TRT
-
టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్టీ), ఏపీ టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదంది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదన్నారు. టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ను ఖరారు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
టెట్, టీఆర్టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. పరీక్షలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
టీఆర్టీలో స్థానికత చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విషయంలో స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 317 జీవోను అమలు చేసింది. దీని ప్రకారం స్థానికతను నిర్థారించింది. అయితే ఇది ఇప్పటివరకూ ఉద్యోగులకే పరిమితమైంది. తాజాగా టీచర్ల నియామకంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్ళు చదివితే ఆ జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు. గతంలో 4–10 తరగతుల్లో ఎక్కడ నాలుగేళ్ళు చదివి ఉంటే దాన్ని స్థానికతగా చూసేవాళ్ళు. ఈ నిబంధనలో మార్పు వల్ల స్థానికత నిర్ధారణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. అప్పటి స్కూళ్ళు ఇప్పుడు లేవు! సాధారణంగా ప్రాథమిక విద్యను సమీపంలో ఉన్న స్కూల్లో పూర్తి చేస్తారు. 6వ తరగతి నుంచే సరైన రికార్డు ఉంటుంది. కాబట్టి 4 నుంచి 10 తరగతుల వరకు కనీసం నాలుగేళ్ళు ఎక్కడ చదివిందీ ధ్రువీకరించడం కొంత తేలికగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్టీ పరీక్ష రాసే అభ్యర్థులు దాదాపు 15 ఏళ్ళ క్రితం ఒకటి నుంచి 5 తరగతి వరకు చదివి ఉంటారు. ఇందులో చాలా స్కూళ్ళకు అనుమతి కూడా లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఆ తర్వాత 6, 7 తరగతులు వేర్వేరు స్కూళ్లలో చదివిన వారున్నారు. ఇందులో కొంతమంది వేరే జిల్లాల్లోనూ చదివి ఉంటారు. దీనివల్ల ‘1 నుంచి 7వ తరగతి వరకు’ అనే నిబంధన కింద నాలుగేళ్ళు వరసగా ఏ జిల్లాలో చదివారనేది నిరూపించుకోవడం కష్టంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. 1–5 వరకు చదివిన ప్రాథమిక ప్రైవేటు స్కూళ్ళు అనేకం ఇప్పటికే మూతపడటం, కొన్నిటికి అనుమతి లేకపోవడంతో డీఈవో కార్యాలయాల్లోనూ వారి డేటా లభించకపోవడంతో స్థానికత నిరూపణ కష్టంగా ఉందని అంటున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల దృష్ట్యా, హాస్టళ్ళ కోసం ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల వేర్వేరు తరగతులు చదివిన వాళ్ళకూ ఈ సమస్య తప్పడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగి కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల కూడా స్థానికత ఏదో చెప్పడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాన్–లోకల్కు అవకాశమే లేదు! రాష్ట్రవ్యాప్తంగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రోస్టర్ విధానం తర్వాత అనేక జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఒక్కటి కూడా లేకుండా పోయాయి. 16 జిల్లాల్లో ఎస్ఏ గణితం, ఏడు జిల్లాల్లో ఎస్ఏ ఇంగ్లీష్, మూడు జిల్లాల్లో ఎస్ఏ ఫిజికల్ సైన్స్, రెండు జిల్లాల్లో సోషల్ పోస్టులే లేవు. దీంతో ఈ జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేరే జిల్లాలో ఉండే పోస్టులకు నాన్–లోకల్ కేటగిరీ కింద పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే నియామకాల్లో స్థానికేతరుల కోటాను కేవలం 5 శాతానికే పరిమితం చేశారు. అంటే ఇతర జిల్లాల్లో కనీసం 20 పోస్టులు ఉంటేనే నాన్–లోకల్కు ఒక పోస్టు అయినా ఉంటుంది. కానీ ఏ జిల్లాలోనూ ఏ సబ్జెక్ట్కు సంబంధించి కూడా ఇన్ని పోస్టులు లేవు. అలాంటప్పుడు నాన్–లోకల్గా పరీక్ష రాసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నా స్థానికత తేలడం లేదు మహబూబాబాద్లో 1–5 వరకూ చదివాను. ఆ స్కూల్ ఇప్పుడు లేదు. ఆరు, ఏడు తరగతులు ప్రస్తుత వరంగల్ జిల్లాలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటర్ వరకూ చదివాను. దీంతో నాలుగేళ్ళు ఎక్కడ చదివింది నిరూపించుకోవడం కష్టంగా ఉంది. – చదలవాడ నవీన్ (వరంగల్, టీఆర్టీ దరఖాస్తుదారు) స్థానికత నిబంధనపై ఆలోచించాలి 1 నుంచి 7 తరగతుల్లో నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడి స్థానికులుగా పరిగణింపబడతారనే నిబంధన చాలామంది అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంది. నాన్–లోకల్ కోటాను తగ్గించడం వల్ల కూడా చాలా జిల్లాల్లో టీచర్ పోస్టులు పొందే అవకాశం ఉండటం లేదు. దీనిపై అధికారులు పునః సమీక్షించాలి. – రావుల రామ్మోహన్రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) -
పెరిగిన సిలబస్... ఆధునిక బోధనపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్ః ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు హాజరయ్యే అభ్యర్థులు లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా బోధన విధానాల్లో వస్తున్న మార్పులపై నిశిత పరిశీలన ఉండేలా ప్రశ్నలుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) అవగాహన పరిధిని విస్తృతంగా పరిశీలించాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్కు సంబంధించి 8వ తరగతి వరకూ కొన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతామని మొదట చెప్పినా, మెథడాలజీలో మాత్రం ఇంటర్మీడియేట్ స్థాయిలోని ఆలోచన ధోరణికి సంబంధించిన చాప్టర్లను జోడించింది. నవంబర్ 20 నుంచి జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి విద్యాశాఖ గురువారం పరీక్ష సిలబస్ను విడుదల చేసింది. ఏ చాప్టర్ నుంచి ఏయే ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ఇందులో పేర్కొంది. ఎస్జీటీ పోస్టులకు పరీక్ష రాసే వారు 1–8వ తరగతి, స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేవారికి 1–10 తరగతులతో పాటు ప్లస్ టు నుంచి ప్రశ్నలు ఇస్తామని విద్యాశాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పుల విషయంలో ప్రశ్నలుంటాయని తెలిపింది. ఈ క్రమంలో ఎస్జీటీలకు ఇచ్చే ప్రశ్నలు నిర్ణీత తరగతులు దాటి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే పరీక్ష కావడంతో టీఆర్టీకి ఈసారి ప్రత్యేకంగా శిక్షణ ఉండాలని అభ్యర్థులు అంటున్నారు. ప్రతీ ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. దీంతో ప్రతి ప్రశ్న కూడా కీలకంగానే భావిస్తున్నారు. మెథడాలజీపై గురి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిపై పెద్దగా అభ్యంతరాలు రావడం లేదు. అయితే నవీన విద్యా బోధనపై 20 ప్రశ్నలు ఇస్తున్నారు. స్వాతంత్య్రం పూర్వం, తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, వివిధ విద్యా కమిషన్లు, సిఫార్సులు, చట్టాలపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఇస్తున్నారు. ’’స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల ఆలోచనల్లో విద్యా విధానం’’ అనే సబ్జెక్టుల్లోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఇవి అకడమిక్ పుస్తకాలతో సంబంధం ఉన్నవి కావని, జనరల్ నాలెడ్జ్గానే భావించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. విద్యార్థి, శిక్షణలో అభివృద్ధి అనే అంశంలో వివిధ రకాలుగా వస్తున్న మార్పులు, అధ్యయనాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. కేంద్ర విద్యా చట్టం, మార్పులు అనే అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే, జాతీయ విద్యా చట్టాలపై ప్రశ్నలు ఇస్తున్నారు. మేథమెటిక్స్లోనూ ఆలోచన ధోరణి ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాతకాలం విధానాలు కాకుండా, సరికొత్త పద్ధతిలో గణితం విద్యార్థులకు బోధించే ధోరణìలపై ప్రశ్నలు ఉంటాయని సిలబస్లో పేర్కొన్నారు. ఎస్ఏలకు 88 ప్రశ్నలు.. ఎస్జీటీలకు 160 ప్రశ్నలు ఎస్ఏలకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడిట్ స్థాయి వరకూ 88 ప్రశ్నలు ఇస్తున్నారు. దీనిపైనా స్పష్టత లేకుంటే ప్రిపరేషన్ సమస్యగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియేట్) స్థాయి ప్రశ్నలు ఇస్తామని చెప్పినా, ఇందులో కమ్యూనికేషన్ స్కిల్ పరీక్షకు సంబంధించినవి ఉంటాయా? సబ్జెక్టు నుంచి ఇస్తారా? అనే దానిపై స్పష్టత కోరుతున్నారు. టీచింగ్ విధానాలపై 32 ప్రశ్నలు ఇస్తున్నారు. రాష్ట్ర యూనివర్సిటీలు రూపొందించిన వివిధ బోధన పద్ధతుల నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అన్ని కోణాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ సహా 18 సబ్జెక్టులకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ప్రతీ సబ్జెక్టు నుంచి 5కు మించకుండా ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తం 100 ప్రశ్నలను ఈ తరహాలోనే విభజించారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్కు 160 ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇంటర్మీడియేట్ సిలబస్తో పాటు, కొత్త విద్యావిధానంపై తర్ఫీదు అవ్వాల్సిన అవసరం ఉందని సిలబస్ స్పష్టం చేస్తోంది. -
ఈ టీచర్లకు 30 శాతం పీఆర్సీ వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: తాజా పీఆర్సీలో రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా కొత్తగా నియమితులైన టీచర్లకు భారీ నష్టం వాటిల్లనుంది. కిందిస్థాయి పోస్టు లో ఉండి, ఎస్ఏ పోస్టులకు ఎంపికైన టీచర్లకు పే ప్రొటెక్షన్ లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లనుండగా, నియామకాల్లో జాప్యం కారణంగా కొత్త పీఆర్సీ ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు ఎక్కు వ మందికి దక్కకుండాపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా 8,792 మంది టీచర్లకు నష్టం వాటిల్లనుండటంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి పే ప్రొటెక్షన్ లేక నష్టం రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా ప్రభుత్వం 1,941 ఎస్ఏ పోస్టులను భర్తీ చేసింది. అందులో దాదాపు వెయ్యి పోస్టులకు ప్రస్తుతం స్కూళ్లలో ఎస్జీటీలుగా, భాషా పండితులుగా (ఎల్పీ) పని చేస్తున్నవారే ఎంపికయ్యారు. మిగతా పోస్టుల్లో కొత్తవారు ఎంపికయ్యారు. ఇలా ఎస్ఏ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరికి పలు కారణాలతో 2019లో నియామక పత్రాలు అందజేయగా, మరికొందరికి 2020లో నియామక పత్రాలు అందజేశారు. ఇంకొందరికైతే 15 రోజుల కిందటే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. వారిలో 95 శాతం మంది పంచాయతీరాజ్ టీచర్లే ఉన్నారు. అయితే వారికి ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోని కనీస మూల వేతనంతోనే వేతనాలను చెల్లించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదేని ఉన్నత స్థాయి పోస్టుకు ఎంపికైనప్పుడు వారికి అంతకుముందు ఉద్యోగంలో వచ్చిన వేతనాన్ని కాపాడుతూ (పే ప్రొటెక్షన్ ఇస్తూ) ఉత్తర్వులిచ్చి కొత్త వేతనం ఖరారు చేస్తారు. అంతకుముందు వచ్చిన కనీస మూల వేతనానికి పీఆర్సీ అమలుతేదీ నాటికి ఉన్న డీఏ, ఫిట్మెంట్ను కలిపి కొత్త పోస్టులో కనీస మూల వేతనాన్ని ఖరారు చేస్తారు. కానీ ఇప్పుడు నియమితులైన పంచాయతీరాజ్ టీచర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. వాస్తవానికి 2013 డిసెంబర్ తరువాత ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని, సర్వీస్ మొత్తం లెక్కిస్తే నష్టం లక్షల్లో ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నియామకాల్లో ఆలస్యంతో ఎక్కువ మందికి... 2017 టీఆర్టీ ద్వారా ఎస్జీటీ, ఎల్పీ, ఎస్ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ)గా నియమితులైన 7,792 మంది టీచర్లకు తాజా పీఆర్సీలో ప్రకటించిన వేతన స్థిరీకరణలో కీలకమైన 30 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ అందని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన 2017 టీఆర్టీ నియామకాలను 2019 నుంచి 2021 వరకు సాగదీయడమే ఇందుకు కారణం. తాజా పీఆర్సీ ఇప్పుడు ప్రకటించినా 2018 జూలై 1 నుంచే అమల్లోకి రానుంది. కాబట్టి అప్పటివరకు సర్వీస్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే 30 శాతం ఫిట్మెంట్ ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత నియామకమైన వారికి నియమితులైన రోజు నుంచి లెక్కించి తాజా పీఆర్సీలో మినిమమ్ బేసిక్తో వేతనం ఖరారు చేసి, కరెస్పాండింగ్ పేస్కేల్ ఇస్తారు. ఒకవేళ వారు అంతకుముందే నియమితులై ఉంటే వారికి అప్పుడు ఉన్న ఇంక్రిమెంట్తో కూడిన మూల వేతనంపై 30.392 శాతం డీఏ, 30 శాతం ఫిట్మెంట్ వచ్చేది. కానీ వారు 2018 జూలై 1 నాటికి నియమితులు కాలేదు కాబట్టి ఇప్పుడు వారికి 30 శాతం ఫిట్మెంట్ వర్తించదు. పైగా ఇప్పుడు రూపొందించిన మాస్టర్ స్కేల్ ప్రస్తుతం ఉన్న 30 శాతం ఫిట్మెంట్తో కాకుండా 15 శాతం ఫిట్మెంట్తోనే రూపొందించినందున వారికి రెండు రకాలుగా కలిపి నెలకు ఐదారు వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ–2017) ద్వారా నియమితులైన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)కు తాజా పీఆర్సీతో ఇప్పుడు రూ.31,040 కనీస మూల వేతనం రానుంది. అదే టీచర్ 2018 జూలై 1కి ముందు నియమితులై ఉంటే పాత స్కేల్పై 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.34,690 కనీస మూల వేతనం వచ్చేది. అలాగే అదే టీఆర్టీ ద్వారా స్కూల్ అసిస్టెంట్గా (ఎస్ఏ) నియమితులైన వారికి ఇప్పుడు రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. ఈ టీచర్ కూడా ముందే నియమితులై ఉంటే 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.47,240 వచ్చేది. 2017 టీఆర్టీ అయినప్పటికీ నియామకాల్లో ఆలస్యం కావడం వల్ల ఫిట్మెంట్ వర్తించకపోవడంతో ఒక్కో టీచర్ నెలకు నాలుగైదు వేలు నష్టపోనున్నారు. ఒక అభ్యర్థి 2008లో ఎస్జీటీగా ఎంపికయ్యారు. 2018 జూలై 1నాటికి ఆయన కనీస మూల వేతనం రూ. 31,460. ఆయన 2017 టీఆర్టీ ద్వారా ఎస్ఏగా ఎంపికయ్యారు. ఆయనకు ఇప్పుడు ఎస్ఏ పోస్టులో రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. అయితే పే ప్రొటెక్షన్ ఉంటే 2018 జూలై 1 నాటికి ఉన్న కనీస మూల వేతనంపై 30.392 కరువు భత్యం (డీఏ), 30 శాతం ఫిట్మెంట్ కలిపి రూ.51,320 కనీస మూల వేతనంగా వచ్చేది. అది లేకపోవడం వల్ల ఇంక్రిమెంటు కలుపుకొని నెలకు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లనుంది. న్యాయం చేయాల్సిందే టీఆర్టీ–2017లో భాగంగా రాత పరీక్ష, ఇతరత్రా నియామకాల ప్రక్రియ 2018 జూలై 1 నాటికి పూర్తయ్యింది. అయితే పోస్టింగ్లు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. అందువల్ల వారికి 30 శాతం ఫిట్మెంట్ను వర్తింపజేసి న్యాయం చేయాలి. అలాగే పైస్థాయి పోస్టులకు ఎంపికైన టీచర్ల కోసం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలి. లేకపోతే వారు తీవ్రంగా నష్టపోతారు. – మానేటి ప్రతాప్రెడ్డి,టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చదవండి: ఉచిత నీటి పథకానికి తిప్పలెన్నో.. -
టెట్ ఇంకెప్పుడో..! అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్ష (టీఆర్టీ) రాయాలంటే కచ్చితంగా ఉండాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై అడుగులు ముందుకు పడట్లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేసి నెల కావొస్తున్నా టెట్ నిర్వహణపై ఉన్నత స్థాయిలో ఎలాంటి కదలిక లేదు. టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందుకు అవసరమైన కార్యాచరణ ఒక్కటీ మొదలు కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాకముందే టెట్ నిర్వహించాలని అభ్యర్థులకు కోరుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను విద్యా శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ఇప్పటివరకు వాటికి ఇంకా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ ఆమోదం వస్తే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం టెట్ నిర్వహించకుండా ముందుకు పోతే లక్షల మంది పోస్టుల భర్తీకి దూరం అయ్యే ప్రమాదం నెలకొంది. నెలన్నరలో వ్యాలిడిటీ ముగింపు.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు. 2011 నుంచి రాష్ట్రంలో నిర్వహించిన ఆరు టెట్లలో మూడు టెట్ల (2011 ఒకసారి, 2012లో రెండుసార్లు) వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసిపోయి 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ అర్హత కోల్పోయారు. ఇక 2014 మార్చి 16న నిర్వహించిన టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి 16వ తేదీతో ముగియనుంది. అందులోనూ మరో 1.5 లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోతారు. మరోవైపు రాష్ట్రంలో 2015లో ఒకసారి టెట్ నిర్వహించగా, 2017లో చివరి టెట్ను నిర్వహించారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్ను గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గడిచిన మూడేళ్లలోనూ మరో 1.5 లక్షల మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు అసలు టెట్ రాయలేదు. ఇప్పుడు వారంతా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్యుర్థులకు టెట్ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెలలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో వెంటనే టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ నిర్వహించకుండా టీఆర్టీ నోటిఫికేషన్ వస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు అవసరం.. రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అందుకే విద్యా శాఖ త్వరగా టెట్ నిర్వహణకు చర్యలు చేపడితేనే తమకు టీఆర్టీ రాసే అవకాశం వస్తుందని పేర్కొంటున్నారు. మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్? టీఆర్టీ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఇప్పటివరకు ఉన్న ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పటికిప్పుడు 8 వేల పోస్టులు భర్తీ చేయొచ్చని పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించింది. అందులో 8 వేలకు పైగా పోస్టుల్లో పదోన్నతులు కల్పించొచ్చని పేర్కొంది. పదోన్నతులు చేపట్టాక టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే 15 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే వీలుంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి విద్యా శాఖకు ఇంకా ఆమోదం రాలేదు. ఇప్పటికిప్పుడు ఆమోదం తెలిపినా పదోన్నతులు ఇచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఫిబ్రవరిలో టీఆర్టీ నోటిఫికేషన్ జారీ కుదరదు. ఇక మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా టెట్ నిర్వహిస్తే తాము టీఆర్టీకి సిద్ధం అయ్యేందుకు సమయం దొరుకుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
టీఆర్టీ కంటే ముందే టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలల హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య 5వేలకు మించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం 12వేలకు పైగా పోస్టులు రావచ్చని వెల్లడించారు. చదవండి: (ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!) లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో, ప్రభుత్వ ఆమోదం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బదిలీల వ్యవహారంపై మంగళవారం ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. మరోవైపు ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్ చేయవద్దని సోమవారం ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరికొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాల్లోకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. -
విధుల్లోకి 2,788 మంది టీచర్లు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో (టీఆర్టీ–2017) భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) నియామక ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు పూర్తయింది. ఏజెన్సీ మినహా మైదాన ప్రాంతాల్లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ నియామకపత్రాలు అందజేసింది. మొత్తంగా మైదాన ప్రాంతంలో 3,127 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, అందులో 2,822 పోస్టులకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇటీవల ఎంపికైన అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా విద్యా శాఖకు టీఎస్పీఎస్సీ అందజేసింది. దీంతో విద్యాశాఖ నియామకాల కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ కౌన్సెలింగ్కు 2,788 అభ్యర్థులు హాజరుకాగా, వారందరికీ మంగళవారం పోస్టింగ్ ఆర్డర్లను జిల్లా అధికారులు అందజేశారు. పోస్టింగ్ ఆర్డర్లను పొందినవారు బుధవారం సంబంధిత పాఠశాలల్లో హెడ్మాస్టర్లకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరనున్నారు. కౌన్సెలింగ్కు హాజరుకాని 34 మందికి పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్టర్పోస్ట్ ద్వారా డీఈవోలు పంపించనున్నారు. -
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్), పీఈటీ ఫలితాలు ప్రకటించాలంటూ అభ్యర్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. బుధవారం ప్రగతి భవన్ను ముట్టడించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్టీ, పీఈటీ ఫలితాల జాబితాను ప్రకటించి పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2017లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికీ నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అభ్యర్థులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత
-
టీఆర్టీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) తెలుగు మీడియం పోస్టుల భర్తీకి చేపట్టిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2017లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 3,786 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. మరో 910 ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల భర్తీ కోసం 2018 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు టీఎస్పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. అదే ఏడాది డిసెంబర్లో ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం ఫలితాలు వెల్లడించింది. దీంతో రీలింక్విష్మెంట్ తీసుకోవాలంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టుల అవసరం లేని వారు రీలింక్విష్ మెంట్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఆ మేరకు అభ్యర్థులు కొందరు రీలింక్విష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలు వెల్లడించిం ది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడి యం పోస్టులు వస్తే అవి వద్దంటూ రీలింక్విష్మెంట్కు అవకాశం ఇవ్వాలంటూ మరికొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మళ్లీ రీలింక్విష్మెంట్కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో తుది ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఎట్టకేలకు శుక్రవారం 3,325 ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు అభ్య ర్థులను ఎంపిక చేసింది. వికలాంగుల కేటగిరీకి సంబంధించి విద్యాశాఖ నుంచి రావాల్సి ఉన్నందున 270 పోస్టుల ఫలితాలను తర్వాత ప్రకటి స్తామని పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతా నికి సంబంధించిన అంశాల్లో కోర్టు వివాదాలు ఉన్నందున 117 పోస్టుల ఫలితాలను విత్ హెల్డ్లో పెట్టింది. మరోవైపు వివిధ కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లభించనందున 74 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మొత్తానికి 3,325 పోస్టుల ఫలితాలను వెల్లడించింది. ఈ జాబితాను త్వరలోనే తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ తెలిపింది. మరోవైపు ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడిసా ్తమని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత గ్రూప్–2 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించాయి. టీఎస్పీఎస్సీ ఫలితాలు విడుదల చేయడంతో తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధం అవు తోంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు 15 రోజుల్లో షెడ్యూలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి సబిత విద్యాశాఖ, టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించిన సంగతి తెలిసిందే. -
భర్తీ ప్రక్రియ షురూ..
సాక్షి, మహబూబ్నగర్: ఎంతో కాలంగా టీఆర్టీ అభ్యర్థులు ఎదురుచూసిన ఘడియ రానేవచ్చింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మొదటి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రతిపాధికన భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంతో పాటు, డైట్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కేవలం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రమే పిలుపువచ్చింది. తదుపరి ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్ ప్రకారం ఎస్టీటీలకు నిర్వహించనున్నారు. 374 పోస్టులకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,979 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో భాగంగా మొదట 374 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. టీఆర్టీ పరీక్షలో మొత్తం 50వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో కేవలం కొంతమంది మాత్రమే అర్హత సాధించారు. వారికి మాత్రమే వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన వెరిఫికేషన్కు 8 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. సబ్జక్టుల వారీగా.. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల వెరిఫికేషన్ జరిగిన క్రమంలో 374 పోస్టుల్లో వివిధ సబ్జెక్టుల వారీగా ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో పోస్టులు, తెలుగు పండిట్ 67 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ ఉర్దూలో 4 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో గణితం 36, సోషల్ 139 పోస్టులు, ఉర్దూ పోస్టులు 6, ఇంగ్లీష్ 17, ఫిజికల్ సైన్స్ 23, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 44, జీవశాస్త్రం 41 పోస్టులు ఉన్నాయి. వీరి వెరిఫికేషన్ అనంతరం 15లోగా వివిధ స్థానాల్లో భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. 13న ఖాళీల వివరాల ప్రదర్శన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జిల్లా అధికారులు ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అభ్యర్థులకు 1.3 రెషియో ప్రకారం గతంలో ఒకమారు నిర్వహించిన వారిలో పూర్తిస్థాయి అర్హత సాధించిన వారికి గురువారం ఒకమారు నిర్వహించారు. అనంతరం వివిధ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ఏయే పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయన్న అంశంపై గురువారం సాయంత్రంలోగా, శుక్రవారం ఉదయం లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీల వివరాలను ప్రదర్శించాల్సి ఉంది. అభ్యర్థులకు ఖాళీలను ఎంపిక అనంతరం ఈనెల 13న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తర్వాత ఈనెల 15న కలెక్టర్ ఆధ్వర్యంలో వారికి భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
కొత్త సార్లొస్తున్నారు..
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. పెండింగ్లో ఉన్న టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం జీఓ రాగా, అనంతరం షెడ్యూల్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో నెట్టుకురాగా.. ఆయా పోస్టుల్లో కొత్త టీచర్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో టీఆర్టీ ప్రకటన చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. విడతలవారీగా సెప్టెంబర్ 2018, ఏప్రిల్ 2019లో జాబితా విడుదల చేసింది. అయితే టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాలు జారీ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేపట్టకపోవడంతో దాదాపు 20 నెలలపాటు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నియామక పత్రాలపై జీఓను విడుదల చేయడంతో త్వరలోనే అభ్యర్థులు టీచర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్.. కార్యదర్శిగా డీఈఓ మదన్మోహన్ వ్యవహరించనున్నారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ టీఆర్టీ జాబితాను ఇప్పటికే జిల్లా కమిటీకి సమర్పించింది. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కమిటీలు తమ పరిధిలోని సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించి.. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇలా.. టీఆర్టీ నియామకాలకు సంబంధించి షెడ్యూల్ ఇలా ఉంది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియంవారీగా ఈనెల 10న ప్రదర్శించనున్నారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకొని కేటగిరీ, మీడియంలవారీగా ఖాళీలను వెల్లడిస్తారు. 13, 14వ తేదీన అభ్యర్థులకు కేటగిరీ, మీడియంవారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పోస్టింగ్ పొందిన కొత్త టీచర్లు ఈనెల 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 17న జాయిన్ కానీ, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను గుర్తిస్తారు. 19న ఎంపికైన టీచర్లు జాయినింగ్ రిపోర్టును ఎంఈఓలు, హెచ్ఎంలకు అందజేయాలి. వేగవంతం చేస్తున్నాం.. టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్వ ఖమ్మం జిల్లా నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామకాలు చేపట్టనున్నాం. మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నాం. – పి.మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
పదోన్నతుల మాటేమిటి?
సాక్షి, మహబూబ్నగర్ : టీఆర్టీ ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పిడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2017నవంబర్లో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి రెండేళ్లు పూర్తయింది. భర్తీ ఉత్తర్వులు అందకపోవడంతో అభ్యర్థులు అనేక విధాలుగా ఉద్యమాలు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,979 ఉపాద్యాయ పోస్టుల గాను 2018 ఫిబ్రవరీ, మార్చిలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించన పరీక్షకు దాదాపు 50వేల మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ పరీక్ష రాశారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అనందంగా ఉన్నా సీనియర్ ఉపాధ్యాయులకు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకుండానే నేరుగా పోస్టులు భర్తీ చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 1,979 పోస్టుల భర్తీకి కసరత్తు టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జరగనుంది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కలెక్టర్ కమిటీ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ను వైస్ చైర్మన్గా, డీఈఓను కార్యదర్శిగా నియమించారు. ఈ కమిటీ పాత జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల రోస్టర్ పాయింట్లకు సంబంధించిన వివరాలను విద్యాశాఖకు అందిస్తారు. పాత, కొత్త జిల్లాల వారీగా ఖాళీలు, సబ్జెక్టు, మాధ్యమం, ప్రాంతాల వారీగా వివరాలు సేకరించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమిస్తూ కమిటీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ సబ్జెక్టుల వారీగా 1,979 పోస్టులను ఖాళీలకు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. 1979 ఎస్జీటీ, 1400 ఎస్టీటీ పోస్టులు ఇవ్వనుండగా, మిగతావి వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వనున్నారు. ప్రమోషన్లు కల్పించాల్సిందే గత డీఎస్సీలో సీనియర్ల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు ఇచ్చిన తర్వాత మాత్రమే నూనతంగా వచ్చిన ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం అడ్హాక్ పద్ధతిలో అయినా పోస్టింగ్లు ఇచ్చి, విద్యాసంవత్సరం ప్రారంభంలో వారిని రివర్ట్ చేస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉంది. -గట్టు వెంకట్రెడ్డి,పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి ప్రస్తుతం ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల అభ్యర్థుల భర్తీ ప్రక్రియను ఎటువంటి న్యాయపరైమన ఇబ్బందులు రాకుండా భర్తి చేస్తే బాగుటుంది. మొదటిగా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వాలి. అదికూడా పాత జిల్లాల ప్రకారమే ఇస్తే ఇబ్బందులు ఉండవు. కానీ నూతనంగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. పాత జిల్లాల వారీగా టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి, ప్రమోషన్లు మాత్ర కొత్త జిల్లాల ప్రకారం ఇవ్వడం సరికాదు. – దుంకుడు శ్రీనివాస్, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ–2017 నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి.విజయ్కుమార్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. -
టీఆర్టీ అభ్యర్థులకు తీపికబురు
సాక్షి, ఆదిలాబాద్ : ఎట్టకేలకు టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టీఆర్టీ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ప్రభుత్వం ఇది వరకే ఫలితాలు విడుదల చేసినా నియామకాలు చేపట్టకపోవడంతో గత కొన్ని రోజులుగా ఎంపికైన అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టినా టీఆర్టీ నియామకాలు చేపట్టకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. తాజా నిర్ణయం వారికి తీపి కబురును అందించినట్టయింది. అయితే ఇప్పటికే అభ్యర్థుల ఫలితాలను ప్రకటించారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కేవలం విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వడమే మిగిలి ఉంది. త్వరలోనే పాఠశాలలకు కొత్త పంతుళ్లు రానున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,582 పోస్టులు ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ 2017 అక్టోబర్ 21న విడుదల చేశారు. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. గతేడాది చివరి మాసంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే నియామకాలు మాత్రం జరపలేదు. కొంతమంది కోర్టుకు వెళ్లడంతో నియామకాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.10 విడుదల చేసింది. కాగా ఈ నియామకాలు ఉమ్మడి జిల్లా పరిధిలో చేపట్టనున్నారు. మొత్తం 1,582 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో లాంగ్వేజ్ పండితులు 122, ఎస్జీటీ పోస్టులు 1314, పీఈటీ పోస్టులు 25, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 118, మూడు ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. తీరనున్న ఇబ్బందులు.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2012లో డీఎస్సీ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నియామకాలు చేపట్టడంలో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసి ఎంపికైన అభ్యర్థులు నియామకాల కోసం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. టీఆర్టీ నిర్వహించిన తర్వాత గతేడాది, ఈ ఏడాది కూడా విద్యావలంటీర్లతోనే చదువులను కొనసాగిస్తోంది. అయితే ఎంపికైన అభ్యర్థులు నియామకాలు చేపట్టకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం ప్రభుత్వం నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు జరగనున్నాయి. ఇదివరకు జరిగిన డీఎస్సీల్లో విద్యా శాఖాధికారులే సర్టిఫికెట్ల పరిశీలన, రోస్టర్, మెరిట్ జాబితాను ప్రకటించేది. కాని ఈసారి ప్రభుత్వమే ప్రక్రియను పూర్తి చేసింది. కేవలం విద్యాశాఖాధికారులు ఆయా ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్గా, ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యదర్శిగా, సభ్యులుగా జెడ్పీ సీఈఓ, ఉమ్మడి జిల్లా పరిధిలోని డీఈఓలు ఉంటారు. నియామకాలు పారదర్శకంగా చేపడతాం టీఆర్టీ నియామకాలను పారదర్శకంగా చేపడతాం. దీనికి సంబంధించిన షెడ్యూల్ రాగానే మొదట కేటగిరి–4, తర్వాత 3,2,1 వారీగా పోస్టులు భర్తీ చేస్తాం. బాలికల పాఠశాలలకు మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇస్తాం. మొదట ఒక్కరుకూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేస్తాం. ఆ తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. – ఎ.రవీందర్రెడ్డి, డీఈఓ -
నియామకాలెప్పుడో..!
కరీంనగర్ఎడ్యుకేషన్: టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల్లో ఇది వరకు పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే తాజాగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడిన కొద్దీ ఉపాధ్యాయుల నియామకంపై తర్జనభర్జన కొనసాగింది. ప్రభుత్వం టీఆర్టీ నియామకాలు చేపడుతుందా.. విద్యావాలంటీర్లను కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉండగా తాజాగా తాత్కాలిక బోధకుల వైపే విద్యాశాఖ మొగ్గు చూపింది. ఈ నెల 11న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు వెల్లడించారు. దీంతో ఏడాదిన్నరగా నియామకాల కోసం ఎదురు చూస్తున్న టిఆర్టీ అభ్యర్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. నియామకాలను భర్తీ చేసి మిగతా ఖాళీలను విద్యావాలంటీర్ల ద్వారా భర్తీ చేయాల్సిన విద్యాశాఖ టీఆర్టీ అభ్యర్థులను పక్కనబెట్టి విద్యావాలంటీర్లను కొనసాగించడంతో సందిగ్ధత నెలకొంది. పాతవారే కొనసాగింపు.. సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి విద్యావాలంటీర్లను నియమిస్తోంది. రెండేళ్ల నుంచి నెలకు రూ.12 వేల వేతనం అందజేస్తూ వారితో వివిధ సబ్జెక్టుల వారీగా బోధన చేయిస్తోంది. కిందటేడాది వరకు కొత్తగా నియామకాలు చేపడుతూ అర్హత ప్రకారం నియమించేవారు. ఇలా ప్రతీ ఏడాది దరఖాస్తులు చేసుకోవడం, మెరిట్ తదితర కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్నామని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇదివరకు పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే ఈ ఏడాది నుంచి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో తాత్కాలిక బోధకులను బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బడులు పునః ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల విద్యాధికారులు సైతం ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు తాత్కాలిక బోధకులను కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు వారికి బడుల్లో చేరాలని సమాచారం అందించారు. ఇది వరకు ఉపాధ్యాయులు లేనిచోట, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి బోధకుల కొరత ఉన్నచోట, ప్రాధాన్యతక్రమంలో వీరిని నియమించారు. ఆయా పాఠశాలల్లో తాజా సంఖ్యను బట్టి మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కిందటేడాదిలో పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్తగా మరికొందరిని కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 134 మంది వరకు ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు విద్యావాలంటీర్లు రావడంతో కొంత ఉపశమనం కలిగినట్లవుతోంది. టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదా..! ప్రభుత్వం తాజాగా సర్కారు బడుల్లో విద్యావాలంటీర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటి కే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి ఫలితాల ను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి సుమారు నాలు గు నెలలు కావస్తున్నా... వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. బడులు తెరిచే నాటికి వీరిని బడుల్లో నియమించాలని అనేక డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. ఎంపికైన అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం నియామక ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యావాలంటీర్లనే బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొంత కాలం టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వి ద్యావాలంటీర్లను కొనసాగిస్తున్నామని డీఈవో వెంకటేశ్వర్లు వివరించారు. పాఠశాలల్లో ప్రాధాన్య క్రమంలో వారిని నియమించినట్లు వివరించారు. -
టీఆర్టీ అభ్యర్థుల అరెస్ట్..విడుదల
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామకాల జాప్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్కు వచ్చిన టీఆర్టీ అభ్యర్థులను పోలీటసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్దకు వేళ్లేందుకు పోలీసులు అనమతి నిరాకరించారు. అయినప్పటికీ టీఆర్టీ అభ్యర్థులు టీఆర్టీ ప్రగతి భవన్లోకి వేళ్లేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేసి గోషామాల్ పోలీస్టేషన్కు తరలించారు. దీనికి నిరసనగా అభ్యర్థులు అక్కడే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉదయం నుండి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో మహిళల పరిస్థితి చాలా ఆందోళనగా మారింది. దీంతో అరెస్ట్ చేసిన టీఆర్టీ అభ్యర్థులను రిలీజ్ చేశారు. -
టీఆర్టీ–ఎస్జీటీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ–ఎస్జీటీ(తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన 3,375 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ గురువారం రాత్రి ప్రకటించింది. 3,786 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా, వివిధ కారణాలతో 411 పోస్టులకు సంబంధించిన ఫలితాలను పెండింగ్లో ఉంచింది. వైద్య నివేదికలు పెండింగ్లో ఉండటం/ఆయా శారీరక వైకల్య(పీహెచ్) కేటగిరీల అభ్యర్థులు లేకపోవడంతో ఇతర అంతర్గత కేటగిరీలకు మార్చడం/ఫర్దర్ పికప్ వంటి కారణాలతో పీహెచ్ కేటగిరీలోని 269 పోస్టుల ఫలితాలను పెండింగ్లో ఉంచింది. బీసీ–సీ, ఎస్టీ(డబ్ల్యూ) ఏజెన్సీ అభ్యర్థులు లేక 73 పోస్టులను భర్తీ చేయలేకపోయింది. కోర్టు కేసుల కారణంగా 23 పోస్టులు, ఏజెన్సీ ప్రాంతాలకు ఎంపికైన అభ్యర్థుల స్థానిక క్లైం విషయంలో మరో 46 పోస్టుల ఫలితాలను పెండింగ్లో ఉంచామని కమిషన్ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 45 కేటగిరీల్లో 7,485 ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను ప్రకటించామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్ ఠీఠీఠీ. ్టటpటఛి. జౌఠి. జీn లో చూసుకోవాలని సూచించారు. -
రెగ్యులర్ ఉపాధ్యాయులేరి?
భైంసాటౌన్ ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమంటూ ఊదరగొడుతున్న సర్కారు.. విద్యార్థులకు సరైన విద్య అందించడంపై మాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రెగ్యులర్ ఉపాధ్యాయుల భర్తీపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో మొత్తం 510 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఖాళీల్లో విద్యావలంటీర్ల భర్తీతో సరిపెట్టనుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన టీఆర్టీలో మెరిట్ సాధించిన అభ్యర్థులు నియామకాల ప్రక్రియ జాప్యం అవుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 764 ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అన్నీ కలిపి 764 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 3047 ఉపాధ్యాయులు అవసరం ఉండగా, ప్రస్తుతం 2537 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 510 ఖాళీలున్నాయి. ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ఉపాధ్యాయులు లేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినా ఉపాధ్యాయులు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థుల ప్రవేశాలను పెంచుతున్నారు. సమస్యలతో సతమతం.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని నిరుద్యోగ యువత భావించింది. ప్రభుత్వం కూడా టీచర్ల భర్తీ అంటూ చాలాసార్లు ప్రకటనలు చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇటీవల టీఆర్టీ నిర్వహించినా.. దానికి సంబంధించిన ఫలితాలు, నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మూడేళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్యాబోధన అందక ఇబ్బందులు పడ్డారు. అంతేగాకుండా ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలంటూ బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కానీ అందుకనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు విద్యాబోధన అందించడం కష్టంగా మారింది. అయోమయంలో టీఆర్టీ అభ్యర్థులు.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం విద్యావలంటీర్లతో భర్తీ చేయనుంది. 510 ఖాళీలుండగా, ప్రభుత్వం అన్ని చోట్ల టీచర్ల భర్తీకి వీవీ పోస్టులను మంజూరు చేసింది. ఈనెల 16వరకు దరఖాస్తుల స్వీకరించారు. ప్రస్తుతం డీఈవో కార్యాలయం నుంచి ప్రొవిజనల్ లిస్టు ఎంఈవో కార్యాలయాలకు చేరింది. ఏమైనా అభ్యంతరాలుంటే పరిశీలించిన అనంతరం తిరిగి డీఈవో కార్యాలయానికి లిస్టు పంపనున్నారు. అనంతరం అభ్యర్థులు తుది ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశముంది. దీంతో విద్యార్థులకు కొంతమేర ఇబ్బంది తొలగినా.. అది తాత్కాలికమేనని అనిపిస్తోంది. ఒకవేళ టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే వీవీల పరిస్థితి ఏమిటోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2600 దరఖాస్తులు జిల్లాకు 510 విద్యావలంటీర్ల పోస్టులు మంజూరుకాగా, ఆయా మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 2600 దరఖాస్తులు వచ్చినట్లు డీఈవో తెలిపారు. దరఖాస్తులదారులకు సంబంధించి నిబంధనల మేరకు రోస్టర్ పాయింట్లు కేటాయించారు. ఎంఈవో కార్యాలయాలకు అభ్యర్థుల లిస్టు పంపించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసి, అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక లిస్టు రానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశం ఉంది. రెగ్యులర్ టీచర్లను నియమించాలి మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులకు సరైన విద్యాబోధన అందకపోవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపడానికి ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. – బివి.రమణారావు,పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
‘టీఆర్టీ’ ఫలితాల్లో గందరగోళం
సాక్షి, జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్టికెట్పై సంబంధంలేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలంగా కష్టపడి పరీక్ష కు ప్రిపేర్ అయితే.. టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో అధి కారులు సాంకేతిక తప్పిదం జరిగిందని తప్పించుకుని మరోమారు నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన అనంతరం తాము చూసుకున్న ఫైనల్కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు కూడా వ్యత్యాసం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్. సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీకి చెందిన మహిళ. ఈమెను బీసీ డీ పురుషుడిగా, మహబూబ్నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో చూపించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జె. రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాలు ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థికి రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా, బీసీ డీగా చూపించారు. మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలాకా లం పాటు కష్టపడి చదివి ఫలితాల కోసం ఎదురుచూస్తే తీవ్రనిరాశ కలిగించాయి. ప్రకటించిన ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతోంది.. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్షల్లో తప్పులు దొర్లడం సర్వసాధారణమైంది. పరీక్ష రాసిన అభ్యర్థిలో ప్రతిసారి ఫలితాలు ఎలా వస్తాయో అనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రకటించిన ఫలితాల్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి. –మారుతిరెడ్డి, కరీంనగర్ జిల్లా -
టీఆర్టీ ఫలితాల్లో గందరగోళం
జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్టికెట్పై సంబంధం లేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలం కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయితే టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. సాంకేతిక తప్పిదం జరిగిందంటూ అధికారులు నిరుద్యోగులను మరోమారు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన తర్వాత తాము చూసుకున్న ఫైనల్ కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు వ్యత్యాసం ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. ♦ జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్.సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. ♦ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీ మహిళ. ఈమెకు బీసీ డీ పురుషుడిగా, మహబూబ్నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో ఉంది. ♦మహబూబ్నగర్కు చెందిన జె.రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాల్లో ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ♦ ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థి అయితే రంగారెడ్డి జిల్లా బీసీ డీ అని ఉంది. ♦ మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలా కాలం పాటు కష్టపడి చదివి పరీక్ష రాస్తే ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం సరికాదు. ఫలితాలు సైతం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా -
‘స్కూల్ అసిస్టెంట్’ ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలతో పాటు మెరిట్ ఆధారంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయించింది. పోస్టుల భర్తీలో పారదర్శకతతో పాటు జిల్లాలోని 20 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ ర్యాంకులను ప్రకటించింది. 1941 స్కూల్ ఆసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థికి వచ్చిన రాష్ట్ర ర్యాంకు, హాల్టికెట్ నంబరు, మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, జిల్లా వివరాలతో ఫలితాలను ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులకు 1,17,410 మందితో మెరిట్ జాబితాను రూపొందించింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం జారీ చేసిన ర్యాంకుల జాబితాల నుంచి ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పంపించనుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను బట్టి అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనుంది. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పండిట్ పోస్టులకు సంబంధించిన ర్యాంకులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ప్రకటన చేశారు. మే 4న టెట్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసకమిషన్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని చెప్పారు. ఆరు కేటగిరీల్లో(ఎస్జీటీ, ఎస్ఏ, పీఈటీ, ఎల్పీ, మ్యూజిక్) మొత్తం 10,351 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెట్, డీఎస్సీల సిలబస్ను వారంలోగా వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ : 6-7-2018 దరఖాస్తు గడువు : 7-7-2018 నుంచి 9-8-2018 వరకూ హాల్ టికెట్స్ : 15-08-2018 పరీక్షలు : 23-08-2018 నుంచి 30-08-2018 ( రెండు సెషన్లలో 9.30 నుంచి 12, 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు ) ప్రాథమిక కీ : 31-08-2018 అభ్యంతరాల గడువు : 31-08-2018 నుంచి 07-09-2018 వరకూ ఫైనల్ కీ :10-09-2018 తుది ఫలితాలు : 15-09-2018 ఖాళీల వివరాలు ఎస్జీటీ - 4,967 ఎస్ఏ - 2978 లాంగ్వేజ్ పండిట్స్ - 312 పీఈటీ - 1056 మ్యూజిక్, డాన్స్ - 109 మోడల్ స్కూల్స్ - 929 -
మూడ్రోజుల్లో టీఆర్టీ ఫైనల్ కీలు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ఫైనల్ కీలను రెండు, మూడ్రోజుల్లో ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల వెరిఫికేషన్ జాబితాలను సిద్ధం చేయనుంది. అయితే ఈ ప్రక్రియను చేపట్టాలంటే కోర్టులో 200 వరకు ఉన్న కేసులపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, విద్యాశాఖ కమిషనర్ కిషన్, న్యాయ శాఖ కార్యదర్శితో టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ గురువారం సమావేశమై చర్చించారు. వారి ఫలితాలు ప్రకటించాలా.. వద్దా? సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, పండిట్ పోస్టులకు సంబంధించిన అర్హతల విషయంలో అభ్యర్థులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్, డిగ్రీలలో జనరల్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాల్సిందేనని ఆయా పోస్టుల నోటిఫికేషన్లలో పొందుపరిచారు. అలాగే విద్వాన్ వంటి కోర్సులకు ఎన్సీటీఈ ఆమోదం లేనందున వాటిని అనుమతించబోమని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. దీంతో ఆయా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వారంతా కోర్టు అనుమతితో పరీక్షలకు హాజరయ్యారు. కోర్టు వారిని పరీక్షకు అనుమతించాలని చెప్పిందే తప్ప వారి ఫలితాలను ప్రకటించాలని చెప్పలేదు. ఈ నేపథ్యంలో వారి ఫలితాలను వెల్లడించవద్దని, ఆయా కేసుల్లో అప్పీల్కు వెళతామని విద్యాశాఖ టీఎస్పీఎస్సీ అధికారులకు సూచించింది. ఒకట్రెండు రోజుల్లో కోర్టుకు.. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న ఫైనల్ కీలను ప్రకటించాల్సి ఉంది. దీంతో వాణీప్రసాద్ గతంలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అందులో భాగంగా గురువారం సమావేశం నిర్వహించి ఆయా కేసులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ అప్పీల్ ద్వారా ఆయా కేసులపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో విద్యాశాఖ కోర్టును ఆశ్రయించనుంది. అయితే ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఫైనల్ కీలను ప్రకటించినా కోర్టులో ఉన్న కేసులపై స్పష్టత వచ్చాకే 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసి పాఠశాల విద్యా కమిషనర్కు టీఎస్పీఎస్సీ పంపించనుంది. జిల్లాల్లో వెరిఫికేషన్ పూర్తయ్యాక డీఈవోలు ఆ జాబితాలను టీఎస్పీఎస్సీకి పంపిస్తే.. టీఎస్పీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లను ప్రకటించనుంది. -
జూన్లోగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్లోగా 8,792 ఉపాధ్యాయ ఖాళీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ – నాణ్యమైన విద్య – ప్రధానోపాధ్యాయుల పాత్ర’అనే అంశంపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేయడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం బాధ కల్గిస్తోందన్నారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రాకపోవడం గురించి హెచ్ఎంలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 31 జిల్లాల్లో బాగా పనిచేసే ప్రధానోపాధ్యాయులను గుర్తించి, వారికి ప్రత్యేకంగా సన్మానం చేస్తామని తెలిపారు. మిషన్ భగీరథలో పాఠశాలలకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని స్థానికంగా సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఆదేశాలు జారీ చేశామన్నా రు. ప్రస్తుతం వారానికి 3 గుడ్లు ఇస్తున్నామని భవిష్యత్తులో ఆరు గుడ్లు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు బియ్యం కోటా పెంచుతామని అన్నారు. పాఠశాలలకు కరెంట్ బిల్లులు లేకుండా చేస్తామన్నారు. నాణ్యమైన విద్యను అందించాలి: ఈటల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడేలా చేయాలని సూచించారు. పాఠశాలల్లో స్థలం ఉంటే ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు పెట్టుకోవాలని చెప్పామన్నారు. కార్యక్రమంలో మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్రెడ్డి, పూల రవీందర్, టీఎస్జీహెచ్ఎంఏ గౌరవాధ్యక్షుడు ఎస్.సుధాకర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సింగిడి లక్ష్మారెడ్డి, పి.రాజభాను చంద్రప్రకాశ్, కోశాధికారి కె. శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
టీచర్ జాబ్ రాదేమోనని యువతి ఆత్మహత్య
పరిగి : జీవితంలో ఇక టీచర్ ఉద్యోగం సాధించలేనేమోనన్న ఆందోళనతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్లా మూసపేట మండలం వేములకు చెందిన ఎన్.చంద్రయ్య చిన్న కుమార్తె నిర్మల(30) డీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. గతంలో 2సార్లు డీఎస్సీ రాసినా కొద్దిలో తప్పిపోయింది. టీఆర్టీ నోటిఫికేషన్ రాగానే పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకుంది. వచ్చే నెల 4న ఫిజికల్ సైన్స్లో స్కూల్ అసిస్టెంట్ కోసం టీఆర్టీ రాయాలి. ఈ సారీ పోటీ ఎక్కువగా ఉందంటూ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనం చదివి తీవ్ర ఆందోళనకు గురైంది. ఇదే సమయంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు వికారాబాద్ మిషన్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గతేడాది అనారోగ్య కారణంతో తల్లి మృతిచెందగా అప్పట్నుంచీ నిర్మల మరింత కుంగిపోసాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
సాక్షి ఎడ్యుకేషన్.కామ్లో టీఆర్టీ ఎస్జీటీ ‘కీ’
సాక్షి, ఎడ్యుకేషన్ : టీఎస్పీఎస్సీ పిబ్రవరి 25న నిర్వహించిన టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్ష కు నిపుణులతో రూపొందించి కీ సాక్షి ఎడ్యుకేషన్.కామ్లో అందుబాటులో ఉంది. ఇది అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే కీ ని అంతిమంగా పరిగణించాలి. టీఆర్టీలో మొత్తం 42 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ముగిసిన వెంటనే సాక్షి ఎడ్యుకేషన్.కామ్లో కీ అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం కీ కోసం క్లిక్ చేయండి ఇంగ్లిష్ మీడియం కీ కోసం క్లిక్ చేయండి -
నేటి నుంచి టీఆర్టీ పరీక్షలు
-
ఆలస్యమైతే నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల రాత పరీక్షలను (టీఆర్టీ) రేపటి నుంచి మార్చి 4 వరకు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో జరిగే పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఐదు కేటగిరీల్లో 48 రకాల సబ్జెక్టులు, మీడియంలలోని 8,792 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,77,518 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయంకన్నా ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. బయోమెట్రిక్ అథెంటికేషన్ వివరాల సేకరణకు సమయం పడుతుందని, అందుకే అభ్యర్థులు కచ్చితంగా 45 నిమిషాల ముందే పరీక్ష హాల్లోకి వెళ్లాలని వివరించింది. నిర్ణీత పరీక్ష సమయం కంటే ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమ య్యే పరీక్షల కోసం అభ్యర్థులు 9:15 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలని, మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలయ్యే పరీక్షల కోసం అభ్యర్థులు 1:45 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలని సూచించింది. అభ్యర్థులు హాల్టికెట్తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని పేర్కొంది. పరీక్షలు, హాల్టికెట్లకు సంబంధించి ఏమై నా సమస్యలుంటే టీఆర్టీ హెల్ప్డెస్క్ను 8333923740 నంబర్లో (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు) సంప్రదించాలని లేదా helpdesk @tspsc.gov.inకు మెయిల్ చేయాలని సూచించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి రెండు పరీక్షలు మినహా మిగ తా వాటిని ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అభ్యర్థులు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన లింకు (ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఆన్ సీబీఆర్టీ ఎగ్జామినేషన్స్లోకి వెళ్లి ఆన్లైన్ మాక్ టెస్టు) ద్వారా ప్రాక్టీస్ చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ చేసిన సూచనలు ఇవీ... ఉదయం పరీక్ష రాసే వారు 9:15 గంటలకే, మధ్యాహ్నం పరీక్ష రాసేవారు1:45 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలి. హాల్టికెట్తోపాటు ఏదేని గుర్తింపు కార్డు పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు ఐడీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి. పరీక్ష పూర్తయ్యే 150 నిమిషాల వరకు బయటకెళ్లడానికి వీల్లేదు. పూర్తయ్యాక బయటకు వెళ్లేప్పుడు తమ వద్ద ఉన్న పెన్, రఫ్ పేపర్లు ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. అభ్యర్థి హాల్ టికెట్లో ఫొటో సరిగ్గా కనిపించకపోతే అభ్యర్థి తన రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలను వెంట తీసుకెళ్లాలి. అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ స్క్రీన్పై అతని ఫొటో పేరుతో సహా వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఏమైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్కు తెలియజేయాలి. మొబైల్, ట్యాబ్, పెన్డ్రైవ్, బ్లూటూత్, వాచ్, క్యాలిక్యులేటర్, లాగ్ పట్టికలు, పర్స్, నోటు పుస్తకాలు, విడి పేపర్లు, రికార్డింగ్ పరికరాలు వెంట తెచ్చుకోకూడదు. బంగారు ఆభరణాలు వెంట తెచ్చుకోవద్దు. మెహందీ, ఇంక్ను చేతులు, పాదాలపై పెట్టుకోవద్దు. పరీక్ష సమయంలో కీబోర్డును తాకవద్దు. మౌస్ను ఉపయోగించి సమాధానాలు క్లిక్ చేయాలి. -
యథావిధిగా టీఆర్టీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లు యథావిధిగా జరుగుతాయని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని చెప్పారు. ఈ నెల 24 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డేటా ప్రాసెస్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిబ్బంది(సీజీజీ) చేసిన పొరపాట్ల వల్ల పరీక్ష కేంద్రాల కేటాయింపులో తప్పులు దొర్లాయని, వాటిని మార్చామని చెప్పారు. రాత పరీక్షలకు (ఆఫ్లైన్) సంబంధించి పరీక్ష కేంద్రాల ను ఏ జిల్లా అభ్యర్థికి ఆ జిల్లాలోనే కేటాయించామని, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్, బయోలాజికల్ సైన్స్) పోస్టులకు ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఎక్కడైనా కేటాయించే అధికారం టీఎస్పీఎస్సీకి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం గా పేర్కొన్నా.. అభ్యర్థులకు అసౌకర్యం కలగకూడదని మార్పులు చేసినట్లు చెప్పారు. 25 నాటి పరీక్షల హాల్టికెట్లు నేడు.. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలకు హెచ్ఎండీఏ సహా కరీంనగర్, వరంగల్, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని చక్రపాణి తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్ అభ్యర్థులకు హైదరాబాద్ తదితర జిల్లాల్లో కేటాయించామని చెప్పారు. కరీంనగర్లో ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో కొందరికి ఇతర జిల్లాల్లో కేంద్రాలు కేటాయించామన్నారు. 48 రకాల సబ్జెక్టులు, మీడియం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. 24న జరిగే పరీక్షల హాల్టికెట్ల జారీని బుధవారం ప్రారంభించామని, 25 నాటి పరీక్షలకు హాల్టికెట్లు గురువారం అందుబాటులో ఉంచుతామని, ఇలా మార్చి 4వ తేదీ వరకు జరిగే పరీక్షల హాల్టికెట్లను వరుసగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీఆర్టీ తర్వాత ‘గురుకుల లెక్చరర్’ గురుకుల టీజీటీ పోస్టుల పరీక్ష ఫలితాలు త్వరలోనే ప్రకటిస్తామని చక్రపాణి వెల్లడించారు. పీజీటీ పోస్టులు పొందిన వారు కొందరు టీజీటీ పోస్టుల ఎంపిక జాబితాలోనూ ఉన్నారని, అందులో టీజీటీ పోస్టు వద్దనుకునే వారి అభిప్రాయాలు తీసుకొని తరువాతి మెరిట్ అభ్యర్థుల ఎంపిక చేపట్టామన్నారు. నెల రోజుల్లో పోస్టింగులు ఇస్తామని చెప్పారు. గురుకుల లెక్చరర్ పోస్టుల మెయిన్ పరీక్షలకు 1:15 రేషియోలో సీజీజీ ఎంపిక చేసిన జాబితాలో పొరపాట్లు దొర్లినందున ఈ నెల 19 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామన్నారు. టీఆర్టీ పరీక్షలు పూర్తయ్యాక వాటికి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు టీఎస్పీఎస్సీ, పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని టీఎస్పీఎస్సీ సభ్యుడు సి.విఠల్ హెచ్చరించారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించామని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకునే అధికారం కమిషన్కు ఉందని చెప్పారు. గతంలో నిజామాబాద్లోని ఓ కాలేజీలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయకపోయినా అక్కడ పరీక్ష కేంద్రం ఉందని, అక్కడ పరీక్ష రాసిన 150 మందిని ఎంపిక చేశారని తప్పుడు ప్రచారం చేశారని, అలా ప్రచారం చేసిందెవరో గుర్తించామని వివరించారు. టీఎస్పీఎస్సీని అభాసుపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. హెల్ప్డెస్క్ను సంప్రదించండి హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే స్వయంగా లేదా ఫోన్ ద్వారా టీఆర్టీ హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు హెల్ప్డెస్క్ పని చేస్తుందని చెప్పారు. రెండు రకాల సబ్జెక్టులు మినహా మిగతా 46 రకాల సబ్జెక్టులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నందున మాక్ టెస్టు లింకును వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ప్రశ్నకు సరైన జవాబు ఎంపిక చేసుకొని టిక్ చేశాక జవాబు పక్కన ఉండే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలని, అప్పుడే జవాబు రాసినట్లు ధ్రువీకరణ అవుతుందని వివరించారు. టీఆర్టీ పీఈటీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్లోనూ ఇవ్వండి టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ల్లో పీఈటీ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు తెలుగుతో పాటు ఇంగ్లిష్లోనూ ప్రశ్నపత్రం ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. పీఈటీ కోర్సు ఇంగ్లిష్లోనే ఉంటుందని, తెలుగులోనే ప్రశ్నపత్రం ఇస్తే అభ్యర్థులు నష్టపోతారంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కె.వెంకటరమణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో రెండు భాషల్లోనూ పరీక్షను నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రమేశ్ హైకోర్టుకు తెలపటంతో న్యాయమూర్తి పైవిధంగా ఆదేశాలిచ్చారు. -
తప్పుల తడకగా టీఆర్టీ హాల్టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) హాల్టికెట్ల జారీ గందరగోళంగా మారింది. అభ్యర్థుల హాల్టికెట్లలో తప్పులు దొర్లడంతోపాటు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ భారీ తప్పిదం జరిగింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక తప్పిదంతో పరీక్ష కేంద్రాల కేటాయింపు తారుమారైంది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన మూడు ప్రాధాన్య జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. మంగళవారం అనేక మంది టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిపై టీఎస్పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీజీజీలో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన టీఎస్పీఎస్సీ.. హాల్టికెట్ల డౌన్లోడ్ లింకును వెబ్సైట్ నుంచి తొలగించింది. అభ్యర్థులు ఆందోళన చెందొద్దని.. కొత్త హాల్టికెట్లను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఇప్పటికే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారితోపాటు మిగిలిన వారు కూడా కొత్త హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. వీలైతే ఈ నెల 21న (బుధవారం) హాల్టికెట్ల లింకు అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. సీజీజీ వరుస తప్పిదాలు.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వరుస తప్పిదాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. గతంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కేటాయింపులో తప్పులు జరిగిన తర్వాత కూడా సీజీజీ జాగ్రత్త వహించిన దాఖలాలు లేవు. ఇటీవల గ్రూప్–1 పోస్టులకు పోస్టుల కేటాయింపే అందుకు ఉదాహరణ. సీజీజీ సాంకేతిక తప్పిదంతో అభ్యర్థుల పోస్టింగులు మారిపోయాయి. దీనిపై ఫిర్యాదులందడంతో ఎంపిక జాబితాను మళ్లీ రూపొందించారు. లెక్చరర్ పోస్టులకు సంబంధించి మెయిన్ పరీక్షకు 1.15 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలోనూ మళ్లీ అదే తప్పు చేసింది. మెయిన్ జాబితాలో పేర్లు లేవని ఫిర్యాదులు అందడంతో.. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు దొర్లినట్లు టీఎస్పీఎస్సీ గుర్తించింది. దీంతో ఈ నెల 19న జరగాల్సిన గురుకుల పోస్టుల మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయినా జాగ్రత్త వహించకుండా టీఆర్టీ హాల్టికెట్లలో పొరపాట్లకు సీజీజీ కారణమైంది. హాల్టికెట్లలో తప్పులు తరువాత సరిచేసుకోవచ్చనుకున్నా.. అభ్యర్థి పరీక్ష కేంద్రం కోసం ఇచ్చిన మూడు జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించింది. నల్లగొండ జిల్లా అభ్యర్థులకు ఆదిలాబాద్లో, మహబూబ్నగర్ అభ్యర్థులకు కరీంనగర్లో.. ఇలా అన్ని జిల్లాల అభ్యర్థుల పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లోనూ పొరపాట్లు చేసింది. -
టీఆర్టీ ఫలితాల విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్ : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) ఖమ్మం , వరంగల్ జిల్లాల ఫలితాల విడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించ తలపెట్టిన టీఆర్టీ, ఎస్జీటీ పోస్టులలో డీఎస్సీ-2012 లో భర్తీ కాకుండా మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల పోస్టులను టీఆర్టీ-2017లో వికలాంగ అభ్యర్థులకు కేటాయించకపోవటాన్ని సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన మురళి, వరంగల్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2012 డీఎస్సీలో వికలాంగ అభ్యర్థులకు కేటాయించిన ఎస్జీటీ పోస్టులలో ఖమ్మం జిల్లాలో 6 పోస్టులు, వరంగల్ జిల్లాలో 19 పోస్టులు మిగిలిపోయానని, అయితే జీవో 23, 99 ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులను తరవాత వచ్చే వరుస మూడు నోటిఫికెషన్లలలో కూడా వికలాంగ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 తెలియ చేస్తుందని న్యాయవాది బూర రమేష్ వాదించారు. ఖమ్మం జిల్లాలో మిగిలిపోయిన 6 పోస్టులలో కేవలం ఒక పోస్టును, వరంగల్ జిల్లాలో 19 పోస్టులలో కేవలం 10 పోస్టులు మాత్రమే వికలాంగ అభ్యర్థులకు కేటాయించారు అని బూర రమేష్ హైకోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 కి విరుద్ధమని వాదించారు. బూర రమేష్ వాదనలతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. అయితే పరీక్ష నిర్వహించుకోవచ్చుననీ ఈ వాజ్యం పై తుది తీర్పు వెలువడేవరకు ఖమ్మం, వరంగల్ జిల్లాలో టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించటానికి వీలు లేదు అని టీఎస్పీఎస్సీ, ఉన్నత విద్యా శాఖలకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ దరఖాస్తును స్వీకరించండి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లపాటు మహబూబ్నగర్ జిల్లాలో చదివినందున తనకు టీఆర్టీ నిబంధనల ప్రకారం తెలంగాణలో స్థానికత ఉంటుందని కర్నూలు జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగి చేసిన వాదనను హైకోర్టు ఆమోదించింది. 5వ తరగతి నుంచి టెన్త్ వరకూ మహబూబ్నగర్ జిల్లాలో చదివానని, అయితే తాను కర్నూలు జిల్లా వాసినని చెప్పి ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం చేసుకున్న దరఖాస్తును ఆమోదించలేదంటూ కర్నూలు మండలం రెమట గ్రామస్తుడు ఎం.రంగస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. ఉద్యోగ ప్రకటన ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతిలోపు నాలుగేళ్లు వరుసగా ఒకే జిల్లాలో చదివి ఉంటే స్థానికత వర్తింపజేస్తామన్న నిబంధన మేరకు పిటిషనర్ దరఖాస్తును స్వీకరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను న్యాయమూర్తి ఆదేశించారు. దరఖాస్తుల ఆన్లైన్ స్వీకరణ గడువు ముగిసినప్పటికీ లిఖితపూర్వక హామీతో దరఖాస్తు తీసుకుని ఆమోదించాలని, అభ్యర్థికి హాల్టికెట్ కూడా జారీ చేసి పరీక్షకు అనుమతించాలని సర్వీస్ కమిషన్ను ఆదేశించారు. -
టీఆర్టీ దరఖాస్తుల్లో సవరణకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఇకపై మళ్లీ అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థులు తమ జిల్లా విషయంలో పొరపాట్లు చేశారని దీంతో వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని పేర్కొంది. ఆ సమయంలోనూ చాలా మంది మళ్లీ పొరపాట్లు చేశా రని తెలిపింది. 31 జిల్లాల ప్రకారం చేసిన దరఖాస్తుల్లోనూ పొరపాట్లు చేశారని వెల్ల డించింది. మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని తెలిపింది. -
4 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నాలుగు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని 423 పోస్టులకు గురువారం ప్రకటనలు వెలువరించింది. ఈ పోస్టుల వివరాలు పరిశీలిస్తే హార్టికల్చర్ ఆఫీసర్-27, అసిస్టెంట్ లైబ్రేరియన్ -6, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 - 238, ఏఎన్ఎంలు - 152 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈ నెల (జనవరి) 31 మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. 310 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులకు ఆ రోజు నోటిఫికేషన్ వెలువరిస్తారు. టీఆర్టీ దరఖాస్తు సవరణకు మరో అవకాశం టీఆర్టీ దరఖాస్తు సవరణకు టీఎస్పీఎస్సీ మరోసారి అవకాశం కల్పించింది. పాత జిల్లాల ప్రకారం పొందుపరచాల్సిన వివరాలు కూడా అభ్యర్థులు సరిగా ఇవ్వలేదని, బయోడేటా వంటి వివరాలు సక్రమంగా పొందుపరచలేదని వారికోసం మరోసారి అప్లికేషన్ సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. 26, 27 తేదీల్లో టీఆర్టీ దరఖాస్తును సవరించుకోవచ్చు. -
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
-
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ వెంటనే గురుకుల టీజీటీ తుది ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టీజీటీ అభ్యర్థులు చేరి ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ వద్దే భైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులాల్లోని (పీజీటీ, టీజీటీ) స్థాయిలోని పలు పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తొలుత అభ్యర్థులను 1:2 గా ఎంపిక చేశారు. ఇందులో కొద్ది రోజుల కిందటే పీజీటీ ఫలితాలను వెల్లడించారు. కానీ, టీజీటీ ఫలితాలను మాత్రం పెండింగ్లో పెట్టారు. అయితే, ప్రస్తుతం టీజీటీ పోస్టులకు 1:2 ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా కూడా తమకు ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క, వివిధ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు నిర్వహించనుంది. దీంతో టీజీటీ 1:2కు ఎంపికైన అభ్యర్థులు ఇటు గురుకులాలపై ఆశపెట్టుకోవాలా, టీఆర్టీకి చదవాలా అనే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినప్పటికీ ఫలితాల వెల్లడి విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తునే ఉన్నారు. వివిధ మార్గాల ద్వారా టీఎస్పీఎస్సీపై ఫలితాలకోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రావడంతో సోమవారం టీజీటీ 1:2 అభ్యర్థులంతా టీఎస్పీఎస్సీ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న తమకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉపశమనం కలిగించాలని, ఆందోళన నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
14 నుంచి టీ–శాట్ చానళ్లలో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’
సాక్షి, హైదరాబాద్: వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టీ–శాట్ చానళ్లలో ప్రత్యేకంగా ఆంగ్లబోధన పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్లు టీ–శాట్ సీఈఓ ఆర్.శైలేశ్రెడ్డి వెల్లడించారు. రామకృష్ణ మఠం సౌజన్యం తో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి ప్రతి ఆదివారం నిపుణ, విద్య చానళ్లలో ప్రసారం చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిపుణ చానల్లో, సాయంత్రం 4గంటలకు విద్య చానల్లో 45 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీఆర్టీ ప్రసారాలు మరో 3 గంటలు.. టీ–శాట్ నెట్వర్క్ చానళ్లలో ప్రసారం చేస్తున్న టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అవగాహన ప్రసారాలను ఈ నెల 12 నుంచి మరో 3 గంటలు అదనంగా ప్రసారం చేయనున్నట్లు శైలేశ్రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులున్న నేపథ్యంలో 5 రోజుల పాటు ప్రసారాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిపుణ చానల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు, విద్య చానల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఈ అదనపు ప్రసారాలుంటాయని పేర్కొన్నారు. -
రండిబాబూ.. రండి..!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే టీచర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులు కూడా పూర్తయ్యాయి. సంబంధిత పరీక్షలో విజయం సాధించేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా కొలువు కొట్టాలని ఆసక్తితో ఉన్నారు. అయితే సదరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ‘రండిబాబూ.. రండి’ అంటూ అభ్యర్థులను నిలువునా ముంచుతున్నారు. అర్హతలేని టీచర్లతో బోధిస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. గోదావరిఖని టౌన్ : టీఆర్టీకి కేవలం కొద్ది నెలల గడువు మాత్రమే ఉందని భావించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగు తీస్తున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం కోచింగ్ తీసుకునే అభ్యర్థులు తస్మాత్జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీని ప్రకటించిన వెంటనే కొన్ని బూటకపు కోచింగ్ సెంటర్లు పుట్టుకచ్చి, అభ్యర్థుల నుంచి వేలల్లో డబ్బు గుంజడానికి అసత్యపు ప్రచారాలతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 నుంచి 40వేల వరకు టీఆర్టీ కోసం కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారు. గతంలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలలో మాత్రమే గుర్తింపు ఉన్న కోచింగ్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం గుర్తింపు లేకున్నా ప్రతీ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం సంబంధిత అధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించడం లేదు. కోచింగ్ సెంటర్లకు కావాల్సిన అర్హత ఏమిటి, వాటిని ఎలా సమసన్వయ పరుచాలనే బాధ్యతలను నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారు. వేలల్లో ఫీజులు గోదావరిఖని, మంథని, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలలో ఉన్న పలు సెంటర్లు మూడు నెలలకు రూ. 40 నుంచి 60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులను నియంత్రించడమే కాకుండా, సరైన కోచింగ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సరైన సెంటర్ను ఎంచుకోవాలి కోచింగ్ సెంటర్లలలో బోధించే అధ్యాపకులకు అర్హత ఉందా, లేదా? అని చూసి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో చేరాలి. అధిక డబ్బులు చెల్లించి సరైన కోచింగ్ సెంటర్ను ఉంచుకోవడం వలన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – దాదాసలాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రచారాలు నమ్మొద్దు ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ ప్రకటించిన వెంటనే చాలా కోచింగ్ సెంటర్లు సెల్ ద్వారా, ఇతర ప్రచారా సాధనాల ద్వార ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఏది మెరుగైంది. గతంలో వాటి చరిత్ర ఏంటి ఇలా చాలా రకాలుగా సెంటర్పై విషయాన్ని తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – ఎల్ సుహాసిని, ఆర్జేడీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కోచింగ్ సెంటర్ల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. గుర్తింపు లేని సెంటర్లను మూసి వేయాలి. అర్హత లేని భోధకులను తొలగించాలి. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే డబ్బుతో పాటు సమయాన్ని, భవిష్యత్ను, అవకాశాన్ని చేజార్చుకుంటాం. – సుచరిత, హెచ్పీటీ అభ్యర్థి -
డీఈడీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష(టీఆర్టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు ఊరట లభించింది. వారి పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించిన ఓసీ, 40 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ వర్గాలకు చెందిన డీఈడీ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి, టీఆర్టీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉంటేనే టీచర్ పోస్టులకు అర్హులని అధికారులు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. అయితే, టీఆర్టీకి దరఖాస్తు చేసుకున్న పలువురి దరఖాస్తులను, డిగ్రీలో కనీస మార్కులు లేవన్న కారణంతో అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. -
డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష (టీఆర్టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖ లు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా దర ఖాస్తులను స్వీకరించి, టీఆర్టీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పిటిషనర్ల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2007 తర్వాత డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్ కేటగిరీవారు ఇంటర్లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఇతరులు 45% మార్కు లు సాధించి ఉంటేనే ఎస్జీటీ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు. ఇంటర్లో కనీస మార్కులు లేవని పలువురు టీఆర్టీ అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. -
టీఆర్టీ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) దరఖాస్తుల గడువును జనవరి 7 వరకు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ శనివారం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సుమారు 40 వేల మంది పాత 10 జిల్లాల ప్రకారం ఆప్షన్ను మార్చుకోలేదని తెలిపింది. ఎడిట్ ఆప్షన్ ద్వారా స్థానిక జిల్లాను మార్చుకుంటేనే ...దరఖాస్తులోని మిగతా తప్పిదాలు సవరించుకునేందుకు అవకాశముంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు 10వ తేదీలోగా దరఖాస్తుల్లోని తప్పులు సవరించుకోవాలని సూచించింది. దరఖాస్తుకు శనివారం ఆఖరు కావడంతో దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. అభ్యర్థుల అనుమానాలను టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ శనివారం విలేకరుల ముందు నివృత్తి చేశారు. ఎస్జీటీ తెలుగు, ఇంగ్లిష్ మీడియం పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరికి హాల్ టికెట్లతో పాటు పరీక్షలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీల్లో ఏ సబ్జెక్టుకు అర్హత కలిగిన వారు ఆయా సబ్జెక్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని కేటగిరీలకు కలిపి సుమారు 2.40లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను పాత పది జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని, మిగిలిన పోస్టులకు హెచ్ఎండీఏ పరిధిలో రాతపరీక్ష నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్టికెట్లు అందుబాటులో ఉంచుతామని, మే 10 నాటికి ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామన్నారు. నిబంధనల ప్రకారమే డీఎడ్ అభ్యర్థులకు ఇంటర్మీడియెట్లో కనీస అర్హత మార్కుల నిబంధనలు పెట్టామన్నారు. కోర్టు ఆదేశం మేరకు ఇంటర్లో 45 శాతం మార్కులు వచ్చిన వారిని సైతం అనుమతించాలని విద్యా శాఖ కోరితే అనుమతిస్తామన్నారు. పోస్టులు తక్కువగా ఉన్న జిల్లాల అభ్యర్థులు మిగిలిన జిల్లాల్లో ఓపెన్ మెరిట్ కేటగిరీ పోస్టులకు అర్హులన్నారు. దరఖాస్తు పీడీఎఫ్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ నంబర్ 9030174469, 7288896658లకు సంప్రదించాలన్నారు. -
‘పాత’ లెక్కపై పోస్టుల భర్తీకి కసరత్తు
-
‘పాత’ లెక్కపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పాత పది జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల వారీగా కాకుండా పాత పది జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేసేందుకు సోమవారం రాత్రే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య.. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి లేఖ (లెటర్ నంబర్ 7126/ఎస్ఈ జనరల్1/ఎ12015, డేట్ 4–12–2017) రాశారు. అలాగే మెమో కూడా జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పాత 10 జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. అక్టోబర్ 21వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్కు సవరణ చేయాలని సూచించారు. అభ్యర్థులు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి రాత పరీక్షలను 2018 ఫిబ్రవరిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించిన విధంగానే ముందుకు సాగాలని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ పాత పది జిల్లాల ప్రకారం పోస్టుల వివరాలను, జిల్లాల వారీగా, పోస్టుల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను విద్యా శాఖ.. టీఎస్పీఎస్సీకి అందజేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యా శాఖ.. పోస్టుల వారీగా వివరాలతోపాటు రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను సోమవారం రాత్రి టీఎస్పీఎస్సీకి అందజేసింది. దీంతో తదుపరి కార్యాచరణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. విద్యా శాఖ అధికారులతోపాటు టీఎస్పీఎస్సీ అధికారులు పది జిల్లాల వారీగా పోస్టులు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలపై పరిశీలనను మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక సవరణ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉంది. అపాయింటింగ్ అథారిటీపై సమాలోచనలు ఉపాధ్యాయ పోస్టులు జిల్లా కేడర్వి కావడంతో సంబంధిత జిల్లా అధికారి అయిన డీఈవోనే సాధారణంగా అపాయింటింగ్ అథారిటీగా వ్యవహరిస్తారు. 31 జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే ఆ విధానమే అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. తాజాగా పాత జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో భర్తీ అయ్యే టీచర్ల అపాయింటింగ్ అథారిటీ ఎవరనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదని, పాత జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తున్నందున పాత జిల్లాల డీఈవోలే అపాయింటింగ్ అథారిటీగా వ్యవహరిస్తారని న్యాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ విషయంలో విద్యా శాఖ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. ఇప్పుడే నియామకాలకు సంబంధించిన అంశంపై వివాదం ఎందుకన్న ధోరణితో ముందుకు వెళ్తోంది. పరీక్షలు పూర్తయి, నియామకాలు చేపట్టే నాటికి దానిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం ప్రకటించవచ్చని భావిస్తోంది. మార్పుల కోసం ఎడిట్ ఆప్షన్! ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్త జిల్లాల ప్రకారం దరఖాస్తు చేసుకుని ఉన్నందున.. వారు పాత జిల్లాల ప్రకారం మార్పు చేసుకునేలా దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని విద్యా శాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తుల్లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన స్కూల్, ప్రాంతం, జిల్లా పేరు ఉంటుంది కనుక.. అవి ఏ జిల్లా పరిధిలోకి (పాత జిల్లాల్లో) వస్తే ఆ జిల్లాకు స్థానికునిగా పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందని కొందరు అధికారులు భావిస్తున్నారు. దీనిపైనా రెండు మూడు రోజుల్లో టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రానుంది. -
బీఈడీ సర్టిఫికెట్ను అమ్మకానికి పెట్టిన నిరుద్యోగి
హైదరాబాద్ : 2012లో డీఎస్సీ రాయడానికి అర్హుడైన వ్యక్తి 2017 వచ్చే సరికి అనర్హుడయ్యాడు. అప్పుడు కేవలం ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయిన అతను ఐదేళ్లు డీఎస్సీ కోసం ఎదురు చూసి చివరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టీఆర్టీ నోటిఫికేషన్ చూసి షాక్కు గురయ్యాడు. టీచర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 2017 టీఆర్టీ రాయడానికి తాను అనర్హుడని పేర్కొనడంతో ఎంతో కష్టపడి తెచ్చుకున్న బీఈడీ సర్టిఫికెట్ను ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టాడో నిరుద్యోగి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అశోక్ జోగుపర్తి అనే నిరుద్యోగి తన ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్ట్.. ఇది నా బీఈడీ సర్టిఫికేట్.. అమ్ముతాను..ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తా.. మీరిచ్చిన డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇస్తా... దీనితో తెలంగాణ ప్రభుత్వం నాకు ఏమి ఉపయోగం లేకుండా చేసింది.. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది. నేను బీఈడీ చదివే రోజుల్లో నాకు ఫీజు రీయింబర్స్ కూడా రాలేదు. మంచి ర్యాంక్ తో సొంత డబ్బులతో ఫీజు కట్టి చదువుకున్నా. పంతులు ఉద్యోగం కొలువు చేద్దామని బీఈడీ పూర్తి చేశా. ఇక పంతులు కొలువు ఎప్పుడెప్పుడు సాధిద్దామా అని ఎదురుచూశా. అప్పుడు టెట్ అని ఇంకో మెలిక పెట్టిర్రు. దాంట్లో 60%మార్కులు రావలంట. సరే అదికూడా చదివిన 72% మార్కులు తెచ్చుకున్న. 2012 డీఎస్సీ రాసిన 72 మార్కులు వచ్చినాయి. ఉద్యోగం రాలే. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్కు సిద్ధపడింది. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మా తెలంగాణలో మా నోటిఫికేషన్ మేమే వేసుకుంటం అని ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం. ఎప్పుడెప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూసినం. మూడేళ్లకు కానీ మన ప్రభుత్వానికి నిరుద్యోగులు గుర్తు రాలేదు. సరే ఇప్పుడు వచ్చింది. మన ప్రభుత్వంలో పంతులు కొలువుకోసం చదువుతున్న. కానీ మన ప్రభుత్వం డిగ్రీలో 50% మార్కులు ఉంటేనే పరీక్ష రాయాలని మెలిక పెట్టింది. నేనెప్పుడో 2008 లో డిగ్రీ పూర్తి చేసిన. నాకు 48.25% మార్కులు వచ్చాయి. అప్పుడే బీఈడీకి అర్హత లేదంటే వేరేది చదువుకునే వాడిని. బీఈడీ చేసి 2 సార్లు టెట్ రాసి, ఒకసారి డీఎస్సీ రాస్తే... ఇప్పుడు నేను అర్హుడిని కాదంట.. ఇదెంత వరకు న్యాయమో మీరే చెప్పండి. 36% మార్కులు వచ్చిన వారు కలెక్టర్ అవ్వచ్చు. గ్రూప్ 1 & 2 ఉద్యోగులు అవ్వొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నాకు అర్హత లేదంటారా. మరి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అందరికీ అవకాశం ఇచ్చింది. నాకు పీజీలో 75% మార్కులు వచ్చాయి. నేను అర్హుడుని కాదా. కనీసం ప్రైవేట్ టీచర్గా కూడా పనికిరానని మన ప్రభుత్వం సర్టిఫై చేసింది నన్ను. అలాంటప్పుడు ఎందుకు నాకీ మెమో. ప్లీజ్ ఎవరైనా కొనండి నా మెమో. నా మీద జాలితో అయిన. ఆ డబ్బు కచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తా. నేను ఇప్పటికీ రెండు పీజీలు చేశా... ఆ మెమోలు కావాలన్నా ఇస్తా. ఎవ్వరూ కొనకపోతే ప్రొఫెసర కోదండరాం సమక్షంలో యూనివర్సిటీ వారికి రిటర్న్ చేస్తా. నేను ఎవ్వరి మీద కోపంతో ఈ మాటలు చెప్పట్లేదు.. ఒక నిరుద్యోగిగా...నా బాధ చెప్పుకున్నా... అని అశోక్ జోగుపర్తి తన ఆవేదన వ్యక్తం చేశాడు. అశోక్లా చాలా మంది నిరుద్యోగులు సోషల్ మీడియాలో టీఆర్టీ నోటిఫికేషన్ నిబంధనలపై, ఆలస్యంపై తమ గోడును చెప్పుకుంటున్నారు. -
ఉపాధ్యాయ దరఖాస్తుల గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తు గడువును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. గతంలో ఇచ్చిన గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు 31 జిల్లాల వారీగా కాకుండా పాత 10 జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అలాగే విద్యా శాఖ కూడా 31 జిల్లాలకు ఇచ్చిన 8,792 పోస్టులను పాత జిల్లాల వారీగా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వాటితోపాటు పాత జిల్లాల వారీగా పోస్టుల రోస్టర్ కమ్ రిజర్వేషన్లను టీఎస్పీఎస్సీకి అందజేయాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో దరఖాస్తుల గడువును వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగించాలని టీఎస్పీఎస్సీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ పాత జిల్లాల వారీగా పోస్టుల భర్తీకి సంబంధించిన జీవో జారీ, పోస్టులు, రోస్టర్ ఇవ్వడంలో ఆలస్యమైతే.. మరికొన్ని రోజులు గడువు పెంచే అవకాశం ఉంది. పాత జిల్లాల వారీగా పోస్టులను, ఆయా జిల్లాల్లో కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్లను సిద్ధం చేసి వారం రోజుల్లోగా టీఎస్పీఎస్సీకి అందజేస్తామని విద్యా శాఖ పేర్కొంది. ఇదే విషయాన్ని టీఎస్పీఎస్సీకి తెలియజేసినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ప్రభుత్వ ఉత్తర్వులు, విద్యా శాఖ నుంచి వివరాలు అందిన తర్వాత టీఎస్పీఎస్సీ తదుపరి కసరత్తును ప్రారంభించనుంది. ఈ పోస్టుల భర్తీ కోసం గత నెల 30వ తేదీ నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో అభ్యర్థుల స్థానికతను 31 జిల్లాల వారీగా తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వారు తమ గ్రామం కొత్త జిల్లాల్లో దేని కింద వస్తుందో వాటినే ఎంచుకున్నారు. ఇపుడు పాత జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నందున కొత్త జిల్లాల ప్రకారం స్థా«నికత చెల్లదు. అందుకే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి పాత జిల్లాను తమ స్థానిక జిల్లాగా ఎంచుకునేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టనుంది. అలాగే నోటిఫికేషన్కు సవరణలు చేయనుంది. ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్లో 31 జిల్లాల వారీగా వివరాలు ఇవ్వగా, ఇపుడు పాత జిల్లాల ప్రకారం, కేటగిరీల వారీగా పోస్టులు, వాటి రోస్టర్ కమ్ రిజర్వేషన్లను వివరాలతో సవరణ నోటిఫికేషన్ను జారీ చేయనుంది. మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టనుంది. అందుకే దరఖాస్తుల గడువును పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. -
‘ప్రొఫెసర్ల’ బాధ్యత వర్సిటీలకే
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల బాధ్యత యూనివర్సిటీలకే అప్పగించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో 1,550 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి సంబంధించి వేసిన కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో నియామకాలపై స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రూ.6.22 కోట్లతో నిర్మించిన పరీక్షల భవనానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.420 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.20 కోట్లు అంబేడ్కర్ యూనివర్సిటీకి ఇచ్చిందని గుర్తు చేశారు. వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనాలు పేంచేందుకు వీసీల కమిటీ ఆమోదం తెలిపిందని, త్వరలో పెంపు అమల్లోకి వస్తుందని వెల్లడించారు. కోర్టు తీర్పునకు లోబడే టీఆర్టీ ఎందరో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ను కోర్టు తీర్పునకు అనుగుణంగా చేపడతామని కడియం స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సమీక్షిస్తున్నామని, త్వరలో పది జిల్లాల ఆధారంగానే టీఆర్టీ నిర్వహించి నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే క్రమంలోనే 31 జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. -
పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 31 కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికతకు ప్రాతిపదికగా పాత పది జిల్లాలనే పేర్కొన్నారని.. వాటి ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు.. ఆ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనూ సవరణలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పది జిల్లాలను ఆధారంగా చేసుకుని.. షెడ్యూల్ ప్రకారమే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నిర్వహించుకోవచ్చంది. దీనికి అవసరమైన సవరణలు, చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా వీలుకాదు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నిబంధనలను, 8,700కుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఆదిలాబాద్కు చెందిన అరుణ్కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్.రాహుల్రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా 31 జిల్లాల ఆధారంగా నియామకాలు సబబు కాదని తేల్చిచెప్పింది. సవరణ నోటిఫికేషన్ ఇవ్వండి టీఆర్టీకి సంబంధించి జారీ చేసిన జీవోలో 31 జిల్లాలని పేర్కొన్న స్థానంలో 10 జిల్లాలనే పేర్కొనాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే దరఖాస్తుల స్వీకరణ గడువునూ డిసెంబర్ 15 వరకు పెంచాలని సూచించింది. ఈ మేరకు సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని.. దరఖాస్తులను బట్టి అభ్యర్థులు పాత పది జిల్లాల్లో ఏ జిల్లాకు చెందుతారో వర్గీకరించాలని స్పష్టం చేసింది. తాము చెప్పిన ఈ సవరణలు చేసి.. షెడ్యూల్ ప్రకారమే టీఆర్టీని నిర్వహించుకోవచ్చని సూచించింది. -
స్వాతి దరఖాస్తును స్వీకరించండి..
సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)లో భాగంగా భర్తీ చేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి చాకలి స్వాతి దరఖాస్తును స్వీకరించాలని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఇంటర్లో 50 శాతం మార్కులతో పాటు, జిల్లా లేదా రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్న వారు సైతం పీఈటీ పోస్టులకు అర్హులని అయితే టీఆర్టీలో మాత్రం ఇంటర్లో 50 శాతం మార్కులు, ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా ఉన్నవారు మాత్రమే అర్హులని చెప్పారని, ఇది సరికాదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన స్వాతి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జక్కుల శ్రీధర్ వాదనలు వినిపిస్తూ విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ పోస్టుల కనీస అర్హతలను ఎన్సీటీఈ మాత్రమే నిర్ణయించగలదన్నారు. పీఈటీ పోస్టుల భర్తీలో పిటిషనర్ దరఖాస్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం టీఎస్పీఎస్సీని ఆదేశించింది. -
టీఆర్టీపై రేపు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల ఆధారంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నిర్వహించడం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమంటూ దాఖలైన వ్యాజ్యంపై ఈ నెల 24న తీర్పు వెలువడనుంది. బుధవారం పిటిషనర్, ప్రభుత్వ వాదనలు ముగియడంతో తమ నిర్ణయాన్ని శుక్రవా రం 24న వెల్లడిస్తామని హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి.అరుణ్కుమార్ మరో ముగ్గురు దాఖలు చేసిన వ్యా జ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. పరీక్ష వాయిదా పడకుండా చూడండి: ఏజీ 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నియామకాల్ని సవాల్ చేసిన వ్యాజ్యంలో అంతిమంగా పిటిషనర్లు విజయం సాధిస్తే.. పూర్వపు పది జిల్లాలకే టీఆర్టీని వర్తింపజేస్తామని ఏజీ దేశాయ్ ప్రకాశ్రెడ్డి స్పష్టం చేశారు. ఇదే జరిగితే దరఖాస్తుల స్వీకరణ గడువు 15 రోజులు పొడిగిస్తామని చెప్పారు. అభ్యర్థులు పది జిల్లాల్లో ఎక్కడి వారో తెలుసుకునేందుకు అధికారులకు ఇబ్బందేమీ లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే టీఆర్టీ నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని, పరీక్ష వాయిదా పడకుండా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థాని క అభ్యర్థులకు అన్యాయం జరగదని, రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లు కాదని ఏజీ వాదించారు. స్థానికులకు అన్యాయం: పిటిషనర్ పాఠశాల విద్యా శాఖ అక్టోబర్ 10న జీవో 25, అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని పిటిషనర్ న్యాయవాది ఎస్.రాహుల్రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణలోని పూర్వపు పది జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదముందని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని వాదించారు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలోని అభ్యర్థి పూర్వపు జిల్లాలో స్థానికేతరుడిగా నష్టపోతున్నారని చెప్పారు. 1976లోనే లోకల్ కేడర్ నిర్ధారణ జరిగిందని, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాల్ని పరిగణనలోకి తీసుకోవడం చెల్లదన్నారు. పాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు కూడా కొత్త జిల్లాల్ని ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. -
31 జిల్లాల్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది జిల్లాలను 31 జిల్లాలకు పెంచి ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) ఎలా నిర్వహిస్తారని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పది జిల్లాలకే ఆమోదం ఉంది కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తే.. అభ్యర్థి ఒక జిల్లాలోనే స్థానికుడు అవుతాడని, పాత జిల్లాకు చెందిన మిగిలిన రెండు జిల్లాల్లో స్థానికేతరుడు అవుతాడు కదా అనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. జిల్లాల సంఖ్య పెంపు వల్ల అభ్యర్థులకు నష్టం రాదనే ప్రభుత్వ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. పది జిల్లాలను రెండు మూడు జిల్లాలుగా తగ్గించినప్పుడు అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పది జిల్లాల ప్రస్తావన ఉంటే కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 31 జిల్లాలకు ప్రకటన ఎలా జారీ చేస్తారో చెప్పాలని సూచించింది. 31 జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేదు కాబట్టి టీఆర్టీ పాత పద్ధతిలోనే నిర్వహించాలని, 31 జిల్లాల ఆధారంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలుగా గత అక్టోబర్ 10న విద్యా శాఖ జారీ చేసిన జీవో 25, అందుకు అనుగుణంగా టీఆర్టీ నోటిఫికేషన్ జారీలను సవాల్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి.అరుణ్కుమార్, మరో ముగ్గురు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం గురువా రం విచారించింది. దర్మాసనం.. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు టీఆర్టీ పరీక్షలు జరపరాదని ప్రభుత్వానికి మౌఖిక సూచన చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే.. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ఇచ్చామని, పరీక్ష ఆపాల్సి న అవసరం లేదన్నారు. ఒక జిల్లాను మూడు జిల్లాలు చేస్తే పాత జిల్లాలో స్థానికుడైన అభ్యర్థి ఇప్పుడు రెండు జిల్లాల్లో స్థానికేతరుడు అవుతున్నాడని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్రెడ్డి వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. స్థానిక రిజర్వేషన్ల గురించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉందని, ఆ ఉత్తర్వుల మేరకు పూర్వపు పది జిల్లాలకే ఆమోదం ఉందని, ఈ పరిస్థితుల్లో 31 జిల్లాలను ఆధారంగా చేసుకుని నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. పది జిల్లాల సంఖ్య రెండుమూడు జిల్లాలకు తగ్గించితే పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. స్థానికులకు నష్టం వాటిల్లదు.. ఏజీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థానిక అభ్యర్థులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. ఒక జిల్లాను రెండుమూడు జిల్లాలుగా చేయడం వల్ల అభ్యర్థుల స్థానికతకు నష్టం ఉండబోదని, అభ్యర్థులు ఉన్న జిల్లాలోనే స్థానికత అమలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే జిల్లాల పెంపు జరిగిందని చెప్పారు. పది జిల్లాల సంఖ్యను రెండుగా తగ్గించినప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకం అవుతుందని చెప్పారు. లోతుగా విచారణ చేస్తాం.. ధర్మాసనం స్పందిస్తూ.. పది జిల్లాల్ని 31గా చేయడం, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడానికి చట్టబద్ధత ఉందా, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన అవునో కాదో.. వంటి అంశాలపై లోతుగా విచారణ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థి కొత్త జిల్లాతోపాటు పాత జిల్లా పేరు తెలియజేసేలా దరఖాస్తులో అవకాశం కల్పిం చాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సోమవారానికి(13వ తేదీ) వాయిదా వేసింది. -
టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేశాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై కొనసాగుతున్న కేసు విచారణలో భాగం గా సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన మేరకు ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ఫిబ్రవరిలో పూర్తిచేస్తామని పేర్కొనగా అంత సమయం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు, తెలంగాణ పేరెంట్స్ ఫౌండేషన్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్కుమార్ వాదిస్తూ ‘‘3 నెలల్లోగా టీచర్ నియామకాలు చేపడతామని కేసు గత విచారణ సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం తాజా విచారణ తేదీకి కేవలం 2 రోజుల ముందు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కాల యాపన వల్ల అభ్యర్థులు, విద్యార్థులు నష్టపోతారు’’ అని పేర్కొన్నారు. ఈ కేసులో అమికస్ క్యూరీ అశోక్ గుప్తా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరగా సహేతుక కారణం ఉన్నప్పుడు ప్రభుత్వానికి సమయం ఇచ్చినా ఫరవాలేదని విన్నవించారు. దీంతో కేసు విచారణను ధర్మాసనం మార్చి తొలి వారానికి వాయిదా వేసింది. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య విచారణకు హాజరయ్యారు. ఏపీలో ఖాళీలపై అఫిడవిట్ సమర్పించండి విచారణ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థుల తరపు న్యాయవాది కె. శ్రవణ్ కుమార్ వాదిస్తూ ఏపీలో టీచర్ల ఖాళీల సంఖ్యపై ఏపీ ప్రభుత్వం మాటమారుస్తోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గతంలో 25 వేల ఖాళీలున్నాయన్న ప్రభుత్వం... ప్రస్తుతం పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో ఖాళీలు లేవంటోందని నివేదించారు. దీంతో ధర్మాసనం ఖాళీల వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది. -
డీఎస్సీ అభ్యర్థులకు ని‘బంధనాలు’
విజయనగరం అర్బన్ : జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించనున్న టీచర్ ఎలిజిబులిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్ టీ)లో గందరగోళం నెలకొంది. ఆరు మాసాల పాటు ఊరించి ఎట్టకేలకు జారీ చేసిన నోటిఫికేషన్లో అడ్డగోలు నిబంధనలు చూసి అభ్యర్థులు కుంగి పోతున్నారు. టెట్, డీఎస్సీ-2014 రెండు పరీక్షలూ కలిపి రాయడం, పరీక్షలకు సిలబస్, వివిధ కేడర్ పోస్టుల అర్హతలు, స్థానికత, దూరవిద్య వంటి పలు అంశాలపై అడ్డగోలు నిబంధనలు పెడ్డడంతో అభ్యర్థులు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. పోటీకి అవకాశం ఇవ్వని స్థానికత సమస్య రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు స్థానిక సమస్యను ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల విద్యాభ్యాసన జరిగిన ప్రాంతాన్నే వారికి స్థానికంగా గుర్తిస్తారు. 10వ తరగతి వరకు ఏడేళ్లపాటు ఏ జిల్లాలో విద్యాభ్యాసం చేస్తే ఆ జిల్లానే స్థానిక జిల్లాగా గుర్తిస్తారు. అయితే రాష్ట్ర విభజన తరువాత వచ్చిన డీఎస్సీలో తెలంగాణా జిల్లాల్లో విద్యాభ్యాసం చేసిన వారికి ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. ఈ నిబంధన వల్ల పలు వర్గాల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడాపాఠశాల తెలంగాణ ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ చదివిన విద్యార్థులందరికీ ప్రస్తు త డీఎస్సీలో అవకాశం కల్పించలేదు. వీరితో పాటు ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని హైదరాబాద్, తెలం గాణా జిల్లాలకు వలసవెళ్లి వారి పిల్లలున్నారు. వారి పరిస్థితీ ఇదే. మరిన్ని నిబంధనలు డీఎస్సీ-2014కు ప్రభుత్వం విధించిన నిబంధనలు ని రుద్యోగుల పాలిట ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు డీఎస్సీకి అర్హత కో ల్పోయే ప్రమాదం ఏర్పడింది. గతంలో అభ్యర్థు లు డీఎస్సీ రాతపరీక్షకు హాజరై, వారు టీచర్ పో స్టుకు ఎంపికైన తర్వాతే సర్టిఫికెట్ల పరిశీలన చేసేవారు. ప్రస్తుతం నోటిఫికేషన్లో అలా లేదు. డీఎ స్సీకి దరఖాస్తు చేసే సమయంలో ఆన్లైన్లో ఏ యే విద్యార్హతలున్నట్టు అభ్యర్థులు పేర్కొన్నారో .... ఆ సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలు, ఆన్లైన్ దరఖాస్తు ప్రింటవుట్ జతచేసి డీఎస్సీ కౌంటర్లలో సమర్పించాలి. ఇదే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు. విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇంకా చేతికి అందని అభ్యర్థులు ఈ డీఎస్సీలో అవకాశం కో ల్పోయే ప్రమాదం ఉంది. డీఈడీ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్ప టివరకు ఆ ఫలితాలు ప్రకటించలేదు. దీంతో వీరు డీఎస్సీ-2014కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. గతంలో మాత్రం డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థుల ను కూడా డీఎస్సీకి అనుమతించారు. బీకాం అభ్యర్థులకు నిరాశే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీకాం అభ్యర్థులకు అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం... సబ్జెక్టుల విషయంలో నిబంధనలు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన 38 జీఓ ప్రకారం కనీసం నాలుగు సబ్జెక్టులున్న వారు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు. అయితే ఇక్కడ యూనివర్సిటీ జారీ చేస్తున్న బీకాం డిగ్రీలో మూడు సబ్జెక్టులు మాత్రమే ఉంటున్నా యి. వీటిలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం బీకాం అభ్యర్థులకు నాలుగు సబ్జెక్టులు లేకపోవడంతో వీరి దరఖాస్తులు స్వీకరించడం లేదు. వికలాంగులకూ తప్పని పాట్లు ఓహెచ్, వీహెచ్, హెచ్హెచ్ అభ్యర్థుల విషయంలో సర్టిఫికెట్లు ఎవరు జారీ చేయాలన్న విషయంలో కూడా స్పష్టత లేదు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టు అర్హత విషయంలో కూడా స్పష్టత కొరవడింది. గతంలో ప్రభుత్వం శాశ్వత కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయగా... తాజాగా మీ-సేవ ద్వారా తీసుకున్న కు లధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. దూరవిద్య అభ్యర్థుల ఇక్కట్లు దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి, డీఎస్సీకి హజరవుతున్న అభ్యర్థులకు కూడా ఇక్కట్లు తప్పలేదు. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు తప్పనిసరిగా 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీతోపాటు బీఈ డీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టంగా పేర్కొంది. దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన కొందరు అభ్యర్థులు 10వ తరగతి తర్వాత నేరుగా డిగ్రీకి హాజరయ్యారు. దీంతో వీరికి ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ లేదు. ఈ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేం దుకు అవాంతరాలు ఎరురవుతున్నాయి. ఇంటర్మీడియె ట్ లేని కారణంగా వీరి దరఖాస్తులు అప్లోడ్ కావడంలేదు. దూర విద్యను ప్రోత్సహిస్తున్నామని బాకా ఊదుతున్న ప్రభుత్వం, ఉద్యోగాల విషయంలో అడ్డగోలు ని బంధనలు పెట్టడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నా రు. గత డీఎస్సీల్లో ఎన్నడూ ఈ నిబంధన లేదు. ఇం టర్మీడియెట్ లేకపోయినా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా గుర్తించాలని అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి అధికారులు రోజకోరకంగా స్పష్టతలేని ప్రకటనలు చేస్తున్నారు. అసలు అనుకున్న సమయానికి డీఎస్సీ జరుగుతుందో లేదో అన్న సందేశం కలుగుతోంది. ఈ పరీక్షపై నిర్థిష్టమైన, స్పష్టమైన విధానాన్ని అభ్యర్థులకు వివరించాలి. -ఐ. సింహాచలం, డీఎడ్ అభ్యర్థి, జిన్నాం, గజపతినగరం. చదివే సమయం ఏదీ? అన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రపంచ మంతా ఈజీ ప్రొసెస్లో ఉంటే.. డీఎస్సీలో మాత్రం అన్ని సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నా రు. ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దార్ కార్యాల యం చుట్టూ, కాలేజీల చుట్టూ తిరగడానికే సరిపోతుం ది. చదువుకోవడానికి సమయం ఎక్కడుంది..? -కె.కిరణకుమారి, బీఎడ్ అభ్యర్థి , విజయనగరం. నా పేరు తాటి తూరి సరోజా గాయత్రి. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా అక్కింపేట స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివాను. పీఈటీ పోస్టుకు విద్యార్హత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సర్టిఫికెట్కు ప్రస్తుత డీఎస్సీకి అర్హత లేదని ఆన్లైన్లో దరఖాస్తును తీసుకోవడం లేదు. తండ్రి స్థానికేతరుడు కావడం వల్ల తెలంగాణ డీఎస్సీకి కూడా అర్హత లేదు. దీన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. నూతన నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి.. మా చే తుల్లోలేదని చెబుతున్నారు. - ఇది ఈమె ఒక్కరి సమస్యే కాదు. స్థానికత సమస్యతో జిల్లాలో పలువురు ఆందోళన చెందుతున్నారు. -
డీఎస్సీ అభ్యర్థులకు ఆదిలోనే హంసపాదు
మొదటి రోజే ఓపెన్ కాని వెబ్సైట్ ఖాళీల వివరాల ప్రకటన ఎప్పుడో... ఒంగోలు వన్టౌన్: టెట్, టీఆర్టీల ఉమ్మడి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. టెట్ కమ్ టీఆర్టీ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బుధవారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది. అయితే తొలిరోజు వారికి నిరాశే ఎదురైంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం ప్రకటించిన ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో డీఎస్సీ దరఖాస్తులు ఓపెన్ కాలేదు. దీంతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే గడువును ఒకరోజు కోల్పోయినట్లయింది. ఖాళీల వివరాలేవీ... ఉపాధ్యాయుల నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు చేసుకునేందుకు షెడ్యూలు ప్రకటించినా ఇప్పటి వరకు జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీలను ప్రభుత్వం ప్రకటించలేదు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా ఈ డీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1252 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిలో సెకండరీ గ్రేడు టీచర్లు 813, భాషా పండితులు 214, స్కూలు అసిస్టెంట్లు 184, వ్యాయామోపాధ్యాయులు 41 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఏ మున్సిపాలిటీకి, ఏ నగరపాలక సంస్థకు ఎన్ని పోస్టులు కేటాయించిందీ ఇంత వరకు వివరాల్లేవు. డీఆర్ఆర్ఎంలో ప్రత్యేక కౌంటర్లు: టెట్ కమ్ టీఆర్టీ -2014 (డీఎస్సీ-2014) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో బి.విజయభాస్కర్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు వేర్వేరుగా నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు బుధవారం నుంచి 2015 జనవరి 17వ తేదీ వరకు ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్లో దరఖాస్తుల్లో పొందుపరిచిన తర్వాత ప్రింట్ కాపీని తీసి తమ విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ, నేటివిటీ సర్టిఫికెట్లను గజిటెడ్ అధికారులతో అటెస్టేషన్ చేయించి దరఖాస్తులకు జతపరిచి కౌంటర్లలో అందజేయాలని డీఈవో తెలిపారు. ఆ వివరాలను డీఈఓ కార్యాలయం నుంచి ధ్రువీకరించిన తర్వాతే వారికి హాల్ టికెట్లు జారీ అవుతాయి.