indian hockey
-
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
రాజ్గిర్ (బిహార్): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, జపాన్పై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్నీత్ కౌర్ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మలిచింది. అనంతరం లాల్రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ లీగ్ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్లో మలేసియా, జపాన్ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో కొరియా థాయ్లాండ్ను 3-0 గోల్స్ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
భారత హాకీలో మహరాణి
దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని హరియాణా రాష్ట్రంలో.. చారిత్రక గ్రాండ్ట్రంక్ రోడ్పై శాహాబాద్ పేరుతో ఒక చిన్న పట్టణం ఉంటుంది. దాదాపు 50 వేల జనాభా గల అలాంటి పట్టణాన్ని మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడి ఆడబిడ్డలు దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడి అమ్మాయి ఆటలోకి అడుగు పెడితే హాకీ స్టిక్ అందుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క శాహాబాద్ నుంచే భారత జూనియర్, సీనియర్ మహిళల హాకీ జట్లకు 45 మంది ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో భారత సీనియర్ టీమ్లో 12 మంది ఇక్కడివారే కావడం విశేషం. అలాంటి చరిత్ర ఉన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయే రాణి రామ్పాల్. ప్లేయర్గా, కెప్టెన్గా అరుదైన విజయాలు సాధించి భారత హాకీకి రాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. రాణి.. జట్టులోకి వచ్చే సమయానికి పలువురు సీనియర్లు ఆట నుంచి తప్పుకుంటు న్నారు. అలాంటి సందర్భంలో తన ఆటతో టీమ్ బెస్ట్ ప్లేయర్గా ఎదిగి, తర్వాత 15 ఏళ్ల పాటు జట్టు భారాన్ని మోసింది. ఒంటి చేత్తో పలు కీలక విజయాలు అందించింది. అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రష్యాలో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ సాధించడంతో పాటు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలవడంతో ఆమె విజయప్రస్థానం మొదలైంది. మరుసటి ఏడాదే అర్జెంటీనాలో జరిగిన వరల్డ్ కప్లో 5 గోల్స్ కొట్టిన రాణి ఇక్కడా బెస్ట్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్గా నిలవడం విశేషం. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్లో భారత జట్టు తొలిసారి పతకం సాధించడం (కాంస్యం)లో కీలక పాత్ర పోషించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా శిఖరాన నిలబడింది. అతి పిన్న వయస్కురాలిగా..కులాధిపత్యం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఖాప్ పంచాయత్ల నియమ నిబంధనలు అన్నింటినీ బద్దలు కొట్టి.. షార్ట్ స్కర్ట్స్తో అమ్మాయిలు హాకీ ఆడగలగడమే శాహాబాద్లో పెద్ద ఘనత. అలాంటి వారిలో రాణి రామ్పాల్ తన అద్భుత ఆటతో మరెన్నో మెట్లు పైకెక్కి తన స్థాయిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే హాకీకి ఆకర్షితురాలైన ఆమె స్టిక్ చేతపట్టింది. మరో మూడేళ్ళ తర్వాత స్థానిక హాకీ అకాడమీలో చేరిన అనంతరం రాణి ఒక్కసారిగా దూసుకుపోయింది. హరియణా జట్టు తరఫున స్కూల్ నేషనల్స్, ఆపై జూనియర్ నేషనల్స్లో ఆమె అసాధారణ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత సీనియర్ జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇంత చిన్న అమ్మాయా.. అంటూ తీవ్రంగా చర్చ సాగినా ఆటలో మేటిగా గుర్తించి సెలక్టర్లు ఎంపిక చేయక తప్పలేదు. ఫలితంగా 14 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున రాణి అంతర్జాతీయ హాకీలోకి అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. అసాధారణ కెరీర్..మైదానంలో రాణి చూపించిన పదునైన ఆట, చురుకుదనం ఆమెను ఇతర ప్లేయర్లకంటే భిన్నంగా అగ్రస్థానాన నిలబెట్టాయి. ఫార్వర్డ్గా కీలక గోల్స్ చేయడంతో పాటు మిడ్ఫీల్డర్గా కూడా రెట్టింపు బాధ్యతతో ఆడింది. 254 అంతర్జాతీయ మ్యాచ్లలో సాధించిన 120 గోల్స్ రాణిని ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారిణులలో ఒకరిగా నిలబెట్టాయి. 2009లో జరిగిన ఆసియా కప్లో రజతం సాధించిన భారత జట్టులో రాణి సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత 2017లో ఇదే టోర్నీలో జట్టు టైటిల్ సాధించడంలో కూడా ఆమెదే ప్రధాన పాత్ర. ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరేళ్ల వ్యవధిలో భారత జట్టు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో ప్లేయర్గా కెరీర్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాణి ప్రదర్శనే ఈ విజయాలకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన జట్టులో కూడా రాణి సభ్యురాలు. విజయసారథిగా..ప్రతి ప్లేయర్కి కెరీర్లో చెప్పుకోదగ్గ, అత్యుత్తమ క్షణాలు కొన్ని ఉంటాయి. రాణి రామ్పాల్ సుదీర్ఘ కెరీర్లోనూ అలాంటివి చాలా ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో రాణి సారథ్యంలో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్కి చేరిన జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. 1980 తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడంలో ప్లేయర్గా రాణిదే కీలక పాత్ర. ఆ ఈవెంట్లో టీమ్ విఫలమైనా.. జట్టుపై ఆమె ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో నాయకురాలిగా సమర్థంగా జట్టును నడిపించిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్కు టీమ్ అర్హత సాధించేలా చేయగలిగింది. ఈ ఒలింపిక్స్లో ప్లేయర్గా, కెప్టెన్గా రాణి ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనిది. లీగ్ దశను దాటి హాట్ ఫేవరిట్ ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో సాధించిన సంచలన విజయంతో భారత్ సెమీస్కి చేరింది. కాంస్యపతక పోరులో చివరి వరకు పోరాడి 3–4తో బ్రిటన్ చేతిలో మన అమ్మాయిలు ఓడారు. అయితే ఈ నాలుగో స్థానం భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యుత్తమమైంది.ప్రతిభకు పట్టం..టోక్యో ఒలింపిక్స్ తర్వాత వరుస గాయాలు ఆమెను వరల్డ్ కప్కు, కామన్వెల్త్ క్రీడలకు దూరం చేశాయి. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. దాంతో 15 ఏళ్ల అసాధారణ కెరీర్కు గుడ్బై చెబుతూ రాణి ఇటీవల 29 ఏళ్లకే రిటైర్మెంట్ను ప్రకటించింది. తన ప్రదర్శనకుగాను అర్జున, ఖేల్రత్న, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. భారతీయ రైల్వే రాయ్బరేలీలోని కొత్త హాకీ స్టేడియానికి రాణి పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని ప్రదర్శించింది. రాణి ఘనకీర్తిని గుర్తిస్తూ ఆమె ధరించిన 28 నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ వాడకుండా హాకీ ఇండియా దానికీ రిటైర్మెంట్ను ఇవ్వడం విశేషం. -
భారత్పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు!
పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చైనాను 1-0 గోల్స్ తేడాతో ఓడించి ఐదోసారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై న్యారో మార్జిన్తో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది సమరంలో జుగ్రాజ్ సింగ్ 51వ నిమిషంలో గోల్ చేసి భారత్కు ఆధిక్యాన్ని అందించాడు. భారత్ ఇదే లీడ్ను చివరి వరకు కొనసాగించి విజేతగా నిలిచింది.చైనాకు మద్దతుగా పాక్ ఆటగాళ్లుఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా నిలిచి అబాసుపాలయ్యారు. పాక్ ఇదే టోర్నీ సెమీఫైనల్లో చైనా చేతిలో ఘోరంగా ఓడింది. అయినా పాక్ ఆటగాళ్లు నిసిగ్గుగా చైనా జెండాలు పట్టుకుని వేలాడారు. వారు ఏకంగా చెంపలపై చైనా జెండా స్టిక్కర్లు అంటించుకుని మద్దతు తెలిపారు. తాము మద్దతు తెలిపినా చైనా ఓడిపోవడంతో పాక్ ఆటగాళ్లు దిగాలుగా ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరలవుతుండటంతో భారత అభిమానులు పాక్ను ఆటాడేసుకుంటున్నారు. వారి బుద్ధే అంతా చీవాట్లు పెడుతున్నారు. కాగా, సెమీస్లో చైనా చేతిలో ఓడిన పాక్ మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కొరియాపై 5-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో గెలిచిన అనంతరమే పాక్ ఆటగాళ్లు నేరుగా వచ్చి భారత్-చైనా ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. India's Asian Champions Trophy heroes rewarded! 🏆🇮🇳The victorious Indian Men's Hockey Team gets a well-deserved bonus for their record 5th title win! Each player will receive ₹3 lakhs, while support staff members will be awarded ₹1.5 lakhs each.This well-deserved reward… pic.twitter.com/cvI8avkpvx— Hockey India (@TheHockeyIndia) September 17, 2024చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
భారత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. దక్షిణ కొరియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరిగిన మ్యాచ్లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు, స్ట్రయికర్ అరైజీత్ సింగ్ హుండల్ ఓ గోల్ చేశారు. కొరియా చేసిన ఏకైక గోల్ను జిహున్ యంగ్ సాధించాడు. భారత్ తమ తదుపరి లీగ్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. భారత్ ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా.. తమ తొలి మ్యాచ్లో చైనాపై 3-1 గోల్స్ తేడాతో.. రెండో మ్యాచ్లో జపాన్పై 5-1 గోల్స్ తేడాతో.. మూడో మ్యాచ్లో మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ ఈ టోర్నీలో జయకేతనం ఎగురవేసి రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. -
రాజ్ కుమార్ హ్యాట్రిక్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో భారత్
చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్లో జపాన్ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్స్కు అర్హత సాధించింది.రాజ్ కుమార్ హ్యాట్రిక్మలేసియాతో మ్యాచ్లో రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్ కుమార్ గోల్స్ చేశాడు. భారత్ తరఫున రాజ్ కుమార్తో పాటు అరైజీత్ సింగ్ హుండల్ 6, 39 నిమిషంలో, జుగ్రాజ్ సింగ్ 7వ నిమిషంలో, కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, ఉత్తమ్ సింగ్ 40వ నిమిషంలో గోల్స్ సాధించారు. మలేసియా సాధించిన ఏకైక గోల్ను అకీముల్లా అనువర్ 34వ నిమిషంలో సాధించాడు.ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ల్లో కొరియా, పాకిస్తాన్లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్ సెప్టెంబర్ 12న.. పాక్తో మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. చదవండి: స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ -
భారత హాకీ జట్టకు ఘన సన్మానం.. అమిత్కు రూ. 4 కోట్ల నజరానా
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం కొనసాగిస్తుందని... 2036 వరకు భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్గా కొనసాగుతుందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు.బుధవారం భువనేశ్వర్లో భారత జట్టు సభ్యులకు ఒడిశా ప్రభుత్వం సన్మానించింది. పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్కు రూ. 4 కోట్ల నజరానాను చెక్ రూపంలో అందించింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు తలా రూ. 15 లక్షల, సహాయక సిబ్బదికి రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేసింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్గా వ్యవహరిస్తోంది.ఈ సందర్భంగా భారత సారథి హర్మన్ప్రీత్ మాట్లాడుతూ.. ‘జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విజయానికి చేరువగా వచ్చాం. చాలా అవకాశాలు సృష్టించుకున్నాం. అయితే అది మా రోజు కాదు. అయినా కాంస్య పతక పోరులో తిరిగి సత్తాచాటాం. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పారిస్కు వెళ్లాం. కానీ అది సాధ్యపడలేదు. వరసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని.. ఇక్కడ హాకీకి కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి’ అని అన్నాడు. -
భారత జూనియర్ హాకీ జట్టు కోచ్గా శ్రీజేశ్!
పారిస్ ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా రెండో కాంస్య పతకం సాధించిన అనంతరం కెరీర్కు వీడ్కోలు పలికిన భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ త్వరలోనే కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. గోల్ పోస్ట్ ముందు తన అసమాన ప్రతిభతో దేశానికి ఎన్నో మధుర విజయాలు అందించిన శ్రీజేశ్.. ఇకపై జాతీయ జూనియర్ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు. ‘త్వరలోనే శ్రీజేశ్ను జూనియర్ (అండర్–21) జట్టు కోచ్గా నియమిస్తాం. దీని గురించి అతడితో మాట్లాడాం. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడికి మించిన వారు మరొకరు లేరు. దీంతో పాటు శ్రీజేశ్ స్థానాన్ని భర్తీ చేయనున్న గోల్ కీపర్లు సూరజ్ కార్కెరా, క్రిషన్ బహదూర్ పాఠక్కు కూడా దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. -
కాంస్య పతకంతో వీడ్కోలు పలికిన భారత హాకీ లెజెండ్...
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకుంది. సెమీస్లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా.. స్పెయిన్తో కాంస్య పతక పోరులో మాత్రం సత్తాచాటింది. 2-1 తేడాతో స్పెయిన్ ఓడించిన భారత జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇక ఈ చిరస్మరణీయ విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలికాడు. కాగా తన రిటైర్మెంట్ విషయాన్ని ఒలింపిక్స్ ఆరంభానికి ముందే శ్రీజేశ్ ప్రకటించాడు.ఈ క్రమంలో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్పై కూర్చోబెట్టారు. తమ హాకీ స్టిక్స్తో జేజేలు కొట్టారు. కాగా భారత్ కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.ఇక 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్గా, గోల్కీపర్గా భారత్కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు."నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించిందని" తన రిటైర్మెంట్ ప్రకటనలో శ్రీజేష్ పేర్కొన్నాడు. -
Paris Olympics: జెర్మనీతో సెమీస్.. భారత హాకీ జట్టుకు బిగ్ షాక్
ప్యారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్కు ముందు భారత హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. నిషేదం కారణంగా భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మంగళవారం జెర్మనీతో జరగనున్న సెమీఫైనల్కు దూరమయ్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని రోహిదాస్పై ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(FIH )టెక్నికల్ డెలిగేట్ ఒక్క మ్యాచ్ నిషేధం విధించింది. ఈ క్రమంలోనే సెమీస్ పోరుకు రోహిదాస్ దూరంగా ఉండనున్నాడు. సెమీఫైనల్లో హాకీ జట్టు 16 మంది సభ్యులకు బదులుగా 15 మందితో ఆడనుంది. అయితే హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై భారత జట్టు అసహనంగా ఉంది. అయితే హాకీ ఇండియా ఇప్పటికే ఎఫ్ఐహెచ్ నిర్ణయంపై సవాలు చేసింది. రోహిదాస్పై విదించిన బ్యాన్ పై పూనరాలోచించాలని హాకీ ఇండియా అప్పీల్ చేసింది. అయితే సెమీస్కు ముందు ఎఫ్ఐహెచ్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు తక్కువ.అసలేం జరిగిందంటే?మ్యాచ్ 17వ నిమిషంలో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ బ్రిటన్ ఫార్వర్డ్ విలియమ్ కల్నాన్ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్కు ‘రెడ్ కార్డ్’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం భారత్ 10 మందితోనే ఆడింది. -
టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు
భారత జాతీయ జట్టు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏళ్ల అమ్మాయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుణ్పై కేసు నమోదు చేశారు. 2018లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వరుణ్.. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను మైనర్నని (17 ఏళ్లు).. వరుణ్ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణలో ఉన్నాడని యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్ కోసం గాలిస్తున్నారు. వరుణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు కాకముందు వరకు వరుణ్ భువనేశ్వర్లోని జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల వరుణ్ కుమార్ భారత జాతీయ జట్టు తరఫున డిఫెండర్ స్థానంలో ఆడతాడు. 2017 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత జట్టులో స్టాండ్బై సభ్యుడిగా ఉన్నాడు. జూనియర్ స్థాయి నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. హాకీ ఇండియా లీగ్లో పంజాబ్ వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా తరఫున 142 మ్యాచ్లు ఆడిన వరుణ్ మొత్తం 40 గోల్స్ చేశాడు. -
Men's Hockey5s World Cup: క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓటమి
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు పతకం రేసులో నిలువలేకపోయింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 4–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున రహీల్ మొహమ్మద్ (1వ, 7వ, 25వ ని.లో) మూడు గోల్స్ చేయగా... మందీప్ మోర్ (11వ ని.లో) ఒక గోల్ సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత జట్టు 5 నుంచి 8 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్ల్లో భాగంగా కెన్యాతో జరిగిన పోరులో 9–4తో ఘనవిజయం సాధించింది. -
Men's Hockey5s World Cup: క్వార్టర్ ఫైనల్లో భారత్
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. జమైకాతో జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 13–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మణీందర్ సింగ్ (28వ, 29వ ని.లో), మంజీత్ (5వ, 24వ ని.లో), రహీల్ మొహమ్మద్ (16వ, 27వ ని.లో), మన్దీప్ మోర్ (23వ, 27వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. ఉత్తమ్ సింగ్ (5వ ని.లో), రాజ్భర్ పవన్ (9వ ని.లో), గుర్జోత్ సింగ్ (14వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పూల్ ‘బి’లో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్తో తలపడుతుంది. -
రన్నరప్గా నిలిచిన భారత్
మస్కట్: మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని కెపె్టన్సీలోని భారత జట్టు 2–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జ్యోతి ఛత్రి (20వ ని.లో), రుతుజా (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించింది. -
భారత హాకీ జట్టుకు రెండో గెలుపు
మస్కట్: మహిళల ‘ఫైవ్స్’ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. అమెరికాతో జరిగిన పూల్ ‘సి’ రెండో మ్యాచ్లో టీమిండియా 7–2 గోల్స్తో గెలిచింది. భారత్ తరఫున మరియానా (20వ, 22వ ని.లో), దీపిక (23వ, 25వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... ముంతాజ్ (27వ ని.లో), అజ్మీనా (29వ ని.లో), మహిమ (17వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పోలాండ్తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 5–4తో గెలిచింది. -
సెమీస్లో భారత్.. ఒలింపిక్స్ బెర్త్ అవకాశాలు సజీవం
రాంచీ: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాలను భారత మహిళల హాకీ జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఇటలీ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ఉదిత రెండు గోల్స్ (1వ, 55వ ని.లో) చేయగా... దీపిక (41వ ని.లో), సలీమా టెటె (45వ ని.లో), నవ్నీత్ కౌర్ (53వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఇటలీ జట్టుకు కామిలా మాచిన్ (ప్లస్ 60వ ని.లో) ఏకైక గోల్ను అందించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో అమెరికా 1–0తో న్యూజిలాండ్ను ఓడించింది. దాంతో గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన అమెరికా 9 పాయింట్లతో టాపర్గా నిలువగా... రెండు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ 6 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి సెమీఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్లో జపాన్తో అమెరికా; జర్మనీతో భారత్ తలపడతాయి. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. -
ఛాంపియన్ భారత్
రాంచీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున సంగీత కుమారి (17వ ని.లో), నేహా (46వ ని.లో), లాల్రెమ్సియామి (57వ ని.లో), వందన కటారియా (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. Congrats to the 🇮🇳 Women’s 🏑 team as they beat 🇯🇵 4-0 in the final to win the Asian Champions Trophy at Ranchi. 7 matches,7 convincing wins. After the disappointment of missing out on the Asian Games🥇this will give the team huge confidence for the Olympic Qualifiers in 2024 pic.twitter.com/6XY2yPCc4m— Viren Rasquinha (@virenrasquinha) November 5, 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్ సాధించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలిగా రూ. 3 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపింది. -
పేదరికం.. ఎన్నో అవమానాలు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ హాకీ ప్లేయర్
భారత దేశంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతి విషయంలో వారిపై అంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. వారు మనసు నచ్చిన ఏ పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు మద్దతు ఉన్నా, సమాజం ప్రతి విషయంలో వారిని కుళ్ళబొడుస్తూనే ఉంది. ఇలాంటి అనుభవాలనే భారత దేశం గర్వించదగ్గ మహిళా హాకీ ప్లేయర్ వందనా కటారియా కూడా ఎదుర్కొంది. తనకు ఎంతో ఇష్టమైన క్రీడను (హాకీ) ఆడే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అబ్బాయిలు ఆడే ఆటలు అమ్మాయిలకు ఎందుకని చుట్టుపక్కల వాళ్లు చులకన చేశారు. అబ్బాయిల్లా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకోవడమేంటని అవహేళన చేశారు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులను కూడా నిందించారు. ఓ దశలో అమ్మాయిగా ఎందుకు పుట్టానా అని ఆమె బాధపడింది. అసలే పేదరికంతో బాధపడుతుంటే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటీ మాటలతో మరింత వేధించారు. ఇలాంటి సమయంలోనే ఆమె గట్టిగా ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాలని డిసైడైంది. ఆ క్రమంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం యావత్ భారత దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యే 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వందన కటారియా.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జన్మించిన వందన.. భారత మహిళా హాకీ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్గా కొనసాగుతుంది. భారత్ తరఫున జూనియర్ వరల్డ్కప్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకు ప్రాతినిథం వహించిన ఆమె.. 2020 టోక్యో ఒలింపిక్స్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా తొలిసారి దేశవ్యాప్త గుర్తింపు దక్కించుకుంది. అయితే అదే ఒలింపిక్స్ వందనతో పాటు ఆమె కుటుంబానికి కూడా చేదు అనుభవాలను మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్స్లో భారత్.. అర్జెంటీనా చేతిలో ఓడిపోవడంతో వందన, ఆమె కుటుంబం కులపరమైన దూషణలను ఎదుర్కొంది. ఒలింపిక్స్లో పాల్గొన్న జట్టులో వందన లాంటి చాలా మంది దళితులు ఉన్నందున సెమీస్లో భారత్ ఓడిందని కొందరు అగ్రవర్ణ పురుషులు ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడారు. ఇలాంటి అవమానాలను తన 14 ఏళ్ల కెరీర్లో అనునిత్యం ఎదుర్కొన్న వందన.. మహిళల హాకీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, విమర్శకుల నోళ్లు మూయించింది. 31 సంవత్సరాల వందన.. తన అక్కను చూసి హాకీ పట్ల ఆకర్శితురాలైంది. కనీసం బూట్లు కూడా కొనలేని స్థితి నుంచి నేడు దేశం గర్వించదగ్గ స్టార్గా ఎదిగింది. హాకీ స్టిక్ కొనే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆమె చెట్ల కొమ్మలతో సాధన చేసి ఈ స్థాయికి చేరింది. ఓ పక్క పేదరికంతో బాధపడుతూ.. మరోపక్క అవమానాలను దిగమింగుతూ సాగిన వందన ప్రస్తానం భారత దేశ మధ్యతరగతి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది. -
Asia Cup 2023: పాక్పై టీమిండియా గెలుపు
ఆసియా కప్ 5s హాకీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో భారత్ 6-4 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో భారత్, పాక్లు చెరి 4 గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్స్ ద్వారా ఫలితం తేలింది. షూటౌట్స్లో భారత్ రెండు అటెంప్ట్స్ను గోల్స్గా మలిచి, ఛాంపియన్గా అవతరించింది. 5s ఫార్మాట్లో భారత్ పాక్ను ఓడించడం మూడు సందర్భాల్లో ఇదే మొదటిసారి. India beat Pakistan in Men's Hockey 5s Asia Cup Final. pic.twitter.com/VyKC6aG06S — Azhutozh ⚕ (@azhutozh) September 2, 2023 సెకెండాఫ్లో 2-4 గోల్స్ తేడాతో వెనుకంజలో ఉండిన భారత్.. అనూహ్యంగా పుంజుకుని, షూటౌట్స్ వరకు వెళ్లి విజేతగా నిలిచింది. షూటౌట్స్లో పాక్ రెండు ప్రయత్నాల్లో విఫలం కాగా.. గుర్జోత్ సింగ్, మణిందర్ సింగ్లు తలో గోల్ చేసి, భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు భారత్ 2-4 గోల్స్తో వెనుకపడి ఉన్నప్పుడు మొహమ్మద్ రహీల్ 2 గోల్స్ చేసి, మ్యాచ్ డ్రా అయ్యేందుకు దోహదపడ్డాడు. Maninder Singh scores the second goal in shoot-out as India clinches Hockey 5s Asia Cup title defeating Pakistan. Both teams were 4-4 tied in normal time before India won the shootout 2-0.#Hockey5sAsiaCup #HockeyIndia pic.twitter.com/SWncUcVxnn — Pritish Raj (@befikramusafir) September 2, 2023 -
ఇంగ్లండ్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున హోలీ హంట్ ఏడో నిమిషంలో గోల్ చేయగా... భారత జట్టుకు లాల్రెమ్సియామి 41వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్లో స్పెయిన్ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. -
'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై
1998.. ముప్పైరెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. 10 గోల్స్తో సత్తా చాటి కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన టీమ్కి అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఘనాతిఘనమైన స్వాగతం సంగతి దేవుడెరుగు.. దేశంలో ఆటను నడిపించే భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్)కు చెందిన అధికారులైనా కనీసం విమానాశ్రయానికి వచ్చి తమ ఆటగాళ్లను కలవలేదు. అన్నింటికి మించి ఎటువంటి కనీస ఏర్పాట్లూ చేయకపోవడంతో ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రంతా భారత ఆటగాళ్లు ఎయిర్పోర్ట్లో నేలపై పడుకోవాల్సి వచ్చింది. దాంతో ధన్రాజ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఐహెచ్ఎఫ్ మొత్తాన్ని తిట్టిపడేసి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాతి ఫలితం ఊహించిందే. అప్పట్లో కంటిచూపుతో ఐహెచ్ఎఫ్ని శాసిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కేపీఎస్ గిల్.. తర్వాతి సిరీస్కి ఎంపిక చేయకుండా పిళ్ళైపై చర్య తీసుకొని తన బలాన్ని చూపించాడు. మళ్లీ టీమ్లోకి వచ్చేందుకు ధన్రాజ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఇదంతా ఊహించిందే. ‘తప్పు నాది కానప్పుడు దేనికైనా తెగిస్తాను.. న్యాయం కోసం పోరాడేందుకు సిద్ధం’ అనే లక్షణం ధన్రాజ్లో ఎప్పటినుంచో ఉంది. అద్భుతమైన ఆటగాడిగా మాత్రమే కాకుండా అవసరమైతే వ్యవస్థను ప్రశ్నించేందుకూ సిద్ధపడే తత్వమే ధన్రాజ్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత హాకీ దిగ్గజాలలో ఒకడిగా తనకంటూ విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఘనత ధన్రాజ్ది! ధ్యాన్చంద్, బల్బీర్ సింగ్, మొహమ్మద్ షాహిద్ వంటి దిగ్గజాల తర్వాతి తరంలో తన దూకుడైన ఆటతో ధన్రాజ్ పిళ్లై భారత హాకీలో ప్రత్యేకంగా నిలిచాడు. 90వ దశకంలో వేర్వేరు కారణాలతో కునారిల్లిన భారత హాకీ సాధించిన కొన్ని చెప్పుకోదగ్గ ఫలితాల్లో తన ఆటతో అతను శిఖరాన నిలిచాడు. హాకీ స్టిక్తో మైదానంలో ధన్రాజ్ చూపించిన మ్యాజిక్ క్షణాలెన్నో. టర్ఫ్పై వేగంగా దూసుకుపోవడం, ప్రత్యర్థి డిఫెండర్లను దాటి సహచరులకు పర్ఫెక్ట్ పాస్లు అందించడం, అతని డ్రిబ్లింగ్, రివర్స్ హిట్లు, ఫార్వర్డ్గా కొట్టిన గోల్స్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి పెనాల్టీలను విఫలం చేయడంలో డిఫెండర్గా కూడా ధన్రాజ్ ఆట అత్యుత్తమంగా సాగింది. ఆటలో ప్రతిభ మాత్రమే కాదు.. స్టిక్ చేతిలో ఉంటే అతనికి పూనకం వచ్చేస్తుంది. ఒక రకమైన కసి, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అతని ఆవేశానికి మరింత బలాన్నిస్తాయి. దశాబ్దంన్నర అంతర్జాతీయ కెరీర్లో ధన్రాజ్ భారత హాకీకి పోస్టర్ బాయ్గా నిలిచాడు. భారత్ తరఫున 339 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అతను 170 గోల్స్ సాధించడమే కాదు, మరెన్నో వందల గోల్స్లో తన వంతు పాత్రను పోషించాడు. ఆటపై మమకారంతో.. పుణే శివారులోని ఖడ్కి.. ధన్రాజ్ స్వస్థలం. అతని తండ్రి ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో లేబర్గా పని చేస్తుండేవాడు. ఆర్మీ అధికారుల ప్రాబల్యం ఉండే ఆ కంటోన్మెంట్ ఏరియాలో చాలామంది ఏదో ఒక ఆడుతూ కనిపించేవారు. క్రీడలపై అమితాసక్తి ఉన్న తండ్రి తన నలుగురు కొడుకులను కూడా ప్రోత్సహించాడు. వారిలో చిన్నవాడు ధన్రాజ్ని హాకీ ఆకర్షించింది. అక్కడ ఉండే మట్టిలో, పేడతో అలికిన టర్ఫ్పై విరిగిన పాత స్టిక్లతో హాకీ ఆడుతూ ఉండే ధన్రాజ్కి ఆ ఆటపై మరింత ఆసక్తి పెరిగింది. ఒకనాటి భారత దిగ్గజం మొహమ్మద్ షాహిద్ని అతను విపరీతంగా అభిమానించేవాడు. అతని శైలిలోనే ఆడి చూపించేవాడు. చివరకు అది పూర్తిస్థాయి ప్రొఫెషనల్గా మారే వరకు చేరింది. అధికారికంగా ఆ సమయంలో హాకీలో వేర్వేరు వయో విభాగాల్లో పోటీలు లేకపోయినా.. అందరికీ ధన్రాజ్లో ఏదో ప్రత్యేకత కనిపించింది. అదే మలుపు.. ధన్రాజ్లో ప్రతిభను పూర్తిగా వాడుకొని సరైన దారిలో నడిపించాలని అన్నయ్య రమేశ్ భావించాడు. తాను అప్పటికే ముంబైలో హాకీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమ్ముడిని తన వద్దకు తెచ్చుకొని సరైన రీతిలో దిశానిర్దేశం చేశాడు. అక్కడే ప్రముఖ కోచ్ జోకిమ్ కార్వాలోను కలవడం పిళ్లై జీవితాన్ని మార్చేసింది. ఈ కుర్రాడిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన ఆయన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆటను తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా అప్పట్లో యువ ఆటగాళ్లకు అండగా నిలుస్తున్న మహీంద్ర అండ్ మహీంద్ర క్లబ్లో తన సిఫారసుతో ప్రవేశం ఇప్పించి ఆ జట్టు తరఫున ఆడే అవకాశం కల్పించాడు. దాంతో ధన్రాజ్ హాకీలో మరింత దూసుకుపోయాడు. చివరకు భారత జట్టులో స్థానం సంపాదించే వరకు అతను ఆగలేదు. 1989లో తొలిసారి దేశం తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ధన్రాజ్ 2004 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సాధించిన ఘనతలెన్నో.. 15 ఏళ్ల పాటు ధన్రాజ్ భారత హాకీలో అంతర్భాగంగా ఉన్నాడు. మన జట్టు సాధించిన ఎన్నో గుర్తుంచుకోదగ్గ విజయాల్లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఆసియా కప్లో ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో 2 రజతాలు, ఒక కాంస్యం గెలుచుకున్న జట్టులో.. ఆసియా క్రీడల్లో స్వర్ణం, 3 రజతాలు సాధించిన టీమ్లలో సభ్యుడైన అతను 2001లో చాంపియన్స్ చాలెంజ్ టోర్నీని గెలుచుకున్న జట్టులో కూడా ఉన్నాడు. హాకీలో 3 మెగా ఈవెంట్లలో కనీసం నాలుగు సార్లు పాల్గొన్న ఏకైక ఆటగాడు ధన్రాజ్ కావడం విశేషం. నాలుగు ఒలింపిక్స్లలో, నాలుగు చాంపియన్స్ ట్రోఫీలలో, నాలుగు వరల్డ్ కప్లలో అతను భాగమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి చాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచిన క్షణం ధన్రాజ్ని అందరికంటే అగ్రభాగాన నిలబెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు అతనే. 1994 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవన్ని ఎంపిక చేసినప్పుడూ ధన్రాజ్కి చోటు దక్కింది. క్లబ్లలోనూ మేటి.. ఒకప్పుడు మట్టి మైదానాల్లో సత్తా చాటిన భారత హాకీ తర్వాతి రోజుల్లో ఆస్ట్రోటర్ఫ్ దెబ్బకు చతికిలపడింది. సంప్రదాయ శైలికి పూర్తి భిన్నమైన యూరోపియన్ శైలి ప్రపంచ హాకీలోకి ప్రవేశించడంతో మన జట్టు ప్రమాణాలు బాగా పడిపోయాయి. యూరోపియన్ల ఫిట్నెస్తో పోలిస్తే భారత ఆటగాళ్లు ఆ స్థాయిని అందుకోలేని పరిస్థితి. ముఖ్యంగా 90వ దశకంలో మన జట్టు పరాజయాలకు ఇదీ ఒక కారణం. అలాంటి సమయంలోనే ధన్రాజ్ తాను కొత్తగా మారేందుకు సిద్ధమయ్యాడు. జట్టులో అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను తన ఆటనూ మార్చుకుంటే అది భారత జట్టుకు మేలు చేస్తుందని భావించాడు. అందుకే యూరోపియన్ క్లబ్లలో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ధన్రాజ్ స్థాయి ప్లేయర్ గురించి అందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రతిజట్టూ అతడిని కోరుకుంది. అందుకే పెద్ద ఎత్తున అతడికి చాన్స్ దక్కింది. స్టట్గార్డ్ కికర్స్ (జర్మనీ), హెచ్సీ లయన్ (ఫ్రాన్స్), ఇండియన్ జింఖానా (లండన్) క్లబ్లకు అతను ప్రాతినిధ్యం వహించాడు. వివాదాలతో సహవాసం చేస్తూనే.. ఆటగాడిగా గొప్ప స్థాయికి చేరినా అతని మాటతో, దూకుడుతో ధన్రాజ్ చాలా మంది దృష్టిలో రెబల్గా మారాడు. అయితే తన తిక్కకూ లెక్క ఉంటుందని అతను పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. విమానాశ్రయ ఘటనలోనే కాకుండా ఆటగాళ్లకు కనీస ఫీజులు కూడా ఇవ్వడం లేదని పలుమార్లు ఫెడరేషన్తో గొడవలు, అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా నాసిరకం ఆహారం ఇస్తున్నారంటూ స్పోర్ట్స్ అథారిటీ కేంద్రలో కుక్పై దాడి, మ్యాచ్ జరిగినంతసేపూ భారత్ని అవమానించాడంటూ స్టాండ్స్లోకి వెళ్లి మరీ ప్రేక్షకుడిని కొట్టిన తీరు అతని ఆవేశాగ్రహాలను చూపించాయి. అయితే అతను ఏనాడూ ఇలాంటి వాటి వల్ల తన స్థానానికి ముప్పు వస్తుందని భయపడలేదు. ఆసియా గేమ్స్ పతకం తర్వాత ఫెడరేషన్తో గొడవతో కోల్పోయిన స్థానాన్ని ఆరునెలల్లో మళ్లీ దక్కించుకున్నాడు. ‘నాకు తెలుసు.. నా ఆటపై నాకు నమ్మకముంది. మరొకరు నా స్థానాన్ని భర్తీ చేయలేరు’ అని చెప్పడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. నిజంగానే మైదానం బయట ఘటనలు అతని స్థాయిని తగ్గించలేదు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ధన్రాజ్.. ఖేల్రత్న అవార్డు స్వీకరించిన తొలి హాకీ క్రీడాకారుడు. అది మాత్రం దక్కలేదు.. హాకీ ఆటగాడిగా ఎన్నో సాధించినా.. ఒలింపిక్స్ పతకం మాత్రం ధన్రాజ్కి కలగానే మిగిలిపోయింది. ఏకంగా నాలుగు ఒలింపిక్స్లలో పాల్గొన్నా ఆ అదృష్టం లభించలేదు. 1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్లలో పిళ్లై భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో జట్టు మొత్తం పేలవ ప్రదర్శనే కనబర్చింది. పతకం కాదుకదా కనీసం చేరువగా కూడా రాలేక వరుసగా 7, 8, 7, 7 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో జట్టుపై కాస్త ఆశలు ఉండేవి. అందుకే ఈసారి ఎలాగైనా పతకంతో తిరిగొస్తాం అని ధన్రాజ్ అందరికీ చెప్పాడు. పోలండ్తో చివరి లీగ్ మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. ఆఖరి వరకు ఆధిక్యంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న స్థితిలో అనూహ్యంగా గోల్ ఇవ్వడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో తర్వాతి నాలుగు రోజుల పాటు ధన్రాజ్.. తన గేమ్స్ విలేజ్ గదిలోనే ఉంటూ రోధించాడు. తనతో మాట్లాడేందుకు తల్లి ఫోన్లో ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. మాట తప్పినందుకు మన్నించమని తల్లికి చెప్పమంటూ తన సహచరులకు సూచించాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే అతని జీవిత విశేషాలతో కూడిన బయోగ్రఫీకి ఫర్గివ్ మి అమ్మా అని పేరు పెట్టారు. -
సెమీస్లో భారత్.. థాయ్లాండ్పై 17–0తో ఘన విజయం
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్లాండ్ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 17–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అంగద్బీర్ సింగ్ (13వ, 33వ, 47వ ని.లో) మూడు గోల్స్ చేయగా... అమన్దీప్ లాక్రా (26వ, 29వ ని.లో), ఉత్తమ్ సింగ్ (24వ, 31వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. శ్రద్ధానంద్ తివారి (46వ ని.లో), యోగంబర్ రావత్ (17వ ని.లో), అమన్దీప్ (47వ ని.లో), రోహిత్ (49వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు, ఒక ‘డ్రా’తో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పూల్ ‘ఎ’లో నేడు జపాన్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతకు మరో సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. మ్యాచ్ ‘డ్రా’ అయితే పాకిస్తాన్ ముందంజ వేస్తుంది. -
భారత హాకీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
భువనేశ్వర్: భారత సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల హాకీ జట్లకు మరో పదేళ్లపాటు (2033 వరకు) స్పాన్సర్ షిప్ చేస్తామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి ఒడిశా జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. 2018, 2023లలో పురుషుల ప్రపంచకప్ టోర్నీలకు ఒడిశా ఆతిథ్యమిచ్చింది. -
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న హార్ధిక్
భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) 2022 సంవత్సరానికిగాను భారత జట్టుకు సంబంధించి వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో సవితా పూనియా హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచకప్లో హార్దిక్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ నేషనల్ కప్ టైటిల్ గెలిపించి ప్రొ లీగ్కు భారత జట్టు అర్హత సాధించడంలో కీపర్గా, కెప్టెన్గా సవిత కీలక పాత్ర పోషించింది. ఇద్దరికీ హాకీ ఇండియా తరఫున రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. దీంతో పాటు 2021కు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటించగా హర్మన్ప్రీత్, సవితా పూనియా అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డులు అందుకున్నారు. 2022లో సుల్తాన్ జొహర్ కప్ గెలిచిన భారత జూనియర్ జట్టును కూడా ఈ సందర్భంగా సత్కరించారు. -
వరల్డ్కప్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ. 1 కోటి..!
భువనేశ్వర్: భారత హాకీ జట్టుకు ఇప్పటికే ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిషా ప్రభుత్వం ఆటగాళ్లను ఉత్సాహపరిచే మరో ప్రకటన చేసింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ. 1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల 13నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది. గురువారం రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్...ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. -
‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్కు..
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఫిట్నెస్ సమస్యలతో ప్రపంచకప్ ఆడే జట్టుకు దూరమైంది. సీనియర్ గోల్ కీపర్ సవిత సారథ్యంలోని మహిళల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. తొడ కండరాల గాయం నుంచి రాణి పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆమెను ఎంపిక చేయలేదని హెచ్ఐ వర్గాలు వెల్లడించాయి. గతేడాది టోక్యో ఒలింపిక్స్లో భారత్ను తొలిసారి నాలుగో స్థానంలో నిలిపిన ఘనత రాణిది. ఆ తర్వాత గాయం కారణంగా ఆమె ఏ టోర్నీ ఆడలేదు. ఇటీవలే ప్రొ లీగ్ మ్యాచ్లకు ఎంపిక చేసినా... పూర్తి ఫిట్నెస్ లేక తొలి నాలుగు మ్యాచ్ల్లో ఆడలేకపోయింది. దీంతో భారత ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ వచ్చే నెల 1 నుంచి 17 వరకు జరుగుతుంది. భారత జట్టు: సవిత (కెప్టెన్, గోల్కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), బిచూ దేవి, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మోనిక, నేహా, జ్యోతి, నవ్జ్యోత్ కౌర్, సోనిక, సలిమా టేటే, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్నీత్ కౌర్, షర్మిలా దేవి. -
‘టాప్’లోనే టీమిండియా
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత్ తమ సత్తా చాటుకుంది. ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్లో 21 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (26వ, 43వ ని.లో), మన్ప్రీత్ సింగ్ (15వ, 26వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా హర్మన్ప్రీత్ కెరీర్లో 100 గోల్స్ మైలురాయిని దాటాడు. ఇంగ్లండ్ తరఫున లియామ్ సాన్ఫోర్డ్ (7వ ని.లో), డేవిడ్ కాన్డన్ (39వ ని.లో), సామ్ వార్డ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్ ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్లోనే జర్మనీతో రెండు మ్యాచ్ల్లో తలపడుతుంది. -
శ్రీజేశ్కు ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్’ అవార్డు
భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ప్రతిష్టాత్మక ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అడ్వెంచర్ క్రీడాకారుడు అల్బెర్టో గైన్స్ లోపెజ్ (స్పెయిన్), వుషూ ప్లేయర్ గియోర్డనో (ఇటలీ)లతో శ్రీజేశ్ పోటీ æపడ్డాడు. ఓటింగ్లో శ్రీజేశ్కు 1,27,647 ఓట్లు రాగా, లోపెజ్కు 67, 428, మైకేల్కు 52,046 ఓట్లే పోలయ్యాయి. భారత్ తరఫున 2020లో మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్కు ఈ అవార్డు లభించింది. -
Asia Champions Trophy Hockey: సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్
India Lose Semi Final Vs Japan Hockey Asia Champions Trophy.. పురుషుల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పోరు ముగిసింది. జపాన్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 5-3 తేడాతో పరాజయం పాలైంది. ఇక ఫైనల్ చేరిన జపాన్.. దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఇదే జపాన్ను లీగ్ దశలో 6-0 తేడాతో చిత్తు చేసిన భారత పురుషుల జట్టు మళ్లీ అదే ఫీట్ను పునరావృతం చేయలేకపోయింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన లీగ్ దశలో 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో గ్రూఫ్ టాపర్గా నిలిచిన భారత్ కీలకమైన సెమీస్లో మాత్రం ఒత్తిడికి తలొగ్గి పరాజయం చవిచూసింది. ఇక మూడోస్థానం కోసం భారత్ పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. -
విజయంతో ముగించాలని...
ఢాకా: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను విజయంతో ముగించేందుకు డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు సిద్ధమైంది. ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించిన టీమిండియా నేడు జరిగే తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ను జపాన్తో ఆడనుంది. కొరియాతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించిన భారత్... అనంతరం బంగ్లాదేశ్పై 9–0తో, పాకిస్తాన్పై 3–1తో గెలిచింది. టోక్యో ఒలింపిక్స్లో చివరిసారిగా జపాన్తో తలపడిన భారత్ ఆ మ్యాచ్లో 5–3 గోల్స్తో విజయం సాధించింది. -
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను
మన ఆటగాళ్లకు కాంస్యం దక్కిన క్షణం చూసిన నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా వల్ల సాధ్యం కానిది ఈతరం ఆటగాళ్లు సాధించడం గర్వంగా అనిపిస్తోంది. జర్మనీతో మ్యాచ్లో మన జట్టులో కొన్ని లోపాలు కనిపించినా చివరకు మెడల్ గెలవగలిగాం. ఎప్పటిలాగే చివరి క్షణాల్లో గోల్ ఇచ్చేస్తారేమోనని భయపడ్డాను. ఆ ఉత్కంఠను అధిగమించి మ్యాచ్ను నిలబెట్టుకోగలిగారు. నేను ఆడిన రోజుల్లో ఒలింపిక్స్కు ముందు యూరోప్ దేశాలకు వెళ్లి 100 శాతం శ్రమించి గెలిచి రావడం, అసలు ఒలింపిక్స్కు వచ్చేసరికి విఫలం కావడం జరిగాయి. మిగతా జట్లు ఒలింపిక్స్లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కోసం సన్నద్ధమయ్యేవి. దీనిని కూడా గుర్తించలేని స్థితిలో మా ఆట సాగింది. ఇప్పుడు అంతా మారిపోయింది. విదేశీ కోచ్లు బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును యూరోపియన్ శైలికి అనుగుణంగా మనోళ్ల ఆటను తీర్చిదిద్దారు. గత 6–7 ఏళ్లుగా ఇది సాగుతుండగా ఫలితం ఇప్పుడు కనిపించింది. కొత్త తరహా షాట్లు వచ్చి అంతా ‘పవర్గేమ్’గా మారిపోయింది. మేం ఆడిన రోజులతో పోలిస్తే సబ్స్టిట్యూట్ల సంఖ్య విషయంలో పరిమితి లేకపోవడంతో ఎక్కువ మందిని రొటేట్ చేస్తూ అందరినీ మ్యాచ్ ఆసాంతం తాజాగా ఉంచే అవకాశం కలిగింది. దాంతో ఆటలో వేగం పెరిగింది. ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులను భారత జట్టు సమర్థంగా అమలు చేయగలగడమే మళ్లీ పతకం గెలుచుకోవడానికి కారణమైంది. –‘సాక్షి’తో ముకేశ్ కుమార్ (ట్రిపుల్ ఒలింపియన్–1992, 1996, 2000) భారత హాకీకి ఇదో పునర్జన్మలాంటిది. ఈ పతకం సాధించి భవిష్యత్తులో ఎవరైనా హాకీ ఆడేందుకు కావాల్సిన ప్రేరణను అందించగలిగాం. ఆఖరి పెనాల్టీ కార్నర్కి ముందే ఒకటే మాట అనుకున్నాను. 21 ఏళ్లుగా హాకీ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు ఈ పెనాల్టీని ఆపలేకపోతే అదంతా వృథా అనిపించింది. ఆపి చూపించాను. –పీఆర్ శ్రీజేశ్, గోల్ కీపర్ యావద్భారత దేశం ఈ పతకం కోసం ఎదురు చూస్తోందని నాకు బాగా తెలుసు. ఈ విజయంలో నేనూ ఒక పాత్ర పోషించడం గొప్పగా అనిపిస్తోంది. జట్టు సభ్యులంతా ఎన్నో త్యాగాలు చేసి కష్టపడ్డారు. కరోనా బారిన పడి కూడా అంతే పట్టుదలగా సాధన చేశారు. మ్యాచ్ పూర్తిగా ముగిసే వరకు అంతా అయిపోయినట్లు కాదు. ఈ మ్యాచ్లో జట్టు వెనుకబడి కూడా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది. –గ్రాహం రీడ్, చీఫ్ కోచ్ అద్భుతంగా అనిపిస్తోంది. మాకు పతకం గెలిచే అర్హత ఉందని భావించాం. 15 నెలలుగా దీని కోసం ఎంతో కష్టపడ్డాం. మ్యాచ్లో వెనకబడ్డా మేం నిరాశ చెందలేదు. చివరి వరకు పోరాడాం. చివరి ఆరు సెకన్లలో పెనాల్టీని ఆపేందుకు మా ప్రాణాలు అడ్డువేయాలన్నట్లుగా అనిపించింది –మన్ప్రీత్ సింగ్, కెప్టెన్ ప్రతీ భారతీయుడి హృదయంలో హాకీకి ప్రత్యేక స్థానం ఉంది. హాకీ ప్రేమికులకు, క్రీడాభిమానులకు ఆగస్టు 5, 2021 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి భారత జట్టు 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించింది. 1–3తో వెనుకబడి కూడా ఎంతో పట్టుదల కనబరుస్తూ 5–4తో గెలవడం నిజంగా అద్భుతం. కాంస్యం గెలిచి జట్టుకు నా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం గెలవడం మనందరం సంబరాలు చేసుకోవాల్సిన ఘట్టం. జట్టుకు నా అభినందనలు. ఈ విజయంతో హాకీ పునర్వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తున్నా. కె. చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి 1983, 2007, 2011లను మరచిపోండి. భారత హాకీ జట్టు సాధించిన ఈ పతకం ఏ ప్రపంచ కప్కంటే కూడా ఎక్కువే. –గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ -
41 ఏళ్ల ఎదురు చూపులు.. ఆ సీఎం వల్లే ఈ ఒలింపిక్ పతకం
సాక్షి, వెబ్డెస్క్: ‘హాకీ’.. చెప్పుకోవడానికే మన జాతీయ క్రీడ. కానీ ఈ కాలం వారికి దాని గురించి పెద్దగా తెలియదనేది నమ్మకతప్పాల్సిన వాస్తవం. మన దగ్గర ఆటలంటే చాలు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. గతమెంతో ఘనమన్నట్లు ఒకప్పుడు ఒలింపిక్స్లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నప్పటికి మన జాతీయ క్రీడకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదనేది వాస్తవం. కారణాలు ఏవైనా కావచ్చు.. కానీ గత 40 ఏళ్లుగా హాకీ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. దాంతో మన దేశంలో హాకీ కథ ముగిసిందనే చాలా మంది భావించారు. అలాంటి పరిస్థితులను తట్టుకుని.. నిలబడి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్లో మెడల్ గెలిచే స్థాయికి చేరింది. ఇక ఈ విజయంలో ఫీల్డ్లో పోరాడిన ఆటగాళ్ల కృషి ఎంత ఉందో.. అంతకంటే పెద్ద పాత్రే పోషించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు భారత హాకీ టీం సాధించిన పతకం ఆయన చలవే. ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. భారత్ హాకీలో చివరిసారిగా 1980 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో పతకం రావడానికి దాదాపు 41 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకు కారణాలు అనేకం.. 1980 తర్వాత దేశంలో క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. అప్పుడే ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్కు సరైన గుర్తింపు దక్కకపోగా.. రిఫరెన్స్లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వీటికితోడు క్రికెట్కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఆదుకున్న నవీన్ పట్నాయక్.. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లు అన్నాళ్లు ఇండియన్ హాకీ టీమ్కు స్పాన్స్రగా కొనసాగుతున్న సహారా 2018లో టీమ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. హాకీని స్పాన్సర్ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్లకుగాను హాకీని స్పాన్సర్ చేయడానికి పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లతో హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. పట్నాయక్ నాడు చూపిన చొరవే.. నేడు టోక్యో ఒలిపిక్స్లో పతకానికి కారణమయ్యింది. హాకీపై మక్కువతో.. నవీన్ పట్నాయక్ భారత హాకీ టీమ్ను స్పాన్సర్ చేయడానికి కారణం.. గతంలో ఆయన కూడా హాకీ ప్లేయరే కావడం. ఆయన డూన్ స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్కీపర్గా ఉన్నారు. అందుకే ఆ ఆటపై ఉన్న ఇష్టంతోనే టీమ్కు స్పాన్సర్గా ఉండటానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది ఒడిశా ప్రభుత్వం. ఇది జరిగిన మూడేళ్లకు ఇప్పుడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్కు అడుగు దూరంలో ఉంది. ఒడిశాలో 2014 నుంచి హాకీ హవా.. 2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్గా ఉన్న కళింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ టీం వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ, కృషి ఉన్నాయి. ఒడిశా గతంలో కొందరు గొప్ప హాకీ ఆటగాళ్లను తయారు చేసింది. పురుషులు, మహిళల జట్లలో ఒడిశాకు చెందిన పలువురు క్రీడాకారులున్నారు. వీరిలో వైస్ కెప్టెన్లు - బీరేంద్ర లక్రా, దీప్ గ్రేస్ ఎక్కా వంటి వారు ఒడిశాకు చెందినవారే. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 2023 వరకు హాకీ ఇండియాకు స్పాన్సర్గా ఉంది. అదే ఏడాది భారతదేశం ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్కు ఆతిథ్యమివ్వనుంది. ఈ ఒలింపిక్స్లో ఇండియన్ హాకీ టీమ్ ఆడిన పలు మ్యాచ్లను నవీన్ పట్నాయక్ చూశారు. ఇప్పుడు కాంస్య పతకం గెలిచిన తర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్తో వీడియో కాల్లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు నవీన్ పట్నాయక్. -
పొట్టి బట్టలు వేసుకోవద్దన్నారు.. ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు
‘ఆటలాడితే ఏమొస్తుంది’ అన్నారు తల్లిదండ్రులు. ‘నేను ఆడతాను’ అంది నిషా. ‘పొట్టి బట్టలు వేసుకోకూడదు’ అన్నారు మత పెద్దలు. ‘నేను లెగ్గింగ్స్ వేసుకుని ఆడతాను’ అంది నిషా. ‘మేము బూట్లు బ్యాటు ఏమీ కొనివ్వ లేము’ అన్నారు అయినవాళ్లు. ‘నేనే ఎలాగో తిప్పలు పడతాను’ అంది నిషా. హర్యానాలో సోనిపట్లో 25 చదరపు మీటర్ల ఇంట్లో నివాసం ఉండే నిషా ఇవాళ మహిళా హాకీ టీమ్ లో ఇంత పెద్ద దేశానికి పతకం కోసం పోరాడుతోంది.. ‘మాకు మూడో కూతురుగా నిషా పుట్టింది. మళ్లీ ఆడపిల్లా అని బంధువులు హేళన చేశారు. ఇవాళ బ్యాట్తో సమాధానం చెప్పింది’ అని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు తల్లిదండ్రులు. ఒక సన్నివేశం ఊహించండి. తొమ్మిదేళ్ల వయసు నుంచి హాకీ ఆడుతోంది ఆ అమ్మాయి. గుర్తింపు వచ్చి జాతీయ స్థాయిలో ఆడే రోజులు వచ్చాయి. ఇక దేశానికి పేరు తెలియనుంది. ఏమో... రేపు ప్రపంచానికి తెలియవచ్చేమో. కాని ఆ సమయంలోనే తండ్రికి పక్షవాతం వస్తుంది. ముగ్గురు కూతుళ్లున్న ఆ ఇంట్లో ఆ తండ్రి జీవనాధారం కోల్పోతే తినడానికి తిండే ఉండదు. ఇప్పుడు తండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాలా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగాలా? దిగినా కుదురుగా ఆడగలదా తను? అలాంటి పరిస్థితిలో ఆడగలరా ఎవరైనా అని ఆలోచించండి. ఆడగలను అని నిరూపించిన నిషా వర్శీని చూడండి. ఆమె పోరాటం తెలుస్తుంది. ఆమె నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలుస్తుంది. టైలర్ కూతురు హర్యానాలోని సోనిపట్లో పేదలవాడలో పుట్టింది నిషా వర్శి. తండ్రి షొహ్రబ్ వర్శి టైలర్. ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురుగా నిషా జన్మించింది. టైలర్గా సంపాదించి ఆ ముగ్గురు కూతుళ్లను సాకి వారికి పెళ్లి చేయడమే పెద్దపని అనుకున్నాడు షొహ్రబ్. ‘పాపం... ముగ్గురు కూతుళ్లు’ అని బంధువులు జాలిపడేవారు అతణ్ణి చూసి. మూడోసారి కూతురు పుడితే ‘మూడోసారి కూడానా. ఖర్మ’ అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షొహ్రబ్ ఏమీ మాట్లాడలేదు. ముగ్గురిని ప్రాణంగా చూసుకున్నాడు. నిషా వర్శి హాకీ ఆడతానంటే ‘మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఆటలు ఆడలేదు ఎప్పుడూ’ అన్నాడు. కాని తల్లి మెహరూన్ కూతురి పట్టుదల గమనించింది. ఆడనిద్దాం అని భర్తకు సర్దిచెప్పింది. నిషా వర్శి తల్లిదండ్రులు ఎన్నో అడ్డంకులు క్రీడల్లో రాణించడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం, ట్రైనింగ్ తీసుకోవడం, అవసరమైన కిట్లు కొనుక్కోవడం ఇవన్నీ పేదవారి నుదుటిరాతలో ఉండవు. కలలు ఉండొచ్చు కాని వాటిని నెరవేర్చుకోవడం ఉండదు. కాని నిషా పట్టుపట్టింది. ప్రస్తుతం భారత హాకీ టీమ్లో ఆడుతున్న నేహా గోయల్ కూడా ఆమె లాంటి నేపథ్యంతో ఆమె వాడలోనే ఉంటూ ఆమెకు స్నేహితురాలై హాకీ ఆడదామని ఉత్సాహపరిచింది. ఇద్దరూ మంచి దోస్తులయ్యారు. కాని తెల్లవారి నాలుగున్నరకు గ్రౌండ్లో ఉండాలంటే తల్లిదండ్రులు నాలుగ్గంటలకు లేవాల్సి వచ్చేది. తల్లి ఏదో వొండి ఇస్తే తండ్రి ఆమెను సైకిల్ మీద దించి వచ్చేవాడు. ఒక్కోసారి తల్లి వెళ్లేది. వారూ వీరు చూసి ‘ఎందుకు ఈ అవస్థ పడతారు. దీని వల్ల అర్దనానా కాణీనా’ అని సానుభూతి చూపించేవారు. మరొకటి ఏమంటే– ఇస్లాంలో మోకాళ్ల పైభాగం చూపించకూడదని భావిస్తారు. హాకీ స్కర్ట్ మోకాళ్ల పైన ఉంటుంది. మత పెద్దల నుంచి అభ్యంతరం రాకూడదని కోచ్కు చెప్పి లెగ్గింగ్స్ తో ఆడటానికి ఒప్పించింది నిషా. ఒలింపిక్స్లో కూడా లెగ్గింగ్స్తోనే ఆడింది. కొనసాగిన అపనమ్మకం 2016లో తండ్రి పక్షవాతానికి గురయ్యాక దీక్ష వీడక ఆడి జాతీయ, అంతర్జాతీయ మేచెస్ లో గుర్తింపు పొందింది నిషా వర్శీ. రైల్వే బోర్డ్ టీమ్లో ఆడటం వల్ల ఆమెకు రైల్వేలో 2018లో ఉద్యోగం దొరికింది. పరిమిత నేపథ్యం ఉన్న నిషా కుటుంబానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. ‘చాలమ్మా... ఇక హాకీ మానెయ్. పెళ్లి చేసుకో’ అని నిషాను ఒత్తిడి పెట్టసాగారు. అప్పటికి ఆమెకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమైతే పెళ్లికి చిక్కులు వస్తాయేమోనని వారి ఆందోళన. కాని నిషాకు ఎలాగైనా ఒలింపిక్స్లో ఆడాలని పట్టుదల. ‘ఒలింపిక్స్లో ఆడేంత వరకూ నన్ను వదిలేయండమ్మా’ అని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబం మంచి చెడ్డలు చూసుకుంటానని మేనమామ హామీ ఇచ్చాక పూర్తిగా ఆట మీదే ధ్యాస పెట్టింది. ఆమె గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్లడమే లేదు. హాకీ సాధనలో, ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రయినింగ్ క్యాంప్లో ఉండిపోయింది. చివరకు ఆస్ట్రేలియా మీద గెలిచాక సగర్వంగా ఇంటికి ఫోన్ చేసింది. అవును.. ఆడపిల్లే గొప్ప ఒకప్పుడు ఆడపిల్ల అని తక్కువ చూసి బంధువులు, అయినవారే ఇప్పుడు నిషాలోని గొప్పతనం అంగీకరిస్తున్నారు. ప్రతిభకు, ఆటకు, కుటుంబానికి, జీవితానికి కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమానమే అని భావన తన సమూహంలో చాలా బలంగా ఇప్పుడు నిషా తీసుకెళ్లగలిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్ కొట్టడమే అసలైన ప్రతిభ. తాను అలాంటి గోల్ కొట్టి ఇవాళ హర్షధ్వానాలు అందుకుంటోంది నిషా. -
విషాదం: ఒకేరోజు అటు రవీందర్ పాల్... ఇటు కౌశిక్
న్యూఢిల్లీ: భారత హాకీలో విషాదం. కరోనా కారణంగా శనివారం ఒకే రోజు ఇద్దరు మాజీ స్టార్ క్రీడాకారులు తుది శ్వాస విడిచారు. కోవిడ్–19కు చికిత్స పొందుతూ కోలుకోలేకపోయిన రవీందర్ పాల్ సింగ్ (61) లక్నోలో... ఎంకే కౌశిక్ (66) ఢిల్లీలో కన్ను మూశారు. కౌశిక్కు భార్య, ఒక కుమారుడు ఉండగా... రవీందర్ పాల్ అవివాహితుడు. 1980 మాస్కో ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణపతకం గెలిచింది. రవీందర్ పాల్, కౌశిక్లు ఈ జట్టులో సభ్యులు కావడం విశేషం. ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి పట్ల హాకీ ఇండియా (హెచ్ఐ) సంతాపం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ స్వర్ణ పతకం సాధించిన ఆటగాళ్లుగా వారిద్దరూ భారత హాకీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారని హెచ్ఐ అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోంబామ్ శ్రద్ధాంజలి ఘటించారు. కౌశిక్: ఆటగాడిగానే కాకుండా కోచ్గా కూడా కౌశిక్ భారత హాకీపై తనదైన ముద్ర వేశాడు. ఆయన శిక్షణలో భారత పురుషుల జట్టు 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకోగా... భారత మహిళల జట్టు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. కౌశిక్ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా అర్జున, ఆపై ‘ద్రోణాచార్య’ పురస్కారాలతో సత్కరించింది. రవీందర్ పాల్: 1979 జూనియర్ ప్రపంచకప్లో సభ్యుడి నుంచి సీనియర్ టీమ్కు వెళ్లిన రవీందర్ పాల్ 1984 వరకు సెంటర్ హాఫ్గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో కూడా పాల్గొన్న అతను 1982 ఆసియా కప్లో, రెండు చాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. -
భారత హాకీ దిగ్గజం బల్బీర్ కన్నుమూత
మొహాలీ : భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్(95) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి డైరెక్టర్ అభిజిత్ సింగ్ వెల్లడించారు. మే 8న హాస్పిటల్లో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. గతంలో కూడా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన మూడు నెలలకుపైగా హాస్పిటల్లోనే ఉన్నారు. 1948, 1952, 1956 ఒలింపిక్స్లలో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు సాధించడంలో బల్బీర్ కీలక పాత్ర పోషించారు. 1975లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టుకు ఆయన కోచ్గా, మేనేజర్గా వ్యవహించారు. ఒలింపిక్స్లో పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఆయన పేరిట ఉన్న రికార్డును ఇప్పటివరకు ఎవరు అధిగమించలేదు. 1952 ఒలింపిక్స్లో భారత్ 6-1తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించగా.. అందులో 5 గోల్స్ బల్బీర్ చేసినవే. బల్బీర్ తన కెరీర్లో 61 అంతర్జాతీయ క్యాప్స్తో పాటుగా.. 246 గోల్స్ సాధించాడు. భారత హాకీకి బల్బీర్ చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన సేవలకు గుర్తుగా హాకీ ఇండియా.. 2015లో మేజర్ ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. -
భారత హాకీ జట్ల జోరు
టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ముందు నిర్మించిన స్టేడియంలో టెస్ట్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఇందులో భారత హాకీ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన పోరులో పురుషుల జట్టు ఏకంగా అరడజను గోల్స్తో హోరెత్తించింది. దీంతో భారత్ 6–3 గోల్స్తో ఆతిథ్య జపాన్ను కంగుతినిపించి ఫైనల్ బెర్తు కొట్టేసింది. స్ట్రయికర్ మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగాడు. మన్దీప్ 9, 29, 30 నిమిషాల్లో మూడు గోల్స్ చేశాడు. మిగతా వారిలో నీలకంఠ శర్మ (3వ ని.), నీలమ్ సంజీప్ (7వ ని.), గుర్జంత్ సింగ్ (41వ ని.) తలా ఒక గోల్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ ఆడుతుంది. ‘డ్రా’తో ఫైనల్కు... భారత మహిళల జట్టు చైనాతో ‘డ్రా’ చేసుకొని ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్లో ఒక్క గోల్ అయినా నమోదు కాలేదు. ఈ ఫలితంతో భారత మహిళల జట్టు పాయింట్ల పట్టికలో 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో ఆతిథ్య జపాన్తో తలపడుతుంది. -
భారత్ గర్జన
భువనేశ్వర్: తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు గర్జించింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను 7–2 గోల్స్ తేడాతో ఓడించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున రమణ్దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... హార్దిక్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, వివేక్ ప్రసాద్, గురుసాహిబ్జిత్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టు తరఫున కెంజి కిటజాటో, కొటా వతనాబె గోల్స్ చేశారు. జపాన్పై విజయంతో భారత్ ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్కు బెర్త్ను ఖరారు చేసుకుంది. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 2–1తో అమెరికాను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్తో అమీతుమీకి సిద్ధమైంది. భారత్తోపాటు దక్షిణాఫ్రికా కూడా టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్త్ను దక్కించుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే దూకుడును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. తొలి క్వార్టర్లో జపాన్ నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఆట రెండో నిమిషంలోనే కెంజి కిటజాటో గోల్తో జపాన్ ఖాతా తెరిచింది. ఈ షాక్ నుంచి భారత్ వెంటనే తేరుకుంది. ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 14వ నిమిషంలో వరుణ్ కుమార్ మరో పెనాల్టీ కార్నర్ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో కొటా వతనాబె గోల్తో జపాన్ స్కోరును 2–2తో సమం చేసింది. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 4–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి పది నిమిషాల వ్యవధిలో మరో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 7–2కు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత హాకీ కోచ్గా గ్రాహం రీడ్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజం గ్రాహం రీడ్ భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్గా ఎంపికయ్యారు. ఆయన 2020 ముగిసే వరకు కోచ్ పదవిలో ఉంటారని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం అనంతరం హరేంద్ర సింగ్ను అనూహ్యంగా తప్పించిన తర్వాత కోచ్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు రీడ్ ఆ స్థానంలో బాధ్యతలు చేపడతారు. గత నెలలోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) భారత కోచ్గా ఆయన పేరును సిఫారసు చేసింది. రీడ్కు నెలకు 15 వేల డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు) వేతనంగా లభిస్తుంది. కుటుంబంతో సహా స్థిరపడిపోయి బెంగళూరు ‘సాయ్’ సెంటర్ కేంద్రంగా ఆయన పని చేయనున్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరం కోసం 60 మంది ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తే రీడ్ కాంట్రాక్ట్ను 2022 ప్రపంచ కప్ వరకు పెంచే అవకాశం కూడా ఉంది. ఘనమైన రికార్డు... క్వీన్స్లాండ్కు చెందిన 54 ఏళ్ల గ్రాహం రీడ్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు. నాలుగు సార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్లో కూడా ఆయన భాగంగా ఉన్నారు. డిఫెండర్, మిడ్ఫీల్డర్గా 130 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రీడ్ 36 గోల్స్ చేశారు. 2009లో కోచింగ్లో అడుగు పెట్టిన ఆయన 2014లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ నంబర్వన్ కావడంలో కీలక పాత్ర పోషించారు. గత ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన నెదర్లాండ్స్ టీమ్కు కూడా రీడ్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించారు. ‘భారత హాకీ జట్టు చీఫ్ కోచ్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. హాకీలో భారత్కు ఉన్నంత గొప్ప చరిత్ర మరే దేశానికి లేదు. చాలా కాలంగా భారత హాకీని దగ్గరినుంచి చూశాను. నాతో పాటు ఆటగాళ్లకు కూడా సానుకూల వాతావరణం ఉండేలా చేయడం నా పని. చాలా దూరంలో ఉన్న ఒలింపిక్స్, వరల్డ్ కప్లకంటే కూడా త్వరలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెడతా. భారత హాకీ కోచ్ బాధ్యత చాలా ఒత్తిడితో కూడుకున్నదని నేనూ విన్నా. కానీ దానిని పట్టించుకోను’ –గ్రాహం రీడ్ -
భారత్ షూటౌట్
ఇపో (మలేసియా): చివరి నిమిషాల్లో గోల్ ఇచ్చుకోవడం...ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్లో విఫలం కావడం...ఇటీవల భారత హాకీ జట్టు పరాజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. శనివారం అజ్లాన్ షా టోర్నీ ఫైనల్లో కూడా ఇదే తరహాలో భారత్ ఓడింది. తుది పోరులో కొరియా 4–2 తేడాతో (షూటౌట్లో) ఐదు సార్లు చాంపియన్ భారత్పై విజయం సాధించి సగర్వంగా టైటిల్ సొంతం చేసుకుంది. 9వ నిమిషంలోనే సిమ్రన్జిత్ సింగ్ చేసిన ఫీల్డ్ గోల్తో భారత్ 1–0తో ముందంజ వేసింది. మూడు క్వార్టర్ల పాటు మన జట్టు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే నాలుగో క్వార్టర్ ప్రారంభం కాగానే (47వ నిమిషంలో) కొరియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. భారత్ వీడియో రిఫరల్కు వెళ్లినా ఫలితం దక్కలేదు. జంగ్ జోంగ్ హ్యూన్ దీనిని గోల్గా మలచి స్కోరు సమం చేశాడు. చివర్లో పెనాల్టీ అవకాశం దక్కినా భారత్ దానిని ఉపయోగించుకోలేకపోయింది. షూటౌట్లో భారత్ తరఫున బీరేంద్ర లక్డా, వరుణ్ కుమార్ గోల్స్ నమోదు చేయగా... మన్దీప్ సింగ్, సుమీత్, సుమీర్ కుమార్ జూనియర్ గోల్ చేయడంలో విఫలమయ్యారు. వర్గీకరణ మ్యాచ్లో కెనడాను 4–2తో ఓడించి ఆతిథ్య మలేసియా మూడో స్థానంలో నిలిచింది. -
కుర్రాళ్లతో ‘అజ్లాన్ షా’ టోర్నీకి భారత్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) బుధవారం ప్రకటించింది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కాగా 18 మంది సభ్యుల జట్టులో కుర్రాళ్లకు చోటు దక్కింది. మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. డిఫెండర్ సురేందర్ కుమార్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మలేసియాలోని ఐపోలో ఈ నెల 23 నుంచి 30 వరకు అజ్లాన్ షా హాకీ టోర్నీ జరుగుతుంది. భారత్, ఆతిథ్య మలేసియాతో పాటు కెనడా, కొరియా, దక్షిణాఫ్రికా, జపాన్ జట్లు ఇందులో తలపడతాయి. 23న భారత్ తమ తొలి మ్యాచ్లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్తో ఆడనుంది. అనుభవజ్ఞులైన ఫార్వర్డ్ ఆటగాళ్లు సునీల్, ఆకాశ్దీప్ సింగ్, రమణ్దీప్ సింగ్, లలిత్ ఉపా«ధ్యాయ్లతో పాటు డిఫెండర్లు రూపిందర్ పాల్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, మిడ్ఫీల్డర్ చింగ్లేసన సింగ్లు గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. వీళ్లందరికీ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) సెంటర్లో పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఐ ప్రకటించింది. ఈ నెల 18న భారత హాకీ జట్టు మలేసియాకు బయల్దేరుతుంది. భారత హాకీ జట్టు: మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), సురేందర్ (వైస్ కెప్టెన్), శ్రీజేశ్ (గోల్ కీపర్), క్రిషన్ పాఠక్, గురీందర్ సింగ్, వరుణ్ కుమార్, బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్, కొతాజిత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, సుమీత్, వివేక్ సాగర్ ప్రసాద్, మన్దీప్ సింగ్, సిమ్రాన్జిత్ సింగ్, గుర్జంత్ సింగ్, శిలానంద్ లక్రా, సుమిత్ కుమార్. -
రన్నరప్ భారత్
జొహర్ బారు (మలేసియా): ఆరంభంలోనే దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయిన భారత యువ హాకీ జట్టు... సుల్తాన్ జొహర్ కప్ అండర్–18 టోర్నీలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. నాలుగో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి విష్ణుకాంత్ సింగ్ టీమిండియాకు ఆధిక్యం అందించాడు. అయితే, డానియెల్ వెస్ట్ 7వ నిమిషంలో ఫీల్డ్ గోల్తో బ్రిటన్ స్కోరు సమం చేసింది. పోటాపోటీగా సాగిన రెండో భాగంలో మరో గోల్ నమోదు కాలేదు. మూడో భాగంలో జేమ్స్ ఓట్స్ (39వ ని., 42వ ని.) విజృంభణతో బ్రిటన్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. తర్వాత భారత్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 55వ నిమిషంలో అభిషేక్ గోల్ చేసినా అది స్కోరు అంతరం తగ్గించడానికే ఉపయోగపడింది. -
హాకీకి సర్దార్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత హాకీలో మరో స్టార్ ప్లేయర్ శకం ముగిసింది. 12 ఏళ్లుగా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సర్దార్ సింగ్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. కొత్త కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏళ్ల ఈ హరియాణా ప్లేయర్ వివరించాడు. హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సర్దార్ 2006లో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 307 మ్యాచ్ల్లో భారత్ తరఫున బరిలోకి దిగాడు. మిడ్ ఫీల్డ్లో పాదరసంలా కదులుతూ... ఆటను నియంత్రిస్తూ... ఫార్వర్డ్ ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశాలు సృష్టిస్తూ... ప్రత్యర్థి ఆటగాళ్ల దాడులను మధ్యలోనే తుంచేస్తూ... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2008 నుంచి 2016 వరకు భారత్కు కెప్టెన్ వ్యవహరించాడు. ‘ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ హాకీ ఆడుతున్నా. ఇప్పుడు సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికి... కుర్రాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నా. కుటుంబ సభ్యులు, హాకీ ఇండియా, మిత్రులతో చర్చించాకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నా’ అని సర్దార్ వివరించాడు. ‘నా నిర్ణయానికి ఫిట్నెస్ సమస్య కాదు. మరో మూడేళ్లు ఆడే ఫిట్నెస్ నాలో ఉంది. ప్రతి దానికి సమయం అంటూ ఉంటుంది కదా. హాకీకి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని భావించా’ అని సర్దార్ వివరించాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్లో ఆడిన సర్దార్కు 2012లో ‘అర్జున’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. అంతర్జాతీయ హాకీకి గుడ్బై చెప్పినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడతానని... 2010, 2018 ఏషియాడ్లో కాంస్యం, 2014 ఏషియాడ్లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడైన సర్దార్ వివరించాడు. -
బంగ్లాతో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: యూత్ ఒలింపిక్స్ బరిలో దిగనున్న భారత హాకీ అండర్–18 జట్ల షెడ్యూల్ ఖరారైంది. అర్జెంటీనాలో జరిగే ఈ క్రీడల్లో అక్టోబర్ 7న పురుషుల జట్టు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో... మహిళల జట్టు ఆస్ట్రియాతో ఆడతాయి. పూల్ ‘బి’లో పురుషుల జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రియాతో, 9న కెన్యాతో, 10న ఆస్ట్రేలియాతో, 11న కెనడాతో ఆడనుంది. మహిళల బృందం పూల్ ‘ఎ’లో అక్టోబర్ 8న ఉరుగ్వేతో, 9న వనుతుతో, 10న అర్జెంటీనాతో, 11న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. హాకీ–5 ఫార్మాట్లో జరిగే ఈ పోటీల్లో ఐదుగురే బరిలోకి దిగుతారు. -
ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే!
(ఇఫో) మలేసియా: ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చడమే తమ ముందున్న లక్ష్యమని... ప్రత్యర్థి, పూల్లతో సంబంధం లేకుండా ముందుకు సాగడమే ముఖ్యమని భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ జోయర్డ్ మరీనే అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్ హాకీ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కోచ్ మరీనే మాట్లాడుతూ... ‘ప్రతి జట్టు గెలవాలనే ఈ మెగా టోర్నీకి వస్తుంది. అందువల్ల మన జట్టుకు సులువైన ‘డ్రా’ లభించిందా... కఠినమైనదా అనేదానితో సంబంధం లేకుండా ప్రత్యర్థులను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ర్యాంకింగ్స్తో పనిలేదు. టైటిల్ నెగ్గాలంటే ఉత్తమ ప్రతిభ కనబర్చాల్సిందే. నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆడాల్సిందే. దాని కోసం ఆటగాళ్లను శారీరకంగా మానసి కంగా సిద్ధంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. -
ధ్యాన్చంద్ను క్యూలో నిలబెట్టారు
కోల్కతా: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్. తన అసాధారణ ఆటతీరుతో జర్మనీ నియంత హిట్లర్నే మెప్పించిన ఈ అలనాటి స్టార్ ఒలింపిక్స్లో స్వర్ణ చరిత్ర లిఖించారు. ఇప్పుడైతే వేనోళ్ల స్తుతిస్తున్నారు... ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కానీ... ఆయన కెరీర్ ముగియగానే దిక్కుమాలిన రాజకీయాలతో ఘోరంగా అవమానించారని భారత హాకీ మాజీ కెప్టెన్ గుర్బక్ష సింగ్ తన ఆత్మకథ ‘మై గోల్డెన్ డేస్’లో పేర్కొన్నారు. ధ్యాన్చంద్ ఆట చూసేందుకు క్యూ కట్టిన రోజులున్నాయి. అయితే 1962లో ఆయన్నే క్యూలో నిలబెట్టిన ఘనత మన కుటిల రాజకీయాలది అని గుర్బర్ సింగ్ తన బాధని వెళ్లగక్కారు. 1960 నుంచి 1970 వరకు క్రీడల వ్యవహారాలు నీచ రాజకీయాలతో మసకబారాయి. పాటియాలాలోని జాతీయ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఐఎస్), భారత హాకీ సమాఖ్యకు అప్పట్లో అసలు పొసిగేదే కాదు. ఆ సమయంలో ధ్యాన్చంద్ ఎన్ఐఎస్ చీఫ్ కోచ్గా పని చేశారు. తన వద్ద శిక్షణ పొందిన ఆటగాళ్లు తదనంతరం అహ్మదాబాద్లో మ్యాచ్లు ఆడుతుండగా... అక్కడికి వెళ్లిన ధ్యాన్చంద్ను స్టేడియంలోకి అనుమతించలేదు. అయితే ధ్యాన్చంద్ మాత్రం తన కుర్రాళ్ల ప్రదర్శన చూడాలన్న తాపత్రయంతో ప్రతీ మ్యాచ్ కోసం క్యూలో నిలబడి టికెట్ కొనుక్కొని మరీ చూశారు. ఇది అత్యంత శోచనీయమని గుర్బక్ష తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు. -
రన్నరప్ భారత్
తౌరంగ (న్యూజిలాండ్): టైటిల్ పోరులో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. బెల్జియంతో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా 1–2 గోల్స్తో ఓడిపోయింది. దీంతో నాలుగు దేశాల ఇన్విటేషనల్ తొలి అంచె టోర్నీలో భారత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను మన్దీప్ సింగ్ 19వ నిమిషంలో సాధించగా... టామ్ బూన్ (4వ ని.),డాకియెర్ (36వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను గెలిపించారు. నాలుగో నిమిషంలోనే బెల్జియం సఫలమైంది. బూన్ చేసిన గోల్తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత రెండో క్వార్టర్లో భారత్కు మన్దీప్ గోల్ సాధించిపెట్టాడు. దీంతో 1–1తో స్కోరు సమమైంది. అయితే మూడో క్వార్టర్ మొదలైన ఆరు నిమిషాలకే డాకియెర్ చేసిన గోల్తో మళ్లీ బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకుంది. రెండో అంచె టోర్నీ ఈనెల 24న మొదలవుతుంది. -
భారత యువ జట్టుకు కాంస్యం
న్యూఢిల్లీ: సుల్తాన్ జోహర్ కప్ అంతర్జాతీయ అండర్–21 హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మలేసియాలోని జోహర్ బాహ్రులో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4–0తో మలేసియాను ఓడించింది. భారత్ తరఫున విశాల్ రెండు గోల్స్ చేయగా... వివేక్ ప్రసాద్, శైలానంద్ లాక్రా ఒక్కో గోల్ సాధించారు. -
భారత్ అదరహో...
►15 ఏళ్ల తర్వాత ఫైనల్కు అర్హత ►సెమీస్లో షూటౌట్లో ఆస్ట్రేలియాపై గెలుపు ►రేపు బెల్జియంతో టైటిల్ పోరు ►జూనియర్ ప్రపంచకప్ హాకీ సొంతగడ్డపై మూడేళ్ల క్రితం ఎదురైన నిరాశను మరిపించేలా భారత హాకీ యువ ఆటగాళ్లు మెరిశారు. జూనియర్ ప్రపంచకప్లో అంతిమ సమరానికి అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షూటౌట్లో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో 15 ఏళ్ల తర్వాత టైటిల్ పోరుకు చేరుకున్నారు. బెల్జియంతో ఆదివారం జరిగే ఫైనల్లోనూ గెలిచి 15 ఏళ్ల ప్రపంచకప్ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నారు. లక్నో: జాతీయ క్రీడ మళ్లీ జిగేల్మంది. సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో టైటిల్కు మరో విజయం దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 4–2తో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించారు. ఆదివారం జరిగే ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో బెల్జియం ‘షూటౌట్’లో 4–3తో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. భారత్ చివరిసారి 2001లో టైటిల్ను సాధించింది. 2013లో స్వదేశంలోనే జరిగిన ప్రపంచకప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి షూటౌట్ను నిర్వహించారు. షూటౌట్లో గోల్కీపర్ వికాస్ దహియా ఆస్ట్రేలియా ఆటగాళ్ల రెండు షాట్స్ను నిలువరించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. భారత్ తరఫున హర్జీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, సుమీత్, మన్ప్రీత్ జూనియర్ సఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్, జాక్ వెల్చ్ గోల్స్ చేయగా... మాథ్యూ బర్డ్, షార్ప్ లాచ్లన్ కొట్టిన షాట్లను భారత గోల్కీపర్ వికాస్ దహియా అడ్డుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో భారత్ ఐదో షాట్ను తీసుకోలేదు. రెగ్యులర్ సమయంలో ఆట 14వ నిమిషంలో టామ్ క్రెయిగ్ గోల్తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 42వ నిమిషంలో గుర్జంత్ సింగ్ గోల్తో భారత్ స్కోరును సమం చేసింది. 48వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్తో భారత్ 2–1తో ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే 57వ నిమిషంలో షార్ప్ లాచ్లన్ గోల్తో ఆసీస్ స్కోరును 2–2తో సమం చేసింది. అనంతరం తర్వాత 13 నిమిషాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడానికి తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. -
రీతూ..గుడ్ బై
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్ ముందు భారత మహిళ హాకీ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ హాకీకి గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని రీతూ మెయిల్ ద్వారా వెల్లడించినట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బత్రా తెలిపారు. 'రెండు రోజుల క్రితం జాతీయ హాకీ శిబిరంలో పాల్గొనడం లేదని రీతూ పేర్కొంది. దాంతో పాటు అంతర్జాతీయ హాకీ నుంచి వీడ్కోలు చెబుతున్న విషయాన్ని కూడా ఆ మెయిల్ స్పష్టం చేసింది. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. భారత హాకీ జట్టుకు సేవలందించిన రీతూ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం' అని బత్రా పేర్కొన్నారు. గత రెండు నెలల క్రితం రీతూను అటు కెప్టెన్గా, ఇటు క్రీడాకారిణిగా జట్టు నుంచి తొలగిస్తూ హాకీ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే రీతూ ఆవేదన వ్యక్తం చెందింది. తనపై వివక్ష చూపించి జట్టు నుంచి తొలగించారంటూ కన్నీటి పర్యంతమైంది. -
భారత హాకీ మాంత్రికుడు ఇకలేడు
-
'మన బంగారం' మెరుస్తుందా!
ఒకప్పుడు ఒలింపిక్స్లో హాకీ స్టిక్ మనం చెప్పినట్లుగా ఆడింది... మైదానంలో ఏ మూలనుంచి కొట్టినా గోల్ పోస్ట్ వైపే బంతి పరుగులు తీసింది. మంత్ర దండం అనండి, మ్యాజిక్ అనుకోండి... ఏదైనా మన మార్క్ మాత్రం గట్టిగా ముద్రించుకు పోయింది. జట్టులో ప్రతీ ఒక్కరూ దిగ్గజమే. ఒకరినుంచి మరొకరు చెలరేగి పోతుంటే భారత్ను హాకీలో ఆపడం వృథా ప్రయత్నం అనుకున్న ప్రత్యర్థులు అప్పట్లో రెండో స్థానం కోసమే పోటీ పడటంతోనే సరిపెట్టేశారు. ఇప్పటికీ ఏ దేశానికి సాధ్యం కాని విధంగా ఒలింపిక్స్లో భారత్కు ఏకంగా ఎనిమిది స్వర్ణాలు లభించాయి. కానీ ఇప్పుడు... ఒలింపిక్స్లో పతకం కళ్ల చూసి మూడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. మాస్కో పోటీల్లో స్వర్ణం తర్వాత దిగజారడం మొదలు పెట్టిన మన హాకీ అంతకంతకు పతనం దిశగా పయనించింది. సాంప్రదాయ శైలిని ఒక్కసారిగా వీడలేక, ఆధునిక ఆటను అందుకోలేక నలిగి పోవడంతో హాకీ కథ వ్యథగా మారి పోయింది. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. * ఆశలు రేపుతున్న భారత హాకీ * పతకం సాధించేందుకు అవకాశాలు * గతంలో ఎనిమిది స్వర్ణాలు నెగ్గిన రికార్డు భారత అభిమాని ఇప్పుడు మరో సారి హాకీ జట్టు వైపు ఆశగా చూస్తున్నాడు. గత లండన్ ఒలింపిక్స్లో మరీ ఘోరంగా 12వ స్థానంలో నిలిచిన పరాభవం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే ఆ తర్వాత జట్టు ఆట అందరిలో కాస్త నమ్మకాన్ని పెంచుతోంది. 2012, 2014 చాంపియన్స్ ట్రోఫీలలో నాలుగో స్థానం, ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు సుల్తాన్ అజ్లాన్షా టోర్నీలో వరుసగా రెండు సార్లు మెరుగైన ప్రదర్శనతో జట్టు కాస్త దారిలోకి వచ్చినట్లు కనిపించింది. కొత్త కోచ్ ఓల్ట్స్మన్ నేతృత్వంలో ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకం గెలుచుకోవడం కీలక పరిణామం. ఈ గెలుపుతో మన టీమ్పై అంచనాలు పెరిగాయి. మరి ఒలింపిక్స్లో ఈ ఫలితం జట్టు పునరావృతం చేస్తుందా అనేది ఆసక్తికరం. గతమెంతో ఘనం... 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో భారత జట్టు తొలి సారిగా స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో ధ్యాన్చంద్ చేసిన మూడు గోల్స్ కారణంగా 3-0తో నెదర్లాండ్స్ను చిత్తు చేసి తమ జైత్ర యాత్ర మొదలు పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సార్లు స్వర్ణం నెగ్గిన జట్టు... స్వాతంత్య్రానంతరం మువ్వన్నెల జెండా కింద మరో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకుంది. దీంతో మరొకరికి అవకాశం ఇవ్వకుండా వరుసగా ఆరు స్వర్ణాలు మన ఖాతాలో చేరాయి. తర్వాతి ఒలింపిక్స్లో రజతానికే పరిమితమై 1964లో మరో గోల్డ్ కొట్టింది. అనంతరం జరిగిన మూడు ఒలింపిక్స్లలో రెండు కాంస్యాలు మాత్రమే జట్టుకు లభించాయి. అయితే 1980 మాస్కో ఒలింపిక్స్ మరో సారి మన బంగారు దశను గుర్తుకు తెచ్చాయి. భాస్కరన్, జఫర్ ఇక్బాల్, మొహమ్మద్ షాహిద్, రాజీందర్ సింగ్లతో కూడిన మన జట్టు స్పెయిన్ను చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాతి తరంలో పర్గత్ సింగ్, ధన్రాజ్ పిళ్లై, ముకేశ్ కుమార్, జూడ్ ఫెలిక్స్, దిలీప్ తిర్కీ తదితరులు హాకీలో సుదీర్ఘ కాలం తమ ముద్ర చూపించినా వారికి, భారత్కు ఒలింపిక్ పతకం కలగానే మిగిలింది. ఉత్సాహంగా జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడినా... ఇంత నిలకడగా మ్యాచ్ ఆసాంతం ఆడటం నేనెప్పుడూ చూడలేదు. ఇది నాకు పతకంపై ఆశలు రేపుతోంది... హాకీ దిగ్గజం ధన్రాజ్ పిళ్లై పరిశీలన ఇది. చాలా రోజుల తర్వాత మన జాతీయ జట్టు కోచ్పై కూడా ఏకాభిప్రాయంతో ప్రశంసలు కురిశాయి. జట్టు డిఫెన్స్, మిడ్ ఫీల్డ్ ఎంతో మెరుగైంది. ఫార్వర్డ్ విభాగంలో మరింత చురుకుదనం కావాల్సి ఉన్నా... బలమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థిని అడ్డుకోగల సామర్థ్యం జట్టుకు ఉంది. కెప్టెన్సీకి దూరమైన సర్దార్ సింగ్ ఆటలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. వేగం పెంచిన అతను ప్రత్యర్థి 25 యార్డ్ సర్కిల్లోకి దూసుకెళ్లి అవకాశాలు సృష్టిస్తున్నాడు. ఇక పెట్టని కోటలా గోల్కీపర్ శ్రీజేశ్ కీలక సమయంలో భారత్ను ఆదుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీతో అతనిపై బాధ్యత మరింత పెరిగింది. మొత్తంగా మన ఆటగాళ్లు గతంతో పోలిస్తే దూకుడు పెంచారు. ఆత్మవిశ్వాసం తో బరిలోకి దిగుతున్న జట్టు పతకంతో తిరిగి రావాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. అమ్మాయిలు ఏం చేస్తారో..! ఒలింపిక్స్లో తొలి సారి మహిళల హాకీని 1980లో ప్రవేశ పెట్టారు. నాడు బరిలోకి దిగిన భారత్ రౌండ్ రాబిన్ తరహాలో జరిగిన పోటీల్లో ఐదు మ్యాచ్లలో 2 గెలిచి 2 ఓడింది. మరో మ్యాచ్ డ్రా అయింది. మొత్తంగా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం కోల్పోయింది. ఆ తర్వాతి ఒలింపిక్స్లో ఒక్కసారి కూడా మన మహిళా జట్టు అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం వచ్చింది. హాకీ వరల్డ్ లీగ్లో ఐదో స్థానంలో నిలిచిన అనంతరం జట్టు రియోకు క్వాలిఫై అయింది. జట్టు సభ్యులంతా తొలి సారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఒత్తిడిని తట్టుకొని ఎలా ఆడగలరో చూడాలి. పతకంపై పెద్దగా ఆశలు లేకున్నా... సంచలనం సృష్టించే సత్తా ఉంది. 36 పురుషుల జట్టు ఒలింపిక్స్లో పతకం సాధించి 36 ఏళ్లు అయింది. మహిళల జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించి 36 ఏళ్లు అయింది. -
భారత మహిళల గోల్స్ వర్షం
గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు బ్రహ్మాండమైన విజయంతో టోర్నీని ఆరంభించింది. ఆదివారం నేపాల్ తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో భారత్ గోల్స్ వర్షం కురిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 గోల్స్ సాధించి నేపాల్ కు చుక్కలు చూపించింది. అదే క్రమంలో నేపాల్కు ఒక్క గోల్ కూడా సమర్పించుకోని భారత్ పరిపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. భారత అటాకింగ్ కు ఏ దశలోనూ పోటీనివ్వని నేపాల్ పూర్తిగా తేలిపోయి ఘోర ఓటమిని చవిచూసింది. భారత మహిళల్లో సౌందర్య యెండాల(15వ 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బర్లా(7వ, 42వ, 43వ, 51వ నిమిషాల్లో) నాలుగేసి గోల్స్ తో రాణించగా, రాణి(2వ, 46వ, 48వ నిమిషాల్లో), జస్పరిత్ కౌర్ (4వ, 35వ, 56వ నిమిషాల్లో) , నేహా గోయల్(14వ,22వ, 70వ నిమిషాల్లో), దీపిక(53వ, 62వ, 67వ నిమిషాల్లో) మూడేసి గోల్స్ చొప్పున నమోదు చేశారు. మరోవైపు గుర్జిత్ కౌర్(21వ 41వ నిమిషాల్లో), ప్రీతి దుబే(23వ, 29వ నిమిషాల్లో)లు చెరో రెండు గోల్స్ సాధించి విజయంలో భారీ విజయంలో పాలు పంచుకున్నారు. భారత హాకీ జట్టు తమ తదుపరి మ్యాచ్ ను సోమవారం శ్రీలంకతో ఆడనుంది. -
న్యూజిలాండ్ పై భారత్ గెలుపు
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన మూడో టెస్టులో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ 3-2 తేడాతో విజయం సాధించింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యం సంపాదించింది. ఆట మొదలైన పదో నిమిషంలో రూపేందర్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచి భారత్ ను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. భారత తొలి గోల్ ఆధిక్యం 52వ నిమిషం వరకూ కొనసాగగా, న్యూజిలాండ్ ఆటగాడు స్టీవ్ ఎడ్వర్డ్స్ అద్భుతమైన గోల్ ను వేసి స్కోరును సమం చేశాడు. ఆ తరువాత రమన్ దీప్ సింగ్ గోల్ సాధించి జట్టును తిరిగి ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. మ్యాచ్ మరో 40 నిమిషాల్లో ముగుస్తుందనగా భారత ఆటగాడు ధర్మవీర్ సింగ్ మరో గోల్ ను నమోదు చేశాడు. దీంతో న్యూజిలాండ్ ఇక తిరిగి తేరుకోలేక పోవడంతో భారత్ కు విజయం దక్కింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ గెలవగా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది.చివరిదైన నాల్గో టెస్టు ఆదివారం జరుగనుంది. -
ప్రపంచ లీగ్ కోసం సెప్టెంబర్ 5 నుంచి కసరత్తు
ప్రపంచ లీగ్లో పాల్గొననున్న ఇండియన్ పురుషుల హాకీ జట్టు సెప్టెంబర్ 5 నుంచి కసరత్తు ప్రారంభించనుంది. ఇక్కడి మేజర్ ధ్యాన్చంద్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో సెప్టెంబర్ 29 వరకూ ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నట్లు హాకీ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ క్యాంప్ కోసం 26 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. నవంబర్ 27 నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరగనున్న ప్రపంచ హాకీ లీగ్ లో ఫైనల్స్లోకి చేరడమే లక్ష్యంగా ఈ క్యాంప్ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఇటీవల యూరప్ టూర్లో ఫ్రాన్స్, స్పెయిన్పై అద్భుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకుందని భారత హాకీ కోచ్ తెలిపాడు. ఈ టూర్ లో ఆటగాళ్లు యూరోపియన్ శైలిపై అనుభవం గడించారన్నారు. రియో ఒలింపిక్స్ ముందు భారత ఆటగాళ్ల బలాబలాలు తేల్చుకునేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచ హాకీ లీగ్లో ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
కోచ్లతో ఆటలా..!
ఏ ఆటైనా ఆడించడం కోచ్ పని... నిర్వహించడం పరిపాలకుడి పని. కోచ్ పనిలో పరిపాలకుడు వేలుపెడితే నష్టమే ఎక్కువ. ఈ చిన్న విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు మరచిపోయారు. తన నియంతృత్వ ఆలోచనా విధానంతో కోచ్ను తప్పించారు. మొత్తం దేశంలో హాకీ అంతా తన చేతుల్లోనే ఉండాలనే ఆలోచనతో ఆయన మరోసారి గిల్ను గుర్తుకు తెచ్చారు. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన పరిపాలకులు... తమ అహం కోసం కోచ్లను తప్పిస్తూ వాళ్లతో ఆటలాడుతున్నారు. సమయం ఇవ్వకుండానే సాగనంపుతున్నారు ఇప్పటికి ఆరుగురు విదేశీ కోచ్లపై వేటు వచ్చే ఏడాదే రియో ఒలింపిక్స్ సాక్షి క్రీడావిభాగం ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ కచ్చితంగా ఎవరూ చెప్పలేరని అంటారు. అలాగే భారత హాకీలో కొత్త కోచ్ ఎప్పుడు వస్తాడో, ఎంత కాలం ఉంటాడో, ఎందుకు వెళ్లిపోతాడో కూడా అంచనా వేయలేని పరిస్థితి. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం కేపీఎస్ గిల్ హయాంలో స్వదేశీ, విదేశీ అని లేకుండా ‘కోచ్లతో కుర్చీలాట’ మొదలైంది. సమాఖ్య పేరు మారినా, అధికారం బదలాయింపు జరిగినా కోచ్లతో గిల్లీకజ్జాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ హాకీని ఏలిన భారత్ నేడు తమ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన వారే ఈ ఆటతో ఆటలాడుకుంటున్నారు. తమ పెత్తనమే ఉండాలని కోరుకుంటూ, పట్టుదలకు పోయి ఆటకు అన్యాయం చేస్తున్నారు. రాచ్ నుంచి పాల్ వరకు... రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ఒలింపిక్ స్వర్ణాలు నెగ్గిన భారత్కు తొలిసారి 2004లో గెరార్డ్ రాచ్ (జర్మనీ) రూపంలో విదేశీ కోచ్ వచ్చారు. అయితే ఏథెన్స్ ఒలింపిక్స్లో, చాంపియన్స్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శన కారణంగా ఆయనపై అదే ఏడాది వేటు వేశారు. ఆ తర్వాత వచ్చిన విదేశీ కోచ్లు కూడా రావడం, బాధ్యత తీసుకోవడం, కొన్నాళ్లు ఉండటం ఆ తర్వాత వెళ్లిపోవడం జరుగుతోంది. తాజాగా నెదర్లాండ్స్కు చెందిన పాల్ వాన్ యాస్ విషయంలోనూ ఇదే జరిగింది. 2018 ప్రపంచ కప్ వరకు ఆయనను భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్గా ఈ ఫిబ్రవరిలో నియమించారు. ఆరు నెలలు కూడా గడవకముందే ఆయనపై వేటు వేశారు. నాడు గిల్... నేడు బాత్రా పంజాబ్ ‘సూపర్కాప్’ కేపీఎల్ గిల్ తన హయాంలో స్వదేశీ కోచ్లతో ఓ ఆటాడుకున్నారు. కోచ్లను నియమించడం, ఫలితాలు వస్తున్న సమయంలో వారిని అకారణంగా తప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు గిల్ హయాంలో ఎనిమిది మంది (జఫర్ ఇక్బాల్, సెడ్రిక్ డిసౌజా, భాస్కరన్, పర్గత్ సింగ్, ఎం.కె.కౌశిక్, హర్చరణ్ సింగ్, సీఆర్ కుమార్, రాజిందర్ సింగ్) స్వదేశీ కోచ్లపై వేటు పడింది. ఆ తర్వాత 2004 నుంచి 2015 వరకు ఏడుగురు (గెరార్డ్ రాచ్, జోస్ బ్రాసా, మైకేల్ నాబ్స్, రోలెంట్ ఆల్ట్మన్స్, గ్రెగ్ నికోల్, టెర్రీ వాల్ష్, పాల్ వాన్ యాస్) విదేశీ కోచ్లను తప్పించారు. రోలెంట్ ఆల్ట్మన్స్ ప్రస్తుతం భారత హాకీ జట్టుకు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆనాడు గిల్ నియంతృత్వ ధోరణిపై తిరుగుబాటు చేసిన నాటి భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్) ఉపాధ్యక్షుడు, నేటి హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా ఇప్పుడు గిల్ అడుగుజాడల్లో నడస్తుండటం గమనార్హం. పారిశ్రామికవేత్త అయిన బాత్రా భారత హాకీ పురోగతికి తనవంతు కృషి చేస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే మొత్తం హాకీ ఇండియా తన చేతుల్లోనే ఉండాలనుకోవాలనే ఆయన అత్యాశ ఆటకు చేటు చేస్తోంది. గతేడాది కోచ్ టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అయితే టెర్రీ వాల్ష్ కుదురుకున్నాడని అనుకుంటున్న తరుణంలో ఆయనను సాగనంపారు. ఆయన స్థానంలో వచ్చిన పాల్ వాన్ యాస్కు దీనికి మినహాయింపు కాదు. ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ సందర్భంగా మలేసియాతో మ్యాచ్ అనంతరం నరీందర్ బాత్రా నేరుగా మైదానంలోకి రావడం... ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేయడం... ఆయనను అక్కడి నుంచి వెళ్లాపోవాలని కోచ్ పాల్ కోరినందుకే ఆయనపై వేటు పడిందని అంటున్నారు. ఇకనైనా మేలుకుంటారా... రియో ఒలింపిక్స్కు ఇంకా ఏడాది సమయం ఉంది. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన తర్వాత భారత హాకీ జట్టు ఖాతాలో మరో పతకం చేరలేదు. ఒలింపిక్స్ సన్నాహాలపై ప్రభావం పడకుండా ఉండాలంటే వెంటనే కొత్త కోచ్ను నియమించడమో లేక హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్గా ఉన్న రోలెంట్ ఆల్ట్మన్స్కు మరోసారి చీఫ్ కోచ్ బాధ్యతలు అప్పగించడమో చేయాలి. టెర్రీ వాల్ష్ను తప్పించిన తర్వాత కొంతకాలంపాటు ఆల్ట్మన్స్ భారత్కు తాత్కాలిక కోచ్గా పనిచేశారు. రెండేళ్లుగా జట్టుతో ఉన్నందున ఆయనకు భారత హాకీ బలాబలాలపై మంచి అవగాహన ఏర్పడింది. కొత్త కోచ్ను నియమించే బదులు రియో ఒలింపిక్స్ వరకు ఆల్ట్మన్స్ను కోచ్గా కొనసాగించాలని భారత ఆటగాళ్లు కూడా కోరుకుంటున్నారు. ఇకనైనా హాకీ ఇండియా అధికారులు తమ పొరపాట్లను సరిదిద్దుకొని భారత హాకీకి మేలు చేసే నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. విదేశీ కోచ్లు వచ్చి పోయారిలా... 1. గెరార్డ్ రాచ్ (జర్మనీ) నియామకం: భారత జట్టు తొలి విదేశీ కోచ్గా 2004 జూన్లో నియమించారు. ఏథెన్స్ ఒలింపిక్స్, చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. దాంతో అదే ఏడాది డిసెంబరులో రాచ్పై వేటు పడింది. 2. జోస్ బ్రాసా (స్పెయిన్) వేతనం: రూ. 7 లక్షలు (నెలకు) నియామకం: 2009 మేలో కోచ్గా ఎంపిక చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: బ్రాసా అధ్వర్యంలో భారత్ 2010 కామన్వెల్త్ గేమ్స్లో రజతం సాధించింది. అయితే అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుపొందకపోవడంతో భారత్ నేరుగా లండన్ ఒలింపిక్స్కు అర్హత పొందలేకపోయింది. 2010లో ఆయన కాంట్రాక్ట్ను రద్దు చేశారు. 3. నాబ్స్ (ఆస్ట్రేలియా) వేతనం: రూ. 6.5 లక్షలు నియామకం: 2011 జూన్లో కోచ్గా నియమించారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: నాబ్స్ ఆధ్వర్యంలో భారత్ 2012 లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. అయితే లండన్ ఒలింపిక్స్లో భారత్ చిట్టచివరిదైన 12వ స్థానంలో నిలిచింది. 2013 జూన్లో ఆయనపై వేటు వేశారు. 4. గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా) నియామకం: 2013లో మైకేల్ నాబ్స్ను తప్పించాక కొంతకాలంపాటు గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా) భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా వ్యవహరించారు. వేటు పడిందిలా: నికోల్ ఆధ్వర్యంలో భారత్ 2013లో జపాన్లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగింది. ఈ టోర్నీలో టీమిండియా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. నికోల్ న్యూజిలాండ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా వెళ్లిపోయారు. 5. టెర్రీ వాల్ష్ (ఆస్ట్రేలియా) వేతనం: రూ. 10 లక్షలు నియామకం: 2013 అక్టోబరులో కోచ్గా తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి రియో ఒలింపిక్స్కు అర్హత పొందింది. వేటు పడిందిలా: ఆసియా క్రీడలు ముగిశాక హాకీ ఇండియా, సాయ్ అధికారులతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయనను తప్పించారు. 6. వాన్ యాస్ (నెదర్లాండ్స్) వేతనం: రూ. 7.5 లక్షలు నియామకం: ఈ ఏడాది ఫిబ్రవరిలో కోచ్గా నియమించారు. 2018 ప్రపంచకప్ వరకు ఆయనతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ టోర్నీ సందర్భంగా హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో మైదానంలో వాగ్వాదం. టోర్నీ ముగిశాక నేరుగా నెదర్లాండ్స్ వెళ్లిపోయిన పాల్ తిరిగి భారత్కు రాలేదు. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన వారిలో కోచ్గా ఆయన పేరు లేదు. -
అమ్మాయిలు భేష్... అబ్బాయిలు తుస్!
'గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్'... చందంగా తయారైంది భారత్ జాతీయ క్రీడ హాకీ పరిస్థితి. గతంలో సువర్ణ కాంతులు వెదజల్లిన హాకీ ఆట ఇప్పుడు వెలవెలబోతోంది. పతకాలు మాట పక్కనపెడితే అర్హత సాధించడానికే ఆపసోపాలు పడుతోంది. తాజాగా ముగిసిన వరల్డ్ కప్ సెమీఫైనల్స్ హాకీ టోర్నమెంట్ లో ఇండియా టీమ్ నాలుగో స్థానంలో నిలిచింది. కనీసం కాంస్య పతకం కూడా సాధించలేక ఉత్తి చేతులతో తిరిగొచ్చింది. లీగ్, క్వార్టర్ పోరులో స్థాయికి తగిన ఆటతీరు కనబరిచిన భారత ఆటగాళ్లు సిసలు సమరంలో చేతులెత్తేశారు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఒక్కటే ఊరట. ఘనమైన చరిత్ర ఉన్న మన హాకీ టీమ్ ప్రాభవం చాలా కాలంగా తగ్గుతూ వస్తోంది. ఒక దశలో పతనావస్థకు చేరుకున్న హాకీ క్రీడ ఇటీవల కాలంలో కాస్త మెరుగైనట్టు కనబడుతోంది. లీగ్ దశను దాటి నాకౌట్ వరకు చేరుకోవడంలో సఫలీకృతమవుతున్న భారత జట్టు టైటిల్ ను ఒడిసిపట్టడంలో తడబడుతోంది. చివరి మెట్టుపై బోల్తా పడే అలవాటు నుంచి బయటపడితే ఇండియా హాకీకి పూర్వ వైభవం ఖాయం. ఒలింపిక్స్ లో సత్తా చాటాలంటే భారత్ హాకీ టీమ్ చాలా శ్రమించాల్సివుందని వరల్డ్ కప్ హాకీ లీగ్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఫార్వర్ట్స్, రక్షణ పంక్తిని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సివుంది. ప్రత్యర్థి జట్టు డిఫెన్స్ ను కకావికలం చేసే సమర్థ దాడులకు స్ట్రయికర్లు రాటుదేలాలి. పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలచడంలో డ్రాగ్ ఫ్లికర్లు పట్టుసాధించాలి. అన్నింటికీ మించి కీలక టోర్నీలకు ముందు స్టార్ ఆటగాళ్లు గాయాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతికూలతలను అధిగమించి రియో ఒలింపిక్స్ కు భారత అమ్మాయిలు అర్హత సాధించడం విశేషం. 5-6 స్థానాల కోసం జపాన్ తో జరిగిన వర్గీకరణ మ్యాచ్ లో మన అమ్మాయిలు అసమాన ఆటతీరుతో విజయకేతనం ఎగురవేసి 35 ఏళ్ల ఒలింపిక్స్ నిరీక్షణకు తెర దించారు. ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా భారత్ లో మళ్లీ మహిళల హాకీకి మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నారు. భారత్ హాకీ తలరాత మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సందీప్ సింగ్పై బాలీవుడ్ చిత్రం
న్యూఢిల్లీ: దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్పై రూపొందించిన చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరో క్రీడాకారుడిపై ఇదే రీతిన సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్పై బాలీవుడ్లో ఓ సినిమా రూపొందనుంది. నటి చిత్రాంగద సింగ్ నిర్మాతగా వ్యవహరించనుంది. 2006లో జర్మనీలో జరిగిన ప్రపంచకప్ కోసం జట్టుతో చేరేందుకు వస్తున్న సందీప్ సింగ్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో అనుకోకుండా బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపుగా పక్షవాతానికి గురై రెండేళ్ల పాటు చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అయితే ఈ స్థితి నుంచి బయటపడడమే కాకుండా తిరిగి మైదానంలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరోవైపు ఈ సినిమాలో తన పాత్రను రణబీర్ కపూర్ పోషించాలని సందీప్ కోరుకుంటున్నాడు. -
హాకీ సంక్షోభానికి తెర
-
భారత హాకీ జట్టు ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం
ఒకప్పుడు రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారట... రాజులనాటి ప్రాభవం గురించి చెబుతూ ఈ మాట వాడటం తరచూ వింటుంటాం. ఒకప్పుడు భారత హాకీ జట్టు అంటే ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం. ఏకంగా ఎనిమిది ఒలింపిక్ స్వర్ణ పతకాలు నెగ్గిన ఏకైక దేశం. ప్రస్తుత భారత హాకీని నాటి వైభవంతో పోలిస్తే... అంతే అబ్బురం ఇప్పుడు. ఇతర క్రీడల జోరులో ఎదగలేక, మార్గదర్శనం కరువై మన హాకీ వెనుకబడిపోయింది. కించిత్ బాధ వెంటాడుతుంది. అయితే... అందరికీ హాకీ ఆట దూరం కాలేదు. స్టిక్ పట్టుకుంటేనే చేతిలోకి మంత్రదండం వచ్చేసినంతగా ఉప్పొంగిపోయే కుర్రాళ్లు... భవిష్యత్తుపై భరోసా లేకపోయినా హాకీ అంటే పడిచచ్చే పిల్లలు ఇంకా ఉన్నారు. ఇలాంటి ఈతరం ఆటగాళ్లతోనే హాకీ ఇంకా మనుగడ సాగిస్తోంది. హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ పుట్టినరోజును ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నగరంలో హాకీపై అభిమానం పెంచుకున్న చిన్నారుల గురించి... సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో హాకీ ఆడేందుకు పెద్ద సంఖ్యలో చిన్నారులు వస్తుంటారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వారి సంఖ్య దాదాపు 50 వరకు ఉంటుంది. నగరంలో ఈ క్రీడకు ఇప్పుడు ఇదే కేంద్రం. గచ్చిబౌలి ఆస్ట్రో టర్ఫ్ స్టేడియంలో అవకాశమున్నా... అదంతా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ మాత్రం పేద, పెద్ద తేడా లేకుండా ఆసక్తి ఉన్న చిన్నారులంతా హాకీ ఆడేందుకు వస్తారు. ఎక్కువగా రసూల్పురావారు వచ్చేవారు. గతంలో దీని వెనుక భాగంలో బేగంపేట ఆస్ట్రోటర్ఫ్ స్టేడియం ఉండేది. అక్కడి నుంచే అనేక మంది జాతీయ స్థాయిలో హాకీ ఆడారు. అయితే బేగంపేట స్టేడియం పోలీసుల అధీనంలోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు వారు జింఖానా బాట పట్టాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో... ఇక్కడి ఆటగాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచ్ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న వీరిలో పది మందికి పైగా జాతీయ స్థాయి పోటీల్లో రాణించారు. అండర్-12, అండర్-14తో పాటు ప్రతిష్టాత్మక కె.డి.సింగ్ బాబు జాతీయ చాంపియన్షిప్లో కూడా వీరు పాల్గొన్నారు. నలుగురు చిన్నారులు జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీ ల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కొన్నాళ్లుగా నగరంలో సీనియర్ స్థాయి టోర్నీలు లేక పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోయినా... తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదని వారు అంటున్నారు. హాకీ అంటే కొందరికి ప్రాణమని, మరికొందరికి పిచ్చి అని... అందుకే ఇదే ఆట ఎంచుకున్నామని వారు చెబుతున్నారు. ప్రోత్సాహకాలు, ఉద్యోగాల గురించి ఇప్పుడు ఆలోచన లేదని, బాగా ఆడితే అన్నీ వాటంతట అవే వస్తాయని వీరికి బలమైన నమ్మకం. టోర్నీలేవీ..! ఇక్కడి చిన్నారుల్లో చాలా ప్రతిభ ఉంది. క్లే కోర్టులోనే బాగా ఆడే వీరు అవకాశం దక్కితే ఆస్ట్రో టర్ఫ్లోనూ సత్తా చాటగలరు. సీనియర్ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహిస్తే వీరి ప్రతిభకు తగిన న్యాయం జరుగుతుంది. వీరిలో చాలా మంది ఆర్థిక స్థోమత లేనివారు. అయినా వారి పట్టుదల ముందు ఇలాంటివేవీ కనిపించవు. - కామేశ్వర రావు, హాకీ కోచ్ -
భారత్ శుభారంభం
ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు... యూరోప్ పర్యటనను విజయంతో మొదలుపెట్టింది. ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7-0తో లీడెన్ హాకీ క్లబ్ (డచ్ నేషనల్ క్లబ్)పై విజయం సాధించింది. అక్షదీప్ (18వ ని.), నికిన్ తిమ్మయ్య (21వ ని.), రూపిందర్ పాల్ సింగ్ (38, 39వ ని.), రమన్దీప్ సింగ్ (43వ ని.), రఘునాథ్ (45వ ని.), యువరాజ్ వాల్మీకి (53వ ని.)లు భారత్కు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లు మెరుగైన డిఫెన్స్తో ఆకట్టుకున్నాయి. ఫార్వర్డ్స్ అటాకింగ్ మొదలుపెట్టడంతో తొలి అర్ధభాగంలో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడెన్ క్లబ్ ఆటగాళ్లు స్కోరును సమం చేసేందుకు చేసిన ప్రయత్నాలను గోల్కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలోనూ భారత ప్లేయర్ల హవా కొనసాగింది. లీడెన్ క్లబ్కు లభించిన ఒకటి, రెండు అవకాశాలనూ సబ్స్టిట్యూట్ గోల్కీపర్ హర్జ్యోత్ సింగ్ అడ్డుకోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. నెదర్లాండ్స్లో మే నెల 31 నుంచి జూన్ 15 వరకు ప్రపంచకప్ జరగనుంది. -
నేడు ఆసియా కప్ హాకీ ఫైనల్
సా.గం. 5.30 నుంచి స్టార్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం ఇపో (మలేసియా): పరిష్కారం లభించని సమాఖ్య వివాదాలు... ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో అంతకంతకూ దిగజారుతున్న ప్రతిష్ట... మధ్యలో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆకట్టుకున్నా... మిగతా ఈవెంట్లలో మళ్లీ నిరాశే. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతం భారత హాకీ జట్టు పరిస్థితి ఇది. ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన యువ జట్టు దుమ్మురేపే ఆటతో ఆసియా కప్ టైటిల్ పోరుకు దూసుకుపోయింది. ఆదివారం ఇక్కడ జరిగే ఫైనల్లో పటిష్టమైన దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. 2007 చెన్నైలో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఘోరంగా విఫలమైంది. గతేడాది టోర్నీలో ఏడో స్థానంలో నిలిచిన భారత్కు ఈసారి కప్ గెలిచే సువర్ణావకాశం దక్కింది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. అనుభవం లేకున్నా నిలకడైన ఆటతీరుతో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. లీగ్ దశలోనే కొరియాపై 2-0తో గెలవడం జట్టులో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ టోర్నీలో ప్రత్యర్థులపై 21 గోల్స్ చేసిన భారత్ ఒకే ఒక్క గోల్ను సమర్పించుకుంది. చాలాకాలం నుంచి వేధిస్తున్న డిఫెన్స్ సమస్యకు ఈ టోర్నీలో కాస్త పరిష్కారం లభించింది. బ్యాక్లైన్లో వీఆర్ రఘునాథ్, రూపిందర్పాల్ సింగ్, కొతాజిత్ సింగ్, గుర్మెల్ సింగ్, బీరేంద్ర లక్రాల బృందం అడ్డుగోడలా నిలుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గోల్ కీపర్ శ్రీజేష్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. డ్రాగ్ఫ్లిక్స్లో రఘునాథ్, రూపిందర్ అదనపు బాధ్యతలు తీసుకుంటున్నారు. మిడ్ఫీల్డ్లో కెప్టెన్ సర్దారాకు తోడుగా మన్ప్రీత్, చింగ్లెన్సనా, ఉతప్పలు చక్కని సహకారాన్ని అందిస్తున్నారు. యువ ఫార్వర్డ్లైన్లో మన్దీప్ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే నాలుగు గోల్స్ చేసిన అతను మరోసారి విజృంభిస్తే కొరియాకు కష్టాలు తప్పవు. నితిన్ తిమ్మయ్య, మలక్ సింగ్లు కూడా విశేషంగా రాణిస్తుండటం భారత్కు లాభిస్తోంది. అయితే జట్టులో ప్రస్తుతం నెలకొన్న ఆత్మ విశ్వాసం...అతి విశ్వాసంగా మారితే ప్రమాదకరమైన కొరియా నుంచి ముప్పు తప్పదు. ఆసియా కప్ గెలిస్తే జట్టుపై మళ్లీ నమ్మకం ఏర్పడుతుందని కెప్టెన్ సర్దారా ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు కొరియా ప్రతీకారమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఏ ఒక్క అవకాశం లభించినా ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సమర్థులు జట్టులో ఉండటం అదనపు బలం. ఓ రకంగా చూస్తే భారత్తో పోలిస్తే అన్ని రంగాల్లో కొరియాదే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. డిఫెన్సివ్గా ఆడుతూ భారత్ను దెబ్బకొట్టాలని వ్యూహం రచిస్తోంది. గెలిస్తే... నేరుగా ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే... వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. లేదంటే నవంబర్లో ఓసియానియా కప్ ముగిసే వరకు వేచి చూడాలి. సెమీస్లో మలేసియాను ఓడించిన భారత్కు దాదాపుగా వరల్డ్కప్ బెర్త్ ఖరారైనా మరికొన్ని మ్యాచ్ల ఫలితాలు దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి గెలిస్తే నేరుగా... ఓడితే మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి.