Vishesh
-
బాధ్యతల్లో బ్యాలెన్స్ లేకుంటే కాపురం కష్టమే!
రేఖది పల్లెటూరి నేపథ్యం. తండ్రిది వ్యవసాయం. తల్లి గృహిణి. పిల్లల పెంపకం బాధ్యత కూడా ఆమె మీదనే ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన రేఖకు భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తయ్యాక ఆమెకు ఆనంద్తో పెళ్లయింది. ఆనంద్ ప్రభుత్వోద్యోగి. గృహిణిగా రేఖ సంతోషంగా బాధ్యతలను స్వీకరించింది. ఒక బిడ్డ పుట్టాక కూడా రేఖ తన పనులను హ్యాపీగా మేనేజ్ చేసుకునేది. రెండో బిడ్డ పుట్టాక కష్టమైంది. ఉదయాన్నే లేచి ఆనంద్కు బ్రేక్ఫస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల పనులు చూసుకోవడంతో చాలా అలసిపోయేది. ఆనంద్ తన పని ఒత్తిడిలో ఉండి ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేసేవాడు కాదు. కనిపించని దూరం..భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ సమకూర్చే క్రమంలో రేఖ తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. ఎప్పుడైనా తన అవసరాల గురించి ఆమె మాట్లాడగానే ఆనంద్ వాటిని పట్టించుకునేవాడు కాదు. లేదంటే తన ఆఫీసు ఒత్తిడి గురించి చెప్పుకునేవాడు. దీంతో తన కష్టాన్ని ఆనంద్ గుర్తించడం లేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించసాగింది. క్రమేపీ వారిద్దరి మధ్య మానసికంగా దూరం పెరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపుల్స్..కుటుంబ జీవితం అనేది ఆటోమేటిక్గా సాఫీగా సాగిపోయే విషయం కాదు. క్రమం తప్పకుండా పరస్పర సహకారం, ఓపిక, కమ్యూనికేషన్ అవసరం. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బలమైన బంధాన్ని కాపాడు కోవడం కోసం పాటించాల్సిన సూత్రాలివే. 1. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం⇒ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా, భావాలను వ్యక్తపరచడంలో ఓపెన్గా ఉండాలి⇒ ఐ–సెంటెన్సెస్ వాడకం అంటే ‘నాకు ఇలా అనిపిస్తోంది’, ‘నేను ఇలా ఫీలవుతున్నాను’ అని చెబుతూ, దూషణలకు లేదా నిందలకు తావు లేకుండా కమ్యూనికేషన్ చేయండి. మీ ఆలోచనలను ఈ విధంగా పంచుకోవడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.2.బాధ్యతలను పంచుకోండి⇒ గృహభారాలు ఒక్కరిపై మాత్రమే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఏమి చేయాలో కూర్చుని మాట్లాడి నిర్ణయించు కోవాలి. చిన్న విషయాల్లో కూడా భాగస్వామ్యం ఉంటే, ఎదుటి వాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది⇒ వారానికి ఒకసారి ఆ వారం ఎవరేం పనులు చేయాలనేది చర్చించుకోవడం ద్వారా బ్యాలెన్స్ను సాధించవచ్చు.3.తమ శ్రమను గుర్తించండి⇒ కుటుంబంలో ఎవరి శ్రమకైనా విలువ ఇవ్వడం అవసరం ⇒ భర్త తన పని ఒత్తిడిని, భార్య తన ఇంటి పనుల కష్టాన్ని పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది.⇒ వారానికి ఒకసారి ఓపెన్గా అభినందనలు లేదా కృతజ్ఞత వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది.4. ప్రత్యేక సమయాన్ని కేటాయించండి⇒ పనుల మధ్య ఎప్పుడు తనతో మాట్లాడతాడో అన్న నిరీక్షణ భార్య/భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది · వారానికి ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఒకరి కష్టాన్ని మరొకరు వినండి · మనసు పంచుకునే ఈ చర్చలు బంధం బలపడటానికి దోహదపడతాయి. 5. ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేయడం నేర్చుకోండి⇒ గృహిణిగా స్త్రీ, పనిలో పురుషుడు ఇద్దరూ ఒత్తిడితో ఉంటారు ⇒ దీర్ఘ శ్వాస, ధ్యానం, మైండ్ఫుల్నెస్ వంటి పద్ధతులు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి ⇒ అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.6. సామాజిక ప్రమాణాలను పునఃపరిశీలించండి⇒ భార్యాభర్తలు తప్పనిసరిగా వారి వారి పాత్రల్లోనే ఉండాలి అనే ఆలోచనను మార్చుకోండి ⇒ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ విషయంలో భర్త సహాయాన్ని సగర్వంగా కోరండి ⇒ గృహిణి కష్టం కూడా సమాన గౌరవానికి అర్హమైనది.7. సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి⇒ ఇతరులను తప్పు పట్టడం కంటే, కలిసి పనిచేయడం ద్వారా సమస్యలపై దృష్టి పెట్టండి⇒ ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసలు అందించుకోవడమనేది ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. 8. స్వీయపరామర్శ⇒ తన బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నానని భావించడంలో తప్పు లేదు. కానీ ఆలోచనను సానుకూలంగా మలచుకోవాలి ⇒ ‘నేను కుటుంబం కోసం ఇలా చేయగలిగాను’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి⇒ అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. దానివల్ల మానసిక శక్తి పెరుగుతుంది. -
Australian Open: జొకోవిచ్కు ముచ్చెమటలు పట్టించిన తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్
అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత... ఏకంగా 1126 మ్యాచ్ల్లో విజయం సాధించిన ప్లేయర్... కెరీర్లో ఇప్పటికే 76 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్కు ‘వైల్డ్ కార్డు’ ద్వారా కెరీర్లోనే తొలి గ్రాండ్స్లామ్ మ్యాచ్ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్ ఏకపక్షంగా వరుస సెట్లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒకే ఒక్క మ్యాచ్తో టెన్నిస్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్ టెన్నిస్ టీనేజ్ రైజింగ్ స్టార్.. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో నిశేష్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్ సాధించేందుకు జొకోవిచ్ను తెగ కష్టపెట్టాడు. నిశేష్కు ఎంతో భవిష్యత్ ఉందని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్ రైజింగ్ టీనేజ్ టెన్నిస్ స్టార్ నిశేష్ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్ పోరులో జొకోవిచ్ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో నిశేష్ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గత నెలలోనే ప్రొఫెషనల్గా మారిన 19 ఏళ్ల నిశేష్ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్లైన్ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్ షాట్లు... కళ్లు చెదిరే రిటర్న్లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని ఎనిమిదో గేమ్లో జొకోవిచ్ సరీ్వస్ను బ్రేక్ చేసిన నిశేష్ ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు. తొమ్మిదో గేమ్లో జొకోవిచ్ సర్వీస్ కాపాడుకోగా... పదో గేమ్లో నిశేష్ తన సర్వీస్ను నిలబెట్టుకొని తొలి సెట్ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్లోనూ నిశేష్ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ టీనేజర్ నిశేష్ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు. స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్లో నిశేష్ సర్వీస్ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్లో తన సర్వీస్ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్లోని చివరి గేమ్ ఆడుతున్న సమయంలో నిశేష్ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్ మరింత జోరు పెంచాడు. మూడో సెట్లోని తొలి గేమ్లోనే నిశేష్ సర్వీస్ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో కూడా తొలి గేమ్లో, ఐదో గేమ్లో నిశేష్ సర్వీస్లను బ్రేక్ చేసిన జొకోవిచ్ కళ్లు చెదిరే ఏస్తో మ్యాచ్ను ముగించాడు. ‘నిశేష్ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్ లో నిశేష్ ఆటతీరును చాలాసార్లు చూస్తాము. ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్ ముగిశాక జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్లో ఓడిన నిశేష్కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్మనీతోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్లో నిశేష్ కెరీర్ బెస్ట్ 104వ ర్యాంక్కు చేరుకుంటాడు. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్లో సోమవారం స్టార్ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో సినెర్ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్ (చిలీ)పై, అల్కరాజ్ 6–1, 7–5, 6–1తో షెవ్చెంకో (కజకిస్తాన్)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్లో పదో సీడ్ దిమిత్రోవ్ గాయం కారణంగా రెండో సెట్లో వైదొలిగాడు. 21-టెన్నిస్ ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్ గ్రాండ్స్లామ్ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (22 ఏళ్లు) మాత్రమే ముందున్నాడు. 429-ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ఫెడరర్ (429 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్ రెండో రౌండ్ మ్యాచ్లో బరిలోకి దిగితే ఫెడరర్ రికార్డును అధిగమిస్తాడు. -
ప్రాణాలు తీసే అభిమానం సరికాదు!
పుష్ప-2 సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలచివేస్తోంది.అసలెందుకిలా జరుగుతోంది? సినిమాల పట్ల ఇంత వేలంవెర్రి ఎందుకు? టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉండటమేంటి? అందుకు ప్రభుత్వాలు అనుమతించడమేంటి? వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడమే కాకుండా, ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలనే ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతోంది? దీన్ని ఎలా నివారించాలి? అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.మనదేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది. సినిమా హీరోలను దేవుళ్లుగా భావించడం, వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్ గా మారిపోయింది.ఫ్యాన్స్ మానసిక స్థితిఅభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటారు. వారితో మమేకమవుతారు. వారిలో తమను చూసుకుంటారు. అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిస్తుంది. అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు. ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు. ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ తనను తాను పుష్పలా భావించుకునేవాడని, అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి.మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్, ఎక్సయిట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది. దాంతో ఆ అనుభవం ఎక్సయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ప్రతీ మూవీ మొదటిరోజు చూసేందుకు, అందుకోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు ఉర్రూతలూగుతుంటారు.మొదటిరోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా, ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు. అలా తమ గ్రూప్ లో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది. అంతేకాదు, ఫ్యాన్స్ గ్రూప్ లో ఉన్నవారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది. మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీలవుతుంటారు. ఇది గుంపు ప్రవర్తన (Herd Behaviour)తో ముడిపడి ఉంటుంది.గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు. అభిమానుల ఆసక్తి, ఉత్తేజం వేగంగా పాకిపోతుంది, చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారతాయి. తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంద. సంధ్య ధియేటర్ వద్ద జరిగింది ఇదే.నిర్మాతల వ్యాపారాత్మక ధోరణి... బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప-2తో ఒక మేనియాగా మారింది. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం.వ్యాపారాత్మక ధోరణి తప్ప, అభిమానుల బలహీనతలను సొమ్మి చేసుకోవడం నిర్మాతల నైతికలోపంగా భావించవచ్చు. కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?మరోవైపు, భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు. ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని, తొక్కిసలాట జరగవచ్చని గుర్తించి ఉండాల్సింది. ఆయనా పని చేయలేదు. సరే ఆయన వచ్చారు. ధియేటర్ యాజమాన్యం, పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా ఒక నిండుప్రాణం బలయ్యింది. అందరూ బాధ్యత తీసుకోవాలి.. • ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాధాన్యతలను పునరాలోచించుకోవాలి. ప్రాణాలకంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసలు కోవాల్సిన అవసరం ఉంది. • పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి. వాళ్ళ అభిమానులు జవాబుదారీతనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు చేయాలి.• నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి, మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి. • మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్వర్డ్స్ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్తో ఓపెన్గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
ప్రేమాకర్షణలు సహజం.. శాశ్వతం కావు
ఇంట్లో టీనేజర్స్ ఉన్నారంటే తల్లిదండ్రులకు గుండెల్లో గుబులే. ఎప్పుడేం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఏ గొడవ తీసుకొస్తారో అని! అన్నింటికంటే భయపెట్టే అంశం.. ప్రేమ వ్యవహారాలు. పెళ్లికి ముందు శృంగారం కూడా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశం. కానీ కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి. ఈ కాలం పిల్లలకు రిలేషన్స్, బ్రేకప్స్ సర్వసాధారణమయ్యాయి. కొందరు ఈ రిలేషన్స్లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు బ్రేకప్ వల్ల అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అందుకే పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కొందరైతే తిడతారు, కొడతారు, కంట్రోల్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల టీనేజర్లలో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెరగడం తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. దీనికన్నా టీనేజర్లతో ఓపెన్గా మాట్లాడటం, సరైన గైడెన్స్ను అందించడమే మంచిదని గుర్తించాలి. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. సెక్సువల్ డెవలప్మెంట్..సెక్సువల్ డెవలప్మెంట్ అనేది సహజమైన పరిణామం. పీరియడ్స్, వెట్ డ్రీమ్స్ లాంటి శారీరక మార్పులు, అపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి లాంటి భావోద్వేగ మార్పులు మొదలవుతాయి. ఇదంతా వారికి కొత్తగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్తో చర్చిస్తారు. లేదా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అందులో తప్పుడు సమాచారం అందే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశాలపై తల్లిదండ్రులే చర్చించాలి. అలా చర్చించడంలో ఎలాంటి తప్పూ లేదని గుర్తించాలి. ప్రేమ, ఆకర్షణ..టీనేజ్లో ప్రేమ, ఆకర్షణ సహజమైన భావోద్వేగాలు. నచ్చిన వ్యక్తి పట్ల బలమైన ఆకర్షణను కలిగి ఉంటారు. అదే ప్రేమ అని భ్రమపడుతుంటారు. ఇది చూసి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఆకర్షణ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొందరిలో ఎక్కువకాలం కొనసాగవచ్చు. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పిల్లలను జడ్జ్ చేయకుండా, వారి క్రష్, లవ్ గురించి ఓపెన్గా మాట్లాడండి, తప్పొప్పులు, పర్యవసానాల గురించి చర్చించండి. అప్పుడే వాళ్లు తమ భావోద్వేగాలను సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.టీనేజ్ సెక్స్..యవ్వనంలో సెక్స్ అనే అంశం చాలా సున్నితమైనది. యవ్వనంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల లేదా సోషల్ మీడియా లేదా ఫ్రెండ్స్ ప్రభావం వల్ల టీనేజ్ సెక్స్ పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ దశలో టీనేజర్లకు సరైన గైడెన్స్ అవసరం. అది ఫ్రెండ్స్ ద్వారానో, పోర్న్ ద్వారానో వచ్చేకంటే, పేరెంట్స్ ద్వారా అందడం అవసరం. భయపెట్టడం, నియంత్రించడం కంటే గైడెన్స్ ద్వారానే పిల్లలను సరైన దారిలో నడపగలమని గుర్తించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు ఎలాంటి సందేహాలనైనా అడగడానికి, వారి భావాలు పంచుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి ∙సెక్సువల్ డెవలప్మెంట్, రిలేషన్స్ గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి ∙ తాత్కాలిక ఆకర్షణలు, టీనేజ్ లవ్, సంపూర్ణ ప్రేమ మధ్య తేడాలు అర్థం చేసుకునేందుకు సహాయపడాలి ∙సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడాలి ∙టీనేజర్ల ఫ్రీడమ్, తల్లిదండ్రుల గైడె¯న్స్ మధ్య బ్యాలె¯న్స్ సాధించాలి ∙పేరెంట్స్ చర్చించలేని అంశాల గురించి చెప్పేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.టీనేజర్లు చేయాల్సింది..టీనేజ్లో జరిగే మార్పుల గురించి చదవాలి, అవగాహన పెంచుకోవాలి. పేరెంట్స్తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి టీనేజ్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ సహజమైన విషయాలని, శాశ్వతం కావని గుర్తించాలి తొందరపాటు చర్యల వల్ల వచ్చే ఎమోషనల్ పెయిన్ గురించి అవగాహన పెంచుకోవాలి ఈ వయసులో ప్రేమ వ్యవహారాల కంటే అకడమిక్ సక్సెస్ ముఖ్యమని అర్థం చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి కొత్త ఆసక్తులు, హాబీలను కనుగొనేందుకు సమయం కేటాయించాలి మైండ్ఫుల్నెస్, జర్నలింగ్, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం వంటి పనుల ద్వారా ఎమోష¯న్స్ను నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేయాలి సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. నిజమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశగా అనిపిస్తే సైకాలజిస్ట్తో మాట్లాడి సహాయం తీసుకోవాలి. -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు
ఆత్మహత్య లేదా బలవన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8,00,000 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ నేర పరిశోధన బ్యూరో (NCRB) ప్రకారం, 2021లో మన దేశంలో 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే, రోజుకు 450 బలవన్మరణాలు. ప్రతి నాలుగు నిమిషాలకో జీవితం కోల్పోవడం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. వ్యక్తుల నిశ్శబ్ద బాధను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆత్మహత్యకు, 20 కి పైగా ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘ఆత్మహత్య నివారణ దినోత్సవం’ జరుపుకుంటాం. అవగాహన లోపమే ప్రధాన సమస్య.. భారతదేశంలో ఆత్మహత్యలను నివారించడంలో ప్రధాన అడ్డంకి, మానసిక ఆరోగ్యం చుట్టూ ఉండే అపహాస్యం. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది సహాయం కోసం బయటకు రావడానికి సిగ్గుపడుతున్నారు. ఈ మౌనం ప్రమాదకరం, ఇది ప్రజలను ఒంటరితనం, నిరాశలోకి నెట్టేస్తుంది. ఇవన్నీ కలిసి బలవన్మరణం వైపు నెట్టేస్తాయి. కొన్ని ముఖ్యమైన గణాంకాలు... దేశంలో మొత్తం బలవన్మరణాల్లో 34.5 శాతం 18-30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే.బలవన్మరణాల్లో 71 శాతం పురుషులే. మహిళల్లో 15-39 ఏళ్ల మధ్యవారే ఎక్కువ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.సామాజిక, ఆర్థిక సమస్యలు వల్ల 10,881 మంది రైతులు 2021లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.కొన్ని ప్రధాన కారణాలు... పరీక్షల ఒత్తిడి, పోటీ, భవిష్యత్తు పట్ల భయంతో 2021లో 13,089 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.ఉద్యోగాలు కోల్పోవడం, అప్పులు, పేదరికం ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.కుటుంబ విభేదాలు, వివాహ పరమైన సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు చికిత్స లేకపోతే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు ఆత్మహత్య నివారణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అందుకోసం ముందుగా ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. అవి... నేను చనిపోవాలని అనుకుంటున్నాను" లేదా "నేను పుట్టకపోయినా బాగుండేది" అంటూ ఆత్మహత్య గురించి మాట్లాడటం.కత్తి, తాడు, నిద్రమాత్రలు లాంటి వాటిని సమకూర్చుకోవడం. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం. ఒక రోజు అత్యంత సంతోషంగా, మరుసటి రోజు తీవ్ర నిరుత్సాహంగా ఉండటం వంటి మూడ్ స్వింగ్ కలిగి ఉండటం. సమస్యలో చిక్కుకున్నట్లు, బయటపడే మార్గం లేనట్లు, నిస్సహాయంగా ఉన్నట్లు మాట్లాడటం. మద్యం లేదా మాదకద్రవ్యాల వాడకం పెరగడం. తిండి, నిద్రలాంటి సాధారణ దినచర్యలలో మార్పు. డ్రగ్స్ వాడటం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర లేదా స్వీయ-విధ్వంసక పనులు చేయడం తన వస్తువులను, వ్యవహారాలను ఇతరులకు అప్పజెప్పడం. మళ్లీ కనిపించనట్లుగా వీడ్కోలు చెప్పడం. వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఆత్రుత లేదా ఆందోళన చెందడం. మీరేం చేయవచ్చు... మీ సన్నిహితుల్లో ఎవరిలోనైనా ఎవరికైనా ఆత్మహత్య యత్నం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మాట్లాడండి. మీ మద్దతును, సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీకు సాధ్యం కాదనుకున్నప్పుడు సైకాలజిస్ట్ ను సంప్రదించండి. ఆత్మహత్య గురించి అడగడాన్ని భయపడవద్దు. ఇది వాళ్లకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. జడ్జ్మెంట్ లేకుండా, ప్రేమగా వారు చెప్పేది వినండి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్ట్ చేయండి. ఒంటరిగా వదిలిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. వారి దగ్గర ఉన్న కత్తులు, తాళ్లు, మాత్రల్లాంటి ప్రమాదకరమైన వస్తువులు తీసివేయండి. మీరు లేదా మీకు తెలిసినవారు ఆత్మహత్య ఆలోచనలకు గురవుతున్నట్లయితే, వెంటనే హైదరాబాద్ లో ఉన్న రోష్ణి ఆత్మహత్యల నివారణ సంస్థకు (081420 20033 ⋅ 081420 20044) ఫోన్ చేసి సహాయం పొందండి. అప్పటికీ మీకు ఉపశమనం కలగకపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.comగమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్గా, కంట్రోల్డ్గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్ఫుల్నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
మజిల్స్ రిలాక్సయితే మనసూ రిలాక్సవుతుంది! ఎలా అంటే..?
ప్రపంచం పరుగెడుతోంది. ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. వీటిని ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR). అమెరికన్ వైద్యుడు ఎడ్మండ్ జాకబ్సన్ 1920లో అభివృద్ధి చేసిన ఈ పద్ధతి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతోంది. ఆయన పేరు మీదే దీన్ని జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR) అంటున్నారు.శరీరం, మనసు వేర్వేరు కాదని, రెండూ ఒకటిదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయనే ఆలోచనపై ఈ టెక్నిక్ ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సులువైన, శక్తిమంతమైన టెక్నిక్. దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. మన శరీరంలోని కండరాల (మజిల్స్)ను నిర్దిష్ట క్రమంలో టెన్షన్ చేయడం, రిలాక్స్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను సాధించడమే జేపీఎమ్మార్ (PMR). ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. దీర్ఘకాలిక నొప్పులున్న వారికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్, పరీక్షలు లేదా మెడికల్ టెస్టుల సమయంలో కలిగే ఒత్తిడినీ తగ్గించుకోవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాం.ఎలాంటి అంతరాయం కలగని ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. రిలాక్సింగ్ చైర్ లేదా మంచం మీద పడుకోవాలి.వదులుగా ఉండే, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. మన కదలికలకు ఇబ్బంది కలిగించే వస్తువులను తీసేయాలి.నిండుగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇది శరీరాన్ని, మనసును విశ్రాంతికి సిద్ధం చేస్తుంది.పాదాల నుంచి తల దాకా ప్రతిభాగంలోని కండరాలను ఐదు నుంచి పది సెకన్ల వరకు వీలైనంత గట్టిగా పట్టి ఉంచాలి. తర్వాత నిదానంగా సడలించాలి.దాదాపు 20 నుంచి 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మదిగా నిండుగా ఊపిరి తీసుకోవాలి. కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి.అన్ని కండరాల సమూహాలను సడలించిన తర్వాత, పూర్తి విశ్రాంతిని ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించాలి. మెల్లగా.. నిండుగా ఊపిరి తీసుకోవడం ద్వారా ఒత్తిడి నెమ్మదిగా కరిగిపోతుంది.కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి, శరీరాన్ని సున్నితంగా కదిలించడం మొదలపెట్టాలి. మైకంగా ఉంటే మరి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.మంచి ఫలితాలు పొందడానికి ఈ ఎక్సర్సైజ్ ను క్రమం తప్పకుండా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి.టెన్షన్, రిలాక్సేషన్ సమయాల్లో శరీరం, మనసు ఎలా స్పందిస్తున్నాయో గమనించాలి.అవసరాన్ని బట్టి, సౌకర్యానికి అనుగుణంగా కండరాలకు ఒత్తిడిని, విశ్రాంతినిచ్చే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. JPMR ప్రాక్టీస్ చేయడమిలా..– కాలి వేళ్లను గట్టిగా ముడుచుకుని, ఆపై వాటిని రిలాక్స్ చేయాలి.– కాలి వేళ్లను తల వైపు లాగుతూ కండరాలను బిగించి, తర్వాత నిదానంగా సడలించాలి.– మీ తొడ కండరాలను బిగించి, ఆపై సడలించాలి.– కడుపు కండరాలను బిగించి, నిదానంగా సడలించాలి.– నిండుగా ఊపిరి తీసుకుని.. అలాగే పట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత శ్వాస వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– వీపును కొద్దిగా వంచి, ఆపై నిదానంగా యథాస్థితికి రావాలి.– పిడికిలిని గట్టిగా బిగించి, ఆపై వదలాలి.– మోచేతులను వంచి, కండరాలను బిగించి, ఆ తర్వాత సడలించాలి.– భుజాలను చెవుల వైపు లేపి.. ఆపై వదలాలి.– తలను సున్నితంగా వెనక్కి నొక్కాలి. గడ్డాన్ని ఛాతీ మీదకు లాగాలి. ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– కనుబొమలను పైకి లేపడం ద్వారా నుదిటిని బిగించి, ఆపై వదిలేయాలి.– కళ్లు గట్టిగా మూసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– దవడను బిగించి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– పెదాలను గట్టిగా ఒత్తి పట్టి, ఆపై వదిలేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ఇవి చదవండి: ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో.. -
Health: ఒత్తిడి, ఆందోళనను తగ్గించే.. 5–4–3–2–1 టెక్నిక్!
అరుణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్. 28 ఏళ్లుంటాయి అతనికి. ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆందోళన పడుతున్నాడు. దాంతో పని మీద దృష్టి నిలపడం కష్టంగా మారింది అతనికి. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. ఆపాలని ప్రయత్నించినా ఆగడంలేదు. దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. చేతులు చెమటలు పడుతున్నాయి. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తోంది. ఈ సంకేతాలన్నీ తనకు ఏదైనా ఐపోతుందేమోనన్న భయాన్ని, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి పని మీదా ప్రభావం చూపి మేనేజర్ నుంచి వార్నింగ్స్ అందుకునేలా చేస్తోంది. నలుగురితో కలవలేకపోతున్నాడు. ఫ్రెండ్స్కు, పార్టీలకు దూరమయ్యాడు. నిద్ర పట్టడం లేదు. పట్టినా తరచూ మెలకువ వస్తోంది.అరుణ్ ఆందోళనకు గల కారణాలను లోతుగా పరిశీలించినప్పుడు.. అతనికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. దాంతో పని, బాధ్యతలు పెరిగాయి. అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండాలని, అన్ని పనులూ పర్ఫెక్ట్గా చేయాలనే అతని తీరు ఒత్తిడిని పెంచింది. ఫలితంగా అతని జీవితంలోకి ఆందోళన ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. అరుణ్ యాంగ్జయిటీ డిజార్డర్తో బాధపడుతున్నాడని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొదలైంది. తాత్కాలిక ఉపశమనం కోసం 5–4–3–2–1 టెక్నిక్నీ ఫాలో అయ్యాడు. దాంతో అతను కొంత ఊరట పొందాడు. థెరపీ ద్వారా కొన్ని సెషన్లలోనే తన ఆందోళనను అధిగమించి హాయిగా పనిచేసుకోగలుగుతున్నాడు.5–4–3–2–1 గ్రౌండింగ్ టెక్నిక్..ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేసేందుకు 5–4–3–2–1 గ్రౌండింగ్ ఒక పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మీ పంచేంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి.. మీకు బాధ కలిగించే ఆలోచనల నుంచి మీ దృష్టిని మళ్లించుకోవచ్చు. మీ ఆలోచనలపై కంట్రోల్, ఎమోషనల్ బ్యాలె¯Œ ్సను సాధించి ప్రశాంతతను పొందవచ్చు.మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఒకసారి పరికించి ఐదు విభిన్న విషయాలను గమనించండి. అవి వస్తువులు, రంగులు, ఆకారాలు లాంటివి ఏవైనా కావచ్చు. వాటిని గమనించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనల నుంచి మీ దృష్టిని బాహ్యప్రపంచంవైపు మళ్లించడానికి సహాయపడుతుంది.మీరు తాకగల 4 విషయాలను గుర్తించండి..మీ దుస్తులు, కుర్చీ, కంప్యూటర్ మౌస్ లాంటి మీరు తాకగల నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకడం ద్వారా మీరు పొందుతున్న అనుభూతులపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మీ తక్షణ శారీరక అనుభూతులతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది.మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న శబ్దాలను జాగ్రత్తగా వినండి. మీ కంప్యూటర్ శబ్దం, ట్రాఫిక్ ధ్వని, మీ శ్వాస శబ్దం లాంటివి ఏవైనా కావచ్చు. వాటిపై శ్రద్ధ చూపడం వల్ల మీ దృష్టిని అంతర్గత ఒత్తిళ్ల నుంచి∙దూరం చేసుకోవచ్చు.మీరు వాసన చూడగల 2 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న వాతావరణంలో రెండు భిన్నమైన వాసనలను గుర్తించడంపై దృష్టి పెట్టండి. ఏవీ లేకుంటే అగర్బత్తి, కర్పూరం, డియోడరెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించండి. ఆ పరిమళాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీరు కనెక్ట్ అవ్వడానికి దోహదపడతాయి.మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించండి..చివరగా, ఒక రుచిపై దృష్టి పెట్టండి. అది అంతకు ముందు మీరు తాగిన పానీయం లేదా తిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. లేదంటే మీ నోటిలో ప్రస్తుతం ఎలాంటి రుచి ఉందో గమనించండి. ఇది మీ దృష్టిని రుచి ద్వారా ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది.. ఇంద్రియ అనుభవాన్ని పూర్తి చేస్తుంది. -
పిల్లలు.. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు! అయితే ఈ సామర్థ్యం..
పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విషయాన్ని అర్జునుడు తన భార్య సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విని నేర్చుకున్నాడని మహాభారతంలో చదువుకున్నాం. అది నిజమేనని నమ్మేవాళ్లే ఎక్కువ. ఆ నమ్మకాన్ని వ్యాపారం చేసుకుంటూ, గర్భంలోని బిడ్డలకు కూడా పాఠాలు నేర్పిస్తున్నవారూ ఉన్నారు. అయితే అదంతా నిజమేనా? అనే సందేహం ఉంది. అందుకే తల్లిదండ్రులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచే శిశు సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. పిల్లలను మరింత బాగా అర్థం చేసుకుని పెంచేందుకు ఇవి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి.శిశువులకు అసాధారణ వినికిడి సామర్థ్యాలు ఉన్న మాట నిజం. పెద్దలు నిమిషానికి 14 వేల వైబ్రేషన్స్ని స్వీకరిస్తే, పిల్లలు 20 వేల వైబ్రేషన్స్ని స్వీకరిస్తారు. గర్భం దాల్చిన 24వ వారం నుంచి పిండాలు బాహ్య వాతావరణం నుంచి శబ్దాలను గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు. అయితే ఈ సామర్థ్యం స్వరాన్ని గుర్తించడానికి మాత్రమే పరిమితం. పద్మవ్యూహాన్ని అర్థం చేసుకునేటంత తెలివితేటలు ఉండవు. ఇక పుట్టిన వారం రోజుల నుంచే తల్లి గొంతును, ఇతరుల గొంతు నుంచి వేరు చేస్తారని డికాస్పర్, ఫీఫెర్(1980) చేసిన పరిశోధనలో వెల్లడైంది.శిశువులు అమ్మభాషకు, వేరే భాషలకు మధ్య తేడాను గుర్తించగలరంటే మీరు నమ్మగలరా? కానీ పెదవి కదలికలు, ముఖ కవళికలను గమనించడం ద్వారా ఆ తేడాను గుర్తించగలరని వీకమ్ ఎటేల్ (2007) అధ్యయనంలో వెల్లడైంది. దీన్నిబట్టి పిల్లల చూపు ఎంత చురుగ్గా ఉంటుందో అర్థమైంది కదా!శిశువుల పరిశీలనా సామర్థ్యం కేవలం భాషాభివృద్ధికే పరిమితం కాదు. 18 నెలల వయసు గల పిల్లలు.. ఇతరులు మాట్లాడటానికంటే ముందే ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్ను గమనించి వారి ఉద్దేశాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోగలరని మెల్ట్జాఫ్ (1995) కనుగొన్నారు.పిల్లలు.. వాళ్లేం నేర్చుకుంటారని కొట్టిపడేయకండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి శిశువుల మెదళ్లు తయారుగా ఉంటాయని కుహ్ల్ (2004) నొక్కి చెప్పారు. భాషను నేర్చుకునే సామర్థ్యం.. బాల్యంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ల లోపు ఐదు భాషలు ఏకకాలంలో నేర్చుకోగలరు.అమ్మ పోలికా? నాన్న పోలికా? ఇకపై గొడవ పడకండి. నవజాత శిశువులు ఎక్కువగా తండ్రులను పోలి ఉంటారని సూచించే ఆధారాలు ఉన్నాయి. జన్యు పరీక్షలనేవి రాకముందే తండ్రెవరో గుర్తించడానికి ప్రకృతి పరంగా ఈ సారూప్యత ఏర్పడి ఉండవచ్చని బ్రెస్సన్, గ్రాస్సీ (2004) పేర్కొన్నారు.పుట్టుకతోనే పిల్లలకు సంఖ్యల పట్ల సహజమైన ఇన్ట్యూషన్ ఉంటుంది. అంతేకాదు వివిధ పరిణామాల మధ్య తేడాను గుర్తించగలరు. కూడిక, తీసివేతల మధ్య ప్రాథమిక అవగాహన కలిగి ఉంటారని గిynn (1992) అధ్యయనంలో వెల్లడైంది.శిశువులు మనిషి ముఖాలనే కాదు, జంతువుల ముఖాల మధ్య తేడానూ గుర్తించగలరు. అయితే వయసుతో పాటు మనుషులతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. జంతువుల ముఖాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుందని పాస్కాలిస్తోపాటు ఇతరులూ (2002) కనుగొన్నారు.నవజాత శిశువులు తల్లి పాలనే కాదు, తల్లి వాసనకూ ప్రాధాన్యాన్నిస్తారు. తల్లి వాసన తగిలినవెంటనే శిశువులు ప్రశాంతంగా ఉంటారని మాక్ఫర్లేన్ (1975) కనుగొన్నారు. ఇది తల్లితో బంధం బలపడటంలో, ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.మనిషి మనుగడ సాగించాలంటే కమ్యూనికేషన్ అవసరం. అది పిల్లలు పుట్టుకతోనే నేర్చుకుంటారు. శిశువులు ముఖకవళికలను అనుకరించగలరని, ముఖ సంజ్ఞలను పునరావృతం చేయగలరని మెల్ట్జాఫ్, మూర్ (1977) గమనించారు. కమ్యూనికేషన్ స్కిల్స్కు మూలం బాల్యంలోనే ఉంది.శిశువులు తమ అనుభవాలను జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటారు. ఈ జ్ఞాపకాలు జీవితంలో తర్వాత స్పష్టంగా గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవి ప్రవర్తనను, ప్రాధాన్యాలను ప్రభావితం చేస్తాయి. అందుకే శిశువులకు అందమైన అనుభవాలను అందించడం తల్లిదండ్రుల బాధ్యత.– సైకాలజిస్ట్ విశేష్ -
అందంగా లేననే అనుమానం..!?
అంజలి సింగ్.. ఢిల్లీకి చెందిన విద్యార్థి. 21 ఏళ్లు. ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి తెలుగు, తండ్రి పంజాబీ. ఆమెకు తన బాడీ ఇమేజ్ గురించి అసంతృప్తి. అదెంతవరకు వెళ్లిందంటే.. 24 గంటలూ దాని గురించే ఆలోచించేంతగా. తను అట్రాక్టివ్గా లేననే మాట మనసులో తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకోవడం, కనిపించిన లోపాలను సరిచేసుకోవడానికి గంటలు గంటలు వెచ్చించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది.సోషల్ మీడియా ప్రభావం..తన డిజైనర్ పనికోసం ప్రేరణ పొందేందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను స్క్రోల్ చేయడం ఆమె ఆందోళనకు మూలంగా మారింది. పూర్తిగా మేకప్ వేసుకున్న, భారీగా ఎడిట్ చేసిన మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల పిక్స్ చూసి, వాళ్లతో పోల్చుకుంటుంది. తను వాళ్లలా స్లిమ్గా లేనని, అందుకే తాను ఆకర్షణీయంగా లేనని బాధపడుతుంది.కేలరీల కొలత..స్లిమ్ అవ్వడం కోసం కేలరీలను నిశితంగా ట్రాక్ చేస్తుంది. ఏది తిన్నా, తాగినా కేలరీలు లెక్కేసుకుంటుంది. త్వరగా బరువు తగ్గుతారని ట్రెండ్ అయిన కీటో డైట్ కూడా పాటించింది. యాంగ్జయిటీ ఎక్కువైనప్పుడు విపరీతంగా తినేసి, ఆ వెంటనే గిల్టీగా ఫీలై కొన్ని రోజులపాటు భోజనం పూర్తిగా మానేస్తోంది. ఇవన్నీ కలసి తనకు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టాయి.సామాజిక ఒత్తిడి..అంజలి నాన్న తరఫు బంధువులందరూ తెల్లగా, ఫిట్గా ఉంటారు. దాంతో వాళ్లు అంజలిని కలసినప్పుడల్లా ‘కొంచెం స్లిమ్గా, కాస్త ఛాయ మెరుగ్గా ఉంటే అందంగా ఉండేదానివి’ అని కామెంట్ చేస్తుంటారట. వాస్తవానికి అంజలి అందంగానే ఉంటుంది. కానీ బంధువుల మాటలు, సోషల్ మీడియాలో కనిపించే జీరోసైజ్ మోడల్స్, ఇన్ఫ్లూయెన్సర్లతో పోల్చుకోవడం ఆమె అభద్రతాభావానికి కారణమయ్యాయి. వాటికి తోడు ఫ్రెండ్స్ కూడా బరువు తగ్గడం గురించి, డైటింగ్ గురించి తరచూ మాట్లాడటం తన ఆందోళనను మరింత తీవ్రం చేసింది. తాను అట్రాక్టివ్గా లేననే ఆలోచనతో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడం మానేసింది. ఎలాగైనా స్లిమ్గా, ఫిట్గా కావాలనే కోరిక తనపై ఒత్తిడిని పెంచుతోంది. అన్నీ కలసి ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నతస్థాయికి చేరాలనే కోరికను అడ్డుకుంటున్నాయి.థెరపీతో పరిష్కారం..అంజలిలాగే చాలామంది యువతులు జీరోసైజ్ కోసం కష్టపడుతుంటే, యువకులు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్లలో చెమటోడుస్తున్నారు. ఇలాంటివారు ముందుగా చేయాల్సింది అమితాభ్బచ్చన్, రజనీకాంత్లకు సిక్స్ ప్యాక్లు లేవని.. అందరూ ఐశ్వర్యారాయ్లా ఉండలేరని గుర్తించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా బాడీ ఇమేజ్ పట్ల అంజలి.. తనకున్న నెగెటివ్ భావనలను, వాటికి మూలకారణాలను అర్థం చేసుకుంది. ఐదు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది.పాజిటివ్ బాడీ ఇమేజ్ కోసం..మీ బాడీ ఇమేజ్ పట్ల మీకున్న ప్రతికూల, విమర్శనాత్మక ఆలోచనలను గుర్తించండి. అవి వాస్తవికతపై ఆధారపడి ఉన్నాయా లేక సోషల్ స్టాండర్డ్స్ ద్వారా వక్రీకరించబడ్డాయా? అనేది గమనించండి.– మీ ప్రతికూల ఆలోచనలను గుర్తించాక, ‘నా ఫ్రెండ్తో నేనిలాగే మాట్లాడతానా? ఇలాగే విమర్శిస్తానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.– అవాస్తవికమైన బాడీ ఇమేజ్ ప్రమాణాలను ప్రోత్సహించే సోషల్ మీడియా అకౌంట్స్కు దూరంగా ఉండండి.– ఆకారం కంటే ఆరోగ్యం ముఖ్యమని గ్రహించండి. డా¯Œ ్స, యోగా లేదా ఈత వంటి వాటిని రోజూ ప్రాక్టీస్ చేయండి.– అద్దం ముందు నిలబడి మీ సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టండి. ‘ఎవరి అందం వారిదే’, ‘నేను ప్రత్యేకం’, ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాను’ అని చెప్పుకోండి.– బాడీ ఇమేజ్తో కాకుండా టాలెంట్తో స్ఫూర్తి పంచే కళాకారులు, డిజైనర్లు, క్రియేటర్లను అనుసరించండి. మీరు ఎలా ఉన్నారనేది కాకుండా, మిమ్మల్ని మీరుగా అంగీకరించే స్నేహితులతో కనెక్ట్ అవ్వండి.– ఈ సెల్ఫ్–హెల్ప్ టిప్స్ సరిపోవనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి?
‘నాకు 45 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాను. హ్యాపీ ఫ్యామిలీ మాది. నాకున్న సమస్యను ఎలా చెప్పాలో తెలియడం లేదు. సిగ్గుగా ఉంది. అదేంటంటే.. కొన్నాళ్లుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నా. కొలీగ్స్ బ్యాగ్స్లోంచి చిన్నచిన్న వస్తువులు తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినా వాళ్లకు తెలియకుండా ఏదో ఒకటి దొంగిలిస్తున్నా. స్పూన్, ఫోర్క్లాంటి వాటికీ కక్కుర్తి పడుతున్నా.ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నా. మొన్న సూపర్ మార్కెట్లో దొరికిపోయేదాన్నే. అదృష్టవశాత్తు బయటపడ్డా. గూగుల్లో బ్రౌజ్ చేస్తే ఇది క్లెప్టోమేనియా అనే మానసిక సమస్య అని తెలిసింది. దీనికి పరిష్కారం ఏంటి? దీన్నుంచి నేను బయటపడ్డం ఎలా?’ అంటూ తన పరిస్థితిని వివరించింది మాధవి.నిజమే మాధవి చెప్పినదాన్ని బట్టి అవన్నీ క్లెప్టోమేనియా లక్షణాలే. ఆమె సమస్యను ఎనలైజ్ చేయడానికి ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవలసి వచ్చింది. మాధవి స్వస్థలం బెంగళూరు. బాగా చదవాలని, అన్నిట్లో ఫస్ట్ ఉండాలని చిన్నతనం నుంచే నూరిపోశారు పేరెంట్స్. వాళ్లను సంతోషపెట్టేందుకు కష్టపడి చదివి వాళ్లు కోరుకున్నట్లే అన్నీట్లో ఫస్ట్ ఉండేది ఆమె.ఆ క్రమంలో చాలా ఒత్తిడి అనుభవించింది. చదువైపోయి, మంచి ఉద్యోగమూ సాధించింది. కెరీర్ కూడా బాగుంది. అయినా ఆమెలో ఏదో స్ట్రెస్, ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ క్రిటిసిజం. రెండేళ్ల నుంచి క్లెప్టోమేనియాతో బాధపడుతోంది. తప్పని తెలిసినా కంట్రోల్ చేసుకోలేని స్థితి ఆమెది. ఎవరైనా పట్టుకుంటే అవమానమనే భయం, సిగ్గు, ఆందోళనతో చితికిపోతోంది. ఈ ఆందోళన తగ్గించుకోవడానికి మళ్లీ దొంగతనం చేస్తోంది. అలా చేస్తేనే తనకున్న ఆందోళన తగ్గుతోందట.మెదడులో మార్పులే కారణం... సాధారణంగా ఎవరైనా విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఏమాత్రం విలువలేని చిన్నచిన్న వస్తువులను దొంగిలించకుండా ఉండలేకపోవడం క్లెప్టొమేనియా ప్రధాన లక్షణం. ఆ తర్వాత భయం, ఆందోళన, అపరాధభావం. వాటినుంచి తప్పించుకునేందుకు మళ్లీ మరో దొంగతనం. ఇదో వలయంలా సాగుతుంది. క్లెప్టోమేనియాకు కచ్చితమైన కారణాలు తెలియవు. మెదడులోని మార్పులు కారణం కావచ్చని, లేదా ఒత్తిడిని అధిగమించేందుకు దొంగతనం అలవాటు కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే మెదడులో సెరటోనిన్ అనే రసాయనానికి ఈ రుగ్మతకు సంబంధం ఉందని తెలుస్తోంది. అలాగే చిన్నచిన్న వస్తువులను దొంగిలించినప్పుడు వచ్చే ఎగ్జయిట్మెంట్ మెదడులో డోపమైన్ విడుదలకు కారణం కావచ్చు. దాంతో అలాంటి ఎగ్జయిట్మెంట్ కోసం మళ్లీమళ్లీ దొంగతనం చేస్తుంటారు. ఇంకా మెదడులోని ఓపియాయిడ్ వ్యవస్థ కూడా కారణం కావచ్చు. అలాగే ఇబ్బందికరమైన కోరికల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా దొంగతనం చేయవచ్చు.చికిత్స తప్పనిసరి అవసరం..అరుదుగా ఉండే ఈ రుగ్మత గురించి ఎవరికైనా చెప్పుకుంటే అవమానమని చాలామంది చికిత్సకు దూరంగా ఉంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ క్లెప్టోమేనియాను స్వయంగా అధిగమించడం కష్టం. దానికి కచ్చితంగా చికిత్స అవసరం. ఇందులో మందులు లేదా సైకోథెరపీ, లేదా రెండూ అవసరమవుతాయి.అనారోగ్యకరమైన, ప్రతికూల ప్రవర్తనలను, నమ్మకాలను గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన వాటితో భర్తీ చేయడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేయాలని ట్రిగ్గర్ అవుతుందో గుర్తించాలి. కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్,సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, కౌంటర్ కండిషనింగ్, కోవర్ట్ సెన్సిటైజేషన్, ఎవర్షన్ థెరపీ టెక్నిక్స్ ద్వారా మాధవి మూడు నెలల్లో తన సమస్య నుంచి బయటపడగలిగింది.అయితే ఇది మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి రివ్యూ సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆమె ఫాలో అయింది. ఇప్పుడు మాధవి ఏ దొంగతనాలూ చేయకుండా ప్రశాంతంగా జీవిస్తోంది. – సైకాలజిస్ట్ విశేష్ -
అందరూ మెచ్చుకుంటున్నా.. లోలోపల అనుమానం!?
డేవిడ్ ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. చాలా ప్రాజెక్టులు చేశాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నాడు. కొలీగ్స్, సీఈఓ కూడా అతని పనిని మెచ్చుకుంటారు. అయినా ఏదో భయం. తనను మోసగాడు అనుకుంటారేమోననే భయం! దానివల్ల సరిగా పనిచేయలేక పోతున్నాడు. డేవిడ్ ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’తో బాధపడుతున్నాడని అర్థమైంది. దాంతో అతని బాల్యంలోకి వెళ్లాల్సి వచ్చింది.పర్ఫెక్ట్ పేరెంటింగ్ ప్రభావం..డేవిడ్ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులు. బాల్యం నుంచి డేవిడ్ను బాగా ప్రోత్సహించేవారు. చదువులోనే కాదు, అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలని తరచుగా చెప్పేవాళ్లు. ఏ చిన్న తప్పు చేసినా వెంటనే సరిదిద్దేవాళ్లు. డేవిడ్ మంచి గ్రేడ్లు, ర్యాంకులు సాధించినా.. ఏ తప్పూ లేకుండా చేయాలనే ఒత్తిడి అనుభవించేవాడు. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్ద ఫెయిల్యూర్గా చూసేవాడు.స్కూల్, కాలేజీ రోజుల్లో బాగానే ఉన్నా యూనివర్సిటీకి వెళ్లేసరికి డేవిడ్ పై ఒత్తిడి తీవ్రమైంది. కంప్యూటర్ సై¯Œ ్సలో కాంప్లెక్స్ కాన్సెప్ట్లను అర్థం చేసుకోవడానికి తాను కష్టపడుతుండగా, తన ఫ్రెండ్స్ ఈజీగా అర్థం చేసుకోవడం చూసి ఒత్తిడికి లోనయ్యేవాడు. తాను అందరూ అనుకున్నంత తెలివైన వాడినేం కాదని, అందుకే ఇప్పుడు కంప్యూటర్ సై¯Œ ్సను అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నానని అనుకునేవాడు. ఆ విషయం ఎవరికీ చెప్పలేక, చెప్పుకోలేక లోలోపల మథనపడేవాడు.మీ అపనమ్మకమే సమస్య.. తనపై తనకు అపనమ్మకమున్నా డేవిడ్ టాలెంట్ వల్ల టాప్ టెక్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. అతని టాలెంట్ను అందరూ మెచ్చుకునేవారు. కానీ డేవిడ్ లోలోపల మాత్రం అంతా లక్ వల్లే జరిగిందని, తనకేం పెద్ద టాలెంట్ లేదని, ఆ విషయం ఎప్పుడో ఒకసారి, ఎవరో ఒకరు కనుక్కుంటారనే భయపడుతుండేవాడు. ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడానికి టీమ్ మెంబర్సే కారణమని అనుకునేవాడు. తనను తాను నిరూపించుకోవాలని నిరంతరం ఒత్తిడి అనుభవించేవాడు. పనులను వాయిదా వేసేవాడు. ఇవన్నీ కలసి అతన్ని డిప్రెషన్లోకి తోసేశాయి. నిద్ర సమస్యలు మొదలయ్యాయి. టాలెంట్ ఉన్నా, ఉందని అందరూ చెప్తున్నా, మెచ్చుకుంటున్నా.. అలాంటి టాలెంటేం లేదని సందేహపడటం, తన మోసం బయట పడుతుందని భయపడటాన్ని ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ అంటారు.ఈ సిండ్రోమ్ నుంచి బయటపడాలంటే..మీ లోపల నిరంతరం విమర్శిస్తుండే వాడి స్వరాన్ని గుర్తించండి. మీ అర్హత, యోగ్యత, సాధించిన విజయాలతో వాడి మాటలను సవాల్ చేయండి.ఊరికే మీపై మీరు సందేహపడుతూ బాధపడకుండా.. మీపై మీరు నమ్మకం పెంచుకోవడానికి మీరు సాధించిన విజయాలు, పూర్తయిన ప్రాజెక్టులను సమీక్షించండి.మీ నైపుణ్యాలు, ప్రతిభను అభినందించడానికి సమయాన్ని వెచ్చించండి. గ్రాటిట్యూడ్ డైరీ రాయండి.చిన్నదైనా పెద్దదైనా మీ ప్రోగ్రెస్ను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోండి. ఇది మీరు మరింత సాధించడానికి ప్రేరేపిస్తుంది.మీ మనసులోని భావాలను స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబసభ్యుల సహాయం తీసుకోండి.క్రిటికల్ లేదా పర్ఫెక్షనిస్ట్ పేరెంటింగ్, దానివల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల వచ్చే ఇంపోస్టర్ సిండ్రోమ్ను అధిగమించాలంటే మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. అలా జరగాలంటే ఈ సూచనలు పాటించాలి.Fail అంటే first attempt in learning అని రీఫ్రేమ్ చేయండి. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి, దాన్నుంచి పాఠాలు నేర్చుకోండి.మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కాకుండా, మీ స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి.అన్నిటికంటే ముఖ్యంగా, ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది ఒక మానసిక సమస్యే తప్ప మీ సామర్థ్యాలకు కొలమానం కాదని గుర్తించండి. మీ ప్రతికూల ఆలోచనలను సవాలు చేయడం ద్వారా, మీ ప్రతిభకు సంకేతాలను గుర్తించడం ద్వారా మీపై మీరు నమ్మకాన్ని తిరిగి సాధించుకోవచ్చు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.కెరీర్లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్ను, పెయింటింగ్ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్కు వచ్చింది.‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.కారణాలు..– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి ప్లాట్ఫామ్స్లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి. – సారిక తన జీవితాన్ని ఆన్లైన్లో చూసే పర్ఫెక్ట్ లైఫ్లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది. – నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.లక్షణాలు..– సోషల్ మీడియా అప్డేట్స్ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..సెల్ప్ హెల్ప్ టిప్స్..– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి. – చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్ను ఆపేయండి. – మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి. – మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్ను అనుసరించవద్దు. – స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి. – ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి. – మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్ను కలవండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
ఎంత ప్రయత్నించినా.. నిద్ర పట్టడంలేదు!
విజయ్ ఒక ప్రముఖ ఎమ్మెన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లిచేసుకున్నాడు. జీవితంలోనూ, ఉద్యోగంలోనూ త్వరత్వరగా ప్రమోషన్లు అందుకున్నాడు. కానీ గత మూడు నెలలుగా రాత్రిళ్లు నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నాడు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.కానీ విజయ్కు త్వరగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టదు. ఉదయం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఏ పనిౖ పెనా శ్రద్ధ నిలవడంలేదు. నిరంతరం నిద్ర గురించిన ఆలోచనలే. పనిలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. దాంతో ఆఫీసులో రెడ్ స్లిప్ వచ్చింది.ఏం చేయాలో అర్థంకాక, స్లీపింగ్ పిల్స్ వాడటం ఇష్టంలేక కౌన్సెలింగ్కి వెళ్లాడు. ఫస్ట్ సెషన్లోనే అతను నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్టు తేలింది. ముగ్గురిలో ఒకరు ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. వెంటనే డాక్టర్ను సంప్రదించి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోమని సూచించారు.ఎలాంటి శారీరక కారణాలు లేవని పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత రెండు వారాలపాటు ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో మేల్కొంటున్నాడో డైరీ రాయమని సూచించారు. విజయ్ భార్యతో మాట్లాడి స్లీప్ ఆప్నియా లేదా రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటివి లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా విజయ్ కొద్దివారాల్లో తన నిద్రలేమిని అధిగమించగలిగాడు.నిద్రలేమికి కారణాలు..- దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మన మనస్సును చురుకుగా ఉంచుతాయి, నిద్రను కష్టతరం చేస్తాయి. - షిఫ్ట్ లను తరచుగా మార్చడం లేదా వివిధ టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్లా శరీరంలోని గడియారానికి (సర్కేడియన్ రిథమ్స్) భంగం కలుగుతుంది- ఒక్కోరోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పనిచేయడం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. - యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు..- మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందులు..- స్లీప్ ఆప్నియా, రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్..- రాత్రిళ్లు నికోటిన్, ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు, పానీయాలను తీసుకోవడమూ నిద్రలేమికి కారణమవుతాయి.మంచి అలవాట్లతో మంచి నిద్ర..మంచి అలవాట్లు నిద్రలేమిని నివారించడంలో సహాయపడతాయి.- వారాంతాలు సహా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కోవడం చేయాలి. - రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.- పగలు అస్సలు నిద్రపోవద్దు, లేదా పరిమితం చేసుకోవాలి. - కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి.. వీలైతే పూర్తిగా మానేయాలి. - నిద్రవేళకు ముందు భారీగా తినొద్దు, తాగొద్దు. - పడకగదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి. - గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. - ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్ను కలవడం తప్పనిసరి. - నిద్రకు దూరంచేసే నెగెటివ్ ఆలోచనలు, చర్యలను సీబీటీ ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే ప్రభావవంతంగా ఉంటుంది. - లైట్ థెరపీ, స్టిములస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. - ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్రవేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఎవరి నిద్ర వారిదే..నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయేవాళ్లందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు. - త్వరగా పడుకొని, త్వరగా లేచేవారిని ఎర్లీబర్డ్స్ అంటారు. - గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని, ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు. - ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు. - పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఈ 5 ఎక్సర్సైజ్లతో.. మీ ఓవర్ థింకింగ్కి చెక్!
‘మీకున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అని ప్రశ్నిస్తే పదిమందిలో ఏడుగురు ‘అతిగా ఆలోచించడం’ అని సమాధానమిస్తారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది, త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ఎక్సర్సైజ్లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ‘ఓవర్ థింకింగ్’కి చెక్ పెట్టవచ్చు.ఎప్పడు అతిగా ఆలోచిస్తున్నారో గుర్తించాలి..రోజులో ఏ సమయంలో, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో, ఆ సమయంలో మీ శరీరంలో ఏయే భాగాలు బిగుసుకుని ఉంటున్నాయో గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనూ ఏ పని చేస్తున్నప్పుడు మీకు తక్కువ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయో కూడా గుర్తించాలి. ఉదాహరణకు మీరు జిమ్కి వెళ్లినప్పుడు లేదా ఫన్నీ పాడ్కాస్ట్ వింటున్నప్పుడు ఆందోళన చెందకపోవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించడం, ఆచరించడం ఓవర్ థింకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.‘మీ ఆలోచనలకు’ దూరంగా జరగాలి..మీరు ఆలోచనల సుడిగుండంలో పడి మునిగిపోతున్నప్పుడు దానికి దూరంగా జరగాలి. గోడ మీది ఈగలా లేదా జడ్జిలా మీ ఆలోచనలకు దూరంగా జరిగి వాటిని గమనించాలి. ఇలా ఒక అడుగు వెనక్కు వేసి మీ ఆలోచనలను మీరు గమనించడం ద్వారా మీ భావోద్వేగాల తీవ్రత తగ్గిందని మీకు అర్థమవుతుంది. అంతే కాదు, మీ ఆలోచనల చానెల్ను మార్చే శక్తి మీకుందని మీరు గుర్తిస్తారు.‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారాలి..ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనతో భర్తీ చేయడానికి సులభమైన మార్గం ‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారడం. అంటే ‘నాకే ఎందుకిలా జరిగింది?’, ‘నేనే ఎందుకు చేయాలి?’ లాంటి ప్రశ్నల నుంచి దారి మళ్లించుకుని ‘నేను ఎలా ముందుకు వెళ్ళగలను?’ అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీకు చెప్పిన సమయానికి రాకపోతే, మెసేజ్కి స్పందించకపోతే.. ఎందుకలా చేశారని అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవచ్చనే దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, మీరు నెగెటివ్ ఓవర్ థింకింగ్ నుంచి మంచి ప్లానింగ్కి మారతారు.రీషెడ్యూల్ చేయాలి..అతిగా ఆలోచించడానికి రోజులో పది, పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజూ అదే సమయంలో కూర్చుని దానిపై ఆలోచించాలి . రోజూ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా సమయాల్లో ఆ అతి ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టవు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఈ ఐదు ఎక్సర్సైజ్లను రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ని సంప్రదించాలి. – డా. విశేష్, సైకాలజిస్ట్ -
ఈ తరానికి అవసరమైన సప్తపది..
‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి’... అనే పాట ఒకప్పుడు చాలా పాపులర్. ఈతరం ఒక్కసారి కూడా విని ఉండదు. ఈ పాటలాగే పెళ్లి కూడా పాతబడిపోతోంది. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ పెళ్లి స్వరూపం మారిపోతోందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి స్థానంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేస్తోంది. పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కలిసి ఉండే జంటల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఇది ఎక్కడకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే పెళ్లయినా, లివ్ ఇన్ అయినా మరెలాంటి బంధమైనా నిలబడాలంటే ఏడు సూత్రాలు పాటించాలని ‘ఫ్యామిలీ జర్నల్’ జరిపిన సైకాలజికల్ రీసెర్చ్లో వెల్లడైంది. ఈ ఏడు సూత్రాలు పాటించడం ద్వారా జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తుందని ఆ అధ్యయనం చెబుతోంది. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.లోపాలను బలాలుగా మార్చుకోగల సామర్థ్యం..పెళ్లంటే చాలా సవాళ్లు ఉంటాయి. భార్యాభర్తల్లో లోపాలుంటాయి, దిగులుపడే సందర్భాలు ఉంటాయి. ఆ సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటారు, వారి లోపాలను ఎలా మార్చుకుంటారనేదే వారి బంధంలోని బలాన్ని నిర్ణయిస్తుం దని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కష్టసమయాల్లో ఒకరికొకరు ఓదార్పు, మద్దతు, ప్రోత్సాహం అందిస్తూ కలిసి సమస్యలు ఎదుర్కోవడమే తొలిమెట్టు.కలిసి పంచుకోవడం కీలకం..‘నా స్పేస్ నాకు కావాలి’ అంటూ గొడవపడే జంటలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. పెళ్లంటేనే కలిసి జీవితాన్ని పంచుకోవడం. ఇద్దరూ కలిసి ఆనందించే చర్యల ద్వారా తమదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం అవసరమని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. ఇలా చేయడం జంట మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అందువల్ల తరచుగా కలిసి నడవడం, వంటచేయడం, పరస్పర హాబీలను ప్రోత్సహించుకోవడం లాంటి పనులు చేయాలి.విభేదాలు, మార్పును సహించడం..పెళ్లంటే భిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడం. అంటే వారిద్దరి మధ్య విభేదాలు సహజం. వాటిని అంగీకరించడం, సహించడం అవసరం. అలాగే బంధంలో, భాగస్వామిలో వచ్చే మార్పును ముప్పుగా భావించకుండా, దాన్ని పరిణామానికి ఒక అవకాశంగా చూడాలి. విభేదాలతో విడిపోకుండా, అవి ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవడానికి అమూల్యమైన అవకాశాలుగా వినియోగించుకోవాలి.రాజీతోనే విభేదాలు పరిష్కారం..వైవాహిక జీవితంలో విభేదాలు సహజం. తప్పెవరిదైనా విభేదాలను పరిష్కరించు కోవడానికి రాజీ పడటం అవసరం. అలా రాజీపడి విభేదాలను పరిష్కరించుకోగల జంటలు ఎక్కువ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారని అధ్యయనం చెబుతోంది. అందువల్ల లోపాల గురించి విమర్శించుకునే బదులు బలాలు, సానుకూల లక్షణాలను ప్రశంసించడంపై దృష్టి పెట్టండి. ఒకరిపట్ల మరొకరికి అవగాహన, కృతజ్ఞత కలిగి ఉండటం సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.అప్పుడప్పుడైనా మెచ్చుకోవాలి..భార్య వంట చేస్తే లొట్టలేసుకుంటూ తినడం, భర్త బంగారం కొనిస్తే తీసుకోవడమే కాదు.. వారికెప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? చిన్న చిన్న విషయాలకు కూడా థాంక్స్ చెప్పడం అవసరమని అధ్యయనం నొక్కి చెబుతుంది. అలా చేయడం జంట మధ్య ప్రేమ, అనుబంధాన్ని పెంపొందిస్తుంది. అందుకే మీ పార్ట్నర్ సహకారాన్ని, లవ్ సిగ్నల్స్ను గుర్తించి అభినందించేందుకు ప్రయత్నించండి.బంధంలో నిబద్ధత..భారతదేశంలో పెళ్లంటేనే జీవితకాల బంధం. అది విజయవంతం కావాలంటే నిబద్ధత కీలకం. జీవితంలో వచ్చే చెడు కాలాలను దాటి బంధం నిలబడాలంటే జంటలో అంకితభావం, పట్టుదల అవసరం. అన్నింటికంటే వైవాహిక బంధమే ముఖ్యమైనదని గుర్తించి, దాన్ని కాపాడుకోవడానికి సమయం వెచ్చించాలి. అలా కాల పరీక్షను తట్టుకుని నిలబడే ప్రేమ, విశ్వాసాలకు పునాదిని నిర్మించుకోవచ్చు.తనను తాను గౌరవించుకోవాలి..ఆరోగ్యకరమైన సంబంధాలకు ఆత్మగౌరవం ఆధారం. అది మీరు మీ భాగస్వామితో వ్యవహరించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బలమైన ఆత్మగౌరవం ఉన్నవారు సంతృప్తికరమైన సంబంధాలను కొనసాగించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారని అధ్యయనం సూచిస్తోంది. ఆత్మగౌరవం లేనివారు చిన్నచిన్న విషయాలకు కూడా నొచ్చుకుని గొడవపడుతుంటారు. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి. అది మీ వైవాహిక బంధానికి పునాదిగా నిలుస్తుంది.ఇవి చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!! -
బుల్లీయింగ్ను నిర్లక్ష్యం చేయొద్దు..
రేచల్ చురుకైన విద్యార్థిని. ఆటల్లో, పాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటుంది. స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే గత ఏడాదిగా తన ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. 15ఏళ్ల టీనేజర్లో ఉండే చురుకుదనం కనిపించడంలేదు. టీచర్లు గుర్తించి అడిగారు, ఏమీ చెప్పలేదు. దాంతో పేరెంట్స్ను పిలిపించి చెప్పారు. వాళ్లు అడిగినా ఏమీ చెప్పలేదు. మరోవైపు టెస్టుల్లో మార్కులు తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థంకాక కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు.రేచల్ ఆందోళగా కనిపించింది. ఐ కాంటాక్ట్ ఇవ్వడంలేదు. వినిపించీ వినిపించకుండా మాట్లాడుతోంది. నెమ్మదిగా తనను మాటల్లో పెట్టాను. ఫాదర్కు ట్రాన్స్ఫర్ కావడంతో రెండేళ్ల కిందటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చామని చెప్పింది. సిటీకి రావడం మొదట్లో తనకు ఉత్సాహంగా ఉన్నా పాత స్నేహితులకు, సుపరిచితమైన వాతావరణానికి దూరంకావడం తనకు బాధగా ఉందని, తరచుగా కడుపునొప్పి కూడా వస్తోందని చెప్పింది. అది యాంగ్జయిటీ వల్ల వచ్చే సొమాటిక్ సింప్టమ్ అని అర్థమైంది. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె తీవ్ర ఆందోళన, డిప్రెషన్తో బాధపడుతోందని నిర్ధారణైంది.కొత్త స్కూల్లో ఒక బ్యాచ్ తన మాటలు, ఉచ్చారణ, డ్రెస్సుల గురించి ఎగతాళి చేస్తోందని ఆ తరువాతి సెషన్లో చెప్పింది. ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, తన సోషల్ మీడియా పోస్టులను అపహాస్యం చేస్తున్నారని చెప్పింది. ఇటీవల నేరుగానే బెదిరిస్తున్నారని, ఏం చేయాలో అర్థం కావడంలేదని కంటనీరు పెట్టుకుంది. రేచెల్లానే దాదాపు 20 శాతం మంది విద్యార్థులు, విద్యార్థినులు బుల్లీయింగ్ బాధితులవుతున్నారు. అది వారిని మానసికంగా, విద్యాపరంగా చాలా దెబ్బతీస్తుంది. కొన్ని సెషన్ల థెరపీ అనంతరం రేచల్ బుల్లీయింగ్ నుంచి బయటపడి, తిరిగి తన సంతోషాన్ని వెనక్కు తెచ్చుకోగలిగింది.ఎలా ఎదుర్కోవాలి?బుల్లీయింగ్ ఎదురైనప్పుడు పిల్లలు కొన్ని చిట్కాలు పాటించాలి. పేరెంట్స్ అండగా నిలవాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. – మీ బలాలు, ప్రతిభను గుర్తించండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ను ప్రాక్టీస్ చేయండి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. – ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకునేందుకు బ్రీతింగ్, రిలాక్సేషన్, మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయండి. – మీ భావాలను, అవసరాలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకోండి. – మీకు మద్దతుగా ఉండే స్నేహితుల సహాయం తీసుకోండి. – బుల్లీయింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, పరిస్థితులకు దూరంగా ఉండండి. – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి.పేరెంట్స్ ఏం చేయాలి?– మీ పిల్లలు అన్ని ఫీలింగ్స్, అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడేలా, పంచుకునేలా ప్రోత్సహించండి.– శారీరక, మౌఖిక, సైబర్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించండి. – బుల్లీయింగ్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. – కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ టెక్నిక్ట్స్ ప్రాక్టీస్ చేయించండి. – తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి. – బుల్లీయింగ్ గురించి టీచర్స్తో, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. – బుల్లీయింగ్ వల్ల మీ బిడ్డ ఎమోషనల్గా బాధపడుతుంటే వెంటనే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఫ్యామిలీ థెరపీ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయం చేస్తారు.ఎందుకు బెదిరిస్తారు? ప్రతి వ్యక్తీ గుర్తింపును కోరుకుంటారు. ఆటలు, మాటలు, పాటలు, ప్రవర్తన లేదా ప్రతిభ ద్వారా గుర్తింపును సాధించుకుంటారు. అవేమీ లేనివారు ఇతరులను ఏడిపించడం ద్వారా గుర్తింపును సాధించాలనుకుంటారు. అయితే ఎవ్వరూ అలా పుట్టరు. రెండు మూడేళ్ల వయసులో పిల్లల దూకుడు ప్రవర్తనను నియంత్రించకపోతే వారు పెద్దయ్యాక ఇతరులను బెదిరించేవారిగా మారవచ్చు. వారిని అలాగే వదిలేస్తే వారిలో నేరప్రవృత్తి పెరిగి భార్యాపిల్లలను కొట్టడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పిల్లలకు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం.ఎందుకు ఆపరు?బుల్లీయింగ్ను చాలామంది గమనించినా ఆపే ప్రయత్నం చేయరు. ఆపితే తమను కూడా టార్గెట్ చేస్తారని భయపడతారు. కొందరు తాము చేయలేనిదాన్ని వాళ్లు చేస్తున్నారని చూసి ఆనందిస్తారు. మరికొందరు దాన్ని ఫన్లా తీసుకుని నవ్వుతారు. ఈ మౌనం, నవ్వు ఎగతాళి చేసేవారికి ప్రోత్సాహకంగా మారుతుంది. ఇక సైబర్ బుల్లీయింగ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ట్రోల్ చేయడమే ప్రధానంగా సోషల్ మీడియా పేజీలు, వీడియోలు రావడం, వాటిని పలువురు షేర్ చేయడం గమనించవచ్చు.– సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) -
సెల్ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?
‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ఒక తండ్రి ఆవేదన.‘మా పాపకు ఇన్స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు’ ఒక తల్లి ఆక్రోశం.‘స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు’ ఒక టీచర్ ఫిర్యాదు.‘వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్ఫోన్లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం, చూస్తున్నాం. తప్పేంటీ?’ ఈ తరం విద్యార్థి ప్రశ్న.సోషల్ మీడియాతోనే చిక్కు..పిల్లల మీద స్మార్ట్ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది.సమస్య ఎక్కడ మొదలైంది?ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ను ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తుందనీ, పిల్లలు తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్ఫోన్ వలలో చిక్కుకుపోయారు.మారకపోతే ప్రమాదమే..ప్రస్తుతం స్మార్ట్ఫోన్లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు ఐnట్ట్చజట్చఝ, టn్చpఛిజ్చ్టి లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోష¯Œ ్స గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.ఐదు అంచెల్లో పరిష్కారం..1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది.2. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.3. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్ఫోన్దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్ఫోన్ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సమయం గడుపుతారు.4. స్మార్ట్ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ల కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్లే వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి.5. పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి.– సైకాలజిస్ట్ విశేష్ -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్ను స్కూల్కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్కు వెళ్ళారు. పేరెంట్స్తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్లో హింసాత్మక ప్రోగ్రామ్లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
'విడిపోతామని విపరీతమైన భయం'! అసలు కారణమేంటి?
భారతికి ఇద్దరు పిల్లలు. భర్త భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. భారతి గతంలో పనిచేసినప్పటికీ, ప్రస్తుతం పిల్లలకోసం ఇంట్లోనే ఉంటోంది. కానీ పిల్లలను స్కూల్కు పంపాలంటే విపరీతంగా భయపడుతోంది. వాళ్లు తనకు దూరమవుతారేమోనని ఆందోళన చెందుతోంది. స్కూలుకెళ్తే పిల్లలు దూరమవుతారనే భయమేంటోయ్ అని భరత్ జోక్ చేసినా ఆమె ఆందోళన తగ్గకపోగా, భర్త ఎక్కడ దూరమవుతాడోననే భయమూ మొదలైంది. నీవన్నీ పిచ్చి భయాలని భర్త ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం రావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కౌన్సెలింగ్కి అటెండ్ అయింది.భారతితో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెరిగిందనే విషయం తెలిసింది. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల ఆమెను హాస్టల్లో ఉంచారని చెప్పింది. పేరెంట్స్ ఎక్కడ విడిపోతారోనని రోజూ భయపడేదాన్నని, తాను భయపడినట్లు వాళ్లు విడిపోయారని బాధపడింది. అప్పటినుంచీ ఒంటరిగానే ఉంటున్నానని, కానీ ఒంటరితనం విపరీతమైన ఆందోళనను పెంచిందని చెప్పింది. భారతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆమె సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్తో బాధపడుతోందని అర్థమైంది. ఇష్టమైన వ్యక్తి నుంచి విడిపోతామనే భయమే ఈ డిజార్డర్. ఇది పిల్లల్లో సహజం. అయితే భారతిలానే కొందరు పెద్దల్లో కూడా ఉంటుంది.ఎప్పడు మొదలవుతుంది?విడిపోతామనే ఆందోళన సాధారణంగా ఎనిమిది నెలల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు పక్కకు వెళ్లినప్పడు ఆందోళన చెందుతారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమను వదిలి వెళ్లరని, తిరిగి వస్తారని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు. అయితే కొందరిలో ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో లేదా రక్తసంబంధీకులు, స్నేహితులతో విడిపోతామని ఆందోళన చెందుతుంటారు.పిల్లల్లో సెపరేషన్ యాంగ్జయిటీకి కారణాలు..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జన్యుపరమైనది కావచ్చు. ఇది కుటుంబ పరంగానూ రావచ్చు. జీవితంలో జరిగే సంఘటనలూ కారణం కావచ్చు. ఉదాహరణకు..కుటుంబ సభ్యుల మరణంతల్లిదండ్రులు విడిపోవడం తల్లిదండ్రులు లేకపోవడంవలస వెళ్లాల్సి రావడంపాఠశాల మార్పుతల్లిదండ్రుల్లో ఆందోళనతల్లిదండ్రుల మద్య వ్యసనందత్తతకు వెళ్లడంపెద్దల్లో కారకాలు..ప్రియమైన వ్యక్తిని కోల్పోవడంకఠినమైన పెంపకంజీవితంలో నిత్యం సవాళ్లు, ఒత్తిళ్లుచిన్నతనంలో ఆందోళన రుగ్మతపిల్లల్లో కనిపించే లక్షణాలు..పిల్లల్లో తరచుగా ప్రీస్కూల్, డేకేర్ సమయంలో ఇది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వదిలివెళ్లడానికి బిడ్డ నిరాకరించవచ్చు, కోపం ప్రదర్శించవచ్చు. · కుటుంబ సభ్యులకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం· ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం· తప్పిపోతామేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే భయం· పీడ కలలు· నిద్రలో మూత్రం పోయడంపెద్దల్లో కనిపించే ఇతర లక్షణాలు..· ఇష్టమైన వారు దగ్గర లేనప్పుడు భయాందోళనలు · ప్రియమైన వ్యక్తి గాయపడతారనే భయం · ఎవరితోనూ కలవకపోవడం · ఏకాగ్రత కోల్పోవడం.జీవితంపై తీవ్ర ప్రభావం..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది పాఠశాల, ఉద్యోగ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, అతిసారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు డిప్రెషన్, ఇతర యాంగ్జయిటీ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లూ తలెత్తవచ్చు.నివారించడమెలా?సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ను నివారించడానికి ఎలాంటి మార్గాలూ లేవు. అయితే పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. · నమ్మకమైన బేబీ సిట్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా వేరుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి..· కొద్ది సమయంపాటు విడిగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి..· ఎక్కడైనా వదిలివెళ్లినప్పుడు, చెప్పిన సమయానికి రావడం ద్వారా నమ్మకాన్ని పెంచాలి.. · అయినప్పటికీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను కలవాలి..· కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రుగ్మతకు చికిత్సను అందించొచ్చు. · డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో పాటు ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. · అవసరమైతే సైకియాట్రిస్ట్ను కలసి మందులు తీసుకోవాల్సి ఉంటుంది.— సైకాలజిస్ట్ విశేష్ -
Health: మీరు ఈ తొమ్మిది అలవాట్లు వదులుకుంటే.. సక్సెస్ గ్యారంటీ!
‘పదే పదే ఏం చేస్తామో అదే మనం. ఎక్సలెన్స్ అనేది ఒక పని కాదు, ఒక అలవాటు’ అంటాడు అరిస్టాటిల్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారతాయి. అవే మన విజయాన్ని నిర్ణయిస్తాయి. తొమ్మిది అలవాట్లు 90శాతం సమయాన్ని వృథా చేస్తాయని సైకాలజిస్టులు గుర్తించారు. వాటిని మార్చుకునే మార్గాలు కూడా సూచించారు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా మీరు జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.1. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం..అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్. అలా అనుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం నాశనమైందంటూ బాధపడుతుంటారు. అందుకే అందరిలోనూ, అన్నిటిలోనూ.. చిన్నవో, పెద్దవో లోపాలు ఉంటాయనే విషయాన్ని అంగీకరించాలి. పాజిటివ్స్ను చూస్తూ ముందుకు సాగాలి.2. మల్టీ టాస్కింగ్..ఒకేసారి పలు పనులు చేయడం గొప్ప విషయంగా భావిస్తుంటారు. కానీ నిజానికి మెదడు ఒకసారి ఒక అంశంపైనే ఫోకస్ చేయగలదు. ఈ విషయం అర్థంకాక మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు ‘పోమోడోరో టెక్నిక్’ ఉపయోగించండి. అంటే, ఒక పని మొదలుపెట్టాక 20 నిమిషాల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ధ్యాస పెట్టడం. ఆ పని పూర్తయ్యాకనే మరో పని ప్రారంభించడం.3. చేసిందే చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశించండి..చేసిన పనే చేస్తుంటే వచ్చిన ఫలితాలే వస్తాయి. భిన్నమైన ఫలితాలు రావాలంటే భిన్నంగా ప్రయత్నించాలి. అందుకే మీ అలవాట్లను ట్రాక్ చేయండి. అందులో ఏవి పునరావృతం అవుతున్నాయో గుర్తించండి. అవసరమైతే వాటిని మార్చుకోండి. 4. ప్రతిదానికీ ‘అవును‘ అని చెప్పడం..కొందరికి మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరేం అడిగినా ‘నో’ చెప్పలేక, ‘ఎస్’ చెప్పేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ‘నో’ చెప్పడం నేర్చుకోండి. ఎందువల్ల మీరు ఆ పని లేదా సహాయం చేయలేరో వివరించడం నేర్చుకోండి. 5. వాయిదా వేయడం..ఎప్పటిపని అప్పుడు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండటం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీ కలలను నాశనం చేస్తుంది. మిమ్మల్నో పరాజితుడిగా నిలుపుతుంది. అందుకే నిద్ర లేవగానే, ఉదయాన్నే ముఖ్యమైన పనిని చేయడం అలవాటుగా మార్చుకోండి. అలా చేయడం ఈ రోజే మొదలుపెట్టండి. నెల రోజుల్లో అది అలవాటుగా మారుతుంది. 6. అతిగా ఆలోచించడం..వర్తమానం కంటే ఎప్పడో జరిగిన వాటి గురించో లేదా ఏదో జరుతుందనో అతిగా ఆలోచిస్తూ ఎక్కువ బాధపడతాం. అందుకే మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పుస్తకంలో లేదా డైరీలో రాసుకోండి. నాలుగు రోజుల తర్వాత అందులో ఎన్ని నిజమయ్యాయో, ఎన్ని నిజం కాలేదో పరిశీలించండి. ఆలోచనలన్నీ నిజం కావని, అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మీకే అర్థమవుతుంది. 7. క్లోజ్డ్ మైండ్ సెట్..చాలామంది ‘నాకు లెక్కలు రావు’, ‘నాకు ఇంగ్లిష్ రాదు’ అని క్లోజ్డ్ మైండ్ సెట్తో ఉంటారు. కానీ మనందరం ఒకే రకమైన మెదడుతో పుట్టాం. ఆ తర్వాతే అన్నీ నేర్చుకుంటాం. అంటే, మనందరం లెర్నింగ్ మెషి¯Œ లా పుట్టాం. అందువల్ల ఏదైనా నేర్చుకోవచ్చనే ‘గ్రోత్ మైండ్ సెట్’ను అలవరచుకోండి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి. 8. నెగెటివ్ వ్యక్తులు..కొంతమంది మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం నిరాశపరుస్తూ ఉంటారు, మీ ఉత్సాహాన్ని తమ మాటలతో నీరు కారుస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండండి. మీ లక్ష్యసాధనను ప్రోత్సహించే వ్యక్తులకు దగ్గరవ్వండి. వారితో స్నేహం చేయండి. 9. బాధిత మనస్తత్వం..ప్రపంచమంతా అన్యాయంగా ఉందని, అందరూ ద్రోహమే చేస్తారని కొందరు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. అది విక్టిమ్ మైండ్ సెట్. అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మానసిక సమస్యల పాలవుతారు. అందుకే తక్షణం ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి. ఇతరులపై నిందలు వేయడం ఆపండి. మీ చర్యలకు, మీ జయాపజయాలకు మీరే బాధ్యత తీసుకుని ముందుకు సాగండి.— సైకాలజిస్ట్ విశేష్ -
ఈ తరం తీరే వేరు!.. ఆనందం తక్కువ ఎందుకంటే...
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్ కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి... రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్ను పొందేందుకు ట్రోలింగ్ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్ను ఎంచుకుంటారు. ట్రోల్స్లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు
ఐన్ స్టీన్.. ఈ పేరు వినగానే చింపిరి జుత్తుతో కనిపించే ఓ పెద్దాయన గుర్తొస్తాడు కదా. కాస్తంత చదువుకొని ఉంటే శక్తి నిత్యత్వ సూత్రం E = mc² గుర్తొస్తుంది. ఇంకా.. సాధారణ సాపేక్షత సిద్ధాంతం గుర్తొస్తుంది. 20వ శతాబ్దపు మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఐన్ స్టీన్ కేవలం భౌతికశాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన శాంతికాముకుడు, రాజకీయ కార్యకర్త, చురుకైన జాత్యహంకార వ్యతిరేకి, నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన జీవితం నుంచి, మిత్రులకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి ఆయన చెప్పిన జీవన సూత్రాలను ఈరోజు తెలుసుకుందాం. మీ సమయాన్ని, కృషిని ముఖ్యమైన విషయాలపై వెచ్చించండి మనం ఏదైనా పని చేయాలంటే శక్తిని వెచ్చించాలి. అలాగే రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి మానసిక శక్తిని వెచ్చించాలి. ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తినాలనే దాని దగ్గర్నుంచి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆఫీస్ కు ఎలా వెళ్లాలి లాంటి వాటికోసం మానసిక శక్తిని వెచ్చించడం వల్ల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. అందుకే చాలామంది టాప్ అచీవర్స్ ఇలాంటి చిన్నచిన్న విషయాలకు ప్రాథాన్యం ఇవ్వరు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు మంగలి దగ్గరకు సమయం వృథా చేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే ఆ చింపిరి జుట్టు. ఇక ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎప్పడూ బ్లూ జీన్స్ మాత్రమే ధరిస్తాడు. అమెజాన్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ జుకర్ బర్గ్ కూడా అంతే. ఏ డ్రెస్ వేసుకోవాలనే నిర్ణయం కోసం తమ మానసిక శక్తిని వెచ్చించకుండా ముఖ్యమైన నిర్ణయాల కోసం ఆదా చేసుకుంటారు. ఎంత కష్టమైనప్పటికీ మీరు ఇష్టపడే పనులే చేయండి ఐన్ స్టీన్ అంటే కేవలం భౌతిక శాస్త్రం మాత్రమే కాదు. ఆయన వయోలిన్ వాయిస్తాడు. పడవ కూడా నడుపుతాడు. తనకు మనసు బాలేనప్పుడు, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆయనీ పనులు చేస్తాడు. అలాగని ఐన్ స్టీన్ గొప్ప సెయిలర్ కాదు. కనీసం ఈత కూడా రాదు. పడవ బోల్తాకొట్టి మునిగిపోతుంటే జాలర్లు కాపాడిన సందర్భాలున్నాయి. అయినా ఎందుకు సెయిలింగ్ చేస్తాడంటే... ‘‘సముద్రంలో విహారయాత్ర ప్రశాంతతనిస్తుంది. విభిన్న దృక్కోణాలనుండి ఆలోచించడానికి అద్భుత అవకాశాలు కల్పిస్తుంది’’ అని ఆయనే చెప్పాడు. అందుకే మీ సబ్జెక్ట్ తో పాటు మీరు ఆనందించే ఒక హాబీని అలవాటు చేసుకోండి. అందులో మీరేం నిష్ణాతులు కావాల్సిన అవసరంలేదు. అది మీకు కావాల్సిన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఫలితంగా మీ ఒత్తిడి తగ్గుతుంది, మీ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. పజిల్ మైండ్సెట్ను కలిగి ఉండండి. జీవితంలో అనేకానేక సమస్యలు వస్తుంటాయి. వాటికి భయపడి పారిపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. సమస్యలను పజిల్ లా చూసి పరిష్కరించుకునే మైండ్ సెట్ ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు కొత్త విధానం గురించి ఆలోచించవచ్చు. ఐన్స్టీన్ అలాగే చేసేవాడు. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక పజిల్గా చూసి పరిష్కరించుకునేవాడు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు ముందు చాలామంది శాస్త్రవేత్తలు కాంతి వేగంతో కదిలే వస్తువులను చూశారు. కానీ ఐన్స్టీన్ మాత్రమే దాన్ని ఒక పజిల్ లా చూశాడు. సాపేక్ష సిద్ధాంతంతో పరిష్కరించాడు. అందుకే తప్పొప్పుల గురించి ఆలోచించకుండా పజిల్ పరిష్కారంపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఆకర్షించే విషయాల గురించి లోతుగా ఆలోచించండి ‘‘మీకు ఆసక్తిని కలిగించే ప్రశ్న ఎదురైతే సంవత్సరాల తరబడి దాన్నే పట్టుకుని ఉండండి. లోతుగా అన్వేషించండి. దానిపై పట్టు సాధించండి. అంతేతప్ప సులువుగా అందే విజయాలతో సంతృప్తి చెందకండి’’ అని ఐన్ స్టీన్ కూడా ఒక లేఖలో చెప్పారు. అంతేకాదు.. ‘‘సమస్య క్లిష్టతను చూసి కుంగిపోకూడదు. ప్రయత్నిస్తే దేన్నయినా అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. కావాల్సిందల్లా పట్టువిడవని ప్రయత్నం మాత్రమే’’ అని తన స్నేహితుడు డేవిడ్ బోమ్ కు రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఉదాహరణకు నేను ఎస్వీ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక వ్యక్తిని కలిశాను. ఆయన ప్రపంచంలో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తి. కానీ ఏ ఒక్క సబ్జెక్ట్ లోనూ లోతైన అవగాహన లేదు. దీన్నే హారిజంటల్ లెర్నింగ్ అంటారు. అంటే.. అన్నీ పైపైన నేర్చుకోవడం. నేనేమో పాతికేళ్లుగా ‘జీనియస్’ అనే ఒకే పదాన్ని పట్టుకుని ఉన్నా. దాని పూర్వాపరాలు, లోతుపాతులు అర్థం చేసుకునేందుకు, పిల్లల్లోని జీనియస్ ను వెలికితీసే మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. దీన్నే వర్టికల్ లెర్నింగ్ అవసరం. ఏ రంగంలోనైనా పట్టు సాధించి, పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే ఈ వర్టికల్ లెర్నింగ్ అవసరం. రాజకీయాలు మిమ్మల్ని ఆవేశంతో లేదా నిరాశతో నింపనివ్వవద్దు. మనం రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు మనల్ని నిత్యం అనేక విధాలుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాగని ఆ రాజకీయాల్లో మునిగి, మీ లక్ష్యాన్ని జారవిడుచుకోకండి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఇజ్రాయిల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని ఐన్ స్టీన్ ను కోరారు. ‘‘రాజకీయాలు తాత్కాలికం. కానీ నా ఫార్ములాలు శాశ్వతం’’ అంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. జీవితం ప్రశాంతంగా సాగాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి. సోషల్ మీడియా కాలంలో ఇది చాలా అవసరం. స్నేహితుడు, పరిచయస్తుడు లేదా పూర్తిగా అపరిచితుడు చేసిన పోస్ట్ వల్ల ఎలా కోపంతో ఊగిపోయామో లేదా గంటలు గంటలు వాదించామో ఒక్కసారి గుర్తుచేసుకోండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ఎవరి అభిప్రాయమూ మారదని తెలిసినా అలా సమయం వృథా చేస్తూనే ఉంటాం. మీరు రాజకీయాల్లో రాణించాలనుకుంటే అందులో సమయం వెచ్చించండి, లేదంటే దాని మానాన దాన్ని సాగనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. అధికారానికి గుడ్డి విధేయత సత్యానికి అతి పెద్ద శత్రువు నోబెల్ గ్రహీత జోహన్నెస్ స్టార్క్ వంటివారు కూడా ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంతోపాటు, దానికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి జాతీయవాదాన్ని చేర్చి ఐన్ స్టీన్ పై దాడి ప్రారంభించారు. ఈ కుతంత్రాలు హాస్యాస్పదమైనవి, హానిచేయనివిగా ఐన్ స్టీన్ మొదట భావించినప్పటికీ, వాటిని తట్టుకోలేక అమెరికా పారిపోవాల్సి వచ్చింది. అందుకే "అధికారానికి గుడ్డిగా విధేయత చూపడం సత్యానికి అతిపెద్ద శత్రువు" అని చెప్పాడు. సోషల్ మీడియా కాలంలో, ఫేక్ న్యూస్ యుగంలో ఇది మరింత ముఖ్యమైనది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, అధికారంలో ఉన్నవారి చుట్టూ మేధావులు కూడా చేరి భజనలు చేయడం మీరు గమనించే ఉంటారు. అలా చేయడం ‘మంద మనస్తత్వం’, ‘సామూహిక పిచ్చితనం’ అంటాడు ఐన్ స్టీన్. అందుకే అధికారాన్ని గుడ్డిగా విధేయత చూపకండి. విమర్శనాత్మక దృష్టితో చూడండి. సైన్స్, సత్యం, విద్య అందరికీ... కొందరికి మాత్రమే కాదు 1930లలో వలస వెళ్లి 1940లో పౌరసత్వం పొందిన తర్వాత కూడా ఐన్స్టీన్ తరచుగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవాడు. అందుకే FBI 1932లో ఐన్స్టీన్పై ఒక ఫైల్ను ప్రారంభించింది. అయినా ఆయన అదరలేదు, బెదరలేదు. అమెరికాలోని తొలి నల్లజాతి కళాశాల అయిన లింకన్ యూనివర్శిటీని సందర్శించి ఉపన్యాసాలు ఇచ్చాడు. "సత్యం కోసం శోధించే హక్కు, సత్యమని భావించే వాటిని ప్రచురించి, బోధించే హక్కు" ఉండాలని ఉద్యమించాడు. సైన్స్ ద్వారా వెలికితీసిన ఆవిష్కరణలు, ఫార్ములాలు ఏ జాతికి, దేశానికి లేదా వర్గానికి చెందినవి కావు, మానవాళి అందరికీ చెందినవని ఎలుగెత్తి చాటాడు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా మారుతున్న కాలంలో ఈ దృక్పథం మరింత అవసరం. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
విచిత్రమైన మాటలు, దుస్తులు, ప్రవర్తన.. A సినిమాలో ఉపేంద్ర గుర్తున్నాడా?
అంకిత్ ఒక ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్. చిన్న అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. చిన్నప్పటి నుంచీ పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన, భయం. ఎలాగోలా పదోతరగతి పూర్తయిందనిపించాడు. ఆ తర్వాత ఇంట్లోనే కూర్చుని గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ కస్టమర్లతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాడు. బయటకు వెళ్తే తన గురించి తప్పుగా అనుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమోనని భయపడుతుంటాడు. తనపై ఇతరులు కుట్రలు చేస్తున్నారని నమ్ముతుంటాడు. ఇటీవల.. తాను ఎదుటివారి మనసులోని మాటలను ఎంతదూరం నుంచైనా వినగలనని, తాను ఆత్మలతో మాట్లాడగలనని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడోననే భయంతో సన్నిహితుల అతన్ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. అంకిత్ డ్రెస్.. పలు రంగులతో ముక్కలు ముక్కలుగా విచిత్రంగా ఉంది. ప్రవర్తన కూడా అసాధారణంగా ఉంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేదు. మాటల్లో క్లారిటీ లేదు. చెప్పేది పూర్తి చేయకుండానే మరో అంశంలోకి వెళ్లి పోతున్నాడు. సైకోడయాగ్నసిస్ అనంతరం అతను స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు నిర్ధారణైంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులను అందరూ విచిత్ర వ్యక్తులని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా టీనేజ్లో బయటపడుతుంది. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరం.. పర్సనాలిటీ డిజార్డర్స్కు మందులు లేవు. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరమవుతుంది. దాంతోపాటు డిజార్డర్ ఉన్నవారు తమ జీవనశైలిలో, కోపింగ్ స్ట్రాటజీస్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చు. ► స్కిజోటైపల్ వ్యక్తిత్వ లక్షణాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మొదటి అడుగు. ► పరిచయస్తులతో కొద్దికొద్దిగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు చూపు కలిపేందుకు, పదిమందిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలి ► పెద్ద లక్ష్యాలను చిన్నవిగా, సాధించగలిగేవిగా విభజించుకోవాలి ► ధ్యానం, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ను దినచర్యలో భాగం చేసుకోవాలి ► ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుభవాలను పంచుకోవాలి ► క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం, తగినంత నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి ► మానసిక ఆరోగ్యం మీద శారీరక ఆరోగ్యం సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది ► ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగాన్ని వెంటనే ఆపేయాలి. అవి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. చికిత్స ప్రభావానికి అంతరాయం కలిగిస్తాయి ► ఇవన్నీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ పూర్తి అంచనా, పర్సనల్ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం సైకాలజిస్ట్ను సంప్రదించాలి ► వక్రీకరించిన ఆలోచనా విధానాలను సవరించడం, ఆందోళనను తగ్గించడం, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో CBT ప్రభావవంతంగా ఉంటుంది ► SPDకి సంబంధించిన ఇతర లక్షణాలను తగ్గించడానికి అవసరమైతే సైకియాట్రిస్ట్ సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది. భావోద్వేగాలు కనిపించవు.. PD ఉన్నవారు బాల్యంలో ఎవరితోనూ కలవకపోవడం, స్కూల్లో అండర్ పెర్పార్మెన్స్ ఉండవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇతరులు బెదిరించవచ్చు, ఆటపట్టించవచ్చు. టీనేజ్లో ఒంటరితనం, సామాజిక ఆందోళన అధికస్థాయిలో ఉంటుంది. ఈ కింది లక్షణాల్లో ఐదు, అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ► ఒంటరిగా ఉండటం, కుటుంబ సభ్యులు తప్ప సన్నిహితులు లేకపోవడం.. ► అసలు ఎమోషన్స్ లేకపోవడం లేదా పరిమిత, అనుచితమైన భావోద్వేగ ప్రతిస్పందనలుండటం.. ► పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన.. ► ప్రమాదంకాని.. లేని పరిస్థితులను, సందర్భాలను కూడా తప్పుగా అర్థం చేసుకోవడం.. ► విచిత్రమైన, అసాధారణమైన ఆలోచనలు, నమ్మకాలు లేదా ప్రవర్తన.. ► ఇతరుల విధేయత గురించి నిరంతరం సందేహాలు, అనుమానాస్పద లేదా మతిస్థిమితం లేని ఆలోచనలు.. ► టెలిపతి వంటి ప్రత్యేక శక్తులపై నమ్మకం.. ► ఎదురుగా లేని వ్యక్తులు కూడా ఉన్నట్లుగా భ్రమలు.. ► చిత్రవిచిత్రంగా దుస్తులు ధరించడం, చిందరవందరగా కనిపించడం.. ► అస్పష్టంగా, అసాధారణంగా మాట్లాడటం, విచిత్రమైన ప్రసంగశైలి.. స్కిజోఫ్రెనియా అని పొరపాటు వ్యక్తిత్వం మనల్ని ప్రత్యేకంగా నిలిపే ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనల కలయిక. మెదడు పనితీరు, జన్యుశాస్త్రం, పర్యావరణ ప్రభావాలు, చూసి నేర్చుకున్న ప్రవర్తనల వల్ల వ్యక్తిత్వంలో లోపాలు ఏర్పడవచ్చు. PD ఉన్నవారిని స్కిజోఫ్రేనియా అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ PDలో భ్రమలు లేదా భ్రాంతులతో సైకోటిక్ ఎపిసోడ్లు క్లుప్తంగా ఉంటాయి. భ్రమలు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరు. స్కిజో ఫ్రేనియా లాంటి మానసిక రుగ్మత ఉన్న బంధువు ఉంటే PD వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆత్మహత్య ఆలోచనలు, పని, పాఠశాల, సంబంధబాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు ఉంటాయి. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
పిల్లల్లో మొండితనం.. మంచికా..? చెడుకా..?
కవిత, సురేష్ తమ బిడ్డ సుమనతో కలిసి షాపింగ్కు వెళ్లారు. అక్కడ ఒక బొమ్మ సుమనకు నచ్చింది. అది కావాలని అడిగింది. ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి, వద్దన్నారు. లేదు, నాకది కావాలి అని మంకుపట్టు పట్టింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే! ‘‘నాకా బొమ్మ కావాలీ’’ అంటూ కిందపడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా కంట్రోల్ అవ్వడం లేదు. మాల్లో అందరూ వాళ్లనే చూస్తున్నారు. సిగ్గనిపించింది. చేసేదేంలేక ఆ బొమ్మ కొనిచ్చారు. ఇది చదువుతుంటే మీ అనుభవమూ గుర్తొచ్చింది కదా! పిల్లలు తమకు కావాల్సిన దానికోసం మొండిపట్టు పట్టడం, హఠం చేయడం తల్లిదండ్రులందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలియక, పిల్లలు అడిగింది ఇచ్చేసి సమస్య నుంచి బయటపడతారు. అయితే అలా చేయడం వల్ల పిల్లల్లో అలాంటి మొండితనం తగ్గకపోగా, పెరుగుతుందని, అలాంటి ప్రవర్తన పెరిగేందుకు తామే కారణమవుతున్నామని చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లల్లో మొండిపట్టు సాధారణం పిల్లల్లో మంకుతనం తమ భావోద్వేగాలను, బాధను ప్రదర్శించే ప్రక్రియ. తమ కోపం, నిరాశ, విచారం లేదా నిరాశ వంటి తీవ్రమైన భావోద్వేగాలను ‘టాంట్రమ్స్’ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఆ క్రమంలో అరుస్తారు, తంతారు, కొడతారు, వస్తువులను విసిరేస్తారు, ఊపిరి బిగపడతారు లేదా కదలకుండా కూర్చుంటారు. వయసు పెరిగే కొద్దీ, పిల్లలు భాష, భావోద్వేగాల నియంత్రణ పెంపొందించుకునే కొద్దీ ఈ ప్రవర్తన తగ్గుతుంది. సాధారణంగా ఈ మంకుతనం 15 నిమిషాలు ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ ప్రవర్తనకు తల్లిదండ్రులు ఏమాత్రం అటెన్షన్ చూపినా అది రెట్టింపవుతుంది. ‘వద్దు’ అని చెప్పింది ఇచ్చారంటే, ఆ ప్రవర్తనను ప్రోత్సహించినట్లు అవుతుంది. దాంతో భవిష్యత్తులో వాళ్లకు ఏం కావాల్సి వచ్చినా అదే మంకుతనం ప్రదర్శిస్తారు. అందువల్ల పిల్లల్లో ఈ మంకుతనం, మొండితనం తగ్గాలంటే వారికి భావోద్వేగాల గురించి అవగాహన కల్పించడం, వాటినెలా ప్రాసెస్ చేయాలో, కోపాన్నెలా నియంత్రించడం నేర్పించాలి. మొండితనానికి విరుగుడు... మూడేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు చిన్నచిన్న విషయాలకే నిరుత్సాహానికి గురవుతారు. తమ అవసరాలను ఎలా కమ్యూనికేట్ చేయాలో అప్పుడప్పుడే నేర్చుకుంటుంటారు. సొంతంగా పనిచేయాలని, అన్వేషించాలని కోరుకుంటారు. వాటిని ఎవరైనా అడ్డుకున్నప్పుడు మొండితనం ప్రదర్శిస్తారు. అందువల్ల ఏ విషయం వారిలో మొండితనాన్ని ప్రేరేపిస్తుందో తల్లిదండ్రులు గుర్తించాలి. బిడ్డలు తమ భావోద్వేగాలను మాటల్లో ఎలా వ్యక్తీకరించాలో ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి టాంట్రమ్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందువల్ల మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి భావాలను వివరించే పదాలను ఉపయోగించండి. దానివల్ల తమ అవసరాలు, కోరికలు, ఆందోళనల గురించి మీకు మాటల్లో చెప్పే వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు సినిమా చూస్తున్నప్పుడు, పాత్రలు భావోద్వేగాలను వ్యక్తం చేసినప్పుడు వాటి గురించి చెప్పండి. బొమ్మల పుస్తకాల్లో సంతోషంగా, దుఃఖంగా, కోపంతో, ఆకలితో లేదా అలసిపోయిన వంటి భావాలను వారికి చూపించండి. మీ భావోద్వేగాలను చెప్పడం ద్వారా వారు దాన్ని అనుకరిస్తారు. తమకు కావాలనుకున్నది దొరకని సందర్భాల్లో కూడా పిల్లలు సానుకూల ప్రతిచర్యలు చూపినప్పుడు, తగిన ప్రవర్తనలో నిమగ్నమైనప్పుడు వారిని మెచ్చుకోండి, బహుమతి ఇవ్వండి. ఉదాహరణకు, మీ బిడ్డ కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేయకుండా శాంతంగా ప్రవర్తించినప్పుడు ‘‘నువ్విలా కూల్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అని మెచ్చుకోండి. పిల్లలు మొండితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కష్టమే. కానీ ఆ సమయంలో మీరే కోపంతో అరిస్తే లేదా కొడితే.. అలాంటి సందర్భాల్లో అదే సరైన ప్రవర్తనని పిల్లలు భావిస్తారు, దాన్నే అనుకరిస్తారు. అందువల్ల పిల్లలు మంకుతనం చూపినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. దాన్ని చూసి వాళ్లూ నేర్చుకుంటారు. దారి మళ్లింపు అనేది మరో ప్రభావవంతమైన వ్యూహం. ముందుగా, పిల్లల మంకుపట్టుకు కారణమయ్యే ట్రిగ్గర్ను గుర్తించండి. బహుశా వారు దుకాణంలో ఒక బొమ్మను చూసి కావాలంటున్నారు. దాన్నుంచి వారి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ‘మీ దగ్గర బొమ్మ లేదు కాబట్టి ఏడవడం సరికాదు. అక్కడ చాలా ఆటలున్నాయి. కలిసి ఆడుకుందాం రా!’ పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వడం వారికి సాధికారతను అందిస్తుంది, మొండిపట్టును నివారిస్తుంది. ఉదాహరణకు, ప్లేగ్రౌండ్లో ఇంకా ఉండాలని మొండిపట్టు పట్టినప్పడు ‘సరే, ఇంకో ఐదు నిమిషాలు ఆడుకుంటావా లేక ఇంటికి వెళ్లి ఐస్క్రీమ్ తిందామా?’ అని నిర్ణయం వారికే వదిలివేయవచ్చు. టాంట్రమ్స్ నియంత్రణకు మీరు ఎంచుకున్న పద్ధతులను నిలకడగా ఉపయోగించడం ద్వారా మీ పిల్లల్లో మొండితనాన్ని కొద్ది కాలంలోనే నియంత్రించవచ్చు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
వర్చువల్ రియాల్టీలో దాడి.. తప్పని బాధ!
కాలం మారింది. టెక్నాలజీ మారుతోంది. దాంతో నేరాల తీరు కూడా మారుతోంది. ఈరోజు మనం ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని ఒక నేరం గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ లో 16 సంవత్సరాల వయసున్న ఒక బాలిక అవతార్ పై మెటావర్స్ లో గ్యాంగ్ రేప్ చేశారు. అంటే ఆమెపై భౌతికంగా ఎలాంటి దాడీ జరగలేదు, వర్చువల్ రియాలిటీలో జరిగింది. కానీ ఆమె నిజ జీవితంలో అత్యాచార బాధితులు అనుభవించే మానసిక, భావోద్వేగ వేదననే అనుభవిస్తోంది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్చువల్ రియాలిటీ గురించి, దాని లాభనష్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? వర్చువల్ రియాలిటీ (VR) అంటే... నిజజీవితంలో లభించే అనుభవాన్ని కంప్యూటర్ వాతావరణంలో అందించే సాంకేతికత. ఫేస్బుక్ సంస్థ మెటా ఇప్పుడు మెటావర్స్ పేరుతో అలాంటి టెక్నాలజీని అందరికీ అందించే ప్రయత్నంలో ఉంది. దీనివల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. అందువల్ల దీన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ముఖ్యం. నిజంగా దాడి జరగకపోయినా మానసిక క్షోభ ఎందుకు? అది సరే.. ఆ అమ్మాయిపై ఎలాంటి దాడి జరగకపోయినా మానసిక వేదన కలగడానికి కారణమేమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా. మీరో చిన్న పనిచేయండి. కళ్లు మూసుకుని, చేతిలో నిమ్మకాయ ఉన్నట్లు ఊహించండి. దాని వాసన చూస్తున్నట్లుగా, టేస్ట్ చేస్తున్నట్లుగా ఊహించండి. మీ నోటిలో లాలాజలం ఊరిందా? మీరు నిమ్మకాయ తినకుండానే లాలాజలం ఎలా ఊరింది? వర్చువల్ రియాలిటీ అనుభవం కూడా అలాంటిదే. ► నిజానుభవం లాంటి అనుభవాన్ని కంప్యూటర్ ప్రపంచంలో అందించడమే వర్చువల్ రియాలిటీ లక్ష్యం. వినియోగదారులు తాము నిజమైన వాతావరణంలో ఉన్నట్లు భావించేలా చేయడం. అందువల్ల మెదడు వర్చువల్ అనుభవాలను వాస్తవంగా భావిస్తుంది. ► భౌతిక ప్రపంచంలో లేదా వర్చువల్ రియాలిటీలో మనం సంఘటనలను అనుభవించినప్పుడు, మన మెదడు వివిధ నాడీ మార్గాల ద్వారా సమాచారాన్ని ఒకేలా ప్రాసెస్ చేస్తుంది. అందువల్ల నిజమైన లేదా వర్చువల్ అనుభవాలకు సమానంగా ప్రతిస్పందిస్తుంది. ► ఒక సంఘటన వల్ల జరిగే నష్టాన్నికేవలం శారీరక హాని ద్వారా మాత్రమే నిర్ణయించరు. దానికి మించిన ఎమోషనల్ పెయిన్ ఉండవచ్చు, ముఖ్యంగా అత్యాచారం లాంటి దుర్ఘటనల్లో. వర్చువల్ రియాలిటీలో జరిగిన అత్యాచారాన్ని వాస్తవమైనట్లుగా మెదడు ప్రాసెస్ చేసిందా కాబట్టే ఆ అమ్మాయి నిజమైన మానసిక క్షోభకు గురయ్యింది. అత్యాచారం జరగకపోయినా, ఎమోషనల్ పెయిన్ మాత్రం నిజం. ► అలాగని అందరూ అలాగే స్పందించాలని లేదు. వ్యక్తిత్వం, గత అనుభవాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు వ్యక్తి వర్చువల్ పరిస్థితులను ఎలా గ్రహించి ప్రతిస్పందిస్తారో ప్రభావితం చేయవచ్చు. కాపాడుకోవడం ఎలా? ► మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఇకపై నిజ జీవితంలోనే కాదు వర్చువల్ రియాలిటీలో కూడా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ► హానికరమైన సాఫ్ట్వేర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అధికారిక స్టోర్లు నుండి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేయండి. ► సాఫ్ట్వేర్ హార్డ్వేర్ను, అప్డేట్ చేస్తూ ఉండండం వల్ల బగ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ► వర్చువల్ రియాలిటీలో మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి. మీ అసలు పేరు, చిరునామా లేదా ఆర్థిక సమాచారం వంటి సున్నితమైన డేటాను షేర్ చేసుకోవద్దు. ► మీ VR ఖాతాల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించండి. ► వాస్తవ ప్రపంచంలో లానే VRలో కూడా అపరిచితులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ► వర్చువల్ ప్రపంచంలో ఎదురైన వ్యక్తులను నిజ జీవితంలో కలవకుండా ఉండండి. ► మీ పిల్లలు VRని ఉపయోగిస్తుంటే, వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించండి. వయస్సుకి తగిన కంటెంట్ పరిమితులను సెట్ చేయండి. ► VR ప్లాట్ఫారమ్ అందించిన పేరంటల్ కంట్రోల్స్ ను ఉపయోగించండి. ► VR ప్లాట్ఫారమ్లో ఏదైనా అనుమానాస్పదంగా, అనుచితంగా కనిపిస్తే వెంటనే బ్లాక్ చేయండి, ప్లాట్ ఫారమ్ కు రిపోర్ట్ చేయండి. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
అవధుల్లేని ఆనందం
డబ్బుల సంగతేమో కానీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 114 మిలియన్ల యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. అంటే 11 కోట్లకు పైగానే. ఈ విశ్వంలోని సుమారు 800 కోట్ల జనాభాలో సగటున ప్రతి 72 మందికి ఒక చానల్ అన్నమాట. ఇటీవల విడుదలైన రజినీకాంత్ సినిమా ‘జైలర్’లో రజినీ ఐదేళ్ల మనవడు రుత్విక్ కూడా ఓ చానల్ నడుపుతుంటాడు. వీడియో చిత్రీకరణకు తాత రజినీ సాయం తీసుకుంటుంటాడు. ‘ఏదో ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసెయ్..’ అని తాత సలహా ఇస్తే.. ‘బాగోలేని వీడియోలకు సంబంధించి కామెంట్స్లో జనం ఎలా గడ్డి పెడతారో చూడు’ అని సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు తమ గురించి, తమకు తెలిసింది ప్రజలకు తెలియజేసి, వారి మెప్పు పొందాలని ఉబలాట పడుతుండటం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలా నిర్ణయించుకున్న మరుక్షణమే యూ ట్యూబ్ చానల్ పెట్టేస్తున్నారు. ఇలా ఆవిర్భవించిన చానళ్ల ద్వారా వంటింట్లో వంటలు మొదలు రాకెట్ తయారీ వరకు ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇట్టే సమాధానం దొరుకుతోంది. ఏ చానల్కు సంబంధించిన వీడియోను ఎంత ఎక్కువ మంది చూస్తారో ఆ చానల్ పెట్టిన వాళ్లకు అంతగా డబ్బులొస్తాయి. ఇదంతా ఎవరు ఏ అంశానికి అత్యంత ప్రభావితమవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో మన ఇండియన్స్, ప్రత్యేకించి పలువురు తెలుగు యూ ట్యూబర్స్ కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చానళ్లు, వీడియోలు వీక్షిస్తున్న వారి అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఆశ్చర్యంగొలుపుతున్నాయి. – వీఏవీ రంగాచార్యులు, ఏపీ సెంట్రల్ డెస్క్ కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి.. కొందరేమో లక్షలు, కోట్లకు పడగలెత్తుతుంటే మరికొందరు మాత్రం నెలలు, ఏళ్ల తరబడి కష్టపడుతున్నా, కనీసం మానిటైజేషన్కు నోచుకోవడం లేదు. ఎలాగోలా మానిటైజేషన్ అయినా వారు అప్లోడ్ చేసే వీడియోలు వైరల్ కావడం లేదంటూ వాపోతుంటారు. ఇందుకు వారు యూ ట్యూబ్ ఆల్గారిథమ్ ఫాలో కాకపోవడమే. ఏ తరహా కంటెంట్ను జనం కోరుకుంటున్నారనేది గమనించి.. వీడియోలు రూపొందించుకోవాలి. ఒక్కోసారి సీరియస్ అంశాలు సైతం వైరల్ అవుతుంటాయి. అయితే అది ప్రజల అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు స్పోకెన్ ఇంగ్లిష్కు సంబంధించి మన తెలుగు కుర్రాడు స్టార్ట్ చేసిన ‘వశిష్ట 360’ చానల్ విశేష ఆదరణ పొందింది. ఆ వీడియోల ఆధారంగా ప్రచురించిన పుస్తకాల ద్వారా అతను కోట్లాది రూపాయలు ఆర్జించాడు. వరల్డ్ నంబర్ వన్ మిస్టర్ బీస్ట్ అనే యువకుడు (అసలు పేరు జిమ్మి డొనాల్డ్సన్) తన 13వ ఏట చానల్ స్టార్ట్ చేశాడు. మొదట్లో ‘ఐ పుట్ 100 మిలియన్ ఆర్బీజ్ ఇన్ మై ఫ్రెండ్స్ బ్యాక్ యార్డ్’ అనే వీడియోకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రతి వీడియోకు సగటున 150 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సముద్రంలో ఒంటరిగా ఏడు రోజులు గడపడం, షోల రీ క్రియేషన్, ఒక డాలర్ నుంచి ఒక మిలియన్ డాలర్స్ వరకు హోటల్ గదులు.. ఇలా ప్రతి వీడియో కొత్తదనంతో, విచిత్రంగా ఉండటం విశేషం. ఉదాహరణకు.. పేద్ద మాల్లోకి వెళ్లి.. 15 నిమిషాల్లో ఎవరేం కావాలన్నా కొనుక్కుని బిల్లింగ్ కోసం లైన్లో నిలుచుంటే ఆ బిల్లు తానే చెల్లిస్తానని చెప్పడం.. నిజంగానే చెల్లించడం. ఇతడి ప్రతి వీడియో రియాలిటీతో స్ట్రెయిట్గా సబ్జెక్ట్లోకి వెళ్తుంది. ఎక్కడా సుత్తి ఉండదు. ఒక్కో వీడియో షూటింగ్కు వారం పది రోజులు కష్టపడినా, తుదకు ఆ వీడియో నిడివి కేవలం 15–20 నిమిషాలే ఉంటుంది. ఇతను తన వీడియోల ద్వారా వచ్చే మొత్తంలో చాలా వరకు పేద ప్రజల కోసమే వెచ్చిస్తాడు. పాతికేళ్ల ఈ యువకుడు గత ఏడాది యూ ట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఏకంగా 82 మిలియన్ డాలర్లు సంపాదించారు. మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.700 కోట్లు పైమాటే. అంటే రోజుకు దాదాపు రూ.2 కోట్లు. ఫోర్బ్స్ 2023 టాప్ క్రియేటర్స్ ఇన్ వరల్డ్ లిస్ట్లో అగ్రస్థానంలో నిలిచాడు. అభిరుచుల్లో మార్పు ♦ ప్రపంచాన్ని అన్వేషించడం అనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కోసం చాలా మంది సామాజిక మాధ్యమాలను ఫాలోఅవుతున్నారు. ♦ ఈ విషయంలో ఇప్పటిదాకా యూ ట్యూబ్ అతిపెద్ద ఫ్లాట్ఫాం. ఈ స్థానాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆక్రమించేస్తోంది. యువతరం అంతా ఇన్స్టాలోనే మునిగి తేలుతోంది. ♦ 40–50 శాతం యువత స్క్రీన్ టైమ్ సగటున రోజూ 4 నుంచి 10 గంటలు ఉంటోంది. ఇంత సమయం స్క్రీన్ కోసం కేటాయించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది న్యూరో, కంటి, మానసిక సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ♦ యువ దంపతుల దాంపత్య జీవితంలోనూ ఇది చిచ్చు రేపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నెగెటివ్ అంశాల పట్ల మనసు మళ్లడం సహజమే అయినా అస్తమానం అదే అలవాటుగా మారి అనుకరించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ♦ ఇలా విద్యార్థుల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పాఠ్యాంశాల పట్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతోంది. ♦ఈ సమస్యలన్నింటికీ స్వీయ నియంత్రణే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అది డోపమైన్ ఎఫెక్ట్ జనరేషన్, జనరేషన్కు ప్రజల అభిప్రాయాలు, అభిరుచులు మారుతుంటాయి. ఇందుకు సహజంగా 15 ఏళ్లు పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో టెక్నాలజీలో మార్పుల∙ప్రభావం వల్ల రెండేళ్లలోనే అభిరుచులు మారిపోతున్నాయి. ఇదివరకు బాగా కష్టపడే వాళ్లు మాత్రమే డబ్బు సంపాదించే వారు. మనం ఇన్నాళ్లు చెత్తా, చెదారం అనుకున్న కంటెంట్తో కూడా రూ.లక్షలు, కోట్లు సంపాదించేస్తున్నారు. యాలకలు, లవంగాలు అంటూ చేస్తున్న వీడియోలకు కూడా లక్షల్లో లైక్లు వస్తున్నాయి. ఇదంతా ‘హ్యాపీనెస్’ అనే సూత్రం. ఉదాహరణకు ఒక రోజంతా కష్టపడి ఒక పుస్తకం చదివితే ఎంత ఆనందం వస్తుందో.. ఒక నిమిషం పాటి రీల్/షాట్ చూస్తే అంతే ఆనందం వస్తుంది. కొన్ని పిచ్చి పనులను చూసినప్పుడు కూడా కొందరి మనసు అలానే స్పందించి డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటర్ హార్మోన్ రిలీజ్ అవుతోంది. ఈ తరహా డోపమైన్కు జనం అలవాటు పడిపోయారు. – విశేష్ , సైకాలజిస్ట్ -
యాలకులు, బిర్యానీ ఆకులతో కోరుకున్నది నెరవేరుతుందా? బ్యాగుల్లో.. జేబుల్లో పెట్టుకుంటే..
సుమ రెండేళ్ల కిందట బ్యూటీ పార్లర్ మొదలు పెట్టింది. కానీ తాను ఊహించినంత గొప్పగా సాగడంలేదు. దాంతో ఫ్రస్ట్రేషన్కి లోనయ్యింది. అదే సమయంలో పర్స్లో ప్రతి శుక్రవారం ఆరు యాలకులు పెట్టుకుంటే కోరుకున్నది జరుగుతుందని యూట్యూబ్లో ఒక వీడియో చూసింది. రెండు మూడు నెలల పాటు దాన్ని ఫాలో అయ్యింది. కానీ తన బిజినెస్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఆ సమయంలోనే యూట్యూబ్లో మరో వీడియో కనిపించింది.. మీకేం కావాలనుకున్నారో అది బిర్యానీ ఆకుపై రాసి, కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను ఆకాశంలోకి ఊదుతూ మీకేం కావాలో కోరుకుంటే అది జరుగుతుంది అని! చాలా ఆశగా ఆ పని చేసింది. ఒకసారి కాదు, పలుసార్లు. ఫలితం శూన్యం. పది వేల రూపాయలు ఖర్చుపెట్టి ఒక వర్క్షాప్కి హాజరయ్యింది. విజన్ బోర్డ్ తయారు చేసుకుంది. తనకేం కావాలో అఫర్మేషన్స్ రూపంలో రోజూ క్రమం తప్పకుండా రాసింది. కానీ తన బ్యూటీ పార్లర్ బిజినెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలానే ఉంది. ఏం చేయాలో అర్థం కాక తీవ్రమైన ఒత్తిడికి లోనయింది. ఆ ఒత్తిడిని భర్తపై, పిల్లలపై చూపించింది. వీటన్నింటినీ గమనించిన భర్త.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని కౌన్సెలింగ్కి తీసుకువచ్చాడు. అశాస్త్రీయం.. అభూత కల్పనలు.. సుమలానే చాలామంది సక్సెస్ కోసం, సంతోషం కోసం, కోరుకున్నది జరగడం కోసం షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. అలాంటివారికి సులువైన చిట్కాలిస్తూ యూట్యూబ్లో వందలు, వేల వీడియోలు కనిపిస్తాయి. ఆ మార్గాలు సులువుగా ఉండటం వల్ల వాటిని పాటిస్తూ, ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీటన్నింటికీ మూలం ‘లా ఆఫ్ అట్రాక్షన్’ అనే సిద్ధాంతం. ‘ప్రతికూల ఆలోచనల వల్ల ప్రతికూల ఫలితాలే వస్తాయి. సానుకూల ఆలోచనల వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తుంటే అవి నెరవేరేలా విశ్వం మీకు సహాయపడుతుంది. విశ్వంలోని శక్తులన్నింటినీ మీవైపు ఆకర్షించి మీ ఆలోచనలు సాకారమయ్యేలా చేస్తుంది’ అనేదే లా ఆఫ్ అట్రాక్షన్. ఆలోచనలకు విశ్వం ప్రతిస్పందిస్తుందని దీన్ని నమ్మేవారు చెప్తారు. ఎనర్జీ, ఎలక్ట్రాన్స్, ఫ్రీక్వెన్సీ, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి సైన్స్కి సంబంధించిన పదాలను వాడుతుంటారు. కానీ నిజానికి సైన్స్కి ‘లా ఆఫ్ అట్రాక్షన్’కి ఎలాంటి సంబంధమూ లేదు. ఇది అశాస్త్రీయమైన అభూత కల్పనలతో నిండిన ఒక మెటాఫిజికల్ సూడోసైన్స్ మాత్రమే. మీకు ఎప్పుడేది ఇవ్వాలో విశ్వానికి తెలుసునని, దాన్ని నమ్ముకుని లక్ష్యాన్ని సాధించినట్లు విశ్వసిస్తే చాలని ప్రబోధిస్తారు. కన్ఫర్మేషన్ బయాస్ వల్ల చాలామంది ఈ మాటలను, సిద్ధాంతాన్ని నమ్ముతారు. అఫర్మేషన్స్ రాసుకుంటూ, జపిస్తూ సుమలానే కాలాన్ని వృథా చేస్తుంటారు. తాము కోరుకున్నది ఎప్పటికీ జరక్క ఫ్రస్ట్రేషన్కి, ఒత్తిడికి లోనవుతారు. యూనివర్సిటీల అధ్యయనం లా ఆఫ్ అట్రాక్షన్, విజన్ బోర్డ్ల ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక ప్రయోగం జరిగింది. అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించారు. టాప్ గ్రేడ్స్ సాధిస్తే ఎలా ఉంటుందో మొదటి గ్రూప్ని ఊహించమన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదువుకోవాలో ఊహించమని రెండో గ్రూప్కి చెప్పారు. మూడో గ్రూప్కి ఎలాంటి సలహాలూ ఇవ్వలేదు. మొదటి గ్రూప్ విద్యార్థులు ఎక్కువ విజువలైజ్ చేసి, తక్కువ చదివి, తక్కువ గ్రేడ్లు సాధించారు. చదువుతున్నట్లు ఊహించుకుని చదివిన రెండో గ్రూప్ విద్యార్థులు తక్కువ వత్తిడితో ఎక్కువ మార్కులు సాధించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో జరిగిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వెలువడ్డాయి. పని చేయాల్సిందే.. ►గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదని కోరుకున్నట్లుగా.. లవంగాలు, యాలకులను బ్యాగుల్లో.. జేబుల్లో పెట్టుకోవడం వల్ల, బిర్యానీ ఆకులను కాల్చి గాలిలో ఊదడం లాంటి చిట్కాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించాలి. ►అఫర్మేషన్స్, విజన్ బోర్డ్ లాంటివి లక్ష్యం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడటానికి ఉపయోగపడతాయి. వాటి ప్రయోజనం అంతవరకేనని గుర్తించాలి. ►విశ్వం ఒక వ్యక్తి కాదని, అది మన ఆలోచనలు, మాటలు వినదని అర్థం చేసుకోవాలి. ►‘‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’’ అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పారు. అంటే కలలు కనడంతోనే సంతృప్తిపడితే సరిపోదు. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుని తదనుగుణంగా శ్రమించాలి. ►లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుని, అంచెలంచెలుగా దాన్ని పూర్తి చేసుకుంటూ కలలను సాకారం చేసుకోవాలి. -సైకాలజిస్ట్ విశేష్ -
తనిష్క తనను ప్రేమిస్తోందనే భ్రమలో సుశాంత్ అలా.. తన కోసమే పెళ్లి చేసుకోలేదని..
సుశాంత్కు 35 ఏళ్లు, పదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. ఒక ఎమ్మెన్సీలో పదేళ్లుగా పని చేస్తున్నాడు. మంచి భర్త, తండ్రి, ఉద్యోగి, తెలివైనవాడు, అందరితో కలివిడిగా ఉంటాడు. సాధారణంగా మర్యాదస్తుడయి నప్పటికీ తరచుగా చికాకుగా కనిపిస్తాడు. కౌన్సెలింగ్ రావడం తనకు ఇష్టంలేదనీ, భార్య ఒత్తిడితో వచ్చాననీ చెప్పాడు. periences.. తాను లాప్టాప్పై ఎక్కువ సమయం గడుపుతున్నాననీ, పిలిస్తే చిరాకు పడుతున్నానని తన భార్య రోజూ నస పెడుతోందనీ చెప్పాడు. తనకు భార్యా పిల్లలంటే చాలా ఇష్టమన్నాడు. ‘లాప్టాప్లో అంత టైమ్ ఏం చేస్తారు?’ అని అడిగినప్పుడు చెప్పడానికి సంశయించాడు. ‘సమస్య ఏదైనా సరే.. మీరు చెప్తేనే సహాయం చేయగలను’ అని నచ్చజెప్పాక నోరు విప్పాడు. నటి తనిష్క తనను ప్రేమిస్తోందనీ ప్రముఖ నటి తనిష్క తనను ప్రేమిస్తోందనీ, తనకోసమే ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకుండా ఉందనీ చెప్పాడు. ఆమె గురించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికే లాప్టాప్పై ఎక్కువ సమయం గడుపుతానన్నాడు. తమ ప్రేమ గురించి భార్యకు చెప్పినా అర్థం చేసుకోలేదు కాబట్టి రహస్యంగా ఉంచానని అన్నాడు. త్వరలోనే తాను, తనిష్క పెళ్లి చేసుకుంటామన్నాడు. అయితే తాను ఎక్కువ సేపు తనిష్క గురించే సెర్చ్ చేస్తూ ఉండటం వల్ల ఆఫీసు పని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నానని చెప్పాడు. అదే తనకు ఆందోళన కలిగిస్తుందన్నాడు. కోడ్ లాంగ్వేజ్లో ‘తనిష్క మీకెలా పరిచయం? ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకెలా తెలుసు? ఆమె మీతో చెప్పిందా?’ అని అడిగినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడించాడు. మొదట్లో తాను తనిష్కకు చాలా లెటర్స్ రాశాననీ, ఆ తర్వాత ఆమె నంబర్ సంపాదించి మెసేజెస్ పెట్టానని చెప్పాడు. ఒకసారి ఆమె నుంచి రిప్లయ్ మెసేజ్ కూడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఆమె తన ఇంటర్వ్యూల్లోనూ, సినిమాల్లోనూ కోడ్ లాంగ్వేజ్లో తనకు సందేశాలు పంపిస్తుందన్నాడు. ∙∙ పచ్చి అబద్ధాలని తెలిసినా సుశాంత్ చెప్పిన కథల్లాంటివి మనకు అప్పుడప్పుడూ పత్రికల్లో కనిపించేవి. సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్ల హవా మొదలయ్యాక ఇలాంటి కథలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ప్రముఖ నటి తనను పెళ్లి చేసుకుందంటూ యూట్యూబ్ చానళ్లలో హల్చల్ చేయడం మీరూ చూసే ఉంటారు. అతను చెప్తున్నవి పచ్చి అబద్ధాలని తెలిసినా యూట్యూబ్ చానళ్లు పదే పదే అతన్ని ఇంటర్వ్యూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. నిజానికి అది ‘ఎరటోమానియా’ అనే అరుదుగా కనిపించే డెల్యూషనల్ డిజార్డర్. అయితే మామూలు భ్రమలకు, ఎరటోమేనియాలోని భ్రమలకు తేడా ఉంటుంది. మా పెరట్లోని చెట్లు ప్రతిరోజూ నాతో మాట్లాడతాయని నమ్మడం ఒక డెల్యూషన్. అది జరిగే అవకాశమే లేదు. కానీ ఒక సెలబ్రిటీ మామూలు వ్యక్తిని ప్రేమించే అవకాశం 0.0001 శాతమైనా ఉంటుంది. ఆ వ్యక్తి తానేనని ఎరటోమేనియా ఉన్న వ్యక్తి నమ్ముతాడు. ఇలాంటి భ్రమలు ఏర్పడటంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. గేలి చేయకుండా.. చికిత్స అందించాలి ►సుశాంత్ లాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు సాధారణంగా వారి మాటలు విని నవ్వుకుంటారు, గేలి చేస్తారు. కానీ అది ఒక మానసిక రుగ్మత అని గుర్తించి వెంటనే చికిత్స అందించాలి. ►ఇలాంటి రుగ్మతలున్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు కాబట్టి కుటుంబ సభ్యుల సహాయం అవసరం ►వారి భ్రమలను సవాలు చేయడం కంటే, వాటిని తొలగించి వాస్తవం అర్థమయ్యేలా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి ►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వారి ఆలోచనను, ప్రవర్తనను దారి మళ్లించడానికి ఉపయోగపడు తుంది ►వీలైనంత స్వతంత్రంగా జీవించడంలో వారికి సహాయపడటం కీలకం. ►సమస్య తీవ్రతను బట్టి సైకియాట్రిస్టును సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. లక్షణాలు.. ►ఎరోటోమానియా ప్రధాన లక్షణం ఒక సెలబ్రిటీ తనను ప్రేమిస్తున్నారని లేదా పెళ్లి చేసుకున్నారనే భ్రమను నమ్మడం. ►ఆ సెలబ్రిటీ ఏం చేసినా అది తనకు పంపే రహస్య సందేశమనే భ్రమలోనే జీవించడం. ►ఆ సెలబ్రిటీ పట్ల విపరీతమైన అబ్సెషన్. సోషల్ మీడియాలో వారిని నిరంతరం ఫాలో అవ్వడం. ►వారి పరిచయం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడకపోవడం. కారణాలు... ►జీవితంలో తిరస్కరణ, స్థానభ్రంశం, స్వలింగ సంపర్క ప్రేరణలను నివారించడానికి ఎరోటోమేనియా ఒక రక్షణ విధానంగా ఉంటుందని ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించాడు. ►తీవ్రమైన ఒంటరితనం లేదా పెద్ద నష్టం తర్వాత ఏర్పడే లోటును భర్తీ చేసుకోవడానికి దీన్ని ఒక మార్గంగా తీసుకోవచ్చు. ►బైపోలార్ డిజార్డర్ లేదా స్కిజోఫ్రేనియా ఉన్నవారిలో రావచ్చు. ►మాదక ద్రవ్యాలు లేదా యాంటీ డిప్రెసెంట్స్ వాడకం వల్ల కూడా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. ►మెదడులో అసాధారణతలు లేదా వారసత్వం కూడా కారణం కావచ్చు. -సైకాలజిస్ట్ విశేష్ -
పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. స్నేహితుల బలవంతంతో అతడు..
జానకి, రమేష్లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. జాతకాలు సహా చివరకు అన్నీ కుదిరిన అమెరికా సంబంధం దొరికింది. అక్కడున్న స్నేహితులతో అతని గురించి ఎంక్వయిరీ చేయించారు. అన్నీ బాగున్నాయని తెలుసుకున్నాక సంబంధం ఫిక్స్ చేశారు. వరుడి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి ఆర్భాటంగా చేశారు. వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ సమర్పించారు. పెళ్లయిన 15 రోజులకే కూతుర్ని ఆనందంగా అమెరికా పంపించారు. ∙∙ అమెరికా వెళ్లిన కొత్తల్లో సునీత కాపురం పిక్నిక్స్, పార్టీలు, సైట్ సీయింగ్లతో సంతోషంగా సాగింది. మూడునెలల తర్వాత ఫ్రెండ్స్తో పార్టీ అని వెళ్లిన సునీల్ తాగి వచ్చాడు. అదేమిటని అడిగితే ‘ఫ్రెండ్స్ బలవంతం చేశార’ని చెప్పాడు. ఆ తర్వాత వారం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ తాగడంతో పాటు మాంసాహారం కూడా తిన్నాడు. అది చూసి సునీత షాకయ్యింది. అదేమిటని నిలదీస్తే ‘‘పెళ్లికి ముందు సవాలక్ష చెప్తాం, అలాగని అన్నిటికీ మడి కట్టుకుని కూర్చుంటామా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్లాగే ఉండాలి’’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. వీటన్నింటికీ మించి మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం, ఎడాపెడా అబద్ధాలు చెప్పడం, అడిగితే చేయి చేసుకోవడం సునీతను కలచివేసింది. ‘‘నువ్వో పల్లెటూరి బైతువి, నిన్ను చేసుకోవడం నా ఖర్మ’’ అంటూ రోజూ తిట్టేవాడు. ఇవన్నీ భరించలేక సునీత డిప్రెషన్కి లోనయ్యింది. సునీల్ ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వాళ్లమ్మ వాళ్లింట్లో దింపేసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పుడుగాని జానకి, రమేష్లకు అసలు విషయం తెలియలేదు. వాళ్లు ఫోన్లో అడిగితే... ‘‘సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నదాన్ని నాకు కట్టబెట్టి అన్యాయం చేశారు. మీ అమ్మాయి నాకు అక్కర్లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా’’ అని చెప్పి, నెల తిరిగేసరికి విడాకుల నోటీస్ కూడా పంపాడు. దాంతో సునీత మరింత డిప్రెషన్కి లోనయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెను కౌన్సెలింగ్కి తీసుకొచ్చారు. ∙∙ వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరు శారీరక, మానసిక, లైంగిక అవసరాలు ఉంటాయి. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమైనా భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవేవీ గుర్తించకుండా జానకి, రమేష్లు చేసిన తప్పే చేస్తుంటారు. పెళ్లికి కులం, గోత్రం, జాతకాలు కలిస్తే చాలనుకుంటారు. మంచి జాబ్ ఉంటే భేషనుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వారిద్దరి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. ప్రయత్నించినా సునీల్ లాంటి వారు నెగెటివ్ పాయింట్స్ దాచి పాజిటివ్స్ను మాత్రమే ముందుంచుతారు. ఈ సమస్యకు పరిష్కారమే ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్. ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్లో ఏం జరుగుతుంది? ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్ అనేది జంటలను మానసికంగా వివాహానికి సిద్ధం చేయడానికి సహాయపడే చికిత్స. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలరని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకరికొకరు వారి వైవాహిక సంబంధాన్ని గురించి వారి దృక్కోణాలను అంచనా వేయడానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి విడివిడిగా ప్రశ్నలు అడుగుతారు. ఫైనాన్స్, కమ్యూనికేషన్, నమ్మకాలు, విలువలు, ఆప్యాయత, సెక్స్, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు, డెసిషన్ మేకింగ్, యాంగర్ మేనేజ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, లైఫ్ స్టైల్, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంలాంటి వివిధ అంశాల గురించి చర్చిస్తారు. ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్ వల్ల ఉపయోగాలు ►వివాహ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కాబోయే వధూవరులను సిద్ధం చేస్తుంది ►తమను తాము మార్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి, భాగస్వాములతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది ►వధువు లేదా వరుడు మానసికంగా వివాహానికి సిద్ధమైనట్టయితే.. తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సరైన దారి చూపుతుంది ►వ్యక్తిగత యోగ్యతలను అంచనావేయడానికి బదులుగా భాగస్వాముల మధ్య అనుకూలతను అంచనా వేసుకోగలరు ►జంట మధ్య సానుకూల దృక్పథం ఏర్పడుతుంది ►భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి, వివాహానికి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడానికి సహాయపడుతుంది ►సంఘర్షణ–పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని! -
PTSD: సొంత తాతే తన పట్ల, తన చెల్లి పట్ల నీచంగా.. అందుకే ఆమె ఇలా..
రియాకు 15 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా తనను తాను గాయపరచు కుంటోంది. ఎందుకలా చేస్తుందో పేరెంట్స్ అడిగినా, ఫ్రెండ్స్తో అడిగించినా ఏమీ చెప్పలేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఫ్రెండ్స్ సలహాపై పేరెంట్స్ ఆ అమ్మాయిని కౌన్సెలింగ్కి తీసుకొచ్చారు. ఆమెతో మాట్లాడినప్పుడు కూడా కారణమేంటో చెప్పలేదు. రెండు మూడు సెషన్లతో ఆమె నమ్మకం సంపాదించుకున్న తర్వాత తన మనసులోని బాధను బయటపెట్టింది. తన 8 నుంచి 12 ఏళ్ల వరకు సొంత తాతే తనను లైంగికంగా వేధించాడని బోరుమని ఏడ్చింది. ఆ విషయం ఎవరికైనాచెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఎవ్వరికీ చెప్పలేదంది. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని తన చెల్లీ చెప్పిందని, ఆయన ఏడాది కిందట చనిపోయాడని తెలిపింది. తాత తనతో, చెల్లితో ప్రవర్తించిన విధానం అమ్మానాన్నలకు చెప్తే నమ్మకపోగా... ఇద్దరినీ కలిపి తిట్టారనీ చెప్పింది. తాను ముందే చెప్పి ఉంటే చెల్లెలైనా సేఫ్గా ఉండేదని, చెల్లెలికి అలా జరగడానికి తానే కారణమని బాధపడింది. చెల్లెల్ని చూసినప్పుడల్లా తాత గురించి పేరెంట్స్కు చెప్పకుండా తప్పుచేశాననే గిల్టీ ఫీలింగ్ చంపేస్తోందని, తాను చేసిన తప్పుకు శిక్షగా చెయ్యి కోసుకుంటున్నానని తెలిపింది. తానలా శిక్ష అనుభవించినప్పుడే మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటోందని తెలిపింది. ∙∙∙ కుటుంబ సభ్యుల మరణం, రక్తసిక్తమైన చావుని కళ్లారా చూడటం, చంపేస్తామనే బెదిరింపులు, యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, తీవ్రమైన గాయం, లైంగిక హింసకు గురికావడం లాంటి అత్యంత బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారిని అవి జీవితాంతం వెంటాడుతుంటాయి. ఆ సంఘటన జరిగింది ఒకసారే అయినా దాన్ని మర్చిపోలేకపోతుంటారు. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్కు గురైన రియాకు ఆ జ్ఞాపకాలు పదేపదే గుర్తొచ్చి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీన్నే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అంటారు. పీటీఎస్డీ లక్షణాలు.. ►బాధాకరమైన సంఘటనలు పదేపదే గుర్తొస్తుంటాయి ∙దానికి సంబంధించిన పీడకలలు రోజూ భయపెడుతుంటాయి. ►ఆ సంఘటనకు సంబంధించిన ఆలోచనలు, ప్రాంతాలు తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తాయి ∙వాటిని నివారించేందుకు రోజూ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ►కొందరిలో బాధాకరమైన సంఘటనలకు సంబంధించి మతిమరపు ఏర్పడుతుంది∙ ►ప్రపంచం, వ్యక్తులు ప్రమాదకరమైనవనే నమ్మకాలు ఏర్పడతాయి. ►ఒంటరిననే భావన కమ్మేస్తుంది. రోజువారీ పనులపై ఆసక్తి తగ్గుతుంది నిరంతరం భయం, కోపం, అపరాధ భావన, అవమానాలతో కుమిలిపోతుంటారు∙ ►స్నేహం, ప్రేమ, దయ, కరుణలాంటి సానుకూల భావోద్వేగాలను అనుభవించలేకపోతారు చిరాకు, విధ్వంసకర ప్రవర్తన, నిద్రలేమి, ఏకాగ్రత లేమి, హైపర్ విజిలెన్స్ ఉంటాయి. ►రియాలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. చెల్లెలిపై వేధింపులకు తాను చెప్పకపోవడమే కారణమనే అపరాధ భావన, తాను చెప్పినా పేరెంట్స్ నమ్మలేదనే బాధ ఆమె మనసును నిత్యం దహించివేస్తున్నాయి. ►లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో పీటీఎస్డీ ప్రధాన సమస్యగా మారుతుంది. ఇది వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, డిఫెన్స్ సిస్టమ్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమను తాము హింసించుకునేలా ప్రేరేపిస్తుంది. రియా చేసిందదే. తనకు తానే శిక్ష వేసుకుంటోంది. ఏం చెయ్యాలి? ►ప్రతి ఏడుగురిలో ఒకరు రియాలా బాల్యంలోనే లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. లైంగిక వేధింపులకు గురైన వారిలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అది జీవితాంతం వేధించే పీటీఎస్డీగా మారుతుంది. దీన్ని డీల్ చేయడంలో ముందుగా పేరెంట్స్కి కౌన్సెలింగ్ అవసరం. ఆ తర్వాత క్వాలిఫైడ్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ల ద్వారా థెరపీ, చికిత్స అవసరం ఉంటుంది. ►లైంగిక హింసకు పాల్పడేవారిలో ఎక్కువమంది సన్నిహిత బంధువులో, తెలిసినవారో అయ్యుంటారు ∙తల్లిదండ్రులు నిత్యం జాగరూకతతో ఉండాలి. బాల్యంలోనే గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి ∙తమపట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా పేరెంట్స్కి చెప్పవచ్చనే భరోసా కల్పించాలి ►పీటీఎస్డీ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెస్ బాల్స్ ఉపయోగించవచ్చు ∙అనుచిత ఆలోచనలను తప్పించుకోవడానికి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది ►మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మైండ్ఫుల్ నెస్ ప్రాక్టీస్ సహాయపడుతుంది ∙ప్రతికూల ఆలోచనలు, బాధాకరమైన జ్ఞాపకాలు వచ్చినప్పుడు స్టాప్ అనే పదాన్ని మనసులో చూడండి ►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, ఐ మూవ్ మెంట్ డిసెన్సిటైజేషన్ అండ్ రిప్రాసెసింగ్((EMDR)), ట్రామా–ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (TF&CBT) లాంటి థెరపీ పద్ధతులు సహాయపడతాయి∙ న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీలోని VK Dissociation టెక్నిక్ జ్ఞాపకాల నుంచి దూరమయ్యేందుకు సహాయపడుతుంది. ►సాధారణంగా 12 నుంచి 16 సెషన్లు కౌన్సెలింగ్కి హాజరవ్వాల్సి ఉంటుంది. ►యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగించేందుకు సైకియాట్రిస్ట్ని సంప్రదించి యాంటీ డిప్రసెంట్ పిల్స్ వాడవచ్చు. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా? -
ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే..
Attention Deficit Hyperactivity Disorder: సుమంత్ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు. కానీ సుమంత్ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్వర్క్ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది. సుమంత్ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్–డెఫిషిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD).. ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది. కారణాలు– పర్యవసానాలు ఏడీహెచ్డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు. అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు. స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు. కనీసం ఆరు లక్షణాలు ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. చంచలత్వం (attention deficit) లక్షణాలు: వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం ∙టాస్క్స్ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు హైపర్యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ లక్షణాలు: ►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం ►సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం ►తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం ►ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం ►తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం ►ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం ►ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. తల్లిదండ్రులు ఏం చేయాలి? ►ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్గా మీరేం చేయొచ్చంటే.. ►మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి ►పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి ►వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి ►మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి ►ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో అఈఏఈ అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. ►పేరెంటింగ్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి. ►సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ►మందులు మెదడులోని న్యూరోట్రాన్సి్మటర్లు డోపమైన్, నోర్ ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్ ను మెరుగుపరుస్తాయి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
డ్రైవర్ బబ్లూకైనా.. అమెరికాలో డాక్టర్ కోమలికైనా! ఎందుకీ విపరీతారాధన?
బబ్లూ ఒక సినిమా హీరోకు వీరాభిమాని. ఎంత అంటే ఆధార్ కార్డ్లో తన పేరు కూడా మార్చేసుకునేంత! ఆ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే వారం రోజులపాటు థియేటర్ల దగ్గరే ఉంటాడు. పూలదండలు, బ్యాండ్ మేళాలు, ఊరేగింపుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తాడు. తమ హీరోను ఎవరైనా ఏదైనా అంటే వాళ్లను కొట్టేస్తాడు. తమ హీరోను ఆన్లైన్లో ఎవరైనా ఏమైనా అంటే తన ఫేక్ ప్రొఫైల్ నుంచి వాళ్లను అసభ్యకరమైన రీతిలో ట్రోల్ చేస్తాడు. అలా ట్రోలింగ్కు గురైన వాళ్లలో ఒకరు సైబర్ క్రైమ్ కేసు పెట్టడంతో బబ్లూ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంతా చేసి బబ్లూ చదివింది పదో తరగతి, చేసేది డ్రైవర్ ఉద్యోగం. ∙∙ కోమలి అమెరికాలో డాక్టర్. ఇండియాలో ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నా అమెరికా వెళ్లాక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి పెరిగింది. ఉదయం లేవగానే ప్రవచనాలు వింటుంది. ఆ ప్రవచనకారుడు ఏం చెప్తే అది తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఆయన చెప్పేదంతా చాదస్తమని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోదు. మెడిసిన్ చదివి కూడా అంత అన్ సైంటిఫిక్ విషయాలను ఎందుకు పాటిస్తున్నావని కొలీగ్స్ ఎవరైనా అడిగితే.. ఆ ప్రవచనాల్లోని శాస్త్రీయత గురించి వివరించేందుకు ప్రయత్నిస్తుంది. అంతకుమించి ఏమైనా మాట్లాడితే వాళ్లతో గొడవ పడుతుంది, మాట్లాడటం మానేస్తుంది. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ బబ్లూ, కోమలి.. ఇలా సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, మత గురువులు, ప్రవచనకారులను అభిమానించేవారు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. అభిమానించడంలో తప్పులేదు. కానీ ఆ అభిమానం దురభిమానంగా, ఉన్మాదంగా మారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే.. సంబంధబాంధవ్యాలను దెబ్బతీస్తుంటే.. దాన్నే ‘సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్’ అంటారు. ఈ సిండ్రోమ్ ఉన్నవారికి తమ జీవితం కన్నా తాము అభిమానించే వారి జీవితం ముఖ్యం. తన కుటుంబ సభ్యులను పట్టించుకోకపోయినా తాము అభిమానించే హీరో, నేతలకోసం డబ్బు, సమయం, శక్తీ ఖర్చు పెడుతుంటారు. వారికోసం ఎంతటికైనా సిద్ధమవుతారు. ఇలాంటి వారిలో మానసిక ఆరోగ్యం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే వారికే తెలియని కొన్ని మానసిక సమస్యలు ఉంటాయన్నమాట. అసలెందుకు ఆరాధిస్తారు? కొందరు వ్యక్తులు కొన్నిరంగాల్లో ఏదో ఉన్నతిని సాధిస్తారు. మీడియా దాన్ని పదే పదే చూపిస్తుంది. వారి జీవితంలో జరిగే ప్రతి అంశాన్నీ గొప్పగా ప్రొజెక్ట్ చేస్తుంది. వారు చేసే ప్రతి పనినీ గొప్పగా ప్రచారం చేస్తుంది. దాన్ని చూసి అభిమానిస్తారు. అయితే కొందరిలో ఈ అభిమానం హద్దులు దాటుతుంది. తాము అభిమానించే వ్యక్తులను మనుషులుగా చూడటం మరిచిపోతారు. వారిని మహాత్ములుగా, మహిమానిత్వులుగా, సర్వశక్తి సంపన్నులుగా, దైవ స్వరూపులుగా చూడటం మొదలుపెడతారు. వారిలో తప్పులేమీ ఉండవన్నట్లుగా, వారు చేసేవన్నీ ఒప్పే అన్నట్లుగా విశ్వసిస్తారు. ఈ స్థితికి చేరాక తార్కికతకు తావుండదు. తర్కంతో సంబంధం లేకుండా వారు చేసే ప్రతి పనినీ సమర్థిస్తుంటారు. వాస్తవికతకు దూరం... సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఉన్న అభిమానులు వాస్తవికతకు దూరమవుతారు. తాము నమ్మిందే వాస్తవమనే భ్రమల్లో బతుకుతుంటారు తమ సెలబ్రిటీని విమర్శించిన వాళ్లపై విరుచుకు పడతారు. ఎలాంటి గొడవలకైనా సిద్ధపడతారు. కేసుల్లో ఇరుక్కుంటారు. తమను సెలబ్రిటీతో పోల్చుకుని వారిలా ఉండాలని ప్రయత్నిస్తారు. అలా లేనందుకు బాధపడుతుంటారు. బాడీ ఇమేజ్ సమస్యలుంటాయి. ఆలోచించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. బాధ్యత లేకుండా ఫూలిష్గా ప్రవర్తిస్తుంటారు సెన్సేషన్ కోరుకుంటారు. ఇతరుల స్సేస్ను గుర్తించడంలో సమస్యలుంటాయి. బయటపడటం ఎలా? మీరు అభిమానించే సెలబ్రిటీలో ఏయే లక్షణాలు, ప్రవర్తనలు మీకు నచ్చాయో లిస్టు రాసుకోండి. అదంతా పబ్లిక్ బిహేవియర్ మాత్రమేనని, నిజం కావాల్సిన అవసరం లేదని గ్రహించండి ∙అతనంటే మీకెందుకు ఇష్టమో విశ్లేషించుకోండి. అతని పట్ల అభిమానం మీ జీవితాన్ని, బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి. వారితో కలవగలిగితే, మాట్లాడగలిగితే మీరు అభిమానించడంలో తప్పులేదు. లేదంటే మీరు ఊహల లోకంలో ఉన్నారని తెలుసుకోండి మీ సెలబ్రిటీ గురించి తెలుసుకోవడం కోసం, వారి గురించి మాట్లాడుతూ రోజుకు ఎన్ని గంటలు వెచ్చిస్తున్నారో లెక్కేయండి. ఆ సమయాన్ని క్రమేపీ తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి. ఆ సెలబ్రిటీకి భిన్నంగా వేరే అలవాట్లను, హాబీలను అలవాటు చేసుకోండి ∙ఎంత ప్రయత్నించినా మీరు ఆ వలయం నుంచి బయటపడటం సాధ్యం కాకపోతే సైకాలజిస్ట్ను, లేదా సైకియాట్రిస్టును కలవండి. -సైకాలజిస్ట్ విశేష్. -
గుండెపోటుతో చనిపోతాననే భయం.. ఎందుకిలా? సమస్య ఏమిటంటే..
Panic Attacks: సంతోష్ పేరుకు తగ్గట్టే నిత్యం సంతోషంగా ఉంటాడు. కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటూ బాగా సంపాదించాడు. తనకంటూ సొంతకారు కొనుక్కున్నాక, సొంత ఇల్లు కట్టుకున్నాకే నిత్యను పెళ్లి చేసుకున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఒకరోజు కారులో సైట్కు వెళ్తున్న సమయంలో గుండె పట్టేసినట్లనిపించింది. లైట్గా తీసుకున్నాడు. మరో నెల తర్వాత నిద్రపోతుండగా అదే రిపీట్ అయ్యింది. వెంటనే హాస్పిటల్కు వెళ్లి డాక్టర్ను కలిశాడు. ఆయన అన్ని పరీక్షలు చేశాక ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని నిర్ధారించాడు. కానీ మరో నెల తర్వాత బిజినెస్ మీటింగ్లో ఉండగా అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. గుండెపోటు వచ్చిందేమోనని తీవ్రంగా భయపడ్డాడు, వణికిపోయాడు. మళ్లీ హాస్పిటల్కు వెళ్లి అన్ని పరీక్షలూ చేయించుకున్నాడు. ఎలాంటి సమస్యా లేదన్నారు. కానీ గుండెపోటుతో చనిపోతాననే భయం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పుడు ఏమవుతుందోనని వణికిపోతున్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇలా అకస్మాత్తుగా భయాందోళనలతో మనసు, శరీరం అతలాకుతలం కావడాన్ని పానిక్ అటాక్స్ అంటారు. కారణాలు తెలియవు.. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనం పోరాడతాం లేదా పారిపోతాం. అది శరీరపు సహజ స్పందన. అలాంటి సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగవంతమవుతుంది. పానిక్ అటాక్స్లో కూడా అలాంటి ప్రతిచర్యలే జరుగుతాయి. స్పష్టమైన ప్రమాదం లేకున్నా అలా ఎటాక్స్ ఎందుకు వస్తాయో కారణాలు తెలియవు. కానీ జీన్స్, ఒత్తిడి, ఒత్తిడి వల్ల తీవ్ర ప్రతికూల భావోద్వేగాలకు గురయ్యే స్వభావం, మెదడులోని భాగాల పనితీరులో మార్పులు కారకాలుగా గుర్తించారు. పానిక్ అటాక్స్ లక్షణాలు.. ►పానిక్ అటాక్స్కు గుండె వేగంగా కొట్టుకోవడం ఒక్కటే కాదు ఇంకా అనేక లక్షణాలున్నాయి. ►ఒళ్లంతా వణుకుతుంది, చెమటలు పడతాయి. ►శ్వాస వేగవంతమవుతుంది లేదా ఆగిపోయినట్లనిపిస్తుంది. ►ఒళ్లంతా వేడి సెగలు, వేడి ఆవిరులు వస్తాయి. ►తలనొప్పి, తల తిరగడం, మైకం లేదా మూర్ఛపోవచ్చు. ►మరణభయం వెంటాడుతుంది. ►ఈ అటాక్స్ జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తాయి. ►డ్రైవింగ్ చేయాలన్నా, ఇల్లు వదిలి వెళ్లాలన్నా భయం వెంటాడుతుంది. ►తరచూ హాస్పిటళ్ల చుట్టూ తిరగడం పెరుగుతుంది. ►పదిమందిలో కలవడాన్ని నిలిపేస్తారు. దీనివల్ల పనిలో సమస్యలు ఎదురవుతాయి. ►డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలూ రావచ్చు. ►ఆత్మహత్య ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉంది. ►భయాన్ని అధిగమించేందుకు మద్యం వినియోగం పెరుగుతుంది. ►మొత్తంమీద జీవితం దుర్భరంగా మారుతుంది. తరచూ వస్తుంటే డిజార్డర్ ►పానిక్ అటాక్స్ తరచుగా వస్తుంటే దాన్ని పానిక్ డిజార్డర్ అంటారు. ఈ డిజార్డర్ ఉన్నవారికి ఒకసారి అటాక్ రాగానే, మరొక అటాక్ వస్తుందేమోననే ఆందోళన నెల లేదా అంతకంటే ఎక్కువకాలం కొనసాగుతుంది. ►గుండెపోటు వస్తుందేమోననే భయాందోళనలు తీవ్రంగా ఉంటాయి. అందువల్ల అటాక్స్కు కారణమని భావించే పరిస్థితులను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. ప్రవర్తనలో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా టీనేజ్ చివరిలో లేదా యుక్తవయస్సులో ప్రారంభమవుతాయి.ఇవి పురుషుల కంటే స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎవరికి వస్తుందంటే.. ►కుటుంబంలో ఎవరికైనా పానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు ►తీవ్ర అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, శారీరక, లైంగిక వేధింపులు, సీరియస్ యాక్సిడెంట్ లాంటి తీవ్ర ఒత్తిడి కలిగించే సంఘటనలు ►విడాకులు లేదా బిడ్డను కనడం వంటి మేజర్ మార్పులు ►ధూమపానం లేదా అధిక కెఫీన్ తీసుకోవడం ఏం చేయాలి? ►రోజూ వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండండి ►పగటిపూట మగతగా అనిపించకుండా తగినంత నిద్రపోండి ►మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, డీప్ బ్రీతింగ్, జాకబ్సన్ రిలాక్సేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయండి ►కాఫీ, మద్యం, ధూమపానం, డ్రగ్స్ మీ పానిక్ అటాక్స్ను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి ►యాంగ్జయిటీ, పానిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తులతో ఏర్పడిన సపోర్ట్ గ్రూపులో చేరండి ►అప్పటికీ మీ భయాందోళనలు తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను కలవండి ►మీకు వచ్చే అటాక్స్ ప్రాణాంతకం కాదని తెలుసుకోవడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సహాయపడుతుంది ►థెరపీ వల్ల మీకు కొన్ని వారాల్లోనే రిలీఫ్ రావచ్చు. ►రిలీఫ్ వచ్చేసిందని థెరపీ ఆపేయకుండా సైకాలజిస్ట్ చెప్పిన ప్రొటోకాల్కు కట్టుబడి ఉండండి. ►మీ డిజార్డర్ నుంచి పూర్తిగా బయటపడేందుకు కొన్ని నెలలు పట్టవచ్చు ►మీ డిజార్డర్ తీవ్రంగా ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ను కలసి, ఆయన ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి? -
సాఫ్ట్వేర్ జాబ్.. సహోద్యోగితో పెళ్లి! అమెరికాలో కాపురం.. కానీ, ఆ భయం వల్ల..
Acrophobia: గోపీ హైదరాబాద్లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. నాలుగేళ్లు పనిచేశాక తన సహోద్యోగినే పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే ఆన్సైట్ అవకాశం వచ్చింది. ఇద్దరూ సంతోషంగా అమెరికా వెళ్లారు. ఆఫీసు 36వ అంతస్తులో ఉందని అక్కడకు వెళ్లాక తెలిసింది. అంతే.. ఒంట్లో వణుకు మొదలైంది. ఎలాగోలా ధైర్యం చేసి ఆఫీసుకు బయలుదేరాడు. అక్కడ లిఫ్ట్లో రాడ్ గట్టిగా పట్టుకుని 36వ అంతస్తుకు చేరుకున్నాడు. ఊపిరాగినట్లనిపించింది. ఎవరూ చూడకుండా గోడ సాయంతో కేబిన్ చేరుకుని కుర్చీలో కూర్చున్నాడు. సాయంత్రం డ్యూటీ అయిపోయేంతవరకు మనసంతా తీవ్రమైన ఆందోళనగా ఉంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కుర్చీలోంచి లేస్తే పడిపోతానేమోనని విపరీతమైన భయం. అందుకే సాయంత్రం డ్యూటీ అయ్యేంతవరకు కుర్చీలోంచి కదల్లేదు. సాయంత్రం డ్యూటీ అయ్యాక ఎలాగోలా కష్టపడి ఇంటికి చేరుకున్నాడు. అలా వారం రోజులు ఆఫీసుకు వెళ్లాక ఇక తనవల్ల కాదనిపించింది. జాబ్ రిజైన్ చేస్తానంటూ భార్యకు చెప్పాడు. ఎందుకని అడిగితే.. ఏదో కారణం చెప్పాడు. అది సరైన కారణమని ఆమెకు అనిపించలేదు. దాంతో వాగ్వాదం మొదలై, వాగ్యుద్ధంగా ముగిసింది. ఎత్తయిన ప్రదేశాలంటే వణకడాన్ని ఏమంటారు? సాధారణంగా అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. కొందరికి పిల్లంటే భయం, మరికొందరికి కుక్కంటే భయం, ఇంకొందరికి పామంటే భయం. అలాగే ఎత్తయిన ప్రదేశాలంటే అందరికీ ఎంతో కొంత భయం ఉంటుంది. ఎత్తయిన ప్రాంతాల నుంచి కిందకు చూస్తే చాలామందికి అసౌకర్యంగా ఉంటుంది. కొందరికి కొద్దిపాటి వణుకుగా అనిపించవచ్చు. అందుకే ఎత్తులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఆ జాగ్రత్త, ఆ భయం అతిగా మారి, ఆ పరిస్థితులను తలచుకుంటేనే వణుకు వస్తే, అలా ఆరు నెలలపాటు ఉంటే దాన్ని ‘ఫోబియా’ అంటారు. ఇది ఒక మానసిక సమస్య. ఇలాంటి ఫోబియాలు చాలా ఉన్నాయి. వాటిలో గోపీలా ఎత్తయిన ప్రదేశాలంటే వణికిపోవడాన్ని ‘అక్రోఫోబియా’ అంటారు. ఈ ఫోబియా ఉన్న వ్యక్తులకు ఎత్తయిన ప్రదేశాలన్న ఊహే వణుకు తెప్పిస్తుంది. ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోతామనే భయమే మనసులో ఉంటుంది. అందువల్ల మెట్లు ఎక్కడం, బాల్కనీ దగ్గర నిలబడటం, బహుళ అంతస్తుల భవనాల్లో పనిచేయడం లాంటి వాటిని తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడయినా ఎత్తయిన ప్రదేశంలో ఉండాల్సి వస్తే ఆందోళనతో గుండె వేగంగా కొట్టుకుంటుంది, తల తిరిగినట్లు, ఊపిరాగినట్లు అనిపిస్తుంది. ఎవరికి రావచ్చు? అక్రోఫోబియా ఏ వయస్సులోనైనా రావచ్చు. అయితే ఇలాంటి నిర్దిష్ట భయాలు బాల్యంలో వచ్చే అవకాశాలు ఎక్కువ. బాల్యంలో ఎదురైన ఏదో ఒక భయం కలిగించే అనుభవాన్ని అతిగా జనరలైజ్ చేయడం వల్ల, అతిగా ఆలోచించి భూతద్దంలో చూడటం వల్ల అది ఫోబియాగా మారుతుంది. ఈ భయాలు టీనేజర్స్లో, యువకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మహిళల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి. కారణాలేమిటి? అక్రోఫోబియాకు కారణం ఏమిటో కచ్చితంగా తెలియదు. అక్రోఫోబియా కలిగి ఉండటం అనేది ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం లేదా మనల్ని మనం బాధించు కోవాలనే సహజ మానవ ఆందోళన నుంచి ఉత్పన్నమవుతుందని చెప్తారు. ఎత్తు నుంచి∙పడిపోవడం వల్ల మీరు అనుభవించే నొప్పి గురించి ఆలోచించడం, మనసులో ఆ దృశ్యాన్ని పదేపదే చూస్తూ బాధపడటం అక్రోఫోబియా పెరగడానికి కారణం అవుతుంది. నివారణ ఉందా? దాదాపు మూడు నుంచి ఆరుశాతం మందిలో అక్రోఫోబియా ఉంటుంది. ఈ ఫోబియా మీకుందని మీరు గుర్తిస్తే.. ఎత్తయిన ప్రదేశంలో ఉన్నప్పుడు కిందకు చూడకుండా మీ దృష్టిని హరైజాన్పై నిలపండి. మీకు సమీపంలో నిశ్చలంగా ఉన్న వస్తువులను చూడండి. అవసరమైతే మీ కదలికలను ఆపేయండి. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, డీప్ బ్రీత్, యోగా వంటివి ప్రాక్టీస్ చేయండి. అయితే ఇవన్నీ అప్పటికి ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప మీ ఫోబియాను పరిష్కరించవు. అందువల్ల మీ ఫోబియాకు సరైన సైకోథెరపీ పొందడం అవసరం. మీరెంత త్వరగా కౌన్సెలింగ్ తీసుకుంటే అంత త్వరగా మీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మీలో ఆందోళన, నిరాశ, నిస్పృహలు పెరగడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. అక్రోఫోబియాకు ప్రస్తుతం ఎటువంటి నివారణ లేదు. అయితే ఎక్స్పోజర్ థెరపీ, వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీవంటి పద్ధతులతో చికిత్స చేయవచ్చు. న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా ఒకటి నుంచి మూడు సెషన్లలోనే ఫోబియా నుంచి ఉపశమనం పొందవచ్చు. భయాన్ని ఎదుర్కోవటానికి, భయం లేదా ఆందోళన లక్షణాల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు ఒక్కోసారి మందులు కూడా అవసరమవుతాయి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి? -
OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి..
Obsessive-Compulsive Disorder: సునీత తెలుగు టీచర్. సంప్రదాయ కుటుంబం. ప్రతి పనీ పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచీ అలవాటు. అయితే కరోనా తర్వాత ఆమె ప్రవర్తన విపరీతంగా మారింది. కరోనా లేదని తెలిసినా శానిటైజర్ వాడకం ఆపలేదు. కూరగాయలు, పండ్లు, సరుకులు.. ఏవి తీసుకువచ్చినా శానిటైజ్ చేయాల్సిందే. స్నానానికి వెళ్లిందంటే గంట పాటు బయటకు రాదు. ఏమాత్రం అశుభ్రంగా ఉన్నా ఏదైనా వైరస్ వస్తుందేమోనని విపరీతమైన భయం. గిన్నెలు పదేపదే కడుగుతూనే ఉంటుంది. హాల్లో వస్తువులు ఏ మాత్రం ఆర్డర్ తప్పినా తట్టుకోలేదు. పిల్లలపై అరిచేస్తుంది. ‘ఏంటమ్మా నీ చాదస్తం?’ అని పిల్లలంటున్నా పట్టించుకోదు. ఆయనది ఇంకో తీరు సునీత భర్త సుకుమార్ది మరో సమస్య. అతనికీ మధ్య ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఆఖరుకు గుడికి వెళ్లి విగ్రహాల్ని చూసినా లైంగికపరమైన ఆలోచనలు వస్తున్నాయి. తల్లి, చెల్లి గురించి కూడా అలాంటి ఆలోచనలు వస్తుండటంతో ఎవరికీ చెప్పలేక, చెప్పుకోలేక తనలో తానే మథన పడిపోతున్నాడు. తాను తప్పుడువాడిని కనుకే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని అపరాధభావంతో కుంగిపోతున్నాడు. ఒక్కోసారి బలవన్మరణ ఆలోచనలు అతని మనసును కమ్మేస్తున్నాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సునీత, సుకుమార్ ఇద్దరిదీ ఒకటే మానసిక సమస్య.. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ). అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం (అబ్సెషన్స్), ఒకే పని పదేపదే చేయడాన్ని నియంత్రించుకోలేకపోవడం (కంపల్సివ్) ఆ వ్యాధి లక్షణాలు. కొందరిలో అబ్సెషన్ లేదా కంపల్సివ్ లక్షణాలుంటే, మరికొందరిలో రెండూ ఉంటాయి. కానీ అది ఒక మానసిక సమస్య అనే విషయం చాలామందికి తెలియక తమలో తామే మథనపడుతూ ఉంటారు. ఈ రుగ్మత వల్ల సమయం విపరీతంగా వృథా అవుతుంది, జీవితం దుర్భరంగా మారుతుంది. ఓసీడీ లక్షణాలు ►అనుచిత, అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం. వీటితో డిస్టర్బింగ్గా ఉండడం. ►తమ గురించి తాము అతిగా ఆందోళన చెందడం, లేదా ఇతరుల గురించి వారికేదైనా ఆపద వస్తుందేమోనని భయపడడం. ►అన్నీ పరిశుభ్రంగా ఉండాలనుకోవడం. వస్తువులు మురికిగా ఉన్నాయనో, కల్తీ అయ్యాయనో ఆందోళనచెందడం లేదా వాటిని పదేపదే శుభ్రపరచుకోవడం ►తాళం వేశామా లేదా? అలారం పెట్టామా? గ్యాస్ ఆఫ్ చేశామా లేదా? అని పదేపదే చెక్ చేయడం. ►అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం, అందుకోసం పదేపదే సర్దడం. ►కొన్ని పనులను ప్రతిసారి నిర్దిష్టమైన పాటర్న్లో చేయడం లేదా పదేపదే చేయడం ►అవతలి వ్యక్తి తాను చెప్పింది వింటున్నారో లేదో అన్న అనుమానంతో చెప్పిన విషయాన్ని పదేపదే చెప్పడం ►ముట్టుకుంటే క్రిములు వస్తాయనే భయంతో ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఈ లక్షణాలు కనపడగానే మీకు మాత్రమే ఈ సమస్య వచ్చిందని బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు డేవిడ్ బెకమ్, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకోణ్, ప్రియాంక చోప్రా కూడా ఈ రుగ్మత నుంచి బయటపడిన వారే. జనాభాలో రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. మహిళల్లో, పురుషుల్లో దాదాపు సమానంగా ఉంటుంది. అయితే 10–25 శాతం మందికి తమకు సమస్య ఉందనే విషయమే తెలియదు. 15శాతం మంది బలవన్మరణానికి ప్రయత్నించవచ్చు. ఎందుకొస్తుంది? ఓసీడీకి జన్యుపరమైన, పర్యావరణ కారకాలు రెండూ ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఓసీడీ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదడులోని నాడీకణాల మధ్య సమాచార మార్పిడికి సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మీటర్ అవసరం. దాని పరిమాణం తగ్గితే మతిమరపు, ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బాల్యంలో భౌతిక, లైంగిక దాడికి గురైనప్పుడు, ప్రమాదం బారినపడ్డప్పుడు, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యలున్నప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. కరోనా వల్ల ఈ రుగ్మత బారినపడ్డ వారి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఏం చేయాలి? ఓసీడీ లక్షణాలు కనిపించగానే ఎవరికి వారు తమ ఆలోచనలను ఆపేసేందుకు, అణచివేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ అవి మరింత బలంగా వస్తాయి. అలాగే పదేపదే చేస్తున్న పనులను బలవంతంగా ఆపేసేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. ఆ ఆందోళన తగ్గేందుకు మైండ్ఫుల్నెస్, వ్యాయామం లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే వెంటనే సైకాలజిస్టును కలవండి. ఆయన డయాగ్నసిస్ ద్వారా మీ రుగ్మతను నిర్ధారిస్తారు. మీ భయాలు, ఆందోళనలు తగ్గించేందుకు సైకోథెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. మీ అవాంఛిత ఆలోచనలు, అసహజ ప్రవర్తనకు మూలమైన విశ్వాసాలను మార్చుకునేందుకు సహాయపడతారు. ఎక్స్పోజర్, రెస్పాన్స్ ప్రివెన్షన్ ద్వారా మీ అలవాట్లను మార్చేందుకు సహాయపడతారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్కు రిఫర్ చేస్తారు. మెదడులో తగ్గిన సెరటోనిన్ స్థాయిలను పెంచడానికి ఆయన మందులు సూచిస్తారు. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Toxic Positivity: ‘పాజిటివిటీ పిచ్చి’ పడితే అంతే సంగతులు! అతి సానుకూలతతో అనర్థాలే! మీలో ఈ లక్షణాలుంటే వెంటనే.. Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. -
ఈ లక్షణాలుంటే మీకు ‘పాజిటివిటీ పిచ్చి’ పట్టినట్టే! అతి సానుకూలతతో అనర్థాలే
What Is Toxic Positivity: రాజుది తెనాలి. సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ కోసం మూడేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. అశోక్నగర్లో ఫ్రెండ్స్తో పాటు రూమ్లో ఉండి చదువుకునేవాడు. మొదట్లో కోచింగ్, లైబ్రరీ, రూమ్, ప్రిపరేషన్లతో చాలా బిజీగా ఉండేవాడు. అక్కడే ఒక ఫ్రెండ్ రూమ్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదివాడు. అప్పటి నుంచి అలాంటి పుస్తకం ఎక్కడ కనపడినా చదువుతుండేవాడు. ఒక సంస్థ ఉచితంగా వ్యక్తిత్వ వికాస శిక్షణ నిర్వహిస్తోందని తెలిసి హాజరయ్యాడు. అదే సంస్థ నిర్వహించే ట్రైనర్స్ ట్రైనింగ్కీ హాజరయ్యాడు. అక్కడే అతనికి ‘పాజిటివిటీ పిచ్చి’ పట్టింది. జీవితంలో అంతా పాజిటివిటీనే చూడాలని ట్రైనింగ్లో చెప్పిన మాటలు అతని మనసును పూర్తిగా ఆక్రమించాయి. అప్పటి నుంచీ పాజిటివిటీ, పాజిటివ్ థింకింగ్పై సోషల్ మీడియాలో రోజుకు పది పోస్టులు పెడుతుండేవాడు. వాటికి వచ్చే లైక్లు చూసుకుని, కామెంట్లు చదువుకుని సంబరపడిపోయేవాడు. యువతలో పాజిటివిటీ నింపాలని స్కూళ్లు, కాలేజీల్లో ఉచితంగా క్లాసులు నిర్వహించేవాడు. ప్రతిక్లాసుకు సంబంధించిన వార్త, ఫొటో పేపర్లో వస్తుండటంతో చదువుకుని మురిసిపోయేవాడు. తానో సెలబ్రిటీ అయ్యానని కలల్లో విహరించేవాడు. కానీ వాస్తవం మరోలా ఉంది. రాజు తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. రాజు ఉద్యోగం సాధిస్తే తమ జీవితాలు మారతాయని వాళ్లు ఎదురుచూస్తున్నారు. కానీ రాజు పాజిటివిటీ పేరుతో పక్కదారి పట్టాడు. మూడేళ్లయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇలాంటివాళ్లు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. టాక్సిక్ పాజిటివిటీ లక్షణాలు పాజిటివిటీ లేదా పాజిటివ్గా ఆలోచించడం తప్పుకాదు. కానీ ఆ పాజిటివిటీ ఎక్కువైతే అదే ఒక సమస్యగా మారుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆశావాదంతో, సంతోషంగా ఉండాలనుకోవడం, నిజమైన భావోద్వేగాలను తిరస్కరించడం లేదా తగ్గించడాన్నే ‘టాక్సిక్ పాజిటివిటీ’ అంటారు. ఈ టాక్సిక్ పాజిటివిటీలో చిక్కుకున్న వ్యక్తులు... ►అన్నింటిలో సానుకూలతను మాత్రమే చూడాలంటారు ►నిజమైన భావోద్వేగాలను గుర్తించేందుకు ఇష్టపడరు. వాటికి ముసుగువేస్తారు లేదా దాచేస్తారు. ►జీవితంలో ఎదురయ్యే ప్రతీ విపత్తు వెనుక ఏదో మంచి ఉంటుందని వాదిస్తారు ►భావోద్వేగాలను విస్మరించడం ద్వారా దానితో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు ►పాజిటివ్ కోట్స్, స్టేట్మెంట్లతో ఇతరుల బాధను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తారు ►ప్రతికూల భావోద్వేగం వస్తే అపరాధ భావనకు లోనవుతారు ►ప్రతికూల భావోద్వేగాలున్నవారిని బలహీనులుగా చూస్తారు, కించపరుస్తారు. అతి సానుకూలతతో అనర్థాలే ►ప్రతికూల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేసినా, అణచివేసినా అవి వదిలిపెట్టవు. సమయం చూసుకుని వెంటపడతాయి. అందుకేటాక్సిక్ పాజిటివిటీని పాటించే వ్యక్తులు మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. ‘ఆల్ ఈజ్ వెల్’, ‘డోంట్ వర్రీ, బీ హేపీ’, ‘పాజిటివ్ వైబ్స్ ఓన్లీ’ అనే స్టేట్మెంట్లు అన్ని సందర్భాల్లోనూ సరిపోవు. ప్రతీక్షణం ఇలా ఆలోచించడం వల్ల... ►ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడం లేదా తిరస్కరించడం వల్ల మరింత మానసిక ఒత్తిడికి లోనవుతారు ∙అంతా మంచిగా ఉందని అనుక్షణం నటించడం చివరకు యాంగ్జయిటీ, డిప్రెషన్, శారీరక సమస్యలకు దారితీస్తుంది ►అసలైన సమస్యను తిరస్కరించడం లేదా గుర్తించకపోవడం వల్ల కష్టాల్లో పడతారు, నష్టపోతారు ►సమయం సందర్భం చూసుకోకుండా పాజిటివ్గా మాట్లాడటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి, ఒంటరిగా మిగిలిపోతారు ►సహానుభూతి లేకుండా, సన్నిహితుల కష్టాలను అర్థం చేసుకోకుండా సలహాలిచ్చి దూరం చేసుకుంటారు. మరేం చెయ్యాలి? జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్నీ పాజిటివ్గా చూడటం ద్వారానో లేదా ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడం ద్వారానో నిజమైన ఆనందం రాదు. ఇప్పుడు, ఈ క్షణంలో మనం ఏ భావోద్వేగాన్ని అనుభవిస్తున్నామో.. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా.. దాన్ని అంగీకరించడమే నిజమైన ఆనందాన్నిస్తుంది. టాక్సిక్ పాజిటివిటీ నుంచి తప్పించుకోవాలంటే.. ►ఆరోగ్యకరమైన వ్యక్తికి అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని గుర్తించండి ►కోపం, బాధ, నిరాశ, నిస్పృహ.. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు జీవితంలో సాధారణమని గుర్తించాలి. ►వాటిని కలిగి ఉండటం, వ్యక్తీకరించడం తప్పేమీ కాదని అంగీకరించాలి ∙ ►భావోద్వేగాలను సాధనాలుగా, సమాచారంగా గుర్తించాలి. ►ఏదైనా ప్రతికూలత ఎదురైతే, అది ఇస్తున్న సమాచారాన్ని గుర్తించి ముందుకు సాగాలి ∙ ►ప్రతికూల భావోద్వేగాల గురించి సన్నిహితులతో మాట్లాడాలి. ►టాక్సిక్ పాజిటివిటీతో సన్నిహితులను ఇబ్బంది పెట్టాయని గుర్తిస్తే వెంటనే ఆ తప్పును అంగీకరించాలి. ►మరోసారి అలా స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలి. ►సన్నిహితులెవరైనా టాక్సిక్ పాజిటివిటీతో సలహాలిస్తుంటే నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకోవాలి. ►నిగ్రహాన్ని కోల్పోయి అరిచినా.. కోపం చల్లారాక క్షమాపణ కోరాలి. ►మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. ఇవేవీ పనిచేయనప్పుడు సైకాలజిస్ట్ లేదా సైకోథెరపిస్ట్ను కలవండి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్ను గుర్తు చేసుకుని.. చివరికి -
ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్ను గుర్తు చేసుకుని.. చివరికి! ఎందుకిలా చేసింది?
ఆనంది అందమైన అమ్మాయి. ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ తెచ్చిన సంబంధాలన్నీ వద్దంటోంది. క్రమేపీ ఇంట్లో వాళ్లతో మాట్లాడటం తగ్గించింది. ఆస్పత్రినుంచి రాగానే తన గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటోంది. మెల్లగా ఆస్పత్రికి వెళ్లడం కూడా తగ్గించింది. కారణమేంటని అడిగితే ఏడుస్తోంది. తను ఆలా ఎందుకు ఏడుస్తోందో పేరెంట్స్కు అర్థం కావడం లేదు. అడిగితే ఏమీ చెప్పడం లేదు. ఒకరోజు హఠాత్తుగా చెయ్యి కోసుకుంది. పేరెంట్స్ సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెను కాపాడుకున్నారు. తనకు అంత పని చేయాల్సినంత కష్టం ఏమొచ్చిందో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. డిప్రెషన్ ఆనందిలా నిద్రాహారాలకు దూరమై, బంధాలన్నింటికీ స్వస్తిచెప్పి, నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి, ఒంటరిగా కూర్చుని కుమిలిపోవడాన్నే డిప్రెషన్ అంటారు. డిప్రెషన్కు లోనైన వ్యక్తుల్లో కొందరికి బలవన్మరణ ఆలోచనలూ రావచ్చు. కొందరు ఆనందిలా ప్రయత్నాలు కూడా చేస్తారు. జనాభాలో దాదాపు ఐదుశాతం డిప్రెషన్తో బాధపడుతుంటారు. ఈ డిప్రెషన్ మహిళల్లో ఎక్కువ. తల్లిదండ్రుల్లో డిప్రెషన్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకు వస్తుంది? డిప్రెషన్ ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పడం కష్టమే. సకల సౌకర్యాలతో జీవిస్తున్న వ్యక్తులూ హఠాత్తుగా డిప్రెషన్లో పడిపోవచ్చు. తామెప్పుడో చేసిన చిన్న తప్పును భూతద్దంలో చూడటం, తన జీవితమే తప్పు దారిలో వెళ్తోందని అతిగా ఆలోచించడం, తప్పు చేసిన తాను ఎందుకూ పనికిరాననే ఆత్మన్యూనతకు లోనవ్వడం వంటివన్నీ.. డిప్రెషన్కు కారణమవుతాయి. ఆనంది విషయంలో జరిగిందదే. తన టీనేజ్ అఫైర్ను ఇప్పుడు గుర్తు చేసుకుని, అతిగా ఆలోచించి, తాను తప్పు చేశా కాబట్టి పెళ్లికి అర్హురాలిని కాదని, తనను తాను తక్కువ చేసుకుని, ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేక డిప్రెషన్లోకి జారిపోయింది. మరికొన్ని సందర్భాల్లో జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు డిప్రెషన్కు వెళ్లిపోతారు. ఆ కోల్పోవడం ఆర్థికంగా లేదా మానసికంగా లేదా సామాజికంగా కావచ్చు. ఒక్కోసారి ఆర్థికంగా, వస్తురూపంగా ఎలాంటి నష్టం లేకపోయినా అహం దెబ్బతినడం, అవమానం పాలవ్వడం కూడా డిప్రెషన్కు కారణం కావచ్చు. ఒక్కోసారి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండానే డిప్రెషన్కు లోనుకావచ్చు. మెదడులోని సెరటోనిన్ అనే రసాయనంలో హెచ్చుతగ్గుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. గుర్తించడం ఎలా? డిప్రెషన్ను గుర్తించడం కొంచెం సులభం, మరికొంచెం కష్టం కూడా. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఆనందిలా సరిగా నిద్రపోలేరు. తిండిపై ఆసక్తి ఉండదు. ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారో కూడా ఆలోచించరు. చిన్న చిన్న పనులకే అలసిపోతారు. హఠాత్తుగా బరువు తగ్గుతారు. మద్యం తాగడం పెంచుతారు. కొందరిలో తరచూ తలనొప్పి, ఒళ్లునొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్యా లేదని చెప్తారు. కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంటుంది. మందులు వాడినా శారీరక బాధలు తగ్గనప్పుడు, దీర్ఘకాలం దిగులుగా ఉన్నప్పుడు అది డిప్రెషన్ అని గుర్తించాలి. ఏం చేయాలి? ►డిప్రెషన్కు లోనయ్యామని తెలుసుకున్నప్పుడు మొదట దానికి దారితీసిన కారణాలను వెదకాలి. ఆ కారణాలకు దిగులుపడాల్సిన అవసరం ఉందా, లేదా అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి. ►పని ఒత్తిడి భరించలేని స్థాయికి వచ్చినందువల్ల కూడా డిప్రెషన్కు లోనయ్యే చాన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు పని ఒత్తిడి తగ్గించుకోవాలి. ►హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ అంటారు. అలాగే యాక్టివ్ బాడీ, యాక్టివ్ మైండ్. శరీరం చురుగ్గా ఉంటేనే మనసూ ఉత్సాహంగా ఉంటుంది. అందుకే శరీరానికి పనిపెట్టండి. వాకింగ్, ఏరోబిక్ ఎక్సర్ సైజ్లు, యోగ వంటివి ప్రాక్టీస్ చేయాలి. ►ఒంటరిగా కూర్చుంటే దిగులు మరింత పెరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కూర్చోకుండా బయటకు కదలాలి. స్నేహితులను కలవాలి. వాళ్లతో నవ్వుతూ కబుర్లు చెప్పుకోవాలి. హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ ఉండే వాతావరణంలో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి. ►మీ స్నేహితుడో, సన్నిహితురాలో డిప్రెషన్తో బాధపడుతున్నారని అనిపించినప్పుడు వారికి సపోర్ట్గా నిలవండి. వారిని సంతోషపెట్టే మార్గాలు అన్వేషించండి. ►మీ కుటుంబంలో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు.. ఏమీ చేయకుండా కూర్చున్నారని తిట్టకండి. వారి మనసులోని బాధేమిటో తెలుసుకుని అనునయించండి. ►అవసరమైతే వారితో సన్నిహితంగా ఉండేవారి సహాయం తీసుకోండి. ►మీ ప్రయత్నాలేవీ ఫలించనప్పుడు సైకాలజిస్ట్ను కలవండి. ఆయన పరీక్షించి మైల్డ్, మోడరేట్ లెవెల్లో ఉంటే కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయం చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్కు రిఫర్ చేస్తారు. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? -
అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం?
జీవన శైలి మారింది.. పర్యవసానంగా వచ్చిన.. వస్తున్న శారీరక సమస్యల మీదే మన దృష్టి అంతా! అదే తీవ్రత మానసిక ఆరోగ్యం మీదా ఉంది.. కానీ అది అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది! ఫలితంగా సమాజమే డిప్రెషన్లోకి వెళ్లొచ్చు! వెళ్లకూడదు అనుకుంటే మానసిక సమస్యలు, రుగ్మతల మీద సాధ్యమైనంత వరకు చర్చ జరగాలి.. కౌన్సెలింగ్, వైద్యం దిశగా ప్రయాణం సాగాలి! ఆ ప్రయత్నమే ఈ కాలమ్!! ఆనంద్ 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైదరాబాద్లో ఉద్యోగం. తన ఫ్రెండ్ కుమార్తో కలసి మాదాపూర్లో ఒక డబుల్ బెడ్ రూమ్లో ఉంటున్నాడు. రోజూ ఉదయాన్నే జాగింగ్కు, అట్నుంచటే జిమ్కు వెళ్లేవాడు. ఇరుగుపొరుగు కనిపిస్తే నవ్వుతూ పలకరించే వాడు. నీట్గా రెడీ అయ్యి, తన కొత్త బైక్పై ఆఫీస్కి వెళ్లేవాడు. అక్కడ కొలీగ్స్ అందరితో సరదాగా ఉండేవాడు. వారానికి ఐదురోజులు పనిచేయడం, వీకెండ్స్లో ఫ్రెండ్స్తో కలసి ఔటింగ్కి వెళ్లడం అలవాటు. అయితే గత రెండు నెలలుగా ఆనంద్ ప్రవర్తన మారిపోయింది. రూమ్మేట్ కుమార్తో మాట్లాడటం తగ్గించేశాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు. స్నానం చేయడం లేదు, సరిగా డ్రెస్ చేసుకోవడం లేదు. అత్యవసరమైతే తప్ప రూమ్ దాటి బయటకు వెళ్లట్లేదు. అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాడు. కుమార్కు ఇదంతా కొత్తగా అనిపించింది. అడిగితే ‘‘నేను బాగానే ఉన్నాను’’ అని చెప్తున్నాడు. ..కానీ బాగాలేడు.. క్రమేపీ ఆనంద్కు ఆరోగ్య సమస్యలూ మొదలయ్యాయి. తరచూ తలనొప్పి, ఒళ్లు నొప్పులంటూ బాధపడుతున్నాడు. అస్సలు నిద్రపోవడంలేదు. అల్సర్ వచ్చింది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యాయి. గుండె దడగా ఉంటోందంటున్నాడు. వర్క్ విషయంలోనూ ఆఫీసు నుంచి కంప్లయింట్స్ వస్తున్నాయి. అలాగే వదిలేస్తే ఏమై పోతాడోననే భయంతో కుమార్ బలవంతంగా ఆనంద్ను కౌన్సెలింగ్కి తీసుకువచ్చాడు. కౌన్సెలింగ్లో భాగంగా ఆనంద్ కుటుంబం, గతం గురించి తెలుసుకున్నాను. అతనికి ముగ్గురు అక్కలు. లేకలేక పుట్టిన మగబిడ్డ కావడంతో పేరెంట్స్ చాలా గారాబం చేసేవారు. ఆనంద్ 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబం అతలాకుతలమైంది. తల్లి, అక్కలు ఏదో ఒక జాబ్ చేస్తే తప్ప గడవని పరిస్థితి. ఆనంద్కు ఉద్యోగం వచ్చాకే కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కానీ అక్కలకు ఇంకా పెళ్లి కాకపోవడం ఆనంద్పై తెలియని ఒత్తిడిని పెంచింది. అక్కలకు పెళ్లి కాదేమో, వాళ్లకు పెళ్లి చేయకుండా తాను పెళ్లి చేసుకోలేడు కాబట్టి, తనకు జీవితంలో పెళ్లి కాదేమోననే ఆందోళన మొదలైంది. అది అతని ఆలోచనలన్నింటినీ ఆక్రమించేసింది. దీన్నే జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ లేదా GAD అంటారు. ఆనంద్ ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులన్నీ ఈ డిజార్డర్ వల్ల వచ్చినవే. ఆరుగురిలో ఒకరు.. ఇది ఆనువంశికంగా వచ్చి ఉండవచ్చు. లేదా జీవితంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాల వల్లా కావచ్చు. ఆనంద్ తల్లి కూడా ఇలాగే ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతుంటుందని అతని మాటల్లో తెలిసింది. దానికితోడు చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం, కుటుంబ కష్టాలు, అక్కల పెళ్లిళ్లు.. అవన్నీ అతన్ని ఆందోళనలోకి నెట్టేశాయి. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ లేకపోవటం, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో అది డిజార్డర్గా మారింది. వందమంది భారతీయుల్లో ఆరుగురు ఈ డిజార్డర్తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ తీసుకుంటే ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయం వల్లే చాలామంది చికిత్సకు వెనుకడుగు వేస్తుంటారు. ఫలితంగా అది మరిన్ని మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుంది. అందుకే మానసికంగా ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే చర్యలు తీసుకోవడం అవసరం. జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ లక్షణాలున్నవారు దాన్నుంచి బయటపడేందుకు చేయాల్సిన పనులు.. ►ఆందోళన కలిగించే ఆలోచనలను ఒక జర్నల్లో రాసుకోవాలి. వాటిని గమనిస్తే.. మీకు వస్తున్న చాలా ఆలోచనలు నిజం కావడంలేదని అర్థమవుతుంది. అది మీకు ధైర్యాన్నిస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దానివల్ల మెదడులో విడుదలయ్యే సెరటోనిన్ మూడ్ను మెరుగుపరుస్తుంది. కనీసం వారానికి ఐదురోజులు, రోజుకు అరగంట వ్యాయామం చేయాలి. ►ఆందోళనకూ శ్వాసకూ సంబంధం ఉంది. ఆందోళనలో ఉన్నప్పుడు శ్వాస వేగమవ్వడం గమనించవచ్చు. అందువల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ను రోజూ ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ కూడా ఉపయోగ పడుతుంది. ఇవన్నీ చేసినా ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం బెరుకులేకుండా సైకాలజిస్టును సంప్రదించండి. ►మనదేశంలో వందలో ఏడుగురు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారిలో 80శాతం మంది ఎలాంటి చికిత్స తీసుకోవడంలేదు. మానసిక సమస్యల పట్ల అవగాహన లేకపోవడం, సమస్యను బయటకు చెప్పుకుంటే ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయమే ఇందుకు కారణం. ఎలాంటి భయం లేకుండా మీ సమస్యను కింద ఇచ్చిన ఐడీకి మెయిల్ చేయవచ్చు. పరిష్కారమార్గం చూపిస్తాం. -సైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com) చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. Health Tips: క్యాన్సర్కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్తో.. -
విశ్లేషణం: ‘మన’ సత్య
సత్య నాదెళ్ల.. మనవాడు... మన తెలుగువాడు... మన దేశంవాడు... భారతదేశ మేధాశక్తిని ప్రపంచానికి చాటినవాడు... ప్రపంచ పత్రికల పతాక శీర్షికలలో నిలిచినవాడు... ఈ బుక్కాపురం బుల్లోడు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎలా కాగలిగాడు? హైదరాబాద్ చదివి అమెరికాలో ఎలా పాగా వేయగలిగాడు? ఓపెన్ అండ్ క్లారిటీ సత్య మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... అతని చేతులు ఓపెన్గా ఉంటాయి. తాను చెప్తున్న విషయాలకు అనుగుణంగా చేతుల కదలికలు ఉంటాయి. బొటనవేలును చూపుడువేలును కలిసే చిన్ముద్రను ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఇవి అతను ఓపెన్గా ఉంటాడని, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని చెప్తాయి. చిన్ముద్ర అతను చెప్తున్నది నిజమేనన్న భావనను కలిగిస్తుంది. నిల్చున్నప్పుడు నిలకడగా ఉంటాడు, కదలికలు తక్కువగా ఉంటాయి. కూర్చున్నప్పుడు కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటాడు. సత్య నిలకడగా ఉంటాడని, తొందరపాటు లేదని, ఆత్మవిశ్వాసంతో ఉంటాడని ఇవి చెప్తాయి. సత్య మాటల్లో మొదటగా ఆకట్టుకునేది స్పష్టత. అతని మాటల్లో, పదాలను ఉచ్ఛరించడంలో, ఆలోచనను వ్యక్తీకరించడంలో స్పష్టత కనిపిస్తుంది... ఎక్కడా ఎలాంటి తొట్రుబాటు, గందరగోళం కనిపించదు. పదాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాడని తెలుస్తుంది. అలాగే తాను ప్రధానంగా చెప్పదలచుకున్న విషయాలను చెప్తున్నప్పుడు, కీలక పదాలను పలుకుతున్నప్పుడు నొక్కి చెప్పడం గమనించవచ్చు. స్వరం హైపిచ్లో ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలకన్నా కంపెనీ విజన్ గురించే ఎక్కువగా మాట్లాడతాడు. ఇవన్నీ అతనో విజువల్ పర్సన్ అని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు పనిని ఆనందిస్తారు. వేగంగా పనిచేస్తారు. చేసే పని పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటారు. అసంపూర్తి పనులంటే వీరికి అసౌకర్యంగా ఉంటుంది. సత్య మాట్లాడటం చూసినప్పుడు, సత్య గురించి చదివినప్పుడు ఈ లక్షణాలన్నీ మనం గమనించవచ్చు. జ్ఞాన పిపాసి... ఒక వ్యక్తి తన ప్రవర్తను ఎంతగా నియంత్రించుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాదు. అతను ఎంచుకునే పదాలు, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికైన తర్వాత సత్య ఇచ్చిన ఇంటర్వ్యూలు, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు అతను రాసిన తొలి ఉత్తరం మూలాలపట్ల అతనికున్న అనురక్తిని, అతను ఈ స్థాయికి రావడానికి కారణాలను మనకు చూపిస్తాయి. అలాగే ఇన్నోవేషన్, కోర్, డూ మోర్... అని పలికేటప్పుడు ఆ పదాలపై ఒత్తిడి పెడతాడు. ఇవన్నీ అతని జ్ఞాన జిజ్ఞాసను ప్రతిఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూకూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణంచేసి కోర్సు చేయడం ఇందులో భాగమే. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్ట్, ఎంఐటీల్లో చదవకపోయినా తన జ్ఞాన జిజ్ఞాసతో అంతకంటే ఎక్కువే నేర్చుకున్నాడు. విలువలు, విశ్వాసాలే బలం... సత్య బలం అతని విలువల్లో, విశ్వాసాల్లో ఉంది. ఉద్యోగం కేవలం జీతంకోసమే కాదు... పలువురి జీవితాల్లో మార్పు తీసుకురావడానికని బలంగా విశ్వసిస్తాడు. ఆ శక్తి అందరిలోనూ ఉందని నమ్ముతాడు. అందరినీ అందులో భాగస్వాములను చేస్తాడు. సత్య మాటల్లో ‘నేను’కన్నా ‘మనం’ అనే పదం ఎక్కువగా వినిపించేది ఇందుకే. నా కుటుంబం, నా జీవితానుభవాలే నన్నీ స్థాయికి తెచ్చాయంటాడు సత్య. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకతే తన వ్యక్తిత్వమంటాడు. కొత్తవిషయాలు నేర్చుకోకపోతే కొత్తవి కనిపెట్టలేమని చెప్తాడు. లక్ష్యంకన్నా విజన్ ఇంకా గొప్పది. వ్యక్తిగత విజన్ను సంస్థ విజన్తో మమేకం చేయడం మరింత గొప్పపని. అది సత్యలో గమనించవచ్చు. ఏడాదికి, రెండేళ్లకు ఉద్యోగాలు మారే సాఫ్ట్వేర్ రంగంలో 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్లోనే పనిచేయడం సంస్థపట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. అంతగా అతను సంస్థను ప్రేమించాడు, సంస్థతో మమేకమయ్యాడు, సంస్థ విజన్ను తనతో ఐక్యం చేసుకున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా సత్యకే ఓటేశారు. - విశేష్, సైకాలజిస్ట్ -
విశ్లేషణం: మనసున్న మాంత్రికుడు
న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్మెడల్ అందుకున్న ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ సినిమాల మీద మక్కువతో తివిక్రమ్ శ్రీనివాస్గా మారి... ‘స్వయంవరం’ లాంటి చిన్న సినిమాకు మాటల రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టి... నువ్వే-నువ్వే సినిమాతో దర్శకుడి అవతారమెత్తి... అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది?... సినిమాలతో తన ‘త్రివిక్రమ’ స్వరూపాన్ని చూపించాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన ప్రభావమేమో మాటల తూటాలతో ఆంధ్ర ప్రేక్షకులను మాయ చేసేస్తున్నాడు. మరి ఈ మాటల మాంత్రికుడి మనస్తత్వమేమిటి? మనసు మనిషి... సినిమాల్లో మాటల తూటాలు పేల్చే త్రివిక్రమ్ బయట మాత్రం చాలా తక్కువగా మాట్లాడతాడు... ఈ మధ్యనే కొంచెం కొంచెం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... కూర్చుని ఉంటే కాళ్లు ఆడిస్తూ ఉంటాడు. నిల్చున్నా చాలా ఈజ్గా ఉంటాడు. తల కొంచెం కుడివైపుకు వంచి, తలాడిస్తూ మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఆయనది అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని చెప్తుంటాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు మనుషులతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటారు. మనుషుల గురించి తెలుసుకుంటారు. నచ్చినవారితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వారితో బంధాలకు, బాంధవ్యాలకు ప్రాధాన్యతనిస్తుంటారు. వారితో గడపడానికి ఇష్టపడతారు. గట్టిగా మాట్లాడేవాళ్లంటే ఇష్టపడరు. అందుకేనేమో త్రివిక్రమ్కు మహేష్బాబు, పవన్కళ్యాణ్తో అంతగా అనుబంధం కుదిరింది. సునీల్తో స్నేహం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యక్తిత్వమున్నవారు బాగా సెన్సిటివ్గా ఉంటారు. విషయాలను పర్సనల్గా తీసుకుంటారు. త్రివిక్రమ్ ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు కళ్లనీళ్లు పెట్టుకోవడం, తరచుగా కన్నీరు తుడుచుకోవడం మనం గమనించవచ్చు. అలాగే తరచూ నవ్వుతుంటారు. సూటిగా చూస్తూ మాట్లాడతారు. ఇవన్నీ ఆయన ఎలాంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా వ్యవహరిస్తారని చెప్తుంటాయి. ఆయన మాట్లాడేటప్పుడు స్వరం మంద్రస్థాయిలో ఉంటుంది. మాటల్లో ఒక ఫ్లో, ఒక నిజాయితీ కనిపిస్తుంది. మాటలకు చేతుల కదలికలకు మధ్య చక్కని సమన్వయం కనిపిస్తుంది. రెండూ కలిసి ఒక డ్యూయట్లా ఉంటుంది. మాట్లాడేటప్పుడు చేతులు ఓపెన్గా ఉంటాయి. ఇది ఆయన ఓపెన్నెస్ను చూపిస్తుంది. నిర్ణయాలు కొంచెం నిదానంగా తీసుకోవడం, పనులను వాయిదా వేయడం ఈ మనస్తత్వమున్నవారి బలహీనతలు. అందుకేనేమో త్రివిక్రమ్ సినిమాలు తక్కువగా తీస్తుంటారు. మాటల్లోనూ మనసుంది మాటల గురించి చెప్పకుండా త్రివిక్రమ్ గురించి చెప్తే అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. ఏ సినిమాకు కథ రాస్తున్నా, ఎలాంటి కేరెక్టర్కు డైలాగ్స్ రాస్తున్నా అందులో రచయిత వ్యక్తిత్వం తప్పకుండా ప్రతిఫలిస్తుంది. త్రివిక్రమ్ సినిమాలు, ఆయన రాసే మాటల్లో ఎక్కడా ద్వంద్వార్థాలు లేకపోవడం, అసభ్యత కనిపించకపోవడం ఆయన పాటించే విలువలకు దర్పణంగా నిలుస్తాయి. పిల్లను ఇచ్చేటప్పుడు డబ్బులు ఉన్నోడా? లేనోడా? అని కాదు, మనసున్నోడా, చెడు అలవాట్లు లేనోడా? అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. ఎక్కడ నెగ్గాలో కాదురా... ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. లాజిక్లు ఎవరూ నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్ట్లకన్నా బాబాలే బాగా ఫేమస్. ... ఈ మాటల్లో త్రివిక్రమ్ నమ్మే విలువలు, ఆయన సంస్కారం కనిపిస్తాయి, సమాజం పట్ల అవగాహన, అనురక్తి, సెటైర్ వినిపిస్తాయి. అంతేనా... ‘‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడెయ్యకూడదురా... అలాగే పులి పలకరించిందికదా అని పక్కన నిలబడి ఫొటో తీయించుకోకూడదురోయ్...’’ అంటూ హాస్యాన్ని కూడా పండించగడు. - విశేష్, సైకాలజిస్ట్ -
విశ్లేషణం: మనసున్న మేథావి
అతనేం పెద్దగా చదువుకోలేదు... కానీ గొప్పగా ఆలోచించాడు. ‘కిటికీల’తో సాంకేతిక సామ్రాజ్యాధిపతిగా నిలిచాడు. ప్రపంచంలో ఎవరూ సంపాదించలేనంత ధనాన్ని ఆర్జించాడు. సంపాదించడమే కాదు పంచడమూ తెలుసంటూ వేలకోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తున్నాడు. తానో హృదయమున్న మేధావినని నిరూపించుకున్నాడు. ఆయనే... మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్. మాటలు, చేతులు కలిసి జంటగా... గేట్స్ కాస్తంత తల పెకైత్తి, కాలు మీద కాలువేసుకుని ధారాళంగా, స్వేచ్ఛగా మాట్లాడతారు. ఇవన్నీ ఆయన మంచి భావనలున్న విజువల్ పర్సన్ అనీ, ఆత్మవిశ్వాసం మెండుగా ఉందనీ చెప్తాయి. ఆయన తన ఫీలింగ్స్ను ఎంతో కొంత నిగ్రహించుకుంటాడని పెదవులు దాటని నవ్వు చెప్తుంది. నిజాయితీగా మాట్లాడతాడని ఓపెన్గా చాచిన చేతులు వివరిస్తాయి. అయితే ఈ చేతుల కదలికలు సందర్భాన్ని బట్టి మారిపోతూంటాయి. అప్పుడప్పుడూ అథారిటేటివ్గా హస్తాలను కిందకు కూడా ఉంచుతాడు. ఎవరు మాట్లాడుతున్నా ఆయన శ్రద్ధగా వింటారు. కళ్లజోడు సవరించుకుంటున్నారంటే తానేదో చెప్పబోతున్నాడన్నమాట. అంతేకాదు గేట్స్ చేతులు కూడా మాటలతో జతకలిసి జంటగా కదులుతాయి. అంటే ఆయన మనసులో ఉన్నదే నిజాయితీగా చెప్తున్నాడని అర్థం. ఆలోచనాజీవి... బిల్గేట్స్ చిన్నప్పటినుంచీ ఆలోచనా జీవి. ఆరేళ్ల వయసులో గేట్స్ను తల్లి ఏం చేస్తున్నావ్? అని అడిగితే.. ఆలోచిస్తున్నాను అని చెప్పాడట. ఆవిడకు అర్థంకాక ‘ఏంటీ.. ఆలోచిస్తున్నావా?’ అని అడిగితే... ‘అవును, ఆలోచిస్తున్నాను, నువ్వెప్పుడైనా ఆ ప్రయత్నం చేశావా?’ అని అడిగాడట. బాల్యంనుంచే గేట్స్ ఆలోచించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాడు కనుకనే నూనూగు మీసాల వయసులోనే విండోస్ సాఫ్ట్వేర్ను సృష్టించి, మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి సాఫ్ట్వేర్ కింగ్గా నిలిచాడు. ఆలోచనలు మెరుపువేగంలో వినూత్నంగా, లక్ష్యం దిశగా సాగిపోవడమే అందుకు కారణం. ఆయన పుస్తకాల్లో ఒకదానికి ‘బిజినెస్ ఎట్ స్పీడ్ ఆఫ్ థాట్’ అని పెట్టడం కూడా కాకతాళీయమేమీ కాదు. బిల్గేట్స్ది ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. తన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, కార్యసాధన, చురుకైన ఆలోచనాధోరణితో సహచరులను, అనుచరులను ప్రభావితం చేస్తాడు. తన విజన్ను అందరితోనూ పంచుకుంటాడు, అందరూ దానిలో భాగస్వాములై దాన్ని సఫలం చేయాలనుకుంటాడు. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంకోసం ఎన్ని గంటలైనా శ్రమిస్తాడు, దేనికైనా సిద్ధమవుతాడు. ఈ క్రమంలో తన ఉద్యోగులను అదిలించడంలో, విమర్శించడంలో ఏ మాత్రం వెనుకాడడు. అలాగే పోటీ సంస్థలను అధిగమించేందుకు కూడా. అయితే ఫౌండేషన్ స్థాపించాక ఆయన నాయకత్వ ధోరణిలో కొంత మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఫౌండేషన్ అకౌంట్లను భాగస్వాములందరికీ అందుబాటులో ఉంచడమే అందుకు ఉదాహరణ. మనసున్న మారాజు... బిల్గేట్స్ తెలివైనవాడు, మేధావి మాత్రమే కాదు... మనసున్న మారాజు కూడా. కాబట్టే ప్రపంచంలో పేదరికంతో, జబ్బుల బారిన పడి మరణిస్తున్న పిల్లలను చూసి చలించాడు. ఫౌండేషన్ను స్థాపించి అనేక దేశాల్లో బాలలకు వ్యాక్సిన్ అందిస్తున్నాడు. డబ్బు సంపాదించడం చాలామందికి తెలుసు, కానీ సంపాదించిన డబ్బును విరాళంగా ఇవ్వాలంటే గొప్ప మనసుండాలి. ఆ మంచి మనసు, స్పందించే హృదయం గేట్స్ సొంతం. సమాజంలో ప్రజలందరూ మెరుగైన జీవనాన్ని పొందినప్పుడే తన వ్యాపార విస్తరణ మరింతగా జరుగుతుందన్న స్వార్థం అందులో లేకపోలేదు. అయినా అది మంచి స్వార్థమే. కంప్యూటర్ రంగంలో విస్తృత పరిజ్ఞానం, విజన్, చిత్తశుద్ధి, పట్టుదల, పవర్, కరిష్మా గేట్స్ బలాలు కాగా... ఆధిప్యత ధోరణి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం, లక్ష్యాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆయన బలహీనతలు. - విశేష్, సైకాలజిస్ట్ -
విశ్లేషణం: పోరాటమే జీవితం... వ్యక్తిత్వం
ఆమె ప్రజల తరపున వీధుల్లో నిలబడి పోరాడగలరు... ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించగలరు... విద్యార్థులను, జర్నలిస్టులను మావోయిస్టులనగలరు... నిండు లోక్సభలో సహచర ఎంపీ కాలర్ పట్టుకోగలరు... స్పీకర్పైకి కాగితాలు విసరగలరు... తాను నమ్మిన సిద్ధాంతంకోసం, తనను నమ్మిన ప్రజలకోసం ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలరు. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రియ దీదీ అమె. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మమతా బెనర్జీ తొమ్మిదేళ్లకే తండ్రిని కోల్పోయారు. చిన్నతనంలోనే కాంగ్రెస్ రాజకీయాల్లోకి ప్రవేశించి మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా ఎదిగారు. పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీపీఎంకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. సీపీఎంతో కుమ్మక్కయిందంటూ కాంగ్రెస్నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ ఆమె వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఆమె ఘర్షణాత్మక వైఖరినే అవలంబిస్తున్నారు. సుదీర్ఘకాలం ఆమె చేసిన పోరాటాలే అందుకు కారణం. నా భావాలే నాకు ముఖ్యం మమతా బెనర్జీ మాట్లాడుతున్నప్పుడు మీరెప్పుడైనా గమనించారా? తల కొద్దిగా కుడివైపుకు వాలి ఉంటుంది. ఎవరేం ప్రశ్నించినా ఆమె ముందుగా కుడివైపు కిందకు చూసిన తర్వాత తల పెకైత్తి మాట్లాడతారు. ఇవన్నీ మమత అనుభూతి ప్రధానమైన వ్యక్తి అని చెప్తాయి. ఆమెకు తన భావాలు, తన అనుభవాలే ప్రామాణికం... ఆ తర్వాతే ఏదైనా. ఆమె మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకుని కూర్చుంటారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తుంటే తల పక్కకు తిప్పేసుకుంటారు. దీన్ని బట్టి కూడా ఆమె తన అనుభవాలనే ప్రామాణికంగా తీసుకుంటారని, ఎదుటివారు చెప్పేది వినేందుకు సిద్ధంగా ఉండరని తెలుస్తుంది. అంతేకాదు విరుద్ధ భావనలు అంగీకరించేందుకు ఆమె సిద్ధంగా ఉండరు. మాటల్లోనే కాదు బాడీ లాంగ్వేజ్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. నేను చెప్పిందే వినాలి మమతలో ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశాన్ని నిగ్రహించుకునే శక్తి తక్కువ. తానెక్కడున్నాను... ఎవరితో మాట్లాడుతున్నాను... ఏ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాననే స్పృహ లేకుండా తన మనసుకు తోచింది అనేస్తారు, చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.. అది పార్లమెంటయినా, టీవీ ఇంటర్వ్యూ అయినా, బహిరంగ సభయినా సరే. నాయకత్వంలో ఆమెది అథారిటేటివ్ శైలి. తాను చెప్పేది వినాలే తప్ప, ఎవరేం చెప్పినా పట్టించుకోరు. ఎవరేం చెప్పినా వినాలన్న విషయాన్ని కూడా ఆమె అంగీకరించరు. చూపుడువేలు చూపిస్తూ అదిరిస్తున్నట్లుగా, బెదిరిస్తున్నట్లుగా మాట్లాడతారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలైనా సరే, విదేశీ ప్రతినిధులైనా సరే తన మాట వినాల్సిందే అన్నట్లుగా ప్రవరిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం మమత బలమైతే, తన భావాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేకపోవడం ఆమె బలహీనత. పట్టుదలకు మొండితనానికి మధ్య ఉండే సన్నని గీతను ఆమె ఎప్పుడో చెరిపేశారు. తనను ప్రశ్నించేది ఎవరన్నది క్షణకాలం కూడా ఆలోచించకుండా వారిపై మావోయిస్టు లేదా కమ్యూనిస్టు ముద్ర వేయడం ఆమె అసహనానికి పరాకాష్ట. అంతేకాదు ఆమెలో పారనాయిడ్ లక్షణాలున్నాయన్న అనుమానాలకు కూడా తావిస్తోంది. పైకి గంభీరంగా కనిపించే దీదీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సివచ్చినప్పుడు ఆందోళనకు లోనవుతారు. చేతిలో పెన్నును అటూ ఇటూ తిప్పుతూ తన ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. గొంతెత్తి మాట్లాడి తన ఆందోళనను దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. అయినా దీదీ దీదీనే మమత తొలినాటినుంచీ నేత చీర, భుజానికో సంచీతో అతి సాధారణంగా జీవించారు. ప్రజల తరఫున వీధులెక్కి పోరాడారు. అందుకోసం ఎన్ని కష్టాలనైనా భరించారు, సహించారు. ఇవన్నీ ఆమెను బెంగాల్ ప్రజలకు దగ్గర చేశాయి.. బెంగాలీల ‘దీదీ’గా మార్చాయి. - విశేష్, సైకాలజిస్ట్ -
ఛేంజ్, హోప్... ప్రచార పదాలు, పథాలు
విశ్లేషణం: ‘‘ఒక గొంతు ఒక గదిని మార్చగలదు. ఒక గదిని మార్చిన గొంతు ఒక సిటీని మార్చగలదు. ఒక సిటీని మార్చిన గొంతు ఒక రాష్ట్రాన్ని మార్చగలదు. ఒక రాష్ట్రాన్ని మార్చిన గొంతు ఒక దేశాన్ని మార్చగలదు. ఒక దేశాన్ని మార్చిన గొంతు ప్రపంచాన్నే మార్చగలదు. అది మీ గొంతే. మీ గొంతు ప్రపంచాన్నే మార్చగలదు’’. అతనేం గొప్ప కుటుంబంలో పుట్టలేదు... అతని కుటుంబానికి రాజకీయ నేపథ్యమూ లేదు... అతనేం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోలేదు... ప్రపంచం గుర్తించేటంత గొప్ప విజయాలూ సాధించలేదు.. కానీ అనూహ్యంగా అమెరికా ప్రజల మనసులు కొల్లగొట్టాడు... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు... తొలి నల్లజాతి, ముస్లిం నేపథ్యమున్న అధ్యక్షుడిగా వైట్హౌస్లో అడుగుపెట్టాడు... ప్రపంచం మొత్తం తన వైపే చూసేలా చేసుకున్నాడు... అతనే బరాక్ హుస్సేన్ ఒబామా! ఈ అద్భుతం ఒబామా వ్యక్తిత్వం, వాక్చాతుర్యం వల్లనే సాధ్యమైంది. మీరెప్పుడైనా ఒబామా ఉపన్యాసం విన్నారా? లేదంటే ఈ రోజే వినండి యూ ట్యూబ్లో. అతని ఉపన్యాసాల్లో ‘నేను’ అనే పదం కన్నా ‘మీరు’, ‘మనం’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని తన కళ్లతోనే కాక ప్రజల దృష్టినుంచి కూడా పరిశీలిస్తాడు. గతం కంటే వర్తమానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. అందమైన భవిష్యత్తు పట్ల విశ్వాసం కల్పిస్తాడు. ‘ఛేంజ్’, ‘హోప్’... ఒబామా ప్రచార పదాలు, పథాలు. ఆశలేని వ్యక్తి, మార్పులేని వ్యక్తి ప్రపంచంలో కానరాడు. ఆ రెండు పదాలను తన ప్రచారానికి ఎంచుకోవడంలోనే ఒబామా తెలివితేటలు కనిపిస్తాయి. ఎడమచేతి వాటం కల ఒబామా సృజనాత్మకంగా ఆలోచిస్తాడు. గొప్ప లక్ష్యాలను ఊహిస్తాడు, వాటిని సాధించేందుకు శ్రమిస్తాడు, రిస్క్ తీసుకునేందుకు వెనకాడడు. అందంగా, ఆకట్టుకునేలా మాట్లాడటం ఆయన బలం. ఒబామా ఉపన్యసించేటప్పుడు చూపుడువేలు, బొటనవేలు కలిసి ఉండే ఒబామా మార్కు ముద్రను చూడండి. తాను మాట్లాడుతున్న అంశాలపట్ల తన సంతృప్తికి ఆ ముద్ర అద్దం పడుతుంది. అంతేకాదు... ఎవరైనా కలం పట్టుకుని సంతకం చేయాలంటే ఆ ముద్రనే వాడాలి. అంటే... ఓటు వేయడానికి ముందు సంతకం చేసేటప్పుడు ఓటరు మనసులో ఒబామా రూపం కదలాడుతుందన్న మాట. దీన్నే ‘స్టీలింగ్ ఆఫ్ యాంకర్’ అంటారు. అంతేకాదు... తన ప్రత్యర్థి గురించి మాట్లాడేటప్పుడు పెదవులు బిగిస్తాడు. తద్వారా తన అనంగీకారాన్ని ప్రజలకు తెలపడమే కాకుండా వారు కూడా అలాగే ఫీల్ అయ్యేలా చేస్తాడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు... ‘మనకు మార్పు కావాలి’, ‘మనం కోరుకునే మార్పు మన నుంచే రావాలి’, మార్పుకోసం నినదించే లక్షల గొంతుకల ముందు ఏ శక్తీ ఎదురునిలవలేదు’, ‘మార్పు తీసుకువచ్చే సామర్థ్యం మాకుందని విశ్వసించమని అడగడంలేదు, మీ సామర్థాన్ని మీరు విశ్వసించండి’, ‘మీ పరాజయాలు మీ జీవితాన్ని నిర్దేశించకూడదు, మీకు జీవితపాఠాలు నేర్పాలి’, ‘మార్పు సులభం కాదు, కానీ సాధ్యమే’, ‘మనం భిన్న ప్రాంతాలనుంచి వచ్చి ఉండవచ్చు, మనకు భిన్న కథనాలు ఉండవచ్చు. కానీ మనందరి ఆశ ఒక్కటే, అది మన అమెరికన్ కల’... ఇవన్నీ ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడో చెప్పిన మాటలు కాదు. బరాక్ ఒబామా తన ఉపన్యాసాల్లో పలికిన పలుకులు. మార్పు తప్పదనే విషయం అమెరికన్లకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఆ మార్పు తానేనని వారి మనసులకు చేరేలా చేయగలిగాడు. ‘మనం సాధించగలం’ అనే నమ్మకాన్ని వారికి కల్పించాడు. తాను సాధించి చూపించాడు. తన ఆశను, ఆశయాన్ని అమెరికన్లందరి ఆశగా, ఆశయంగా మార్చగలగడమే ఒబామా విజయరహస్యం. - విశేష్, సైకాలజిస్ట్