మందికిపైగా అరెస్ట్ • బాధితులకు అండగా నిలుస్తామన్న వైఎస్సార్ సీపీ జిల్లాలో అధికార పార్టీ దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరింది. దేవరపల్లి దళిత భూముల్లో దౌర్జన్యకాండ కొనసాగింది. గత ఎన్నికల్లో ఓట్లేయలేదన్న అక్కసుతో దశాబ్దాలుగా సాగు చేసుకొని కడుపు నింపుకుంటున్న భూములు లాగేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి.. అడ్డొచ్చిన వారిని, ఇళ్లలో ఉన్న గ్రామస్తులను సైతం ఈడ్చుకొచ్చి అరెస్టులు చేయించింది. రాత్రికి రాత్రే నీరు–చెట్టు పేరుతో చెరువులను తవ్వేసింది. ఆ భూములపై ఆధారపడి కుటుంబాలు ఇప్పుడు జీవనాధారం కోల్పోయి వీధిన పడ్డాయి. తాము అనుకున్నది సాధించేందుకు అధికార పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తారనడానికి పర్చూరు మండలం దేవరపల్లి ఘటన ఉదాహరణగా నిలిచింది. దళితుల భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించిన విషయంపై ఆరా తీసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ నేతలు దేవరపల్లి వెళ్లేందుకు మరోమారు సిద్ధమయ్యారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/పర్చూరు : పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో 159/1 సర్వే నంబరులో కృష్ణంరాజుకుంట పేరుతో సుమారు 39.37 ఎకరాల చెరువు పారంబోకు భూమి ఉంది. ఈ చెరువు కుంటలో ఆగ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు 60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాయి. 39.37 ఎకరాలకు గాను 22 ఎకరాలను గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి.భూముల్లో 11.37 ఎకరాల్లో గ్రామానికి చెరువు కింద వినియోగించుకుంటున్నారు. దాదాపు ఆరు ఎకరాల భూమిలో ప్రస్తుతం టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్తో పాటు, మరికొందరు ఆక్రమించి స్థిర నివాసం ఉంటున్నారు. కాగా దళితుల స్వాధీనంలో ఉన్న 22 ఎకరాల భూములు చెరువుకు సంబంధించినవే అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు గత మూడేళ్లుగా వాటిని లాక్కునే ప్రయత్నానికి దిగారు. భూములు తమవేనంటూ కోర్టుకెక్కిన దళితులు అధికార పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి దళితుల భూములు లాక్కునేందుకు అధికార పార్టీ మరోమారు సిద్ధమైంది. గురువారం తెల్లవారుజామున నుంచి దేవరపల్లి దళితుల పొలాల్లో జేసీబీలు, ఇటాచ్లు పెట్టి కుంట తవ్వకం ప్రారంభించారు. ఇందుకు భారీగా పోలీస్ బలగాలను రక్షణగా పెట్టుకున్నారు. అంతకు ముందే 40 కుటుంబాల దళితులను పడుకున్న వారిని పడుకున్నట్లే... అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో జెసిబిలు, ఇటాచ్లు పెట్టి దౌర్జన్యంగా నీరు–చెట్టు పథకంలో కుంట తవ్వకం ప్రారంభించారు. గురువారం సాయంత్రం వరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. దళితులకు మద్ధతుగా ఏ ఒక్కరూ దేవరపల్లికి చేరకుండా పోలీసులు అడుగడుగునా కాపు కాశారు. వారికి మద్ధతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుమాని రాజశేఖర్, జజ్జర ఆనందరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సీపీఐ నేత ప్రకాష్, ఐద్వా నేతలు ఆదిలక్ష్మి, రమాదేవిలతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డిలతో పాటు దాదాపు 40 మంది నేతలను పోలీసులు అరెస్ట్లు చేశారు. వీరిని జరుగుమల్లి, నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్లకు తరలించారు. దేవరపల్లికి చేరుకునేందుకు పర్చూరుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర నేత మధును సైతం అక్కడే పోలీసులు అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లావ్యాప్తంగా వందలాది మందిని అరెస్ట్ చేసి నిర్భంధించారు. సాయంత్రం వరకు వారికి వదిలిపెట్టలేదు. మీడియాను సైతం చెరువు తవ్వకం వద్దకు అనుమతించలేదు. ఆర్థిక లబ్ధే ధ్యేయంగా.. మరోవైపు దళితుల భూములను క్రిష్టంరాజుకుంట విస్తరణ పేరుతో నీరు–చెట్టు పథకం ద్వారా చెరువు తవ్వకాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే అనుచరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీరు–చెట్టు పథకం ద్వారా క్రిష్టంరాజుకుంటను ఆధునీకరించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇందుకోసం రూ.6.80 లక్షలు నిధులు మంజూరైనట్లు ఉంది. ఎటువంటి పనులు జరగకుండానే ప్రభుత్వ రికార్డుల్లో పనులు అయిపోయినట్లు చూపించటం చూస్తే ఇప్పటికే ఈ నిధులు స్వాహా చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై మౌన నిద్ర వహిస్తుండటం గమనార్హం. దళితులకు అండగా వైఎస్సార్ సీపీ.. దేవరపల్లి దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వైఎస్సార్సీపీతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం వారికి మద్ధతు పలుకుతున్నారు. అధికార పార్టీ నేతలు దళితుల భూముల్లో జోలికి వెళ్లొద్దని వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దళితుల పక్షాన ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సమస్యను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం తీసుకువచ్చారు. జగన్ సూచనల మేరకు దళితుల పక్షాన పోరుబాట సాగించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. ఈ నెల 16న దళితులకు అండగా దేవరపల్లిని సందర్శించి భూములు పరిశీలించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధంకాగా పోలీసులు ఆంక్షలు విధించారు. 15వ తేదీ అర్థరాత్రే నుంచి ఆయన్ను గృహనిర్భంధం చేశారు. ఆయనతో పాటు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పెద్ద ఎత్తున అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్లలో నిర్భంధించారు. తాజాగా దళితుల భూములను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకొని గురువారం కుంట తవ్వకానికి సిద్ధమైన నేపథ్యంలో దళితుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం దేవరపల్లి దళితులకు మద్ధతు పలకనున్నారు. నోరు మెదపని కలెక్టర్ తాము సాగుచేసుకుంటున్న భూములను అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా లాక్కోవడంతో దళితులు లబోదిబోమంటున్నారు. అధికారులకు మొర పెట్టుకున్నా వినే పరిస్థితి లేకపోవడంతో వారిది అరణ్యరోదనే అయింది. దేవరపల్లి రాష్ట్రస్థాయి వివాదంగా మారినా జిల్లా కలెక్టర్ మాత్రం నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు!
►‘రైతురథం’ కింద జిల్లాకు 520 సబ్సిడీ ట్రాక్టర్లు ►మండలానికి 6–10 వరకు కేటాయించే అవకాశం ►దందాకు తెరలేపిన అధికార పార్టీ నేతల అనుచరులు ►మార్గదర్శకాలు రాకనే పైరవీలు కర్నూలు : రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీకి ఉద్దేశించిన ‘రైతురథం’ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లకు బ్రహ్మరథంగా మారుతోంది. తాము చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇవ్వాలంటూ ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. వారి అనుచరులు ఒకడుగు ముందుకేసి.. ట్రాక్టర్లు ఇచ్చేది తమ వారికేనంటూ మండలాల వారీగా జాబితాలు తయారుచేసే పనిలో పడ్డారు. ఇదే అదనుగా ట్రాక్టర్లు ఇప్పిస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు 520 ట్రాక్టర్లు వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. జిల్లాలో 54 మండలాలను లెక్కిస్తే ఒక్కో మండలానికి 6 నుంచి 10 ట్రాక్టర్లు వచ్చే అవకాశముంది. వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పోటీ ప్రారంభమయ్యింది. దీన్ని అదనుగా చూసుకుని కొద్ది మంది అమ్యామ్యాలకు తెరలేపారు. దీనికితోడు జిల్లాలో మొత్తం అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సిద్ధం చేయనుండడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు దక్కేది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్చార్జ్ మంత్రికే అధికారాలు! రైతురథం పథకం కింద ట్రాక్టర్తో పాటు వ్యవసాయ పనిముట్లకు ఒక్కో దానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)తో కలిసి తయారుచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో నియోజకవర్గాల వారీగా జాబితాల తయారీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు చేపడుతున్నారు. ఇదే అదనుగా కొద్ది మంది వారి అనుచరులు కమీషన్లకు తెరలేపారు. మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి... మీకు ట్రాక్టర్ ఇప్పిస్తామని ఆశలు రేపుతున్నారు. మరికొంత మంది అధికార పార్టీ నేతలు బినామీ పేర్లతో దరఖాస్తు చేయించేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాక్టర్ల పంపిణీకి ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలు రాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని ట్రాక్టర్లు కేటాయించిన విషయమూ ఇంకా తమకు తెలియలేదని అంటున్నారు. ఇవీ నిబంధనలు = రైతురథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీస రెండెకరాల పొలం ఉండాలి. = అప్పటికే సబ్సిడీ కింద ట్రాక్టర్లను తీసుకుని ఉండరాదు. = దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే ట్రాక్టర్ ఉంటే అనర్హుడు. = ఆధార్, పాస్బుక్లను చూపించి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి. = దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. = వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు. ఇన్చార్జ్ మంత్రి, జేడీఏ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇన్చార్జ్ మంత్రి కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు చెప్పిన వారినే ఎంపిక చేసే అవకాశముంది. -
పెద్దల్ని తప్పించారు
⇒అటవీ భూముల స్వాహాలో అధికార పార్టీ నేతల బినామీ బాగోతం ⇒ఏడాదిపాటు సాగిన సుదీర్ఘ విచారణ ⇒తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలపై వేటు నెల్లూరు : పెద్దలే గద్దలయ్యారు. 545 ఎకరాల అటవీ భూముని స్వాహా చేశారు. పాత రికార్డులను సేకరించి.. తప్పుడు పత్రాలను సృష్టించి.. బినామీల పేరుతో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు చేయించేశారు. ఏడాది క్రితం వరకు పదవిలో ఉన్న చిత్తూరు జిల్లా అమాత్యులు, జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి అటవీ భూమిని కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారుల్ని వదిలేసిన ప్రభుత్వం పాత్రధారులైన రెవెన్యూ ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. జిల్లాలో కీలక అంశంగా మారిన ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు ఆందోళనలు చేసినా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. సర్వే నంబర్ మార్చేసి.. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలోని సర్వే నంబర్ 43/1లో 1,988.81 ఎకరాల అటవీ భూమి ఉంది. దీనిని రీసర్వే చేసి సర్వే నంబర్ 43/1ను 75/2 నంబర్గా మార్చా రు. ఫెయిర్ అడంగల్లోనూ భూమి వివరాలు నమోదు చేసి.. అటవీ పోరంబోకుగా రికార్డుల్లో చూపారు. ఆ తర్వాత 2014లో జారీ చేసిన జిల్లా నూతన గెజిట్లో భూమి వివరాలను మార్చేశారు. 1,988 ఎకరాలకు బదులుగా 1,329 ఎకరాలు మాత్రమే అటవీ భూమి ఉన్నట్టు చూపించారు. మిగిలిన 659.60 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్టు గాని.. ఇతర వివరాలేవీ రికార్డుల్లో నమోదు చేయలేదు. అందులో 549 ఎకరాలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధి కన్నుపడింది. వేగంగా పావులు కదిపాడు. వెంటనే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, ఆయన కుమారుడి సహకారంతో పక్కా ప్రణాళిక రచించి అమలు పరిచాడు. ఈ క్రమంలో 1915లోని ఇనాం భూముల రికార్డులు, ఇనాం చట్టంలోని లొసుగులు, ఇతర అంశాలను ఆసరాగా చేసుకుని అక్కడ ఆక్రమంగా సాగు చేస్తున్న వారి నుంచి భూములు కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించాడు. వెంటనే 2015లో భూమిని స్వాధీనపర్చుకోవటానికి వీలుగా రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తి చేశాడు. వాస్తవానికి ఆ భూములను రాపూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండగా, తనకు పరపతి ఉన్న వెంకటగిరి సబ్రిజి స్ట్రార్ కార్యాలయంలో 16 మంది బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి బినా మీల పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. దళిత, గిరిజన సంఘాలు లోకాయుక్తకు ఫిర్యాదు చేయటంతో జిల్లా అధికారులు స్పందించి 2016లో విచారణకు తెర తీశారు. వాస్తవానికి అటవీ భూమి కావటంతో భూమి విలువ అతి తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూమిని భూబదలాయింపు కోసం వినియోగించుకుని.. రూ.కోట్లు విలువ చేసే భూమి దక్కించుకోవచ్చు. అలాగే పట్టాదార్ పాస్బుక్స్పై బ్యాంకుల్లో పంట, ఇతర రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏడాదిగా విచారణ ఈ భూముల వ్యవహారంపై నెల్లూరు జెడ్పీ సీఈఓ రామిరెడ్డి 2016లో విచారణ ప్రారంభించారు. ఆయన ఏసీబీకి పట్టుపడిన అనంతరం గూడూరు ఆర్డీఓ అరుణ్బాబు విచారణ నిర్వహించారు. చివరగా ఈనెల 3న ఆర్డీఓ విచారణ జరిపి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని కలెక్టర్కు నివేదిక అందజేశారు. గతంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్ సు«ధాకర్, ఆర్ఐ శరత్, వీఆర్వోలు అంకయ్య, ప్రభాకర్రెడ్డిని సస్పెండ్ చేసి కథ ముగించారు. -
కార్డుందా.. రైట్ రైట్
జోరుగా ఇసుక అక్రమ రవాణా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారగణం చక్రం తిప్పుతున్న అధికారపార్టీ నేత ఇసుక రవాణా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇసుక రీచ్ల నిర్వహణను రద్దు చేసి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లాలని తీసుకున్న నిర్ణయం అధికారపార్టీ వారికి కాసులు కురిపిస్తోంది. ఇది వారి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు నిత్యం లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. సోమశిల(ఆత్మకూరు): కార్డుల పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అటు పోలీసు అధికారులు, ఇటు రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అనంతసాగరం మండల పరిధిలో రెండు ఇసుకరీచ్లు ఉన్నాయి. అందులో ఒకటి పీకేపాడు కాగా, రెండోది లింగంగుంట ఇసుక రీచ్. లింగంగుంట ఇసుక రీచ్లో గ్రామస్తులు అడ్డుకోవడంతో ప్రస్తుతం రవాణా సాగడం లేదు. మండలంలోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం, బెస్తవారిపేట, కంభం తదితర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది. రోజూ 150 నుంచి 200 ట్రాక్టర్లలో ఇసుక బద్వేల్ వరకు తరలుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇసుక రవాణా మొత్తం అక్రమంగానే సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధించిన నిబంధనల కన్నా ఇసుకను అధికంగా లోడ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. రోజూ వేలాది రూపాయలు దండుకొంటున్నారు. స్థానిక రెవెన్యూ, రవాణా ఇతర శాఖలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. ట్రాక్టర్లకు నెల కార్డులు ఈ ప్రాంతంలో ఇసుక రవాణాకు సంబంధించి ఒక్కో ట్రాక్టరుకు నెలకు రూ.2000 చెల్లించాలనే అక్రమ నిబంధన నెల కార్డుల పేరుతో ఉండడంతో ట్రాక్టర్ల డ్రైవర్లు సైతం అధికంగా ఇసుకను అక్రమంగా లోడ్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇసుక రవాణా చేసేందుకు పత్రాలు సక్రమంగా ఉన్నా లేకపోయినా ఆత్మకూరు రవాణా శాఖ అధికారికి రూ.1500, మర్రిపాడు పోలీసులకు రూ.2000, వైఎస్సార్ జిల్లా బద్వేల్ పోలీసులకు రూ.2500, రవాణా శాఖ వారికి రూ.1500, పోరుమామిళ్ల పోలీసులకు రూ.1500 నెల కార్డులకు సమర్పించుకుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకునే వారు ఉండరని సమాచారం. చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తన అనుచరగణానికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపకుంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. అక్రమ రవాణాపై చర్యలు చేపడతాం పీకే పాడు ఇసుక రీచ్ నుంచి అధిక లోడుతో ఇసుక తరలుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దానిపై దృష్టి సారించి చర్యలు చేపడతాం. ఎంసీ కృష్ణమ్మ, తహసీల్దార్, అనంతసాగరం -
ఎంత దారుణం
రుణాల మంజూరులో రాజకీయ ప్రమేయం చెప్పిన వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ నాయకుల హుకుం ఎమ్మెల్యేలనుంచి చోటా నాయకుల దాకా ఒత్తిళ్లు నిజమైన లబ్ధిదారులకు మొండిచెయ్యే! దిక్కుతోచని స్థితిలో అధికారులు అధికారంతో పనిలేకుండా అందరినీ సమానంగా చూడాల్సిన ప్రజాప్రతినిధులు వివక్ష పాటిస్తున్నారు. తాము చెప్పిన లబ్ధిదారులకే రుణాలు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అర్హులను పక్కనబెట్టి తమ కార్యకర్తలకే రుణాలు మంజూరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో తేడావస్తే సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువకావడంతో అధికారపార్టీ నాయకులు రంగంలోకి దిగారు. తాము ఎవరికి చెబితే వారికే రుణాలు మంజూరు చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టార్గెట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 4,142 యూనిట్లను టార్గెట్గా విధించింది. వీటికి 25,128 దరఖాస్తులు అందాయి. ఒక్కో యూనిట్కు సగటున ఆరుగురు పోటీపడ్డారు. ఎస్టీ కార్పొరేషన్కు 265 యూనిట్లకుగాను 6,002 దరఖాస్తులు వచ్చాయి. బీసీ రుణాలకు 1,662 యూనిట్లు కేటాయించగా 25,714 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు రుణాలకు 2,916 యూనిట్లు కేటాయించగా 13,834 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికార ముద్ర పడాల్సిందే రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైంది. మొదట జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించి సంబంధిత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి జెడ్పీ చైర్పర్సన్కు సిఫార్సు చేస్తున్నారు. ఆపై తాము రూపొందించిన రహస్య నివేదికలను అధికారులకు చేరవేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో పలుచోట్ల అధికార పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికి ఇస్తే మరో వర్గం అధికారులపై ఒత్తిడి పెంచుతోంది. నిబంధనలు తూచ్ ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదు. గ్రామసభల సమక్షంలో జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధు లు, డ్వాక్రా సంఘాల మహిళల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రహస్యంగా పంపిన నివేదికల ఆధారంగా అధికారులు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోంది. హెచ్చరికలు ‘‘మేం చెప్పిన అభ్యర్థులకే రుణాలు మంజూరు చేయాలి.. లేదంటే మీ అంతు చూస్తాం’’ అంటూ కొందరు అధికారపార్టీ నేతలు అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చేసేది లేక నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి, అనర్హులకు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోందని పలువురు మదనపడుతున్నారు. -
జన్మభూమిని.. మమ అనిపించారు
ఆందోళనలు, నిరసనల మధ్యముగిసిన జన్మభూమి ప్రశ్నించిన వారిపై బెదిరింపులు నిరాశపరచిన గ్రామసభలు చిత్తూరు (కలెక్టరేట్):జిల్లాలో చేపట్టిన నాలుగో విడత జన్మభూమి – మా ఊరు గ్రామసభలు ప్రజల ఆందోళనలు, నిరసనల మధ్య తూతూమంత్రంగా ముగిశాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతంత మాత్రంగానే గ్రామ సభలకు హాజరవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలే తెలియక ప్రజలు నిరాశ చెందారు.జన్మభూమి – మా ఊరు గ్రామసభలను ఈ నెల 2వ తేదీ నుంచి 11వ వరకు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రధానంగా కుటుంబ, సామాజిక వికాసమే లక్ష్యంగా చేపట్టాలని, గ్రామ సభలన్నింటినీ పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలిరోజు నుంచే గ్రామ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు లబ్ధిదారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. గతంలో జరిగిన మూడు జన్మభూముల్లో ఇచ్చిన సమస్యలే పరష్కారం కాలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జన్మభూమితో కూడా ఒరిగేది ఏముందిలే అని సామాన్య ప్రజలతోపాటు, అధికార పార్టీ కార్యకర్తలు కూడా పెదవి విరిచారు. పలుచోట్ల జన్మభూమి గ్రామసభలను అడ్డుకోవడంతో అధికారులు సభలను నిర్వహించలేక, పోలీసుల సహకారాన్ని తీసుకుని, అర్ధాంతరంగా ముగించారు. గ్రామసభల్లో ఎలాంటి హామీలు ఇవ్వకపోగా అధికార పార్టీల నాయకుల ఊకదంపుడు ప్రసంగాలతోనే సమయం కరిగిపోయిందనే విమర్శలు వచ్చాయి. టీడీపీ కార్యకర్తల నుంచే నిరసన జన్మభూమి గ్రామసభల్లో అధికార పార్టీ కార్యకర్తల నుంచే పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తొలిరోజు టీడీపీ ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే సభలను ఏర్పాటు చేసినా.. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. దీంతో చాలాచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గ్రామసభలకు డుమ్మాకొట్టారు. కేవలం కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతోనే గ్రామసభలను నిర్వహించి చేతులు దులుపుకున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో అధికారులు సభలను నిర్వహించలేక ఇబ్బందు లు పడిన సంఘటనలు ఉన్నాయి. రసీదులు లేవ్ .. ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలకు ప్రతీకగా అధికారులు రశీదులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ దఫా జన్మభూమి గ్రామసభల్లో ఎక్కడా అర్జీలకు రశీదులు ఇచ్చిన దాఖలాలు లేవు. లక్ష అర్జీలు.. జిల్లావ్యాప్తంగా నాలుగో విడత జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై లక్షకు పైగా అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను అధికారులు రోజువారీగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఇసుక దందా
అదే అధికార పార్టీ నేతల పంథా నదీ పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చోడవరం ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఇసుక రవాణా బెల్లం పెనాల్లో నది నుంచి ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్న ఇసుకాసురులు నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు.. అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు, శిక్షలు వేసినా ఆగని దందాలు.. ఇసుక మాఫియా ఎక్కడా తగ్గడంలేదు.. దీనికి కారణం కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. జిల్లాలో మేజర్ శారద, మైనర్ శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, తాండవ నదులు ప్రధానంగా ఉన్నాయి. అనుమతి లేకుండా ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇసుక రీచ్లను అక్రమంగా ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. చోడవరం :ఇసుకాసులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చోడవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, మాడుగుల, అనకాపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి, కశింకోట మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ఈ ఇసుక మాఫియాకు పరోక్షంగా అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, దేవరాపల్లి మండలాల్లో ఇసుక రీచ్లపై అధికారులు దాడులు చేయడం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిడి చేసి వారిని విడిపించుకెళ్లడం పరిపాటిగా జరుగుతుంది. ఇటీవల చోడవరం వ ముద్దుర్తి, గవరవరం, జుత్తాడ, గజపతినగరం, గౌరీపట్నం, లక్ష్మీపురం కల్లాలు, బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట రీచ్లలో వందలాది క్యుబిక్ మీటర్ల ఇసుకను అధికారులు పట్టుకున్నారు. వీటిలో బుచ్చెయ్యపేట మండలంలో పట్టుకున్న కొన్ని లారీలను స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేర అధికారులు వదిలేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద మేజర్ శారదనదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడే గతంతో అధికారులు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న బెల్లం పెనాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. అయినా ఈ రేవు వద్ద మళ్లీ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న రేవులో పూర్తిగా ఇసుక తవ్వేసి లోతు చేశారు ఇసుకాసురులు. జిల్లాలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయం, స్నానాల రేవు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ఇసుక తవ్వకాల వల్ల ఈ పవిత్ర స్నానఘట్టం కూడా నది నీటిలో తెలియని భారీ గోతులుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బెల్లం పెనాల్లో ఇసుక తరలింపు అన్ని చోట్ల నదుల్లో జేసీబీలు, ఇతరత్ర రూపాల్లో ఇసుకను తవ్వేసి ఒడ్డుకు చేరుస్తుంటే ఇక్కడ మాత్రం బెల్లం తయారుచేసే పెద్దపెద్ద పెనాల్లో ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. ఆలయం ఒడ్డు నుంచి నది అవతల ఒడ్డు, మధ్యలో ఉన్న ఇసుక మేట్లను తవ్వి పెనంలో వేసి ఈదుతూ ఇవతల ఒడ్డుకు తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. ఇక్కడ నుంచి లారీలు, యడ్ల బళ్లపై ఇతర ప్రాంతాలకు తరలించి రూ.లక్షల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్, పోలీసులు పంచాయతీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కూడా ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగానే రోజూ పెద్దసంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తున్నా వీఆర్ఓలు పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రజలు అంటున్నారు. ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం సంగమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఇసుక తవ్వకాలపై ఇప్పటికే దాడులు చేశాం. మళ్లీ ఈ రేవుతోపాటు మిగతా రీచ్లపై కూడా దాడులు చేస్తాం. కొత్త నిబంధనల ప్రకారం దొరికిన లారీకి రూ.లక్షకు పైగా జరిమానా, రెండేళ్లు జైలు కూడా పడుతుంది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం. వెంటనే తవ్వకాలు ఆపకపోతే కేసులు నమోదు చేస్తాం. –రామారావు, తహసీల్దార్, చోడవరం -
కార్యదర్శి స్వాహాకారం
► సభ్యులకు ఇవ్వాల్సిన ప్లాట్లు సొంతవారికి ధారాదత్తం.. ► మరికొన్ని ఇతరులకు అక్రమంగా విక్రయం ► రు.5 కోట్ల విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతం ► ఆ ప్లాట్లలోనే అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మకం ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీలో స్వాహాకాండ ► అరెస్టరుునా ఆగని దందా.. అధికార పార్టీ నేతల అండ ► విచారణ పేరుతో సాగదీస్తున్న అధికారులు కబ్జాకు కాదేదీ అనర్హం అంటున్నారు కొందరు ప్రబుద్ధులు.. అనడమేంటి.. ఆచరణలోనూ చూపిస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా.. సొసైటీ పాలక పెద్దలే ప్లాట్లను అన్యాక్రాంతం చేసి.. ఎడాపెడా స్వార్జనకు పాల్పడుతున్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత కుటుంబ సభ్యులకు గిఫ్ట్.. అన్న ముద్దు పేరుతో రెండేసి ప్లాట్లు ధారాదత్తం చేసేశారు. ఆనక వాటిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఎంచక్కా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు నగర శివారులోని పీఎంపాలెం పరిధిలో ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సొసైటీ నిలయంగా మారింది. కోట్ల విలువైన ఈ స్వాహాకాండ గురించి వింటే ఎవరైనా ఔరా.. అనక మానరు. విశాఖపట్నం: ఫొటోలో ఈ అపార్టుమెంట్ చూశారుగా.. నగరంలో సొసైటీల స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. సెంట్రల్ ఎకై ్సజ్ అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సోసైటీ(నెం.1561) 1971లో సహకార సంఘంగా రిజిస్టర్ ్రఅరుు్యంది. మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) 5వ వార్డు పరిధిలోకి వచ్చే పీఎంపాలెంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని సర్వే నెం.359, 360లలో చెరో 10 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి చాణక్యపురి లే అవుట్గా అభివృద్ధి చేసి సొసైటీ సభ్యులకు ఒక్కొక్కరికి 267 గజాలు చొప్పున సర్వే నెం.359లో 107, సర్వే నెం.360లో 102 ప్లాట్లు కేటారుుంచారు. అదే విధంగా నగరపాలెంలోని అయోధ్యనగర్లోని సర్వే నెం.63లో 15, సర్వే నెం.2లో 72 ప్లాట్లు కూడా ఇచ్చారు. అక్కడి వరకు అంతా సజావుగానే సాగినా.. ప్లాట్ల విభజన తర్వాతే అసలు కథ మొదలైంది. ఇష్టారాజ్యంగా తనవారికి కేటారుుంపులు సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన డబ్బీరు గౌరీశంకరరావు అనే వ్యక్తి కోట్ల రూపాయల విలువైన సొసైటీ ప్లాట్లను సభ్యులకు తెలియకుండా తెగనమ్ము కున్నాడు. అక్కడితో ఆగకుండా సొసైటీ సభ్యులకే కేటారుుంచాల్సిన సర్వే నెం.359లో 94, 95.. సర్వే నెం. 360లో 24, 25, 26, 27 ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులకు గిఫ్టుల పేరుతో కట్టబెట్టేశాడు. మరో రెండు ప్లాట్లను మైనర్లకు అమ్మేశాడు. ఇలా సుమారు రు.ఐదు కోట్లు విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతమయ్యారుు. ఈ ప్లాట్లలోనే ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నారుు. ఇక సర్వే నెం.2లోని 79 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో సభ్యులకు కూడా తెలియని పరిస్థితి.రిటైరైన తర్వాత ఇల్లు కట్టుకుని శేష జీవితం హారుుగా గడుపుతామనుకున్న పలువురు సొసైటీ సభ్యులు తమ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పదవి నుంచి తొలగించినా.. సొసైటీ అస్తులకు కస్టోడియన్గా వ్యవహరించాల్సిన కార్యదర్శే తమ స్థలాలను అమ్ముకున్నాడని.. సొంతవారికి కట్టబెట్టేశాడని ఆలస్యంగా గుర్తించిన సొసైటీ సభ్యులు అవాక్కయ్యారు. తర్వాత తేరుకొని కార్యదర్శిని తొలగిస్తూ సొసైటీ సమావేశంలో తీర్మానం చేశారు. అరుుతే సొసైటీ తన చేతుల్లో ఉందని, తనను తొలగించే అధికారం సభ్యులకు లేదని గౌరీ శంకరరావు తేల్చిచెప్పడంతో అతనిపై న్యాయపోరాటానికి సభ్యులందరూ సిద్ధమయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ హౌస్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడ్డారు. ఉన్నతాధికారుల దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. బైలాకు వ్యతిరేకంగా స్థలాల కేటారుుంపులు జరిపినట్లు విచారణలో సహకార శాఖాధికారులు గుర్తించారు. ఈ కేటారుుంపులు అక్రమమేనని కో-ఆపరేటివ్ సోసైటీ ‘51 ఎంకై ్వరీ రిపోర్టు ప్రకారం’ నిర్థారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గౌరీశంకరరావును అరెస్ట్ కూడా చేశారు. అధికార పార్టీ నేతల అండ మరోవైపు జైలుకు వెళ్లిన వ్యక్తి కార్యదర్శిగా కొనసాగటం చెల్లదంటూ సహకార శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆదేశాలిచ్చారు. అరుునా పట్టించుకోని గౌరీశంకరరావు అధికార పార్టీ నేతల అండదండలతో ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి సాగదీస్తున్నాడని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరికి కోర్టు తప్పుబట్టినా..సహకార శాఖాధికారులు కాదు పొమ్మన్నా సరే పట్టించుకోకుండా సొసైటీకి చెందిన ప్లాట్లలో అక్రమ నిర్మాణాలు సాగిస్తూ అమ్మేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఆదేశించాం దీనిపై సహకార శాఖ జారుుంట్ రిజి్ట్రార్ గౌరీశంకర్ను వివరణ కోరగా. ఇటీవలే కొంతమంది సొసైటీ సభ్యులు తమకు మరోసారి ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారంపై విచారణ జరపమని జిల్లా రిజి్ట్రార్ను ఆదేశించామన్నారు. జిల్లా రిజి్ట్రార్ సన్యాసినాయుడ్ని వివరణ కోరగా, ప్లాట్ల అన్యాక్రాంతం..అక్రమ నిర్మాణం వ్యవహారం కోర్టులో ఉందన్నారు. కాగా కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాలని కార్యదర్శి వ్యతిరేక వర్గీయులు తమను కోరారని.. త్వరలోనే ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా గిఫ్టులు డబ్బీరు గౌరిశంకరరావు అనే వ్యక్తి ఈ సొసైటీకి కార్యదర్శిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా తన తమ్ముడి కుమారునికి, తన కూతురికి రెండేసి ప్లాట్లు గిప్ట్గా ఇచ్చారు. ఇలా ఇవ్వడం చెల్లదని సహకార శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. పైగా మరో రెండు ప్లాట్లు మైనర్లకు గిప్ట్ ఇచ్చారు.. అదీ చెల్లదు. వీటన్నిటిలో అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముకుంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. - డి.సత్యనారాయణ, రిటైర్డ్ ఏడీఈ, విద్యుత్ శాఖ సొసైటీ సభ్యుడు -
అటవీ అధికారుల అదుపులో 20 మంది తమిళ కూలీలు
మైదుకూరు(చాపాడు): మైదుకూరు మండలం జాండ్లవరం వద్ద గల లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడు ప్రాంతానికి చెందిన ఎర్రచందనం కూలీలను మంగళవారం రాత్రి ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా లంకమల అడవుల్లో ఎర్రచందనం నరుకుతూ ఉన్న తమిళ కూలీలు మంగళవారం జాండ్లవరం గ్రామానికి చెందిన బడా స్మగ్లర్, అధికార పార్టీ నాయకుడిని సంప్రదించేందుకు వస్తుండగా బీట్లో ఉన్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ సిబ్బంది గమనించి వారిని వెంటాడి పట్టుకున్నట్లు తెలిసింది. తమిళ కూలీలు పట్టుబడిన విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకుడైన బడా స్మగ్లర్ వారిని విడిపించేందు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో తాను అధికార పార్టీ అండ ఉన్న వ్యక్తినని, నియోజకవర్గంలో కీలకమైన నాయకుడినని, కూలీలను వదలకపోతే మీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఓ ఫారెస్ట్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. కాగా, జాండ్లవరం పరిధిలో తమిళ కూలీలు పట్టుబడగా.. ఫారెస్ట్ అధికారులు మాత్రం అక్కడ కాదని, ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాలు వద్ద తమిళ కూలీలు దొరికారని చెబుతున్నారు. జాండ్లవరం వద్ద దొరికినట్లు చెబితే ఆ ప్రాంతానికి చెందిన బడా డాన్తో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఫారెస్ట్ సిబ్బంది ఇలా మాట మారుస్తున్నారని, జాండ్లవరం ప్రాంతానికి చెందిన వారు చర్చించుకుంటున్నారు. 20 మంది తమిళ కూలీలు దొరికారుః డీఎఫ్ఓ శివశంకర్ లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను పట్టుకున్నాము. వీరందరూ ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాల వద్ద అడవిలో నుంచి బయటకి వస్తుండగా తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు, అని డీఎఫ్ఓ శివశంకర్ తెలిపారు. -
డైట్ బిల్లుల స్వాహా
ఫోర్జరీ సంతకాలతో లక్షలు కాజేసిన కాంట్రాక్టర్ ఏరియా ఆసుపత్రిలో వెలుగుచూసిన వైనం మల్లగుల్లాలు పడుతున్న వైద్య సిబ్బంది ప్రజా సంక్షేమం కోసం తలపెట్టిన ఉపాధి హామీ.. సీసీరోడ్లు, నీరు-చెట్టు పనుల్లో అధికార పార్టీకి చెందిన అనుయాయులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆఖరికి పేద రోగుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇస్తున్న డైట్ నిధులను సైతం వదలటం లేదు. ఏరియా ఆసుపత్రిలో లక్షల్లో డైట్ నిధుల స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇలాకాలోనే రోగుల సొమ్ము కాజేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. నర్సీపట్నం: అధికారుల ఫోర్జరీ సంతకాలతో స్థానిక ఏరియా ఆస్పత్రి కాంట్రాక్టర్ సుమారు 10 లక్షల రూపాయలు కాజేసిన వైనం వెలుగుచూసింది. గత ఎన్నికల్లో టీడీపీకి విధేయులుగా పనిచేసిన వారిలో కొంత మందికి ఆసుపత్రిలో ఏఎన్ఎంలు, సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పించారు. అప్పటి డైట్ కాంట్రాక్టర్ను అర్ధంతరంగా తొలగించి పార్టీకి విధేయుడుగా ఉన్న ఒక వ్యక్తికి బినామీ కాంట్రాక్టర్గా అవకాశం కల్పించా రు. వైద్య సిబ్బందిని ప్రలోభ పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫోర్జరీ సంతకాలు చేసేందుకు కూడా వెనకాడలేదు. డైట్ పర్యవేక్షకురాలిగా ఆసుపత్రి హెడ్నర్సు పద్మ వ్యవహరిస్తున్నారు. ఆమె ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు భోజనం తయారు చేసి వడ్డించాలి. బిల్లుల చెల్లింపునకు వచ్చేసరికి హెడ్నర్సుతో పాటు ఆర్ఎంవో సుధా శారద, గుమస్తా ధ్రువీకరించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డైట్ కాంట్రాక్టర్కు బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే పర్యవేక్షకురాలు పద్మ సంతకం ఫోర్జరీ చేసి, మిగిలిన ఇద్దరు చేత సంతకాలు పెట్టించి సూపరింటెండెంట్కు బిల్లులు సమర్పిస్తున్నారు. పర్యవేక్షకురాలు ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు కాంట్రాక్టర్ భోజనం పెడుతున్నాడు. ఉన్నవారి కంటే ఆదనంగా రోగుల సంఖ్యను చూపించి అధిక మొత్తంలో డైట్ బిల్లులు మారుస్తుండటంపై అనుమానం వచ్చి హెడ్నర్సు పద్మ డైట్ షీట్లను పరిశీలించారు. ఈ షీట్లలో సంతకాలు తనవి కావని, తన దగ్గర ఉన్న రోగుల హాజరుకు, ఫోర్జరీ సంతకాలతో ఉన్న హాజరుకు చాలా వ్యత్యాసం ఉందని సూపరింటెం డెంట్ హెచ్.వి.దొర దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రోగులకు సంబంధించిన డైట్ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్య కంటే ఆదనంగా బిల్లు మార్చినట్టు సూపరింటెండెంట్ నిర్ధారణకు వచ్చారు. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ స్వాహా పర్వంలో సుమారు రూ.10 లక్షల వరకు కాంట్రాక్టర్ కాజేసినట్లు ఆసుపత్రి అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. సంతకాల ఫోర్జరీ వాస్తవమే డైట్ బిల్లుల్లో ఫోర్జరీ సంతకాలు జరిగిన సంగతి వాస్తవమేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ దొర స్పష్టంచేశారు. సంబంధిత కాంట్రాక్టర్ నుండి స్వాహా చేసిన నిధులు రికవరీ చేస్తామని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. చర్యలకు వైఎస్సార్సీపీ డిమాండ్ రోగుల పేరిట నిధులు స్వాహా చేసిన సంబంధిత కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, పార్టీ నాయకులు పెదిరెడ్ల నాగేశ్వరరావు, గుడబండి నాగేశ్వరరావు తదితరులు సూపరింటెండెంట్ దొరకు మెమొరాండం అందజేశారు. రోగుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించటం దారుణమని పేర్కొన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల అండతోనే ఇష్టారాజ్యంగా బిల్లులు చేసుకుని స్వాహా చేశారని ఆరోపించారు. నిధుల స్వాహాపై జిల్లా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధులు రాబట్టడమే కాకుండా ఫోర్జరీ సంతకాలకు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పేరుకు ఉచితం.. దోపిడీ యథాతథం
అధికారపార్టీ అనుచరుల గుప్పెట్లో ఇసుక రీచ్లు నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలింపు శాఖల మధ్య సమన్వలోపం నర్సీపట్నం: ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అమలులోకి తీసుకురావడంతో ఇక అందరికీ ఇసుక లభిస్తుందని ప్రజలు ఆశించారు. కాని అధికారపార్టీ అనుచరులు ఇసుక రీచ్లను వారి గుప్పెట్లో పెట్టుకుని యథేచ్ఛగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. అనుమతులు రద్దు చేసిన రీచ్ల్లో కూడా అధికార బలంతో తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక రీచ్ల వలన సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు. ఎప్పట్లాగే ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేలు పెట్టి ఇసుక కొనుగోలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు భయపడి అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖలు ఎవరికి వారే యమునాతీరే చందంగా వ్యవహరిస్తుండడంతో ట్రాక్టర్లలో ఇసుక తరలించే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పాలసీ మారినా..: కొద్దికాలం క్రితం వరకు ఇసుక కష్టాలు అందరినీ వెంటాడాయి. వేలకు వేలు వచ్చించి రోజల తరబడి వేచి చూస్తేగాని లభించడం గగనంగా మారింది. డ్వాక్రా సంఘాల పేరిట కొందరు ఇసుక అమ్మకాలతో భారీగా వెనకేసుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవచ్చని అదేశాలిచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్ల్లోనే తవ్వకాలు చేయాలని పేర్కొంది. దీంతో ఇసుక లభించడం సులభతరమైనా సామాన్యులు మాత్రం సొమ్ము వెచ్చించక తప్పడం లేదు. ట్రాక్టర్ల యజమానులు సమీపంలో రీచ్ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక త వ్వి తరలిస్తున్నారు. మూసేసిన రీచ్లోనూ తవ్వకాలు : రెవెన్యూ విడిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం నారాయణరాజుపేట ఇసుక రీచ్, కోటవురట్ల మండలంలో పందూరు, గొట్టివేడ, చౌడువాడ, కైలాసపట్నం, గొలుగొండ మండలం తాండవ జలాశయం పరిధిలోని ఇసుక రీచ్ల్లో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చే సమయానికి నారాయణరాజుపేట ఇసుక రీచ్ ఖాళీ అయింది. పరిసర ప్రాంతాల్లోని తాగునీటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నారాయణరాజుపేట రీచ్ అనుమతులను రద్దు చేశారు. అయినప్పటికీ అధికార పలుకుబడితో కొందరు నేటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మిగిలిన కీలకమైన రీచ్ల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. రీచ్లో నిత్యం వందలాది ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి. ఆయా రీచ్ల్లో ఎవరూ ప్రశ్నించేవారు లేకపోవడంతో ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపేస్తున్నారు. రీచ్లోకి ట్రాక్టర్ ప్రవేశించగానే ఎక్కడ ఇసుక ఉంటే అక్కడే తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక మీటరు మించి ఎక్కువ లోతులో తవ్వకాలు జరపకూడదు. అలా చేస్తే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుంది. అయినా సరే ఏవీ పట్టించుకోవడం లేదు. రీచ్లకు ఏర్పాటు చేసిన హద్దులను సైతం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ఉచిత ఇసుకపై అటు గనులశాఖ, ఇటు రెవెన్యూ, పోలీసు శాఖలు ఏవీ పెద్దగా పట్టించుకోవటం లేదు. రీచ్ల్లో తవ్వకాలను పర్యవేక్షించటం లేదు. రహదారులపై వెళ్లే వాహనాలను మాత్రమే ఆపి విచారించి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అనుమతి లేకుండా తవ్వితే చర్యలు.. ఆర్డీవో ఈ విషయమై ఆర్డీవో కె.సూర్యారావును వివరణ కోరగా అనుమతులు లేని రీచ్ల్లో తవ్వకాలు జరిపితే తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనుమతులు లేని రీచ్ల్లో తవ్వకాలు జరిపితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘ఇంకుడు’ దోపిడీ
ఇంకుడు గుంతలనూ వదలని తెలుగు తమ్ముళ్లు 90 శాతం గుంతలు టీడీపీ కార్యకర్తలకే రూ.18 కోట్లు అధికారపార్టీ నేతల జేబుల్లోకి? చిత్తూరు: జిల్లాలో భూగర్భజలాల పెంపు కోసం కేంద్రప్రభుత్వం చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమం టీడీపీ నేతల జేబులు నింపుతోంది. లబ్ధిదారుడికి గుంత తవ్వుకునే అవకాశం మాత్రమే ఇచ్చి.. గుంతకు కావాల్సిన సామాగ్రి మొత్తం టీడీపీ నాయకులే సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియతో గుంతలకు కేటాయిస్తున్న నిధుల్లో 90 శాతం అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలకే వెళ్తోంది. నీరుగారుతున్న లక్ష్యం.. కరువు పరిస్థితుల్లో కూడా ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడకుండా ఉండటమే ఇంకుడుగుంతల ఏర్పాటు ముఖ్య లక్ష్యం. అయితే జిల్లాలో అధికారపార్టీ నాయకుల ఆధిపత్యంతో ఈ పథకం ఉద్దేశ్యం పూర్తిగా నీరుగారుతోంది. టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ శాతం ఇంకుడు గుంతలను కేటాయించడంతో నిర్దేశిం చిన లక్ష్యం కూడా చేరలేదు. ఈ ఇంకుడుగుంత లు నింపడంలో కూడా పచ్చ కార్యకర్తలు కనీస ప్రమాణాలను పాటించడం లేదు. నిబంధనలు తుంగలో.. ప్రభుత్వం ఒక్క ఇంకుడు గుంత తవ్వుకుంటే లబ్ధిదారుడికి రూ.1670 చెల్లిస్తుంది. గుంత తవ్వుకున్నందుకు రూ.314, కంకర, ఇసుక, సిమెంట్రింగుల కోసం రూ.1,356లు చెల్లిస్తుంది. వీటిని లబ్ధిదారుడే తనకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు. అలా కానిపక్షంలో స్థానిక సర్పంచ్ను లబ్ధిదారుడు కోరితే ఆయన సరఫరా చేయవచ్చు. లేకపోతే భూగర్భ గనుల శాఖను కోరినా ఇసుక, కంకరను సరఫరా చేస్తారు. ఈ నిబంధనలు టీడీపీ నాయకులు తుంగలో తొక్కుతున్నారు. లబ్ధిదారులకు ఇష్టం లేకపోయినా తమ దగ్గరే ఇసుక, కంకర కొనుగోలు చేయాల్సిందేనని నిబంధనలు పెడుతున్నారు. కొనుగోలు చేయకుంటే ఇంకుడు గుంత మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారు. దోచుకుంటున్నారు ఇసుక, కంకర, స్టీల్ కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1,356 తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకే వెళుతున్నాయి. స్థానికంగా ఉండే టీడీపీ నే తలే వీటిని సరఫరా చేస్తున్నారు. కంకరను 20 ఎంఎం, 40 ఎంఎం అనే రెండు రకాలు వాడాలి. అయితే వీటిబదులు ఇటుక ముక్కలు, రాళ్లు సరఫరా చేస్తున్నారు. నాసిరకం సిమెంట్ రింగులను లబ్ధిదారులకు అంటగడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.36 లక్షల ఇంకుడు గుంతలను తవ్వారు. దాదాపు వీటన్నింటికీ టీడీపీ నాయకులే మెటీరియల్ సరఫరా చేశారు. ఇంకా అందని బిల్లులు.. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న లబ్ధిదారుల కు ఇప్పటివరకు బిల్లులు అందలేదు. జిల్లా వ్యా ప్తంగా తవ్విన 1.36 లక్షల ఇంకుడు గుంతలకు సుమారు రూ.22.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో లబ్ధిదారులకు సుమారు రూ.4.27 కోట్లు చేరుతుంది. మిగతా రూ.18.45 కోట్లు పచ్చ బాబుల జేబుల్లోకి చేరనుంది. -
అధికారపార్టీకి ఎన్నికల భయం
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు సర్వేలో అధికార పార్టీకి ఎదురుగాలి ఎన్నికలు జరిపేందుకు వెనుకడుగు పార్టీలో గ్రూపు తగాదాలతో సతమతం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తిరుపతి కార్పొరేషన్ పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి రూ.వేల కోట్లు ఇస్తున్నా వాటిని రాబట్టుకోలేని స్థితిలో ఉంది. దీనికి కారణం కార్పొరేషన్కి పాలకవర్గం లేకపోవడం. అయితే ఓటమి భయంతో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. ఏదో ఒక కారణం చూపుతూ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా తిరుపతి నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు సుమారు రూ.600 కోట్లకు పైగా నిలిచిపోయాయి. దీంతో నగరపాలక సంస్థ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహిం చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేసినా ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల సమయం అవసరమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క మిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఎన్నికలు జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు లోలోపల జరిగిపోయాయి. సర్వేలో ఎదురుగాలి తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అధికారపార్టీ ఇటీవల నిఘా వర్గాలతో సర్వే చేయించినట్లు సమాచారం. ప్రస్తు తం ఎన్నికలు నిర్వహిస్తే ఎదురీత తప్పదని, ప్రజాగ్రహా నికి గురయ్యే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు జరిపేందుకు తట పటాయిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నట్లు సమాచా రం. దీంతో అధికార పార్టీ ఎన్నికలను జాప్యం చేయాల నే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని అధికార పార్టీ ఓ దశలో యోచించినా పార్టీలో గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నట్లు సమాచారం. నగరంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఓ బీసీ నేత మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమాచారం. ఓ వర్గానికి టిక్కెట్టు ఇస్తే మరో వర్గం సహకరించదేమోననే భయం నగర నేతలను వెంటాడుతోంది. దీంతో పార్టీ అధినేతలకు అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కంటే వాయిదా వేయడం మేలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర నిధులు ఆగిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగినా ఫర్వాలేదు కానీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందని భావిస్తున్నారని సమాచారం. సీఎం సొంత జిల్లాలో ఎదురుగాలి వీస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందనే భావనలో ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద నగరపాలక సంస్థ ఎన్నికలు అధికార పార్టీకి కత్తిమీద సాములా మారాయి. -
సామాన్యులపై శివతాండవం!
ఆస్తిపన్ను వసూళ్లలో అధికారుల ఇష్టారాజ్యం అధికారపార్టీ నేతలవైపు కన్నెత్తి చూడని వైనం చివరి రోజున రూ.24 కోట్ల వసూళ్లు స్తంభన ‘ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గీర్వాణి భర్త చంద్రప్రకాష్ పేరిట ఉన్న ఈ భవనం చిత్తూరు కార్పొరేషన్కు రూ.7.17లక్షల ఆస్తిపన్ను చెల్లించాలి. పన్ను బకాయిలు ఉంటే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదనే నిబంధన ఉండటంతో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్కు పన్ను చెల్లించారు. అప్పటి నుంచి రెండేళ్లుగా కార్పొరేషన్కు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. అత్యధిక బకాయిల జాబితాలో ఈ పెద్ద మనిషి పేరున్నా అధికారపార్టీ నాయకుడు కావడంతో ఏ అధికారీ ఆయనచేత పన్నుకట్టించే దైర్యం చేయలేకపోయారు.’ ..ఇలా పేదలకో న్యాయం.. పెద్దలకో ధర్మం ఎలా ఉంటుందో చిత్తూరు కార్పొరేషన్ అధికారులు స్పష్టంగా చూపించారంతే. మిగిలిన మునిసిపాలిటీల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. జిల్లాలో ఆస్తిపన్ను వసూళ్లలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉదాసీనంగా వ్యవహరించాయి. మార్చి దగ్గరపడుతుందని ఊదరగొడుతూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తూ పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టిన మునిసిపల్ అధికారులు రూ.లక్షల్లో బకాయిలు పడ్డ పెద్దల జోలికి వెళ్లలేదు. అందులోనూ టీడీపీకి చెందిన నాయకులు రూ.లక్షల్లో అప్పులున్నా వాళ్ల వద్దకువెళ్లి అడగలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో గురువారంతో 2015-16 ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియ పూర్తయింది. అయితే కేవలం మధ్య తరగతి కుటుంబాలు, నిరుపేదలు, సమాజంలో గౌర వం కోసం బతికేవాళ్లనే లక్ష్యంగా చేసుకుని పన్నులు వసూలు చేశారే తప్ప పెద్దమనుషులుగా, అధికారపార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్లు రూ.లక్షల్లో బకాయిలు పడ్డా పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో మొత్తం రూ.24 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాకుండా స్తంభించిపోయింది. పుత్తూరు టాప్.. ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలో పుత్తూరు మునిసిపాలిటీ ముందజంలో నిలిచింది. ఇక్కడ గత గురువారం నాటికి మొత్తం రూ.1.39 కోట్లు (99 శాతం)వసూలయిం ది. తరువాతి స్థానాల్లో పుంగనూరు రూ.3.15 కోట్లు(83 శాతం), పలమనేరు రూ.1.25 కోట్లు(82 శాతం), తిరుపతి కార్పొరేషన్ రూ. 31.66 కోట్లు(80 శాతం), శ్రీకాళహస్తి రూ.3.58 కోట్లు (73 శాతం), మదనపల్లె రూ.6.62 కోట్లు (63 శాతం) చిత్తూరు రూ.10.10 కోట్లు (60 శాతం) వసూలు చేసింది. అన్నింటికంటే అట్టడుగులో నగరి మునిసిపాలిటీ రూ.63 లక్షలు వసూలుచేసి 19 శాతం వసూళ్లతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. -
కలవరం.. కలకలం!
అధికార పార్టీలో మంత్రి పదవి రచ్చ ►కొత్తగా పార్టీలో చేరిన నేతలకు అధినేత హామీలు? ► పార్టీనే నమ్ముకున్నఎమ్మెల్యేల్లో అసంతృప్తి ►నిరాశలో ఓ యువ ఎమ్మెల్యే ఒక్క తాటిపైకి వస్తున్న పాత కాపులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆలూ లేదు చూలూ లేదు.. కొడుపు పేరు సోమలింగం అన్నట్టు తయారయింది జిల్లాలో మంత్రి పదవి కేటాయింపు వ్యవహారం. కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు తమకు మంత్రి పదవి పక్కా అని ప్రచారం చేసుకుంటుండగా.. ఆయన అయ్యే అవకాశమే లేదని మరో వర్గం వాదిస్తోంది. తాను యువజన, క్రీడా శాఖల మంత్రిని కాబోతున్నానంటూ ఊరు, వాడ ప్రచారం చేసుకున్న ఓ యువ ఎమ్మెల్యే ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఎక్కడ తనకు మంత్రి పదవి వరించకుండా పోతుందోనని మదన పడుతున్నట్టు సమాచారం. పాత కాపులంతా ఒకే తాటిపైకి.. అధికార పార్టీలో నిన్నా మొన్నా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత కాపులంతా మండిపడుతున్నారు. మొదటి నుంచి తమతో ఉన్న పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో కూరుకుపోయే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలోని పాత కాపులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు. పార్టీలో ఎన్నికల ముందు నుంచి ఉన్న వారికే మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని.. వీరంతా కోరుతున్నారు. ఇదే అంశాన్ని అందరూ కలిసి వెళ్లి అధినేతకు వివరించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు పార్టీలో చేరిన తాజా మాజీ కాంగ్రెస్ నేతలు కూడా స్వరం కలుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు యువ ఎమ్మెల్యే ఆశలు మళ్లీ మొగ్గతొడిగాయి. ఈ నేతలతో సదరు యువ ఎమ్మెల్యే కూడా కలిసి మళ్లీ మంత్రి పదవి యత్నాల్లో పడినట్టు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మంత్రి పదవి చర్చ లేదంటూనే.. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ నుంచి పార్టీలోకి చేర్చుకునే సందర్భంగా భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే అంశం ఎక్కడా ప్రస్తావనకే రాలేదనేది జిల్లా పార్టీ నేతలు వాదన. మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి పార్టీలో చేర్చుకోలేదని స్వయంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. తద్వారా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదనే సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏదో ఒక మూలన.. మంత్రి పదవి వస్తుందనే భయంతోనే పాత కాపులంతా ఏకమవుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా అధికార పార్టీలో మంత్రి పదవి వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందనే విషయం.. బడ్జెట్ సమావేశాల తర్వాత వచ్చే నెలలో తేలే అవకాశం ఉంది. -
‘సెస్’ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
► అభ్యర్థి లేదా ఏజెంట్కు అనుమతి ► కౌంటింగ్కు నాలుగు టేబుళ్లు ► హైకోర్టు నిర్ణయంపైనే ► ఉత్కంఠ కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు ► ఎన్నికల అధికారి చంద్రమోహన్రెడ్డి సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, పోటీ చేసిన అభ్యర్థులు, లేదా వారి తరఫున ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల ఫలితాలు సాయంత్రం 3 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ సరళిపై చర్చలు ‘సెస్’ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై అంచనాలు వేస్తూ.. తమకు వచ్చే ఓట్ల గురించి అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో పది మంది బరిలో ఉండగా ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటల్లో ద్విముఖ పోటీ ఉండడంతో గెలుపుపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ముస్తాబాద్లో నలుగురు పోటీలో ఉండగా అధికార టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. వేములవాడ పట్టణంలో ఆరుగురు బరిలో ఉండగా విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వేములవాడ రూరల్లో అధికార పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. చందుర్తిలో చతుర్ముఖ పోటీ ఉన్నా విజయంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కోనరావుపేటలో చతుర్ముఖ పోటీలో గెలుపెవరిదో అంతుచిక్కని పరిస్థితి. ఇల్లంతకుంటలో ఆరుగురు, బోయినపల్లిలో నలుగురు పోటీలో ఉన్నారు. 11 డెరైక్టర్ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హైకోర్టుదే తుది నిర్ణయం ‘సెస్’ ఎన్నికల ఫలితాలపై హైకోర్టుదే తుది నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను బకాయిల పేరుతో ఓటింగ్కు దూరం చేశారని, చనిపోయిన ఓటర్ల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించలేదని పేర్కొంటూ సిరిసిల్లకు చెందిన డి.ప్రభాకర్రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల పక్రియను కొనసాగించాలని, ఫలితాలు ఎలా వచ్చినా కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ ప్రభాకర్రావు వాదనను కోర్టు సమర్థిస్తే ఎన్నికలే రద్దయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఆయన వాదనతో ఏకీభవించకుంటే ‘సెస్’ ఎన్నికలకు ఎలాంటి ప్రమాదం లేదని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు సెస్’ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. మంగళవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తాం. బుధవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఏజెంట్ను కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరినో ఒక్కరినే అనుమతిస్తాం. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం అందిస్తాం. ఆ పత్రంలో నోట్ పెట్టి కోర్టు నిర్ణయానికి లోబడి ఉండాలనే నిబంధనను స్పష్టం చేస్తాం. ఓట్ల లెక్కింపునకు 25 సిబ్బందిని నియమించాం. గురువారం ‘సెస్’ ఆఫీస్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెజార్టీ డెరైక్టర్ల ఆమోదం మేరకు జరుగుతుంది. అంతిమంగా కోర్టు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే - జి.చంద్రమోహన్రెడ్డి, ఎన్నికల అధికారి -
అభయం!
భూమా-శిల్పా మధ్య ముసలం ఉద్యోగుల బదిలీ తప్పదనే ప్రచారం ధైర్యం చెప్పే ప్రయత్నంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూమాకు మంత్రి పదవి రాకుండా మోకాలడ్డు నంద్యాల, ఆళ్లగడ్డల్లోని అధికారుల్లో గందరగోళం సమన్వయం’ ఎన్నటికో... సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో భూమా-శిల్పాల మధ్య రేగిన ముసలం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మంత్రి పదవి విషయంలో వివాదం రాజుకుంటుండగానే.. తాజాగా అధికారుల బదిలీల విషయంలో కొత్త సమస్య తెరమీదకొచ్చింది. అన్నకు మంత్రి పదవి రాగానే అధికారులపై వేటు తప్పదనే ప్రచారం ఇప్పటికే అటు ఆళ్లగడ్డ, ఇటు నంద్యాలలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఏ ఒక్కరిపై బదిలీ వేటు పడకుండా చూస్తానని అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ధైర్యం చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు అసలు మంత్రి పదవి ఆయనకు వచ్చే అవకాశమే లేదని కూడా చెబుతుండటం గమనార్హం. డీఎస్పీపై వేటు తప్పదు నంద్యాల డీఎస్పీని బదిలీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ విషయమై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భూమా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ నేతలు మాత్రం ఆయన బదిలీ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. కేవలం నియోజకవర్గ ఇన్చార్జీల మాటే చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే శిల్పా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆళ్లగడ్డలోనూ వార్ షురూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ ఇదే తరహా యుద్ధానికి తెరలేసింది. నియోజకవర్గంలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా పలువురు అధికారులను నియమించుకున్నారు. వీరందరిపైనా ఇప్పుడు వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మండలంలో రెగ్యులర్ తహశీల్దారును కాదని.. డిప్యూటీ తహశీల్దారునే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈయన స్థానానికి కూడా ఎసరు తప్పదనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే తాడోపేడో తేల్చుకుంటామని గంగుల వర్గీయులు సవాల్ విసురుతున్నారు. తాజా చేరికలతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుతోంది. కమిటీ వచ్చేదెన్నడో.. పార్టీలో విపక్ష ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో పాత నేతలు, కొత్త నేతలకు మధ్య సమన్వయం చేసేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ, జిల్లా అధ్యక్షులతో కూడిన కమిటీని పార్టీ నియమించింది. అయితే, ఈ కమిటీ ఇప్పటివరకు కనీసం ఇరువురితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. కమిటీ వచ్చెదెన్నడో.. నేతల మధ్య సమన్వయం సాధించేదెన్నడో అనే చర్చ అధికారపార్టీలో జరుగుతోంది. -
బెదిరింపులతో చితికిపోతున్నాం..!
ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన నగరపాలక సంస్థ ఉద్యోగులు దాడులను ఎదుర్కొనేందుకు నూతనంగా కమిటీ ఏర్పాటు అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థలో అధ్వానమైన పరిస్థితి నెలకొందని, నిత్యం బెదిరింపులతో చితికి పోవాల్సి వస్తోందని అధికారులు, ఉద్యోగులు ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను కలిసిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. ఏఈ సుభాష్ రాజీనామా చేసే స్థాయికి వచ్చాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల చేయమని వేధించడమేమిటన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామన్నారు. ఒకరికి పని చేస్తే మరో వర్గం లక్ష్యంగా చేసుకుని దురుసుగా ప్రవర్తిస్తోందన్నారు. ఈఈ, డీఈ, ఏఈ అధికారులన్న ఆలోచన లేకుండా దుర్భాషలాడడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తమ పట్ల ఇంత వివక్ష చూపించడం సరికాదన్నారు. కార్పొరేటర్లు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పాలకవర్గంలోని నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కింది స్థాయి ఉద్యోగి నుంచి అధికారుల వర కు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాగైతే ఏవిధంగా పనిచేయాలని ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను తాము కాపాడుకునేందుకు ఓ కమిటీను వేసుకుంటామని తెలిపారు. ఎవరినీ ఉపేక్షించ వద్దు: ఎమ్మెల్యే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధికారులకు భరోసా ఇచ్చారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు, ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. ధైర్యంగా, స్వేచ్ఛగా పని చేయాలన్నారు. నగరాభివృద్ధికి అందరూ ముందుకు రావాలన్నారు. ఎవరైనా సరే అధికారులు, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులతో సమన్వయంతో పని చేయించుకోవాలన్నారు. ఎమ్మెల్యేను కలసిన వారిలో అడిషినల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, డిప్యూటీ కమిషనర్ అజయ్ కిషోర్ తదితరులున్నారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న నగరపాలక సంస్థ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఇదేగౌరవాధ్యక్షులుగా చల్లా ఓబులేసు(కమిషనర్), అధ్యక్షుడుగా నరసింహులు, కార్యదర్శిగా బీఎస్ కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శిగా మురళీ, కోశాధికారిగా రమణ, ఉపాధ్యక్షులుగా నవనీతకృష్ణ, సతీష్, సురేంద్ర, బాషా ఉన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తే సహించం = ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం హెచ్చరిక అనంతపురం న్యూటౌన్ : అధికార పార్టీ నాయకుల అరాచకాలు క్రమంగా పెరిగిపోతున్నాయని, దళిత ఉద్యోగులపై ప్రతాపం చూపిస్తుండడం దారుణమని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ రామప్రసాద్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దళిత ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అనేక అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సుభాష్చంద్రబోస్కు సమయానికి మించి పని భారం పెట్టడం వల్ల కుటుంబానికి చెప్పుకోలేక, ఇటు అధికారులకు చెప్పలేక మనోవేదనకు గురై ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. -
టీడీపీ ఎంపీటీసీ తనయుడి దాడి
తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు చిలమత్తూరు: అధికార పార్టీ నాయకులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. అధికారం ఉందని విచక్షణ రహితంగా భౌతిక దాడులకు దిగడం పరిపాటిగా మారుతోంది. తాజాగా మండలంలోని కోడూరు పంచాయతీ మదిరేపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు కుమారుడు గంగాధర్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం కోడూరు తోపులో టీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు తనయుడు సోమశేఖర్ ఎందుకు నవ్వుతున్నారంటూ వారితో వాదనకు దిగాడు. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో సోమశేఖర్ పక్కనే ఉన్న ఇనుప రాడుతో గంగాధర్పై దాడి చేశాడు. దీంతో గంగాధర్ తలకు దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన బంధువులు గంగాధర్ను స్థానిక పోలీసుస్టేషన్కు తరలించి ఫిర్యాదు చేశారు. పోలీసులు చికిత్స నిమిత్తం బాధితుణ్ని ఆసుప్రతికి పంపించారు. గతంలో కూడా దారి విషయంలో తమపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దాడి విషయంలో బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయరాదని అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఇసుక తోడేళ్లు
అక్రమార్కులకు కాసుల వర్షంకురిపిస్తున్న ఇసుకసంఘాల ముసుగులో రూ.కోట్లు దండుకుంటున్న వైనం ఇప్పటికే రూ.182.5 కోట్లఅక్రమార్జనజిల్లాలో ఇసుక రీచ్లన్నీ ఖాళీ ధర్మవరం: జిల్లాలో ఇసుక రీచ్లు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చతమ్ముళ్లు సహజ సంపదను కొల్లగొట్టారు. తద్వారా కోట్లాది రూపాయలు తమ జేబుల్లోకి వేసుకున్నారు. జిల్లాలోని 35 ఇసుక రీచ్లలో 16.87 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని భూగర్భ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో ఇసుకను విక్రయించేందుకు అక్టోబర్, 2014 లో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి 2016 జనవరి ఆఖరు నాటికి 35 రీచ్ల పరిధిలో 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించారు. రూ.19.98 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. తెర వెనుక ఇలా.. ప్రతి రోజూ జిల్లాలోని 35 ఇసుక రీచ్లనుంచి నుంచి సగటున 100 నుంచి 120 లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. పేరు డ్వాక్రా సంఘాలదే అయినా పెత్తనం మొత్తం అధికార పార్టీనేతల చేతిలో ఉండటంతో వారు అందినకాటికి అమ్మేసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. ఇసుక రీచ్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. ఈ సమయం దాటిపోతానే అనధికాధికారులు ఇసుక రీచ్లలోకి వెళ్లి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఇసుకను యధేచ్చగా తరలించేవారు. ఈ ఇసుకరీచ్లపై ఎటువంటి నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ తాత్సారం వెరసి జిల్లాలోని రీచ్లన్నింటినీ అక్రమార్కులు కొల్లకొట్టేశారు. ప్రతి రోజు జిల్లా నుంచి 100 నుంచి 120 దాకా లారీల ఇసుక జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలుతోంది. ఒక్కో లారీకి 10 క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపితే 100 లారీలకు 1200 క్యూబిక్ మీటర్ల ఇసుక బయటి ప్రాంతాలకు తరలిపోయింది. ఈ ప్రకారం ఒక్క ఏడాదిలోనే 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమార్కులు జిల్లా దాటించి సొమ్ముచేసుకున్నారు. అనధికారికంగా జిల్లా దాటిపోయిన ఇసుకను బెంగళూరు, చిక్బళాపూర్, బళ్లారి, తదితర ప్రాంతాల్లో విక్రయించగా అక్రమార్కులకు చే కూరిన ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మకపోవు. సీపీరేవు రీచ్నుంచే వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే రోజుకు 30 నుంచి 40 దాకా ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటించారు. తాడిమర్రి మండలం చిన్నచిగుళ్ల రేవు ఇసుక రీచ్ వద్దనుంచే ఈ ఏడాది వ్యవధిలో 12,000 లారీల ఇసుక అక్రమంగా తరలిపోయింది. ఆ ఇసుకను విక్రయించగా వారికి దాదాపు 60కోట్లు లాభం చేకూరింది. ఇసుక విక్రయాలు ఆపేసిన తరువాత ఈ అక్రమ తరలింపు రోజుకు 50నుంచి 60 లారీల మేర జరిగినట్లు సమాచారం. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 1,000 లారీల ఇసుకను తరలించినట్లు రీచ్కు సమీపంలోని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు. అధికారులపై ఆరోపణలు అధికారుల అండతోనే ఇసుక వ్యాపారం మూడు డంపులు.. ఆరు లారీలుగా కొనసాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురుల కనుసన్నల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చూడనట్లు వ్యవహరించడం వల్లనే ప్రజాదనం అక్రమార్కుల పాలైందని పలువు నేతలు వ్యాఖ్యానిస్తున్నార -
ఖాకీపై ఖద్దర్ స్వారీ
అనంతపురం టూటౌన్ ఎస్ఐ హమీద్వీఆర్కు బదిలీ మంత్రి పరిటాల సునీత ఒత్తిడితోఉన్నతాధికారుల నిర్ణయం? నిక్కచ్చిగా ఉన్నందుకు మొన్న గోరంట్ల మాధవ్.. నేడు హమీద్ బలి బదిలీలపై పోలీసు అధికారుల సంఘంలో చర్చ (సాక్షిప్రతినిధి, అనంతపురం) మంత్రి పరిటాల సునీత ఒత్తిడితో మరో ఎస్ఐ బలయ్యారా? విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్ఐని కాపాడటం కనీస బాధ్యత అనే విషయాన్ని విస్మరించి, అధికార పార్టీ ఆదేశాలనే ఉన్నతాధికారులు శిరసావహించారా? మొన్న గోరంట్ల మాధవ్..నేడు హమీద్ బదిలీల వెనుక మర్మమిదేనా? అధికార పార్టీ నేతలను ఎదిరిస్తే ఎవరికైనా ‘లూప్లైన్’ తప్పదనే సంకేతాన్ని పంపారా?.. తాజా పరిస్థితులు చూస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాంను కేబుల్ వ్యవహారంలో గట్టిగా మందలించడం...స్థలం విషయంలో చమన్కు మీడియా ద్వారా హెచ్చరికలు పంపడాన్ని సీరియస్గా తీసుకుని గతంలో సీఐ గోరంట్ల మాధవ్ బదిలీకి కారణమైన అధికారపార్టీ నేతలు ఇప్పుడు మరో యువ ఎస్ఐపై కన్నెర్ర చేశారు. తమ అనుచరులను అదుపులోకి తీసుకున్నారనే కారణంతో టౌటౌన్ ఎస్ఐ హమీద్ను లూప్లైన్కు బదిలీ చేయించారు. ఈ బదిలీపై ప్రస్తుతం పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది.హమీద్ చేసిన నేరం ఇదేనా?హమీద్ బదిలీకి సంబంధించి పోలీసువర్గాలు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ‘అనంత’లోని నందమూరినగర్కు చెందిన టీడీపీ నేత మనోహర్నాయుడు పరిటాల వర్గానికి ప్రధాన అనుచరుడు. ఇటీవల ఆంథోనిరెడ్డి అనే రియల్టర్ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆంథోనిరెడ్డి కుటుంబసభ్యులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ హమీద్.. మనోహర్నాయుడి కోసం గాలించారు. విషయం తెలిసి అతను పరారయ్యాడు. దీంతో అతని కుమారుడు కార్తీక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మనోహర్ అనుచరుడు జయకృష్ణ స్టేషన్కు వెళ్లి హమీద్తో దురుసుగా మాట్లాడాడు.దీంతో చిర్రెత్తిన హమీద్ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయం సునీత దృష్టికి వెళ్లింది. హమీద్ సంగతి తేల్చాలని మనోహర్తో పాటు జయకృష్ణ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే సునీత పోలీసుశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి హమీద్ను వీఆర్కు పంపించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకివ్యతిరేకంగా పనిచేయకూడదా? యువ ఎస్ఐలలో హమీద్కు మంచి పేరుంది. పార్టీలకతీతంగా బాధితులకు న్యాయం చేసేలా వ్యవహరిస్తుంటారు. ఇదే క్రమంలో మనోహర్నాయుడు సునీత అనుచరుడని తెలిసినా, తాను ఉద్యోగధర్మం నిర్వర్తిస్తున్నాననే ధోరణిలోనే ముందడుగు వేశారు. గతంలో కూడా టూటౌన్ పరిధిలో ఇంటిస్థలం విషయమై ఓ యువతితో మనోహర్ నాయుడు అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పాటు మనోహర్పై పలు ఫిర్యాదులు వచ్చినా సీఐ శుభకుమార్ పూర్తిగా పక్కనపెట్టారని తెలిసింది. సీఐ చర్యలను భరిస్తూ వచ్చిన హమీద్.. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. గతంలో సీఐ గోరంట్ల మాధవ్ కూడా రాజకీయనేతలను కాదని బాధితుల పక్షాన నిలవడంతోనే సీఐడీకి బదిలీ అయ్యారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ రెండు బదిలీలపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయనేతలు సిఫారసు చేస్తే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని పోలీసు సంఘంలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే పోలీసులపై అధికారపార్టీనేతల నుంచి ఇబ్బందులు రావడం సహజమని, అయితే ఉన్నతాధికారులు అండగా నిలవాలని అంటున్నారు. ‘అనంత’పోలీసు శాఖలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే మరింత మంది అధికారులు బలవుతారని, కావున దీనిపై గట్టిగా పోరాడాలని పోలీసుసంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎస్ఐలు వీఆర్కు.. అనంతపురం క్రైం : నగరంలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు పంపుతూ ఎస్పీ రాజశేఖర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్రీటౌన్ ఎస్ఐ తమీమ్ అహ్మద్, టూటౌన్ ఎస్ఐ హమీద్ఖాన్లను వీఆర్కు పంపారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో వీరిని వీఆర్కు పంపినట్లు తెలిసింది. -
ఇక పనుల పందేరం
అధికార పార్టీ నేతలకు రూ.100 కోట్ల పనులు నీరు-చెట్టు కింద అంచనాల్లో నిమగ్నమైన అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమ్ముళ్లు 1500 చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు పనుల పంపకాలకు తెర లేచింది. గతంలోనే నీరు-చెట్టు కింద అందినకాడికి దోచుకున్న అధికార పార్టీ నేతలకు మరో రూ.100 కోట్ల పనులు కట్టబెట్టనున్నారు. చెరువుల మరమ్మతుల పేరుతో ఈ నిధులను వెచ్చించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తిరుపతి: జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద ఈ ఏడాది రూ.100 కోట్ల పనులను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. పనులను గుర్తించడం, అంచనాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ భాగం చెరువుల్లో నీరు ఉండడంతో నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించే దిశగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. పనుల గుర్తింపు ఇలా.. నీరు-చెట్టు పనులకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని జిల్లాలోని నేతలు తమకు అనువు గా మలచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఈ కార్యక్రమం కింద వంకలు, వాగులపై చెక్డ్యాంలు, పంటకాలువలు, చెరువుల్లో పూడికతీత, కంపచెట్ల తొలగింపు, కట్టలను బలపరచడం, తూములు, గేట్ల పునరుద్ధరణ, చెరువు మొరవలు, కాంక్రీట్ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తమ్ముళ్లు నీరు-చెట్టు కార్యక్రమంలో పనులను గుర్తించి అధికారులతో అంచనాలు రూపొందించుకునేందుకు అధికార పార్టీ నేతలు నీటిపారుదల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది నామమాత్రంగా పనులు చేసి లక్షల రూపాయలు స్వాహా చేసిన నేతలు మళ్లీ, ఈ ఏడాది అలానే పనులు చేసి అందిన కాడికి దోచుకునేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో అవసరం లేకున్నా పనులు చేయడం, ఒకే పనిని రెండుమార్లు చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది రూ.136 కోట్ల పనులకు అనుమతి ఇచ్చారు. ఇందులో రూ.103 కోట్ల మేర పనులు చేసి తెలుగు తమ్ముళ్లు జేబులు ఇక పనుల పందేరం నింపుకొన్నారు. పనుల్లో జన్మభూమి కమిటీలది పెత్తనం కావడం, పనులను నామినేషన్పైనే కట్టబెడుతుండడంతో దేశం ద్వితీయ శ్రేణి నేతలు పనులు దక్కించుకొనేందుకు అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. కొంత మంది పచ్చ నేతలు, తమ అధినాయకులకు కమీషన్లు ఇచ్చి పనులు దక్కించుకొనే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కోట్లాది రూపాయల పనులు, దీనికి తోడు మట్టి పనులు కావడంతో సొమ్ము చేసుకోవచ్చనే దిశగా తెలుగు తమ్ముళ్లు తహతహలాడుతున్నారు. అధిష్టానం సైతం కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా నీరు-చెట్టు పనులను నామినేషన్పై కేటాయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 8000 పైగా చెరువులున్నాయి. ఈ ఏడాది దాదాపు 1500 చెరువులకు పైగా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలనే దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రణాళికలు రూపొందిస్తున్నాం నీరు-చెట్టు కార్యక్రమం కింద పనుల గుర్తింపు కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించాం. దాదాపు రూ.100 కోట్ల మేర పనుల కోసం అంచనాలు రూపొందిస్తున్నాం. చెరువుల్లో నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి, నిర్ణీత కాలవ్యవధిలోపు పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. - శ్రీరామకృష్ణ. ఎస్ఈ, నీటిపారుదల శాఖ, చిత్తూరు -
కసంక్రాంతి ‘బరి’లో కాక్ ఫైట్
పోలీసులు వర్సెస్ ప్రజాప్రతినిధులు కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు మంత్రులతో ప్రారంభించేందుకు సన్నాహాలు వీవీఐపీల రాకపోకలకు ప్రత్యేక రోడ్లు నిర్మాణం కఠిన చర్యలు తప్పవని ఎస్పీల హెచ్చరికలు గుంటూరు సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లాలో కోడి పందేలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అండతో హైకోర్టు, పోలీస్ అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లక్షల రూపాయల ఖర్చుతో బరులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో కోడి పందేల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు హైదరాబాద్ స్థాయి అధికారులతో పైరవీలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులతో కలసి ‘చినబాబు’ వద్ద ఆమోదముద్ర తీసుకున్న నేతలు పోలీసులను లెక్కచేయకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా కట్టడి చేసిన పోలీసులు రేపల్లెలో ఏర్పాటు చేసిన బరుల వైపు వెళ్ళలేకపోయారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అప్పట్లో కోడి పందేలను ఆపలేకపోయారనేది బహిరంగ రహస్యమే. ఈ సారి కూడా అలాగే జరుగుతుందని అధికారపార్టీ నేతలు ధీమాగా ఉండగా, పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకునేలా అన్ని జిల్లాల ఎస్పీలకూ స్పష్టమైన ఆదేశాలిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఇళ్ళల్లోకి చొరబడి మరీ పందెం కోళ్ళను ఎత్తుకెళుతున్న పోలీసులు రేపల్లె మండలంలోని ఓ మాజీ ఎమ్మెల్యే పొలంలో పందేల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాకీ, ఖద్దరు మధ్య వివాదం జరిగిన ప్రతిసారీ ఖద్దరుదే పైచేయిగా నిలుస్తోంది. డీఎస్పీ, సీఐల బదిలీల దగ్గర నుంచి, జిల్లాలో జరుగుతున్నఅక్రమాలను అడ్డుకుంటున్న ఎస్పీల బదిలీల వరకు అధికారపార్టీ నేతల పంతమే నెగ్గుతూ వస్తోంది. మంత్రులు, ఎంపీలతో ప్రారంభించేందుకు సన్నహాలు ... జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలను ఆహ్వానించి కోడి పందేలను ప్రారంభింపజేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పొలాల్లో బరులు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడకు నేరుగా వీవీఐపీల వాహనాలు వచ్చేలా రోడ్ల నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. లక్షల్లో పందేలు కాసే వారి కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పందేల వద్ద ఉంటే పోలీసులు అక్కడికి వచ్చినా నిలువరించలేరనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు సైతం వారికి ఆ మేరకు భరోసా ఇస్తున్నారు. అయితే అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు మాత్రం కోడి పందేలు నిర్వహిస్తే సహించేదిలేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంక్రాంతి కాక్ ఫైట్లో ఖద్దరు, ఖాకీల్లో ఎవరు నెగ్గుతారో వేచి చూడాల్సిందే. -
అధికార పార్టీ ‘చిట్స్’ లీలలు
నూతన చిట్ వేడుకల్లో అసభ్యకర నృత్యాలు అడ్డుకున్న పోలీసులు ఒత్తిళ్లతో చర్యలకు వెనుకడుగు నరసరావుపేట టౌన్ : కాల్మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి, అతని సోదరుడు నూతన చిట్ వేడుకల్లో భాగంగా మందుపార్టీ, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతో చర్యలకు వెనుకడుగు వేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే. పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్, అతని సోదరుడు నూతన చిట్స్ను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా వినుకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలతో అసభ్యకర డాన్స్లు చేయించారు. హాజరైన చీటీపాట సభ్యులు కార్యక్రమాలను ఫోన్లో చిత్రీకరించి ఇతరులకు వాట్స్ఆప్ ద్వారా పంపారు. కొందరు ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. పోలీసుల రాకను గమనించిన వారు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసులు సూచించినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించడంతో నిర్వాహకులపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా పై అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో నిర్వాహకులను స్టేషన్కు రావాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి సోమవారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై డీఎస్పీ కె.నాగేశ్వరరావును వివరణ కోరగా పోలీసుశాఖ అనుమతి లేకుండా డాన్స్లు నిర్వహిస్తున్న కారణంగా కార్యక్రమాన్ని నిలిపివేశామన్నారు. -
క్లబ్లు తెరుద్దాం
ప్రజాప్రతినిధులపై తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు పక్క జిల్లాలో లేని అభ్యంతరం ఇక్కడెందుకని ప్రశ్న వారి ఆవేదనను అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన రాజధాని నగరమంటే మంత్రులు, అధికారులు, కార్యాలయాలే ఉంటే ఎట్లా.. కాస్తంత రిక్రియేషన్, ఆపై సంపాదన కూడా ఉండాలనే ఆలోచన తెలుగు తమ్ముళ్లకు వచ్చింది. ఇంకేముంది తమకు అనుకూలురైన ప్రజాప్రతినిధుల ద్వారా పేకాట క్లబ్లు తెరిపిం చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. విజయవాడ సిటీ : రాజధాని ముఖద్వారం కృష్ణా జిల్లాలో పేకాటక్లబ్లు ఏర్పాటుచేయాలని తమ్ముళ్లు ఉబలాటపడుతున్నారు. వాటి ఆవశ్యకతను వివరించడంతో పాటు అందుకు సహకరిస్తే ఒనగూరే ఆర్థిక ప్రయోజనాల్ని ఎరగా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా ఊ..అనిపిస్తే చాలు, పోలీసుపరంగా తాము మేనేజ్ చేసుకుంటామనే భరోసా ఇస్తున్నారు. వీరి ప్రతిపాదనలపై కొందరు కేబినెట్ స్థాయి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వీరి ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే దసరా నాటికి జిల్లాలో ఐదారు పేకాటక్లబ్లు రావడం ఖాయమనిపిస్తోంది. ప్రయత్నాల్లో తెలుగు తమ్ముళ్లు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి కుమారుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మూతపడిన పేకాట క్లబ్ను నెల రోజుల కిందట తెరిపించి నిర్వహిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ క్లబ్లో పేకాడేందుకు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన జూదరులు ‘హ్యాపీ’గా వెళ్లొస్తున్నారు. ఇదే రీతిలో తాము కూడా ఏర్పాటు చేసుకుంటామంటూ పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. కంచికచర్ల మండలం, ఆగిరిపల్లి మండలంలో మూతపడిన క్లబ్లను తెరుస్తామంటూ ముందుకొస్తున్నారు. వీటిల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు భాగస్వాములుగా చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ నగరంలో ఓ సొసైటీ క్లబ్తోపాటు మరో కొత్త క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవికాక నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లోని మామిడి తోటలు, నందిగామ, గుడివాడ, కైకలూరు పరిసర ప్రాంతాల్లోని పొలాల అతిథి గృహాల్లో తాత్కాలిక క్లబ్ల ఏర్పాటుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సొమ్ము చేసుకునేందుకే.. రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా పలువురు బలోపేతం అవుతున్నట్టు తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. భూములు అమ్మడం ద్వారా కొందరు ఆర్థిక స్థితిమంతులైతే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లాభాలు ఆర్జించేవారి సంఖ్య కూడా బాగానే ఉంది. దసరాకు రాజధానికి శంకుస్థాపన చేస్తే విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణాజిల్లాలో భూముల క్రయవిక్రయాలు పెరిగి ఆదాయ వనరులు మరింత పెరుగుతాయని వారి ఆశ. పైగా రాజధానికి చేరువ కావడంతో వ్యాపారాలన్నీ కూడా బాగానే పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇక్కడ క్లబ్లు లేకుంటే హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వెళ్లి పేకాడతారని, ఇక్కడి సంపద పొరుగు ప్రాంతాలకు తరలివెళుతుందని చెబుతున్నారు. ఇక్కడే క్లబ్లను అనుమతించిన పక్షంలో అందరికీ ‘ప్రయోజనం’ ఉంటుందనే ఫార్ములాను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకెళుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పేకాట క్లబ్ల్లో నిబంధనలు అతిక్రమించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామంటూ ప్రతిపాదిస్తున్నారు. వీటిని సంబంధిత పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేస్తామని, ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలించుకోవచ్చంటున్నారు. పేకాట వ్యవహారాలు నిక్కచ్చిగా జరిగే విధంగా కొందరు పోలీసు సిబ్బందిని సీసీ కెమెరాల పర్యవేక్షణకు పెడితే బాగుంటుందని, అవసరమైతే వారికయ్యే జీతభత్యాలు కూడా తామే చెల్లిస్తామనే అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లుగా పార్టీని మోసిన తమకు ఈ మాత్రం మేలు చేయకుంటే ఎలాగంటూ ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. ఇప్పటికే వీరిపై సానుకూలంగా ఉన్న గాడ్ఫాదర్లు ఓ మంచి ముహుర్తం చూసుకుని అధినేత నుంచి గ్రీన్సిగ్నల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
సిలికాన్ ముసుగులో.. ఇసుక దోపిడీ
- గూడూరు నుంచి బెంగళూరుకు వందల లోడ్ల రవాణా - పక్కా మైనింగ్ పర్మిట్లతోనే తరలుతున్న వైనం - అక్రమాల్లో చిత్తూరుకు చెందిన అధికారపార్టీ నాయకుల హస్తం పలమనేరు: సిలికాన్ ముసుగులో ఇసుక దోపిడీ పేట్రేగుతోంది. గూడూరు నుంచి బెంగళూరుకు వందల లోడ్ల ఇసుక రవాణా అవుతోంది. దీనివెనుక చిత్తూరుకు చెందిన అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు సమాచారం. అంతా పక్కాగానే.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూ రు నుంచి సిలికాన్ ఇసుక బెంగళూరుకు తరలుతోంది. అక్కడ మైనింగ్ లీజుదారులు సిలికాన్ ఇసుకను సబ్లీజు, లేదా సేల్స్ ద్వారా టన్ను రూ.500 విక్రయిస్తున్నారు. లారీలోడు 20 టన్నులకు వారికి అక్కడికక్కడే పదివేలు గిట్టుబాటవుతోంది. దీన్ని కొనుగోలుచేసిన వ్యక్తి పక్కా రికార్డులతో అక్కడి నుంచి బయలుదేరి మధ్యలో లారీలోని సిలికాన్ ఇసుక లోకి మామూలు ఇసుకను నింపుకుని పైకి మాత్రం సిలికాన్ ఇసుక కనిపించేలా పట్టలు కప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు. సిలికాన్ ఇసుకను గ్లాస్, పింగాణీ, గేర్బాక్స్లు, టాయ్లెట్స్, కొన్ని ఫౌడర్ల తయారీకి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇసుకకు డిమాండ్ ఉంది కాబట్టి మామూలు ఇసుకలోనూ దీన్ని కలిపి భవన నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. మామూలుగా సిలికాన్ ఇసుకైతే బెంగళూరులో టన్ను రూ.35 వేలు పలుకుతోంది. అదే మామూలు ఇసుకైతే రూ.80 వేల నుంచి లక్షవరకు (12 చక్రాల లారీ) అమ్ముడవుతోంది. గూడూరు నుంచి నిత్యం బెంగళూరుకు 700 లోడ్లు గూడూరు నుంచి బెంగళూరుకు అటు తిరుపతి, చిత్తూరు, పలమనేరు మీదుగా రోజుకు 400 లోడ్లు, పుంగనూరు మీదుగా 300 లోడ్లు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కా బిల్లులతో సిలికాన్ ఇసుకను తరలించినట్టే వెళుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని లోడ్లు మాత్రం ఇసుకతో వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం పలమనేరు పోలీసులు కేవలం ఒక రాత్రిలోనే 30 లారీలను పట్టుకోవడం గమనార్హం. అంతా మామూళ్ల మయం ఈ మధ్యలో నాయుడుపేట నుంచి హొస్కోట వరకు 16 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రేణిగుంట, కర్ణాటకలోని వడ్డిపల్లె చెక్పోస్టులున్నాయి. ఇక్కడ లారీకి రూ.500 ఇస్తేనే బండి ముందుకు కదులుతుందట. ఇక సంబంధిత పోలీసు సబ్డివిజన్లకు నెల మామూళ్లు టంచనుగా అందుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ రవాణాలో అధికారపార్టీ నాయకులే కీలకం చాలామంది లారీ యజమానులు, సిలికాన్ ఇసుక కొనుగోలుదారులు లోడుకు రూ.ఐదువేలు సంపాదించుకోవడానికే ఈ వ్యాపారం చేస్తున్నారు. కానీ వీరి ముసుగులో చిత్తూరుకు చెందిన ఓ అధికారపార్టీ చోటా నాయకుడు మరో బడా నాయకుని పేరు చెప్పి ఈ అక్రమాలను కొనసాగిస్తున్నట్టు స్థానిక పోలీసులకు తెలియందీమే కాదు. వీరికి పలమనేరుకు చెందిన ఈ జేసీబీ యజమాని, గంగవరం మండలానికి చెందిన ఇరువురు కీలకంగా ఉన్నట్టు సమాచారం. పలమనేరు డీఎస్పీ కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి అండదండలు వీరికున్నాయని తెలిసింది. ఈ విషయమై స్థానిక సీఐ సురేందర్రెడ్డి మాట్లాడుతూ చాలా లారీలు సిలికాన్ పేరిట ఇసుకను తరలిస్తున్నాయనే మాట వాస్తవేమన్నారు. త్వరలో ఈ ముఠా గుట్టురట్టు చేస్తామన్నారు. -
అయ్యా.. బాబూ అంటేనే పోస్టింగ్
- లేదంటే వెయిటింగ్ ! - ఖాకీ వనంలో కొత్త పోకడలు - లూప్ లైన్ పోస్టుల్లోనే దళిత వర్గాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉంటేనే ఒకింత ప్రాధాన్య పోస్టులు దక్కుతాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తితేనే కోరుకున్న చోట పోస్టింగ్లు పడతాయనేది తాజాగా పోలీసు వర్గాల్లో వినవస్తున్న కొత్త వాదన. పోలీసు శాఖలో ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియను పరిశీలిస్తే ప్రజాప్రతినిధుల జోక్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. జిల్లా పోలీస్ శాఖ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ప్రజాప్రతినిధులు తాము చెప్పిందే వేదంలా పాటించే పోలీసులను ఏరి కోరి నియమించుకున్నారు. ఇందుకుఉన్నతాధికారులూ వీలైనంత సహకరించారన్న వాదనలున్నాయి. నోటిమాటతో మూడునెలలు ఉద్యోగం ముందెన్నడూ లేనివిధంగా జిల్లాలో తొలిసారి ఓరల్ ఆర్డర్ (నోటిమాట)తోనే పలువురు సీఐలను జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్వోలుగా నియమించారు. గతంలో అత్యవసర సందర్భాల్లో ఒకరిద్దరు సీఐలను ఓరల్ ఆర్డర్తో పంపించిన దాఖలాలు ఉన్నాయి గానీ ఎక్కువమందిని ఒకేసారి ఇలా పంపించడం ఇదే తొలిసారి. అటాచ్మెంట్, మెమో గానీ లేకుండా పలువురు సీఐలకు విధులు అప్పగించారు. ఇందులో కొంతమంది అలా వెళ్లిందే తడవుగా ఆయా సర్కిళ్ల పరిధిలోకి వచ్చే నియోజకవర్గ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే దృష్టిలో పడటమే లక్ష్యంగా పనిచేశారు. చివరకు ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తీసుకోవడంతోపాటు మాకు ఈ సర్కిల్ ఇనస్పెక్టరే కావాలి అనే స్థాయిలో ఆయా ఎమ్మెల్యేల మన్ననలు పొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులను నేరుగా కలిసో, లేదంటే ఫోన్లలోనే మాకు ఇప్పుడున్న పోలీసు ఇనస్పెక్టర్నే కొనసాగించండి.. అతనికే పోస్టింగ్ ఇవ్వండి అని ఒత్తిళ్లు తీసుకువచ్చే స్థాయిలో పనితీరు కనబరిచారు. ఇక పోలీసు అధికారులు ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా ఆయా సీఐలకు పోస్టింగ్లు ఇచ్చేశారు. జిల్లాలో ఇటీవల జరిగిన పోస్టింగ్ల్లో చాలావరకు ఇదే బాపతు వ్యవహారాలు నడిచాయన్నది బహిరంగ రహస్యం. ఆరోపణలున్నా పోస్టింగ్లు ఇదే క్రమంలో ఆరోపణలు, శాఖాపరమైన విచారణ ఎదుర్కొంటూ వీఆర్లో ఉన్న ఇనస్పెక్టర్లకే కీలకమైన పోలీస్ స్టేషన్లను అప్పగించారు. ఎన్ని ఆరోపణలున్నాయనేది కాదు.. ప్రజాప్రతినిధి ఎంతగట్టిగా సిఫార్సు చేశాడా.. అనేదే ప్రామాణికంగా తీసుకుని బదిలీల పర్వం సాగించారని చెబుతున్నారు. కొంతమంది సీఐల పోస్టింగ్లు మాత్రం ఉన్నతాధికారుల ఆబ్లిగేషన్ మేరకు జరిగాయని అంటున్నారు. ఈ పోస్టింగ్లు కూడా వ్యూహాత్మకంగా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే సాగేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్లారని అంటున్నారు. ఇన్ని వ్యూహాలు, రాజకీయాలు చేయలేని సీఐలు మాత్రం ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారని చెబుతున్నారు. సిఫార్సుల ఖాకీలు జన సమస్యల పై ఏం స్పందిస్తారో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తి పోస్టింగ్లు పొందిన పలువురు పోలీసులు సదరు ఎమ్మెల్యేను కాదని రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం ఎలా చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం పచ్చచొక్కాల సేవలోనే తరిస్తూ మిగిలిన పార్టీల నేతలను, ప్రజాసంఘాల వారిని, ప్రజాసమస్యలపై పోరాడే నాయకులను టార్గెట్ చేస్తారన్న వాదనలు బయలుదేరాయి. దళిత పోలీసులకు పోస్టింగ్లు ఎక్కడ? వ్యూహాత్మకమో, యాథృచ్ఛికమో తెలియదు కానీ పోలీసుల బదిలీ ప్రక్రియలో దళితవర్గానికి చెందిన సీఐలకు ప్రాధాన్యం దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. దళితవర్గానికి చెందిన సీఐల్లో కేవలం ముగ్గురికే లా అండ్ ఆర్డర్ బాధ్యతలు దక్కాయి. ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే కనీసం ఆ ముగ్గురికైనా పోస్టింగ్లు దక్కాయని చెబుతున్నారు. మిగిలిన వారందరినీ లూప్లైన్లకే పరిమితం చేశారు. పోలీసు శాఖలో మితిమీరిన అధికార పార్టీ నేతల పెత్తనం ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాల్సిందే. -
మళ్లీ వారేనా!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అధికార పార్టీ సంస్థాగత ఎన్నికల కీలక ప్రక్రియ దగ్గరపడింది. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జిల్లా కమిటీ ఎన్నిక గురువారం జరగనుంది. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి జిల్లా కమిటీ ఎన్నిక కావడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు,తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పరిమిత సంఖ్యలో ఉండే జిల్లా కమిటీలో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఉద్యమంలో, టీఆర్ఎస్లో మొదటి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారా? కొత్తగా పార్టీలోకి చేరిన వారికి పెద్దపీట వేస్తారా? అనేది కొత్త కమిటీ ఏర్పాటుతో స్పష్టం కానుంది. సాధారణ ఎన్నికల ముందు వరకు సంస్థాగతంగా పటిష్టంగా లేని టీఆర్ఎస్, తాజా సంస్థాగత ఎన్నికలతో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉంది. గ్రామ, మండల స్థాయిలో నాయకుల పోటీ వల్ల ఇది పెద్దగా సఫలం కాలేదు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు సూచించిన వారికే పార్టీ పదవులు దక్కాయి. కొన్నిచోట్ల రెండు కమిటీలు ప్రకటించుకున్న పరిస్థితి ఉంది. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా కమిటీ ఎన్నిక సమావేశం జరగనుంది. విద్యుత్ శాఖ మం త్రి జి.జగదీశ్వరరెడ్డి ఎన్నికల పరిశీలకుడిగా వస్తున్నారు. రెండు కమిటీలు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వరంగల్ జిల్లా కమిటీ, గ్రేటర్ వరంగల్ కమిటీల్లో పెద్దగా మార్పులు ఉం డబోవని తెలుస్తోంది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్రావు, గ్రేటర్ అధ్యక్షుడిగా నన్నపునేని నరేం దర్ కొనసాగుతారని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో సా మాజిక సమీకరణల్లో మార్పులు ఉంటే తప్ప.. కార్యవర్గాలు పాతవే ఉంటాయని గులాబీ వర్గాలు చెబుతున్నా యి. రెండు కమిటీల్లో ఏ ఒక్కరు మారినా ఇద్దరు మారుతారని అంటున్నారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా కమిటీలో 33 మంది చొప్పున ఉంటారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కార్యదర్శులు, ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు ప్రచార కా ర్యదర్శులు, ఒక కార్యాలయ కార్యదర్శి, ఒక కోశాధికారి, 17 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. జిల్లా కమిటీ, గ్రేటర్ వరంగల్ కమిటీలో కూడా ఇంతే సంఖ్యలో నాయకులకు చోటు కల్పిస్తారు. రెండు కమిటీలకు పార్టీ అనుబంధ సంఘాలు ఉంటాయి. రెండు కమిటీల్లో నూ ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే లు ప్రతిపాదించే వారినే తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనలతో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల ప్రకారమే జిల్లా కమిటీలు ఉండనున్నాయి. అందరి దృష్టి అటే.. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పార్టీలోని కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నాయకులకు ఇబ్బందికరంగా మారుతోంది. దశాబ్దంన్నరగా టీఆర్ఎస్లో పని చేస్తున్న వారు ఇప్పుడు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇలాంటి వారు ఎక్కువగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరపడుతున్నా జిల్లా స్థాయిలో ఎవరికీ అవకాశాలు రాలేదు. ఎక్కువ మంది నాయకులు ఉండడంతో ఈ విషయంలో పోటీ నెలకొంది. అయినా ఎవరికివారు అధికార పదవుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుత జిల్లా కమిటీలో చోటు కోసం ప్రయత్నిస్తే.. నామినేటెడ్ పోస్టుల్లో కోత పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పార్టీ పదవి తీసుకుంటే భవిష్యత్తులో అధికార పదవికి రాదేమోనని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం.. ముందుగా పార్టీ పదవిలో ఉంటేనే అధికార పదవి తెచ్చుకునేందుకు మార్గం ఉంటుందని భావిస్తున్నారు. -
ప్రతిపక్షం గొంతునొక్కుతున్న అధికార పార్టీ
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: ప్రతిపక్షం గొంతు నొక్కి అసెంబ్లీని అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని పల్నాడురోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారెడీ మాత్రమేనని తప్పులు లెక్కలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి దగా చేశారని విమర్శించారు. అధికారపక్షం అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు వ్యక్తిగత ఆరోపణలను ఏకైక మార్గంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ఎవరికి మేలు చేసేలా లేదని కేవలం కాంట్రాక్టర్లకు కోసమే అన్న విధంగా బడ్జెట్ను రూపొందించార ని ఆరోపించారు. రైతులకు మొండి చేయి చూపించారన్నారు. రైతులు దయనీయ పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారణమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని బాబు వస్తే జాబు వస్తుందన్నారు. జాబు వచ్చేంది ఎలా ఉన్న ఉన్న జాబులను పీకేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేదు. డ్వాక్వా సంఘాలకు, చేనేత కార్మికులకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డున పడ్డా వారి గోడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజులు కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. వరికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తానని బీసీ ఓట్లు వేయించుకుని వారిని దగా చేశారన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతలచెర్వు వెంకిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, శావల్యాపురం కన్వీనర్ చుండూరు వెంకటేశ్వర్లు, చీరపురెడ్డి కోటిరెడ్డి , పట్టణ కన్వీనర్ నరాలశెట్టి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ చింతా ఆదిరెడ్డి, జిల్లా కార్యదర్శి డూమావత్ గోవిందునాయక్, మాజీ సర్పంచ్లు గంధం బాలిరెడ్డి, దండు చెన్నయ్య, పీఎస్ ఖాన్, మాజీ కౌన్సిలర్ చల్లా కొండయ్య, కాల్వ రవిరాజు, ఎపిపి పట్రా కోటేశ్వరరావు, ఎంఎల్ రెడ్డి, ఎన్ వెంకటేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి, శ్రీలక్ష్మీ, శ్రీరెడ్డి, గుత్తా కోటేశ్వరరావు, గురవయ్య, శ్రీనివాసరెడ్డి, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
పేదల పొట్టలు కొట్టి..రూ. కోట్లు ఆర్జన !
అధికార పార్టీ అండ ఉంటే ఎంతటి అక్రమమైనా సునాయాసంగా సాగిపోతుందనడానికి రేషన్ బియ్యం మాఫియా ఆగడాలే నిదర్శనం. చిలకలూరిపేట నియోజకవర్గం, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో యథేచ్ఛగా సాగిపోతున్న అక్రమబియ్యం వ్యాపారానికి అధికారపార్టీ నేతల అండదండలు, కాసులకు కక్కుర్తిపడిన అధికారుల సహకారం అనుకూలంగా మారింది. చిలకలూరిపేట : పేదల బియ్యం అమ్ముకుంటున్న రేషన్ మాఫియా రూ. కోట్లు గడిస్తోంది. డీలర్ల నుంచి కిలో తొమ్మిది రూపాయల వంతున బియ్యం కొనుగోలు చేసి, ఆ తరువాత పాలిష్ పట్టించి రూ. 21 వంతున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వినుకొండకు చెందిన ఓ వ్యాపారి, చిలకలూరిపేట నియోజకవర్గంలో ముగ్గురు వ్యాపారులు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఈ వ్యాపారంలో సిద్ధహస్తులని పేరుంది. నెలలో మూడో తేదీ నుంచి 20 వరకు ప్రకాశం జిల్లా కోనంకి, ఉప్పుమాగులూరు, చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం, యడవల్లి, మిట్టపాలెం, ఈవూరివారిపాలెం గ్రామాలకు సంబంధించి నాదెండ్లలోని వినాయకుని గుడి సమీపంలో, యడ్లపాడులో జాలాది బ్రిడ్జి, కారుచోల, పట్టణంలోని బాలాజీ థియేటర్ సెంటర్, చెరువుకు వెళ్లేదారిలో రాత్రి 11 గంటల నుంచి రెండు గంటల వరకు లోడింగ్ చేస్తుంటారు. రెండు గంటల తర్వాత బియ్యం లారీలు రోడ్డుపైకి వచ్చేలా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి గుంటూరు, విజయవాడ, గన్నవరం మీదుగా తాడేపల్లిగూడెం, మండపేటలోని మిల్లులకు రీసైక్లింగ్ కోసం తరలిస్తారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి నెలకు 30 లారీలు, ప్రకాశం జిల్లా నుంచి మరో 30 లారీలు తరలి వెళ్తుంటాయి. లారీకి 170 క్వింటాళ్ల చొప్పున బియ్యం లోడ్ చేస్తారు. ఇలా కోట్ల రూపాయలు అక్రమవ్యాపారుల జేబుల్లోకి చేరుకుంటున్నాయి. అధికారులకు నజరానా ... లారీలు లోడ్ చేస్తున్న సమయంలో బీటు పోలీసులు, హోంగార్డులు కనబడితే వెయ్యి నుంచి ఐదు వేల వరకు అందజేస్తారు. ఈ మొత్తాల కోసమే రాత్రి బీటు చేయటానికి కొంతమంది పోలీసులు పోటీపడుతున్నారు. రోడ్డు మీదకు చేరుకోవటానికి చెక్పోస్టు వారికి లారీకి రూ. వెయ్యి అందిస్తారు. టోల్ప్లాజా వద్ద నుంచి గన్నవరం వరకు తరలిపోవటానికి లారీ ఒక్కింటికి రూ. 1500 చొప్పున సేల్స్ట్యాక్స్ అధికారికి అందజేస్తుంటారు. గతంలో గుంటూరులో విధులు నిర్వహించి ప్రస్తుతం కావలిలో పనిచేస్తున్న వాణిజ్యపన్నుల అధికారి ఒకరు ఫోన్ల ద్వారా తమ శాఖ అధికారులకు సూచనలు అందజేస్తుంటారని తెలిసింది. నాదెండ్ల మండలం నుంచి లారీలు బయటకు రావటానికి ఓ అధికారికి 50 వేలు, పట్టణ, రూరల్ పరిధి నుంచి బయటపడటానికి మరో అధికారికి లక్ష రూపాయలు ముట్టజెప్తున్నట్లు సమాచారం. వీటితో పాటు పట్టణానికి చెందిన అధికార పార్టీ యువ నాయకుడికి ప్రతి నెలా, ప్రతి వ్యాపారి లక్ష రూపాయలు అందజేయాల్సి ఉంటుందని సమాచారం. పెద్దలపై చర్యలేవీ....? పోలీసు ఉన్నతాధికారులకు అందే సమాచారం మేరకు స్థానిక అధికారులు అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో లారీడ్రైవర్లను మాత్రమే అరెస్టు చేసి బియ్యం వ్యాపారులను వదిలివేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22 తెల్లవారు జామున పట్టణంలోని సింగ్నగర్లో ఆరుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని మాత్రమే అరెస్టు చేశారు. అసలు వ్యాపారం చేసేవారిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎఫ్ఐఆర్లో అందరు నిందితుల వివరాలు పొందుపరిచిన పోలీసులు ఆ ఇద్దరి పేర్లకు సంబంధించి కనీసం ఇంటిపేర్లు, వయస్సు, తండ్రిపేర్లు పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద స్వాధీనం చేసుకున్న నాలుగు లారీల అక్రమ రేషన్ బియ్యం కేసులో కూడా సూత్రధారులను అరెస్టు చేయలేదు. గతంలో వినుకొండకు చెందిన బియ్యం వ్యాపారి బెయిల్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాక తీరికగా అరెస్టు చేశారు. దీనిని బట్టి ఇక్కడ అధికారులు అక్రమార్కులకు ఎంతగా సహకారమందిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. -
తమ్ముళ్ల దందా
రాజంపేట: అక్కడ అధికారులు తమ్ముళ్లకు తలవంచి పనిచేయూల్సిందే... చట్టం, నిబంధనల గురించి ఆ ప్రాంతంలో మాట్లాడకూడదు... తమ్ముళ్లు చెప్పిన మాటలకు తలూపాల్సిందే. ఏదో సొంత పనిచేసిపెట్టమని ఒత్తిడి చేస్తే అధికార పార్టీ వారు కదా అని సరిపెట్టుకోవచ్చు. అరుుతే వారు అడుతున్నది మనీ... ఏ అభివృద్ధి పని చేపట్టిన తమ మామూళ్లు ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే పని ఆగిపోవాల్సిందే. కొందరు అధికారులు సైతం వారికి సహకరిస్తుండడంతో వారి పని సులువు అవుతోంది. ఇలాంటి అధికారులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని సీపీఐ నాయకులు చెబుతున్నారు. ఈ శాఖ..ఆ శాఖనికాదు.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆగిపోరుున పనులే ఇందుకు నిదర్శనం. వారు చెప్పినట్లు చేయకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి పని సాగకుండా అడ్డుకుంటారు. పార్టీకి ఆది నుంచి పనిచేసిన కరుడుకట్టిన తెలుగుతమ్ముళ్లు దందా తమ్ముళ్ల వ్యవహారాన్ని బహిరంగగానే విమర్శిస్తున్నారు. నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాల, మైన్స్ అండ్ జియాలజి, రెవిన్యూ, ఐసీడీఎస్, మున్సిపాలిటి, వైద్యఆరోగ్యశాఖ, పోలీసుశాఖ పంచాయతీరాజ్ శాఖలలో దందా తమ్ముళ్ల జోక్యం అధికం కావడంతో ఆ శాఖల అధికారులు జీర్ణించుకోలేకున్నారు. అభివృద్ధి, సంక్షేమం అమలు విషయంలో అడ్డుగోలుగా వ్యవహారించాలని చేస్తున్న ఒత్తిడిలతో ఇక్కడి నుంచి బదిలీ చేసుకుని వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నారు. మరికొందరు అధికారులు అరుుతే వారితో కలిసిపోయూరు. ఇలాంటి వారిపై గవర్నర్, ప్రభుత్వకార్యదర్శికి పిర్యాదుచేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య చెప్పారంటే రాజంపేట డివిజన్లో పరిస్ధితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది. నిలిచిపోయిన రూ.10కోట్ల రోడ్డు రాజంపేట డివిజన్ పరిధిలో రాజంపేట-వత్తలూరు రోడ్డు విస్తరణలో భాగంగా సీఆర్ఎఫ్ కింద రూ.10కోట్లతో పనులు చేపట్టారు. 14 కిలోమీటర్ల తారురోడ్డు విస్తరణ పనులు చేయాల్సి ఉంది. ఈ పనుల దక్కించుకున్న కాంట్రాక్టరు అన్ని సమస్యలను అధిగమించి చేపట్టేసరికే ‘లోకల్’ పేరుతో వాటాలు ఇవ్వాలని మిట్టమీదపల్లెకుచెందిన తమ్ముళ్ల బృందం తేల్చి చెప్పింది. తమదైనశైలిలో బెదిరించడంతో కాంట్రాక్టరు పని నిలిపివేశారు. అయితే స్ధలం వివాదం వల్ల పనులు ఆపేయాల్సి వచ్చిందని డీఈఈ చలపతి చెబుతున్నారు. పని ఆపడం వెనుక స్ధల సమస్య ఉన్నా... అది పుట్టింది వాటాల కోసమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దినెలల కింద బోయనపల్లె-బ్రహ్మణపల్లె రోడ్డు విషయంలో కూడా వాటాలు రాలేదని.. తమకు కాకుండా మరొకరి గుడ్విల్ ఇచ్చారని పనులు అడ్డుకున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిటి వాటాల కోసం తమ్ముళ్లు కీచులాడుకుంటున్నారు. వాటాలు.. కమీషన్లు ఇస్తే చివరికి పనుల్లో నాణ్యత ఏ పాటి ఉంటుందో తెలిసిన విషయమే. తమ్ముళ్ల కనుసన్నల్లో.. రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సుండుపల్లె, వీరబల్లి, రాజంపేట మున్సిపాలిటిలో అధికారపార్టీ తమ్ముళ్ల తమ కనుసన్నలో అభివృద్ధి పనులు జరగాలని వివిధ శాఖల అధికారులపై స్వారీ చేస్తున్నారు. చౌకదుకాణం డీలర్లు నియామయకం, ఐసీడీఎస్ అంగన్వాడీ పోస్టులు, ఏరియా ఆసుపత్రి, మున్సిపాలిటిలో ఔట్సోర్సింగ్ పోస్టులు లాంటివి తమ్ముళ్ల చెప్పిన వారికే కట్టుబెడుతున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో అధికారులు ఉన్నారు. అధికారులు, అధికార పార్టీ, లంచం, Authorities, the ruling party, bribery -
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్!
పులివెందుల/సింహాద్రిపురం: పైడిపాలెం ప్రాజెక్టు వద్ద మరోమారు ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ, బిసీ వర్గాలకు చెందిన రైతుల కడుపు కొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు ఏమాత్రం ఆటంకం కల్గించమని పేర్కొంటున్నా, భూనిర్వాసితులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం చర్యలు కన్పిస్తున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్కచేయకుండా ఏకపక్ష చర్యలకు సిద్ధమయ్యారు. రైతన్నల ఆవేదనకు చలించిపోయినా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వారికి అండగా నిలవడంతో యంత్రాంగం వెనుదిరగాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతల ఒత్తిడి ఫలితంగా మరోమారు ట్రాన్సుకో ఏకపక్ష చర్యలకు సిద్ధమైంది. పైడిపాలెం ప్రాజెక్టు వద్ద ఉన్న ఎస్టీ రైతు పొలాలకు చెందిన విద్యుత్ కనె క్షన్లు తొలగించడానికి మంగళవారం అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సింహాద్రిపురం మండల పరిధిలోని పైడిపాలెం ప్రాజెక్టు కింద ముంపు గ్రామమైనకుమ్మరాంపల్లెపై అధికారులు కక్ష కట్టారు. సోమవారం మధ్యాహ్నం గ్రామానికి విద్యుత్ అధికారులు విద్యుత్ను కట్ చేశారు. ఇది ఇలా ఉంటే మంగళవారం విద్యుత్ ఎస్ఈ సుబ్బరాజుతోపాటు డీఈఈ ఓబుళకొండారెడ్డితోపాటు భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని మళ్లీ విద్యుత్లైన్లతోపాటు ట్రాన్స్ఫార్మర్లు తొలగించేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు ఆందోళనకు దిగారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వారికి మద్దతుగా నిలిచి కోర్టు స్టే ఇస్తే ఎలా ధిక్కరిస్తారని ఎస్ఈ సుబ్బరాజును ప్రశ్నించారు. డినోటిఫికేషన్ ఇంకా ప్రకటించలేదన్నారు. ప్రాజెక్టు పనులకు తాము ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదని.. నీరు వస్తే తామే వెళ్లిపోతామని.. కడుపులు కొట్టకండని అధికారులను వేడుకున్నారు. కరెంటు సర్వీసులు తొలగిస్తే మూకుమ్మడిగా పురుగుల మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని.. పచ్చని తమ పొలాల్లో చిచ్చు పెట్టవద్దని అధికారులను వేడుకున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్నారు. కొండాపురం మండ లంలోని 14 గ్రామాల రైతులు ఇలాగే లబ్ది పొందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం తమ గ్రామంలో ఉన్న 30కుటుంబాలపైనే అధికారులు ఎందుకు ఇంత కక్ష కడుతున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. ఒకదశలో అధికారుల దౌర్జన్యం నశించాలంటూ రైతులు నినాదాలు చేశారు. సీఎం రమేష్నాయుడు ఆదేశించారని కోర్డు ఆర్డర్ను ధిక్కరిస్తారా అని ఎస్ఈని రైతులు ప్రశ్నించారు. విద్యుత్లేక చీకట్లో మగ్గుతున్నామని ఎస్టీ, బీసీ రైతులు వాపోయారు. ఎస్టీ కుటుంబాలపైన ఇంత కక్ష సాధింపా అని వారు ప్రశ్నించారు. పైడిపాలెం ప్రాజెక్టుకు నీరు వచ్చేవరకు తామే యజమానులం అంటూ రైతులు స్పష్టంచేశారు. పగబట్టిన కలెక్టర్... భూ నిర్వాసితులమన్న కనీస స్పృహ లేకుండా జిల్లా కలెక్టర్ తమ గ్రామంపై పగబట్టారని రైతులు వాపోయారు. టీడీపీ వారు ఆదేశిస్తే హైకోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్కచేయరా అని వారు ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వుల్ని ఖాతరు చేయకపోవడం నేరమన్న విషయాన్ని గ్రహించాలని వారు అధికారులకు తెలిపారు. దీంతో ఎస్ఈ సుబ్బరాజు కలెక్టర్తో మాట్లాడారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో చర్చల వివరాలు వెల్లడించారు. ఎట్టకేలకు అధికారులు వెనుతిరిగి వెళ్లారు. జిల్లా కలెక్టర్తో కూడా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. రైతులపట్ల కనికరం లేకుండా ఇలా ప్రవర్థించడం మంచిదికాదని ఆయన హితవు పలికారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగపు కార్యదర్శి అరవిందనాథరెడ్డి, ఎంపీపీ భర్త కొమ్మా పరమేశ్వరరెడ్డి, బలపనూరు శేఖరరెడ్డి, లోమడ జనార్థన్రెడ్డి, కొత్తపల్లె భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ పవన్, సర్పంచ్లు శివారెడ్డి, కిశోర్రెడ్డి, ప్రకాష్రెడ్డి, ప్రతాప్రెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బయ్యనాయుడు, ఏడీ శ్రీకాంత్, ఏఈలు రమేష్రెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంటలు కోల్పోతే బజారున పడాల్సిందే : 4ఎకరాల పొలంలో వేరుసెనగ, కూరగాయల పంట సాగు చేశా. నెలరోజుల్లో పంట చేతికి రానుంది. అధికారులు కక్ష కట్టి ప్రతాపం చూపిస్తున్నారు. ఎస్టీలమైన మాకు ఏ ఆధారంలేదు. విద్యుత్ సరఫరాలేక పంటలు కోల్పోతే బజారున పడాల్సి వస్తుంది. - పుష్పాంజలి(మహిళా రైతు), పైడిపాలెం అధికారులవి కక్ష సాధింపు చర్యలు : రాజకీయ దురుద్దేశంతోనే మా గ్రామానికి విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. వారికి ఏమి అపకారం చేశాం. అధికారులు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. - లక్ష్మిదేవి (మహిళా రైతు), పైడిపాలెం కోర్టు ఆర్డర్ను గౌరవించాల్సిందే :ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోర్డు ఆర్డర్ను సామాన్య వ్యక్తి నుంచి అత్యున్నతస్థాయి వ్యక్తుల వరకు అందరూ గౌరవించాల్సిందేనని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పైడిపాలెం ప్రాజెక్టు వద్ద ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు వారాల క్రితం విద్యుత్ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా కలెక్టర్ ఆదేశించారని పైడిపాలెం పొలాల కరెంటు సర్వీసులను తొలగించడానికి వచ్చారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కలెక్టర్ అధికారులను పంపారన్నారు. ఆ రోజు రైతులు అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారని.. తర్వాత హైకోర్టును ఆశ్రయించిన రైతులు 6వారాల పాటు స్టేటస్ కో ఆర్డర్ పొందారన్నారు. ఈ ఆర్డర్ను కలెక్టర్, అధికారులకు చూపించినా కూడా మళ్లీ ఇప్పుడు పొలాల సర్వీసులను తొలగించడానికి వచ్చారన్నారు. హైకోర్టు ఆర్డర్ను అధికారులు పాటించాల్సిందిపోయి వ్యతిరేకంగా నడుచుకోవడం శోచనీయమన్నారు. -
టీడీపీ ఆగడాలను అడ్డుకోండి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో అధికార పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని, అడ్డుకోండని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారన్నారు. జిల్లాలోని 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా శ్రేణులకు అండగా ఉంటారని ఆయన భరోసానిచ్చారు. శనివారం కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధికార బలంతో టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసో, ఆశ పెట్టో ఒక పార్టీ టికెట్టుపై గెలిచిన వారిని తమ పార్టీలోకి తీసుకోవడం మంచి కార్యక్రమం కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలంటే ప్రజలను ఇసుక ధర భయపెడుతోందని అన్నారు. ఇసుక రేటు చూసి పేదలు ఇల్లు కట్టుకోవడాన్ని నిలిపివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు (శుక్ర, శనివారాలు) జరిగిన కర్నూలు జిల్లా సమీక్ష సమావేశాలు శనివారంతో ముగిశాయి. రెండో రోజు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వ్యక్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారి స్థానంలో మరింత మంచి వారిని తయారుచేసుకునేందుకు మనకు అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ తీరును ఆయన ఎండగట్టారు. అవ్వాతాతల పింఛన్ల సంఖ్యలో కోత పెట్టేందుకు సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ నేతలు వస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల పాటు సాగిన సమీక్ష సమావేశాలు జిల్లాలోని పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కలిగించాయి. పార్టీ నాయకత్వం మొత్తం కర్నూలుకు తరలివచ్చింది. పార్టీ శ్రేణుల రాకతో కర్నూలు కిటకిటలాడింది. మొత్తం మీద రెండు రోజుల పాటు సాగిన సమీక్ష సమావేశాలు అటు నేతల్లోను, ఇటు కార్యకర్తల్లోనూ సమరోత్సాహాన్ని నింపింది. ప్రజా సమస్యలపై కలిసి పోరాడదామని ప్రతిన పూనారు. పోరాడమని ప్రజలడుగుతున్నారు...! ఎన్నికల వుుందు బాబు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్ధాలకు విసుగెత్తి ప్రజలందరూ తవు తరపున పోరాటం చేయూలని పార్టీపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రుణమాఫీ పేరుతో కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. మొత్తం రూ.87 వేల కోట్ల రుణాలుంటే కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిందని మండిపడ్డారు. వాస్తవానికి రూ.87 వేల కోట్లకు 14 శాతం అపరాధ రుసుంతో లెక్కిస్తే వడ్డీనే రూ.12 వేల కోట్లు అవుతుందన్నారు. మరోవైపు కొత్త రుణాలు లభించక అధిక వడ్డీలకు ప్రజలు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో ఉన్న కోటి 75 లక్షల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన బాబు.. ఇప్పుడు అసెంబ్లీలో నిలదీస్తే నేనెక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పానని నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగం లేని వారికి రూ.2 వేల నిరుద్యోగ భృతి గురించి కనీసం ప్రస్తావించడం లేదన్నారు. అవ్వాతాతల పింఛన్లను కత్తిరించేందుకు సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ మంత్రులు చెప్పిన వారిని నియమించారని.. వీరి పనంతా పింఛన్లను కత్తిరించడమేనని ధ్వజమెత్తారు. ‘బ్యాంకులో బంగారం ఇంట్లోకి వస్తుందనుకుంటే బ్యాంకు వాళ్లు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. అరుుతే, చంద్రబాబు ఇంట్లో బంగారు వూత్రం ఆయున భార్య మెడలోనే ఉంది. డ్వాక్రా అక్కాచెల్లెవ్ముల రుణాలు వూఫీ కాకపోగా... వాళ్లు పొదుపు చేసుకున్న డబ్బులను బ్యాంకులు లాక్కొంటున్న పరిస్థితి ఉంది’ అని విమర్శించారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వ పాలన సాగుతున్న ఈ పరిస్థితులల్లో వునం ప్రజలకు తోడుగా ఉండాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 20 గంటలపాటు సమీక్ష.. రెండు రోజుల పాటు సాగిన ఈ సమీక్షా సమావేశాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి రోజు నంద్యాల పార్లమెంటు స్థానం పరిధిలోని నియోజకవర్గాల సమీక్ష సమావేశం 12 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకూ సాగింది. రెండోరోజు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా... రాత్రి 8 గంటల వరకూ విరామం లేకుండా సాగింది. అంటే మొదటి రోజు 10 గంటలు... రెండో రోజు 10 గంటల చొప్పున మొత్తం 20 గంటలపాటు సమీక్ష సమావేశాలు జరిగాయన్నమాట. ఈ సమావేశాల్లో నియోజకవర్గానికి కనీసం 50 చొప్పున లెక్కిస్తే.. మొత్తం 14 నియోజకవర్గాల నుంచి సుమారు 700 మంది కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా మాట్లాడారు. వారిని పేరు పేరునా పలకరించి.. పార్టీ పటిష్టతకు వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకుని తప్పకుండా పాటిస్తానని కార్యకర్తలకు హామీనిచ్చారు. ఓడిపోయిన మూడు నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయామో కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టాలని సూచించారు. అధికార పార్టీ నుంచి వచ్చే విమర్శలను వెంటనే ఖండించాలని ఆదేశించారు. మొత్తమ్మీద ఈ సమీక్ష సమావేశాల వల్ల జిల్లాలో పార్టీకి మరింత ఊపు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, సీఈసీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, పత్తికొండ రామచంద్రారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనరు హఫీజ్ ఖాన్, మహిళా విభాగం జిల్లా కన్వీనరు నారాయణమ్మ, జిల్లా పార్టీ గ్రీవెన్స్సెల్ కన్వీనర్ తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్రబోతుల ఉదయభాస్కరరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ రమణ, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డిగారి రాకేష్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎ.శ్రీధర్రెడ్డి, పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
కళ్లు తెరవండి!
ఇది వల్లూరు మండలంలోని తప్పెట్ల ఇసుకక్వారీ.. ఇక్కడ నవంబర్ 3వ తేదీ నుంచి ఇసుక విక్రయాలు ప్రారంభించారు.. ఇప్పటి వరకు 17,640 క్యూబిక్మీటర్ల ఇసుకను విక్రయించారు. క్యూబిక్మీటర్కు రూ. 650 చొప్పున ప్రభుత్వానికి రూ. 1.50 కోట్ల ఆదాయం ఒనగూరింది.. కేవలం 50 రోజుల్లో ఒక తప్పెట్ల క్వారీ నుంచే వచ్చిన ఆదాయం ఇది.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 3.2 కోట్ల ఆదాయం లభించింది. ఇదిలా ఉండగా ఇంతకు పదిరెట్లు అక్రమంగా ఇసుక తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చూస్తుండిపోతోంది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి సంపద అధికార పార్టీ నేతలకు అందివచ్చిన అవకాశంగా మారింది. నాయకుల అక్రమ సంపాదనకు అడ్డుఅదుపూ లేకుండా ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో ఆరు రీచ్ల ద్వారా ఇసుక విక్రయాలు చేస్తున్నారు. మరో 15 రీచ్లలో ఇసుక తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెయ్యేరు నదిలో 6 రీచ్లు, పెన్నాలో 5 రీచ్లు, పాపాఘ్నిలో 4 రీచ్లను ఏర్పాటు చేయలని నిర్ణయించారు. దాదాపు 80 హెక్టార్లలో 9లక్షల 5వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించవచ్చనేది అధికారుల అంచనా. తద్వారా రూ.60 కోట్లు ఆదాయాని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాత్రికి రాత్రే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నా ఎవరూ నియంత్రించడం లేదు. ప్రధానంగా తప్పెట్ల, పైడికాల్వ, కమలాపురం, ములుకోనిపల్లె, నందిమండలం, వేంపల్లె, వీరన్నగట్టుపల్లె నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాగే కొండాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, చెన్నూరు మండలాల నుంచి కూడా ఇసుక సంపదను కొల్లగొడుతున్నారు. అంతలోనే ఎంత మార్పు... నదుల్లోని ఇసుక తరలిస్తే భూగర్భజలాలు అడుగింటి పోతాయని ఆవేదన చెందుతూ ఆందోళన చేపట్టిన నాయకులు అధికారపీఠం ఎక్కగానే దృష్టి మరలుతోంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్రెడ్డి తీరు ఇందుకు దర్పంగా నిలుస్తోంది. 2007-08లో తంగేడుపల్లె (వేంపల్లె దిగువన) ఇసుక టెండర్ నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇసుకను తరలిస్తే నీటిపథకాలకు గ్రహణం పడుతుందని, వేంపల్లెకు తాగునీటి సమస్య వస్తుందని ఆవేదన చెందారు. ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వేంపల్లె గ్రామానికి పైభాగాన కుమ్మరాంపల్లె గ్రామం ఉంది. తాగునీటి పథకాలన్నీ కుమ్మరాంపల్లెకు సమీపంలోనే ఉన్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఒక్కమారు కూడా పట్టుమని పదిరోజులు పాపాఘ్ని నదిలో నీటి ప్రవాహం లేదు. నాడు వేంపల్లె భూగర్భజలాలపై ఆందోళన చెందిన ఎస్వీ సతీష్రెడ్డికి ప్రస్తుతం కుమ్మరాంపల్లె ఇసుకక్వారీ గుర్తుకు రాకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కరువు మండలాలతోనే సరి... జిల్లాలో 48 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చెన్నూరు మండలాలు మినహా తక్కినవికరువు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రకటన మినహా ఇంతవరకు ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవలేదు. కరవు నేపధ్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుదిబండగా ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కార్మికులు, చిన్నతరహా పరిశ్రమల యజమానులకు గుదిబండగా మారింది. జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న 20వేల మంది రోడ్డుపాలయ్యారు. బెరైటీస్ ఖనిజం ఆధారంగా 180 మిల్లులు పనిచేస్తున్నాయి. వాటిలో ప్రత్యక్షంగా 5వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇదివరకు 40ః60 దామాషా ప్రకారం బెరైటీస్ ఖనిజాన్ని సరఫరా చేసేవారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు గ్యారంటీ అనీ ప్రకటనలు ఇచ్చారు, ఇప్పుడేమో కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు. జఠిలంగా మారుతున్న తాగునీటి సమస్య... వేసవి రాకముందే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. 185 గ్రామాలు నీటి ఎద్దడితో ఉన్నాయి. వాటిలో 110 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్రాక్టర్కు రూ.500 మాత్రమే కేటాయిస్తున్నారని .. మిగతాది తాము చేతి నుంచి భరించాల్సిన దుస్థితి నెలకొందని ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు నీటి తరలింపునకు వెనక్కి తగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తుండటంతో భూగర్భజలాల్ని అడుగంటి నీటి సమస్య ఏర్పడుతోంది. కొనసాగుతున్న వివక్షత... జిల్లాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివక్షత ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు స్పష్టమైన ఉదాహరణలుగా ఎయిర్పోర్టు, కలెక్టరేట్ కాంప్లెక్స్ బిల్డింగ్లు నిలుస్తున్నాయి. కడప విమానాశ్రయంలో దిగేందుకు కింగ్ఫిషర్, జెట్ ఏయిర్ వేస్, స్పైజెట్లు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. వాటితోపాటు ప్రభుత్వ విమానయాన సంస్థ ఇండియన్ ఏయిర్ లైన్స్ సర్వీసులు ఎలాగూ నడుస్తాయి. అయితే కడప విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఏయిర్పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో కేవలం ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులు మాత్రమే సౌకర్యం ఉంటుంది. దీనికి కూడా కొందరు అడ్డుపుల్ల వేస్తున్నారు. దీంతో విమానాశ్రయ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది. కలెక్టరేట్ కాంప్లెక్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లో పూర్తయిన భవనాలు ఐదేళ్లుగా అలాగే ఉండిపోతున్నాయి. జిల్లాలోని గండికోట ప్రాజక్టులో ఏకకాలంలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పెండింగ్ కారణంగా గండికోట ముంపు గ్రామాలు ఖాళీ కాలేదు. గండికోట, మైలవరం, వామికొండ, సర్వారాయసాగర్, బ్రహ్మంసాగర్లలో నీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉండి కూడా ఆ మేరకు చర్యలు తీసుకోలేకపోతున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈనేపధ్యంలో శనివారం జిల్లా సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ చూపెట్టాలని పాలక పక్షం వివక్షతను ఎండగట్టాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. -
అధికార పార్టీ నేతల్లో కలవరం
‘రాష్ట్రంలో నియంతపాలన నడుస్తోంద’ంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి గణపతి చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. గణపతి వ్యాఖ్యలను పాలక పక్షానికి హెచ్చరికగా భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు తమ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి : ఇంతకాలం మావోయిస్టు పార్టీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపడమే కాకుండా టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత పాలకపక్ష విధానాలను స్వయంగా మావోయిస్టు పార్టీ చీఫ్ గణపతి తప్పుబట్టడం ప్రాధాన్యం సంతరించుంది. మావోయిస్టు పార్టీ విధానమే తన విధానమంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిర్బంధాన్ని అమలు చేస్తున్నారంటూ సీఎంను ఒక నియంతగా పేర్కొనడం సంచనలం కలిగించింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై గణపతి మండిపడ్డ నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న మావోయిస్టులు ప్రభుత్వంపై విరుచుకపడడంతో అధికార పార్టీ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పార్టీ బలంగా ఉండి సమాంతర పాలన కొనసాగిస్తోంది. ఇదేక్రమంలో ఆ పార్టీ మళ్లీ తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. గతనెలలో పౌరహక్కుల సంఘాలు హైదరాబాద్లో తలపెట్టిన సభను ప్రభుత్వం అడ్డుకున్నప్పటి నుంచి కేసీఆర్పై విప్లవసంఘాలు, హక్కుల సంఘాల నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో గణపతి కేసీఆర్పై చేసిన ప్రకటన అధికారపార్టీ నాయకులను కలవరపెడుతోంది. రెండు నెలలక్రితం ఆదిలాబాద్ పరిసరాల్లో జరిగిన ఎన్కౌం టర్లో మహారాష్ట్రకు చెందిన దళం హతమైంది. అప్పటినుంచే అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులకు భద్రతను పెంచారు. పోలీసుస్టేషన్లకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటనను ఖరారు చేసుకోవాలని పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రస్తుతం అదే పద్ధతిలో నాయకుల పర్యటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గణపతి హెచ్చరికతో ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 2నుంచి కొయ్యూర్ మృతవీరుల సంస్మరణార్థం మావోయిస్టు పార్టీ తలపెడుతున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతుండగానే గణపతి ప్రకటన మరింత కలకలం రేపుతోంది. -
అధికార పార్టీలో గ్రానైట్ వార్!
చెక్పోస్టుల ఎత్తివేతపై స్వపక్ష నేతల రుసరుస సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో గ్రానైట్ వార్ కొనసాగుతూనే ఉంది. గ్రానైట్ ఓవర్లోడ్తోపాటు ఇతర అక్రమాలను అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులను రాత్రికి రాత్రే ఎత్తివేయడంతో ప్రతిపక్ష పార్టీలోనూ, అధికార పార్టీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రానైట్ అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా విడిపోయారు. గ్రానైట్ అనుకూలవర్గం తమకున్న అధికార, అంగ, అర్థబలంతో చెక్పోస్టులను ఎత్తివేయించిందని భావిస్తున్న వ్యతిరేకవర్గం జిల్లాలో గ్రానైట్ పేరిట జరుగుతున్న అక్రమాలను, గ్రానైట్ వల్ల ప్రజలకు, పర్యావర ణానికి జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలున్న నేపథ్యంలో వారు దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకంజ వేస్తున్నారు. త్వరలోనే గ్రానైట్ వ్యతిరేక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా సమావేశమై తగిన కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గ్రానైట్ అనుకూల ఎమ్మెల్యేలు, నాయకుల్లో తమ అభీష్టానికి వ్యతిరేకంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎత్తివేయించడంలో సక్సెస్ అయ్యామనే భావన వ్యక్తమవుతోంది. మంత్రికి తెలియకుండానే ఎత్తేశారా? గ్రానైట్ చెక్పోస్టుల ఎత్తివేత అంశం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. ప్రధానంగా మంత్రి ఈటెల రాజేందర్ సన్నిహితులు చెక్పోస్టుల ఎత్తివేతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి తెలియకుండానే చెక్పోస్టులను ఎత్తివేశారని చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలో అధికారుల బదిలీలు, ఇతరత్రా ముఖ్యమైన వ్యవహారాలు మంత్రికి సంబంధం లేకుండా జరిగిపోతున్నాయని వాపోతున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్బాబు సిఫారసు చేసిన వారికే పోస్టింగులివ్వడంతోపాటు పనులను కట్టబెట్టేవారని, ప్రస్తుతం మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెల సైతం జరుగుతున్న పరిణామాలను లోలోపలే దిగమింగుకుంటున్నారే తప్ప పైకి మాట్లాడలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా, సీనియర్ నాయకుడిగా తానే అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదనే భావనతో ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ సమావేశం నుంచి తీవ్రమైన పోరు గతంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం సందర్భంగా అధికార పార్టీ నేతల మధ్యనున్న గ్రానైట్ విబేధాలు బయటపడ్డాయి. ఆ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు గ్రానైట్ వ్యాపారానికి అనుకూలంగా మాట్లాడగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావడంతో పార్టీలో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలోనే గ్రానైట్ వ్యాపారుల అక్రమాలు పత్రికల ద్వారా వెలుగుచూస్తుండడం పార్టీని కుదిపేసింది. ఓవర్లోడ్, తదితర అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేయగా, తాజాగా ప్రభుత్వ ఁముఖ్య*నేత నుంచి గ్రానైట్ వ్యాపారులకు అనుకూలమైన నిర్ణయం రావడంతో గ్రానైట్ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. గ్రానైట్ అక్రమాలపై గొంతెత్తాలని ఉన్నా పెద్దల అండదండలు ఎదుటివారికే ఉండడంతో కిమ్మనడం లేదు. తమను పట్టించుకోకుండా గ్రానైట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల తీరుపై మాత్రం లోలోన మండిపడుతున్నారు. తాము కూడా ప్రజాప్రతినిధులమేనని, ఓవైపు తాము అభ్యంతరం చెబుతుంటే, తమను కాదని ఏకంగా పెద్దల స్థాయిలో ఒప్పందం కుదుర్చోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి చెక్పోస్టుల ఎత్తివేతపై బహిరంగంగా పెదవి విప్పకపోయినప్పటికీ అదను కోసం ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని ఆసక్తి సర్వత్రా నెలకొంది. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో నెలకొన్న విభేదాలు తమను ఎక్కడ ముంచుతాయోనని గ్రానైట్ వ్యాపారులు వాపోతున్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. వాటిని కాజేసేందుకు పథకాలు రచిస్తున్నారు. రెవెన్యూశాఖలోని కొందరి బలహీనతలను ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ అక్రమాల వెనుక వీఆర్ఓలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి స్వార్థానికి ప్రభుత్వభూములే కాకుండా చెరువులు, కుంటలు.. ఆఖరుకు శ్మశానాలు సైతం కరిగిపోతున్నాయి. - అనంతపురం అర్బన్ జాతీయ రహదారి పక్కనున్న భూములే కీలకం రాష్ర్ట విభజన అనంతరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు రెట్టింపు కావడంతో ప్రభుత్వ భూములపై కొందరు ప్రబుద్ధులు కన్నేశారు. ప్రధానంగా 44వ జాతీయరహదారిని ఆనుకుని ఉన్న భూములను దక్కించుకునేందుకు తెగబడుతున్నారు. ఈ వ్యవహారం వీఆర్ఓలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో వారు సైతం కబ్జాదారులకు అండగా నిలిచి, అవరసమైన రికార్డులు పూర్తి చేసి ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 3.76 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. 2004కు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా సుమారు 75 వేల ఎకరాలను పేదలకు పంచిపెట్టింది. అదే ప్రభుత్వ హయాంలో 2010-14 మధ్య మరో ఆరు వేల ఎకరాలను ఇతరుల పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. 20 వేల ఎకరాలకు పైగా కబ్జా రాప్తాడు నుంచి పెనుకొండ వరకు 44వ జాతీయ రహదారికి ఇరువైపులా వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇటీవల 20 వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. కనగానపల్లి మండలం దాదలూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే 498-2బీ భూమిని చింత వనం కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే అదే సర్వే నంబర్లో దాదాపు 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ముక్తాపురానికి చెందిన ఓ వ్యక్తికి ధారాదత్తం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఏడాదిగా దాదాలూరు పంచాయతీకి వీఆర్ఓ లేకపోవడంతో ముక్తాపురం వీఆర్ఓను ఇన్చార్జిగా నియమించారు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్లతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినందుకు ఇన్చార్జి వీఆర్ఓపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆక్రమిత చింతవనంలో గోరు చిక్కుడు పంటను సాగు చేస్తుండడం గమనార్హం. ఇలా కాజేస్తున్నారు.. వీఆర్ఓలు కొంతమంది రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రక్క ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు ఒక ఎకరాకు రూ. 10 వేలు నుంచి రూ. 20 వేల వరకు తీసుకుని ఒక్కొక్కరి పేరుతో మూడు నుంచి ఐదు ఎకరాలకు పాత తేదీలలో ఫోర్జరీ సంతాకాలతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. రహదారులు, జాతీయ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు ఒక ఎకరానికి రూ. 50వేలు నుంచి రూ. 60 వేల వరకు తీసుకుని పలుకుబడి ఉన్న నాయకులకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, గోరంట్ల, ఓడీసీ, అమడగూరు, కూడేరు, నార్పల, మండలాల్లో ప్రభుత్వ భూమి వేలాది ఎకరాలు కబ్జాకు గురైయింది. ఈ కబ్జాకు గురైన భూమిపై వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు కూడా తీసుకున్నారు. ఒకసారి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ జారీ చేస్తే ఆ భూమి రెట్టింపు ధరలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ ప్రభుత్వ భూముల కబ్జాలతో కొంతమంది వీఆర్ఓలు కోట్లకు పడగలెత్తున్నారనే ఆరోపణలు కోకొల్లలు. -
అయిననూ.. తవ్వేస్తాం
కర్నూలు రూరల్: ఇసుక తవ్వకాల్లో అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పర్యావరణానికి ముప్పు తప్పదని తెలిసినా.. ఆదాయమే పరమావధిగా ముందుకెళ్తోంది. తవ్వకాలకు కేంద్ర పర్యావరణ అనుమతి లభించకపోయినా.. రెండు రాష్ట్రాల మధ్య నదీ సరిహద్దు వివాదమూ కొలిక్కి రాకపోయినా.. నిడ్జూరు రీచ్లో ఏకంగా డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి చేతుల మీదుగా ఇసుక తవ్వకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అనుమతులు లేవనే విషయాన్ని భూగర్భ గనుల శాఖ, డీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. హడావుడిగా ఇసుక వ్యాపారం డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నామనే ప్రకటన వెనుక అనధికారంగా టీడీపీ నేతల హస్తముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇసుక రీచ్ల కేటాయింపుతో డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తామని చెబుతున్నా.. ఇసుక అక్రమ తరలింపుతో టీడీపీ వర్గీయులకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. పర్యావరణ అనుమతులు పక్కనపెడితే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నదీ సరిహద్దులపై పలుమార్లు ఇరు ప్రాంతాల రైతుల మధ్య వివాదం చెలరేగింది. ఘర్షణలకు కారణమైంది. ఈ అంశం కొలిక్కి రాకమునుపే తవ్వకాలకు సిద్ధమవడం విమర్శలకు తావిస్తోంది. సహజ సంపదను కాపాడాల్సిన అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తవ్వకాలకు అనుమతులు ఇచ్చేయడం ఏ పరిస్థితికి దారితీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. డ్వాక్రా సంఘాలకు ఇసుక తవ్వకాలు చేసి విక్రయించేందుకు జిల్లాలో మంత్రాలయం, నిడ్జూరు-బావాపురం రీచ్లను మొదటి దశ కింద అధికారులు అనుమతిచ్చారు. నిడ్జూరు రీచ్లో 50వేల మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు తేల్చారు. వాస్తవానికి అక్కడ అంత మొత్తంలో ఇసుక లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణం వల్లే నిడ్జూరు గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్లు 2012 సంవత్సరం వేసవి కాలంలో నది మధ్యలోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఏపీ, తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఘర్షణ పడ్డారు. ఇలా రెండు, మూడుసార్లు సరిహద్దుపై వివాదం చెలరేగిన ప్రాంతంలో తవ్వకాలు చేయాలని అధికారులు గుర్తించడం వివాదాస్పదం కానుంది. అంటే ఇసుక లేనప్పటికీ ఇతర ప్రాంతాల్లో అనధికారంగా ఇసుక తవ్వకాలు చేపట్టి.. నిడ్జూరు ఖాతాలో వేసేందుకు పన్నిన పన్నాగంగా తెలుస్తోంది. నేతల కనుసన్నల్లోనే... డ్వాక్రా సంఘాలకు కేటాయించిన ఇసుక రీచ్లు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఉండేలా ముందస్తుగా వారి పార్టీకి అనుకూలమైన వారిచేతనే ఇసుక సహకార సంఘాలను ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం ఉంటే ఇసుక క్రయ విక్రయాల లెక్కలు అడుగుతారనే ఉద్దేశంతో సంఘంలో ప్రెసిడెంట్, సెక్రటరీలను వేలి ముద్రలు వేసే వారిని నియమించారు. ఆయా రీచ్ల సమీపంలోని గ్రామాల డ్వాక్రా సంఘాల్లో ఎంతో మంది చదువుకున్న వారున్నా పట్టించుకోకుండా.. ఏమాత్రం అర్హత లేని వారిని సంఘంలో నియమించారు. ఇప్పటికే తుంగభద్ర నదీ తీరంలోని పంచలింగాల, దేవమాడ, మునగాలపాడు గ్రామాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేసి లక్షలాది రూపాయల ప్రజా సంపదను దోచుకున్నారు. పంచలింగాలలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులకు మేము ఎంత ఇస్తే అంతే తీసుకొని మా డంప్లకు ఇసుక తీసుకురావాలని.. లేకపోతే అధికారులతో దాడులు చేయించి మీ వాహనాలకు సీజ్ చేయిస్తామని హెచ్చరికలు జారీ చేస్తుండటం గమనార్హం. -
బదిలీల జాతర
‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం’ సామెతను అధికార పార్టీ నేతలు చక్కగా వంటబట్టించుకున్నారనే చర్చ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. తమకు తెలీకుండా బదిలీలు జరిగేందుకు వీల్లేదని ఉన్నతాధికారులకు హుకూం జారీ చేశారు. పోస్టులకు వెలకట్టి ద్వితీయ శ్రేణి నేతలతో బేరసారాలు సాగిస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత సిఫార్సు లేఖను చేతిలో పెట్టి ‘బెస్టాఫ్.. లక్’ చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో జేబు నింపుకోవడమే ధ్యేయంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. తహసిల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఎస్పీడీసీఎల్ ఏఈలతో పాటు పలు కీలక శాఖలకు సంబంధించిన పోస్టులకు తాము సిఫార్సు చేస్తూ లేఖలు ఇచ్చినవారికే ఇవ్వాలని కొందరు ప్రజాప్రతినిధులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. కోరుకున్న స్థానాన్ని దక్కించుకునేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ‘మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను. మీ సూచనలు, నిర్ణయాలకు ఫేర్గా ఉంటాను. నాకు లెటర్ ఇవ్వండి సార్’ అంటూ పలువురు ఉన్నతోద్యోగులు.. ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు అధికారులు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లెటరు కూడా తీసుకుంటున్నారు. సిఫార్సు లేఖలు ఇచ్చేందుకు కొందరు ప్రజాప్రతినిధులు పోస్టును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. దీంతో కొందరు అధికారులు అంత డబ్బులు ఇవ్వలేమని వెనకడుగు వేస్తుంటే, ఇంకొందరు పోస్టింగ్లో చేరిన వెంటనే ఒప్పుకున్న డబ్బులు ముట్టజెపుతామని ముందడుగు వేస్తున్నారు. కీలక పోస్టులకు ఖరారైన అధికారులు! విద్యాశాఖలో కీలకమైన సర్వశిక్ష అభియాన్ పోస్టుకు ఓ మంత్రి లేఖ ఇచ్చారు. దీని కోసం భారీ మొత్తానికి బేరం కుదిరినట్లు సమాచారం. దీంతో ఆ ఫైలు సెక్రటేరియల్లో అన్ని టేబుళ్లుదాటి చివరగా సీఎం వద్దకు చేరింది. అక్కడ పీటముడి పడింది. రెవెన్యూకు చెందిన వ్యక్తికి ఆ పోస్టు ఇచ్చేందుకు సీఎం విముఖత చూపుతున్నారని సమాచారం. పెనుకొండ, కళ్యాణదుర్గం ఆర్డీవో పోస్టులకు రూ.20 లక్షలు, రూ.15 లక్షలు ధర నిర్ణయించినట్లు.. ఆ మొత్తం చెల్లించడానికి ఇద్దరు అధికారులు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. సీఐల బదిలీలకు సంబంధించి కూడా లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. జెడ్పీ చైర్మన్ సిఫార్సు కోసం ఎంపీడీవోల యత్నాలు ఎంపీడీవోల నియామకంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్మన్ సిఫారసు తప్పనిసరి అవుతోంది. ఎమ్మెల్యే లేఖ ఇచ్చినా జెడ్పీచైర్మన్ అభిప్రాయం కూడా ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలు మండలాలకు చెందిన టీడీపీ నేతలు తమ మండలానికి ఎంపీడీఓ ఎవరు ఉండాలనే అంశంపై జెడ్పీ చైర్మన్తో చర్చించారు. కొందరు ప్రజాప్రతినిధులు అధికారులకు లేఖ ఇచ్చినప్పటికీ, ఫోన్లో మరొకరి పేరు సిఫార్సు చేస్తూ ‘చేతివాటం’ ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి, ఉరవకొండలో కందికుంట వెంకట ప్రసాద్, పయ్యావుల కేశవ్ సూచించిన వారికే పోస్టింగ్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. -
మామూళ్ల మత్తు.. మస్త్
ఇద్దరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మద్యం సిండికేట్ సాక్షి ప్రతినిధి, అనంతపురం : మద్యం వ్యాపారులు జిల్లాలో మందుబాబులను గుల్ల చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. సరిగ్గా రెండేళ్ల కిందట మద్యం సిండికేట్ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో 2012 జూలై నుంచి కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుండి లక్కీడిప్ ద్వారా లెసైన్స్లు కేటాయించడం, ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయించడం లాంటి నిబంధనలు అమలు చేశారు. అయితే అవి ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది జూలై నుంచి కొత్త లెసైన్స్దారులు మద్యం దుకాణాలు నడుపుతున్నారు. దుకాణాన్ని బట్టి ఒక్కో లెసైన్స్కు 32.52 నుంచి 50 లక్షల రూపాయలు చెల్లించారు. ‘సిట్టింగ్ రూం’ కోసం మరో 2 లక్షల రూపాయలు అదనంగా చెల్లించారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం రాదని భావించిన వ్యాపారులు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓ మాజీ ఎమ్మెల్యేను కలిశారు. వారి అండతో సిండికేట్ అయ్యారు. ఒక్కో బాటిల్పై 10-15 రూపాయలు పెంచి విక్రయాలు జరుపుకునేందుకు నిర్ణయించారు. ఆబ్కారీ అధికారులు కూడా ఇందుకు ‘ఓకే’ చెప్పారు. ఇంకేముంది.. నెలన్నరగా జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. దీనివల్ల మందుబాబుల జేబులు గుల్లవుతోంటే.. మద్యం వ్యాపారుల గల్లా పెట్టె మాత్రం కళకళలాడుతోంది. నెలకు రూ.6.39 కోట్ల అదనపు ఆదాయం జిల్లాలో 233 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణంలో రోజుకు సగటున 610 బాటిళ్లు విక్రయిస్తున్నారు. ప్రతీ బాటిల్పై 10-15 రూపాయలు అదనంగా పెంచి విక్రయిస్తున్నారు. అంటే ఒక్కో దుకాణానికి రోజుకు 6,100 నుంచి 9,150 రూపాయలు వస్తుంది. ఈ లెక్కన నెలకు 1.83 లక్షల నుంచి 2.74 లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. అంటే 233 దుకాణాలకు నెలకు 4.26 కోట్ల నుంచి 6.39 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తోంది. నెలవారీ మామూళ్లు రూ.81.55 లక్షలు ఓ మద్యం వ్యాపారి వివరాల ప్రకారం.. అనంతపురం నగరంతో పాటు మునిసిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాల నుంచి అధికారులకు నెలకు 41 వేల రూపాయలు మామూళ్లు ఇస్తున్నారు. రూరల్ పరిధిలో 35 వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. సగటున ఒక్కో దుకాణం నుంచి 35 వేల రూపాయలు ఇస్తున్నారని అనుకున్నా నెలకు 81.55 లక్షల రూపాయలు మామూళ్లు అధికారులకు అందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్సైజ్ స్టేషన్కు 27-30 వేల రూపాయలు, ఎక్సైజ్ ఏసీ, సూపరింటెండెంట్ కార్యాయాలకు కలిపి 6 వేలు, డీపీ ఆఫీసుకు రూ.5 వేలు ఇస్తారని తెలుస్తోంది. ఇది కాకుండా ఆయా మద్యం దుకాణాల పరిధిలోని కొన్ని స్టేషన్లు మినహా తక్కిన స్టేషన్లకు మామూళ్లు అందుతున్నాయి. సిండికేట్ ద్వారా నెలకు 6.39 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే ఈ మాత్రం చెల్లించడం వీరికి పెద్ద లెక్కేం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిండికేట్ విషయంపై వివరణ కోరేందుకు ఎక్సైజ్ డీసీ జీవన్సింగ్ను ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
విచ్చలవిడిగా ఇసుక డంప్లు
సుండుపల్లి: మండలంలో ఇసుక డంప్లు భారీగా ఉన్నాయి. ఈ డంప్లు అధికార పార్టీ నాయకులవి కాబట్టే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మడితాడు పంచాయతీ సానిపాయి రోడ్డు మార్గంలో ఉన్న ఉప్పరపల్లి వెనుక వైపున మామిడి తోటల్లో ఇసుక డంప్లు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. అదే మార్గంలో గల చండ్రాయుడు ఆలయం వద్ద కూడా డంప్లున్నాయి. ఒక్కో డంప్లో వందల ట్రాక్టర్ల ఇసుక నిల్వ చేసి పెట్టారు. ఒక పక్క పోలీసులు, మరో పక్క రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మండల కేంద్రానికి కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలో సానిపాయి రోడ్డుకు కూత వేటులోనే డంప్లు ఉన్నప్పటికీ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యం. మండలంలోని పేదలు గృహ నిర్మాణాలకు ఇసుక లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇసుకాసురులు మాత్రం డంప్లను ఏర్పాటు చేసుకొని దర్జాగా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సానిపాయి మార్గంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద ఉన్న ఇసుక డంప్ను సీజ్ చేశారు. అయితే అక్కడికి దగ్గరగా ఉన్న మామిడి తోటలోని ఇసుక డంప్ల విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్ల దాడి
పులివెందుల : పులివెందులలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఉన్న ఫలంగా పులివెందుల నడిరోడ్డుపై ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ సంఘటనను చూడగానే ఉద్రిక్త పరిస్థితి. పులివెందులకు చెందిన వైఎస్ఆర్ సీపీ గిరిజనులపై అధికార పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో వారు కూడా ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య అర్ధగంటపాటు రాళ్లు, సీసాలతో యథేచ్చగా పరస్పరం విసురుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేముల మండలం చింతలజూటూరుకు చెందిన యువకులు పులి వెందులలో బైకులో వెళుతూ క్రిష్టియన్లైన్ సమీపంలో రోడ్డుపై జారి కిందపడ్డారు. సమీపంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి చెందిన గిరిజన యువకుడు సంఘటనను చూసి నవ్వినట్లు భావించిన ఆ యువకులు గిరిజన యువకుడు నిఖిల్పై దాడికి పూనుకున్నారు. సమీపంలో ఉన్న వారు సర్దిచెప్పారు. అయితే మళ్లీ కొద్దిసేపటికి యువకులతోపాటు మరో 40మంది టీడీపీ కార్యకర్తలు పుల్లారెడ్డి ఆసుపత్రి సమీపంలో దాడులకు సిద్ధమయ్యారు. దీంతో వైఎస్ఆర్ సీపీకి చెందిన గిరిజన కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో వైఎస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు అంజన్నప్ప, బాబులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఆలస్యంగా పోలీసులు సంఘటనా ప్రాంతం నుంచి పోలీస్స్టేషన్కు ఈల వేస్తే వినపడేంత దూరంలో ఉన్నా.. పోలీసులు మాత్రం చాలాసేపటి తర్వాత వచ్చారు. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే మధ్యలో వచ్చినా ఘర్షణ నివారించడం వారి వల్ల కాలేదు. ఇరువర్గాలు రాళ్లు వేసుకుం టున్న దాదాపు 15నిమిషాల తర్వాత ఒక్కసారిగా రూరల్, అర్బన్ సీఐలతోపాటు మిగతా సిబ్బం ది వచ్చి పరిస్థితి అదుపు చేశారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేయడంతోపాటు దొరికిన వాళ్లను దొరికనట్లు చితకబాది పరిస్థితి అదుపులోకి తెచ్చారు. పోలీసులు ముందే వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. 10మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు టీడీపీ నాయకులు, చింతల జూటూరు అంజితోపటు మరో 10మంది కులంపేరుతో దూషిస్తూ చితకబాదిన నేపథ్యంలో కావేటి అంజన్నప్ప ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. గాయపడిన ఇరువురిని పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. -
గ్రానైట్ వార్
ఎమ్మెల్యేల పోరు.. అధికార పార్టీలో చిచ్చు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రజాప్రతినిధుల మధ్య గ్రానైట్ వార్ మొదలైంది. అధికార పార్టీ నేతల మధ్యనే చిచ్చు పెట్టింది. ఇటీవల జిల్లా పరిషత్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రానైట్ పరిశ్రమపై రెండు వర్గాలుగా చీలిపోవటం చర్చనీయాంశంగా మారింది. పర్యావరణ విధ్వంసంతో పాటు రహదారులను ఛిద్రం చేస్తున్న గ్రానైట్ క్వారీలు.. రవాణాకు అడ్డుకట్ట వేయాలని మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఎమ్మెల్యేలు బొడిగె శోభ, రసమయి బాలకిషన్ తమ ఆవేదన వెళ్లగక్కారు. గ్రానైట్ లారీలు, క్వారీలతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని.. తమ సొంత నియోజకవర్గాల్లో రోడ్లన్నీ పాడైపోయాయని.. గ్రానైట్ రవాణా కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని ఆందోళన వెలిబుచ్చారు. అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు వారికి మద్దతు పలికారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే గ్రానైట్ పరిశ్రమపై ఏకపక్షంగా మాట్లాడటం సరైంది కాదని.. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి సైతం ఘాటుగానే స్పందించారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయం తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మైనింగ్ అధికారులను పిలిచి గ్రానైట్ ఓవర్లోడ్ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించినట్లు తెలిసింది. అదీ మొదలు.. జిల్లాలో గ్రానైట్ ఓవర్లోడ్ రవాణాపై అధికారులు కన్నెర్ర జేశారు. వరుసగా వారం రోజుల్లోనే 37 కేసులు నమోదు చేసి జరిమానా విధించటం వెనుక అసలు తతంగం ఇదేనని అర్థమవుతోంది. జిల్లాలో దాదాపు 350 గ్రానైట్ క్వారీలున్నాయి. ప్రతిరోజు దాదాపు 300 లారీల్లో గ్రానైట్ రవాణా అవుతోంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో సగానికి పైగా రాజకీయ నేతలకు చెందినవే. కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు.. విపక్షాలకు చెందిన నేతలు సైతం ఈ వ్యాపారంలో పాతుకుపోయారు. దీంతో అధికారులు సైతం గ్రానైట్ క్వారీల నిబంధన ఉల్లంఘన.. అడ్డగోలు ఓవర్లోడ్ రవాణా.. సీనరేజీ ఎగవేతపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆరోపణలున్నాయి. గ్రానైట్ రాళ్ల రవాణాతో కరీంనగర్, హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, చొప్పదండి, బోయినపల్లి, వేములవాడ, గంగాధర, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేసింది. గ్రానైట్ క్వారీల నుంచి తొలిగించిన మట్టి గుట్టలు కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై ప్రమాదాలకు నిలయంగా మారాయి. గ్రానైట్, ఇనుక లారీలతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేసేందుకు కనీసం రూ.50 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ.. ప్రభుత్వం నుంచి నిధులేవీ రాకపోవటంతో ఆర్అండ్బీ విభాగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఓవర్ లోడ్ రవాణాను అనుమతించాలని గ్రానైట్ క్వారీల యజ మానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన జిల్లా కు ప్రత్యేకంగా జీవో తెచ్చుకోవటం గమనార్హం. ఇక్కడి రాజకీయాలను.. అధికారులను శాసించే స్థాయికి గ్రానైట్ పరిశ్రమ వేళ్లూనుకుందని వరుసగా జరిగిన ఎన్నికలు.. వాటి ఫలితాలు సైతం రూఢీ చేశాయి. గుట్టలు కనుమరుగవుతున్నాయని.. కొత్తగా క్వారీలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. ఎన్నికల తర్వాత ఈ సంస్థలు పెదవి విప్పకముందే.. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగటం.. అందులోనూ అధికార పార్టీ నేతలే విరుచుకుపడుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
బెల్టు షాపుల్లేవట!
జిల్లాలో మద్యం అక్రమ అమ్మకాలు అస్సలు జరగడం లేదంట! అంతా పద్ధతిగానే జరుగుతోందట! వినేవాళ్లు వుండాలే గానీ.. మన ఎక్సైజ్ అధికారులు ఏమైనా చెబుతారు. తాము నమ్మడమే కాకుండా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ పట్టించుకోలేదనుకుంటుందట. అచ్చం ఎక్సైజ్ అధికారుల తీరూ ఇలానే ఉంది. క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నా ‘అబ్బే.. ఎక్కడా అలాంటివి జరగడం లేదండీ’ అంటూ మాయమాటలు చెబుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అధికార పార్టీ అండతో మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. ఆ సమాచారం తెలిసినా.. అధికారులు మాత్రం ఆవైపు కన్నెత్తి చూడడం లేదు. అనంతపురం క్రై ం : మీకో విషయం తెలుసా.. జిల్లాలోని అనంతపురం, పెనుకొండ ఎక్సై జ్ పరిధిలో కేవలం లెసైన్స్డ్ మద్యం దుకాణాలు, బార్లలో మినహా మరెక్కడా ‘బైనాక్యులర్’ పెట్టి వెతికినా మద్యం దొరకదంట. అబ్బ..ఛా..ఎవరు చెప్పారేంటి? మీకీ సందేహం వస్తుందని తెలుసు. మేం చెప్పకపోతే నమ్మరేమోనని ఎక్సైజ్ ఉన్నతాధికారులనే అడిగాం. వాళ్లే చెప్పారు. అంతా ఒకేనంట. వాళ్లు చెబితే మీరు నమ్మేస్తారా? అయ్యో.. రామా.. మీరు మరీను. ఆ శాఖ అధికారులు మనల్ని తప్పుదోవ పట్టిస్తారా? ఉన్నదున్నట్టే చెప్పుంటారు. అంతగా చెబుతున్నారు కదా మీకు తెలిసి దుకాణాల్లో కాకుండా బయట ఎక్కడైనా మందు దొరుకుతుందా? అనంతపురం, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, పెనుకొండ, హిందూపురం, రొద్దం, చిలమత్తూరు.. ఇలా చాలా మండలాల్లో ఎక్కడైనా..ఎప్పుడైనా.. సమయం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే..కావాల్సినంత మద్యం క్షణాల్లో లభ్యమవుతుంది. మరి అధికారులు అలా చెబుతున్నారేంటి? మీరే ఏదో పొరబడుతున్నట్లున్నారు?అయితే మేం కొన్ని అడ్రస్లు చెబుతాం. అక్కడికెళ్లి చూడండి. మేం చెప్పినట్లు మీకు కావాల్సిన మద్యం దొరక్కపోతే అప్పుడు నిలదీయండి. అంటే ఇదంతా అధికారులకు నిజంగా తెలుసుండదంటారా.. ఒకవేళ తెలిస్తే అలా ఎందుకు చెప్తారు? మీకు మరీ చాదస్తమనుకుంటా. ప్రతి లెసైన్సు దుకాణానికి అనుబంధంగా కనీసం మూడు, నాలుగు బెల్టు షాపులున్నాయి. అసలు దుకాణంలో ఎలాగూ ఎమ్మార్పీకే విక్రయించాలి. ఇది గిట్టుబాటయ్యేది కాదు. అందుకే ‘బెల్ట్’ పెట్టి పల్లె ముంగిట్లోకి మద్యం తీసుకొస్తున్నారు. అర్ధరాత్రీ.. అపరాత్రీ అని లేకుండా అమ్ముతున్నారు. ఇంకేముంది వాళ్లు చెప్పిన ధరకే కొనుక్కుని మందుబాబులు నిషాలో తేలుతుంటే.. వాళ్ల బలహీనతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు పండగ చేసుకుటుంన్నారు. ఇదేమీ రహస్యంగా జరిగేది కాదు కదా? అన్నీ అధికారులకు ఎరుకే. ఈ దుకాణాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరన్నది బహిరంగ రహస్యం. =అప్పుడప్పుడు దాడులు చేస్తేనే.. అనంతపురం ఎక్సైజ్ జిల్లా పరిధిలోని 25 మండలాల్లో 136 లెసైన్స్డ్ మద్యం దుకాణాలు, 3 బార్ అండ్ రెస్టారెంట్లు, ఒక క్లబ్ ఉంది. వీటిద్వారా ప్రభుత్వానికి మొదట విడతగా (నాలు గు నెలలు) రూ. 18.70 కోట్లు ఆదాయం వచ్చింది. మూన్నెళ్లలో (జూన్, జూలై, ఆగస్టు) 216 మద్యం అక్రమ వ్యాపార కే సులు నమోదయ్యాయి. 257 మందిని అరెస్టు చేశారు. 3227 లీ టర్ల మద్యం (ఐఎంఎల్), 199 లీటర్ల బీరును, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు దాడులు చేసినప్పుడు మాత్రమే దొరికినవి. ఇక రోజువారీగా దాడులు చేస్తే వీటి సంఖ్య ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. పెనుకొండ ఎక్సైజ్ జిల్లాలో 41 కేసులేనట! 25 మండలాలున్న అనంతపురం ఎక్సైజ్ జిల్లాలో మూన్నెళ్లలో (జూన్, జూలై, ఆగస్టు) 216 కేసులు నమోదైతే 38 మం డలాలున్న పెనుకొండ ఎక్సైజ్ జిల్లాలో కేవలం 41 కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం. 43 మందిని అరెస్టు చేసి 896 బాటిళ్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ 93 మద్యం షాపులు, 5 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉండి, అధిక మండలాలున్న చోటు కేసులు అంతంతమాత్రంగానే నమోదవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. కొంత మంది మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలున్నాయి. పైగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ సిబ్బంది కేసుల విషయంలో ముందగుడు వేయలేకపోతున్నట్లు సమాచారం. బెల్టు షాపులివి...గో = అనంతపురం రూరల్ పరిధిలోని పిల్లిగుండ్లకాలనీలో ఓ ఇంట్లో ఎప్పుడెళ్లినా మద్యం లభిస్తుంది. కంకర ఫ్యాక్టరీ సమీపంలో కూల్డ్రింక్ షాపుల్లో అర్ధరాత్రయినా ‘కిక్’ ఎక్కుతుంది. జాకీర్కొట్టాలులో మసీదు సమీపంలోని ఓ ఇంట్లో మద్యం అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. = బుక్కరాయసముద్రంలో అర్ధరాత్రి వెళ్లిన తాగుతూ తూలొచ్చు. ఇదే మండలం భద్రంపల్లిలోని ఓ నివాసంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. = కూడేరులో బ్రాంది షాపు సమీపంలో ఉన్న కూల్డ్రింక్ షాపులో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారు. ఏ సమయంలోనైనా ఇక్కడ మద్యం లభిస్తుంది. = గార్లదిన్నె మండలం మర్తాడు, పెనకచెర్ల డ్యాం, కల్లూరులో లూజు విక్రయాలు జరుగుతున్నాయి. ఎప్పుడెళ్లినా మద్యం సీసా మీ ముందు పెడతారు. = బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, కేకే ఆగ్రహారం, కొర్రపాడు, రోటరీపురం, వడియంపేట గ్రామాల్లో మద్యం అనధికారికంగా అమ్ముతున్నారు. = శింగనమల మండలం ఉల్లికల్లు, తూర్పు నరసాపురం, ఆకులేడు గ్రామాల్లో మద్యం లభిస్తుంది. = చిలమత్తూరు మండలం సోమఘట్టలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో, మధురేపల్లిలో బస్టాండ్ దగ్గర, కల్లుకుంటలోని ఓ చిల్లర దుకాణంలో, దేమకేతేపల్లి బీసీ కాలనీలోని అంగన్వాడీ సెంటర్ సమీపంలో అనధికార మద్యం దుకాణాలు దర్శనమిస్తాయి. ఇదే మండలం చాగలేరులోని బస్టాండ్ వద్ద, మొరసలపల్లి ప్రధాన వీధిలోని ఓ చిల్లర దుకాణంలో, పలగలపల్లిలోని మసీదు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో మందు లభిస్తుంది. ఈ బెల్టు షాపుల్లో రోజూ కొనుగోలు చేసే వారికి మాత్రమే తొందరగా మద్యం దొరుకుతుంది. కొత్త వ్యక్తులెవరైనా వస్తే కొంచెం ఆలోచించి ఇస్తారు. = పెనుకొండ మండలం అడదాకులపల్లి, పెద్దమంతూ రు, కలిపి, లక్కసానపల్లి, తిమ్మాపురం గ్రామాలతో పాటు రొద్దం మండలం కోగిర, ఆర్.లోచర్ల, రొద్దం పట్టణం, నారనాగేపల్లి, గోనిమేకులపల్లి గ్రామాల్లో అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో బెల్టు షాపులు ఉన్నాయి. రెచ్చిపోతున్న ‘తమ్ముళ్లు’ చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి కాగానే బెల్టు షాపులు తొలగిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎలాగూ ఆయన సీఎం అయ్యారు. ముందు చెప్పినట్లుగానే బెల్టు షాపుల ఎత్తివేతకు సంబంధించి ఫైలుపై సంతకమూ చేశారు. అంతే.. ఆ మరుసటి రోజే ఎకై ్సజ్ అధికారులు నానా హడావుడి చేసి దాడులు కూడా చేశారు. హమ్మయ్య.. బాబొచ్చారు.. బెల్టు తీశారు అని జనం అనుకునేలోపే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ‘బాబొచ్చాడు..మనకెవరు అడ్డు’ అన్న చందంగా మద్యం అక్రమ అమ్మకాలు తీవ్రం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో మెజార్టీ శాతం తెలుగుదేశం పార్టీ నేతల అనుచరులకు సంబంధించినవే కావడం గమనార్హం. అందుకే అధికారం ఎలాగూ ఉంది.. మమ్మల్నెవరేం చేస్తారనుకుంటున్న తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. వాళ్ల జోలికెందుకెళ్లడం.. అంతో ఇంతో తీసుకుని కళ్లు మూసుకుందాం అన్నట్లు ఎకై ్సజ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. సమాచారం అందితే వెంటనే దాడులు చేస్తాం పెనుకొండ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని బెల్టు షాపుల సమాచారంపై ఈఎస్ నాగమద్దయ్యను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఏఈఎస్ శ్రీనివాసులును సంప్రదించగా.. తమ పరిధిలో ఎలాంటి బెల్టు షాపులు లేవన్నారు. దీనిపై పూర్తి నిఘా ఉంచామని, బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు చేస్తామన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు ఎక్కడా లేవు అనంతపురం ఎక్సైజ్ జిల్లా పరిధిలో బెల్టు షాపులు దాదాపు ఎక్కడా లేవు. కొన్ని చోట్ల అనధికారికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచాం. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి మందు సరఫరా చేస్తున్న షాపులపై కూడా చర్యలు తీసుకుంటాం. 5 వేలు జనాభా కల్గిన ప్రాంతంలోని లెసైన్స్డ్ షాపునకు ఒక పర్మిట్ రూంకు అనుమతి ఉంటుంది. ఇక్కడ కేవలం మద్యం తాగేందుకు మాత్రం అనుమతించాలి తప్ప ఎలాంటి అమ్మకాలు జరగకూడదు. స్టాకు పెట్టుకోకూడదు. అలాగుంటే బెల్టుషాపు కిందే పరిగణించి కేసులు నమోదు చేస్తాం. - ప్రణవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
ప్రత్యేక నిధికి ఎసరు!
బడ్జెట్టు రూపకల్పన దశలోనే ఉంది. వివిధ పథకాలు.. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. కానీ, తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలంటూ స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా అధికారులకు లేఖలు రాస్తున్నారు. తమ నియోజకవర్గంలో అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తున్నారు. అసలు నిధులేవీ లేకుండా.. ఈ పనులెలా మంజూరు చేయాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి (సీడీపీ) ఒక్కో ఎమ్మెల్యేకు ఏటేటా కోటి రూపాయల నిధులు విడుదల చేయగా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అనేది స్పష్టత లేదు. ఇదేమీ పట్టనట్లుగా.. ఇటీవలే ఓ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జిల్లా అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. సీసీ రోడ్లు, ప్రహరీలు, కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన 95 పనుల ప్రతిపాదనలను జత చేసి.. వాటికయ్యే అంచనా వ్యయం రూ.6 కోట్లు మంజూరు చేయాలని అందులో ప్రస్తావించినట్లు సమాచారం. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తే.. వీటికి నిధుల కేటాయించటం సాధ్యం కాదంటూ ఈ ప్రతిపాదనలను తిప్పి పంపిన విషయాన్ని రాస్తూనే.. జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులు మంజూరు చేయాలని లేఖలో ప్రస్తావించారు. సీఎం తోసిపుచ్చిన ప్రతిపాదనలను తమకు పంపిస్తే.. నిధులు తమ దగ్గరెలా ఉంటాయో అర్థం కాక అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తనవంతు సలహాగా సదరు ఎమ్మెల్యే స్పెషల్ డెవలప్మెంట్(ఎస్డీసీ) ఫండ్ నుంచి ఆ నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో ఎటూ పాలుపోక అధికారులు తల పట్టుకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధుల పేరిట నిధులు విడుదలయ్యాయి. అప్పటి కాంగ్రెస్ నేతలు శ్రీధర్బాబు, ఆరెపల్లి మోహన్, ప్రవీణ్రెడ్డి ముఖ్యమంత్రిని అభ్యర్థించి.. తమ తమ నియోజకవర్గాలకు వీటిని రాబట్టుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో జిల్లాకు రూ.31.32 కోట్లు విడుదలయ్యాయి. తమ నేతలు సూచించిన పనులను ప్రభుత్వం ఈ నిధుల ద్వారా చేపట్టింది. దీంతో ఈ స్పెషల్ ఫండ్ రాజకీయ ప్రయోజనాల కోసమేననే విమర్శలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ పనులకు చెక్ పెట్టింది. ఎస్డీసీ కింద మంజూరైన పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి? ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి? అసలు ప్రారంభం కాని పనులెన్ని? అనే వివరాలను ఆరా తీసింది. ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్నవాటిని యథాతథంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు రూ.15 కోట్ల పనులు ఆగిపోయాయి. అసంపూర్తిగా ఉన్న పనులకు వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. ప్లానింగ్ విభాగం ఖాతాలో మిగులు నిధులు ఉన్నప్పటికీ.. వీటిని వేరే పథకాలకు మళ్లించే పరిస్థితి లేదు. కానీ.. ఈలోగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎస్డీసీ నిధులతో పనులు మంజూరు చేయాలని లేఖలు రాస్తుండటంతో అధికారులు బిత్తరపోతున్నారు. తమ దగ్గర నిధులేమీ లేకపోవటంతో ఏంబదులివ్వాలో తేల్చి చెప్పలేకపోతున్నారు. డబ్బుల్లేని విషయం.. సీడీపీ ఇంకా అమలు కాలేదనే విషయం తెలియనిది కాకపోయినా... గతంలో మంజూరైన ప్రత్యేక నిధిని తమ నియోజకవర్గాలకు దక్కించుకునేందుకు అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచినట్లు స్పష్టమవుతోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక అభివృద్ధి నిధులకు ఎసరు పెట్టేందుకు ఈ లేఖాస్త్రం విసిరినట్లు చర్చ జరుగుతోంది. -
రాజకీయ బదిలి
రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్లో పనిచేసే ఆర్డీఓలకు రాజకీయ బదిలీ తప్పడం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే వారిని సాగనంపడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. తక్కువ వ్యవధిలోనే ముగ్గురు ఆర్డీఓలకు రాజకీయ బదిలీ తప్పలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిన్న కాంగ్రెస్.. నేడు తెలుగుదేశం పాలకుల హయాంలో ముగ్గురు మహిళా ఆర్డీఓలపై బదిలీ వేటు పడింది. పద్మజ నుంచి.. వెంకటరమణారెడ్డి ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన తర్వాత ఆర్డీవోగా పద్మజ బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో ఆ సమయంలో సీఎంకు ముఖ్యుడిగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గానికి చెందిన నేత ఆమెను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయించారు. ఆ తర్వాత శ్రీనివాసులు వచ్చారు. అనంతరం ఐఏఎస్ క్యాడర్కు చెందిన అధికారిణి ప్రీతిమీనా సబ్కలెక్టర్గా నియమితులయ్యారు. ఈమె ముక్కుసూటిగా విధులు నిర్వర్తించడంతో అధికారపార్టీ నేతలు బదిలీ చేయించారు. అయితే ఆమె బదిలీపై వెళ్లడానికి స్వతహాగానే సిద్ధమైన నేపథ్యంలో ఆమెకు ఈ బదిలీ కలిసి వచ్చింది. ఆరునెలలకే.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ యేడాది ఫిబ్రవరి 13వతేదీన విజయసునీత ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలు, మండలపరిషత్, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో ఆమె సఫలీకృతులయ్యారు. ఈమె పట్టుమని పది నెలలు కూడా పనిచేయకముందే ఆరు నెలలకే బదిలీ చేశారు. ఈ బదిలీపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురి బదిలీలోనూ గతంలో కాంగ్రెస్లో..ప్రస్తుతం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. -
అధికార జులుం!
సాక్షి, విజయవాడ : జిల్లాలో అధికార పార్టీ జులుం పెరిగిపోయింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని వేధించటమే ధ్యేయంగా టీడీపీ శ్రేణులు గ్రామాల్లో ముందుకుసాగున్నాయి. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు సహకారం అందిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మరింత చెలరేగిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు రగిలిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకు అన్నీ తెలిసినా అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల మౌనం పాటిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు చేయడానికి వెనకాడుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గత రెండు నెలల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలు 15కు పైగా ఉన్నాయి. ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హత్య చేశారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పట్టించుకోని పోలీసులు నందిగామ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ మండలాల్లో కొద్ది రోజులుగా పచ్చ చొక్కాల నేతల అగడాలు అధికమయ్యాయి. గతంలో గొట్టుముక్కల గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి ఎన్నికల అనంతరం తొలగించారు. పోలీసుల పికెట్ లేకపోవడం వల్లే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో అనేక సంఘటనలు జరిగిన ఇక్కడి రూరల్ పోలీసులు సీరియస్గా స్పందించలేదు. గతంలో పోలీసుస్టేషన్లోనే సీఐ, ఎస్ఐ ఎదుట గుదే వెంకటేశ్వరరావు అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేసిన పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఉప సర్పంచ్ ఆలోకం కృష్ణారావు ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి దిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో కృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం అదే గ్రామానికి చెందిన జిల్లాలోని నూజివీడు రూరల్ ప్రాంతలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నూజివీడులో మే నెలలో వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి జరిగినా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. -
డీసీసీబీ కుంపటి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో షురువైన ‘అవిశ్వాస’ ముసలం అధికార టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల్లో ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వర్గం నాయకుల ఆశీస్సులతో వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి డీసీసీబీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి పావులు కదుపగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు దామోదర్రెడ్డి అదే పార్టీకి చెందిన మంత్రి జోగు రామన్న వర్గాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో డీసీసీబీలో ప్రారంభమైన ముసలం టీఆర్ఎస్లోని అగ్రనేతల్లో వర్గపోరుకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఎలాగైనా డీసీసీబీపై టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడంతోపాటు జిల్లా రాజకీయాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు టీఆర్ఎస్లోని ఇరువర్గాల నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారు. మరోవైపు డీసీవో సూర్యచంద్రరావు నిర్వాకంతో ‘అవిశ్వాసం’ అంశం వివాదానికి దారి తీయడంతో ఈ వర్గపోరుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ క్రమంగా జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా హవా కొనసాగించి ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్తోపాటు, అత్యధిక మండల పరిషత్లపైనా టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ ఖాతాలో ఉన్న సహకార సంస్థలపై కూడా గులాబీ జెండాను ఎగురవేసేందుకు పావులు కదిపింది. ఈ క్రమంలోనే వేణుగోపాలాచారి ఆశీస్సులతో చంద్రశేఖర్రెడ్డి చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి తెరలేపడం.. చైర్మన్ మంత్రి రామన్నను ఆశ్రయించడం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఈ డీసీసీబీ వివాదం అధికార పార్టీ అగ్రనేతల్లో గ్రూపు విభేదాలకు దారితీయడమే కాకుండా, సహకార పోరును రసకందాయంలో పడేసింది. టీడీపీ సహాయంతో వైస్ చైర్మన్పై అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టిన వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి ఖానాపూర్ మండలం సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్గా ఉన్నారు. ఈ సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్ పదవిపై అవిశ్వాసం పెడితే డీసీసీబీలో ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చని డీసీసీబీ చైర్మన్ దామోదర్రెడ్డి తెర వెనుక పావులు కదిపినట్లు సమాచారం. ఈ సొసైటీలోని టీడీపీకి చెందిన డెరైక్టర్లు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అనుచరులున్నారు. దామోదర్రెడ్డి సొదరుడు ప్రేమేందర్రెడ్డికి రాథోడ్ రమేష్తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈ టీడీపీ డెరైక్టర్ల మద్దతును కూడగట్టి చంద్రశేఖర్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సొసైటీ బలపరీక్ష కోసం ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డీసీవో సూర్యచంద్రరావు నిర్ణయించారు. టీఆర్ఎస్లోకి చైర్మన్, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర్రెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరికలు ఉండే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా దామోదర్రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరేందుకు ఇంతకుముందే ముహుర్తం ఖరారైనప్పటికీ.. అవిశ్వాసం అంశం తేలాకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయని, ఆయన అనుచరుడైన దామోదర్రెడ్డి ఆయనతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కొనసాగింది. అయితే ప్రేంసాగర్రావు రాకను జిల్లా టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.