Indian badminton
-
Singapore International Challenge Tourney: రన్నరప్గా భారత యువ షట్లర్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా సింగపూర్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఉన్నతి 17–21, 16–21 పాయింట్ల తేడాతో రుజానా (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో ఉన్నతి వరుస గేమ్ల్లో ఓడింది. టోర్నీ ఆసాంతం రాణించిన ఉన్నతి... రెండో రౌండ్లో ఆసియా క్రీడల పతక విజేత సయిన కవాకమి (ఆ్రస్టేలియా)ను ఓడించింది. సెమీఫైనల్కు చేరే క్రమంలో చైనీస్ తైపీకి చెందిన ఇద్దరు షట్లర్లు సైయాంగ్ స్యూన్ లిన్, యీ టింగ్పై కూడా ఉన్నతి విజయాలు సాధించింది. సెమీఫైనల్లో ఉన్నతి 18–21, 21–19, 22–20తో థి ట్రాంగ్ వు (వియత్నాం)ను చిత్తు చేసింది. తొలి గేమ్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి పుంజుకున్న ఉన్నతి... హోరాహోరీ పోరులో చక్కటి విజయంతో ఫైనల్ చేరింది. అయితే తుదిపోరులో యువ షట్లర్ అదే జోరు కనబర్చలేక రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీలో భారత్కు చెందిన మరో యువ షట్లర్ దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. -
భర్తతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ (ఫొటోలు)
-
పెళ్లి షాపింగ్ చేసిన భారత ప్రముఖ షట్లర్
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. శ్రావ్య వర్మ అనే అమ్మాయిని శ్రీకాంత్ త్వరలో మనువాడనున్నాడు. శ్రావ్య.. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తుంది. శ్రీకాంత్ ఇటీవలే కాబోయే భార్యతో కలిసి పెళ్లి షాపింగ్ చేశాడు. నగరంలోని ప్రముఖ వెడ్డింగ్ కలెక్షన్ మాల్ అయిన గౌరీ సిగ్నేచర్స్లో శ్రీకాంత్, శ్రావ్య జోడీ సందడి చేశాడు. వీరిద్దరి షాపింగ్కు సంబంధించిన చిత్రాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్.. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉన్నాడు. -
Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్ బృందం ఇదే (ఫొటోలు)
-
Swiss Open 2024: క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–12తో భారత్కే చెందిన ప్రియ–శ్రుతి మిశ్రా జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 17–21, 16–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
తామిరి సూర్య చరిష్మాకు కాంస్య పతకం
జర్మన్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తామిరి సూర్య చరిష్మా కాంస్య పతకం గెలిచింది. బెర్లిన్లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చరిష్మా 21–15, 20–22, 17–21తో కిమ్ మిన్ జీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు చరిష్మా క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సితి జులైఖా (మలేసియా)పై... రెండో రౌండ్ లో13వ సీడ్ పిచిత్ప్రిచాసెక్ (థాయ్లాండ్)పై సంచలన విజయాలు సాధించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్
హైదరాబాద్కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ప్రణీత్ తన కెరీర్లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్లో భారత్కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. View this post on Instagram A post shared by Sai Praneeth (@saipraneeth92) ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్కు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం ప్రణీత్ కోచ్గా సేవలించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. యూఎస్లోని నార్త్ కరోలినా క్లబ్లో అతను కోచ్గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన భారత్
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన ఫైనల్లో (సింగిల్స్) పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయ్లాండ్ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ల్లో (బెస్ట్ ఆఫ్ 5) సింధు, అన్మోల్తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ (డబుల్స్) విజయాలు సాధించారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు.. ఫైనల్లో థాయ్ షట్లర్ సుపనిందా కతేథాంగ్ను కేవలం 39 నిమిషాల్లో 21-12, 21-12 తేడాతో ఓడించి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత మూడు గేమ్ల పోరులో (21-16, 18-21, 21-16) గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ.. జోంగ్కోల్ఫామ్ కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్జల్లను ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడు (అస్మిత చాలిహ), నాలుగు మ్యాచ్ల్లో (డబుల్స్) ఓటమి చవిచూసిన భారత్.. నిర్ణయాత్మకమైన మ్యాచ్లో గెలుపొంది, టైటిల్ను కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఆఖరి మ్యాచ్లో 16 ఏళ్ల అన్మోల్ (472వ ర్యాంకర్).. ప్రపంచ 45వ ర్యాంకర్ పోర్న్పిచా చోయికీవాంగ్పై వరుస గేమ్లలో విజయం సాధించి, భారత జట్టు చారిత్రక గెలుపు భాగమైంది. -
ఏడో ర్యాంక్కు ఎగబాకిన ప్రణయ్.. టాప్-100లో భారత్ నుంచి ఏకంగా..!
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించారు. తాజా ర్యాంకింగ్స్లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఏడో ర్యాంక్కు చేరుకొని భారత నంబర్వన్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లక్ష్య సేన్ (20), శ్రీకాంత్ (24), ప్రియాన్షు (28), కిరణ్ జార్జి (36), సతీశ్ కుమార్ (49), మిథున్ మంజునాథ్ (63), శంకర్ ముత్తుస్వామి (70), సమీర్ వర్మ (77), సాయిప్రణీత్ (91), మెరాబా లువాంగ్ మైస్నమ్ (93), చిరాగ్ సేన్ (99) ఉన్నారు. -
పోరాడి ఓడిన ప్రణయ్
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి చవిచూశాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 21–19, 16–21, 19–21తో పరాజయం పాలయ్యాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్లు కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రణయ్ ఓ దశలో 4–12తో వెనుకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి చివరకు స్కోరును 19–19తో సమం చేశాడు. అయితే చౌ తియెన్ చెన్ కీలకదశలో రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్కు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో ప్రణయ్ విశేషంగా రాణించాడు. ప్రపంచ చాంపియన్షిప్లో, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించాడు. మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ కేరళ ప్లేయర్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. -
తొలి రౌండ్లోనే సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 18–21, 16–21తో ప్రపంచ 21వ ర్యాంక్ జంట లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్, చిరాగ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)తో లక్ష్య సేన్; లీ చెయుక్ యి (హాంకాంగ్)తో హెచ్ఎస్ ప్రణయ్; లిన్ చున్యి (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు. -
డాక్టర్ పుల్లెల గోపీచంద్!
బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు మరో గౌరవం దక్కింది. కర్ణాటకకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. మంగళవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. జాతీయ అభివృద్ధిలో క్రీడల ద్వారా తనదైన పాత్ర పోషించినందుకు గోపీచంద్ను డాక్టరేట్ కోసం ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గోపీచంద్తో పాటు మరో నలుగురు కూడా దీనిని అందుకున్నారు. -
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ప్రకటించారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–20లో ఉన్న వారిని నేరుగా ఎంపిక చేయగా... మిగతా బెర్త్లను ఆదివారం ముగిసిన సెలెక్షన్ ట్రయల్స్ టోర్నీ ద్వారా ఖరారు చేశారు. భారత పురుషుల జట్టు: ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్, రోహన్ కపూర్, సాయిప్రతీక్. మహిళల జట్టు: పీవీ సింధు, అష్మిత, అనుపమ, మాళవిక, గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, సిక్కి రెడ్డి. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
బాసెల్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరోసారి మేజర్ టోర్నీలో సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్–300 టోర్నీ స్విస్ ఓపెన్లో సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో ఈ జంట మినహా ఇతర భారత షట్లర్లంతా ముందే నిష్క్రమించగా...వీరిద్దరు మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19–21, 21–17, 17–21తో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీపై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్ను కోల్పోయినా...తర్వాతి రెండు గేమ్లలో సత్తా చాటి భారత జంట విజయాన్ని అందుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్సీడెడ్ జంట రెన్ జియాంగ్ యు – టాన్ ఖియాంగ్తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. -
థామస్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో థామస్ కప్ ‘హీరో’లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సౌరభ్ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
థామస్ కప్ విజయంపై పుల్లెల గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
థామస్ కప్ 2022లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్య పౌరుల దాకా అందరూ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. టీమిండియా సాధించిన అపురూప విజయంపై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందిస్తూ.. బ్యాడ్మింటన్కు ఈ విజయం 1983 క్రికెట్ వరల్డ్కప్ విజయం కంటే గొప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్కప్ బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిస్తే.. తాజాగా కిదాంబి శ్రీకాంత్ నేతృత్వంలోని టీమిండియా సైతం 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో చిత్తు చేసి బ్యాడ్మింటన్లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసిందని అన్నాడు. 1983 వరల్డ్కప్ గెలిచాక భారత క్రికెట్ రూపురేఖలు ఎలా మారిపోయాయో.. థామస్ కప్ గెలుపుతో భారత బ్యాడ్మింటన్కు కూడా శుభ ఘడియలు మొదలయ్యాయని తెలిపాడు. థామస్ కప్ విజయం ఇచ్చిన స్పూర్తితో భారత షట్లర్లు మున్ముందు మరిన్ని సంచనాలు నమోదు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత బృందానికి నాయకత్వం వహించిన కిదాంబి శ్రీకాంత్ను గోపీచంద్ ప్రత్యేకంగా అభినందించాడు. చదవండి: Thomas Cup 2022: షటిల్ కింగ్స్ -
Thomas Cup 2022: ఆకాశాన మన ‘స్మాష్’...
కిడాంబి శ్రీకాంత్ అలా గాల్లోకి ఎగిరాడు... తనదైన శైలిలో ఒక క్రాస్కోర్ట్ స్మాష్ను సంధించాడు... ప్రత్యర్థి క్రిస్టీ వద్ద దానికి జవాబు లేకపోయింది... అంతే! శ్రీకాంత్ వెనుదిరిగి రాకెట్ విసిరేయగా, భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా ప్రవాహంలా కోర్టులోకి దూసుకొచ్చారు... కనీసం ప్రత్యర్థికి మర్యాదపూర్వకంగా శ్రీకాంత్ ఒక షేక్ హ్యాండ్ అన్నా ఇవ్వమంటూ రిఫరీ చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా మన షట్లర్ల సంబరాలతో స్టేడియం హోరెత్తింది... శ్రీకాంత్ వరల్డ్ చాంపియన్షిప్లో రజతం గెలిచాడు... ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించాడు... వరల్డ్ నంబర్వన్గా కూడా నిలిచాడు. లక్ష్య సేన్ 20 ఏళ్లకే వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలవడంతోపాటు మూడు బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ అందుకున్నాడు... హెచ్ఎస్ ప్రణయ్ ఖాతాలోనూ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ ఉండగా, ఆసియా చాంపియన్షిప్లో అతను రన్నరప్... డబుల్స్లోనూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఇటీవల సంచలనాలు సృష్టిస్తోంది. విడివిడిగా చూస్తే వీరంతా వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ఘనతలు సాధించారు... అంతకుముందు తరంలో ప్రకాశ్ పడుకోన్, పుల్లెల గోపీచంద్ కూడా భారత బ్యాడ్మింటన్ స్థాయిని పెంచే ఆటను ప్రదర్శించారు. కానీ జట్టుగా, కలిసికట్టుగా, సమష్టిగా చూస్తే మాత్రం భారత్ ఖాతాలో భారీ విజయం లోటు ఇన్నేళ్లుగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఆ కల నిజమైంది. ఈ చిరస్మరణీయ ఘట్టం ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనే ఆవిష్కృతమైంది కాదు... గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరిన ప్రస్థానమిది. సాక్షి క్రీడా విభాగం భారత జట్టు థామస్ కప్ కోసం వెళ్లినప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు... గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న ఆటగాళ్లతో పాటు అన్ని విభాగాల్లో బలమైన ఆటగాళ్లు ఉన్న ప్రత్యర్థులను దాటి మన జట్టు ముందంజ వేయడం కష్టమనిపించింది. ఎవరి నుంచైనా ఏదైనా అద్భుత ప్రదర్శన వచ్చినా ఇతర మ్యాచ్లూ వరుసగా గెలిస్తే తప్ప జట్టుకు విజయం దక్కదు. అయితే ఎలాంటి ఆశలు లేకుండా పోవడమే టీమ్కు మేలు చేసింది. తమను ఎవరూ నమ్మని సమయంలో ఆటగాళ్లే తమను తాము నమ్మారు... వారికి కోచ్లు అండగా నిలిచి స్ఫూర్తిని నింపారు. జట్టు ప్రకటించిన తర్వాత టోర్నీ ఆరంభానికి ముందు భారత బృందం ‘వి విల్ బ్రింగ్ ఇట్ హోమ్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ను తయారు చేసుకుంది. చాంపియన్గా నిలిచే వరకు ఇందులో ప్రతీ క్షణం స్ఫూర్తి నింపే సందేశాలే. చివరకు మన షట్లర్లు చిరస్మరణీయ విజయంతో తామేంటో చూపించారు. సెమీస్ చేరడంతోనే కనీసం కాంస్యం ఖాయం చేసుకొని మన టీమ్ టోర్నీలో తొలి పతకంతో కొత్త చరిత్ర సృష్టించింది. కానీ ఆ జోరు తుది లక్ష్యాన్ని అందుకునే వరకు ఆగలేదు. అందరూ అదరగొట్టగా... బ్యాడ్మింటన్కు ప్రపంచకప్లాంటి థామస్ కప్లో భారత్కు విజయం అందించినవారిని చూస్తే ఒక్కరి ఖాతాలోనూ ఒలింపిక్ పతకం లేదు! కానీ ఈ మెగా టోర్నీకి వచ్చేసరికి అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపించారు. అజేయ ఆటతో శ్రీకాంత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. లీగ్ దశలో భారత్ ఒక మ్యాచ్ ఓడినా శ్రీకాంత్ మాత్రం ఒక్కసారి కూడా నిరాశపర్చలేదు. ఇక క్వార్టర్స్, సెమీస్లలో ప్రణయ్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టు 2–2తో సమంగా నిలిచిన స్థితిలో చివరి మ్యాచ్లో బరిలోకి దిగే ఆటగాడిపై అపారమైన ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రణయ్ ఎంతో పట్టుదలగా నిలబడ్డాడు. తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆడి జట్టును గెలిపించాడు. అదృష్టవశాత్తూ ఫైనల్లో అతను ఆడాల్సిన అవసరమే రాలేదు. రెండు నాకౌట్ మ్యాచ్లలో నిరాశపర్చిన లక్ష్య సేన్ అసలు సమరంలో సత్తా చాటాడు. ఫైనల్లో అతడు తన స్థాయిని ప్రదర్శించడం భారత్ అవకాశాలు పెంచింది. ఇక విశ్వసనీయమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్–చిరాగ్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరిగ్గా చెప్పాలంటే థామస్ కప్లాంటి ఈవెంట్లలో బలహీన డబుల్స్ కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడుతూ వచ్చిన భారత్కు ఈ ద్వయం కారణంగా ముందంజ వేసే అవకాశం దక్కింది. ఇంతింతై వటుడింతై... థామస్ కప్లో భారత్ గెలవడమే కాదు, గెలిచిన తీరుకు కూడా జేజేలు పలకాల్సిందే. ఈ రోజు మన ఘనతను చూసి సాధారణ అభిమానులు ఎంతో సంతోషిస్తూ ఉండవచ్చు. కానీ ఇన్నేళ్లుగా ఆటను దగ్గరి నుంచి చూసిన వారికి ఈ విజయం విలువేమిటో మరింత బాగా కనిపిస్తుంది. పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా షటిల్ పరిస్థితులు గొప్పగా ఏమీ లేవు. కానీ గోపీచంద్ కోచ్గా మారిన తర్వాత షటిల్ క్రీడకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. సరిగ్గా చెప్పాలంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత ఆటపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సైనా సాధించిన వరుస విజయాలు ఈ క్రీడ స్థాయిని పెంచాయి. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకంతో సైనా మెరవడంతో బ్యాడ్మింటన్ కూడా ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటిగా మారింది. అయితే 2016 రియో ఒలింపిక్స్లో సింధు సాధించిన రజతం ఈ క్రీడ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. సాధారణ క్రీడాభిమానులు కూడా బ్యాడ్మింటన్ను అనుసరించసాగారు. ప్రపంచంలో ఏ మూల టోర్నీ జరిగినా వాటి ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇక ఆయా దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు టోర్నీ వేదికలకు వెళ్లి మరీ మన షట్లర్లను ప్రోత్సహించసాగారు. పలువురు ప్రముఖులు ట్వీట్ల ద్వారా బ్యాడ్మింటన్ ఫలితాలను చర్చిస్తుండటంతో సంబంధం లేనివారి దృష్టి కూడా ఆటపై పడింది. కొన్నేళ్ల క్రితం వరకు మన షట్లర్లు మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టడం, టాప్–100 ర్యాంకుల్లో ఉండటం కలగానే అనిపించేది. కానీ ఇప్పుడు ఎంతో మంది నేరుగా పెద్ద టోర్నీల్లో తలపడుతున్నారు. ఈ పురోగతి అంతా నేటి థామస్ కప్ విజయం వరకు తీసుకెళ్లిందంటే అతశయోక్తి కాదు. -
థామస్ కప్ గెలిచిన భారత బృందానికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. బ్యాడ్మింటన్లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసినందుకు గాను కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్ను అభినందించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్నిపంపారు. A historic moment for Indian Badminton as India brings home its first #ThomasCup! Congratulations to Srikanth Kidambi and team India for their spectacular win in the finals and their remarkable journey up to the last shot. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2022 కాగా, పురుషుల బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..! -
చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
బ్యాంకాక్: పురుషుల బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీ 73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు. The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons. — Narendra Modi (@narendramodi) May 15, 2022 "భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. -
ఉన్నతి హుడాకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ‘బాయ్’ ప్రకటించింది. ఏప్రిల్ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్ కప్లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్లో టీనేజ్ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది. హరియాణాలోని రోహ్టక్కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్ ట్రయల్స్లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్గా 40 మందిని సీనియర్ కోచింగ్ క్యాంప్ కోసం కూడా ఎంపిక చేశారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితా: కామన్వెల్త్ క్రీడలు: పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప ఆసియా క్రీడలు, థామస్–ఉబెర్ కప్ పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, విష్ణువర్ధన్ గౌడ్, జి.కృష్ణప్రసాద్ మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా -
‘నీ పని చూసుకో’...
న్యూఢిల్లీ: సినీ నటి తాప్సీపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులకు సంబంధించి స్పంది స్తూ సహాయం కోరిన ఆమె స్నేహితుడు, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ మథియాస్ బో (డెన్మార్క్)ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మందలించారు. ఇతర విషయాలపై కాకుండా కోచ్గా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాప్సీ తదితరులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో గురువారం ఆమెకు మద్దతుగా మథియాస్ బో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను స్విస్ ఓపెన్లో పాల్గొంటున్న జట్టుతోపాటు స్విట్జర్లాండ్లో ఉన్నాడు. ‘నా పరిస్థితి గందరగోళంగా ఉంది. తొలిసారి భారత జట్టుకు కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే స్వదేశంలో తాప్సీ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కిరణ్ రిజిజు... ఏదైనా చేయగలరా’ అని అతను రాశాడు. దీనిపై మంత్రి శుక్రవారం స్పందిస్తూ కొంత ఘాటుగానే జవాబిచ్చారు. ‘అన్నింటికంటే దేశ చట్టాలు సర్వోన్నతమైనవి. వాటిని మనందరం పాటించాలి. తాజా అంశం మనిద్దరి పరిధిలో లేనిది. మన ఉద్యోగ బాధ్యతలకే మనం కట్టుబడి ఉండాలి. అది భారత క్రీడారంగానికి మేలు చేస్తుంది’ అని రిజిజు ట్వీట్ చేయడం విశేషం. డెన్మార్క్కు చెందిన 40 ఏళ్ల మథియాస్ బో 2012 లండన్ ఒలింపిక్స్లో పురుషుల డబుల్స్లో రజతం సాధించాడు. పీబీఎల్లో పుణే ఏసెస్ జట్టుకు ఆడిన నాటి నుంచి ఆ టీమ్ యజమాని తాప్సీతో మథియాస్కు సాన్నిహిత్యం ఉంది. -
కోచ్ గోపీచంద్తో విభేదాల్లేవు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగానే గచ్చిబౌలిలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో సాధన చేస్తున్నానని వరల్డ్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. గోపీచంద్ కోరిన మీదటే ‘శాట్స్’ తమ శిక్షణకు స్టేడియాన్ని సిద్ధం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఒలింపిక్స్లో తాము పోటీ పడే తరహా వాతావరణం గచ్చిబౌలి స్టేడియంలో అందుబాటులో ఉండటమే తాను అక్కడికి వెళ్లేందుకు కారణమని ఆమె వెల్లడించింది. ‘నాకూ, చీఫ్ కోచ్కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్య అంతా బాగుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. ఇదే తరహా వేదికపైనే ఒలింపిక్ మ్యాచ్లు జరగనున్నాయి. ముఖ్యంగా ఏసీ బ్లోయర్లు మ్యాచ్లో షటిల్ దిశను ప్రభావితం చేస్తాయి. దానికి అలవాటు పడాలంటే అలాంటి సౌకర్యం ఉన్న స్టేడియంలోనే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ సాధన చేసేందుకు నాకు ‘సాయ్’ కూడా అనుమతి ఇచ్చింది’ అని సింధు పేర్కొంది. కొన్నాళ్ల క్రితం తాను లండన్ వెళ్లినప్పుడు తన కుటుంబంతో విభేదాల గురించి వచ్చిన వార్తలపై చాలా బాధపడ్డానని, అయితే అందరికీ తాను వివరణ ఇస్తూ ఉండలేనని సింధు వ్యాఖ్యానించింది. -
సింధు విజ్ఞప్తికి ‘సాయ్’ ఓకే
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్, ఫిజియోలను అనుమతిస్తూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల సింధు వచ్చే జనవరిలో తాజాగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల విదేశాల్లో జరగనున్న మూడు టోర్నీల కోసం తన వెంట వ్యక్తిగత సిబ్బందిని అనుమతించాలని ఆమె ‘సాయ్’ని కోరగా... శుక్రవారం దీనిపై సానుకూలంగా స్పందించింది. ‘థాయ్లాండ్లో జనవరి 12 నుంచి 17 వరకు, 19 నుంచి 24 వరకు జరిగే రెండు టోర్నీలతో పాటు అక్కడే జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ (27 నుంచి 31) పోటీల్లో సింధుతో పాటు అక్కడికి వెళ్లేందుకు కోచ్, ఫిజియోలను ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి ఈ ముగ్గురికి అయ్యే వ్యయాన్ని సుమారు రూ.8 లక్షల 25 వేలుగా అంచనా వేసి మంజూరు చేసింది’ అని ‘సాయ్’ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనాతో పలు టోర్నీలు వాయిదా పడగా అక్టోబర్లో ఒక్క డెన్మార్క్ ఓపెన్ జరిగింది. కానీ సింధు ఈ టోర్నీకి దూరంగా ఉంది. ఈ ఏడాది ఆమె ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ (మార్చి) తర్వాత మళ్లీ బరిలోకే దిగలేదు. ప్రస్తుతం సింధు లండన్లోని గ్యాటోరెడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ రెబెకా రాన్డెల్తో కలిసి వచ్చే సీజన్కు సిద్ధమవుతోంది. లండన్లోని జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు టోబీ పెంటీ, రాజీవ్ ఉసెఫ్లతో కలసి సాధన చేస్తోంది. -
ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోన్న సమయంలో క్రీడల ప్రాధాన్యత సహజంగానే వెనక్కి వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడగా, ఇతర ప్రధాన ఈవెంట్లు అదే బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటప్పుడు వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేయడంలో కోచ్ల పాత్ర కూడా కీలకం. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా దీనినే అనుసరిస్తున్నారు. కరోనా విపత్కర స్థితిని అందరూ సమష్టిగా ఎదుర్కోవడం ముఖ్యమని చెబుతున్నారు. హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్వారంటైన్ ఇటీవలే ముగిసింది. అయితే లాక్డౌన్ కారణంగా తన ఫామ్హౌస్కే పరిమితమైన గోపీచంద్... తాజా పరిణామాలను విశ్లేషించారు. ఒక క్రీడాకారుడికి టోర్నీలు ప్రాధాన్యతాంశమే అయినా ప్రాణాలకంటే ఎక్కువేమి కాదని ఆయన అన్నారు. గోపీచంద్ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... లాక్డౌన్ ప్రభావం... వ్యక్తిగతంగా చూస్తే దేవుని దయవల్ల లాక్డౌన్తో ఇబ్బంది పడని వారిలో నేనూ ఉన్నాను. మధ్యతరగతి వారికి కూడా ఎలాగో గడిచిపోతుంది. అయితే చేతుల్లో డబ్బులు ఉండని రోజూవారీ శ్రామికులు, రైతు కూలీలు నిజంగా తీవ్ర సమస్యలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉండే వీరిని ఆదుకోవడం మన బాధ్యత. తొందరలోనే అంతా సాధారణంగా మారిపోతే సమస్య తీరుతుంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నా. యోగా, ధ్యానం చేస్తూ నా ఫిట్నెస్ను కాపాడుకునే పనిలో ఉన్నా. ఆటగాళ్లతో కూడా మాట్లాడుతున్నా. నాకు లభించిన ఈ విరామాన్ని ఎక్కువ భాగం ఉపయోగించుకుంటున్నా కాబట్టి లాక్డౌన్ గురించి ఫిర్యాదేమీ లేదు. ఆటగాళ్లు ఏం చేస్తున్నారంటే... ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా వారందరికీ అందుబాటులోనే ఉన్నా. మా ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ వీడియో కాల్ ద్వారా వారందరికీ రోజుకు రెండుసార్లు ఫిట్నెస్ పాఠాలు ఇస్తుంది. దానిని అందరూ అనుసరిస్తారు. ఇక చాలా మంది షట్లర్లు తమ కెరీర్లో ఎప్పుడో గాయాలకు గురై విరామం తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. దీనిని కూడా అలాంటి సుదీర్ఘ విరామంగానే భావించాలి. జూలై వరకు టోర్నీల రద్దుపై... వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి టోర్నీలు ఉండవని బీడబ్ల్యూఎఫ్ స్పష్టం చేసేసింది. అయితే అసలు ఈ లాక్డౌన్ ఎంత కాలం కొన సాగుతుందో, ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చూడాలి. ఆ తర్వాతే ఆట గురించి ఆలోచించవచ్చు. ఒలింపిక్స్ సన్నాహాలపై... ఆందోళన అనవసరం. ఒలింపిక్స్ కొన్ని నెలలకు వాయిదా పడితే ఆటగాళ్ల ప్రాక్టీస్ గురించి ఆలోచించాల్సి వచ్చేది. అయితే ఏడాది పాటు వాయిదా పడ్డాయి కాబట్టి వాటికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రపంచ వ్యా ప్తంగా ఆటగాళ్లందరి పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం లేదు. ప్రస్తు తం మన, మన కుటుంబసభ్యుల, మిత్రుల, దేశప్రజల ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం. క్రీడల గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. కరోనా సమయంలో టోర్నీలపై... ఆల్ ఇంగ్లండ్ టోర్నీని నిర్వహించడంపై బీడబ్ల్యూఎఫ్ను చాలా మంది విమర్శించారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే వారు చివరి క్షణం వరకు సాగదీసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్లో పరిస్థితి చూస్తుంటే మేం సరైన సమయంలో అక్కడి నుంచి బయట పడ్డామనిపిస్తోంది. ఒలింపిక్స్కు అర్హత అంశంపై... మనం అనుకుంటున్నంత తొందరగా పరిస్థితులు మెరుగుపడవని నా అభిప్రాయం. అయితే పరిస్థితులను సానుకూలంగా చూస్తే మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టమని మాత్రమే ఆటగాళ్లకు చెబుతున్నా. చాలా మంది మాకు కుటుంబంతో గడిపే సమయం దొరకడం లేదంటూ ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు దానిని ఉపయోగించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది క్రీడలకంటే పెద్ద సమస్య. అది ఏ దేశాన్ని వదిలిపెట్టడంలేదు. ఎవరూ ఊహించనిది. ఎవరి చేతుల్లోనూ లేనిది. కాబట్టి అన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఒకసారి క్వాలిఫయింగ్ ప్రమాణాలు ఏమిటో తెలిస్తే అప్పుడు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. చేదు గుళికలా భరించాల్సిందే.... ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ప్రభావం రాబోయే రోజుల్లో ప్రతీ రంగంపై ఉంటుంది. క్రీడారంగం మినహాయింపు కాదు. ఆర్థికంగా చాలా మంది దీని బాధితులుగా మారతారు. అందరికీ ఇది కఠిన సమయం. ఇలాంటి సమయంలోనే మానసికంగా కూడా దృఢంగా మారాల్సి ఉంటుంది. క్రీడా రంగానికి కూడా భారీ నష్టం జరుగుతుందనేది వాస్తవం. దీంతో సంబంధం ఉన్న అనేక మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. లేదా జీతాల్లో కోత పడవచ్చు. దీనిని అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఈ ఆరు నెలల కాలాన్ని లెక్కలోంచి తీసేయాలి. గత వందేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. దీనిని ఎదుర్కోవడం అందరికీ కష్టంగా మారింది. అయితే చేదు గుళికలా దీనిని భరించక తప్పదు. త్వరలోనే అంతా మెరుగుపడాలని కోరుకుందాం. -
తప్పుడు నిర్ణయం... తగిన మూల్యం
నానింగ్ (చైనా): ప్రత్యర్థి ర్యాంక్ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసి... విజయం సాధిస్తామనే ధీమాతో తప్పుడు నిర్ణయం తీసుకుంటే... తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత బ్యాడ్మింటన్ కోచ్ల బృందానికి తెలిసొచ్చింది. ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ సుదిర్మన్ కప్లో భాగంగా గ్రూప్–1‘డి’లో మలేసియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 2–3తో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ను కాదని... సమీర్ వర్మను ఆడించాలని కోచ్లు తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 16–21, 21–17, 24–22తో గో సూన్ హువాట్–లై షెవోన్ జెమీ (మలేసియా)లను ఓడించి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించారు. రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సమీర్ వర్మ 13–21, 15–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో భారత నంబర్వన్ పీవీ సింధు 21–12, 21–8తో గో జి వె (మలేసియా)పై నెగ్గడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో ప్రపంచ 24వ ర్యాంక్ జోడీ సుమీత్ రెడ్డి–మను అత్రి 20–22, 19–21తో ప్రపంచ 1394 ర్యాంక్ జంట ఆరోన్ చియా–తియో ఈ యి (మలేసియా) చేతిలో ఓడిపోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 1394వ స్థానంలో ఉన్నప్పటికీ ఆరోన్–తియో జోడీ పట్టుదలతో పోరాడి మలేసియాను నిలబెట్టింది. ఇక చివరి మ్యాచ్గా జరిగిన మహిళల డబుల్స్లో ప్రపంచ 25వ ర్యాంక్ ద్వయం సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 11–21, 19–21తో ప్రపంచ 13వ ర్యాంక్ జోడీ చౌ మె కువాన్–లీ మెంగ్ యీన్ (మలేసియా) చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత్ పరాజయం ఖాయమైంది. ఒకవేళ శ్రీకాంత్ను పురుషుల సింగిల్స్లో ఆడించి ఉంటే, అతను గెలిచి ఉంటే భారత్ విజయం డబుల్స్ మ్యాచ్లకంటే ముందుగానే 3–0తో ఖాయమయ్యేది. కానీ శ్రీకాంత్కంటే సమీర్ వర్మపైనే కోచ్లు ఎక్కువ నమ్మకం ఉంచారు. కానీ వారి నిర్ణయం బెడిసికొట్టింది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరాలంటే పదిసార్లు చాంపియన్ చైనాతో నేడు జరిగే మ్యాచ్లో భారత్ తప్పకుండా గెలవాలి. -
వయసును తక్కువగా చూపిస్తే...
న్యూఢిల్లీ: ఆటగాళ్లు తమ వయోధ్రువీకరణను తప్పుగా వెల్లడించి పోటీల్లో పాల్గొంటే నిషేధం విధించాల్సిందేనని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచించారు. ‘వయస్సును తక్కువ చేసి చూపించే ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మరొకరు ఆ తప్పుచేయకుండా నిరోధించాలంటే నిషేధం అమలు చేయాలి’ అని గోపీచంద్ అన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)లు అలాంటి ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నాయి. అయితే భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్ మాత్రం నిషేధం సరికాదని అంటున్నారు. రెండు మూడేళ్లు సస్పెన్షన్ వేటు వేస్తే సదరు ఆటగాళ్ల ప్రతిభను చంపేసినట్లే అవుతుందని అన్నారు. అలా కాకుండా అండర్–15, 17, 19లలో పెద్ద వయస్సు వారు తప్పుడు ధ్రువీకరణతో పాల్గొంటే వాళ్లకు శిక్షగా ఈ వయోవిభాగాల నుంచి తప్పించి నేరుగా సీనియర్స్ కేటగిరీలో ఆడించడమే ఉత్తమమైన పరిష్కారమన్నారు. 2016లో కొందరు ఆటగాళ్లు తప్పు వయో ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొన్న కేసు విషయంలో విచారణ జరిపిన సీబీఐ నలుగురు ఆటగాళ్లు వయస్సు ధ్రువీకరణ పత్రాలను దిద్దినట్లు తేల్చింది. పలువురు జూనియర్ ఆటగాళ్ల తల్లిదండ్రులు వయసు ధ్రువీకరణ అంశంపై, తప్పుడు ధ్రువీకరణపై చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు చర్యలు చేపట్టే విధాన నిర్ణయం తీసుకోవాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘాన్ని (బాయ్) ఆదేశించింది. -
గోపీచంద్ అకాడమీలో మరో శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో క్రీడాకారుల కోసం మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆవరణలో అదనంగా ఆరు ఎయిర్ కండిషన్డ్ కోర్టుల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్లు వెచ్చించి ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. ఈ కేంద్రంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ను కూడా నెలకొల్పుతామని, కోచ్లకు శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని అన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు లభిస్తే భారత ఆటగాళ్లు మున్ముందు మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్లను ఎయిర్ కండిషన్డ్ కోర్టులలో నిర్వహిస్తారు. అకాడమీలో ఎయిర్ కండిషన్డ్ కోర్టులు ఉండాలని కోరుకున్నాం. త్వరలోనే వీటి నిర్మాణ పనులు మొదలవుతాయి. ఇందులో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారు’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. -
సైనాకు మళ్లీ నిరాశ
ఓడెన్స్: ఈ ఏడాది తొలి టైటిల్ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆశలు అడియాసలయ్యాయి. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 52 నిమిషాల్లో 13–21, 21–13, 6–21తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేత తై జు యింగ్కు 54,250 డాలర్లు (రూ. 39 లక్షల 78 వేలు) 11,000 పాయింట్లు... రన్నరప్ సైనాకు 26,350 డాలర్లు (రూ. 19 లక్షల 32 వేలు) లభించాయి. ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సైనాకిది వరుసగా 11వ పరాజయంకాగా, ఈ ఏడాదిలో ఐదో ఓటమి. ఈ సంవత్సరంలోనే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోనూ తై జు యింగ్ చేతిలోనే సైనా ఓడిపోయింది. ఈ ఏడాది తొమ్మిదో ఫైనల్ ఆడుతోన్న తై జు యింగ్ తొలి గేమ్ ఆరం భం నుంచే ఆధిపత్యం చలాయించింది. 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరును కొనసాగించి 15 నిమిషాల్లోనే తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లో సైనా వ్యూహాలు మార్చి తన ప్రత్యర్థి దూకుడుకు పగ్గాలు వేసింది. విరామానికి 11–5తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత గేమ్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం తై జు యింగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చకచకా పాయింట్లు సాధించి 11–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన తై జు యింగ్ ఇక వెనుదిరిగి చూడకుండా ఈ ఏడాది ఎనిమిదో టైటిల్ను కైవసం చేసుకుంది. -
టాప్... జంప్... టాప్... స్మాష్...
భారత బ్యాడ్మింటన్లో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన క్షణం... తెలుగు జాతి క్రీడాభిమానులంతా సగర్వంగా మనవాడని చెప్పుకోగలిగే ఘనత... ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన మన కిడాంబి శ్రీకాంత్ ఎందరో దిగ్గజాల వల్ల కానిది సాధ్యం చేసి చూపించాడు. వరుస విజయాలతో సత్తా చాటిన ‘డిప్యూటీ కలెక్టర్’ ఇప్పుడు షటిల్ ప్రపంచంలో శిఖరానికి చేరుకున్నాడు. తాజా ప్రపంచ ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ తొలిసారి వరల్డ్ నంబర్వన్గా అవతరిస్తున్నాడు. కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ ప్రవేశ పెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు శ్రీకాంత్ కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ అభిమానులందరికీ ఆనందం పంచే రోజు వచ్చేసింది. చైనా కోటను బద్దలుకొట్టి మనోళ్లూ ప్రపంచ బ్యాడ్మింటన్ను శాసించగలరని చూపించిన శ్రీకాంత్ ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టించాడు. గురువారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అధికారికంగా ప్రకటించబోయే ర్యాంకింగ్స్లో శ్రీకాంత్కు నంబర్వన్ స్థానం దక్కనుంది. 2017లో ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టోర్నీ విజయాలతో అగ్రస్థానానికి చేరువగా వచ్చిన శ్రీకాంత్ త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. అయితే ఆ కల నెరవేరేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. గత ఏడాది నవంబర్ 2న తొలిసారి వరల్డ్ నంబర్–2 స్థానానికి చేరుకున్న శ్రీకాంత్... ఇప్పుడు నంబర్వన్ హోదాను ఖాయం చేసుకున్నాడు. అక్సెల్సన్ను వెనక్కి తోసి... ప్రస్తుతం శ్రీకాంత్ ఖాతాలో 76,895 పాయింట్లు ఉన్నాయి. డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ 77,130 పాయింట్లతో నంబర్వన్గా కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య 235 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం గత 52 వారాల ప్రాతిపదికన ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. గత ఏడాదిలో అత్యధిక పాయింట్లు సాధించిన 10 టోర్నీల ప్రదర్శ నను తీసుకొని గణిస్తారు. గతేడాది ఇదే సమయానికి మలేసియా ఓపెన్ ద్వారా సాధించిన 1660 పాయింట్లు అక్సెల్సన్ కోల్పోతాడు. 2018లో ఇప్పటికే జరగాల్సిన ఈ టోర్నీ వాయిదా పడింది. ఫలితంగా శ్రీకాంత్ ముందంజ వేసే అవకాశం లభించింది. మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 2015 మార్చిలో తొలిసారి వరల్డ్ నంబర్వన్గా నిలిచింది. 1980లో భారత దిగ్గజం ప్రకాశ్ పదుకొనే వరల్డ్ నంబర్వన్గా నిలిచినా.. అప్పటికి అధికారికంగా కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ వ్యవస్థ లేదు. ఆ సమయంలో అతను సాధించిన వరుస విజయాలను బట్టి ప్రకాశ్ను నంబర్వన్గా గుర్తించారు. శ్రీకాంత్ గురువు, ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ 2001లో అత్యుత్తమంగా 5వ ర్యాంక్కు చేరుకున్నారు. తగ్గే అవకాశమూ... నంబర్వన్గా శ్రీకాంత్ ఎంత కాలం నిలుస్తాడనేది కూడా ఆసక్తికరం. గతేడాది గెలిచిన నాలుగు సూపర్ సిరీస్లు ఇండోనేసియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ల వల్ల అతను అగ్రస్థానానికి చేరుకోగలిగాడు. ఈ ఏడాది వాటన్నింటినీ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ టోర్నీ ఓడినా అంతే భారీ స్థాయిలో పాయింట్లు కోల్పోతాడు కాబట్టి ర్యాంకింగ్ బాగా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంది. అలా మొదలై.. ►2011 డిసెంబర్ 15న శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. అప్పుడతని ర్యాంక్ 386. తర్వాతి వారమే అది 535కు పడిపోయింది. ►2012 డిసెంబర్ 6న తొలి సారి టాప్–100లోకి. నాడు ర్యాంక్ 81. ►2013 జూన్ 13న తొలిసారి టాప్–50లోకి (44వ ర్యాంక్) ► 2014 నవంబర్ 20న తొలిసారి టాప్–10లోకి (10) ► 179- 89 శ్రీకాంత్ కెరీర్లో గెలుపోటములు ►కెరీర్ మొత్తం ప్రైజ్మనీ 3 లక్షల 97 వేల డాలర్లు (సుమారు రూ. 2 కోట్ల 58 లక్షలు) -
శ్రీకాంత్... ది గ్రేట్
కొన్నేళ్ల క్రితం భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరైనా అంతర్జాతీయస్థాయిలో ఒక్క టైటిల్ గెలిస్తే ఎంతో మురిసిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు... ప్రత్యర్థి ఎంతటి వారైనా ‘సూపర్’గా ఆడుతూ మనోళ్లు టైటిల్స్ను గెలవడం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ తన అద్వితీయ ఆటతీరుతో మరోసారి మెప్పించాడు. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 2007లో ఫ్రెంచ్ ఓపెన్కు సూపర్ సిరీస్ హోదా లభించాక ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ దిగ్గజాలు లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తర్వాత ఒకే ఏడాది కనీసం నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్గా ఘనత వహించాడు. అందరిచేతా మన శ్రీకాంత్... ‘ది గ్రేట్’ అనిపించుకున్నాడు. పారిస్: వేదిక మారింది. టోర్నీ మారింది. ప్రత్యర్థీ మారాడు. కానీ ఫలితం మాత్రం మారలేదు. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మరోసారి ‘సూపర్’గా ఆడాడు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21–14, 21–13తో ప్రపంచ 40వ ర్యాంకర్, క్వాలిఫయర్ కెంటా నిషిమోటో (జపాన్)పై అలవోకగా గెలిచాడు. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్కు తొలి గేమ్ ఆరంభంలో మినహా మరెక్కడా పోటీ ఎదురుకాలేదు. ప్రతీ రౌండ్లో తనకంటే మెరుగైన ఆటగాళ్లు లీ చోంగ్ వీ (8వ ర్యాంక్–మలేసియా), సాయిప్రణీత్ (15వ ర్యాంక్–భారత్), ఆంథోనీ జిన్టింగ్ (16వ ర్యాంక్–ఇండోనేసియా), ఆంటోన్సెన్ (17వ ర్యాంక్–డెన్మార్క్)లను బోల్తా కొట్టించిన నిషిమోటో ఫైనల్లో మాత్రం శ్రీకాంత్ దూకుడుకు తలవంచక తప్పలేదు. తొలి గేమ్లో ఒకదశలో శ్రీకాంత్ 5–9తో వెనుకబడినా... నిషిమోటో ఆటతీరుపై అవగాహన వచ్చాక ఈ హైదరాబాద్ ప్లేయర్ రెచ్చిపోయాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 11–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం ఒకసారి వరుసగా నాలుగు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్లో శ్రీకాంత్ మరింత విజృంభించాడు. ఆరంభంలోనే 10–2తో ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. ఓవరాల్గా శ్రీకాంత్ కెరీర్లో ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్. కెరీర్ బెస్ట్ ర్యాంక్కు... ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్కు 24,375 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 15 లక్షల 85 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో శ్రీకాంత్ వచ్చే గురువారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తొలిసారి అత్యుత్తమంగా రెండో ర్యాంక్కు చేరుకోనున్నాడు. ఇంతకుముందు 2015 ఆగస్టులో శ్రీకాంత్ మూడో ర్యాంక్లో నిలిచాడు. ప్రశంసల వెల్లువ... ఈ ఏడాది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్పై ప్రశంసల వర్షం కురిసింది. ‘అభినందనలు. విజయాలను అలవాటు చేసుకున్నావు. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది’ అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్... ‘శ్రీకాంత్ మరో శుభవార్త వినిపించాడు. ఫ్రెంచ్ ఓపెన్లో అద్భుత విజయం సాధించి దేశం గర్వించేలా చేశాడు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాబాబు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, ఐటీ శాఖా మంత్రి కె.తారక రామారావు కూడా శ్రీకాంత్ను అభినందించారు. భవిష్యత్లో అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ గత రెండు వారాలు ఎంతో అద్భుతంగా గడిచాయి. కొన్ని క్లిష్టమైన మ్యాచ్ల్లో పైచేయి సాధించాను. ఈ ఏడాది మిగిలిన టోర్నీల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాను. -
షట్లర్స్ ఫ్యాక్టరీ
చాంపియన్లను తయారు చేస్తున్న పుల్లెల గోపీచంద్ అకాడమీ - అన్ని స్థాయిలలో విజేతలుగా నిలుస్తున్న ఆటగాళ్లు - సంవత్సరాల శ్రమకు లభిస్తున్న ఫలితాలు - భవిష్యత్తులో మరింత మంది స్టార్లు అది హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ప్రాంగణం... సుదీర్ఘంగా సాగిన ప్రాక్టీస్ తర్వాత లభించిన కొద్ది పాటి విరామ సమయం... ఆ కొద్ది సమయంలోనే తమ పరిచయం, తాము వచ్చిన కారణం, తమ ఆలోచనలను గోపీచంద్తో పంచుకునేందుకు పలువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అందులో ఎక్కువ మంది ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు. గోపీచంద్ అనుమతిస్తే అకాడమీతో జత కూడేందుకు... ఏదో రూపంలో స్పాన్సర్షిప్ అందజేసేందుకు వచ్చిన వారే. దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను వారు చర్చిస్తున్నారు. మరికొందరు ఆటగాళ్ల బ్రాండింగ్ గురించి, ఇతర ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాలని ఆశిస్తున్నారు. గోపీచంద్కు ఇటీవల ఇది రొటీన్గా మారిపోయింది. రియో ఒలింపిక్స్లో సింధు రజతం నెగ్గిన తర్వాత ఇలాంటి వాటి కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. ఒకప్పుడు ఇదే అకాడమీ నిర్మాణం కోసం సహకారం కావాలంటూ ఆయన ఎక్కని, దిగని మెట్టు లేదు. అడగని కార్పొరేట్ సంస్థ లేదు. ఒక రకమైన లెక్కలేనితనంతో చిన్న చూపు చూసినవారు కొందరైతే... అసలు బ్యాడ్మింటన్ను ఎవరు పట్టించుకుంటారంటూ మొహం మీదే అనేసిన వారు మరెందరో. అయితే వారి మాటలు గోపీచంద్ లక్ష్యాన్ని మార్చలేదు. చాంపియన్లను తయారు చేయాలన్న తన పట్టుదల ముందు అవన్నీ చిన్న చిన్న విఘ్నాలుగా కనిపించాయే తప్ప... మనకెందుకులే ఇదంతా అంటూ కాడి పడేయాల్సినంతగా భయపెట్టలేదు. కష్టాలు, సమస్యలు ఎన్ని చెప్పుకున్నా... చివరకు ఫలితాలతోనే తనను ప్రపంచం అంచనా వేస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే వెనకడగు వేయలేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ తన కలను నిజం చేసుకున్నారు. అకాడమీ నుంచి అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడంలో విజయవంతమయ్యారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి... ఈ జాబితా ఇంతటితో ఆగిపోలేదు. రుత్విక శివాని, మేఘన, రాహుల్ యాదవ్... తదితరులు దీనికి కొనసాగింపు... గాయత్రి, సామియా, విష్ణు...ఇది రాబోయే విజేతల వరుస... ఒకరా, ఇద్దరా బ్యాడ్మింటన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న వారిలో ఎక్కువ మంది గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చినవారే. భారత బ్యాడ్మింటన్కు కేంద్రంగా మారిన ఈ అకాడమీపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.... మొహమ్మద్ అబ్దుల్ హాది గోపీచంద్ 2004 నవంబర్లో ఆటగాడిగా ఆఖరి సారిగా ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ బరిలోకి దిగారు. హైదరాబాద్లోనే జరిగిన ఆసియా శాటిలైట్ టోర్నీలో విజేతగా నిలిచారు. అప్పటికే వరుస గాయాలకు పదే పదే జరిగిన శస్త్ర చికిత్సల తర్వాత పునరాగమనంలో గెలిచిన టైటిల్ అది. ఈ విజయం తర్వాత ప్రధాన టోర్నీలలో మళ్లీ గెలవడం సాధ్యం కాదని ఆయనకు అర్థమైంది. దాంతో ప్లేయర్గా కెరీర్ ముగిసింది. అదీ ఆరంభం... 2001లో గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్గా నిలిచే సమయానికి భారత్లో బ్యాడ్మింటన్కు సౌకర్యాల పరంగా అనుకూల వాతావరణం ఏమీ లేదు. తర్వాతి మూడేళ్లలో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్లో కూడా ఎల్బీ ఇండోర్ స్టేడియం మినహా మరో చెప్పుకోదగ్గ వేదిక లేదు. ఇలాంటి స్థితిలో ఆడిన గోపీచంద్... మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది బ్యాడ్మింటన్లో వెలుగులోకి రావొచ్చని నమ్మారు. అదే ఆలోచనతో కోచ్గా మారి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సహకారంతో... 2004లోనే అప్పటి ‘శాప్’ మేనేజింగ్ డైరెక్టర్ సుమితా దావ్రా చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గోపీచంద్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చారు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం వైపు నుంచి ఏడాదికి రూ. 10 లక్షల చొప్పున ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ఇందులో పెద్ద మొత్తం ఇండోనేసియా కోచ్కే చెల్లించాల్సి వచ్చేది. కొంత మంది వర్ధమాన షట్లర్లు, కొత్తవారితో కలిసి 30 మందితో అకాడమీ ప్రారంభమైంది. సంవత్సరం పాటు ప్రభుత్వ నిధులతో అకాడమీ నడిచింది. కానీ ఆ తర్వాత ఆ మొత్తాన్ని కొనసాగించేందుకు వేర్వేరు కారణాలతో ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ దశలో గోపీచంద్ సొంత డబ్బులతోనైనా అకాడమీని నడిపించాలని పట్టుదల ప్రదర్శించారు. 2008 వరకు సొంత డబ్బును ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అత్యుత్తమంగా... ప్రపంచ స్థాయి కోర్టులు, శిక్షణ, జిమ్, ఫిజియోలు, డైటింగ్... ఇలా ప్రతీ అంశంలో గోపీచంద్ అకాడమీ సౌకర్యాలపరంగా ‘ది బెస్ట్’గా నిలుస్తుంది. పదేళ్ల వయసు ఉన్న చిన్నారుల నుంచి రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు వరకు ప్రస్తుతం అందరికీ ఇక్కడ శిక్షణ కొనసాగుతోంది. 2008లో ఏర్పాటైన అకాడమీకి తోడు అవుటర్ రింగ్రోడ్ జంక్షన్ సమీపంలో 2016లో భారత క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో గోపీచంద్ రెండో అకాడమీ కూడా ఏర్పాటైంది. రెండు అకాడమీల్లో కలిపి 150 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఆటగాళ్లందరినీ మొత్తం 6 గ్రూప్లుగా విభజించారు. సింధు, శ్రీకాంత్ తదితర ఆటగాళ్ల కోచింగ్ గోపీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. గోపీ కాకుండా మరో 15 మంది కోచ్లు పని చేస్తున్నారు. వీరంతా మిగతా గ్రూప్లలోని ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తారు. నోయిడాలో కూడా... హైదరాబాద్లో గోపీచంద్ అకాడమీ సూపర్ సక్సెస్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా తమ వద్ద అలాంటి అకాడమీలు ఏర్పాటు చేయాలని, ఎంత డబ్బయినా వెచ్చిస్తామని ఆయనకు అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే అందులో చాలా వాటిని గోపి తిరస్కరించారు. ‘వీళ్లంతా ఇలా పెట్టుబడి పెట్టగానే అలా లాభం మొదలు కావాలని భావించేవాళ్లే. క్రీడల్లో అది సాధ్యం కాదు. దానిని పక్కా వ్యాపార దృష్టితో వారు చూశారు. అందుకే అంగీకరించలేదు’ అని గోపీచంద్ చెప్పారు. తన ఆలోచనలకు తగినట్లుగా, కేవలం మంచి ఫలితాలు రావాలనే నమ్మకంతో ముందుకు వచ్చిన వారితో కలిసి న్యూఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆయన అకాడమీని ఏర్పాటు చేశారు. గోపీచంద్ పేరును జోడిస్తూ గ్వాలియర్, వడోదర, తణుకు, సేలంలలో కూడా అకాడమీలు ఉన్నా... వాటిలో ఆయన భాగస్వామ్యం లేదు. అవసరమైనప్పుడు ఆయన తగిన మార్గనిర్దేశనం చేస్తుంటారు. లండన్ ఒలింపిక్స్ తర్వాతే 2008లో అకాడమీ ప్రారంభమైనా నిర్వహణ కోసం చెప్పుకోదగ్గ మద్దతు లభించలేదు. 2012 లండన్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఇక్కడ మెరికల్లాంటి షట్లర్లను తయారు చేసే అవకాశం ఉందని అంతా గుర్తించారు. భవిష్యత్తు విజయాల్లో తాము కూడా భాగం కావాలని అనేక కంపెనీలు భావించాయి. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కూడా ఆ తర్వాత భాగంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆసక్తి కనబర్చాయి. ఇక స్పోర్ట్స్ అథారిటీ, భారత బ్యాడ్మింటన్ సంఘం రెగ్యులర్గా జాతీయ జట్టు శిక్షణ శిబిరాలు ఇక్కడే ఏర్పాటు చేయడంతో అకాడమీకి ఆర్థిక భారం తగ్గింది. ఇక గత ఏడాది ‘రియో’లో సింధు పతకం తర్వాతనైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీర్ఘకాలిక లక్ష్యాలు... ఇప్పుడు అకాడమీ నుంచి వరుస విజయాలతో కీర్తి కనకాదులు సొంతం చేసుకుంటున్నవారు ఒక్క రోజులో స్టార్లుగా మారిపోలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల వాటి వెనక ఉన్నాయి. గోపీచంద్ కూడా అందరికీ ఇదే చెబుతారు. కఠోర ప్రాక్టీస్, సరైన డైట్, రోజూవారీ క్రమశిక్షణ... ఈ మూడింటిని ఒక వారమో, నెల రోజులో కాకుండా కనీసం పదేళ్ల పాటు ఒకే తరహాలో కొనసాగించగలవారు మాత్రమే ఆటలోకి అడుగు పెట్టాలి. ఇన్స్టంట్గా కాకుండా సుదీర్ఘ లక్ష్యాలతో శ్రమిస్తేనే ఫలితాలు ఆశించవచ్చు. అంతే కానీ ఉత్సాహంతో రావడం, కొద్ది రోజులకే ఇంకా చాంపియన్ కావడం లేదని భావిస్తే ఏ అకాడమీ కూడా ఏమీ చేయలేదు అని ఆయన అంటారు. నిధుల వేటలో... అకాడమీ నిర్మాణం కోసం అప్పటికే గోపీచంద్కు ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కేటాయించినా... ఆర్థిక సమస్యలతో అటువైపు దృష్టి పెట్టలేదు. అయితే 2006లో జాతీయ జట్టు చీఫ్ కోచ్గా ఎంపికయ్యాక శిక్షణ పరిధి మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి అకాడమీలో నిర్వహణ గురించి కొన్ని సమస్యలు తలెత్తాయి. దాంతో అన్ని సౌకర్యాలతో కొత్త అకాడమీని నిర్మించాలని గోపీచంద్ నిర్ణయించుకున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అప్పటికి కొద్ది రోజుల క్రితమే కట్టుకున్న ఇల్లును గోపీచంద్ కుదువ పెట్టారు (2012లో ఈ అప్పు తీరింది). అయితే ఆ మొత్తం ఏమాత్రం సరిపోలేదు. చివరకు ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో గోపీచంద్ కల సాకారమైంది. ఆయన రూ. 4.5 కోట్లు అకాడమీ కోసం ఇచ్చారు. చివరకు 2008లో నిమ్మగడ్డ ఫౌండేషన్–పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభమైంది. క్రీడా పరికరాల ఉత్పత్తుల్లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘యోనెక్స్’ మొదటి నుంచీ అకాడమీకి అండగా నిలుస్తోంది. ఇక్కడి ఆటగాళ్ల శిక్షణ కోసం పెద్ద సంఖ్యలో అవసరమైన షటిల్స్ను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు గుర్తింపు తెచ్చుకున్న షట్లర్లకు పూర్తి స్థాయిలో కిట్ కూడా అందజేస్తోంది. ఇది తమపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని గోపీచంద్ చెబుతారు. అంతా బాగున్న సమయంలో కొంత మంది తప్పుదోవ పట్టించిన కారణంగా మధ్యలో ఒకసారి భూమి వెనక్కి ఇమ్మంటూ ప్రభుత్వం నుంచి నోటీసు వచ్చింది. దాని కోసం కోర్టులో పోరాడాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు అధికారికంగా పూర్తి స్థాయిలో అకాడమీ భూమి మా చేతికొచ్చింది. సమస్యలను అధిగమించి దీనిని సమర్థంగా నడిపించడంలో గవర్నర్ నరసింహన్తో పాటు ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కమల్వర్ధన్ రావు ఎంతో సహకరించారు అని గోపీచంద్ అన్నారు. ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు... ‘సొంత అకాడమీ ఉంటూ జాతీయ జట్టు చీఫ్ కోచ్గా ఎలా పని చేస్తావు’ అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. నిజానికి అది నాకు ఒక పదవి మాత్రమే. హోదా ఎలా ఉన్నా అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడమే నా పని. ఏ అకాడమీ నుంచి ఆటగాళ్లు వచ్చినా చివరకు వారు భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తారు. దేశం కోసం పతకం గెలుస్తారు. అది ముఖ్యం. అకాడమీ కోచ్, భారత కోచ్ రెండింటినీ నేను సమన్వయపరుస్తూ వెళ్లానే తప్ప ప్రత్యేకంగా సొంత ప్రయోజనాలకు వాడుకోలేదు. అజయ్ జయరామ్ అగ్రశ్రేణి ఆటగాడు. అతను నా అకాడమీలో కాకుండా సొంతంగా ముంబైలో ప్రాక్టీస్ చేసుకుంటాడు. కానీ భారత కోచ్గా అతడికి నేను నా వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాను. అంతే గానీ నా అకాడమీ షట్లర్ కాదని నేను భావించను. అన్నింటికి మించి అందరికి తెలియని విషయం ఏంటంటే నేను గత 11 ఏళ్లలో భారత కోచ్ హోదాలో ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ఇండియన్ ఆయిల్లో ఉద్యోగిగా నాకు వచ్చే జీతం, నా భార్య లక్ష్మి జీతంతో పాటు మా నాన్నగారి ఆదాయాన్ని మేం పూర్తిగా వాడుకున్నాం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొంతున్న వారిలో 70 శాతం మంది నుంచి నేను ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు. కార్పొరేట్లు ఇచ్చే సహకారంతోనే దానిని భర్తీ చేస్తున్నాను. అకాడమీ నిర్వహణ అనేది నాకు ఎప్పుడూ ఆదాయ వనరు కాదు. అలా ఆలోచించి దీనిని మొదలు పెట్టలేదు. ఆయన పిల్లలు కూడా... తల్లిదండ్రుల బాటలోనే గోపీచంద్, లక్ష్మీల ఇద్దరు పిల్లలు కూడా బ్యాడ్మింటన్పైనే దృష్టి పెట్టారు. ఇతర ట్రైనీలతో పాటు వీరిద్దరు కూడా అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నారు. నిబంధనల విషయంలో వారికీ ఎలాంటి వెసులుబాటు ఉండదని గోపి చెప్పారు. కూతురు గాయత్రి జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక టైటిల్స్ సాధించి తన ప్రత్యేకత ప్రదర్శించగా... కుమారుడు సాయి విష్ణు కూడా అదే బాటలో ఉన్నాడు. ప్రపంచంలో నంబర్వన్... గోపీచంద్ అకాడమీ నుంచి పెద్ద ఎత్తున ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఒలింపిక్ పతకాలతో చెలరేగితే... మిగతా వారంతా అనేక పెద్ద స్థాయి అంతర్జాతీయ టోర్నీలలో విజేతలుగా నిలిచి సత్తా చాటారు. ఈ విజయాల వరుసకు బ్రేక్ రాకుండా గోపీచంద్ జాగ్రత్త తీసుకుంటారు. అగ్రశ్రేణి ఆటగాళ్ల శిక్షణపైనే పూర్తిగా దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయి బృందంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒకవేళ సీనియర్లు విఫలమైనా ఆ లోటు కనిపించకుండా... తర్వాతి వారు దానిని అందుకునే విధంగా వారికి కోచింగ్ ఇస్తారు. దాని వల్ల మళ్లీ అండర్–13 నుంచి సీనియర్ విభాగం వరకు ఎక్కడా విజయాలకు విరామం లభించదు. చైనాలో 50 అకాడమీలు ఎంతో మంది ఆటగాళ్లను తయారు చేస్తున్నాయి. కానీ ఒకే అకాడమీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ షట్లర్లు రావడం ఎక్కడా జరగలేదు. సౌకర్యాలు, ఫలితాలపరంగా ప్రపంచంలోనే మా అకాడమీ నంబర్వన్ అని గట్టిగా చెప్పగలను. ఆ విషయంలో నేను గర్వపడుతున్నాను అని గోపీచంద్ చెబుతారు. గోపీ పరీక్ష తర్వాతే... సహజంగానే గోపీచంద్ అకాడమీకి ఇప్పుడు ఉన్న గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దాంతో తమ పిల్లలు అక్కడ చేరితే చాంపియన్లుగా మారతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే నేరుగా తీసుకొచ్చి అకాడమీలో చేర్పించేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. అయితే గోపీచంద్ చెప్పిన దాని ప్రకారం... గత మూడేళ్లుగా అకాడమీలో దాదాపుగా అడ్మిషన్లు ఆగిపోయాయి. బేసిక్స్ నేర్చుకునే లెర్నర్స్ విభాగంలోనైతే ఎవరినీ తీసుకోవడం లేదు. కొంత మంది పెద్ద స్థాయి సిఫారసులతో వచ్చినా సరే వారికి కూడా నో ఎంట్రీనే. అయితే ప్రాథమిక స్థాయిలో అప్పటికే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన వారిని తీసుకొని మరింతగా సానబెట్టే అవకాశం మాత్రం ఇక్కడ ఉంది. అదీ గోపీచంద్ స్వయంగా తనదైన శైలిలో ఆటలో పరీక్ష నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వారికి అవకాశం లభిస్తుంది. అసాధారణ ప్రతిభ ఉందంటూ వచ్చే కొందరికి కూడా ఇదే వర్తిస్తుందని ఆయన అంటున్నారు. క్రమశిక్షణకు కేరాఫ్... అగ్రశ్రేణి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకొని ఉండవచ్చు... అప్పటికే పెద్ద టోర్నీలలో వరుస విజయాలు సాధిస్తూ ఉండవచ్చు... కానీ అకాడమీలో క్రమశిక్షణ విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా ఒక్కటే. ఏ ఒక్కరూ తమ పరిధి దాటి ప్రవర్తించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. తమకు ఇచ్చిన షెడ్యూల్ను కచ్చితంగా, సమర్థంగా పాటించాల్సిందే. ఇన్నేళ్లలో క్రమశిక్షణకు సంబంధించి అకాడమీ నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం విశేషం. తాను కూడా ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తానని గోపీచంద్ అన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యవస్థలో వాతావరణం చెడగొట్టేవారు ఒకరో, ఇద్దరో కచ్చితంగా ఉంటారు. అలాంటి వారిని గుర్తించి పక్కన పెట్టేయడం చాలా అవసరం. ఇక్కడ ట్రైనింగ్ కూడా పూర్తిగా నేను ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే సాగాలి. కొంత మంది ఆటగాళ్లు బయట గెలిచి రాగానే ఇలా కాదు అలా ఆడాలి అన్నట్లుగా తమ షెడ్యూల్ తామే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే జూనియర్లకు సలహాలిస్తూ మాస్టర్లా మారే ప్రయత్నం చేస్తారు. కానీ అలా ప్రవర్తిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించే అవకాశం నేను అసలే ఇవ్వను అని ఆయన చెప్పారు. -
గోపీచంద్ అధికారాలకు కత్తెర?
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్కు ఎన్నో అద్వితీయ విజయాలు అందించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అధికార పరిధిని తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నూతన అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ‘బాయ్’ నియామావళిలో పలు మార్పులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘జాతీయ చీఫ్ కోచ్’ అనే పదవిని తొలగించి, దాని స్థానంలో రెండేళ్ల పదవి కాలంతో జాతీయ కోచ్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో పాటు సింగిల్స్, డబుల్స్, జూనియర్స్ విభాగాలకూ ప్రత్యేకంగా వేరు వేరు కోచ్ల నియామకానికి ఆయన మొగ్గుచూపుతున్నారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం కోచ్లు మరే ఇతర రాష్ట్ర సంఘాలలో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. గోపీచంద్ 2006 నుంచి జాతీయ చీఫ్ కోచ్గా కొనసాగుతున్నారు. గోపీచంద్ పర్యవేక్షణలో ఇతర జాతీయ కోచ్లు పనిచేస్తున్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి ఆయన కార్యదర్శి కూడా. తాజా ప్రతిపాదనల ప్రకారం కోచ్ల బృందానికి ప్రత్యేక పర్యవేక్షణాధికారి ఉండరు. రాష్ట్ర సంఘంలోనూ ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ అంశంపై జూన్ 11న బెంగళూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు ఇన్స్టిట్యూషన్ జట్లు అయిన ఎయిరిండియా, పీఎస్పీబీ, రైల్వేస్, కాగ్, ఇంటర్ యూనివర్సిటీ కంట్రోల్ బోర్డులకు ఓటింగ్ హక్కును తొలగించాలని కూడా ప్రతిపాదించారు. -
భారత్ ఆశలు సజీవం
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): నాకౌట్ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటుకుంది. సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ చాంపియన్షిప్లో భాగంగా గ్రూప్1–డి మ్యాచ్లో భారత్ 4–1తో ఇండోనేసియాను ఓడించింది. తొలుత మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 22–20, 17–21, 21–19తో తొంతోవి అహ్మద్–గ్లోరియా జోడీని ఓడించింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–16తో జొనాథన్ క్రిస్టీపై గెలవడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 9–21, 17–21తో మార్కస్ గిడియోన్–కెవిన్ సంజయ జంట చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 21–8, 21–19తో ఫిత్రియానిపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన మహిళల డబుల్స్ మ్యాచ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–12, 21–19తో డెల్లా డెస్తియారా–రొసియాతా జోడీపై నెగ్గడంతో భారత్ 4–1తో గెలుపొందింది. బుధవారం ఇండోనేసియా, డెన్మార్క్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితంపై భారత్ నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇండోనేసియా ఓడిపోతే భారత్, డెన్మార్క్ జట్లు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఇండోనేసియా గెలిస్తే ఈ గ్రూప్లోని మూడు జట్లు ఒక్కో విజయంతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన గేమ్లు, పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్కు చేరుతాయి. -
మొదలైంది వేట...
సింధు శుభారంభం తొలి మ్యాచ్లో యామగుచిపై విజయం మారిన్కు సున్ యు షాక్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ రెండు వారాల తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో బోణీ చేసింది. కొంతకాలంగా జోరు మీదున్న ఈ హైదరాబాద్ అమ్మాయి మెగా ఈవెంట్లో శుభారంభం చేసి... టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో తాను ఉన్నానని ప్రత్యర్థులకు సంకేతాలు పంపించింది. దుబాయ్: చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... సీజన్ ముగింపు టోర్నమెంట్కు ఆఖరి బెర్త్ రూపంలో అర్హత పొందిన పీవీ సింధు తొలి మ్యాచ్లోనే విజయాన్ని అందుకుంది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఈ హైదరాబాద్ షట్లర్ అంచనాలకు అనుగుణంగా రాణించి రెండో సీడ్ను బోల్తా కొట్టించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పీవీ సింధు 12–21, 21–8, 21–15తో రెండో సీడ్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఇదే గ్రూప్లోని మరో లీగ్ మ్యాచ్లో సున్ యు (చైనా) 21–18, 24–22తో ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)పై సంచలన విజయం సాధించింది. తడబడి... తేరుకొని... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ద్వారా ఈ ఏడాది ‘అత్యంత పురోగతి సాధించిన క్రీడాకారిణి’ పురస్కారాన్ని అందుకున్న సింధు ఈ మ్యాచ్ తొలి గేమ్లో తడబడింది. ఈ ఏడాది డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీల్లో విజేతగా నిలిచిన అకానె ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 14–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అకానె ఆటతీరును అంచనా వేయలేకపోయిన సింధు అనవసర తప్పిదాలు కూడా చేసి తొలి గేమ్ను 16 నిమిషాల్లో చేజార్చుకుంది. ఇక రెండో గేమ్లో సింధు ఆటతీరు మారిపోయింది. కోచ్ పుల్లెల గోపీచంద్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం ఆడిన సింధు మొదట్లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అవకాశం దొరికినపుడల్లా పదునైన స్మాష్లు సంధించడం... డ్రాప్ షాట్లు కొట్టడం... సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించడం... నెట్ వద్ద అప్రమత్తత కారణంగా సింధు ఈ గేమ్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విరామానికి 11–7తో ముందంజలో ఉన్న సింధు అదే జోరులో రెండో గేమ్ను 19 నిమిషాల్లో సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్ సుదీర్ఘ ర్యాలీతో మొదలైంది. అయితే యామగుచి కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో సింధు ఖాతాలో తొలి పాయింట్ చేరింది. అకానె బలహీనతలపై అవగాహన పెంచుకున్న సింధు దానికి తగ్గట్టు ఆడుతూ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు మరింత జోరు పెంచింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. మరోవైపు అకానె తేరుకునే ప్రయత్నం చేసినా సింధు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మూడో గేమ్ను 27 నిమిషాల్లో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే లీగ్ మ్యాచ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సున్ యు (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఈ ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు. -
ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు
-
ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు
కోట్లాది భారతీయుల ఆకాంక్ష నెరవేరలేదు కానీ.. రియో ఒలింపిక్స్లో మరోసారి మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఫైనల్ సమరంలో భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైనా.. తుదిమెట్టుపై స్వర్ణం చేజారినా.. రజతపతకంతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ సమరంలో సింధు పోరాడి ఓడిపోయింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది. తొలి గేమ్ ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. ఆరంభంలో మారిన్ దూసుకెళ్లగా, సింధు వెనుకబడింది. ఓ దశలో మారిన్ 12-6తో ముందంజ వేసింది. ఈ సమయంలో సింధు విజృంభించి వరుసగా మూడు పాయింట్లు సాధించింది. తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. మారిన్ కాసేపు ఆధిక్యతను కొనసాగించినా, సింధు పోరాటపటిమతో ఆమెను నిలువరించింది. సింధు స్కోరును 19-19తో సమంచేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకుంది. సింధు ప్లేస్మెంట్లు, స్మాష్లతో అదరగొట్టింది. రెండో గేమ్లో మారిన్ చెలరేగగా, సింధు జోరు తగ్గింది. ఆరంభంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యం ప్రదర్శించింది. తర్వాత సింధు, మారిన్కు చెరో రెండు పాయింట్లు వచ్చాయి. కాగా మారిన్ వరుసగా 5 పాయింట్లు సాధించి 11-2 స్కోరుతో ముందంజ వేసింది. ఈ దశలో సింధు కాస్త జోరు పెంచడంతో స్కోరు 7-14కు చేరుకుంది. ఆనక మారిన్ను నిలువరించడంలో సింధు విఫలమైంది. స్పెయిన్ షట్లర్ అదే జోరు కొనసాగిస్తూ గేమ్ను సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ 1-1 గేమ్స్తో సమమైంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ మారిన్ దూకుడు ప్రదర్శించింది. వరుసగా రెండు పాయింట్లు గెలిచి ముందంజ వేసింది. ఆ తర్వాత సింధుకు ఓ పాయింట్ రాగా, మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 6-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో సింధు పుంజుకుని వరుసగా రెండు పాయింట్లు గెలిచి మారిన్ను జోరును అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. మారిన్ ఆధిక్యాన్ని 9-8కి తగ్గించిన సింధు స్కోరును 10-10తో సమం చేసింది. దీంతో ఫలితంపై ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. కాగా ఈ సమయంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ముందంజ వేసింది. తర్వాత మారిన్ను నిలువరించేందుకు సింధు శ్రమించినా ఫలితం లేకపోయింది. మారిన్ గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. కంగ్రాట్స్ సింధు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్న పీవీ సింధుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సింధు సాధించిన విజయం చారిత్రాత్మకమని తన ట్వీట్లో కొనియాడారు. సింధు విజయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో క్రీడా రంగంలో మంచి మార్పులకు, మరెన్నో విజయాలకు నాందీ పలికే అద్భుతమైన, స్ఫూర్తిమంతమైన విజయమని ఆయన ప్రశంసించారు. సింధు తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు, కోచ్ గోపీచంద్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. Very well played @Pvsindhu1 Proud of your performance. Congrats on creating history by being the first Indian woman athlete to get a silver — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 August 2016 -
సింధు ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది
-
కంగ్రాట్స్ సింధు.. గో ఫర్ గోల్డ్
రియో ఒలింపిక్స్లో రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం గెలవడం, ఆ వెంటనే తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్కు చేరి రజతం ఖాయం చేసుకోవడంతో భారత క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పతకాలు తీసుకువస్తారని భావించిన స్టార్ క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరగడంతో నిరాశపడ్డ అభిమానులకు తాజా విజయాలు అమితానందం కలిగిస్తున్నాయి. ఇప్పుడు అభిమానుల మూడ్ మారింది. దేశంలో ఎక్కడ చూసినా బ్యాడ్మింటన్ ఫీవరే. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల వరకు అందరి నోటా సింధు మాటే. శుక్రవారం సాయంత్రం జరిగే ఫైనల్లో సింధు గెలవాలన్నది అందరి ఆకాంక్ష. అభిమానులు సింధు గెలవాలని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్, సింధుల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఆమె విజయం కోసం దేశం యావత్తూ ప్రార్థిస్తోంది. సింధు గెలవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, మాధురీ దీక్షిత్, కరణ్ జోహార్, ఆశీష్ చౌదరి, నందితా దాస్, మాధుర్ బండార్కర్.. సింధుకు అభినందలు తెలిపారు. కంగ్రాట్స్ సింధు.. గో ఫర్ గోల్డ్. -
దూకుడు కొనసాగిస్తా!
దాదాపు 15 నెలల విరామం తర్వాత దక్కిన సూపర్ సిరీస్ టైటిల్... వరుసగా ముగ్గురు పటిష్ట ప్రత్యర్థులపై విజయం... ఆటతీరులో ఒక్కసారిగా అనూహ్య మార్పు... స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా, రియో ఒలింపిక్స్కు ముందు కీలక విజయాన్ని అందుకుంది. గాయం నుంచి కోలుకున్న అనంతరం దక్కిన ఈ విజయం రియో కోసం స్ఫూర్తినిస్తుందని ఆమె చెబుతోంది. * సరైన సమయంలో టైటిల్ గెలిచా * ఒలింపిక్స్ స్వర్ణం సులువు కాదు * ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సైనా సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్లో తాను ప్రదర్శించిన ఆట తనకే ఆశ్చర్యం కలిగించిందని భారత నంబర్వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. గతానికి భిన్నంగా బాగా దూకుడుగా ఆడిన తాను, ఇకపై కూడా ఇలాగే ఆడతానని స్పష్టం చేసింది. సిడ్నీ నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చిన అనంతరం సైనా మంగళవారం మీడియాతో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే... తాజా విజయంపై... నా దృష్టిలో ఇది చాలా గొప్ప విజయం. వరల్డ్ చాంపియన్షిప్, చైనా ఓపెన్లో ఫైనల్ చేరినా... టైటిల్ దక్కలేదు. అన్నింటికీ మించి రెండు నెలలు కాలి గాయంతో తీవ్రంగా బాధపడ్డాను. ఒక దశలో ఏమైపోతుందో అనిపించింది. అలాంటిది ఇప్పుడు కోలుకొని మళ్లీ టైటిల్ గెలవగలిగాను. ఈ దశలో నాకు ఒక విజయం ఎంతో అవసరం. ర్యాంకింగ్ తగ్గడంతో నాపై ఒత్తిడి కూడా నెలకొంది. నిజాయితీగా చెప్పాలంటే ఫిట్నెస్ నిరూపించుకుంటే చాలనుకున్నాను. గెలవడంపై ఆశలు పెట్టుకోలేదు. కీలకమైన ఒలింపిక్స్కు ముందు నాలో ఆత్మవిశ్వాసం పెంచే విజయం ఇది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఎదుర్కొన్న ప్రత్యర్థులపై... గతంలో నాకు ఎప్పుడూ ఒకే టోర్నీలో ఇంత సవాల్ ఎదురు కాలేదు. రెండో రౌండ్లో ప్రపంచ జూనియర్ చాంపియన్తో పాటు క్వార్టర్స్లో రచనోక్, సెమీస్ యిహాన్, ఫైనల్లో సున్ యులాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులతో తలపడాల్సి వచ్చింది. చాలా కఠినమైన మ్యాచ్లు ఎదుర్కొని టైటిల్ సాధించగలిగాను. ముఖ్యంగా రచనోక్తో మ్యాచ్లో తొలి గేమ్ ఒక్కటే 40 నిమిషాలు సాగింది. 28-26తో గెలవడం నాపై నమ్మకాన్ని పెంచింది. ఒలింపిక్స్కు ముందు ఇలాంటి మ్యాచ్లు ఆడటం కూడా మంచిదే. నేను కష్టపడేందుకు ఎప్పుడూ వెనుకాడను. తొలి మ్యాచ్ ఓడినా నా సాధన తీరులో తేడా ఉండదు. కానీ గొప్ప మ్యాచ్లు గెలిచినప్పుడు కలిగే ఆనందమే వేరు. రియోలో పతకావకాశాలపై... ప్రతీ ప్లేయర్కు ఒలింపిక్ మెడల్ అనేది ఒక కల. నేను ఒకసారి సాధించగలిగాను. కానీ ఇప్పుడు దానికంటే మెరుగ్గా ఆడి స్వర్ణం గెలవాలని భావిస్తున్నా. కానీ అంత సులువు కాదు. ప్రతీ దేశానికి చెందిన షట్లర్లు ఎంతో సన్నద్ధమై వస్తారు. ఇతర టోర్నీలతో పోలిస్తే మరింత పోటీ ఉంటుంది. అయితే నేను చాలా కష్టపడుతున్నా. నా శ్రమ వృధా పోదని నమ్మకం. 100 శాతం కష్టపడతా. అప్పటి వరకు నేను జాగ్రత్తగా ఫిట్నెస్ కాపాడుకోవడంపై కూడా దృష్టి పెట్టా. ఈసారి ఒలింపిక్స్కు నాతో పాటు మా నాన్న కూడా వస్తున్నారు. నాలుగు రోజులు ముందుగా వెళితే అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేస్తుంది. ఇక మరో టోర్నీ లేకుండా నేరుగా ఒలింపిక్సే లక్ష్యం. మారిన ఆట శైలిపై... క్రికెట్లో విరాట్ కోహ్లి తరహాలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. మా షట్లర్లలో కరోలినా మారిన్ చాలా వేగంగా ఆడుతుంది. నిజానికి ఆస్ట్రేలియన్ ఓపెన్లో నా ఆటతీరు నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇంత దూకుడుగా నేను ఎప్పుడూ ఆడలేదు. చాలా ఎక్కువ సార్లు స్మాష్, హాఫ్ స్మాష్లు కొట్టాను. కొన్ని రోజులుగా సాధన చేశాను కానీ ఫలితం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఎంత దూకుడుగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. కోర్టులో వేగంగా కదిలే ఉత్సాహం వస్తుంది. మున్ముందు కూడా ఇదే తరహాలో అటాకింగ్ ఆటను ఆడాలని నిర్ణయించుకున్నా. కోచ్ విమల్ కుమార్ పాత్రపై... స్ట్రోక్స్ మెరుగు కావడంలో విమల్ కుమార్ సర్ పాత్ర ఎంతో ఉంది. నా ఆటలో వేగం పెరిగేందుకు కూడా ఆయనే కారణం. నాతో పాటు వచ్చిన ఇండోనేసియా కోచ్ ఉమేంద్ర రాణా కూడా ఎంతో సహకరించారు. గాయం వల్ల నా కాళ్లలో కొంత చురుకుదనం తగ్గింది. కానీ వారి శిక్షణతో మెల్లమెల్లగా అంతా సర్దుకుంది. ఈ మధ్య అమ్మాయిలు కూడా చాలా వేగంగా ఆడుతున్నారు. దానిని అందుకోవాలంటే కొత్త తరహా వ్యూహాలతో సిద్ధం కావాలి. ఇప్పుడు వెంటనే నా రియో సన్నాహాలు మొదలవుతాయి. నెలన్నర రోజులు శ్రమిస్తాను. సాంకేతికంగా నేను గొప్ప ప్లేయర్ను కాకపోయినా కష్టపడే నేను నా ఆటను మెరుగుపర్చుకున్నా. కోచ్తో పాటు ఫిజియో, ఇతర సిబ్బంది కూడా నా గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఒలింపిక్స్లో నా విజయావకాశాలు పెంచుతాయని నా నమ్మకం. -
మరింత దూకుడుగా.. ఎటాకింగ్ చేస్తా
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, మరింత కష్టపడటానికి ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ అంది. తర్వాతి మ్యాచ్ల్లో మరింత దూకుడుగా, ఎటాకింగ్ గేమ్ ఆడుతానని చెప్పింది. రియో ఒలింపిక్స్లో రాణించి, పతకం గెలవాలని కోరుకుంటున్నట్టు సైనా వెల్లడించింది. ఈ మెగా ఈవెంట్లో తన అత్యుత్తమ స్థాయి ఆటతీరును ప్రదర్శిస్తానని ధీమా వ్యక్తం చేసింది. తన ఆటతీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఆటలో సాంకేతికంగా కూడా పరిణతి చెందాల్సివుందని చెప్పింది. ప్రస్తుతం తాను విజయాలగాడిలో పడ్డానని అంది. -
నెంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన సైనా
న్యూఢిల్లీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను చేజార్చుకుంది. గురువారం ప్రకటించిన తాజా జాబితాలో సైనా ఓ స్థానం కోల్పోయి రెండో ర్యాంక్తో సరిపెట్టుకోగా.. ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ నెంబర్ వన్ ర్యాంక్ను దక్కించుకుంది. గత రెండు టోర్నీల్లో సైనా పేలవ ప్రదర్శన చేయడంతో ర్యాంక్ పడిపోయింది. తాజా జాబితాలో భారత యువ షట్లర్ పీవీ సింధు 13వ ర్యాంక్ను నిలబెట్టుకుంది. పురుషుల సింగిల్స్లో బారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్, ప్రణోయ్ ర్యాంక్లు దిగజారాయి. శ్రీకాంత్ 6, కశ్యప్ 10, ప్రణోయ్ 17వ ర్యాంక్ల్లో నిలిచారు. -
సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బెంగళూరుకు మకాం మార్చడం, కోచ్ను మార్చడం కలసి వచ్చిందని సైనా వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ దిగ్గజాలు విమల్ కుమార్, ప్రకాశ్ పదుకొనే సలహాలు తనకు ఎంతో మేలు చేశాయని చెప్పింది. ఇవన్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించడానికి ఉపయోగపడ్డాయని సైనా తెలిపింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సైనా బెంగళూరుకు వెళ్లకముందే గోపీచంద్ అకాడమీలో ఆయన వద్దే కొన్నేళ్ల పాటు శిక్షణ పొందింది. గోపీ, సైనా గురుశిష్యులుగా ఎన్నో విజయాలు సాధించారు కూడా. అయితే గోపీచంద్తో విబేధాల వల్లే సైనా బెంగళూరుకు మకాం మార్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే గోపీతో విబేధాలున్నట్టు సైనా నేరుగా చెప్పలేదు. మరో స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మాత్రం గోపీపై తీవ్ర విమర్శలు చేసింది. సైనా తన కెరీర్లో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పతకం కల మొన్నటి వరకు నెరవేరలేదు. తాజాగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో సైనా రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. గోపీ దగ్గర శిక్షణ పొందినపుడు సాధించలేనిదాన్ని (ప్రపంచ చాంపియన్షిప్ పతకం) ప్రస్తుత కోచ్ విమల్ కుమార్ శిక్షణలో సొంతం చేసుకుంది. కోచ్ను మార్చడం వల్లే తనకు మేలు జరిగిందని సైనా చెప్పడం వెనుక గోపీచంద్తో విబేధాలున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
సైనా నెహ్వాల్ మరో సంచలనం
-
సైనా నెహ్వాల్ మరో సంచలనం
జకార్తా: తెలుగుతేజం సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో హైదరాబాదీ తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా 21-17, 21-17 స్కోరుతో అన్సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సైనా వరుస గేమ్ ల్లో నెగ్గింది. లిందావెనిపై ముఖాముఖి రికార్డును 3-1కు పెంచుకుంది. ఫైనల్ సమరంలో సైనా.. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. మరో సెమీస్లో కరోలినా 21-17, 15-21, 21-16తో సంగ్ జి హ్యున్ (కొరియా)ను ఓడించింది. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించినా ప్రపంచ చాంపియన్షిప్ పతకాన్నిఅందుకోని సైనా.. ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతూ పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో సైనా ఓడినా రజత పతకం దక్కుతుంది. గెలిస్తే స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించనుంది. -
ఫైనల్లో జ్వాల జోడీ
కల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం గుత్తా జ్వాల జోడీ దూసుకెళ్తోంది. మహిళల డబుల్స్లో జ్వాల, అశ్వినీ పొన్నప్ప ద్వయం ఫైనల్లో ప్రవేశపెట్టింది. సెమీఫైనల్లో జ్వాల, అశ్విని 21-17, 21-16 స్కోరుతో జపాన్ క్రీడాకారిణులు షిహొ టనక, కొహరు యొనెమొటోపై౦ విజయం సాధించారు. కాగా ఈ టోర్నీలో ఇతర భారత క్రీడాకారులు ఇంతకుముందే వైదొలిగారు. -
సెమీస్లో జ్వాల జోడి
కాల్గారి (కెనడా) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్విని... కెనడా గ్రాండ్ ప్రి టోర్నీలో సెమీస్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో జ్వాల-అశ్విని 21-19, 21-13తో హాంకాంగ్ ద్వయం చాన్ కాకా-యున్ సిన్ యంగ్లపై నెగ్గారు. మరో మ్యాచ్లో ప్రద్నా గాద్రె-సిక్కి రెడ్డి 18-21, 25-23, 15-21తో పున్లాక్ యన్-సి యింగ్ సుయెట్ (హాంకాంగ్)ల చేతిలో ఓడారు. పురుషుల క్వార్టర్స్లో 10వ సీడ్ సాయి ప్రణీత్ 13-21, 21-18, 11-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో; అజయ్ జయరామ్ 16-21, 15-21తో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) చేతిలో ఓడారు. -
టాప్-10లో కశ్యప్
రెండో స్థానానికి సైనా న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ సంచలనం పారుపల్లి కశ్యప్ బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో తిరిగి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇండోనేసియా సూపర్ సిరీస్లో ప్రపంచ నంబర్వన్ చెన్ లాంగ్ను మట్టికరిపించిన తను గురువారం విడుదల చేసిన జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరాడు. కె.శ్రీకాంత్ మూడో స్థానంలోనే కొనసాగుతుండగా మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఓ స్థానం మెరుగుపరుచుకుని తిరిగి రెండో ర్యాంకుకు చేరింది. పీవీ సింధు 14వ ర్యాంకులోనే ఉంది. -
సైనా నెహ్వల్కు నిరాశ
జకర్తా: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ సైనా 21-16, 12-21, 18-21 స్కోరుతో ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. గంటా పది నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సైనా తొలి గేమ్లో విజృంభించి ముందంజ వేసింది. కాగా ఆ తర్వాత సైనా వెనుకబడింది. వరుసగా రెండు గేమ్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. -
ప్రపంచ నెం 1కు షాకిచ్చిన కశ్యప్
-
ప్రపంచ నెం 1కు షాకిచ్చిన కశ్యప్
జకర్తా: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ సత్తాచాటాడు. ప్రపంచ చాంపియన్, నెంబర్ వన్ ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)ను మట్టికరిపించి సెమీస్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో 12వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 21-17, 21-14 స్కోరుతో చెన్ లాంగ్పై విజయం సాధించాడు. తొలి గేమ్ కోల్పోయిన కశ్యప్ ఆ తర్వాత పుంజుకున్నాడు. వరసగా రెండు గేమ్లు గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
జ్వాల, అశ్వినిలను తిరస్కరించలేదు
టాప్ స్కీమ్లో చేర్చడంపై క్రీడాశాఖ వ్యాఖ్య న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్వినిలను టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) స్కీమ్లో చేర్చడాన్ని ఎప్పుడూ మర్చిపోలేదని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 21న జరిగిన ఐడెంటిఫికేషన్ కమిటీ సమావేశంలోనే వాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. ‘ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత వీళ్ల ప్రదర్శన గురించి చర్చించింది. చర్చ తర్వాత ఈ ఇద్దర్ని స్కీమ్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. డబుల్స్లో వీళ్లిదరికి కలిపి శిక్షణ ఇప్పించాలని కమిటీ భావించింది’ అని క్రీడా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్మింటన్లో సైనా, సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, హెచ్.ఎస్.ప్రణయ్లను టాప్కి ఎంపిక చేయగానే... జ్వాల, అశ్విని క్రీడాశాఖపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
మరోసారి నంబర్వన్గా సైనా
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా నిలిచింది. గురువారం బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. గత నెలలో తొలిసారిగా ప్రపంచ నంబర్వన్గా నిలిచిన సైనా ఆ తర్వాత రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ముందు తిరిగి టాప్ ర్యాంకును దక్కించుకుంది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తను డిఫెండింగ్ చాంప్గా బరిలోకి దిగబోతోంది. పీవీ సింధు ఒక స్థానం దిగజారి 12వ ర్యాంకులో ఉంది. పురుషుల విభాగంలో కె.శ్రీకాంత్ తన నాలుగో స్థానాన్ని.. పి.కశ్యప్, ప్రణయ్ తమ 13, 15వ స్థానాలను కాపాడుకున్నారు. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జంట 21వ స్థానంలో ఉంది. -
సైనా మళ్లీ నంబర్వన్
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ స్థానానికి చేరుకుంది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. ఇండియా ఓపెన్లో విజేతగా నిలిచిన తర్వాత నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి వారం రోజుల పాటే ఆ ర్యాంక్లో కొనసాగింది. మలేసియా ఓపెన్ సెమీస్లో ఓడటంతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. మరోవైపు పి.వి.సింధు మూడు స్థానాలు కోల్పోయి 12వ ర్యాంక్తో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ నాలుగో ర్యాంక్ను నిలబెట్టుకోగా, పారుపల్లి కశ్యప్ 14, హెచ్.ఎస్.ప్రణయ్ 15వ ర్యాంక్లో ఉన్నారు. -
సెమీస్లో కశ్యప్
గాయంతో వైదొలిగిన ప్రణయ్ సింగపూర్ ఓపెన్ సింగపూర్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో కశ్యప్ 21-6, 21-17తో బ్రైస్ లివర్డెజ్ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్లో హెచ్.ఎస్. ప్రణయ్ పాదం గాయంతో ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. బ్రైస్తో 30 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో కశ్యప్ చెలరేగిపోయాడు. తొలిగేమ్లో 6-1, 9-6 ఆధిక్యం సాధించిన హైదరాబాద్ కుర్రాడు తర్వాత వరుసగా 12 పాయింట్లు నెగ్గి గేమ్ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్లోనూ అదే జోరుతో 4-1 ఆధిక్యాన్ని సంపాదించాడు. కానీ బ్రైస్ పుంజుకొని ఆధిక్యాన్ని 7-9కి తగ్గించాడు. తర్వాత ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లినా... చివర్లో కశ్యప్ మెరుగ్గా ఆడాడు. శనివారం జరిగే సెమీస్లో కశ్యప్... హు యున్ (హాంకాంగ్)తో తలపడతాడు. -
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్.. సైనా రికార్డు
బర్మింగ్హామ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రికార్డు నెలకొల్పింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో సైనా ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా హైదరాబాదీ చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా 21-13, 21-13 స్కోరుతో చైనా షట్లర్ సన్ యూపై అలవోక విజయం సాధించింది. సైనా వరుస గేమ్ల్లో మ్యాచ్ను వశం చేసుకుంది. -
తెలివైనవారిని ఆకర్షించాలి
బ్యాడ్మింటన్ కోచ్లపై గోపీచంద్ సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్లో ప్రస్తుతం నవతరం ఆటగాళ్లు దుమ్మురేపే ఆటతీరుతో దూసుకెళుతున్నారు. కె.శ్రీకాంత్, సైనా, సింధులు తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి వన్నె తెస్తున్నారు. అయితే భారత్ మున్ముందు మంచి కోచ్లను ఆకర్షించకపోతే ప్రపంచ స్థాయి ఆటగాళ్లు రావడం కష్టమవుతుందని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పి.గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘భవిష్యత్లో సత్తా ఉన్న ఆటగాళ్లు దొరకడం, నాణ్యమైన కోచ్లను తెచ్చుకోవడం వంటివి భారత బ్యాడ్మింటన్ ఎదుర్కోబోయే రెండు పెద్ద సమస్యలు. మౌలిక వసతులు ఏర్పరచుకోవడం సులువే. కానీ అంకితభావం ఉండి పదేళ్ల పాటు నిలకడగా రాణించే ఆటగాళ్లను తయారుచేయడం కష్టం. తెలివైనవారు కోచింగ్ వృత్తిలోకి రావడం లేదు. ముందుగా వారిని ఆకర్షించాలి. గత ఆసియా గేమ్స్లో భారత్ దాదాపు 60 పతకాలు గెల్చుకుంది. కానీ ఎంతమంది కోచ్ల పేర్లు మనకు తెలుసు?’ అని గోపీచంద్ ప్రశ్నించారు. -
డచ్ ఓపెన్లో అరవింద్ భట్ ముందంజ
అల్మెరె (నెదర్లాండ్స్): భారత షట్లర్ అరవింద్ భట్ డచ్ ఓపెన్లో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్లో భట్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో భట్ 11-7, 11-9, 11-8 స్కోరుతో స్కాట్లాండ్ షట్లర్ కీరన్ మెరీలెస్పై విజయం సాధించాడు. భట్ 28 నిమిషాల్లో మ్యాచ్ను ముగించాడు. రెండో రౌండ్లో హాంకాంగ్ ఆటగాడు యన్ కిట్ చన్తో ఆడనున్నాడు. -
పోరాడి ఓడిన శ్రీకాంత్
సింగపూర్ ఓపెన్ సింగపూర్: భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ సంచలన ప్రదర్శనకు తెరపడింది. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ అబ్బాయి సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీకాంత్ 19-21, 18-21తో ఓటమి చవిచూశాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో శ్రీకాంత్ తన ప్రత్యర్థికి గట్టిపోటీనే ఇచ్చాడు. ప్రతి పాయింట్ కోసం లీ చోంగ్ వీని కష్టపడేలా చేశాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఒకదశలో శ్రీకాంత్ 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లి గేమ్ను దక్కించుకునేలా కనిపించాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన లీ చోంగ్ వీ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ను 21-19తో సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్నూ దూకుడుతో ప్రారంభించిన శ్రీకాంత్ 4-2తో ముందంజ వేశాడు. అయితే లీ చోంగ్ వీ వెంటనే తేరుకొని ఐదు పాయింట్లు నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సెమీస్లో ఓడిన శ్రీకాంత్కు 4,350 డాలర్ల (రూ. 2 లక్షల 61 వేలు) ప్రైజ్మనీతోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మకావులో మెరిసిన సింధు
-
మకావులో మెరిసిన సింధు
తెలుగుతేజం పీవీ సింధు మకావు ఓపెన్లో మెరిసింది. భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం సింధు మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాదీ విజయకేతనం ఎగురవేసి తన కెరీర్లో రెండో గ్రాండ్ ప్రీ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సింధు 21-15, 21-12తో మిచెల్లీ లీ (కెనడా)ని చిత్తుచేసింది. హైదరాబాదీ 37 నిమిషాల్లో వరుస గేమ్ల్లో మ్యాచ్ను వశం చేసుకుంది. మ్యాచ్ ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శిస్తూ ఏకపక్షంగా ముగించింది. ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్న సింధు గత మేలో జరిగిన మలేసియా ఓపెన్ టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది సింధును అర్జున అవార్డు వరించింది. -
సైనా మరో'సారీ'..
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాదిలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న హైదరాబాదీకి మరోసారి నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో సైనా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ సైనా 17-21, 21-9, 15-21 స్కోరుతో పోర్న్టిప్ బురానప్రసెట్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లోనూ భారత ఆటగాడు అజయ్ జయరామ్ 18-21, 12-21తో సోనీ డ్వి కున్కోరొ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ఈ ఏడాదిలో సైనా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. సీజన్ చివర్లోనైనా నెగ్గాలన్న సైనా ఆశలు నెరవేరలేదు. గాయాలు, పేలవ ఫామ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతోంది. -
ఏడాది తర్వాతైనా సైనా ఆశ నెరవేరేనా..?
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ టైటిల్ నెగ్గి ఏడాదికి పైగా కావస్తోంది. ఈ సీజన్లో గాయాలు, ఫామ్లేమితో సతమతమవుతున్న సైనా మరో పోరాటానికి సన్నద్ధమైంది. బుధవారం ఆరంభమయ్యే హాంకాంగ్ సూపర్ సిరీస్లో హైదరాబాదీ బరిలోకి దిగుతోంది. సీజన్ చివర్లో కనీసం ఈ టైటిల్ను అయినా నెగ్గాలని సైనా ఎదురు చూస్తోంది. సైనా చివరిసారిగా 2012 అక్టోబర్లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ టైటిల్ను గెలిచింది. తాజా టోర్నీ తొలిరౌండ్లో ఏడోసీడ్, హైదరాబాదీ మనుపుట్టి (ఇండోనేసియా)తో తలపడనుంది. ఆ తర్వాత టాప్సీడ్లతో సవాల్ ఎదురుకానుంది. ఇక యువసంచలనం, పదో ర్యాంకర్ పీవీ సింధుకు తొలిరౌండ్లో రెండో సీడ్ రట్చనోక్ ఇంటనోన్ రూపంలో గట్టిపోటీ ఎదురైంది. ఈ టోర్నీలో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, అజయ్ జయరామ్, శ్రీకాంత్, ఆనంద్ పవార్, గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప బరిలోకి దిగుతున్నారు. -
జ్వాలపై విచారణ అడ్డుకునేందుకు హైకోర్టు నిరాకరణ
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతి తెచ్చుకున్నా, ఈ హైదరాబాదీపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) విచారణ ప్రక్రియ మాత్రం జరగనుంది. ఆమెకు బాయ్ విచారణ చేపట్టకుండా స్టే విధించేందుకు ఢిల్లీ హైకో్ర్టు శుక్రవారం నిరాకరించింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా జ్వాల అనుచిత ప్రవర్తనపై బాయ్ క్రమశిక్షణ సంఘం చర్యలకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. బాయ్ జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ జ్వాల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ ప్రక్రియ జరపకుండా స్టే విధించాలని అభ్యర్థించింది. అయితే కోర్టు ఇందుకు నిరాకరించింది. టోర్నీలో పాల్గొనేందుకు ఇంతకుముందు అనుమతిచ్చామని గుర్తు చేస్తూ, బాయ్ విచారణ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని జస్టిస్ వీకే జైన్ పేర్కొన్నారు. బాయ్ తీసుకున్న నిర్ణయం సముచితంకాదని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని జ్వాలకు సూచించారు. -
జ్వాలకు ‘క్లీన్స్పోర్ట్స్’ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాలపై నిషేధం విధించాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చేసిన ప్రతిపాదన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జ్వాల పట్ల ‘బాయ్’ ప్రతీకార వైఖరిని అవలంబిస్తోందని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా సంస్థ ఆరోపించింది. క్రీడల్లో అవినీతిని దూరం చేయాలంటూ ప్రచారం చేస్తున్న ఈ సంస్థ తాజా వివాదంలో జ్వాలకు మద్దతు పలికింది. ‘ఇది ఒక ప్లేయర్, సంఘానికి మధ్య జరుగుతున్న గొడవ కాదు. ‘బాయ్’ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిని లక్ష్యంగా చేసుకుంది. ఏ స్థాయిలోనైనా న్యాయం కోసం జరిగే పోరాటంలో మేం జ్వాలకు మద్దతుగా నిలుస్తాం’ అని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా కన్వీనర్ బీవీపీ రావు అన్నారు. మరో వైపు అశ్విని పొన్నప్ప కూడా తన డబుల్స్ భాగస్వామి జ్వాలకు సంఘీభావం తెలిపింది. ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం ఆరిఫ్ కూడా ‘బాయ్’ ప్రతిపాదనను తప్పు పట్టారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించడం జ్వాల స్వభావమని, ఐబీఎల్లో జరిగిన వాస్తవాన్ని పట్టించుకోకుండా ఆమెను తప్పు పట్టడం అర్థం లేనిదని ఆయన చెప్పారు. మరో వైపు నిషేధానికి సంబంధించి మీడియానుంచే తప్ప తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని జ్వాల తండ్రి గుత్తా క్రాంతి చెప్పారు. ‘మాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులాంటిది అందలేదు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. ఫ్రాంచైజీ ఢిల్లీ స్మాషర్స్ మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు. సహచరుల మద్దతు... జ్వాలపై నిషేధం ప్రతిపాదనను సహచర ఆటగాళ్లు తప్పుపట్టారు. అరవింద్ భట్, రూపేశ్, సనావే థామస్ ఆమెకు మద్దతు పలికారు. ‘ఇదో తీవ్రమైన నిర్ణయం. జ్వాల జట్టు ఐకన్ ప్లేయర్గా ముందు నిలబడింది. ఒక వేళ అది తప్పు అయితే హెచ్చరికతో వదిలేస్తే సరి’ అని భట్ అభిప్రాయ పడ్డాడు. ‘నిషేధం అర్థం లేనిది. ఐబీఎల్లో ఏం జరిగినా అది సమష్టి నిర్ణయమే. జ్వాల భారత్కు ఎన్నో గొప్ప విజయాలు అందించింది. ఆమెతో ఈ రకంగా వ్యవహరించవద్దు’ అని రూపేశ్, థామస్ సూచించారు. విచారణకు మరో కమిటీ జ్వాలపై నిషేధం విషయంలో అన్ని వైపులనుంచి విమర్శలు రావడంతో ‘బాయ్’ ఇప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది. జ్వాలపై ఆరోపణలను విచారించేందుకు తాజాగా ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీని నియమించింది. ఐఓఏ సంయుక్త కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే, ల్యూజ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు దీపా మెహతా, సామాజిక కార్యకర్త స్వాతి శుక్లా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జ్వాలకు షోకాజ్ నోటీసు జారీ చేసి వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరనుంది. నెల రోజుల్లో కమిటీ ‘బాయ్’కు నివేదిక ఇస్తుంది. అయితే ఆలోగా ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు జ్వాల పేరు పరిగణనలోకి తీసుకోరని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి విజయ్ సిన్హా ప్రకటించారు. -
బంగా బీట్స్ బోణి
లక్నో: సింగిల్స్లో రాణించడంతో బంగా బీట్స్ (బీబీ) జట్టు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో బోణీ చేసింది. మరోవైపు అవధ్ వారియర్స్ (ఏడబ్ల్యూ) వరుసగా రెండో మ్యాచ్లోనూ పరాజయం చవిచూసింది. భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, పురుషుల సింగిల్స్లో వీ ఫెంగ్ చోంగ్ చేతులెత్తేయడంతో వారియర్లు కోలుకోలేకపోయారు. ఆదివారం లక్నోలో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) మ్యాచ్లో బంగా బీట్స్ (బీబీ) 4-1తో వారియర్స్పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి పోరులో హూ యున్ (బీబీ) 21-11, 21-20తో వీ ఫెంగ్ చోంగ్ (ఏడబ్ల్యూ)పై గెలిచి బంగా బీట్స్కు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్ బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత, అవధ్ స్టార్ ప్లేయర్ సింధు 16-21, 13-21తో ప్రపంచ 19వ ర్యాంకు క్రీడాకారిణి కరోలినా మారిన్ (బీబీ) చేతిలో పరాజయం చవిచూసింది. రెండు గేముల్లోనూ ఏపీ రైజింగ్ స్టార్ చేతులెత్తేసింది. తనకన్నా తక్కువ ర్యాంకు ప్రత్యర్థి దూకుడుకు ఏ దశలోనూ కళ్లెం వేయలేకపోయింది. ఈ టోర్నీలో పదో ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో పరాజయం. దీంతో బీబీ ఆధిక్యం 2-0కు పెరిగింది. అనంతరం జరిగిన పురుషుల డబుల్స్లో వారియర్స్ జోడి మథియస్ బోయె-కైడో మార్కిస్ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. వీరిద్దరు చక్కని సమన్వయంతో రాణించడంతో 21-14, 21-19తో మోగెన్సన్-అక్షయ్ దివాల్కర్ (బీబీ)పై గెలుపొందారు. దీంతో అవధ్ జట్టు 1-2తో బీబీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్ (బీబీ), శ్రీకాంత్ (ఏడబ్ల్యూ)ల మధ్య పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇందులో సీనియర్ ఆటగాడు, 14వ ర్యాంకర్ కశ్యప్ 20-21, 21-11, 11-9తో శ్రీకాంత్పై చెమటోడ్చి నెగ్గాడు. తొలిగేమ్లో శ్రీకాంత్ స్మాష్లతో రెచ్చిపోగా... రెండో గేమ్లో పుంజుకున్న కశ్యప్ తన రాష్ట్ర సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ 5-1తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే కశ్యప్ తన అనుభవాన్ని రంగరించి పోరాడాడు. వరస పాయింట్లు సాధించి స్కోరును సమం చేయడంతో పాటు చివర్లో మ్యాచ్ను దక్కించుకున్నాడు. ఇక నామమాత్రమైన మిక్స్డ్ డబుల్స్లో కైడో మార్కిస్- మనీషా (ఏడబ్ల్యూ) జంట 21-20, 16-21, 8-11తో కార్స్టన్-మారిన్ (బీబీ) ద్వయం చేతిలో ఓడింది.